• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Science

జాతీయ పతాకానికి అవమానం, హిందూ దేశంగా జాబిల్లి, రాజధానిగా శివశక్తి కేంద్రం, ఒక స్వామి డిమాండ్‌ !

29 Tuesday Aug 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Science, Uncategorized, USA, Women

≈ Leave a comment

Tags

#Hindutva, BJP, Chandrayaan-3, Defame to national flag tiranga, ISRO scientists, Jawahar Point, Naming Controversy, Narendra Modi, RSS, Shiv Shakti Point, Tiranga Point’, Vikram Lander


ఎం కోటేశ్వరరావు


చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాడుకున్నమనం దాని రాకకోసం ఆగకుండా మనమే వెళ్లాం. ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే కాదు, ప్రపంచంలోనే ఒక వినూత్న అధ్యాయానికి నాంది పలికింది. చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ నిలిచిందంటే దాని వెనుక ఉన్న యావత్‌ ఇస్రో సిబ్బంది దీక్ష, పట్టుదలే కారణం. అందుకు వారిని యావత్‌ జాతి శ్లాఘిస్తోంది.భుజం తట్టి మరిన్ని విజయాలతో ముందుకు పోవాలని మనసారా కోరుకుంటోంది. ఇంతటి మహత్తర విజయం తరువాత ఏమిటి అనే ప్రశ్న, ఉత్కంఠను రేకెత్తించింది. చంద్రయాన్‌-లో భాగంగా విక్రమ్‌ లాండర్‌ దిగిన ప్రాంతానికి ” శివశక్తి ” అని 2019లో చంద్రయాన్‌ -2లో దిగటంలో విఫలమైన ప్రాంతానికి ” తిరంగ ” అని ప్రధాని నరేంద్రమోడీ పేరు పెట్టారు. అనేక పరిశోధనలు, ఫలితాలు, నవీకరణలకు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసిన వారి పేర్లు పెట్టటం ప్రపంచమంతటా ఉన్నదే. దానిలో భాగంగానే లాండర్‌కు విక్రమ్‌ అన్న నామకరణం భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభారు పేరును చిరస్థాయిగా చేసేందుకే అన్నది తెలిసిందే. పెట్టిన పేరు వివాదాలకు తావు ఇవ్వకుండా ఉత్తేజాన్ని లేదా సందేశాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఆ విధంగా చూసినపుడు రెండు పేర్లూ అభ్యంతరకరమైనవే. చంద్రయాన్‌-2లో విఫలమైన ప్రాంతానికి పనిగట్టుకొని నాలుగేండ్ల తరువాత పెట్టటం ఏమిటి ? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఉంటుందా ? నరేంద్రమోడీ స్పూర్తితో చంద్రుడిని హిందూ దేశంగా, దాని రాజధానిగా విక్రమ్‌ లాండర్‌ దిగిన ప్రాంతాన్ని పార్లమెంటు ప్రకటించాలని సంత్‌ మహాసభ జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న చక్రపాణి మహరాజ్‌ అనే హిందూ స్వామి ఒకరు ఆదివారం నాడు డిమాండ్‌ చేశారు. భిన్న భావజాలం కలవారు అక్కడకు చేరి గజ్వా ఏ హింద్‌ (ముస్లింలు జయించిన రాజ్యం) అని ప్రకటించుకోక ముందే ఈ పని చేయాలని అన్నారు. ఇదే ప్రాతిపదిక అయితే చంద్రుడి మీద తొలుత కాలుమోపిన వారు మతరీత్యా క్రైస్తవులు. వారు క్రీస్తు రాజ్యం అని పేరు పెట్టాలన్న ఆలోచన చేయలేదే !


తిరంగ అన్నది మన జాతీయ పతాకను జనం పిలిచే పేరు. ఒక విఫల ప్రయోగానికి దాని పేరు పెట్టటం మొత్తం జాతిని, జాతీయోద్యమాన్ని అవమానించటం తప్ప మరొకటి కాదు. అది బ్రిటీష్‌ వలస పాలకులపై సాగించిన సమర విజయానికి ప్రతీకగా 1947 ఆగస్టు 15న ఎగిరిన పతాకమది.స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములు కాకపోవటమే కాదు, బ్రిటీష్‌ వారికి సేవ చేసుకుంటామన్న వారిని ఆకాశానికి ఎత్తుతున్న పాలకులు చంద్రుడిపై లాండర్‌ దిగటంలో విఫలమైన ప్రాంతానికి ఆ పేరు పెట్టటాన్ని ఏమనాలి? అమృతకాలమని, ఆజాదీకా అమృతమహౌత్సవాలు జరిపిన వారు దీనికి పాల్పడటం నిస్సందేహంగా అభ్యంతరకరం. ప్రధాని నరేంద్రమోడీ, మన దేశంలోని ఇతర మూడు రాజ్యాంగ బద్దమైన ఉన్నత పదవుల్లో (రాష్ట్రపతి, ఉపాధ్యక్షుడు, లోక్‌సభ స్పీకర్‌) ఉన్నవారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి చెందిన వారే. తిరంగాను జాతీయ పతాకగా ఆర్‌ఎస్‌ఎస్‌ అంగీకరించలేదు, ఆ కారణంగానే స్వాతంత్య్రం వచ్చిన 52 సంవత్సరాల పాటు తమ కార్యాలయాల దగ్గర గానీ, ఇతర చోట్ల ఆ సంస్థ నేతలెవరూ ఎగురవేయలేదు. అజాదీకా అమృతమహొత్సవాల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో తిరంగాను తమ ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టుకోవాలని ప్రధాని మోడీ సలహా ఇచ్చారు. అనేక మంది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు దాన్ని అనుసరించలేదని వార్తలు వచ్చాయి. హర్‌ ఘర్‌ తిరంగా ప్రచారానికి పిలుపునిచ్చిన వారు ఒక జాతివ్యతిరేక సంస్థకు చెందిన వారని 52 సంవత్సరాల పాటు వారు జాతీయపతాకను ఎగురవేయలేదని, వారు ప్రధాని మాట వింటారా అని గతేడాది రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాజకీయం చేయవద్దని, తమ అణువణువు దేశభక్తితో ఉంటుందని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పుకున్నాయి.


మూడు రంగుల్లో మూడు అనే పదమే అశుభమని, మూడు రంగులు దేశం మీద మానసిక చెడు ప్రభావాన్ని కలిగిస్తాయని, దేశానికి హానికరమని జాతీయ జెండాపై చర్చ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది. ఆ సంస్థ పత్రిక ఆర్గనైజర్‌లో రాసిన ఒక విశ్లేషణలో దాని వైఖరిని వెల్లడించారు. దాన్ని మార్చుకున్నట్లు ఇంతవరకు ఎక్కడా అది చేసిన ప్రకటన లేదు. నాగపూర్‌లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రేమీ యువదళ్‌ అనే సంస్థకు చెందిన ముగ్గురు బలవంతంగా జాతీయ జెండాను ఎగురవేశారని 2001 జనవరి 26న ఆర్‌ఎస్‌ఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. సదరు ప్రాంగణ పర్యవేక్షకుడు తొలుత వారిని అడ్డుకున్నట్లు చెప్పారు. పది సంవత్సరాలకు పైగా నడిచిన తరువాత తగిన ఆధారాలు చూపలేదని కేసును కొట్టి వేశారు. తిరంగా బదులు జాతీయ పతాకంగా భగవధ్వజం ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు చెప్పారు. ఈ మేరకు ఆర్గనైజర్‌ పత్రికలో భగవధ్వజం వెనుక ఉన్న రహస్యం పేరుతో రాసిన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. విధి కారణంగా అధికారానికి వచ్చిన వారు మన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పెట్టవచ్చు. దాన్ని ఎవరూ గౌరవించరు, హిందువులెవరూ స్వంతం చేసుకోరు ” అని రాశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ మన్మోహన్‌ వైద్య 2018లో చెన్నయిలో లౌకికవాదం మీద జరిగిన ఒక సెమినార్‌లో మాట్లాడుతూ జాతీయ పతాకంలో కాషాయ రంగు ఒకటి మాత్రమే ఉండాలి, ఇతర రంగులు మతోన్మాదానికి ప్రాతినిధ్యం వహిస్తాయి అని సెలవిచ్చారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వార్త పేర్కొన్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ నేత కల్లాడక ప్రభాకర్‌ భట్‌ 2022 మార్చినెలలో ఒక దగ్గర మాట్లాడుతూ చాలా త్వరలోనే జాతీయ జెండాగా త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండా రానుందని చెప్పారు.


శివసేన(ఉద్దావ్‌)నేత సంజయ రౌత్‌ మాట్లాడుతూ లాండర్‌ దిగిన చోటుకు విక్రమ్‌ సారాభారు లేదా నెహ్రూ పేరు పెట్టి ఉండాల్సిందని అన్నారు. వారు చేసిన కృషి కారణంగానే ఇదంతా జరిగింది అన్నారు. శాస్త్రవేత్తలను మరిచిపోతున్నారు, ప్రతి చోట హిందూత్వను తీసుకువస్తున్నారు. మేము కూడా హిందూత్వ పట్ల విశ్వాసం ఉన్నవారిమే, కానీ కొన్ని అంశాలు శాస్త్రానికి సంబంధించినవి, అక్కడికి హిందూత్వను తీసుకురాకూడదని వీర సావర్కర్‌ చెప్పారని శివసేన నేత అన్నారు. దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చాలనే అజెండాలో భాగంగా ఇలాంటి వన్నీ చోటు చేసుకుంటున్నాయి. మెజారిటీ హిందువులు చెప్పినట్లు జరగాలి తప్ప ఇతరంగా పరిణామాలు ఉండకూడదనే దురహంకార ధోరణిని ఈ పేరు ప్రతిబింబిస్తున్నది. రెండవది స్వాతంత్య్రం విఫలమైందని జనాలకు చెప్పటం కూడా తిరంగ పేరు పెట్టటం వెనుక దాగుంది.


చంద్రుడిపై లాండర్‌ దిగిన కేంద్రానికి శివశక్తి అని ప్రధాని మోడీ పేరు పెట్టటం సరైనదే అని దానికి ఆయనకు అర్హత ఉందని ఇస్రో చైర్మన్‌గా ఉన్న ఎస్‌ సోమనాధ్‌ ఆదివారం నాడు సమర్ధించారు. శివశక్తి, తిరంగ అనే పేర్లు భారతీయతను ధ్వనిస్తున్నాయని అన్నారు.శివ అనే మాటలో శుభం ఉందని శక్తి అనే పదంలో నారీశక్తి దాగుందని ప్రధాని మోడీ చెప్పారు. శనివారం నాడు స్వంత రాష్ట్రమైన కేరళలోని తిరువనంతపురంలోని భద్రకాళీ, ఇతర ఆలయాలను సోమనాధ్‌ సందర్శించి పూజలు చేశారు. తాను శాస్త్రాన్ని,పరలోకాన్ని నమ్ముతానని అందుకే దేవాలయాల సందర్శన, పురాణాలను చదువుతానని అన్నారు. తాను అన్వేషినని చంద్రుడిని, అంత:కరణాన్ని కూడా అన్వేషిస్తానని చెప్పారు. అది తన జీవితంలో భాగమని, సంస్కృతి అన్నారు. మన ఉనికి, అంతరిక్షంలోకి మన ప్రయాణ అర్ధాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక సంస్థలలో పని చేస్తున్న ఇలాంటి అనేక మందిలో సోమనాధ్‌ ఒకరు. గతంలో ఇస్త్రో నేతలుగా ఉన్నవారి హయాంలో కూడా రాకెట్ల నమూనాలను సుళ్లూరు పేట చెంగాలమ్మ గుడిలో, తిరుపతి వెంకటేశ్వరుడి గుడిలో పూజలు చేయించిన తరువాత ప్రయోగించిన సంగతి తెలిసిందే. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్పే క్రమంలో మన పరిశోధనలు విఫలమైనా సఫలమైనా అంతా దేవుడి లీల అని చెబుతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు, అన్నీ వేదాల్లో ఉన్నాయష, సంస్కృతంలో రాసిన శాస్త్ర విజ్ఞానాన్ని పశ్చిమ దేశాలు తస్కరించి వాటిని తామే కనుగొన్నట్లు చెబుతారని వాదించేవారు ఇటీవల బాగా పెరిగారు. అలాంటి కోవకు చెందిన శాస్త్రవేత్తే సోమనాధ్‌ కూడా. ఈ ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్‌లోని మహరిషి పాణిని సంస్కృత, వేద విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఆల్జీబ్రా, స్క్కేర్‌ రూట్స్‌, కాలం, ఆర్కిటెక్చర్‌, మెటలర్జీ, వైమానిక పరిజ్ఞానం కూడా తొలుత వేదాల్లోనే కనుగొన్నారని చెప్పారు. ఈ అంశాలన్నీ అరబ్‌ దేశాల ద్వారా ఐరోపాకు చేరినట్లు, తరువాత వాటిని పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు ప్రకటించారని అన్నారు. సంస్కృతంలో రాసిన వాటిని పూర్తిగా పరిశోధించి ఉపయోగించుకోలేదని సోమనాధ్‌ చెప్పారు. ఇలాంటి కబుర్లు చెప్పేవారు ఇస్రో కేంద్రాలతో సహా, ఇతర శాస్త్రపరిశోధనా సంస్థలలో శాస్త్రవేత్తల బదులు సంస్కృత పండితులను నియమించి పరిశోధనలు జరిపితే ఎంతో ఖర్చు కలసి వచ్చేది. ఈ కబుర్ల మీద వారికి నిజంగా నమ్మకం ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే ఆపని చేయవచ్చు.విజ్ఞానమంతా వేదాల్లో , సంస్కత గ్రంధాల్లో వుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాటిని వెలికి తీసి దేశానికి మేలు చేసి పక్కా దేశభక్తులని నిరూపించుకోండని చేసిన సూచనలను ఏ ఘనాపాఠీ, సంస్కత పండితులు పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడు నైవేద్యం తినడనే నిజం పూజారికి తెలిసినట్లుగా మరొకరికి తెలియనట్లే వాటిలో కావలసినంత అజ్ఞానం తప్ప విజ్ఞానం లేదని పండితులకు బాగా తెలుసు. ఇస్రో లేదా మరొక శాస్త్ర పరిశోధనల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలు అలా కాదు, వారిలో నిజాయితీ వుంది, తాము నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించాలంటే వాటిని నిరుత్సాహపరిచే అశాస్త్రీయ భావాల ప్రచారాన్ని కట్టిపెట్టాలి.


దేశంలో ఇలాంటి తాతగారి నాన్నగారి భావాలను పెంచి పోషిస్తున్న కారణంగానే అనేక మంది రెచ్చిపోతున్నారు. బిజెపి ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన కంగన రనౌత్‌ చంద్రయాన్‌ గురించి స్పందించారు. ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు ఉన్న ఒక ఫోటోను తన ఇనస్టాగ్రామ్‌లో పోస్టు చేసి వారంతా బిందీ, సింధూరాలు, తాళిబట్లు ధరించి ఉన్నారని, ఉన్నత ఆలోచనలు, సాధారణ జీవితాలల భారతీయతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలా చెప్పటం ద్వారా ఆమె జనాలకు ఏ సందేశం ఇవ్వదలచుకున్నారు ? చంద్రయాన్‌-1 చంద్రుడి ఉపరితలం మీద ఉన్న ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించారు. రెండు సంవత్సరాల పాటు పరిశోధనకు పంపిన ఉపగ్రహం 2008 నవంబరు 14న అక్కడకు వేరుకుంది. ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాం అజాడ్‌ సూచన మేరకు అది దిగిన చోటును ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌ నెగ్రూ కేంద్రం అని పేరు పెట్టారు.అయితే అది 312 రోజులు మాత్రమే పని చేసింది.2009 ఇస్రో కేంద్రం నుంచి సంబంధాలు తెగిన తరువాత ఆచూకీ తెలియలేదు. తరువాత అమెరికా నాసా కేంద్రం కనుగొన్న సమాచారం ప్రకారం 2016వకు క్షక్ష్యలో తిరుగుతూనే ఉంది. అది పంపిన సమాచారంలో చంద్రుడి మీద నీరు ఉన్నట్లు తేలింది. అది దిగిన కేంద్రానికి నెహ్రూ పేరు పెట్టటం మీద ఎలాంటి వివాదం తలెత్తలేదు. కానీ చంద్రయాన్‌ -3 లాండర్‌ దిగిన చోటుకు నరేంద్రమోడీ శిశశక్తి అని పెట్టటం వివాదాస్పదమైంది. ఒక మతానికి ప్రతీక అయిన పేరు పెట్టటం ఏమిటన్నది ప్రశ్న. ఇప్పటికే భారత్‌లో మతశక్తులు రెచ్చిపోతున్నారని భావిస్తున్న విదేశాల్లో మన దేశ ప్రతిష్ట మరింత దిగజారుతుంది తప్ప మరొకటి కాదు.ది. భారత్‌ వారసత్వంలో అనేక మతాలు ఉన్నాయి, వాటన్నింటినీ తోసి పుచ్చి హిందూ ఒక్కటే వారసురాలని చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఒకనాడు పెద్ద ఎత్తున విలసిల్లిన బౌద్ద, జైన మతాలు మన దేశంలో పుట్టినవి తప్ప విదేశాల నుంచి వచ్చినవి కాదు. అసలు అన్నింటికంటే కుల, మతాలకు అతీతంగా ఉన్న మనశాస్త్రవేత్తల సమిష్టి కృషికి వైజ్ఞానిక గుర్తింపు ఇవ్వాల్సి ఉండగా మతం రంగు పులమటం దుష్టఆలోచనకు ప్రతిరూపం తప్ప మరొకటి కాదు. జవహర్‌ పేరు లౌకిక వాదానికి శివశక్తి మతవాదానికి ప్రతీకలు. ఇది మత ప్రాతిపదికన సమాజం మరింతగా చీలిపోవటానికి దోహదం చేస్తుంది.మతం పేరుతో జరిపే వాటికి రానున్న రోజుల్లో ఇతర దేశాలు ఏమేరకు సహకరిస్తాయన్నది ప్రశ్న.


చంద్రయాన్‌ -2 ప్రయోగం విజయవంతంగా కావాలని మఠాధిపతులు, గుడి పూజారులు, చిన్న దేవుళ్లు, దేవతలు, పెద్ద వెంకటేశ్వరస్వామి ఆశీర్వచనాలు, వాట్సాప్‌ భక్తులు చేసిన పూజలు ఫలించలేదు. అందుకుగాను వారెవరూ ఏడ్చినట్లు చూడలేదు గానీ ఇస్రో అధిపతి శివన్‌ ఏడ్చేశారు.ౖ ఒక ప్రయోగం విఫలమైనపుడు, మరొకటి సఫలమైనపుడు శాస్త్రవేత్తలు, సమాజం భావోద్వేగాలకు గురి కావటం సహజం. మన చంద్రయాన్‌ మాదిరే ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు మన ఖర్చులో సగంతో ఒక ప్రయోగం జరిపారు. అది 2019 ఏప్రిల్‌ 19వ తేదీన చివరిక్షణాల్లో సమాచార వ్యవస్ధతో సంబంధాలు తెగిపోయి, మన ప్రయోగం మాదిరే జయప్రదం కాలేదు. మన దేశంలో మాదిరి దశ్యాలు,ఓదార్పులు అక్కడ లేవు. చంద్రయాన్‌-2 ప్రయోగానికి ముందు సామాజిక మాధ్యమంలో ఒక అంశం చక్కర్లు కొట్టింది. ” చంద్రయాన్‌-2 ప్రయోగానికి అంతా రెడీ, కానీ ఎక్కడో ఏదో చిక్కుముడి తెమలడం లేదు, తేలడం లేదు లెక్క తెగడమే లేదు.900 కోట్ల ప్రాజెక్టు. కోట్ల మంది భారతీయుల ఆశలు. ప్రపంచ కన్ను . ఇస్రో ఛైర్మన్‌కు ఓ సీనియర్‌ సైంటిస్టు ఓ సలహా ఇచ్చాడు. ఇస్రో శివన్‌ కూడా ప్రతిదీ వినే తరహా, దేన్నీ తేలికగా తీసేసే రకం కాదు. ఆ సలహా ఏమిటంటే..? ‘పూరి శంకరాచార్యను కలుద్దాం సార్‌, ఆయన ఏమైనా పరిష్కారం చెప్పవచ్చు, తను ఓ క్షణం విస్తుపోయాడు, ఆధునిక గణితవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు, భౌతికశాస్త్ర పరిశోధకులకే చేతకానిది ఓ కాషాయగుడ్డల సన్యాసికి ఏం తెలుసు అని బయటికి వెల్లడించలేదు తన మనసులో భావాన్ని..! కానీ వాళ్లు వెళ్లలేదు స్వామివారినే శ్రీహరికోటకు రమ్మని ఆహ్వానించారు ఆయన వచ్చాడు,చూశాడు. ఆ లెక్కను చిటికెలో సాల్వ్‌ చేసేశాడు శంకరాచార్య అలియాస్‌ నిశ్చలానంద సరస్వతి. ఆయన ఎదుట అక్షరాలా భక్తిభావంతో సాగిలపడ్డాడు ఇస్రో చీఫ్‌. ” ఇలా సాగింది. ఇది కచ్చితంగా ఫేక్‌ ప్రచారమే. ఇస్రో అంటే ఏదో గణిత శాస్త్ర సంస్ధ అన్నట్లు, లెక్కల చిక్కు ముడి పడినట్లు చిత్రించారు. ఇలా చెప్పటం నిజంగా మన శాస్త్రవేత్తలను అవమానించటం, స్వామీజీలు, బాబాలకు లేని ప్రతిభను ఆపాదించటం తప్ప మరొకటి కాదు. ప్రతి అంతరిక్ష ప్రయోగానికి ముందు వాటి ప్రతిమలతో తిరుపతి వెంకన్న , సుళ్లూరు పేట చెంగాలమ్మ దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. చంద్రయాన్‌-2కు నాటి ఇస్రో అధిపతి కె శివన్‌ వుడిపి శ్రీకష్ణ మఠాధిపతి ఆశీస్సులు కూడా అందుకున్నారు. ఇక వాట్సాప్‌ భక్తులు, ఇతరులు చేసిన వినతులకు కొదవ లేదు. మరి శంకరాచార్య లెక్కలేమయ్యాయి. దేవుళ్ల కరుణాకటాక్షం, మఠాధిపతుల, తిరుపతి వేద పండితుల ఆశీర్వాచనాల మహత్తు, శక్తి ఏమైపోయినట్లు ? మూఢనమ్మకాలను పెంచే, శాస్త్రవిజ్ఞానం మీద పూర్తి నమ్మకంలేని తరాలను మనం తయారు చేస్తున్నాము. దీనికి తాజాగా ప్రస్తుత ఇస్రో అధిపతి సోమనాధ్‌ కూడా జతకలిశారు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష బాపతు పక్కన చేరారు.


