• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Uncategorized

నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !

05 Friday Dec 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, IMF about India, India economy, India GDP, India growth rates, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

పరీక్షల్లో మార్కులు తగ్గితే విద్యార్దుల గ్రేడ్‌ (నాణ్యత) తగ్గుతుంది.సమాధానాల పేరుతో పేజీల కొద్దీ రాసినా అసలు విషయాలు లేకపోతే మార్కులు పడవు. పదకొండు సంవత్సరాల పాలనలో నరేంద్రమోడీ సర్కార్‌ అందచేస్తున్న జిడిపి వృద్ధి అంకెల నాణ్యతను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) గతంలో ప్రశ్నించింది. ఎలాంటి స్పందన మార్పులు లేకపోవటంతో కొద్ది రోజుల క్రితం సి గ్రేడ్‌కు తగ్గించింది.దీని గురించి గురువారంనాడు (2025 డిసెంబరు 4) లోక్‌సభలో సమర్ధించుకుంటూ వచ్చే ఏడాదినుంచి 2022-23 సంవత్సరాన్ని నూతన ప్రాతిపదికగా తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఎన్‌సిపి సభ్యురాలు సుప్రియా సూలే అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గణాంకవిధానం గురించి ఐఎంఎఫ్‌ చెప్పింది తప్ప అభివృద్ధి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అనేక అంకెలకు బి గ్రేడ్‌ ఇచ్చిందని నిర్మలమ్మ అన్నారు.మన అంకెల నాణ్యత నాలుగు గ్రేడ్లలో దిగువ నుంచి రెండవదిగా ఉంది.దీనికి అభివృద్ధి అంచనాలకు సంబంధం లేదు, వాటికి చెబుతున్న భాష్యం మీదనే పేచీ. గణింపుకు మీరు తీసుకున్న ప్రాతిపదిక, పద్దతి తప్పు, పాతబడిన సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని భాష్యాలను చెబుతున్నారంటూ 2025 ఆర్టికల్‌ నాలుగు నివేదికలో తలంటింది. మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానం గురించి ఇంటా బయటా గత పదేండ్ల నుంచి అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఎలాంటి చలనం లేదు. ప్రస్తుతం 2011-12 సంవత్సర అంకెలను ప్రాతిపదికగా తీసుకొని గణాంకాలను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి 2022-23 ప్రాతిపదికగా కొత్త సూచీలను రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వ గణాంక మరియు కార్యక్రమాల అమలు శాఖ ప్రకటించింది. అయినప్పటికీ ఐఎంఎఫ్‌ మనదేశ సమాచార నాణ్యత గ్రేడ్‌ను తగ్గించింది. అంతర్జాతీయంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొత్త ప్రాతిపదికన నూతన సూచీలను తయారు చేస్తారు. ఐఎంఎఫ్‌ చర్యతో మరోసారి కేంద్రం చెబుతున్న అభివృద్ధి అంకెల విశ్వసనీయత గురించి మీడియా, సామాన్య జనంలో చర్చలేకపోయినా ఆర్థికవేత్తలలో మొదలైంది.

మన దేశ జిడిపి గురించి ప్రభుత్వం చెప్పే అంకెలకు ఐఎంఎఫ్‌ అంచనాలకు తేడా ఉంది. అది విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిజమైన జిడిపి వృద్ధి రేటు 6.5శాతం కాగా 2025-26 తొలి మూడు మాసాల్లో 7.8శాతం ఉంది. అయితే ఐఎంఎఫ్‌ మాత్రం 2025-26లో 6.6శాతం ఉంటుందని, మరుసటి ఏడాది 6.2శాతమని అంచనా వేసింది.మన ప్రభుత్వం అనుసరిస్తున్న గణాంక, విశ్లేషణ పద్దతులపై ఐఎంఎఫ్‌ చాలా సంవత్సరాల నుంచి విబేధిస్తున్నప్పటికీ సంస్థ నిబంధనల ప్రకారం సభ్యదేశాలు ఇచ్చిన అధికారిక సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకొని తన విశ్లేషణలను అందిస్తున్నది. వాటి గురించి తన భిన్నాభిప్రాయాన్ని చెప్పవచ్చు తప్ప సమాచారాన్ని తిరస్కరించేందుకు వీల్లేదు. కొద్ది సంవత్సరాలుగా వెల్లడిస్తున్న అభిప్రాయాలను జనం దృష్టికి తేలేదు. ఇప్పుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.గత పదేండ్లలో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, కరోనా తరువాత చెప్పే అంకెలకు, వాస్తవానికి తేడా ఉంటోందని ఐఎంఎఫ్‌ భావించింది. కొద్ది సంవత్సరాలుగా అంతర్గతంగా తన విబేధాలను వెల్లడిస్తూనే ఉంది, చివరికి 2025లో సమాచారం నాణ్యత గురించి గ్రేడ్‌ను తగ్గించింది. ఇప్పుడెందుకు ఆపని చేసింది. ముందే చెప్పుకున్నట్లుగా వచ్చే ఏడాది 2022-23 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని కొత్త సిరీస్‌ను విడుదల చేయనుంది గనుక ఇప్పటి వరకు గమనించిన లోపాలను సరిదిద్దాలనే ఉద్దేశ్యంతోనే ఈ పనిచేసిందని చెబుతున్నారు.ప్రస్తుతం ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చే సమాచారాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నది తప్ప సంఘటిత, అసంఘటితరంగ సమాచారాన్ని నిర్దిష్టంగా సేకరించటం లేదనే విమర్శ ఉంది. ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకు టోకు ధరలను ప్రామాణికంగా తీసుకుంటున్నది, దీనికి బదులు ఉత్పత్తి ధరలు, రంగాల వారీ ధరలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. మొత్తం మీద ఆర్థిక రంగం గురించి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు కదా, నాణ్యత లేని సమాచారం ఆధారంగా తీసుకోవటాన్ని ఐఎంఎఫ్‌ తప్పుపట్టిందని మాత్రమే కొందరు సూత్రీకరిస్తున్నారు. రుణాలు, విదేశీమారకద్రవ్యం, ఖర్చు గురించి సరైన లెక్కలే చెబుతున్నారు కదా అంటున్నారు. ముఖం ఎలా ఉందో ఎవరికైనా తెలుస్తుంది,దాన్ని వేరేగా చెబితే వెంటనే బండారం బయటపడుతుంది. శరీరం అంతర్భాగంలో ఉన్నవాటిని ఎవరో ఒక నిపుణుడు చెబితేనే కదా మనకు తెలిసేది, ఆ చెప్పటంలోనే నిపుణుల మధ్య ఏకాభిప్రాయం, నాణ్యత లేదన్నది సమస్య. కేవలం చెయ్యి చూసి అంతాబాగానే ఉందంటే కుదురుతుందా ? నాణ్యత లేని వస్తువును కొన్నపుడు అది ఎంతకాలం మన్నుతుందో తెలియదు, నాణ్యత లేని సమాచారం ప్రాతిపదికగా ఏ రంగమైనా దీర్ఘకాలిక వ్యూహాలను ఎలా రూపొందించుకుంటుంది ?

జిడిపి వృద్ధి రేటు ఎక్కువగా ఉందని చూపుతున్నపుడు దానికి తగినట్లుగా కార్పొరేట్‌ ఫలితాలు కనిపించటం లేదన్నది కొందరి ప్రశ్న. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జడిపి వృద్ధి రేటు 7.4శాతం ఉంటుందని, పబ్లిక్‌ ఫైనాన్స్‌ మరియు విధాన జాతీయ సంస్థ(ఎన్‌ఐపిఎఫ్‌పి) చెప్పింది.మూడీస్‌ రేటింగ్‌ సంస్థ 2026, 2027 సంవత్సరాలలో ప్రపంచ వృద్ధి రేటు 2.5 -2.6శాతం మధ్య, భారత వృద్ధి 6.4 మరియు 6.5, చైనా 4.5శాతం ఉంటుందని పేర్కొన్నది. ఇవి చూడటానికి బాగానే ఉన్నాయి.పశ్చిమ దేశాల సూత్రం ప్రకారం జిడిపి వృద్ధి రేటు కంటే కార్పొరేట్‌ లాభాల రేటు మూడు, నాలుగుశాతం ఎక్కువగా ఉంటుంది.మనదేశంలో కూడా దశాబ్దాల పాటు అలాగే ఉంది. కానీ సెప్టెంబరుతో ముగిసిన మూడు మాసాల్లో నిఫ్టీ 50 సూచికలో పెరుగుదల కేవలం ఏడుశాతమే. మొత్తం లాభాలు 13శాతం కాగా పన్నులు పోను నిఖర లాభం తొమ్మిదిశాతమే ఉంది. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించకపోవచ్చుగానీ దాన్ని విస్మరించలేము.నిప్టీ మైక్రోకాప్‌ 250 అమ్మకాల వృద్ధి 12శాతం ఉన్నా, మొత్తం లాభాలు ఆరుశాతమే ఉన్నాయి. జిడిపి వృద్ధి రేటు స్థిరంగా ఉంటే ఈ ఫలితాల సంగతేమిటి ? ఏ అంకెలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు ? ఆసియన్‌ పెయింట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ 2024 మేనెలలో జిడిపి అంకెలు ఎలా వస్తున్నాయో నాకు నమ్మకం లేదు అని వ్యాఖ్యానించాడు. ఆ మాటలు వైరల్‌ కావటంతో ఒక్క రోజులోనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. ఎక్కడి నుంచి వత్తిడి వచ్చిందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

పిండికొద్దీ రొట్టె అన్నారు.కుండలో కూడు కూడు అసలుందో లేదో ఉంటే ఎంత ఉందో,పిల్లాడు తిన్నాడో లేదో తెలియదు గానీ దుడ్డులా ఉన్నాడు అని చెబుతున్నట్లుగా అభివృద్ధి గొప్పగా ఉందని భాష్యం చెబుతున్నారు. జిడిపికి దోహదం చేసేవాటిలో వినియోగవృద్ధి ఒకటి.దేశంలో నిజవేతనాలు పడిపోవటం లేదా గిడసబారి పోయినట్లు చెబుతుండగా గృహస్తుల వినియోగం పెరిగిందని చెప్పటం మీద అనుమానాలు ఉన్నాయి. రెండవ అంశం పెట్టుబడులు, మొత్తం పెట్టుబడుల్లో ప్రైవేటు పెట్టుబడులు నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు జిడిపిలో 31.3శాతం ఉంటే 2024-25లో 29.6శాతం ఉన్నాయి. మధ్యలో ఒక ఏడాది మాత్రమే 31.2శాతం నమోదయ్యాయి. మిగిలిన అన్ని సంవత్సరాలలో అంతకంటే తక్కువే.ఈ కాలంలో కార్పొరేట్‌ పన్ను మొత్తం ప్రైవేటు రంగానికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని చూస్తే కార్పొరేట్‌ పన్ను విధింపు 30శాతం నుంచి 15కు తగ్గించారు. అయినా పారిశ్రామికరంగం వాటా జిడిపిలో 2014తో పోల్చితే తగ్గింది లేదా స్థిరంగా ఉంది తప్ప పెరగలేదు. చైనాలో సాధారణ కార్పొరేట్‌ రేటు 25శాతం కాగా మన దేశంలో కొత్త సంస్థలకు 15శాతంగా రాయితీ ఇచ్చినప్పటికీ చైనా నుంచి కంపెనీలు ఆశించిన స్థాయిలో రాలేదు. మేకిన్‌ ఇండియా విధానంతో 2022 నాటికి జిడిపిలో పారిశ్రామిక రంగం వాటా 25శాతం లక్ష్యంగా చెప్పారు.తరువాత దాన్ని 2025కు పొడిగించామన్నారు. వాస్తవ పరిస్థితి ఏమిటి 2006లో 17.3శాతం ఉండగా మోడీ అధికారానికి వచ్చినపుడు 2014లో 15.07 నమోదైంది తరువాత నేటి వరకు చూస్తే 13శాతానికి పడిపోయింది. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా పదవ స్థానంలో ఉన్న జిడిపిని ఐదుకు తెచ్చామంటారు, మరి దీని సంగతేమిటి ? జిడిపిని 2022 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామన్నారు, పారిశ్రామిక ఉత్పాదకత పెరగకుండా అదెలా సాధ్యం ? ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయాయి, ప్రభుత్వ పెట్టుబడులు పెట్టటం లేదు. ఆర్థిక మాంద్యం వచ్చినపుడు అమెరికాలో భారీ మొత్తంలో రోడ్లు, వంతెనలు, రైల్వే వంటి మౌలిక సదుపాయాల మీద అక్కడి ప్రభుత్వం ఖర్చు చేసి కొనుగోలు శక్తి పెంచేందుకు చూసింది. అక్కడి మాదిరి మాంద్యాలు లేకపోయినా మందగమనం కారణంగా మనదేశంలో కూడా జరుగుతున్నది అదే. ప్రైవేటు రంగంలో తనకు లాభం ఉంటుందా లేదా అని ఆచితూచి పెట్టుబడులు పెడుతోంది.వాజ్‌పారు నుంచి మధ్యలో మన్మోహన్‌ సింగ్‌, ఇప్పుడు నరేంద్రమోడీ వరకు భారీమొత్తాలను కేటాయించి జాతీయ రహదారులనిర్మాణం, రైల్వే విస్తరణ, సరిహద్దుల్లో రోడ్లు, వంతెనల వంటివి నిర్మిస్తున్నారు.అవి లేకపోతే పరిస్థితి మరింత దిగజారి ఉండేది, బిజెపి నేతలు రోడ్లను చూపి చూశారా మా ప్రతిభ అంటున్నారు. అదే సామర్ధ్యాన్ని ఉత్పాదకరంగంలో ఎందుకు చూపలేకపోతున్నారు ? మోటారు వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌ వంటి వాటి ఉత్పాదకతను పెంచకపోయినా పడిపోకుండా చూసేందుకు ఇటీవల తగ్గించిన జిఎస్‌టి కూడా ఆయా రంగాలకు ఉద్దీపనలో భాగమే.చిత్రం ఏమిటంటే జిఎస్‌టి తగ్గించిన రెండు నెలల తరువాత నవంబరు మాసంలో పన్ను వసూలు పెరగకపోగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువగా నమోదైంది. అందుకే నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి భజనబృందాలు ఇప్పుడు మూగపోయాయి.

జిఎస్‌టి తగ్గింపు గురించి గతేడాదే సంప్రదింపులు మొదలయ్యాయి. తగ్గింపుతో డిమాండ్‌ పెరిగి ప్రైవేటు రంగానికి పెద్ద ఊపువస్తుందన్న అంచనాతో 2025-26 బడ్జెట్‌లో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించేందుకు పూనుకుంది. వాటిలో గ్రామీణ ఉపాధిపథకానికి నిధుల కోత ఒకటి.2023-24లో రు.89,154 కోట్లు ఖర్చు చేస్తే 2025-26లో రు.86వేల కోట్లకు కుదించారు.2025 జనవరిలో చూస్తే ఏడు రాష్ట్రాలలో ప్రకటించిన వేతన సగటు రు.294 కాగా చెల్లించిన మొత్తం రు.257 మాత్రమే. తెలంగాణాలో రు.319కిగాను రు.276, ఆంధ్రప్రదేశ్‌లో రు.300కు గాను రు.258 చెల్లించారు. జిడిపిలో ప్రభుత్వ ఖర్చు వాటాను 15.6 నుంచి 15శాతానికి తగ్గించారు. వాస్తవంలో ఇంకా దిగజారుతుందేమో తెలియదు. మొత్తంగా దేశమంతటా శ్రామికుల నిజవేతనాలు పెరగకుండా వస్తు, సేవలకు గిరాకీ పెరగదు. ఉద్యోగులకు వేతన సవరణ చేసినంత మాత్రాన మొత్తం గిరాకీ మీద దాని ప్రభావం పెద్దగా ఉండదు. ఉదాహరణకు రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే కోట్లాది మంది రాబడిని పెంచే అసంఘటిత రంగ కార్మికుల వేతనాలను ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే పెంచారు. ఐదేండ్లకు ఒకసారి సవరిస్తే ఈ పాటికి మూడుసార్లు పెరిగేవి.ప్రభుత్వాల ఖర్చు అంటే ఏదో ఒక రూపంలో జనాలకు చేరే మొత్తాలతో పాటు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకూ లబ్ది చేకూరుతుంది. ప్రైవేటు పెట్టుబడులలు అలాంటివి కాదు, వాటి లాభాలే ప్రాతిపదికగా ఉంటాయి. అందువలన ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పు రానున్న రోజుల్లో ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.అధికారంలో ఎవరున్నా చేసింది అంకెల గారడీ గనుకనే సామాన్యుల స్థితిలో పెద్దగా మార్పులేదు, వచ్చే ఏడాది నూతన సీరీస్‌ అంటున్నారు గనుక మరో జిమ్మిక్కు చేయనున్నారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

03 Wednesday Dec 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Nicolás Maduro Moros, US military action on Venezuela, Venezuela

ఎం కోటేశ్వరరావు

మేక పిల్లను మింగేయాలనుకున్న తోడేలు కథ తెలిసిందే ! ప్రపంచంలో ఏదో ఒక మూల ఘర్షణ లేదా యుద్ధం లేకుండా అమెరికాకు నిదురపట్టదు. అందుకే మాదక ద్రవ్యాల రవాణా సాకుతో వెనెజులాపై ఏ క్షణమైనా దాడి చేసేందుకు అవసరమైన సన్నాహాలన్నీ పెంటగన్‌ పూర్తి చేసింది. మిలిటరీ ద్వారా మదురోను తొలగించేందుకు పూనుకోవద్దని, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పోప్‌ లియో మంగళవారం నాడు డోనాల్డ్‌ ట్రంప్‌కు హితవు చెప్పాడు. అక్కడ మార్పులు కావాలని అనుకుంటే ఆర్థిక ఆంక్షల ద్వారా చేయవచ్చని సలహా కూడా ఇచ్చాడు. ప్రపంచంలో అతి పెద్దది, అధునాతనమైనదిగా పరిగణిస్తున్న యుఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఫోర్డ్‌ విమానవాహక యుద్ధ నౌకతో సహా అనేక ఇతర నౌకలు, వేలాది మంది సైనికులను కరీబియన్‌ సముద్ర ప్రాంతానికి తరలించింది.దేశం నుంచి వెళ్లిపోవాలని డోనాల్డ్‌ ట్రంప్‌ వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను బెదిరించిన ట్రంప్‌ శుక్రవారం నాటితో గడువు ముగిసిందంటూ వెనెజులా గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించాడు. ఆ ప్రకటన చేసినప్పటికీ సోమ, మంగళవారాల్లో అమెరికా నుంచి వెనెజులా పౌరులను అనేక మందిని విమానాల ద్వారా తరలించారు, వారానికి రెండు రోజుల్లో తరలించవచ్చని గతంలో మదురో సర్కార్‌ అనుమతించింది. అద్దె విమానాలను నడిపే సంస్థ తమకు అనుమతులు ఇవ్వాలని సోమవారం నాడు దరఖాస్తు చేసింది. గత కొద్ది నెలలుగా వెనెజులా నుంచి మాదక ద్రవ్యాలతో నిండిన పడవలు వస్తున్నాయంటూ వాటిపై దాడులు చేసి అనేక మందిని అమెరికా హత్య చేసింది. అమెరికా దుర్మార్గాన్ని వదలిపెట్టి వెనెజులా మిలిటరీ సామర్ధ్యం ఎంత, దాడులను తట్టుకోగలదా లేదా అంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే కథనాలను మీడియా ముందుకు తెస్తున్నది. గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ డాట్‌కామ్‌ 2025 మిలిటరీ సూచిక ప్రకారం అమెరికా మొదటి స్థానంలో ఉండగా వెనెజులా 50వదిగా ఉంది. అయినప్పటికీ తమ దేశాన్ని కాపాడు కొనేందుకు చివరి రక్తపు బొట్టువరకు చిందిస్తామని మదురో గతంలో ప్రకటించాడు. ఏ దేశానికైనా అంతకు మించి మరో మార్గం ఉండదు.సోమవారం నాడు విదేశాంగ, రక్షణ మంత్రులు, ఉన్నతాధికారులతో ట్రంప్‌ సమావేశమైన దాడి సన్నాహాల గురించి చర్చించినట్లు వార్తలు.అమెరికా అధికార పీఠంపై ఎవరు ఉన్నప్పటికీ వెనెజులాలో వామపక్షల హ్యూగో ఛావెజ్‌ రాజకీయ వారసుడిగా వచ్చిన మదురో వరకు వారి కుట్రలు ఆపటం లేదు. అక్కడి ప్రతిపక్ష నేతలకు మద్దతు ఇచ్చి కుట్రలకు తెరలేపిన సంగతి తెలిసిందే.

