• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !

18 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Hormuz mission, Narendra Modi Failures, NATO allies, Netanyahu, US attack Iran, Vladimir Putin

ఎం. కోటేశ్వరరావు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ ప్రారంభించిన దాడులు మంగళవారం నాడు పద్దెనిమిదవ రోజులో ప్రవేశించాయి. వాటికి దీటుగా టెహ్రాన్‌ కూడా ప్రతి దాడులతో బెంబేలెత్తిస్తున్నది. హార్ముజ్‌ జలసంధి ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి నౌకలకు రక్షణ కల్పించాలన్న ట్రంప్‌ కోరికను ఏ ఒక్క మిత్ర దేశం కూడా అంగీకరించలేదు. ఇది తమ యుద్ధం కాదని బయటకు చెప్పకుండానే ముఖం చాటేస్తుండటంతో ట్రంప్‌కు దిక్కుతోచక పిచ్చి ప్రేలాపనలకు దిగాడు. అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుంచీ కొంత మంది అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌ పక్షాన చైనా, రష్యా ఎందుకు దాడుల్లో పాల్గ్గొనటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా తమతో కలసి దాడులకు పూనుకోవటంలేదని డోనాల్డ్‌ ట్రంప్‌ తన మిత్ర దేశాల మీద తిట్ల పురాణం ప్రారంభించాడు. చివరికి చైనా గనుక హార్ముజ్‌ జలసంధికి యుద్ధ నౌకలను పంపి ఇరాన్‌ను కట్టడి చేయకపోతే ఈ నెలాఖరులో బీజింగ్‌ పర్యటనను వాయిదా వేసుకుంటానని చైనాను కూడా బెదిరించాడు. మాకేం తొందరలేదు, వస్తే రా, లేకపోతే లేదు నీ ఇష్టం అన్నట్లుగా చైనా ఉంది. నాటోలో ఉన్న దేశాలే కాదు, ఇరాన్‌ దాడులకు గురవుతున్న గల్ఫ్‌ దేశాలు కూడా యుద్ధంలో దిగేందుకు అంగీకరించటం లేదు.

ఇరాన్‌పై దాడులు ఎప్పుడు ముగుస్తాయన్నది మరొక ప్రశ్న. ప్రారంభించిన అమెరికాకే దిక్కు తోచటం లేదు. ఇరాన్‌ వైపు నుంచి ఇలాంటి ప్రతిఘటన ఉంటుందని తనకెవరూ చెప్పలేదని, నెపాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా సలహాదారులు, నిఘా యంత్రాంగం మీద నెట్టేందుకు పూనుకున్నాడు. అయితే అలాంటిదేం లేదు, ముందుగానే ట్రంప్‌కు హెచ్చరికలు అందాయని వార్తలు. ఒకవైపు ఇరాన్‌లో వేలాది కేంద్రాలపై దాడులు చేశామని, దాని మిలిటరీ నడ్డి విరిచామని రోజూ డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతుంటాడు. అదే నిజమైతే జరుగుతున్న క్షిపణి దాడుల సంగతేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారు లేరు. మొత్తంగా నాశనం చేశావని ఎలాగూ చెప్పావు కదా. ఇంక చేయాల్సిందేమీ లేదని గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించవచ్చు కదా అని ట్రంప్‌ మిత్రుడే బహిరంగంగా చెప్పిన తరువాత కూడా అలాంటి చర్యకు పూనుకోలేదు. ఎవరికైనా మదం తలకెక్కినపుడు హితవచనాలు రుచించవు. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గ్గొనే ఉద్దేశం తమకు లేదని జర్మనీ పేర్కొన్నది. హార్ముజ్‌ జలసంధిలో నౌకల రక్షణకు మిలటరీని పంపాలనే కోరిక తమకు లేదని స్పష్టం చేసింది. ఆసియాలో అమెరికా అనుయాయి దేశం దక్షిణ కొరియా, అక్కడ అమెరికాకు తొమ్మిది మిలిటరీ కేంద్రాలు, వాటిలో అన్ని దళాలకు చెందిన 25 వేల మంది సైనికులు ఉన్నారు. తాము కూడా హార్ముజ్‌కు నౌకాదళాన్ని పంపటం లేదని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. తమ దేశంలో నిల్వ ఉంచిన ఆయుధాలను పశ్చిమాసియాకు తరలించారని, దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర కొరియా దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటని కొద్ది రోజుల క్రితం దక్షిణ కొరియా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంధన ఉత్పత్తుల ఎగుమతులపై పరిమితులు విధించనున్నట్లు చెప్పాడు. నౌకలను పంపే అంశం పరిశీలనలో లేదని జపాన్‌ ప్రధాని తకాయిచి పార్లమెంటులో చెప్పారు. ఆస్ట్రేలియా కూడా అదే బాటలో ఉంది. ఐరోపా యూనియన్‌ విదేశాంగ మంత్రి కాజా కలాస్‌ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న చర్యలను మార్చాలనే కోరిక ఇప్పటికైతే తమకు లేదని చెప్పాడు. బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ కూడా తమ దేశం విస్తృత యుద్ధంలోకి రాదని అన్నాడు.

ఇలావుండగా…యుద్ధ లక్ష్యాల గురించి ట్రంప్‌ మాట మార్చాడు. తాము ముడి చమురు కోసం ఇరాన్‌ మీద దాడి చేయలేదని ట్రంప్‌ చెప్పుకున్నాడు. హార్ముజ్‌ జలసంధిలో నౌకలు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా తమ మిత్ర దేశాల కోసమే దాడి చేసినట్లు మాట మార్చాడు. అందుకుగాను ఆ ప్రాంతంలో రక్షణ కోసం చైనా, జపాన్‌ వంటి దేశాలు యుద్ధ నౌకలను పంపాలని అన్నాడు. తమకు చమురు అవసరం లేదని, కావాల్సిన దానికంటే రెండింతల ఎక్కువ ఉందని, మా మంచి మిత్రుల కోసమే దాడి చేశామని అన్నాడు. నిజానికి ఇతర దేశాలను రక్షించాలని తప్ప మా కోసం దాడులు చేయటం లేదన్నాడు. తమ మిత్ర దేశాలు ముఖ్యంగా నాటో దేశాల వైఖరి ఆశాభంగం కలిగించిందని ట్రంప్‌ చెప్పాడు. మేం మాత్రం వారికోసం ఎల్లవేళలా ఉండాలి, కాని వారు మాత్రం మాకోసం రారు అంటూ బి-2 స్పిరిట్‌ బాంబరు బొమ్మను చూపుతూ హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు మాకు ఎవరి అవసరమూ లేదని ఊగిపోయాడు. తమకు సహకరించకపోతే నాటోకు రానున్నది చెడు కాలమన్నాడు.

ఇరాన్‌పై దాడులను ప్రారంభించినప్పటి నుంచి గల్ఫ్‌, ఇతర దేశాలను యుద్ధంలోకి లాగాలని అమెరికా తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్‌ వైపు నుంచి క్షిపణుల వర్షం కురుస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా దాడులకు గల్ఫ్‌ దేశాలు పూనుకోలేదు. అమెరికాను నమ్మి నిజంగా తమ దళాలను రంగంలోకి దింపితే తలెత్తే పర్యవసానాల గురించి పైకి చెప్పుకోవటం లేదుగానీ అవి తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. పొద్దున లేస్తే ఇరాన్‌తో ముఖాముఖాలు చూసుకోవాల్సింది తామని…ఈ రోజు అమెరికా ఉంటుంది, రేపు వెళ్లిపోతుంది. తాము శాశ్వతంగా బలమైన ఇరాన్‌తో వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. తప్పనిసరై అమెరికా స్థావరాలు ఉన్న కారణంగా కొన్ని ఆయుధాలను గల్ఫ్‌ దేశాల మీద ప్రయోగించాల్సి వస్తోంది తప్ప తమ కేంద్రీకరణ అంతా ఇజ్రాయిల్‌ మీదనే అని తాజాగా ఇరాన్‌ ప్రకటించింది. అమెరికా యుద్ధ స్థావరాలున్న గల్ఫ్‌ దేశాల మీద దాడి చేస్తే అవి అమెరికాకు వ్యతిరేకంగా వ్యహరించాలనే ఎత్తుగడ ఉందని బహిరంగంగానే చెబుతున్నారు.

తాజా పరిణామాల్లో మరో ముఖ్యాంశం ఏమంటే ఇరాన్‌పై అమెరికా దాడి రష్యాకు పెట్రో డాలర్లను కురిపిస్తోంది. ట్రంప్‌ అనుకున్నదొకటి అవుతున్నది ఒకటి. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు కొనుగోలు చేయవచ్చని అన్ని దేశాలకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. నరేంద్రమోడీ సైతం ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఏ మాత్రం పసిగట్టినా ట్రంప్‌ బెదిరించగానే రష్యా నుంచి చమురు కొనుగోలును సగానికి సగం తగ్గించి ఉండేవారు కాదు. ఇప్పుడు పరువూ పోయింది. రష్యా నుంచి వచ్చే రాయితీ కూడా లేదని చెబుతున్నారు. చమురుపై ఆంక్షలతో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తామని బహిరంగంగానే ప్రకటించారు. అయినప్పటికీ నాలుగేళ్లుగా కొంత ఇబ్బంది పడినప్పటికీ భారత్‌ చైనా కొనుగోళ్లతో నిలిచింది. ఇటీవల ట్రంప్‌ బెదిరించటంతో మన దేశం సగానికి కొనుగోళ్లను తగ్గించింది. హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనంతో అనేక దేశాల నుంచి ఒత్తిడి పెరగటంతో రష్యా చమురు కొనుగోలుకు అమెరికా ”అనుమతి” ఇచ్చింది. దీంతో ప్రస్తుతం రోజుకు 15 కోట్ల డాలర్ల మేర పుతిన్‌ సర్కార్‌కు రాబడి వస్తోంది.
పన్నెండు రోజుల తరువాత బ్రిక్స్‌ కూటమి అధ్యక్ష స్థానం (భారత్‌)…ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఖండించింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్‌ నేతలతో మాట్లాడారు. ఆ తరువాతే మన దేశానికి ఎల్‌పిజి ని తీసుకువచ్చే మూడు ట్యాంకర్లను సురక్షితంగా హార్ముజ్‌ జలసంధి నుంచి ఇరాన్‌ అనుమతించింది. మన దేశంపై వచ్చిన ఒత్తిడి, వంట గ్యాస్‌ సెగ తగిలిన తరువాతగాని మన నేతలకు తత్వం తలకెక్కలేదని చెప్పవచ్చు!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !

11 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

#China arms to Iran, BJP, China, China Arms, Donald trump, Narendra Modi Failures, US attack Iran, West Asia Crisis, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

త్వరలో ఇరాన్‌పై యుద్ధం ముగుస్తుందని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అది నిజమో కాదో ఎత్తుగడో తెలియదు. సోమవారం నాడు 116 డాలర్లకు పెరిగిన బ్రెంట్‌ రకం ముడి చమురు ధర బుధవారం నాడు ఇది రాసిన సమయానికి 87 డాలర్లకు తగ్గింది.. ఇదే విధంగా మన స్టాక్‌ మార్కెట్‌లో సోమవారం నాడు రెండున్నరవేల పాయింట్ల వరకు పతనమైన సూచి మంగళవారం నాడు ఆరువందల పాయింట్లు పెరిగింది.ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.యుద్ధ ప్రభావం మన మీద పడుతున్నది.పెట్రోలు, డీజిలు కొరత లేదు గానీ వంటగ్యాస్‌ మండుతున్నది.ఇది ఒక అంశం. ఇరాన్‌పై జరిగిన దాడి సందర్భంగా కొంత మంది చైనా ఆయుధాల పనితీరు గురించి చర్చ చేస్తున్నారు. పాకిస్తాన్‌, వెనెజులా తరువాత ఇరాన్‌లో కూడా అవి తుస్సుమన్నాయని చెబుతున్నారు.ఇరాన్‌ దగ్గర ఆయుధ నిల్వలు తగ్గిపోయినట్లు , రోజూ ప్రయోగించే క్షిపణుల సంఖ్య పడిపోయినట్లు మరికొన్ని కథనాలు.మరోవైపున దాని క్షిపణి ప్రయోగ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశామని అమెరికా చెబుతోంది.ఇంకో వైపున రోజూ క్షిపణి దాడుల వార్తలు తెలిసిందే. యుద్ధ సమయాల్లో ఇలాంటి పరస్పర విరుద్ధ ప్రచారాలు సహజమే.

ఇరాన్‌కు మిత్రదేశాలు అని చెబుతున్న చైనా, రష్యా దాని తరఫున యుద్దంలోకి ఎందుకు దిగటం లేదు అని కొందరు తెలివిగా ప్రశ్నిస్తున్నామనుకుంటున్నారు. అమెరికా దాడిని అవి రెండూ ఖండించాయి.మనమూ యుద్ధంలోని మూడు దేశాలకూ మిత్రులమే కదా మనమెందుకు యుద్ధంలో అడుగుపెట్టలేదని మోడీని ఎవరైనా ప్రశిస్తున్నారా ? కనీసం ఇరాన్‌తో మాట్లాడను కూడా మాట్లాడలేదే !.అనేక పశ్చిమ దేశాలు అమెరికాకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి, అవి కూడా తమ మిలిటరీలను దించలేదు. అమెరికా మిలిటరీ స్థావరాలను అనుమతించిన కారణంగా గల్ఫ్‌దేశాల మీద ఇరాన్‌ దాడులు జరుపుతున్నది.ప్రత్యక్ష బాధితులైన ఆ దేశాలు కూడా యుద్దాన్ని ఎందుకు ప్రకటించటం లేదు. వాటి రక్షణకు అమెరికా చేస్తున్నదేమిటి ? చెప్పేవాడు లోకువ అయితే అడిగేవాడు రెచ్చిపోతుంటాడు.

కొందరు విశ్లేషకులు చెబుతున్నదేమిటి ? తాజా యుద్ధంతో ప్రధానంగా నష్టపోయేది చైనా.హార్ముజ్‌ జలసంధి దిగ్బంధనంతో చమురు సరఫరా నిలిచిపోతుంది.ఇరాన్‌లో దాని పెట్టుబడులకు దెబ్బతగులుతుంది. దాని ఆయుధాలు పనికిరావని తేలినందున కొనేవారు ఉండరు.అసలు ఇరాన్‌కు చైనా ఇచ్చిన ఆయుధాల గురించి ఊహాగానాలు తప్ప నిజానిజాలను నిర్ధారణగా చెప్పటం లేదు. చైనా ఆయుధాల గురించి చెబుతున్నవి వాస్తవం కాదు అని చెబుతున్నవారూ ఉన్నారు. విమానదాడుల నుంచి రక్షణకు జనవరిలో చైనా రాడార్లను భారీ విమానంలో పంపిందన్నది ఒక వార్త. రాడార్లు పెద్దవిగా ఉన్నందున ఉపగ్రహాల నిఘా నుంచి వాటిని దాచటం కష్టం. గతంలో చైనా ఆయుధాలను సరఫరా చేసింది. ఐరాస 2007లో చేసిన తీర్మానం తరువాత వాణిజ్యం నిలిచిపోయింది. అంతకు ముందుకుదిరిన ఒప్పందాల ప్రకారం 2015వరకు సరఫరాలు కొనసాగాయి. ఇరాన్‌ తయారు చేస్తున్న షాహేద్‌ డ్రోన్ల గురించి 2022 దర్యాప్తులో తేలిన అంశం ఏమంటే 80శాతం భాగాలు పశ్చిమదేశాలు అడ్డదారుల్లో అందించినవే.ఓల్టేజ్‌ కన్వర్టర్లు, ఇంజన్లు మాత్రం చైనావని చెప్పారు. ఇతర దేశాల డ్రోన్లు దొరికినపుడు వాటిని పరిశీలించి అదే రకాలను ఇరాన్‌ స్వయంగా తయారు చేస్తున్నది. పశ్చిమాసియా, మధ్య ప్రాచ్యంలోని ఇతర దేశాలతో కూడా చైనాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అవి దెబ్బతినకుండా ఉండాలంటే సమతుల్యత పాటించాలి గనుక యుద్ధ విమానాలు కావాలని ఇరాన్‌ వత్తిడి తెచ్చినప్పటికీ వాటిని సరఫరా చేయలేదు. అయితే చైనా ఏమి సరఫరా చేసింది.2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం భూమి, అంతరిక్షంలో సమాచార సేకరణ కేంద్రాలను ఇరాన్‌లో ఏర్పాటు చేసింది.తరువాత 2021లో కుదిరిన 25 సంవత్సరాల ఒప్పందంలో కూడా వాటిని చేర్చింది.దాంతో బెయిడౌ-3 ఉపగ్రహ సేవలను అందుబాటులోకి తెచ్చింది. గతేడాది అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన 12రోజుల దాడుల సమయంలో ఇరాన్‌లోని జిపిఎస్‌ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఆ యుద్ధం తరువాత జూన్‌ నెలలో పౌర, మిలిటరీ అవసరాలకు బెయిడౌ-3 మీద పూర్తిగా ఆధారపడేందుకు ఇరాన్‌ ఒప్పందం చేసుకుంది. బీజింగ్‌ కేంద్రంగా పని చేస్తున్న మిజరావిషన్‌ అనే ఉపగ్రహ నిఘా కంపెనీ సేవలను కూడా పొందుతున్నది.

తాజా అమెరికా దాడుల సమయంలో ఇజ్రాయెల్‌లోని అవడా విమాన స్థావరంలో ఉంచిన 11 అమెరికా ఎఫ్‌-22 బాంబర్లు, అమెరికా యుద్ద నౌకలు, గగనతలంలోనే ఇంథనం నింపుకొనే విమానాల వంటి వాటి చిత్రాలను, సమాచారాన్ని ఆ సంస్థ ఇరాన్‌కు అందచేయటంతో వాటిని గురిచూసి కొట్టిందని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమాచారం రష్యా కూడా అందచేసి ఉంటుంది. ఈ కారణంగానే ఆ రెండు దేశాలూ సమాచారమిస్తున్నాయని అమెరికా మీడియా రాసింది. ఆధునిక యుద్ధంలో ఆయుధాలతో పాటు శత్రువు కదలికలను పసిగట్టే సమాచారమూ అంతే ముఖ్యమైనది.ఈ రంగంలో అమెరికాకు ధీటుగా చైనా అనేక ఉపగ్రహాలను కలిగి ఉంది. ఉక్రెయిన్‌-రష్యా పోరులో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు అందించిన సమాచారంతోనే ఉక్రెయిన్‌ అనేక దాడులు చేసి రష్యాకు నష్టం కలిగించిన సంగతి తెలిసిందే.అమెరికా బెదిరింపులతో మనదేశం ఇరాన్‌ చమురు కొనుగోలు నిలిపివేసింది. ఇతర దేశాలు కూడా అదే చేశాయి. ఈ పూర్వరంగంలో ఇరాన్‌ చమురు ఎగుమతుల్లో 80శాతం చైనాకే జరుగుతున్నాయి. ఈ మొత్తం చైనా దిగుమతుల్లో 12-15శాతమే. హార్ముజ్‌ జలసంధిని ఇతర దేశాల నౌకలకు మూసివేసినప్పటికీ చైనా వాటిని మినహాయించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన పరిమితంగానే చైనా ప్రభావితం అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి మినహాయింపు మనకు ఇవ్వలేదు, కారణం మనం ఇజ్రాయెల్‌, అమెరికా వైపు మొగ్గటమే అని చెప్పవచ్చు.

