• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: imperialism

పోలీసు దురాగతం : రెండో వారంలోకి ఫ్రెంచి నిరసనలు !

05 Wednesday Jul 2023

Posted by raomk in Africa, Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

emmanuel macron, French protests, Nahel Merzouk, Riots in France


ఎం కోటేశ్వరరావు


అల్జీరియా-మొరాకో సంతతికి చెందిన 17 సంవత్సరాల నహేల్‌ అనే కుర్రవాడు ట్రాఫిక్‌ సిగల్‌ నిబంధనలను ఉల్లంఘించాడంటూ పోలీసులు గుండెల మీద కాల్చి చంపిన దురంతం ప్రస్తుతం ఫ్రాన్స్‌ను ఊపివేస్తున్నది. జూన్‌ 27న పారిస్‌ శివార్లలోని నాన్‌తెరేలో ఈ దారుణం జరిగింది. ఇరవై తొమ్మిదవ తేదీన అంత్యక్రియల సందర్భంగా దేశమంతటా ఆగ్రహించినవారి తీవ్ర నిరసనలు, దాడులు కొనసాగుతున్నాయి. మధ్యేవాద, వామపక్ష పార్టీలు, శక్తులు ఈ ఉదంతాన్ని ఖండించాయి, నిరసనలో పాల్గొన్నాయి. జాత్యహంకారి, హంతకుడైన పోలీసు అధికారికి మద్దతుగా విరాళాలు ఇవ్వాలని పచ్చిమితవాద నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ నేత మేరీనె లీపెన్‌ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాటికి 17లక్షల డాలర్లకు పైగా వసూలైంది. నాలుగు సంవత్సరాల క్రితం ” పసుపు చొక్కాల ” ఆందోళన జరిగినపుడు పోలీసుల మీద దాడి చేసిన మాజీ బాక్సర్‌కు మద్దతుగా నిధుల సేకరణకు పిలుపు ఇచ్చినపుడు వెంటనే ఆ నిధి సేకరణను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు అలా జరగలేదు. అరబ్బులను చంపండి మీరు మిలియనీర్లు కావచ్చు అని ఈ నిధి సేకరణ సందేశం ఇస్తున్నదని వామపక్ష నేత డేవిడ్‌ గుయిరాడ్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ చర్య అన్యాయం జరుగుతున్నదనే మనోభావాలను రగిలించటంతో పాటు ఉద్రిక్తతలు మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుందని స్లీపింగ్‌ జైంట్స్‌ అనే సంస్థ పేర్కొన్నది. ఒక మేయరు ఇంటి మీద తగులబడుతున్న కారును తోలి దాడికి పాల్పడ్డారంటే జాతి వివక్ష ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో వెల్లడించింది. దేశంలో తలెత్తిన ఉద్రిక్తత కారణంగా అధ్యక్షుడు మక్రాన్‌ జర్మనీ పర్యటనను రద్దు చేసుకున్నాడు. మైనారిటీల పట్ల దేశంలో ఉన్న జాతివివక్ష గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆందోళన రెండో వారంలో ప్రవేశించింది.


ఉదయం ఎనిమిది గంటలపుడు మెర్సిడెజ్‌ కారు నడుపుతున్న నహేల్‌ దురుసుగా ఒక స్టాప్‌ వద్ద ఉన్న ఇద్దరు పోలీసుల మీద దురుసుగా కారును పోనిచ్చేందుకు చూసాడనే కథనాలు వెలువడ్డాయి. అది వాస్తవం కాదని, వారిద్దరూ కారు పక్కనే ఉన్నట్లు, కారు కదలక ముందే ఒక పోలీసు కారులో ఉన్న నహేల్‌ మీద తుపాకి గురిపెట్టినట్లు కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చాయి.కాల్పులు జరిపిన తరువాత అదుపుతప్పిన కారు సమీపంలోని ఒక స్థంభాన్ని ఢకొీట్టి ఆగింది. నీ తలలో బుల్లెట్‌ దిగుతోంది అన్న మాటలు వినిపించినట్లు ఒక టీవీ ఛానల్‌ పేర్కొన్నది. కాల్పులు జరిపినపుడు నహేల్‌తో పాటు కారులో మరో ఇద్దరు ఉన్నారని వారిలో ఒకడు పోలీసులతో మాట్లాడినట్లు, మరొకడు కారు దిగి పారిపోయినట్లు చూసిన వారు చెబుతున్నారు. కాల్పులు జరపటానికి ముందు బస్సులు వెళ్లే మార్గంలో వెళుతున్న కారును ఇద్దరు పోలీసులు మోటారు సైకిళ్ల మీద వెంబడించి ఆపేందుకు చూడగా నహేల్‌ కారును ఆపలేదు, కొంత దూరం వెళ్లిన తరువాత ట్రాఫిక్‌ కారణంగా నిలపాల్సి వచ్చింది. వెనుకనే వచ్చిన పోలీసుల్లో ఒకడు కారు పక్కకు వచ్చి కాల్పులు జరిపాడు. ఈ తీరుతో జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చైనా పర్యాటకులు వెళుతున్న బస్‌పై జరిగిన దాడి తరువాత అనేక దేశాలు తమ పౌరులను హెచ్చరిస్తూ ఫ్రాన్స్‌ వెళ్లవద్దని సలహా ఇచ్చాయి.


గతవారం రోజులుగా దేశమంతటా వేలాది మంది సాయుధ పోలీసులను మోహరించి హింసాకాండను ఆపేందుకు పూనుకున్నారు. వేలాది మందిని అరెస్టు చేశారు. హింసాకాండకు పాల్పడుతున్న వారు తన మనవడి మరణాన్ని సాకుగా చూపుతున్నారని అమ్మమ్మ నాదియా ఒక టీవీలో చెప్పింది. ఆందోళనలు విరమించాలని కోరింది. నహేల్‌ ఉదంతం ఇలాంటి పరిస్థితిని ఎందుకు సృష్టించిందన్నది ప్రశ్న. 2020లో అమెరికాలోని మినియాపోలిస్‌ పట్టణంలో పోలీసులు జార్జి ఫ్లాయడ్‌ అనే నల్లజాతి యువకుడిని ఊపిరాడకుండా చేసి చంపిన తీరును చుట్టుపక్కల ఉన్నవారు తీసిన వీడియో సంచలనంగా మారి ఆందోళనకు దారితీసింది. నహేల్‌ను కాల్చి చంపుతున్న వీడియో కూడా అలాంటి ప్రతిస్పందననే కలిగించింది.2005లో పోలీసులు వెంటాడినపుడు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించినపుడు దేశమంతటా మూడు వారాల పాటు తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఆ తరువాత ఇప్పుడు అదే మాదిరి ఫ్రాన్సులోని మైనారిటీలు ఆందోళనకు పూనుకున్నారు. ఫ్రెంచి పోలీసుల దుర్మార్గపూరిత వైఖరి, జాతి వివక్ష తీరుతెన్నులకు ఈ ఉదంతాలు నిదర్శనం.


నెలల తరబడి సాగిన పెన్షన్‌ సమ్మెలు,ఇతర ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్‌లో అధికారాన్ని నెట్టుకువస్తున్న మక్రాన్‌ ప్రభుత్వానికి తాజా ఆందోళనతో ఎదురైన సవాలు ఎంత తీవ్రమైనదంటే బ్రసెల్స్‌లో జరుగుతున్న ఒక సమావేశం నుంచి ముందుగానే స్వదేశానికి చేరుకోవటం, జర్మనీ పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.పెన్షన్‌ సంస్కరణలకు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న సమయంలో బ్రిటన్‌ రాజు చార్లెస్‌ కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రెంచి టూర్‌ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మన దేశంలోని మణిపూర్‌లో పరిస్థితి ఎంతగా దిగజారిందో తెలిసిందే. శాంతిగా ఉండాలని కనీసం ప్రధాని నరేంద్రమోడీ నోటి వెంట ఒక్క ముక్కరాలేదు, స్వయంగా పరిస్థితిని తెలుసుకొనేందుకు అక్కడకు వెళ్లలేదు. తమ రాష్ట్రంలో శాంతినెలకాల్పాలని కోరుతూ ఢిల్లీ వచ్చిన ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల ప్రతినిధులను కూడా కలుసుకొనేందుకు అవకాశం ఇవ్వలేదు. అమెరికా, ఈజిప్టు వెళ్లి సుభాషితాలు చెప్పివచ్చారు. సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మంగళవారం నాడు దేశంలోని 220 మంది మేయర్లతో(స్థానిక సంస్థల అధిపతులు) సమావేశం కానున్నట్లు వార్తలు వచ్చాయి.


అల్జీరియా ఫ్రెంచి వలసగా ఉన్న కాలంలో ఫ్రెంచి దళాలు జరిపిన దారుణమారణకాండలు ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. అనేక మంది అల్జీరియన్స్‌ ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. అలాంటి కుటుంబానికి చెందిన వాడే గత నెలలో పోలీసుల చేతిలో మరణించిన నహేల్‌. వలస వచ్చిన ఆఫ్రికా అరబ్బులు, ఇతరులు అంటే ఫ్రెంచి అధికార యంత్రాంగానికి చిన్న చూపు, నేరగాండ్లుగా చూస్తారు.వారితో మమేకం కావటానికి బదులు దమనకాండ ప్రదర్శిస్తారు. అందుకే వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తరచూ వివాదాలు జరుగుతుంటాయి. పశ్చిమ దేశాలలో అమెరికా తరువాత ఫ్రాన్స్‌లోనే పోలీసుల చేతుల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, ఆర్థిక దిగజారుడు పరిణామాలు, వలసదారుల అంశాల మీద ఐరోపా దేశాల్లో పరిస్థితి దిగజారుతోంది.ఇటువంటి స్థితిలో జనంలో ఉన్న అసంతృప్తి ఇలాంటి ఉదంతాలు జరిగినపుడు ఊహించని రీతిలో వెల్లడౌతుంది.ఫ్రాన్స్‌ ఆందోళనకు పూర్వరంగమిదే. నహేల్‌ హత్య ఊహించని ఉదంతమైనా దానికి ప్రతికూల స్పందన గూడు కట్టుకున్న అసంతృప్తికి నిదర్శనం. ఇటీవలి కాలంలో ఫ్రెంచి అధినేత మక్రాన్‌ తమకు మరింత వ్యూహాత్మక స్వయం నిర్ణయాధికారం ఉండాలని, ప్రపంచ వ్యవస్థలో బహుళనాయకత్వం ఉండాలని గట్టిగా చెబుతున్నారు. ఇది అమెరికా గురించే అన్నది స్పష్టం. మక్రాన్నుదారిలోకి తెచ్చుకొనేందుకు పెత్తందారీ ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని చూస్తున్న శక్తుల హస్తం కూడా తాజా కొట్లాటల వెనుక ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అమెరికాకు నచ్చని వైఖరిని తీసుకున్నపుడల్లా ఫ్రాన్స్‌లో కొట్లాటలు జరగటాన్ని బట్టి ఇలా అనుమానించాల్సి వస్తోందని చెబుతున్నారు. అందువలన ఇది ఒక్క ఫ్రాన్స్‌కే కాదు, ఐరోపా సమాఖ్యకు, దేశాలకు ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.


ఐరోపాలో ఇటీవలి కాలంలో ముస్లిం వ్యతిరేక వైఖరితో ఉన్న పచ్చిమితవాద శక్తులు రెచ్చిపోతున్నారు.ఫ్రాన్స్‌ కొట్లాటల్లో పాల్గొన్నది వలస వచ్చిన లేదా ఎప్పటి నుంచో అక్కడ స్థిరపడిన ముస్లింలు, అరబిక్‌ లేదా ఆఫ్రికన్‌ దేశాల నుంచి వలస వచ్చిన వారని చెబుతున్నారు. తాజా పరిణామాల గురించి మీడియాలో చర్చ జరుగుతున్నది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులకు మరింత శిక్షణ అవసరమని, జాతి వివక్ష అంశాన్ని పరిష్కరించాలని, పేదలు-ధనికుల మధ్యపెరిగిన అంతరాన్ని తగ్గించాలని, నిరుద్యోగం పెరుగుదల గురించి సూచనలు చేస్తున్నారు. నిజానికి ఇవి కొత్తవి కాదు ఎప్పటి నుంచో ఉన్నవే. ప్రపంచీకరణ తెచ్చిన సంక్లిష్ట సమస్యలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ప్రపంచీకరణ క్రమంలో ఉత్పత్తి ఖర్చు అధికంగా ఉందనే కారణంతో ఇతర దేశాల నుంచి పారిశ్రామిక వస్తువులను దిగుమతి చేసుకొని సేవారంగం మీద కేంద్రీకరించాయి. ఈ విధానంతో నిరంతర వృద్ది సాగదని తేలింది. ప్రపంచ అభివృద్దిలో అసమతూకానికి దారితీసింది, ప్రపంచీకరణకు వ్యతిరేకతను పెంచింది. కరోనా, ఉక్రెయిన్‌ సంక్షోభం సమస్యల తీవ్రతను వేగతరం కావించింది. ఆర్థిక మందగమన ప్రతికూల పర్యవసానాలు పేద, మధ్య తరగతి మీద భారాలను మోపుతున్నాయి.స్థిరమైన ఉపాధి, అవసరాలకు అనుగుణంగా పెరిగే రాబడి, కుటుంబ జీవనం సంతోషంగా ఉంటుందనే అంశాల మీద ఆశలను తుంచివేస్తున్నది. వీటికి జాత్యహంకారం కూడా తోడైతే ఇక చెప్పనవసరం లేదు. అసంతృప్తి కనిపించని గాస్‌ మాదిరి వ్యాపిస్తే మండటం క్షణాల్లో జరుగుతుంది. గడచిన ఐదు దశాబ్దాల్లో ప్రపంచీకరణ తెచ్చిన మార్పు ఫ్రాన్సులోనూ ఇతర పశ్చిమ దేశాల్లోనూ అనేక పరిణామాలు, ఉద్యమాలు, ఆందోళనలకు దారి తీసింది. వస్తు దిగుమతులు తమ ఉపాధిని దెబ్బతీసిందనే అసంతృప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే అభిప్రాయం రోజు రోజుకూ బలపడటానికి దారి తీస్తోంది. గత రెండు దశాబ్దాల్లో ఏ నేతా ఎదుర్కోనటువంటి తీవ్ర సవాలును మక్రాన్‌ ఎదుర్కొంటున్నట్లు కొందరు విశ్లేషించారు. పార్లమెంటులోని 577 స్థానాలకు గాను మక్రాన్‌ నాయకత్వంలోని రినయసెన్స్‌ పార్టీకి 251 సీట్లే ఉన్నాయి. రెండవ సారి ఎన్నికైనపుడు సంపూర్ణ మెజారిటీ రాకపోవటంతో ద్వితీయ రౌండ్‌లో మితవాది మారినే లీపెన్‌ మీద 58శాతం ఓట్లతో గెలిచాడు. మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో కొనసాగేందుకు పార్లమెంటులో ప్రతిపక్షాల సహకారంతోనే గట్టెక్కే అవకాశం ఉంది.వచ్చే ఏడాది జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా మక్రాన్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పరిశోధనల్లో చైనాను తక్కువ అంచనా వేస్తే ముప్పే – అమెరికాను హెచ్చరించిన ఓ నివేదిక !

14 Wednesday Jun 2023

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti china, Chinese Innovation Inputs, Chinese Scientific Articles, ITIF, natural-science research ranking, R&D Expenditures


ఎం కోటేశ్వరరావు


ప్రకృతి విజ్ఞానం(నేచురల్‌ సైన్స్‌)లో అమెరికాను వెనక్కు నెట్టి చైనా ప్రధమ స్థానానికి వచ్చిందన్నది ఒక నివేదిక.” మేలుకో అమెరికా : నవ కల్పన ఉత్పత్తిలో అమెరికాను అధిగమిస్తున్న చైనా ” అనే శీర్షికతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఐటిఐఎఫ్‌) ఒక నివేదికలో హెచ్చరించింది. ” చైనా నకిలీ సైన్సు పరిశ్రమ ” అంటూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక ఒక పెద్ద నింద మోపింది. ఇవన్నీ ఇటీవల చైనా గురించి వచ్చిన విశ్లేషణలు, వార్తలకు సంబంధించిన అంశాలు. ప్రకృతి విజ్ఞానంలో చైనా తొలిసారిగా అమెరికాను అధిగమించి ఒకటవ స్థానంలో ఉన్నట్లు నేచర్‌ ఇండెక్స్‌ పేర్కొన్నది. అగ్రశ్రేణి పత్రికల్లో 2022 సంవత్సరంలో ప్రచురితమైన పరిశోధనా పత్రాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. ఎనభై రెండు పత్రికల్లో చైనాకు చెందిన వారు సమర్పించిన పత్రాలు 19,373 కాగా అమెరికా నుంచి వచ్చినవి 17,610 ఉన్నాయి. ఏ దేశానికి చెందిన వారైనా ఏ దేశం నుంచి పత్రాలను సమర్పిస్తే వాటిని ఆ దేశాల ఖాతాలో వేస్తారు. ప్రకృతి విజ్ఞాన పరిశోధనా పత్రాల సమర్పణలో చైనా, అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, జపాన్‌ మొదటి ఐదు స్థానాల్లో ఉండగా మన దేశం పదవ స్థానంలో ఉంది. భౌతిక, రసాయన శాస్త్ర పరిశోధనల్లో 2021లో చైనా మొదటి స్థానంలో ఉంది. తాజా సమాచారాన్ని పరిశీలించినపుడు భూమి, పర్యావరణ శాస్త్రాలలో కూడా తొలిసారిగా అమెరికాను వెనక్కు నెట్టి చైనా ముందుకు వచ్చింది. గత ఏడాది వివరాలను పరిశీలించినపుడు ప్రపంచ అగ్రశ్రేణి 50 పరిశోధన ఉత్పాదక సంస్థలలో చైనా సైన్సెస్‌ అకాడమీ ఒకటవదిగా ఉండగా మొత్తం 19 చైనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఆ జాబితాలో ఉన్నాయి. 2010 నుంచి జాతీయ సమతూకంలో మార్పు ఉన్నట్లు నేచర్‌ ఇండెక్సు ప్రకటన పేర్కొన్నది.2018 -2020 సంవత్సరాలలో ఉటంకించిన అగ్రశ్రేణి ఒకశాతం పరిశోధనా పత్రాలలో అమెరికా కంటే చైనావే ఎక్కువగా ఉన్నట్లు సైన్సెస్‌ మరియు టెక్నాలజీ జపాన్‌ జాతీయ సంస్థ 2022 నివేదిక పేర్కొన్నది.

నిజానికి 2018లోనే మొత్తం పరిశోధనా పత్రాల సమర్పణలో అమెరికా, ఐరోపాను వెనక్కు నెట్టి చైనా ముందుంది.
2018 నుంచి 2020వరకు ప్రపంచ శాస్త్ర పత్రాలలో 23.4శాతంతో చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతానికి జీవ శాస్త్ర రంగంలోనే అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.అమెరికా ఎన్నో శతాబ్దాలు ముందుండి పరుగులు పెడుతుంటే చైనా ఇటీవలనే నడక ప్రారంభించింది. అందుకే ఇప్పటికీ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు కొన్ని రంగాలలో ముందున్నాయి. నోబెల్‌ బహుమతులను కొలబద్దగా తీసుకుంటే 403తో అమెరికా, 137తో బ్రిటన్‌, 114తో జర్మనీ మొదటి మూడు స్థానాల్లో ఉండగా చైనా తొమ్మిదితో 23వ స్థానంలో ఉంది. 2015లో పశ్చిమ దేశాల సైన్సు పత్రికలలో చైనా పరిశోధనా పత్రాలు కేవలం ఏడున్నవేలు మాత్రమే ప్రచురణకు నోచుకోగా అమెరికా నుంచి 21వేలవరకు ఉన్నాయి. 2020 అమెరికా పత్రాలు స్వల్ప తేడాతో స్థిరంగా ఉండగా తరువాత తగ్గటం ప్రారంభమైంది. మరోవైపున అచిర కాలంలోనే చైనా దాన్ని అధిగమించింది. పశ్చిమ దేశాల పరిశోధనా సంస్థలు కొన్ని రంగాలలో తప్పనిసరైతే తప్ప చైనా లేదా మరొక వర్ధమాన దేశంతో సహకరించటం లేదన్నది తెలిసిందే. కొత్తవాటిని కనుగొనటం కాకుండా ఉన్నవాటిని కాపీ కొడుతుందని ఇప్పటికీ చైనా గురించి చెప్పేవారు మనకు కనిపిస్తారు. అదే నిజమైతే మిగిలిన దేశాలకూ అలాంటి అవకాశం ఉన్నట్లే, మరి అవెందుకు ఆ పని చేయటం లేదు ? మన దేశంలో దొంగ డిగ్రీలు, చివరికి పిహెచ్‌డి థీసిస్‌లను కూడా కొనుక్కొని పట్టాలు పొందవచ్చు కనుక అనేక మంది చైనా గురించి జరుగుతున్న ప్రచారాన్ని నమ్మటంలో వింత లేదు.


