• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Readers News Service

విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !

17 Saturday Jan 2026

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, inequality, Narendra Modi Achhedin, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

ధనం మూలం ఇదం జగత్‌ అన్నారు పెద్దలు. జగతిని నడిపించేది ధనమే. పూర్వకాలపు మన, ఇతర దేశాల తత్వవేత్తలు ప్రవచించినా ఆధునిక కాలంలో కమ్యూనిస్టు సిద్దాంతకర్తలు కారల్‌మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ చెప్పినా వాస్తవం అదే. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థికమైనవే అని కూడా కమ్యూనిస్టులు చెప్పారు. ఇద్దరూ చెప్పింది ఒకటే కదా మనవారు ఎన్నడో చెప్పారు, వామపక్ష వాదుల ప్రత్యేకత ఏమిటని ఎవరికైనా సందేహం వచ్చిందంటే వారి బుర్రపని చేస్తున్నదని అర్ధం. నిజమే, సర్వేజనా సుఖినో భవంతు, వసుధైక కుటుంబం అని లేదా ఇతర దేశాలలో తత్సమాన అర్ధంతో ఎవరు చెప్పినా వారంతా మంచి జరగాలని ఆకాంక్షించారు, సుబోధ చేశారు. కానీ విన్నవారు, పాటించినవారెవరూ లేరు, సుభాషితాలను దాటి అమలుకోసం ఎవరైనా ముందుకు పోతే విప్లవకారులంటూ అణచివేతలే అన్నది యావత్‌ప్రపంచ చరిత్ర. ఆ సారాన్ని గ్రహించిన మార్క్సిస్టు పెద్దలు చెప్పిందేమంటే మంచిమాటలతో సమాజం మారదు, మార్చేందుకు జనమే పూనుకోవాలి, వారిలో కూడా దోపిడీకి గురయ్యేవారే ముందుండాలి. అడ్డుకొనేవారు మామూలుగా వినకపోతే చివరికి బడితెలు పట్టుకొని మార్చటం తప్ప మరొక మార్గం లేదని కర్తవ్యబోధ చేశారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇటీవలి కాలంలో సంపదల అసమానత విపరీతంగా పెరుగుతున్నదని, సంపదల పున:పంపిణీ జరగకపోతే సామాజిక సంక్షోభానికి దారితీస్తుందని అనేక మంది చెబుతున్నారు. అయితే ఈ మాటలు చెప్పేవారిలో సంపన్నుల బాగు కోరుకొనే వారే ఎక్కువగా ఉన్నారు. వారి ఉద్దేశ్యం ఏమిటంటే కొంత మంది దగ్గరే అపార సంపద పోగుపడితే మొదటికే మోసం వస్తుందన్నది వారి ఉద్దేశ్యం. అయితే నిజంగా మంచి కోరుకుంటున్నవారు లేరా అంటే ఉన్నారు.

2026 ప్రపంచ అసమానతల నివేదిక డిసెంబరులో విడుదలైంది.2018, 22 తరువాత ఇది మూడవది.ప్రపంచంలో, మనదేశంలో కూడా అసమానత తీవ్ర స్థాయిలో ఉందని హెచ్చరించింది. ఈ నివేదికను రూపొందించిన వారు ల్యూకాస్‌ ఛాన్సెల్‌, రికార్డో గోమెజ్‌ కరేరా, రొవాయిడా మోషిరిఫ్‌, థామస్‌ పికెటి. ఆ నివేదికకు మన దేశానికి చెందిన జయతి ఘోష్‌,జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ ముందు మాటరాశారు. సంపాదకుల్లో చివరి వ్యక్తి ఫ్రెంచి ఆర్థికవేత్త థామస్‌ పికెటి గురించి తెలుగువారికి కొంతమేరకు తెలుసు,ఎందుకంటే ఆర్థిక అసమానతల గురించి ఆయన హెచ్చరించిన అంశాలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. అసమానతలు అంటే కేవలం సంపదకే పరిమితం కాదు, వాతావరణ, లింగపరమైన, అవకాశాలు అందరికీ అందుబాటులో లేకపోవటం, చివరికి ఎన్నికల కోసం నియోజకవర్గాల విభజనలో వివక్షతో సహా ఇతర అంశాలు ఉన్నాయి. ప్రపంచ అసమానతల సమాచార సంస్థకు అనుబంధంగా ఉన్న రెండువందల మందికి పైగా పరిశోధకులు అనేక కోణాల్లో చేసిన విశ్లేషణల సారమే ప్రపంచ అసమానతల నివేదిక. అన్ని అంశాలను ఇక్కడ సృజించటం సాధ్యం కాదు గనుక సంపదల పున:పంపిణీ గురించి చర్చిద్దాం.ప్రపంచాన్ని ” కమ్యూనిస్టు భూతం ” ఆవహించకుండా జనం దానివైపు మరలకుండా చూసేందుకు పెట్టుబడిదారీ ఆర్థిక, సామాజికవేత్తలు అనేక అంశాలను ముందుకు తెచ్చారు.వాటిలో ఊట సిద్దాంతం ఒకటి.

ప్రభుత్వాలు కేవలం పాలనకే పరిమితమై అన్ని రంగాలను ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకే అప్పగిస్తే వారు సృష్టించే సంపదల మూట నుంచి ఊట యావత్‌ సమాజానికి దిగుతుందన్నది ఊట సిద్దాంతం. దానికి సంస్కరణలు, నూతన ఆర్థిక విధానాల వంటి ముద్దుపేర్లు పెట్టారు, జనం కూడా నిజమే అని నమ్మారు, తమకూ సంపదల ఊట దిగుతుందేమోనని పోరాటాలు మాని ఆశతో చెంబులు పట్టుకు ఎదురు చూశారు, ధారలేమీ కారలేదు, కేవలం కొన్ని చుక్కలు మాత్రమే పడ్డాయి.దాంతో ఫలితం లేదని అసంతృప్తి చెందటం ప్రారంభించారు. సోషలిస్టు సమాజాలం కోసం జనం చూడకుండా కొన్ని తాయిలాలు అందించి సంతృప్తిపరచేందుకు ఐరోపాలో అనేక ప్రయోగాలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు జరిపి సోషలిజంలో ఇంతకంటే పెద్దగా ఒరిగేదేమిటని జనాన్ని కొంతకాలం మభ్యపెట్టారు. ప్రధమ సోషలిస్టు రాజ్యం సోవియట్‌ యూనియన్‌ కూలిపోవటంతో కమ్యూనిజం, సోషలిజాలపై విజయం సాధించామని, ఆ ప్రయోగం విఫలమైందని ప్రచారం చేశారు. అంతేనా పోటీ లేకపోవటంతో అప్పటి వరకు అమలు జరిపిన అనేక సంక్షేమాలకు కోత పెట్టటం ప్రారంభించారు. అసమానతలు అప్పటి నుంచి మరింత పెరగటంతో జనాన్ని తప్పుదారి పట్టించేందుకు సంపదల పున:పంపిణీ అవసరమంటూ మరో పల్లవి అందుకున్నారు.సూత్రరీత్యా దీన్ని ఎవరూ వ్యతిరేకించరు, అయితే అది ఎలా అన్న అంశంమీదే తేడా వస్తున్నది. సంపదలు పంచినంత మాత్రాన వేగంగా దారిద్య్రం తగ్గుతుంది తప్ప ఆర్థిక వృద్ధి జరగదని, జనాలను సోమరులుగా మారుస్తాయని కొందరు చెబుతున్నారు. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ఈ మంచి సంస్కరణ అంశాన్ని ప్రచారం చేసి జనాన్ని సమీకరించేందుకు చూస్తున్నాయి. అసలేమీ లేనిదానికంటే ఏదో ఒకటి మంచిదే.అయితే భ్రమలు పెట్టుకోనవసరం లేదని చెప్పక తప్పదు.

అసమానతల గురించి తాజా నివేదకలో పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూద్దాం.మచ్చుకు ఒకటి, సబ్‌ సహారా ప్రాంతంలో ఒక బిడ్డ మీద పిపిపి పద్దతిలో 200యూరోలు ఖర్చు చేస్తుండగా ఐరోపాలో 7,400, ఉత్తర అమెరికా, ఓషియానా దేశాల్లో 9,000 యూరోలు వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో 0.001శాతం అంటే అరవైవేల మందికంటే తక్కువ ఉన్న కోటీశ్వరులు దిగువన ఉన్న 50శాతం జనాభా మొత్తం సంపదల కంటే మూడు రెట్లు ఎక్కువ కలిగి ఉన్నారు. ప్రతి ఏటా ప్రపంచ జిడిపిలో ఒకశాతం ధనికదేశాలకు తరలుతున్నది.ఇది ప్రపంచ వృద్ధికి ఇస్తున్నట్లు చెబుతున్న సాయానికి మూడు రెట్లు ఎక్కువ. స్త్రీ, పురుష వేతన తేడా అన్ని చోట్లా ఉంది. గంటకు ఒక పురుషుడు పొందే వేతనంలో మహిళకు వస్తున్నది 61శాతమే, వేతన చెల్లింపులేని పనిగంటలను కూడా లెక్కిస్తే ఈ తేడా 32శాతానికి దిగజారుతుంది.

సంపదల పున:పంపిణీ ఎలా అన్నదాని మీద పూర్తి ఏకాభిప్రాయం ఉందా అంటే లేదు అని చెప్పవచ్చు, దోపిడీ విధానాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయకుండా తీసుకొనే ఏ చర్య అయినా అది ఉపశమనం తప్ప మరొకటి కాదు.లాటిన్‌ అమెరికా దేశాల్లో, దక్షిణాఫ్రికా, నేపాల్‌ వంటి చోట్ల పురోగామివాదులు, కమ్యూనిస్టులు ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చారు.దోపిడీ వర్గ పునాదిని దెబ్బతీయకుండా దాని మీదే కొన్ని సంస్కరణలు మాత్రమే అమలు చేయటంతో ఒకదశ దాటిన తరువాత కార్మికవర్గంలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది.లాటిన్‌ అమెరికా దేశాల అనుభవం ఇదే.కొన్ని చోట్ల ఒకసారి గెలిచిన వామపక్ష శక్తులు తరువాత ఓడిపోవటానికి కారణాలు ఇవే. అసమానతలు ఎక్కువగా ఉంటే సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి.ఈ కారణంగానే రాజకీయ పార్టీలు ప్రజాకర్షక నినాదాలు, చర్యలతో ముందుకు రావటం పెరిగింది. ఓట్ల కోసం అలాంటి చర్యలకు పాల్పడను, ఆ సంస్కృతికి దూరం అని కొండంత రాగం తీసిన నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి అదే చేస్తున్నది. అయితే ఇతర పార్టీలు చేస్తే జనాకర్షక పథకాలు, తాము చేసేవి సాధికారత కలిగించేవంటూ వంచనకు పాల్పడుతోంది. ఇవి దీర్ఘకాలంలో అభివృద్ధిని దెబ్బతీస్తాయని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆశ్రితులకు దేశ సంపదలను దోచిపెట్టి మరింతగా పెంచటమే గాక, సంపదలను సమంగా పంపిణీ చేయటాన్ని వ్యతిరేకించేవారే ఇలాంటి జనాకర్షక పథకాలను తీసుకువస్తారన్నది ఒక వాస్తవం. స్వాతంత్య్రం గురించి కన్న కలలు విఫలమై 1967లో కాంగ్రెస్‌ అనేక రాష్ట్రాలలో ఓడిపోవటం, తనకు పార్టీలో సవాలు ఎదురైనపుడు గరీబీ హటావో పేరుతో ఇందిరా గాంధీ వాటికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. అయితే మనవంటి సమాజాలాలలో అవి అవసరం. ఉదాహరణకు ఎన్‌టి రామారావు ప్రవేశపెట్టిన సబ్సిడీ బియ్యపు పధకం, వృద్ధాప్య, వితంతు, వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు ఏ విధంగా సాయపడుతున్నాయో చూస్తున్నాం. ఇతర నగదు బదిలీ పథకాలు కూడా అలాంటివే.నిజానికి ఆ మొత్తాలు వస్తు,సేవల కొనుగోళ్ల రూపంలో తిరిగి ఆర్థిక వ్యవస్థలోకే వస్తున్నాయి. అందువలన ఈ మొత్తాలను ఇంకా పెంచటం సంపద పంపిణీలో భాగంగానే పరిగణించవచ్చు.అభివృద్ధి రేటుకు తగిన విధంగా పేదల ఆదాయాలు పెరగకపోతే ఫలాలు ధనికులకే చేరుతున్నట్లు లెక్క.మనదేశంలో అదే జరుగుతున్నది, శతకోటీశ్వరులు మరింతగా పెరుగుతున్నారు.

ప్రపంచ అసమానతల సమాచార కేంద్ర వివరాల ప్రకారం దిగువ విధంగా మనదేశంలో అసమానత పెరిగింది.దీన్ని రెండుగా విభజించి చూడాలి.1990 దశకంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టక ముందు, తరువాత సమాజంలోని మూడు తరగతుల సంపదలు ఎలా పెరిగాయో చూడవచ్చు.

సంవత్సరాలు××× దిగువ 50శాతం××ఎగువ 10శాతం××× ఎగువ ఒకశాతం

1961-1970×× 12.29 ×× 43.18 ××11.87

1971-1980×× 11.75 ×× 42.25 ×× 11.23

1981-1990×× 10.91 ×× 45.00 ×× 12.50

1991-2000×× 8.36 ×× 54.57 ××× 23.31

2001-2010×× 8.10 ×× 56.60 ××× 25.70

2010-2020×× 6.12 ×× 63.68 ××× 31.55

దీన్ని ముందే చెప్పుకున్నట్లుగా రెండు భాగాలుగా చేస్తే 1961 నుంచి 1990 వరకు సగటు దిగువ 50శాతం జనాభా వాటా 11.65శాతం కాగా ఎగువ పదిశాతం 43.47,ఎగువ ఒకశాతం 11.86శాతం కలిగి ఉన్నారు. ఇదే 1990 నుంచి 2020 వరకు వరుసగా 7.52-58.28-26.85శాతం ఉన్నారు. నూతన ఆర్ధిక విధానాలు అమలు జరిగిన మూడుదశాబ్దాలలో ఎగువ ఒకశాతం వాటా 226,పదిశాతం మంది వాటా 134శాతం పెరగ్గా దిగువ 50శాతం వాటా 63శాతం తగ్గింది. తాజా అంచనా ప్రకారం ఒకశాతం ధనికుల సంపద 40శాతానికి చేరింది.మంచి రోజులు తీసుకువస్తానని చెప్పిన నరేంద్రమోడీ సంస్కరణలను మరింత వేగంగా అమలు జరుపుతానని కూడా చెప్పారు. దాని ఫలితం ఏమిటో చూశాము. కార్పొరేట్‌ పన్ను గణనీయంగా తగ్గించిన కారణంగా ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖజానా కోల్పోతున్నది. పోనీ ఆ మేరకు ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నాయా అంటే అదీ లేదు. పర్మనెంటు ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతున్నది.మన దేశ కార్పొరేట్‌ సంస్థలకు పన్ను తగ్గించిన కారణంగా వాటిలో పెట్టుబడులు పెడితే లాభసాటిగా ఉండటంతో విదేశీ కంపెనీ నేరుగా పరిశ్రమల స్థాపనకు బదులు ఉన్న కంపెనీల వాటాలను స్టాక్‌మార్కెట్‌లో కొనుగోలు, విక్రయాలు చేస్తూ లాభాలను తమ దేశాలకు తరలించుకుపోతున్నాయి.

ఆదాయాన్ని బట్టి పన్ను విధించి, ఆ మేరకు అల్పాదాయవర్గాలకు రాయితీల రూపంలో సంపదల పంపిణీ ఒక పద్దతి. లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌లో అసమానతలు, దారిద్య్ర నిర్మూలన పథకాల్లో భాగంగా షరతులతో కూడిన నగదు బదిలీ పథకాలను అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న అమ్మవడి, తల్లిదీవెన పథకాలు వాటికి నకలే. తమ బుర్రలో పుట్టినవే అని ఎవరైనా చెప్పుకుంటే బడాయి తప్ప మరొకటి కాదు. 2003లో వామపక్ష నేత లూలా డ సిల్వా అధికారానికి వచ్చినపుడు అంతకు ముందున్న కొన్ని పథకాల అనుభవాలను చూసి మరింత లబ్ది చేకూరేవిధంగా అల్పాదాయ వర్గాలకు ఈ పథకాన్ని అమలు చేశారు. పిల్లలను బడికి పంపటం, టీకాలు వేయించిన వారికి నగదు బదిలీ జరిగింది.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు దీనికి అర్హులు. అంతర్జాతీయంగా అది ప్రశంసలు పొందింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది,సంపదల పంపిణీ వలన దారిద్య్ర తీవ్రత తగ్గుతుంది తప్ప అసమానత తొలగదు. గమనించాల్సిందేమంటే రెండు దశాబ్దాల తరువాత చూస్తే అసమానతలు ఎక్కువగా ఉన్న పది ప్రపంచ దేశాల్లో బ్రెజిల్‌ ఒకటిగా ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేస్తున్న రైతు బంధు, భరోసా మరో పేరుతో అందచేస్తున్న నిధులు, పిఎం కిసాన్‌ మొత్తాలు కూడా సంపద పున:పంపిణీలో భాగమే. అయితే అవి వ్యవసాయ రంగ సంక్షోభాన్ని ఆర్చేవి తీర్చేవి కాదు.కనీస వేతనాల పెంపుదల కూడా సంపదల పంపిణీలో ఒక అంశమే. గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు, అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అవకాశాలను పెంచుతాయి. అందువలన సంపదల పంపిణీ గురించి మరింత నిర్దిష్టంగా మధనం జరగాల్సి ఉంది. తమ ప్రత్యేక లక్షణాలతో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించిన చైనాలో కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, అయితే వాటిని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది.

ఈ నివేదిక ప్రకారం సమాజంలో ప్రపంచంలో ఎగువన ఉన్న పదిశాతం మంది వద్ద సంపద 58శాతం ఉంది (2022లో 57శాతం) దిగువన ఉన్న 50శాతం మందికి 15శాతం(2022లో 13శాతం). ఇంతకు ముందు పట్టికలో సంపదల పెరుగుదల రేటు చూశాము, ఉన్న సంపదల మొత్తం వేరు,పెరుగుదల రేటు వేరు. భారత్‌ మరియు చైనా గురించి చెప్పిందేమంటే ప్రపంచ మధ్యతరగతిలోకి చైనా జనాభా ఎక్కువ మంది చేరారని, అదే భారత్‌లో 1980లో మధ్య తరగతిలో ఉన్న 40శాతంలో ఎక్కువ మంది ఇప్పుడు దిగువ 50శాతంలోకి దిగజారినట్లు పేర్కొన్నది. కార్పొరేట్లకు పన్ను తగ్గించిన కారణంగా సంపదలు పోగుపడటం ఒకటైతే రాష్ట్రాలకు రావాల్సిన పన్నురాబడి తగ్గుతున్నది, అది సంక్షేమ పథకాల మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఉదాహరణకు వెనుకబడిన తరగతుల వారికి 50 ఏండ్లకే పెన్షన్‌ ఇస్తామని చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ మాదిరి సామాజిక పెన్షన్లు నాలుగువేలకు పెంచుతామని చెప్పిన తెలంగాణా కాంగ్రెస్‌ వాగ్దానం అమలుకు నిధులు లేవు, బిజెపి పాలిత రాష్ట్రాలలో పరిస్థితి మరీ అధ్వానం, వారికి అసలు ఆ ఉద్దేశ్యమే లేదు అని వేరే చెప్పనవసరం లేదు. యుపిఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయించిన పెన్షన్‌ మొత్తాలనే మోడీ సర్కార్‌ ఇప్పటికీ అందిస్తున్నది తప్ప పైసా పెంచలేదు. దాని మానవత్వ ముఖం అలా ఉంది. అందువలన మరో విధంగా చెప్పాలంటే సంపదల పున:పంపిణీని దెబ్బతీస్తున్నది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ రూపొందించిన ఆర్థిక చట్రంలోనే మన పాలకులు విధానాలను రూపొందిస్తున్నారు. అందుకే గొర్రె తోక మాదిరి జనజీవితాలు పెద్దగా పెరగటం లేదు. సంపదల పున:పంపిణీ నినాదం సంస్కరణ మాదిరి ఉన్నప్పటికీ అది కూడా వర్గపోరాట ప్రాధమిక రూపమే అని చెప్పవచ్చు. ఈ మాత్రపు సంస్కరణనే వ్యతిరేకించేవారు, సంపదలను సమాజపరం చేస్తే ఊరుకుంటారా ? దేశంలో కార్పొరేట్లు, ధనికుల పెత్తనం ఉన్నందున వారి మీద పన్ను తగ్గించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దానికి విరుద్దంగా పన్ను మొత్తాలను పెంచి పేదలకు పంచాలని ఇతరులు కోరుతున్నారు. పన్నులు పెంచుకుంటూ పోతే ఎగువన ఉన్నవారు కుప్పకూలుతారని వారి సమర్ధకులు అంటే పెంచకపోతే మరింతగా దిగజారతామని దిగువన ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు.ఈ వైరుధ్యం మరింత ముదిరితే విప్లవానికే దారితీస్తుంది.ప్రస్తుతం మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు.

‘ చెడుగా మారేంత వరకు అసమానత మౌనంగానే ఉంటుంది.ఈ నివేదిక అసమానతకు మరియు నేటి అసమాన సామాజిక, ఆర్థిక నిర్మాణాలతో అవకాశాల నిరాకరణకు గురైన వందల కోట్ల మందికి గళాన్ని ఇస్తుంది” అని ప్రపంచ అసమానతల నివేదిక సంపాదకుల్లో ఒకరైన రికార్డో గోమెజ్‌ కరేరా వ్యాఖ్యానించాడు. ముందుమాట రాసిన వారిలో ఒకరైన జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ ఇలా చెప్పారు.” నేటి విపరీత అసమానత అనివార్యమైనదేమీ కాదని చరిత్ర, అన్ని దేశాల అనుభవాలు, సిద్దాంతం కూడా చెబుతున్నది.పురోగామి పన్ను విధానం( సంపద పెరిగే కొద్దీ పన్నుల పెంపు), పెద్దమొత్తంలో సామాజిక పెట్టుబడి,న్యాయమైన కార్మిక ప్రమాణాలు, ప్రజాస్వామిక వ్యవస్థలు గతంలో తేడాలను తగ్గించాయి. ఇదే మరోసారి చేయగలవు ” సంపదల పున:పంపిణీ జరగాలని కోరుకొనే వారు ప్రచారానికి మాత్రమే పరిమితం కారాదు, కార్యాచరణకూ పూనుకోవాలి !హొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

గుజరాత్‌ రైతుల మీదే మోడీకి శ్రద్ద లేదు, ఇక దేశం గురించి పట్టించుకుంటారా ! భారత్‌పై వేలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కత్తి !!

