• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: China

చైనా కరెన్సీలో చమురు డబ్బు డిమాండ్‌ చేస్తున్న రష్యా – పరువు పోతుందని నరేంద్రమోడీ భావిస్తున్నారా ?

22 Sunday Oct 2023

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BJP, China, De Dollarisation, Narendra Modi Failures, Russian oil, U.S. Dollar, yuan

ఎం కోటేశ్వరరావు

గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్రమోడీ సర్కార్‌ చిక్కుకుందా ? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా ? చైనా మీద కోపంతో అధిక ధరలకు ఇతర దేశాల నుంచి కొని జనం మీద భారం మోపేందుకు సిద్దపడుతుందా ? తాజాగా తలెత్తిన పరిస్థితి నుంచి పుట్టుకువస్తున్న అనుమానాలివి. తమ ముడి చమురుకు చైనా యువాన్లు చెల్లించాలన్న రష్యా డిమాండ్‌ను భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్లుగా బ్లూమ్‌బెర్గ్‌ మీడియా పేర్కొన్నది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యన్లు తమ వద్ద కొనుగోలు చేసే దేశాలకు రాయితీ ధరలకు చమురును విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గతం కంటే ఎంతో ఎక్కువగా చైనాపై ఆధారపడ్డారు. ఐరోపా యూరోలు, అమెరికా డాలర్లను మార్చుకొనేందుకు ఆంక్షలు అడ్డువస్తున్నందున తమకు చైనా యువాన్లలో చెల్లించాలని రష్యా మన దేశాన్ని కోరింది. దీనికి మనదేశం అంగీకరించే అవకాశాలు లేవని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. అదే జరిగితే రష్యా నుంచి కొనుగోలు నిలిపివేసి డాలర్లు చెల్లించి అధిక ధరకు ఇతర మార్కెట్లో చమురు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ యువాన్లలో చెల్లించినప్పటికీ, ఇప్పుడు హిందూస్తాన్‌ పెట్రోలియం, భారత పెట్రోలియం కార్పొరేషన్‌ చెల్లింపుల అంశానికి వస్తే ప్రభుత్వం విముఖంగా ఉందని రాయిటర్స్‌ వార్తా సంస్థ కొద్ది రోజుల క్రితం పేర్కొన్నది. కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటో తెలియదు. గతేడాది నవంబరు నాలుగున ఒపెక్‌ దేశాల నుంచి మనం కొనుగోలు చేస్తున్న ముడి చమురు పీపా ధర 93.86 డాలర్లు ఉండగా తరువాత మే మూడవ తేదీకి 70.52 డాలర్లకు తగ్గింది.సెప్టెంబరు 29న 97.03 డాలర్లకు పెరిగి తరువాత కాస్త తగ్గి అక్టోబరు 19న 91.71 డాలర్ల వద్ద ఉంది.

చైనాతో సరిహద్దు వివాదంలో ఎలాంటి పురోగతి లేకపోవటం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో చైనాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలకు మరింత సన్నిహితం కావటం వంటి కారణాలు ఉండవచ్చు. లేదా రూపాయిని అంతర్జాతీయ మారక కరెన్సీగా మారుస్తామన్న మాటల ప్రచార బండారం సంగతేమిటని జనం అడుగుతారన్న భయం కావచ్చు. 2022-23లో రోజుకు 7.8లక్షల పీపాల రష్యా చమురు దిగుమతి చేసుకోగా 2023-24లో ఇప్పటి వరకు 17.6లక్షలకు పెరిగింది. ఈ మేరకు ఒపెక్‌(చమురు ఎగుమతి దేశాలు) నుంచి దిగుమతులు తగ్గాయి. 2022 ఏప్రిల్‌-సెప్టెంబరు కాలానికి మన మొత్తం అవసరాల్లో 63 శాతం ఒపెక్‌ నుంచి దిగుమతి చేసుకోగా ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 40శాతానికి తగ్గింది. ఒపెక్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురుతో పోలిస్తే తక్కువ ధర, రూపాయల్లో చెల్లింపుల వెసులుబాటు వంటి సానుకూల కారణాలు ఉన్న కారణంగానే మనదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. మన రూపాయలతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు దొరకదు. అందుకోసం డాలర్లు ఖర్చు చేయాల్సిందే. వాటి బదులు యువాన్లలో చెల్లిస్తే మనకు పడే అదనపు భారం ఉండదు. మన వినియోగదారులకు మేలు కలుగుతున్నపుడు, ఖజానా మీద భారం పడనపుడు ఏ విదేశీ కరెన్సీలో చెల్లిస్తే ఏమిటి ? వివాదాలకు – వ్యాపారానికి సంబంధం లేదంటూ గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి చైనా నుంచి దిగుమతులు సజావుగానే మనం చేసుకుంటున్నాం.వాటి దగ్గర లేనిది యువాన్ల దగ్గర పట్టుదల అవసరమా ?అంతర్జాతీయ మార్కెట్లో యువాన్లను కొనుగోలు చేయటం అవమానంగా భావిస్తున్నామా ?

ప్రయివేటు సంస్థలు యువాన్లలో చెల్లింపులు జరపటంపై ఎలాంటి నిషేధం లేదని మన ప్రభుత్వం ప్రకటించింది. అయితే అలాంటి లావాదేవీలను ప్రోత్సహించటం గానీ, వీలు కల్పించటం గాని చేసేది లేదని కూడా పేర్కొన్నది. తాము డాలర్లను స్వీకరించేది లేదని, యువాన్లు లేదా రూబుళ్లను చమురు లావాదేవీల్లో అంగీకరిస్తామని రష్యా కంపెనీ గాజ్‌ ప్రోమ్‌ స్పష్టం చేసింది. ప్రపంచ లావాదేవీలు యువాన్లతో జరపాలన్న ప్రతిపాదనల పట్ల మనదేశం సంతోషంగా లేదని ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఏ కరెన్సీతో లావాదేవీలు జరపాలన్న అంశం తేలకపోవటంతో రష్యాకు సెప్టెంబరు నుంచి ఏడు టాంకర్ల చెల్లింపులు నిలిచిపోయాయి.ఇప్పటికే తన దగ్గర భారీ మొత్తంలో రూపాయి నిల్వలు ఉన్నందున చమురు చెల్లింపులకు గాను తనకు యువాన్లలో చెల్లించాల్సిందేనని రష్యా పట్టుబట్టింది. తాను చైనా దిగుమతుల మీద ఆధారపడి నందున యువాన్ల అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ప్రయివేటు చమురుశుద్ధి సంస్థలు కొంత మేరకు చెల్లింపులు జరిపాయి. యుఏఇ దిర్‌హామ్స్‌లో కూడా రష్యాకు చెల్లించాము. కొన్ని రష్యన్‌ కంపెనీలు దిరహామ్స్‌ను కూడా అంగీకరించటం లేదు. పీపా ముడి చమురును 60 డాలర్లకు మించి రష్యా దగ్గర కొనుగోలు చేస్తే అమెరికా ఆంక్షలను అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మారుస్తామని చెబుతున్న తరుణం, సరిహద్దు వివాదం కారణంగా చైనా కరెన్సీలో చెల్లింపులు చేసేందుకు మోడీ సర్కార్‌ ఇబ్బంది పడుతోంది.బ్రిక్స్‌ దేశాల కూటమిలో ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన రాగా మనదేశం మాత్రమే వ్యతిరేకించింది. ఒకవేళ అంగీకరిస్తే యువాను అవుతుందన్నభయం ఉందని వార్తలు. ప్రస్తుతం రూపాయి అంతర్జాతీయ లావాదేవీల్లో పూర్తిగా మారకం కావటం లేదు. అందువలన తన దగ్గర ఉన్న వందల కోట్ల రూపాయలను ఏం చేసుకోవాలని రష్యా అడుగుతోంది. ఇప్పటి వరకు స్థానిక కరెన్సీలో లావాదేవీలు జరిపిన కారణంగా రష్యాకు యువాన్లు వస్తున్నాయి. రష్యా రాయితీల వలన చైనా 10, భారత్‌ 7 బిలియన్ల డాలర్లను పొదుపు చేసుకున్నాయి.ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి, వాటికిి ప్రతికూలంగా నడిచే పరిస్థితి మనకు ఉందా అన్నది సమస్య.

అమెరికా డాలరు పెత్తనానికి రోజులు దగ్గర పడుతున్నాయా ? అనేక వైపుల నుంచి వస్తున్న వార్తలు ఏదో జరగబోతోందనే సూచిస్తున్నాయి. తన బిఆర్‌ఐ పధకం కింద గతంలో ఎక్కువగా డాలర్లు ఇచ్చిన చైనా ఇప్పుడు తన కరెన్సీ యువాన్‌ ఇవ్వటం ప్రారంభించింది. అక్టోబరు మూడవ వారంలో ఈ మేరకు అనేక ఒప్పందాలను కుదుర్చుకుంది. రాయిటర్స్‌ వార్తా సంస్థ కథనం ప్రకారం చైనా అభివృద్ధి బాంకు మలేషియా, ఈజిప్టు, పెరూ కేంద్ర బాంకులతో ఒప్పందాలు చేసుకుంది.చైనా ఎగుమతి-దిగుమతి బాంకు సౌదీ నేషనల్‌ బాంకుతో, బాంక్‌ ఆఫ్‌ చైనా ఈజిప్టుకు 47.9 కోట్ల డాలర్ల విలువగల యువాన్‌ పాండా బాండ్లను జారీ చేసింది. సిల్క్‌ రోడ్‌ నిధులకు గాను 80 బిలియన్ల యువాన్లను అదనంగా చైనా పక్కన పెట్టింది. అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్ల వాటా ఎంతో ఎక్కువగా ఉంది. ఆగస్టు నెలలో 83.95శాతంగా ఉన్నది సెప్టెంబరులో 84.15కు పెరిగింది. యూరో వాటా 6.43 నుంచి 5.43శాతానికి తగ్గగా చైనా యువాన్‌ లావాదేవీలు 4.82 నుంచి 5.8శాతానికి చేరి రెండవ స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో యూరో, జపాన్‌ ఎన్‌, సౌదీ రియాల్‌ ఉన్నాయి.యువాన్‌ వాటా తక్కువే అయినప్పటికీ క్రమంగా పెరుగుతోంది. ఇరవై భాగస్వామ్య దేశాలతో చైనా ఇప్పటి వరకు పదిహేడింటితో యువాన్‌ మార్పిడి ఒప్పందాలు కుదుర్చుకుంది. అర్జెంటీనాలో ఆరున్నర బిలియన్‌ డాలర్ల విలువగల యువాన్‌ మార్పిడి ఒప్పందం చేసుకుంది.అంతర్జాతీయ వాణిజ్యంలో 15శాతం వాటా ఉన్న చైనా కరెన్సీయే అంత తక్కువగా ఉన్నపుడు కేవలం 1.8శాతం వాణిజ్యం ఉన్న మనదేశ కరెన్సీ వాటా ఎంత ఉంటుందో చెప్పనవసరం లేదు.

బ్లాక్‌ మార్కెట్‌ కారణంగా కరెన్సీ మారకపు విలువలో సంభవిస్తున్న హెచ్చు తగ్గుల వలన తమ దేశానికి పదిబిలియన్‌ డాలర్ల మేర నష్టం జరుగుతున్నదని ఇరాక్‌ కేంద్ర బాంకు పెట్టుబడులు, స్వీకరణల డైరెక్టర్‌ జనరల్‌ మజెన్‌ అహమ్మద్‌ చెప్పాడు.డాలరు దిగుమతుల్లో సగం అక్రమంగా జరుగుతున్నవే అన్నాడు. 2023లో స్వీకరించిన డాలరు డిపాజిట్లను వచ్చే ఏడాది ఉపసంహరిస్తామని,2024 జనవరి ఒకటి తరువాత స్వీకరించబోమన్నాడు. ఆంక్షల కారణంగా గత రెండు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న ఇరాక్‌ బ్రిక్స్‌ కూటమిలో చేరాలని, డాలరుతో నిమిత్తం లేకుండా ఆర్ధిక వ్యవస్థ నిర్వహణ జరపాలని చూస్తున్నది.ఆహ్వానం వస్తే బ్రిక్స్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నామని ఇరాక్‌ ప్రధాని మహమ్మద్‌ షియా అల్‌ సుదానీ ప్రకటించాడు.తమ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు అవసరమైన పెట్టుబడుల ఆకర్షణకు వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపడుతున్నట్లు, తద్వారా స్థానిక కరెన్సీకి ఆసరా దొరుకుతుందని మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం చెప్పాడు. బ్రిక్స్‌ దేశాల స్ఫూర్తితో తమ కరెన్సీ రింగెట్‌ను స్థిరపరిచేందుకు చూస్తామన్నాడు. ఇండోనేషియా, చైనా, థాయిలాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలలో రింగెట్‌ను వినియోగిస్తామన్నాడు. డాలరు మీద పూర్తిగా ఆధారపడటం కష్టమన్నాడు.డాలరు బదులు స్థానిక కరెన్సీ బ్రిక్స్‌ దేశాలు గనుక తమతో జరిపే లావాదేవీలలో ముఖ్యంగా ఇంథనానికి తమకు స్థానిక కరెన్సీలలోనే చెల్లింపులు జరపాలని అమెరికా, ఐరోపా దేశాలను డిమాండ్‌ చేస్తే పరిస్థితి ఏమిటి అన్నది ఒక చర్చ. తమకు డాలర్లలోనే చెల్లింపులు జరపాలనేదేమీ లేదని స్థానిక కరెన్సీలను కూడా అంగీకరిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి న్యూ డెవలప్‌మెంట్‌ బాంక్‌ (ఎన్‌డిబి) ఏర్పాటు చేసింది. రానున్న మూడు సంవత్సరాల్లో సభ్య దేశాలు డాలరు బదులు ఆయా దేశాల కరెన్సీలలో లావాదేవీలు జరుపుకోవాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఆయా దేశాల కరెన్సీలలో ఇతర దేశాలకు రుణాలు ఇవ్వాలని సూచించింది. 2026 నాటికి డాలర్‌ పెత్తనం తగ్గటం ప్రారంభమవుతుందని అంచనా.ప్రస్తుతం బ్రిక్స్‌ కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 30శాతం వాటా కలిగి ఉంది, దాన్ని మరింతగా విస్తరించాలనే యత్నాల్లో ఉన్నారు. ఈ కూటమిలో చేరాలని 40కి పైగా దేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. సెప్టెంబరులో జరిగిన కూటమి సమావేశంలో సౌదీ అరేబియా, ఇరాన్‌, ఈజిప్టు, ఇథియోపియా,అర్జెంటీనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను చేర్చుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది. వీటిలో అర్జెంటీనా మినహా ఐదు దేశాలూ చమురు ఎగుమతి దేశాలే అన్నది తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న పశ్చిమ దేశాల పెత్తనం క్రమంగా తూర్పు దేశాలకు వస్తుందని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌ దుర్మార్గానికి 500 మంది రోగులు బలి, జో బైడెన్‌ పర్యటన తరువాత గాజాపై ముప్పేట దాడి !

18 Wednesday Oct 2023

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR, Women

≈ 1 Comment

Tags

2023 Israel–Hamas war, China, HAMAS attacks 2003, Iran protests, israel massacre, Joe Biden, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


హమస్‌ సాయుధులను మట్టుపెట్టే పేరుతో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన దాడుల్లో మంగళవారం నాడు ఐదు వందల మంది రోగులు మరణించారు. గాజాలోని ఒక ఆసుపత్రి మీద జరిపిన వైమానిక దాడికి వారు బలయ్యారు.మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు ఉన్నట్లు వార్తలు. ఈ దుర్మార్గానికి నిరసనగా బుధవారం నాడు అమెరికా అధినేత జో బైడెన్‌, ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌ శశితో అమ్మాన్‌ నగరంలో జరగాల్సిన భేటీని రద్దు చేసినట్లు జోర్డాన్‌ ప్రకటించింది. అరబ్బు దేశాలు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని ఖండిస్తూ జనం ప్రదర్శనలు జరుపుతున్నారు.హమస్‌ దాడుల నుంచి ఆత్మరక్షణకు పూనుకోవటం ఇజ్రాయెల్‌కు ఉన్న హక్కు, దాని బాధ్యత అని నొక్కివక్కాణించేందుకు అమెరికా అధినేత జో బైడెన్‌ బుధవారం నాడు ఇజ్రాయెల్‌ వచ్చి కొన్ని గంటల పాటు అక్కడ గడపుతాడని తాజా వార్తలు.నిరంతరం మానవహక్కుల గురించి ప్రపంచానికి బోధ చేస్తున్న అమెరికా నేత ఇజ్రాయెల్‌ గడ్డ మీద కూర్చొని ఇంకా కొట్టండి, చంపండి అని గాక ఇంకా ఏం చెబుతాడో చూద్దాం.


” హంతకుల మీద ఈ రోజు మనం నెపం నెట్టకూడదు. మన పట్ల వారి తీవ్ర ద్వేషాన్ని ఎందుకు గర్హించాలి ? ఎనిమిది సంవత్సరాలుగా గాజాలోని శరణార్ధి శిబిరాలలో వారు కూర్చున్నారు. వారు, వారి తండ్రులు నివశించిన చోట వారి భూములు, గ్రామాలను వారి కళ్ళ ముందే మన ఎస్టేట్లుగా మార్చి వేయటాన్ని వారు చూస్తున్నారు ” ఈ మాటలు చెప్పింది జనరల్‌ మోషే డయాన్‌. నూటికి నూరుపాళ్లు యూదు దురహంకారే.1948లో ఇజ్రాయెల్‌ మిలిటరీ పాలస్తీనా అరబ్బు ప్రాంతాల మీద జరిపిన దురాక్రమణ, హత్యాకాండకు నాయకత్వం వహించిన అధికారులలో ఒకడు. తరువాత మిలిటరీ ప్రధాన అధికారిగా పని చేశాడు.1956లో పాలస్తీనా గెరిల్లాలు జరిపిన దాడుల తరువాత డయాన్‌ చేసిన వ్యాఖ్యలివి. తరువాత కాలంలో పాలస్తీనియన్లతో శాంతి పరిష్కారం కోరుకున్న కారణంగా అదే యూదు దురహంకారులు అతన్ని పక్కన పెట్టారు. ఈ రోజు హమస్‌ చేసిన దాడులతో మొత్తం పాలస్తీనా వాసులను నిందిస్తున్న వారు అర్ధం చేసుకోవాల్సిన కీలక అంశం ఏమిటో డయాన్‌ చెప్పాడు.


పాలస్తీనా – ఇజ్రాయెల్‌ వివాదంలో ఒక యూదు దురంహంకారికి తెలిసిన మేరకు కూడా అర్ధం కానంత అమాయకంగా అమెరికా ఉందా ? 1948 నుంచి పాలస్తీనియన్ల ప్రాంతాలను ఆక్రమించి వారిని తరమివేయటంతో విదేశాల్లో శరణార్ధులుగా, ఇజ్రాయెలీ పాలకులు బహిరంగ జైలుగా మార్చిన పాలస్తీనా ప్రాంతాలలో బందీల మాదిరి క్షణం క్షణం ఏం జరుగుతుందో తెలియని భయం, అనిశ్చితిలో బతుకుతున్నారు. మంగళవారం నాడు అల్‌జజీరా వెల్లడించిన సమాచారం మేరకు హమస్‌ దాడుల్లో 1,400 మందికి పైగా మరణించగా దానికి ప్రతిగా ఇప్పటి వరకు గత పదకొండు రోజుల్లో ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడుల్లో గాజాలోని పాలస్తీనియన్లు 2,808 మంది మరణించారు. వారిలో మూడోవంతు మంది పిల్లలు.ఆసుపత్రి మీద జరిపిన దాడిలో మరణాలతో ఈ సంఖ్య పెరిగింది. అయినా రక్తదాహం తీరలేదు. త్రివిధ దళాలతో గాజాలోని సామాన్య పౌరుల మీద దాడులకు ఇప్పటికే సన్నాహాలు పూర్తి అయ్యాయి. బైడెన్‌ తిరిగి అమెరికా వెళ్లిన తరువాత విరుచుకుపడవచ్చు. ఈ పూర్వరంగంలో మరోవైపున లెబనాన్‌-ఇజ్రాయెల్‌ సరిహద్దులో పరస్పరం దాడులకు దిగినట్లు, కొందరు మరణించినట్లు వార్తలు. రానున్న కొద్ది గంటల్లో ఇజ్రాయెల్‌ మీద ఆ ప్రాంతంలోని కొన్ని బృందాలు దాడులకు దిగవచ్చని ఇరాన్‌ విదేశాంగ మంత్రి చెప్పాడు. వివాదం మరింతగా ముదరకూడదని తాము కోరుకుంటున్నామని ఇరాన్‌ ఒక సందేశాన్ని పంపింది. అయితే గాజాలో పరిస్థితి దిగజారితే తాను జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు కూడా వార్తలు. ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తే పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఇరాన్‌ భాగస్వామి అవుతుందని కొందరు చెబుతున్నారు.