రెండు దేశాల మధ్య వివాదం తలెత్తినపుడు ఎవరి బలాన్ని వారు ప్రదర్శిస్తారు. ఎలాంటి క్షిపణి ప్రయోగంలేకుండానే అమెరికా ఎఫ్‌-35 యుద్ధ విమానాలను చైనా దెబ్బతీస్తున్నందంటూ తాజాగా ఒక విశ్లేషణ వెలువడింది.అమెరికాకు పోటీగా చైనా మరో యుద్ధాన్ని ప్రారంభించిందని చెబుతున్నారు. ప్రపంచ బలాబలాలను సమతూకం చేసేందుకు చైనా మార్చినెల ఐదున 15వ పంచవర్ష ప్రణాళికను విడుదల చేసింది. పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం, విలువైన ఖనిజాల రంగంలో పురోగతికి దానిలో ప్రాధాన్యత ఇచ్చారు. అది పైకి ఆర్థిక పరమైనదిగా కనిపిస్తున్నప్పటికీ మిలటరీ లక్ష్యాలు కూడా ఉన్నాయని చడీ చప్పుడు లేకుండా చైనా ముందుకు పోతున్నతీరును ఎవరూ పట్టించుకోవటం లేదంటూ పెట్టుబడుల విశ్లేషకుడు షనాకా అన్సెలెమ్‌ పెరేరా వాపోయాడు. ఐదేండ్ల కాలంలో కృత్రిమ మేథ వినియోగం ద్వారా పరిశ్రమల్లో 1.4లక్షల కోట్ల డాలర్ల మేర అదనపు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా అనేక రంగాల గురించి దానిలో పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో చైనాను అడ్డుకొనేందుకు అమెరికా ఒక ఇనుపతెరను ఏర్పాటు చేసింది.ఫాక్స్‌సిలికా పేరుతో మనతో సహా అనేక దేశాలతో ఒక వ్యవస్థను రూపొందించింది. ఆధునిక చిప్స్‌, వాటి తయారీకి అవసరమైన యంత్రాలను అందకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చైనా రూపొందించిన పంచవర్ష ప్రణాళిక ఒక ఆర్థిక పథకం కాదు, అమెరికాతో యుద్ధ ప్రణాళిక అని పెరేరా పేర్కొన్నాడు. అమెరికా చిప్స్‌ చట్టం ఒక రైఫిల్‌ వంటిది కాగా చైనా పంచవర్ష ప్రణాళిక ఒక అమ్ముల పొది అని వర్ణించాడు.దీనిలో విలువైన ఖనిజాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం ఈ రంగంలో చైనా ప్రపంచంలోనే ఆధిపత్యం వహిస్తున్నది.ఈ ఖనిజాలు విద్యుత్‌ వాహనాల నుంచి లక్ష్యాల మార్గదర్శనం చేసే వ్యవస్థలు, అత్యాధునిక రాడార్ల వరకు ఎంతో ముఖ్యమైనవి. అమెరికా ప్రతి ఎఫ్‌-35 ఆధునిక యుద్ద విమానానికి వందల కిలోల ఖనిజాలు, లోహాలు అవసరం. ఇంజన్లు, సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలు, క్షిపణి బ్యాటరీలు, ఎలక్ట్రానిక్‌ యుద్ధ పరికరాలకు ఇవి లేకుండా పని జరగదు.

చైనా మీద అమెరికా 2018 నుంచి వాణిజ్యంతో పాటు చిప్స్‌ యుద్ధం కూడా చేస్తున్నది.దీనికి ప్రతిగా బీజింగ్‌ నూతన ఎత్తుగడలను రంగంలోకి తెచ్చింది. విలువైన ఖనిజాలు, వాటితో ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడిసరకు ఉత్పత్తిలో నైపుణ్యం సాధించి, ఇతర దేశాలకు అందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది.వీటి దిగుమతులకు సంబంధించిన అమెరికా రక్షణశాఖ చేసుకున్న ఒప్పందాలు 2027లో ముగుస్తాయి.చైనాకు ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే అమెరికాకు సంవత్సరాలు, దశాబ్దం పట్టినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్‌ పోరులో అమెరికా పెద్ద మొత్తంలో విలువైన ఖనిజాలతో కూడిన ఆయుధాలను వినియోగిస్తున్నది. ఇరాన్‌ యుద్ధంలో అమెరికన్లు క్షిపణులు,డ్రోన్లను అడ్డుకొనే ఆయుధాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు, మరోవైపు చైనా వాటి తయారీకి అవసరమైన ఆ ఖనిజాల సరఫరాను కఠినతరం కావిస్తున్నదని పెరేరా వాపోయాడు. తెలివితేటలు అమెరికా సొత్తు కాదు. విలువైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం రానున్న 15 సంవత్సరాలు ఉంటుందని అంచనా. నిజంగానే చైనా తన పట్టు నిలుపు కుంటే అమెరికా ఎఫ్‌-35 విమానాలు ఎగిరే అవకాశాలు లేవని కొందరు వ్యాఖ్యానించారు. అయితే ఇది కాస్త అతిగా ఉన్నప్పటికీ పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నది.

చైనా ఆయుధాల్లో పసలేదని ఒక వైపు ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఆయుధాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో చైనా కూడా అలాంటి ఆధునిక మిలిటరీ ఉత్పత్తులను సేకరించుకోవాలి, కానీ దానికి విరుద్ధంగా గడచిన ఐదు సంవత్సరాల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలను 72శాతం తగ్గించింది. మరోవైపు మనదేశం ప్రపంచంలో సాధారణ పరిస్థితుల్లో ఆయుధాల దిగుమతిలో మొదటి స్థానంలో ఉన్నాం.(యుద్ధంలో ఉంది కనుక ఉక్రెయిన్‌ మనకంటే ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నది) విదేశీ ఆయుధాల స్థానంలో చైనా తన స్వంత ఉత్పత్తులను చేరుస్తున్నది. మరోవైపు చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌లకు ఆధునిక ఆయుధాలను అమెరికా అందచేస్తున్నది, అవసరమైతే తైవాన్‌ విషయంలో నేరుగా జోక్యం చేసుకుంటామని అమెరికా, జపాన్‌ ప్రకటించాయి. నిజంగా తన ఆయుధాలు నాశిరకమైతే చైనా వాటితోఅమెరికాను అడ్డుకోగలదా ! చిత్రం ఏమిటంటే చైనా ఆయుధాలను చూసి ఇరుగు పొరుగు దేశాలు ఆధునిక ఆయుధాలను సమీకరించుకుంటున్నట్లు పశ్చిమదేశాల వ్యాఖ్యాతలు పాటపాడుతుంటారు. స్వీడన్‌లోని స్టాక్‌హౌమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) తాజాగా వివిధ దేశాల ఆయుధాల గురించి ఒక నివేదికను విడుదల చేసింది. ఐరోపా 2021-25 సంవత్సరాలలో 33శాతం, ఆసియా,ఓషియానా దేశాలు 31శాతం ఆయుధాలను దిగుమతి చేసుకున్నాయి.అంతకు ముందు ఐదు సంవత్సరాలతో పోల్చితే ఇరవై శాతం తగ్గాయి. చైనా 72, దక్షిణ కొరియా 54, ఆస్ట్రేలియా 39 శాతం తగ్గించాయి. గతంలో ఆయుధ దిగుమతుల్లో తొలి పది దేశాల్లో ఉన్న చైనా 1991-95 తరువాత ప్రస్తుతం 21వదిగా ఉంది. తన దిగుమతుల్లో రష్యా నుంచి 66శాతం దిగుమతి చేసుకుంటోంది. చైనా సాధించిన ప్రగతి గురించి కొందరు ఉక్రోషంతో తక్కువ చేసి చూడవచ్చు. కానీ విధాన నిర్ణేతలు వాటి ఆధారంగా అంచనా వేసుకుంటే పప్పులో కాలేసినట్లే !అఱa

Share this:

  • Tweet
  • More
Like Loading...

వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

10 Tuesday Mar 2026

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, Donald trump, India-US trade deal, MAGA, Narendra Modi Failures, Russian oil, US attack Iran

ఎం కోటేశ్వరరావు

కేవలం విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటనతో సరిపెడదామని చూసిన పాలక కూటమి యత్నంతో సోమవారం నాడు పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. పశ్చిమాసియాలో పరిస్థితి గురించి ప్రకటన కాదు, చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. గల్ఫ్‌లో చిక్కుకు పోయిన భారతీయుల గురించి ఆందోళన చెందుతున్నట్లు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి మంత్రి చెప్పారు.యుద్ధం, దాని పర్యవసానాల గురించి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో చర్చించాలని ప్రతిపక్షం పట్టుబట్టటంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే సమావేశాలు వాయిదా పడ్డాయి, పశ్చిమాసియా పరిస్థితి గురించి ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ స్థానం అనుమతించలేదు. యుద్ధాలు, ప్రపంచాన్ని కుదిపివేసే ఇతర సంక్షోభాలు అప్పటి వరకు ఉదాసీనంగా ఉన్నవారిలో, కొందరు నేతల మీద ఉన్న భ్రమలు పటాపంచలు అవుతాయి, అయితే కొందరు వాటిని బహిరంగంగా అంగీకరించటానికి ముందుకు రారు. ఫర్లేదు, ఒకసారి బుర్ర ఆలోచించటం ప్రారంభించిన తరువాత ఎంతకాలం బిడియపడతారు ! ఎన్‌డిఏ ప్రభుత్వం, నరేంద్రమోడీ అనుసరించే లొంగుబాటు విధానాల గురించి వామపక్షాలు, ఇతర పార్టీలు ఎంతగా మొత్తుకున్నా చెవికి ఎక్కని వారికి గూబగుయ్యి మనిపించేలా వినిపించినందుకు నిజంగా డోనాల్డ్‌ ట్రంప్‌కు ” అభినందనలు ” చెప్పక తప్పదు.ప్రతి తరంలోనూ ఒక మహానుభావుడు అవతరిస్తాడు మరి ! జీవ పరిణామ క్రమంలో కొన్ని జీవుల మెదళ్లు ఎదగలేదు, మనుషుల్లో కూడా అలాంటి వారు ఉంటే వారి పట్ల జాలి చూపుదాం !!

నెల రోజుల పాటు రష్యన్‌ ముడిచమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు అనుమతి ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించగానే నరేంద్రమోడీ భక్తి మైకంలో ఉన్నవారికి చెర్నాకోల దెబ్బలా తగిలి మత్తువదిలింది. ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు అన్న శ్రీశ్రీ పాట చాలా మందికి డోనాల్డ్‌ ట్రంప్‌ను గుర్తుకు తెచ్చింది. అది కూడా కొత్తగా రష్యాలో కొనుగోలు చేసేందుకు కాదు. అమెరికా ఆంక్షల కారణంగా రష్యన్‌ రేవుల నుంచి బయలుదేరి, ఏ దేశానికి వెళ్లాలో తెలియక సముద్రంలో లంగరు వేసిన చమురు టాంకర్లలో ఉన్న సరకు మాత్రమే కొనుగోలు చేసుకోవాలి.ఈ ఉదంతాన్ని చూస్తే బందీగా ఉన్న బానిసకు రెండు నిమిషాల్లో కాలకృత్యాలు తీర్చుకురా అన్న యజమాని ఉదారత్వం కనిపించింది. ఇంతకీ మనం అసలైన దేశభక్తులం అని చెప్పుకొనే కాషాయదళాల పాలనలో ఉన్న స్వేచ్చా జీవులమా, అమెరికా యజమానులకు బానిసలమా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే ! యావత్‌ దేశంలో ఆత్మగౌరవం గలవారందరూ అమెరికా ప్రకటనపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే బిజెపి మాత్రం నరేంద్రమోడీ దౌత్య విజయం అంటూ భజన చేస్తున్నది. మొత్తం మీద ఈ పరిణామం ఆ పార్టీ నిజస్వరూపాన్ని వెల్లడించింది. నిజంగా విజయమే అయితే 30 రోజులే గడువు ఎందుకు ? నీ ఆంక్షలను మేము ఖాతరు చేయం, ఇప్పటి వరకు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురు ఇది, ముందు ముందు కూడా కొనసాగిస్తాం అని మోడీ సర్కార్‌ ఎందుకు చెప్పలేకపోయింది ? మధ్యలో రష్యా నుంచి దిగుమతులను ఎందుకు తగ్గించినట్లు ? పిల్లి పాలుతాగుతూ తనను ఎవరూ చూడలేదు అనుకుంటుందట. అమెరికా బెదిరింపులకు లొంగి మాస్కో నుంచి దిగుమతులు ఎలా తగ్గించారో లోకం కోడై కూస్తున్నది.చైనా అలా తగ్గించినట్లు వార్తలు లేవు. మన ఛాతీ 56 నుంచి 6 అంగుళాలకు తగ్గిపోయిందా ! ఇంతా చేసి ఇంటా బయటా పరువుపోయినా భారత్‌ సాధించింది కేవలం 30రోజుల పాటు దిగుమతులకు అనుమతా, సిగ్గుచేటు !ఈ చమురు గురించి మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ప్రామాణిక బ్రెంట్‌ రకం ముడి చమురు ధర కంటే నాలుగైదు డాలర్లు ఎక్కువగా ఉంటుందట, గతంలో రష్యా మనకు ఇచ్చిన 13 డాలర్ల రాయితీ పోయి ఇది అదనం. అవసరం మనదైపుడు వ్యాపారులు కొండెక్కుతారని తెలిసిందే.

