• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Mao Zedong

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

30 Sunday Nov 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

14th Dalai Lama, 1962 India–China war, Anti China Media, Arunachal Pradesh Dispute, CIA on Tibet, CPI, CPI(M), Jawaharlal Nehru, Mao Zedong, Narendra Modi, USSR

ఎం కోటేశ్వరరావు

ఇటీవల చైనాతో సంబంధం ఉన్న రెండు వార్తలు, విశ్లేషణలు మీడియాలో వచ్చాయి.ఒకటి, 1962లో చైనాతో వచ్చిన యుద్ధం సరిహద్దు సమస్యల మీద కాదు, రెండవది అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మన పౌరురాలి పాస్‌పోర్టు, వీసా చెల్లదు అని చైనా విమానాశ్రయంలో ఇబ్బంది పెట్టారు అన్నది రెండవది. మొదటి అంశాన్ని మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు, రెండవదాని మీద పెద్ద ఎత్తున స్పందించింది, ఎందుకు ?చైనాతో వచ్చిన యుద్దం గురించి వచ్చిన విశ్లేషణ మీద కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది, దాని మనసెరిగి, కనుసన్నలలో నడుస్తున్న మీడియా కావాలనే విస్మరించింది. రెండవ ఉదంతం మీద దానికి భిన్నంగా జరిగింది. చరిత్ర దాస్తే దాగేది కాదు, చెరిపితే పోయేది కాదు.రెండు దేశాల మధ్య యుద్ధం ప్రాధమికంగా సరిహద్దులపై ఏకాభిప్రాయం లేకపోవటం లేదా దౌత్యపరమైన వైఫల్యాల వలన జరగలేదని, పథకం ప్రకారం 1950 మరియు 60దశకాల్లో అమెరికా అనుసరించిన వ్యూహంలో భాగంగా చోటు చేసుకుందని సిఐఏ, దౌత్యకార్యాలయాల పత్రాలు, ప్రచ్చన్న యుద్ద అంతర్జాతీయ చరిత్ర ప్రాజెక్టు పత్రాలు వెల్లడించాయి. కొన్ని ప్రధాన మంత్రి మ్యూజియం మరియు లైబ్రరీలో కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని సంప్రదింపులతో పరిష్కరించుకోవాలన్న వైఖరిని వెల్లడించినందుకు తరువాత సిపిఐ(ఎం)గా ఏర్పడిన నాయకులను యుద్ధ సమయంలో ప్రభుత్వం, నాడు జనసంఘం రూపంలో ఉన్న నేటి బిజెపి నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర పార్టీలు, సంస్థలు దేశద్రోహులుగా చిత్రించాయి. ప్రభుత్వం జైల్లో పెట్టింది. యుద్దాన్ని సమర్ధించి నాటి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపిన సిపిఐతో ఇతరులను దేశభక్తులుగా చిత్రించారు, జనం కూడా అత్యధికులు నిజమే అని నమ్మారు. అది జరిగి ఆరు దశాబ్దాలు దాటింది. ఇప్పుడు వెలువడిన నిజానిజాలేమిటి ? యుద్ధానికి కారణం సరిహద్దు సమస్య కాదని, టిబెట్‌ కేంద్రంగా అమెరికా జరిపిన కుట్రలో భాగంగా జరిగిందని ఇటీవల బహిర్గత పరచిన నాటి రహస్య పత్రాలను అధ్యయం చేసిన వారు చెప్పిన మాట ఇది. వారెవరూ కమ్యూనిస్టులు కాదు. ఆ పత్రాలన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి గనుక దీనికి భిన్నమైన విశ్లేషణను ఎవరైనా జనం ముందు పెట్టవచ్చు. అప్పటి వరకు కమ్యూనిస్టుల మీద నిందవేయటం తప్పని దాన్ని వెనక్కు తీసుకుంటామని ఎవరైనా నిజాయితీతో అంగీకరిస్తారా ?

” 1962 చైనా-భారత్‌ సంఘర్షణ భౌగోళిక రాజకీయ పరిణామాల వెల్లడి : చైనాా-భారత్‌ విభజనను అమెరికా ఎలా మలచింది ? ” అనే శీర్షికతో అమెరికాలోని పబ్లిక్‌ ఎఫైర్స్‌ జర్నల్‌ ఏప్రిల్‌ 2025 సంచికలో వెల్లడించారు. దాని రచయిత జిందాల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌లో పని చేస్తున్న డాక్టర్‌ లక్ష్మణ కుమార్‌. ది హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికతో ఆయన సంభాషించిన అంశాలను ఆ పత్రిక ప్రచురించింది. సోషలిస్టు దేశాలపై అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం, సోవియట్‌ యూనియన్‌-చైనా మధ్య తలెత్తిన సైద్ధాంతిక వివాదాలను ఆసరా చేసుకొని టిబెట్‌ అంశాన్ని ముందుకు తెచ్చి భారత్‌-చైనా మధ్య వివాదాన్ని రగిలించేందుకు అమెరికా రూపొందించిన దీర్ఘకాలిక కుట్రకు రెండు దేశాలూ గురయ్యాయి. నాటి నుంచి నేటి వరకు తరువాత కాలంలో సాధారణ సంబంధాలు ఏర్పడినప్పటికీ పరస్పరం నమ్మకంలేకుండా గడుపుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా ఎత్తుగడ నిజానికి టిబెట్‌ తిరుగుబాటుదార్లకు ఏదో చేద్దామని కాదు, వారికి సాయపడే ముసుగులో భారత్‌-,చైౖనా మధ్య వైరం పెంచటమే అసలు లక్ష్యంగా రహస్య పత్రాల్లో వెల్లడైంది.