పాలస్తీనా విముక్తి కోసం పలు పద్దతులలో పోరాడుతున్నవారు ఉన్నారు.హమస్‌ సాయుధపోరాట మార్గాన్ని ఎంచుకుంది. అదీ ఎప్పుడు ? ఇజ్రాయిల్‌ ఆక్రమణలకు పాల్పడి అరబ్బుల తరిమివేత, హత్యాకాండను ప్రారంభించిన ఐదు దశాబ్దాల తరువాత. పాలస్తీనా ప్రాంతాలను అక్కడి జనాలకు అప్పగించి ఇజ్రాయెల్‌ తప్పుకుంటే సమస్య ఒక్క రోజులో పరిష్కారం అవుతుంది.అంతా అమెరికా చేతిలో ఉంది. ఐక్యరాజ్య సమితి తాను చేసిన తీర్మానాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్యకు ఎందుకు ఉపక్రమించటం లేదు ? భద్రతా మండలి చేసే తీర్మానాన్ని ఇజ్రాయెల్‌కు అనుకూలమైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వీటో చేస్తాయి. సాధారణ అసెంబ్లీ చేసే తీర్మానాలకు విలువ ఉండదు. నాలుగున్నర దశాబ్దాల తరువాత అమెరికా మధ్యవర్తిత్వంలో ఓస్లో ఒప్పందం కుదిరింది. ఆ మేరకు పాలస్తీనాలో పరిమిత అధికారాలున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఇజ్రాయెల్‌ తాను ఆక్రమించిన ప్రాంతాలను క్రమంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలి. ఈ ఒప్పందాన్ని పాలస్తీనా విమోచనా సంస్థ(పిఎల్‌ఓ) చేసుకుంది. దాన్ని ఇతర పార్టీలు, సంస్థలు ఆమోదించలేదు. లొంగుబాటుగా వర్ణించాయి. వాటిలో హమస్‌ ఒకటి. ఎందుకంటే దానిలో అసలు పాలస్తీనా దేశం అనే పదాలే లేవు. ఆ ఒప్పందాలు జరిగి మూడు దశాబ్దాలు గడచింది. మొత్తం మీద చూసినపుడు ఒక్క నిబంధనను కూడా అమలు జరపలేదు. ఆక్రమణల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగలేదు, పాలస్తీనాకు అప్పగించలేదు.ఆక్రమణలు ఇంకా పెరిగాయి. జెరూసలెం పట్టణాన్ని కూడా ఆక్రమించేందుకు పూనుకుంది. మధ్యవర్తిగా ఉన్న అమెరికా అమలు జరిపేందుకు వత్తిడితేవటంమాని యూదుల పక్షాన నిలబడింది.ఓస్లో ఒప్పందంపై సంతకాలు చేసి దాన్ని అమలు జరిపేందుకు పూనుకోవాలి అని చెప్పిన ఇజ్రాయెల్‌ ప్రధాని యత్జిక్‌ రబిన్‌పై తీవ్రవాదులైన యూదు దురహంకారులు కుట్ర చేసి 1995లో హత్య చేశారు. ఎవరైనా అమలుకు పూనుకుంటే వారికి ఇదే గతి అన్న హెచ్చరికే అది.


ఇక హమస్‌ తాజా దాడులకు ఎందుకు పాల్పడింది అన్న అంశం మీద ప్రచారంలో ఉన్న కుట్ర సిద్దాంతాలలో ఒకటేమిటంటే ఇజ్రాయెల్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్య కుదిర్చేందుకు అమెరికా చేస్తున్న యత్నాలను దెబ్బతీసేందుకు అన్నది ఒకటి. పాలస్తీనా అరబ్బులకు మద్దతు ఇస్తున్న దేశాలలో సౌదీ ఒకటి. అది ఇజ్రాయెల్‌తో కుదుర్చుకొనే ఒప్పందాలకు ప్రాతిపదికలు ఏమిటో బహిర్గతం కాలేదు.మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం జెరూసలెంతో సహ పశ్చిమ గట్టు, గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న ప్రాంతాలను పాలస్తీనాకు బదలాయిస్తేనే రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలను నెలకొల్పుకొనేందుకు అవకాశం ఉందని సౌదీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఉగ్రవాదులైన ఇజ్రాయెల్‌ మంత్రులు, యంత్రాంగానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ కారణంగానే హమస్‌ సాయుధులు క్షిపణులతో సహా గాజా కంచెను దాటి ఇజ్రాయెల్‌ ప్రాంతంలోకి ప్రవేశించి దాడులు చేసేందుకు కావాలనే అవకాశం ఇచ్చారని, దాడులను సాకుగా చూపి ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఒప్పందాన్ని అడ్డుకోవాలన్నది ఒక కుట్ర కోణం. దాడి జరిగిన ఐదు గంటల తరువాత మాత్రమే ఇజ్రాయెల్‌ భద్రతాదళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.ఈ కుట్రను అర్ధం చేసుకోలేని హమస్‌ వచ్చిన అవకాశాన్ని దాడికి ఉపయోగించుకున్నట్లు కొందరు చెబుతున్నారు.


గాజాపై దాడికి ఇజ్రాయెల్‌ పూనుకున్న పూర్వరంగంలో పశ్చిమాసియాలో పర్యవసానాలు, చైనా పాత్ర గురించి కూడా విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్‌తో ఒప్పందాన్ని సౌదీ పక్కన పెట్టినట్లు, ఇరాన్‌తో సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజా పరిస్థితికి బాధ్యత ఇజ్రాయెల్‌దే అన్న సౌదీ, పరిణామాలను దగ్గరగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది, హమస్‌ చర్యను ఖండించలేదు. గతంలో ఇజ్రాయెల్‌ను హెచ్చరించినట్లు కూడా పేర్కొన్నది. ఈ స్పందన మీద అమెరికా మండిపడింది. తమతో సాధారణ సంబంధాలను కోరుకోవాలనుకొనే వారి నుంచి రావాల్సిన సాధారణ ప్రకటన ఇలా ఉండకూడదని వ్యాఖ్యానించింది.ఉప్పు-నిప్పుగా ఉన్న సౌదీ-ఇరాన్‌లను ఒక దగ్గరకు చేర్చి సంబంధాల ఏర్పాటుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా మధ్యవర్తిత్వం వహించింది.బ్రిక్స్‌ కూటమిలోకి ఈజిప్టు, సౌదీ, యుఏఇ, ఇరాన్‌లను తెచ్చేందుకు కూడా చూస్తున్నది. ఈ పూర్వరంగంలో చైనా నుంచి దూరంగా జరిగితే పౌర అణు కార్యక్రమంలో భాగంగా ఒక విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మిస్తామని అమెరికా ఇటీవల సౌదీకి ఒక బిస్కెట్‌ వేసింది. గత కొన్ని దశబ్దాలుగా అమెరికా మిత్ర దేశంగా ఉన్నప్పటికీ గతంలో అలాంటి ప్రతిపాదన చేయలేదు. ఇరాన్‌తో కుదిరిన మైత్రిని దెబ్బతీసేందుకు పావులు కదుపుతోంది. మరోవైపున మధ్య ప్రాచ్యంలో తన పట్టుతగ్గలేదని, తనను ఎదిరిస్తే అంతుచూస్తానని బెదిరించేందుకు రెండు విమానవాహక యుద్ద నౌకలను, యుద్ధ ఓడలను ఆ ప్రాంతానికి పంపింది. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థంగా ఉన్న మన దేశం ఇప్పుడు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది.


చైనా వైఖరిని ఇజ్రాయెల్‌, అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాలు జీర్ణించుకోకపోగా మండిపడుతున్నాయి. తటస్థం అంటే ఇజ్రాయెల్‌ వ్యతిరేక వైఖరిని తీసుకోవటంగా చిత్రిస్తున్నాయి. అరబ్‌ దేశాల్లో తనకు అనుకూలమైన స్థితిని సృష్టించుకొనేందుకు చూస్తున్నదని, తన ప్రపంచ అజండాను ముందుకు తీసుకుపోవటంలో ఇది భాగమని ఉక్రోషం వెల్లడిస్తున్నాయి.ఒకవైపున జనాలను వీధుల్లో హతమారుస్తున్నపుడు దాని గురించి మాట్లాడకుండా పాలస్తీనా ఏర్పాటు గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పాలస్తీనా పాలనా మండలి అధ్యక్షుడు అబ్బాస్‌ను ఒక దేశాధినేత హౌదాలో చైనా ఆహ్వానించింది. పాలస్తీనా పౌరుల న్యాయమైన జాతీయ హక్కులకు మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ ప్రధానిని కూడా చైనా ఆహ్వానించింది. పాలస్తీనా పౌరులహక్కులను హరించినందుకు గాను గతంలో దౌత్య సంబంధాలు పెట్టుకొనేందుకు నిరాకరించిన చైనా ఇటీవలి కాలంలో వైఖరిని మార్చుకొని అటు పాలస్తీనా ప్రతినిధులతో పాటు ఇటు ఇజ్రాయెల్‌తో కూడా సంబంధాలను నిర్వహిస్తున్నది. మరోవైపున చైనా మీడియాలో అమెరికా పాత్రను ఎండగడుతూ విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఒక వైపున అరబ్‌ దేశాలను ఇజ్రాయెల్‌కు దగ్గర చేసేందుకు, మరోవైపున యూదు దురహంకారులకు మద్దతు ఇస్తూ పాలస్తీనియన్ల మీద భరించరాని వత్తిడిని అమెరికా పెంచుతున్నదని, ఒకవైపు కొమ్ముకాస్తున్నదని పేర్కొంటున్నారు. చైనా పశ్చిమాసియా తాజా వివాదంలో తటస్థంగా ఉంది. ఉభయ పక్షాలు శాంతం వహించాలని కోరింది తప్ప హమస్‌ను ఖండించలేదు. మావో కాలం నుంచీ పాలస్తీనా పక్షమే వహిస్తున్నది. ఆత్మ రక్షణ పేరుతో తన దాడులను ఇజ్రాయెల్‌ సమర్ధించుకుంటున్నది.చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్‌ బిన్‌ ఫర్హాన్‌తో మాట్లాడుతూ ఆత్మ రక్షణ పరిధికి మించి ఇజ్రాయెల్‌ చర్యలు ఉన్నాయి.అది అంతర్జాతీయ పిలుపులను వినాలి, గాజా పౌరులందరినీ శిక్షించాలని చూస్తున్న చర్యలను ఐరాస ప్రధాన కార్యదర్శి నిలిపివేయించాలని, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడాలని కూడా చైనా మంత్రి స్పష్టం చేశాడు. చైనా ఇస్తున్న గట్టి మద్దతు అరబ్‌ ప్రపంచంలో పాలస్తీనీయన్లకు మరింత బలాన్ని ఇస్తుందని, అరబ్‌ దేశాలు వారి వైపున నిలిచే అవకాశం ఉందని, చైనా కోరుకుంటోంది కూడా అదేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా తటస్థత అంటూ రష్యా దాడులను ఖండించలేదని మరోవైపున దానితో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకుందని పశ్చిమదేశాల విశ్లేషకులు చైనా మీద మండిపడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌పై హమస్‌ దాడులకు కారణం ఏమిటి ! ఆజ్యం పోస్తున్న అమెరికా కూటమి !!

11 Wednesday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, International, NATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, China, Gaza, Hamas, Israel, Joe Biden, Narendra Modi Failures, Palestinian People, RSS, USS Gerald R Ford


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనా సమరయోధుల సంస్థ హమస్‌- ఇజ్రాయెల్‌ మధ్య మరోసారి చెలరేగిన పోరు ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందా అని ఒకవైపు ప్రపంచం ఆందోళన చెందుతుంటే మరోవైపు అమెరికా స్టాక్‌మార్కెట్‌లో ఆయుధ ఉత్పత్తి కంపెనీల వాటాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూడటం అంటే ఇదే. గత మూడు సంవత్సరాల్లో ఎంతగా లేనంతగా సోమవారం ఒక్కరోజే ఎనిమిది శాతం ఎగువకు దూసుకుపోయాయంటే తమకు లాభాల పంట పండుతుందని మదుపుదార్లు వాటాల కొనుగోలు ఎగబడిన ఫలితమే అది. ఇజ్రాయెల్‌కు మరింతగా సాయం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించటంతో ఆయుధ కంపెనీలకు చేతినిండా పని అన్నది తెలిసిందే. తాజా పరిణామాల్లో అటూ ఇటూ పెద్ద ఎత్తున జననష్టం, ఆస్థి విధ్వంసం గురించి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. తక్షణమే దాడులు నిలిపివేయాలన్న అభిప్రాయం వెల్లడి అవుతోంది. ఎవరు ముందు ప్రారంభించారు, ఎవరు ప్రతిఘటిస్తున్నారు అన్న విచక్షణలోకి పోతే పైకి హమస్‌ దాడులు కనిపించవచ్చుగానీ అంతకు ముందు ఇజ్రాయెల్‌ చేసిన దారుణాలు తక్కువేమీ కాదు.ఇది ప్రారంభం కాదు, అంతమూ కాదు. ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామాలకు కారణాలు ఏమిటన్నది చూద్దాం. ఒకటి పాలస్తీనా ఏర్పాటును అడ్డుకోవటమే కాదు, ఐరాస దానికి కేటాయించిన ప్రాంతాలను క్రమంగా ఆక్రమించుకుంటున్న ఇజ్రాయెల్‌, దానికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాల వైఖరి ఒకటైతే, తక్షణ కారణాలేమిటన్నది మరొక అంశం. తాజాగా తలెత్తిన వివాదానికి అమెరికా మరింతగా ఆజ్యం పోస్తున్నది, ఇజ్రాయెల్‌కు మద్దతుగా మధ్యధరా సముద్రానికి తన సప్తమ నౌకా దళం, జెట్‌ యుద్ధ విమానాలను పంపుతున్నది. మధ్యవర్తిగా ఉన్న ఒక దేశం ఇలా ఒకపక్ష కొమ్ముకాయటం దుర్మార్గం.


పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదంలో జరూసలెం పట్టణం ఎవరికి చెందాలన్నది ఒక అంశం. ఇటీవలి వరకు టెల్‌ అవీవ్‌లో ఉన్న తన ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించాలని అమెరికా నిర్ణయించటం ఏకపక్షం, పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమిస్తున్న ఇజ్రాయెల్‌ దుర్మార్గానికి మద్దతు ఇవ్వటమే. ఇంకా అమెరికా కనుసన్నలలో నడిచే అనేక దేశాలు అదే మాదిరి తమ కార్యాలయాలను కూడా జెరూసలెంకు తరలించాలని చూడటం యూదుల ఆక్రమణలను శాశ్వతం చేసే కుట్రలో భాగమే. జెరూసలెంలోని చారిత్రాత్మక అల్‌ అక్సా మసీదును ఆక్రమించుకొనేందుకు ఇజ్రాయెల్‌ పూనుకోవటమే తాజాగా హమస్‌ను దాడులకు పురికొల్పిందని చెప్పవచ్చు. 2021 ఏప్రిల్‌లో రంజాన్‌, యూదుల పండుగ పాసోవర్‌ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ముస్లిమేతరులు ఆ మసీదు ప్రాంగణాన్ని సందర్శించాలంటే అనుమతి తీసుకోవాలి. ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో మసీదు పరిసరాలను ఆక్రమించిన యూదులు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాసోవర్‌ పండగ సందర్భంగా ప్రాంగణాన్ని దురాక్రమించి ప్రార్ధనలు జరిపారు. ఏప్రిల్‌ 14వ తేదీన ఇజ్రాయెల్‌ పోలీసులు బలవంతంగా ప్రవేశించి మసీదులో ఉన్న మైకుల వైర్లను తెంచివేశారు.ఎందుకు అంటే మసీదు పక్కనే జరుగుతున్న ఇజ్రాయెలీ అధ్యక్షుడి కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని సాకు చెప్పారు. తరువాత రెండు రోజులకు పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ పోలీసుల ఆంక్షలను తోసిపుచ్చి వేలాది మంది చేరి ప్రార్ధన చేశారు. మరుసటి నెలలో యూదు దురాక్రమణదార్లు పాలస్తీనియన్ల మీద జరిపిన దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. అదే ఏడాది ఇజ్రాయెల్‌ – హమస్‌ మధ్య పదకొండురోజుల పాటు దాడులు ప్రతిదాడులు జరిగాయి. గతేడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెలీ దళాలు ప్రవేశించి పాలస్తీనియన్ల మీద దాడులు చేశాయి. మసీదులో తిష్టవేసిన వారు తమ మీద రాళ్లు వేసినట్లు సాకు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఐదున కూడా ఇజ్రాయెల్‌ దళాలు మసీదు మీద దాడి జరిపాయి. మసీదులో ఉన్నవారు రాళ్లు విసిరినట్లు పాత కథనే తిరిగి వల్లించారు. అప్పటి నుంచి ఏదో ఒక సాకుతో అల్‌ అక్సా మసీదు, పరిసరాల్లో ఉన్న పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు ఇజ్రాయలీలు రెచ్చగొడుతుండటమే ఈనెల ఆరున హమస్‌ దాడులకు కారణంగా చెబుతున్నారు. యాభై సంవత్సరాల క్రితం 1973 అక్టోబరు ఆరున ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలపై అరబ్బులు ఆకస్మికంగా దాడులు జరిపారు. నాటి ఉదంతాల గురించి ఇజ్రాయెలీ మీడియాలో గత కొద్ది రోజులుగా పాలస్తీనియన్లను రెచ్చగొడుతూ వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.దాన్లో భాగంగానే సిమ్‌చాట్‌ తోరా పేరుతో యూదులు పండుగ చేసుకుంటున్న పూర్వరంగంలో దాడులకు ఆక్టోబరు ఆరవ తేదీనే హమస్‌ కూడా ఎంచుకున్నదని, ” ఆపరేషన్‌ అల్‌ అక్సా ఫ్లడ్‌ ” పేరు పెట్టినట్లు చెబుతున్నారు. దీని గురించి ఇజ్రాయెలీ గూఢచారులు ఏ మాత్రం పసిగట్టలేకపోయారు. తాడిని ఎక్కేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడు.