నియంత జూలియస్‌ సీజర్‌ చరిత్రలో అతగాడి నమ్మినబంటు బ్రూటస్‌ వెన్నుపోటు పొడుస్తాడు, అప్పుడు బ్రూటస్‌ నువ్వు కూడానా ( యూ టూ బ్రూటస్‌) అంటాడు సీజర్‌.ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే అధికారమే పరమావధిగా ఉన్నవారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ముఖ్యంగా పరీక్షా సమయం వచ్చినపుడు అసలు రంగు బయటపడుతుంది. బ్రిక్స్‌ కూటమిలో స్థాపక సభ్యులైన బ్రెజిల్‌,రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇండోనేషియా, ఈజిప్టు,ఇథియోపియా ఉన్నాయి.ఒక సభ్యురాలైన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు జరుపుతున్నాయి, వాటిని ఇరాన్‌ ప్రతిఘటిస్తున్నది.ఈ క్రమంలో కూటమిలోని సౌదీ అరేబియా,యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్న అమెరికా సైనిక కేంద్రాలు, ఎంబసీల మీద ఇరాన్‌ దాడులు చేస్తున్నది.ఈ పరిణామంపై కూటమికి ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో నాయకత్వం వహిస్తున్న భారత్‌ నోరుమెదపలేదు. ఇది మన గురించి ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తున్నది ? గతేడాది ఇదే అమెరికా, ఇజ్రాయెల్‌ పన్నెండు రోజుల పాటు ఇరాన్‌పై దాడులు చేసినపుడు బ్రిక్స్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న బ్రెజిల్‌ వెంటనే ఆ చర్య అంతర్జాతీయ న్యాయాన్ని ఉల్లంఘించటమే అని ఖండించింది. అప్పుడు అది తన ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. గత డిసెంబరు నుంచి భారత్‌ అధ్యక్ష స్థానంలోకి వచ్చింది. కూటమి కంటే తన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నదని, అమెరికా-ఇజ్రాయెల్‌కు దగ్గర ఉన్నట్లు సంకేతాలు పంపినట్లు అల్‌ జజీరా పత్రిక, సండే గార్డియన్‌ వ్యాఖ్యానించాయి. సరిగ్డా యుద్ధ ప్రారంభానికి ముందు నరేంద్రమోడి ఇజ్రాయెల్‌ పర్యటన, ఇతర అంశాల గురించి పేర్కొన్నాయి. పారిశ్రామిక దేశాలతో కూడిన జి 7 కూటమికి ప్రత్యామ్నాయంగా పేద దేశాల ప్రయోజనాల కోసం ఏర్పడిందే బ్రిక్స్‌, దాని అజెండాల్లో ఇప్పుడు సభ్య దేశాల భద్రత అంశం కూడా ఉంది. అందువలన ఇరాన్‌ భద్రతకు ముప్పు తెచ్చిన వారి గురించి మౌనంగా ఉంటే కుదరదు, మనకు మన ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాలి. బ్రిక్స్‌ అమెరికా వ్యతిరేక కూటమి అని ట్రంప్‌ ఆరోపించాడు. సభ్య దేశాల సంగతి తేలుస్తాం అని మాట్లాడాడు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన మిలిటరీ విన్యాసాలకు భారత్‌ దూరంగా ఉంది.అమెరికాకు ఆగ్రహం కలిగించే చర్యలేవీ చేపట్టబోమని చెప్పకనే చెప్పింది. విశాఖపట్టణంలో మనదేశం మిలన్‌ 2026 విన్యాసాల్లో ఇరాన్‌ పాల్గొనగా అమెరికా మొఖం చాటేసింది.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలి అన్న లోకోక్తులు తెలిసిందే. అమెరికాతో అన్ని దేశాలూ వాణిజ్యం చేస్తున్నాయి, అయినా ఒక పరిణామం జరిగినపుడు వాటి గురించి పట్టించుకోకుండా స్పందిస్తున్నాయి. అమెరికా దాడులను ఒక్క మనదేశం తప్ప బ్రిక్స్‌ స్థాపకసభ్యులైన నాలుగు దేశాలూ విడివిగా ఖండించాయి. మూడు రోజులు ఆలశ్యంగా ఈ ఉన్మాదానికి స్వస్థి పలకాలని దక్షిణాఫ్రికా స్పందించింది. ముందుగా పాలక ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఖండిస్తూ ఒక ప్రకటన చేసింది. అవసరమైతే మధ్యవర్తి పాత్రపోషిస్తామని కూడా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా ప్రకటించాడు. ఇదే దక్షిణాఫ్రికా జనవరి నెలలో నిర్వహించిన బ్రిక్స్‌ నౌకాదళ విన్యాసాలలో ఇరాన్‌ భాగస్వామిగా ఉండటానికి అంగీకరించినందుకు దక్షిణాఫ్రికాపై ట్రంప్‌ తీవ్రంగా విమర్శించాడు. తొలి దాడి, ఖమేనీ హత్య జరిగిన మూడు రోజుల తరువాత భారత విదేశాంగశాఖ ఒక ప్రకటన చేస్తూ చర్చలు, దౌత్యాన్ని కోరుతున్నామని, వివాదం త్వరగా ముగియాలని పేర్కొన్నది. ఇరాన్‌ నేతలతో ఎలాంటి మాటలు లేకపోగా దాని పేరు ఎత్తకుండా గల్ఫ్‌ దేశాల నేతలతో మాట్లాడుతూ వాటి భూభాగాలపై జరుగుతున్న దాడులను నరేంద్రమోడీ విమర్శించారు. గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండ, వెస్ట్‌బాంక్‌ ప్రాంతంలో పాలస్తీనియన్లపై కొనసాగుతున్న మారణకాండను ప్రపంచ దేశాలు ఖండిస్తుండగా ఫిబ్రవరి 25,25 తేదీలలో పర్యటన జరిపి పార్లమెంట్‌ నెసెట్‌లో మాట్లాడుతూ వర్తమానంలో, తరువాత కూడా తాము ఇజ్రాయెల్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు.హమస్‌ దాడులను ఖండించారు గానీ వారిని అణచేపేరుతో గాజాలో టెల్‌అవీవ్‌ జరిపిన మారణకాండ గురించి పల్లెత్తుమాట అనలేదు. గాజాలో యుద్ద నేరాల కేసులో తమ ముందు హాజరు కావాలని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు కోరిన నెతన్యాహును ఆలింగనాలు చేసుకున్నారు. రెండు దేశాల సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని కూడా మోడీ చెప్పారు. ఆ మాటలు చెబుతున్న సమాయానికే అమెరికా, ఇజ్రాయెల్‌ అన్ని యుద్ధ సన్నాహాలు చేసుకున్నాయి.ఒక రోజు తేడాతో దాడులను ప్రారంభించాయంటే మోడీకి ఆ విషయం తెలియకుండా ఎలా ఉంటుందని విమర్శకులు అంటున్నారు. నిజంగా తెలియదంటే మన వేగుల వ్యవస్థ ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించాల్సి ఉంటుంది. తెలుసు అంటే ఎరుకలో ఉండి కూడా మోడీ వెళ్లారంటే ఇజ్రాయెల్‌కు సమర్ధనే అన్నది స్పష్టం. దీని గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గల్ఫ్‌లో ఉన్న భారతీయుల గురించే మా తపన అని జైశంకర్‌ చెప్పారు. ఇరాన్‌లో కూడా ఉన్నారుగా, అయినా తమ మీద దాడి చేస్తే ఎక్కడ అమెరికా మిలిటరీ స్థావరాలు ఉన్నా వాటి మీద దాడి చేస్తామని ముందే ఇరాన్‌ ప్రకటించింది. దాని అర్ధం తెలియనంత అమాయకంగా కేంద్ర ప్రభుత్వం ఉందని నమ్మటానికి ఎవరూ చెవుల్లో పూలు పెట్టుకొని లేరు. గతంలో ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులను తీసుకు వచ్చేందుకు తన పలుకుబడిని ఉపయోగించి యుద్ధాన్ని కొద్ది రోజులు ఆపారని మోడీ గురించి పెద్ద ప్రచారం చేశారు కదా, ఆ పని ఇప్పుడెందుకు చేయలేదు ?

పశ్చిమాసియా సంక్షోభ సమయంలో భ్రమల్లో ఉన్న అనేక మంది భారతీయులను మరో అంశంలో కూడా అమెరికా కళ్లు తెరిపించింది. మన స్వేచ్చా మీడియా దాని గురించి పెద్దగా వార్తలు ఇవ్వటానికి చర్చిందేందుకు భయపడింది. తమను దెబ్బతీసేందుకు భారత్‌ను అనుమతించనివ్వం, ఇరవై ఏండ్ల క్రితం చైనా వ్యవహారంలో చేసిన తప్పిదాన్ని పునరావృతం కానివ్వం, ఇది భారత్‌కు అర్ధమైంది, మాకు పోటీగా మరొక అర్ధిక వ్యవస్థ ఎదగటం మా పౌరుల ప్రయోజనాలకు విరుద్దం అని న్యూఢిల్లీ గడ్డమీద రైసినా 2026 చర్చల్లో అమెరికా విదేశాంగశాఖ ఉపమంత్రి క్రిస్టోఫర్‌ లాండవ్‌ తెగేసి చెప్పినా మనం గొణగటం తప్ప గట్టిగా మాట్లాడలేకపోయాం. దీని అర్ధం ఏమిటి ? గత పన్నెండు సంవత్సరాలుగా చైనాను పక్కకు నెట్టి మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా పథకాలతో భారత్‌ను ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తాని మోడీ అండ్‌కో చెబుతున్నది.దానికి మేం అనుమతించం అని అమెరికా చెప్పింది. అంతే కాదు భారత్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం కూడా తొలుత తమ ప్రయోజనాలకే పెద్ద పీటవేసిందని కూడా క్రిస్టోఫర్‌ ఎలాంటి శషభిషలు లేకుండా చెప్పాడు. ముందే చెప్పినట్లుగా సంచలనాత్మక పరిణామాలు జరిగినపుడు జనంలో అనేక ఆలోచనలకు నాంది పడుతుంది. భారత్‌ను విశ్వగురువుగా మారుస్తానని చెప్పిన నరేంద్రమోడీ అమెరికా తోకగా మారుస్తున్నారని పశ్చిమాసియా సంక్షోభం వెల్లడించింది. గతంలో వామపక్షాలు, ఇతర పార్టీలు, ఎందరో మేథావులు చెప్పినా పట్టించుకోని వారు ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీరుతో ఆలోచించకతప్పటం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

04 Wednesday Mar 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Ali Hosseini Khamenei, BJP, China, Donald trump, Narendra Modi Failures, Netanyahu, us and israel attack iran, Vladimir Putin, West Asia Crisis

ఎం. కోటేశ్వరరావు

ఫిబ్రవరి 28న అడ్డగోలుగా అమెరికా, ఇజ్రాయిల్‌ మిలిటరీ దళాలు ఇరాన్‌పై దాడులను ప్రారంభించాయి. ఆ దేశ సుప్రీమ్‌ నేత అయతుల్లా అలీ ఖమేనితో పాటు కుటుంబ సభ్యులు, ఇతర సీనియర్‌ నేతలను అనేక మందిని హత్య చేశాయి. దానికి ప్రతిగా ఇరాన్‌ కూడా తనకున్న సత్తామేరకు ఆత్మరక్షణ ఎదురు దాడులు చేస్తోంది. అమెరికా దాడుల ఆంతర్యం గురించి మీడియాలో రోజూ వస్తున్న వార్తల పూర్వ రంగంలో మరోసారి చెప్పనవసరం లేదు. అనేక కోణాల గురించి చర్చ జరుగుతున్నది.
ఇక అంతా వారే చేశారంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ మాజీ అధ్యక్షులైన బరాక్‌ ఒబామా, జో బైడెన్ల మీద విరుచుకుపడ్డాడు. వారిద్దరూ నిద్రపోయిన కారణంగానే ఇరాన్‌ అణుముప్పు తలెత్తిందని ఆరోపించాడు. ఈ పెద్దమనిషి టెహ్రాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి 2018లో ఏకపక్షంగా తప్పుకొని చేసిందేమిటి? తాను గనుక వైదొలగకపోతే ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందం మేరకు ఈపాటికే ఇరాన్‌ అణుబాంబులను తయారు చేసి ఉండేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లగల ఆయుధాలను రూపొందించు కోవటం తమ హక్కని, ఇతరులకు అది లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. సుదూర ప్రాంతాల లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను మనం కూడా తయారు చేస్తున్నాం. ఏదో ఒక రోజు ఇరాన్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌ గాకపోతే మరొకడు మనకూ వర్తింపచేయడని గ్యారంటీ ఏముంది ?
ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేస్తే వాటిని ఇజ్రాయిల్‌ మీద ప్రయోగిస్తుందన్నది ఒక ఆరోపణ. మరి ఇజ్రాయిల్‌ ఎవరి మీద ప్రయోగించేందుకు అణుబాంబులను తయారు చేసినట్లు? అణ్వాయుధాలను రూపొందించిన వారందరూ ఎవరో ఒకరి మీద ప్రయోగించేందుకు అన్న అమెరికా అడ్డగోలు వాదనలను మన దేశంలోని కొందరు సమర్ధిస్తుంటారు. మరి మనం ఎవరి మీద వేసేందుకు రెండుసార్లు అణుపరీక్ష జరిపినట్లు? ఉత్తర కొరియా, పాకిస్తాన్‌ కూడా బాంబులను కలిగి ఉన్నాయి వాటి గురించి అమెరికా మాట్లాడదేం! అనేక సార్లు ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా-ఇజ్రాయిల్‌ తమ ఏజంట్లను ప్రయోగించి దాడులు చేశాయి. అనేక మంది శాస్త్రవేత్తలను చంపివేశాయి. కాస్పియన్‌ సముద్రంలో ఇరాన్‌ సహజ వాయువు పైప్‌లైన్లను 2024 ఫిబ్రవరిలో ఇజ్రాయిల్‌ ధ్వంసం చేసింది. ఏప్రిల్‌ నెలలో సిరియా రాజధాని డెమాస్కస్‌ లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం మీద దాడికి ప్రతిగా ఇరాన్‌ ఎదురు దాడి చేసింది తప్ప…తర ఏ సందర్భంలోనూ ముందుగా అది టెల్‌అవీవ్‌ మీద దాడులు చేయలేదు.
అమెరికా, ఇజ్రాయిల్‌ను వ్యతిరేకించే దేశాలు, సాయుధ బృందాలకు ఇరాన్‌ సాయం చేయటం సరైంది కాదు కదా! ఈ వాదన చేస్తున్న వారు ఐరాస నిర్దేశించిన పాలస్తీనా ప్రాంతాలను తీర్మానం చేసిన మరుసటి రోజు నుంచే ఇజ్రాయిల్‌ ఎందుకు ఆక్రమించుకొని పాలస్తీనియన్లను ఆ ప్రాంతాల నుంచి తరిమివేస్తున్నట్లు? దానికి పశ్చిమ దేశాలు ఎందుకు మద్దతు ఇస్తున్నట్లు? తమ మాతృభూమి కోసం పోరాడుతున్న వారికి మద్దతు ఇస్తున్నది ఇరాన్‌, అడ్డుకొనే దుర్మార్గానికి ఆసరా ఇస్తున్నవి అమెరికా, దాని మిత్ర దేశాలు. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొని అవి మావే అని చెబుతున్న ఇజ్రాయిల్‌ దుండగాలను సమర్ధిస్తున్నవారు ఏదోఒక సాకుతో మరో దేశాన్ని ఆక్రమించరనే హామీ ఏముంది? కెనడాను తమ 51వ రాష్ట్రంగా మార్చాలని ట్రంప్‌ అంటే తప్పు పట్టిన అదే కెనడా నేడు అమెరికా దుండగానికి, పాలస్తీనా ఆక్రమణలో ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్నది. పాలస్తీనా ప్రాంతాలు తమ రక్షణకు హామీగా కావాలని యూదు దురహంకారులు చెబుతున్నట్లే అమెరికా రక్షణకు గ్రీన్‌లాండ్‌ అవసరం అంటున్న అమెరికా చర్యను విమర్శించిన ఫ్రాన్సు, బ్రిటన్‌, జర్మనీ ఇప్పుడు ఇరాన్‌పై దాడిని సమర్ధిస్తున్నాయి. తమ స్థావరాలను వినియోగించుకొని మరింత మంది పసిపిల్లలను చంపమని, గాజాను నాశనం చేసిన మాదిరి ధ్వంసం చేయమని చెబుతున్నట్లు కాదా!
చరిత్రలో యూదులకు అన్యాయం జరిగిందని, ఇజ్రాయిల్‌ బాధిత దేశం అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. యూదులు నీచులంటూ మధ్యయుగాల్లోనే పశ్చిమాసియా ప్రాంతం నుంచి మధ్యయుగాల్లో జరిగిన మత యుద్ధాల్లో తరిమివేశారు. నాజీ మూకలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అనేక దేశాల్లో ఊచకోత కోశాయి. వారికి న్యాయం చేసే పేరుతో మాతృభూమిగా ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేశారన్నది ఒక వాస్తవం. అదే సమయంలో పాలస్తీనా కూడా అవతరించాలని ఐరాస చేసిన నిర్ణయం గడచిన ఎనిమిది దశాబ్దాలుగా అమల్లోకి రాకపోతే ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు ఎందుకు ప్రశ్నించరు? వారికి మాతృభూమి లేకనే ఇరుగు పొరుగు దేశాల్లో తల దాచుకుంటున్నారు. తమ దేశ ఏర్పాటు కోసం సాయుధ పోరాట మార్గాన్ని కొందరు చేపట్టారు. అలాంటి సంస్థలలో ఒకటైన హమాస్‌ 2023 అక్టోబరు ఏడున దాడి చేసి 1200 మందిని హతమార్చి 250 మందిని బందీలుగా పట్టుకోవటాన్ని ప్రపంచంలో ఎవరూ సమర్ధించలేదు. కానీ ఆ పేరుతో గాజాలో 70 వేల మందిని ఊచకోత కోసిన ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని హమాస్‌ చర్యను ఒకే గాటన కట్టటం ఏ విధంగా సమర్ధనీయం? మన దేశం పాలస్తీనా ఏర్పాటును పూర్తిగా సమర్ధించింది. కానీ ఇటీవల ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లి హమాస్‌ దురాగతాన్ని ఖండించారు తప్ప ఇజ్రాయిల్‌ మారణకాండ గురించి పల్లెత్తు మాట అనలేదు. మానవత్వం గురించి కబుర్లు చెబితే ఎలా! దాడులు ప్రారంభమైన తరువాత ఇజ్రాయిల్‌, ఇతర దేశాలతో మాట్లాడారు తప్ప ఇరాన్‌ నేతలకు మోడీ ఎందుకు ఫోన్‌ చేయలేదు! పోనీ ఇరాన్‌ మన శత్రు దేశమా? కాదే, అమెరికా బెదిరించేవరకు 2019కు ముందు చమురు దిగుమతి చేసుకన్నాంగా !
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు, అందువలన అతగాడు మరణిస్తే సంతాపం తెలపాల్సిన అవసరం లేదు, ఖండించాల్సిన పని కూడా లేదంటున్నారు. పోనీ కాసేపు నిజమే అనుకుందాం. వెనిజులా అధ్యక్షుడు మదురో మన వ్యవహారాల్లో వేలు పెట్టలేదుగా, చమురు సరఫరా చేశాడుగా, అతన్ని అమెరికా కిడ్నాప్‌ చేస్తే ఎందుకు ఖండించలేదో ఎవరైనా చెప్పగలరా? ఆర్టికల్‌ 370 రద్దును ఖమేనీ వ్యతిరేకించాడని అంటున్నారు. ఆ మాటకు వస్తే చైనా కూడా వ్యతిరేకించింది, అయినా సీ జిన్‌పింగ్‌తో మోడీ చెట్టపట్టాలు వేసుకోలేదా? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును పాక్‌ పాలిత ప్రాంతమని, మన అంతర్భాగంగా ఉన్న కాశ్మీర్‌ను భారత పాలిత ప్రాంతంగా అమెరికా వర్ణించింది. అంటే కాశ్మీరు మనది అని చెప్పకపోయినప్పటికీ అమెరికాతో సన్నిహితంగా మసలుతున్నాం. ఖమేని మరణానికి సంతాపం తెలపాలా లేదా అన్నది ఒక సమస్య. కచ్చితంగా చెప్పాలని ఎవరూ అనటం లేదు, అయితే హత్యను, ఇరాన్‌ మీద దాడిని ఖండించాలా లేదా, ఎందుకు నోరువిప్పటం లేదు! కొన్ని అంశాల మీద భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఇరాన్‌ మన మిత్ర దేశమే అని చెబుతున్నారు కదా? ఎందుకుని వారితో మాట్లాడలేదు! ఈ వైఖరి ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటంటే మనం అమెరికా చంకనెక్కాం, దాని హత్యాకాండను సమర్ధించాం అని కాదా !
ఇరాన్‌కు కోపం ఉంటే అమెరికా, ఇజ్రాయిల్‌ మీద తీర్చుకోవాలిగానీ గల్ఫ్‌ దేశాల మీద దాడులు చేయటం ఏమిటన్నది మరొక అతి తెలివి వాదన. ఒక వేళ తమ మీద దాడి చేస్తే అమెరికా వైమానిక స్థావరాలు, నౌకల మీద విరుచుకుపడతామని పదే పదే ఇరాన్‌ ముందే ప్రకటించింది. అలాంటపుడు గల్ఫ్‌ దేశాలు తమ గడ్డ మీద ఉన్న స్థావరాల నుంచి అమెరికన్లను ఎందుకు ఖాళీ చేయించలేదు. స్థావరాలు ఎందుకు అంటే అమెరికా పెట్టుబడులు ఆ ప్రాంతంలో ఉన్నాయి గనుక వాటిని రక్షించుకొనేందుకని అతనికంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లుగా సమర్ధిస్తున్నారు. అమెరికా పెట్టుబడులు మన దేశంలో, చైనాలో కూడా ఉన్నాయి, మరి వాటి రక్షణకు మిలిటరీ స్థావరాలను నెలకొల్పలేదేం! మనకు పదిహేడు వందల కిలోమీటర్ల దూరంలో హిందూ మహా సముద్రం లోని డిగోగార్షియా దీవుల్లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉంది. అక్కడ ఏం పెట్టుబడులు ఉన్నట్లు ? తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి కోసం అన్నట్లుగా సాకులు చెబుతున్నారు. గల్ఫ్‌ దేశాల్లోని స్థావరాలను ఉపయోగించుకొని అమెరికా ఇప్పుడు ఇరాన్‌ మీద దాడులు చేస్తున్నది. అందుకే వాటిని టెహ్రాన్‌ లక్ష్యంగా చేసుకుంది తప్ప ఆ దేశాల మీద యుద్ధం ప్రకటించలేదు. యుద్ధం అంటే ముందు హతమయ్యేది నిజం. అందువలన ఏ మాట, చర్య వెనుక ఏ ప్రయోజనం దాగుందో జనం తెలుసుకోవాలి!