1962 అక్టోబరు 20న చైనా దాడి ప్రారంభించి నవంబరు 20న ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి అరుణాచల్‌ ప్రదేశ్‌లో తన ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి సేనలను ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు పరిమితమైంది. అవి తన ప్రాంతాలని అంతకు ముందునుంచి చెబుతున్నప్పటికీ చైనా వెనక్కు తగ్గింది. టిబెట్‌లో జరిగిన కుట్రల క్రమ సారాంశం ఇలా ఉంది.1956లో అక్కడ దలైలామా పలుకుబడిలో ఉన్న ప్రభుత్వ మద్దతుతో తిరుగుబాటుకు నాందిపలికారు. సిఐఏ దాన్ని అవకాశంగా తీసుకొని ముందే చెప్పుకున్నట్లు 1957 నుంచి 1961వరకు వారికి శిక్షణ, ఆయుధాలు,రేడియోలు, ఇతర పరికరాలను ఇచ్చింది.విమానాల ద్వారా 250టన్నుల మిలిటరీ సరఫరాలు చేసింది.నిఘావిమానాల ద్వారా సమాచారాన్ని అందచేసింది. చైనా మిలిటరీ తిరుగుబాటును అణచివేయటంతో 1959లో దలైలామాను టిబెట్‌ నుంచి తప్పించి అరుణాచల్‌ ప్రదేశ్‌ ద్వారా భారత్‌కు చేర్చారు.దీనికి నాటి నెహ్రూ సర్కార్‌ పూర్తి మద్దతు ఇచ్చింది, అధికారులను పంపి మరీ స్వాగత ఏర్పాట్లు చేసిందంటే అమెరికా సిఐఏతో సమన్వయం చేసుకోకుండా జరిగేది కాదు. అంతేనా మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక తిరుగుబాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చింది. దీన్ని రెచ్చగొట్టటం, తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంగా చైనా పరిగణించింది.1961లో ఉత్తర నేపాల్లోని ముస్టాంగ్‌కు సిఐఏ తన కార్యకలాపాలను విస్తరించింది. దలైలామా పరారీ తరువాత అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా మిలిటరీ మన సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.చైనాను నిలువరించాలని ప్రధాని నెహ్రూ నాటి సోవియట్‌ నేతలను కోరారు. అయితే తాము తటస్థంగా ఉంటామనే సందేశాన్ని వార్తల ద్వారా సోవియట్‌ పంపింది. తరువాత దాని నేత కృశ్చెవ్‌ 1959 అక్టోబరు రెండున బీజింగ్‌ పర్యటనలో నెహ్రూ మంచివాడని, భారత్‌తో వైరం వద్దని మావోకు సూచించటంతో ఈ వైఖరి చైనా-సోవియట్‌ మధ్య విబేధాలను పెంచింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటామని అది పెద్ద సమస్య కాదని, అసలు అంశం టిబెట్‌ అని ఈ విషయంలో భారత్‌తో రాజీపడేది లేదని మావో చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దాని పర్యవసానాలు మనదేశంలో కూడా ప్రతిబింబించాయి. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలోని ఒక వర్గం సోవియట్‌ వైఖరికి అనుగుణంగా నెహ్రూ అనుకూల, చైనా వ్యతిరేక వైఖరిని తీసుకుంది.దానికి భిన్నంగా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే వైఖరిని మరో వర్గం తీసుకుంది. అందుకు వారిని జైలుపాలు చేశారు. తరువాత వారే సిపిఐ(ఎం)గా ఏర్పడ్డారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు సిపిఐ(ఎం) వైఖరే సరైనదని రుజువు చేశాయి.సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌, బిజెపి ఎవరు అధికారంలో ఉన్నా వాటి మీద ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉంటూనే చైనాతో సంబంధాలను కొనసాగించారు. ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీ అయి నరేంద్రమోడీ ఒక రికార్డు సృష్టించారు.చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతులలో మోడీ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారు.

అసలు రెండు దేశాల మధ్య యుద్దానికి దారితీసిన పరిస్థితి ఏమిటి ? తెరవెనుక అమెరికా సృష్టించిన టిబెట్‌ చిచ్చుకాగా బయటికి సరిహద్దు వివాదంగా ముందుకు వచ్చింది.1954లో చైనా-భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. అయితే అప్పటికే అమెరికా కుట్ర మొదలైంది. దాన్లో భాగంగా బుద్ద జయంతిని జరుపుకొనే పేరుతో 14వ దలైలామా భారత్‌ వచ్చాడు. ఆ సందర్భంగా అంగీకరిస్తే భారత్‌లో ఆశ్రయం పొందుతానని చేసిన వినతిని నెహ్రూ తిరస్కరించారు. కానీ అదే నెహ్రూ సిఐఏ పధకం ప్రకారం టిబెట్‌ నుంచి పారిపోయి 1959 ఏప్రిల్‌ 18న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ చేరుకున్న దలైలామాకు మానవతాపూర్వక కారణాల సాకుతో ఆశ్రయం ఇవ్వటమేగాక ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకూ అనుమతించించారు. వేలాది మంది టిబెట్‌ నుంచి వచ్చిన వారికీ ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. కాలనీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.సరిహద్దులో మన ప్రభుత్వం 1961 కొన్ని పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతం తమ అదుపులోనే ఉందని ఉద్ఘాటించింది. అప్పటికే దలైలామా ప్రవాస ప్రభుత్వం చైనా వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తోంది.దీనికి తోడు సరిహద్దుల్లో కొత్తగా పోస్టులను ఏర్పాటు చేయటాన్ని అవకాశంగా తీసుకొని చైనా వాటిని తొలగించేందుకు పూనుకోవటం, మన మిలిటరీ ప్రతిఘటించటంతో అది తరువాత నెల రోజుల యుద్ధంగా మారింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ మహిళ ప్రేమా వాంగ్‌జోమ్‌ థోంగ్‌డాక్‌ దగ్గర ఉన్న పాస్‌పోర్టు చెల్లదంటూ షాంఘై పుడోంగ్‌ విమానాశ్రయ అధికారులు కొన్ని గంటల పాటు నిలిపివేశారంటూ వచ్చిన వార్తలకు మన మీడియా పెద్ద ఎత్తున ప్రచారమిచ్చిన సంగతి తెలిసిందే.మనదేశం, చైనాల మధ్య సరిహద్దులంటూ మాపులపై బ్రిటీష్‌ అధికారులు గీచిన రేఖలు రెండు దేశాల మధ్య వివాదాన్ని సృష్టించాయి. వివిధ సందర్భాలలో ప్రచురించిన మాప్‌ల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ చైనాకు చెందినది, చైనా ఆధీనంలో ఉన్న లడఖ్‌ సమీపంలోని ఆక్సారుచిన్‌ ప్రాంతం మనదిగా చూపాయి. అందువలన రెండుదేశాలూ అవి తమ ప్రాంతాలని మాపుల్లో చూపుతున్నాయి. అరుణాచల్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతమైన జాంగ్‌నాన్‌ అని చెబుతుండగా ఆక్సారు చిన్‌ మా లే (లడఖ్‌) జిల్లాలో భాగమని అంటున్నాము. దలైలామా 2023లో తవాంగ్‌ పర్యటన చేస్తామని ప్రకటించగా అనుమతించకూడదంటూ నాడు చైనా అభ్యంతరం చెప్పింది.అంతకు ముందు కూడా అభ్యంతరాల మధ్య పర్యటించినా చివరిసారిగా గాల్వన్‌ ఉదంతాల తరువాత ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌-భారత్‌ పేరుతో ఉన్న పాస్‌పోర్టు, వీసాలను చైనా తిరస్కరించటం ఇదే మొదటిసారి కాదు. పాస్‌పోర్టు మీద స్టాంప్‌ వేయటానికి నిరాకరించి ఒక తెల్లకాగితం మీద అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని చైనా చెప్పింది. దానికి నిరాకరించిన మనదేశం చైనాలో జరిగిన ఆసియా క్రీడలకు మన క్రీడాకారులను పంపలేదు. తాజాగా ప్రేమ అనే మహిళ విషయంలో కూడా అదే జరిగింది, మీరు భారతీయురాలు కాదు, చైనీస్‌ అందువలన వీసా కోసం దరఖాస్తు చేసుకోండి అని చైనా అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