తప్పుడు ప్రచారం, అసత్యాలతో ఇతర దేశాలపై దాడులు చేయటం అమెరికాకు కొత్తేమీ కాదు. తనకు లొంగని, నచ్చని దేశాధినేతలను పదవుల నుంచి తొలగించేందుకు చేసిన కుట్రల గురించి తెలిసిందే. వాటి వలన ప్రయోజనం లేదని చరిత్ర చెబుతున్నా పదే పదే ప్రయత్నాలు చేస్తున్నది.వలసవాదానికి వ్యతిరేకంగా లాటిన్‌ అమెరికా గతంలో పోరాడింది. దాన్ని తన పెరటితోటగా మార్చుకొనేందుకు అమెరికా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.ఈ ప్రాంతంలో సామ్రాజ్యవాదుల దుర్మార్గాలు ఇన్నిన్నికాదు. నవంబరు 29న లాటిన్‌ అమెరికాలో జోంగ్‌ మారణ కాండకు 244 సంవత్సరాలు నిండాయి.లాటిన్‌ అమెరికాలోని చెరకు తోటల్లో పని చేసేందుకు జోంగ్‌ అనే పడవలో 1781లో ఆఫ్రికా నుంచి బానిసలను తరలించారు. ఒక్కో బానిసను 36 పౌండ్లకు విక్రయించారు. పడవ సామర్ధ్యానికి రెండు రెట్లు అంటే 442మందిని ఎక్కించారు.ఘనా నుంచి జమైకాకు ప్రయాణించే ఆ పడవ నావికులు చేసిన తప్పిదాల వలన ఆలస్యమై మంచినీరు చాలకపోవటం, ఇతరత్రా కారణాలతో అనేక మంది మరణించారు. ఓడ యజమానులు ఒక్కొక్క బానిస మీద 30 పౌండ్ల చొప్పున బీమా సొమ్ము పొందే అవకాశం ఉంది. దుర్మార్గం ఏమంటే అందుకోసం నీరసించిపోయిన వారిలో 54 మంది మహిళలు, పిల్లలను మరణించినవారితో పాటు నవంబరు 29న కరీబియన్‌ సముద్రంలోకి నెట్టి చంపివేశారు.ఈ ఉదంతం సామ్రాజ్యవాదంపై ప్రతిఘటన, బానిసత్వ రద్దు చట్టాలకు నాంది పలికింది. దీన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే బానిసవ్యాపారులు బీమా సొమ్ముకోసం బతికి ఉన్నవారిని సముద్రంలోకి తోసివేసినట్లే వెనెజులాపై దాడికి అమాయకులైన వారు ప్రయాణిస్తున్న పడవలపై దాడులు చేసి వారిని చంపివేసిన అమెరికా మిలిటరీ దాన్ని మాదకద్రవ్యాల నిరోధానికి తీసుకున్న చర్యగా ప్రపంచాన్ని నమ్మించేందుకు చూసింది. అసలు అమెరికాకు అలాంటి అధికారం ఎవరిచ్చారు, అదేమీ అమెరికా గడ్డకాదు, సముద్రజలాలు వారివి కాదు. తాము పేల్చివేసిన ప్రతిపడవతో 25వేల మంది అమెరికన్ల ప్రాణాలను రక్షించామని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకున్నాడు.ప్రతి ఏటా వేలాది మందిని అమెరికాలో తుపాకులతో కాల్చిచంపుతుంటే, మాదక ద్రవ్యాలతో నింపుతుంటే వారిని నిరోధించటం చేతగాని దద్దమ్మలు ఎక్కడో మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయంటూ యుద్ధ నౌకలు, మిలిటరీని తరలిస్తుంటే నమ్మటానికి జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరు. ఛావెజ్‌ నాయకత్వంలో వెనెజులాలో ప్రారంభమైన వామపక్ష పాలనకు 26 సంవత్సరాలు నిండాయి. ఆ ప్రాంతంలో అమెరికాకు కొరకరాని కొయ్యగా తయారైంది.అసలు దుగ్ద అది, అందుకే మదురోను తొలగించి తన తొత్తులను అక్కడ అధికారంలో కూర్చోపెట్టేందుకే ఈ దుర్మార్గానికి ట్రంప్‌ తెరతీశాడు.

అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా వెనెజులా ప్రస్తుతం క్యూబా, చైనా తదితర దేశాలకు చమురు ఎగుమతులు చేస్తున్నది. ప్రపంచంలో 303 బిలియన్‌ పీపాల చమురు నిల్వలతో వెనెజులా మొదటి దేశంగా ఉంది.వాటిని చేజిక్కించుకొని అమెరికా కంపెనీలకు అప్పగించాలని అక్కడి రిపబ్లికన్లు, డెమోక్రాట్లూ ప్రయత్నిస్తున్నారు.దానికి గాను సాకులు చెబుతున్నారు.2007లో ఛావెజ్‌ ప్రభుత్వం అమెరికా కంపెనీల చేతుల్లో ఉన్న చమురు సంస్థలను జాతీయం చేసినప్పటి నుంచి కుట్రలు మొదలయ్యాయి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల సరఫరాలో వెనెజులా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిరంతరం ప్రచారం చేస్తున్నారు. మాదకద్రవ్యాలు, నేరాలకు సంబంధించిన ఐరాస సంస్థ, చివరికి అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజన్సీ కూడా వాటిని తిరస్కరించింది. వార్షిక నివేదికల్లో మాదకద్రవ్యాలను వెనెజులా ఉత్పత్తి చేయటం లేదని, సరఫరా గురించి ఆధారాలు లేవని పేర్కొన్నాయి.అమెరికా చేరుతున్న కొకెయిన్‌లో 90శాతం పసిఫిక్‌ సముద్రమార్గాల ద్వారా దక్షిణ అమెరికా మిత్రదేశాల నుంచి నుంచి చేరుతున్నదని, ప్రమాదకరమైన ఫెంటానిల్‌ అమెరికా దక్షిణ సరిహద్దుల నుంచి ఎక్కువగా అమెరికా పౌరులే స్మగ్లింగ్‌ చేస్తున్నారని అనేక నివేదికలు ఉన్నాయి.వాటిని విస్మరించి మదురో మాదక ద్రవ్యాల సరఫరా మాఫియా నాయకుడని ఆరోపించటం తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. అమెరికా చెబుతున్న మాదకద్రవ్యాల ముఠా జాడ అక్కడ ఉందని ఏ అంతర్జాతీయ సంస్థా చెప్పలేదు. మాదకద్రవ్యాల రవాణా మీద పోరాడుతున్నట్లు అమెరికా చెప్పుకోవటం హాస్యాస్పదం, బూటకం. లాటిన్‌ అమెరికాలోని హొండురాస్‌ మాజీ అధ్యక్షుడు జువాన్‌ ఓర్లాండో హెర్నాండెజ్‌ మాదక ద్రవ్యాల రవాణా కేసులో 2024లో అమెరికా కోర్టు 45 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాంటి నేరగాడికి క్షమాభిక్ష ప్రసాదిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు.

యుద్ధాల ప్రారంభానికి సామ్రాజ్యవాదులు, యుద్దోన్మాదులు అబద్దాలు చెప్పటం కొత్త కాదు.నిజానికి అది పురాతన ఎత్తుగడ. యుద్దంలో ముందుగా హతమయ్యేది నిజం.మొదటి ప్రపంచ యుద్దంలో న్యూయార్క్‌ నుంచి బ్రిటన్‌లోని లివర్‌పూల్‌ బయలుదేరిన ఆర్‌ఎంఎస్‌ లుస్టియానా అనే నౌకను ఐర్లండు వద్ద జర్మన్లు పేల్చివేశారని ప్రచారం చేశారు.జున్ను, వెన్న రవాణా పేరుతో పేలుడు పదార్దాలను కూడా దానిలో రవాణా చేస్తుండగా అవి పేలటంతో 139 మంది అమెరికన్లలో 128 మంది మరణించారు. ఇది వాస్తవం కాగా జర్మనీ మీద నెపం మోపి అమెరికన్లను యుద్దానికి సిద్ధంచేసేందుకు తప్పుడు ప్రచారం చేశారు. ఇదే ఎత్తుగడతో రెండవ ప్రపంచ యుద్దంలో చేరేందుకు కుట్ర చేశారు.దాన్ని అర్ధంచేసుకోని జపాన్‌ 1941 డిసెంబరులో పెరల్‌హార్బర్‌పై చేసినదాడిలో 2,400 మంది అమెరికన్‌ మిలిటరీ, పౌరులు మరణించారు. ఆ దాడి గురించి నాటి అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌, అధికార యంత్రాంగానికి ముందే తెలుసునని, వారం ముందే దాడి జరగనున్నదని రూజ్‌వెల్ట్‌ తనకు చెప్పినట్లు నాటి అమెరికా యుద్ధ మంత్రి హెన్రీ టిమ్సన్‌ తన డైరీలో రాశాడు. ప్రభుత్వానికి అందిన హెచ్చరికలను కూడా కావాలనే పక్కన పెట్టారని తరువాత వెల్లడైంది.ఈ దాడిని ఆసరా చేసుకొని జపాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించటం, అణుబాంబులను వినియోగించటం తెలిసిందే. దీనికి పది సంవత్సరాల ముందు చైనాలోని మంచూరియాను ఆక్రమించుకొనేందుకు జపాన్‌ సామ్రాజ్యవాదులు కూడా ఇదే ఎత్తుగడను అనుసరించారు. తమ నిర్వహణలోని రైల్వే ట్రాక్‌ను తామే పేల్చుకొని చైనా మీద నెపం మోపి దురాక్రమణకు పూనుకున్నారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఉత్తర కొరియా దురాక్రమణ నుంచి దక్షిణ కొరియాను రక్షించేపేరుతో కొరియా యుద్దం జరిగింది. అది కూడా తప్పుడు ప్రచారమే.అసలు అలాంటి ప్రయత్నమే జరగలేదు. ఉత్తర కొరియా కమ్యూనిస్టుల ఆధీనంలో ఉండటమే అసలు కారణం. ఐరాస పేరుతో అమెరికా జరిపిన దాడి, ప్రతిఘటనలో 30లక్షల మంది పౌరులు మరణించారు.

వియత్నాం దురాక్రమణ కూడా అసత్యాలతోనే ప్రారంభమైంది. టోంకిన్‌ గల్ఫ్‌(దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం తీరంలోని జలసంధి) లో తమ నౌకపై ఉత్తర వియత్నాం 1964 ఆగస్టులో రెండుసార్లు దాడి చేసిందని ఆరోపిస్తూ అమెరికా దాడికి దిగింది. దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టు వ్యతిరేకపాలకులకు మద్దతుగా వచ్చిన అమెరికా నౌక ముందుగా చేసిన దాడిని ఉత్తర వియత్నాం ప్రతిఘటించింది. అసలు రెండవదాడి ఉదంతమే జరగలేదని తరువాత వెల్లడైంది. 1967లో అమెరికా మద్దతుతో ఈజిప్టు,జోర్డాన్‌, సిరియాపై ఇజ్రాయెల్‌ జరిపినదాడి కూడా అబద్దాలతోనే జరిగింది.ఈజిప్టు తొలుత తమపై దాడి చేసినట్లు దానికి ప్రతిదాడికి దిగినట్లు ఆరోపించింది. దానికి ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో ఈజిప్టు ఇతర అరబ్బుదేశాలు తమపై దాడికి సన్నద్దం అవుతుండటంతో ఆత్మరక్షణ కోసం దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ సమర్ధించుకుంది. అమెరికాను ప్రత్యక్షంగా రంగంలోకి దించేందుకు పధకం ప్రకారం ఈజిప్టు సమీపంలో ఉన్న అమెరికా నౌక యుఎస్‌ఎస్‌ లిబర్టీపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. నెపాన్ని ఈజిప్టుమీద నెట్టేందుకు చూసింది.ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని తరువాత వెల్లడైంది.1990దశకంలో జరిగిన గల్ఫ్‌దాడులను కూడా అమెరికా అబద్దాలతోనే మొదలు పెట్టింది.ఇరాకీలు కువాయిట్‌పై దాడి చేసినపుడు ఆసుపత్రిలో ఉన్న పిల్లలను చంపివేశారని కాకమ్మ కథలను అమెరికా చెప్పించింది. తరువాత 2003లో ఇరాక్‌ అధినేత సద్దామ్‌ హుస్సేన్‌ మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసి దాడి చేయటమేగాక సద్దామ్‌ను ఉరితీసిన సంగతి తెలిసిందే. తరువాత అలాంటి ఆయుధాలేమీ లేవని అమెరికన్లే అంగీకరించారు. సిఐఏ చెప్పిన కట్టుకథలను అమెరికాతో సహా యావత్‌ ప్రపంచ మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. లిబియాలో మానవహక్కులకు భంగం కలిగిందని, వాటిని పునరుద్దరించేపేరుతో జోక్యం చేసుకోవటమే గాక అధినేత గడాఫీని అంతం చేసేందుకు నాటో దళాలను దించిన సంగతి తెలిసిందే.గడాఫీ వ్యతిరేక తిరుగుబాటుదార్ల పేర్లతో నాటకమాడి 2011లో గడాఫీని హత్య చేశారు.

అనేక దేశాలలో పాలకులు, పార్టీలను మార్చి తనకు అనుకూలశక్తులను గద్దెల మీద కూర్చోపెట్టేందుకు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా చేసిన యత్నాలన్నీ విఫలం కావటమేగాక చేతులు కాల్చుకున్నది.నియంతలు, పచ్చిమితవాదులకు ఆశ్రయమిచ్చి రక్తపాతానికి కారకురాలైంది.అయినా సరే ఎప్పటికాలిట్టిట్టే అన్నట్లుగా అమెరికాలో ఏ పార్టీ అధికారానికి వచ్చినా అదే వైఖరి.ఇప్పుడు వెనెజులాలో కూడా అదే జరుగుతోంది.అధ్యక్షుడు నికోలస్‌ మదురో దేశం విడిచిపోవాలని ట్రంప్‌ బెదిరించాడు. ఒక విమానవాహక యుద్ధ నౌక, పది ఇతర మిలిటరీ నౌకలు, పదిహేనువేల మంది మిలిటరీ, వందలాది యుద్ధ విమానాలతో వెనెజులాను చుట్టుముట్టారు. మదురో కూడా గతకొద్ది నెలలుగా తనకున్న మిలిటరీ, గెరిల్లా దళాలను సన్నద్దం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.ఏం జరగనుందో అని యావత్‌ ప్రపంచం ఆందోళనతో చూస్తున్నది.నేడు వెనెజులా పతనమైతే రేపు ఏ దేశం మీదనైనా ఏదో ఒకసాకుతో అమెరికా దాడికి దిగితే పరిస్థితి ఏమిటో ప్రతివారూ ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాకు భారత ఎగుమతులు పెరిగాయా ! జనాలకు గోడీ మీడియా చెబుతున్న నిజానిజాలేమిటి !!

26 Wednesday Nov 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#India trade matters, BJP, China exports, India exports and Imports, Media Bluffing, Narendra Modi Failures, world exports

ఎం కోటేశ్వరరావు

చైనాకు ఏడు నెలల్లో 25శాతం పెరిగిన భారత ఎగుమతులు. మీడియాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన శీర్షిక ఇది. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు వరుసగా ఏడు నెలల నుంచీ పెరుగుతూనే ఉన్నాయి.మంచిదే, మన ఎగుమతులు ఏమాత్రం పెరిగినా సంతోషించాల్సిందే. అయితే అసలు కథేమిటంటే నరేంద్రమోడీకి భజన చేసేందుకు అలవాటు పడిన వారు చేసిన జిమ్మిక్కు లేదా తిమ్మిని బమ్మిని ఇది. నిజంగా జరిగిందేమిటి ? గతేడాదితో పోలిస్తే ఎగుమతులు పెరిగిన మాట నిజం. ఇదే సమయంలో చైనా నుంచి దిగుమతులు అంతకంటే ఎక్కువగా పెరిగిన సంగతి, పదేండ్ల స్థాయికి ఎగుమతులు పడిపోయిన నిజాన్ని జనాలకు చెప్పరేం ! నరేంద్రమోడీ ఏలుబడి పదకొండు సంవత్సరాలను మూడు భాగాలుగా విభజిద్దాం. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో చైనాకు మన ఎగుమతులు 11.96 నుంచి 16.75 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. తరువాత మూడు సంవత్సరాలలో 21.56 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అప్పటి నుంచి 2024-25లో 14.25 బిలియన్‌ డాలర్లకు పతనమయ్యాయి. గత ఏడాది తొలి ఏడు నెలలతో పోల్చి చూపి వర్తమాన సంవత్సరంలో 10.03 బిలియన్‌ డాలర్లకు 25శాతం పెరిగినట్లు చిత్రించారు. మిగిలిన ఐదు నెలల కాలంలో గత ఏడాది మొత్తాలకు చేరవచ్చు, స్వల్పంగా పెరగవచ్చు తప్ప గతంలోని 21.56 బిలియన్‌ డాలర్లకు చేరే స్థితి ఉందా ? చైనాకు మన ఎగుమతులు పెరగటం వెనుక అంతర్జాతీయ రాజకీయాలు కూడా లేకపోలేదు. అమెరికా వైపు మొగ్గుచూపుతున్న నరేంద్రమోడీకి పన్నుల రూపంలో ట్రంప్‌ తీసుకున్న వైఖరి మింగుడు పడలేదు.ఈ స్థితిలో ఎత్తుగడగా అవసరం ఉన్నా లేకున్నా చైనా ఏప్రిల్‌ నుంచి మన దేశం నుంచి దిగుమతులను పెంచింది, దీని కొనసాగింపు రానున్న రోజుల్లో మనదేశం అనుసరించే వైఖరిని బట్టి ఉంటుంది.చైనాకు మన మార్కెట్‌ను ఎంతగా తెరిస్తే దానికి ప్రతిగా మనకూ మేలు చేకూరే విధంగా బీజింగ్‌ వ్యవహరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. చైనా పెట్టుబడులను స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. మన దేశం నుంచి విమానాలను నడిపేందుకు రెండు చైనా కంపెనీలు దరఖాస్తు చేసినట్లు తాజా వార్తలు వెల్లడించాయి.