Share this:

  • Tweet
  • More
Like Loading...

శనగ రైతుల సంక్షోభం

04 Wednesday Mar 2026

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, TDP

≈ Leave a comment

Tags

Bengal Gram price, CHANDRABABU, Farmers

డా|| కొల్లా రాజమోహన్‌

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో శనగ ఒక వాణిజ్య పంటగా మారింది. నల్ల బర్లీ పొగాకు, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు శనగ వైపు మొగ్గు చూపారు. సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వలన పీకల లోతు కష్టాల్లో మునిగిపోయారు. ఏ పంట వేయాలో తెలియక, ప్రత్యామ్నాయ పంటలు లేక రైతులు అయోమయంలో వున్నారు. నల్ల బర్లీ పొగాకు నిషేధం నేపథ్యంలో అత్యధికంగా రైతులు శనగ పంటను సాగు చేశారు.
ధరల పతనం – దిగుమతి సుంకాల దెబ్బ
క్వింటాలు శనగలకు 5,875 రూపాయల కనీస మద్దతు ధరకు మార్క్‌ ఫెడ్‌ ద్వారా రైతు సేవా కేంద్రాలలో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శనగలను కొంటామన్న నిర్ణయం సంతోషాన్ని కలిగించింది. కానీ ఎన్ని శనగలు కొంటారు? కోల్డ్‌ స్టోరేజ్‌లో వున్న శనగల మాటేమిటి? మొత్తంగా కొంటారా? లేక దళారుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తారా? విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్న రైతులకు నగదు ప్రోత్సాహకాల సంగతేమిటి? విదేశీ శనగల దిగుమతులను ఆపేసి వ్యవసాయాన్ని, రైతు రక్షణకు తీసుకునే చర్యలు చాలా అవసరం. వ్యవసాయ రక్షణకు తీసుకునే చర్యలపై దీర్ఘకాలిక ప్రణాళిక కావాలి.

పోషకాహార లోపం-పంపిణీ వైఫల్యం
పప్పుధాన్యాలలో శనగ అతి ముఖ్యమైన పంట. ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగలు ఇప్పుడు ధర లేక రైతులను దివాళా తీయిస్తున్నాయి. రైతులను కష్టాలపాలు చేస్తున్నాయి. ఆహారంలో పప్పుధాన్యాల అవసరం ఎక్కువగానే ఉన్నది. శరీర నిర్మాణంలో ప్రొటీన్‌ అవసరం గురించి డాక్టర్లు నొక్కి చెప్తున్నారు. రైతులు కష్టపడి కావాల్సినంత పండిస్తున్నారు. పప్పుధాన్యాల పంపిణీ సరిగ్గా లేక అందరికీ అందనందున ”ప్రొటీన్‌ క్యాలరీ మాల్‌న్యూట్రిషన్‌” దాపురిస్తున్నది. ఒకపక్క గోడౌన్లలో శనగలు పుచ్చిపోతుంటే మరోపక్క పేద వారికి పప్పుధాన్యాలు అందటంలేదు. రేషన్‌ షాపుల ద్వారా శనగలను పంపిణీ చేస్తే ఇటు రైతులకు అటు పేద ప్రజలకు మేలు జరుగుతుంది. దేశీయ ఉత్పత్తి సరిపోయినంత ఉంది. కానీ విదేశీ ప్రభుత్వాలను తృప్తిపరచటానికి విదేశీ శనగలను దిగుమతి చేస్తున్నారు. ఇక్కడ పండే పంటలు అమ్ముడు పోవటంలేదు. రేటు రావటం లేదు. రైతులు అప్పులపాలవుతున్నారు.

పెరుగుతున్న ఖర్చులు – తగ్గుతున్న ధరలు
ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలలో విస్తారంగా శనగ పంటను సాగు చేస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే శనగ సాగు కాస్త సులభంగానే జరుగుతుంది. శనగలకు ఉత్తరాదిన డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో 2.8 లక్షల హెక్టార్లలో శనగ పంట సాగవుతున్నది. దాదాపు 4 లక్షల టన్నుల శనగల ఉత్పత్తి జరుగుతుంది.
దేశం మొత్తం మీద 115 నుండి 120 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి అవుతున్నదని అంచనా. మన దేశ ప్రజల అవసరాలకు 120 లక్షల టన్నుల శనగలు సరిపోతాయంటున్నారు. అయితే అవసరానికి మించి నిల్వలు ఉన్నాయి. అమ్ముడుపోక కోల్డ్‌ స్టోరేజీలలో శనగలు ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. కోల్డ్‌ స్టోరేజీలలో వున్న శనగల లెక్క ప్రభుత్వం బయటకు తీయాలి. వాటిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
భూసారం క్షీణించడం వలన, వాతావరణంలో మార్పుల వలన, దిగుబడులు తగ్గిపోతున్నాయి. విత్తనాలు, ఎరువులతో సహా వ్యవసాయ ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి. రైతులు దివాళా తీస్తున్నారు. ప్రభుత్వాలు మరోపక్క దిగుమతి సుంకాన్ని తగ్గించి, విదేశీ దిగుమతులను పోత్సహిస్తున్నాయి. విదేశాల నుండి అధికంగా దిగుమతులు చేయటంతో ఇక్కడి శనగ రైతుల కష్టాలు పెరుగుతున్నాయి.
ఎకరానికి దిగుబడి 10 క్వింటాళ్ళ నుండి ఆరేడు క్వింటాళ్ళకు పడిపోయింది. గత సంవత్సరం ఎర్ర శనగలు క్వింటాలు రేటు రూ.7,200 ఉంటే ఇప్పుడు దళారులు రూ.5000 కన్నా తక్కువకు అడుగుతున్నారు. తెల్ల శనగలు పోయిన సంవత్సరం రూ.10,200 వుంటే ఇప్పుడు రూ.5,600కు అడుగుతున్నారు. బోల్టు శనగలు గత ఏడాది రూ.15,000 ఉంటే ఇప్పుడు అడిగేవారే లేరు.

సుంకాల రద్దు- రైతుకు ఉరి
2017-18 సంవత్సరాలలో శనగ దిగుమతులపై 40 శాతం ఉన్న దిగుమతి సుంకం 10 శాతానికి తగ్గిస్తూ వచ్చారు. దేశీయ శనగల ఉత్పత్తి తగ్గిపోవడం వలన, 2024 మే నుంచి 2025 మార్చి వరకు పూర్తిగా దిగుమతి సుంకాలను రద్దు చేశారు. ఉత్పత్తి పుంజుకున్న తర్వాత 2025 ఏప్రిల్‌ నుండి 10 శాతం సుంకాలను మరల అమలులోకి తెచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, రికార్డు స్థాయిలో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. విదేశాలలో రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా ఎక్కువగా వుండటం వలన ఉత్పత్తి ధర తక్కువగా ఉంటుంది. మన రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం వల్ల మన రైతులకు అప్పులు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఏళ్ల తరబడి కోల్డ్‌ స్టోరేజ్‌లో నిల్వలు వుంచటం వలన క్వింటాలుకు రూ.150 కడుతూ ఉండాలి. బయట గోడౌన్లలో పెడదామంటే శనగలు పుచ్చిపోతున్నాయి. శీతల గిడ్డంగులలో ఖాళీ లేదు. ఒకపక్క పేరుకుపోతున్న శనగలు. మరో పక్క అప్పులు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు దివాలా తీస్తున్న తరుణంలో ఏ పంట వేయాలో తెలియని పరిస్థితులలో, కొద్దిగా డబ్బులు వస్తాయనే ఆశతో నల్ల బర్లీ పొగాకును సాగు చేశారు. నల్ల బర్లీ పొగాకు 15-18 వేల రూపాయల వరకు ధర వచ్చింది. పొగాకు కంపెనీలు, ప్రభుత్వం కలిసి క్వింటాల్‌ నల్ల బర్లీ పొగాకు రేట్లను రూ.12000-9000-6000గా తగ్గించి నిర్ణయించి రైతులకు అన్యాయం చేశాయి. ఈ సంవత్సరం అసలు నల్ల బర్లీ పొగాకు సాగు చేయడాన్ని నిషేధించారు.
పత్తికి ధర లేదు. విదేశాల నుండి ఎటువంటి అడ్డంకులు లేకుండా పత్తిని దిగుమతి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంట ఏమిటో ప్రభుత్వం చెప్పదు. ధైర్యం చేసి పంట పండించే సమయానికి అమెరికా నుంచి దిగుమతులు వెల్లువలా వచ్చి పడతాయి. రెండు సంవత్సరాల నుండి ఏ పంటకూ సరైన ధర లేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో దాచిపెట్టటానికి ఖాళీలు లేవు. దిగుబడి కూడా తగ్గిపోయింది. 2024-25 సంవత్సరంలో 15 లక్షల టన్నుల శనగలను దిగుమతి చేసుకున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 15 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్‌ స్టోరేజ్‌లో స్టాక్‌ నిండుగా ఉన్నా విదేశీ శనగలను దిగుమతి చేశారు.
ఒకప్పుడు లాభాలను కురిపించిన శనగ సాగు ఇప్పుడు కళ్ళ నీళ్లు తెప్పిస్తున్నది. బయట తెచ్చిన అప్పుల వడ్డీ పెరిగిపోతున్నది. వ్యవసాయ ఖర్చులకి, ఇంటి ఖర్చులకి చేతిలో డబ్బులు లేవు. బ్యాంకర్లు, అప్పులవాళ్ళు అప్పులు ఇవ్వడం మానేశారు. ప్రభుత్వం సహాయం చేస్తే బయటపడవచ్చు.

ఇప్పుడు ఏం చేయాలంటే…
– రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకు మొత్తం కొనుగోలు చేయాలి. రైతులు అమ్మకానికి తెచ్చిన శనగలకు ఆంక్షలు పెట్టకుండా కొనాలి. నిబంధనలను సడలించాలి.
– కనీస మద్దతు ధర అంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసినట్లుగా ఖర్చులకు 50 శాతం కలిపి చెల్లించాలి.
– ఇదివరకు లాగా విదేశీ దిగుమతులపైన 40 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలి. అలా చేస్తేనే దేశంలో ఉత్పత్తి అయిన శనగకు డిమాండ్‌ ఉంటుంది.
– విదేశీ శనగల దిగుమతులను ఆపేయాలి.
– వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి, రైతు రక్షణకు తీసుకునే చర్యలను ప్రకటించి అమలు పరచాలి.
రైతు రక్షణ చర్యల అమలుకు రైతులు సమైక్యంగా ఉద్యమించాలి.
– వ్యాసకర్త : డా|| కొల్లా రాజమోహన్‌, నల్లమడ రైతు సంఘం నేత, గుంటూరు, సెల్‌: 9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

హీరోయిన్‌ త్రిషను కించపరిచిన బిజెపి నేత క్షమాపణ : హీరో విజై మౌనముద్రకు అర్ధం ఏమిటి !

18 Wednesday Feb 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Filims, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, Women

≈ Leave a comment

Tags

Actor Vijay, BJP, DMK, Nainar Nagendran, Narendra Modi Failures, Tamilnadu Elections 2026, Tamilnadu politics, Thrisha, TVK

ఎం కోటేశ్వరరావు

తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోంది ? ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నట్లు కలలు కంటున్న సినీహీరో విజై ఒంటరిగా బరిలో దిగుతారా లేక ఏ పార్టీతో అయినా జతకడతారా ? తన ఆధిపత్యాన్ని అంగీకరించటం తప్ప సిద్దాంత రాద్దాంతాలేమీ లేవనే సందేశం పంపుతున్న తమిళ వెట్రి కజగమ్‌(టివికె) నేతను ఎవరైనా భరించగలరా ? డిఎంకె నాయకత్వంలోని కూటమిలో తాము కొనసాగాలంటే అధికారంలో కూడా భాగం పంచాలని కోరుతున్న కాంగ్రెస్‌ ఎత్తుగడ ఏమిటి ? ఇలా ఎన్నో సశేషాలుగా ఉన్న విశేషాలు అక్కడ జరుగుతున్నాయి. విలువలు, వలువలు, సంస్కారం అంటూ కబుర్లు చెప్పే బిజెపి కుదురులోని రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ నోరుపారవేసుకొని అభాసుపాలయ్యారు. భారతీయ సంస్కృతికి తామే ప్రతీకలమని చెప్పుకొనే వారు ఎంత అసహ్యంగా మాట్లాడుతారో ఈ ఉదంతం వెల్లడించింది.గతంలో అనేక మంది సినీనటులు పార్టీలను పెట్టినపుడు,రాజకీయాల్లోకి వచ్చినపుడు వారి అనుభవం గురించి ఇతరులు విమర్శలు చేశారు. అయితే అనుభవం ఉన్న వారు మాత్రం వెలగబెడుతున్నదేమిటి అన్న అంశం ఉన్నప్పటికీ నటీనటులపై ఒక మేరకు విమర్శను అర్ధం చేసుకోవచ్చు గానీ చౌకబారు మాటలు తగవు.

విజైకు అనుభవం లేదంటూనే ముందుగా హీరోయిన్‌ త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని బిజెపినేత చేసిన వ్యాఖ్య ఏ విధంగా చూసినప్పటికీ తీవ్ర అభ్యంతరకరం. మాజీ ప్రధాని వాజ్‌పాయి దశాబ్దాల పాటు ఒకనాడు తాను ప్రేమించిన రాజకుమారి కౌల్‌కు వేరే వ్యక్తితో వివాహమైన తరువాత తాను కూడా దంపతుల ఇంట్లో జీవించారు.ఆమెకు పుట్టిన కుమార్తె గురించి నిరూపితం కాని వార్తలు వచ్చినా ఎన్నడూ ఏ రాజకీయ నేత, పార్టీ కూడా వారి బంధం గురించి బహిరంగంగా రచ్చ చేయలేదు. త్రిషతో స్నేహం కారణంగా విజై భార్య విదేశాల్లో ఒంటరిగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఏమైనప్పటికీ అది వారి వ్యక్తిగత వ్యవహారం. అనేక మంది ఇష్టపూర్వకంగా సహజీవనం చేయటం ఈ రోజుల్లో అందునా సినిమా రంగంలో సర్వసాధారణంగా జరుగుతోంది. రాజకీయ రంగంలో కూడా ప్రారంభమైంది. విజరు రాజకీయ నేతగా మారిన కారణంగానే నాగేంద్రన్‌ మాటలు సంచలనం కలిగించాయి. బహుశా బిజెపి అగ్రనాయకత్వం కూడా చివాట్లు పెట్టిన కారణంగా ఆ పెద్దమనిషి తన వ్యాఖ్యలపట్ల క్షమాపణలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేయటం తప్పే, ఎవరైనా వాటితో గాయపడితే విచారం వ్యక్తం చేస్తున్నాను.మా పార్టీ అఖిల భారత మహిళా విభాగం అధ్యక్షురాలు వనాతి శ్రీనివాసన్‌, అన్నామలై ఈ అంశం గురించి నాతో మాట్లాడారు. నా రాజకీయ జీవితంలో ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు, కానీ ఆరోజు దాన్నుంచి వైదొలిగి మాట్లాడాను అని నాగేంద్రన్‌ పేర్కొన్నారు. నాగేంద్రన్‌ వ్యాఖ్యలపై ఎలాంటి ప్రత్యక్ష ప్రస్తావన లేకుండా త్రిష తన న్యాయవాది ద్వారా ఒక ప్రకటన చేయించారు. వ్యాఖ్యలు చౌకబారుగా ఉన్నాయని, రాజకీయాల్లో తాను తటస్థంగా ఉన్నానని,రానున్న రోజుల్లో కూడా ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండదని ఆమె పేర్కొన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అంతగా దిగజారి మాట్లాడతారని ఎన్నడూ ఊహించలేదన్నారు.తనకు సంబంధం లేని అంశాల్లో తన పేరును లాగవద్దని కోరారు. సంచలనం కలిగించిన ఈ ఉదంతం గురించి విజై ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం దాల్చారు. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడలేదు. ఒక వేళ ఏ పరిస్థితిలోనైనా బిజెపితో జట్టుకట్టాల్సి వస్తే ఇబ్బందులు రాకుండా ఈ వైఖరి తీసుకున్నారా లేక మరింత రచ్చ అవుతుందని భావించారో తెలియదు.

అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా రానున్న రోజుల్లో బిజెపి పట్ల విజై వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్న తలెత్తింది.కరూరులో జరిగిన తొక్కిసలాట మరణాల ఉదంతం తరువాత బిజెపి గురించి ఇంతవరకు ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. ఓడించాల్సింది డిఎంకెను గనుక దాని వరకే పరిమితం అవుదాం అని తప్పించుకున్నారు.గతేడాది కేంద్ర బడ్జెట్‌ మీద విమర్శలు చేసిన విజై ఈసారి మౌనం పాటించారు.కరూరు కేసు, తన వ్యాపారలావాదేవీలు, కేంద్ర సంస్థలను చూసి భయపడే ఈ వైఖరి తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. రెండు కూటములనూ వ్యతిరేకిస్తానంటూ ప్రకటించినా తరువాత వెనక్కు తగ్గారు. ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ ఉండవచ్చని భావిస్తున్నారు. డిఎంకె కూటమి, అన్నాడిఎంకె-బిజెపి, టివికే, సీమన్‌ అనే మాజీ నటుడు, దర్శకుడు ఏర్పాటు చేసిన నామ్‌ తమిళ్‌ కచ్చి(ఎన్‌టికె) కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు, అయితే ఎన్‌టికే ప్రభావం పరిమితమే. తమిళనాడు రాజకీయాలు డిఎంకె, అన్నాడిఎంకెల మధ్య కేంద్రీకృతమయ్యాయి. గతంలో పార్టీ పెడతానంటూ లీకులు వదిలిన రజనీకాంత్‌ ధైర్యం చేయలేకపోయారు.మరో ప్రముఖ నటుడు కమల్‌ హసన్‌ పార్టీ పెట్టి విఫలమయ్యారు. వారిద్దరి తరువాత ప్రేక్షకాదరణ ఉన్న విజరు పరిస్థితి చెప్పలేము. స్టార్‌ హీరోల సభలకు జనం రావటం, ఈలలు, కేకలు వేయటం వేరు, ఓట్లు పడటం మరొకటి. కెప్టెన్‌ విజయకాంత్‌ కూడా పేరున్న నటుడే అయినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.

