• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Germany

సముద్రంలో చైనా డేటా సెంటర్‌ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్‌ దార్శనికులా !

27 Monday Oct 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Environment, Europe, Germany, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

# China underwater data center, BJP, CHANDRABABU, China, Data Centers, Data centers Employment, Narendra Modi Failures, Vizag Google Data Center, Xi Jinping, YS jagan

ఎం కోటేశ్వరరావు

సముద్రంలో చైనా నిర్మించిన పదమూడు వందల టన్నుల బరువుగల డేటా సెంటర్‌ ఆదివారం నాడు(2025 అక్టోబరు26న) ప్రారంభమైంది. ఇది గాలి మరలతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వినియోగించనుంది. హై క్లౌడ్‌ అనే కంపెనీ మొదటి దశలో భాగంగా 24మెగావాట్ల కేంద్రాన్ని షాంఘై తీరంలో నెలకొల్పింది. న్యూస్‌ అట్లాస్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం సముద్రపు ఒడ్డున నిర్మించిన గాలి మరల విద్యుత్‌ కేంద్రం నుంచి 95శాతం విద్యుత్‌ను ఈ కేంద్రానికి సరఫరా చేస్తారు, సముద్రపు నీటిని చల్లబరిచేందుకు వినియోగిస్తారు. మొత్తం 22.6 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేంద్రంలో సాంప్రదాయపు డేటా సెంటర్ల కంటే 23శాతం విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. సముద్రంలో 114 అడుగుల అడుగున ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలోని ఒక్కో గదిలో 4 నుంచి ఐదు వందల సర్వర్లు ఉంటాయి. సముద్రంలో ఏర్పాటు చేసిన టెలికాం కేబుళ్ల ద్వారా ఈస్ట్రన్‌ డేటా, వెస్ట్రన్‌ కంప్యూటింగ్‌ వ్యూహం ప్రకారం ప్రధాన భూభాగంలోని కేంద్రానికి అనుసంధానం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివే మరో వందగదులను నిర్మించి విస్తరిస్తారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ చైనాలో 2015లో పైలట్‌ ప్రాజక్టుగా సముద్రంలో ఒక డాటా కేంద్రాన్ని నిర్మించింది. ప్రాజెక్ట్‌ నాటిక్‌ పేరుతో చేసిన ఈ ప్రయోగానికి స్వస్తి పలికి 2024జూన్‌లో దాన్ని సముద్రంలో ముంచివేసింది. ఆదివారం నాడు సముద్రంలో తొలి వాణిజ్య డాటా కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించిన తొలి దేశంగా చైనా చరిత్రకెక్కింది. ఇలాంటివే మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఈ కేంద్రం చైనాలో అతి పెద్ద తొలి స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఉన్న హైనాన్‌ సమీపంలో ఉంది. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో నిర్మించారు.

విశాఖలో అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీలతో కలసి గూగుల్‌ నిర్మించనున్న డేటా కేంద్రం ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందన్నది చర్చ. లింక్‌డ్‌ఇన్‌లో వచ్చిన ఒక విశ్లేషణ జర్మనీలోని బిఎఎస్‌ఎఫ్‌ రసాయన కంపెనీతో డేటా సెంటర్ల ఉపాధిని పోల్చింది. సదరు జర్మనీ సంస్థ 684మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది, 50వేల మందికి పూర్తి స్థాయి ఉపాధిని కల్పిస్తున్నది. అదే జర్మనీలో డాటా కేంద్రం 2,283మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగించే చోట పూర్తి కాలపు ఉపాధి 6,849 నుంచి 13,699 మందికి చూపుతుంది. రసాయన ఫ్యాక్టరీ ఒక మెగావాట్‌కు 73 మందికి ఉద్యోగ కల్పన చేస్తుంటే డేటా సెంటర్‌ ఒక మెగావాట్‌కు 3 నుంచి ఆరు ఉద్యోగాలను ఇస్తున్నది. గూగుల్‌ ఆధునిక సాంకేతిక ప్రక్రియలను వినియోగిస్తుంది గనుక ఇంకా తగ్గవచ్చు. ఆ లెక్కన చూసినా విశాఖలో నిర్మించే ఒక గిగావాట్‌(వెయ్యి మెగావాట్లు) కేంద్రం మూడు నుంచి ఆరువేల మందికి పర్మనెంటు ఉద్యోగాలను కల్పిస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలు దీనికి దగ్గరగా ఉన్నాయి. దానికి భిన్నంగా రాష్ట్ర మంత్రి లోకేష్‌ చెప్పారు. ఇద్దరికి సమాచార వనరు ఏమిటి ? ఈ విషయాన్ని చెప్పటానికి బిడియపడాల్సిందేముంది. అదే గూగుల్‌ను అడిగితే అందించిన ఇతర విశ్లేషణలు కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలన్నీ సాధ్యమైనమేరకు తక్కువ మందితో పని చేయించుకొనేందుకు చూస్తాయి. కన్సిడర్‌ మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన సిడ్నీలోని డాటా కేంద్రం 2023లో అకస్మాత్తుగా ఆగిపోయింది. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా జరిగిన ఆ అంతరాయం 46 గంటల పాటు సేవల నిలిపివేతకు దారితీసింది. అప్‌టైమ్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ సిబ్బంది కొరత గురించి పేర్కొన్నది. ప్రపంచ డాటా సెంట్లర్లలో 2019లో ఇరవైలక్షల మంది పూర్తి కాలపు ఉద్యోగులు ఉంటే 2025 నాటికి కేంద్రాలు పెరిగినా 23లక్షల మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులా అన్నది వివరణ లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న 122 గిగావాట్ల సామర్థ్యంలో సగటు తీసుకుంటే ఒక్కో గిగావాట్‌కు 18,700 ఉన్నట్లు కనిపిస్తున్నది. విశాఖ గూగుల్‌ సెంటర్‌కు అందరూ కలసి 20 నుంచి 30వేల మంది ఉంటారని కూడా పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. డాటా కంపెనీలు సిబ్బందిని చేర్చుకోవటం, నిలుపుకోవటంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చిన్న కేంద్రాలు(ఒకటి నుంచి ఐదు మెగావాట్లు) 8 నుంచి 15 మంది, ఐదు నుంచి ఇరవై మెగావాట్ల కేంద్రాలు 15 నుంచి 35 మంది, ఇరవై అంతకు మించిన సామర్ధ్యం కలిగినవి 35 మందికి పైగా, 40 మెగావాట్ల సంస్థలు 45 మందిని, వంద మెగావాట్లు అంతకు మించి సామర్ధ్యం కలిగినవి కొద్దిమందితోనే నిర్వహిస్తున్నాయి, ఎందుకంటే యాంత్రీకరణ మరియు నిర్ణీత ప్రమాణాలతో ఉండే వ్యవస్థలు అందుకు దోహదం చేస్తున్నాయి. నియమించుకుంటున్నాయి. డేటా సెంటర్లలో మొత్తం 230 రకాల సిబ్బంది అవసరం అని చెబుతున్నారు. అయితే చిన్న సంస్థలు అంతమందిని నియమించవు, అవి అవసరమైనపుడు పొరుగు సేవలను ఉపయోగించుకుంటాయి. సగం డేటా సెంటర్లు అవసరమైన నిపుణులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి.

రెండును రెండుతో కలిపినా, హెచ్చవేసినా ఫలితం నాలుగే. ఇది చెప్పటానికి గణితమేథావులతో పనిలేదు. డేటా సెంటర్లతో కలిగే పర్యావరణహాని, విషపూరితమైన వ్యర్ధాల వంటి ఇతర దుష్ఫలితాల గురించి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెప్పినా(అఫ్‌ కోర్స్‌ అధికారంలో ఉన్నపుడు ఈ పెద్దమనిషి వీటి గురించి చెప్పలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నోరు విప్పరు) ఆ రంగం గురించి అధ్యయనం చేసినవారు చెప్పినా విషయం ఒకటే. ఎవరైనా రాజకీయాలతో నిమిత్తం లేని వారు చెబితే చూశారా రాష్ట్ర అభివృద్దిని వ్యతిరేకించేవారు జగన్‌తో చేతులు కలిపి అవే వాదనలు చేస్తున్నారంటూ ప్రచారదాడికి దిగుతున్నారు. అంటే నోరు మూయించేందుకు ఇదొక రకం నియంతృత్వపోకడతప్ప మరొకటి కాదు. తేమ కారణంగా యంత్రాలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అమెరికాలోని డేటా కేంద్రాలన్నీ పొడివాతావరణం ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారని చెబుతున్నారు.పెట్టుబడిలో నాలుగో వంతు సబ్సిడీలు, సంవత్సరాల తరబడి రాయితీ ధరలకు నీరు, విద్యుత్‌ అందచేస్తున్న తరువాత ఏ పెట్టుబడిదారుడు మాత్రం చంద్రబాబు నాయుడి దరిచేరడు ! డాటా సెంటర్‌ మాప్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం గూగుల్‌కు ప్రపంచంలో 113 డాటా సెంటర్లు ఉండగా వాటిలో 68 పని చేస్తున్నాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎందరు ఉద్యోగులు పని చేస్తున్నారని అడిగితే సమాచారం లేదని బదులు వచ్చింది. ప్రపంచంలో గూగుల్‌ సంస్థలో లక్షా 83వేల మంది పనిచేస్తున్నారనే సమాచారం ఉంది తప్ప ఏ విభాగంలో ఎందరు అన్నది లభ్యం కావటం లేదు. ఎవరికైనా దొరికితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. మానవహక్కుల ఫోరం(హెచ్‌ఆర్‌ఎఫ్‌) సమాచారం ప్రకారం అమెరికాలోని అష్‌బర్న్‌ మరియు లీస్‌బర్గ్‌ డాటా సెంటర్లు రెండిలోనూ కలిపి ప్రత్యక్షంగా 400 మందికి పరోక్షంగా 3,100 మంది ఉపాధి దొరుకుతున్నట్లు పేర్కొన్నది.లోకేష్‌ చెప్పినట్లు లక్షా 88వేల ఉద్యోగాల్లో 88వేలు పర్మనెంటు అనుకుంటే మొత్తం గూగుల్‌ ఉద్యోగులు విశాఖలోనే ఉంటారన్నట్లుగా భావించాలి, అది జరిగేదేనా !

ఇంటర్నెట్‌ వెతుకులాటలో డాటా సెంటర్ల ఉపాధి గురించి ఎవరెటు తిప్పి చెప్పినా పెట్టుబడులు, స్థలాల విస్తీర్ణం ఎక్కువ, ప్రత్యక్ష ఉపాధి తక్కువ, పరోక్ష ఉపాధి గురించి మాత్రమే వెల్లడవుతున్నది. పరోక్షం అంటే భవనాల నిర్మాణ సమయంలో దొరికే ఉపాధి, వాటి చుట్టూ ఉండే నివాసాలతో కలిగే లబ్ది గురించి మాత్రమే ప్రస్తావన ఉంటున్నది. ఆ లెక్కన బడా పరిశ్రమలు అంతకంటే ఎక్కువ కల్పిస్తున్నాయి. వస్తూత్పత్తిలో చైనాను పక్కకు నెట్టే ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా దేశాన్ని మారుస్తామన్న మాటలు ఇప్పుడు ఎకువగా వినిపించటం లేదు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గురించి కబుర్లు పెరిగాయి.ఒకదానికి ఒకటి పోటీ కాదు, పరస్పరం సాయం చేసుకొనేవే.పెట్టుబడులు ఎక్కువ ఉపాధి తక్కువ ఉండే టెక్‌ కంపెనీల కోసం మోడీ, చంద్రబాబు వంటి వారు వెంపర్లాడుతున్నారు. ఒకసారి భవనాల నిర్మాణాలు పూర్తయిన తరువాత తాత్కాలిక కార్మికులకు పని ఉండదు. ఆటోమేషన్‌ ప్రధాన ప్రక్రియగా నడిచే ఈ కేంద్రాలలో కీలకమైన సిబ్బంది ఎవరంటే సెంటర్ల మేనేజర్లు, నెట్‌వర్క్‌ మరియు వ్యవస్థల అడ్మినిస్ట్రేటర్లు, సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక నిపుణులు, వారికి సహాయ సిబ్బంది.

ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఏటా పదివేల కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. డేటా సెంటర్లు అవసరమే, అయితే అవి కొత్త సమస్యలను సృష్టించకూడదు. మనదేశంలో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం గురించి తెలిసిందే. పాలకులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారంటే ఉత్పత్తులకు తప్ప కాలుష్యానికి కాదు, దాన్ని నివారించేందుకు పరిశ్రమలే చర్యలు తీసుకోవాలన్న నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేస్తే తమ లాభాలు తగ్గుతాయని తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో ఫార్మా, ఇతర సంస్థల నుంచి వెలువడుతున్న కాలుష్యం సమీపంలోని సముద్రంలో కలుస్తున్నది. దాంతో మత్స్యకారుల ఉపాధికి దెబ్బతగులుతున్నది. పరిష్కరించండి మహానుభావా అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అడిగితే ఈ మధ్యే మాట్లాడుతూ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది తాము కాదని, వంద రోజుల గడువులో పరిష్కరిస్తానని చెప్పారు. అధికారానికి వచ్చి 15నెలల తరువాత ఈ మాటలు చెప్పిన పెద్ద మనిషి ఇంతకాలం ఏం చేస్తున్నట్లు ?

డేటా అనేక విధాలుగా కీలక పాత్ర పోషిస్తున్న పూర్వరంగంలో మనదేశం కూడా వెనుకపడకూడదు. కానీ నరేంద్రమోడీ లేదా రెండింజన్ల పాలనలో ఉన్న ప్రభుత్వాలు గానీ ఎంతో నిర్లక్ష్యం చేశాయన్నది అంకెలే చెబుతున్నాయి.2019లో 350 మెగావాట్ల సామర్ధ్యం ఉండగా 2025 నాటికి 1,350 మెగావాట్లకు చేరుతుందని చెబుతున్నారు. ఈ రంగంలో మిగిలిన దేశాలు ఎంతో ముందున్నాయి.దీనికి కూడా నెహ్రూయే కారణం అని చెబుతారేమో తెలియదు. ముందు చూపు లేకపోవటం తప్ప మరొకటి కాదు.చైనాలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు లేవు, మైక్రోసాఫ్ట్‌ కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో తప్ప ప్రభుత్వం వినియోగించటం లేదు.కృత్రిమ మేథ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో చైనా వెనుకబడిందని శత్రువులు కూడా చెప్పలేరు.తాజా సమాచారం ప్రకారం 2024నాటికి చైనాలో డేటా వాణిజ్య విలువ 47.23 బిలియన్‌ డాలర్లు కాగా 2030 నాటికి అది 97.30బి.డాలర్లకు పెరుగుతుందని రిసర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ సంస్థ పేర్కొన్నది. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ మరోవిధంగా ఉంది.అమెరికాలో 2025 నాటికి డాటా సెంటర్ల ఆదాయం 171.9 బిలియన్‌ డాలర్లు, కాగా చైనాలో 103.19 బిలియన్‌ డాలర్లని 2030 నాటికి 142.64 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. మరో సమాచారం ప్రకారం ప్రపంచ డేటా సెంటర్ల సామర్ధ్యం 2024నాటికి 122.2 గిగావాట్లు. దీనిలో అమెరికా 53.7(44శాతం) కలిగి ఉండగా చైనా 31.9 గిగావాట్లు కలిగి ఉంది. మూడో స్థానంలో ఒక కూటమిగా ఐరోపా యూనియన్‌ 11.9 గిగావాట్లు, మనదేశం 3.6గా ఉంది.చైనాలో ఇటీవల జత చేసిన సామర్ధ్యాన్ని పని చేయించటం లేదని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి అర్ధం అవుతున్నదేమిటి ? దేశం వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలన్నింటా వృద్ది చెందితేనే డేటా కేంద్రాలకు చేతినిండా పని ఉంటుంది. గడచిన పదకొండు సంవత్సరాలుగా కబుర్లు తప్ప అభివృద్ధి లేని కారణంగా డేటా సెంటర్ల సామర్ధ్యం కూడా పెరగలేదన్నది స్పష్టం.విశ్లేషణలను కొనుగోలు చేసేవారు లేకపోతే రేపు విశాఖ గూగుల్‌ సెంటర్‌ అయినా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే.

దేశాన్ని, రాష్ట్రాన్ని వికసిత్‌ భారత్‌లో ఎక్కడికో తీసుకుపోతామని ప్రధాని నరేంద్రమోడీ, ఆయన అడుగుజాడల్లో లేదా అడుగులకు మడుగులద్దుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మంది దృష్టిలో దేశంలో అతి పెద్ద దార్శనికులు, ఇతరులకు తట్టనివి అనేకం వారికి కనిపిస్తాయని చెబుతారు. ఆ ప్రచారం వలన దేశానికి ఎంత లాభమో తెలియదు గానీ నష్టం కలిగిస్తున్నారంటే ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి) నేడు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో చెప్పనవసరం లేదు.తన పాలనలో జిడిపిని పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి తెచ్చిన ఘనత నాదే అంటారు మోడీ. కాసేపు అంగీకరిద్దాం, ఆ పురోగతి ఇతర రంగాల్లో ఉందా ? వాటిలో కీలకమైన పరిశోధనకు కేటాయింపుల సంగతేమిటి ? 1995-96 నుంచి 2014-15వరకు రెండు దశాబ్దాల వార్షిక సగటు జిడిపిలో 0.73 శాతం ఉంది. యుపిఏ పాలనలో 2008-09లో జిడిపిలో 0.8శాతం నిధులు కేటాయిస్తే మోడీ ఏలుబడిలో 2017-18లో 0.7, ఇప్పుడు 0.64శాతానికి తగ్గించారు. దీనికైతే జవహర్‌లాల్‌ నెహ్రూ కారణం కచ్చితంగా కాదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే భావజాలంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల ఈ నిర్వాకాన్ని చంద్రబాబు నాయుడు సమర్ధిస్తారా ? 2013 నాటి సైన్స్‌ మరియు టెక్నాలజీ విధానంలో, 2017-18 ఆర్థిక సర్వేలో కూడా కనీసం రెండు శాతం కేటాయించాలని చెప్పిన అంశం ఎవరికీ తెలియదా ? ఇద్దరు నేతలు దేశ దేశాలు తిరుగుతున్నారు కదా ఎక్కడ ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోరా ? ఎందుకీ నిర్లక్ష్యం ? మన అభివృద్ధి మీద గణనీయమైన ప్రభావం చూపాలంటే 2047నాటి వరకు కనీసం ఒక శాతం, ఆదర్శవంతంగా(ఐడియల్‌) ఉండాలంటే మూడుశాతం చొప్పున ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు. పిండికొద్దీ రొట్టె, పరిశోధనా రంగంలో మనం ప్రపంచ బస్‌ను అందుకోకుండా చేసింది ఎవరంటే ఎవరిని చూపాలి ? పరిశోధనలకు మనం తక్కువ కేటాయిస్తున్నా, పరిశోధనా పత్రాలు గణనీయంగానే మనవారు సమర్పిస్తున్నారుగా అని సమర్ధించుకొనే వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు ! ఎలాంటి పాలకులను మోస్తున్నాంరా బాబూ అని తల పట్టుకోవాలి !!

సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు ;

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?
https://vedikaa.com/2025/10/25/are-data-centers-godowns-or-production-houses-what-is-the-truth-about-ycp-and-tdp-claims-on-employment/

Share this:

  • Tweet
  • More
Like Loading...

పశ్చిమ దేశాల తీరు : ఒకవైపు కార్మికవర్గంపై దాడి మరోవైపు రష్యాతో లడాయి !

08 Wednesday Oct 2025

Posted by raomk in Current Affairs, Economics, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Another Cold war, Cold War, Donald trump, Europe workers struggle, Putin warns US, Tomahawk missiles, Ukraine, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు

నాటో కూటమితో చేతులు కలిపి తమ మీద చేస్తున్న కుట్రకు ప్రతిక్రియగా ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య బుధవారం నాడు 1,322వ రోజులో ప్రవేశించింది. పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఐరోపా అంతటా దోపిడీకి గురౌతున్న కార్మికుల సమ్మెలు ఒక వైపు, మరోవైపు రష్యాను దెబ్బతీసేందుకు అమెరికాతో కలసి పాలకవర్గాల కుట్రలు కనిపిస్తున్నాయి. తమ మీద దాడులు చేసేందుకు అమెరికా గనుక తోమహాక్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తే సంబంధాలు నాశనం అవుతాయని రష్యన్‌ అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ అమెరికానుద్దేశించి చెప్పాడు. నిజానికి ఇది ట్రంప్‌కే కాదు, కయ్యానికి ఎగదోస్తున్న యావత్‌ ఐరోపా ధనిక దేశాలకు చేసిన హెచ్చరిక. ఆ ప్రకటన మరుసటి రోజు డోనాల్డ్‌ ట్రంప్‌ విలేకర్లు అడిగిన ప్రశ్నలపై స్పందించాడు.” నేనూ కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాను, ఆ పోరు మరింతగా పెరగాలని కోరుకోవటం లేదు ” అన్నాడు. పశ్చిమ దేశాలతో మరో ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నట్లు తమ మీద చేస్తున్న ఆరోపణను రష్యా తోసిపుచ్చింది. తమ మీద దాడులు చేసేందుకు, మిలటరీ ఖర్చు పెంచేందుకు నెపాన్ని తమ మీద నెట్టాలని ఐరోపా యూనియన్‌, నాటో కూటమి దేశాలు లేని పోని కథలను వ్యాపింప చేస్తున్నాయని గత ప్రచ్చన్న యుద్దంతో పోల్చటాన్ని అంగీకరించటం లేదని రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా ఝకరోవా గత వారంలో స్పష్టం చేశారు.క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెష్కోవ్‌ మాట్లాడుతూ ఐరోపా అంతటా ఇటీవల కనిపించిన డ్రోన్లకు రష్యా కారణమని నిందించటానికి ఎలాంటి హేతుబద్దత లేదన్నాడు.డ్రోన్ల వెనుక రష్యా ఉందని భావిస్తున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్య తరువాత ఐరోపాలోని అనేక మంది రాజకీయవేత్తలు అన్నింటికీ రష్యా కారణమని నిందిస్తున్నారన్నాడు.

