అచ్చేదిన్‌ పదేండ్లలో ఆవిరైన సంతోషం, పాకిస్థాన్‌ కంటే దిగువనే : నాడు బ్రిటీష్‌ రాజ్యం – నేడు బిలియనీర్ల భోజ్యం !!

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


తెల్లోడి రాజ్యమే బాగుంది, కమ్యూనిస్టులే మంచోళ్లు అని మా తాత చెప్పేవాడు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్ల పాలకులు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచండి అన్న విధానంలో భాగంగా బండి పట్టాలకు అవసరమైన ఇనుము ఇచ్చారట, వాటిని పంపిణీ చేయటంలో ఆ నాడే కాంగ్రెస్‌ వారు తన, పర బేధాన్ని పాటిస్తే కమ్యూనిస్టులు అందరికీ ఇప్పించేందుకు చూశారట. తెల్లోడి పాలనను తప్పు పట్టనందుకు మా తాతను విమర్శించాలా ? ఒక రైతుగా తన పరిమిత ప్రయోజనాన్ని చూసి సంతోషించినందుకు విమర్శించాలా ? ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. జనజీవితాలను దిగజారుస్తూ కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీని వ్యతిరేకించాలా ? రామాలయం కట్టినందుకు సానుకూలంగా ఉండాలా ? ముఖ్యవైరుధ్యం ఏమిటన్నదే కీలకం. నరేంద్రమోడీ పదేండ్ల విజయ గీతాలాపన వికసిత భారత్‌ చెవుల తుప్పు వదిలిస్తున్నది. అఫ్‌ కోర్స్‌ 2004 ఇదే బిజెపి దేశం వెలిగిపోతోందంటూ తాను ఆరిపోయిందనుకోండి. ఇప్పుడూ అదే జరగనుందా ? ఎవరి అంచనాలు వారివి ! పదేండ్లలో తమను మరింతగా పెంచిన మోడీ ఏలుబడిని బిలియనీర్లు అంత తేలికగా వదులుకోరు, వారి చేతుల్లో ఉన్న మీడియాలో మోడీ భజన మరింత పెరుగుతుంది, దీనికి మత మత్తు ఎలాగూ ఉంది. ఈ అంశాన్ని తక్కువ అంచనా వేయకూడదు.


వికసిత భారత్‌ అంటూ బిజెపి ప్రచార గాలి తీస్తూ రెండు నివేదికలు తాజాగా వెలువడ్డాయి. ఒకటి ప్రపంచ సంతోష సూచికలో మనదేశ స్థానం గత పది సంవత్సరాల్లో దిగజారింది తప్ప జనానికి అచ్చేదిన్‌ జాడలేదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి రూపొందిస్తున్నది గనుక సంతోష సూచికను మేం అంగీకరించం అని బిజెపి ఠలాయిస్తే కుదరదు.తలసరి జిడిపి, సామాజిక మద్దతు,ఆరోగ్యం, జీవన విధానాన్ని ఎంచుకొనే స్వేచ్చ,ఉదారత, ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో అవినీతిని జనం ఎలా చూస్తున్నారు అనే ప్రాతిపదికల మీద ప్రతిదేశం తెచ్చుకొనే మార్కులను బట్టి సూచికలను ప్రకటిస్తారు. ప్రతి ఏడాది సూచిక అంతకు ముందు రెండు సంవత్సరాల తీరుతెన్నుల ప్రాతిపదిన ఉంటుంది. కొన్ని సార్లు పరిగణనలోకి తీసుకొనే దేశాల సంఖ్యలో తేడాలు ఉండవచ్చు. అందువలన మార్కులను బట్టి దిగజారిందా మెరుగుపడిందా అన్నది కూడా చెప్పవచ్చు. మన ఇరుగు పొరుగు దేశాల వివరాలను చూద్దాం. 1.సూచిక, మార్కులు అంటే 2014-16 పంవత్సరాలకు సంబంధించి 2017వ సంవత్సర నివేదిక, 2 సూచిక, మార్కులు అంటే 2021-23కు సంబంధించి 2024 నివేదిక వివరాలు అని గమనించాలి.
దేశంపేరు×1.సూచిక×1.మార్కులు×2.సూచిక××2.మార్కులు
భారత్‌ ×× 118 ×× 4.407 ×× 126 ×× 4.054
చైనా ×× 83 ×× 5.245 ×× 60 ×× 5.979
పాకిస్థాన్‌ ×× 92 ×× 5.132 ×× 108 ×× 4.657
నేపాల్‌ ×× 107 ×× 4.793 ×× 93 ×× 5.158
బంగ్లాదేశ్‌ ×× 110 ×× 4.643 ×× 129 ×× 3.886
శ్రీలంక ×× 117 ×× 4.415 ×× 128 ×× 3.898
నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ప్రపంచ జిడిపిలో పదవ స్థానంలో ఉన్నదానిని ఐదవ స్థానానికి చేర్చారని గొప్పలు చెప్పుకుంటారు.త్వరలో చైనాను అధిగమించి పోతామని అందుకే వికసిత భారత్‌ అని చెబుతున్నారు.వచ్చే రోజుల్లో రాజెవరో రెడ్డెవరో అన్నట్లుగా వాటి గురించి వదలివేద్దాం. గడచిన పదేండ్లలో చైనాకు పోటీగా దేశాన్ని నిలబెడతానని చెప్పిన మోడీ దానితో పోలిస్తే దేశాన్ని ఎక్కడ ఉంచారోపైన పేర్కొన్న సంతోష సూచికల్లోనే డొల్లతనం వెల్లడైంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా కూడా ఉంచటంలో విఫలమయ్యారు. పదేండ్ల క్రితం ప్రపంచ జిడిపిలో చైనా వాటా 13.1శాతంగా ఉన్నదాన్ని 2023లో 17.7శాతానికి పెంచుకోగా మన వాటా 2.6 నుంచి 3.73కు పెరిగింది. పాకిస్థాన్‌ జిడిపి 2014లో 271.4బిలియన్‌ డాలర్ల నుంచి మధ్యలో ఒక ఏడాది 374.66 బి.డాలర్లకు పెరిగి 2023లో 340.64బి.డాలర్ల వద్ద ఉంది. జిడిపి పెరిగినా సంతోష సూచిక పతనంలో మనకూ పాకిస్థాన్‌కూ తేడా ఏముంది ? అచ్చేదిన్‌, వికసిత భారత్‌ నినాదాలు ఇచ్చిన వారూ, విదేశాల్లో దేశ ప్రతిష్ట పెంచినట్లు చెప్పుకున్నవారూ అక్కడ లేరు. బిజెపి వారు చెబుతున్నట్లు మనకు అన్నీ ఉన్నా జనాలు ఎందుకు సంతోషంగా లేకపోతున్నారు ?


నాటి బ్రిటీష్‌ వలస పాలనలో కంటే నేటి స్వతంత్ర పాలనలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా పెరిగినట్లు తాజాగా ప్రపంచ అసమానతల ప్రయోగశాల(వరల్డ్‌ ఇనీక్వాలిటీ లాబ్‌) 2024 మనదేశం గురించి ప్రకటించిన విశ్లేషణలో పేర్కొన్నది. నాడు మన జనాన్ని విదేశీ దొరలు దోచుకుంటే నేడు స్వదేశీ దొరలు ఆపని చేస్తున్నారు. అనేక అంశాల మీద అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఆర్థికవేత్తలు నితిన్‌ కుమార్‌ భర్తీ, లూకాస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెట్టీ, అన్‌మోల్‌ సోమాంచీ ఒక పత్రాన్ని రూపొందించారు.దానిలో పేర్కొన్న ప్రధాన అంశాలేమిటి ? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1980దశకం వరకు అసమానతలు తగ్గాయి. తరువాత ముఖ్యంగా 1990దశకంలో సంస్కరణలు ప్రారంభించిన పదేండ్ల తరువాత విపరీతంగా పెరిగాయి.నరేంద్రమోడీ ఏలుబడిలో అది మరింత ఎక్కువైంది. 1982 నాటికి దేశంలోని ఎగువ ఒకశాతం మంది రాబడి 6.1శాతం, అది 2014-15 నుంచి 2022-23 వరకు పరిశీలించినపుడు 22.6శాతం ఉంటే వారి వద్ద పోగుబడిన సంపదలు 40.1శాతంగా ఉన్నాయి. ఎగువ పదిశాతం మంది వద్ద 2022 నాటికి దేశ సంపదల్లో 60శాతం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు.అంతరాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, అమెరికాల్లో కూడా ఆదాయరాబడి వాటా ఇంతగా లేదు. పన్నుల విధానం, ప్రపంచీకరణ దీనికి కారణం.ధనికులుగా ఉన్న 167 కుటుంబాల సంపదపై రెండుశాతం పన్ను విధిస్తే జాతీయ ఆదాయం 0.5శాతం పెరుగుతుందని అంచనా వేశారంటే సంపద ఎలా గుట్టలుగా పడి ఉందో అర్ధం చేసుకోవచ్చు. సక్రమంగా లేని సమాచారం మేరకే తాము అసమానతల గురించి చెబుతున్నామని, నాణ్యమైన, సమగ్ర సమాచారం ఉంటే అసమానతలు ఇంకా ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ధనికుల్లో ఉన్న ఎగువ తరగతిలో కూడా మిగతావారితో పోలిస్తే వారిలో 0.1శాతం మంది పదిశాతం రాబడిని పొందారు. ప్రస్తుతం రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయని కొందరు చెప్పిన మాటలను నరేంద్రమోడీ నిజం చేస్తున్నారు. అందుకే కార్పొరేట్‌ మీడియా, ధనికుల ప్రతినిధులందరూ మరోసారి వచ్చే ఎన్నికల్లో మోడీని కోరుకుంటున్నారన్నది స్పష్టం.


దేశంలో అనేక సమస్యలకు జనాభా పెరుగుదలే కారణం అని గతంలో ఊదరగొట్టారు, కుటుంబనియంత్రణ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటి పాలకులు అధిక జనాభా మన దేశానికి వరం అని ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా మారటానికి అవసరమైన చౌక శ్రామిక శక్తి అందుబాటులో ఉందని తమ జబ్బలను తామే చరుచుకుంటున్నారు. మరోవైపు గత పదేండ్లుగా కేంద్రంలో, వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాషాయ దళాలు ముస్లిం జనాభా పెరిగి హిందువుల కంటే మెజారిటీగా మారనున్నదనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అది నిజమా, సంతోషం ఆవిరి అవుతున్న స్థితిలో ఏ మతానికి చెందిన వారైనా ప్రతి కుటుంబమూ పరిమితం చేసుకొనేందుకు చూస్తున్నాయని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి.జనన-మరణాల రేటును ప్రాతిపదికగా తీసుకున్నపుడు జననాల రేటు 2.1గా ఉండాలని ఆ రంగనిపుణులు పేర్కొన్నారు. కానీ తాజా సర్వ ప్రకారం రెండుశాతమే ఉన్నందున రానున్న రోజుల్లో జనాభా తగ్గుతుంది తప్ప పెరగదని చెబుతున్నారు. జనాభాలో పదిహేనేండ్ల లోపు వారు 2015-16లో 28.6శాతం ఉండగా 2019-21లో 26.5శాతానికి తగ్గారు. అంటే కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గుతోంది. జమ్మూ-కాశ్మీరు జనాభాలో 68శాతం ముస్లింలే ఉన్నారు. అక్కడ జననాల రేటు దేశ సగటు కంటే తక్కువగా 1.4శాతమే ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ముస్లిం జననాల సగటు కంటే కూడా ఇది తక్కువ. విద్య, ఉపాధి, వైద్య, ఆరోగ్య రంగాల్లో కేటాయింపులు ఎక్కువగా ఉండి జనాల పరిస్థితి మెరుగుపడితే కులం, మతంతో నిమిత్తం లేకుండా కుటుంబనియంత్రణ ఎవరికి వారు పాటిస్తారన్నది అందరికీ తెలిసిన సత్యం.

రెండు సంవత్సరాల క్రితం ఆక్స్‌ఫామ్‌ ఇండియా సంస్థ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం కేవలం 98 మంది ధనికులైన భారతీయులు రు.49.15లక్షల కోట్ల సంపదలను అదుపు చేస్తుండగా పేదల్లోని 55.5 కోట్ల మంది వద్ద అంత ఉందని పేర్కొన్నది. 2021లో ఒక వ్యక్తి జాతీయ ఆదాయ సగటు రు.2,04,200గా లెక్కించగా దిగువ 50శాతం మంది ఆదాయం రు.53,610 ఉంది. ఎగువ పదిశాతం మంది జనాల సగటు రాబడి రు.11,66,520గా ఉంది. కరోనా తరువాత పేదలలో 20శాతం మంది రాబడి 2020-21లో 53శాతం తగ్గగా ఇదే సమయంలో ఎగువ 20శాతం మంది రాబడి 39శాతం పెరిగింది. కరోనా కారణంగా ఆరు కోట్లుగా ఉన్న పేదలు 13.4 కోట్లకు పెరిగారు. వైద్య ఖర్చుల కారణంగా 2017లో 5.5 కోట్ల మంది పేదరికంలోకి దిగజారారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా దిగువ తరగతి జనాల రాబడి పెరగకపోతే వారి జీవితాలు అతలాకుతలం అవుతాయి. విద్య, వైద్య రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటూ ప్రయివేటు వారిని ప్రోత్సహిస్తున్నాయి. రుణగ్రస్తులు కావటానికి వీటి మీద పెట్టే ఖర్చు కూడా ఒక అంశంగా మారింది.జిడిపిలో విద్య మీద ఆరుశాతం ఖర్చు పెట్టాలన్నది లక్ష్యం. కానీ నరేంద్రమోడీ తొలి ఐదు సంవత్సరాలలో మూడు శాతానికి మించలేదు, ఏటేటా తగ్గుతున్నది.జిడిపిలో ఐదవ స్థానానికి దేశాన్ని చేర్చామని గొప్పలు చెప్పుకోవటం కాదు. మన కంటే ఎంతో తక్కువగా ఉన్న బ్రెజిల్‌ విద్యకు 6.1, వైద్యానికి 9.5శాతం, రష్యా 4.7-5.3 చొప్పున దక్షిణాఫ్రికా 6.8-8.2శాతాల చొప్పున కేటాయిస్తున్నాయి. సంతోష సూచికలో సామాజిక రంగాల మీద పెట్టే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటారని గమనించాలి. వాటి కేటాయింపులు సరిగా లేకపోతే,తగ్గుతుంటే సంతోషం ఆవిరి అవుతుంది. గడచిన పదేండ్లలో సూచికలో దిగజారటానికి కారణం ఇదే.

వల్లించేది శాంతి ప్రవచనాలు – ఆచరణలో అశాంతి బీజాలు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ శాంతికోసమే తాము తాపత్రయపడుతున్నట్లు చెప్పిన వారందరూ చరిత్రలో అశాంతికి మూలకారకులుగా రుజువైంది. ఇప్పటికీ ఆదే జరుగుతోందా ? పాలస్తీనా ప్రాంతాలను కబళించిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు మొత్తం అరబ్బులనే అంతం చేసేందుకు, వారి ప్రాంతాల నుంచి వెళ్లగొట్టేందుకు జరుపుతున్న మారణకాండ మంగళవారం నాటికి 165వ రోజులో ప్రవేశించింది. గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 32వేలకు చేరుకుంది.గాయపడిన వారు, నిలువ నీడ, సర్వస్వం కోల్పోయిన వారు, ధ్వంసమైన గృహాల సంఖ్య సరేసరి.మానవహక్కులు, మానవాదానికి అసలు సిసలు ప్రతినిధులుగా చెప్పుకుంటున్నవారు పడక కుర్చీలకే పరిమితమయ్యారు. గతేడాది అక్టోబరు ఏడు నుంచి జరుపుతున్న ఇజ్రాయెల్‌ దాడులతో పాటు మధ్య ప్రాచ్యంలో అమెరికా మిలిటరీ, ఆధునిక ఆయుధాల మోహరింపు కూడా పెరిగింది. ఆసియాలో పరిస్థితి ఇదైతే ఐరోపా దేశాలకు ముప్పు పేరుతో గత ఎనిమిది దశాబ్దాలుగా తిష్టవేసిన అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభం ముసుగులో ఆ దేశాలకు ముప్పును మరింత పెంచేవిధంగా ప్రయత్నించటం శాంతిని కోరుకొనే వారికి ఆందోళన కలిగిస్తోంది. నాటి జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకురాలిగా ఉంటే ఇప్పుడు అమెరికా చర్యలు మూడవ ప్రపంచ పోరుకు దారితీసేవిగా ఉన్నట్లు అనేక మంది చెబుతున్నారు.


