నరేంద్రమోడీ పదేండ్ల ఏలుబడి : మూడోసారి అధికారం కోసం ఎగుమతుల నిషేధంతో రైతాంగాన్ని బలిపెడతారా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరు తెన్నులను చూస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి మూడోసారి అధికారానికి వచ్చేందుకు కోట్లాది మంది రైతాంగాన్ని బలిపెట్టేందుకు పూనుకుందా అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. తాను చెప్పిన మాటలను తానే దిగమింగి ప్రకటిత విధానాల నుంచి వైదొలగటాన్ని చూసి అనేక మంది అలాగే భావిస్తున్నారు.ఎగుమతి నిషేధాల జాబితాలో ఇక పంచదార వంతు అంటూ ఆగస్టు 23వ తేదీన ఒక వార్త వెలువడింది. అంతకు ఒక రోజు ముందు ” రైతులు లాభపడటాన్ని అడ్డుకుంటున్న ప్రభుత్వం ” అనే శీర్షికతో డెక్కన్‌ హెరాల్డ్‌ పత్రికలో అజిత్‌ రనడే అనే ఆర్థికవేత్త కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి ఒక విశ్లేషణ రాశారు.కేంద్ర నిర్ణయాల మీద వివిధ కోణాల్లో మరికొందరు కూడా రాస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న ఆంక్షలన్నింటినీ సడలిస్తామని, ఎలాంటి పరిమితులు విధించబోమంటూ 2018లో కేంద్ర ప్రభుత్వం ఎగుమతి-దిగుమతి విధానంలో పేర్కొన్నది. తరువాత దాని కొనసాగింపుగా రాష్ట్రాలతో సంప్రదించకుండా, వాటి అభిప్రాయం తీసుకోకుండా మూడు సాగు చట్టాలను తీసుకువచ్చి దేశం మీద రుద్దాలని చూసిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన కారణంగా తప్పనిసరై వాటిని వెనక్కు తీసుకున్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా అంతకు రెండేళ్ల ముందు ప్రకటించిన ఎగుమతి -దిగుమతి విధానాన్ని కూడా అటక ఎక్కించింది. ఎప్పుడేం చేస్తారో తెలియని ఇలాంటి పాలకులను నమ్మి ఎవరైనా ముందుకు పోగలరా ? గడచిరైతొమ్మిదేండ్ల పాలనలో ఒకటి స్పష్టం. పారిశ్రామిక, వాణిజ్యవేత్తల మీద ఉన్న శ్రద్ద, ప్రేమ రైతాంగం మీద లేదు. వారికి ఇచ్చినన్ని రాయితీలు, రద్దు చేసిన రుణాలు రైతులకు లేవు.


ఇప్పటి వరకు పంచదార ఎగుమతుల మీద ఆంక్షలు, పరిమితులు మాత్రమే విధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా నిషేధం విధిస్తూ నేడో రేపో ప్రకటన చేయనుందని ఆగస్టు 23న రాయిటర్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. అంతకు ముందు వచ్చే సీజన్‌లో 40లక్షల టన్నులకు ఎగుమతులు పరిమితం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి చెరకు ఆర్థిక సంవత్సరం ప్రారంభమౌతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో తగినంత వర్షపాతం లేని కారణంగా చెరకు దిగుబడి తగ్గవచ్చని అందువలన పంచదార ధరలు పెరగకుండా ఎగుమతులపై నిషేధం విధించవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు వార్తలో తెలిపింది. సెప్టెంబరు 30వ తేదీ వరకు 61లక్షల టన్నుల పంచదార ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం మిల్లులకు అనుమతి ఇచ్చింది. గత ఏడాదిలో 111లక్షల టన్నుల ఎగుమతికి అనుమతించారు.వచ్చే రెండు సంవత్సరాల్లో దిగుమతి తగ్గవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరో నెల రోజుల్లో ముగియనున్న సంవత్సరంలో పంచదార ఉత్పత్తి 3.6 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా వేయగా 3.28ోట్లకు మించే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. మన దేశం నుంచి ఎగుమతి లేకుంటే ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో పెరిగిన ధరలు మరింత పెరుగుతాయని, బ్రెజిల్‌ ఎగుమతిదారులు మంచి ధరతో లబ్దిపొందుతారని భావిస్తున్నారు.


2022 ఏప్రిల్‌ 13న గుజరాత్‌ రాజధాని అహమ్మదాబాద్‌లో ఒక భవనాన్ని నరేంద్రమోడీ వీడియో ద్వారా ప్రారంభించారు. ఆ సందర్భంగా సందేశమిస్తూ ఉక్రెయిన్‌ యుద్దం తరువాత ఏ దేశానికి ఆ దేశం తన ఆహార భద్రత సంగతి తాను చూసుకుంటోందని తాను ఒకసారి అమెరికా అధినేత జో బైడెన్‌తో మాట్లాడినపుడు ప్రస్తావించానని, ప్రపంచ వాణిజ్య సంస్థ గనుక అనుమతి ఇస్తే ప్రపంచానికి ఆహార ధాన్యాలను సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నాం అని చెప్పినట్లు మోడీ ఆ సందర్భంగా వెల్లడించారు. మన జనానికి సరిపడా ఆహారం ఇప్పటికే మన దగ్గర ఉందని, కానీ మన రైతులను చూస్తుంటే ప్రపంచానికే ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నదని, ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు అనుమతిస్తుందో తెలియదు గానీ మనం మాత్రం ప్రపంచానికి ఆహారం అందించగలం అని నరేంద్రమోడీ చెప్పారు. అదే ఏడాది మేనెల నాలుగవ తేదీన ఐరోపాలోని కోపెన్‌హాగన్‌లో ఒక సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ అక్కడి భారతీయుల సమావేశంలో మాట్లాడుతూ ఆహార ధాన్యాల్లో భారత్‌ స్వయ సమృద్ధి సాధించిందనీ, ఆకలి నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. ప్రపంచ ఆకలి సూచిక 2013లో 78 దేశాల జాబితాలో మనది 63 కాగా శ్రీలంక 43, నేపాల్‌ 49, పాకిస్తాన్‌ 57వ స్థానాలతో మన కంటే ఎగువన ఉన్నాయి. 2022లో 121 దేశాలకు గాను 107వ స్థానంలో మన దేశం ఉంది. శ్రీలంక 64, మయన్మార్‌ 71, నేపాల్‌ 81, బంగ్లాదేశ్‌ 84, పాకిస్తాన్‌ 99 స్థానాల్లో ఉన్నాయి. ఈ వివరాలన్నీ తెలిసిన తరువాత కూడా ప్రపంచ ఆకలి తీరుస్తామని వేదికల మీద చెప్పటం నరేంద్రమోడీకి తప్ప మరొక నేతకు సాధ్యం అవుతుందా ?


ప్రధాని మాటల కొనసాగింపుగా అంతకు ముందు ఏడాది చేసిన 20లక్షల టన్నులను 2022-23లో కోటి టన్నులకు పెంచి గోధుమలను ఎగుమతి చేసే లక్ష్యాన్ని సాధించేందుకు ఇండోనేషియా,ట్యునీషియా, మొరాకో, ఫిలిప్పీన్స్‌,టర్కీ, థాయిలాండ్‌, వియత్నాం, అల్జీరియా, లెబనాన్‌లకు ప్రతినిధి బృందాలను పంపనున్నట్లు మే 12న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రకటించింది.అంతే కాదు, కొన్ని దేశాలకు ఎగుమతులు ప్రారంభమైనట్లు కూడా చెప్పారు. చిత్రం ఏమిటంటే మరుసటి రోజే గోధుమల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. తరువాత సెప్టెంబరు తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చే విధంగా బాస్మతేతర బియ్యం ఎగుమతులపై ఇరవైశాతం ఎగుమతి పన్ను విధించటంతో పాటు, కొద్దిగా ముక్కలైన బియ్యం ఎగుమతులపై కూడా పూర్తి నిషేధం విధించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఓడలకు ఎక్కించేందుకు వివిధ రేవుల్లో ఉన్న ఐదు లక్షల టన్నుల గోధుమలను ఎగుమతిదార్లు వెనక్కు తీసుకువచ్చి మార్కెట్లో అమ్మేందుకు పూనుకోవటంతో మార్కెట్లో పది-పదిహేనుశాతం ధరలు పడిపోయాయి. దాంతో ఎగుమతిదార్ల వత్తిడికి లొంగి రేవుల్లో నమోదైన మేరకు ఎగుమతులు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తరువులను సవరించింది. మొత్తం మీద రైతులు పెద్ద ఎత్తున నష్టపడ్డారు.


ఈ ఏడాది తాజాగా గోధుమ పిండి, మైదా, గోధుమ రవ్వ ఎగుమతులను కూడా నిషేధించింది. అంతే కాదు ఇప్పటికే రష్యా నుంచి తక్కువ ధరలకు ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న మన దేశం ఇప్పుడు గోధుమలను కూడా దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. టన్నుకు 25 నుంచి 40 డాలర్ల వరకు తక్కువకు దిగుమతి చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి. స్థానిక మార్కెట్లో పెరిగిన ధరలను తగ్గించేందుకు అని చెబుతున్నారు. ఇదంతా త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,తదుపరి జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి ధరలను తగ్గించామని జనం ముందు చెప్పుకొనేందుకు తప్ప వేరు కాదన్నది స్పష్టం.. ఉల్లి ధరల పెరుగుదల సూచన కనిపించటంతో వాటి ఎగుమతులపై 40శాతం పన్ను విధించుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.దీంతో నాసిక్‌ ప్రాంతంలోని వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లను నిలిపివేశారు. క్వింటాలు రు.2,410 రూపాయల ధరతో తాము కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పియుష్‌ గోయల్‌ ప్రకటించారు.ఎగుమతులు లేక కేంద్రం దిగుమతులు చేసుకుంటే తాము కొన్న ధరలకంటే మార్కెట్లో తగ్గితే నష్టపోతామన్న భయంతో వారు మానుకున్నారు. ధరలు పెరిగినపుడు కొద్ది నెలలు ఉల్లి తినటం మానుకుంటే సరి అధిక ధరలకు ఎవరు కొనమన్నారు అంటూ మహారాష్ట్ర బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వ మంత్రి దాదా భూసే అన్నారు. 2019లో ఉల్లి ధర కిలో రు.100కు చేరినపుడు నేను ఉల్లిపాయలు తినను అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్న సంగతి తెలిసిందే. ఉల్లి ధరలను ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చిన గతం బిజెపికి గుర్తుకు వచ్చి ముందు జాగ్రత్తపడుతున్నది. కానీ నష్టపోతున్నది రైతులే. ధరలు పతనమైనపుడు కేంద్ర ప్రభుత్వం క్వింటాలు రు.2,410కి కొన్న దాఖలా లేదు. స్వేచ్చామార్కెట్‌లో ఎక్కడ ధర ఎక్కువగా ఉంటే అక్కడే అమ్ముకోవచ్చు, రైతులు కూడా నేరుగా ఎగుమతులు కూడా చేసుకోవచ్చు అందుకే మూడు సాగు చట్టాలు అని బల్లలు చరిచి, ఊరూవాడా తిరిగి మరీ చెప్పారు. వ్యాపారుల నిల్వలతో సహా అన్ని రకాల నియంత్రణలను ఎత్తివేస్తామని రైతులు నేరుగా ఎగుమతులు చేసుకోవచ్చని అరచేతిలో ప్రపంచ మార్కెట్లను చూపారు. ఇప్పుడు ఆ అవకాశాలను ఎందుకు అడ్డుకున్నట్లు ? తమ మీద ఉద్యమించినందుకు రైతుల మీద కక్ష తీర్చుకుంటున్నారా ? మరోవైపున పారిశ్రామిక, సేవా ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహకాలిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతి పన్ను విధించి అడ్డుకుంటున్నారు, రైతులపై ఎందుకీ కత్తి ? పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ఎగుమతి ప్రోత్సాహకాల మాదిరే రైతాంగ ప్రయోజనాలను కాపాడాలా లేదా ? ఎగుమతులకు రాయితీలు ఇచ్చి విదేశీయులకు మన వస్తువులను చౌకగా అందించేందుకు పడుతున్న తాపత్రయంలో నూరోవంతు మన వినియోగదారుల మీద చూపి సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలి తప్ప రైతుల నడ్డి విరవటం ఏమిటి ?


ఏ రోటి దగ్గర ఆ పాట పాడుతున్న బిజెపి పాలకుల విధానాలు తెలియనంత అమాయకంగా జనాలు లేరు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మే సందర్భంగా ప్రభుత్వాలు పాలన కోసం తప్ప వ్యాపారాలు చేసేందుకు కాదని చెబుతారు. అదే కేంద్ర ప్రభుత్వం ఇటీవల టమాటాలను, ఇప్పుడు ఉల్లిపాయలను కూడా రాయితీ ధరలకు ఎన్‌సిసిఎఫ్‌, నాఫెడ్‌ ద్వారా అమ్ముతూ వ్యాపారం చేస్తున్నది. ఇందుకోసం వెచ్చిస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఎక్కడ నుంచి చెల్లిస్తున్నట్లు ? ప్రజల సొమ్మును బిజెపికి ఓట్ల కోసం ప్రభుత్వం ద్వారా ఖర్చు చేస్తున్నారు. ఇటీవల బాస్మతి రకాలు తప్ప మిగిలిన అన్ని రకాల బియ్యం ఎగుమతుల మీద కేంద్రం నిషేధం విధించింది. దాంతో అమెరికాలో మనవారు అక్కడి దుకాణాల మీద ఎగబడి ఎలా కొనుగోలు చేసిందీ చూశాము. కొంత మంది చెబుతున్నదాని ప్రకారం ఇథనాల్‌ ఉత్పత్తిదారుల కోసమే ఈ పని చేశారు. ముక్కలుగా మారిన 50-60లక్షల టన్నుల బియ్యంలో 30లక్షల టన్నులను ఇథనాల్‌కు కేటాయించనున్నట్లు వార్తలు. బియ్యం ఎగుమతులపై నిషేధం రైతాంగానికి నష్టం.తమకు కావాల్సిన బియ్యానికి క్వింటాలుకు రు.3,400 చెల్లించి మరీ కొంటామని అడిగినప్పటికీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించేందుకు కేంద్ర నిరాకరించింది. అదే ప్రభుత్వం పెట్రోలులో కలిపేందుకు తయారు చేసే ఇథనాల్‌కు మాత్రం రు.2,000కే సరఫరా చేస్తున్నది. నీతి అయోగ్‌ రూపొందించిన ఒక పత్రంలో పేర్కొన్న సమాచారం మేరకు 2025-26 నాటికి పెట్రోలులో 20శాతం ఇథనాల్‌ను మిళితం చేయాలని ప్రతిపాదించారు. దీనిలో సగం బియ్యం నుంచి తయారు చేయాల్సి ఉంది.


కేంద్ర ప్రభుత్వం 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిజెపికి లబ్ది చేకూర్చేందుకు ఏటా ఆరువేల రూపాయలను రైతులకు చెల్లించేందుకు ఒక పధకాన్ని ప్రకటించింది.తొలి విడత మొత్తాన్ని 2018 డిసెంబరు నుంచి అమలులోకి వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు కోసం అప్పటి నుంచి ఏటా అరవైవేల కోట్ల మొత్తాన్ని చెల్లిస్తున్నది. ఈ మొత్తాన్ని నరేంద్రమోడీ రైతులకు ఇస్తున్న సాయంగా బిజెపి ప్రచారం చేసుకుంటున్నది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పనంగా ఇవ్వటం లేదు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పేరుతో పేరుతో ప్రతి లీటరు పెట్రోలు మీద రు.2.50, డీజిల్‌ మీద రు.4 సెస్‌ వసూలు చేస్తున్నది.ఆ నిధి నుంచే కిసాన్‌ సమ్మాన్‌ చెల్లింపులు జరుగుతున్నాయి.2021-22 బడ్జెట్‌లో ఈ సెస్‌ ద్వారా వసూలు చేయాల్సిన మొత్తం రు.76,950 కోట్లుగా ప్రతిపాదించారు. అంటే రైతులకు చెల్లించుతున్నదాని కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఎక్సైజ్‌ డ్యూటీ నుంచి సర్దుబాటు చేస్తున్నాం తప్ప వినియోగదారుల మీద అదనపు భారం మోపటం లేదని కేంద్రం వాదిస్తున్నది. అసలు కిటుకు ఏమంటే ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో వసూలు చేసే మొత్తాలలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని నామమాత్రం చేసి సెస్‌ పేరుతో వసూలు చేస్తే సెస్‌ నుంచి ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఆ మేరకు రాష్ట్రాలకు రాబడి తగ్గినట్లే. రైతులకు ఇచ్చే ఎరువుల రాయితీ గురించి గొప్పగా చెబుతున్నారు. కొన్నివేల కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలు, రుణాల రద్దుతో పోల్చితే కోట్లాది మంది రైతాంగానికి ఇస్తున్న మొత్తాలు ఎంత ? నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు రు.73వేల కోట్ల సబ్సిడీ 2022-23లో రెండున్నరలక్షల కోట్లకు పెంచినట్లు ప్రచారం చేస్తున్నారు. పదేండ్ల ఏలుబడిలో ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించటంలో తమ వైఫల్యానికి నరేంద్రమోడీ చెల్లిస్తున్న పరిహారమిది. ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరగటంతో దిగుమతి ఖర్చు పెరిగింది. దాన్ని రైతుల ఉద్దరణ అంటున్నారు. పెరిగిన ధరలతో ఎరువులు కొనాలంటే రైతులు సాగు మానుకోవటం తప్ప మరో దారి ఉండదు. నూటనలభై కోట్ల మందికి ఆహారం అందించే పరిస్థితి ఉండదు గనుక తప్పనిసరై భరిస్తున్నారు.ఈ మొత్తం ప్రతి ఏటా ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2014-15లో రు.75,067 కోట్లు ఇస్తే తరువాత సంవత్సరాలలో వరుసగా 76,538, 74,100, 69,206,73,435 కోట్లు ఇచ్చింది. 2019-20 నుంచి తరువాత మూడు సంవత్సరాల్లో ఆ మొత్తాలు రు.83,468, 1,31,229,1,57,640 కోట్లు చెల్లించింది. దీనికి ప్రధాన కారణం దిగుమతి ఎరువుల ధరల పెరుగుదల ఒకటైతే, రూపాయి విలువ పతనాన్ని నిరోధించలేని అసమర్ధత మరో కారణం. ఈ కారణంగానే సబ్సిడీ పెరిగింది. దిగుమతి ఎరువుల ధరలు తగ్గితే సబ్సిడీని తగ్గించి వేస్తారు.


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి సంవత్సరం 2014-15 నుంచి ఇప్పటి వరకు వివిధ బాంకుల నుంచి రద్దు చేసిన రుణాల మొత్తం రు.14లక్షల 56వేల కోట్లు. దీనిలో సగానికిపైగా మొత్తం బడా పారిశ్రామికవేత్తలు, సేవలందించే కంపెనీలవే ఉన్నాయి.ఈ రుణాలను రద్దు అనకూడదు, పక్కన పెట్టాము, వసూలు చేస్తాము అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతారు. అదేలా ఉంది.2014 ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి నెల వరకు వసూలు చేసిన మొత్తం రు.2.04లక్షల కోట్లు మాత్రమే. బడా సంస్థలకు పన్ను రాయితీల మొత్తం ఎలా ఉందో చూద్దాం.2014-15లో కార్పొరేట్‌ టాక్సు రు.4.3లక్షల కోట్లు ఉండగా అది 2018-19నాటికి 6.6లక్షల కోట్లకు పెరిగింది. తరువాత దాన్ని తగ్గించటంతో 2021-22 నాటికి రు.5.5లక్షల కోట్లకు పడిపోయింది. దిగుమతుల మీద విధించే కస్టమ్స్‌ సుంకం రు.1.9లక్షల కోట్ల నుంచి రు.1.4లక్షల కోట్లకు తగ్గింది. మధ్య తరగతి ఉద్యోగులు ఎక్కువగా చెల్లించే ఆదాయపన్ను మాత్రం ఇదే కాలంలో రు.2.6 నుంచి 5.6లక్షల కోట్లకు పెరిగింది. ఈ కాలంలోనే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మొత్తం పన్నుల్లో కార్పొరేట్‌ టాక్సు వాటా 34.5 నుచి 24.7శాతానికి, కస్టమ్స్‌ పన్ను 15.1 నుంచి 6.1శాతానికి తగ్గగా ఆదాయపన్ను 20.8 నుంచి 25.3శాతానికి పెరిగింది. ఇంతగా కార్పొరేట్ల కొమ్ము కాస్తున్న పాలకులు రైతుల దగ్గరకు వచ్చేసరికి ఎగుమతులపై నిషేధాలతో వారి నడ్డివిరిచేందుకు చూస్తున్నారు. వారి స్వయం ప్రకటిత విధానాలనే పక్కన పెట్టి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదంతా వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, తరువాత లోక్‌సభ ఎన్నికల నాటికి ధరల పెరగకుండా చూసుకోవటం, ఆ ఘనత తమదే అని చెప్పుకొనేందుకు తప్ప మరొకటి కాదు. ఎగుమతుల రద్దు అంటే దాన్ని అవకాశంగా తీసుకొని కృత్రిమ కొరతను సృష్టించి ధరలను పెంచిన గతం పునరావృతం అవుతుందా ?