ఆయుధాలతో అరబ్బులను బెదిరించి వారి ప్రాంతాలను ఆక్రమించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న బ్రిటీష్‌ పాలకుల చర్యలను 1938లోనే గాంధీ మహత్ముడు హరిజన్‌ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో వ్యతిరేకించారు.యూదులు ఏదేశంలో ఉంటే అదే వారి మాతృదేశం అవుతుందని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా 1948లో పాలస్తీనాలో కొన్ని ప్రాంతాలను గుర్తించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. తరువాతే అసలు కుట్ర బయటపడింది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించి తన రక్షణకు అవి అవసరమంటూ నాటి నుంచి నేటి వరకు అసలు పాలస్తీనా ఉనికినే లేకుండా చేసింది ఇజ్రాయెల్‌. అంతకు ముందు ఎక్కడెక్కడో ఉన్న యూదులందరినీ సమీకరించి బ్రిటీష్‌ పాలకులు అక్రమంగా పాలస్తీనాలో ప్రవేశపెట్టారు. వారికి ఆయుధాలతో శిక్షణ, నిధులు అందచేశారు.ఐరాస చేసిన విభజన తీర్మానాన్ని పాలస్తీనా అంగీకరించలేదు. ఇతర దేశాల్లోని యూదులను చేర్చటంతో అప్పటి వరకు పాలస్తీనాలో 90శాతంగా ఉన్న అరబ్బులు 67శాతానికి తగ్గారు. సారవంతమైన ప్రాంతాలతో సహా పాలస్తీనాలో 55శాతాన్ని యూదులకు కేటాయిస్తూ విభజన పధకంలో చేర్చారు. అరబ్బులకు 42శాతం, మూడుశాతం విస్తీర్ణంలో ఉన్న జెరూసలేం ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యవేక్షణలో ఉంచేందుకు నిర్ణయించారు.ప్రస్తుతం పశ్చిమ గట్టు, గాజా పాలస్తీనా పాలిత ప్రాంతాలుగా పేరుకు 23శాతం విస్తీర్ణంలో ఉన్నప్పటికీ వాటిలో కూడా ఇజ్రాయెల్‌ ఆక్రమణలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పాలస్తీనాను విభజించినపుడు ఏడున్నరలక్షల మంది అరబ్బులు నిర్వాసితులై విదేశాలకు శరణార్ధులుగా వెళ్లారు. గడచిన 75 సంవత్సరాల్లో వారి వారసుల సంఖ్య అరవైలక్షలకు పెరిగింది. వారంతా పాలస్తీనాలోని కొన్ని శిబిరాలు, ఈజిప్టు, లెబనాన్‌, జోర్డాన్‌, సిరియాల్లో తలదాచుకుంటున్నారు.
తాజాగా హమస్‌ దాడుల గురించి పశ్చిమ దేశాల వార్తా సంస్థలు ఇచ్చిన వార్తల్లో వారి ఆధీనంలో ఉన్న గాజా ప్రాంతంలో వంద మంది ఐరోపావాసులు బందీలుగా ఉన్నట్లు పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చాయి. ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న వేలాది మంది తమవారిని విడిచిపెడితే వారిని తాము కూడా స్వదేశాలకు పంపుతామని హమస్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.పశ్చిమ దేశాలు, అక్కడి మీడియాను అనుసరించే మన దేశంలోని కొందరు హమస్‌ను ఉగ్రవాదులుగానూ, ఇజ్రాయెల్‌ను ప్రజాస్వామిక శక్తిగా చిత్రిస్తున్నారు. ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న తమ దేశాన్ని విముక్తి కావించేందుకు అనేక శక్తులు అనేక పద్దతుల్లో పోరాడుతున్నాయి. పాలస్తీనా విమోచనా సంస్థ యాసర్‌ అరాఫత్‌నే ఉగ్రవాదిగా చిత్రించిన వారు హమస్‌ను మరొక విధంగా పేర్కొంటారని అనుకోలేము.హమస్‌ గాజా ప్రాంతంలో అధికారంలో ఉంది.అది సాయుధపోరాటాన్ని ఒక మార్గంగా ఎంచుకుంది. పశ్చిమ దేశాల మద్దతు, బలమైన మిలిటరీ ఉన్న ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని సందర్భాల్లో గెరిల్లా పద్దతిలో దాడులు జరుపుతుంది. మన దేశ చరిత్రలో శివాజీ కూడా ఔరంగజేబు సేనల మీద, అల్లూరి సీతారామ రాజు బ్రిటీష్‌ వారి పాలకుల మీద గెరిల్లా పద్దతిలో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. వారిని ఉగ్రవాదులందామా ? బ్రిటీష్‌ వారు భగత్‌ సింగ్‌నే ఉగ్రవాది అని నిందించిన సంగతి తెలిసిందే.


చరిత్రలో హిట్లర్‌ మూకలు యూదులను నిర్బంధ శిబిరాల్లో చిత్రహింసలు పెట్టి చంపిన దారుణ మారణకాండను ప్రపంచం చూసింది. గాజా ప్రాంతంలో ఇరవైలక్షల మందికి పైగా అరబ్బులు నివశిస్తున్నారు. ప్రపంచంలో అదొక పెద్ద జైలు అంటే అతిశయోక్తి కాదు. అక్కడి జనం బయటకు రావాలన్నా, పరిసరాల్లో పనిపాటలు చేసుకోవాలన్నా ఇజ్రాయెల్‌ మిలిటరీ అనుమతి తీసుకోవాల్సిందే. తనిఖీ లేందే జనాలను కదలనివ్వరు.హమస్‌ దాడులకు ముందే ఇజ్రాయెల్‌ పోలీసులు 5,250 మంది పాలస్తీనియన్లను బందీలుగా ఉంచుకున్నారు, వారిలో 170 మంది పిల్లలు కూడా ఉన్నారు. వీరి గురించి మీడియా, పశ్చిమ దేశాల మానవతావాదులు పట్టించుకోరు. ఉగ్రవాదం మీద దాడులు చేయండి తప్ప పాలస్తీనియన్ల మీద కాదంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏడున్నర దశాబ్దాలుగా దాడులు చేస్తున్నది సామాన్యజనం మీదనే అన్న వాస్తవాన్ని దాచేందుకే ఈ పదజాలం.పాలస్తీనా వాసులు పోరులోనే పుట్టి ,పోరులోనే పెరిగి ,పోరులోనే మరణిస్తున్నారు. అంతకంటే వారికి పోయేదేమీ లేదు. వారి మాతృదేశ కాంక్ష మరింతగా పెరుగుతుందే తప్ప నిర్భంధంతో అణిగేది కాదు. జెరూసలెంతో సహా అరబ్బులకు నిర్దేశించిన ప్రాంతాలను పూర్తిగా తిరిగి వారికి అప్పగించకుండా, వారి ప్రాంతాలలో యూదుల నివాసాలను ఖాళీ చేయించకుండా సమస్య పరిష్కారం కాదు. పాలస్తీనియన్ల మాతృదేశ కాంక్ష తీరదు.


ఇప్పటికే మాతృగడ్డమీద దశబ్దాల తరబడి బందీలుగా మారిన పాలస్తీయన్ల భవితవ్యం గురించి ఒకవైపు ప్రపంచం ఆలోచిస్తుంటే మరోవైపు వారిని మరింతగా అణచివేసేందుకు అవసరమైన ఆయుధాలను అమ్ముకొనేందుకు అమెరికా పూనుకుంది. ఇజ్రాయెల్‌ మీద దాడి చేసినందుకు ప్రతీకారంగా పాలస్తీనాకు అందచేస్తున్న సాయాన్ని సమీక్షించే నెపంతో ఐరోపా నిలిపివేసింది. అదే పాలస్తీనా మీద యుద్ద విమానాలతో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. యూదుల అణచివేతను ఆయుధంగా చేసుకొని హిట్లర్‌ మారణకాండకు పాల్పడ్డాడు. అదే యూదులకు మాతృదేశాన్ని ఏర్పాటు చేయాలనే సాకుతో పశ్చిమాసియాలో ఉన్న చమురు, ఇతర సహజ సంపదలను ఆక్రమించాలని చూసిన బ్రిటన్‌, అమెరికా తదితర పశ్చిమ దేశాలు అందుకోసం తమ తొత్తుగా పనిచేసే ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న ఎత్తుగడలను ప్రపంచం చూసింది.ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థవిధానాన్ని అనుసరించిన మనదేశం పశ్చిమాసియాలోనే కాదు, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను ఖండించాల్సిందిపోయి ఇప్పుడు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది. ఇది గడచిన ఏడుదశాబ్దాలుగా అనుసరిస్తున్న మన విదేశాంగ విధానానికే విరుద్దం. నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరి బిజెపితో సహా సంఘపరివార్‌ సంస్థల ముస్లిం వ్యతిరేకతకు ప్రతిబింబం తప్ప మరొకటి కాదు. ఇలాంటి వైఖరితో తలెత్తే పర్యవసానాల గురించి ఎవరెన్ని హెచ్చరికలు చేసినా, సుద్దులు చెప్పినా పట్టించుకోకపోవటం విచారకరమే కాదు గర్హనీయం.స్వాతంత్య్రపోరాటంలో భాగస్వామ్యం లేకపోవటమే కాదు దానికి వ్యతిరేకంగా పని చేసిన శక్తుల వారసులు పాలస్తీనియన్ల మాతృదేశ విముక్తి వాంఛ, దురాక్రమణ వ్యతిరేక పోరాటాన్ని అర్ధం చేసుకొంటారని భావించటం అత్యాశే అవుతుంది. ఇజ్రాయెల్‌ను సమర్ధిస్తున్న అమెరికా తదితర దేశాల వైఖరిని యావత్‌ శాంతి శక్తులు ఎలుగెత్తి ఖండించాలి, పాలస్తీనా విముక్తికి పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పతకాలు తెచ్చిన భారత ఆసియాడ్‌ క్రీడాకారులకు అభినందనలు – ఆటలను పట్టించుకోని పాలకులకు అక్షింతలు !

08 Sunday Oct 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Sports

≈ Leave a comment

Tags

Asian Games 2023, BJP, China, First Asian Games, Hangzhou Asian Games, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


చైనాలోని హాంగ్‌ఝౌలో శనివారం నాడు ముగిసిన పందొమ్మిదవ ఆసియాడ్‌లో మన క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. పతకాల వేటలో గత 70 రికార్డును అధిగమించి వంద పతకాలను సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో వెళ్లి 107 పతకాలతో తిరిగి వచ్చినందుకు యావత్‌ దేశం వారిని అభినందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలను తెచ్చి దేశ కీర్తిపతాకను సమున్నతంగా ఎగురవేయాలని ఆశిస్తోంది.నాలుగేండ్లకు ఒకసారి జరుగుతున్న ఆసియా క్రీడలు చైనాలో కరోనా నిరోధ చర్యల కారణంగా 2022లో జరగాల్సినవి ఈ ఏడాది నిర్వహించారు. 2026లో జపాన్‌లోని ఇచి, నాగోయా నగరాల్లో జరగనున్నాయి. మన క్రీడాకారులు 28 బంగారు,38 రజిత, 41 కాంస్య పతకాలను సాధించారు. వీటిలో కొన్ని అనూహ్య పతకాలు ఉన్నాయి. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా తరువాత నాలుగవ స్థానంలో మన దేశం ఉంది.జనాభాతో, ఆర్థికంగా చైనాతో పోటీపడుతున్న మనం క్రీడల్లో ఎందుకు పోటీలో లేము అని ఎవరైనా అనుకోవచ్చు.దానికి ఏడున్నర దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న పార్టీలు, వాటి నేతలు తప్ప క్రీడాకారులు కాదు. అధికారం నిలుపుకోవటం మీద ఉన్న యావ యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలన్నదాని మీద ఏ మాత్రం లేదు. పోటీలకు ముందు రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌ (బిజెపి ఎంపీ ) నిర్వాకం, క్రీడాకారుల ఆందోళన గురించి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తన ఎంపీని కాపాడుకొనేందుకు ఇచ్చిన ప్రాధాన్యత పోటీల్లో పాల్గొనేవారి పట్ల చూపలేదు. అందుకే చివరికి ఫెడరేషన్‌ లేదు, జాతీయ శిక్షణా శిబిరాలు లేవు, అంతర్జాతీయ శిక్షకులు లేరు, అయినప్పటికీ తాజా క్రీడల్లో వారు ఒక వెండి, నాలుగు కాంస్య పతకాలను సాధించారు.మరికొన్ని క్రీడలకు సంబంధించిన వివాదాల కారణంగా చివరి వరకు ఎంపికలు జరగలేదంటే మన యాజమాన్య నిర్వహణ ఎంత అసమర్ధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఈక్వెస్ట్రియన్‌ పోటీలో పాల్గొనాలంటే క్రీడాకారులతో పాటు గుర్రాలను కూడా తీసుకుపోవాల్సి ఉంటుంది. క్వారంటైన్‌ నిబంధనల కారణంగా భారత గుర్రాలను చైనా అనుమతించటం లేదనే కీలక అంశాన్ని తన దగ్గర దాచారని క్రీడాకారుడు గౌరవ్‌ పుందిర్‌ చెప్పాడు. తీరా తెలుసుకున్న తరువాత ఐరోపా, మరోచోట తగిన గుర్రాల కోసం వెళ్లేందుకు, శిక్షణ పొందేందుకు తనకు అవకాశం లేకుండా పోయిందని, ఎంపిక విధానాన్ని కూడా మార్చారని వాపోయాడు. పోటీలకు వెళ్లకుండా తనను అడ్డుకోవటమే ఫెడరేషన్‌ అధికారుల ఎత్తుగడగా కనిపించిందని ఆరోపించాడు. పతకాలు వచ్చిన వారికి బహుమతులు ఇచ్చి గొప్పలు చెప్పుకోవటం కాదు కావాల్సింది. ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ సౌకర్యాలు, క్రీడలనే ఆలంబనగా చేసుకున్న వారు జీవితంలో స్థిరపడేందుకు ఇచ్చే చేయూతను బట్టే యువతరం ముందుకు వస్తుంది. ఇప్పుడు వచ్చిన పతకాల కీర్తి కూడా క్రీడాకారుల తపనకు, వారిని ప్రోత్సహించిన తలిదండ్రులకు తప్ప మరొకరికి దక్కదు. ఈ క్రీడల్లో కొన్ని అనూహ్య పతకాలను మన దేశానికి సాధించటం సంచలనం కలిగించింది.


1951లో మనదేశమే తొలి ఆసియాడ్‌కు ఆతిధ్యమిచ్చింది.నాడు 17 దేశాల వారు 489 మంది పాల్గొంటే ఇప్పుడు 41కి, పోటీలు 57 నుంచి 481 అంశాలకు పెరిగాయి. చైనా 1962 నుంచి మాత్రమే పాల్గొంటున్నది.ఇప్పటి వరకు వివిధ దేశాలు సాధించిన బంగారు పతకాల సంఖ్య ఇలా ఉంది. బ్రాకెట్లలో ఉన్నవి మొత్తం పతకాల సంఖ్య) చైనా 1,674 ( 3,570, జపాన్‌ 1,084( 3,240), దక్షిణ కొరియా 787 (2,425), ఇరాన్‌ 193 (611), భారత్‌ 183( 779).తొలి ఆసియన్‌ గేమ్స్‌ జరిగిన తీరు చూస్తే అసలు నిర్వాహకులు ఎంత ఇబ్బంది పడింది, అధికారంలో ఉన్నవారికి క్రీడల పట్ల శ్రద్దలేమి స్పష్టంగా కనిపించింది. నాటి నుంచి నేటి వరకు ఉత్సాహవంతులైన వారి చొరవే ప్రధానంగా కనిపించింది. తొలి క్రీడల్లో జపాన్‌ 24 బంగారు పతకాలతో మొత్తం 58 పొందగా రెండవ స్థానంలో మన దేశం 15 స్వర్ణాలతో 51 పతకాలు సాధించింది. తరువాత 1962లో జపాన్‌ 73 స్వర్ణాలతో ముందుండగా పదింటితో రెండవ స్థానంలో మన దేశం ఉండటం తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం రెండవ స్థానానికి ఎదగలేదు. టెహరాన్‌ 1974 క్రీడలలో చైనా 32 స్వర్ణాలతో రెండవ స్థానంలోకి వచ్చింది. తరువాత 1982లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియాడ్‌లో తొలిసారిగా 61 పతకాలతో జపాన్ను వెనక్కు నెట్టి మొదటి స్థానానికి వచ్చిన చైనా అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూడలేదు.1990లో తొలిసారిగా చైనాలో ఆసియా క్రీడలు జరిగాయి.183 బంగారు, మొత్తం 341 పతకాలతో చైనా క్రీడాకారులు అదరగొట్టారు. తాజా పోటీలలో 200 స్వర్ణ, 111 రజత, 71 కాంస్యాలతో మొత్తం 382 పతకాలను సాధించింది.


1896 నుంచి 2020 వరకు జరిగిన ఒలింపిక్స్‌లో మనదేశం నిరాశాజనక ప్రతిభనే కనపరిచింది.2024లో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో మంచి ప్రతిభ కనపరచాలని కోరుకుందాం. 2020లో జరగాల్సిన టోకియో ఒలింపిక్స్‌ మరుసటి ఏడాది జరిగాయి. వాటిలో 39 స్వర్ణాలు, మొత్తం 113 పతకాలతో అమెరికా, 38 స్వర్ణాలు, మొత్తం 89తో చైనా, 26 స్వర్ణాలు, మొత్తం 57 పతకాలతో జపాన్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మన దేశం ఒక స్వర్ణం, మొత్తం ఏడు పతకాలతో 48వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన 32 పోటీల్లో ఐదు స్థానాలో అధిక పతకాలు తెచ్చుకున్న తొలి దేశాల వివరాలు ఇలా ఉన్నాయి. సోవియట్‌ యూనియన్‌కు వెయ్యికిపైగా పతకాలు వచ్చినప్పటికీ అది ఉనికిలో లేనందున దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చైనా ఆలశ్యంగా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిందన్న అంశాన్ని గమనలో ఉంచుకోవాలి.1984 లాస్‌ ఏంజల్స్‌ పోటీల నుంచి పాల్గొంటున్నది.
దేశం×××× స్వర్ణం ××రజతం×× కాంస్య××× మొత్తం
అమెరికా × 1,061×× 830 ×× 738××× 2,629
బ్రిటన్‌ ××× 284 ×× 318 ×× 314 ××× 916
ఫ్రాన్స్‌×××× 223 ×× 251×× 277 ××× 751
జర్మనీ×××× 201 ×× 207 ×× 247 ××× 655
చైనా ×××× 263 ×× 199 ×× 174 ××× 636
ఇటలీ ×××× 217 ×× 188 ×× 213 ××× 618
భారత్‌ ×××× 10 ×× 9 ×× 16 ××× 35


క్రీడలకు రాజకీయాలు ఉండవు. రాజకీయ కారణాలతో కొన్ని దేశాలు కొన్ని పోటీలను బహిష్కరించిన ఉదంతాలు ఉన్నాయి. చైనాతో జనాభాను అధిగమించిన మనం క్రీడల్లో ఎందుకు దూసుకుపోలేకపోతున్నాం అన్నది ప్రశ్న. మన దేశంలో పిల్లలతో ఆటలాడించేందుకు స్థలాల్లేకుండానే పాఠశాలలకు అనుమతులిస్తున్నారు. ఎన్ని స్కూళ్లలో క్రీడోపాధ్యాయులు ఉన్నారు. ఎన్ని చోట్ల ఆటలాడిస్తున్నారు, అవసరమైన కనీస పరికరాలు ఎన్ని చోట్ల ఉన్నాయి అన్నది రోజు మనం చూస్తున్నదే.కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఒకే విధంగా ఉన్నాయి. పిండికొద్దీ రొట్టె అన్నారు. క్రీడల మీద మనం చేస్తున్న ఖర్చు ఎంత ? మాజీ అధ్లెట్‌, 2018లో కేంద్ర మంత్రిగా ఉన్న రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాధోడ్‌ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ 2017-18లో కేంద్ర క్రీడల బడ్జెట్‌ రు.1,329 కోట్లని, 2011 జనాభా లెక్కల ప్రకారం రోజుకు తలకు ఒక్కరి మీద మూడు పైసలు క్రీడలకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.ఆ వార్తను ప్రచురించిన స్పోర్ట్స్‌ క్రీడా డాట్‌ కామ్‌ చైనా డైలీలో వచ్చిన సమాచారం ప్రకారం చైనా ప్రభుత్వం ఏటా 316.5బిలియన్‌ యువాన్లు ఖర్చు చేస్తున్నదని దాన్ని రూపాయల్లో మారిస్తే మూడులక్షల కోట్లని(2018 జనవరి 9) పేర్కొన్నది. ఈ ఏడాది మార్చి 28వ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో వచ్చిన వార్త ప్రకారం 2007-08లో మన కేంద్ర బడ్జెట్‌లో రు.708 కోట్లు కేటాయించారని తరువాత కామన్‌వెల్త్‌ క్రీడలు ఉన్నందున 2009-10లో రు.3,760, మరుసటి ఏడాది రు.2,841కోట్లుగా ఉందని 2015-16లో రు.1,121 కోట్లకు తగ్గింది. ఖేలో ఇండియా కార్యక్రమం ప్రకటించిన తరువాత 2019-20లో రు.2,636 కోట్లు కేటాయించారు. కరోనాలో రు.1,800 కోట్లకు తగ్గించారు.2023-24 బడ్జెట్‌లో రు.3.397 కోట్లు కేటాయించగా దానిలో ఖేలో ఇండియాకు వెయ్యికోట్లు పక్కన పెట్టారు.ఈ మొత్తం 140 కోట్ల జనాభాకు తలకు ఏటా రు.24 అవుతుంది. బ్రిటన్‌లో 2022-23లో తలకు రు.4,898, ఆస్ట్రేలియాలో రు.976 ఖర్చు చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏటా కేటాయిస్తున్న మొత్తాలు రూపాయలలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. కానీ ఎంత పెరిగినప్పటికీ మొత్తం బడ్జెట్‌లో వాటా 0.6 నుంచి 0.8శాతం మధ్యనే ఉంటోంది. మన దేశంలో ఇంత తక్కువ ఖర్చు పెడితే క్రీడాకారులు ఎలా తయారవుతారు, పతకాలు ఎలా వస్తాయి ? పోనీ ప్రతిభ గలవారికి కొరత ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిన్న దేశం మాల్దీవుల ఎన్నికలు – చైనాకు అనుకూలమా ? భారత్‌ ఎదురు దెబ్బా !