ఆసియా ఖండంలోని సహజ సంపదలు, రాజకీయ ఆధిపత్యం మీద కన్నేసిన అమెరికా ఒక్కో దశలో ఒక్కోకారణాన్ని సాకుగా చూపి తిష్టవేస్తోంది. మధ్య ప్రాచ్యంలో పరిణామాలు దేనికి దారితీసేదీ ఎవరూ ఊహించలేని స్థితి.బాధితులకు ఆహార సరఫరా చేస్తున్నట్లు చెబుతూనే అంతకంటే ఎక్కువగా అమెరిన్లు మిలిటరీ కేంద్రీకరణకు పూనుకున్నారు. గాజా మీద దాడులకు నిరసన లేదా ప్రతీకారంగా ప్రపంచంలో ఎంతో కీలకమైన నౌకా మార్గం ఉన్న ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌ వైపు ప్రయాణించే నౌకల మీద ఇరాన్‌ మద్దతు ఉన్న ఎమెన్‌లోని హౌతీ దళాలు దాడులకు దిగటం, వాటి మీద అమెరికా జరుపుతున్న దాడుల గురించి తెలిసిందే. కొద్ది గంటల్లోనే గాజాలోని హమస్‌ సాయుధులను అదుపు చేస్తామని ప్రగల్భాలు పలికిన ఇజ్రాయెల్‌ ఇప్పటి వరకు సామాన్య పౌరులు, వారిలో కూడా 70శాతం మంది పిల్లలూ, మహిళలు, వృద్ధులు, ఆసుపత్రులలో రోగులనే చంపుతున్నది. ఎంతకాలం అవసరమైతే అంతకాలం తాము మధ్య ప్రాచ్యంలోనే తిష్టవేస్తామని అమెరికా మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవటం అంత తేలిక కాదని అమెరికా మిలిటరీ కమాండర్‌ మిగుయెజ్‌ చెప్పాడు. ఆహార సరఫరా పేరుతో ఆయుధాలను పెద్ద ఎత్తున ఎర్ర సముద్ర ప్రాంతానికి చేరవేస్తున్నారు.లెబనాన్‌లోని హిజబుల్లా, హౌతీ సాయుధులను ఎదుర్కొనేందుకు మధ్య ప్రాచ్యంలోని జలాల్లోకి ఐషెన్‌హౌవర్‌, యుఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఫోర్డ్‌ అనే రెండు విమానవాహక యుద్ధ నౌకలను అమెరికా మోహరించింది. వాటికి అనుబంధంగా అనేక ఇతర మిలిటరీ నౌకలు ఉన్నాయి. నీటిలో, నేల మీద ఎలా అవసరమైతే అలా ప్రయాణించే యుద్ధ వాహనాలు, ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పెద్ద ఎత్తున తరలించారు. గతంలో ఇరాక్‌లో మోహరించిన లక్షా 60వేలు, ఆఫ్ఘ్‌నిస్తాన్‌కు తరలించిన లక్ష మంది మిలిటరీతో పోలిస్తే ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో ఉన్న తమ సేనలు తక్కువే అని అమెరికా సమర్ధించుకుంటున్నది. దీర్ఘకాలంగా మిలిటరీ స్థావరాలున్న కతార్‌, బహరెయిన్‌, యుఏయిలతో పాటు జోర్డాన్‌, ఇరాక్‌, సిరియాలలో కూడా వేలాది మంది సైనికులు ఉన్నారు.


తమ మిలిటరీ, పరికరాలను సిద్దంగా ఉంచినప్పటికీ యుద్ధం కోసం కాదని అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూస్తున్నది.అక్టోబర్‌ ఏడవ తేదీ తరువాత ఇప్పటి వరకు హౌతీ దళాలు 170 దాడులను జరిపాయి. వాటిని నిలువరించటంలో అమెరికా ఎలాంటి పురోగతినీ సాధించలేదు. దీంతో రవాణా నౌకలు ఆఫ్రికా గుడ్‌హౌప్‌ ఆగ్రం చుట్టి తిరిగి రావాల్సి వస్తోంది. దీని వలన సరకు రవాణా ఆలశ్యం కావటమే గాక ఖర్చు కూడా పెరుగుతున్నది. దీనికి పూర్తి బాధ్యత అమెరికా, ఇజ్రాయెల్‌దే అన్నది స్పష్టం. మధ్య ప్రాచ్యంలో ఎన్నో ఏండ్లుగా 30వేలకు పైగా అమెరికా దళాలు ఉన్నాయి. ఇవిగాక తాత్కాలికం, అదనపు దళాల పేరుతో మరికొన్ని వేల మందిని, ముందే చెప్పుకున్నట్లు పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలను దించారు. ఒక్క సిరియాలో తప్ప మధ్య ప్రాచ్య, పశ్చిమాసియాలోని దేశాలన్నింటా ఏదో ఒక పేరుతో అనుమతి తీసుకొనే అమెరికా తిష్టవేసింది. కొన్ని చోట్ల ఆయాదేశాల దళాలకు శిక్షణ, ఇస్లామిక్‌ తీవ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఇదంతా జరిగింది. నిజానికి ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధ బృందాలను అరికట్టేందుకే ఇదంతా అన్నది బహిరంగ రహస్యం. జోర్డాన్‌లో ఉన్న మిలిటరీ స్థావరం సరిహద్దుల్లో ఉన్న ఇరాక్‌, సిరియాలపై దాడులు చేసేందుకే ఉంది. తూర్పు సిరియాలో ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధ దళాలు ఉన్నాయి. మధ్య ప్రాచ్యంలో తిష్టవేసిన అమెరికా దళాల గురించి చూద్దాం.


ఎర్ర సముద్రంలోకి ఫిబ్రవరిలో దించిన ఐషెన్‌ హౌవర్‌ విమాన వాహక యుద్ధ నౌకతో పాటు నియంత్రిత క్షిపణిదాడుల నౌక, ప్రత్యర్ధుల క్షిపణులను అడ్డుకొనే రెండు నౌకలు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, ఐదువేల మంది నౌకాదళ సిబ్బంది ఉన్నారు. ఇది ఇరాన్‌కు హెచ్చరికగానే జరిగింది. అణుశక్తితో నడిచే ఓహియో తరగతి జలాంతర్గాములను కూడా సూయజ్‌ కాలువ ద్వారా సమీకరించారు. ఇవి ఎక్కడా ఎలాంటి హడావుడి చేయవు. ఒక్కొక్క జలాంతర్గామి 154 తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను మోసుకుపోగలదు. మధ్యధరా సముద్రంలో ఉన్న ఫోర్డ్‌ కారియర్‌ అనే యుద్ధ నౌకను కూడా తరలించారు.దీనిలో ఒక విమానవాహక యుద్ధ నౌకతో పాటు మూడు ఖండాంతర క్షిఫణి రక్షణ నౌకలు కూడా ఉన్నాయి.ఎమెన్‌ నుంచి ప్రయోగించిన క్షిపణులను కూల్చివేసిన నౌకతో పాటు ఇతర అనేక యుద్ధ నౌకలను మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రంవైపు తరలించారు. ఇవన్నీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా, దాన్ని వ్యతిరేకించే దేశాలను బెదిరించటం, అవసరమైతే దాడులకు దిగేందుకే అన్నది స్పష్టం. నౌకా దళాలు కాకుండా 45వేల మంది వివిధ దేశాల స్థావరాల్లో ఉన్నారు.వీటన్నింటిని చూసుకొనే ప్రపంచం, ఐరాస సాధారణ అసెంబ్లీ ఖండించినా, భద్రతా మండలిలో తీర్మానాలు ప్రవేశపెట్టినా, అంతర్జాతీయ కోర్టులలో కేసులు దాఖలు చేసినా ఇజ్రాయెల్‌ ఏమాత్రం ఖాతరు చేయకుండా గాజాలో మారణకాండ, పశ్చిమగట్టు ప్రాంతంలో నిరంతరం దాడులు జరుపుతున్నది. అమెరికా తీరు వివాదం విస్తరించటానికే దోహదం చేస్తున్నది.


ఆసియాలో ఇలా ఉంటే ఐరోపాలో ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం గావించేందుకు అమెరికా పూనుకుంది.ఉక్రెయిన్‌కు 61బిలియన్‌ డాలర్ల ఆయుధ సరఫరాను అంగీకరించకపోతే ఆ దేశాన్ని,ఐరోపా, మొత్తం స్వేచ్చా ప్రపంచాన్ని ముప్పులో ఉంచినట్లేనని అధ్యక్షుడు జో బైడెన్‌ అమెరికా పార్లమెంట్‌ను బెదిరించాడు.2014కు ముందు ఉన్న ఉక్రెయిన్‌ సరిహద్దులను పునరుద్దరించేందుకు రష్యాను ఓడించాలన్న జో బైడెన్‌ కలను చూస్తుంటే గతంలో వియత్నాం, ఉత్తర కొరియా,ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ సిరియా, ఎమెన్‌ తదితర దేశాలలో మాదిరి ఓటములు గుర్తుకు వస్తున్నట్లు అనేక మంది చెబుతున్నారు. అమెరికా గనుక 2022 ఏప్రిల్‌లోనే టర్కీ ముందుకు తెచ్చిన శాంతి ప్రతిపాదనలను అంగీకరించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని, శాంతికి బదులు అమెరికా, నాటో కూటమి పోరును మరింతగా ఎగదోసేందుకే ఒక సాధనంగా చేసుకుంటున్నారన్నది స్పష్టం. ఉక్రెయిన్‌ వ్యవహరంలో అమెరికా వినాశకర విధానాన్ని అనుసరించటానికి కారకులైన వారిలో ఒకరిగా ఆరోపిస్తూ విక్టోరియా న్యూలాండ్‌ అనే విదేశాంగశాఖ ఉప మంత్రిని పదవీ కాలం ఉండగా ముందుగానే తొలగించారు. అంతకు రెండు వారాల ముందు ఆమె ఒక సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ పోరు మొదటి ప్రపంచయుద్ధానికి దారితీసిన ఘర్షణ స్థాయికి దిగజారిందని, ఉక్రెయిన్‌కు ప్రతిపాదించిన 61బిలియన్‌ డాలర్ల ఆయుధ సాయానికి ఒక వేళ పార్లమెంటు ఆమోదం తెలపకపోతే బైడెన్‌ దగ్గర మరొక ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు. ఈ కారణంగానే ఆమెను తొలగించారని, లేదూ బైడెన్‌ విధానాలకు నిరసనగా ఆమే రాజీనామా చేసినట్లు కూడా కొందరు చెబుతున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 2022 ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైతే నెల రోజుల తరువాత అధ్యక్షుడు జెలెనెస్కీ మాట్లాడుతూ తమ లక్ష్యం శాంతి, సాధ్యమైనంత త్వరలో సాధారణ జీవన పునరుద్దరణ అని చెప్పాడు. కానీ అమెరికా,బ్రిటన్‌,ఫ్రెంచి నేతలు రంగంలోకి దిగి శాంతి చర్చలు కొనసాగకుండా చేశారు. అంతే కాదు పెద్ద సంఖ్యలో నాటో దళాలను ఉక్రెయిన్‌కు పంపుతున్నట్లు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించాడు.దాన్ని నమ్మిన జెలెనెస్కీ వారి మాయలో పడి శాంతి ప్రక్రియ నుంచి వైదొలిగాడు. ఇప్పటి వరకు ఆయుధాలు తప్ప దళాలను నాటో పంపలేదు. సంక్షోభం ప్రారంభమైపుడు ఉక్రెయిన్‌ జనాలకు హెల్మెట్లు, రాత్రుళ్లు పడుకొనేందుకు బ్యాగులు పంపితే సరిపోతుందని జర్మనీ చెప్పిందని, ఇప్పుడు వారే మరిన్ని క్షిపణులు, యుద్ధ టాంకులు అవసరమంటున్నారని మక్రాన్‌ చెబుతున్నాడు. ప్రతి దశలోనూ ఆరు నుంచి ఎనిమిది నెలలు వెనుబడి ఉన్నామని కూడా అన్నాడు. ఒక వేళ గనుక ఇప్పుడు నాటో దళాలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే అది రష్యా-నాటో యుద్దంగా మారుతుందని రష్యా హెచ్చరించింది. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని పుతిన్‌ చెబుతున్నాడు. అయితే ఇప్పటికే కొన్ని ప్రత్యేక నాటో దళాలు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు పెంటగన్‌ పత్రాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌ చేరిన వేలటన్నుల ఆయుధాలు ఎక్కడకు వెళుతున్నదీ తెలుసుకొనేందుకు కొందరు తమ మిలిటరీ అధికారులు అక్కడ ఉన్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అంగీకరించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం తొలి రోజుల్లో రష్యా యుద్ధ పాటవం పెద్ద లెక్కలోది కాదని ఐరోపా, ఇతర దేశాల జనాలను నమ్మించిన నాటో కూటమి ఇప్పుడు రష్యాను ఒక బూచిగా చూపుతున్నది. సోవియట్‌ యూనియన్‌ ఉనికిలో ఉన్నపుడు ఐరోపాను ఉపయోగించుకున్న అమెరికా, తాజాగా అదే ఐరోపా దేశాలతో కలసి ఉక్రెయిన్‌న్ను పరిశోధన శాలల్లో గినియా పందుల మాదిరి, తరువాత మరోసారి అమెరికా ఐరోపాను సమిధగా వినియోగించుకోవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. రష్యన్లు ఐరోపాను ఆక్రమించుకుంటారన్న ప్రచారం దానిలో భాగమే అన్నది స్పష్టం. అమెరికా గద్దె మీద ఎవరున్నా తమ కార్పొరేట్ల, రాజకీకీయ ప్రయోజనాలు, ప్రపంచాధిపత్యానికే అగ్రపీఠం వేస్తారని తెలిసిందే.

గుజరాత్‌ అభివృద్ధి గురించి నరేంద్రమోడీ నోటికి తాళం ఎందుకు వేసుకున్నట్లు ?

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఈ మధ్య కాలంలో టీవీలు, సామాజిక మాధ్యమాలను చూస్తున్నవారికి నరేంద్రమోడీ గ్యారంటీల గురించి చెవుల తుప్పు వదలగొడుతున్నారు. గత పదేండ్లలో ఒకసారి చెప్పిన దానిని మరోసారి మాట్లాడటం లేదు గనుక మామూలుగా చెబితే జనం నమ్మే స్థితి లేదు అందుకే నన్ను నమ్మండి పక్కా గ్యారంటీ అని చెప్పటం తప్ప మరొకటి కాదు.పదేండ్ల క్రితం గుజరాత్‌ తరహా అభివృద్ధిని దేశమంతటా అమలు జరుపుతామని ఎన్నికల సందర్భంగా మోడీ జనానికి ఇచ్చిన గ్యారంటీ గురించి ఎక్కడా ప్రస్తావించటం లేదు. గుజరాత్‌ విజయ గీతాలాపన లేదు.ఎందుకు ? నరేంద్రమోడీ ప్రధానిగా అధికారంలోకి రాగానే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నివేదికలను రూపొందించటం, సిఫార్సులు చేయటం తప్ప వాటికి ఎలాంటి గ్యారంటీ లేని నీతి అయోగ్‌ పేరుతో ఒక అజాగళ స్థనం వంటి సంస్థను ఏర్పాటు చేశారు. సదరు సంస్థ వెల్లడించిన సమాచారం 2019-21 సంవత్సరాలలో బహుముఖ దారిద్య్ర సూచికలో గుజరాత్‌ రాష్ట్రం 16వ స్థానంలో ఉంది. దీర్ఘకాలంగా బిజెపి ఏలుబడిలో రెండింజన్ల పాలన, దానికి స్వయంగా నరేంద్రమోడీ డ్రైవరుగా ఉన్న చోట ఇలా ఉంది గనుకనే దాని గురించి మాట్లాడరు. బిజెపి లేని రాష్ట్రాలలో మాత్రం రెండింజన్లని కబుర్లు చెబుతారు.దశాబ్దాల తరబడి బిజెపి ఏలుబడిలో ఉన్న గుజరాత్‌ దారిద్య్ర నిర్మూలనలో వెనుకబడింది.


ఇక్కడ అభివృద్ధి అంటే పరిశ్రమల గురించి చెబుతారు. నరేంద్రమోడీ సిఎంగా అధికారానికి రాక ముందే ఉమ్మడి బొంబాయి ప్రోవిన్స్‌లో నేటి గుజరాత్‌ ప్రాంతాలు పారిశ్రామికంగా ముందున్నాయి.ఒకసారి ఒక చోట పరిశ్రమలు కేంద్రీకృతమైతే అక్కడే మరింతగా పెరగటం ప్రపంచ వ్యాపితంగా ఉన్న పరిణామం. పరిశ్రమలు ఉన్నంత మాత్రాన అభివృద్ధి చెందినట్లు కాదు. అలాగైతే అమెరికాలో ఇప్పటికీ మన ఉచిత బియ్యం పథకం మాదిరి ఉచిత ఆహార కూపన్లు ఉండేవి కాదు. గుజరాత్‌లో పరిశ్రమల వృద్దికి అక్కడి భౌతిక పరిస్థితులే కారణం తప్ప మోడీ గొప్పతనం కాదు.రాష్ట్ర విస్తీర్ణంలో దాదాపు సగం ఎడారి ప్రాంతం గనుక అక్కడ వ్యవసాయానికి తావుండదు. మన దేశంలో ఇప్పటికీ ఉపాధి వ్యవసాయరంగంలోనే ఉంది, అలాంటి అవకాశం అక్కడ ఉండదు. వాణిజ్య రంగంలో గుజరాతీల వలసలకు అదొక ప్రధాన కారణం.కచ్‌ ప్రాంతంలో ఉప్పు పండిస్తారు, అది ఏడాది మొత్తం ఉండదు. అందుకే గుజరాత్‌ ప్రాంతంలో స్వాతంత్య్రానికి ముందు తరువాత కూడా పరిశ్రమలు, వాణిజ్యం మీద కేంద్రీకరించారు. రేవులు ఒక పెద్ద వనరుగా ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పటికీ దారిద్య్రంతో సహా అనేక అభివృద్ధి సూచికల్లో గుజరాత్‌ వెనుకబడి ఉంది.సృష్టించిన సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నది తప్ప జనానికి చేరటం లేదు. గతంలో దారిద్య్ర నిర్మూలనలో గుజరాత్‌ కొన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో దిగజారుతున్నది. అధికారంలో ఎవరున్నా ఇంతవరకు దారిద్య్ర రేఖ అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్దిష్ట నిర్వచనం లేదు.తమకు అనుకూలమైన అంకెలతో దారిద్య్రం తగ్గిందని జనాన్ని మోసం చేస్తున్నారు. ప్రతి దేశంలోనూ జిడిపి పెరుగుదలను బట్టి దారిద్య్ర రేఖ నిర్వచనం కూడా మారుతూ ఉంటుంది.