చంద్రయాన్‌ 2 విఫలం కాదు, ప్రయోగాలలో అది ఒక భాగమే. ఆర్యభట్ట నుంచి సాగుతున్న విజయాల పరంపరలో ఇదొక ప్రయోగం. వైఫల్యాలతో గతంలో ఏ శాస్త్రవేత్త కుంగిపోలేదు. నిరాశపడలేదు. అది అసలు వారి లక్షణం కాదు. వారి ప్రయోగాలు విజయవంతం కావాలని, అది దేశానికి వుపయోగపడాలని అందరూ కోరుకుంటున్నారు. చంద్రయాన్‌ 1లో 2008లోనే దాదాపు 10 నెలలపాటు మన పరిశోధనలు చంద్రునిపై సాగాయి, కొన్ని లోపాలు ఉన్నా అది విజయమే, ప్రపంచంలో స్థానం ఆనాడే సాధించాము. చంద్రయాన్‌ 2 లో ఆర్బిటర్‌ లక్షణంగా పని చేసింది. లాండర్‌ మాత్రమే విఫలమైంది. ఇప్పుడు చంద్రయాన్‌-3లో ఆ లోపాన్ని కూడా అధిగమించాము. ఇందుకు గాను మన శాస్త్రవేత్తలను యావత్‌ లోకం వేనోళ్ల కొనియాడుతున్నది.


నరేంద్రమోడీ సర్కార్‌ వుగ్రవాదులు, నల్లధనం వున్న వారి మీద కంటే మేధావులు, శాస్త్ర పరిశోధనల మీద సమర్దవంతంగా మెరుపు దాడులు చేసిందని (సర్జికల్‌ స్ట్రెక్స్‌ ) ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. 2014లో అధికారానికి వచ్చినప్పటి నుంచి మేథావుల మీద నిరంతరం యుద్ధం సాగిస్తున్నదని, ఒక విశ్వవిద్యాలయం తరువాత మరొక విశ్వవిద్యాలయాన్ని, పరిశోధనా సంస్ధలను లక్ష్యంగా చేసుకొని వాటి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నదని పేర్కొన్నారు. మన పూర్వీకులు ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని, కత్రిమ గర్భధారణ పద్దతులను అభివద్ధి చేశారని స్వయంగా నరేంద్రమోడీయే చెప్పారు. ఇలాంటి ఆధారం లేని ఆశాస్త్రీయ ప్రచారాలను చేయటంలో మోడీని ఆయన మంత్రులు పెద్ద ఎత్తున అనుకరిస్తున్నారు.ఇలాంటి విషయాలను (చెప్పింది వినటం తప్ప ప్రశ్నించటానికి సాహసం చేయని) ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో లేదా ప్రయివేటు సంభాషణల్లో కాదు, ఏకంగా సైన్స్‌ కాంగ్రెస్‌లోనే చెప్పారని రామచంద్ర గుహ వ్యాఖ్యానించారు. నరేంద్రమోడీ నాలుగు సంవత్సరాల తరువాత చంద్రయాన్‌-2లో లాండర్‌ విఫలమైన చోటుకు తిరంగా అని పెట్టటం జాతీయ పతాకను అవమానించటం, తాజాగా జయప్రదంగా దిగిన చోటుకు శివశక్తి అని పేరు పెట్టటం మత అజెండాను ముందుకు తీసుకుపోవటంలో భాగంగా భావించటం తప్పువుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి : ఉపాధి నైపుణ్యం నిల్‌ – ఓట్లు తెచ్చే విద్వేషం ఫుల్‌ !

14 Monday Aug 2023

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Education, employees, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, employability, Hate crime, Hate-Speech, Narendra Modi Failures, National Skill Development, practical skills, Skilled Labor Force


ఎం కోటేశ్వరరావు


ఈ మధ్య రెండు అంశాలపై వార్తలు వచ్చాయి. ఒకటి దేశంలో నిపుణులైన కార్మికుల లేమి గురించి ఒక నివేదిక వెలువడింది. నైపుణ్య శిక్షణ పేరుతో చేసిన హడావుడి ఎలా విఫలమైందో అంతకు ముందే విశ్లేషణలు వచ్చాయి. విద్వేష ప్రసంగాల మీద నమోదైన కేసుల గురించి ఒక కమిటీని ఆగస్టు 18లోగా ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విద్వేష ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగం కొన్ని చోట్ల పని చేయటం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. రెండింటిలోనూ కేంద్ర వైఫల్యం స్పష్టమైంది. నిజానికి సుప్రీం కోర్టు ఆదేశం మోడీ సర్కార్‌ను పరోక్షంగా అభిశంసించటం తప్ప వేరు కాదు. నైపుణ్య మెరుగుదల కోసం ఎన్నో పధకాలు, ఏకంగా మంత్రినే ఏర్పాటు చేసిన ఘనత తమదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇతర పథకాలు, ప్రకటనల మాదిరే ఇది కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. 2023 ఆగస్టు రెండవ వారంలో స్కిల్‌ ఫైనాన్సింగ్‌ రిపోర్టు 2023 కొన్ని అంశాలను వెల్లడించింది.దేశంలోని 78శాతం మంది యువతరానికి అభ్యాససిద్దమైన నైపుణ్యాలు లేవు.జనాభాలో 15-24 సంవత్సరాల యువత 25.4 కోట్ల మంది ఉన్నారు.ఉపాధికి అవసరమైన ఉన్నత నైపుణ్యాలు కలిగిన వారు కేవలం 46.2శాతం మందే ఉన్నారు. మొత్తం మీద నైపుణ్యాల రాంకులో మన దేశం ప్రపంచంలో 60వ స్థానంలో ఉంది. 2015 వరకు మన దేశంలోని కార్మికుల్లో 4.7శాతమే నైపుణ్య శిక్షణ పొందగా దక్షిణ కొరియాలో 90, జపాన్‌లో 80, బ్రిటన్‌లో 68, అమెరికాలో 52శాతం ఉన్నారు. ఇక ప్రతిదాన్ని వాణిజ్య ప్రాతిపదికన లెక్కిస్తున్నారు గనుక 2030 నాటికి ప్రపంచ వృత్తి విద్యా మార్కెట్‌ విలువ పెరుగుదల 1,585 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందట.ఇక 2031నాటికి విద్యా రుణాల మార్కెట్‌ విలువ 8,750 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. మన దేశంలో శిక్షణ పెద్ద ఎత్తున అవసరం గనుక నిధుల కేటాయింపు పెద్ద ఎత్తున పెంచాల్సి ఉంటుందని కూడా సదరు నివేదిక సలహా ఇచ్చింది. నైపుణ్యాలు, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ మార్కెట్‌ విలువ 2020లో మన దేశంలో 180 బిలియన్‌ డాలర్లు ఉందని, 2030 నాటికి అది 313 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా.


2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు 2015లో ప్రధాని నరేంద్రమోడీ ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్‌డిటివీ వార్త ప్రకారం సంబంధిత మంత్రిత్వశాఖ సమాచారం మేరకు 2021 జనవరి 19 నాటికి దేశమంతటా 1.07 కోట్ల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 46.27లక్షల మందికి స్వల్పకాల శిక్షణ ఇచ్చారు. మిగిలిన వారికి అంతకు ముందు వారు నేర్చుకున్నదాని గురించి పునశ్చరణ తరగతులు నిర్వహించారు. వారిలో 19లక్షల మందికి ఉపాధి దొరికింది.స్కిల్‌డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ సమాచారం మేరకు 2023 ఫిబ్రవరి ఆరు నాటికి 142లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 137లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. 124లక్షల మందిని విశ్లేషించి 110లక్షల మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. తరువాత ఈ పధకంలో కొన్ని మార్పులు చేశారు. ప్రభుత్వ విధానాల పరిశోధనా సంస్థ (సిపిపిఆర్‌) వెబ్‌సైట్‌లో 2023 ఫిబ్రవరి నాలుగున ” కొనసాగుతున్న యువనైపుణ్య శిక్షణ నిర్లక్ష్యానికి దేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ” అనే శీర్షికతో ప్రచురించిన ఒక విశ్లేషణలోని అంశాల సారాంశం ఇలా ఉంది.ప్రభుత్వం గత అనేక సంవత్సరాలుగా చేసిన వాగ్దానాలు, సాధించిన దానికి చాలా తేడా ఉంది.యువత నైపుణ్యానికి వస్తే దాని పునాదులు ఇప్పటికీ బలహీనంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అది ఇవ్వదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి పార్లమెంటు ప్రసంగంలో ఏడుసార్లు యువత అనే పదాన్ని ఉచ్చరించారు తప్ప ఒక్కసారి కూడా నైపుణ్యం గురించి చెప్పలేదు.(అది మోడీ సర్కార్‌ రాసి ఇచ్చిన ప్రసంగమే) 2023 బడ్జెట్‌లో ప్రకటించిన నైపుణ్య శిక్షణ పధకాలు వాస్తవరూపం ధరించాలంటే సంవత్సరాలు పడుతుంది.లోక్‌సభలో 2022 మార్చి 14న ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రకారం పిఎంకెవివై 1.0 కింద 18.04లక్షల మంది నమోదై శిక్షణ పొందగా వారిలో 13.32లక్షల మందికి నైపుణ్య సర్టిఫికెట్లు ఇచ్చారు. వారిలో కేవలం 2.53లక్షల మందికే లేదా 19శాతం మందికి మాత్రమే ఉపాధి దొరికింది. పిఎంకెవివై 3.0 ప్రకారం స్థానిక అవసరాలకు అనుగుణ్యంగా నైపుణ్యం ఇవ్వాలని నిర్ణయించారు, తమిళనాడు వంటి పారిశ్రామిక రాష్ట్రంలో కూడా మొత్తంగా అది విఫలమైంది. పిఎంకెవివై 3.0లో 4.98లక్షల మంది నమోదు చేసుకోగా 4.45లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 1.72లక్షల మంది సర్టిఫికెట్లను పొందారు. వారిలో కేవలం 15,450 మందికి మాత్రమే ఉపాధి దొరికింది. పిఎంకెవివై 1.0లో 12,218 నైపుణ్య శిక్షణ కేంద్రాలుండగా, 2.0నాటికి 9,030 కేంద్రాలు, 3.0లో కేవలం 683 మాత్రమే ఉన్నాయి. ఇదీ ఆ విశ్లేషణ సారం.


యువ భారతం అని, తగినంత మంది పని చేసే వారున్నారని గొప్పలు చెప్పుకుంటే చాలదు. ఏటా కోటి మంది కొత్తగా పని కోసం వస్తున్నారు. ఏటికేడు కొత్త సాంకేతికతలు ముందుకు వస్తున్నాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ప్రయివేటు రంగం ఆ బాధ్యత తీసుకొనేందుకు ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. గతేడాది జూన్‌లో భారత్‌ కోసం కృత్రిమ మేథ అనే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. పాతికలక్షల మందికి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడపదాటటం లేదు. ఏ దేశానికైనా నిపుణులైన కార్మికులు అవసరం. అది వారి జీవన పరిస్థితులను మెరుగుపరుస్తుంది.అమెరికా మీడియా యుఎస్‌ న్యూస్‌ 2022 సెప్టెంబరులో 85 దేశాల పరిస్థితుల మీద సర్వే చేసి జాబితాను ప్రకటించింది. కార్మిక నైపుణ్యంలో జపాన్‌, దక్షిణ కొరియా తరువాత చైనా మూడవ స్థానంలో ఉంది. మన దేశం ఇరవై ఒకటవ స్థానంలో ఉంది.మొత్తం మీద అన్ని రకాల నైపుణ్యాల్లో చైనా 17వ దేశం కాగా మనది 31వదిగా ఉంది.అమెరికా సిఐఏ ఫాక్ట్‌బుక్‌ పేరుతో సమాచారాన్ని విడుదల చేస్తుంది. దాని ప్రకారం 2021లో చైనాలో నిపుణులైన కార్మికులు 79 కోట్ల 14లక్షల 83వేల మంది ఉండగా మన దేశంలో 46 కోట్ల,66లక్షల 70వేల వంద మంది ఉన్నారు. నిజానికి ఈ సంఖ్య తక్కువేమీ కాదు గానీ పని చేసే వారికి అవకాశాలు కల్పించటమే కీలకం, మన దగ్గర అది లేదు. గడచిన నాలుగు దశాబ్దాల్లో నైపుణ్యం పెంచేందుకు చైనా ప్రభుత్వమే భారీ ఎత్తున ఖర్చు చేసింది. అందుకే నిపుణులైన కార్మికుల మీద పెట్టే ఖర్చు తప్పుతుంది గనుక అమెరికా, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయి, చైనా 17.7లక్షల కోట్ల జిడిపిని సృష్టించగలిగింది. దాని తలసరి జిడిపి(పిపిపి) 19,338 డాలర్లు, మన దేశం 3.17లక్షల కోట్ల డాలర్లు, తలసరి 7,334 డాలర్లతో ఉంది. ఏ దేశమైనా నైపణ్యం పెంచటమే కాదు, పరిశోధన-అభివృద్ధికి భారీ మొత్తాలను ఖర్చు చేయాల్సి ఉంది. మన దేశంలో ఆ రెండూ లేవు.


మరి మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అన్నది ప్రశ్న. చేసేందుకు ఉపాధి లేక, ఉపాధికి అవసరమైన నైపుణ్యం లేక నామ మాత్ర వేతనాలతో పని చేసే యువతను తప్పు దారి పట్టించటానికి అనువైన పరిస్థితులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం కాలంలో ఉన్నాం. దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వైపు చూడకుండా ఆవు పేడ, మూత్రంలో ఉన్న బంగారాన్ని వెలికి తీస్తే ధనిక దేశంగా మారతాం అనే ఆలోచనలో ఇంకా ఉన్నామంటే అతిశయోక్తి కాదు. బహుశా ఏ దేశంలోనూ లేని విధంగా వాట్సాప్‌ ద్వారా తప్పుడు, విద్వేష సమాచారాన్ని క్షణాల్లో ఎలా వ్యాపింప చేయాలో మన పండితులు ప్రపంచానికి పాఠాలు నేర్పేవారిగా ఉన్నారు. టెక్నాలజీ పరుగులో ముందుండాలంటే పరిశోధన, అభివృద్ది ఖర్చు లేకుండా కుదరదు. అందుకు గాను జిడిపిలో మన దేశ ఖర్చు 0.7శాతం కాగా చైనా ఖర్చు 2.1శాతంగా ఉంది.ి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారంటే కేటాయింపు లేకుండా కేవలం కబుర్లు చెబుతున్నారన్నది స్పష్టం.


నైపుణ్యం పెంచటానికి, పరిశోధనకు నిధులు కేటాయించేందుకు ప్రధాని నరేంద్రమోడీని ఎవరూ అడ్డుకోలేదు. కానీ మన దేశంలో విద్వేషం పెరుగుతున్నది. దానికి కారకులు ఎవరో పదే పదే చెప్పనవసరం లేదు. ఇది ఇంకా పెరిగితే వచ్చే పెట్టుబడులు రావు. మతకొట్లాటలు, పరస్పర అవిశ్వాసంతో కొట్టుకు చావాల్సిందే. అది తెలిసినా మత దేశంగా ఉన్న పాకిస్తాన్‌ దరిద్రం గురించి ఒకవైపు చెబుతున్నవారే దేశాన్ని మెజారిటీ హిందూ దేశంగా మార్చుతామని రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా దేశంలో ఉన్న విద్వేష పూరిత వాతావరణ, ఉదంతాల గురించి సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఇటీవలి కాలంలో పదే పదే ఆందోళన వెల్లడిస్తున్నది. జాతి, మతం, పుట్టిన ప్రాంతం,నివాసం, భాష తదితర అంశాల ప్రాతిపదికన భిన్న పౌర సమూహాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి సామరస్యతను దెబ్బతీసే శక్తులను అదుపు చేసేందుకు ఐపిసిలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. వాటిలో ఒకటైన 153 ఏ ప్రకారం నమోదు చేసిన కేసులు దేశంలో 2014-2020 కాలంలో 323 నుంచి 1,804కు పెరిగాయి. జాతీయ సమగ్రతను దెబ్బతీసేందుకు పాల్పడేవారి మీద 153 బి సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తారు. ఇవి 13 నుంచి 82కు పెరిగాయి. తప్పుదారి పట్టించే, విద్వేషాన్ని, శతృత్వాన్ని పెంచే సమాచారాన్ని వ్యాపింప చేయటం, ప్రకటనలు చేసే వారిని శిక్షించేందుకు ఉన్న సెక్షన్‌ 505 కేసులు 2017లో 257 ఉంటే 2020 నాటికి 1,527కు పెరిగాయి. రాష్ట్రాల్లో బిజెపి అధికారం ఉన్న చోట ఒక సామాజిక తరగతి మీద అసలు కేసులే నమోదు చేయటం లేదన్న విమర్శలున్న సంగతి తెలిసిందే. అందుకే బాధితులు లేదా ఎవరూ ఫిర్యాదు చేయకున్నా పోలీసులు తమంతట తాముగా కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.దేశంలో తలెత్తుతున్న ఆందోళనకర పరిస్థితికి ఈ కేసులు, సుప్రీం కోర్టు ఆదేశాలు నిదర్శనం.


2022 అక్టోబరు 21న సుప్రీం కోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్‌, హృషీకేష్‌ రాయి బెంచ్‌ ” ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము ? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్‌ 51చెబుతున్నది.మతం పేరుతో జరుగుతున్నదేమిటి ? ఇది విషాదం ” అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ పోలీసు అధికారులు అలాంటి ద్వేష పూరిత ప్రసంగాలు ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆర్టికల్‌ 51(ఏ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పధాన్ని పాటించాలని, భారత్‌ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్న మతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించనట్లైతే సహౌదరభావం ఉండదని కోర్టు పేర్కొన్నది.


మానభంగం వంటి అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడిన వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మంది పెరోలుపై వెలుపలికి వచ్చినపుడు సత్పప్రవర్తనతో మెలిగారని చెబుతూ జీవిత కాల శిక్ష పడిన వారిని గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసింది.2002లో గోద్రా రైలు సజీవదహనం,దానిలో కొందరు కరసేవకులు మరణించిన తరువాత జరిగిన మారణకాండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బిజెపి పెద్దలు వారికి ఘనస్వాగతాలు పలికి స్వీట్లు పంచారు, వీరకుంకుమలు దిద్దారు. తమ ” ఘన ” కార్యానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. బాధితులుగా ఉన్న తమను దీని గురించి సంప్రదించలేదని, విడుదల గురించి తమకు తెలుపలేదని బిల్కిస్‌ కుటుంబం పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే ఈ నేరగాండ్లను గుజరాత్‌ ప్రభుత్వం ఆజాదీకా అమృతమహౌత్సవం పేరుతో ఆగస్టు15న విడుదల చేసింది. నారీశక్తి, మహిళలకు రక్షణ గురించి కబుర్లు చెబుతున్న పెద్దలు ఈ కేసులో రేపిస్టులను విడుదల చేసేందుకు ఎవరినీ ఖాతరు చేయలేదు. కేసు విచారణ జరిపిన సిబిఐ కోర్టు జడ్జి కూడా వీరి విడుదలను వ్యతిరేకించారు.” ఈ కేసులో నేరగాండ్లకు – బాధితులకు ఎలాంటి సంబంధమూ లేదు, ఎలాంటి వైరమూ లేదు.బాధితులు ఒక మతానికి చెందిన వారనే కారణాలతో మాత్రమే నేరానికి పాల్పడ్డారు.ఈ కేసులో చిన్న పిల్లలను, గర్భిణీని వదల్లేదు.ఇది అత్యంత హీనమైన విద్వేషపూరిత, మానవత్వం మీదనే జరిపిన నేరం ” అని పేర్కొన్నారు. ఇలాంటి రెండింజన్ల పాలనే మణిపూర్‌లో కూడా ఉన్నందున మహిళలను నగంగా తిప్పి, అత్యాచారం చేసిన ఉదంతాన్ని వెల్లడి కాకుండా తొక్కి పెట్టాలని చూశారు. వీడియో వెల్లడి కావటంతో మొక్కుబడి ప్రకటనతో సరిపుచ్చారు.విద్వేషాన్ని రెచ్చగొట్టటంలో ఎవరూ తక్కువ తినటం లేదు. రిజర్వేషన్ల గురించి ఆందోళన తలెత్తితే మణిపూర్‌లో చర్చ్‌లను తగులబెడతారు, మహిళల మీద అత్యాచారాలు చేస్తారు. మత విద్వేషం చెలరేగితే హర్యానాలో ఒక మతానికి చెందిన వారి నివాసాలు, దుకాణాల మీదకు మాత్రమే అక్కడి ప్రభుత్వ అధికారులు బుల్డోజర్లు నడుపుతారు. దేశం ఎటుపోతోంది అని గాదు ఎటు తీసుకుపోతున్నారు, ఎవరు అన్నది ఆలోచించాల్సిన తరుణం వచ్చింది.దేశంలో ముస్లింలు, దళితుల మీద జరుగుతున్న దాడులను నమోదు చేసేందుకు 2017లో హిందూస్తాన్‌ టైమ్స్‌ అనే పత్రిక పూనుకుంది.దాన్ని వెంటనే యాజమాన్యం నిలిపివేసింది, దానికి చొరవ చూపిన సంపాదకుడు రాజీనామా చేసి తప్పుకున్నారు. దీని వెనుక ఎవరి వత్తిడి ఉండి ఉంటుందో వేరే చెప్పాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రానున్నది రోబోట్లు, కోబోట్ల యుగం !

02 Wednesday Aug 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Education, employees, Europe, Germany, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, UK, Uncategorized, USA

≈ 1 Comment

Tags

China, Cobots, robotics, Robots, Robots vs. Cobots


ఎం కోటేశ్వరరావు


ఒక నాడు కంప్యూటర్ల ప్రవేశం, వినియోగం గురించి అనుకూల వ్యతిరేక వాదనలు జరిగినట్లుగానే ఇప్పుడు ప్రపంచంలో రోబోట్లు, కోబోట్ల గురించి మాట్లాడుతున్నారు. మానవులతో పని లేకుండా ప్రోగ్రామ్‌ చేసి వదిలితే వాటంతట అవే పని చేసేవి రోబోట్లు, మనుషులు పని చేయించేవి కోబోట్లు. రెండూ ఉత్పత్తిని పెంచేవే. ఎవరు వద్దన్నా కద్దన్నా వచ్చే రోజులు వాటివే. అంతర్జాతీయ రోబోటిక్స్‌ ఫెడరేషన్‌ వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం చైనా పెద్ద మొత్తంలో రోబోట్ల మీద పెట్టుబడి పెడుతోంది. ప్రతి పదివేల మంది కార్మికులకు అక్కడ ప్రస్తుతం 322 రోబోట్లు ఉన్నాయి. దీన్ని రోబోట్ల సాంద్రతగా పరిగణిస్తున్నారు. ఉత్పాదక రంగ పరిశ్రమల్లో 2021 సమాచారం ప్రకారం ప్రపంచ సగటు 141రోబోలు ఉన్నాయి. దేశాల వారీగా దక్షిణ కొరియా 1,000, సింగపూర్‌ 670, జపాన్‌ 399, జర్మనీ 397, చైనా 322, స్వీడన్‌ 321, చైనీస్‌ హాంకాంగ్‌ 304, చైనీస్‌ తైవాన్‌ 276, అమెరికా 274, స్లోవేనియా 249తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. గతంలో వ్యవసాయం నుంచి పరిశ్రమలకు మారినపుడు, 1980వ దశకంలో వచ్చిన కంప్యూటర్ల తరువాత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఉపాధి దొరికినట్లే రోబోలు వచ్చినా కొత్త అవకాశాలు వస్తాయని సమర్దకులు చెబుతున్నారు. కార్మికుల స్థానంలో గతంలో యంత్రాలు వచ్చినా వాటిని నడిపేందుకు కార్మికులు కావాల్సి వచ్చింది. ఇప్పుడు రోబోలకు ఎవరితోనూ అవసరం ఉండదు.అందువలన అంత తేలిక కాదు అంటున్నారు మరికొందరు.


