• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Uncategorized

విదేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్ల పిట్టకథల వెనుక సిఐఏ హస్తం !

21 Wednesday Jun 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#Anti China, china’s economic growth, CHINESE POLICE STATION, cia, Joe Biden, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఒకటి మాత్రం వాస్తవం. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా తీవ్రత తగ్గిన తరువాత వివిధ దేశాల ఆర్థిక రంగాలు ఎలా కోలుకుంటాయి, ఉక్రెయిన్‌ సంక్షోభం ఎలా ముగుస్తుంది.చైనా ఆర్థిక వ్యవస్థ ఏమౌతుంది అన్నవి ఎక్కువగా చర్చలో ఉన్న అంశాలు.కొద్ది రోజులుగా చైనా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి సోషల్‌ మీడియా, సంప్రదాయ మీడియాలో కూడా కొందరు తెగ స్పందిస్తున్నారు. విదేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్లంటూ ప్రచారం సాగుతున్నది. ప్రపంచ ఆర్థిక రంగంతో చైనా ముడిపడి ఉన్నంతగా ప్రపంచంలో ప్రస్తుతం మరొక దేశం లేదని గ్రహించాలి. 2018 తరువాత తొలిసారిగా చైనా పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చైనా మంత్రి క్విన్‌ గాంగ్‌తో రహస్య చర్చలు జరిపినట్లు జపాన్‌ వార్తా సంస్థ నికెయి పేర్కొన్నది. దాపరికం ఏమీ లేదు, చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దం అంటూ చొక్కా చేతులు మడుస్తున్న అమెరికా మూసిన తలుపుల వెనుక ఏమి చర్చించి ఉంటుంది. రెండు దేశాల సంబంధాల గురించి సుభాషితాలు చెప్పటం కాదు, ఆచరణలో చూపండి అని చైనా అధినేత షీ జింపింగ్‌ చెప్పినట్లు వెల్లడైంది. మరోసందర్భంలో దాని గురించి చూద్దాం.


చైనా ఆర్థిరంగం మందగించిందంటూ అనేక కథనాలు వెలువడుతున్న తరుణంలో అమెరికా విదేశాంగ మంత్రి బీజింగ్‌ వచ్చాడు. అందరూ చెబుతున్నట్లు నిజంగా ఆర్థికంగా కుంగిపోతుందా ? గడచిన నాలుగు దశాబ్దాలుగా అనేక మంది ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉన్నారు. మరింకేమీ పని లేనట్లు కొందరు వాటిని మన జనానికి సరఫరా గొలుసు ద్వారా పంపిణీ చేస్తున్నారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడిస్తున్నారు. మే నెలలో ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి ప్రభుత్వం వివరాలను వెల్లడిస్తున్నది. మన సర్కార్‌ మాదిరే చైనా కూడా అదే చేసింది. ఏప్రిల్‌ మాసంతో పోలిస్తే ఆర్థికరంగం పురోగతి మందగించిందని పేర్కొన్నది.దాన్ని చూపి ఇంకేముంది ఫినిష్‌ అన్నట్లుగా సంబరపడిపోతున్నారు.వేగం తగ్గటం వేరు, ప్రతికూల వృద్ది నమోదు వేరు. చైనా తనను తాను సమర్ధించుకోగలదు,లోపాలు ఉంటే సరిచేసుకోగలదు. దాన్ని ఎవరూ భుజాన వేసుకొని మోయాల్సిన అవసరం లేదు. వామపక్ష శక్తులే కాదు, ఇతరులకూ అక్కడి పరిణామాల వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారి కోసం కొన్ని మాటలు చెప్పుకోక తప్పదు. అంతర్జాతీయ వాతావరణం ఇప్పటికీ సంక్లిష్టంగాను, తీవ్రంగా ఉందని, ప్రపంచ ఆర్థిక పరిస్థితి స్థబ్దుగా ఉందని, తమ ఆర్థికరంగం సరిగానే కోలుకుంటున్నప్పటికీ, మార్కెట్‌ గిరాకీ ఇంకా తక్కువగా ఉందని చైనా ప్రతినిధి విలేకర్లతో చెప్పారు. ఏ రంగంలో ఎంత పురోగతి ఉంది, దేనిలో ఎంత తిరోగమనం ఉందో కూడా అంకెలను వెల్లడించారు. మందగమనాన్ని అరికట్టి వేగాన్ని పెంచేందుకు ఉద్దీపన పాకేజీ గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానిలో భాగంగానే 2.75 శాతం ఉన్న వడ్డీ రేటును 2.65కు తగ్గించింది.


ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ అనే అంతర్జాతీయ సంస్థ జరిపిన సర్వే గురించి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఒక వార్తను ప్రచురించింది. దాని ప్రకారం 74శాతం మంది జీవన వ్యయ పెరుగుదల, తమ వ్యక్తిగత ఆర్థిక స్థితి గురించి ఆందోళన వెల్లడించగా, 63శాతం మంది సేవలు, అత్యవసరం గాని వస్తువుల గురించి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నట్లు చెప్పారట. మరి మన కేంద్ర ప్రభుత్వం పాకేజీలేమైనా ప్రకటిస్తుందా ? ఆరున్నరశాతంగా ఉన్న వడ్డీ రేటును తగ్గిస్తుందా ? ఎందుకంటే చైనా కంటే మన పరిస్థితి మెరుగ్గా వుందని చెబుతున్నారు కదా !చైనాలో వేతనాలు పెరుగుతున్నందున తక్కువ ధరలకు అక్కడ సరకులను ఉత్పత్తి చేసేందుకు వీలు లేని కారణంగా కంపెనీలు మనవైపు చూస్తున్నాయని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఎర్రతివాచీలు పరచి ఏమేమి రాయితీలు ఇచ్చేది చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మి కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. బండి గుర్రానికి గడ్డి చూపించి పరుగెత్తిస్తున్నట్లు తాము సూచించిన సంస్కరణలను అమలు జరిపితే అప్పుల పరిమితి పెంచుతామని చెబుతోంది తప్ప జన జీవన వ్యయ పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వమూ ముందుకు రావటం లేదు, రాష్ట్రాలనూ కోరిన దాఖలాలు లేవేమి ?


చైనా నుంచి తరలి పోతున్నట్లు కొన్ని కంపెనీలు ప్రకటించిన మాట నిజం, అవి మన దేశానికి వస్తాయని చెప్పిన వారి అంచనాలు తప్పిందీ అంతే వాస్తవం.2022 డిసెంబరు నాటికి తొమ్మిది నెలల కాలంలో మన దేశానికి వచ్చిన ఎఫ్‌డిఐలు 36.7 బి.డాలర్లు, అదే అంతకు ముందు ఏడాది వచ్చిన మొత్తం 43.2 బి.డాలర్లని మార్చి 20 వ తేదీ బిజినెస్‌స్టాండర్డ్‌ పత్రిక వార్త పేర్కొన్నది.చైనాలో కూడా ఎఫ్‌డిఐ పెరుగుదల తగ్గినప్పటికీ 2022లో కొత్తగా 18,532 విదేశీ పెట్టుబడి సంస్థలు నమోదైనట్లు, అంతకు ముందేడాదితో పోలిస్తే 38.3 శాతం ఎక్కువని చైనా పేర్కొన్నది. ప్రపంచమంతటా కరోనా లాక్‌డౌన్లు ఎత్తివేసినా చైనాలో 2022 డిసెంబరు వరకు దాదాపు దేశమంతటా సున్నా కోవిడ్‌ కేసులు అనే విధానంలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగింది, తరువాత ఎత్తివేశారు. ఈ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి తిరిగి అనేక రంగాల్లో వినిమయం పెరిగి మే నెలలో తగ్గిందని చెబుతున్నారు. దాన్ని నమ్మటమా లేదా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. అంతర్గత మార్కెట్‌తో పాటు అనేక ధనిక దేశాల్లో తలెత్తిన మాంద్యం కూడా తోడైంది. మన దేశంలో ఈ ఏడాది మార్చినెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటుతో పోలిస్తే వర్తమాన సంవత్సరం రేటు తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అదే చైనాకూ వర్తించుతుంది.


చైనాలో 16-24 సంవత్సరాల వయస్సు గల వారిలో మే నెలలో 20.8శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సర్వే వెల్లడించింది. మన దేశంలో ఎంత ఉందో ప్రభుత్వం ప్రకటించిన దాఖలాల్లేవు. ఇక్కడి పరిస్థితి మామూలేగా, అద్భుతాలు సృష్టిస్తున్నదని చెబుతున్న చైనాలో అలా ఉండటం ఏమిటని కొందరు అమాయకత్వాన్ని నటిస్తారు. చైనా పురోగతి అద్భుతమనటంలో ఎలాంటి సందేహం లేదు. నూటనలభై కోట్ల మంది అవసరాలను తీర్చగల స్థాయికి ఇంకా పెరగలేదు గనుకనే కొన్ని సమస్యలు. వాటిని తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చూస్తున్నదా లేదా లేక మన ప్రధాని చెప్పినట్లు పకోడీ, బజ్జీల బండి పెట్టుకొని ఉపాధి చూసుకోండని గాలికి వదలివేసిందా అన్నదే ప్రశ్న.మన దేశంలో ఏటా 65లక్షల మంది డిగ్రీలు తీసుకొని కాలేజీల నుంచి వెలుపలికి వస్తుంటే చైనాలో దానికి రెట్టింపుగా రికార్డు స్థాయిలో 115.8లక్షల మంది ఈ ఏడాది వచ్చారు. మే నెలలో మొత్తం 3.3 కోట్ల మందికి గాను 2.6 కోట్ల మంది ఏదో ఒక ఉపాధిలో చేరారని, 60లక్షల మంది వేచి ఉన్నారని కూడా చైనా సర్వే పేర్కొన్నది. మన దేశంలోని సిఎంఐఇ సంస్థ పేర్కొన్న సమాచారం ప్రకారం పాతికేండ్ల లోపు యువత మన జనాభాలో 40శాతం ఉన్నారు. వారిలో 2022 డిసెంబరు నాటికి 45.8శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. చైనాలో 20శాతంపైన ఉంటే అక్కడి వారి గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నవారు మన దేశంలో దానికి రెట్టింపుకు మించి ఉన్నవారి గురించి మాట్లాడరేం ? చైనాలో మే నెలలో నిరుద్యోగులు మే నెలలో 4.1శాతం, అదే మన దేశంలో ఏప్రిల్‌ నెలలో 8.11శాతం ఉంది.


చైనా గడచిన నాలుగు దశాబ్దాలలో అనేక విజయాలతో పాటు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొన్నది. వాటిని అధిగమించి ముందుకు పోతున్నది. ఇప్పుడు కూడా అంతే. అక్కడి నాయకత్వం మరింత పరిణితి చెందింది. కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు క్రిమి కీటకాలు కూడా లోనికి వస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ చైనా మార్కెట్‌ను తెరిచేటపుడు చెప్పాడు. ఇప్పుడూ ఎదురైన సవాళ్లను అదిగమించగలదని గత చరిత్రను బట్టి చెప్పవచ్చు. మన దేశంతో సహా విదేశాలలో 110 చైనా పోలీస్‌ స్టేషన్లు అంటూ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తన వ్యతిరేకులను పట్టుకొనేందుకు అనధికారికంగా వాటిని తెరిచిందనే ప్రచారం ఇప్పటికీ సాగుతోంది.దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా ఈ కట్టు కథలను పిట్ట కతలను నమ్ముతున్నవారు లేకపోలేదు.


తమ రాజధాని సియోల్‌, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న చైనా రహస్య పోలీస్‌ స్టేషన్ల గురించి విచారణ జరుపుతున్నట్లు దక్షిణ కొరియా అధికారులు తాజాగా చెప్పారు. ఒక చైనా రెస్టారెంట్‌ కేంద్రంగా పని చేస్తున్నట్లు గుర్తించారట. స్పెయిన్‌ కేంద్రంగా పని చేస్తున్న సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ అనే ఒక స్వచ్చంద సంస్థ చేస్తున్న ప్రచారం ప్రకారం 53 దేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయట.కరోనా మహమ్మారి విజృంభించినపుడు వివిధ దేశాల్లో ఉన్న తమ జాతీయులను స్వదేశానికి రప్పించేందుకు కొన్ని సంస్థలు పని చేశాయి తప్ప పోలీస్‌ స్టేషన్లు లేవని మే 15వ తేదీన చైనా విదేశాంగశాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. చైనా జాతీయులు నిర్వహించే రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థల ముసుగులో పోలీస్‌ స్టేషన్లు నడుపుతున్నారని గత కొద్ది నెలలుగా ప్రచారం చేస్తున్నారు. న్యూయార్క్‌ నగరంలో అలాంటి ఒక పోలీస్‌ స్టేషన్ను పట్టుకున్నామని, 1998 నుంచి పని చేస్తున్న ఒక ధార్మిక సంస్థకు చెందిన ఇద్దర్ని గుర్తించినట్లు అమెరికా పోలీసులు ప్రకటించారు. నగరంలోని చైనీయులకు అవసరమైన సేవలు అందిస్తామంటూ ఆ సంస్థ బహిరంగంగానే మీడియాలో చిరునామాతో సహా ప్రకటనలు జారీ చేసినప్పటికీ అమెరికా పోలీసులు అది రహస్యంగా పని చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశారు. బ్రిటన్‌లో కూడా ఇలాంటివే ఉన్నట్లు సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ చెప్పటంతో మూడు అనుమానిత ప్రాంతాల్లో సోదా చేసిన పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు, చట్ట ఉల్లంఘనలు కనిపించలేదని బ్రిటన్‌ భద్రతా మంత్రి టామ్‌ ప్రకటించాడు.


చైనా పోలీస్‌ స్టేషన్ల ప్రచారం సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ సంస్థ నుంచే జరుగుతోందన్నది స్పష్టం. దీని కథను చూస్తే అది అమెరికా సిఐఏ ఏర్పాటు చేసినది అని స్పష్టం అవుతున్నది. మానవహక్కుల కార్యకర్త పేరుతో స్వీడిష్‌ జాతీయుడైన పీటర్‌ డాహిలిన్‌ చైనాలో 2009లో కుర్ర లాయర్లు, గ్రామీణులకు సాయం చేసే పేరుతో చైనా యాక్షన్‌ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. చేస్తున్న సాయం సంగతి పక్కన పెడితే ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టటం అసలు లక్ష్యంగా వెల్లడి కావటంతో 2016 చైనా అధికారులు డాహ్లిన్‌తో సహా పని చేస్తున్న వారందరినీ పట్టుకొని జైల్లో పెట్టారు. కొందరు కనిపించకుండా పోయారు. డాహ్లిన్‌ కేవలం 23 రోజులు మాత్రమే జైల్లో ఉన్నాడు. తాను చట్టవిరుద్దంగా పని చేశానని అంగీకరించటంతో విడుదల చేసి పది సంవత్సరాల పాటు తిరిగి చైనాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించారు. అప్పటి నుంచి చైనా గురించి ప్రపంచానికి కట్టుకథలు చెప్పటం ప్రారంభించాడు. నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ(ఎన్‌ఇడి) అనే పేరుతో పనిచేసే అమెరికా సంస్థ ప్రపంచంలో తప్పుడు ప్రచారం, కట్టుకథలు అల్లే వారికి, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారకులకు పెద్ద మొత్తంలో నిధులు అందచేస్తుంది. దీనికి సిఐఏ మార్గదర్శకత్వం ఉంది. ఆ సంస్థ నుంచి డాహ్లిన్‌ నిధులు పొందినట్లు 2017లో హాంకాంగ్‌ ఫ్రీ ప్రెస్‌ అనే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికతో చెప్పాడు. అమెరికా ఎన్‌ఇడి మాదిరి ఐరోపా ఇఇడి సంస్థ డాహ్లిన్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందచేసింది. ఈ సంస్థలు అనేక దేశాల్లో అక్కడి పాలకుల మీద జనాలను రెచ్చగొట్టి వాటికి రంగుల విప్లవాలని పేరు పెట్టి ప్రచారం చేసిన చరిత్ర ఉంది, ఇప్పటికీ అదే జరుగుతోంది.చైనా గురించి ఎన్నిక కథలు చెప్పినా దాని పురోగతి ఆగటం లేదు, ఆగదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎక్కడైనా బావే గానీ సిఎం కుర్చీ దగ్గర కాదు : మహారాష్ట్రలో బిజెపి, షిండే శివసేన కుమ్ములాట – ముద్దులాట !

14 Wednesday Jun 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BJP-Sena rift, Maharashtra, Narendra Modi Failures, Siva Sena


ఎం కోటేశ్వరరావు


మహారాష్ట్రలో అసలు సిసలు మహత్తర హిందూత్వ శక్తులం, హిందుమత ఉద్దారకులం తామే అంటున్న బిజెపి – షిండే శివసేన నేతలు ఎంతవారలైనా అధికార కాంత దాసులే అన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో సిఎం కుర్చీ కోసం కొట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది.” ఢిల్లీలో నరేంద్రమోడీ – రాష్ట్రంలో ఫడ్నవీస్‌ ” అంటూ బిజెపి ఒక నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానికి పోటీగా ” దేశంలో మోడీ – మహారాష్ట్రలో షిండే ” అంటూ తాజాగా షిండే శివసేన సోమవారం నాటి పత్రికల్లో ఇచ్చిన ప్రకటన రెండు పార్టీల మధ్య కాక పుట్టించింది.మంగళవారం నాడు కొల్లాపూర్‌లో సిఎం ఏకనాధ్‌ షిండే పాల్గొన్న కార్యక్రమాలను దేవేంద్ర ఫడ్నవిస్‌ బహిష్కరించారు, అనారోగ్యసాకు చెప్పినట్లు వార్తలు. దాంతో రెండు పార్టీలు నష్ట నివారణకు పూనుకొని బుధవారం నాటి పత్రికల్లో ఐక్యంగా ఉన్నట్లు కనిపించేందుకు శివసేన మరొక ప్రకటన ఇచ్చింది.” అందరూ ప్రేమించిన అద్భుతమైన బృందం ” అనే శీర్షికతో నష్ట నివారణకు గాను శివసేన మరొక ప్రకటన జారీ చేసింది. దానిలో నరేంద్రమోడీ, అమిత్‌ షా, బాలాసాహెబ్‌ థాకరే, ఆనంద దిఘేల బొమ్మలతో పాటు ఏకనాధ్‌ షిండే -దేవేంద్ర ఫడ్నవిస్‌ ఇద్దరూ జట్టుగా చేతులూపుతున్న చిత్రాన్ని ప్రదర్శించారు. వాటితో పాటు శివసేన ఎన్నికల గుర్తు బాణం, బిజెపి గుర్తు కమలం కూడా చోటు చేసుకుంది. తొలి ప్రకటనలో షిండేకు 26.1శాతం, ఫడ్నవిస్‌కు 23.2 శాతం మద్దతు అని పేర్కొనగా తాజా ప్రకటనలో ఇద్దరికీ కలిపి 49.3 శాతం మద్దతు అని పేర్కొన్నారు. ఈ పరిణామం మిగతా రాష్ట్రాలలో బిజెపితో చేతులు కలిపే ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఒక పాఠంగా పనికివస్తుంది. మరోవైపు కొద్ది రోజుల క్రితం సకాల్‌ అనే మరాఠీ దినపత్రిక వెల్లడించిన ఒక సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్‌సిపిా థాకరే శివసేన పార్టీ (ఎంవిఏ) మెజారిటీ సీట్లను సాధిస్తుంది. నిర్ణీత గడువు ప్రకారమైతే లోక్‌సభ తరువాత వచ్చే ఏడాది అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు, అలాగాక రెండింటినీ కలుపుతారా అన్నది చెప్పలేము.


శివసేనను చీల్చి బిజెపి మద్దతుతో బిజెపి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏదో ఒక అంశం రెండు పార్టీల మధ్య అనుమానాలను పెంచింది. రెండుసార్లు సిఎంగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఉప ముఖ్యమంత్రిగా పెట్టి అసలు కథ నడిపించాలన్నది బిజెపి పన్నాగం. ఏకనాధ్‌ షిండే తాత్కాలికమే, సిఎం పదవి తనదే అన్నట్లుగా ఫడ్నవిస్‌ ” ఢిల్లీలో నరేంద్రమోడీ- రాష్ట్రంలో ఫడ్నవీస్‌ ” అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. దానికి పోటీగా ఏకనాధ్‌ షిండే రంగంలోకి దిగారు. ఒక టీవీ ఛానల్‌-ఒక ఏజన్సీ నిర్వహించిన సర్వేలో తిరిగి సిఎంగా షిండేను కోరుతున్నవారు 26.1శాతం, ఫడ్నవిస్‌ను కోరుతున్నవారు 23.2శాతం అని తేలిందని పేర్కొంటూ శివసేన పేరుతో ఒక ప్రకటన జారీ చేశారు. అంతే కాదు బిజెపికి 30.2శాతం, షిండే సేనకు 16.2శాతం ఓటర్ల మద్దతు ఉందని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో షిండే అమలు జరుపుతున్న పధకాల వలన ప్రజా మద్దతు పెరిగిందని కూడా పేర్కొనటం గమనించాల్సిన అంశం. బాలాసాహెబ్‌ థాకరే ఫొటో లేకుండా ఆ ప్రకటన జారీ చేయటం అంటే మోడీ, అమిత్‌ షాలను చూసి షిండే భయపడుతున్నారని తేలిందని ఉద్ధావ్‌ ధాకరే సేన నేత సంజయ రౌత్‌ ధ్వజమెత్తారు. ఈ ప్రకటనను బట్టి ఏకనాధ్‌ షిండేను సిఎంగా అంగీకరించినట్లేనని ఫడ్నవిస్‌కు ఇది విచారకరమైన రోజని ఎన్‌సిపి స్పందించింది. ఈ ప్రకటన గురించి బిజెపి పెద్దలకు తెలిపామని, వారి అంగీకారంతోనే విడుదల చేసినట్లు షిండే వర్గం చెప్పుకుంది. సిఎంను పొగడటం వరకు ఓకే , ఇద్దరికీ కలిపి ఉన్న బలం గురించి ప్రతిపక్షాలకు చెప్పాలి మనలో ఎవరికి ఎంత బలం ఉందో, తమ నేత ఫడ్నవిస్‌కు జనంలో ఆదరణ లేదని చెప్పటాన్ని అంగీకరించేది లేదని బిజెపి నేతలు మండిపడ్డారు. షిండే తనతో పాటు తీసుకువచ్చిన 40 మంది ఎంఎల్‌ఏల కారణంగానే బిజెపికి అధికారం దక్కిందని గుర్తించాలని షిండే వర్గం తిప్పి కొట్టింది. ఇలాంటి ప్రకటనల రాజకీయాలు కొత్త కాదు. 2019 ఎన్నికల్లో మోడీ దేశానికి దేవేంద్ర రాష్ట్రానికి అంటూ బిజెపి ప్రకటనలు జారీ చేసింది.