14 Wednesday Jan 2026

Posted by raomk in Current Affairs, Economics, Farmers, Gujarat, History, imperialism, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, USA

≈ Leave a comment

Tags

agricultural research, Agriculture Crisis in India, agriculture in india, BJP, Donald trump, MSP in India, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

వ్యవసాయంలో మొత్తం విలువ జోడింపు(గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌-జివిఏ) మార్చినెలతో ముగిసే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెరుగుదల రేటు కేవలం 0.8శాతమే అని గతేడాది 10.4శాతం ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం తగ్గటమే అని చెబుతున్నారు. దేశమంతటా దాదాపు అన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు పడి పంటల ఉత్పత్తులు పెరిగినప్పటికీ జివిఏ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. రైతాంగ ఆదాయాల రెట్టింపు, కనీస మద్దతు ధరల పెంపుదల, ఎగుమతి అవకాశాల కల్పన వంటి ఎన్నికబుర్లు చెప్పినా నరేంద్రమోడీ పాలనలో పరిస్థితి దిగజారింది.రైతాంగం మీద కక్షగట్టినట్లుగా అనుసరిస్తున్న విధానాల ఫలితంగా మొత్తంగా రైతుల ఆదాయాలు పడిపోయాయి, కనీస మద్దతు ధరల నిర్ణయమే లోపభూయిష్టమైతే ఈ ఏడాది ప్రతి పంటనూ అంతకంటే తక్కువ ధరలకే రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది.వివిధ రంగాల జివిఏల తీరు తెన్నులు చూసినపుడు యుపిఏ పాలనలో 2011-12లో వ్యవసాయ రంగ వాటా 18.53 శాతం ఉండగా 2019-20 నుంచి 2023-24 మధ్య కాలంలో ఐదేండ్ల సగటు 18.57 శాతం ఉంది, తరువాత ఇంకా పడిపోయిందనే అంచనాలు వెలువడుతున్నాయి.మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత అన్నప్పటికీ ీ పారిశ్రామిక రంగ జివిఏ ఐదేండ్ల సగటు 27.56శాతం ఉంది, అదే 2011-12లో 32.5 శాతం ఉంది. సేవారంగంలో ఐదేండ్ల సగటు 53.85కాగా 2011-12లో 48.97శాతం ఉంది, ఒక్క సేవారంగంలో మాత్రమే పెరుగుదల ఉంది. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించే వ్యవసాయ, పారిశ్రామిక రంగాల దిగజారుడు కారణంగానే ఏటా రెండు కోట్ల కొత్త ఉద్యోగాల గురించి మోడీ మౌనంగా ఉంటున్నారు.

2025 డిసెంబరు 26వరకు ఉన్న వ్యవసాయ మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం ప్రధాన పంటలైన మొక్కజొన్న,వేరుసెనగ, సోయా, పత్తి, కందులు, పెసలు, మినుముల వంటి వాటి ధరలు కనీస మద్దతు కంటే 5.30శాతం తక్కువ ఉన్నట్లు నమోదైంది.వివిధ పంటలకు కనీసంగా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు రైతులు నష్టపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల రేటుతో పోలిస్తే వ్యవసాయ రంగం తక్కువగా ఉండటం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కొనసాగుతుండటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల భారతీయ పరిశోధనా మండలి (ఐసిఆర్‌ఐఇఆర్‌) ఇటీవలి విధాన పత్రంలో పేర్కొన్న అంశాల ప్రకారం ఒక వ్యవసాయ కుటుంబ సగటు ఆర్జన 2012-13లో రు.6,426 ఉంటే 2024-25లో రు.19,696గా ఉంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తే నిజ పెరుగుదల రు.12,173గా తేలింది. దేశంలో 2014-15 నుంచి 2024-25 వరకు జిడిపి వార్షిక వృద్ధి రేటు ఆరుశాతంపైగా ఉండగా వ్యవసాయం 4శాతమే ఉంది. జనాభాలో 46శాతం మందికి జీవనాధారంగా ఉన్న ఈ రంగంలో ఇంత తక్కువ వృద్ధి సహజంగానే గ్రామీణ భారతంలో వినియోగ వృద్ధి మీద ప్రభావం చూపుతుంది. పట్టణ ప్రాంతాలు-గ్రామీణ ప్రాంతాల మధ్య వినియోగంలో తీవ్ర అంతరం ఉండగా గ్రామీణంలో వ్యవసాయ కుటుంబాల వినియోగం తక్కువగా ఉన్నట్లు వివిధ సర్వేలు వెల్లడించాయి. అనేక పథకాలతో ఉద్దరిస్తున్నామని చెప్పిన తరువాత కూడా ఉన్న పరిస్థితి ఇది.అవేవీ పారిశ్రామిక వస్తువులకు గిరాకీని పెంచలేకపోయాయి.

పంటల ద్వారా వచ్చే రాబడి కంటే పశుపోషణ ద్వారా ఎక్కువగా ఉన్నట్లు కూడా సర్వేలు చెబుతున్నాయి. అందుకే సాగు గిట్టుబాటు కావటం లేదంటూ అనేక మంది విముఖత చూపుతున్నారు, ఇతర జీవనోపాధివైపు మరలుతున్నారు. 2000 సంవత్సరంలో కేవలం నాలుగుశాతంగా ఉన్న పశుపోషణ రాబడి 2018-19 నాటికి 16శాతానికి పెరిగింది. పంటల రాబడి వాటా 40శాతం దిగువకు పడిపోయింది.ఉద్యానవన పంటల సాగు మెరుగ్గా ఉండటంతో సాగు భూమి పెరుగుతున్నది.వ్యవసాయం, అనుబంధ రంగాలపై కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపుల్లో కేవలం రెండుశాతమే ఉద్యానవన పంటలకు ఉంది. ఈ పంటల రైతాంగానికి అవసరమైన శీతల గిడ్డంగుల వంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తేనే వారికి ఉపయోగం. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని కూడా ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు పూనుకున్నందున పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తున్నాయి.మౌలిక సదుపాయాలు, రోడ్లు,పంటల ప్రాసెసింగ్‌ సదుపాయాలు లేని కారణంగా టమాటా, ఉల్లి, పండ్లు, బంగాళాదుంపల వంటి ఉత్పత్తుల్లో ఐదోవంతు వృధా అవుతున్నాయి, ఆ మేరకు నష్టాలను రైతులే భరిస్తున్నారు. బీమా కూడా లేదు.

ప్రభుత్వ విధానాలు అటు వినియోగదారులు, ఇటు ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడేవిగా ఉండాలి.మొత్తంగా చూసినపుడు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు అనుసరిస్తున్న పద్దతుల మీద ఏకాభిప్రాయం లేదు. ఇదే సమయంలో తగ్గుదల రైతాంగాన్ని, యావత్‌ గ్రామీణ ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నది, వ్యవసాయదారులను ఫణంగా పెడుతున్నది. ప్రపంచంలో బియ్యాన్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న చైనా(14.5 కోట్ల టన్నులు)ను వెనక్కు నెట్టి మనదేశం(15 కోట్ల టన్నులు) ప్రధమ స్థానానికి చేరటం తమ ఘనతే అని కేంద్ర ప్రభుత్వం, అధికార బిజెపి స్వంతడబ్బా కొట్టుకుంటున్నాయి. రైతులకు దక్కిందేమిటన్నది ప్రశ్న. విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే కంపెనీలు కిలో రు.33కు అటూ ఇటూగా ధరల ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వార్తలు. నిజంగా కనీస మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తే ఈ ధర గిట్టుబాటు అవుతుందా ? ఎగుమతులకు గ్రేడ్‌ ఏ రకాలే ఉంటాయన్న సంగతి తెలిసిందే, వర్తమాన సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలు కనీస మద్దతు ధర రు.2,389గా ఉంది. మరోవైపు వినియోగదారులు 45 నుంచి 55 రూపాయలకు కిలోబియ్యం కొంటున్నారు. అంటే అటు రైతులను ముంచి ఇటు వినియోగదారుల జేబులు కొట్టి విదేశాలకు చౌకగా బియ్యం ఎగుమతి చేస్తున్నాం.

పప్పు, నూనె గింజల్లో స్వయం పోషకత్వం సాధించాలని సంకల్పాలు చెప్పుకోవటం తప్ప తగిన ప్రోత్సాహం, అధిక దిగుబడి వంగడాల మీద పరిశోధనా లేదు. మూడు దశాబ్దాల క్రితం నామమాత్రంగా ఖాద్య తైలాలను దిగుమతి చేసుకోనే వారం, ఇప్పుడు 60 శాతం అవసరాలు విదేశాల నుంచే తీర్చుకుంటున్నాం. అదానీ వంటి దిగుమతి కంపెనీల లాభాలను కాపాడటానికే ఈ రంగంపై మోడీ సర్కార్‌ శ్రద్ద చూపటం లేదు. నూనెగింజల ఉత్పత్తి పెంచాలంటూ 2024లో జాతీయ పథకాన్ని ప్రారంభించారు, కళ్లు తెరవటానికి పదేండ్లు పట్టింది.మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియాల మాదిరే ఇది కూడా మారనుందా ? 2021 ఆగస్టులో ఖాద్య తైలాలు- పామాయిల్‌ ఉత్పత్తి పెంపు పథకాన్ని ప్రకటించి 2025-26 నాటికి అదనంగా పామాయిల్‌ 6.64లక్షల హెక్టార్ల సాగు చేయిస్తామని చెప్పారు, కానీ 1.89లక్షలే పెరిగింది, ఇదే కాలంలో ఆవనూనె సాగు, ఉత్పత్తి రెండూ తగ్గాయి. దీనికి కూడా జవహర్‌ లాల్‌ నెహ్రూ, కాంగ్రెస్‌ నేతలే కారణమని చెప్పినా నమ్మే జనాలున్నారు మరి ! మరోవైపు ముడి పామాయిల్‌ దిగుమతులపై పన్ను మొత్తాన్ని 20 నుంచి పది శాతానికి తగ్గించారు. కొనుగోలు శక్తి లేక తలసరి ఖాద్యతైల వినియోగం తక్కువగా ఉండబట్టి గానీ లేకుంటే దిగుమతులు మరింతగా పెరిగి ఉండేవి.

వేరుసెనగ దేశం మొత్తంలో మూడోవంతుకు పైగా గుజరాత్‌లో సాగు చేస్తారు. మొత్తం నూనె గింజల సాగులో మూడు దశాబ్దాల క్రితం 38శాతంగా ఉన్న వేరుశనగ ఇప్పుడు 28శాతానికి పడిపోయింది. పొద్దుతిరుగుడు ఆరు నుంచి 0.5శాతానికి దిగజారింది. సోయాబీన్‌, ఆవ నూనె సాగు పెరిగింది.వేరుశనగలో నూనె 48-50శాతం వరకు ఉంటుంది, అదే సోయాలో 18-20శాతమే, అందువలన సోయా పెరిగినా పెద్దగా ప్రయోజనం లేదు. ఆవు పేడ, మూత్రాల్లో ఏముందని పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యత రైతాంగానికి మేలు చేసే నూనె గింజల దిగుబడిని పెంచే రకాల అభివృద్ధి పట్ల లేదు. వేరుశనగ దిగుబడి హెక్టారుకు మన దేశంలో 2.08టన్నులు(2023) కాగా చైనాలో 3.98, అమెరికాలో 4.19 టన్నులు ఉంది. ఇటు ధరలు లేక అటు అధిక దిగుబడి వంగడాలు లేకుండా దేశం కోసం ధర్మం కోసం పాలన అంటే ప్రయోజనం ఏముంది ! గుజరాత్‌ వేరుశన సాగులో ఒక నిలకడ లేదు. గడచిన రెండు దశాబ్దాలలో అక్కడ కూడా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి.ఎందుకు రైతులు వేరే పంటలకు వెళతారంటే వేరుశెనగ గిట్టుబాటు కాకపోవటమే. నిజానికి నరేంద్రమోడీకి గుజరాత్‌ రైతుల మీద అయినా శ్రద్ద, రైతాంగానికి గిట్టుబాటయ్యే చర్యలు తీసుకొని ఉంటే మొత్తంగా సాగు ఇంకా పెరిగి ఉండేది, దిగుమతుల భారాన్ని తగ్గించి ఉండేది, అధిక దిగుబడి వంగడాల అభివృద్ధి జరిగి ఉండేది. ఇటీవలి కాలంలో బిజెపి రెండింజన్ల పాలిత రాష్ట్రాలతో సహా అన్ని చోట్లా రైతాంగం యూరియా కొరతను ఎదుర్కొన్నది. దేశీయంగా ఉత్పత్తిని పెంచటంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న కారణంగా దిగుమతులు నిలిపివేయటమే దీనికి కారణం.పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వటంలో ఉన్న శ్రద్ద రైతాంగం మీద లేదు. ఇతర ఎరువుల ధరలు ఎక్కువగా ఉండటం, యూరియా సబ్సిడీకి లభిస్తుండటంతో రైతాంగం దాని మీద మొగ్గు చూపుతున్నారు, దానికి తోడు గతేడాది వర్షాలు బాగాపడటం కూడా డిమాండ్‌ను పెంచింది.

అంతర్గత పరిస్థితి ఇలా ఉంటే అమెరికా కత్తి మన రైతాంగం మీద వేలాడుతున్నది.2030 నాటికి ఇరుదేశాల వాణిజ్యాన్ని 128 బిలియన్‌ డాలర్ల నుంచి 500బి.డాలర్లకు తీసుకుపోతామని మన నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అందుకు గాను తమ దేశంలో వినియోగించని కోడికాళ్లు, మిగులుగా ఉన్న వెన్న, జున్ను వంటి పాడి ఉత్పత్తులను, సోయా, మొక్కజొన్నలు, పత్తి తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు అనుమతితో పాటు పన్ను భారాన్ని తగ్గించాలని అమెరికా వత్తిడి చేస్తున్నది.ఏటా 20 బిలియన్‌ డాలర్ల మేర అక్కడి రైతాంగానికి అమెరికా సబ్సిడీలు ఇస్తున్నది. షరతులను అంగీకరిస్తే ఆ వస్తువులన్నింటినీ మన దేశంలో కుమ్మరిస్తారు,మనకు వ్యవసాయం వాణిజ్యం కంటే జీవనాధారంగా ప్రాధాన్యత కలిగి ఉంది.అమెరికా వస్తువులకు మార్కెట్‌ను తెరిస్తే నరేంద్రమోడీతో పాటు బిజెపి రాజకీయ పతనానికి నాంది పలికినట్లే.ట్రంప్‌ను సంతుష్టీకరించటానికి సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు పత్తి దిగుమతి పన్ను రద్దు చేశారు. దాని ప్రభావం మన పత్తిమార్కెట్‌పై పడి కనీస మద్దతు ధరలకంటే తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మన దేశ వ్యవసాయ మార్కెట్‌ విలువ 452 బిలియన్‌ డాలర్లని, 2030నాటికి 563బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా,146 కోట్ల జనాభా ఉన్నందున మన మార్కెట్‌ ఎవరికైనా ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ పూర్వరంగంలో కనీస మద్దతు ధరలను పెంచటంతో పాటు వాటికి చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌ సరైనదే అని తేలుతున్నది.ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం 2022జూలైలో ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటి వరకు 45 సార్లు సమావేశం జరపటం తప్ప చేసిందేమీ లేదు, దానికి ఎలాంటి వ్యవధి నిర్ణయించలేదు గనుక అలా సాగదీస్తూనే ఉంటారు. ఈలోగా రైతులు మరచిపోతారు.ఏడాది క్రితమే, 2024లో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించాలని సిఫార్సు చేసింది. అంతే కాదు పిఎం కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఏటా ఇప్పుడు ఇస్తున్న ఆరువేల రూపాయలను పన్నెండు వేలకు పెంచాలని కూడా చెప్పింది. అయినా మోడీ సర్కార్‌ ఏమీ తెలియనట్లుగా నటిస్తోంది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.గ్రామీణ ఆదాయ పెరుగుదల 57.6, ఖర్చు పెరుగుదల 69.4శాతాల చొప్పున ఉంది.ఈ కారణంగా రుణ భారం పెరిగినందున రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలను మాఫీ చేయాలి.2016-17లో రుణ భారం ఉన్న గ్రామీణ కుటుంబాలు 47.4శాతం కాగా 2021-22 నాటికి 52శాతానికి చేరినట్లు నాబార్డు సర్వే తెలిపింది.వ్యవసాయానికి కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు 2020-21లో 3.53శాతం ఉండగా 2024-25లో 2.54శాతానికి తగ్గాయి.వ్యవసాయ వృద్ధి రేటు 2023-24లో 1.4శాతానికి తగ్గింది, ఇది ఏడు సంవత్సరాల్లో కనిష్టం. రెండు ఎకరాలలోపు రైతాంగానికి విధిగా అందిరికీ పంటల బీమా చేయించాలి. వ్యవసాయ కార్మికులకు జాతీయ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖగా ఉన్న పేరును వ్యవసాయం, రైతులు, వ్యవసాయ కార్మిక సంక్షేమ శాఖగా మార్చాలి. పంటల సేకరణ పరిమితంగానే ఉన్నందున కనీస మద్దతు ధరలను కేవలం ఆరుశాతం మంది రైతులు మాత్రమే 2021-22లో లబ్ది పొందినట్లు తేలింది.చట్టబద్ద హామీ ఉంటే ఎక్కువ మంది లబ్ది పొందుతారు. స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఎంఎస్‌పి నిర్ణయించాలి.బలహీనమైన మార్కెట్‌ సంబంధాలు ఉన్న రాష్ట్రాలలో రైతులు ఎంఎస్‌పి కంటే తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పిస్తే ప్రభుత్వం మీద భారం పెరుగుతుంది. మొత్తం 23 పంటలకు అమలు జరపాలంటే ఏడాదికి ఆరులక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి కావాలి. కనీస మద్దతు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వినియోగదారులకు ధరలు పెరుగుతాయి. గోధుమలు, బియ్యానికి ఒక శాతం కనీస మద్దతు ధర పెంచితే చిల్లర ధరలు 0.22శాతం పెరుగుతాయి.రాష్ట్రాలలో ఉన్న పరిస్థితిని బట్టి ప్రత్యేక విధానాలను రూపొందించాలి.చట్టబద్దత కల్పిస్తే ప్రైవేటు వ్యాపారులు ఆధరలకు కొనేందుకు ముందుకు రారు, ప్రభుత్వమే కొనాల్సి ఉంటుంది. నీరు ఎక్కువగా అవసరయ్యే వరి, గోధుమ, చెరకు వంటి పంటల ధరలకు చట్టబద్దత కల్పిస్తే భూగర్భ జలాల వాడకం ఎక్కువ అవుతుంది, భూసారం దిగజారుతుంది. చట్టబద్దత కల్పించటం ప్రపంచవాణిజ్య సంస్థ నిబంధనకు విరుద్దం, మొత్తం వ్యవసాయ ఉత్పత్తి విలువలో పదిశాతానికి మించి సబ్సిడీలు ఇవ్వటానికి ఉండదు. బియ్యం ఎగుమతులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను మద్దతు ధరలతో ప్రోత్సహించాలి. పార్లమెంటరీ కమిటీ చేసిన ఈ సిఫార్సులలో అదియును సూనృతమే ఇదియును సూనృతమే అన్నట్లుగా ఉన్నాయి, కానీ ప్రతికూలంగా ఉన్న అంశాలను మాత్రమే పట్టించుకొని అనుకూలంగా ఉన్నవాటిని విస్మరించటం రైతాంగం మీద ఉన్న కక్ష, వివక్షగాక మరేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

24 Wednesday Dec 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Education, Europe, Germany, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti-science politics, Attack on Scientific Temperament, Donald trump, Hitler’s Gift, India pseudoscience, Narendra Modi Failures, RSS, Trump assault on science

ఎం కోటేశ్వరరావు

అమెరికాలో రెండవసారి అధికారానికి వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తికాకుండానే డోనాల్డ్‌ ట్రంప్‌ సైన్సు, సంబంధిత అంశాలపై దాడులు చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా సైన్సు రక్షణకు అక్కడి శాస్త్రవేత్తలు నడుంకట్టారు. గత పదకొండు నెలల కాలంలోనే ట్రంప్‌ వేగవంతంగా, తీవ్రమైన దాడులు ఐదువందలసార్లు చేశాడని ఆ రంగం తీరుతెన్నులను పరిశీలిస్తున్న విశ్లేషకులు చెబుతున్నారు. అనేక సంస్థలలో అశాస్త్రీయ భావాలు కలవారితో నింపుతున్నాడు. పొమ్మనకుండానే పొగబెట్టినట్లుగా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు నిధుల కోత పెడుతున్నాడు. ఈ వైఖరి సైన్సుపై నిరంకుశత్వంగా వర్ణిస్తూ దాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధులు కావాలని, వచ్చే ఏడాది చేపట్టే కార్యాచరణకు గాను డిసెంబరు 31లోగా విరాళాలు ఇవ్వాలని ” తాపత్రయపడే సైంటిస్టుల యూనియన్‌ ” పిలుపునిచ్చింది. మనతో సహా ప్రపంచంలో అనేక దేశాల్లో ఆశాస్త్రీయ కుహనా సైన్సును జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం జరుగుతున్నది.

డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సైన్సు మీద జరుపుతున్నదాడి వలన అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అది స్వయంగా చేసుకొనే తీవ్రహాని అని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులు పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్‌ దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రావటాన్ని సహించలేని ట్రంప్‌ వాటికి నిధులు కోతపెడతానని బెదిరించిన సంగతి తెలిసిందే.వాటితో నిమిత్తం లేకుండానే శాస్త్రపరిశోధనలను నిరుత్సాహపరిచేందుకు బిలియన్లకొద్దీ నిధులకోత ప్రారంభించాడు. ప్రధాన పరిశోధనా సంస్థల బడ్జెట్‌లో 50శాతం కోత పెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీంతో అనేక మంది శాస్త్రవేత్తలు అమెరికా వీడటం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీలో హిట్లర్‌ యూదులపై జరిపిన ఊచకోత నుంచి తప్పించుకొనేందుకు ఆ సామాజిక తరగతికి చెందిన అనేక మంది విద్యావంతులు, శాస్త్రవేత్తలు అమెరికా, ఇతర ఐరోపా దేశాలకు వలసలు పోయారు.ఆ దేశాల్లో అనేక నవకల్పనలకు ఆద్యులయ్యారు. దీంతో ఇతర దేశాలకు ” హిట్లర్‌ ఇచ్చిన బహుమతి ” అని ఈ పరిణామాన్ని వర్ణించారు. ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా అదే చేస్తున్నారని చెబుతున్నారు. ఈ చర్యలతో చైనాతో సహా ఐరోపా ధనికదేశాలన్నీ లబ్దిపొందుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దేశాల్లో ప్రతిభావంతులకు పట్టం కట్టేందుకు పెద్ద మొత్తాలలో నిధులు కేటాయించారు. ట్రంప్‌ శాస్త్ర సలహాదారైన మైఖేల్‌ క్రాటిసియోస్‌ మాట్లాడుతూ సైన్సు అసమర్ధంగానూ, కనపడకుండా కంటిమీద గట్టి పొరలా మారిందని, ప్రత్యామ్నాయాలను చూడనిరాకరించేవారి బందీగా మారినందున అంతటినీ మార్చివేయాలని చెప్పాడు. ఇలాంటి వారి మాటలను విన్నతరువాత 80ఏండ్ల ట్రంప్‌కు బుర్రపని చేస్తుందని ఎలా అనుకోగలం.