04 Wednesday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, Maldives election 2023, Maldives presidency, Mohamed Muizzu, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మాల్దీవులు,ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటి. ఆసియాలో రెండవది. కేవలం ఐదు లక్షల 21వేల జనాభా మాత్రమే కలిగిన ఈ దేశం ఇప్పుడు ప్రపంచ మీడియాలో పెద్ద స్థానాన్ని ఆక్రమించింది.కారణం గతనెల 30న అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. వాటి మీద ప్రపంచ మీడియాలో వచ్చిన కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి.” మాల్దీవుల ఎన్నికల్లో మహమ్మద్‌ ముయిజ్జు గెలుపు చైనా అనుకూల శిబిరానికి విజయం ” భారత్‌కు మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఒక దౌత్యసవాలుకు ప్రతినిధి ” ” చైనా చెవులకు సంగీత విందు ” ” భారత్‌ వెళ్లిపోవాలంటున్న మాల్దీవుల చైనా అనుకూల నూతన అధ్యక్షుడు ” ఇలా పదజాలాల్లో మార్పు ఉన్నప్పటికీ స్పందన స్వభావమిది.హిందూ మహా సముద్రంలో మనదేశం, శ్రీలంకకు 750 కిలోమీటర్ల దూరంలో ఈ దేశం ఉంది. నామమాత్రంగా క్రైస్తవులు తప్పు నూటికి నూరుశాతం ముస్లింలు ఉన్న 1,200 చిన్నా పెద్ద దీవుల దేశానికి ఎవరితోనూ సరిహద్దు తగాదాలు లేవు. దేశ రాజధాని మాలె దీవిలో దేశంలోని సగం జనాభా ఉంది. చైనా నుంచి విమాన మార్గం 4,900 కిలోమీటర్ల దూరం ఉంది. సముద్ర మార్గంలో 4,682 నాటికల్‌ మైళ్లు లేదా 8,670 కిలోమీటర్ల దూరంలో ఉంది.ప్రపంచంలో ఏ దేశమూ మరొక దేశాన్ని విశ్వసించక పరస్పరం అనుమానంతో చూస్తున్న అంశం తెలిసిందే. ప్రాంతీయ, ప్రపంచ యుద్దాలు తలెత్తితే సముద్రాల్లోని ఒక చిన్న దీవి, దాని మీద పెత్తనం లేదా ఎవరి ప్రభావంలో ఉంది అన్న అంశం కూడా ఎంతో కీలకమైనదే. అందువల్లనే ఆయా దేశాల మిలిటరీ వ్యూహకర్తలు రూపొందించిన ప్రణాళికలు, ఎత్తుగడల ప్రకారం ఇరుగు పొరుగు, దూరంగా ఉన్న దేశాలు కూడా సంబంధాలను నిర్వహిస్తుంటాయి. అలాంటి కీలక ప్రాంతాలలో ఒకటిగా మాల్దీవులు ఉన్న కారణంగానే అక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ప్రపంచం జాగ్రత్తగా గమనిస్తుంది.


ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇబ్రహీం మహమ్మద్‌ సాలి 2018లో అధికారానికి వచ్చాడు. అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యామీన్‌ మీద అవినీతి ఆరోపణల కేసులు పెట్టి పదకొండు సంవత్సరాల పాటు జైలు శిక్ష వేయించాడని ఆరోపణ ఉంది. సదరు యామీన్‌ ప్రభుత్వంలో మంత్రి, రాజకీయ వారసుడే నూతన అధ్యక్షుడు ముయిజ్జు.అక్కడి విధానం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఎందరైనా పోటీ పడవచ్చు. పోలైన ఓట్లలో 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ అలా తెచ్చుకోని పక్షంలో అధిక ఓట్లు తెచ్చుకొని మొదటి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య 21వ రోజున తిరిగి పోటీ నిర్వహిస్తారు. సెప్టెంబరు 9న జరిగిన ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది పోటీ చేశారు. వారిలో పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ తరఫున 45 ఏండ్ల మహమ్మద్‌ ముయిజ్జు 46.06శాతం ఓట్లు తెచ్చుకోగా రెండవ స్థానంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇబ్రహీం మహమ్మద్‌ సాలి 39.05 తెచ్చుకున్నాడు. సాలి నాయకత్వంలోని మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీలో ఎన్నికల ముందు చీలిక వచ్చింది. విడిపోయిన వారు డెమోక్రాట్స్‌ పేరుతో పోటీ చేసి 7.18శాతం తెచ్చుకున్నారు. సెప్టెంబరు 30న రెండవసారి ఎన్నిక జరిగింది. ముయిజ్జు 54.04శాతం తెచ్చుకున్నాడు.నవంబరు 17న అధికారాన్ని స్వీకరిస్తాడు, ప్రస్తుతం రాజధాని మాలె నగర మేయర్‌గా పని చేస్తున్నాడు. ఈ ఎన్నికల నిర్వహణ గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. మాల్దీవుల ట్రాన్సఫరెన్సీ అనే సంస్థ ఎన్నికల హింసాకాండ ఉదంతాలు కొన్ని జరిగినట్లు చెప్పటం తప్ప వివరాలను వెల్లడించలేదు. అర్హులైన రెండు లక్షల 82వేల మంది ఓటర్లలో తొలి దఫా 79.85, తుది విడత 87.31 శాతం ఓట్లు వేశారు.


ఈ ఎన్నిక ఒక విధంగా చెప్పాలంటే చైనా – భారత్‌ మధ్య పోటీగా జరిగిందంటే అతిశయోక్తి కాదు. బహుశా ఎక్కడా ఇంత బాహాటంగా రాజకీయ పార్టీలు పోటీ చేసి ఉండవు. ఈ ఎన్నికలు తమ పౌరుల దేశ భక్తికి ఒక ప్రతిబింబమని, మా ఇరుగు పొరుగు వారు, భాగస్వాములు తమ స్వాతంత్య్రం, సర్వసత్తాకతను పూర్తిగా గౌరవించాలని ఇచ్చిన ఒక పిలుపు అని పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ కూటమి ప్రతినిధి వ్యాఖ్యానించాడు. చైనా బిఆర్‌ఐ పధకం కింద పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వంలో గృహశాఖ మంత్రిగా ముయిజ్జు పని చేశాడు. తాను అధికారానికి వస్తే రెండు దేశాల మధ్య మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతానని గతేడాదే ప్రకటించాడు. 2018లో అధికారానికి వచ్చిన సాలి తన పాలనా కాలంలో విచక్షణా రహితంగా భారత ప్రవేశానికి అవకాశమిచ్చినట్లు విమర్శలు చేశాడు. చివరికి భారత మిలిటరీని కూడా దేశంలో అనుమతించాడని, తాను అధికారానికి వస్తే దళాలను వెనక్కు పంపటమే గాక ప్రస్తుతం భారత్‌కు అనుకూలంగా వాణిజ్య సంబంధాలను సమతూకంలో ఉండేట్లు చూస్తానని వాగ్దానం చేశాడు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం మేరకు ఒక డాక్‌యార్డ్‌ నిర్మాణ పర్యవేక్షణకు మాత్రమే భారత సైనికులు ఉన్నారని సాలి సమర్ధించుకున్నాడు. కొత్త ప్రభుత్వం భారత్‌-చైనాల పట్ల ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనే అంశంపై విమర్శకులు భిన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. చైనాకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ భారత్‌ను తక్కువ చేయదన్నది వాటిలో ఒకటి.


రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. ఈ కారణంగానే బ్రిటీష్‌ ఆక్రమించిన మారిషస్‌కు చెందిన డిగోగార్సియా దీవులను అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఖాళీ చేసేందుకు మొరాయిస్తున్నది. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది. మనదేశంలోని కన్యాకుమారికి ఆ దీవులు 1,796కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అది మనదేశంతో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకూ ఆందోళన కలిగించే అంశమే. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఆ వరుసలో మాల్దీవులు కూడా చేరితే ఏమిటన్నదే వారి ఆందోళన. ఈ పరిణామం భారత భద్రతకు ముప్పు అని మన దేశానికి అవి చెబుతున్నాయి. ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా 1965లో బ్రిటన్‌ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది. అనేక విధాలుగా సాయం చేసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. తమను అదుకోవాలని అనేక దేశాలను గయూమ్‌ కోరినా ఎవరూ ముందుకు రాలేదు. భారత్‌ స్పందించింది, ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపర్లను ఎక్కడా ఆపకుండా నేరుగా మాల్దీవుల్లో దించి కుట్రను విఫలం గావించింది. అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి.


తరువాత జరిగిన పరిణామాల్లో దీవుల ఆర్థిక సమస్యలను, పౌరుల జీవితాలను మెరుగుపరచటంలో పాలకుల వైఫల్యం కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. సరిగ్గా అదే సమయంలో చైనా తన బిఆర్‌ఐ పధకాన్ని ముందుకు తెచ్చింది. ఐఎంఎఫ్‌, ప్రపంచబాంక్‌, అమెరికా, ఇతర పశ్చిమదేశాల మాదిరి కఠినమైనవి కాకుండా సాధారణ షరతులతో ప్రాజెక్టులకు చైనా రుణాలు ఇచ్చింది. దాంతో 2013లో అధికారానికి వచ్చిన అబ్దుల్లా యామిన్‌ చైనాతో సంబంధాలను పెంచుకున్నాడు.2018లో గెలిచిన ఇబ్రహీం సాలి భారత్‌కు పెద్ద పీట అనే విధానంతో మన దేశానికి సన్నిహితంగా భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాడు. అది తాజా ఎన్నికల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.2020లో ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక కూటమిగా ఏర్పడి ” భారత్‌ను బయటకు పంపాలి( భారత్‌ అవుట్‌) ” అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించాయి. జనంలో ఉన్న భారత వ్యతిరేక మనోభావాలు కూడా దీనికి దోహదం చేశాయి. 1978లో అధ్యక్షుడిగా నియమితుడైన అబ్దుల్‌ గయూమ్‌ ప్రజాస్వామిక స్వేచ్చకు తిలోదకాలిచ్చి 2008లో ఓడిపోయే వరకు పదవిలో కొనసాగాడు. అతడి మీద జరిగిన కుట్రను భారత్‌ అడ్డుకొని అధికారంలో కొనసాగేందుకు దోహదం చేసింది.2013లో పోటీ చేసిన యామిన్‌ ఈ గయూమ్‌కు సవతి సోదరుడు. ఆ ఎన్నికల్లో గయూమ్‌ అతనికి మద్దతు ఇచ్చాడు. తరువాత ఇద్దరి మధ్య తలెత్తిన విబేధాలతో గయూమ్‌ పార్టీని చీల్చి ప్రతిపక్షంతో చేతులు కలిపాడు. తరువాత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రచేశాడనే ఆరోపణతో 2018లో అతన్ని అరెస్టు చేశారు. తరువాత బెయిలు మీద విడుదల చేశారు. మనదేశానికి చెందిన జిఎంఆర్‌ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక అధ్యక్షుడు నషీద్‌ మద్దతు కూడా ఉందని చెబుతారు. అదే పెద్ద మనిషి మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్‌ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది.దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి.


2013లో అధికారానికి వచ్చిన యామీన్‌ మరుసటి ఏడాది చైనా అధినేత షీ జింపింగ్‌ను పర్యటనకు ఆహ్వానించాడు. అధికారికంగా భారత్‌కు అగ్రస్థానం అనే విధానం నుంచి వైదొలగనప్పటికీ చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. మౌలిక సదుపాయాల పధకాలకు ఒప్పందం చేసుకున్నాడు.చైనాతో కలసి సాగర పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిపాడు.చైనాతో బంధం బలపడిన తరువాత 2018లో అప్పటి వరకు మాల్దీవుల్లో నిర్వహిస్తున్న భారత హెలికాప్టర్లు, నిర్వహణ సిబ్బంది తమ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు, గూఢచర్యం జరుపుతున్నట్లు ఆరోపించి వెంటనే వెనక్కు తీసుకోవాలని మనదేశాన్ని కోరాడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. అధికారానికి వచ్చిన ఇబ్రహీం సాలి చైనా రుణ పధకాలనుంచి దేశాన్ని కాపాడినట్లు చెప్పుకున్నాడు.జనం విశ్వసించలేదు. ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ మాదిరి విధానపరమైన షరతులను ఎవరి మీద చైనా రుద్దలేదు. చైనా రుణాలు పుచ్చుకున్న దేశాలు, అందుకు చొరవ చూపిన అక్కడి పాలకులు అనుసరించిన విధానాల్లో ఏవైనా లోపాలు, అక్రమాలు, అవినీతి ఉంటే అవి ఆ దేశాల అంతర్గత అంశాలు. వాటి మంచి చెడ్డలను జనం చూసుకుంటారు. కానీ చైనా వ్యతిరేక పశ్చిమ దేశాలు, వాటికి వంతపాడే ఇతర దేశాల పాలకులు, మీడియా అనేక కట్టుకధలను వ్యాపింప చేస్తోంది. మాల్దీవుల్లో కూడా అదే జరిగింది. 2018లో యామీన్‌ పదవి నుంచి దిగిపోయేనాటికి ఉన్న పరిస్థితిని తిరిగి కొనసాగిస్తామని ముయిజ్జు ఎన్నికలకు ముందే స్పష్టం చేశాడు. అందువలన ఆ విధానాలకు అనుకూలంగా జనం ఇచ్చిన తీర్పుగా దీన్ని పరిగణించాలి తప్ప, భారత్‌కు ఎదురుదెబ్బ అనో మరో విధంగానో చిత్రించటం మన ప్రయోజనాలను కాపాడుకోవాలనే సరైన ఆలోచనలో భాగం కాదు. మాల్దీవులే కాదు మరేదేశానికైనా మన దేశం కూడా అభివృద్ధికి తోడ్పడి మనకు మిత్రదేశాలుగా ఉండేట్లు చూసుకోవాలి తప్ప అమెరికా రాజకీయంలో భాగంగా వ్యవహరించకూడదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల నరేంద్రమోడీ పాలన : పెరిగిన అప్పులు – తగ్గిన మానవాభివృద్ధి, పన్నుబాదుడులో ఔరంగజేబే ఆదర్శం !

02 Monday Oct 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, China, India debt matters, India HDI, Modi 2014 vs 2024, Narendra Modi Failures, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ” శుభవార్తలు ” చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రు.6.43లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్‌లో సూచించిన మొత్తం కంటే ఎక్కువగా రిజర్వుబాంకు మిగులు నుంచి రు.87,420 కోట్లు బదలాయించిన తరువాత కూడా ఇలా జరిగింది. గతేదాది ఈ మొత్తం రు.5.42లక్షల కోట్లు. దీన్ని సులభంగా చెప్పుకోవాలంటే తెలుగింటి కోడలు నిర్మలమ్మ ఆర్థికశాఖ మంత్రిగా 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టినపుడు వచ్చే పన్నెండు నెలల్లో ఒక వంద రూపాయలు కొత్తగా ద్రవ్యలోటు ఉంటుందని ప్రతిపాదించారని అనుకుందాం. అది ఐదు నెలలకే 36 రూపాయలకు చేరింది, అదే కాలానికి గత ఏడాది రు.32.60 మాత్రమే ఉంది.మరింత వివరణ ఏమంటే గతేడాది మొత్తం లోటు రు.16.61లక్షల కోట్లని చెప్పగా వర్తమాన సంవత్సరంలో రు.17.86లక్షలుగా ప్రతిపాదించారు. మొత్తం పెరుగుదల లక్షా 25వేల కోట్లు, ఇప్పటికే లక్ష కోట్లు పోగా ఇంకా మిగిలింది 25వేల కోట్లు మాత్రమే. వచ్చే ఏడు నెలల్లో ఏ పధకానికి కోత పెడతారు, కొత్త అప్పులు తెస్తారా, కొత్త నోట్లను ముద్రిస్తారా ఏం చేస్తారన్నది చూడాలి. నరేంద్రమోడీకి సర్వాధికారాలు ఉన్నాయి కదా ! ఏం చేసినా అడిగేవారు లేరు. నోట్ల ముద్రణ జరిగితే ధరలు మరింతగా పెరుగుతాయి, రూపాయి విలువ పతనం అవుతుంది.


ఇక రెండవ మంచి వార్త ఏమంటే మన విదేశీ రుణ భారం 2023 జూన్‌నాటికి 629.1 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. తమ విశ్వగురువు విదేశీ రుణాల మీద ఆధారపడరని, తగ్గిస్తారని భక్త జనులు అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో ప్రచారం చేశారు. 2014లో మోడీ అధికారానికి వచ్చినపుడు 2013 డిసెంబరు నాటికి ఉన్న విదేశీ రుణం 409.4 బిలియన్‌ డాలర్లు మాత్రమే. దానిలో తీర్చింది తీర్చగా ఆ మొత్తం అలాగే ఉందనుకుంటే అదనంగా 220 బిలియన్‌ డాలర్లు కొత్త అప్పులు చేశారు. ఇది ప్రతి మూడు నెలలకు పెరుగుతున్నది తప్ప తగ్గటం లేదు.ఈ ఏడాది మార్చి నాటికి 624.3 బిలియన్‌ డాలర్లకు అదనంగా 470 కోట్ల డాలర్లు తోడైంది. దీన్ని మోడీ సర్కార్‌ వైఫల్యంగా చెబుతారా, ఘనత అంటారా ? గతంలో వాజ్‌పాయి ఏలుబడిలో, యుపిఏ కాలంలో కూడా అప్పులు గణనీయంగా తీసుకున్నారు. విదేశీ రుణాలన్నీ డాలర్లలో ఉండవు.1991లో మన విదేశీ రుణం 83.8 బిలియన్‌ డాలర్లు కాగా దానిలో రాయితీలతో కూడిన మొత్తం 45.9శాతం ఉండేది. అది తరువాత క్రమంగా తగ్గుతూ 2013నాటికి 11.1కి 2022 డిసెంబరు నాటికి 8.1శాతానికి తగ్గింది.