షిండే సేన ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలు తమవే అని బిజెపి చెబుతోందని, అదే విధంగా షిండే వర్గానికి చెందిన ఐదుగురు మంత్రులను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మంత్రులు ఉద్దావ్‌ధాక్రేపై తిరుగుబాటులో కీలకపాత్ర పోషించారు. వారి ప్రవర్తనతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని ఫడ్నవిస్‌ ఇటీవల అమిత్‌ షా వద్ద మొరపెట్టుకున్నారని వార్తలు. ఇటీవల ఎవరికి వారు తమ ఎంఎల్‌ఏలతో విడివిడి సమావేశాలు జరపటం, నిధులు సరిగా కేటాయించటం లేదని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నట్లు షిండే కుమారుడు, ఎంపీ డాక్టర్‌ శ్రీకాంత్‌ షిండేపై బిజెపి నేతలు ధ్వజమెత్తారు. శ్రీకాంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కల్యాణ్‌ లోక్‌సభ సీటు తమదే అని కూడా వారు బహిరంగంగా చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో బలపరచకూడదని తీర్మానాలు కూడా చేశారు. ఈ పూర్వరంగంలో అవసరమైతే తాను రాజీనామా చేస్తానని శ్రీకాంత్‌ గతవారంలో ప్రకటించారు. సిఎంగా తండ్రి తీసుకొనే నిర్ణయాల వెనుక కుమారుడి ప్రభావం ఉందన్న పేరుంది. ఏకనాధ్‌ షిండేను అదుపులో ఉంచేందుకు, అవసరమైతే తప్పించేందుకు ఎన్‌సిపి నేత అజిత్‌ పవార్‌కు బిజెపి గాలం వేసింది. రాష్ట్ర రాజకీయాలలో అధికారం కోసం అర్రులు చాస్తారన్న పేరున్న అజిత్‌ బిజెపిలో చేరటం లాంఛనమే అన్న వార్తలు కూడా వచ్చాయి. అదే జరిగితే తాము కూటమి నుంచి తప్పుకుంటామని బిజెపిని షిండేసేన హెచ్చరించింది. అజిత్‌ పవార్‌ గతంలో బిజెపితో చేతులు కలిపి దొంగచాటుగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 80 గంటల తరువాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష కూటమి నేతగా ఉన్నారు.


మరాఠీ పత్రిక సకాల్‌ ఇటీవల ప్రకటించిన సర్వే ప్రకారం మహారాష్ట్రలో నరేంద్రమోడీని ప్రధానిగా కోరుకుంటున్నవారు 42.1శాతంగా కాగా వద్దన్నవారు 41.5శాతం ఉన్నారు. మిగిలిన వారు చెప్పేందుకు నిరాకరించటం లేదా తెలియదని చెప్పారు. దాదాపు 70శాతం మంది ఆర్థిక రంగంలో మోడీ విఫలం చెందినట్లు పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ తరువాత ఎక్కువ 48 స్థానాలున్న ఇక్కడ మోడీ పట్ల అనుకూలత ఎంతో ప్రతికూలత కూడా అంతే ఉంది. కోర్టులో శివసేన పేరు, గుర్తును షిండే వర్గం దక్కించుకోవచ్చుగానీ ఈ సర్వే ప్రకారం ఓటర్లు 12.5శాతం మంది ఉద్దావ్‌ ధాక్రే శివసేనకు మద్దతు ప్రకటిస్తే కేవలం 5.5శాతమే షిండేకు అనుకూలమని చెప్పారు. బిజెపికి 33.7శాతం మొగ్గుచూపారు. బిజెపి కూటమికి 39.2 శాతం మద్దతు పలకగా ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్‌సిపి, ఉద్దావ్‌ శివసేన కూటమికి 48శాతం మంది అనుకూలం అన్నారు. అరమరికలు లేకుండా ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఓటు బదిలీ చేసుకుంటే బిజెపి శంకరగిరి మాన్యాలు పడుతుందని అంకెలు చెబుతున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్‌-ఎన్‌సిపి ఒక కూటమిగా పోటీ చేశాయి. బిజెపికి 27.84, శివసేనకు 23.5, కూటమికి 51.34 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌, ఎన్‌సిపిలకు 16.41,15.66 మొత్తం 32.07శాతం రాగా 47 చోట్ల బరిలోకి దిగిన వంచిత్‌ బహుజన్‌ అగాధీకి 6.92 శాతం దానితో కలసి ఒక చోట పోటీ చేసి దాన్ని గెలుచుకున్న మజ్లిస్‌కు 0.73 ఓట్లు వచ్చాయి. వంచిత్‌ బహుజన్‌ అగాధీ ప్రస్తుతం ఉద్దావ్‌ శివసేనకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2019 అక్టోబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, శివసేన కూటమికి 25.75,16.41 చొప్పున మొత్తం 42.16 శాతం మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌, ఎన్‌సిపి కూటమికి 15.87, 16.71 చొప్పున, మొత్తం 32.58 శాతం వచ్చాయి. ఇక కుమ్ములాటలు-ముద్దులాటలుగా ఉన్న బిజెపి-షిండే సేన కూటమి తాత్కాలికంగా కలసి ఉన్నట్లు కనిపించేందుకు పూనుకున్నప్పటికీ అధికార కుమ్ములాటలు,పరిణామాలు ఏ రూపం తీసుకొనేది చెప్పలేము.కలసి ఉన్నా ఎంవిఏ కూటమిని ఎంత మేరకు ఎదుర్కొనేది ప్రశ్నార్ధకమే.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పరిశోధనల్లో చైనాను తక్కువ అంచనా వేస్తే ముప్పే – అమెరికాను హెచ్చరించిన ఓ నివేదిక !

14 Wednesday Jun 2023

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti china, Chinese Innovation Inputs, Chinese Scientific Articles, ITIF, natural-science research ranking, R&D Expenditures


ఎం కోటేశ్వరరావు


ప్రకృతి విజ్ఞానం(నేచురల్‌ సైన్స్‌)లో అమెరికాను వెనక్కు నెట్టి చైనా ప్రధమ స్థానానికి వచ్చిందన్నది ఒక నివేదిక.” మేలుకో అమెరికా : నవ కల్పన ఉత్పత్తిలో అమెరికాను అధిగమిస్తున్న చైనా ” అనే శీర్షికతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఐటిఐఎఫ్‌) ఒక నివేదికలో హెచ్చరించింది. ” చైనా నకిలీ సైన్సు పరిశ్రమ ” అంటూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక ఒక పెద్ద నింద మోపింది. ఇవన్నీ ఇటీవల చైనా గురించి వచ్చిన విశ్లేషణలు, వార్తలకు సంబంధించిన అంశాలు. ప్రకృతి విజ్ఞానంలో చైనా తొలిసారిగా అమెరికాను అధిగమించి ఒకటవ స్థానంలో ఉన్నట్లు నేచర్‌ ఇండెక్స్‌ పేర్కొన్నది. అగ్రశ్రేణి పత్రికల్లో 2022 సంవత్సరంలో ప్రచురితమైన పరిశోధనా పత్రాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. ఎనభై రెండు పత్రికల్లో చైనాకు చెందిన వారు సమర్పించిన పత్రాలు 19,373 కాగా అమెరికా నుంచి వచ్చినవి 17,610 ఉన్నాయి. ఏ దేశానికి చెందిన వారైనా ఏ దేశం నుంచి పత్రాలను సమర్పిస్తే వాటిని ఆ దేశాల ఖాతాలో వేస్తారు. ప్రకృతి విజ్ఞాన పరిశోధనా పత్రాల సమర్పణలో చైనా, అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, జపాన్‌ మొదటి ఐదు స్థానాల్లో ఉండగా మన దేశం పదవ స్థానంలో ఉంది. భౌతిక, రసాయన శాస్త్ర పరిశోధనల్లో 2021లో చైనా మొదటి స్థానంలో ఉంది. తాజా సమాచారాన్ని పరిశీలించినపుడు భూమి, పర్యావరణ శాస్త్రాలలో కూడా తొలిసారిగా అమెరికాను వెనక్కు నెట్టి చైనా ముందుకు వచ్చింది. గత ఏడాది వివరాలను పరిశీలించినపుడు ప్రపంచ అగ్రశ్రేణి 50 పరిశోధన ఉత్పాదక సంస్థలలో చైనా సైన్సెస్‌ అకాడమీ ఒకటవదిగా ఉండగా మొత్తం 19 చైనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఆ జాబితాలో ఉన్నాయి. 2010 నుంచి జాతీయ సమతూకంలో మార్పు ఉన్నట్లు నేచర్‌ ఇండెక్సు ప్రకటన పేర్కొన్నది.2018 -2020 సంవత్సరాలలో ఉటంకించిన అగ్రశ్రేణి ఒకశాతం పరిశోధనా పత్రాలలో అమెరికా కంటే చైనావే ఎక్కువగా ఉన్నట్లు సైన్సెస్‌ మరియు టెక్నాలజీ జపాన్‌ జాతీయ సంస్థ 2022 నివేదిక పేర్కొన్నది.

నిజానికి 2018లోనే మొత్తం పరిశోధనా పత్రాల సమర్పణలో అమెరికా, ఐరోపాను వెనక్కు నెట్టి చైనా ముందుంది.
2018 నుంచి 2020వరకు ప్రపంచ శాస్త్ర పత్రాలలో 23.4శాతంతో చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతానికి జీవ శాస్త్ర రంగంలోనే అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.అమెరికా ఎన్నో శతాబ్దాలు ముందుండి పరుగులు పెడుతుంటే చైనా ఇటీవలనే నడక ప్రారంభించింది. అందుకే ఇప్పటికీ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు కొన్ని రంగాలలో ముందున్నాయి. నోబెల్‌ బహుమతులను కొలబద్దగా తీసుకుంటే 403తో అమెరికా, 137తో బ్రిటన్‌, 114తో జర్మనీ మొదటి మూడు స్థానాల్లో ఉండగా చైనా తొమ్మిదితో 23వ స్థానంలో ఉంది. 2015లో పశ్చిమ దేశాల సైన్సు పత్రికలలో చైనా పరిశోధనా పత్రాలు కేవలం ఏడున్నవేలు మాత్రమే ప్రచురణకు నోచుకోగా అమెరికా నుంచి 21వేలవరకు ఉన్నాయి. 2020 అమెరికా పత్రాలు స్వల్ప తేడాతో స్థిరంగా ఉండగా తరువాత తగ్గటం ప్రారంభమైంది. మరోవైపున అచిర కాలంలోనే చైనా దాన్ని అధిగమించింది. పశ్చిమ దేశాల పరిశోధనా సంస్థలు కొన్ని రంగాలలో తప్పనిసరైతే తప్ప చైనా లేదా మరొక వర్ధమాన దేశంతో సహకరించటం లేదన్నది తెలిసిందే. కొత్తవాటిని కనుగొనటం కాకుండా ఉన్నవాటిని కాపీ కొడుతుందని ఇప్పటికీ చైనా గురించి చెప్పేవారు మనకు కనిపిస్తారు. అదే నిజమైతే మిగిలిన దేశాలకూ అలాంటి అవకాశం ఉన్నట్లే, మరి అవెందుకు ఆ పని చేయటం లేదు ? మన దేశంలో దొంగ డిగ్రీలు, చివరికి పిహెచ్‌డి థీసిస్‌లను కూడా కొనుక్కొని పట్టాలు పొందవచ్చు కనుక అనేక మంది చైనా గురించి జరుగుతున్న ప్రచారాన్ని నమ్మటంలో వింత లేదు.


వాషింగ్టన్‌ డిసి కేంద్రంగా పని చేస్తున్న ఐటిఐఎఫ్‌కు చైనా మీద ఎలాంటి ప్రత్యేక అభిమానం ఏమీ ఉండదు, అది అమెరికాలోని ఒక స్వచ్చంద సంస్థ. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదికలో అమెరికా పాలకవర్గానికి ఒక హెచ్చరిక చేసింది. చైనాను ఒక నవకల్పన దేశానికి బదులు అనుకరించేది అని తక్కువగా అంచనా వేస్తే తనకు తానే ఆపద కొనితెచ్చుకున్నట్లు అవుతుందని పేర్కొన్నది.2020 నాటికి అంతర్జాతీయ పేటెంట్‌ కుటుంబాల (అమ్మా, నాన్న, పిల్లలు కుటుంబం అన్నట్లే, ఒక పేటెంట్‌ దానికి అనుబంధంగా పేటెంట్లు ఉండటాన్ని కూడా కుటుంబంగా పరిగణిస్తారు) సంఖ్య అమెరికా కంటే చైనాకు చెందినవి ఐదు రెట్లు ఉన్నట్లు చెప్పింది.నవకల్పనలో అమెరికా ఆధిపత్యాన్ని పునరుద్దరించాలని విధాన నిర్ణేతలకు సూచించింది. మేడిన్‌ చైనా 2025 వ్యూహం ప్రకారం ఆ దేశం ముందుకు పోతున్నదని కూడా చెప్పింది. పరిశోధనా రంగంలో సాధిస్తున్న ప్రగతిని పేర్కొంటూ 2010లో ఐరోపా సమాఖ్య ప్రకటించిన పరిశోధన-అభివృద్ధి రంగంలో పెట్టుబడుల సూచికలో 1,400 కంపెనీలకు గాను 19 చైనా కంపెనీలుండగా 2020 నాటికి 278కి పెరగ్గా ఇదే కాలంలో అమెరికా సంస్థలు 487 నుంచి 449కి తగ్గాయి. సైన్స్‌, ఇంజనీరింగ్‌ పరిశోధనా పత్రాలు 2020లో 7,42,000 కాగా అవి అమెరికా కంటే 123.7శాతం ఎక్కువని ఐటిఐఎఫ్‌ పేర్కొన్నది. పేటెంట్ల లైసన్సు ద్వారా వచ్చే రాబడిలో అమెరికా ఎంతో ముందుంది. చైనాకు 2016లో అమెరికాకు వచ్చే రాబడిలో కేవలం రెండుశాతమే రాగా 2020 నాటికి 12శాతానికి పెరిగిందని ప్రపంచ బాంకు సమాచారం వెల్లడించింది. సూపర్‌ కంప్యూటర్లలో 2020 నాటికి 500 అగ్రశ్రేణి వ్యవస్థలకు గాను చైనాలో 214 ఉండగా అమెరికా 113 మాత్రమే ఉన్నాయి. పారిశ్రామిక రోబోల వినియోగంలో 2010 అమెరికాతో పోలిస్తే పదికి ఒకటి ఉండగా ఇప్పుడు అమెరికాతో సమంగా ఉన్నాయి. గణనీయ పురోగతి ఉన్నప్పటికీ చైనా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఐటిఐఎఫ్‌ పేర్కొన్నది.


ఎలక్ట్రిక్‌ బాటరీలు, హైపర్‌సోనిక్‌,5జి,6జి, నానో స్కేల్‌ మెటీరియల్స్‌, సింథటిక్‌ బయాలజీ వంటి కొన్ని రంగాలలో తిరుగులేనిదిగా ఉన్న చైనా 44 సాంకేతిక పరిజ్ఞానాల్లో 37లో ముందున్నదని ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పోలసీ ఇనిస్టిట్యూట్‌ అనే మేథో సంస్థ 2022 నివేదికలో పేర్కొన్నది. మిగిలిన ఏడింటిలో అమెరికా ముందున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని పది అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలు చైనాలో ఉన్నాయని, అమెరికా కంటే తొమ్మిది రెట్లు పరిశోధనా పత్రాలను అవి రూపొందిస్తున్నట్లు , షీ జింపింగ్‌, అంతకు ముందున్న నేతల మార్గదర్శకత్వంలో ఈ కృషి కొనసాగుతున్నదని పేర్కొన్నది. అణ్వాయుధాలను మోసుకుపోగల హైపర్‌సోనిక్‌ క్షిపణులను 2021లో పరీక్షించిన తీరును చూసి అమెరికా గూఢచార సంస్థలు ఆశ్చర్యపడనవసరం లేదని, గడచిన ఐదు సంవత్సరాలలో ప్రపంచంలో పెద్ద ప్రభావం కలిగించే మొత్తం పరిశోధనా పత్రాల్లో 48.49శాతం ఒక్క చైనా నుంచే ఉన్నట్లు ఆస్ట్రేలియన్‌ సంస్థ పేర్కొన్నది.


పరిశోధనల్లో వివిధ దేశాల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. సహకరించిన వారెవరైనా ఏ దేశానికి చెందిన వారు పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తే దాన్ని ఆ దేశ ఖాతాలో వేస్తారు.చైనా నుంచి వస్తున్న పరిశోధనా పత్రాలు ఇతరుల సహకారంతో సమర్పిస్తున్నవని కొందరు చైనాను తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.రెండవది చైనా తమ పరిశోధన అంశాలను తస్కరిస్తున్నారని నిందిస్తున్నారు. మన దేశంతో సహా అనేక దేశాల సంప్రదాయ విజ్ఞానాన్ని అమెరికా, ఐరోపా దేశాలు అపహరించి తమ పేరుతో మేథో సంపత్తి హక్కులు పొందాయి. అందుకు ఒక చక్కటి ఉదాహరణ మన దేశం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు చెబుతున్న పసుపు మీద అమెరికా పేటెంట్‌ హక్కు దఖలు పరచుకుంది. దాని మీద మన దేశం చట్టబద్దమైన పోరాటం చేసి విజయం సాధించింది. ఇలాంటి అవకాశం ఏ దేశానికైనా ఉంది. కొందరు ఆరోపిస్తున్నట్లు చైనా కూడా అలాంటి పని చేస్తే దాన్ని కూడా కోర్టులకు లాగవచ్చు. ఎవరి విజ్ఞానాన్ని వారు పరిరక్షించుకోవచ్చు.విద్యుత్‌ బల్బును కనుగొన్నది ఎవరని అడిగితే ఠకీమని చెప్పే జవాబు థామస్‌ ఎడిసన్‌ అని వస్తుంది. కానీ ఎడిసన్‌ కంటే ముందే అనేక మంది దాని మీద పరిశోధనలు చేశారు, బల్బులను రూపొందించారు. దాని కొనసాగింపుగా ఎడిసన్‌ తన పరిశోధనలను జోడించి ఆ బల్బును వాణిజ్యపరంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అనుసరించిన క్రమం గురించి పేటెంట్‌ పొందాడు. దాంతో పేరు అతనికి వచ్చింది. ఆ పరిశోధనలో అనేక మంది ఎడిసన్‌కు సహకరించారన్నది గమనించాలి. మరొకరెవరూ తదుపరి పరిశోధనలు చేయకూడదు, ఎడిసన్‌ లేదా అతని వారసులు మాత్రమే చేయాలంటే ఈ రోజు ఇన్ని రకాల బల్బులు వచ్చి ఉండేవి కాదు. పరిశోధనలకు మూలం అంతకు ముందున్న తరాల విజ్ఞానమే అన్నది తెలిసిందే.


చైనా శాస్త్రవేత్తల పరిశోధనల్లో పెద్దగా పస ఉండదు, నాసిరకం, ఇతరులు చేసిన వాటిని అటూ ఇటూ మార్చి నూతన పరిశోధనల పేరుతో సమర్పిస్తున్నారు, ఒకే వనరు నుంచి కాపీ పరిశోధనలు వస్తున్నాయి, ఇతరులు బొమ్మలను మరోకోణంలో కొత్తవిగా చూపుతున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు కొందరు. చైనాలో ఉన్న అవినీతిని తొలగించేందుకు ఎలాంటి కఠిన శిక్షలను అమలు చేస్తున్నారో తెలిసిందే. పరిశోధనా రంగంలో ఉన్నవారు కూడా అవినీతికి పాల్పడితేవారి నుంచి వచ్చిన వాటిని అంతర్జాతీయ సమాజం పక్కన పెట్టవచ్చు. పరిశోధనలను ప్రోత్సహించే క్రమంలో ప్రచురించిన పత్రాల ప్రాతిపదికన చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిన కారణంగా కొందరు అవినీతికి పాల్పడి ఉండవచ్చు తప్ప మొత్తంగా నకిలీ అనే వారిని చేసేదేమీ లేదు. ఇప్పుడు అలాంటి ప్రోత్సహకాలను నిలిపివేసింది. అక్కడ జరుగుతున్న అభివృద్ది వాస్తవం, సాధిస్తున్న అద్బుతాలు నిజం. ఈ పూర్వరంగంలో చైనా మీద బురద జల్లేందుకు కుహనా శాస్త్ర పరిశ్రమ పేరుతో వారినీ వీరిని ఉటంకించి ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఒక కథను అల్లింది. చైనాదంతా బోగస్‌ అని అమెరికా ఇతరులను నమ్మించేందుకు ప్రచారం చేయవచ్చు తప్ప దాన్ని వారే నమ్మటం లేదు. చైనాతో పోటీని తట్టుకొనేందుకు వచ్చే పది సంవత్సరాల్లో శాస్త్ర పరిశోధనలకు రెండు వందల బిలియన్‌ డాలర్లను అధ్యక్షుడు జో బైడెన్‌ నిధుల మంజూరు చేసేవాడే కాదు.


ఇంతవరకు ప్రపంచంలో చైనా గురించి చేసినన్ని తప్పుడు ప్రచారాలు మరొక దేశం గురించి లేవంటే అతిశయోక్తి కాదేమో ! ఎవరు అవునన్నా కాదన్నా చైనా నేడు సాంకేతిక, ఆర్థిక రంగాల్లోనే కాదు, శాస్త్ర రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలను సవాలు చేస్తూ ముందుకు పోతోంది. అది కూలిపోవాలి, పేలిపోవాలని ఎన్ని దుష్ట కోరికలు కోరుకున్నప్పటికీ, కూలుతుందని తేదీలు, సంవత్సరాలను ఉటంకించినప్పటికీ అలాంటి జాడలేమీ లేవు. అనేక రంగాలలో ముందుకు పోవటానికి కారణం జనానికి జవాబుదారీగా ఉండే కమ్యూనిస్టు భావజాలం కలిగిన శక్తులు అక్కడ అధికారంలో ఉండటమే కారణం. దోపిడీ లేని మరో సమాజ నిర్మాణం సాధ్యమే అని నిరూపించేందుకు కమ్యూనిస్టులు ముందుకు పోతుండగా అడ్డుకొంటున్న ప్రతిసారీ ఆటంకాలను అధిగమించి ముందుకు పోతున్నది. ఆ క్రమంలో ఉన్న లోపాలను చైనా ప్రభుత్వం, పార్టీ కూడా దాచుకోవటం లేదు. వాటిని అధిగమిస్తూ, అందుకు పాల్పడిన వారిని కఠినంగా అదుపు చేస్తూ జగన్నాధ రధం ముందుకు పోతున్నది. పరిశోధన-అభివృద్ధి రంగంలో 2022లో అమెరికా 660 బి.డాలర్లు ఖర్చు చేయగా జిడిపిలో అది 2.6శాతం. అదే చైనా 556 (3.1), జపాన్‌ 194 (3.4) భారత్‌ 159 (0.56), ఖర్చు చేస్తున్నట్లు వికీపీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా జిడిపిలో 5.9, 5 శాతాల చొప్పున అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకే పిండికొద్దీ రొట్టె అంటారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అది పంటల కనీస మద్దతు ధర కాదన్నా – మోసం జరుగుతున్న తీరిది చూడు రైతన్నా !

10 Saturday Jun 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

#Farmers matter, BJP, MSP 2023-24 kharif crops, MSP demand, Narendra Modi Failures



ఎం కోటేశ్వరరావు


ఖరీఫ్‌ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు తోడ్పడుతాయని ఆర్థికవేత్తలు స్పందించారు. ఎన్నికల సంవత్సరంలో ధరలు పెరగకుండా, తద్వారా బిజెపికి జనం దూరం కాకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగమే ఇది,రైతులకు మేలు చేసేది కాదు అని వేరే చెప్పనవసరం లేదు. సావిత్రీ నీపతి ప్రాణంబు దక్క వరాలు కోరుకోమన్నట్లుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం మినహా రైతులు ఏమైనా కోరు కోవచ్చని ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళన సందర్భంగా బిజెపి నేతలు చెప్పారు. విధిలేని పరిస్థితిలో ప్రధాని నరేంద్రమోడీ దేశానికి క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు, కనీస మద్దతు ధరల గురించి సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మద్దతు ధరలను సిఫార్సు చేసేందుకు బిజెపి అధికారానికి రాక ముందు నుంచే ఒక వ్యవస్థ ఉంది. ఆ విధానానికి చట్టబద్దత కల్పించాలని రైతులు కోరుతున్నారు, సిఎంగా ఉన్నపుడు నరేంద్రమోడీ కూడా డిమాండ్‌ చేశారు. ఇప్పుడు కాదు పో పొమ్మికన్‌ అన్నట్లుగా రైతుల పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. వేసిన కమిటీలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు, మూడు సాగు చట్టాలను రూపొందించిన పెద్దలే ఉన్నందున తామా కమిటీని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించింది. తరువాత గత ఏడాది కాలంగా ఆ కమిటీ ఏం చేస్తున్నదో, ఏం చెబుతుందో తెలియదు. రైతుల ఆదాయాలను 2022 నాటికి రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ బాసల గురించి మన్‌కీబాత్‌లో కూడా మాట్లాడేందుకు నోరు రావటం లేదు.