శాస్త్ర పరిశోధనలకు గత కొన్ని దశబ్దాలుగా అమెరికా కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే, వివిధ రంగాలలో నోబెల్‌ బహుమతి గ్రహీతల్లో సగం మంది అక్కడి నుంచే ఉన్నారు.అలాంటి చోట శాస్త్రంపై కత్తికట్టటం అంటే అది ఒక్క అమెరికాకే కాదు, యావత్‌ ప్రపంచానికి నష్టం.ఇప్పటికీ అనేక వ్యాధులకు కారణాలు, చికిత్సలు సవాలుగానే ఉన్నాయి. ట్రంప్‌ తీసుకున్న మతిమాలిన చర్యల కారణంగా అనేక పరిశోధనలు అర్ధంతరంగా ఆగటం లేదా ఆలశ్యానికి దారితీస్తాయి.అన్ని దేశాల్లో ఉన్నట్లే బ్యూరోక్రసీ అమెరికాలో కూడా తక్కువేమీ కాదు.ఐదు రోజుల పనివారంలో రెండు రోజులు ప్రయోగశాలలకు బదులు ప్రభుత్వ యంత్రాంగ కాగితాలు నింపటానికే రెండు రోజులు పోతున్నదని అనేక మంది శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నమాట నిజం. నివారణకు మార్గాలు వెతకాలి తప్ప అసలు పరిశోధకులనే తొలగిస్తే ఎలా ? అమెరికా అనుసరిస్తున్న ప్రతికూల విధానాల ఫలితంగా అక్కడ ఉండేవారి సంఖ్య తగ్గుతోంది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలకు విదేశాలకు వెళ్లాలని దరఖాస్తుచేసుకున్నవారు 2024 మొదటి మూడునెలలతో పోలిస్తే మూడో వంతు పెరిగింది.అమెరికాకు రావాలనుకొనే వారు నాలుగోవంతు తగ్గారు.ఒకసారి ఉన్న పేరుపోతే తిరిగి తెచ్చుకోవటం కష్టమని అనేక మంది చెబుతున్నా ట్రంప్‌ చెవికి ఎక్కటం లేదు. అమెరికా మిలిటరీ, సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నతంగా ఉండటానికి శాస్త్రపరిశోధనలే కారణమని, అలాంటివి లేకపోతే ఆ స్థానాన్ని చైనా ఆక్రమిస్తుందని ఆందోళన చెందేవారు మరోవైపు ఉన్నారు. శాస్త్రవిజ్ఞానాన్ని మానవాళి సౌభాగ్యానికి వినియోగించాలి. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు ఎక్కడ జరిగినా కాస్త వెనుకా ముందూ ప్రపంచంలోని వారందరికీ అందుబాటులోకి వస్తాయి. అలాంటి పరిశోధనా రంగంలో ముందున్న అమెరికా ఒక్కసారిగా జెండా ఎత్తేస్తే లోకమంతా అలాగే ఉంటుందని కాదు గానీ, పరిశోధనలు ఆలశ్యమౌతాయి.

శాస్త్రపరిశోధనలు ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితం అవుతున్నందున వాటిని ఆయుధాలుగా చేసుకొని వెనుకబడిన దేశాలను దోపిడీ చేయటం కూడా ఒక వాస్తవం. ఉదాహరణకు అధిక దిగుబడి వంగడాలను తయారు చేసిన దేశాలకు చెందిన సంస్థలు పేటెంట్‌ హక్కుల పేరుతో ఎంత అధిక ధరలకు వాటిని ఎలా విక్రయిస్తున్నారో చూస్తున్నాం. వర్షాలు, వరదలు, దుర్భిక్షం వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే పసిగట్టే పరిజ్ఞానాన్ని మరింత నిర్ధిష్టం కావించాలి. అది అమెరికాకూ అవసరమే అక్కడి కొన్ని రాష్ట్రాలలో సంభవించిన ప్రమాదకర వరదలు, తుఫాన్లను సకాలంలో పసిగట్టగలిగి ఉంటే నష్టాలు తగ్గి ఉండేవి. జలుబుకు కారణమౌతున్న వైరస్‌లు అమెరికాలో ఇప్పటికీ ప్రాణాంతకంగానే ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమకాటు వలన డెంగీ ఎంత ప్రమాదకరంగా ఉందో తెలిసిందే. రాజకీయాలలో ప్రపంచమంతటా మితవాద శక్తులు పెరిగిపోతున్నట్లుగానే ప్రపంచంలో శాస్త్రవిజ్ఞానాన్ని వ్యతిరేకించే మూఢత్వం కూడా పెరుగుతున్నది. కరోనా సమయంలో మనదేశంతో సహా ప్రపంచమంతటా అలాంటి శక్తులు ఎలా రెచ్చిపోయాయో చూశాము. శాస్త్రవేత్తలు, వైద్యుల సలహాలను పక్కన పెట్టి, వాక్సిన్‌ను వ్యతిరేకంచే శక్తుల మాటలు నమ్మి లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సందర్భంగా లాక్‌డౌన్లు విధించినందుకు పెట్రోలు, డీజిలు వ్యాపారుల లాబీ రంగంలోకి దిగి లాక్‌డౌన్ల వలన ఆర్థిక వ్యవస్థలకు నష్టం అని ప్రచారం చేయించటాన్ని కూడా చూశాము. కరోనా లేకుండానే సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాల వలన కలిగిన నష్టం ఎంతో, ఎందుకు సంభవించిందో వారు చెప్పారా ? కరోనా గురించి మీడియా సంస్థలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేశాయో కూడా చూశాము.కరోనా, వాతావరణమార్పులు వాస్తవం కాదని, వాక్సిన్ల వలన ప్రయోజనం లేదని అమెరికా, ఐరోపాలోని ప్రముఖ మీడియా సంస్థలు చేసిన తప్పుడు ప్రచారం తెలిసిందే.

పర్యావరణానికి కలుగుతున్న హాని, వివిధ వ్యాధుల నివారణకు అవసరమైన వాక్సిన్లపై జరిపే పరిశోధనలకు ట్రంప్‌ సర్కార్‌ నిధుల కోత పెడుతున్నది, సిబ్బందిని తగ్గిస్తున్నది. వాతావరణ మార్పులపై పరిశోధన చేస్తున్న ఎన్‌సిఏఆర్‌ వంటి సంస్థలను ఎత్తివేయాలని చూస్తున్నది. వచ్చే ఏడాది ఎలాంటి దాడులను చేస్తుందో తెలియదు, 2025లో పరిశోధనా ప్రయత్నాలు, కీలకమైన శాస్త్రీయ సమాచారంతో పౌరులందరికీ అందుబాటులో వెబ్‌సైట్లను మూసివేసింది.ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే లేదా వ్యతిరేకించేవారి మీద దాడులకు ఉసిగొల్పుతున్నది, పదవుల నుంచి తొలగిస్తున్నది. ప్రజారోగ్య రక్షణలో ముందున్న డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సిడిసి) అధిపతిగా సుసాన్‌ మోనారెజ్‌ బాధ్యతలు స్వీకరించినపుడు అనేక మంది పరిశోధకులు ఊపిరి పీల్చుకున్నారు. ఆమెకు రాజీపడని మైక్రోబయాలజిస్ట్‌ మరియు ఇమ్యునాలజిస్ట్‌ శాస్త్రవేత్తగా పేరుంది. ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలుగా పని చేస్తున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే ఆగస్టులో ట్రంప్‌ ఆమెను బయటకు పంపాడు. ఒక శాస్త్రవేత్తగా రాజీపడని కారణంగానే తనను తొలగించారని ఆమె చెప్పారు.సిడిసిలో కొంత మంది శాస్త్రవేత్తలను తొలగించాలని,ఎలాంటి శాస్త్రీయ సమాచారం లేకపోయినప్పటికీ కొన్ని వాక్సిన్లకు ఆమోద ముద్ర వేయాలని ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్‌ ఎఫ్‌ కెనడీ జూనియర్‌ తనపై తెచ్చిన వత్తిడికి లొంగని కారణంగా తప్పుడు ఆరోపణలతో తొలగించినట్లు ఆమె చెప్పారు. ఈ మంత్రి గతంలో అమెరికాలో అత్యంత అవినీతి సంస్థగా సిడిసిని వర్ణించాడు. వాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కెనడీ వాక్సిన్ల విషయంలోనే ఆమెను వత్తిడి చేయటం అంటే సదరు కంపెనీల లాబీ ఎంతటి శక్తివంతమైనదో అర్ధం చేసుకోవచ్చు. బహిరంగంగా వాక్సిన్లను విమర్శించిన వారిని ఆ సంస్థలో చేర్చాడు. నాలుగో వంతు సిబ్బందిని తగ్గించాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ విధానాలు ప్రజారోగ్యానికి ముప్పు తెస్తాయని మోనారెజ్‌ హెచ్చరించారు.నిబద్దత, ఆత్మగౌరవం ఉన్న శాస్త్రవేత్త ఎవరూ తగిన శాస్త్రీయ సమాచారం లేకుండా వాక్సిన్‌ లేదా ఔషధాలను అంగీకరించరని సుసాన్‌ కూడా అదే చేశారని అనేక మంది ప్రశంసించారు. ఆమెకు మద్దతుగా ఒక వైద్యాధికారి, ముగ్గురు సీనియర్‌ సిడిసి శాస్త్రవేత్తలు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు.

శాస్త్రీయ భావనలు, వైఖరుల మీద ఒక్క అమెరికాలోనే కాదు అనేక దేశాల్లో మితవాదశక్తులు దాడులు చేస్తున్నాయి. గత పదకొండు సంవత్సరాల్లో మనదేశంలో కూడా అదే జరిగింది.ఊహాజనితమైన ఆశాస్త్రీయ సాంకేతికపరమైన అంశాలను అధికారంలో ఉన్న పెద్దలే ప్రచారం చేస్తున్నారు. సైన్సును కాపాడాలంటూ గత ఏడాది ఆగస్టులో అనేక పట్టణాల్లో ప్రదర్శనలు చేసిన శాస్త్రవేత్తలను చూశాము. శాస్త్రీయ భావజాలంపై దాడి, పరిశోధనలకు నిధుల కోత పెట్టటాన్ని, కుహనా సైన్సును ముందుకు తేవటాన్ని నిరసించారు. హిందూత్వ భావజాలానికి అనుగుణంగా విద్యావిధానం, సిలబస్‌లో మార్పులు తెస్తున్నారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయని, ఇతర నాగరికతల కంటే వేదకాలమే గొప్పదనే ప్రచారం చేస్తూ జనాలను నమ్మించేందుకు చూస్తున్నారు. పురాతన కాలంలోనే మన దేశంలో ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసని దానికి నిదర్శనం గణేషుడేనని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే పురాతన కాలంలోనే దేశంలో ఇంటర్నెట్‌, ఉపగ్రహాలు ఉన్నాయని త్రిపుర ముఖ్యమంత్రిగా పని చేసిన బిజెపినేత విప్లవదేవ్‌ చెప్పారు.అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు మహాభారతంలో విదురుడు కూడా ఆ పరిజ్ఞానంతోనే యుద్దంలో జరుగుతున్నదాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడని చెప్పేవారున్న సంగతి తెలిసిందే. పురాతన భారతీయ విజ్ఞానం పేరుతో అనేక కోర్సులను ఐఐటిలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెడుతున్నారు. హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడటానికి మాంసాహారం తినటమే కారణమని హిమచల్‌ ప్రదేశ్‌లోని మండి ఐఐటి డైరెక్టర్‌ లక్ష్మీధర్‌ బెహరా సెలవిచ్చారు. ఇలాంటి అంశాలకు ప్రయోగశాలగా ఐఐటిని మార్చారు. భారతీయ విజ్ఞాన కేంద్రం (ఐకెఎస్‌) పేరుతో ఖరగ్‌పూర్‌ ఐఐటి అనేక అశాస్త్రీయ అంశాలను ప్రచురించింది. ఈ పేరుతో జ్యోతిష్యం వంటి వాటిని నూతన విద్యావిధానంలో చొప్పించేందుకు పూనుకున్నారు. డార్విన్‌ సిద్దాంతాన్ని సిలబస్‌నుంచి తొలగించారు. పురాతన కాలంలో అనేక ఇతర నాగరికతల మాదిరి మనదేశంలో కూడా శాస్త్రవిజ్ఞానం వర్ధిల్లిన మాట నిజం, దానికి అనేక దృష్టాంతాలున్నాయి. వాటిని చూపి నాడు లేనివాటిని కూడా ఉన్నాయని చెప్పటం జనాలను తప్పుదారి పట్టించటమే.పురాణాల్లో ఉన్న పుష్పక విమానాలను చూసే మన సంస్కృత గ్రంధాల్లో ఉన్న సమాచారాన్ని తస్కరించి నేటి విమానాలను పశ్చిమదేశాల్లో తయారు చేశారని చెబుతారు. ఆ గ్రంధాలు మన దగ్గర ఉన్నపుడు మనవారెందుకు చేయలేకపోయారంటే సమాధానం ఉండదు.ఈ పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ సైన్సు వ్యతిరేకచర్యలకు పాల్పడటం ఆశ్చర్యం కలిగించటం లేదు. అతగాడి విధానాలను కార్మికవర్గం ఎలా ప్రతిఘటిస్తున్నదో అదే విధంగా అమెరికా శాస్త్రవేత్తలు ప్రారంభించిన ఉద్యమం కూడా ముందుకు పోయి తగిన ప్రభావం చూపటం అనివార్యం. మనదేశంలో కూడా శాస్త్రవేత్తలు, పురోగామివాదులు ముందుకు వచ్చి అలాంటి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టకపోతే రానున్న తరాలు సైన్సు -జ్యోతిష్యాలలో దేన్ని నమ్మాలో తెలియని అయోమయానికి లోనవుతాయి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?

21 Sunday Dec 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#India trade matters, BJP, China, India exports and Imports, Japan, Narendra Modi Failures, Nirmala Sitharaman, Rupee, Rupee fall under Modi rule, US Dollar

ఎం కోటేశ్వరరావు

వినేవారికి కేవలం చెవులే ఉండి మెదడులో పదార్ధం లేకపోతే చెప్పేవారు ఎన్ని కతలైనా వినిపిస్తారు. రూపాయి పతనం గురించి ఇప్పుడు అదే నడుస్తున్నది. డాలరు విలువ పెరిగింది తప్ప మన రూపాయి పడిపోలేదని ఒక పాట, మిగతా కరెన్సీలతో పోలిస్తే మన పతనం తక్కువ, ఇతర కరెన్సీలన్నీ ఇలాగే ఉన్నాయంటూ మరోముక్తాయింపు. గతంలో వీరే ఏం చెప్పారంటే తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే ……. అన్నట్లుగా ఉంది. అవునులే నడిచినంత కాలం దేశం కోసం ధర్మం కోసం అంటూ ఏమైనా చెప్పవచ్చు, చేయవచ్చు. డాలరుతో పోటీ పడి మన రూపాయి విలువను ఎందుకు పెంచలేదని ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహం నేరం కింద జైల్లో వేస్తారు. రూపాయి పతనమైతే వచ్చే నష్టం ఏమిటి ? ఉదాహరణకు నరేంద్రమోడీకి అమెరికాలో ఉన్న పలుకుబడి కారణంగా గత పదకొండేళ్లుగా మనం కేవలం పదిడాలర్లకే విమానంలో అమెరికా వెళుతున్నాం, రాయితీ టిక్కెట్ల ధరలు పెంచలేదు అనుకుందాం. గత ఏడాది కాలంలో రూపాయి విలువ 85 నుంచి 91కి దిగజారింది. టికెట్‌ కొనుక్కోవాలంటే రు.850 బదులు రు.910 చెల్లించాలి. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే రూపాయి పాపాయికి రక్షణ లేకుండా పోయిందని నరేంద్రమోడీ, బిజెపి నేతలు ఊరూవాడా నానా యాగీచేసి అధికారానికి వచ్చినపుడు కేవలం రు.600లకే ఆ టికెట్‌ దొరికేది. బిజెపి నేత సుబ్రమణ్య స్వామి చెప్పినట్లు మోడీ వస్తే విలువను 35కు పెంచుతామని చెప్పారు. ఆ పుణ్యం కట్టుకొని ఉంటే రు.350కే దొరికేది. ఇది అత్యాశ అనుకున్నా కనీసం ”56” కు పెంచినా రు.560కి దొరికేది. మోడీకి అంత బలమైన ఛాతీ ఉందని జనం నమ్మేవారు. బిజెపి ప్రభుత్వ నిర్వాకం గురించి ఇంతకంటే వివరణ అవసరం లేదేమో ?

ప్రధాన మంత్రికి రోజూ సలహాలిస్తున్న ఆర్థిక సలహామండలి సభ్యుల్లో ఒకరైన సంజీవ్‌ సన్యాల్‌ పుండు మీద కారం చల్లుతున్నారు. రూపాయి పతనంపై తనకెలాంటి ఆందోళన లేదని చెప్పారు.ఆర్ధిక స్థితికి – రూపాయికి సంబంధం లేదని, దేశాల ఆర్థిక వ్యవస్థలలో ఉన్నత వృద్ధి రేటు ఉన్నపుడు తరచుగా కరెన్సీ మారకపు విలువలు తక్కువగా ఉంటాయన్నారు. రూపాయి పతనం 91 నుంచి వందకు చేరి నరేంద్రమోడీ కళ్లలో ఆనందం చూసే సమయం దగ్గరపడుతున్నదని నెటిజన్లు స్పందిస్తున్న తరుణమిది. టైమ్స్‌ నెట్‌వర్క్‌ 2025 సమావేశంలో సన్యాల్‌ మాట్లాడారు.దేశీయంగా ద్రవ్యోల్బణానికి కారణం కానంత వరకు రూపాయి పతనమైనా ఇబ్బంది లేదని, వెనక్కు తిరిగి చూస్తే జపాన్‌ ఆర్థిక వ్యవస్థ చాలా చాలా వేగంగా పురోగమిస్తున్నపుడు దాని కరెన్సీ చాలా బలహీనంగా ఉంది.చైనా తన కరెన్సీ విలువను పెరగనిచ్చేంతవరకు 1990, 2000దశకాల్లో అలాగే ఉందంటూ సన్యాల్‌ చెప్పారు. ఒక దేశ కరెన్సీ డాలరుతో మారకపు విలువ తక్కువగా ఉన్నపుడు ఆయాదేశాల వస్తువుల ధరలు ప్రపంచ మార్కెట్లో చౌకగా ఉండి ఎగుమతులు పెరిగేందుకు అవకాశం ఉండే మాట నిజం. కానీ మన కరెన్సీ పతనమైనా ఎగుమతులు దానికి అనుగుణంగా ఎందుకు పెరగలేదో పెద్దలు చెప్పాలి. చైనానే తీసుకుంటే జిడిపిలో దాని ఎగుమతులు 2013లో 24.6శాతం కాగా 2024లో 20శాతానికి తగ్గాయి. దాని యువాన్‌ విలువ పెరిగిందని సరిపెట్టుకుందాం. సన్యాల్‌ వాదన ప్రకారం దాని కరెన్సీ విలువ పెరిగింది కనుక తగ్గినట్లు అంగీకరిద్దాం. భారత్‌ పరిస్థితి ఏమిటి ? 2013లో జిడిపిలో మన ఎగుమతులు 25.43 శాతం కాగా 2024లో 21.2శాతానికి తగ్గాయి. ఈ కాలంలోనే కదా మన రూపాయి విలువ 60 నుంచి ఇప్పుడు 91కి పడిపోయినా ఎగుమతులు ఎందుకు తగ్గినట్లు ? జపాన్‌ ఎన్‌ విలువ డాలరుకు 2014లో 106కాగా ఇప్పుడు 157కు తగ్గింది. ఇదే కాలంలో దాని జిడిపిలో ఎగుమతులు 15.8 నుంచి 22.8శాతానికి పెరిగాయి. మన కరెన్సీ విలువపతనమైనా ఎగుమతులు ఎందుకు పెరగలేదు ? అందుకని రూపాయి పతనం గురించి ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకుంటున్నారు. వారి ధైర్యం ఏమంటే దీని గురించి సామాన్యులకు నిజానిజాలు తెలుసుకొనే తీరిక, ఆసక్తి లేదా తెలివి తేటలు ఉండవనే గట్టి నమ్మకం. అభివృద్ధి చెందుతున్నపుడు కరెన్సీ విలువను తగ్గించి ఉంచుతారని చెప్పటమంటే కావాలనే పతనాన్ని ప్రోత్సహిస్తున్నారు లేదా పతనమౌతుంటే కాగల కార్యం గంధర్వులు తీర్చుతున్నారన్నట్లుగా చూస్తూ ఊరుకున్నట్లు కనిపిస్తున్నది. రూపాయి పతనం అవుతుంటే ఎగుమతిదార్లు సంతోషిస్తారు, దిగుమతిదార్లు పెరిగిన భారాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు, వారికి పోయేదేమీ లేదు, జనాలకు జేబులు గుల్ల. అందుకే సన్యాల్‌ వంటి ఆర్థికవేత్తలకు ఎలాంటి ఆందోళన ఉండదు. ఒక్క సన్యాలే కాదు. ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ ఇంకా తీవ్రమైన వ్యాఖ్య చేశారు. రూపాయి పతనం అవుతుంటే ప్రభుత్వం ” నిద్ర చెడగొట్టుకోవటం ”లేదన్నారు. అంటే తాపీగా తడిబట్ట వేసుకొని ఉందని వేరే చెప్పనవసరం లేదు.

బిజెపి పెద్దలు ప్రతిపక్షంలో ఉన్నపుడేంచెప్పారో చూద్దాం. రాజ్యసభలో బిజెపి ఉపనేతగా ఉన్న రవి శంకర్‌ (2013 జూలై 10) రూపాయి విలువ 60.15కు పడిపోయినపుడు ” జాతీయ స్వాభిమానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది,ప్రభుత్వం ఏమి చెప్పినప్పటికీ ఆర్థిక మూలాలు విపరీతంగా దిగజారుతున్నయనేందుకు ఇది నిదర్శనం. విదేశీ పెట్టుబడులపై ఆధారపడటం దుర్బల నమూనా, ఎక్కువగా వాటిపై ఆధారపడితే అవెంత వేగంగా వస్తాయో అదే విధంగా వెనక్కు వెళతాయి.” ఇలాంటి పెద్ద మనుషులందరూ 2014లో అధికారానికి వచ్చినకొత్తలో మోడీ పదే పదే విదేశాలకు ఎందుకు వెళుతున్నారంటే దేశప్రతిష్ట పునరుద్దరణ, విదేశీ పెట్టుబడుల కోసం అని సమర్ధించిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. యుపిఏ ప్రభుత్వ హయాంతో పోల్చితే ఎక్కువగా రూపాయి పతనమైంది. ఇప్పుడు స్వాభిమానం పెరిగినట్లా దిగజారినట్లా ? ఆడవారి మాటలకు అర్దాలే వేరులే అని మహిళలను రచయిత పింగళి నాగేంద్రరావు మిస్సమ్మ సినిమాలో తూలనాడారు గానీ బిజెపి నేతల మాటలకు అది వర్తిస్తుంది.