రాజకీయ నేతలు అధికార పార్టీల ప్రాపకం కోసం పాకులాడినట్లే కొందరు మేథావులు కూడా అదేమాదిరి ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన ప్రొఫెసర్‌ వివేక్‌ దేవరారు బుర్ర నుంచి పుట్టిందే ”గుజరాత్‌ తరహా అభివృద్ధి నినాదం”. మోడీ గుజరాత్‌ సిఎంగా నాలుగువేల రోజుల పదవీకాలం పూర్తి కానుండగా తదుపరి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ” వృద్ధి, అభివృద్ధికి గుజరాత్‌ పాలన ” అనే పుస్తకాన్ని రాశారు. తరువాత 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ దాన్ని ఒక నినాదంగా తీసుకొని తాను అధికారంలోకి వస్తే దేశమంతటా అదే విధానాన్ని అమలు చేస్తానని నమ్మబలికారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా భక్తులకు తెలియదు. అదే మాదిరి గుజరాత్‌ గురించి తెలిసిన మోడీ ప్రధాని పీఠం అలంకరించిన తరువాత ఎక్కడా దాని ప్రస్తావన తేవటం లేదు. ప్రతి రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నపుడు ఒక రాష్ట్ర నమూనా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తామని చెప్పటమే పెద్ద మోసం. పదేండ్ల నాటి అంకెలను తీసుకొని వివేక్‌ దేవరారు గుజరాత్‌ పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రం భారీగా తగ్గిందని చెప్పారు. ఊట మాదిరి అభివృద్ధి ఫలాలు కిందికి దిగినట్లు సూత్రీకరించారు. పాత లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉన్నపుడు దేశంలో ఏడవ స్థానంలో ఉన్న గుజరాత్‌ తరువాత కాలంలో దిగజారింది. దీన్ని బట్టి పరిశ్రమల వృద్ధి దారిద్య్ర నిర్మూలనకు దోహదం చేయదని కొందరు ఆర్థికవేత్తలు స్పష్టం చేశారు. ఆర్థిక స్వేచ్చలో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉందని దేవరారు చెప్పారు. అలాంటి రాష్ట్రం తాజా నీతిఅయోగ్‌ నివేదిక ప్రకారం దారిద్య్ర నిర్మూలనలో 16వ స్థానానికి ఎందుకు దిగజారిట్లు ?


గుజరాత్‌లో ఎవరు అధికారంలో ఉన్నా కార్పొరేట్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇచ్చారు.వాటిలో పని చేసే కార్మికులకు వేతనాలు తక్కువగా నిర్ణయిస్తున్నారు. ఉదాహరణకు బాగా వెనుక బడిన చత్తీస్‌ఘర్‌లో 2023 అక్టోబరు ఒకటి నాటికి అమల్లో ఉన్నట్లు ప్రకటించిన వేతనాల ప్రకారం నైపుణ్యం లేని కార్మికుడికి నెలకు రు.12,623, నైపుణ్యం ఉన్నవారికి రు.13,698 కాగా అభివృద్ధి చెందిన గుజరాత్‌ రెండింజన్ల పాలనలో రు.12,012 నుంచి 12,298, నిపుణులైన వారికి రు.12,558 నుంచి 12,870 వరకు నిర్ణయించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఊడ్చి, శుభ్రం చేసే కార్మికులకు కనీసవేతనం ఏ జోన్‌లో రు.19,136, బి జోన్లో రు.16,016, సి జోన్లో రు.12,844గా 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు జరుపుతున్నట్లు ప్రకటించింది. ఇదీ గుజరాత్‌ ఆదర్శం, నరేంద్రమోడీ గారి అచ్చేదిన్‌.అందుకే గుజరాత్‌ కార్పొరేట్లు బలిశారు తప్ప కార్మికులు, ఇతరుల పరిస్థితి దిగజారుతోంది. మానవాభివృద్ధి సూచికలే దానికి పక్కా నిదర్శనం. కొన్ని వివరాలు ఎలా ఉన్నదీ చూద్దాం.వీటికి ఆధారం గ్లోబల్‌ డాటా లాబ్‌ వెబ్‌సైట్‌.
ప్రాంతం×××× 1990 ×× 2000 ×× 2010 ×× 2021
దేశం ×××× 0.434 ××0.491 ××0.575 ××0.633
గుజరాత్‌×××× 0.474 ××0.521 ××0.599 ××0.638
కేరళ ×××× 0.550 ××0.593 ××0.709 ××0.752
మహారాష్ట్ర ××× 0.498 ××0.552 ××0.638 ××0.688
మధ్యప్రదేశ్‌ ××× 0.407 ××0.453 ××0.531××0.596
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు పారిశ్రామికంగా, వ్యవసాయకంగా వెనుకబడిన కేరళలో మానవాభివృద్ధి సూచికల కంటే పారిశ్రామికంగా వృద్ధి చెందిన గుజరాత్‌, మహారాష్ట్ర వెనుకబడి ఉన్నాయి.దీర్ఘకాలంగా బిజెపి ఏలుబడిలో ఉన్న మధ్యప్రదేశ్‌ స్థితినీ చూడవచ్చు.


సంక్షేమ పధకాలను అమలు జరిపితే రాష్ట్రాలు అప్పుల పాలవుతాయని నరేంద్రమోడీ పదే పదే వ్యతిరేకతను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే గుజరాత్‌లో అరవై ఏండ్లు దాటిన వారికి నెలకు వెయ్యి, 80దాటితే రు.1,250 మాత్రమే ఇస్తున్నారు.పోనీ గుజరాత్‌కు అప్పులు లేవా ? 2024-25కు బడ్జెట్‌ అంచనాల ప్రకారం రు.4.26లక్షల కోట్లకు, మరుసటి ఏడాది ఐదులక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు.1995లో బిజెపి పాలన పదివేల కోట్ల అప్పుతో ప్రారంభమై ఈ స్థాయికి పెరిగింది.నరేంద్రమోడీ సిఎంగా అధికారానికి వచ్చే నాటికి రు.45,301 కోట్లు ఉండగా దిగిపోయే నాటికి రు.2.21లక్షల కోట్లకు పెరిగింది.ఈ కారణంగా 2028 నాటికి రు.1.87లక్షల కోట్ల రుణాలను తీర్చాల్సి వస్తోంది. ఇందుకోసం కొత్తగా అప్పులు చేయాల్సి ఉంది. 2016 నుంచి 2021వరకు వార్షిక జిడిపి వృద్ధి రేటు కంటే రుణాల పెరుగుదల రేటు ఎక్కువగా ఉందని కాగ్‌ నివేదిక చెప్పింది.రెండు సంవత్సరాలకు ఒకసారి గుజరాత్‌ ప్రభుత్వం ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహిస్తున్నది. ఈ సదస్సులను నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచేందుకు ఉపయోగించారు. ఆహౌ ఓహ అన్నట్లుగా పెట్టుబడులు వచ్చినట్లు ఊదరగొట్టారు. గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటా అమలు జరుపుతానని చెప్పేందుకు ఇది కూడా కారణమైంది.మోడీ ఏలుబడిలో 2003 నుంచి 2015 వరకు ఏడు సదస్సులు జరగ్గా 84లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేశారు.2017 సదస్సు సందర్భంగా నాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెఎన్‌ సింగ్‌ అప్పటి వరకు 61 వాస్తవ రూపం దాల్చినట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక,గణాంకాల శాఖనివేదిక ప్రకారం 2003-11 మధ్య కేవలం ఎనిమిదిశాతమే అమల్లోకి వచ్చాయి. 2000 నుంచి 2016వరకు మహారాష్ట్రలో 30శాతం, గుజరాత్‌లో 10శాతం మాత్రమే వాగ్దానాల్లో అమల్లోకి వచ్చాయి. విదేశీ పెట్టుబడులు మోడీ హయాంలోనే గుజరాత్‌కు తగ్గాయి. మూడు దశాబ్దాల బిజెపి, దానిలో 13 సంవత్సరాల నరేంద్రమోడీ ఏలుబడిలో ఆరోగ్య తలసరి ఖర్చు దిగజారింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం 2020లో వేయిమందికి దేశంలో 0.55 ఆసుపత్రి పడకలుంటే గుజరాత్‌లో 0.33 ఉన్నాయి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు బీహార్‌ కంటే తక్కువ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరించారు.


నెలవారీ తలసరి వినియోగ ఖర్చు ఆయా రాష్ట్రాల్లో జనం ఉన్న స్థితిని అంచనా వేసుకొనేందుకు ఒక అంశంగా తీసుకోవచ్చు. నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎంగా ఉన్న సమయంలో దేశ సగటులో ఉన్న వృద్ధి కంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కూడా గుజరాత్‌ వెనుకబడింది. పదేండ్ల రెండింజన్ల వృద్ధిని చూస్తే దేశ సగటుకు దగ్గరగా మాత్రమే ఉంది. దిగువన తాజాగా కేంద్ర ప్రకటించిన 2022-23 తలసరి వినియోగ ఖర్చు కొన్ని వివరాలను చూద్దాం..ఖర్చు రూపాయలలో.
రాష్ట్రం××××× గ్రామీణ ×× పట్టణ
ఆంధ్రప్రదేశ్‌×× 4,870 ×× 6,782
తమిళనాడు × 5,310 ×× 7,630
కేరళ ××××× 5,924 ×× 7,078
దేశసగటు××× 3,773 ×× 6,459
గుజరాత్‌ ××× 3,798 ×× 6,621
మధ్యప్రదేశ్‌×× 3,384 ×× 4,987
ఉత్తరప్రదేశ్‌×× 3,191 ×× 5,040
2003 నుంచి 2011-12 సంవత్సరాలలో దేశంలో సగటున వినియోగ ఖర్చు గ్రామీణ ప్రాంతాలలో 158, పట్టణ ప్రాంతాలలో 157శాతం పెరిగింది. గుజరాత్‌లో 145, 146శాతాలుగా ఉన్నాయి.కేరళ 2003లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రధమ స్థానంలో ఉంది.2011-12లో పట్టణాలలో హర్యాన ముందుండగా కేరళ రెండవదిగా ఉంది.2022-23లో సర్వే ఫలితాలను బట్టి రెండింజన్ల పాలనలో ఉన్నవి లేని రాష్ట్రాల తీరు తెన్నులు పైవిధంగా ఉన్నాయి.గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఉన్న ప్రధాన రాష్ట్రాల వివరాలను ఎగువున చూశాము. ఎందుకని రెండింజన్ల పాలిత రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి ? బిజెపి చెప్పే మాటలు బూటకం, అభివృద్ధి నాటకం తప్ప వాస్తవం కాదని స్పష్టం కావటం లేదా ?

పెట్రోల్‌, డీజిల్‌ ధర రు.2 తగ్గింపు : నరేంద్రమోడీ కుడుములేస్తున్నారు పండగ చేసుకుందామా !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


త్వరలో ప్రపంచ జిడిపిలో జపాన్‌, జర్మనీలను వెనక్కు నెట్టి మూడవ స్థానం ఆక్రమించే ధనిక దేశంగా మనలను నరేంద్రమోడీ ముందుకు తీసుకుపోతున్నారు. టీవీలు చూడండి రోజూ ఎన్ని గ్యారంటీలను ప్రకటిస్తున్నారో, రామరాజ్యాన్ని తెచ్చారు, రామాలయాన్ని నిర్మించారు, ప్రపంచంలో తలెత్తుకొనేట్లు చేశారు. ఓట్ల కోసం మోడీ ఏమీ చేయరని బరాబర్‌ చెబుతున్నాం అంటూ భక్తులు ఊరూరా తిరుగుతున్నారు. అదే నిజమైతే ”ధనికులైన” మన జనాలకు ముష్టి విదిల్చినట్లుగా తాజాగా పెట్రోలు, డీజిలు మీద లీటరుకు రు.2 తగ్గించటం అవమానించటం కాదా ? ఈ చర్యతో జనం పండగ చేసుకుంటున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు. పూర్వం గ్రామాల్లో వృత్తుల వారికి పండుగల సందర్భంగా రైతులు తాము చేసుకున్న పిండివంటలు ఇస్తే ఎంతో సంతోషించేవారు(దీని అర్ధం వృత్తుల వారిని కించపరచటం కాదు, అలాంటి పరిస్థితి గతంలో ఉందని చెప్పటమే.ఇప్పుడు ఇంకా ఎక్కడైనా అలా ఉందేమో తెలియదు). దాన్నుంచి వచ్చిందే కుడుమేస్తే పండగ అనే లోకోక్తి. ఇప్పుడు ముష్టివిదిల్చినట్లుగా రెండు రూపాయలు , గ్యాస్‌ సిలిండర్‌కు వంద ఇచ్చి బిజెపి వారు జనాలను డూ ఫెస్టివల్‌ (పండగ చేస్కో) అంటున్నారు.2022 ఏప్రిల్‌ ఆరు నుంచి చమురు ధరలను స్థిరంగా ఉంచిన పెద్దలు ఓట్లు కొల్లగొట్టాలని తప్ప ఇప్పుడు ఇంత స్వల్పంగా తగ్గించటానికి ప్రాతిపదిక ఏమిటి ? ఈ మాత్రానికే పండగ చేసుకొని ఓట్లు వేస్తామని ఎవరైనా అంటే అది వారిష్టం.


అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గించే విధానం అమలు జరుపుతున్నట్లు ప్రతి రోజూ సుప్రభాతం మాదిరి ధరలను ప్రకటించే వారు. రెండు సంవత్సరాలుగా ఎందుకు నిలిపివేసినట్లు ? ఎన్నికల్లో మీట నొక్కిన తరువాత తిరిగి పెంచరనే గ్యారంటీ ఏముంది ? కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ సెల్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌లోని తాజా సమాచారం ప్రకారం పదేండ్ల యుపిఏ పాలనా కాలంలో 2004-05 నుంచి 2013-14 వరకు కేంద్ర ప్రభుత్వం లేదా చమురు ఉత్పత్తుల మార్కెటింగ్‌ కంపెనీలు వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీల మొత్తం రు.8,88,024 కోట్లు. సగటున ఏటా 88.8వేల కోట్లు. తరువాత నరేంద్రమోడీ అచ్చేదిన్‌ పాలనలో ఈ మొత్తం రు.2,82653 కోట్లు మాత్రమే. సగటున 30.1వేల కోట్లు. వీటిలో ప్రజాపంపిణీ కిరోసిన్‌, ఉజ్వల గ్యాస్‌ సబ్సిడీ ఉన్నాయి. ఇది సబ్సీల కోత తీరు కాగా ఈ కాలంలో చమురు రంగంలో జనంపై మోపిన భారమెంతో చూద్దాం.తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మోడీ సర్కార్‌ పెంచిన పన్నులు, సెస్సులు,చమురు కంపెనీల నుంచి వచ్చిన రాబడుల మొత్తం రు.34,53,930 కోట్లు. అంటే సగటున రు.3.45లక్షల కోట్లు వచ్చింది. అధికారానికి వచ్చిన తొలి ఏడాది అంటే అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ విధించిన పన్నులు, ఇతర రాబడి రు.1.72లక్షల కోట్లు మాత్రమే. అది 2021-22లో గరిష్ట స్థాయికి రు.4.92లక్షల కోట్లకు పెరిగింది. ఈ ప్రాతిపదికన అంటే తొలి ఏడాది పన్నులే కొనసాగి ఉంటే పదేండ్లలో రు17.22 లక్షల కోట్లుగా ఉండేది, కానీ మొత్తం మీద చూసినపుడు రెట్టింపైంది. రద్దు చేసిన సబ్సిడీ, పెంచిన భారాలను కలుపు కుంటే 23లక్షల కోట్ల మేరకు భారం జనం భరించినట్లు లెక్క.


