• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: INDIA

ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !

28 Wednesday Jan 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

China, Donald trump, Narendra Modi Failures, World Military Power, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

77వ రిపబ్లిక్‌ దినోత్సవం రోజున మన సైనిక బలగాల సత్తాను ప్రదర్శించారు. న్యూఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిపిన కవాతును చూసి దేశం యావత్‌ పులకించిపోయింది.ప్రతి దేశం రిపబ్లిక్‌ దినోత్సవం లేదా స్వాతంత్య్ర దినోత్సవం, ఇతర ముఖ్య ఉదంతాలు ఉంటే ఆరోజున ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించి తమ శక్తి ఇదని ప్రపంచానికి చాటుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు విశ్లేషకులు, కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన కథనాలు, విశ్లేషణల్లో అతిశయోక్తులు దార్లాయి.ఈ నేపధ్యంలో ప్రపంచ మిలిటరీ బలం బలగాల గురించి పరిమితంగా అయినా ఒక్కసారి అవలోకనం చేసుకోవటం అవసరం. హిందూ మహాసముద్రం భారతదేశానిదే అని ఒక విశ్లేషకుడు చెప్పారు. ఒక దేశ సరిహద్దు నుంచి 12 నాటికల్‌ మైళ్ల(ఒక్కో నాటికల్‌ మైలు 1.852 కిలోమీటర్లకు సమానం) వరకు ఆయా దేశాలకు సర్వహక్కులు ఉంటాయి.పన్నెండు నుంచి 24 నాటికల్‌ మైల్స్‌ వరకు కస్టమ్స్‌, వలసలు,కాలుష్యాలకు సంబంధించిన చట్టాలు అమలు చేసే అధికారం ఉంటుంది.రెండువందల నాటికల్‌ మైల్స్‌ వరకు సముద్ర ఉత్పత్తులు,ఆ పరిధిలో ఉన్న ఖనిజవనరులను తవ్వితీసుకొనే హక్కు ఆయాదేశాలకు ఉంటుంది. ఆపైన ఉండే ప్రాంతం అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. శ్రీలంక-భారత్‌ మధ్య దూరం 288 కిలోమీటర్లు మాత్రమే ఉన్నందున సమదూరంతో సరిహద్దుల నిర్ణయం జరిగింది. నిజానికి హిందూమహాసముద్రం అంటే మనదేశ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు. పొడవు 9,600, వెడల్పు 7,600 కిలోమీటర్లు ఉంది.మనదేశానికి ఇది మూడువైపుల ఉంది. దీనిలో అందరికీ తెలిసిన అరేబియా సముద్రం, బంగాళాఖాతం,మరికొన్ని ప్రాంతీయ సముద్రాలు ఉన్నాయి.వీటన్నింటినీ కలిపి హిందూ మహాసముద్రం అంటున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండం వరకు విస్తరించి ఉంది.

మనదేశం వద్ద 1,500 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ నౌకలను దెబ్బతీసే సామర్ధ్యం గల దీర్ఘశ్రేణి క్షిపణి (ఎల్‌ఆర్‌-ఎఎస్‌హెచ్‌ఎం)తో చైనా,అమెరికా నౌకలను కూడా దెబ్బతీయగలవని విశ్లేషకుడు చెప్పారు. అది నిజమే, ఎప్పుడు యుద్ధం వచ్చినపుడు, ఎదుటి వారు దాడికి దిగనంతవరకు మాత్రమే.హిందూమహాసముద్ర అంతర్జాతీయ జలాల్లో ప్రవేశించిన ఏ దేశనౌకనైనా వెంటనే పేల్చివేయటానికి ఉండదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అలాంటి క్షిపణులను తయారు చేసే దేశంగా మనం ఇటీవలనే సామర్ధ్యం సంపాదించుకున్నాం.మనకంటే బలమైన మిలిటరీ శక్తి ఉన్న విషయాన్ని దాచి ప్రపంచంలో మనకు ఎదురులేదని ఎవరైనా చెపితే అది వాట్సాప్‌ పాండిత్యం తప్ప మరొకటి కాదు. వర్తమాన బలా బలాల గురించి ఈ సందర్భంగా చూద్దాం.మన దగ్గర ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయోగించగల ఖండాంతర క్షిపణి అగ్ని-5 ఉంది. ఇతర దేశాలలో మినిట్‌మాన్‌- అమెరికా క్షిపణి 13,000 కిమీ, రష్యాలో ఆర్‌ఎస్‌- 28 శాటమాన్‌ క్షిపణి పదకొండువేల కి.మీ, చైనా వద్ద డాంగ్‌ ఫెంగ్‌-41 రకం తొమ్మిదివేల కిలోమీటర్లు ప్రయాణించగలవి ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద గరిష్టంగా 15వేల కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణి తయారీలో ఉన్నట్లు ఊహాగానాలు. దాని వద్ద శక్తివంతమైన ద్రీర్ఘశ్రేణి క్షిపణులు ఉన్నకారణంగా తేడా వస్తే తన మిత్రదేశంగా ఉన్న జపాన్‌ మీద ప్రయోగించగలదనే భయంతోనే అమెరికా ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యవహరిస్తున్నది. ఇలా ఒకరిని మించి ఒకరు తమ ఆయుధాలకు పదునుపెట్టుకుంటున్నారు.ఇప్పటికే ప్రపంచంలో చైనా నావికాదళశక్తిలో ఒకటవ స్థానంలో ఉంది. అమెరికా వద్ద అన్ని రకాల యుద్ధ నావలు 471 ఉండగా చైనా 1,025 భారత్‌ 290 మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే అమెరికా వద్ద విమానవాహక యుద్ద నౌకలు 11, చైనా దగ్గర మూడు, భారత్‌ వద్ద రెండు ఉన్నాయి. ఈ పూర్వరంగంలో మనదేశం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆయుధాలను తయారు చేసుకోవాల్సిందే అనటం నిర్వివాదాంశం. దీనిలో భాగంగానే అణ్వస్త్రాలను తయారు చేసుకొనే అవకాశాలను అట్టిపెట్టుకొని అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాం.గతంలో రెండుసార్లు మనం అణుపరీక్షలు జరిపినపుడు మిత్రదేశం అంటూనే మన మీద కక్షతో అమెరికా ఒక్కటే ఆంక్షలు విధించింది.శత్రువైరుధ్యాలు ఉన్నప్పటికీ చైనా అలాంటి చర్యలకు పాల్పడలేదు.

మానవాళికి ముప్పు తెచ్చే యుద్ధాలు వద్దనే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. కానీ ఉన్మాదంతో కొందరు ఊగిపోతున్నారు. పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని దెబ్బతీసే మన తాజా క్షిపణి ధ్వని వేగం (గాలిలో గంటకు 1,225కిలోమీటర్లు) పది మాక్‌లంటే 12,250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని పావు గంటలోనే పని ముగిస్తుందని చెబుతున్నారు. ఇది మన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. అయితే వారు ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. రష్యా వద్ద 27 మాక్‌ల అవన్‌గార్డ్‌, చైనా వద్ద 27మాక్‌ల డిఎఫ్‌-41, అమెరికా దగ్గర ట్రైడెంట్‌ 24, మినిట్‌మాన్‌ 23,రష్యా వద్ద 20.64మాక్‌ల క్షిపణులు ఉన్నాయి. అందువలన మాదేవుడే అందరికీ అంటే ఎలా అంగీకరించటం లేదో ఇది కూడా అంతే. మన గొప్ప గురించి మనం చెప్పుకోవచ్చు తప్ప మనమే గొప్ప అంటే జనాలను తప్పుదారి పట్టించినట్లే. మన మిలిటరీ అజేయమే అయితే నరేంద్రమోడీ మన ఆక్రమిత కాశ్మీర్‌ను ఎందుకు వెనక్కు తీసుకురాలేదు, ఆపరేషన్‌ సింధూర్‌లో మరికొంత మందుకు పోయి ఉంటే పని జరిగేది కదా అని అనేక మంది అనుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం యుద్ధాల్లో కావాల్సింది ఎప్పటి సమాచారాన్ని అప్పుడు తెలియచేసే పరిజ్ఞానం. ఉక్రెయిన్‌కు అలాంటి సత్తాలేనప్పటికీ పశ్చిమ దేశాలు అందచేసిన సమాచారంతో గడచిన నాలుగు సంవత్సరాలుగా రష్యాను అడ్డుకోవటమే గాక, కొన్ని దాడులు కూడా చేయగలుగుతున్నదంటే కారణం అదే. ఆపరేషన్‌ సింధూర్‌లో తొలి రోజు మనకు ఎదురుదెబ్బలు తగలటానికి కారణం పాకిస్తాన్‌కు పశ్చిమదేశాలు(అమెరికాతో సహా) అందించిన సమాచారమే కారణంగా కొందరు భావిస్తున్నారు.

అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం మిలిటరీ అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహాలు అమెరికా వద్ద 247, చైనా 157, రష్యా 110,ఫ్రాన్స్‌ 17, ఇజ్రాయెల్‌ 12, ఇటలీ 10, మనదేశం 9, జర్మనీ 8,బ్రిటన్‌ 6, స్పెయిన్‌ 4 కలిగి ఉన్నాయి.అందువలన భూమి చుట్టూ తిరిగే అవి ఒకదాని వెనుక ఒకటి సమాచారాన్ని పసిగడితేనే 24గంటల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు.మిలిటరీతో సహా అన్ని అవసరాలకు గాను అమెరికా 5,176, బ్రిటన్‌ 653, చైనా 623, రష్యా 181, జపాన్‌ 88 కలిగి ఉండగా మనదేశం 62 కలిగి ఉంది. అయితే ఈ ఉపగ్రహాలు సేకరించే సమాచారం కూడా మిలిటరీ అవసరాలకు ఉపయోగపడుతుంది.ఈ కారణంగానే ప్రపంచంలో ఏమూల ఏమిజరిగినా అమెరికా ఇట్టే పసిగడుతున్నదంటే ఈ వ్యవస్థలే కారణం. ఇటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రపంచానికి భద్రత లేదని, తనకు అన్ని వైపుల నుంచీ ముప్పు ఉన్నదని అమెరికా ప్రపంచాన్ని నమ్మించేందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నది. గ్రీన్‌లాండ్‌ ప్రాంతాన్ని తాము ఆక్రమిస్తామని చెప్పిన ట్రంప్‌ తమ దేశ రక్షణకు ఉన్న ” గోల్డెన్‌ డోమ్‌ ” వంటిదాన్నే ఆ ప్రాంతానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఏమిటిది అంటే గగనతలం నుంచి జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించటం.మన రామాయణ, మహాభారత కథలో అలాంటివి చూసే ఉంటారు. రాక్షసులు యాగాన్ని కొనసాగ నివ్వకుండా చేసేందుకు చూస్తే రక్షణగా రాముడిని నియమించిన సంగతి, మహాభారతంలో బాణాలతో అర్జునుడి పరాక్రమం తెలిసిందే.కొన్ని దశాబ్దాలకు ముందే అమెరికా హాలీవుడ్‌ స్టార్‌వార్స్‌పేరుతో సినిమాలు తీసింది. ఇప్పుడు నిజంగానే అలాంటి గగనతల యుద్ధాలు జరుగుతున్నాయా ? అమెరికా కనుసన్నలలో పని చేసే సంస్థలు, కొందరు వ్యక్తులు రష్యా, చైనా ఈ రంగంలో ముందున్నాయని, ప్రపంచానికి ముప్పు ఉందని ప్రచారం చేస్తున్నారు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడన్నట్లుగా తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. అంతా రహస్యంగా జరుగుతున్న వ్యవహారం గనుక ఈ పోటీ గురించి చెబుతున్న అంశాలను అవుననీ, కాదని చెప్పలేము.

భూ కక్ష్యలో ఉపగ్రహాలను దెబ్బతీసే సాంకేతిక పరిజ్ఞానం(ఎసాట్‌) ప్రతిదేశం కలిగి ఉండాలని అందరూ చెబుతున్నారు. గగనతల కేంద్రంగా ఆయుధాలు కావాలని అమెరికా మిలిటరీ నిపుణులు బహిరంగంగానే చెప్పారు.ఈ విషయంలో రష్యన్లు, చైనీయులు తమ సామర్ధ్యాలను ఎంతో ఆధునికంగా కనపరుస్తున్నారని, దాన్ని కాదనలేమని బ్రిటన్‌లోని డుర్హామ్‌ విశ్వవిద్యాలయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం సహడైరెక్టర్‌ బ్లెడిన్‌ బోవెన్‌ చెప్పాడు. నిజంగా అలాంటి వేదికలు ఇప్పుడు ఉన్నాయో లేదో చెప్పలేము గానీ అవసరమైన సాంకేతికతలను వారు చూపుతున్నారని అన్నాడు. ఒక ఉపగ్రహాన్ని నేరుగా దెబ్బతీయటం,ఇతరంగా కూల్చివేయటం వాటిలో ఒకటి.భూతలం నుంచి సముద్రాల్లో నౌకలను ముంచివేయటం, టెర్మినళ్లను దెబ్బతీయటం, ఎలక్ట్రానిక్స్‌ ద్వారా చేసేవన్నీ గగనతల పోరులో భాగమే అన్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ పోరులో స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ వంటి ప్రైవేటు ఉపగ్రహసేవలను అందించేవారు రష్యన్ల ఆయుధాలను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని, సైబర్‌దాడులకు పాల్పడుతున్నారని, అదే విధంగా రష్యా నుంచి సంకేతాలను అడ్డుకోవటాన్ని గమనించినట్లు బోవెన్‌ చెప్పాడు. గగనతల దాడుల ఆయుధాలను తయారు చేయకూడదన్న ఒప్పందాల మేరకు నాడు సోవియట్‌ వెనక్కు తగ్గిందని ఇప్పుడు రష్యా తిరిగి పూనుకున్నట్లు కనిపిస్తున్నదని రాండ్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఎం క్లింటాక్‌ ఆరోపించాడు. సాధారణంగా గగనతలంపై రష్యా పరిమితంగానే ఆధారపడుతుందని, అదే అమెరికా తన ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలకు గరిష్టంగా ఆధారపడుతున్నది. రోజువారీ ఉపగ్రహ ప్రయోగాలను చూస్తే చైనా కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తున్నదని క్లింటాక్‌ చెప్పాడు. ముందే చెప్పుకున్నట్లు ట్రంప్‌ ప్రస్తావించిన ”గోల్డెన్‌ డోమ్‌ ” ఏర్పాటుకు 1983 నాటి అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ప్రకటించిన స్ట్రాటజిక్‌ డిఫెన్స్‌ ఇనిషియేటివ్‌ నాంది. దీన్నే స్టార్‌వార్స్‌ అని పిలిచారు.దీనిలో గగనతలంలో ఉండే పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే గోల్డెన్‌ డోమ్‌ వ్యవస్థ అణ్వాయుధాల నుంచి రక్షణ కల్పించలేదు గానీ ఇతరంగా ఎంతో ఉపయోగం అని బోవెన్‌ చెప్పాడు. గతంలో ఎదురైన అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించారని, గగనతలంలో అడ్డుకోవటం సంక్లిష్టమైనదని, వాటిని వేగంగా రూపొందించటం, పరీక్షించటం అంతతేలిక కాదని అంటున్నారు.

అంతరిక్ష రంగంలో మనదేశం అనేక విజయాలను సాధించింది. అయితే ఇంకా ఎంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.చైనా తన సోషలిస్టు వ్యవస్థను కాపాడుకొనేందుకు అమెరికాతో పోటీ అని చెప్పకపోయినప్పటికీ మిలిటరీ రీత్యా బలాన్ని పెంచుకుంటున్నది, ఆర్థికంగా దానికా శక్తి ఉంది. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు మిలిటరీ మీద అవసరమైనదాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.మనదేశం 109 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుంటే (జిడిపి 4లక్షల కోట్ల డాలర్లు) చైనా 303 బిలియన్‌ డాలర్లు (జిడిపి 19లక్షల కోట్ల డాలర్లు) వెచ్చిస్తున్నది.అమెరికా 831 బిలియన్‌ డాలర్లు (జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు) కేటాయించింది.తన ఆయుధ ప రిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా వెచ్చిస్తున్నది, చైనా స్వంతంగా తయారు చేసుకొనేందుకు పూనుకుంది.మనం ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాం. అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తే ఓకే, మనం కూడా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే పోటీపడే ఆర్ధిక శక్తి ఉందా లేదా అన్నది ముందు చూసుకోవాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !

25 Sunday Jan 2026

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, BJP, Governors Walkout, MK Stalin, Narendra Modi, o, Puppet Rulers, Sidda Ramaiah

ఎం కోటేశ్వరరావు

కుక్క మనిషిని కరిస్తే సాధారణం, అదే మనిషి కుక్కను కరిస్తే పెద్ద వార్త. జర్నలిజం విద్యార్ధులకు చెప్పే ఉదాహరణ ఇది. అదే మాదిరి చట్టసభల నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు వాకౌట్‌ చేయటం పెద్ద వార్త కాదు, కానీ గవర్నర్లు అదే పని చేస్తే సంచలనం. కానీ మన మీడియా చర్మాలు మొద్దుబారటంతో దాని గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. పెద్దన్న నరేంద్రమోడీ పైనుంచి గమనిస్తున్నారన్న భయంతో రాజ్యాంగ పరిరక్షణకు మద్దతుదార్లం అని చెప్పుకొనే వారు కూడా గొణుగుతున్నారు తప్ప నోరు విప్పటం లేదు. మన దేశంలో అపహాస్యం పాలైన వాటిలో గవర్నర్ల వ్యవస్థ ఒకటి. తొలిసారిగా 1959 జూలై 31న రాష్ట్రగవర్నర్‌ సిఫార్సుతో ఆర్టికల్‌ 356ను ఉపయోగించి ఎన్నికలలో కేరళలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వంలో అధికారానికి వచ్చిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేశారు. భూ సంస్కరణల చట్టం తెచ్చి అమలు జరిపేందుకు పూనుకున్న కారణంగా అక్కడ ఉన్న అన్ని రకాల కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులు ఏకమై విమోచన సమరం పేరుతో సాగించిన ఆందోళనను సాకుగా చూపి అక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడిందనే సాకుతో ఆ దుండగానికి పాల్పడ్డారు. నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పెద్దలే సదరు ఆందోళన వెనుక ఉన్నారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌లో సిపిఐ(ఎం) నాయకత్వాన ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం బలనిరూపణకు సిద్దం అవుతున్న తరుణంలో గవర్నర్‌ ధరమ్‌ వీర అధర్మంగా వ్యవహరించి ఆ ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేయటంతో రాష్ట్రపతి పాలన విధించారు. నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని వ్యతిరేకించే పార్టీలు రాష్ట్రాలలో అధికారానికి వస్తే గవర్నర్ల ద్వారా కుట్రలు, కూలదోయించటంలో ఎవరూ తక్కువ తినలేదు, 2014 నుంచి మోడీ సర్కార్‌ నియమించిన గవర్నర్లు బరితెగించి వ్యవహరిస్తున్నారు.

పార్టీ ఏజంట్ల మాదిరి గవర్నర్లు వ్యవహరిస్తున్నారని, ఎన్నికైన ప్రభుత్వాల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా వ్యవవరిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. చట్టసభలను ఉద్దేశించి ఏడాది ప్రారంభంలో గవర్నర్లు ప్రసంగించాల్సిన అవసరం లేకుండా రాజ్యాంగ సవరణ చేయటమే పరిష్కారమని, ఇతర పార్టీలతో కలసి దీని గురించి రానున్న పార్లమెంటు సమావేశాలలో లేవనెత్తుతామని చెప్పారు. జనవరి 22(2026)న కర్ణాటక గవర్నర్‌ తహ్వార్‌చంద్‌ గెహలట్‌ కేవలం కొన్ని పేరాల ప్రసంగాన్ని మాత్రమే చదివి మిగతాది వదలి ఉభయ సభల సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.గవర్నర్‌తో పాటు ప్రతిపక్ష బిజెపి, జెడిఎస్‌ సభ్యులు కూడా అనుసరించారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం తయారు చేస్తుందన్నది తెలిసిందే. దానిలో పదకొండు పేరాలను చదివేందుకు గవర్నర్‌ నిరాకరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని బదులు ఒక స్కీమును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆ ప్రసంగంలో విమర్శించారు. ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 176, 163 ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం తయారు చేసిన ప్రసంగాన్ని విధిగా చదవటం తప్ప గవర్నర్‌కు మరొక అవకాశం లేదని, తన స్వంత అభిప్రాయాలను దానిలో చొప్పించే అధికారం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గవర్నర్‌ చర్యను ఖండించారు. అంతకు ముందు తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే భాగాలు ఉన్నందున అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.కేరళ గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగంలో కొన్ని భాగాలను వదలి, కొన్నింటిని తాను చేర్చి చదివారు.తాము సూచించిన భాగాలను చేర్చకుండా ప్రసంగాన్ని రూపొందించారని లోక్‌భవన్‌ పేర్కొన్నది.కేరళకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ ద్రవ్యవిధానాన్ని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్రవేయని గవర్నర్‌ చర్యను విమర్శిస్తూ రాసిన భాగాలను గవర్నర్‌ విస్మరించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. అనవసరమైన, ఆధారం లేని అంశాలు మంత్రివర్గం రూపొందించిన ప్రసంగంలో ఉన్నాయని, వాటిని తొలగించాలన్న తమ సూచనను పట్టించుకోకుండా రెండవసారి కూడా తొలి ముసాయిదానే పంపారని గవర్నర్‌ కార్యాలయం ఆరోపించింది. ఏ అంశ ం అవసరమో కాదో నిర్ణయించే విచక్షణ అధికారం గవర్నర్‌కు లేదు. అయితే గవర్నర్‌ ఏమి ప్రసంగించినప్పటికీ అసెంబ్లీ రికార్డులలో మంత్రివర్గం రూపొందించిన ప్రసంగపాఠమే ఉండాలని ప్రభుత్వం కోరింది. గతంలో మాదిరే మంత్రివర్గం తయారు చేసినదే రికార్డులలో ఉంటుందని స్పీకర్‌ ఎఎన్‌ షంషీర్‌ ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ చర్యలు, విధానాలనే కాదు తొలిసారిగా గవర్నర్‌ చర్యను కూడా పశ్చిమబెంగాల్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ మంత్రివర్గం రూపొందించిన ప్రసంగంలో విమర్శించింది.1967లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టిన తరువాత 1969లో ఎన్నికలు జరిపారు. తిరిగి వామపక్షాలతో కూడిన ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చింది. అప్పుడు రూపొందించిన ప్రసంగంలో గవర్నర్‌ చర్యను తప్పుపట్టింది. తన చర్యను తానే విమర్శించినట్లు అవుతుంది గనుక ఆ పేరాను చదివేది లేదని ధరమ్‌ వీర తిరస్కరించారు. తరువాత కూడా బెంగాల్లో పునరావృతమైంది. గవర్నర్‌ బిడి పాండేను బంగ్లా డామన్‌ పాండే( బెంగాల్‌ను నాశనం చేస్తున్న పాండే)గా వామపక్షాలు వర్ణించాయి.1984లో గవర్నర్‌ ఏపి శర్మ కొల్‌కతా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా తాను ఎంపిక చేసిన వ్యక్తిని తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాబితా నుంచి నియమించేందుకు తిరస్కరించారు.ఇలాంటి అనేక చర్యలకు పాల్పడుతుండటంతో గవర్నర్‌ కార్యక్రమాలను బహిష్కరించాలని వామపక్ష సంఘటన నిర్ణయించింది. గవర్నర్‌ పదవిని రద్దు చేయాలని సర్కారియా కమిషన్‌కు నివేదిక పంపింది.2007లో నందిగ్రామ్‌ హింసాకాండ సందర్భంగా గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ (మహాత్మా గాంధీ మనవడు) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడారు.ఈ డొంకతిరుగుడెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గంటే పోతుందిగా అని అప్పుడు సిపిఐ(ఎం) నేతలు గడ్డిపెట్టారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా గవర్నర్‌ను సమర్ధించిన మమతా బెనర్జీకి తరువాత బిజెపి నియమించిన గవర్నర్లు అదేపని చేస్తే భగ్గుమన్నారు,కొంత మందికి అంతే, తమదాకా వస్తే తప్ప తత్వం బోధపడదు. తరువాత కాలంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికై అర్ధంతరంగా రాజీనామా చేసిన బిజెపి అసంతృప్త నేత జగదీప్‌ థంకడ్‌ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్నపుడు బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్నారు.