చిత్రం ఏమిటంటే మన దేశంలో ఆశ్రయం పొంది,ప్రవాస టిబెట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1959 నుంచి అన్ని సౌకరాలను అనుభవిస్తున్న 14వ దలైలామా 2003లో మాట్లాడుతూ అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగం అన్నాడు తప్ప మనదేశంలో భాగం అని గుర్తించలేదు. అయినప్పటికీ అతగాడికి సౌకర్యాలు కల్పించటం రాజకీయం తప్ప వేరు కాదు. మనదేశం తెచ్చిన వత్తిడి, విధిలేని పరిస్థితిలో 2008లో తన వైఖరిని మార్చుకున్నాడు. 1914లో బ్రిటీష్‌ వారు గీచిన మక్‌మోహన్‌ రేఖను భారత్‌-టిబెట్‌ సరిహద్దుగా నిర్ణయిస్తూ బ్రిటీష్‌ ఇండియా పాలకులు టిబెట్‌ పాలకులతో సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు.బ్రిటీష్‌ వారి పాలనకు చరమగీతం పాడారు, దాంతో ఉక్రోషం పట్టలేని బ్రిటన్‌ కుట్రకు తెరలేపింది. అప్పుడే స్వాతంత్య్రం పొందిన చైనాకు టిబెట్‌ మీద హక్కులేదని చెప్పేందుకు బ్రిటీష్‌ పాలకులు పన్నిన కుట్రలో భాగం సిమ్లా ఒప్పందమంటూ నాటి, నేటి చైనా ప్రభుత్వం అంగీకరించలేదు. టిబెట్‌ తమ సామంత దేశమని అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకొనేందుకు దాని పాలకులకు హక్కు లేదు, చెల్లదని చైనా చెబుతున్నది. ఉదాహరణకు, బ్రిటీష్‌ పాలనలో సామంత రాజ్యాలుగా ఉన్న కాశ్మీరు, నిజాం సంస్థానాలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటాన్ని నాడు మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ పూర్వరంగంలో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటం తప్ప దగ్గరదారి లేదు. అప్పటి వరకు యథాతధ స్థితి కొనసాగించాల్సి ఉంది. రెండు దేశాలూ ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నప్పటికీ సాధారణ సంబంధాలకు ఢోకా ఉండదు. వివాదాన్ని కాలమే పరిష్కరించాల్సి ఉంది. యుద్ధాల ద్వారా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటం కుదిరే అంశం కాదు. ఆక్రమిత కాశ్మీరుపై మనకు తిరుగులేని హక్కు ఉంది, ఎలాంటి వివాదం లేకున్నా బలప్రయోగంతో స్వాధీనం చేసుకొనేందుకు పూనుకోలేదు. చైనా గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి అమెరికా బడా పత్రికలు అనేక తప్పుడు వార్తలు ఇచ్చాయి. మీడియాలో వచ్చే వార్తలు, వ్యాఖ్యలు లేదా అధికారంలో లేని సంస్థలు, వ్యక్తులు చేసే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే అంశాలకు రెండు దేశాలకు చెందిన పౌరులు భావోద్వేగాలకు గురైతే బుర్రలు ఖరాబు చేసుకోవటం తప్ప జరిగేదేమీ ఉండదు. వివాదాలు పభుత్వాలు తేల్చాల్సిన, తేల్చుకోవాల్సిన అంశాలని గ్రహించాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎర్రపూల వనం : మావో లిటిల్‌ రెడ్‌ బుక్‌ అట్ట రంగు నీలం ! అయితేనేం, అంశాలు కమ్యూనిజమే కదా !!

16 Sunday Mar 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Political Parties, RELIGION, USA

≈ 1 Comment

Tags

Anti Communist Eevangelicals, Donald trump, first Little Red Book, Mao Zedong, Mao Zedong thought, Mao Zedong’s first Little Red Book, US anti China Propaganda, US anti communism, Yoon Suk-yeol’


ఎం కోటేశ్వరరావు


పిల్లి నల్లదా తెల్లదా అన్నది కాదు, అది ఎలుకల్ని వేటాడుతుందా లేదా అన్నదే చూడాలన్నది ఒక చైనా సామెత. కమ్యూనిస్టులు ముద్రించే సాహిత్యం అంటే ఎర్రటి అట్టలుంటాయని చాలా మంది అనుకుంటారు, అది పాక్షికంగా వాస్తవం కూడా. పోలీసులు నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లలో హత్య చేసినపుడు వారి దగ్గర స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన వస్తువుల్లో ఎర్ర అట్టలతో ముద్రించిన పుస్తకాలను కూడా చూపేవారు. నిజానికి ఎర్ర అట్టలతో పుస్తకాలు ముద్రించిన వారిలో ఎందరు చివరి వరకూ కమ్యూనిస్టులుగా ఉన్నారు ? గాడి తప్పి జెండాను పక్కన పడేయటం, ఉద్యమాన్ని నాశనం చేయటం, ద్రోహం చేసిన వారి చరిత్రలు తెలిసినవే. సాంస్కృతిక విప్లవం పేరుతో అమలు జరిపిన కార్యక్రమానికి ముందు మావో జెడాంగ్‌ ఆలోచనలతో కూర్చిన ఒక పుస్తకాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ 1964లో ప్రచురించింది. దాన్నే లిటిల్‌ రెడ్‌ బుక్‌ అని పిలిచారు. ఆ పుస్తకపు తొలి ముద్రణ అట్ట నీలి రంగులో ఉంది.తరువాత అది ఎర్ర అట్టతో వందకోట్లకు పైగా ముద్రణలు పొందిందని చెబుతారు. తొలి నీలి రంగు ప్రతి అరుదైనదిగా మారింది. ఈ ప్రతిని ఏప్రిల్‌లో న్యూయార్క్‌లో జరిగే అంతర్జాతీయ ప్రాచీన పుస్తక ప్రదర్శనలో ప్రదర్శించటమే గాక వేలంలో దాని ధరగా పదిలక్షల పౌండ్లు నిర్ణయించారు. విప్లవంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర గురించి మావో చెప్పిన అంశాలతో ఈ పుస్తకం ప్రారంభమౌతుంది. 1964 ముద్రణకు ముందు చైనా ప్రజా విముక్తి సైన్యాన్ని ఉద్దేశించి మావో చెప్పిన అంశాలతో సంకలనం జరిగింది. తరువాత అనేక మార్పులు, చేర్పులతో మరింత స్పష్టత,క్లుప్తతతో రూపొందించారు. ఈ పుస్తక ముద్రణ తరువాత 1966లో వివాదాస్పద సాంస్కృతిక విప్లవ కార్యక్రమాన్ని అమలు చేశారు. అప్పుడు ఎర్ర అట్టతో మరోసారి మార్పులు చేసిన ఈ గ్రంధం అనేక ముద్రణలు పొందింది. జస్టిన్‌ ష్కిల్లర్‌ అనే అమెరికన్‌ రెండు దశాబ్దాలకు పైగా వివిధ దేశాల నుంచి అపురూప పుస్తకాలను సేకరించాడు. 1990 దశకం ప్రారంభంలో ష్కిల్లర్‌ చైనా వెళ్లాడు. ఆ సమయానికి 1963నాటి ముద్రణ ప్రతులను సంస్థలు, వ్యక్తులు పక్కన పడేశారని ఆ తరుణంలో ఆ ప్రతిని సంపాదించినట్లు పుస్తకాల అమ్మకాలను పర్యవేక్షిస్తున్న లండన్‌కు చెందిన అపురూప పుస్తకాల డీలర్‌ మాట్‌ విల్స్‌ చెప్పాడు. ఈ ప్రదర్శన`అమ్మకంలో అనేక తొలి , అంతర్జాతీయ ముద్రణల అపురూప ప్రతులను ప్రదర్శిస్తారు.