క్యూబన్‌ క్షిపణుల సంక్షోభం 1962 తరువాత రష్యా మరియు పశ్చిమ దేశాల మధ్య ఉక్రెయిన్‌ సంక్షోభ రూపంలో తలెత్తిన ఘర్షణ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో తీవ్రమైనది,అతి పెద్దది. తాము ఇప్పటికే మరో రూపంలో ఉన్న ఘర్షణలో ఉన్నామని, అదేమాత్రం ప్రచ్చన్న యుద్ధం కాదు ఇప్పటికే ఇక్కడ మంటలు ఉన్నాయని మరియ ఝకరోవా చెప్పారు. అలాస్కా భేటీ తరువాత శాంతి అవకాశాలు ఆవిరవుతున్నట్లు జరిగే పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తమ అజెండాను అమలు జరిపేందుకు పశ్చిమ దేశాలు సరికొత్త ప్రచారదాడిని మొదలు పెట్టాయి. తమ గగనతలాన్ని అతిక్రమిస్తున్నందంటూ వివిధ దేశాలు ఒక పథకం చేస్తున్న ప్రచారాన్ని రష్యా తిరస్కరించినప్పటికీ గోబెల్స్‌ ప్రచారం సాగుతున్నది. ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా మెల్ల మెల్లగా కొత్త ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది.దానికి పోటీగా పశ్చిమ దేశాల గగనతల అతిక్రమణ కతలను ముందుకు తెచ్చాయి. ఆ పేరుతో మిలిటరీ బడ్జెట్‌లను పెంచేందుకు, సంక్షేమ పథకాలకు కోత విధించేందుకు పూనుకున్నారు. తమకు వ్యతిరేకంగా నాటో కూటమి కుట్రపన్నిందని పుతిన్‌ ఉక్రెయిన్‌ సంక్షోభ ప్రారంభానికి ముందు నుంచీ చెబుతున్నాడు.సోవియట్‌ పతనమైన 1991లో నాటో కూటమిని తూర్పు వైపు విస్తరించబోమని చెప్పి దాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించాయి. రష్యా సరిహద్దుల్లో ఉన్న ఉక్రెయిన్‌, జార్జియా వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మాస్కో వ్యవహారాలను నియంత్రించేందుకు చూశాయని అదే తమ మిలిటరీ చర్యకు కారణమని, అలాంటి కుట్రకు స్వస్థి పలికితే వెంటనే దాడులను నిలిపివేస్తామని పదే పదే చెబుతున్నాడు.

రష్యా చెబుతున్న అంశాలను విననట్లు నటిస్తున్న పశ్చిమ దేశాలు తీవ్రమైన ఆంక్షలను ప్రకటించి దిగ్బంధనం కావించేందుకు చూసినప్పటికీ వాటన్నింటిని మాస్కో ఇప్పటి వరకు అధిగమించింది. మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు అందించి దాడులు చేయించాయి.ఫలితం లేకపోవటంతో ఇప్పుడు మాస్కోతో సహా రష్యాలోని ఐరోపా ప్రాంతాలన్నింటిపైనా దాడులు చేయగల రెండున్నరవేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే తమ తోమహాక్‌ క్షిపణులను అందచేయాలని అమెరికా చూస్తున్నది. అనేక ఐరోపా దేశాలు వాటిని అడుగుతున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వారం రోజుల క్రితం ప్రకటించాడు.నేరుగా ఉక్రెయిన్‌కు అందిస్తే విమర్శలపాలు కావాల్సి వస్తుందనే భయంతో ఇతర దేశాలకు విక్రయించి అక్కడి నుంచి మళ్లించాలన్నది ఎత్తుగడ. అయితే జెలెనెస్కీ సేనలకు వాటిని అందచేసినప్పటికీ ఉపయోగించే సామర్ధ్యం లేదు. ఆ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. ఆ క్షిపణులు తమ దగ్గర ఉంటే పుతిన్‌పై వత్తిడి పెంచటానికి తోడ్పడతాయని అన్నాడు. అందుకే అదే జరిగితే పశ్చిమ దేశాలతో సంబంధాల విచ్చిన్నానికి దారితీస్తుందని పుతిన్‌ హెచ్చరించాడు. ఇవ్వాలా లేదా అన్నది అమెరికా తేల్చుకోవాల్సి ఉంది. ఇస్తామంటే ఎలాంటి స్పందనలు వస్తాయో తెలుసుకొనేందుకు వాన్స్‌ ద్వారా ట్రంప్‌ మాట్లాడించాడు. రష్యా ఇంథన మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని ఉక్రెయిన్‌కు అందచేసేందుకు వాషింగ్టన్‌ నిర్ణయించిందని, వాటిని ధ్వంసం చేయాలంటే దీర్ఘశ్రేణి క్షిపణులు అవసరమౌతాయని వాటిని ఇవ్వటమా లేదా అన్న గుంజాటనలో ఉన్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది.

అమెరికన్లు ప్రత్యక్షంగా పాల్గ్గొంటే తప్ప తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించటం అసాధ్యమని, అదే జరిగితే ఉద్రిక్తలు నూతన దశకు చేరతాయని పుతిన్‌ గతవారంలో హెచ్చరించాడు. అలాంటి క్షిపణులను ఇచ్చేది లేదని గతంలో ట్రంప్‌ ప్రకటించాడు. అయితే ఉక్రెయిన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి కెయిత్‌ కెల్లాగ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రష్యా మీద దీర్ఘశ్రేణి లక్ష్యాలపై దాడులను చేసే స్థితిలో ఉక్రెయిన్‌ ఉందని ట్రంప్‌ సూచన ప్రాయంగా చెప్పినట్లు తెలిపాడు.తన పాటలకు అనుగుణ్యంగా పుతిన్‌ నృత్యం చేయటం లేదనే ఉక్రోషంతో ఈ విపరీత చర్య గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పవచ్చు. పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి ఎప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అమెరికా మీడియా క్సియోస్‌తో మాట్లాడిన జెలెనెస్కీ తాము కూడా రష్యా ఏది చేస్తే ప్రతిక్రియగా అదే చేస్తామన్నాడు.తమ ఇంథన వనరులపై పుతిన్‌ సేనలు దాడి చేస్తే తాము కూడా అదే చేస్తామన్నాడు.కెయిత్‌ కెలోగ్‌ ఒక మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ ఇప్పటికే రష్యాలో ఉన్న కొన్ని ప్రత్యేక లక్ష్యాలపై దాడులకు కీవ్‌ను అనుమతిస్తున్నట్లు చెప్పాడని తెలిపాడు. సురక్షిత ప్రాంతాలనేవి లేవని అన్నాడు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు నిలిపివేయాలని కోరుతున్న శక్తులపై ఇటీవల గెలిచిన చెక్‌ అధ్యక్షుడు పీటర్‌ పావెల్‌ మాట్లాడుతూ సరఫరా కొనసాగించాల్సిందే అన్నాడు. తగ్గించినా, నిలిపివేసినా మనకు మనమే హాని చేసుకున్నట్లని వ్యాఖ్యానించాడు. 650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల మీద దాడులు చేయగల డ్రోన్‌ క్షిపణి వ్యవస్థలను తాము స్వంతంగా తయారు చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ చెప్పింది, అది నిజమో కాదో తెలియదు గానీ నిజమైతే దాని వెనుక నాటో దేశాల హస్తం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అంతే ఫ్లెమింగో పేరుతో తాము మూడువేల కిలోమీటర్ల దూరం ప్రయణించే క్షిపణిని తయారు చేసినట్లు కూడా కీవ్‌ చెప్పుకుంది. అంటే పశ్చిమదేశాల ఆయుధాలకు ఉక్రెయిన్‌ ముద్రవేసి రష్యా మీద దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పవచ్చు.బహుశా వీటిని గమనించే పుతిన్‌ చేసిన తాజా హెచ్చరిక పరమార్ధం.

మరోవైపున ఐరోపా అంతటా ఇటీవల జరుగుతున్న వివిధ రంగాల సమ్మెలను గమనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నెలలో అనేక దేశాల్లో విమానాశ్రయాల సిబ్బంది సమ్మెకు పిలుపులు ఇచ్చారు. అందువలన ప్రయాణీకులు ఒకటికి రెండుసార్లు తమ విమానాలు నడిచేదీ లేనిదీ తనిఖీ చేసుకోవాలని ఆ రంగానికి చెందిన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పని పరిస్థితులు, వేతన పెంపుదల వంటి అంశాలు ప్రధానంగా సమ్మెలకు పురికొల్పుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల సమ్మెలు, ఇతర రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 నుంచి స్పెయిన్‌లోని అనేక విమానాశ్రయాలలో సిబ్బంది ఆందోళన కారణంగా అనేక విమానాలు నిలిచిపోయాయి. ప్రతి బుధ,శుక్ర, శనివారాల్లో విమానాలు దిగేందుకు పని చేసే సిబ్బంది ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు సమ్మెలు చేస్తున్నారు, ఈ ఆందోళన డిసెంబరు 31వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఫ్రాన్సులో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ నియమించిన ఏడవ ప్రధాని లికోర్ను రాజీనామా చేశాడు. సెప్టెంబరు 9న పదవీ బాధ్యతలు స్వీకరించి కేవలం 26 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ఏలుబడిలో ఉన్న వ్యక్తిగా చరిత్రకెక్కాడు. అంతకు ముందు బడ్జెట్లో కోతలను ప్రతిపాదించిన ఫ్రాంకోయిస్‌ బేయరు నాటకీయంగా గద్దె దిగాల్సి వచ్చింది.కేవలం రెండు సంవత్సరాల్లోనే ఐదుగురు ప్రధానులను నియమించారు. పోర్చుగల్‌లో వచ్చే జనవరి వరకు ప్రకటించిన 71 రోజుల ఆందోళన పిలుపును కోర్టు ఆదేశాల కారణంగా వెనక్కు తీసుకున్నారు. కనీస సిబ్బంది విధుల్లో ఉండాల్సిందే అని కోర్టు ఆదేశించింది. ఇది సమ్మెహక్కుపై నిజమైన దాడి అని కార్మిక సంఘం విమర్శించింది. ఇటలీ రవాణా రంగంలో అనేక అంశాలపై ఒప్పందాలకు రావటంలో విఫలం కావటంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. దీనికి తోడు గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండను నిరసిస్తూ జరిగిన సాధారణ సమ్మెకు కార్మికులు మద్దతు ప్రకటించి లక్షలాది మంది ప్రదర్శనల్లో పాల్గన్నారు. చాలీ చాలని వేతనాలతో బతుకులీడుస్తున్నామని స్వంత ఇల్లు కొనుగోలు చేసేందుకు అవసరమైన రీతిలో తమవేతనాలను పెంచాలని బ్రిటన్‌లో రైల్‌,మారిటైమ్‌ మరియు ట్రాన్ప్‌పోర్ట్‌ (ఆర్‌ఎంటి) యూనియన్‌ ప్రచార ఆందోళన నిర్వహిస్తున్నది.వేతన పెంపుదలను కోరుతూ రెండు రోజుల పాటు సమ్మె జరపాలని ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ (టిఎఫ్‌ఎల్‌) పిలుపు ఇవ్వగా 4.5శాతం పెంపుదలకు అంగీకరించటంతో ఆందోళన విరమించారు. కార్మికవర్గం జరుపుతున్న సమ్మెలకు వ్యతిరేకంగా మీడియాలో ఉన్న యాజమాన్య అనుకూల వ్యాఖ్యాతలు వక్రీకరణలతో విశ్లేషణలు రాస్తున్నారు. స్వంత ఇల్లు కొనుగోలు బ్రిటన్‌లో ఒక హక్కుగా లేదన్నది వాటిలో ఒకటి. బ్రిటన్‌లో 1947 నుంచి ప్రతి ఏటా రైల్వే కార్మికులు సమ్మెలు చేస్తున్నారంటూ ఒక వ్యాఖ్యాత ఉక్రోషం వెలిబుచ్చాడు.బడ్జెట్‌లోటు ఏర్పడినపుడల్లా ఫ్రాన్సులో ఆ భారాన్ని కార్మికవర్గం మీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో జిడిపిలో ఐదుశాతం ఉన్నపుడు 1995లో జరిగిన ఆందోళనల్లో ఇరవై లక్షల మంది రోడ్ల మీదకు వచ్చారు. నాటి ప్రధాని అలైన్‌ జుపే అంతకు ముందు ప్రతిపాదించిన అనేక పొదుపు చర్యలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అధ్యక్షుడు మక్రాన్‌ 2023లో ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 64 సంవత్సరాలకు పెంచి పెన్షన్‌ బిల్లును తగ్గించేందుకు చూశాడు.ఇప్పుడు మరో మితవాద ప్రధాని లీకొర్ను అదే విధానాలతో ఇంటిదారి పట్టాడు.ఐరోపా పాలకవర్గ సంక్షోభం, దానికి కార్మికవర్గం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనకు ఇది ఒక సాక్ష్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పసిడి ధర ఐదేండ్లలో మూడు రెట్లు పెరుగుదల ? ప్రపంచ అప్పుకు దీనికి సంబంధం ఉందా !

01 Wednesday Oct 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, GLOBAL DEBT SURGE, Gold Price Record, India debt matters, Narendra Modi Failures, World Debt, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ప్రపంచ రుణం 338 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌(ఐఐఎఫ్‌) సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.(ఎవరికైనా ఆసక్తి ఉండి యుఎస్‌ డెబిట్‌ క్లాక్‌ డాట్‌ ఓఆర్‌జి వెబ్‌సైట్‌లోకి వెళితే ప్రతి క్షణం ఏ దేశానికి ఎంత అప్పు పెరుగుతున్నదో చూడవచ్చు.) మన జిడిపి నాలుగు లక్షల కోట్ల డాలర్లు, ప్రపంచ రుణం మాత్రం ప్రతి నెలా సగటున 3.4లక్షల కోట్ల డాలర్లు పెరుగుతున్నది.ఈ లెక్కన ఈ ఏడాది డిసెంబరు నాటికి మరో 20లక్షల కోట్ల డాలర్ల మేర ప్రపంచ రుణం పెరగనుంది. ఇలా పెరుగుతున్న అప్పులతో జనాలకు తిప్పలు కూడా అధికం అవుతున్నాయి. అమెరికా కరెన్సీ డాలరు ఈ ఏడాది జనవరి నుంచి 9.75శాతం పతనమైంది. అందువలన రుణం బాగా పెరిగినట్లు కనిపిస్తోందని కొంత మంది భాష్యం చెబుతున్నారు. కరోనా వచ్చిన 2020లో ఈ మాదిరి భారీ పెరుగుదల ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకున్నా పెరగటం ఆందోళన కలిగిస్తున్నది. కుటుంబాలకు అప్పులు పెరిగితే ఏమౌతుంది. దానికి తగిన రాబడి లేకపోతే వాటిని తీర్చేందుకు కొన్ని కుటుంబ అవసరాలను తగ్గించుకొని రుణ చెల్లింపులకు కొంత మొత్తాన్ని మళ్లించాల్సి వస్తుంది. ప్రభుత్వాలు అయినా చేస్తున్నది అదే. ఉదాహరణకు ప్రపంచంలో అత్యధికంగా అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లు. దానికి ఏటా చెల్లిస్తున్న వడ్డీ,అసలు మొత్తం 1.157లక్షల కోట్ల డాలర్లు. కొత్తగా తీసుకొనే అప్పులో సగానికి పైగా రుణ చెల్లింపులకే పోతున్నది.

అప్పులు పెరిగే కొద్దీ చేసిన వాగ్దానాలకు, అమలు చేస్తున్న పథకాలకు ఏదో ఒక సాకుతో కోత పెడతున్నారు.నిజానికి సామాన్యులకు ఏం జరుగుతున్నదో కూడా తెలియటం లేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులను చూద్దాం. మన దేశ మొత్తం అప్పు 2025 మార్చి నాటికి రు.181,74,284 కోట్లు దీన్ని 2026 మార్చి నాటికి రు.196,78,772 కోట్లకు పెంచుతామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. శాశ్వత ఆస్తుల కల్పనకు మూలధన పెట్టుబడిగా పెట్టాలి లేదా సంక్షేమానికి కేటాయించాలి.అప్పు తెస్తామన్న రు.15.69లక్షల కోట్లలో వడ్డీలు, అసలు చెల్లించేందుకు రు. 12.76లక్షల కోట్లు కేటాయించారు.2024-25 బడ్జెట్‌లో సబ్సిడీలకు రు.4.28లక్షల కోట్లు కేటాయించి పదకొండువేల కోట్లు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో రు.4.26వేల కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం మీద గతేడాది కేటాయింపులతో పోలిస్తే 0.4శాతం తగ్గించారు. నూతన ఉపాధి కల్పన పధకానికి గతేడాది పదివేల కోట్లు కేటాయించి 6,800 కోట్లు ఖర్చు చేసి వర్తమాన కేటాయింపుల్లో 20వేల కోట్లు చూపి 194శాతం అదనం అని గొప్పలు చెప్పారు.గ్రామీణ ప్రాంతాలకు మంచినీటిని అందచేసే జలజీవన్‌ పథకానికి 70వేల కోట్లు కేటాయించి చేసిన ఖర్చు చేసిన కేవలం 22.693వేల కోట్లు మాత్రమే. ఈ ఏడాది 67వేల కోట్లు కేటాయించి చూశారా 195 శాతం పెంచామంటూ ఊదరగొడుతున్నారు. వీటన్నింటినీ నిజంగా ఖర్చు చేస్తారా అన్నది చూడాలి. ఎరువుల సబ్సిడీగా 2023-24లో రు.1.88 వేల కోట్లు ఖర్చు చేసిన సర్కార్‌ ఈ ఏడాది దాన్ని 1.67లక్షల కోట్లకు కోత పెట్టింది. ఈ కారణంగానే అవసరమైన మేరకు యూరియా ఇతర ఎరువులను దిగుమతి చేసుకోకుండా డబ్బు మిగుల్చుకొని రైతాంగాన్ని ఇక్కట్ల పాలు చేసింది. కార్పొరేట్‌ పన్ను తగ్గించిన కారణంగా గతేడాది లక్ష కోట్ల మేరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కోత పడింది. ఇవన్నీ చూసినపుడు పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు, కార్పొరేట్లకు రాయితీల కొనసాగింపు, కోట్లాది మంది రైతాంగానికి, ఇతరులకు సబ్సిడీల కోత స్పష్టంగా కనిపిస్తున్నది.

నరేంద్రమోడీ మిత్రుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్నది కూడా ఇదే. వివిధ దేశాల వస్తువుల మీద దిగుమతి పన్నులు వేసి రానున్న పది సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర లోటుబడ్జెట్‌ను తగ్గించుకోవాలని చూస్తున్నాడు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ పన్నుల మొత్తాన్ని చెల్లించాల్సింది సామాన్య పౌరులే గనుక తన అసమర్ధతను జనం మీద రుద్దుతున్నట్లే. నరేంద్రమోడీ చేస్తున్నది కూడా అదే మన అవసరాల్లో 80శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాం.దాని ఉత్పత్తులైన పెట్రోలు, డీజిలుపై సెస్‌, ఇతర పన్నుల భారాన్ని పెంచారు. మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. ఏటా లక్షా 73వేల కోట్ల మేర జనం నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధర పీపాకు 20డాలర్లు తగ్గినా ఒక్క పైసా కూడా వినియోగదారులకు ధరలు తగ్గించలేదు. రష్యా నుంచి చౌకధరలకు ముడి చమురు దిగుమతి చేసుకొని లాభాలకు ఐరోపా దేశాలకు ఉత్పత్తులను అమ్మిస్తున్నారు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023-24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. అందుకే అభివృద్ధి కోసం రుణాలు చేస్తున్నామని రాజకీయ నేతలు చెప్పే మాటలు బూటకం అని చెప్పాల్సి వస్తోంది.

కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రాలు కూడా నానాటికీ రుణ ఊబిలో కూరుకుపోతున్నాయి. అవి కూడా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నాయి.హిమచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం పద్నాలుగు రకాల సబ్సిడీలను క్రమబద్దీకరించే పేరుతో కోత పెట్టేందుకు కసరత్తు చేస్తున్నది.మహారాష్ట్రలో రెండింజన్ల పాలన ఉంది. రాష్ట్ర రుణ భారం 9.25లక్షల కోట్లకు పెరగనుంది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి లడకీ బహిన్‌ పధకానికి రు.46వేల కోట్లు కేటాయించారు. తాజాగా దాన్ని రు.36వేల కోట్లకు కోత పెట్టారు.వృద్ధులకు యాత్రల సబ్సిడీ కొత్త కేటాయింపులు లేవు. మరో రెండింజన్ల పాలన రాష్ట్రం మధ్య ప్రదేశ్‌. అక్కడ ప్రాధమిక పాఠశాల విద్యకు ఈ ఏడాది రు.15,509 కోట్ల నుంచి రు.11,837 కోట్లకు కుదించారు. మహిళలకు ఉచిత బస్‌ పథకాన్ని ప్రకటించిన కర్ణాటక సర్కార్‌ 15శాతం బస్‌ ఛార్జీలను పెంచింది.

ఒక్క చైనా తప్ప రుణ భారం పెరిగిన ప్రపంచ దేశాలన్నింటా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నారు. అందుకే అనేక చోట్ల వలస వచ్చిన వారు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారంటూ మితవాద శక్తులు జనాలను రెచ్చగొడుతున్నాయి.జి 7 దేశాలతో పాటు చైనా రుణభారం గణనీయంగా పెరుగుతున్నట్లు ఐఐఎఫ్‌ నివేదిక పేర్కొన్నది.అమెరికా వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం జపాన్‌ పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం కలిగి ఉంది. ఇది జిడిపికి 293శాతం ఎక్కువ. ఇంత రుణం కలిగిన జపాన్‌ అమెరికాకు లక్ష కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అదే విధంగా జిడిపిలో 86.7శాతం 16లక్షల కోట్ల రుణం ఉన్న చైనా మరోవైపున అమెరికాకు 750 బిలియన్‌డాలర్ల రుణం ఇచ్చింది. ఇతర దేశాలలో సూడాన్‌ రుణం జిడిపికి 252 శాతం ఉంది. నిరంతరం అంతర్యుద్ధాలతో సూడాన్‌ అప్పు పెరిగింది. జపాన్‌లో కార్పొరేట్లకు ఉద్దీపన పథకాలు, వృద్ధుల సంఖ్య పెరగటం కారణాలుగా చెబుతున్నారు. సింగపూర్‌ 175, బహరెయిన్‌ 141, ఇటలీ 137 అమెరికా 123శాతం రుణభారంతో ఉన్నాయి. ధనిక దేశాలు ఇలా ఉండటానికి కారణంగా కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలే ప్రధాన కారణం. ధనిక దేశాలకు సగటున 110, వర్దమాన దేశాలకు 74శాతం రుణభారం ఉంది. ధనిక దేశాల కంటే వర్ధమానదేశాల రుణ భారం వేగంగా పెరగటం ఆందోళన కలిగిస్తోందని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది.గతంలో యుద్ధ సమయాల్లోనే దేశాలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొనేవి. 1980దశకం నుంచి అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు రుణాలు తీసుకోవటం జరుగుతున్నది. చిత్రం ఏమిటంటే అప్పులు పెరుగుతున్నాయి అభివృద్ధి దిగజారుతున్నది, అనేక ధనిక దేశాల అనుభవం ఇదే. అంటే అభివృద్ధికి అప్పులు అనేది పూర్తిగా నిజం కాదు. అనేక దేశాలు రుణాలు తీసుకోవటమే కాదు ఇస్తున్నాయి. ఉదాహరణకు పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం ఉన్న జపాన్‌ అమెరికాకు లక్ష కోట్లతో సహా ఇతర దేశాలన్నింటికీ ఇస్తున్న రుణం 2024 నవంబరు నాటికి 4.18 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.ఇలాగే ఇతర దేశాలు కూడా ఇస్తున్నాయి. అందువలన ఇలాంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే నిఖరంగా ఎంత అప్పు అన్నది తేలుతుంది. మన జిడిపి చాలా తక్కువే అయినప్పటికీ 216, చైనా 750 బిలియన్‌ డాలర్లు అమెరికాకు అప్పు ఇచ్చాయి. కరీబియన్‌ సముద్రంలో కేమన్‌ దీవుల జనాభా 90వేలకు అటూ ఇటూ, అది అమెరికాకు ఇచ్చిన అప్పు 2024లో 423 బిలియన్‌ డాలర్లు. అదెలా అంటే అదొక పన్నుల స్వర్గం, అక్కడ డబ్బుదాచుకుంటే ఎవరూ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల్లో పన్నులు ఎగవేసిన పెద్దల నల్లధనం మొత్తం ఇలాంటి చోట్లకు చేర్చి అక్కడి నుంచి ఏ దేశానికైనా రుణాలు ఇచ్చి బ్లాక్‌ను వైట్‌గా మార్చుకుంటారు. అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లలో అక్కడి ఫెడరల్‌ రిజర్వు ప్రభుత్వం జారీచేసిన రుణబాండ్లను ఆరులక్షల డాలర్లమేర కొనుగోలు చేసింది, అంటే అప్పు ఇచ్చింది. మన కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం 196లక్షల కోట్లలో 190లక్షల కోట్లు అంతర్గత రుణాలే. అంటే మన బాంకులు, ఉద్యోగులు, ద్రవ్య సంస్థలు ఇచ్చిన అప్పులే అవి. వడ్డీ రాబడి కోసం ఇదంతా జరుగుతున్నది. ఇతర దేశాల మాదిరి జిడిపిలో మన రుణం 93శాతం, దానికి మించి పెరిగితే ఇబ్బందులు వస్తాయి.

ఒక వైపు అప్పులు పెరుగుతుంటే మరోవైపు ప్రపంచ మార్కెట్లో బంగారం ధర దూసుకుపోతోంది.ఈ రెండింటికీ సంబంధం ఉంది అంటున్నారు. గత చరిత్ర ఇదే చెబుతోంది.రుణాలు పెరిగే కొద్దీ కరెన్సీ విలువలు కూడా పడిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే దేశాలూ, వ్యక్తులూ కూడా బంగారం కొనుగోళ్లు సురక్షితం అని భావిస్తున్నారు.మొదటి ప్రపంచ యుద్ధంలో అప్పులపాలైన జర్మనీ తీర్చేందుకు 1920దశకంలో విపరీతంగా నోట్లను ముద్రించింది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి నోట్లు దేనికీ పనికిరాకుండా పోయాయి. జనాలు కరెన్సీ నోట్లను గోడలకు కాగితాల మాదిరి అంటించి నిరసన తెలిపారు. సంక్షోభాలకు బీమా వంటిది బంగారం అని చెబుతారు. ఇప్పుడు ప్రపంచంలో రిజర్వు ఆస్తులలో బంగారానిది రెండవ స్థానం.ప్రపంచ ధనిక దేశాల్లో 2008లో తలెత్తిన ద్రవ్య సంక్షోభంతో ఉద్దీపన పథకాలు అమలు జరిపిన కారణంగా ప్రపంచ రుణం 2007 నుంచి 2009 కాలంలో 20శాతం పెరిగి 178లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బంగారం ఔన్సు(28.35గ్రాములు) ధర 869 డాలర్ల నుంచి 1,224 డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచ రుణం ముందే చెప్పుకున్నట్లు 338లక్షల కోట్లడాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సు ధర 3,800 డాలర్లుగా ఉన్నది త్వరలో 4,800 డాలర్లకు పెరగవచ్చని జోశ్యం చెబుతున్నారు. ఐరోపాలో 2011-2012లో తలెత్తిన రుణ సంక్షోభ సమయంలో మదుపుదార్లకు యూరో మీద విశ్వాసం తగ్గి బంగారంవైపు మొగ్గు చూపటంతో 2011 సెప్టెంబరులో 1,920 డాలర్లకు పెరిగింది. జపాన్‌లో 2020-21 సంవత్సరాలలో రుణ భారం 266శాతానికి పెరగటంతో మదుపుదార్లు బంగారం కొనుగోలుకు ఎగబడటంతో కరెన్సీ విలువలో ధర 18శాతం పెరిగింది.2024లో అమెరికా ఐపి పెట్టేవరకు వచ్చి బయటపడింది.రుణం 34లక్షల కోట్ల డాలర్లు దాటింది.దాంతో బంగారం ధర 2,100 డాలర్లకు పెరిగింది. ఏడాది కాలంలోనే 3,800 డాలర్లకు చేరిందంటే సంక్షోభం మరింత ముదురుతున్నట్లు మదుపుదార్లు భావిస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచ రుణం జిడిపిలో 95శాతం ఉంది, 2030 నాటికి అది వందశాతానికి చేరవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అంటే సామాన్యులకు ముప్పు మూడినట్లే ! మరి బంగారం ధర సంగతి ? జోశ్యాలను చూస్తే సామాన్యులు దానివైపు చూడనవసరం లేదనట్లుగా ఉన్నాయి. అక్టోబరు ఒకటవ తేదీన ఔన్సు ధర 3,875 డాలర్లకు చేరింది.1999లో కనిష్ట ధర 252 డాలర్లు. డిసెంబరు ఆఖరుకు 4,036 డాలర్ల వరకు పెరగవచ్చని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. కొందరైతే 4,289 డాలర్లకు చేరవచ్చన్నారు.వచ్చే ఏడాది(2026) ఆఖరుకు 5,488 డాలర్లు, 2027-30 మధ్య 5,479 నుంచి 7,956 డాలర్ల మధ్య ధర ఉండవచ్చని కొందరు చెబుతుంటే 2030 నాటికి 11,330 డాలర్లకు పెరగవచ్చని మరికొందరు. కొనుగోలు చేయాలా వద్దా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చరిత్ర గమనాన్ని మార్చివేస్తున్న కమ్యూనిస్టులు : ప్రతిభావంతులను ఆకర్షిస్తున్న చైనా, బెంబేలెత్తుతున్న అమెరికా !

21 Thursday Aug 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Education, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

China “young talent” K visa, china communist party, China vs US, Donald trump, global scientific talent China, STEM experts, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


అవును ఎవరు అవునన్నా కాదన్నా, మరొకటన్నా ఇది నిజం. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లుగా మేథావులందరూ పశ్చిమదేశాలలోనే పుట్టారు, మిగతా దేశాల వారు అక్కడికే వెళతారు అన్నట్లుగా కొందరు చాలాకాలంగా జనాల మెదళ్లకు ఎక్కించారు. ఇప్పుడు చైనా కమ్యూనిస్టులు దాన్ని తలకిందులు చేస్తున్నారు. గత శతాబ్దిలో ప్రపంచాన్ని ఏలిన చమురుకు ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది. అయితే అదే సర్వస్వం కాదని తేలిపోయింది. దాన్ని పక్కన పెట్టే ‘‘ ప్రతిభ ’’ ప్రత్యామ్నాయ హరిత ఇంథనం, క్వాంటమ్‌, కృత్రిమ మేథ వంటి రూపాల్లో ముందుకు వస్తున్నది. చమురుతో పని లేకుండా నడిచే విద్యుత్‌ వాహనాలు రోడ్లను ముంచెత్తటం తెలిసిందే. ఈ పూర్వరంగంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో 2035 నాటికి అమెరికాను అధిగమించేందుకు చైనా నడుంకట్టటం గురించి కొద్ది నెలలుగా మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి, అవేవీ కమ్యూనిస్టులు నడిపేవి కాదు, చివరికి కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదుల పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక ‘‘స్వరాజ్య ’’లో 2025 జూన్‌ 27న అమిత్‌ మిశ్రా అనే విశ్లేషకుడు కూడా రాశారు.దాన్ని నవీకరించి ఆగస్టు మూడున తిరిగి ప్రచురించారు. ‘‘ మేథోవంతుల ఆకర్షణ : వేయి ప్రతిభల చైనా వ్యూహం దాని ఔన్నత్యాన్ని ఎలా ముందుకు నెడుతున్నది ’’ అనే శీర్షిక( కోర్టింగ్‌ జీనియసెస్‌ : హౌ చైనా స్‌ థౌసెండ్‌ టాలంట్స్‌ స్ట్రాటజీ ఈస్‌ ఫ్యూయలింగ్‌ ఇట్స్‌ ఎసెంట్‌)తో ఒక విశ్లేషణ వెలుండిరది. ఇక్కడ దీన్ని ప్రస్తావించటం అంటే చైనాకు మిత,మతవాదుల సర్టిఫికెట్‌ లేదా ప్రశంసల గురించి కాదు. చైనా ఎలా దూసుకుపోతున్నదో చూడండి అనే ఉక్రోషం, అసూయ ప్రదర్శన దాని వెనుక ఉందని చెప్పేందుకే.


ఇక సందర్భానికి వస్తే ఈ ఏడాది అక్టోబరు ఒకటి నుంచి అంటే విప్లవదినోత్సం రోజు నుంచి చైనా ప్రభుత్వం ప్రపంచంలోని యువ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కె రకం వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఎందుకు అంటే 2035నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామి దేశంగా మారేందుకు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. కొత్తగా పట్టా పుచ్చుకున్న స్వదేశీయులు లేదా విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారు, ఇతర దేశాల్లో ఇప్పటికే ఆయా రంగాలలో పని చేస్తున్న వారిని ఆకర్షించేందుకు పూనుకుంది. ఇటీవలి కాలంలో చైనా విధాన నిర్ణయాలలో ఇది పెద్దదని భావిస్తున్నారు. తనకు ఎదురులేనంతవరకు చైనాను ఎదగనిచ్చిన అమెరికా ఎప్పుడైతే తన ఆధిపత్యానికి అన్ని రంగాలలో ప్రతిఘటన ఎదురవుతున్నదని గ్రహించిందో అప్పటి నుంచి అడ్డుకోవటం ప్రారంభించింది. వైట్‌హౌస్‌లో ఏ పార్టీ వారున్నా అదే చేస్తున్న పూర్వరంగంలో దానికి ధీటుగా చైనా కమ్యూనిస్టు పార్టీ చేసిన కసరత్తు నుంచి వెలువడిరదే తాజా నిర్ణయం. ప్రధాని లీ క్వియాంగ్‌ సంతకంతో అది చట్టంగా మారింది. స్టెమ్‌(సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణితం) రంగాలలో ప్రతిభావంతులైన విదేశీ యువతను ఆకర్షించేందుకు సరికొత్త ‘‘ యువ ప్రతిభ ’’ కె వీసా ప్రత్యేకత ఏమంటే చైనాలో ఉన్న కంపెనీల యజమానులు లేదా సంస్థల నుంచి సిఫార్సులు అవసరం లేదు.నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రతిభావంతులైన యువశాస్త్రవేత్తల కార్యక్రమంలో వయస్సు గరిష్ట పరిమితి 45 సంవత్సరాలు, మరో పధకానికి 40 ఏండ్లు. దీనికి ఎలాంటి పరిమితి నిబంధన లేదు. ఇతర దేశాలతో పోటీ పడుతూ వేతనాలు, వసతి, బోనస్‌, పిల్లలకు విద్య వంటి ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.దేశ విధానానికి లోబడి పరిశోధనలో స్వేచ్చ ఉంటుంది. ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడులకు ఎలాంటి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించారో ఇప్పుడు ప్రతిభావంతులైన వారిని ఆకర్షించేందుకు అలాంటి విధానాన్నే ముందుకు తెచ్చారని చెప్పవచ్చు. ఇలాంటి ప్రత్యేక వీసాలు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి.

అమెరికాలో చైనా సంతతికి చెందిన వారి మీద పెరుగుతున్న జాత్యహంకార వివక్ష, ఆంక్షలు, పరిశోధనలకు కేటాయింపుల కోత, గూఢచర్య ఆరోపణలతో వేధింపులు, రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల పూర్వరంగంలో అనేక మంది అక్కడి నుంచి బయటపడేందుకు చూస్తున్నారు. మంచి పండ్లను ఏరి దిగుమతి చేసుకున్నట్లుగా దశాబ్దాల తరబడి, అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మేథోవలసతో ఎంతగానో లబ్దిపొందాయి. ఇప్పుడు అటునుంచి వలసలకు చైనాతో నాంది పడిరదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు.చైనా కమ్యూనిస్టు పార్టీ నేత లి యువాన్‌చావో 2008లో ‘‘వేయి ప్రతిభావంతుల పథకాని(టిటిపి)కి రూపకల్పన చేశారు .విదేశాల్లో ఉన్న చైనా సంతతికి చెందిన వారిలో కనీసం రెండువేల మందిని స్వదేశానికి ఆహ్వానించి ఒక నవకల్పన సమాజంగా దేశాన్ని మార్చాలని తలపెట్టారు. 2011ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినపుడు ఏటా 50 నుంచి వందమందిని పదేండ్ల పాటు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దానికి మించి ఇప్పటి వరకు ఏడువేల మంది శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు,వాణిజ్య,పారిశ్రామికవేత్తలు వచ్చారని అంచనా, వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నారు. మరొక సమాచారం ప్రకారం 2010 నుంచి 2021 మధ్య కాలలో కనీసం 20వేల మంది చైనా జాతీయులు అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లారు. ఇలాంటి వారు చూపుతున్న ప్రతిభను బట్టి మిలియన్ల యువాన్లను బోనస్‌, ఇతర రాయితీలను ప్రతిఫలంగా చెల్లించుతున్నారు. అమెరికా నుంచి వచ్చే వారు విద్రోహచర్యల నిమిత్తం వస్తున్నారా నిజంగానే పని చేసేందుకే అని నిర్ధారించుకొనేందుకు సునిశిత పరిశీలనలు కూడా చేశారని వార్తలు. ఈ పధకానికి చైనా పెద్ద ప్రచారం ఇవ్వలేదు గాని దాని తీరుతెన్నులు గమనించిన అమెరికా జాతీయ గూఢచార సంస్థ, ఎఫ్‌బిఐ గుండెలు బాదుకుంటూ నివేదికలు రూపొందించాయి. చైనా ఆర్థిక, మిలిటరీ రంగాలలో పురోగమించటానికి చట్టబద్దంగా, అక్రమ పద్దతుల్లో అమెరికా మేథో సంపదను చైనా కొల్లగొడుతున్నదని ఆరోపించారు. ఈ ప్రచారం పెరగటంతో చైనా కొత్త పద్దతుల్లో క్విమింగ్‌ పేరుతో ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పూనుకుంది.2019 నుంచి 2023వరకు ఐదు వందలకు పైగా ప్రభుత్వ పత్రాలను పరిశీలించిన రాయిటర్స్‌ వార్తా సంస్థ చైనా ఇస్తున్న నగదు, ఇతర మొత్తాల గురించి పేర్కొన్నది.

దశాబ్దాలుగా భారత్‌, చైనా వంటి దేశాల నుంచి ఎందరో ప్రతిభావంతులు ఎక్కువగా అమెరికా, ఇతర పశ్చిమదేశాలకు వలస వెళ్లారు.వ్యక్తిగతంగా వారితో పాటు ఆయా దేశాల పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. ఆర్థికంగా నిలదొక్కుకొని ఎదగటం ప్రారంభమైన తరువాత మరింత ముందుకు పోవాలంటే అలాంటి అవసరం ఎంతో ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీ గుర్తించింది.కమ్యూనిస్టులు ప్రతిభావంతుల మీద కూడా తమ సిద్దాంతాలను రుద్దుతారని, వారికి స్వేచ్చ ఇవ్వరని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.చైనా కమ్యూనిస్టులు దాన్ని కూడా గమనంలో ఉంచుకున్నారు. నూటనలభై కోట్ల జనాభా జీవితాలను ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దాన్లో భాగంగానే తమ దగ్గరలేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించారు. అవి తమ నుంచి లబ్దిపొందుతాయని తెలిసినప్పటికీ దాని కంటే తాము ఎక్కువ ప్రయోజనం పొందుతామనే ముందు చూపు, ధైర్యంతో ఎన్ని విమర్శలు వచ్చినా సంస్కరణలకు తెరతీశారు, విజయం సాధించారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది గనుక అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రతిభావంతులను అక్కున చేర్చుకుంటున్నారు.దాని ఫలితాలు కనిపించాయి. సెమికండక్టర్లు, వైమానిక రంగం, 5జి, క్వాంటమ్‌ వంటి అనేక రంగాల్లో మరొకదాని వెనుక వెళ్లే పరిస్థితి నుంచి పోటీదారుగా మారింది. జీవశాస్త్రంలో అమెరికాను అధిగమించి 2017లోనే ఎక్కువగా పరిశోధక పత్రాలను చైనీయులు ప్రచురించారు.