మనదేశంలో గవర్నర్లను మూడు తరగతులుగా చూడాలి. స్వాతంత్య్రానికి ముందు, తరువాత 1967వరకు, ఆ తరువాత వ్యవహరించిన తీరులో స్పష్టంగా దిగజారుడు కనిపిస్తుంది. బ్రిటీష్‌ వారి కాలంలో గవర్నర్‌ అంటే ప్రభుత్వ ప్రతినిధి, సర్వాధికారి. మనదేశంలోని ప్రోవిన్స్‌లకు అధిపతులుగా ఉన్నారు.ప్రజాప్రభుత్వాలు లేవు, స్వాతంత్య్రానికి ముందు 1935 నుంచి పరిమితంగా ప్రావిన్సు( రాష్ట్ర ) ప్రభుత్వాల ఏర్పాటుకు అవకాశమిచ్చినా వాటికి పెద్దగా అధికారాలు లేవు, గవర్నర్లే సర్వస్వం. తరువాత రెండు దశాబ్దాలలో దేశంలో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలే లేవు(1957లో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం తప్ప, దాని గురించి ముందే చెప్పుకున్నాం) గవర్నర్లుగా నియమితులైనవారు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నతరం వారే అత్యధికులు కనుక రాజ్యాంగ విలువలను పాటించారు.గవర్నర్ల గురించి జనానికి పెద్దగా తెలియదంటే అతిశయోక్తి కాదు. తొలిసారిగా కాంగ్రెస్‌ అనేక రాష్ట్రాలలో ఓడిపోయిన 1967 నుంచి ఇప్పటి వరకు చూస్తే రాజకీయ పార్టీలలో తమకు పోటీగా వస్తున్నారని పక్కకు తప్పించిన నేతలు, సామాజిక సమీకరణల్లో భాగంగా కొందరిని గవర్నర్‌లుగా నియమిస్తున్నారు. వారు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి చేత నియమాకాలు పొందినవారు కావటంతో పార్టీల ఏజంట్లుగా సిగ్గువిడిచి ప్రవర్తిస్తున్నారు.

రాజ్యాంగాన్ని రచించే సమయంలో గవర్నర్ల వ్యవస్థ గురించి పెద్ద చర్చే జరిగింది. గవర్నర్లు వద్దని, కావాలని వాదించిన వారు ఉన్నారు. రాజీమార్గంగా రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతిగా గవర్నర్‌ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గ సలహామేరకు పని చేయాల్సి ఉంటుందని పరిమితి విధించారు. ఇదే సమయంలో కొన్ని విచక్షణాధికారాలను కూడా కల్పించారు. ఇప్పుడు ఆ పేరుతో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. అయితే ఎస్‌ఆర్‌ బొమ్మరు-కేంద్ర ప్రభుత్వ కేసులో సుప్రీం కోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. గవర్నర్ల చర్యలు కోర్టు సమీక్షలకు లోబడి ఉంటాయన్నదే అది.దానికి అనుగుణంగానే కొన్ని రాష్ట్రాలు సుప్రీం కోర్టును ఆశ్రయించి గవర్నర్ల చర్యలను సవాలు చేశాయి.అడ్డగోలుగా ఆర్టికల్‌ 356ను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయకూడదని, గవర్నర్లు రాజ్యాంగ నిబంధనలను పాటించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తరువాత 2005లో రామేశ్వర ప్రసాద్‌-కేంద్ర ప్రభుత్వ వివాదంలో గవర్నర్ల విచక్షణ అధికారం,రాష్ట్ర అసెంబ్లీ పనివిధానం గురించిన అంశం ముందుకు వచ్చింది. బీహార్‌ ముఖ్యమంత్రి అసెంబ్లీని లాంఛనంగా రద్దు చేయకముందే గవర్నర్‌ అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ఉత్తరాఖండ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంలో గవర్నర్‌ జోక్యం చేసుకున్నారు. కేంద్రం-రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాల్సిన గవర్నర్లు కేంద్ర పాలకపార్టీ ఏజంట్లుగా తయారయ్యారు.1984లో తెలుగుదేశం పార్టీలో తలెత్తిన సంక్షోభంలో గవర్నర్‌గా ఉన్న రామ్‌లాల్‌ ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని కూలదోసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యకు నిరసనగా తలెత్తిన ప్రజానిరసనతో తిరిగి ఎన్‌టిఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రతిష్టించాల్సి వచ్చింది. ఇలాంటి పరిణామం మరేరాష్ట్రంలోనూ జరగలేదు.

సుప్రీం కోర్టు 2025 ఏప్రిల్‌ ఎనిమిదిన మైలురాయిగా నిలిచే తీర్పునిచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన పది బిల్లులకు ఆమోదముద్ర వేసేందుకు తిరస్కరించటం గవర్నర్‌ రాజ్యాంగవిరుద్ధ చర్య అని ప్రకటించింది.తమిళనాడు ప్రభుత్వం 2020 నవంబరు నుంచి 2023 ఏప్రిల్‌ మధ్య పదమూడు బిల్లులను ఆమోదించగా వాటిలో పదింటిని ఆమోదించకుండా, తిప్పి పంపకుండా గవర్నర్‌ తనదగ్గరే అట్టిపెట్టుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200ప్రకారం గవర్నర్లకు నాలుగు అవకాశాలు ఉన్నాయి. ఒకటి బిల్లులకు ఆమోదం తెలపటం, ఆమోదం నిలిపివేయటం, ద్రవ్య బిల్లుతప్ప ఇతర వాటిని తిరిగి పరిశీలించాలని కోరటం,తిరిగి వచ్చిన వాటిని ఆమోదించటం, రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా నిలిపివేయటం. అయితే ఆ నిబంధనలో ఎటూ తేల్చకుండా ఎంతకాలం కొనసాగించవచ్చు అన్నది ఎక్కడా లేదు. దాన్ని అవకాశంగా తీసుకొని గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు.తమిళనాడు గవర్నర్‌ చర్య ఉద్దేశ్య పూర్వకంగా బిల్లులను అడ్డుకున్నట్లున్నదని,రాజ్యాంగ పద్దతిని ఉల్లంఘించటమే అని కోర్టు పేర్కొన్నది. ఎలాంటి మార్పులు లేకుండా రెండవసారి పంపిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపకుండా ఉండటం తగదని, నిలిపివేయకూడదని రాజ్యాంగం పేర్కొన్నదని విధిగా పంపాలని పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యకు గవర్నర్‌ రవి పాల్పడ్డారని స్పష్టం చేసింది. బిల్లు వచ్చిన నెలరోజుల్లో ఆమోదం తెలపాలి,ఆమోదం తెలపని వాటిని కారణం తెలుపుతూ మూడు నెలల్లోగా తిప్పి పంపాలి.రెండవసారి వచ్చిన బిల్లుకు నెలరోజుల్లో ఆమోదం తెలపాలి, మూడు నెలలకు మించి బిల్లులను నిలిపివేయరాదు. ఆర్టికల్‌ 201ప్రకారం రాష్ట్రపతి కూడా నిరవధికంగా ఆమోదం నిలిపివేయరాదు. ఒకవేళ బిల్లు రాజ్యాంగవిరుద్ధంగా ఉందనకుంటే రాష్ట్రపతి దాని గురించి తప్పనిసరిగాకపోయినప్పటికీ సుప్రీం కోర్టు సలహాను కోరవచ్చు అని కూడా కోర్టు చెప్పింది.ఈ తీర్పులు వచ్చిన తరువాత కూడా గవర్నర్లు మంత్రివర్గం రూపొందించిన ప్రసంగాలకు బద్దులై ఉండకుండా స్వంతపైత్యాలను జోడించటం చూస్తున్నాం. అందువలన ఈ అంశంపై కూడా రానున్న రోజుల్లో రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టటం మినహా మరొక మార్గం లేదు. రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చేందుకు క్షణ క్షణం ప్రయత్నిస్తున్న బిజెపి చర్యలను అడ్డుకొనేందుకు అటు న్యాయవ్యవస్థను ఆశ్రయించటంతో పాటు వ్యతిరేకంగా ప్రజాసమీకరణ కూడా అవసరం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

17 Saturday Jan 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, inequality, Narendra Modi Achhedin, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

ధనం మూలం ఇదం జగత్‌ అన్నారు పెద్దలు. జగతిని నడిపించేది ధనమే. పూర్వకాలపు మన, ఇతర దేశాల తత్వవేత్తలు ప్రవచించినా ఆధునిక కాలంలో కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ చెప్పినా వాస్తవం అదే. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థికమైనవే అని కూడా కమ్యూనిస్టులు చెప్పారు. ఇద్దరూ చెప్పింది ఒకటే కదా మనవారు ఎన్నడో చెప్పారు, వామపక్ష వాదుల ప్రత్యేకత ఏమిటని ఎవరికైనా సందేహం వచ్చిందంటే వారి బుర్రపని చేస్తున్నదని అర్ధం. నిజమే, సర్వేజనా సుఖినో భవంతు, వసుధైక కుటుంబం అని లేదా ఇతర దేశాలలో తత్సమాన అర్ధంతో ఎవరు చెప్పినా వారంతా మంచి జరగాలని ఆకాంక్షించారు, సుబోధ చేశారు. కానీ విన్నవారు, పాటించినవారెవరూ లేరు, సుభాషితాలను దాటి అమలుకోసం ఎవరైనా ముందుకు పోతే విప్లవకారులంటూ అణచివేతలే అన్నది యావత్‌ప్రపంచ చరిత్ర. ఆ సారాన్ని గ్రహించిన మార్క్సిస్టు పెద్దలు చెప్పిందేమంటే మంచిమాటలతో సమాజం మారదు, మార్చేందుకు జనమే పూనుకోవాలి, వారిలో కూడా దోపిడీకి గురయ్యేవారే ముందుండాలి. అడ్డుకొనేవారు మామూలుగా వినకపోతే చివరికి బడితెలు పట్టుకొని మార్చటం తప్ప మరొక మార్గం లేదని కర్తవ్యబోధ చేశారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇటీవలి కాలంలో సంపదల అసమానత విపరీతంగా పెరుగుతున్నదని, సంపదల పున:పంపిణీ జరగకపోతే సామాజిక సంక్షోభానికి దారితీస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే ఈ మాటలు చెప్పేవారిలో సంపన్నుల బాగు కోరుకొనే వారే ఎక్కువగా ఉన్నారు. వారి ఉద్దేశ్యం ఏమిటంటే కొంత మంది దగ్గరే అపార సంపద పోగుపడితే మొదటికే మోసం వస్తుందన్నది వారి ఉద్దేశ్యం. అయితే నిజంగా మంచి కోరుకుంటున్నవారు లేరా అంటే ఉన్నారు.

2026 ప్రపంచ అసమానతల నివేదిక డిసెంబరులో విడుదలైంది.2018, 22 తరువాత ఇది మూడవది.ప్రపంచంలో, మనదేశంలో కూడా అసమానత తీవ్ర స్థాయిలో ఉందని హెచ్చరించింది. ఈ నివేదికను రూపొందించిన వారు ల్యూకాస్‌ ఛాన్సెల్‌, రికార్డో గోమెజ్‌ కరేరా, రొవాయిడా మోషిరిఫ్‌, థామస్‌ పికెటి. ఆ నివేదికకు మన దేశానికి చెందిన జయతి ఘోష్‌,జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ ముందు మాటరాశారు. సంపాదకుల్లో చివరి వ్యక్తి ఫ్రెంచి ఆర్థికవేత్త థామస్‌ పికెటి గురించి తెలుగువారికి కొంతమేరకు తెలుసు,ఎందుకంటే ఆర్థిక అసమానతల గురించి ఆయన హెచ్చరించిన అంశాలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. అసమానతలు అంటే కేవలం సంపదకే పరిమితం కాదు, వాతావరణ, లింగపరమైన, అవకాశాలు అందరికీ అందుబాటులో లేకపోవటం, చివరికి ఎన్నికల కోసం నియోజకవర్గాల విభజనలో వివక్షతో సహా ఇతర అంశాలు ఉన్నాయి. ప్రపంచ అసమానతల సమాచార సంస్థకు అనుబంధంగా ఉన్న రెండువందల మందికి పైగా పరిశోధకులు అనేక కోణాల్లో చేసిన విశ్లేషణల సారమే ప్రపంచ అసమానతల నివేదిక. అన్ని అంశాలను ఇక్కడ సృజించటం సాధ్యం కాదు గనుక సంపదల పున:పంపిణీ గురించి చర్చిద్దాం.ప్రపంచాన్ని ” కమ్యూనిస్టు భూతం ” ఆవహించకుండా జనం దానివైపు మరలకుండా చూసేందుకు పెట్టుబడిదారీ ఆర్థిక, సామాజికవేత్తలు అనేక అంశాలను ముందుకు తెచ్చారు.వాటిలో ఊట సిద్దాంతం ఒకటి.

ప్రభుత్వాలు కేవలం పాలనకే పరిమితమై అన్ని రంగాలను ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకే అప్పగిస్తే వారు సృష్టించే సంపదల మూట నుంచి ఊట యావత్‌ సమాజానికి దిగుతుందన్నది ఊట సిద్దాంతం. దానికి సంస్కరణలు, నూతన ఆర్థిక విధానాల వంటి ముద్దుపేర్లు పెట్టారు, జనం కూడా నిజమే అని నమ్మారు, తమకూ సంపదల ఊట దిగుతుందేమోనని పోరాటాలు మాని ఆశతో చెంబులు పట్టుకు ఎదురు చూశారు, ధారలేమీ కారలేదు, కేవలం కొన్ని చుక్కలు మాత్రమే పడ్డాయి.దాంతో ఫలితం లేదని అసంతృప్తి చెందటం ప్రారంభించారు. సోషలిస్టు సమాజాలం కోసం జనం చూడకుండా కొన్ని తాయిలాలు అందించి సంతృప్తిపరచేందుకు ఐరోపాలో అనేక ప్రయోగాలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు జరిపి సోషలిజంలో ఇంతకంటే పెద్దగా ఒరిగేదేమిటని జనాన్ని కొంతకాలం మభ్యపెట్టారు. ప్రధమ సోషలిస్టు రాజ్యం సోవియట్‌ యూనియన్‌ కూలిపోవటంతో కమ్యూనిజం, సోషలిజాలపై విజయం సాధించామని, ఆ ప్రయోగం విఫలమైందని ప్రచారం చేశారు. అంతేనా పోటీ లేకపోవటంతో అప్పటి వరకు అమలు జరిపిన అనేక సంక్షేమాలకు కోత పెట్టటం ప్రారంభించారు. అసమానతలు అప్పటి నుంచి మరింత పెరగటంతో జనాన్ని తప్పుదారి పట్టించేందుకు సంపదల పున:పంపిణీ అవసరమంటూ మరో పల్లవి అందుకున్నారు.సూత్రరీత్యా దీన్ని ఎవరూ వ్యతిరేకించరు, అయితే అది ఎలా అన్న అంశంమీదే తేడా వస్తున్నది. సంపదలు పంచినంత మాత్రాన వేగంగా దారిద్య్రం తగ్గుతుంది తప్ప ఆర్థిక వృద్ధి జరగదని, జనాలను సోమరులుగా మారుస్తాయని కొందరు చెబుతున్నారు. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ఈ మంచి సంస్కరణ అంశాన్ని ప్రచారం చేసి జనాన్ని సమీకరించేందుకు చూస్తున్నాయి. అసలేమీ లేనిదానికంటే ఏదో ఒకటి మంచిదే.అయితే భ్రమలు పెట్టుకోనవసరం లేదని చెప్పక తప్పదు.

అసమానతల గురించి తాజా నివేదకలో పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూద్దాం.మచ్చుకు ఒకటి, సబ్‌ సహారా ప్రాంతంలో ఒక బిడ్డ మీద పిపిపి పద్దతిలో 200యూరోలు ఖర్చు చేస్తుండగా ఐరోపాలో 7,400, ఉత్తర అమెరికా, ఓషియానా దేశాల్లో 9,000 యూరోలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో 0.001శాతం అంటే అరవైవేల మందికంటే తక్కువ ఉన్న కోటీశ్వరులు దిగువన ఉన్న 50శాతం జనాభా మొత్తం సంపదల కంటే మూడు రెట్లు ఎక్కువ కలిగి ఉన్నారు. ప్రతి ఏటా ప్రపంచ జిడిపిలో ఒకశాతం ధనికదేశాలకు తరలుతున్నది.ఇది ప్రపంచ వృద్ధికి ఇస్తున్నట్లు చెబుతున్న సాయానికి మూడు రెట్లు ఎక్కువ. స్త్రీ, పురుష వేతన తేడా అన్ని చోట్లా ఉంది. గంటకు ఒక పురుషుడు పొందే వేతనంలో మహిళకు వస్తున్నది 61శాతమే, వేతన చెల్లింపులేని పనిగంటలను కూడా లెక్కిస్తే ఈ తేడా 32శాతానికి దిగజారుతుంది.

సంపదల పున:పంపిణీ ఎలా అన్నదాని మీద పూర్తి ఏకాభిప్రాయం ఉందా అంటే లేదు అని చెప్పవచ్చు, దోపిడీ విధానాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయకుండా తీసుకొనే ఏ చర్య అయినా అది ఉపశమనం తప్ప మరొకటి కాదు.లాటిన్‌ అమెరికా దేశాల్లో, దక్షిణాఫ్రికా, నేపాల్‌ వంటి చోట్ల పురోగామివాదులు, కమ్యూనిస్టులు ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చారు.దోపిడీ వర్గ పునాదిని దెబ్బతీయకుండా దాని మీదే కొన్ని సంస్కరణలు మాత్రమే అమలు చేయటంతో ఒకదశ దాటిన తరువాత కార్మికవర్గంలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది.లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం ఇదే.కొన్ని చోట్ల ఒకసారి గెలిచిన వామపక్ష శక్తులు తరువాత ఓడిపోవటానికి కారణాలు ఇవే. అసమానతలు ఎక్కువగా ఉంటే సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి.ఈ కారణంగానే రాజకీయ పార్టీలు ప్రజాకర్షక నినాదాలు, చర్యలతో ముందుకు రావటం పెరిగింది. ఓట్ల కోసం అలాంటి చర్యలకు పాల్పడను, ఆ సంస్కృతికి దూరం అని కొండంత రాగం తీసిన నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి అదే చేస్తున్నది. అయితే ఇతర పార్టీలు చేస్తే జనాకర్షక పథకాలు, తాము చేసేవి సాధికారత కలిగించేవంటూ వంచనకు పాల్పడుతోంది. ఇవి దీర్ఘకాలంలో అభివృద్ధిని దెబ్బతీస్తాయని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆశ్రితులకు దేశ సంపదలను దోచిపెట్టి మరింతగా పెంచటమే గాక, సంపదలను సమంగా పంపిణీ చేయటాన్ని వ్యతిరేకించేవారే ఇలాంటి జనాకర్షక పథకాలను తీసుకువస్తారన్నది ఒక వాస్తవం. స్వాతంత్య్రం గురించి కన్న కలలు విఫలమై 1967లో కాంగ్రెస్‌ అనేక రాష్ట్రాలలో ఓడిపోవటం, తనకు పార్టీలో సవాలు ఎదురైనపుడు గరీబీ హటావో పేరుతో ఇందిరా గాంధీ వాటికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. అయితే మనవంటి సమాజాలాలలో అవి అవసరం. ఉదాహరణకు ఎన్‌టి రామారావు ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యపు పధకం, వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు ఏ విధంగా సాయపడుతున్నాయో చూస్తున్నాం. ఇతర నగదు బదిలీ పథకాలు కూడా అలాంటివే.నిజానికి ఆ మొత్తాలు వస్తు,సేవల కొనుగోళ్ల రూపంలో తిరిగి ఆర్థిక వ్యవస్థలోకే వస్తున్నాయి. అందువలన ఈ మొత్తాలను ఇంకా పెంచటం సంపద పంపిణీలో భాగంగానే పరిగణించవచ్చు.అభివృద్ధి రేటుకు తగిన విధంగా పేదల ఆదాయాలు పెరగకపోతే ఫలాలు ధనికులకే చేరుతున్నట్లు లెక్క.మనదేశంలో అదే జరుగుతున్నది, శతకోటీశ్వరులు మరింతగా పెరుగుతున్నారు.