మావో ఆలోచనా విధానంలో కొన్ని అంశాలను తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ పక్కన పెట్టినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ పాత్ర, విప్లవ అనుభవాల గురించి మావో చెప్పిన అనేక అంశాలు ఇప్పటికీ చైనా కమ్యూనిస్టులకు, అంతర్జాతీయంగా మార్గదర్శకంగానే ఉన్నాయి. మరణానంతరం మావో పాత్రను తగ్గించటం లేదా విస్మరించటం వంటి తప్పిదాలకు కమ్యూనిస్టు పార్టీ పాల్పడలేదు.ప్రతి ఒక్కరూ ధనవంతులౌతారని ఊహించుకోవటానికే భయం వేస్తున్నదని ఆ పుస్తకంలో ఒక సందర్భంగా మావో చెప్పారు. ఆరుదశాబ్దాల తరువాత చైనా ఆ దిశగా ప్రయాణిస్తుందని, అసాధ్యం అనుకున్నదానిని తాను మార్గదర్శకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ సుసాధ్యం చేసే బాటలో పయనిస్తుందని మావో ఊహించి ఉండరు. లిటిల్‌ రెడ్‌ బుక్‌ ప్రతిని ఎవరు స్వంతం చేసుకుంటారో, విక్రేతలు ఆశిస్తున్నట్లుగా పదిలక్షల పౌండ్లకా తక్కువ ఎక్కువలకు అమ్ముడు పోతుందా అన్నది వేరే అంశం. మావో జీవితాంతం వ్యతిరేకించిన ధనికస్వామ్యపు ప్రతినిధులు, భాగస్వాములే దాన్ని సొంతం చేసుకుంటారు. వారికి అది ఒక అలంకరణ వస్తువు మాత్రమే. కమ్యూనిస్టులు, కష్ట జీవులు అంత ధరకు కొనుగోలు చేయరు గానీ దానిలో ఉన్న అంశాలను మాత్రం సొంతం చేసుకుంటారు, ఆచరించేందుకు చూస్తారు, భవిష్యత్‌ తరాలకు అందిస్తారు.

సైప్రస్‌లో మరో కమ్యూనిస్టు పార్టీ !
ప్రాణం ఉన్నంత వరకు జీవి బతుకుపోరాటం చేస్తూనే ఉంటుంది. అలాగే సజీవంగా ఉన్న ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో నిరంతరం మధనం జరుగుతూనే ఉంటుంది. సైప్రస్‌లో కొందరు 2024 సైప్రస్‌ కమ్యూనిస్టు ఇనీషియేటివ్‌(సిసిఐ) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. సైప్రస్‌ కమ్యూనిస్టు పార్టీ అకెల్‌(ప్రోగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ వర్కింగ్‌ పీపుల్‌) కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు క్రిస్టోస్‌ కౌర్టెల్లారిస్‌ దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. క్రిస్టోస్‌ తాత అకెల్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. తాము ఎన్నికల్లో పాల్గ్గొనటం కంటే సంస్థాగతంగా పటిష్టం కావటానికి ప్రాధాన్యత ఇస్తామని, కమ్యూనిస్టు పార్టీ లేని లోటును పూడుస్తామని తాజాగా ఆ పార్టీనేత ఒకరు చెప్పారు.అకెల్‌ పార్టీ సైప్రస్‌ పార్లమెంటులోని 56 స్థానాలకు గాను 15 సీట్లతో, 21శాతం ఓట్లతో రెండవ స్థానంలో ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని సిసిఐ చెప్పుకుంది.

దక్షిణ కొరియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత`క్రైస్తవ సువార్తకులు !
దక్షిణ కొరియాలో సైనిక పాలన ప్రకటించి తీవ్ర వ్యతిరేకత వెల్లడి కావటంతో కొద్ది గంటల్లోనే రద్దు చేసిన అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ మీద కోర్టు తీర్పు వెలువడనుండగా అతగాడికి మద్దతుగా, వ్యతిరేకంగా శనివారం నాడు లక్షల మంది రాజధాని సియోల్‌ పట్టణంలో ప్రదర్శనలు జరిపారు. వ్యతిరేకంగా పదిలక్షల మంది, అనుకూలంగా మూడున్నరలక్షల మంది పాల్గ్గొన్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కమ్యూనిస్టు ముప్పు నుంచి తప్పించేందుకే తాను మిలిటరీ పాలన విధించానని యూన్‌ సమర్ధించుకున్నప్పటికీ గద్దె దిగాల్సిందేనని పార్లమెంటు గతేడాది డిసెంబరులో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది, దాన్ని ధిక్కరించటంతో అరెస్టు కూడా చేశారు. మార్చినెల ఏడవ తేదీన అరెస్టు వారంటును కోర్టు రద్దు చేయటంతో జైలు నుంచి విడుదల చేశారు, యూన్‌ పార్లమెంటు చర్యను కోర్టులో సవాలు చేశాడు. అక్కడి చట్ట ప్రకారం తిరుగుబాటు చేసిన వారికి ఉరిశిక్ష, జీవిత ఖైదు విధించవచ్చు, తప్పుచేయలేదంటే అధ్యక్షుడు గనుక తిరిగి పదవిలో కూర్చో పెట్టవచ్చు. తీర్పు సమయం దగ్గరపడిన కొద్దీ దేశంలో అనుకూల, వ్యతిరేక వర్గాలు సమీకరణలకు పూనుకున్నాయి. యూన్‌ తరఫున అక్కడి క్రైస్తవ ఇవాంజెలికల్స్‌ రంగంలోకి దిగారు. తమ అధ్యక్షుడిని తిరిగి గద్దె మీద ప్రతిష్టించాలని డిమాండ్‌ చేస్తున్నారు.దేశమంతటా ఈ మేరకు ప్రదర్శనలు చేస్తూ కమ్యూనిజం ముప్పు ఉన్నందున రక్షకుడిగా యూన్‌ ఉండాల్సిందేనంటూ ఉపన్యాసాలు చేస్తున్నారు.దేవుడు రచించిన మంచి పధకంలో భాగంగానే యూన్‌ చర్యలు తీసుకున్నాడంటూ బోధలు, ప్రార్ధనలు చేస్తున్నారు. చివరి వరకు పోరాడాల్సిందేనంటూ యూన్‌కు మద్దతు తెలుపుతున్నారు.దేశంలోని క్రైస్తవులు రెండు పక్షాలుగా చీలిపోయారు. మూడిరట రెండు వంతుల మంది సీనియర్‌ పాస్టర్లు యూన్‌ తొలగింపును సమర్ధిస్తున్నట్లు సర్వే వెల్లడిరచింది.అమెరికాలో ఎవాంజెలికల్స్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్లే దక్షిణ కొరియాలో కూడా యూన్‌కు మద్దతు ఇస్తున్నారు. ఉత్తర కొరియా, చైనా ఏజంట్లు, మద్దతుదార్లు దక్షిణ కొరియా ప్రభుత్వంలో చొరబడినట్లు, వారందరినీ రూపుమాపాల్సిందేనని వారు సాధారణ జనాన్ని రెచ్చగొడుతున్నారు.యూన్‌ తిరిగి అధికారానికి రాకపోతే చైనా, ఉత్తర కొరియా అనుకూల పార్లమెంటు సభ్యులు దేశాన్ని చైనాకు సామంత దేశంగా, సోషలిస్టు రాజ్యంగా మార్చుతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 1950దశకంలో ఉత్తర కొరియాపై అమెరికా దాడి చేసినపుడు దాన్ని పవిత్ర యుద్ధంగా దక్షిణ కొరియాలోని చర్చి వర్ణించి అమెరికాకు మద్దతు పలికింది. ఇటీవలి పరిణామాల గురించి యూట్యూబర్లు పెద్ద ఎత్తున రంగంలోకి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు, వారి వెనుక ఎవరు ఉన్నదీ అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