వాషింగ్టన్‌ డిసి కేంద్రంగా పని చేస్తున్న ఐటిఐఎఫ్‌కు చైనా మీద ఎలాంటి ప్రత్యేక అభిమానం ఏమీ ఉండదు, అది అమెరికాలోని ఒక స్వచ్చంద సంస్థ. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదికలో అమెరికా పాలకవర్గానికి ఒక హెచ్చరిక చేసింది. చైనాను ఒక నవకల్పన దేశానికి బదులు అనుకరించేది అని తక్కువగా అంచనా వేస్తే తనకు తానే ఆపద కొనితెచ్చుకున్నట్లు అవుతుందని పేర్కొన్నది.2020 నాటికి అంతర్జాతీయ పేటెంట్‌ కుటుంబాల (అమ్మా, నాన్న, పిల్లలు కుటుంబం అన్నట్లే, ఒక పేటెంట్‌ దానికి అనుబంధంగా పేటెంట్లు ఉండటాన్ని కూడా కుటుంబంగా పరిగణిస్తారు) సంఖ్య అమెరికా కంటే చైనాకు చెందినవి ఐదు రెట్లు ఉన్నట్లు చెప్పింది.నవకల్పనలో అమెరికా ఆధిపత్యాన్ని పునరుద్దరించాలని విధాన నిర్ణేతలకు సూచించింది. మేడిన్‌ చైనా 2025 వ్యూహం ప్రకారం ఆ దేశం ముందుకు పోతున్నదని కూడా చెప్పింది. పరిశోధనా రంగంలో సాధిస్తున్న ప్రగతిని పేర్కొంటూ 2010లో ఐరోపా సమాఖ్య ప్రకటించిన పరిశోధన-అభివృద్ధి రంగంలో పెట్టుబడుల సూచికలో 1,400 కంపెనీలకు గాను 19 చైనా కంపెనీలుండగా 2020 నాటికి 278కి పెరగ్గా ఇదే కాలంలో అమెరికా సంస్థలు 487 నుంచి 449కి తగ్గాయి. సైన్స్‌, ఇంజనీరింగ్‌ పరిశోధనా పత్రాలు 2020లో 7,42,000 కాగా అవి అమెరికా కంటే 123.7శాతం ఎక్కువని ఐటిఐఎఫ్‌ పేర్కొన్నది. పేటెంట్ల లైసన్సు ద్వారా వచ్చే రాబడిలో అమెరికా ఎంతో ముందుంది. చైనాకు 2016లో అమెరికాకు వచ్చే రాబడిలో కేవలం రెండుశాతమే రాగా 2020 నాటికి 12శాతానికి పెరిగిందని ప్రపంచ బాంకు సమాచారం వెల్లడించింది. సూపర్‌ కంప్యూటర్లలో 2020 నాటికి 500 అగ్రశ్రేణి వ్యవస్థలకు గాను చైనాలో 214 ఉండగా అమెరికా 113 మాత్రమే ఉన్నాయి. పారిశ్రామిక రోబోల వినియోగంలో 2010 అమెరికాతో పోలిస్తే పదికి ఒకటి ఉండగా ఇప్పుడు అమెరికాతో సమంగా ఉన్నాయి. గణనీయ పురోగతి ఉన్నప్పటికీ చైనా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఐటిఐఎఫ్‌ పేర్కొన్నది.


ఎలక్ట్రిక్‌ బాటరీలు, హైపర్‌సోనిక్‌,5జి,6జి, నానో స్కేల్‌ మెటీరియల్స్‌, సింథటిక్‌ బయాలజీ వంటి కొన్ని రంగాలలో తిరుగులేనిదిగా ఉన్న చైనా 44 సాంకేతిక పరిజ్ఞానాల్లో 37లో ముందున్నదని ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పోలసీ ఇనిస్టిట్యూట్‌ అనే మేథో సంస్థ 2022 నివేదికలో పేర్కొన్నది. మిగిలిన ఏడింటిలో అమెరికా ముందున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని పది అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలు చైనాలో ఉన్నాయని, అమెరికా కంటే తొమ్మిది రెట్లు పరిశోధనా పత్రాలను అవి రూపొందిస్తున్నట్లు , షీ జింపింగ్‌, అంతకు ముందున్న నేతల మార్గదర్శకత్వంలో ఈ కృషి కొనసాగుతున్నదని పేర్కొన్నది. అణ్వాయుధాలను మోసుకుపోగల హైపర్‌సోనిక్‌ క్షిపణులను 2021లో పరీక్షించిన తీరును చూసి అమెరికా గూఢచార సంస్థలు ఆశ్చర్యపడనవసరం లేదని, గడచిన ఐదు సంవత్సరాలలో ప్రపంచంలో పెద్ద ప్రభావం కలిగించే మొత్తం పరిశోధనా పత్రాల్లో 48.49శాతం ఒక్క చైనా నుంచే ఉన్నట్లు ఆస్ట్రేలియన్‌ సంస్థ పేర్కొన్నది.


పరిశోధనల్లో వివిధ దేశాల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. సహకరించిన వారెవరైనా ఏ దేశానికి చెందిన వారు పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తే దాన్ని ఆ దేశ ఖాతాలో వేస్తారు.చైనా నుంచి వస్తున్న పరిశోధనా పత్రాలు ఇతరుల సహకారంతో సమర్పిస్తున్నవని కొందరు చైనాను తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.రెండవది చైనా తమ పరిశోధన అంశాలను తస్కరిస్తున్నారని నిందిస్తున్నారు. మన దేశంతో సహా అనేక దేశాల సంప్రదాయ విజ్ఞానాన్ని అమెరికా, ఐరోపా దేశాలు అపహరించి తమ పేరుతో మేథో సంపత్తి హక్కులు పొందాయి. అందుకు ఒక చక్కటి ఉదాహరణ మన దేశం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు చెబుతున్న పసుపు మీద అమెరికా పేటెంట్‌ హక్కు దఖలు పరచుకుంది. దాని మీద మన దేశం చట్టబద్దమైన పోరాటం చేసి విజయం సాధించింది. ఇలాంటి అవకాశం ఏ దేశానికైనా ఉంది. కొందరు ఆరోపిస్తున్నట్లు చైనా కూడా అలాంటి పని చేస్తే దాన్ని కూడా కోర్టులకు లాగవచ్చు. ఎవరి విజ్ఞానాన్ని వారు పరిరక్షించుకోవచ్చు.విద్యుత్‌ బల్బును కనుగొన్నది ఎవరని అడిగితే ఠకీమని చెప్పే జవాబు థామస్‌ ఎడిసన్‌ అని వస్తుంది. కానీ ఎడిసన్‌ కంటే ముందే అనేక మంది దాని మీద పరిశోధనలు చేశారు, బల్బులను రూపొందించారు. దాని కొనసాగింపుగా ఎడిసన్‌ తన పరిశోధనలను జోడించి ఆ బల్బును వాణిజ్యపరంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అనుసరించిన క్రమం గురించి పేటెంట్‌ పొందాడు. దాంతో పేరు అతనికి వచ్చింది. ఆ పరిశోధనలో అనేక మంది ఎడిసన్‌కు సహకరించారన్నది గమనించాలి. మరొకరెవరూ తదుపరి పరిశోధనలు చేయకూడదు, ఎడిసన్‌ లేదా అతని వారసులు మాత్రమే చేయాలంటే ఈ రోజు ఇన్ని రకాల బల్బులు వచ్చి ఉండేవి కాదు. పరిశోధనలకు మూలం అంతకు ముందున్న తరాల విజ్ఞానమే అన్నది తెలిసిందే.


చైనా శాస్త్రవేత్తల పరిశోధనల్లో పెద్దగా పస ఉండదు, నాసిరకం, ఇతరులు చేసిన వాటిని అటూ ఇటూ మార్చి నూతన పరిశోధనల పేరుతో సమర్పిస్తున్నారు, ఒకే వనరు నుంచి కాపీ పరిశోధనలు వస్తున్నాయి, ఇతరులు బొమ్మలను మరోకోణంలో కొత్తవిగా చూపుతున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు కొందరు. చైనాలో ఉన్న అవినీతిని తొలగించేందుకు ఎలాంటి కఠిన శిక్షలను అమలు చేస్తున్నారో తెలిసిందే. పరిశోధనా రంగంలో ఉన్నవారు కూడా అవినీతికి పాల్పడితేవారి నుంచి వచ్చిన వాటిని అంతర్జాతీయ సమాజం పక్కన పెట్టవచ్చు. పరిశోధనలను ప్రోత్సహించే క్రమంలో ప్రచురించిన పత్రాల ప్రాతిపదికన చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిన కారణంగా కొందరు అవినీతికి పాల్పడి ఉండవచ్చు తప్ప మొత్తంగా నకిలీ అనే వారిని చేసేదేమీ లేదు. ఇప్పుడు అలాంటి ప్రోత్సహకాలను నిలిపివేసింది. అక్కడ జరుగుతున్న అభివృద్ది వాస్తవం, సాధిస్తున్న అద్బుతాలు నిజం. ఈ పూర్వరంగంలో చైనా మీద బురద జల్లేందుకు కుహనా శాస్త్ర పరిశ్రమ పేరుతో వారినీ వీరిని ఉటంకించి ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఒక కథను అల్లింది. చైనాదంతా బోగస్‌ అని అమెరికా ఇతరులను నమ్మించేందుకు ప్రచారం చేయవచ్చు తప్ప దాన్ని వారే నమ్మటం లేదు. చైనాతో పోటీని తట్టుకొనేందుకు వచ్చే పది సంవత్సరాల్లో శాస్త్ర పరిశోధనలకు రెండు వందల బిలియన్‌ డాలర్లను అధ్యక్షుడు జో బైడెన్‌ నిధుల మంజూరు చేసేవాడే కాదు.


ఇంతవరకు ప్రపంచంలో చైనా గురించి చేసినన్ని తప్పుడు ప్రచారాలు మరొక దేశం గురించి లేవంటే అతిశయోక్తి కాదేమో ! ఎవరు అవునన్నా కాదన్నా చైనా నేడు సాంకేతిక, ఆర్థిక రంగాల్లోనే కాదు, శాస్త్ర రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలను సవాలు చేస్తూ ముందుకు పోతోంది. అది కూలిపోవాలి, పేలిపోవాలని ఎన్ని దుష్ట కోరికలు కోరుకున్నప్పటికీ, కూలుతుందని తేదీలు, సంవత్సరాలను ఉటంకించినప్పటికీ అలాంటి జాడలేమీ లేవు. అనేక రంగాలలో ముందుకు పోవటానికి కారణం జనానికి జవాబుదారీగా ఉండే కమ్యూనిస్టు భావజాలం కలిగిన శక్తులు అక్కడ అధికారంలో ఉండటమే కారణం. దోపిడీ లేని మరో సమాజ నిర్మాణం సాధ్యమే అని నిరూపించేందుకు కమ్యూనిస్టులు ముందుకు పోతుండగా అడ్డుకొంటున్న ప్రతిసారీ ఆటంకాలను అధిగమించి ముందుకు పోతున్నది. ఆ క్రమంలో ఉన్న లోపాలను చైనా ప్రభుత్వం, పార్టీ కూడా దాచుకోవటం లేదు. వాటిని అధిగమిస్తూ, అందుకు పాల్పడిన వారిని కఠినంగా అదుపు చేస్తూ జగన్నాధ రధం ముందుకు పోతున్నది. పరిశోధన-అభివృద్ధి రంగంలో 2022లో అమెరికా 660 బి.డాలర్లు ఖర్చు చేయగా జిడిపిలో అది 2.6శాతం. అదే చైనా 556 (3.1), జపాన్‌ 194 (3.4) భారత్‌ 159 (0.56), ఖర్చు చేస్తున్నట్లు వికీపీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా జిడిపిలో 5.9, 5 శాతాల చొప్పున అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకే పిండికొద్దీ రొట్టె అంటారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !

07 Wednesday Jun 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA

≈ Leave a comment

Tags

Anti communist, capitalism or socialism, Capitalism’s flaws, capitalist crisis, karal marx


ఎం కోటేశ్వరరావు


ఎవరు ఎన్ని చెప్పినా చివరికి కారల్‌ మార్క్స్‌ చెప్పిందే సరైనదా ? అంటూ జర్మన్‌ కార్పొరేట్‌ల పత్రిక డెర్‌ స్పీగల్‌ ఈ ఏడాది జనవరిలో ఒక విశ్లేషణను ప్రచురించింది. అంతకు ముందు గతేడాది సెప్టెంబరులో అమెరికా పరిశోధనా సంస్థ పూ సోషలిజం-పెట్టుబడిదారీ విధానాల గురించి అమెరికన్లలో ఉన్న వైఖరి గురించి సర్వే వివరాలను వెల్లడించింది.దీనిలోని కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం. అమెరికాలో పద్దెనిమిది-ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సు వారిలో సోషలిజాన్ని సమర్ధించే వారు 44శాతం మంది ఉండగా పెట్టుబడిదారీ విధానాన్ని అభిమానించిన వారు 40శాతం ఉన్నారు.2019 మే నెలలో కాపిటలిజం పట్ల సానుకూలంగా ఉన్న వారు 65శాతం కాగా 2022 ఆగస్టులో వారు 57శాతానికి తగ్గారు. ఇదే కాలంలో సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నవారు 42 నుంచి 36శాతానికి తగ్గినట్లు. ఆక్సియోస్‌ సర్వే ప్రకారం 2019 నుంచి 2021వరకు చూస్తే రిపబ్లికన్‌ పార్టీని సమర్ధించే 18-34 సంవత్సరాల యువతలో పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు 81 నుంచి 66శాతానికి తగ్గారు. మొత్తంగా సోషలిజాన్ని సమర్ధించే వారు 39 నుంచి 41శాతానికి పెరిగారు. ధనిక దేశాల్లో పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల పూర్వరంగంలో సోషలిజం, మార్క్స్‌ మీద ప్రేమ కంటే పెట్టుబడిదారీ విధాన సమర్ధకులను హెచ్చరిస్తూ చేసిన విశ్లేషణలు ఇవి అన్నది గమనించాలి. సర్వే సంస్థలు ఇచ్చే ప్రశ్నావళి, దానికి అడిగే సమాధానాల తీరు తెన్నులను బట్టి సమర్ధకులు, కాని వారి సంఖ్య మారుతున్నప్పటికీ రూపుదిద్దుకుంటున్న ప్రధాన ధోరణులు ఏమిటన్నదానిని చూడాలి. గతంలో సోషలిజాన్ని వ్యతిరేకించే అంశం గురించి చర్చలు జరిగితే ఇప్పుడు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి కమ్యూనిస్టుల కంటే పెట్టుబడిదారీ విధాన సమర్ధకులే ఎక్కువగా మాట్లాడుతున్నారు.


” పెట్టుబడిదారీ విధానం మీద విమర్శ కొత్తదేమీ కాదు. కరోనా మహమ్మారి నాలుగో సంవత్సరం, ఉక్రెయిన్‌ యుద్ధం రెండవ సంవత్సర ప్రారంభంలో గమనించాల్సినంతగా అది పెరుగుతున్నది. అనేక అంశాలు ఎక్కువ కాలం పని చేయవు. ప్రపంచీకరణ కుప్పకూలుతున్నది, దానితో పాటే జర్మన్‌ తరహా కలిమి కూడా ఉంది.ప్రపంచం శత్రుపూరిత కూటములలో పాదుకొనిపోతున్నది. ద్రవ్యోల్బణం పేదలు-ధనికులను మరింతగా వేరు చేస్తున్నది. దాదాపు అన్ని పర్యావరణ లక్ష్యాలు తప్పాయి. వ్యవస్థలో కనిపిస్తున్న కొత్త పగుళ్లన్నింటినీ రాజకీయవేత్తలు ఇంకేమాత్రమూ సరి చేయలేరు. ఒక పెద్ద సమస్య తరువాత మరొకటి వెనుకే వస్తున్నది, అవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇంథన సంక్షోభం, వాణిజ్యపోరు, ప్రపంచ యుద్ధం పోకడలు కనిపిస్తున్నాయి.జనాకర్షక(మభ్యపెట్టే) నేతలు, నిరంకుశ పాలకుల నుంచి ప్రజాస్వామ్యం దాడులను ఎదుర్కొంటున్నది.ఇటీవలి వరకు ఈ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం ఉంటుందని, మార్కెట్‌ తనను తాను రక్షించుకోగలదని అనుకున్నారు. కానీ ఈ రోజు దాన్ని ఎంత మంది నిజంగా నమ్ముతున్నారు ? ప్రత్యేకించి అన్ని ప్రతికూలతలు, వాతావరణ సంక్షోభం అనేక రెట్లు పెరుగుతున్నది.” ఇలాంటి వర్ణన సాధారణంగా సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలు చేస్తుంటాయి. కానీ ఇదంతా పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించే డెర్‌ స్పీగల్‌ విశ్లేషకుల అభిప్రాయాల సారమే.అంతేనా ?


” పెట్టుబడిదారీ విధానాన్ని తక్షణమే మౌలికంగా సంస్కరించాల్సి ఉంది. లేకుంటే అది నాశనమౌతుంది గనుక తగిన చర్యలు తీసుకోవాలి ” అని రే డాలియో అనే 2200 కోట్ల డాలర్ల హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌ చెప్పాడు.ఫైనాన్సియల్‌ టైమ్స్‌,గోల్డ్‌మన్‌ శాచ్స్‌, బోష్చ్‌ వంటి సంస్థలు ఎన్నో ఇలాంటి అభిప్రాయాలను వెల్లడించినట్లు ఆ పత్రిక విశ్లేషకులు ఉటంకించారు.” మహా పెట్టుబడిదారులుగా రుజువు చేసుకున్న వారు ప్రపంచస్థితి గురించి చెబుతూ ఆకస్మికంగా కారల్‌ మార్క్స్‌ అభిమానుల మాదిరి మాట్లాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వాలు, కార్పొరేట్‌ ప్రధాన కార్యాలయాలు,అగ్రశ్రేణి మేథావులు, వ్యవహార జ్ఞానులు ఎవరైనా అడుగుతున్న అతి పెద్ద, మౌలిక ప్రశ్న ఏమిటంటే ఈ ఆర్థిక వ్యవస్థతో మనం కొనసాగ గలమా అంటున్నారు.” అని డెర్‌ స్పీగల్‌ అన్నదంటే పెట్టుబడిదారులకు తమ వ్యవస్థ మీద తమకే విశ్వాసం సన్నగిల్లుతున్నదని చెప్పినట్లే . దీని అర్ధం వారు చేతులు ముడుచుకు కూర్చుంటారని కాదు, దాన్ని అధిగమించేందుకు, జనాన్ని తొక్కిపెట్టేందుకు కొత్త పద్దతులను వెతికే పనిలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం పెట్టుబడిదారీ విధానం సాధారణ సంక్షోభాన్ని కాదు ప్రపంచంలో 2023లో విధాన పరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు డెర్‌ స్పీగల్‌ విశ్లేషకులు చెబుతున్నారు.


వారి అసలు బాధ ఏమిటో కూడా దాచుకోలేకపోయారు. ” పారిశ్రామిక దేశాలలో సంవత్సరాల తరబడి ఒక స్పష్టమైన ఆగ్రహం వ్యాపిస్తున్నది. అది సైద్దాంతిక కారణాలతో కాదు, ఎందుకంటే ఇండ్ల అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఎందుకంటే ఆస్తులను కొనుగోలు చేయలేనివిగా మారాయి. వనరులనుంచి సంపదలను సృష్టించే యంత్రం అందరికీ సృష్టించనపుడు దాన్ని ఎందుకు ఆమోదించాలి ” అని ప్రశ్నిస్తున్నారని అంటూ అమెరికాలో సోషలిజం పట్ల యువతలో సానుకూల వైఖరి పెరగటాన్ని ఉటంకించారు. అసంతృప్తి, ఆగ్రహం, ఉద్యోగాలకు రాజీనామాలతో నిరసన కొట్టవచ్చినట్లుగా కనిపిస్తోందని, సోషలిస్టు సిద్దాంతాల పట్ల ఆకర్షితులౌతున్నట్లు పేర్కొన్నారు.గతంలో ఇదే పత్రిక జరిపిన సర్వేలో పెట్టుబడిదారీ విధానం వాతావరణ సంక్షోభానికి కారకురాలైనట్లు సగం మంది జర్మన్లు భావిస్తున్నట్లు వెల్లడైంది. ఎక్కడైనా సంక్షోభాలు తలెత్తినపుడే దాన్నుంచి బయటపడే మార్గాలను సమాజం వెతుకుతుంది. అసలీ కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ పుట్టకపోతే ఈ కమ్యూనిస్టు సిద్దాంతం, బీరకాయ ఉండేది కాదు అని కొందరు అనుకుంటారు. వారుగాక పోతే మరొకరు, మరొకరు దోపిడీని అంతం చేసే శాస్త్రీయ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చి ఉండేవారు. సోషలిజం గాక పోతే మరొక పేరు పెట్టి ఉండేవారు. దోపిడీ అంతం కావటం, సమసమాజం రావటం తప్ప పేరు ఏదైతేనేం. నిజానికి వారి కంటే ముందుగానే సోషలిజం గురించి చెప్పిన వారున్నారు. దాన్ని సాధించే మార్గం వారు చెప్పలేకపోయారు గనుక వారిని ఊహాజనిత సోషలిస్టులని పిలిచారు. మన దేశంలో కూడా సర్వేజనా సుఖినో భవంతు అని చెప్పిన వారు, వసుధైక కుటుంబం అన్నవారి గురించి తెలిసిందే.