2020లో మనదేశంలో 88.2 బిలియన్‌ లీటర్ల డీజిల్‌,37.2 బిలియన్‌ లీటర్ల పెట్రోలు(స్టాటిస్టా సమాచారం) వినియోగం మొత్తం 125.4బిలియన్‌ లీటర్లు. ఇప్పుడు రెండు రూపాయల చొప్పున తగ్గించారు గనుక ఏడాది పాటు అమలు చేస్తే 250.8బిలియన్లు అంటే 25వేల కోట్లు జనానికి విదిల్చి ఓట్లు కొల్లగొట్టాలని పధకం వేశారు.మోపిన భారం ఎంత ? తగ్గించిన ధర ఎంత ? తరువాత వినియోగం పెరిగి ఉంటే ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరిగినట్లే తగ్గింపు మొత్తం కూడా అదే దామాషాలో పెరుగుతుంది. జనం మరీ ఇంత అమాయకంగా ఉన్నారని, కుడుమేస్తే పండగ చేసుకొనే వారి మాదిరి కనిపిస్తున్నారా ? పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాలకు చమురు ఉత్పత్తుల మీద వచ్చిన పన్ను, ఇతర రాబడి రు.22,19,558 కోట్లు అంటే సగటున 2.3 లక్షల కోట్లు. పదేండ్ల క్రితం వార్షిక రాబడి 1.6లక్షల కోట్ల నుంచి 2.3లక్షల కోట్లకు తప్ప కేంద్రం మాదిరి రు.1.72లక్షల నుంచి 3.45లక్షల కోట్లకు పెరగలేదు. కేంద్రం నుంచి పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా సంగతేమిటని కొందరు ప్రశ్నించవచ్చు. ఎక్సైజ్‌, ఇతర పన్నులో రాష్ట్రాలకు వాటా ఉంటుంది తప్ప సెస్సుల పేరుతో మోపిన దానిలో ఒక్క పైసా కూడా రాదు. మోడీ మోపిందంతా సెస్సుల పేరుతోనే. ధరలు తగ్గించాలని ఒక వైపు డిమాండ్‌ చేసే వారు ప్రభుత్వం అదే చేస్తే సంతోషించకుండా విమర్శలెందుకు చేస్తారు అనే వారు ఉన్నారు.వారందరికీ ఒకటే సమాధానం పెంచాలని ఎవరూ కోరలేదు, వద్దంటున్నా విపరీతంగా పెంచి జేబులు కొల్లగొట్టారు.దానిలో ఓట్ల కోసం నామమాత్రం తగ్గిస్తే పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ తగ్గింపు నేతలకు భజన చేయాల్సినంత గొప్పదేమీ కాదు. రద్దు చేసిన సబ్సిడీలతో పోలిస్తే ఇచ్చిన రాయితీ మొత్తమెంతో ఈ ప్రశ్నలు వేసే వారు సమాధానం చెప్పాలి.యుపిఏ పాలనా కాలంలో వార్షిక సగటు ముడిచమురు పీపా ధర డాలర్లలో, రూపాయలలో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో, నరేంద్రమోడీ హయాంలో ఎలా ఉందో దిగువ చూడవచ్చు.
సంవత్సరం× ధర డాలర్లలో×× పెట్రోలు ×× డీజల్‌
2010-11××× 85.09 ×× 52.64 ×× 38.56
2011-12××× 111.89 ×× 64.71 ×× 40.26
2012-13××× 107.97 ×× 68.71 ×× 45.26
2013-14××× 105.52 ×× 73.70 ×× 51.90
2014-15××× 84.16 ×× 66.36 ×× 52.23
2015-16××× 46.17 ×× 68.71 ×× 45.26


2016-17లో మనదేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధర 47.57 ,2017-18లో 56.43, 2018-19లో 69.88,2019-2020లో 60.57, 2020-21లో 44.82, 2021-22లో 79.18, 2022-23లో 93.15, 2023-24లో 82.41డాలర్లు ఉంది. 2022 ఏప్రిల్‌ ఆరున ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రు.105.41, డీజిల్‌ ధర రు.96.67 కాగా మే 22 నుంచి రు. 96.72, రు.89.62కు తగ్గించారు. అప్పటి నుంచి 2024 మార్చినెల 14వరకు అదే రేట్లు కొనసాగాయి. యుపిఏ పాలనలో 112 డాలర్లకు ముడి చమురు దిగుమతి చేసుకుంటే వినియోగదారుల నుంచి వసూలు చేసింది పెట్రోలు రు.64.71, డీజిల్‌కు రు.40.26 మాత్రమే. ఇప్పుడు తాజా రేటు పైన చెప్పుకున్నట్లు 82.41 డాలర్లు ఉంటే ఢిల్లీలో 96.67, 89.62గా ఎందుకు ఉన్నట్లు? తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు రేటు రు.109, 111 వంతున ఉన్నాయి, మరికొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా వినియోగదారుల నుంచి ఇంతగా ధర వసూలుకు కారణమేమిటి అంటే విపరీతంగా సెస్సులను వడ్డించటం, రూపాయి మారకపు విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధతే తప్ప మరొక కాదు. వీటి గురించి నరేంద్రమోడీ దేశానికి ఇస్తున్న గ్యారంటీలు ఏమిటి అన్నది ప్రశ్న.


.2011-12లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది.2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29.అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదుడేబాదుడు అన్నట్లుగా చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లించాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు 83కు అటూ ఇటూగా ఉంది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరుగుతుంది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాల గురించి నిరంతరం ఊదరగొడుతుంటారు. 1995లో స్వదేశీ ముడిచమురు ఉత్పత్తి 32.2మిలియన్‌ టన్నులు. దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించుకోవాలి, స్వదేశీ ఉత్పత్తిని పెంచుకోవాలని రోజూ సుభాషితాలు చెబుతుంటారు.మోడీ ఏలుబడిలో 2022 నాటికి 28.4మిలియన్‌ టన్నులకు దిగజారింది. ఎంతో కీలకమైన ఈ రంగంలోనే మన ప్రతిభ ఇలా ఉంటే దేశాన్ని ముందుకు తీసుకుపోతాం, అగ్రస్థానానికి చేరుస్తాం అంటే ఉట్టికి ఎగరలేని వారు స్వర్గానికి ఎగురుతాం అన్నట్లుగా ఉంది.

కరోనా సంక్షోభంలో కార్పొరేట్‌ శక్తులను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ది చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ది పొందేది ఎవరు? మన జనమైతే కాదు, పోనీ ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్రమోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన-కలుగుతున్న మేలు ఇదీ అని ఎవరినైనా చెప్పమనండి !

గోధుమ ధరలపై మూడు నెలల్లోనే బిజెపి వాగ్దాన భంగం !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


గోధుమ రైతులకు కనీస మద్దతు ధరకంటే అదనంగా చెల్లిస్తామని వాగ్దానం చేసిన బిజెపి నామమాత్రంగా పెంచి చేతులు దులుపుకుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోధుమ రైతులకు క్వింటాలుకు రు.2,700 చొప్పున చెల్లిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. మధ్య ప్రదేశ్‌లో బిజెపి వరికి రు.3,100 చెల్లిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. గోధుమ కనీస మద్దతు ధర రు.2,275 కాగా తమను ఎన్నుకుంటే బోనస్‌ రూపంలో ఇచ్చేదానితో పాటు రు.2,700 చెల్లిస్తామని నమ్మబలికింది. తాజాగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రు.125 మాత్రమే పెంచి రు.2,400 ఇస్తామని ప్రకటించాయి.బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం నాణ్యతను బట్టి క్వింటాలు గోధుమల ధర రు.2,700 నుంచి 3,000 ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ధరలు పడిపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో ఇది చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది.రెండు రాష్ట్రాల బిజెపి ప్రభుత్వాలు క్వింటాలుకు రు.125 బోనస్‌ ప్రకటించటంతో అక్కడ నిరసన, ఆ మాత్రమైనా ఉత్తర ప్రదేశ్‌, హర్యానాలో ఉన్న ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పెంచవు అనే వత్తిడి తలెత్తే అవకాశం ఉంది.

రైతులను మోసగించటంలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు నిమగమైతే అసలు రాజధాని ఢిల్లీకే రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని ఫిబ్రవరి 13నుంచి వేలాది మంది రైతులను పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో నిలవేసింది.గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) మార్చి 14వ తేదీ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో తలపెట్టిన కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌కు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్న కేంద్రం వత్తిడికి తట్టుకోలేక చివరకు ఒక రోజు ముందుగా అనుమతి ఇచ్చింది. రైతుల ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అక్కడ సంకల్ప పత్ర పేరుతో తీర్మానం చేయనున్నారు.లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగనుండటంలో భవిష్యత్‌ కార్యాచరణను కూడా ఇక్కడ ప్రకటిస్తారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నుంచి విడిపోయిన కొందరు, గత ఆందోళనకు దూరంగా ఉన్నవారు కలసి ఎస్‌కెఎం(ఎన్‌పి)గా ఏర్పడి ఢిల్లీ చలోకు పిలుపు ఇచ్చారు. వారిని అడ్డుకొనేందుకు అసాధారణ రీతిలో పోలీసులు రాజధానికి వచ్చే రోడ్ల మీద కందకాలు తవ్వటం, మేకులు కొట్టి, పెద్ద పెద్ద సిమెంట్‌ బ్లాకులు, మట్టి, రాళ్లతో నింపిన కంటెయినర్లను రోడ్ల మీద అడ్డంగా పెట్టిన అంశం తెలిసిందే. రామ్‌లీలా మైదానంలో జరిగే మహాపంచాయత్‌కు కేంద్ర కార్మిక సంఘాలు, రంగాల వారీగా పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి.యువజన, విద్యార్ధి,మహిళా సంఘాలు కూడా భాగస్వాములు కానున్నాయి.


ఫిబ్రవరి 22వ తేదీన ఈ సభ గురించి ఎస్‌కెఎం ప్రకటించినప్పటికీ అనుమతి గురించి ఎటూ తేల్చకుండా చివరి నిముషంలో అనుమతి ఇచ్చినప్పటికీ పంజాబ్‌ నుంచి వందలాది బస్సులు, ట్రక్కులు, రైళ్లలో బయలుదేరి 50వేల మంది వస్తున్నట్లు ఆ రాష్ట్రనేతలు చెప్పారు. తమతో పాటు రొట్టెలు చేసుకొనేందుకు పిండి, కూరగాయలు, స్టౌవ్‌లు, గ్యాస్‌ సిలిండర్లు కూడా తెచ్చుకుంటున్నారని, రాజధానిలోని గురుద్వారాలలో రైతులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సమీప హర్యానా, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌,ఉత్తరాఖండ్‌ నుంచి కూడా రైతులు తరలివస్తున్నట్లు ఎస్‌కెఎం నేతలు చెప్పారు.హర్యానాలోని బిజెపి ప్రభుత్వం పంజాబ్‌ నుంచి రైతులు రాకుండా ప్రధాన రహదార్లపై అనేక ఆటంకాలను కల్పించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలలో వస్తున్నారు. రైతు కుటుంబాల నుంచి మహిళలు కూడా గణనీయంగా వస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.


కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయటం, ఆహార భద్రత కోసం ప్రభుత్వ ధాన్య సేకరణ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్దం. అయితే ఈ అంశంపై గత రెండు దశాబ్దాలుగా ఒక ఒప్పందం జరగని కారణంగా వాటిని కొనసాగిస్తున్నారు. అబూదాబీ సమావేశాల్లో కూడా ధనిక దేశాలు ఈ అంశం మీద పట్టుపట్టాయి. వాటిని సంతుష్టీకరించేందుకు కరోనా కాలంలో రైతులు రోడ్ల మీదకు రారనే అంచనాతో నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను తెచ్చారు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా సాగు మీద వస్తున్న రైతుల ఆదాయాలు పడిపోతున్నట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అనేక మంది రైతులు కూలీపని చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. వ్యవసాయ అనుబంధ, పాడి, కోళ్ల పెంపకం వంటి ఇతర వనరుల ద్వారా వస్తున్న రాబడి పెరుగుతున్నది. అందుకే సాగే ప్రధానంగా ఉన్న పంజాబ్‌, హర్యానా, ఇతర ఉత్తరాది ప్రాంతాల రైతులు కనీస మద్దతు ధరలను తమ ప్రాణవాయువుగా చూస్తున్నారు. వాటిని తీసివేస్తే ప్రాణాలు పోతాయని భయపడుతున్నారు గనుకనే, ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఆందోళనలకు సిద్దం అవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తాము అధికారానికి వస్తే గోధుమలు, ధాన్య ధరలను కనీస మద్దతు ధరలకంటే పెంచుతామని బిజెపి చెబుతున్నపుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అదే పని ఎందుకు చేయటం లేదు ? దేశంలోని ఇతర ప్రాంతాల రైతుల నుంచి వ్యతిరేకత పెద్ద ఎత్తున రాకపోవటాన్ని అవకాశంగా తీసుకొని రద్దు చేసిన మూడు సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడే వారు ఇప్పుడు వాదిస్తున్నారు. సాగు చట్టాల రద్దు సందర్భంగా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ కూడా వాటి వలన రైతులకు మేలు జరుగుతుందని, వెనక్కు తీసుకోవటం సరైంది కాదని చెప్పింది. అందువల్లనే ఆ కత్తి ఇప్పటికీ రైతాంగం మెడమీద వేలాడుతూనే ఉంది. నరేంద్రమోడీ మరోసారి అధికారానికి వస్తే రద్దుచేసిన వాటిని తిరిగి ప్రవేశపెట్టబోరనే గ్యారంటీ లేదు. మీడియాలో లోక్‌సభ ఎన్నికలను గమనంలో ఉంచుకొని మోడీ గ్యారంటీలంటూ చెబుతున్నవాటిలో కనీస మద్దతు ధర అంశం లేదని వేరే చెప్పనవసరం లేదు.

చిలీలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని ఏడు నిలువుల లోతున పాతిపెట్టిన చిలీ నియంత పినోచెట్‌ చచ్చి పద్దెనిమిదేండ్లు అవుతున్నా, వాడి వారసులు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల పూర్వరంగంలో మరోసారి కమ్యూనిస్టుల మీద విరుచుకుపడుతున్నారు. చిలీలో ఆశ్రయం పొందిన వెనెజులా సోషలిస్టు వ్యతిరేక మిలిటరీ అధికారి ఒకడు ఇటీవల హతుడయ్యాడు. కమ్యూనిస్టులే చంపారంటూ చిలీ మీడియా,పినోచెట్‌ వారసులైన ప్రతిపక్ష పార్టీ కూటమి తప్పుడు ప్రచారం ప్రారంభించింది. కమ్యూనిస్టుల విశ్వసనీయత ప్రశ్నించరానిదని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ బహిరంగంగా సమర్ధించాడు. వామపక్ష సంఘటన ప్రభుత్వంలో కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రధాన భాగస్వామిగా ఉంది. పార్లమెంటులోని 155 స్థానాలకు గాను అధికార కూటమికి 37,దానికి మద్దతు ఇస్తున్న కూటమికి మరో 37 ఉన్నాయి.వాటిలో సోషలిస్టులకు 13, కమ్యూనిస్టు పార్టీ 12సీట్లతో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. లాటిన్‌ అమెరికాలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో మితవాద శక్తుల ప్రధాన ఆయుధం కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం ఒకటన్నది తెలిసిందే. అనేక దేశాల్లో నిరంకుశ, మితవాద శక్తులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సోషలిస్టులు, కమ్యూనిస్టులు అధికారానికి వస్తే క్రైస్తవమతానికి, ధనికుల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో చేస్తున్నారు. నాజీ గోబెల్స్‌ను మించి అవాస్తవాలను ప్రచారంలో పెడుతున్నారు.


2017లో వెనెజులా నుంచి పారిపోయి వచ్చి చిలీలో ఆశ్రయం పొందిన మిలిటరీ మాజీ అధికారి రోలాండ్‌ జెడాను కొద్ది రోజుల క్రితం కొందరు అపహరించి హత్యచేశారు. దీని వెనుక కమ్యూనిస్టులు ఉన్నారని, దేశంలో హింసాకాండ సృష్టికి కుట్రలు పన్నుతున్నారంటూ అనేక పత్రికలు, ప్రతిపక్ష మితవాద పక్షాలు ఎలాంటి ఆధారం లేకుండా ధ్వజమెత్తుతున్నాయి. జనంలో అనుమానాలు కలిగించేరీతిలో కథనాలు అల్లుతున్నాయి. ఈ శక్తులన్నీ నియంత పినోచెట్‌ హయాంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఇతర ప్రజాస్వామిక వాదుల అణచివేత, అపహరణలను సమర్ధించినవే. మార్క్సిస్టు కాన్సర్‌ను అంతమొందించాలనే పేరుతో పినోచెట్‌ మిలిటరీ పాలకులు వేలాది మంది కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులను హతమార్చారు, అనేక మంది జాడలేకుండా చేశారు. చిత్రహింసలు, జైళ్లపాలు సరేసరి. 1983లో కేవలం రెండు నెలల వ్యవధిలోనే 20 మంది కమ్యూనిస్టు నేతలను హత్యచేశారు. తరువాత ముగ్గురు నేతల నాలుకలను చీల్చి చిత్రహింసలకు గురిచేశారు. పినోచెట్‌ పాలనలో నాలుగువేల మంది అపహరణలకు గురయ్యారు. కనీసం ఇరవై వేల మంది పిల్లలను అపహరించి విదేశాల్లో చట్టవిరుద్ద దత్తతకు సహకరించారనే విమర్శలున్నాయి. వాటి గురించి దర్యాప్తు జరపాలని, నిజాల నిగ్గుతేల్చాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు.


చిలీలో నియంతృత్వం ఉన్నకాలంలో కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాతవాసంలోకి వెళ్లింది.ప్రజల తరఫున పోరాడేందుకు సాయుధ దళాలను ఏర్పాటు చేసింది. నియంతల పాలన అంతరించిన తరువాత కమ్యూనిస్టులు తిరిగి బహిరంగంగా పనిచేయటం ప్రారంభించారు.ప్రస్తుతం 46,023 మంది సభ్యులతో దేశంలో అతి పెద్ద పార్టీగా ఉంది. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్ధి బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే వామపక్ష కూటమిలోని పార్టీల అభిప్రాయం మేరకు గాబ్రియెల్‌ బోరిక్‌ పోటీ చేసి 2021ఎన్నికల్లో గెలిచారు. హతుడైన వెనెజులా మాజీ మిలిటరీ అధికారికి వెనెజులాలో అనేక మందిని హతమార్చిన చరిత్ర ఉంది. హత్యవెనుక వెనెజులా హస్తం ఉందని, దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఖండించటంలో గొంతుకలపాలని చిలీ మితవాద పార్టీలు చేసిన డిమాండ్‌ను కమ్యూనిస్టు పార్టీ తిరస్కరించింది. కమ్యూనిస్టుల మీద విషం చిమ్మటానికి ఇదొక కారణమని చిలీ మంత్రి, కమ్యూనిస్టు నేత గామిలా వలేజో చెప్పారు. పార్లమెంటులో ఉన్న బలంతో గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వానికి అనేక ఆటంకాలు కలిగిస్తున్న ప్రతిపక్షాలు కమ్యూనిస్టు పార్టీ మీద విషం చిమ్మటంలో ఆశ్చర్యం ఏముందని కమ్యూనిస్టు పార్టీ ఎంపీ, విద్యార్ధి సంఘమాజీ నాయకురాలు కరోల్‌ కారియోలా చెప్పారు.భాగస్వామ్య పక్షాల అవగాహన మేరకు పార్లమెంటు సభాధ్యక్ష స్థానాన్ని కమ్యూనిస్టులు చేపట్టనున్న పూర్వరంగంలో పార్టీ మీద దాడికి దిగినట్లు చెప్పారు.