అమెరికాను వెన్నాడుతున్న చైనా కమ్యూనిస్టు భయం !
కమ్యూనిజాన్ని ఏడు నిలువుల లోతున పాతి పెట్టామని, విజయం సాధించామని మూడు దశాబ్దాల క్రితం ప్రకటించుకున్న అమెరికాను ‘‘ కమ్యూనిస్టు భూతం ’’ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇటీవల అమెరికా జాతీయ భద్రతకు చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎలా ముప్పు వచ్చిందో చెప్పాలంటూ పార్లమెంటరీ కమిటీ కొన్ని ప్రశ్నలను సంధించింది. చైనా వాంఛలేమిటి, సైబర్‌, అంతర్గత భద్రతకు దాన్నుంచి ముప్పు ఎలా ఉంది, చైనా వివిధ దేశాల నుంచి ఎలా ముప్పు కలిగిస్తోందో చెప్పాలని కోరింది. దానికి గాను ఆ కమిటీ ముందు వివరించిన అంశాల సారం ఇలా ఉంది. చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయవాదంతో పని చేస్తోంది. సామ్రాజ్యవాదుల చేతిలో దశాబ్దం పాటు పొందిన అవమానాలకు బదులు తీర్చుకోవాలని చూస్తోంది.అమెరికా నాయకత్వంలోని ప్రపంచ వ్యవస్థను అధిగమించాలన్న పెద్ద పథకంతో ఉంది.సాంకేతికంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా కూడా అధిగమించే, ఓడిరచే సత్తాను సమకూర్చుకోవాలని చూస్తోంది. పశ్చిమార్ధగోళంలో మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది.భూ, సముద్ర, ఆకాశంలో కూడా మిలటరీ రీత్యాపై చేయిగా మారాలనుకుంటున్నది.


అంతర్జాతీయ సంస్థలలో నాయకత్వ పాత్రకోసం,పశ్చిమ దేశాల కూటమిని చీల్చాలని చూస్తోంది. అమెరికా వ్యక్తిగత సమాచారాన్ని పొందటం ద్వారా గూఢచార అవసరాలను తీర్చుకోవాలని, లక్ష కోట్ల మేథోసంపత్తి సంపదను కొట్టేసేందుకు వివిధ కంపెనీలు, అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో చొరబడాలని, ఉన్నత అధికారుల వివరాలను సేకరించాలని, యుద్ధ సమయాలలో గగనతలంలో పోరు సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లకోసం ప్రయత్నిస్తున్నది. చైనా నుంచి పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉత్పత్తులను అమెరికా ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయటాన్ని నిషేధించాలి.అమెరికా వ్యవస్థలు, కంపెనీలు ఎలా పనిచేస్తున్నదీ తెలుసుకొనేందుకు చైనా ప్రయత్నించటాన్ని అనుమతించకూడదు. అమెరికా వ్యవస్థలలో వినియోగించేందుకు చైనా కంపెనీల పరికరాలను నిషేధించాలి.అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఫెంటానిల్‌ తయారీకి చైనా ప్రభుత్వం కంపెనీలకు రాయితీలు ఇస్తున్నది.రహస్యంగా పనిచేస్తున్న చైనా బాంకులు ఫెంటానిల్‌ సరఫరాదార్లకు తోడ్పడుతూ వచ్చిన లాభాలను స్వంతం చేసుకుంటున్నాయి. ఇలాంటి సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించాలి.నగదు చేతులు మారకుండా అవసరమైన మేరకు చట్టాలను సవరించాలి.


పార్లమెంటరీ కమిటీ ముందు ఈ అంశాలన్నింటినీ చెప్పిన తరువాత రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ బైరన్‌ డోనాల్డ్స్‌ అమెరికా మద్దతు ఇస్తున్న తైవాన్‌ చట్టం పేరుతో ఒక బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టాడు. తైవాన్‌ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వాలని, అమెరికా పత్రాల్లో చైనీస్‌ తైపే అనే పదాలకు బదులు తైవాన్‌ అని సవరించాలని, ఆ మేరకు అన్ని వెబ్‌సైట్లలో మార్చాలని ప్రతిపాదించాడు. అమెరికాకు వ్యూహ్మాక భాగస్వామిగా తైవాన్‌ ఉండాలని బైరన్‌ చెప్పాడు. ప్రపంచ వేదికల మీద చైనా తన ప్రభావాన్ని పెంచుకొనేందుకు చూస్తున్నదని అన్నాడు.డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత మరోసారి చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించిన తరువాత ఇలాంటి రెచ్చగొట్టే అంశాలను పార్లమెంటులో ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగించటం లేదు. ఇంకా ఇలాంటివి ఎన్నింటిని చూడాల్సి వస్తుందో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాలో “సోషలిస్టు మార్కెట్‌ ఎకానమీ” మావో ఆలోచనావిధానంలో భాగమే

12 Wednesday Oct 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

China socialist market economy, chinese communist party, Mao Zedong, Mao Zedong thought, People's Republic of China

ఆదిత్య కృష్ణ  

చైనాకీ,  చైనాపరిశీలకులకీ చాలాముఖ్యమైనది ఈ అక్టోబరు16 న మొదలౌతున్న చెనా కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభ. నేడు చైనాలో సోషలిజం ప్రాథమిక స్థాయిలోనూ, చైనా ప్రత్యేక లక్షణాలతోనూ కూడి వున్నది అని అక్కడి నాయకత్వం చెప్తున్నది. 2050 నాటికి ప్రపంచంలోని మధ్యస్థాయి (యూరపు) దేశాల అభివృద్ధి స్థాయిని అందుకొంటుందనీ వారు చెప్తున్నారు. దాన్ని కొట్టిపారేస్తూ – చైనా పాలకులు సోషలిజం ముసుగులో పెట్టుబడిదారీ పాలనను సాగిస్తున్నారని మీడియాలో నిత్యం ప్రచారం సాగుతున్నది. సోషలిజం సార్వజనీనమైనది, మళ్లీ ‘చైనా మాదిరి’ ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సోషలిజానికి ఒకే రకమైన రెడీమేడ్‌ మోడల్‌ ఏమీ లేదు.

అక్కడితో ఆగక, చైనాది సామ్రాజ్యవాదం, లేదా సోషల్‌ సామ్రాజ్యవాదం అని మరి కొందరు – మావో వాదులమని  చెప్పుకొనేవారు ‘సిద్ధాంతాల’ పేరిట – విమర్శిస్తున్నారు. సామ్రాజ్యవాదం అంటేనే గుత్తపెట్టుబడిదారీ వ్యవస్థ; గుత్తపెట్టుబడిదారీ విధాన అత్యున్నత రూపం సామ్రాజ్యవాదం అవుతుంది – అని లెనినిజం చెప్తుంది. చైనాలో గుత్త పెట్టుబడిదారీ విధానం అనే పునాదే లేదు; అనేక (పబ్లిక్, సమిష్టి, ప్రైవేటు, వ్యక్తిగత) సెక్టార్లున్న చైనాలో – దానికి ప్రాతిపదిక లేదు. అలాంటిచోట (సోషల్‌) సామ్రాజ్యవాదం ఎలా ఏర్పడుతుంది?