ప్రపంచ పరిణామాలను చూస్తున్నపుడు పెద్ద మొత్తంలో భారీ పరిశ్రమలను నిర్వహించేవారు లాభాలు ఎక్కువగా ఉంటాయి గనుక రోబోట్ల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. చిన్న సంస్థలు కోబోటిక్స్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరింత ఆధునిక రోబోలను రూపొందించేందుకు పరిశోధన- అభివృద్ధికి దేశాలూ, సంస్థలు కూడా భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. రోబో రంగంలో ప్రపంచ అగ్రగామిగా మారే లక్ష్యంతో చైనా 2021 డిసెంబరు 21న పద్నాలుగవ పంచవర్ష ప్రణాళికను ప్రకటించింది. ఐదు సంవత్సరాల్లో ఎనిమిది కీలక పరిశ్రమలను రోబోట్లతో నింపాలని పేర్కొన్నారు.” తెలివైన రోబో ” ను ఆవిష్కరించేందుకు 2022 ఏప్రిల్‌ 23న 4.35 కోట్ల డాలర్లతో పరిశోధనకు శ్రీకారం చుట్టారు.2018లో ప్రపంచంలో చైనా 20వ స్థానంలో ఉండగా మూడు సంవత్సరాల్లో ఐదవ స్థానానికి ఎదిగింది. నూతన రోబోట్‌ వ్యూహం పేరుతో జపాన్‌ 93 కోట్ల డాలర్లతో నూతన ఆవిష్కరణలతో తమ దేశాన్ని ప్రపంచ రోబో హబ్‌గా మార్చేందుకు పూనుకుంది. స్వంతంగా వాహనాలను నడిపే రోబోలతో సహా ఇతర ఆధునిక ఆవిష్కరణలకు నిధులు వెచ్చిస్తున్నది. పారిశ్రామిక రోబోల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జపాన్‌ 2021లో ప్రపంచానికి 45శాతం సరఫరా చేసింది.
నాలుగవ తరం పారిశ్రామిక విప్లవానికి అవసరమైన రోబోలను అందించేందుకు దక్షిణ కొరియా 2022వ సంవత్సరానికే 17.25 కోట్ల డాలర్లను కేటాయించింది. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు 2021 నుంచి 2027వరకు 9.43 కోట్ల డాలర్లను ఐరోపా సమాఖ్య వెచ్చించనుంది. 2021-22లో రోబో సంబంధిత కార్యక్రమానికి 19.85 కోట్ల డాలర్లను కేటాయించింది. హైటెక్‌ వ్యూహం 2025 పేరుతో జర్మనీ పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఏటా 6.9 కోట్ల డాలర్లను 2026 వరకు ఖర్చు చేస్తుంది. జాతీయ రోబోటిక్‌ చొరవ(ఎన్‌ఆర్‌ఐ 3.0) పేరుతో అమెరికా కూడా 2021లో 1.4 కోట్ల డాలర్లతో నవీకరణకు పూనుకుంది. అంతరిక్షంలో పరిశోధనలకు అవసరమైన రోబోలను రూపొందించటం కూడా దీనిలో ఉంది. రోబో సాంద్రతలో వెనుకబడ కూడదని అది భావిస్తున్నది.


రానున్న రోజుల్లో పారిశ్రామిక ఉత్పత్తి, అంతరిక్షం, వైద్యం మొదలు అనేక రంగాల్లో ముందుండేందుకు ప్రపంచ దేశాలన్నీ పరుగులు పెడుతున్నాయి.కృత్రిమ మేథలో ఎవరికి వారు పైచేయి సాధించాలని చూస్తున్నారు. వైద్యం వంటి రంగాలలో రోబోలతో మరింత మెరుగైన సేవలను అందించవచ్చుగానీ పారిశ్రామిక రంగంలో వీటి ప్రవేశంతో వేతనాల తగ్గుదల, నిరుద్యోగం పెరుగుతుందనే అభిప్రాయాలతో పాటు దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేవారు కూడా ఉన్నారు.చైనాలో జరిగిన పరిశోధనలో పారిశ్రామిక రోబోలు ప్రతికూల ప్రభావం చూపుతాయని తేలిందని కొందరు ఉటంకిస్తున్నారు.2016లో ప్రచురితమైన ఒక పత్రం ప్రకారం యాంత్రీకరణ వలన 77శాతం మంది ఉపాధికి గండిపడుతుందని పేర్కొన్నారు. దానికి ఫాక్స్‌కాన్‌ కంపెనీని ఉదహరించారు. 2020నాటికి 30శాతం ఆటోమేషన్‌ చేసేందుకు గాను 2012-16 సంవత్సరాల్లో నాలుగు లక్షల ఉద్యోగాలను రోబోలతో నింపారు. అన్నింటా అదే జరుగుతుందని చెప్పలేము. గంటలవారీ చెల్లించే వేతనాలు తొమ్మిదిశాతం తగ్గినట్లు కూడా తేలింది. కార్మికుల పని గంటలు కూడా పెరిగాయి. మెకెన్సీ గ్లోబల్‌ సంస్థ 2017లో వెల్లడించిన నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో ఐదో వంతు అంటే 80 కోట్ల ఉద్యోగాలు రద్దుకానున్నట్లు అంచనా వేశారు.నలభై ఆరు దేశాల్లోని పరిస్థితిని విశ్లేషించారు. ధనిక దేశాల్లో యాంత్రీకరణ మరింత ఎక్కువగా ఉంటుంది కనుక నిధులు కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, పేద దేశాల దగ్గర డబ్బు ఉండదు కనుక వాటి మీద ప్రభావం తక్కువేనని కూడా పేర్కొన్నది. యాంత్రీకరణతో మెషిన్‌ ఆపరేటర్లు, ఆహార కార్మికులు, ఆఫీసు సిబ్బంది, అకౌంటెంట్లు ఎక్కువగా ప్రభావితులౌతారు. భారత్‌లో తొమ్మిది శాతం ఉద్యోగాలను నూతన సాంకేతిక యంత్రాలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది. వైద్యులు, లాయర్లు, బార్లలో పనిచేసే వారు, తక్కువ వేతనాలతో పనిచేసే గార్డెనర్లు, ప్లంబర్లు, సంరక్షణ సిబ్బంది మీద పెద్దగా ప్రభావం ఉండదు. తక్కువ చదువుకున్నవారికి ఉపాధి తగ్గుతుంది, అభివృద్ది చెందిన దేశాలలో విశ్వవిద్యాలయాల చదువు అవసరాలు పెరుగుతాయి.అమెరికాలో 2030 నాటికి 3.9 నుంచి 7.3 కోట్ల వరకు ఉద్యోగాలు రద్దవుతాయని, ఉపాధి కోల్పోయే రెండు కోట్ల మందిని ఇతర పరిశ్రమల్లోకి సర్దుబాటు చేయవచ్చని, బ్రిటన్‌లో 20శాతం ఉద్యోగాలను రోబోలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది.


అమెరికాలో రోబోల ప్రవేశం గురించి జరిగిన పరిశోధనలో ప్రతి 1000 మంది కార్మికులకు ఒక రోబోను ఏర్పాటు చేస్తే 0.42 శాతం వేతనాలు తగ్గుతాయని, ఉపాధి జనాభా దామాషాలో 0.2శాతం తగ్గుతుందని అంచనా వేశారు.ప్రదేశాలను బట్టి ఇవి మారతాయి. మరొక రోబోను తోడు చేస్తే ఆరుగురికి ఉపాధి ఉండదు. వెల్డింగ్‌, పెయింటింగ్‌, పాకింగ్‌ వంటి వాటిని పూర్తిగా ఆటోమేషన్‌ చేయవచ్చు. 1993-2007 కాలంలో అమెరికాలో పారిశ్రామిక రోబోట్లు నాలుగు రెట్లు పెరిగాయి.యాంత్రీకరణ కంటే ఇవి ఎక్కువ మంది ఉపాధి పోగొట్టినట్లు తేలింది. ఆటోమోటివ్‌ పరిశ్రమలో ఎక్కువగా రోబోట్లు వస్తున్నాయి.ఎలక్ట్రానిక్స్‌లో 15,కెమికల్స్‌లో 10శాతం రోబోట్లను పెట్టగా ఆటో పరిశ్రమలో 38శాతం ఏర్పాటు చేశారు. పెట్టుబడిదారీ దేశాల్లో కార్పొరేట్ల లాభాల ప్రాతిపదికనే రోబోలను ఏర్పాటు చేస్తే చైనాలో ఎందుకు వేగంగా ప్రవేశపెడుతున్నారనే ప్రశ్న తలెత్తవచ్చు. అమెరికా, ఐరోపా ధనిక దేశాల్లో జనాభా తక్కువ, ఉత్పత్తి ఎక్కువ గనుక లాభాల కోసం చేస్తే చైనాలో 140 కోట్ల జనాభా వినియోగం కోసం ఉత్పత్తి, సేవలను ఎంతగానో పెంచాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారీ దేశాల్లో లాభం కొన్ని సంస్థల చేతుల్లో చేరుతుంది, చైనాలో ఎక్కువ భాగం సమాజపరం అవుతుంది. ఐరోపా, జపాన్‌ మాదిరి చైనాలో సగటు జీవిత కాలం పెరగటం, పిల్లల్ని కనటం తగ్గింది కనుక రానున్న కాలంలో కార్మికులకు కొరత ఏర్పడనుందని అక్కడి నిపుణులు అంచనా వేశారు. ఆ పరిణామం పశ్చిమ ఐరోపా దేశాల్లో చూస్తున్నదే. ఈ కారణంగా కూడా చైనా రోబోట్లను ప్రవేశపెడుతున్నది. చైనాలో గత దశాబ్దిలో 50లక్షల జనాభా తగ్గింది. సామర్ధ్యపెంపుదలకు, డ్రైవర్లతో పని లేని కార్లు, రోబోలతో నడిచే గోదాముల వంటి వాటి ఏర్పాటుకు అనేక పరిశోధనలు చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం ఫైనాన్సియల్‌ రంగంలో పని చేసే ఒక కార్మికుడి ఉత్పాదకత ఐరోపాతో పోల్చితే చైనాలో 20శాతం ఉంది, తరువాత 40,50 శాతం వరకు పెరిగినప్పటికీ ఇంకా చాలా తేడా ఉంది. అందువలన వాటితో పోటీ పడాలంటే తగిన మార్పులు అవసరం అని భావిస్తున్నారు. మన దేశంలో కారు డ్రైవర్లకు తక్కువ వేతనాలకు దొరుకుతున్నారు గానీ ఐరోపాలో, అమెరికాలో అలా దొరకరు. అందుకే డ్రైవర్లతో పనిలేని కార్ల గురించి పరిశోధనకు తెరతీశారు.రోబో, యాంత్రీకరణ కారణంగా చైనాలో 2018-30 మధ్య 30శాతం మంది కార్మికులు ఒక పని నుంచి మరొకదానికి మారాల్సి ఉంటుందని మెకెన్సీ సంస్థ అంచనా వేసింది. ఇది అక్కడి ప్రభుత్వం, పౌరులకూ పెద్ద సవాలే అనటంలో సందేహం లేదు. దాన్ని అధిగమించేందుకు చైనా సన్నద్దం అవుతున్నది.


చైనాలో రోబోట్ల ప్రవేశం వలన కలిగే ప్రతికూల పర్యవసానాలు రానున్న రెండు దశాబ్దాల్లో కనిపిస్తాయని కొందరు చెబుతున్నారు. కృత్రిమ మేథ, రోబోట్ల వలన రెండు దశాబ్దాల్లో 26శాతం మంది వేరే ఉపాధి చూసుకోవాల్సి వుంటుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ అంచనా వేసింది. దీనికీ మెకెన్సీ అంచనాకు చాలా తేడా ఉంది. కొన్ని పోవటం, కొత్త ఉపాధి రావటం ఏతా వాతా వచ్చే రెండు దశాబ్దాల్లో నికరంగా పన్నెండు శాతం ఉపాధి పెరుగుతుందని కూడా ప్రైస్‌వాటర్‌ చెప్పింది.2017-37 మధ్య సేవారంగంలో 9.7 కోట్లు, నిర్మాణ రంగంలో 1.4 కోట్లు, పరిశ్రమల్లో 40లక్షల మందికి ఉపాధి పెరిగితే వ్యవసాయంలో 2.2 కోట్లు తగ్గితే మొత్తంగా 9.3 కోట్లు పెరుగుతాయని అంచనా వేసింది. అక్కడ ఉన్నది ప్రజానుకూల సోషలిస్టు ప్రభుత్వం గనుక వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన సర్దుబాటు చేస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా దానికంతటికి అదే జరుగుతుందని ఎవరూ భావించనవసరం లేదు. ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించిన చైనా గత చరిత్రను బట్టి ఇలా చెప్పవచ్చు. జనానికి పని కల్పించి ఉత్పత్తి పెంచి ఎగుమతులు చేసి ఎంతో ప్రగతి సాధించిన చైనాలో మాదిరి ఇతర దేశాల్లో కార్మికుల వేతనాలు పెరగలేదు. ఒకనాడు తక్కువగా ఉన్న కారణంగా అనేక దేశాలు తమ పెట్టుబడులతో అక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేతనాలు పెంచిన కారణంగా ఆశించిన మేర లాభాలు రావటం లేదని కొన్ని సంస్థలు అక్కడి నుంచి వెనక్కు పోతున్నాయి. ఎగుమతుల మీద ఎల్లకాలం ఆధారపడటం సాధ్యం కాదని గ్రహించిన కారణంగానే తమ జనాల కొనుగోలు శక్తిని పెంచేందుకు వేతన పెంపుదల వంటి చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. నూతన ఆవిష్కరణలతో ఉత్పత్తి పెరిగితే ఆ మేరకు మానవ శ్రమ పని గంటలను తగ్గించి అందరికీ ఉపాధి కల్పించటం, సంపదల పంపిణీతో జనం అవసరాలను తీర్చటం వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందువలన ఈ నూతన సవాలును ప్రజల పట్ల బాధ్యత కలిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ అధిగమించటం ఖాయం, అయితే ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఆసక్తికరం, ఇదే సమస్యను ఎదుర్కొనే పెట్టుబడిదారీ దేశాలు ఎలా పని చేసేది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ : ఆవు పేడ కాదు, కావాల్సింది సెమీ కండక్టర్ల పరిశోధన !

31 Monday Jul 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, Germany, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

America's tech war with China, India’s R&D, Narendra Modi, Narendra Modi Failures, R&D investment, Research on cow dung, Semicon India 2023, Semiconductor


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారికి,
అయ్యా ప్రతి నెలా మీ మన్‌కీ బాత్‌ అంశాలను చదివేవారిలో నేను ఒకరిని.ఒక జర్నలిస్టుగా జన్‌కీ బాత్‌లో ఉన్న కొన్ని ంటిని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జూలై 28-30 తేదీలలో గుజరాత్‌ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో తమరు సెమికాన్‌ ఇండియా 2023 రెండవ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా దేశమంతటా పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు కూడా జారీ చేశారు. దేశాన్ని సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చుతామని, మూడు వందల కాలేజీల్లో సెమికండక్టర్‌ కోర్సులను ప్రవేశపెడతామని తమరు ప్రకటించటం సంతోషం. గతంలో దేశంలో జరిగిన అనర్ధాలకు, వెనుకబడి ఉండటానికి,మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రాకపోవటానికి నెహ్రూనే కారణం అని బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివారం ఠకీమని సమాధానం చెబుతుంది. సెమికండక్టర్ల రంగంలో వెనుకబడటానికి కూడా నెహ్రూనే నిందిస్తారా ?


అన్నీ మీరే చేశారు అని మా తెలుగు సినిమాలో ఒక పాత్ర తండ్రిని తప్పుపడుతుంది. అలాగే అన్నీ ఆ నెహ్రూ చేశారనే కాసేపు అనుకుందాం.ఆయన అనుసరించిన విధానాల నుంచి కాంగ్రెస్‌ 1990దశకంలోనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వైదొలిగిందని మీకు తెలియంది కాదు. వాటినే మీరు అమలు జరుపుతున్నారు తప్ప కొత్త విధానాలు కాదు, ఎందుకంటే వాటిని మన మీద ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ రుద్దింది. గత పది సంవత్సరాలలో మీకు పూర్తి అధికారం ఉన్నప్పటికీ మీరు అంగీకరించినా లేకున్నా అనేక రంగాలలో వైఫల్యబాటలోనే దేశం ఉండటానికి కారణం ఆ విఫల విధానాలనే మరింత వేగంగా అమలు జరపటమే. అరిగిపోయిన రికార్డు అంటే ఇప్పటివారికి తెలియదు కనుక అన్నీ నెహ్రూనే చేశారు అనే పాచిపాట ఇంకా ఎంతకాలం పాడాలి అని మీ భక్తులు, జనం నుంచి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. మీరు చెప్పిన మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ధి వంటి విఫల నినాదాలను చూసిన తరువాత ఎన్నికల కోసం ఆడుతున్న ఆటలో భాగం ఇదని అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన నినాదం, చెప్పిన మాట మరోసారి మీ నోటి వెంట రాదన్నది స్పష్టమే. మీ శైలి అనితరసాధ్యం. గతంలో అమెరికా, పూర్వపు సోవియట్‌ మధ్య ప్రచ్చన్న పోరులో అణ్వాయుధాలు కేంద్ర స్థానంలో ఉంటే ఇప్పుడు అమెరికా, చైనా మధó్య తలెత్తిన పోరులో సెమీకండక్టర్‌లు ఉన్నాయి.ఆయుధాలలో కూడా ఇవి కీలకంగా మారనున్నాయని విశ్వగురువుగా ప్రపంచాన్ని ఔపోసన పట్టిన మీకు నేను చెప్పాల్సినపని లేదు.


ఎయిర్‌బస్‌లో అనేక దేశాలను అలా వెళ్లి ఇలా చుట్టివచ్చిన మీరు సెమీకండక్టర్‌ బస్‌ను ఎలా మిస్‌ అయ్యారన్నది చాలా మందికి అర్ధం కావటం లేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తరువాత వచ్చిన ప్రధానులెవరికీ(వారిలో అతల్‌ బిహారీ వాజ్‌పాయి ఉన్నదీ లేనిదీ తెలియదు) దూర దృష్టి లేదని విమర్శించే మీ అనుయాయులు (సుబ్రమణ్య స్వామిని పక్కన పెడదాం) మీ గురించి ఏం చెబుతారో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేసిన దాన్ని మీరు తొలి ఐదు సంవత్సరాల్లోనే చేసి చూపించారని గత ఎన్నికలపుడు ప్రచారం చేశారు. చేసిందేమిటో సాధికారిక సమాచారాన్ని జనానికి అందిస్తే వాస్తవం తెలుస్తుంది. మన దేశంలో మీ కంటే ముందు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) పేరుతో వివరాలను సేకరిస్తున్నారు. దానిలో మీ పాలనలో అనేక సూచికలు దిగజారినట్లు కనిపించింది. మీ ఏలుబడిలో నిరుద్యోగం పెరిగిందన్న సమాచారాన్ని గత లోక్‌సభ ఎన్నికల ముందు తొక్కిపెట్టిన సంగతి మీకు చెప్పనవసరం లేదు. వచ్చే సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని సమాచారాన్ని సేకరించే పద్దతిని రూపొందించే సంస్థ అధిపతినే తప్పించారు అని జనం అనుకుంటున్నారు.


నరేంద్రమోడీ పెద్ద విజనరీ అంటే భూత, వర్తమాన, భవిష్యత్‌ను చూడగలిగిన దృష్టి కలవారని అని ప్రచారం చేశారు. నిజమే కావచ్చు, సర్వేల్లో వచ్చే సమాచారం ఎలాంటిదో మీకు ముందే తెలిసి ఉంటుంది గనుక దాని రూపకర్తనే తొలగించారు. అన్నట్లు మరిచాను. ఈ ఏడాది మీ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని మీరు ముందే గ్రహించి ఆ విషయాన్ని ఎన్నో సంవత్సరాల ముందే మీరు చెప్పినట్లు కొందరు సామాజిక మాధ్యమంలో మీ గొప్ప గురించి ప్రచారం చేస్తున్న పోస్టు ఉంది. దాని నిజా నిజాలు మీకే ఎరుక. నిజంగా మీకు తెలిసి ఉంటే మణిపూర్‌ దురంతాన్ని ఎందుకు నివారించలేకపోయారు అన్న ప్రశ్న వస్తోంది. దాన్ని వదలివేద్దాం. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం గురించి కూడా మీరు చెప్పారు. పిండి లేకుండా రొట్టెలు రావు కదా ? దానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి రంగాల ప్రాధాన్యత, దానిలో సెమికండక్టర్ల గురించి ప్రధాని కాగానే లేదా అంతకు ముందు గుజరాత్‌ సిఎంగా ఎందుకు పసిగట్టలేకపోయినట్లు ? ఈ రంగానికి నిధుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు చేయాల్సి ఉంది. రెండూ జరగటం లేదు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న గేట్‌వే హౌస్‌ అనే ఒక మేథో సంస్థ 2015 జనవరి పదహారున టెక్నాలజీ పరుగులో చైనా ముందు భారత్‌ ఓడిపోనుందా అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది. మీ సలహాదారులకు దీని గురించి తెలియదని అనుకోలేము.లేదా ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే మన దేశ ఖర్మ అనుకోవటం తప్ప చేసేదేమీ లేదు. దానిలో పరిశోధన, అభివృద్ది ఖర్చు గురించి చర్చించారు. 1991 నుంచి చైనా పరిశోధన ఖర్చును ఏటా 19శాతం పెంచుతూ 2012నాటికి జిడిపిలో 1.97శాతానికి చేరినట్లు పేర్కొన్నారు.అప్పటికి మనదేశ ఖర్చు 0.9శాతం మాత్రమే ఉంది.ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రికలో 2023 ఫిబ్రవరి ఒకటిన ప్రచురితమైన ఒక విశ్లేషణలో జిడిపిలో మనదేశ తాజా ఖర్చు 0.7శాతమే అని చైనా 2.1శాతంగా పేర్కొన్నారు. జిడిపిలో రెండు శాతం ఖర్చు చేయాలని గతంలో వాజ్‌పాయి సర్కార్‌ కూడా చెప్పింది. దూరదృష్టి గల మీ పాలనలో గతం కంటే తగ్గిందేమిటి ? మన దేశంలో నిపుణులకు, పరిశోధకులకు కొరత ఉన్నదా ?