అర్జెంటీనాకు వామపక్ష వ్యతిరేక మితవాద శక్తుల ముప్పు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


అర్జెంటీనాకు పచ్చి మితవాద శక్తుల ముప్పు ముంచుకువస్తున్నట్లు ఈనెల పదమూడున జరిగిన ప్రాధమిక ఎన్నికల ఓటింగ్‌ తీరుతెన్నులు వెల్లడించాయి. ఫలితాలు అనేక మందిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. కొత్త రాజకీయ చర్చకు తెరతీశాయి. ఆ ఎన్నికల్లో కేవలం రెండు సంవత్సరాల క్రితమే ”స్వేచ్చతో ముందుకు ” (లిబర్టీ అడ్వాన్సెస్‌) అనే పార్టీని పెట్టిన ఆర్థికవేత్త జేవియర్‌ మిలై అగ్రస్థానంలో నిలిచాడు. దేశంలోని 24 ప్రావిన్సులలో పదహారు చోట్ల ఆధిక్యత కనపరిచాడు. ఈ ఎన్నికలలో1.5శాతం కనీస ఓట్లు సాధించిన పార్టీ లేదా కూటమి పార్టీలలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నవారు అక్టోబరు 22న జరిగే అధ్యక్ష, ఉపాధ్యక్ష, పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అర్హులు.మిలైకు 30.04శాతం, మరో మితవాద పార్టీకి 28.28శాతం, ప్రస్తుతం అధికారంలో ఉన్న పెరోనిస్టు ప్రజాతంత్ర, వామపక్ష కూటమికి 27.27శాతం ఓట్లు వచ్చాయి. అర్జెంటీనాలో ఉన్న ఎన్నికల విధానం ప్రకారం ఏ కూటమిలోనైనా ఉన్న పార్టీలన్నీ ప్రాధమిక ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. వారి బలాన్ని బట్టి ఓట్లు తెచ్చుకుంటారు. అధికార పెరోనిస్టు కూటమిలో ఇద్దరు పోటీ చేశారు. ఒకరికి 21.4శాతం, మరొకరికి 5.87శాతం వచ్చాయి. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న దేశ ఆర్థిక మంత్రి సెర్గియో మాసా అక్టోబరు ఎన్నికలలో ఆ కూటమి తరఫున బరిలో ఉంటాడు. మరో మితవాద కూటమిలో ఒకరికి 16.98శాతం, మరొకరికి 11.3శాతం వచ్చాయి. ఎక్కువ తెచ్చుకున్న హౌంమంత్రి పార్టిసియా బుల్‌రిచ్‌(మహిళ) అభ్యర్ధి. వీరుగాక 3.83శాతం తెచ్చుకున్న మరోపార్టీ నేత జువాన్‌ సచియారెటి, వామపక్ష, వర్కర్స్‌ ఫ్రంట్‌ కూటమికి 2.65శాతం ఓట్లు రాగా వారిలో 1.87శాతం తెచ్చుకున్న మిరియం బెర్గమాన్‌ పోటీలో నిలిచాడు. అక్టోబరులో జరిగే ఎన్నికలో ఈ ఐదుగురు అధ్యక్షపదవికి, వారు నిలిపే మరోఐదుగురు ఉపాధ్యక్ష పదవికి అర్హులు.వారిలో 45శాతంపైగా తెచ్చుకున్నవారు ఒకరే ఉంటే ఆ రెండు పదవులకు పోటీ చేసిన వారు నెగ్గినట్లు ప్రకటిస్తారు. అలాగాక 40శాతం తెచ్చుకున్నప్పటికీ విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే రెండవ స్థానంలో ఉన్న అభ్యర్ధికి మొదటి స్థానంలో ఉన్నవారికి తేడా పదిశాతం కంటే ఎక్కువ ఉండాలి. ఒక వేళ ఇద్దరికి 45శాతానికి మించి ఓట్లు వచ్చినా లేక 40శాతం నిబంధన ప్రకారం ఎవరూ నెగ్గకున్నా, ఎక్కువ ఓట్లు వచ్చిన తొలి ఇద్దరి మధ్య నవంబరు 19న రెండవ దఫా ఎన్నిక జరిపి విజేతను ప్రకటిస్తారు. పదహారు సంవత్సరాలకే ఓటింగ్‌ హక్కు ఇచ్చినప్పటికీ 18-70 సంవత్సరాల వయస్సులో ఉన్న వారు విధిగా ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.


2019లో జరిగిన ఎన్నికలలో పెరోనిస్టు కూటమికి చెందిన ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ ప్రాధమిక ఎన్నికల్లో 47.79 శాతం ఓట్లు, తొలిదఫా పోలింగ్‌లో 48.24 శాతం తెచ్చుకోవటంతో రెండవ దఫా అవసరం లేకపోయింది. గత ఎన్నికల్లో ఆరుగురు పోటీ చేశారు. ఈ ఎన్నికలో ఎవరు విజేతగా ఉంటారు అన్నది అక్టోబరు 22న జరిగే పోలింగ్‌లో తేలే అవకాశం కనిపించటం లేదు త్రిముఖ పోటీలో ప్రాధమిక ఎన్నికల్లో వచ్చిన మాదిరి ఓట్లే వస్తే రెండు మితవాద పార్టీల పోరుగా మారుతుంది. అలాగాక మిలై తొలిస్థానంలో కొనసాగి అధికారంలో ఉన్న పెరోనిస్టు కూటమి ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే పోటీ మితవాద-ప్రజాతంత్ర, వామపక్ష కూటమి పోరుగా మారుతుంది. అందువలన అర్జెంటీనా ఎన్నికలు ఒక్క లాటిన్‌ అమెరికాకే కాదు, మొత్తం ప్రపంచానికే ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. అక్కడి ఎన్నికల పద్దతి ప్రకారం పార్లమెంటు ఉభయ సభలకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దిగువ సభలో సగం సీట్లకు, ఎగువ సభలో మూడోవంతు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటు రద్దు కాదు. ఒకసారి ఎన్నికైన వారు ఎగువ సభలో ఆరు సంవత్సరాలు, దిగువ సభలో నాలుగేండ్లు ఉంటారు.ప్రజాప్రతినిధుల దిగువ సభలో రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన సీట్లు ఖరారు చేస్తారు. కనీసం మూడుశాతం తెచ్చుకున్న పార్టీలు, స్వతంత్రులకు దామాషా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు.మూడోవంతు సీట్లలో మహిళలను నిలపాలి. ఎగువ సభకు దేశాన్ని ఎనిమిది భాగాలుగా విభజించారు. ఒక్కో ప్రాంతం నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ముగ్గురిని ఎన్నుకుంటారు. ప్రతి పార్టీ ఇద్దరు అభ్యర్ధులను నిలపవచ్చు, వారిలో ఒకరు మహిళ ఉండాలి. ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి రెండు సీట్లు, రెండవ స్థానంలో ఉన్న పార్టీకి ఒక సీటు కేటాయిస్తారు.


పెరోనిస్టు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కరోనా, ఇతర వైఫల్యాల కారణంగా తలెత్తిన పరిస్థితిని ఉపయోగించుకొని జేవియర్‌ మిలై 2021 పార్లమెంటు ఎన్నికల్లో కొత్త పార్టీతో రంగంలోకి దిగాడు.అక్కడ 113శాతంద్రవ్యోల్బణం ఉంది. వాస్తవ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన అభ్యర్ధిని తాను మాత్రమేనని మిలై చెప్పాడు. తాను అనార్కో కాపిటలిస్టునని చెప్పుకున్నాడు. అతగాడికి కుక్కలంటే తగని మక్కువ. కుక్కల భాషలో మాట్లాడతాడు.ఫైనాన్సియల్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం ఎలా అన్నది తన ఆలోచన అని అందుకుగాను తన దగ్గర ఐదు కుక్కలున్నాయని లేదా అవి పది లేదా ఇరవై కూడా కావచ్చు అని చెప్పాడు. వాటిని వదిలితే తగ్గుతుందన్నాడు. మిలై దృష్టిలో కుక్కలంటే రాజ్యాన్ని పక్కన పెట్టి మొత్తం పెట్టుబడిదారులకు అప్పగించాలని ప్రబోధించే ప్రముఖులు. ఆర్థిక సమస్యలను పరిష్కరించటానికి రాజ్యం ఒక పరిష్కారం కాదు, అదే అసలు సమస్య అని కూడా చెప్పాడు. ఐరోపా సంతతితో ఏర్పడిన అర్జెంటీనా గత శతాబ్ది తొలి రోజుల్లో సంపద్వంతంగా ఉండేదని, ప్రస్తుత దురవస్థకు ప్రభుత్వాల వైఫల్యమే కారణమనేందుకు ఉదాహరణగా ఉందన్నాడు. దేశంలోని మొత్తం రాజకీయ తరగతి అంతా దొంగలని, పన్నులు విధించాలని కోరటం హింసాత్మక చర్య అన్నాడు.” హంతకుడు హంతకుడే, దొంగను దొంగనే అని పిలుస్తాం, వారంతా ఒక సంఘటిత నేరస్థ బృందం.ప్రపంచంలో అతి పెద్ద సంఘటిత నేర సంస్థను రాజ్యం అని పిలుస్తారు. దాన్ని నేను మరో విధంగా ఎందుకు చూడాలి ?” అన్నాడు. ఇతగాడి నోటి దురుసుతనంతో అసంతృప్తితో ఉన్న జనం మద్దతుదారులుగా మారవచ్చు, ఓట్లు వేయవచ్చు. నిజంగా అధికారం వస్తే ఎలా పాలిస్తాడో ఏ తిప్పలు తెచ్చిపెడతాడో అన్న భయాన్ని వెల్లడించేవారు కూడా ఉన్నారు.


ప్రాధమిక ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉన్నట్లు ఫలితాలు వెల్లడి కావటంతో మిలై తన మద్దతుదారులతో మాట్లాడుతూ సంబరాలు చేసుకున్నాడు.రాజకీయ నేతలు మారకపోతే వారిని వదిలించుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుత అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ విధానాల కారణంగా చైనాను అనుమతించి కొన్ని కీలకరంగాలను అప్పగించాడని ఆరోపించాడు. తాను చైనాతో సంబంధాలను తెంచివేస్తానని, కమ్యూనిస్టులతో వ్యాపారం చేయనని అన్నాడు. కమ్యూనిజం ఒక హంతక వ్యవస్థ, సోషలిజం ఆత్మకు పట్టిన జబ్బు అన్నాడు. తాను అధికారానికి వచ్చిన తరువాత దేశ రిజర్వుబాంకును రద్దు చేస్తానని, ప్రభుత్వ ఖర్చు కోత పెడతానని, పతనమౌతున్న దేశ కరెన్సీ పెసోను రద్దు చేసి కొన్ని దేశాలు అమలు చేసిన మాదిరి అమెరికా డాలరును చట్టబద్దమైన కరెన్సీగా ప్రకటిస్తానని చెప్పాడు. విధిగా పాఠశాలల్లో లైంగిక విద్య బోధన జరపాలన్న గత ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేస్తానని అన్నాడు. ప్రాధమిక ఎన్నికల ఫలితాలు వెలువడినందున ప్రజాస్వామ్య అనుకూల, ప్రజల వాణి గురించి అసలైన ప్రచారం ఇప్పుడు ప్రారంభం అవుతుందని ప్రస్తుత అధ్యక్షుడు ఫెర్నాండెజ్‌ ప్రకటించాడు. గతంలో తీసుకున్న ప్రజానుకూల కార్యక్రమాలు, హక్కుల రక్షణకు తాము ఐక్యంగా పని చేస్తామని అన్నాడు. మరోసారి అర్జెంటీనా మితవాద శక్తుల చేతుల్లోకి పోకుండా చూడాలన్నదే తన ఆందోళన అన్నాడు.


ప్రాధమిక ఎన్నికల్లో మిలై మొదటి స్థానంలో ఉన్నట్లు ఫలితాలు వెల్లడికావటంతో అర్జెంటీనా స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. రిజర్వుబాంకు వడ్డీ రేట్లను 21శాతం పెంచింది. కరెన్సీ విలువను 18శాతం తగ్గించింది. రుణాల చెల్లింపుల గండం నుంచి బయట పడేందుకు 44బిలియన్‌ డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌తో ప్రభుత్వం ప్రారంభించిన చర్చల్లో తాను కూడా భాగస్వామిని అవుతానని మిలై ప్రకటించాడు. గత నెలలో జరిపిన సమీక్షల తరువాత ఏడున్నర బిలియన్‌ డాలర్ల రుణాన్ని విడుదల చేసేందుకు ఐఎంఎఫ్‌ అంగీకరించింది. లాటిన్‌ అమెరికాలో వివిధ దేశాలలో నిరంకుశ, మితవాద శక్తులకు వ్యతిరేకంగా ఎన్నికల్లో విజయాలు సాధించిన వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు గత పునాదులను అలాగే ఉంచి వాటి మీదనే సామాన్య జనానికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో వరుసగా రెండు, మూడు సార్లు గెలుస్తూ వచ్చారు. అయితే వాటికి ఉన్న పరిమితులు వెల్లడి కావటంతో జనంలో తలెత్తిన అసంతృప్తి కారణంగా తిరిగి మితవాద శక్తులు తలెత్తుతున్నాయి. లాటిన్‌ అమెరికా నయా ఉదారవాద విధానాల ప్రయోగశాల. వాటి దివాలాకోరు తనంతో జన జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. దాంతో జనం వాటిని వ్యతిరేకించే శక్తులకు పట్టం గట్టారు. అర్జెంటీనాలో కూడా జరిగింది అదే. ఆ శక్తులు మౌలిక విధానాల మార్పుల జోలికి పోని కారణంగా జన జీవితాల్లో మౌలిక మార్పులు రాలేదు. అర్జెంటీనాలో ప్రస్తుతం 45శాతం జనం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. గతేడాది వార్షిక ద్రవ్యోల్బణం వందశాతానికి చేరింది. ప్రభుత్వం వద్ద నగదు నిల్వలు లేవు. దశాబ్దికాలంగా జిడిపి ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది.కరెన్సీ విలువ పతనమైంది. అప్పుల మీదనే దేశం నడుస్తోంది. ఈ కారణంగానే మితవాద ఆర్థికవేత్త కూడా అయిన మిలై చేస్తున్న సైద్దాంతికపరమైన దాడికి నూతన తరం ఆకర్షితమౌతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న వాటన్నింటినీ రద్దు చేసి మొత్తం బాధ్యత అంతటినీ మార్కెట్‌ శక్తులకు వదలి వేస్తే అవే సమస్యలను పరిష్కరిస్తాయంటూ అరచేతిలో స్వర్గం చూపుతున్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌, బ్రెజిల్‌ మితవాది బోల్సనారో బాటలో తాను దేశాన్ని నడిపి ఫలితాలను చూపుతానని నమ్మబలుకుతున్నాడు.


మార్కెట్‌ అనుకూల మిలై వాగాడంబరానికి మితవాద శక్తులు మద్దతు ఇస్తున్నాయి. 2015 నుంచి 2019వరకు మధ్యేవాద మితవాద కూటమిగా వర్ణించిన శక్తులు అధికారంలో ఉన్నాయి. ఆ శక్తుల వైఫల్యంతో అంతకు ముందు రెండు సార్లు అధికారంలో ఉన్న వామపక్ష పెరోనిస్టు శక్తులకు 2019లో జనం తిరిగి పట్టం కట్టారు. కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌, మరింత దిగజారిన ఆర్ధిక వ్యవస్థ కారణంగా జనంలో ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి తలెత్తింది. ఏ ప్రభుత్వమైతే పెద్ద ఎత్తున సబ్సిడీలు, నగదు బదిలీ చేసిందో ఆ లబ్ది పొందిన పేదలు కూడా దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మితవాద మిలైకి ఓటువేసినట్లు స్పష్టమైంది. ఇప్పుడున్న వ్యవస్థను సమూలంగా కూలగొడితే తప్ప జీవితాలు బాగుపడవు అంటున్న మితవాద మిలై విప్లవాత్మక మార్పులను నిజంగా తెస్తాడని, మరొక మార్గం లేదని జనం భ్రమలకు గురైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వాలు చేయలేనిదానిని చేసి చూపుతానని మిలై జనాన్ని నమ్మించేందుకు చూస్తున్నప్పటికీ అతని విజయం అంత తేలిక కాదని భావిస్తున్నవారు కూడా లేకపోలేదు. ప్రాధమిక ఎన్నికల్లో విధిగా ఓటు వేయాలన్న నిబంధన లేని కారణంగా మూడో వంతు మంది అసలు ఓటింగుకే రాలేదని, మిలై అధికారానికి వస్తే రాగల ప్రతికూల పరిణామాల గురించి చర్చ రానుందని అప్పుడు అతని పలుకుబడి తగ్గవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. పెరోనిస్టులు ఇటీవలి సంవత్సరాల్లో చీలిపోయారని, మితవాద ముప్పు గ్రహించి తిరిగి ఏకం కావచ్చని చెబుతున్నవారూ లేకపోలేదు. ఏమైనప్పటికీ మితవాద ముప్పును తక్కువ అంచనా వేయలేము. నయా ఉదారవాద విధానాలకు శస్త్ర చికిత్స తప్ప పై పూతలతో దాన్ని సంస్కరించి ప్రజానుకూలంగా మార్చలేరన్నది గ్రహించాల్సి ఉంది.

పదేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి : కొనసాగుతున్న రూపాయి పతనం-నిరోధానికి చేసింది శూన్యం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకే విధానాలను అనుసరిస్తూ ఎదుటి వారిని వేలెత్తి చూపితే అవకాశం వచ్చినపుడు అవే వేళ్లు మనవైపు తిరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ స్పృహ ఉండదని గతంలో అనేక ఉదంతాలు వెల్లడించాయి. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి నేతలకూ అదే పరిస్థితిని రూపాయి తెచ్చింది. ” రూపాయి అగాధంలో పడుతుందా దాని కంటే ఎక్కువ లోతులో కాంగ్రెస్‌ పడుతుందా అన్న పోటీ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి దేశ భద్రత గురించిగానీ అదే విధంగా రూపాయి పతనం గురించి గానీ పట్టలేదు. దాని కుర్చీని కాపాడుకోవటం గురించే ఆందోళన పడుతోంది. డాలరుతో మారకంలో రూపాయి పతనం అవుతోంది. కాంగ్రెస్‌ కారణంగా అది ఐసియులో ఉంది. ” రూపాయి పతనం గురించి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్రమోడీ ట్వీట్లు, సభలలో చేసిన విమర్శలివి.2013-14లో రూపాయి ఒక డాలరుకు రు. 56-62 మధ్య కదలాడింది. ఇప్పుడు కొత్త రికార్డు నెలకొల్పి రు. 83 దాటింది.

తాము అధికారానికి వస్తే రూపాయి విలువను రు.45కు పెంచుతామని నాడు బిజెపి చెప్పింది. ” గత మూడు నెలలుగా రూపాయి పతనం వేగంగా జరుగుతోంది. దాన్ని బలపరిచేందుకు కేంద్రం ఏ చర్యలూ చేపట్టలేదు. ఇలా రూపాయి పతనం అవుతుంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయి.ఇంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంటుందని దేశం ఎన్నడూ ఊహించలేదు.కానీ అలాంటి సంక్షోభంలో నాయకత్వం దిక్కుతోచకుండా ఉంది.దీంతో ఆశ సన్నగిల్లుతోంది.పౌరుల్లో విశ్వాసాన్ని నింపేందుకు ఎలాంటి చర్యలనూ కేంద్రం తీసుకోలేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి మూడునెలలకు ఒకసారి ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని కేంద్రం చెప్పటాన్ని వింటున్నాంగానీ జరిగిందేమీలేదు. ” అని బిజెపి ఎన్నికల ప్రచారకమిటీ నేతగా మోడీ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం 2022 జూలై 11న పార్లమెంటులో అంగీకరించినదాని ప్రకారం గడచిన ఎనిమిది సంవత్సరాల్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ రు.16.08(25.39శాతం) పతనమైంది. ఆరోజు మారకపు విలువ రు.79.41గా ఉంది. ఇప్పుడు 83 దాటింది. డాలరుతో మారకంలో అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నపుడు మనది ఎలా తగ్గకుండా ఉంటుందని పాలకపార్టీ నేతలు వాదనలు చేస్తున్నారు. ఇతర కరెన్సీలతో విలువ తగ్గలేదంటున్నారు. ప్రధాన కరెన్సీలతో 2014-2023లో ఆగస్టు 19నాటి రూపాయి విలువలు ఎలా ఉన్నదీ చూస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుంది. 2014 ఏడాదిలో సగటు విలువ అని గమనించాలి.
కరెన్సీ ×××××× 2014 ××× 2023
డాలరు ×××××× 60.99 ××× 83.15
రూబుల్‌ ×××××× 1.61 ××× 0.88
పౌండ్‌ ××××××100.45 ××× 105.89
యువాన్‌్‌ ××××× 9.90 ××× 11.42
యన్‌్‌ ××××× 0.57 ××× 0.57
యూరో ××××× 81.04 ××× 90.57


డాలరు విలువ పెరిగింది తప్ప మన రూపాయి విలువ తగ్గలేదు, ఇతర కరెన్సీల కంటే మనది పటిష్టంగా ఉంది, ఇతర కరెన్సీల విలువలు కూడా పడిపోతున్నాయంటూ సమర్ధించుకొనేందుకు, జనాన్ని నమ్మించేందుకు బిజెపి మంత్రులు, నేతలు చూస్తున్నారు. దాని వలన మనకు ఒరిగేదేమిటి ? పైన పేర్కొన్న పట్టిక ప్రకారం ఒక్క జపాన్‌ కరెన్సీ ఎన్‌తో మాత్రమే మన రూపాయి విలువలో మార్పు లేదు. మిగిలిన కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి పతనమైంది. మన కంటే దరిద్రంగా ఉన్న దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే మనది పెరగవచ్చు. ఉదాహరణకు పాక్‌ రూపాయి. 2014లో దాని విలువ 1.70 కాగా ఇప్పుడు 0.28కి పడిపోయింది. పాకిస్తాన్‌ నుంచి సరకులు దిగుమతి చేసుకుంటే మనకు కారుచౌక. మన దేశం నుంచి వారు దిగుమతి చేసుకుంటే భారం పెరుగుతుంది. ప్రధాన కరెన్సీలతో కూడా పతనం అన్నది వాస్తవం. డాలరు విలువ పెరిగింది, మనది తగ్గలేదు అని చెబుతున్న వారు ఇప్పుడున్న మారకం రేటుతో డాలర్లను కొంటారా లేక 2014నాటి రేట్లతో కొనుగోలు చేస్తారా ? ఒన్‌ ఇండియా డాట్‌ కామ్‌లో 2020 ఆగస్టు 14న ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 2005 జనవరిలో రు.43.47 గా ఉన్నది 2014 మే నెలలో రు.59.44గా ఉంది. పతనం పదహారు రూపాయలు. ఇప్పుడు రు.83 అనుకుంటే మోడీ ఏలుబడిలో రు.24 తగ్గింది. మనది ఎగుమతి చేసే దేశమైతే మన కరెన్సీ పటిష్టంగా ఉంటే మనకు లాభం, దిగుమతులైతే డాలర్లు, ఇతర కరెన్సీల కోసం మనం ఎక్కువ రూపాయలు చెల్లించాలి.రాయితీ రేట్లకు మనం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం. వారికి డాలర్లలో చెల్లించేందుకు వీలు లేదు గనుక మన చమురు శుద్ధి సంస్థలు ఇటీవల చైనా యువాన్లలో చెల్లిస్తున్నాయి. అంటే మనం డాలర్ల బదులు యువాన్లు కొనుగోలు చేస్తున్నాం.మన కంటే ముందే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఎప్పటి నుంచో యువాన్లు చెల్లిస్తున్నాయి.


తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో రూపాయి విలువ పతనంలో కొత్త రికార్డులను తాకింది. ఇంకా పతనం కావచ్చని చెబుతున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గించాలంటే అక్కడ వడ్డీ రేటు పెంచటాన్ని మార్గంగా విధాన నిర్ణేతలు ఎంచుకున్నారు. దాంతో అమెరికా డాలరు రుణాల మీద వచ్చే వడ్డీ ఎక్కువగా ఉండటంతో ప్రపంచంలో ఉన్న డాలర్లన్నీ అక్కడకు చేరుతున్నాయి.దాని విలువ పెరుగుతోంది.మనతో అనేక కరెన్సీల మీద ప్రతికూల ప్రభావం పడుతోంది. మరికొంత కాలం అమెరికా వడ్డీ రేటు ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. అంటే మన కరెన్సీ విలువ ఇంకా పతనం కావచ్చు.మన ఎగుమతులు దిగుమతుల కంటే తక్కువగా ఉన్నందున మనకు నష్టం. డాలరుతో చైనా కరెన్సీ విలువ కూడా తగ్గింది. అది చైనాకు వరంగా మారింది. దాని ఎగుమతులు ప్రపంచంలో తక్కువ ధరకు అమ్ముడుపోతాయి. ఎగుమతి సామర్ధ్యం పెరుగుతుంది.మన ఎగుమతులకు పోటీ పెరుగుతుంది. వాణిజ్య లోటు పెరిగితే మన రూపాయి మరింత బలహీనమౌతుంది.మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనం గల అనేక మంది స్విస్‌ బాంకుల్లో డబ్బుదాచుకుంటారని తెలిసిందే. వాటిని రక్షిత స్వర్గాలు అని పిలుస్తారు. అంటే స్విస్‌ కరెన్సీ ఫ్రాంక్‌లోకి డబ్బును మార్చుకొని ఆస్తులు కొనుగోలు లేదా బాంకుల్లో డబ్బు దాచుకుంటారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో ఒక స్విస్‌ ఫ్రాంక్‌కు మన కరెన్సీ మారకపు విలువ ఏడాది సగటు రు.66.68. అది ఇప్పుడు ఆగస్టు 19న రు.94.28గా ఉంది. అంటే మన కరెన్సీ పతనమౌతున్న కొద్దీ నగదు వ్యాపారులు డాలర్లు లేదా ఫ్రాంక్‌లో తమ డబ్బును దాచుకునేందుకు ఎగబడతారు. దాంతో వాటి విలువ మరింత పెరుగుతుంది. ఎగబడే దేశాల కరెన్సీ విలువ పతనమౌతుంది. ఇప్పుడు మన రూపాయి ఈ సమస్యనే ఎదుర్కొంటోంది. పదేండ్ల క్రితం విమర్శలు చేసిన నరేంద్రమోడీ లేదా ఇతర బిజెపి నేతలు ఇప్పుడు నోటికి తాళం వేసుకొని పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారు. మన కరెన్సీ విలువను పెంచేందుకు అంటే పదేండ్ల క్రితం బిజెపి చెప్పినట్లు రు.45కు తగ్గించేందుకు పూనుకుంటే మన ఎగుమతిదార్లు గగ్గోలు పెడతారు, దిగుమతిదార్లు సంతోషిస్తారు. అదే పతనాన్ని అనుమతిస్తే దానికి భిన్నంగా స్పందన ఉంటుంది.


2013 నాటి పతనానికి ఇప్పటి పతనానికి పోలిక సరైంది కాదు అని కొందరు ఆర్థికవేత్తలు కూడా చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో కొన్ని కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలపడిందని కూడా ఉదాహరణలు చూపారు. అలా జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జనానికి కావలసింది రూపాయి బలపడితే లేదా పతనమైతే జనం మీద మన ఖజానా మీద చూపిన అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఏమిటన్నది గీటురాయి. రెండురెళ్లు నాలుగు అన్నట్లుగా మన ఎగుమతులు పెరిగితే మనకు లాభం, దిగుమతులు పెరిగితే నష్టం. అన్ని అనర్ధాలకు కారకులు గత యుపిఏ పాలకులు అని ఊరూవాడా ప్రచారం చేశారు. మేకిన్‌ ఇండియా, మేక్‌ ఇండియా పేరుతో పెద్ద ఎత్తున ఎగుమతులు చేసి చైనా స్థానాన్ని ఆక్రమిస్తామన్నారు. కానీ జరిగిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2022-23లోని గణాంకాల అనుబంధం పేజీ 108,109లో ఇచ్చిన సమాచారం ఏమి చెబుతున్నదో ఎవరైనా చూడవచ్చు.2003-04 (వాజ్‌పాయి సర్కార్‌ చివరి సంవత్సరం)లో మన దేశ ఎగుమతుల విలువ రు.2,93,367 కోట్లు కాగా యుపిఏ చివరి సంవత్సరం 2013-14 నాటికి అవి రు.19,05,011కోట్లకు చేరాయి. అదే నరేంద్రమోడీ ఏలుబడిలో 2021-22 నాటికి రు.30,47,021కు చేరాయి.ఎవరు ఎంత వృద్ధి సాధించినట్లు ? ఏ స్కూలు విద్యార్ధిని అడిగినా కాంగ్రెసే అని వెంటనే చెప్పేస్తారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో దేశం పరువు పోయిందని, విదేశాలు తిరిగి తమ నేతి తిరిగి తెచ్చారని చెప్పుకుంటున్న బిజెపి నేతలు మన ఎగుమతులకు మార్కెట్లను ఎందుకు సంపాదించలేకపోయారో చెప్పగలరా ?


మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం మేరకు 2004 నుంచి 2013 వరకు పది సంవత్సరాల్లో సగటున మన జిడిపిలో 22.09 శాతం విలువగల వస్తు,సేవల ఎగుమతులు జరిగాయి. 2014 నుంచి 2021వరకు ఎనిమిది సంవత్సరాల సగటు 19.85శాతమే ఉంది. నరేంద్రమోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారని, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు, ఎగుమతి ప్రోత్సాహకాలు, భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తెచ్చారని, సులభతర వాణిజ్య సూచికను ఎంతగానో మెరుగుపరిచారని చెప్పిన కబుర్లు, ప్రచారం ఏమైనట్లు ? ఎగుమతుల శాతం ఎందుకు తగ్గినట్లు ?

మూడు నెలల్లో పాక్‌ ఎన్నికలు- అమెరికా కుట్రతో ఇమ్రాన్‌ ఖాన్‌ జైలుకు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆగస్టు పదవ తేదీన పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సిఫార్సు చేశారు. దాన్ని ఆమోదించిన అధ్యక్షుడు అరీఫ్‌ అల్వీ పద్నాలుగవ తేదీన తాత్కాలిక ప్రధానిగా అన్వార్‌ ఉల్‌ హక్‌ కాకర్‌ చేత ప్రమాణస్వీకారం చేయించారు. పాక్‌ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ రద్దు తరువాత ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు నెలల్లోగా ఎన్నికలు జరగాలి, ఆ మేరకు నవంబరు ఎనిమిదవ తేదీ లోపు ఎన్నికలు జరిపి కొత్త సభ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బలూచిస్తాన్‌ అవామీ పార్టీ ప్రతినిధిగా గెలిచిన అన్వర్‌ పేరును అధికార, ప్రతిపక్షం రెండూ సిఫార్సు చేశాయి. గత ఏడాది అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్‌ ఖాన్‌ మీద అవినీతి కేసు మోపి మూడేండ్ల జైలు శిక్ష విధించి ఆగస్టు ఐదవ తేదీన జైలుకు పంపారు. ఐదు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ఎన్నికల సంఘం ప్రకటించింది. మాజీ క్రెకెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీచ్యుతి, అరెస్టు, జైలుకు పంపటం వెనుక పాక్‌ మిలిటరీని లోబరుచుకున్న అమెరికా కుట్ర ఉన్నట్లు కొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. విధించిన శిక్ష మీద ఉన్నత న్యాయస్థానానికి చేసుకున్న అప్పీలు ఎప్పటికి పరిష్కారం అవుతుందో చెప్పలేము. ఎన్నికల లోపు తీర్పు వచ్చే అవకాశం లేదు.తనకు శిక్ష విధించటం ప్రజాస్వామ్యం మీద దాడిగా ఇమ్రాన్‌ ఖాన్‌ వర్ణించాడు.ప్రధానిగా విదేశీ పర్యటనలు జరిపినపుడు అక్కడ ప్రభుత్వాలు అందచేసిన కానుకల వివరాలను వెల్లడించకుండా అక్రమాలకు పాల్పడినట్లు కేసు దాఖలు చేశారు. తాను చెప్పేది వినకుండా శిక్ష విధించారని ఖాన్‌ పేర్కొన్నాడు.


2018 జూలై 25న జరిగిన ఎన్నికలలో 31.82 శాతం ఓట్లు 342 స్థానాలకు గాను 149 తెచ్చుకొని పెద్ద పార్టీగా ఎన్నికై స్వతంత్రులు, చిన్న పార్టీల వారి మద్దతుతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఈఏడాది మే నెలలో జరిగిన సర్వే ప్రకారం పాక్‌ ఎన్నికల్లో 45శాతం ఓట్లతో ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహరిక్‌ పార్టీ(పిటిఐ) ముందున్నట్లు తేలింది.తరువాత 22, 13శాతాలతో ముస్లింలీగ్‌, పీపుల్స్‌ పార్టీ ఉంది. పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఈ ఏడాది 336 స్థానాలున్నాయి. వీటికి మూడు పద్దతుల్లో సభ్యులను ఎన్నుకుంటారు. సాధారణ స్థానాల్లో మన దేశంలో మాదిరి 266 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. వాటిలో రాష్ట్రాలలో వచ్చిన స్థానాలను బట్టి దామాషా ప్రాతిపదికన మహిళలకు రిజర్వుచేసిన 60 స్థానాలను కేటాయిస్తారు. మరో పదింటిని మొత్తంగా వచ్చిన సీట్లలో దామాషా ప్రాతిపదికన ముస్లిమేతరులుకు అవకాశమిస్తారు. గత ఎన్నికలలో మొత్తం 14 పార్టీలకు ప్రాతినిధ్యం వచ్చింది. ఇమ్రాన్‌ ఖాన్ను జైలుకు పంపటం, అనర్హుడిగా ప్రకటించటంతో వచ్చే ఎన్నికల్లో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఏ పార్టీ అధికారానికి వచ్చినా అది పాక్‌ మిలిటరీ కనుసన్నలలో నడవాలనేది గత 76 సంవత్సరాల అనుభవం వెల్లడించింది. పాక్‌ మిలిటరీ అమెరికా కీలుబొమ్మగా ఉందని, అమెరికాను వ్యతిరేకించే శక్తులను సహించరని తాజాగా ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీచ్యుతి ఉదంతంలో కూడా తేటతెల్లమైంది. పాకిస్తాన్ను పక్కన పెట్టి మనదేశాన్ని అమెరికా చంకనెక్కించుకుందన్న ప్రచారం కూడా వాస్తవం కాదని, చైనాను దెబ్బతీసేందుకు గాను మనతో వ్యవహరిస్తోందని అమెరికాలో పాక్‌ రాయబారి అసాద్‌ మజీద్‌ ఖాన్‌ తమ ప్రభుత్వానికి పంపిన వర్తమానం వెల్లడించింది.


ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీచ్యుతి వెనుక అమెరికా హస్తం ఉన్నట్లు అమెరికాకు చెందిన ఇంటరెసెప్ట్‌ అనే మీడియా సంస్థ తనకు దొరికిన పాక్‌ అధికారిక పత్రాలను ప్రచురించింది.ఆ పత్రం వాస్తవమైనదే అని ఇమ్రాన్‌ ఖాన్‌ తరువాత పదవిలోకి వచ్చిన షెహబాజ్‌ షరీఫ్‌ అంగీకరించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభంపై పాకిస్తాన్‌ తటస్థవైఖరిని తీసుకోవటాన్ని రష్యా అనుకూల వైఖరిగా అమెరికా పరిగణించింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా పాక్‌ నిలవాలని అంతకు ముందే ఐరోపా దేశాల రాయబారులు బహిరంగంగా పిలుపునిచ్చారు. గతేడాది మార్చి ఆరవ తేదీన అమెరికా-పాక్‌ అధికారుల సమావేశం జరిగింది. దానికి ఒక రోజు ముందే ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఐరోపా రాయబారుల మీద స్పందిస్తూ ” మేము మీకేమైనా బానిసలమా ? మా గురించి మీరేమనుకుంటున్నారు ? మేం బానిసలమని, మీరేమి కోరితే మేమది చేయాలని అనుకుంటున్నారా ? మేము రష్యా స్నేహితులం, మేము అమెరికాకూ స్నేహితులమే, మేము చైనా, ఐరోపాకూ స్నేహితులమే, మేము ఎవరి కూటమిలోనూ లేము ” అని స్పష్టం చేశాడు. ఈ మాటలు అమెరికా అహాన్ని దెబ్బతీశాయి. దశాబ్దాల తరబడి తమ కనుసన్నల్లో నడుస్తున్న పాకిస్తాన్‌ ఇలా మాట్లాడటమా అని రగిలిపోయింది. అప్పటికే అమెరికా రంగంలోకి దిగిన అంశం గురించి తెలుసుకున్నకారణంగానే ఇమ్రాన్‌ఖాన్‌ ఇలా బహిరంగంగా స్పందించారన్నది స్పష్టం.


పాక్‌-అమెరికా అధికారులు సమావేశమైన నెల రోజుల తరువాత ఖాన్‌ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు, పదవి నుంచి తప్పించారు. అప్పటి నుంచి కొద్ది రోజుల్లోనే పాక్‌ విదేశాంగ వైఖరి మారిపోయింది. ఉక్రెయిన్‌ వివాదంలో అమెరికా, ఐరోపా పక్షాన చేరింది. అంతే కాదు, ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాలు, మందుగుండును తయారు చేసి పంపుతున్నది. ఆగస్టు మూడవ తేదీన వచ్చిన వార్తల ప్రకారం అమెరికాతో పాకిస్తాన్‌ ఒక రక్షణ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. దాని ప్రకారం సంయుక్త మిలిటరీ విన్యాసాలు, శిక్షణ, మిలిటరీ పరికరాల సహకారం ఉంటుంది. గత ఏడాది ఏప్రిల్‌ పదిన ఇమ్రాన్‌ ఖాన్‌ పదవి కోల్పోయారు. అప్పటి వరకు 2018 నుంచి ఉన్న నిషేధాన్ని సడలించి అదే ఏడాది సెప్టెంబరు నెలలో 45 కోట్ల డాలర్లతో పాకిస్తాన్‌ వద్ద ఉన్న అమెరికా గతంలో అమ్మిన ఎఫ్‌ 16 యుద్ధ విమానాలను నవీకరించేందుకు అమెరికా ఒప్పందం చేసుకుంది. దానికి ఉగ్రవాదం మీద పోరుకు సిద్దంగా ఉండేందుకు అని సాకు చెప్పారు. నిజానికి ఉగ్రవాదుల మీద విమానాలతో దాడి చేసి నిర్మూలించిన చరిత్ర పాకిస్తాన్‌కు గానీ అమెరికాకు గానీ లేదు. ఇరుగుపొరుగున ఉన్న దేశాలలో ఒక్క మన మీదనే పాక్‌ గతంలో యుద్ధానికి దిగింది. ఇప్పుడు ఏ ఇతర దేశం మీద అది పోరుకు దిగే అవసరమూ లేదు, అలాంటి ఆలోచనా లేదు. అవసరమైతే ఆ విమానాలు మన మీద దాడికే అన్నది స్పష్టం. అది అమెరికాకు తెలియందీ కాదు.


ఇక పాక్‌ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం గురించి చూస్తే ఇమ్రాన్‌ ఖాన్‌ మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గితే అంతకు ముందు ఖాన్‌కు మద్దతు ఇచ్చిన వారందరినీ క్షమించి వేస్తామని అమెరికా అధికారి చెప్పినట్లు పాక్‌ రాయబారి పంపిన వర్తమానంలో ఉంది.అవిశ్వాస తీర్మాన సమయానికే పాక్‌ మిలిటరీతో అధికార పార్టీ వివాదంలో ఉంది. పాక్‌ రాయబారి అసాద్‌ మజీద్‌ ఖాన్‌తో జరిపిన సమావేశానికి దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా సహాయ మంత్రి డోనాల్డ్‌ లు, మరో అధికారి వచ్చారు. ఆ సమావేశంలో డోనాల్డ్‌ లు మాటల సారం ఇలా ఉంది. ఉక్రెయిన్‌ అంశంలో పాక్‌ వైఖరి అమెరికా, ఐరోపాకు ఆందోళన కరంగా ఉంది. తటస్థం అని చెప్పుకోవచ్చుగాని అలా కనిపించటం లేదు. ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం నెగ్గితే రష్యా పర్యటనను కేవలం ప్రధాని తీసుకున్న నిర్ణయంగా పరిగణించి మిగతా అందరినీ అమెరికా క్షమించి వేస్తుంది. లేకుంటే గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. ఐరోపా దీన్ని ఎలా చూస్తుందో చెప్పలేము, నేననుకోవటం వారి స్పందన కూడా ఇలాగే ఉంటుంది. ఖాన్‌ గనుక అధికారంలో గనుక కొనసాగితే ఐరోపా, అమెరికా అతన్ని ఒంటరిపాటు చేస్తాయి. అమెరికా అధికారి మాట్లాడిన దాని మీద పాక్‌ రాయబారి స్పందన సారం ఇలా ఉంది. అమెరికా నేతల నుంచి ఎలాంటి స్పందన, సంప్రదింపులు లేవు.దీన్ని బట్టి మారు మాట్లాడకుండా మీకు అవసరమైన వాటన్నింటికీ పాకిస్తాన్‌ మద్దతు పలుకుతుందనే భావనలో మీరున్నట్లు, మమ్మల్ని ఖాతరు చేయటం లేదని మావారు అనుకున్నారు. ఉక్రెయిన్‌-రష్యా పోరు మన సంబంధాల మీద ప్రభావం చూపదు. దీని మీద లూ మాట్లాడుతూ మీరు అనుకుంటే అనుకున్నారు కొంత నష్టం జరిగినా అదేమీ పెద్దది కాదులే.ఖాన్ను సాగనంపిన తరువాత మన సంబంధాలు తిరిగి మామూలు స్థితికి చేరతాయి. ఇప్పటికే కొంత దెబ్బ తగిలింది. కొద్ది రోజుల్లో మీ దేశ రాజకీయ పరిస్థితి మారుతుందో లేదో చూద్దాం.మారితే ఈ సమస్య గురించి మాకు పెద్ద విబేధాలేమీ ఉండవు, లేదో దీని సంగతి తేల్చుకోవాల్సి ఉంటుంది, ఎలా అదుపులోకి తేవాలో నిర్ణయిస్తాం అన్నాడు. ఈ సమావేశం జరిగిన తరువాత మార్చి ఎనిమిదవ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టారు. నెల రోజుల తరువాత అమెరికా జోక్యం గురించి ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగంగానే తన మద్దతుదారులతో సభలో చెప్పాడు. అయితే తమ జోక్యం అన్నది ఆరోపణ తప్ప వాస్తవం కాదని అమెరికా ఖండించింది.


పాక్‌ రాయబారి పంపిన వర్తమానం గురించి అనధికారికంగా వెల్లడి కావటంతో పత్రికల్లో చర్చ మొదలైంది. ఇమ్రాన్‌ ఖాన్‌కు జనంలో ఆదరణ పెరిగింది, అమెరికా, ఐరోపా వ్యతిరేకత కనిపించింది. దాంతో మిలిటరీ రంగంలోకి దిగింది.అధికారిక రహస్యాలను వెల్లడించినా, ప్రచురించినా, మిలిటరీని విమర్శించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎలాంటి వారంట్లు లేకుండానే తనిఖీలు చేస్తామని, దీర్ఘకాల జైలు శిక్షలుంటాయని, రాజకీయ, పౌర అంశాల్లో మిలిటరీ అధికారులకు అపరిమిత అధికారాలను ఇస్తున్నట్లు హెచ్చరికలను జారీ చేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌కు మద్దతుగా రాసినా, చివరికి అతని పేరును పదే పదే ప్రస్తావించినా సంగతి తేలుస్తామని మీడియా సంస్థలకు వర్తమానాలు పంపినట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు ఖాన్‌ మద్దతుదారుగా భావిస్తున్న ఒక ప్రముఖ జర్నలిస్టు అర్షాద్‌ షరీఫ్‌ ఈ ఆంక్షలతో దేశం విడిచి వెళ్లాడు. అక్టోబరు నెలలో నైరోబీలో అతన్ని కాల్చి చంపారు. ఎలా, ఎందుకు జరిగిందో ఇంతవరకు వెల్లడికాలేదు.మరో జర్నలిస్టు ఇమ్రాన్‌ రియాజ్‌ ఖాన్ను మే నెలలో ఒక విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతని ఆచూకీ ఇంతవరకు వెల్లడి కాలేదు. గతేడాది నవంబరులో అసలు ఇమ్రాన్‌ ఖాన్‌ మీదనే జరిగిన హత్యాయత్నంలో ఒక మద్దతుదారు మరణించిన సంగతి తెలిసిందే.