సామ్రాజ్యవాదాన్ని, అమెరికా అగ్రరాజ్యాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన ప్రపంచ శక్తిగా ఉన్న  చైనాపై అలాంటి ఆరోపణలు అర్థరహితం. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మూడవ ప్రపంచదేశాల్లో  చైనాకి  ఉన్న ఆదరణను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల పాలకవర్గాలకు ఈ ప్రచారాలు ఆచరణలో తోడ్పడుతున్నాయి. సిద్ధాంతరీత్యా చూసినా, ఆచరణలో చూసినా చెల్లని ఆరోపణలివి. స్వతంత్ర పరిశీలనకన్నా పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య మేధావులూ వండి వార్చినదే  వారి విమర్శలకి మూలాధారం. చైనా పార్టీతో, వారి డాక్యుమెంట్ల పరిశీలనతో వారికి పనిలేదు. 

భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం , అనేక తప్పులు చేసి, ఎదురుదెబ్బలు తిని,విప్లవ గమనంలో కుంటుపడి చిక్కుల్లో ఉన్నది. మనదేశంలో మార్కిజం-లెనినిజం-మావో ఆలోచనావిధానం పేరిట బలమైన పిడివాదం వుంది. తప్పుడు విమర్శలకు ఒక పునాది అదే. మనదేశంలో చాలా మంది కమ్యూనిస్టులకూ, అభ్యుదయవాదులకూ అల నాటి రష్యాపట్ల అపార అభిమానం. వారికి ఎంగెల్స్‌ నొక్కి చెప్పిన “శాస్త్రీయ సోషలిజం” కన్నా ఆదర్శవాద, ఊహాజనిత సోషలిజమే ఒంట బట్టింది. అందుకే అశాస్త్రీయమైన అవగాహనతో విమర్శలు చేస్తుంటారు. ఈ విషయంపై సమగ్ర అధ్యయనం అవసరం. దానికిది క్లుప్త పరిచయం.

అంతర్జాతీయ, చైనా వ్యవహారాల నిపుణులైన జె.యన్‌.యు. ప్రొఫెసర్‌ అల్కా ఆచార్య క్జి జిన్‌పింగ్‌ ఎన్నికపై లోగడ ఒక సమీక్షావ్యాసం రాశారు (EPW 5-5-2018). బీజింగ్‌లో ఒక యువపరిశోధకుడు 2017లో అన్న మాటతో ఆమె తనవ్యాసం ముగించారు: “మావో మమ్మల్ని విముక్తి చేశారు. డెంగ్‌   మ మ్మల్ని సంపన్నులుగా మార్చారు. ఇప్పుడు జిన్‌పింగ్‌ మా పార్టీని, చైనాను శక్తివంతంగా  రూపొందిస్తారు.”  విప్లవ విజయం (1949) తర్వాత  చైనా – సోషలిస్టు నిర్మాణంలో అంచెలంచెలుగా ముందుకుసాగుతున్నది. పై వాక్యాలు అక్కడి పరిణామాల క్రమాన్ని అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతాయి. 

వాస్తవాలకు విరుద్దమైన విమర్శలు : చైనాలో వ్యవసాయ భూమినేటికీ  ప్రభుత్వ ఆస్తిగానే వుంది   

మావోకాలంలో అంతా సవ్యంగా వుందని, మావో తర్వాత డెంగ్‌ అంతా తిరగ దోడారనీ విమర్శలు చేస్తుంటారు. చెనాలో మావో పద్ధతులని పక్కనపెట్టి, “స్వేచ్చామార్కెటు” (డెంగ్‌) విధానాలను అనుసరిస్తున్నారని అంటూ చైనాలో పెట్టుబడిదారీ పునరుద్దరణ జరిగిందన్న సిద్దాంతాన్ని – లోతుపాతులు తెలుసుకోకుండా-కమ్యునిస్టు వ్యతిరేకులు కూడా- ప్రచారం చేస్తున్నారు. నిజానికి అచ్చంగా “స్వేచ్భామార్కెట్‌” విధా నాలు ఈ నాడు ఏ సామ్రాజ్యవాదదేశంలో సైతం అమల్లో లేవు. సామ్రాజ్యవాదం అంటేనే గుత్తపెట్టుబడిదారీ వ్యవస్థ . స్వేచ్చా మార్కెటు‌కీ, గుత్త వెట్టుబడికీ పొత్తు కుదరదు. ఇటీవలి కాలంలో అనేక దేశాల్లో అక్కడితో ఆగలేదు. ప్రొటెక్షనిజం, ఆశ్రిత (క్రోనీ) పెట్టుబడిదారీ పద్దతులు గుత్తపెట్టుబడికి తోడైనాయి. చైనా పాలకులు సోషలిజం ముసుగువేసుకొన్నారు;  ఆచరణలో సొంత ఆస్థిని పునరుద్ధరించారు; కమ్యూన్‌లను రద్దు చేసారు అని కొందరు చెప్తున్నారు. చైనాలో కమ్యూన్‌లను రద్దు చేసి “వ్యక్తిగత బాధ్యతావిధానం”  (Individual Responsibility system) అనే వ్యవసాయరంగ సంస్క రణను చేసా రన్నది నిజమే. కానీ సొంత ఆస్తిని పునరుద్ధరించారన్నది వాస్తవం కాదు. చైనాలో వ్యవసాయ భూమి ఈనాడు కూడా ప్రభుత్వ ఆస్తిగానే వుంది. రైతులకు అనుభవించే హక్కు, ఆ హక్కుని తర్వాతి తరం పొందే హక్కు కూడా వుంది. ఆస్తి వ్యవస్థ  వేరు, నిర్వహణా పద్ధతి వేరు. సంస్కరించింది రెండో అంశం మాత్రమే. ఈ కీలకమైన వాస్తవాన్ని విస్మరించి, వ్యాఖ్యానించటం తప్పు. ఇది అవాస్తవం, అశాస్త్రీయం, హేతువిరుద్ధం కూడా.

సోషలిస్ట్ మార్కెట్‌ ఎకానమీ అంటే.. చైనాలో అనుసరిస్తున్నది “స్వేచ్చా మార్కెట్‌ పద్ధతి” కాదు. దాన్ని “సోషలిస్టు మార్కెట్‌ ఎకానమీ” అంటారు. దానికే “సోషలిస్ట్ ప్లాన్డ్‌ కమోడిటీ ఎకానమీ” అనే పేరు కూడా ఉంది. “పబ్లిక్‌ ఓనర్‌షిప్‌” పైచేయిగా వుండే వ్యవస్థ అది. రాజ్యం మార్కెటుని రెగ్యు లేటు చే స్తుంది; మార్కెట్‌ ఎంటర్ ప్రైజెస్ ని గైడ్ చేస్తుంది” అన్నది దాని ప్రాతిపదిక. ఆ విధంగా ప్లానింగు, మార్కెటు మేళవించబడుతాయి. ఈ అవగాహ నను చైనాపార్టీడాక్యుమెంట్లలో చూడవచ్చును. కొన్ని మౌలిక ఆర్థిక సూత్రాలను  తెలుసుకోకుండా, లేదా విస్మరించి, తప్పు అవగాహనలు చలామణీలో వున్నాయి. పెట్టుబడిదారీ విధానం=మార్కెటు; సోషలిజం=ప్లానింగు; ఇవి విడదీయరాని జంటలని ఒక అవగాహన విస్తృతంగా వుంటూ వచ్చింది. ఇది తప్పు అని చైనా పార్టీ, డెంగ్‌ వివరించారు. ఫ్యూడల్‌ యుగంలోనూ మార్కెటు- వాణిజ్యం, ఎగుమతులూ – ఉన్నాయి;  బడా పెట్టుబడిదారీ సంస్థలు ప్లానింగ్ చే సుకొన్నాకే  రంగంలోకి దిగుతాయని గుర్తుచేసారు. దాని అధ్యయనం అవసరం, ఉపయోగకరం. 