అమెరికాలో పూ సంస్థ జరిపిన సర్వే ప్రకారం అక్కడి డెమోక్రాట్లలో అనేక మంది పౌరుల మౌలిక అవసరాలను సోషలిజం తీరుస్తుందని నమ్ముతున్నారు. వ్యక్తిగత స్వేచ్చను హరిస్తుందని రిపబ్లికన్లు చెబుతారు.2019లో సోషలిజం పట్ల డెమోక్రాట్లలో 65శాతం మంది సానుకూలంగా ఉన్నారని 2022లో 57శాతానికి తగ్గినట్లు సర్వే చెప్పింది. పెట్టుబడిదారీ విధానం గురించి సానుకూల వైఖరి ఉన్న డెమోక్రాట్లు ఇదే కాలంలో 55 నుంచి 46 శాతానికి తగ్గినట్లు కూడా పేర్కొన్నది. దీన్ని ఏ విధంగా చూడాలి ? ఏ సమాజంలోనైనా మధనం జరగాలి. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతున్నదని చెప్పవచ్చు. పెట్టుబడిదారీ విధానం పట్ల రిపబ్లికన్లలో సానుకూల వైఖరి 78 నుంచి 74శాతానికి తగ్గింది. ఇదీ మంచి పరిణామమే కదా ! పెట్టుబడిదారీ విధానం ఎక్కువ అవకాశాలను కల్పిస్తుందని నమ్ముతున్నవారు తగ్గుతున్నారు. తక్కువ కుటుంబ ఆదాయం ఉన్న వారు సోషలిజం పట్ల సానుకూలంగా ఉంటే ఎక్కువ వస్తున్నవారు పెట్టుబడిదారీ విధానమే ఉండాలని కోరుకుంటున్నారు. జనాలకు మౌలిక అవసరాలైన ఆహారం, ఆరోగ్యం, ఇంటి వసతులను సోషలిజం తీరుస్తుందని 38శాతం నమ్ముతుంటే 18శాతానికి పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు ఉన్నాయి. మూడు పదులు దాటిన వారిలో వయసుపైబడిన కొద్దీ సోషలిజం పట్ల సానుకూల వైఖరి ఉన్నవారు తగ్గినట్లు సర్వే వెల్లడించింది. దానిలో ఆశ్చర్యం ఏముంది ? తీవ్రమైన సోషలిస్టు వ్యతిరేక ప్రచారానికి లోనైన వారు.గతంలో అనుభవించిన సామాజిక రక్షణ పధకాలు నేటి తరాలకు అందుబాటులో ఉండటం లేదు. పాతవారితో పోల్చితే బతుకుదుర్భరంగా మారుతున్నది. అందువలన యువతలో కొత్త ఆలోచనలు. సోవియట్‌ ఉనికిలో ఉన్నపుడు సోషలిస్టు దేశాల గురించి చేసిన తప్పుడు ప్రచారంతో పోలిస్తే ఇప్పుడు అమెరికాలో అది తగ్గింది. ఎందుకంటే సోషలిజం మీద విజయం సాధించామని అక్కడి పాలకులు మూడు దశాబ్దాల క్రితం ప్రకటించారు. అదే నోటితో ఇప్పుడు పోరు సాగిస్తామని చెప్పలేరు కదా ! అందుకే కొత్త తరాలు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి ఆలోచించే క్రమంలో ప్రత్యామ్నాయంగా సోషలిజం తప్ప మరొకటి కనిపించటం లేదు గనుక దాని పట్ల క్రమంగా సానుకూలత పెరుగుతోంది.


సోషలిస్టు దేశాలంటే జనానికి ఇచ్చిన మేరకు తీసుకోవటం తప్ప అవసరమైన సరకులను అందించలేరంటూ ఖాళీగా ఉన్న దుకాణాలను చూపి కట్టుకథలను ప్రచారం చేశారు. మరోవైపు చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. కానీ అక్కడి నుంచి కావాల్సిన వస్తువులన్నింటినీ దిగుమతి చేసుకుంటారు. ఆ మేరకు తమ ప్రభుత్వం తమ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నదని అమెరికన్లు భావించటంతో పాటు చైనా అనేక దేశాలకు వస్తువులను ఎలా అందచేస్తున్నది. అక్కడ ఉపాధిని, ఆదాయాలను ఎలా పెంచుతున్నది అనే మధనం కూడ ప్రారంభమైంది.మనకు పెట్టుబడిదారీ విధానం వలన ఉపయోగం ఏమిటి ? అన్న సందేహాలు మొగ్గతొడిగాయి.. వరుసగా వచ్చిన ఆర్థిక మాంద్యాలకు పెట్టుబడిదారీ దేశాలు ప్రభావితమైనట్లుగా చైనాలో జరగకపోవటం కూడా అమెరికన్లలో సోషలిజం పట్ల మక్కువను పెంచింది. నూట ఆరు సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా బ్రిటన్‌లో నర్సులు సమ్మె చేశారు. ఫ్రాన్సు సమ్మెలు, ప్రదర్శనల ఆందోళనలతో ఉడికిపోతోంది. ప్రభుత్వం దిగిపోవాలని 74శాతం మంది కోరుకుంటున్నారు. ఐరోపాలో అనేక దేశాల్లో కార్మికవర్గం వీధుల్లోకి వస్తోంది. పెట్టుబడిదారీ విధానం మీద కరోనాకు ముందే అమెరికాలో దాడి మొదలైందని, తరువాత ఆర్ధిక, సామాజిక ఇబ్బందులు పెరగటంతో మరింత తీవ్రమైందని కొందరు గగ్గోలు పెడుతూ పత్రికల్లో రాశారు. పెట్టుబడిదారీ విధానం చితికింది అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక, ఇంకేమాత్రం పెట్టుబడిదారీ విధానం పనిచేయదు అంటూ సిఎన్‌ఎన్‌, పెట్టుబడిదారీ విధానాన్ని తిరిగి పెద్ద ఎత్తున తిరిగి ప్రారంభించాలి అని ప్రపంచ ఆర్థికవేదిక వంటివి చెప్పిన తరువాత జనాలకు ఆ వ్యవస్థమీద విశ్వాసం ఎలా పెరుగుతుంది. మరో ప్రపంచం అది సోషలిస్టు సమాజం సాధ్యమే అని చెప్పేందుకు పెట్టుబడిదారీ విధానమే అనేక అవకాశాలను ముందుకు తెచ్చింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !

31 Wednesday May 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

CEPR, China, Donald trump, Economic Sanctions, imperialism, Joe Biden, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


కొట్టవద్దు తిట్టవద్దు, పొమ్మనకుండా పొగబెట్టు ఎలా దారికి రారో చూద్దాం అన్నట్లుగా ఆర్థిక ఆంక్షలను ఆయుధాలుగా చేసుకొని అమెరికా, పశ్చిమ దేశాలు సామ్రాజ్యవాదులు, వాటి తొత్తులు అనేక దేశాల మీద దాడులు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆర్థిక మరియు విధాన పరిశోధనా కేంద్రం (సిఇపిఆర్‌) ” ఆర్థిక ఆంక్షల మానవీయ పర్యవసానాలు ” అనే శీర్షికతో ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.మానవహక్కులు, ప్రజాస్వామ్యం వంటి పెద్ద కబుర్లు చెప్పే పశ్చిమ దేశాల దుర్మార్గాన్ని అది ఎండగట్టింది. ఆంక్షలలో రెండు రకాలు, ఐరాస విధించేవి ఒక తరగతి. ఇవి స్వంత పౌరుల పట్ల లేదా ఇతర దేశాల మీద కాలుదువ్వే పాలకులను దారికి తెచ్చేందుకు సమిష్టిగా విధించేవి. ఐరాసతో నిమిత్తం లేకుండా కర్ర ఉన్నవాడితే గొర్రె అన్నట్లుగా తమకు లొంగని దేశాలు, సంస్థలు, వ్యక్తుల మీద ఏకపక్షంగా అమెరికా, దాని మిత్రదేశాలు విధించేవి రెండవ కోవకు చెందినవి. కేవలం కమ్యూనిస్టులుగా ఉన్నందుకు, ప్రపంచమంతటా కమ్యూనిజాన్ని అరికట్టే మొనగాడిగా ఉన్న తమకు కూతవేటు దూరంలోనే ఒక సోషలిస్టు దేశం ఉనికిలోకి రావటాన్ని సహించలేని అహంతో అమెరికాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అమానవీయ ఆంక్షలను క్యూబా మీద అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. 1992 నుంచీ ప్రతి ఏటా 2020లో కరోనా కారణంగా తప్ప వాటిని ఖండిస్తూ ఐరాస సాధారణ అసెంబ్లీలో తీర్మానం పెట్టటం దాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యతిరేకించటం, అమెరికా వత్తిడిని తట్టుకోలేక కొన్ని దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండటం తప్ప మిగిలిన దేశాలన్నీ ఖండించినా అమెరికా ఖాతరు చేయటం లేదు.


ఐరాస విధించేవి తప్ప భద్రతా మండలి అనుమతి లేని మిగిలిన ఆంక్షలన్నీ చట్టవిరుద్దమైనవే. దేశమంటే మట్టి కాదు, మనుషులు అని చెప్పిన మహాకవి గురజాడ ప్రకారం అనేక దేశాలను అనేకంటే అక్కడి పౌరుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఈ దుర్మార్గాలను నిరోధించే సత్తా ఐరాసకు లేదు. 1960 దశకం నాటికి ప్రపంచంలోని నాలుగుశాతం దేశాలు ఐరాస, అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షలకు గురికాగా ప్రస్తుతం 54 దేశాలు లేదా 27శాతానికి చేరాయి. వీటి జిడిపి నాలుగు నుంచి 29శాతానికి పెరిగింది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇటీవలి పరిణామాలను చూస్తే బరాక్‌ ఒబామా ఏలుబడిలో సంస్థలు లేదా వ్యక్తుల మీద ఏడాదికి 544 కొత్త ఆంక్షలు విధిస్తే అవి ట్రంప్‌ కాలంలో 975, వర్తమాన జో బైడెన్‌ ఇప్పటి వరకు సగటున 1,151గా ఉన్నాయి. దీర్ఘకాలంగా అమల్లో ఉన్నవాటిలో క్యూబా మీద 1960 దశకం నుంచి అమలు జరుగుతుంటే ఇరాన్‌ మీద 1979, ఆప్ఘనిస్తాన్‌ మీద 1999 నుంచి అమల్లో ఉన్నాయి. ఐరాస మానవహక్కుల మండలి 2014లో ఆమోదించిన తీర్మానంలో ఏకపక్ష ఆంక్షలు పౌరుల మీద చూపుతున్న ప్రతికూల ప్రభావాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ తరువాత తీవ్రత, సంఖ్య రీత్యా ఇంకా పెరిగాయి తప్ప తగ్గలేదు.


ఔషధాల దగ్గర నుంచి అన్నింటి మీద అమెరికా విధించిన ఆంక్షల వలన క్యూబా అపార నష్టానికి గురైంది. ఒక దశలో వ్యవసాయ పరికరాలైన ట్రాక్టర్ల వంటి వాటికి కూడా డీజిలు, పెట్రోలు దొరక్క గుర్రాలతో సాగు చేసుకోవాల్సి వచ్చింది. క్యూబా మీద ఆంక్షల వలన తమకు జరిగిన నష్టం గురించి అమెరికా సంస్థలు కూడా గగ్గోలు పెట్టాయి. ఎవడి గోల వాడిది. క్యూబా పాలసీ ఫౌండేషన్‌ అనే సంస్థ 2002లో వేసిన అంచనా ప్రకారం ఏటా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 360 కోట్ల డాలర్ల నష్టం జరిగింది. తరువాత అక్కడి కార్పొరేట్ల వత్తిడి మేరకు ఆంక్షలను సడలించటంతో 2000-2006 కాలంలో అమెరికా వార్షిక ఎగుమతులు 60లక్షల నుంచి 35 కోట్ల డాలర్లకు పెరిగాయి. అయినప్పటికీ తమకు ఏటా 120 కోట్ల డాలర్ల మేర నష్టం జరుగుతున్నట్లు 2009లో అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొన్నది. ప్రారంభం నుంచి తమకు 753 బి. డాలర్ల నష్టం జరిగిందని క్యూబా సర్కార్‌ చెప్పింది. అమెరికాకు ఏటా 484 కోట్ల డాలర్ల మేర, క్యూబాకు 68.5 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగినట్లు క్యూబా పాలసీ ఫౌండేషన్‌ అంచనా వేసింది.భిన్నమైన అంశాల ప్రాతిపదికన చెప్పే ఈ అంచనాలు ఒకదానికి ఒకటి పొసగవు. ఉదాహరణకు 2015లో అల్‌ జజీరా ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం ఆంక్షలు ప్రారంభమైన 55 సంవత్సరాలలో క్యూబాకు 1.1లక్షల కోట్ల నష్టం జరిగింది.


ఇరాన్‌ మీద విధించిన ఆంక్షల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన అత్యవసర ఔషధాల జాబితాలోని 32తో సహా 73 ఔషధాలకు అక్కడ కొరత ఏర్పడింది. ఆప్ఘ్‌నిస్తాన్‌లో తలసరి ఆదాయం దారుణంగా తగ్గింది.2021లో అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత అదే అమెరికా, ఐరోపా సమాఖ్య 960 కోట్ల డాలర్ల విలువగల ఆప్ఘన్‌ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఆ దేశ జిడిపిలో సగం. ఆంక్షల కారణంగా విదేశాల నుంచి ఏటా వచ్చే 80 కోట్ల డాలర్ల మేర నిలిచిపోయాయి. వెనెజులా మీద 2017లో విధించిన ఆంక్షల కారణంగా 2020నాటికి దేశ దిగుమతులు 91శాతం తగ్గాయి. దాదాపు పూర్తిగా దిగుమతుల మీదనే ఆహారం సమకూర్చుంటున్న వెనెజులా దిగుమతులు 78శాతం పడిపోయాయి. చమురు ఎగుమతులపై ఆంక్షల కారణంగా జీవన ప్రమాణాలు తగ్గి శిశు, సాధారణ మరణాల రేటు పెరిగింది. తమ ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడిన జనం ఇరాన్‌, వెనెజులా పాలకులపై తిరుగుబాటు చేసే విధంగా పురికొల్పటమే లక్ష్యమని అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి మైక్‌ పాంపియో గతంలో చెప్పాడు. ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యం, మానవహక్కుల పేరుతో ఇలాంటి దుర్మార్గమైన ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. ఆంక్షలు ప్రకటించిన ఏ దేశంలోనైనా జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప వీటిని సాధించలేదు. అవి సమర్ధించే అనేక దేశాల్లో వాటి జాడే కనపడదు. సోషలిస్టు బాట నుంచి వైదొలిగేట్లుగా లేదా తనకు అనుకూలంగా మార్చుకొనేట్లు క్యూబా మీద అమలు జరుపుతున్న ఆంక్షల ప్రభావం ఏమాత్రం లేదని విలియం లియోగ్రాండే అనే విశ్లేషకుడు చెప్పాడు. ప్రాణాలైనా ఇస్తాంగానీ అమెరికాకు లొంగేది లేదన్న కమ్యూనిస్టుల ప్రత్యేకత ఇది.


అన్ని దేశాల మీద ప్రకటిస్తున్న ఆంక్షల లక్ష్యం కూడా లొంగదీసుకోవటమే. అణుపరీక్షలు జరుపుతున్నదనే కారణంతో ఇరాన్‌ మీద భద్రతా మండలి విధించిన ఆంక్షలు కొన్ని కాగా దానితో నిమిత్తం లేకుండా అమెరికా, ఇతర దేశాలు విధించినవి మరికొన్ని.అణు కార్యమం నిలిపివేతకు అంగీకరించిన ఇరాన్‌తో దానికి ప్రతిగా స్పందించాల్సిన అమెరికా ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలిగింది. తమ భద్రతకు ముప్పుతెచ్చే ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవద్దన్న రష్యా వినతిని ఖాతరు చేయకుండా ముందుకు పోతుండటంతో తప్పనిసరై సైనిక చర్యకు దిగిన పుతిన్‌పై ఆంక్షలు విధించి దేశ ఆర్థిక రంగాన్ని దెబ్బతీసి జనాన్ని వీధుల్లోకి తెచ్చి పుతిన్‌ సర్కార్‌ను గద్దెదింపాలని అమెరికా చూసింది.వాణిజ్య పోరు పేరుతో చైనాను తన దారికి తెచ్చేందుకు అంతకు ముందే పూనుకుంది.వివిధ సందర్భాలలో మనతో సహా అనేక దేశాలను బెదిరించటం చూస్తున్నదే.


ఉక్రెయిన్‌ మీద మిలిటరీ దాడులు జరుపుతున్నదనే కారణంతో రష్యాకు చెందిన సంస్థలు, వ్యక్తుల మీద ఆంక్షలు విధించారు.రష్యా ఐటి,ఇంజనీరింగ్‌ వంటి రంగాలకు అవసరమైన వస్తువులు, సేవల ఎగుమతుల మీద బ్రిటన్‌ నిషేధం విధించింది, 70శాతం సెమీ కండక్టర్ల ఎగుమతులు నిలిచాయి. అమెరికా, ఇతర నాటో దేశాల చమురు, గాస్‌ ఎగుమతుల నిషేధం, చమురు ధరలపై ఆంక్షల గురించి తెలిసిందే. దేశాల వారీ చూస్తే అమెరికా 374, కెనడా 156, బ్రిటన్‌ 95, ఐరోపా సమాఖ్య 44, స్విడ్జర్లాండ్‌ 42,ఆస్ట్రేలియా 28 చొప్పున కొత్త ఆంక్షలు విధించాయి.ఇరాన్‌ మీద కొత్తగా 115 ఆంక్షలు ఈ దేశాలు విధించాయి.హిరోషిమాలో ఇటీవల జరిగిన జి7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి ముందు పలు ఆంక్షలకు తెరతీశారు. వాటి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే అమలు జరుపుతున్న ఆంక్షల వలన రష్యా ప్రభావితం అవుతున్నది. చమురును ఆరవై డాలర్లకు మించి కొనకూడదన్న ఆంక్ష వలన గానీ రాయితీ ధరలకు వివిధ దేశాలకు అమ్ముతున్నకారణం కావచ్చు ప్రస్తుత రష్యా చమురు సగటు ధర 58.62 డాలర్లు ఉంది. ఆర్మీనియా నుంచి అది దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ 3,700 శాతం పెరిగాయి.వివిధ దేశాల మీద 2023 ఫిబ్రవరి 22 నాటికి విధించిన ఆంక్షల సంఖ్య గురించి స్టాటిస్టా సమాచారం ఇలా ఉంది.
దేశం ×× మొత్తం ××2022, ఫిబ్రవరి×× 2022 ఫిబ్రవరి తరువాత
రష్యా ×× 14,081 ××× 2,754 ××× 11,327
ఇరాన్‌ ×× 4,191 ××× 3,616 ××× 575
సిరియా ×× 2,644 ××× 2,598 ××× 46
ఉ.కొరియా ×× 2,133 ××× 2,052 ××× 81
బెలారస్‌ ×× 1,154 ××× 788 ××× 366
వెనెజులా ×× 651 ××× ××××× ××× ×××


చైనా మార్కెట్‌లో మరింతగా తన వస్తువులను అమ్ముకొనేందుకు, దిగుమతులను అడ్గుకొనేందుకు, చైనాకు అధునాత సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసేందుకు అమెరికా ఆంక్షలను అమలు జరుపుతోంది. 2008లో రెండు కొత్త ఆంక్షలను విధించగా తరువాత 2018నాటికి వాటిని 59కి పెంచింది. తరువాత నాలుగు సంవత్సరాలలో 29,300,89,36 కొత్తగా విధించింది.వీటిలో ఇటీవలి కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల ఎగుమతుల మీద విధించిన ఆంక్షలు తీవ్రమైనవి. తద్వారా చైనా ఆర్థిక రంగాన్ని కుదేలు కావించాలని చూస్తున్నది.2023తొలి మూడు మాసాలలో విధించిన ఆంక్షలను పరిగణలోకి తీసుకుంటే పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల సంఖ్య 36,500 దాటింది.తాము విధించిన వాటితో పాటు ప్రతిగా తమ మీద విధించిన ఆంక్షలతో పశ్చిమ దేశాలు కూడా కొంత మేరకు ప్రభావితం అవుతాయి. వాటి తీవ్రత పెరిగి తమ లాభాలు, అసలుకే ముప్పు వచ్చేంత వరకు కార్పొరేట్‌ సంస్థలు రంగంలోకి రావు. డాలరు పెత్తనం తగ్గుతుందని అనేక మంది చెబుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే అది అంత తేలిక కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ దేశాల రిజర్వుబాంకుల్లో డాలరు నిల్వలు 2021 డిసెంబరులో 7,085.92 బిలియన్‌ డాలర్లుంటే 2022 ఆగస్టులో 6,652.32 బి.డాలర్లకు మాత్రమే తగ్గాయి. ఇదే కాలంలో మొత్తం రిజర్వుబాంకుల ఆస్తుల్లో చైనా యువాన్‌ నిల్వలు నామమాత్రం నుంచి 6.2శాతానికి పెరిగాయి. అందువల్లనే అమెరికా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది, ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నది. సామ్రాజ్యవాదులు, దానితో చేతులు కలుపుతున్న శక్తుల తీరు తెన్నులను చూస్తే తమకు లొంగని దేశాల మీద ఆంక్షలను రోజు రోజుకు పెంచటాన్ని గమనించాము. రానున్న రోజుల్లో ఇదే ధోరణి కొనసాగితే ఆయుధ యుద్ధాలకు బదులు ఆంక్షల దాడులతో జనాలకు ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఐరాస వీటిని నిరోధించలేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన యుద్ధాలనే కాదు ఆంక్షలనూ వద్దంటూ జనం వీధుల్లోకి రావాల్సిన అవసరం ఉంది.


.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !

27 Saturday May 2023

Posted by raomk in Asia, BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, TDP, USA

≈ Leave a comment

Tags

#Anti China, Anti-China 'Remove China Apps', BJP, CHANDRABABU, Narendra Modi, Narendra Modi Failures, Reliance Group, RSS, Shein, SJM


ఎం కోటేశ్వరరావు


షీ ఇన్‌ అనే ఒక చైనా కంపెనీతో మన దేశ బడాసంస్థ రిలయన్స్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్రం ఆమోద ముద్రవేసినట్లు వార్త. దీని గురించి మీడియా చాలా పరిమితంగా మాత్రమే వార్తలు ఇచ్చింది. పెద్ద హడావుడి లేదు. ఎందుకంటే చైనా వ్యతిరేకతను వెల్లడించటమే అసలు సిసలు దేశ భక్తి అన్నట్లు అవకాశం దొరికినపుడల్లా ప్రదర్శిస్తున్న వారికి ఇది తేలుకుట్టిన దొంగ పరిస్థితే మరి. అమెజాన్‌ మన మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించకుండా తనకు మద్దతు ఇస్తున్న అంబానీ కంపెనీ కోసం నరేంద్రమోడీ సర్కార్‌ శాయశక్తులా చూస్తోంది.గతంలో అమెజాన్‌ అధిపతి బెజోఫ్‌ ఢిల్లీ వచ్చినపుడు కలిసేందుకు అంగీకరించకుండా పడిగాపులు పడేట్లు చేసి నరేంద్రమోడీ నాడు అంబానీకి సంతోషం కలిగించారు.ఇంతకీ షీ ఇన్‌ కంపెనీ, దాని యాప్‌ మీద ఇప్పుడు అంబానీలకు ఎందుకు కన్ను పడిందంటే మూడేండ్ల క్రితం దాన్ని నిషేధించినా అమెజాన్‌ కంపెనీ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ లాభపడుతున్నది. ఆ లబ్దిని తామే నేరుగా ఎందుకు పొందకూడదన్నది ముకేష్‌ అంబానీ కుటుంబ ఆలోచన. డబ్బు ఎవరికి చేదు. వారు తలచుకుంటే దేశభక్తి స్వభావం, రూపమే మారిపోతుంది. జనానికి జ్ఞాపకశక్తి తక్కువ, అసలు ఉండదు అన్నది కొందరి ప్రగాఢ విశ్వాసం. నరేంద్రమోడీ లేదా మోడీని తీర్చిదిద్దిన సంఘపరివార్‌ కూడా అంబానీల ముందు మోకరిల్లాల్సిందే. వారి దేశ భక్తి అలాంటిది. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీకి తోడుగా నిలిచిన బిర్లా కుటుంబం గురించి తెలిసిందే. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చుకోవచ్చన్నది బిర్లా కుటుంబ ఆలోచన. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అదే జరిగింది. ఇప్పుడూ జరుగుతున్నది అదే, కాకుంటే లబ్దిదారు అంబానీ. నరేంద్రమోడీతో 2014లో అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పేవారి గురించి తెలిసిందే.