అంకెలతో జనాన్ని తిమ్మిని బమ్మిని చేయవచ్చు. దానిలో భాగంగానే విదేశీ అప్పు మొత్తం పెరిగిందని ఒకవైపు అంగీకరిస్తూనే మార్చినెలతో ముగిసిన దానితో పోలిస్తే జూన్‌ నాటికి జిడిపిలో అప్పు శాతం 18.8 నుంచి 18.6 శాతానికి తగ్గినట్లు ఆర్‌బిఐ చెబుతోంది.ప్రభుత్వ అప్పు తగ్గింది, ప్రభుత్వేతర అప్పు పెరిగిందని కూడా పేర్కొన్నది. గతంలో కూడా ప్రభుత్వ అప్పు తగ్గింది తప్ప పెరగలేదు, కానీ బిజెపి నేతలు దాని గురించి ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి అన్నట్లు కాంగ్రెస్‌ పాలన గురించి నానా యాగీ చేశారు. మొత్తంగా పెరిగిందా లేదా అన్నది గీటురాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన అప్పు తక్కువ అని మరోసన్నాయి నొక్కు. ప్రతిదానికి చైనాతో పోలుస్తున్నారు, దాని విదేశీ అప్పు జిడిపిలో 13.6శాతం ఉంది, దాని కంటే మన అప్పు ఆరుశాతం ఎక్కువ. ఇంటా బయటా అప్పులు చేసి లేదా ప్రయివేటు అప్పులకు హామీ ఇచ్చి సాధించింది ఏమిటి ? కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేయలేని వాటిని తన తొలి ఐదు సంవత్సరాల పాలనలోనే సాధించినట్లు నరేంద్రమోడీ చెప్పుకున్నారు. అందువలన పదేండ్ల కాలం తక్కువేమీ కాదు. కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉంది. విధానాలను అమలు జరపటానికి వచ్చిన ఇబ్బంది లేదు.ఒక దేశ అభివృద్ధికి ఒక కొలమానం మానవాభివృద్ధి సూచిక. ఐరాస అభివృద్ధి ప్రమాణాల(హెచ్‌డిఐ) ప్రకారం 0.550 కంటే తక్కువ పాయింట్లు వచ్చిన దేశాలు తక్కువ, 0.550 -0.699 మధ్య ఉన్నవి మధ్యరకం, 0.699 నుంచి 0.799 పాయింట్లు వస్తే ఉన్నత, 0.800 కంటే మించితే అత్యున్నత వృద్ధి సాధించిన దేశాలుగా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది ప్రకటించిన 2022 నివేదిక ప్రకారం 0.633 పాయింట్లతో మనదేశం 188 దేశాల జాబితాలో 132వదిగా ఉంది.నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ఉన్న 130 నుంచి రెండు స్థానాలు దిగజారింది. మన దేశం ఇచ్చిన సమాచారం ప్రకారమే విశ్లేషించి సూచికలను రూపొందిస్తారని తెలిసిందే. ఎందుకీ దిగజారుడు ? ఇష్టం ఉన్నా లేకున్నా చైనాతో పోలుస్తున్నారు గనుక అదెక్కడ ఉందో చూద్దాం. తాజా సూచిక ప్రకారం 0.768 పాయింట్లతో 79వ స్థానంలో ఉంది. ఈ సూచికలకు ఇచ్చే పాయింట్లు ఆయా దేశాల్లో జరిగే వృద్ధిని బట్టి ఏటా మారుతూ ఉంటాయి. లింగ సమానత్వం, ఆరోగ్యం, విద్య, ఆదాయం, అసమానతల వంటి 13 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గడచిన నాలుగున్నర దశాబ్దాలుగా కొన్ని దేశాల మానవాభివృద్ధి సూచికలలో వచ్చిన మార్పులు దిగువ విధంగా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న అంకెలు సదరు ఏడాది పరిగణనలోకి తీసుకున్న దేశాల సంఖ్యగా గమనించాలి.
హెచ్‌డిఐ ××× 1980 ×× 1990 ×××× 2000 ×××× 2010 ×× 2014 ×××× 2022
చైనా ×××××0.423 ×× 0.501 ×× 0.588 ××0.699 ××0.727 ×× 0.768
చైనారాంక్‌ ×××92(124) ××103(143) ××108(166) ××102(188)××90(188) ××79(191)
భారత్‌ ×××0.369 ×× 0.428 ××0.496 ××0.586 ×××× 0.609 ×× 0.633
భారతరాంక్‌×××100(124) ××114(143) ××120(166) ××136(188)××130(188) ××132(191)
అమెరికా ×××0.825 ×× 0.859 ××××0.883 ××××0.909 ××××0.915 ×××× 0.921
అమెరికారాంక్‌×× 2(124) ×× 2 (143) ×× 5 (166) ×× 5 (188)×× 8 (188) ×× 21(191)


తన పాలనలో జిడిపి గణనీయంగా పెరిగిందని, త్వరలో ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చుతామని, 2047 నాటికి చైనాను కూడా అధిగమిస్తామని బిజెపి నమ్మింప చూస్తున్నది. రాష్ట్రాలు రుణాలు తీసుకోవద్దని, సంక్షేమ పధకాలకు అనవసరంగా ఖర్చు చేయవద్దని ప్రధాని నరేంద్రమోడీ పదే పదే చెబుతున్నారు.కానీ ఆ పెద్ద మనిషి ఏలుబడిలో జరిగిందేమిటి ? 2013-14 సంవత్సరంతో పోల్చితే 2022-23నాటికి స్వదేశీ అప్పు 174శాతం, విదేశీ అప్పు వందశాతం పెరిగింది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ విదేశీ, స్వదేశీ అప్పు మొత్తం రు.50,68,235 కోట్లు. వర్తమాన సంవత్సర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అప్పుల గురించి నిర్మలమ్మ పార్లమెంటుకు సమర్పించిన పత్రం ప్రకారం 2023 మార్చి నెల ఆఖరుకు రు. 152,61,122.12 కోట్లుగా ఉన్నది 2024 మార్చి ఆఖరుకు రు.169,46,466.85 కోట్లకు చేరుతుంది. ఎన్నికల సంవత్సరం గనుక ఇంకా పెరగటమే తప్ప తగ్గే అవకాశం లేదు. దీనిలో స్వదేశీ అప్పు రు.147,77,724.43 కోట్ల నుంచి రు.164, 23,983.04కు, విదేశీ రుణం రు.4,83,397.69 నుంచి రు.5,22,683.81 కోట్లకు పెరుగుతుందని చెప్పారు. ఇంత అప్పు చేసినా మానవాభివృద్ధి సూచికలు దిగజారాయంటే ఆ సొమ్మును జనానికి గాకుండా కార్పొరేట్లకే కట్టపెట్టారన్నది స్పష్టం. పెంచిన పన్ను భారాలు, అప్పుల గురించి అడిగితే జాతీయ రహదారులు, రైల్వేలను అభివృద్ధి చేశామంటారు. నిజమే, వాటిని వినియోగించుకున్నవారి నుంచి వసూలు చేస్తున్న టోలు టాక్సు, ఎంత ? సామాన్యులు ఎక్కే పాసింజరు రైళ్లను రద్దు చేసి వాటిని ఎక్స్‌ ప్రెస్‌ల పేరుతో జనాన్ని బాదుతున్నారు. వృద్దులకు ఇచ్చే రాయితీలను రద్దు చేశారు.రిజర్వేషన్ల రద్దుకు ఎంత వసూలు కోత పెడుతున్నారో తెలిసిందే. స్టాటిస్టా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2017 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 వరకు టోల్‌టాక్సు రు.17,942 కోట్ల నుంచి 48,028 కోట్లకు పెరిగింది. దీనిలో సరకు, ప్రయాణీకుల రవాణా వాహనాల నుంచి వసూలు చేసేదే ఎక్కువ అన్నది తెలిసిందే, అంటే ఆ మేరకు జనం మీద భారం మోపుతున్నారు.


ఆరోగ్య పరిస్థితిని చూస్తే ఆందోళనకరంగా ఉంది. తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయని కారణంగా దేశంలో అన్ని వయసుల వారిలో రక్త హీనత (అనీమియా)పెద్ద సమస్యగా ఉంది. కుటుంబ జాతీయ ఆరోగ్య సర్వే 5 (2019-21) ప్రకారం ఆరు నెలల నుంచి ఐదేండ్ల మధ్య వయస్సు పిల్లల్లో 67శాతం, 15-19 సంవత్సరాల బాలికల్లో 59, బాలురలో 31,పిల్లల్ని కనేవయస్సున్న మహిళల్లో 57, గర్భిణుల్లో 52, గర్భిణులు కాని మహిళల్లో 57 మంది రక్త హీనతో ఉన్నారు. అంతకు ముందు చేసిన సర్వే 4 వివరాలతో పోలిస్తే పైన చెప్పుకున్న అన్ని తరగతుల వారిలో ఈ సమస్య తీవ్రత పెరిగింది. దేశానికి గుజరాత్‌ తరహా అభివృద్ధిని అమలు చేస్తానని నరేంద్రమోడీ చెప్పారు, ఆ గుజరాత్‌ పిల్లల్లో తీవ్రత 62.6 నుంచి 79.7శాతానికి పెరిగింది. ఈసురో మని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోరు అని మహాకవి గురజాడ చెప్పింది ఇలాంటి వారి గురించే.2018లో అనీమియా ముక్త భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. అది ఏమేరకు ఫలితాలు ఇచ్చిందో ఇంకా ఏమి చేయాలో తెలియాలంటే సర్వేలు తప్ప మరొక మార్గం లేదు కానీ, ఆరవ విడత నిర్వహించదలచిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆ సమాచారాన్ని రాబట్టే ప్రశ్నలనే కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఎందుకంటే తీవ్రత తగ్గకపోతే మోడీ సర్కార్‌ వైఫల్యం వెల్లడౌతుంది. అంతకు మించి మరొక కారణం కనిపించటం లేదు. దీని మీద తీవ్ర విమర్శలు రావటంతో డైట్‌ మరియు బయోమేకర్స్‌ సర్వే(డాబ్స్‌-1) ఆ సమాచారాన్ని సేకరిస్తుందని కేంద్ర ప్రకటిచింది. మన దేశంలో తృణధాన్యాల వినియోగం గురించి ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ 2019 సంవత్సర వివరాలను వెల్లడించింది.ప్రపంచ వ్యాపితంగా తలసరి ఆహారం,దాణాగా 304కిలోలు వినియోగిస్తున్నారు. మన దేశంలో 171 కిలోలు, ఆఫ్రికాలో 190, బాగా వెనుక బడిన దేశాల్లో 205, బ్రెజిల్‌, చైనాలో 360, రష్యాలో 407,ఐరోపా పారిశ్రామిక దేశాల్లో 494, అమెరికాలో 590 కిలోలు ఉంది. దీన్ని బట్టి 121 దేశాల్లో మన దేశం ఆకలి సూచికలో 107వదిగా ఎందుకు ఉందో అర్ధం చేసుకోవటం కష్టం కాదేమో ? రాష్ట్రాలకు చెందాల్సిన న్యాయమైన వాటాను రాకుండా ఎగవేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న కొన్ని భారాలను చూస్తే స్వచ్చ భారత్‌, విద్య, ఆరోగ్యం,రోడ్డు , నాణ్యమైన ఇంథనం, వ్యవసాయం పేరుతో విధిస్తున్న సెస్‌ల గురించి జనానికి తెలిసిందే తక్కువే. రాబడి కోసం ఔరంగజేబు ముస్లిమేతరుల మీద విధించిన జిజియా పన్ను గురించి చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం.ఇప్పుడు జరుగుతున్నదేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత – కెనడా కలహంపై పశ్చిమ దేశాల్లో ఆందోళన ఎందుకు, చైనా ఏమంటోంది !

27 Wednesday Sep 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Europe, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Canada, Canada-India row, China, Hardeep Singh Nijjar, Joe Biden, Justin Trudeau, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే పంజాబ్‌ వేర్పాటువాద, ఉగ్రవాది హత్య ప్రస్తుతం భారత్‌-కెనడా మధ్య సంబంధాలు దిగజారటానికి దారి తీసింది. నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ సెప్టెంబరు 18న పార్లమెంటులో చేసిన ఆరోపణను మనదేశం తిరస్కరించింది. దానికి ఎలాంటి ఆధారాలు లేవంది. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు అక్కడ విద్యాభ్యాసం, ఉపాధికోసం వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ వివాదం తమ చైనా వ్యతిరేక ఎత్తుగడలు, సమీకరణలకు ఎక్కడ దెబ్బతగులుతుందో అన్న భయం అమెరికా కూటమి దేశాల్లో వెల్లడి అవుతోంది. భౌగోళిక రాజకీయాల మీద చూపే ప్రభావమే కాదు, భారత్‌కు ఆగ్రహం కలిగిస్తే దాని మార్కెట్‌లో ప్రవేశించేందుకు అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళన కూడా వాటిలో ఉంది. చైనా మీద ఆధారపడకుండా భారత్‌ను ప్రత్యామ్నాయ వస్తు ఎగుమతి దేశంగా మార్చేందుకు సాయం చేస్తామని, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకుంటామని చేస్తున్న ప్రకటనలు తెలిసినవే. చేసిన ఆరోపణను కెనడా వెనక్కు తీసుకోవాలని మనదేశం డిమాండ్‌ చేస్తోంది. ఉగ్రవాదులకు కెనడా సురక్షిత స్వర్గంగా ఉందని వర్ణించింది. మూడునెలల పరిశోధన తరువాత భారత హస్తం ఉందని నిర్ధారించుకున్నామని కెనడా అంటోంది. ఈ ఆరోపణను ఉపసంహరించుకుంటే తప్ప మనదేశం వెనక్కు తగ్గదు, అదే జరిగితే కెనడా అభాసుపాలవుతుంది కనుక వెనక్కు తగ్గే అవకాశాలు తక్కువ. ఇది చినికి చినికి గాలివానగా మారితే జరిగే పర్యవసానాల గురించి ఆందోళన చెందుతున్న జి 7 కూటమిలో పెద్దన్న అమెరికా, ఇతర దేశాలు ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించాయి.


ఈ ఏడాది జూన్‌ 18న కెనడా వాంకోవర్‌ సమీపంలోని సురే అనే చోట ఒక గురుద్వారా వెలుపల హత్యకు గురైన నిజ్జర్‌ 1977లో పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని ఒక గ్రామంలో జన్మించాడు.పంజాబ్‌లో తీవ్రవాదులపై 1995లో చర్యలను ముమ్మరం చేయటంతో 1997లో నిజ్జర్‌ నకిలీ పాస్‌పోర్టుతో కెనడా పారిపోయాడు. అక్కడ తప్పుడు సమాచారం వెల్లడికావటంతో కేసులు, వివాదాల తరువాత 2007లో కెనడా పౌరసత్వం ఇచ్చారు. ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అనే ఉగ్రవాద సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నాయని, ఒక వేర్పాటువాది, నేరగాడు అని అతన్ని అరెస్టు చేసి అప్పగించాలని గతంలో మనదేశం కెనడాను కోరింది. దాన్ని అది ఖాతరు చేయలేదు. స్వేచ్చగా తిరగనిస్తున్నది. అతడు ఒక మానవహక్కుల కార్యకర్త, శాంతియుత పద్దతుల్లో సిక్కు దేశం ఏర్పాటుకు మద్దతు ఇచ్చినట్లు అతని మద్దతుదార్లు వాదిస్తారు. తమ దేశంలో భావ ప్రకటన స్వేచ్చ ఉందని అందువలన అతను మాట్లాడేదానితో తమకు సంబంధం లేదని కెనడా వాదించింది. అతను 2019లో సురే గురుద్వారా నేతగా మారాడు.2020లో ఖలిస్తాన్‌ ప్రజాభిప్రాయ సేకరణలో, వేర్పాటువాదాన్ని సమర్ధిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అతని హత్యకేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.


నిజ్జర్‌కు ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అనే మిలిటెంట్‌ గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని భారత్‌ చేసిన వినతి మేరకు 2014లో ఇంటర్‌ పోల్‌ అరెస్టు వారంటు జారీ చేసింది. అతడు 2013-14లో పాకిస్తాన్‌ వెళ్లాడని అక్కడ పాక్‌ ఐఎస్‌ఐ చేర్చుకున్న బబ్బర్‌ ఖాల్సా అనే సంస్థకు చెందిన జగతార్‌ సింగ్‌ తారాను కలిశాడని మన ప్రభుత్వం పేర్కొన్నది. అతని మీద నిఘా పెట్టాలని 2015లో కేంద్ర ప్రభుత్వం కోరింది. తరువాత రెండోసారి కూడా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.తన మీద భారత ప్రభుత్వం చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, రాజకీయపరమైనవని నిజ్జర్‌ 2016లో కెనడా ప్రధానికి లేఖ రాశాడు. అతగాడు అనేక హత్యలకు కారకుడని, తమకు కావాల్సిన ముఖ్యులలో ఒకడని 2018లో కేంద్రం కెనడాకు తెలిపింది. పంజాబ్‌ను విముక్తి చేసి ఖలిస్తాన్‌ ఏర్పాటు చేయాలన్న ప్రచారానికి నిజ్జర్‌ మద్దతు తెలిపాడు.2020లో మన ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ ఏడాది మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమం వెనుక అతడు ఉన్నాడని ఆరోపించి కేసులు కూడా దాఖలు చేసింది. పంజాబ్‌లోని ఒక హిందూ పూజారిని హత్య చేసేందుకు కుట్ర పన్ని లక్ష రూపాయల బహుమతి ప్రకటించాడని 2022లో ఎన్‌ఐఏ పేర్కొన్నది.


కెనడా రాజకీయాల్లో సిక్కులు ఒక ప్రభావిత శక్తిగా ఉన్నారు. పంజాబ్‌ తరువాత ప్రపంచంలో సిక్కు సామాజిక తరగతి ఎక్కువగా ఉన్నది కెనడాలోనే, అక్కడ జనాభాలో 2.1శాతం ఉన్నారు. ముప్పై మందితో కూడిన జస్టిన్‌ ట్రుడేవ్‌ మంత్రివర్గంలో నలుగురు సిక్కులు మంత్రులుగా ఉన్నారు. ఈ కారణంగా నిజ్జర్‌ మరణానికి బాధ్యులను తేల్చాలన్న డిమాండ్‌ సహజంగానే అక్కడ ముందుకు వచ్చింది. అందువలన మరొకదారి లేని పరిస్థితిలో అంతర్జాతీయ కర్తవ్యం సంగతి తరువాత ముందు తన ప్రభుత్వం గురించి చూసుకోవాలని హత్య గురించి ట్రుడేవ్‌ పార్లమెంటులో మాట్లాడాల్సి వచ్చింది. జూన్‌ మొదటి వారంలో మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఖలిస్తాన్‌ వేర్పాటువాదులకు కెనడా మద్దతు ఇవ్వటం రెండు దేశాల సంబంధాలకు మంచిది కాదని విమర్శించారు. ఆ తరువాత నిజ్జర్‌ హత్య జరిగింది. ఢిల్లీలో జరిగిన జి 20 కూటమి సమావేశాలకు జస్టిన్‌ ట్రుడేవ్‌ వచ్చినప్పటికీ ఇతర దేశాధినేతలతో మాదిరి ఫ్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక చర్చలు జరపలేదు. అంతే కాదు కెనడాలో ఉగ్రవాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఇటీవలి కాలంలో జరిగిన ఉదంతాల గురించి మోడీ కెనడా దృష్టికి తేగా, ప్రతిగా కెనడా కూడా మనదేశం మీద ఆరోపణలు చేసిందని వెల్లడైంది. తిరుగు ప్రయాణంలో ట్రుడేవ్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడగా ప్రత్యామ్నాయంగా విమానం ఏర్పాటు చేస్తామని మన దేశం ప్రతిపాదించినా రెండు రోజులు వేచి ఉండి తన విమానంలోనే వెళ్లిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవని ఈ ఉదంతం వెల్లడించింది. ఆ తరువాతే పార్లమెంటులో మన దేశం మీద ఆరోపణ చేశాడు. ఈ అంశాన్ని తాము భారత్‌కు ఎంతో ముందుగానే తెలిపామని ట్రడేవ్‌ చెబుతుండగా ఎలాంటి సమాచారం లేదని మన అధికారులు అంటున్నారు.