తమ ప్రభుత్వ హయాంలో 2014-15లో ఏ గ్రేడ్‌ వరి మద్దతు ధర రు.1,400 నుంచి 2023-24లో రు.2,203కు అంటే రు 803 పెంచినట్లు మోడీ సర్కార్‌ గొప్పగా చెప్పుకుంటున్నది.సగటున వార్షిక పెంపుదల 5.7శాతం. అంతకు ముందు కాంగ్రెస్‌ ఏలుబడిలో 2004-05 రు.590 నుంచి రు.1,400కు పెరిగింది. రు.810 పెరిగింది. సగటు వార్షిక పెరుగుదలలో చూస్తే 14శాతం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి గణనీయంగా సాగు చేస్తారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో పొడవు పింజ పత్తి ధర రు.1,760 నుంచి రు.4,050 పెరిగింది. నిఖర పెరుగుదల రు.2,290 వార్షిక సగటు 13శాతం, అదే నరేంద్రమోడీ కాలంలో రు.4050 నుంచి రు.7,020కి పెంచారు.నిఖర పెరుగుదల రు.2,970 కాగా వార్షిక సగటు 7.3శాతమే. ఎవరు రైతులకు మేలు చేసినట్లు ? దీని అర్ధం కాంగ్రెస్‌ రైతులను ఏదో ఉద్దరించిందని చెప్పటం కాదు, పెరిగిన సాగు ఖర్చులతో పోలిస్తే అది కూడా తక్కువే. దానితో పోలిస్తే మంచి రోజులను తెచ్చి అమృత కాలంగా మార్చి రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ పాలనలో మరింత దిగజారింది అని చెప్పేందుకే ఈ పోలిక. అంకెలన్నీ మన ముందున్నాయి. ఎవరికి వారు పోల్చి చూసుకోవచ్చు.


కనీస మద్దతు ధరలను పెంచితే దాని ప్రభావం బియ్యం, వస్త్రాలు-దుస్తుల ధరల పెరుగుదలకు దారి తీస్తుంది కదా అని ఎవరైనా వాదించవచ్చు. రైతులు గొంతెమ్మ కోరికలను కోరటం లేదు. సాగు గిట్టుబాటు కావాలి-వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉండాలి. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల ధరలను స్థిరంగా ఉంచితే రైతులు కూడా మద్దతు ధరల పెంపుదలను అడగరు. అన్నింటికీ మించి ఎవరేమి చెప్పినా రైతు బతకాలి, సాగు సాగాలి. అందుకే కదా రైతుల రాబడిని రెట్టింపు చేస్తామని మోడీ సర్కార్‌ చెప్పింది. దాన్ని అమలు జరపమనే కదా రైతులు అడుగుతోంది. ఎన్నికలు జరిగే సంవత్సరంలో ధరలను కాస్త ఎక్కువగా పెంచటం గతంలో కాంగ్రెస్‌ చేసింది. సేమ్‌ టు సేమ్‌ అదే జిమ్మిక్కు నరేంద్రమోడీ కూడా కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు 2014-15 నుంచి 2017-18వరకు మూడు సంవత్సరాల్లో ఏ గ్రేడ్‌ వరికి పెరిగింది మొత్తం రు.190 మాత్రమే, సగటున ఏడాదికి రు.63 మాత్రమే. అదే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2018-19లో పెంచిన మొత్తం రు.180. తరువాత నాలుగు సంవత్సరాల్లో రు.1,770 నుంచి 2022-23 వరకు రు,2,060కి అంటే రు.290, ఏడాదికి సగటున రు.72.50 కాగా వచ్చే ఏడాది ఎన్నికల కారణంగా ఈ సారి రు.143 పెంచారు. ఎంఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వార్షిక ద్రవ్యోల్బణ ప్రాతిపదికన నామమాత్రంగా పెంచుతున్నారు తప్ప సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదు. మరోవైపు మార్కెట్లో గోధుమలు, బియ్యం ధరల పెరుగుదల కనీస మద్దతు ధరల కంటే ఎక్కువగా ఉంటున్నది, దీనికి కారణం ఏమిటో ఎవరూ చెప్పరు. ప్రతిదానికీ ఉక్రెయిన్‌ సంక్షోభం అని చెప్పి తప్పించుకుంటున్నారు. అది ప్రారంభంగాక ముందే మన దేశంలో ధరల పెరుగుదల మొదలైందన్నది చేదునిజం. ప్రతి ఆరునెలలకు ఒకసారి దానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంచటమే దానికి తిరుగులేని నిదర్శనం.


2021 నవంబరు 19వ తేదీన నరేంద్రమోడీ దేశమంతటికీ క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు చెప్పారు. వాటిని అమలు జరిపితే రైతుల కష్టాలు తీరుస్తాయన్నారు. వాటిని రద్దు చేసిన తరువాత ఇంతవరకు వాటి బదులు కష్టాలు తీర్చే చర్యలేమీ తీసుకోలేదు. అంటే తాను చెప్పినట్లు వినలేదు గనుక రైతులకు ఒక పాఠం చెప్పాలని మోడీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి నిబద్దులై ఉండేవారి లక్షణం కాదిది. వెంటవెంటనే నిర్ణయాలు తీసుకోవటంలో తమకు తామే సాటి అని చెప్పుకొనే వారు సాగు చట్టాల రద్దు తరువాత ఐదు నెలలకు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ పరిధి ఏమిటి ? ఏ అంశాలను అది పరిశీలిస్తుందో వివరించాలని రైతు ఉద్యమం నడిపిన సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. అందువలన ఆ కమిటీలో ఉండి చేసేదేమీ లేదు గనుక ప్రతినిధుల పేర్లను ప్రతిపాదించటం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ చైర్మన్‌ ఎవరంటే రైతులు తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రచించిన వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సంజయ అగర్వాల్‌. ఆ చట్టాలను ఎలా రూపొందించాలో సలహా ఇచ్చిన నీతిఅయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్‌ .కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించకూడదని చెప్పిన ఆర్థికవేత్తలను నిపుణుల పేరుతో చేర్చారు. ప్రభుత్వ ప్రతినిధులు సరేసరి, వీరుగాక రైతుల ఆందోళనను వ్యతిరేకించిన ఐదు సంఘపరివార్‌ సంఘాలకు చెందిన వారిని చేర్చారు. ఆందోళనకు నాయకత్వం వహించిన వారిని మూడు పేర్లు ఇవ్వాలని కోరారు. నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ఈ ముగ్గురూ ఆ కమిటీలో ఉండి చేసేదేమీ ఉండదు. పోనీ వీరు లేకుండా ఇప్పటి వరకు కమిటీ చేసిందేమిటి అంటే నాలుగు ఉపసంఘాల ఏర్పాటు తప్ప మరేమీ లేదు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత ప్రతిపాదన ప్రస్తావన లేని కమిటీ ఇది. రైతుల రాబడి రెట్టింపుకు మూడు సాగు చట్టాలే ఆక్సిజన్‌ అని చెప్పారు. ఇంతవరకు వాటి బదులు ఏం చేస్తారో చెప్పలేదు. రైతులను నట్టేట ముంచినట్లేనా !


మూడు సాగు చట్టాలను అమలు జరపకుండా 2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేయటం కుదరదని నీతిఅయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్‌ రైతుల ఆందోళన సమయంలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు అవసరమైన మేరకు చర్యలు కూడా తీసుకోలేదని అన్నారు. అసలు రాష్ట్రాలతో సంప్రదించకుండా సాగు చట్టాలను రుద్దారు.నీతిఅయోగ్‌ సిఫార్సులు చేయటం తప్ప వాటిని కేంద్రమే పట్టించుకోదు.తమ ప్రభుత్వం అమలు జరుపుతున్న స్కీములతో రైతుల రాబడి పెరుగుతున్నదని కేంద్ర ప్రభుత్వం నమ్మించ చూస్తున్నది.2021లో పార్లమెంటు చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ఇవిగో తమ పథకాలంటూ 17తో ఒక జాబితాను అందించింది, వాటికి గాను రు.17,540 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పింది.2020-21 సంవత్సరానికి గాను వాటికి కేటాయించిన బడ్జెట్‌లో మూడో వంతు అంటే రు.5,787 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వాటిలో మూడు పథకాలకైతే ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. అంతే కాదు మొత్తం ఖర్చు చేసినప్పటికీ కేవలం పదిశాతం మంది రైతులకే ఈ పధకాలు అమలు అవుతాయని కూడా కేంద్రమే చెప్పింది. మోడీ సర్కార్‌ అమలు జరుపుతున్న పిఎం కిసాన్‌ పథకంలో ఏడాదికి ఆరువేల చొప్పున ఇస్తున్నది కేవలం 10.74 కోట్లు లేదా పదిశాతం మంది రైతులకే. అంటే దీని ద్వారా కుటుంబానికి అదనపు రాబడి నెలకు రు.500 మాత్రమే.


2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇటీవలి కాలంలో ఎక్కడా దాని గురించి మాట్లాడటం లేదు.2016 ఏప్రిల్లో మంత్రులతో ఒక కమిటీని వేశారు.2018 సెప్టెంబరులో అది ఒక నివేదికను ఇచ్చింది. దానిలో ఏడు అంశాలను పేర్కొన్నారు. 1. పంటల ఉత్పాదకత పెంపుదల,2.పశువుల ఉత్పాదకత పెంపుదల, 3.వనరులను సమర్ధవంతంగా వినియోగించటం-ఉత్పత్తి ఖర్చు తగ్గింపు, 4.పంటల సాంద్రతను పెంచటం, 5.అధిక విలువనిచ్చే పంటల వైపు మళ్లింపు,6.రైతుల పంటలకు గిట్టుబాటు ధర, 7. అదనంగా ఉన్న మానవ వనరులను వ్యవసాయేతర రంగాలకు మళ్లించటం. వీటిల ఏ ఒక్క అంశంలోనైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధించిన అభివృద్ది ఏమిటో ఎక్కడా మనకు కనిపించదు. కేంద్రం ప్రభుత్వం జూన్‌ ఏడున ప్రకటించిన మద్దతు ధరల్లో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా ాస్వామినాధన్‌ కమిషన్‌ సూచించిన సి2 ప్లస్‌ 50 ప్రకారం ధరలను ప్రకటించటం లేదు. అఖిల భారత కిసాన్‌ సభ వంటి రైతు సంఘాలు కేంద్రం మోసాన్ని ఆధార సహితంగా నిరూపించాయి. ధాన్యానికి క్వింటాలకు రూ.2183, జొన్నకు రూ.3180, కందికి రూ.7000, పత్తికి రూ.6620 చొప్పున కేంద్రం ఎంఎస్‌పి ప్రకటించింది. కానీ సి2 ప్లస్‌ 50 పర్సెంట్‌ ప్రకారం ధాన్యానికి క్వింటాలుకు రూ.2866.5, జొన్నకు రూ.2833, కందికి రూ.8989.5, పత్తికి రూ.8679 ప్రకటించాలి. ఆ మేరకు రైతులు నష్టపోతున్నారు. రైతు వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (సిఎసిపి) అంచనాల కంటే ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ వంటి చోట్ల పెట్టుబడులు అధికంగా ఉంటున్నాయి. జాతీయ సగటు కంటే అధికంగా ఎంఎస్‌పి ఇచ్చామంటున్నారు. ఎక్కువ ఖర్చు ఉన్న చోట రైతుల నష్టాన్ని ఎవరు భరించాలి ? వరి సాగు ఖర్చు (సి2) క్వింటాలకు కనీసం తెలంగాణాలో రు.3300, ప్రకటించింది రు.2,183 మాత్రమే. ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే విధమైన తేడాలు ఉన్నాయి. రైతుల రాబడిలో కూడా ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రంతో పొసగదు. అందువలన సగటు లెక్క అనేది అశాస్త్రీయం. కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక విధానాలను అమలు జరుపుతున్నట్లే సాగు ఖర్చు ఎక్కువగా ఉన్న చోట రైతును ఆ మేరకు ఆదుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !

03 Saturday Jun 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#Anti China, Acheedin, BJP, Boycott china goods, China imports to India, cock and bull stories, Gujarat model, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


2025 మార్చి నెల నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి ఉండే విధంగా దేశాన్ని ముందుకు నడిపించే బాటను రూపొందించాలని ఐదేండ్ల నాడు నరేంద్ర మోడీ తన పరివారాన్ని ఆదేశించారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబరు పదకొండవ తేదీన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ద్వారా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఒక లక్ష కోట్ల డాలర్లు వ్యవసాయం-అనుబంధ రంగాల నుంచి, మరొక లక్ష కోట్ల డాలర్లు పారిశ్రామిక రంగం నుంచి, మూడు లక్షల కోట్ల డాలర్లు సేవా రంగం నుంచి వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ హడావుడి అంతా మరుసటి ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల కోసం అని వేరే చెప్పనవసరం లేదు. ఆచరణలో జరుగుతున్నదేమిటి ? 2026 మార్చి నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని 2023 జనవరి 31న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, 2028 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లని కేఫ్‌ మ్యూచ్యువల్‌ డాట్‌కామ్‌ ఫిబ్రవరి22న, 2029నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లని ఏప్రిల్‌ 20న ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ పత్రిక శీర్షికల ద్వారా తెలిపాయి. 2022-23 నాటికి 3.5లక్షల కోట్ల డాలర్లకు చేరతామని తరువాత ఏడు సంవత్సరాలలో ఏడు లక్షల కోట్లకు పెరుగుతామని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ జనవరి 12న విలేకర్లతో చెప్పారు.2022-23లో 3.3లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఏ అంచనాలను, ఎవరి మాట నమ్మాలి ? దేశాన్ని ఏ దారిలో మోడీ నడుపుతున్నారు ? అంకెలతో జనాన్ని ఎలా ఆడిస్తున్నారో కదా !
2021-22 ప్రకారం మన జిడిపిలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 18.8, పారిశ్రామిక, సేవా రంగాల నుంచి 28.2, 53 శాతాల చొప్పున ఉందని చెబుతున్నారు.ఆ లెక్కన చూసుకుంటే 3.3లక్షల కోట్ల డాలర్లలో వరుసగా ఈ రంగాల నుంచి 62వేలు, 93వేల కోట్ల డాలర్లు, 1.79లక్షల కోట్ల డాలర్లు ఉంది. దేశమంతటా గుజరాత్‌ నమూనా అమలు చేసి అభివృద్ధి చేస్తానని మోడీ 2014లో నమ్మబలికారు. దాని ప్రకారమైతే సేవల నుంచి 37, పారిశ్రామిక రంగం 43, వ్యవసాయం నుంచి 20శాతం ఉండాలి కానీ, ఐదులక్షల కోట్ల డాలర్ల లక్ష్యంలో మాత్రం 50-25-25 శాతాలని నిర్దేశించారు. ఇదెలా జరిగింది, మోడీ సర్కార్‌కు వాస్తవాలు తెలియదా ? అసలు గుజరాత్‌ నమూనాతో మామూలు జనానికి ఒరిగేదేమీ లేదని మానవాభివృద్ధి సూచికలు వెల్లడించాయి, అది దేశం మొత్తానికి వర్తించదని తెలిసే ఓటర్లను తప్పుదోవపట్టించారా ? ఎవరికి వారు అవలోకించుకోవాలి.


ప్రపంచంలో మనది వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అన్నది అంకెల్లో నిజమే. అభివృద్ధి ఫలాలు ఎవరికి అన్నదే అసలు ప్రశ్న.2017-18లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొడుతూ 6.1శాతం నిరుద్యోగులున్నట్లు తేలింది. ఎన్నికల్లో అది ప్రతికూల ఫలితాలనిస్తుందనే భయంతో మోడీ సర్కార్‌ దాన్ని తొక్కిపెట్టింది. అది లీకు కావటంతో సరైన లెక్కలతో జనం ముందుకు వస్తామని చెప్పింది, ఇంతవరకు రాలేదు. పకోడీల బండి పెట్టుకొన్నప్పటికీ అది ఉపాధి కల్పనే అని అచ్చే దిన్‌ ఫేం నరేంద్రమోడీ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. బహుశా పకోడీలు, బజ్జీల బండ్ల లెక్కలు తేలలేదని అనుకోవాలి. 2016లో పెద్ద నోట్ల రద్దు అనే తెలివి తక్కువ పని కారణంగా తరువాత నిరుద్యోగం పెరిగిందని జనం ఎక్కడ అనుకుంటారోనని ఆ నివేదికను తొక్కిపెట్టారని అనుకుందాం. ఈ ఏడాది జనవరిలో 7.14శాతం ఉంటే ఏప్రిల్‌ నెలలో అది 8.11 శాతానికి పెరిగిందని సిఎంఐఇ సమాచారం వెల్లడించింది. అలాంటపుడు వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటే జనానికి ఒరిగేదేమిటి ? ఎంతగా మూసిపెడితే అంతగా పాచిపోతుందన్న సామెత తెలిసిందే. జరుగుతున్నది ఉపాధి రహిత వృద్ధి. అందుకే పాలకుల భజనకు తప్ప జనానికి పనికి రావటం లేదు. పోనీ పని చేసిన వారికి వేతనాలేమైనా పెరుగుతున్నట్లా అదీ లేదు. దేశంలో నిజవేతన పెరుగుదల 2014-15 నుంచి 2021-22 కాలంలో వ్యవసాయకార్మికులకు సగటున ఏటా 0.9, నిర్మాణ కార్మికులకు 0.2, ఇతర కార్మికులకు 0.3 శాతమని సాక్షాత్తూ రిజర్వుబాంకు అంకెలే చెప్పాయి.


జిఎస్‌టి వసూళ్లు పెరుగుదలను చూపి చూడండి మా ఘనత కారణంగానే జనం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు అని చెబుతున్నారు. విదేశీ దిగుమతుల పెరుగుదల కూడా దేశంలో కొనుగోలు శక్తి పెరిగింది అనేందుకు నిదర్శనంగా చిత్రించేందుకు చూస్తున్నారు. గడచిన పన్నెండు సంవత్సరాల్లో దేశంలో పన్నుల వసూలు 303శాతం పెరిగింది. 2010 ఆర్ధిక సంవత్సరంలో రు.6.2లక్షల కోట్లు ఉంటే 2022 నాటికి అది 25.2లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో జడిపి మాత్రం 93 శాతం అంటే రు.76.5లక్షల కోట్ల నుంచి 147.4లక్షల కోట్లకు మాత్రమే చేరింది. పన్నుల బాదుడు పెరిగింది, సంపదల సృష్టి తగ్గింది. పెరిగినవి ధనికుల చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నట్లు అందరికీ తెలిసిందే. పన్నుల వసూలు పెరుగుదల వెనుక అనేక అంశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగటం, దానికి అనుగుణంగా పన్ను మినహాయింపు పరిమితి పెరగక పోవటంతో అనేక మంది కొత్త వారు పన్ను పరిధిలోకి రావటం. జిఎస్‌టిలో పన్ను భారం పెంచటం, కొత్త వస్తువులను దాని పరిధిలోకి తేవటం, ధరల పెరుగుదలకు అనుగుణంగా జిఎస్‌టి కూడా పెరగటం వంటి అంశాలు దాని వెనుక ఉన్నాయి. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక రంగం మనదని చెబుతున్నవారు దానికి అనుగుణంగా ఆ రంగం నుంచి పన్నులను ఎందుకు రాబట్టటం లేదు. ప్రపంచంలో పోటీ పడాలనే పేరుతో పన్ను రేటు గణనీయంగా తగ్గించారు. పోనీ అలా లబ్దిపొందిన కార్పొరేట్‌ సంస్థలు తిరిగి పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నాయా, కల్పిస్తే నిరుద్యోగం ఎందుకు పెరుగుతున్నట్లు అంటే దానికి సమాధానం ఉండదు.


వార్షిక లావాదేవీలు రు.400 కోట్లు ఉన్న కంపెనీలకు పన్ను రేటును 25శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తాజాగా ఒక పరిశీలనలో 22శాతానికి అటూ ఇటూగా ఉన్నట్లు తేలింది. ఏదో ఒక పేరుతో ఇస్తున్న మినహాయింపులే దీనికి కారణం. 2017-18లో 27.6శాతంగా ఉన్న కార్పొరేట్‌ పన్ను శాతం 2019-20నాటికి 22.8శాతానికి తగ్గిందని బరోడా బాంక్‌ పరిశోధన నివేదిక వెల్లడించింది. తరువాత ఇంకా తగ్గి 22శాతానికి చేరుకుంది. అనేక మంది పాత సంస్థలను దివాలా తీయించి లేదా మూసివేసి వాటి బదులు కొత్త వాటిని ఏర్పాటు చేస్తే పదిహేనుశాతమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఎగుమతుల ప్రోత్సాహం పేరుతో మనకు బదులు విదేశాల వారికి తక్కువ ధరలకు సరకులు అందించేందుకు అని తెలిసిందే. పోనీ ఇంతగా తగ్గించినా మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులను పట్టించుకున్నవారు లేరు. అది జరిగి ఉంటే ఎగుమతులు ఇబ్బడి ముబ్బడిగా ఎందుకు పెరగలేదు ?


తొమ్మిదేండ్ల మోడీ ఏలుబడిని చూసిన తరువాత మన విదేశీ వాణిజ్యలోటు పెరుగుతోంది తప్ప తరగటం లేదు.మరోవైపు అప్పులు పెరుగుతున్నాయి. ఎందుకు ఇంత అప్పు చేశారంటే గతంలో కాంగ్రెస్‌ చమురు దిగుమతుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకని కొన్ని రోజులు పిట్టకతలు చెప్పారు. పోనీ వాటిని ఇంతవరకు తీర్చారా అంటే లేదు. చెల్లింపు గడువు ఇంకా ఉంది. తరువాత ఇంకేవో కతలు చెప్పారు. పాలకులుగా కాంగ్రెస్‌-బిజెపి ఎవరున్నా దొందూ దొందే ! కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించినదాని ప్రకారం 2024 మార్చి నాటికి దేశ అప్పు 169.46లక్షల కోట్లకు చేరుతుంది. ఇంకా పెరగవచ్చు కూడా దీనిలో విదేశీ రుణం 5.22 లక్షల కోట్లు. దేశ జనాభా 140 కోట్లు అనుకుంటే మొత్తం తలసరి అప్పు లక్షా 21వేలు. ఇది మోడీ ప్రధాని పీఠం ఎక్కినపుడు రు.43వేలు.2014-15లో ఓఇసిడి దేశాల లెక్కింపు పద్దతి ప్రకారం మన దేశంలో నిఖర తలసరి జాతీయ రాబడి రు.72,805 కాగా 2022-23 నాటికి రు.98,118కి పెరిగింది. దీన్ని బట్టి మోడీని సమర్ధ ప్రధాని అనవచ్చా ! కొంతమంది వేద గణికులు చైనా విదేశీ అప్పు 2.64లక్షల కోట్లు, మనది 61,500 వేల కోట్లు మాత్రమే(2022 జూన్‌ నాటి లెక్కలు), చూశారా చైనా ఎప్పుడైనా రుణ భారంతో కూలిపోతుందని చంకలు కొట్టుకుంటారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా నరం లేని నాలికలతో ఏమైనా మాట్లాడవచ్చు. చైనా రుణం దాని జిడిపితో పోల్చితే 14.39 శాతం కాగా మనది 19.2శాతం ఉంది. అందువలన రుణంతోనే చైనా కూలితే మన తరువాతే అన్నది గ్రహించాలి. విదేశీ చెల్లింపుల్లో నిలకడ ఉండటం లేదు, లోటు కొనసాగుతోంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే మనవారి సంఖ్య తగ్గితే అది మరింత పెరుగుతుంది. విషమిస్తే మరోసారి ఐఎంఎఫ్‌ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.