ప్రపంచ అసమానతల సమాచార కేంద్ర వివరాల ప్రకారం దిగువ విధంగా మనదేశంలో అసమానత పెరిగింది.దీన్ని రెండుగా విభజించి చూడాలి.1990 దశకంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టక ముందు, తరువాత సమాజంలోని మూడు తరగతుల సంపదలు ఎలా పెరిగాయో చూడవచ్చు.

సంవత్సరాలు××× దిగువ 50శాతం××ఎగువ 10శాతం××× ఎగువ ఒకశాతం

1961-1970×× 12.29 ×× 43.18 ××11.87

1971-1980×× 11.75 ×× 42.25 ×× 11.23

1981-1990×× 10.91 ×× 45.00 ×× 12.50

1991-2000×× 8.36 ×× 54.57 ××× 23.31

2001-2010×× 8.10 ×× 56.60 ××× 25.70

2010-2020×× 6.12 ×× 63.68 ××× 31.55

దీన్ని ముందే చెప్పుకున్నట్లుగా రెండు భాగాలుగా చేస్తే 1961 నుంచి 1990 వరకు సగటు దిగువ 50శాతం జనాభా వాటా 11.65శాతం కాగా ఎగువ పదిశాతం 43.47,ఎగువ ఒకశాతం 11.86శాతం కలిగి ఉన్నారు. ఇదే 1990 నుంచి 2020 వరకు వరుసగా 7.52-58.28-26.85శాతం ఉన్నారు. నూతన ఆర్ధిక విధానాలు అమలు జరిగిన మూడుదశాబ్దాలలో ఎగువ ఒకశాతం వాటా 226,పదిశాతం మంది వాటా 134శాతం పెరగ్గా దిగువ 50శాతం వాటా 63శాతం తగ్గింది. తాజా అంచనా ప్రకారం ఒకశాతం ధనికుల సంపద 40శాతానికి చేరింది.మంచి రోజులు తీసుకువస్తానని చెప్పిన నరేంద్రమోడీ సంస్కరణలను మరింత వేగంగా అమలు జరుపుతానని కూడా చెప్పారు. దాని ఫలితం ఏమిటో చూశాము. కార్పొరేట్‌ పన్ను గణనీయంగా తగ్గించిన కారణంగా ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖజానా కోల్పోతున్నది. పోనీ ఆ మేరకు ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నాయా అంటే అదీ లేదు. పర్మనెంటు ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతున్నది.మన దేశ కార్పొరేట్‌ సంస్థలకు పన్ను తగ్గించిన కారణంగా వాటిలో పెట్టుబడులు పెడితే లాభసాటిగా ఉండటంతో విదేశీ కంపెనీ నేరుగా పరిశ్రమల స్థాపనకు బదులు ఉన్న కంపెనీల వాటాలను స్టాక్‌మార్కెట్‌లో కొనుగోలు, విక్రయాలు చేస్తూ లాభాలను తమ దేశాలకు తరలించుకుపోతున్నాయి.

ఆదాయాన్ని బట్టి పన్ను విధించి, ఆ మేరకు అల్పాదాయవర్గాలకు రాయితీల రూపంలో సంపదల పంపిణీ ఒక పద్దతి. లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌లో అసమానతలు, దారిద్య్ర నిర్మూలన పథకాల్లో భాగంగా షరతులతో కూడిన నగదు బదిలీ పథకాలను అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న అమ్మవడి, తల్లిదీవెన పథకాలు వాటికి నకలే. తమ బుర్రలో పుట్టినవే అని ఎవరైనా చెప్పుకుంటే బడాయి తప్ప మరొకటి కాదు. 2003లో వామపక్ష నేత లూలా డ సిల్వా అధికారానికి వచ్చినపుడు అంతకు ముందున్న కొన్ని పథకాల అనుభవాలను చూసి మరింత లబ్ది చేకూరేవిధంగా అల్పాదాయ వర్గాలకు ఈ పథకాన్ని అమలు చేశారు. పిల్లలను బడికి పంపటం, టీకాలు వేయించిన వారికి నగదు బదిలీ జరిగింది.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు దీనికి అర్హులు. అంతర్జాతీయంగా అది ప్రశంసలు పొందింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది,సంపదల పంపిణీ వలన దారిద్య్ర తీవ్రత తగ్గుతుంది తప్ప అసమానత తొలగదు. గమనించాల్సిందేమంటే రెండు దశాబ్దాల తరువాత చూస్తే అసమానతలు ఎక్కువగా ఉన్న పది ప్రపంచ దేశాల్లో బ్రెజిల్‌ ఒకటిగా ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేస్తున్న రైతు బంధు, భరోసా మరో పేరుతో అందచేస్తున్న నిధులు, పిఎం కిసాన్‌ మొత్తాలు కూడా సంపద పున:పంపిణీలో భాగమే. అయితే అవి వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ఆర్చేవి తీర్చేవి కాదు.కనీస వేతనాల పెంపుదల కూడా సంపదల పంపిణీలో ఒక అంశమే. గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు, అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అవకాశాలను పెంచుతాయి. అందువలన సంపదల పంపిణీ గురించి మరింత నిర్దిష్టంగా మధనం జరగాల్సి ఉంది. తమ ప్రత్యేక లక్షణాలతో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించిన చైనాలో కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అయితే వాటిని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.

ఈ నివేదిక ప్రకారం సమాజంలో ప్రపంచంలో ఎగువన ఉన్న పదిశాతం మంది వద్ద సంపద 58శాతం ఉంది (2022లో 57శాతం) దిగువన ఉన్న 50శాతం మందికి 15శాతం(2022లో 13శాతం). ఇంతకు ముందు పట్టికలో సంపదల పెరుగుదల రేటు చూశాము, ఉన్న సంపదల మొత్తం వేరు,పెరుగుదల రేటు వేరు. భారత్‌ మరియు చైనా గురించి చెప్పిందేమంటే ప్రపంచ మధ్యతరగతిలోకి చైనా జనాభా ఎక్కువ మంది చేరారని, అదే భారత్‌లో 1980లో మధ్య తరగతిలో ఉన్న 40శాతంలో ఎక్కువ మంది ఇప్పుడు దిగువ 50శాతంలోకి దిగజారినట్లు పేర్కొన్నది. కార్పొరేట్లకు పన్ను తగ్గించిన కారణంగా సంపదలు పోగుపడటం ఒకటైతే రాష్ట్రాలకు రావాల్సిన పన్నురాబడి తగ్గుతున్నది, అది సంక్షేమ పథకాల మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఉదాహరణకు వెనుకబడిన తరగతుల వారికి 50 ఏండ్లకే పెన్షన్‌ ఇస్తామని చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ మాదిరి సామాజిక పెన్షన్లు నాలుగువేలకు పెంచుతామని చెప్పిన తెలంగాణా కాంగ్రెస్‌ వాగ్దానం అమలుకు నిధులు లేవు, బిజెపి పాలిత రాష్ట్రాలలో పరిస్థితి మరీ అధ్వానం, వారికి అసలు ఆ ఉద్దేశ్యమే లేదు అని వేరే చెప్పనవసరం లేదు. యుపిఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన పెన్షన్‌ మొత్తాలనే మోడీ సర్కార్‌ ఇప్పటికీ అందిస్తున్నది తప్ప పైసా పెంచలేదు. దాని మానవత్వ ముఖం అలా ఉంది. అందువలన మరో విధంగా చెప్పాలంటే సంపదల పున:పంపిణీని దెబ్బతీస్తున్నది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ రూపొందించిన ఆర్థిక చట్రంలోనే మన పాలకులు విధానాలను రూపొందిస్తున్నారు. అందుకే గొర్రె తోక మాదిరి జనజీవితాలు పెద్దగా పెరగటం లేదు. సంపదల పున:పంపిణీ నినాదం సంస్కరణ మాదిరి ఉన్నప్పటికీ అది కూడా వర్గపోరాట ప్రాధమిక రూపమే అని చెప్పవచ్చు. ఈ మాత్రపు సంస్కరణనే వ్యతిరేకించేవారు, సంపదలను సమాజపరం చేస్తే ఊరుకుంటారా ? దేశంలో కార్పొరేట్లు, ధనికుల పెత్తనం ఉన్నందున వారి మీద పన్ను తగ్గించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దానికి విరుద్దంగా పన్ను మొత్తాలను పెంచి పేదలకు పంచాలని ఇతరులు కోరుతున్నారు. పన్నులు పెంచుకుంటూ పోతే ఎగువన ఉన్నవారు కుప్పకూలుతారని వారి సమర్ధకులు అంటే పెంచకపోతే మరింతగా దిగజారతామని దిగువన ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు.ఈ వైరుధ్యం మరింత ముదిరితే విప్లవానికే దారితీస్తుంది.ప్రస్తుతం మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు.

‘ చెడుగా మారేంత వరకు అసమానత మౌనంగానే ఉంటుంది.ఈ నివేదిక అసమానతకు మరియు నేటి అసమాన సామాజిక, ఆర్థిక నిర్మాణాలతో అవకాశాల నిరాకరణకు గురైన వందల కోట్ల మందికి గళాన్ని ఇస్తుంది” అని ప్రపంచ అసమానతల నివేదిక సంపాదకుల్లో ఒకరైన రికార్డో గోమెజ్‌ కరేరా వ్యాఖ్యానించాడు. ముందుమాట రాసిన వారిలో ఒకరైన జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ ఇలా చెప్పారు.” నేటి విపరీత అసమానత అనివార్యమైనదేమీ కాదని చరిత్ర, అన్ని దేశాల అనుభవాలు, సిద్దాంతం కూడా చెబుతున్నది.పురోగామి పన్ను విధానం( సంపద పెరిగే కొద్దీ పన్నుల పెంపు), పెద్దమొత్తంలో సామాజిక పెట్టుబడి,న్యాయమైన కార్మిక ప్రమాణాలు, ప్రజాస్వామిక వ్యవస్థలు గతంలో తేడాలను తగ్గించాయి. ఇదే మరోసారి చేయగలవు ” సంపదల పున:పంపిణీ జరగాలని కోరుకొనే వారు ప్రచారానికి మాత్రమే పరిమితం కారాదు, కార్యాచరణకూ పూనుకోవాలి !హొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!

14 Wednesday Jan 2026

Posted by raomk in Current Affairs, Economics, Farmers, Gujarat, History, imperialism, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

agricultural research, Agriculture Crisis in India, agriculture in india, BJP, Donald trump, MSP in India, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

వ్యవసాయంలో మొత్తం విలువ జోడింపు(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌-జివిఏ) మార్చినెలతో ముగిసే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెరుగుదల రేటు కేవలం 0.8శాతమే అని గతేడాది 10.4శాతం ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం తగ్గటమే అని చెబుతున్నారు. దేశమంతటా దాదాపు అన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు పడి పంటల ఉత్పత్తులు పెరిగినప్పటికీ జివిఏ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. రైతాంగ ఆదాయాల రెట్టింపు, కనీస మద్దతు ధరల పెంపుదల, ఎగుమతి అవకాశాల కల్పన వంటి ఎన్నికబుర్లు చెప్పినా నరేంద్రమోడీ పాలనలో పరిస్థితి దిగజారింది.రైతాంగం మీద కక్షగట్టినట్లుగా అనుసరిస్తున్న విధానాల ఫలితంగా మొత్తంగా రైతుల ఆదాయాలు పడిపోయాయి, కనీస మద్దతు ధరల నిర్ణయమే లోపభూయిష్టమైతే ఈ ఏడాది ప్రతి పంటనూ అంతకంటే తక్కువ ధరలకే రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది.వివిధ రంగాల జివిఏల తీరు తెన్నులు చూసినపుడు యుపిఏ పాలనలో 2011-12లో వ్యవసాయ రంగ వాటా 18.53 శాతం ఉండగా 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో ఐదేండ్ల సగటు 18.57 శాతం ఉంది, తరువాత ఇంకా పడిపోయిందనే అంచనాలు వెలువడుతున్నాయి.మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత అన్నప్పటికీ ీ పారిశ్రామిక రంగ జివిఏ ఐదేండ్ల సగటు 27.56శాతం ఉంది, అదే 2011-12లో 32.5 శాతం ఉంది. సేవారంగంలో ఐదేండ్ల సగటు 53.85కాగా 2011-12లో 48.97శాతం ఉంది, ఒక్క సేవారంగంలో మాత్రమే పెరుగుదల ఉంది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించే వ్యవసాయ, పారిశ్రామిక రంగాల దిగజారుడు కారణంగానే ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాల గురించి మోడీ మౌనంగా ఉంటున్నారు.

2025 డిసెంబరు 26వరకు ఉన్న వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం ప్రధాన పంటలైన మొక్కజొన్న,వేరుసెనగ, సోయా, పత్తి, కందులు, పెసలు, మినుముల వంటి వాటి ధరలు కనీస మద్దతు కంటే 5.30శాతం తక్కువ ఉన్నట్లు నమోదైంది.వివిధ పంటలకు కనీసంగా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు రైతులు నష్టపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల రేటుతో పోలిస్తే వ్యవసాయ రంగం తక్కువగా ఉండటం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొనసాగుతుండటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల భారతీయ పరిశోధనా మండలి (ఐసిఆర్‌ఐఇఆర్‌) ఇటీవలి విధాన పత్రంలో పేర్కొన్న అంశాల ప్రకారం ఒక వ్యవసాయ కుటుంబ సగటు ఆర్జన 2012-13లో రు.6,426 ఉంటే 2024-25లో రు.19,696గా ఉంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తే నిజ పెరుగుదల రు.12,173గా తేలింది. దేశంలో 2014-15 నుంచి 2024-25 వరకు జిడిపి వార్షిక వృద్ధి రేటు ఆరుశాతంపైగా ఉండగా వ్యవసాయం 4శాతమే ఉంది. జనాభాలో 46శాతం మందికి జీవనాధారంగా ఉన్న ఈ రంగంలో ఇంత తక్కువ వృద్ధి సహజంగానే గ్రామీణ భారతంలో వినియోగ వృద్ధి మీద ప్రభావం చూపుతుంది. పట్టణ ప్రాంతాలు-గ్రామీణ ప్రాంతాల మధ్య వినియోగంలో తీవ్ర అంతరం ఉండగా గ్రామీణంలో వ్యవసాయ కుటుంబాల వినియోగం తక్కువగా ఉన్నట్లు వివిధ సర్వేలు వెల్లడించాయి. అనేక పథకాలతో ఉద్దరిస్తున్నామని చెప్పిన తరువాత కూడా ఉన్న పరిస్థితి ఇది.అవేవీ పారిశ్రామిక వస్తువులకు గిరాకీని పెంచలేకపోయాయి.

పంటల ద్వారా వచ్చే రాబడి కంటే పశుపోషణ ద్వారా ఎక్కువగా ఉన్నట్లు కూడా సర్వేలు చెబుతున్నాయి. అందుకే సాగు గిట్టుబాటు కావటం లేదంటూ అనేక మంది విముఖత చూపుతున్నారు, ఇతర జీవనోపాధివైపు మరలుతున్నారు. 2000 సంవత్సరంలో కేవలం నాలుగుశాతంగా ఉన్న పశుపోషణ రాబడి 2018-19 నాటికి 16శాతానికి పెరిగింది. పంటల రాబడి వాటా 40శాతం దిగువకు పడిపోయింది.ఉద్యానవన పంటల సాగు మెరుగ్గా ఉండటంతో సాగు భూమి పెరుగుతున్నది.వ్యవసాయం, అనుబంధ రంగాలపై కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల్లో కేవలం రెండుశాతమే ఉద్యానవన పంటలకు ఉంది. ఈ పంటల రైతాంగానికి అవసరమైన శీతల గిడ్డంగుల వంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తేనే వారికి ఉపయోగం. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని కూడా ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు పూనుకున్నందున పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తున్నాయి.మౌలిక సదుపాయాలు, రోడ్లు,పంటల ప్రాసెసింగ్‌ సదుపాయాలు లేని కారణంగా టమాటా, ఉల్లి, పండ్లు, బంగాళాదుంపల వంటి ఉత్పత్తుల్లో ఐదోవంతు వృధా అవుతున్నాయి, ఆ మేరకు నష్టాలను రైతులే భరిస్తున్నారు. బీమా కూడా లేదు.

ప్రభుత్వ విధానాలు అటు వినియోగదారులు, ఇటు ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడేవిగా ఉండాలి.మొత్తంగా చూసినపుడు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు అనుసరిస్తున్న పద్దతుల మీద ఏకాభిప్రాయం లేదు. ఇదే సమయంలో తగ్గుదల రైతాంగాన్ని, యావత్‌ గ్రామీణ ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నది, వ్యవసాయదారులను ఫణంగా పెడుతున్నది. ప్రపంచంలో బియ్యాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న చైనా(14.5 కోట్ల టన్నులు)ను వెనక్కు నెట్టి మనదేశం(15 కోట్ల టన్నులు) ప్రధమ స్థానానికి చేరటం తమ ఘనతే అని కేంద్ర ప్రభుత్వం, అధికార బిజెపి స్వంతడబ్బా కొట్టుకుంటున్నాయి. రైతులకు దక్కిందేమిటన్నది ప్రశ్న. విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే కంపెనీలు కిలో రు.33కు అటూ ఇటూగా ధరల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వార్తలు. నిజంగా కనీస మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తే ఈ ధర గిట్టుబాటు అవుతుందా ? ఎగుమతులకు గ్రేడ్‌ ఏ రకాలే ఉంటాయన్న సంగతి తెలిసిందే, వర్తమాన సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలు కనీస మద్దతు ధర రు.2,389గా ఉంది. మరోవైపు వినియోగదారులు 45 నుంచి 55 రూపాయలకు కిలోబియ్యం కొంటున్నారు. అంటే అటు రైతులను ముంచి ఇటు వినియోగదారుల జేబులు కొట్టి విదేశాలకు చౌకగా బియ్యం ఎగుమతి చేస్తున్నాం.

పప్పు, నూనె గింజల్లో స్వయం పోషకత్వం సాధించాలని సంకల్పాలు చెప్పుకోవటం తప్ప తగిన ప్రోత్సాహం, అధిక దిగుబడి వంగడాల మీద పరిశోధనా లేదు. మూడు దశాబ్దాల క్రితం నామమాత్రంగా ఖాద్య తైలాలను దిగుమతి చేసుకోనే వారం, ఇప్పుడు 60 శాతం అవసరాలు విదేశాల నుంచే తీర్చుకుంటున్నాం. అదానీ వంటి దిగుమతి కంపెనీల లాభాలను కాపాడటానికే ఈ రంగంపై మోడీ సర్కార్‌ శ్రద్ద చూపటం లేదు. నూనెగింజల ఉత్పత్తి పెంచాలంటూ 2024లో జాతీయ పథకాన్ని ప్రారంభించారు, కళ్లు తెరవటానికి పదేండ్లు పట్టింది.మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియాల మాదిరే ఇది కూడా మారనుందా ? 2021 ఆగస్టులో ఖాద్య తైలాలు- పామాయిల్‌ ఉత్పత్తి పెంపు పథకాన్ని ప్రకటించి 2025-26 నాటికి అదనంగా పామాయిల్‌ 6.64లక్షల హెక్టార్ల సాగు చేయిస్తామని చెప్పారు, కానీ 1.89లక్షలే పెరిగింది, ఇదే కాలంలో ఆవనూనె సాగు, ఉత్పత్తి రెండూ తగ్గాయి. దీనికి కూడా జవహర్‌ లాల్‌ నెహ్రూ, కాంగ్రెస్‌ నేతలే కారణమని చెప్పినా నమ్మే జనాలున్నారు మరి ! మరోవైపు ముడి పామాయిల్‌ దిగుమతులపై పన్ను మొత్తాన్ని 20 నుంచి పది శాతానికి తగ్గించారు. కొనుగోలు శక్తి లేక తలసరి ఖాద్యతైల వినియోగం తక్కువగా ఉండబట్టి గానీ లేకుంటే దిగుమతులు మరింతగా పెరిగి ఉండేవి.

వేరుసెనగ దేశం మొత్తంలో మూడోవంతుకు పైగా గుజరాత్‌లో సాగు చేస్తారు. మొత్తం నూనె గింజల సాగులో మూడు దశాబ్దాల క్రితం 38శాతంగా ఉన్న వేరుశనగ ఇప్పుడు 28శాతానికి పడిపోయింది. పొద్దుతిరుగుడు ఆరు నుంచి 0.5శాతానికి దిగజారింది. సోయాబీన్‌, ఆవ నూనె సాగు పెరిగింది.వేరుశనగలో నూనె 48-50శాతం వరకు ఉంటుంది, అదే సోయాలో 18-20శాతమే, అందువలన సోయా పెరిగినా పెద్దగా ప్రయోజనం లేదు. ఆవు పేడ, మూత్రాల్లో ఏముందని పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యత రైతాంగానికి మేలు చేసే నూనె గింజల దిగుబడిని పెంచే రకాల అభివృద్ధి పట్ల లేదు. వేరుశనగ దిగుబడి హెక్టారుకు మన దేశంలో 2.08టన్నులు(2023) కాగా చైనాలో 3.98, అమెరికాలో 4.19 టన్నులు ఉంది. ఇటు ధరలు లేక అటు అధిక దిగుబడి వంగడాలు లేకుండా దేశం కోసం ధర్మం కోసం పాలన అంటే ప్రయోజనం ఏముంది ! గుజరాత్‌ వేరుశన సాగులో ఒక నిలకడ లేదు. గడచిన రెండు దశాబ్దాలలో అక్కడ కూడా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.ఎందుకు రైతులు వేరే పంటలకు వెళతారంటే వేరుశెనగ గిట్టుబాటు కాకపోవటమే. నిజానికి నరేంద్రమోడీకి గుజరాత్‌ రైతుల మీద అయినా శ్రద్ద, రైతాంగానికి గిట్టుబాటయ్యే చర్యలు తీసుకొని ఉంటే మొత్తంగా సాగు ఇంకా పెరిగి ఉండేది, దిగుమతుల భారాన్ని తగ్గించి ఉండేది, అధిక దిగుబడి వంగడాల అభివృద్ధి జరిగి ఉండేది. ఇటీవలి కాలంలో బిజెపి రెండింజన్ల పాలిత రాష్ట్రాలతో సహా అన్ని చోట్లా రైతాంగం యూరియా కొరతను ఎదుర్కొన్నది. దేశీయంగా ఉత్పత్తిని పెంచటంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా దిగుమతులు నిలిపివేయటమే దీనికి కారణం.పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వటంలో ఉన్న శ్రద్ద రైతాంగం మీద లేదు. ఇతర ఎరువుల ధరలు ఎక్కువగా ఉండటం, యూరియా సబ్సిడీకి లభిస్తుండటంతో రైతాంగం దాని మీద మొగ్గు చూపుతున్నారు, దానికి తోడు గతేడాది వర్షాలు బాగాపడటం కూడా డిమాండ్‌ను పెంచింది.