గత నాలుగున్నర దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, విధానాల గురించి కొంత మంది విమర్శలు చేయవచ్చు.ఇప్పుడు చైనా మరొకదశలో ప్రవేశించింది. అధికారాన్ని కార్మికవర్గం చేతిలో పెట్టటం ద్వారా విప్లవం చేయాల్సినపని చేసింది. సాధించిన అధికారం ఒక్కటే జన జీవితాలను మెరుగుపరచదని గుర్తించిన తరువాత తీసుకున్న చర్యలకు తగిన ఫలితాలు వచ్చాయి. వాటికి ఉన్న పరిమితులను గమనించి మరొక అడుగు ముందుకు వేస్తున్నది. విదేశీ పెట్టుబడులకు కొంత ప్రతిఫలాన్ని చెల్లించినట్లుగా, స్వదేశంలోనే సంస్థల పెరుగుదలకు వ్యక్తులను ప్రోత్షహించిన తీరు చూశాము. అలాగే ప్రతిభావంతులకు మిగతావారితో పోలిస్తే అధికమొత్తాలను ఇవ్వాల్సి ఉంటుందని గ్రహించింది. మరిన్ని పరిశోధనల ద్వారా జనకల్యాణానికి వినియోగించేందుకు పూనుకున్నది. ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతులను చైనా ఆకర్షించటం అమెరికా మాదిరి కార్పొరేట్ల లాభాలకు కాదు, జనాల కోసం.ఈ ప్రయత్నం వెనుక వ్యూహాత్మక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి. నిజానికి ఇది చైనా కమ్యూనిస్టు పార్టీకి కత్తిమీద సామువంటిదే.వచ్చేవారు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి, శాస్త్ర రంగ నాయకత్వంతో పాటు రాజకీయ నాయకత్వంలో ఇమిడి పోయే విధంగా ఉండాలి. కమ్యూనిస్టుల గురించి అనేక తప్పుడు ప్రచారాలు జరిగిన నేపధ్యం,అన్యవర్గ ప్రభావంతో అలాంటి వారు ప్రతి చర్యనూ అనుమానంతో చూసే అవకాశం ఉంటుంది, సహజం. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొనే చైనా కమ్యూనిస్టులు ఒక ప్రయోగం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు అది చేసిన వన్నీ మొత్తం మీద ఫలించాయి.

చైనాలో ప్రస్తుతం ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాల పర్యావరణం నానాటికీ పెరుగుతున్నది.ప్రపంచ స్థాయి సంస్థలలో చైనా వాటికి చోటుదక్కుతున్నది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోమెడిసిన్‌, కృత్రిమ మేథ, ప్రత్యామ్నాయ ఇంథన రంగాలలో సాధించే పురోగతితో అగ్రగామిగా ఉన్న అమెరికాను అధిగమించాలన్నది కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన లక్ష్యం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ క్రమంలో తలెత్తే మిత్రవైరుధ్యాలు ఎలా ఉంటాయి, వాటిని పార్టీ ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం.మరోవైపున చూస్తే అమెరికా, ఇతర పెట్టుబడిదారీ ధనిక దేశాలు పరిశోధకులను, వారితో కలిగే లాభాలను కోల్పోతే చూస్తూ ఊరుకోవు. ప్రమాణాలకు గీటురాళ్లుగా ఇప్పటి వరకు కొనసాగిన అమెరికా విశ్వవిద్యాలయాలు ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటాయా ? ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పోటీ పడటంలో కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, జర్మనీ, అరబ్‌ ఎమిరేట్స్‌ వంటివి కూడా ఉన్నాయన్నది మరచిపోరాదు. గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టే విధంగా రానున్న రోజుల్లో పోటీ మరింత పెరగటం మంచిదే. వ్యక్తుల ప్రతిభకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది, అయితే అది పూర్తిగా వారి స్వంతం కాదు, సమాజం నేర్పినదానికి తమ సృజనాత్మకతను జోడిరపు మాత్రమే. ఉదాహరణకు విద్యుత్‌ బల్బ్‌ను చూస్తే, 1,799 సంవత్సరం నుంచి బల్బులు, బ్యాటరీల తయారీకి పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అనేక మంది చేసిన కృషి 1870, 80 దశకాల్లో పోటీ మరింత పెరిగింది.బ్రిటన్‌లో జోసెఫ్‌ స్వాన్‌, అమెరికాలో థామస్‌ ఎడిసన్‌ ఒకేసారి బల్బులను కనుగొన్నారు.స్వాన్‌ బల్బులు విలియమ్‌ స్టెయిట్‌ రూపొందించన నమూనాల ప్రకారం ఉన్నాయి. వాటి ఫిలమెంటు చాలా మందంగా ఉంది. ఎడిసన్‌ బల్బులో పలుచగా ఉండటంతో వాణిజ్య పరంగా అది విజయవంతమైంది. స్వాన్‌, ఎడిసన్‌ మధ్య పోటీ చివరకు వారిద్దరినీ ఒక దగ్గరకు చేర్చి ఎడిసన్‌ మరియు స్వాన్‌ ఎలక్ట్రిక్‌ లైట్‌ కంపెనీగా ఏర్పడి స్వాన్‌ రూపొందించిన ఫిలమెంట్‌తో మార్కెట్‌ చేశారు. కానీ పేరు ఎడిసన్‌కు వచ్చింది, దాని వెనుక ఎందరో ఉన్నారు. ఆ తరువాత బల్బుల్లో ఎన్ని మార్పులు, చేర్పులు జరిగాయో మనకు తెలిసిందే. అందువలన ప్రతి నవకల్పన సమాజానికి ఉపయోగపడుతుందా, కార్పొరేట్ల లాభాలకా అన్నదాన్ని బట్టి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల వర్గదృకృధం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. చైనా కార్మికవర్గ వైఖరితో ప్రతిభకు పట్టం కడుతున్నదని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : అలాస్కా సమావేశ ఆంతర్యం ఏమిటి ? జెలెనెస్కీతో చర్చలకు తొందరేం లేదన్న రష్యా !

20 Wednesday Aug 2025

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Alaska meeting, Donald trump, Ukrain failures, Ukraine, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ గద్దె నెక్కి రెండు వందల రోజులు దాటింది. అడుగు ముందుకు పడకున్నా తాజాగా ఇదిగో పరిష్కారం అంటూ యావత్‌ ప్రపంచ దృష్టిని అటువైపు తిప్పాడు. తాజాగా అమెరికాలోని అలాస్కాలో గత శుక్రవారం నాడు జరిగిన ట్రంప్‌ మరియు పుతిన్‌ భేటీ వార్త సేకరణకు భారీ సంఖ్యలో వచ్చిన మీడియా సిబ్బందే దానికి నిదర్శనం. అంతకు ముందు వరకు కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం ముందు జరగాలంటూ చెప్పిన పెద్దమనిషి అలస్కా సమావేశం తరువాత అలాంటివేమీ లేవు. ఏకంగా పరిష్కారానికి మరోసారి మాస్కోలో సమావేశమని ప్రకటించాడు. చిత్రం ఏమిటంటే సోమవారం నాడు ట్రంప్‌తో భేటీ అయిన ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ మర్యాదల ప్రకారం గతానికి భిన్నంగా కోటు ధరించి వచ్చాడు. గతంలో ట్రంప్‌తో సమావేశానికి ఒక సాధారణ పౌరుడి మాదిరి దుస్తులు రావటంతో అవమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. జెలెనెస్కీని ట్రంప్‌ ఎక్కడ బుట్టలో వేస్తాడో తమతో నిమిత్తం లేకుండా ఒప్పందం కుదుర్చుకుంటారేమో అన్న భయం లేదా ముందు చూపుతో అనేక మంది ఐరోపా నేతలు కూడా కట్టగట్టుకు వచ్చి ట్రంప్‌తో చర్చలు జరిపారు.వారితో మాట్లాడుతూనే కాసేపు ఉండండి అన్నట్లు అంతరాయమిచ్చి పుతిన్‌తో ఫోన్లో మాట్లాడి తన ప్రాధాన్యత ఏమిటో వారికి అవగతమయ్యేట్లు చేశాడు.దానికి అనుగుణంగానే ఐరోపా నేతలు కూడా తమ మర్యాదను కాపాడుకుంటూ ట్రంప్‌ యత్నాలను హర్షిస్తూనే నర్మగర్భంగా తమ భిన్నాభిప్రాయాలను వెల్లడిరచారు. భద్రత అన్న తరువాత మేం లేకుండా పుతిన్‌, జెలెనెస్కీ, ట్రంప్‌ ముగ్గురూ మాట్లాడుకుంటే సరిపోతుందా, నాలుగు పక్షాల సమావేశం జరగాలనే సందేశాన్ని వారు కూడా ఇచ్చారు.ఈ నెలాఖరులో సమావేశం ఎక్కడ జరగాలనే అంశంపై కసరత్తు ప్రారంభమైంది. అది కూడా గత సమావేశాల మాదిరే విఫలయత్నం అవుతుందా నిజంగానే రాజీ కుదిరేందుకు వేదిక అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. సోమవారం నాటి ట్రంప్‌ ఫోన్లో మాట్లాడినపుడు నేరుగా ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు పుతిన్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే మంగళవారం నాడు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లోవరోవ్‌ మాట్లాడిన తీరు చూస్తే చర్చలు వెంటనే జరిగే అవకాశం లేదని తేలిపోయింది. క్రమంగా నిపుణుల స్థాయిలో మొదలై తరువాత దశలవారిగా చర్చలు జరగాలని లోవరోవ్‌ చెప్పాడు.ఐరాసలో రష్యా ప్రతినిధి దిమిత్రి పోలియానిస్కీ మాట్లాడుతూ చర్చల కోసం చర్చలు జరగకూడదని వ్యాఖ్యానించాడు.


అలాస్కా సమావేశం తరువాత కొన్ని సరికొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.చైనా మరియు రష్యాల మధ్య ఉన్న బంధాన్ని తెంచేందుకు అమెరికా పూనుకుందన్నది వాటిలో ఒకటి.ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైటు వెలుగుతుందన్నట్లుగా దీనికి ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారం నాంది పలుకుతుందా ! దీనర్ధం వెంటనే ఏదో జరుగుతుందని కాదు గానీ మాజీ కమ్యూనిస్టు మహాప్రమాదకారి అన్నట్లుగా పుతిన్‌ తీరుతెన్నులను ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిందే. వర్తమాన అంశానికి వస్తే మీడియాలో వస్తున్న లీకు వార్తలు, విశ్లేషణలను చూస్తుంటే మొదటి నుంచి రష్యా చెబుతున్నట్లుగానే దాని షరతులు, వైఖరికి అనుగుణంగానే ఒక పరిష్కారం కుదరవచ్చు అనే భావం కొందరిలో కలుగుతోంది. నిజంగా అలా జరిగితే ఐరోపాలో, ప్రపంచంలోనే సరికొత్త సమీకరణలు, పరిణామాలకు, మరింత పెద్ద సంక్షోభాలకు అది నాంది అవుతుంది. తాజా పరిణామాలు, విశ్లేషణలను చూసినపుడు మొత్తం మీద వ్లదిమిర్‌ పుతిన్‌ కూడా ఆశాభావంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకుల వ్యాఖ్య. ఇప్పటికే ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పుతిన్‌కు యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే రాజకీయ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.అందువల్లనే అతనికీ పరిష్కారం అవసరం.


ట్రంప్‌ యంత్రాంగం రూపొందించినట్లు చెబుతున్న పరిష్కార పద్దతి ప్రకారం ప్రస్తుతం రష్యా స్వాధీనంలో లేని కొన్ని ప్రాంతాలతో సహా డాన్‌బాస్‌ ప్రాంతంలో 6,600 చదరపు కిలోమీటర్లు లేదా 12శాతం భూభాగాన్ని ఉక్రెయిన్‌ వదులుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రతిగా సుమీ, ఖార్కివ్‌ ప్రాంతాలలో 440 చదరపు కిలోమీటర్లను రష్యా ఖాళీ చేసి ఉక్రెయిన్‌కు ఇస్తుంది. ఇదే జరిగితే రష్యాదే పైచేయి అవుతుంది, దాని షరతుల ప్రాతిపదికగానే ఒప్పందం ఉంటుంది. ఇంతవరకు ఏ ఒక్క అంశం మీద కూడా పుతిన్‌ దిగిరాలేదు.ఈ పూర్వరంగంలో అమెరికా ప్రతిపాదనలకు ఉక్రెయిన్‌ అంగీకరిస్తుందా, ఒకవేళ అమెరికా జెలెనెస్కీ మెడలు వంచి ఒప్పించినా ఐరోపా అగ్రదేశాలు తలూపుతాయా, చెప్పలేము. తెల్లవారే సరికి వైఖరులు, పరిణామాలు మారిపోతున్న ఈ రోజుల్లో రష్యా గడ్డమీద తలపెట్టిన తదుపరి భేటీలోపల ఏమైనా జరగవచ్చు.మిలిటరీ దళాల రంగ ప్రవేశంతో సహా ఉక్రెయిన్‌కు ఐరోపా భద్రత కల్పించేందుకు పుతిన్‌ అంగీకరించవచ్చని ట్రంప్‌ యంత్రాంగం చెబుతోంది. దీని మీద పుతిన్‌ వైపు నుంచి ఇది రాస్తున్న సమయానికి ఎలాంటి ప్రతికూల లేదా అనుకూల స్పందనలు లేవు. ఒక వారంలోపే ఒప్పందం జరగాలని ట్రంప్‌ పట్టుబడుతుండగా అదెలా కుదురుతుంది, మంచి చెడ్డలు ఆలోచించటానికి కొన్ని వారాల వ్యవధి కావాలని ఐరోపా నేతలు చెబుతున్నారు.


పరిష్కారం కుదరాలంటే ముందుగా డాంటెస్క్‌, లుహానస్క్‌ ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ వెనక్కు పోవటం తనకు ముఖ్యమని, అది చేస్తే మిలిటరీ చర్య నిలిపివేస్తానని శుక్రవారం నాటి చర్చలలో పుతిన్‌ స్పష్టం చేశాడట.జూన్‌ రెండవ తేదీన ఇస్తాంబుల్‌ సమావేశంలోనే దీన్ని రష్యా ప్రతినిధులు చెప్పారు.దీనితో పాటు క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా అంతర్భాంగా గుర్తించటం, ఉక్రెయిన్‌ మిలిటరీ సంఖ్య తగ్గింపు, ఇతర ప్రాంతాల గురించి కూడా దానిలో పేర్కొన్నారు. రష్యన్లు మరీ ఎక్కువగా అడుగుతున్నారని, దాన్లో వారి స్వాధీనంలో లేని ప్రాంతాలు కూడా ఉన్నాయిని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వ్యాఖ్యానించటమే కాదు, ఉక్రెయిన్‌ కూడా అంగీకరించలేదు. గతంలో పేర్కొన్న నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ ఉపసంహరణ బదులు రెండు ప్రాంతాల గురించి పుతిన్‌ పట్టుబట్టినట్లు వార్తలు. ఉక్రెయిన్‌ భద్రతకు హామీకి తాను అంగీకరిస్తానని అయితే వివిధ దేశాలతో కూడిన అలాంటి వ్యవస్థలో తనకు వీటో అధికారం ఉండాలని రష్యా కోరింది.


శుక్రవారం నాటి చర్చలలో భద్రత గురించి చర్చ వచ్చింది తప్ప అది ఎలా అన్నది తేలలేదు. దీని అర్ధం ఏమిటి ? ఒక ఆలోచన ప్రకారం ఒక వేళ ఉక్రెయిన్‌ మీద తిరిగి రష్యా దాడి చేస్తే భద్రతకు హామీ ఇచ్చిన వారు ఐరోపా వారైతే అమెరికా మద్దతు లేకుండా రష్యా మీద ప్రతిదాడులు జరపవచ్చు. అలాంటి ఒప్పందం కుదిరితే అది అమెరికా మరియు ఐరోపా మధ్య అంతరాన్ని పెంచేందుకు, నాటో కూటమిని పూర్తిగా దెబ్బతీసేందుకు రష్యా వినియోగించుకోవచ్చని యూరోపియన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరొక దృశ్యం ప్రకారం ఉక్రెయిన్‌ భద్రతకు హామీదారుగా ఉన్న ఐరోపా దేశాలపై రష్యా దాడికి పూనుకుంటే ఐరోపాకు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగుతుంది. మూడవ దృశ్యం ప్రకారం భద్రతగా ఉండే ఐరోపా దేశాల మిలిటరీ ఉక్రెయిన్‌లో ఉన్నప్పటికీ రష్యా మీద దాడికి దిగదు, ఉక్రెయిన్‌ మిలిటరీకి అవసరమైన శిక్షణ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు పరిమితంగా అదే చేస్తున్నారు. ఒకవేళ మరోసారి రష్యా దాడికి దిగితే ఇతర దేశాల మిలిటరీ సురక్షితంగా వెనక్కు పోయేందుకు అమెరికా రంగంలోకి దిగుతుంది. ఇవన్నీ పరిపరి విధాల ఊహాగానాలు మాత్రమే.


తమతో భాగస్వామిగా చేసుకొని ప్రపంచ మార్కెట్లపై పెత్తనం చేయాలని జి7 కూటమి ఎనిమిదవ దేశంగా రష్యాను చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే విబేధాలు తలెత్తి రష్యాను పక్కన పెట్టటం, ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి మాస్కో ముంగిట ఆయుధ మోహరింపుకు పశ్చిమదేశాలు కుట్రపన్నిన తరువాతే గతంలో తన ప్రాంతంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా 2014లో విలీనం చేసుకుంది. సోవియట్‌ ఉనికిలో ఉన్న సమయంలో పాలనా సౌలభ్యం కోసం రష్యన్‌ రిపబ్లిక్‌ ప్రాంతమైన క్రిమియాను ఉక్రెయిన్‌లో కలిపారు. సోవియట్‌ పతనమైన తరువాత రెండూ స్వతంత్ర దేశాలుగా మారినప్పటికీ 24 సంవత్సరాలు రష్యా వైపు నుంచి విలీనానికి ఎలాంటి ప్రయత్నాలు లేవన్నది గమనించాల్సిన అంశం. తమకు విశ్వసనీయమైన భద్రతా హామీ ఇవ్వాలని జెలెనెస్కీ పట్టుబడుతున్నాడు. ఇటీవలి కాలంలో అమెరికా వైఖరిలో వచ్చిన మార్పు ప్రకారం ఆయుధాలు ఎన్నికావాలంటే అన్ని ఇస్తుంది, అవసరమైతే వైమానిక దాడులు జరుపుతుంది తప్ప తన మిలిటరీని కొత్తగా మరేదేశంలోనూ దించేందుకు సిద్దం కావటం లేదు. అందువలన ఐరోపా దేశాలతో కలసి రక్షణ కల్పించేందుకు ట్రంప్‌ అంగీకరించే అంశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు.తనకు వ్యతిరేకంగా పశ్చిమదేశాల కుట్రకు ఉక్రెయిన్‌ దూరంగా ఉంటే అన్ని రకాల భద్రత కల్పించేందుకు అసలు రష్యానే సిద్ధంగా ఉంటుందన్నది వేరే చెప్పనవసరం లేదు. రష్యాకు కొన్ని ప్రాంతాలను అప్పగిస్తే యుద్ధం ఆగిపోవచ్చుగానీ జెలెనెస్కీ పదవీ గండం పొంచి ఉంటుంది. జరిగే ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు చెప్పలేము గానీ అతగాడు గెలిచే సమస్యే లేదు. మంత్రులు, ఉన్నతాధికారులు యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించారనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. భవిష్యత్‌లో రష్యాకు ముప్పు తలెత్తకుండా చూసేందుకు ఇప్పటి వరకు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను సాధించకుండా ఒప్పందం చేసుకుంటే పుతిన్‌కూ అదే పునరావృతం అవుతుంది. ఇన్ని ప్రాణాలను బలి ఇచ్చి ఆర్థికంగా నష్టం కలిగించటం ఎందుకన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. రష్యాది పైచేయిగా మారితే ట్రంప్‌ కూడా ఇబ్బందుల్లో పడతాడు, వెంటనే ఎన్నికలు లేవు, వచ్చేసారి పోటీ చేస్తాడో లేదో తెలియదు గనుక వ్యక్తిగతంగా కలిగే నష్టం ఉండదు గానీ, ఐరోపాలో ఉన్న పలుకుబడిని అమెరికా కోల్పోవటం ఖాయం, దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీదనే పడుతుంది.


విడివిడిగా అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోలేమన్న వాస్తవాన్ని గ్రహించిన ఐరోపా దేశాలు సమాఖ్య (ఇయు)గా ఏర్పడి, ఐక్యత మరియు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఇతర దేశాల మీద పన్నుల దాడిని ప్రకటించినట్లే ట్రంప్‌ ఈ కూటమితో కూడా వ్యవహరించి వత్తిడి చేసి ఒక ఒప్పందానికి వచ్చాడు.మరోవైపున జర్మనీ వంటి దేశాలు భారీ ఎత్తున సైనికీకరణకు పూనుకున్నాయి. గతంలో సోవియట్‌ను, గతమూడున్నరదశాబ్దాలుగా రష్యాను చూపి బెదిరించిన అమెరికా ఇప్పుడు ఆ రష్యాతోనే చేతులు కలిపి మరో రూపంలో ఐరోపాను అదుపులో ఉంచుకోవాలని చూస్తోందా అనే కోణాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది.గతంలో సోవియట్‌ మరియు చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన సైద్దాంతిక విబేధాలను ఉపయోగించుకొని లబ్దిపొందేందుకు చూసింది. ఒకటి రాజకీయ, రెండవది చైనా మార్కెట్లో ప్రవేశించి ఆర్థిక లబ్ది.తైవాన్‌ బదులు కమ్యూనిస్టు చైనాకు భద్రతామండలిలో శాశ్వత సభ్వత్యం కల్పించటాన్ని సైద్దాంతిక విబేధాలున్నా నాటి సోవియట్‌ వ్యతిరేకించలేదు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే రష్యా మరియు చైనా నేడు మిత్రదేశాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో పుతిన్‌ కమ్యూనిస్టు కాదు, రష్యా సోషలిస్టు దేశం కాదు.ఈ రెండో అంశాన్ని ఉపయోగించుకొని మిత్రబేధంతో రష్యాను దగ్గరకు తీసుకోవాలని, దాని వనరులు, మార్కెట్‌లో లబ్ది పొందాలని కొందరు అమెరికన్లు కోరుతున్నారు. ఇందుకు ఉక్రెయిన్‌ సంక్షోభం ఆటంకంగా ఉంది గనుక దాన్ని పరిష్కరించాలని వారు చెబుతున్నారు. ఈ పూర్వరంగంలోనే ఎరగా ఉక్రెయిన్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ అంటున్నారు. అయితే అదే జరిగితే ఐరోపాలోని ధనికదేశాలు చైనాతో జట్టుకట్టే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేము. పెట్టుబడిదారులకు లాభాలు తప్ప శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పుతిన్‌ తక్షణ ఆలోచన యుద్ధం నుంచి బయటపడి తద్వారా ఆర్థిక ఆంక్షల బంధాలను బద్దలు కొట్టటం గనుక ఆ కోణంలో దాని మీద కేంద్రీకరించవచ్చు.అమెరికా మద్దతు లేకపోయినా ఐరోపా దేశాలు ఇచ్చే ధైర్యం, ఆయుధ సాయంతో నిలవగలమని ఉక్రెయిన్‌ భావిస్తే వెంటనే ఒప్పందానికి అంగీకరించకపోవచ్చు. లేకపోతే ముందే చెప్పుకున్నట్లు రష్యా షరతుల మీద రాజీకి రావచ్చు కూడా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ పోరుకు 50 రోజుల గడువు : తగ్గేదేలే అన్న పుతిన్‌, మాటమార్చిన ట్రంప్‌!