తమ పార్టీ మాత్రమే డిఎంకెను సవాలు చేయగలదని టివికె నేత విజై ప్రతి సభలోనూ చెబుతున్నారు. దీని గురించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్‌ స్పందన ఏమిటని ప్రశ్నించినపుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.” ఇంటి మీదకు కూడా ఎక్కలేని వారు స్వర్గానికి ఎగురుతామని కలలు కంటున్నారు. అతనికి ఏమాత్రం అనుభవం లేదు. ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి, తరువాత ఏదైనా జరుగుతుంది” అంటూ నవ్వారు. ఒక్క కౌన్సిలర్‌ కూడా పార్టీలో లేరు గానీ 30శాతం ఓట్లు తనకు ఉన్నాయని విజరు ఎలా చెప్పుకుంటారు. ముందు విజై తన కుటుంబంతో సంబంధాలను నిర్వహించుకోవాలి, గొప్పనేతలు చెప్పిన అంశాలను సక్రమంగా జనాలకు చెప్పాలి, ముందు వీటన్నింటి నుంచి బయటపడాలి అన్నారు. ఈ వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారటంతో వాటిని వెనక్కు తీసుకుంటారా అని అడగ్గా చెప్పినదానికి కట్టుబడి ఉంటాను అన్నారు. తరువాత విధిలేక క్షమాపణ చెప్పారు. టివికె సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల కుమార్‌ మాట్లాడుతూ గతంలో బిజెపికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని,వచ్చే ఎన్నికల్లో ఇంకా దిగజారతాయని అన్నారు.కొంత మంది బిజెపి నేతలు డిఎంకె తొత్తులుగా ఉన్నారన్నారు. బిజెపి ఎంఎల్‌ఏ, మహిళా నాయకురాలు వనాతి శ్రీనివాసన్‌ మాట్లాడుతూ నాగేంద్రన్‌ ఎంతో మృదువుగా మాట్లాడే మనిషని, అలాంటి వ్యాఖ్యలు చేయటం విచారకరమంటూ తన అసంతృప్తిని తెలియచేస్తానని చెప్పారు. డిఎంకె, కాంగ్రెస్‌ నేతలు మహిళానేతలను వేధిస్తారని ఆరోపించారు.

ఈ ఉదంతం జరగ్గానే డిఎంకె నేతలు బిజెపి అధ్యక్షుడిపై ధ్వజమెత్తారు. పార్టీ ప్రతినిధి టికెఎస్‌ ఇలాంగోవన్‌ స్పందిస్తూ మహిళలను కించపరచటంలో బిజెపి నేతల గురించి అందరికీ తెలిసిందే అన్నారు.” వారు మనుధర్మాన్ని అనుసరిస్తారు, అది మహిళలకు ఎన్నడూ గౌరవం ఇవ్వలేదు, సహజంగానే అతను అలా మాట్లాడతారు. అందుకే తమిళనాడు జనాలు బిజెపికి వ్యతిరేకంగా, వారు మహిళలను అవమానిస్తారు, ఆ విషయంలో వారు పేరుమోశారు, నాగేంద్రన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌కు బానిసగా మారారు, అందుకే అతను అలా మాట్లాడారు ” అన్నారు. తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు సెల్వపెరుంతగరు కూడా విమర్శించారు. త్రిష గురించి అలా మాట్లాడటం దిగ్భ్రాంతికి గురిచేసింది.దేశంలో చేయాల్సిన పని చాలా ఉంది, అది చేయకుండా అతను వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు.రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు తగవు అన్నారు. తమ నేత సదుద్ధేశ్యంతో చేసిన వ్యాఖ్యలను డిఎంకె వక్రీకరించిందంటూ బిజెపి నేతలు నాగేంద్రన్‌కు మద్దతుగా మాట్లాడారు. ఆ పార్టీ నాయకురాలు విజయధరణి మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరినపుడు డిఎంకె తన గురించి చెడు వ్యాఖ్యలు చేసిందని, వారెప్పుడూ మహిళల పట్ల అలాగే మాట్లాడతారని ఆరోపించారు.తమ నేత చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. నాగేంద్రన్‌ చౌకబారు మాటలపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ మరోవైపు హీరో విజైను ఎలా సమర్ధించాలో పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఇబ్బందికరంగా పరిణమించింది. విజై-త్రిష మధ్య ఉన్న సంబంధం గురించి పలు కథనాలు ఈ వివాదానికి ముందే ఉన్నాయి. అయితే బజారుకు ఎక్కలేదు గనుక సమస్య రాలేదు. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలను బిజెపి నేత ఒక కుదుపుకుదిపారు. రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అవాస్తవాలు చెబుతున్నదెవరు పియూష్‌ గోయలా – రాహుల్‌ గాంధీనా : పత్తి రైతులు, పరిశ్రమకు ముప్పుగా మారిన మోడీ-ట్రంప్‌ ఒప్పందం !

15 Sunday Feb 2026

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Farmers, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, USA

≈ Leave a comment

Tags

cotton farmers, Donald trump, Farmers matters, Narendra Modi Failures, Piyush Goyal, Rahul gandhi, Textiles Industry, US-India trade Deal

ఎం కోటేశ్వరరావు

రైతులు నిజంగా అమాయకులే, ముల్లుగర్రతో ఎద్దుముడ్డి మీద పొడవటం తప్పఏమీ తెలియదు,(కొంత మందికి ఇప్పుడు ఎద్దులతో సాగు చేస్తారని తెలియదు, వాటి స్థానంలో ట్రాక్టర్లు, ఇతర పరికరాలు వచ్చాయి) ఏం చెప్పినా తలూపుతారన్న గట్టి విశ్వాసం లేకపోతే మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ అలా ఎందుకు మాట్లాడతారు. అమెరికా మన దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన ఎగుమతులపై 18శాతం దిగుమతి పన్ను విధిస్తారు. అదే బంగ్లాదేశ్‌తో చేసుకున్న అవగాహన ప్రకారం దిగుమతి చేసుకొనే దుస్తులపై అమెరికా ఎలాంటి పన్ను విధించదు. ఈ అంశం మన దేశ వస్త్రపరిశ్రమ,వాణిజ్యవేత్తలలో ఆందోళనకు గురిచేసింది. దాంతో కేంద్ర మంత్రి రంగంలోకి దిగారు.మనకూ అలాంటి సౌకర్యం ఉందన్నారు. ఉంటే అమెరికా జారీ చేసిన ప్రకటనలో ఆ వివరం ఎందుకు లేదు ! అదంతే,మనకా రాయితీ ఎలా వస్తుందంటే మనం కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకుంటే ఎలాంటి పన్నులూ ఉండవని, ఈ అంశాన్ని సంతకాల సమయానికి ఒప్పందంలో భాగంగా చేర్చుతామని చెప్పారు. ఖాళీ చెక్కు మీద సంతకం చేసినపుడు ఎంతమొత్తమైనా రాసుకోవచ్చు. అమెరికాతో అలాంటి అవగాహనకు వచ్చినందున ఇంకా ఇలాంటి వాటిని మరెన్నింటిని చేర్చుతారో ! ఆ నిబంధన రైతాంగానికి నష్టం కదా అంటే కాదని సెలవిచ్చారు. ఎందుకటా అమెరికాలో పత్తి పరిమితంగానే పండుతుంది గనుక అన్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరిగేందుకు చూస్తున్నారు గనుకనే అడుగడుగునా అనుమానించాల్సిందే. ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా పియూష్‌ గోయల్‌ కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు ఎవరేం చెప్పారో ? చూద్దాం !

అమెరికాతో కుదిరిన ఒప్పందంతో వచ్చే ముప్పు గురించి అనేక రైతు సంఘాల ప్రతినిధులు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని కలిసి దానిపై గళమెత్తాలని కోరారు. అదేమీ తప్పు కాదు, అన్ని పార్టీల నేతలను అలా కలిసిన ఉదంతాలు ఎన్నో. కొంత మందిని రప్పించుకొని రాహుల్‌ నాటకమాడుతున్నారని కేంద్ర వాణిజ్యశాఖ పియూష్‌ గోయల్‌ ఆరోపించారు. రైతులు, వస్త్ర పరిశ్రమ వర్గాల్లో భయాన్ని రేపుతున్నారని అన్నారు. వాస్తవాలు తెలియకుండా తన అవివేకాన్ని స్వయంగా బయటపెట్టుకున్నారని, దేశ అభివృద్ధిని దెబ్బతీయాలని చూస్తున్నారని, ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్నారని కూడా ధ్వజమెత్తారు. ” కఠిన వాస్తవాలు ” అంటూ ఎక్స్‌లో కొన్ని విషయాలను మంత్రి పోస్టు చేశారు. అభివృద్ధి చెందిన 38దేశాలతో కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో ఇప్పుడున్న నాలుగు లక్షల కోట్ల రూపాయల వస్త్ర ఎగుమతులు 45 లక్షల కోట్ల పెరుగుతాయంటే ఎంతగా వృద్ధి అవకాశాలు ఉన్నాయో స్త్రీ, పురుషులకు లక్షలాది ఉద్యోగాలు ఎలా వస్తాయో ఊహించుకోవచ్చన్నారు. అమెరికా పత్తి ఉత్పత్తి చాల తక్కువని, స్థానిక అవసరాలకు పోను ఆరుబిలియన్‌ డాలర్ల విలువగల పత్తి, నూలు ఎగుమతులు చేస్తున్నారని, భారత్‌ నుంచి 2.7 బిలియన్‌ డాలర్ల విలువగల పత్తి, నూలును బంగ్లాదేశ్‌ దిగుమతి చేసుకుంటున్న విషయం రాహుల్‌కు తెలియదని అన్నారు. రాహుల్‌ గాంధీ కుటుంబం పాలన సాగించిన రోజుల్లో అమల్లోకి తెచ్చిన సెజ్‌ చట్టం నిబంధన 27(1) ప్రకారం ఎగుమతి చేసే వస్తువులకు గాను పత్తితో సహా ముడివస్తువులను ఎలాంటి పన్ను లేకుండా దిగుమతి చేసుకోవచ్చని, ఎగుమతుల కోసం సున్నా పన్నుల విధానం తెచ్చిన స్వంత పార్టీ మీదే రాహుల్‌ గాంధీ దాడి చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. అంతకు ముందు రోజు రాహుల్‌ గాంధీ ఎక్స్‌ ద్వారా ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. ప్రభుత్వం ఊబిలోకి నడుస్తూ కోట్లాది మందిని దానిలోకి లాక్కుపోతున్నదని పేర్కొన్నారు. పద్దెనిమిది, సున్నా శాతం పన్నులంటూ జనాన్ని ప్రభుత్వం గందరగోళపరుస్తున్నదని అవాస్తవాలు చెప్పటంలో ప్రధాని ఎంతో నిపుణులని, మంత్రివర్గం గందరగోళాన్ని వ్యాపింప చేస్తున్నదని విమర్శించారు. బంగ్లాదేశ్‌కు అమెరికా ఇచ్చిన ప్రత్యేక రాయితీ మనకూ రావాలంటే మనం కూడా అమెరికా పత్తి దిగుమతి చేసుకోవాల్సి ఉందని రాహుల్‌ పేర్కొన్నారు.పత్తి వివరాలేమిటి, ఎవరు చెబుతున్నది వాస్తవం, ఎవరిది అవాస్తవం !

ప్రపంచ పత్తి ఉత్పత్తి వివరాలను చూస్తే చైనాలో 7.5, భారత్‌లో 5.1,బ్రెజిల్‌ 4.1, అమెరికాలో 3,పాకిస్తాన్‌లో 1.1మిలియన్‌ టన్నుల పత్తి పండిందని 2025 అంచనా. బ్రెజిల్‌లో ప్రతి మనిషికి 0.19మి.ట, అమెరికాలో 0.088 , చైనాలో 0.052,మనదేశంలో 0.032 మి.టన్నులు ఉంది. ఈ వివరాలన్నీ తెలియకుండానే గోయల్‌ అమాత్యగిరీ వెలగబెడుతున్నారని అనుకోవాలా ? 2024 వివరాల ప్రకారం ప్రపంచంలో 90లక్షల టన్నుల ఎగుమతి జరగ్గా బ్రెజిల్‌ 27.74, అమెరికా 24.91, మనదేశం 4.65లక్షల టన్నులు ఎగుమతి చేసింది. రెండవ స్థానంలో ఉన్న మనం అంత తక్కువ, నాలుగవదిగా ఉన్న అమెరికా అంత ఎక్కువ ఎందుకు ఎగుమతి చేస్తున్నట్లు ! మనకంటే ఎక్కువగా పండిస్తున్నప్పటికీ చైనా ఎందుకు దిగుమతి చేసుకొంటోందంటే అక్కడ వస్త్ర పరిశ్రమకు అవసరం, తద్వారా విదేశాలకు ఎగుమతి చేసి లబ్ది పొందుతోంది.మన దేశంలో ఐదు కోట్లకు పైగా కదుళ్లు ఉండగా చైనా పది కోట్లు కలిగి ఉంది, వాటితో అక్కడి జనాభాకు పని కల్పిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో నిమిత్తం లేకుండానే పిలుపులు ఇచ్చిన మన మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర భారత్‌ సంగతేమిటి ? ఒక మౌలిక ప్రశ్న ఏమంటే వస్త్ర ఎగుమతులకు నిజంగా అంత అవకాశం ఉంటే మోడీ సర్కార్‌ 12 సంవత్సరాలపాటు అలాంటి ఒప్పందాలను ఎందుకు చేసుకోలేదు ? లక్షలాది మందికి ఉపాధి ఎందుకు కల్పించలేదు ?

మన రైతాంగం, పరిశ్రమ బంగ్లాదేశ్‌ గురించి ఎందుకు భయపడాలి ? బంగ్లాదేశ్‌ ప్రధాన ఉత్పత్తి వస్త్రాలు,రెడీమేడ్‌ దుస్తులు. అక్కడ పత్తి పెద్దగా పండదు, దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలో అదే ఎక్కువగా ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నది. వస్త్ర ఉత్పత్తులతో చైనా, భారత్‌, వియత్నాం వంటి దేశాలను సవాలు చేస్తున్నది. తాజా ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి నూలు, పత్తి దిగుమతి చేసుకొని దుస్తులను తమకు ఎగుమతి చేస్తే ఎలాంటి పన్నులు ఉండవు అన్న వెసులుబాటు అమెరికా కల్పించింది. నిజానికి అది తమ పత్తి కొనుగోలు చేయాలనే షరతును రుద్దింది.ఒక దశలో షేక్‌ హసీనా పదవీచ్యుతురాలు గాక ముందు మన పత్తి, నూలు ఎగుమతుల్లో 70శాతం బంగ్లాదేశ్‌కే జరిగాయి.పైకి ఎన్ని చెప్పినప్పటికీ ఇప్పుడు అక్కడ మనకు వ్యతిరేకమైన బిఎన్‌పి అధికారానికి వచ్చింది. అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి చేసే రెడీమేడ్‌ దుస్తులలో 70శాతం అమెరికా ముడి సరకులేే ఉంటే ఎలాంటి దిగుమతి పన్ను ఉండదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పత్తి సంవత్సరం 2025-26 (అక్టోబరు నుంచి సెప్టెంబరు వరకు) బంగ్లాదేశ్‌ 84లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. బ్రెజిల్‌ నుంచి 19(22శాతం) భారత్‌ 14(15శాతం) బెనిన్‌ 10.6, కామెరూన్‌ 6.2, అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి 5.95లక్షల బేళ్ల వంతున దిగుమతి చేసుకోవాలని తలపెట్టింది. ఇప్పుడు తాజా ఒప్పందంతో అమెరికా నుంచి దిగుమతులు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. మన పత్తి కంటే అమెరికా సరకు రేట్లు తక్కువ, ఎందుకని ? 2026లో ఒక పౌను(453 గ్రాములు) దూదికి ప్రభుత్వ సాయంగా 55 సెంట్లు, మననగదులో రు.50 ఇస్తుంది. అంతమొత్తం సబ్సిడీ పొందుతున్న తరువాత ప్రపంచానికి చౌకధరలకు పత్తి ఎగుమతులు చేయకుండా ఎలా ఉంటుంది. పైసా పైసా లాభాన్ని లెక్కవేసుకొనేవారు అమెరికా పత్తికి ఎగబడక చస్తారా ? బంగ్లాదేశీయులు దూరంగా ఉంటారా ? ట్రంప్‌ విధించిన పన్నులతో మన ఎగుమతిదారులు అమెరికన్లకు చౌకగా దుస్తులు అందించలేకపోతున్నారని అచ్చే దిన్‌కు దూరం చేస్తున్నారనే ”జాలి గుండె ” నరేంద్రమోడీ సర్కార్‌ అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే పత్తిపై 11శాతం పన్ను తగ్గించింది. పొడవు పింజ పత్తిని మాత్రమే దిగుమతికి అనుమతించామంటారు, రెండు తెలుగు రాష్ట్రాలు, దక్షిణాదిన పండేది అదే గనుక మన రైతులకు వెయ్యి నుంచి రెండువేల వరకు నష్టం వచ్చింది, అయితేనేం అమెరికన్లకు తక్కువ ధరలకు దుస్తులను అందించినందుకు మన బిజెపి నేతలు తమ భుజాలను తామే చరుచుకున్నారు. ఇప్పుడు కూడా అమెరికా నుంచి దిగుమతులు చేసుకోవాలని పియూష్‌ గోయల్‌ చెబుతున్నారు. అంటే ఈ ఏడాది కూడా పత్తి రైతుల నోట్లో మట్టికొట్టేందుకు పూనుకున్నారు. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా పత్తిసాగు గిట్టుబాటు కావటం లేదంటూ అమెరికన్‌ రైతులు విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. దాంతో ట్రంప్‌ ప్రభుత్వం రంగంలోకి దిగి వాణిజ్య ఒప్పందాల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను కొనాల్సిందే అనే షరతులు పెడుతోంది.బ్రెజిల్‌ నుంచి పత్తి ఎగుమతుల్లో తీవ్ర పోటీ ఎదురుకావటంతో సబ్సిడీలతో రంగంలోకి దిగనుంది.