అంతర్గత పరిస్థితి ఇలా ఉంటే అమెరికా కత్తి మన రైతాంగం మీద వేలాడుతున్నది.2030 నాటికి ఇరుదేశాల వాణిజ్యాన్ని 128 బిలియన్‌ డాలర్ల నుంచి 500బి.డాలర్లకు తీసుకుపోతామని మన నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు గాను తమ దేశంలో వినియోగించని కోడికాళ్లు, మిగులుగా ఉన్న వెన్న, జున్ను వంటి పాడి ఉత్పత్తులను, సోయా, మొక్కజొన్నలు, పత్తి తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు అనుమతితో పాటు పన్ను భారాన్ని తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్నది.ఏటా 20 బిలియన్‌ డాలర్ల మేర అక్కడి రైతాంగానికి అమెరికా సబ్సిడీలు ఇస్తున్నది. షరతులను అంగీకరిస్తే ఆ వస్తువులన్నింటినీ మన దేశంలో కుమ్మరిస్తారు,మనకు వ్యవసాయం వాణిజ్యం కంటే జీవనాధారంగా ప్రాధాన్యత కలిగి ఉంది.అమెరికా వస్తువులకు మార్కెట్‌ను తెరిస్తే నరేంద్రమోడీతో పాటు బిజెపి రాజకీయ పతనానికి నాంది పలికినట్లే.ట్రంప్‌ను సంతుష్టీకరించటానికి సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు పత్తి దిగుమతి పన్ను రద్దు చేశారు. దాని ప్రభావం మన పత్తిమార్కెట్‌పై పడి కనీస మద్దతు ధరలకంటే తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మన దేశ వ్యవసాయ మార్కెట్‌ విలువ 452 బిలియన్‌ డాలర్లని, 2030నాటికి 563బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా,146 కోట్ల జనాభా ఉన్నందున మన మార్కెట్‌ ఎవరికైనా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ పూర్వరంగంలో కనీస మద్దతు ధరలను పెంచటంతో పాటు వాటికి చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌ సరైనదే అని తేలుతున్నది.ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం 2022జూలైలో ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటి వరకు 45 సార్లు సమావేశం జరపటం తప్ప చేసిందేమీ లేదు, దానికి ఎలాంటి వ్యవధి నిర్ణయించలేదు గనుక అలా సాగదీస్తూనే ఉంటారు. ఈలోగా రైతులు మరచిపోతారు.ఏడాది క్రితమే, 2024లో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలని సిఫార్సు చేసింది. అంతే కాదు పిఎం కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఏటా ఇప్పుడు ఇస్తున్న ఆరువేల రూపాయలను పన్నెండు వేలకు పెంచాలని కూడా చెప్పింది. అయినా మోడీ సర్కార్‌ ఏమీ తెలియనట్లుగా నటిస్తోంది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.గ్రామీణ ఆదాయ పెరుగుదల 57.6, ఖర్చు పెరుగుదల 69.4శాతాల చొప్పున ఉంది.ఈ కారణంగా రుణ భారం పెరిగినందున రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలను మాఫీ చేయాలి.2016-17లో రుణ భారం ఉన్న గ్రామీణ కుటుంబాలు 47.4శాతం కాగా 2021-22 నాటికి 52శాతానికి చేరినట్లు నాబార్డు సర్వే తెలిపింది.వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు 2020-21లో 3.53శాతం ఉండగా 2024-25లో 2.54శాతానికి తగ్గాయి.వ్యవసాయ వృద్ధి రేటు 2023-24లో 1.4శాతానికి తగ్గింది, ఇది ఏడు సంవత్సరాల్లో కనిష్టం. రెండు ఎకరాలలోపు రైతాంగానికి విధిగా అందిరికీ పంటల బీమా చేయించాలి. వ్యవసాయ కార్మికులకు జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖగా ఉన్న పేరును వ్యవసాయం, రైతులు, వ్యవసాయ కార్మిక సంక్షేమ శాఖగా మార్చాలి. పంటల సేకరణ పరిమితంగానే ఉన్నందున కనీస మద్దతు ధరలను కేవలం ఆరుశాతం మంది రైతులు మాత్రమే 2021-22లో లబ్ది పొందినట్లు తేలింది.చట్టబద్ద హామీ ఉంటే ఎక్కువ మంది లబ్ది పొందుతారు. స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఎంఎస్‌పి నిర్ణయించాలి.బలహీనమైన మార్కెట్‌ సంబంధాలు ఉన్న రాష్ట్రాలలో రైతులు ఎంఎస్‌పి కంటే తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తే ప్రభుత్వం మీద భారం పెరుగుతుంది. మొత్తం 23 పంటలకు అమలు జరపాలంటే ఏడాదికి ఆరులక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి కావాలి. కనీస మద్దతు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వినియోగదారులకు ధరలు పెరుగుతాయి. గోధుమలు, బియ్యానికి ఒక శాతం కనీస మద్దతు ధర పెంచితే చిల్లర ధరలు 0.22శాతం పెరుగుతాయి.రాష్ట్రాలలో ఉన్న పరిస్థితిని బట్టి ప్రత్యేక విధానాలను రూపొందించాలి.చట్టబద్దత కల్పిస్తే ప్రైవేటు వ్యాపారులు ఆధరలకు కొనేందుకు ముందుకు రారు, ప్రభుత్వమే కొనాల్సి ఉంటుంది. నీరు ఎక్కువగా అవసరయ్యే వరి, గోధుమ, చెరకు వంటి పంటల ధరలకు చట్టబద్దత కల్పిస్తే భూగర్భ జలాల వాడకం ఎక్కువ అవుతుంది, భూసారం దిగజారుతుంది. చట్టబద్దత కల్పించటం ప్రపంచవాణిజ్య సంస్థ నిబంధనకు విరుద్దం, మొత్తం వ్యవసాయ ఉత్పత్తి విలువలో పదిశాతానికి మించి సబ్సిడీలు ఇవ్వటానికి ఉండదు. బియ్యం ఎగుమతులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను మద్దతు ధరలతో ప్రోత్సహించాలి. పార్లమెంటరీ కమిటీ చేసిన ఈ సిఫార్సులలో అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా ఉన్నాయి, కానీ ప్రతికూలంగా ఉన్న అంశాలను మాత్రమే పట్టించుకొని అనుకూలంగా ఉన్నవాటిని విస్మరించటం రైతాంగం మీద ఉన్న కక్ష, వివక్షగాక మరేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !

07 Wednesday Jan 2026

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Maduro Kidnap, Narendra Modi Failures, Nicolás Maduro, Nicolás Maduro Moros, Oil politics, US aggression against Venezuela, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

లాటిన్‌ అమెరికాలోని వెనెజులా ప్రస్తుతం ఒక విచిత్ర పరిస్థితిలో ఉంది.జనవరి మూడవ తేదీన రాజధాని కారకాస్‌పై దాడి చేసిన అమెరికా నిద్రలో ఉన్న అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణి సిసిలీ ఫ్లోర్స్‌ను కిడ్నాప్‌ చేసి తీసుకుపోయింది.నార్కో టెర్రరిస్టు అని అభియోగం మోపి న్యూయార్క్‌ కోర్టులో ప్రవేశపెట్టింది.తాను వెనెజులా అధ్యక్షుడినని, ఎలాంటి నేరం చేయలేదని మదురో కోర్టులో చెప్పాడు.తదుపరి ఏం జరుగుతుందో తెలియదు. తామే వెనెజులాను నడిపిస్తామని ట్రంప్‌ ప్రకటించాడు.ఏ న్యాయశాస్త్రంలోనూ ఒక దేశాన్ని నడిపించటం గురించి మనకు కనపడదు.ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగజ్‌ అధ్యక్ష భాద్యతలు చేపట్టారు.తమకు సహకరించకపోతే మదురో కంటే ఎక్కువగా అనుభవించాల్సి వస్తుందని ట్రంప్‌ ఆమెను బెదిరించాడు.ఆర్థిక, రాజకీయ ” సంస్కరణలు ” చేపట్టాలని, అందుకు వెనెజులా పూర్తిగా సహకరిస్తుందంటూ విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ట్రంప్‌ ఆదేశించాడు. ఒక పెద్ద బృందం అక్కడికి వెళ్లనుందని సలహాదారు స్టీఫెన్‌ మిలర్‌ చెప్పాడు.వెనెజులాలో పరిస్థితి గురించి భిన్న కథనాలు వెలువడుతున్నాయ. వాటిని అవునని లేదా కాదని గానీ వెంటనే నిర్దారించలేము. ఉదాహరణకు కొందరు వెనెజులా అధికారులు అమెరికాతో చేతులు కలిపారని అంటున్నారు. అది జరిగి ఉండకపోతే అంత సులభంగా కిడ్నాప్‌ జరిగేదా అనే సందేహాలు ఉన్నాయి.దేని గురించి తొందరపడి నిర్దారణలకు రానవసరం లేదు. అమెరికా చర్యను ఐరాస ఖండించింది. ప్రపంచ ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి వంటిది భారత్‌ అని చెబుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఈ దుర్మార్గాన్ని ఖండించకుండా మౌనముద్ర దాల్చారు.తాను భారత్‌ పట్ల సంతోషంగా లేనని ట్రంప్‌ ప్రకటించాడు. అతగాడిని ” సంతుష్టీకరించేందుకే ” మౌన దౌత్యమా ! మొత్తానికి మోడీని అమెరికా ఇరకాటంలో పెట్టింది. చమురుకోసమే అన్నది అందరికీ అర్ధమైన ఒక అంశం. మదురో మీద నార్కో టెర్రరిస్టు ముద్రవేసిన అమెరికా, ప్రస్తుతం అధ్యక్షరాలిగా ఉన్న డెల్సీ మీద అలాంటి ఆరోపణ చేయలేదు, తమకు సహరించకపోతే సంగతి చూస్తాం అని బెదిరించిందంటే కారణాలు ఉన్నాయన్నది స్పష్టం. వాటి గురించి ప్రపంచంలో పండిత మధనం జరుగుతోంది.

మదురోను ఎలా పట్టుకున్నారు, అందుకు అనుసరించిన పద్దతేమిటి అనే అంశాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కొన్ని నెలల పాటు మదురు నివశించే భవనం లాంటిదే ఒకటి ఏర్పాటు చేసి రెక్కీ నిర్వహించారని, మదురో సిబ్బందిని ప్రలోభపెట్టి వివరాలు తెలుసుకున్నట్లు చెబుతున్నారు.అపహరణ సమయంలో జరిగిన ప్రతిఘటనలో 80 మంది మరణించారని, వారిలో 32 మంది క్యూబన్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగజ్‌, ఆమె సోదరుడు జార్జి ఇద్దరూ వామపక్ష గెరిల్లా కుటుంబం నుంచి వచ్చిన వారే. మదురో పాలకుడైతే జార్జి విధానాల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నాడు. వారి తండ్రి జార్జి ఆంటోనియో రోడ్రిగజ్‌ 1970దశకంలో వెనెజులా నిరంకుశత్వాన్ని వ్యతిరేకించిన గెరిల్లా పోరాట యోధుడు. అతన్ని పట్టుకొని పోలీసులు కస్టడీలో చంపివేశారు.డెల్సీ రోడ్రిగజ్‌ సహకరించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ ఆమెనేమీ చేయలేదు. ఇది లొంగదీసుకొనేందుకు బెదిరింపుగా కనిపిస్తున్నది. మరోవైపు డెల్సీ అమెరికా విదేశాంగ మంత్రితో సంబంధాలు కలిగి ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇవి ఛావెజ్‌ అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించటానికి ఎత్తుగడగా వ్యాపింపచేసినవి కూడా కావచ్చు.

చరిత్రను చూస్తే ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి ప్రపంచానికి నిత్యం నీతి సూత్రాలను బోధించే అమెరికా అడుగడుగునా వాటిని ఉల్లంఘించిన ఉదంతాలు కోకొల్లలు. అది సమర్ధించని నియంతలు లేరు, మారణకాండ లేదు.తమదారికి రాని వారిని ఏం చేస్తామో ఇది ప్రారంభం మాత్రమే అని మదురో అపహరణ తరువాత ట్రంప్‌ చెప్పాడంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ప్రపంచానికి ఎలాంటి ముప్పురానుందో ! రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్‌ హిట్లర్‌ యూదుల మారణకాండకు పాల్పడినా, అనేక దేశాలను ఆక్రమించుకోవటం ప్రారంభించినా ”ప్రజాస్వామిక ముసుగు ” వేసుకున్నదేశాలేవీ అడ్డుకోలేదు, వాడికి అమెరికా ఆయుధాలు కూడా అందించింది.సోవియట్‌ కమ్యూనిస్టుల మీదకు వెళ్లినపుడు సోషలిస్టు వ్యవస్థను అంతంచేస్తాడని కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ ఆనందించారు. ఉక్కు మనిషి స్టాలిన్‌ నాయకత్వంలో ప్రతిఘటించి చుక్కలు చూపించిన తరువాత హిట్లర్‌ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు.ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో ఉన్న అమెరికన్‌ ఫాసిస్టు శక్తిని నిలువరించేది ఎవరు ? తదుపరి లక్ష్యం మెక్సికో, కొలంబియా, క్యూబా అని కూడా ట్రంప్‌ చెప్పాడు. అది అక్కడితోనే ఆగదు.రెండవ ప్రపంచ యుద్ధంతో భౌతిక వలసలు సాధ్యం కాదని గ్రహించిన సామ్రాజ్యవాదులు ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను స్వాధీనం చేసుకొనేందుకు చూశారు.అది కూడా సాధ్యం కాదని 80 ఏండ్ల అనుభవం తేల్చింది. అందుకు గాను అంతకు ముందునాటి ఆక్రమణలు మినహా మరో మార్గం లేదని,గతంలో తమ పెరటి తోటగా పరిగణించిన లాటిన్‌ అమెరికాతోనే ప్రారంభం అని వెనెజులా ఉదంతం స్పష్టం చేసింది. అంతకు ముందు డెన్మార్క్‌ స్వయంపాలిత గ్రీన్‌ లాండ్‌ తమకు కావాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్‌ తరహా సామ్రాజ్యవాదంగా చరిత్రలో నమోదైంది.

ప్రస్తుతం ప్రపంచంలో అస్థిరపరిస్థితి రోజు రోజుకూ పెరుగుతున్నట్లుగా ఉంది.ఉక్రెయిన్‌, పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు, కాంగో, సూడాన్‌లో దాడులు, అంతర్యుద్ధాలు,రష్యా, ఇరాన్‌, వెనెజులాలపై ఆంక్షలు, ఐరాస ప్రసంగాల వేదికగా మారి చేష్టలుడిగి చూస్తున్నదిగా మారటం,సోవియట్‌తో ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తరువాత అమెరికా అనేక దేశాల మీద దాడులకు పూనుకోవటం, సిరియా,లిబియాల్లో జోక్యం, గాజాలో ఇజ్రాయెల్‌ మారణకాండకు మద్దతు, ఇరాన్‌పై దాడి, ఇరాక్‌, ఆఫ్ఘ్‌నిస్తాన్‌లో పరాభవం.మొత్తం మీద ప్రపంచంలో విలువైన వనరులను చేజిక్కించుకొనేందుకు అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్న అమెరికా తీరు ఇటీవలి కాలంలో మరింతగా ప్రపంచానికి తేటతెల్లమైంది. వెనెజులాలో జరిగిన దుర్మార్గానికి అమెరికా, ఐరోపా, ఇతర అమెరికా అనుకూల దేశాల్లోని మీడియా ” ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన నెలకొల్పే చర్య ” గా వర్ణించి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. అమెరికా చెప్పిన కట్టుకతలనే వల్లిస్తున్నాయి.ఒక పధకం ప్రకారం వెనెజులాలో తన తొత్తు మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ బహుమతి ఇప్పించిన అమెరికా ఇప్పుడు ఆమెతో చిలుకపలుకులు పలికిస్తున్నది,వాటిని పట్టుకంని పశ్చిమదేశాల మీడియా వేదవాక్కులుగా చెబుతున్నది. వెనెజులా మాదక ద్రవ్యాల కేంద్రంగా ఉన్నట్లు చివరికి అమెరికా సంస్థలు కూడా చెప్పలేదు.డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌( డిఇఏ) తాజా నివేదికలో ఒక పేరాలో మాత్రమే పేర్కొన్నది. ఐరాస వందపేజీల నివేదికలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఐరోపా సమాఖ్య నివేదికలో కూడా అంతే. అయినా సరే పశ్చిమ దేశాల మీడియాకు అవేవీ పట్టలేదు. మదురో నియంత అంటూ రోతపాటలను పాడుతున్నాయి. మెక్సికో వంటి అనేక దేశాల్లో మాదకద్రవ్యాల ముఠాలు ఎలా చెలరేగుతున్నాయో అందరికీ తెలుసు, మెక్సికోలో నిజమైన పాలకులు అవే అని స్వయంగా ట్రంప్‌ తాజాగా చెప్పాడు.పక్కనే సరిహద్దు నుంచి పెంటానిల్‌ అనే డ్రగ్‌ సరఫరా అవుతున్నదని కూడా గతంలో చెప్పాడు.మరి దాని మీద ఎందుకు దాడి చేయలేదన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. అసలు కారణం ఏమిటంటే గత పాతిక సంవత్సరాలుగా వెనెజులా కొరకరాని కొయ్యగా తయారైంది.క్యూబా చమురు అవసరాలు తీరుస్తున్నది, పెద్ద మొత్తంలో చైనాకు సరఫరా చేస్తున్నది, ఒక్క వీటికే కాదు, ఎవరు వస్తే వారికి విక్రయిస్తున్నది.మనదేశం 2024లో 140 కోట్ల డాలర్ల మేర చమురు దిగుమతి చేసుకుంది. ట్రంప్‌ బెదిరించటంతో 2025లో 81శాతం తగ్గించింది.తెగించినవాడికి తెడ్డే లింగం అన్నట్లుగా ట్రంప్‌ ఎలాంటి శషభిషలు లేకుండా తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.కట్టుకథలు చెప్పినా నమ్మే స్థితిలో ప్రపంచం లేదు, శాసించేదిగా అమెరికా లేదు. ఇప్పటికీ బలమైన శక్తిగా ఉన్నప్పటికీ అదుపు చేసే శక్తి దానికి లేదు. ఇంకా ఆలశ్యం చేస్తే ఉన్న పట్టుకూడా జారిపోయేట్లు ఉన్నదని భావించి అమెరికా తెగింపుకు దిగింది. భద్రతా మండలిలో ఒక శాశ్వత రాజ్యంగా ఉండి మరో సర్వసత్తాక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్‌ చేసిందంటే ఐరాస ఉండీ లేనట్లే.తాను భాగస్వామిగా ఉండి నెలకొల్పిన అనేక సంస్థలు అనివార్యమై తనకే అడ్డుపడుతుండటంతో క్రమంగా అమెరికా నాశనం చేస్తున్నది.

వెనెజులాను ఆక్రమించటం దాని బలహీనతకు చిహ్నం తప్ప బలానికి కాదు. రష్యాను శాసించలేదని ఉక్రెయిన్‌ సంక్షోభం వెల్లడించింది. చైనా మిలిటరీ రీత్యా కూడా బలపడుతున్నది.ఈ రెండూ కలసి వాషింగ్టన్ను సవాలు చేస్తున్నాయి. అమెరికా ఎత్తుగడల గురించి రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మదురోను పట్టుకోవటం కాదని, అసలు లక్ష్యం చైనా అన్నది వాటిలో ఒకటి.చైనాను దెబ్బతీసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్‌ అందకుండా ఇప్పటికే ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచంలో చమురు దిగుమతి చేసుకొనే దేశాలలో చైనా అగ్రస్థానంలో ఉంది. వెనెజులా ఒక ప్రధాన సరఫరాదారు, అక్కడ చైనా పెట్టుబడులు కూడా ఉన్నాయి. అక్కడి చమురును స్వాధీనం చేసుకుంటే చైనాకు సరఫరా నిలిపివేయవచ్చు.మరో ప్రధాన సరఫరాదారు ఇరాన్‌ మీద కూడా మిలిటరీ చర్య ద్వారా దాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా చూస్తున్నది. ఇదే సమయంలో మరో ప్రధాన వనరుగా ఉన్న రష్యాను కూడా చైనా నుంచి దూరం చేయాలనే ఎత్తుగడ ఉంది. దానిలో భాగంగానే ఉక్రెయిన్‌లో కోరిన ప్రాంతాలను అప్పగించేందుకు కూడా సిద్దపడుతున్నట్లు ట్రంప్‌ తీరుతెన్నులు ఉన్నాయి.అయితే అది జరగాలంటే అనేక చిక్కు ముడులు ఉన్నాయి. అమెరికా చెలగాటం తమకు ప్రాణగండంగా ఐరోపా భావిస్తే ప్రపంచ రాజకీయాలే మరోమలుపు తిరుగుతాయి. మొత్తం మీద చెప్పాలంటే చైనాకు చమురు దొరక్కుండా చేయాలనే ఎత్తుగడలో అమెరికా ఉంది. భారత్‌ మీద తాను ఆగ్రహంగా ఉన్నట్లు వారికి తెలుసని ఈ సందర్భంగా ట్రంప్‌ చేసిన ప్రకటన నరేంద్రమోడీని మరింతగా ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పటికే ఆపరేషన్‌ సింధూర్‌ను తానే ఆపివేయించానని పదే పదే చెప్పిన ట్రంప్‌ వాణిజ్య ఒప్పందం గురించి ఇంకా పట్టుబడుతూనే ఉన్నాడు.ఒక వైపు పాకిస్తాన్‌ మరో వైపు నుంచి బంగ్లాదేశ్‌ను మన మీదకు ఉసిగొల్పుతున్నాడు.