చిట్కాలు చెప్పటంలో మన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పెట్టింది పేరు. రూపాయి పతనం చెందినందుకు అసలు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే పోతుంది అన్నారు.(2013సెప్టెంబరు ఒకటి) చెన్నరులో మాట్లాడుతూ పక్షవాతం వచ్చిన ప్రభుత్వాన్ని దేశం భరించలేదు, ఈ అనిశ్చితిని తొలగించటం మంచిది, సాధ్యమైనంత మేరకు త్వరగా ఎన్నికలు పెట్టాలి. మన్మోహన్‌ సింగ్‌ దేశ ఆర్థిక బాధల కంటే తన పేరు ప్రతిష్టలను పెంచుకోవటం గురించి ఎక్కువగా శ్రద్ద చూపుతున్నారు. ప్రభుత్వ పెద్దగా దీనికి బాధ్యత ఎవరిదో నిర్ణయించాలి. సదరు వ్యక్తిని తొలగించాలి లేదా తానే బాధ్యత తీసుకోవాలి ” ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా వేదంలా విలువైన దంటూ ఒక పాట గుర్తుకు వచ్చింది. ఇప్పుడు నరేంద్రమోడీని లేదా కనీసం నిర్మలాసీతారామన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలి మరి, చేస్తారా ? బిజెపి జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ గడ్కరీ (ఇప్పుడు జాతీయ రహదారుల కేంద్ర మంత్రి) ఉన్న సమయంలో(2012 మే 24) రూపాయి పతనానికి ప్రపంచ కారణాలు కానేకాదంటూ ” సమస్య యూరో జోన్‌లో కాదు, యుపిఏ జోన్‌లో ఉంది. ఆర్థికవేత్త అయిన మన ప్రధాని నాయకత్వంలో రూపాయి స్వేచ్చగా పతనమౌతున్నది.” బిజెపి మరోనేత పియూష్‌ గోయల్‌, ఇప్పుడు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి 2013 జూన్‌ 26న ఒక ట్వీట్‌ చేశారు(ఇప్పుడు ఎక్స్‌) పతనం అవుతున్న రూపాయిని చూస్తుంటే చాలా వేదనా భరితంగా ఉంది ” రూపాయి పతనం కాకుండా మోడీ ప్రభుత్వం ఏమైనా పడకుండా కాపాడుతున్నదా ? గోయల్‌ ఆనందంతో గంతులు వేస్తున్నారా ? బిజెపి అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ 2013లో మాట్లాడుతూ రూపాయి పతనాన్ని ఆపలేనట్లయితే మన్మోహన్‌ సింగ్‌ రాజీనామా చేయాలి.ఒక ఆర్థికవేత్తగా ఏం చేస్తున్నారు ? పదవిలో కొనసాగే హక్కులేదు ” అని చెప్పారు. మరో బిజెపి నేత ప్రకాష్‌ జవదేకర్‌ 2013లో మాట్లాడుతూ ” పూర్తిగా దివాలాకోరు ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోలేని స్థితి,పాలన లేదు. రూపాయి పతనానికి అసమర్ధ నాయకత్వమే కారణం, మన్మోహన్‌ సింగ్‌, ఆయన మంత్రులే బాధ్యులన్నది స్పష్టం. మౌలిక సదుపాయాలు, వాణిజ్యంపై సకాలంలో చర్యలు తీసుకుంటే రూపాయి పతనాన్ని అరికట్టవచ్చు ” అన్నారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉందటూ ప్రధానిగా మోడీ పేరును ముందుకు తెచ్చిపుడు చెప్పారు. సదరు అనుభవం రూపాయి పతనాన్ని ఆపలేకపోయింది. ఇక మౌలిక సదుపాయాల గురించి అతిశయోక్తులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎనిమిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం పెద్ద ప్రకటనలు ఇచ్చి విజయాల గురించి చెప్పుకుంది.తమ ఏలుబడిలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 140కి పెరిగిందన్నది వాటిలో ఒకటి. నిజానికి 2014లో దేశంలో 94 పని చేస్తున్నవి, 31పని చేయనివి ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్‌ అధారిటీ వార్షిక నివేదికలో ఉందని ఫాక్ట్‌చెకర్‌ అనే వెబ్‌ పోర్టల్‌ పేర్కొన్నది. యుపిఏ పాలనలో రోజుకు 12కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించగా తాము 37 కిలోమీటర్లు నిర్మించినట్లు చెప్పుకుంది. నిజానికి తొమ్మిది సంవత్సరాల సగటు 19.17 కిలోమీటర్లు మాత్రమే, 2021లో 36.5 కిలోమీటర్లు నిర్మించారని లోక్‌సభకు అందచేసిన సమాచారంలో పేర్కొన్నారు. అందువలన అసత్యాలు,అర్ధసత్యాలకు మోడీ సర్కార్‌ పేరు మోసిందన్నది సత్యం.రూపాయి పతనం గురించి ఒక్క బిజెపి నేతలే కాదు, వారిని సమర్ధించే సినీనటీనటులు, ఆధ్యాత్మికులం అని చెప్పుకొనే బాబాలు కూడా యుపిఏ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వారు తలలు ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు. జూహీ చావ్లా ఒకపుడు ప్రముఖ హీరోయిన్‌, 2013 ఆగస్టు 21న ఒక ట్వీట్‌ చేశారు.” దేవుడా నీకు కృతజ్ఞతలు, నా అండర్‌వేర్‌ పేరు డాలర్‌, రూపాయి గనుక అయి ఉంటే అది మాటి మాటికీ జారిపోతూ ఉండేది ” అని పేర్కొన్నారు. నెటిజన్లు మామూలుగా స్పందించలేదు, ఇప్పుడు ఆమె అండర్‌వేర్‌ను చూడాలి,రూపాయి పడిపోకుండా డాలర్‌కు రాఖీ కట్టటం(ముడివేయటం) ఆపిందేమో అంటూ సెటైర్లు. గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ ఒక ట్వీట్‌లో నరేంద్రమోడీ అధికారానికి వస్తే రూపాయి విలువ 40కి పెరుగుతుందని పేర్కొన్నారు. నిజమే అతని పేరులో ఉన్న ఒక్కో శ్రీ కి 45 రూపాయల చొప్పున ఇప్పుడు 90కి దిగజారిందరటూ జోకులు. బాబా రామ్‌దేవ్‌ యుపిఏ ప్రభుత్వం మీద ఆరోపణల పత్రం(చార్జిషీట్‌) దాఖలు చేయాలని 2013లో చెప్పారు.ఈ 0.75కంటి మనిషి కాంగ్రెస్‌ మీద చార్జిషీట్‌ వేయాలన్నారు, ఇప్పుడు స్వదేశీ పేరుతో భక్తులను వెర్రి వెంగళప్పలను చేస్తున్నాడంటూ నెటిజన్లు ఆడుకున్నారు.

బిజెపిలో సుబ్రమణ్యస్వామి స్థానం ఏమిటో ఒక బ్రహ్మపదార్ధం.తనకు పదవులు ఇచ్చినపుడు, కావాల్సినపుడు ఒక మాట లేనపుడు మరోమాట మాట్లాడతారు, అయినా ఎలాంటి చర్య తీసుకొనే ధైర్యం బిజెపికి లేదు. ఆ పెద్దమనిషి ఆర్థికవేత్త కూడా, 2014 ఏప్రిల్‌ 27న మాట్లాడుతూ ఎన్‌డిఏ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేట్లయితే మోడీ ప్రధానమంత్రి అవుతారు, రెండు సంవత్సరాలలోపు రూపాయి బలపడి రు.35కు చేరుతుంది ” అన్నారు. నిర్మలా సీతారామన్‌ ప్రతిపక్షంలో ఉండగా ఏం చెప్పారో చూద్దాం ” రూపాయి పతనం చెందుతున్నపుడు మీరు ఊహించుకోవచ్చు, భారత ఎగుమతులు పెరుగుతాయి, ఎందుకంటే మీ వస్తువులు చౌకగా మారతాయి. మీ వస్తువులను కొనేందుకు విదేశాల వారు ఆకర్షణకు లోనౌతారు. కానీ అలా జరగటం లేదు, మీ వస్తువులను కొనాలని జనాలు అనుకోవటం లేదు. మీ పెట్టుబడులు పెరుగుతున్నాయి, రూపాయి పతనం అవుతున్నా మీ ఎగుమతులు పెరగటం లేదు, ఇది తీవ్రమైన పరిస్ధితి. ఆందోళన పడాల్సిన అవసరం లేదని మనకు ప్రతిసారీ ప్రభుత్వం చెబుతున్నది. నేను ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చాను.నాకు తెలుసు అనేక మంది తమకున్న కొద్దిపాటి పొలాలను కూడా అమ్ముకొని విదేశాల్లో చదువుకుంటున్న తమ పిల్లల కోసం డబ్బు చెల్లించారు. రూపాయి విలువ పతనం కారణంగా బయట ఉన్న విద్యార్ధులు చదువులను మధ్యలో ఆపివేసి తిరిగి రాకతప్పటం లేదు.మనం ఎప్పుడైనా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల గురించి మాట్లాడుతున్నాం రూపాయి పతనం గురించి చెబుతున్నామా ? మనకేమీ చెప్పటం లేదు ” ఒకనాడు తెలుగింటి కోడలిగా ఉన్న ఆమె ఇప్పుడు మాట్లాడటం లేదేం ?

పైన చెప్పుకున్నవారందరికీ తిరుగులేని నేత నరేంద్రమోడీ ఏం సెలవిచ్చారో చెప్పుకోకపోతే ప్రహసనం సంపూర్ణం కాదు. ప్రధానమంత్రి పదవి స్వీకరించిన తరువాత రూపాయి పతనం గురించి నోరెత్తితే భారతమాత మీద ఒట్టు. అఫ్‌కోర్స్‌ మహానుభావులుగా మారిన తరువాత వారి మౌనానికి ఎన్నో అర్దాలు ఉంటాయనుకోండి. కర్ణాటకలోని హుబ్లీలో 2014 ఫిబ్రవరి 28న జరిగిన సభలో మాట్లాడుతూ ఇలా అన్నారు.” మన రూపాయి నిలకడ లేకుండా ఉంది. విలువ పడిపోతూనే ఉంది. అతల్‌ జీ ప్రభుత్వంలో రూపాయి 40-45 మధ్య ఉంది,ఈ ప్రభుత్వ హయాంలో 62,65,70…..గా పడిపోతూనే ఉంది.దిగుమతులు పెరుగుతున్నాయి, ఎగుమతులు తగ్గుతున్నాయి…స్పృహ ఉన్న ప్రభుత్వం చేయాల్సినపని ఎగుమతులను పెంచాలి, దిగుమతులను తగ్గించాలి ” పదకొండు సంవత్సరాల పాలనలో మోడీ ప్రభుత్వం చేసిందేమిటి ? తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం 2025లో చైనా కస్టమ్స్‌శాఖ చెబుతున్నదాని ప్రకారం బీజింగ్‌తో మన వాణిజ్య లోటు 115 బిలియన్‌ డాలర్లు, మనదేశం 106 బిలియన్‌ డాలర్లు అంటున్నది, ఏ సంఖ్యను చూసినా మోడీ తన రికార్డులను తానే బద్దలుకొట్టుకున్నారు. పదకొండు సంవత్సరాల మోడీ ప్రభుత్వ నిర్వాకాన్ని చూసినపుడు 2014 తరువాత ఒక్క ఏడాది కూడా ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గలేదు. పదకొండు సంవత్సరాలలో మన వాణిజ్య లోటు 80వేల కోట్ల డాలర్లు. తొలి ఏడాది 607 కోట్ల డాలర్లు లోటు ఉంటే 2024-25లో అది 950 కోట్ల డాలర్లకు చేరింది. అయినా సరే సమర్ధవంతమైన పాలన అందిస్తున్నామని చెబుతుంటే మనమంతా నిజమేకదా అని నమ్ముతున్నాం, విశ్వాసం అలాంటిది మరి. రూపాయి గురించి గతంలో నరేంద్రమోడీ ఇంకా ఏం చెప్పారు ! రూపాయి ఆసుపత్రిలో ఉంది ఐసియులో చేర్చారు. సంక్షోభం వచ్చింది, ఇలాంటి సమయాల్లో ఆశల్లేనపుడు, నాయకత్వం ఎటుపోతున్నదో తెలియనపుడు సంక్షోభం మరింత తీవ్రం అవుతుంది. ఒకసారి రూపాయి పతనం అయితే ప్రపంచ శక్తులు దాన్ని పూర్తి అవకాశంగా మలుచుకుంటాయి. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం రూపాయి పోటీ పడుతున్నాయి, రూపాయి విలువ వేగంగా పతనం అవుతున్నది. అతల్‌ జీ అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ రు.42 ఉంది, దిగిపోయేటపుడు 44, కానీ ఈ ప్రభుత్వం(యుపిఏ) దాన్ని రు.60కి దిగజార్చింది. రూపాయి బలాన్ని కోల్పోవటం లేదు, దాని సైజు మారింది, ఎందుకంటే ఢిల్లీలో అధికారంలో ఉన్నవారు అవినీతి మీద కేంద్రీకరించారని చెప్పారు. నిజంగా బిజెపి నేతలకు, వారిని సమర్ధించేవారికి భారతీయ ఆత్మ, విలువలు, వలువలు ఉండి వారి గతాన్ని నెమరువేసుకుంటే వారి ముఖాలు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !

05 Friday Dec 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, IMF about India, India economy, India GDP, India growth rates, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

పరీక్షల్లో మార్కులు తగ్గితే విద్యార్దుల గ్రేడ్‌ (నాణ్యత) తగ్గుతుంది.సమాధానాల పేరుతో పేజీల కొద్దీ రాసినా అసలు విషయాలు లేకపోతే మార్కులు పడవు. పదకొండు సంవత్సరాల పాలనలో నరేంద్రమోడీ సర్కార్‌ అందచేస్తున్న జిడిపి వృద్ధి అంకెల నాణ్యతను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) గతంలో ప్రశ్నించింది. ఎలాంటి స్పందన మార్పులు లేకపోవటంతో కొద్ది రోజుల క్రితం సి గ్రేడ్‌కు తగ్గించింది.దీని గురించి గురువారంనాడు (2025 డిసెంబరు 4) లోక్‌సభలో సమర్ధించుకుంటూ వచ్చే ఏడాదినుంచి 2022-23 సంవత్సరాన్ని నూతన ప్రాతిపదికగా తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఎన్‌సిపి సభ్యురాలు సుప్రియా సూలే అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గణాంకవిధానం గురించి ఐఎంఎఫ్‌ చెప్పింది తప్ప అభివృద్ధి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అనేక అంకెలకు బి గ్రేడ్‌ ఇచ్చిందని నిర్మలమ్మ అన్నారు.మన అంకెల నాణ్యత నాలుగు గ్రేడ్లలో దిగువ నుంచి రెండవదిగా ఉంది.దీనికి అభివృద్ధి అంచనాలకు సంబంధం లేదు, వాటికి చెబుతున్న భాష్యం మీదనే పేచీ. గణింపుకు మీరు తీసుకున్న ప్రాతిపదిక, పద్దతి తప్పు, పాతబడిన సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని భాష్యాలను చెబుతున్నారంటూ 2025 ఆర్టికల్‌ నాలుగు నివేదికలో తలంటింది. మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానం గురించి ఇంటా బయటా గత పదేండ్ల నుంచి అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఎలాంటి చలనం లేదు. ప్రస్తుతం 2011-12 సంవత్సర అంకెలను ప్రాతిపదికగా తీసుకొని గణాంకాలను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి 2022-23 ప్రాతిపదికగా కొత్త సూచీలను రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వ గణాంక మరియు కార్యక్రమాల అమలు శాఖ ప్రకటించింది. అయినప్పటికీ ఐఎంఎఫ్‌ మనదేశ సమాచార నాణ్యత గ్రేడ్‌ను తగ్గించింది. అంతర్జాతీయంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొత్త ప్రాతిపదికన నూతన సూచీలను తయారు చేస్తారు. ఐఎంఎఫ్‌ చర్యతో మరోసారి కేంద్రం చెబుతున్న అభివృద్ధి అంకెల విశ్వసనీయత గురించి మీడియా, సామాన్య జనంలో చర్చలేకపోయినా ఆర్థికవేత్తలలో మొదలైంది.

మన దేశ జిడిపి గురించి ప్రభుత్వం చెప్పే అంకెలకు ఐఎంఎఫ్‌ అంచనాలకు తేడా ఉంది. అది విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిజమైన జిడిపి వృద్ధి రేటు 6.5శాతం కాగా 2025-26 తొలి మూడు మాసాల్లో 7.8శాతం ఉంది. అయితే ఐఎంఎఫ్‌ మాత్రం 2025-26లో 6.6శాతం ఉంటుందని, మరుసటి ఏడాది 6.2శాతమని అంచనా వేసింది.మన ప్రభుత్వం అనుసరిస్తున్న గణాంక, విశ్లేషణ పద్దతులపై ఐఎంఎఫ్‌ చాలా సంవత్సరాల నుంచి విబేధిస్తున్నప్పటికీ సంస్థ నిబంధనల ప్రకారం సభ్యదేశాలు ఇచ్చిన అధికారిక సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకొని తన విశ్లేషణలను అందిస్తున్నది. వాటి గురించి తన భిన్నాభిప్రాయాన్ని చెప్పవచ్చు తప్ప సమాచారాన్ని తిరస్కరించేందుకు వీల్లేదు. కొద్ది సంవత్సరాలుగా వెల్లడిస్తున్న అభిప్రాయాలను జనం దృష్టికి తేలేదు. ఇప్పుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.గత పదేండ్లలో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, కరోనా తరువాత చెప్పే అంకెలకు, వాస్తవానికి తేడా ఉంటోందని ఐఎంఎఫ్‌ భావించింది. కొద్ది సంవత్సరాలుగా అంతర్గతంగా తన విబేధాలను వెల్లడిస్తూనే ఉంది, చివరికి 2025లో సమాచారం నాణ్యత గురించి గ్రేడ్‌ను తగ్గించింది. ఇప్పుడెందుకు ఆపని చేసింది. ముందే చెప్పుకున్నట్లుగా వచ్చే ఏడాది 2022-23 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని కొత్త సిరీస్‌ను విడుదల చేయనుంది గనుక ఇప్పటి వరకు గమనించిన లోపాలను సరిదిద్దాలనే ఉద్దేశ్యంతోనే ఈ పనిచేసిందని చెబుతున్నారు.ప్రస్తుతం ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చే సమాచారాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నది తప్ప సంఘటిత, అసంఘటితరంగ సమాచారాన్ని నిర్దిష్టంగా సేకరించటం లేదనే విమర్శ ఉంది. ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకు టోకు ధరలను ప్రామాణికంగా తీసుకుంటున్నది, దీనికి బదులు ఉత్పత్తి ధరలు, రంగాల వారీ ధరలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. మొత్తం మీద ఆర్థిక రంగం గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు కదా, నాణ్యత లేని సమాచారం ఆధారంగా తీసుకోవటాన్ని ఐఎంఎఫ్‌ తప్పుపట్టిందని మాత్రమే కొందరు సూత్రీకరిస్తున్నారు. రుణాలు, విదేశీమారకద్రవ్యం, ఖర్చు గురించి సరైన లెక్కలే చెబుతున్నారు కదా అంటున్నారు. ముఖం ఎలా ఉందో ఎవరికైనా తెలుస్తుంది,దాన్ని వేరేగా చెబితే వెంటనే బండారం బయటపడుతుంది. శరీరం అంతర్భాగంలో ఉన్నవాటిని ఎవరో ఒక నిపుణుడు చెబితేనే కదా మనకు తెలిసేది, ఆ చెప్పటంలోనే నిపుణుల మధ్య ఏకాభిప్రాయం, నాణ్యత లేదన్నది సమస్య. కేవలం చెయ్యి చూసి అంతాబాగానే ఉందంటే కుదురుతుందా ? నాణ్యత లేని వస్తువును కొన్నపుడు అది ఎంతకాలం మన్నుతుందో తెలియదు, నాణ్యత లేని సమాచారం ప్రాతిపదికగా ఏ రంగమైనా దీర్ఘకాలిక వ్యూహాలను ఎలా రూపొందించుకుంటుంది ?