చైనా మీద ఆధారపడకూడదు, దాన్ని పక్కకు నెట్టేసి అసలు మనమే ప్రపంచానికి వస్తువులను ఎగుమతులు చేద్దాం అంటూ పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అలాంటి సూచనలు లేవు.తొలి ఏడు నెలల్లో ఎగుమతులు పెరిగాయని చెప్పిన వారు అదే సమయంలో చైనా నుంచి దిగుమతులు 57.65 నుంచి 64బిలియన్‌ డాలర్లకు పెరిగాయని చెబితే నిజాయితీగా ఉంటుంది. గత సంవత్సరం చైనాతో మన వాణిజ్య లోటు 99.12 బిలియన్‌ డాలర్లు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే నరేంద్రమోడీ సర్కార్‌ అసమర్ధతకు బీజింగ్‌కు మనం చెల్లించిన మూల్యం.ఇంకా చెప్పాలంటే గత పదకొండు సంవత్సరాల్లో 701.95 బిలియన్‌ డాలర్లు సమర్పించుకున్నాం. మోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది మన వాణిజ్య లోటు 48.45 బిలియన్‌ డాలర్లు కాగా పదకొండేండ్లలో రెట్టింపై 99.21 బి.డాలర్లకు చేరింది, ఎందుకని ? గత ఐదు సంవత్సరాల్లో చైనాకు మన ఎగుమతులు 33శాతం పడిపోగా దిగుమతులు 74శాతం పెరిగాయి. ఆత్మనిర్భరత ఏమైనట్లు, ప్రపంచంలో పెరిగినట్లు చెబుతున్న మోడీ పలుకుబడి సంగతేమిటి ? కాంగ్రెస్‌ యాభై ఏండ్లలోచేయలేని వాటిని తాను తొలి ఐదేండ్లలోనే చేసినట్లు గతంలో చెప్పుకున్నారు. సంతోషం. వర్తమాన అవసరాలకు అనుగుణంగా వస్తూత్పత్తిని ఎందుకు చేయలేకపోయినట్లు ? రెండింజన్ల పాలనే కదా ఉన్నది. యాపిల్‌ ఐఫోన్లను తయారు చేస్తున్నాం, ఎగుమతి చేస్తున్నాం చూడండహౌ అంటూ ప్రచారం చేస్తున్నారు. మిగతా ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంగతేమిటి ? గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(జిటిఆర్‌ఐ-ఇండియా) చెప్పినదాని ప్రకారం కీలకమైన ఎనిమిది పారిశ్రామిక ఉత్పత్తుల విషయంలో చైనా ప్రధాన సరఫరాదారుగా ఉంది. చైనా నుంచి దిగుమతుల వలన రెండు రకాల నష్టాలు, ఒకటి స్థానిక మన పరిశ్రమలు గిడసబారిపోతున్నాయి, కార్మికులకు ఉపాధి దొరకటం లేదు.విలువైన విదేశీమారక ద్రవ్యాన్ని చైనాకు సమర్పించుకుంటున్నట్లు ముందే చెప్పుకున్నాం. గత కాంగ్రెస్‌ పాలనకూ మోడీ ఏలుబడికి తేడా ఏమిటి ? చైనా నుంచి దిగుమతుల్లో మన్మోహన్‌ సింగ్‌ రికార్డులనే కాదు, తన రికార్డులను కూడా తానే మోడీ బద్దలు కొట్టుకున్నారు. చైనాతో తిరిగి సత్సంబంధాలను నెలకొల్పుకొనటం మంచిదే. కానీ అనేక వస్తువుల దిగుమతులపై ఆంక్షలను సడలించిన కారణంగా గత రికార్డులను అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి గత పదినెలలుగా చెబుతూనే ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతతో సహా అన్నీ డోనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్నట్లే జరుగుతున్నందున అనేక అనుమానాలు. ఇంతవరకు ఏం జరుగుతోందో జనానికి తెలియదు. ట్రంప్‌ చెబితే తప్ప మనకు తెలిసేట్లు లేదు, మన మార్కెట్‌ను వారి వస్తువులకు బార్లా తెరవాలని అమెరికా వత్తిడి తెస్తోంది. అదే జరిగితే స్థానిక పరిశ్రమలు, వాణిజ్యాలను మూసుకోవాల్సిందే అని మన కార్పొరేట్లు హెచ్చరిస్తున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఏడునెలల్లో మన ఎగుమతులు ఎక్కువగా అమెరికాకు జరిగితే దిగుమతులు చైనా నుంచి జరిగాయి. ఇదేం కుదరదు అన్నీ మానుంచే దిగుమతి చేసుకోవాలని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. అసలు సంగతేమిటంటే చైనా నుంచి తక్కువ ధరలకు వస్తున్నాయి గనుక దిగుమతి చేసుకుంటున్నాం తప్ప షీ జింపింగ్‌ మీద ప్రేమతో కాదు. అమెరికాకు చోటిస్తే ఎడారి వ్యాపారి, ఒంటె కథ మాదిరి దేశీయ సంస్థలను బయటకు నెట్టేయటం లేదా మింగివేస్తుంది. అందుకనే రెండు దేశాలతో సమన్వయం చేసుకోవటం మోడీకి కత్తిమీద సాములా ఉంది. రానున్న రోజుల్లో మనకు మేలు జరిగే విధంగా విదేశాంగ విధానం ఉండాలని ఇప్పటికే కార్పొరేట్ల లాబీ మాట్లాడుతోంది. కరవమంటే కప్పకు విడవమంటే పాముకు కోపం ! మన దేశ వస్తు ఎగుమతులను చూస్తే 2024లో 434.44 బిలియన్‌ డాలర్లు కాగా దిగుమతులు 698-702 బి. డాలర్ల మధ్య ఉన్నాయి. నిఖర వాణిజ్యలోటు 263.31బిలియన్‌ డాలర్లు. ఎగుమతుల్లో అమెరికా 18.3, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 8.5, నెదర్లాండ్స్‌ 5.6, సింగపూర్‌ 3.6, చైనా 3.4,బ్రిటన్‌ 3.2, సౌదీ అరేబియా 2.8, బంగ్లాదేశ్‌ 2.6, జర్మనీ 2.4, ఇటలీ 1.92శాతాల చొప్పున ఉన్నాయి. 2024 జనవరి నుంచి జూన్‌ వరకు వివరాలు చూస్తే మన దేశం 151దేశాలతో వాణిజ్య మిగులు, 75దేశాలతో తరుగులో ఉంది. మోడీ భక్తులు చూశారా మానేత పలుకుబడి అని డబ్బా కొట్టుకోవటానికి ఈ అంకెలు తప్ప వాస్తవ పరిస్థితి ఏమిటోపైన చెప్పుకున్నాం. అమెరికాను వదులుకొనేందుకు భయపడటానికి, డోనాల్డ్‌ ట్రంప్‌ ఎంతగా అవమానించినా మౌనంగా ఉండటానికి అక్కడికి మన ఎగుమతులు ఎక్కువగా ఉండటమే.మరోవైపు ఐదేండ్లపాటు చైనాతో వైరంతో గడిపిన తరువాత సాధారణ సంబంధాలు ఏర్పరుచుకోవటానికి కారణం దాని మీద ఆధారపడాల్సి రావటమే. పదకొండు సంవత్సరాల్లో పరాధీనతను తగ్గించటానికి మోడీ చేసిందేమీ లేదు. అందుకే రాజీపడ్డాం. మన దిగుమతులను చూస్తే 2024లో చైనా నుంచి 15.5,రష్యా 9.1, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 8.6, అమెరికా 6.1, సౌదీ అరేబియా 4.3, ఇరాక్‌ 4.2, ఇండోనేషియా 3.4,స్విడ్జర్లాండ్‌ 3.1,దక్షిణ కొరియా 3, సింగపూర్‌ 2.9శాతం చొప్పున ఉన్నాయి. గాల్వన్‌ లోయ ఉదంతాల సమయంలో కాషాయ దళాలు చైనా నుంచి దిగుమతుల నిలిపివేస్తే డ్రాగన్‌ మన కాళ్ల దగ్గరకు వస్తుందంటూ ఊగిపోయారు.నిజానికి మనకు అంత సీన్‌ లేదు, 2024లో చైనా నుంచి దిగుమతులు చేసుకున్న మొదటి పది దేశాలలో మనం కేవలం 3.4శాతంతో ఆరవ స్థానంలో ఉన్నాం.

మన ఎగుమతులు, దిగుమతులు రెండు రకాలు. ఒకటి వస్తువులు, రెండవది సేవలు. వస్తు లావాదేవీల్లో 2014-15లో లోటు 137 బిలియన్‌ డాలర్ల నుంచి 2024-25 నాటికి 283బి.డాలర్లకు పెరిగింది. సేవల విషయంలో ఇదే కాలంలో మిగులు 74 నుంచి 189 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. రెండింటినీ కలిపి చూసినపుడు నిఖర లోటు 63 నుంచి 94 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.ప్రపంచంలో 2024లో మొత్తం 24.5లక్షల కోట్ల డాలర్ల విలువగల వస్తు ఎగుమతులు జరగ్గా ఎగువన ఉన్న 30దేశాల వాటా 20.3లక్షల కోట్ల డాలర్లు.మొదటి స్థానంలో ఉన్న చైనా వాటా 14.6 శాతం కలిగి మొదటి స్థానంలో ఉండగా పద్దెనిమిదవదిగా మనదేశ వాటా కేవలం 1.8శాతమే, రష్యా, స్విడ్జర్లాండ్‌ కూడా ఇదే వాటాను కలిగి ఉన్నాయి. చైనాను వెనక్కు నెట్టేయాలన్న సంకల్పాన్ని ఎవరూ కాదనరు, పోటీ పడాల్సిందే. కానీ ఒక్కసారిగా ఈ పరిస్థితి మారాలన్నా, 2047 నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోవాలన్నా నరేంద్రమోడీ అల్లావుద్దీన్‌ అద్భుత దీపాన్ని సంపాదించాల్సిందే. అల్లావుద్దీన్‌ ముస్లిం మేం బరాబర్‌ హిందువులం పొడగిట్టదు అని అంటారా, మనోభావాలను ముందుకు తెస్తే మన వేదాల్లో ఉన్నవాటిని వెలికి తీయాలి మరి, దగ్గరిదారి లేదు, చేస్తారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పతన దిశగా ఉక్రెయిన్‌, లొంగిపోతున్న మిలిటరీ – పరారీ క్రమంలో జెలెనెస్కీ !

19 Wednesday Nov 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#Ukraine Crisis, Donald trump, Ukraine, Ukrainian Troops Abandoning Front, Vladimir Putin, Zelensky

ఎం కోటేశ్వరరావు

నిజమే ! గతవారం రోజులుగా ఉక్రెయిన్‌ పోరులో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పశ్చిమదేశాల నుంచి వస్తున్న వార్తలను చూస్తుంటే భయంకరమైన చలికాలం ముగిసేలోగా ఉక్రెయిన్‌ పతనం అవుతుందా ? చలికి తట్టుకోలేక ఉక్రెయిన్‌ సైన్యం తెల్లజెండా ఎత్తుతుందా ? ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య మంగళవారం నాడు 1,363వ రోజులో ప్రవేశించింది. వేలాది మంది ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోతున్నట్లు వార్తలు, అధ్యక్షుడు వ్లదిమిర్‌ జెలెనెస్కీ విదేశాలకు పారిపోనున్నాడా అంటే మిన్నువిరిగి మీద పడే అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప అందుకు అవకాశాలు లేకపోలేదని అనిపిస్తున్నది. గత కొద్ది వారాలుగా అనేక కీలక ప్రాంతాలను చక్రబంధంలో బిగించిన రష్యా ఒక్కో గ్రామం, ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. పోకరోవస్క్‌ అనే పట్టణంలోకి పుతిన్‌ సేనలు చొరబడ్డాయని ఏక్షణంలోనైనా స్వాధీనం చేసుకోవచ్చని వార్తలు. గత ఏడాదిన్నర కాలంగా ఆ పట్టణాన్ని పట్టుకొనేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతున్నది. అక్కడ ఉన్న దాదాపు ఐదువేల మంది ఉక్రెయిన్‌ మిలిటరీ కదలకుండా బందీ అయిందని, తెల్లజెండా ఊపిందని, పోరు సాగుతున్నదని భిన్నవార్తలు వచ్చాయి. వెలుపలి నుంచి వస్తున్న రష్యన్‌ సేనలను ప్రతిఘటిస్తున్నట్లు కనిపించటం లేదని, అయితే ఇండ్లు, బంకర్లలో ఉన్నవారి కారణంగా ఒక్కో ప్రాంతాన్ని జల్లెడ పట్టి ముందుకు పోతున్నారని, కొన్ని వారాల్లో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్నారు.అది స్వాధీనమైతే అనేక కొత్త ప్రాంతాలను సులభంగా పట్టుకొనేందుకు వీలుకలుగుతుందని, సైనిక చర్య మరో మలుపు తిరుగుతుందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో జరిపే పెద్ద దాడులకు సన్నాహాలలో భాగంగా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న పోలాండ్‌లోని రైల్వేట్రాక్‌ను ధ్వంసం చేసినట్లు రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. సోమవారం నాడు పోలాండ్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఐరోపా దేశాల మీడియా రష్యా కారణమని చెబుతున్నది. ఇదే సమయంలో తాము ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటున్నట్లు శుక్రవారం నాడు జెలెనెస్కీ కూడా అంగీకరించాడు. నాటో కూటమి దేశాలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్నప్పటికీ అది వృధా అనే అభిప్రాయంతో నేతలు ఉన్నారు. ఉక్రెయిన్‌ ఇజ్‌మెయిల్‌ రేవు పట్టణం వద్ద ఉన్న టర్కీ ఎల్‌పిజి టాంకర్‌ షిప్‌పై జరిగినదాడిలో అది దగ్దమైంది.దాడి ఎవరు జరిపిందీ తేలనప్పటికీ రష్యా చేసిందని ఆరోపించారు. దాంతో పక్కనే ఉన్న రుమేనియాతన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. పత్యక్షంగా పాల్గ్గొనేందుకు నాటో నేతలు విముఖత చూపుతున్నారు. గతంలో తగిలిన దెబ్బలతో తలబొప్పి కట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఉక్రెయిన్‌ సమస్యపై ప్రస్తుతం కంటి చూపుతున్న నోటమాట లేదు.జెలెనెస్కీ పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలా ఉంది.

దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిఝఝియాలో మరికొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలోకి వెళ్లాయి.ఈ ప్రాంతంలో పోరు దిగజారుతున్నదని జెలెనెస్కీ మిలిటరీ అధికారులే అంగీకరించారు.వ్యూహాత్మకంగా తమసేనలను వెనక్కు రప్పిస్తున్నట్లు చెప్పుకున్నారు.హంగరీ ప్రధాని విక్టర్‌ ఒర్బాన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ గెలిచే అవకాశం లేదని, ఐరోపా ఆర్థికసాయం పిచ్చితనం తప్ప మరొకటి కాదన్నాడు. ఇప్పటికే 185బిలియన్‌ యూరోలు తగలేశామని, ఇంకా అంతకంటే ఎక్కువే తగేలేయాలని చూస్తున్నామని, ఎంత చేసినా గెలిచే అవకాశం లేదని జర్మన్‌ మీడియా గ్రూపు అక్సెల్‌ స్ప్రింగర్‌ సిఇఓతో మాట్లాడుతూ చెప్పాడు. యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణుల కోసం జెలెనెస్కీ ప్రస్తుతం ఫ్రాన్సు పర్యటనలో ఉన్నాడు, రానున్న పది సంవత్సరాలలో 100 రాఫేల్‌ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. తరువాత స్పెయిన్‌ వెళతాడని వార్తలు.సరస్సులోని చేపలు పైకి వస్తే మింగివేసేందుకు సిద్దంగా ఉండే కొంగల మాదిరి క్రామాటోరస్క్‌ వంటి చోట్ల రష్యన్‌ లాన్సెట్‌ డ్రోన్లు దాడులకు సిద్దంగా ఉన్నాయని ఉక్రెయిన్‌ నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రతి రోజూ రష్యన్ల చేతిలో నరకం చూస్తున్నట్లు చెబుతున్నారు. సమీప భవిష్యత్‌లో రష్యాతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ జరిగే అవకాశం లేదని మాస్కోతో 1,350 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఫిన్లండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌ చెప్పాడు. సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి గురించి తాను ట్రంప్‌తో మాట్లాడతానని, పది అంశాల్లో ఏ ఒక్కదానికి పుతిన్‌ అంగీకరించినా మంచిదే అన్నాడు. ఇటీవలనే ఫిన్లాండ్‌ నాటో కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. రష్యా ఎత్తుగడలు ఏమిటో తమకు బాగా తెలుసని స్టబ్‌ చెప్పాడు.

ఉక్రెయిన్‌ సేనలు యుద్ద రంగం నుంచి పారిపోతున్న వార్తలు గతంలోనే వచ్చినప్పటికీ ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉన్నాయి. వివాదం ప్రారంభమైన 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే పశ్చిమ దేశాల మీడియా వార్తల ప్రకారం అక్టోబరు నెలలో 21వేల మంది పారిపోయారు. రష్యాపై తాము విజయం సాధించబోతున్నామని జెలెనెస్కీ ఎన్ని కబుర్లు చెప్పినా, ఇతర దేశాలు ఇచ్చిన కొన్ని ఆధునిక ఆయుధాలు, సమాచారం ఆధారంగా రష్యాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేసిన తరువాత ఇలా జరగటం, అదీ పశ్చిమ దేశాల మీడియా వెల్లడించట గమనించాల్సిన అంశం. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని ఇటీవలి వరకు ఉక్రెయిన్‌ మిలిటరీలో పనిచేసిన ఇగోర్‌ లుస్టెంకో చెబుతున్నాడు. మిలిటరీ ఇలాంటి అంశాలను బయటకు రాకుండా చూస్తుందని వేరే చెప్పనవసరం లేదు.అధికారిక సమాచారం ప్రకారమే అక్టోబరులో 21,602 మంది పారిపోయారు, వాస్తవంలో ఎక్కువ మంది ఉంటారని లుస్టెంకో చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఇటీవలి కాలంలో రష్యన్‌ సేనలు మరిన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవటానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతుండగా, తాము గెలిచే అవకాశం లేదని ఉక్రెనియన్లు భావించటంతో పోరాడటం, ప్రాణాలు పోగొట్టుకోవటంలో అర్దం లేదని అనేక మంది భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇటీవల ఒక బ్రిటీష్‌ పత్రిక చేసిన విశ్లేషణ ప్రకారం ఆరున్నర లక్షల మంది మిలిటరీలో చేరి పోరాడగలిగిన వయస్సున్నవారు ఉక్రెయిన్‌ వదలి పారిపోయారు. ఆ దేశ పార్లమెంటు సభ్యుడొకరు నాలుగు లక్షలని చెప్పాడు.మిలిటరీ నుంచి పారిపోతున్నవారి గురించి 2024 డిసెంబరులో ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం అంతకు ముందు రెండు సంవత్సరాలతో పోలిస్తే ఆ ఏడాది రెండింతలున్నారు.బ్రిటీష్‌ పత్రిక టెలిగ్రాఫ్‌ ఇటీవల ఇచ్చిన విశ్లేషణ ప్రకారం ప్రతి నెల పారిపోతున్న లేదా విధులకు చెప్పకుండా గైరుహాజరవుతున్నవారి సంఖ్య ఇరవైవేలు ఉంటున్నది. పారి పోయిన వారి మీద 2.9లక్షల కేసులను ప్రభుత్వం నమోదు చేసింది.ఇప్పుడు కనీసం రెండు లక్షల మంది కొరత వున్నట్లు అంచనా. అనేక మంది మాజీ, ప్రస్తుత అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఈ విషయాలను రాసింది. పోరు జరుగుతున్న ప్రాంతాలలో ఉన్నవారిలో కేవలం 30శాతం మందే యుద్ద సన్నద్దతతో ఉన్నారు. సెప్టెంబరు నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ సేనలలో కేవలం 47-48శాతానికి మించి లేరని చెప్పాడు. సైనికుల కొరత ఉన్నవారి మీద వత్తిడిని కూడా పెంచుతున్నది.వారినే ఒక రంగం నుంచి మరో రంగానికి పదే పదే మారుస్తున్నారు. నిరంతర దాడులను తట్టుకొనే శక్తి తగ్గుతున్నదని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారులు వాపోతున్నారు. కొత్తగా సైన్యంలోకి తీసుకున్నవారికి కూడా తగిన శిక్షణ ఇవ్వకుండా యుద్ద రంగానికి తరలిస్తున్నారు.గ్రామాల నుంచి మిలిటరీలోకి తీసుకున్నవారిలో కొందరికి కేవలం రెండు రోజులు మాత్రమే శిక్షణ ఇచ్చి యుద్ధ రంగానికి పంపుతున్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. యుద్ధం జరిగిన సమయాల్లో ఏ పక్షమైనా తమకు జరిగిన నష్టాన్ని మూసిపెడుతుంది.వర్తమాన పోరులో రష్యా, ఉక్రెయిన్‌ గురించి కూడా అలాంటి వార్తలే వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టులో వెల్లడైనట్లు చెబుతున్న ఒక పత్రం ప్రకారం 17లక్షల మంది ఉక్రేనియన్‌ సైనికులు మరణించారన్నది అతిశయోక్తితో కూడినదిగా ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ఉంటారన్నది వాస్తవం. మిలిటరీ నుంచి పారిపోవటం పెరగటానికి ఇవి కూడా కారణం.

అనేక చోట్ల ఉక్రెయిన్‌ సేనల లొంగుబాటు, రష్యా ఆధీనంలోకి పలు ప్రాంతాలు పోతున్నట్లు వచ్చిన వార్తల నేపధ్యంలో జెలెస్కీ బ్రిటన్‌ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు, ఉక్రెయిన్‌ గగనతలంపై విమానాలు ఎగరటం ప్రమాదకరంగా ఉండటంతో పక్కనే పోలాండ్‌లో విమానాన్ని సిద్దంగా ఉంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జెలెనెస్కీ ఏ ఐరోపా దేశానికి వెళుతున్నా కూడా చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతున్నారు. భద్రతా కారణాల రీత్యా తమదేశ పర్యటన గురించి వివరాలను వెల్లడించలేమని స్పెయిన్‌ ప్రధాని కార్యాలయం పేర్కొన్నట్లు రేడియో వెల్లడించింది. అయితే జెలెనెస్కీ సోమవారం నాడు ఫ్రాన్సు వెళ్లాడు. మరో వైపున అతగాడి స్థానంలో ఎవరిని గద్దెనెక్కించాలా అని ఆరునెలలుగా డోనాల్డ్‌ ట్రంప్‌ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దానిలో భాగంగానే ఇంథన ఒప్పందాలలో జెలెనెస్కీకి పది కోట్ల డాలర్ల లంచం ముట్టినట్లు, దాని గురించి దర్యాప్తు జరుగుతున్నదనే వార్తలు వచ్చాయి. అనేక దేశాల్లో ఎవరినైనా సాగనంపాలనుకున్నపుడు ఇలాంటి వాటిని ముందుకు తెచ్చి రంగం సిద్దం చేసే సంగతి తెలిసిందే. జెలెనెస్కీ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు రష్యన్‌ వర్గాలు కూడా చెబుతున్నాయి. బ్రిటన్‌ ఆశ్రయం ఇచ్చేందుకుసిద్దంగా ఉన్నప్పటికీ అక్కడ ఎంతకాలం ఉంటారన్న విశ్లేషణ కూడా సాగుతున్నది. ఇప్పటికే బ్రిటన్‌లో భవనాలను కొనుగోలు చేశాడని, రాజు చార్లెస్‌తో సంబంధాలలో ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల నాటికి డెమోక్రటిక్‌ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసేందుకు గాను దాఖలు చేసే కేసులలో జెలెనెస్కీని సాక్షిగా చేసేందుకు చూస్తున్నట్లు, దానికి గాను పారిపోతే బ్రిటన్‌ నుంచి రప్పిస్తారని కూడా చెబుతున్నారు.మరొక దేశం ఇజ్రాయెల్‌ వెళ్లినా అదే జరుగుతుంది. కీలకమైన పోకరోవస్క్‌ పట్టణం పతనమైన తరువాత ఇలాంటి పరిణామం జరుగవచ్చని భావిస్తున్నారు. జెలెనెస్కీ పర్సుగా పరిగణిస్తున్న ఒక టీవీ కార్యక్రమాల స్టూడియో యజమాని తైముర్‌ మిండిచ్‌ మీద ఇప్పుడు జాతీయ అవినీతి నిరోధకశాఖ దర్యాప్తు జరుపుతున్నది. మాజీ ఉప ప్రధాని, ప్రస్తుతం జాతీయ ఐక్యత శాఖ మంత్రిగా ఉన్న ఒలెక్సీ గురించి కూడా దర్యాప్తు జరుగుతున్నది. జెలెనెస్కీ పదవీ కాలం ముగిసింది. పోరు సాగుతున్నదనే పేరుతో పదవిలో కొనసాగుతున్నాడు, ఉక్రెయిన్‌కు తగులుతున్న ఎదురుదెబ్బల పూర్వరంగంలో అతగాడిని బలిపశువుగా చేసి కొత్త బొమ్మను గద్దె నెక్కించి కాలం గడిపేందుకు అమెరికా, ఇతర నాటో దేశాలు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. అక్కడ ఎవరు గద్దె నెక్కినా రష్యాకు వ్యతిరేకంగా నాటో దేశాల కుట్రలకు తెరపడితే తప్ప ప్రయోజనం ఉండదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్నం : అసలు కారణాలు ఏమిటి ? కాషాయ దళాల అతి తెలివి !

