పుతిన్‌పై కిరాయి సేన విఫల తిరుగుబాటు – సమాధానం లేని ప్రశ్నలు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఇరవై రెండు సంవత్సరాల పాటు రష్యాలో తిరుగులేని అధినేతగా ఉన్న వ్లదిమిర్‌ పుతిన్‌ నాయకత్వానికి తొలిసారిగా వాగర్‌ కిరాయి సాయుధ మూక రూపంలో విఫల సవాలు ఎదురైంది. ఒక్క తూటా కూడా పేల కుండా తిరుగుబాటు ముగిసినప్పటికీ పుతిన్‌ బలహీనత వెల్లడైంది. తన లక్ష్యం పుతిన్ను అధికారం నుంచి తొలగించటం కాదని, తిరుగుబాటు నేత ఎవగెనీ ప్రిగోఝిన్‌ సోమవారంనాడు ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ ఉదంతానికి సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానం లేదు.దీని గురించి ఊహించిందే అన్నట్లుగా పశ్చిమ దేశాల స్పందన ఉంది. అధికార గణం తగిన సన్నద్దతను ప్రదర్శించలేదని మాస్కో మీడియా విమర్శించింది. మిలిటరీ అధికారులతో వచ్చిన పేచీలే దీనికి మూలమా లేక నాటో హస్తం ఉందా అన్నది తేలాల్సి ఉంది. పరస్పర విరుద్దంగా మాట్లాడిన ప్రిగోఝిన్‌ తన బలాన్ని ఎక్కువ అంచనా వేసుకొని తిరుగుబాటు జరిపాడా లేక మరొకటా అన్నది స్పష్టం కాలేదు.ఈ తిరుగుబాటు విఫలం తరువాత ఉక్రెయిన్‌ మీద తిరిగి దాడులు కొనసాగుతున్నాయి.


మాస్కోను పట్టుకుంటామంటూ ఉక్రెయిన్‌లోని రష్యా ఆధీనంలో ప్రాంతాల నుంచి బయలు దేరిన ఈ ప్రైవేటు దండు (పిఎంసి) జూన్‌ 24 శనివారం నాడు ఒక్క తూటాను కూడా పేల్చకుండానే సరిహద్దులోని రష్యా నగరమైన రోస్టోవ్‌ అన్‌ డాన్‌లోని మిలిటరీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకొన్నది. అక్కడి నుంచి మాస్కో నగరానికి 360 కిలోమీటర్ల దూరంలో ఉండగా(కొన్ని వార్తల ప్రకారం రెండు వందల కిమీ) నాటకీయ పరిణామాల మధ్య తన దళాలు వెనక్కు తిరుగుతున్నట్లు, తిరిగి ఉక్రెయిన్లో పోరు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లాలని వాగర్‌ కంపెనీ అధిపతి ఎవగెనీ ప్రిగోఝిన్‌ ప్రకటించాడు. రష్యా మిత్రదేశమైన బెలారస్‌ అధినేత అలెగ్జాండర్‌ లుకషెంకో మధ్య వర్తిత్వంలో కుదిరినట్లు చెబుతున్న రాజీ మేరకు వాగర్‌ దళం, దాని అధిపతి మీద ఎలాంటి విచారణ ఉండదు. దళాలు తిరిగి ఉక్రెయిన్లో ఉన్న ప్రాంతానికి వెళతాయి. అధిపతి ప్రిగోఝిన్‌కు బెలారస్‌ ఆశ్రయం కల్పిస్తుంది. వాగర్‌ దళాలు తమ వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే అప్పగిస్తే వారి మీద ఎలాంటి విచారణ ఉండదు. తిరుగుబాటులో పాల్గొనని వారిని మిలిటరీ కాంట్రాక్టుదళంలో సర్దుబాటు చేస్తారు. జూలై ఒకటవ తేదీలోగా వారు దరఖాస్తు చేసుకోవాలి. రాజీ వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే స్వాధీనం చేసుకున్న రోస్టోవ్‌ నగరం నుంచి వాగర్‌ దళం వైదొలిగింది. ప్రిగోఝిన్‌ శుక్రవారం నాడు ఒక ప్రకటన చేస్తూ అవసరం లేకున్నా ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ పోరుకు దిగాడని, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాడు. తమ దళాల మీద రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదేశాల మేరకు రాకెట్లు, హెలికాప్టర్లు, ఫిరంగులతో మిలిటరీ దాడి చేసి రెండువేల మందిని హతమార్చినట్లు ఆరోపించాడు. తమ తిరుగుబాటుకు కారణం ఇదే అని చెప్పాడు. షోయిగుతో భేటీ తరువాత సైనిక దళాల చీఫ్‌ వాలెరె గెరాసిమోవ్‌ తమ దండు మీద దాడులకు ఆదేశించినట్లు ఆరోపించాడు. ఈ ఆరోపణను మిలిటరీ తిరస్కరించింది. ఉక్రెయిన్లోని బఖుమట్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటంలో వాగర్‌ దళం కీలకపాత్ర పోషించింది.


అంతకు ముందు దేశ పౌరులనుద్దేశించి టీవీలో మాట్లాడిన పుతిన్‌ తిరుగుబాటును వెన్నుపోటుగా, విద్రోహంగా వర్ణిస్తూ దీనివెనుక ఉన్న వారిని శిక్షించాలని చెప్పాడు. ఈ కారణంగా ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్య ఆగదన్నాడు. తిరుగుబాటు ప్రారంభం కాగానే బెలారస్‌ నేత లుకషెంకో ఒక ప్రకటన చేస్తూ పుతిన్‌కు మద్దతు ప్రకటించాడు. మరో ప్రైవేటు దండు చెచెన్‌ దళాల నేత కదరివ్‌ కూడా ఉక్రెయిన్లో ఉన్న మూడువేల మంది తమ వారిని వాగర్‌ దళం మీద పోరుకు పంపుతున్నట్లు చెప్పాడు. వాగర్‌ దళాలు వస్తున్న మార్గంలో అనేక చోట్ల తనిఖీ కేంద్రాలు, భారీ ఎత్తున రష్యన్‌ మిలిటరీ సాయుధ శకటాలను రంగంలోకి దించారు, మాస్కో చుట్టూ భద్రతను పటిష్టం కావించారు.


అరవై రెండు సంవత్సరాల ప్రిగోఝిన్‌ ఒక నేరగాడు.పదేళ్ల పాటు జైలులో ఉండి విడుదలైన తరువాత ఆహార సరఫరా కాంట్రాక్టరు అవతారమెత్తాడు. ఆక్రమంలో పుతిన్‌ వంట వాడని ఎగతాళి చేసేంతగా దగ్గరయ్యాడు. మిలిటరీ అధికారులతో సంబంధాలు పెట్టుకొని వారి మద్దతుతో జైళ్లలోని నేరగాండ్లు, నిరుద్యోగులను చేరదీసి వాగర్‌ కంపెనీ పేరుతో కిరాయి సాయుధ దళాన్ని ఏర్పాటు చేశాడు. మిలిటరీ అందచేసిన ఆయుధాలు, నిధులతో లిబియా, సిరియా తదితర దేశాల్లో అమెరికా వినియోగించిన ఐఎస్‌ కిరాయి మూకలను ఎదుర్కొనేందుకు పని చేశాడు. దాని కొనసాగింపుగానే ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ మిలిటరీతో తలపడి ఆప్రాంతాలను పట్టుకోవటంలో, క్రిమియాను స్వాధీనం చేసుకోవటంలో కూడా కీలక పాత్ర పోషించాడు.2016 ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా కొంత మందితో కలసి సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసినట్లు కూడా వెల్లడైంది.తమ వద్ద పాతికవేల మంది ఉన్నట్లు ప్రిగోఝిన్‌ ప్రకటించాడు. మరో పాతిక వేల మంది కలుస్తారని, తిరుగుబాటులో కలసి వచ్చే వారందరినీ కలుపుకుంటామన్నాడు. తాము ఎందుకోసమైతే బయలు దేరామో అది ముగిసిన తరువాత మాతృదేశాన్ని కాపాడు కొనేందుకు తిరిగి వస్తామని చెప్పాడు. రక్షణ మంత్రి దేశాన్ని, పుతిన్ను కూడా తప్పుదారి పట్టించాడన్నాడు.


ఎక్కడైనా మిలిటరీ లేదా పారామిలిటరీ తిరుగుబాట్ల గురించే ఇప్పటి వరకు ప్రపంచానికి తెలుసు. తొలిసారిగా కిరాయి మిలిటరీ ఒక పెద్ద దేశంలో విఫల కుట్రకు పాల్పడటం ఇదే ప్రధమం.ప్రపంచంలో ఇలాంటి సంస్థలు 16వేల వరకు ఉన్నట్లు అంచనా. వీటిలో ఓడలు, గనులు, చమురు బావుల వంటి వాటికి సాయుధ కాపలాతో పాటు ఎవరు డబ్బులిస్తే వారి తరఫున ఇతర దేశాలు మీద యుద్ధాలు చేసేందుకు కూడా జనాలను పంపుతాయి. కొంత మంది వర్ణించినట్లు పురాతన వృత్తులలో రెండవదిగా కిరాయి మిలిటరీ ఉంది. అధికారికంగా లేదా అనధికారికంగా మన దేశంతో సహా దాదాపు అన్ని దేశాలూ పిఎంసిలను కలిగి ఉన్నాయి. వివిధ దాడుల్లో అమెరికా సైనికులు మరణించటంపై తలెత్తిన నిరసన కారణంగా గడచిన మూడు దశాబ్దాలుగా అమెరికా కిరాయి మూకలను రంగంలోకి దించుకతోంది. దీంతో సైనికుల మరణాలను తగ్గించుకోవచ్చు, పౌరుల నుంచి నిరసనలు ఉండవు. నిరంతరం మిలిటరీని పోషించాలంటే ఖర్చుకూడా ఎక్కువ. రాబోయే రోజుల్లో అధికారిక మిలిటరీ బదులు ఇలాంటి వారితోనే యుద్ధాలు జరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. 1990 దశకంలో ప్రతి 50 మంది మిలిటరీ సిబ్బందికి ఒకరు కాంట్రాక్టు ప్రైవేటు మిలిటరీ మిలిటరీ ఉండగా ఇప్పుడు పదికి ఒకరు ఉన్నట్లు అంచనా.ఆయుధాలతో పాటు పిఎంసిల నిర్వహణ పెద్దలాభసాటి వ్యాపారంగా మారింది. లాటిన్‌ అమెరికాలో పోలీసుల కంటే కిరాయి సిబ్బంది ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. 1990లో అమెరికా త్రివిధ దళాల్లో 21లక్షల మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం 14లక్షలకు కుదించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారిక మిలిటరీ కంటే ఇలాంటి కిరాయి దళాలనే అమెరికా ఎక్కువగా దింపింది. అక్కడ అమెరికా 14లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టగా మూడో వంతు ప్రైవేటు మిలిటరీ కాంట్రాక్టర్లకే వెళ్లింది.2001లో 140 బి.డాలర్లు చెల్లించగా 2019 నాటికి 370 బి.డాలర్లకు పెరిగింది. ఇరాక్‌ మీద దాడి చేసిన అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా అదే చేశాయి. కొన్ని కంపెనీలు పిఎంసి కంపెనీల పేరుతో స్టాక్‌ మార్కెట్లో వాటాలను కూడా అమ్ముతున్నాయి.


సిరియా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా పిఎంసిలను రంగంలోకి దింపగా వాటిని ఎదుర్కొనేందుకు రష్యా కూడా వాగర్‌ వంటి కంపెనీలను మోహరించింది. చమురు సంపదలున్న అరేబియా దేశాలు ఇలాంటి వాటిని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాయి. ఎమెన్‌ వంటి చోట్ల అదే జరిగింది.లాటిన్‌ అమెరికాలో నిరంకుశ పాలకులు ఇలాంటి దళాలతో ప్రతిపక్షాల నేతలు, ఇతరుల మీద దాడులు, హతమార్చటం వంటి దారుణాలకు పాల్పడ్డారు. ఇప్పటికీ కొనసాగుతోంది. ఏ ప్రైవేటు మిలిటరీ చరిత్రను చూసినా వారి వెనుక మిలిటరీ అధికారులు ఉంటారు. వారికి శిక్షణ ఇచ్చేది కూడా వారే.ప్రపంచ మిలిటరీ చరిత్రను చూసినపుడు క్రీస్తుపూర్వం నుంచి తరువాత కూడా కిరాయి సైనికుల ప్రస్తావన,వినియోగం కనిపిస్తుంది. ఆసియా దేశాలపై దండెత్తిన అలెగ్జాండర్‌ సేనలో ఐదువేల మంది వరకు ఉన్నారని చరిత్రకారులు చెప్పారు. అతన్ని ఎదుర్కొన్న పర్షియా మిలటరీలో పదివేల మంది గ్రీకులు ఉన్నారు. మన దేశంలోని పాలకులు కూడా కొందరు గ్రీకులను తెచ్చుకున్నట్లు వారిని యవనులుగా వర్ణించినట్లు చరిత్రలో ఉంది. రోమ్‌ పాలకులు తమ సామ్రాజ్యాన్ని కాపాడుకొనేందుకు, దానిపై దాడులు చేసేందుకు ఇతర దేశాలూ కూడా వేలాది మంది కిరాయి బంట్లను సమకూర్చుకున్నాయి. చైనా యుద్ధ ప్రభువులు కూడా ఇరుగుపొరుగు దేశాలకు చెందిన వారిని కిరాయికి తెచ్చుకున్నారు. చివరికి క్రైస్తవ మతంలో పోప్‌లు కూడా కిరాయి మూకలను రంగంలోకి దించారు. దక్షిణ ఫ్రాన్సులోని కాథర్స్‌ అనే క్రైస్తవ తెగవారి మీద 1.209లో పోప్‌ మూడవ ఇన్నోసెంట్‌ పవిత్ర యుద్ధం పేరుతో కిరాయి మూకలతో దాడి చేయించినట్లు ఉంది.


ఇక వర్తమాన అంశానికి వస్తే వాగర్‌ కంపెనీ నేత తిరుగుబాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా గూఢచారులు పసిగట్టి జోబైడెన్‌కు సమాచారమందించినట్లు అమెరికా మీడియా పేర్కొన్నది. ఈ సమాచారం పుతిన్‌కు ఎందుకు అందలేదు అన్నది ప్రశ్న. ఒక వేళ తెలిసి ఉంటే తగిన జాగ్రత్తలతో రోస్టోవ్‌ నగరంలోని మిలిటరీ కేంద్రం వద్ద భద్రతా చర్యలెందుకు తీసుకోలేదు ? అనేక ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానాలు లేవు. తమకు చెల్లించాల్సిన మొత్తాలకు కోత పెట్టారని విమర్శించినట్లు , దళాన్ని మిలిటరీ ఆధీనంలో ఉంచేందుకు వాగర్‌ తిరస్కరించినట్లు వార్తలు వచ్చినప్పటికీ జాగ్రత్తలు తీసుకోలేదు. నాటో నేతలతో ప్రిగోఝిన్‌ సంబంధాల్లో ఉన్నట్లు కుట్ర తరువాత కొన్ని సూచనలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై అవసరం లేకున్నా దాడికి దిగినట్లు పుతిన్‌ మీద ఆరోపణే అందుకు నిదర్శనం. మూడు వారాలుగా జరుపుతున్న ఎదురుదాడుల్లో ఉక్రెయిన్‌ భారీగా నష్టపోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు ఆశ్చర్యం కలిగించలేదన్నట్లుగా అమెరికా, పశ్చిమ దేశాల స్పందన ఉంది. బెలారస్‌ నేత లుకషెంకోతో వాగర్‌ యజమాని జరిపిన రాజీ చర్చల్లో రష్యా రక్షణ మంత్రి షొయిగు, సైనిక అధికారి వాలెరీ గెరాసిమోవ్‌ను తొలగించేందుకు, వాగర్‌ దళాన్ని ఆఫ్రికా పంపేందుకు అంగీకరించినట్లు నిర్ధారణకాని వార్తలు వచ్చాయి. ప్రిగోఝిన్‌పై దేశద్రోహ విచారణ కొనసాగుతుందని కూడా సోమవారం నాడు కొన్ని వార్తలు పేర్కొన్నాయి.తిరుగుబాటుకు తగినంత మద్దతు లభించకపోవటం, వాగర్‌ దళంలోని కొందరు కమాండర్లు కూడా సిద్దం కాలేదని వార్తలు వచ్చినందున నేత తోకముడిచినట్లు చెబుతున్నప్పటికీ ఎక్కడా మిలిటరీ ఎందుకు ప్రతిఘటించలేదు, విఫలమైన తరువాత అణచివేయకుండా పుతిన్‌ రాజీకి ఎందుకు అంగీకరించాడు ? ఒక వేళ శిక్షిస్తే ఇతర కిరాయి దళాలు తన పట్టునుంచి జారతాయని భావించారా ? పుతిన్‌ ఒక బూర్జువా, వాగర్‌ కంపెనీని పెంచి పోషించటంలో అతగాడేమీ తక్కువ తినలేదు.పశ్చిమ దేశాలు చెబుతున్నట్లు పుతిన్‌-రక్షణ మంత్రి- మిలిటరీ అధికారుల మధ్య నిజంగానే సంబంధాలు సజావుగా లేవా ? పుతిన్‌ మీద కాదు నా తిరుగుబాటు అని చెబుతున్న ప్రిగోఝిన్‌ ఎవరి మీద కుట్రకు తెరలేపినట్లు ? ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది ? ప్రస్తుతానికి సశేషమే.

మేడిపండు చూడ మేలిమై ఉండు…. మోడీ ఏలుబడిలో దేశ ప్రతిష్ట పెరిగిందా ? తరిగిందా ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజు అమెరికా పర్యటన తరువాత ఈజిప్టు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏమి సాధించారో మోడీ మాటల్లో విన్న తరువాత వాటి మంచి చెడ్డల గురించి చూద్దాం. ఏదేశమేగినా ఎందుకాలిడినా మోడీ వెంట మన బడా కొర్పొరేట్‌ పెద్దలు పొలోమంటూ వెళతారు. వెళ్లిన చోట అక్కడి బడా సంస్థల వారితో కొలువు తీరతారు, ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వాటితో మన 140 కోట్ల జనానికి కలిగే లబ్ది ఎంత ? వేళ్ల మీద లెక్కించగలిగిన బడా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కలిగే లాభం ఏమిటి అన్నదాన్ని బట్టే టూరు ఎందుకో అవగతం అవుతుంది. గత తొమ్మిది సంవత్సరాలుగా జరిపిన అన్ని విదేశీ టూర్లను ఈ ప్రాతిపదికగానే చూడాల్సి ఉంది. గతంలో పదేండ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌, ఇతర ప్రధానులు కూడా విదేశాలకు వెళ్లారు. మోడీ మాదిరి పొగడ్తలు, బిరుదులు, ఆహా ఓహౌలను వెంట తీసుకురాలేదన్నది నిజం. ఎవరినైనా కౌగలించుకొనే చొరవ అందరికీ ఉంటుందా ? ప్రపంచంలో నాడున్న పరిస్థితి, అంతర్జాతీయ రాజకీయాలు, వాటిలో భారత నేతలను మునగచెట్టు ఎక్కిస్తే తమకెంత లాభం అన్నదాన్ని బట్టి పొగడ్తలు ఉంటాయి. ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి. గత ప్రధానులను విదేశాల్లో పొగడనంత మాత్రాన మన జనానికి కలిగిన నష్టం లేదు-మోడీని పొగిడినదానికి వచ్చిన లాభమూ లేదు. విదేశాల్లో మోడీ పొందిన బహుమతులను వేలం వేస్తే ఖజనాకు నాలుగు డబ్బులు వస్తాయి. పొగడ్తలను కొనుగోలు చేసే వారెవరూ ఉండరు. వాటిని చూపి ప్రపంచంలో మోడీ హయాంలో దేశ ప్రతిష్ట విపరీతంగా పెరిగిందని బిజెపి నేతలు, మోడీ సర్కార్‌తో అవసరం ఉన్నవారందరూ ఆకాశానికి ఎత్తుతున్నారు. అమెరికా, ఈజిప్టు టూర్‌లో ఇంకెన్ని తీసుకువస్తారో చూడాల్సి ఉంది. రాహుల్‌ గాంధీ బ్రిటన్‌, అమెరికా వెళ్లి మన ప్రభుత్వ విధానాలను విమర్శించి దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చారని బిజెపి నానా రచ్చ చేసింది. మోడీ వెళ్లిన చోట కూడా మన అంతర్గత విధానాలు, వైఖరి గురించి రచ్చ జరుగుతూనే ఉంది. అమెరికాలో కూడా జరిగింది. దాన్ని దేశానికి గౌరవాన్ని తెచ్చినట్లు ఎవరైనా వర్ణిస్తారా ?