అమెరికాతో ఒప్పందం గురించి అడుగడుగునా దాగుడుమూతలే,పైకి చెబుతున్నది ఒకటి లోపల మరొకటి జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. వివిధ రకాల ధాన్యాల నుంచి అమెరికాలో ఎథనాల్‌ తయారు చేస్తారు, ఆ క్రమంలో వచ్చే పిప్పి లేదా చెక్కను పశువుల దాణాగా వినియోగిస్తారు.తాజా ఒప్పందం ప్రకారం దాన్ని మనం ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలి, అది కోళ్ల ఫారాల యజమానులకు లబ్ది కలిగిస్తుంది, కానీ మన దగ్గర అందుకోసం సాగు చేస్తున్న రైతులేం కావాలి ? ఇదే మాదిరి సోయా ఆయిల్‌ను పన్నుల్లేకుండా దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు. ఆ రైతుల పరిస్థితి ఏమిటి ? ఒక వైపు నూనె గింజల సాగును ప్రోత్సహిస్తామంటారు మరోవైపు ఆ రైతులను దెబ్బతీస్తారు. బయో ఇంథన ఉత్పత్తిలో భాగంగా ఇథనాల్‌ తయారీని ప్రోత్సహిస్తారు. అమెరికా నుంచి దాని చెక్కను దిగుమతి చేసుకుంటే ఇక్కడి కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు ?

ముందే చెప్పుకున్నట్లు పైకి చెబుతున్నది ఒకటి లోపల జరుగుతున్నది మరొకటి.అమెరికా నుంచి పప్పు ధాన్యాలను కూడా దిగుమతి చేసుంటారని ట్రంప్‌ యంత్రాంగం ”వాస్తవాల పత్రం ”లో చెప్పింది. మన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో మాట మార్చింది. ఫిబ్రవరి పన్నెండు కార్మికుల సార్వత్రిక సమ్మె సందర్భంగా రైతులు మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గ్గొన్నారు. అలాగే ఐదేండ్ల పాటు ప్రతి ఏటా వంద బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ వస్తువులు, ఇంథనాన్ని కొనుగోలు చేసేందుకు భారత్‌ అంగీకరించినట్లు తొలుత చెప్పారు. తరువాత మాట మార్చి అంగీకారం కాదు వాంఛిస్తున్నదని సవరించారు. డిజిటల్‌ సేవలపై పన్నులు ఎత్తివేసేందుకు మోడీ సర్కార్‌ అంగీకరించిందని తొలుత ప్రకటించారు.తరువాత దానికి సంబంధించిన పేరాను తొలగించారు.దాని బదులు డిజిటల్‌ వాణిజ్య సేవల గురించి సంప్రదింపులు జరిపేందుకు అంగీకరించిదని మార్చారు. ఇలా అమెరికా రోజుకొక మాట చెబుతున్నా మోడీ నోరు విప్పటం లేదు, ఇదేమని అడిగిన వారిని అభివృద్ధి నిరోధకులు, దేశ వ్యతిరేకులని ముద్ర వేస్తున్నారు. మార్చి నెలలో సంతకాలు జరుగుతాయని చెబుతున్న ఒప్పందంలో ఇంకెన్ని చేరుస్తారో, ఆ తరువాత చేర్చటానికి మరెన్ని షరతులకు అంగీకరిస్తారో, రైతాంగాన్ని ఎలా నట్టేట ముంచేందుకు చూస్తున్నారో తలచుకొంటే ఆందోళన కలుగుతోంది, జనం ఎలా స్పందిస్తారో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాషాయదళానికి కర్రుకాల్చి వాత పెట్టిన పినరయి విజయన్‌ : బోనస్‌ , ధాన్యం పండిస్తే భారమ ంటూ లేఖ రాసిన మోడీ సర్కార్‌, ఇరుకున పడ్డ బిజెపి !

09 Monday Feb 2026

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, STATES NEWS

≈ Leave a comment

Tags

Anti Farmer BJP, BJP, Kerala Paddy Bonus Policy, LDF, Narendra Modi Failures, Pinarayi Vijayan

ఎం కోటేశ్వరరావు

ధాన్య ఉత్పత్తి పెరిగితే దేశానికి భారంగా మారుతుందా ? నేరుగా రైతులకే ఎగుమతి అవకాశాలు కల్పిస్తామంటూ కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ సర్కార్‌ అదే చెబుతోంది, రాష్ట్రాలకు లేఖలు రాస్తోంది. అవర్‌ వరల్డ్‌ డాటా ప్రకారం మన పక్కనే ఉన్న చైనాలో 2022లో రోజుకు ప్రతి వ్యక్తికి సగటున 3,454 కాలరీల శక్తి నిచ్చే ఆహారాన్ని అందిస్తుండగా నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తున్న నరేంద్రమోడీ ఏలుబడిలో 2,574 కాలరీలు ఉంది. అయినప్పటికీ ధాన్యం పండించే రైతులకు బోనస్‌ ఇస్తే ఉత్పత్తి పెరుగుతుందని, అది దేశానికి భారంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర వైఖరిని ఆదివారం నాడు ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వరి మద్దతు ధరకంటే అదనంగా క్వింటాలుకు కేరళ ప్రభుత్వం రు.631 అందిస్తున్నది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కంటే ఎక్కువగా ఇవ్వటాన్ని నిలిపివేయాలని కేంద్ర ఆర్థికశాఖలో ఖర్చుల విభాగ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇలా ఇస్తున్న కారణంగా ధాన్య సేకరణ ఖర్చు పెరిగి ప్రభుత్వ ఖజానా మీద వత్తిడిని పెంచుతున్నదని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన అధికారిక లేఖలో పేర్కొన్నారు. తెలంగాణాలో సన్న రకాలు పండించే వారికి బోనస్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర లేఖ ఒక్క కేరళకేనా, అన్ని రాష్ట్రాలు పంపిందా అన్నది తెలియదు. ఎలాంటి శషభిషలు లేకుండా కార్పొరేట్‌ కంపెనీలకు వేలాది కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నదని, రైతులకు ఇచ్చే బోనస్‌ను ప్రధాన ఆర్థిక భారంగా ఎందుకు భావిస్తున్నదని పినరయి విజయన్‌ ప్రశ్నించారు. ఈ లేఖలో వెల్లడించిన అభిప్రాయం వెనుక మనదేశ మార్కెట్‌ను అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు తెరవాలన్న ఆలోచన ఉందా అని కూడా ప్రశ్నించారు.వరి రైతులకు చెల్లించాల్సిన సాయాన్ని సకాలంలో విడుదల చేయటంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ లేఖను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఎల్‌డిఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ టిపి రామకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర వైఖరి ఆహార భద్రత, స్వయం సమృద్ధిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి తొమ్మిదవ తేదీన కేంద్ర ప్రభుత్వం రాసిన ఈ లేఖలో గోధుమ,వరి పంటలకు అదనపు ప్రోత్సాహాన్ని నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పప్పు ధాన్యాలు,చమురు గింజలు,చిరుధాన్యాలకు ప్రోత్సాహాకాలను అందించాలని పేర్కొన్నారు.కేంద్ర సూచనను తిరస్కరిస్తున్నామని, వరి సాగు విషయంలో రాజీపడేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి పి ప్రసాద్‌ కేంద్రానికి లేఖ రాశారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగు ప్రోతాహకాలను తాము వ్యతిరేకించటం లేదని, వరిని ఫణంగా పెట్టి ఆ పని చేయలేమని, వాటి ఉత్పత్తికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేరళ అవసరాలలో కేవలం 21శాతం మాత్రమే స్థానికంగా బియ్యం ఉత్పత్తి ఉంది, దాన్ని 30శాతానికి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహం అందిస్తున్నది.

కొసమెరుపు ఏమంటే కేంద్ర చర్యతో రైతాంగంలో వెలువడిన వ్యతిరేకతతో రాష్ట్ర బిజెపి బెంబేలెత్తింది. వెంటనే ఆ లేఖను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు సోమవారం నాడు వార్త వచ్చింది. అంతవరకైతే అదో దారి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్య రైతాంగాన్ని పట్టించుకోవటం లేదని, ముఖ్యంగా ఉత్పాదక ఖర్చు, సేకరణ యంత్రాంగం, మార్కెటింగ్‌ మద్దతు ఇవ్వటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బోనస్‌ ప్రకటించలేదని కూడా చెప్పారు.కేంద్రం పంపిన లేఖలో పేర్కొన్నట్లు కేరళలో అదనపు ఉత్పత్తిలేదని, కేంద్ర నిల్వలు కూడా అదనంగా లేవని, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని చెప్పిన అంశాలు కేరళకు వర్తించవని బిజెపి నేత వాపోయారు. ధాన్య సాగు విస్తీర్ణం తగ్గుతున్నదని, ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు, ఆహార భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని కూడా పేర్కొన్నారు.ఈ కారణంగానే కేంద్రం ఆర్థికంగా కేరళను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వరి సాగును పెంచేందుకు అదనంగా బోనస్‌ ఇస్తున్నది. దీన్ని సాకుగా చూపి మరిన్ని ఇబ్బందులు పెట్టేందుకే ఆర్థిక శాఖ రాసిన లేఖ అన్నది స్పష్టం. త్వరలో ఎన్నికలు జరగనుండగా ఇలాంటి పనులు చేస్తే వచ్చే ఇబ్బందులను ఊహించి బిజెపి నేత నిర్మలా సీతారామన్‌కు మొరపెట్టుకున్నారు.దీంతో కేంద్ర ప్రభుత్వం, బిజెపి కూడా ఇరుకునపడింది.ఇప్పుడు లేఖను వెనక్కు తీసుకున్నా, లేకున్నా బిజెపికే నష్టం.అదొక అసెంబ్లీ ఎన్నికల అస్త్రంగా మారుతుంది.

ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం గురించి పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం 2022జూలైలో వేసిన కమిటీ ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించలేదు, ఏం చేస్తున్నారని కేంద్రం అడగనూ లేదు. రైతుల పట్ల మోడీ ప్రభుత్వ శ్రద్దకు ఇది చక్కటి తార్కాణం.అమెరికా ఉత్పత్తులకు ఒక్కసారే పూర్తి స్థాయిలో మార్కెట్‌ను తెరిస్తే రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భయంతో దశలవారీ చర్యలకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరినైనా హత్య చేయదలచుకుంటే మెల్లగా పనిచేసే విషం ఇవ్వటం తెలిసిందే. అలా ఒక్కొక్కటిగా వెల్లడిస్తే ఈలోగా జనం అలవాటు పడిపోతారన్నది భావన కావచ్చు. మంత్రి పియూష్‌ గోయల్‌ స్వయంగా చెప్పినట్లు ఇప్పుడు కుదిరింది ఒక స్వరూప అవగాహన మాత్రమే. ఉదాహరణకు ఇల్లు కట్టేటపుడు ఒక ప్లాన్‌ గీస్తారు. తరువాత పిల్లర్లు, గోడలు, స్లాబ్‌ వేస్తారు. ఇంట్లో ఏమేమి ఉండేది తరువాత మాత్రమే బయటివారికి తెలుస్తుంది. అలాంటిదే అమెరికాతో కుదిరిన అవగాహన. తాత్కాలిక ఒప్పందం పేరుతో పశుదాణా అవసరాలకు ఎర్ర జొన్నలు, పలురకాల ధాన్యాలతో చేస్తున్న ఇథనాల్‌ తయారీలో ఉప ఉత్పత్తిగా తయారయ్యే చెక్కను కూడా కూడా దిగుమతి చేసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దిగుమతి పన్నులేకుండా అనుమతించింది. ఇప్పటికే పత్తి దిగుమతి పన్ను తగ్గింపుతో క్వింటాలకు వెయ్యి నుంచి రెండువేల వరకు రైతాంగం నష్టపోయింది.ఈ పశుదాణా పేరుతో దిగుమతులు, అందుకోసం మనదేశంలో సాగు చేస్తున్న మొక్కజొన్న, జొన్న, ఇతర పంటల ధరల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. సోయా ఆయిల్‌ దిగుమతి ఆ పంట పండించే రైతాంగంతో పాటు పామాయిల్‌, నూనె గింజల సాగుమీద ఎలాంటి ప్రతికూల ప్రభావం పడనుందో అధ్యయనం చేయాల్సి ఉంది. యాపిల్‌ పండ్ల దిగుమతులు కాశ్మీర్‌,హిమచల్‌ ప్రదేశ్‌ ఇతర ప్రాంతాల్లోని రైతాంగానికి గొడ్డలి పెట్టని యాపిల్‌ సాగుదార్ల అఖిల భారత సంఘ అధ్యక్షుడు, సిపిఐ(ఎం) నేత మహమ్మద్‌ యూసుఫ్‌ తారిగామి పేర్కొన్నారు.

అమెరికాతో ఒప్పందం రైతాంగానికి నష్టం గనుక ఆందోళన చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా, దాన్నుంచి విడిపోయిన వారితో సహా అనేక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దేశ వ్యవసాయ రంగాన్ని అమెరికన్‌ కార్పొరేట్లకు పూర్తిగా అప్పగించేశారని పేర్కొన్నాయి.వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండవని, మనం ఎగుమతి చేసే వాటిపై 18శాతం పన్ను విధిస్తామని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా, ఐరోపా యూనియన్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు గిడసబారిన స్థితిలో ఉన్నందున చేసుకొనే ఒప్పందాలు వాటికి ఉపయోగం తప్ప భారత్‌కు మేలు చేయవని అనేక మంది చేస్తున్న ఆందోళనను కేంద్రం పట్టించుకోవటం లేదు. ఈనెల పన్నెండున లేబర్‌ కోడ్‌లు, ఇతర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాపిత సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే, వారికి మద్దతుగా, రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఆ రోజున రైతాంగం కూడా పాల్గ్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున ట్రంప్‌, మోడీ దిష్టి బొమ్మలను దగ్దం చేయాలని కోరాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయేతర) ఒక ప్రకటన చేస్తూ త్వరలో సమావేశం జరిపి, అమెరికాతో ఒప్పందానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిస్తామని పేర్కొన్నది. ప్రతిపక్షాలు, రైతు సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వ్యవసాయానికి ఎలాంటి ముప్పు ఉండదని పియూష్‌ గోయల్‌ చెప్పుకున్నారు.

వాణిజ్య ఒప్పందం గురించి 2025 ఫిబ్రవరి 13న డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ చర్చలకు శ్రీకారం చుట్టారు.రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందంలోని అంశాలు ఇలా ఉన్నాయి. అమెరికా పారిశ్రామిక వస్తువులు మరియు పలు ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులను భారత్‌ పూర్తిగా ఎత్తివేయటం లేదా తగ్గించటం చేస్తుంది.వాటిలో పశుదాణా అవసరాల కోసం డ్రైడ్‌ డిస్టిల్లర్స్‌ గ్రెయిన్స్‌(పైన చెప్పుకున్న ఇథనాల్‌ ఉప ఉత్పత్తులు), ఎర్ర జొన్నలు,ట్రీ నట్స్‌, తాజా మరియు ప్రోసెస్‌ చేసిన పండ్లు, సోయాబీన్‌ నూనె, వైన్‌, ఆల్కహాల్‌ మరియు అదనపు ఉత్పత్తులు.దీనికి ప్రతిగా ఏప్రిల్‌ రెండవ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం భారత ఉత్పత్తులపై 18శాతం పన్నులు విధిస్తారు. వాటిలో వస్త్రాలు, దుస్తులు, తోలు వస్తువులు, చెప్పులు, ప్లాస్టిక్‌ మరియు రబ్బరు, ఆర్గానిక్‌ రసాయనాలు,గృహ అలంకరణ వస్తువులు, కళా ఉత్పత్తులు మరియు కొన్ని యంత్రాలు ఉన్నాయి.జనరిక్‌ ఔషధాలు, వజ్ర వైఢూర్యాలు, విమానాల విడిభాగాల మీ పన్నులను రద్దు చేస్తారు.అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా భావించి గతంలో పన్నులు విధించిన భారత విమానాల విడిభాగాలు,అల్యూమినియం, ఉక్కు, రాగి, వాహన ఉత్పత్తులపై రాయితీలు, కోటాలను అమలు చేస్తారు. రానున్న ఐదు సంవత్సరాల్లో అమెరికా నుంచి ఇంథన ఉత్పత్తులు, విమానాలు, విమానవిడి భాగాలు, వంట బొగ్గు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పతులను 500 బిలియన్‌ డాలర్ల మేర కొనుగోలు చేయాలనుందని భారత్‌ చెప్పింది. ఈ ఒప్పందంలో భారత్‌ నుంచి అమెరికా ఏ వస్తువులను, ఎంత మొత్తంలో కొనుగోలు చేసేందుకు అంగీకరించిందీ లేదా వాంఛిస్తున్నదీ వివరాలు లేవు.ఈ కారణంగానే దీన్ని ఖరారు చేసే నాటికి వాటిలో ఎన్ని చేరుస్తారో ఏమిటో జనాలకు అంతుబట్టటం లేదు గనుకనే అనేక అనుమానాలు తలెత్తాయి. ఇది అమెరికాకు అనుకూలంగా ఉందనే అభిప్రాయం రావటానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది, ఒప్పందంపై సంతకాల తరువాత అవి వెల్లడౌతాయి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బూతు పురాణంలో ”భారతీయ ” ప్రముఖులు : దర్శకురాలు మీరా నాయర్‌ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన హిందూత్వ శక్తులు !