‘ఆర్థిక రంగంలో సాగించే యుద్ధం‘: లెనిన్‌

లెనిన్‌ కాలంలో రష్యా విప్ణవం (1917) విజయవంత మైంది. ఆ వెంటనే సామ్రాజ్యవాదుల జోక్యం, అంతర్యుద్ధం రష్యాని అతలాకుతలం చేశాయి. 1922 దాకా అలాంటి సంక్షోభం కొనసాగింది. సోషలిస్ట్ నిర్మాణం- అభివృద్ధి తొలిదశలోనే 1924 జనవరిలో లెనిన్‌ మరణించారు. ఆ దశలో లెనిన్‌ నూత న ఆర్థిక విధానం ( NEP) పేరిట దేశ, విదేశ పెట్టుబడిదారులనూ, వారి పద్ధతులనూ రష్యా లో  అనుమతించారు. 

ఈ విధానం ప్రమాదకరం కాదా? అంటే అది పెట్టుబడిదారీ అభివృద్ధే అవుతుంది, నిజమే. కానీ ప్రమాదకరం కాదు; ఎందుకంటే అధికారం కార్మికుల, రైతులచేతిలోనే ఉంటుంది. కంట్రాక్టు షరతుల్ని అమలు చేస్తాం; దాని వల్ల కార్మికుల పరిస్థితులు బాగుపడుతాయి… ఇది సరైందే కూడా; ఎందుకంటే ఇతరదేశాల్లో విప్లవం ఆలస్యమైపోయింది; ఈ లోగా మన పారిశ్రామిక తదితర ఉత్పత్తులు పెరుగుతాయి; మన కార్మికుల, రైతుల, ప్రజల పరిస్థితి బాగుపడుతుంది, అది అవసరం.ఈ అవకాశాన్నివదులుకొనే హక్కు మనకిలేదు“…ఈ క్రమంలో (విదేశీ) పెట్టుబడిదారులు కొంత లాభపడుతారు; మనం కొంత వదులుకోవాల్సివస్తుంది నిజమే,  ఈ త్యాగం మృత్యుసమానం కాదు, ప్రమాదకరం కాదు”, అని లెనిన్‌  వివరించారు ( 1921 ఏప్రెల్‌ 25; CW volume 32). ఈ ఏర్పాట్లు ఒక రకం యుద్ధమే;  ఆయుధాలతోకాక, ఆర్థిక రంగంలో సాగించే యుద్ధం; ఈ యుద్ధంలో మన ఉత్పత్తిశక్తుల్ని ధ్వంసం చేసుకోము; పెంపొందించుకొంటాం. పెట్టుబడిదారులు మనని మోసం చేయ జూస్తారు, నిజమే; వారిని మన రాజ్యం, చట్టాలద్వారా, ఇతరత్రా ఎదుర్కొంటాం; గెల్చి తీరుతాం. మనం వారిని కేవలం ఆయుధాల ద్వారానే ఓడించగల్గుతామని భావించటంలేదు…’ప్రపంచ విప్లవ చెయిన్‌ లో మనమొక లింకుమాత్రమే; మనమొక్కరమే ప్రపంచ విప్లవాన్ని సాధించలేము, ఆ లక్ష్యాన్ని  మనం పెట్టుకోలేదు కూడా.. అని ఆ రోజుల్లోనే ( Lenin On Concessions, 1920 నవంబరు 26; మాస్కో పార్టీ సమావేశంలో ఉపన్యాసం) వివరించారు. సామ్రాజ్యవాదం మరణశయ్యపై ఉన్నదని లెనిన్ సూత్రీకరించి శతాబ్దం దాటిపోయినా, నేటికీ అది ఎంతబలంగా ఉన్నదో చూస్తూనే ఉన్నాం. 

లెనిన్‌ తర్వాత ఆ బాధ్యతల్నిస్టాలిన్‌ చేపట్టి 1953 లో తన మరణందాకా కొనసాగించారు. రష్యాలో ‘సోషలిజం చాలా పరిణతి చెంది, వర్గరహిత కమ్యూనిజంవలె’ రూపొందుతున్నదన్న అతివాద అంచనావేసి, పొరపాటుచేసినట్టు స్టాలిన్ కాలం చివరిలో గుర్తించబడింది. ఆ పొరపాటుని మావో కాలంలోనే చైనా పార్టీ గుర్తించింది. నేడు చైనాలో సోషలిజం ప్రాథమిక స్థాయిలో వున్నది; అక్కడ సోషలిస్ట్ మార్కెటు వ్యవస్థకి  కీలక పాత్ర వున్నది – అని డెంగ్‌ నాయకత్వంలో చైనా పార్టీ సూత్రీకరించింది.

‘సోషలిజంలో కూడా  మార్కెట్‌ పాత్ర వుంటుంది’ : మావో  

సోషలిస్ట్  నిర్మాణానికి సంబంధించి కొన్ని ఆర్థికనియమాలు (EconomicLaws)వున్నాయి, వుంటాయి. వాటిపట్ల శాస్త్రీయ అవగాహన వుండాలని, అవి మన ఇష్టాయిష్టాల ప్రకారం వుండవని లెనిన్‌, స్టాలిన్‌, మావో, డెంగ్  నొక్కి చెప్పారు. వాటి అవగాహన, అన్వయాలలో అనేక ప్రయోగాలు, అనుభవాలు, సాఫల్యవైఫల్యాలు, అంగీకారాలు – అనంగీకారాలు కూడా వున్నాయి, సహజమే. ఆ నియమాలు ఇలా వున్నాయి:

“ఎకనామిక్‌ ప్రాబ్లమ్స్‌ ఆఫ్‌ సోషలిజం ఇన్‌ యు.యస్.‌యస్.‌ఆర్‌” పేరుతో స్టాలిన్‌(1951 లో) రచించిన గ్రంధం ఒకటుంది. మానవాళి చరిత్రలో మొదటిసారిగా శాస్త్రీయ సోషలిజం అమలు జరిగింది రష్యాలోనే.  కార్మికవర్గం అధికారం చేజిక్కించుకోవటం సోషలిస్ట్ విప్లవానికి నాంది. అది బతికి బట్టకట్టాలంటే     ‘సోషలిస్టు నిర్మాణం-అభివృద్ధి’  కీలకం; ఆ రెంటిలోనూ   రష్యాది కొత్త అనుభవం, కొత్త ప్రయోగం. ఆ అనుభవాలనే స్టాలిన్‌ పై పుస్త కంలో చర్చిం చారు; సోషలిజంలో కూడా సరుకుల (కమోడిటీ) ఉత్పత్తి వ్యవస్థ, మార్కెట్‌ పాత్ర వుంటాయని, అవి పెట్టుబడిదారీ సమాజంతోనే ముగియవని స్టాలిన్‌ (1951) నిర్ధారించారు. ఈ పుస్తకంపై మావో ఒక విమర్శతో కూడిన సమీక్షను (క్రిటిక్‌)1958లో రచించారు.  చైనా భవిష్యత్తుకి ఉపయోగ పరచుకునే లక్ష్యంతో రష్యా అనుభవాలను మావో పరిశీలించారు. పారిశ్రామిక రష్యా స్థితి అది;  చైనాలోని వాస్తవ పరిస్థితులతో కలిపి చూడాలని,  వెనుకబడిన వ్యవసాయ దేశమైన చైనాలో మార్కెట్ మరింత అవసరం అని మావో ఆ రచన ప్రారంభంలోనే నొక్కిచెప్పారు. ఆ ‘సమీక్ష’లోని అంశాలు గమనించదగినవి. “సరకుల ఉత్పత్తి వ్యవస్థ అనగానే మనలో కొందరికి చిర్రెత్తుతుంది; అది పెట్టుబడిదారీ విధానమే అని భావిస్తాం. కానీ కోట్లాది రైతుల సంఘీభావాన్ని సమీకరించుకోగలగాలంటే, సరకుల ఉత్పత్తిని, మనీ సప్లయిని పెద్ద  యెత్తున పెంపొందించాల్సి వస్తుందని కన్పడుతుంది- అని వెనుకబడిన, రైతాంగదేశాల ప్రత్యేకతల దృష్ట్యా మావో చెబుతారు.  ప్రయోగాల అవసరం మావో గుర్తిస్తారు. 