పాక్‌ రాయబారి వర్తమానంలో మన దేశం గురించి కూడా అమెరికాాపాక్‌ మధ్య జరిగిన సంభాషణల్లో కొన్ని అంశాలు చోటు చేసుకున్నాయి. పాక్‌ రాయబారి డోనాల్డ్‌ లూ తో దీని గురించి మాట్లాడిన అంశాలు ఇలా ఉన్నాయి. అమెరికా-భారత్‌ సంబంధాల గురించి సెనెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో మీరు మాట్లాడిన తీరు చూస్తే భారత్‌,పాకిస్తాన్‌ పట్ల భిన్న ప్రాతిపదికలను అనుసరిస్తున్నట్లు ఉంది. భద్రతా మండలి, ఐరాస సమావేశానికి భారత్‌ గైరు హాజరు గురించి ఈ వైఖరి స్పష్టంగా కనిపించింది. వారి పట్ల ఒక వైఖరి మా పట్ల మరో వైఖరి ఎందుకు ? భారత్‌ కంటే మా నుంచి మీరు ఎక్కువ ఆశిస్తున్నట్లు, ఎక్కువ ఆందోళన చెందినట్లు కనిపిస్తోంది. దీని మీద డోనాల్డ్‌ స్పందిస్తూ చైనాలో ఏం జరుగుతోందనే దాన్ని బట్టి అమెరికాాభారత్‌ సంబంధాలు ఉంటాయి. దానితో పాటు మాస్కోతో భారత్‌కు సన్నిహిత బంధం ఉంది. ఉక్రెయిన్‌ నుంచి భారత విద్యార్ధులు వెలుపలికి వచ్చిన తరువాత భారత వైఖరిలో మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. మొత్తం మీద చూస్తే అమెరికా తన అవసరాలకోసం ఎంతకైనా తెగిస్తుందని, ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనైనా జోక్యం చేసుకుంటుందని పాక్‌ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామా ?

పదేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి : ఉపాధి నైపుణ్యం నిల్‌ – ఓట్లు తెచ్చే విద్వేషం ఫుల్‌ !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఈ మధ్య రెండు అంశాలపై వార్తలు వచ్చాయి. ఒకటి దేశంలో నిపుణులైన కార్మికుల లేమి గురించి ఒక నివేదిక వెలువడింది. నైపుణ్య శిక్షణ పేరుతో చేసిన హడావుడి ఎలా విఫలమైందో అంతకు ముందే విశ్లేషణలు వచ్చాయి. విద్వేష ప్రసంగాల మీద నమోదైన కేసుల గురించి ఒక కమిటీని ఆగస్టు 18లోగా ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విద్వేష ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగం కొన్ని చోట్ల పని చేయటం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. రెండింటిలోనూ కేంద్ర వైఫల్యం స్పష్టమైంది. నిజానికి సుప్రీం కోర్టు ఆదేశం మోడీ సర్కార్‌ను పరోక్షంగా అభిశంసించటం తప్ప వేరు కాదు. నైపుణ్య మెరుగుదల కోసం ఎన్నో పధకాలు, ఏకంగా మంత్రినే ఏర్పాటు చేసిన ఘనత తమదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇతర పథకాలు, ప్రకటనల మాదిరే ఇది కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. 2023 ఆగస్టు రెండవ వారంలో స్కిల్‌ ఫైనాన్సింగ్‌ రిపోర్టు 2023 కొన్ని అంశాలను వెల్లడించింది.దేశంలోని 78శాతం మంది యువతరానికి అభ్యాససిద్దమైన నైపుణ్యాలు లేవు.జనాభాలో 15-24 సంవత్సరాల యువత 25.4 కోట్ల మంది ఉన్నారు.ఉపాధికి అవసరమైన ఉన్నత నైపుణ్యాలు కలిగిన వారు కేవలం 46.2శాతం మందే ఉన్నారు. మొత్తం మీద నైపుణ్యాల రాంకులో మన దేశం ప్రపంచంలో 60వ స్థానంలో ఉంది. 2015 వరకు మన దేశంలోని కార్మికుల్లో 4.7శాతమే నైపుణ్య శిక్షణ పొందగా దక్షిణ కొరియాలో 90, జపాన్‌లో 80, బ్రిటన్‌లో 68, అమెరికాలో 52శాతం ఉన్నారు. ఇక ప్రతిదాన్ని వాణిజ్య ప్రాతిపదికన లెక్కిస్తున్నారు గనుక 2030 నాటికి ప్రపంచ వృత్తి విద్యా మార్కెట్‌ విలువ పెరుగుదల 1,585 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందట.ఇక 2031నాటికి విద్యా రుణాల మార్కెట్‌ విలువ 8,750 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. మన దేశంలో శిక్షణ పెద్ద ఎత్తున అవసరం గనుక నిధుల కేటాయింపు పెద్ద ఎత్తున పెంచాల్సి ఉంటుందని కూడా సదరు నివేదిక సలహా ఇచ్చింది. నైపుణ్యాలు, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ మార్కెట్‌ విలువ 2020లో మన దేశంలో 180 బిలియన్‌ డాలర్లు ఉందని, 2030 నాటికి అది 313 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా.


2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు 2015లో ప్రధాని నరేంద్రమోడీ ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్‌డిటివీ వార్త ప్రకారం సంబంధిత మంత్రిత్వశాఖ సమాచారం మేరకు 2021 జనవరి 19 నాటికి దేశమంతటా 1.07 కోట్ల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 46.27లక్షల మందికి స్వల్పకాల శిక్షణ ఇచ్చారు. మిగిలిన వారికి అంతకు ముందు వారు నేర్చుకున్నదాని గురించి పునశ్చరణ తరగతులు నిర్వహించారు. వారిలో 19లక్షల మందికి ఉపాధి దొరికింది.స్కిల్‌డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ సమాచారం మేరకు 2023 ఫిబ్రవరి ఆరు నాటికి 142లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 137లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. 124లక్షల మందిని విశ్లేషించి 110లక్షల మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. తరువాత ఈ పధకంలో కొన్ని మార్పులు చేశారు. ప్రభుత్వ విధానాల పరిశోధనా సంస్థ (సిపిపిఆర్‌) వెబ్‌సైట్‌లో 2023 ఫిబ్రవరి నాలుగున ” కొనసాగుతున్న యువనైపుణ్య శిక్షణ నిర్లక్ష్యానికి దేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ” అనే శీర్షికతో ప్రచురించిన ఒక విశ్లేషణలోని అంశాల సారాంశం ఇలా ఉంది.ప్రభుత్వం గత అనేక సంవత్సరాలుగా చేసిన వాగ్దానాలు, సాధించిన దానికి చాలా తేడా ఉంది.యువత నైపుణ్యానికి వస్తే దాని పునాదులు ఇప్పటికీ బలహీనంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అది ఇవ్వదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి పార్లమెంటు ప్రసంగంలో ఏడుసార్లు యువత అనే పదాన్ని ఉచ్చరించారు తప్ప ఒక్కసారి కూడా నైపుణ్యం గురించి చెప్పలేదు.(అది మోడీ సర్కార్‌ రాసి ఇచ్చిన ప్రసంగమే) 2023 బడ్జెట్‌లో ప్రకటించిన నైపుణ్య శిక్షణ పధకాలు వాస్తవరూపం ధరించాలంటే సంవత్సరాలు పడుతుంది.లోక్‌సభలో 2022 మార్చి 14న ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రకారం పిఎంకెవివై 1.0 కింద 18.04లక్షల మంది నమోదై శిక్షణ పొందగా వారిలో 13.32లక్షల మందికి నైపుణ్య సర్టిఫికెట్లు ఇచ్చారు. వారిలో కేవలం 2.53లక్షల మందికే లేదా 19శాతం మందికి మాత్రమే ఉపాధి దొరికింది. పిఎంకెవివై 3.0 ప్రకారం స్థానిక అవసరాలకు అనుగుణ్యంగా నైపుణ్యం ఇవ్వాలని నిర్ణయించారు, తమిళనాడు వంటి పారిశ్రామిక రాష్ట్రంలో కూడా మొత్తంగా అది విఫలమైంది. పిఎంకెవివై 3.0లో 4.98లక్షల మంది నమోదు చేసుకోగా 4.45లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 1.72లక్షల మంది సర్టిఫికెట్లను పొందారు. వారిలో కేవలం 15,450 మందికి మాత్రమే ఉపాధి దొరికింది. పిఎంకెవివై 1.0లో 12,218 నైపుణ్య శిక్షణ కేంద్రాలుండగా, 2.0నాటికి 9,030 కేంద్రాలు, 3.0లో కేవలం 683 మాత్రమే ఉన్నాయి. ఇదీ ఆ విశ్లేషణ సారం.


యువ భారతం అని, తగినంత మంది పని చేసే వారున్నారని గొప్పలు చెప్పుకుంటే చాలదు. ఏటా కోటి మంది కొత్తగా పని కోసం వస్తున్నారు. ఏటికేడు కొత్త సాంకేతికతలు ముందుకు వస్తున్నాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ప్రయివేటు రంగం ఆ బాధ్యత తీసుకొనేందుకు ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. గతేడాది జూన్‌లో భారత్‌ కోసం కృత్రిమ మేథ అనే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. పాతికలక్షల మందికి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడపదాటటం లేదు. ఏ దేశానికైనా నిపుణులైన కార్మికులు అవసరం. అది వారి జీవన పరిస్థితులను మెరుగుపరుస్తుంది.అమెరికా మీడియా యుఎస్‌ న్యూస్‌ 2022 సెప్టెంబరులో 85 దేశాల పరిస్థితుల మీద సర్వే చేసి జాబితాను ప్రకటించింది. కార్మిక నైపుణ్యంలో జపాన్‌, దక్షిణ కొరియా తరువాత చైనా మూడవ స్థానంలో ఉంది. మన దేశం ఇరవై ఒకటవ స్థానంలో ఉంది.మొత్తం మీద అన్ని రకాల నైపుణ్యాల్లో చైనా 17వ దేశం కాగా మనది 31వదిగా ఉంది.అమెరికా సిఐఏ ఫాక్ట్‌బుక్‌ పేరుతో సమాచారాన్ని విడుదల చేస్తుంది. దాని ప్రకారం 2021లో చైనాలో నిపుణులైన కార్మికులు 79 కోట్ల 14లక్షల 83వేల మంది ఉండగా మన దేశంలో 46 కోట్ల,66లక్షల 70వేల వంద మంది ఉన్నారు. నిజానికి ఈ సంఖ్య తక్కువేమీ కాదు గానీ పని చేసే వారికి అవకాశాలు కల్పించటమే కీలకం, మన దగ్గర అది లేదు. గడచిన నాలుగు దశాబ్దాల్లో నైపుణ్యం పెంచేందుకు చైనా ప్రభుత్వమే భారీ ఎత్తున ఖర్చు చేసింది. అందుకే నిపుణులైన కార్మికుల మీద పెట్టే ఖర్చు తప్పుతుంది గనుక అమెరికా, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయి, చైనా 17.7లక్షల కోట్ల జిడిపిని సృష్టించగలిగింది. దాని తలసరి జిడిపి(పిపిపి) 19,338 డాలర్లు, మన దేశం 3.17లక్షల కోట్ల డాలర్లు, తలసరి 7,334 డాలర్లతో ఉంది. ఏ దేశమైనా నైపణ్యం పెంచటమే కాదు, పరిశోధన-అభివృద్ధికి భారీ మొత్తాలను ఖర్చు చేయాల్సి ఉంది. మన దేశంలో ఆ రెండూ లేవు.


మరి మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అన్నది ప్రశ్న. చేసేందుకు ఉపాధి లేక, ఉపాధికి అవసరమైన నైపుణ్యం లేక నామ మాత్ర వేతనాలతో పని చేసే యువతను తప్పు దారి పట్టించటానికి అనువైన పరిస్థితులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం కాలంలో ఉన్నాం. దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వైపు చూడకుండా ఆవు పేడ, మూత్రంలో ఉన్న బంగారాన్ని వెలికి తీస్తే ధనిక దేశంగా మారతాం అనే ఆలోచనలో ఇంకా ఉన్నామంటే అతిశయోక్తి కాదు. బహుశా ఏ దేశంలోనూ లేని విధంగా వాట్సాప్‌ ద్వారా తప్పుడు, విద్వేష సమాచారాన్ని క్షణాల్లో ఎలా వ్యాపింప చేయాలో మన పండితులు ప్రపంచానికి పాఠాలు నేర్పేవారిగా ఉన్నారు. టెక్నాలజీ పరుగులో ముందుండాలంటే పరిశోధన, అభివృద్ది ఖర్చు లేకుండా కుదరదు. అందుకు గాను జిడిపిలో మన దేశ ఖర్చు 0.7శాతం కాగా చైనా ఖర్చు 2.1శాతంగా ఉంది.ి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారంటే కేటాయింపు లేకుండా కేవలం కబుర్లు చెబుతున్నారన్నది స్పష్టం.


నైపుణ్యం పెంచటానికి, పరిశోధనకు నిధులు కేటాయించేందుకు ప్రధాని నరేంద్రమోడీని ఎవరూ అడ్డుకోలేదు. కానీ మన దేశంలో విద్వేషం పెరుగుతున్నది. దానికి కారకులు ఎవరో పదే పదే చెప్పనవసరం లేదు. ఇది ఇంకా పెరిగితే వచ్చే పెట్టుబడులు రావు. మతకొట్లాటలు, పరస్పర అవిశ్వాసంతో కొట్టుకు చావాల్సిందే. అది తెలిసినా మత దేశంగా ఉన్న పాకిస్తాన్‌ దరిద్రం గురించి ఒకవైపు చెబుతున్నవారే దేశాన్ని మెజారిటీ హిందూ దేశంగా మార్చుతామని రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా దేశంలో ఉన్న విద్వేష పూరిత వాతావరణ, ఉదంతాల గురించి సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఇటీవలి కాలంలో పదే పదే ఆందోళన వెల్లడిస్తున్నది. జాతి, మతం, పుట్టిన ప్రాంతం,నివాసం, భాష తదితర అంశాల ప్రాతిపదికన భిన్న పౌర సమూహాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి సామరస్యతను దెబ్బతీసే శక్తులను అదుపు చేసేందుకు ఐపిసిలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. వాటిలో ఒకటైన 153 ఏ ప్రకారం నమోదు చేసిన కేసులు దేశంలో 2014-2020 కాలంలో 323 నుంచి 1,804కు పెరిగాయి. జాతీయ సమగ్రతను దెబ్బతీసేందుకు పాల్పడేవారి మీద 153 బి సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తారు. ఇవి 13 నుంచి 82కు పెరిగాయి. తప్పుదారి పట్టించే, విద్వేషాన్ని, శతృత్వాన్ని పెంచే సమాచారాన్ని వ్యాపింప చేయటం, ప్రకటనలు చేసే వారిని శిక్షించేందుకు ఉన్న సెక్షన్‌ 505 కేసులు 2017లో 257 ఉంటే 2020 నాటికి 1,527కు పెరిగాయి. రాష్ట్రాల్లో బిజెపి అధికారం ఉన్న చోట ఒక సామాజిక తరగతి మీద అసలు కేసులే నమోదు చేయటం లేదన్న విమర్శలున్న సంగతి తెలిసిందే. అందుకే బాధితులు లేదా ఎవరూ ఫిర్యాదు చేయకున్నా పోలీసులు తమంతట తాముగా కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.దేశంలో తలెత్తుతున్న ఆందోళనకర పరిస్థితికి ఈ కేసులు, సుప్రీం కోర్టు ఆదేశాలు నిదర్శనం.


2022 అక్టోబరు 21న సుప్రీం కోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్‌, హృషీకేష్‌ రాయి బెంచ్‌ ” ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము ? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్‌ 51చెబుతున్నది.మతం పేరుతో జరుగుతున్నదేమిటి ? ఇది విషాదం ” అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ పోలీసు అధికారులు అలాంటి ద్వేష పూరిత ప్రసంగాలు ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆర్టికల్‌ 51(ఏ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పధాన్ని పాటించాలని, భారత్‌ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్న మతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించనట్లైతే సహౌదరభావం ఉండదని కోర్టు పేర్కొన్నది.


మానభంగం వంటి అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడిన వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మంది పెరోలుపై వెలుపలికి వచ్చినపుడు సత్పప్రవర్తనతో మెలిగారని చెబుతూ జీవిత కాల శిక్ష పడిన వారిని గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసింది.2002లో గోద్రా రైలు సజీవదహనం,దానిలో కొందరు కరసేవకులు మరణించిన తరువాత జరిగిన మారణకాండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బిజెపి పెద్దలు వారికి ఘనస్వాగతాలు పలికి స్వీట్లు పంచారు, వీరకుంకుమలు దిద్దారు. తమ ” ఘన ” కార్యానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. బాధితులుగా ఉన్న తమను దీని గురించి సంప్రదించలేదని, విడుదల గురించి తమకు తెలుపలేదని బిల్కిస్‌ కుటుంబం పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే ఈ నేరగాండ్లను గుజరాత్‌ ప్రభుత్వం ఆజాదీకా అమృతమహౌత్సవం పేరుతో ఆగస్టు15న విడుదల చేసింది. నారీశక్తి, మహిళలకు రక్షణ గురించి కబుర్లు చెబుతున్న పెద్దలు ఈ కేసులో రేపిస్టులను విడుదల చేసేందుకు ఎవరినీ ఖాతరు చేయలేదు. కేసు విచారణ జరిపిన సిబిఐ కోర్టు జడ్జి కూడా వీరి విడుదలను వ్యతిరేకించారు.” ఈ కేసులో నేరగాండ్లకు – బాధితులకు ఎలాంటి సంబంధమూ లేదు, ఎలాంటి వైరమూ లేదు.బాధితులు ఒక మతానికి చెందిన వారనే కారణాలతో మాత్రమే నేరానికి పాల్పడ్డారు.ఈ కేసులో చిన్న పిల్లలను, గర్భిణీని వదల్లేదు.ఇది అత్యంత హీనమైన విద్వేషపూరిత, మానవత్వం మీదనే జరిపిన నేరం ” అని పేర్కొన్నారు. ఇలాంటి రెండింజన్ల పాలనే మణిపూర్‌లో కూడా ఉన్నందున మహిళలను నగంగా తిప్పి, అత్యాచారం చేసిన ఉదంతాన్ని వెల్లడి కాకుండా తొక్కి పెట్టాలని చూశారు. వీడియో వెల్లడి కావటంతో మొక్కుబడి ప్రకటనతో సరిపుచ్చారు.విద్వేషాన్ని రెచ్చగొట్టటంలో ఎవరూ తక్కువ తినటం లేదు. రిజర్వేషన్ల గురించి ఆందోళన తలెత్తితే మణిపూర్‌లో చర్చ్‌లను తగులబెడతారు, మహిళల మీద అత్యాచారాలు చేస్తారు. మత విద్వేషం చెలరేగితే హర్యానాలో ఒక మతానికి చెందిన వారి నివాసాలు, దుకాణాల మీదకు మాత్రమే అక్కడి ప్రభుత్వ అధికారులు బుల్డోజర్లు నడుపుతారు. దేశం ఎటుపోతోంది అని గాదు ఎటు తీసుకుపోతున్నారు, ఎవరు అన్నది ఆలోచించాల్సిన తరుణం వచ్చింది.దేశంలో ముస్లింలు, దళితుల మీద జరుగుతున్న దాడులను నమోదు చేసేందుకు 2017లో హిందూస్తాన్‌ టైమ్స్‌ అనే పత్రిక పూనుకుంది.దాన్ని వెంటనే యాజమాన్యం నిలిపివేసింది, దానికి చొరవ చూపిన సంపాదకుడు రాజీనామా చేసి తప్పుకున్నారు. దీని వెనుక ఎవరి వత్తిడి ఉండి ఉంటుందో వేరే చెప్పాలా ?

ఇష్టం లేని పెళ్లిలో తలంబ్రాలు పోసినట్లు : పులిహోర – పప్పుచారు మీద ఉన్న యావ మణిపూర్‌ మీద లేకపాయే ! నరేంద్రమోడీ 133 నిమిషాల ప్రసంగంలో కేవలం మూడు నిమిషాలే !

Tags

, , , , , ,

  ఎం కోటేశ్వరరావు

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లుగానే దేశనేతలందు మన ప్రధాని నరేంద్రమోడీ వేరయా అని చెప్పక తప్పదు. సుదీర్ఘ ప్రసంగంతో తన రికార్డును బద్దలు చేశారు. గురువారం నాడు(ఆగస్టు పదవ తేదీ) తన ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ప్రశ్నలను సంధిస్తూ ప్రధాని మాట్లాడిన తీరు కూడా దాన్ని నిర్ధారించింది. మణిపూర్‌ మీద నోరు విప్పించేందుకే అవిశ్వాసం అన్నది తెలిసిందే. దానికి సమాధానం అంటూ 133 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో కేవలం మూడంటే మూడు నిమిషాలే (డక్కన్‌ హెరాల్డ్‌ పత్రిక) మణిపూర్‌ గురించి మాట్లాడారంటే మొక్కుబడి,ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో లోకానికి వెల్లడైంది. ప్రశ్నలను అడిగే చతురత ఏ ఒక్కరి సొత్తూ కాదు. మీడియాతో మాట్లాడని దేశాధినేతలెవరు లేదా ఎందరు ? ప్రజాస్వామ్యానికి మన దేశం పుట్టినిల్లు , పార్లమెంటును దేవాలయం అని వర్ణించి దానికి దూరంగా ఉండటం, మాట్లాడేందుకు ?ఇచ్చగించని ప్రధాని ఎవరు ? పార్లమెంటుకు వస్తూ సభలో చేయాల్సిన ప్రకటనను ప్రాంగణంలోని మెట్లు, గోడలను ఉద్దేశించి మొక్కుబడిగా మాట్లాడిన ప్రధాని ఎవరు అన్న ప్రశ్నలకు సమాధానం అంత కష్టమేమీ కాదు. యావత్‌ దేశాన్నే గాక ఐరోపా పార్లమెంటులో కూడా చర్చనీయాంశమైన మణిపూర్‌ దారుణాల గురించి స్పందనకు కూడా తీరికలేకుండా ప్రధాని ఉన్నారు.పార్లమెంటులో ఈ అంశం గురించి ప్రధాని నోరు విప్పాలన్న ప్రతిపక్షాల, యావత్‌ సమాజ వేడుకోళ్లు, విన్నపాలు, డిమాండ్లను పట్టించుకోకపోవటంతో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టి మాట్లాడించే మార్గాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా తలెత్తి ఉండదు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. మణిపూర్‌ మీద ఏం చెబుతారో దేశానికి వెల్లడించాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రవేశపెట్టారన్నది తెలిసిందే.