మన దేశ వాణిజ్య ప్రధమ భాగస్వామిగా చైనాను నెట్టేసి అమెరికా ముందుకు వచ్చిందని ఒక లెక్క, కాదు అని మరొక లెక్క చెబుతోంది. ఎవరైతేనేం చైనాకు మనం సమర్పించుకొనేది ఏటేటా పెరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం పదవ స్థానంలో ఉన్న చైనా ఇప్పుడు ఒకటి, రెండు స్థానాల్లోకి వచ్చింది. విదేశాల నుంచి మన వలస కార్మికులు పంపుతున్న డాలర్లన్నీ చైనాకు సమర్పించుకుంటున్నార. ఒక దేశం నుంచి దిగుమతులు పెరుగుతున్నాయంటే ఆ మేరకు మన దేశంలో ఉపాధికి గండిపడుతున్నట్లే. అంతే కాదు, స్వదేశీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గుతున్నట్లే, అది కొత్త సమస్యలను ముందుకు తెస్తుంది. చైనా నుంచి చౌక ధరలకు దిగుమతులు చేసుకున్న అమెరికా కార్పొరేట్లు లబ్ది పొందినట్లే, మన వారు కూడా లాభాలు పొందుతున్నారు. అందుకే దేశంలోని చైనా వ్యతిరేకులు ఎంత గగ్గోలు పెట్టినా నరేంద్రమోడీ ఖాతరు చేయకుండా దిగుమతులను అనుమతించి రికార్డులను బద్దలు కొడుతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే చైనా వస్తు మార్కెట్‌గా మన దేశం మారే అవకాశం ఉంది. చైనా అంటే మనకు పడదు అనుకుంటే ఇతర దేశాల వస్తువులతో నింపుతారు. మొత్తంగా చూస్తే తొమ్మిదేండ్లలో దిగుమతులు, అప్పు తప్ప చెప్పుకొనేందుకు పెద్దగా ఏమీ కనిపించటం లేదు.


2021-22 ఏప్రిల్‌-జనవరి కాలంలో వస్తువుల దిగుమతి విలువ 494 బిలియన్‌ డాలర్లు కాగా అదే 2022-23 నాటికి 602బి.డాలర్లకు పెరిగింది. ఎందుకు అంటే దేశంలో కొనుగోలు శక్తిని పెంచాం అని బిజెపి నేతలు చెప్పారు. అంటే వారి చేతిలో మంత్ర దండం ఉందని అనుకుందాం, మరి అదే ఊపులో నిరుద్యోగాన్ని ఎందుకు తగ్గించలేదు, ఆత్మనిర్భరత, మరొక పేరుతో చేసిన హడావుడి ప్రకారం ఎగుమతులు ఎందుకు దిగుమతులను అధిగమించలేదు ? సేవా రంగ ఎగుమతుల పెరుగుదల కేంద్ర పాలకుల పరువును, వెంటనే మరోసారి ఐఎంఎఫ్‌ దగ్గర అప్పుకు పోకుండా కాపాడుతున్నాయి. అంకుర సంస్థల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంకురమైనా పాతదైనా దేశంలో ఉన్న పౌరుల ఆదాయాలను బట్టి ప్రభావితమౌతాయి. 2021, 22 సంవత్సరాల్లో అంకురాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇన్వెస్కో, బ్లాక్‌రాక్‌ సంస్థలు తాజాగా బైజు విలువను 22 నుంచి 11.5కు, స్విగ్గీ 10.7 నుంచి 5.5 బిలియన్‌ డాలర్లకు తగ్గించాయి. ఇవే కాదు ఓలా విలువ 35శాతం, ఇలా అనేక కంపెనీల విలువలను తగ్గిస్తూ సంపదల నిర్వహణ కంపెనీలు ప్రకటించాయి. ఈ కంపెనీలన్నీ సిబ్బంది తొలగింపు, ఖర్చుల్లో కోత, కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్ల తగ్గింపు వంటి చర్యలకు పాల్పడ్డాయి.


మన దేశంలో మధ్య తరగతి భారీ ఎత్తున ఖర్చు చేయనున్నారనే అంచనాతో పాటు, చైనాలో అనేక కంపెనీల మీద విధిస్తున్న ఆంక్షల కారణంగా అవన్నీ మన దేశానికి వస్తున్నాయనే భ్రమను కల్పించారు. దీంతో వెంచర్‌ కాపిటల్‌ పెట్టుబడిదారులు ( వీరు ఎక్కడ ఎక్కువ లాభం ఉంటే అక్కడికి వెంటనే వెళ్లిపోతారు, ఒక దగ్గర స్థిరంగా ఉండరు.లాభాలు రాగానే తమ వాటాను అమ్మి వేరే వైపు వెళ్లిపోతారు. తెల్లవారే సరికి నడమంత్రపు సిరి కావాలి) మన దేశంలోని అంకుర సంస్థలకు భారీ ఎత్తున పెట్టుబడులను మళ్లించారు. వాటి విలువలను విపరీతంగా పెంచివేశారు. మార్కెట్‌ను స్వంతం చేసుకొనేందుకు ఈ కంపెనీలన్నీ ఆ రంగంలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాయి.బైజు సంస్థ క్రికెటర్ల జెర్సీల మీద పేరుకోసం పెద్ద మొత్తంలో చెల్లించింది, ఫీపా ప్రపంచ కప్‌ను స్పాన్సర్‌ చేసింది. స్విగ్గీ,డ్రీమ్‌ 11 వంటి సంస్థలు క్రికెట్‌ ఐపిఎల్‌కు ఖర్చు చేశాయి. ప్రకటనల కంపెనీ మాడిసన్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం అగ్రశ్రేణి ప్రకటనదార్లు 50లో 15 అంకుర సంస్థలే ఉన్నాయి.వినియోగదారులు విస్తరించకపోవటంతో అనేక కంపెనీలు మూతలవైపు మళ్లాయి. స్విగ్గీ తన మాంస, ఇతర ఇంటి సరకుల సరఫరా నిలిపివేసింది. ఓలా కూడా ఆహార, ఇంటి సరకుల సరఫరా, మీషో ఇంటి సరకుల, అన్‌ అకాడమీ ప్రాధమిక, సెకండరీ స్కూల్‌ బిజినెస్‌ను మూసివేసింది.మన జనాలను డిస్కౌంట్లకు అలవాటు చేసిన తరువాత వాటిని ఇచ్చే వాటివైపు చూస్తారు తప్ప మిగతావాటిని పట్టించుకోరు. అదే కంపెనీల విస్తరణకు అడ్డంకిగా మారింది. ఆహారాన్ని అందించే జోమాటో తగిన గిరాకీల్లేక 225 పట్టణాల్లో సేవలను నిలిపివేసింది. కరోనా కారణంగా దేశంలో ఆన్‌లైన్‌ సేవలవైపు జనాలు మొగ్గారు అది అంతరించగానే వాటికి డిమాండ్‌ తగ్గింది. వెంచర్‌ కాపిటల్‌కు ఇబ్బందులు రావటానికి వడ్డీ రేట్ల పెరుగుదల కూడా ఒక కారణం. అనేక దేశాల్లో బాంకుల్లో డిపాజిట్లు చేసిన వారే ఎదురు ఎవడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇది వెంచర్‌ కాపిటల్‌ సంస్థలకు ఎంతో కలసి వచ్చింది. డాలర్లన్నీ వాటివైపు ప్రవహించాయి. గతేడాది అమెరికా, ఇతర దేశాల్లో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు ఈ సంస్థలకు తక్కువ వడ్డీలకే రుణాలు ఇచ్చే అవకాశాలను తగ్గించింది.


చైనాను దెబ్బతీసేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు అన్ని విధాలుగా చూస్తున్నాయి.వాణిజ్య సంబంధాలను తెంచుకోవటం వాటిలో ఒకటి.అలాంటి ప్రయత్నాలెన్ని చేసినప్పటికీ 2030వరకు ప్రపంచ వాణిజ్య వృద్ధిలో చైనా కీలకంగా ఉండనుందని లండన్‌ కేంద్రంగా ఉన్న స్టాండర్డ్‌ చార్టర్డ్‌ కంపెనీ తాజా నివేదికలో వెల్లడించింది. ఎగుమతుల వార్షిక వృద్ధి రేటు 4.7శాతం ఉంటుందని,2030 నాటికి మొత్తం విలువ 4.37లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని పేర్కొన్నది. ఎగుమతుల్లో మెకానికల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు 52శాతం ఉంటాయన్నది. ఇదే సంస్థ మన దేశం గురించి వేసిన అంచనాలో 2021లో 401బి.డాలర్లుగా ఉన్న మన వస్తు ఎగుమతులు 2030 నాటికి 773 బి.డాలర్లకు పెరుగుతాయని చెప్పింది. అప్పటికి చైనా నుంచి మనం దిగుమతి చేసుకొనే వస్తువుల విలువ 212, ఎగుమతుల విలువ 49 బి. డాలర్లు ఉంటుందని కూడా చెప్పింది. ఇది ఊహలే తప్ప వాస్తవం కాదని మన సర్కార్‌ రుజువు చేస్తుందా ? ఇప్పటి వరకు నడచిన తీరును చూస్తే ఇంకా పెరిగేందుకే అవకాశం ఉంది.2023 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు మన దేశం చైనాతో జరిపిన వాణిజ్య లావాదేవీల విలువ 44.34 బిలియన్‌ డాలర్లుగా ఉందని చైనా కస్టమ్స్‌ శాఖ సమాచారం వెల్లడించింది. ఇదే ఏడాది మొత్తం కొనసాగితే 175బి. డాలర్ల రికార్డు నమోదు కావచ్చు.2022లో జరిగిన 135.98 బి.డాలర్లు ఇప్పటి వరకు ఒక రికార్డు. మన వాణిజ్యలోటు వంద బి.డాలర్లు దాటింది. మరోవైపు మోడీ సర్కార్‌ రూపొందించిన భారత విదేశీ వాణిజ్య విధాన పత్రం 2023లో 2030 నాటికి మన ఎగుమతులు రెండులక్షల కోట్ల డాలర్లకు చేరతాయని, వార్షిక వృద్ది రేటు 14.8శాతం ఉంటుందని పేర్కొన్నారు.మనల్ని నేల మీద నడిపించి అన్ని ఎగుమతులు చేస్తే అంతకంటే కావాల్సిందేముంది ? ఇది కూడా గుజరాత్‌ అభివృద్ధి నమూనా, అచ్చేదిన్‌, నల్లధనం రప్పింపు వంటి కతల జాబితాలో చేరుతుందా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

31 Wednesday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, COUNTRIES, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

Amith shah, BJP, Dharma Danda, Jawaharlal Nehru, Narendra Modi, Narendra Modi Failures, Raja Danda, RSS, Sengol, vd savarkar


ఎం కోటేశ్వరరావు


వివాదాస్పద అంశాలను ముందుకు తేవటం ప్రతిపక్షాలను, జనాన్ని వాటి చుట్టూ తిప్పటంలో కొంత మంది సిద్దహస్తులు. వారిలో నరేంద్రమోడీకి సాటి రాగల వారెవరూ కనిపించటం లేదు. గతాన్ని కాసేపు పక్కన పెడితే నూతన పార్లమెంటు భవన ప్రారంభాన్ని ప్రధమ పౌరురాలు, రాజ్యాంగ అధిపతిగా ఉన్న రాష్ట్రపతి పదవిని అగౌరవపరచి, ఆ పదివిలో ఉన్న ద్రౌపది ముర్మును విస్మరించి తానే ప్రారంభించి చర్చకు తెరలేపారు. అదే విధంగా రాజ్యాంగం. అధికారంతో సంబంధంలేని ఒక రాజ దండాన్ని ముందుకు తెచ్చి మరో పనిలేని చర్చను ముందుకు తెచ్చారు. పురాతన సంప్రదాయాలకు ప్రాణ ప్రతిష్ట చేయాలనే నాన్నగారి తాతగారి భావాలకు దాసులైన వారికి వెనుక చూపు తప్ప వర్తమానం, ముందు చూపు ఉండదు. అలాంటి వారు కుహనా గతాన్ని అమలు జరపాలని చూస్తారు. లేని చరిత్రను, ఉదంతాలను సృష్టించటంలో, చిన్న వాటిని బూతద్దంలో చూపటంలోనూ పేరు మోసిన మన వాట్సాప్‌ విశ్వవిద్యాలయం స్వర్గంలో ఉన్న గోబెల్స్‌కు సదరు అంశాలపై తమకు మార్గదర్శకుడిగా ఉన్నందుకు గౌరవడాక్టరేట్‌ ప్రదానం చేసిందట.


ఫలానా చోట ఫలానా ఉదంతం జరిగింది. మీడియాలో మొత్తం హిందూ వ్యతిరేకులే ఉన్నందున ఏ టీవీ, పత్రికలోనూ రాలేదు, రాదు. కనుక మీరు దీనిని అందరికీ పంపించండి అన్న తప్పుడు వర్తమానం ఒక్కటైనా వాట్సాప్‌ను వాడే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అందే ఉంటుంది. పెద్దలు చెప్పిన ఒక హితవును కాషాయ దళాలు పక్కాగా పాటిస్తున్నాయి . అదేమంటే ఒక అబద్దం చెబితే గోడ కట్టినట్లు ఉండాలి తప్ప తడికలా ఉండకూడదు. ప్రాణ, విత్త, మాన భంగములందు అబద్దం చెప్పవచ్చనే మినహాయింపు ఇచ్చారు మన పెద్దలు. దీనీలో ఎన్నికలను కూడా చేర్చి పచ్చి అబద్దాలు చెబుతున్నారు. వీటిని చూసి, విని గోబెల్స్‌ కూడా సిగ్గుపడుతున్నట్లు సమాచారం. తాజాగా దేశమంతటా పెద్ద చర్చ జరిగిన, పార్లమెంటులో ప్రతిష్టించిన రాజదండం గురించి కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా తడిక కథ చెప్పారు. దేవుడు ప్రసాదం తినడని పూజారికి మాత్రమే తెలుసు. అదే మాదిరి నరేంద్రమోడీకి రాజకీయ ఇబ్బందులు వస్తున్నట్లు అమిత్‌షాకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఆడిన మాట తప్పని తెగకు చెందినవారం అని చెప్పుకుంటారు గనుక చెప్పింది వాస్తవం కాదు అని తేలిన తరువాత కూడా తన ప్రకటనను వెనక్కు తీసుకోలేదు, సవరించుకోలేదు. చరిత్రలో అత్యంత దుర్మార్గమైన రెండవ ప్రపంచ యుద్ధం తప్పుడు ప్రచారంతోనే నాజీలు ప్రారంభించారు. అదేమిటంటే జర్మనీ రేడియో ట్రాన్స్‌మిటర్‌ మీద పోలాండ్‌ చేసిన దాడికి ప్రతీకారం పేరుతో హిట్లర్‌ మూకలు పోలాండ్‌ మీద టాంకులతో దాడికి దిగాయి. ఒక ట్రాన్స్‌మిటర్‌ను ధ్వంసం చేస్తేనే మరొక దేశం మీద దాడికి దిగాలా ? ఏదో ఒక సాకు కావాలి. తరువాత నిజానిజాలు వెల్లడైనా అప్పటికే జరగాల్సిన మారణ హౌమం జరిగింది. మహా జర్మనీ నుంచి నినాదం నుంచి కాపీ కొట్టిందే అఖండభారత్‌,అలాంటి అనేక పోలికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గతమెంతో ఘనం అన్న జాతీయవాదం రోజు రోజుకూ ఊపందుకుంటోంది. ఏ దేశ చరిత్రలోనైనా ఘనమూ, హీనమూ రెండూ ఉంటాయి. ఘనాన్ని దాచుకొని రెండవ దాన్ని చరిత్ర చెత్తబుట్టలోకి నెడుతుంది. దాన్నుంచి కూడా లబ్ది పొందాలని చూసే వారు చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తారు.


నూతన పార్లమెంటు భవనంలో గత ఘనం, సంస్కృతి పరిరక్షణలో భాగంగా రాజ దండానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామంటూ మన ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ప్రతిష్టించారు. అంతకు ముందు హౌమంత్రి అమిత్‌ షా విలేకర్లతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినపుడు బ్రిటీష్‌ చివరి వైస్రాయి మౌంట్‌ బాటన్‌ అధికార మార్పిడి చిహ్నంగా రాజదండాన్ని నెహ్రూకు అందచేస్తే దాన్ని పక్కన పెట్టేసి మన సంస్కృతిని అవమానపరిచారు, ఆ చారిత్రాత్మకమైన రాజదండాన్ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు భవనంలో ప్రతిష్టించి గౌరవాన్ని నిలబెడతారు అని సెలవిచ్చారు. దేశ ప్రజలందరూ దీన్ని చూసి ఈ చారిత్రాత్మక ఉదంతం గురించి తెలుసుకోవాలని, అందరికి గర్వకారణము అని కూడా చెప్పారు. ఆ రాజదండం మన దేశంలోని అనేక రాజవంశాలలో ఏదో ఒకరు వాడినది అనుకుందామా అంటే అదేమీ కాదు. అది శైవ మతాన్ని అవలంభించిన వారు రూపొందించిన దండం, వైష్టవులు, బౌద్ద, జైనాలను ఆదరించిన రాజులు వాడిన దండాలు వేరుగా ఉంటాయి. వర్తమాన ప్రభుత్వం అంగీకరించాలంటే ఏ రాజదండాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ? అసలు అది రాజదండం కాదు, చరిత్రలో వర్ణించిన చోళ రాజరిక దండ నమూనా మాత్రమే. స్వాతంత్య్ర తరుణంలో అధికార మార్పిడి గురుతుగా ఏదైనా క్రతువు నిర్వహించుతారా అని మౌంట్‌ బాటన్‌ నాడు నెహ్రూను అడిగారట. దాని గురించి రాజాజీగా సుపరిచితులైన సి రాజగోపాలచారిని నెహ్రూ సంప్రదించగా చోళ రాజుల పద్దతిని పాటిద్దామని చెప్పారట. ఈ పూర్వరంగంలో తమిళనాడులోని తిరువదుత్తురై అనే ఒక మఠానికి చెందిన వారు 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూకు నమూనా రాజదండాన్ని పూజా పునస్కార తంతుతో బహుకరించారు తప్ప దానికి మౌంట్‌బాటన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు. నమూనా రాజదండాన్ని ఉమ్మిడి బంగారు చెట్టి రూపొందించగా ఉమ్మిడి ఎతిరాజులు(96),ఉమ్మిడి సుధాకర్‌(88) తయారు చేశారు. వారు చెన్నైలో నివసిస్తున్నారు. క్రీస్తు పూర్వం 300సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1279 వరకు చోళ రాజుల పాలన సాగింది. అంటే తరువాత వారి రాజదండాన్ని ఎవరికిచ్చినట్లు ? తరువాత వచ్చిన రాజులు దాన్ని పక్కన పెట్టి కొత్త రాజదండాలను వాడారా అసలు సిసలు దండం ఎక్కడ ఉన్నట్లు అన్న ప్రశ్నకు సమాధానం లేదు.


అసలు పురావస్తుశాలలోని రాజదండం ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఆసక్తికరం. దీనికోసం చెప్పిన ” కత ” విన్న తరువాత సందేహాలు తలెత్తటం సహజం. దీన్ని చారిత్రాత్మక రాజదండం అని వర్ణించటంతోనే పురాతన వస్తువు పేరుతో నకిలీలను అంటగట్టే మోసగాళ్లను గుర్తుకు తెచ్చారు. చోళుల నాటి ఈ రాజదండాన్ని బ్రిటీష్‌ వారికి అందచేయగా వారి చివరి ప్రతినిధి మౌంట్‌బాటన్‌ అధికార మార్పిడి సూచికగా దాన్ని దాని నెహ్రూకు అందచేశారన్నది కూడా మోసగాళ్ల కథలో భాగమే. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌గా మారిన పూర్వపు అలహాబాద్‌ నగరంలో నెహ్రూ నివాసం ఆనంద భవన్‌ను ఒక పురావస్తుశాలగా మార్చారు. దానిలో తనకు బహుమతిగా ఇచ్చిన నమూనా రాజదండాన్ని కూడా ఉంచారు. దాన్ని బంగారు చేతి కర్రగా నమోదు చేశారు. ఇది చోళ రాజవంశం నాటిదని చివరికి అమిత్‌ షా కూడా నమ్మారు.లేదా నమ్మినట్లు నటించి చెప్పారు. పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం దాన్ని తయారు చేసిన ఉమ్మిడి బంగారు చెట్టి కుటుంబీకులు కూడా దాని గురించి మరచిపోయారు.నిజానికి దానికి అంతటి ప్రాధాన్య ఉంటే దాన్ని తయారు చేసిన ఆ కుటుంబీకులు ఇప్పటికీ సజీవులుగా ఉన్నప్పటికీ గడచిన 75 సంవత్సరాలుగా తమ వారికి చెప్పలేదంటే తాము తయారు చేసిన అనేక వస్తువుల్లో ఒకటిగా చూశారు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. ఆ కుటుంబానికి చెందిన ఉమ్మిడి అమరేంద్రన్‌ చెప్పినదాని ప్రకారం 2018లో ఒక పత్రికలో దాని గురించి చదివారట. మరుసటి ఏడాది పురావస్తు శాలలో చూశారట. దాని గురించి ఒక పత్రికా గోష్టి పెడదామనుకుంటే కరోనా (2020లో కరోనా బయటపడింది) కారణంగా కుదరలేదట. దాంతో ఒక నిమిషము నిడివి గల వీడియో తీస్తే అది నరేంద్రమోడీ కంటబడటంతో వెలుగులోకి వచ్చిందట. దాన్ని ఎప్పుడు తీశారు, నరేంద్రమోడీ ఎప్పుడు చూశారు, ప్రధానికి వీడియోలు చూసే తీరిక ఉందా అని సందేహం కలగవచ్చు.