16 Wednesday Jul 2025

Posted by raomk in Current Affairs, Economics, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Trump 50 days ultimatum, Ukraine crisis, US Patriot to Ukraine via Europe, Vladimir Putin, Volodymyr Zelensky

ఎం కోటేశ్వరరావు


రానున్న యాభై రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడులను ఆపకపోతే తీవ్రమైన ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా గడువు ప్రకటించాడు.దీనితో పాటు ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ క్షిపణులు అందిస్తానని కూడా వెల్లడిరచాడు. ఈ బెదిరింపు, ఆయుధ సరఫరాను చూసి భయపడేదేలేదని, పోరు కొనసాగింపుకే వ్లదిమిర్‌ పుతిన్‌ ముందుకు పోవాలనే వైఖరితో ఉన్నట్లు మాస్కో వర్గాలు చెప్పినట్లు రాయిటర్‌ వార్త పేర్కొన్నది. ఇదిలా ఉండగా మాస్కోపై ఎలాంటి దాడులు చేయవద్దని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీని ట్రంప్‌ ఆదేశించాడు, బెదిరించిన ఒక రోజులోనే ట్రంప్‌ మాట మార్చాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం బుధవారం నాటికి 1,238వ రోజులో ప్రవేశించింది. పరస్పరదాడులు సాగుతున్నాయి, కొత్త ప్రాంతాలను రష్యా ఆధీనంలోకి తెచ్చుకుంటూనే ఉంది. అధికారం స్వీకరించిన 24గంటల్లో పోరును ఆపివేస్తానని ప్రకటించిన ట్రంప్‌ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మాటలు మార్చాడో, ప్రగల్భాలు పలికాడో తెలిసిందే. పోరును గనుక ఆపకపోతే రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని తాజాగా బెదిరించాడు, కొద్ది రోజుల క్రితం 500శాతం అని చెప్పిన సంగతి తెలిసిందే. జూన్‌ నెల సమాచారం ప్రకారం మనదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు రోజుకు 20.8లక్షల పీపాలకు చేరి పదకొండు నెలల గరిష్ట రికార్డును సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం రష్యా నుంచి తమ అవసరాల్లో చైనా 47, భారత్‌ 38, ఐరోపా యూనియన్‌, టర్కీ ఆరేసి శాతాల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం ఇతర దేశాల నుంచి చూస్తే ఇరాక్‌ 18.2, సౌదీ అరేబియా 12.1, యుఏయి 10.2, అమెరికా నుంచి 6.3శాతాల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాము.

సోమవారం నాడు ప్రగల్భాలు పలికిన ట్రంప్‌ మంగళవారం నాడు మాట మార్చాడు.దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు లేదు, ఆలాంటి ఆలోచన చేయటం లేదని చెప్పాడు. జూలై నాలుగవ తేదీన మాస్కో, సెంట్‌పీటర్స్‌బర్గ్‌లపై దాడి చేయగలరా అంటూ ఫోన్లో జెలెనెస్కీని ట్రంప్‌ అడగ్గా కచ్చితంగా మీరు గనుక మాకు ఆయుధాలిస్తే కొడతాం, రష్యా పట్టణాల మీద దాడి చేసి వారికి నొప్పితెలిసేట్లు చేయండని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. హత్యలను ఆపాలని కోరుతున్న తాను, పోరు ఆపాలని, మానవత్వంవైపు తప్ప ఎవరి పక్షమూ కాదని మంగళవారం నాడు అధ్యక్ష భవనంలో ట్రంప్‌ విలేకర్లతో చెప్పాడు. అధ్యక్షుడు కేవలం ప్రశ్నలను అడిగాడు తప్ప హింసాకాండను ప్రోత్సహించేందుకు కాదని ట్రంప్‌ ప్రతినిధి చెప్పాడు. సైనిక చర్య ముగింపు గడువు విధింపు, ఆధునిక ఆయుధాలు అందచేయాలన్న ట్రంప్‌ ప్రకటనను రష్యా నేత పుతిన్‌ ఖాతరు చేయలేదని రాయిటర్స్‌ పేర్కొన్నది. మిలిటరీ చర్యను ముగించే ఆలోచనలో కూడా లేదని, లక్ష్యాన్ని సాధించేవరకు కొనసాగుతుందని క్రెమ్లిన్‌ వర్గాలు తెలిపినట్లు వెల్లడిరచింది. ట్రంప్‌, పశ్చిమదేశాల బెదిరింపులకు భయపడటం లేదని యుద్ధం కొనసాగించటానికి వీలుగా తమ ఆర్థిక పరిస్థితి ఉందని అన్నట్లు కూడా రాసింది.


గత కొద్ది నెలలుగా ముఖ్యంగా ట్రంప్‌ గెలిచిన తరువాత ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాల గురించి అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు తర్జన భర్జనలో ఉన్నాయి. ట్రంప్‌ ఓవల్‌ ఆఫీసులో సోమవారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రూటే భేటీ జరిపినపుడు ట్రంప్‌ తమ నిర్ణయాన్ని వెల్లడిరచాడు. యాభై రోజుల్లో గనుక పోరు విరమణ ఒప్పందం కుదరకపోతే వందశాతం పన్నులు విధిస్తాం, దాని అర్ధం మీకు తెలిసిందే, అనేక అంశాలపై వాణిజ్యాన్ని వినియోగిస్తాను, అవి యుద్ధాల పరిష్కారాలకు ఎంతో దోహదం చేస్తాయి అన్నాడు. ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేసి పాకిస్తాన్‌తో రాజీకి వచ్చే విధంగా భారత్‌ను రప్పించేందుకు వాణిజ్య ఆయుధాన్ని వినియోగించినట్లు చెప్పిన అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. తమ అధ్యక్షుడు చెప్పిన పన్నుల విధింపు అంటే రష్యాతో వాణిజ్యం చేసే ఇతర దేశాల మీద అని అధికారవర్గాలు వివరించాయి. రష్యాతో అమెరికా వాణిజ్యం పెద్దగా ఏమీ లేదు గనుక దాని మీద అపరాధ సుంకాలు విధించేదేమీ ఉండదు. వాస్తవానికి రష్యా మీద ఆంక్షలేమీ ఉండవని, దాని దగ్గర నుంచి చమురు కొనుగోలు చేసేవారి మీద విధించే పన్నుల గురించి ట్రంప్‌ చెప్పినట్లు నాటోలో అమెరికా రాయబారి వైట్‌కర్‌ మాట్‌ చెప్పాడు.ఈ చర్యతో రష్యాపై నాటకీయంగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అన్నాడు. అయితే అమెరికా బెదిరింపులను గతంలోనే అమెరికా, భారత్‌ ఖాతరు చేయని సంగతి తెలిసిందే. రష్యా కూడా లెక్క చేయలేదు.


గత ఆరునెలలుగా పుతిన్‌తో సంప్రదింపుల గురించి చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్‌పై దాడులు పెరుగుతున్నాయే తప్ప తగ్గలేదని రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 500శాతం పన్ను విధించాలనే తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతానని చెప్పిన సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ చెప్పాడు. గొప్పలు చెప్పుకున్న ట్రంప్‌ అది జరగకపోవటంతో అవమానభారంతో ఏం
మాట్లాడుతున్నాడో, ఏం చేస్తాడో తెలియని స్థితిలో ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. పుతిన్‌ సేనలు, రష్యాపై దాడులు చేసేందుకు పేట్రియాట్‌ క్షిపణులు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించి సంక్షోభాన్ని మరోమలుపు తిప్పాడు. పరిష్కరించాలనే చిత్తశుద్ది అమెరికాకు లేదన్నది స్పష్టం. ఈ క్షిపణి విధ్వంసక వ్యవస్థ ధర ఒక్కొక్కటి 40లక్షల డాలర్లు ఉంటుంది. ఉక్రెయిన్‌కు సరఫరా చేసే ఆయుధాలను ఐరోపాకు విక్రయించి అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు తరలించే విధంగా అమెరికా నిర్ణయించింది. కీలక ఆయుధ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి రష్యాను బుట్టలో వేసుకోవాలని ట్రంప్‌ చూశాడు. ఆ పప్పులు ఉడకలేదు, దాంతో ఆయుధాల సరఫరా పునరుద్దరించనున్నట్లు అమెరికా అధికారులు వెల్లడిరచారు. మరోవైపున శాంతి చర్చలకు చొరవ చూపేందుకు పోప్‌ లియో సుముఖంగా ఉన్నారని ఆయనను కలిసిన తరువాత జెలెనెస్కీ ప్రకటించాడు. దాని గురించి ఎటూ తేలక ముందే సరికొత్త ఆంక్షల గురించి ట్రంప్‌ ప్రకటించాడు. పుతిన్‌ గురించి నోరుపారవేసుకున్న ట్రంప్‌ తీరును తాము పట్టించుకోవటం లేదని గతవారంలో రష్యా స్పందించింది.ఆయుధ ఒప్పందం ఆటతీరునే మార్చి వేస్తుందని రూటే వర్ణించాడు.జర్మనీతో సహా ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే వంటివి అమెరికా నుంచి తీసుకొని నూతన ఆయుధాలను సరఫరా చేస్తాయని చెప్పాడు. తాను ముందుగా ఐరోపా దేశాలు ఇలాంటి చొరవ తీసుకుంటాయని అనుకోలేదని కానీ అవి చేశాయని ట్రంప్‌ అభినందించాడు.త్వరలో మరికొన్ని క్షిపణులను కూడా అందించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా క్షిపణులను అడ్డుకొనేందుకు పేట్రియాట్‌ వ్యవస్థలను వినియోగిస్తామని, అయితే ఎదురుదాడి చేసే ఆయుధాలను కూడా ఇచ్చే అవకాశం ఉందని నాటోలో అమెరికా రాయబారి చెప్పాడు. నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు విక్రయిస్తే వచ్చే విమర్శల నుంచి తప్పుకొనేందుకు, తన చేతికి మట్టి అంటకుండా, ఖజానా మీద భారం మోపకుండా ఐరోపా దేశాలకు ఆయుధాలను విక్రయించి అటు నుంచి తరలించేందుకు ట్రంప్‌ వేసిన ఎత్తుగడ ఇది.


అధికారానికి వచ్చిన తరువాత ఆర్భాటంగా పుతిన్‌తో నేరుగా మాట్లాడాడు. రష్యాకు రాయితీలు ఇవ్వాల్సిందే, కొన్ని ప్రాంతాలు వదులుకోవాల్సిందే, మేం 350 బిలియన్‌ డాలర్లు ఇచ్చినా యుద్దంలో గెలిచేది లేదు చచ్చేది లేదని జెలెనెస్కీతో చెప్పాడు. అతగాడిని మంచి హాస్యనటుడు అంటూనే ఎన్నికలు జరపని నియంత అన్నాడు.ఫిబ్రవరి 28న అధ్యక్ష భవనంలో బహిరంగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీని అవమానించి ఐరోపా భాగస్వాములను నిర్ఘాంతపరిచాడు. రష్యాను ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించాడు.ఐరోపా దేశాలన్నీ ఈ తీరును చూసి నిజంగానే ట్రంప్‌ తమను వదలి పుతిన్‌తో చేతులు కలిపి ఉక్రెయిన్ను అప్పగిస్తాడా అన్నంతగా భయపడ్డాయి. చివరికి భద్రతా మండలిలో రష్యామీద ఎలాంటి విమర్శలు లేని తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. ఈలోగా ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు అప్పగించాలని అమెరికా రాయించుకొని ఒప్పందం చేసుకుంది. ఎత్తుగడ ఏమిటో తెలియదు గానీ పదేండ్ల క్రితమే పుతిన్‌ గురించి ట్రంప్‌ పొగడ్తలు ప్రారంభించాడు. గత వారంలో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది. పుతిన్‌ పైకి కనిపించేంత మంచి వాడు కాదు, నేను ఎంతో ఆశాభంగం చెందాను, అతన్ని హంతకుడు అని చెప్పాలనుకోవటం లేదు కానీ గట్టి పిండం అని ఎన్నో సంవత్సరాలుగా రుజువైంది. బిల్‌క్లింటన్‌, బుష్‌,ఒబామా,జో బైడెన్‌ అందరినీ వెర్రి వెంగళప్పలను గావించాడు గానీ నన్ను చేయలేకపోయాడు.. ఒక రోజు ఇంటికి వెళ్లి నా సతీమణితో మాట్లాడుతూ నేను ఈ రోజు పుతిన్‌తో మాట్లాడాను, అద్భుతతమైన సంభాషణ చేశాను తెలుసా అని చెప్పాను. ఆమె తాపీగా అవునా నిజమేనా అంటూ మరో(ఉక్రెయిన్‌) పట్టణంపై దాడి జరిగింది అని చెప్పింది అన్నాడు. ఎవరైనా నేతలు అతగాడితో ఫోన్లో మాట్లాడుతుండగానే ఉక్రెయిన్‌పై దాడులు చేయిస్తుంటాడు అని ట్రంప్‌ చెప్పాడు.


గత గురువారం నాడు రోమ్‌ నగరంలో ఉక్రెయిన్‌ స్వస్థత సమావేశం జరగటానికి ముందు జెలెనెస్కీ ఇటలీలో ట్రంప్‌ ప్రతినిధి కెయిత్‌ కెలోగ్‌తో సమావేశం సందర్భంగా రష్యా దాడులను తీవ్రం కావించింది. పోప్‌ లియోను రెండు నెలల్లోనే జెలెనెస్కీ రెండుసార్లు కలిశాడు. పోరు ఇంకా కొనసాగుతుండగానే ఉక్రెయిన్‌ పునరుద్దరణ పథకాలు దానికి అవసరమైన పెట్టుబడులు, దానిలో పాలుపంచుకొనే దేశాలు, నిర్మాణ సంస్థల గురించి పశ్చిమదేశాలు వాణిజ్య చర్చలు జరిపాయి. ఇప్పటికే ఐరోపాలో ఉన్న పేట్రియాట్‌ క్షిపణులను వెంటనే ఉక్రెయిన్‌కు తరలించి మిగతావాటిని అమెరికా ఫ్యాక్టరీల్లో తయారు చేసి అందచేస్తారు. మీరు గనుక ఉక్రెయిన్‌ మీద దాడి చేస్తే నేను మాస్కో మీద బాంబులు వేయిస్తానని పుతిన్‌తో మాట్లాడినపుడు ట్రంప్‌ బెదిరించాడన్న వార్త గుప్పుమన్నది. అయితే వారి మధ్య ఆ సంభాషణ ఎప్పుడు జరిగిందో, అది నిజమో కాదో నిర్ధారణ కాలేదు గానీ, ఆధునిక ఆయుధాలను ఇస్తాన్న ట్రంప్‌ మాటలు దాన్ని నిర్ధారిస్తున్నాయి.కొద్ది వారాల క్రితం రష్యా భూభాగంలో ప్రవేశించి అనేక చోట్ల ఉక్రెయిన్‌ జరిపిన దాడుల వెనుక అమెరికా హస్తం లేదని ఎవరూ చెప్పలేరు.


రష్యా ఆధీనంలోని జపోర్‌రిaయా ప్రాంతంలో ఉన్న అణువిద్యుత్‌ కేంద్రంపై వందలాది రౌండ్ల కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చెప్పింది. అక్కడ అణు ప్రమాదం జరిగితే దానికి రష్యాను బాధ్యురాలిగా చేసి వత్తిడి తేవాలన్న కుట్ర దీనిలో కనిపిస్తోంది. దీని వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందని వేరే చెప్పనవసరం లేదు. పేట్రియాట్స్‌తో సహా ఆధునిక ఆయుధాలను అందచేయాలన్న నిర్ణయం నాటకీయంగా జరగలేదు. గత కొద్ది వారాలుగా మల్లగుల్లాలు పడుతున్నారు. వీటితో పుతిన్‌ దారికి వస్తాడని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. జూన్‌ లో జరిగిన నాటో సమావేశాల్లో ఒక కొలిక్కి వచ్చిన ఈ ఆలోచనపై అంతకు ముందే విధి విధానాల గురించి చర్చ మొదలైంది.నాటో నేరుగా ఆయుధాలు పంపితే అది రష్యాకు ఒక అస్త్రంగా మారుతుంది, అన్నింటికీ మించి నాటో కూడా యుద్ధంలో పాల్గ్గొన్నట్లే, అందుకే కొన్ని దేశాలను ఎంపిక చేసి వాటి ద్వారా కథనడిపిస్తున్నారు. ఒకవేళ అమెరికా తప్పుకుంటే తామే ఉక్రెయిన్‌కు బాసటగా నిలవాలని ఐరోపా దేశాలు స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత అయితే మా దగ్గర ఆయుధాలు కొని మీరే జెలెనెస్కీకి ఇవ్వండని అమెరికన్లు వారిని కట్టుబడేట్లు చేసినట్లు కూడా చెప్పవచ్చు. మీరు ఆధునిక ఆయుధాలు ఇస్తారు, అవి రష్యా క్షిపణులను అడ్డుకుంటాయి సరే, మా కుటుంబాల ప్రాణాలను కాపాడతాయో లేదో చెప్పండని ఉక్రేనియన్‌ సైనికులు కొందరు సిఎన్‌ఎన్‌తో మాట్లాడిన మాటలు ఒక్క మిలిటరీలోనే కాదు, యావత్తు ఉక్రేనియన్లలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే జెలెనెస్కీ అవమానాలు భరించి కూడా ఆయుధాల కోసం విలువైన ఖనిజాలున్న ప్రాంతాలను అమెరికాకు రాసి ఇచ్చిన తరువాత దేశం మొత్తాన్ని నాటో కూటమికి తాకట్టు పెట్టినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తొంభై రోజులు ముగిసినా 90 ఒప్పందాలు లేవు, భంగపడిన ‘‘ రారాజు ’’ డోనాల్డ్‌ ట్రంప్‌ ! బంతి అమెరికా మైదానంలో ఉందన్న భారత్‌ !!

09 Wednesday Jul 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, Farmers, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BJP, Donald trump, Narendra Modi Failures, Tariff Fight, Trade agreement with US, Trade war Expanding, Trump Letters, Trump tariffs, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


తొంభై రోజుల్లో తొంభై ఒప్పందాలు ఏప్రిల్‌ రెండవ తేదీ అమెరికా విముక్తి దినం పేరుతో డోనాల్డ్‌ ట్రంప్‌ పలికిన ప్రగల్భాలలో ఒకటి. ఆ గడువు జూలై 9వ తేదీతో ముగిj. అనుకున్నది పగటికలగా మారింది. దాంతో తమతో ఒప్పందాలకు రాకపోతే అపరాధ సుంకాలు విధిస్తానని ఆగస్టు ఒకటి వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించాడు. బెదిరింపులో భాగంగా పద్నాలుగు దేశాలు ఎంతెంత సుంకాన్ని ఎదుర్కోవాల్సిందీ వెల్లడిస్తూ లేఖల రూపంలో ఆదేశాలను పంపాడు. ఒప్పందాలు కుదుర్చుకోవటం లేదా సిద్దంగా ఉన్నట్లు తిరుగులేఖలు రాయకపోతే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి తన సుంకాలు అమల్లోకి వస్తాయన్నాడు. చర్చలకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయని కూడా చెప్పాడు. మాటి మాటికి గడువు పొడిగిస్తా అనుకుంటున్నారేమో నూటికి నూరు శాతం గట్టిగా చెబుతున్నా, వారు గనుక తనకు ఫోన్‌ చేసి వేరే పద్దతులను ఆలోచిస్తున్నట్లు చెబితే సరే, దానికి అవకాశం ఇస్తున్నా లేకపోతే ఏం చేస్తానో తెలుసుగా అన్నట్లుగా పొడిగించిన గడువుకు అయినా కట్టుబడి ఉంటారా లేదా అని అడిగిన విలేకర్లతో చెప్పాడు. ఏప్రిల్‌లో వివిధ దేశాల సరకులపై ఎంత మేరకు పన్ను విధించేది ప్రకటించిన ట్రంప్‌ ఏ దేశమూ ముందుకు రాకపోవటంతో మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు, జూలై 9వ తేదీతో గడువు ముగుస్తుందన్నాడు. అయినప్పటికీ స్పందన లేకపోవటంతో ఆగస్టు వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడిరచాడు. ఆలోగా ఒప్పందానికి రాకుంటే ఏప్రిల్‌ రెండవ తేదీన ప్రకటించిన విధంగా పన్నులను విధిస్తామని వాణిజ్యశాఖ మంత్రి లుటినిక్‌ చెప్పాడు. మనదేశంతో ఎనిమిదవ తేదీలోగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు లీకులు వదిలిన సంగతి తెలిసిందే. తాజా వార్తలను బట్టి ఆ గడువు ఆగస్టు ఒకటి వరకు పొడిగించినట్లు చెబుతున్నారు. నాటకీయంగా ఏదో కుదిరిందని మొక్కుబడి ప్రకటన చేస్తే చెప్పలేము.మేం చెప్పాల్సింది చెప్పాం, తేల్చుకోవాల్సింది ట్రంపే, బంతి అమెరికా కోర్టులో ఉంది అని మనదేశం తరఫున చర్చల్లో పాల్గొన్న ఒక అధికారి చెప్పినట్లు ఒక వార్త. ఏం జరుగుతుందో చూద్దాం !