గత తొమ్మిది సంవత్సరాలలో మోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారా తగ్గించారా అన్నది ఒక చర్చ. అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ తాజాగా అమెరికా వెళ్లిన మన ప్రధాని గురించి మన టీవీల తీరు తెన్నుల మీద రాసిన కొన్ని అంశాలను చూద్దాం. ” అమెరికాలో అడుగుపెట్టిన బాస్‌, దౌత్య రారాజు, చరిత్ర సృష్టిస్తున్నారు చూడండి, దౌత్యంలో మోడీ వినూత్న పరిణామం ” ఇలా టీవీల శీర్షికలున్నాయి. జో బైడెన్‌, నరేంద్రమోడీ కరచాలనం చేస్తున్న దృశ్యంలో వారి హావ భావాలను చూస్తే ఒకరికొకరు లేకపోతే అసంపూర్ణం అన్నట్లుగా ఉందని ఒక యాంకర్‌ వర్ణించారట.( గతంలో మోడీ-డోనాల్డ్‌ ట్రంప్‌ కౌగిలింతలు, చెట్టపట్టాలు వేసుకు తిరిగినపుడు కూడా చాలా మందికి వారు అలానే కనిపించారు. మోడీ, బైడెన్‌, ట్రంప్‌ మహానటులు అనటంలో సందేహం లేదు) ఎంతో యుక్తితో జాగ్రత్తగా సంప్రదాయ వార్తా సంస్థలతో సంబంధాలను మోడీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రోత్సాహకాలు, వత్తిడి ఎత్తుగడల సమ్మిళితంతో ఎక్కువ సంస్థలను తనవైపు ఉండేట్లు చేసుకున్నారు.ఇబ్బందికరమైన సమస్యలు తలెత్తినపుడు అంటే ఒక రాష్ట్రంలో ఎన్నికల్లో ఓటమి, ఈశాన్య రాష్ట్రంలో తెగల మధ్య తలెత్తిన పోరులో రక్తపాతం, అశాంతి, ప్రాణాంతకమైన మూడు రైళ్ల ఢ వంటి వాటితో మోడీకేమీ సంబంధం లేదని తప్పుదారి పట్టించటంలో అవి వేగంగా ఉంటాయి. మోడీ అమెరికా టూరు గురించి వార్తలు ఇచ్చిన తీరు ఒక వరం. వచ్చే ఏడాది జరగాల్సిన పార్లమెంటు ఎన్నికల్లో తన ప్రచారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన అజెండాను రూపొందించేందుకు తోడ్పడుతుంది అని కూడా ఆ పత్రిక రాసింది. దీన్ని బట్టి జరుగుతున్నదేమిటో చెప్పేందుకు అరటి పండు ఒలిచి చేతుల్లో పెట్టాల్సిన పనిలేదు. కొస మెరుపు ఏమిటంటే బైడెన్‌తో కలసి మోడీ పాల్గొన్న పత్రికా గోష్టిలో భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. దాన్నే ఎంతో ధైర్యంగా ఆప్రశ్నను మోడీ ఎదుర్కొన్నట్లు ఒక హిందీ ఛానల్‌ యాంకరమ్మ వర్ణించినట్లు కూడా అమెరికా పత్రిక పేర్కొన్నది. రాజులు, రంగప్పల ఆస్థానాల్లో ఉన్న భట్రాజులు(కుల ప్రస్తావన, కించపరచటంగా భావించవద్దని మనవి) స్వర్గం నుంచి చూస్తూ తమ స్థానాన్ని ప్రజాస్వామ్యంలో కొందరు టీవీ యాంకర్లు, విశ్లేషకులు భర్తీ చేశారని భావిస్తూ తమ పొగడ్తలతో పోల్చుకొని ఉండాలి.


గతంలో వారం రోజుల పాటు జరిపిన అమెరికా టూర్‌ నుంచి తిరిగి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ తన పాలనలో విదేశాల్లో దేశ ప్రతిష్ట పెద్ద ఎత్తున పెరిగిందని స్వయంగా చెప్పుకున్నారు. అప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు జో బైడెన్‌ ఉన్నాడు. తాజా పర్యటన గురించి ఇంకెన్ని కబుర్లు చెబుతారో చూద్దాం. అమెరికా పార్లమెంటులో మోడీ ప్రసంగంలో 79సార్లు హర్వధ్వానాలు చేశారని, 15సార్లు లేచి నిలిచి చప్పట్లు కొట్టారని, ప్రసంగం ముగిసిన వెంటనే ఎంపీలు మోడీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడినట్లు వార్తలు, దృశ్యాలను చూపారు. భారత సంతతివారు పోటెత్తినట్లు పేర్కొన్నారు.


లండన్‌ కేంద్రంగా ఉన్న హెన్లే పాస్‌ పోర్ట్‌ విశ్లేషణ ప్రకారం 2013లో మన సూచిక 199 దేశాలలో 74లో ఉండగా (52 దేశాలకు ముందుగా వీసాలతో పని లేకుండా వెళ్లి రావచ్చు) అది 2021లో 90కి దిగజారింది. ఆ మధ్యలో ఎగుడు దిగుడులు ఉన్నాయి. ఒక దేశ పాస్‌ పోర్టుతో వీసాలతో నిమిత్తం లేకుండా ఎన్ని దేశాలకు స్వేచ్చగా వెళ్లి రావచ్చు అనేదాన్ని బట్టి ఆ దేశ ప్రతిష్టకు కొలబద్దగా ఈ సూచికను పరిగణిస్తున్నారు. కరోనా కారణంగా అనేక దేశాలు రాకపోకల మీద ఆంక్షలు విధించినందున 2020,21 సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకోనవసరం లేదు. 2023లో మన దేశం ఈ సూచికలో 82వ స్థానంలో ఉంది, 59 దేశాలకు స్వేచ్చగా వెళ్లి రావచ్చు. పెరుగుదల ఏడు దేశాలు మాత్రమే. ఇదే పెద్ద గొప్ప అంటారా? ప్రపంచంలో మన దేశ ప్రతిష్ట పెరిగితే నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ఉన్న స్థానం కంటే ఇప్పుడు ఎందుకు దిగజారినట్లో మోడీ భక్తులు చెప్పాలి. ఈ కాలంలోనే ప్రపంచంలో ఒంటరిదౌతున్నదని చెబుతున్న చైనా రాంకు 82 నుంచి 62కు పెరిగింది. దేశాల సంఖ్య 81గా ఉంది. ఎవరి పలుకుబడి పెరిగినట్లు ? మొదటి మూడు స్థానాల్లో సింగపూర్‌ 194, జపాన్‌ 192,జర్మనీ, దక్షిణ కొరియా,స్పెయిన్‌,ఇటలీ 191 దేశాలతో మూడవ స్థానంలో ఉన్నాయి. మనకు ఎగువన 140కిపైగా దేశాలు మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఇతర అంతర్జాతీయ సూచికల్లో మన స్థానం గురించి వార్తలు వచ్చినపుడు వాటిని మేము గుర్తించం అని బిజెపి సర్కార్‌ చెబుతున్నది. మరి మోడీ దేశ ప్రతిష్టను పెంచినట్లు బిజెపి నేతలు చెప్పేదానికి ప్రాతిపదిక ఏమిటి ? కరోనా నిరోధంలో మోడీ సర్కార్‌ ప్రపంచంలోనే గొప్పగా ప్రశంసలు పొందిందని చెప్పారు, అలాంటపుడు దాని తరువాత వీసా ఆంక్షలను ఇతర దేశాలు మన వారికి ఎందుకు సడలించలేదు ? ఏ దేశమూ వేయనన్ని వాక్సిన్లు వేసినట్లు చెప్పుకుంటారు. ఇంత మంది జనాభా మరో దేశంలో లేదు. మన దేశంలో ఈ ఏడాది జనవరి నాటికి 220 కోట్ల టీకాలు వేస్తే చైనాలో మార్చి 23వ తేదీ నాటికి 351 కోట్లు వేశారు.


ఎన్నికల ప్రజాస్వామ్య సూచికలో మన దేశం అంతకు ముందు ఏడాది వందవ స్థానంలో ఉన్నది కాస్తా 2023లో 108వ స్థానానికి దిగజారినట్లు వి డెమ్‌ (ప్రజాస్వామ్య రకాలు) సంస్థ పేర్కొన్నది.మన కాషాయ దళాలు నిరంతరం పారాయణం చేస్తూ గుర్తు చేసే పాకిస్తాన్‌ మనకు దగ్గరగా 110వదిగా ఉంది. ఎగువన లేకపోవటం మోడీ భక్తులకు కాస్త ఊరట కలిగించే అంశం. నిరంకుశత్వం వైపు వెళుతున్న దేశాల గురించి కూడా ఆ సంస్థ సూచికలను ఇచ్చింది. ప్రపంచ ప్రజాస్వామ్య స్థితి నివేదికల్లో వెల్లడించిన సమాచారం ప్రకారం 1975 నుంచి 1995వరకు మన మార్కులు 59 నుంచి 69కి పెరగ్గా, 2015లో 72, తరువాత 2020లో 61కు తగ్గాయి. ఇలా ఏ సూచికను చూసినా తగ్గుదల తప్ప పెరిగింది లేదు. అలాంటపుడు ప్రపంచ దేశాల్లో మన ప్రతిష్ట పెరుగుతుందని ఎలా నమ్మబలుకుతున్నారో అర్ధం కాదు. సరిహద్దులు లేని విలేకర్ల పేరుతో ఉన్న సంస్థ విడుదల చేసిన సూచిక ప్రకారం పత్రికా స్వేచ్చలో మన స్థానం 2023లో అంతకు ముందున్న స్థితి నుంచి పదకొండు స్థానాలు దిగజారి 180 దేశాలలో 161 దగ్గర ఉన్నాం. మన దేశం ప్రజాస్వామ్య పుట్టిల్లు అని చెప్పిన తరువాత ఉన్న స్థితి ఇది. 2002లో 139 దేశాల్లో 80 మెట్టు దగ్గర ఉంటే 2023నాటికి 81 మెట్లు దిగజారి 180 దేశాల్లో 161 దగ్గర ఉన్నాం. ప్రధాని నరేంద్రమోడీ గద్దె నెక్కినపుడు 140లో ఉన్నాం. తొమ్మిదేండ్లలో మన ప్రతిష్టను మోడీ పెంచారా తగ్గించారా ?


నరేంద్రమోడీ పలుకుబడి అంతగా పెరిగితే పదే పదే ఐరాస సంస్కరణల గురించి చెబుతుంటే విడదీయరాని బంధంలో ఉన్నట్లు చెబుతున్న అమెరికా, ఇతర శాశ్వత దేశాలు భారత్‌కు శాశ్వత ప్రాతినిధ్యం గురించి ఇంతవరకు ఒక నిర్దిష్ట ప్రతిపాదనను ఎందుకు చేయలేదో ఎవరైనా చెబుతారా ? చైనా వీటో చేస్తుందేమో అని కొందరు గొణగవచ్చు, ముందు ప్రతిపాదించాలి గదా ! చైనా మీద ప్రేమతో జవహర్‌లాల్‌ నెహ్రూ మనకు అవకాశం వచ్చినపుడు వదులుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.స్వాతంత్య్రం రాకముందే ఐరాస ఏర్పడిందని, ప్రారంభంలోనే చైనా శాశ్వత దేశమని చరిత్ర తెలియని వారికి ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాదు. ఒక దేశాన్ని తొలగించి తాను ఎవరికి కావాలంటే వారికి ఇవ్వటానికి ఐరాస ఏమైనా అమెరికా జేబు సంస్థా ? దానికి నిర్ణయాత్మక సత్తా, అధికారం ఉంటే ఇప్పుడు ఇమ్మనండి ఎవరు వద్దన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే వారి మీద ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదరించింది. మోడీ పలుకుబడి కారణంగా వెనక్కు తగ్గిందని చెబుతున్నారు, మరి అదే పలుబడి, చాణక్యం భద్రతా మండలి అంశంలో ఏమైంది ? పుతిన్‌ దగ్గర నుంచి చమురు కొని దాన్ని డీజిల్‌, పెట్రోలు, ఇతర ఉత్పత్తులుగా మార్చి అదే అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు గనుక అమెరికా చూసీ చూడనట్లు ఉంటోంది తప్ప మోడీ ఘనత ఏముంది ?


అట్లాంటిక్‌ కౌన్సిల్‌ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో 2033 వరకు అసలు భద్రతా మండలి విస్తరణే ఉండదని 64శాతం మంది చెప్పారు. శాశ్వత సభ్యత్వం భారత్‌కు ఇవ్వాలని 26, జపాన్‌కు 11,బ్రెజిల్‌కు 9, జర్మనీకి 7,నైజీరియాకు 4, దక్షిణాఫ్రికాకు రెండు శాతం మంది మద్దతు తెలిపారు. విస్తరణ అంశం నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు, స్వస్తి పలికే అవకాశమూ లేదు.1990 దశకం నుంచే విస్తరణను అడ్డుకోవాలని కొన్ని దేశాలూ కంకణం కట్టుకున్నాయి. దీన్ని కాఫీ క్లబ్‌ అని నిక్‌నేమ్‌ పెట్టారు. దీన్లో ఇటలీ, ఈజిప్టు, పాకిస్తాన్‌, మెక్సికో, కెనడా, టర్కీ, స్పెయిన్‌, అర్జెంటీనా తదితర దేశాలు ఉన్నాయి. ఏకాభిప్రాయ సాధనతో ఏదైనా జరగాలని ఇవి మోకాలడ్డుతున్నాయి. ఈ పూర్వరంగంలో బ్రెజిల్‌, జర్మనీ, భారత్‌, జపాన్‌ 2005లో జి 4 కూటమిగా ఏర్పడి ఉమ్మడిగా మద్దతు సాధించాలని నిర్ణయించుకున్నాయి. ఈ బృందంలో భారత్‌కు మద్దతు ఇస్తాం గానీ జపాన్ను అంగీకరించేది లేదని గతంలోనే చైనా స్పష్టం చేసింది. ఇప్పుడు సంబంధాలు దెబ్బతిన్న పూర్వరంగంలో పూర్వ వైఖరికి కట్టుబడి ఉంటుందని చెప్పలేము. మొత్తంగా చెప్పాలంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్లుగా నరేంద్రమోడీ రంగంలోకి వచ్చిన తరువాత ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదు. విశ్వగురువు పలుకుబడి పని చేయటం లేదన్నది స్పష్టం.


మోడీ ఏలుబడిలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విమానవాహక యుద్ధ నౌకను ప్రారంభించారని గొప్పగా చెబుతారు. దాని చరిత్రను చూసిన వారెవరూ ఆ ఖ్యాతిని మోడీ ఖాతాలో వేయరు. నౌక రూపకల్పన 1999లో ప్రారంభమై 2022 నాటికి సర్వీసులోకి వచ్చింది. అగ్ని 5 క్షిపణి, ఇస్రో కూడా అలాంటిదే.ఎప్పటి నుంచో ఉన్న కార్యక్రమం అది. వీటి వలన ప్రపంచంలో మన దేశం కూడా అగ్రదేశాల సరసన చేరిందనే పేరు తెచ్చుకుంది. గత ప్రభుత్వాల కొనసాగింపుగా మోడీ సర్కార్‌ కూడా ఈ పధకాలను కొనసాగిస్తున్నది తప్ప మోడీతోనే ప్రారంభమైనట్లు చెప్పుకుంటే ఎలా ? ఇలాంటి వాటిని ఏ దేశమూ స్వల్పకాలంలో సాధించలేదు. కానీ పత్రికా స్వేచ్చ, ప్రజాస్వామ్యం,ఆకలి వంటి అంశాలను మెరుగుపరచేందుకు దశాబ్దాల కాలం అవసరం లేదు. మరి వాటిలో పురోగతి లేకపోగా దేశద్రోహం వంటి చట్టాలు కొనసాగాలని చెబుతుంటే, పరిస్థితులు ఇంకా దిగుజారుతుంటే విదేశాల్లో మన ప్రతిష్ట పెరుగుతుందా ? విదేశాల వారు మరీ అంత అమాయకులా ?

విదేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్ల పిట్టకథల వెనుక సిఐఏ హస్తం !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకటి మాత్రం వాస్తవం. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా తీవ్రత తగ్గిన తరువాత వివిధ దేశాల ఆర్థిక రంగాలు ఎలా కోలుకుంటాయి, ఉక్రెయిన్‌ సంక్షోభం ఎలా ముగుస్తుంది.చైనా ఆర్థిక వ్యవస్థ ఏమౌతుంది అన్నవి ఎక్కువగా చర్చలో ఉన్న అంశాలు.కొద్ది రోజులుగా చైనా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి సోషల్‌ మీడియా, సంప్రదాయ మీడియాలో కూడా కొందరు తెగ స్పందిస్తున్నారు. విదేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్లంటూ ప్రచారం సాగుతున్నది. ప్రపంచ ఆర్థిక రంగంతో చైనా ముడిపడి ఉన్నంతగా ప్రపంచంలో ప్రస్తుతం మరొక దేశం లేదని గ్రహించాలి. 2018 తరువాత తొలిసారిగా చైనా పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చైనా మంత్రి క్విన్‌ గాంగ్‌తో రహస్య చర్చలు జరిపినట్లు జపాన్‌ వార్తా సంస్థ నికెయి పేర్కొన్నది. దాపరికం ఏమీ లేదు, చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దం అంటూ చొక్కా చేతులు మడుస్తున్న అమెరికా మూసిన తలుపుల వెనుక ఏమి చర్చించి ఉంటుంది. రెండు దేశాల సంబంధాల గురించి సుభాషితాలు చెప్పటం కాదు, ఆచరణలో చూపండి అని చైనా అధినేత షీ జింపింగ్‌ చెప్పినట్లు వెల్లడైంది. మరోసందర్భంలో దాని గురించి చూద్దాం.


చైనా ఆర్థిరంగం మందగించిందంటూ అనేక కథనాలు వెలువడుతున్న తరుణంలో అమెరికా విదేశాంగ మంత్రి బీజింగ్‌ వచ్చాడు. అందరూ చెబుతున్నట్లు నిజంగా ఆర్థికంగా కుంగిపోతుందా ? గడచిన నాలుగు దశాబ్దాలుగా అనేక మంది ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉన్నారు. మరింకేమీ పని లేనట్లు కొందరు వాటిని మన జనానికి సరఫరా గొలుసు ద్వారా పంపిణీ చేస్తున్నారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడిస్తున్నారు. మే నెలలో ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి ప్రభుత్వం వివరాలను వెల్లడిస్తున్నది. మన సర్కార్‌ మాదిరే చైనా కూడా అదే చేసింది. ఏప్రిల్‌ మాసంతో పోలిస్తే ఆర్థికరంగం పురోగతి మందగించిందని పేర్కొన్నది.దాన్ని చూపి ఇంకేముంది ఫినిష్‌ అన్నట్లుగా సంబరపడిపోతున్నారు.వేగం తగ్గటం వేరు, ప్రతికూల వృద్ది నమోదు వేరు. చైనా తనను తాను సమర్ధించుకోగలదు,లోపాలు ఉంటే సరిచేసుకోగలదు. దాన్ని ఎవరూ భుజాన వేసుకొని మోయాల్సిన అవసరం లేదు. వామపక్ష శక్తులే కాదు, ఇతరులకూ అక్కడి పరిణామాల వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారి కోసం కొన్ని మాటలు చెప్పుకోక తప్పదు. అంతర్జాతీయ వాతావరణం ఇప్పటికీ సంక్లిష్టంగాను, తీవ్రంగా ఉందని, ప్రపంచ ఆర్థిక పరిస్థితి స్థబ్దుగా ఉందని, తమ ఆర్థికరంగం సరిగానే కోలుకుంటున్నప్పటికీ, మార్కెట్‌ గిరాకీ ఇంకా తక్కువగా ఉందని చైనా ప్రతినిధి విలేకర్లతో చెప్పారు. ఏ రంగంలో ఎంత పురోగతి ఉంది, దేనిలో ఎంత తిరోగమనం ఉందో కూడా అంకెలను వెల్లడించారు. మందగమనాన్ని అరికట్టి వేగాన్ని పెంచేందుకు ఉద్దీపన పాకేజీ గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానిలో భాగంగానే 2.75 శాతం ఉన్న వడ్డీ రేటును 2.65కు తగ్గించింది.


ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ అనే అంతర్జాతీయ సంస్థ జరిపిన సర్వే గురించి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఒక వార్తను ప్రచురించింది. దాని ప్రకారం 74శాతం మంది జీవన వ్యయ పెరుగుదల, తమ వ్యక్తిగత ఆర్థిక స్థితి గురించి ఆందోళన వెల్లడించగా, 63శాతం మంది సేవలు, అత్యవసరం గాని వస్తువుల గురించి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నట్లు చెప్పారట. మరి మన కేంద్ర ప్రభుత్వం పాకేజీలేమైనా ప్రకటిస్తుందా ? ఆరున్నరశాతంగా ఉన్న వడ్డీ రేటును తగ్గిస్తుందా ? ఎందుకంటే చైనా కంటే మన పరిస్థితి మెరుగ్గా వుందని చెబుతున్నారు కదా !చైనాలో వేతనాలు పెరుగుతున్నందున తక్కువ ధరలకు అక్కడ సరకులను ఉత్పత్తి చేసేందుకు వీలు లేని కారణంగా కంపెనీలు మనవైపు చూస్తున్నాయని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఎర్రతివాచీలు పరచి ఏమేమి రాయితీలు ఇచ్చేది చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మి కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. బండి గుర్రానికి గడ్డి చూపించి పరుగెత్తిస్తున్నట్లు తాము సూచించిన సంస్కరణలను అమలు జరిపితే అప్పుల పరిమితి పెంచుతామని చెబుతోంది తప్ప జన జీవన వ్యయ పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వమూ ముందుకు రావటం లేదు, రాష్ట్రాలనూ కోరిన దాఖలాలు లేవేమి ?


చైనా నుంచి తరలి పోతున్నట్లు కొన్ని కంపెనీలు ప్రకటించిన మాట నిజం, అవి మన దేశానికి వస్తాయని చెప్పిన వారి అంచనాలు తప్పిందీ అంతే వాస్తవం.2022 డిసెంబరు నాటికి తొమ్మిది నెలల కాలంలో మన దేశానికి వచ్చిన ఎఫ్‌డిఐలు 36.7 బి.డాలర్లు, అదే అంతకు ముందు ఏడాది వచ్చిన మొత్తం 43.2 బి.డాలర్లని మార్చి 20 వ తేదీ బిజినెస్‌స్టాండర్డ్‌ పత్రిక వార్త పేర్కొన్నది.చైనాలో కూడా ఎఫ్‌డిఐ పెరుగుదల తగ్గినప్పటికీ 2022లో కొత్తగా 18,532 విదేశీ పెట్టుబడి సంస్థలు నమోదైనట్లు, అంతకు ముందేడాదితో పోలిస్తే 38.3 శాతం ఎక్కువని చైనా పేర్కొన్నది. ప్రపంచమంతటా కరోనా లాక్‌డౌన్లు ఎత్తివేసినా చైనాలో 2022 డిసెంబరు వరకు దాదాపు దేశమంతటా సున్నా కోవిడ్‌ కేసులు అనే విధానంలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగింది, తరువాత ఎత్తివేశారు. ఈ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి తిరిగి అనేక రంగాల్లో వినిమయం పెరిగి మే నెలలో తగ్గిందని చెబుతున్నారు. దాన్ని నమ్మటమా లేదా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. అంతర్గత మార్కెట్‌తో పాటు అనేక ధనిక దేశాల్లో తలెత్తిన మాంద్యం కూడా తోడైంది. మన దేశంలో ఈ ఏడాది మార్చినెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటుతో పోలిస్తే వర్తమాన సంవత్సరం రేటు తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అదే చైనాకూ వర్తించుతుంది.