కుహనా అంశాలమీద పరిశోధనకు మీరు చూపుతున్న శ్రద్ధ సెమికండక్టర్స్‌ వంటి ప్రాధాన్యరంగాల మీద లేదు, ఆవు పేడ, మూత్రం, పాలలో బంగారం ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ పరిశోధనలకు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తున్నదని 2020 సంవత్సరంలో వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వతీరుతెన్నులను తప్పు పడుతూ ఆ పరిశోధనలను ఆపివేయాలని కోరినా మీరు పట్టించుకోలేదు. అంతకు ముందు 2017లో పంచగవ్య గురించి ఆయుర్వేద పుస్తకాల్లో రాసిన వాటిని రుజువు చేసేందుకు పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. మొత్తంగా పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించకుండా ముందుకు పోవటానికి మీ దగ్గర మంత్రదండమేదైనా ఉంటే హాం ఫట్‌ అంటూ తిప్పండి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారని చెప్పటం మీకు ఇష్టముండదని తెలిసినా తప్పటం లేదు.


తినేందుకు బంగాళాదుంప, అరటి చిప్స్‌ లేకున్నా రోజు గడుస్తుందిగానీ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ లేకుండా మనకు క్షణం గడవదంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో నిపుణులైన సెమికండక్టర్‌ రూపకల్పన ఇంజనీర్లు ప్రపంచం మొత్తంలో ఉన్నవారిలో 20శాతం మంది మనదేశంలో ఉన్నారని అంచనా. వారందరినీ విదేశీ కంపెనీలకు చౌక శ్రామికులుగా సమర్పించటం తప్ప ఇప్పుడు జరుగుతున్నదేమైనా ఉందా ? వారు సాధించే పేటెంట్స్‌ మన దేశానికి దక్కవు. మన ఇంజనీర్లు ఐటి రంగంలో ముందున్నారు. దీనికి మీ సర్కార్‌ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. హార్డ్‌వేర్‌ రంగంలో ఆ స్థితి లేదు. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ భాగం మనం దిగుమతి చేసుకుంటున్నార. అదే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో విదేశీ కంపెనీలు రూపకల్పనలో లబ్ది పొందటం తప్ప చిప్స్‌ తయారీ మన దేశంలో ఎంతమేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం అమెరికా మైక్రాన్‌ కంపెనీ ఎక్కడో ఉత్పత్తి చేసిన వాటిని మనదేశంలో పరీక్షించి పాకింగ్‌ చేయిస్తున్నది. దానితోనే పండగ చేసుకుందామా ?


చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరులో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది.తమ దేశంలోనే సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని, అక్కడి నుంచి ఎగుమతులు జరపాలని అమెరికా సర్కార్‌ పట్టుబడుతోంది. తైవాన్‌లోని టిఎస్‌ఎంసి కంపెనీ ఉత్పత్తి మీద అదుపు కలిగి ఉంది.1990లో ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పతిలో అమెరికా వాటా 37శాతం ఉంటే 2020లో 12శాతానికి తగ్గింది. తిరిగి పూర్వపు స్థితికి చేరాలంటూ కొత్త పరిశ్రమలకు ఇచ్చేందుకు 280 బిలియన్‌ డాలర్లను అమెరికా కేటాయించింది.ఈ మొత్తానికి స్థానిక ప్రభుత్వాలు ఇచ్చేది అదనం. ఇప్పటి వరకు అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్‌ సెమీకండక్టర్ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు సబ్సిడీల నిమిత్తం పదివేల కోట్ల డాలర్లు పక్కన పెడుతున్నట్లు ప్రకటించాయి. ఇంటెల్‌ కంపెనీ జర్మనీలో 30బిలియన్‌ యూరోల ప్లాంట్‌ పెట్టాలంటే మూడో వంతు తమకు సబ్సిడీ ఇవ్వాలని బేరమాడింది.పోలాండ్‌, జర్మనీ, ఇజ్రాయెల్లో కొత్త ప్లాంటులు పెట్టేందుకు 50బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇంటెల్‌ పేర్కొన్నది. మొత్తం మీద చూస్తే ఈ రంగంలో ముందున్న కంపెనీలు పెద్ద ఎత్తున లబ్దిపొందనున్నాయి. ఈ పోరులో మనదేశం ఎక్కడ అన్నది ప్రశ్నార్ధకమే.


గత పది సంవత్సరాలుగా ఈ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణం అని మీ మద్దతుదార్లు చెప్పినా ఆశ్చర్యంలేదు. అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండోతో మన మంత్రి పియూష్‌ గోయల్‌ 2023 మార్చి పదవ తేదీన సెమీకండక్టర్ల సరఫరా, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యం గురించి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్లిష్టమైన, వర్ధమాన సాంకేతికతల (ఐసిఇటి) సహకారం గురించి ఒప్పందం జరిగింది. చిత్రం ఏమంటే అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వాస్తవాల పత్రంలో మిగతా అంశాల గురించి ఉంది తప్ప సెమీకండక్టర్ల మీద నిర్దిష్టంగా ఏమీ లేదు అని కార్నెగీ ఇండియా వెబ్‌సైట్‌లో 2023 మే నెల 23వ తేదీన కోణార్క భండారీ రాశారు. మన దగ్గర దానికి భిన్నమైన సమాచారం ఉంటే ఆ పత్రాన్ని విడుదల చేస్తే వాస్తవం తెలుస్తుంది. మనదేశంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే వాటిని ప్రోత్సహించేందుకు ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహక(పిఎల్‌ఐ) పధకాన్ని 2021 నుంచి ఐదేండ్లలో రు.1.97లక్షల కోట్లు ఇచ్చే ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఆచరణలో ఉత్పత్తి బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఒక దగ్గర చేర్చే సెల్‌ఫోన్లకు, చిప్స్‌ పరీక్షలకు ఇస్తున్నారు. అందుకే భలే మంచి పధకం, వదలితే దొరకదని పొలోమంటూ ఆపిల్‌, మైక్రాన్‌ వంటి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయి.


రెండు దిగ్గజదేశాలైన అమెరికా, చైనా సెమీకండక్టర్ల రంగంలో పైచేయి సాధించేందుకు భారీ సబ్సిడీలతో పోటీ పడుతున్నాయి. అదే సమయంలో చైనా తన స్వంత రూపకల్పన, ఉత్పత్తికి గాను భారీ మొత్తంలో పరిశోధనకు నిధులు వెచ్చిస్తున్నది. మనదేశంలో ఒక సమగ్ర విధానాన్ని కూడా ఇప్పటికీ రూపొందించుకోలేకపోయాము.అలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా ఉంటే మన దేశాన్ని సెమీకండక్టర్‌ హబ్‌గా మారుస్తానని మీరు చెబుతున్నారు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ తాజా(2023) సమాచారం ప్రకారం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, అమెరికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఫాబ్రికేషన్‌లో 2022 డిసెంబరు నాటికి జపాన్‌లో 102, తైవాన్‌ 77, అమెరికా 76, చైనా 70, జర్మనీ 20, బ్రిటన్‌ 12, మలేషియా 7 ప్లాంట్లను కలిగి ఉన్నాయి. తరువాత స్థానాల్లో ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గుజరాత్‌లో 70శాతం సబ్సిడీ ఇచ్చి అమెరికా మైక్రాన్‌ కంపెనీతో ఒక పాకింగ్‌ కేంద్రాన్ని పెట్టించి దీంతో ప్రపంచ హబ్‌గా మారుస్తానని మీరు జనాలకు చెబుతున్నారు. ఇది ఎంతకాలం నడుస్తుంది ? అమెరికా మనలను తన సహజ భాగస్వామిగా పరిగణిస్తున్నదని, పిలిచి పెద్ద పీటవేస్తున్నదని చెబుతున్నారు. గతేడాది (2022) మార్చి నెలలో తొలిసారిగా అమెరికా చొరవతో చిప్స్‌ 4 లేదా ఫాబ్‌ 4 కూటమి ఏర్పడింది. దానిలో తైవాన్‌(చైనా తిరుగుబాటు రాష్ట్రం), జపాన్‌, దక్షిణ కొరియా ఇతర భాగస్వాములు తప్ప మనకు చోటు లేదు. ప్రపంచ సెమీకండక్టర్ల పరిశ్రమలో 70శాతం వాటా ఈ నాలుగు దేశాలదే. విధాన రూపకల్పన, ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకొనేందుకు, విస్తరణకు దీన్ని ఏర్పాటు చేశారు.


గత తొమ్మిది సంవత్సరాల్లో దేశ అప్పును విపరీతంగా పెంచివేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు తరువాత మీరు దాన్ని ఎడాపెడా పెంచారు.కేవలం మీరు చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు.మీరు అధికారానికి వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపిలో 67.1 శాతం కాగా 2021లో 88.5 శాతానికి పెరిగింది, 2023 నాటికి అది 83.1శాతంగా ఉంది. ఇంత చేసిన వారు పరిశోధనకు పెంచకపోగా ఎందుకు తగ్గించిందీ ఏదైనా ఒక మన్‌కీ బాత్‌లో చెబితే సంతోషం. ఆవు పేడ పరిశోధన నిధులు సెమీ కండక్టర్లకు మళ్లించండి, సబ్సిడీలతో పాటు పరిశోధనలకూ నిధులు ఇవ్వండి. ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నా.
తోటి భారతీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

పరిశోధనల్లో చైనాను తక్కువ అంచనా వేస్తే ముప్పే – అమెరికాను హెచ్చరించిన ఓ నివేదిక !

14 Wednesday Jun 2023

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti china, Chinese Innovation Inputs, Chinese Scientific Articles, ITIF, natural-science research ranking, R&D Expenditures


ఎం కోటేశ్వరరావు


ప్రకృతి విజ్ఞానం(నేచురల్‌ సైన్స్‌)లో అమెరికాను వెనక్కు నెట్టి చైనా ప్రధమ స్థానానికి వచ్చిందన్నది ఒక నివేదిక.” మేలుకో అమెరికా : నవ కల్పన ఉత్పత్తిలో అమెరికాను అధిగమిస్తున్న చైనా ” అనే శీర్షికతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఐటిఐఎఫ్‌) ఒక నివేదికలో హెచ్చరించింది. ” చైనా నకిలీ సైన్సు పరిశ్రమ ” అంటూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక ఒక పెద్ద నింద మోపింది. ఇవన్నీ ఇటీవల చైనా గురించి వచ్చిన విశ్లేషణలు, వార్తలకు సంబంధించిన అంశాలు. ప్రకృతి విజ్ఞానంలో చైనా తొలిసారిగా అమెరికాను అధిగమించి ఒకటవ స్థానంలో ఉన్నట్లు నేచర్‌ ఇండెక్స్‌ పేర్కొన్నది. అగ్రశ్రేణి పత్రికల్లో 2022 సంవత్సరంలో ప్రచురితమైన పరిశోధనా పత్రాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. ఎనభై రెండు పత్రికల్లో చైనాకు చెందిన వారు సమర్పించిన పత్రాలు 19,373 కాగా అమెరికా నుంచి వచ్చినవి 17,610 ఉన్నాయి. ఏ దేశానికి చెందిన వారైనా ఏ దేశం నుంచి పత్రాలను సమర్పిస్తే వాటిని ఆ దేశాల ఖాతాలో వేస్తారు. ప్రకృతి విజ్ఞాన పరిశోధనా పత్రాల సమర్పణలో చైనా, అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, జపాన్‌ మొదటి ఐదు స్థానాల్లో ఉండగా మన దేశం పదవ స్థానంలో ఉంది. భౌతిక, రసాయన శాస్త్ర పరిశోధనల్లో 2021లో చైనా మొదటి స్థానంలో ఉంది. తాజా సమాచారాన్ని పరిశీలించినపుడు భూమి, పర్యావరణ శాస్త్రాలలో కూడా తొలిసారిగా అమెరికాను వెనక్కు నెట్టి చైనా ముందుకు వచ్చింది. గత ఏడాది వివరాలను పరిశీలించినపుడు ప్రపంచ అగ్రశ్రేణి 50 పరిశోధన ఉత్పాదక సంస్థలలో చైనా సైన్సెస్‌ అకాడమీ ఒకటవదిగా ఉండగా మొత్తం 19 చైనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఆ జాబితాలో ఉన్నాయి. 2010 నుంచి జాతీయ సమతూకంలో మార్పు ఉన్నట్లు నేచర్‌ ఇండెక్సు ప్రకటన పేర్కొన్నది.2018 -2020 సంవత్సరాలలో ఉటంకించిన అగ్రశ్రేణి ఒకశాతం పరిశోధనా పత్రాలలో అమెరికా కంటే చైనావే ఎక్కువగా ఉన్నట్లు సైన్సెస్‌ మరియు టెక్నాలజీ జపాన్‌ జాతీయ సంస్థ 2022 నివేదిక పేర్కొన్నది.

నిజానికి 2018లోనే మొత్తం పరిశోధనా పత్రాల సమర్పణలో అమెరికా, ఐరోపాను వెనక్కు నెట్టి చైనా ముందుంది.
2018 నుంచి 2020వరకు ప్రపంచ శాస్త్ర పత్రాలలో 23.4శాతంతో చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతానికి జీవ శాస్త్ర రంగంలోనే అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.అమెరికా ఎన్నో శతాబ్దాలు ముందుండి పరుగులు పెడుతుంటే చైనా ఇటీవలనే నడక ప్రారంభించింది. అందుకే ఇప్పటికీ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు కొన్ని రంగాలలో ముందున్నాయి. నోబెల్‌ బహుమతులను కొలబద్దగా తీసుకుంటే 403తో అమెరికా, 137తో బ్రిటన్‌, 114తో జర్మనీ మొదటి మూడు స్థానాల్లో ఉండగా చైనా తొమ్మిదితో 23వ స్థానంలో ఉంది. 2015లో పశ్చిమ దేశాల సైన్సు పత్రికలలో చైనా పరిశోధనా పత్రాలు కేవలం ఏడున్నవేలు మాత్రమే ప్రచురణకు నోచుకోగా అమెరికా నుంచి 21వేలవరకు ఉన్నాయి. 2020 అమెరికా పత్రాలు స్వల్ప తేడాతో స్థిరంగా ఉండగా తరువాత తగ్గటం ప్రారంభమైంది. మరోవైపున అచిర కాలంలోనే చైనా దాన్ని అధిగమించింది. పశ్చిమ దేశాల పరిశోధనా సంస్థలు కొన్ని రంగాలలో తప్పనిసరైతే తప్ప చైనా లేదా మరొక వర్ధమాన దేశంతో సహకరించటం లేదన్నది తెలిసిందే. కొత్తవాటిని కనుగొనటం కాకుండా ఉన్నవాటిని కాపీ కొడుతుందని ఇప్పటికీ చైనా గురించి చెప్పేవారు మనకు కనిపిస్తారు. అదే నిజమైతే మిగిలిన దేశాలకూ అలాంటి అవకాశం ఉన్నట్లే, మరి అవెందుకు ఆ పని చేయటం లేదు ? మన దేశంలో దొంగ డిగ్రీలు, చివరికి పిహెచ్‌డి థీసిస్‌లను కూడా కొనుక్కొని పట్టాలు పొందవచ్చు కనుక అనేక మంది చైనా గురించి జరుగుతున్న ప్రచారాన్ని నమ్మటంలో వింత లేదు.


వాషింగ్టన్‌ డిసి కేంద్రంగా పని చేస్తున్న ఐటిఐఎఫ్‌కు చైనా మీద ఎలాంటి ప్రత్యేక అభిమానం ఏమీ ఉండదు, అది అమెరికాలోని ఒక స్వచ్చంద సంస్థ. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదికలో అమెరికా పాలకవర్గానికి ఒక హెచ్చరిక చేసింది. చైనాను ఒక నవకల్పన దేశానికి బదులు అనుకరించేది అని తక్కువగా అంచనా వేస్తే తనకు తానే ఆపద కొనితెచ్చుకున్నట్లు అవుతుందని పేర్కొన్నది.2020 నాటికి అంతర్జాతీయ పేటెంట్‌ కుటుంబాల (అమ్మా, నాన్న, పిల్లలు కుటుంబం అన్నట్లే, ఒక పేటెంట్‌ దానికి అనుబంధంగా పేటెంట్లు ఉండటాన్ని కూడా కుటుంబంగా పరిగణిస్తారు) సంఖ్య అమెరికా కంటే చైనాకు చెందినవి ఐదు రెట్లు ఉన్నట్లు చెప్పింది.నవకల్పనలో అమెరికా ఆధిపత్యాన్ని పునరుద్దరించాలని విధాన నిర్ణేతలకు సూచించింది. మేడిన్‌ చైనా 2025 వ్యూహం ప్రకారం ఆ దేశం ముందుకు పోతున్నదని కూడా చెప్పింది. పరిశోధనా రంగంలో సాధిస్తున్న ప్రగతిని పేర్కొంటూ 2010లో ఐరోపా సమాఖ్య ప్రకటించిన పరిశోధన-అభివృద్ధి రంగంలో పెట్టుబడుల సూచికలో 1,400 కంపెనీలకు గాను 19 చైనా కంపెనీలుండగా 2020 నాటికి 278కి పెరగ్గా ఇదే కాలంలో అమెరికా సంస్థలు 487 నుంచి 449కి తగ్గాయి. సైన్స్‌, ఇంజనీరింగ్‌ పరిశోధనా పత్రాలు 2020లో 7,42,000 కాగా అవి అమెరికా కంటే 123.7శాతం ఎక్కువని ఐటిఐఎఫ్‌ పేర్కొన్నది. పేటెంట్ల లైసన్సు ద్వారా వచ్చే రాబడిలో అమెరికా ఎంతో ముందుంది. చైనాకు 2016లో అమెరికాకు వచ్చే రాబడిలో కేవలం రెండుశాతమే రాగా 2020 నాటికి 12శాతానికి పెరిగిందని ప్రపంచ బాంకు సమాచారం వెల్లడించింది. సూపర్‌ కంప్యూటర్లలో 2020 నాటికి 500 అగ్రశ్రేణి వ్యవస్థలకు గాను చైనాలో 214 ఉండగా అమెరికా 113 మాత్రమే ఉన్నాయి. పారిశ్రామిక రోబోల వినియోగంలో 2010 అమెరికాతో పోలిస్తే పదికి ఒకటి ఉండగా ఇప్పుడు అమెరికాతో సమంగా ఉన్నాయి. గణనీయ పురోగతి ఉన్నప్పటికీ చైనా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఐటిఐఎఫ్‌ పేర్కొన్నది.


ఎలక్ట్రిక్‌ బాటరీలు, హైపర్‌సోనిక్‌,5జి,6జి, నానో స్కేల్‌ మెటీరియల్స్‌, సింథటిక్‌ బయాలజీ వంటి కొన్ని రంగాలలో తిరుగులేనిదిగా ఉన్న చైనా 44 సాంకేతిక పరిజ్ఞానాల్లో 37లో ముందున్నదని ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పోలసీ ఇనిస్టిట్యూట్‌ అనే మేథో సంస్థ 2022 నివేదికలో పేర్కొన్నది. మిగిలిన ఏడింటిలో అమెరికా ముందున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని పది అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలు చైనాలో ఉన్నాయని, అమెరికా కంటే తొమ్మిది రెట్లు పరిశోధనా పత్రాలను అవి రూపొందిస్తున్నట్లు , షీ జింపింగ్‌, అంతకు ముందున్న నేతల మార్గదర్శకత్వంలో ఈ కృషి కొనసాగుతున్నదని పేర్కొన్నది. అణ్వాయుధాలను మోసుకుపోగల హైపర్‌సోనిక్‌ క్షిపణులను 2021లో పరీక్షించిన తీరును చూసి అమెరికా గూఢచార సంస్థలు ఆశ్చర్యపడనవసరం లేదని, గడచిన ఐదు సంవత్సరాలలో ప్రపంచంలో పెద్ద ప్రభావం కలిగించే మొత్తం పరిశోధనా పత్రాల్లో 48.49శాతం ఒక్క చైనా నుంచే ఉన్నట్లు ఆస్ట్రేలియన్‌ సంస్థ పేర్కొన్నది.


పరిశోధనల్లో వివిధ దేశాల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. సహకరించిన వారెవరైనా ఏ దేశానికి చెందిన వారు పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తే దాన్ని ఆ దేశ ఖాతాలో వేస్తారు.చైనా నుంచి వస్తున్న పరిశోధనా పత్రాలు ఇతరుల సహకారంతో సమర్పిస్తున్నవని కొందరు చైనాను తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.రెండవది చైనా తమ పరిశోధన అంశాలను తస్కరిస్తున్నారని నిందిస్తున్నారు. మన దేశంతో సహా అనేక దేశాల సంప్రదాయ విజ్ఞానాన్ని అమెరికా, ఐరోపా దేశాలు అపహరించి తమ పేరుతో మేథో సంపత్తి హక్కులు పొందాయి. అందుకు ఒక చక్కటి ఉదాహరణ మన దేశం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు చెబుతున్న పసుపు మీద అమెరికా పేటెంట్‌ హక్కు దఖలు పరచుకుంది. దాని మీద మన దేశం చట్టబద్దమైన పోరాటం చేసి విజయం సాధించింది. ఇలాంటి అవకాశం ఏ దేశానికైనా ఉంది. కొందరు ఆరోపిస్తున్నట్లు చైనా కూడా అలాంటి పని చేస్తే దాన్ని కూడా కోర్టులకు లాగవచ్చు. ఎవరి విజ్ఞానాన్ని వారు పరిరక్షించుకోవచ్చు.విద్యుత్‌ బల్బును కనుగొన్నది ఎవరని అడిగితే ఠకీమని చెప్పే జవాబు థామస్‌ ఎడిసన్‌ అని వస్తుంది. కానీ ఎడిసన్‌ కంటే ముందే అనేక మంది దాని మీద పరిశోధనలు చేశారు, బల్బులను రూపొందించారు. దాని కొనసాగింపుగా ఎడిసన్‌ తన పరిశోధనలను జోడించి ఆ బల్బును వాణిజ్యపరంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అనుసరించిన క్రమం గురించి పేటెంట్‌ పొందాడు. దాంతో పేరు అతనికి వచ్చింది. ఆ పరిశోధనలో అనేక మంది ఎడిసన్‌కు సహకరించారన్నది గమనించాలి. మరొకరెవరూ తదుపరి పరిశోధనలు చేయకూడదు, ఎడిసన్‌ లేదా అతని వారసులు మాత్రమే చేయాలంటే ఈ రోజు ఇన్ని రకాల బల్బులు వచ్చి ఉండేవి కాదు. పరిశోధనలకు మూలం అంతకు ముందున్న తరాల విజ్ఞానమే అన్నది తెలిసిందే.