జిడిపి వృద్ధి రేటు ఎక్కువగా ఉందని చూపుతున్నపుడు దానికి తగినట్లుగా కార్పొరేట్‌ ఫలితాలు కనిపించటం లేదన్నది కొందరి ప్రశ్న. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జడిపి వృద్ధి రేటు 7.4శాతం ఉంటుందని, పబ్లిక్‌ ఫైనాన్స్‌ మరియు విధాన జాతీయ సంస్థ(ఎన్‌ఐపిఎఫ్‌పి) చెప్పింది.మూడీస్‌ రేటింగ్‌ సంస్థ 2026, 2027 సంవత్సరాలలో ప్రపంచ వృద్ధి రేటు 2.5 -2.6శాతం మధ్య, భారత వృద్ధి 6.4 మరియు 6.5, చైనా 4.5శాతం ఉంటుందని పేర్కొన్నది. ఇవి చూడటానికి బాగానే ఉన్నాయి.పశ్చిమ దేశాల సూత్రం ప్రకారం జిడిపి వృద్ధి రేటు కంటే కార్పొరేట్‌ లాభాల రేటు మూడు, నాలుగుశాతం ఎక్కువగా ఉంటుంది.మనదేశంలో కూడా దశాబ్దాల పాటు అలాగే ఉంది. కానీ సెప్టెంబరుతో ముగిసిన మూడు మాసాల్లో నిఫ్టీ 50 సూచికలో పెరుగుదల కేవలం ఏడుశాతమే. మొత్తం లాభాలు 13శాతం కాగా పన్నులు పోను నిఖర లాభం తొమ్మిదిశాతమే ఉంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించకపోవచ్చుగానీ దాన్ని విస్మరించలేము.నిప్టీ మైక్రోకాప్‌ 250 అమ్మకాల వృద్ధి 12శాతం ఉన్నా, మొత్తం లాభాలు ఆరుశాతమే ఉన్నాయి. జిడిపి వృద్ధి రేటు స్థిరంగా ఉంటే ఈ ఫలితాల సంగతేమిటి ? ఏ అంకెలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు ? ఆసియన్‌ పెయింట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ 2024 మేనెలలో జిడిపి అంకెలు ఎలా వస్తున్నాయో నాకు నమ్మకం లేదు అని వ్యాఖ్యానించాడు. ఆ మాటలు వైరల్‌ కావటంతో ఒక్క రోజులోనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. ఎక్కడి నుంచి వత్తిడి వచ్చిందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

పిండికొద్దీ రొట్టె అన్నారు.కుండలో కూడు కూడు అసలుందో లేదో ఉంటే ఎంత ఉందో,పిల్లాడు తిన్నాడో లేదో తెలియదు గానీ దుడ్డులా ఉన్నాడు అని చెబుతున్నట్లుగా అభివృద్ధి గొప్పగా ఉందని భాష్యం చెబుతున్నారు. జిడిపికి దోహదం చేసేవాటిలో వినియోగవృద్ధి ఒకటి.దేశంలో నిజవేతనాలు పడిపోవటం లేదా గిడసబారి పోయినట్లు చెబుతుండగా గృహస్తుల వినియోగం పెరిగిందని చెప్పటం మీద అనుమానాలు ఉన్నాయి. రెండవ అంశం పెట్టుబడులు, మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు పెట్టుబడులు నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు జిడిపిలో 31.3శాతం ఉంటే 2024-25లో 29.6శాతం ఉన్నాయి. మధ్యలో ఒక ఏడాది మాత్రమే 31.2శాతం నమోదయ్యాయి. మిగిలిన అన్ని సంవత్సరాలలో అంతకంటే తక్కువే.ఈ కాలంలో కార్పొరేట్‌ పన్ను మొత్తం ప్రైవేటు రంగానికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని చూస్తే కార్పొరేట్‌ పన్ను విధింపు 30శాతం నుంచి 15కు తగ్గించారు. అయినా పారిశ్రామికరంగం వాటా జిడిపిలో 2014తో పోల్చితే తగ్గింది లేదా స్థిరంగా ఉంది తప్ప పెరగలేదు. చైనాలో సాధారణ కార్పొరేట్‌ రేటు 25శాతం కాగా మన దేశంలో కొత్త సంస్థలకు 15శాతంగా రాయితీ ఇచ్చినప్పటికీ చైనా నుంచి కంపెనీలు ఆశించిన స్థాయిలో రాలేదు. మేకిన్‌ ఇండియా విధానంతో 2022 నాటికి జిడిపిలో పారిశ్రామిక రంగం వాటా 25శాతం లక్ష్యంగా చెప్పారు.తరువాత దాన్ని 2025కు పొడిగించామన్నారు. వాస్తవ పరిస్థితి ఏమిటి 2006లో 17.3శాతం ఉండగా మోడీ అధికారానికి వచ్చినపుడు 2014లో 15.07 నమోదైంది తరువాత నేటి వరకు చూస్తే 13శాతానికి పడిపోయింది. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా పదవ స్థానంలో ఉన్న జిడిపిని ఐదుకు తెచ్చామంటారు, మరి దీని సంగతేమిటి ? జిడిపిని 2022 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామన్నారు, పారిశ్రామిక ఉత్పాదకత పెరగకుండా అదెలా సాధ్యం ? ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయాయి, ప్రభుత్వ పెట్టుబడులు పెట్టటం లేదు. ఆర్థిక మాంద్యం వచ్చినపుడు అమెరికాలో భారీ మొత్తంలో రోడ్లు, వంతెనలు, రైల్వే వంటి మౌలిక సదుపాయాల మీద అక్కడి ప్రభుత్వం ఖర్చు చేసి కొనుగోలు శక్తి పెంచేందుకు చూసింది. అక్కడి మాదిరి మాంద్యాలు లేకపోయినా మందగమనం కారణంగా మనదేశంలో కూడా జరుగుతున్నది అదే. ప్రైవేటు రంగంలో తనకు లాభం ఉంటుందా లేదా అని ఆచితూచి పెట్టుబడులు పెడుతోంది.వాజ్‌పారు నుంచి మధ్యలో మన్మోహన్‌ సింగ్‌, ఇప్పుడు నరేంద్రమోడీ వరకు భారీమొత్తాలను కేటాయించి జాతీయ రహదారులనిర్మాణం, రైల్వే విస్తరణ, సరిహద్దుల్లో రోడ్లు, వంతెనల వంటివి నిర్మిస్తున్నారు.అవి లేకపోతే పరిస్థితి మరింత దిగజారి ఉండేది, బిజెపి నేతలు రోడ్లను చూపి చూశారా మా ప్రతిభ అంటున్నారు. అదే సామర్ధ్యాన్ని ఉత్పాదకరంగంలో ఎందుకు చూపలేకపోతున్నారు ? మోటారు వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌ వంటి వాటి ఉత్పాదకతను పెంచకపోయినా పడిపోకుండా చూసేందుకు ఇటీవల తగ్గించిన జిఎస్‌టి కూడా ఆయా రంగాలకు ఉద్దీపనలో భాగమే.చిత్రం ఏమిటంటే జిఎస్‌టి తగ్గించిన రెండు నెలల తరువాత నవంబరు మాసంలో పన్ను వసూలు పెరగకపోగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువగా నమోదైంది. అందుకే నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి భజనబృందాలు ఇప్పుడు మూగపోయాయి.

జిఎస్‌టి తగ్గింపు గురించి గతేడాదే సంప్రదింపులు మొదలయ్యాయి. తగ్గింపుతో డిమాండ్‌ పెరిగి ప్రైవేటు రంగానికి పెద్ద ఊపువస్తుందన్న అంచనాతో 2025-26 బడ్జెట్‌లో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించేందుకు పూనుకుంది. వాటిలో గ్రామీణ ఉపాధిపథకానికి నిధుల కోత ఒకటి.2023-24లో రు.89,154 కోట్లు ఖర్చు చేస్తే 2025-26లో రు.86వేల కోట్లకు కుదించారు.2025 జనవరిలో చూస్తే ఏడు రాష్ట్రాలలో ప్రకటించిన వేతన సగటు రు.294 కాగా చెల్లించిన మొత్తం రు.257 మాత్రమే. తెలంగాణాలో రు.319కిగాను రు.276, ఆంధ్రప్రదేశ్‌లో రు.300కు గాను రు.258 చెల్లించారు. జిడిపిలో ప్రభుత్వ ఖర్చు వాటాను 15.6 నుంచి 15శాతానికి తగ్గించారు. వాస్తవంలో ఇంకా దిగజారుతుందేమో తెలియదు. మొత్తంగా దేశమంతటా శ్రామికుల నిజవేతనాలు పెరగకుండా వస్తు, సేవలకు గిరాకీ పెరగదు. ఉద్యోగులకు వేతన సవరణ చేసినంత మాత్రాన మొత్తం గిరాకీ మీద దాని ప్రభావం పెద్దగా ఉండదు. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే కోట్లాది మంది రాబడిని పెంచే అసంఘటిత రంగ కార్మికుల వేతనాలను ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే పెంచారు. ఐదేండ్లకు ఒకసారి సవరిస్తే ఈ పాటికి మూడుసార్లు పెరిగేవి.ప్రభుత్వాల ఖర్చు అంటే ఏదో ఒక రూపంలో జనాలకు చేరే మొత్తాలతో పాటు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకూ లబ్ది చేకూరుతుంది. ప్రైవేటు పెట్టుబడులలు అలాంటివి కాదు, వాటి లాభాలే ప్రాతిపదికగా ఉంటాయి. అందువలన ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పు రానున్న రోజుల్లో ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.అధికారంలో ఎవరున్నా చేసింది అంకెల గారడీ గనుకనే సామాన్యుల స్థితిలో పెద్దగా మార్పులేదు, వచ్చే ఏడాది నూతన సీరీస్‌ అంటున్నారు గనుక మరో జిమ్మిక్కు చేయనున్నారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

30 Sunday Nov 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

14th Dalai Lama, 1962 India–China war, Anti China Media, Arunachal Pradesh Dispute, CIA on Tibet, CPI, CPI(M), Jawaharlal Nehru, Mao Zedong, Narendra Modi, USSR

ఎం కోటేశ్వరరావు

ఇటీవల చైనాతో సంబంధం ఉన్న రెండు వార్తలు, విశ్లేషణలు మీడియాలో వచ్చాయి.ఒకటి, 1962లో చైనాతో వచ్చిన యుద్ధం సరిహద్దు సమస్యల మీద కాదు, రెండవది అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మన పౌరురాలి పాస్‌పోర్టు, వీసా చెల్లదు అని చైనా విమానాశ్రయంలో ఇబ్బంది పెట్టారు అన్నది రెండవది. మొదటి అంశాన్ని మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు, రెండవదాని మీద పెద్ద ఎత్తున స్పందించింది, ఎందుకు ?చైనాతో వచ్చిన యుద్దం గురించి వచ్చిన విశ్లేషణ మీద కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది, దాని మనసెరిగి, కనుసన్నలలో నడుస్తున్న మీడియా కావాలనే విస్మరించింది. రెండవ ఉదంతం మీద దానికి భిన్నంగా జరిగింది. చరిత్ర దాస్తే దాగేది కాదు, చెరిపితే పోయేది కాదు.రెండు దేశాల మధ్య యుద్ధం ప్రాధమికంగా సరిహద్దులపై ఏకాభిప్రాయం లేకపోవటం లేదా దౌత్యపరమైన వైఫల్యాల వలన జరగలేదని, పథకం ప్రకారం 1950 మరియు 60దశకాల్లో అమెరికా అనుసరించిన వ్యూహంలో భాగంగా చోటు చేసుకుందని సిఐఏ, దౌత్యకార్యాలయాల పత్రాలు, ప్రచ్చన్న యుద్ద అంతర్జాతీయ చరిత్ర ప్రాజెక్టు పత్రాలు వెల్లడించాయి. కొన్ని ప్రధాన మంత్రి మ్యూజియం మరియు లైబ్రరీలో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని సంప్రదింపులతో పరిష్కరించుకోవాలన్న వైఖరిని వెల్లడించినందుకు తరువాత సిపిఐ(ఎం)గా ఏర్పడిన నాయకులను యుద్ధ సమయంలో ప్రభుత్వం, నాడు జనసంఘం రూపంలో ఉన్న నేటి బిజెపి నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర పార్టీలు, సంస్థలు దేశద్రోహులుగా చిత్రించాయి. ప్రభుత్వం జైల్లో పెట్టింది. యుద్దాన్ని సమర్ధించి నాటి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన సిపిఐతో ఇతరులను దేశభక్తులుగా చిత్రించారు, జనం కూడా అత్యధికులు నిజమే అని నమ్మారు. అది జరిగి ఆరు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు వెలువడిన నిజానిజాలేమిటి ? యుద్ధానికి కారణం సరిహద్దు సమస్య కాదని, టిబెట్‌ కేంద్రంగా అమెరికా జరిపిన కుట్రలో భాగంగా జరిగిందని ఇటీవల బహిర్గత పరచిన నాటి రహస్య పత్రాలను అధ్యయం చేసిన వారు చెప్పిన మాట ఇది. వారెవరూ కమ్యూనిస్టులు కాదు. ఆ పత్రాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి గనుక దీనికి భిన్నమైన విశ్లేషణను ఎవరైనా జనం ముందు పెట్టవచ్చు. అప్పటి వరకు కమ్యూనిస్టుల మీద నిందవేయటం తప్పని దాన్ని వెనక్కు తీసుకుంటామని ఎవరైనా నిజాయితీతో అంగీకరిస్తారా ?

” 1962 చైనా-భారత్‌ సంఘర్షణ భౌగోళిక రాజకీయ పరిణామాల వెల్లడి : చైనాా-భారత్‌ విభజనను అమెరికా ఎలా మలచింది ? ” అనే శీర్షికతో అమెరికాలోని పబ్లిక్‌ ఎఫైర్స్‌ జర్నల్‌ ఏప్రిల్‌ 2025 సంచికలో వెల్లడించారు. దాని రచయిత జిందాల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌లో పని చేస్తున్న డాక్టర్‌ లక్ష్మణ కుమార్‌. ది హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికతో ఆయన సంభాషించిన అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. సోషలిస్టు దేశాలపై అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ యూనియన్‌-చైనా మధ్య తలెత్తిన సైద్ధాంతిక వివాదాలను ఆసరా చేసుకొని టిబెట్‌ అంశాన్ని ముందుకు తెచ్చి భారత్‌-చైనా మధ్య వివాదాన్ని రగిలించేందుకు అమెరికా రూపొందించిన దీర్ఘకాలిక కుట్రకు రెండు దేశాలూ గురయ్యాయి. నాటి నుంచి నేటి వరకు తరువాత కాలంలో సాధారణ సంబంధాలు ఏర్పడినప్పటికీ పరస్పరం నమ్మకంలేకుండా గడుపుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా ఎత్తుగడ నిజానికి టిబెట్‌ తిరుగుబాటుదార్లకు ఏదో చేద్దామని కాదు, వారికి సాయపడే ముసుగులో భారత్‌-,చైౖనా మధ్య వైరం పెంచటమే అసలు లక్ష్యంగా రహస్య పత్రాల్లో వెల్లడైంది.

1962 అక్టోబరు 20న చైనా దాడి ప్రారంభించి నవంబరు 20న ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి అరుణాచల్‌ ప్రదేశ్‌లో తన ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి సేనలను ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు పరిమితమైంది. అవి తన ప్రాంతాలని అంతకు ముందునుంచి చెబుతున్నప్పటికీ చైనా వెనక్కు తగ్గింది. టిబెట్‌లో జరిగిన కుట్రల క్రమ సారాంశం ఇలా ఉంది.1956లో అక్కడ దలైలామా పలుకుబడిలో ఉన్న ప్రభుత్వ మద్దతుతో తిరుగుబాటుకు నాందిపలికారు. సిఐఏ దాన్ని అవకాశంగా తీసుకొని ముందే చెప్పుకున్నట్లు 1957 నుంచి 1961వరకు వారికి శిక్షణ, ఆయుధాలు,రేడియోలు, ఇతర పరికరాలను ఇచ్చింది.విమానాల ద్వారా 250టన్నుల మిలిటరీ సరఫరాలు చేసింది.నిఘావిమానాల ద్వారా సమాచారాన్ని అందచేసింది. చైనా మిలిటరీ తిరుగుబాటును అణచివేయటంతో 1959లో దలైలామాను టిబెట్‌ నుంచి తప్పించి అరుణాచల్‌ ప్రదేశ్‌ ద్వారా భారత్‌కు చేర్చారు.దీనికి నాటి నెహ్రూ సర్కార్‌ పూర్తి మద్దతు ఇచ్చింది, అధికారులను పంపి మరీ స్వాగత ఏర్పాట్లు చేసిందంటే అమెరికా సిఐఏతో సమన్వయం చేసుకోకుండా జరిగేది కాదు. అంతేనా మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చింది. దీన్ని రెచ్చగొట్టటం, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా పరిగణించింది.1961లో ఉత్తర నేపాల్లోని ముస్టాంగ్‌కు సిఐఏ తన కార్యకలాపాలను విస్తరించింది. దలైలామా పరారీ తరువాత అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా మిలిటరీ మన సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.చైనాను నిలువరించాలని ప్రధాని నెహ్రూ నాటి సోవియట్‌ నేతలను కోరారు. అయితే తాము తటస్థంగా ఉంటామనే సందేశాన్ని వార్తల ద్వారా సోవియట్‌ పంపింది. తరువాత దాని నేత కృశ్చెవ్‌ 1959 అక్టోబరు రెండున బీజింగ్‌ పర్యటనలో నెహ్రూ మంచివాడని, భారత్‌తో వైరం వద్దని మావోకు సూచించటంతో ఈ వైఖరి చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటామని అది పెద్ద సమస్య కాదని, అసలు అంశం టిబెట్‌ అని ఈ విషయంలో భారత్‌తో రాజీపడేది లేదని మావో చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దాని పర్యవసానాలు మనదేశంలో కూడా ప్రతిబింబించాయి. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలోని ఒక వర్గం సోవియట్‌ వైఖరికి అనుగుణంగా నెహ్రూ అనుకూల, చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంది.దానికి భిన్నంగా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని మరో వర్గం తీసుకుంది. అందుకు వారిని జైలుపాలు చేశారు. తరువాత వారే సిపిఐ(ఎం)గా ఏర్పడ్డారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు సిపిఐ(ఎం) వైఖరే సరైనదని రుజువు చేశాయి.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బిజెపి ఎవరు అధికారంలో ఉన్నా వాటి మీద ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉంటూనే చైనాతో సంబంధాలను కొనసాగించారు. ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీ అయి నరేంద్రమోడీ ఒక రికార్డు సృష్టించారు.చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులలో మోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు.

అసలు రెండు దేశాల మధ్య యుద్దానికి దారితీసిన పరిస్థితి ఏమిటి ? తెరవెనుక అమెరికా సృష్టించిన టిబెట్‌ చిచ్చుకాగా బయటికి సరిహద్దు వివాదంగా ముందుకు వచ్చింది.1954లో చైనా-భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అయితే అప్పటికే అమెరికా కుట్ర మొదలైంది. దాన్లో భాగంగా బుద్ద జయంతిని జరుపుకొనే పేరుతో 14వ దలైలామా భారత్‌ వచ్చాడు. ఆ సందర్భంగా అంగీకరిస్తే భారత్‌లో ఆశ్రయం పొందుతానని చేసిన వినతిని నెహ్రూ తిరస్కరించారు. కానీ అదే నెహ్రూ సిఐఏ పధకం ప్రకారం టిబెట్‌ నుంచి పారిపోయి 1959 ఏప్రిల్‌ 18న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ చేరుకున్న దలైలామాకు మానవతాపూర్వక కారణాల సాకుతో ఆశ్రయం ఇవ్వటమేగాక ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకూ అనుమతించించారు. వేలాది మంది టిబెట్‌ నుంచి వచ్చిన వారికీ ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. కాలనీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.సరిహద్దులో మన ప్రభుత్వం 1961 కొన్ని పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతం తమ అదుపులోనే ఉందని ఉద్ఘాటించింది. అప్పటికే దలైలామా ప్రవాస ప్రభుత్వం చైనా వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తోంది.దీనికి తోడు సరిహద్దుల్లో కొత్తగా పోస్టులను ఏర్పాటు చేయటాన్ని అవకాశంగా తీసుకొని చైనా వాటిని తొలగించేందుకు పూనుకోవటం, మన మిలిటరీ ప్రతిఘటించటంతో అది తరువాత నెల రోజుల యుద్ధంగా మారింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ మహిళ ప్రేమా వాంగ్‌జోమ్‌ థోంగ్‌డాక్‌ దగ్గర ఉన్న పాస్‌పోర్టు చెల్లదంటూ షాంఘై పుడోంగ్‌ విమానాశ్రయ అధికారులు కొన్ని గంటల పాటు నిలిపివేశారంటూ వచ్చిన వార్తలకు మన మీడియా పెద్ద ఎత్తున ప్రచారమిచ్చిన సంగతి తెలిసిందే.మనదేశం, చైనాల మధ్య సరిహద్దులంటూ మాపులపై బ్రిటీష్‌ అధికారులు గీచిన రేఖలు రెండు దేశాల మధ్య వివాదాన్ని సృష్టించాయి. వివిధ సందర్భాలలో ప్రచురించిన మాప్‌ల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ చైనాకు చెందినది, చైనా ఆధీనంలో ఉన్న లడఖ్‌ సమీపంలోని ఆక్సారుచిన్‌ ప్రాంతం మనదిగా చూపాయి. అందువలన రెండుదేశాలూ అవి తమ ప్రాంతాలని మాపుల్లో చూపుతున్నాయి. అరుణాచల్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతమైన జాంగ్‌నాన్‌ అని చెబుతుండగా ఆక్సారు చిన్‌ మా లే (లడఖ్‌) జిల్లాలో భాగమని అంటున్నాము. దలైలామా 2023లో తవాంగ్‌ పర్యటన చేస్తామని ప్రకటించగా అనుమతించకూడదంటూ నాడు చైనా అభ్యంతరం చెప్పింది.అంతకు ముందు కూడా అభ్యంతరాల మధ్య పర్యటించినా చివరిసారిగా గాల్వన్‌ ఉదంతాల తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌-భారత్‌ పేరుతో ఉన్న పాస్‌పోర్టు, వీసాలను చైనా తిరస్కరించటం ఇదే మొదటిసారి కాదు. పాస్‌పోర్టు మీద స్టాంప్‌ వేయటానికి నిరాకరించి ఒక తెల్లకాగితం మీద అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని చైనా చెప్పింది. దానికి నిరాకరించిన మనదేశం చైనాలో జరిగిన ఆసియా క్రీడలకు మన క్రీడాకారులను పంపలేదు. తాజాగా ప్రేమ అనే మహిళ విషయంలో కూడా అదే జరిగింది, మీరు భారతీయురాలు కాదు, చైనీస్‌ అందువలన వీసా కోసం దరఖాస్తు చేసుకోండి అని చైనా అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

చిత్రం ఏమిటంటే మన దేశంలో ఆశ్రయం పొంది,ప్రవాస టిబెట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1959 నుంచి అన్ని సౌకరాలను అనుభవిస్తున్న 14వ దలైలామా 2003లో మాట్లాడుతూ అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగం అన్నాడు తప్ప మనదేశంలో భాగం అని గుర్తించలేదు. అయినప్పటికీ అతగాడికి సౌకర్యాలు కల్పించటం రాజకీయం తప్ప వేరు కాదు. మనదేశం తెచ్చిన వత్తిడి, విధిలేని పరిస్థితిలో 2008లో తన వైఖరిని మార్చుకున్నాడు. 1914లో బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖను భారత్‌-టిబెట్‌ సరిహద్దుగా నిర్ణయిస్తూ బ్రిటీష్‌ ఇండియా పాలకులు టిబెట్‌ పాలకులతో సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు.బ్రిటీష్‌ వారి పాలనకు చరమగీతం పాడారు, దాంతో ఉక్రోషం పట్టలేని బ్రిటన్‌ కుట్రకు తెరలేపింది. అప్పుడే స్వాతంత్య్రం పొందిన చైనాకు టిబెట్‌ మీద హక్కులేదని చెప్పేందుకు బ్రిటీష్‌ పాలకులు పన్నిన కుట్రలో భాగం సిమ్లా ఒప్పందమంటూ నాటి, నేటి చైనా ప్రభుత్వం అంగీకరించలేదు. టిబెట్‌ తమ సామంత దేశమని అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకొనేందుకు దాని పాలకులకు హక్కు లేదు, చెల్లదని చైనా చెబుతున్నది. ఉదాహరణకు, బ్రిటీష్‌ పాలనలో సామంత రాజ్యాలుగా ఉన్న కాశ్మీరు, నిజాం సంస్థానాలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటాన్ని నాడు మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ పూర్వరంగంలో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటం తప్ప దగ్గరదారి లేదు. అప్పటి వరకు యథాతధ స్థితి కొనసాగించాల్సి ఉంది. రెండు దేశాలూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలకు ఢోకా ఉండదు. వివాదాన్ని కాలమే పరిష్కరించాల్సి ఉంది. యుద్ధాల ద్వారా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటం కుదిరే అంశం కాదు. ఆక్రమిత కాశ్మీరుపై మనకు తిరుగులేని హక్కు ఉంది, ఎలాంటి వివాదం లేకున్నా బలప్రయోగంతో స్వాధీనం చేసుకొనేందుకు పూనుకోలేదు. చైనా గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా బడా పత్రికలు అనేక తప్పుడు వార్తలు ఇచ్చాయి. మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు లేదా అధికారంలో లేని సంస్థలు, వ్యక్తులు చేసే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే అంశాలకు రెండు దేశాలకు చెందిన పౌరులు భావోద్వేగాలకు గురైతే బుర్రలు ఖరాబు చేసుకోవటం తప్ప జరిగేదేమీ ఉండదు. వివాదాలు పభుత్వాలు తేల్చాల్సిన, తేల్చుకోవాల్సిన అంశాలని గ్రహించాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాకు భారత ఎగుమతులు పెరిగాయా ! జనాలకు గోడీ మీడియా చెబుతున్న నిజానిజాలేమిటి !!