మానవతుల మర్యాద మంట గలిపిన దుర్మార్గం గురించి మాట్లాడవయ్యా మహానుభావా అంటే మణిపూర్‌ ప్రభుత్వ ఆఫీసుల్లో మహాత్మాగాంధీ చిత్రాలను అనుమతించనపుడు అక్కడున్న ప్రభుత్వం ఎవరిది, జాతీయగీతం అలపించటాన్ని అనుమతించనపుడు ఎవరు అధికారంలో ఉన్నారు, తిరుగుబాటుదార్లు చెప్పిందే జరిగినపుడు ఏలుబడి ఎవరిది అంటూ జికె ప్రశ్నలను సంధించారు. మిజోరామ్‌ అమాయక పౌరుల మీద 1956 మార్చి ఐదున వైమానిక దళంతో కాంగ్రెస్‌ దాడులు చేయించింది అంటూ ప్రధాని మోడీ మాట్లాడిన తీరును చూసి ఏమనుకోవాలి ! జనాలకు బుర్ర తిరిగింది. అప్పుడు మిజోరంలో కాంగ్రెస్‌ దాడి చేయిస్తే నేడు మణిపూర్‌లో ఉన్న రెండింజన్ల పాలన సాగిస్తున్న బిజెపి మేమేన్నా తక్కువ తిన్నామా అంటూ మహిళలను నగంగా తిప్పి మానభంగం చేయించినట్లుగా ప్రధాని తర్కం ఉంది. మణిపూర్‌ వెళ్లి బాధితులను ఎందుకు పరామర్శించలేదు, రెండు సామాజిక తరగతుల మధ్య తలెత్తిన అనుమానాలను ఎందుకు తీర్చలేదు, ప్రధాని కనిపించటం లేదు అని పోస్లర్లు వేసి మరీ అక్కడ జనం అడుగుతున్నారు అని ప్రతిపక్షాలు అడిగాయి. వాటికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ ఎన్నడూ ఆ ప్రాంత ప్రజల మనోభావాలను అర్ధం చేసుకొనేందుకు చూడలేదు, నేను 50సార్లు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాను అన్నారు ప్రధాని. ఓట్ల కోసం వందసార్లు వెళ్లవచ్చు, ఒక రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించి జనం బిక్కుబిక్కు మంటూ దిక్కులేకుండా ఉన్నపుడు మణిపూర్‌ వెళ్లారా, పరామర్శించారా ,గాయపడిన మణిపూర్‌ పౌరుల మనోభావాలను పట్టించుకున్నారా లేదా అన్నది గీటురాయి తప్ప ఆ ప్రాంతానికి ఎన్నిసార్లు వెళ్లారు అని ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అడిగిందా ? మణిపూర్‌లో నిందితులను కఠినంగా శిక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.సమీప భవిష్యత్‌లో మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని దేశ ప్రజలకు హామీ ?ఇస్తున్నాను, దేశం మొత్తం మీతో ఉందని మణిపూర్‌ మహిళలు, బిడ్డలతో సహా పౌరులందరికీ నేను చెబుతున్నాను అని ప్రధాని చెప్పారు. ఈ ముక్కేదో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగిన తొలి రోజుల్లోనే చెప్పి ఉంటే ? పార్లమెంటు ప్రారంభం కాగానే స్వయంగా ప్రకటన చేసి ఉంటే ఇంత రచ్చ జరిగేదా ?

  తనకు లేని అధికారాన్ని పుచ్చుకొని మెయితీలను గిరిజనులుగా పరిగణిస్తూ రిజర్వేషన్లు వర్తింప చేయాలన్న మణిపూర్‌ హైకోర్టు ఆదేశమే కదా అక్కడ జరిగిన పరిణామాలకు కారణం.దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక వైఖరి ప్రకటించనంతవరకు గిరిజనుల్లో ఉన్న అనుమానాలు తొలగవు. ఇతర ప్రాంతాల్లోని గిరిజనులలో కూడా అదే పరిస్థితి తలెత్తవచ్చు. కానీ ప్రధాని ప్రసంగంలో దాని ప్రస్తావన లేదు. అంటే ఆ వివాదాన్ని కొనసాగించాలని చూస్తున్నారన్నది స్పష్టం. మణిపూర్‌ దారుణాలు జరిగినపుడు కర్ణాటకలో ఓట్ల వేటలో ఉన్నందున మోడీ గారికి వెళ్లే తీరికలేదు అనుకుందాం. ఒక ట్వీట్‌ ద్వారానైనా తన స్పందన ఎందుకు వెల్లడించలేదు. ట్వీట్‌ అంటే గుర్తుకు వచ్చింది. మణిపూర్‌లో హింసాత్మక ఉదంతాలు ఆగలేదు, ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. పక్కనే ఉన్న హర్యానాలో బుల్డోజర్లను నడిపిస్తున్న ఆటవిక పాలన సాగుతున్నది. సరిగ్గా అప్పుడు అంటే ఆగస్టు రెండున ఒక ఉదంతం జరిగింది. దాన్ని నరేంద్రమోడీ గారి ట్వీట్‌లోనే చూద్దాం. ” గత సాయంత్రం నేను భారత దక్షిణ రాష్ట్రాల ఎన్‌డిఏ ఎంపీలతో ఒక అద్భుతమైన సమావేశాన్ని జరిపాను. తరువాత గొప్ప విందు జరిగింది. దానిలో పానియారమ్‌, అప్పమ్‌, కూరగాయల కుర్మా, పులిహోర,పప్పుచారు,అడాయి. అవియాల్‌ ?ఇంకా కొన్ని వడ్డించారు ” అని ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు మూడవ తేదీ సాయంత్రం 4.1?కు ఒక ట్వీట్‌ చేశారు, దానికి విందు ఫొటోను కూడా జత చేశారు.

  రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తి నిర్వాకం గురించి తెలిసిందే. పులిహౌర-పప్పుచారు రుచుల మీద ఉన్న యావ మణిపూర్‌ మీద ప్రధానికి ఎందుకు లేకపోయింది అన్నది ప్రశ్న. అవిశ్వాస తీర్మానం మీద సమాధానంగా ప్రధాని చేసిన మిగతా ప్రసంగమంతా కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల మీద గతంలో చేసిన దాడిని పునరుచ్చరించటం తప్ప మరేమీ లేదు.ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నిసార్లు వెళ్లిందీ ప్రధాని చెప్పారు. దేవాలయం అని వర్ణించిన పార్లమెంటుకు ప్రధాని ఎన్నిసార్లు వచ్చారు, ఎంతసేపు గడిపారు, ఏం మాట్లాడారు అన్నది ప్రశ్న.పార్లమెంటు నిబంధనల ప్రకారం ప్రధానితో సహా కేంద్ర మంత్రులు పార్లమెంటుకు వచ్చినా రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిన అవసరం లేదు గనుక వారెన్ని సార్లు వచ్చిందీ మనకు తెలియదు. మన ప్రజాస్వామ్య గొప్పతనమిది అనుకొని మన భుజాలను మనమే చరుచుకోవాలి. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను 2014 ఎన్నికలపుడు నరేంద్రమోడీ విమర్శించిన తీరును చూశాము. బలహీన, నోరులేని, మౌన మోహన సింగ్‌ అని వర్ణించారు. గడచిన తొమ్మిది సంవత్సరాలలో అదే పెద్దముషి తాజాగా చేసిన ప్రసంగంతో కలుపుకొని పార్లమెంటులో మాట్లాడింది కేవలం 31 సార్లు మాత్రమే అని తేలింది. ఇంత కంటే ఎక్కువ సార్లు మాట్లాడినట్లు ఎవరైనా చెబితే ఆ మేరకు అంకెను సవరిద్దాం. అదే మౌన మోహన సింగ్‌ గారు పదేండ్ల పాలనా కాలంలో 70సార్లు మాట్లాడారు. అనేక కీలక అంశాల మీద నరేంద్రమోడీ మౌనం జగమెరిగిన సత్యం.ప్రతి ఏడాదీ రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలపటం, స్పీకర్‌ ఎన్నిక సందర్భంగా అభినందనలు, తన మంత్రుల పరిచయం, రామ మందిర నిర్మాణం గురించి ప్రకటనల వంటివి మోడీ ప్రసంగాల జాబితాలో ఉన్నట్లు ఇండియా టుడే ఒక విశ్లేషణలో పేర్కొన్నది.

  2014లో మంత్రిగా ఉన్న సాధ్వి నిరంజన ప్రతిపక్షాల మీద చేసిన సంస్కారం లేని అనుచిత వ్యాఖ్యల మీద దుమారం లేవటంతో తప్పనిసరై మోడీ జోక్యం చేసుకొని పార్లమెంటులో మాట్లాడటం, తరువాత ఆమె మంత్రి పదవి పోవటం, ముంబై పేలుళ్లలో పాక్‌ జాతీయుడికి బెయిలిచ్చిన ఉదంతం మీద, ఒకసారి కాశ్మీరు మీద, మరోసారి వ్యవసాయ సంక్షోభం, పదహారవ లోక్‌సభలో ముగింపు మాటలు తప్ప మరొకటి లేదు.రాఫెల్‌ గురించి, అదానీ కంపెనీల మీద హిండెన్‌బర్గ్‌ నివేదిక వంటి అంశాల మీద నోరు విప్పలేదు. వర్తమాన లోక్‌సభలో నెలల తరబడి సాగు చట్టాల మీద పార్లమెంటు అనేక సార్లు స్థంభించినా, మిత్రపక్షం అకాలీదళ్‌ వెళ్లిపోయినా నోరు విప్పలేదు. బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమ మర్యాదకు భంగం కలిగించినట్లు మహిళా రెజ్లర్లు కేసులు పెట్టి ఆందోళన చేసినా నోరు మెదపలేదు. అందువలన మణిపూర్‌లో తమ పార్టీ నిర్వాకం వలన తలెత్తిన పరిస్థితి గురించి ప్రధాని మౌనంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. విధిలేక సాగు చట్టాలను రద్దు చేస్తూ జాతికి క్షమాపణలు చెబుతూ బయట మాట్లాడారు తప్ప పార్లమెంటులో కాదు. అంతకు ముందు గోరక్షకుల పేరుతో జరిపిన దురాగతాల గురించి చేసిన ప్రకటన, సిఏఏ ఆందోళన గురించి మాట్లాడింది కూడా పార్లమెంటులో కాదు. చివరికి గాల్వన్‌ ఉదంతాల మీద కూడా ప్రతిపక్షాలతో జరిపిన అఖిల పక్ష సమావేశంలో, టీవీలో మాత్రమే మన భూభాగంలోకి ఎవరూ రాలేదు, ఏ పోస్టునూ కదిలించలేదు అని మాట్లాడారు. ప్రతిపక్షం అవిశ్వాసం తీర్మానం పెట్టటమే తప్పు అధికారం కోసం ఆకలితో ఉన్నట్లు ప్రధాని ఆరోపించారు. చరిత్రను ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే తమ గతం గుర్తుకు వచ్చి ఉండేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద గతంలో ప్రవేశపెట్టిన అన్ని అవిశ్వాస తీర్మానాలకు బిజెపి లేదా దానికి ముందు రూపమైన జనసంఘం మద్దతివ్వటమే కాదు, తానే స్వయంగా ప్రవేశపెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి.ప్రతిపక్షాలకు అవిశ్వాస తీర్మానం ఒక ఆయుధం.దేశ చరిత్రలో 28సార్లు ప్రవేశపెట్టారు. పదహారు సంవత్సరాల పాలనలో ఇందిరా గాంధీ పదిహేను తీర్మానాలను ఎదుర్కొన్నారు. ఏ ఒక్కటీ నెగ్గలేదు.

  ఇక ప్రధాని నరేంద్రమోడీ పులిహోర- ప్చుచారు ట్వీట్‌ మీదా నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. కొన్ని స్పందనలను చూద్దాం.” ఉప్మా ఎక్కడ మోడీ గారూ, పెరుగన్నం గురించి చెప్పలేదేం సార్‌, పప్పు అంటే ఏమిటి ? ” ఒక మొద్దుబారిన స్పందన ఇది, హర్యానా, మణిపూర్‌ తగులబడుతున్నది, ఎక్కడ చూసినా హింసాకాండ, రక్తపాతం, విద్వేష ప్రసంగాలు, ప్రతి చోటా జనం చచ్చిపోతుండగా ఈ మనిషి తాను తిన్నదాని గురించి ట్వీట్‌ చేశారు.అతనికేమీ సహానుభూతి లేదు, అతనేమీ పట్టించుకోరు.” ” జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు ఎందుకు వెళ్లరు,మణిపూర్‌ను ఎందుకు సందర్శించరు ?” ” ఈ మనిషి నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నారు, దేశం తగులబడుతుంటే తాను తిన్న పదార్ధాల గురించి చెబుతున్నారు ” ” మీ డిన్నర్‌లో దాక్షిణాది వంటకాలతో మజా చేసుకోండి ” ” చాలా గొప్పగా ఉందండి హర్యానా లేదా మణిపూర్‌లో గుజరాత్‌ నమూనా విద్వేష విస్తరణ పండగ పార్టీలా ఉంది. మీరు పార్లమెంటు లేదా మణిపూర్‌ ఎప్పుడు వెళతారు ” ” ఎంతటి గొప్ప మనిషిని మనం ప్రధానిగా కలిగి ఉన్నాం. మణిపూర్‌ సమస్య మీద వివరణ కోసం మీరు పార్లమెంటుకు రావాలని యావత్‌ ప్రతిపక్షం కోరుతుండగా మీరు మాత్రం తాపీగా ఉన్నారు. దక్షిణాది వంటకాల రుచులను అనుభవిస్తున్నారు. మోడీ గారూ పౌరుల గురించి మీకు ఎంత విశాల హృదయ స్పందన ఉందో కదా ! ” ” మీరు మంచి సమావేశాన్ని జరిపారు కానీ మీకు దేశంలో జరుగుతున్న దానిమీద చర్చించేందుకు తగిన సమయం లేదాు. మీరు ఆ గద్దెమీద ఎందుకు ఉన్నారు. మీ వంటి నేతను కలిగి ఉన్నాం కాబట్టి వందల సంవత్సరాల తరువాత కూడా మీ కారణంగా మనం అభివృద్ది చెందిన దేశం మాదిరి గాక అభివృద్ది చెందుతున్న దేశంలోనే ఉంటాం.” ” అద్భుతం మీరూ హాపీ మేమూ హాపీ . రకరకాల దుస్తులు, ఎన్నో రకాల వంటలు అనుభవించండి, భిన్న రుచులను అనుభవించటమే కదా జీవితం ” ” సార్‌ అప్పుడప్పుడూ డిన్నర్‌లో ఒక రొట్టె ముక్కను కూడా తినేందుకు ప్రయత్నించాలి మీరు. ఎందుకంటే మణిపూర్‌ సహాయ శిబిరాల్లో ఉంటున్నవారు తింటున్నది అదే ” ” ఎనభై కోట్ల మంది జనం ఐదు కిలోల ఉచిత రేషన్‌తో బతుకుతుండగా మీరు అనేక వంటకాలను భుజిస్తున్నారు ” ” అనేక శాంతి భద్రలతల సమస్యల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం, లక్షలాది మంది పేదా మధ్యా తరగతి జనాల ఆదాయం మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నది. మన దేశ ప్రధానికి తమ పార్టీ ఎంపీలతో కలసి ఆరగించిన ఆహార పదార్దాల గురించి ట్వీట్‌ చేసేందుకు వ్యవధి ఉంటుంది గానీ పరిస్థితిని అదుపు చేసేందుకు ఎలాంటి ప్రయత్నం కనిపించటం లేదు.” వీటి గురించి వేరే వ్యాఖ్యలు అవసరమా ?

పెట్టుబడిదారీ విధానాన్నే అస్త్రంగా మార్చి అమెరికాపై చైనా దాడిని ఎక్కుపెట్టిందా ?

Tags

, , , , ,



ఎం కోటేశ్వరరావు


పెట్టుబడిదారీ విధానాన్నే అస్త్రంగా మార్చి అమెరికాను దెబ్బతీసేందుకు చైనా ఎలా చూస్తున్నదో చూడండి, మన పెట్టుబడులనే మన నాశనానికి వాడుతున్నది అంటూ అమెరికాలో విశ్లేషకులు కొందరు అక్కడి పాలకవర్గాన్ని హెచ్చరించారు. ఇది ఒక్కరిద్దరి అభిప్రాయం అనుకుంటే పొరపాటు, అమెరికాలో పెట్టుబడిదారీ విధాన మీద తలెత్తిన ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు అక్కడి పాలకవర్గ మేథావులు ముందుకు తెచ్చిన సరికొత్త ప్రచారదాడిలో అదొక అస్త్రం.అదే విధంగా అమెరికా స్కూళ్లలో చైనా ప్రవేశించి కమ్యూనిస్టు పాఠాలు చెబుతున్నదని ఆధారంలేని ఆరోపణలతో ఒక నివేదికను విడుదల చేశారు. ఈ రెండూ అక్కడి పాలకవర్గంలో ఉన్న చైనా, కమ్యూనిస్టు వ్యతిరేకత, దాన్ని జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం కనిపిస్తున్నది.


విశ్లేషకుల కథన సారం ఇలా ఉంది. ” ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి కమ్యూనిస్టు సిద్దాంత మార్గదర్శకత్వంలో పని చేసే చైనా నుంచి ముప్పు తీవ్రం అవుతున్నది. అందువలన దానితో ఆర్థిక లావాదేవీలను పున: విశ్లేషణ చేసుకోవాల్సిన అత్యవసరం ఎన్నటి కంటే మరింత పెరిగింది. అమెరికా పెట్టుబడులతో అపార సంపదలను చైనా పోగేసుకుంది. మన స్వంత పెట్టుబడిదారీ వ్యవస్థను మన వ్యతిరేక ఆయుధంగా మార్చింది. పెన్షన్‌ నిధులు, ఇతర మార్గాల ద్వారా దాదాపు పది కోట్ల మంది అమెరికన్లు తమకు తెలియకుండానే తమను దెబ్బతీసే ఆర్థిక ప్రత్యర్ధి చైనాలో పెట్టుబడులు పెట్టారు.ప్రపంచాధిపత్యం కోసం చూస్తున్న దాని మిలిటరీ బలపడేందుకు అవకాశం కల్పించారు. ఆర్థిక సరళీకరణను ప్రారంభించిన 1978 నుంచి చైనా ఒక పద్దతి ప్రకారం పశ్చిమ దేశాల పెట్టుబడి మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. చైనా కమ్యూనిస్టు పార్టీపై అమెరికా పార్లమెంటు ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ ముందు సాక్ష్యమిచ్చిన పెట్టుబడి మార్కెట్ల భద్రతా కమిషనర్‌ రోజర్‌ రాబిన్సన్‌ మాట్లాడుతూ పరాకుగా ఉన్న అమెరికా చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న ఐదు వేల కంపెనీల్లో లక్షల కోట్ల డాలర్లును పెట్టుబడులుగా పెట్టేందుకు సాధారణ అమెరికన్లను అనుమతించింది. ప్రపంచమంతటి నుంచి చైనా వచ్చే పెట్టుబడుల్లో అరవైశాతం డాలర్లు అమెరికా వనరుల నుంచే ఉన్నాయి గనుక అవి నిలిచిపోతే అక్కడి ఆర్థికరంగం పూర్తిగా దెబ్బతిని చైనా ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుంది.