చైనా శాస్త్రవేత్తల పరిశోధనల్లో పెద్దగా పస ఉండదు, నాసిరకం, ఇతరులు చేసిన వాటిని అటూ ఇటూ మార్చి నూతన పరిశోధనల పేరుతో సమర్పిస్తున్నారు, ఒకే వనరు నుంచి కాపీ పరిశోధనలు వస్తున్నాయి, ఇతరులు బొమ్మలను మరోకోణంలో కొత్తవిగా చూపుతున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు కొందరు. చైనాలో ఉన్న అవినీతిని తొలగించేందుకు ఎలాంటి కఠిన శిక్షలను అమలు చేస్తున్నారో తెలిసిందే. పరిశోధనా రంగంలో ఉన్నవారు కూడా అవినీతికి పాల్పడితేవారి నుంచి వచ్చిన వాటిని అంతర్జాతీయ సమాజం పక్కన పెట్టవచ్చు. పరిశోధనలను ప్రోత్సహించే క్రమంలో ప్రచురించిన పత్రాల ప్రాతిపదికన చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిన కారణంగా కొందరు అవినీతికి పాల్పడి ఉండవచ్చు తప్ప మొత్తంగా నకిలీ అనే వారిని చేసేదేమీ లేదు. ఇప్పుడు అలాంటి ప్రోత్సహకాలను నిలిపివేసింది. అక్కడ జరుగుతున్న అభివృద్ది వాస్తవం, సాధిస్తున్న అద్బుతాలు నిజం. ఈ పూర్వరంగంలో చైనా మీద బురద జల్లేందుకు కుహనా శాస్త్ర పరిశ్రమ పేరుతో వారినీ వీరిని ఉటంకించి ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఒక కథను అల్లింది. చైనాదంతా బోగస్‌ అని అమెరికా ఇతరులను నమ్మించేందుకు ప్రచారం చేయవచ్చు తప్ప దాన్ని వారే నమ్మటం లేదు. చైనాతో పోటీని తట్టుకొనేందుకు వచ్చే పది సంవత్సరాల్లో శాస్త్ర పరిశోధనలకు రెండు వందల బిలియన్‌ డాలర్లను అధ్యక్షుడు జో బైడెన్‌ నిధుల మంజూరు చేసేవాడే కాదు.


ఇంతవరకు ప్రపంచంలో చైనా గురించి చేసినన్ని తప్పుడు ప్రచారాలు మరొక దేశం గురించి లేవంటే అతిశయోక్తి కాదేమో ! ఎవరు అవునన్నా కాదన్నా చైనా నేడు సాంకేతిక, ఆర్థిక రంగాల్లోనే కాదు, శాస్త్ర రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలను సవాలు చేస్తూ ముందుకు పోతోంది. అది కూలిపోవాలి, పేలిపోవాలని ఎన్ని దుష్ట కోరికలు కోరుకున్నప్పటికీ, కూలుతుందని తేదీలు, సంవత్సరాలను ఉటంకించినప్పటికీ అలాంటి జాడలేమీ లేవు. అనేక రంగాలలో ముందుకు పోవటానికి కారణం జనానికి జవాబుదారీగా ఉండే కమ్యూనిస్టు భావజాలం కలిగిన శక్తులు అక్కడ అధికారంలో ఉండటమే కారణం. దోపిడీ లేని మరో సమాజ నిర్మాణం సాధ్యమే అని నిరూపించేందుకు కమ్యూనిస్టులు ముందుకు పోతుండగా అడ్డుకొంటున్న ప్రతిసారీ ఆటంకాలను అధిగమించి ముందుకు పోతున్నది. ఆ క్రమంలో ఉన్న లోపాలను చైనా ప్రభుత్వం, పార్టీ కూడా దాచుకోవటం లేదు. వాటిని అధిగమిస్తూ, అందుకు పాల్పడిన వారిని కఠినంగా అదుపు చేస్తూ జగన్నాధ రధం ముందుకు పోతున్నది. పరిశోధన-అభివృద్ధి రంగంలో 2022లో అమెరికా 660 బి.డాలర్లు ఖర్చు చేయగా జిడిపిలో అది 2.6శాతం. అదే చైనా 556 (3.1), జపాన్‌ 194 (3.4) భారత్‌ 159 (0.56), ఖర్చు చేస్తున్నట్లు వికీపీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా జిడిపిలో 5.9, 5 శాతాల చొప్పున అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకే పిండికొద్దీ రొట్టె అంటారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచాన్ని భయపెడుతున్న మంకీపాక్స్‌ వెనుక అమెరికా హస్తం ఉందా ?

22 Sunday May 2022

Posted by raomk in Current Affairs, Health, History, INTERNATIONAL NEWS, Opinion, Science, UK, Uncategorized, USA

≈ 1 Comment

Tags

BILL GATES, Monkeypox, Monkeypox Conspiracy Theory, Monkeypox goes global, Monkeypox Vaccines, Smallpox


ఎం కోటేశ్వరరావు


ఒకనాడు కేవలం ఆఫ్రికా ఖండానికే పరిమితం అనుకున్న మంకీపాక్స్‌ వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని ఆవరించనుందా ? కరోనా మాదిరి మహమ్మారిగా మారనుందా ? నివృత్తి జరిగేంతవరకు అనేక అనుమానాలు, సందేహాలు వెలువడుతూనే ఉంటాయి. తెలుగు నాట మసూచి, పెద్ద అమ్మోరు, స్ఫోటకంగా పిలిచిన వైరస్‌కు ఇది సోదరి. ప్రస్తుతానికి అలాంటి తీవ్ర హెచ్చరికలు వెలువడలేదుగానీ కరోనా నేపధ్యంలో అనేక వార్తలు భయపెడుతున్నాయి. ఇది పాక్స్‌ జాతికి చెందిన వైరస్‌గా కోతుల్లో గుర్తించినందుకు దానికి మంకీపాక్స్‌ అని పేరు పెట్టారు. ఇది మసూచికి సంబంధించిందైనప్పటికీ అంతటి ప్రమాదకారి కాదని కొందరు అంటున్నా ,అప్పుడే నిర్దారించలేమని మరికొందరు హెచ్చరిస్తున్నారు.వరియోలా మేజర్‌, వరియోలా మైనర్‌గా పిలిచిన వైరస్‌లు మసూచి కారకాలు, ఇది గతశతాబ్దిలో 30 కోట్ల మందిని, అంతకు ముందు మరో ఇరవై కోట్ల మందిని బలితీసుకుందని అంచనా.పదహారవ శతాబ్దిలో బ్రిటన్‌లో దీన్ని స్మాల్‌పాక్స్‌ అని పిలిచారు.1980లో ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించి ఈ వైరస్‌ ఇప్పుడు అమెరికా, రష్యాల్లోని రెండు పరిశోధనా సంస్ధలలో మాత్రమే ఉంది.


ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా ఖండాల్లోని 14 దేశాల్లో మే నెల మూడవ వారం వరకు 120 నిర్దారణ లేదా అనుమానాస్పద కేసులు నమోదైనాయి. ఒక ప్రాంతంలోని జనాభాతో మరొక ప్రాంత జనాభాకు సంబంధలేనప్పటికీ ఇన్ని చోట్ల వ్యాప్తి చెందటం ఆసక్తి కలిగిస్తున్నదని ఆఫ్రికాలోని కాంగోలో పదేండ్ల క్రితం ఈ వైరస్‌ మీద పరిశోధన చేసిన అమెరికా శాస్త్రవేత్త అనే రిమోయిన్‌ చెప్పారు. ఇది మసూచి సంబంధిత వైరస్‌ కనుక కరోనా మాదిరి వ్యాప్తి చెందదని మరోశాస్త్రవేత్త జే హూపర్‌ అన్నారు. ఇది సోకిన వ్యక్తులు దగ్గినపుడు అతి సమీపంలోని వారికి మాత్రమే సోకే అవకాశం ఉందన్నారు. ఇది సోకిన వారు ఎలాంటి చికిత్సలేకుండానే కొన్ని వారాల తరువాత ఎక్కువ మంది కోలుకుంటారని కూడా హూపర్‌ అంటున్నారు. ఇది ప్రాధమిక దశలో ఉన్నందున ఇప్పటికిప్పుడే నిర్ధారణగా దేన్నీ చెప్పలేమని మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మరో వైరాలజిస్టు గుస్తావ్‌ పాలాసియో చెప్పారు. ఆఫ్రికా దేశాల్లో ఇది కనిపించినప్పటికీ ఐరోపా, అమెరికాల్లో వ్యాప్తి చెందటానికి ఉన్న సంబంధం ఇంకా తెలియలేదు.ప్రస్తుతానికి మన దేశంలో ఈ వైరస్‌ దాఖల్లాలేవు. సోకిన దేశాల నుంచి వచ్చిన వారి మీద నిఘావేసి, లక్షణాలున్నవారి నుంచి రక్త నమూనాలను సేకరించాలని ఆదేశించారు.స్త్రీ-పురుషుల సంపర్కం ద్వారా మంకీపాక్స్‌ వ్యాపించదని భావించిన ఈ వైరస్‌ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకొనేట్లు చేసింది. బ్రిటన్‌లో వెలువడిన కేసులలో ఎక్కువ మంది స్వలింగ, ద్విలింగ సంపర్క పురుషుల్లో కనిపించింది.


సంబంధం లేని దేశాల జనాభాలో ఇది కనిపించటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మసూచి(స్మాల్‌పాక్స్‌)ను పూర్తిగా నిర్మూలించినందున దాని సోదరి మంకీపాక్స్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంతకాలంగా భావిస్తున్నారు. బలహీనం, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో మంకీపాక్స్‌ సోకవచ్చని భావిస్తున్నారు.కాంగోలో కనిపించిన తరువాత 39 ఏండ్లకు 2017 నుంచి నైజీరియాలో రెండువందల నిర్ధారిత, ఐదు వందల అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. 2003లో ఘనా నుంచి దిగుమతి చేసుకున్న ఎలుకల నుంచి అమెరికాలోని ఇల్లినాయిస్‌ కుక్కలకు తరువాత 70 మంది మనుషులకు సోకింది. తాజాగా వివిధ దేశాల్లో కనపడిన కేసుల వెనుక బిల్‌గేట్స్‌ హస్తం ఉందంటూ కొన్ని కుట్ర సిద్దాంతాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. వాక్సిన్ల తయారీలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న బిల్‌గేట్స్‌ వాటిని అమ్ముకొనేందుకు వైరస్‌లను కూడా సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఒక సభలో మాట్లాడిన బిల్‌గేట్స్‌ త్వరలో మరో పెద్ద మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని, దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్ద కొత్త సంస్దను ఏర్పాటు చేయాలని, జీవాయుధాలుగా వైరస్‌లను ఉగ్రవాదులు వినియోగించవచ్చని హెచ్చరించాడు. ఆ మాటలకు ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధం కలిపి వార్తలు వెలువడుతున్నాయి. అంతకు ముందు కూడా గేట్స్‌ ఇలాగే మాట్లాడిన ఉదంతాలున్నాయి. గతవారంలో పెద్ద మొత్తంలో మంకీపాక్స్‌ వాక్సిన్ను అమెరికా కొనుగోలు చేయటం వాటికి ఊతమిస్తున్నాయి.


బ్రిటన్‌లో తొలికేసు నైజీరియా వెళ్లి వచ్చిన పురుషుడిది కాగా తరువాత వారికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఒకరికి నిర్దారణైంది. అతను ఇటీవలే కెనడా వెళ్లి వచ్చినట్లు తేలింది. దాంతో 119మిలియన్‌ డాలర్ల విలువగల మంకీపాక్స్‌ వాక్సిన్లు సరఫరా చేయాలని అమెరికా సర్కార్‌ కోరిందని బవేరియన్‌ నోర్డిక్‌ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందే ఇచ్చిన ఆర్డర్‌తో కలిపితే 299 మిలియన్‌ డాలర్లని, కోటీ30లక్షల డోసులమేర కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిని 2024,25లో సరఫరా చేస్తారు. మంకీపాక్స్‌ సోకినవారిలో నూటికి పది మంది మరణించినట్లు గత సమాచారం వెల్లడిస్తున్నది.
మంకీపాక్స్‌ను పరిశోధనకు తెచ్చిన కోతుల్లో 1958లో కనిపించింది.మానవుల్లో తొలికేసు 1970లో నమోదైంది. ఇది వివిధ పద్దతుల్లో , రకరకాలుగా సోకే అవకాశం ఉంది. వైరస్‌ ఉన్న జంతువు మనిషిని కరచినా, దాని రక్తం, స్రవించిన ద్రవాలను ముట్టుకున్నా, ఈకలను తాకినా రావచ్చు. ఎలుకలు, ఉడుతలు, వైరస్‌ సోకిన జంతుమాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వైరస్‌ సోకుతుంది. సంభోగం ద్వారా కూడ సంక్రమించవచ్చు. మనుషుల్లో జ్వరం, కండరాల నొప్పి,దద్దుర్లు, గాయాలుకావటం, చలి వంటి లక్షణాలుంటాయి. సాధారణంగా వైరస్‌ సోకిన తరువాత ఐదు నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపించవచ్చు.


2003 అక్టోబరు 29న న్యూసైంటిస్టు డాట్‌కామ్‌లో డెబోరా మెకంజీ అనే విశ్లేషకుడు ” అమెరికా వృద్ధి చేసిన ప్రాణాంతక వైరస్‌లు ” అనే పేరుతో రాశారు. అమెరికా ప్రభుత్వ నిధులతో పరిశోధనలు చేసిన ఒక శాస్త్రవేత్త మసూచి వైరస్‌ నుంచి జన్యుమార్పిడితో ప్రమాదకర మౌస్‌పాక్స్‌ను తయారు చేసినట్లు పేర్కొన్నారు.యాంటీ వైరల్‌ వాక్సిన్లు ఇచ్చినప్పటికీ ఇది సోకిన ఎలుకలు మరణించాయి. తరువాత కౌపాక్స్‌(ఆవు) వైరస్‌ను కూడా రూపొందించారు. ఇలా రూపొందించిన వాటిని ప్రమాదకారులుగా మార్చేందుకు కూడా వీలుంది. మానవుల్లో కూడా వైరస్‌ను ప్రవేశపెట్టేవిధంగా మార్చ వచ్చని 2003నాటి ఆర్టికల్‌లో హెచ్చరించారు. లాభాల కోసం ఎంతకైనా తెగించే అమెరికన్లు దేనికైనా పాల్పడతారని చరిత్ర రుజువు చేసింది.


ఐరోపాలో స్మాల్‌పాక్స్‌, మంకీపాక్స్‌, కౌపాక్స్‌ చికిత్సకు ” టెకోవిరిమాట్‌” అనే ఔషధాన్ని అనుమతించారు.దాన్ని టిపాక్స్‌ పేరుతో విక్రయిస్తున్నారు. అమెరికాలో స్మాల్‌పాక్స్‌కు మాత్రమే అనుమతించారు.తాజాగా వ్యాపిస్తున్న మంకీపాక్స్‌ పాతదేనా కొత్త రకమా అన్నది ఇంకా నిర్దారణ కాలేదు. అనేక దేశాల్లో కనిపించిన తీరును చూస్తే వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని అర్ధం కరోనా మాదిరి వేగంగా విస్తరిస్తుందని కాదని కూడా అంటున్నారు.


మంకీపాక్స్‌ మరోరూపంలో వచ్చిన మసూచికం అని కొందరు చెబుతున్నారు.1999లో పరిశోధనా సంస్దల్లో ఉన్న మసూచి వైరన్‌సు నాశనం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించింది. ప్రస్తుతం ఆ సంస్ద వద్ద ఐదులక్షల డోసుల వాక్సిన్‌ ఉండగా ఇతర దేశాల్లో 60నుంచి 70 మిలియన్ల డోసులు ఉందని, అనేక నిల్వలు సక్రమంగా లేవని చెబుతున్నారు. అమెరికాలో 50 నుంచి వంద లక్షల మందికి వేసేందుకు సరిపడా ఉందని అంచనా.1980నాటికి వరియోలా వైరస్‌ 76 పరిశోధనా సంస్ధల్లో ఉంది. వైరస్‌ను నాశనం చేయాలన్న సూచన మేరకు తమ 74 కేంద్రాలు నాశనం చేయటం లేదా తమ వద్ద ఉన్న నిల్వలను ప్రపంచ ఆరోగ్య సంస్ధకు అంద చేశాయి. అమెరికాలోని అట్లాంటాలో సిడిసి, రష్యాలోని కోల్ట్‌సోవో వైరాలజీ సంస్ధలో మాత్రమే ఉంది. కొందరి అనుమానం ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్ధకు తెలియ కుండా కొన్ని చోట్ల దాచారని, జీవాయుధంగా వాడేందుకుగాను కొత్త వైరస్‌ సృష్టికోసమే ఇలా చేశారనే ఆరోపణలున్నాయి గాని, నిర్ధారణ కాలేదు.


. ప్రపంచంలో వైరస్‌తో జీవాయుధాలను తయారు చేసి యుద్దాలలో వినియోగించే అంశాల గురించి కొందరు నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, అనేక అంశాలను పేర్కొంటూ చైనా మిలిటరీ వైద్యుడు గ్జు డెహౌంగ్‌ 2015లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అదేమీ రహస్యం కాదు, అమెజాన్‌ ద్వారా ప్రపంచమంతా కొనుగోలు చేసింది. చైనాలో 2002,04 సంవత్సరాలలో బయటపడిన సార్స్‌ మహమ్మారి విదేశాల నుంచి అసహజ పద్దతిలో జన్యుమార్పిడి జరిగి వచ్చిన వైరస్‌ (ఇది కూడా కరోనా వైరస్‌ రకాలలో ఒకటి) అని చైనా పుస్తకంలో అభిప్రాయపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉగ్రవాదుల జీవ ఆయుధాల తయారీని కూడా కాదనలేమని సంపాదకుడు గ్జు పేర్కొన్నారు. ప్రపంచంలో జీవ ఆయుధాల ప్రయోగాలు, యుద్దంలో వాటి వినియోగం గురించి కూడా దానిలో చర్చించారు. 1941లోనే అమెరికా జీవ ఆయుధాల పరిశోధన ప్రారంభించిందని, తరువాత వాటి తయారీకి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, 1940-45 సంవత్సరాల మధ్య జపాన్‌ జీవ ఆయుధాలను ఉపయోగించి తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌, హునాన్‌ రాష్ట్రంలో ప్రయోగించి ప్లేగు వ్యాధి వ్యాపింప చేసిందని కూడా రచయిత దానిలో పేర్కొన్నారు.


బిల్‌ మరియు మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సారధి, మైక్రోసాఫ్ట్‌కు మారు పేరు అయిన బిల్‌ గేట్స్‌ చావులను కూడా సొమ్ము చేసుకొనేందుకు పూనుకున్నాడు. కరోనా వాక్సిన్‌ తయారీ వివరాలను భారత్‌కు మరొక దేశానికి ఇవ్వకూడదని ఆ పెద్దమనిషి చెప్పిన సంగతిని మరచిపోలేము. భద్రతా కారణాల రీత్యా ఇవ్వటం కుదరదన్నాడు. ఒకవేళ ఎక్కడైనా అలా ఇస్తే అది తమ సాయం మరియు నైపుణ్యం ఫలితమే అన్నాడు. 2015లో బిల్‌ గేట్స్‌ టెడ్‌ టాక్‌ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరునెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్దం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్‌ గేట్స్‌ మాటలను బట్టి గేట్స్‌ అప్పటికే మైక్రోచిప్‌ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్దిలేని మాటలని తమ ఫౌండేషన్‌ ద్వారా వాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు.నియంత్రణలతో సురక్షితమైన వాక్సిన్లను తయారు చేయాలి గనుక భారత్‌ వంటి అభివద్ది చెందుతున్న దేశాలకు తయారీ విధానం గురించి చెప్పకూడదని ఒక ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ చెప్పాడు.


ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆగేయ ఆసియా, మాజీ సోవియట్‌ రిపబ్లికులలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలోని మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్‌ అనే ప్రాంతంలో ఫోర్డ్‌ డెట్రిక్‌ ప్రయోగశాలలో ఎబోలా వంటి వ్యాధుల కారకాల గురించి పరిశోధనలు చేశారు. దాని మీద వార్తలు రావటంతో 2019లో మూసివేశారు. గత రెండు దశాబ్దాలలో ఇంటా బయటా ఉన్న అమెరికన్‌ ప్రయోగశాలలో అనేక వందల ఉదంతాలలో ప్రమాదాలు జరిగి ప్రమాదకరమైన వైరస్‌, బాక్టీరియాలు బయటపడినట్లు యుఎస్‌ఏ టుడే పేర్కొన్నది అమెరికాలో ఇలాంటి సమస్యలున్న కారణంగా ఇతర దేశాలలో అసలు విషయాలను దాచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు.


మానవ కల్యాణం కోసం ఒక ప్రమాదకర వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్‌ను రూపొందించేందుకు ప్రతి దేశానికీ అవకాశం, హక్కు ఉంది. అయితే ఆ ముసుగులో ఆయుధాలు తయారు చేసే దేశాలు మిగతా వాటి మీద బురద జల్లుతున్నాయి. చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్‌ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1155లో రాజు బార్బోసా ఇటలీలోని టోరోంటానాలోని మంచి నీటి బావుల్లో శవాలను పడవేసి కలుషితం కావించాడు. 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు స్పెయిన్‌ రాజులు ఇటలీలోని నేపుల్స్‌లో కుష్టువ్యాధి గ్రస్తుల రక్తం కలిపిన వైన్‌ సరఫరా అయ్యేట్టు చూశారు.1675లో విషంతో కూడిన బుల్లెట్లను వినియోగించరాదని జర్మనీ-ఫ్రెంచి సైన్యం అంగీకారానికి వచ్చాయి. 1710లో రష్యన్‌ చక్రవర్తి ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి స్వీడన్‌ పట్టణాలలో పడవేయించాడు. 1763లో అమెరికాలోని గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్‌ పాలకులు మసూచి వ్యాధిగ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేశారు.పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది. నెపోలియన్‌ చక్రవర్తి 1797లో ఇటలీలోని మంటువాలో మలేరియా వ్యాధి వ్యాపింప చేసేందుకు మైదానాలను వరదలతో నింపించాడు. అంతర్యుద్ధ సమయంలో1863లో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకొన్న తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్‌ సైనికులకు ఎల్లోఫీవర్‌, అమ్మోరు సోకిన రోగులు వాడిన వస్త్రాలను విక్రయించేట్టు చూశాయి.


1346లో జెనోయీస్‌-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్‌ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్‌ డే ముసిస్‌ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్‌(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ప్లేగు వ్యాధిగ్రస్తులు, బహుశా దానిని వ్యాపింప చేసే ఎలుకలను కూడా తమ నౌకల్లో తీసుకుపోయి ఉంటారని పేర్కొన్నాడు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే.


మొదటి ప్రపంచ యుద్ధంలో గుర్రాలకు సెంబరోగం (చీమిడి కారటం) వచ్చే ఆంత్రాక్స్‌ పౌడర్‌ను జర్మనీ, ఫ్రెంచి గూఢచారులు ప్రయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సైన్యాలు రష్యా, ఇతర అనేక దేశాలలో ప్లేగ్‌, అంతరాక్స్‌ వంటి వ్యాధులను వ్యాపింపచేసేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇప్పుడు జీవ ఆయుధాలు తయారు చేస్తున్నవారు కూడా ఆ ముసుగుతోనే చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. రసాయనిక, జీవ ఆయుధాలకు పెద్ద తేడా ఉండదు. ఉదాహరణకు వియత్నాంను ఆక్రమించుకొనేందుకు అమెరికా జరిపిన దాడుల సమయంలో కలుపు మొక్కలను నాశనం చేసే పేరుతో ఆరెంజ్‌ ఏజంట్‌ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వియత్నాంలో చల్లారు. యాభై సంవత్సరాలు గడిచిన తరువాత కూడా అనేక చోట్ల కలుపు మొక్కలే కాదు అసలు ఏ మొక్కా బతకని పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పుట్టుకతో పిల్లల్లో లోపాలు, కాన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులకు అమెరికా చిమ్మిన విషం కారణమని తేలింది.