ఈ వివాదంలో పశ్చిమ దేశాల వైఖరిని చూస్తే మన దేశాన్ని ఖండించ లేదుగానీ విచారణ జరగాలి అని మాట్లాడుతున్నాయి. మీడియాలో వచ్చిన వార్తలను బట్టి కెనడా ప్రధాని బహిరంగంగా మన దేశం మీద ఆరోపణ చేయటానికి ముందే ” ఐదు కళ్ల గూఢచార యంత్రాంగం ” లో భాగస్వాములుగా ఉన్న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ అధికారులకు కెనడా నిజ్జర్‌ హత్యలో మన దేశ ప్రమేయం గురించి వెల్లడించటమే గాక ఒక సంయుక్త ప్రకటనలో ఖండించాలని ప్రతిపాదించగా మిగిలిన దేశాలు నష్టదాయకమంటూ తిరస్కరించినట్లు వెల్లడైంది. తమకు ముందుగానే చెప్పినట్లు కెనడాలోని అమెరికా రాయబారి డేవిడ్‌ కోహెన్‌ నిర్ధారించాడు. విదేశాల్లో హత్యలను సహించరాదని, తాము కెనడాను కేవలం సంప్రదించటం లేదని దర్యాప్తులో భాగస్వాములవుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పాడు. భారత్‌కూడా దర్యాప్తులో భాగస్వామి కావాలని అమెరికా కోరింది. ఆరోపణలు ఆందోళనకరమైనవని, తాను భారత దేశం వద్ద ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిణి పెనీ వాంగ్‌ చెప్పింది. ఆరోపణలు తీవ్రమైనవని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లవర్లీ, వస్తున్న వార్తులు నిజమే అయితే తీవ్ర ఆందోళన కలిగించే అంశమని తమ భాగస్వాములతో సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నట్లు న్యూజిలాండ్‌ విదేశాంగ మంత్రి నానియా మహుతా అన్న వ్యాఖ్యలు కెనడాకు అనుకూలంగా చేసినట్లు స్పష్టమౌతున్నాయి.


పంజాబ్‌, కాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు, తీవ్రవాద దుశ్చర్యలకు పాల్పడిన అనేక మందికి అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు ఆశ్రయం ఇచ్చిన సంగతి తెలిసిందే. పక్కనే ఉన్న శ్రీలంకలో ఉగ్రవాదులు సైతం పశ్చిమ దేశాల్లోనే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదుల అడ్డా, శిక్షణా కేంద్రం అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా అమెరికా, ఇతర ఐరోపా దేశాల కుట్రలో భాగంగానే జరిగింది. కెనడా ప్రధాని ఏమి చెప్పినప్పటికీ ఖలిస్తాన్‌ త్రీవ్రవాదుల అడ్డాగా ఆ దేశం మారింది. ప్రపంచంలో ఇతర దేశాల మీద దాడులు చేసేందుకు ఉగ్రవాదుల ఏరివేత అని సాకులు చెప్పే పశ్చిమ దేశాలు తమ సంరక్షణలో ఉన్నవారి గురించి పల్లెత్తు మాట మాట్లాడవు. ఇప్పుడు పశ్చిమ దేశాల ఆందోళన అంతా కెనడాలో ఆశ్రయం పొంది మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రవాదుల ఏరివేత, అదుపు గురించి కాదు. కెనడా – భారత్‌ మధ్య వివాదం ముదిరితే చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను నిలపాలన్న తమ ఎత్తుగడ ఎక్కడ విఫలమౌతుందో అన్న భయమే ఎక్కువ కనిపిస్తోంది. పశ్చిమ దేశాల నుంచి వెలువడుతున్న అన్ని వ్యాఖ్యానాల్లో బహిరంగంగానే దీని గురించి ప్రస్తావిస్తున్నారు. పశ్చిమ దేశాల ఇండో-పసిఫిక్‌ ఎత్తుగడలో కెనడా కూడా ఒక ప్రధాన భాగస్వామే. మన దేశంలో నిరంకుశ పోకడలు, మానవహక్కులకు భంగం కలుగుతున్నదంటూ అమెరికాలోని అనేక సంస్థలు ఒకవైపు నిరంతరం ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద వత్తిడి పెంచుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు 75 మంది ఎంపీలు మోడీ ప్రసంగాన్ని బహిష్కరించారు. అధ్యక్షుడు జో బైడెన్‌ వారి ప్రచారాన్ని అనుమతించి చోద్యం చూశాడు. మౌనంగా ఉన్నాడు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలబెట్టాలన్న ఎత్తుగడలో భాగమే అది. అదే ఎంపీలు చైనా గురించి చేసిన ఆరోపణల మీద అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఎలా స్పందిస్తున్నదీ చూస్తున్నాము.


పశ్చిమ దేశాలు కట్టగట్టుకొని మౌనం పాటిస్తున్నాయని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నట్లు భారత్‌-కెనడా వివాదం గురించి చైనా మీడియా స్పందించింది. తమ వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ను తీసుకుపోవాలని చూస్తున్నాయి గనుక కెనడా మిత్ర దేశాలు మౌనంగా ఉన్నాయి తప్ప తమ మిత్రులు కాకుంటే వెంటనే ఖండనలకు దిగేవని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. తమ ప్రయోజనాలు లేకపోతే పశ్చిమ దేశాలు నీతి సూత్రాలు, నిబంధనలు వల్లించి ఉండేవని, భారత మానవహక్కుల సమస్యల గురించి కళ్లు మూసుకున్నట్లు పేర్కొన్నది. మనదేశం చైనాను ఎలా చూస్తున్నదో చైనా కూడా మనలను అలాగే చూస్తుంది, మరోవైపు కెనడాతో దాని సంబంధాలు సజావుగా లేవు. ఇప్పుడు తలెత్తిన వివాదాన్ని వారెలా చూస్తున్నారన్నది సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. చైనా అధికారికంగా మాట్లాడకపోయినప్పటికీ అధికారిక పత్రికల్లో వస్తున్న వ్యాఖ్యల ద్వారా వైఖరిని అర్ధం చేసుకోవచ్చు. ఈ వివాదంతో తమ వ్యూహం నుంచి భారత్‌ ఎక్కడ వైదొలుగుతుందో అన్న భయం పశ్చిమ దేశాల్లో ఉంటే, పశ్చిమ దేశాలు – భారత్‌ మధ్య దూరం పెరగాలని సహజంగానే చైనా కోరుకుంటుంది. కెనడా ఒక దేశంగా ఉన్నప్పటికీ అది అమెరికాలో 51వ రాష్ట్రం మాదిరి ఉంటుందని చైనా భావిస్తున్నది. అందుకే భారత్‌ పట్ల అమెరికా మోసకారి తనం, ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని, వివాదం మరింత ముదిరితే గందరగోళానికి గురికానుందని చైనా గ్లోబల్‌ టైమ్స్‌లో ప్రచురితమైన విశ్లేషణలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాల వలసవాద వైఖరి భారత్‌ను సమాన స్థాయిలో చూస్తూ సహకరించేందుకు ముందుకు రావటం అసాధ్యమని బీజింగ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అన్నాడు. అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ ప్రవర్తించే కెనడా గతంలో చైనా మీద కాలు దువ్విందని ఇప్పుడు అమెరికా ప్రేరేపణతో భారత్‌ను రెచ్చగొడుతున్నదని చైనా వెబ్‌సైట్‌ ఒక విశ్లేషణలో రాసింది. మరికొందరు విశ్లేషకులు భారత్‌ పెద్ద ఇబ్బందుల్లో పడిందని పేర్కొన్నారు.


అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ మాట్లాడుతూ తమకు భారత్‌ ఎంతో కీలకమైన దేశంగానే ఉంటుందని, అది ఒక్క దక్షిణాసియా ప్రాంతానికే కాదు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి కూడా అని చెప్పాడు. అమెరికాకు ఇది కలవరం కలిగించేదే, దానికి విశాల ప్రయోజనాలు ఉన్నాయి, ట్రుడేవ్‌ ఆరోపణలు గనుక నిజమే అయితే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రజాస్వామ్యానికి కట్టుబడి లేదన్నది అర్ధం, ఇదే విధానాన్ని పుతిన్‌ కూడా అనుసరించాడు అని కెనడాలోని టొరొంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ బోత్‌వెల్‌ అన్నాడు. తన శత్రువులను రష్యాలోపల, వెలుపల బ్రిటన్‌తో సహా ఇతర దేశాల్లో పుతిన్‌ చంపించాడని అన్నాడు. కరవ మంటే కప్పకు కోపం- విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా ప్రస్తుతం పశ్చిమ దేశాల పరిస్థితి ఉంది.చివరకు ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేద దేశాలకు అనుగుణంగా నిబంధనలను మారుద్దాం – జి 77+చైనా కూటమి పిలుపు

20 Wednesday Sep 2023

Posted by raomk in Africa, CHINA, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, G77+China, G77+China summit 2023, Global South, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రతి ఏడాది సెప్టెంబరు పదహారవ తేదీని ” పేద దేశాల శాస్త్ర, సాంకేతిక, నవీకరణ దినం ” గా పాటించాలని 2023 సెప్టెంబరు 15-16 తేదీలలో క్యూబా రాజధాని హవానాలో జరిగిన జి 77+చైనా సభ పిలుపునిచ్చింది.నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, సామర్ధ్యాలు, పరిస్థితులకు సంబంధించి ప్రస్తుతం అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల మధ్య తీవ్ర అసమానతలు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సభ ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు. దానికి నిదర్శనంగా కరోనా వాక్సిన్లను ఉదహరించారు.వర్తమాన సంవత్సరంలో కూటమి అధ్యక్ష స్థానంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు మియల్‌ డియాజ్‌ కానెల్‌ మాట్లాడుతూ కేవలం పది దేశాలు 90శాతం పేటెంట్లు, డిజిటల్‌ పరిజ్ఞాన ఎగుమతుల్లో 70శాతం కలిగి ఉన్నాయని చెప్పారు. సమాన అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక వ్యవస్థ ఏర్పడాలంటే అభివృద్ధి చెందిన దేశాల సాంకేతిక పెత్తనం కొనసాగితే కుదరదని అన్నాడు. అందువలన పేద, వర్ధమాన దేశాల మధ్య ఈ రంగంలో మరింత సహకారం అవసరమని, అందుకే ఆట నిబంధనలను మార్చేందుకు పేద దేశాలు ముందుకు రావాలని చెప్పాడు.ధనిక దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రపంచాన్ని తీసుకుపోతున్నాయి, పేద దేశాలు ఆట నిబంధనలను మార్చాల్సిన తరుణం వచ్చిందన్నాడు.ప్రపంచంలో ప్రస్తుత బహుముఖ సంక్షోభంలో పేద దేశాలు బాధితులని, అసమాన వాణిజ్యం ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమని అన్నాడు.హవానా సభ ఆమోదించిన తీర్మానంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సమూలంగా సంస్కరించాలి.ప్రపంచ విధానాల రూపకల్పన, నిర్ణయాల సంస్థలలో మరింత సమన్వయంతో పాటు వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం పెరగాలి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, నవకల్పనలు ఈ దేశాలకు అందుబాటులోకి వచ్చే విధంగా విధానాల రూపకల్పన జరగాలి. డిజిటల్‌ గుత్తాధిపత్యం, అనుచిత పద్దతులకు జి 77 వ్యతిరేకం. డిజిటల్‌ అసమానతలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. వర్ధమాన దేశాల మీద ఆంక్షలు, ఆర్ధికపరమైన బలవంతాలను ఈ కూటమి వ్యతిరేకిస్తుంది. ఇవి అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించటమే గాక సామాజిక, ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటున్నాయి.


జాత్యహంకారానికి వ్యతిరేకంగా, నిరాయుధీకరణ, నూతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలతో 1964 జూన్‌ 15న ఆంక్టాడ్‌లో ఐరాస ప్రధాన కేంద్రంగా 77 దేశాల కూటమి ఏర్పడింది. దాని నుంచి రెండు ప్రారంభ దేశాలు తప్పుకోగా తరువాత కాలంలో మరో 60దేశాలు చేరాయి. చైనాను తమ సభ్యురాలిగా ఆ కూటమి పరిగణిస్తున్నది. అయితే చైనా మాత్రం తాను సభ్యురాలిని కాదని, కూటమికి అన్ని విధాలుగా సహకరిస్తానని ప్రకటించింది. అన్ని సమావేశాల నిర్ణయాలు, అమలులో భాగస్వామిగా ఉంది. అందువలన సాంకేతికంగా ఇప్పుడు 134 దేశాలే ఉన్నప్పటికీ చైనాను కలుపుకొని పోయేందుకు గాను అది జరిపే సమావేశాలు, చేసేప్రకటనల్లో జి 77+చైనాగా వ్యవహరిస్తున్నారు. జనాభాలోనూ, ఐరాస దేశాల్లో ఎక్కువ సంఖ్యలోనూ ఈ కూటమిలో ఉన్నాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్‌ అందరికోసం పని చేసే ప్రపంచం కోసం పోరాడాలని పిలుపునిచ్చాడు. ఇటీవలి దశాబ్దాలలో పేద దేశాలు కోట్లాది మందిని దారిద్య్రం నుంచి వెలుపలికి తెచ్చినప్పటికీ ఇప్పుడవి పెరుగుతున్న దారిద్య్రం, ఆకాశానికి అంటుతున్న ధరలు, ఆకలి, పెరుగుతున్న రుణభారం, వాతావరణ నాశనం వంటి అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని చెప్పాడు. ప్రపంచ వ్యవస్థలు, చట్రాలు పేద దేశాలను దెబ్బతీశాయి, ముగింపు ఏమిటో స్పష్టమే, దేశాలను అభివృద్ధి చేయటంలో ప్రపంచం విఫలమౌతున్నదని స్పష్టం చేశాడు. ఈ మాటలు ధనిక దేశాలను అభిశంసించటం తప్ప మరొకటి కాదు. పర్యావరణ న్యాయం జరగాలంటే ఆర్థిక న్యాయం జరగాలి, వాగ్దానం చేసినట్లుగా ధనిక దేశాలు అందుకోసం వంద బిలియన్‌ డాలర్లను విడుదల చేయాలి, 2025 నాటికి రెట్టింపు నిధులు ఇవ్వాలి, 2027నాటికి ప్రకృతి వైపరీత్యాల గురించి ప్రతి ఒక్క పౌరుడినీ ముందుగానే హెచ్చరించి రక్షణ కల్పించాలన్నాడు. నిరంతర అభివృద్ధి(ఎస్‌డిజి) లక్ష్యాల సాధనకు ఏటా 500బిలియన్‌ డాలర్లు సమకూర్చాలి, అభివృద్ధి చెందుతున్న దేశాలలో తద్వారా అభివృద్ధి, వాతావరణ పరిరక్షణ కార్యాచరణకు పూనుకోవాలన్నాడు.


తన మిలిటరీ బలాన్ని చూపి అదిరించి బెదిరించి ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు అమెరికా, దాని కూటమిలోని దేశాలు చూస్తున్నాయి. తమకు నచ్చని, తమ బాటలో నడవని దేశాల మీద ఉగ్రవాదం మీద పోరు, మరొక సాకుతో దాడులు, అక్రమణలకు, ఆంక్షల విధింపు వంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి. ఐఎంఎఫ్‌,ప్రపంచబాంకు వంటి ధనికదేశాల పెత్తనంలోని సంస్థలతో పాటు ధనిక దేశాలు ఇచ్చే రుణాలకు అనేక షరతులు విధిస్తాయి, వడ్డీ రేటు కూడా ఎక్కువే. అదే చైనా ఇచ్చే రుణాలు తక్కువ వడ్డీతో పాటు సాధారణం తప్ప ఐఎంఫ్‌ మాదిరి షరతులేమీ ఉండవు. ఉదాహరణకు శ్రీలంక, పాకిస్తాన్‌ వంటి దేశాలకు ఐఎంఎఫ్‌ ఇచ్చిన రుణాలకు ప్రైవేటీకరణ, పన్నుల పెంపు, అన్నింటినీ ప్రైవేటు రంగానికి అప్పగించాలన్న షరతులతో దేశ ఆర్ధిక విధానాల్లో చేయాల్సిన మార్పుల వంటివి ఉన్నాయి. చైనా రుణాలకు సాధారణ హామీ తప్ప మరొక షరతులేదు. ఈ కారణంగానే అనేక పేద, వర్ధమాన దేశాలు చైనా రుణాల కోసం చూస్తున్నాయి. ప్రస్తుతం 160 దేశాలు రుణాలు తీసుకున్నాయి. వాటిలో 150 దేశాల్లో చైనా బిఆర్‌ఐలో పెట్టుబడులు కూడా పొందుతున్నాయి. గడచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ బలాబలాల్లో స్పష్టమైన మార్పు జరుగుతోంది. పేద దేశాల మధ్య వాసి, రాసి పరంగా సహకారం పెరుగుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం వర్ధమాన దేశాలు ప్రపంచ జిడిపిలో 24శాతం సమకూర్చితే ఇప్పుడు నలభై శాతానికి పెరిగింది.