రష్యా ముడిచమురుతో తయారైన ఉత్పత్తులను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోరాదని ఐరోపా సమాఖ్య తొలిసారిగా తన దేశాలను కోరింది.భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులు రష్యా ముడిచమురుతో చేసినవేనని, వాటిని దిగుమతి చేసుకుంటే రష్యా మీద విధించిన ఆంక్షలను ఉల్లంఘించటమే అని సమాఖ్య విదేశాంగ విధాన ఉన్నత ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ వర్ణించారు. పీపా ముడిచమురును 60 డాలర్లకు మించి కొనుగోలు చేసేవారి మీద ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా, ఐరోపా దేశాలు బెదరించిన సంగతి తెలిసిందే. బోరెల్‌ విమర్శలను మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ తోసిపుచ్చారు. తాము ఎగుమతి చేస్తున్నవాటిని భారత ఉత్పత్తులుగానే చూడాలి అన్నారు. మన దేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కంటే రష్యా నుంచి వస్తున్నదానికి పది డాలర్లు తక్కువ చెల్లిస్తున్నాము. ఈ దిగుమతుల్లో 80శాతం పైగా రిలయన్స్‌ మరో ప్రైవేటు కంపెనీలు దిగుమతి చేసుకొని డీజిలు, పెట్రోలు, ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నాయి. దీని వలన మన జనానికి ఎలాంటి లాభమూ లేదు. ఇది మోడీ అసలైన స్వాతంత్య్ర ఫలం.


ఇక తాజాగా అంబానీకి అందిస్తున్న లబ్ది గురించి చూద్దాం. చైనాకు చెందిన షీ ఇన్‌ కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. ఫాషన్‌ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్‌సైట్‌,యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది. గత ఏడాది నాటికి మూడువేల సరఫరాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. షీ ఇన్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదు గనుక రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. ఒక పత్రికలో ” షి ఇన్‌ తిరిగి భారత్‌కు వస్తున్నది, గతంలో దాన్ని ఎందుకు నిషేధించారు ” అంటూ రాసిన వార్తలో అదే రాశారు. ఈ కంపెనీ ఇంకేమాత్రం చైనాకు చెందినదిగా భారత్‌ భావించకపోవచ్చని పేర్కొన్నారు. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు.
గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు.ఐటి చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్రకారం చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత నిషేధిత జాబితాను 270కి పెంచారు. ఇప్పటికీ అదే అమల్లో ఉంది. షీ ఇన్‌ కంపెనీ దెబ్బకు అనేక దేశాల్లోని సంస్థలకు దిమ్మతిరిగింది. దాంతో దాన్ని అడ్డుకొనేందుకు అనేక సాకులను ముందుకు తెచ్చి అడ్డుకొనేందుకు చూశారు. వివిధ దేశాల సమాచారాన్ని అపహరిస్తున్నదని, మూడో పక్షానికి దాన్ని విక్రయిస్తున్నదన్నది వాటిలో ఒకటి. సమగ్ర సమాచారం ఇవ్వలేదనే పేరుతో అమెరికాలో 19లక్షల డాలర్ల జరిమానా విధించారు. మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందని, వేరే బ్రాండ్లను పోలిన బ్రాండ్లను ముందుకు తెచ్చిందని, ట్రేడ్‌మార్క్‌ హక్కులను ఉల్లంఘించిందని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టిందని, బలవంతంగా కార్మికులతో పని చేయించి కార్మికుల హక్కులను ఉల్లంఘించిందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలతో బలవంతగా పనులు చేయించిందని, ఇలా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ కంపెనీకి కూడా ఆపాదించి అడ్డుకోవాలని చూశారు.


ఇక రిలయన్స్‌తో ఒప్పందానికి వస్తే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రిలయన్స్‌ రిటెయిల్స్‌ సేకరణ సామర్ధ్యాలు, గోదాములు, రవాణా సదుపాయాలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దుకాణాలు షీ ఇన్‌కు అందుబాటులోకి వస్తాయి. ఇతర వివరాలేమీ చెప్పం గానీ రిలయన్స్‌తో మా భాగస్వామ్యం పక్కా అని షీ ఇన్‌ ప్రతినిధి చెప్పినట్లు, రిలయన్స్‌ స్పందించలేదని, ఈ లావాదేవీ గురించి తొలుత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించిందని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ తాజాగా తన విశ్లేషణలో పేర్కొన్నది. గత ఏడాది మన దేశంలో జరిగిన ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల లావాదేవీల విలువ పది బిలియ డాలర్లు ఉండవచ్చని అంచనా.చైనాతో తలెత్తిన విబేధాల కారణంగా అమెరికా, ఐరోపాలో షీఇన్‌ మార్కెట్‌ తగ్గుతున్నందున ఇతర చోట్లకు విస్తరించాలని అది చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మైంత్రా ప్రధాన విక్రేతగా ఉంది. షీ ఇన్‌కు అనుమతిస్తే దాని మార్కెట్‌ను సవాలు చేస్తుందని చెబుతున్నారు.


ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నదాని ప్రకారం లైసన్సు ఒప్పందాన్ని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారత్‌లో ద్వారా వచ్చే లాభాల్లో కొంతశాతం షి ఇన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.చైనాలో ఉన్న తన ఎనిమిదివేల మంది సరఫరదారుల నుంచి సేకరించే దుస్తులతో పాటు భారత్‌లో రిలయన్స్‌ సేకరించే వాటిని కూడా ప్రపంచమంతటా విక్రయిస్తుంది. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య వంటి వారు సి ప్లస్‌ 1 అంటే చైనా ప్లస్‌ ఒకటి అనే అవగాహన ప్రకారం మన దేశంలోని ఐదు పెద్ద రిలయన్స్‌, టాటా, బిర్లా,అదానీ, భారతీ గ్రూపు కంపెనీలు లబ్ది పొందవచ్చని చెబుతున్నారు.చైనాలో పెట్టుబడులతో పాటు మరొక దేశంలో పెట్టుబడులు పెట్టటమే దీని అర్ధం. మన దేశంలోని బడా కంపెనీలు చిన్న చిన్నవాటిని మింగివేస్తున్నాయి. ప్రభుత్వం వాటికి రక్షణలు కల్పిస్తున్నది. ఉదాహరణకు అమెజాన్‌ నుంచి రిలయన్స్‌కు రక్షణగా నిలుస్తున్న మాదిరి అని చెప్పవచ్చు. చైనాలో 2010 తరువాత వేతనాలు, అక్కడి కార్పొరేట్‌ కంపెనీలపై పన్నులు గణనీయంగా పెరిగాయి. ఈ పూర్వరంగంలో 2013లోనే అంటే నరేంద్రమోడీ అధికారానికి రాకముందే సి ప్లస్‌ 1 అనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అది ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది మరింత విస్తరిస్తే పెట్టుబడులు భారత్‌కు రావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇతర దేశాలకు తరలుతున్నాయి. ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు ఆ చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్‌ ముందుకు వచ్చింది. అమెజాన్‌తో పోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢకొీట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం. అందుకే అంబానీ వత్తిడికి లంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్రమోడీ అనుమతించారన్నది స్పష్టం.రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని చౌక దుకాణాలు విలేజ్‌ మాల్స్‌గా మారుస్తామని, ఆ కంపెనీల ఉత్పత్తులను విక్రయిస్తామని 2017లో సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం 29వేల చౌకదుకాణాల్లో తొలిదశలో 6,500లను మాల్స్‌గా మార్చాలని, వాటికి అన్న (ఎన్‌టిఆర్‌) విలేజ్‌ మాల్స్‌ అనే పేరు పెట్టాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌ను ఎందుకు కలిపారంటే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది ఆచరణలోకి రాలేదు.


ఒకటి మాత్రం నిజం, అంగీకరించకతప్పదు. ఒకసారి చెప్పిందాన్ని మరోసారి ప్రస్తావించకపోవటం, ఎప్పటికప్పుడు కొత్త అంశాలతో జనాన్ని ఎలా రెచ్చగొట్టాలో, మనోభావాలను ముందుకు తెచ్చి వారితో ఎలా ఆడుకోవాలో, ఓట్లు ఎలా దండుకోవాలో, అంబానీ, అదానీల వంటి కార్పొరేట్లను ఎలా వాడుకోవాలో నరేంద్రమోడీకి తెలిసినంతగా మరొకరికి తెలియదు. గాల్వన్‌ లోయలో మన సైనికుల మీద చైనా మిలిటరీ దాడి చేసి చంపినదానికి ప్రతీకారం అంటూ నాడు చైనా యాప్‌ల మీద, చైనా పెట్టుబడుల మీద నిషేధం విధించారు. ఆ విధంగా జనాల మనోభావాలను సంతుష్టీకరించి వారి దృష్టిలో చైనాను దెబ్బతీసిన మొనగాడిగా కనిపించిన సంగతి తెలిసిందే.యాప్‌ల మీద ఆంక్షలతో ఒక దేశాన్ని దెబ్బతీస్తున్నామంటే మన జనమంతా నిజమే కామోసు అనుకున్నారు. ఇంకే ముంది చైనా కథ ముగిసినట్లే అని సంతోషించారు. మోడీ మీద ఉన్న భ్రమ అలాంటిది. గాల్వన్‌ ఘర్షణ తరువాత చైనా వస్తువులను నిషేధించాలని కాషాయ దళాలు వీధుల్లో వీరంగం వేసిన దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. స్వదేశీ జాగరణ మంచ్‌ నిదురలేచింది. తరువాత అదే చైనా నుంచి మన దిగుమతుల అంశంలో మోడీ తన రికార్డులను తానే బద్దలు చేస్తున్నారు.వందల కోట్ల డాలర్లను ప్రతి ఏటా సమర్పించుకుంటున్నారు. మన ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 2022-23లో మన చైనా దిగుమతులు 4.16శాతం పెరిగి 98.51 బి.డాలర్లకు చైనాకు మన ఎగుమతులు 28శాతం తగ్గి 15.32 బి.డాలర్లుగా ఉన్నాయి. మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 72.91 నుంచి 83.2 బి.డాలర్లకు పెరిగింది. అదే మొనగాడు ఇప్పుడు అంబానీ కంపెనీ కోసం వాటిలో షీ ఇన్‌ అనే ఒక యాప్‌కు గుట్టుచప్పుడు కాకుండా అనుమతించేందుకు ఇచ్చేశారు. అటు జనం ఓట్లు ఇటు కార్పొరేట్ల నోట్లు కావాలి కదా ! నరేంద్రమోడీ ఒక చైనా కంపెనీ, యాప్‌ను తిరిగి అనుమతించటం ద్వారా ద్వారం తెరిచారు. వచ్చే రోజుల్లో ఏదో ఒకసాకుతో మిగిలిన వాటికి కూడా తెరుస్తారా ? మన దేశానికి చెందిన ఏదో ఒక బడా కంపెనీకి లబ్ది కలిగితే ఎలాంటి సందేహం లేకుండా అనుమతిస్తారని వేరే చెప్పనవసరం లేదు.


అమెజాన్‌ మన మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించకుండా తనకు మద్దతు ఇస్తున్న అంబానీ కంపెనీ కోసం నరేంద్రమోడీ సర్కార్‌ శాయశక్తులా చూస్తోంది.గతంలో అమెజాన్‌ అధిపతి బెజోఫ్‌ ఢిల్లీ వచ్చినపుడు కలిసేందుకు అంగీకరించకుండా పడిగాపులు పడేట్లు చేసి నరేంద్రమోడీ నాడు అంబానీకి సంతోషం కలిగించారు.ఇంతకీ షీ ఇన్‌ కంపెనీ, దాని యాప్‌ మీద ఇప్పుడు అంబానీలకు ఎందుకు కన్ను పడిందంటే దాన్ని నిషేధించినా అమెజాన్‌ కంపెనీ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ లాభపడుతున్నది. ఆ లబ్దిని తామే నేరుగా ఎందుకు పొందకూడదన్నది ముకేష్‌ అంబానీ కుటుంబ ఆలోచన. డబ్బు ఎవరికి చేదు. వారు తలచుకుంటే దేశభక్తి స్వభావం, రూపమే మారిపోతుంది.నరేంద్రమోడీ లేదా మోడీని తీర్చిదిద్దిన సంఘపరివార్‌ కూడా అంబానీల ముందు మోకరిల్లాల్సిందే. వారి దేశ భక్తి అలాంటిది. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీకి తోడుగా నిలిచిన బిర్లా కుటుంబం గురించి తెలిసిందే. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చుకోవచ్చన్నది బిర్లా కుటుంబ ఆలోచన. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అదే జరిగింది. ఇప్పుడూ జరుగుతున్నది అదే, కాకుంటే లబ్దిదారు అంబానీ. నరేంద్రమోడీతో 2014లో అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పేవారి గురించి తెలిసిందే.


రష్యా ముడిచమురుతో తయారైన ఉత్పత్తులను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోరాదని ఐరోపా సమాఖ్య తొలిసారిగా తన దేశాలను కోరింది.భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులు రష్యా ముడిచమురుతో చేసినవేనని, వాటిని దిగుమతి చేసుకుంటే రష్యా మీద విధించిన ఆంక్షలను ఉల్లంఘించటమే అని సమాఖ్య విదేశాంగ విధాన ఉన్నత ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ వర్ణించారు. పీపా ముడిచమురును 60 డాలర్లకు మించి కొనుగోలు చేసేవారి మీద ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా, ఐరోపా దేశాలు బెదరించిన సంగతి తెలిసిందే. బోరెల్‌ విమర్శలను మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ తోసిపుచ్చారు. తాము ఎగుమతి చేస్తున్నవాటిని భారత ఉత్పత్తులుగానే చూడాలి అన్నారు. మన దేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కంటే రష్యా నుంచి వస్తున్నదానికి పది డాలర్లు తక్కువ చెల్లిస్తున్నాము. ఈ దిగుమతుల్లో 80శాతం పైగా రిలయన్స్‌ మరో ప్రైవేటు కంపెనీలు దిగుమతి చేసుకొని డీజిలు, పెట్రోలు, ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నాయి. దీని వలన మన జనానికి ఎలాంటి లాభమూ లేదు. ఇది మోడీ అసలైన స్వాతంత్య్ర ఫలం.


ఇక తాజాగా అంబానీకి అందిస్తున్న లబ్ది గురించి చూద్దాం. చైనాకు చెందిన షీ ఇన్‌ కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. ఫాషన్‌ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్‌సైట్‌,యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది. గత ఏడాది నాటికి మూడువేల సరఫరాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. షీ ఇన్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదు గనుక రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. ఒక పత్రికలో ” షి ఇన్‌ తిరిగి భారత్‌కు వస్తున్నది, గతంలో దాన్ని ఎందుకు నిషేధించారు ” అంటూ రాసిన వార్తలో అదే రాశారు. ఈ కంపెనీ ఇంకేమాత్రం చైనాకు చెందినదిగా భారత్‌ భావించకపోవచ్చని పేర్కొన్నారు. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు.
గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు.ఐటి చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్రకారం చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత నిషేధిత జాబితాను 270కి పెంచారు. ఇప్పటికీ అదే అమల్లో ఉంది. షీ ఇన్‌ కంపెనీ దెబ్బకు అనేక దేశాల్లోని సంస్థలకు దిమ్మతిరిగింది. దాంతో దాన్ని అడ్డుకొనేందుకు అనేక సాకులను ముందుకు తెచ్చి అడ్డుకొనేందుకు చూశారు. వివిధ దేశాల సమాచారాన్ని అపహరిస్తున్నదని, మూడో పక్షానికి దాన్ని విక్రయిస్తున్నదన్నది వాటిలో ఒకటి. సమగ్ర సమాచారం ఇవ్వలేదనే పేరుతో అమెరికాలో 19లక్షల డాలర్ల జరిమానా విధించారు. మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందని, వేరే బ్రాండ్లను పోలిన బ్రాండ్లను ముందుకు తెచ్చిందని, ట్రేడ్‌మార్క్‌ హక్కులను ఉల్లంఘించిందని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టిందని, బలవంతంగా కార్మికులతో పని చేయించి కార్మికుల హక్కులను ఉల్లంఘించిందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలతో బలవంతగా పనులు చేయించిందని, ఇలా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ కంపెనీకి కూడా ఆపాదించి అడ్డుకోవాలని చూశారు.


ఇక రిలయన్స్‌తో ఒప్పందానికి వస్తే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రిలయన్స్‌ రిటెయిల్స్‌ సేకరణ సామర్ధ్యాలు, గోదాములు, రవాణా సదుపాయాలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దుకాణాలు షీ ఇన్‌కు అందుబాటులోకి వస్తాయి. ఇతర వివరాలేమీ చెప్పం గానీ రిలయన్స్‌తో మా భాగస్వామ్యం పక్కా అని షీ ఇన్‌ ప్రతినిధి చెప్పినట్లు, రిలయన్స్‌ స్పందించలేదని, ఈ లావాదేవీ గురించి తొలుత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించిందని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ తాజాగా తన విశ్లేషణలో పేర్కొన్నది. గత ఏడాది మన దేశంలో జరిగిన ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల లావాదేవీల విలువ పది బిలియ డాలర్లు ఉండవచ్చని అంచనా.చైనాతో తలెత్తిన విబేధాల కారణంగా అమెరికా, ఐరోపాలో షీఇన్‌ మార్కెట్‌ తగ్గుతున్నందున ఇతర చోట్లకు విస్తరించాలని అది చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మైంత్రా ప్రధాన విక్రేతగా ఉంది. షీ ఇన్‌కు అనుమతిస్తే దాని మార్కెట్‌ను సవాలు చేస్తుందని చెబుతున్నారు.


ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నదాని ప్రకారం లైసన్సు ఒప్పందాన్ని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారత్‌లో ద్వారా వచ్చే లాభాల్లో కొంతశాతం షి ఇన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.చైనాలో ఉన్న తన ఎనిమిదివేల మంది సరఫరదారుల నుంచి సేకరించే దుస్తులతో పాటు భారత్‌లో రిలయన్స్‌ సేకరించే వాటిని కూడా ప్రపంచమంతటా విక్రయిస్తుంది. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య వంటి వారు సి ప్లస్‌ 1 అంటే చైనా ప్లస్‌ ఒకటి అనే అవగాహన ప్రకారం మన దేశంలోని ఐదు పెద్ద రిలయన్స్‌, టాటా, బిర్లా,అదానీ, భారతీ గ్రూపు కంపెనీలు లబ్ది పొందవచ్చని చెబుతున్నారు.చైనాలో పెట్టుబడులతో పాటు మరొక దేశంలో పెట్టుబడులు పెట్టటమే దీని అర్ధం. మన దేశంలోని బడా కంపెనీలు చిన్న చిన్నవాటిని మింగివేస్తున్నాయి. ప్రభుత్వం వాటికి రక్షణలు కల్పిస్తున్నది. ఉదాహరణకు అమెజాన్‌ నుంచి రిలయన్స్‌కు రక్షణగా నిలుస్తున్న మాదిరి అని చెప్పవచ్చు. చైనాలో 2010 తరువాత వేతనాలు, అక్కడి కార్పొరేట్‌ కంపెనీలపై పన్నులు గణనీయంగా పెరిగాయి. ఈ పూర్వరంగంలో 2013లోనే అంటే నరేంద్రమోడీ అధికారానికి రాకముందే సి ప్లస్‌ 1 అనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అది ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది మరింత విస్తరిస్తే పెట్టుబడులు భారత్‌కు రావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇతర దేశాలకు తరలుతున్నాయి. ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు ఆ చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్‌ ముందుకు వచ్చింది. అమెజాన్‌తో పోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢకొీట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం. అందుకే అంబానీ వత్తిడికి లంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్రమోడీ అనుమతించారన్నది స్పష్టం.రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని చౌక దుకాణాలు విలేజ్‌ మాల్స్‌గా మారుస్తామని, ఆ కంపెనీల ఉత్పత్తులను విక్రయిస్తామని 2017లో సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం 29వేల చౌకదుకాణాల్లో తొలిదశలో 6,500లను మాల్స్‌గా మార్చాలని, వాటికి అన్న (ఎన్‌టిఆర్‌) విలేజ్‌ మాల్స్‌ అనే పేరు పెట్టాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌ను ఎందుకు కలిపారంటే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు నరేంద్రమోడీ ఒక చైనా కంపెనీ, యాప్‌ను తిరిగి అనుమతించటం ద్వారా ద్వారం తెరిచారు. వచ్చే రోజుల్లో ఏదో ఒకసాకుతో మిగిలిన వాటికి కూడా తెరుస్తారా ? మన దేశానికి చెందిన ఏదో ఒక బడా కంపెనీకి లబ్ది కలిగితే ఎలాంటి సందేహం లేకుండా అనుమతిస్తారని వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?