పెట్టుబడులు పెట్టినందుకు దోహదం చేసిన బ్లాక్‌రాక్‌ వంటి అగ్రశ్రేణి ఆస్తుల నిర్వహణ సంస్థలు ఇప్పుడు సాకులు చెబుతున్నాయి.అమెరికా పర్యావరణ, సామాజిక, పాలన ప్రమాణాలను పక్కన పెట్టి పెట్టుబడులు పెట్టాయి. ఇలాంటి కంపెనీలు వాటిని గట్టిగా పాటించి ఉంటే చైనా కంపెనీలకు పెట్టుబడులు వెళ్లేవి కాదు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ పెట్టనన్ని పెట్టుబడులను బ్లాక్‌రాక్‌ కంపెనీ సిఇఓ లారీ ఫింక్‌ ప్రవహింపచేశాడు. పెట్టుబడి సంస్థలు చైనాలో పెట్టుబడులు పెడితే సంభవించే ఆపదల గురించి పట్టించుకోకపోగా పైకి కనిపించినంత చెడుగా చైనా సంస్థలు లేవని యుబిఎస్‌ గ్లోబల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ చెప్పింది. నిర్భంద శిబిరాలు, బలవంతంగా కార్మికులను తరలించే,మారణకాండ, చైనా మిలిటరీకి ఆధునిక ఆయుధాలను సరఫరా చేసేందుకు దోహదం చేసేవిగా చైనా కార్పొరేట్‌ కంపెనీలు ఉన్నాయి.ప్రపంచ ప్రజాస్వామిక ఆర్థిక వ్యవస్థలున్న దేశాలన్నీ చైనా సంస్థలతో చేతులు కలిపితే వచ్చే ముప్పును గ్రహిస్తున్నాయి. చైనా మీద ఆధారపడితే తలెత్తే ముప్పును తొలగించుకొనేందుకు, నూతన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు జి7 దేశాల కూటమి పూనుకుంది. ఇది చాలదు, అమెరికా స్టాక్‌ ఎక్సేంజ్‌లలో ఉన్న చైనా కంపెనీలను జాబితా నుంచి తొలగించాలి, రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి.చైనా కంపెనీలకు రుణాలు ఇచ్చే సంస్థలను నిషేధించాలి.డాలర్ల రూపంలో ఇస్తున్న చైనా ప్రభుత్వ బాండ్ల మీద నిషేధం విధించాలి. గతంలో సోవియట్‌ ముప్పును వమ్ము చేసేందుకు అనుసరించిన ఆర్థిక పద్దతులను ఇప్పుడు చైనా మీద అనుసరించాలి. మనం దీర్ఘకాలంగా ప్రేక్షకుల మాదిరి ఉన్నాం, మన పెట్టుబడిదారీ వ్యవస్థను నియంత్రించేందుకు ఇది సరైన తరుణం. ”


అమెరికా గడ్డ మీద, వెలుపలా అమెరికా మీద చైనా నిరంతర నిఘాను ఉపేక్షించరాదని ఆగస్టు మొదటి వారంలో జరిగిన పార్లమెంటు సెలెక్ట్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘర్‌ డిమాండ్‌ చేశాడు. ఇప్పుడే మేలుకున్నామని కూడా అన్నాడు. దానిలో భాగంగా ప్రపంచమంతటా రహస్య పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిందని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.చైనాలో ప్రైవేటు కంపెనీలంటూ లేవు, ప్రతి ఒక్కరూ, ప్రతిదీ, ప్రతి సంస్థ షీ జింపింగ్‌ కోరుకున్నదాని ప్రకారమే ఉంటుందని గాలఘర్‌ ఆరోపించాడు.చైనాలో పెట్టుబడులపై పరిమితులను మరింతగా విస్తరించాలని జో బైడెన్‌న్ను గాలఘర్‌ కోరాడు. ఉత్తరువుల ద్వారా వాటిని వెంటనే అమల్లోకి తేవాలంటూ ఒక లేఖను కూడా రాశాడు. ప్రభుత్వ పెట్టుబడులకే పరిమితం గాకుండా ప్రైవేటు పెట్టుబడుల మీద ఆంక్షలు విధించాలని కోరాడు. చైనా మిలిటరీ కంపెనీలకు మన పెట్టుబడులు తరలటం అంటే మన నాశనానికి మనమే సహకరించినట్లు అవుతుందన్నాడు. చైనా బాండ్లు, కంపెనీల వాటాల్లో 1.1లక్షల కోట్ల డాలర్లు, ప్రైవేటు పెట్టుబడిదారులు 200బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. దీనిలో ఎక్కువ భాగం చైనా మిలిటరీతో సంబంధాలున్న కంపెనీలలో ఉందని ఆరోపించాడు. తైవాన్‌ విలీనం షీ జింపింగ్‌ జీవిత లక్ష్యమని అందుకు గాను సన్నాహాలకు గాను అవసరమైన సమాచారం మొత్తాన్ని సేకరిస్తున్నారని అన్నాడు. దాన్ని ఎదుర్కొనేందుకు ఇండో ఫసిఫిక్‌ ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన మిలిటరీ, పరికరాలను సమీకరించే మన సామర్ధ్యాన్ని దెబ్బతీసేందుకు చైనా చూస్తున్నదని, చైనాతో ఘర్షణకు దిగాల్సి వస్తే మనం భూమ్యాకాశాలను కదిలించాల్సి ఉంటుందని,ఎంతో వినాశకరంగా ఉంటుందని అన్నాడు.అమెరికా నిషేధిత జాబితాలో ఉంచిన చైనా కంపెనీల్లో పెట్టుబడులు ఎందుకు పెట్టారంటూ బ్లాక్‌రాక్‌, ఎంఎస్‌సిఐ కంపెనీలకు సెలెక్ట్‌ కమిటీ అడిగిన సంజాయిషీకి తాము చట్ట ప్రకారమే తమ వాణిజ్య పద్దతుల్లో భాగంగానే పెట్టుబడులు పెట్టినట్లు ఆ కంపెనీలు చెప్పాయి.


ఇలా సాగిన విశ్లేషణలు, పార్లమెంటరీ కమిటీ చైనా మీద చేసిన విచారణ అంతా అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు, రాజకీయంగా ప్రపంచంలో తింటున్న ఎదురుదెబ్బలకు కారణం చైనా అని తమ జనాన్ని నమ్మించేందుకు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ముందుకు తెచ్చిన కొత్త ప్రచార ఎత్తుగడ. గతంలో సోవియట్‌ యూనియన్‌ ఉన్నపుడు దానితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనే పేరుతో ప్రచ్చన్న పోరు పేరుతో సాగించిన ప్రత్యక్ష ప్రచార దాడిలో భాగంగా సోషలిజం, కమ్యూనిజం వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఆ పోరులో విజయం సాధించినట్లు మూడు దశాబ్దాల క్రితం స్వయంగా ప్రకటించుకున్నారు. మరోవైపు చైనాలో పెట్టుబడులు పెట్టటంతో పాటు అక్కడి నుంచి భారీ ఎత్తున సరకులు దిగుమతి చేసుకున్నది. దాంతో అనేక మంది చైనా తమ ఉపాధిని హరించిందనే ప్రచారాన్ని అమెరికాలో పెద్ద ఎత్తున ప్రారంభించారు. అది అనేక మంది యువతలో సైద్ధాంతిక మధనాన్ని పెంచింది. సోషలిజమే మెరుగైనది, పెట్టుబడిదారీ విధానం విఫలమైంది అనే భావనలు పెరుగుతున్నాయి. అందువలన పాతబడిన కమ్యూనిస్టు వ్యతిరేక అస్త్రాన్ని ప్రధానంగా ప్రయోగిస్తే దశాబ్దాల తరబడి ఆ కమ్యూనిస్టు చైనాలో ఎందుకు పెట్టుబడులు పెట్టారు, ప్రతి వస్తువును అక్కడి నుంచి ఎందుకు దిగుమతులు చేసుకున్నారు, ఇప్పటికీ ఎందుకు కొనసాగిస్తున్నారు, చైనాతో తెగతెంపులు చేసుకోవటం లేదని ఎందుకు ప్రకటిస్తున్నారు అన్న ప్రశ్నలకు అమెరికా విధాన నిర్ణతల దగ్గర సమాధానం లేదు. అందుకే మనలను దెబ్బతీసేందుకు మన పెట్టుబడిదారీ వ్యవస్థనే చైనా అస్త్రంగా మార్చుకున్నదనే తర్కానికి నిలవని ప్రచారానికి పూనుకున్నారు. ఒకటి వాస్తవం, ఏ విధంగా చూసినా నేటి చైనా నాటి సోవియట్‌ కాదు.ఆర్థికంగా త్వరలో అమెరికాను అధిగమించనుంది.ప్రపంచీకరణ భావన, స్వేచ్చామార్కెట్‌ను ముందుకు తెచ్చింది అమెరికా తప్ప చైనా కాదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని చైనా లబ్ది పొందిన మాట వాస్తవం. దివాలా కోరు విధానాలతో అమెరికా పెట్టుబడిదారీ విధానం విఫల బాటలో ఉంది.


అమెరికా స్కూళ్లలో పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్న చైనా వాటిని కమ్యూనిస్టు ప్రచారానికి అడ్డాలుగా మారుస్తున్నదని విద్యా పరిరక్షక తలిదండ్రుల కమిటీ(పిడిఇ) పేరుతో ఉన్న సంస్థ తాజాగా ఒక నివేదికలో ఆరోపించింది. అమెరికాలో స్కూళ్లు పన్నెండవ తరగతి(మన దగ్గర ఇంటర్‌ మీడియెట్‌) వరకు బోధిస్తాయి. తమ దేశ తత్వవేత్త కన్ఫ్యూసియస్‌ పేరుతో వందకు పైగా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో తరగతులను నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వ అనుమతుల మేరకే చైనా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. నిజానికి అక్కడి సంస్థల సంఖ్యతో పోలిస్తే అసలు లెక్కలోకి రావు. ఈ పేరుతో అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరించేందుకు, తమకు ఏజంట్లుగా పనిచేసే వారిని ఎంచుకొనే కేంద్రాలుగా మార్చుతున్నదంటూ ఆరోపిస్తూ ఇటీవల అమెరికా ఎఫ్‌బిఐ ఒక నివేదికను వెల్లడించింది. చైనా జాతీయ ఇంటిలిజెన్స్‌ చట్టంలో చైనా పౌరులు ఎక్కడ నివశిస్తున్నప్పటికీ తమ మాతృభూమి కోసం కళ్లు, చెవులుగా పని చేయాలని చెప్పిందని, అందువలన అమెరికాతో సహా విదేశాల్లో ఉన్న చైనా జాతీయులందరూ గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ గతేడాది సిఐఏ మాజీ అధికారి శామ్‌ ఫడీస్‌ ఒక తర్కాన్ని ముందుకు తెచ్చాడు. ఇదంతా తప్పుడు ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. అదే సూత్రం ప్రతి దేశ పౌరులకు వర్తిస్తుంది. అందరినీ అలాగే చూసేట్లైతే ఎవరూ వేరే దేశానికి వెళ్లే అవకాశం ఉండదు.


ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు గాను ప్రతి దేశం అనేక చర్యలను తీసుకోవటం తెలిసిందే. అమెరికా స్కూళ్లలోని టీచర్లు, విద్యార్ధులతో చైనా వారు సంబంధాలు పెట్టుకుంటూ చైనా భాష, సాంస్కృతిక సంబంధాలు, విద్యార్ధి బృందాల మార్పిడి పేరుతో గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు పిడిఇ ” లిటిల్‌ రెడ్‌ క్లాస్‌ రూమ్స్‌” పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో ఆరోపించింది. ఇలాంటి స్కూళ్లు, కాలేజీలన్నీ అమెరికాలోని 20 మిలిటరీ కేంద్రాల చుట్టూ ఉన్నట్లు మరొక కథనాన్ని దానిలో పేర్కొన్నారు. నిజానికి ఇవేవీ అమెరికా ప్రభుత్వానికి తెలియకుండా జరిగే అవకాశం లేదు.ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా పసిగట్టే శక్తి ఉన్న అమెరికా సిఐఏ, ఎఫ్‌బిఐ, ఎన్‌ఐఏ వంటి సంస్థలకు వేళ్ల మీద లెక్కించదగిన ఆ సంస్థల్లోని కేంద్రాలను మూసి వేయించటం పెద్ద కష్టమేమీ కాదు. ఒక వేళ నిజమే అనుకుంటే ఆ పని చేయకుండా వాటిని అనుమతిస్తూనే మరో వైపు అనుమానాలు రేకెత్తించే ప్రచారానికి అవి తెరలేపుతున్నాయి. అలాంటి కేంద్రాలన్నీ గూఢచర్యానికి పాల్పడుతుంటే, అది వాస్తవమనుకుంటే అమెరికా సర్కార్‌ లేదా అక్కడి సంస్థలు మన దేశంతో సహా అనేక చోట్ల విద్యా సంస్థలతో సంబంధాలు, అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి, వారాలు , నెలల తరబడి మన వారిని అమెరికా ఆహ్వానిస్తున్నాయి. వాటన్నింటినీ సిఐఏ గూఢచార కేంద్రాలుగా పరిగణించాలా ?

కాశ్మీరీ ఫైల్స్‌ వివేక్‌ అగ్నిహౌత్రికి ఆగ్రహం ! మణిపూరీ ఫైల్స్‌ మీద ఎదురుదాడి !!

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాతో డబ్బుకు డబ్బు, కాషాయ దళాలను ఎంతగానో రంజింప చేసి వారి మద్దతు పొందిన వివేక్‌ రంజన్‌ అగ్నిహౌత్రిని మణిపూర్‌ ఫైల్స్‌ గురించి అడగ్గానే అగ్నిహౌత్ర అవధానులయ్యారు. అగ్నిహౌత్రి సంఘపరివార్‌ సభ్యుడా లేక అనేక మంది మాదిరి ముసుగులో ఉన్న అదే తెగ సినిమా రంగ పెద్దమనిషా అన్నది పక్కన పెడదాం. మణిపూరీ ఫైల్స్‌ సినిమా ఎందుకు తీయరు అని ప్రశ్నించిన వారి మీద నేను తప్ప వేరే మగాళ్లే లేరా అంటూ మండిపడ్డారు. ఎదురుదాడికి దిగారు. కాశ్మీరీ ఫైల్స్‌ సినిమా 2022లో ప్రపంచమంతటా 350 కోట్ల రూపాయలను వసూలు చేసి హిందీ సినీ రంగంలో ఒక రికార్డు నెలకొల్పింది. దాని కొనసాగింపుగా మరింతగా సొమ్ము చేసుకొనేందుకు, ప్రచార పర్వంలో భాగంగా కాశ్మీరీ ఫైల్స్‌ అన్‌రిపోర్టెడ్‌ పేరుతో అంటే వెలుగులోకి రాని కాశ్మీరి పండిట్ల ఉదంతాల పేరుతో ఒక సిరీస్‌ విడుదల చేయనున్నారు. తొలి భాగం ఆగస్టు 11న జీ5లో ప్రసారం కానుంది. తాము పరిశోధించిన దానిలో పది నుంచి ఇరవై శాతమే ఈ సిరీస్‌లో చూపనున్నామని, వాస్తవ గాధలను వీటిలో చూస్తారని, తమ పరిశోధన సారాన్ని కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాగా తీశామని అగ్నిహౌత్రి చెప్పారు. ఇది రాజకీయ ప్రచారం కోసం అన్నది వేరే చెప్పనవసరం లేదు. కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడుల గురించి అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలేవీ దాచలేదు, వార్తల మీద ఆంక్షలు విధించలేదు. వాటిని అన్ని పార్టీలూ ఖండించాయి. నేడు మణిపూర్‌ ఉదంతాల మీద జరిగినట్లుగా పార్లమెంటు దద్దరిల్లలేదు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న విపి సింగ్‌ ప్రభుత్వానికి బిజెపి కూడా వెలుపలి నుంచి మద్దతు ఇచ్చింది. రాముడి రధ యాత్ర పేరుతో 1990 నవంబరు రెండున అయోధ్యకు చేరుకున్న కరసేవకులను నిరోధించేందుకు నాడు అధికారంలో ఉన్న ములాయం సింగ్‌ ప్రభుత్వం కాల్పులు జరపటానికి దారితీసిన పరిస్థితి తరువాత బిజెపి దానికి నిరసగా కేంద్రంలో విపి సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది తప్ప కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడులకు కాదు. మూడు దశాబ్దాల తరువాత నాటి ఉదంతాల పేరుతో సినిమా తీసిన వివేక్‌ అగ్నిహౌత్రి వర్తమాన మణిపూర్‌ ఫైల్స్‌ గురించి పరిశోధనా లేదు, సినిమా లేదు.


మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించి, అత్యాజరిపిన ఉదంతం ప్రపంచమంతటినీ కదిలించింది. వివేక్‌ అగ్నిహౌత్రి ఒక సంఘపరివార్‌ విధేయుడిగా స్పందించారు. ఆ ఉదంతాన్ని తక్కువ చేసి చూపేందుకు బిజెపి ఎత్తుగడనే ఆ పెద్దమనిషి కూడా అనుసరించి తన నిబద్దతలో ఎలాంటి సడలింపు లేదని ప్రదర్శించుకున్నారు. వెలుగులోకి రాని కాశ్మీరీ పండిట్ల ఉదంతాలు అనే సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు అగ్నిహౌత్రి ట్విటర్‌ ద్వారా, ఇతరంగా ప్రకటించారు. కాశ్మీరీ హిందువులను ఊచకోత కోస్తే భారత న్యాయవ్యవస్థ దాన్ని చూడకుండా, మౌనంగా నిస్సహాయంగా ఉందని ధ్వజమెత్తారు. మన రాజ్యాంగం వాగ్దానం చేసినట్లుగా కాశ్మీరీ హిందువుల జీవిత హక్కును రక్షించేందుకు తనంతట తానుగా స్పందించటంలో విఫలమైంది, ఇప్పటికీ విఫలమౌతూనే ఉంది అని ఆరోపించారు. మణిపూర్‌ ఉదంతాల మీద నెలల తరబడి మౌనంగా ఉన్న ప్రధాని మోడీ మీద అదే స్పందన ఎందుకు వెల్లడించలేదు ? నిజానికి అగ్నిహౌత్రి కడుపు మంట కాశ్మీరీ పండిట్ల మీద స్పందించలేదు అన్నదాని కంటే మణిపూర్‌ మీద నోరు విప్ప నోరు విప్ప అంటూ ప్రధాని నరేంద్రమోడీ నోటికి వేసుకున్న తాళాన్ని న్యాయవ్యవస్థ తీయించిందన్న దుగ్దను ఆ రూపంలో వెల్లడించుకున్నారు. సమయాన్ని వృధా చేయకండి మీరు దమ్మున్న మగాడే అయితే అక్కడికి వెళ్లండి, మణిపూర్‌ ఫైల్స్‌ సినిమా తీయండి అని దాని మీద ఒక ట్విటర్‌ సవాలు విసిరారు. ఒక ప్రముఖుడి నుంచి అలాంటి ట్వీట్‌ వెలువడితే వేరు. కానీ ఆ సాధారణ ట్వీట్‌ మీద స్పందించి మీకు నా మీద విశ్వాసం ఉన్నందుకు కృతజ్ఞతలు, కానీ నన్ను అన్ని సినిమాలూ తీయాలంటున్నారు దమ్మున్న వారు ఇంకెవరూ లేరా అని ఎదురుదాడికి దిగి అతి తెలివి ప్రదర్శించారు.


అంతకు ముందు వివేక్‌ అగ్నిహౌత్రి మణిపూర్‌ మీద ట్వీట్లు చేశారు, ఒక కవితను కూడా రాశారు. ఒక ట్వీట్‌లో ఇలా ఉంది. ” మణిపూర్‌ : మోప్లా, డైరెక్ట్‌ యాక్షన్‌ డే( ప్రత్యేక దేశంగా పాకిస్తాన్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోకపోతే 1946 ఆగస్టు 11న ప్రత్యక్ష కార్యాచరణ దినాన్ని పాటిస్తామని ముస్లింలీగ్‌ నేత జిన్నా అదే ఏడాది జూలైలో చేసిన ప్రకటన), నౌఖాలీ, బంగ్లాదేశ్‌, పంజాబ్‌, కాశ్మీర్‌, బెంగాల్‌, కేరళ, అసోం, బస్తర్‌ ఇప్పుడు మణిపూర్‌…ప్రతిసారీ అంతిమంగా మన అమాయక తల్లులు, సోదరీమణులు అమానుష,ఆటవిక చర్యలకు బలౌతున్నారు. ఒక భారతీయుడిగా, ఒక పురుషుడిగా, ఒక మనిషిగా ప్రతిసారీ నా ధైర్యం చెదిరింది, నేను సిగ్గుపడ్డాను, నా చేతగాని తనానికి అపరాధన భావనతో ఉన్నా అని పేర్కొన్నారు. ఇక ఆ పెద్దమనిషి కవితా స్పందన గురించి చూద్దాం. ” ఓ మణిపూర్‌… నేను యత్నించా…నేను యత్నించా… కానీ విఫలమయ్యా……నా నైపుణితో ఇప్పుడు నేను చేయగలిగింది వారి విషాద గాధలను చెప్పటమే, కానీ అప్పటికి అది ఎంతో ఆలశ్యం అవుతుంది…… ఎంపిక చేసుకున్న, అతితో కూడిన పోటీ తత్వపు ఎన్నికల రాజకీయాలకు మనమందరం బాధితులం…..మనమందరం మత అతి బాధితులం….. మనమందరం ప్రమాదకర మీడియా బాధితులం…..మనం భారత పౌరులం, బాధితులం……..స్వేచ్ఛా భారతంలో జీవన హక్కులేదు, దాని గురించి మనమేమీ చేయలేం…… ఇది నేను కోరుకున్న స్వేచ్చ కాదు…. ఇలాంటి ప్రజాస్వామ్యం కాదు నేను కోరుకున్నది…… పరస్పరం కొట్టుకున్నవారి రక్తంతో ఒక అఖాతాన్ని మనతో ఏర్పాటు చేయిస్తే దానికి అర్దమే లేదు…..మనది ఒక విఫల సమాజం…. నా సోదరీమణులారా నేను విచారిస్తున్నాను…. నా తల్లులారా నేను విచారిస్తున్నాను…….భారత మాతా నేను విచారిస్తున్నాను.” ఇలా సాగింది ఆ కవిత.


ఇది చదివిన తరువాత ఎవరిలోనైనా తలెత్తే ప్రశ్న ఏమిటంటే దానిలో ఎక్కడైనా మణిపూర్‌ దురాగతానికి పాల్పడిన శక్తుల గురించి ఖండన ఉందా ? దాని మీద రెండు ఇంజన్ల పాలక పార్టీ, ప్రభుత్వాల తీరుతెన్నుల మీద అధిక్షేపణ ఎక్కడైనా ఉందా? మూడు దశాబ్దాల క్రితం జరిగిందని చెబుతున్న, అతిశయోక్తులతో కూడిన కాశ్మీరీ ఫైల్స్‌ సినిమాను తీశారు. ఇప్పుడు కానసాగింపుగా సిరీస్‌ను ఇప్పుడెందుకు తీస్తున్నట్లు ? మణిపూర్‌ గురించి తాను సినిమా తీసే సరికి ఎంతో ఆలశ్యం అవుతుందని చెప్పటాన్ని ఏమనాలి ? తప్పించుకొనే ఎత్తుగడ తప్ప ఇంకేమైనా ఉందా ? ఎంపిక చేసుకున్న ఎన్నికల రాజకీయాలని ఎత్తి చూపుతున్న పెద్దమనిషి వర్తమానాన్ని వదలి మూడు దశాబ్దాల నాటి సంఘటనలను ఇప్పుడెందుకు ”ఎంపిక” చేసుకున్నట్లు ? అవి జరిగినపుడు నా వయస్సు 17, అప్పుడు నాకు తెలియదు అని చెప్పవచ్చు. ఇప్పుడు 49 సంవత్సరాల పరిణితి వచ్చింది కదా పైన చెప్పిన కవితలోని అంశాలతో వర్తమాన భారతమాత ఫైల్స్‌ ఎందుకు తీయలేదు ? ఐరోపా పార్లమెంటుతో సహా ప్రపంచమంతా చర్చిస్తున్నప్పటికీ మణిపూర్‌ ఫైల్స్‌కు అంత సీన్‌ లేదు, గిరిజనుల జీవితాలు అంత విలువైనవి కాదు, వారికి కాశ్మీరీ పండిట్లకు ఉన్నంత పలుకుబడి వారికి లేదు, కాశ్మీరీ ఫైల్స్‌ మాదిరి సంఘపరివారం ప్రోత్సహించదు, డబ్బురాదు అనుకుంటున్నారా ? లేక అన్నింటికీ మించి అక్కడ అసలు కారకులు సంఘపరివారం అని చెప్పాల్సి వస్తుందనా ? బేటీ బచావో అని చెప్పిన పెద్దమనిషి మణిపూర్‌ బేటీల గురించి తనంతట తాను ముందుకు వచ్చి దేవాలయం అని వర్ణించిన పార్లమెంటులో మాట్లాడకుండా భవనపు మెట్లు, గోడల ముందు మొక్కుబడి ప్రకటన చేసిన ప్రధాని నరేంద్రమోడీ ఫైల్స్‌ను విప్పాల్సి ఉంటుందనా ?