ఏ కూటమి సమావేశాలు కూడా రాజకీయాలకు అతీతంగా ఉండవు అన్నది గమనించాలి. బహుముఖ సంక్షోభంలో పేద దేశాలు బాధితులు గనుక ధనిక దేశాలకు వ్యతిరేకంగా సంఘటితం కావాలన్నది ఈ సమావేశాల్లో ముందుకు వచ్చిన అంశం. పేద దేశాలు ఈ పరిస్థితిని ఇంకేమాత్రం భరించే స్థితిలో లేనందున ధైర్యవంతమైన చర్యలకు పూనుకోవాలని వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో పిలుపునిచ్చారు. క్యూబా మీద ఆరుదశాబ్దాలుగా అమలు జరుపుతున్న ఆంక్షలు నేరపూరితమైనవని వర్ణించాడు. అమెరికా అనుచిత ఆంక్షలకు బలౌతున్నదేశాల్లో వెనెజులా కూడా ఒకటి అన్నది తెలిసిందే. నికరాగువా అధ్యక్షుడు డేనియల్‌ ఓర్టేగా మాట్లాడుతూ గత రెండు శతాబ్దాలుగా శత్రువు ఒకటే మనందరికీ తెలుసు, అదే అమెరికా అన్నాడు.పర్యావరణానికి హాని కలిగించే బొగ్గు, చమురు కర్బన ఉద్గారాలతో నిమిత్తం లేని ఆర్థిక వ్యవస్థ కావాలని కొలంబియా అధ్యక్షుడు గుస్తావ్‌ పెట్రో కోరాడు. వర్తమాన వాతావరణ మార్పుల కారణంగా 300 కోట్ల మంది నెలవులు తప్పుతారని, సారవంతమైన భూములు ఎండిపోతాయని, ఆహార సంక్షోభం ఏర్పడుతుందని, ప్రజాస్వామ్యం లేని పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించాడు. రష్యా-ఉక్రెయిన్‌ పోరు మీద ఒక వైఖరి అనుసరిస్తున్నదేశాలు ఇజ్రాయెల్‌-పాలస్తీనా మీద భిన్నవైఖరిని అనుసరిస్తున్నాయని పశ్చిమ దేశాల మీద ధ్వజమెత్తాడు.
హవానా సమావేశాల్లో 30 మంది వరకు దేశాధినేతలు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ జి-20 సమావేశాల్లో ఆఫ్రికా యూనియన్ను సభ్యురాలిగా చేర్చటంలో ప్రముఖ పాత్ర పోషించి పేద దేశాల ఛాంపియన్‌గా నిలిచినట్లు, వాటి వాణిగా ఉన్నట్లు చెప్పుకున్న ప్రధాని నరేంద్రమోడీ మొత్తం పేద, వర్ధమాన దేశాలతో కూడిన జి 77 సమావేశాలకు ఒక దేశాధినేతగా హాజరు కావాల్సి ఉంది. కనీసం విదేశాంగ మంత్రి జై శంకర్‌నైనా పంపాల్సి ఉండగా మొక్కుబడిగా ఒక అధికారిని పంపటం ఈ కూటమి దేశాల్లో మన గురించి ఎలాంటి అభిప్రాయాలకు తావిస్తుందో వేరే చెప్పనవసరం లేదు. ఈ నెల పద్దెనిమిది నుంచి 22వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల కారణంగా మంత్రి హాజరు కావటం లేదని ప్రకటించారు. హవానా సమావేశాలు 15,16 తేదీల్లో ముగిశాయి. పద్దెనిమిదవ తేదీన పార్లమెంటులో జరిగిందేమీ లేదు. పార్లమెంటులో ప్రతిపక్షాలతో సంప్రదింపులు, ఇతర అవసరాల కోసం పార్లమెంటరీ శాఖ మంత్రి ఉన్నారు. విదేశాంగ మంత్రి చేసేదేమీ లేదు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకావటానికి తగినంత సమయం ఉన్నప్పటికీ వెళ్లకపోవటానికి కారణం ఏమిటి ?


దశాబ్దాల తరబడి అమెరికా, దాని మిత్ర దేశాల అన్ని రకాల దిగ్బంధనానికి గురి అవుతున్న క్యూబా జి 77కు ఆతిధ్యం ఇస్తున్నది. ఇది సహజంగానే అమెరికాకు ఇష్టం ఉండదు.లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంతంలోని అనేక దేశాలను అమెరికాకు వ్యతిరేకంగా కూడగట్టటంలో క్యూబా కీలకపాత్ర పోషిస్తున్నది. ఆ ప్రాంత దేశాలతో చైనా సంబంధాలు, పలుకుబడి కూడా పెరుగుతున్నది. ఆగస్టు 21న సెంట్రల్‌ అమెరికన్‌ పార్లమెంటు సమావేశం ఆమోదించిన తీర్మానంలో చైనాను శాశ్వత పరిశీలక దేశంగా ఆమోదిస్తూ అంతకు ముందు ఆ స్థానంలో ఉన్న చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు ఇచ్చిన హౌదాను రద్దు చేసింది. చైనా-లాటిన్‌ అమెరికా దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 18శాతం పెరుగుతూ 2022నాటికి 485.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. ఆ కూటమిలోని దేశాలు అమెరికా, ఇతర ధనిక దేశాల పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నాయి.రష్యా -ఉక్రెయిన్‌ వివాదంలో అమెరికాకు వంతపాడేందుకు నిరాకరించాయి.మరోవైపున చైనా సహకారాన్ని దెబ్బతీసేందుకు పేద దేశాల మధ్య విభజనకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. పేద దేశాల ఛాంపియన్‌ భారత్‌ అని చెబుతున్నది.చైనాను వర్ధమాన దేశంగా గుర్తించకూడదంటూ ఏకంగా అమెరికా పార్లమెంటులో ఒక తీర్మానాన్నే చేశారు. చైనా ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ జనాభా ఎక్కువగా ఉన్న కారణంగా తలసరి జిడిపి, ఆదాయం కూడా వర్ధమాన దేశాల స్థాయిలోనే ఉంది. వర్ధమానదేశంగా గుర్తిస్తే కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది, వాటిని ఎగవేసేందుకే తిరస్కరణ అన్నది స్పష్టం. ఇటీవలి కాలంలో చైనాను ఎంతగా దెబ్బతీయాలని చూస్తే అంతగా అమెరికా, దాని మిత్రదేశాలు విఫలం, చైనా ముందుకు పోవటం చూస్తున్నదే. అన్నింటినీ మించి పూర్తి సభ్యురాలు కాకున్నా చైనాకు కూటమిలో పెద్ద పీట వేయటం, అమెరికా వ్యతిరేక విమర్శలకు వేదికగా ఉన్న చోట భారత్‌ ప్రేక్షకురాలిగా ఉండటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు సుతరామూ ఇష్టం ఉండదు. బహుశా విదేశాంగ మంత్రి గైరు హాజరుకు బయటకు వెల్లడించలేని అసలు కారణం ఇదే కావచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంతన్నాడింతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు : పదేండ్ల నరేంద్రమోడీ పాలనలో ఎగుమతులు తగ్గాయన్న ప్రపంచ బాంక్‌ !

16 Saturday Sep 2023

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Failed Narendra Modi, 10 years Narendra Modi, BJP, China, Donald trump, India Exports, India Imports, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు మనల్ని నిలదీస్తారు. అంతే కాదు ప్రపంచ దేశాల్లో 2022 సౌదీ అరేబియా తప్ప జి-20 దేశాల్లో 6.7శాతంతో మన దేశమే అగ్రస్థానంలో ఉంది. మరి అలాంటపుడు మన దిగుమతులు కూడా ఎందుకు తగ్గినట్లు ? తాజాగా వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్‌ బరత్వాల్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు మన ఎగుమతులు 11.9శాతం తగ్గి 172.95 బిలియన్‌ డాలర్లుండగా మన దిగుమతులు 12శాతం తగ్గి 271.83 బి.డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే మన వాణిజ్య లోటు 112.85 నుంచి 98.88 బి.డాలర్లకు తగ్గింది. అంటే పద్నాలుగు బిలియన్‌ డాలర్ల మేర మన విదేశీమారక ద్రవ్యం మిగిలింది. కానీ సెప్టెంబరు 16వ తేదీ సమాచారం ప్రకారం గడచిన పదకొండు వారాలలో ఐదు బిలియన్‌ డాలర్లు తగ్గి మన నిల్వలు 593,9బి.డాలర్లకు చేరాయి. మన దిగుమతులు గతేడాది మాదిరిగా ఉంటే వాటి పరిస్థితి ఇంకా దిగజారి ఉండేది.

అంతన్నాడింతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు, హస్కన్నడు బుస్కన్నాడే గంగరాజు అంటూ సాగే జానపద గీతంలో మాదిరి పదేండ్ల నుంచి ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన కబుర్లేమిటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.
గుజరాత్‌ తరహాలో దేశమంతటినీ అభివృద్ధి చేస్తామన్నారు. నల్లధనాన్ని వెలికి తీసి ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామని చెప్పారు. ఎగుమతులతో చైనాను వెనక్కు నెట్టేసేందుకు గాను మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత పధకాలను ప్రకటించారు. గంగరాజు మురిపించిన మాదిరి కబుర్లు తప్ప పరిస్థితి ఇంకా దిగజారింది తప్ప మెరుగుపడలేదు. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్ప కేంద్రం ప్రకటించిన ఆర్ధిక విధానాలనే రాష్ట్రాలు అమలు జరుపుతున్నాయి.మెజారిటీ రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలోనే కొనసాగుతున్నాయి. గ్లోబల్‌ ఫైనాన్స్‌ అనే పత్రికలో 2023 జూన్‌ ఎనిమిదవ తేదీన ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం 2018 నుంచి 2022 వరకు ఐదు సంవత్సరాల కాలంలో మన సగటు వృద్ధి రేటు 4.1శాతం కాగా, దిగజారిందీ, తీవ్ర ఆర్థిక సమస్యలతో ఉందని చెబుతున్న చైనాలో 5.5 శాతం ఉంది. వికీపీడియా సమాచారం ప్రకారం 2022లో ఎగుమతులలో ప్రధమ స్థానంలో ఉన్న చైనా వస్తు, సేవల విలువ 3,71,582.7 కోట్ల డాలర్లు కాగా, అమెరికా 3,01,185.9 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. మనదేశం 76,771.7 కోట్లతో పదవ స్థానంలో ఉంది. పదిహేనవదిగా ఉన్న హాంకాంగ్‌ ఎగుమతుల విలువ 69,829.3 కోట్ల డాలర్లు. చైనా తన ఉత్పత్తులు కొన్నింటిని హాంకాంగ్‌ పేరుతో ఎగుమతి చేస్తున్న సంగతి బహిరంగమే. ప్రపంచ జిడిపిలో దేశాన్ని నరేంద్రమోడీ ఐదవ స్థానంలోకి తీసుకుపోయినట్లు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నవారు ఎగుమతుల్లో ఎందుకు తీసుకుపోలేదన్నది ప్రశ్న. ప్రపంచబాంకు విశ్లేషణ ((https://data.worldbank.org/indicator/NE.EXP.GNFS.ZS?locations=IN ) )ప్రకారం 2004లో యుపిఏ అధికారంలోకి వచ్చినపుడు మన జిడిపిలో వస్తు, సేవల ఎగుమతుల విలువ 17.9 శాతం కాగా 2013 నాటికి 25.3కు పెరిగింది. మరుసటి ఏడు 23శాతంగా ఉంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత అది క్రమంగా తగ్గుతూ 2019లో 18.7కు దిగజారింది. తరువాత 2022లో 22.4శాతం ఉంది.1960 నుంచి 1990 వరకు మన జిడిపిలో ఎగుమతుల విలువ 4.5 నుంచి 7.1శాతం మధ్య ఉంది. నూతన ఆర్థిక సంస్కరణల పేరుతో ఆర్ధిక విధానాల్లో మార్పుల తరువాత అది 1998 నాటికి 11 శాతానికి చేరింది. బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పాయి అధికారంలో ఉన్న 1998-2004కాలంలో పైన చెప్పుక్నుట్లు 17.9శాతానికి పెరిగింది. నరేంద్రమోడీ ఏలుబడిలోనే తొలిసారిగా పదేండ్ల కాలంలో పతనమైంది. ఎగుమతులను పెంచేందుకు ప్రతి దేశమూ చర్యలు తీసుకుంటున్నపుడు మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నవాటిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒక నిర్దిష్ట విధానం, నిలకడ, స్పష్టత లేని, సరైనవి కాని విధానాలను అమలు జరిపినపుడు అవి జయప్రదం కావు. మన దేశంలో జరిగిందీ, జరుగుతున్నదీ అదే. జనానికి ఏం చెప్పారు, ఆచరణలో ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న.


చైనాతో సరిహద్దు ఉన్న గాల్వన్‌ లోయలో 2020లో జరిగిన ఉదంతంలో మన సైనికుల మీద చైనా మిలిటరీ దాడి చేసి చంపినదానికి ప్రతీకారం అంటూ నాడు చైనా యాప్‌ల మీద నిషేధం, చైనా నుంచి పెట్టుబడులు రాకుండా ఆంక్షల విధింపు హడావుడి చేసిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. దాంతో అనేక మంది చైనా ఉత్పత్తులు బహిష్కరిస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందని, నరేంద్రమోడీ అందుకు సమర్ధులని ప్రచార ఆర్భాటం చేశారు. జనాల మనోభావాలను సంతుష్టీకరించి చైనాను దెబ్బతీసిన మొనగాడిగా నరేంద్రమోడీ కనిపించిన సంగతి తెలిసిందే.యాప్‌లు, పెట్టుబడులు మన రక్షణను దెబ్బతీస్తాయని చెబితేే జనమంతా నిజమే కామోసు అనుకున్నారు. మోడీ మీద ఉన్న భ్రమ అలాంటిది. సరిహద్దు వివాదం, 1962లో యుద్ధం జరిగినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాలూ వివాదాలకు దౌత్య సంబంధాలకు, వాణిజ్యానికి ముడిపెట్టకూడదన్న అవగాహనకు వచ్చాయి. దాని ఫలితం, పర్యవసానమే నరేంద్రమోడీ- షీ జింపింగ్‌ ఇద్దరూ కలసి ఊహాన్‌-మహాబలిపురాల్లో ఉయ్యాలలూగేందుకు దోహదం చేసింది. గాల్వన్‌ ఉదంతాలు తీవ్ర విచారకరమైనవి. కానీ వాటికి-వాణిజ్యానికి లంకెపెట్టి హడావుడి చేసిన పెద్దలు ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా తమ మాటలను తామే దిగమింగి పెద్ద ప్రచారం లేకుండా చైనా సంస్థలకు తిరిగి స్వాగతం పలుకుతున్నారు. ఇది రక్షణకు ముప్పులేదని అంగీకరించటమే కదా ! మన దేశంతో సరిహద్దులు కలిగి ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయించింది. చైనా మినహా మిగిలిన దేశాలన్నీ మన నుంచి పెట్టుబడులను తీసుకొనేవే తప్ప పెట్టుబడులు పెట్టే సత్తా వాటికి లేదన్నది తెలిసిందే. అందుకే ఆ నిబంధన చైనాను కట్టడి చేసేందుకే అన్నది స్పష్టం. కానీ సూటిగా ఆ మాట చెప్పే ధైర్యం మోడీ సర్కార్‌కు లేదు. కొండంత ప్రతికూల రాగం తీసి కీచు గొంతుతో మాట్లాడుతున్నట్లు ఇప్పుడు దారి తెరిచారు.


మన దేశంలో షియోమీ ఫోన్లను సరఫరా చేసే డిక్సన్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యంతో సెల్‌ ఫోన్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు పోతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌ తెలిపింది. నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో రానున్న మూడు సంవత్సరాల్లో మూడు లక్షల చదరపు అడుగుల్లో స్మార్ట్‌ ఫోన్ల యూనిట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు, వచ్చే నెలలో ప్రారంభించనట్లు వార్తలో పేర్కొన్నారు. ఇదే విధంగా మన దేశంలోని అప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థకు బ్లూటూత్‌ నెక్‌బాండ్‌ ఇయర్‌ ఫోన్ల తయారీ కాంట్రాక్టును కూడా అదే కంపెనీ అప్పగించింది. ఇటీవలి కాలంలో షియోమీ కంపెనీ మీద విధించిన ఆంక్షలు, ఇతర కారణాలతో మన దేశంలో దాని ఉత్పత్తుల విక్రయం తగ్గింది. ఈ ఒప్పందాలతో ఆటంకాలను అధిగమించి తిరిగి మార్కెట్‌ వాటాను పెంచుకోవచ్చని భావిస్తున్నారు.చట్టబద్దంగా, మన చట్టాలకు అనుగుణంగా పని చేసే చైనాతో సహా ఏ దేశానికి చెందిన ఏ సంస్థనైనా అనుమతిస్తామని ఐటి, ఎలక్ట్రానిక్స్‌ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనా సరఫరా వ్యవస్థ నుంచి వైదొలగాలని అమెరికా, ఇతర ఐరోపా దేశాల గీతానికి మన దేశం కోరస్‌గా గొంతు కలిపింది. అయితే చైనా మీద ఆధారపడకుండా మనుగడ కష్టమని గడచిన మూడు సంవత్సరాల అనుభవతత్వం బోధపడటం, మన దేశంలోని కార్పొరేట్‌ సంస్థల వత్తిడి, ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ముందుకు రాకపోవటం, చైనా నుంచి కంపెనీలు వియత్నాంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు పూనుకోవటం వంటి పరిణామాలతో చైనా కంపెనీల గురించి కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందన్నది స్పష్టం. తన వైఖరిని సమర్ధించుకొనేందుకు మనదేశ కంపెనీలకు 51శాతం వాటా ఉండాలన్న నిబంధన విధించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు 2022 డిసెంబరులోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు మీడియాకు లీకులు వదిలారు. గాల్వన్‌ ఉదంతాల తరువాత విధించిన ఆంక్షల ప్రకారం 2020-21లో చైనా నుంచి వచ్చిన 58 ఎఫ్‌డిఐ ప్రతిపాదనలను, మరుసటి ఏడాది మరో 33 ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది.సంయుక్త రంగంలో విద్యుత్‌ వాహనాల తయారీకి వంద కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామన్న చైనా బివైడి కంపెనీ ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. అయినప్పటికీ ఆ ప్రతిపాదన కూడా ఇంకా పరిశీలనలోనే ఉందని చెబుతున్నారు.2023 మార్చి 21 నాటికి చైనా లేదా హాంకాంగ్‌ నుంచి వచ్చిన 54 పెట్టుబడి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు తెలిపారు.


ప్రతి దేశం తన స్వంత పరిశ్రమలు, వాణిజ్యాన్ని కాపాడుకొనేందుకు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నది. దానికి మనదేశం కూడా మినహాయింపు కాదు. నరేంద్రమోడీ సర్కారు కూడా ఆర్ధిక ఆయుధాలను ప్రయోగించి పరీక్షిస్తున్నది.చైనా విషయంలో అవి పని చేయటం లేదన్నది గత పది సంవత్సరాల అనుభవం చెబుతున్నది. చైనా నుంచి మన దిగుమతులు దాదాపు రెట్టింపు కావటమే దానికి నిదర్శనం. అదే మాదిరి మన ఎగుమతులు పెరగలేదు. ఐఎంఎఫ్‌ సమాచారం ప్రకారం రెండు దేశాల మధ్య 2022లో 117 బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగితే చైనా నుంచి దిగుమతుల వాటా 87శాతం ఉంది. మన దేశం నుంచి రొయ్యలు, పీతల వంటి సముద్ర ఉత్పత్తులు, పత్తి, గ్రానైట్‌, వజ్రాల వంటి వాటిని ఎగుమతి చేస్తుంటే చైనా నుంచి ఎలక్ట్రానిక్‌ చిప్స్‌,ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లు, ఔషధాల తయారీకి అవసరమైన పదార్ధాలను దిగుమతి చేసుకుంటున్నాము. మన ఉత్పత్తుల ఎగుమతి నిలిపివేసినా చైనా వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కానీ చైనా నుంచి మనం తెచ్చుకుంటున్న వస్తువులను అంత తక్కువ ధరలకు మరేదేశమూ ఇవ్వని కారణంగానే మరో మార్గం లేకౖ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అనుమతించకపోతే కార్పొరేట్ల ఆగ్రహానికి మోడీ గురికావాల్సి వస్తుంది.