25 Thursday May 2023

Posted by raomk in BJP, COUNTRIES, Current Affairs, Europe, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anthony Albanese, BJP, G7 summit, Modi Vest, Narendra Modi, Narendra Modi Failures, Nehru Jacket, PM Modi Is 'The Boss', US President Biden


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల ఆరు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ బుధవారం నాడు ట్వీట్‌ చేశారు. భాగస్వామ్య దేశాలతో బంధం మరింతగా బలపడినట్లు పేర్కొన్నారు. గురువారం నాడు ఢిల్లీ చేరుకున్న ప్రధాని స్వాగతం పలికిన బిజెపి మద్దతుదార్లతో మాట్లాడుతూ పర్యటనలో ప్రతి క్షణం దేశ బాగుకోసమే వెచ్చించినట్లు చెప్పారు. అఫ్‌ కోర్స్‌ ఒక పర్యటన ఫలితాలు, పర్యవసానాలు వెంటనే వెల్లడికావు అన్నది తెలిసిందే. తొలిసారిగా ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత వరుసబెట్టి విదేశీ ప్రయాణాలు చేశారు.ఎక్కువ కాలం విమానాల్లోనే గడిపినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకు ఇలా తిరుగుతున్నారు అంటే విదేశాల్లో దేశ ప్రతిష్టను పెంచేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అని మోడీ మద్దతుదారులు, బిజెపి పెద్దలు చెప్పారు. తొమ్మిది సంవత్సరాలు గడిచినా దాని ఫలితాలు పెద్దగా కనిపించలేదు. విదేశాల్లో దేశ ప్రతిష్టను కొలిచేందుకు కొలబద్దలు లేవు. నిజంగా మోడీ పెంచారనే అనుందాం, దాని వలన దేశానికి ఒరిగిందేమిటి ? మన ప్రమేయంతో పరిష్కారమైన సమస్యలేమీ లేవు. సేవా రంగంలో పెట్టుబడుల పెరుగుదల మోడీ ప్రభావంతో జరిగితే , ఉత్పత్తిరంగంలోకి ఎందుకు రాలేదు.గతేడాది డిసెంబరు 28న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన విశ్లేషణ ప్రకారం సేవారంగంలో ఏప్రిల్‌ 2000 నుంచి 2014 మార్చినెల వరకు విదేశీ పెట్టుబడులు 80.51 బి.డాలర్లుండగా అప్పటి నుంచి నుంచి 2022 మార్చి నెల వరకు 153 బి.డాలర్లకు పెరగ్గా ఉత్పాదక రంగంలో ఇదే కాలంలో 77.11 బి.డాలర్ల నుంచి 94.32కు మాత్రమే పెరిగాయి. దీన్ని బట్టి చైనాను వెనక్కు నెట్టేసి మన దేశం ప్రపంచ కర్మాగారంగా మారనుందని చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని తేలింది. అందువలన తాజా పర్యటన గతానికి భిన్నంగా తెల్లవారేసరికి ఏదో ఒరగబెడుతుందని భావించనవసరం లేదు.


ప్రధాని తాజా టూర్‌ గురించి అతిశయోక్తుల ప్రచారం మొదలైంది.ప పొగడ్తలు పొగ చెట్టువంటివి. పొగ కనిపిస్తుంది గానీ ఎంత కోసినా గుప్పెడు కాదు, కడుపు నింపదు, దాహం తీర్చదు. కొద్ది సేపు ఉండి అదృశ్యమౌతుంది. ఒక ప్రధానికి లేదా మరొక ప్రముఖుడిని పొగడ్తలతో ముంచెత్తితే దేశానికి, జనానికి ఒరిగేదేమిటి అన్నది ప్రశ్న. పాపువా న్యూగినియా ప్రధాని నరేంద్రమోడీకి పాదాభివందనం చేశాడని, అక్కడి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి రాత్రి పూట స్వాగతం పలికారని ఇవన్నీ నరేంద్రమోడీ ఘనతగా చిత్రించారు. కొన్ని అంశాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. తమ అవసరాల కోసం నరేంద్రమోడీని మునగ చెట్టు ఎక్కించేందుకు చూశారు. మోడీ గారూ మీరు అంత పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నవారితో ఎలా నెట్టుకురాగలుగుతున్నారో చూసిన తరువాత మీ ఆటోగ్రాఫ్‌ (ఒక పుస్తకం మీద లేదా ఒక కాగితం మీద అభిమానులు సినిమా వాళ్లను, ఇతర ప్రముఖులను సంతకాలు అడగటం తెలిసిందే) తీసుకోవాలనిపిస్తోందని అమెరికా అధినేత జో బైడెన్‌ అడిగినట్లు వార్తలు. ఇద్దరి మధ్య సంభాషణల సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ ” మీరు నాకు నిజంగా ఒక సమస్య తెస్తున్నారు. వచ్చే నెలలో వాషింగ్టన్‌లో మీకోసం ఒక డిన్నర్‌ ఏర్పాటు చేస్తున్నాము. దేశమంతటి నుంచి ప్రతివారూ దానికి రావాలని కోరుకుంటున్నారు. నా దగ్గర (టికెట్ల) ఆహ్వానాల కొరత ఏర్పడింది.( పశ్చిమ దేశాల్లో ప్రముఖులతో కలసి విందులు ఆరగించేందుకు వెల చెల్లించి ఆహ్వానాలను కొనుక్కుంటారు,ఎందుకంటే అక్కడ ఏదీ ఊరికే పెట్టరు ) నేను హాస్యమాడుతున్నట్లు మీరు అనుకోవచ్చు. నా సిబ్బందిని అడగండి. నేను గతంలో ఎన్నడూ చూడని విధంగా సినిమా నటుల నుంచి బంధువుల వరకు ప్రతివారి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మీరు ఎంతో ప్రాచుర్యం పొందారు. ప్రధాని గారూ మనం చతుష్టయం(క్వాడ్‌)లో చేస్తున్నదానితో సహా మీరు ప్రతిదాని మీద గణనీయమైన ప్రభావం కలిగిస్తున్నారు. పర్యావరణం మీద కూడ మౌలిక మార్పును తెచ్చారు. ఇండో-పసిఫిక్‌లో మీ ప్రభావం ఉంది, మీరు ఎంతో తేడాకు కారకులుగా ఉన్నారు.” అని బైడెన్‌ అన్నట్లుగా పత్రికల్లో వచ్చింది.


మోడీ-బైడెన్‌ మాట్లాడుకుంటుండగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్‌ కూడా వచ్చాడట. వారితో మాట కలుపుతూ సిడ్నీ నగరంలో పౌర ఆహ్వానానికి వసతి ఇరవై వేల మందికి మాత్రమే సరిపోతుంది, వస్తున్న వినతులన్నింటినీ అంగీకరించలేకపోతున్నాను అన్నాడట. మీరు గెలిచినపుడు నరేంద్రమోడీ స్టేడియంలో తొంభైవేలకు పైగా వచ్చిన వారిని సర్దుబాటు చేసిన తీరు గుర్తుకు వస్తోంది అన్నాడట. అప్పుడు మీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని ఉందని బైడెన్‌ మన ప్రధాని మోడీతో అన్నాడట. ఈ ఉదంతం గురించి వేరే విధంగా స్పందించనవసరం లేదు. విదేశీ నేతలు అలా మాట్లాడకపోతేనే ఆశ్చర్యపడాలి. గత జి 7 సమావేశాల్లో కూడా వెనుక నుంచి వచ్చి మోడీ భుజం తట్టి బైడెన్‌ పలుకరించినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. బైడెన్‌, అల్బనీస్‌ అలా మాట్లాడినపుడు నరేంద్రమోడీ స్పందన ఏమిటన్నది వార్తలలో రాలేదు. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. మీడియాకు ఈ అంశాలను చెప్పిన వారు కేవలం నరేంద్రమోడీ గొప్పను పెంచేందుకు పనికి వచ్చే వాటిని మాత్రమే వెల్లడించారన్నది స్పష్టం. వారు అలా పొగుడుతుంటే మోడీ మౌనంగా ఉంటారని, ఉన్నారని ఎలా అనుకోగలం ? మర్యాద కోసమైనా మోడీ ఎలా స్పందించిందీ చెప్పాలని అధికార గణానికి తోచలేదా ? లేక మోడీ కూడా ప్రతిగా వారిని పొగిడి ఉంటే ఒకరి నొకరు పొగుడుకున్నారని జనం భావిస్తారు గనుక ఒక భాగాన్ని మాత్రమే విలేకర్లతో చెప్పారన్నది స్పష్టం.


ఇక ఆస్ట్రేలియా వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ సిడ్నీ సభలో మరిన్ని పొగడ్తలను పొందారు. విశ్వగురు, ప్రపంచ నేత అని ఇప్పటికే ప్రధాని గురించి చెబుతున్న అంశం తెలిసిందేమో ప్రధాని మోడీ ఈస్‌ ద బాస్‌ అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ సభికులకు పరిచయం చేశారు. సుప్రసిద్ద రాక్‌ స్టార్‌ బ్రూస్‌ స్ప్రింగ్‌స్టీన్‌ అభిమానులు అతన్ని బాస్‌ అని పిలుస్తారని ప్రధాని నరేంద్రమోడీ కూడా అలాంటి వారేనని అన్నాడు. గతంలో ఇదే వేదిక మీద బ్రూస్‌ స్ప్రింగ్‌స్టీన్ను చూశాను ప్రధాని నరేంద్రమోడీ మాదిరి స్వాగతం లేదు అని కూడా అల్బనీస్‌ అన్నాడు. ఏడాది క్రితం ఇదే రోజున ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను. అప్పటి నుంచి ఆరుసార్లు మేము కలుసుకున్నామంటే రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని ఆల్బనీస్‌ చెప్పాడు. హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబులు వేయించి మారణహౌమానికి కారకురాలైన అమెరికా అధినేతలందరూ దాన్ని గురించి మరచిపోదాం అంటారు తప్ప క్షమాపణ చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన బైడెన్‌తో కలసి కూర్చున్న మన ప్రధాని మోడీ అమెరికా దుర్మార్గాలకు నిలువెత్తు చిహ్నంగా ఉన్న హిరోషిమా బాధితుల స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించారు. జి 7వేదిక మీద అదే అమెరికాతో కలసి శాంతి వచనాలు వల్లించారు. ఇక జి 7 సమావేశంలో నరేంద్రమోడీ ప్రత్యేకతను గురించి చెప్పేందుకు ఆ సమావేశంలో మోడీ ధరించిన కోటును విశ్లేషకులు ఎంచుకున్నారు. వాడిపారేసిన ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలను కరగించి దానికి వేరే పదార్ధాలను కలిపి దారాలుగా మార్చి దానితో కుట్టిన కోటును మోడీ ధరించటం జి 7 సమావేశం మీద ప్రతిధ్వని ప్రభావం కలిగించిందని ఒక విశ్లేషకుడు వర్ణించారు. ఎలాంటి ప్రయత్నం లేకుండానే ధరించిన ఆ కోటుతో వాతావరణ మార్పుల, పర్యావరణ అనుకూల సందేశాన్ని ఆ సమావేశంలో మోడీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చెప్పుకొనేందుకు వేరే ఏమీ లేనపుడు ఇలాంటి కబుర్లతో పేజీలు నింపటం కొత్తేమీ కాదు.


జి7లో వేసుకున్న పనికిరాని ప్లాస్టిక్‌తో రూపొందించిన పాలిస్టర్‌ కోటు రంగు వేరేది, కానీ ఫిబ్రవరి ఎనిమిదిన మరొక కోటు ధరించి పార్లమెంటుకు వచ్చారు.అంతకు ముందు భారత ఇంథన వారోత్సవాలలో బెంగలూరులో ఐఓసి కంపెనీ ఈ కోటును ప్రధానికి బహుకరించింది. అదే రోజు పార్లమెంటులో కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే ధరించిన శాలువ గురించి బిజెపి వివాదం రేపింది. ప్రధాని రీసైకిల్డ్‌ దారంతో ఉన్న తక్కువ ఖర్చుతో చేసిన జాకెట్‌ ధరించగా ఖర్గే శాలువ ఖరీదు రు.56,332 అని ట్వీట్లు చేసింది. నరేంద్రమోడీ ఎక్కడకు వెళితే అక్కడి వేషాలను(దుస్తులను) వేసుకుంటారన్నది మన జనానికి బాగా తెలిసిందే. ఈ అంశంలో గతంలో ఇందిరా గాంధీకి ఆ పేరు ఉండేది, దాన్ని మోడీ తుడిచివేసి తన పరంపరను ప్రారంభించారు.దాన్ని తలదన్నే విధంగా ఎవరు ఉంటారో చరిత్రకే వదలివేద్దాం. ఇక నరేంద్రమోడీ, ఇతర నేతలు ధరించిన దుస్తుల గురించి దేశంలో పెద్ద చర్చే జరిగింది, కొనసాగుతోంది కూడా.

కాలమహిమ ఏమంటే గతంలో నెహ్రూ మీద నిరంతరం దాడి చేసే తెగకు చెందిన ప్రధాని అదే నెహ్రూ కోటుగా జనంలో ప్రాచుర్యం పొందిన పొట్టి కోటునే నరేంద్రమోడీ కూడా ధరించారు, అలాంటి వాటిని 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జె ఇన్‌కు బహుమతిగా పంపారు. దాన్ని ధరించి చూడండి నేను మోడీ పొట్టి కోటును ధరించాను అని మూన్‌ ట్వీట్‌ చేశారు. తాను భారత సందర్శనకు వచ్చినపుడు నరేంద్రమోడీ ధరించిన కోటును చూసి ఈ కోటులో మీరు ఎంతో బాగున్నారు అని ప్రశంసించానని, తన కొలతలు తీసుకొని అలాంటి కోట్లను కుట్టించి మోడీ పంపారని మూన్‌ పేర్కొన్నారు. వాటి మీద మోడీ జాకెట్‌ అనే రాసి ఉంది. దీని గురించి పలు స్పందనలు వెలువడ్డాయి. వాటిలో ఒకదానిలో ఇలా ఉంది.” ప్రెసిడెంట్‌ గారూ మీరు చెప్పింది తప్పు. ఇది మోడీ వెస్ట్‌ కాదు, నెహ్రూ జాకెట్‌, మోడీకి నెహ్రూకు సంబంధం లేదు, ఎన్నడూ కాలేరు. మోడీ గురించి ఏదైనా చెప్పాలంటే అది ఖాకీ నిక్కరు ” అని ఒక ట్వీట్‌లో ఉంది. మన ప్రధాని మూన్‌కు అలాంటి కోట్లను పంపటం చాలా బాగుందని, అయితే వాటి పేరు మార్చకుండా పంపి ఉండాల్సిందని పేర్కొంటూ వాటిని నెహ్రూ కోటు అంటారని, 2014కు ముందు దేశంలో మోడీ జాకెట్లు లేవని కాశ్మీరు మాజీ సిఎం ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. ఇది వివాదం కావటంతో వాటిని రూపొందించిన కంపెనీని రంగంలోకి దించి వివరణ ఇప్పించారు. జేడ్‌ బ్లూ లైఫ్‌ స్టైల్‌ ఇండియా కంపెనీ ఆ కోట్లను మూన్‌కు పంపింది. దాని ఎండి బిపిన్‌ చౌహన్‌ ఒక వివరణ ఇచ్చారు. నెహ్రూ జాకెట్లు మెడను మూసివేస్తాయని, వాటిని సర్దార్‌ పటేల్‌ కూడా ధరించారని, కానీ మోడీ వెస్ట్‌ల పేరుతో తాము అమ్ముతున్నవి అలాగాక కాస్త పొడవుగా, సౌకర్యవంతంగా ఉంటాయని వివరణ ఇచ్చారు. ఇవి నెహ్రూ జాకెట్లు ఏమాత్రం కాదని, మోడీ అనేక భిన్నమైన రంగులకు ప్రాధాన్యత ఇస్తారు గనుక వీటిని మోడీ వెస్ట్‌లనే పిలవాలని అన్నారు.అంతే కాదు, గతంలో నెహ్రూ, పటేల్‌ ధరించిన కోట్లు ఎంతో నాణ్యమైన వస్త్రంతో రూపొందించి ప్రముఖులు మాత్రమే ధరించే వారని, అలాంటి వాటిని మోడీ సామాన్యులలో ఎంతో ప్రచారం కల్పించారని కూడా అన్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా మోడీ ప్రతిష్టకు మచ్చపడితే వివరణలకు కొదవ ఉంటుందా ? నెహ్రూ జాకెట్‌ అన్నా మోడీ వెస్ట్‌ అన్నా అర్ధం ఒకటే పొట్టి కోటు.


నెహ్రూ కోటు మాదిరి లాల్‌ బహదూర్‌ శాస్త్రి ధోవతి, ఇందిరాగాంధీ తేలికైన, సాదాసీదా చీరలు, జయలలిత షిఫాన్‌, నేత చీరల గురించి గతంలో చర్చలు జరిగాయి.నరేంద్రమోడీ పేదల గురించి పేద కబుర్లు చెప్పినా సందర్భానికి తగిన విధంగా ధరించే దుస్తులు ఎంతో ఖరీదైనవనే విమర్శల గురించి తెలిసిందే. భక్తులు వాటి గురించి ఒక్క మాట కూడా అననివ్వరు. కెమెరా కోసమే నరేంద్రమోడీ పుట్టారా లేక కెమెరాలను నరేంద్రమోడీ కోసమే రూపొందించారా అన్నట్లుగా కూడా ప్రచారం పొందిన అంశం తెలిసిందే. అడవిలోకి వెళ్లినపుడు వేటగాడిగా కనిపించిన మోడీ కేదారనాధ్‌ గుహలో ఒక కాషాయ సన్యాసిలా దర్శనమిచ్చినా, అవసరానికి తగిన దుస్తులను ధరించటంలో మోడీకి మరొకరు సాటి రారు అని అంగీకరించాల్సిందే. మోడీని చాయి వాలా అని చెప్పిన వారిని పదిలక్షల విలువగల సూట్‌, ఖరీదైన కళ్లజోళ్లు ధరించారేమిటి అంటే చాయి వాలా కూడా ఆ స్థాయికి ఎదగాలనే సందేశం అంతర్లీనంగా ఇమిడి ఉందని భక్తులు భాష్యం చెప్పటంతో ఎవరేమనుకున్నా నా తీరు మారదు అన్నట్లుగా మోడీ ఇంతవరకు రాజీపడిన దాఖాల్లేవు.


జయలలిత ఒకసారి కట్టిన చీరను మరోసారి కట్టలేదని, ఆమె దగ్గర పదివేలకు పైగా చీరలు ఉన్నట్లు చెబుతారు. నరేంద్రమోడీ కూడా అదే మాదిరి ఒకసారి వేసుకున్న దుస్తులను మరోసారి వేసుకోరని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌ 2016లో చెప్పిన సంగతి తెలిసిందే.మోడీ ధరించే దుస్తుల విలువ రెండు లక్షలని,రోజుకు ఐదుసార్లు మారుస్తారని అంటే రోజుకు పదిలక్షలు ఖర్చు చేస్తారని, మోడీ దుస్తులకు కోసం చేసే ఖర్చు కంటే తమ ప్రభుత్వ ప్రకటనల ఖర్చు రు.76కోట్లు చాలా తక్కువని కేజరీవాల్‌ చెప్పారు. భారత జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ ధరించిన టీ షర్టు విలువ రు.41వేలని బిజెపి విమర్శించింది. దాన్ని తిప్పికొడుతూ మోడీ సూట్‌ పదిలక్షలని, దాన్ని వేలం వేస్తే నాలుగుకోట్లు వచ్చినట్లు, మోడీ ధరించే కళ్లద్దాల వెల లక్షన్నర ఉంటుందని, వీటి గురించి చర్చిద్దామా అని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. నరేంద్రమోడీ తైవాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న రు.80వేల విలువగల పుట్టగొడుగులు తింటారని, ధరించే సూటు ధర ఎనిమిది నుంచి పదిలక్షల వరకు ఉంటుందని, రోజూ వైద్య పరీక్షలు చేయించుకుంటారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సంగతి తెలిసిందే. దీని గురించి వాస్తవాలను నిర్ధారించుకోగా సమాచార హక్కు చట్టం కింద మోడీ తన ఇంట్లో నెలకు ఎన్ని గాస్‌ సిలిండర్లు వాడతారు, కొనుగోలు చేసిన కూరగాయల బిల్లులు, దుస్తుల గురించి వివరాలు అడిగితే వాటికి మోడీ తన ఖర్చులను తానే భరిస్తారని, ప్రభుత్వానికి సంబంధం లేదు గనుక మోడీ వెల్లడిస్తే తప్ప వివరాలు లేవని ప్రధాని ఆఫీసు చెప్పినట్లు టైమ్స్‌ నౌ పేర్కొన్నది.


ఎవరినైతే మేము నమ్మామో అవసరం వచ్చినపుడు వారు మాతో నిలబడలేదని పాపువా న్యూగినియాలో ధనిక దేశాల గురించి ప్రధాని నరేంద్రమోడీ అన్నట్లు ఇండియా టుడే పేర్కొన్నది. భారత్‌, పద్నాలుగు దీవుల దేశాల సదస్సులో మోడీ మాట్లాడారు.నేడు ఇంథనం, ఆహారం, ఫార్మా, ఎరువుల సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నం కావటాన్ని చూస్తున్నాము. మాకు అవసరమైనపుడు మేము నమ్మిన వారు మాతో నిలబడలేదు, దీవుల దేశాలకు ఇబ్బందులు వచ్చినపుడు భారత్‌ బాసటగా నిలిచిందని మోడీ అన్నారు. పాపువా న్యూగినియా ప్రధాని జేమ్స్‌ మరాపే మాట్లాడుతూ ప్రపంచ అధికార క్రీడలో తాము బాధితులమని, మీరు పేద దేశాల నేత, ప్రపంచ వేదికల మీద మీ నాయకత్వం వెనుక నిలుస్తామని మోడీని ఉద్దేశించి అన్నాడు. మరి అలాంటి వారు ఆ ధనిక దేశాల ప్రాపకం కోసం ఎందుకు పాకులాడుతున్నట్లు ?