చైనాలో 16-24 సంవత్సరాల వయస్సు గల వారిలో మే నెలలో 20.8శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సర్వే వెల్లడించింది. మన దేశంలో ఎంత ఉందో ప్రభుత్వం ప్రకటించిన దాఖలాల్లేవు. ఇక్కడి పరిస్థితి మామూలేగా, అద్భుతాలు సృష్టిస్తున్నదని చెబుతున్న చైనాలో అలా ఉండటం ఏమిటని కొందరు అమాయకత్వాన్ని నటిస్తారు. చైనా పురోగతి అద్భుతమనటంలో ఎలాంటి సందేహం లేదు. నూటనలభై కోట్ల మంది అవసరాలను తీర్చగల స్థాయికి ఇంకా పెరగలేదు గనుకనే కొన్ని సమస్యలు. వాటిని తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చూస్తున్నదా లేదా లేక మన ప్రధాని చెప్పినట్లు పకోడీ, బజ్జీల బండి పెట్టుకొని ఉపాధి చూసుకోండని గాలికి వదలివేసిందా అన్నదే ప్రశ్న.మన దేశంలో ఏటా 65లక్షల మంది డిగ్రీలు తీసుకొని కాలేజీల నుంచి వెలుపలికి వస్తుంటే చైనాలో దానికి రెట్టింపుగా రికార్డు స్థాయిలో 115.8లక్షల మంది ఈ ఏడాది వచ్చారు. మే నెలలో మొత్తం 3.3 కోట్ల మందికి గాను 2.6 కోట్ల మంది ఏదో ఒక ఉపాధిలో చేరారని, 60లక్షల మంది వేచి ఉన్నారని కూడా చైనా సర్వే పేర్కొన్నది. మన దేశంలోని సిఎంఐఇ సంస్థ పేర్కొన్న సమాచారం ప్రకారం పాతికేండ్ల లోపు యువత మన జనాభాలో 40శాతం ఉన్నారు. వారిలో 2022 డిసెంబరు నాటికి 45.8శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. చైనాలో 20శాతంపైన ఉంటే అక్కడి వారి గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నవారు మన దేశంలో దానికి రెట్టింపుకు మించి ఉన్నవారి గురించి మాట్లాడరేం ? చైనాలో మే నెలలో నిరుద్యోగులు మే నెలలో 4.1శాతం, అదే మన దేశంలో ఏప్రిల్‌ నెలలో 8.11శాతం ఉంది.


చైనా గడచిన నాలుగు దశాబ్దాలలో అనేక విజయాలతో పాటు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొన్నది. వాటిని అధిగమించి ముందుకు పోతున్నది. ఇప్పుడు కూడా అంతే. అక్కడి నాయకత్వం మరింత పరిణితి చెందింది. కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు క్రిమి కీటకాలు కూడా లోనికి వస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ చైనా మార్కెట్‌ను తెరిచేటపుడు చెప్పాడు. ఇప్పుడూ ఎదురైన సవాళ్లను అదిగమించగలదని గత చరిత్రను బట్టి చెప్పవచ్చు. మన దేశంతో సహా విదేశాలలో 110 చైనా పోలీస్‌ స్టేషన్లు అంటూ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తన వ్యతిరేకులను పట్టుకొనేందుకు అనధికారికంగా వాటిని తెరిచిందనే ప్రచారం ఇప్పటికీ సాగుతోంది.దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా ఈ కట్టు కథలను పిట్ట కతలను నమ్ముతున్నవారు లేకపోలేదు.


తమ రాజధాని సియోల్‌, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న చైనా రహస్య పోలీస్‌ స్టేషన్ల గురించి విచారణ జరుపుతున్నట్లు దక్షిణ కొరియా అధికారులు తాజాగా చెప్పారు. ఒక చైనా రెస్టారెంట్‌ కేంద్రంగా పని చేస్తున్నట్లు గుర్తించారట. స్పెయిన్‌ కేంద్రంగా పని చేస్తున్న సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ అనే ఒక స్వచ్చంద సంస్థ చేస్తున్న ప్రచారం ప్రకారం 53 దేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయట.కరోనా మహమ్మారి విజృంభించినపుడు వివిధ దేశాల్లో ఉన్న తమ జాతీయులను స్వదేశానికి రప్పించేందుకు కొన్ని సంస్థలు పని చేశాయి తప్ప పోలీస్‌ స్టేషన్లు లేవని మే 15వ తేదీన చైనా విదేశాంగశాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. చైనా జాతీయులు నిర్వహించే రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థల ముసుగులో పోలీస్‌ స్టేషన్లు నడుపుతున్నారని గత కొద్ది నెలలుగా ప్రచారం చేస్తున్నారు. న్యూయార్క్‌ నగరంలో అలాంటి ఒక పోలీస్‌ స్టేషన్ను పట్టుకున్నామని, 1998 నుంచి పని చేస్తున్న ఒక ధార్మిక సంస్థకు చెందిన ఇద్దర్ని గుర్తించినట్లు అమెరికా పోలీసులు ప్రకటించారు. నగరంలోని చైనీయులకు అవసరమైన సేవలు అందిస్తామంటూ ఆ సంస్థ బహిరంగంగానే మీడియాలో చిరునామాతో సహా ప్రకటనలు జారీ చేసినప్పటికీ అమెరికా పోలీసులు అది రహస్యంగా పని చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశారు. బ్రిటన్‌లో కూడా ఇలాంటివే ఉన్నట్లు సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ చెప్పటంతో మూడు అనుమానిత ప్రాంతాల్లో సోదా చేసిన పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు, చట్ట ఉల్లంఘనలు కనిపించలేదని బ్రిటన్‌ భద్రతా మంత్రి టామ్‌ ప్రకటించాడు.


చైనా పోలీస్‌ స్టేషన్ల ప్రచారం సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ సంస్థ నుంచే జరుగుతోందన్నది స్పష్టం. దీని కథను చూస్తే అది అమెరికా సిఐఏ ఏర్పాటు చేసినది అని స్పష్టం అవుతున్నది. మానవహక్కుల కార్యకర్త పేరుతో స్వీడిష్‌ జాతీయుడైన పీటర్‌ డాహిలిన్‌ చైనాలో 2009లో కుర్ర లాయర్లు, గ్రామీణులకు సాయం చేసే పేరుతో చైనా యాక్షన్‌ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. చేస్తున్న సాయం సంగతి పక్కన పెడితే ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టటం అసలు లక్ష్యంగా వెల్లడి కావటంతో 2016 చైనా అధికారులు డాహ్లిన్‌తో సహా పని చేస్తున్న వారందరినీ పట్టుకొని జైల్లో పెట్టారు. కొందరు కనిపించకుండా పోయారు. డాహ్లిన్‌ కేవలం 23 రోజులు మాత్రమే జైల్లో ఉన్నాడు. తాను చట్టవిరుద్దంగా పని చేశానని అంగీకరించటంతో విడుదల చేసి పది సంవత్సరాల పాటు తిరిగి చైనాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించారు. అప్పటి నుంచి చైనా గురించి ప్రపంచానికి కట్టుకథలు చెప్పటం ప్రారంభించాడు. నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ(ఎన్‌ఇడి) అనే పేరుతో పనిచేసే అమెరికా సంస్థ ప్రపంచంలో తప్పుడు ప్రచారం, కట్టుకథలు అల్లే వారికి, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారకులకు పెద్ద మొత్తంలో నిధులు అందచేస్తుంది. దీనికి సిఐఏ మార్గదర్శకత్వం ఉంది. ఆ సంస్థ నుంచి డాహ్లిన్‌ నిధులు పొందినట్లు 2017లో హాంకాంగ్‌ ఫ్రీ ప్రెస్‌ అనే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికతో చెప్పాడు. అమెరికా ఎన్‌ఇడి మాదిరి ఐరోపా ఇఇడి సంస్థ డాహ్లిన్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందచేసింది. ఈ సంస్థలు అనేక దేశాల్లో అక్కడి పాలకుల మీద జనాలను రెచ్చగొట్టి వాటికి రంగుల విప్లవాలని పేరు పెట్టి ప్రచారం చేసిన చరిత్ర ఉంది, ఇప్పటికీ అదే జరుగుతోంది.చైనా గురించి ఎన్నిక కథలు చెప్పినా దాని పురోగతి ఆగటం లేదు, ఆగదు !

బిజెపి అజెండాను ముందుకు తెచ్చిన లా కమిషన్‌ : ఏక రూప పౌరస్మృతిని హిందువులందరూ అంగీకరిస్తారా ?

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఏక రూప పౌర స్మృతి గురించి ఆసక్తి ఉన్న వారు నోటిఫికేషన్‌ జారీ చేసిన జూన్‌ 14వ తేదీ నుంచి నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలపాలంటూ ఇరవై రెండవ లా కమిషన్‌ ఒక ప్రకటన చేసింది. అది లేకపోతే దేశం ఇంకేమాత్రం ముందుకు పోదు, తీవ్ర ఆటంకంగా ఉందన్నట్లు కొందరు గుండెలు బాదుకుంటున్నారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నదే కదా దాన్ని అమలు చేస్తామంటుంటే ఎందుకు లేనిపోని దురుద్దేశాలు అంటగడుతున్నారు అంటూ అమాయకత్వాన్ని నటిస్తున్నారు. అదే గనుక వాస్తవమైతే నరేంద్రమోడీ తొమ్మిది సంవత్సరాలుగా ఏం చేస్తున్నట్లు ? చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. లా కమిషన్‌ సరిగ్గా ఇప్పుడు దాన్ని ఎందుకు ముందుకు తీసుకు వచ్చిందన్నది ప్రశ్న. దీని గురించి దాన్ని ఎవరూ సవాలు చేయటం లేదు, విబేధించటమూ లేదు. ఎన్నో తర్జన భర్జనల తరువాత మన దేశంలోని సంక్లిష్ట పరిస్థితుల కారణంగా ఏకాభిప్రాయసాధనతో సాధించాల్సిన అంశంగా పరిగణించి అర్టికల్‌ 44లో ఇతర అదేశిక సూత్రాలలో దాన్ని చేర్చారు. వాటిని కోర్టులు అమలు జరపలేవని కూడా రాజ్యాంగంలో ఉంది. వాటిలో పని హక్కు, నిరుద్యోగ భృతి వంటి వివాదం లేని వాటిని అమలు జరపటం మీద శ్రద్ద లేని బిజెపి వివాదాస్పద ఏక రూప పౌర స్మృతి మీద కేంద్రీకరిస్తున్నది. మతోన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే మెజారిటీ-మైనారిటీ మతశక్తులు రెచ్చిపోతున్న తరుణంలో అనేక అపోహలు ఉన్న ఈ అంశం ఇప్పుడు తక్షణ అవసరం అంటూ బిజెపి ముందుకు తెస్తున్నది.

మహిళల ఉద్దరణ అని చెబుతున్నది. నిజానికి దానికి అంత శ్రద్ద ఉంటే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ ఎందుకు కల్పించలేదు. ఒక ముసాదాను రూపొందించి జనం ముందు ఎందుకు పెట్టలేదు ? త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇరవై రెండవ లా కమిషన్‌ ద్వారా ఒక ప్రచార అస్త్రంగా తన అజెండాను ముందుకు తెచ్చింది.
ఏక రూప పౌర స్మృతి ఈ దశలో అవసరమూ కాదు వాంఛనీయమూ కాదని 2018 ఆగస్టులో ఇరవై ఒకటవ లా కమిషన్‌ విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. ఆ పత్రం విడుదల చేసి మూడు సంవత్సరాలు దాటినందున నాటి నోటిఫికేషన్‌ గడువు ముగిసిందని, వివిధ కోర్టుల ఉత్తర్వులు దీని మీద ఉన్నందున ఈ అంశం మీద కొత్తగా అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నది. అభిప్రాయాలు తప్ప కోర్టు ఉత్తరువులేమీ లేవు.తాజా సేకరణతో ఏమి చేస్తారో చెప్పలేదు. గత కమిషన్‌ 2016 జూన్‌ 17 నోటి ఫికేషన్‌ ద్వారా అభిప్రాయాలను సేకరించింది. వాటిని క్రోడీకరించి కుటుంబ చట్ట సంస్కరణలు పేరుతో 185 పేజీల పత్రాన్ని విడుదల చేసింది. ఏక రూప దేశం అంటే సమరూపత ఉండనవసరం లేదు. మానవహక్కుల అంశంలో ప్రపంచమంతటా ఉన్న వివాదాలు లేని తర్కాలతో మన భిన్నత్వాన్ని సమ్మతింప చేసేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉందని ఆ పత్రం పేర్కొన్నది. వివిధ మతాలకు సంబంధించి పర్సనల్‌ చట్టాల్లో ఉన్న వివక్ష, అసమానతలను ఎదుర్కొనేందుకు ఇప్పుడున్న కుటుంబ చట్టాలను అవసరమైన మేరకు క్రోడీకరించి, సవరించవచ్చని కూడా పేర్కొన్నది. సుప్రీం కోర్టు తన ముందుకు వచ్చిన వివిధ కేసుల విచారణ సందర్భంగా ఏకరూప పౌర స్మృతి అవసరమని అభిప్రాయపడింది. తాజాగా మార్చి 23వ తేదీన వివిధ పిటీషన్ల మీద తీర్పు చెబుతూ ఇలాంటి పిటీషన్లను ఆమోదించి విచారించటం అంటే అలాంటి చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటును ఆదేశించటమేనని, తామాపని చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దీని గురించి తాజాగా ఆలోచించాలని, ఏ చర్యలు తీసుకున్నది కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. 2022 అక్టోబరులో సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్లపై ప్రభుత్వం స్పందిస్తూ మత ప్రాతిపదికన ఉన్న వ్యక్తిగత చట్టాలు దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్నట్లు, ఏకరూప పౌర స్మృతిని తీసుకువస్తామని పేర్కొన్నది.


దేశ ఐక్యతకు, సామాజిక సమతుల్యతకు ముప్పు తెస్తున్న అంశాలలో విద్వేష పూరిత ప్రసంగాలు, ఇతర వివాదాస్పద అంశాలు, చట్టాన్ని కొందరు చేతుల్లోకి తీసుకోవటం, వ్యవస్థల దుర్వినియోగం వంటివి నేడు ప్రధానంగా ముందుకు వచ్చాయి. అలాంటి వారి మీద ఫిర్యాదు లేకున్నా కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఒకటికి రెండుసార్లు చెప్పాల్సి వచ్చింది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే అలాంటి ప్రసంగాలు చేసిన వారి మీద కేసు నమోదు చేసిన వారికి భద్రత లేదన్నది స్పష్టం. ఆదేశిక సూత్రాల్లోని పని, విద్య, నిరుద్యోగ భృతి వంటి హక్కులను అమల్లోకి తెస్తే కరోనాలో వలస కార్మికులు దిక్కులేని చావులకు, ఇబ్బందులకు గురయ్యేవారు కాదు. వలస కూలీలు తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని స్థానికులు దాడులకు దిగేవారూ కాదు.రిజర్వేషన్ల కోసం తన్నుకు చచ్చేవారూ కాదు.తాజాగా మణిపూర్‌ మంటలూ ఉండేవి కాదు, ప్రధాని మోడీ కనిపించటం లేదనే పోస్టర్లూ వెలువడేవి కాదు.


ఏకరూప పౌర స్మృతి అంటే ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి ఎలాంటి మార్పులు చేసేదీ జనంలో చర్చకు పెడితే దాని గురించి ఉన్న అనేక అపోహలు తొలుగుతాయి. ఏమైనా సరే వెంటనే అమలు జరపాలని కోరుతున్న మోడీ సర్కార్‌ గత తొమ్మిది సంవత్సరాలుగా అలాంటిదేమీ తీసుకురాలేదు. రూపు రేఖలు లేని ఒక ప్రతిపాదన మీద అభిప్రాయాలు చెప్పమంటే ఏమి చెబుతారు ? గతంలో చెప్పిన అభిప్రాయాలకు కాలదోషం పట్టిందని వర్తమాన లా కమిషన్‌ ఏ ప్రాతిపదికన నిర్దారించింది. అసలది ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ తప్ప రాజ్యాంగబద్దమైనది కాదు, ప్రభుత్వం దాని ద్వారా అభిప్రాయసేకరణ జరపమని కోరింది గాని రాజ్యాంగ ఆదేశం లేదు. ఏకరూప పౌర స్మృతిని ముస్లింలు లేదా ఏమతం వారైనా ఎలాంటి హేతుబద్దత లేకుండా గుడ్డిగా తిరస్కరించనవసరంలేదు, భిన్న అభిప్రాయం వెల్లడించవచ్చు, ముసాయిదాను ముందుపెడితే వివరణలు కోరవచ్చు.


ఆదేశిక సూత్రాల్లో అనేక అంశాలు ఉన్నప్పటికీ మిగతావాటిని అమలు జరపకుండా ఏకరూప పౌర స్మృతి మీద బిజెపి కేంద్రీకరణ అన్నది ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ఆ మతానికి చెందినవారితో పాటు ఇతర మతాల వారు, మతం, కుల పట్టింపులు లేనివారు కూడా బలంగా నమ్ముతున్నారు. దాన్ని ఏకాభిప్రాయంతో సాధించాల్సి ఉందని అంబేద్కర్‌తో సహా మెజారిటీ భావించిన కారణంగానే ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు పది సంవత్సరాలు చాలని నాడు భావించారు. ఆ లక్ష్యం నెరవేర లేదు గనుక పొడిగిస్తూ వస్తున్నారు. తరువాత ఓబిసిలకూ వర్తింప చేశారు. పౌర స్మృతి మీద ఇప్పటికీ ఏకాభిప్రాయ పరిస్థితి ఉందా అంటే లేదు. అసలు హిందువులందరూ దానితో ఏకీభవిస్తారా అన్నది ప్రశ్న. కర్ణాటకలో ఎక్కువగా ఉన్న లింగాయతుల తమను ప్రత్యేక మతానికి చెందిన వారిగా పరిగణించాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.శైవులు, వైష్ణవులు వారిలో కులాల వారీ భిన్న ఆచారాలు, ఇలా ఎన్నో విభిన్నతలు ఉన్నాయి. వాటన్నింటిలో బిజెపి లేదా కేంద్ర ప్రభుత్వం వేలు బెట్టాలని, ఫలానా పద్దతి పాటించాలని ఆదేశించాలని చూస్తున్నదా ? అందుకే ముసాయిదా చట్టాన్ని ముందుపెడితే ఇలాంటి అనుమానాలకు తెరపడుతుంది లేదా కొత్త అంశాలు ముందుకు రావచ్చు. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే అదేదో ముస్లింలకు సంబంధించిందని అనేక మంది భావించి మద్దతు ఇచ్చారు. రాముడి గుడి కడతామంటే సరే అన్నారు. వ్యక్తిగత అంశాల్లో తమదాకా వస్తే అలాగే ఉంటారా ? ఒక కులానికి చెందిన వారు మరో కులం, మతానికి చెందిన వారిని వివాహం చేసుకోకూడదని తీర్మానాలు చేస్తున్న పంచాయత్‌లు సాగుతూనే ఉన్నాయి.ఎవరికి వారు తమ కులాన్ని, మతాన్ని పవిత్రంగా మార్చాలని చూస్తున్నారు. అలాంటి స్థితిలో అందరూ సమానమే, ఒకటే అనే భావనను అంగీకరిస్తాయా ?


గోవాలో ఏకరూప పౌర స్మృతి అమలు జరుపుతున్నపుడు ఇతర చోట్ల ఎందుకు అమలు జరపకూడదు అని కొందరు వాదిస్తున్నారు. పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా 1961లో దేశంలో విలీనమైంది. అప్పటి వరకు అక్కడ అమల్లో ఉన్న పౌర స్మృతిని మార్చి కొత్త విధానాన్ని వర్తింప చేయాల్సిన అగత్యం తలెత్తలేదు. దాన్నే వర్తింప చేసేందుకు నాడు కేంద్రం అంగీకరించింది, ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అలాంటి చట్టాన్ని మిగతా దేశంలో అమలు జరపవద్దని ఎవరూ అనటం లేదు, బలవంతంగా రుద్దటం గాక అనుమానాలను తీర్చి అమలు జరపాలని చెబుతున్నారు. అందుకు అనువైన వాతావరణం లేదు గనుక తొందరపడవద్దంటున్నారు. మిగిలిన ఆదేశిక సూత్రాలు అమలు జరిపిన తరువాత దీన్ని కూడా చేపట్టవచ్చు. గోవాలో ఉన్న చట్టం ప్రకారం వివాహమైన వెంటనే ఏ మతం వారికైనా భర్త ఆస్తిలో భార్యకు సగం వాటా మీద హక్కు దఖలు పడుతుంది. దేశంలో దాన్ని అమలు చేస్తే ఇప్పుడున్న హిందూ అవిభక్త కుటుంబం, దానితో పాటే ఆ పేరుతో పొందుతున్న పన్ను రాయి రద్దవుతుంది. దీన్ని దేశంలోని హిందువులందరూ సమ్మతిస్తారా ? ఉత్తరాదిన సప్తపది హౌమం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తేనే వివాహం జరిగినట్లు, దక్షిణాదిన అదే హిందువుల్లో ఎవరైనా పాటించ వచ్చు తప్ప విధి కాదు. లేదు. ఇలాంటి అనేక తేడాలు ఉన్నప్పుడు ఏక రూప చట్టం ఎలా ఉంటుందో ఎవరిని ఎలా ప్రభావితం చేస్తుందో, ఎలా స్పందిస్తారో తెలియదు. పంజాబ్‌లో వారసత్వహక్కులు హిందువులకు ఒక విధంగా సిక్కులకు మరొక విధంగా ఉన్నాయి. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం ఆ మతానికి చెందిన పురుషులు నలుగురిని వివాహం చేసుకోవచ్చు, ఆ మేరకు వివాహాలు చేసుకుంటూ హిందువులు మెజారిటీగా ఉన్న దేశాన్ని ముస్లిం మెజారిటీగా మార్చేందుకు కుట్రపన్నుతున్నారంటూ కాషాయదళాలు నిరంతరం చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం తెలిసిందే.