11 Saturday Oct 2025

Posted by raomk in Communalism, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ 1 Comment

Tags

‘Lord Vishnu’ Remarks., BJP, BR Ambedkar, BR Gavai, CJI BR Gavai, Kamaltai Gavai, Narendra Modi Failures, RSS, Sanatan Dharma, Shoe Thrown at Chief Justice Gavai, Supreme Court

ఎం కోటేశ్వరరావు

మనోభావాల మాటున ఎంతకైనా తెగించే శక్తులు రెచ్చిపోతున్న రోజులివి. అక్టోబరు ఆరవ తేదీన సుప్రీం కోర్టు పధ్రాన న్యాయమూర్తి భూషన్‌ రామకృష్ట (బిఆర్‌ ) గవాయిపై రాకేష్‌ కిషోర్‌ అనే 71 ఏండ్ల న్యాయవాది కోర్టు హాలులో బూటువిసిరి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని అవమానిస్తే హిందూస్తాన్‌లో సహించేది లేదంటూ నినాదాలు చేశాడు. అయితే తొణకని బెణకని ప్రధాని న్యాయమూర్తి ఇలాంటి చర్యలు తననేమీ చేయవని, వాదనలు కొనసాగించాలని న్యాయవాదులను కోరారు. రాకేష్‌ కిషోర్‌ను కొద్ది సేపు నిర్బంధంలోకి తీసుకున్న సిబ్బంది తరువాత వదలి పెట్టారు. ఎలాంటి కేసు దాఖలు చేయలేదు. ఈ ఉదంతాన్ని అనేక మంది తీవ్రంగా ఖండించారు. సిపిఐ(ఎం) వంటి క్నొు పార్టీలు, సంస్థలు అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు చేశాయి. మా వరకు ఇది మరచిపోయిన ఉదంతం అని తరువాత బిఆర్‌ గవాయి వ్యాఖ్యానించారు. మా సోదర న్యాయమూర్తి, నేను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనప్పటికీ మా వరకు ఇది ముగిసిపోయిన అంశము అన్నారు. సదరు లాయరు సభ్యత్వాన్ని సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ , భారత బార్‌ కౌన్సిల్‌ వెంటనే రద్దు చేశాయి. గవారు తల్లి కమలాతారు, సోదరి కీర్తి అర్జున్‌ కూడా ఖండించారు.సమస్యలు ఏవైనా ఉంటే రాజ్యాంగబద్దంగా పరిష్కరించుకోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనేందుకు ఎవరికీ హక్కులేదని కమలాతారు పేర్కొన్నారు. ఈ దాడి కేవలం వ్యక్తిగతమైనది కాదు, దేశానికే అవమానకరమైనది, ఒక విషపూరిత భావజాలంలో భాగము, దాన్ని నిరోధించాలని కీర్తి పేర్కొన్నారు.

తనది సాధారణ జన్మ కాదు అన్న ప్రధాని నరేంద్రమోడీని ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఈ దాడి తాను చేసింది కాదు,తనకసలు అలాంటి ఉద్దేశమే లేదు, దేవుడే చేయించాడని రాకేష్‌ కిషోర్‌ తరువాత చెప్పాడు. ఎఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ సెప్టెంబరు 16వ తేదీన ప్రధాన న్యాయమూర్తి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విన్నారు, దాన్ని దాఖలు చేసిన న్యాయవాది ఎవరో కూడా తెలియదు అప్పటి నుంచి తన చర్యలతో ఒక సందేశాన్ని ఇాచ్చేందుకు ప్రయత్నించినట్లు, విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సనాతన ధర్మాన్ని అవమానించారని రాకేష్‌ ఆరోపించారు. ఖజురహౌలో ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం తలనరికి వేశారు, విదేశీయులు మన దేశం మీద దండయాత్రలు చేసినపుడు అనేక దేవాలయాల మీద దాడులు చేశారు, వాటిలో ాదొకటు, తాను వ్యక్తిగతంగా ఆ విగ్రహ్నాు సందర్శించినపుడు ఏడ్చాను, అలాంటి అందమైన విగ్రహానికి తలలేకపోవటంతో ఎంతో విచారించాను, అది అందరికీ విచారం కలిగించేదే అని రాకేష్‌ కిషోర్‌ చెప్పారు. ఆ విగ్రహానికి మరమ్మతులు చేయాలన్న పిటీషనర్‌ వినతి మీద ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య తనకు విచారం కలిగించింది, మీరు దేవుడికి అంత గొప్ప భక్తులైతే ఏదో ఒకటి చేయాలని ఆ విగ్రహానికే మీరు చెప్పండి అన్నారు, దాని కంటే ఆ పిటీషన్ను కొట్టివేయటం తనకు మరింత విచారం కలిగించిందని చెప్పారు.

న్యాయమూర్తి ఏ పూర్వరంగంలో ఆ వ్యాఖ్య చేశారో గమనించటం అవసరం. ఖజురహౌ ప్రాంతం వారసత్వ సంపదగా ప్రకటించిన జాబితాలో ఉంది, దాని మీద నిర్ణయం తీసుకొనే అవకాశం కోర్టుకు లేదంటూ పిటీషన్‌ కొట్టివేసినట్లు ప్రకటించిన సందర్భంలో పిటీషనర్‌ పదే పదే తాను విష్ణుమూర్తి భక్తుడనని ప్రస్తావించటంతో అయితే ఆ విష్ణుమూర్తికే విన్నవించుకోండి, మీతీరు చూస్తే ప్రజాప్రయోజన వాజ్యంగాక ప్రచార ప్రయోజనం కోసం వేసినట్లుగా ఉందని కూడా గవాయి వ్యాఖ్యానించారు. దాడి యత్నానికి తానేమీ చింతించటం లేదని రాకేష్‌ కుమార్‌ చెప్పారు. సనాతన ధర్మాన్ని ప్రధాన న్యాయమూర్తి అపహాస్యం చేసిన క్రియకు తాను చేసింది కేవలం ప్రతిక్రియ మాత్రమే అన్నారు. తానెలాంటి మైకంలో లేనని, భయపడేవాడిని కూడా కాదన్నారు. ఇతర సామాజిక తరగతుల విషయంలో న్యాయస్థానం పెద్ద చర్యలు తీసుకున్నదంటూ హల్దవానీ రైల్వే భూమిని ఆక్రమించిన ఒక సామాజిక తరగతి నుంచి దాన్ని తొలగించాలనే కేసు సుప్రీం కోర్టు ముందుకు వచ్చినపుడు మూడు సంవత్సరాల క్రితం స్టే విధించారు, అది ఇప్పటికీ కొనసాగుతున్నది, నూపూర్‌ శర్మ కేసు వచ్చినపుడు మీరు వాతావరణ్నాు చెడగొట్టినట్లు కోర్టు వ్యాఖ్యాుంచింది, ఇలా అన్నీ వారే చేస్తారు, అదంతా సక్రమంగా ఉందనుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. రోజూ సామాజక మాధ్యమం, ఇతర మాధ్యమాల్లో కాషాయ దళాలు చేస్తున్న వాదనలన్నింటినీ ఈ సందర్భంగా వల్లించారు. తాను ఒక సాధారణ వ్యక్తిని కాదని ఎంఎస్‌సి, పిడి. గోల్డ్‌మెడలిస్ట్‌ మరియు ఎల్‌ఎల్‌బి చదివినట్లు, తనకే పార్టీ, సంస్థ మద్దతు లేదని చెప్పుకున్నారు. తన సామాజిక తరగతి గురించి అతనేమీ చెప్పలేదు గానీ దళితుడని సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. సనాతన ధర్మం, మను ధర్మం పేరుతో వేల సంవత్సరాలుగా అంటరాని వారంటూ దళితులను తీవ్ర వివక్ష, అవమానాలకు గురిచేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సామాజిక తరగతికి చెందిన వ్యక్తై ఉండి ఆ సనాతన ధర్మం కోసం ఈ పని చేశానని చెప్పటం, సామాజిక స్పృహను కోల్పోయిన ఉన్మాద స్థితిలోకి వెళ్లిన అతన్ని చూసి నిజంగా జాలిపడాలి. ఆ విష్ణువునే ప్రార్ధించండి అని అనటం సనాతన ధర్మాన్ని అవమానించటమా ? అదే గనుక అయితే నైజాం నవాబు జైల్లో పెట్టినపుడు ఎవడబ్బ సొమ్మని కులికావు రామచంద్రా అని భక్తరామదాసు నిరసనగా కీర్తన పాడినట్లు ప్రచారంలో ఉన్నదే దానికి మనోభావాలు దెబ్బతిని ఎవరిని చెప్పుదెబ్బలు కొడతారు. వేదవిద్యలెల్ల వేశ్యల వంటివి, భ్రమలు పెట్టి తేటపడగనీవు,అన్న వేమన, కనక మృగము భువినికద్దు లేదనక యే, తరుణి విడిచిపోయె దాశరధియు, తెలివిలేనివాడు దేవుడెట్లాయరా అన్న సంగతి తెలిసిందే. అందువలన మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరుతో వేమన మీద దాడులు చేస్తారా ?

మీడియాతో మాట్లాడినదాన్ని బట్టి రాకేష్‌ కుమార్‌ ఒక పథకం ప్రకారమే దాడికి యత్నించినట్లు చెప్పవచ్చు. ఎందుకంటే నిజంగా మనోభావాలు గాయపడిన వారి లక్షణం వెంటనే స్పందించటం, గవారు వ్యాఖ్య చేసిన రోజు లేదా మరుసటి రోజే ఆపని చేసి ఉంటే 71ఏండ్ల వయస్సు వచ్చినా ఉద్రేకం తగ్గలేదు భావించేందుకు ఆస్కారం ఉండేది. కానీ ఇరవై రోజుల తరువాత బూటు విసిరేందుకు పూనుకోవటం అప్పటికప్పుడు కలిగిన స్పందన అంటారా ? ఒక పథకం ప్రకారం చేసింది తప్ప మరొకటి కాదు. నూపూర్‌ శర్మ గురించి న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. మరి ఆ రోజు ఈ పెద్దముషి అలాంటి ప్రతిక్రియకు పాల్పడాలని అనిపించలేదా ? కోర్టు అన్నదాన్ని తప్పు పట్టారు, ఒకే. ఆమె నోటితుత్తరతో విదేశాల్లో కూడా తలెత్తిన నిరసన కారణంగా వారిని సంతుష్టీకరించేందుకు చర్య తీసుకొని బిజెపి అసలు ప్రజాజీవనంలో తిరిగి కనిపించకుండా చేసింది కదా ? ఆలాంటి పార్టీ నేతల మీద బూటు విసిరి ప్రతీకారం తీర్చుకోవాలని ఎందుకు అనిపించలేదు ? చట్టం ముందు అందరూ సమానులే, గవారు వ్యాఖ్య తప్పు లేదా నేరం అనుకుంటే తానే కేసు ఎందుకు దాఖలు చేయలేదు. ఖజురహౌ విగ్రహం గురించి తాను కేంద్ర ప్రభుత్వాుకి అనేక లేఖలు రాసినా స్పందన లేదని కూడా దరఖాస్తుదారు కోర్టులో చెప్పారు. హిందువుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, పురావస్తుశాఖ మంత్రి మీద ప్రతిచర్య తీసుకోవాలని రాకేష్‌ కుమార్‌ను దేవుడు ఆదేశించలేదా ? ఎవరి మీద బూటు విసరాలో లేదో దేవుడు వడపోతద్వారా ఎంచుకొని ఆదేశిస్తాడా ? తన వ్యాఖ్యల మీద సామాజిక మాధ్యమంలో భిన్నంగా చిత్రిస్తూ ప్రచారం చేస్తున్నారని కొందరు తన దృష్టికి తెచ్చారని, తనకు అన్ని మతాల మీద గౌరవం ఉందు గవారు స్పష్టం చేశారు.రాకేష్‌ కుమార్‌ చర్యను హిందూత్వశక్తులు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద తొలిసారిగా బూటువిసిరినట్లు ఒక సంస్థ వ్యాఖ్యానించింది. రాకేష్‌కు ఉన్న సంబంధాల గురించి చర్చ అవసరం లేదు. దేశంలో విచ్చలవిడిగా వ్యాపిస్తున్న విద్వేష కాషాయ వైరస్‌ సోకిన వ్యక్తి అన్నది స్పష్టం. దానికి నివారణ తప్ప ఎయిడ్స్‌ మాదిరి చికిత్సలేదు. అతగాడి బుర్ర ఎంతగా చెడింది అంటే ” జరిగిందేదో జరిగింది, వడపోత న్యాయం, దుర్మార్గమైన(బ్లడీ) ఈ లౌకికవాదం ప్రమాదకరంగా హిందువుల అనేక ప్రాధమిక హక్కులను తిరస్కరిస్తున్నది.” అనే వ్యాఖ్యలు అతగాడి నోటి వెంట వచ్చాయంటే రాజ్యాంగమౌలిక లక్షణాలకు వ్యతిరేకి అని వేరే చెప్పనవసరం లేదు. రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం, సామ్యవాదం పదాలను తొలగించాలని అర్‌ఎస్‌ఎస్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి భావజాలం కలిగిన వ్యక్తి ఇరవై రోజుల తరువాత బూటు విసిరాడంటే కుట్రలో భాగంగానే జరిపిందన్నది స్పష్టం.

ఇలా చెప్పటాుకి హేతువు ఏమిటి ? సెప్టెంబరు 16న గవారు వ్యాఖ్యల మీద సామాజిక మాధ్యమంలో కాషాయదళాలు విరుచుకుపడ్డాయి తప్ప పక్కా హిందూత్వ సంస్థలుగా చెప్పుకొనేవేవీ కూడా మనోభావాల పేరుతో విమర్శలకు, దాడులకు దిగలేదు. అక్టోబరు ఐదవ తేదీన అమరావతి పట్టణం(మహారాష్ట్ర)లో జరిగే విజయదశమి కార్యక్రమాలకు అతిధిగా రావాల్సిందిగా గవాయి తల్లి కమలాతారును ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానించింది. ప్రముఖులు లేదా వారి సంబంధీకులను బుట్టలో వేసుకొనే ప్రక్రియ, వారికి కాషాయ రంగు పులమటంలో సంఘమేథావులకు మరొకరు సాటి రారు. దాన్లో కూడా పెద్ద రాజకీయమే నడిచింది. గట్టి అంబేద్కరిస్టు కుటుంబం, అందునా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాతృమూర్తి తమ సభకు వచ్చారంటే తమ భావజాల్నాు ఆమోదించినట్లే అని ప్రచారం చేసుకొనే చౌకబారు ఎత్తుగడ దానిలో ఉంది.తమ ఆహ్వానాన్ని మన్నించి ఆమె హాజరుకానున్నట్లు మీడియాలో ప్రచారం చేయించారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానాన్ని కమలాతారు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. దాదాసాహెబ్‌ గవాయి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షురాలిగా ఉన్న తాను అంబేద్కర్‌ భావజాలం, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న వ్యక్తినని, అలాంటి కార్యక్రమాుకి హాజరు కావటం అంటే సామాజిక చైతన్యానికి హాని జరిగినట్లే అంటూ ఆమె ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్యక్రమానికి హాజరుకావటం లేదు, సమర్ధించటం లేదు, రాజ్యాంగ విలువలకు తమ కుటుంబం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. బౌద్దులు విజయదశమి రోజును అశోక్‌ విజయదశమి లేదా ధర్మచక్ర పరివర్తన దినంగాగా పాటిస్తారు, ఆ రోజునే చక్రవర్తి అశోకుడు బౌద్దాన్ని స్వీకరించాడు, అంబేద్కరిస్టులకు ఆ విధంగా ఆ రోజు ఎంతో ముఖ్యమైనదని కూడా స్పష్టం చేశారు. తన అంగీకారం, అనుమతి తీసుకోకుండానే రాక గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేసింది, అలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు, ఆహ్వానాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ విడుదల తరువాత రిపబ్లికన్‌ పార్టీ నాయకుడైన ఆమె రెండో కుమారుడు డాక్టర్‌ రాజేంద్ర ఆ కార్యక్రమాుకి తన తల్లితో పాటు తాను కూడా హాజరవుతున్నట్లు గట్టిగా చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానాన్ని తాను అంగీకరించినట్లు చెప్పారు. గవారు తల్లి లేఖ కాషాయదళాలకు చెప్పుకోరాని చోట తగిలిన దెబ్బ. ఆ కార్యక్రమ మరుసటి రోజే గవారు మీద బూటుదాడి యత్నం జరిగింది.దానికీ దీనికి ఎలాంటి సంబంధం లేదంటారా ?

ఈ సందర్భంగా గవాయి కుటుంబ నేపధ్యం గురించి చెప్పుకోవటం కూడా అవసరం.గవాయిసోదరుల తండ్రి ఆర్‌ఎస్‌ గవారు రిపబ్లికన్‌ పార్టీ సీనియర్‌ నేత, యువకుడిగా అంబేద్కర్‌తో కలసి పని చేశారు. నాగపూర్‌ దీక్షభూమి సంపర్క సమితి అధ్యక్షుడిగా ఉన్నారు, 1998లో అమరావతి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎు్నకయ్యారు. కాంగ్రెస్‌ పాలనా కాలంలో 2006 నుంచి 11వరకు బీహార్‌, సిక్కిం, కేరళ గవర్నర్‌గా పుచేశారు. కాంగ్రెస్‌ మద్దతుదారుగా ఆ పదవుల్లో ఉన్నపుడు కేరళలో నేటి ముఖ్యమంత్రి పినరరు విజయన్‌పై నాటి మంత్రివర్గ సిఫారసును తోసిపుచ్చి ఎస్‌ఎన్‌సి-లావ్లియన్‌ కేసులో సిబిఐ దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశించారు. కాంగ్రెస్‌ మద్దతుతో తన తండ్రి నాలుగుదశాబ్దాల పాటు ఎంఎల్‌ఏ, ఎంపీగా పు చేశారు, తన సోదరుడు ఆర్‌పిఐ నేతగా కాంగ్రెస్‌కు దగ్గరగా ఉంటారు ఒక సందర్భంగా బిఆర్‌ గవారు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. చిత్రం ఏమిటంటే హిందువుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రబోధించే ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు మహారాష్ట్రలో హిందూత్వ సంస్థలు, వ్యక్తుల మనోభావాలను తుంగలో తొక్కారు. గవారు కుటుంబం పక్కా ఆంబేద్కరిస్టు , అనేక సందర్భాలలో హిందుత్వ వ్యతిరేక మనోభావాలతో విభజించేందుకు చూసిందంటూ అలాంటి కుటుంబానికి చెందిన మహిళను విజయదశమి కార్యక్రమానికి పిలవటం ఏమిటంటూ వారు అమరావతి కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల మీద ధ్వజమెత్తారని వార్త. జనాల్లో ఒక పునాదిని ఏర్పాటు చేసుకొనేందుకు దశాబ్దాల తరబడి హిందూత్వశక్తులు విద్వేషాన్ని రెచ్చగొట్టాయి.వచ్చిన అధికారాన్ని నిలుపుకోవాలంటే మద్దతుదార్లను మరింతగా పెంచుకోవాలి, విద్వేష ప్రచారం దానికి అడ్డుపడుతున్నది. అందుకే గోముఖవ్యాఘ్రం మాదిరి చెబుతున్న సుభాషితాలు పూర్తిగా విద్వేషం తలకెక్కిన వారికి మింగుడుపడటం లేదు. దేశంలో ఉన్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవులదందరిదీ ఒకే డిఎన్‌ఏ, సామాజిక సామరస్యత కోసం గొడ్డు మాంసం తినటం, ముస్లింలు లేకుండా హిందూరాష్ట్రం ఉండదు, వంటి మాటలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అలాంటి వారు తమ మనోభావాలను అణచివేసుకుంటున్నారు తప్ప ఆ కబుర్లు చెప్పిన వారి మీద బూట్లు విసరటం, దాడుల వంటి వాటికి పాల్పడటం లేదు. అలాంటివి చేస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ లాఠీలు వారి వీపులు పగలగొడతాయి మరి.

ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి శక్తులు బూటు ఉదంతాన్ని తప్పు పడుతూనే అతి తెలివితేటల వాదనలను ముందుకు తెస్తున్నాయి. రాకేష్‌ కుమార్‌ మీద కేసు పెట్టి విచారణ జరపాలంటున్నాయి. అలా ఎందుకు చేశారో న్యాయస్థానాల విచారణల్లో నమోదు కావాలి. ఇది ప్రజాస్వామ్యం కనుక ఒక టెర్రరిస్టుకు సైతం తన వాదనలు చెప్పుకొనేందుకు అవకాశం ఇస్తున్నపుడు రాకేష్‌ కుమార్‌కు కోర్టులో చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి అంటూ సామాజిక మాధ్యమంలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంటే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని బోనెక్కించాలని చెప్పటం తప్ప మరొకటి కాదు. జాతిపిత మహాత్మాగాంధీని తానెందుకు చంపిందీ వివరిస్తూ కోర్టులో గాడ్సే చేసిన వాదనలను పుస్తకాలుగా ముద్రించి ప్రచారం చేస్తున్న కాషాయ దళం బూటు ఉదంతాన్ని కూడా అలాంటి హిందూత్వ ప్రచారానికి వినియోగించుకోవాలన్న అతితెలివి తప్ప మరొకటి కాదు. అందుకే ఆ దాడి వెనుక పెద్ద కుట్రదాగి ఉందు చెప్పాల్సి వస్తోంది. ఒక దళితుడైన ప్రముఖుడి మీద మరో దళితుడితో దాడి చేయించటం కుట్రగాక మరేమిటి ? దేశంలో వివిధ మఠాలు, స్వాములు మౌనంగా ఉండి రాకేష్‌ కుమార్‌ను ఉసికొల్పటాన్ని అర్దం చేసుకోలేనంత అమాయకంగా నేడు దళిత సామాజిక తరగతి ఉందా ? సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్‌ గవాయి ఎంతో సముచితంగా, హుందాగా వ్యవహరించారని వేరే చెప్పనవసరం లేదు, బూటువెనుక ఉన్న కుట్రను వెంటనే గ్రహించారేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పశ్చిమ దేశాల తీరు : ఒకవైపు కార్మికవర్గంపై దాడి మరోవైపు రష్యాతో లడాయి !

08 Wednesday Oct 2025

Posted by raomk in Current Affairs, Economics, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Another Cold war, Cold War, Donald trump, Europe workers struggle, Putin warns US, Tomahawk missiles, Ukraine, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు

నాటో కూటమితో చేతులు కలిపి తమ మీద చేస్తున్న కుట్రకు ప్రతిక్రియగా ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య బుధవారం నాడు 1,322వ రోజులో ప్రవేశించింది. పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఐరోపా అంతటా దోపిడీకి గురౌతున్న కార్మికుల సమ్మెలు ఒక వైపు, మరోవైపు రష్యాను దెబ్బతీసేందుకు అమెరికాతో కలసి పాలకవర్గాల కుట్రలు కనిపిస్తున్నాయి. తమ మీద దాడులు చేసేందుకు అమెరికా గనుక తోమహాక్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తే సంబంధాలు నాశనం అవుతాయని రష్యన్‌ అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ అమెరికానుద్దేశించి చెప్పాడు. నిజానికి ఇది ట్రంప్‌కే కాదు, కయ్యానికి ఎగదోస్తున్న యావత్‌ ఐరోపా ధనిక దేశాలకు చేసిన హెచ్చరిక. ఆ ప్రకటన మరుసటి రోజు డోనాల్డ్‌ ట్రంప్‌ విలేకర్లు అడిగిన ప్రశ్నలపై స్పందించాడు.” నేనూ కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాను, ఆ పోరు మరింతగా పెరగాలని కోరుకోవటం లేదు ” అన్నాడు. పశ్చిమ దేశాలతో మరో ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నట్లు తమ మీద చేస్తున్న ఆరోపణను రష్యా తోసిపుచ్చింది. తమ మీద దాడులు చేసేందుకు, మిలటరీ ఖర్చు పెంచేందుకు నెపాన్ని తమ మీద నెట్టాలని ఐరోపా యూనియన్‌, నాటో కూటమి దేశాలు లేని పోని కథలను వ్యాపింప చేస్తున్నాయని గత ప్రచ్చన్న యుద్దంతో పోల్చటాన్ని అంగీకరించటం లేదని రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా ఝకరోవా గత వారంలో స్పష్టం చేశారు.క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెష్కోవ్‌ మాట్లాడుతూ ఐరోపా అంతటా ఇటీవల కనిపించిన డ్రోన్లకు రష్యా కారణమని నిందించటానికి ఎలాంటి హేతుబద్దత లేదన్నాడు.డ్రోన్ల వెనుక రష్యా ఉందని భావిస్తున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్య తరువాత ఐరోపాలోని అనేక మంది రాజకీయవేత్తలు అన్నింటికీ రష్యా కారణమని నిందిస్తున్నారన్నాడు.

క్యూబన్‌ క్షిపణుల సంక్షోభం 1962 తరువాత రష్యా మరియు పశ్చిమ దేశాల మధ్య ఉక్రెయిన్‌ సంక్షోభ రూపంలో తలెత్తిన ఘర్షణ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో తీవ్రమైనది,అతి పెద్దది. తాము ఇప్పటికే మరో రూపంలో ఉన్న ఘర్షణలో ఉన్నామని, అదేమాత్రం ప్రచ్చన్న యుద్ధం కాదు ఇప్పటికే ఇక్కడ మంటలు ఉన్నాయని మరియ ఝకరోవా చెప్పారు. అలాస్కా భేటీ తరువాత శాంతి అవకాశాలు ఆవిరవుతున్నట్లు జరిగే పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తమ అజెండాను అమలు జరిపేందుకు పశ్చిమ దేశాలు సరికొత్త ప్రచారదాడిని మొదలు పెట్టాయి. తమ గగనతలాన్ని అతిక్రమిస్తున్నందంటూ వివిధ దేశాలు ఒక పథకం చేస్తున్న ప్రచారాన్ని రష్యా తిరస్కరించినప్పటికీ గోబెల్స్‌ ప్రచారం సాగుతున్నది. ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా మెల్ల మెల్లగా కొత్త ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది.దానికి పోటీగా పశ్చిమ దేశాల గగనతల అతిక్రమణ కతలను ముందుకు తెచ్చాయి. ఆ పేరుతో మిలిటరీ బడ్జెట్‌లను పెంచేందుకు, సంక్షేమ పథకాలకు కోత విధించేందుకు పూనుకున్నారు. తమకు వ్యతిరేకంగా నాటో కూటమి కుట్రపన్నిందని పుతిన్‌ ఉక్రెయిన్‌ సంక్షోభ ప్రారంభానికి ముందు నుంచీ చెబుతున్నాడు.సోవియట్‌ పతనమైన 1991లో నాటో కూటమిని తూర్పు వైపు విస్తరించబోమని చెప్పి దాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించాయి. రష్యా సరిహద్దుల్లో ఉన్న ఉక్రెయిన్‌, జార్జియా వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మాస్కో వ్యవహారాలను నియంత్రించేందుకు చూశాయని అదే తమ మిలిటరీ చర్యకు కారణమని, అలాంటి కుట్రకు స్వస్థి పలికితే వెంటనే దాడులను నిలిపివేస్తామని పదే పదే చెబుతున్నాడు.

రష్యా చెబుతున్న అంశాలను విననట్లు నటిస్తున్న పశ్చిమ దేశాలు తీవ్రమైన ఆంక్షలను ప్రకటించి దిగ్బంధనం కావించేందుకు చూసినప్పటికీ వాటన్నింటిని మాస్కో ఇప్పటి వరకు అధిగమించింది. మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు అందించి దాడులు చేయించాయి.ఫలితం లేకపోవటంతో ఇప్పుడు మాస్కోతో సహా రష్యాలోని ఐరోపా ప్రాంతాలన్నింటిపైనా దాడులు చేయగల రెండున్నరవేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే తమ తోమహాక్‌ క్షిపణులను అందచేయాలని అమెరికా చూస్తున్నది. అనేక ఐరోపా దేశాలు వాటిని అడుగుతున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వారం రోజుల క్రితం ప్రకటించాడు.నేరుగా ఉక్రెయిన్‌కు అందిస్తే విమర్శలపాలు కావాల్సి వస్తుందనే భయంతో ఇతర దేశాలకు విక్రయించి అక్కడి నుంచి మళ్లించాలన్నది ఎత్తుగడ. అయితే జెలెనెస్కీ సేనలకు వాటిని అందచేసినప్పటికీ ఉపయోగించే సామర్ధ్యం లేదు. ఆ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. ఆ క్షిపణులు తమ దగ్గర ఉంటే పుతిన్‌పై వత్తిడి పెంచటానికి తోడ్పడతాయని అన్నాడు. అందుకే అదే జరిగితే పశ్చిమ దేశాలతో సంబంధాల విచ్చిన్నానికి దారితీస్తుందని పుతిన్‌ హెచ్చరించాడు. ఇవ్వాలా లేదా అన్నది అమెరికా తేల్చుకోవాల్సి ఉంది. ఇస్తామంటే ఎలాంటి స్పందనలు వస్తాయో తెలుసుకొనేందుకు వాన్స్‌ ద్వారా ట్రంప్‌ మాట్లాడించాడు. రష్యా ఇంథన మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని ఉక్రెయిన్‌కు అందచేసేందుకు వాషింగ్టన్‌ నిర్ణయించిందని, వాటిని ధ్వంసం చేయాలంటే దీర్ఘశ్రేణి క్షిపణులు అవసరమౌతాయని వాటిని ఇవ్వటమా లేదా అన్న గుంజాటనలో ఉన్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది.

అమెరికన్లు ప్రత్యక్షంగా పాల్గ్గొంటే తప్ప తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించటం అసాధ్యమని, అదే జరిగితే ఉద్రిక్తలు నూతన దశకు చేరతాయని పుతిన్‌ గతవారంలో హెచ్చరించాడు. అలాంటి క్షిపణులను ఇచ్చేది లేదని గతంలో ట్రంప్‌ ప్రకటించాడు. అయితే ఉక్రెయిన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి కెయిత్‌ కెల్లాగ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రష్యా మీద దీర్ఘశ్రేణి లక్ష్యాలపై దాడులను చేసే స్థితిలో ఉక్రెయిన్‌ ఉందని ట్రంప్‌ సూచన ప్రాయంగా చెప్పినట్లు తెలిపాడు.తన పాటలకు అనుగుణ్యంగా పుతిన్‌ నృత్యం చేయటం లేదనే ఉక్రోషంతో ఈ విపరీత చర్య గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పవచ్చు. పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి ఎప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అమెరికా మీడియా క్సియోస్‌తో మాట్లాడిన జెలెనెస్కీ తాము కూడా రష్యా ఏది చేస్తే ప్రతిక్రియగా అదే చేస్తామన్నాడు.తమ ఇంథన వనరులపై పుతిన్‌ సేనలు దాడి చేస్తే తాము కూడా అదే చేస్తామన్నాడు.కెయిత్‌ కెలోగ్‌ ఒక మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ ఇప్పటికే రష్యాలో ఉన్న కొన్ని ప్రత్యేక లక్ష్యాలపై దాడులకు కీవ్‌ను అనుమతిస్తున్నట్లు చెప్పాడని తెలిపాడు. సురక్షిత ప్రాంతాలనేవి లేవని అన్నాడు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు నిలిపివేయాలని కోరుతున్న శక్తులపై ఇటీవల గెలిచిన చెక్‌ అధ్యక్షుడు పీటర్‌ పావెల్‌ మాట్లాడుతూ సరఫరా కొనసాగించాల్సిందే అన్నాడు. తగ్గించినా, నిలిపివేసినా మనకు మనమే హాని చేసుకున్నట్లని వ్యాఖ్యానించాడు. 650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల మీద దాడులు చేయగల డ్రోన్‌ క్షిపణి వ్యవస్థలను తాము స్వంతంగా తయారు చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ చెప్పింది, అది నిజమో కాదో తెలియదు గానీ నిజమైతే దాని వెనుక నాటో దేశాల హస్తం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అంతే ఫ్లెమింగో పేరుతో తాము మూడువేల కిలోమీటర్ల దూరం ప్రయణించే క్షిపణిని తయారు చేసినట్లు కూడా కీవ్‌ చెప్పుకుంది. అంటే పశ్చిమదేశాల ఆయుధాలకు ఉక్రెయిన్‌ ముద్రవేసి రష్యా మీద దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పవచ్చు.బహుశా వీటిని గమనించే పుతిన్‌ చేసిన తాజా హెచ్చరిక పరమార్ధం.

మరోవైపున ఐరోపా అంతటా ఇటీవల జరుగుతున్న వివిధ రంగాల సమ్మెలను గమనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నెలలో అనేక దేశాల్లో విమానాశ్రయాల సిబ్బంది సమ్మెకు పిలుపులు ఇచ్చారు. అందువలన ప్రయాణీకులు ఒకటికి రెండుసార్లు తమ విమానాలు నడిచేదీ లేనిదీ తనిఖీ చేసుకోవాలని ఆ రంగానికి చెందిన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పని పరిస్థితులు, వేతన పెంపుదల వంటి అంశాలు ప్రధానంగా సమ్మెలకు పురికొల్పుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల సమ్మెలు, ఇతర రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 నుంచి స్పెయిన్‌లోని అనేక విమానాశ్రయాలలో సిబ్బంది ఆందోళన కారణంగా అనేక విమానాలు నిలిచిపోయాయి. ప్రతి బుధ,శుక్ర, శనివారాల్లో విమానాలు దిగేందుకు పని చేసే సిబ్బంది ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు సమ్మెలు చేస్తున్నారు, ఈ ఆందోళన డిసెంబరు 31వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఫ్రాన్సులో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ నియమించిన ఏడవ ప్రధాని లికోర్ను రాజీనామా చేశాడు. సెప్టెంబరు 9న పదవీ బాధ్యతలు స్వీకరించి కేవలం 26 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ఏలుబడిలో ఉన్న వ్యక్తిగా చరిత్రకెక్కాడు. అంతకు ముందు బడ్జెట్లో కోతలను ప్రతిపాదించిన ఫ్రాంకోయిస్‌ బేయరు నాటకీయంగా గద్దె దిగాల్సి వచ్చింది.కేవలం రెండు సంవత్సరాల్లోనే ఐదుగురు ప్రధానులను నియమించారు. పోర్చుగల్‌లో వచ్చే జనవరి వరకు ప్రకటించిన 71 రోజుల ఆందోళన పిలుపును కోర్టు ఆదేశాల కారణంగా వెనక్కు తీసుకున్నారు. కనీస సిబ్బంది విధుల్లో ఉండాల్సిందే అని కోర్టు ఆదేశించింది. ఇది సమ్మెహక్కుపై నిజమైన దాడి అని కార్మిక సంఘం విమర్శించింది. ఇటలీ రవాణా రంగంలో అనేక అంశాలపై ఒప్పందాలకు రావటంలో విఫలం కావటంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. దీనికి తోడు గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండను నిరసిస్తూ జరిగిన సాధారణ సమ్మెకు కార్మికులు మద్దతు ప్రకటించి లక్షలాది మంది ప్రదర్శనల్లో పాల్గన్నారు. చాలీ చాలని వేతనాలతో బతుకులీడుస్తున్నామని స్వంత ఇల్లు కొనుగోలు చేసేందుకు అవసరమైన రీతిలో తమవేతనాలను పెంచాలని బ్రిటన్‌లో రైల్‌,మారిటైమ్‌ మరియు ట్రాన్ప్‌పోర్ట్‌ (ఆర్‌ఎంటి) యూనియన్‌ ప్రచార ఆందోళన నిర్వహిస్తున్నది.వేతన పెంపుదలను కోరుతూ రెండు రోజుల పాటు సమ్మె జరపాలని ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ (టిఎఫ్‌ఎల్‌) పిలుపు ఇవ్వగా 4.5శాతం పెంపుదలకు అంగీకరించటంతో ఆందోళన విరమించారు. కార్మికవర్గం జరుపుతున్న సమ్మెలకు వ్యతిరేకంగా మీడియాలో ఉన్న యాజమాన్య అనుకూల వ్యాఖ్యాతలు వక్రీకరణలతో విశ్లేషణలు రాస్తున్నారు. స్వంత ఇల్లు కొనుగోలు బ్రిటన్‌లో ఒక హక్కుగా లేదన్నది వాటిలో ఒకటి. బ్రిటన్‌లో 1947 నుంచి ప్రతి ఏటా రైల్వే కార్మికులు సమ్మెలు చేస్తున్నారంటూ ఒక వ్యాఖ్యాత ఉక్రోషం వెలిబుచ్చాడు.బడ్జెట్‌లోటు ఏర్పడినపుడల్లా ఫ్రాన్సులో ఆ భారాన్ని కార్మికవర్గం మీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో జిడిపిలో ఐదుశాతం ఉన్నపుడు 1995లో జరిగిన ఆందోళనల్లో ఇరవై లక్షల మంది రోడ్ల మీదకు వచ్చారు. నాటి ప్రధాని అలైన్‌ జుపే అంతకు ముందు ప్రతిపాదించిన అనేక పొదుపు చర్యలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అధ్యక్షుడు మక్రాన్‌ 2023లో ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 64 సంవత్సరాలకు పెంచి పెన్షన్‌ బిల్లును తగ్గించేందుకు చూశాడు.ఇప్పుడు మరో మితవాద ప్రధాని లీకొర్ను అదే విధానాలతో ఇంటిదారి పట్టాడు.ఐరోపా పాలకవర్గ సంక్షోభం, దానికి కార్మికవర్గం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనకు ఇది ఒక సాక్ష్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కరీబియన్‌ ప్రాంతంలో చిచ్చు : వెనెజులా మిలిటరీ విన్యాసాలు, దాడులకు అమెరికా సన్నాహం !

12 Friday Sep 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Chavez, Donald trump, Nicolás Maduro, US boat attack, Venezuela, venezuelan chavista


ఎం కోటేశ్వరరావు


మాదక ద్రవ్యాల ముఠాలను అరికట్టే సాకుతో వామపక్ష పాలనలో ఉన్న వెనెజులాపై దాడులు చేసేందుకు అమెరికా సన్నాహాలు చేసింది. ఏ క్షణమైనా విరుచుకుపడవచ్చని వార్తలు వస్తున్నాయి. అధ్యక్షుడు మదురోను గద్దె దింపటం తమ లక్ష్యం కాదని చెబుతున్నప్పటికీ ఎవరూ నమ్మటం లేదు. అమెరికా దుర్మార్గాన్ని ప్రతిఘటించేందుకు సరిహద్దులో మదురో కూడా మిలిటరీని మోహరించి గురువారం నాడు త్రివిధ దళాలతో విన్యాసాలు నిర్వహించారు. వెనెజులా భూభాగంలో ఉన్న మాదకద్రవ్యాల మాఫియాలపై మిలిటరీ దాడులు చేస్తారా అన్న విలేకరి ప్రశ్నకు మీరే చూస్తారుగా అంటూ ట్రంప్‌ చెప్పటాన్ని బట్టి అమెరికా ఆంతర్యం స్పష్టంగా కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం కరీబియన్‌ సముద్రంలో ఒక పడవపై దాడి అమెరికా మిలిటరీ దాడి చేసి పదకొండు మందిని చంపివేసింది.వారికి మదురోకు సంబంధాలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నద్ని అ బోటులో ఉన్నవారెవరికీ అమెరికా చెప్పే మాదక ద్రవ్యాల ముఠాతో ఎలాంటి సంబంధాలు లేవని మదురో సర్కార్‌ ప్రకటించింది. తమ కుటుంబ సభ్యులు కనిపించటం లేదని బంధువులు చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నది.తొలుత ఆ ఉదంతం కృత్రిమ మేథతో సృష్టించిన వీడియో అని మదురో పేర్కొన్నారు. వెనెజులా నుంచి వచ్చిన ఆ మోటార్‌ బోట్‌లో మాదకద్రవ్యాలు ఉన్నట్లు స్వయంగా ట్రంప్‌ కత చెప్పాడు. ఆ ముఠా అమెరికాలో హింసాత్మక చర్యలకు, మాదక ద్రవ్యాల వ్యాప్తి, సామూహిక హత్యలు, అమ్మాయిల అక్రమరవాణాకు పాల్పడుతున్నదని ఆరోపించాడు. ఆ తరువాత పోర్టారికోకు పది ఎఫ్‌ 35 రకం యుద్ధ విమానాలను అమెరికా తరలించింది. తప్పుడు సాకులతో అమెరికా దాడులకు పూనుకున్నదని మదురో శుక్రవారం నాడు చెప్పారు. మారణాయుధాలను గుట్టలుగా పోసినట్లు ప్రచారం చేసి ఇరాక్‌ మీద దాడులు చేసినట్లుగానే తమపై అమెరికా దుర్మార్గానికి పాల్పడేందుకు పూనుకున్నదన్నాడు. అనేక దేశాలతో పోల్చితే తమ దేశం ద్వారా రవాణా అవుతున్న మాదకద్రవ్యాలు స్పల్పమని చెప్పాడు. అమెరికన్లు వెనక్కు తిరిగి పోలేని చోటికి చేరుకుంటున్నారని హెచ్చరించారు. మదురోను అరెస్టు చేసేందుకు వీలు కలిగే సమాచారం ఇచ్చిన వారికి ఐదు కోట్ల డాలర్లు ఇస్తామని ఆగస్టు నెలలో అమెరికా ప్రకటించిన అంశం తెలిసిందే.1998లో హ్యూగో ఛావెజ్‌ నాయకత్వంలో వామపక్షాలు అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలను కూలదోసేందుకు మితవాద నేతలకు అనేక రకాలుగా అమెరికా సాయం చేసినప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. విధించిన ఆంక్షలు పనిచేయటం లేదు. ఇప్పుడు మాదకద్రవ్యాల పేరుతో మరోకుట్రకు తెరలేపారు.