మొదటి ప్రపంచ యుద్దం మీద విచారణ జరిపిన నానాజాతి సమితి కమిటీ జీవ ఆయుధాలను ఉపయోగించలేదు గానీ జర్మన్లు రసాయనిక ఆయుధాలు వాడినట్లు పేర్కొన్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ సామ్రాజ్యవాదులు ఆపరేషన్‌ చెర్రీ బ్లూసమ్స్‌ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్‌, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్‌, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్‌ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్‌ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా.


జపాన్‌ జీవ ఆయుధాల తయారీకి 150 భవనాలను, ఐదు శివారు ప్రాంతాలను ఉపయోగించి మూడువేల మంది శాస్త్రవేత్తలతో పని చేయించారు. వాటి తయారీ సమయంలో కనీసం పదివేల మంది ఖైదీలపై వాటిని ప్రయోగించగా మరణించినట్టు తేలింది. వారిలో మూడువేల మంది కొరియా, చైనా, సోవియట్‌, మంగోలియా, అమెరికన్‌, బ్రిటిష్‌, ఆస్ట్రేలియన్‌ యుద్ద ఖైదీలు ఉన్నట్టు బయట పడింది. జపాన్‌ జీవ ఆయుధాల విషయం బయటపడిన తరువాత అమెరికా పెద్ద ఎత్తున 1942నుంచి వాటిని రూపొందించేందుకు పూనుకుంది. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే అనేక కుట్ర సిద్దాంతాలను అమెరికన్లు ప్రచారంలో పెట్టారు.ఏమైనా గత చరిత్రను బట్టి మంకీపాక్సు గురించి అమెరికా, పైన పేర్కొన్న ఇతర దేశాల గురించి వెలువడిన ప్రతి సమాచారాన్ని అనుమానంతో చూడాల్సిందే. తమ దేశాల్లో ఎందుకు విస్తరిస్తున్నదో అవి ప్రపంచానికి చెప్పాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పశ్చిమ దేశాలకు దిగులు పుట్టిస్తున్న చైనా టెక్నాలజీ ప్రగతి !

01 Saturday Jan 2022

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

Another Cold war, China Technological Self-Reliance, Intel apologize, Made in China 2025, Technology Superpower


ఎం కోటేశ్వరరావు


మాతో మరో ప్రచ్చన్న యుద్దానికి తలపడితే తాట తీస్తాం అని అమెరికా పాలకులను చైనా హెచ్చరించింది. డిసెంబరు చివరివారంలో వాషింగ్టన్‌ నగరంలో అమెరికా మీడియా సంపాదకులు, సీనియర్‌ జర్నలిస్టులతో చైనా రాయబారి క్విన్‌ గాంగ్‌ మాట్లాడారు.” మూడు దశాబ్దాల నాడు అమెరికా ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. చైనా మాజీ సోవియట్‌ రిపబ్లిక్‌ కాదు, చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా నాటి సోవియట్‌ పార్టీ వంటిది కాదు. ఎవరైనా నిజంగా ప్రచ్చన్న యుద్ధం ప్రారంభించాలనుకుంటే చైనా ఓడిపోదని నేను చెప్పగలను. అమెరికాకు చైనా ఎంత అవసరమో చైనాకూ అమెరికా అంతే అవసరం ఉంది.” అని క్విన్‌ గాంగ్‌ చెప్పారు. ఎటువైపు నుంచి ప్రచ్చన్న యుద్దం వస్తుంది ? అసలు వస్తుందని కొందరు జనాలు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే అమెరికాలో కొందరు అలాంటి మన:ప్రవృత్తితో ఉన్నారు, సోవియట్‌ మాదిరి చైనా మీదకు పోవాలనుకుంటున్నారని విమర్శించారు.


ఈ దశాబ్ది చివరికి ఆర్ధిక అగ్రరాజ్యంగా అవతరించనున్న చైనా సాంకేతిక రంగంలో కూడా అదే స్ధాయికి చేరుకొనేందుకు అడుగులు వేస్తోంది. ప్రపంచంలో ఇ కామర్స్‌లో పెద్ద సంస్ధగా ఉన్న అలీబాబా గ్రూపు కంపెనీలను అణచివేస్తున్నదంటూ గగ్గోలు పెట్టిన వారు సాంకేతిక రంగంలో ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ తయారీకి అదే కంపెనీని ప్రోత్సహిస్తున్నదనే అంశాన్ని కావాలనే విస్మరిస్తున్నారు. ఇటియాన్‌ 710 పేరుతో తన మూడవ ప్రోసెసర్‌ను అక్టోబరు నెలలో విడుదల చేసింది. మూడు సంవత్సరాల్లోనే ఈ పని చేసింది. దానిని ఇతర దేశాలకు అమ్మేది లేదని చెప్పింది. చిప్‌ రూపొందించినా తయారీ సమస్య ఉంది. ఇతర చైనా కంపెనీలు టెన్‌సెంట్‌, షియామీ అదే పోటీలో ఉన్నాయి. ప్రోసెసర్‌ చిప్‌లు ఫోన్లు, కార్లు, వైద్య, గృహ పరికరాల్లో ఎంతో ప్రాధాన్యవహిస్తున్నాయి. కరోనా కారణంగా సరఫరాలు దెబ్బతింటే, చైనాను ఆర్ధికంగా నష్టపరిచేందుకు కొన్ని కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టించాయి.


సెమీకండక్టర్లు లేదా చిప్స్‌ కోసం ప్రస్తుతం అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, తన తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌పై చైనా ఎక్కువగా ఆధారపడుతోంది.ఈ రంగంలో చిప్స్‌ చైనా తనకు తానే సమకూర్చుకోగలిగితే అది మిగతా దేశాల్లో నవకల్పనలను, ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందని కొందరు వాపోతున్నారు.జాతీయ ఆర్ధిక భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానంలో ఇతరుల మీద ఆధారపడకూడదని, సాంకేతిక అగ్రరాజ్యంగా మారాలని 2021 మార్చినెలలో చైనా నేత షీ జింపింగ్‌ పిలుపునిచ్చారు. తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా తస్కరిస్తున్నదనే తప్పుడు ప్రచారాన్ని అమెరికా, ఐరోపా ధనిక దేశాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా తన చిప్స్‌ను తానే ప్రత్యేకంగా రూపొందించుకుంటే, తాము రూపొందించినవి చైనా కార్లు, సెల్‌ఫోన్లకు పనికి రాకపోతే, మిగతా దేశాలు కూడా అదే బాట పడితే తాము ప్రతి దేశానికి విడివిడి ప్రమాణాలతో ఎలా తయారు చేయగలం, అందుకు అవసరమైన పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని, అభివృద్ధి మందగిస్తుందని అమెరికా, ఐరోపా బడా సంస్ధలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచం విడిపోకుండా చూడాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అమెరికా-చైనాలను కోరారు. ఒకచేత్తో చప్పట్లు కష్టం కదా !


ప్రస్తుతం చైనాలో తయారవుతున్న సెల్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల వంటి వాటికి ఏటా 300 బి. డాలర్ల మేర చిప్స్‌ చైనా ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోంది, చమురు తరువాత స్ధానం వీటిదే. 2016లో డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్యయుద్దంలో భాగంగా చైనాలోని హువెయి టెక్నాలజీస్‌ సంస్ధకు అవసరమైన చిప్స్‌, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుకుంది. ఆ కంపెనీ పరికరాలతో ఇతర దేశాల భద్రతకు ముప్పు అనే ప్రచారాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేసి, చిప్స్‌ రూపకల్పనకు పూనుకుంది. దీంతో దిగ్గజాలైన క్వాలకమ్‌(అమెరికా) శాంసంగ్‌(దక్షిణ కొరియా, ఆర్మ్‌(బ్రిటన్‌) కంపెనీలకు సవాలు ఎదురైంది. సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన పరికరాలు, వస్తువులు, ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానంలో చైనా వెనుకబడి ఉంది. దాన్ని అలుసుగా తీసుకొని ఆ రంగంలో ముందున్న దేశాలు బెదిరిస్తున్నాయి. తన సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే ఫౌండరీల్లో చైనా హువెయి కంపెనీ చిప్స్‌ తయారు చేయరాదని, ఒకవేళ చేసినా ఐదవ తరం ఫోన్లకు అసలు చేయకూడదని అమెరికా ఆంక్షలు విధించింది. ఐరోపా యూనియన్‌ కూడా తక్కువేమీ తినలేదు. జర్మనీలో రోబోలను తయారు చేసే కుకా కంపెనీని చైనా కొనుగోలు చేస్తే తమ పెట్టుడుల గురించి సమీక్షించాల్సి వస్తుందని బెదిరించింది.చిప్స్‌ తయారీకి అవసరమైన ఆధునిక యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఎటూ తేల్చకుండా ఉంది.


్ట మానవహక్కులు, టిబెట్‌, తైవాన్‌, హాంకాంగ్‌ అంశాలను ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తూ రాజకీయ దాడులు, మిలిటరీ కవ్వింపులకు పశ్చిమ దేశాలు పూనుకున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా సెమికండక్టర్లను తయారు చేస్తున్న దిగ్గజ కంపెనీ ఇంటెల్‌ తాజాగా చైనాకు క్షమాపణ చెప్పింది.చైనాలో ముస్లింలు అధికంగా ఉండే షిజాంగ్‌ రాష్ట్రంలో వారిని అణచివేస్తున్నారను తప్పుడు ప్రచారం సాగించటమే కాదు, ఆంక్షలను కూడా అమెరికా, ఇతర దేశాలు అమలు చేస్తున్నాయి. తైవాన్ను ప్రత్యేకదేశంగా పిలిచినందుకు హాలీవుడ్‌ నటుడు, అమెరికా రెజ్లర్‌ జాన్‌ సెనా చైనాకు క్షమాపణలు చెప్పారు.తన సినిమాలకు చైనాలో టిక్కెట్లు అమ్ముకోవటానికి తప్ప వేరే కారణం లేదు. జెపి మోర్గాన్‌ బాంకు సిఇఓ జామీ డైమన్‌ చైనా కమ్యూనిస్టు పార్టీ మీద జోక్‌ వేసి తరువాత రెండుసార్లు క్షమాపణలు చెప్పాడు.జర్నలిజం నైతికవిలువలు, మానవత్వం గురించి చైనాకు వ్యతిరేకంగా నోరుపారవేసుకొన్న సిఎన్‌ఎన్‌ తరువాత క్షమాపణలు చెప్పింది. షిజాంగ్‌ రాష్ట్రంలో తయారయ్యే నూలును తాము వినియోగించబోమని ప్రకటించిన నైక్‌ కంపెనీ తరువాత చెంపలు వేసుకుంది.ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవన్నీ చైనా మార్కెట్‌, లాభాల కోసం వేసే నక్కజిత్లులు తప్ప వేరు కాదు.వాణిజ్య సంస్ధలు రాజకీయాల్లో వేలు పెడితే పర్యవసానాలకూ సిద్దపడాలి. లేకుంటే పరువు పోగొట్టుకోవాలి.


తమ సరఫరాదారులు చైనా షిజాంగ్‌ రాష్ట్రం నుంచి ఉత్పత్తయ్యేవస్తువులు లేకుండా చూడాలని ఇంటెల్‌ కోరింది. ఆ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలను అణచివేస్తున్నారని, బలవంతంగా పని చేయిస్తున్నారంటూ ఆ వస్తువులను కొనుగోలు చేయకూడదంటూ అమెరికా ఆంక్షలు విధించింది. దానికి అనుగుణంగానే తాము అలాంటి లేఖ రాసినట్లు ఇంటెల్‌ తెలిపింది. ఇది తమ దేశాన్ని అవమానించటమే అంటూ ఇంటెల్‌ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ చైనా సామాజిక మాధ్యమంలో నెటిజన్లు స్పందించటం, ఇంటెల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తప్పుకుంటున్నట్లు చైనా పాప్‌ గాయకుడు వాంగ్‌ జుంకాయి ప్రకటించటం వంటి చర్యలతో కంపెనీ దిగివచ్చింది. షిజాంగ్‌ రాష్ట్రంలో దొరికే సిలికాను చిప్స్‌ తయారీకి వినియోగిస్తారు. ఆసియాలో ఉన్న ఏకైక ఇంటెల్‌ ఫ్యాక్టరీ చైనాలోని దలియాన్‌లో, బీజింగ్‌లో పరిశోధనా కేంద్రం ఉంది. ఇతర కంపెనీల చిప్స్‌ అందుబాటులో ఉండటంతో ఇంటెల్‌ దిగివచ్చింది. 2020లో ఆ కంపెనీ ఆదాయంలో నాలుగో వంతు చైనా నుంచే ఉంది. వేరే మార్కెట్‌ను వెతుక్కోవటం చాలా కష్టం, ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావటం, వీటికి తోడు స్వంతంగా చిప్స్‌ తయారీకి పూనుకోవటం కూడా ఇంటెల్‌ను ప్రభావితం చేసింది. మానవహక్కుల కోసం నిలబడే అమెరికన్‌ కంపెనీలు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్‌ మీడియా అధికారి జెన్‌ సాకీ అన్నారు.


రెండవ ప్రపంచయుద్దానికి ముందు తమతో పోటీ పడుతున్న జపాన్‌ సామ్రాజ్యవాదాన్ని అడ్డుకొనే క్రమంలో పశ్చిమ దేశాలు జపాన్‌కు అవసరమైన సహజవనరులు, ముడి సరకులను అందకుండా చూశాయి. ఇప్పుడు చైనా ఆర్ధికంగా పోటీపడుతున్న నేపధ్యంలో అడ్డుకొనేందుకు చిప్స్‌, సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసేందుకు పశ్చిమ దేశాలు పూనుకోవటం గత పరిణామాలను గుర్తుకు తెస్తున్నాయి. రెండవ ప్రపంచయుద్దంలో ఓడిపోయిన జపాన్‌కు మిలిటరీని లేకుండా ఆంక్షలు విధించారు. మిలిటరీ ఖర్చును జపాన్‌ తన పరిశ్రమలకు అవసరమైన పరిశోధన-అభివృద్ధి, సబ్సిడీలకు మళ్లించి పశ్చిమ దేశాలకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌, ఆటోమొబైల్‌ రంగంలో సవాలు విసిరి వాటికి మారుపేరుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైనాను కూడా జపాన్‌తో సహా పశ్చిమ దేశాలన్నీ అదే దిశగా ఒకవైపుకు నెడుతున్నాయి. చైనా దీన్ని ముందుగానే అంచనావేసి వాటి మీద ఆధారపడకుండా ఉండేందుకు తగిన కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు పోతున్నది. అమెరికా 2016లో వాణిజ్య యుద్దం ప్రారంభించినప్పటికీ అది ఆచరణలో సాంకేతిక యుద్దంగా పరిణమించిందని చెప్పవచ్చు. మేడిన్‌ చైనా 2025 కార్యక్రమంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి.


చైనాను దెబ్బతీయాలని చూస్తున్న వారికి జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదు, అంతేకాదు బెంగపట్టుకుందని చెప్పవచ్చు.” ప్రపంచ అశాంతికి దోహదం చేస్తున్న చైనా సాంకేతిక స్వీయ ఆధార బాట ” అనే శీర్షికతో తాజాగా ఏపి వార్తా సంస్ధ ఒక కధనాన్ని వెలువరించింది. ఒక వైపు మార్కెట్లను మరింతగా తెరిచి తమ వస్తువులను కొనుగోలు చేయాలని అమెరికా నాలుడేండ్లుగా ప్రత్యక్షంగా సాగిస్తున్న వాణిజ్యయుద్దం, చైనాకు వ్యతిరేకంగా చేస్తున్న సమీకరణలు, విధిస్తున్న ఆంక్షల నేపధ్యంలో ఎవరి మీదా ఆధారపడకుండా సాంకేతిక రంగంలో స్వీయ ఆధార దిశగా చైనా అనేక చర్యలు తీసుకుంది. అది సాధిస్తున్న పురోగతిని దిగ్జజదేశాలు ఊహించలేదు. తమ కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తామనట్లుగా ఉన్నాయి. ఇప్పుడు మొదటికే మోసం వస్తుందనే బెంగ పట్టుకుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సైన్సు పరిశోధనలు : అవని చుట్టూ ఇతర జనం – ఆవు చుట్టూ మనం !

22 Wednesday Dec 2021

Posted by raomk in CHINA, Current Affairs, Education, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

(R&D) expenditure -India, pseudo-scientific claims, research and development (R&D) expenditure


ఎం కోటేశ్వరరావు


ఉన్నత స్ధాయిలో ప్రామాణికంగా పేర్కొన్న పరిశోధకుల పేర్లతో లండన్‌లోని శాస్త్ర సమాచార సంస్ద, క్లారివేట్‌ రూపొందించిన 6,602 మంది వివరాలను పరిశీలించినపుడు అమెరికా ప్రధమ స్థానంలో, తరువాత చైనా ఉంది. డెబ్బయి దేశాలకు చెందిన వారితో 2021నవంబరు 16న ఈ వివరాలను ప్రకటించారు. తొలి ఐదు దేశాలకు చెందిన వారు 71.4శాతం మంది కాగా, మొదటి పది దేశాలను తీసుకుంటే 82.9శాతం ఉండటాన్ని బట్టి కేంద్రీకరణను అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలో 2,622, చైనాలో 935 మంది ఉన్నారు. గత పది సంవత్సరాలలో తమ పరిశోధనలతో గణనీయ ప్రదర్శన, ప్రచురించిన పత్రాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. వీరిలో 3,774 మంది ఒక నిర్ణీత రంగంలో, 2,828 మంది ఒకటి కంటే ఎక్కువ రంగాలలో పరిశోధనలు చేస్తున్నవారు ఉన్నారు. మూడవ స్ధానంలో ఉన్న బ్రిటన్‌కు చెందిన వారు గత మూడు సంవత్సరాల్లో తగ్గి 492 లేదా 7.5శాతంగా ఉన్నారు. జర్మనీని అధిగమించి ఆస్ట్రేలియన్లు 332 మంది నాలుగో స్ధానంలో, 331 మందితో జర్మనీ ఐదవ, నెదర్లాండ్స్‌(207, కెనడా(196), ఫ్రాన్స్‌ 146) స్పెయిన్‌(109), స్విడ్జర్లాండ్‌(102)తో తొలి పదిస్దానాల్లో ఉన్నాయి.

గతంతో పోల్చితే అమెరికన్లు 2014లో 55శాతం, 2018నాటికి 43.3, 2021కి 39.7శాతానికి తగ్గారు. చైనీయులు 2018లో 7.9శాతం కాగా 2021కి 14.2కు పెరిగారు.చైనాలో 2014లో కేవలం 122 మంది మాత్రమే ఉన్నారు. గడచిన నాలుగు సంవత్సరాలలో చైనీయుల పెరుగుదల, అమెరికన్ల తగ్గుదల మరింత స్పష్టంగా కనిపిస్తోందని సీనియర్‌ విశ్లేషకుడు డేవిడ్‌ పెండెల్‌బరీ అన్నాడు. బ్రిటన్‌లో పరిశోధన తగ్గుతున్నది. హాంకాంగ్‌లో ఒక ఏడాది కాలంలోనే పరిశోధకుల సంఖ్య 40 నుంచి 79కి పెరిగింది.తొలిసారిగా బంగ్లాదేశ్‌, కువైట్‌, మారిషస్‌, మొరాకో, జార్జియా ఈ జాబితాకు ఎక్కాయి. క్లారివేట్‌ సంస్ధ దేశాల జనాభా సంఖ్య-శాస్త్రవేత్తలతో పోల్చింది.నూట ముఫ్పై ఎనిమిది కోట్ల మంది ఉన్న భారత్‌లో 22 మంది,22.1 కోట్ల మంది ఉన్న పాకిస్ధాన్‌ నుంచి ఐదుగురు, 27.3 కోట్ల మంది ఉన్న ఇండోనేషియా నుంచి ఒక్కరు ఉన్నట్లు పేర్కొన్నది. ఇండోనేషియా నుంచి ఉన్న ఒక్కరు కూడా మహిళ కావటం విశేషం.ఆమె బయోఫ్యూయల్‌ మీద పరిశోధనలు చేస్తున్నారు. సంస్ధల వారీగా చూస్తే 1,300లో శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు.హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం 214 మందితో అగ్రస్ధానంలో ఉంటే చైనా సైన్స్‌ అకాడమీ 194 మందితో రెండవ స్ధానంలో, స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం 122 మందితో తృతీయ స్ధానంలో ఉంది. యాభై అగ్రశ్రేణి సంస్ధలలో 28 అమెరికాలో, ఐదు బ్రిటన్‌, నాలుగేసి చైనా,ఆస్ట్రేలియాలో సింగపూర్‌, సౌదీ అరేబియాలో రెండేసి, హాంకాంగ్‌, జర్మనీ, కెనడా, నెదర్లాండ్స్‌, బెల్జియంలలో ఒక్కొక్కటి ఉన్నాయి.


పరిశోధనారంగంలో వివిధ దేశాలు పోటీ పడుతున్నతీరును చూశాము.ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెది మరొకదారి అన్నట్లుగా మనం ఉన్నాం.నరేంద్రమోడీ సర్కార్‌ గత ఏడున్నర సంవత్సరాల్లో ఈ రంగానికి అందించిన ప్రోత్సాహంతో మనంపైన పేర్కొన్న పరిశోధకుల్లో 22 మందైనా ఉన్నారని భక్తులు భజనకు దిగవచ్చు.పరిశోధనలు, నవకల్పనల పాత్ర ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. దేశీయ ఆవుల అద్వితీయత,వాటి పాలు, పేడ, మూత్రంలో ఉన్న రోగనిరోధకత లేదా కాన్సర్‌తో సహా రకరకాల వ్యాధులను నయం చేసే గుణాల గురించి పరిశోధించాలని మన కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇది అశాస్త్రీయం, నిధులను దుర్వినియోగం చేయటం తప్ప మరొకటి కాదని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఐదు వందల మంది శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా వెనక్కు తగ్గలేదు. విశ్వాసాల ప్రాతిపదికన ముందుకు తెస్తున్న కుహనా సైన్సును సక్రమమైనదిగా చెల్లుబాటు చేసే యత్నమని పేర్కొన్నారు. హౌమియోపతి, అల్లోపతి, నేచురోపతి వంటి వాటి సరసన కౌపతిని చేర్చేందుకు పూనుకున్నారు. ఆవు మూత్రం, పాలు, పేడలతో చీడపీడల నివారణ మందులు, షాంపూలు, తలనూనెలు, నేలను శుభ్రం చేసే ద్రవాల వంటి వాటి తయారీకి పరిశోధనలు జరపాలని కేంద్రం నిధులు కేటాయించింది. పుక్కిటి పురాణాల్లో రాసిన ఊహాజనితమైన వాటిని రుజువు చేసేందుకు డబ్బు దుర్వినియోగం తప్ప మరొకటి కాదు.దీనికి ”సూత్రా-పిక్‌ అని పేరు పెట్టారు ఆవు మూత్రంతో తన కాన్సర్‌ మాయమైందని బిజెపి ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


కేంద్రం వెనక్కు తగ్గలేదు సరికదా ఆవు శాస్త్ర పధకాలను వేగంగా అమలు జరిపి 2021 ఆగస్టు పదిహేనున ప్రధాని ప్రసంగానికి ముందే పురోగతిని చూపాలని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ఏప్రిల్‌ నెలలో ఆదేశించారు. అనుమతులు, నిధుల మంజూరులో ఎందుకు జాప్యం చేశారంటూ అధికారుల మీద మండిపడ్డారు. ఆలస్యానికి సాకులు చెబితే కుదరదని హెచ్చరించారు.ప్రధాని నరేంద్రమోడీకి దేశీయ ఆవులు ఎంతో ముఖ్యమని కూడా చెప్పారు. ఢిల్లీ ఐఐటి రూపొందించిన ఈ పధకంలో 2016 నుంచి ఎలాంటి పురోగతి లేదన్నారు.2017లో తొలుత పంచగవ్య సుగుణాలను శాస్త్రీయంగా నిరూపించాలని ఆదేశించారు. తరువాత 2020లో దాన్ని మరింత విస్తరించి కొత్త పధకంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో పెట్రోలు లేకుండా పైకీ కిందికీ, ఎందరెక్కినా ఒకరికి జాగా ఉండే పురాణాల్లోని విమానాలు,వినాయకుడు పాలు తాగాడు వంటి నమ్మకాలు, ఇతర ఊహలన్నింటినీ 2024 ఎన్నికల నాటికి ఫాస్ట్‌ట్రాక్‌ ప్రాజక్టులుగా చేపట్టి నిర్ధారించమని నిధులు కేటాయించినా ఆశ్చర్యం లేదు.