నిషేధం ఉన్నప్పటికీ ముస్లింలలో కంటే హిందువులు, ఇతరుల్లోనే ఎక్కువగా బహుభార్యాత్వం ఉందని గతంలో జరిపిన విశ్లేషణలో తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2005-06 ప్రకారం హిందువుల్లో 1.9, ముస్లింలలో 2.9, ఇతరుల్లో 2.9శాతం ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్నారు. అదే 2019-20 సర్వే ప్రకారం 1.3,1.9,1.6 శాతాలకు తగ్గారు. తగ్గుదల అందరిలోనూ ఉంది. అందువలన ముస్లింలు పనిగట్టుకొని ఎక్కువ మందిని వివాహమాడి పిల్లలను కని దేశాన్ని ఆక్రమిస్తున్నారనే ప్రచారం వాస్తవం కాదు. విద్యలేని వారు, పేదలు, చిన్న వయస్సులోనే వివాహాలు చేసుకున్న వారిలో ఈ దురాచారం ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారిక సర్వే వెల్లడించింది. కులాల వారీ చూసినపుడు తాజా సర్వే ప్రకారం గిరిజనుల్లో 2.4, ఎస్‌సి 1.5, ఒబిసి 1.3, ఇతరుల్లో 1.2శాతం చొప్పున, మతాలవారీ హిందూ 1.3, ముస్లిం 1.9, క్రైస్తవులు 2.1, బౌద్దులు 1.3, సిక్కులు 0.5, ఇతరులు 2.5 శాతం మంది ఉన్నారు. ముస్లింలకు మినహా ఇతరుల్లో ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉండటం నిషేధం. దేశంలో జరిపిన నేషనల్‌ శాంపుల్‌ సర్వే ప్రకారం ఓబిసిలు 40.94, దళితులు 19.59, గిరిజనులు 8.63 శాతం ఉన్నారు. వీరిలో అనేక కులాలు, ఉపకులాలు ఆచారాలు, సాంప్రదాయాలన్నీ ఒకటే కాదు, వీరందరూ హిందువులే, ఎంతో భిన్నత్వం కలిగిన వారందరికీ ఒకే పౌరస్మృతిని అమలు జరిపే ముందు వీరిలో ఉన్న అనుమానాలను తొలగించాలా లేదా ? దానికి మార్గం నమూనా చట్టం జనం ముందు పెట్టటమే.


ప్రస్తుతం వివిధ మతాల వ్యక్తిగత చట్టాల ప్రకారం ఒకే అంశంపై ఏకీ భావం లేదు. ఎవరి భాష్యాలు వారు చెబుతున్నారు. జనంలో అనేక అనుమానాలు, గందరగోళం ఉంది. ఏక రూప పౌరస్మృతిని బిజెపి బలవంతంగా రుద్దాలనుకుంటే ప్రస్తుతం దానికి అడ్డులేదు. పార్లమెంటులో దానికి గుడ్డిగా మద్దతు ఇచ్చే పార్టీలు ఉన్నందున అదేమీ పెద్ద అంశం కాదు. దాన్ని ఒక ఎన్నికల ప్రచార అస్త్రంగా, ముస్లింల మీద విద్వేషాలు, వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకు సృష్టికి, సంతుష్టీకరణకు పూనుకుంది. దీనికి ఇస్లాం లేదా దేశంలోని ముస్లింలు వ్యతిరేకమనే ప్రచారం చేస్తున్నారు. దీనిలో వాస్తవం-వక్రీకరణ రెండూ ఉన్నాయి. ముస్లిం మతశక్తులు గుడ్డిగా సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయి తప్ప సామాన్య ముస్లింలందరూ అలా లేరు, అదే విధంగా హిందూత్వ పేరుతో వీరంగం వేస్తున్న వారు ముస్లింల పట్ల గుడ్డి ద్వేషాన్ని వెళ్లగక్కుతుంటే మొత్తం హిందువులందరూ అలా లేరు. ఏ మతమైనా వర్తమానానికి అనుగుణంగా మారకపోతే మౌఢ్యం పెరుగుతుంది. ఉన్న మతాల్లో హిందూ అని చెబుతున్న అనేక సామ్యాలున్న శైవ, వైష్ణవ ఇతర వివిధ మతాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నందున అనేక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. లేకపోతే జనం మతాలను పక్కన పెట్టేస్తారు. అమెరికా వెళ్లి హిందూమత గొప్పతనం గురించి ప్రసంగించిన స్వామి వివేకానందుడి గురించి గొప్పగా చెబుతారు. సముద్రయానం చేశాడనే కారణంగా తిరిగి వచ్చిన తరువాత అదే హిందూమతం వివేకానంద దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకుంది. ఇటీవలి కాలంలో ఆ మూఢనమ్మకాన్ని సవరించుకొని పరిహారంగా కొన్ని క్రతువులు చేస్తే చాలని సరిపుచ్చుతున్నారు. ఎందుకంటే అనేక మంది స్వామీజీలు విదేశాల సందర్శన సరదాను అణుచుకోలేకపోయారు. మడిని గట్టున పెట్టి వెళ్లారు. సముద్రం దాటిన వారు కులాన్ని కోల్పోతారని శాస్త్రాల్లో రాసి ఉంది మరి. ఎవరైనా కులం పోగొట్టుకున్నవారు ఉన్నారా ? లేకపోగా విదేశాల్లో కూడా కుల గజ్జిని వ్యాపింప చేస్తున్నారు. దేశ పరువును గంగలో కలుపుతున్నారు. ఉన్న మతాలలో తాజాది ఇస్లాం గనుక ఆ మతం మీద ముల్లా ” అగ్రహారికుల ” ప్రభావం ఎక్కువగా ఉంది. వివాహం, విడాకులు, ఆస్తి హక్కులు, సంరక్షణ, దత్తత వంటి అంశాలు ఎంతో సున్నితమైనవి గనుక వాటిని సమానత్వ ప్రాతిపదికన, లింగవివక్ష లేకుండా ఎలా చట్టాన్ని రూపొందించాలన్నది పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అన్ని మతాలూ మహిళను చిన్న చూపు చూసేవే, అణచేందుకు చూసేవే. అందువలన వారికి అనుకూలమైన ఏ చట్టం రూపొందాలన్నా చట్ట సభల్లో వారికి హక్కుగా ప్రవేశించే హక్కు కల్పించటం ముందుగా జరగాలి. అప్పుడే పితృస్వామిక సమాజ పెత్తనాన్ని చట్టబద్దంగా కూడా అడ్డుగోగలరు. అనుమానాలను తొలగిస్తూ, విశ్వాసాన్ని పాదుకొల్పుతూ తేవాల్సిన ఏకరూప పౌరస్మృతిని బిజెపి కోరుకుంటున్నట్లుగా ఏకపక్షంగా రుద్దకూడదు.

ఎక్కడైనా బావే గానీ సిఎం కుర్చీ దగ్గర కాదు : మహారాష్ట్రలో బిజెపి, షిండే శివసేన కుమ్ములాట – ముద్దులాట !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


మహారాష్ట్రలో అసలు సిసలు మహత్తర హిందూత్వ శక్తులం, హిందుమత ఉద్దారకులం తామే అంటున్న బిజెపి – షిండే శివసేన నేతలు ఎంతవారలైనా అధికార కాంత దాసులే అన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో సిఎం కుర్చీ కోసం కొట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది.” ఢిల్లీలో నరేంద్రమోడీ – రాష్ట్రంలో ఫడ్నవీస్‌ ” అంటూ బిజెపి ఒక నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానికి పోటీగా ” దేశంలో మోడీ – మహారాష్ట్రలో షిండే ” అంటూ తాజాగా షిండే శివసేన సోమవారం నాటి పత్రికల్లో ఇచ్చిన ప్రకటన రెండు పార్టీల మధ్య కాక పుట్టించింది.మంగళవారం నాడు కొల్లాపూర్‌లో సిఎం ఏకనాధ్‌ షిండే పాల్గొన్న కార్యక్రమాలను దేవేంద్ర ఫడ్నవిస్‌ బహిష్కరించారు, అనారోగ్యసాకు చెప్పినట్లు వార్తలు. దాంతో రెండు పార్టీలు నష్ట నివారణకు పూనుకొని బుధవారం నాటి పత్రికల్లో ఐక్యంగా ఉన్నట్లు కనిపించేందుకు శివసేన మరొక ప్రకటన ఇచ్చింది.” అందరూ ప్రేమించిన అద్భుతమైన బృందం ” అనే శీర్షికతో నష్ట నివారణకు గాను శివసేన మరొక ప్రకటన జారీ చేసింది. దానిలో నరేంద్రమోడీ, అమిత్‌ షా, బాలాసాహెబ్‌ థాకరే, ఆనంద దిఘేల బొమ్మలతో పాటు ఏకనాధ్‌ షిండే -దేవేంద్ర ఫడ్నవిస్‌ ఇద్దరూ జట్టుగా చేతులూపుతున్న చిత్రాన్ని ప్రదర్శించారు. వాటితో పాటు శివసేన ఎన్నికల గుర్తు బాణం, బిజెపి గుర్తు కమలం కూడా చోటు చేసుకుంది. తొలి ప్రకటనలో షిండేకు 26.1శాతం, ఫడ్నవిస్‌కు 23.2 శాతం మద్దతు అని పేర్కొనగా తాజా ప్రకటనలో ఇద్దరికీ కలిపి 49.3 శాతం మద్దతు అని పేర్కొన్నారు. ఈ పరిణామం మిగతా రాష్ట్రాలలో బిజెపితో చేతులు కలిపే ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఒక పాఠంగా పనికివస్తుంది. మరోవైపు కొద్ది రోజుల క్రితం సకాల్‌ అనే మరాఠీ దినపత్రిక వెల్లడించిన ఒక సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్‌సిపిా థాకరే శివసేన పార్టీ (ఎంవిఏ) మెజారిటీ సీట్లను సాధిస్తుంది. నిర్ణీత గడువు ప్రకారమైతే లోక్‌సభ తరువాత వచ్చే ఏడాది అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు, అలాగాక రెండింటినీ కలుపుతారా అన్నది చెప్పలేము.


శివసేనను చీల్చి బిజెపి మద్దతుతో బిజెపి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏదో ఒక అంశం రెండు పార్టీల మధ్య అనుమానాలను పెంచింది. రెండుసార్లు సిఎంగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఉప ముఖ్యమంత్రిగా పెట్టి అసలు కథ నడిపించాలన్నది బిజెపి పన్నాగం. ఏకనాధ్‌ షిండే తాత్కాలికమే, సిఎం పదవి తనదే అన్నట్లుగా ఫడ్నవిస్‌ ” ఢిల్లీలో నరేంద్రమోడీ- రాష్ట్రంలో ఫడ్నవీస్‌ ” అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. దానికి పోటీగా ఏకనాధ్‌ షిండే రంగంలోకి దిగారు. ఒక టీవీ ఛానల్‌-ఒక ఏజన్సీ నిర్వహించిన సర్వేలో తిరిగి సిఎంగా షిండేను కోరుతున్నవారు 26.1శాతం, ఫడ్నవిస్‌ను కోరుతున్నవారు 23.2శాతం అని తేలిందని పేర్కొంటూ శివసేన పేరుతో ఒక ప్రకటన జారీ చేశారు. అంతే కాదు బిజెపికి 30.2శాతం, షిండే సేనకు 16.2శాతం ఓటర్ల మద్దతు ఉందని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో షిండే అమలు జరుపుతున్న పధకాల వలన ప్రజా మద్దతు పెరిగిందని కూడా పేర్కొనటం గమనించాల్సిన అంశం. బాలాసాహెబ్‌ థాకరే ఫొటో లేకుండా ఆ ప్రకటన జారీ చేయటం అంటే మోడీ, అమిత్‌ షాలను చూసి షిండే భయపడుతున్నారని తేలిందని ఉద్ధావ్‌ ధాకరే సేన నేత సంజయ రౌత్‌ ధ్వజమెత్తారు. ఈ ప్రకటనను బట్టి ఏకనాధ్‌ షిండేను సిఎంగా అంగీకరించినట్లేనని ఫడ్నవిస్‌కు ఇది విచారకరమైన రోజని ఎన్‌సిపి స్పందించింది. ఈ ప్రకటన గురించి బిజెపి పెద్దలకు తెలిపామని, వారి అంగీకారంతోనే విడుదల చేసినట్లు షిండే వర్గం చెప్పుకుంది. సిఎంను పొగడటం వరకు ఓకే , ఇద్దరికీ కలిపి ఉన్న బలం గురించి ప్రతిపక్షాలకు చెప్పాలి మనలో ఎవరికి ఎంత బలం ఉందో, తమ నేత ఫడ్నవిస్‌కు జనంలో ఆదరణ లేదని చెప్పటాన్ని అంగీకరించేది లేదని బిజెపి నేతలు మండిపడ్డారు. షిండే తనతో పాటు తీసుకువచ్చిన 40 మంది ఎంఎల్‌ఏల కారణంగానే బిజెపికి అధికారం దక్కిందని గుర్తించాలని షిండే వర్గం తిప్పి కొట్టింది. ఇలాంటి ప్రకటనల రాజకీయాలు కొత్త కాదు. 2019 ఎన్నికల్లో మోడీ దేశానికి దేవేంద్ర రాష్ట్రానికి అంటూ బిజెపి ప్రకటనలు జారీ చేసింది.


షిండే సేన ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలు తమవే అని బిజెపి చెబుతోందని, అదే విధంగా షిండే వర్గానికి చెందిన ఐదుగురు మంత్రులను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మంత్రులు ఉద్దావ్‌ధాక్రేపై తిరుగుబాటులో కీలకపాత్ర పోషించారు. వారి ప్రవర్తనతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని ఫడ్నవిస్‌ ఇటీవల అమిత్‌ షా వద్ద మొరపెట్టుకున్నారని వార్తలు. ఇటీవల ఎవరికి వారు తమ ఎంఎల్‌ఏలతో విడివిడి సమావేశాలు జరపటం, నిధులు సరిగా కేటాయించటం లేదని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నట్లు షిండే కుమారుడు, ఎంపీ డాక్టర్‌ శ్రీకాంత్‌ షిండేపై బిజెపి నేతలు ధ్వజమెత్తారు. శ్రీకాంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కల్యాణ్‌ లోక్‌సభ సీటు తమదే అని కూడా వారు బహిరంగంగా చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో బలపరచకూడదని తీర్మానాలు కూడా చేశారు. ఈ పూర్వరంగంలో అవసరమైతే తాను రాజీనామా చేస్తానని శ్రీకాంత్‌ గతవారంలో ప్రకటించారు. సిఎంగా తండ్రి తీసుకొనే నిర్ణయాల వెనుక కుమారుడి ప్రభావం ఉందన్న పేరుంది. ఏకనాధ్‌ షిండేను అదుపులో ఉంచేందుకు, అవసరమైతే తప్పించేందుకు ఎన్‌సిపి నేత అజిత్‌ పవార్‌కు బిజెపి గాలం వేసింది. రాష్ట్ర రాజకీయాలలో అధికారం కోసం అర్రులు చాస్తారన్న పేరున్న అజిత్‌ బిజెపిలో చేరటం లాంఛనమే అన్న వార్తలు కూడా వచ్చాయి. అదే జరిగితే తాము కూటమి నుంచి తప్పుకుంటామని బిజెపిని షిండేసేన హెచ్చరించింది. అజిత్‌ పవార్‌ గతంలో బిజెపితో చేతులు కలిపి దొంగచాటుగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 80 గంటల తరువాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష కూటమి నేతగా ఉన్నారు.


మరాఠీ పత్రిక సకాల్‌ ఇటీవల ప్రకటించిన సర్వే ప్రకారం మహారాష్ట్రలో నరేంద్రమోడీని ప్రధానిగా కోరుకుంటున్నవారు 42.1శాతంగా కాగా వద్దన్నవారు 41.5శాతం ఉన్నారు. మిగిలిన వారు చెప్పేందుకు నిరాకరించటం లేదా తెలియదని చెప్పారు. దాదాపు 70శాతం మంది ఆర్థిక రంగంలో మోడీ విఫలం చెందినట్లు పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ తరువాత ఎక్కువ 48 స్థానాలున్న ఇక్కడ మోడీ పట్ల అనుకూలత ఎంతో ప్రతికూలత కూడా అంతే ఉంది. కోర్టులో శివసేన పేరు, గుర్తును షిండే వర్గం దక్కించుకోవచ్చుగానీ ఈ సర్వే ప్రకారం ఓటర్లు 12.5శాతం మంది ఉద్దావ్‌ ధాక్రే శివసేనకు మద్దతు ప్రకటిస్తే కేవలం 5.5శాతమే షిండేకు అనుకూలమని చెప్పారు. బిజెపికి 33.7శాతం మొగ్గుచూపారు. బిజెపి కూటమికి 39.2 శాతం మద్దతు పలకగా ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్‌సిపి, ఉద్దావ్‌ శివసేన కూటమికి 48శాతం మంది అనుకూలం అన్నారు. అరమరికలు లేకుండా ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఓటు బదిలీ చేసుకుంటే బిజెపి శంకరగిరి మాన్యాలు పడుతుందని అంకెలు చెబుతున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్‌-ఎన్‌సిపి ఒక కూటమిగా పోటీ చేశాయి. బిజెపికి 27.84, శివసేనకు 23.5, కూటమికి 51.34 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌, ఎన్‌సిపిలకు 16.41,15.66 మొత్తం 32.07శాతం రాగా 47 చోట్ల బరిలోకి దిగిన వంచిత్‌ బహుజన్‌ అగాధీకి 6.92 శాతం దానితో కలసి ఒక చోట పోటీ చేసి దాన్ని గెలుచుకున్న మజ్లిస్‌కు 0.73 ఓట్లు వచ్చాయి. వంచిత్‌ బహుజన్‌ అగాధీ ప్రస్తుతం ఉద్దావ్‌ శివసేనకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2019 అక్టోబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, శివసేన కూటమికి 25.75,16.41 చొప్పున మొత్తం 42.16 శాతం మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌, ఎన్‌సిపి కూటమికి 15.87, 16.71 చొప్పున, మొత్తం 32.58 శాతం వచ్చాయి. ఇక కుమ్ములాటలు-ముద్దులాటలుగా ఉన్న బిజెపి-షిండే సేన కూటమి తాత్కాలికంగా కలసి ఉన్నట్లు కనిపించేందుకు పూనుకున్నప్పటికీ అధికార కుమ్ములాటలు,పరిణామాలు ఏ రూపం తీసుకొనేది చెప్పలేము.కలసి ఉన్నా ఎంవిఏ కూటమిని ఎంత మేరకు ఎదుర్కొనేది ప్రశ్నార్ధకమే.
.

పరిశోధనల్లో చైనాను తక్కువ అంచనా వేస్తే ముప్పే – అమెరికాను హెచ్చరించిన ఓ నివేదిక !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రకృతి విజ్ఞానం(నేచురల్‌ సైన్స్‌)లో అమెరికాను వెనక్కు నెట్టి చైనా ప్రధమ స్థానానికి వచ్చిందన్నది ఒక నివేదిక.” మేలుకో అమెరికా : నవ కల్పన ఉత్పత్తిలో అమెరికాను అధిగమిస్తున్న చైనా ” అనే శీర్షికతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఐటిఐఎఫ్‌) ఒక నివేదికలో హెచ్చరించింది. ” చైనా నకిలీ సైన్సు పరిశ్రమ ” అంటూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక ఒక పెద్ద నింద మోపింది. ఇవన్నీ ఇటీవల చైనా గురించి వచ్చిన విశ్లేషణలు, వార్తలకు సంబంధించిన అంశాలు. ప్రకృతి విజ్ఞానంలో చైనా తొలిసారిగా అమెరికాను అధిగమించి ఒకటవ స్థానంలో ఉన్నట్లు నేచర్‌ ఇండెక్స్‌ పేర్కొన్నది. అగ్రశ్రేణి పత్రికల్లో 2022 సంవత్సరంలో ప్రచురితమైన పరిశోధనా పత్రాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. ఎనభై రెండు పత్రికల్లో చైనాకు చెందిన వారు సమర్పించిన పత్రాలు 19,373 కాగా అమెరికా నుంచి వచ్చినవి 17,610 ఉన్నాయి. ఏ దేశానికి చెందిన వారైనా ఏ దేశం నుంచి పత్రాలను సమర్పిస్తే వాటిని ఆ దేశాల ఖాతాలో వేస్తారు. ప్రకృతి విజ్ఞాన పరిశోధనా పత్రాల సమర్పణలో చైనా, అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, జపాన్‌ మొదటి ఐదు స్థానాల్లో ఉండగా మన దేశం పదవ స్థానంలో ఉంది. భౌతిక, రసాయన శాస్త్ర పరిశోధనల్లో 2021లో చైనా మొదటి స్థానంలో ఉంది. తాజా సమాచారాన్ని పరిశీలించినపుడు భూమి, పర్యావరణ శాస్త్రాలలో కూడా తొలిసారిగా అమెరికాను వెనక్కు నెట్టి చైనా ముందుకు వచ్చింది. గత ఏడాది వివరాలను పరిశీలించినపుడు ప్రపంచ అగ్రశ్రేణి 50 పరిశోధన ఉత్పాదక సంస్థలలో చైనా సైన్సెస్‌ అకాడమీ ఒకటవదిగా ఉండగా మొత్తం 19 చైనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఆ జాబితాలో ఉన్నాయి. 2010 నుంచి జాతీయ సమతూకంలో మార్పు ఉన్నట్లు నేచర్‌ ఇండెక్సు ప్రకటన పేర్కొన్నది.2018 -2020 సంవత్సరాలలో ఉటంకించిన అగ్రశ్రేణి ఒకశాతం పరిశోధనా పత్రాలలో అమెరికా కంటే చైనావే ఎక్కువగా ఉన్నట్లు సైన్సెస్‌ మరియు టెక్నాలజీ జపాన్‌ జాతీయ సంస్థ 2022 నివేదిక పేర్కొన్నది.