రష్యాతో వాణిజ్యం చేస్తే భారత్‌, చైనాలపై 500శాతం పన్నులు విధిస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిక్స్‌ సమావేశాల్లో అమెరికా బెదిరింపు వైఖరిని విమర్శించిన తరువాత తమ వ్యతిరేక విధానాలను అనుసరించే బ్రిక్స్‌ దేశాలతో వాణిజ్యం జరిపే దేశాల మీద కూడా పదిశాతం పన్ను విధిస్తానని బెదిరింపులకు దిగాడు.ఏకపక్ష పన్ను ప్రకటనలు ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని బ్రిక్స్‌ పేర్కొన్నది. వివిధ దేశాలపై డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన పన్నుశాతాలు గతంలో ప్రకటించినవి కొన్నింటిలో మార్పులేదు, మరికొన్నింటిని సవరించాడు. ఆయా దేశాల వస్తువులపై జపాన్‌ 25,దక్షిణ కొరియా 25, థాయ్‌లాండ్‌ 36, మలేసియా 25, ఇండోనేషియా 32, దక్షిణాఫ్రికా 30,కంపూచియా 36, బంగ్లాదేశ్‌ 35,కజకస్తాన్‌ 25, ట్యునీసియా 25, సెర్బియా 35,లావోస్‌ 40, మయన్మార్‌ 40 శాతం పన్నులు ఉంటాయి. ఒక వేళ ఈ దేశాలు గనుక ప్రతి సుంకాలు పెంచినట్లయితే తాను ప్రకటించిన మొత్తాల మీద మరో అంత మొత్తం పెంచుతామని కూడా ట్రంప్‌ బెదిరించాడు. రానున్న రోజుల్లో మిగిలిన దేశాలకు కూడా ఎంత పన్ను విధించేదీ లేఖల రూపంలో తెలియచేస్తామని అధ్యక్ష భవన మీడియా అధికారిణి కారాలోని లీవిట్‌ చెప్పారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్ను మొత్తాలను పెంచితే ఆ భారం అమెరికా వినియోగదారుల మీదనే పడుతుందన్నది తెలిసిందే.ఆర్థికవేత్తలు చెప్పినదాని ప్రకారం ఒక్కో కుటుంబం మీద 3,800 నుంచి నాలుగువేల డాలర్ల వరకు భారం పడుతుందని, అది ఒకటి నుంచి ఒకటిన్నర శాతం వరకు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.


జపాన్నుంచి కార్లు, ఎలక్ట్రానిక్స్‌, వైద్య పరికరాలు, దక్షిణ కొరియా నుంచి సెమీకండక్టర్లు, ఆటోవిడి భాగాలు, ఓడలు, మలేషియా నుంచి సెమికండక్టర్లు, రబ్బరు, బంగ్లాదేశ్‌ నుంచి దుస్తులు, పాదరక్షలు, కంపూచియా నుంచి తక్కువ వెలగల దుస్తులు, ఫర్నీచర్‌, ఇండోనేషియా ఓడల్లో ధరించే పాదరక్షలు, పామ్‌ఆయిల్‌, ఎలక్ట్రానిక్స్‌, దక్షిణాఫ్రికా లోహాలు, పండ్లు, ఆభరణాలు, తాజా వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోవిడి భాగాలు, సెర్బియా యంత్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు లావోస్‌ పాదరక్షలు, కలప వస్తువులు, మయన్మార్‌ నుంచి చౌకగా లభించే ఉత్పత్తులు, బోస్నియా కలప, లోహాలు, కజకస్తాన్‌ లోహాలు, తైలాలు, రసాయనాలు, టునీసియా ఆలివ్‌ ఆయిల్‌ వంటి వాటిని అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. వాటి మీద ఎంత పన్ను విధిస్తే అంత మొత్తాన్ని వినియోగదారులు అదనంగా చెల్లించాలి, ఆమొత్తాలతో ట్రంప్‌ లోటుబడ్జెట్‌ పూడ్చుకొనేందుకు లేదా కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇచ్చేందుకు వినియోగించాలన్నది అసలు ఎత్తుగడ. జూలై తొమ్మిదవ తేదీలోగా ఒప్పందాలు చేసుకోని దేశాలకు ఆగస్టు ఒకటవ తేదీ వరకు అవకాశం ఇస్తున్నామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పాడు. వచ్చే మూడు రోజులు తాము ఊపరిసలపని పనిలో ఉంటామని ఆదివారం నాడు సిఎన్‌ఎస్‌ టీవితో అన్నాడు. ఆగస్టు ఒకటవ తేదీని కొత్తగడువుగా అభివర్ణించకూడదని, పనులు వేగంగా జరగాలంటే ఏదో ఒకటి ఉండాలన్నాడు. కొత్త పన్నులు కావాలా లేదా గతంలో ప్రకటించినవే కావాలా అన్నది లేఖలు అందుకున్నదేశాలు తేల్చుకోవాలని చెప్పాడు.తాము పద్దెనిమిది ప్రధాన వాణిజ్య భాగస్వాముల మీద కేంద్రీకరిస్తున్నామని అనేక పెద్ద ఒప్పందాలు పూర్తి కావచ్చాయన్నాడు. ఏ దేశ ఉత్పత్తులపై తామెంత పన్ను విధించేది 100 చిన్న దేశాలకు లేఖల ద్వారా తెలియచేస్తామని అన్నాడు. ఇది అమెరికా దురహంకారం తప్ప మరొకటి కాదు.పూర్వం పెద్ద దేశాల రాజులు చిన్న లేదా సామంత దేశాలు తమకు ఏటా ఇంత కప్పం కట్టాలని లేకపోతే తమ తడాఖా చూపుతామని బెదిరించేవారు. అయితే బెసెంట్‌ మాటలను బట్టి ఏదీ ఖరారు కాలేదన్నది స్పష్టం. అమెరికాలో వాషింగ్టన్‌ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నానికల్లా తన లేఖలు సంబంధిత దేశాలకు అందుతాయని ఆదివారం నాడు ట్రంప్‌ చెప్పాడు. కొన్ని దేశాలు బుధవారం లోగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు లేదా లేఖలు అందించే అవకాశం ఉందన్నాడు.


ట్రంప్‌ లేఖలు అంటే ఏకపక్షంగా జారీ చేసినవి, బెదిరించే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.చైనాతో ఒప్పందం కుదిరిందని ఏకపక్షంగా ట్రంప్‌ ప్రకటించటం తప్ప వివరాలేమిటో ఇంతవరకు తెలియదు. అదే విధంగా వియత్నాంతో వచ్చినట్లు చెబుతున్న అవగాహన కూడా అదే స్థితిలో ఉంది.అంశాలు ఇంకా ఖరారు కాలేదు.మనదేశంతో ఒప్పందం గురించి కూడా రకరకాల వార్తలను ప్రచారంలో పెట్టారు. అసలు ఒకసారి కుదిరిందని ట్రంప్‌ చెప్పాడు. అంతిమ ఒప్పందం అని, తరువాత తాత్కాలిక ఒప్పందం, మరోసారి చిన్న ఒప్పందం ఇలా రకరకాలుగా వర్ణించారు. మధ్యలో అమెరికా వస్తువులపై పన్నులను తగ్గించేందుకు భారత్‌ అంగీకరించటం లేదని లీకులు వదిలారు.మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి ఒప్పందం గురించి ఎలాంటి వార్తలు లేవు. రాజకీయంగా, మిలిటరీ, ఆర్థికంగా ఏ రీత్యా చూసినప్పటికీ జపాన్‌, దక్షిణ కొరియా ఇప్పటి వరకు అమెరికా కనుసన్నలలోనే వ్యవహరించాయి. అలాంటి దేశాలపై 25శాతం పన్ను విధిస్తానని ఏకపక్షంగా ప్రకటించాడు ట్రంప్‌.అమలుకు ఆగస్టు ఒకటి వరకు గడువు ఉందన్నాడు. ఇప్పటి వరకు వివిధ దేశాల వైఖరుల సారాంశం దిగువ విధంగా ఉంది.

జపాన్‌లో కూడా ఆటోపరిశ్రమ పెద్దదే. తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు, తట్టుకొనేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆదివారం నాడు ప్రధాని షిగెరు షిబా ఫూజీ టీవీ కార్యక్రమంలో ఆదివారం నాడు చెప్పాడు. అమెరికా వస్తువుల మీద దిగుమతి పన్ను తగ్గిస్తామని మనదేశం సంకేతాలిచ్చినప్పటికీ దానికంటే మన పాడి,వ్యవసాయ రంగాలను అమెరికా ఉత్పత్తులకు తెరవాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు వార్తలు.ఏం జరుగుతుందో తెలియదు.ఇరవై ఏడు దేశాలతో కూడిన ఐరోపా యూనియన్‌తో చర్చల్లో మంచి పురోగతి ఉందని అమెరికా చెప్పటం తప్ప అలాంటి సూచనలు కనిపించటం లేదు. సమాఖ్యదేశాల కార్లపై 50శాతం పన్ను విధిస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలుకే మోసం రాకుండా ఒప్పందం ఉందాలని జర్మనీ చెబుతుండగా హానికరమైన ఒప్పందానికి తాము వ్యతిరేకమని ఫ్రాన్సు పేర్కొన్నది. బ్రిటన్ను అదిరించి బెదిరించి ఒప్పందం కుదుర్చుకున్నారు.పదిశాతం కనీస పన్నులు విధిస్తారు, దానికి ప్రతిగా అమెరికా కార్లు, విమానాలకు బ్రిటన్‌ తలుపులు తెరిచింది. తాము జూలై 21లో ఒప్పందం కుదుర్చుకుంటామని కెనడా చెప్పటంతో దానికి లేఖ పంపలేదు. ఎవరైనా ఇదే మాదిరి ఒప్పందానికి దగ్గరగా ఉంటే వాటికి వ్యవధిని పెంచుతామని ట్రంప్‌ సలహాదారు కెవిన్‌ హాసెట్‌ చెప్పాడు.


చైనాతో ఒప్పందం కుదిరిందని లండన్‌ భేటీ తరువాత డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. దాని మీద చైనా అవుననిగానీ కాదని గానీ ప్రకటించలేదు. నువ్వెంత దిగివస్తే నేనంత తగ్గుతాను అన్నట్లుగా చైనా వ్యవహరిస్తున్నది.లాభం లేదని గ్రహించిన ట్రంప్‌ తొలుత ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాడు.ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థలు చైనాకు ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ అందించేందుకు, విమాన ఇంజన్ల ఎగుమతులకు అవకాశం కల్పించాడు. దానికి ప్రతిగా ఆంక్షలున్న ఎనిమిది వస్తువుల ఎగుమతులపై నిబంధనలను సడలించేందుకు చైనా చర్యలు తీసుకుంది. ఈ విధంగా ఇరుదేశాల వాణిజ్య యుద్ధ రాజీ ఒప్పందం ముందుకు పోతున్నదని రాయిటర్స్‌ పేర్కొన్నది.అమెరికా దిగిరావటానికి అక్కడి బహుళజాతి గుత్త సంస్థలు ట్రంప్‌ మీద తెస్తున్న వత్తిడే ప్రధాన కారణం. ఉదాహరణకు 2014లో ఇంటెల్‌ కంపెనీ మొత్తం రాబడిలో 27శాతం ఉంది. క్వాల్‌కామ్‌ ఆదాయంలో 50శాతం చైనా నుంచి ఉంది. దీనికి తోడు చైనా పారిశ్రామిక ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టటంతో ఆ ఉత్పత్తులున్న అమెరికన్‌ కంపెనీలకు అది పెద్ద మార్కెట్‌గా మారింది. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత అమెరికా అనేక పాఠాలు నేర్చుకుంది. ఇతర దేశాల మాదిరి లేఖల ఆదేశాలు పంపి గరిష్టంగా వత్తిడితో అదిరించి బెదిరిస్తే లొంగే ఘటం కాదు అన్నది ఒకటి. కలసి ఉంటే కలదు సుఖం ఘర్షణ పడితే లాభం లేదని, పరస్పరం లాభదాయకమైన అంశాల్లో రాజీపడటమే మేలని గ్రహించటం రెండవది.కృత్రిమ గోడలు కట్టి సరఫరా వ్యవస్థలను విచ్చిన్నం చేస్తే అమెరికా పొందే లాభం లేదని, తన స్వంత చట్టాలతో ఇతర దేశాలను శిక్షించినట్లుగా చైనాతో వ్యవహరిస్తే కుదరదని గ్రహించటం వంటి అంశాలు ప్రభావతం చేశాయి.అయితే ఇంకా బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, నూతన ఇంథనం వంటి కొన్ని రంగాల్లో చైనాను కట్టడి చేసేందుకు అమెరికా చూస్తూనే ఉంది. చైనాలో పెట్టుబడులు పెట్టేవారి మీద పన్నులు విధిస్తున్నది. దానికి తగినట్లుగా చైనా కూడా తన తురుపు ముక్కలను వాడుతున్నది. ఐరోపా యూనియన్‌, ఇతర దేశాలు అమెరికా మాదిరి మడికట్టుకు కూర్చోవటం లేదు, అది ఆడమన్నట్లుగా ఆడకుండా చైనాతో తమ ప్రయోజనాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఇది కూడా అమెరికా మీద ప్రభావం చూపుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ అంచనా తప్పిందా, బంకర్‌లో నెతన్యాహు, జి7 సభ నుంచి అర్ధంతరంగా వెనుదిరిగిన ట్రంప్‌ !

18 Wednesday Jun 2025

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Ayatollah Ali Khamenei, Donald trump, Iran nuclear weapon, Israel Attack on Iran, Netanyahu


ఎం కోటేశ్వరరావు


ఇరాన్‌లో తెల్లవారు రaామున మూడు గంటల సమయంలో 2025 జూన్‌ 13వ తేదీ ఇజ్రాయెల్‌ వైమానిక దళం విరుచుకుపడిరది.రెండువందల జెట్‌లతో వంద లక్ష్యాలపై దాడి చేసింది. అనేక మంది మిలిటరీ ఉన్నతాధికారులు, అణుశాస్త్రవేత్తలను హత్యచేసింది. మరోవైపున ఆకస్మికదాడిని ఊహించని ఇరాన్‌ వెంటనే కోలుకొని ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రాణ భయంతో బంకర్‌లోకి వెళ్లిపోయాడు, నలభై లక్షల జనాభా ఉన్న రాజధాని టెల్‌అవీవ్‌ నగరం దాడులతో అతలాకుతలం అయినట్లు చెబుతున్నారు.కెనడాలో జరుగుతున్న జి7 కూటమి సమావేశాల నుంచి అర్ధంతరంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక రోజు ముందుగానే వెనుదిరిగాడు. ఇది రాసిన సమయానికి రెండు దేశాల మధ్య పరస్పరదాడులు కొనసాగుతున్నాయి. కోటీ 70లక్షల జనాభా ఉన్న టెహరాన్‌ నగరాన్ని వదలి వెళ్లాలని ఇజ్రాయెల్‌, దానికి వెన్నుదన్నుగా ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ పిలుపు ఇవ్వగా టెల్‌అవీవ్‌ను ఖాళీ చేయాలని ఇరాన్‌ ప్రకటించింది. ఇటీవలి కాలంలో నివాసిత ప్రాంతాల నుంచి జనం ఖాళీ చేయాలన్న పిలుపులు సర్వసాధారణంగా మారాయి. యుద్ధ సమయంలో జరిగిన నష్టాల గురించి ఎవరు ఏమి చెప్పినా అతిశయోక్తులు ఉంటాయన్నది తెలిసిందే. తమ పౌర నివాసాలపై ఇరాన్‌ దాడులు చేస్తున్నదంటూ ఇజ్రాయెల్‌ గుండెలు బాదుకుంటున్నది.దానికి పశ్చిమ దేశాల మీడియా సమర్ధన, కావాలంటే వారు కూడా మిలిటరీ కేంద్రాల మీద దాడులు చేయవచ్చు కదా అన్నట్లు ఫోజుపెడుతున్నాయి. ఇజ్రాయెల్‌ తొలిరోజు జరిపిన దాడి టెహరాన్‌లోని పౌరనివాస భవనం మీదే, అక్కడ నివశిస్తున్న అణుశాస్త్రవేత్తలతో సహా 60 మంది మరణించారు. నిత్యం గాజాలో ఆసుపత్రులు, పాఠశాలలతో సహా, నివాసభవనాలు చివరికి సహాయశిబిరాలు, సహాయ కేంద్రాల వద్ద ఉన్న పౌరుల మీద మారణకాండ జరుపుతున్నది, వేలాది మంది పిల్లలు, మహిళలు, కదలలేని వృద్దుల ఉసురుతీస్తున్న తీరు ప్రపంచం చూడటం లేదా !


కెనడాలో జరుగుతున్న జి7 కూటమి సమావేశాల నుంచి ముందే ఎందుకు వెనుదిరిగి వెళ్లిపోతున్నారన్న ప్రశ్నకు ఇంతకంటే ముఖ్యమైన పనులున్నాయని ట్రంప్‌ బదులిచ్చాడు. అటువంటపుడు అసలా సమావేశానికి ఎందుకు వెళ్లినట్లు ? ఈ పరిణామం గురించి భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఊహించినదానికి భిన్నంగా ఇరాన్‌ దాడులకు దిగటంతో తలెత్తిన పరిస్థితిలో ఏం చేయాలన్న తర్జన భర్జనలకు అన్నది ఒకటైతే, ఇరాన్‌పై స్వయంగా అమెరికా దాడులకు పూనుకోవాలన్న వత్తిడి పెరిగిన కారణం అని రెండవదిగా చెబుతున్నారు. రెండూ ఒకదానితో ఒకటి సంబంధాలు కలిగిన అంశాలే గనుక ఏం చేయనున్నారనేదాన్ని బట్టి పరిణామాలు ఉంటాయి. ఇరాన్‌ అణుబాంబులు తయారు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుందని గతంలో వార్తలు వచ్చాయి. అందుకే ట్రంప్‌ 60రోజుల్లో ఒప్పందానికి రాకపోతే మీ అంతు చూస్తానని ట్రంప్‌ బెదిరించాడు. ఆ గడువు ముగిసిన మరుసటి రోజే ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. అంతకు ముందు జాతీయ గూఢచార సంస్థ అధిపతి తులసీ గబ్బార్డ్‌ సెనెట్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఇరాన్‌ అణుబాంబును తయారు చేయటం లేదని గూఢచారులు అంచనాకు వచ్చినట్లు చెప్పారు. అణుకార్యక్రమం నుంచి వైదొలిగేట్లు చేసే వత్తిడిలో భాగంగా ఇజ్రాయెల్‌ దాడులకు ట్రంప్‌ పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో కొన్ని కేంద్రాలు పాక్షికంగా దెబ్బతినటం తప్ప భూగర్భంలో ఉన్న అసలైన కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వార్తలు వచ్చాయి. వాటిని దెబ్బతీయాలంటే బి2 బాంబర్లు లేదా 30వేల పౌండ్లు(13,607కిలోలు) భారీ బాంబులు అవసరం, అవి ఇజ్రాయెల్‌ వద్దలేవు గనుక నేరుగా అమెరికా రంగంలోకి దిగాలని వత్తిడి వస్తున్నదట. ఇంతకంటే ముఖ్యమైన పనులన్న ట్రంప్‌ వ్యాఖ్యకు ఇదే అర్ధమా ? లేక గౌరవ ప్రదంగా ఇజ్రాయెల్‌ను ఎలా బయటపడవేయాలని చూస్తున్నాడా ?