కరీబియన్‌ అంతర్జాతీయ జలాల్లో ఉన్న పడవను ఆపేందుకు, ప్రాణాలతో దాన్లో ఉన్నవారిని పట్టుకొనేందుకు అమెరికా మిలిటరీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.నేరుగా కాల్పులు జరిపి చంపివేయటం ద్వారా తాను తలచుకొంటే ఏ దేశంపై అయినా యుద్ధాన్ని ప్రకటిస్తామని, ఎవరినైనా మట్టుబెడతామనే బెదిరింపు సందేశాన్ని ఆప్రాంత దేశాలకు పంపినట్లయింది.తమకు పూర్తి అధికారాలు, సత్తా ఉందని ఈ ఉదంతంపై విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించాడు. పడవపై దాడి ఉదంతానికి ఒక రోజు ముందు మదురో మాట్లాడుతూ అమెరికన్లు అవాస్తవాలు చెబుతున్నారని వారు వెనెజులా చమురు, గ్యాస్‌ను ఉచితంగా దోచుకొనేందుకు వస్తున్నారని అందుకోసం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతారని హెచ్చరించాడు. 1898లో స్పెయిన్‌తో యుద్దాలకు తప్పుడు ప్రచారం చేశారని, 1964లో వియత్నాంపై దాడికి టోంకిన్‌ గల్ప్‌ కల్పిత ఉదంతాన్ని, 2003 ఇరాక్‌పై మారణాయుధాల గుట్టల గురించి ప్రచారం చేశారని అన్నాడు.మోనికా లెవెన్సీతో తన అక్రమ సంబంధ ఉదంతం నుంచి అమెరికన్లను పక్కదారి పట్టించేందుకు నాటి అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ సూడాన్‌ మీద దాడి చేయించాడని ఇప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అలాంటి కుంభకోణంలో జెఫ్రి ఎప్‌స్టెయిన్‌ ఫైళ్లలో కూరుకుపోయాడని అన్నాడు.


తన ప్రత్యర్ధులైన ఇరాన్‌,లెబనాన్‌,హుతీ, హిజబుల్లా, హమస్‌ అగ్రనేతలను ఒక ప్రకారం మట్టుబెడుతున్న క్రమంలో ఇజ్రాయెల్‌ తాజాగా ఎమెన్‌ ప్రధాని, మంత్రులను హతమార్చటాన్ని చూశాము. ఈ దుర్మార్గాలన్నింటికీ అమెరికా, ఇతర పశ్చిమదేశాల సంపూర్ణ మద్దతు ఉంది. లాటిన్‌ అమెరికాలో వామపక్ష నేతలు అమెరికాకు కొరకరాని కొయ్యలుగా మారిన పూర్వరంగంలలో వారిని హతమార్చేందుకు అమెరికా చూస్తున్నది, దాని లక్ష్యంగా మదురో ఉన్నాడని వేరే చెప్పనవసరం లేదు.అమెరికా గద్దెపై ఎవరున్నా అదే చేస్తున్నారు. రెండవసారి అధికారానికి వచ్చిన మరుసటి రోజే విదేశీ ఉగ్రవాద సంస్థలను మాదకద్రవ్యాల మాఫియాలుగా చిత్రిస్తూ ట్రంప్‌ ఉత్తరువులు జారీ చేశాడు. ఆ ముసుగులో వెనెజులా సమీపానికి మిలిటరీని దించుతున్నాడు.ఇతర దేశాల్లో జోక్యం చేసుకొనేందుకు మిలిటరీకి అధికారమిస్తూ రహస్య ఉత్తరువులు ఇచ్చినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. వెనెజులా చమురు కొనుగోలు చేయవద్దని, దాన్ని రవాణా చేయవద్దంటూ ఆంక్షలు విధించింది. ట్రంప్‌కు చిత్తశుద్ధి ఉంటే అమెరికాలో విచ్చలవిడిగా దొరుకున్న మాదకద్రవ్యాలు, వాటిని సరఫరా చేసే వారి మీద కేంద్రీకరించాలి. ఒక అంచనా ప్రకారం అమెరికాలో 200 నుంచి 750బిలియన్‌ డాలర్ల మేరకు మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతుంటే ప్రాణావసరమైన ఔషధాల లావాదేవీలు 600 బిలియన్‌ డాలర్లు, చమురు లావాదేవీల విలువ 400 బి.డాలర్లు మాత్రమే అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. మరోమాటలో చెప్పాలంటే ప్రపంచంలో మాదక ద్రవ్యాలను అత్యధికంగా వినియోగిస్తున్న, వాటి తయారీకి అవసరమైన ఔషధ సంబంధిత రసాయనాలు, ఆయుధాలను ప్రపంచానికి ఎక్కువగా సరఫరా చేస్తున్నది అమెరికా అన్నది నమ్మలేని నిజం. ఈ అక్రమలావాదేవీల్లో అమెరికాలోని బడా బాంకులు, కార్పొరేట్‌ సంస్థలు ఉన్నాయి. అమెరికన్‌ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇదంతా సాగుతుందా ? తన విధానాలు, కార్పొరేట్ల దోపిడీని ప్రశ్నించకుండా యువతను మత్తులో ముంచే ఎత్తుగడ కూడా దీని వెనుక ఉందన్నది స్పష్టం. ఐరాస 2025 ప్రపంచ మాదకద్రవ్యాల నివేదికలో వెనెజులా గురించి చేసిన ప్రస్తావన చాలా పరిమితంగా ఉంది. అక్కడ మాదక ద్రవ్యాల సాగు లేదా తయారీ దాదాపు లేదని పేర్కొన్నది.


కరీబియన్‌ ప్రాంతంలో అమెరికా మిలిటరీ మోహరింపు వెనుక బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. చైనాలోని తియాన్‌జిన్‌లో జరిగిన చారిత్మ్రాక షాంఘై సహకారం సంస్థ 25వ సమావేశంలో షీ జింపింగ్‌, నరేంద్రమోడీ, పుతిన్‌ కలయిక అమెరికా విధాన నిర్ణేతలకు వణుకుపుట్టించింది. వెంటనే గుక్క తిప్పుకోలేకపోయిన ట్రంప్‌ నాలుగు రోజుల తరువాత భారత్‌ను చైనాకు కోల్పోయినట్లు ఉక్రోషంతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం ముగిసిన వారం రోజుల్లోనే బ్రిక్స్‌ సమావేశాన్ని ట్రంప్‌ జీర్ణించుకోలేకపోయాడు. వెనెజులా పేరుతో కరీబియన్‌ సముద్రంలో ఉద్రిక్తతలకు తెరతీశాడు. సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్సుద్వారా బ్రిక్స్‌ సదస్సును బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా ప్రారంభించాడు. కరీబియన్‌ ప్రాంతంలో అమెరికా యుద్ద నావలు ఉద్రిక్తతకు కారణం అవుతున్నాయని చెప్పాడు. వెనెజులా మీద దాడికి సన్నాహాల్లో ఉన్నట్లు కనిపిస్తున్నదన్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు బ్రిక్స్‌ సమావేశానికి డుమ్మాకొట్టిన ప్రధాని నరేంద్రమోడీ విదేశాంగ మంత్రి జై శంకర్‌ను పంపారు. చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మాట్లాడుతూ బ్రిక్స్‌ దేశాల మధ్య సహకారం మరింతగా పెరగాలని పిలుపునిచ్చాడు.


ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల తయారీ అక్రమరవాణా సమస్యలు ఉన్నాయి. ఒక దేశం మీదకు యుద్ధ సన్నాహాల మాదిరి కరీబియన్‌ సముద్రంలో అమెరికా యుద్ద నావలను దించింది. వాటిలో నాలుగున్నరవేల మంది మెరైన్లు, నావికులను మోసుకువెళ్లే నౌక, నియంత్రిత క్షిపణులను ప్రయోగించే మూడు డెస్ట్రాయర్లు ఇతర నౌకలు, మరోచోట పది యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇది వెనెజులాను బెదిరించేందుకు, దాడి చేసేందుకు అన్నది తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎక్కడా అమెరికా ప్రత్యక్ష దాడుల్లో పాల్గొన్న ఉదంతాలులేవు. ఇతర దేశాలతో దాడులు చేయించటం, వాటికి ఆయుధాలు విక్రయించి లబ్దిపొందే విధానాన్ని అనుసరిస్తున్నది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో మరోమారు విజయం సాధించిన నికొలస్‌ మదురో ప్రభుత్వాన్ని అమెరికా ఇంతవరకు గుర్తించలేదు.తాము బలపరిచిన ప్రతిపక్ష అభ్యర్థి గోన్‌జాలెజ్‌కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు అమెరికా చెప్పుకుంది. అమెరికా గనుక దాడులకు పాల్పడితే తాము ప్రతిఘటించేందుకు సిద్దంగా ఉన్నామని, మిలిటరీతో పాటు లక్షలాది మంది పౌరులను దించుతామని మదురో హెచ్చరించాడు. దాదాపు ఇరవై ఐదువేల మంది సైనికులను కొలంబియా సరిహద్దులకు, చమురు శుద్ది కర్మాగారాలు ఉన్న ప్రాంతాలకు, సముద్రతీరానికి తరలించటమే గాక దేశవ్యాపితంగా డ్రోన్లు ఎగురవేయటంపై ఆంక్షలు విధించాడు. తమ జలాల్లో నౌకా దళం పహారా కాస్తుందని రక్షణ మంత్రి ప్రకటించాడు.ప్రస్తుతం మిలిటరీలో లక్షా 23వేల మంది సైనికులు ఉన్నారు. వీరు గాక మరో రెండులక్షల ఇరవైవేల మంది ప్రజాసాయుధులు ఉన్నట్లు మదురో ప్రకటించాడు. దేశంలో అమెరికా వ్యతిరేక భావనలను ముందుకు తేవటంతో పాటు పరిసర దేశాల మద్దతు పొందేందుకు వెనెజులా నాయకత్వం పూనుకుంది.

గతంలో మిత్రదేశంగా ఉన్న సమయంలో వెనెజులాకు అమెరికా నాలుగవ తరం ఎఫ్‌ 16 యుద్ద విమానాలను సరఫరా చేసింది. ఇప్పుడు వాటితోనే కరీబియన్‌ సముద్రంలో ఉన్న అమెరికా యుద్ధ నావల చుట్టూ చక్కర్లు కొట్టించారు. నియంతల పాలనా కాలంలో చమురు నిల్వలపై కన్ను, కమ్యూనిజాన్ని విస్తరించకుండా చూసేందుకు వెనెజులా ఆ ప్రాంతంలో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో అమెరికా యుద్ధ విమానాలను అందచేసింది. అయితే అనూహ్యంగా ఛావెజ్‌ రంగంలోకి రావటంతో వెనెజులా బద్దశత్రువుగా మారింది. ఛావెజ్‌ అధికారానికి వచ్చిన తరువాత చైనా, రష్యాలతో మిలిటరీ సంబంధాలను పెట్టుకున్నాడు. ఒక దశలో తమపై విధించిన ఆంక్షలకు ప్రతిగా ఎఫ్‌16 విమానాలను ఇరాన్‌కు విక్రయిస్తామని ఛావెజ్‌ అమెరికన్లను హెచ్చరించాడు.2013 నుంచి నికోలస్‌ మదురో అధికారంలో కొనసాగుతూ చావెజ్‌ బాటను అనుసరిస్తున్నాడు. కరీబియన్‌ సముద్రంలో అమెరికా మోహరించిన నాలుగున్నరవేల మందితో వెనెజులాను స్వాధీనం చేసుకోవటం లేదా దాడి చేసే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.అమెరికా దాడులకు గురైన ఇతర దేశాలకు భిన్నంగా ప్రజాసాయుధులను కూడా వెనెజులా దింపే అవకాశం ఉంది. ఇరుగు పొరుగులాటిన్‌ అమెరికా దేశాలలో ఎక్కువ భాగం అమెరికా చర్యను ఖండిరచాయి. అమెరికా ఆంక్షలను ఖాతరు చేయకుండా చైనా చమురు దిగుమతి చేసుకోవటమే గాక వెనెజులాలో చమురు వెలికితీసేందుకు కూడా ముందుకు వచ్చింది. చైనా నుంచి మిలిటరీ జెట్లను కొనుగోలు చేసేందుకు మదురో ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.అయినప్పటికీ అమెరికా మిలిటరీ శక్తితో పోలిస్తే వెనెజులా బలం ఒక లెక్కలోనిది కాదు. దాని బలం, బలగం మదురోకు మద్దతు ఇస్తున్న జనం, ఇరుగు పొరుగుదేశాల సంఫీుభావమే !
 
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చెవిలో పూలు : పాకిస్థాన్‌ ప్రాజెక్టుల నుంచి చైనా తప్పుకుందా, కాషాయ దళాలు, మీడియా కథనాల్లో నిజమెంత !

07 Sunday Sep 2025

Posted by raomk in Africa, BJP, CHINA, Congress, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BRI, China, CPEC, Narendra Modi Failures, pakistan, RSS, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


‘‘ పాకిస్థాన్‌ 60 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నడవా ప్రాజెక్టు నుంచి వైదొలిగిన చైనా, నిధుల కోసం ఎడిబిని ఆశ్రయించిన ఇస్లామాబాద్‌ ’’ ఇది కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.ఇదే అర్ధం వచ్చేవి మరికొన్నింటిలో వున్నాయి. దీనికి కాషాయ దళం చెప్పిన భాష్యం మచ్చుకు ఒకటి ఇలా ఉంది. ‘‘ భారత జాతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కనెక్టివిటీని మోడీజీ వ్యతిరేకించిన తరువాత (సిపిఇసి ప్రాజెక్టులో స్పష్టంగా సూచించడం) చైనా పాకిస్తాన్‌ యొక్క 60 బిలియన్‌ డాలర్స్‌ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ఇది భారతదేశానికి దౌత్యపరంగా అతిగొప్ప విజయం, పాక్‌కు చావు దెబ్బ ’’ అని పేర్కొన్నారు. ఇది నిజమా ? మొదటి అవాస్తవం ఏమిటంటే నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగాక ముందే దానికి నాంది పలికిన 2013లోనే నాటి యుపిఏ ప్రభుత్వం ఈ పథకానికి అభ్యంతర తెలుపుతూ వ్యతిరేకించింది. ఎందుకు ? పాక్‌ ఆక్రమిత్‌ కాశ్మీరులో భాగమైన గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంలో 600 కిలోమీటర్ల పొడవున పాకిస్థాన్‌ మరియు చైనా నడవా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు మరియు రైలు మార్గ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు సాగుతుంది. అది చైనాలోని షింజియాంగ్‌ స్వయంపాలిత ప్రాంతం నుంచి మొదలై మూడువేల కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్‌ అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్‌ రేవు వరకు ఉంటుంది. గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంపై మనదేశం హక్కును వదులుకోలేదు గనుక ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని మన ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయినప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు.2014లో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సర్కార్‌ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వివిధ సందర్భాలలో నిరసన తెలుపుతూనే ఉంది. వాస్తవం ఇది కాగా, కొత్తగా మోడీ వ్యతిరేకత తెలిపినట్లు దానికి తలొగ్గి ప్రాజెక్టు నుంచి చైనా వైదొలిగినట్లు చెప్పటం జనాల చెవుల్లో పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.


నిజానికి మన్మోహన్‌ సింగ్‌ గానీ, నరేంద్రమోడీ గానీ ఈ సమస్య మీద పెద్దగా చేసిందేమీ లేదు. వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇద్దరూ చైనాతో ఇతర సంబంధాలను కొనసాగించారు. షాంఘై సహకార సంస్థలో మనదేశం 2005 నుంచి పరిశీలకురాలిగా 2014వరకు ఉంది. ఆ ఏడాది మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. మనదేశమూ, పాకిస్థాన్‌ రెండూ 2017లో ఒకేసారి సభ్యత్వం పొందాయి. అప్పుడు సిపిఇసి నడవాను ఒక సమస్యగా మోడీ ముందుకు తేలేదు. నరేంద్రమోడీ హయాంలో 2020 గాల్వన్‌లోయ ఉదంతాల ముందుకు వరకు చైనాతో సంబంధాలు మరింత ముందుకు పోయాయి.ఐదేండ్ల తరువాత తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) 25వ వార్షిక సమావేశాలకు నరేంద్రమోడీతో పాటు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా హాజరయ్యారు. మోడీ వెంటనే తిరిగి రాగా సెప్టెంబరు మూడున జపాన్‌పై రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా సాధించిన విజయం 80వ వార్షికోత్సవ మిలిటరీ పరేడ్‌లో ఒక అతిధిగా షరీఫ్‌ పాల్గొన్నారు.ఆ ఉత్సవానికి నరేంద్రమోడీకి కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరు కాలేదు. ఎస్‌సిఓ సమావేశాలలో సిపిఇసి గురించి అభ్యంతరాలు తెలిపినట్లుగానీ, చైనా నేతలతో మాట్లాడినట్లుగానీ ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాలేదు. కానీ కొద్ది రోజుల తరువాత మీడియాలో వచ్చిన కథనాలను పట్టుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ తనదైన శైలిలో రాసింది. ఆరు రోజులు పాటు చైనాలో ఉన్నప్పటికీ షెహబాజ్‌ షరీఫ్‌ సిపిఇసికి రెండవ దశ పెట్టుబడుల విషయంలో విఫలమయ్యారు.పరిమితమైన అవగాహన ఒప్పందాలు మాత్రమే చేసుకున్నారు.పెద్ద పెట్టుబడులేమీ లేవు. సిపిఇసి 2.0 ప్రారంభమైనట్లు షెహబాజ్‌ ఏకపక్షంగా ప్రకటించారు తప్ప చైనా వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేదు.పరేడ్‌లో చైనా అధ్యక్షుడు తనతో పాటు పుతిన్‌, ఉత్తర కొరియా కిమ్‌ను తప్ప షెహబాజ్‌ను పట్టించుకోలేదు.పుతిన్‌తో సంభాషించినపుడు చెవులకు ఫోన్లను కూడా షరీఫ్‌ సరిగా అమర్చుకోలేకపోయారంటూ రాసింది. పాకిస్థాన్‌తో సిపిఇసి పెట్టుబడుల నుంచి వెనక్కు తగ్గినట్లు చైనా అధికారిక ప్రకటనను ఆర్గనైజర్‌ లేదా కథనాలు రాసిన ఇతర పత్రికలు చూపగలవా ?

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎటుతిప్పి ఎటురాసినా కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఇవ్వటం లేదని చైనా చెప్పిందని, గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు తగ్గిందని, ఆ మొత్తాన్ని ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు (ఏడిబి) నుంచి తీసుకోవాలని పాక్‌ నిర్ణయించిందని రాశాయి. పదే పదే ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకుంటున్న పాకిస్థాన్‌కు తాము ఇచ్చిన రుణాలను చెల్లించే సత్తాదానికి ఉందా అనే అనుమానాలు చైనాకు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక స్నేహితుడి కోసం మరొకర్ని వదులుకోలేమని ఇటీవల పాక్‌ ఆర్మీ ప్రధాన అధికారి అసిమ్‌ మునీర్‌ చెప్పాడని, దాంతో చైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదన్నట్లుగా వర్ణించారు. ఇదే సమయంలో 8.5 బిలియన్‌ డాలర్లను వివిధ పథకాలకు చైనా అందించేందుకు పాక్‌ ప్రధానితో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలను మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు. రెండు బిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు తిరస్కరించిన చైనా కొత్తగా 8.5బి.డాలర్లు ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించినట్లు ? ఈ మొత్తాన్ని సిపిఇసి 2.0లో ఐదు కొత్త కారిడార్లు, అదే విధంగా ఇతర రంగాలలో వినియోగించనున్నట్లు ప్రముఖ పాక్‌ పత్రిక డాన్‌ రాసిందని మనదేశ వార్తా సంస్థ పిటిఐ పేర్కొన్నది. తొలిసారిగా పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఒక సంస్థ సిపిఇసిలో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిందని కూడా వార్తల్లో రాశారు.చైనాకు లాభదాయకం కాని వాటిలో అదెందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? సమాధానం ఉండదు.


నిజానికి ఇలాంటి కథనాలు రావటం ఇదే కొత్త కాదు. 2024 జూన్‌ 11న బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక రాసిన కథనానికి ‘‘ సిపిఇసి 2.0లేదు, భారీ పెట్టుబడులు లేవని పాకిస్థాన్‌కు చెప్పకనే చెప్పింది ’’ అనే శీర్షిక పెట్టింది. ఐదు రోజుల పర్యటన జరిపిన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పర్యటనకు ముందు ఇస్లామాబాద్‌ అధికారులు సిపిఇసి మరొక ఉన్నత స్థాయికి తీసుకువెళతారని చెప్పారని అయితే ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని, పాక్‌ ఆశల మీద చైనా నీళ్లు చల్లిందని, పరిమిత లబ్దితోనే తిరిగి వెళ్లినట్లు నికీ ఆసియా రాసిందని దాన్లో పేర్కొన్నారు. ఏడాది క్రితం మోడీ చైనా వెళ్లలేదు, దానితో సాధారణ సంబంధాల స్థితి కూడా లేదు, అప్పుడెందుకు చైనా అలా వ్యవహరించిందో మీడియా ‘‘ వంట ’’ వారు, కాషాయ దళాలు చెప్పగలవా ? ‘‘పాకిస్థాన్‌ : ఎందుకు చైనా సిపిఇసి ప్రాజెక్టులు నిలిపివేసింది ?’’ అనే శీర్షికతో ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ (ఒఆర్‌ఎఫ్‌) వెబ్‌సైట్‌లో 2020 నవంబరు 25వ తేదీన అయిజాజ్‌ వానీ రాసిన విశ్లేషణను ప్రచురించింది. అప్పుడు గాల్వన్‌లోయ ఉదంతాలతో చైనాతో మనదేశం వైరంలో ఉంది తప్ప మిత్రదేశంగా లేదు కదా, ఆ నాడే అలా ఎందుకు రాయాల్సి వచ్చినట్లు ? నరేంద్రమోడీ నిరసన లేదా పలుకుబడి ఏమైనట్లు ? అప్పటికే కొన్ని అంశాలను నిలిపివేసినట్లు అయిజాజ్‌ వానీ రాశారు. పాకిస్థాన్‌లో మాంద్యం, అవినీతి,బెలూచిస్తాన్‌ ఇతర తిరుగుబాట్లు వంటి అంశాలతో అనేక ప్రాజక్టులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.