మన దేశం నుంచి గరిష్టంగా లబ్ది పొందేందుకు ఆస్ట్రేలియా చూసింది. సిడ్నీలోని హారిస్‌ పార్క్‌ పేరును లిటిల్‌ ఇండియాగా మారుస్తున్నట్లు ప్రధాని అల్బనీస్‌ భారత సంతతి వారితో జరిగిన సభలో ప్రకటించారు. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు.గతంలోనే పేరు మార్పు ప్రతిపాదన వచ్చినపుడు కొన్ని అభ్యంతరాలు తలెత్తటంతో ఆగింది.మనల్ని ఉబ్బించేందుకు చూడటం తప్ప దీని వలన మన దేశానికి ఒరిగేదేమిటి ? హైదరాబాదులో లాలాగూడ పరిసరాలను లిటిల్‌ ఇంగ్లండ్‌ అని పిలుస్తారు, అలాగే ముషిరాబాద్‌లో బంగ్లాదేశ్‌ మార్కెట్‌ అని ఉంది. చైనా బజార్ల గురించి తెలిసిందే వాటివలన ఆ దేశాలకు ఒరిగేదేమీ లేదు. అవసరం కొద్దీ అధికారంలో ఉన్న వారు ఆహా ఓహౌ అంటూ నరేంద్రమోడీని పొగడినా ఆస్ట్రేలియాలో మోడీ ఉన్న సమయంలో పార్లమెంటు సభ్యులు నరేంద్రమోడీపై బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని పార్లమెంటు భవనంలో తిలకించారు. దాని గురించి చర్చలు జరిపారు. డాక్యుమెంటరీని మన దేశంలో అనధికారికంగా నిషేధించిన సంగతి తెలిసిందే.మానవ హక్కుల కోసం పని చేసే హిందువుల సంస్థ,ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, పెరియార్‌ అంబేద్కర్‌ ఆలోచనల బృందం,హూమనిజం ప్రాజెక్టు,కేర్‌ తదితర సంస్థలు ఈ ప్రదర్శన, చర్చను ఏర్పాటు చేశాయి.నరేంద్రమోడీ తన భావజాలానికి అనుగుణంగా ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నట్లు, వాటిని నివారించాలని కోరటం ద్వారా హిందూత్వ వాదులను సంతుష్టీకరించేందుకు చూశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !

24 Wednesday May 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

China-Central Asia Summit 2023, G7 summit, Hiroshima, Joe Biden, Narendra Modi, The Group of Seven (G7) 2023, Xi Jinping warns US-Taiwan separatists


ఎం కోటేశ్వరరావు


ఏ పదజాలం వెనుక ఏమి దాగుందో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్‌ మాటలు పరమ సత్యాలు. అలాగే ఏ సమావేశం ఎందుకు జరిగిందో అని కూడా మనం అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఒకే సారి ఆసియాలో రెండు ముఖ్య సమావేశాలు జరిగాయి. ఒకటి ప్రపంచంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ శాంతి, అభివృద్ధికి ముప్పు తెస్తున్న అమెరికా నేతృత్వంలోని జి 7 సమావేశం 19-21 తేదీలలో జపాన్‌లోని హీరోషిమాలో జరిగింది. రెండవది చైనాలోని షియాన్‌ నగరంలో మే 18-19 తేదీలలో మధ్య ఆసియా దేశాల సదస్సు. మొదటిది రాజకీయాల చుట్టూ నడిస్తే రెండవది అభివృద్ధి కేంద్రంగా జరిగింది. చైనాతో విడగొట్టుకోకుండానే నష్టాలను పరిమితం చేసుకోవాలని ఈనెల జపాన్‌లోని హిరోషిమా నగరంలో జరిగిన జి 7 దేశాల శిఖరాగ్ర సమావేశం పిలుపునిచ్చింది. తన పాటకు అనుగుణంగా నృత్యం చేయించాలని ఈ బృందంతో సహా ప్రపంచదేశాలన్నింటి మీద అమెరికా వత్తిడి తెస్తున్నప్పటికీ దానికి కొన్ని దేశాలు సిద్దంగా లేవన్నది ఈ ప్రకటనలో అంతర్లీనంగా ఉన్న సందేశం. అయితే పదజాలం దానికి చెప్పే భాష్యాలు ఎలా ఉన్నప్పటికీ సమావేశం జరిగిన తీరు, ఆమోదించిన ప్రకటన చూస్తే చైనా చుట్టూ తిప్పి దాన్ని ఎలా దెబ్బతీయాలన్న దాని మీదే కేంద్రీకరించారన్న విశ్లేషణలు వెలువడ్డాయి.


అమెరికా కోరుతున్నట్లుగా చైనాతో విడగొట్టుకొనేందుకు జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి కొన్ని దేశాలు సిద్దంగా లేవు. ఈ కారణంగానే ఆర్థిక అంశాల్లో బస్తీమే సవాల్‌ అంటూ చైనా మీద తొడగొట్టకుండా అటు అమెరికాను, ఇటు ఇతర దేశాలను సంతుష్టీకరించే విధంగా ఈ పిలుపు ఉంది. ఆర్థికంగా చైనా ఇతర దేశాలను బలాత్కారం చేస్తోందన్న ఆరోపణలను ఇటీవలి కాలంలో అనేక దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.హిరోషిమా సమావేశాలు కూడా దాని చుట్టూ తిరిగాయి గానీ బహిరంగంగా వేలెత్తి చూపేందుకు ఎవరూ ముందుకు రాలేదు.చైనా నుంచి చేసుకొనే దిగుమతులను తగ్గించుకొని ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు.చైనా నుంచి విడగొట్టుకోవటం ఇప్పటల్లో జరిగేది కాదని తెలుసు గనుకనే ప్రతి దేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు చూస్తుంది తప్ప చైనా ఆర్థిక ప్రగతి, అభివృద్ధిని అడ్డుకోవటం తమ ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చుకొనేందుకు చూశాయి. దశాబ్దాల తరబడి పక్షవాత రోగి మాదిరిగా ఉన్న జపాన్‌కు చైనాతో వాణిజ్య సంబంధాలు ఎంతో అవసరం. గత సంవత్సరం జపాన్‌ చైనాకు 189 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు, 145బి.డాలర్ల దిగుమతులు చేసుకుంది. నష్టాలను తగ్గించుకోవటం అంటే అవసరమైన వస్తువుల కోసం ఒక దేశం మీద ఆధారపడకుండా చూసుకోవాలన్నది అమెరికా వైఖరి అని జో బైడెన్‌ చెప్పాడు. చైనాలో పెట్టుబడులతో ముప్పు కూడా ఉంటుందని తెలిసినప్పటికీ తాము పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ చెప్పాడు.


చైనాతో సంబంధాలను విడగొట్టుకోవాలని జి 7 కోరుకోవటం లేదు, ఎందుకంటే అది ఎంతో కష్టం,ఇబ్బందులను కూడా తెస్తుంది, సాధ్యం కూడా కాదు అని కునీహికో మియాకే అనే విశ్లేషకుడు చెప్పాడు. అందుకే సమావేశ ప్రకటనలో విడగొట్టుకోవటం అనే పదం బదులు ముప్పు తగ్గించుకోవటం అని చెప్పారని అన్నాడు. జి 7 సమావేశం చైనా వ్యతిరేక (వర్క్‌షాప్‌) కసరత్తు అని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వర్ణించింది.2021 నుంచి జి 7 సమావేశాల ప్రకటనలు క్రమంగా ట్రాఫిక్‌ సిగల్‌ మాదిరి మారుతూ చైనాను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, ఆ బృందం పూర్తి పేరు ఏడు పారిశ్రామిక శక్తి దేశాల బృందం అనీ, ఆర్థికంగా చేసేదేమీ లేక ఇప్పుడది ఒక చిన్న వర్క్‌షాప్‌గా పని చేస్తూ చైనా వ్యతిరేక నకిలీ ఉత్పత్తుల సామూహిక ఉత్పత్తి మీద కేంద్రీకరిస్తోందని గ్లోబల్‌టైమ్స్‌ ఎద్దేవా చేసింది. తాజా ప్రకటనలో తైవాన్‌,తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్‌, షింజియాంగ్‌, చైనా అణుశక్తి అంటూ ఇరవైసార్లు చైనా పేరును పలవరించినట్లు పేర్కొన్నది. దీనికి తోడు చైనా ఆర్థిక బలత్కారాన్ని కూడా చేర్చినట్లు పేర్కొన్నది. శిబిరాల మధ ఘర్షణలను కోరుతూ ఈ బృందం ప్రపంచ శాంతి, అభివృద్ధికి అతి పెద్ద ముప్పులలో ఒకటిగా మారినట్లు స్పష్టం చేసింది.


ఆర్థిక అంశాలకు సంబంధించి సమావేశ ప్రకటనలో మాటల గారడీ చేసినా రాజకీయాలకు వస్తే చైనా మీద దూకుడుగానే ఉన్నారు. దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ ఆర్థిక నియమావళిని తిరిగి రాసేందుకు పూనుకుందని ఆరోపించాయి. సిడ్నీలో జరగాల్సిన చతుష్టయ(క్వాడ్‌) సమావేశాలు రద్దు కావటంతో పరువు దక్కించుకొనేందుకు హిరోషిమాకు వచ్చిన అమెరికా,ఆస్ట్రేలియా,జపాన్‌, భారతదేశ నేతలు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్‌ అధినేత జెలెనెస్కీని ఆహ్వానించి జి7 సభ్యదేశాలన్నీ అతని వెనుక నిలిచాయి.సాయాన్ని పెంచనున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలను చూసినపుడు ఈ సమావేశం చైనా, రష్యాల మీద కేంద్రీకరించినట్లు చెప్పకనే చెప్పింది. ఈ ప్రకటనలు చేస్తుండగానే దీర్ఘకాలంగా పోరు సాగుతున్న బఖుమత్‌ పట్టణాన్ని రష్యా తన అదుపులోకి తెచ్చుకొని ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న దేశాల పప్పులు ఉడకవనే సందేశాన్ని పంపింది. గత సమావేశాలు లేదా ఇతర శిఖరాగ్ర సమావేశాలకు భిన్నంగా హిరోషిమా సభ ఒక రోజు ముందుగానే సమావేశ ప్రకటనను విడుదల చేసింది. మీడియాలో జెలెనెస్కీకి ప్రాధాన్యత ఇచ్చి ఈప్రకటనను పక్కన పడవేస్తారన్న కారణంగా ముందుగానే విడుదల చేసినట్లు కొందరు చెప్పారు. నిజానికి గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అన్నట్లుగా సమావేశం చేసే ప్రకటనలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా చైనా మీద కేంద్రీకరించటం తప్ప కొత్తగా చెప్పేదేమీ ఉండదని ముందుగా ఊహించిందే. దానికోసం ప్రకటన దాకా ఆగాల్సిన అవసరం కూడా లేదు.చైనా మీద వత్తిడి స్వరాన్ని పెంచినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం, సహకరించుకోవటం లక్ష్యంగా ఏర్పడిన జి7 ఇటీవలి కాలంలో దాని కంటే ప్రపంచ రాజకీయాల మీదనే ఎక్కువగా కేంద్రీకరిస్తున్నది. ఐదు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న ఈ కూటమిలోని దేశాలు నాడు ప్రపంచ జీడిపిలో 70శాతం కలిగి ఉన్నాయి. ఇప్పుడు దాని విలువ నలభైశాతానికి అటూ ఇటూగా ఉంది.


అసలు జి 7 ఎలా ఉనికిలోకి వచ్చిందీ క్లుప్తంగా చూద్దాం. అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం.అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1998లో రష్యా చేరి జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి రష్యాను తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. శిఖరాగ్ర సమావేశాలపుడు ఎవరు దేశాల అధిపతిగా ఉంటే వారు ప్రతినిధిగా హాజరవుతారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు.తమ దేశంలో జరిగే సమావేశాలకు ఇతర దేశాలను ఆహ్వానించే స్వేచ్చ ఆ దేశానికి ఉంటుంది. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. శిఖరాగ్ర సమావేశాల్లో ఐరాసతో సహా వివిధ ప్రపంచ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ఇప్పటి వరకు గత తొమ్మిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. మన దేశం ఆహ్వానం అందుకోవటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు. ఆహ్వానాలు అందుకున్న తొమ్మిది దేశాలలో మనది కూడా ఒకటి తప్ప ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇలా పాల్గన్నదేశాల అధినేతలు విడి విడిగా ఇతర దేశాల నేతలను కలుసుకోవటం, వేదిక మీద ధర్మోపన్యాసాలు చేయటం తప్ప బృంద నిర్ణయాలతో ఎలాంటి ప్రమేయం ఉండదు. ఈ ఏడాది అతిధులుగా ఆస్ట్రేలియా,బ్రెజిల్‌, కామెరూస్‌,కూక్‌ ఐలాండ్స్‌, భారత్‌, ఇండోనేషియా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్‌, వియత్నాం అధినేతలను ఆహ్వానించారు. పసిఫిక్‌ సముద్రంలో కేవలం 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పదిహేను దీవుల సముదాయం 15,040 మంది జనాభా ఉన్న ఈ దేశ అధినేతకు ప్రపంచంలో పెద్దదైన భారత అధినేతల మర్యాదలు ఒకే విధంగా ఉంటాయి. పసిఫిక్‌ దీవుల్లో ఉన్న చిన్న దేశాలకు ఏర్పడిన ప్రాధాన్యాత కారణంగానే కూక్‌ ఐలాండ్స్‌కు ఆహ్వానం పలికారన్నది స్పష్టం.


ఒక దశలో ట్రంప్‌ ఏలుబడిలో తిరిగి రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి.తరువాత అది ముందుకు పోలేదు. దాని వలన చేరే దేశాలకు జరిగే మేలేమీ కనిపించకపోవటం ఒక కారణం అని చెప్పవచ్చు.అన్నింటికీ మించి అమెరికా అజెండాను ముందుకు తీసుకువెళ్లే ఒక వాహనంగా అది మారింది. ధనిక దేశాల బృందం తన పూర్వపు ఆర్థిక శక్తిని తిరిగి తెచ్చుకొనేందుకు చూపుతున్న శ్రద్ద కంటే ఇటీవలి కాలంలో చైనా వ్యతిరేక స్వరాన్ని పెంచుతున్నారంటే దాని అర్ధం ఈ బృందం అమెరికా విదేశాంగ విధాన ప్రయోజనాలకు తోడ్పడటం తప్ప వేరు కాదు. చైనా ఆర్థిక బలాత్కారం అనే ఆరోపణ ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రచారంలో పెట్టారు. తన వస్తువులను కొనుగోలు చేయాలంటూ ఏ దేశాన్నైనా వత్తిడి చేసిన దాఖలాలు లేవు. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ రుణాల ద్వారా అలాంటి పనిచేసిన, ఇప్పటికీ చేస్తున్నది వాటి మీద పెత్తనం చేస్తున్న ధనిక దేశాలన్నది బహిరంగ రహస్యం. తమకు లంగని లేదా రాజకీయంగా వ్యతిరేకించే దేశాల మీద ఆర్థిక, వాణిజ్య అంశాలను ఆయుధాలుగా మారుస్తున్నది పశ్చిమ దేశాలు. లడఖ్‌ సరిహద్దు వివాదం తరువాత మన దేశంలోని సంఘపరివార్‌, ఇతర చైనా వ్యతిరేక శక్తులు చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చేసిన హడావుడి గురించి తెలిసిందే. ఊహలు, వాంఛలను బట్టి ప్రపంచం నడవదు. నరేంద్రమోడీ సర్కార్‌ గత రికార్డులను బద్దలు కొట్టి చైనా నుంచి దిగుమతులను భారీగా పెంచింది. మరోవైపు చైనా నుంచి విడగొట్టుకోవాలన్నదేశాలతో యుగళగీతం ఆలపిస్తున్నారు.


షియాన్‌ నగరంలో చైనా, ఆరు మధ్య ఆసియా దేశాల సదస్సు రాజకీయాలతో నిమిత్తం లేకుండా అభివృద్ది అజండాతో జరిగింది. పలు ఒప్పందాలను చేసుకున్నారు.అమెరికా, ఐరోపా, మన దేశంతో చైనా జరుపుతున్న వాణిజ్యలావాదేవీల మాదిరే ఈ దేశాలతో కూడా జరుపుతున్నది. పరస్పర అంగీకారంతో పెట్టుబడులు పెడుతున్నది.కొందరు విశ్లేషకులు ఈ సమావేశాన్ని తన పలుకుబడిని పెంచుకొనేందుకు చైనా చేసిన కసరత్తుగా ఆరోపించుతున్నారు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట అమెరికా అభివృద్ది పేరుతో పాగా వేసేందుకు, రక్షణ పేరుతో తన విష కౌగిలిలో బంధించేందుకు చూస్తున్నది తెలిసిందే. అలాంటిది చైనా తన పొరుగున ఉన్నదేశాల ఆర్థిక వృద్ధికి తోడ్పడితే దాన్ని విస్తరణ కాంక్షగా వర్ణించటం అర్ధం లేదు. మన దేశం పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌లకు చేస్తున్న సాయాన్ని విస్తరణ కాంక్షలో భాగంగా చేస్తున్నామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాలకవర్గాలను భయపెడుతున్న కమ్యూనిజం !

17 Wednesday May 2023

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, USA

≈ Leave a comment

Tags

Anti communist, Austrian Communist Party, Chicago mayor, communism, Communism won, communist manifesto, Joe Biden, karal marx


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిస్టు విప్లవం గురించి పాలక వర్గాలను భయపడనివ్వండి. కార్మికవర్గానికి వారి సంకెళ్లు తప్ప పోయేదేమీ లేదు.వారు గెలుచుకొనేందుకు తమదైన ప్రపంచం ఉంది. అన్ని దేశాల కార్మికులూ ఐక్యం కండి అన్న పిలుపు గురించి తెలిసిందే. సరిగ్గా 175 సంవత్సరాల క్రితం 1848 ఫిబ్రవరి 21న తొలిసారిగా ముద్రితమైన కమ్యూనిస్టు ప్రణాళికలో కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రాశారు.పైకి ఎవరెన్ని చెప్పినా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఇప్పటికీ ఆ ప్రణాళిక పాలకవర్గాలను భయపెడుతూనే ఉంది. ఫిబ్రవరి 21 రెడ్‌ బుక్స్‌ డే రోజున ప్రపంచమంతటా కార్మికవర్గం దాన్ని పఠించింది. ప్రపంచ చరిత్రలో ఏ గ్రంధాన్ని ఇలా చదివి, చర్చించి ఉండరు. కమ్యూనిస్టు ప్రణాళిక ప్రచురణకు ముందు ప్రజాస్వామ్యం, విముక్తి కోసం అనేక పోరాటాలు, విప్లవాలు జరిగాయి. అప్పటివరకు జరిగింది ఒక ఎత్తుకాగా వాటికి ఒక దశ, దిశ నిర్దేశం చేస్తూ నిర్దిష్ట కార్యాచరణకు నాంది పలికింది కమ్యూనిస్టు ప్రణాళిక.అమెరికాలోని సెంటినల్‌ రికార్డ్‌ అనే వెబ్‌ పత్రిక మే ఎనిమిదవ తేదీన కమ్యూనిజం విజయం అనే శీర్షికతో బ్రాడ్లే గిట్జ్‌ అనే విశ్లేషకుడు రాసిన అంశాన్ని ప్రచురించింది. అదేమీ సానుకూల వైఖరితో చేసిన పరిశీలన కాదు. పేరులో ఏమున్నది పెన్నిధి అన్నట్లుగా పదాలను, వాటికి అర్ధాలను ఎటుతిప్పి ఎటు చెప్పినా చివరికి కమూనిస్ట్యులు చెప్పిన దాన్నే చెబుతున్నారుగా అని ఉక్రోషంతో పెట్టిన శీర్షిక అనిపించింది. భిన్నత్వం, న్యాయం లేదా ధర్మం, అంతర్గహణం (డిఇఐ) అని బైడెన్‌ ప్రభుత్వం, విశ్వవిద్యాలయాల్లో ఏమి బోధించినప్పటికీ వెనుక ద్వారం నుంచి కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రవేశపెట్టినట్లే.సమానత్వం అన్నది న్యాయం నుంచి పుట్టిందే. గత రెండువందల సంవత్సరాలు అంతకు ముందు నుంచి అమెరికాలో చెబుతున్న హక్కుల సమానత్వానికి కారల్‌ మార్క్స్‌, లెనిన్‌, ఇతర కమ్యూనిస్టు సిద్దాంతవేత్తలు చెప్పిన పర్యవసానం లేదా ఫలితాల సమానత్వానికి వైరుధ్యం ఉంది. అని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు.