కెనడా నుంచి అర్ధంతరంగా ట్రంప్‌ వాషింగ్టన్‌ వెళ్లటం ఇరాన్‌ మరియు ఇజ్రాయెల్‌ మధ్య సయోధ్య కుదర్చటానికే అని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. అయితే మక్రాన్‌ చెప్పింది తప్పని, మీడియాలో ప్రచారం కోసం తాపత్రయపడుతున్నాడని, తన తిరుగు ప్రయాణానికి సయోధ్యకు సంబంధమే లేదని ట్రంప్‌ చెప్పాడు. అతగాడి మాటలను విశ్వసించాల్సినపని లేదు. ఇజ్రాయెల్‌ చర్యల గురించి పరిపరి విధాలుగా చర్చ జరుగుతున్నది. గతంలో మారణాయుధాలను గుట్టలుగా పోసిన ఇరాక్‌ నేత సద్దాం హుస్సేన్‌ ప్రమాదకరంగా మారినందున తాము దాడిచేశామని అమెరికా తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్‌ అణుబాంబు కార్యక్రమంలో ఉందని అది తమకు ముప్పు అని అందుకే ముందు జాగ్రత్తగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూస్తున్నది. దానికి అమెరికా, ఐరోపా ధనిక దేశాలు వంతపాడాయి. వర్తమాన ప్రపంచంలో అణుబాంబులు కలిగిన దేశాలు కొన్ని తమకు లొంగని వారిని బెదిరించేందుకు పూనుకున్నాయి. అందువలన ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని ఏ దేశమైనా అణ్వాయుధాలను తయారు చేయవచ్చు. మనదేశం కూడా ఆ విధంగానే తయారు చేసింది. అణువిద్యుత్‌ కేంద్రాలు కలిగిన ఏ దేశమైనా ఆయుధాల తయారీకి అవసరమైన యురేనియంను శుద్ది చేసే సత్తా కలిగి ఉంటుంది.అమెరికా తొత్తు ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత మరోసారి అమెరికా కుట్రలకు సమాధానం చెప్పేందుకు ఇరాన్‌ నూతన నాయకత్వం అణుకార్యక్రమం చేపట్టింది.


నేడు పశ్చిమాసియాలో యుద్ధం చెలరేగటానికి అసలైన నేరస్తురాలు అమెరికా. ఇరాన్‌ తనకు కొరకరాని కొయ్యగా మారినప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా చేయని కుట్ర లేదు. ఇజ్రాయెల్‌ తనకు ఇరుగు పొరుగు అరబ్‌, ఇస్లామిక్‌ దేశాల నుంచి ముప్పు ఉందంటూ పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలతో పాటు ఇరుగుపొరుగుదేశాల ప్రాంతాలను ఆక్రమించింది. యూదులను తరలించి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో జనాభా నిష్పత్తిని మార్చి అవి తమ ప్రాంతాలే అని చెప్పేందుకు పూనుకుంది. ఇప్పుడు ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని బూచిగా చూపి రక్షణ కావాలంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నది. ఇరాన్‌ అణుసమస్య పదమూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. నాటోలో చేరాలా లేదా అన్నది ఒక సార్వభౌత్వ దేశంగా ఉన్న ఉక్రెయిన్‌కు ఉందని వాదిస్తున్న అమెరికా అదే సార్వభౌమత్వం కలిగిన ఇరాన్‌ అణుబాంబును తయారు చేస్తుంటే చేయటానికి వీల్లేదని చెప్పటం అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు. నాటోను విస్తరించబోమని గతంలో రష్యాతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగానే ఇరాన్‌తో చేసుకున్న 2015నాటి అణు నిరోధ ఒప్పందాన్ని అమలు జరపకుండా 2018లో ఏకపక్షంగా వైదొలిగింది. నాటోలో చేరే ఉక్రెయిన్‌తో తనకు ముప్పు ఉన్నందున రష్యా దాని మీది సైనిక చర్యను ప్రారంభించినట్లుగానే అమెరికా స్వయంగా వైదొలిగినందున తన కార్యక్రమాన్ని ఇరాన్‌ కొనసాగిస్తున్నది.ఇప్పుడు అది ఒక దశకు వచ్చినట్లు పసిగట్టింది గనుక ఆపివేయాలంటూ ఏకపక్షంగా బెదిరింపులకు దిగింది. ఆ ఒప్పందాన్ని అమెరికా పూర్తిగా అమలు జరిపి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు, ఇరాన్‌ మరియు ఇజ్రాయెల్‌ కూడా సురక్షితంగా ఉండేవి. అందువలన అసలు నేరస్తురాలు అమెరికా. చరిత్రను చూసినపుడు అది అడుగుపెట్టిన ప్రతి చోటా సమస్య పరిష్కారం సంగతి తరువాత కొత్త వివాదానికి తెరలేపటాన్ని చూడవచ్చు. ఒక విషవలయంగా మార్చి తన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకోసం చూస్తున్నది. పశ్చిమాసియాలో అది ఇంతవరకు ఎలాంటి నిర్మాణాత్మక పాత్రను పోషించటం లేదు, ప్రతినాయకుడిగా మారుతున్నది. పాలస్తీనా సమస్యను పరిష్కరించకుండా చూస్తున్నది, గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని విహార ప్రాంతంగా మారుస్తానని ట్రంప్‌ చెప్పటం మరింత అగ్నికి ఆజ్యం పోయటం గాక మరేమిటి ? మధ్యప్రాచ్య అడవిలో రారాజు సింహం లాంటిది అమెరికా, దానిలో కందిరీగవంటిది ఇరాన్‌, దాన్ని చంపటానికి అవసరమైతే మొత్తం అడవిని తగలబెట్టాల్సి ఉంటుందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో ఒక రచయిత పేర్కొన్నాడంటే అమెరికన్ల ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

తాజా దాడులలో ఇప్పటి వరకు కనిపించినదాన్ని బట్టి ఇజ్రాయెల్‌కు ఉన్న పరిమితులు ఏమిటో అది అమెరికాను కూడా ఎలా యుద్దానికి లాగేందుకు చూస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇరాన్‌ శక్తిని అది తక్కువ అంచనా వేసింది. లెబనాన్‌లో ప్రభుత్వేతర సాయుధ శక్తిగా ఉన్న హిజబుల్లా నెట్‌వర్క్‌లో ప్రవేశించి గత ఏడాది దానికి భారీ నష్టం చేకూర్చింది. అదే మాదిరి ఇరాన్‌లో చేయాలని చూసింది, కొందరు విద్రోహులను చేరదీసి కొంత మేరకు నెరవేరినట్లు కనిపిస్తున్నది. ఇరాన్‌లో ఎందరు మిలిటరీ కమాండర్లను హతమార్చినా ప్రత్యామ్నాయం ఉంటారన్న అంశాన్ని విస్మరించింది.హిజబుల్లాలోనే అలాంటి నేతలు ఉన్నపుడు ఇరాన్‌లో కొదవేముంటుంది. తన తొత్తుతో దాడులు చేయించి ఇరాన్‌న్ను దారికి తెచ్చుకోవాలన్నది అమెరికా దుష్ట ఎత్తుగడ, రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్‌తో ఇటీవల భారీ ఎత్తున దాడులు చేయించినప్పటికీ పుతిన్‌ లొంగలేదు, అలాంటిది ఇరాన్‌ సలాం కొడుతుందా ? ఇరాన్‌ దాడులతో అమెరికా, ఇతర పశ్చిమదేశాలు ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్‌ ఐరన్‌ డ్రోమ్‌ దాన్ని కాపాడలేకపోయింది. రాజధాని, ఇతర నగరాలపై క్షిపణులతో విరుచుకుపడటంతో అది నివ్వెరపోయింది. చివరకు ప్రధాని నెతన్యాహు కూడా బంకర్‌లో దాక్కోవాల్సి వచ్చింది. మీకు రెండో అవకాశం ఇస్తున్నా అంటూ ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ కెనడా నుంచి ఆకస్మికంగా వెనుదిరగాల్సి వచ్చింది. తాను కూడా ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనాలా లేదా అని అమెరికా మల్లగుల్లాలు పడుతున్నది. నిజానికి ఇజ్రాయెల్‌ దాడికి దిగినప్పటికీ అమెరికాయే దాడి చేస్తున్నట్లు ఇరాన్‌ పరిగణిస్తున్నది.


ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డుల మాజీ జనరల్‌ కమాండర్‌ మొహసెన్‌ రెజాయి ఒక మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్‌కు ఇస్తున్న మద్దతు, ఆయుధాలను అమెరికా, ఐరోపా వెంటనే విరమించుకోవాలి. కొనసాగితే గగనతలంలో తమ క్షిపణులు తలపడతాయని, అవి అమెరికా, బ్రిటీష్‌, ఫ్రెంచి విమానాలు ఏవైనా తమకు ఒకటే అని అన్ని పరిణామాలు, పర్యవసానాలకు తాము సిద్దపడి ఉన్నామని చెప్పాడు. మేం ముందుగా దాడులు చేయంగానీ ముగించేది మాత్రం మేమే అన్నాడు. పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న తమ చమురు కేంద్రాలను ధ్వంసం చేస్తే ఏ దేశం కూడా చమురును వినియోగించుకోకుండా చేస్తామని ఇరాన్‌ అధినేత అలీ ఖమేనీ సలహాదారు మహమ్మద్‌ జావేద్‌ లారిజాని కూడా స్పష్టం చేశాడు.హార్ముజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ పశ్చిమ ప్రాంతంలో ఉన్న కొన్ని కేంద్రాలను ఇజ్రాయెల్‌ దెబ్బతీయగలిగింది గానీ మధ్య,తూర్పు ప్రాంతాలో ఉన్న ముఖ్యమైన వాటిని అది తాకలేకపోయింది. తాము దాడులు చేయగానే అలీ ఖమేని వ్యతిరేకులు పెద్ద ఎత్తున రంగంలోకి వస్తారని అధికార మార్పిడికి ఆజ్యం పోయవచ్చని ఇజ్రాయెల్‌ భావించినట్లు కనిపిస్తోందని, దానికి భిన్నంగా పరిణామాలు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.విబేధాలు ఉన్నప్పటికి ఉమ్మడి శత్రువుగా ఇజ్రాయెల్‌ దానికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర దేశాలను వారు చూస్తున్నారు.పశ్చిమాసియా అంతటా అమెరికా వ్యతిరేక ధోరణులు పెరుగుతున్నపుడు ఖమేనీ పాలనపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ జనంలో జాతీయ భావాలు పెరిగినట్లు కనిపిస్తోంది, యుద్ధం ఎన్నిరోజులు సాగుతుందో, ఎలా ముగుస్తుందో తెలియదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ ఉగ్రవాదం : చైనా మీద ఆరోపణ మాత్రమే, అమెరికా అధ్యక్షుడు కెనడీ, బ్రిటన్‌ దుర్మార్గం గురించి తెలుసా !

08 Sunday Jun 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, Farmers, Germany, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Agro Terrorism, Amarican Virus, Biological weapons, Bioterrorism, chemical weapons


ఎం కోటేశ్వరరావు


వ్యవసాయ ఉగ్రవాదం ప్రపంచమంతటా పురాతన కాలం నుంచి ఉన్నదే. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే అస్సీరియన్లు తమ శత్రువుల ప్రాంతాలలోని బావులలో విషాన్ని కలిపేవారు. మొదటి ప్రపంచ యుద్ద కాలంలో ఫ్రాన్సుకు రవాణా అయ్యే గుర్రాలు, పశువులకు అమెరికాలో జర్మన్‌ ఏజంట్లు విషం ఇచ్చేవారు. కత్తి, బాకు, బల్లెం వంటి వాటిని కనుగొన్న తొలి మానవుడు వాటిని ప్రమాదకర జంతువుల నుంచి రక్షణకు, ఆహారం కోసం ఉపయోగించాడు. తరువాత అవే యుద్దాల్లో ఆయుధాలుగా మారాయి. శాస్త్రవేత్త చార్లెస్‌ డార్విన్‌ 1880దశకంలో చేసిన పరిశోధనలు పంటల్లో కలుపు మొక్కల నివారణకోసం రసాయనాలను కనిపెట్టేందుకు దారితీశాయి. తరువాత కాలంలో బ్రిటన్‌, అమెరికా, తదితర సామ్రాజ్యవాదులు, నియంతలు ఏకంగా పంటలు, అడవులనే నాశనం చేసేందుకు, లక్షలాది మంది మానవులు, జంతుజాలాన్ని అంతమొందించేందుకు వినియోగించిన చరిత్ర తెలుసా ? శాస్త్రవిజ్ఞానాన్ని మానవ, ప్రకృతి వినాశనానికి వినియోగించింది మానవ కల్యాణానికి బదులు వినాశనాన్ని కోరుకున్న దుర్మార్గులే అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రమాదకరమైన ఫంగస్‌ను అమెరికా వ్యవసాయక్షేత్రాల్లో ప్రవేశపెట్టి దాని ఆహార వనరును దెబ్బతీయాలని చైనా కుట్రపన్నింది, దానిలో భాగంగా ఇద్దరు చైనా జాతీయులు ఆ ఫంగస్‌ను అక్రమంగా తెస్తూ ఎఫ్‌బిఐకి దొరికి పోయారు. ఇదీ వార్త, ఒక ఆరోపణ, సదరు ఫంగస్‌ను ఎక్కడా ప్రయోగించలేదు. పరిశోధనల కోసం తెచ్చారన్నది ఒక అభిప్రాయం. అమెరికా మనదేశంలోకి వయ్యారి భామ అనే వినాశకారి అయిన కలుపు మొక్కను ఎలా ప్రవేశ పెట్టిందీ వేరే విశ్లేషణలో చూశాము. గుండెలు బాదుకుంటున్న అమెరికా కొన్ని దశాబ్దాల నాడే ఆ దుర్మార్గానికి పాల్పడిరది అనే అంశం ఎక్కడా మీడియాలో చర్చకు రావటం లేదు.పురాతన, ఆధునిక యుద్ధాలలో ఆహార ఉత్పత్తి వ్యవస్థలను దెబ్బతీయటం ఒక ఆయుధం. అందుకే చరిత్రను చదివినపుడు శత్రుదేశాలు కోటలను చుట్టుముట్టినపుడు నెలల తరబడి తట్టుకొనేందుకు ఆహారం, నీటిని నిల్వచేసుకొనే ఏర్పాట్లు చేసుకున్నట్లు అనేక దుర్గాలు, కోటల చరిత్రలు వెల్లడిరచాయి. ఆధునిక కాలంలో అందుకు జీవ, రసాయనాలను అమెరికా అస్త్రంగా వాడుకున్నది. అదెలా జరిగిందో చూద్దాం !


1953లో కొరియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే నెల రోజుల ముందు ఉత్తర కొరియా ప్రాంతంలో అమెరికా వైమానిక దళం చేసిన దాడుల్లో 75శాతం వరి ఉత్పత్తికి నీటిని అందించే ప్రాజెక్టులను నాశనం చేసింది. ఇది తరువాత కాలంలో అక్కడ కరవుకు దారి తీసింది. కమ్యూనిస్టుల పాలనలో జనాన్ని ఆకలితో మాడ్చి చంపారని ప్రచారం చేసే మానవతావాదులకు ఈ విషయం పట్టలేదు. వియత్నాంపై దాడిచేసిన అమెరికా మొక్కలను నాశనం చేసే ఏజంట్‌ ఆరెంజ్‌ అనే రసాయనాన్ని ఆపరేషన్‌ రాంచ్‌ హాండ్‌ పేరుతో 1962 నుంచి 1971వరకు వెదజల్లింది. దీనికి ఆదర్శం ఎవరు అంటే మలయా యుద్ధంలో ప్రయోగించిన బ్రిటీష్‌ దుర్మార్గులు. అమెరికాలో రైలు మార్గాలు, విద్యుత్‌ లైన్లు వేసే ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరగకుండా చూసేందుకు 1940దశకంలో దీన్ని తయారు చేశారు. మనందరికీ తెలిసిన మానశాంటో సహా తొమ్మిది కంపెనీల నుంచి వియత్నాంలో చల్లేందుకు అమెరికన్‌ మిలిటరీ 7.6 కోట్ల లీటర్లు కొనుగోలు చేసింది. దాన్ని చల్లిన చోట 40లక్షల మంది మీద ప్రతికూల ప్రభావాలను చూపింది,30లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ అంచనా ప్రకారం పది లక్షల మంది వికలాంగులయ్యారు. ఈ దుర్మార్గ ప్రక్రియలో భాగస్వాములైన అమెరికా మిలిటరీలో అనేక మందికూడా దీని ప్రభావంతో కాన్సర్‌, లింఫోమా వంటి వ్యాధులకు గురైనట్లు తేలింది. వారికి పుట్టిన పిల్లలకు జన్యు సంబంధమైన వ్యాధులు వచ్చాయి, వారి దుర్మార్గానికి పిల్లలు బలయ్యారు. వియత్నాంలో పర్యావరణానికి కలిగిన హాని గురించి చెప్పనవసరం లేదు, 77లక్షల ఎకరాల్లో పంటలు పండలేదు, అడవుల్లో మొక్కలు పెరగలేదు. అనేక జంతువులకు హాని కలిగింది.మానవ మారణకాండను జనోసైడ్‌ అని వర్ణిస్తే పర్యావరణానికి చేసిన హానిని ఎకోసైడ్‌ అని వర్ణించారు. అమెరికా దురాక్రమణను వ్యతిరేకించిన వియత్నాం వీరులు అడవుల్లో ఉండటంతో వియత్నాం సరిహద్దుల్లో ఉన్న లావోస్‌, కంపూచియా అడవులను కూడా అమెరికా దుర్మార్గులు వదల్లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రసాయన, జీవ ఆయుధాలను తయారు చేశాయి. ఆ సమయంలో అనేక ప్రాంతాల్లో వాటిని పరీక్షించి చూశారు. జపాన్‌పై అణుబాంబును వేసిన అమెరికా యుద్దం గనుక కొనసాగితే 1946లో జపాన్‌పై ఏజంట్‌ ఆరెంజ్‌ను ప్రయోగించాలని పథకం వేసింది. బ్రిటీష్‌ పాలనలో ఉన్న మనదేశం, ఆస్ట్రేలియాలతో సహా మొత్తం 1,100 కేంద్రాల్లో దాని పనితీరును పరీక్షించారు. అమెరికాను కూడా వదల్లేదు. ఉష్ణప్రదేశాల్లో ఎలా పని చేస్తుందో చూసేందుకు కెన్యాలో కూడా చల్లారు. మలయా ప్రాంత దేశాల్లో రబ్బరు తోటల్లో పెరిగే కలుపు మొక్కలను నివారించేందుకు తయారు చేసిన రసాయనాన్ని తమ మీద తిరుగుబాటు చేసిన మలయన్లు ఉన్న అడవుల్లో 1960వరకు బ్రిటీష్‌ మిలిటరీ ప్రయోగించింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని అమెరికా తరువాత ఇండోచైనా ప్రాంతంలో అమలు చేసింది.ముఖ్యంగా దక్షిణ వియత్నాం బలైంది. అనేక మంది గొప్పగా పొగిడే నాటి అమెరికా అధ్యక్షుడు కెనడీ ఈ దుర్మార్గానికి అనుమతి ఇచ్చాడు. ఈ దుర్మార్గం గురించి తెలుసుకున్న తరువాత అమెరికాలో వియత్నాం యుద్ధవ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది.తప్పుడు వాదనలతో ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి.


అమెరికా ముందుగా ఎవరి మీద జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించదని, అయితే శత్రుదేశం ఏదైనా వినియోగిస్తే మాత్రం రసాయన ఆయుధాలను వదులుతామని అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ గొప్పగా చెప్పాడు, ఏ దేశమూ వినియోగించకుండానే అణుబాంబుతో సహా ఆ దుండగాలకు అమెరికా పాల్పడిరది. జపాన్‌లో వరి పొలాలను నాశనం చేసేందుకు అమెరికా వినియోగించింది.వియత్నాంలో ఏజంట్‌ ఆరంజ్‌ చల్లిన ప్రాంతాల్లో గత ఐదు దశాబ్దాలుగా చెట్లలో సాధారణ పెరుగుదల లేదు, మామూలు స్థితికి రావాలంటే చాలాకాలం పడుతుందని చెబుతున్నారు.వియత్నాం దురాక్రమణ, దాడుల్లో పాల్గొన్న అమెరికా సైనికులు ఏజంట్‌ ఆరంజ్‌ తదితర విషపూరిత రసాయనాలను వెదజల్లుతున్నపుడు వారికి కూడా వాటి ప్రభావం సోకిన కారణంగా 1984లో కోర్టు వెలుపల రసాయన కంపెనీలు 18 కోట్ల డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇజ్రాయెల్‌ ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాల్లోకి సముద్రపు నీరు, తమ నివాసాల నుంచి వెలువడే మురుగునీటిని పాలస్తీనియన్ల నివాసాలు, వ్యవసాయ భూముల్లోకి వదలి పనికి రాకుండా చేయటం నిత్యకృత్యం. ఇది కూడా ఒక రకంగా వ్యవసాయ ఉగ్రవాదమే. పంటలు పండకుండా అరబ్బులను మాడ్చే ఎత్తుగడ.