అమెరికా ఒక దేశాధ్యక్షుడిని పదవి నుంచి కూల్చివేయటం నికోలస్‌ మదురోతోనే ప్రారంభం కాలేదు. పనామాలో స్వయంగా మిలిటరీ నియంత మాన్యుయల్‌ నోరిగాను గద్దె నెక్కించింది అమెరికా. సంబంధాలు చెడింతరువాత మాదకద్రవ్యాల నిరోధం పేరుతో అదే అ మూడు వందల విమానాలు, 27వేల మంది సైనికులతో పనామా మీద దాడి చేసి అతగాడిని పట్టుకొని అమెరికాలో విచారించి 40 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. మానవాళికి ముప్పు తెచ్చే ఆయుధాలను గుట్టలుగా నిల్వచేశాడంటూ ఇరాక్‌ మీద దాడి చేసి అధ్యక్షుడు సద్దామ్‌ హుస్సేన్ను పట్టుకొని తరువాత ఉరితీసి అమెరికా చంపింది.హైతీ అధ్యక్షుడు జీన్‌ బెట్రాండ్‌ అరిస్డైడ్‌ను కిడ్నాప్‌ చేసి పదవి నుంచి తొలగించింది. హొండూరాస్‌ అధ్యక్షుడు జువాన్‌ ఆర్లాండో హెర్నాండెస్‌ను అరెస్టు చేసి అమెరికా కోర్టులో మాదక ద్రవ్యాల కేసులో 45ఏండ్ల శిక్షవేసింది. ట్రంప్‌ అతగాడిని క్షమించి జైలు నుంచి ఇటీవలనే విడుదల చేశాడు. ఇరాన్‌లో అమెరికా, ఇతర ఐరోపా దేశాల చమురు కంపెనీలను జాతీయం చేసినందుకు ప్రధాని మహమ్మద్‌ మొసాదిక్‌ను తొలగించి నియంత షాను గద్దెనెక్కించింది.గౌతమాలాలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే పేరుతో జాకబ్‌ ఆర్బెంజ్‌ను తొలగించింది. అతనికీ కమ్యూనిజానికి సంబంధం లేదు. పశ్చిమదేశాలను వ్యతిరేకించే వామపక్ష అనుకూలుడైన అధ్యక్షుడు అబ్దుల్‌ కరీం ఖాశింను ఇరాక్‌లో హత్య చేయించింది. దక్షిణ వియత్నాంలో తామే గద్దె నెక్కించిన నియంత నగో దిన్‌ డైమ్‌ కమ్యూనిస్టులను అణచటంలో విఫలమయ్యాడని మిలిటరీ తిరుగుబాటులో తొలగించింది. కమ్యూనిస్టుల మీద నెపాన్ని నెట్టింది.గ్రెనడాలో హడ్సన్‌ ఆస్టిన్‌ను తొలగించింది.లిబియాలో గడాఫీని కూలదోయించి హత్య చేయించింది..

Share this:

  • Tweet
  • More
Like Loading...

విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !

03 Saturday Jan 2026

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

#Pinarayi Vijayan, 2025 Kerala Lokal Elections, Believers in Kerala LDF, BJP, Kalpetta Municipal Chairman, LDF, Paniya Tribe, Pinarayi Vijayan, RSS, Sabarimala Gold case, Soniya gandhi, UDF Kerala

ఎం కోటేశ్వరరావు

మేం అందంగా లేకపోవచ్చు, మేమూ అందరిమాదిరి మనుషులమే…

మా శరీరాలు నల్లగా ఉండవచ్చు, మా హృదయాలు స్వచ్చం…

విత్తనాలు నాటేవారిలో మేమూ ఒకరిమే, వాటికి కాపలాదారులం కూడా ….

పిడికెడు ధాన్యమే మేం కోరుతున్నాం….

ఈ భావంతో లిపిలేని తమ భాషలో పాటలు పాడుకొంటారు కేరళలోని పనియా గిరిజన తెగకు చెందిన వారు. సమాజంలో నిరాదరణకు గురైన ఈ తెగకు చెందిన నాలుగుపదుల వయస్సున్న పి.విశ్వనాధన్‌ జీవనం కోసం కాపలాదారుగా పని చేస్తున్నాడు. గతేడాది డిసెంబరులో జరిగిన ఎన్నికలలో కేరళలోని వయనాడ్‌ జిల్లా కేంద్రమైన కాల్‌పెట్టా మున్సిపల్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించాడు. ఇతర గిరిజన తెగలలో కురిచియా వారే రిజర్వుడు సీట్ల నుంచి ప్రాతినిధ్యం వహించారు తప్ప జనాభా రీత్యా ఎక్కువగా ఉన్నప్పటికీ అత్యంత వెనుకబడిన కారణంగా నోరులేని పనియా తెగకు చెందిన వారు ఇప్పటి వరకు ఇలాంటి పదవులను చేపట్టలేదు. దళితులు, గిరిజనులకు కేటాయించిన స్థానాల నుంచే ఆ తరగతులకు చెందిన వారు ఎన్నికై పదవులను చేపట్టటం సర్వసాధారణం. అయితే సిపిఐ(ఎం) తన కార్యకర్తగా పని చేస్తున్న విశ్వనాధన్ను ఒక జనరల్‌ వార్డు నుంచి పార్టీ పోటీకి నిలిపింది. పట్టణంలో అత్యధిక మెజారిటీతో కౌన్సిలర్‌గా గెలిపించింది. గిరిజనులకు రిజర్వు చేసిన చైర్మన్‌ పదవిని చేపట్టారు.మళయాళ పత్రికలతో పాటు అక్కడి నుంచి వెలువడే జాతీయ పత్రికలన్నీ ఈ ఎన్నిక గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. విశ్వనాధన్ను ఒక పత్రిక హీరోగా వర్ణించింది. తమ పొలాల్లో పని చేసేందుకు గతంలో ఈ తెగవారిని భూస్వాములు బానిసలుగా చేసుకున్న చరిత్ర ఉంది.

యువకుడిగా డివైఎఫ్‌ఐ నేతగా, సిపిఐ(ఎం)లో ఏరియా కమిటీ సభ్యుడిగా, ఆదివాసీ క్షేమ సమితి నేతగా, జానపద గాయకుడిగా విశ్వనాధన్‌ పని చేస్తున్నారు.గిరిజన తెగల హక్కులు, గౌరవం కోసం జరిగే అన్ని ఉద్యమాల్లో భాగస్వామి.చిన్న తనంలో చదువు సంధ్యలకు నోచుకోని కారణంగా ఈ వయస్సులో పదవ తరగతితో సమానమైన( మెట్రిక్‌ వంటిది) తుల్యత పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఎవరికోసమో ఎదురు చూడకుండా తమ సామాజిక తరగతికి చెందిన వారు తమ పరిమితులను అధిగమించి అన్ని ఆటంకాలను తట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. తన ఎన్నిక తమవారిలో ప్రోత్సాహానికి దోహదం చేస్తుందన్నారు.దరఖాస్తులు రాసుకోవటం కూడా రాని తమవారు ఇతరుల మీద ఆధారపడుతున్నారని చెప్పారు. వయనాడ్‌ జిల్లాలోని గిరిజనుల్లో పనియా తెగవారు 75వేల మంది ఉండగా కురుమా, కురిచియా తెగలకు చెందిన వారు 52వేల మంది చొప్పున ఉన్నారు. ఈ తెగకు చెందిన వారు వయనాడ్‌, కన్నూరు, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాలో ఉన్నారు. పొరుగునే ఉన్న తమిళనాడు నీలగిరి జిల్లాలో, కర్ణాటకలో పరిమితగా ఉన్నారు. ఎన్నికైన తరువాత అధికారిక వాహనంలో తన తలిదండ్రులను కలుసుకొనేందుకు వెళ్లినపుడు వారిలో ఎలాంటి సంభ్రమాశ్చర్యాలు లేకుండా కొడుకును చూశారని, తన కుమారుడు ఈ పదవికి ఎన్నికైనందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని తల్లి చెప్పినట్లు పిటిఐ తెలిపింది. అతని సామర్ధ్యం కారణంగానే జనరల్‌ సీటు నుంచి గెలిచారని సిపిఐ(ఎం) సీనియర్‌ నేత వి హారిస్‌ చెప్పారు.

కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌ – కుమ్మక్కుతోనే బిజెపి విజయం: పినరయి విజయన్‌

కేరళలో కూడా మతపరమైన రాజకీయాలు పెరుగుతున్నాయని జనం జాగరూకులై ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ హెచ్చరించారు.గురువారం నాడు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సిపిఐ(ఎం) వ్యతిరేకంగా 1990దశకంలో ప్రారంభమైన కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌-బిజెపి కుమ్మక్కు ఇప్పటికీ కొనసాగుతున్నదని, ఆ కారణంగానే ఇటీవల తిరువనంతపురంలో, 2024 ఎన్నికల్లో త్రిసూర్‌ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిందని, అంతకు ముందు 2016లో నీమమ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలిచిందని చెప్పారు.తనకు అనుకూలంగా కాంగ్రెస్‌ సహకరించిందని నీమమ్‌లో గెలిచిన బిజెపి నేత ఓ రాజగోపాల్‌ స్వయంగా అంగీకరించిన అంశాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. తిరువనంతపురంలో బిజెపి గెలిచిన అనేక వార్డుల్లో కాంగ్రెస్‌కు అతి తక్కువగా ఓట్లు రావటాన్ని బట్టే కుమ్మక్కును గ్రహించవచ్చన్నారు. కర్ణాటకలో ముస్లింల ఇండ్ల కూల్చివేతపై తాను స్పందించిందాంట్లో తప్పులేదన్నారు. ఇలాంటి ఉదంతాలు విదేశాల్లో జరిగినా స్పందిస్తున్నపుడు దేశంలో జరిగిన వాటి మీద మౌనంగా ఎలా ఉంటామని ప్రశ్నించారు. కేరళకే పరిమితం కావాలని అనటం ఏమిటని అన్నారు. ఈ అంశాన్ని కర్ణాటక సిఎం సిద్దరామయ్యతో చర్చించారా అని అడగ్గా, ఇటీవల శివగిరి మఠసమావేశానికి ఆయన ఆలశ్యంగా వచ్చారని, మంత్రివర్గ సమావేశం, ఇతర కార్యక్రమాల వలన తాను ముందుగానే మాట్లాడి వెళ్లినట్లు చెప్పారు.

సోనియా గాంధీని కలిసిన శబరిమల బంగారం చోరీ కేసు నిందితులు !

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసు సిట్‌ దర్యాప్తులో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుంటున్నదన్న కాంగ్రెస్‌ ఆరోపణను విజయన్‌ తోసిపుచ్చారు. జవాబు చెప్పాల్సిన వారు ఎదురుదాడికి దిగినట్లు ఆయన చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్‌ పొట్టి, దొంగబంగారం కొనుగోలు చేసిన వర్తకుడు గోవర్ధన్‌తో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు ఆడూర్‌ ప్రకాష్‌, ఆంటో ఆంటోనీ కాంగ్రెస్‌ నేత సోనియగాంధీతో కలసి దిగిన ఫొటో సంగతేమిటో చెప్పకుండా నాటకాలు వేస్తున్నారని సిఎం అన్నారు. పొట్టి పిలిస్తే వెళ్లానని ప్రకాష్‌ చెబుతున్నారని, ఎవరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళతారా, అసలు వారిని సోనియా వద్దకు తీసుకువెళ్లిన వారెవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఈ కేసు విచారణలో ఎలాంటి ఇబ్బంది లేదని, హైకోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్నందున బిజెపి కోరుతున్నట్లుగా సిబిఐకి నివేదించాల్సిన అవసరం లేదని విజయన్‌ చెప్పారు.

ఏ కూటమి ఓట్లు పెరిగాయి, ఎవరికి తగ్గాయి !

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎల్‌డిఎఫ్‌ ఘోరపరాజయం పాలైందని, రానున్న రోజుల్లో బిజెపి హవా ప్రారంభమౌతుందని మీడియాలో అనేక మంది చెబుతున్నారు. మళయాళ మనోరమ పత్రిక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన అంకెలను ఉటంకిస్తూ కొన్ని వివరాలను వెల్లడించింది. ఎల్‌డిఎఫ్‌కు మొత్తం 70,99,175 ఓట్లు వచ్చాయి, 2024లోక్‌సభ ఎన్నికల కంటే 4.3లక్షలు ఎక్కువ.యుడిఎఫ్‌, ఎన్‌డిఏల కంటె మెరుగైనదిగా ఉంది.లోక్‌సభ ఎన్నికల్లో యుడిఎఫ్‌ 90,18,752 ఓట్లు తెచ్చుకోగా తాజా ఎన్నికల్లో 82,37,385కు అంటే 7.81లక్షల ఓట్లు తగ్గాయి.ఎన్‌డిఏ(బిజెపి) ఓట్లు 38,37003 నుంచి 31,21,335కు పడిపోయాయి, 7.16లక్షల ఓట్లు తగ్గాయి.

బిజెపి మేయర్‌కు శృంగభంగం !

తిరువనంతపురం నగరమేయర్‌గా ఎన్నికైన బిజెపి నేత వివి రాజేష్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకొనే తానే ఇరుక్కు పోయారు. స్మార్ట్‌ సిటీ పధకంలో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్‌ వాటా సొమ్ముతో 113 ఎలక్ట్రానిక్‌ బస్సులను కొనుగోలు చేసి నగరంలో, వెలుపలా వాటిని నడిపిస్తున్నారు.గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం వాటి నిర్వహణలో వచ్చే లాభంలో వాటాను నగర కార్పొరేషన్‌కు ఇవ్వాలని ఉంది. ఆ మేరకు తమకు ఇవ్వటం లేదంటూ బిజెపి మేయర్‌ ధ్వజమెత్తారు. ఆ బస్సులను రాష్ట్ర రవాణా సంస్థకు అప్పగించారు. కార్పొరేషన్‌ ఖాతా నుంచి కొంత సొమ్ము ఇచ్చినప్పటికీ అది కూడా ప్రభుత్వ సొమ్మే, దీనికి తోడు ప్రత్యేకంగా ఆ బస్సుల నిర్వహణకు ప్రత్యేక ఖాతా లేదు గనుక గనుక లాభనష్టాల ప్రస్తావన రాలేదు.పినరయి ప్రభుత్వం మీద ధ్వజమెత్తేందుకు మంచి అవకాశం దొరికిందని బిజెపి భావించింది. డీజిలుతో నడిచే బస్సులతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ భారంగా ఉందని రవాణా శాఖ మంత్రి కెబి గణేష్‌ కుమార్‌ చెప్పారు. మేయర్‌కు నిజంగా ఆసక్తి ఉంటే వాటిని తిరిగి తమకు అప్పగించాలని లేఖ రాస్తే వెంటనే స్వాధీనం చేస్తామని ప్రకటించారు. ఆ బస్సులను ఆర్‌టిసి డిపోలలో నిలిపేందుకు వీల్లేదని, కార్పొరేషనే ఏర్పాటు చేసుకోవాలని కూడా చెప్పారు. ప్రభుత్వం చౌకగా దొరికే డీజిల్‌ బస్సులను కొనుగోలు చేస్తుందని కూడా స్పష్టం చేశారు. దాంతో తత్వం బోధపడిన మేయర్‌ తమకు వాటిని వెనక్కు తీసుకోవాలనే ఉద్దేశ్యం లేదంటూ తోకముడిచారు. నగరమేయర్‌ పదవిని ఆశించి భంగపడిన బిజెపి కార్పొరేటర్‌, మాజీ డిజిపి అయిన ఆర్‌ శ్రీలేఖ ఒక భవనం విషయంలో కూడా భంగపడ్డారు. మాజీ మేయర్‌, సిపిఐ(ఎం) ఎంఎల్‌ఏ అయిన వికె ప్రశాంత్‌ ప్రస్తుతం కార్పొరేషన్‌కు చెందిన ఒక భవనానికి అద్దె చెల్లిస్తూ తన కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ భవనంలోనే సదరు ప్రాంత వార్డు కార్పొరేటర్‌ కార్యాలయం కూడా ఉంది. ప్రస్తుతం ఆ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలేఖ భవనం నుంచి ఎంఎల్‌ఏ ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారు. తాను ఒప్పందం మేరకు అద్దె చెల్లిస్తున్నందున ఖాళీ చేసే ప్రసక్తి లేదని, గడువు తీరేంతవరకు తననెవరూ కదిలించలేరని ప్రశాంత్‌ స్పష్టం చేశారు. దాంతో ఆమె అబ్బే ఊరికే కేవలం అభ్యర్ధించా అంటూ వెనక్కు తగ్గారు. నెల రోజులు కూడా గడవక ముందే బిజెపి ఇలాంటి పనులకు పాల్పడిందింటే రానున్న రోజుల్లో ఎలాంటి గిల్లి కజ్జాలకు దిగుతుందో చూడాల్సి ఉంది.

బంగ్లాదేశీయుడివా అంటూ గిరిజనుడిని కొట్టి చంపిన ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి గూండాలు !

డిసెంబరు 17న కేరళ పాలక్కాడ్‌ జిల్లా అట్టపల్లమ్‌ గ్రామంలో హత్యకు గురైన చత్తీస్‌ఘడ్‌ వలస కూలీ, గిరిజనుడైన రామనారాయన్‌ భగేల్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 30లక్షల రూపాయలు మంజూరు చేసింది. తల్లి, భార్యకు ఐదేసి లక్షలు, ఇద్దరు పిల్లలకు పదేసి లక్షల చొప్పున వారి పేర్లతో ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేస్తారు. నువ్వు బంగ్లాదేశీయుడివా అంటూ రామనారాయన్‌ను కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో నిందితుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపికి చెందిన వారు ఉన్నారు. ఏడుగురిని అరెస్టు చేయగా మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో నిందితుల్లో ఇద్దరు పదిహేనేండ్ల క్రితం ఒక సిఐటియు మరియు డివైఎఫ్‌ఐ కార్యకర్తను చేసిన వారిలో ఉన్నారు. వారితో తమకేమీ సంబంధం లేదని బిజెపి చెప్పుకుంది. ఆ పార్టీకి చెందిన వారు ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు మీడియాకు తెలిసినప్పటికీ మూసిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

28 Sunday Dec 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

14th Dalai Lama, 2025 Pentagon Report, anti china, Anti communist, BJP, China, China Arms, Donald trump, Narendra Modi Failures, RSS, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ప్రతి ఏటా మాదిరే ఈసారి కూడా అమెరికా రక్షణశాఖ ( పెంటగన్‌ ) 2025 నివేదిక విడుదల చేసింది. దానిలో ఉన్న అభూత కల్పనలు, కుట్ర సిద్దాంతాలు, వక్రీకరణలతో సహా అనేక అంశాల గురించి మీడియాలో, ఇతరంగా అనేక మంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. హెచ్చరికలు, పరోక్ష బెదిరింపులు, బుజ్జగింపులు, చైనా, మనదేశం పరస్పరం దెబ్బలాడుకొనేందుకు తంపులు పెట్టటం వంటివి అనేకం ఉన్నాయి. ఈ ఏడాది నివేదిక ప్రత్యేకత ఏమంటే తనతో చెట్టపట్టాలు వేసుకుతిరిగి ఒకే కంచం, ఒకే మంచం అనే జిగిని దోస్తులా ఉన్న నరేంద్రమోడీకి సహజభాగస్వామి డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్ని పరీక్ష పెట్టాడంటే అతిశయోక్తి కాదు. ఏడాది కాలంలో ఎంతలో ఎంతమార్పు ? ఐదేండ్ల పాటు శత్రువుగా పరిగణించిన చైనాతో పూర్వంమాదిరి సంబంధాలు, అమెరికాతో ఎడబాటుకు 2025 నాంది పలికింది. అమెరికా మీడియా కొన్ని అంతర్గత అంశాల మీద విమర్శనాత్మకంగా ఉన్నప్పటికీ మొత్తం మీద ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ కనుసన్నలలోనే ఉంటుంది.” భవిష్యత్‌లో ఘర్షణ అవకాశం ” ఉంటుందంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజాగా భారత్‌-చైనా గురించి ఒక విశ్లేషణ రాసింది. దానికి ఆధారం పెంటగన్‌ నివేదికలోని అంశాలు. భవిష్యత్‌లో చైనాతో తలెత్తే యుద్ధం కోసం యావత్‌ హిమాలయ ప్రాంతంలో భారత్‌ వందల కోట్ల డాలర్లతో రోడ్లు, సొరంగాలు, విమానాలు ఎగిరే, దిగే ఏర్పాట్లు తదితర మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. రక్షణ విషయంలో సమతూకంతో ఉండటం కాకుండా వ్యూహాత్మక పోటీని సంచలనాత్మకం కావిస్తోంది. 2020 గాల్వన్‌ లోయలో మాదిరి చైనా కొద్ది గంటల్లోనే అదనపు బలగాలను దించగలదు, మౌలిక సదుపాయాలు లేని కారణంగా అదే భారత్‌కు ఒక వారం పడుతుంది. మొత్తం వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందని గుర్తించామని, అందువలన ఆలోచనలు నాటకీయంగా మారినట్లు లడఖ్‌ ప్రాంతంలో రవాణా నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించిన మాజీ అధికారి మేజర్‌ జనరల్‌ అమ్రిత్‌ పాల్‌ సింగ్‌ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది.గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత రెండుదేశాల మధ్య సంబంధాలు కనిష్ట స్థాయికి పడిపోయాయని, డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నుల విధింపుతో భారత్‌, చైనాలతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నట్లు కూడా వ్యాఖ్యానించింది.

రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవాలని 2024 అక్టోబరు నుంచి నిర్ణయించుకోవటమేగాక వేగంగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాయి. దాంతో ఏడు సంవత్సరాల తరువాత ప్రధాని నరేంద్రమోడీ చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి హాజరై పుతిన్‌, షీ జింపింగ్‌లతో భేటీ జరిపి అమెరికాకు పరోక్ష హెచ్చరికలు పంపారు. పెంటగన్‌ నివేదిక ఈ పూర్వరంగంలో తయారైందే అన్నది స్పష్టం. సరిహద్దులలో ఉద్రిక్తతలు తగ్గటాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా-భారత్‌ సంబంధాలను బలహీనపరిచేందుకు చూస్తున్నదని, పాకిస్తాన్‌తో రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకుంటున్నదని, అరుణాచల్‌ ప్రదేశ్‌ను ప్రధాన అంశంగా చూస్తున్నదని ఆ నివేదికలో చైనా మీద ఆరోపించారు. గత పదకొండు సంవత్సరాలు, అంతకు ముందు యుపిఏ హయాంలో అమెరికా జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు మన్మోహన్‌ సింగ్‌ ప్రయత్నించారు. ఆ కారణంతోనే యుపిఏ-2 హయాంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. తరువాత నరేంద్రమోడీ హౌడీమోడీ కార్యక్రమంలో డోనాల్డ్‌ ట్రంప్‌ను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేసి చెట్టపట్టాలు వేసుకుతిరిగి మరింత సన్నిహితమయ్యారు. క్వాడ్‌ పేరుతో చైనాకు వ్యతిరేకంగా మరింత చురుకుగా వ్యవహరించారు.ఈ పరిణామాలకు చైనా కారణమా ? ప్రారంభ సంవత్సరాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా అమెరికావైపే మొగ్గారు.దానిది ధృతరాష్ట్ర కౌగిలి అని అర్ధమయ్యాక అలీనవిధానం, సోవియట్‌ వైపు మొగ్గారు. పరిస్థితిని చూస్తుంటే ఇప్పుడు నరేంద్రమోడీ కూడా చైనాతో రానున్న రోజుల్లో ఎలా ఉంటారో తెలియదుగాని అనివార్యంగా అమెరికా బెదిరింపులను వ్యతిరేకించకతప్పని స్థితిలో ఉన్నారు. నరేంద్రమోడీ అమాయకంగా చైనా వలలో చిక్కుకున్నారని అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. అవసరాలు అలానడిపిస్తాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగమని మనదేశంలో ఆశ్రయం పొందుతున్న దలైలామా స్వయంగా చెప్పాడు. ఆ పెద్దమనిషికి మనదేశం అన్నివిధాలుగా మద్దతు ఇస్తున్నది.అదే మాట చైనా కూడా చెబుతున్నమాట నిజం.అయితే ఎన్నడూ ఆక్రమించుకుంటామని చెప్పలేదు.1962 యుద్ధం సందర్భంగా చైనా సేనలు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ వరకు వచ్చాయి. అక్కడే తిష్టవేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.యుద్ధంలో కాల్పుల విరమణను వారే ప్రకటించి, తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు ఆవలకు వెళ్లాయి. ఇది చైనా వ్యతిరేకులు కూడా అంగీకరిస్తున్న తిరుగులేని వాస్తవం. బ్రిటీష్‌ అధికారులు గీచిన సరిహద్దు రేఖలను చైనా ఎన్నడూ అంగీకరించ లేదు. లడఖ్‌లోని ఆక్సారు చిన్‌ ప్రాంతం మనదిగానూ, అరుణాచల్‌ చైనాలో భాగంగా బ్రిటీష్‌ మాపుల్లో ఉంది. అందుకే సరిహద్దు వివాదం తలెత్తింది. ఐదేండ్ల క్రితం ఆరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి చైనా కొన్ని గ్రామాలు నిర్మిస్తున్నదని మన మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అవి అమెరికా సిఐఏ సృష్టించిన కట్టుకథలు, వక్రీకరించిన చిత్రాలు. హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన మన మిలిటరీ అధికారి రావత్‌ అప్పుడే ఆ వార్తలు అవాస్తమని ప్రకటించారు. గతంలో ఎన్నడో నిర్మించిన ఇండ్లు పాతబడిపోయినందున వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు తప్ప చైనా ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని చెప్పారు.మన కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఎలాంటి దురాక్రమణలు జరగలేదని పార్లమెంటులో, వెలుపలా ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు, యుద్ధ విమానాలు విక్రయిస్తున్నది జాగ్రత్త అంటూ మనదేశాన్ని భయపెట్టేందుకు పెంటగన్‌ పూనుకుంది. ఆయుధాల క్రయ, విక్రయాలు అంతర్జాతీయ నిబంధనలమేరకే జరుగుతున్నాయి.చైనా గురించి మనలను రెచ్చగొడుతున్న అమెరికా దాని కంటే ముందుగానే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను, ఇతర ఆయుధాలను పాకిస్తాన్‌కు ఎందుకు అమ్మినట్లు ? మనకు కూడా ఎఫ్‌-35 విమానాలను ఇస్తామని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే చెప్పాడు కదా ? మనం ఫ్రాన్సునుంచి రాఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నాం. అదేవిధంగా చైనా నుంచి పాకిస్తాన్‌ కొనుగోలు చేసింది. చైనా విమానాలు ఎగరలేవు, ఆయుధాలు తుస్సుమనే నాశిరకం అని ఒకవైపు ప్రచారం చేస్తున్నవారు, వాటి గురించి ఎందుకు భయపెడుతున్నట్లు ? ఎంతో సమర్ధవంతమైనవని చెబుతున్న రాఫేల్‌ విమానాలను పాకిస్తాన్‌ ఆ నాశిరకం ఆయుధాలతోనే కూల్చివేసింది. ఆపరేషన్‌ సింధూర్‌లో ఏం జరిగిందీ, చైనా ఆయుధాల గురించీ నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు. ఆ తరువాతే కదా చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి మోడీ వెళ్లటం, చైనాకు వీసాలు, విమానాల పునరుద్ధరణ వంటి సానుకూల పరిణామాలన్నీ చోటు చేసుకున్నది. సంబంధాల పునరుద్ధరణ సందర్భంగా రెండు దేశాలూ ఇతర దేశాలతో సంబంధాల విషయంలో పరస్పరం ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని నిర్ణయించాయి. పెంటగన్‌ నివేదికను చూసి మనదేశంలోని కొందరు నిజమే కదా అనుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.

తగాదాలు పెట్టటం, అనుమానాలను పెంచటంలో అమెరికా తరువాతే ఎవరైనా. పెంటగన్‌ నివేదికను బయటపెట్టిన తరువాత గతంలో అధ్యక్షుడిగా ఉన్న జార్జి డబ్ల్యు బుష్‌ మరియు రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణలు బయటకు వచ్చాయి. చైనాను నమ్మవద్దని ఇప్పుడు మనకు ట్రంప్‌ చెబుతున్నట్లే నాడు బుష్‌ కూడా పుతిన్‌కు చెప్పాడు. బుష్‌-పుతిన్‌ మధ్య 2001 నుంచి 2008వరకు జరిగిన సంభాషణల ప్రకారం చైనా నుంచి మీకూ మాకూ ఇద్దరికీ దీర్ఘకాలిక సవాలు ఉన్నదని, అందువలన మీరు జాగ్రత్తలు తీసుకోవాలని బుష్‌ చెప్పాడు. తొలిసారి స్లోవేనియాలో ఇద్దరు నేతలు భేటీ అయినపుడు రష్యా పశ్చిమదేశాల్లో భాగం అనీ శత్రుదేశం కాదని, చైనాతో జాగ్రత్తగా ఉండాలని, ఇద్దరికీ దీర్ఘకాలం సమస్యలుంటాయని బుష్‌ అన్నాడు.2005లో కూడా ఈ ప్రస్తావన చేసినపుడు మాకంటే మీకే ఎక్కువ సమస్యలని పుతిన్‌ చెప్పాడు. దానికి వారేమీ మా సరిహద్దులలో లేరని (చైనా – రష్యా మధ్య 4,195 కిలోమీటర్ల సరిహద్దు ఉంది ) చైనా నుంచి వ్యవస్థాపరమైన సవాలు ఉందని బుష్‌ బదులిచ్చాడు.అయితే పుతిన్‌ తక్కువేమీ తినలేదు గనుక తమకు తక్షణ ప్రమాదం నాటో తూర్పువిస్తరణ, ఐరోపాలో అమెరికా క్షిపణి మోహరింపు పధకాల నుంచి వుందని చెప్పాడు. చివరి సారిగా ఇద్దరు నేతల మధ్య 2008లో సంభాషణలు చోటు చేసుకున్నాయి. అక్కడ కూడా బుష్‌ చైనా గురించి హెచ్చరించాడు. అయితే తమ దేశ సరిహద్దులకు పశ్చిమ దేశాల మిలిటరీ మోహరింపు తక్షణ ప్రమాదంగా ఉందని పుతిన్‌ స్పష్టం చేశాడు. తరువాత జరిగిన పరిణామాల్లో రష్యాను నమ్మించి మోసం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని నాటో చేసిన కుట్రలు బయటపడ్డాయి. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి తమకు తొత్తులుగా ఉండేవారిని గద్దెనెక్కించి, దానికి నాటో సభ్యత్వమిచ్చి రష్యా సరిహద్దుల్లో తిష్టవేసేందుకు పూనుకున్నారు. దానికి ప్రతిగానే రష్యా 2014లో ఉక్రెయిన్‌లో ఉన్న ప్రాంతమైన క్రిమియాను స్వాధీనం చేసుకుంది. దాంతో రష్యాను జి 8 కూటమి నుంచి తొలగించారు.

అసలు అమెరికా ఎందుకు గుండెలు బాదుకుంటోంది ? ఆసియా ఖండంపై ఆధిపత్యం కోసం, దానిలో భాగంగా చైనాను కట్టడి చేసేందుకు దీర్ఘకాలంగా అది అనుసరిస్తున్న విధానానికి న్యూఢిల్లీ-బీజింగ్‌ సాధారణ సంబంధాల పునరుద్దరణ పెద్ద ఎదురుదెబ్బ.భారత్‌ మెడమీద తుపాకి పెట్టి చైనాను కాల్చాలనుకున్న దాని ఎత్తుగడ పారే అవకాశం లేదని అనుకుంటున్నది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంలో మూడోదేశ జోక్యానికి అవకాశం లేదని మోడీ సర్కార్‌ స్పష్టం చేసింది.చైనాతో దౌత్య సంబంధాలు, వీసాలు, విమానాల పునరుద్దరణ ఏదో తాత్కాలిక వ్యూహంలో భాగం అనుకోలేము. రష్యా,చైనా, భారత్‌ సంబంధాలు మరింత సన్నిహితం కావటం సహజంగానే అమెరికాకు మింగుడుపడటం లేదు. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాలలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేదిగా కనిపిస్తున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా, భారత్‌,జపాన్‌,ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్‌ కూటమి భవిష్యత్‌ ఏమిటన్నది ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు.దక్షిణ చైనా సముద్రంలో చైనాను అడ్డుకొనేందుకు 2007లో ఈ కూటమిని అమెరికా ముందుకు తెచ్చింది. తరువాత దాని పరిణామాలు, పర్యవసానాలను మదింపు చేసుకొని మన్మోహన్‌ సింగ్‌ దాని పట్ల ఆసక్తి చూపకపోవటంతో ఒక విధంగా అది అటకెక్కింది. తరువాత నరేంద్రమోడీ ఉత్సాహం చూపటంతో 2017 నుంచి చురుకుగా పని చేస్తున్నది. అప్పటి వరకు అది ఆసియా – పసిఫిక్‌ అనే ఇతివృత్తంతో పని చేస్తున్నది కాస్తా మన దేశాన్ని ఇరికించేందుకు అమెరికా తెలివిగా ” ఇండో-పసిఫిక్‌ ” అజండాగా మార్చి దానికి భారత్‌ మూలస్థంభం అంటూ మోడీని మునగచెట్టు ఎక్కించి మన భుజాల మీద తుపాకి పెట్టి చైనాను కాల్చాలని పధకం వేసింది. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో మోడీ ముందుకు పోతారా ? ఈ కూటమి తనకు వ్యతిరేకంగా రూపొందిన ” ఆసియా నాటో ” అని చైనా భావిస్తున్నది. తమకు ముప్పు తలపెట్టిన ఐరోపా కేంద్రంగా ఉన్న నాటో కూటమిని పుతిన్‌ వ్యతిరేకించటమేగాక దానికి పావుగా ఉన్న ఉక్రెయిన్‌ మీద మిలిటరీ చర్య జరుపుతున్న సంగతి తెలిసిందే. క్వాడ్‌ అంశంలో మరింత ముందుకు పోతే చైనాకు, వెనక్కు తగ్గితే అమెరికాకు ఆగ్రహం. అందుకే నరేంద్రమోడీకి డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్నిపరీక్ష పెట్టాడని చెప్పాల్సి వస్తోంది. ఏ దేశానికైనా దీర్ఘకాలిక విదేశాంగ విధానం ఉండాలి. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి అన్నట్లు ఎటువాటంగా ఉంటే అటుపోతే ఇలాంటి ఇరకాటాలే వస్తాయి మరి ! ఏం జరుగుతుందో చూద్దాం !!

రాజకీయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అది నడిపించే బిజెపిలోని అత్యధికులు కమ్యూనిస్టు వ్యతిరేకత, చైనా వ్యతిరేకత కారణంగా అమెరికా వైపు మొగ్గాలని వత్తిడి చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అయితే మనవిదేశాంగ విధానం, స్వదేశీ విధానాలను నిర్దేశించేది ఇక్కడ ఉన్న పాలకవర్గం-బడా కార్పొరేట్లు, వారితో చేతులు కలిపే భూస్వామ్య, ధనిక రైతులు- అన్నది బహిరంగ రహస్యం. కొంత మందికి వెంటనే అవగతం గాకపోవచ్చు. అమెరికా విధించే షరతులు,వాణిజ్య విధానం తమకు నష్టదాయకమని పాలకవర్గం భావిస్తున్నది. దానికి అనుగుణంగా నడుచుకోవటం మినహా ప్రధానిగా ఎవరున్నా చేసేదేమీ లేదు. ధిక్కరిస్తే తమకు దాసులుగా ఉన్నవారిని గద్దెనెక్కిస్తారు.సంస్కరణలను మరింతవేగవంతంగా, ప్రతిఘటనను అణచివేసి తమకు మరింతగా లాభాలు సంపాదించి పెడతారనే నమ్మకంతోనే మన్మోహన్‌ సింగ్‌ను వదిలించుకొని నరేంద్రమోడీని రంగంలోకి తెచ్చారు. మారిన పరిస్ధితుల్లో అంతర్గతంగా మోడీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారు, చైనా వైపు మొగ్గారు. అందుకే ట్రంప్‌ ఇప్పుడు అగ్నిపరీక్ష పెట్టారు. ఏ గట్టునుండాలో తేల్చుకొమ్మని హెచ్చరించాడు. చరిత్రలో అనేక మంది తీరుతెన్నులను చూసినపుడు జెండాలు, అజెండాలను ఊసరవెల్లి మాదిరి పరిస్థితికి తగినట్లుగా మార్చటం చూశాము. ముందు రోజు రాత్రి వరకు జనతా పార్టీని గట్టిగా సమర్ధించిన ” సోషలిస్టు ” జార్జి ఫెర్నాండెజ్‌ తెల్లవారేసరికి మొరార్జీదేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారటం తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు : బిజెపి తీరుచూస్తే అమిత్‌ షాకు ఆశాభంగం !

24 Wednesday Dec 2025

Posted by raomk in BJP, Congress, CPI(M), INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

BJP, CPI()M, Kerala local body election 2025, LDF, Narendra Modi Failures, UDF

ఎం కోటేశ్వరరావు

ఇటీవల కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అక్కడ అధికారంలో ఉన్న వామపక్ష సంఘటనకు ఎదురుదెబ్బ తగిలిందన్నది వాస్తవం. దాన్ని చావుదెబ్బగా కొందరు వర్ణిస్తున్నారు. అది నిజమా ? ప్రధాని నరేంద్రమోడీ తిరువనంతపురంలో బిజెపి సాధించిన విజయం గురించి గొప్పలు చెప్పుకున్నారు. కేరళ రాజకీయాల్లో ఒక మహత్తర ఘట్టం అన్నారు. మోడీ సేవలో తరిస్తున్న కాంగ్రెస్‌ తిరువనంతపురం ఎంపీ శశిధరూర్‌ చారిత్రాత్మక విజయం అన్నారు. ఎందుకటా నాలుగున్నర దశాబ్దాలుగా తిరువనంతపురం మేయర్‌ పీఠాన్ని నిలుపుకున్న సిపిఎం అక్కడ ఓడిపోయి 101 సీట్లకు బిజెపి 50 తెచ్చుకున్నందుకు. ఓకే, కాసేపు నరేంద్రమోడీని సంతుష్టీకరించేందుకు అంగీకరిద్దాం, నిజమే కదా ! అయోధ్య రామ మందిరం గురించి దశాబ్దాల పాటు బిజెపి ఎంత హడావుడి చేసిందో చూశాము. దానివల్లనే మూడుసార్లు మోడీ ప్రధాని అయ్యారు. అక్కడ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య భాగంగా ఉన్న ఫైజాబాద్‌లో పదేండ్ల అధికారం తరువాత బిజెపి ఓడిపోయింది, అంతేనా, వారణాసి నియోజకవర్గం, వరుసగా ప్రధాని నరేంద్రమోడీ మూడుసార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 3,71,784 ఓట్ల మెజారిటీ తెచ్చుకుంటే రెండవసారి 4,79,505కు పెంచుకోగా మూడవ సారి 1,52,532కు దిగజారింది. దీని గురించి ఏమని వర్ణిస్తారు ? ఒక వాస్తవం ఏమంటే కేరళలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈసారి పెరగకపోగా స్వల్పంగా తగ్గాయి. దీని గురించి మోడీ నుంచి ఎలాంటి స్పందనా ఉండదు ! స్థానిక సంస్థలలో అనేక అంశాలు పని చేస్తాయి. బిజెపి కేరళలో గతంలో తెచ్చుకున్న ఆరువందలకు పైగా పంచాయతీ వార్డులను ఈసారి పోగొట్టుకుంది. కొత్తగా కొన్ని తెచ్చుకొని గతం కంటే స్వల్పంగా మెరుగుపడింది. ఒకసారి అధికారంలో ఉన్నతరువాత అన్ని పార్టీలకూ వాటి పనితీరును బట్టి వ్యతిరేకత ఉంటుంది. అది ఒక్క సిపిఐ(ఎం)కే కాదు, ప్రతి పార్టీకి వర్తిస్తుంది.

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ(ఎం) నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ పని అయిపోయిందని తరువాత బిజెపిదే హవా అన్నట్లుగా మీడియాలో కొందరు ఊదరగొట్టారు. కేరళలో కమ్యూనిస్టు వ్యతిరేక మీడియాలో మళయాళ మనోరమ ఒకటి. అది 2025 డిసెంబరు 22న ఒక విశ్లేషణ రాసింది. దానికి పెట్టిన శీర్షిక ” స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ బిజెపి తీరుచూసి అమిత్‌ షా ఎందుకు ఆశాభంగం పొందుతారంటే ” దాన్లో ఏముందో చూద్దాం. ” స్థానిక సంస్థల ఎన్నికల్లో 25శాతం ఓట్లు తెచ్చుకోవాలని కేంద్ర హౌమ్‌ మంత్రి అమిత్‌ షా లక్ష్య నిర్దేశం చేశారు. అమిత్‌ షాలో ఆశావాద వేడి ఎందుకు పుట్టిందంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏ ఒక్కటే ఇక్కడ 19.40 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. అదిప్పుడేమైందంటే నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (బిజెపి-భారత ధర్మ జనసేన-లోక్‌ జనశక్తి పార్టీ) కేవలం 14.76శాతం ఓట్లనే తెచ్చుకోగలిగింది.(గత స్థానిక ఎన్నికల కంటే 0.24శాతం తక్కువ-వికీపీడియా) యుడిఎఫ్‌కు 38.81, ఎల్‌డిఎఫ్‌కు 33.45శాతం వచ్చాయి.

పంచాయత్‌లలో(జిల్లా,బ్లాక్‌,గ్రామపంచాయతీలు అన్నీ కలిపి) ఎన్‌డిఏకు వచ్చిన ఓట్లు 13.92శాతం, 2020లో వచ్చిన 14.34శాతం కంటే స్వల్పంగా తక్కువ. మున్సిపాలిటీలలో 13.1 నుంచి 19.44శాతానికి పెంచుకుంది.కార్పొరేషన్లలో 19.44 నుంచి 23.58శాతానికి పెంచుకుంది. మొత్తం అన్ని స్థానిక సంస్థలలో వచ్చిన సగటు ఓట్లు 14.76శాతం.2020 ఎన్నికల్లో వచ్చిన 12.92శాతం కంటే స్వల్పంగా పెంచుకుంది. కానీ ఇది తప్పుదారి పట్టించేది,ఎందుకంటే 2020 కంటే బిజెపి అదనంగా ఈసారి 40శాతం సీట్లలో పోటీ చేసింది.ఆ ఏడాది బిజెపి 14వేల వార్డుల కంటే తక్కువే పోటీ చేసింది. ఈసారి ఆ పార్టీ, మిత్రపక్షాలతో కలసి ఎన్నికలు జరిగిన మొత్తం 23,576 వార్డులలో 89.35శాతం అంటే 21,065 చోట్ల పోటీ చేసింది. బిజెపి ఒక్కటే 19,262 సీట్లలో పోటీ చేసింది. ఇతర ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ 17,497, సిపిఎం 14,802చోట్ల పోటీ చేశాయి. గత ఎన్నికల కంటే ఏడువేల వార్డులలో అదనంగా పోటీ చేయటంతో పాటు మొత్తం 25శాతం ఓట్లు, రెండు కార్పొరేషన్లు, కనీసం పది మున్సిపాలిటీలు,30 బ్లాక్‌ పంచాయతీలు, 300కు పైగా గ్రామ పంచాయతీలు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా దానిలో ఒక చిన్న భాగం మాత్రమే చివరికి దక్కింది. ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు (తిరువనంతపురం 6, కొల్లం 2, పత్తానంతిట్ట 4, అలప్పూజ 5,కొట్టాయం 3, త్రిసూర్‌ 1, పాలక్కాడ్‌ 2, కాసరగోడ్‌ ),రెండు మున్సిపాలిటీలు(పాలక్కాడ్‌,తిరుప్పునితుర) ఒక కార్పారేషన్‌(తిరువనంతపురం) దానికి దక్కాయి. అయినప్పటికీ కేవలం ఆరుగ్రామ పంచాయతీల్లోనే దానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ముదక్కల్‌(తిరువనంతపురం),పండలం-తెక్కెక్కర(పత్తానంతిట్ట) తిరువిలివామల(త్రిసూర్‌) అకతెత్తెర, పూడూరు(పాలక్కాడ్‌) మాధూర్‌(కాసర్‌గోడ్‌). చివరికి తిరువనంతపురం కార్పారేషన్‌లో కూడా 101 సీట్లకు గాను సాధారణమెజారిటీ 51కి గాను ఒకటి తక్కువగా 50వచ్చాయి. సీట్ల రీత్యా ఎల్‌డిఎఫ్‌ కంటే మెరుగ్గావచ్చాయి, గతం కంటే నాలుగుశాతం ఓట్లు పెరిగినప్పటికీ ఎన్‌డిఏకు వచ్చిన 34.52శాతం కంటే మెరుగ్గా ఎల్‌డిఎఫ్‌కు 34.56శాతం వచ్చాయి.