26 Wednesday Nov 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#India trade matters, BJP, China exports, India exports and Imports, Media Bluffing, Narendra Modi Failures, world exports

ఎం కోటేశ్వరరావు

చైనాకు ఏడు నెలల్లో 25శాతం పెరిగిన భారత ఎగుమతులు. మీడియాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన శీర్షిక ఇది. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు వరుసగా ఏడు నెలల నుంచీ పెరుగుతూనే ఉన్నాయి.మంచిదే, మన ఎగుమతులు ఏమాత్రం పెరిగినా సంతోషించాల్సిందే. అయితే అసలు కథేమిటంటే నరేంద్రమోడీకి భజన చేసేందుకు అలవాటు పడిన వారు చేసిన జిమ్మిక్కు లేదా తిమ్మిని బమ్మిని ఇది. నిజంగా జరిగిందేమిటి ? గతేడాదితో పోలిస్తే ఎగుమతులు పెరిగిన మాట నిజం. ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు అంతకంటే ఎక్కువగా పెరిగిన సంగతి, పదేండ్ల స్థాయికి ఎగుమతులు పడిపోయిన నిజాన్ని జనాలకు చెప్పరేం ! నరేంద్రమోడీ ఏలుబడి పదకొండు సంవత్సరాలను మూడు భాగాలుగా విభజిద్దాం. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో చైనాకు మన ఎగుమతులు 11.96 నుంచి 16.75 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. తరువాత మూడు సంవత్సరాలలో 21.56 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అప్పటి నుంచి 2024-25లో 14.25 బిలియన్‌ డాలర్లకు పతనమయ్యాయి. గత ఏడాది తొలి ఏడు నెలలతో పోల్చి చూపి వర్తమాన సంవత్సరంలో 10.03 బిలియన్‌ డాలర్లకు 25శాతం పెరిగినట్లు చిత్రించారు. మిగిలిన ఐదు నెలల కాలంలో గత ఏడాది మొత్తాలకు చేరవచ్చు, స్వల్పంగా పెరగవచ్చు తప్ప గతంలోని 21.56 బిలియన్‌ డాలర్లకు చేరే స్థితి ఉందా ? చైనాకు మన ఎగుమతులు పెరగటం వెనుక అంతర్జాతీయ రాజకీయాలు కూడా లేకపోలేదు. అమెరికా వైపు మొగ్గుచూపుతున్న నరేంద్రమోడీకి పన్నుల రూపంలో ట్రంప్‌ తీసుకున్న వైఖరి మింగుడు పడలేదు.ఈ స్థితిలో ఎత్తుగడగా అవసరం ఉన్నా లేకున్నా చైనా ఏప్రిల్‌ నుంచి మన దేశం నుంచి దిగుమతులను పెంచింది, దీని కొనసాగింపు రానున్న రోజుల్లో మనదేశం అనుసరించే వైఖరిని బట్టి ఉంటుంది.చైనాకు మన మార్కెట్‌ను ఎంతగా తెరిస్తే దానికి ప్రతిగా మనకూ మేలు చేకూరే విధంగా బీజింగ్‌ వ్యవహరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. చైనా పెట్టుబడులను స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. మన దేశం నుంచి విమానాలను నడిపేందుకు రెండు చైనా కంపెనీలు దరఖాస్తు చేసినట్లు తాజా వార్తలు వెల్లడించాయి.

చైనా మీద ఆధారపడకూడదు, దాన్ని పక్కకు నెట్టేసి అసలు మనమే ప్రపంచానికి వస్తువులను ఎగుమతులు చేద్దాం అంటూ పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అలాంటి సూచనలు లేవు.తొలి ఏడు నెలల్లో ఎగుమతులు పెరిగాయని చెప్పిన వారు అదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 57.65 నుంచి 64బిలియన్‌ డాలర్లకు పెరిగాయని చెబితే నిజాయితీగా ఉంటుంది. గత సంవత్సరం చైనాతో మన వాణిజ్య లోటు 99.12 బిలియన్‌ డాలర్లు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ సర్కార్‌ అసమర్ధతకు బీజింగ్‌కు మనం చెల్లించిన మూల్యం.ఇంకా చెప్పాలంటే గత పదకొండు సంవత్సరాల్లో 701.95 బిలియన్‌ డాలర్లు సమర్పించుకున్నాం. మోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది మన వాణిజ్య లోటు 48.45 బిలియన్‌ డాలర్లు కాగా పదకొండేండ్లలో రెట్టింపై 99.21 బి.డాలర్లకు చేరింది, ఎందుకని ? గత ఐదు సంవత్సరాల్లో చైనాకు మన ఎగుమతులు 33శాతం పడిపోగా దిగుమతులు 74శాతం పెరిగాయి. ఆత్మనిర్భరత ఏమైనట్లు, ప్రపంచంలో పెరిగినట్లు చెబుతున్న మోడీ పలుకుబడి సంగతేమిటి ? కాంగ్రెస్‌ యాభై ఏండ్లలోచేయలేని వాటిని తాను తొలి ఐదేండ్లలోనే చేసినట్లు గతంలో చెప్పుకున్నారు. సంతోషం. వర్తమాన అవసరాలకు అనుగుణంగా వస్తూత్పత్తిని ఎందుకు చేయలేకపోయినట్లు ? రెండింజన్ల పాలనే కదా ఉన్నది. యాపిల్‌ ఐఫోన్లను తయారు చేస్తున్నాం, ఎగుమతి చేస్తున్నాం చూడండహౌ అంటూ ప్రచారం చేస్తున్నారు. మిగతా ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంగతేమిటి ? గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(జిటిఆర్‌ఐ-ఇండియా) చెప్పినదాని ప్రకారం కీలకమైన ఎనిమిది పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో చైనా ప్రధాన సరఫరాదారుగా ఉంది. చైనా నుంచి దిగుమతుల వలన రెండు రకాల నష్టాలు, ఒకటి స్థానిక మన పరిశ్రమలు గిడసబారిపోతున్నాయి, కార్మికులకు ఉపాధి దొరకటం లేదు.విలువైన విదేశీమారక ద్రవ్యాన్ని చైనాకు సమర్పించుకుంటున్నట్లు ముందే చెప్పుకున్నాం. గత కాంగ్రెస్‌ పాలనకూ మోడీ ఏలుబడికి తేడా ఏమిటి ? చైనా నుంచి దిగుమతుల్లో మన్మోహన్‌ సింగ్‌ రికార్డులనే కాదు, తన రికార్డులను కూడా తానే మోడీ బద్దలు కొట్టుకున్నారు. చైనాతో తిరిగి సత్సంబంధాలను నెలకొల్పుకొనటం మంచిదే. కానీ అనేక వస్తువుల దిగుమతులపై ఆంక్షలను సడలించిన కారణంగా గత రికార్డులను అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి గత పదినెలలుగా చెబుతూనే ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతతో సహా అన్నీ డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నట్లే జరుగుతున్నందున అనేక అనుమానాలు. ఇంతవరకు ఏం జరుగుతోందో జనానికి తెలియదు. ట్రంప్‌ చెబితే తప్ప మనకు తెలిసేట్లు లేదు, మన మార్కెట్‌ను వారి వస్తువులకు బార్లా తెరవాలని అమెరికా వత్తిడి తెస్తోంది. అదే జరిగితే స్థానిక పరిశ్రమలు, వాణిజ్యాలను మూసుకోవాల్సిందే అని మన కార్పొరేట్లు హెచ్చరిస్తున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఏడునెలల్లో మన ఎగుమతులు ఎక్కువగా అమెరికాకు జరిగితే దిగుమతులు చైనా నుంచి జరిగాయి. ఇదేం కుదరదు అన్నీ మానుంచే దిగుమతి చేసుకోవాలని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. అసలు సంగతేమిటంటే చైనా నుంచి తక్కువ ధరలకు వస్తున్నాయి గనుక దిగుమతి చేసుకుంటున్నాం తప్ప షీ జింపింగ్‌ మీద ప్రేమతో కాదు. అమెరికాకు చోటిస్తే ఎడారి వ్యాపారి, ఒంటె కథ మాదిరి దేశీయ సంస్థలను బయటకు నెట్టేయటం లేదా మింగివేస్తుంది. అందుకనే రెండు దేశాలతో సమన్వయం చేసుకోవటం మోడీకి కత్తిమీద సాములా ఉంది. రానున్న రోజుల్లో మనకు మేలు జరిగే విధంగా విదేశాంగ విధానం ఉండాలని ఇప్పటికే కార్పొరేట్ల లాబీ మాట్లాడుతోంది. కరవమంటే కప్పకు విడవమంటే పాముకు కోపం ! మన దేశ వస్తు ఎగుమతులను చూస్తే 2024లో 434.44 బిలియన్‌ డాలర్లు కాగా దిగుమతులు 698-702 బి. డాలర్ల మధ్య ఉన్నాయి. నిఖర వాణిజ్యలోటు 263.31బిలియన్‌ డాలర్లు. ఎగుమతుల్లో అమెరికా 18.3, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 8.5, నెదర్లాండ్స్‌ 5.6, సింగపూర్‌ 3.6, చైనా 3.4,బ్రిటన్‌ 3.2, సౌదీ అరేబియా 2.8, బంగ్లాదేశ్‌ 2.6, జర్మనీ 2.4, ఇటలీ 1.92శాతాల చొప్పున ఉన్నాయి. 2024 జనవరి నుంచి జూన్‌ వరకు వివరాలు చూస్తే మన దేశం 151దేశాలతో వాణిజ్య మిగులు, 75దేశాలతో తరుగులో ఉంది. మోడీ భక్తులు చూశారా మానేత పలుకుబడి అని డబ్బా కొట్టుకోవటానికి ఈ అంకెలు తప్ప వాస్తవ పరిస్థితి ఏమిటోపైన చెప్పుకున్నాం. అమెరికాను వదులుకొనేందుకు భయపడటానికి, డోనాల్డ్‌ ట్రంప్‌ ఎంతగా అవమానించినా మౌనంగా ఉండటానికి అక్కడికి మన ఎగుమతులు ఎక్కువగా ఉండటమే.మరోవైపు ఐదేండ్లపాటు చైనాతో వైరంతో గడిపిన తరువాత సాధారణ సంబంధాలు ఏర్పరుచుకోవటానికి కారణం దాని మీద ఆధారపడాల్సి రావటమే. పదకొండు సంవత్సరాల్లో పరాధీనతను తగ్గించటానికి మోడీ చేసిందేమీ లేదు. అందుకే రాజీపడ్డాం. మన దిగుమతులను చూస్తే 2024లో చైనా నుంచి 15.5,రష్యా 9.1, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 8.6, అమెరికా 6.1, సౌదీ అరేబియా 4.3, ఇరాక్‌ 4.2, ఇండోనేషియా 3.4,స్విడ్జర్లాండ్‌ 3.1,దక్షిణ కొరియా 3, సింగపూర్‌ 2.9శాతం చొప్పున ఉన్నాయి. గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో కాషాయ దళాలు చైనా నుంచి దిగుమతుల నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందంటూ ఊగిపోయారు.నిజానికి మనకు అంత సీన్‌ లేదు, 2024లో చైనా నుంచి దిగుమతులు చేసుకున్న మొదటి పది దేశాలలో మనం కేవలం 3.4శాతంతో ఆరవ స్థానంలో ఉన్నాం.

మన ఎగుమతులు, దిగుమతులు రెండు రకాలు. ఒకటి వస్తువులు, రెండవది సేవలు. వస్తు లావాదేవీల్లో 2014-15లో లోటు 137 బిలియన్‌ డాలర్ల నుంచి 2024-25 నాటికి 283బి.డాలర్లకు పెరిగింది. సేవల విషయంలో ఇదే కాలంలో మిగులు 74 నుంచి 189 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. రెండింటినీ కలిపి చూసినపుడు నిఖర లోటు 63 నుంచి 94 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.ప్రపంచంలో 2024లో మొత్తం 24.5లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తు ఎగుమతులు జరగ్గా ఎగువన ఉన్న 30దేశాల వాటా 20.3లక్షల కోట్ల డాలర్లు.మొదటి స్థానంలో ఉన్న చైనా వాటా 14.6 శాతం కలిగి మొదటి స్థానంలో ఉండగా పద్దెనిమిదవదిగా మనదేశ వాటా కేవలం 1.8శాతమే, రష్యా, స్విడ్జర్లాండ్‌ కూడా ఇదే వాటాను కలిగి ఉన్నాయి. చైనాను వెనక్కు నెట్టేయాలన్న సంకల్పాన్ని ఎవరూ కాదనరు, పోటీ పడాల్సిందే. కానీ ఒక్కసారిగా ఈ పరిస్థితి మారాలన్నా, 2047 నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోవాలన్నా నరేంద్రమోడీ అల్లావుద్దీన్‌ అద్భుత దీపాన్ని సంపాదించాల్సిందే. అల్లావుద్దీన్‌ ముస్లిం మేం బరాబర్‌ హిందువులం పొడగిట్టదు అని అంటారా, మనోభావాలను ముందుకు తెస్తే మన వేదాల్లో ఉన్నవాటిని వెలికి తీయాలి మరి, దగ్గరిదారి లేదు, చేస్తారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

విత్తనాల ముసాయిదా బిల్లు ఎవరికోసం?

19 Wednesday Nov 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ 1 Comment

Tags

farmers seeds rights, India agri reforms, Narendra Modi Failures, seed acts, seed imports, The Draft Seeds Bill 2025 India

డాక్టర్ కొల్లా రాజమోహన్

దశాబ్దాల నాటి 1966 విత్తనాల చట్టాన్ని, సీడ్ కంట్రోల్ ఆర్డర్, 1983 బదులుగా 2025 విత్తనాల ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టబోయే ముందుఒక నెలలోపున ప్రజల అభిప్రాయం కోరుతూ ఈ ముసాయిదా బిల్లును ప్రకటించింది. డిసెంబర్ 11 లోగా సూచనలు సమర్పించాలని ప్రజలను కోరారు.

రైతులకు అధిక నాణ్యత గల మంచి విత్తనాల లభ్యతను పెంచడం మరియు నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాల అమ్మకాలను అరికట్టడం లక్ష్యాలుగా ముసాయిదా బిల్లు నిర్ధారిస్తున్నది. మార్కెట్లో విక్రయించబడే అన్ని విత్తన వెరైటీస్ కి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తున్నది.. రైతులు సంప్రదాయంగా వాడుకునే వెరైటీలు మినహాయిస్తానంటున్నది. దీనివలన విత్తనాలనాణ్యత, పనితీరు గురించి ప్రభుత్వమువద్ద అధికార సమాచారం ఉంటుందని అంటుంది.

ఎవరికోసం

జన్యుమార్పిడి విత్తనాలను , కొత్త హైబ్రిడ్ విత్తనాలనుకార్పొరేట్ కంపెనీల నుంచి తేలికగా దిగుమతి చేసుకోవడానికి చట్టాలను సవరిస్తున్నారు. జన్యుమార్పిడి విత్తనాలు, దిగుమతి చేసుకునే విత్తనాల సాగుకు  పురుగు మందులు, ఎరువులు, నీళ్ళు ఎక్కువ అవసరం. మనం కార్పొరేట్ కంపెనీ వ్యవసాయ ఉచ్చులో చిక్కుకుంటున్నాము. ఈ బిల్లు కార్పొరేటర్లకు అనుకూలంగా ఉన్నది. చిన్న రైతులను నాశనం చేసేటట్లు గా ఉంది . తరతరాలుగా జాగ్రత్తగా చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని పురాతన విత్తన రకాల వెరైటీస్ ని రక్షించుకోవడానికి ఏమాత్రం సహాయం చేసే పరిస్థితి లేదు. సాధారణ రైతులకు, ముఖ్యంగా సాంప్రదాయ విత్తనాలను తయారుచేస్తున్న రైతుల ప్రయోజనాలకు. నష్టం కలుగుతుంది.

కేంద్రీకృత అనుమతి (Centralised Clearance):

 ఒక కంపెనీ కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు (Accreditation) పొందితే, అది దేశంలోని అన్ని రాష్ట్రాలలో విత్తనాలను విక్రయించడానికి అనుమతి పొందినట్లే. బహుళ రాష్ట్రాల నియంత్రణ లేనందున కార్పొరేట్ కంపెనీల వ్యాపార విస్తరణను వేగవంతం చేస్తుంది. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనాన్ని సుస్ధిర పరుస్తున్నారు. 

కంపెనీలు ప్రతి రాష్ట్రంలో వేర్వేరు అనుమతులు పొందాల్సిన అవసరం ఉండదు. నియంత్రణల సరళీకరణ పేరున (Deregulated Control) అపరిమితమైన స్వేచ్ఛ లభిస్తుంది. కంపెనీల ఉల్లంఘనలపై నేరారోపణలను తొలగించారు లేదా శిక్షలను తగ్గించినందువలన  కంపెనీల అధికారులు జైలుకు వెళ్లాల్సిన భయం తప్పుతుంది. మైనర్ నేరాలుగా భావించమంటున్నారు.

విత్తనాల డీలర్లు, పంపిణీ దారులు విత్తనాలను విక్రయించడానికి, దిగుమతి చేసుకోవడానికి, ఎగుమతి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. క్యూ ఆర్ కోడ్ ద్వారా పక్కా నియంత్రణ వుంటుంది. చిన్న వ్యాపారస్తులు పోటీ లో నిలబడలేరు. పెద్ద కార్పొరేట్ కంపెనీల కు కేంద్రీకృత అనుమతి వలన వ్యాపారం సులభమవుతుంది.

నకిలీ విత్తనాలు

వ్యవసాయ మంత్రిత్వ శాఖ చాలా కాలంగా నకిలీ విత్తనాల గురించి మాట్లాడుతుంది. కార్పొరేట్ కంపెనీలు నకిలీ విత్తనాలు అమ్మితే కఠినమైన జరిమానా విధించబడుతుందనే అభిప్రాయాన్ని కలిగించింది .అయితే ప్రస్తుత బిల్లులో ఎటువంటి కఠినమైన నిబంధనలను ప్రతిపాదించలేదు. ముసాయిదాలో ఫేక్ సీడ్స్ నకిలీ విత్తనాలు అనే పదం లేదు. 

ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఖరీఫ్ రబీ సీజన్లో నకిలీ , నాణ్యతలేని నాసిరకం విత్తనాల అమ్మకాల కారణంగా రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. విత్తనాలు అమ్మిన కంపెనీలు ముందు ఒకరకంగా వాగ్దానాలిస్తున్నారు. మొలక శాతానికి, దిగుబడులకు మాదే గ్యారంటీ అంటూన్నారు. అమ్ముకున్నతరువాత సమస్య వచ్చినపుడు ముఖం చాటేస్తున్నారు.

విత్తన సరఫరా గొలుసులో పారదర్శకత , జవాబుదారితనం నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్న బిల్లు ఏమి చెప్తున్నదో చూడండి.

“సెక్షన్ 31కింద నియమించబడిన సీడ్ ఇన్స్పెక్టర్ కు విషేష అధికారాలను ఇచ్చారు. అనుమానం వచ్చిన విత్తనాల సాంపుల్స్ ను ఆ ప్రాంత అనలిస్ట్ దగ్గరకు పంపి , స్టాక్ ను సీజ్ చేయాలి. సీడ్ ఇన్స్పెక్టర్ కు అనుమానం వచ్చినప్పుడు ఇంటి తలుపులు పగలకొట్టైనా అనుమానం వున్న విత్తనాలను స్వాధీనం చేసుకునే అధికారాలను ఇచ్చారు.అపరిమితమైన అధికారాలను సీడ్ ఇన్స్పెక్టర్క ను కట్టబెట్టారు.

రైతులు, విత్తన కంపెనీలను అనవసరంగా కోర్టు కేసుల లోకి లాగుతున్నారట—- కొంతమంది స్వార్థ ప్రయోజనాలు కలిగినటువంటి రైతులు కంపెనీలను అనవసరంగా కోర్టుకులాగుతున్నందున కంపెనీల ను  రక్షించాలని ప్రభుత్వం వాదించింది.  25 నాటికి భారత విత్తన మార్కెట్ విలువ దాదాపు 3.8 2 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా మరియు 2030 నాటికి దాదాపు 5.5% వార్షిక వృద్ధిరేటుతో దాదాపు 5 బిలియన్ డాలర్లు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇంత భారీ మార్కెట్ పై బేయర్స్, మాన్సాంటో , సింజెంటా లాంటి కార్పొరేట్ కంపెనీలు కన్ను వేశాయి.  పెద్ద కంపెనీలు తప్పులు చేయరంటున్నారు. వలస పాలకులు తమ  సహాయకులు రక్షించేందుకు ఉపయోగించిన Good Faith క్లాజును విత్తన చట్టం లో కూడా ప్రయోగిస్తున్నారు. 

చట్టాలను అతిక్రమించే కార్పోరేట్ కంపెనీల కు వెసులుబాటు ఇలా వుంటుందట. 

మొదటి తప్పు, రెండవ తప్పు లకు పెనాల్టీ లేదు,

ప్రధమ తప్పు -రెండవ తప్పు -మూడు సంవత్సరాలు అదే తప్పు చేస్తూవుంటే , అపుడు 2 లక్షల రూపాయలు పెనాల్టీ విధించవచ్చు.

కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వం అవసరాన్ని బట్టి పెనాల్టీని నిర్ణయించటానికి సెక్షన్ 34 ప్రకారం ఒక నోటిఫికేషన్ ద్వారా ఒక ఆఫీసర్ ను  నిర్ణయించవచ్చు. ప్రభుత్వం నియమించిన ఆఫీసరు పెనాల్టీని నిర్ణయిస్తాడు. ఆ ఆఫీసురు సెక్షన్ 31 ప్రకారం ప్రధమ తప్పు అని భావిస్తే కంపెనీని శిక్ష లేకుండా వదిలేయొచ్చు.