గతంలో శవ గంగా వాహిని పేరుతో దిక్కులేని కరోనా మృతుల కళేబరాలను గంగానదిలో నెట్టివేసి చేతులు దులుపుకున్న యోగి ఆదిత్యనాధ్‌ ఏలుబడి నిర్వాకం మీద, సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ ప్రతినిధిగా ఉన్న వారణాసి వద్ద ప్రవహించే గంగను పవిత్ర నదిగా భావించే గుజరాతీ కవయిత్రి పారుల్‌ కక్కర్‌ రాసిన ఆగ్రహ, నిరసన కవిత మీద హిందూత్వశక్తులు విపరీతంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వివేక్‌ అగ్నిహౌత్రి మణిపూర్‌ ఫైల్స్‌ సినిమా తీస్తే అదే దాడి అతని మీద కూడా జరుగుతుంది. దేశంలో ఉన్న వర్తమాన స్థితి అది. అందుకే చచ్చిన చేప వాలు కథనాన్ని ఎంచుకున్నారన్నది స్పష్టం.మణిపూర్‌ మీద అల్లిన కవిత అలాంటిదే. దానితో సంఘపరివారానికి, పాలక బిజెపి నేతలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మానవాళి మీద జరుగుతున్న దోపిడీ, అణచివేత గురించి చరిత్రలో అనేక మంది చెప్పారు. దాన్ని తొలగించే కార్యాచరణను కూడా ప్రతిపాదించటమే కారల్‌ మార్క్స్‌, ఎంగెల్స్‌ ప్రత్యేకత. విఫల సమాజం గురించి చెప్పిన వారి కోవలో వివేక్‌ అగ్నిహౌత్రి మొదటి వారూ కాదు చివరి వారూ కాదు.


గంగ గురించి, దాని మురికి గురించి అనేక మంది రాశారు. ఇప్పుడు ఎవరైనా రాస్తే కొత్త దనం ఏమిటన్నది ప్రశ్న. ప్రధాన స్రవంతి మీడియా గంగలో కొట్టుకు వస్తున్న కరోనా శవాల గురించి అనివార్యమై పోటీ కారణంగా వార్తలు, చిత్రాలను ఇవ్వాల్సి వచ్చి ఇచ్చింది తప్ప ఆ నిర్వాకానికి కారణభూతమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి పారుల్‌ ఖక్కర్‌ కూడా రాజకీయ కోణంతో రాయలేదు. ఒక హిందువుగా గంగానదిని పవిత్రమైనదిగా భావించే కోవకు చెందిన సామాన్యురాలు ఆమె. కొట్టుకు వస్తున్న శవాల వార్తలు, వాటిని కుక్కలు పీక్కు తింటున్న దశ్యాలను చూసిన తరువాత అలాంటి పవిత్ర భావనలను కుదిపివేయటంతో తట్టుకోలేక వెల్లడించిన స్పందన తప్ప మరొకటి కాదు. అలాంటి స్పందన కూడా వివేక్‌ అగ్నిహౌత్రిలో కనిపించలేదు. ఆమె కవితను మరోసారి ఇక్కడ చూద్దాం.అనువాదం : రాఘవశర్మ

శవవాహిని గంగ
భయపడకు..ఆనందపడిపో…ఒకే గొంతుతో శవాలు మాట్లాడుతాయి….ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవాలు గంగానదిలో ప్రవహించడం చూశాం….ఓ రాజా..అడవి అంతా బూడిదయ్యింది,ఆనవాళ్ళు లేవు, అంతా శ్మశానమైపోయింది,…..ఓ రాజా..బతికించే వాళ్ళు లేరు,…..శవాలను మోసేవాళ్ళూ కనిపించడం లేదు,…..ధుఃఖితులు మాత్రం మిగిలారు……అంతా కోల్పోయి మిగిలాం…..మాటలు లేక బరువెక్కిన మా హదయాలు శోకగీతాలైనాయి…..ప్రతి ఇంటిలో మత్యుదేవత ఎగిసిపడుతూ తాండవమాడుతోంది……ఓ రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది……ఓ రాజా..కరిగిపోతున్న పొగగొట్టాలు కదిలిపోతున్నాయి, వైరస్‌ మమ్మల్ని కబళించేస్తోంది……ఓ రాజా.. మా గాజులు పగిలిపోయాయి, భారమైన మా హదయాలు ముక్కలయ్యాయి……అతను ఫిడేలు వాయిస్తున్నప్పుడు మా నగరం కాలిపోతోంది…..బిల్లా రంగాల బరిసెలు రక్తదప్పిక గొన్నాయి….. రాజా..నీ రామ రాజ్యంలో శవ గంగా ప్రవాహమైంది……ఓ రాజా..నీవు మెరిసిపోతున్నట్టు, మండుతున్న కొలిమి లాగా నీ దుస్తులు తళుక్కుమనడం లేదు…..ఓ రాజా..ఈ నగరమంతా చివరిగా నీ ముఖాన్ని చూస్తున్నాయి…..ఇక పరిమితులు, మినహాయింపులు లేవు నీ దమ్ము చూపించు,…..రా..బయిటికి రా.. గట్టిగా చెప్పు, పెద్దగా అరువు,……దిగంబర రాజు అవిటివాడు, బలహీనుడు……ఇక నీవు ఏ మాత్రం మంచివాడిగా ఉండలేనని చెప్పు……కోపంతో ఊగిపోతున్న నగరం మంటలు ఎగిసిపడుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి…..,ఓ రాజా.. నీ రామరాజ్యంలో శవగంగా ప్రవాహాన్ని చూశావా?


ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్‌ ఉదంతం మీద దాల్చిన మౌనం, అక్కడి మానవతుల మీద జరిపిన దుర్మార్గ పూర్వరంగంలో మరో గుజరాతీ రచయిత్రి మహాస్వేతా జానీ స్పందించారు. ఆ ఉదంతాలు గతంలో జరిగిన వాటి కొనసాగింపే అన్న అగ్నిహౌత్రకు, ఇక్కడ అలాంటివి ఎన్నో జరిగాయన్న మణిపూర్‌ సిఎం బిరేన్‌ సింగ్‌కూ తేడా ఏముంది ? మహిళలు, వారి శరీర భాగాల మీద మనువాదుల భావజాలాన్ని, అత్యాచారాన్ని ఆయుధంగా చేసుకొని దాడులు చేస్తున్న వారిని నిరసిస్తూ మణిపూర్‌ ఉదంతం మీద వెల్లడించిన మహాస్వేతా జానీ రచన ఇది. ఇతర రాష్ట్రాలలోని అనేక మంది కవులు, కవయిత్రులు స్పందించటం వేరు. గుజరాత్‌కు చెందిన వారు తమ మీద పెద్ద ఎత్తున కాషాయదళ దాడి జరుగుతుందని తెలిసినా గళం విప్పటం, అది కూడా ప్రధాని నరేంద్రమోడీ తీరు తెన్నుల నేపధ్యంలో అన్నది గమనించాలి. ఆ రచన ఇలా సాగింది.సంఘపరివార్‌ నీడలో జీవిస్తున్న వివేక్‌ అగ్నిహౌత్రి స్పందనకు దీనికి ఉన్న తేడాను వేరే చెప్పాల్సిన పనిలేదు.


ఇటీవల కామన్‌ కాజ్‌, లోకనీతి, సిఎస్‌డిఎస్‌ సంస్థలు గుజరాత్‌లో ఉన్న పరిస్థితి గురించి ఒక సర్వే చేశాయి. సామాజిక మాధ్యమంలో ఒక రాజకీయ లేదా సామాజిక అంశం మీద ప్రతికూలంగా స్పందిస్తే దాడికి దిగుతున్నవారిని చూసి తాము చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నట్లు సర్వేలో మూడింట రెండు వంతుల మంది చెప్పారని తేలింది. వారిలో మూడో వంతు మంది తీవ్రంగా భయపడుతున్నట్లు, తమ ఫోన్ల మీద నిఘాఉన్నట్లు చెప్పారట. ఆ సర్వేలో లోకనీతి ప్రతినిధిగా ఉన్న మహాశ్వేతా జానీ ఆ తరువాతే మణిపూర్‌ ఉదంతం గురించి గుజరాతీ భాషలో ఒక కవితను రాశారు. దాన్ని సలీల్‌ త్రిపాఠీ ఆంగ్లీకరించారు. అది ఇలా సాగింది.

నేను
భగరంధ్రము…..నేను ఒక యుద్ధ క్షేత్రాన్ని కాదు……లేదా ఏ విశ్వాసాన్ని రక్షించేదాన్ని కాదు…..లేదా ఏ సంస్మృతినీ మోసేదాన్ని కాదు…..లేదా పవిత్రతవైపు నడిపించే మార్గాన్ని కాదు……లేదా ఏ సమాజపు సొత్తునూ కాదు…..లేదా బానిసత్వానికి దారి తీసే మార్గాన్ని కాదు….లేదా రక్త ప్రవాహాన్ని కాదు….లేదా స్త్రీత్వ సారాన్ని కాదు……కచ్చితంగా చెబుతున్నా భూమికి భారాన్ని కాదు……కానీ……ఆమె కోరుకుంటే…..
తరువాత…నేను …..ఒక నవసృష్టికి సారధిని అవుతా !

రానున్నది రోబోట్లు, కోబోట్ల యుగం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఒక నాడు కంప్యూటర్ల ప్రవేశం, వినియోగం గురించి అనుకూల వ్యతిరేక వాదనలు జరిగినట్లుగానే ఇప్పుడు ప్రపంచంలో రోబోట్లు, కోబోట్ల గురించి మాట్లాడుతున్నారు. మానవులతో పని లేకుండా ప్రోగ్రామ్‌ చేసి వదిలితే వాటంతట అవే పని చేసేవి రోబోట్లు, మనుషులు పని చేయించేవి కోబోట్లు. రెండూ ఉత్పత్తిని పెంచేవే. ఎవరు వద్దన్నా కద్దన్నా వచ్చే రోజులు వాటివే. అంతర్జాతీయ రోబోటిక్స్‌ ఫెడరేషన్‌ వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం చైనా పెద్ద మొత్తంలో రోబోట్ల మీద పెట్టుబడి పెడుతోంది. ప్రతి పదివేల మంది కార్మికులకు అక్కడ ప్రస్తుతం 322 రోబోట్లు ఉన్నాయి. దీన్ని రోబోట్ల సాంద్రతగా పరిగణిస్తున్నారు. ఉత్పాదక రంగ పరిశ్రమల్లో 2021 సమాచారం ప్రకారం ప్రపంచ సగటు 141రోబోలు ఉన్నాయి. దేశాల వారీగా దక్షిణ కొరియా 1,000, సింగపూర్‌ 670, జపాన్‌ 399, జర్మనీ 397, చైనా 322, స్వీడన్‌ 321, చైనీస్‌ హాంకాంగ్‌ 304, చైనీస్‌ తైవాన్‌ 276, అమెరికా 274, స్లోవేనియా 249తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. గతంలో వ్యవసాయం నుంచి పరిశ్రమలకు మారినపుడు, 1980వ దశకంలో వచ్చిన కంప్యూటర్ల తరువాత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఉపాధి దొరికినట్లే రోబోలు వచ్చినా కొత్త అవకాశాలు వస్తాయని సమర్దకులు చెబుతున్నారు. కార్మికుల స్థానంలో గతంలో యంత్రాలు వచ్చినా వాటిని నడిపేందుకు కార్మికులు కావాల్సి వచ్చింది. ఇప్పుడు రోబోలకు ఎవరితోనూ అవసరం ఉండదు.అందువలన అంత తేలిక కాదు అంటున్నారు మరికొందరు.


ప్రపంచ పరిణామాలను చూస్తున్నపుడు పెద్ద మొత్తంలో భారీ పరిశ్రమలను నిర్వహించేవారు లాభాలు ఎక్కువగా ఉంటాయి గనుక రోబోట్ల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. చిన్న సంస్థలు కోబోటిక్స్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరింత ఆధునిక రోబోలను రూపొందించేందుకు పరిశోధన- అభివృద్ధికి దేశాలూ, సంస్థలు కూడా భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. రోబో రంగంలో ప్రపంచ అగ్రగామిగా మారే లక్ష్యంతో చైనా 2021 డిసెంబరు 21న పద్నాలుగవ పంచవర్ష ప్రణాళికను ప్రకటించింది. ఐదు సంవత్సరాల్లో ఎనిమిది కీలక పరిశ్రమలను రోబోట్లతో నింపాలని పేర్కొన్నారు.” తెలివైన రోబో ” ను ఆవిష్కరించేందుకు 2022 ఏప్రిల్‌ 23న 4.35 కోట్ల డాలర్లతో పరిశోధనకు శ్రీకారం చుట్టారు.2018లో ప్రపంచంలో చైనా 20వ స్థానంలో ఉండగా మూడు సంవత్సరాల్లో ఐదవ స్థానానికి ఎదిగింది. నూతన రోబోట్‌ వ్యూహం పేరుతో జపాన్‌ 93 కోట్ల డాలర్లతో నూతన ఆవిష్కరణలతో తమ దేశాన్ని ప్రపంచ రోబో హబ్‌గా మార్చేందుకు పూనుకుంది. స్వంతంగా వాహనాలను నడిపే రోబోలతో సహా ఇతర ఆధునిక ఆవిష్కరణలకు నిధులు వెచ్చిస్తున్నది. పారిశ్రామిక రోబోల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జపాన్‌ 2021లో ప్రపంచానికి 45శాతం సరఫరా చేసింది.
నాలుగవ తరం పారిశ్రామిక విప్లవానికి అవసరమైన రోబోలను అందించేందుకు దక్షిణ కొరియా 2022వ సంవత్సరానికే 17.25 కోట్ల డాలర్లను కేటాయించింది. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు 2021 నుంచి 2027వరకు 9.43 కోట్ల డాలర్లను ఐరోపా సమాఖ్య వెచ్చించనుంది. 2021-22లో రోబో సంబంధిత కార్యక్రమానికి 19.85 కోట్ల డాలర్లను కేటాయించింది. హైటెక్‌ వ్యూహం 2025 పేరుతో జర్మనీ పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఏటా 6.9 కోట్ల డాలర్లను 2026 వరకు ఖర్చు చేస్తుంది. జాతీయ రోబోటిక్‌ చొరవ(ఎన్‌ఆర్‌ఐ 3.0) పేరుతో అమెరికా కూడా 2021లో 1.4 కోట్ల డాలర్లతో నవీకరణకు పూనుకుంది. అంతరిక్షంలో పరిశోధనలకు అవసరమైన రోబోలను రూపొందించటం కూడా దీనిలో ఉంది. రోబో సాంద్రతలో వెనుకబడ కూడదని అది భావిస్తున్నది.


రానున్న రోజుల్లో పారిశ్రామిక ఉత్పత్తి, అంతరిక్షం, వైద్యం మొదలు అనేక రంగాల్లో ముందుండేందుకు ప్రపంచ దేశాలన్నీ పరుగులు పెడుతున్నాయి.కృత్రిమ మేథలో ఎవరికి వారు పైచేయి సాధించాలని చూస్తున్నారు. వైద్యం వంటి రంగాలలో రోబోలతో మరింత మెరుగైన సేవలను అందించవచ్చుగానీ పారిశ్రామిక రంగంలో వీటి ప్రవేశంతో వేతనాల తగ్గుదల, నిరుద్యోగం పెరుగుతుందనే అభిప్రాయాలతో పాటు దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేవారు కూడా ఉన్నారు.చైనాలో జరిగిన పరిశోధనలో పారిశ్రామిక రోబోలు ప్రతికూల ప్రభావం చూపుతాయని తేలిందని కొందరు ఉటంకిస్తున్నారు.2016లో ప్రచురితమైన ఒక పత్రం ప్రకారం యాంత్రీకరణ వలన 77శాతం మంది ఉపాధికి గండిపడుతుందని పేర్కొన్నారు. దానికి ఫాక్స్‌కాన్‌ కంపెనీని ఉదహరించారు. 2020నాటికి 30శాతం ఆటోమేషన్‌ చేసేందుకు గాను 2012-16 సంవత్సరాల్లో నాలుగు లక్షల ఉద్యోగాలను రోబోలతో నింపారు. అన్నింటా అదే జరుగుతుందని చెప్పలేము. గంటలవారీ చెల్లించే వేతనాలు తొమ్మిదిశాతం తగ్గినట్లు కూడా తేలింది. కార్మికుల పని గంటలు కూడా పెరిగాయి. మెకెన్సీ గ్లోబల్‌ సంస్థ 2017లో వెల్లడించిన నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో ఐదో వంతు అంటే 80 కోట్ల ఉద్యోగాలు రద్దుకానున్నట్లు అంచనా వేశారు.నలభై ఆరు దేశాల్లోని పరిస్థితిని విశ్లేషించారు. ధనిక దేశాల్లో యాంత్రీకరణ మరింత ఎక్కువగా ఉంటుంది కనుక నిధులు కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, పేద దేశాల దగ్గర డబ్బు ఉండదు కనుక వాటి మీద ప్రభావం తక్కువేనని కూడా పేర్కొన్నది. యాంత్రీకరణతో మెషిన్‌ ఆపరేటర్లు, ఆహార కార్మికులు, ఆఫీసు సిబ్బంది, అకౌంటెంట్లు ఎక్కువగా ప్రభావితులౌతారు. భారత్‌లో తొమ్మిది శాతం ఉద్యోగాలను నూతన సాంకేతిక యంత్రాలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది. వైద్యులు, లాయర్లు, బార్లలో పనిచేసే వారు, తక్కువ వేతనాలతో పనిచేసే గార్డెనర్లు, ప్లంబర్లు, సంరక్షణ సిబ్బంది మీద పెద్దగా ప్రభావం ఉండదు. తక్కువ చదువుకున్నవారికి ఉపాధి తగ్గుతుంది, అభివృద్ది చెందిన దేశాలలో విశ్వవిద్యాలయాల చదువు అవసరాలు పెరుగుతాయి.అమెరికాలో 2030 నాటికి 3.9 నుంచి 7.3 కోట్ల వరకు ఉద్యోగాలు రద్దవుతాయని, ఉపాధి కోల్పోయే రెండు కోట్ల మందిని ఇతర పరిశ్రమల్లోకి సర్దుబాటు చేయవచ్చని, బ్రిటన్‌లో 20శాతం ఉద్యోగాలను రోబోలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది.


అమెరికాలో రోబోల ప్రవేశం గురించి జరిగిన పరిశోధనలో ప్రతి 1000 మంది కార్మికులకు ఒక రోబోను ఏర్పాటు చేస్తే 0.42 శాతం వేతనాలు తగ్గుతాయని, ఉపాధి జనాభా దామాషాలో 0.2శాతం తగ్గుతుందని అంచనా వేశారు.ప్రదేశాలను బట్టి ఇవి మారతాయి. మరొక రోబోను తోడు చేస్తే ఆరుగురికి ఉపాధి ఉండదు. వెల్డింగ్‌, పెయింటింగ్‌, పాకింగ్‌ వంటి వాటిని పూర్తిగా ఆటోమేషన్‌ చేయవచ్చు. 1993-2007 కాలంలో అమెరికాలో పారిశ్రామిక రోబోట్లు నాలుగు రెట్లు పెరిగాయి.యాంత్రీకరణ కంటే ఇవి ఎక్కువ మంది ఉపాధి పోగొట్టినట్లు తేలింది. ఆటోమోటివ్‌ పరిశ్రమలో ఎక్కువగా రోబోట్లు వస్తున్నాయి.ఎలక్ట్రానిక్స్‌లో 15,కెమికల్స్‌లో 10శాతం రోబోట్లను పెట్టగా ఆటో పరిశ్రమలో 38శాతం ఏర్పాటు చేశారు. పెట్టుబడిదారీ దేశాల్లో కార్పొరేట్ల లాభాల ప్రాతిపదికనే రోబోలను ఏర్పాటు చేస్తే చైనాలో ఎందుకు వేగంగా ప్రవేశపెడుతున్నారనే ప్రశ్న తలెత్తవచ్చు. అమెరికా, ఐరోపా ధనిక దేశాల్లో జనాభా తక్కువ, ఉత్పత్తి ఎక్కువ గనుక లాభాల కోసం చేస్తే చైనాలో 140 కోట్ల జనాభా వినియోగం కోసం ఉత్పత్తి, సేవలను ఎంతగానో పెంచాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారీ దేశాల్లో లాభం కొన్ని సంస్థల చేతుల్లో చేరుతుంది, చైనాలో ఎక్కువ భాగం సమాజపరం అవుతుంది. ఐరోపా, జపాన్‌ మాదిరి చైనాలో సగటు జీవిత కాలం పెరగటం, పిల్లల్ని కనటం తగ్గింది కనుక రానున్న కాలంలో కార్మికులకు కొరత ఏర్పడనుందని అక్కడి నిపుణులు అంచనా వేశారు. ఆ పరిణామం పశ్చిమ ఐరోపా దేశాల్లో చూస్తున్నదే. ఈ కారణంగా కూడా చైనా రోబోట్లను ప్రవేశపెడుతున్నది. చైనాలో గత దశాబ్దిలో 50లక్షల జనాభా తగ్గింది. సామర్ధ్యపెంపుదలకు, డ్రైవర్లతో పని లేని కార్లు, రోబోలతో నడిచే గోదాముల వంటి వాటి ఏర్పాటుకు అనేక పరిశోధనలు చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం ఫైనాన్సియల్‌ రంగంలో పని చేసే ఒక కార్మికుడి ఉత్పాదకత ఐరోపాతో పోల్చితే చైనాలో 20శాతం ఉంది, తరువాత 40,50 శాతం వరకు పెరిగినప్పటికీ ఇంకా చాలా తేడా ఉంది. అందువలన వాటితో పోటీ పడాలంటే తగిన మార్పులు అవసరం అని భావిస్తున్నారు. మన దేశంలో కారు డ్రైవర్లకు తక్కువ వేతనాలకు దొరుకుతున్నారు గానీ ఐరోపాలో, అమెరికాలో అలా దొరకరు. అందుకే డ్రైవర్లతో పనిలేని కార్ల గురించి పరిశోధనకు తెరతీశారు.రోబో, యాంత్రీకరణ కారణంగా చైనాలో 2018-30 మధ్య 30శాతం మంది కార్మికులు ఒక పని నుంచి మరొకదానికి మారాల్సి ఉంటుందని మెకెన్సీ సంస్థ అంచనా వేసింది. ఇది అక్కడి ప్రభుత్వం, పౌరులకూ పెద్ద సవాలే అనటంలో సందేహం లేదు. దాన్ని అధిగమించేందుకు చైనా సన్నద్దం అవుతున్నది.