ఉమ్మిడి కుటుంబం దాన్ని వంద సావరిన్‌(సవర్లు)ల బంగారంతో తయారు చేసి ప్రభుత్వం నుంచి రు.15వేలు తీసుకున్నదట. దీని గురించి ప్రధాని మోడీ కార్యాలయం పంపిన బృందంలోని జర్నలిస్టు ఎస్‌ గురుమూర్తి ఉమ్మిడి కుటుంబాన్ని సంప్రదించారు. వారి కోరిక మేరకు దాని ప్రతిరూపాన్ని రూపొందించారు. వెండితో చేసిన దానికి బంగారు పూత పూశారు. అసలైన బంగారు వస్తువును శాశ్వతంగా పార్లమెంటు భవనంలో, దాని ప్రతి రూపాన్ని జనం కోసం ప్రదర్శిస్తారని చెప్పారు. గవర్నర్‌ జనరల్‌గా ఉన్న రాజగోపాల చారి అనేక పుస్తకాలను చదివి చివరికి చోళుల రాజదండం గురించి తెలుసుకొని కొత్త రాజులకు అధికారిక మార్పిడి సూచికగా రాజదండాలను అందచేసే వారని తెలుసుకొన్నారు. తరువాత తికెవదుత్తురై మఠానికి చెందిన స్వాములను సంప్రదించి బంగారు రాజదండాన్ని తయారు చేయించి వారి ద్వారానే నెహ్రూకు అంద చేయించారు. దీనికి నెహ్రూ అంగీకరించారని చెబుతున్నారు. అదే గనుక వాస్తవమైతే అదే నెహ్రూ దాన్ని ఎందుకు పక్కన పడవేసినట్లు ? తన తరువాత అధికారానికి వచ్చేవారికి దాన్ని అందచేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదు ? ఈ విషయాలన్నీ తరువాత అధికారానికి వచ్చిన లాల్‌బహదూర్‌ శాస్త్రికి ఎవరూ ఎందుకు చెప్పలేదు ? నెహ్రూకు అందచేసిన మఠాధిపతులైనా తరువాత ప్రధానులుగా చేసిన వారికి కూడా ఎందుకు ఈ ఘనమైన సంప్రదాయం, సంస్కృతి గురించి ఎందుకు గుర్తు చేయ లేదు ? ఇలా ఆలోచించటం కూడా జాతి వ్యతిరేకం అంటారేమో ? రాజదండ ప్రహసనం వచ్చే ఎన్నికల్లో తమిళుల ఎన్నికల కోసమే అన్న విమర్శ ఉంది.


ద్రావిడ నాడు అనే పత్రికలో 1947 ఆగస్టు 24వ తేదీ సంచికలో తరువాత డిఎంకె స్థాపకుడిగా, సిఎంగా పని చేసిన సిఎన్‌ అన్నాదురై రాజదండం బహుకరించిన వారి ఉద్దేశం ఏమిటో గ్రహించాలని నెహ్రూను హెచ్చరిస్తూ రాశారు. దానిలో ఎక్కడా అది చోళుల నాటి రాజదండం అని గానీ పరంపరగా అధికార బదిలీ గురించిగానీ లేదు. అన్ని రకాలుగాను జనాన్ని దోచుకుంటున్న మఠాలు, స్వాములు కేంద్ర ప్రభుత్వాన్ని మంచి చేసుకొనేందుకు, తమ ఆస్తుల జోలికి రాకుండా, ఎదురులేకుండా చేసుకొనేందుకు గాను దాన్ని బహుకరించినట్లు పేర్కొన్నారు.దాని గురించి తమిళనాడు ప్రభుత్వ పత్రాల్లో ప్రస్తావించారు.అధికారానికి చిహ్నంగా రాజముద్రికలు ఉండేవి.రాజ ఫర్మానాల మీద ఆ ముద్రిక ఉంటేనే దాన్ని రాజాధికారిక పత్రంగా పరిగణించారని తెలుసు. రాజులుగా అధికారం స్వీకరించినపుడు కిరీటం ధరించటం అధికారిక చిహ్నంగా ఉండేది. రాజదండం అనేది ఒక అలంకార ప్రాయం తప్ప అధికారిక గుర్తు కాదు. అధికార మార్పిడి అంటే ఒక పత్రం మీద సంతకం చేసి కరచాలనం చేసుకోవటమే కాదు, స్థాుక సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలని అమిత్‌ షా గారు చెప్పారు. మన దేశంలో అనేక రాజవంశాలు, సంప్రదాయాలు ఉండేవి. దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? సంప్రదాయాల ప్రకారం అధికారానికి చిహ్నంగా పరిగణించారని చెబుతున్న రాజదండం, రాజముద్రికలు, కిరీటం రాజుగారి కనుసన్నలలోనే ఉంటాయి.


అలాంటి దాన్ని లోక్‌సభ స్పీకర్‌ స్థానం పక్కనే ప్రతిష్టించారు. ఆడా మగా కాని ఈ కొత్త పరంపర ఏమిటి ? స్పీకర్‌ దేశ సర్వాధికారి అని అర్ధమా? ఉప రాష్ట్రపతి ఉండే రాజ్యసభ సంగతేమిటి ? స్థానిక సంప్రదాయాల గురించి వాటికి అసలు సిసలు వారసులుగా చెప్పుకొనే వారి పరంపరకు చెందిన వాజ్‌పాయి, నరేంద్రమోడీ పదవీ స్వీకారం చేసినపుడు వారికి, లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ, బిజెపినేతలకు వాటి గురించి గుర్తులేదా ? ఆధునిక రాజ్యాంగం ప్రకారం అధికారాన్ని అనుభవిస్తూ మనుధర్మశాస్త్ర కాలానికి జనాన్ని తీసుకుపోవాలని చూస్తున్న వారికి సంప్రదాయాలను, ఆధునికతను మేళవించాలనే అందమైన మాటలను చెప్పటం కష్టం కాదు. పోనీ అలా చేస్తే నష్టం ఏమిటి , గతాన్ని ఎందుకు వదులు కోవాలి అని గొర్రెదాటు కబుర్ల చెప్పేవారు మపకు ఎక్కడబడితే అక్కడ దొరుకుతారు, వాటిని సమర్ధించటమూ తెలిసిందే. కనిపించిన ప్రతి రాయికి రప్పకూ మొక్కి ఒక నమస్కారమే కదా పోయేదేముంది అనే వారికి కొదవ లేదు. ఆ తర్కం ప్రకారమే సమర్ధన. రాజదండంతో పాటు కిరీటం, పట్టపురాణి, రాజ గురువు, రాజనర్తకి తదితర సాంప్రదాయాల సంగతేమిటి ? ఇపుడు అధికారిక పురోహితులు, స్వాములు లేరు. ఏ ప్రాతిపదికన రాజరిక చిహ్నమైన రాజదండాన్ని పట్టుకొని నరేంద్రమోడీ ఒక మతానికి చెందిన 20 మఠాల వారిని పార్లమెంటులో నడిపించినట్లు ?

ఇదంతా నూతన పార్లమెంటు భవనం బదులు ఒక రాజు కొత్త కోటను ప్రారంభించినట్లుగా ఉంది. అందుకే కొల్‌కతా నుంచి వెలువడే టెలిగ్రాఫ్‌ దినపత్రిక పతాక శీర్షికలో క్రీస్తు పూర్వం 2023 అని ప్రముఖంగా ప్రచురించింది. రాజరికాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ రాజదండం అన్నది 1300 సంవత్సరాల నుంచి మాత్రమే ఉనికిలోకి వచ్చిందని, దాని అసలు పేరు నంది ధ్వజము అని ఆరియాలజిస్టులు సిహెచ్‌ బాబ్జీరావు, ఇ శివనాగిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వాములుగా చెలామణిలో ఉన్న కొందరు రాజ దండాన్ని ధర్మ దండం అని పిలిచేవారని చెబుతున్నారు. ప్రధాని మోడీ, అమిత్‌ షాకు మద్దతుగా సాంప్రదాయాల గురించి స్వామీజీలు, మరి కొందరు రంగంలోకి దిగారు. రాజు కోరుకుంటే ఇలాంటి వారికి కొదవా ? వారి వాదనలసారం ఇలా ఉంది.
పట్టాభిషేకం జరిగినపుడు మంత్రాల ద్వారా ” నా రాజదండంతో పరిపాలన చేసేందుకు పూనుకున్నాను. నా అధికారంతో నేను పాలన-దండన చేస్తాను ” అని ప్రమాణం చేసిన తరువాత రాజ గురువు రాజును రాజదండంతో తాటించి ధర్మ దండంతో పాలించాలని అందచేస్తాడట.( వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పే వేదకాలం నాటి వారు ప్రతి తరంలోనూ ఉంటారు.) రాజదండం అంటే ధర్మ ప్రతీక అని, దానికి వృషభం ప్రతినిధి అని, దానికి ఉండే నాలుగు కాళ్లను సత్య, సౌచ(శుచి), బహుతాద్య,(భూత దయ), నిష్మామకర్మలుగా చెప్పారు. పూర్వీకులు చెప్పిన ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుందంటే అర్ధమిదేనట.

నంది ఒక పాదాన్ని ఎందుకు ముడవకుండా కూర్చుంటుందటా !. ఎందుకంటే సత్యం కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు లేచి వెళ్లటానికట. ధర్మాన్ని కాపాడే శివుడి ముందే కూర్చుంటుంది గనుక అది లేవాల్సిన అవసరం ఉండదట. అలాగే నరేంద్రమోడీ ధర్మ పరీక్షకు కూడా పరిగెత్తనవసరం లేదట. అంటే మోడీ శివుడితో సమానం అని చెప్పటం. సంస్కృత పదాలకు అర్ధాలకోసం కూడా వెతుక్కోవాల్సిన పని లేదట. భారత అంటే సత్యం, సెక్యులర్‌ ఇండియా అంటే మాయ, విశ్వగురువు అంటే దక్షిణామూర్తి (నరేంద్రమోడీ అవతారానికి అర్ధం అదే అని చెప్పలేదుగానీ భావం అదే ). వసుధైక కుటుంబం అంటే స్వచ్చ భారత్‌, స్మార్ట్‌ సిటీస్‌,జాతీయ రహదారులు, కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్లు, వందే భారత్‌ తదితరాలు శుచిలో భాగమట. భూత దయ అంటే నమామి గంగ, పునరుత్పాదక శక్తి, ఎల్‌ఇడి లైట్లు, ఉజ్వల పధకం, ఆయుష్మాన్‌ భారత్‌, నేరుగా నగదు బదిలీ, గోవధ నిషేధం, ఆవు పేడతో సేంద్రీయ సాగు, నిష్కామకర్మ అంటే అగ్నివీర్‌, అవినీతి రహిత పాలన, అధికారయంత్రాంగ ప్రక్షాళన, కిసాన్‌ సమ్మాన్‌ యోజన, ముద్ర యోజన తదితరాలట. అమృత కాలం నూతన పార్లమెంటు భవనంతో ప్రారంభమౌతుందట. (అంటే ఇప్పటి వరకు చెప్పిన అచ్చేదిన్‌, ఇతర వాగ్దానాలన్నీ వచ్చే రోజుల్లో అమలు చేస్తారని, గతం గురించి ప్రశ్నించకుండా నోర్మూసుకోవాలని చెబుతున్నారు ధర్మ మూర్తులు) ధర్మ విజయాన్ని పున:ప్రతిష్టించే అవకాశం నరేంద్రమోడీకి వచ్చింది. ధర్మాన్ని కాపాడే ధర్మ దండాన్ని నరేంద్రమోడీ ప్రతిష్ఠిస్తున్నారు గనుక కాంగ్రెస్‌ వణికి పోతోందని కూడా చెప్పారు.

వీటిని చూస్తే మేం కూడా ఇంతగా పొగడలేదని పూర్వపు భట్రాజులు కూడా సిగ్గుపడిపోతారు( ఒక కులాన్ని కించపరచటంగా భావించవద్దని మనవి) రాజు దైవాంశ సంభూతుడని చిత్రించిన వారు, నిరంకుశ రాజరికాలను ప్రోత్సహించిన వారు రాజదండాన్ని ఆ దేవుడే పంపాడు, దేవు ప్రతినిధులం తాము గనుక రాజులకు అందించే తంతు తమదని పూజారులు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ భావనలను, హిందూత్వను ముందుకు తెచ్చిన విడి సావర్కర్‌ కూడా నమ్మారు, అతగాడిని ఆరాధించే శక్తులు గనుకనే సావర్కర్‌ జన్మదినం రోజునే పార్లమెంటులో రాజదండం ప్రతిష్టాపన, భవన ప్రారంభోత్సం జరిపారు. అదేమీ కాదు, ఏదో ఒక తేదీని ఎంచుకోవాలి కదా అలా చేస్తే ఏదో అలా కలసి వచ్చిందని చెబితే ఎవరూ నమ్మరు. రాజరికాలను తిరిగి ప్రతిష్టించాలనే కోరిక, తిరిగి సమాజాన్ని వెనక్కు నడపాలనే , ప్రజస్వామ్యాన్ని పాతిపెట్టి హిందూత్వ పాలన రుద్దాలన్న ప్రగాఢవాంఛ నరనరాన ఉన్నవారే దీనికి పాల్పడతారని వేరే చెప్పనవసరం లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు అనే గ్రంధంలో బిఆర్‌ అంబేద్కర్‌ రాసిన ఒక పేరాలో ఏముందో చూద్దాం.” ఒక బ్రాహ్మణుడు స్వతంత్ర దేశ తొలి ప్రధాని ఐన సందర్భంగా పండుగ చేసుకొనేందుకు బనారస్‌ బ్రాహ్మలు చేసిన యజ్ఞంలో ప్రధాని నెహ్రూ పాల్గొనలేదు. ఆ బ్రాహ్మలు అందించిన రాజదండాన్ని ధరించలేదు, గంగ నుంచి తెచ్చిన జలాన్ని తాగలేదు ” అని రాశారు. అధికార మార్పిడి జరిగిన మరుసటి రోజు యజ్ఞం జరిగింది. అధికార మార్పిడి చిహ్నంగా రాజదండం, దాన్ని మౌంట్‌బాటన్‌ అందచేశాడనటాుకి ఎలాంటి రుజువులు, ఆధారాలు లేవు.

గోద్రా ఉదంతం తరువాత గుజరాత్‌లో జరిగిన మారణకాండ సందర్భంగా రాజధర్మం పాటించాలని ప్రధానిగా ఉన్న వాజ్‌పాయి నరేంద్రమోడీకి హితవు చెప్పిన సంగతి తెలిసిందే. దాన్ని పాటించిన దాఖలాల్లేవు. రాజులు దండాన్ని దుష్టుల మీద ప్రయోగించాలని చెప్పారు. ్ల ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుమేరకు విధిలేక కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో కేసు పెట్టిన వారిని అరెస్టు చేస్తారన్న సంగతి తెలిసిందే. కానీ తన పార్టీకి చెందిన సదరు ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌కి మద్దతుగా కొందరు ప్రదర్శనలకు దిగుతున్నారు. గుజరాత్‌లో అత్యాచారాలకు పాల్పడి రుజువైన కేసులో శిక్షలను పూర్తిగా అమలు జరపకుండా నేరగాండ్లను విడుదల చేసి వారికి గౌరవ మర్యాదలు చేసిన బిజెపి ఘనులను నరేంద్రమోడీ పల్లెత్తు మాట అనలేదు. బ్రిజ్‌ భూషణ్ను కాపాడుతూ అరెస్టు డిమాండ్‌ చేస్తున్న రెజ్లర్ల మీద దండాన్ని ఝళిపించి అధికారాన్ని దేనికి, ఎలా ఉపయోగించేదీ బేటీ పడావో బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ లోకానికి వెల్లడించారు. ఇది మన గతం, సంప్రదాయం అని మనం నమ్మాలి, ఏమి చేసినా కిమ్మన కూడదు ? రాజదండ సందేశమిదే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అబ్బబ్బబ్బ…. ఏమి స్తుతి, ఎన్ని పొగడ్తలు : నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన ఫలితాలేమిటి ?

25 Thursday May 2023

Posted by raomk in BJP, COUNTRIES, Current Affairs, Europe, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anthony Albanese, BJP, G7 summit, Modi Vest, Narendra Modi, Narendra Modi Failures, Nehru Jacket, PM Modi Is 'The Boss', US President Biden


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల ఆరు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ బుధవారం నాడు ట్వీట్‌ చేశారు. భాగస్వామ్య దేశాలతో బంధం మరింతగా బలపడినట్లు పేర్కొన్నారు. గురువారం నాడు ఢిల్లీ చేరుకున్న ప్రధాని స్వాగతం పలికిన బిజెపి మద్దతుదార్లతో మాట్లాడుతూ పర్యటనలో ప్రతి క్షణం దేశ బాగుకోసమే వెచ్చించినట్లు చెప్పారు. అఫ్‌ కోర్స్‌ ఒక పర్యటన ఫలితాలు, పర్యవసానాలు వెంటనే వెల్లడికావు అన్నది తెలిసిందే. తొలిసారిగా ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత వరుసబెట్టి విదేశీ ప్రయాణాలు చేశారు.ఎక్కువ కాలం విమానాల్లోనే గడిపినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకు ఇలా తిరుగుతున్నారు అంటే విదేశాల్లో దేశ ప్రతిష్టను పెంచేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అని మోడీ మద్దతుదారులు, బిజెపి పెద్దలు చెప్పారు. తొమ్మిది సంవత్సరాలు గడిచినా దాని ఫలితాలు పెద్దగా కనిపించలేదు. విదేశాల్లో దేశ ప్రతిష్టను కొలిచేందుకు కొలబద్దలు లేవు. నిజంగా మోడీ పెంచారనే అనుందాం, దాని వలన దేశానికి ఒరిగిందేమిటి ? మన ప్రమేయంతో పరిష్కారమైన సమస్యలేమీ లేవు. సేవా రంగంలో పెట్టుబడుల పెరుగుదల మోడీ ప్రభావంతో జరిగితే , ఉత్పత్తిరంగంలోకి ఎందుకు రాలేదు.గతేడాది డిసెంబరు 28న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించిన విశ్లేషణ ప్రకారం సేవారంగంలో ఏప్రిల్‌ 2000 నుంచి 2014 మార్చినెల వరకు విదేశీ పెట్టుబడులు 80.51 బి.డాలర్లుండగా అప్పటి నుంచి నుంచి 2022 మార్చి నెల వరకు 153 బి.డాలర్లకు పెరగ్గా ఉత్పాదక రంగంలో ఇదే కాలంలో 77.11 బి.డాలర్ల నుంచి 94.32కు మాత్రమే పెరిగాయి. దీన్ని బట్టి చైనాను వెనక్కు నెట్టేసి మన దేశం ప్రపంచ కర్మాగారంగా మారనుందని చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని తేలింది. అందువలన తాజా పర్యటన గతానికి భిన్నంగా తెల్లవారేసరికి ఏదో ఒరగబెడుతుందని భావించనవసరం లేదు.


ప్రధాని తాజా టూర్‌ గురించి అతిశయోక్తుల ప్రచారం మొదలైంది.ప పొగడ్తలు పొగ చెట్టువంటివి. పొగ కనిపిస్తుంది గానీ ఎంత కోసినా గుప్పెడు కాదు, కడుపు నింపదు, దాహం తీర్చదు. కొద్ది సేపు ఉండి అదృశ్యమౌతుంది. ఒక ప్రధానికి లేదా మరొక ప్రముఖుడిని పొగడ్తలతో ముంచెత్తితే దేశానికి, జనానికి ఒరిగేదేమిటి అన్నది ప్రశ్న. పాపువా న్యూగినియా ప్రధాని నరేంద్రమోడీకి పాదాభివందనం చేశాడని, అక్కడి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి రాత్రి పూట స్వాగతం పలికారని ఇవన్నీ నరేంద్రమోడీ ఘనతగా చిత్రించారు. కొన్ని అంశాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. తమ అవసరాల కోసం నరేంద్రమోడీని మునగ చెట్టు ఎక్కించేందుకు చూశారు. మోడీ గారూ మీరు అంత పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నవారితో ఎలా నెట్టుకురాగలుగుతున్నారో చూసిన తరువాత మీ ఆటోగ్రాఫ్‌ (ఒక పుస్తకం మీద లేదా ఒక కాగితం మీద అభిమానులు సినిమా వాళ్లను, ఇతర ప్రముఖులను సంతకాలు అడగటం తెలిసిందే) తీసుకోవాలనిపిస్తోందని అమెరికా అధినేత జో బైడెన్‌ అడిగినట్లు వార్తలు. ఇద్దరి మధ్య సంభాషణల సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ ” మీరు నాకు నిజంగా ఒక సమస్య తెస్తున్నారు. వచ్చే నెలలో వాషింగ్టన్‌లో మీకోసం ఒక డిన్నర్‌ ఏర్పాటు చేస్తున్నాము. దేశమంతటి నుంచి ప్రతివారూ దానికి రావాలని కోరుకుంటున్నారు. నా దగ్గర (టికెట్ల) ఆహ్వానాల కొరత ఏర్పడింది.( పశ్చిమ దేశాల్లో ప్రముఖులతో కలసి విందులు ఆరగించేందుకు వెల చెల్లించి ఆహ్వానాలను కొనుక్కుంటారు,ఎందుకంటే అక్కడ ఏదీ ఊరికే పెట్టరు ) నేను హాస్యమాడుతున్నట్లు మీరు అనుకోవచ్చు. నా సిబ్బందిని అడగండి. నేను గతంలో ఎన్నడూ చూడని విధంగా సినిమా నటుల నుంచి బంధువుల వరకు ప్రతివారి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మీరు ఎంతో ప్రాచుర్యం పొందారు. ప్రధాని గారూ మనం చతుష్టయం(క్వాడ్‌)లో చేస్తున్నదానితో సహా మీరు ప్రతిదాని మీద గణనీయమైన ప్రభావం కలిగిస్తున్నారు. పర్యావరణం మీద కూడ మౌలిక మార్పును తెచ్చారు. ఇండో-పసిఫిక్‌లో మీ ప్రభావం ఉంది, మీరు ఎంతో తేడాకు కారకులుగా ఉన్నారు.” అని బైడెన్‌ అన్నట్లుగా పత్రికల్లో వచ్చింది.


మోడీ-బైడెన్‌ మాట్లాడుకుంటుండగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్‌ కూడా వచ్చాడట. వారితో మాట కలుపుతూ సిడ్నీ నగరంలో పౌర ఆహ్వానానికి వసతి ఇరవై వేల మందికి మాత్రమే సరిపోతుంది, వస్తున్న వినతులన్నింటినీ అంగీకరించలేకపోతున్నాను అన్నాడట. మీరు గెలిచినపుడు నరేంద్రమోడీ స్టేడియంలో తొంభైవేలకు పైగా వచ్చిన వారిని సర్దుబాటు చేసిన తీరు గుర్తుకు వస్తోంది అన్నాడట. అప్పుడు మీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని ఉందని బైడెన్‌ మన ప్రధాని మోడీతో అన్నాడట. ఈ ఉదంతం గురించి వేరే విధంగా స్పందించనవసరం లేదు. విదేశీ నేతలు అలా మాట్లాడకపోతేనే ఆశ్చర్యపడాలి. గత జి 7 సమావేశాల్లో కూడా వెనుక నుంచి వచ్చి మోడీ భుజం తట్టి బైడెన్‌ పలుకరించినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. బైడెన్‌, అల్బనీస్‌ అలా మాట్లాడినపుడు నరేంద్రమోడీ స్పందన ఏమిటన్నది వార్తలలో రాలేదు. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. మీడియాకు ఈ అంశాలను చెప్పిన వారు కేవలం నరేంద్రమోడీ గొప్పను పెంచేందుకు పనికి వచ్చే వాటిని మాత్రమే వెల్లడించారన్నది స్పష్టం. వారు అలా పొగుడుతుంటే మోడీ మౌనంగా ఉంటారని, ఉన్నారని ఎలా అనుకోగలం ? మర్యాద కోసమైనా మోడీ ఎలా స్పందించిందీ చెప్పాలని అధికార గణానికి తోచలేదా ? లేక మోడీ కూడా ప్రతిగా వారిని పొగిడి ఉంటే ఒకరి నొకరు పొగుడుకున్నారని జనం భావిస్తారు గనుక ఒక భాగాన్ని మాత్రమే విలేకర్లతో చెప్పారన్నది స్పష్టం.