అంతరంగంలో గూడు కట్టుకున్న కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రతిపక్షాలు వెల్లడిస్తున్నాయి.ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా వ్యక్తులు, సంస్థలు ఎవరిమీదనైనా భయంకరమైన ఆరోపణలు చేయగల సమర్ధత కలిగినవి.వాటి పర్యవసానాలు వాటికి పట్టదు.ఊహాజనితమైన ఆరోపణలు చేస్తున్నాయి. చరిత్రలో చిలీ కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామిక నిబద్దతను ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదు. అది ప్రారంభమైనప్పటి నుంచి అందరికీ తెలుసు. ప్రజాస్వామిక పోరాటాల్లో తమదైన ముద్రను వారు ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణను వారెన్నడూ వీడలేదు. ఆ క్రమంలో నిరంతరం భాగస్వాములుగానే ఉన్నారు. వ్యవస్థాపరమైన చట్రానికి అనుగుణంగా వారు సర్దుబాటు చేసుకొని నడుచుకుంటున్నారు.అందువల్లనే కమ్యూనిస్టుల మీద జరుపుతున్నదాడిని కాకమ్మ కథలుగా చూస్తున్నాను అని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ చెప్పాడు. కమ్యూనిస్టులు న్యాయం, సమానత్వం, హక్కులకు అంకితమయ్యారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు, ఆదర్శసమాజాన్ని ఏర్పాటు చేసేందుకు దేశంలో ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు. అన్ని రకాల వివక్ష, అణచివేతను నిర్మూలించాలన్నదే తమ లక్ష్యమని కూడా చెప్పారు.జనం, సమాజ కేంద్రంగా ఉండాలని, జీవితాలు మెరుగుపడాలని మేం కోరుతుండగా నయా ఉదారవాదం ప్రజలు, వారి హక్కుల కంటే పెట్టుబడికి పెద్ద పీటవేస్తున్నదని బోరిక్‌ చెప్పాడు. ప్రభుత్వ ఏర్పాటు ఒప్పందంలో భాగంగా ప్రజాప్రతినిధుల సభ అధ్యక్ష పదవిని కమ్యూనిస్టులకు అప్పగించాల్సి ఉంది. దానికి అనుగుణంగా నిర్ణయించామని, గౌరవిస్తామని అన్నాడు. ఆ పదవిలో ఎవరు అన్నది సమస్యే కాదు, పార్లమెంటులోని సహచరులందరూ సమర్ధులే, వ్యక్తులు దొరుకుతారా లేదా అన్నది కాదు, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి గనుక ఎవరున్నా ఇబ్బంది ఉండదన్నాడు.


ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలకు సామాజిక ఉద్యమాల ద్వారా మద్దతు కూడగట్టాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇవ్వటం పార్లమెంటులోని మితవాద శక్తులకు కంటగింపుగా మారింది.చిలీ పార్లమెంటులో ఇప్పుడున్న బలాబలాల ప్రకారం అధికారంలో ఉన్న కూటమి ప్రతిపాదించే విధానాలు ఓటింగ్‌లో వీగిపోయే అవకాశం ఉంది. చట్టాలు, విధానాలను రూపొందించాల్సిన బాధ్యత చట్టసభలది తప్ప సామాజిక మద్దతు పేరుతో వత్తిడి తేవటం ఏమిటని మితవాదశక్తులు, వాటికి మద్దతుగా ఉన్న మీడియా,వాదిస్తున్నాయి. అందులో తప్పేం ఉందని అధ్యక్షుడు బోరిక్‌ ప్రశ్నించాడు. ఆ ఉద్యమాలు ప్రజా ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించినట్లయితే ఆహ్వానించాల్సిందే అన్నాడు. అబార్షన్‌ మీద చేసిన చట్టం వెనుక మహిళా ఉద్యమాల సమీకరణ లేదా అని ప్రశ్నించాడు. విద్యార్ధి ఉద్యమం ఉచిత విద్య కోసం పోరాడిందని, నూతన రాజ్యాంగం సామాజిక ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నదని, ప్రజాస్వామిక పద్దతుల్లో సామాజిక చర్చ జరగాలన్నాడు.వామపక్ష శక్తులు అధికారానికి వచ్చిన తరువాత ప్రతిపాదించిన ప్రజానుకూల సంస్కరణలను ముందుకు తీసుకు వెళ్లలేని వాస్తవ పరిస్థితి పార్లమెంటులో ఉంది. దానిలో భాగంగానే ధనికుల నుంచి పన్నువసూళ్లను పెంచే ప్రతిపాదన పార్లమెంటుముందుంచగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.కార్పొరేట్‌, ధనికులకు మద్దతుగా నిలిచాయి. పెన్షన్ల పెంపు, పెన్షన్‌ హామీ, సంరక్షణ వంటి పధకాలకు అవసరమైన నిధులను సేకరించేందుకు కలిగిన వారి మీద పన్ను పెంచాలని వామపక్ష ప్రభుత్వం ప్రతిపాదించింది.దాన్ని అడ్డుకోవటం అంటే పౌరుల సామాజిక హక్కుల మీద దాడి చేయటమే. అందుకే అలాంటి పార్టీల మీద వత్తిడి తేవాలంటే పార్లమెంటుతో పాటు వెలుపల ప్రజా ఉద్యమాలను నడపాలని కమ్యూనిస్టు పార్టీ కోరింది. దీని మీద ఆగ్రహిస్తున్న మీడియా వెనెజులా మిలిటరీ మాజీ అధికారి హత్యను సాకుగా తీసుకొని కమ్యూనిస్టుల మీద తప్పుడు ఆరోపణలతో దాడికి దిగింది.


గతంలో ఎన్నడూ లేనంత భయం, విపరీత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార నేపధ్యంలో 2021 డిసెంబరు 19న జరిగిన చిలీ మలి విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ ఘనవిజయం సాధించాడు.నవంబరు 21న జరిగిన ఎన్నికలలో క్రిస్టియన్‌ సోషల్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ 27.92 శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో ఉండగా బోరిక్‌ 25.82శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. డిసెంబరు 19న తుది పోటీ జరిగింది. బోరిక్‌ 55.87శాతం, కాస్ట్‌ 44.13శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. నయా ఉదారవాద తొలి ప్రయోగశాల లాటిన్‌ అమెరికా కాగా, దానిలో చిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడి యువత నయా ఉదారవాదం పుట్టింది ఇక్కడే దానికి గోరీ కట్టేది ఇక్కడే అనే నినాదంతో ఉద్యమించింది, దానికి బోరిక్‌ రూపంలో విజయం లభించింది. పదేండ్ల క్రితం విద్యార్ధి ఉద్యమం ముందుకు తెచ్చిన నేతలలో బోరిక్‌ ఒకడు, 2014 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.
1973లో సోషలిస్టు పార్టీ నేత (మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడిన) సాల్వెడార్‌ అలెండీ ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగంగా మిలిటరీ, పోలీసు తిరుగుబాటు చేసింది. దాన్ని ప్రతిఘటించేందుకు ఆయుధం పట్టిన అలెండీని కుట్రదారులు కాల్చి చంపారు. అయితే ప్రాణాలతో మిలిటరీకి పట్టుబడటం ఇష్టం లేక ఆత్మహత్యచేసుకున్నట్లు 2011లో కోర్టు ప్రకటించింది. ఈ కథను ఎవరూ నమ్మకపోయినా తాము విశ్వసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ కేసు విచారణ ముగించారు. అలెండీ మీద తిరుగుబాటు చేసిన జనరల్‌ పినోచెట్‌ తరువాత పగ్గాలు చేపట్టి నయాఉదారవాద విధానాలను జనం మీద రుద్దాడు.1973 నుంచి 1990వరకు నియంతగా పాలించాడు. తరువాత పౌరపాలన పునరుద్దరణ జరిగింది.

మధ్యలో రెండు సార్లు గతంలో అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచలెట్‌ అధికారానికి వచ్చినప్పటికి మిగతావారి మాదిరే మొత్తం మీద నయా ఉదారవాద విధానాలనే కొనసాగించారు. సాధారణంగా తొలిదఫా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంతిమ పోటీలో గెలుస్తుంది. చిలీలో దానికి భిన్నంగా రెండవ స్ధానంలో వచ్చిన బోరిక్‌ ఘనవిజయం సాధించాడు. మితవాద శక్తులన్నీ ఒకవైపు, వారిని ప్రతిఘటించే పురోగామి, ఉదారవాదులందరూ మరోవైపు సమీకరణయ్యారు.ఈ క్రమంలో బోరిక్‌ను ఎన్నుకుంటే కమ్యూనిస్టు ప్రమాదం వస్తుందని, దేశం మరొక వెనెజులాగా మారిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. సామాజిక, మతపరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. భయం మీద ఆశ విజయం సాధించిందని, ఒక పద్దతి ప్రకారం కమ్యూనిస్టునిస్టు వ్యతిరేక విష ప్రయోగాన్ని కూడా జనం అధిగమించారని బోరిక్‌ తన విజయ సందేశంలో చెప్పాడు. పార్లమెంటు దిగువ సభ డిప్యూటీల ఛాంబర్‌లో దామాషా ప్రాతిపదికన 155 స్ధానాలకు గాను వామపక్ష కూటమి పార్టీలకు వచ్చింది 37 మాత్రమే. ఎగువ సభలోని 50 స్దానాలకు గాను వామపక్షాలకు ఐదు, స్వతంత్రులు ఇద్దరు, మిగిలిన 43మితవాద పార్టీలకే వచ్చాయి. వామపక్షాలలో ప్రధాన పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు గతంలో ఉన్నఎనిమిదింటిని 12కు పెంచుకున్నారు, ఎగువ సభలో కొత్తగా రెండు స్దానాలను గెలుచుకున్నారు. నూతన రాజ్యాంగ ప్రతిపాదనపై 2022లో జరిగిన ఓటింగ్‌ తిరస్కరణకు గురైంది. దాన్ని వామపక్ష వాదులు ప్రతిపాదించినట్లు ప్రచారం చేశారు. తరువాత 2023డిసెంబరులో రెండవ రాజ్యాంగం గురించి జరిగిన ఓటింగ్‌లో మరోసారి తిరస్కరణకు గురైంది. దానిలో మితవాద ముద్ర ఉండటంతో వామపక్ష శక్తులు వ్యతిరేకించాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు, నూతన రాజ్యాంగం వంటి అంశాలలో మితవాద శక్తులు ఇప్పటి నుంచే వామపక్షాలను దెబ్బతీసేందుకు పూనుకున్నాయి. దానిలో భాగంగానే పెద్ద పార్టీగా ఉన్న కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. వాటిని వామపక్షాలు ఎలా ఎదుర్కొంటాయన్నది ఆసక్తిగా మారింది.

దివ్యాస్త్రం అగ్ని క్షిపణి చైనా, పాకిస్థాన్లను దెబ్బతీస్తుందా ?

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకేసారి పలు లక్ష్యాలను దెబ్బతీసే ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో అగ్నిా5 తరం క్షిపణి తొలి ప్రయోగం జయప్రదంగా జరిగినట్లు ప్రధాని నరేంద్రమోడీ 2024 మార్చి 11న ప్రకటించారు. దాన్ని దివ్యాస్త్రంగా వర్ణించారు. ఈ విజయానికి కారకులైన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.ఈ ప్రకటనతో మీడియా, సామాజిక మాధ్యమంలో పలు రకాల స్పందనలు వెలువడ్డాయి. ఒక్క క్షిపణితో చైనాలోని పలు లక్ష్యాలను దెబ్బతీయవచ్చు అని కాషాయ దళాలు నడిపే పత్రిక స్వరాజ్య ఒక విశ్లేషణను ప్రచురించింది. మిలిటరీ ఉన్మాదంతో ఊగిపోయే వారికి అలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. పరస్పర అనుమానాలు, కుట్ర సిద్దాంతాలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న నేపధ్యంలో ఏ దేశానికి ఆ దేశం తన రక్షణకు అవసరమైన పాటవాన్ని సమకూర్చుకుంటున్నది, అది ప్రతిదేశానికి ఉన్న హక్కు. అందుకే మనదేశం అణుపరీక్షలు జరిపినా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి) మీద సంతకం చేయకపోయినా కమ్యూనిస్టులతో సహా అందరూ మనదేశ వైఖరిని సమర్ధించారు. సరిగ్గా ఎన్నికల ముందు పరీక్ష నిర్వహించటం, దాని గురించి ప్రధాని ప్రకటించటం, దానికి చైనా వ్యతిరేకతను నూరిపోస్తూ మీడియా స్పందించటం అర్ధం కానంత బ్రహ్మవిద్యేమీ కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన విజయాలు తమ ఘనతే అని రాజకీయపార్టీలు చెప్పుకోవటం ఓట్ల రాజకీయమే. ప్రధాని నరేంద్రమోడీ లాగులు లేదా నిక్కర్లు వేసుకొని తిరుగుతున్న వయస్సులోనే 1958లో అంతకు ముందు విడిగా ఉన్న కొన్ని సంస్థలను కలిపి డిఆర్‌డిఓ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సమిష్టి కృషితో అనేక విజయాలను మన శాస్త్రవేత్తలు సాధించారు, అదే క్రమం కొనసాగుతోంది. మన జాగ్రత్తలో మనం ఉండటం సమర్ధనీయమే, బస్తీమే సవాల్‌ అని ఎదుటివారి మీద తొడగొట్టటం వేరు. రెండవది ప్రమాదకరం అని ప్రపంచ చరిత్ర చెబుతున్నది.


ఓట్ల కోసం మనోభావాలను ముందుకు తేవటం, విద్వేషాన్ని నూరిపోయటం గత పది సంవత్సరాలు, అంతకు ముందు నుంచీ చూస్తున్నదే. కొన్ని వాస్తవాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఐదవతరం అగ్ని క్షిపణితో నిజంగా పాకిస్థాన్‌, చైనాలను దెబ్బతీయగలమా ! కచ్చితంగా తీయగలం, ఎప్పుడు ? వాటి దగ్గర అలాంటివి లేనపుడు, ఉన్నా సన్నద్దంగా లేనపుడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా ? ప్రతి దేశమూ పోటా పోటీగా ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. మనం జరిపింది తొలి పరీక్ష మాత్రమే, ఇది ఐదువేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను దెబ్బతీయవచ్చునని చెబుతున్నారు. ఇలాంటి క్షిపణులను మనకంటే ఎంతో ముందుగా అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, పాకిస్థాన్‌ సమకూర్చుకున్నాయి. మన క్షిపణి ఒకేసారి ఎన్ని బాంబులను మోసుకుపోగలదో తెలియదు, నాలుగు అంటున్నారు. మిగతా దేశాల(రష్యా శాటన్‌-2) దగ్గర 16 బాంబులు(అదే సంఖ్యలో లక్ష్యాలు) మోసుకుపోగలవి ఉన్నట్లు మీడియాలో వెతికితే వివరాలు ఉన్నాయి.మనం తొలిపరీక్ష ఇప్పుడు చేస్తే చైనా 2016నాటికే ఏడు పరీక్షలు జరిపింది, తరువాత కూడా చేస్తున్నది. చైనా వద్ద ఆధునిక డిఎఫ్‌-41క్షిపణి 12 నుంచి 15వేల కిలోమీటర్లు అంటే అమెరికాలో ఉన్న లక్ష్యాలను కూడా తాకగలదు.మనం గనుక ఎదురుదాడికి దిగి క్షిపణిని వదిలితే ఎవరూ పసిగట్టలేరని చెబుతున్నారు. ఇదే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఏ దేశం ఎదురుదాడికి దిగినా అదే జరుగుతుంది. మనకు ఇతరులెంత దూరమో వారికి మనమూ అంతేదూరంలో ఉంటాం. దక్షిణాసియాలో తొలిసారిగా ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్థాన్‌ అబాబీల్‌ క్షిపణిని రూపొందించిందని గమనంలో ఉంచుకోవాలి. దాని పరిధి 2,200కిలోమీటర్లని వార్తలు. ఒకసారి పరీక్షలు మొదలైన తరువాత విస్తరించటం పెద్ద కష్టమేమీ కాదు. మీడియాలో వచ్చినట్లుగా మనమే ఎదురుదాడికి దిగితే మనకంటే బలంగా ఉన్న చైనా ఊరుకుంటుందా ? ఇప్పటికే అది భూమి,మోటారు వాహనాలు, రైళ్ల మీద నుంచి ప్రయోగించే ఎంఐఆర్‌వి క్షిపణులను కలిగి ఉంది.2019లోనే అలాంటి వాటిని మిలిటరీకి అందచేసింది. మనం పరీక్షించిన తాజా క్షిపణిని మిలిటరీకి అందించాలంటే మరికొన్ని సంవత్సరాలు పడుతుంది.


గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ అనే సంస్థ ప్రతిదేశానికి సంబంధించి 60అంశాలను పరిగణనలోకి తీసుకొని 145 దేశాలకు 2024 సంవత్సర సూచికలను ఇచ్చింది.దాని ప్రకారం 0.0000 పాయింట్లు వస్తే ఆ దేశం పక్కాగా ఉన్నట్లు. ఈ ప్రాతిపదికన మొదటి స్థానంలో ఉన్న అమెరికాకు 0.0699, రెండవదిగా ఉన్న రష్యాకు 0.0702, మూడవది చైనాకు 0.0706 రాగా నాలుగవ స్థానంలో ఉన్న మనదేశానికి 0.1023 మార్కులు వచ్చాయి. అంటే చైనా కంటే ఎంతో దిగువన ఉంది. తొలి పది స్థానాల్లో మన తరువాత దక్షిణ కొరియా, బ్రిటన్‌,జపాన్‌, టర్కీ, పాకిస్థాన్‌, ఇటలీ ఉన్నాయి. ఒక వేళ యుద్దమే వస్తే ఇప్పుడున్న ప్రపంచ రాజకీయాలు, సమీకరణల్లో చైనా, పాకిస్థాన్‌ ఒక్కటయ్యే అవకాశం, రష్యా పరోక్షంగా చైనాకు సహరించే పరిస్థితి ఉందని యుద్దం గురించి రంకెలు వేసేవారు గమనించాలి. మన దేశానికి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు పాకిస్థాన్ను అమెరికా ప్రోత్సహించిన కారణంగానే అది ప్రపంచ మిలిటరీలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మిలిటరీ ఖర్చుకు వెనకాడటం లేదు. దాని ఆర్థిక స్థితి దిగజారటానికి ఇది కూడా ఒక కారణం.చైనా జిడిపి, దాని విదేశీమారక ద్రవ్యనిల్వల వంటి అంశాలు మిలిటరీకి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేందుకు వీలు కల్పిస్తున్నది, మనమాపరిస్థితిలో ఉన్నామా ? మనకు వచ్చే ముప్పు గురించి స్వంత నిఘా, సమాచారాన్ని బట్టి వ్యవహరించాల్సి ఉంటుంది. అమెరికా చెప్పేదాన్ని నమ్ముకుంటే నట్టేటమునుగుతాం. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా దళాల కదలికల గురించి అమెరికా చెప్పిన మాటలను నమ్మి ముందుగానే మన మిలిటరీ లడక్‌ పర్వతాల మీదకు వెళ్లి కూర్చున్నది.తరువాతే చైనా దళాలను మోహరించినట్లు వెల్లడైంది. ఇప్పుడు మనం కొండలనుంచి దిగిరాలేని స్థితి, ఖర్చు విపరీతంగా అవుతున్నది.చైనా వైపునుంచి కొత్తగా దురాక్రమణ యత్నాలు ఉన్నట్లు మన ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు.అరుణాచల్‌ సరిహద్దులో చైనా కొత్తగా గ్రామాలను కడుతున్నట్లు కూడా కొన్ని బొమ్మలను చూపి అమెరికా మనలను తప్పుదారి పట్టించేందుకు చూసిన సంగతి తెలిసిందే. ఆధునిక ఆయుధాలు, నిధులతో ఉక్రెయిన్‌లో రష్యా సేనలను ఒక్కదెబ్బతో వెనక్కు కొట్టగలమని అమెరికన్లు ఇతర నాటో దేశాలను నమ్మించారు. రెండు సంవత్సరాలు గడిచినా అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. మధ్యలో ఇరుక్కున్న ఉక్రెయిన్‌ చావుదెబ్బలు తింటున్నది.


అంతరిక్షంలో అమెరికా మిలిటరీ ఆధిపత్యాన్నే సవాలు చేసే స్థితికి చైనా చేరుకుందనే అంశం మనదేశంలో యుద్ధం గురించి కలలు కనేవారికి తెలుసా? ఇటీవలి కాలంలో ఈ రంగంలో అమెరికాకు దగ్గరగా చైనా వచ్చిందని, అమెరికా నిశ్చింతగా లైటార్పి పడుకున్నట్లుగా కనిపిస్తోందని ఆ రంగంలో నిపుణుడు డీన్‌ చెంగ్‌ చెప్పినట్లు 2023 డిసెంబరు 13న అమెరికా ఎన్‌బిసి న్యూస్‌ పేర్కొన్నది. ప్రపంచమంతటా అంతరిక్ష ఉపగ్రహాల ద్వారా మిలిటరీ నియంత్రణలో అమెరికా ముందున్నది.వాటిని దెబ్బతీసే, పనికిరాకుండా చేసే, ఆయుధాలను చైనా తయారు చేస్తున్నదని అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ నివేదికలు గగ్గోలు పెడుతున్నాయి. చైనా 2019-21 సంవత్సరాలలో తన ఉపగ్రహాల సంఖ్యను 250 నుంచి 499కి పెంచుకుందని రక్షణ నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఆధునిక నిఘా బెలూన్లు,హైపర్‌సోనిక్‌ క్షిపణులను ఉపగ్రహాలకు దిగువన, విమానాలు ఎగిరే ఎత్తుకు ఎగువన చైనా మోహరించింది. ఇటీవల ఉపగ్రహాలకు తిరిగి ఇంథనాన్ని నింపే ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది.భూమి లేదా గగనతలం నుంచి క్షిపణులను, లేజర్లను ప్రయోగించి అంతరిక్షంలోని శత్రు ఉపగ్రహాలను ధ్వంసం చేసే పరిశోధనలు కూడా చేస్తున్నదని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు.ధ్వనికంటే కనీసం 20రెట్ల వేగంతో ప్రయాణించే క్షిపణులు భూమిని చుట్టివచ్చి లక్ష్యాలను దెబ్బతీసేవాటిని చైనా పరీక్షిస్తున్నదని కూడా అమెరికా భయపడుతోంది. అందువలన మన అగ్ని క్షిపణితో చైనాను దెబ్బతీయగలమని ఎవరైనా కలగన్నా, చెప్పినా అది వాస్తవ విరుద్దం తప్ప మరొకటి కాదు. భూతలం నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణుల అంశంలో రెండు దేశాల మధ్య ఉన్న తీవ్ర అంతరం కొంత మేర తగ్గుతుంది.నౌకా దళ బలాబలాల్లో మన దేశం ఎంతో వెనుకబడి ఉంది. జలాంతర్గాములు చైనా వద్ద 61 ఉండగా మనకు 18 మాత్రమే ఉన్నాయి.


ప్రతి దేశమూ తన మిలిటరీ పాటవాన్ని పెంచుకొనేందుకే చూస్తున్నది. ఈ విషయంలో పాకిస్థాన్‌ కూడా వెనుకబడిలేదు.మనకంటే ముందే 2023 అక్టోబరు చివరిలో ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో అబాబీల్‌ అనే క్షిపణి ప్రయోగం జరిపినట్లు డిప్లోమాట్‌ పత్రిక నవంబరు 18న ఒక విశ్లేషణ వెలువరించింది.మనదేశం బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ(బిఎండి)ను ఏర్పాటు చేస్తున్నందున దానికి విరుగుడుగా ఎంఐఆర్‌వి క్షిపణులను పాకిస్థాన్‌ రూపొందించినట్లు దానిలో పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ సమీపంలో నిర్మిస్తున్న బిఎండి రాడార్‌ కేంద్రం 2024లో అందుబాటులోకి వస్తుందని, మరో కేంద్రాన్ని మధ్య ప్రదేశ్‌లో నిర్మిస్తున్నట్లు కూడా డిప్లొమాట్‌ రాసింది. నౌకల మీద కూడా ఇలాంటి రాడార్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఐఎన్‌ఎస్‌ అన్వేష్‌ అలాంటి నౌకే. ఇవి రెండు నుంచి ఐదువేల కిలోమీటర్ల పరిధిలో క్షిపణులను పసిగట్టి మధ్యలోనే కూల్చివేస్తాయి. తొలిదశలో న్యూఢిల్లీ, ముంబై నగరాలకు రక్షణ కల్పిస్తారు.


మార్చి 11-16 తేదీల మధ్య ఎప్పుడైనా తాము మూడున్నర వేల కిలోమీటర్ల పరిధిలో క్షిపణి ప్రయోగం జరపవచ్చని ఆ పరిధిలోకి వచ్చేవారు తగు జాగ్రత్తలు పాటించాలని మన రక్షణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేయటం తెలిసిందే. ఆ సంగతి తెలిసే అగ్ని – 5 క్షిపణి ప్రయోగాన్ని చూసి భయపడిన చైనా తన గూఢచారి నౌకను విశాఖపట్టణానికి 260 నాటికల్‌ మైళ్ల దూరంలో లంగరు వేసినట్లు ఒక పత్రిక రాసింది.చైనా తాను జరుపుతున్న ప్రయోగాల గురించి కూడా ముందుగానే ప్రకటిస్తుంది. మనం కూడా చైనా సమీపంలోని అంతర్జాతీయ జలాల్లోకి నౌకలను పంపి నిఘావేయవచ్చు. ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకొనేందుకు 2012 నుంచి మన శాస్త్రవేత్తలు పని చేస్తున్నది, మన అగ్ని క్షిపణుల సామర్ధ్యం బహిరంగ రహస్యం.గతంలో ఒక చైనా నౌక శ్రీలంకకు వచ్చినపుడు,ప్రస్తుతం మాల్దీవుల సమీపంలో ఉన్న మరొక నౌక గురించి కూడా ఇలాగే రాశారు. ఇతరుల బలాబలాలను తెలుసుకొనేందుకు మనదేశం ఎలా ప్రయత్నిస్తుందో ప్రతిదేశమూ అదే చేస్తుందన్నది కూడా అందరికీ తెలిసిందే.మనకే అలాంటి హక్కు ఉండాలి, ఇతరులకు కూడదు అంటే కుదురుతుందా ! అమెరికా విమానవాహక యుద్ధ నౌకలు, ఇతర మిలిటరీ నౌకలు నిత్యం ప్రపంచమంతటా తిరుగుతుంటాయి, అనేక ప్రాంతాల్లో లంగరు వేయటం తెలిసిందే. అవి విహారయాత్రలు చేస్తున్నట్లు చెప్పగలమా ?

కేరళ రాజకీయం : అన్న కాంగ్రెస్‌, ఇడి భయంతో చెల్లి బిజెపి ! సిపిఎం వైపు ముస్లిం ఓటర్ల మొగ్గు !!

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రసవత్తర రాజకీయం మొదలైంది. కాంగ్రెస్‌ గతంలో సాధించిన సీట్లను నిలుపుకోవాలని చూస్తున్నది. సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని కొనసాగించి లోక్‌సభ సీట్లును గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓట్ల కోసం కమలనాధులు దేనికైనా సిద్దపడుతున్నారు. కేరళలో 2019లో ఇరవై స్థానాలకు గాను కేవలం ఒక్కచోటే సిపిఎం గెలిచింది. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఎన్నికలకు ముందు శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఎల్‌డిఎఫ్‌ సమర్ధించింది. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంది, సుప్రీం కోర్టులో పునర్విచారణ జరుగుతోంది. దానికి తోడు కేంద్రంలో రెండవసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే సమర్ధవంతంగా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్‌ మాత్రమే అని జనం నమ్మటం కాంగ్రెస్‌ గెలుపుకు దోహదం చేశాయి. తరువాత జరిగిన ఎన్నికల్లో, ఇప్పుడు శబరిమల వివాదం ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని తేలిపోయింది. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ కూడా భాగస్వాములుగా ఉండటంతో ఎవరు గెలిచినా బిజెపిని వ్యతిరేకించే వారే గనుక గతంలో మాదిరి బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ముస్లింలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం లేదని సాధారణంగా కమ్యూనిస్టులను వ్యతిరేకించే ప్రముఖ పత్రిక మళయాళ మనోరమ తాజాగా ఒక సమీక్షలో పేర్కొన్నది. దానిలోని కొన్ని ముఖ్య అంశాల సారం దిగువ విధంగా ఉంది.


గత ఎన్నికల అనంతరం సిఎస్‌డిఎస్‌ జరిపిన సర్వేలో మూడింట రెండువంతుల మంది ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటువేసినట్లు వెల్లడైంది. గతం కంటే నరేంద్రమోడీ అధికారంలోకి రాగూడదన్న భావన ముస్లింలలో పెరిగినప్పటికీ గుడ్డిగా కాంగ్రెస్‌వైపు మొగ్గే ధోరణిలో లేరు. మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ వంటి చోట్ల బిజెపి కంటే కాంగ్రెస్‌ ఎక్కువ హిందూత్వను అనుసరించటం ముస్లిం సామాజిక తరగతిని ఆశాభంగానికి గురి చేసింది. రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కాబోవటం లేదని చెప్పేందుకు కాంగ్రెస్‌ ఆలశ్యం చేయటం కూడా వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కాంగ్రెస్‌ మీద తొలుగుతున్న భ్రమలతో పాటు విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా సిపిఎంను చూస్తున్నారు. ” కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో చేరే అవకాశం కోసం వేచి చూస్తున్నారు.వారు ఉన్నత రాజకీయ లక్ష్యాలనేమీ ప్రకటించటం లేదు.వారికి కేవలం అధికారం మాత్రమే ప్రధానంగా ఉంది ” అని రచయిత, ఒక పరిశోధనా సంస్థ అధ్యక్షుడు ముజిబ్‌ రహమాన్‌ కినలూర్‌ చెప్పారు. ” అలాంటి వలస కేరళలో కూడా కనిపిస్తోంది.ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోని, ఇప్పుడు కరుణాకరన్‌ కుమార్తె పద్మజ బిజెపిలో చేరారు.ఎవరైనా కాంగ్రెస్‌ ఎంపీని నమ్మాలంటే ఎంతో కష్టంగా మారుతోంది” అని కూడా ముజిబ్‌ చెప్పారు. ”బిజెపిని ఎదుర్కొనే అవకాశం సిపిఎంకు లేదని మాకు తెలుసు, కానీ కాంగ్రెస్‌కు ఉంది.ఇప్పుడు రెండు పార్టీలూ ఇండియా కూటమిలో ఉన్నాయి. అందువలన ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిని ఎంచుకుంటే తేడా ఏముంటుంది.” అని ఇస్లామిక్‌ పండితుడు, రచయిత అష్రాఫ్‌ కడక్కల్‌ ప్రశ్నించారు.” ఈ సారి ప్రతి ముస్లిం ఒక అభ్యర్ధి లౌకిక వైఖరినే చూస్తారు.పార్లమెంటులో గట్టిగా లౌకికవాదాన్ని ఎవరు గట్టిగా రక్షణకు నిలబడతారు, ఉదాహరణకు జాన్‌ బ్రిట్టాస్‌(సిపిఎం రాజ్యసభ సభ్యుడు) వంటి వారిని ఎంచుకుంటారు ” అని కూడా చెప్పారు.లౌకివాద పరీక్షలో కాంగ్రెస్‌ ఎంపీ శశిధరూర్‌, ఆర్‌ఎస్‌పి ఎంపీ ఎన్‌కే ప్రేమ చంద్రన్‌ ఫెయిల్‌ అయ్యారు. హమస్‌ను ఉగ్రవాద సంస్థ అని శశిధరూర్‌ వర్ణించారు.పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ మారణకాండను గట్టిగా ఖండించలేదు. దీంతో పాలస్తీనా సంఘీభావ సభల్లో పాల్గొనే వారి జాబితా నుంచి ముస్లిం సంస్థలు శశిధరూర్‌ పేరును తొలగించాయి. ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కావటంతో ప్రేమచంద్రన్‌పై అపనమ్మకం ఏర్పడింది.


శుక్రవారాల్లో నమాజు తరువాత మసీదుల్లో చేసే ప్రసంగాల్లో ఎల్‌డిఎఫ్‌ను విమర్శించాలని ముస్లింలీగు కోరుతున్నది. మసీదుల్లో రాజకీయ విమర్శలు చేయకూడదని సమస్త కేరళ జమాయతుల్లా చెప్పింది.ముస్లిం లీగ్‌ చేస్తున్న రాజకీయాలు సమస్తలోని ఒక వర్గాన్ని ఆశాభంగానికి గురిచేశాయి.వారు ఈసారి ఎల్‌డిఎఫ్‌ను ఎంచుకోవచ్చు.లీగ్‌ నేతల తీరుతెన్నులను విమర్శించినందుకే పార్టీ నేత కెఎస్‌ హంసను బహిష్కరించారు. ఇప్పుడు సిపిఎం తన అభ్యర్ధిగా హంసను పొన్నాని బరిలో నిలిపింది.అయోధ్యలో రామాలయ నిర్మాణం గురించి నిరసన తెలపాల్సిన అవసరం లేదని, అక్కడ మసీదు నిర్మాణం కూడా చేయనున్నందున లౌకికవాదం మరింత బలపడుతుందని ముస్లింలీగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సాదిక్‌ అలీ తంగల్‌ చేసిన వ్యాఖ్యలను లీగ్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.జ్ఞానవాపి మసీదు కూడా కావాలని సంఘపరివార్‌ కోరుతున్నందున అలా ఎలా మాట్లాడతారని సమస్త నేత ప్రశ్నించారు.తిరువాన్కూర్‌ సెంట్రల్‌ ప్రాంతంలో 2016 ఎల్‌డిఎఫ్‌కు ముస్లింలు 25శాతం మంది మద్దతు ఇవ్వగా 2021లో అది 50శాతానికి పెరిగింది.ఎక్కడైతే బిజెపి పోటీ ఇస్తుందని అనుకుంటారో అక్కడ ఓడించేవారిని చూసి ఎంచుకుంటారు.