నిజానికి 2018లోనే మొత్తం పరిశోధనా పత్రాల సమర్పణలో అమెరికా, ఐరోపాను వెనక్కు నెట్టి చైనా ముందుంది.
2018 నుంచి 2020వరకు ప్రపంచ శాస్త్ర పత్రాలలో 23.4శాతంతో చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతానికి జీవ శాస్త్ర రంగంలోనే అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.అమెరికా ఎన్నో శతాబ్దాలు ముందుండి పరుగులు పెడుతుంటే చైనా ఇటీవలనే నడక ప్రారంభించింది. అందుకే ఇప్పటికీ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు కొన్ని రంగాలలో ముందున్నాయి. నోబెల్‌ బహుమతులను కొలబద్దగా తీసుకుంటే 403తో అమెరికా, 137తో బ్రిటన్‌, 114తో జర్మనీ మొదటి మూడు స్థానాల్లో ఉండగా చైనా తొమ్మిదితో 23వ స్థానంలో ఉంది. 2015లో పశ్చిమ దేశాల సైన్సు పత్రికలలో చైనా పరిశోధనా పత్రాలు కేవలం ఏడున్నవేలు మాత్రమే ప్రచురణకు నోచుకోగా అమెరికా నుంచి 21వేలవరకు ఉన్నాయి. 2020 అమెరికా పత్రాలు స్వల్ప తేడాతో స్థిరంగా ఉండగా తరువాత తగ్గటం ప్రారంభమైంది. మరోవైపున అచిర కాలంలోనే చైనా దాన్ని అధిగమించింది. పశ్చిమ దేశాల పరిశోధనా సంస్థలు కొన్ని రంగాలలో తప్పనిసరైతే తప్ప చైనా లేదా మరొక వర్ధమాన దేశంతో సహకరించటం లేదన్నది తెలిసిందే. కొత్తవాటిని కనుగొనటం కాకుండా ఉన్నవాటిని కాపీ కొడుతుందని ఇప్పటికీ చైనా గురించి చెప్పేవారు మనకు కనిపిస్తారు. అదే నిజమైతే మిగిలిన దేశాలకూ అలాంటి అవకాశం ఉన్నట్లే, మరి అవెందుకు ఆ పని చేయటం లేదు ? మన దేశంలో దొంగ డిగ్రీలు, చివరికి పిహెచ్‌డి థీసిస్‌లను కూడా కొనుక్కొని పట్టాలు పొందవచ్చు కనుక అనేక మంది చైనా గురించి జరుగుతున్న ప్రచారాన్ని నమ్మటంలో వింత లేదు.


వాషింగ్టన్‌ డిసి కేంద్రంగా పని చేస్తున్న ఐటిఐఎఫ్‌కు చైనా మీద ఎలాంటి ప్రత్యేక అభిమానం ఏమీ ఉండదు, అది అమెరికాలోని ఒక స్వచ్చంద సంస్థ. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదికలో అమెరికా పాలకవర్గానికి ఒక హెచ్చరిక చేసింది. చైనాను ఒక నవకల్పన దేశానికి బదులు అనుకరించేది అని తక్కువగా అంచనా వేస్తే తనకు తానే ఆపద కొనితెచ్చుకున్నట్లు అవుతుందని పేర్కొన్నది.2020 నాటికి అంతర్జాతీయ పేటెంట్‌ కుటుంబాల (అమ్మా, నాన్న, పిల్లలు కుటుంబం అన్నట్లే, ఒక పేటెంట్‌ దానికి అనుబంధంగా పేటెంట్లు ఉండటాన్ని కూడా కుటుంబంగా పరిగణిస్తారు) సంఖ్య అమెరికా కంటే చైనాకు చెందినవి ఐదు రెట్లు ఉన్నట్లు చెప్పింది.నవకల్పనలో అమెరికా ఆధిపత్యాన్ని పునరుద్దరించాలని విధాన నిర్ణేతలకు సూచించింది. మేడిన్‌ చైనా 2025 వ్యూహం ప్రకారం ఆ దేశం ముందుకు పోతున్నదని కూడా చెప్పింది. పరిశోధనా రంగంలో సాధిస్తున్న ప్రగతిని పేర్కొంటూ 2010లో ఐరోపా సమాఖ్య ప్రకటించిన పరిశోధన-అభివృద్ధి రంగంలో పెట్టుబడుల సూచికలో 1,400 కంపెనీలకు గాను 19 చైనా కంపెనీలుండగా 2020 నాటికి 278కి పెరగ్గా ఇదే కాలంలో అమెరికా సంస్థలు 487 నుంచి 449కి తగ్గాయి. సైన్స్‌, ఇంజనీరింగ్‌ పరిశోధనా పత్రాలు 2020లో 7,42,000 కాగా అవి అమెరికా కంటే 123.7శాతం ఎక్కువని ఐటిఐఎఫ్‌ పేర్కొన్నది. పేటెంట్ల లైసన్సు ద్వారా వచ్చే రాబడిలో అమెరికా ఎంతో ముందుంది. చైనాకు 2016లో అమెరికాకు వచ్చే రాబడిలో కేవలం రెండుశాతమే రాగా 2020 నాటికి 12శాతానికి పెరిగిందని ప్రపంచ బాంకు సమాచారం వెల్లడించింది. సూపర్‌ కంప్యూటర్లలో 2020 నాటికి 500 అగ్రశ్రేణి వ్యవస్థలకు గాను చైనాలో 214 ఉండగా అమెరికా 113 మాత్రమే ఉన్నాయి. పారిశ్రామిక రోబోల వినియోగంలో 2010 అమెరికాతో పోలిస్తే పదికి ఒకటి ఉండగా ఇప్పుడు అమెరికాతో సమంగా ఉన్నాయి. గణనీయ పురోగతి ఉన్నప్పటికీ చైనా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఐటిఐఎఫ్‌ పేర్కొన్నది.


ఎలక్ట్రిక్‌ బాటరీలు, హైపర్‌సోనిక్‌,5జి,6జి, నానో స్కేల్‌ మెటీరియల్స్‌, సింథటిక్‌ బయాలజీ వంటి కొన్ని రంగాలలో తిరుగులేనిదిగా ఉన్న చైనా 44 సాంకేతిక పరిజ్ఞానాల్లో 37లో ముందున్నదని ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పోలసీ ఇనిస్టిట్యూట్‌ అనే మేథో సంస్థ 2022 నివేదికలో పేర్కొన్నది. మిగిలిన ఏడింటిలో అమెరికా ముందున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని పది అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలు చైనాలో ఉన్నాయని, అమెరికా కంటే తొమ్మిది రెట్లు పరిశోధనా పత్రాలను అవి రూపొందిస్తున్నట్లు , షీ జింపింగ్‌, అంతకు ముందున్న నేతల మార్గదర్శకత్వంలో ఈ కృషి కొనసాగుతున్నదని పేర్కొన్నది. అణ్వాయుధాలను మోసుకుపోగల హైపర్‌సోనిక్‌ క్షిపణులను 2021లో పరీక్షించిన తీరును చూసి అమెరికా గూఢచార సంస్థలు ఆశ్చర్యపడనవసరం లేదని, గడచిన ఐదు సంవత్సరాలలో ప్రపంచంలో పెద్ద ప్రభావం కలిగించే మొత్తం పరిశోధనా పత్రాల్లో 48.49శాతం ఒక్క చైనా నుంచే ఉన్నట్లు ఆస్ట్రేలియన్‌ సంస్థ పేర్కొన్నది.


పరిశోధనల్లో వివిధ దేశాల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. సహకరించిన వారెవరైనా ఏ దేశానికి చెందిన వారు పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తే దాన్ని ఆ దేశ ఖాతాలో వేస్తారు.చైనా నుంచి వస్తున్న పరిశోధనా పత్రాలు ఇతరుల సహకారంతో సమర్పిస్తున్నవని కొందరు చైనాను తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.రెండవది చైనా తమ పరిశోధన అంశాలను తస్కరిస్తున్నారని నిందిస్తున్నారు. మన దేశంతో సహా అనేక దేశాల సంప్రదాయ విజ్ఞానాన్ని అమెరికా, ఐరోపా దేశాలు అపహరించి తమ పేరుతో మేథో సంపత్తి హక్కులు పొందాయి. అందుకు ఒక చక్కటి ఉదాహరణ మన దేశం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు చెబుతున్న పసుపు మీద అమెరికా పేటెంట్‌ హక్కు దఖలు పరచుకుంది. దాని మీద మన దేశం చట్టబద్దమైన పోరాటం చేసి విజయం సాధించింది. ఇలాంటి అవకాశం ఏ దేశానికైనా ఉంది. కొందరు ఆరోపిస్తున్నట్లు చైనా కూడా అలాంటి పని చేస్తే దాన్ని కూడా కోర్టులకు లాగవచ్చు. ఎవరి విజ్ఞానాన్ని వారు పరిరక్షించుకోవచ్చు.విద్యుత్‌ బల్బును కనుగొన్నది ఎవరని అడిగితే ఠకీమని చెప్పే జవాబు థామస్‌ ఎడిసన్‌ అని వస్తుంది. కానీ ఎడిసన్‌ కంటే ముందే అనేక మంది దాని మీద పరిశోధనలు చేశారు, బల్బులను రూపొందించారు. దాని కొనసాగింపుగా ఎడిసన్‌ తన పరిశోధనలను జోడించి ఆ బల్బును వాణిజ్యపరంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అనుసరించిన క్రమం గురించి పేటెంట్‌ పొందాడు. దాంతో పేరు అతనికి వచ్చింది. ఆ పరిశోధనలో అనేక మంది ఎడిసన్‌కు సహకరించారన్నది గమనించాలి. మరొకరెవరూ తదుపరి పరిశోధనలు చేయకూడదు, ఎడిసన్‌ లేదా అతని వారసులు మాత్రమే చేయాలంటే ఈ రోజు ఇన్ని రకాల బల్బులు వచ్చి ఉండేవి కాదు. పరిశోధనలకు మూలం అంతకు ముందున్న తరాల విజ్ఞానమే అన్నది తెలిసిందే.


చైనా శాస్త్రవేత్తల పరిశోధనల్లో పెద్దగా పస ఉండదు, నాసిరకం, ఇతరులు చేసిన వాటిని అటూ ఇటూ మార్చి నూతన పరిశోధనల పేరుతో సమర్పిస్తున్నారు, ఒకే వనరు నుంచి కాపీ పరిశోధనలు వస్తున్నాయి, ఇతరులు బొమ్మలను మరోకోణంలో కొత్తవిగా చూపుతున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు కొందరు. చైనాలో ఉన్న అవినీతిని తొలగించేందుకు ఎలాంటి కఠిన శిక్షలను అమలు చేస్తున్నారో తెలిసిందే. పరిశోధనా రంగంలో ఉన్నవారు కూడా అవినీతికి పాల్పడితేవారి నుంచి వచ్చిన వాటిని అంతర్జాతీయ సమాజం పక్కన పెట్టవచ్చు. పరిశోధనలను ప్రోత్సహించే క్రమంలో ప్రచురించిన పత్రాల ప్రాతిపదికన చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిన కారణంగా కొందరు అవినీతికి పాల్పడి ఉండవచ్చు తప్ప మొత్తంగా నకిలీ అనే వారిని చేసేదేమీ లేదు. ఇప్పుడు అలాంటి ప్రోత్సహకాలను నిలిపివేసింది. అక్కడ జరుగుతున్న అభివృద్ది వాస్తవం, సాధిస్తున్న అద్బుతాలు నిజం. ఈ పూర్వరంగంలో చైనా మీద బురద జల్లేందుకు కుహనా శాస్త్ర పరిశ్రమ పేరుతో వారినీ వీరిని ఉటంకించి ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఒక కథను అల్లింది. చైనాదంతా బోగస్‌ అని అమెరికా ఇతరులను నమ్మించేందుకు ప్రచారం చేయవచ్చు తప్ప దాన్ని వారే నమ్మటం లేదు. చైనాతో పోటీని తట్టుకొనేందుకు వచ్చే పది సంవత్సరాల్లో శాస్త్ర పరిశోధనలకు రెండు వందల బిలియన్‌ డాలర్లను అధ్యక్షుడు జో బైడెన్‌ నిధుల మంజూరు చేసేవాడే కాదు.


ఇంతవరకు ప్రపంచంలో చైనా గురించి చేసినన్ని తప్పుడు ప్రచారాలు మరొక దేశం గురించి లేవంటే అతిశయోక్తి కాదేమో ! ఎవరు అవునన్నా కాదన్నా చైనా నేడు సాంకేతిక, ఆర్థిక రంగాల్లోనే కాదు, శాస్త్ర రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలను సవాలు చేస్తూ ముందుకు పోతోంది. అది కూలిపోవాలి, పేలిపోవాలని ఎన్ని దుష్ట కోరికలు కోరుకున్నప్పటికీ, కూలుతుందని తేదీలు, సంవత్సరాలను ఉటంకించినప్పటికీ అలాంటి జాడలేమీ లేవు. అనేక రంగాలలో ముందుకు పోవటానికి కారణం జనానికి జవాబుదారీగా ఉండే కమ్యూనిస్టు భావజాలం కలిగిన శక్తులు అక్కడ అధికారంలో ఉండటమే కారణం. దోపిడీ లేని మరో సమాజ నిర్మాణం సాధ్యమే అని నిరూపించేందుకు కమ్యూనిస్టులు ముందుకు పోతుండగా అడ్డుకొంటున్న ప్రతిసారీ ఆటంకాలను అధిగమించి ముందుకు పోతున్నది. ఆ క్రమంలో ఉన్న లోపాలను చైనా ప్రభుత్వం, పార్టీ కూడా దాచుకోవటం లేదు. వాటిని అధిగమిస్తూ, అందుకు పాల్పడిన వారిని కఠినంగా అదుపు చేస్తూ జగన్నాధ రధం ముందుకు పోతున్నది. పరిశోధన-అభివృద్ధి రంగంలో 2022లో అమెరికా 660 బి.డాలర్లు ఖర్చు చేయగా జిడిపిలో అది 2.6శాతం. అదే చైనా 556 (3.1), జపాన్‌ 194 (3.4) భారత్‌ 159 (0.56), ఖర్చు చేస్తున్నట్లు వికీపీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా జిడిపిలో 5.9, 5 శాతాల చొప్పున అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకే పిండికొద్దీ రొట్టె అంటారు.

అది పంటల కనీస మద్దతు ధర కాదన్నా – మోసం జరుగుతున్న తీరిది చూడు రైతన్నా !

Tags

, , , ,



ఎం కోటేశ్వరరావు


ఖరీఫ్‌ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు ద్రవ్యోల్బణం తగ్గించేందుకు తోడ్పడుతాయని ఆర్థికవేత్తలు స్పందించారు. ఎన్నికల సంవత్సరంలో ధరలు పెరగకుండా, తద్వారా బిజెపికి జనం దూరం కాకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగమే ఇది,రైతులకు మేలు చేసేది కాదు అని వేరే చెప్పనవసరం లేదు. సావిత్రీ నీపతి ప్రాణంబు దక్క వరాలు కోరుకోమన్నట్లుగా కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటం మినహా రైతులు ఏమైనా కోరు కోవచ్చని ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళన సందర్భంగా బిజెపి నేతలు చెప్పారు. విధిలేని పరిస్థితిలో ప్రధాని నరేంద్రమోడీ దేశానికి క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించారు, కనీస మద్దతు ధరల గురించి సిఫార్సు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మద్దతు ధరలను సిఫార్సు చేసేందుకు బిజెపి అధికారానికి రాక ముందు నుంచే ఒక వ్యవస్థ ఉంది. ఆ విధానానికి చట్టబద్దత కల్పించాలని రైతులు కోరుతున్నారు, సిఎంగా ఉన్నపుడు నరేంద్రమోడీ కూడా డిమాండ్‌ చేశారు. ఇప్పుడు కాదు పో పొమ్మికన్‌ అన్నట్లుగా రైతుల పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. వేసిన కమిటీలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు, మూడు సాగు చట్టాలను రూపొందించిన పెద్దలే ఉన్నందున తామా కమిటీని బహిష్కరిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించింది. తరువాత గత ఏడాది కాలంగా ఆ కమిటీ ఏం చేస్తున్నదో, ఏం చెబుతుందో తెలియదు. రైతుల ఆదాయాలను 2022 నాటికి రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ బాసల గురించి మన్‌కీబాత్‌లో కూడా మాట్లాడేందుకు నోరు రావటం లేదు.


తమ ప్రభుత్వ హయాంలో 2014-15లో ఏ గ్రేడ్‌ వరి మద్దతు ధర రు.1,400 నుంచి 2023-24లో రు.2,203కు అంటే రు 803 పెంచినట్లు మోడీ సర్కార్‌ గొప్పగా చెప్పుకుంటున్నది.సగటున వార్షిక పెంపుదల 5.7శాతం. అంతకు ముందు కాంగ్రెస్‌ ఏలుబడిలో 2004-05 రు.590 నుంచి రు.1,400కు పెరిగింది. రు.810 పెరిగింది. సగటు వార్షిక పెరుగుదలలో చూస్తే 14శాతం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి గణనీయంగా సాగు చేస్తారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో పొడవు పింజ పత్తి ధర రు.1,760 నుంచి రు.4,050 పెరిగింది. నిఖర పెరుగుదల రు.2,290 వార్షిక సగటు 13శాతం, అదే నరేంద్రమోడీ కాలంలో రు.4050 నుంచి రు.7,020కి పెంచారు.నిఖర పెరుగుదల రు.2,970 కాగా వార్షిక సగటు 7.3శాతమే. ఎవరు రైతులకు మేలు చేసినట్లు ? దీని అర్ధం కాంగ్రెస్‌ రైతులను ఏదో ఉద్దరించిందని చెప్పటం కాదు, పెరిగిన సాగు ఖర్చులతో పోలిస్తే అది కూడా తక్కువే. దానితో పోలిస్తే మంచి రోజులను తెచ్చి అమృత కాలంగా మార్చి రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ పాలనలో మరింత దిగజారింది అని చెప్పేందుకే ఈ పోలిక. అంకెలన్నీ మన ముందున్నాయి. ఎవరికి వారు పోల్చి చూసుకోవచ్చు.


కనీస మద్దతు ధరలను పెంచితే దాని ప్రభావం బియ్యం, వస్త్రాలు-దుస్తుల ధరల పెరుగుదలకు దారి తీస్తుంది కదా అని ఎవరైనా వాదించవచ్చు. రైతులు గొంతెమ్మ కోరికలను కోరటం లేదు. సాగు గిట్టుబాటు కావాలి-వినియోగదారులకు సరసమైన ధరలకు అందుబాటులో ఉండాలి. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల ధరలను స్థిరంగా ఉంచితే రైతులు కూడా మద్దతు ధరల పెంపుదలను అడగరు. అన్నింటికీ మించి ఎవరేమి చెప్పినా రైతు బతకాలి, సాగు సాగాలి. అందుకే కదా రైతుల రాబడిని రెట్టింపు చేస్తామని మోడీ సర్కార్‌ చెప్పింది. దాన్ని అమలు జరపమనే కదా రైతులు అడుగుతోంది. ఎన్నికలు జరిగే సంవత్సరంలో ధరలను కాస్త ఎక్కువగా పెంచటం గతంలో కాంగ్రెస్‌ చేసింది. సేమ్‌ టు సేమ్‌ అదే జిమ్మిక్కు నరేంద్రమోడీ కూడా కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు 2014-15 నుంచి 2017-18వరకు మూడు సంవత్సరాల్లో ఏ గ్రేడ్‌ వరికి పెరిగింది మొత్తం రు.190 మాత్రమే, సగటున ఏడాదికి రు.63 మాత్రమే. అదే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2018-19లో పెంచిన మొత్తం రు.180. తరువాత నాలుగు సంవత్సరాల్లో రు.1,770 నుంచి 2022-23 వరకు రు,2,060కి అంటే రు.290, ఏడాదికి సగటున రు.72.50 కాగా వచ్చే ఏడాది ఎన్నికల కారణంగా ఈ సారి రు.143 పెంచారు. ఎంఎస్‌ స్వామినాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వార్షిక ద్రవ్యోల్బణ ప్రాతిపదికన నామమాత్రంగా పెంచుతున్నారు తప్ప సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకోవటం లేదు. మరోవైపు మార్కెట్లో గోధుమలు, బియ్యం ధరల పెరుగుదల కనీస మద్దతు ధరల కంటే ఎక్కువగా ఉంటున్నది, దీనికి కారణం ఏమిటో ఎవరూ చెప్పరు. ప్రతిదానికీ ఉక్రెయిన్‌ సంక్షోభం అని చెప్పి తప్పించుకుంటున్నారు. అది ప్రారంభంగాక ముందే మన దేశంలో ధరల పెరుగుదల మొదలైందన్నది చేదునిజం. ప్రతి ఆరునెలలకు ఒకసారి దానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంచటమే దానికి తిరుగులేని నిదర్శనం.