2020లో బిజెపికి కాసరగోడ్‌ జిల్లాలోని మధుర్‌, బెల్లూర్‌ గ్రామపంచాయతీలలో, రెండు మున్సిపాలిటీలు పాలక్కాడ్‌, పండలంలో స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈసారి రెండింటిలో దానికి మెజారిటీ రాలేదు, పండలంలో అవమానకరంగా నష్టపోయింది.ఈసారి ఎన్‌డిఏ 421 కార్పొరేషన్‌ వార్డులకు గాను 22.09శాతం(93), 3,240 మున్సిపల్‌ వార్డులకు గాను పదిశాతం (324), 346 జిల్లా పంచాయత్‌ వార్డులకు గాను ఒక్కటి, 2,267 బ్లాక్‌ పంచాయత్‌ వార్డులకు 54, గ్రామపంచాయతీలలోని 17,337కు గాను 1,447 వార్డులు 8.35శాతం వచ్చాయి.ఒక్క కార్పొరేషన్లలో తప్ప 2020తో పోల్చితే బిజెపి పరిస్థితి పెద్దగా మెరుగైనట్లు ఇవి ప్రతిబింబించటం లేదు. మున్సిపాలిటీలు, జిల్లా పంచాయత్‌లో గతం కంటే తగ్గింది. బిజెపి 2020లో సాధించినవి, ఇప్పటి పరిస్థితి ఇలా ఉంది.కార్పొరేషన్లు 14.25(ఇప్పుడు 22.09), మున్సిపాలిటీలు 10.4(ఇప్పుడు పదిశాతం) జిల్లాపంచాయత్‌లు 0.60(ఇప్పుడు 0.29), బ్లాక్‌ పంచాయత్‌ 1.78(ఇప్పుడు 2.38) గ్రామపంచాయతీలు 7.4 (ఇప్పుడు 8.35).ఈ సారి పండలం మున్సిపాలిటీని బిజెపి కోల్పోయింది. ఇది శబరిమలకు దగ్గరగా ఉంది. అంతర్గత కుమ్ములాటలు, పాలనలో అక్రమాల కారణంగా ఇది జరిగింది.గతంలో బిజెపికి 20 సీట్లు ఉంటే ఇప్పుడు తొమ్మిది స్థానాలతో మూడవ స్థానానికి దిగజారింది. పాలక్కాడ్‌లో బిజెపి 2020లో 28 సీట్లు తెచ్చుకొని సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఈసారి పెద్ద పార్టీగా ఎన్నికైనప్పటికీ మెజారిటీకి అవసరమైన 27కు గాను 25 తెచ్చుకుంది. తిపురినిత్తుర మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో 15 తెచ్చుకుంది(ఎల్‌డిఎఫ్‌కు 21) ఈసారి 21సీట్లతో బిజెపి పెద్ద పార్టీగా ఎన్నికైంది, మెజారిటీ సంఖ్య 27.గత ఎన్నికల్లో రెండవ పార్టీగా ఉన్నప్పటికీ ఓట్లశాతంలో 27.54తో పెద్దదిగా, యుడిఎఫ్‌ 24.42, ఎల్‌డిఎఫ్‌ 23.25శాతం తెచ్చుకున్నాయి.

మున్సిపాలిటీలలో గుర్తించదగినదిగా బిజెపి ఉనికి ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో దాని ఓట్ల వాటా పెరిగింది. ఎర్నాకుళంలో 9.08 నుంచి 12.65, పత్తానంతిట్టలో 16.18 నుంచి 18.02, త్రిసూర్‌లో 19.14 నుంచి 21.86, పాలక్కాడ్‌లో 18.28 నుంచి 23.96కు పెరిగాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో క్రైస్తవ అభ్యర్ధులతో అది ప్రయోగం చేసింది. మున్సిపాలిటీలలో దాని ఓట్ల వాటా పెరిగింది.కొట్టాయంలో 11.5 నుంచి 15.1, ఇడుక్కిలో 12.53 నుంచి 14.88శాతానికి పెరిగింది. ఎల్‌డిఎఫ్‌ వాటా 21.63శాతానికి దగ్గరగా వచ్చింది.అయితే కొన్ని జిల్లాలోని మున్సిపాలిటీలలో దాని ఓట్ల వాటా తగ్గింది. తిరువనంతపురంలో 24.49 నుంచి 23.48కి, అలప్పూజలో 19.08 నుంచి 18.19, కాసరగోడ్‌లో 15.36 నుంచి 14.52కు తగ్గాయి. కొల్లం కార్పొరేషన్‌లో ఆరు నుంచి పన్నెండు సీట్లకు పెరిగాయి. ఆ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఓట్ల శాతం స్థిరంగా ఉంది, ఇప్పుడు 15.92 రాగా 2020లో 15.9శాతం వచ్చాయి. కొల్లం కార్పొరేషన్‌లో కూడా ఓట్లశాతం స్థిరంగానే ఉంది. తిరువనంతపురంలో 30.92 నుంచి 34.52,కొచ్చిలో 10.95 నుంచి 14.41కి, కన్నూరులో 11.61 నుంచి 14.06కు పెరిగాయి. మిగిలిన మూడు కార్పొరేషన్లలో 2020లో వచ్చిన మేరకే తిరిగి వచ్చాయి. కొల్లంలో 22.02 నుంచి 22.61కి,త్రిసూర్‌లో 18.86 నుంచి 18.54, కోజికోడ్‌లో 22.29 నుంచి 22.43శాతంగా ఉంది.

పైన పేర్కొన్నదంతా మళయాళ మనోరమ విశ్లేషణలోని అంశాలే. తిరువనంతపురంలో బిజెపి గెలుపు గురించి మీడియాలో వచ్చిందేమిటో చూశాము. శబరిమల అయ్యప్ప ఆలయం సమీపంలో ఉన్న పండలం మున్సిపాలిటీలో 34వార్డులు ఉండగా గత ఎన్నికల్లో బిజెపి పద్దెనిమిది తెచ్చుకుంది. ఈ సారి తొమ్మిది వార్డులతో మూడ స్థానానికి పడిపోయింది. అనేక మంది రాష్ట్ర నేతలు ఇక్కడ తిష్టవేసి ఎలాగైనా నిలబెట్టుకోవాలని చూశారు. ఎల్‌డిఎఫ్‌ 14, యుడిఎఫ్‌ 11 తెచ్చుకున్నాయి. అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశ వివాదంతో గతంలో బిజెపి పొందిన లబ్ది ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ఇటీవల అయ్యప్ప ఆలయంలో జరిగిన బంగారు తాపడాల అక్రమాన్ని ప్రచారం చేసి మరింతగా లబ్దిపొందాలని చూసి భంగపడింది. ఈ మున్సిపాలిటీ మాత్రమే కాదు, దాని పక్కనే ఉన్న కులంద గ్రామ పంచాయతీ 15 సంవత్సరాలుగా బిజెపి ఆధీనంలో ఉంది. ఈ సారి అక్కడ ఎల్‌డిఎఫ్‌ 8,బిజెపి, ఇతరులు నాలుగు చొప్పున, యుడిఎఫ్‌కు ఒక స్థానం వచ్చింది. శబరిమల ఆలయం ఉన్న రన్నీ-పెరునాడ్‌ పంచాయతీ శబరిమల వార్డులో బిజెపి మూడవ స్థానంలో ఉంది. యుడిఎఫ్‌, ఎల్‌డిఎఫ్‌కు సమంగా ఓట్లు రావటంతో లాటరీలో ఎల్‌డిఎఫ్‌కు వచ్చింది. ఈ పంచాయతీని పదివార్డులతో ఎల్‌డిఎఫ్‌ గెలుచుకుంది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో బిజెపి 101కిగాను 50వార్డులతో అధికారానికి వచ్చింది. సిపిఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఓట్ల రీత్యా అక్కడ సిపిఐ(ఎం) ప్రధమ స్థానంలో ఉంది. మీడియాకు ఈ వివరాలు తెలిసినప్పటికీ అది పెద్ద ప్రాధాన్యత కలిగిన అంశం కాదన్నట్లుగా మౌనంగా ఉంది.లోక్‌సభ ఎన్నికలు 2024లో బిజెపికి తిరువనంతపురంలో 2,13,214 ఓట్లు వస్తే కార్పొరేషన్‌ ఎన్నికల్లో అవి 1,65,891కి తగ్గాయి. యుడిఎఫ్‌ ఓట్లు 1,84,727 నుంచి 1,25,984కు పడిపోగా ఎల్‌డిఎఫ్‌ ఓట్లు 1,29,048 నుంచి 1,67,522కు పెరిగాయి, అంటే బిజెపి కంటే స్వల్పంగా ఎక్కువ తెచ్చుకుంది. బిజెపి గెలిచిన 50 వార్డులలో 40 చోట్ల యుడిఎఫ్‌ మూడవ స్థానంలో ఉంది. ఇరవై అయిదు వార్డులలో కాంగ్రెస్‌కు కనీసం వెయ్యి ఓట్లు కూడా రాలేదు. కొన్నింటిలో ఐదువందలకు లోపే వచ్చాయి. ? కొన్ని చోట్ల బిజెపి వంద ఓట్లకంటే తక్కువ మెజారిటీతో గెలిచింది. దీని అర్ధం ఏమిటి ? పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలో ఓటర్ల తీరులో తేడా ఉంటుందన్నది వాస్తవం. అక్కడ గెలిచిన కాంగ్రెస్‌ నేత శశిధరూర్‌ ఆ పార్టీలో ఉంటూనే బిజెపితో చెలిమిచేస్తున్న సంగతి బహిరంగ రహస్యం. తన పార్టీ తీరుతెన్నులను మరిచి పోయి బిజెపి చారిత్రాత్మక విజయం సాధించిందని పొగిడారంటే ఏం జరిగిందో చెప్పనవసరం లేదు. అనేక చోట్ల రెండు పార్టీలు సిపిఎంకు వ్యతిరేకంగా కుమ్మక్కు కావటం గతంలో జరిగింది, ఇప్పుడు కూడా పునరావృతం అయినట్లు కనిపిస్తోంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !

17 Wednesday Dec 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Chip war 2.0, Chip war 2.0 against China, Elon Musk, Nvidia's H200, Pax Silica, US and China Chip War

ఎం కోటేశ్వరరావు

సాంకేతిక రంగంలో ముందుకు పోకుండా చైనాను అడ్డుకొనేందుకు ఇప్పటి వరకు ఒంటరిగా ప్రయత్నించిన అమెరికా తాజాగా తనకు తోడుగా మరికొన్ని దేశాలను కూడగట్టుకొని గోదాలోకి దిగింది. బహుశా అందుకే కృత్రిమ మేథ(ఏఐ) రంగంలో పూర్తిస్థాయి యుద్ధ ముప్పు ఉందని ప్రపంచ ధనికుడు ఎలన్‌ మస్క్‌ వ్యాఖ్యానించాడు. అమెరికా దిగ్గజ సంస్థ ఎన్‌విడియా తదుపరి తరం హార్డ్‌వేర్‌ బ్లాక్‌వెల్‌ చిప్‌తో అది ప్రారంభం అయినట్లే అన్నాడు. వచ్చే ఏడాది మార్కెట్‌లోకి అది రానుందనే వార్తల పూర్వరంగంలో జరుగుతున్న పరిణామాలపై తాజాగా మస్క్‌ స్పందించాడు. ఈ చర్యతో పోటీదారులు వేగం,ఖర్చు,విస్తృతి అంశాల్లో తమ సత్తా చూపేందుకు పూనుకుంటారన్నాడు. ద్రవ్యపెట్టుబడిదారు గవిన్‌ బేకర్‌ మాట్లాడిన అంశాల మీద మస్క్‌ స్పందించాడు. బ్లాక్‌వెల్‌ చిప్స్‌ తయారీలో అనేక సవాళ్లు ఉన్నట్లు బెకర్‌ చెప్పాడు. అందుకే అది ఆలస్యం అవుతున్నదని అన్నాడు.ఏది ఏమైనప్పటికీ ఈ రంగంలో ఉన్న గూగుల్‌, ఎలన్‌మస్క్‌ ఎక్స్‌ఏఐ, మేటా (ఫేస్‌బుక్‌ ) వంటి కంపెనీలన్నీ పోటీపడతాయని వేరే చెప్పనవసరం లేదు. మరోవైపు పశ్చిమ దేశాల సంస్థలకు చైనా పెద్ద సవాలు విసురుతున్నది. గత పదిహేను సంవత్సరాలుగా సాంకేతిక రంగంలో బీజింగ్‌ ఎదగకుండా చూసేందుకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చేయని యత్నం లేదు. వాణిజ్యపోరుతో పాటు చిప్స్‌ పోరును కూడా ప్రారంభించాయి. తాజా పరిణామాలను బట్టి ఈ యుద్ధంలో అమెరికాకు ఊహించని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.అందుకే అది కొత్త ఎతుత్తగడలతో పోరును కొనసాగించేందుకు పాక్స్‌ సిలికా పేరుతో కొత్త కూటమిని రంగంలోకి తెచ్చింది.

చిప్‌ యుద్ధంలో చైనా ఒక్కటే ఒకవైపు ,అనేక దేశాలు మరోవైపు ఉన్నాయి. జోబైడెన్‌ సర్కార్‌ 2022 అక్టోబరు నుంచి ా చైనాకు అధునాతన చిప్స్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇటీవలనే ట్రంప్‌ ఏలుబడి ఎన్‌విడియా కంపెనీకి అనుమతి ఇచ్చింది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ ఆ చిప్స్‌ తమకు అవసరం లేదన్నట్లుగా చైనా తీరు ఉందని, తిరస్కరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పూర్వరంగంలో చిప్‌ యుద్దంలో తన బలం ఒక్కటే చాలదని భావించిన అమెరికా డిసెంబరు 12న తొలిసారిగా పాక్స్‌ సిలికా పేరుతో ఒక కూటమికి శ్రీకారం చుట్టింది. పాక్స్‌ అంటే లాటిన్‌ భాషలో శాంతి, స్థిరత్వం, సిలికా అంటే ఇసుకతో సహా వివిధ రూపాల్లో ఉండే ఖనిజం. దాన్నుంచి కంప్యూటర్లకు అవసరమైన చిప్స్‌ తయారు చేస్తారు,అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఐటి, సాంకేతిక పరిజ్ఞానం కేంద్రాలు కేంద్రీకృతమైన ప్రాంతాన్ని సిలికాన్‌ వ్యాలీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. పాక్స్‌ సిలికా లక్ష్యం ఏమిటంటే విలువైన ఖనిజాల సరఫరా, సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో ఆ కూటమిలోని దేశాలు బలపడటం, చైనా ఆధిపత్యాన్ని ఉమ్మడిగా సవాలు చేయటం. అమెరికా వైపు నుంచి ఇలాంటి చొరవ చూపటం అంటే కమ్యూనిస్టు చైనా ముందు ఒక విధంగా తన ఓటమిని అంగీకరించటమే.చిత్రం ఏమిటంటే ఈ బృందం నుంచి భారత్‌ను మినహాయించారు.దీని అర్ధం మనలను చేర్చుకున్నందున తమకు ఉపయోగం లేదని భావించినట్లేనా ? లేక తమకు అనుకూలమైన షరతులతో వాణిజ్య ఒప్పందానికి ఒప్పించటానికి మరోవిధంగా వత్తిడి చేయటమా ?

ప్రస్తుతం ప్రపంచంలో విలువైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల విషయంలో 70శాతంతో చైనా అగ్రభాగాన ఉంది. వాటి ఎగుమతుల నిలిపివేతతో ఇటీవల ప్రపంచంలోని అనేక దేశాలు గిజగిజలాడిన సంగతి తెలిసిందే.ఈ ఖనిజాలతో పాటు కృత్రిమ మేథ(ఏఐ), చిప్స్‌ తయారీ వంటి కీలక రంగాలలో పరస్పరం సహకరించుకొనేందుకు అమెరికా,దక్షిణ కొరియా, సింగపూర్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌, బ్రిటన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ స్థాపక సభ్యులుగా పాక్స్‌ సిలికా ఏర్పడింది. ఆర్థిక కూటములు తప్ప సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఏర్పడటం ఇదే ప్రధమం.దీన్ని అమెరికా కృత్రిమ మేథ దౌత్యంగా వర్ణించారు. ఈ కూటమికి సహకరించేందుకు లేదా అతిధులుగా తైవాన్‌, ఐరోపా యూనియన్‌, కెనడా,ఓయిసిడి ఉంటాయి. ఈ సంస్థలకు చెందిన దేశాలు తమవంతు సహకారాన్ని అందిస్తాయి. అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయమంత్రి జాకబ్‌ హెల్‌బర్గ్‌ ఈ చొరవను ” నూతన స్వర్ణ యుగం ” అని వర్ణించాడు. దీని గురించి చైనా ఇంతవరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇతరులపై ఆధారపడకుండా చైనా స్వయంశక్తితో ఎదిగేందుకు దీర్ఘకాలిక పథకాలను రూపొందించింది.దాన్లో భాగంగానే అక్కడి ప్రభుత్వం పెద్ద మొత్తాలలో పరిశోధన, అభివృద్ధికి ఖర్చు చేస్తున్నది.స్వయంగా ఉత్పత్తులను చేస్తున్నది. ఇప్పుడు పాక్స్‌ సిలికాను కూడా సవాలుగా తీసుకొని మరింతగా తన సంస్థలను ప్రోత్సహిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో అమెరికా, పశ్చిమ దేశాలు ఎంతగా ఒంటరిపాటు చేయాలని చూస్తే ఎలాంటి ఆర్భాటం లేకుండా అంతగా నూతన విజయాలతో ముందుకు వచ్చి సమాధానం చెప్పింది.

చైనా గురించి అనేక అబద్దాలను ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఎన్‌విడియా కంపెనీ తయారు చేసిన చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేయరాదని అమెరికా ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే వాటిని అక్రమ పద్దతుల్లో సేకరించి డీప్‌సీక్‌లో వినియోగిస్తున్నట్లు వార్తలు రాశారు. అయితే అలాంటిదేమీ లేదని ఎన్‌విడియా ప్రకటించి వాటిగాలి తీసింది. సదరు ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేవని, తాము అమెరికా నిబంధనలకు అనుగుణంగానే పని చేస్తున్నట్లు పేర్కొన్నది. అత్యంత తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలోనే ఏఐ డీప్‌సీక్‌ను తయారు చేసి 2025లో ప్రపంచాన్ని కుదిపివేసింది. చాట్‌ జిపిటి వంటి ఏఐ వ్యవస్థలను తయారు చేసేందుకు భారీ మొత్తాలలో ఖర్చు చేసిన సంస్థలు తలలు పట్టుకున్నాయి. కంపెనీల వాటాల ధరలు పతనమయ్యాయి. ఆధునికమైన చిప్స్‌తో పనిలేకుండానే తక్కువ ఖర్చుతో ఏఐ వ్యవస్థలను తయారు చేయవచ్చని ఇప్పుడు అనేక మంది భావిస్తున్నారు. సాంకేతిక రంగంలో కొన్నింటిలో ఇప్పటికీ ముందున్నప్పటికీ మొత్తంగా చూసినపుడు గతంలో మాదిరి అమెరికా ఒక నిర్ణయాత్మక శక్తిగా లేదు. ఎన్‌విడియా హెచ్‌200 రకం చిప్‌లను చైనాకు ఎగుమతి చేయవచ్చని ట్రంప్‌ అనుమతించాడు.చైనా మార్కెట్‌లో ప్రవేశించటం ఒకటైతే, వాటిని కొనుగోలు చేసిన చైనా తనపరిశోధనలను పక్కన పెట్టి వాటిపైనే ఆధారపడుతుందనే అంచనాతో ఈ చర్య తీసుకున్నాడు. అయితే అలా జరుగుతుందని చెప్పలేమని అధ్యక్ష భవనంలో ఏఐ జార్‌గా పరిగణించే డేవిడ్‌ శాక్స్‌ చెప్పాడు. ఎగుమతులపై నిషేధం పెట్టిన అమెరికా తానే ఏకపక్షంగా ఎత్తివేసింది. ఆట నిబంధనలను తానే రూపొందించి తానే మార్చినట్లయింది.