07 Saturday Feb 2026

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Telugu, Uncategorized, USA, Women

≈ Leave a comment

Tags

Anil Ambani, BJP, Epstein Files, Hardeep Singh Puri, Jeffrey Epstein, Leftist Zohran Mamdani, Mira Nair

ఎం కోటేశ్వరరావు

ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌ ఈ మాట వినగానే వివాదాస్పద కాశ్మీరీ ఫైల్స్‌ సినిమా గుర్తుకు వస్తుంది. అమెరికాలో జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ స్వంత విమానాల్లో తిరిగేంత ధనవంతుడు, ఫైనాన్సర్‌, ఘరానా పైరవీ, తార్పుడుగాడు. వాడి దగ్గర ఉన్న ఫైల్స్‌ ఓ బూతుసినిమా అనుకుంటే దానిలో మన దేశానికి చెందిన ప్రముఖులు ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రభుత్వ ప్రాపకం ఉన్న పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ వరకు కొందరు నటించినట్లు ప్రస్తావనలు ఉన్నాయి.నీలి చిత్రాల్లో నటించటం అంటే ‘ఏ’ దృశ్యాల్లోనే పాల్గొనాల్సిన అవసరం లేదు. అసలేం జరిగింది ? ట్రంప్‌ సర్కార్‌ విధిలేక బయటపెట్టిన లక్షలాది ఆ ఫైళ్లలో ప్రముఖ దర్శకురాలు, న్యూయార్క్‌ నగర వామపక్ష మేయర్‌ జోహ్రాన్‌ మమదానీ తల్లి మీరా నాయర్‌ పేరు కూడా ఉంది. ట్రంప్‌ను సవాల్‌ చేసి ప్రపంచ పెట్టుబడిదారీ కుంభస్థలంగా భావించే నగరానికి 34ఏండ్ల మమదానీ ఎన్నికయ్యాడు. అవకాశం కోసం చూస్తున్న అమెరికాలో వామపక్ష వ్యతిరేకులు, వారి అడుగుజాడల్లో నడిచే హిందూత్వ శక్తులు రెచ్చిపోయాయి.

కృత్రిమ మేథతో రూపొందించిన చిత్రాల్లో ఒకదానిలో బాలుడిగా ఉన్న జోహ్రాన్‌ మమ్‌దానీ, మీరానాయర్‌, బిల్‌క్లింటన్‌,జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ ఉన్నారు. ఆ ఫొటోలను ఎక్స్‌లో పెట్టటంతో లక్షలాది మంది చూశారు.ఇద్దరు పెద్ద ఉగ్రవాదులతో ఒక చిన్న ఉగ్రవాది అన్నారు. మమదానీకి శిక్షణ ఇచ్చింది ఎప్‌స్టెయిన్‌ అన్న అర్ధం వచ్చేలా ఫొటోల కింద వ్యాఖ్య రాశారు. మన దేశంలో హిందూత్వ ప్రచారం చేస్తున్న ఖాతాలలో జైపూర్‌ డైలాగ్స్‌ ఒకటి. అలెక్స్‌ జోన్స్‌ పోస్టు చేసిన ఫేక్‌ ఫొటో వీడియోను అది షేర్‌ చేసింది. మమదానీ అసలు తండ్రి ఎప్‌స్టెయిన్‌ అని వర్గాలు తెలిపాయి అంటూ వ్యాఖ్య చేశారు. ఇదే విధంగా వాయిస్‌ ఆఫ్‌ హిందూస్‌ పేరుతో ఉన్నవారు కూడా దాన్ని ప్రచారంలో పెట్టారు. నిజమేమిటో తల్లి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇలా అనేక మంది వాటిని వైరల్‌ చేశారు. దీని వెనుక ముస్లిం, వామపక్ష భావజాల వ్యతిరేక ఉన్మాదం స్పష్టంగా కనిపిస్తోంది. మీరా నాయర్‌ అమెరికాలో చదువుకున్న రోజుల్లో ఆమెకు టీచర్‌గా ఉన్న మిచెల్‌ ఎపిస్టెయిన్‌తో 1970దశకం చివరిలో వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత విడిపోయారు.ఈ ఎపిస్టెయిన్‌కు, తార్పుడు ఎపిస్టెయిన్‌కు కుటుంబం, ఇతరత్రా ఎలాంటి సంబంధాలు లేవు. ఒకరు ఆర్టిస్టు కాగా మరొకడు నేరగాడు. మీరా నాయర్‌ ఎలాంటి తప్పూ చేయనప్పటికీ ఆ పార్టీలో పాల్గొనటాన్ని అవకాశంగా తీసుకొని మమదానీ వ్యతిరేకులు, వారితో గొంతుకలిపిన హిందూత్వశక్తులు పెద్ద ఎత్తున కృత్రిమ ఫొటోలు సృష్టించి అక్రమ సంబంధాలను అంటగట్టారు.జోహ్రాన్‌ తండ్రి ఎప్‌స్టెయిన్‌ అని ప్రచారం చేశారు. ఎన్నికల్లో నిజాలను దాచి తమను మోసం చేశారంటూ మమదానీ అభిమానుల ముసుగులో కొందరు న్యూయార్క్‌లో ప్రదర్శన చేశారు. అయితే నిజనిర్ధారణ చేసిన వారు అవన్నీ తప్పుడు ప్రచారాలని, ఎలాంటి వాస్తవం లేదని తేల్చారు.

ఎప్‌స్టెయిన్‌ ఫైళ్లలో మాన్‌సూన్‌ వెడ్డింగ్‌, నేమ్‌సేక్‌, సలాంబాంబే వంటి చిత్రాలు నిర్మించినప్రముఖ దర్శకురాలు మీరా నాయర్‌ ప్రస్తావన ఉంది. ఆమె న్యూయార్క్‌లో ” సామాజిక సేవకురాలు ” గా ఉన్న ఘిస్‌లేయిన్‌ మాక్స్‌వెల్‌ ఇంట్లో జరిగిన ఒక విందులో పాల్గ్గొన్నారు. తన సినిమా అమేలియా తొలి ప్రదర్శన తరువాత 2009లో ఈ ఉదంతం జరిగింది. ప్రచార రంగంలో ఉన్న పెగీ సిగల్‌ ఆ పార్టీలో పాల్గ్గొన్నవారి గురించి ఎప్‌స్టెయిన్‌కు పంపిన ఈ మెయిల్‌లో ” సినిమా కోసం ఏర్పాటు చేసిన పార్టీ తరువాత ఘిస్‌లెయిన్‌ టౌన్‌హౌస్‌ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. బిల్‌క్లింటన్‌(అమెరికా మాజీ అధ్యక్షుడు),జెఫ్‌ బెజోస్‌(అమెజాన్‌ అధినేత) అక్కడ ఉన్నారు.జీన్‌ పిగోజీ (పెట్టుబడిదారు), డైరెక్టర్‌ మీరా నాయర్‌ తదితరులు కూడా ఉన్నారు ” అని ఉంది. సినిమా పార్టీ గనుక అనేక మంది హాలీవుడ్‌ ప్రముఖులు కూడా వచ్చారు. న్యూయార్క్‌లో ఇలాంటి పార్టీలు మామూలు. మీరా నాయర్‌-ఎపిస్టెయిన్‌ మధ్య నేరుగా సంబంధాలు ఉన్నట్లు ఎక్కడా ప్రస్తావన లేదు. మాక్స్‌వెల్‌ కార్యకలాపాల గురించి తెలియని అనేక మంది అలాంటి పార్టీలకు సినిమా రంగానికి చెందిన వారు వచ్చేవారు. నిజానికి ఆమె సామాజిక సేవకురాలి ముసుగులో ఎప్‌స్టెయిన్‌తో కలసి తరుణ వయస్సులో ఉన్న బాలికలను ఆకర్షించి ప్రముఖులకు తార్చటంలో ప్రముఖురాలు.ఆ కేసులో 20 ఏండ్ల శిక్షపడి ఇప్పుడు జైల్లో ఉంది. చిత్రం ఏమిటంటే ఆమె తండ్రే ఎప్‌స్టెయిన్‌కు పరిచయం చేశాడు. ఇద్దరూ కలసి తిరగటమేగాక బాలికలను సరఫరా చేశారు.

ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌లో పేర్లున్న మన ప్రముఖుల గురించి చూద్దాం.వారికి ఆ తార్పుడు గాడు అమ్మాయిలను సరఫరా చేసినట్లు గానీ, వాడి నేరాలలో భాగస్వామ్యం ఉన్నట్లు గానీ ఇప్పటి వరకు వెలువడిన పత్రాల్లో లేదు.ఇప్పటికి ఆరులక్షల పేజీలు వెల్లడి కాగా ఇంకా బయటకు రావాల్సినవి ఉన్నాయి. ఇక్కడ అసలు సమస్య అలాంటి అవాంఛనీయ వ్యక్తితో విలువలు వలువల గురించి కబుర్లు చెప్పేవారు సంబంధాలు ఎందుకు పెట్టుకున్నారన్నదే బయటకు రావాల్సిన అంశం. తెరవెనుక ఇవన్నీ సాధారణమే అంటారా అదైనా చెప్పండి. మోడీ ఆన్‌ బోర్డ్‌ అనే ఇమెయిల్లో ప్రధాని పేరు ప్రస్తావన ఉంది. ఆ తార్పుడుగాడితో 2014-17 సంవత్సరాలలో కేంద్ర మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఐదుసార్లు కలిసినట్లు వెల్లడైంది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన పూరీ 2014 జనవరిలో బిజెపిలో చేరారు. అంతకు ముందు 1974 నుంచి 2013వరకు విదేశాంగశాఖ అధికారిగా వివిధ హౌదాల్లో పని చేశారు.ప్రస్తుతం పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.ప్రధాని నరేంద్రమోడీ గురించి జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ మరియు డోనాల్డ్‌ ట్రంప్‌ మాజీ వ్యూహకర్త స్టీవ్‌ బనాన్‌ మధ్య నడిచిన ఇమెయిల్స్‌లో ప్రస్తావన ఉంది.తాను ట్రంప్‌ అధికార యంత్రాంగం-భారత ప్రధాని కార్యాలయ అధికారులకు మధ్యవర్తిగా ఉన్నట్లు ఎప్‌స్టెయిన్‌ పేర్కొన్నాడు. 2017 జూలై ఆరున మోడీ ఇజ్రాయెల్‌ పర్యటన ముగిసిన తరువాత కతార్‌కు చెందిన జబోర్‌ వై అనే వ్యక్తి(కతార్‌ రాచకుటుంబానికి చెందిన వ్యక్తి అని వార్తలు)కి మెయిలు పంపాడు.దానిలో ” భారత ప్రధాని మోడీ సలహా తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడికి మేలు చేకూర్చేందుకు ఇజ్రాయెల్‌లో నృత్యం చేశారు, పాట పాడారు.వారు కొద్ది వారాల ముందు కలుసుకున్నారు, అది పని చేసింది ” ( ఇక్కడ నృత్యం, పాట అంటే అవసరానికి అనుగుణంగా వ్యవహరించారని అనుకోవాలేమో) మోడీ ఇజ్రాయెల్‌ పర్యటన ఖ్యాతి తనదే అని కూడా పేర్కొన్నాడు. ఒక భారత ప్రధాని తొలిసారిగా ఇజ్రాయెల్‌ను సందర్శించటమే గాక తరువాత విదేశాంగ విధానంలో నిర్ణయాత్మక మార్పులు చేసిన ఖ్యాతి మోడీకి దక్కిందన్నది స్పష్టం. ఈ ఫైళ్లలో ఉన్న అంశం మీద మన విదేశాంగశాఖ స్పందించింది.ప్రధాని పర్యటన నిజమే గానీ శిక్షపడిన ఒక నేరగాడు పేర్కొన్న అంశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎప్‌స్టెయిన్‌ లేదా ఇతర విదేశీ సలహాల ప్రభావంగానీ పర్యటన మీద లేదని వ్యాఖ్యానించింది. ఆ సమయంలో ఎప్‌స్టెయిన్‌ ట్రంప్‌ యంత్రాంగంతో సంబంధాలలో ఉన్నాడన్నది, భారత వ్యవహారాల్లో వేలుపెట్టాడన్నది వాస్తవమే అన్నది కొందరి అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితిలో నిజానిజాలను ఎవరూ బయటపెట్టరన్నది వేరే చెప్పనవసరం లేదు.

నరేంద్రమోడీ నేరుగా కలిసినట్లు ఎప్‌స్టెయిన్‌ కూడా చెప్పలేదు. అతగాడి హవా నడిచిన సమయంలో కేంద్ర మంత్రి హరదేవ్‌ సింగ్‌ పూరీ 2014-17 సంవత్సరాలలో ఐదుసార్లు పూరీ కలిసినట్లు ఎప్‌స్టెయిన్‌ దినచర్య డైరీలో పూరీ పేరు ఉంది. మూడు సార్లు న్యూయార్క్‌ నివాసంలో భేటీ అయినట్లు స్పష్టంగా ఉంది.నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2014 నవంబరులో భారత డిజిటల్‌ ఎకానమీ, పెట్టుబడులకు ఉన్న మంచి అవకాశాల గురించి పూరీ ఒక మెయిల్‌ పంపారు.సిలికాన్‌ వాలీలోని,టెక్‌ కంపెనీల ఉన్నతాధికారులు, పెట్టుబడిదారులతో పూరీని కలిపేందుకు చురుకుగా ఎప్‌స్టెయిన్‌ పని చేసినట్లు ఒక మెయిల్లో ఉంది. లింక్‌డ్‌ ఇన్‌ కంపెనీ స్థాపకుడితో భారత్‌లో పెట్టుబడి అవకాశాల గురించి పూరీ చర్చించినట్లు కూడా వెల్లడైంది.తాను ఎనిమిదేండ్లు న్యూయార్క్‌లో ఉన్నానని, మూడు సార్లు కలిసింది నిజమే అని అంతర్జాతీయ పీస్‌ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తుండగా మూడుసార్లు కలిసింది నిజమే అని, అది పని సంబంధంగా, చాలా పరిమితమైన కలయిక అని, తనకు అతగాడి నేరజీవితం గురించి తెలియదని వైర్‌ పోర్టల్‌ అడిగిన ప్రశ్నకు పూరీ సమాధానంగా చెప్పారు.తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని చెప్పినట్లుగా కేంద్ర మంత్రి సమాధానం ఉంది.అంతర్జాతీయ శాంతి వ్యవహారాల్లో ఎప్‌స్టెయిన్‌కు ఉన్న సంబంధం ఏమిటో ఒక రాయబారిగా పూరీ ఏమి చర్చించారో అంతుబట్టదు. ఆ భేటీల తరువాతే గురుదీప్‌ సింగ్‌ పూరీ కేంద్ర మంత్రివర్గంలో 2017లో చేరారు. చిత్రం ఏమిటంటే ఈ ఫైళ్ల గురించి తొలి సమాచారం 2025 నవంబరులోనే వెల్లడైంది. ఇదంతా వట్టిదే అని అప్పుడు బిజెపి ప్రతినిధి ప్రదీప్‌ భండారీ కొట్టి పడేశారు. ఇప్పుడు ఆ పెద్దమనిషి తలెక్కడ పెట్టుకున్నారో తెలియదు.

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ పేరుతో మందిని ముంచిన అనిల్‌ అంబానీ నడిపిన వ్యవహారాలు ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌లో స్పష్టంగా ఉన్నాయి. 2017మార్చినెల 16న అంబానీ పంపిన ఒక వర్తమానం ఇలా ఉంది.” హలో నేను ఢిల్లీలో ఉన్నాను.జారెడ్‌(ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుషనర్‌) మరియు బానన్‌ (స్టీవ్‌ బానన్‌ ట్రంప్‌ ప్రధాన వ్యూహకర్త)లను నేను కలుసుకొనేందుకు మీ సాయం కావాలని ”నాయకత్వం ” ( ప్రధాని కార్యాలయం) వాంఛిస్తున్నది. దయచేసి సలహా ఇవ్వండి.ప్రధాని వాషింగ్టన్‌ పర్యటన జరపబోతున్నారు. అని అనిల్‌ అంబానీ పేర్కొన్నాడు. ఇదంతా ఆ తరువాత 2017 జూన్‌లో జరిపే అమెరికా పర్యటనకు ముందు జరిగింది.2017 నుంచి 2019వరకు అనిల్‌ అంబానీ -ఎప్‌స్టెయిన్‌ మధ్య నిరంతర సంబంధాలు ఉన్నట్లు ఫైళ్లలో బయటపడింది.వారేమి చర్చించుకున్నారంటే అమెరికా, భారత్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పెట్టుబడి వ్యూహాలు, ట్రంప్‌ యంత్రాంగంతో అప్పాయింట్‌మెంట్లు,మోడీ అమెరికా, ఇజ్రాయెల్‌ యాత్రల గురించి.ప్రధాని ఇజ్రాయెల్‌ పర్యటనకు ముందు, ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ బరాక్‌ను ఎలా కలుసుకోవాల్సిందీ ఒక మెయిల్‌లో ఎప్‌స్టెయిన్‌ అంబానీకి సూచించాడు. ఇద్దరి మధ్య సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పాడు. మోడీ పర్యటనపై ఇజ్రాయెల్‌ వ్యూహం గురించి చర్చించారు. ఆ సమయంలో అనిల్‌ అంబానీ రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ఇజ్రాయెల్‌ ప్రభుత్వ రంగ సంస్థ రాఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ కంపెనీతో సంయుక్త ప్రాజెక్టు నడుస్తున్నది. మోడీ సర్కార్‌ రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో అనిల్‌ అంబానీ పాత్ర, అతగాడికి ఆ విమానాలను తయారు చేసే ఫ్రెంచి కంపెనీ దసాల్ట్‌తో విమానాల విడిభాగాల తయారీపేరుతో కుదిరిన ఒప్పందం గురించి తెలిసిందే. అంతకు ముందు అంబానీలు ఎన్నడూ ఆ రంగంలో లేరు. అనిల్‌ అంబానీ దివాలా ప్రకటించినపుడు 2019లో తనకు 75 కోట్ల డాలర్ల రుణ సేకరణకు సలహా ఇవ్వాలని ఎప్‌స్టెయిన్ను కోరినట్లు వెల్లడైంది. వీటి గురించి వివరణ కోరగా అంబానీ కంపెనీ నుంచి స్పందన లేదని మీడియాలో వార్తలు వచ్చాయి. రాజకీయ నేతలు, వాణిజ్య కంపెనీల యజమానుల సంబంధాలు గురించి ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.ఎపస్టెయిన్‌ వంటి బాపతును దేనికైనా వినియోగించుకోవచ్చని కూడా తెలిసిందే.