చైనాలో రోబోట్ల ప్రవేశం వలన కలిగే ప్రతికూల పర్యవసానాలు రానున్న రెండు దశాబ్దాల్లో కనిపిస్తాయని కొందరు చెబుతున్నారు. కృత్రిమ మేథ, రోబోట్ల వలన రెండు దశాబ్దాల్లో 26శాతం మంది వేరే ఉపాధి చూసుకోవాల్సి వుంటుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ అంచనా వేసింది. దీనికీ మెకెన్సీ అంచనాకు చాలా తేడా ఉంది. కొన్ని పోవటం, కొత్త ఉపాధి రావటం ఏతా వాతా వచ్చే రెండు దశాబ్దాల్లో నికరంగా పన్నెండు శాతం ఉపాధి పెరుగుతుందని కూడా ప్రైస్‌వాటర్‌ చెప్పింది.2017-37 మధ్య సేవారంగంలో 9.7 కోట్లు, నిర్మాణ రంగంలో 1.4 కోట్లు, పరిశ్రమల్లో 40లక్షల మందికి ఉపాధి పెరిగితే వ్యవసాయంలో 2.2 కోట్లు తగ్గితే మొత్తంగా 9.3 కోట్లు పెరుగుతాయని అంచనా వేసింది. అక్కడ ఉన్నది ప్రజానుకూల సోషలిస్టు ప్రభుత్వం గనుక వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన సర్దుబాటు చేస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా దానికంతటికి అదే జరుగుతుందని ఎవరూ భావించనవసరం లేదు. ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించిన చైనా గత చరిత్రను బట్టి ఇలా చెప్పవచ్చు. జనానికి పని కల్పించి ఉత్పత్తి పెంచి ఎగుమతులు చేసి ఎంతో ప్రగతి సాధించిన చైనాలో మాదిరి ఇతర దేశాల్లో కార్మికుల వేతనాలు పెరగలేదు. ఒకనాడు తక్కువగా ఉన్న కారణంగా అనేక దేశాలు తమ పెట్టుబడులతో అక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేతనాలు పెంచిన కారణంగా ఆశించిన మేర లాభాలు రావటం లేదని కొన్ని సంస్థలు అక్కడి నుంచి వెనక్కు పోతున్నాయి. ఎగుమతుల మీద ఎల్లకాలం ఆధారపడటం సాధ్యం కాదని గ్రహించిన కారణంగానే తమ జనాల కొనుగోలు శక్తిని పెంచేందుకు వేతన పెంపుదల వంటి చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. నూతన ఆవిష్కరణలతో ఉత్పత్తి పెరిగితే ఆ మేరకు మానవ శ్రమ పని గంటలను తగ్గించి అందరికీ ఉపాధి కల్పించటం, సంపదల పంపిణీతో జనం అవసరాలను తీర్చటం వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందువలన ఈ నూతన సవాలును ప్రజల పట్ల బాధ్యత కలిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ అధిగమించటం ఖాయం, అయితే ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఆసక్తికరం, ఇదే సమస్యను ఎదుర్కొనే పెట్టుబడిదారీ దేశాలు ఎలా పని చేసేది చూడాల్సి ఉంది.

ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ : ఆవు పేడ కాదు, కావాల్సింది సెమీ కండక్టర్ల పరిశోధన !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారికి,
అయ్యా ప్రతి నెలా మీ మన్‌కీ బాత్‌ అంశాలను చదివేవారిలో నేను ఒకరిని.ఒక జర్నలిస్టుగా జన్‌కీ బాత్‌లో ఉన్న కొన్ని ంటిని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జూలై 28-30 తేదీలలో గుజరాత్‌ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో తమరు సెమికాన్‌ ఇండియా 2023 రెండవ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా దేశమంతటా పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు కూడా జారీ చేశారు. దేశాన్ని సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చుతామని, మూడు వందల కాలేజీల్లో సెమికండక్టర్‌ కోర్సులను ప్రవేశపెడతామని తమరు ప్రకటించటం సంతోషం. గతంలో దేశంలో జరిగిన అనర్ధాలకు, వెనుకబడి ఉండటానికి,మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రాకపోవటానికి నెహ్రూనే కారణం అని బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివారం ఠకీమని సమాధానం చెబుతుంది. సెమికండక్టర్ల రంగంలో వెనుకబడటానికి కూడా నెహ్రూనే నిందిస్తారా ?


అన్నీ మీరే చేశారు అని మా తెలుగు సినిమాలో ఒక పాత్ర తండ్రిని తప్పుపడుతుంది. అలాగే అన్నీ ఆ నెహ్రూ చేశారనే కాసేపు అనుకుందాం.ఆయన అనుసరించిన విధానాల నుంచి కాంగ్రెస్‌ 1990దశకంలోనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వైదొలిగిందని మీకు తెలియంది కాదు. వాటినే మీరు అమలు జరుపుతున్నారు తప్ప కొత్త విధానాలు కాదు, ఎందుకంటే వాటిని మన మీద ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ రుద్దింది. గత పది సంవత్సరాలలో మీకు పూర్తి అధికారం ఉన్నప్పటికీ మీరు అంగీకరించినా లేకున్నా అనేక రంగాలలో వైఫల్యబాటలోనే దేశం ఉండటానికి కారణం ఆ విఫల విధానాలనే మరింత వేగంగా అమలు జరపటమే. అరిగిపోయిన రికార్డు అంటే ఇప్పటివారికి తెలియదు కనుక అన్నీ నెహ్రూనే చేశారు అనే పాచిపాట ఇంకా ఎంతకాలం పాడాలి అని మీ భక్తులు, జనం నుంచి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. మీరు చెప్పిన మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ధి వంటి విఫల నినాదాలను చూసిన తరువాత ఎన్నికల కోసం ఆడుతున్న ఆటలో భాగం ఇదని అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన నినాదం, చెప్పిన మాట మరోసారి మీ నోటి వెంట రాదన్నది స్పష్టమే. మీ శైలి అనితరసాధ్యం. గతంలో అమెరికా, పూర్వపు సోవియట్‌ మధ్య ప్రచ్చన్న పోరులో అణ్వాయుధాలు కేంద్ర స్థానంలో ఉంటే ఇప్పుడు అమెరికా, చైనా మధó్య తలెత్తిన పోరులో సెమీకండక్టర్‌లు ఉన్నాయి.ఆయుధాలలో కూడా ఇవి కీలకంగా మారనున్నాయని విశ్వగురువుగా ప్రపంచాన్ని ఔపోసన పట్టిన మీకు నేను చెప్పాల్సినపని లేదు.


ఎయిర్‌బస్‌లో అనేక దేశాలను అలా వెళ్లి ఇలా చుట్టివచ్చిన మీరు సెమీకండక్టర్‌ బస్‌ను ఎలా మిస్‌ అయ్యారన్నది చాలా మందికి అర్ధం కావటం లేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తరువాత వచ్చిన ప్రధానులెవరికీ(వారిలో అతల్‌ బిహారీ వాజ్‌పాయి ఉన్నదీ లేనిదీ తెలియదు) దూర దృష్టి లేదని విమర్శించే మీ అనుయాయులు (సుబ్రమణ్య స్వామిని పక్కన పెడదాం) మీ గురించి ఏం చెబుతారో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేసిన దాన్ని మీరు తొలి ఐదు సంవత్సరాల్లోనే చేసి చూపించారని గత ఎన్నికలపుడు ప్రచారం చేశారు. చేసిందేమిటో సాధికారిక సమాచారాన్ని జనానికి అందిస్తే వాస్తవం తెలుస్తుంది. మన దేశంలో మీ కంటే ముందు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) పేరుతో వివరాలను సేకరిస్తున్నారు. దానిలో మీ పాలనలో అనేక సూచికలు దిగజారినట్లు కనిపించింది. మీ ఏలుబడిలో నిరుద్యోగం పెరిగిందన్న సమాచారాన్ని గత లోక్‌సభ ఎన్నికల ముందు తొక్కిపెట్టిన సంగతి మీకు చెప్పనవసరం లేదు. వచ్చే సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని సమాచారాన్ని సేకరించే పద్దతిని రూపొందించే సంస్థ అధిపతినే తప్పించారు అని జనం అనుకుంటున్నారు.


నరేంద్రమోడీ పెద్ద విజనరీ అంటే భూత, వర్తమాన, భవిష్యత్‌ను చూడగలిగిన దృష్టి కలవారని అని ప్రచారం చేశారు. నిజమే కావచ్చు, సర్వేల్లో వచ్చే సమాచారం ఎలాంటిదో మీకు ముందే తెలిసి ఉంటుంది గనుక దాని రూపకర్తనే తొలగించారు. అన్నట్లు మరిచాను. ఈ ఏడాది మీ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని మీరు ముందే గ్రహించి ఆ విషయాన్ని ఎన్నో సంవత్సరాల ముందే మీరు చెప్పినట్లు కొందరు సామాజిక మాధ్యమంలో మీ గొప్ప గురించి ప్రచారం చేస్తున్న పోస్టు ఉంది. దాని నిజా నిజాలు మీకే ఎరుక. నిజంగా మీకు తెలిసి ఉంటే మణిపూర్‌ దురంతాన్ని ఎందుకు నివారించలేకపోయారు అన్న ప్రశ్న వస్తోంది. దాన్ని వదలివేద్దాం. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం గురించి కూడా మీరు చెప్పారు. పిండి లేకుండా రొట్టెలు రావు కదా ? దానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి రంగాల ప్రాధాన్యత, దానిలో సెమికండక్టర్ల గురించి ప్రధాని కాగానే లేదా అంతకు ముందు గుజరాత్‌ సిఎంగా ఎందుకు పసిగట్టలేకపోయినట్లు ? ఈ రంగానికి నిధుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు చేయాల్సి ఉంది. రెండూ జరగటం లేదు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న గేట్‌వే హౌస్‌ అనే ఒక మేథో సంస్థ 2015 జనవరి పదహారున టెక్నాలజీ పరుగులో చైనా ముందు భారత్‌ ఓడిపోనుందా అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది. మీ సలహాదారులకు దీని గురించి తెలియదని అనుకోలేము.లేదా ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే మన దేశ ఖర్మ అనుకోవటం తప్ప చేసేదేమీ లేదు. దానిలో పరిశోధన, అభివృద్ది ఖర్చు గురించి చర్చించారు. 1991 నుంచి చైనా పరిశోధన ఖర్చును ఏటా 19శాతం పెంచుతూ 2012నాటికి జిడిపిలో 1.97శాతానికి చేరినట్లు పేర్కొన్నారు.అప్పటికి మనదేశ ఖర్చు 0.9శాతం మాత్రమే ఉంది.ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రికలో 2023 ఫిబ్రవరి ఒకటిన ప్రచురితమైన ఒక విశ్లేషణలో జిడిపిలో మనదేశ తాజా ఖర్చు 0.7శాతమే అని చైనా 2.1శాతంగా పేర్కొన్నారు. జిడిపిలో రెండు శాతం ఖర్చు చేయాలని గతంలో వాజ్‌పాయి సర్కార్‌ కూడా చెప్పింది. దూరదృష్టి గల మీ పాలనలో గతం కంటే తగ్గిందేమిటి ? మన దేశంలో నిపుణులకు, పరిశోధకులకు కొరత ఉన్నదా ?


కుహనా అంశాలమీద పరిశోధనకు మీరు చూపుతున్న శ్రద్ధ సెమికండక్టర్స్‌ వంటి ప్రాధాన్యరంగాల మీద లేదు, ఆవు పేడ, మూత్రం, పాలలో బంగారం ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ పరిశోధనలకు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తున్నదని 2020 సంవత్సరంలో వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వతీరుతెన్నులను తప్పు పడుతూ ఆ పరిశోధనలను ఆపివేయాలని కోరినా మీరు పట్టించుకోలేదు. అంతకు ముందు 2017లో పంచగవ్య గురించి ఆయుర్వేద పుస్తకాల్లో రాసిన వాటిని రుజువు చేసేందుకు పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. మొత్తంగా పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించకుండా ముందుకు పోవటానికి మీ దగ్గర మంత్రదండమేదైనా ఉంటే హాం ఫట్‌ అంటూ తిప్పండి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారని చెప్పటం మీకు ఇష్టముండదని తెలిసినా తప్పటం లేదు.


తినేందుకు బంగాళాదుంప, అరటి చిప్స్‌ లేకున్నా రోజు గడుస్తుందిగానీ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ లేకుండా మనకు క్షణం గడవదంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో నిపుణులైన సెమికండక్టర్‌ రూపకల్పన ఇంజనీర్లు ప్రపంచం మొత్తంలో ఉన్నవారిలో 20శాతం మంది మనదేశంలో ఉన్నారని అంచనా. వారందరినీ విదేశీ కంపెనీలకు చౌక శ్రామికులుగా సమర్పించటం తప్ప ఇప్పుడు జరుగుతున్నదేమైనా ఉందా ? వారు సాధించే పేటెంట్స్‌ మన దేశానికి దక్కవు. మన ఇంజనీర్లు ఐటి రంగంలో ముందున్నారు. దీనికి మీ సర్కార్‌ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. హార్డ్‌వేర్‌ రంగంలో ఆ స్థితి లేదు. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ భాగం మనం దిగుమతి చేసుకుంటున్నార. అదే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో విదేశీ కంపెనీలు రూపకల్పనలో లబ్ది పొందటం తప్ప చిప్స్‌ తయారీ మన దేశంలో ఎంతమేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం అమెరికా మైక్రాన్‌ కంపెనీ ఎక్కడో ఉత్పత్తి చేసిన వాటిని మనదేశంలో పరీక్షించి పాకింగ్‌ చేయిస్తున్నది. దానితోనే పండగ చేసుకుందామా ?


చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరులో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది.తమ దేశంలోనే సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని, అక్కడి నుంచి ఎగుమతులు జరపాలని అమెరికా సర్కార్‌ పట్టుబడుతోంది. తైవాన్‌లోని టిఎస్‌ఎంసి కంపెనీ ఉత్పత్తి మీద అదుపు కలిగి ఉంది.1990లో ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పతిలో అమెరికా వాటా 37శాతం ఉంటే 2020లో 12శాతానికి తగ్గింది. తిరిగి పూర్వపు స్థితికి చేరాలంటూ కొత్త పరిశ్రమలకు ఇచ్చేందుకు 280 బిలియన్‌ డాలర్లను అమెరికా కేటాయించింది.ఈ మొత్తానికి స్థానిక ప్రభుత్వాలు ఇచ్చేది అదనం. ఇప్పటి వరకు అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్‌ సెమీకండక్టర్ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు సబ్సిడీల నిమిత్తం పదివేల కోట్ల డాలర్లు పక్కన పెడుతున్నట్లు ప్రకటించాయి. ఇంటెల్‌ కంపెనీ జర్మనీలో 30బిలియన్‌ యూరోల ప్లాంట్‌ పెట్టాలంటే మూడో వంతు తమకు సబ్సిడీ ఇవ్వాలని బేరమాడింది.పోలాండ్‌, జర్మనీ, ఇజ్రాయెల్లో కొత్త ప్లాంటులు పెట్టేందుకు 50బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇంటెల్‌ పేర్కొన్నది. మొత్తం మీద చూస్తే ఈ రంగంలో ముందున్న కంపెనీలు పెద్ద ఎత్తున లబ్దిపొందనున్నాయి. ఈ పోరులో మనదేశం ఎక్కడ అన్నది ప్రశ్నార్ధకమే.


గత పది సంవత్సరాలుగా ఈ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణం అని మీ మద్దతుదార్లు చెప్పినా ఆశ్చర్యంలేదు. అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండోతో మన మంత్రి పియూష్‌ గోయల్‌ 2023 మార్చి పదవ తేదీన సెమీకండక్టర్ల సరఫరా, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యం గురించి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్లిష్టమైన, వర్ధమాన సాంకేతికతల (ఐసిఇటి) సహకారం గురించి ఒప్పందం జరిగింది. చిత్రం ఏమంటే అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వాస్తవాల పత్రంలో మిగతా అంశాల గురించి ఉంది తప్ప సెమీకండక్టర్ల మీద నిర్దిష్టంగా ఏమీ లేదు అని కార్నెగీ ఇండియా వెబ్‌సైట్‌లో 2023 మే నెల 23వ తేదీన కోణార్క భండారీ రాశారు. మన దగ్గర దానికి భిన్నమైన సమాచారం ఉంటే ఆ పత్రాన్ని విడుదల చేస్తే వాస్తవం తెలుస్తుంది. మనదేశంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే వాటిని ప్రోత్సహించేందుకు ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహక(పిఎల్‌ఐ) పధకాన్ని 2021 నుంచి ఐదేండ్లలో రు.1.97లక్షల కోట్లు ఇచ్చే ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఆచరణలో ఉత్పత్తి బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఒక దగ్గర చేర్చే సెల్‌ఫోన్లకు, చిప్స్‌ పరీక్షలకు ఇస్తున్నారు. అందుకే భలే మంచి పధకం, వదలితే దొరకదని పొలోమంటూ ఆపిల్‌, మైక్రాన్‌ వంటి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయి.


రెండు దిగ్గజదేశాలైన అమెరికా, చైనా సెమీకండక్టర్ల రంగంలో పైచేయి సాధించేందుకు భారీ సబ్సిడీలతో పోటీ పడుతున్నాయి. అదే సమయంలో చైనా తన స్వంత రూపకల్పన, ఉత్పత్తికి గాను భారీ మొత్తంలో పరిశోధనకు నిధులు వెచ్చిస్తున్నది. మనదేశంలో ఒక సమగ్ర విధానాన్ని కూడా ఇప్పటికీ రూపొందించుకోలేకపోయాము.అలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా ఉంటే మన దేశాన్ని సెమీకండక్టర్‌ హబ్‌గా మారుస్తానని మీరు చెబుతున్నారు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ తాజా(2023) సమాచారం ప్రకారం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, అమెరికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఫాబ్రికేషన్‌లో 2022 డిసెంబరు నాటికి జపాన్‌లో 102, తైవాన్‌ 77, అమెరికా 76, చైనా 70, జర్మనీ 20, బ్రిటన్‌ 12, మలేషియా 7 ప్లాంట్లను కలిగి ఉన్నాయి. తరువాత స్థానాల్లో ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గుజరాత్‌లో 70శాతం సబ్సిడీ ఇచ్చి అమెరికా మైక్రాన్‌ కంపెనీతో ఒక పాకింగ్‌ కేంద్రాన్ని పెట్టించి దీంతో ప్రపంచ హబ్‌గా మారుస్తానని మీరు జనాలకు చెబుతున్నారు. ఇది ఎంతకాలం నడుస్తుంది ? అమెరికా మనలను తన సహజ భాగస్వామిగా పరిగణిస్తున్నదని, పిలిచి పెద్ద పీటవేస్తున్నదని చెబుతున్నారు. గతేడాది (2022) మార్చి నెలలో తొలిసారిగా అమెరికా చొరవతో చిప్స్‌ 4 లేదా ఫాబ్‌ 4 కూటమి ఏర్పడింది. దానిలో తైవాన్‌(చైనా తిరుగుబాటు రాష్ట్రం), జపాన్‌, దక్షిణ కొరియా ఇతర భాగస్వాములు తప్ప మనకు చోటు లేదు. ప్రపంచ సెమీకండక్టర్ల పరిశ్రమలో 70శాతం వాటా ఈ నాలుగు దేశాలదే. విధాన రూపకల్పన, ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకొనేందుకు, విస్తరణకు దీన్ని ఏర్పాటు చేశారు.


గత తొమ్మిది సంవత్సరాల్లో దేశ అప్పును విపరీతంగా పెంచివేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు తరువాత మీరు దాన్ని ఎడాపెడా పెంచారు.కేవలం మీరు చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు.మీరు అధికారానికి వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపిలో 67.1 శాతం కాగా 2021లో 88.5 శాతానికి పెరిగింది, 2023 నాటికి అది 83.1శాతంగా ఉంది. ఇంత చేసిన వారు పరిశోధనకు పెంచకపోగా ఎందుకు తగ్గించిందీ ఏదైనా ఒక మన్‌కీ బాత్‌లో చెబితే సంతోషం. ఆవు పేడ పరిశోధన నిధులు సెమీ కండక్టర్లకు మళ్లించండి, సబ్సిడీలతో పాటు పరిశోధనలకూ నిధులు ఇవ్వండి. ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నా.
తోటి భారతీయుడు
ఎం కోటేశ్వరరావు