కాంగ్రెస్‌ నేత బొమ్మతో బిజెపి ప్రచారం !
కేరళలో జగమెరిగిన కాంగ్రెస్‌ నేత, మాజీ సిఎం కరుణాకరన్‌. ఆయన కుమార్తె పద్మజ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరగానే బిజెపి పెద్దలు కాషాయ జెండాపై కరుణాకరన్‌ బొమ్మను ముద్రించి ప్రచారానికి దిగారు. తన తండ్రి కాంగ్రెస్‌ ఆస్తి అని త్రిసూర్‌ లోకసభ కాంగ్రెస్‌ అభ్యర్ధి కె మురళీధరన్‌ ప్రకటించారు. నిలంబూర్‌లో నరేంద్రమోడీ, కరుణాకరన్‌, పద్మజ బొమ్మలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్య తీసుకోకపోవటంతో వారు వాటిని చించివేశారు. రాష్ట్రంలో మొత్తం 20లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న 16చోట్ల అభ్యర్ధులను ఖరారు చేసింది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కె కరుణాకరన్‌, ఎకె ఆంటోనీ. ఇద్దరూ కాంగ్రెస్‌ ప్రముఖులే. గతంలో ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోని బిజెపిలో చేరగా,ప్రస్తుతం ఆ పార్టీ తరఫున పత్తానంతిట్ట లోక్‌సభ బరిలో దిగారు. అక్కడ సిపిఎం నేత థామస్‌ ఐజాక్‌ పోటీ చేస్తున్నారు. పద్మజ వేణుగోపాల్‌ వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ మీద ఆమె పోటీ చేయనున్నట్లు నిర్దారణగాని వార్తలు వచ్చాయి. దేశవ్యాపితంగా ఈ పోటీని సంచలనాత్మకం కావించేందుకు బిజెపి ఇలాంటి ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె సోదరుడు, ప్రస్తుతం వడకర ఎంపీగా ఉన్న మురళీధరన్‌ త్రిసూర్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు ఆకస్మికంగా మార్పును ప్రకటించారు.
కాంగ్రెస్‌ నేతలు బిజెపిలో చేరటంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. ఈ రోజు కాంగ్రెస్‌లో ఉన్న నేతలు రేపుదానిలో ఉంటారన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. బిజెపిలో చేరతానని గతంలో పిసిసి అధ్యక్షుడు సుధాకరన్‌ స్వయంగా చెప్పారు. ఇద్దరు ప్రముఖుల పిల్లలు బిజెపిలో చేరారు. ఇంకా ఎంత మంది చేరతారో తెలియదు. కాంగ్రెస్‌ తరఫున ఎంపీలుగా గెలిచినప్పటికీ వారు పార్టీలో కొనసాగుతారన్న ఎలాంటి హామీ లేదన్నారు.ఇంకా ఎంత మంది కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరతారో మీరే చూస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విలేకర్లతో అన్నారు. అనేక మంది ఆ పార్టీ నుంచి వెళ్లిపోయారని, మొత్తంగా బిజెపిలో చేరరన్న గ్యారంటీ ఏముందన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వందల మంది మాజీ ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ముగ్గురు పిసిసి అధ్యక్షులు బిజెపిలో చేరారని చెప్పారు.


సురేష్‌ గోపికి కోపమొచ్చింది ! ఓట్ల కోసం ఎన్ని తిప్పలో !!
ఈ సారి ఎలాగైనా విజయం సాధిస్తాననే ధీమాతో త్రిసూర్‌లో పోటీకి దిగిన సినీనటుడు సురేష్‌ గోపికి శనివారం నాడు కోపమొచ్చింది. ఒక గిరిజన కాలనీలో ప్రచారానికి వచ్చిన గోపికి కొంత మంది మహిళా వలంటీర్లు తప్ప ఓటర్లు కనిపించలేదు.దాంతో కారుదిగకుండానే వలంటీర్లు కూడా తగినంత మంది లేనపుడు ఇక్కడ పోటీ చేయటం ఎందుకు తిరువనంతపురం వెళ్లి అక్కడ కేంద్రమంత్రి చంద్రశేఖర్‌కు ప్రచారం చేస్తా అంటూ మండిపడినట్లు మీడియా పేర్కొన్నది. ఇంకా నామినేషన్‌ కూడా దాఖలు చేయలేదు గుర్తుపెట్టుకోండి అంటూ ఆగ్రహించారు. దాంతో కార్యకర్తలు ఇక ముందు ఇలా జరగకుండా చూస్తామంటూ క్షమాపణలు చెప్పారట. అక్కడ సోదరుడికి వ్యతిరేకంగా చెల్లి పద్మజ బిజెపి తరఫున ప్రచారం చేయనున్నట్లు వార్తలు. బిజెపిని మూడవ స్థానంలోకి నెడతామని మురళీధరన్‌, కాంగ్రెస్‌నే ఆ చోటులో ఉంచుతామని సురేష్‌ గోపి ప్రకటించారు. ఓట్ల కోసం ఈ పెద్దమనిషి నానా తిప్పలు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది ప్రముఖుల సమక్షంలో తన కుమార్తె వివాహాన్ని గురువాయూర్‌ శ్రీకృష్ణ దేవాలయంలో నిర్వహించారు. దానికి రెండు రోజుల ముందు త్రిసూర్‌లోని ఒక చర్చిలో మేరీమాతకు ఒక బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించుకున్నారు. అయితే అది బంగారు పూత పూసిన రాగిదనే విమర్శలు రావటంతో వివాదాస్పదమైంది. దానిలో బంగారం ఎంత ఉందో పరీక్షించి చెప్పాలని చర్చి అధికారులను కాంగ్రెస్‌ కోరింది. ఐదు సవర్ల బంగారంతో దాన్ని చేసినట్లు కంసాలి చెప్పారు. తాను ఇచ్చినదానిలో సగం బంగారాన్ని కంసాలి తనకు తిరిగి ఇచ్చారని, 18కారట్ల బంగారంతో కిరీటాన్ని తయారు చేసినట్లు, తాను గెలిస్తే మరో పదిలక్షల విలువగల బంగారాన్ని మేరి మాతకు కానుకగా ఇస్తానని సురేష్‌ గోపి వివరణ ఇచ్చారు. ఎల్‌డిఎఫ్‌ తరఫున సిపిఐ అక్కడ పోటీ చేస్తున్నది.అక్కడ టిఎన్‌ ప్రతాన్‌ తమ అభ్యర్ధి అని కాంగ్రెస్‌ ఎన్నో రోజుల ముందుగానే అనధికారికంగా ప్రకటించింది. దాంతో గోడరాతలతో పాటు మూడున్నరలక్ష వాల్‌పోస్టర్లను కూడా ప్రతాపన్‌ ముద్రించారు. ఇప్పుడు అవన్నీ వృధా అయ్యాయి.


ఇడి దెబ్బకు బిజెపిలోకి ఫిరాయింపు !
పద్మజా వేణుగోపాల్‌ కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించి బిజెపిలో చేరటానికి కారణం ఆమె భర్త డాక్టర్‌ వేణుగోపాల్‌ను ఇడి అధికారులు ప్రశ్నించటమేఅని కాంగ్రెస్‌ నాయకురాలు బిందు కృష్జ చెప్పారు. ఆమె ఎప్పటి నుంచో తమతో మాట్లాడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ అన్నారు. తన సోదరితో అన్ని బంధాలను తెంచుకున్నానని, ఆమె చేరికతో బిజెపికి ఒక్క పైసా కూడా ఉపయోగం ఉండదని మురళీధరన్‌ మీడియాతో చెప్పారు.తన తండ్రి ఆత్మ ఆమెను క్షమించదన్నారు.ఆమె ఫిరాయింపు వెనుక తమ కుటుంబంతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్న మాజీ డిజిపి లోక్‌నాధ్‌ బెహరా ఉన్నారని, అతను ప్రధాని నరేంద్రమోడీ, పినరయి విజయన్‌కూ సన్నిహితుడే అన్నారు. పత్తానం తిట్టలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ నేత ఎకె ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోని ఓట్లకోసం శివరాత్రి నాడు శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకున్నారు. తన పార్టీ జనపక్షంను బిజెపిలో విలీనం చేసిన పిసి జార్జి ఆ సీటును ఆశించి భంగపడ్డారు.కేరళ రాజకీయాల గురించి అనిల్‌ ఆంటోనికి అనుభవం లేదని అక్కడ ఓడిపోతారని ప్రకటించారు. దాంతో బిజెపి నాయకత్వం నష్టనివారణకు పూనుకొని అనిల్‌తో కలిపి శివాలయానికి పంపింది. అక్కడ జార్జి స్వయంగా అనిల్‌ నుదుట తిలకాన్ని దిద్దిన వీడియో వైరల్‌గా మారింది. పోటీకి దిగాలన్న తన కలను సిఎం పినరయి విజయన్‌, బిజెపి మిత్రపక్షం బిడిజెఎస్‌ నేత తుషార్‌ వెల్లపల్లి వమ్ముచేశారని పిసి జార్జి ఆరోపించారు.

పదేండ్ల మోడీ రామరాజ్య పాలన : మహిళలకు ఉపాధి, శాంతి, భద్రతలూ కరవే !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


పదేండ్ల నరేంద్రమోడీ పాలన, వెనక్కు తిరిగి చూసుకుంటే జనాభాలో సగభాగమైన మహిళల స్థితి ఏమిటి ? వచ్చే ఎన్నికల్లో ఓట్ల మోడీ గ్యారంటీల పేరుతో ఊదరగొడుతున్నారు. తమ మోడీని ప్రపంచనేతగా గుర్తించారని కీర్తిస్తున్నారు బిజెపి అభిమానులు.ఎవరు గుర్తించారో, ప్రాతిపదిక ఏమిటో ఎవరూ చెప్పలేరు. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత. తమకు అవసరమైనపుడు వెంపల చెట్లకు నిచ్చెన వేసి ఎక్కేవారిని కూడా ఆజానుబాహుడని పొగడేవారికి ప్రపంచంలో కొరత లేదు. మహిళలకు శాంతి, రక్షణ సూచికలో మనమెక్కడున్నామో తెలుసా ? మన మిత్ర లేదా సహజ భాగస్వామ్య దేశంగా మోడీ అండ్‌ కో చెప్పుకుంటున్న అమెరికాలోని జార్జిటౌన్‌ సంస్థ రూపొందించిన 2023 విశ్లేషణ ప్రకారం 177దేశాలలో 128వ స్థానంలో ఉన్నాం.మోడీ గొప్పదనం గురించి చెప్పుకొనేందుకు ఆయన భక్తులు నిత్యం వల్లించే పాకిస్థాన్‌ 158 స్థానంలో ఉండటం ఎంతో ”ఊరట” కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. బేటీ పడావో, బేటీ బచావో నినాదంతో పాటు అచ్చేదిన్‌ వాగ్దానం చేసిన మోడీ ఏలుబడిలో తొమ్మిది సంవత్సరాల తరువాత పరిస్థితి ఇది. పోనీ మెరుగుపడే ఆశ ఉందా ? 2017 నివేదిక ప్రకారం మన దేశం 131వ స్థానంలో ఉన్నది కాస్తా 128కి ఎగబాకింది.ఇదేమీ పెద్ద మెరుగుదలా, పెరుగుదలా కాదు. పాయింట్ల పరంగా చూస్తే 0.580 నుంచి 0.595కు(15) చేరినప్పటికీ రాంకులో పెద్దగా మెరుగుదల లేదంటే దాని అర్ధం మిగతా దేశాల్లో పరిస్థితి బాగా మెరుగుపడినట్లు. ఉదాహరణకు పాకిస్థాన్నే తీసుకుందాం. ఇదే కాలంలో దాని పాయింట్లు 0.441 నుంచి 481కి(40) పెరిగినప్పటికీ రాంకు 150 నుంచి 158కి దిగజారింది. పాయింట్ల వారీ చూస్తే మన కంటే పాకిస్థాన్‌లో మెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. మరో పొరుగుదేశమైన చైనా రాంకు ఈ కాలంలో 87నుంచి 82కు పెరిగింది. పాయింట్ల వారీ చూస్తే 0.671 నుంచి 0.7కు(29) చేరింది. ఇరుగుదేశమైన బంగ్లాదేశ్‌ 127 నుంచి 131కు దిగజారింది, అయినా అక్కడ పాయింట్ల వారీ చూస్తే 0.585 నుంచి 0.593కు పెరిగింది. స్త్రీ-పురుష తేడా 2023 సూచికలో మనదేశం ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం 146దేశాల్లో 127వదిగా ఉంది. మోడీ అధికారానికి వచ్చిన 2014లో అది 142 దేశాల్లో 114వ స్థానంలో ఉంది. ఈ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2022లో 135వదిగా ఉంది. ఒక్క ఏడాదిలో ఎనిమిది స్థానాలు ఎలా పెరిగిందన్నది ఆలోచించాల్సిన అంశం. ఒక వేళదాన్నే ప్రామాణికంగా తీసుకుంటే 114 నుంచి 135కు ఎందుకు దిగజారినట్లు ? ఏ రీత్యా చూసినా గడచిన పదేండ్లలో మొత్తం మీద ఈ అంతరం తగ్గకపోగా పెరిగిందని స్పష్టంగా కనిపిస్తోంది. లింగ అసమానతలో 2021 సూచిక ప్రకారం చైనా 48, శ్రీలంక 92, నేపాల్‌ 113, మనదేశం 122, బంగ్లాదేశ్‌ 131, పాకిస్థాన్‌ 149 స్థానాల్లో ఉన్నాయి.మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల సూచికలో ఆఫ్‌ఘనిస్తాన్‌ 1, పాకిస్థాన్‌ 4, భారత్‌ 9, బంగ్లాదేశ్‌ 17, చైనా 23, శ్రీలంక 65 స్థానాలలో ఉన్నాయి. మనదేశం గురించి ఇలాంటి సూచికలన్నీ ప్రపంచ మంతటా అందరికీ తెలిసినప్పటికీ నరేంద్రమోడీని ప్రపంచ నేతగా గుర్తించిందని బిజెపి నేతలు ప్రచారం చేయటం విడ్డూరం కాదా !


అంబానీ కుటుంబంలో పెండ్లి వేడుకకు తన స్నేహితురాలితో కలసి వచ్చిన బిల్‌గేట్స్‌ దేశంలో జరిగిన అభివృద్ధి తనను ఎంతగానో ముగ్దుడిని చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రశంసలను చూసి మోడీ భక్తులు ఊగి తూగుతారని వేరే చెప్పనవసరం లేదు. ఇంట్లో ఈగల మోత బిల్‌గేట్స్‌కు ఎలా తెలుస్తుంది. పదేండ్ల పాలన గురించి ప్రసార మాధ్యమాల్లో మోడీ గ్యారంటీల గురించి ఎంత ఊదరగొట్టినా పరిస్థితుల్లో పెద్ద మార్పులేదు, దిగజారుడే కనిపిస్తోంది.మహిళల శాంతి, భద్రతల గురించి తాజా సూచికల గురించి అంతర్జాతీయ మీడియాలో పేర్కొన్న అంశాలు నరేంద్రమోడీ పరువును మరింత పోగొట్టేవిగా ఉన్నాయి తప్ప మరొకటి కాదు. స్టాటిస్టా అనే సంస్థ సమీక్ష జార్ఖండ్‌లో స్పానిష్‌-బ్రెజిలియన్‌ పర్యాటకరాలి మీద ఆమె భర్త ముందే ఎనిమిది మంది చేసిన అత్యాచార ఉదంతంతో ప్రారంభమైంది.ఇది అంతర్జాతీయంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.ప్రపంచంలో మహిళలకు రక్షణ లేని దేశాల సరసన చేర్చి మన గురించి చర్చించుకుంటున్నారు. దేశంలో రోజుకు 86 అత్యాచారాలు జరుగుతున్నట్లు 2022లో నమోదైంది. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు పెరుగుతున్నట్లు నమోదైన నివేదికలు వెల్లడిస్తున్నాయి. అసలు పోలీసుల వరకు రాని కేసులు ఎన్నో. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న, ఒక యోగి పాలనలోని ఉత్తర ప్రదేశ్‌ 2022లో ప్రధమ స్థానంలో ఉంది.


ప్రపంచం మొత్తం మీద చూసినపుడు స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ. అయితే ఇదే స్థితి అన్ని చోట్లా లేదు. కొన్ని దేశాల్లో పురుషులు, కొన్ని చోట్ల మహిళలు ఎక్కువగా ఉన్నారు.అయితే ఈ పరిస్థితి శాశ్వతంగా ఒకే విధంగా ఉండదు. తూర్పు ఐరోపా కొన్ని దేశాల్లో గతంలో రెండవ ప్రపంచ యుద్ధ కారణంగా, ప్రస్తుతం పురుషుల వలసలు, జీవిత కాలం ఎక్కువగా ఉన్నందున మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది.మధ్య ప్రాచ్య దేశాల్లో కార్మికులుగా పురుషులు ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన కారణంగా అక్కడ మహిళల శాతం తక్కువగా ఉంది. వర్తమాన పార్లమెంటులో చివరి బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ బ్రహ్మాండమైన నారీశక్తి (మహిళా సాధికారత) అవుతుందని చెప్పారు.నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ” మహిళా సాధికారత పండగ ” అని కూడా వర్ణించారు.నూతన పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశంలో నారీశక్తి అభియాన్‌కు ఆమోదాన్ని చూశారని, జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళాశక్తిని చూశారని అన్నారు. గతంలో బేటీ బచావో, బేటీ పఢావో అని పిలుపు ఇచ్చారు.దాని ఫలితం ఏమిటో పైన చూశాము. ఇండియా టుడే వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు మహిళలు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక లింగ అసమానతల నివేదిక 2022 ప్రకారం 146 దేశాల జాబితాలో 135వ స్థానంలో భారత్‌ ఉంది.ప్రపంచ శ్రామిక శక్తిలో లింగ సమానత్వం రావాలంటే 132 సంవత్సరాలు పడుతుందని ఆ నివేదిక పేర్కొన్నది. అట్టడుగున్న ఉన్న మన దేశానికి ఇంకా ఎక్కువ వ్యవధి పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది.


అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి అది 25శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పారు. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇంటి దగ్గర ఉండి ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నారని సిఎంఐఇ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ చెప్పారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. క్వాల్‌ట్రిక్స్‌ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం 2022లో ప్రపంచంలోని 180దేశాలలో శ్రామిక శక్తిలో 52.7శాతం మహిళలతో ఆర్మేనియా మొదటి స్థానంలో ఉంది.ప్రపంచ సగటు 39.49శాతం.మన దేశం 23.54శాతంతో 166వ స్థానంలో ఉంది.మనకంటే ఎగువన 147లో నేపాల్‌, 153, 156 స్థానాలలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, దిగువున 168వ స్థానంలో పాకిస్తాన్‌ ఉంది. మనతో జనాభాలో పోటీ పడుతున్న చైనా 45.17శాతంతో 89వ దేశంగా ఉంది. పరిస్థితి ఇంతదారుణంగా ఉంటే ఏం చేశారని ఓట్లు అడుగుతున్నట్లు ? కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో బిజెపి లేదా దానితో జతకట్టిన వారి ప్రభుత్వాలే ఉన్నాయి గనుక అతివల స్థితి అధ్వానంగా ఉండటానికి కారకులు ఎవరంటే మోడీని చూసి ఓటువేయాలని బిజెపి చెబుతున్నందున మోడీనే అని చెప్పాల్సి వస్తోంది. కాదంటారా ?

ఎక్కడి గొంగళి అక్కడే : డబ్ల్యుటిఓ అబుదాబీ చర్చలు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
నూట అరవై ఆరు దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఐదు రోజుల పాటు తాగామా, తిన్నామా, పడుకున్నామా, లేచి వెళ్లిపోయామా అన్నట్లుగా వ్యవహరించారంటే అతిశయోక్తి కాదు. ఎక్కడ అనుకున్నారు ! యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబూదాబీలో ఫిబ్రవరి 26 నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ) మంత్రుల పదమూడవ సమావేశం(ఎంసి13) జరిగింది. చిన్నా చితకా అంశాల మీద కొన్ని ఒప్పందాలు జరిగాయి తప్ప కీలకమైన వ్యవసాయం, మత్స్య సంపద సబ్సిడీలు, తదితర అంశాలపై ఎలాంటి ముందడుగు పడలేదు. ఉమ్మడి ప్రకటన కోసం నాలుగవ రోజు మూడు సార్లు సమావేశం వాయిదా పడింది, కుదరలా మరో రోజు పొడిగించారు. చివరికి వచ్చే సారి రాజుగారి గంగాళంలో అందరం పాలుపోద్దాం అన్నట్లుగా మంచి కోసం మరిన్ని చర్చలు కొనసాగిద్దాం అనే అంశం మీద తప్ప మరొక ఏకాభిప్రాయం లేదు. పేద వర్దమాన దేశాలు తమ ప్రయోజనాలకోసం పట్టుబడితే, ధనిక దేశాలూ అంతకంటే గట్టిగా ఉడుంపట్టు పట్టాయి.ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పదాలలో సంధికాలం నిబంధన(పీస్‌ క్లాజ్‌) ప్రకారం మన వంటి దేశాలు యథాతధ స్థితిని కొనసాగించేందుకు లభించిన ఊరట తప్ప కొత్తగా ఒరిగిందేమీ లేదు. అత్యంత పేదరికంతో ఉన్న కామెరోస్‌, తైమూర్‌-లెస్తే అనే దేశాలను చేర్చుకోవటంతో సంస్థ సభ్యత్వం 164 నుంచి 166దేశాలకు పెరిగింది. ప్రపంచ వాణిజ్యంలో 98శాతం వీటి పరిధిలో ఉంది.చూశారా రెండు కొత్తదేశాలు చేరాయంటే డబ్ల్యుటిఓ మీద ఇంకా నమ్మకం ఉన్నట్లే కదా అని కొందరు భాష్యం చెప్పారు. ఇప్పటికిప్పుడు తమకు పెద్దగా ఒరిగేదేమీ లేకున్నా అమెరికా వంటి పెద్ద దేశాల సరసన ఉండి లబ్దికోసం ఎదురు చూడటం తప్ప మరొక మార్గం లేదని న్యూజిలాండ్‌ ప్రతినిధి చెప్పారు. సంస్థ ఉన్నంత వరకు ఎవరి ప్రయోజనాల కోసం వారు ఉంటారన్నది గమనించాల్సిన అంశం.


వాణిజ్య వివాదాల పరిష్కారానికి రెండంచెల వ్యవస్థ ఉండే విధంగా సంస్కరించాలన్నది ఒక ప్రతిపాదన. ఇప్పుడున్న వ్యవస్థనే పనిచేయనివ్వకుండా 2019 నుంచి అమెరికా, దాని వెనుక ఉన్న ఇతర ధనికదేశాలు మోకాలడ్డుతుండటంతో ఎలాంటి కార్యకలాపాలు లేవు. ఎలక్ట్రానిక్‌ (ఇ) కామర్స్‌లో జరిగే లావాదేవీలపై సభ్యదేశాలు కస్టమ్స్‌ సుంకాలు విధించకూడదన్న నిర్ణయాన్ని 1998 నుంచి ప్రతి సమావేశంలో పొడిగించినట్లుగానే అబూదాబీలో కూడా 2026వరకు అనుమతించారు. ఇది ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న దేశాలకే లబ్ది చేకూర్చుతుందని వేరే చెప్పనవసరం లేదు. మన వంటి దేశాలు ఎప్పుడైనా వాటి సరసన చేరకపోతామా, మార్కెట్లలో ప్రవేశించకపోతామా, మన కార్పొరేట్లకూ లబ్ది చేకూర్చలేకపోతామా అనే బండి గుర్రపు ఆశతో ఎదురుచూస్తున్నాయి. ఇదే సమయంలో అభివృద్ది చెందిన దేశాలు వర్ధమాన దేశాల సబ్సిడీలకు గండికొట్టేందుకు చూడటంతో పాటు తమ సబ్సిడీలను మరింతగా పెంచుకుంటున్నాయి. వాటిని ప్రతిఘటించే స్థితిలో మిగతా దేశాలు లేవు. అయినా ఎండమావుల వెంట పరుగెత్తినట్లుగా మన వంటి దేశాల పరిస్థితి ఉంది. ఒకవైపు లబ్దికోసం రాజీపడుతున్నాయి, మరోవైపు జనం నుంచి వ్యతిరేకతను చూసి ప్రతిఘటిస్తున్నాయి.మన రైతాంగానికి రక్షణ కల్పించేందుకు గాను కొన్ని పంటలకు కనీస మద్దతు ధర విధానం, ఆహార భద్రతకు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సిఐ) ద్వారా ప్రభుత్వమే ఆహారధాన్యాల సేకరణ విధానాన్ని అమలు జరుపుతున్నాం. ఈ రెండూ కూడా డబ్ల్యుటిఓ నిబంధనలకు విరుద్దమని వాటిని ఎత్తివేయాలని అమెరికా, ఐరోపా దేశాలు 2013 నుంచి పెద్ద ఎత్తున వత్తిడి తెస్తున్నాయి, వాటిని సంతుష్టీకరించేందుకు 2020లో నరేంద్రమోడీ తెచ్చిన మూడు సాగు చట్టాలు రాజీలో భాగమైతే, రైతుల ప్రతిఘటనతో క్షమాపణలు చెప్పిమరీ తోకముడవటం రెండోదానికి నిదర్శనం. మొదటిది వాస్తవం, రెండవది వంచన. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు మొరాయించటమే దీనికి నిదర్శనం.అంతిమ ఫలితం ఏమంటే ధనికదేశాల వత్తిడే ఎక్కువగా పని చేస్తున్నది.ముందే చెప్పుకున్నట్లుగా సంధికాలం నిబంధన(పీస్‌ క్లాజ్‌) ఇంకా అమల్లో ఉన్నందున ఎఫ్‌సిఐ, ప్రజా పంపిణీ వ్యవస్థలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచంలో వివిధ దేశాలు రైతాంగానికి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేర సబ్సిడీలు ఇస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాలు వీటిని ఎత్తివేసి మార్కెట్లో ప్రవేశించే హక్కు తమకు కల్పించాలని పట్టుబడుతున్నాయి. ఇదే సమయంలో నిబంధనలకు వక్రభాష్యాలు చెప్పి పెద్ద ఎత్తున అవి సబ్సిడీలు ఇస్తున్నాయి. ఐరోపా దేశాలు ఇస్తున్న సబ్సిడీలను ఎత్తివేస్తే ప్రపంచంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎనిమిదిశాతం పెరుగుతాయని, అది న్యూజిలాండ్‌ రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఒక సంస్థ చేసిన విశ్లేషణను న్యూజిలాండ్‌ ప్రతినిధి ఉటంకించారు.


అబూదాబీలో తేలని మరొక అంశం సముద్ర ఉత్పత్తులకు సబ్సిడీలు. ప్రపంచంలో 26 కోట్ల మంది వీటి వేటలో ఉపాధిపొందుతున్నారు.చిన్న స్థాయిలో చేపలను పట్టే దేశాల వారు సబ్సిడీల వలన నష్టపోతున్నారు.ఆయా దేశాల సముద్ర తీరానికి రెండు వందల నాటికల్‌ మైళ్ల అవతల ఎవరైనా చేపలు పట్టవచ్చు. చైనా, ఐరోపాలోని ధనిక దేశాల వద్ద భారీ నౌకల ద్వారా చేపలను పట్టే సంస్థలు ఉన్నాయి. వాటితో చిన్నవారు పోటీపడలేరు. భారీ నౌకలకు వ్యతిరేకంగా వర్ధమాన, పేద దేశాలు తెస్తున్నవత్తిడికి ఎలాంటి ఫలితమూ కనిపించటం లేదు. రెండవది సముద్ర ఉత్పత్తుల నిర్వచనాల్లో ఉన్న లొసుగులను ఆధారం చేసుకొని ధనిక దేశాలు వ్యవసాయానికి ఇస్తున్నట్లుగానే వీటికి భారీ సబ్సిడీలు ఇస్తున్నాయి.రెండు సంవత్సరాల క్రితం కుదిరిన ఒప్పందం ధనిక దేశాల సంస్థలకు మేలు చేకూర్చేదిగా ఉంది. చట్టవిరుద్దంగా, వివరాలు వెల్లడించని, నియంత్రణ విధానం లేకుండా పట్టినవాటికి, పరిమితికి మించి నిల్వలు ఉన్న చేపలకు సబ్సిడీ ఇవ్వకూడదన్న నిబంధనను 2022లో ఆమోదించారు. ఈ ఒప్పందాన్ని నూట పది దేశాలు ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుంది, మరొక 39దేశాలు సంతకాలు చేయాల్సి ఉంది. దీని నిబంధనల్లో ఉన్న లోపాల కారణంగా ఏకీభావం కుదరలేదు.ఈ ఒప్పందం మీద జరిగిన ప్రజా విచారణలో పాల్లొన్న వారు ఇప్పటి వరకు కార్పొరేట్లు భూములను కొల్లగొట్టారని,ఇది అమల్లోకి వస్తే సముద్రాలను ఆక్రమిస్తారని, నియంత్రణలు లేకపోతే దోపిడీకి హద్దే ఉండదని హెచ్చరించారు. పేద దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి వెలుపలికి వచ్చి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో పెట్రోలియం ఉత్పత్తుల మీద ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేయాలన్న ధనిక దేశాల డిమాండ్‌కు అబూదాబీలో మరో అడుగు ముందుకు పడింది. మన దేశంలో నరేంద్రమోడీ సర్కార్‌ సబ్సిడీలను ఎత్తివేయటమేగాక, సెస్సుల రూపంలో జనం జేబులను కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే.


ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడటం కంటే తక్షణమే ప్రత్యామ్నాయంగా పేద దేశాలకు ఆహార సర్వసత్తాక హక్కు, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సౌహార్ద్రతల ప్రాతిపదికన సంస్కరణలు జరగాలని అబూదాబీ సమావేశాల నుద్దేశించి అనేక రైతు, వ్యవసాయ కార్మిక, ఇతర వ్యవసాయ సంబంధ సంస్థలు కోరాయి. బహుముఖ సంక్షోభాలు తలెత్తిన వర్తమానంలో వాటిని పరిష్కరించేందుకు డబ్ల్యుటిఓ పనికిరాదని, ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని కోరాయి.ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ఖండాలలోని 65దేశాల్లో 2023లో రైతులు పోరుబాట పట్టారని వారిలో ఉన్న అశాంతికి ఇది నిదర్శనమని పేర్కొన్నాయి. ధనిక దేశాల నుంచి చౌకగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులతో అనేక దేశాల్లో రైతులు నష్టపోతున్నారు. కొన్ని చోట్ల పర్యావరణ రక్షణ పేరుతో వ్యవసాయం మీద ఆంక్షలు విధిస్తున్నారు. పంజాబ్‌, హర్యానాల్లో వరుసగా వరి వేయకుండా పంటల మార్పిడి పద్దతిని అనుసరిస్తే మూడు పప్పుధాన్యాలు, పత్తి, మొక్కజొన్నలను కనీస మద్దతు ధరలకు ఐదు సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తామని తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతులు తిరస్కరించిన సంగతి తెలిసిందే.


అబూదాబీలో మన దేశం వ్యవహరించిన తీరు తెన్నులను చూద్దాం. ఆహార ధాన్యాల సేకరణ, నిల్వలు, కనీస మద్దతు ధరల విధానాన్ని కొనసాగించాలని కోరటం తప్ప వాటిని వ్యతిరేకిస్తున్న అమెరికా, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దేశాల మీద గట్టిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే అతిశయోక్తి కాదు. వ్యాపారేతర అంశాలను అజెండాలో చేర్చకుండా చూడటంలో, దేశ ప్రయోజనాలను కాపాడటంలో విజయవంతమైనట్లు మనదేశ అధికారులు వర్ణించినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. చైనాతో 120 దేశాలు ముందుకు తెచ్చిన ” అభివృద్ధి కోసం పెట్టుబడుల ఒప్పంద ” ప్రతిపాదనను మనదేశంతో పాటు దక్షిణాఫ్రికా అడ్డుకున్నాయి. ఈ పెట్టుబడులు డబ్ల్యుటిఓ ద్వారా వస్తే అభ్యంతరం లేదని, వేరే మార్గంలో ప్రతిపాదించినందున వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నాయి. అదే విధంగా ఎగుమతులకు లింగవివక్షను ముడి పెట్టటాన్ని కూడా అడ్డుకున్నవాటిలో మనదేశం ఒకటి. ఆహార సబ్సిడీకి 1986-88 సంవత్సరాల ధరలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారని, దీన్ని తాజా ధరలతో నవీకరించాలని మనదేశం కోరింది. విదేశాల్లో ఉన్న వలస కార్మికులు(వీరికి అతిధి కార్మికులని ముద్దుపేరు) తమ దేశాలకు పంపే పొదుపు మొత్తాల ఖర్చు ఆరుశాతానికి మించి ఉంటోంది. దీన్ని తగ్గించాలని ఆయాదేశాలు కోరుతుండగా వీల్లేదని ధనిక దేశాలు పట్టుబడుతున్నాయి. ఎందుకు అంటే నగదును బదిలీ చేసే సేవా సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి, వాటి లాభాలు తగ్గకూడదన్నది వాటి వాదన.మనకార్మికులు 2023లో విదేశాల నుంచి 125బిలియన్‌ డాలర్లు పంపారు. దీన్ని బట్టి విదేశీ సంస్థలకు దాదాపు ఎనిమిది బిలియన్‌ డాలర్ల మేర లబ్ది చేకూరినట్లే.
అంతా మీరే చేశారు అంటూ అబూదాబీ సమావేశాల వైఫల్యం గురించి ఐరోపా యూనియన్‌ దేశాలు మన మీద విరుచుకుపడ్డాయి. ఈ సమావేశాల్లో మన ప్రతినిధిగా bల్గొన్న కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ఒక పత్రికతో మాట్లాడుతూ వాణిజ్యేతర అంశాలను ప్రధాన అజెండాలోకి రాకుండా చూడగలిగామని చెప్పారు. శాంతి సంధి నిబంధన మనకు అనుకూలగా ఉన్నందున పెద్దగా ఆందోళన చెందాల్సినపని లేదని అన్నారు. ఏ లక్ష్యాలతో మనదేశం ఆ సమావేశాల్లో పాల్గొన్నదో వాటి గురించి సంతృప్తితో తిరిగి వచ్చామని, దేశ ప్రయోజనాలను కాపాడామని సంతోషం వెలిబుచ్చారు.శాంతి నిబంధన ఉన్నందున ఆహార ధాన్యాలను నిల్వచేయవచ్చని, పేదలకు ఉచితంగా పంచవచ్చని చెప్పారు.చేపల సబ్సిడీలకు సంబంధించి నిర్వచనాలు సంతృప్తికరంగా లేవన్నారు. మూడు దశాబ్దాలుగా డబ్ల్యుటిఓ సాధించిందేమీ లేనందున అసలు ఈ సంస్ధే పనికి మాలిందనే అభిప్రాయం కూడా వెల్లడించిన వారు లేకపోలేదు. బహుళజాతి కార్పొరేట్‌ సంస్థల మేలుకోసం ధనిక దేశాలు ముందుకు తెచ్చిన ఈ సంస్థ మీద ఇలాంటి వ్యాఖ్యలు వెలువడుతున్నాయంటే పెట్టుబడిదారీ విధాన వైఫల్యానికి బలమైన నిదర్శనంగా చెప్పవచ్చు.