కొన్ని దశాబ్దాల పాటు తన నిబంధనలతో అమెరికా ప్రపంచాన్ని ఏలింది. ఇతర దేశాల తలరాతలను రాసేందుకు ప్రయత్నించింది. మనతో సహా అలీన దేశాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తే అది సోవియట్‌, ఇతర సోషలిస్టు దేశాలకు, పెట్టుబడిదారీ దేశాల్లోనే తమ ప్రత్యర్ధులకు చేరుతుందనే భయంతో అనేక చర్యలు తీసుకుంది. పోటీదారులు తలెత్త కుండా చూసుకుంది, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తన రాజకీయ అవసరాల కోసం ఒక ఆయుధంగా వాడుకుంది. మన దేశానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అన్ని విధాలుగా అడ్డుకుంది. సోవియట్‌ యూనియన్‌, తరువాత రష్యా అండతో దాన్ని అధిగమించాం. అణుపరీక్షలు జరిపితే ఆంక్షలు విధించింది. ఆహార ధాన్యాలు కావాలంటే మాకేంటని బేరం పెట్టింది. ఇలా అనేక అంశాలను చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు కుదరదు, పరిస్థితులు మారాయి. అది చేసిన చారిత్రక తప్పిదం వలన ఇతర దేశాల మీద ఆధారపడక తప్పని స్థితి. వస్తు ఉత్పాదక పరిశ్రమలన్నింటినీ మూసివేసింది, లేదా ఇతర దేశాలకు తరలించింది. ఇప్పుడు టాయిలెట్లలో తుడుచుకొనేందుకు అవసరమైన కాగితాన్ని కూడా అది ఏదో ఒక దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. కోట్లకు వేసుకొనే టై దగ్గర నుంచి కాళ్లకు వేసుకొనే బూట్ల వరకు ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటే తప్ప గడవదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంపాదించిన సొమ్ముతో వాటన్నింటినీ ఎక్కడో అక్కడ నుంచి తెచ్చుకుంది. ఇప్పుడు అలాంటి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఉదాహరణకు ఎన్‌విడియా చిప్స్‌ను చైనాకు ఎగుమతి చేసి రాబడిలో 25శాతం ఖజానాకు జమచేస్తానని ట్రంప్‌ చెప్పాడు. ఎలా అంటే 25శాతం ఎగుమతి పన్ను విధించి అన్నాడు. ఆ కంపెనీ ఏటా పది బిలియన్‌ డాలర్ల వరకు హెచ్‌ 200 రకం చిప్స్‌ను ఎగుమతి చేస్తే దాని మీద 25శాతం పన్నుతో రెండున్నర బిలియన్‌ డాలర్ల మేర రాబడి వస్తుందని ట్రంప్‌ లెక్కలు వేసుకున్నాడు. తీరా ఏమైంది. అమెరికా చిప్సా అసలు మనకు వాటి అవసరం ఉందో లేదో సమీక్షించాలని, ప్రభుత్వ రంగంలో వాటిని వాడవద్దని తన అధికారులు, సంస్థలను చైనా ప్రభుత్వం ఆదేశించినట్లు మీడియాలో వచ్చింది. మన చిప్స్‌ను చైనా తిరస్కరిస్తున్నది అని అధ్యక్ష భవన అధికారి డేవిడ్‌ శాక్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ వార్తా సంస్థతో చెప్పాడు. అదే నిజమైతే ట్రంప్‌ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదని చెప్పాల్సి ఉంటుంది. 2023 నుంచి నిషేధం అమలు చేసినందున మూడు సంవత్సరాల్లో ఎంతో నష్టపోయినట్లు ఎన్‌విడియా కంపెనీ వాపోయింది. అమెరికా భద్రత పేరుతో ఈ నిషేధం కారణంగా ఎవరిమీదో ఎందుకు ఆధారపడటం మీరే తయారు చేయండని స్థానిక కంపెనీలకు 70 బిలియన్‌ డాలర్ల ప్రోత్సాహక పాకేజ్‌ను చైనా ప్రకటించింది. అంతే శక్తివంతమైన ప్రత్నామ్నాయాలను రూపొందించింది కనుకనే అమెరికా చిప్స్‌తో పనిలేదన్నట్లుగా ఉంది. భద్రత సాకును వదలివేసి లాభాలే పరమావధిగా ఎగుమతులకు అమెరికా అనుమతి ఇచ్చింది.

ముందే చెప్పుకున్నట్లు చైనా పరిశోధనా రంగంలో చేస్తున్న ఖర్చుకు ఫలితాలు కనిపిస్తున్నాయి.2025 డిసెంబరు ఒకటవ తేదీన ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం అది విశ్లేషించిన 74 కీలక రంగాలకు గాను 66లో చైనా పరిశోధనలు ముందున్నాయి.అమెరికా కేవలం ఎనిమిదింటిలో మాత్రమే ఉంది. 2000 దశకంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది, ఇప్పుడు తిరగబడింది. అయితే చైనా ఆ తరువాత అల్లా ఉద్దీన్‌ అద్బుతదీపాన్ని సంపాదించిందా ? లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యత రంగాలను ఎంచుకొని సాగించిన కృషికి ఫలితమిది.అమెరికా ఎప్పుడైతే అడ్డుకోవాలని చూసిందో అప్పటి నుంచి మరింత పట్టుదల పెరిగింది.అనేక రంగాలలో విదేశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అలా అని తలుపులు మూసుకోలేదు, అవసరమైన వాటికోసం వెంపర్లాడటం లేదు. చిప్స్‌ కొనటం లేదని అమెరికా అధికారి వాపోవటానికి కారణం చైనా కాదు, అమెరికా అనుసరించిన ఎత్తుగడలే అన్నది స్పష్టం. అవసరం అయినపుడు అమ్మకుండా తీరిన తరువాత ఇస్తామంటే ఎవరైనా కొనుగోలు చేస్తారా ? చైనా కొన్ని అంశాలలో తన విధానాలను ఇతర దేశాలను చూసి నిర్ణయించుకోవాల్సిన స్థితిలో లేదు. చైనాతో సహా వర్ధమానదేశాలన్నింటినీ తమ గుప్పిటలోకి తెచ్చుకోవాలని అమెరికా శ్వేత సౌధంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు ఉన్నా అనుసరించిన విధానం ఒక్కటే.అక్కడి అధికారం కోసం వారిలో వారు పోట్లాడుకుంటారు తప్ప ఇతర దేశాలను దోచుకోవటంలో, తంపులు పెట్టి ఆయుధాలు అమ్ముకోవటంలో ఎవరికెవరూ తీసిపోలేదు. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత చైనాపై చిప్‌ యుద్ధం 2.0 ప్రారంభించాడు, ఇది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

30 Sunday Nov 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

14th Dalai Lama, 1962 India–China war, Anti China Media, Arunachal Pradesh Dispute, CIA on Tibet, CPI, CPI(M), Jawaharlal Nehru, Mao Zedong, Narendra Modi, USSR

ఎం కోటేశ్వరరావు

ఇటీవల చైనాతో సంబంధం ఉన్న రెండు వార్తలు, విశ్లేషణలు మీడియాలో వచ్చాయి.ఒకటి, 1962లో చైనాతో వచ్చిన యుద్ధం సరిహద్దు సమస్యల మీద కాదు, రెండవది అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మన పౌరురాలి పాస్‌పోర్టు, వీసా చెల్లదు అని చైనా విమానాశ్రయంలో ఇబ్బంది పెట్టారు అన్నది రెండవది. మొదటి అంశాన్ని మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు, రెండవదాని మీద పెద్ద ఎత్తున స్పందించింది, ఎందుకు ?చైనాతో వచ్చిన యుద్దం గురించి వచ్చిన విశ్లేషణ మీద కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది, దాని మనసెరిగి, కనుసన్నలలో నడుస్తున్న మీడియా కావాలనే విస్మరించింది. రెండవ ఉదంతం మీద దానికి భిన్నంగా జరిగింది. చరిత్ర దాస్తే దాగేది కాదు, చెరిపితే పోయేది కాదు.రెండు దేశాల మధ్య యుద్ధం ప్రాధమికంగా సరిహద్దులపై ఏకాభిప్రాయం లేకపోవటం లేదా దౌత్యపరమైన వైఫల్యాల వలన జరగలేదని, పథకం ప్రకారం 1950 మరియు 60దశకాల్లో అమెరికా అనుసరించిన వ్యూహంలో భాగంగా చోటు చేసుకుందని సిఐఏ, దౌత్యకార్యాలయాల పత్రాలు, ప్రచ్చన్న యుద్ద అంతర్జాతీయ చరిత్ర ప్రాజెక్టు పత్రాలు వెల్లడించాయి. కొన్ని ప్రధాన మంత్రి మ్యూజియం మరియు లైబ్రరీలో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని సంప్రదింపులతో పరిష్కరించుకోవాలన్న వైఖరిని వెల్లడించినందుకు తరువాత సిపిఐ(ఎం)గా ఏర్పడిన నాయకులను యుద్ధ సమయంలో ప్రభుత్వం, నాడు జనసంఘం రూపంలో ఉన్న నేటి బిజెపి నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర పార్టీలు, సంస్థలు దేశద్రోహులుగా చిత్రించాయి. ప్రభుత్వం జైల్లో పెట్టింది. యుద్దాన్ని సమర్ధించి నాటి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన సిపిఐతో ఇతరులను దేశభక్తులుగా చిత్రించారు, జనం కూడా అత్యధికులు నిజమే అని నమ్మారు. అది జరిగి ఆరు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు వెలువడిన నిజానిజాలేమిటి ? యుద్ధానికి కారణం సరిహద్దు సమస్య కాదని, టిబెట్‌ కేంద్రంగా అమెరికా జరిపిన కుట్రలో భాగంగా జరిగిందని ఇటీవల బహిర్గత పరచిన నాటి రహస్య పత్రాలను అధ్యయం చేసిన వారు చెప్పిన మాట ఇది. వారెవరూ కమ్యూనిస్టులు కాదు. ఆ పత్రాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి గనుక దీనికి భిన్నమైన విశ్లేషణను ఎవరైనా జనం ముందు పెట్టవచ్చు. అప్పటి వరకు కమ్యూనిస్టుల మీద నిందవేయటం తప్పని దాన్ని వెనక్కు తీసుకుంటామని ఎవరైనా నిజాయితీతో అంగీకరిస్తారా ?

” 1962 చైనా-భారత్‌ సంఘర్షణ భౌగోళిక రాజకీయ పరిణామాల వెల్లడి : చైనాా-భారత్‌ విభజనను అమెరికా ఎలా మలచింది ? ” అనే శీర్షికతో అమెరికాలోని పబ్లిక్‌ ఎఫైర్స్‌ జర్నల్‌ ఏప్రిల్‌ 2025 సంచికలో వెల్లడించారు. దాని రచయిత జిందాల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌లో పని చేస్తున్న డాక్టర్‌ లక్ష్మణ కుమార్‌. ది హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికతో ఆయన సంభాషించిన అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. సోషలిస్టు దేశాలపై అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ యూనియన్‌-చైనా మధ్య తలెత్తిన సైద్ధాంతిక వివాదాలను ఆసరా చేసుకొని టిబెట్‌ అంశాన్ని ముందుకు తెచ్చి భారత్‌-చైనా మధ్య వివాదాన్ని రగిలించేందుకు అమెరికా రూపొందించిన దీర్ఘకాలిక కుట్రకు రెండు దేశాలూ గురయ్యాయి. నాటి నుంచి నేటి వరకు తరువాత కాలంలో సాధారణ సంబంధాలు ఏర్పడినప్పటికీ పరస్పరం నమ్మకంలేకుండా గడుపుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా ఎత్తుగడ నిజానికి టిబెట్‌ తిరుగుబాటుదార్లకు ఏదో చేద్దామని కాదు, వారికి సాయపడే ముసుగులో భారత్‌-,చైౖనా మధ్య వైరం పెంచటమే అసలు లక్ష్యంగా రహస్య పత్రాల్లో వెల్లడైంది.

1962 అక్టోబరు 20న చైనా దాడి ప్రారంభించి నవంబరు 20న ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి అరుణాచల్‌ ప్రదేశ్‌లో తన ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి సేనలను ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు పరిమితమైంది. అవి తన ప్రాంతాలని అంతకు ముందునుంచి చెబుతున్నప్పటికీ చైనా వెనక్కు తగ్గింది. టిబెట్‌లో జరిగిన కుట్రల క్రమ సారాంశం ఇలా ఉంది.1956లో అక్కడ దలైలామా పలుకుబడిలో ఉన్న ప్రభుత్వ మద్దతుతో తిరుగుబాటుకు నాందిపలికారు. సిఐఏ దాన్ని అవకాశంగా తీసుకొని ముందే చెప్పుకున్నట్లు 1957 నుంచి 1961వరకు వారికి శిక్షణ, ఆయుధాలు,రేడియోలు, ఇతర పరికరాలను ఇచ్చింది.విమానాల ద్వారా 250టన్నుల మిలిటరీ సరఫరాలు చేసింది.నిఘావిమానాల ద్వారా సమాచారాన్ని అందచేసింది. చైనా మిలిటరీ తిరుగుబాటును అణచివేయటంతో 1959లో దలైలామాను టిబెట్‌ నుంచి తప్పించి అరుణాచల్‌ ప్రదేశ్‌ ద్వారా భారత్‌కు చేర్చారు.దీనికి నాటి నెహ్రూ సర్కార్‌ పూర్తి మద్దతు ఇచ్చింది, అధికారులను పంపి మరీ స్వాగత ఏర్పాట్లు చేసిందంటే అమెరికా సిఐఏతో సమన్వయం చేసుకోకుండా జరిగేది కాదు. అంతేనా మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చింది. దీన్ని రెచ్చగొట్టటం, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా పరిగణించింది.1961లో ఉత్తర నేపాల్లోని ముస్టాంగ్‌కు సిఐఏ తన కార్యకలాపాలను విస్తరించింది. దలైలామా పరారీ తరువాత అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా మిలిటరీ మన సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.చైనాను నిలువరించాలని ప్రధాని నెహ్రూ నాటి సోవియట్‌ నేతలను కోరారు. అయితే తాము తటస్థంగా ఉంటామనే సందేశాన్ని వార్తల ద్వారా సోవియట్‌ పంపింది. తరువాత దాని నేత కృశ్చెవ్‌ 1959 అక్టోబరు రెండున బీజింగ్‌ పర్యటనలో నెహ్రూ మంచివాడని, భారత్‌తో వైరం వద్దని మావోకు సూచించటంతో ఈ వైఖరి చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటామని అది పెద్ద సమస్య కాదని, అసలు అంశం టిబెట్‌ అని ఈ విషయంలో భారత్‌తో రాజీపడేది లేదని మావో చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దాని పర్యవసానాలు మనదేశంలో కూడా ప్రతిబింబించాయి. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలోని ఒక వర్గం సోవియట్‌ వైఖరికి అనుగుణంగా నెహ్రూ అనుకూల, చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంది.దానికి భిన్నంగా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని మరో వర్గం తీసుకుంది. అందుకు వారిని జైలుపాలు చేశారు. తరువాత వారే సిపిఐ(ఎం)గా ఏర్పడ్డారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు సిపిఐ(ఎం) వైఖరే సరైనదని రుజువు చేశాయి.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బిజెపి ఎవరు అధికారంలో ఉన్నా వాటి మీద ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉంటూనే చైనాతో సంబంధాలను కొనసాగించారు. ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీ అయి నరేంద్రమోడీ ఒక రికార్డు సృష్టించారు.చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులలో మోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు.

అసలు రెండు దేశాల మధ్య యుద్దానికి దారితీసిన పరిస్థితి ఏమిటి ? తెరవెనుక అమెరికా సృష్టించిన టిబెట్‌ చిచ్చుకాగా బయటికి సరిహద్దు వివాదంగా ముందుకు వచ్చింది.1954లో చైనా-భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అయితే అప్పటికే అమెరికా కుట్ర మొదలైంది. దాన్లో భాగంగా బుద్ద జయంతిని జరుపుకొనే పేరుతో 14వ దలైలామా భారత్‌ వచ్చాడు. ఆ సందర్భంగా అంగీకరిస్తే భారత్‌లో ఆశ్రయం పొందుతానని చేసిన వినతిని నెహ్రూ తిరస్కరించారు. కానీ అదే నెహ్రూ సిఐఏ పధకం ప్రకారం టిబెట్‌ నుంచి పారిపోయి 1959 ఏప్రిల్‌ 18న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ చేరుకున్న దలైలామాకు మానవతాపూర్వక కారణాల సాకుతో ఆశ్రయం ఇవ్వటమేగాక ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకూ అనుమతించించారు. వేలాది మంది టిబెట్‌ నుంచి వచ్చిన వారికీ ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. కాలనీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.సరిహద్దులో మన ప్రభుత్వం 1961 కొన్ని పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతం తమ అదుపులోనే ఉందని ఉద్ఘాటించింది. అప్పటికే దలైలామా ప్రవాస ప్రభుత్వం చైనా వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తోంది.దీనికి తోడు సరిహద్దుల్లో కొత్తగా పోస్టులను ఏర్పాటు చేయటాన్ని అవకాశంగా తీసుకొని చైనా వాటిని తొలగించేందుకు పూనుకోవటం, మన మిలిటరీ ప్రతిఘటించటంతో అది తరువాత నెల రోజుల యుద్ధంగా మారింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ మహిళ ప్రేమా వాంగ్‌జోమ్‌ థోంగ్‌డాక్‌ దగ్గర ఉన్న పాస్‌పోర్టు చెల్లదంటూ షాంఘై పుడోంగ్‌ విమానాశ్రయ అధికారులు కొన్ని గంటల పాటు నిలిపివేశారంటూ వచ్చిన వార్తలకు మన మీడియా పెద్ద ఎత్తున ప్రచారమిచ్చిన సంగతి తెలిసిందే.మనదేశం, చైనాల మధ్య సరిహద్దులంటూ మాపులపై బ్రిటీష్‌ అధికారులు గీచిన రేఖలు రెండు దేశాల మధ్య వివాదాన్ని సృష్టించాయి. వివిధ సందర్భాలలో ప్రచురించిన మాప్‌ల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ చైనాకు చెందినది, చైనా ఆధీనంలో ఉన్న లడఖ్‌ సమీపంలోని ఆక్సారుచిన్‌ ప్రాంతం మనదిగా చూపాయి. అందువలన రెండుదేశాలూ అవి తమ ప్రాంతాలని మాపుల్లో చూపుతున్నాయి. అరుణాచల్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతమైన జాంగ్‌నాన్‌ అని చెబుతుండగా ఆక్సారు చిన్‌ మా లే (లడఖ్‌) జిల్లాలో భాగమని అంటున్నాము. దలైలామా 2023లో తవాంగ్‌ పర్యటన చేస్తామని ప్రకటించగా అనుమతించకూడదంటూ నాడు చైనా అభ్యంతరం చెప్పింది.అంతకు ముందు కూడా అభ్యంతరాల మధ్య పర్యటించినా చివరిసారిగా గాల్వన్‌ ఉదంతాల తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌-భారత్‌ పేరుతో ఉన్న పాస్‌పోర్టు, వీసాలను చైనా తిరస్కరించటం ఇదే మొదటిసారి కాదు. పాస్‌పోర్టు మీద స్టాంప్‌ వేయటానికి నిరాకరించి ఒక తెల్లకాగితం మీద అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని చైనా చెప్పింది. దానికి నిరాకరించిన మనదేశం చైనాలో జరిగిన ఆసియా క్రీడలకు మన క్రీడాకారులను పంపలేదు. తాజాగా ప్రేమ అనే మహిళ విషయంలో కూడా అదే జరిగింది, మీరు భారతీయురాలు కాదు, చైనీస్‌ అందువలన వీసా కోసం దరఖాస్తు చేసుకోండి అని చైనా అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

చిత్రం ఏమిటంటే మన దేశంలో ఆశ్రయం పొంది,ప్రవాస టిబెట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1959 నుంచి అన్ని సౌకరాలను అనుభవిస్తున్న 14వ దలైలామా 2003లో మాట్లాడుతూ అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగం అన్నాడు తప్ప మనదేశంలో భాగం అని గుర్తించలేదు. అయినప్పటికీ అతగాడికి సౌకర్యాలు కల్పించటం రాజకీయం తప్ప వేరు కాదు. మనదేశం తెచ్చిన వత్తిడి, విధిలేని పరిస్థితిలో 2008లో తన వైఖరిని మార్చుకున్నాడు. 1914లో బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖను భారత్‌-టిబెట్‌ సరిహద్దుగా నిర్ణయిస్తూ బ్రిటీష్‌ ఇండియా పాలకులు టిబెట్‌ పాలకులతో సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు.బ్రిటీష్‌ వారి పాలనకు చరమగీతం పాడారు, దాంతో ఉక్రోషం పట్టలేని బ్రిటన్‌ కుట్రకు తెరలేపింది. అప్పుడే స్వాతంత్య్రం పొందిన చైనాకు టిబెట్‌ మీద హక్కులేదని చెప్పేందుకు బ్రిటీష్‌ పాలకులు పన్నిన కుట్రలో భాగం సిమ్లా ఒప్పందమంటూ నాటి, నేటి చైనా ప్రభుత్వం అంగీకరించలేదు. టిబెట్‌ తమ సామంత దేశమని అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకొనేందుకు దాని పాలకులకు హక్కు లేదు, చెల్లదని చైనా చెబుతున్నది. ఉదాహరణకు, బ్రిటీష్‌ పాలనలో సామంత రాజ్యాలుగా ఉన్న కాశ్మీరు, నిజాం సంస్థానాలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటాన్ని నాడు మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ పూర్వరంగంలో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటం తప్ప దగ్గరదారి లేదు. అప్పటి వరకు యథాతధ స్థితి కొనసాగించాల్సి ఉంది. రెండు దేశాలూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలకు ఢోకా ఉండదు. వివాదాన్ని కాలమే పరిష్కరించాల్సి ఉంది. యుద్ధాల ద్వారా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటం కుదిరే అంశం కాదు. ఆక్రమిత కాశ్మీరుపై మనకు తిరుగులేని హక్కు ఉంది, ఎలాంటి వివాదం లేకున్నా బలప్రయోగంతో స్వాధీనం చేసుకొనేందుకు పూనుకోలేదు. చైనా గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా బడా పత్రికలు అనేక తప్పుడు వార్తలు ఇచ్చాయి. మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు లేదా అధికారంలో లేని సంస్థలు, వ్యక్తులు చేసే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే అంశాలకు రెండు దేశాలకు చెందిన పౌరులు భావోద్వేగాలకు గురైతే బుర్రలు ఖరాబు చేసుకోవటం తప్ప జరిగేదేమీ ఉండదు. వివాదాలు పభుత్వాలు తేల్చాల్సిన, తేల్చుకోవాల్సిన అంశాలని గ్రహించాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d