మన దేశంలో దున్నేవాడికే భూమి అన్న నినాదం ఇచ్చారు కమ్యూనిస్టులు. దున్నగలిగేవాడికే భూమి అన్నది తమ వైఖరని భూసమస్య ప్రధాన చర్చగా ఉన్నపుడు బిజెపి నేతలు చేప్పేవారు. సోషలిజం, తరువాత కమ్యూనిజం తమ అంతిమ లక్ష్యమని కమ్యూస్టులు చెప్పే సంగతి తెలిసిందే.జనం ఈ నినాదాల పట్ల ఆకర్షితులవటాన్ని గమనించి తామే సోషలిజాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఆవడి ఏఐసిసి సమావేశంలో తీర్మానించింది.బిజెపి కూడా ఆ నినాద ప్రభావాన్ని తప్పించుకోలేక తాము గాంధేయ సోషలిజం తెస్తామని చెప్పింది.అదే మాదిరి భూ పోరాటాలు అవసరం లేకుండా భూ సంస్కరణలను తామే అమలు జరుపుతామని,భూమిని పంచుతామని కాంగ్రెస్‌ బూటకపు సంస్కరణలకు తెరతీసింది. ఇప్పుడు కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలేవి భూ సమస్య గురించి మాట్లాడటం లేదు. సోషలిస్టు నినాదం జనాన్ని ఆకర్షించిన కారణంగానే ఐరోపాలోని పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షేమ పధకాలు, సబ్సిడీల వంటి చర్యలతో అక్కడి పాలకవర్గాలు కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు చూశారు. తరువాత అనేక దేశాల్లో వాటిని అమలు జరపాల్సి వచ్చింది.చివరికి నరేంద్రమోడీ ముందుకు తెచ్చిన అచ్చేదిన్‌ నినాదం కూడా అలాంటిదే. అసమానతలు పెరిగి జనజీవనం దిగజారుతున్న క్రమంలో మంచి రోజులు తెస్తానంటే తప్ప బిజెపి చెప్పే మత సిద్దాంతాలకు ఓట్లు రాలవని తెలిసే జనాన్ని వంచించేందుకు ఇలాంటి నినాదాలను ముందుకు తెస్తున్నారు. రాజకీయాలకు తోడు జనాన్ని చీల్చేందుకు, మత్తులో ముంచి వర్గ దృక్పధం వైపు చూడకుండా చూసేందుకు మతాన్ని ముందుకు తెస్తున్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక, సిద్దాంతాల మీద గందరగోళం సృష్టించే, తప్పుదారి పట్టించే ఎత్తుగడలతో నిరంతరం వక్రీకరణ దాడి జరుగుతూనే ఉంది.


కమ్యూనిజం గురించి ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు, విద్వేషాన్ని రెచ్చగొట్టినా జనజీవితాలు దుర్భరం అవుతున్నపుడు ప్రత్యామ్నాయాల గురించి జనం ఆలోచిస్తారు. అమెరికాలో, ఐరోపాలో,ఇతర చోట్ల ఇప్పుడు జరుగుతోంది అదే. గతంలో కమ్యూనిజం వైఫల్యగురించి చర్చకు తెరతీస్తే సోషలిజం అంతరించింది అని చెప్పిన చోట జనం పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి ఆలోచించటం మొదలు పెట్టారు. ముందే చెప్పుకున్నట్లు 175 ఏండ్ల నుంచి కమ్యూనిస్టు ప్రణాళిక దోపిడీ వర్గాన్ని భయకంపితం గావిస్తుంటే ఇప్పుడు పెట్టుబడిదారీ విధాన వైఫల్యంపై చర్చ కూడా దానికి తోడైంది. దాన్ని పక్కదారి పట్టించేందుకే మేము కూడా మీ గురించి ఆలోచిస్తున్నామని కార్మికవర్గానికి చెప్పేందుకు భిన్నత్వం, న్యాయం లేదా ధర్మం, అంతర్గహణం (డిఇఐ) భావనలను ముందుకు తెస్తున్నారు. అమెరికాలోని అనేక నగరాల్లో తమకు సరైనదారి చూపేది పురోగామి శక్తులే అనే భావం బలపడుతోంది. మూడో పెద్ద నగరమైన చికాగో నగరంలో మితవాదులను పక్కకు పెట్టి పురోగామి వాదులను నగరపాలక సంస్థకు ఎన్నుకోవటం దాన్నే సూచిస్తోంది.


అమెరికాలో న్యూయార్క్‌, లాస్‌ ఏంజల్స్‌ తరువాత మూడో పెద్ద నగరమైన చికాగో మేయర్‌గా పురోగామివాది బ్రాండన్‌ జాన్సన్‌ ఏప్రిల్‌ నాలుగవ తేదీన ఎన్నికయ్యాడు. చికాగో టీచర్స్‌ యూనియన్‌, కార్మిక నేతగా పని చేస్తున్నారు.మే పదిహేనవ తేదీన ప్రమాణ స్వీకారం చేశాడు. యాభై మంది కౌన్సిలర్లలో నగర చరిత్రలో పురోగామి వాదులు ఎక్కువగా ఎన్నికైన సందర్భమిదే. నిబంధనల ప్రకారం నగర పోలీసు కమిషనర్‌ పదవికి నగరంలోని 22 పోలీసు డివిజన్ల నుంచి వివిధ సామాజిక తరగతుల సమూహాల నుంచి ఎన్నికైన 60 మంది కమిటి ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి సిఫార్సు చేస్తే వారిలో ఒకరిని మేయర్‌ ఎంపిక చేస్తారు. పోలీసు విభాగాన్ని కూడా ప్రజాస్వామ్యపద్దతుల్లో పనిచేసేట్లు చూస్తున్నారు. వచ్చే ఏడాది పాఠశాలల కమిటీలను కూడా ఎన్నికల ద్వారా నింపుతారు.ప్రజా ఉద్యమాల ప్రభావం, ప్రజానుకూల రాజకీయాలు, ఎన్నికల పట్ల పౌరుల ఉత్సాహంతో చికాగో నగరం మరింత ప్రజాస్వామిక వాతావరణంలో పురోగమించనుంది. ఇటీవలి కాలంలో అనేక నగరాలలో పురోగామి శక్తులు మేయర్లుగా ఎన్నిక అవుతున్నారు. వారంతా ప్రజా ఉద్యమాలలో పని చేసి ప్రజాదరణ పొందిన వారే.చికాగోలో గతంలో అధికారంలో ఉన్న వారు అనుసరించిన విధానాల ఫలితంగా ధనికులకు మెరుగైన వసతులు, కార్మికులకు దుర్భరపరిస్థితులు, అవినీతి, అక్రమాలు, నేరాలతో జనం విసిగిపోయారు. కేంద్రం, రాష్ట్రాల నుంచి నిధులను రాబట్టి నగర జీవనాన్ని మెరుగుపరచాలన్న ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఎన్నికల్లో పురోగామి శక్తులు నెగ్గారు. నగరంలోని 50 వార్డులకు గాను జాన్సన్‌ మద్దతుదారులు 29 మంది గెలిచారు. ఆఫ్రికన్‌-అమెరికన్‌ ఓటర్లలో 80శాతం, తెల్లవారిలో 39,లాటినోలలో 49శాతం మంది వారికి ఓటు వేశారు. ఇటీవలి కాలంలో ఆసియన్‌-అమెరికన్‌ జనాభా కూడా పెరుగుతోంది. ఎన్నికైన వారిలో ఆరుగురు డెమోక్రటిక్‌ సోషలిస్టులు కూడా ఉన్నారు. వారి నేత బెర్నీ శాండర్స్‌ రెండు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.


ఏప్రిల్‌ 23వ తేదీన ఐరోపా దేశమైన ఆస్ట్రియాలోని సాల్జ్‌బర్గ్‌ రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టులు(కెపిఓ) 11.7శాతం ఓట్లు సంపాదించారు.ఐదు సంవత్సరాల క్రితం వారికి వచ్చిన ఓట్లు కేవలం 0.4శాతమే. మితవాదానికి కేంద్రంగా ఉన్న ఇక్కడ ఇన్ని ఓట్లు రావటం పరిశీలకులను ఆశ్చర్యపరిచింది.కెపిఓ ప్లస్‌ పేరుతో స్వతంత్రులను కూడా కలుపుకొని ఒక మ్యూజియంలో గైడ్‌గా పని చేస్తున్న 34 సంవత్సరాల కె మైఖేల్‌ డంకల్‌ అనే కార్మికుడి నేతృత్వంలో పార్టీ పోటీ చేసింది. మొదటి స్థానంలో ఉన్న పార్టీకి 30, రెండో స్థానంలో ఉన్న పార్టీకి 25శాతం చొప్పున వచ్చాయి. డంకల్‌ గతంలో గ్రీన్ప్‌ పార్టీలో పని చేశాడు. వర్గ రాజయాలను అనుసరించటం లేదని, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా లేదని 2017లో రాజీనామా చేసి కమ్యూనిస్టులతో కలిశాడు. తరువాత 2019లో స్లాజ్‌బర్గ్‌ నగర ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచాడు. కమ్యూనిస్టు పార్టీ ఓట్లు అంతకు ముందున్న 1.19 నుంచి 21.5శాతానికి పెరిగాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆస్ట్రియాలో నాలుగో పెద్ద నగరమైన ఈ నగరమేయర్‌గా ఒక కమ్యూనిస్టు ఉండబోతున్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.దేశమంతటా పార్టీ ఓటింగ్‌ 2019లో ఒకటి నుంచి ఏడు శాతానికి పెరగ్గా 1959 తరువాత 2024 ఎన్నికల్లో తొలిసారిగా పార్లమెంటులో కూడా ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. ఇళ్ల సమస్య, అద్దెలు, ఇంథన ధరల పెరుగుదల వంటి రోజువారీ కార్మికుల సమస్యల మీద కేంద్రీకరించి పార్టీ ప్రజల అభిమానం పొందింది. అధికార కూటమి జనం నుంచి దూరమైంది.2021లో జరిగిన ఎన్నికల్లో దేశంలో రెండో పెద్ద నగరమైన గ్రాజ్‌ మేయర్‌గా కమ్యూనిస్టు ఎన్నికయ్యాడు. గ్రీసులో జరిగిన విశ్వవిద్యాలయాల విద్యార్ధి సంఘ ఎన్నికల్లో వామపక్ష భావజాలం కలిగిన వారు 35శాతం ఓట్లు తెచ్చుకున్నారు.వరుసగా రెండవ ఏడాది ఈ ఆదరణ లభించింది. ఈ వీధులు ఎవరివి ? మావే, ఈ భూములు ఎవరికి, స్థానికులం మావే, వేరే వారికి అప్పగించటాన్ని అంగీకరించం అంటూ అమెరికాలోని మినియాపోలీస్‌లో జరిపిన ప్రదర్శనల్లో స్థానికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పతాకాలను చేబూని నినదించారు. పురోగామి శక్తులు ఎన్నికల పోరాటాలతో పాటు ప్రజా ఉద్యమాల్లోనూ ముందుంటున్నారు.లాటిన్‌ అమెరికాలో రాగల ముప్పును గురించి కూడా హెచ్చరిస్తున్నారు.


తమ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్‌ ప్రమాదంలో పడిందని చిలీ కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించింది. దేశ నూతన రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన 50 మంది సభ్యుల సభకు మే ఏడవ తేదీన జరిగిన ఎన్నికల్లో మితవాద, తీవ్రవాదుల పార్టీలకు చెందిన వారు 33 మంది ఎన్నికకావటాన్ని కమ్యూనిస్టు పార్టీ ఉటంకించింది. ఆ ఎన్నికల్లో రెండు స్థానాలను పొందిన పార్టీకి ఎనిమిదిశాతం ఓట్లు వచ్చాయి. అక్కడి నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాల్సి ఉంది. పోలైన ఓట్లలో 21శాతం చెల్లనివిగా ప్రకటించారు. ఇవన్నీ కూడా వామపక్ష శక్తులుగా చెప్పుకొనే వారివేనని, వారంతా వామపక్షాలకు ఓట్లు వేసి ఉంటే ఫలితాలు వేరుగా వచ్చి ఉండేవని కమ్యూనిస్టు పార్టీ చిలీ అధ్యక్షుడు గులిరెమో టెలియర్‌ అన్నారు. నూతన రాజ్యాంగ రచనకు ఎంతో గట్టిపోరాటం చేయాల్సి ఉంటుందని అన్నారు. కార్పొరేట్‌ శక్తులు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేసినప్పటికీ దేశంలో ఓట్ల రీత్యా మూడవ స్థానంలో పార్టీ నిలిచిందని చెప్పారు.2021 ఎన్నికల్లో గెలిచిన వామపక్ష గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వానికి తాజా పరిణామంతో ఎలాంటి ముప్పు లేనప్పటికీ కీలకమైన రాజ్యాంగ రచనకు ఓటర్లు మితవాద శక్తులవైపు మొగ్గు చూపటం గమనించాల్సిన అంశం. మొత్తం లాటిన్‌ అమెరికా, ప్రపంచంలోని కమ్యూనిస్టు, వామపక్ష శక్తులు చిలీ పరిణామాల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాల్సి ఉంటుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెరుగుతున్న చైనా పలుకుబడి – తగ్గుతున్న అమెరికా పెత్తనం !

11 Thursday May 2023

Posted by raomk in Africa, CHINA, COUNTRIES, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, emmanuel macron, Joe Biden, NATO, Sudan’s army, Sudanese Communist party, The Rise of China, U.S. Hegemony


ఎం కోటేశ్వరరావు


ఆఫ్రికాలోని కీలక దేశమైన సూడాన్‌లో పారా మిలిటరీ-మిలిటరీ మధ్య కానసాగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు ఆరువందల మందికి పైగా మరణించగా ఐదువేల మంది గాయపడినట్లు వార్తలు. గురువారం నాటికి 27రోజులుగా ఘర్షణ సాగుతోంది. అమెరికా మార్గదర్శకత్వంలో సూడాన్‌ మిలిటరీ-పారామిలిటరీ మధ్య రంజాన్‌ మాసంలో కుదిరిన ఒప్పందాలు విఫలమయ్యాయి. దీంతో అక్కడ శాంతి, భద్రతలు భగం కావటానికి కారకులైన వ్యక్తుల మీద ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించాడు. తరువాత వైరి పక్షాల మధ్య రాజీకుదిర్చేందుకు చైనా రంగంలోకి దిగుతుందా అన్న చర్చ మొదలైంది. మిలిటరీకి అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మద్దతు ఉండగా పారామిలిటరీకి పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల మద్దతు ఉంది. సంక్లిష్టమైన ఈ వివాదంలో చైనా ఏ పక్షమూ వహించటం లేదన్న ఒక్క సానుకూల అంశం తప్ప సయోధ్య కుదుర్చటం, కుదరటం అన్నది అంత తేలిక కాదు. ఆఫ్రికా సమస్యలను ఆఫ్రికాయే పరిష్కరించుకోవాలి అన్న ఆఫ్రికా యూనియన్‌ వైఖరిని గౌరవిస్తున్న చైనా ఏ దేశ వివాదంలోనూ ఒక పక్షం వైపు మొగ్గలేదు.


ఆఫ్రికాలో పశ్చిమ దేశాల భూ సంబంధ రాజకీయాలకు బలైన దేశాల్లో సూడాన్‌ ఒకటి. బ్రిటీష్‌ వలస పాలన నుంచి 1956లో విముక్తి పొందిన తరువాత అక్కడ శాంతి లేదు. అంతకు ముందు ఈజిప్టు ఆక్రమణలో తరువాత బ్రిటీష్‌ ఏలుబడిలో ఉన్నపుడు దక్షిణ, ఉత్తర సూడాన్‌ ప్రాంతాలుగా ఉంది. బ్రిటీష్‌ వారు వైదొలుగుతూ ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా రెండు ప్రాంతాలను ఒకే దేశంగా చేశారు. అప్పటి నుంచి దక్షిణ సూడాన్‌ పౌరులు ప్రభుత్వంలో తమ ప్రాతినిధ్యం పెరగాలని, తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. నిరాకరించటంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. మధ్యలో పది సంవత్సరాలు తప్ప 1956 నుంచి 2005వరకు అది కొనసాగి ఐదు నుంచి పదిలక్షల మంది ప్రాణాలు తీసుకుంది. 2011లో దక్షిణ సూడాన్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. అవిభక్త సూడాన్‌లో, తరువాత పదకొండు మిలిటరీ కుట్రలు, తిరుగుబాట్లు జరిగాయి. అంతర్యుద్ధంలో పాలకులు కిరాయి మూకలను సమీకరించి డార్ఫర్‌, ఇతర ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాన్ని అణచివేశారు. తరువాత వాటిని 2013లో పారామిలిటరీగా మార్చారు. ఇటీవలి అధికార పంపిణీలో మిలిటరీ నేత, పారామిలిటరీ నేతలు ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు అధికార వ్యవస్థను ఆక్రమించారు. పారామిలిటరీని మిలిటరీలో ఎప్పుడు విలీనం కావించాలన్న అంశంపై ఒప్పందానికి భిన్న భాష్యాలు చెప్పి అధికారం కోసం జరిగిన కుమ్ములాటల కారణంగా రెండింటి మధ్య అంతర్యుద్ధం మొదలైంది. జనం నలిగిపోతున్నారు. అణచివేతలో ఇద్దరూ ఇద్దరే.


సూడాన్‌లో వర్తమాన పరిణామాలను చూస్తే ఏడు లక్షల మంది పౌరులు నిర్వాసితులైనట్లు ఐరాస సంస్థ వెల్లడించింది. రాజధాని ఖార్టూమ్‌ పరిసర ప్రాంతాల మీద విమానదాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలన్నీ ఖాళీగా ఉన్నాయి.మరోవైపు అమెరికా-సౌదీ ప్రతిపాదన మేరకు సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో మిలిటరీ-పారా మిలిటరీ ప్రతినిధుల మధ్య తొలిసారిగా ముఖాముఖీ కాల్పుల విరమణ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సూడాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఆకలి కేకలు ప్రారంభమైనట్లు వార్తలు. బాంకులు, ఏటిఎంలు పని చేయటం లేదు.చమురు కొరత, ధరల పెరుగుదలతో జనం సతమతమౌతున్నారు.రాజధానిలో ఎక్కువ ప్రాంతాలు పారా మిలిటరీ ఆధీనంలో ఉన్నాయి. వారిని దెబ్బతీసేందుకు మిలిటరీ వైమానిక దాడులు జరుపుతున్నది. రాజధానిలో కాల్పుల విరమణకు పారామిలిటరీ(ఆర్‌ఎస్‌ఎఫ్‌) అంగీకరించకుండా ఒప్పందం కుదిరే అవకాశం లేదని మిలిటరీ అధికారి అల్‌ బుర్హాన్‌ చెప్పాడు.ఆర్‌ఎస్‌ఎఫ్‌ పౌరులను రక్షణగా చేసుకుందని, సేవా కేంద్రాలను ఆక్రమించిందని ఆరోపించారు. విమానాలను కూల్చివేసేందుకు పారా మిలిటరీ క్షిపణులను సంధిస్తున్నట్లు వార్తలు.


చైనా నిజంగా సూడాన్‌లో రాజీ కుదుర్చుతుందా లేదా అన్నది అనేక అంశాల మీద ఆధారపడి ఉంది. సంక్లిష్టత రీత్యా అంత తేలికగాకపోవచ్చు. సూడాన్‌ పరిణామాలను గమనించినపుడు అక్కడ భద్రతా దళాల మధ్య హింసాకాండ ప్రబలటమే అమెరికా పెత్తనం దిగజారుడుకు ఒక నిదర్శనం అని, అది ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో భాగమే అని కొందరు చెబుతున్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లుగా అమెరికా, దాని అనుచరులుగా ఉన్న ఇతర పశ్చిమ దేశాల ప్రమేయం లేకుండా ప్రపంచంలో ఏదీ జరగదని బలంగా ఉన్న నమ్మకం సడలుతున్నది. ఈ దేశాల నేతలు ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటం, అవి పెద్దన్న అమెరికా ప్రమేయం లేకుండా జరగటం పెద్ద చర్చగా మారింది. ఇరాక్‌ మీద దాడి చేసి అమెరికా చేతులు కాల్చుకుంది. ఇప్పుడు అక్కడ అమెరికా పలుకుబడి ఎంత అన్నది ప్రశ్నార్ధకం. తరువాత ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అవమానకరంగా తాలిబాన్లకు సలాం కొట్టి బతుకుజీవుడా అంటూ ఎక్కడి ఆయుధాలను అక్కడే వదలి కట్టుబట్టలతో అమెరికా మిలిటరీ పారిపోవటం తెలిసిందే.అది శిక్షణ ఇచ్చిన మిలిటరీ కూడా అమెరికాను ఆదుకోలేకపోయింది. దీని అర్ధం అమెరికా కథ ముగిసినట్లు కాదు.


రెండు ప్రపంచ యుద్ధాల్లో మిగతా దేశాలతో పోల్చితే అమెరికా లాభపడింది తప్ప నష్టపోయింది లేదు.తిరుగులేని మిలిటరీ, ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఐరోపా పునరుద్దరణ పేరుతో 13 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టి నాటో మిలిటరీ కూటమి పేరుతో ఐరోపాను తన చక్రబంధంలో బిగించుకుంది. ఇతర ఖండాలను కూడా తన కౌగిలిలోకి తెచ్చుకొనేందుకుగాను 80 దేశాలలో 800 మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది.అట్లాంటిక్‌ సముద్రంలో ఆరవ నౌకాదళాన్ని, పసిఫిక్‌ – హిందూ మహా సముద్రంలో సప్తమ నౌకాదళం, పర్షియన్‌ గల్ఫ్‌Ûలో పంచమ నౌకదళాన్ని మోహరించింది. అంటే అన్ని ఖండాల చుట్టూ త్రివిధ దళాలను మోహరించింది. దానికి గాను రకరకాల సాకులు చెబుతున్నది. ఇదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే కమ్యూనిజం, దానికి ఆలవాలంగా ఉన్న పూర్వపు సోవియట్‌ , వర్తమాన సోషలిస్టు చైనా, ఇతర సోషలిస్టు దేశాల పలుకుబడిని నిరోధించేందుకు అని ప్రపంచాన్ని నమ్మించింది. ఇంతటి శక్తి కలిగి ఉండి కూడా 1960,70 దశకాల్లో వియత్నాం కమ్యూనిస్టు మిలిటరీ, గెరిల్లాల చేతుల్లో చావుదెబ్బతిన్నది. ఆప్ఘనిస్తాన్‌లో తాను పెంచి పోషించిన తాలిబాన్ల చేతుల్లో అవమానాలపాలైంది. ఇప్పుడు ఉక్రెయిన్లో అక్కడి మిలిటరీ, కిరాయి మూకలకు ఆయుధాలు అందిస్తూ పరోక్షంగా పోరు సాగిస్తున్నది. అదే చైనాను చూస్తే ఆఫ్రికాలోని జిబౌటీలో అనేక దేశాలతో పాటు తాను కూడా ఒక సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇదిగాక మయన్మార్‌ బంగాళాఖాతంలోని కోకో దీవుల్లో, సంకేతాలను పసిగట్టే ఒక కేంద్రాన్ని, తూర్పు తజికిస్తాన్‌, లావోస్‌, దక్షిణ చైనా సముద్రంలో ఒక ఆరు చిన్న మిలిటరీ పోస్టులను ఏర్పాటు చేసింది. అమెరికా తన మిలిటరీని చూపి ప్రపంచాన్ని భయపెడుతుంటే చైనా తన దగ్గర ఉన్న మిగులు డాలర్లను ప్రపంచంలో వివిధ దేశాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర పధకాల మీద ఖర్చు పెడుతున్నది, రుణాలు ఇస్తున్నది.