ఇక ఆస్ట్రేలియా వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ సిడ్నీ సభలో మరిన్ని పొగడ్తలను పొందారు. విశ్వగురు, ప్రపంచ నేత అని ఇప్పటికే ప్రధాని గురించి చెబుతున్న అంశం తెలిసిందేమో ప్రధాని మోడీ ఈస్‌ ద బాస్‌ అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌ సభికులకు పరిచయం చేశారు. సుప్రసిద్ద రాక్‌ స్టార్‌ బ్రూస్‌ స్ప్రింగ్‌స్టీన్‌ అభిమానులు అతన్ని బాస్‌ అని పిలుస్తారని ప్రధాని నరేంద్రమోడీ కూడా అలాంటి వారేనని అన్నాడు. గతంలో ఇదే వేదిక మీద బ్రూస్‌ స్ప్రింగ్‌స్టీన్ను చూశాను ప్రధాని నరేంద్రమోడీ మాదిరి స్వాగతం లేదు అని కూడా అల్బనీస్‌ అన్నాడు. ఏడాది క్రితం ఇదే రోజున ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను. అప్పటి నుంచి ఆరుసార్లు మేము కలుసుకున్నామంటే రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని ఆల్బనీస్‌ చెప్పాడు. హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబులు వేయించి మారణహౌమానికి కారకురాలైన అమెరికా అధినేతలందరూ దాన్ని గురించి మరచిపోదాం అంటారు తప్ప క్షమాపణ చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన బైడెన్‌తో కలసి కూర్చున్న మన ప్రధాని మోడీ అమెరికా దుర్మార్గాలకు నిలువెత్తు చిహ్నంగా ఉన్న హిరోషిమా బాధితుల స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించారు. జి 7వేదిక మీద అదే అమెరికాతో కలసి శాంతి వచనాలు వల్లించారు. ఇక జి 7 సమావేశంలో నరేంద్రమోడీ ప్రత్యేకతను గురించి చెప్పేందుకు ఆ సమావేశంలో మోడీ ధరించిన కోటును విశ్లేషకులు ఎంచుకున్నారు. వాడిపారేసిన ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలను కరగించి దానికి వేరే పదార్ధాలను కలిపి దారాలుగా మార్చి దానితో కుట్టిన కోటును మోడీ ధరించటం జి 7 సమావేశం మీద ప్రతిధ్వని ప్రభావం కలిగించిందని ఒక విశ్లేషకుడు వర్ణించారు. ఎలాంటి ప్రయత్నం లేకుండానే ధరించిన ఆ కోటుతో వాతావరణ మార్పుల, పర్యావరణ అనుకూల సందేశాన్ని ఆ సమావేశంలో మోడీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చెప్పుకొనేందుకు వేరే ఏమీ లేనపుడు ఇలాంటి కబుర్లతో పేజీలు నింపటం కొత్తేమీ కాదు.


జి7లో వేసుకున్న పనికిరాని ప్లాస్టిక్‌తో రూపొందించిన పాలిస్టర్‌ కోటు రంగు వేరేది, కానీ ఫిబ్రవరి ఎనిమిదిన మరొక కోటు ధరించి పార్లమెంటుకు వచ్చారు.అంతకు ముందు భారత ఇంథన వారోత్సవాలలో బెంగలూరులో ఐఓసి కంపెనీ ఈ కోటును ప్రధానికి బహుకరించింది. అదే రోజు పార్లమెంటులో కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే ధరించిన శాలువ గురించి బిజెపి వివాదం రేపింది. ప్రధాని రీసైకిల్డ్‌ దారంతో ఉన్న తక్కువ ఖర్చుతో చేసిన జాకెట్‌ ధరించగా ఖర్గే శాలువ ఖరీదు రు.56,332 అని ట్వీట్లు చేసింది. నరేంద్రమోడీ ఎక్కడకు వెళితే అక్కడి వేషాలను(దుస్తులను) వేసుకుంటారన్నది మన జనానికి బాగా తెలిసిందే. ఈ అంశంలో గతంలో ఇందిరా గాంధీకి ఆ పేరు ఉండేది, దాన్ని మోడీ తుడిచివేసి తన పరంపరను ప్రారంభించారు.దాన్ని తలదన్నే విధంగా ఎవరు ఉంటారో చరిత్రకే వదలివేద్దాం. ఇక నరేంద్రమోడీ, ఇతర నేతలు ధరించిన దుస్తుల గురించి దేశంలో పెద్ద చర్చే జరిగింది, కొనసాగుతోంది కూడా.

కాలమహిమ ఏమంటే గతంలో నెహ్రూ మీద నిరంతరం దాడి చేసే తెగకు చెందిన ప్రధాని అదే నెహ్రూ కోటుగా జనంలో ప్రాచుర్యం పొందిన పొట్టి కోటునే నరేంద్రమోడీ కూడా ధరించారు, అలాంటి వాటిని 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జె ఇన్‌కు బహుమతిగా పంపారు. దాన్ని ధరించి చూడండి నేను మోడీ పొట్టి కోటును ధరించాను అని మూన్‌ ట్వీట్‌ చేశారు. తాను భారత సందర్శనకు వచ్చినపుడు నరేంద్రమోడీ ధరించిన కోటును చూసి ఈ కోటులో మీరు ఎంతో బాగున్నారు అని ప్రశంసించానని, తన కొలతలు తీసుకొని అలాంటి కోట్లను కుట్టించి మోడీ పంపారని మూన్‌ పేర్కొన్నారు. వాటి మీద మోడీ జాకెట్‌ అనే రాసి ఉంది. దీని గురించి పలు స్పందనలు వెలువడ్డాయి. వాటిలో ఒకదానిలో ఇలా ఉంది.” ప్రెసిడెంట్‌ గారూ మీరు చెప్పింది తప్పు. ఇది మోడీ వెస్ట్‌ కాదు, నెహ్రూ జాకెట్‌, మోడీకి నెహ్రూకు సంబంధం లేదు, ఎన్నడూ కాలేరు. మోడీ గురించి ఏదైనా చెప్పాలంటే అది ఖాకీ నిక్కరు ” అని ఒక ట్వీట్‌లో ఉంది. మన ప్రధాని మూన్‌కు అలాంటి కోట్లను పంపటం చాలా బాగుందని, అయితే వాటి పేరు మార్చకుండా పంపి ఉండాల్సిందని పేర్కొంటూ వాటిని నెహ్రూ కోటు అంటారని, 2014కు ముందు దేశంలో మోడీ జాకెట్లు లేవని కాశ్మీరు మాజీ సిఎం ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. ఇది వివాదం కావటంతో వాటిని రూపొందించిన కంపెనీని రంగంలోకి దించి వివరణ ఇప్పించారు. జేడ్‌ బ్లూ లైఫ్‌ స్టైల్‌ ఇండియా కంపెనీ ఆ కోట్లను మూన్‌కు పంపింది. దాని ఎండి బిపిన్‌ చౌహన్‌ ఒక వివరణ ఇచ్చారు. నెహ్రూ జాకెట్లు మెడను మూసివేస్తాయని, వాటిని సర్దార్‌ పటేల్‌ కూడా ధరించారని, కానీ మోడీ వెస్ట్‌ల పేరుతో తాము అమ్ముతున్నవి అలాగాక కాస్త పొడవుగా, సౌకర్యవంతంగా ఉంటాయని వివరణ ఇచ్చారు. ఇవి నెహ్రూ జాకెట్లు ఏమాత్రం కాదని, మోడీ అనేక భిన్నమైన రంగులకు ప్రాధాన్యత ఇస్తారు గనుక వీటిని మోడీ వెస్ట్‌లనే పిలవాలని అన్నారు.అంతే కాదు, గతంలో నెహ్రూ, పటేల్‌ ధరించిన కోట్లు ఎంతో నాణ్యమైన వస్త్రంతో రూపొందించి ప్రముఖులు మాత్రమే ధరించే వారని, అలాంటి వాటిని మోడీ సామాన్యులలో ఎంతో ప్రచారం కల్పించారని కూడా అన్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా మోడీ ప్రతిష్టకు మచ్చపడితే వివరణలకు కొదవ ఉంటుందా ? నెహ్రూ జాకెట్‌ అన్నా మోడీ వెస్ట్‌ అన్నా అర్ధం ఒకటే పొట్టి కోటు.


నెహ్రూ కోటు మాదిరి లాల్‌ బహదూర్‌ శాస్త్రి ధోవతి, ఇందిరాగాంధీ తేలికైన, సాదాసీదా చీరలు, జయలలిత షిఫాన్‌, నేత చీరల గురించి గతంలో చర్చలు జరిగాయి.నరేంద్రమోడీ పేదల గురించి పేద కబుర్లు చెప్పినా సందర్భానికి తగిన విధంగా ధరించే దుస్తులు ఎంతో ఖరీదైనవనే విమర్శల గురించి తెలిసిందే. భక్తులు వాటి గురించి ఒక్క మాట కూడా అననివ్వరు. కెమెరా కోసమే నరేంద్రమోడీ పుట్టారా లేక కెమెరాలను నరేంద్రమోడీ కోసమే రూపొందించారా అన్నట్లుగా కూడా ప్రచారం పొందిన అంశం తెలిసిందే. అడవిలోకి వెళ్లినపుడు వేటగాడిగా కనిపించిన మోడీ కేదారనాధ్‌ గుహలో ఒక కాషాయ సన్యాసిలా దర్శనమిచ్చినా, అవసరానికి తగిన దుస్తులను ధరించటంలో మోడీకి మరొకరు సాటి రారు అని అంగీకరించాల్సిందే. మోడీని చాయి వాలా అని చెప్పిన వారిని పదిలక్షల విలువగల సూట్‌, ఖరీదైన కళ్లజోళ్లు ధరించారేమిటి అంటే చాయి వాలా కూడా ఆ స్థాయికి ఎదగాలనే సందేశం అంతర్లీనంగా ఇమిడి ఉందని భక్తులు భాష్యం చెప్పటంతో ఎవరేమనుకున్నా నా తీరు మారదు అన్నట్లుగా మోడీ ఇంతవరకు రాజీపడిన దాఖాల్లేవు.


జయలలిత ఒకసారి కట్టిన చీరను మరోసారి కట్టలేదని, ఆమె దగ్గర పదివేలకు పైగా చీరలు ఉన్నట్లు చెబుతారు. నరేంద్రమోడీ కూడా అదే మాదిరి ఒకసారి వేసుకున్న దుస్తులను మరోసారి వేసుకోరని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజరీవాల్‌ 2016లో చెప్పిన సంగతి తెలిసిందే.మోడీ ధరించే దుస్తుల విలువ రెండు లక్షలని,రోజుకు ఐదుసార్లు మారుస్తారని అంటే రోజుకు పదిలక్షలు ఖర్చు చేస్తారని, మోడీ దుస్తులకు కోసం చేసే ఖర్చు కంటే తమ ప్రభుత్వ ప్రకటనల ఖర్చు రు.76కోట్లు చాలా తక్కువని కేజరీవాల్‌ చెప్పారు. భారత జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ ధరించిన టీ షర్టు విలువ రు.41వేలని బిజెపి విమర్శించింది. దాన్ని తిప్పికొడుతూ మోడీ సూట్‌ పదిలక్షలని, దాన్ని వేలం వేస్తే నాలుగుకోట్లు వచ్చినట్లు, మోడీ ధరించే కళ్లద్దాల వెల లక్షన్నర ఉంటుందని, వీటి గురించి చర్చిద్దామా అని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. నరేంద్రమోడీ తైవాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న రు.80వేల విలువగల పుట్టగొడుగులు తింటారని, ధరించే సూటు ధర ఎనిమిది నుంచి పదిలక్షల వరకు ఉంటుందని, రోజూ వైద్య పరీక్షలు చేయించుకుంటారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సంగతి తెలిసిందే. దీని గురించి వాస్తవాలను నిర్ధారించుకోగా సమాచార హక్కు చట్టం కింద మోడీ తన ఇంట్లో నెలకు ఎన్ని గాస్‌ సిలిండర్లు వాడతారు, కొనుగోలు చేసిన కూరగాయల బిల్లులు, దుస్తుల గురించి వివరాలు అడిగితే వాటికి మోడీ తన ఖర్చులను తానే భరిస్తారని, ప్రభుత్వానికి సంబంధం లేదు గనుక మోడీ వెల్లడిస్తే తప్ప వివరాలు లేవని ప్రధాని ఆఫీసు చెప్పినట్లు టైమ్స్‌ నౌ పేర్కొన్నది.


ఎవరినైతే మేము నమ్మామో అవసరం వచ్చినపుడు వారు మాతో నిలబడలేదని పాపువా న్యూగినియాలో ధనిక దేశాల గురించి ప్రధాని నరేంద్రమోడీ అన్నట్లు ఇండియా టుడే పేర్కొన్నది. భారత్‌, పద్నాలుగు దీవుల దేశాల సదస్సులో మోడీ మాట్లాడారు.నేడు ఇంథనం, ఆహారం, ఫార్మా, ఎరువుల సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నం కావటాన్ని చూస్తున్నాము. మాకు అవసరమైనపుడు మేము నమ్మిన వారు మాతో నిలబడలేదు, దీవుల దేశాలకు ఇబ్బందులు వచ్చినపుడు భారత్‌ బాసటగా నిలిచిందని మోడీ అన్నారు. పాపువా న్యూగినియా ప్రధాని జేమ్స్‌ మరాపే మాట్లాడుతూ ప్రపంచ అధికార క్రీడలో తాము బాధితులమని, మీరు పేద దేశాల నేత, ప్రపంచ వేదికల మీద మీ నాయకత్వం వెనుక నిలుస్తామని మోడీని ఉద్దేశించి అన్నాడు. మరి అలాంటి వారు ఆ ధనిక దేశాల ప్రాపకం కోసం ఎందుకు పాకులాడుతున్నట్లు ?


మన దేశం నుంచి గరిష్టంగా లబ్ది పొందేందుకు ఆస్ట్రేలియా చూసింది. సిడ్నీలోని హారిస్‌ పార్క్‌ పేరును లిటిల్‌ ఇండియాగా మారుస్తున్నట్లు ప్రధాని అల్బనీస్‌ భారత సంతతి వారితో జరిగిన సభలో ప్రకటించారు. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారు.గతంలోనే పేరు మార్పు ప్రతిపాదన వచ్చినపుడు కొన్ని అభ్యంతరాలు తలెత్తటంతో ఆగింది.మనల్ని ఉబ్బించేందుకు చూడటం తప్ప దీని వలన మన దేశానికి ఒరిగేదేమిటి ? హైదరాబాదులో లాలాగూడ పరిసరాలను లిటిల్‌ ఇంగ్లండ్‌ అని పిలుస్తారు, అలాగే ముషిరాబాద్‌లో బంగ్లాదేశ్‌ మార్కెట్‌ అని ఉంది. చైనా బజార్ల గురించి తెలిసిందే వాటివలన ఆ దేశాలకు ఒరిగేదేమీ లేదు. అవసరం కొద్దీ అధికారంలో ఉన్న వారు ఆహా ఓహౌ అంటూ నరేంద్రమోడీని పొగడినా ఆస్ట్రేలియాలో మోడీ ఉన్న సమయంలో పార్లమెంటు సభ్యులు నరేంద్రమోడీపై బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని పార్లమెంటు భవనంలో తిలకించారు. దాని గురించి చర్చలు జరిపారు. డాక్యుమెంటరీని మన దేశంలో అనధికారికంగా నిషేధించిన సంగతి తెలిసిందే.మానవ హక్కుల కోసం పని చేసే హిందువుల సంస్థ,ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, పెరియార్‌ అంబేద్కర్‌ ఆలోచనల బృందం,హూమనిజం ప్రాజెక్టు,కేర్‌ తదితర సంస్థలు ఈ ప్రదర్శన, చర్చను ఏర్పాటు చేశాయి.నరేంద్రమోడీ తన భావజాలానికి అనుగుణంగా ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నట్లు, వాటిని నివారించాలని కోరటం ద్వారా హిందూత్వ వాదులను సంతుష్టీకరించేందుకు చూశారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెరుగుతున్న చైనా పలుకుబడి – తగ్గుతున్న అమెరికా పెత్తనం !

11 Thursday May 2023

Posted by raomk in Africa, CHINA, COUNTRIES, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, emmanuel macron, Joe Biden, NATO, Sudan’s army, Sudanese Communist party, The Rise of China, U.S. Hegemony


ఎం కోటేశ్వరరావు


ఆఫ్రికాలోని కీలక దేశమైన సూడాన్‌లో పారా మిలిటరీ-మిలిటరీ మధ్య కానసాగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు ఆరువందల మందికి పైగా మరణించగా ఐదువేల మంది గాయపడినట్లు వార్తలు. గురువారం నాటికి 27రోజులుగా ఘర్షణ సాగుతోంది. అమెరికా మార్గదర్శకత్వంలో సూడాన్‌ మిలిటరీ-పారామిలిటరీ మధ్య రంజాన్‌ మాసంలో కుదిరిన ఒప్పందాలు విఫలమయ్యాయి. దీంతో అక్కడ శాంతి, భద్రతలు భగం కావటానికి కారకులైన వ్యక్తుల మీద ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించాడు. తరువాత వైరి పక్షాల మధ్య రాజీకుదిర్చేందుకు చైనా రంగంలోకి దిగుతుందా అన్న చర్చ మొదలైంది. మిలిటరీకి అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మద్దతు ఉండగా పారామిలిటరీకి పశ్చిమాసియా, మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల మద్దతు ఉంది. సంక్లిష్టమైన ఈ వివాదంలో చైనా ఏ పక్షమూ వహించటం లేదన్న ఒక్క సానుకూల అంశం తప్ప సయోధ్య కుదుర్చటం, కుదరటం అన్నది అంత తేలిక కాదు. ఆఫ్రికా సమస్యలను ఆఫ్రికాయే పరిష్కరించుకోవాలి అన్న ఆఫ్రికా యూనియన్‌ వైఖరిని గౌరవిస్తున్న చైనా ఏ దేశ వివాదంలోనూ ఒక పక్షం వైపు మొగ్గలేదు.


ఆఫ్రికాలో పశ్చిమ దేశాల భూ సంబంధ రాజకీయాలకు బలైన దేశాల్లో సూడాన్‌ ఒకటి. బ్రిటీష్‌ వలస పాలన నుంచి 1956లో విముక్తి పొందిన తరువాత అక్కడ శాంతి లేదు. అంతకు ముందు ఈజిప్టు ఆక్రమణలో తరువాత బ్రిటీష్‌ ఏలుబడిలో ఉన్నపుడు దక్షిణ, ఉత్తర సూడాన్‌ ప్రాంతాలుగా ఉంది. బ్రిటీష్‌ వారు వైదొలుగుతూ ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా రెండు ప్రాంతాలను ఒకే దేశంగా చేశారు. అప్పటి నుంచి దక్షిణ సూడాన్‌ పౌరులు ప్రభుత్వంలో తమ ప్రాతినిధ్యం పెరగాలని, తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. నిరాకరించటంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. మధ్యలో పది సంవత్సరాలు తప్ప 1956 నుంచి 2005వరకు అది కొనసాగి ఐదు నుంచి పదిలక్షల మంది ప్రాణాలు తీసుకుంది. 2011లో దక్షిణ సూడాన్‌ స్వతంత్ర దేశంగా అవతరించింది. అవిభక్త సూడాన్‌లో, తరువాత పదకొండు మిలిటరీ కుట్రలు, తిరుగుబాట్లు జరిగాయి. అంతర్యుద్ధంలో పాలకులు కిరాయి మూకలను సమీకరించి డార్ఫర్‌, ఇతర ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాన్ని అణచివేశారు. తరువాత వాటిని 2013లో పారామిలిటరీగా మార్చారు. ఇటీవలి అధికార పంపిణీలో మిలిటరీ నేత, పారామిలిటరీ నేతలు ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు అధికార వ్యవస్థను ఆక్రమించారు. పారామిలిటరీని మిలిటరీలో ఎప్పుడు విలీనం కావించాలన్న అంశంపై ఒప్పందానికి భిన్న భాష్యాలు చెప్పి అధికారం కోసం జరిగిన కుమ్ములాటల కారణంగా రెండింటి మధ్య అంతర్యుద్ధం మొదలైంది. జనం నలిగిపోతున్నారు. అణచివేతలో ఇద్దరూ ఇద్దరే.


సూడాన్‌లో వర్తమాన పరిణామాలను చూస్తే ఏడు లక్షల మంది పౌరులు నిర్వాసితులైనట్లు ఐరాస సంస్థ వెల్లడించింది. రాజధాని ఖార్టూమ్‌ పరిసర ప్రాంతాల మీద విమానదాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలన్నీ ఖాళీగా ఉన్నాయి.మరోవైపు అమెరికా-సౌదీ ప్రతిపాదన మేరకు సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో మిలిటరీ-పారా మిలిటరీ ప్రతినిధుల మధ్య తొలిసారిగా ముఖాముఖీ కాల్పుల విరమణ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సూడాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఆకలి కేకలు ప్రారంభమైనట్లు వార్తలు. బాంకులు, ఏటిఎంలు పని చేయటం లేదు.చమురు కొరత, ధరల పెరుగుదలతో జనం సతమతమౌతున్నారు.రాజధానిలో ఎక్కువ ప్రాంతాలు పారా మిలిటరీ ఆధీనంలో ఉన్నాయి. వారిని దెబ్బతీసేందుకు మిలిటరీ వైమానిక దాడులు జరుపుతున్నది. రాజధానిలో కాల్పుల విరమణకు పారామిలిటరీ(ఆర్‌ఎస్‌ఎఫ్‌) అంగీకరించకుండా ఒప్పందం కుదిరే అవకాశం లేదని మిలిటరీ అధికారి అల్‌ బుర్హాన్‌ చెప్పాడు.ఆర్‌ఎస్‌ఎఫ్‌ పౌరులను రక్షణగా చేసుకుందని, సేవా కేంద్రాలను ఆక్రమించిందని ఆరోపించారు. విమానాలను కూల్చివేసేందుకు పారా మిలిటరీ క్షిపణులను సంధిస్తున్నట్లు వార్తలు.


చైనా నిజంగా సూడాన్‌లో రాజీ కుదుర్చుతుందా లేదా అన్నది అనేక అంశాల మీద ఆధారపడి ఉంది. సంక్లిష్టత రీత్యా అంత తేలికగాకపోవచ్చు. సూడాన్‌ పరిణామాలను గమనించినపుడు అక్కడ భద్రతా దళాల మధ్య హింసాకాండ ప్రబలటమే అమెరికా పెత్తనం దిగజారుడుకు ఒక నిదర్శనం అని, అది ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో భాగమే అని కొందరు చెబుతున్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లుగా అమెరికా, దాని అనుచరులుగా ఉన్న ఇతర పశ్చిమ దేశాల ప్రమేయం లేకుండా ప్రపంచంలో ఏదీ జరగదని బలంగా ఉన్న నమ్మకం సడలుతున్నది. ఈ దేశాల నేతలు ఊహించని పరిణామాలు చోటు చేసుకోవటం, అవి పెద్దన్న అమెరికా ప్రమేయం లేకుండా జరగటం పెద్ద చర్చగా మారింది. ఇరాక్‌ మీద దాడి చేసి అమెరికా చేతులు కాల్చుకుంది. ఇప్పుడు అక్కడ అమెరికా పలుకుబడి ఎంత అన్నది ప్రశ్నార్ధకం. తరువాత ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అవమానకరంగా తాలిబాన్లకు సలాం కొట్టి బతుకుజీవుడా అంటూ ఎక్కడి ఆయుధాలను అక్కడే వదలి కట్టుబట్టలతో అమెరికా మిలిటరీ పారిపోవటం తెలిసిందే.అది శిక్షణ ఇచ్చిన మిలిటరీ కూడా అమెరికాను ఆదుకోలేకపోయింది. దీని అర్ధం అమెరికా కథ ముగిసినట్లు కాదు.