సిపిఇసి అవకాశాన్ని పాకిస్థాన్‌ వృధా కావించిందని, మద్దతు గురించి చైనా పునరాలోచనలో పడిరదని సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయ మాజీ ఫ్రొఫెసర్‌ సజ్దాద్‌ అష్రాఫ్‌ 2025 మే రెండవ తేదీన రాశారు. పదేండ్ల తరువాత పాకిస్థాన్‌ అసమర్ధత, రాజకీయ అవకతవకల వంటి కారణాలతో అనేక కీలక ప్రాజెక్టులు ఆలశ్యం,వాయిదా పడటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం.2015 ఏప్రిల్‌ 20న షీ జింపింగ్‌ ఇస్లామాబాద్‌లో ఎంతో అట్టహాసంగా ప్రాజెక్టును ప్రారంభించారు. పదేండ్ల తరువాత తలపెట్టిన 90 పథకాల్లో 38 పూర్తి కాగా మరో 23 నిర్మాణంలో ఉన్నాయి. మూడోవంతును ఇంతవరకు ముట్టుకోలేదు. దీనికి బాధ్యత పరిమితంగా చైనాది కాగా ఎక్కువగా ఇస్లామాబాద్‌దే ఉంది. అత్యంత కీలకమైన ప్రత్యేకించి సెజ్‌లు, పారిశ్రామికవాడలు పూర్తికాలేదు. దీనికి పాకిస్థాన్‌ రాజకీయ నేతలు, ఆసక్తి కనపరచని, సమన్వయం లేని ఉన్నతాధికారులదే బాధ్యత. వీటికి కేటాయించిన వనరులను ఆర్థికంగా పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ ఉండని లాహార్‌ మెట్రో రైలు ప్రాజక్టుకు మళ్లించారు. ఇలాంటి వాటికి తోడు 2021 నుంచి ప్రాజెక్టులలో పని చేస్తున్న చైనా సిబ్బందికి రక్షణ కల్పించటంలో తీవ్ర పరిస్థితి ఏర్పడిరది. అప్పటి నుంచి 14దాడులు జరగ్గా 20 మంది మరణించారు, 34 మంది గాయపడ్డారు. వీటిలో ఎక్కువ భాగం బెలూచిస్తాన్‌లో జరిగాయి. దౌత్యపరంగా ఇప్పటికీ సిపిఇసికి చైనా మద్దతు ఉన్నప్పటికీ 2023 తరువాత కొత్త పెట్టుబడుల పట్ల వెనక్కి తగ్గుతున్నది.


చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ(బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌) పెట్టుబడి పథకాన్ని ప్రారంభం నుంచి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వాటి ఆధ్వర్యాన నడిచే ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌, గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ గుండా రోడ్డు, రైలు మార్గాల నిర్మాణాన్ని కారణంగా చూపినప్పటికీ మనదేశం కూడా దానికి వ్యతిరేకమే అనే చెప్పాలి. పాకిస్థాన్‌లో రాజకీయ, ఇతర కారణాలతో అక్కడి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. బెలూచిస్తాన్‌లోని ఉగ్రవాద శక్తులు చైనా జాతీయుల మీద చేసిన దాడుల వెనుక బిఆర్‌ఐని వ్యతిరేకించే దేశాలు ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యలు, వాటి పరిణామాలు, పర్యవసానాల గురించి చైనాకు తెలిసినప్పటికీ ఎందుకు చేపట్టిందన్నది ప్రశ్న. ప్రపంచ ఫ్యాక్టరీగా తయారైన తరువాత దాని ఎగుమతులు, దిగుమతులు తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో యూరేషియా, ఆఫ్రికా దేశాలకు చేరేందుకు గల మార్గాలను అన్వేషించినపుడు సిపిఇసి ముందుకు వచ్చింది. దక్షిణ చైనా సముద్రం, మలక్కా జలసంధి ద్వారా రవాణా కంటే పశ్చిమ చైనాలోని షిజియాంగ్‌(ఉఘిర్‌) స్వయంపాలిత ప్రాంతం నుంచి పాక్‌ అరేబియా సముద్రరేవు పట్టణం గద్వార్‌ వరకు రవాణా సదుపాయాల ఏర్పాటు లాభదాయకమని భావించింది. చరిత్రలో ఇంగ్లీష్‌ ఛానల్‌ ప్రాంతంలో బ్రిటన్‌ మరియు ఫ్రాన్సును కలుపుతూ ఏర్పాటు చేసిన భూగర్భ రైల్వే టన్నెల్‌, పనామా, సూయజ్‌ కాలవల తవ్వకం అలా జరిగిందే. ప్రస్తుత పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో 51 ఒప్పందాల ద్వారా 46 బిలియన్‌ డాలర్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రారంభించారు. ఇప్పుడు అది 65 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని అంచనా. మధ్యలో కరోనా, ఇతర సమస్యలతో అనుకున్నంత వేగంగా పూర్తి కావటం లేదు. ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌ నుంచి 60 బిలియన్‌ డాలర్ల ప్రాజక్టు నుంచి చైనా వైదొలిగిందని రాస్తే జనం నమ్మాలా ? ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా శాశ్వతంగా ఉంటుందని భావించి మనదేశం అక్కడ మూడు బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. మనకు కూడా చెప్పకుండా అమెరికన్లు 2021లో అక్కడి నుంచి బతుకుజీవుడా మమ్మల్ని ప్రాణాలతో పోనిస్తే చాలంటూ ఆయుధాలు, రవాణా వాహనాల వంటి వాటన్నింటినీ వదిలి కాలికి బుద్ది చెప్పటాన్ని చూశాము. అప్పటి నుంచి మనదేశం తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా తెరవెనుక వారితో మంతనాలు జరుపుతూ పెట్టుబడులను రాబట్టుకొనేందుకు చూస్తున్న సంగతి బహిరంగ రహస్యం. వదలివేసినట్లు ఎక్కడా ప్రకటించలేదు. జూలై మొదటి వారంలో తాలిబాన్‌ సర్కార్‌ను గుర్తించిన ఏకైక దేశం రష్యా. దానితో మనకున్న సంబంధాలను ఉపయోగిస్తామని వేరే చెప్పనవసరం లేదు. అలాంటిది 60 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను అర్ధంతరంగా పాకిస్థాన్‌కు వదలి వట్టి చేతులతో చైనా తిరిగి వెళుతుందని మీడియాలో కొందరు రాస్తే, నరేంద్రమోడీ అభ్యంతరంతోనే ఆపని చేసిందని కాషాయదళాలు జనాన్ని నమ్మించేందుకు చూడటం నిజంగానే దుస్సాహసం. జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరని వారికి చెప్పకతప్పదు !

. 

Share this:

  • Tweet
  • More
Like Loading...

హిందూత్వ బాటలో బ్యాంక్‌ మేనేజర్‌ – పెద్ద కూర నిషేధంపై బెఫి నిరసన ! బిజెపి ఎంఎల్‌సిపై గోరక్షకుల దాడి !!

05 Friday Sep 2025

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, Farmers, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized

≈ Leave a comment

Tags

beef, Beef eating in Vedas, BEFI, BJP, Cow vigilantes, Food Ban, Food- A Symbol Of Identity, Gau Rakshaks, Politicisation of Beef, RSS


ఎం కోటేశ్వరరావు


ఆహార వ్యవహారాల్లో జోక్యం అంటే ఫలాన తినకూడదు అని ఆంక్షలు పెట్టటం వ్యక్తిగత స్వేచ్చలో మితిమీరిన జోక్యం చేసుకోవటం తప్ప మరొకటి కాదు. ఆహారం, ఆహార్యం కొన్ని సమూహాలకు అస్థిత్వ సూచికలుగా ఉన్నాయి. పెద్ద కూర, దీన్ని ఆంగ్లంలో బీఫ్‌ , అచ్చతెలుగులో గొడ్డు మాంసం అంటారు. తక్కువ ఖర్చుతో జనాలకు అవసరమైన ఎక్కువ ప్రొటీన్లు అందచేసే ఆహారం ఇది. ఇటీవలి కాలంలో హిందూత్వశక్తులు, సనాతనులుగా ముద్రవేసుకున్నవారు దీని మీద పెద్ద రాద్దాంతం, దాడులు, హత్యలకూ పాల్పడటాన్ని చూశాం. మేం శాకాహారులం మా మనోభావాలను గాయపరచవద్దు అనేవారు తయారయ్యారు. మాంసాహారులకు కూడా మనోభావాలు ఉంటాయి. తాజాగా కేరళలోని కోచ్చి నగరంలో కెనరా బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయానికి బీహార్‌ నుంచి అశ్వనీ కుమార్‌ అనే మేనేజర్‌ బదిలీ మీద వచ్చారు. అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా బ్యాంకు క్యాంటీన్‌లో పెద్ద కూర కూడా వారంలో కొన్ని రోజులు అందుబాటులో ఉండేది. ఆ పెద్దమనిషి రాగానే ఆహార జాబితా నుంచి దాన్ని తొలగించి నిషేధం విధించారు.ఎందుకంటే నేను తినను అని చెప్పారట. నాకు దక్కనిది ఎవరికీ దక్క కూడదు అనే సినిమా మాటలు బాగా వంటబట్టి ఉంటాయి. దేశంలో అనేక ప్రాంతాలలో ఇలాంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపిన సంగతి తెలియనంత అమాయకంగా సదరు అధికారి ఉంటారని అనుకోలేం. ఉద్యోగులు ప్రశ్నించిన తరువాత అయినా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉంటే ఆ పెద్దమనిషి ఇప్పుడు మీడియాకు ఎక్కి ఉండేవారు కాదు. విధిలేని స్థితిలో బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫి) నాయకత్వంలో సిబ్బంది నిరసన తెలుపుతూ బ్యాంకు ప్రాంగణంలో పెద్ద కూర, పరోటాల పండగచేసి నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏ ఆహారం తీసుకోవాలన్నది వ్యక్తిగత ఎంపిక అంశమని, కొన్నింటి మీద నిషేధం విధించటం రాజ్యాంగహక్కులను ఉల్లంఘించటమే అని స్పష్టం చేశారు. బ్యాంకు అధికారి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక ఉన్నతాధికారి ఇష్టా ఇష్టాలకు అనుగుణంగా ఇతరులు ఆహార అలవాట్లను ఎందుకు మార్చుకోవాలని వారు ప్రశ్నించారు. మాంసాహారం తినాలని తామెవరినీ బలవంతం చేయటం లేదని బెఫి నేత చెప్పారు.


మాంసం, చేపలు, గుడ్లు తినరాదంటూ బలవంతం చేయటాన్ని బ్రాహ్మణీయ జాతీయవాదం(భావజాలం) అంటున్నారు. అనేక మంది బ్రాహ్మలు మాంసాహారాన్ని తింటారన్నది అందరికీ తెలిసిందే. తిరోగామి జాతీయవాదం ఏ రంగంలో, ఏ సమస్యపై తలెత్తినా దాన్ని వ్యతిరేకించాల్సిందే. మన దేశంలో ఆవును పూజించటానికి, గొడ్డు మాంసం తినటానికి లంకె పెడుతున్న కారణంగా తలెత్తిన భావజాల ఘర్షణను భౌతిక దాడులకు తీసుకుపోయేందుకు కొన్ని శక్తులు పనిగట్టుకు పనిచేస్తున్నాయి. బిజెపి పాలిత ఒడిషా రాష్ట్రంలో ఇద్దరు దళితులు చచ్చిన ఆవు కళేబరం నుంచి చర్మాన్ని వేరు చేయటాన్ని చూసిన కొందరు గోవధకు పాల్పడ్డారంటూ వారి మీద దాడి చేయగా ఒక వ్యక్తి మరణించాడు. ఉన్మాదాన్ని ఎలా ఎక్కించారో చూస్తున్నాం. దళితుల మీద దాడులకు ఆవునొక సాకుగా కూడా చూపిన ఉదంతాలు ఉన్నాయి. తమ ఇంట ఆవు చనిపోతే దాన్ని పూడ్చిపెట్టేందుకు ఏ సనాతనవాదీ ముందుకు రారు. ఇదీ గోవుల మీద ప్రేమ బండారం. చివరకు ఆ దళితులే కావాలి. సాంస్కృతిక గురుపీఠాల సృష్టికి ఆహారం ఒక ఉత్ప్రేక్షగా( ప్రస్తుతాన్ని అప్రస్తుతమైనదిగా మార్చటం) మారి చివరకు అవమానించేందుకు దారితీస్తున్నదని ప్రముఖ మేథావి, జెఎన్‌యు ప్రొఫెసర్‌ గోపాల్‌ గురు చెప్పారు. నైతిక పోలీసుల మాదిరి ఇలాంటి గురుపీఠాలు సాంస్కృతిక పోలీసులుగా బ్రాహ్మణ భావజాలాన్ని రుద్దే నిరంకుశ శక్తులుగా మారుతున్నాయి. వాటి ప్రభావానికి లోనైన కారణంగానే కెనరా బాంక్‌ కొచ్చి మేనేజర్‌ వంటి వారు తమ అధికార స్థానాలను ఉపయోగించుకొని నిషేధాలకు దిగటం సహించరానిది. నిజానికి సదరు మేనేజరుకు హిందూత్వ సంస్థలతో సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు. లేనప్పటికీ వాటి ప్రభాంతో తెలియకుండనే హిందూత్వ అజెండాను అమలు జరిపే ఒక పరికరంగా మారటాన్ని గమనించాలి. ఇలాంటి చర్యలకు ప్రతిఘటన తప్పదు. చిత్రం ఏమిటంటే దేశంలో 81శాతం మంది మాంసాహారులు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెప్పగా 39శాతం శాకాహారులని కొన్ని సర్వేలు చెప్పాయి. ఒకటి మాత్రం వాస్తవం, ఏ విధంగా చూసినా మాంసాహారులే అత్యధికంగా ఉన్నప్పటికీ మైనారిటీలుగా ఉన్న శాకాహారులు తమ అలవాట్లను మెజారిటీ మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. గోవధ గురించి దేశంలో ఎంతో చర్చ జరిగిన తరువాత దాని గురించి రాష్ట్రాలకు నిర్ణయాన్ని వదలివేస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్‌ 48లో పేర్కొన్నారు. దాన్ని విధి గాక ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. కొన్ని రాష్ట్రాలలో బిజెపి తన హిందూత్వ అజెండాలో భాగంగా గోవధ నిషేధ చట్టాలు చేసింది. అది కొత్త సమస్యలను ముందుకు తెస్తున్నది.


దోపిడీకి అవకాశం కల్పించే, సామాజిక పరంగా వివక్షాపూరితమైన మనువాదాన్ని సమర్ధించే శక్తులు ఇటీవలి కాలంలో రూటు మార్చి చిల్లి కాదు తూటు అన్నట్లుగా సనాతనం పేరుతో రాజకీయం చేస్తున్నాయి.అధునాతన కాలంలో సనాతనాన్ని పాటించటం ఎలా సాధ్యమో వారు చెప్పలేరు. రెండవది వేదకాలం గొప్పతనం గురించి ఒక వైపు చెబుతారు. పోనీ ఆ కాలానికి వెళ్లగలమా ? వేదకాలం గురించి చెప్పేవారు రెండో వైపున గోవధ నిషేధం గురించి మాట్లాడతారు. ఇది రెండిరటికీ పొసగని అంశం అని ఎంత మందికి తెలుసు? ఆవును పవిత్రంగా చిత్రించేవారు వేదకాలంలో ఆవు మాంసం తినటం గురించి ఎందుకు మాట్లాడరు ? వేదాలుగానీ, శాస్త్రాలు గానీ చరిత్రలు కావు.వాటిలో అనేక పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి. కారణం ఎవరికి తోచిన వాటిని వారు రాసి వాటిలో చేర్చారు. ఎవరి వాదనలకు అనువుగా ఉన్నవాటిని వారు ఉటంకిస్తూ జనాలను మభ్య పెడుతున్నారు. యజ్ఞయాగాదులలో ఆవు పాలు, పెరుగు, నెయ్యి లేకుండా నేడు గడవటం లేదు. వేదాలతో సమానమైనదిగా భావించే శతపథ బ్రాహ్మణంలో యాజ్జవల్క్యుడు తాను బాగా ఉడికించిన పెద్దకూరను తింటానని చెప్పినట్లుగా ఉంది. దేవతల చక్రవర్తిగా పరిగణించే దేవేంద్రుడు ఎద్దుమాంస వడ్డన గురించి చెప్పాడు. వేదకాలంలో పూజారులకు ఆవులను ఇవ్వాలని లేకుంటే కనీసం ఆవు మాంసమైనా అందచేసే సాంప్రదాయం ఉన్నట్లు రాతలను బట్టి తెలిసిందే. కొంత కాలం తరువాత ఆవు వలన ఉపయోగం ఉందని గ్రహించి దాన్ని చంపకూడదని భావించారు. ఆ మాట చెబితే వినే పరిస్థితి లేకపోవటంతో ఆవు గురించి అభూత కల్పనలు, పవిత్రతను అంటగట్టి నిరోధించేందుకు కావాల్సిన వాటినన్నింటినీ చేర్చారన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ క్రమంలో ప్రతి జంతువుకు పవిత్రతను ఆపాదించి పురాణాల్లో రాయటం కనిపిస్తుంది. కానీ వాటిని వధించి తినటానికి ఉన్న అనుమతి ఆవుకు ఎందుకు నిరాకరిస్తున్నారన్నదే ప్రశ్న. దీన్ని లేవనెత్తితే అనేక మంది తమ మనోభావాలను స్వయంగా గాయపరుచుకుంటున్నారు. రాజకీయ నేతలు ఒకే ప్రకటనకు విరుద్ధ భాష్యాలు చెప్పినట్లుగా పురాణాలు, వేదాలలోని వాటికీ ఈ మధ్య తమకు అనుకూలమైన అర్ధాలు, భాష్యాలు చెప్పటాన్ని చూస్తున్నాము. చెప్పుకోనివ్వండి ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ధర్మరక్షకుల పేరుతో సంఘటితం అవుతున్నవారు అంగీకరించనివారి మీద బలవంతంగా రుద్దే గూండాయిజం ఏమాత్రం సహించరానిది.


ఊరకుక్కల కాట్లకు బలవుతున్న పిల్లలు, పెద్దల గురించి తెలిసిందే. ఇప్పుడు వాటికి తోడు యజమానులు పట్టించుకోకుండా వీధుల్లోకి వదలివేస్తున్న ఆవులు కూడా సమస్యగా మారుతున్నాయి. సనాతనులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఉదయం లేవగానే రోడ్ల మీద తిరుగుతున్న వాటన్నింటినీ తమ ఇండ్లకు చేర్చుకొని ఆదరిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎందుకు ఆపని చేయటం లేదు. ఇటీవల ఢల్లీి ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా ఒక ఫ్లై ఓవర్‌ మీదకు ఆవులు రావటంతో ఆకస్మికంగా డ్రైవర్‌ బ్రేకులు వేసి వాహనాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.చిత్రం ఏమిటంటే ఆమె కూడా ఒక సనాతన వాదే, ఆవులు వెళ్లేంత వరకు వాహనం దిగి చూశారు తప్ప సిబ్బందిని ఆదేశించి వాటన్నింటిని తన ఇంటికో, కార్యాలయానికో తోలుకు రమ్మని చెప్పలేదు. దేశంలో 50లక్షలకు పైగా ఆవులను రోడ్ల మీద వదలివేసినట్లు అంచనా, నిజానికి ఇంకా ఎక్కువే ఉంటాయి. యోగి ఆదిత్యనాధ్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి పక్కా సనాతనవాదులు అత్యధిక రాష్ట్రాల్లో పాలకులుగా ఉన్న ఈ దేశంలో అలా బాధ్యతా రహితంగా వదలివేయటం ఏమిటి ! ఉత్తర ప్రదేశ్‌లోనే పన్నెండున్నర లక్షలు ఉన్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. బిజెపి పాలిత మహారాష్ట్రలో గోశాలల్లో ఉన్న ఒక్కో ఆవుకు రోజుకు రు.50 చెల్లిస్తున్న ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్‌గా నెలకు ఇస్తున్న మొత్తం రు.1,500 అంటే ఆవుతో సమానం.బీహార్‌లో రు.400గా ఉన్న వృద్ధాప్య పెన్షన్‌ మొత్తాన్ని ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2025జూన్‌లో నితీష్‌ కుమార్‌ సర్కార్‌ రు.1,100కు పెంచింది. అత్యంత మానవీయ కోణం ఉన్న ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని సర్కార్‌ జాతీయ సామాజిక సహాయ పథకం కింద మన్మోహన్‌ సింగ్‌ హయాంలో నిర్ణయించిన రు.200, రు.500మొత్తాలనే ఇప్పటికీ మంజూరు చేస్తున్నది. ఈ మాత్రానికే తమ వాటా ఎంత ఉందో లబ్దిదారులకు తెలపాలని కేరళ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాము ఇస్తున్న రు.1,600లలో ఎవరి వాటా ఎంతో చెప్పటానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని అక్కడి వామపక్ష ప్రభుత్వం చురక అంటించింది.