లేకపోతే 50 వేల పెనాల్టీని, చిన్న తప్పు కింద విధించవచ్చు . మూడు సంవత్సరాల వరకు అదే తప్పులు మరలా చేస్తూ ఉంటే రెండు లక్షల పెనాల్టీ వరకు విధించవచ్చు. పెద్ద తప్పు అని భావిస్తే పది లక్షల పెనాల్టీ జరిమానా కూడా విధించవచ్చు. మరలా  ఐదు సంవత్సరాలు తర్వాత కూడా అదే పని చేస్తూ ఉంటే 30 లక్షలు వరకు కూడా పెనాల్టీ విధించడానికి, డీలర్ షిప్ ని క్యాన్సిల్ చేయడానికి, ఒక మూడు సంవత్సరాల జైలు ఖైదు విధించడానికి ఈ బిల్ అవకాశమిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయించిన దాని కంటే ఎక్కువ ధరలకు అమ్మడం, రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విత్తన వ్యాపారాన్ని కొనసాగించటం, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను ప్రదర్శించకపోవడం, విత్తన ప్యాకెట్ పైన లేబుల్ అతికించబోవటం ఇలాంటివన్నీ కూడా చిన్న తప్పులు కింద భావిస్తారు,

విత్తనం మొలకెత్తివరకు కంపెనీలను బాధ్యత వహించేలా బిల్లు నిర్దేశించాలి. విత్తనాలు మొలకెత్తినప్పటికీ పంట దిగుబడి ఇవ్వకపోతే ఏమి చేయాలి ? విత్తన నష్టానికి గరిష్ట పరిహారంపై పరిమితి ఉండకూడదనిరైతు నాయకులు కోరుతున్నారు.

నకిలీ విత్తనాలు తరచుగా ఒకేలాంటి 

బ్రాండ్ కింద అమ్ముడు అవుతాయి , తరచుగా మొలకెత్తడంలో లేదా వాగ్దానం చేసిన దిగుబడిని అందించడంలో విఫలమవుతాయి. దీనివలన రైతుల అప్పుల భారం పెరుగుతుంది.  ఒక్క సంవత్సరంలో ఒక్క పంట నష్ట పోయినా దెబ్బ నుంచి కోలుకోలేరు. 25 లో 24 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల విత్తన తనిఖీదారులు సేకరించిన మొత్తం 2.5.లక్షల విత్తన నమూనాలలో 32,525 నమూనాలు నాణ్యత లేనివిగా తేలిందన్నారు

.

విత్తన దిగుమతులు

విత్తన ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం మూడో స్థానంలో ఉంది మొదటి స్థానాల్లో అమెరికా , చైనా , తర్వాత భారతదేశం ఉంది. భారతదేశంలో కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉత్పత్తిలో ముందున్నాయి. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన స్థానిక విత్తనాలను భద్రపరిచే తిరిగి వాడుకునే సాంప్రదాయ ప్రక్రియకు ప్రమాదం ఏర్పడింది . పేటెంట్ ఉన్న బ్రాండెడ్ పంపిణీ విత్తనాలను మాత్రమే వాడాలనే దుష్ట సాంప్రదాయాన్ని ఈ ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో లక్షల ఎకరాల్లో విత్తనాలను తయారుచేస్తున్నారు. విత్తనాలను తయారుచేస్తున్న కర్నూలు, మహబూబ్ నగర్, నూజివీడు రైతుల రక్షణ గురించి బిల్లు ఏమీ మాట్లాడలేదు. అమెరికా , యూరప్ దేశాల పేటెంట్లతో రైతులు విత్తన స్వాతంత్రాన్ని ,స్వేచ్ఛను కోల్పోనున్నారు . భారత సంప్రదాయ వ్యవసాయం లోని మంచి లక్షణాలను కూడా విస్మరిస్తున్నందున వ్యవసాయం ప్రమాదంలో పడుతున్నది. ఈ బిల్లు విత్తన దిగుమతులను సరళీకరించి, కార్పొరేట్ కంపెనీలకు లాభాలను కూడపెట్టడం ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నట్లున్నది. 

  ప్రపంచ వెరైటీలను భారత దేశంలోకి విచక్షణారహితంగా అనుమతించటంద్వారా దేశీయ విత్తనాభివృథిని శాశ్వతంగా దెబ్బగొడ్తున్నారు. రైతుల సృజనాత్మక చొరవను పెంచే గ్రామీణ విత్తన కేంద్రాల అభివృధి నినాదంగానే మిగిలిపోయింది. రైతు విత్తనాలను స్వంతంగా తయారు చేసుకునే హక్కు పై దాడి  చేస్తున్నారు. భారతదేశ విత్తన సంపదను కాపాడవలసిన అవసరం గురించి మౌనం వహించారు. రైతు విత్తన హక్కు గురించి విత్తన స్వావలంబన అందుబాటులోకి తీసుకురావడం, విత్తన సరఫరా లో పారదర్శక మరియు జవాబుదారీతనం పెంచటం ద్వారా రైతు హక్కులను కాపాడటం లక్ష్యంగా పెట్టుకోవటం విస్మరించారు. 

విత్తనాలను రైతులు సాగు చేస్తున్నారు రైతులు తయారు చేసినటువంటి విత్తనాలు ఏదో ఒక కంపెనీ కొనుక్కుని బ్రాండ్ వేసుకొని మార్కెట్లో అమ్ముకుంటున్నారు. మన రైతుల శక్తిని విస్మరించి,కార్పొరేట్ వత్తిడికి లొంగి మన విత్తన స్వాతంత్ర్యాన్ని తాకట్టు పెడుతున్నారు. 

రైతులకు నష్టపరిహారం విధానం మరింత కష్టం.

1. న్యాయం పొందడంలో సమస్యలు (Issues in Seeking Justice)

• నాసిరకం లేదా నకిలీ విత్తనాల వల్ల పంట నష్టం సంభవించిన రైతులకు తప్పనిసరిగా, సులభంగా నష్ట పరిహారం చెల్లించడానికి బిల్లులో స్పష్టమైన, సరళమైన నిబంధనలు ఏమీ లేవు.

నష్ట పరిహారం క్లెయిమ్ చేసుకోవడానికి అవసరమైన ప్రక్రియ క్లిష్టంగా వున్నది. సాంపుల్ సేకరణ, లాబోరేటరీ పరీక్షలు, విచారణలు అన్నీచాలా క్లిష్టంగా మరియు ఖరీదైనదిగా ఉన్నాయి. ఇది చిన్న రైతులు న్యాయం పొందకుండా నిరోధిస్తుంది. స్పష్టమైన నిబంధన లేకపోవడం: నాసిరకం విత్తనాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు తప్పనిసరిగా, సులభంగా పరిహారం చెల్లించేందుకు ఒక స్పష్టమైన మరియు సరళమైన నిబంధన బిల్లులో లేదు. 

• క్లిష్టమైన ప్రక్రియ: నష్టపరిహారం పొందే ప్రక్రియ క్లిష్టంగా, సాంకేతికంగా, మరియు సుదీర్ఘంగా ఉంటుందని, ఇది చిన్న రైతులు అనుసరించడానికి అనుకూలంగా ఉండదని అభిప్రాయపడుతున్నారు. నమూనాల సేకరణ, ప్రయోగశాల పరీక్షలు, విచారణ వంటి సుదీర్ఘ పద్ధతులపై అధికారులు మరియు కోర్టుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

• కోర్టుల ప్రమేయం: విత్తన లోపం వల్ల పంట నష్టం జరిగితే, రైతులు ఇప్పటికీ పెద్ద కంపెనీలతో న్యాయస్థానాలలో పోరాడవలసి వస్తుంది, ఇది ఆర్థికంగా, సమయం పరంగా చిన్న రైతులకు భారం అవుతుందని నిపుణులు హెచ్చరించారు.

కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడే ప్రధాన అంశాలు (Provisions Protecting Corporate Interests)

ముసాయిదా బిల్లులో కంపెనీల పరిశోధన (R&D) మరియు మార్కెట్ విస్తరణకు దోహదపడే అంశాలు, అలాగే నియంత్రణ భారాన్ని తగ్గించే నిబంధనలు ఉన్నాయి:

2. రైతు హక్కులపై పరిమితులు(Limitation of Farmer Rights)

• సంప్రదాయ విత్తనాలను సేవ్ చేసుకోవడం, మార్చుకోవడం లేదా అమ్మడంపై రైతులకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ, బిల్లులోని కొన్ని నిబంధనలు భవిష్యత్తులో ఈ హక్కులకు పరిమితులు విధించవచ్చని ఆందోళనగావున్నది. భారత దేశ జన్యు వారసత్వాన్ని రక్షించేందుకు తీసుకున్న చర్యలు చట్టం లో లేవు.

• రిజిస్ట్రేషన్ భారం: అన్ని విత్తన రకాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడం వలన, రైతులు తమ సంప్రదాయ వెరైటీల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు పడతారు.

3. మార్కెట్ మరియు ధరలపై ప్రభావం (Impact on Market and Prices)

• విత్తన ధరల పెరుగుదల: విత్తన పరిశ్రమపై ప్రభుత్వం యొక్క నియంత్రణ తగ్గి, కేంద్రీకృత గుర్తింపు వ్యవస్థ కారణంగా పెద్ద కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం పెరుగుతుంది. విత్తన ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. 

• పోటీ లేమి: చిన్న విత్తన కంపెనీలు మరియు స్థానిక తయారీదారులు కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థను ఎదుర్కొనే శక్తి లేక మార్కెట్ నుండి నిష్క్రమించక తప్పదు. దీనివల్ల పోటీ తగ్గి, పెద్ద కంపెనీల గుత్తాధిపత్యం (monopoly) పెరుగుతుంది.

4. ప్రభుత్వ నిబంధనల ఉపసంహరణ (Withdrawal of Government Regulations)

• ప్రభుత్వ పాత్ర తగ్గింపు: బిల్లులో విత్తన ధృవీకరణ (certification) మరియు పరీక్షల్లో ప్రభుత్వ పాత్రను తగ్గించి, ప్రైవేట్ సంస్థలకు ఎక్కువ అధికారం కల్పించడంపై ఆందోళన ఉంది. దీనివల్ల నాణ్యత పర్యవేక్షణ ప్రమాణాలు తగ్గే అవకాశం ఉంది. 

కార్పొరేట్ కంపెనీల ప్రయోజన పరిరక్షణ (Protection of Corporate Interests)

ఈ ముసాయిదా బిల్లు విత్తన పరిశ్రమలో  కార్పొరేట్ కంపెనీల వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని (Ease of Doing Business) పెంచడం ద్వారా మరియు వారి పరిశోధన (R&D) పెట్టుబడులకు రక్షణ కల్పించడం ద్వారా కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

1. కంపెనీలపాలనాపరమైన భారం తగ్గింపు (Reduced Regulatory Burden)

• మైనర్ నేరాల డీక్రిమినలైజేషన్ (Decriminalisation of Minor Offences):

• చిన్నపాటి నియమ ఉల్లంఘనలకు లేదా సాధారణ తప్పులకు శిక్షలను తగ్గించడం లేదా వాటిని నేరాల జాబితా నుండి తొలగించడం జరిగింది. దీనివల్ల కంపెనీలపై ఉండే న్యాయపరమైన మరియు పాలనాపరమైన ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.

• కేంద్రీకృత గుర్తింపు వ్యవస్థ (Centralised Accreditation System):

• విత్తన కంపెనీలు కేంద్ర స్థాయిలో గుర్తింపు పొందితే, రాష్ట్రాల స్థాయిలో మళ్లీ అనుమతులు/గుర్తింపులు పొందాల్సిన అవసరం ఉండదు. బహుళ రాష్ట్రాల్లో వ్యాపారం చేసే పెద్ద కంపెనీలకు ఇది ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది.

2. మార్కెట్ విస్తరణ మరియు R&D ప్రోత్సాహం (Market Expansion and R&D Incentive)

• విత్తన దిగుమతుల సరళీకరణ (Liberalised Seed Imports):

. కొత్త విత్తనాలను, ముఖ్యంగా పరిశోధన ఆధారిత జన్యు మార్పిడి విత్తనాలను, భారతదేశంలోకి సులభంగా దిగుమతి చేసుకునేందుకు నిబంధనలను సరళీకరించారు. ఇది వినూత్న విత్తనాలను అందించే పెద్ద కంపెనీల మార్కెట్ విస్తరణకు సహాయపడుతుంది. మన దేశ పరిస్థితులకు సంబంధం లేని పరిశోధనలు మన వ్యవసాయానికి ఉపయోగపడవు. కార్పోరేట్ కంపెనీల కు దండిగా లాభాలను సమకూరుస్తాయి.

• పరీక్షల ప్రక్రియ సరళీకరణ (Streamlined Trial Process):

• నూతన విత్తన వంగడాల ధృవీకరణ మరియు వినియోగ విలువ (Value for Cultivation and Use – VCU) పరీక్షల నియంత్రణలను కొంతవరకు సడలించడం జరిగింది. దీనివల్ల ప్రైవేట్ కంపెనీలు తమ నూతన వంగడాలను మార్కెట్‌లోకి వేగంగా విడుదల చేయగలుగుతాయి, తద్వారా పెట్టుబడిపై రాబడి పెరిగి కంపెనీల లాభాలు పెరుగుతాయి. (Return on Investment) 

3. నకిలీ విత్తనాల నియంత్రణ పేరున ట్రేసబిలిటీ (Traceability) మరియు పారదర్శకత: క్యూఆర్ కోడ్‌లు (QR Codes) మరియు SATHI పోర్టల్ ద్వారా ప్రతి విత్తనం యొక్క మూలాన్ని (Source) సులభంగా గుర్తించవచ్చు. ఇది బ్రాండెడ్ మరియు నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసే పెద్ద కంపెనీల ఉత్పత్తులకు రక్షణ కల్పిస్తుంది. దేశీ విత్తనాలను మార్కెట్‌లోకి తీసుకువచ్చే చిన్న వ్యాపారులను నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది.

ఈ నిబంధనలన్నీ కలిసి, పెద్ద కార్పొరేట్ కంపెనీలు భారతదేశ విత్తన మార్కెట్‌లో మరింత స్వేచ్ఛగా మరియు వేగంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. కార్పొరేట్ కంపెనీల కు అనుకూలంగా, రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా వున్న ఈ బిల్లు ను తిప్పికొట్టాలి. 

డాక్టర్ కొల్లా రాజమోహన్,. నల్లమడ రైతు సంఘం, గుంటూరు. 

9000657799

Share this:

  • Tweet
  • More
Like Loading...

పతన దిశగా ఉక్రెయిన్‌, లొంగిపోతున్న మిలిటరీ – పరారీ క్రమంలో జెలెనెస్కీ !

19 Wednesday Nov 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#Ukraine Crisis, Donald trump, Ukraine, Ukrainian Troops Abandoning Front, Vladimir Putin, Zelensky

ఎం కోటేశ్వరరావు

నిజమే ! గతవారం రోజులుగా ఉక్రెయిన్‌ పోరులో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పశ్చిమదేశాల నుంచి వస్తున్న వార్తలను చూస్తుంటే భయంకరమైన చలికాలం ముగిసేలోగా ఉక్రెయిన్‌ పతనం అవుతుందా ? చలికి తట్టుకోలేక ఉక్రెయిన్‌ సైన్యం తెల్లజెండా ఎత్తుతుందా ? ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య మంగళవారం నాడు 1,363వ రోజులో ప్రవేశించింది. వేలాది మంది ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోతున్నట్లు వార్తలు, అధ్యక్షుడు వ్లదిమిర్‌ జెలెనెస్కీ విదేశాలకు పారిపోనున్నాడా అంటే మిన్నువిరిగి మీద పడే అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప అందుకు అవకాశాలు లేకపోలేదని అనిపిస్తున్నది. గత కొద్ది వారాలుగా అనేక కీలక ప్రాంతాలను చక్రబంధంలో బిగించిన రష్యా ఒక్కో గ్రామం, ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. పోకరోవస్క్‌ అనే పట్టణంలోకి పుతిన్‌ సేనలు చొరబడ్డాయని ఏక్షణంలోనైనా స్వాధీనం చేసుకోవచ్చని వార్తలు. గత ఏడాదిన్నర కాలంగా ఆ పట్టణాన్ని పట్టుకొనేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతున్నది. అక్కడ ఉన్న దాదాపు ఐదువేల మంది ఉక్రెయిన్‌ మిలిటరీ కదలకుండా బందీ అయిందని, తెల్లజెండా ఊపిందని, పోరు సాగుతున్నదని భిన్నవార్తలు వచ్చాయి. వెలుపలి నుంచి వస్తున్న రష్యన్‌ సేనలను ప్రతిఘటిస్తున్నట్లు కనిపించటం లేదని, అయితే ఇండ్లు, బంకర్లలో ఉన్నవారి కారణంగా ఒక్కో ప్రాంతాన్ని జల్లెడ పట్టి ముందుకు పోతున్నారని, కొన్ని వారాల్లో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్నారు.అది స్వాధీనమైతే అనేక కొత్త ప్రాంతాలను సులభంగా పట్టుకొనేందుకు వీలుకలుగుతుందని, సైనిక చర్య మరో మలుపు తిరుగుతుందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో జరిపే పెద్ద దాడులకు సన్నాహాలలో భాగంగా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న పోలాండ్‌లోని రైల్వేట్రాక్‌ను ధ్వంసం చేసినట్లు రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. సోమవారం నాడు పోలాండ్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఐరోపా దేశాల మీడియా రష్యా కారణమని చెబుతున్నది. ఇదే సమయంలో తాము ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటున్నట్లు శుక్రవారం నాడు జెలెనెస్కీ కూడా అంగీకరించాడు. నాటో కూటమి దేశాలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్నప్పటికీ అది వృధా అనే అభిప్రాయంతో నేతలు ఉన్నారు. ఉక్రెయిన్‌ ఇజ్‌మెయిల్‌ రేవు పట్టణం వద్ద ఉన్న టర్కీ ఎల్‌పిజి టాంకర్‌ షిప్‌పై జరిగినదాడిలో అది దగ్దమైంది.దాడి ఎవరు జరిపిందీ తేలనప్పటికీ రష్యా చేసిందని ఆరోపించారు. దాంతో పక్కనే ఉన్న రుమేనియాతన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. పత్యక్షంగా పాల్గ్గొనేందుకు నాటో నేతలు విముఖత చూపుతున్నారు. గతంలో తగిలిన దెబ్బలతో తలబొప్పి కట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఉక్రెయిన్‌ సమస్యపై ప్రస్తుతం కంటి చూపుతున్న నోటమాట లేదు.జెలెనెస్కీ పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలా ఉంది.

దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిఝఝియాలో మరికొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలోకి వెళ్లాయి.ఈ ప్రాంతంలో పోరు దిగజారుతున్నదని జెలెనెస్కీ మిలిటరీ అధికారులే అంగీకరించారు.వ్యూహాత్మకంగా తమసేనలను వెనక్కు రప్పిస్తున్నట్లు చెప్పుకున్నారు.హంగరీ ప్రధాని విక్టర్‌ ఒర్బాన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ గెలిచే అవకాశం లేదని, ఐరోపా ఆర్థికసాయం పిచ్చితనం తప్ప మరొకటి కాదన్నాడు. ఇప్పటికే 185బిలియన్‌ యూరోలు తగలేశామని, ఇంకా అంతకంటే ఎక్కువే తగేలేయాలని చూస్తున్నామని, ఎంత చేసినా గెలిచే అవకాశం లేదని జర్మన్‌ మీడియా గ్రూపు అక్సెల్‌ స్ప్రింగర్‌ సిఇఓతో మాట్లాడుతూ చెప్పాడు. యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణుల కోసం జెలెనెస్కీ ప్రస్తుతం ఫ్రాన్సు పర్యటనలో ఉన్నాడు, రానున్న పది సంవత్సరాలలో 100 రాఫేల్‌ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. తరువాత స్పెయిన్‌ వెళతాడని వార్తలు.సరస్సులోని చేపలు పైకి వస్తే మింగివేసేందుకు సిద్దంగా ఉండే కొంగల మాదిరి క్రామాటోరస్క్‌ వంటి చోట్ల రష్యన్‌ లాన్సెట్‌ డ్రోన్లు దాడులకు సిద్దంగా ఉన్నాయని ఉక్రెయిన్‌ నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రతి రోజూ రష్యన్ల చేతిలో నరకం చూస్తున్నట్లు చెబుతున్నారు. సమీప భవిష్యత్‌లో రష్యాతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ జరిగే అవకాశం లేదని మాస్కోతో 1,350 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఫిన్లండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌ చెప్పాడు. సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి గురించి తాను ట్రంప్‌తో మాట్లాడతానని, పది అంశాల్లో ఏ ఒక్కదానికి పుతిన్‌ అంగీకరించినా మంచిదే అన్నాడు. ఇటీవలనే ఫిన్లాండ్‌ నాటో కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. రష్యా ఎత్తుగడలు ఏమిటో తమకు బాగా తెలుసని స్టబ్‌ చెప్పాడు.