రెండు ప్రపంచ యుద్ధాల్లో మిగతా దేశాలతో పోల్చితే అమెరికా లాభపడింది తప్ప నష్టపోయింది లేదు.తిరుగులేని మిలిటరీ, ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఐరోపా పునరుద్దరణ పేరుతో 13 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టి నాటో మిలిటరీ కూటమి పేరుతో ఐరోపాను తన చక్రబంధంలో బిగించుకుంది. ఇతర ఖండాలను కూడా తన కౌగిలిలోకి తెచ్చుకొనేందుకుగాను 80 దేశాలలో 800 మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది.అట్లాంటిక్‌ సముద్రంలో ఆరవ నౌకాదళాన్ని, పసిఫిక్‌ – హిందూ మహా సముద్రంలో సప్తమ నౌకాదళం, పర్షియన్‌ గల్ఫ్‌Ûలో పంచమ నౌకదళాన్ని మోహరించింది. అంటే అన్ని ఖండాల చుట్టూ త్రివిధ దళాలను మోహరించింది. దానికి గాను రకరకాల సాకులు చెబుతున్నది. ఇదంతా ఒక్క ముక్కలో చెప్పాలంటే కమ్యూనిజం, దానికి ఆలవాలంగా ఉన్న పూర్వపు సోవియట్‌ , వర్తమాన సోషలిస్టు చైనా, ఇతర సోషలిస్టు దేశాల పలుకుబడిని నిరోధించేందుకు అని ప్రపంచాన్ని నమ్మించింది. ఇంతటి శక్తి కలిగి ఉండి కూడా 1960,70 దశకాల్లో వియత్నాం కమ్యూనిస్టు మిలిటరీ, గెరిల్లాల చేతుల్లో చావుదెబ్బతిన్నది. ఆప్ఘనిస్తాన్‌లో తాను పెంచి పోషించిన తాలిబాన్ల చేతుల్లో అవమానాలపాలైంది. ఇప్పుడు ఉక్రెయిన్లో అక్కడి మిలిటరీ, కిరాయి మూకలకు ఆయుధాలు అందిస్తూ పరోక్షంగా పోరు సాగిస్తున్నది. అదే చైనాను చూస్తే ఆఫ్రికాలోని జిబౌటీలో అనేక దేశాలతో పాటు తాను కూడా ఒక సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇదిగాక మయన్మార్‌ బంగాళాఖాతంలోని కోకో దీవుల్లో, సంకేతాలను పసిగట్టే ఒక కేంద్రాన్ని, తూర్పు తజికిస్తాన్‌, లావోస్‌, దక్షిణ చైనా సముద్రంలో ఒక ఆరు చిన్న మిలిటరీ పోస్టులను ఏర్పాటు చేసింది. అమెరికా తన మిలిటరీని చూపి ప్రపంచాన్ని భయపెడుతుంటే చైనా తన దగ్గర ఉన్న మిగులు డాలర్లను ప్రపంచంలో వివిధ దేశాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర పధకాల మీద ఖర్చు పెడుతున్నది, రుణాలు ఇస్తున్నది.


ఆర్థిక, మిలిటరీ, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ఎంతో ముందున్న తమ దేశం క్రమంగా తన పలుకుబడిని ఎందుకు కోల్పోతున్నదనే చర్చ అటు అమెరికాలోనూ ఇటు ప్రపంచంలోనూ రోజు రోజుకూ బలపడుతున్నది.సోవియట్‌ కూలిపోయి, కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గగానే చరిత్ర ముగిసింది, పెట్లుబడిదారీ విధాన ప్రవాహానికి ఎదురు లేదు, ప్రచ్చన్న యుద్ధంలో తమదే గెలుపు అని అమెరికా ప్రకటించుకున్న తరువాత గడచిన మూడు దశాబ్దాల్లో చరిత్ర వేరే విధంగా నమోదౌతున్నది.అమెరికా విధాన నిర్ణేతలు, వ్యూహకర్తలు కలలో కూడా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అమెరికా ఆటకు అనుగుణంగా చైనా నడుచుకుంటుందని భావించి 1970దశకంలో దాన్ని అసలైన చైనాగా గుర్తించారు. తరువాత 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థలోకి అనుమతించారు. అప్పుడు చైనా విదేశీమారకద్రవ్య నిల్వలు కేవలం 200 బి.డాలర్లు మాత్రమే, అవి 2023 జనవరి నాటికి 3,379 బి.డాలర్లకు చేరాయి. ఇంత భారీ మొత్తం ఉంది కనుకనే అనేక దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు అవకాశం వచ్చింది. వాటి కోసం మొహం వాచి ఉన్న దేశాలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. వందల కోట్ల డాలర్లను పెట్టుబడులు, అప్పుగా తీసుకుంటున్నాయి. ఎక్కడా మిలిటరీ కేంద్రాలను పెట్టటం లేదు గనుక దాని మీద అనుమానాలు కూడా లేవు. ఇస్లామిక్‌ దేశాల మధ్య షియా-సున్నీ విబేధాలను అన్ని దేశాలను తన అదుపులో ఉంచుకోవాలని చూసింది. చివరికి దానికి కూడా తెరపడింది. షియా ఇరాన్‌-సున్నీ సౌదీ అరేబియాలను చైనా దగ్గరకు చేర్చింది. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణలకు తెరపడేందుకు ఆ ఒప్పందం దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ప్రాంతీయ, దేశాల అంతర్గత వివాదాలకు దూరంగా ఉండటమే చైనా పలుకుబడిని పెంచుతున్నవాటిలో ఒకటి.


నాటోలో భాగంగా అమెరికాతో స్నేహం చేస్తూనే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ ఇటీవలి బీజింగ్‌ పర్యటనలో మాట్లాడిన తీరు అమెరికాను బిత్తరపోయేట్లు చేసింది. తన వెనుక ఉన్న వారు ఎప్పుడేం చేస్తారో అన్న అనుమానాలను పెంచింది. తైవాన్‌ అంశంపై అమెరికా బాటలో నడిచేది లేదని, చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్య కలిగి ఉంటామని మక్రాన్‌ చెప్పాడు. వందల కోట్ల లాభదాయక ఒప్పందాలను ఫ్రెంచి కంపెనీలకు సాధించటంలో మక్రాన్‌ చొరవ చూపాడు. ఒక్క ఫ్రాన్సే కాదు జర్మనీ వైఖరి కూడా అలానే ఉంది.డాలరు పెత్తనానికి తెరదించాలన్న అభిప్రాయం రోజు రోజుకూ బలపడుతున్నది. నిజానికి అనేక దేశాల మీద ఆంక్షలు విధిస్తూ అమెరికా దాన్ని ముమ్మరం చేస్తున్నది. మొత్తం మీద చూసినపుడు నూతన ప్రపంచ వ్యవస్థ రూపుదిద్దు కుంటున్నది. అది అమెరికా-పశ్చిమ దేశాల కేంద్రంగా జరగటం లేదు. ఏక ధృవ కేంద్రానికి బదులు రెండు లేదా అంతకు మించి ఎక్కువ అధికార కేంద్రాలున్నపుడు దేశాలకు ఎంచుకొనే అవకాశాలు పెరుగుతాయి.


” సాయుధ వివాదాన్ని మరింతగా కొనసాగించటంలో రెండు శక్తులకు పరస్పర ప్రయోజనం ఉంది, దీన్ని సాకుగా చూపి పౌరశక్తులకు అధికారాన్ని బదలాయించకుండా చూస్తున్నాయని ” సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి సాలె మహమ్మద్‌ సూడాన్‌ పరిణామాలపై చెప్పారు.ఈ వివాదంలో ఆర్‌ఎస్‌ఎఫ్‌కు మద్దతు ఇవ్వటం ద్వారా ఎఫ్‌ఎఫ్‌సి కూటమి తన విశ్వసనీయతను కోల్పోయిందని గతంలో ఆ సంస్థలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉండి తరువాత వెలుపలికి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విప్లవ కార్యాచరణకు తిరిగి ఉపక్రమించటం, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరచటం తప్ప మరొక మార్గం లేదని కూడా పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తెల్ల బంగారం లిథియంపై బహుళజాతి గుత్త కంపెనీల కన్ను !

03 Wednesday May 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Environment, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Australia, Chile, China, Lithium, Multinationals, white gold Lithium


ఎం కోటేశ్వరరావు
పెట్టుబడిదారులు తమకు ఏది లాభసాటిగా ఉంటే దానికోసం ఎంతకైనా తెగిస్తారన్నది చరిత్ర చెప్పిన సత్యం.కొలంబస్‌ అమెరికాను కనుగొనటంలోనే అది తొలిసారిగా స్పష్టమైంది. ఆ పరంపరలో ఓడలు, సముద్ర మార్గాలు,దేశాల ఆక్రమణ, వలసపాలన, ముడి చమురు, విలువైన ఖనిజ సంపదలను ఆక్రమించుకొనేందుకు, వాటినుంచి లాభాలను పిండుకొనేందుకు జరిపిన దాడులు, యుద్ధాల చరిత్ర తెలిసింది. ఆ జాబితాలో ఇప్పుడు తెల్లబంగారంగా భావిస్తున్న లిథియం అనే ఖనిజం చేరనుందా ? రానున్న రోజుల్లో చమురుతో పాటు అది కూడా ప్రాధాన్యత సంతరించుకోనుంది. కాలుష్య ఉద్గారాలను 2050నాటికి సున్నా స్థాయికి తగ్గించే విధంగా శుద్దమైన ఇంథనాన్ని ఉత్పత్తి చేయాలనేది ఒక లక్ష్యం.తద్వారా పర్యావరణాన్ని రక్షించేందుకు పూనుకోవాలని ప్రపంచం చూస్తోంది.దీనికి గాను వాహన రంగంలో రెండువందల కోట్ల ఎలక్ట్రిక్‌ లేదా ఎలక్ట్రిక్‌తో పాటు అవసరమైతే చమురు ఇంథనాన్ని వినియోగించే వాహనాలను తయారు చేయాల్సి ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైది పెద్ద మొత్తంలో విద్యుత్‌ నిలువ చేయగలిగిన బ్యాటరీలు.వాటికి అవసరమైనది లిథియం. ఇప్పటివరకు కనుగొన్నమేరకు ఆ ఖనిజ నిల్వలు 250 కోట్ల బ్యాటరీల తయారీకి మాత్రమే సరిపోతాయట. సముద్రాల్లో , రాతి శిలల ప్రాంతాల్లో కూడా ఇది భారీగా దొరుకుతుంది.


ఈ పూర్వరంగంలో ఎంతో విలువైన లిథియం నిల్వలను కొత్తగా కనుగొనేందుకు, ఉన్న వాటిని తమ స్వంతం చేసుకొనేందుకు బహుళజాతి గుత్త కంపెనీలు చూస్తున్నాయి. వాటికి అమెరికా, ఇతర ధనిక దేశాలు తమ పలుకుబడి, అధికారాన్ని ఉపయోగించేందుకు పూనుకున్నాయి. షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా అందుకోసం కుట్రలు ఉంటాయని చెప్పనవసరం లేదు. బహుళజాతి కంపెనీల కోసం పని చేసే పత్రికల్లో ఒకటైన టైమ్స్‌ పత్రిక ఏప్రిల్‌ చివరి వారంలో ” లిథియం కోసం ఒకవేళ దక్షిణ అమెరికా ఒక ఓపెక్‌ను ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది ” అంటూ ఒక విశ్లేషణా హెచ్చరికను ప్రచురించింది. ఒపెక్‌ అంటే చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల సంస్థ. అలాంటి దానినే లిథియం ఖనిజానికీ ఏర్పాటు చేస్తే అనేది దాని భయం. ప్రపంచంలో 2020 నాటికి కనుగొన్న మేరకు ఉన్న నిల్వలు రెండు కోట్ల పదిలక్షల టన్నులు. ఈ మొత్తంలో ఒక్క చిలీలోనే 92లక్షల టన్నులు ఉంది. తరువాత మన దేశంలోని జమ్మూ-కాశ్మీరు ప్రాంతంలో 59లక్షల టన్నులు, ఆస్ట్రేలియా 47, అర్జెంటీనా 19, చైనా 15, అమెరికాలో 7.5, కెనడాలో 5.3లక్షల టన్నుల నిల్వలున్నాయి. వీటి నుంచి 82వేల టన్నులు అదే ఏడాది వెలికి తీయగా ఒక్క ఆస్ట్రేలియాలోనే 40,చిలీ 18, చైనా 14, అర్జెంటీనా 6.2 వేల టన్నులు వెలికి తీశారు.మరుసటి ఏడాది లక్ష టన్నులకు పెరిగింది.దీనిలో అమెరికా వాటా కేవలం ఒక్కశాతమే ఉంది.


గతంలో గ్లాసును కరిగించే ఉష్టోగ్రతలను తగ్గించేందుకు, అల్యూమినియం ఆక్సైడ్‌ కరిగింపు,సిరామిక్స్‌ వంటివాటిలో లిథియంను వాడేవారు. రెండువేల సంవత్సరం తరువాత బ్యాటరీల తయారీకి ఉపయోగించటంతో దాని డిమాండ్‌ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడది భౌగోళిక రాజకీయాలనే ప్రభావితం చేసేదిగా మారుతోందంటే అతిశయోక్తి కాదు.2020లో ప్రపంచమంతటా 30లక్షల విద్యుత్‌ వాహనాలను కొనుగోలు చేస్తే మరుసటి ఏడాదికి 66లక్షలకు పెరిగాయి.మార్కెట్‌లో వీటి వాటా 9శాతం.రానున్న పది సంవత్సరాల్లో పెట్రోలు, డీజిలు మోటారు వాహనాల కొనుగోలును క్రమంగా తగ్గిస్తామని అనేక దేశాల ప్రభుత్వాలు ప్రకటించాయి. చమురు ధరలు పెరగటంతో సాధారణ పౌరులు కూడా వాటివైపే మొగ్గుతున్నారు. మోటారు వాహనాలు, ఇతర రంగాల్లో చిప్స్‌ ప్రాధాన్యత ఎలా పెరిగిందో లిథియ బ్యాటరీలు కూడా అంతే ప్రాధాన్యవహించనున్నాయి. అందుకే ఆరు దశాబ్దాల క్రితం చమురు దేశాలు మార్కెట్‌ను అదుపు చేసేందుకు ఒపెక్‌ సంస్థను ఏర్పాటు చేసినట్లుగా లిథియం ఖనిజం ఉన్న దేశాలు కూడా ఒక్కటైతే అమెరికా,జపాన్‌,ఐరోపాలోని వాహన తయారీ కంపెనీలు విద్యుత్‌ వాహన రంగంలో అడుగుపెట్టాలంటే ఇబ్బందులు తలెత్తుతాయి. టైమ్‌ పత్రిక విశ్లేషణలో వెల్లడించిన భయమదే.


లాటిన్‌ అమెరికా దేశాల్లో లిథియం నిల్వలున్నాయి.పెరూ ఎన్నికల్లో గెలిచిన వామపక్ష నేత పెడ్రో కాస్టిలో ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చివేసి అధికారానికి వచ్చిన అమెరికా అనుకూల ప్రభుత్వం ఏప్రిల్‌ 10న ఒక ప్రకటన చేస్తూ అమెరికా లిథియం కంపెనీ అనుబంధ కెనడా కంపెనీకి లిథియం ఖనిజ గనులను అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. దాన్ని వ్యతిరేకిస్తూ పెరూవియన్లు ఆందోళన చేస్తున్నారు.ప్రభుత్వరంగంలోనే కొనసాగాలని డిమాండ్‌ చేస్తున్నారు.కుట్ర పూరితంగా అధికారానికి వచ్చిన ప్రభుత్వానికి తెలుపుతున్న నిరసనలో భాగంగా ఈ డిమాండ్‌ను కూడా చేర్చారు. కార్పొరేట్ల లాభాలు, ఇతర లబ్ది గురించి చూపుతున్న శ్రద్ద ఆ ప్రాంత పౌరుల పట్ల లేదని, తమ డిమాండ్లను విస్మరిస్తే ఖనిజతవ్వకాలను అనుమతించేది లేదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. ఖనిజమున్న పూనో ప్రాంతంలోని స్థానిక తెగలకు చెందిన మూడువేల మంది ప్రతినిధులు సమావేశమై ఆ ఖనిజం మీద సంపూర్ణ హక్కు తమదేనని, తమ సంక్షేమానికే వనరులను వినియోగించాలని, తమను సంప్రదించకుండా నిర్ణయాలు చేస్తే కుదరదని స్పష్టం చేశారు. ముడిసరకులను ఎగుమతి చేసే ప్రాంతంగా, దేశంగా మారిస్తే సహించేది లేదని పరిశ్రమలను పెట్టి తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.


నిజానికి ఇది ఒక్క పెరూ సమస్యమాత్రమే కాదు, ప్రపంచంలో సహజ సంపదలున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది. లిథియంను కార్పొరేట్ల పరం చేసేందుకు పెరూ కుట్రదారులు చూస్తున్నారు, ప్రజల పరం చేయాలని తాను కోరుతున్నట్లు పెడ్రో కాస్టిలో చెప్పారు. దీనిలో భాగంగానే బొలీవియా అధ్యక్షుడు లూయిస్‌ ఆర్సీ లాటిన్‌ అమెరికా లిథియం ఉత్పత్తి, ఎగుమతులకు ఓపెక్‌ మాదిరి సంస్థ ఏర్పాటును ప్రతిపాదించినట్లు చెప్పాడు. అర్జెంటీనా సర్కార్‌ కూడా దీనిపట్ల ఆసక్తి వెల్లడించింది. మెక్సికో, చిలీ అధినేతలు కూడా ఇటీవల లిథియం గనులను జాతీయం చేయాలని ప్రకటించారు. తమ ప్రాంత సంపదలను తమ పౌరుల సంక్షేమానికే అన్న అంశం దీనివెనుక ఉంది. పెరటిగా తోటగా చేసుకొని నిరంకుశ, మిలిటరీ పాలకులను గద్దె మీద కూర్చోపెట్టిన అమెరికా ముడిసరకుల ఎగుమతి ప్రాంతంగా దీన్ని చూసింది తప్ప పరిశ్రమలను వృద్ది చేయలేదు. అనేక దేశాల్లో అధికారానికి వచ్చిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఈ పరిస్థితిని మార్చాలని చూస్తున్నాయి.


టైమ్‌ వంటి కార్పొరేట్‌ మీడియాకు జన ఆకాంక్షలు పట్టవు. కొద్ది రోజుల క్రితం చిలీ ప్రభుత్వం లిథియం గనులను ప్రభుత్వ అదుపులోకి తేవాలని ఒక ప్రణాళికను ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ తవ్వకాలు సాగిస్తున్న రెండు అమెరికన్‌ కంపెనీలను కొన్ని సంవత్సరాల తరువాత అంతిమంగా ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించటం, కొత్తగా జరిపే తవ్వకాలను ఆధునిక పరిజ్ఞానంతో ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంలో చేపట్టాలని ప్రతిపాదించారు. అనేక దేశాల్లో ఈ పాక్షిక జాతీయకరణ ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నారు. చమురు దేశాల్లో ఒపెక్‌ ఏర్పాటును కూడా నాడు బహుళజాతి గుత్త సంస్థలు అంగీకరించలేదు, విఫలం చేసేందుకు చూశారు. మన దేశంతో సహా అనేక దేశాలు చమురు ఉత్పత్తి, మార్కెటింగ్‌ విదేశీ కంపెనీలను జాతీయం చేశారు. ఒపెక్‌ ఇప్పుడు రష్యాతో సహా 40శాతం చమురు సరఫరాను అదుపు చేస్తున్నది.లిథియం అంశంలో కూడా అదే జరిగితే లాభాలు తెచ్చే మరో గంగిగోవు తమకు దక్కదని బహుళజాతి సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.2010లో కేవలం 23,500 టన్నుల డిమాండ్‌ మాత్రమే ఉన్న ఈ ఖనిజం 2030నాటికి 40లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. లాటిన్‌ అమెరికాలోని ఉప్పునీటి కయ్యలలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. అయితే శుద్ధి ఎంతో సంక్లిష్టమైనదిగా, ఖర్చుతో కూడినదిగా మారటంతో అనేక దేశాల్లో వినియోగంలోకి రాలేదు. లాటిన్‌ అమెరికా దేశాలకు పెట్టుబడులు సమస్య కూడా ఉంది. సంయుక్తరంగంలో తామెందుకు పెట్టుబడులు పెట్టాలని కార్పొరేట్లు పెదవి విరుస్తున్నాయి. చైనా, ఆస్ట్రేలియాలలో కఠిన శిలలు ఉండే ప్రాంతంలో ఈ నిక్షేపాలు ఉన్నాయి. పాక్షిక జాతీయం, ప్రయివేటు రంగ భాగస్వామ్యం అన్న తమ విధానం పెట్టుబడులకు దోహదం చేస్తుందని చిలీ వామపక్ష అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ చెబుతున్నాడు. పర్యావరణానికి హాని జరగకుండా, కాలుష్యం పెంచని ఆధునిక పరిజ్ఞానంతో పెట్టుబడులు పెట్టే వారికి 49.99 శాతం వాటా ఇస్తామని చెప్పాడు. ఖనిజ తవ్వకం స్థానికులకు, దేశ పౌరులకు లబ్ది కలిగించేదిగా ఉండాలన్నాడు.


1995లో ప్రపంచ లిథియం ఉత్పత్తిలో మూడో వంతు వాటా కలిగి ఉన్న అమెరికా ఇప్పుడు ఒక శాతానికి పడిపోయింది. దాని గనుల్లో ఉన్న నిల్వలు కూడా తగ్గినట్లు చెబుతున్నారు.ఈ ఖనిజానికి డిమాండ్‌ పెరుగుతున్న దశలో తమ ఆటో రంగానికి అవసరమైన దానిని చేజిక్కించుకొనేందుకు అక్కడి కంపెనీలు తప్పకుండా చూస్తాయి.చైనాలో ఉన్న గనులతో పాటు విదేశాల్లో కూడా దాని కంపెనీలకు 5.6బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. బాటరీలకు అవసరమైన ప్రపంచ ముడి ఖనిజంలో 60శాతం మేరకు చైనాలో శుద్ది చేస్తున్నారు. డిమాండ్‌ పెరిగే కొద్దీ చిలీ ప్రపంచ కేంద్రంగా మారే అవకాశం ఉంది. ప్రపంచంలోని లిథియం నిల్వల్లో 60శాతం చిలీ, బొలీవియా, అర్జెంటీనా త్రికోణ ప్రాంతంలో ఉన్నట్లు ప్రపంచ ఆర్థికవేదిక చెబుతున్నది. ఫోన్లు, కార్లకు అవసరమైన బాటరీలకు ఇది అనువుగా ఉండటంతో ఒక దశంలో డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. గతేడాది నవంబరులో టన్ను ధర 14 నుంచి 80వేల డాలర్లకు చేరి తరువాత తగ్గింది. 2040 నాటికి ఇప్పుడున్న డిమాండ్‌ 40 రెట్లు పెరుగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇప్పటికే ప్రయివేటురంగంలో ఉన్న చిలీ అమెరికన్‌ కంపెనీల అనుమతి గడువు 2030లో ముగియనున్నది.దానిని పొడిగిస్తారా లేక సంయుక్త భాగస్వామ్యంలోకి మారుస్తారా అన్న అనుమానాలతో ఆ కంపెనీల వాటాల ధరలు పడిపోయాయి. ప్రభుత్వ రంగంలోని చిలీ రాగి కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అదే మాదిరి లిథియం కంపెనీని కూడా ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.ఈ పూర్వరంగంలో అది తెచ్చే లాభాల కోసం సామ్రాజ్యవాదులు ఎన్ని కుట్రలకైనా పాల్పడే అవకాశం ఉంది. చిలీ రాగి గనులకూ ప్రసిద్ది అన్నది తెలిసిందే.ప్రపంచంలో అతి పెద్ద పరిశ్రమను అక్కడ 1973లో అధికారానికి వచ్చిన వామపక్ష నేత సాల్వెడార్‌ అలెండీ జాతీయం చేయటాన్ని అమెరికా, కార్పొరేట్‌ సంస్థలు సహించలేక కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూల్చివేశారు. మిలిటరీ తిరుగుబాటుతో అలెండీని హత్య చేశారు. ఇప్పుడు లిథియం పాక్షిక జాతీయకరణ నిర్ణయం నాటి పరిణామాలను గుర్తుకు తెచ్చిందని కొందరు పేర్కొన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ పక్కకెళ్లొద్దురో డింగరీ : పన్నెండు గంటలపని, మూడు రోజుల సెలవు కుర్రకారుకు గాలమే !