గో సంరక్షణ చట్టాలతో వట్టిపోయిన ఆవులను మేపటం రైతాంగానికి భారంగా మారుతున్నది. గతంలో వాటిని అమ్మివేస్తే వధశాలలకు తరలించేవారు. ఇప్పుడు ఆమ్ముకోవచ్చుగానీ కొనేవారెవరు ? మహారాష్ట్రలో ఉన్న జంతు సంరక్షణ చట్టాన్ని సవరించటం లేదా రద్దు చేయాలని ఏకంగా అక్కడి బిజెపి ఎంఎల్‌సి, మాజీ మంత్రి సదాశివ ఖోట్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అందుకుగాను మండిపడిన కాషాయదళాలు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేయటమే కాదు దాడులకు పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. పోలీస్‌ స్టేషన్‌ ముందు నిరసన కూడా తెలిపారు. సతారా జిల్లాలో కొందరు రైతులు తమ గేదెలను విక్రయించారు.వారికి డబ్బు చేతికి అందక ముందే గోరక్షకులమంటూ కొందరు వచ్చి వాటిని బలవంతంగా పూనే తరలించారు. రైతులు కోర్టుకు ఎక్కటంతో వారి పశువులను వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది. అయితే వాటికోసం ఒక గోశాలకు వెళ్లగా అవి కనిపించలేదు. రైతులతో పాటు ఎంఎల్‌సి అక్కడ ఉండగా గోరక్షకులమంటూ వచ్చిన వారు తన మీద దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సదాశివ ఖోట్‌ చెప్పారు. మహారాష్ట్రలో వట్టిపోయిన ఆవులు, గేదెలను విక్రయించటానికి వీల్లేకపోవటంతో రైతాంగానికి అవి భారంగా మారాయి. షేత్కారి రైతు సంఘ నేత శరద్‌ జోషి, మరికొందరు ఎప్పటి నుంచో చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాను మూడు దశాబ్దాలుగా రైతుల సమస్యల మీద పని చేస్తున్నానని గోరక్షకులుగా చెప్పుకుంటున్నవారు కనీసం ఒక్కసారైనా పాలు పితికిన వారు కాదని ఎంఎల్‌సి విమర్శించారు. గత కొద్ది వారాలుగా సాంప్రదాయకంగా పశువ్యాపారం చేస్తున్నవారు గోరక్షకుల పేరుతో ఉన్నవారి ఆగడాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.వారికి సదాశివ ఖోట్‌ మద్దతు ప్రకటించారు. వట్టిపోయిన పశువులకు నెలకు తొమ్మిదివేల రూపాయల వంతున మేతకు ఖర్చు చేస్తే రైతులకు వచ్చేదేమీ ఉండదని అందువలన వాటిని అమ్ముకోవటం మినహా మరొక మార్గం లేదని, అయితే గోరక్షకులమంటూ బయలుదేరిన వారు ఆ లావాదేవీలను అడ్డుకుంటున్నారని, రైతాంగానికి నష్టం కలిగిస్తున్నారని చెప్పారు.హిందూత్వ నేత మిలింద్‌ ఎక్బోటే ఒక ప్రకటన చేస్తూ ఎంఎల్‌సి పశువులను వధించేవారి తరఫున మాట్లాడుతున్నారని, రాజకీయాలనుంచి గెంటివేయాలని డిమాండ్‌ చేశారు. ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కూడా పశువధ చేసే వారికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. అనేక రాష్ట్రాలలో పశువధ, వ్యాపారం వృత్తిగా ఖురేషీ అనే ముస్లిం తెగకు చెందిన వారు ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మతాన్ని కూడా ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది.మహారాష్ట్రలో వట్టిపోయిన పశువుల సమస్య ముందుకు రావటం ఇదే మొదటి సారి కాదు. నిజానికి ఇది ఒక్క ఆ రాష్ట్రానిదే కాదు, పశువధ నిషేధం ఉన్న ప్రతి చోటా గోరక్షకుల పేరుతో రైతాంగాన్ని దెబ్బతీసే శక్తులు పేట్రేగిపోతాయి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జిఎస్‌టి స్లాబుల తగ్గింపు : మాయల మరాఠీలను తలదన్నే నరేంద్రమోడీ మహాగారడీ మామూలుగా లేదుగా !

28 Thursday Aug 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

#GST jugglery, BJP, GST reforms, GST Revenue, GST Slabs cut, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


దీపావళి కానుకగా వస్తు,సేవల పన్ను(జిఎస్‌టి) భారాన్ని తగ్గించనున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. దీనికి మీడియాలో ఇప్పటికే పెద్ద ప్రచారం వచ్చింది. సిద్దం సుమతీ అన్నట్లు కాచుకొని ఉండే కాషాయ దళాలు భజన ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం 12,28 పన్ను శ్లాబులను రద్దు చేసి ఐదు, 18శాతం స్లాబులకు అంగీకరించగా, జిఎస్‌టి మండలి నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే పన్నెండు, 28శాతాలలో ఉన్న వస్తువులను దేనిలో కలుపుతారు అన్నది ఇంకా ఖరారు కాలేదు. ఈ చర్యతో కలిగే లాభాలు, నష్టాల గురించి మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాటి మంచి చెడ్డల గురించి మాట్లాడుకొనే ముందు ఇప్పుడున్న తీరు తెన్నులేమిటో చూద్దాం. ప్రతిదాన్లో ఉన్నట్లు మంచీ చెడు ఉంటాయి, ఏదెక్కువ అన్నదే గీటురాయిగా ఉండాలి.


జిఎస్‌టి కూడా ప్రపంచబ్యాంకు ఆదేశిత విధానమే. విదేశీ కంపెనీలు, వస్తువులకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అమ్మకపు పన్ను విధించటంతో వాటికి తలనొప్పిగా ఉండి దేశమంతటా ఒకే పన్ను విధానం తీసుకురావాలని వత్తిడి తెచ్చిన ఫలితమే ఇది. దీన్ని అమలు చేయాలని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 115వ రాజ్యాంగ సవరణ బిల్లును బిజెపి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ వ్యతిరేకించారనే అంశం చాలా మందికి గుర్తు ఉండి ఉండదు. బిజెపికి మద్దతు ఇచ్చే వ్యాపారవర్గం పన్నుల ఎగవేతకు అవకాశాలు ‘‘ తగ్గుతాయని ’’ వ్యతిరేకించినట్లు కూడా చెబుతారు. రాజకీయ నేతలు ఎల్లవేళలా కుడి, ఎడమ జేబుల్లో పరస్పర విరుద్దమైన ప్రకటనలు పెట్టుకొని సంచరిస్తూ ఉంటారట. ఏది వాటంగా ఉంటే దాన్ని బయటకు తీస్తారు. జిఎస్‌టి బిల్లు తిరోగామి స్వభావం కలిగినదని, సమాఖ్య ఆర్థిక మూలాలకు పూర్తిగా వ్యతిరేకమని ముఖ్యమంత్రి పాత్రలో 2011 ఫిబ్రవరి 11న వాదించిన రాజనీతిజ్ఞుడు మోడీ. ప్రధాని హోదాలో దానికి పూర్తి విరుద్దంగా రెండో జేబులో ఉన్న ప్రకటన బయటకు తీశారు.(మోడీ కంటే రెండాకులు ఎక్కువ చదివిన చంద్రబాబు స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్ల గురించి ప్రతిపక్షంలో ఉండగా చెప్పినదానికి అధికారానికి వచ్చిన తరువాత మాట మార్చినట్లు ) తన ప్రభుత్వం ముందుకు తెచ్చిన జిఎస్‌టి బిల్లు గురించి 2016 ఆగస్టు 9న పార్లమెంటులో మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిగా తనకు సందేహాలు ఉండేవని ఇప్పుడు అవి ఒక ప్రధానిగా ఆ సమస్యలను పరిష్కరించటాన్ని సులభతరం చేసిందని చెప్పుకున్నారు. దానికి తోడు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీతో కూడా అనేక సార్లు చర్చించినట్లు చెప్పుకున్నారు.(మోడీ సందేహాలను ఆయన తీర్చని కారణంగానే బిల్లును వ్యతిరేకించారా) అదియును సూనృతమే ఇదియును సూనృతమే అని వంది మాగధులు తాళం వేశారు.2017 జూలై ఒకటి నుంచి జిఎస్‌టి అమల్లోకి వచ్చింది.తరువాత కొన్ని శ్లాబుల్లో వస్తువుల జాబితా మార్పు, పన్ను రేటు పెంపుదల వంటివి జరిగాయి.


ప్రతి వంద రూపాయల జిఎస్‌టి రాబడిలో ఏ స్లాబ్‌ నుంచి ఎంతవస్తున్నదంటే ఐదుశాతం ఉన్న వస్తువుల ద్వారా ఏడు రూపాయలు, పన్నెండు శాతం ఉన్నవాటితో ఐదు, పద్దెనిమిదిశాతం వాటితో 65, విలాసవస్తువుల జాబితాలో ఉన్న 28శాతం నుంచి పదకొండు రూపాయలు వస్తున్నాయి. మీడియా రాస్తున్న ఊహాగానాల ప్రకారం పన్నెండుశాతం శ్లాబులో ఉన్న జాబితాలో 99శాతం వస్తువులను ఐదు శాతం స్లాబులో చేరుస్తారు.తొంభై శాతం వస్తువుల మీద పన్ను మొత్తాన్ని 28 నుంచి 18శాతానికి తగ్గిస్తారు.పాపపు పన్ను వస్తువులు అంటే పొగాకు ఉత్పత్తులు, పాన్‌ మసాలా వంటి ఐదు లేదా ఏడు ఉత్పత్తులను 40శాతం మరియు సెస్‌ విధించే ప్రత్యేక శ్లాబులో ఉంచుతారు. బంగారం మీద మూడుశాతం మారదు, వజ్రాల మీద 0.25 నుంచి 0.5శాతానికి పెంచవచ్చు.ఈ కసరత్తు తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత రాబడి తగ్గుతుంది లేదా వినియోగదారులకు ఎంత మేరకు ఉపశమనం కలుగుతుంది అంటే ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ ఏటా 1.45శాతం అంటే రు.32 వేల కోట్లు మాత్రమే అని చెప్పారు. ఇతరులు రు.60 వేల నుంచి 1.8లక్షల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఒక నిర్ణయం జరిగి కొన్ని నెలల రాబడి చూసిన తరువాత మాత్రమే ఏది వాస్తవం అన్నది చెప్పగలం. ఒకటి మాత్రం ఖాయం జనానికి తగ్గేది స్వల్పం.


దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు అనుగుణంగా నిజవేతనాలు పెరగకపోవటంతో వస్తువినియోగం తగ్గుతున్నది. ఇది కార్పొరేట్‌ శక్తులకు ఆందోళన కలిగిస్తున్నది. అందువలన వినియోగాన్ని పెంచాలంటే హెలికాప్టర్‌ మనీ అంటే నేరుగా నగదు ఇవ్వాలని కరోనా సమయంలో కొందరు సూచించారు. మరొకటి పన్నుల తగ్గింపు ఒక మార్గంగా చెబుతున్నారు. అందుకే 28శాతం ఉన్న వస్తువులను 18శాతంలోకి మార్చేందుకు పూనుకున్నారు. గత ఏడాది కాలంగా శ్లాబుల తగ్గింపు గురించి మధనం జరుగుతున్నది. 2024 డిసెంబరులో 55వ జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో చర్చకు పెట్టారు. కొన్ని వస్తువుల మీద పన్ను తగ్గింపు ద్వారా వచ్చే దీపావళి పండుగ తరుణంలో రు.4.25 లక్షల కోట్ల మేర వినియోగాన్ని పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచిన సమాచారం ప్రకారం 2018లో జిఎస్‌టి ద్వారా వచ్చిన రాబడి రు.11,77,380 కోట్లు. సగటున నెలకు రు.98వేల కోట్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల పెరుగుదల, కొన్ని వస్తువుల మీద పన్ను పెరుగుదల వంటి కారణాలు కూడా తోడై 2024లో రు.20,12,720 కోట్లకు అంటే సగటున రు.183వేల కోట్లకు పెరిగింది. సహజన్యాయం లేదా సామాజిక న్యాయం ప్రకారం అధిక ఆదాయం కలిగిన వారు ఎక్కువ మొత్తం పన్ను చెల్లించాలి, ఆ మేరకు తక్కువ రాబడి కలిగిన వారికి ఉపశమనం కలగాలి. ఆదాయపన్ను విషయంలో అదే జరుగుతున్నది. అదే జిఎస్‌టికి ఎందుకు వర్తించదు ?


ఫ్రాన్సు రాజధాని పారిస్‌ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ పాలసీ రీసెర్చ్‌ (సిఇపిఆర్‌) సంస్థ మన జిఎస్‌టి మీద ఒక అధ్యయనం చేసింది. జనాభాలో దిగువ 50శాతం మంది నుంచి 25శాతం రాబడి వస్తుండగా వారు వినియోగిస్తున్న వస్తు, సేవల వాటా 20 నుంచి 25శాతం మధ్య ఉంది.ఎగువ మధ్యతరగతిలోని 30శాతం మంది నుంచి రాబడి 35శాతం కాగా వినియోగం 35 నుంచి 38శాతం ఉంది. అదే ఎగువ 20శాతం నుంచి వస్తున్న మొత్తం 40శాతం కాగా వినియోగిస్తున్నది 45శాతంగా ఉందని మన కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ దగ్గర ఉన్న గణాంకాలను విశ్లేషించి చెప్పింది. ఇప్పుడున్న విధానం ప్రకారం అంబానీ, అదానీ, వారి దగ్గర పని చేసే దిగువ సిబ్బందిలో ఇద్దరు ఒకే షాపులో పండ్లుతోముకొనే బ్రష్‌లను కొనుగోలు చేస్తే నలుగురి మీద విధించే పన్ను మొత్తం ఒక్కటే. మొదటి ఇద్దరు జేబులో ఎంత తగ్గిందో అసలు చూడరు, కానీ పనివారు ఒకటికి రెండుసార్లు మిగిలి ఉన్న మొత్తాన్ని లెక్కపెట్టుకుంటారు. ఎందుకంటే ఆదాయ అసమానత. చూశారా చట్టం ముందు అందరూ సమానులే, సమానత్వం ఎంత చక్కగా అమలు జరుగుతోందో అని కొందరు తమ భుజాలను తామే చరుచుకుంటారు.


ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ, మరో ప్రముఖుడు ల్యూకాస్‌ ఛాన్సెల్‌ ఒక అధ్యయనం చేశారు. అదేమంటే 1922 నుంచి 2015 మధ్య కాలంలో మనదేశంలో జరిగిన ఆదాయ అసమానత పరిణామాలను పరిశీలించారు. బ్రిటీష్‌ రాజ్యం నుంచి బిలియనీర్ల రాజ్యం వరకు అంటూ తమ పరిశీలనకు పేరు పెట్టారు. పేరుకు మనది గణతంత్ర రాజ్యం అని రాసుకున్నప్పటికీ గతంలో బ్రిటీష్‌ వారు పాలిస్తే ఇప్పుడు వారి స్థానంలో బిలియనీర్లు ఉన్నారు.1922ను ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారు అంటే అదే ఏడాది మనదేశంలో బ్రిటీష్‌ పాలకులు ఆదాయపన్ను చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.మన జనాభాలో ఎగువ ఒకశాతం మందికి 1930దశకంలో 21శాతం రాబడి రాగా, 1980దశకంలో అది ఆరుశాతానికి తగ్గింది. తరువాత నూతన ఆర్థిక విధానాలు వచ్చాయి. ఎగువ నుంచి దిగువకు ఊటదిగినట్లుగా జనాభాలో దిగువన ఉన్న వారికి రాబడి ఊట దించేందుకు ఈ విధానాలను అనుసరిస్తున్నట్లు ఊట సిద్దాంతం చెప్పారు. కానీ జరిగిందేమిటి ? జనాభాలో ఒక శాతం ఉన్న ధనికుల ఆదాయం తిరిగి 22శాతానికి చేరింది. అందుకే బ్రిటీష్‌ వారి ఏలుబడి కంటే స్వాతంత్య్రంలోనే అసమానతలు పెరిగినట్లు వారు వ్యాఖ్యానించారు.1950 నుంచి 1980 మధ్య కాలంలో దిగువన ఉన్న 50శాతం మంది రాబడి మొత్తం సగటుతో పోలిస్తే ఎక్కువగా 28శాతం వేగంతో పెరగ్గా ఎగువన ఉన్న 0.1శాతం మంది రాబడి తగ్గిపోయింది. కానీ 2015 నాటికి అది తారుమారైంది. దిగువ 50శాతం మంది వృద్ధి రేటు పదకొండు శాతం కాగా ఎగువన ఉన్నవారిది 12శాతం పెరిగింది. మధ్య తరగతిగా ఉన్న 40శాతం మంది 23శాతం పొందగా ఎగువున ఒక శాతం మందికి 29శాతం ఉంది.


మనదేశంలో తొలి బిలియనీర్‌ నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌. పారిశ్రామికవేత్తలలో 1991లో ఒక్కరే ఉన్నారు. ఇండియా టుడే విశ్లేషణ ప్రకారం 2014లో 70 మంది 2025 నాటికి 284కు పెరిగారు. ఎగువ ఒక శాతం మంది వద్ద దేశ సంపదలో 40.1శాతం పోగుపడిరది. ఇంతగా ధనికులు పెరిగిన తరువాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరింతగా సంపాదిస్తారే తప్ప మోడీ చెప్పినట్లు సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదాన్ని సాకారం కానిస్తారా ? పార్లమెంటు, అసెంబ్లీల్లో పెరుగుతున్న కోటీశ్వరులు సామాన్యుల కోసం విధానాలను రూపొందిస్తారా ? 2025`26 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ 50లక్షల కోట్లు అనుకుంటే బిలియనీర్ల వద్ద ఉన్న సంపద 98లక్షల కోట్లు. ఒక్క ముంబైలోనే 90 మంది ఉన్నారని వారి సంపద 39లక్షల కోట్ల రూపాయలని లెక్క. ప్రపంచ అసమానతల ప్రయోగశాల(వరల్డ్‌ ఇనీక్వాలిటీ లాబ్‌) 2024 మార్చినెలలో విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం మనదేశంలో 2022లో వార్షిక రాబడి ఇరవై ఏండ్లు పైబడిన 92 కోట్ల మంది సగటు రు.2.3లక్షలంటే నెలకు ఇరవై వేలు. మధ్యగత రేఖ(మెడియన్‌) వార్షిక రాబడి రు.లక్ష అంటే నెలకు సగటున రు.8,750 మాత్రమే వస్తున్నది. ఎగువున ఉన్న పదిశాతం మంది ఏడాదికి సగటున రు.13లక్షలు, ఎగువ ఒక శాతం రు.50లక్షలు, ఎగువన 0.1శాతం మంది రెండు కోట్లు, 0.01శాతం మంది పది కోట్ల వంతున సంపాదిస్తున్నారు. ధనికుల్లో అగ్రశ్రేణి వారిలో 9,223 మంది సగటున 50 కోట్లు సంపాదిస్తున్నారు. ఇక సామాజిక తరగతుల వారీ చూస్తే ఐశ్యర్యవంతుల్లో 90శాతం మంది ‘‘ సవర్ణులు ’’’ 2.6శాతం దళితులు, మిగిలిన వారు ఓబిసిలు ఉన్నారట.2014 నుంచి 2022 కాలంలో ధనవంతులైన ఓబిసి బిలియనీర్ల సంపద 20 నుంచి పదిశాతానికి తగ్గగా సవర్ణులకు 80 నుంచి 90శాతానికి పెరిగిందని ఇనీక్వాలిటీ లాబ్‌ పర్కొన్నది. జనాభాలో 25శాతంగా ఉన్న వీరు 55శాతం సంపద కలిగి ఉన్నారట. ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఏమంటే ఇలాంటి ఆర్థిక అసమానతల ఉన్నపుడు శతకోటీశ్వరులు, అల్పాదాయ వర్గాలకు ఒకే జిఎస్‌టి రేటు సామాజిక న్యాయానికి విరుద్దం. ధనికుల మీద సంపదపన్ను విధిస్తే వచ్చే రాబడితో ఖజాన నింపుకోవచ్చు. వస్తు, సేవల పన్ను తగ్గిస్తే భారం ఎంతో తగ్గుతుంది.వినియోగం పెరిగితే యువతకు ఉపాధి పెరుగుతుంది, తద్వారా ప్రభుత్వాలకు రాబడీ పెరుగుతుంది. కానీ ఆ పని చేయటం లేదు. మోడీ సర్కార్‌ మహామాయ జిమ్మిక్కులతో శ్లాబుల కుదింపును రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకొనేందుకు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది తాత్కాలికమే. వాస్తవాలను గ్రహించినపుడు జనాలు చివరికి మోడీ నిజం చెప్పినా నమ్మని స్థితి వస్తుంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d