ఇక మనదేశం తీసుకుంటున్న రక్షణాత్మక చర్యల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆగస్టు మొదటి వారంలో అంబానీ కంపెనీ జియో లాప్‌టాప్‌లు,టాబ్‌లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. అంతకు ముందు అదే కంపెనీ వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకొని మార్కెట్‌ చేసింది. ఇప్పుడు విడిభాగాలను దిగుమతి చేసుకొని ఇక్కడ అసెంబ్లింగ్‌ చేస్తూ తన పేరు పెట్టుకుంది. సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాప్‌టాప్‌ల దిగుమతులపై ఆంక్షలు విధించి అవసరమైన వారు అనుమతి తీసుకోవాలంటూ నిబంధన విధించింది.ఇంతకాలం లేని అనుమతులు ఇప్పుడెందుకు ? ఇది ఎవరికోసమో చెప్పనవసరం లేదు. 2018లో అమెరికా అధినేతగా ఉన్న ట్రంప్‌ చైనా వస్తువుల మీద దిగుమతి పన్ను విధిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీశాడు. అదే ఏడాది మన కేంద్ర ప్రభుత్వం చైనా ఫోన్ల దిగుమతులను అడ్డుకొనేందుకు ఇరవైశాతం పన్ను విధించింది. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా బొమ్మలపై అప్పటికే ఉన్న దిగుమతి పన్నును 60, తరువాత 2021లో 70శాతానికి పెంచింది.షియోమీ, బిబికె ఎలక్ట్రానిక్స్‌ చెల్లించాల్సినదాని కంటే తక్కువ పన్ను చెల్లించినట్లు ఆరోపించి ఆ సంస్థల మీద దాడులు చేశారు. మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఉత్పాదక ఎగుమతి బోనస్‌గా చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం 33 బిలియన్‌ డాలర్లను పక్కన పెట్టి ఒక పధకాన్ని రూపొందించింది. అందుకోసం పద్నాలుగు రంగాలను గుర్తించింది, వాటిలో ఎక్కువగా చైనా కంపెనీల ఆధిపత్యమే కొనసాగుతున్నది. చివరకు ఇప్పుడు ఆ చైనా కంపెనీల పెట్టుబడులకే అనుమతులు ఇచ్చి ఉత్పత్తులు చేయించేందుకు, సబ్సిడీలు ఇచ్చి ఎగుమతు చేయించేందుకు పూనుకుంది. స్థానిక కంపెనీలతో కలసి సంయుక్త సంస్థలను ఏర్పాటు చేయాలనే షరతు విధించింది. గతంలో నిషేధం విధించిన షి ఇన్‌ కంపెనీ మన అంబానీ రిలయన్స్‌తో ఒప్పందం చేసుకోవటంతో కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతించింది. ఎందుకు అంటే సదరు కంపెనీ ఇప్పుడు సింగపూర్‌లో ఉందని చెబుతున్నారు. ఎక్కడున్నా అది చైనా కంపెనీయే, లాభాలు వెళ్లేది చైనాకే కదా ! గతేడాది మన దేశం దిగుమతి చేసుకున్న ఉక్కు ఉత్పత్తుల్లో జూన్‌ నెలలో చైనా నుంచి 26.1, వియత్నాం నుంచి ఒకశాతం ఉండగా ఈ ఏడాది జూన్‌ నాటికి అవి 37.1, 4.8 శాతాలకు పెరిగాయి. చైనా ఉక్కు ఉత్పత్తుల దిగుమతి కారణంగా తమకు నష్టం జరుగుతోందని అందువలన వాటి మీద సబ్సిడీ వ్యతిరేక పన్ను విధించాలని మన ఉత్పత్తిదారులు చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే తిరస్కరించింది. దానికి తగిన ఆధారాలు లేవంది. ఇది చైనాను ప్రసన్నం చేసుకొనే చర్యగా ఆ రంగానికి చెందినవారు భావిస్తున్నారు. రాజకీయం, వివాదాస్పదం చేయటం, తిరిగి అదే చైనాకు అనుమతులు ఇవ్వటమెందుకు అంటే లేకుంటే కార్పొరేట్ల లాభాలకు గండి పడుతుంది, అప్పుడు వాటి కన్నెర్రకు గురి కావాల్సి వస్తుంది, చివరికి అధికారానికే ఎసరు వస్తుంది గనుక, కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జి 20 ఢిల్లీ శిఖరాగ్ర సభ : రష్యాను ఖండించకుండా పశ్చిమ దేశాలు ఎందుకు దిగి వచ్చాయి !

13 Wednesday Sep 2023

Posted by raomk in Africa, BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, G 20, G20 Delhi summit, Joe Biden, Narendra Modi, Ukraine crisis, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో జి 20 దేశాల 2023 శిఖరాగ్ర సమావేశం జయప్రదంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఒక సభ్య దేశ ఆతిధ్యంలో సమావేశాలు జరుగుతాయి. గత ఏడాది ఇండోనేషియాలో జరగ్గా వచ్చే ఏడాది బ్రెజిల్‌ వేదిక కానుంది. మరుసటి ఏడాది దక్షిణాఫ్రికాలో జరుగుతుంది, కాగా 2026లో జరగాల్సిన సభకు అమెరికా వేదిక కావటాన్ని చైనా ప్రశ్నించినప్పటికీ చివరికి అంగీకరించింది. ప్రతి సమావేశం తరువాత విడుదల చేసే సంయుక్త ప్రకటన విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తినప్పటికీ చివరికి విడుదల చేశారు. ఈ కూటమిలోని కొన్ని దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్ర విబేధాలు, పరస్పర అనుమానాలు తదితర కారణాల వలన చైనా అధినేత షీ జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హాజరు కాలేదు. దీని గురించి ఎవరికి తోచిన ఊహాగానాలను వారుచేశారు తప్ప అధికారికంగా సదరు దేశాల నుంచి ఎలాంటి ప్రకటనలూ విడుదల కాలేదు. చైనా తరఫున ప్రధాని లీ చియాంగ్‌, రష్యా నుంచి విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావరోవ్‌ ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించారు. ఈ కూటమిలో ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వం ఇవ్వటంతో ఇప్పటి నుంచి అది జి21గా మారింది. దీనిలో 19 దేశాలు ఉన్నాయి. వాటిలో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా,ఇండోనేషియా, రష్యా, చైనా, అర్జెంటీనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, మెక్సికో, కెనడా, బ్రిటన్‌, జర్మనీ,ఫ్రాన్స్‌, టర్కీ, ఇటలీ, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా ఉన్నాయి. ఆఫ్రికా యూనియన్‌, ఐరోపా యూనియన్‌ పూర్తి సభ్యత్వం గల సంస్థలు, ఐరాసతో సహా కొన్ని శాశ్వత ఆహ్వానితుల జాబితా ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తినపుడు ఒక పరిష్కార మార్గంగా ఈ కూటమి ఏర్పాటుకు 1999లో జి7 దేశాల కూటమి ఆలోచన చేసింది. 2008లో ధనిక దేశాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తినపుడు ప్రతి ఏటా శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.


ఈ కూటమిలో ఇప్పటి వరకు ఆహ్వానితురాలిగా ఉన్న ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వ హౌదా కల్పిస్తూ ఢిల్లీ సభ ఆమోదం తెలిపింది. దీనికి కారకులం తామంటే తామని మన దేశంతో పాటు రష్యా, చైనాలు కూడా ప్రకటించుకున్నాయి.ఈ చర్య ద్వారా పేద దేశాల గొంతుక వినిపించేందుకు అవకాశం వచ్చిందన్నది స్పష్టం. సభ్యత్వం ఇచ్చిన ఖ్యాతిని ఎవరి ఖాతాలో వేసుకోవటం అన్నది ముఖ్యం కాదు. వాటికి తోడ్పడుతున్నది ఎవరు అన్నదే గీటురాయి. దాన్ని పరిశీలించినపుడు ఇటీవలి కాలంలో ఆఫ్రికా ఖండంలో రష్యా, చైనా సాయంతో పాటు వాటి పలుకుబడి కూడా పెరుగుతోందన్నది అందరికీ తెలిసిందే. న్యూఢిల్లీ సభ జరిగిన తీరుతెన్నులు, పర్యవసానాలు, ఫలితాల గురించి సమీక్షలు వెలువడుతున్నాయి. తీసుకున్న నిర్ణయాలపై నవంబరు నెలలో వీడియో కాన్ఫరెన్సుద్వారా సమీక్ష జరుపుతారు. ఆమోదించాల్సిన తీర్మానాలు, నిర్ణయాల మీద ఏకాభిప్రాయం సాధించే బాధ్యత ఆతిధ్య దేశం కలిగి ఉంటుంది. అందుకు అనుగుణ్యంగానే దాన్ని మన దేశం కూడా నిర్వహించింది.ఐరాస తీర్మానాలు, పారిస్‌ ఒప్పందాల వంటి వాటినే అంగీకరించకుండా, అమలు జరపకుండా ఠలాయిస్తున్న దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి.నిర్ణయాలను స్వచ్చందంగా అమలు జరపటం తప్ప విధి కాదు. కొన్ని స్పందనలు, కొన్ని అభిప్రాయాలకు భిన్నంగా దేశాలు వ్యవహరిస్తున్న తీరు తెన్నుల గురించి స్థూలంగా చూద్దాం. ఈ సమావేశాలను తన రాజకీయ ప్రయోజనాలకు నరేంద్రమోడీ ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం మనదేశంలో ఇప్పటికే ఉంది. సభ జరిగిన తీరు మీద బిజెపి, నరేంద్రమోడీ మద్దతుదారుల స్పందన కూడా దానికి అనుగుణంగానే ఉంది.


పశ్చిమాసియాలో ప్రముఖ మీడియా సంస్థ ” అల్‌ జజీరా ” లో రాసిన ఒక విశ్లేషణ ఇలా ప్రారంభమైంది.” నరేంద్రమోడీ మోము, భారత దౌత్య మహత్తు(లేదా వివేకము) ప్రదర్శితమైంది.కానీ భారత భిన్నత్వ ప్రదర్శనకు అవకాశాన్ని నిరాకరించారు.భారత్‌ 140 కోట్ల జనాభా ఉన్న దేశం. కానీ సమావేశ రోజుల్లో రాజధాని నగరంలో ఎక్కడ చూసినా కేవలం ఒక ముఖమే కనిపించింది. జి 20 కూటమి నేతలకు ఆతిధ్యం ఇస్తున్న ప్రధాని నరేంద్రమోడీదే అది. కేవలం విమానాశ్రయం వద్దనే కాదు, సభకోసం ఇటీవల జరిపిన నిర్మాణం వరకు చూస్తే ప్రతి రోడ్డు, కొన్ని చోట్ల ప్రతి కొన్ని అడుగులకు, ఎక్కువ చోట్ల రెండుకార్ల పొడవునా ఒక వ్యక్తి ప్రదర్శన మాత్రమే కనిపించింది. దౌత్య ఆడంబర ప్రదర్శనలో మోడీ హీరో కాగా మధ్య ఢిల్లీలో సభ నిర్వహణ ప్రాంతానికి సమీపంలోని విదేశీరాయబార కార్యాలయాలు, హౌటళ్ల వద్ద సంచరించే కోతులను భయపెట్టేందుకు వాటి బొమ్మలతో కూడిన భారీ కటౌట్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సభ జరిగిన చోట వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతీకగా ఉన్న మోడీ బొమ్మలు ఎక్కువగా కనిపించాయి. ప్రగతి మైదాన్‌గా పిలుస్తున్న ప్రాంతంలో కొత్త సభా భవనాన్ని నిర్మించి దానికి భారత మండపం అని పేరు పెట్టారు. దీంతో లౌకిక ముద్ర నుంచి దూరంగా జరిగినట్లయింది. హిందూ దేవాలయాల్లో ముందు వసారాలను మండపం అని పిలుస్తారు. ” ఈ విశ్లేషణలో వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు.


శిఖరాగ్ర సభ ఒక రోజు ముందే సంయుక్త ప్రకటనను ఆమోదించింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్‌ అని దానిలో పిలుపునిచ్చారు. ఈ సుభాషితంతో ఎవరికీ ఇబ్బంది లేదు, అభినందనీయమే. దానికి కట్టుబడి ఉన్నది ఎవరన్నదే ప్రశ్న. ఇది యుద్ధాలకు తగిన యుగం కాదు అన్నది ప్రకటనలోని ఒక అంశం. ఈ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్ల మీద ఈ కూటమిలోని దేశాలు దురాక్రమణలకు పాల్పడిన చరిత్ర, అనేక దేశాల మీద దాడులకు ఉగ్రవాదులను,కిరాయి మూకలను ఉసిగొల్పుతున్న తీరు తెలిసిందే. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోసిందీ, రష్యా ప్రాదేశిక భద్రత మీద ఎలాంటి హామీ ఇవ్వకుండా ఆయుధాలను సరిహద్దుల్లోకి చేర్చటం ప్రారంభించిన తరువాతే పుతిన్‌ సైనిక చర్యకు పాల్పడినదాన్ని ప్రపంచం చూసింది. దాన్ని పరిష్కరించాల్సిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు తమ ఆయుధ సంపత్తిని అందిస్తూ ప్రోత్సహిస్తూ మరోవైపు సుద్దులు చెప్పటం హాస్యాస్పదం. తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని ఐరాస గుర్తించింది. దాన్ని విలీనం చేసుకొనే హక్కు చైనాకు ఉంది. దానికి తగిన సమయం రాలేదంటూ తైవాన్‌కు ఆయుధాలు ఇస్తూ చైనా మీద దాడికి ఉసిగొల్పుతున్న దేశాల నిజాయితీ ఏమిటన్నది ప్రశ్న. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో చైనా ఇంతవరకు ఏ దేశ నౌకనూ అడ్డుకున్న దాఖలా లేదు.


న్యూఢిల్లీ ప్రకటనలో పేర్కొన్న లక్ష్యానికి భిన్నంగా ప్రపంచంలో పరిణామాలు జరుగుతున్నాయి. అణ్వాయుధాల వినియోగం గురించి ప్రకటన హెచ్చరించింది. కానీ తానుగా వాటిని వినియోగించబోనని ప్రకటించేందుకు ఇంతవరకు అమెరికా అంగీకరించ లేదు. అణ్వాయుధాలను మోసుకుపోయే ఆధునిక క్షిపణులు, విమానాలను రోజు రోజుకూ మెరుగుపరుస్తోంది. ఐరాస నిబంధనావళి ప్రకారం ఏ దేశమూ బలప్రయోగం చేయకూడదని పేర్కొన్నది. దీని మీద కూటమి దేశాలు రాజీపడినట్లు ఉక్రెయిన్‌ మండిపడింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడతామని రష్యా కూడా అంగీకరించిందని అందుకే దిగి వచ్చి సంతకం చేసిందని కొందరు పశ్చిమ దేశాల వారు వక్రీకరించారు. వాస్తవానికి పశ్చిమ దేశాల వలలో చిక్కుకొని నాటోలో చేరి తమ ప్రాదేశిక భద్రతకు ముప్పు తలపెట్టినందున ఉక్రెయిన్ను దారికి తెచ్చేందుకు సైనిక చర్య జరుపుతున్నాం తప్ప దాన్ని ఆక్రమించుకొనే లక్ష్యం లేదని రష్యా ప్రారంభం నుంచీ చెబుతున్నది. రష్యా,ఉక్రెయిన్ల నుంచి ఆహారం, ధాన్యాలు, ఎరువుల సరఫరాను పునరుద్దరించాలని, ఎగుమతి దిగుమతులను అడ్డుకోరాదని, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కూడా జి21 కూటమి కోరింది. టర్కీ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించి తమను దెబ్బతీస్తున్న కారణంగానే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ కారణంగా అనేక పేద దేశాలు అధిక ధరలకు ఇతర దేశాల నుంచి ఆహారాన్ని దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితికి పశ్చిమ దేశాలే కారణం. రైతులు విదేశాలకు సైతం ఎగుమతులు చేసుకొని లబ్దిపొందవచ్చంటూ మూడు సాగు చట్టాలను రైతుల మీద రుద్దినపుడు కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ జి20 అధ్యక్ష స్థానంలో ఉన్నపుడే గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లి ఎగుమతులను కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.


ఢిల్లీ సమావేశానికి షీ జింపింగ్‌ హాజరు కాకపోవటం గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.గతంలో జరిగిన ఇలాంటి శిఖరాగ్ర సమావేశాలకు కొన్ని దేశాల నేతలు రాకపోవటం తెలిసిందే. కానీ జింపింగ్‌ రాలేదంటే దాని వెనుక బలమైన కారణాలేమీ లేవంటే ఎవరూ నమ్మరు, తప్పుకుండా ఉండి ఉంటాయి. చతుష్టయ కూటమి(క్వాడ్‌) అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియా కూటమి తనకు వ్యతిరేకమే అని చైనా భావిస్తున్నది. ఈ కూటమి నేతలను వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవ అతిధులుగా పిలవాలని మన ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీలో ఒక గదిలో చైనా ప్రధాని ఉండగా మరొక పక్క గదిలో జో బైడెన్‌-నరేంద్రమోడీ సమావేశమై క్వాడ్‌ పటిష్టత గురించి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్చా నౌకారవాణా గురించి చర్చలు జరిపారు. ఇవి చైనాను రెచ్చగొట్టేవే అన్నది స్పష్టం. వీటికంటే ముందే చైనా రూపొందించిన ప్రపంచ పటంలో మన భూభాగాలను కొన్నింటిని మినహాయించటం, దాని మీద వివాదం చెలరేగిన సంగతీ తెలిసిందే. గతేడాది ఇండోనేషియా నగరమైన బాలిలో జరిగిన సమావేశ ప్రకటనలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండిస్తూ చేర్చిన పేరా వివాదాస్పదమైంది. రాజీమార్గంగా చివరకు ఎక్కువ మంది సభ్యులు ఖండించారని, పరిస్థితి మీద ఇతరులు భిన్నమైన వైఖరులను వెల్లడించారని పేర్కొన్నారు. మొత్తం మీద ఖండన దానిలో కనిపించింది. ఆ సమావేశంలో వీడియో కాన్ఫరెన్సుద్వారా మాట్లాడిన ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కూటమిని జి20 బదులు జి19 అని సంబోధించటం(రష్యాను గుర్తించకుండా) కూడా రచ్చకు దారి తీసింది. సమావేశం జరుగుతుండగా పోలాండ్‌లో క్షిపణి పేలుడు జరిగింది. వాస్తవాలు నిర్ధారించుకోకుండానే దానికి రష్యా కారణమని ఆరోపించటం, సభలో ఉన్న జి7, నాటో కూటమి దేశాల నేతలు అక్కడే విడిగా సమావేశం కావటం, వాటన్నింటికంటే ముందే రష్యా ప్రతినిధి వర్గ నేత లావరోవ్‌తో ఫొటో దిగేందుకు అనేక మంది నేతలు తిరస్కరించటంతో అసలు బాలిలో పాల్గన్నవారి కుటుంబ చిత్రమే లేకుండా పోయింది. తరువాత జరిగిన అనేక పరిణామాలు చైనా, రష్యాలతో అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల సంబంధాలు మరింతగా దిగజారాయే తప్ప మెరుగుపడలేదు. బాలిలో షీ జింపింగ్‌-జో బైడెన్‌ భేటీ జరిగింది, సంబంధాలను, మాటా మంతిని పునరుద్దరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన వెలువడింది. కానీ ఆ వెంటనే అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నానీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పంతంతో తైవాన్‌ వెళ్లటం తెలిసిందే. తరువాత అమెరికా సర్కార్‌ మరింతగా మిలిటరీ సాయాన్ని ప్రకటించింది. ఈ పూర్వరంగంలో వెళ్లకపోవటమే మంచిదని షీ జింపింగ్‌, పుతిన్‌ భావించి ఉండాలి.సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించి బాలి ప్రకటనలో ఉన్న పదజాలానికి భిన్నంగా రష్యా పేరు లేకుండా యుద్ధం కారణంగా జనం పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే పేర్కొన్నారు. ఇది పశ్చిమ దేశాలకు ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. బాలిలో మాదిరి ఖండిస్తే చైనా, రష్యా అంగీకరించకపోతే అసలు ప్రకటనే వెలువడి ఉండేది కాదు. అది జరిగితే తాము బలపరస్తున్న నరేంద్రమోడీ ప్రతిష్టకు భంగం అని భావించి పశ్చిమ దేశాలు అయిష్టంగానే రష్యా మిలిటరీ చర్య ప్రస్తావన లేకుండా అంగీకరించినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d