భారతీయ-అమెరికన్‌ రచయిత,నీతి బోధలు చేస్తూ, ప్రత్యామ్నాయ వైద్యం గురిచి ప్రచారం చేస్తున్న దీపక్‌ చోప్రా కూడా ఎప్‌స్టెయిన్‌తో సంబంధాలు నెరిపినట్లు బయటపడింది. అతనితో సంబంధాలు నిజమే గానీ తానెలాంటి నేరాలకు పాల్పడలేదని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. వారి మధ్య 2016-2019 మధ్య ఇమెయిల్స్‌ నడిచాయి.పన్నెండుసార్లు వారు కలుసుకున్నట్లు తేలింది.డోనాల్డ్‌ ట్రంప్‌ రెండవ భార్య మర్లా మాపుల్స్‌ సమాచారం చెప్పమని, అది మన మధ్యే ఉంటుంది తప్ప ఇతరులెవరితో చెప్పనని దీపక్‌ మిశ్రా 2016 జూలైలో ఎప్‌స్టెయిన్‌కు మెయిలు చేశారు.అమె వివరాలు తెలియచేస్తూ ఆమె గర్భవతా కాదా అన్నదాని గురించిన పందెంలో తాను ఓడిపోయినట్లు కూడా ఎప్‌స్టెయిన్‌ పేర్కొన్నాడు. ఈ వ్యవహారాలు బయటపడిన తరువాత నెలకు పదిడాలర్లు చెల్లిస్తే ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తానంటూ దీపక్‌ మిశ్రా జనాలను ఆకట్టుకొనేందుకు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. మనదేశానికి చెందిన వారు ఎప్‌స్టెయిన్‌తో నిర్వహించిన లావాదేవీలు, సంబంధాల గురించి మన ప్రధాన స్రవంతి మీడియా మౌనం దాల్చింది.నిజానిజాలను చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం, బిజెపి వాటిని కొట్టిపారవేయటం, మౌనం దాల్చి మూసిపెట్టేందుకు చూస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యా, చైనాల కట్టడికి మరిన్ని అణ్వాయుధాలు కావాలంటున్న అమెరికా !

04 Wednesday Feb 2026

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Science, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Arms race, Donald trump, East Asia Semiconductors, New START treaty, nuclear and missile tests, US build-up, US-Russia Nuclear Limits, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

అమెరికా ా రష్యా మధ్య కుదిరిన వ్యూహాత్మక ఆయుధ తగ్గింపు ఒప్పందం (స్టార్ట్‌) గడువు బుధవారం రాత్రితో (ఫిబ్రవరి నాలుగు) ముగియనుంది. పునరుద్దరణకు అవకాశాలు లేనందున ప్రపంచంలో నూతన ఆయుధ పోటీకి తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏ రూపంలో ముందుకు వస్తుందో, ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో అన్న చర్చ ప్రారంభమైంది. ఆయుధ రంగంలో ముందున్న అమెరికా తాపీగా ఉంది. ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడినపుడు అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ జవాబిస్తూ ఒక వేళ ఒప్పందం గడువు తీరితే,అది ముగిసిపోతుంది అంతే అని స్పందించాడు.అమెరికా, రష్యా రెండు దేశాలూ పాతబడిన ఆయుధాలను తొలగించుకొనేందుకు గతంలో కుదిరిన ఒప్పందాన్ని వినియోగించుకున్నాయి తప్ప కొత్తవాటిని తయారు చేయటం మానుకోలేదనే విమర్శ ఉంది. ఆ రెండు దేశాల దగ్గర ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలలో 87శాతం ఉన్నాయి. గతంలో 2002లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఆయుధాలను 1,700 మరియు 2,200కు పరిమితం చేసుకోవాల్సి ఉంది. దాని స్థానంలో 2010లో పదేండ్లపాటు అమల్లో ఉండే నూతన ఒప్పందం ప్రకారం మరింతగా తగ్గించేందుకు అంగీకరించాయి.దీని గడువు పొడిగింపు వ్యవధి కూడా ముగిసిపోనుంది. ఉన్నవాటిని నవీకరించుకొనేందుకు, వాటికి అవసరమైన కేంద్రాల నిర్వహణ వంటి వాటికి అమెరికాకు రెండు లక్షల కోట్ల డాలర్లమేర ఖర్చు అవుతుందని అంచనావేశారు.రష్యా పరిస్థితి కూడా అటూఇటూగా అంతే. పోనీ ఇంత ఖర్చు చేసినా అమెరికా కలలుగన్న ప్రపంచాధిపత్యం సాధ్యం కాలేదు, పూర్వపు సోవియట్‌, తరువాత రష్యాకు యావత్‌ దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యం లేకపోయినా అమెరికాను అడ్డుకొనేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒప్పందం లాంఛనంగా ఫిబ్రవరి ఐదుతో ముగియనున్నప్పటికీ ఆ ప్రక్రియ 2023లోనే ప్రారంభమైంది. సమాచార మార్పిడి, తనిఖీల వంటి వాటిని రష్యా పక్కన పెట్టింది.

అమెరికాకు ఎన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ కొత్తగా దానికి మరొక భయం పట్టుకుంది. గతంలో ఒక్క రష్యాతోనే పోటీ అనుకుంటే ఇప్పుడు చైనా ముందుకు వస్తోంది, రెండూ కలసి వస్తే తమ పరిస్థితేమిటని వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారట. నిజానికి అణుయుద్దమే వస్తే ఎవరూ మిగలరు. అమెరికా రక్షణ శాఖ తాజా నివేదిక ప్రకారం అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే ఆ సమాచారాన్ని మూడు నాలుగు నిమిషాల్లోనే చైనా కమాండర్లకు చేరవేయగలిగే సమాచార వ్యవస్థ బీజింగ్‌ వద్ద ఉందని పేర్కొన్నారు. శత్రు క్షిపణులు తమను చేరేలోగానే పసిగట్టి ఎదురుదాడికి దిగే సత్తా కలిగి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పదకొండువేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఆధునిక క్షిపణిని చైనా 2024లో పసిఫిక్‌ సముద్రంలో పరీక్షించింది. తరువాత అనేక ప్రయోగాలు చేసింది. అమెరికాను ఎదుర్కొనేందుకు రకరాల క్షిపణుల తయారీలో ఉంది. 2050 నాటికి ఇప్పుడు మోహరించిన 1,770 అణ్వాయుధాల సంఖ్యను 4,625కు పెంచుకోవాలని చూస్తోంది. ఇతర ఆయుధాల సంగతి సరేసరి. ఒకవైపు ఇలా మారణాయుధాల గుట్టలను పెంచుతూనే ఎదుటి దేశాల మీద కుట్ర సిద్దాంతాలను ప్రచారం చేస్తున్నది.

ఈ పూర్వరంగంలో భవిష్యత్‌లో ఆయుధ నియంత్రణ ఒప్పందాలంటూ జరిగితే వాటిలో చైనా కూడా చేరాల్సిందేనని అమెరికా పట్టుబడుతున్నది, ససేమిరా కుదరదని బీజింగ్‌ పలుసార్లు స్పష్టం చేసింది. ఒప్పందాల్లేకపోతే జరిగేదేమిటి ? ఆయుధ పోటీ మరింత పెరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. కొద్ది నెలల్లోనే రష్యా 60, అమెరికా వందశాతంపైగా అణ్వాయుధాలను పెంచుకుంటాయని, రిజర్వులో ఉంచిన వాటిని సిద్దం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం వివిధ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలు, వాటి స్థితి ఇలా ఉంది.

దేశం× ఆయుధాలు×మోహరింపు×నిల్వలు ×ఉపయోగంలో లేనివి

రష్యా×××× 5,449 ×× 1,710 ×× 2,589 ×× 1,150

అమెరికా×× 5,277 ×× 1,770 ×× 1,930 ×× 1,577

చైనా ×××× 600 ×× 24 ×× 576 ×× 0000

ఫ్రాన్స్‌×××× 290 ×× 280 ×× 10 ×× 0000

యుకె×××× 220 ×× 120 ×× 105 ×× 0000

భారత్‌×××× 180 ×× 0000 ×× 180 ×× 0000

పాక్‌ ×××× 170 ×× 0000 ×× 170 ×× 0000

ఇజ్రాయెల్‌ × 90 ×× 0000 ×× 90 ×× 0000

ఉ.కొరియా × 50 ×× 0000 ×× 50 ×× 0000

రెండవ ప్రపంచ యుద్దం నాటికి ఒక్క అమెరికా దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి.అవసరం లేకపోయినా జపాన్‌ మీద ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టింది.దాంతో మిగిలిన దేశాలు కూడా వాటిని సమకూర్చుకున్న కారణంగానే దాని దూకుడు తగ్గింది.అయినప్పటికీ దాని దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలు ఉండటంతో అనేక దేశాలను ఇతరంగా బెదిరిస్తూనే ఉంది,దాడులు, దురాక్రమణలకు పాల్పడుతూనే ఉంది. ఎర్రగీత దాటితే అణ్వాయుధాలను మోహరిస్తానని ఉక్రెయిన్‌ పోరులో రష్యా హెచ్చరించిన కారణంగానే నాటో దేశాలు అదుపులో ఉన్నాయి.ఆర్థిక రంగంలో తనకు సవాలు విసురుతున్న చైనా మీద అనేక కట్టుకథలను ప్రచారంలో పెట్టి ఇతర దేశాలను తన వెనుక సమీకరించుకొనేందుకు అమెరికా పూనుకుంది.వచ్చే నాలుగు సంవత్సరాల్లో బీజింగ్‌ తన అణ్వాయుధాలను వెయ్యికి పెంచుకోనుందని, వాటిని మోహరించటానికి ఏర్పాట్లు చేస్తున్నదనే ప్రచారం దానిలో భాగమే. ప్రతిదేశం మాదిరే చైనా కూడా తన పాటవాన్ని పెంచుకుంటున్నది.చైనా, పాకిస్తాన్‌లను బూచిగా చూపి మనదేశాన్ని కూడా ఆయుధ పోటీలోకి పశ్చిమదేశాలు దించుతున్నాయి. అవసరం లేకుండా శక్తికి మించి ఆయుధాలకు ఖర్చు చేస్తే పాక్‌ మాదిరి దివాలాదీయటం ఖాయం. ఆయుధాలను అమ్ముకొనేవారు రకరకాల కుట్ర సిద్దాంతాలను ముందుకు తెస్తే వేర్వేరు ముసుగుల్లో ఉన్న వారి ఏజంట్లు వాటికి మసాలా దట్టిస్తారు. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో మనదేశం రక్షణ బడ్జెట్‌ను పెద్ద మొత్తంలో పెంచిన తీరు చూశాము.

ఆయుధ నియంత్రణ ఒప్పందం లేకపోవటంతో భారత్‌కు ఇబ్బంది వచ్చిందనే కొత్త పల్లవి కొందరు అందుకున్నారు. నిజానికి ఆ ఒప్పందంలో చైనా లేదు, అయినప్పటికీ ఇప్పుడు సరికొత్తగా ఆయుధాలు పెంచుకొనేందుకు పూనుకున్నందున మనం కూడా ఆలోచించాలని చెబుతున్నారు. చైనా సహకారంతో పాకిస్తాన్‌ కూడా అమ్ములపొదిని విస్తరించుకోవచ్చంటున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలనటంలో ఎలాంటి సందేహం లేదు, కానీ చైనాతో పోటీపడాలని చెప్పటం సరైందేనా ! మన దేశం నుంచి ముప్పు ఉందనే కారణంతో చైనా తన ఆయుధాలను పెంచుకోవటం లేదు, దాని కేంద్రీకరణ అంతా అమెరికా, దాని మిత్రదేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా, తదితర దేశాల మీదనే. అమెరికాతో అవసరానికి మించి ఆయుధ పోటీకి దిగటం కూడా సోవియట్‌ దెబ్బతినటానికి ఒక కారణంగా కొందరు చెప్పటాన్ని, చైనా, మన ఆర్థిక శక్తిని విస్మరించకూడదు.

వర్తమాన కాలంలో మిలిటరీ శక్తిలో అణ్వాయుధాలు ప్రముఖ పాత్రపోషిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో కృత్రిమ మేథ(ఎఐ) ఆయుధ పోటీని గణనీయంగా ప్రభావితం చేయనుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ముఖ్యమైన సెమీకండక్టర్ల రంగంలో అమెరికా-చైనా పోటీపడుతున్నాయి. ఏ రంగంలోనైనా అవి లేకుండా గడిచే స్థితి లేదు.శత్రువుల కదలికలను పసిగట్టటం, స్థావరాలను స్పష్టంగా ఫొటోలు తీయటంలోనూ అవి కీలకంగా మారాయి. చైనా తన సత్తాను చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పూర్వరంగంలో సెమీకండక్టర్ల రంగంలో ప్రస్తుతం తూర్పు ఆసియాలోని తైవాన్‌ ప్రాంతం, జపాన్‌, దక్షిణ కొరియాలు ప్రధానంగా ముందుండగా అమెరికా, ఐరోపా దేశాలు కూడా గణనీయ భాగాన్ని కలిగి ఉన్నాయి. ఆధునిక పరిజ్ఞానాన్ని, సెమికండక్టర్లను చైనాకు అందకుండా అమెరికా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. విడిగా ఉంటున్న తైవాన్‌ విలీనం 2049 నాటికి పూర్తి చేస్తామని చైనా ప్రకటించగా అడ్డుకొని తీరతామని, రక్షణగా సిలికాన్‌ షీల్డ్‌ ఏర్పాటు చేస్తామని, ఒక వేళ బలవంతంగా విలీనం చేసుకుంటే అంతిమంగా అక్కడ ఉన్న సెమికండక్టర్‌ పరిశ్రమలన్నింటినీ పేల్చివేస్తామని కూడా వాషింగ్టన్‌ బెదిరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ చైనా ఎప్పటికప్పుడు తైవాన్‌ తమదే అని వెనక్కు తగ్గేది లేదని ప్రకటిస్తున్నది, తాను విధించిన గడువు చాలా సంవత్సరాలు ఉన్నందున ఎలాంటి మిలిటరీ చర్యకు పాల్పడటం లేదు.ప్రస్తుతం అమెరికా వద్ద ఆధునిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ ప్రపంచ చిప్స్‌ తయారీలో కేవలం 12శాతమే అక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. దాని అవసరాల కోసం ఎక్కువగా తైవాన్‌ మీద ఆధారపడుతున్నది. చైనాలో విలీనాన్ని అడ్డుకోవటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే.మొత్తం మీద ప్రపంచ ఉత్పత్తిలో తైవాన్‌ సగం, ఆధునిక చిప్స్‌లో 90శాతం కలిగి కీలకమైన స్థానంలో ఉంది. పరిశ్రమలను అక్కడి నుంచి తరలించేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నప్పటికీ ఈ పాటికి అమెరికా ఆ పని చేసి ఉండేది, అది సాధ్యం కాదని, వాటిలో పనిచేసే నిపుణులు కూడా తైవాన్‌లో గణనీయంగా ఉండటమే అని చెబుతున్నారు.మొత్తం 66శాతం ఉత్పాదక సంస్థలు తూర్పు ఆసియాలో 292 చోట్ల ఉన్నాయి.

మిలిటరీ రంగంలో ఏఐ లేదా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ చిప్స్‌ వినియోగం గురించి ఇంకా అనేక పరిశోధనలు జరగాల్సి ఉంది.ప్రస్తుతం ప్రయోగశాలలు సాధారణ ఉష్ణోగ్రతల వద్ద వాటిని పరీక్షించారు, అయితే అధిక వేడి, శీతల ప్రాంతాల్లో వాటి పనితీరును చూడాల్సి ఉంది.అవసరమైన సంఖ్యలో తయారు చేసే సంస్థల అవసరం కూడా ఒక సమస్యే. జోబైడెన్‌ హయాంలో చైనాకు అవసరమైన ఆధునిక చిప్స్‌ను ఎగుమతి చేయరాదంటూ నివిడియా కంపెనీ మీద ఆంక్షలు విధించారు. అయితే దాన్ని సవాలుగా తీసుకొని భారీ మొత్తాలను కేటాయించిన డ్రాగన్‌ తనకు అవసరమైన వాటిని ఉత్పత్తి చేయటమే కాకుండా ఆధునిక రకాల కోసం పరిశోధనలు చేస్తున్నది. ఈ పూర్వరంగంలోనే ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత నిషేధాన్ని సడలించి ఎగుమతులకు అనుమతులు ఇచ్చినప్పటికీ నివిడియా ఉత్పత్తి హెచ్‌-200రకం చిప్స్‌ తమకు అవసరం లేదని చైనా ప్రకటించినట్లు వార్తలు. క్వాంటమ్‌ సాంకేతిక పరిజ్ఞాన విషయంలో కూడా అమెరికా ఆంక్షలు విధించటం తెలిసిందే.ఒకవైపు పన్నుల యుద్ధం మరోవైపు సాంకేతిక రంగంలో అమెరికా దాడిని తట్టుకొనేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేయటమే గాక అనేక విజయాలను సాధించి స్వయంసమృద్ధి కోసం ప్రయత్నిస్తున్నది.చాట్‌జిపిటికి పోటీగా చాలా తక్కువ ఖర్చుతో డీప్‌సీక్‌ను తయారు చేసిన సంగతి తెలిసిందే. తన అవసరాలకు ప్రపంచ సరఫరా గొలుసు మీద ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నది. ఎప్పుడైనా తైవాన్‌ విలీనం చేసుకుంటానంటూ చేస్తున్న ప్రకటనలతో సెమీకండక్టర్లకు దాని మీద ఎక్కువగా ఆధారపడిన అమెరికాకు దడపుట్టిస్తున్నది. బహుశా అందుకే తమ దేశంలో ఉత్పత్తి చేసే విధంగా 250 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.

ముందే చెప్పుకున్నట్లుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల కుట్రలను వమ్ము చేసేందుకు కృత్రిమ మేథలో ఇతరుల మీద ఆధారపడకుండా చైనా పూనుకుంది.2025 ఏప్రిల్‌లో కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో ప్రత్యేకంగా సమావేశం జరిపి కర్తవ్య నిర్దేశం చేసింది. ప్రభుత్వం దేశీయంగా ఉన్న పెద్ద కంపెనీలను ప్రోత్సహిస్తున్నది. సెమికండక్టర్లను స్వయంగా తయారు చేస్తున్నప్పటికీ అమెరికాలోని నివిడియా కంపెనీ మాదిరి ఆధునిక డిజైన్లలో అది ఇంకా వెనుకబడే ఉంది. సాంకేతిక అంతరాన్ని క్రమంగా తగ్గిస్తున్నది. ప్రపంచ నిపుణులను ఆకర్షించేందుకు అమెరికా మాదిరి సౌకర్యాలు కల్పిస్తూ 2025 అక్టోబరు నుంచి కె వీసాలను జారీ చేస్తున్నది.అమెరికాలో ఉన్న తన జాతీయులైన వారిని స్వదేశానికి రప్పిస్తున్నది. గతంలో అమెరికా విసిరిన సవాళ్లన్నింటినీ అధిగమించి ముందుకు పోయిన చైనా కృత్రిమ మేథలో కూడా విజయం సాధిస్తునటంలో ఎలాంటి సందేహం లేదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d