30 Sunday Apr 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#May Day 2023, 4-day work week, Anti labour measures, BJP, Four 12-hour days, Labour Reforms INDIA, May Day 2023, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మే డే అంటే కార్మికులు కొన్ని చోట్ల సంబరాలు జరుపుతున్నారు. మరికొన్ని చోట్ల దీక్షాదినంగా పాటిస్తున్నారు. అసలు ఏదీ పాటించకుండా, మే డే అంటే ఏమిటో కూడా తెలియకుండా ఆ రోజున కూడా పనిలో ఉండేవారు ఉన్నారు. కరోనా సమయంలో శ్రామికులు తక్కువగా అందుబాటులో ఉన్నందున రోజుకు పన్నెండు గంటలపాటు పని చేయించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదని సుప్రీం కోర్టు 2020 అక్టోబరు ఒకటవ తేదీన తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చేసిన విధాన నిర్ణయం ప్రకారం వారానికి నాలుగు రోజులు, రోజుకు పన్నెండు గంటల చొప్పున పని గంటలు ఉన్నాయి. వాటిని అమలు జరపాల్సింది రాష్ట్రాలు గనుక అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంది. ఇప్పటికే కర్ణాటకలో ఆమోదించారు. తాజాగా తమిళనాడులో ఆమోదం మీద తీవ్ర నిరసన వెల్లడి కావటంతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది తప్ప రద్దు చేయలేదు. అది తాత్కాలికం, దేశమంతటా ఆ కత్తి కార్మికుల మెడమీద వేలాడుతూనే ఉంది.మూడు సాగు చట్టాలను ప్రతిఘటిస్తూ రైతాంగం సాగించిన ఏడాది పోరాటం, దానికి తలొగ్గి క్షమాపణలు చెప్పి మరీ వాటిని రద్దు చేసిన తీరు తెలిసిందే. రైతన్నల పోరు, దేశంలో దిగజారుతున్న ఆర్థిక స్థితి, వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికల కారణంగా లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మికుల మీద రుద్దనున్న చట్టాలను ఆలశ్యం చేస్తున్నారు తప్ప వెనక్కు తగ్గే ధోరణిలో లేరు. ఇప్పటికే పార్లమెంటు ఆమోదించింది. అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని అంశాలపై ముసాయి నిబంధనలను ప్రకటించాయి. ఒక విధానంగా చట్ట సవరణ చేస్తే దాన్ని కోర్టులు కొట్టివేసేందుకు అవకాశాలు దాదాపు లేవు. కార్మికులను కోర్టులు కూడా ఆదుకోలేవు. ఇప్పుడున్న ఎనిమిది గంటల షిప్టులను పన్నెండు గంటలకు పెంచుకోవటమా లేదా అన్నది యజమానులు నిర్ణయించుకోవచ్చని, దీనికి కార్మికుల అంగీకారం కూడా అవసరమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.తమకు వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలనో మరో సాకునో యజమానులు చూపితే పన్నెండు గంటలు ఏకబిగిన పని చేయక తప్పదు.చట్టాలు యజమానులకు చుట్టాలు తప్ప కార్మికులకు కాదు. చట్టాల ఆటంకం కారణంగానే మన దేశానికి విదేశీపెట్టుబడిదారులు రావటం లేదని, ఎగుమతుల్లో పోటీ పడలేమని అందువలన వారు కోరుకున్నట్లుగా భూమి, కార్మిక చట్టాలను మార్చాలని ఎప్పటి నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ మార్పులన్నీ వారి కోసం తప్ప కార్మికుల కోసం కాదు.


ఆసుపత్రులు, మరికొన్ని చోట్ల ఇప్పటికే అరకొర వేతనాలతో పన్నెండు గంటల షిప్టుల్లో పని చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. వారికి వారానికి ఒక రోజు సెలవు తప్ప అదనంగా ఇవ్వటం లేదు. ఇప్పుడు వారికి మూడు రోజులు సెలవులు, వాటికి వేతనం ఇస్తారా, ప్రభుత్వం ఇప్పిస్తుందా ? నాలుగు రోజులు పని చేస్తే వచ్చే వేతనంతో ఏడు రోజులు ఎలా గడుపుకుంటారు ? కొన్ని చోట్ల పని స్థలాలకు వెళ్లి వచ్చేందుకు కార్మికులకు రెండు నుంచి నాలుగు గంటలు పడుతున్నది. అంటే పదహారు గంటలు కుటుంబాలకు దూరంగా ఉండి ఇంటికి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యులతో గడిపేందుకు, విశ్రాంతి తీసుకొనేందుకు వ్యవధి దొరుకుతుందా ? ఇదే అమలు జరిగితే వారానికి నాలుగు రోజులు వారు ఇంటికి దూరమై ఫ్యాక్టరీల గేట్ల ముందు పడుకున్న 150 సంవత్సరాల నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయంటే అతిశయోక్తి కాదు. ఈ విధానం అమల్లోకి వస్తే తొలి బాధితులు, పనికి దూరమయ్యేది మహిళలు. వారు ఇంట్లో పని చేసుకొని పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయాన్ని పనికి వెచ్చించగలరా ? పసి పిల్లలను సంరక్షించుకోగలరా ? పన్నెండు గంటల షిఫ్టులు పెడితే ఆహారపు అలవాట్లు, వేళలు మారతాయి. మూడు పూటలా తినేందుకు వీలుండదు, మూడుసార్లు తినాల్సినదాన్ని రెండుసార్లు కుక్కటం జరిగేదేనా ? ఇవి అలసట, ఆరోగ్య, మానసిక వత్తిడి, తాగుడు వంటి వాటికి దారితీస్తాయి.ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు, కుటుంబ జీవనానికి కొత్త వాటిని జోడిస్తాయి.


అదనపు వేతనం ఇచ్చేందుకు నిరాకరిస్తూ, ఇచ్చినా అరకొరా చెల్లిస్తూ అడిగిన వారిని పని నుంచి తొలగిస్తున్న యజమానులకు చట్టబద్దంగా అధికారమిచ్చి ఎనిమిది గంటలకు ఇస్తున్న వేతనంతోనే పన్నెండు గంటలు చేయించినా అడిగేవారు ఉండరు. దశాబ్దాల తరబడి కనీస వేతనాలను పెంచని పాలకులు కళ్ల ముందు కనిపిస్తున్నపుడు ఇంతకు మించి కార్మికులకు ఒరిగేదేమీ ఉండదు.చట్టవిరుద్ద దోపిడీని చట్టబద్దం చేస్తుంది. కొత్త చట్టాల ప్రకారం మొత్తం వేతనంలో మూలవేతనం సగం ఉండాలని చెబుతున్నారు. అంటే ఆ మేరకు కార్మికులు, యజమానులు చెల్లించే ప్రావిడెంట్‌ ఫండ్‌ వాటా పెరుగుతుందని, ఉద్యోగ విరమణ చేసినపుడు గ్రాట్యూటీ పెరిగి పెద్ద మొత్తాలు చేతికి అంది సుఖంగా జీవించవచ్చని ఆశ చూపుతున్నారు. పిఎఫ్‌ వాటా పెరగటం అంటే తమ పెన్షన్‌కు తామే ముందుగా చెల్లించటం తప్ప మరొకటి కాదు. దీని వలన వచ్చే వేతనాల మొత్తం తగ్గి రోజువారీ గడవటం ఎలా అన్నది అసలు సమస్య. అలవెన్సులు, కరువు భత్యం వంటివి మూలవేతనంలో సగానికి మించకూడదంటే అది కార్మికులకు నష్టమే.
కొత్త చట్టం వస్తే సెలవులేమీ పెరగవు. ఇప్పుడు 45 రోజులకు ఒక వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నారని, దాన్ని ఇరవై రోజులకు ఒకటి వచ్చేట్లు చేస్తున్నామని చెబుతున్నారు. ఎనిమిదికి బదులు నాలుగు గంటలు పని చేస్తే ఓవర్‌టైమ్‌ వేతనం చెల్లించాలి. ఇప్పుడు మామూలు వేతనానికే అదనంగా రోజుకు నాలుగు గంటలు పని చేయాలి.కంపెనీలో చేరిన 240 రోజుల తరువాత సెలవు పెట్టుకొనే దానిని ఇప్పుడు 180రోజులకే తగ్గిస్తున్నట్లు ఆశచూపుతున్నారు. ఇప్పుడు ఏడాదికి వారాంతపు సెలవులు 52 పోగా పని రోజులు 300 వరకు ఉంటున్నాయి. నాలుగు రోజులే పని అమల్లోకి వస్తే పని రోజులు రెండువందలకు తగ్గుతాయి. ఏదైనా ఒకటే కదా ! వాస్తవంగా నిబంధనలు అమల్లోకి వస్తే తప్ప కార్మికులు ఎంత పొగొట్టుకొనేది, యజమానులకు కలిగే లబ్ది ఏమిటనేది స్పష్టం కాదు.


అనేక దేశాల్లో మాదిరి సంస్కరణల్లో భాగంగా షిప్టులను మారిస్తే తప్పేమిటి అని కొందరు వాదించవచ్చు. ఒక సినిమాలో దేన్నీ ఒక వైపే చూడకు అన్న డైలాంగ్‌ తెలిసిందే. వీటినీ అంతే. చైనాలో సంస్కరణలు అక్కడ సంపదలను సృష్టిస్తే మన దేశంలో అలాంటిదేమీ జరగలేదు. అదే చైనాలో పన్నెండుగంటల పనికి అనుమతి ఉంది అని కొందరు కొన్ని కంపెనీలను చూపి ఉదాహరించవచ్చు.వాస్తవాలేమిటి ? చైనాలో రోజుకు ఎనిమిది గంటలపని, వారానికి 44 గంటలు అన్న చట్టాన్ని మార్చి పన్నెండుగంటలుగా, నాలుగు రోజులుగా మార్చలేదు. ప్రభుత్వం ఇచ్చిన కొన్ని వెసులుబాట్లను అవకాశంగా తీసుకొని కొన్ని కంపెనీలు వారానికి ఆరు రోజులు, రోజుకు పన్నెండు గంటల షిప్టులను అమలు జరిపాయి. దాన్నే 996 పని సంస్కృతి అని పిలిచారు. ఆలీబాబా కంపెనీ అధినేత జాక్‌ మా వంటి వారు దాన్ని అమలు జరిపారు. అలాంటి పని పద్దతులను అమలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చైనా ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేసింది. అనేక కోర్టులు పన్నెండు గంటలపని చట్టవిరుద్దమని తీర్పులు చెప్పాయి. 2021 సెప్టెంబరు 21 చైనా సుప్రీం కోర్టు, కార్మిక మంత్రిత్వశాఖ సంయుక్తంగా ఒక ప్రకటనలో పది కోర్టు తీర్పులను ఉటంకిస్తూ కార్మికుల చేత చట్టాలకు భిన్నంగా ఏ రంగంలోనూ బలవంతంగా పని చేయించటాన్ని సహించేది లేదని స్పష్టం చేశాయి. విశ్రాంతి సమయంలో, సెలవు రోజుల్లో కార్మికులతో పని చేయిస్తే చట్టపరంగా చెల్లింపు లేదా పరిహారాన్ని కోరే హక్కు కార్మికులకు ఉందని పేర్కొన్నాయి. టెక్నాలజీ (ఐటి) కంపెనీలు నిబంధనలకు విరుద్దంగా ఎక్కువ సేపు పని చేయించినట్లు, పరిహారం చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.2019లో కొంత మంది ప్రోగ్రామర్లు రంగంలోకి దిగి అందరికీ అందుబాటులో ఉండే (ఓపెన్‌ సోర్స్‌ కోడ్స్‌ ) సంకేతాలను ఉపయోగించుకొని పని చేసే అంకుర సంస్థలు చట్టాలను ఉల్లంఘిస్తే వాటిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. అలా ఎక్కువ గంటలు పనిచేసి అనారోగ్యాలకు గురై కొందరు నిపుణులు మరణించిన తరువాత నిరసనలు వెల్లువెత్తాయి. మన దగ్గర స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల తరఫున ఆహారాన్ని అందించే కార్మికులు తమకు చట్టాలను వర్తింప చేయటం లేదని ఫిర్యాదు చేసిన తరువాత చైనా ప్రభుత్వం అలాంటి సంస్థలను కట్టడి చేసి కార్మికులకు రక్షణ కల్పించింది. అనేక సంస్థలు దారికి వచ్చాయి. అలాంటి చిత్తశుద్ది మన ప్రభుత్వాలకు ఉన్నాయా అన్నది ప్రశ్న.చైనాలో కార్మిక చట్టాలను కఠినతరం గావించటం, కనీసవేతనాల పెంపుదల వంటి కారణాలతో అక్కడ ఇంకేమాత్రం వాణిజ్యం, ఫ్యాక్టరీలను నడపటం లాభసాటి కానందున అక్కడి నుంచి వచ్చే కంపెనీలను మన దేశం ఆకర్షించాలని మన దేశంలో అనేక మంది చెబుతున్నారు. ఇదే తరుణంలో ఇక్కడ కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేసే, జీవితాలను ఫణంగా పెట్టే పని పద్దతులను రుద్దేందుకు చూస్తున్నారు. ఏదో దేశంలో తొడకోసుకుంటే మన దేశంలో మెడకోసుకోవాల్సిన అవసరం లేదు. విదేశీ సిద్దాంతాలు, విదేశీ పద్దతులు వద్దని చెప్పేవారు కార్మికుల మీద విదేశీ పద్దతులనే ఎందుకు బలవంతంగా రుద్దుతున్నట్లు ?


అంబేద్కర్‌ అంటే దళితుల నాయకుడని, ( కొంత మంది దళితులలో ఒక ఉప కులానికే పరిమితం చేస్తున్నారు) మహాత్మా జ్యోతిరావు పూలే అంటే బిసిల నేతగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.ఈ ఇద్దరికీ కమ్యూనిస్టులు వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం కొందరు చేస్తున్నారు.మరికొందరు వారిని తమ మనువాద, తిరోగామి చట్రంలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వారి స్ధానాన్ని తక్కువ చేసి చూపటమే. మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు, కార్మిక, సామాజిక సమస్యలపై కేంద్రీకరించిన తొలి పత్రిక ‘దీన బంధు ‘ సంపాదకుడు నారాయణ్‌ మేఘాజీ లోఖండే అని, ఆయన మహాత్మా జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన సత్య శోధక సమాజ కార్యక్రమాల వుత్తేజంతోనే దేశంలోనే తొలి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారనే విషయం ఎందరికి తెలుసు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లో జన్మించిన నారాయణ్‌ కేవలం 49 సంవత్సరాలకే ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవలందిస్తూ అనారోగ్యంతో మరణించారు. రైల్వే, తపాల శాఖలో పని చేసిన ఆయన 1870లో మాండవీ బట్టల మిల్లులో స్టోరు కీపరుగా చేరారు. ఆ సమయంలో మిల్లు కార్మికుల దయనీయ స్ధితిని ప్రత్యక్షంగా చూశారు. కార్మికులు పది నుంచి 14 గంటలు పని చేసేవారు.

బాంబే మిల్‌ హాండ్స్‌ అసోసియేషన్‌ పేరుతో తొలి కార్మిక సంఘాన్ని 1884లో నారాయణ్‌ ఏర్పాటు చేశారు. అదే ఏడాది ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్మికుల సంక్షేమ చర్యలలో భాగంగా ప్రమాదానికి గురైనపుడు సాయం, మరణించినపుడు గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ వంటి వాటిని అమలు జరపాలని కోరుతూ మిల్లు కార్మిక సంఘ అధ్యక్షుడి హౌదాలో ఆ కమిషన్‌కు ఒక పిటీషన్‌ అందచేశారు.దానిపై వేలాది మంది కార్మికుల సంతకాలను సేకరించారు. ఒకవైపు వాటితో పాటు 1884 సెప్టెంబరు 23న తొలిసారిగా కార్మికుల సభను ఏర్పాటు చేసి అవే డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ వారానికి ఒక రోజు ఆదివారం సెలవు ఇవ్వాలని, వుదయం ఆరున్నర నుంచి సాయంత్రం పొద్దుగూకే వరకు మాత్రమే పని చేయించాలని, మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి ఇవ్వాలని కూడా సభ ఒక తీర్మానం చేసింది.అయితే వాటిని యజమానులు అంగీకరించలేదు. 1890 నాటికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఒక సంక్షోభం వచ్చింది. వస్త్రాలకు డిమాండ్‌ లేని కారణంగా మిల్లులను మూసివేస్తున్నామని యజమానులు ఏకపక్ష చర్యలకు పూనుకున్నారు. దానికి నిరసనగా 1890 ఏప్రిల్‌ 24న లోఖండే ఒక పెద్ద కార్మిక సభను నిర్వహించారు. అదే ఏడాది జూన్‌ పదిన యజమానుల సమావేశంలో ఆదివారం రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. సంఘటిత కార్మికవుద్యమానికి లభించిన విజయమది. మాంద్యం ఎంతకాల కొనసాగుతుందో తెలియదు కనుక ఒక రోజు సెలవు ఇస్తే వచ్చే నష్టం కంటే పని చేస్తే తమపై పడే భారం ఎక్కువ కనుక యజమానులు సెలవుకు అంగీకరించారన్నది మరొక కోణం.


దీన్ని బట్టి యజమానులకు ఏది లాభంగా ఉంటే దాన్నే కోరుకుంటారన్నది స్పష్టం. పన్నెండు గంటల షిప్టు, మూడు రోజుల సెలవు వెనుక ఉన్నది కూడా అదే.మన దేశంతో సహా ప్రపంచమంతటా వినిమయ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు.ఎనిమిది గంటల బదులు పన్నెండు గంటలు చేసి వారానికి మూడు రోజులు సెలవు తీసుకుంటే కుటుంబాలతో సంతోషంగా గడపవచ్చంటూ రంగుల కలను చూపుతున్నారు. ఇలా మార్చాలని అసలు ఎవరు అడిగారు. అన్ని రోజులు సెలవులు గడిపి ఖర్చు చేసేందుకు ఎందరి వద్ద మిగులు ఉంటుంది. పశ్చిమ దేశాలలో జనం ఎంత ఖర్చు చేస్తే అక్కడి కార్పొరేట్లు, వాణిజ్య సంస్థలకు లబ్ది. అందుకోసం అప్పులూ ఇప్పిస్తారు, వాటిని ఖర్చు చేసేందుకు సెలవులూ ఇస్తున్నారు. మన దేశం ఆ స్థితికి ఇంకా చేరిందా? అక్కడున్న మాదిరి సామాజిక రక్షణలు ఇక్కడ ఉన్నాయా ?


2005లో ఆయన స్మారకార్ధం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ లోంఖడేలో జ్యోతిబా పూలే సామాజిక సంస్కరణ, మహిళాభ్యుదయంతో పాటు కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కార్మిక పక్షపాతం కూడా మిళితమై వుందని చెప్పారు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు రావు బహద్దూర్‌ బిరుదును ప్రకటించటాన్ని బట్టి ఒక సంస్కర్తగానే చూసిందన్నది స్పష్టం. ఒక కార్మిక నేతకు అలాంటి బిరుదులను వూహించలేము. అంతమాత్రాన కార్మికోద్యమానికి ఆయన వేసిన బలమైన పునాదిని విస్మంరించకూడదు. మే డే సందర్భంగా పూలే, అంబేద్కర్‌లను విస్మరించలేము. పూలే, ఆయన సత్యశోధక సమాజం, సంస్కరణలకోసం కషే నారాయణ మేఘజీ లోఖండేను కార్మిక పక్షపాతిగా కూడా మార్చిందన్నది స్పష్టం.ఈ సందర్భంగా పూలే, లోఖండే, అంబేద్కర్‌లను వామపక్ష వుద్యమం విస్మరించిందనే ఒక విమర్శ వుంది. అది గత చరిత్ర. నేడు వామపక్షాలు గతం కంటే వారి కషిని గుర్తించిన మాట వాస్తవం. పూలే, అంబేద్కర్‌లను వామపక్షాలు సముచిత స్ధానంతో గౌరవించలేదని విమర్శించే వారు తాజా వైఖరిలో వచ్చిన మార్పును గమనించవచ్చు. ఈ సందర్భంగానే పూలే-అంబేద్కరిస్టులుగా ముద్రపడిన వారు కుల వివక్ష సమస్యకే పరిమితమై కార్మికవర్గ, ఇతర పోరాటాలను విస్మరిస్తున్నారనే విమర్శను మరచి పోకూడదు. అందువలన ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నప్పటికీ రెండు సమస్యల మీద ఐక్య వుద్యమాలు చేయటానికి అవి ఆటంకం కానవసరం లేదు. అవి శత్రువైరుధ్యాలు కావు.


కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయే తప్ప తగ్గవు అన్నది స్పష్టం. పన్నెండు గంటల షిప్టు నిబంధన అందరికీ వర్తిస్తుంది. దానిలో ఎవరికీ మినహాయింపులు ఉండవు. అందువలన తామేం చేయాలో కూడా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అదే మే డే సందేశం. ఎనిమిది గంటల పని దినం కోసం జరిపిన పోరాటాలకు ప్రతి రూపమే మే డే. ఇప్పుడు ఆ విజయాన్ని వమ్ము చేసి పన్నెండు గంటల పనిని రుద్దబోతున్నారు. కార్మికులు ఈ సవాల్‌ను స్వీకరించాలా వద్దా ? ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ల లాభాలు తగ్గేకొద్దీ శ్రమజీవుల సంక్షేమ చర్యల మీద ముందు దాడి జరుగుతుంది. అందువలన ప్రతి పరిణామాన్ని జాగరూకులై పరిశీలించాల్సి వుంది.ఈ రోజుల్లో కూడా మేడే ఏమిటండీ. ప్రపంచమంతా సోషలిజం, కమ్యూనిజం అంతరించిపోయింది. కొంత మంది పొద్దున్నే జండాలు ఎగరేసి, మధ్యాహ్నం నుంచి తాగి తందనాలాడటం, లేకపోతే మొక్కుబడిగా ఒక ర్యాలీ, సభో జరపటం తప్ప చేస్తున్నదేమిటి? అయినా అసలు మేడే గురించి దానిని పాటించే వారికి ఎందరికి తెలుసు, ఒక రోజు పని మానివేయటం తప్ప ఎందుకిది అని పెదవి విరిచే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రపంచవ్యాపితంగా కార్మికోద్యమాలు వెనుక పట్టుపట్టిన కారణంగా ఇటువంటి చైతన్య రహిత భావాలు ప్రబలుతున్నాయి. తెల్లచొక్కాల వారు తాము కార్మికులం కాదనుకుంటున్నారు.యాజమాన్యంలో భాగం కాకుండా వేతనం తీసుకొనే ప్రతివారూ కార్మికులే. మే డేని ఎలా జరుపుకోవాలా అన్నది వారి చైతన్యానికి గీటురాయి. ఇది ఒక్క రోజుతో ముగిసేది కాదు. దోపిడీకి గురవుతున్న ప్రతి కార్మికుడు ప్రతి రోజూ మేడేను స్మరించుకుంటూ కార్యోన్ముఖులు కావాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d