ఆర్థిక, మిలిటరీ, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎంతో ముందున్న తమ దేశం క్రమంగా తన పలుకుబడిని ఎందుకు కోల్పోతున్నదనే చర్చ అటు అమెరికాలోనూ ఇటు ప్రపంచంలోనూ రోజు రోజుకూ బలపడుతున్నది.సోవియట్‌ కూలిపోయి, కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గగానే చరిత్ర ముగిసింది, పెట్లుబడిదారీ విధాన ప్రవాహానికి ఎదురు లేదు, ప్రచ్చన్న యుద్ధంలో తమదే గెలుపు అని అమెరికా ప్రకటించుకున్న తరువాత గడచిన మూడు దశాబ్దాల్లో చరిత్ర వేరే విధంగా నమోదౌతున్నది.అమెరికా విధాన నిర్ణేతలు, వ్యూహకర్తలు కలలో కూడా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అమెరికా ఆటకు అనుగుణంగా చైనా నడుచుకుంటుందని భావించి 1970దశకంలో దాన్ని అసలైన చైనాగా గుర్తించారు. తరువాత 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థలోకి అనుమతించారు. అప్పుడు చైనా విదేశీమారకద్రవ్య నిల్వలు కేవలం 200 బి.డాలర్లు మాత్రమే, అవి 2023 జనవరి నాటికి 3,379 బి.డాలర్లకు చేరాయి. ఇంత భారీ మొత్తం ఉంది కనుకనే అనేక దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు అవకాశం వచ్చింది. వాటి కోసం మొహం వాచి ఉన్న దేశాలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. వందల కోట్ల డాలర్లను పెట్టుబడులు, అప్పుగా తీసుకుంటున్నాయి. ఎక్కడా మిలిటరీ కేంద్రాలను పెట్టటం లేదు గనుక దాని మీద అనుమానాలు కూడా లేవు. ఇస్లామిక్‌ దేశాల మధ్య షియా-సున్నీ విబేధాలను అన్ని దేశాలను తన అదుపులో ఉంచుకోవాలని చూసింది. చివరికి దానికి కూడా తెరపడింది. షియా ఇరాన్‌-సున్నీ సౌదీ అరేబియాలను చైనా దగ్గరకు చేర్చింది. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణలకు తెరపడేందుకు ఆ ఒప్పందం దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ప్రాంతీయ, దేశాల అంతర్గత వివాదాలకు దూరంగా ఉండటమే చైనా పలుకుబడిని పెంచుతున్నవాటిలో ఒకటి.


నాటోలో భాగంగా అమెరికాతో స్నేహం చేస్తూనే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ ఇటీవలి బీజింగ్‌ పర్యటనలో మాట్లాడిన తీరు అమెరికాను బిత్తరపోయేట్లు చేసింది. తన వెనుక ఉన్న వారు ఎప్పుడేం చేస్తారో అన్న అనుమానాలను పెంచింది. తైవాన్‌ అంశంపై అమెరికా బాటలో నడిచేది లేదని, చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్య కలిగి ఉంటామని మక్రాన్‌ చెప్పాడు. వందల కోట్ల లాభదాయక ఒప్పందాలను ఫ్రెంచి కంపెనీలకు సాధించటంలో మక్రాన్‌ చొరవ చూపాడు. ఒక్క ఫ్రాన్సే కాదు జర్మనీ వైఖరి కూడా అలానే ఉంది.డాలరు పెత్తనానికి తెరదించాలన్న అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతున్నది. నిజానికి అనేక దేశాల మీద ఆంక్షలు విధిస్తూ అమెరికా దాన్ని ముమ్మరం చేస్తున్నది. మొత్తం మీద చూసినపుడు నూతన ప్రపంచ వ్యవస్థ రూపుదిద్దు కుంటున్నది. అది అమెరికా-పశ్చిమ దేశాల కేంద్రంగా జరగటం లేదు. ఏక ధృవ కేంద్రానికి బదులు రెండు లేదా అంతకు మించి ఎక్కువ అధికార కేంద్రాలున్నపుడు దేశాలకు ఎంచుకొనే అవకాశాలు పెరుగుతాయి.


” సాయుధ వివాదాన్ని మరింతగా కొనసాగించటంలో రెండు శక్తులకు పరస్పర ప్రయోజనం ఉంది, దీన్ని సాకుగా చూపి పౌరశక్తులకు అధికారాన్ని బదలాయించకుండా చూస్తున్నాయని ” సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి సాలె మహమ్మద్‌ సూడాన్‌ పరిణామాలపై చెప్పారు.ఈ వివాదంలో ఆర్‌ఎస్‌ఎఫ్‌కు మద్దతు ఇవ్వటం ద్వారా ఎఫ్‌ఎఫ్‌సి కూటమి తన విశ్వసనీయతను కోల్పోయిందని గతంలో ఆ సంస్థలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉండి తరువాత వెలుపలికి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విప్లవ కార్యాచరణకు తిరిగి ఉపక్రమించటం, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచటం తప్ప మరొక మార్గం లేదని కూడా పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెల్ల బంగారం లిథియంపై బహుళజాతి గుత్త కంపెనీల కన్ను !

03 Wednesday May 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Environment, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Australia, Chile, China, Lithium, Multinationals, white gold Lithium


ఎం కోటేశ్వరరావు
పెట్టుబడిదారులు తమకు ఏది లాభసాటిగా ఉంటే దానికోసం ఎంతకైనా తెగిస్తారన్నది చరిత్ర చెప్పిన సత్యం.కొలంబస్‌ అమెరికాను కనుగొనటంలోనే అది తొలిసారిగా స్పష్టమైంది. ఆ పరంపరలో ఓడలు, సముద్ర మార్గాలు,దేశాల ఆక్రమణ, వలసపాలన, ముడి చమురు, విలువైన ఖనిజ సంపదలను ఆక్రమించుకొనేందుకు, వాటినుంచి లాభాలను పిండుకొనేందుకు జరిపిన దాడులు, యుద్ధాల చరిత్ర తెలిసింది. ఆ జాబితాలో ఇప్పుడు తెల్లబంగారంగా భావిస్తున్న లిథియం అనే ఖనిజం చేరనుందా ? రానున్న రోజుల్లో చమురుతో పాటు అది కూడా ప్రాధాన్యత సంతరించుకోనుంది. కాలుష్య ఉద్గారాలను 2050నాటికి సున్నా స్థాయికి తగ్గించే విధంగా శుద్దమైన ఇంథనాన్ని ఉత్పత్తి చేయాలనేది ఒక లక్ష్యం.తద్వారా పర్యావరణాన్ని రక్షించేందుకు పూనుకోవాలని ప్రపంచం చూస్తోంది.దీనికి గాను వాహన రంగంలో రెండువందల కోట్ల ఎలక్ట్రిక్‌ లేదా ఎలక్ట్రిక్‌తో పాటు అవసరమైతే చమురు ఇంథనాన్ని వినియోగించే వాహనాలను తయారు చేయాల్సి ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైది పెద్ద మొత్తంలో విద్యుత్‌ నిలువ చేయగలిగిన బ్యాటరీలు.వాటికి అవసరమైనది లిథియం. ఇప్పటివరకు కనుగొన్నమేరకు ఆ ఖనిజ నిల్వలు 250 కోట్ల బ్యాటరీల తయారీకి మాత్రమే సరిపోతాయట. సముద్రాల్లో , రాతి శిలల ప్రాంతాల్లో కూడా ఇది భారీగా దొరుకుతుంది.


ఈ పూర్వరంగంలో ఎంతో విలువైన లిథియం నిల్వలను కొత్తగా కనుగొనేందుకు, ఉన్న వాటిని తమ స్వంతం చేసుకొనేందుకు బహుళజాతి గుత్త కంపెనీలు చూస్తున్నాయి. వాటికి అమెరికా, ఇతర ధనిక దేశాలు తమ పలుకుబడి, అధికారాన్ని ఉపయోగించేందుకు పూనుకున్నాయి. షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా అందుకోసం కుట్రలు ఉంటాయని చెప్పనవసరం లేదు. బహుళజాతి కంపెనీల కోసం పని చేసే పత్రికల్లో ఒకటైన టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ చివరి వారంలో ” లిథియం కోసం ఒకవేళ దక్షిణ అమెరికా ఒక ఓపెక్‌ను ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది ” అంటూ ఒక విశ్లేషణా హెచ్చరికను ప్రచురించింది. ఒపెక్‌ అంటే చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల సంస్థ. అలాంటి దానినే లిథియం ఖనిజానికీ ఏర్పాటు చేస్తే అనేది దాని భయం. ప్రపంచంలో 2020 నాటికి కనుగొన్న మేరకు ఉన్న నిల్వలు రెండు కోట్ల పదిలక్షల టన్నులు. ఈ మొత్తంలో ఒక్క చిలీలోనే 92లక్షల టన్నులు ఉంది. తరువాత మన దేశంలోని జమ్మూ-కాశ్మీరు ప్రాంతంలో 59లక్షల టన్నులు, ఆస్ట్రేలియా 47, అర్జెంటీనా 19, చైనా 15, అమెరికాలో 7.5, కెనడాలో 5.3లక్షల టన్నుల నిల్వలున్నాయి. వీటి నుంచి 82వేల టన్నులు అదే ఏడాది వెలికి తీయగా ఒక్క ఆస్ట్రేలియాలోనే 40,చిలీ 18, చైనా 14, అర్జెంటీనా 6.2 వేల టన్నులు వెలికి తీశారు.మరుసటి ఏడాది లక్ష టన్నులకు పెరిగింది.దీనిలో అమెరికా వాటా కేవలం ఒక్కశాతమే ఉంది.


గతంలో గ్లాసును కరిగించే ఉష్టోగ్రతలను తగ్గించేందుకు, అల్యూమినియం ఆక్సైడ్‌ కరిగింపు,సిరామిక్స్‌ వంటివాటిలో లిథియంను వాడేవారు. రెండువేల సంవత్సరం తరువాత బ్యాటరీల తయారీకి ఉపయోగించటంతో దాని డిమాండ్‌ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడది భౌగోళిక రాజకీయాలనే ప్రభావితం చేసేదిగా మారుతోందంటే అతిశయోక్తి కాదు.2020లో ప్రపంచమంతటా 30లక్షల విద్యుత్‌ వాహనాలను కొనుగోలు చేస్తే మరుసటి ఏడాదికి 66లక్షలకు పెరిగాయి.మార్కెట్‌లో వీటి వాటా 9శాతం.రానున్న పది సంవత్సరాల్లో పెట్రోలు, డీజిలు మోటారు వాహనాల కొనుగోలును క్రమంగా తగ్గిస్తామని అనేక దేశాల ప్రభుత్వాలు ప్రకటించాయి. చమురు ధరలు పెరగటంతో సాధారణ పౌరులు కూడా వాటివైపే మొగ్గుతున్నారు. మోటారు వాహనాలు, ఇతర రంగాల్లో చిప్స్‌ ప్రాధాన్యత ఎలా పెరిగిందో లిథియ బ్యాటరీలు కూడా అంతే ప్రాధాన్యవహించనున్నాయి. అందుకే ఆరు దశాబ్దాల క్రితం చమురు దేశాలు మార్కెట్‌ను అదుపు చేసేందుకు ఒపెక్‌ సంస్థను ఏర్పాటు చేసినట్లుగా లిథియం ఖనిజం ఉన్న దేశాలు కూడా ఒక్కటైతే అమెరికా,జపాన్‌,ఐరోపాలోని వాహన తయారీ కంపెనీలు విద్యుత్‌ వాహన రంగంలో అడుగుపెట్టాలంటే ఇబ్బందులు తలెత్తుతాయి. టైమ్‌ పత్రిక విశ్లేషణలో వెల్లడించిన భయమదే.


లాటిన్‌ అమెరికా దేశాల్లో లిథియం నిల్వలున్నాయి.పెరూ ఎన్నికల్లో గెలిచిన వామపక్ష నేత పెడ్రో కాస్టిలో ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చివేసి అధికారానికి వచ్చిన అమెరికా అనుకూల ప్రభుత్వం ఏప్రిల్‌ 10న ఒక ప్రకటన చేస్తూ అమెరికా లిథియం కంపెనీ అనుబంధ కెనడా కంపెనీకి లిథియం ఖనిజ గనులను అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. దాన్ని వ్యతిరేకిస్తూ పెరూవియన్లు ఆందోళన చేస్తున్నారు.ప్రభుత్వరంగంలోనే కొనసాగాలని డిమాండ్‌ చేస్తున్నారు.కుట్ర పూరితంగా అధికారానికి వచ్చిన ప్రభుత్వానికి తెలుపుతున్న నిరసనలో భాగంగా ఈ డిమాండ్‌ను కూడా చేర్చారు. కార్పొరేట్ల లాభాలు, ఇతర లబ్ది గురించి చూపుతున్న శ్రద్ద ఆ ప్రాంత పౌరుల పట్ల లేదని, తమ డిమాండ్లను విస్మరిస్తే ఖనిజతవ్వకాలను అనుమతించేది లేదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. ఖనిజమున్న పూనో ప్రాంతంలోని స్థానిక తెగలకు చెందిన మూడువేల మంది ప్రతినిధులు సమావేశమై ఆ ఖనిజం మీద సంపూర్ణ హక్కు తమదేనని, తమ సంక్షేమానికే వనరులను వినియోగించాలని, తమను సంప్రదించకుండా నిర్ణయాలు చేస్తే కుదరదని స్పష్టం చేశారు. ముడిసరకులను ఎగుమతి చేసే ప్రాంతంగా, దేశంగా మారిస్తే సహించేది లేదని పరిశ్రమలను పెట్టి తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.


నిజానికి ఇది ఒక్క పెరూ సమస్యమాత్రమే కాదు, ప్రపంచంలో సహజ సంపదలున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. లిథియంను కార్పొరేట్ల పరం చేసేందుకు పెరూ కుట్రదారులు చూస్తున్నారు, ప్రజల పరం చేయాలని తాను కోరుతున్నట్లు పెడ్రో కాస్టిలో చెప్పారు. దీనిలో భాగంగానే బొలీవియా అధ్యక్షుడు లూయిస్‌ ఆర్సీ లాటిన్‌ అమెరికా లిథియం ఉత్పత్తి, ఎగుమతులకు ఓపెక్‌ మాదిరి సంస్థ ఏర్పాటును ప్రతిపాదించినట్లు చెప్పాడు. అర్జెంటీనా సర్కార్‌ కూడా దీనిపట్ల ఆసక్తి వెల్లడించింది. మెక్సికో, చిలీ అధినేతలు కూడా ఇటీవల లిథియం గనులను జాతీయం చేయాలని ప్రకటించారు. తమ ప్రాంత సంపదలను తమ పౌరుల సంక్షేమానికే అన్న అంశం దీనివెనుక ఉంది. పెరటిగా తోటగా చేసుకొని నిరంకుశ, మిలిటరీ పాలకులను గద్దె మీద కూర్చోపెట్టిన అమెరికా ముడిసరకుల ఎగుమతి ప్రాంతంగా దీన్ని చూసింది తప్ప పరిశ్రమలను వృద్ది చేయలేదు. అనేక దేశాల్లో అధికారానికి వచ్చిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఈ పరిస్థితిని మార్చాలని చూస్తున్నాయి.


టైమ్‌ వంటి కార్పొరేట్‌ మీడియాకు జన ఆకాంక్షలు పట్టవు. కొద్ది రోజుల క్రితం చిలీ ప్రభుత్వం లిథియం గనులను ప్రభుత్వ అదుపులోకి తేవాలని ఒక ప్రణాళికను ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ తవ్వకాలు సాగిస్తున్న రెండు అమెరికన్‌ కంపెనీలను కొన్ని సంవత్సరాల తరువాత అంతిమంగా ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించటం, కొత్తగా జరిపే తవ్వకాలను ఆధునిక పరిజ్ఞానంతో ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంలో చేపట్టాలని ప్రతిపాదించారు. అనేక దేశాల్లో ఈ పాక్షిక జాతీయకరణ ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నారు. చమురు దేశాల్లో ఒపెక్‌ ఏర్పాటును కూడా నాడు బహుళజాతి గుత్త సంస్థలు అంగీకరించలేదు, విఫలం చేసేందుకు చూశారు. మన దేశంతో సహా అనేక దేశాలు చమురు ఉత్పత్తి, మార్కెటింగ్‌ విదేశీ కంపెనీలను జాతీయం చేశారు. ఒపెక్‌ ఇప్పుడు రష్యాతో సహా 40శాతం చమురు సరఫరాను అదుపు చేస్తున్నది.లిథియం అంశంలో కూడా అదే జరిగితే లాభాలు తెచ్చే మరో గంగిగోవు తమకు దక్కదని బహుళజాతి సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.2010లో కేవలం 23,500 టన్నుల డిమాండ్‌ మాత్రమే ఉన్న ఈ ఖనిజం 2030నాటికి 40లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. లాటిన్‌ అమెరికాలోని ఉప్పునీటి కయ్యలలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. అయితే శుద్ధి ఎంతో సంక్లిష్టమైనదిగా, ఖర్చుతో కూడినదిగా మారటంతో అనేక దేశాల్లో వినియోగంలోకి రాలేదు. లాటిన్‌ అమెరికా దేశాలకు పెట్టుబడులు సమస్య కూడా ఉంది. సంయుక్తరంగంలో తామెందుకు పెట్టుబడులు పెట్టాలని కార్పొరేట్లు పెదవి విరుస్తున్నాయి. చైనా, ఆస్ట్రేలియాలలో కఠిన శిలలు ఉండే ప్రాంతంలో ఈ నిక్షేపాలు ఉన్నాయి. పాక్షిక జాతీయం, ప్రయివేటు రంగ భాగస్వామ్యం అన్న తమ విధానం పెట్టుబడులకు దోహదం చేస్తుందని చిలీ వామపక్ష అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ చెబుతున్నాడు. పర్యావరణానికి హాని జరగకుండా, కాలుష్యం పెంచని ఆధునిక పరిజ్ఞానంతో పెట్టుబడులు పెట్టే వారికి 49.99 శాతం వాటా ఇస్తామని చెప్పాడు. ఖనిజ తవ్వకం స్థానికులకు, దేశ పౌరులకు లబ్ది కలిగించేదిగా ఉండాలన్నాడు.


1995లో ప్రపంచ లిథియం ఉత్పత్తిలో మూడో వంతు వాటా కలిగి ఉన్న అమెరికా ఇప్పుడు ఒక శాతానికి పడిపోయింది. దాని గనుల్లో ఉన్న నిల్వలు కూడా తగ్గినట్లు చెబుతున్నారు.ఈ ఖనిజానికి డిమాండ్‌ పెరుగుతున్న దశలో తమ ఆటో రంగానికి అవసరమైన దానిని చేజిక్కించుకొనేందుకు అక్కడి కంపెనీలు తప్పకుండా చూస్తాయి.చైనాలో ఉన్న గనులతో పాటు విదేశాల్లో కూడా దాని కంపెనీలకు 5.6బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. బాటరీలకు అవసరమైన ప్రపంచ ముడి ఖనిజంలో 60శాతం మేరకు చైనాలో శుద్ది చేస్తున్నారు. డిమాండ్‌ పెరిగే కొద్దీ చిలీ ప్రపంచ కేంద్రంగా మారే అవకాశం ఉంది. ప్రపంచంలోని లిథియం నిల్వల్లో 60శాతం చిలీ, బొలీవియా, అర్జెంటీనా త్రికోణ ప్రాంతంలో ఉన్నట్లు ప్రపంచ ఆర్థికవేదిక చెబుతున్నది. ఫోన్లు, కార్లకు అవసరమైన బాటరీలకు ఇది అనువుగా ఉండటంతో ఒక దశంలో డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. గతేడాది నవంబరులో టన్ను ధర 14 నుంచి 80వేల డాలర్లకు చేరి తరువాత తగ్గింది. 2040 నాటికి ఇప్పుడున్న డిమాండ్‌ 40 రెట్లు పెరుగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇప్పటికే ప్రయివేటురంగంలో ఉన్న చిలీ అమెరికన్‌ కంపెనీల అనుమతి గడువు 2030లో ముగియనున్నది.దానిని పొడిగిస్తారా లేక సంయుక్త భాగస్వామ్యంలోకి మారుస్తారా అన్న అనుమానాలతో ఆ కంపెనీల వాటాల ధరలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని చిలీ రాగి కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అదే మాదిరి లిథియం కంపెనీని కూడా ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.ఈ పూర్వరంగంలో అది తెచ్చే లాభాల కోసం సామ్రాజ్యవాదులు ఎన్ని కుట్రలకైనా పాల్పడే అవకాశం ఉంది. చిలీ రాగి గనులకూ ప్రసిద్ది అన్నది తెలిసిందే.ప్రపంచంలో అతి పెద్ద పరిశ్రమను అక్కడ 1973లో అధికారానికి వచ్చిన వామపక్ష నేత సాల్వెడార్‌ అలెండీ జాతీయం చేయటాన్ని అమెరికా, కార్పొరేట్‌ సంస్థలు సహించలేక కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మిలిటరీ తిరుగుబాటుతో అలెండీని హత్య చేశారు. ఇప్పుడు లిథియం పాక్షిక జాతీయకరణ నిర్ణయం నాటి పరిణామాలను గుర్తుకు తెచ్చిందని కొందరు పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!
  • గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!
  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d