ఉక్రెయిన్‌ సేనలు యుద్ద రంగం నుంచి పారిపోతున్న వార్తలు గతంలోనే వచ్చినప్పటికీ ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉన్నాయి. వివాదం ప్రారంభమైన 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే పశ్చిమ దేశాల మీడియా వార్తల ప్రకారం అక్టోబరు నెలలో 21వేల మంది పారిపోయారు. రష్యాపై తాము విజయం సాధించబోతున్నామని జెలెనెస్కీ ఎన్ని కబుర్లు చెప్పినా, ఇతర దేశాలు ఇచ్చిన కొన్ని ఆధునిక ఆయుధాలు, సమాచారం ఆధారంగా రష్యాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేసిన తరువాత ఇలా జరగటం, అదీ పశ్చిమ దేశాల మీడియా వెల్లడించట గమనించాల్సిన అంశం. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని ఇటీవలి వరకు ఉక్రెయిన్‌ మిలిటరీలో పనిచేసిన ఇగోర్‌ లుస్టెంకో చెబుతున్నాడు. మిలిటరీ ఇలాంటి అంశాలను బయటకు రాకుండా చూస్తుందని వేరే చెప్పనవసరం లేదు.అధికారిక సమాచారం ప్రకారమే అక్టోబరులో 21,602 మంది పారిపోయారు, వాస్తవంలో ఎక్కువ మంది ఉంటారని లుస్టెంకో చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఇటీవలి కాలంలో రష్యన్‌ సేనలు మరిన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవటానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతుండగా, తాము గెలిచే అవకాశం లేదని ఉక్రెనియన్లు భావించటంతో పోరాడటం, ప్రాణాలు పోగొట్టుకోవటంలో అర్దం లేదని అనేక మంది భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇటీవల ఒక బ్రిటీష్‌ పత్రిక చేసిన విశ్లేషణ ప్రకారం ఆరున్నర లక్షల మంది మిలిటరీలో చేరి పోరాడగలిగిన వయస్సున్నవారు ఉక్రెయిన్‌ వదలి పారిపోయారు. ఆ దేశ పార్లమెంటు సభ్యుడొకరు నాలుగు లక్షలని చెప్పాడు.మిలిటరీ నుంచి పారిపోతున్నవారి గురించి 2024 డిసెంబరులో ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం అంతకు ముందు రెండు సంవత్సరాలతో పోలిస్తే ఆ ఏడాది రెండింతలున్నారు.బ్రిటీష్‌ పత్రిక టెలిగ్రాఫ్‌ ఇటీవల ఇచ్చిన విశ్లేషణ ప్రకారం ప్రతి నెల పారిపోతున్న లేదా విధులకు చెప్పకుండా గైరుహాజరవుతున్నవారి సంఖ్య ఇరవైవేలు ఉంటున్నది. పారి పోయిన వారి మీద 2.9లక్షల కేసులను ప్రభుత్వం నమోదు చేసింది.ఇప్పుడు కనీసం రెండు లక్షల మంది కొరత వున్నట్లు అంచనా. అనేక మంది మాజీ, ప్రస్తుత అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఈ విషయాలను రాసింది. పోరు జరుగుతున్న ప్రాంతాలలో ఉన్నవారిలో కేవలం 30శాతం మందే యుద్ద సన్నద్దతతో ఉన్నారు. సెప్టెంబరు నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ సేనలలో కేవలం 47-48శాతానికి మించి లేరని చెప్పాడు. సైనికుల కొరత ఉన్నవారి మీద వత్తిడిని కూడా పెంచుతున్నది.వారినే ఒక రంగం నుంచి మరో రంగానికి పదే పదే మారుస్తున్నారు. నిరంతర దాడులను తట్టుకొనే శక్తి తగ్గుతున్నదని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారులు వాపోతున్నారు. కొత్తగా సైన్యంలోకి తీసుకున్నవారికి కూడా తగిన శిక్షణ ఇవ్వకుండా యుద్ద రంగానికి తరలిస్తున్నారు.గ్రామాల నుంచి మిలిటరీలోకి తీసుకున్నవారిలో కొందరికి కేవలం రెండు రోజులు మాత్రమే శిక్షణ ఇచ్చి యుద్ధ రంగానికి పంపుతున్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. యుద్ధం జరిగిన సమయాల్లో ఏ పక్షమైనా తమకు జరిగిన నష్టాన్ని మూసిపెడుతుంది.వర్తమాన పోరులో రష్యా, ఉక్రెయిన్‌ గురించి కూడా అలాంటి వార్తలే వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టులో వెల్లడైనట్లు చెబుతున్న ఒక పత్రం ప్రకారం 17లక్షల మంది ఉక్రేనియన్‌ సైనికులు మరణించారన్నది అతిశయోక్తితో కూడినదిగా ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ఉంటారన్నది వాస్తవం. మిలిటరీ నుంచి పారిపోవటం పెరగటానికి ఇవి కూడా కారణం.

అనేక చోట్ల ఉక్రెయిన్‌ సేనల లొంగుబాటు, రష్యా ఆధీనంలోకి పలు ప్రాంతాలు పోతున్నట్లు వచ్చిన వార్తల నేపధ్యంలో జెలెస్కీ బ్రిటన్‌ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు, ఉక్రెయిన్‌ గగనతలంపై విమానాలు ఎగరటం ప్రమాదకరంగా ఉండటంతో పక్కనే పోలాండ్‌లో విమానాన్ని సిద్దంగా ఉంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జెలెనెస్కీ ఏ ఐరోపా దేశానికి వెళుతున్నా కూడా చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతున్నారు. భద్రతా కారణాల రీత్యా తమదేశ పర్యటన గురించి వివరాలను వెల్లడించలేమని స్పెయిన్‌ ప్రధాని కార్యాలయం పేర్కొన్నట్లు రేడియో వెల్లడించింది. అయితే జెలెనెస్కీ సోమవారం నాడు ఫ్రాన్సు వెళ్లాడు. మరో వైపున అతగాడి స్థానంలో ఎవరిని గద్దెనెక్కించాలా అని ఆరునెలలుగా డోనాల్డ్‌ ట్రంప్‌ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దానిలో భాగంగానే ఇంథన ఒప్పందాలలో జెలెనెస్కీకి పది కోట్ల డాలర్ల లంచం ముట్టినట్లు, దాని గురించి దర్యాప్తు జరుగుతున్నదనే వార్తలు వచ్చాయి. అనేక దేశాల్లో ఎవరినైనా సాగనంపాలనుకున్నపుడు ఇలాంటి వాటిని ముందుకు తెచ్చి రంగం సిద్దం చేసే సంగతి తెలిసిందే. జెలెనెస్కీ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు రష్యన్‌ వర్గాలు కూడా చెబుతున్నాయి. బ్రిటన్‌ ఆశ్రయం ఇచ్చేందుకుసిద్దంగా ఉన్నప్పటికీ అక్కడ ఎంతకాలం ఉంటారన్న విశ్లేషణ కూడా సాగుతున్నది. ఇప్పటికే బ్రిటన్‌లో భవనాలను కొనుగోలు చేశాడని, రాజు చార్లెస్‌తో సంబంధాలలో ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల నాటికి డెమోక్రటిక్‌ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసేందుకు గాను దాఖలు చేసే కేసులలో జెలెనెస్కీని సాక్షిగా చేసేందుకు చూస్తున్నట్లు, దానికి గాను పారిపోతే బ్రిటన్‌ నుంచి రప్పిస్తారని కూడా చెబుతున్నారు.మరొక దేశం ఇజ్రాయెల్‌ వెళ్లినా అదే జరుగుతుంది. కీలకమైన పోకరోవస్క్‌ పట్టణం పతనమైన తరువాత ఇలాంటి పరిణామం జరుగవచ్చని భావిస్తున్నారు. జెలెనెస్కీ పర్సుగా పరిగణిస్తున్న ఒక టీవీ కార్యక్రమాల స్టూడియో యజమాని తైముర్‌ మిండిచ్‌ మీద ఇప్పుడు జాతీయ అవినీతి నిరోధకశాఖ దర్యాప్తు జరుపుతున్నది. మాజీ ఉప ప్రధాని, ప్రస్తుతం జాతీయ ఐక్యత శాఖ మంత్రిగా ఉన్న ఒలెక్సీ గురించి కూడా దర్యాప్తు జరుగుతున్నది. జెలెనెస్కీ పదవీ కాలం ముగిసింది. పోరు సాగుతున్నదనే పేరుతో పదవిలో కొనసాగుతున్నాడు, ఉక్రెయిన్‌కు తగులుతున్న ఎదురుదెబ్బల పూర్వరంగంలో అతగాడిని బలిపశువుగా చేసి కొత్త బొమ్మను గద్దె నెక్కించి కాలం గడిపేందుకు అమెరికా, ఇతర నాటో దేశాలు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. అక్కడ ఎవరు గద్దె నెక్కినా రష్యాకు వ్యతిరేకంగా నాటో దేశాల కుట్రలకు తెరపడితే తప్ప ప్రయోజనం ఉండదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రభుత్వ మూత సామాన్యులకే సంకటం : తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్న ట్రంప్‌ !

12 Wednesday Nov 2025

Posted by raomk in Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

Donald trump, Donald Trump Failuer, US Shutdown 2025

ఎం కోటేశ్వరరావు

అక్టోబరు ఒకటవ తేదీ నుంచి అమెరికాలో కొనసాగుతున్న ఫెడరల్‌ ప్రభుత్వ మూత (షట్‌డౌన్‌)ను ఎత్తివేసేందుకు ఆదివారం నాడు నాంది పలికారు.మూత 41వ రోజు సోమవారం నాడు ఎనిమిది అంశాలపై పార్లమెంటు ఎగువ సభ సెనెట్‌లో తీర్మానాలు ఆమోదం పొందాయి.బుధవారం నాడు ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌ ముందుకు వచ్చిన తరువాత చేసే తీర్మానంతో అధికారికంగా ప్రభుత్వ మూతకు తెరపడుతుందని భావిస్తున్నారు. గతంలో తొలిసారి అధికారానికి వచ్చినపుడు 2019లో 35 రోజుల పాటు మూత తరువాత తన రికార్డును ట్రంప్‌ బద్దలు కొట్టాడు. రారాజునంటూ దిగిరానని బెట్టు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ మెట్టుదిగటంతో జనవరి 31వరకు ప్రభుత్వానికి అవసరమైన నిధులను పొందేందుకు వీలుగా సెనెట్‌ 60-40 ఓట్లతో ఆదివారం నాడు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జనవరి ఒకటవ తేదీతో ముగియనున్న ఆరోగ్య సంరక్షణ సబ్సిడీ పథకాన్ని కొనసాగించేందుకు ట్రంప్‌ అంగీకరించటంతో ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన ఎనిమిది మంది సెనెట్‌ సభ్యులు మద్దతు ఇవ్వటంతో సర్కార్‌ గట్టెక్కింది.కుదిరిన ఒప్పందానికి తాను కట్టుబడి ఉంటానని ట్రంప్‌ ప్రకటించాడు. ఈ సమస్య ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీలో టీకప్పులో తుపాను వంటి చిచ్చు రేపింది. ఎనిమిది మంది సభ్యులను డోనాల్డ్‌ ట్రంప్‌ ” ఆకర్షించి ” మూత ఎత్తివేతకు మద్దతు పలికించినట్లు చెప్పవచ్చు. అసలు ఈ ప్రభుత్వ మూత అంటే ఏమిటి ? దాని పర్యవసానాలేమిటో చూద్దాం. మూత కారణంగా రోజుకు 17 బిలియన్‌ డాలర్ల చొప్పున అప్పు పెరుగుతున్నదని, వారానికి 14 బిలియన్‌ డాలర్ల మేర నష్టమని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఈ అంచనాలు లెక్కించే పద్దతి, పరిగణనలోకి తీసుకొనే అంశాలు ఒకటే కాకపోవటంతో భిన్నమైన అంకెలు మీడియాలో వచ్చాయి. వాటిని చూసి గందరగోళపడాల్సిన అవసరం లేదు, నష్టమైతే వాస్తవం.

ప్రతిదేశంలో బడ్జెట్లకు పార్లమెంట్ల ఆమోద ముద్ర పడితేనే నిధుల విడుదలకు అవకాశం ఏర్పడుతుంది. మనదేశంలో ఏప్రిల్‌ నుంచి మార్చి నెల వరకు ఆర్థిక సంవత్సరం,అత్యధిక దేశాల్లో జనవరి నుంచి డిసెంబరు వరకు ఉంటుంది. మార్చి 31వ తేదీలోగా ద్రవ్యబిల్లుకు ఆమోదం తెలపకపోతే ఏప్రిల్‌ ఒకటి నుంచి ఖజానా నుంచి నిధుల విడుదల ఆగిపోతుంది. అమెరికాలో అది జనవరి ఒకటి నుంచి జరుగుతుంది. అయితే ఇది పౌరకార్యకలాపాలకు తప్ప మిలిటరీ వంటి అత్యవసర సేవలకు వర్తించదు.1980దశకం నుంచి కొన్ని శాఖలకు తగినన్ని నిధులు కేటాయించటంలో తలెత్తిన సమస్యల కారణంగా ఇప్పటి వరకు 21సార్లు ప్రభుత్వ మూతలకు దారితీశాయి. ప్రారంభంలో కొద్ది గంటలతో మొదలై ఇప్పుడు వారాల తరబడి కొనసాగుతున్నది.ప్రారంభంలో ఈ మూతల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు ఉండేవి కాదు, ఇటీవలి 11 మూతల సమయంలో వారిపై వేటు పడటం సాధారణంగా మారింది.సామాన్యులకు ఇబ్బందులు కలుగుతున్నాయి.అమెరికా-మెక్సికో సరిహద్దులో ఇనుప గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్న డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనకు వ్యతిరేకత వ్యక్తం కావటంతో 2018-19లో 35 రోజులు, అంతకు ముందు వివిధ సంక్షేమ పధకాలకు కోతలను ప్రతిపాదించటంతో బిల్‌క్లింటన్‌ ఏలుబడిలో 21, ఆరోగ్య సంక్షేమానికి సబ్సిడీలను పెంచాలన్న బరాక్‌ ఒబామా ప్రతిపాదనలకు వ్యతిరేకంగా 16 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. ఇప్పుడు అదే ఒబామా అమలు చేసిన ఆరోగ్య పథకానికి జనవరి ఒకటి నుంచి నిధులు నిలిపివేయాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా రికార్డు సృష్టించిన మూత ప్రారంభమైంది.2013లో మూత కారణంగా 24 బిలియన్‌ డాలర్లు ఆర్థిక వ్యవస్థకు దూరమైనట్లు, ఆ ఏడాది నాలుగవ త్రైమాస కాలంలో జిడిపి 0.6శాతం నష్టపోయినట్లు అంచనా వేశారు. తాజా ఉదంతంతో నష్టం ఎంతో తెలియాల్సి ఉంది.

తెగేదాకా లాగితే రాజకీయంగా మరింత నష్టమన్న భయమే ట్రంప్‌ను దిగివచ్చేట్లు చేసింది. ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్‌ మేయర్‌, రెండు రాష్ట్రాల గవర్నర్‌ ఎన్నికల్లో అధికార పార్టీ మట్టికరవటం, వచ్చే ఏడాది పార్లమెంటు మధ్యంతర ఎన్నికలు ఉండటంతో రిపబ్లికన్‌ పార్టీ మీద తీవ్ర వత్తిడి వచ్చిన ఫలితమే తాజా పరిణామం అని చెప్పవచ్చు. మూత చివరి రోజులలో రెండువేల విమానాలు రద్దు కావటం, ఏడువేల సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, ప్రయాణీకుల నుంచి వచ్చిన నిరసన కూడా దోహదం చేసి ఉండవచ్చు. రానున్న సెనెట్‌ ఎన్నికలలో ప్రతిపక్ష డెమోక్రాట్లు మెజారిటీ సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కోట్లాది మంది పేదలు, యువత ఇబ్బందులు పడిన తీరు రానున్న రోజుల్లో ట్రంప్‌ మీద వ్యతిరేకత పెంచేదే తప్ప మరొకటి కాదు. ఇవన్నీ తెలిసినప్పటికీ ఆ పెద్దమనిషి ఎందుకు ఇలాంటి చర్యకు పాల్పడినట్లు ? పాలకవర్గాల సేవలో తరించేవారికి సామాన్య జనం పట్టరు. మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌-అమెరికాను మరోసారి గొప్పదానిగా చేద్దాం) రాజకీయాలు చెల్లవని న్యూయార్క్‌, న్యూ జెర్సీ, వర్జీనియా రాష్ట్రాల ఎన్నికలు స్పష్టం చేశాయి.లక్షలాది కుటుంబాలకు వచ్చే స్వల్ప ఆదాయానికి అంతరాయం కలగటంతో పెన్షన్‌ ఖాతాల నుంచి కుటుంబ అవసరాలకోసం డబ్బు తీసుకొనేందుకు సైతం సంకోచించారు, అప్పులు తీసుకుంటే రానున్న రోజుల్లో తీర్చలేమోననే భయంతో అనేక మంది సర్దుకున్నారు.

నలభై రోజులపైగా మూతతో అమెరికా ఏమైనా స్థంభించిందా అంటే లేదు. అంతకు ముందు నుంచి కొనసాగిస్తున్న అన్ని దుర్మార్గాలకు ప్రభుత్వం మద్దతు కొనసాగిస్తూనే ఉంది.మన దేశంలో పేదరికాన్ని నిర్మూలించామని చెబుతూనే ఆకలితో ఉన్న వారికి నరేంద్రమోడీ సర్కార్‌ 80 కోట్ల మందికి ఉచిత బియ్యం, గోధుమలను అందిస్తున్నది.ప్రపంచంలో అత్యంత ధనికదేశం అమెరికా, అక్కడి జనాభా 34 కోట్లు, వారిలో నాలుగున్నర కోట్ల మంది ప్రభుత్వం నుంచి ఆహార సాయం అందుకుంటున్నారు. ప్రభుత్వ మూత అంటే కుదరదు వారందరికీ ఆహార సహాయం చేయాలంటూ కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని ట్రంప్‌ ఉల్లంఘించాడు. మరోవైపు తన కార్యాలయంలో ఉన్నదాన్ని పడగొట్టించి విలాసవంతమైన బాల్‌రూమ్‌ డాన్సు మందిరాన్ని నిర్మించాడు.అర్జెంటీనాలోని పచ్చి మితవాద ప్రభుత్వాన్ని ఆదుకొనేందుకు 80బిలియన్‌ డాలర్ల మేర సాయం అందించాడు. ఇవి మచ్చుకు కొన్ని అంశాలు మాత్రమే.ట్రంప్‌ వంటి వారి ప్రాధాన్యతలు ఎలాంటివో లోకానికి స్పష్టమైంది. వేలాది విమానాలు నిలిచిపోవటంతో ప్రయాణాలు రద్దయి లక్షల మంది ఇబ్బందులు పడుతుంటే మూత కారణంగా విమానరాకపోకల నియంత్రణ సిబ్బంది వత్తిడి నుంచి ఉపశమనం పొందుతారంటూ ట్రంప్‌ యంత్రాంగం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ఇచ్చే విందులు, వినోదాలు చాలా ఖర్చుతో కూడినవి, పిల్లలకు రెండు బదులు ఒక బొమ్మ కొనిపెట్టండని తలిదండ్రులకు మూత సమయంలో ట్రంప్‌ సలహాయిచ్చాడు.

మూతకు తెరపడినప్పటికీ అది ముందుకు తెచ్చిన సమస్యలకు ఇంకా పరిష్కారం దొరకాల్సి ఉంది. ఫెడరల్‌ ఉద్యోగులు 9లక్షల మంది, ఇతరులు 20లక్షల మందికి మూత సమయంలో ఎలాంటి వేతనాలు ఉండవని అధికార యంత్రాంగం పేర్కొన్నది.దాన్ని ఉద్యోగులు అంగీకరించే అవకాశం లేదు, ఎందుకంటే మూతకు వారి విధులకు ఎలాంటి సంబంధం లేదు. ఆరోగ్య సంరక్షణ సబ్సిడీ బీమా పథకం పొడిగింపుకు ట్రంప్‌ దిగివచ్చినా కొనసాగిస్తాడనే హామీ లేదని ఏపి వార్తా సంస్థ పేర్కొన్నది. అన్నింటికీ మించి ఫెడరల్‌ ప్రభుత్వ ఉద్యోగులను భారీగా తగ్గించాలన్న ట్రంప్‌ యంత్రాంగ అజెండాకు పెద్ద పరీక్ష ఎదురుకానుంది. మూత ఎత్తివేతకు కుదిరిన రాజీ ప్రకారం తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకొనేందుకు, వేతనాలు చెల్లించేందుకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం జనవరి మాసం వరకు మాత్రమే గనుక వచ్చే ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో ట్రంప్‌కు అసలైన పరీక్ష ఎదురుకానుంది. ఆదివారం నాటి రాజీ రెండు పార్టీల్లో ఉన్న విబేధాలను వెల్లడించింది. న్యూయార్క్‌ డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ ష్కన్నర్‌ వ్యతిరేకంగా ఓటు వేశాడు. ట్రంప్‌తో జరుపుతున్న పోరాటాన్ని వదలివేయటం భయంకరమైన తప్పిదమని డెమోక్రటిక్‌ సోషలిస్టు పార్టీ స్వతంత్ర సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ వర్ణించాడు. రాజీకి అంగీకరించిన ఎనిమిది మంది డెమోక్రటిక్‌ సెనెటర్లు తమచర్యను సమర్ధించుకున్నారు. మరికొన్ని వారాలు మూత కొనసాగినా ఇంతకంటే మంచి ఒప్పందం కుదిరి ఉండేది కాదని త్వరలో పదవీకాలం ముగియనున్న సెనెటర్‌ షాహీన్‌ చెప్పింది. ఇల్లలకగానే పండగ కాదన్నట్లుగా మూత ముగిసినా వివిధ శాఖలకు కేటాయింపులకు అనేక అంశాల మీద ఓటింగ్‌ జరగాల్సి ఉంది. ఎక్కడైనా తేడా వస్తే మద్దతు ఇచ్చిన వారు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఆదివారం నాడు వ్యతిరేకంగా ఓటు చేసిన డెమోక్రాట్లు ట్రంప్‌ సర్కార్‌ మీద పోరాడిల్సిందే అంటున్నారు.

మూత కారణాలను గనుక చూస్తే రిపబ్లికన్లు ఇంకా దిగిరావాల్సి ఉంటుందన్నది స్పష్టం.2026 సంవత్సర బడ్జెట్‌ కేటాయింపులపై తలెత్తిన విబేధం 40 రోజులకు పైగా మూతకు దారితీసింది. జనవరి ఒకటి నుంచి ఆరోగ్యబీమా సబ్సిడీలను ఎత్తివేస్తానని ట్రంప్‌ ప్రకటించాడు, దాన్ని డెమోక్రాట్లు తిరస్కరించారు. ప్రధానమైన ఈ అంశంతో పాటు వృద్ధుల సంరక్షణ, ఇతర సేవలకు కేటాయింపులు కూడా వివాదాస్పాదం కావించాడు. కోట్లాది మంది కార్మికుల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను ఝటిలం చేయటానికి ట్రంప్‌దే బాధ్యత. గతంలో కూడా అనేకసార్లు మూత ఉదంతాలు జరిగాయి. కానీ ఈ సారి దానితో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించాడు.దేన్నీ మానుకోలేదు. ప్రయాణాలు మానుకోలేదు, గోల్ఫ్‌ ఆడటం ఆపలేదు, మెక్‌డొనాల్డ్‌ నుంచి గాక వేరే సంస్థ నుంచి హామ్‌బర్గర్లు(పందిమాంసంతో చేసినవి) తెప్పించుకు తినటం తగ్గించలేదు. గతంలో ఇలాంటి సమయాల్లో అధ్యక్షులందరూ కనీసం జనానికి సానుభూతి చూపుతున్నట్లు కనిపించేందుకైనా తమ కార్యక్రమాలను తగ్గించుకున్నారు.ట్రంప్‌ అలాంటివేమీ లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరించాడు. నలభై రోజులూ తన కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించాడు. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులదీ అదే వరుస. సామాన్యులు తప్ప అసామాన్యులెవరూ ఇబ్బంది పడలేదు.గతంలో అధ్యక్ష భవనంలో పనిచేసే సిబ్బందిలో 61 నుంచి 70శాతం మంది విధులకు హాజరుకాలేదు, ఈ సారి 32శాతమే రాలేదు.అంటే ఏ సేవకూ అంతరాయం కలగలేదు.చివరి నిమిషంలో ప్రజాప్రతినిధుల సభలో ఆరోగ్య సబ్సిడీలకు ప్రభుత్వం అడ్డం తిరగవచ్చా అంటే స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ చెప్పిన సమాధానం కొన్ని సందేహాలకు తావిస్తున్నది. తానెలాంటి హామీ ఇవ్వలేనని, సభ్యుల మధ్య ఏకాభిప్రాయ సాధన రావాల్సి ఉందన్నాడు.అయితే ఇప్పటికే ఇంటా బయటా అభాసుపాలైన డోనాల్డ్‌ ట్రంప్‌ పౌరుల ఆరోగ్యం విషయంలో మొరటుగా వ్యవహరిస్తే మరింతగా జనాలకు దూరం కావటం ఖాయం !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d