2021 నవంబరు 19వ తేదీన నరేంద్రమోడీ దేశమంతటికీ క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకున్నట్లు చెప్పారు. వాటిని అమలు జరిపితే రైతుల కష్టాలు తీరుస్తాయన్నారు. వాటిని రద్దు చేసిన తరువాత ఇంతవరకు వాటి బదులు కష్టాలు తీర్చే చర్యలేమీ తీసుకోలేదు. అంటే తాను చెప్పినట్లు వినలేదు గనుక రైతులకు ఒక పాఠం చెప్పాలని మోడీ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి నిబద్దులై ఉండేవారి లక్షణం కాదిది. వెంటవెంటనే నిర్ణయాలు తీసుకోవటంలో తమకు తామే సాటి అని చెప్పుకొనే వారు సాగు చట్టాల రద్దు తరువాత ఐదు నెలలకు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ పరిధి ఏమిటి ? ఏ అంశాలను అది పరిశీలిస్తుందో వివరించాలని రైతు ఉద్యమం నడిపిన సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదు. అందువలన ఆ కమిటీలో ఉండి చేసేదేమీ లేదు గనుక ప్రతినిధుల పేర్లను ప్రతిపాదించటం లేదని స్పష్టం చేసింది. ఈ కమిటీ చైర్మన్‌ ఎవరంటే రైతులు తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రచించిన వ్యవసాయశాఖ మాజీ కార్యదర్శి సంజయ అగర్వాల్‌. ఆ చట్టాలను ఎలా రూపొందించాలో సలహా ఇచ్చిన నీతిఅయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్‌ .కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించకూడదని చెప్పిన ఆర్థికవేత్తలను నిపుణుల పేరుతో చేర్చారు. ప్రభుత్వ ప్రతినిధులు సరేసరి, వీరుగాక రైతుల ఆందోళనను వ్యతిరేకించిన ఐదు సంఘపరివార్‌ సంఘాలకు చెందిన వారిని చేర్చారు. ఆందోళనకు నాయకత్వం వహించిన వారిని మూడు పేర్లు ఇవ్వాలని కోరారు. నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి ఈ ముగ్గురూ ఆ కమిటీలో ఉండి చేసేదేమీ ఉండదు. పోనీ వీరు లేకుండా ఇప్పటి వరకు కమిటీ చేసిందేమిటి అంటే నాలుగు ఉపసంఘాల ఏర్పాటు తప్ప మరేమీ లేదు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత ప్రతిపాదన ప్రస్తావన లేని కమిటీ ఇది. రైతుల రాబడి రెట్టింపుకు మూడు సాగు చట్టాలే ఆక్సిజన్‌ అని చెప్పారు. ఇంతవరకు వాటి బదులు ఏం చేస్తారో చెప్పలేదు. రైతులను నట్టేట ముంచినట్లేనా !


మూడు సాగు చట్టాలను అమలు జరపకుండా 2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేయటం కుదరదని నీతిఅయోగ్‌ సభ్యులు రమేష్‌ చాంద్‌ రైతుల ఆందోళన సమయంలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు అవసరమైన మేరకు చర్యలు కూడా తీసుకోలేదని అన్నారు. అసలు రాష్ట్రాలతో సంప్రదించకుండా సాగు చట్టాలను రుద్దారు.నీతిఅయోగ్‌ సిఫార్సులు చేయటం తప్ప వాటిని కేంద్రమే పట్టించుకోదు.తమ ప్రభుత్వం అమలు జరుపుతున్న స్కీములతో రైతుల రాబడి పెరుగుతున్నదని కేంద్ర ప్రభుత్వం నమ్మించ చూస్తున్నది.2021లో పార్లమెంటు చర్చల్లో కేంద్ర ప్రభుత్వం ఇవిగో తమ పథకాలంటూ 17తో ఒక జాబితాను అందించింది, వాటికి గాను రు.17,540 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పింది.2020-21 సంవత్సరానికి గాను వాటికి కేటాయించిన బడ్జెట్‌లో మూడో వంతు అంటే రు.5,787 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వాటిలో మూడు పథకాలకైతే ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. అంతే కాదు మొత్తం ఖర్చు చేసినప్పటికీ కేవలం పదిశాతం మంది రైతులకే ఈ పధకాలు అమలు అవుతాయని కూడా కేంద్రమే చెప్పింది. మోడీ సర్కార్‌ అమలు జరుపుతున్న పిఎం కిసాన్‌ పథకంలో ఏడాదికి ఆరువేల చొప్పున ఇస్తున్నది కేవలం 10.74 కోట్లు లేదా పదిశాతం మంది రైతులకే. అంటే దీని ద్వారా కుటుంబానికి అదనపు రాబడి నెలకు రు.500 మాత్రమే.


2022 నాటికి రైతుల రాబడిని రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఇటీవలి కాలంలో ఎక్కడా దాని గురించి మాట్లాడటం లేదు.2016 ఏప్రిల్లో మంత్రులతో ఒక కమిటీని వేశారు.2018 సెప్టెంబరులో అది ఒక నివేదికను ఇచ్చింది. దానిలో ఏడు అంశాలను పేర్కొన్నారు. 1. పంటల ఉత్పాదకత పెంపుదల,2.పశువుల ఉత్పాదకత పెంపుదల, 3.వనరులను సమర్ధవంతంగా వినియోగించటం-ఉత్పత్తి ఖర్చు తగ్గింపు, 4.పంటల సాంద్రతను పెంచటం, 5.అధిక విలువనిచ్చే పంటల వైపు మళ్లింపు,6.రైతుల పంటలకు గిట్టుబాటు ధర, 7. అదనంగా ఉన్న మానవ వనరులను వ్యవసాయేతర రంగాలకు మళ్లించటం. వీటిల ఏ ఒక్క అంశంలోనైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధించిన అభివృద్ది ఏమిటో ఎక్కడా మనకు కనిపించదు. కేంద్రం ప్రభుత్వం జూన్‌ ఏడున ప్రకటించిన మద్దతు ధరల్లో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా ాస్వామినాధన్‌ కమిషన్‌ సూచించిన సి2 ప్లస్‌ 50 ప్రకారం ధరలను ప్రకటించటం లేదు. అఖిల భారత కిసాన్‌ సభ వంటి రైతు సంఘాలు కేంద్రం మోసాన్ని ఆధార సహితంగా నిరూపించాయి. ధాన్యానికి క్వింటాలకు రూ.2183, జొన్నకు రూ.3180, కందికి రూ.7000, పత్తికి రూ.6620 చొప్పున కేంద్రం ఎంఎస్‌పి ప్రకటించింది. కానీ సి2 ప్లస్‌ 50 పర్సెంట్‌ ప్రకారం ధాన్యానికి క్వింటాలుకు రూ.2866.5, జొన్నకు రూ.2833, కందికి రూ.8989.5, పత్తికి రూ.8679 ప్రకటించాలి. ఆ మేరకు రైతులు నష్టపోతున్నారు. రైతు వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (సిఎసిపి) అంచనాల కంటే ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ వంటి చోట్ల పెట్టుబడులు అధికంగా ఉంటున్నాయి. జాతీయ సగటు కంటే అధికంగా ఎంఎస్‌పి ఇచ్చామంటున్నారు. ఎక్కువ ఖర్చు ఉన్న చోట రైతుల నష్టాన్ని ఎవరు భరించాలి ? వరి సాగు ఖర్చు (సి2) క్వింటాలకు కనీసం తెలంగాణాలో రు.3300, ప్రకటించింది రు.2,183 మాత్రమే. ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే విధమైన తేడాలు ఉన్నాయి. రైతుల రాబడిలో కూడా ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రంతో పొసగదు. అందువలన సగటు లెక్క అనేది అశాస్త్రీయం. కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక విధానాలను అమలు జరుపుతున్నట్లే సాగు ఖర్చు ఎక్కువగా ఉన్న చోట రైతును ఆ మేరకు ఆదుకోవాలి.

పెట్టుబడిదారీ విధానంపై యువతలో ఆగ్రహం – ఆందోళనలో పాలకవర్గం !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఎవరు ఎన్ని చెప్పినా చివరికి కారల్‌ మార్క్స్‌ చెప్పిందే సరైనదా ? అంటూ జర్మన్‌ కార్పొరేట్‌ల పత్రిక డెర్‌ స్పీగల్‌ ఈ ఏడాది జనవరిలో ఒక విశ్లేషణను ప్రచురించింది. అంతకు ముందు గతేడాది సెప్టెంబరులో అమెరికా పరిశోధనా సంస్థ పూ సోషలిజం-పెట్టుబడిదారీ విధానాల గురించి అమెరికన్లలో ఉన్న వైఖరి గురించి సర్వే వివరాలను వెల్లడించింది.దీనిలోని కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం. అమెరికాలో పద్దెనిమిది-ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సు వారిలో సోషలిజాన్ని సమర్ధించే వారు 44శాతం మంది ఉండగా పెట్టుబడిదారీ విధానాన్ని అభిమానించిన వారు 40శాతం ఉన్నారు.2019 మే నెలలో కాపిటలిజం పట్ల సానుకూలంగా ఉన్న వారు 65శాతం కాగా 2022 ఆగస్టులో వారు 57శాతానికి తగ్గారు. ఇదే కాలంలో సోషలిజం పట్ల సానుకూలంగా ఉన్నవారు 42 నుంచి 36శాతానికి తగ్గినట్లు. ఆక్సియోస్‌ సర్వే ప్రకారం 2019 నుంచి 2021వరకు చూస్తే రిపబ్లికన్‌ పార్టీని సమర్ధించే 18-34 సంవత్సరాల యువతలో పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు 81 నుంచి 66శాతానికి తగ్గారు. మొత్తంగా సోషలిజాన్ని సమర్ధించే వారు 39 నుంచి 41శాతానికి పెరిగారు. ధనిక దేశాల్లో పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల పూర్వరంగంలో సోషలిజం, మార్క్స్‌ మీద ప్రేమ కంటే పెట్టుబడిదారీ విధాన సమర్ధకులను హెచ్చరిస్తూ చేసిన విశ్లేషణలు ఇవి అన్నది గమనించాలి. సర్వే సంస్థలు ఇచ్చే ప్రశ్నావళి, దానికి అడిగే సమాధానాల తీరు తెన్నులను బట్టి సమర్ధకులు, కాని వారి సంఖ్య మారుతున్నప్పటికీ రూపుదిద్దుకుంటున్న ప్రధాన ధోరణులు ఏమిటన్నదానిని చూడాలి. గతంలో సోషలిజాన్ని వ్యతిరేకించే అంశం గురించి చర్చలు జరిగితే ఇప్పుడు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి కమ్యూనిస్టుల కంటే పెట్టుబడిదారీ విధాన సమర్ధకులే ఎక్కువగా మాట్లాడుతున్నారు.


” పెట్టుబడిదారీ విధానం మీద విమర్శ కొత్తదేమీ కాదు. కరోనా మహమ్మారి నాలుగో సంవత్సరం, ఉక్రెయిన్‌ యుద్ధం రెండవ సంవత్సర ప్రారంభంలో గమనించాల్సినంతగా అది పెరుగుతున్నది. అనేక అంశాలు ఎక్కువ కాలం పని చేయవు. ప్రపంచీకరణ కుప్పకూలుతున్నది, దానితో పాటే జర్మన్‌ తరహా కలిమి కూడా ఉంది.ప్రపంచం శత్రుపూరిత కూటములలో పాదుకొనిపోతున్నది. ద్రవ్యోల్బణం పేదలు-ధనికులను మరింతగా వేరు చేస్తున్నది. దాదాపు అన్ని పర్యావరణ లక్ష్యాలు తప్పాయి. వ్యవస్థలో కనిపిస్తున్న కొత్త పగుళ్లన్నింటినీ రాజకీయవేత్తలు ఇంకేమాత్రమూ సరి చేయలేరు. ఒక పెద్ద సమస్య తరువాత మరొకటి వెనుకే వస్తున్నది, అవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇంథన సంక్షోభం, వాణిజ్యపోరు, ప్రపంచ యుద్ధం పోకడలు కనిపిస్తున్నాయి.జనాకర్షక(మభ్యపెట్టే) నేతలు, నిరంకుశ పాలకుల నుంచి ప్రజాస్వామ్యం దాడులను ఎదుర్కొంటున్నది.ఇటీవలి వరకు ఈ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం ఉంటుందని, మార్కెట్‌ తనను తాను రక్షించుకోగలదని అనుకున్నారు. కానీ ఈ రోజు దాన్ని ఎంత మంది నిజంగా నమ్ముతున్నారు ? ప్రత్యేకించి అన్ని ప్రతికూలతలు, వాతావరణ సంక్షోభం అనేక రెట్లు పెరుగుతున్నది.” ఇలాంటి వర్ణన సాధారణంగా సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలు చేస్తుంటాయి. కానీ ఇదంతా పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించే డెర్‌ స్పీగల్‌ విశ్లేషకుల అభిప్రాయాల సారమే.అంతేనా ?


” పెట్టుబడిదారీ విధానాన్ని తక్షణమే మౌలికంగా సంస్కరించాల్సి ఉంది. లేకుంటే అది నాశనమౌతుంది గనుక తగిన చర్యలు తీసుకోవాలి ” అని రే డాలియో అనే 2200 కోట్ల డాలర్ల హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్‌ చెప్పాడు.ఫైనాన్సియల్‌ టైమ్స్‌,గోల్డ్‌మన్‌ శాచ్స్‌, బోష్చ్‌ వంటి సంస్థలు ఎన్నో ఇలాంటి అభిప్రాయాలను వెల్లడించినట్లు ఆ పత్రిక విశ్లేషకులు ఉటంకించారు.” మహా పెట్టుబడిదారులుగా రుజువు చేసుకున్న వారు ప్రపంచస్థితి గురించి చెబుతూ ఆకస్మికంగా కారల్‌ మార్క్స్‌ అభిమానుల మాదిరి మాట్లాడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వాలు, కార్పొరేట్‌ ప్రధాన కార్యాలయాలు,అగ్రశ్రేణి మేథావులు, వ్యవహార జ్ఞానులు ఎవరైనా అడుగుతున్న అతి పెద్ద, మౌలిక ప్రశ్న ఏమిటంటే ఈ ఆర్థిక వ్యవస్థతో మనం కొనసాగ గలమా అంటున్నారు.” అని డెర్‌ స్పీగల్‌ అన్నదంటే పెట్టుబడిదారులకు తమ వ్యవస్థ మీద తమకే విశ్వాసం సన్నగిల్లుతున్నదని చెప్పినట్లే . దీని అర్ధం వారు చేతులు ముడుచుకు కూర్చుంటారని కాదు, దాన్ని అధిగమించేందుకు, జనాన్ని తొక్కిపెట్టేందుకు కొత్త పద్దతులను వెతికే పనిలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం పెట్టుబడిదారీ విధానం సాధారణ సంక్షోభాన్ని కాదు ప్రపంచంలో 2023లో విధాన పరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు డెర్‌ స్పీగల్‌ విశ్లేషకులు చెబుతున్నారు.


వారి అసలు బాధ ఏమిటో కూడా దాచుకోలేకపోయారు. ” పారిశ్రామిక దేశాలలో సంవత్సరాల తరబడి ఒక స్పష్టమైన ఆగ్రహం వ్యాపిస్తున్నది. అది సైద్దాంతిక కారణాలతో కాదు, ఎందుకంటే ఇండ్ల అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఎందుకంటే ఆస్తులను కొనుగోలు చేయలేనివిగా మారాయి. వనరులనుంచి సంపదలను సృష్టించే యంత్రం అందరికీ సృష్టించనపుడు దాన్ని ఎందుకు ఆమోదించాలి ” అని ప్రశ్నిస్తున్నారని అంటూ అమెరికాలో సోషలిజం పట్ల యువతలో సానుకూల వైఖరి పెరగటాన్ని ఉటంకించారు. అసంతృప్తి, ఆగ్రహం, ఉద్యోగాలకు రాజీనామాలతో నిరసన కొట్టవచ్చినట్లుగా కనిపిస్తోందని, సోషలిస్టు సిద్దాంతాల పట్ల ఆకర్షితులౌతున్నట్లు పేర్కొన్నారు.గతంలో ఇదే పత్రిక జరిపిన సర్వేలో పెట్టుబడిదారీ విధానం వాతావరణ సంక్షోభానికి కారకురాలైనట్లు సగం మంది జర్మన్లు భావిస్తున్నట్లు వెల్లడైంది. ఎక్కడైనా సంక్షోభాలు తలెత్తినపుడే దాన్నుంచి బయటపడే మార్గాలను సమాజం వెతుకుతుంది. అసలీ కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ పుట్టకపోతే ఈ కమ్యూనిస్టు సిద్దాంతం, బీరకాయ ఉండేది కాదు అని కొందరు అనుకుంటారు. వారుగాక పోతే మరొకరు, మరొకరు దోపిడీని అంతం చేసే శాస్త్రీయ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చి ఉండేవారు. సోషలిజం గాక పోతే మరొక పేరు పెట్టి ఉండేవారు. దోపిడీ అంతం కావటం, సమసమాజం రావటం తప్ప పేరు ఏదైతేనేం. నిజానికి వారి కంటే ముందుగానే సోషలిజం గురించి చెప్పిన వారున్నారు. దాన్ని సాధించే మార్గం వారు చెప్పలేకపోయారు గనుక వారిని ఊహాజనిత సోషలిస్టులని పిలిచారు. మన దేశంలో కూడా సర్వేజనా సుఖినో భవంతు అని చెప్పిన వారు, వసుధైక కుటుంబం అన్నవారి గురించి తెలిసిందే.


అమెరికాలో పూ సంస్థ జరిపిన సర్వే ప్రకారం అక్కడి డెమోక్రాట్లలో అనేక మంది పౌరుల మౌలిక అవసరాలను సోషలిజం తీరుస్తుందని నమ్ముతున్నారు. వ్యక్తిగత స్వేచ్చను హరిస్తుందని రిపబ్లికన్లు చెబుతారు.2019లో సోషలిజం పట్ల డెమోక్రాట్లలో 65శాతం మంది సానుకూలంగా ఉన్నారని 2022లో 57శాతానికి తగ్గినట్లు సర్వే చెప్పింది. పెట్టుబడిదారీ విధానం గురించి సానుకూల వైఖరి ఉన్న డెమోక్రాట్లు ఇదే కాలంలో 55 నుంచి 46 శాతానికి తగ్గినట్లు కూడా పేర్కొన్నది. దీన్ని ఏ విధంగా చూడాలి ? ఏ సమాజంలోనైనా మధనం జరగాలి. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతున్నదని చెప్పవచ్చు. పెట్టుబడిదారీ విధానం పట్ల రిపబ్లికన్లలో సానుకూల వైఖరి 78 నుంచి 74శాతానికి తగ్గింది. ఇదీ మంచి పరిణామమే కదా ! పెట్టుబడిదారీ విధానం ఎక్కువ అవకాశాలను కల్పిస్తుందని నమ్ముతున్నవారు తగ్గుతున్నారు. తక్కువ కుటుంబ ఆదాయం ఉన్న వారు సోషలిజం పట్ల సానుకూలంగా ఉంటే ఎక్కువ వస్తున్నవారు పెట్టుబడిదారీ విధానమే ఉండాలని కోరుకుంటున్నారు. జనాలకు మౌలిక అవసరాలైన ఆహారం, ఆరోగ్యం, ఇంటి వసతులను సోషలిజం తీరుస్తుందని 38శాతం నమ్ముతుంటే 18శాతానికి పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు ఉన్నాయి. మూడు పదులు దాటిన వారిలో వయసుపైబడిన కొద్దీ సోషలిజం పట్ల సానుకూల వైఖరి ఉన్నవారు తగ్గినట్లు సర్వే వెల్లడించింది. దానిలో ఆశ్చర్యం ఏముంది ? తీవ్రమైన సోషలిస్టు వ్యతిరేక ప్రచారానికి లోనైన వారు.గతంలో అనుభవించిన సామాజిక రక్షణ పధకాలు నేటి తరాలకు అందుబాటులో ఉండటం లేదు. పాతవారితో పోల్చితే బతుకుదుర్భరంగా మారుతున్నది. అందువలన యువతలో కొత్త ఆలోచనలు. సోవియట్‌ ఉనికిలో ఉన్నపుడు సోషలిస్టు దేశాల గురించి చేసిన తప్పుడు ప్రచారంతో పోలిస్తే ఇప్పుడు అమెరికాలో అది తగ్గింది. ఎందుకంటే సోషలిజం మీద విజయం సాధించామని అక్కడి పాలకులు మూడు దశాబ్దాల క్రితం ప్రకటించారు. అదే నోటితో ఇప్పుడు పోరు సాగిస్తామని చెప్పలేరు కదా ! అందుకే కొత్త తరాలు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి ఆలోచించే క్రమంలో ప్రత్యామ్నాయంగా సోషలిజం తప్ప మరొకటి కనిపించటం లేదు గనుక దాని పట్ల క్రమంగా సానుకూలత పెరుగుతోంది.


సోషలిస్టు దేశాలంటే జనానికి ఇచ్చిన మేరకు తీసుకోవటం తప్ప అవసరమైన సరకులను అందించలేరంటూ ఖాళీగా ఉన్న దుకాణాలను చూపి కట్టుకథలను ప్రచారం చేశారు. మరోవైపు చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. కానీ అక్కడి నుంచి కావాల్సిన వస్తువులన్నింటినీ దిగుమతి చేసుకుంటారు. ఆ మేరకు తమ ప్రభుత్వం తమ ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నదని అమెరికన్లు భావించటంతో పాటు చైనా అనేక దేశాలకు వస్తువులను ఎలా అందచేస్తున్నది. అక్కడ ఉపాధిని, ఆదాయాలను ఎలా పెంచుతున్నది అనే మధనం కూడ ప్రారంభమైంది.మనకు పెట్టుబడిదారీ విధానం వలన ఉపయోగం ఏమిటి ? అన్న సందేహాలు మొగ్గతొడిగాయి.. వరుసగా వచ్చిన ఆర్థిక మాంద్యాలకు పెట్టుబడిదారీ దేశాలు ప్రభావితమైనట్లుగా చైనాలో జరగకపోవటం కూడా అమెరికన్లలో సోషలిజం పట్ల మక్కువను పెంచింది. నూట ఆరు సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా బ్రిటన్‌లో నర్సులు సమ్మె చేశారు. ఫ్రాన్సు సమ్మెలు, ప్రదర్శనల ఆందోళనలతో ఉడికిపోతోంది. ప్రభుత్వం దిగిపోవాలని 74శాతం మంది కోరుకుంటున్నారు. ఐరోపాలో అనేక దేశాల్లో కార్మికవర్గం వీధుల్లోకి వస్తోంది. పెట్టుబడిదారీ విధానం మీద కరోనాకు ముందే అమెరికాలో దాడి మొదలైందని, తరువాత ఆర్ధిక, సామాజిక ఇబ్బందులు పెరగటంతో మరింత తీవ్రమైందని కొందరు గగ్గోలు పెడుతూ పత్రికల్లో రాశారు. పెట్టుబడిదారీ విధానం చితికింది అని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక, ఇంకేమాత్రం పెట్టుబడిదారీ విధానం పనిచేయదు అంటూ సిఎన్‌ఎన్‌, పెట్టుబడిదారీ విధానాన్ని తిరిగి పెద్ద ఎత్తున తిరిగి ప్రారంభించాలి అని ప్రపంచ ఆర్థికవేదిక వంటివి చెప్పిన తరువాత జనాలకు ఆ వ్యవస్థమీద విశ్వాసం ఎలా పెరుగుతుంది. మరో ప్రపంచం అది సోషలిస్టు సమాజం సాధ్యమే అని చెప్పేందుకు పెట్టుబడిదారీ విధానమే అనేక అవకాశాలను ముందుకు తెచ్చింది.

మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మతం మంచి కంటే హాని ఎక్కువగా చేస్తున్నదని నమ్ముతున్న వారు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారు. ” ప్రపంచ మతం 2023 ” అనే నివేదిక వెల్లడించిన అంశమిది. ఇప్‌సాస్‌ అనే అమెరికన్‌ మీడియా సంస్థ 26దేశాలకు చెందిన వారి మీద జరిపిన సర్వే వివరాలను ఇటీవలనే వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 20 ఫిబ్రవరి మూడవ తేదీ మధ్య సర్వే జరిగింది. కొన్ని దేశాల్లో వెయ్యి, కొన్ని చోట్ల ఐదు వందల మందిని ప్రశ్నించగా మన దేశంలో 2,200 మందిని ఎంచుకున్నట్లు సంస్థ పేర్కొన్నది. వీరిలో తాము హిందువులమని 87శాతం, ముస్లింలు పది, క్రైస్తవులమని రెండు శాతం, మతం ఏమిటో చెప్పని వారు ఒక శాతం ఉన్నారు. సర్వేలో ప్రశ్నలకు వచ్చిన కొన్ని సమాధానాల సారం ఇలా ఉంది. మంచి కంటే మతం హాని ఎక్కువ చేస్తున్నదని నమ్ముతున్న వారు 26 దేశాల సగటు 47శాతం కాగా అగ్రస్థానంలో మన దేశంలో 73 శాతం ఉన్నారు. చుట్టుపక్కల ఇతర మత విశ్వాసాల వారు ఉన్నప్పటికీ పూర్తి నిశ్చింతగా ఉన్నట్లు చెప్పిన వారు సగటున 76శాతం కాగా మన దేశంలో 80శాతం ఉన్నారు. దక్షిణాఫ్రికా 92శాతంతో ప్రధమ, 53శాతంతో దక్షిణ కొరియా అధమ స్థానంలో ఉంది. మత విశ్వాసాలు, దేవుడికి సంబంధించి మన దేశంలో నమ్మకం ఉన్న వారు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దేవుడిని కొలిచేందుకు ప్రార్ధనా స్థలాలకు వెళ్లే వారు సగటున 28శాతం ఉండగా మన దేశంలో అధికంగా 71శాతం ఉన్నారు. జపాన్‌లో అతి తక్కువ ఐదుశాతం. మతం, దేవుడు, స్వర్గం, నరకం గురించి విశ్వాసాలు ఉన్నవారు మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. మన దేశంలోని పట్టణపౌరుల్లో పదింట ఎనిమిదికి దేవుడు అంటే విశ్వాసం ఉంది. దేవుడిని నమ్మే వారు సగటున 40శాతం మంది, అదృశ్య శక్తి ఏదో ఉందని భావిస్తున్నవారు 20 శాతం ఉన్నారు. అదే మన దేశంలో 70, 11 శాతాల చొప్పున ఉన్నట్లు తేలింది.


మన దేశంలో ఓటు బాంకు రాజకీయాల సంతుష్టీకరణ అంశం చర్చనీయాంశంగా ఉంది.మైనారిటీల పరిరక్షణకు పూనుకోవటాన్ని సంతుష్టీకరణగా వర్ణించుతున్న శక్తులు, ఉన్మాదం, విద్వేషాన్ని రెచ్చగొడుతూ మెజారిటీ ఓటు బాంకు సృష్టికి పూనుకున్నాయి. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అని చెబుతున్న బిజెపి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో 15శాతంగా ఉన్న ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారెవరినీ ఒక్క చోట కూడా అభ్యర్ధులుగా పోటీకి నిలపటం లేదు. ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ ప్రముఖ నేత ఒకరు తమకు ముస్లిం ఓట్లు అవసరం లేదని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే పార్టీ నేతలు అసెంబ్లీ ఫలితాల తరువాత ముస్లిలంతా ఒక పార్టీకి వేసినందున తాము ఓడినట్లు ఆరోపించారు.ఇది మెజారిటీని ఆకర్షించే మార్కెటింగ్‌ ఎత్తుగడ, ఒక తరహా విద్వేష ప్రచారం. హిందూ మత రక్షణ అంటూ లేని ప్రమాదాన్ని జనం మెదళ్లలోకి ఎక్కించటమే. వందల సంవత్సరాల ముస్లిం, ఆంగ్లేయుల పాలనలో జరగని హాని ఇప్పుడు జరుగుతోందని చెప్పటం దుష్ట పధకంలో భాగం తప్ప మరొకటి కాదు. హిందూత్వ శక్తులు చెబుతున్నట్లుగా మెజారిటీ మతరాజ్యాన్ని ఏర్పాటు చేస్తే పాకిస్తాన్‌ మాదిరి మట్టి కొట్టుకుపోవటం తప్ప మరొకటి జరగదు. దీన్ని దేశ పౌరులు అంగీకరిస్తారా ? త్వరలో దేశంలో ముస్లిం జనాభా పెరిగి వారి పాలన వస్తుందంటూ వాట్సాప్‌లో రోజూ ఊరూ పేరు, ఆధారం లేని సమాచారాన్ని జనానికి చేరవేసి బుర్రలను ఖరాబు చేస్తున్న సంగతి తెలిసిందే. మన దేశం 2030 నాటికి చైనాను నెట్టేసి అధిక జనాభా దేశంగా మారనుందని ఐరాస గతంలో వేసిన అంచనాను దెబ్బతీసి ఏడు సంవత్సరాల ముందే ఆ ఘనతను మనం సాధించాము. ఇతర అభివృద్ధి లక్ష్యాలకు ఎంతో దూరంలో ఉన్నాము.


మత రాజ్యం దిశగా దేశాన్ని మార్చాలని, అదే ప్రాతిపదికన సమాజాన్ని విభజించాలని చూస్తున్న శక్తులు రెచ్చిపోతున్న కాలమిది. మతం, దేవుళ్లను వీధుల్లోకి తెచ్చి ఓట్లను దండుకోవటం తాత్కాలికం తప్ప శాశ్వతం కాదు గానీ, ఒక్కటిగా ఉండాల్సిన సమాజం పరస్పర అనుమానాలతో విడిపోతుంది. కొన్ని మతాల వారు ఉంటే పరిసరాల్లో ఉండలేమని కొన్ని శక్తులు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని అని ఇప్‌సాస్‌ సర్వే వెల్లడించింది. మార్కెటింగ్‌ అవసరాల కోసం ఇప్‌సాస్‌ సంస్థ వివిధ సర్వేలు చేస్తున్నది. ఓట్లను దండుకోవటం, అధికారం కోసం మతాన్ని, విశ్వాసాలను మార్కెటింగ్‌ చేసుకొనే శక్తులకు ఈ సర్వే కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో అలాంటి శక్తుల కుట్రలకు దేశం, జనం బలికాకుండా చూసేందుకు పూనుకున్న లౌకిక, పురోగామి శక్తులు కూడా తమ విధానాలు, వైఖరులను రూపొందించుకొనేందుకూ ఇది తోడ్పడుతుంది. ప్రతిదాన్నీ మార్కెట్‌ సరకుగా మార్చివేస్తున్న పూర్వరంగంలో మతం, విశ్వాసాలు, దేవుడు, దేవతలను కూడా అదే చేస్తున్నారు. ప్రతి పండుగనూ ఒక ఆదాయవనరుగా మార్చివేసి పెట్టుబడి లేకుండా, ఏమాత్రం శ్రమపడకుండా పరాన్న జీవులుగా మారి లబ్దిపొందేందుకు కొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. వారు అలాంటి శక్తులకు మద్దతుదారులుగా మారటం సహజం. ఇది మార్కెట్‌ సూత్రంలో భాగమే. వామపక్షాలు మినహా మిగతా పార్టీలన్నీ తరతమ తేడాలతో మత మార్కెటింగ్‌లో పోటీపడుతుండగా బిజెపి అన్నింటికీ అందనంత ముందు ఉంది. మాది నాణ్యమైన సరకు అంటే కాదు మాదే అసలు సిసలు అని కంపెనీలు పోటీ పడుతున్నట్లుగా నిజమైన హిందూత్వకు ప్రతీకలం తామంటే తామని బిజెపి-శివసేన పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. హిందూత్వ మార్కెటింగ్‌లో భాగంగానే విద్వేష ప్రచారాన్ని చూడాల్సి ఉంటుంది.


ముస్లింలు నాలుగు వివాహాలు చేసుకోవచ్చు, ఎందరినైనా పిల్లలను కనవచ్చు గనుక వారు జనాభాను ఉత్పత్తి చేసి మెజారిటీగా మారనున్నారు అనే తప్పుడు ప్రచారం సాగుతోంది. దేశంలో పిల్లలను ఎందరినైనా కనేందుకు అవకాశం ఉంది. అయితే ఎన్నికలలో పోటీ చేసేందుకు, సంక్షేమ పధకాలను అందించేందుకు ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు పెట్టాయి. అంతకు మించి సంతానం ఉన్నవారు వాటికి అనర్హులు. 1951 నుంచి 2011 వరకు నిర్వహించిన జనాభా లెక్కలను చూస్తే మొత్తంగా జనాభా పెరుగుదల రేటు 21.6 నుంచి 17.7శాతానికి తగ్గింది. హిందువుల్లో అది 20.7 నుంచి 16.6కు (నాలుగుశాతం తగ్గింది) పడిపోగా ముస్లింలో 32.7 నుంచి 24.7(ఎనిమిదిశాతం తగ్గింది)శాతానికి, క్రైస్తవుల్లో 29 నుంచి 15.7 శాతానికి తగ్గింది. అందువలన మెజారిటీ ముస్లింలు ఉంటారని చెప్పటం దురుద్దేశంతో చేస్తున్న ప్రచారమే. ఈ కాలంలో ముస్లిం జనాభా 4.4శాతం పెరిగి 14.2కు, హిందువులు 4.3శాతం తగ్గి 79.8శాతం వద్ద ఉంది. ఈ తీరు తెన్నులతో హిందువులు మైనారిటీ కావటం జరగదు.2050 నాటికి ముస్లింలు 31.1 కోట్లకు, హిందువులు 130 కోట్లకు, క్రైస్తవులు 3.7, ఇతరులు 4.6 కోట్లకు పెరుగుతారని అంచనా. హమ్‌ పాంచ్‌ హమారో పచ్చాస్‌ (మనం ఐదుగురం మనకు పాతిక మంది) హమ్‌ దో హమారే బారా(మన మిద్దరం మనకు పన్నెండు మంది) అనే తప్పుడు ప్రచారం పనిగట్టుకు చేస్తున్నారు. మన దేశంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, ముస్లింలలో వెనుకబాటుతనం, దారిద్య్రం ఎక్కువ.ఇలాంటి స్థితిలో పిల్లలు ఎక్కువ ఉంటారు, దీనికి మతానికి సంబంధం లేదు. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌లోని ముస్లింలలో సంతనోత్పత్తి రేటు 3.1, కేరళలో 1.86 ఉందని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ ఐదవ సర్వే వెల్లడించింది. దీనికి ఆర్థిక, విద్య, గ్రామీణ, పట్టణ తేడాలు అన్నది స్పష్టం. తమిళనాడులో 1.74 మాత్రమే ఉంది. ఉత్తర ప్రదేశ్‌ పట్టణ ప్రాంతాల్లో 2.1 మంది పిల్లలు ఉంటే గ్రామాల్లో ముగ్గురు ఉన్నారు. జనాభా పెరుగదలలో మత విశ్వాసాల కోణం కొంత మేరకు ఉంది. అది ఒక్క ముస్లింలకే పరిమితం కాదు, అన్ని మతాల్లో , వెనుకబడిన సమాజాలన్నింటా ఉన్న లక్షణమే. ఉత్తర ప్రదేశ్‌ను తీసుకుంటే 1991-2001 కాలంలో మొత్తంగా 25.85 శాతం పెరిగితే అది 2001-11 నాటికి 20.9శాతానికి తగ్గింది.


బహుభార్యత్వం గురించి కూడా తప్పుడు ప్రచారం సాగుతున్నది. రాముడు ఏకపత్నీ వ్రతుడైతే, కృష్ణుడు బహుపత్నీ వ్రతుడు. ఇద్దరూ పూజనీయులుగానే ఉన్నారు. అసలు 1955లో చట్టం నిషేధించేవరకు హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు ఒకరికి మించి భార్యలను కలిగి ఉండవచ్చని ఎంత మందికి తెలుసు ? ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం మహిళల స్థితి గురించి 1974లో వేసిన కమిటీ నివేదికలో నిషేధించినప్పటికీ హిందువుల్లో బహుభార్యత్వం కొనసాగుతున్నది.గిరిజనుల్లో 15.25, బౌద్దులలో 9.7,జైనుల్లో 6.72, హిందువుల్లో 5.8, ముస్లింలలో 5.7శాతం మంది ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉన్నారని పేర్కొన్నది. తరువాత ఇంతవరకు అలాంటి సర్వే జరగలేదు ? అలాంటపుడు ఏ ప్రాతిపదికన ముస్లింలను దోషులుగా చిత్రిస్తున్నట్లు ? ముస్లిం పర్సనల్‌ లా 1937 ప్రకారం ఎక్కువ మంది భార్యలను, పిల్లలను కలిగి ఉండవచ్చని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ భాష్యం చెప్పింది.2015లో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం బహుభార్యత్వం ఇస్లాంలో మౌలిక అంతర్భాగం కాదని, ఆర్టికల్‌ 25 ప్రకారం ఏక భార్యత్వ సంస్కరణ గురించి చట్టం చేసే హక్కు రాజ్యానికి ఉందని చెప్పింది. పర్సనల్‌ లా అనుమతించినప్పటికీ అది ఇస్లాంను పాటించే వారికి మౌలిక హక్కు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.


2020 డిసెంబరులో అమెరికా పూ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, ఈజిప్టులలో బహు భార్యలు ఉన్న పురుషులు ఒక శాతం కూడా లేరు. ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో గరిష్టంగా 36శాతం మంది బహుభార్యలను కలిగి ఉంటే ముస్లింలలో 40శాతం, క్రైస్తవులలో 24శాతం మంది కలిగి ఉన్నారు. మరో పద్నాలుగు ఆఫ్రికా దేశాలలో 34 నుంచి రెండు శాతం వరకు ఉన్నారు. ఈ దేశాలన్నింటా ముస్లింలతో పాటు క్రైస్తవులు, మతంతో సంబంధం లేని గిరిజన తెగల్లో కూడా ఎక్కువ మందిని వివాహమాడుతున్నారు. వందల సంవత్సరాలనాడు అరేబియా యుద్ధాలలో పురుషులు ఎక్కువ మంది మరణించటంతో వితంతువులు, అనాధల సమస్య తలెత్తి వారి ఆలనా పాలనా చూసేందుకు బహుభార్యలను కలిగి ఉండవచ్చని ఇస్లాం అనుమతించిందని చరిత్రకారులు చెప్పారు. పాకిస్తాన్‌లో రెండవ వివాహం చేసుకోవాలంటే మొదటి భార్య రాతపూర్వక అనుమతి అవసరం. అలా తీసుకోకుండా మరో మహిళను వివాహం చేసుకున్న ఒక కేసులో భర్తకు 2017లో కోర్టు జైలు శిక్ష విధించింది.
మన దేశంలో స్త్రీ – పురుషుల నిష్పత్తిని చూసినపుడు పురుషులకు అనేక ప్రాంతాల్లో అసలు వివాహం కావటమే ఒక సమస్యగా మారినపుడు బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యం కాదు.1951లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 946 మంది మహిళలు ఉన్నారు. 2011 నాటికి అది 943కు తగ్గింది. ఏడు దశాబ్దాల సగటు 936 గా ఉంది. ఒక సర్వే ప్రకారం ముస్లింలలో మొదటి భార్యకు సగటున 4.67 మంది ఉంటే రెండవ భార్యకు 1.78 మాత్రమే పిల్లలు ఉన్నట్లు తేలింది. ఒక పరిశీలన ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల మరణాలు హిందువుల్లో 29 ఉండగా ముస్లిం పిల్లల్లో 18 మాత్రమే. అందువలన ఇరు మతాల వారికీ పిల్లలు ఒకే సంఖ్యలో పుట్టినా జీవించే వారు ఎక్కువగా ఉన్నందున జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండవచ్చని తేలింది.

ముస్లింలలో మగపిల్లవాడే కావాలనే వైఖరి లేకపోవటం కూడా స్త్రీ-పురుష నిష్పత్తిలో పెద్ద తేడా ఉండటం లేదన్నది పరిశీలనల్లో తేలింది. మతం కారణంగానే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారనే నిర్ణయానికి వస్తే జననాల రేటు ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గటానికి కారణాలేమిటి అనే దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. విద్య, ఆర్థికం వంటి అనేక అంశాలు దీనికి దోహదం చేస్తున్నాయి. ప్రపంచమంతటినీ ఇస్లామిక్‌ సమాజంగా మార్చేందుకు పిల్లల్ని ఎక్కువ కంటున్నారనేది మరొక ఆరోపణ. పాకిస్తాన్‌ సంగతి చూస్తే 1951లో సగటున ఒక స్త్రీ 6.6 మంది పిల్లల్ని కనగా(1980 వరకు అదే రేటు) 2023లో 3.238కి తగ్గింది.2050 నాటికి 2.332కు 2100నాటికి 1.81కి తగ్గనుందని అంచనా. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 1961పాకిస్తాన్‌లో ఒక మహిళ 6.8 మందిని కంటే మన దేశంలో 5.92 మంది.1971లో బంగ్లాదేశ్‌లో 6.86 ఉండగా 2020 నాటికి రెండుకు తగ్గారు.మన దేశంలో 2.05 ఉన్నారు. ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టేవారు దీన్ని ఏ విధంగా వర్ణిస్తారు ?


గతంతో పోల్చితే భావజాల పోరు తగ్గింది. అటువంటపుడు సహజంగానే వివిధ కారణాలతో అణగిమణిగి ఉన్న మతశక్తులు విజృంభిస్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు ప్రపంచంలో మత ప్రభావం పెరిగింది, దీనికి మినహాయింపుగా మన దేశం ఉండజాలదు. అందుకే మత శక్తులకు అనువైన వాతావరణం నేడున్నది. మతోన్మాదాన్ని, విద్వేషాన్ని ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ 2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు 37.36శాతం, దాని మిత్రపక్షాలను కూడా కలుపుకుంటే 45శాతం. 2022 ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు 41.29శాతమే.ఈ పార్టీలకు కేవలం హిందువులే వేశారని భాష్యం చెప్పినా మెజారిటీ హిందువులు వ్యతిరేకమే అన్నది స్పష్టం. ఓటే వేయనివారు మత రాజ్యంగా మార్చి దేశాన్ని నాశనం చేస్తామంటే అంగీకరిస్తారా ?పేదరికం, బాధల నుంచి బయటపడే చిట్కాల కోసం పేదలు, మరింత ధనికులుగా మారేందుకు, దానికి ఆటంకాలు లేకుండా చూసుకొనేందుకు మధ్యతరగతి, ధనికులు నేడు ఎక్కడ చూసినా గురువులు, స్వామీజీలు, సాధ్వులు, హస్త సాముద్రికులు, వాస్తు పండితుల చుట్టూ తిరుగుతున్నారు. వారి వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా ఉంది. 2007లో అమెరికాకు చెందిన పూ సంస్థ ప్రపంచ దృక్పధం అనే అంశంపై 47 దేశాలలో జరిపిన సర్వేలో ఒక ప్రశ్న అడిగింది. ” మా జనాలు నిర్దోషమైన వారు కాదు. కానీ మా సంస్కృతి ఇతరుల కంటే ఉన్నతమైనది ” అనే అంశాన్ని అంగీకరిస్తారా లేదా అంటే మన దేశానికి చెందిన వారు 93శాతం మంది అవును అని చెప్పి అగ్రస్తానంలో ఉన్నారు. సంస్కృతి పేరుతో సంఘపరివార్‌ జనంలో మనోభావాలను ఎంతగా చొప్పించిందో దీన్ని బట్టి అర్ధం అవుతుంది. ఇలాంటి స్థితిలో ఎవరైనా సంస్కృతి మంచి చెడ్డలను ప్రశ్నిస్తే వారిని దేశద్రోహులుగా, పశ్చిమ దేశాల ప్రభావానికి గురైన వారిగా చిత్రించి దాడి చేస్తున్నారు. ఒక్కసారిగా చంపివేస్తే వేరు కానీ జీవితాంతం మీరు అంటరాని వారు అంటూ కోట్లాది మందిని నిత్యం మానసికంగా చంపటం ఘనమైన సంస్కృతిలో భాగమా ? దాన్ని ప్రశ్నిస్తే నేరమా ?