పిండికొద్దీ రొట్టె అన్నారు పెద్దలు, కుండలో కూడు కుండలోనే ఉండాలి బిడ్డడు దుడ్డుగా ఉండాలి అంటే కుదరదని కూడా అదే పెద్దలు అన్నారు. వీటిని ఎవరు ఎలా వర్తింప చేస్తున్నారు ? చైనాతో పోటీ పడాలని, దేవుతలు కరుణిస్తే అధిగమించాలని మనం కోరుకోవటం తప్పుకాదు. స్టాటిస్టా డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2021లో పరిశోధన-అభివృద్ధికి గాను చైనా పెట్టుబడి 621.5బిలియన్‌ డాలర్లు కాగా అమెరికా 598.7, జపాన్‌ 182.36, జర్మనీ 127.25, భారత్‌ 93.48 బి.డాలర్లు. ఈ మొత్తం నుంచే ఆవు పాలు, పేడ, మూత్ర పరిశోధనలు జరుగుతున్నాయి. మన జనాలకు తెలివితేటలేమైనా తక్కువా, సోమరిపోతులు మరొకటి కాదే. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మాదిరి అదృష్టం కోసం ఎదురు చూసే బాపతు కూడా గణనీయంగా ఉన్నందున కాళ్లు, చేతులూ చూసే, జోశ్యాలు చెప్పే రకరకాల మోసగాండ్లు తామర తంపరగా పెరిగిపోతున్నారు. మన అప్పును నరేంద్రమోడీ 55 లక్షల కోట్ల నుంచి 130లక్షల కోట్లకు పెంచటం పట్ల చూపిన శ్రద్ద పరిశోధనకు కేటాయింపుల్లో లేదు. ఈ అంశంలో అంతకు ముందున్న వాజ్‌పాయి, మన్మోహన్‌ సింగ్‌ సర్కార్లు కూడా ఇంతకు మించి పొడిచిందేమీ లేదు.

గేట్‌వేహౌస్‌ డాట్‌ఇన్‌ సమాచారం ప్రకారం 2000 సంవత్సరంలో జిడిపిలో మన పరిశోధన ఖర్చు 0.7శాతం ఉంటే 2012 నాటికి 0.8శాతం, ఇదే కాలంలో చైనా 0.9 నుంచి 1.8కి పెరిగింది. ప్రపంచబాంకు సమాచారం ప్రకారం 2018లో చైనా 2.14శాతం, మన దేశం 0.65శాతం ఖర్చు చేసింది. రూపాయల్లో పెరుగుదల చూడండి అని ఎవరైనా అంటే చేసేదేమీ లేదు. వాటి విలువ సంగతేమిటని అడగాల్సి వస్తుంది. దేశభక్తి దేశభక్తి అని అరిస్తే,వేషాలు వేస్తే, ఇరుగు పొరుగుదేశాల గురించి కుట్ర సిద్దాంతాలతో జనాలను భయపెడితే, ఆ సాకుతో అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తే, గంజాయి దమ్ముకొట్టి ప్రగల్భాలు పలికినట్లు వారిని అధిగమిస్తాం వీరిని దాటిపోతాం, మా గత ఘనం చూడండి అంటే సరిపోతుందా ? కృత్రిమ మేథలో కొన్ని రంగాల్లో ఇప్పటికే అమెరికాను అధిగమించి, మొత్తంగా సవాలు విసురుతున్న చైనాతో పోల్చుకుంటే మనమెక్కడ ? నేచర్‌ ఇండెక్సు డాట్‌కామ్‌ ప్రకారం 2015-19 సంవత్సరాలలో అమెరికన్లు 7,020,బ్రిటీషర్లు 2,073, జర్మన్లు 1,756, చైనీయులు1,446 ఆర్టికల్స్‌ను ప్రచురిస్తే మొదటి 25లో 20వ స్దానంలో ఉన్న మనవారికి 192 మాత్రమే. మనం గొప్పగా చెప్పుకొనే ఆంగ్ల భాషా జ్ఞానం, సంస్కృత పరిజ్ఞానం ఏమైనట్లు ? ఆ రెండింటిలోనూ మనకంటే వెనుకబడిన చైనా శాస్త్ర పరిశోధనలో ఎందుకు ముందున్నట్లు ? ఇతర దేశాల జనం ప్రపంచాన్ని చుట్టి వస్తుంటే మనం ఆవుచుట్టూ తిరుగుతున్నాం ?తీవ్రంగా ఆలోచించాలా వద్దా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కనిపించిన కేసు ఒక్కటే, పరీక్షలు కోటీ 80లక్షలు – కరోనా కట్టడిలో చైనా రహస్యం అదే !

11 Friday Jun 2021

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Science

≈ 1 Comment

Tags

china communists action to fight against covid-19, China Covid-19, COVID- 19 pandemic, Guangzhou tests 18m people, Narendra Modi Failures, nucleic acid test


ఎం కోటేశ్వరరావు


ఏ రోజు, ఏ నెలలో చైనా ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవటం ఎంతో కష్టంగా మారిందంటూ ఒక విశ్లేషకుడు కొద్ది రోజుల క్రితం ఒక వ్యాఖ్యానం రాశాడు. ఇది నిజమే. అది అతని వ్యక్తిగతం కాదు, చైనా వారు చెప్పే అంశాలపై నమ్మకం కోల్పోయిన వారందరి తీవ్ర మానసిక సమస్య ఇది. వారికి పూర్తిగా తెలియదు, ఇతరులు చెబితే వినరు. చైనా వారు చెప్పేవన్నీ అతిశయోక్తులే, అంత అభివృద్ది, పురోగమనం లేదూ, పాడూ లేదు, అన్నీ నాశిరకరం అని కొట్టి పారవేసిన వారు ఇప్పుడు నమ్మలేని అంశాలతో బిత్తరపోతున్నారు. అది నేల నుంచి నింగి విజయాల వరకు దూసుకుపోతున్నది. త్వరలో ఆర్ధికంగా అమెరికాను అధిగమించనుంది. సాంకేతిక రంగంలో కొన్ని అంశాలలో అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలదే పైచేయిగా ఉన్నప్పటికీ వాటికి ధీటుగా ముందుకు వస్తోంది.


అనేక మంది చైనా గురించి సరైన సమాచారం తెలుసుకోవటం కష్టం అంటూనే రకరకాల చెత్తకథనాలు రాయటం, చూపటం, వినిపించటం చూస్తున్నాము. ఎంతో స్వేచ్చ, దేన్ని గురించైనా మాట్లాడుకోవచ్చు, తెలుసుకోవచ్చు, బయట పెట్టవచ్చు అడ్డూ అదుపు ఉండదు అని చెప్పుకొనే అమెరికా వంటి దేశాలలో కూడా అక్కడి పాలకుల కనుసన్నలలో వారికి పనికిరానిదాన్ని, వారి ప్రయోజనాలకు పనికి వచ్చే సమాచారాన్నే బయటికి వదులుతారు తప్ప ప్రతిదాన్నీ బహిరంగపరచరు. చైనా దానికి మినహాయింపు కాదు. చైనా విలేకర్ల పేరుతో వ్యవహరించే వారిలో అత్యధికులు తైవాన్‌, హాంకాంగ్‌, దక్షిణకొరియా, జపాన్‌లో ఉండి వార్తలు రాస్తారు. వారికి సిఐఏ ఏజంట్లు, చైనా వ్యతిరేకులు అందించే అంశాలే ఆధారం. చైనా ప్రధాన భూభాగంలో ఉండేవారు కూడా ఎక్కువ మంది అసత్య, అర్ధసత్య వార్తలనే వండి వడ్డిస్తారు. వీరిలో చాలా మంది జర్నలిస్టుల ముసుగులో విదేశీ గూఢచార ఏజంట్లు ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. రెండు పనులూ చేస్తారు. మరి చైనా జర్నలిస్టులు ఇతర దేశాల్లో ఎలా ఉంటారు ? వ్యతిరేకులు బాంబులు వేస్తుంటే చైనా వారు రసగుల్లాలు విసురుతూ ఉంటారా ? అయితే ఎవరూ నిజాన్ని అంగీకరించరు.

విదేశీ జర్నలిస్టులు ప్రశ్నించినపుడు సహజంగానే జనాలు ఏ దేశంలో అయినా సందేహిస్తారు. దానికి చైనా మినహాయింపు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా పార్టీ కార్యకర్తలను విదేశీ జర్నలిస్టులు కలిసినపుడు వారు చెప్పదలచుకున్న అంశాలను వక్రీకరించకుండా ఉండేందుకు రాతపూర్వకంగా అందచేస్తారు. ప్రభుత్వ వైఖరి గురించి జనాలు స్వేచ్చగా అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం, వేదికలు ఉండవు అని చాలా మంది చెబుతారు. కానీ చైనా పేరుతో విశ్లేషణలు రాసే అనేక మంది అక్కడి సామాజిక మాధ్యమాల్లో వెల్లడయ్యే వైఖరుల ఆధారంగా, వాటిని ఉటంకిస్తూ, భిన్నఅభిప్రాయాలను తీసుకొని కాళిదాసు కవిత్వానికి తమపైత్యం జోడించి అన్నట్లుగా రాస్తారు.


కరోనా వైరస్‌ గురించి చేసిన తప్పుడు ప్రచారాల్లో వెయ్యోవంతు ఆ వైరస్‌ నివారణ, అంతానికి చైనా సర్కార్‌ తీసుకుంటున్న చర్యల గురించి రాసినా ప్రపంచానికి ప్రయోజనం ( అది చైనాకు కాదు ) ఉండి ఉండేది. అక్కడ అనుసరిస్తున్న పద్దతులను ఎందుకు అమలు చేయరంటూ ఆయా దేశాల జనాలు పాలకుల మీద వత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉండేది. వరల్డో మీటర్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఇది రాసిన సమయానికి ప్రపంచలో మొత్తం కరోనా కేసులు 17కోట్ల 56లక్షల 79వేల 912. మరణించిన వారు 37లక్షల 90వేల 392 మంది. మన దేశానికి సంబంధించి మొత్తం కేసులు రెండు కోట్ల 92లక్షల 74,823, మరణాలు 3,63,097. కేసుల సంఖ్యలో అమెరికా తరువాత రెండవ స్ధానంలో ఉంది, మరణాల్లో అమెరికా,బ్రెజిల్‌ తరువాత మూడవ స్ధానం. మొత్తం 222 దేశాలు, ప్రాంతాలలో చైనా 98వ స్ధానంలో ఉంది. అక్కడ నమోదైన కేసులు 91,359, మరణాలు 4636.చైనాలో కరోనా కేసులు, మరణాలు అంత తక్కువ ఎందుకున్నాయని ఇప్పటికీ సందేహించే వారున్నారు. వారిని ఎవరూ ఒప్పించలేరు,మెప్పించలేరు.ఇంకా మరికొన్ని దేశాల్లో కూడా కేసులు, మరణాలు తక్కువే ఉన్నాయని వారికి తెలిస్తే తట్టుకోలేరేమో !

తాజాగా ప్రపంచ మీడియాలో వచ్చిన ఒక వార్త మరోసారి చైనా కరోనా కట్టడి గురించి ఆసక్తిరేపింది. దేశీయంగా ఒక వాక్సిన్‌ తయారు చేసినందుకు మన ప్రధాని నరేంద్రమోడీ తన భుజాలను తానే చరుచుకొని అభినందించుకున్నారు. పొగడ్తలకు అలవాటు పడ్డ ప్రాణం కదా, పోనీయండి అని అనేక మంది సమర్ధిస్తున్నారు. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ఝౌ అనే పట్టణం, పరిసరాల జనాభా కోటీ 86లక్షలు. ఒక మహిళ (75) ఒక హౌటల్‌కు వెళ్లినపుడు కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు మేనెల 21 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు నగరంలో కోటీ 80లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 115 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి, 106 మందికి నిర్ధారణ అయింది. ఈ కేసులన్నింటిలో భారత్‌లో బయటపడిన డెల్టా రకం కనిపించింది. ఇది వేగంగా వ్యాపించే లక్షణం కలిగినదని చైనా అధికారులు చెప్పారు. ఒక గంటలోపే ఫలితాన్ని వెల్లడించే న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్టులు చేశారు. రక్తం,కండరాలు,మూత్రంలో ఏవైనా వైరస్‌, బాక్టీరియాలు ఉంటే వెంటనే పసిగట్టే ఆధునిక పరిజ్ఞానంతో ఆ పరీక్షను చేస్తారు. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించిన పట్టణంగా రికార్డులకెక్కింది. గతంలో చైనాలోనే మరికొన్ని పట్టణాల్లో కూడా ఈ పరీక్షలు పెద్ద సంఖ్యలో నిర్వహించినా సంఖ్యరీత్యా ఇదే అత్యధికం. వాన్‌ఫు బయోటెక్నాలజీ అభివృద్ది చేసిన విధానం ప్రకారం బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ దేశాలలో బయటపడిన కరోనా వైరస్‌ లక్షణాలను ఈ పరీక్ష వెల్లడిస్తుంది. గ్వాంగఝౌ పట్టణం, పరిసరాలలో 5,500 బయో, ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలు, ఈ రంగంలోనే వెయ్యి ఆధునిక పరిజ్ఞాన సంస్ధలు ఉన్నాయి. కింగ్‌మెడ్‌ డయాగస్టిక్స్‌ గ్రూప్‌ రోజుకు మూడున్నరలక్షల పరీక్షలు చేయగల సామర్ధ్యం కలిగినది ఇక్కడ ఉంది, ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. తమకు కరోనా వచ్చిన విషయాన్ని దాచినందుకు లేదా తెలియచేయనందుకు, పరీక్షకు నిరాకరించినందుకు కొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒక హౌటల్‌లో ఉన్న వ్యక్తి పరీక్షకు నిరాకరించి పోలీసులతో వాగ్వాదానికి దిగటమేగాకుండా భోజనానికి ఉపయోగించే ఫోర్క్‌తో పోలీసు మీద దాడి చేశాడు.

చైనాలో కరోనా కట్టడికి ఇప్పటివరకు మూడు రకాల వ్యూహాలను అనుసరించారు. వైరస్‌ బయటపడగానే దానికి చికిత్స ఏమిటో తెలియలేదు గనుక తొలి దశలో ప్రజారోగ్య నిరోధం మరియు అదుపు పద్దతులను అమలు జరిపారు. రెండవ దశలో వాక్సిన్లను ఉపయోగించారు. ఇప్పుడు మూడవ దశలో నిరోధం మరియు అదుపు పద్దతులను కూడా పాటిస్తున్నట్లు చైనా సిడిసి అధిపతిగా గతంలో పని చేసిన జెంగ్‌ గ్వాంగ్‌ చెప్పారు.ఈ చర్యలతో పాటు వాటిని అమలు జరిపే క్రమంలో చైనీయుల సామాజిక అలవాట్లను, అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నారు. గ్వాంగ్‌ఝౌ నగరంలో కేసులు 115 మాత్రమే బయటపడినప్పటికీ కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ప్రకటించి జన సంచారాన్ని పరిమితం చేశారు.చైనాలో అనేక సంస్ధలు వాక్సిన్ల తయారీకి పరిశోధనలు, పరీక్షలు చేస్తున్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఏడు రకాలకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 80 కోట్ల మందికి తొలి, రెండవ డోసు వాక్సిన్లు వేసినట్లు చైనా ప్రకటించింది.


గత ఏడాది ఊహాన్‌ నగరంలో కరోనాను కట్టడి చేయటం అనేక అనుభవాలను ముందుకు తెచ్చింది. తరువాత కాలంలో చెదురుమదురుగా వివిధ నగరాల్లో చాలా పరిమితంగా అయినా కేసులు బయటపడ్డాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లుగా వైరస్‌ విస్తరించకుండా చూసేందుకు నూక్లియక్‌ యాసిడ్‌ పరీక్షలు చేసి జల్లెడ పట్టాలని నిర్ణయించారు. దీనికి కూడా ఊహాన్‌ అనుభమేతోడ్పడింది. అక్కడ ప్రారంభంలో యాభైవేల పరీక్షలు చేసి సమాచారాన్ని విశ్లేషించారు. తరువాత గతేడాది మేనెల ప్రారంభంలో అక్కడి కోటి మంది జనాభాకు పది రోజుల్లో ఈ పరీక్షలు చేసి దాగున్న వైరస్‌ను వెలికి తీసే యత్నం చేశారు.లక్షణాలు బయటకు కనిపించకుండా వైరస్‌ ఉన్న మూడు వందల కేసులు వెల్లడయ్యాయి.తరువాత బీజింగ్‌లోని కోటి ఇరవైలక్షల మందికి పరీక్షలు చేశారు, 174కేసులు బయటపడ్డాయి.


చైనాలో ప్రయాణాలు చేసే వారు గణనీయ సంఖ్యలో ఉంటారు. ప్రతివారినీ ప్రతి చోటా పరీక్షించటం సాధ్యంకాదు, అవసరమైన సిబ్బంది లభ్యత కూడా పెద్ద సమస్యే. అందువలన చైనా ప్రయాణ ఆరోగ్య సూచిక (కోడ్‌)లను రూపొందించాలని ఐటి కంపెనీలను కోరారు. ఆమేరకు తయారు చేసి ప్రతి ఒక్కరికీ ఒక సూచికను కేటాయించారు. వారి సెల్‌ఫోన్లలో యాప్‌ ఏర్పాటు చేశారు. దానిలో మూడు రంగుల సూచికలను పొందుపరిచారు.దానిలో సదరు వ్యక్తి చిరునామా వంటి ప్రాధమిక సమాచారంతో పాటు అనుమతించిన ఆరోగ్య వివరాలు, సందర్శించిన ఆసుపత్రులు, వాడిన మందుల వంటి వాటిని పొందుపరిచారు.అంతే కాదు, వారు పర్యటించిన ప్రాంతాలు, హౌటల్స్‌, మాల్స్‌, రైలు, విమానం, బస్‌, స్వంత వాహనం వంటి వివరాలు కూడా ఉంటాయి. ఎక్కడైనా తనిఖీ సిబ్బంది ఫోన్లలో వారి కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. ఉదాహరణకు ఆకుపచ్చ సూచిక ఉన్నవారి వివరాలను చూస్తే వారు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు లేవని, కరోనా ప్రాంతాల్లో సంచరించలేదని అర్ధం. పసుపు పచ్చ కోడ్‌ వస్తే వారు శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొన్నారని, కరోనా ముప్పు ప్రాంతాలను సందర్శించటం, వైరస్‌ సోకిన వారితో కలిసినట్లు అర్ధం. ఎరుపు సూచిక ఉంటే ప్రమాదం ఉందని అర్ధం. వారికి లేదా కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకటం, సోకినవారిని కలిసినందున విడిగా ఉంచాల్సిన అవసరం ఉందని అర్ధం. కరోనాను మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించినందున పసుపు, ఎరుపు సూచికలు ఉన్న వారికి ప్రయాణించేందుకు అవసరమైన టిక్కెట్లను తిరస్కరించే, ప్రయాణ అనుమతి నిరాకరించే అధికారం యంత్రాంగానికి ఉంటుంది. ఆకుపచ్చ సూచిక ఉన్నవారు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది.

కరోనా నివారణకు వాక్సిన్‌ రూపొందించే వరకు ఫలానా ఔషధంతో నివారించవచ్చనే హామీ ఎక్కడా లేదు. అనేక రకాలతో ప్రయోగాలు చేశారు. . రెమిడెసివర్‌ కరోనా చికిత్సకు పనికిరాదని గతేడాది ఏప్రిల్‌ 15 నుంచే చైనాలో దాన్ని పక్కన పెట్టారు. అయినా మన నిపుణులు దాని గురించి జనంలో పెద్ద ఎత్తున ఆశలు కల్పించేందుకు కారకులయ్యారు. దాంతో మన జనాన్ని ఎలా పిండుకున్నారో చూశాము. ఫార్మా మాఫియాల పీకనులిమే కొత్త దేవుడు మోడీ అంటూ ప్రచారం చేసినప్పటికీ ఇది జరిగింది. తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్ధ పరిశోధనలో కూడా అదే తేలింది. చైనాలో మన ఆయుర్వేదం మాదిరే స్ధానిక వైద్య పద్దతిలో వాడుతున్న ఔషధాలను కూడా చికిత్సలో ఉపశమనానికి వినియోగించారు. ఆ రంగ నిపుణులను కూడా అల్లోపతి ఆసుపత్రుల్లో నియమించారు, పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ వైద్యపద్దతి, ఔషధం వైరస్‌ను అంతం చేస్తుందనే భ్రమలు కల్పించలేదు. కనుకనే అక్కడ బాబా రామ్‌దేవ్‌ వంటి వారు వాటితో సొమ్ము చేసుకోవటం గానీ, ఆనందయ్య పచ్చడి వంటివి రంగంలోకి రావటం గానీ జరగలేదు.


ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న కారణంగానే చైనాలో వైరస్‌ అదుపులో ఉంది. అయితే ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువేమీ కాదు. అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది కనుక దేశ సంపదలను జనం కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడలేదు.లాభ నష్టాల లెక్కలు వేసుకోలేదు. ముందు ప్రాణాలను రక్షించటమే ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. మన వంటి దేశాలలో పెట్టుబడిదారులు దేని మీద ఎంత ఖర్చు చేస్తే ఎంత లాభం వస్తుందనే లెక్కలు ముందే వేసుకుంటారు. కొత్తదాని మీద ఖర్చు పెడితే ఒకవేళ ప్రయోజనం లేకపోతే మొత్తం దండగే అని భావిస్తే అసలు ముందుకు రారు. పాలకులు కూడా వారినే అనుసరిస్తారు గనుక అంబానీ, అదానీ అండ్‌కోకు ఆత్మనిర్భర అనో మరొక పేరుతోనే రాయితీలు ఇచ్చేందుకు చూపే శ్రద్ద జనం మీద చూపరు. ఆ కారణంగానే కేవలం రెండు వందల కోట్ల ఖర్చుతో జనానికి అవసరమైన ఆక్సిజన్‌ అందించే యంత్రాల ఏర్పాటు టెండర్లను ఎనిమిది నెలల పాటు కేంద్రం ఖరారు చేయలేదు. తీరా ముప్పు ముంచుకు వచ్చిన తరువాత, సుప్రీం కోర్టు మందలింపులతో చేయటాన్ని చూశాము. వాక్సిన్లు కూడా అంతే కదా ! అందుకోసం కేటాయించినట్లు చెప్పిన 35వేల కోట్లకు లెక్కలు చెబుతారా లేదా అని నిలదీసిన తరువాత విధిలేక మేమే వాక్సిన్లు వేయిస్తాం అనే ప్రకటన వెలువడింది. కేసులు తక్కువే అయినప్పటికీ చైనాలో ఖర్చు తక్కువేమీ కాలేదు. దాని కంటే ఆర్ధిక కార్యకలాపాలు నిలిచిపోవటం పెద్ద దెబ్బ అని వెంటనే గ్రహించింది. అందుకే ప్రపంచంలో పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాల్లో ఎక్కడా లేనిóంగా వైరస్‌ కనిపించిన నాలుగు నెలల్లోనే దాన్ని అదుపులో ఉంచి ఆర్ధిక కార్యకలాపాలన్నింటినీ పునరుద్దరించింది. అది ఖర్చు కంటే లబ్దే ఎక్కువ చేకూర్చిందని రుజువైంది. దాన్నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామా ? మన భుజాలను మనమే చరుచుకుంటామా ?
అనువుగాని చోట అధికులమన రాదు,
కొంచెమైన నదియు కొదువగాదు,
కొండ అద్దమందు కొంచెమై ఉండదా,
విశ్వదాభిరామ వినుర వేమా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదివేల కోట్ల కోసం కక్కుర్తి – స్వయంగా పరువు తీసుకున్న ప్రధాని మోడీ !

09 Wednesday Jun 2021

Posted by raomk in BJP, Current Affairs, Health, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Science

≈ Leave a comment

Tags

#Modi’s vaccine policy, BJP, Modi’s Vaccine U-Turn, Narendra Modi Failures, Supreme Court of India

ఎం కోటేశ్వరరావు

కరోనా బాధితుల పట్ల రాష్ట్రాలకు బాధ్యత లేదా, అసలు వైద్యం, ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోని అంశం కదా, అన్నీ కేంద్రమే చేయాలంటే సాధ్యమేనా అంటూ జనం చెవుల తుప్పు వదిలేలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిజెపి పెద్దలు తమ టూల్‌కిట్‌లోంచి ఒక ప్రచార ఆయుధాన్ని ప్రయోగించారు. జనానికి రాజ్యాంగం గురించి బోధ చేయటంతో పాటు ప్రతిపక్షాల మీద దాడికి కత్తులు, కటార్లు, మొరటు బాంబులు, విషపూరిత ఆయుధాలను సిద్దం చేసుకున్న భక్తులందరినీ విశ్వగురువు, దేవుడు లేదా దేవదూత నరేంద్రమోడీ దారుణంగా దెబ్బతీశారు. పద్దెనిమిది సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వాక్సిన్‌ వేయించే బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని నాటకీయ పద్దతుల్లో స్వయంగా ప్రకటించారు. దాంతో ఆయుధాలన్నింటినీ ఎక్కడికక్కడ పడవేసి పాలాభిషేకాలు, పాదాభిషేకాలు చేయటంతో పాటు భజన ప్రారంభించారు. భక్తుల హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో ఇవి లేదా వీటికి అనుబంధ అంశాలు మాత్రమే ఉంటాయి. పరిమిత ప్రయోజనం కోసమే వారిని తయారు చేస్తారు. ఇది విశ్వజనీన సత్యం.

గతంలో ప్రకటించిన వాక్సిన్‌, ధరల విధానం కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అయితే నరేంద్రమోడీ ప్రకటించిన తాజా విధానానికి ముందు అలాంటి సమావేశం జరిగినట్లుగానీ, కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగానీ ఎలాంటి సమాచారం లేదు. రాజ్యాంగం ప్రకారం విధానపరమైన నిర్ణయాలు ఫెడరల్‌ వ్యవస్ధలో మంత్రివర్గం తీసుకోవాలి. అధ్యక్ష తరహా వ్యవస్ధలో అధ్యక్షుడు నిర్ణయం తీసుకొని తరువాత మంత్రివర్గఆమోదానికి పెడతారు. ఇక్కడ నరేంద్రమోడీ గారు చేసిందేమిటి ? పెద్ద నోట్ల రద్దు అంటే రహస్యం కనుక ఆకస్మికంగా చేశారని అనుకుందాం. వాక్సిన్‌ విధానం అలాంటిది కాదు. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు చీమకుట్టలేదు. సుప్రీం కోర్టు స్వయంగా పూనుకున్న తరువాత కూడా స్పర్శలేనట్లుగానే వ్యవహరించారు. తీరా గట్టిగా నిలదీసి కేటాయించిన 35వేల కోట్లు ఏం చేశారో చెప్పాలంటూ గడువు పెట్టటంతో మరోదారి లేకపోయింది. మోడీ స్వయంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నిర్ణయాన్ని ప్రకటించేశారు. మంత్రులను రబ్బరు స్టాంపులుగా మార్చివేశారు. తొలుత ప్రకటించిన దానికీ దానికీ మంత్రి వర్గ ఆమోదం లేదు, దీనికీ అవసరం ఏముంది అంటారా ?

తామేం చేసినా ప్రశ్నించేవారు లేరు, ఉండకూడదు, ప్రతిపక్షాలను లెక్కచేయాల్సిన అవసరం లేదు అనే యావలో పడిన బిజెపి పెద్దలకు ఈ మధ్య వాస్తవ పరిస్ధితులు అర్ధం కావటం లేదు. కరోనా రెండవ దశ నిర్లక్ష్యంతో తలెత్తిన పరిస్ధితి మీద వివిధ రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఉంటే వాక్సిన్‌ విధానంలో ఇంత షాక్‌ తగిలి ఉండేది కాదు. నిజానికిది కరోనా కంటే పెద్ద దెబ్బ. సుప్రీం కోర్టు వాక్సిన్‌ విధానం గురించి ఇలా నిలదీస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. గతంలో చేసిన నిర్ణయాలకే విధానం అనే ముద్రవేసి కోర్టుకు సమర్పించి ఉంటే రాజ్యాంగబద్దమా కాదా అన్నది చూస్తాం తప్ప విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని న్యాయమూర్తులు చెప్పి ఉండేవారేమో ! కానీ ఇది ఎవరో వేసిన కేసు కాదు, స్వయంగా చేపట్టిన అంశం. యాభై ఆరు అంగుళాల గుండె పిరికిబారినట్లుంది. లేకపోతే కోట్లాది భక్తులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రుల పరువు తీస్తూ ఇలాంటి ప్రకటన ఎందుకు చేస్తారు అన్న అనుమానాలు కలగటం సహజం కాదంటారా ?

మరి ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించాలా వద్దా ? స్వాగతించాల్సిందే. కేంద్రమే వాక్సిన్‌ బాధ్యత చేపట్టాలని, మూడు ధరల విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేసిన వారు తప్పకుండా ఆ పని చేస్తారు, చేశారు.అయితే స్వాగతించటానికి – భజన చేయటానికి తేడా ఉంది. బిజెపి ముఖ్యమంత్రులకు భజన చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. అలా చేస్తే జనం దృష్టిలో మరింత పలుచన అవుతారు. నలభైఅయిదు సంవత్సరాల లోపు వారికి వాక్సిన్‌ గురించిన నిర్ణయం రాష్ట్రాలకే వదలి వేయాలని డిమాండ్‌ చేశారని చెబుతున్న బిజెపి ముఖ్యమంత్రులు, ఆ వాదనలతో కొండెక్కి కూర్చున్నవారు ఏ నోటితో స్వాగతిస్తారు, ఏ ముఖాలతో దిగివస్తారు ? కేంద్ర వాక్సిన్‌ విధానం గురించి విమర్శలు చేసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుతూ నాలుగుసార్లు ఏలుబడిలో ఉన్న మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వారం రోజుల క్రితం ఏం మాట్లాడారు ? ” ఎంతో చక్కటి, పక్కాగా ఉన్న కేంద్ర వాక్సిన్‌ విధానాన్ని రాష్ట్రాల వత్తిడి మేరకే కేంద్రం మార్చింది. ముఖ్యమంత్రులందరూ ఒక దగ్గరకు వచ్చి కేంద్రీకృత విధానం కావాలని ప్రధానిని కోరితే ఆయన కూడా పరిశీలిస్తారు.రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నపుడు కేంద్రం కూడా ఒకే రకమైన విధానాన్ని తీసుకురాలేదు, అందుకే రాష్ట్రాలకు వదిలిపెట్టింది ” అన్నారు. మా వాక్సిన్‌ మేం కొనుక్కుంటాం అని బిజెపి ముఖ్యమంత్రులు చెప్పారు. కాదు కేంద్రమే మొత్తంగా ఇవ్వాలి లేదా సేకరించి ఒకే ధరకు రాష్ట్రాలకు ఇవ్వాలి తప్ప ద్వంద్వ ధరలేమిటని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు చెప్పారు. ఎద్దు-దున్నతో అరక కడితే ఏమౌతుంది. ఎండ ముదిరే కొద్దీ ఎద్దు నీడవైపు లాగుతుంది-దున్న ఎండవైపు మొగ్గుతుంది. అలాగే భిన్న వైఖరుల మధ్య ఏకాభిప్రాయం ఎలా సాధ్యం ? అప్పుడు కేంద్రం ఏమి చేయాలి, ధర చెల్లించగలిగిన రాష్ట్రాలు కొనుక్కోవచ్చు, మాకంత శక్తిలేదు అని అన్నవారికి మేమే ఇస్తామని చెప్పాలి. ఆయుష్మాన్‌ భారత్‌ కేంద్ర ప్రభుత్వ పధకం దాన్ని అమలు జరపాలా లేదా అన్నది రాష్ట్రాలకే వదలి వేసినట్లు వాక్సిన్‌ విషయంలో ఎందుకు చేయలేకపోయింది. దురుద్ధేశ్యాన్ని కడుపులో పెట్టుకొని కొన్ని రాష్ట్రాల పేరుతో ఆడిన నాటకం తప్ప మరొకటి కాదు. మరి ఇప్పుడు ఆ పక్కా పధకం ఏమైంది ? రాష్ట్రాలతో సంప్రదించకుండానే ప్రధాని ఏకపక్షంగా ఎలా ప్రకటించారు. మేమే కొనుక్కుంటాం అన్న రాష్ట్రాల మనోభావాలను గాయపరచి, ముఖ్యమంత్రులను అవమానించినట్లు కాదా ?

ఐదూండ్లు కాదు కదా సూదిమొన మోపినంత కూడా ఇచ్చేది లేదన్న రారాజు మాదిరి గత కొన్ని వారాలుగా భీష్మించిన విశ్వగురువు ఆకస్మికంగా అందరికీ మేమే వేయిస్తాం అని ఎందుకు చెప్పారు? ఇది వైఫల్యాన్ని అంగీకరించటమే, పోనీ ఆ చెప్పిందైనా సక్రమంగా ఉందా ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా లేదూ ! పోయిన పరువును తిరిగి తెచ్చుకొనే యత్నమన్నది ఏకాభిప్రాయం. అంటే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదనుకోవాలా ? రారాజు దిగి వచ్చారు సరే, మంచిదే , మళ్లా 25శాతం ప్రయివేటు ఆసుపత్రులద్వారా వేయించుకోవచ్చనే పితలాటకం ఏమిటి ? ఫార్మా, కార్పొరేట్‌ మాఫియాకు లాభాలు చేకూర్చే ఎత్తుగడ అనే విమర్శలను ఎందుకు భరిస్తున్నారు. వారిచ్చే నిధుల ముందు విమర్శలు ఒక లెక్కా ?

ఉచితంగా ఇస్తామనే ప్రకటన హుందాగా చేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు, ఎవరూ వేలెత్తి చూపే వారు కాదు. ప్రధాని స్వయంగా రాష్ట్రాల మీద నెపం మోపారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్ప ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలేవీ వాక్సిన్‌ సేకరణ తమకు వదిలేయాలని అడగలేదు. చివరకు బిజెపి భాగస్వామిగా ఉన్న బీహార్‌ నుంచి కూడా అలాంటి డిమాండ్‌ లేదు. సుప్రీం కోర్టు ప్రశ్నలతో ఊపిరి సలుపుకోలేక తప్ప చిత్తశుద్ది లేదు.గతంలో వాక్సిన్‌ వేసి నందుకు వంద రూపాయల సేవా రుసుం ప్రయివేటు ఆసుపత్రులు తీసుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు దాన్ని 150కి పెంచారు. ఇంతలోనే ఇంత పెంపుదల ఎందుకు ? అదనపు ఖర్చులు ఆసుపత్రులకు ఏమి వచ్చాయి ?

నరేంద్రమోడీ దిగిరావటం వాక్సిన్‌కంటే ముందే ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌ కుంభమేళాను మధ్యలో ఆపివేయాలనటం అదే కదా ? అంతకు ముందు అనేక మంది కరోనా నిబంధనలను ఉల్లంఘించి లక్షలాది మందిని సామూహిక స్నానాలకు అనుమతించటం ప్రమాదకరం అని హెచ్చరిస్తే పెడచెవిన పెట్టారు. మొరటుగా ఆ రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు జనాన్ని మునగమని చెప్పారు. తీరా కొందరు అఖారాలు మరణించటం, కరోనా సోకటం, మీడియాలో వార్తలు రావటంతో విధిలేక ప్రధాని మోడీ జోక్యం చేసుకొని నిలిపివేయించారు.

కరోనా మొదటి తరంగం సమయంలో జనానికి కొన్ని ఉపశమన చర్యలు చేపట్టారు, రెండోసారి వాటి ఊసే లేదు. లాక్‌డౌన్‌ విధించాలా వద్దా అనే నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదలివేసి పర్యవసానాలకు బాధ్యత తమదేమీ లేదన్నట్లు వ్యవహించారు. అందుకే రెండో సారి దీపాలు వెలిగించటం, గ్లాసులు,కంచాలు మోగించటం వంటి పిలుపులకు దూరంగా ఉన్నారు. కానీ వాక్సిన్‌ భారాన్ని రాష్ట్రాల మీద మోపాలన్న ఎత్తుగడ పారకపోగా వికటించింది.మోడీ ఉంటే చాలు ఏదైనా సాధ్యమే అని అతిశయోక్తులు పలికి మునగ చెట్టు ఎక్కించిన వారికి కరోనా రెండవ దశ తీవ్రతను గుర్తించటంలో వైఫల్యాన్ని చూసి దిమ్మతిరిగినోట మాట రావటం లేదు.

ఆత్మనిర్భర పాకేజ్‌ కింద మేడిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా రెండు వ్యాక్సిన్లు తయారు చేసి దేశ ప్రజలకు ఇస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ఇది వాస్తవమా ? కోవాగ్జిన్‌ ఒక్కటే మన దేశంలో తయారు చేసిందని జనానికందరికీ తెలిసిందే. అనేక మంది అది స్వదేశీ అని మరొక వ్యాక్సిన్‌ వేసుకోము అని ఆలస్యం చేసిన వారు కూడా ఉన్నారు. కోవీషీల్డ్‌ విదేశీ ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా తయారీ, కంపెనీ అనుమతితో ఇక్కడ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. అయినా రెండు వాక్సిన్లు ఇక్కడే రూపొందించినట్లు చెప్పటం భావ్యమేనా ? జనాన్ని మరీ అంత అమాయకులుగా భావిస్తున్నారా ?

వాక్సిన్ల విముఖతను విడనాడాలని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. సంతోషం. కానీ కరోనా వచ్చినప్పటి నుంచి కాషాయ దళాలు చెబుతున్నదేమిటి ? ఆవు పేడ పూసుకొని మూత్రం తాగితే కరోనా అంటదనే వీడియోలను ప్రపంచమంతా చూసింది. తాజాగా బిజెపి ఎంపీ, అలనాటి హీరోయిన్‌ హేమమాలిని కరోనా నుంచి రక్షణకు హౌమాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందే అనేక మంది చేశారు. స్ఫూర్తికోసం ప్రధాని దీపాలు వెలిగించమని కోరితే దాంతో కరోనాను నాశనం చేయవచ్చని ప్రచారం చేసిన ప్రబుద్దులు ఉన్నదేశం మనది, గో కరోనా గో కరోనా అంటూ భజనలు చేయించిన పెద్దలున్నారు. గంగలో మునిగితే కరోనా అంటదు అని ప్రబోధించిన వారి గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలన్నింటీని ప్రోత్సహించటంలో అన్ని మతాలూ ఒకటిగానే ఉన్నాయి, ప్రోత్సహించాయి.జనాభా రీత్యా చూస్తే వాక్సిన్‌కు విముఖత చూపితే ఎక్కువగా నష్టపోయేది నూటికి 80శాతంగా ఉన్న మతానికి చెందిన వారే. మరి హిందూత్వ శక్తులు ఇంతగా మూఢత్వాన్ని ఎందుకు ఎక్కించినట్లు ? ఇప్పుడు ఒక్క మాటతో దాన్ని పోగొట్టుకోమంటే అంత తేలికగా మత్తు దిగుతుందా ?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలు దిమ్మతిరిగేట్లు చేస్తే , ఉత్తర ప్రదేశ్‌లో జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు సామాన్యమైనవి కాదు. ప్రధాని వారణాసి జిల్లాలోనే బిజెపి బొక్కబోర్లా పడింది. రాష్ట్రాల నుంచి డిమాండ్‌ వచ్చిన కారణంగానే వికేంద్రీకరణ విధానాన్ని ప్రకటించామని, ఇప్పుడు కొన్ని అనేక రాష్ట్రాలు తిరిగి కేంద్రీకరణ విధానాన్ని డిమాండ్‌ చేస్తున్నాయని మోడీ చెప్పారు.మీడియాలో కొన్ని తరగతులు కూడా ఈ డిమాండ్‌ గురించి ప్రచారం చేశాయి. ఇతర దేశాలు పని ప్రారంభించక ముందే మన దేశంలో శాస్త్రవేత్తలు, తయారీదార్లకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చిందన్నారు. ఇది అతిశయోక్తి, అర్ద సత్యం తప్ప ప్రధాని నోటి నుంచి రావాల్సింది కాదు.

గత కొద్ది వారాలుగా చర్చలను చూసినపుడు కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి పెద్దలు సమాధానాలు చెప్పాల్సి ఉంది. దేశంలో వాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్దాలు లేక సీరం సంస్ద ఉత్పత్తి నిలిపివేసిన విషయం తెలుసు, భారత్‌బయోటెక్‌ ఉత్పత్తి సామర్ధ్యం తక్కువనీ తెలిసినా రాష్ట్రాలు వాక్సిన్లు కొనుగోలు చేయవచ్చని, అవసరమైతే దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర పెద్దలు ఎలా భావించారు.ఇతర వాక్సిన్ల తయారీకి అవసరమైన పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా కేంద్రం తాత్సారం చేసింది. విదేశీ కంపెనీలు వాక్సిన్ల సరఫరాకు పెట్టిన షరతులకు అంగీకరించటమా లేదా అన్నది నిర్ణయించాల్సింది కేంద్రం అయినపుడు దిగుమతులు ఎలా చేసుకుంటాయని భావించారు. కొన్ని రాష్ట్రాల టెండర్లకు ఎలాంటి స్పందన లేదని తెలిసి కూడా కేంద్రం ఏమీ తెలియనట్లు వ్యవహరించిందా లేదా ? ఒకే వాక్సిన్‌కు వివిధ ధరలకు అనుమతించిన విధాన హేతుబద్దతు ఏమిటి ? మిగతా దేశాల మాదిరి తగినంత ముందుగా వాక్సిన్ల కోసం కేంద్రం ఎందుకు ఆర్డర్లు పెట్టలేదు. ప్రభుత్వ రంగంలోని వాక్సిన్‌ తయారీ సంస్ధల గురించి ముందుగానే ఎందుకు కేంద్రం పరిశీలన జరపలేదు. కరోనా మహమ్మారి ప్రారంభమై ఏడాది గడచిన తరువాత దాన్ని జాతీయ సమస్యగా చూడాలా, రాష్ట్రాల పరిధిలో ఆరోగ్య సమస్యగా పరిగణించాలా అన్న చర్చ కేంద్రం వైపు నుంచి ఎందుకు జరపలేదు. ఆరోగ్యం గురించి రాజ్యాంగంలో ఉంది తప్ప మహమ్మారులను ప్రత్యేక అంశంగా పరిగణించాలని పేర్కొనలేదా ? జాతీయ విపత్తుల యాజమాన్య చట్టానికి అర్దం ఏమిటి ?

గతేడాది కరోనా పేరుతో 21లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజి ప్రకటించామని ఊరూ వాడా ప్రచారాన్ని ఎలా అదరగొట్టారో చూశాము. నరేంద్రమోడీ గడ్డం ఎందుకు పెంచుతున్నారో తెలియనట్లుగానే ఆ పాకేజి ఏమిటో దాని వలన సామాన్య జనానికి కలిగిన ప్రయోజనం ఏమిటో ఎవరూ చెప్పలేని స్ధితి. అన్ని లక్షల కోట్లు ప్రకటించినపుడు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు పెట్టి వాక్సిన్లు వేయించలేని దుస్ధితిలో మోడీ సర్కార్‌ ఉందా ? వాక్సిన్లకోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. పద్దెనెమిదేండ్లు పైబడిన అందరికీ వేస్తే అదనంగా మరో పదివేల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. ఈ మాత్రం భరించలేని స్ధితిలో కేంద్రం ఉందా ? లేదూ పిల్లలకూ వేస్తే మరొక పదివేల కోట్లు అవుతుంది, మరొక అంచనా ప్రకారం 80వేల కోట్లతో అందరికీ వేయించ వచ్చు, 138 కోట్ల మందికి ఆ మాత్రం ఖర్చు చేయలేరా ? ఐదులక్షల కోట్ల జిడిపి లక్ష్యమైనా, మరొకటైనా దేనికోసం ? అంబానీ, అదానీలకు కట్టబెట్టటానికా ? ఎందుకీ కక్కుర్తి పనులు ? ఇంతచిన్న తర్కాన్ని కూడా సలహాదారులు,మంత్రులు ఆలోచించే స్ధితిలో లేరా లేక చెబితే వినే పరిస్ధితి లేదా ? మోడీ సర్కార్‌ను తెరవెనుక నుంచి నడుపుతున్న సంఘపరివార్‌ మేథావులకు సైతం ఇది ఎందుకు తట్టలేదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d