నీవు నేర్పియే నీరజాక్షా అని తమ వ్యవసాయం మీద చైనా దాడి చేయనుందని అమెరికా గగ్గోలు పెడుతోంది. దానికి ఇదేమీ కొత్త కాదు. ప్రతి దేశం మీద కుట్ర సిద్దాంతాలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే. తద్వారా తాను చేసే దుర్మార్గాలను స్వంత జనం ప్రశ్నించకుండా సమర్ధించేందుకు అది ఎంచుకున్న ఎత్తుగడ.తాను పెంచి పోషించిన ఉగ్రవాదానికి అదే బలికావటం కూడా వాస్తవం న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై వైమానికదాడి అదే. తాను పెంచిన తాలిబన్లే దానికి పాల్పడ్డారు.అమెరికా జిడిపిలో వ్యవసాయం తక్కువే అయినప్పటికీ గణనీయ మొత్తం ఎగుమతులకు ఉపయోగపడుతున్నది. ఆల్‌ఖైదాతో చెడిన తరువాత తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక కేంద్రాలపై దాడులు చేసినపుడు దొరికిన పత్రాలలో అమెరికా వ్యవసాయ వివరాలున్న పత్రాలు దొరికాయి. వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీయాలా అన్నది ఆల్‌ఖైదా శిక్షణలో భాగంగా బయటపడిరది.అమెరికాకు నాలుగు తరగతుల నుంచి వ్యవసాయ ఉగ్రవాద ప్రమాదం ఉందని 2012లో ఎఫ్‌బిఐ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. ఒకటి ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు, రెండవది మార్కెట్లను తిమ్మినిబమ్మిని చేసి లబ్దిపొందాలని చూసే ఆర్థిక నేరగాండ్లు లేదా అవకాశవాదుల నుంచి ప్రధానంగా ముప్పు ఉన్నట్లుపేర్కొన్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి(ఎఫ్‌ఎండి అంటే ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌)ని వ్యాపింప చేస్తే మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నది తెలిసిందే. మూడవ తరగతి అసంతృప్తి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు తమ కసి తీర్చుకొనేందుకు చేసే ఉగ్రవాద చర్యలు, నాలుగవ తరగతిగా జంతుహక్కుల రక్షకులు, పర్యావరణ ప్రేమికులు అని పేర్కొన్నారు. న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసిన తరువాత అమెరికాలో ఆగ్రో టెర్రరిజం ఆకర్షణీయంగ ఉన్నట్లు కనిపించిందట.


అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తిగా ప్రపంచానికి కనిపించకుండా చేయాలంటే దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఒసామా బిన్‌లాడెన్‌ పదే పదే వాదించేవాడట.2004 అమెరికా ఎన్నికల సమయంలో ఒక వీడియోలో పదేండ్ల పాటు రష్యా రక్తమోడిరది, అమెరికా కూడా దివాలా తీసేంతవరకు అదే విధానాన్ని అనుసరించాలని చెప్పాడట. 2011 సెప్టెంబరులో అమెరికా ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడికి ఆల్‌ఖైదాకు అయిన ఖర్చు కేవలం ఐదు లక్షల డాలర్లేనని , అమెరికాకు కలిగిన నష్టం 500బిలియన్‌ డాలర్లని ఒసామా చెప్పాడు. ఉగ్రవాద సంస్థలు నిజంగా అలా ఆలోచిస్తున్నాయో, పథకాలు వేస్తున్నాయో తెలియదు గానీ అమెరికా విశ్లేషకులు మాత్రం ఏం చేస్తే ఎలా,ఎంతటి నష్టం జరుగుతుందో వారికి విడమరచి చెబుతున్నారు. ఆహార ధాన్యాలు విషపూరితం అయితే వాటి ఎగుమతులు ఆగిపోతాయి లేదా నిల్వలు పేరుకు పోతాయి. పశువుల్లో వ్యాధులను వ్యాపింప చేస్తే వాటిని హతమార్చాల్సి ఉంటుంది. పరోక్షంగా రైతాంగానికి భారీ మొత్తాలను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.పరిశ్రమలకూ పరిహారంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి, ఖర్చులూ పెరుగుతాయి. పశువుల్లో గాలికుంటు వ్యాధిని అమెరికాలో 1929లోనే నిర్మూలించారు. ఇతర ప్రాంతాల్లో ఉంది. ఇది మసూచి కంటే 20 రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ కేవలం నలభై ఎనిమిది గంటల్లో వంద కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందగలదు. ఏదైనా వస్త్రానికి అంటుకుంటే నెల రోజుల పాటు బతికి ఉంటుంది. దీని గురించి తెలుసుకొనే లోపే అమెరికాలోని 25 రాష్ట్రాలకు కేవలం ఐదు రోజుల్లో వ్యాపింపగలదని అంచనా. అమెరికాకు పక్కనే దక్షిణ అమెరికాలో ఈ వ్యాధి ఉంది. అమెరికాలో ఒక్కో రైతు 1,500 నుంచి పదివేల వరకు ఆవులను పెంచుతాడు. ఒక దగ్గర ఈ వైరస్‌ను ప్రవేశపెడితే జరిగే నష్టాన్ని ఊహించుకోవచ్చు.2001లో బ్రిటన్‌లో ఈ వ్యాధి వ్యాపించటంతో 40లక్షల పశువులను వధించాల్సి వచ్చింది. అదే అమెరికాలో సంభవిస్తే 60 బిలియన్‌ డాలర్ల నష్టం(2012అంచనా) అని పరిశోధకులు పేర్కొన్నారు.ఇలాంటి దుర్మార్గాలకు తాము పాల్పడిన ఉదంతాలు అమెరికా అధికార యంత్రాంగానికి తెలుసుగనుక వారు నిరంతరం భయపడుతూనే ఉంటారు, ఎందుకు అంటే అమెరికాను ప్రతి ఒక్కరూ ద్వేషిస్తున్నారు గనుక. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అది అమెరికా నుంచి కూడా కావచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముద్దులాట – దెబ్బలాట : అమెరికా ప్రతికూల సుంకాలపై చర్చలకు శ్రీకారం ! ఐరోపా సంతుష్టీకరణ యత్నం వృధా ప్రయాస అన్న చైనా !!

28 Wednesday May 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, China advise, Donald trump, EU-China, EU-US, Tariff Fight, Trade Protectionism, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

మాటల్లేవ్‌, మాట్లాడుకోవటం లేదు, ఒప్పందమూ లేదు, నేను చెప్పిందే వేదం అంటూ ట్రంప్‌ చిందులు వేశాడు. ఐరోపా సమాఖ్య దేశాల వస్తు దిగుమతులపై జూన్‌ ఒకటవ తేదీ నుంచి 50శాతం ప్రతికూల సుంకాలు విధిస్తానని బెదిరించిన ఆ పెద్దమనిషి ఒక అడుగు వెనక్కు వేసి జూలై 9వ తేదీ వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లేయన్‌ తనకు ఫోన్‌ చేసి మాట్లాడిన తరువాత గడువు పొడిగించేందుకు అంగీకరించినట్లు ట్రంప్‌ చెప్పాడు. ఫోన్‌ చేసింది నిజమే అని ఆమె కూడా నిర్ధారించారు. ఏప్రిల్‌ రెండవ తేదీన అమెరికా విముక్త దినంగా ప్రకటించిన ట్రంప్‌ అన్ని దేశాల మీద పదిశాతం చొప్పున ప్రతిసుంకాలు వేస్తాననటమే గాక కొన్ని దేశాల మీద అదనంగా కూడా వేయనున్నట్లు చెప్పాడు. ఐరోపా సమాఖ్య మీద 20శాతం అన్నాడు.ట్రంప్‌ బెదిరింపుల మీద దేశాలు చర్చలకు ముందుకు రాకపోవటంతో 90రోజుల పాటు అమలు నిలిపివేస్తున్నట్లు చెప్పాడు. ఆ గడువు జూలై 9వరకు ఉంది. చైనాతో రాజీకి వచ్చి 145ను 30శాతానికి తగ్గించాడు. ఐరోపా సమాఖ్య నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో జూన్‌ ఒకటి నుంచి 50 శాతం పన్ను విధిస్తానని, చర్చలేమీ లేవంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ఒప్పందం కోసం ఎదురు చూడటం లేదు, 50శాతం పన్నుల అమలే తరువాయి, అమెరికాలో వస్తువులను ఉత్పత్తి చేస్తే ఎలాంటి పన్నులు ఉండవు అన్నాడు. వాణిజ్య మిగులు ఉన్న ఐరోపా తమ నుంచి ఇంథనం, ఆయుధాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలని ట్రంప్‌ వత్తిడి చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అమెరికా బెదిరింపుల పూర్వరంగంలో మరోసారి చైనాతో వాణిజ్య చర్చలు జరపాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించటం ట్రంప్‌కు పరోక్ష హెచ్చరికగా కనిపిస్తున్నది.అది ట్రంప్‌తో బేరమాడేందుకు కూడా కావచ్చు,చైనా మార్కెట్‌ అవకాశాల కోసమూ చూడవచ్చు. ఐరోపాలో రెండు ధోరణులు ఉన్నాయి. ఒకటి అమెరికాను ప్రసన్నం చేసుకొని పబ్బం గడుపుకోవాలని చూసేవారు కొందరైతే, ఎంతకాలమీ ముసుగులో దెబ్బలాట అని మండిపడుతున్నవారూ ఉన్నారు. అమెరికాను సంతుష్టీకరించటం అంత తేలిక కాదని గుర్తించటం అవసరమని చైనా వ్యాఖ్యానించింది.

ట్రంప్‌ దూకుడు వ్యవహారాన్ని ఐరోపా సమాఖ్య ఇప్పటి వరకు తాపీగా ప్రతిఘటిస్తున్నది. వేగంగా చర్చలు జరపనున్నట్లు ట్రంప్‌ చెప్పాడు. దౌత్యంలో అమెరికాకు ధీటుగా ఐరోపా ధనికదేశాలు ఉన్నాయి. ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తున్నారు.ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య కూటమిగా ఉన్నాయి. మొత్తం మీద ఐరోపా 2024లో 236 బిలియన్‌ డాలర్ల మేర మిగులులో ఉంది. ఈ పూర్వరంగంలో తమ వస్తువులను భారీగా కొనుగోలు చేయాలని, ఉన్న ఆటంకాలు, వ్యాట్‌, అమెరికన్‌ కంపెనీల మీద వివక్ష, అపరాధరుసుముల వంటి వాటిని నామమాత్రం లేదా తొలగించాలని అమెరికా వత్తిడి చేస్తున్నది. అసలు ఐరోపా సమాఖ్య ఏర్పాటే అమెరికా, జపాన్నుంచి తలెత్తిన పోటీని ఉమ్మడిగా తట్టుకొనేందుకు అన్నది తెలిసిందే. అందువల్లనే అది ఆచితూచి వ్యవహరిస్తున్నది. పూర్తిగా తెగతెంపులు చేసుకొనేందుకు, అలాగని లొంగిపోయేందుకు సిద్దం కాదు. అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా 2024లో ఐరోపా యూనియన్‌ 600 బిలియన్‌ డాలర్ల మేరకు సరకులు ఎగుమతి చేసి 370 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంది.

తాజా పరిణామాలను చూస్తుంటే అమెరికా బెదిరింపులకు పూనుకుందన్నది స్పష్టం.తమ అధ్యక్షుడి పన్నుల బెదిరింపు ఐరోపా సమాఖ్య కింద మంటపెట్టింది, ఇతరులతో పోలిస్తే మెల్లగా నడుస్తున్న సంప్రదింపులు దీంతో వేగం పుంజుకుంటాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ బహిరంగంగానే చెప్పాడు. జూలై తొమ్మిది వరకు గడువు ఉంది గనుక ఏం జరుగుతుందో చూడాలి. ఇరుపక్షాలకూ ఇది ప్రతిష్టాత్మకమే. ‘‘ ఈ విషయంలో మేమంతా ఒకటిగా ఉన్నాం, మీరు మాలో ఒకరిని దూరం చేస్తే మా అందరినీ చేసుకున్నట్లే, మా వాణిజ్యం, మా కార్మికులు మొత్తం ఐరోపా వాసులకోసం ఐరోపా ఐక్యంగా ఉంటుంది. మీ చర్య ప్రపంచ ఆర్థికానికే దెబ్బ ’’ అని గతంలో స్పందించిన ఉర్సులా వాండెర్‌ యూరోపియన్లకు ఇప్పుడేమి చెబుతారన్నది ఆసక్తి కలిగించే అంశం. కొన్ని వస్తువులపై ట్రంప్‌ను దెబ్బకు దెబ్బతీయాలని ఐరోపా సమాఖ్య ఇప్పటికే తీర్మానించింది, అయితే ట్రంప్‌ 90రోజుల విరామం ప్రకటించటంతో ప్రతి చర్యలను ప్రకటించటం వాయిదా వేసుకుంది. శుక్రవారం నాడు 50శాతం పన్నుల ప్రకటన చేయగానే పరస్పర గౌరవంతో పరిష్కరించుకోవాలేగానీ బెదిరింపులతో కాదు, మా ప్రయోజనాలను రక్షించుకొనేందుకు కట్టుబడి ఉన్నామని సమాఖ్య వాణిజ్య, ఆర్థిక భద్రతా కమిషనర్‌ మారోస్‌ సెఫ్‌కోవిక్‌ గట్టిగా స్పందించాడు. సంప్రదింపులకు తాము సిద్దమే అన్నాడు. ఐరోపాకు మద్దతుగా తాము నిలుస్తామని జర్మనీ విదేశాంగ మంత్రి జాన్‌ వాడేపుల్‌ అన్నాడు. సంప్రదింపులు జరుగుతున్న తరుణంలో అదనపు పన్నుల గురించి ట్రంప్‌ ప్రకటన వాటికి దోహదం చేయదని, ఉద్రిక్తతలను తగ్గించాలని కోరుకోవటంతో పాటు దేనికైనా సిద్దమే అని ఫ్రెంచి మంత్రి సెయింట్‌ మార్టిన్‌ అన్నాడు.

గత చరిత్రను చూసినపుడు ట్రంప్‌తో ఐరోపా సమాఖ్య సంబంధాలు సజావుగా లేవు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఐరోపా, మెక్సికో, కెనడా నుంచి దిగుమతి చేసుకొనే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 2018లో పన్నులు విధించాడు. ఐరోపా సమాఖ్య అంత అధ్వాన్నంగా మరొకరెవరూ అమెరికా పట్ల వ్యవహరించలేదని అప్పుడు ఆరోపించాడు. అసలు అమెరికా నుంచి లబ్ది పొందేందుకే కూటమి ఏర్పడిరదన్నాడు. సమాఖ్య నుంచి విడిపోయిన బ్రిటన్‌తో అమెరికా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మే ఎనిమిదిన కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా వస్తువులపై దిగుమతి పన్ను 5.1 నుంచి 1.8శాతానికి తగ్గిస్తుంది. దీని వలన ఐదు బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువుల ఎగుమతికి వీలు కలుగుతుందని అధ్యక్ష భవనం తెలిపింది. ఇదే మాదిరి ఇతర ఐరోపా దేశాల్లోకి తన వస్తువులను కుమ్మరించాలని చూస్తున్నది. ఈ నేపధ్యంలో బ్రిటన్‌ పట్ల బహిరంగంగా ప్రకటించనప్పటికీ సమాఖ్య గుర్రుగా ఉంది. ఆ ఒప్పందాన్ని చూపి ట్రంప్‌ బెదిరింపులకు దిగాడు. పదిశాతం పన్నులైతే సరే అంతకు మించి ఉంటే ఒప్పందం కుదరకపోవచ్చని చెబుతున్నారు. ఇరవై లేదా 30శాతమైతే తాము కూడా ప్రతి చర్యలు తీసుకోకతప్పదని ఇప్పటికే కొంత మంది సంకేతాలిచ్చారు. ఒక టవల్‌ను సీటు మీద ఆ సీటు నాదే అన్నంత మాత్రాన భయపడే ప్రాంతం ఐరోపా సమాఖ్య కాదని వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఏకపక్షంగా తాను చెప్పిందానికి అంగీకరించాల్సిందే అంటున్న ట్రంప్‌ ఐరోపాను లొంగదీసుకోగలడా ? చైనా మాదిరి సమాఖ్య గట్టిగా వ్యవహరించగలదా ! అంతర్గతంగా ఆర్థిక వ్యవస్థ మీద పెరుగుతున్న వత్తిడి ట్రంప్‌కు ఊపిరి సలపనీయటం లేదు. పన్నులు లేకపోతే తమ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని గృహస్తులలో 56శాతం మంది పెద్దలు భావిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ సర్వే పేర్కొన్నది. కలుగుతుందని చెబుతున్న ప్రయోజనం కంటే తమపై పడే భారమే ఎక్కువ అని 52శాతం చెప్పారట.కేవలం 37శాతం మంది మాత్రమే ట్రంప్‌ పన్నుల విధానాన్ని సమర్ధించినట్లు మరొక సర్వే పేర్కొన్నది. అంతర్జాతీయంగా రోజు గడిచే కొద్దీ ఎవరు ఎలా బిగదీసుకుంటారో అన్న అనుమానంతో అదిరించి బెదిరించి ఒప్పందాలు కుదుర్చుకోవాలని ట్రంప్‌ చూస్తున్నాడు.

అమెరికా ప్రకటించిన పదిశాతం పన్నులు అలాగే ఉండగా బ్రిటన్‌ పన్నులు తగ్గించటం ఏమిటని మిగతా ఐరోపా దేశాలు మండిపడుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో బ్రిటన్‌ నేడు అమెరికాకు జూనియర్‌ భాగస్వామిగా ఉన్నందున దానితో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరి ఐరోపా సమాఖ్య కుదుర్చుకొనేందుకు సిద్దపడే అవకాశాలు లేవు. ఒకవేళ లొంగిపోతే ఆయాదేశాల్లో తలెత్తే సమస్యలు నాయకత్వానికి మరింత తలనొప్పిగా మారతాయి. అమెరికా లేదా ఐరోపా ధనికదేశాల్లో వస్తూత్పత్తి ఖర్చు ఎక్కువ అందువలన పరస్పరం పన్నులు విధించుకుంటే వాటికే నష్టం అని గత అనుభవం వెల్లడిరచింది.ట్రంప్‌ 50శాతం పన్ను నిర్ణయం ప్రకటించగానే రెండు చోట్లా స్టాక్‌మార్కెట్‌ పతనమైంది. చౌకగా వస్తువులను సరఫరా చేసే చైనా, తూర్పు ఆసియా, భారత్‌ వంటి చోట్ల నుంచి దిగుమతులు చౌకగా మారితే రెండూ నష్టపోతాయి. ఐరోపా నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 2024లో 20.6శాతం ఉంది.ప్రతికూల పన్నులు విధింపు, వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక భవిష్యత్‌ను బలహీనం చేశాయని ఐరాస పేర్కొన్నది, ప్రపంచానికి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు బహుముఖ సవాళ్లు విసురుతున్నాయని కూడా తెలిపింది.

త్వరలో చైనాఐరోపా సమాఖ్య వాణిజ్య ప్రతినిధుల చర్చలు పారిస్‌లో జరగనున్నాయి. సహకారం పెంచుకోవాలని ఉభయపక్షాలూ ఇటీవలి కాలంలో పదే పదే సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ దేశాల మంత్రుల సమావేశాలు జూన్‌ మొదటి వారంలో పారిస్‌లో జరగనున్నాయి. ఆ సందర్భంగా చైనాతో ఐరోపా సమాఖ్య ప్రతినిధులు భేటీ కానున్నారు. ట్రంప్‌ విధించిన గడువు జూలై తొమ్మిది వరకు ఉండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిరది. ఐరోపా యూనియన్‌కు అమెరికాతో సమస్యలున్నట్లే చైనాతో కూడా కొన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఆర్థిక సహకారానికి సంబంధించి మే 13, 14వ తేదీలలో బ్రసెల్స్‌లో ఉభయ పక్షాలు సమావేశమయ్యాయి, మరుసటి రోజు ఫ్రాన్స్‌ ప్రతినిధులు చైనాతో చర్చించారు. చైనా ప్రతినిధివర్గ నేత వాంగ్‌, ఐరోపా నేత సెఫ్‌కోవిక్‌ మధ్య ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు కీలక చర్చలు జరిగాయి. పారిస్‌లో మూడవది జరగనుంది.సెఫ్‌కోవిక్‌ మార్చి 28న చైనా సందర్శించాడు, ఏప్రిల్‌ 18న వీడియో కాన్ఫరెన్సులో విద్యుత్‌ వాహనాల ధరలు, పెట్టుబడులు, ఆటో రంగంలో సహకారం గురించి ఉభయపక్షాలు చర్చలను ప్రారంభించాలని నిర్ణయించారు. పరస్పర లాభదాయకమైన సహకారం,కృత్రిమ మేథ, నూతన ఇంథన రంగాలు ఇతర అంశాలు ఉన్నాయి.ఈ పరిణామాల పట్ల అమెరికా గుర్రుగా ఉంది. చైనా వస్తువుల మీద తమ మాదిరి ఐరోపా సమాఖ్య కూడా ప్రతికూల పన్నులు విధించాలని అది డిమాండ్‌ చేస్తున్నది, అయితే ఐరోపా నుంచి ఇంతవరకు ఎలాంటి హామీ రాలేదని అమెరికా అధికారి ఒకరు చెప్పినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది. అమెరికా తరువాత చైనా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. తమ మీద అమెరికా పన్నులను రద్దు చేస్తే ఉమ్మడిగా చైనా నుంచి ఇద్దరికీ ముప్పు ఉందని ప్రకటించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఐరోపా పార్లమెంటు వాణిజ్య కమిటీ అధ్యక్షుడు బెర్నెడ్‌ లాంగే ప్రకటించటం గమనించాల్సిన అంశం.ఇవన్నీ చూసినపుడు నిజంగా అమెరికాకు వ్యతిరేకంగా కలసి వస్తే ఐరోపా, చైనా బలపడతాయి, లేకుంటే చైనాకు కొత్తగా పోయేదేమీ లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d