చైనా వస్తువులను బహిష్కరించగలమా ! అమ్మా భారత మాతా మా చిన్నప్పటి కాకమ్మ కతలే ఇంకా చెప్పొద్దని మోడీ తాతకు చెప్పమ్మా !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


2025 మార్చి నెల నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి ఉండే విధంగా దేశాన్ని ముందుకు నడిపించే బాటను రూపొందించాలని ఐదేండ్ల నాడు నరేంద్ర మోడీ తన పరివారాన్ని ఆదేశించారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబరు పదకొండవ తేదీన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ద్వారా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఒక లక్ష కోట్ల డాలర్లు వ్యవసాయం-అనుబంధ రంగాల నుంచి, మరొక లక్ష కోట్ల డాలర్లు పారిశ్రామిక రంగం నుంచి, మూడు లక్షల కోట్ల డాలర్లు సేవా రంగం నుంచి వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ హడావుడి అంతా మరుసటి ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల కోసం అని వేరే చెప్పనవసరం లేదు. ఆచరణలో జరుగుతున్నదేమిటి ? 2026 మార్చి నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని 2023 జనవరి 31న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, 2028 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లని కేఫ్‌ మ్యూచ్యువల్‌ డాట్‌కామ్‌ ఫిబ్రవరి22న, 2029నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లని ఏప్రిల్‌ 20న ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ పత్రిక శీర్షికల ద్వారా తెలిపాయి. 2022-23 నాటికి 3.5లక్షల కోట్ల డాలర్లకు చేరతామని తరువాత ఏడు సంవత్సరాలలో ఏడు లక్షల కోట్లకు పెరుగుతామని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ జనవరి 12న విలేకర్లతో చెప్పారు.2022-23లో 3.3లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఏ అంచనాలను, ఎవరి మాట నమ్మాలి ? దేశాన్ని ఏ దారిలో మోడీ నడుపుతున్నారు ? అంకెలతో జనాన్ని ఎలా ఆడిస్తున్నారో కదా !
2021-22 ప్రకారం మన జిడిపిలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 18.8, పారిశ్రామిక, సేవా రంగాల నుంచి 28.2, 53 శాతాల చొప్పున ఉందని చెబుతున్నారు.ఆ లెక్కన చూసుకుంటే 3.3లక్షల కోట్ల డాలర్లలో వరుసగా ఈ రంగాల నుంచి 62వేలు, 93వేల కోట్ల డాలర్లు, 1.79లక్షల కోట్ల డాలర్లు ఉంది. దేశమంతటా గుజరాత్‌ నమూనా అమలు చేసి అభివృద్ధి చేస్తానని మోడీ 2014లో నమ్మబలికారు. దాని ప్రకారమైతే సేవల నుంచి 37, పారిశ్రామిక రంగం 43, వ్యవసాయం నుంచి 20శాతం ఉండాలి కానీ, ఐదులక్షల కోట్ల డాలర్ల లక్ష్యంలో మాత్రం 50-25-25 శాతాలని నిర్దేశించారు. ఇదెలా జరిగింది, మోడీ సర్కార్‌కు వాస్తవాలు తెలియదా ? అసలు గుజరాత్‌ నమూనాతో మామూలు జనానికి ఒరిగేదేమీ లేదని మానవాభివృద్ధి సూచికలు వెల్లడించాయి, అది దేశం మొత్తానికి వర్తించదని తెలిసే ఓటర్లను తప్పుదోవపట్టించారా ? ఎవరికి వారు అవలోకించుకోవాలి.


ప్రపంచంలో మనది వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అన్నది అంకెల్లో నిజమే. అభివృద్ధి ఫలాలు ఎవరికి అన్నదే అసలు ప్రశ్న.2017-18లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొడుతూ 6.1శాతం నిరుద్యోగులున్నట్లు తేలింది. ఎన్నికల్లో అది ప్రతికూల ఫలితాలనిస్తుందనే భయంతో మోడీ సర్కార్‌ దాన్ని తొక్కిపెట్టింది. అది లీకు కావటంతో సరైన లెక్కలతో జనం ముందుకు వస్తామని చెప్పింది, ఇంతవరకు రాలేదు. పకోడీల బండి పెట్టుకొన్నప్పటికీ అది ఉపాధి కల్పనే అని అచ్చే దిన్‌ ఫేం నరేంద్రమోడీ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. బహుశా పకోడీలు, బజ్జీల బండ్ల లెక్కలు తేలలేదని అనుకోవాలి. 2016లో పెద్ద నోట్ల రద్దు అనే తెలివి తక్కువ పని కారణంగా తరువాత నిరుద్యోగం పెరిగిందని జనం ఎక్కడ అనుకుంటారోనని ఆ నివేదికను తొక్కిపెట్టారని అనుకుందాం. ఈ ఏడాది జనవరిలో 7.14శాతం ఉంటే ఏప్రిల్‌ నెలలో అది 8.11 శాతానికి పెరిగిందని సిఎంఐఇ సమాచారం వెల్లడించింది. అలాంటపుడు వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటే జనానికి ఒరిగేదేమిటి ? ఎంతగా మూసిపెడితే అంతగా పాచిపోతుందన్న సామెత తెలిసిందే. జరుగుతున్నది ఉపాధి రహిత వృద్ధి. అందుకే పాలకుల భజనకు తప్ప జనానికి పనికి రావటం లేదు. పోనీ పని చేసిన వారికి వేతనాలేమైనా పెరుగుతున్నట్లా అదీ లేదు. దేశంలో నిజవేతన పెరుగుదల 2014-15 నుంచి 2021-22 కాలంలో వ్యవసాయకార్మికులకు సగటున ఏటా 0.9, నిర్మాణ కార్మికులకు 0.2, ఇతర కార్మికులకు 0.3 శాతమని సాక్షాత్తూ రిజర్వుబాంకు అంకెలే చెప్పాయి.


జిఎస్‌టి వసూళ్లు పెరుగుదలను చూపి చూడండి మా ఘనత కారణంగానే జనం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు అని చెబుతున్నారు. విదేశీ దిగుమతుల పెరుగుదల కూడా దేశంలో కొనుగోలు శక్తి పెరిగింది అనేందుకు నిదర్శనంగా చిత్రించేందుకు చూస్తున్నారు. గడచిన పన్నెండు సంవత్సరాల్లో దేశంలో పన్నుల వసూలు 303శాతం పెరిగింది. 2010 ఆర్ధిక సంవత్సరంలో రు.6.2లక్షల కోట్లు ఉంటే 2022 నాటికి అది 25.2లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో జడిపి మాత్రం 93 శాతం అంటే రు.76.5లక్షల కోట్ల నుంచి 147.4లక్షల కోట్లకు మాత్రమే చేరింది. పన్నుల బాదుడు పెరిగింది, సంపదల సృష్టి తగ్గింది. పెరిగినవి ధనికుల చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నట్లు అందరికీ తెలిసిందే. పన్నుల వసూలు పెరుగుదల వెనుక అనేక అంశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగటం, దానికి అనుగుణంగా పన్ను మినహాయింపు పరిమితి పెరగక పోవటంతో అనేక మంది కొత్త వారు పన్ను పరిధిలోకి రావటం. జిఎస్‌టిలో పన్ను భారం పెంచటం, కొత్త వస్తువులను దాని పరిధిలోకి తేవటం, ధరల పెరుగుదలకు అనుగుణంగా జిఎస్‌టి కూడా పెరగటం వంటి అంశాలు దాని వెనుక ఉన్నాయి. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక రంగం మనదని చెబుతున్నవారు దానికి అనుగుణంగా ఆ రంగం నుంచి పన్నులను ఎందుకు రాబట్టటం లేదు. ప్రపంచంలో పోటీ పడాలనే పేరుతో పన్ను రేటు గణనీయంగా తగ్గించారు. పోనీ అలా లబ్దిపొందిన కార్పొరేట్‌ సంస్థలు తిరిగి పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నాయా, కల్పిస్తే నిరుద్యోగం ఎందుకు పెరుగుతున్నట్లు అంటే దానికి సమాధానం ఉండదు.


వార్షిక లావాదేవీలు రు.400 కోట్లు ఉన్న కంపెనీలకు పన్ను రేటును 25శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తాజాగా ఒక పరిశీలనలో 22శాతానికి అటూ ఇటూగా ఉన్నట్లు తేలింది. ఏదో ఒక పేరుతో ఇస్తున్న మినహాయింపులే దీనికి కారణం. 2017-18లో 27.6శాతంగా ఉన్న కార్పొరేట్‌ పన్ను శాతం 2019-20నాటికి 22.8శాతానికి తగ్గిందని బరోడా బాంక్‌ పరిశోధన నివేదిక వెల్లడించింది. తరువాత ఇంకా తగ్గి 22శాతానికి చేరుకుంది. అనేక మంది పాత సంస్థలను దివాలా తీయించి లేదా మూసివేసి వాటి బదులు కొత్త వాటిని ఏర్పాటు చేస్తే పదిహేనుశాతమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఎగుమతుల ప్రోత్సాహం పేరుతో మనకు బదులు విదేశాల వారికి తక్కువ ధరలకు సరకులు అందించేందుకు అని తెలిసిందే. పోనీ ఇంతగా తగ్గించినా మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులను పట్టించుకున్నవారు లేరు. అది జరిగి ఉంటే ఎగుమతులు ఇబ్బడి ముబ్బడిగా ఎందుకు పెరగలేదు ?


తొమ్మిదేండ్ల మోడీ ఏలుబడిని చూసిన తరువాత మన విదేశీ వాణిజ్యలోటు పెరుగుతోంది తప్ప తరగటం లేదు.మరోవైపు అప్పులు పెరుగుతున్నాయి. ఎందుకు ఇంత అప్పు చేశారంటే గతంలో కాంగ్రెస్‌ చమురు దిగుమతుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకని కొన్ని రోజులు పిట్టకతలు చెప్పారు. పోనీ వాటిని ఇంతవరకు తీర్చారా అంటే లేదు. చెల్లింపు గడువు ఇంకా ఉంది. తరువాత ఇంకేవో కతలు చెప్పారు. పాలకులుగా కాంగ్రెస్‌-బిజెపి ఎవరున్నా దొందూ దొందే ! కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించినదాని ప్రకారం 2024 మార్చి నాటికి దేశ అప్పు 169.46లక్షల కోట్లకు చేరుతుంది. ఇంకా పెరగవచ్చు కూడా దీనిలో విదేశీ రుణం 5.22 లక్షల కోట్లు. దేశ జనాభా 140 కోట్లు అనుకుంటే మొత్తం తలసరి అప్పు లక్షా 21వేలు. ఇది మోడీ ప్రధాని పీఠం ఎక్కినపుడు రు.43వేలు.2014-15లో ఓఇసిడి దేశాల లెక్కింపు పద్దతి ప్రకారం మన దేశంలో నిఖర తలసరి జాతీయ రాబడి రు.72,805 కాగా 2022-23 నాటికి రు.98,118కి పెరిగింది. దీన్ని బట్టి మోడీని సమర్ధ ప్రధాని అనవచ్చా ! కొంతమంది వేద గణికులు చైనా విదేశీ అప్పు 2.64లక్షల కోట్లు, మనది 61,500 వేల కోట్లు మాత్రమే(2022 జూన్‌ నాటి లెక్కలు), చూశారా చైనా ఎప్పుడైనా రుణ భారంతో కూలిపోతుందని చంకలు కొట్టుకుంటారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా నరం లేని నాలికలతో ఏమైనా మాట్లాడవచ్చు. చైనా రుణం దాని జిడిపితో పోల్చితే 14.39 శాతం కాగా మనది 19.2శాతం ఉంది. అందువలన రుణంతోనే చైనా కూలితే మన తరువాతే అన్నది గ్రహించాలి. విదేశీ చెల్లింపుల్లో నిలకడ ఉండటం లేదు, లోటు కొనసాగుతోంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే మనవారి సంఖ్య తగ్గితే అది మరింత పెరుగుతుంది. విషమిస్తే మరోసారి ఐఎంఎఫ్‌ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.


మన దేశ వాణిజ్య ప్రధమ భాగస్వామిగా చైనాను నెట్టేసి అమెరికా ముందుకు వచ్చిందని ఒక లెక్క, కాదు అని మరొక లెక్క చెబుతోంది. ఎవరైతేనేం చైనాకు మనం సమర్పించుకొనేది ఏటేటా పెరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం పదవ స్థానంలో ఉన్న చైనా ఇప్పుడు ఒకటి, రెండు స్థానాల్లోకి వచ్చింది. విదేశాల నుంచి మన వలస కార్మికులు పంపుతున్న డాలర్లన్నీ చైనాకు సమర్పించుకుంటున్నార. ఒక దేశం నుంచి దిగుమతులు పెరుగుతున్నాయంటే ఆ మేరకు మన దేశంలో ఉపాధికి గండిపడుతున్నట్లే. అంతే కాదు, స్వదేశీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గుతున్నట్లే, అది కొత్త సమస్యలను ముందుకు తెస్తుంది. చైనా నుంచి చౌక ధరలకు దిగుమతులు చేసుకున్న అమెరికా కార్పొరేట్లు లబ్ది పొందినట్లే, మన వారు కూడా లాభాలు పొందుతున్నారు. అందుకే దేశంలోని చైనా వ్యతిరేకులు ఎంత గగ్గోలు పెట్టినా నరేంద్రమోడీ ఖాతరు చేయకుండా దిగుమతులను అనుమతించి రికార్డులను బద్దలు కొడుతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే చైనా వస్తు మార్కెట్‌గా మన దేశం మారే అవకాశం ఉంది. చైనా అంటే మనకు పడదు అనుకుంటే ఇతర దేశాల వస్తువులతో నింపుతారు. మొత్తంగా చూస్తే తొమ్మిదేండ్లలో దిగుమతులు, అప్పు తప్ప చెప్పుకొనేందుకు పెద్దగా ఏమీ కనిపించటం లేదు.


2021-22 ఏప్రిల్‌-జనవరి కాలంలో వస్తువుల దిగుమతి విలువ 494 బిలియన్‌ డాలర్లు కాగా అదే 2022-23 నాటికి 602బి.డాలర్లకు పెరిగింది. ఎందుకు అంటే దేశంలో కొనుగోలు శక్తిని పెంచాం అని బిజెపి నేతలు చెప్పారు. అంటే వారి చేతిలో మంత్ర దండం ఉందని అనుకుందాం, మరి అదే ఊపులో నిరుద్యోగాన్ని ఎందుకు తగ్గించలేదు, ఆత్మనిర్భరత, మరొక పేరుతో చేసిన హడావుడి ప్రకారం ఎగుమతులు ఎందుకు దిగుమతులను అధిగమించలేదు ? సేవా రంగ ఎగుమతుల పెరుగుదల కేంద్ర పాలకుల పరువును, వెంటనే మరోసారి ఐఎంఎఫ్‌ దగ్గర అప్పుకు పోకుండా కాపాడుతున్నాయి. అంకుర సంస్థల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంకురమైనా పాతదైనా దేశంలో ఉన్న పౌరుల ఆదాయాలను బట్టి ప్రభావితమౌతాయి. 2021, 22 సంవత్సరాల్లో అంకురాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇన్వెస్కో, బ్లాక్‌రాక్‌ సంస్థలు తాజాగా బైజు విలువను 22 నుంచి 11.5కు, స్విగ్గీ 10.7 నుంచి 5.5 బిలియన్‌ డాలర్లకు తగ్గించాయి. ఇవే కాదు ఓలా విలువ 35శాతం, ఇలా అనేక కంపెనీల విలువలను తగ్గిస్తూ సంపదల నిర్వహణ కంపెనీలు ప్రకటించాయి. ఈ కంపెనీలన్నీ సిబ్బంది తొలగింపు, ఖర్చుల్లో కోత, కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్ల తగ్గింపు వంటి చర్యలకు పాల్పడ్డాయి.


మన దేశంలో మధ్య తరగతి భారీ ఎత్తున ఖర్చు చేయనున్నారనే అంచనాతో పాటు, చైనాలో అనేక కంపెనీల మీద విధిస్తున్న ఆంక్షల కారణంగా అవన్నీ మన దేశానికి వస్తున్నాయనే భ్రమను కల్పించారు. దీంతో వెంచర్‌ కాపిటల్‌ పెట్టుబడిదారులు ( వీరు ఎక్కడ ఎక్కువ లాభం ఉంటే అక్కడికి వెంటనే వెళ్లిపోతారు, ఒక దగ్గర స్థిరంగా ఉండరు.లాభాలు రాగానే తమ వాటాను అమ్మి వేరే వైపు వెళ్లిపోతారు. తెల్లవారే సరికి నడమంత్రపు సిరి కావాలి) మన దేశంలోని అంకుర సంస్థలకు భారీ ఎత్తున పెట్టుబడులను మళ్లించారు. వాటి విలువలను విపరీతంగా పెంచివేశారు. మార్కెట్‌ను స్వంతం చేసుకొనేందుకు ఈ కంపెనీలన్నీ ఆ రంగంలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాయి.బైజు సంస్థ క్రికెటర్ల జెర్సీల మీద పేరుకోసం పెద్ద మొత్తంలో చెల్లించింది, ఫీపా ప్రపంచ కప్‌ను స్పాన్సర్‌ చేసింది. స్విగ్గీ,డ్రీమ్‌ 11 వంటి సంస్థలు క్రికెట్‌ ఐపిఎల్‌కు ఖర్చు చేశాయి. ప్రకటనల కంపెనీ మాడిసన్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం అగ్రశ్రేణి ప్రకటనదార్లు 50లో 15 అంకుర సంస్థలే ఉన్నాయి.వినియోగదారులు విస్తరించకపోవటంతో అనేక కంపెనీలు మూతలవైపు మళ్లాయి. స్విగ్గీ తన మాంస, ఇతర ఇంటి సరకుల సరఫరా నిలిపివేసింది. ఓలా కూడా ఆహార, ఇంటి సరకుల సరఫరా, మీషో ఇంటి సరకుల, అన్‌ అకాడమీ ప్రాధమిక, సెకండరీ స్కూల్‌ బిజినెస్‌ను మూసివేసింది.మన జనాలను డిస్కౌంట్లకు అలవాటు చేసిన తరువాత వాటిని ఇచ్చే వాటివైపు చూస్తారు తప్ప మిగతావాటిని పట్టించుకోరు. అదే కంపెనీల విస్తరణకు అడ్డంకిగా మారింది. ఆహారాన్ని అందించే జోమాటో తగిన గిరాకీల్లేక 225 పట్టణాల్లో సేవలను నిలిపివేసింది. కరోనా కారణంగా దేశంలో ఆన్‌లైన్‌ సేవలవైపు జనాలు మొగ్గారు అది అంతరించగానే వాటికి డిమాండ్‌ తగ్గింది. వెంచర్‌ కాపిటల్‌కు ఇబ్బందులు రావటానికి వడ్డీ రేట్ల పెరుగుదల కూడా ఒక కారణం. అనేక దేశాల్లో బాంకుల్లో డిపాజిట్లు చేసిన వారే ఎదురు ఎవడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇది వెంచర్‌ కాపిటల్‌ సంస్థలకు ఎంతో కలసి వచ్చింది. డాలర్లన్నీ వాటివైపు ప్రవహించాయి. గతేడాది అమెరికా, ఇతర దేశాల్లో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు ఈ సంస్థలకు తక్కువ వడ్డీలకే రుణాలు ఇచ్చే అవకాశాలను తగ్గించింది.


చైనాను దెబ్బతీసేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు అన్ని విధాలుగా చూస్తున్నాయి.వాణిజ్య సంబంధాలను తెంచుకోవటం వాటిలో ఒకటి.అలాంటి ప్రయత్నాలెన్ని చేసినప్పటికీ 2030వరకు ప్రపంచ వాణిజ్య వృద్ధిలో చైనా కీలకంగా ఉండనుందని లండన్‌ కేంద్రంగా ఉన్న స్టాండర్డ్‌ చార్టర్డ్‌ కంపెనీ తాజా నివేదికలో వెల్లడించింది. ఎగుమతుల వార్షిక వృద్ధి రేటు 4.7శాతం ఉంటుందని,2030 నాటికి మొత్తం విలువ 4.37లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని పేర్కొన్నది. ఎగుమతుల్లో మెకానికల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు 52శాతం ఉంటాయన్నది. ఇదే సంస్థ మన దేశం గురించి వేసిన అంచనాలో 2021లో 401బి.డాలర్లుగా ఉన్న మన వస్తు ఎగుమతులు 2030 నాటికి 773 బి.డాలర్లకు పెరుగుతాయని చెప్పింది. అప్పటికి చైనా నుంచి మనం దిగుమతి చేసుకొనే వస్తువుల విలువ 212, ఎగుమతుల విలువ 49 బి. డాలర్లు ఉంటుందని కూడా చెప్పింది. ఇది ఊహలే తప్ప వాస్తవం కాదని మన సర్కార్‌ రుజువు చేస్తుందా ? ఇప్పటి వరకు నడచిన తీరును చూస్తే ఇంకా పెరిగేందుకే అవకాశం ఉంది.2023 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు మన దేశం చైనాతో జరిపిన వాణిజ్య లావాదేవీల విలువ 44.34 బిలియన్‌ డాలర్లుగా ఉందని చైనా కస్టమ్స్‌ శాఖ సమాచారం వెల్లడించింది. ఇదే ఏడాది మొత్తం కొనసాగితే 175బి. డాలర్ల రికార్డు నమోదు కావచ్చు.2022లో జరిగిన 135.98 బి.డాలర్లు ఇప్పటి వరకు ఒక రికార్డు. మన వాణిజ్యలోటు వంద బి.డాలర్లు దాటింది. మరోవైపు మోడీ సర్కార్‌ రూపొందించిన భారత విదేశీ వాణిజ్య విధాన పత్రం 2023లో 2030 నాటికి మన ఎగుమతులు రెండులక్షల కోట్ల డాలర్లకు చేరతాయని, వార్షిక వృద్ది రేటు 14.8శాతం ఉంటుందని పేర్కొన్నారు.మనల్ని నేల మీద నడిపించి అన్ని ఎగుమతులు చేస్తే అంతకంటే కావాల్సిందేముంది ? ఇది కూడా గుజరాత్‌ అభివృద్ధి నమూనా, అచ్చేదిన్‌, నల్లధనం రప్పింపు వంటి కతల జాబితాలో చేరుతుందా !