“కమ్యూనిస్టు స్వర్గంలోకి ఒక్క అంగలో వెళ్ళలేము, క్రమ క్రమంగానే వెళ్ళగలం. సరకుల వ్యవన్థను, విలువ సూత్రాన్ని, అవి బూర్జువా స్వభావం కలవే అయినా, వాటిని మన ఇష్టానుసారం రద్దు చేయలేము..” పీపుల్స్‌కమ్యూన్లున్నా,  అక్కడ సరుకుల వినిమయాన్ని, విలువ సూత్రాన్ని వినియోగించాల్సి వస్తుంది; సోషలిస్టు పరిణామక్రమానికి అవి తోడ్పడుతాయి అంటారు మావో. వ్యవసాయ ప్రధానదేశంగా, గ్రామీణ జనాభా 80 శాతందాకా వున్న దేశంగా చైనా పరిస్థితులు వేరు (రష్యాలో కన్నా వెనుకబడి వుంటాయి) అని కూడా ఎత్తిచూపారు. అక్కడ మార్కెటు పాత్రని నొక్కి చెప్పారు. ‘పెట్టుబడిదారీ కాలంలో అయినా, సోషలిస్టు కాలంలో అయినా ఆర్థికాభివృద్దికి, రాజకీయార్థిక శాస్త్రానికి చెందిన కొన్ని నియమాలు వర్తిస్తాయని చెప్పాల్సివుంటుంది. ప్రకృతి విజ్ఞాన శాస్త్రంలో వలెనే, ఆర్థికాభివృద్ది నియమాలు కూడా వస్తుగతమైనవి (ఆబ్జెక్టివ్)‌, అవి మానవుని ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వుంటాయ’ని మావో రాశారు.  ‘సోషలిస్ట్ ఆర్థికానికి సంబంధించిన “రెడీమేడ్‌” అంశాలేవీ లేనందున,  ‘కొత్తవైన సోష లిస్ట్ ఆర్థిక రూ పాలను సృష్టించాల్సి వుంటుంద’నీ, ఈ క్రమాన్నీ అ-ఆ ల నుంచి మొదలు పెట్టాల్సివస్తుందనీ… నిస్సందేహంగా ఇది “జటిలమైన, సంక్లిష్ట మైన, ఇంతకుముందెన్నడూ లేని కర్తవ్యంగా” వుంటుందనీ మావో చెప్పారు.’సోవియట్‌ యూనియన్‌ నుంచి నేర్చుకుని మనం మెరుగుపరుచుకోవాలని, ఆర్థిక నియమాలను రష్యా రద్దు చేయగలుగుతుందని, కొత్త వాటిని సృష్టించుకోగలుగుతుందని భావిస్తే- అది పూర్తిగా అసత్యం’-అని చెప్పారు మావో. 

‘మన ప్రణాళికా సంస్థలు సామాజిక ఉత్పత్తిని సరిగ్గా (కరెక్ట్‌ గా) ప్లాన్ చేయడం సాధ్యమే…ఐతే దాన్నీ వాస్తవంలో సాధించటాన్నీకలగా పులగం చేయకూడదు. అవి రెండూ వేర్వేరు విషయాలు.’సాధ్యత’ను వాస్తవంగా మార్చగలగాలంటే, ఆర్థికాన్ని అధ్యయనం చేయటం, దానిపై పట్టు సాధించటం, పూర్తి అవగాహనతో దాన్ని అన్వయించగలగటం అవసరం. “ఆయా నియమాలను పూర్తిగా ప్రతిబింబించగల్గినటువంటి ప్రణాళికలను రూపొందించుకోవాలి’- అంటారు మావో. అలాంటి నియమాల్లో భాగమే సరకుల వ్యవస్థ, మార్కెటూ. ‘గతంలో మనం అలాటి కొన్ని ప్రణాళికలు రూపొందించాం; కానీ తరచుగా అవి తుఫానులని సృష్టించాయి. ఐతే అతి, కాకపోతే మరీ తక్కువ..అయింది. అనేక వైఫల్యాల తరువాత,“40 అంశాల వ్యవసాయ కార్యక్రమం” రూపొందించుకున్నాం. ఇప్పటికీ-వాస్తవిక ఆచరణలో దీన్ని ఇంకా నిరూపించాల్సే వున్నది-అని ప్రయోగాల అవనరాన్ని మావో నొక్కిచెప్పారు. “మన ప్రణాళికలు వాస్తవిక సూత్రాలను పూర్తిగా ప్రతిబింబించలేదు…అంతిమ పరిశీలనలో సరకుల ఉత్పత్తి ఉత్పాదక శక్తులతోకూడా ముడిపడి వుంటుంది. అందువల్ల – పూర్తిగా సోషలైజు చేయబడిన పబ్లిక్‌ ఓనర్‌ షిప్‌ క్రింద కూడా- సరకుల  వినిమయం అమలులో వుండడం-కొన్ని రంగాల్లో నైనా- తప్పనిసరవుతుంది’ అని మావో అంటారు. “పట్టణాలకు-గ్రామాలకు, పరిశ్రమలకు వ్యవసాయానికి మధ్య ఆర్థిక సంబంధాన్ని గట్టిపరచాలంటే, సర కుల ఉత్పత్తి వ్యవస్థని కొంతకాలం వుంచాల్సిందేనని బోధపడుతుంది. పట్టణాలతో అలాంటి బంధం మాత్రమే రైతాంగానికి ఆమోదయోగ్యంగా వుం  టుంది” -అంటారు మావో. ఇక్కడ కార్మిక రైతాంగ ఐక్యసంఘటన కూడా ఇమిడిఉంది.  ఇంకా ఇలా అంటారు: అభివృద్ది చెందిన పెట్టు బడిదారీ దేశాలకీ, వెనుకబడిన పారిశ్రామిక వ్యవస్థలకూ, వ్యవసాయ ప్రధాన దేశాలకూ తేడా వుంటుంది. ఒకే దేశంలో పరిశ్రమలకూ-వ్యవసాయానికీ, పట్టణ వర్గాలకూ రైతాంగానికీ కూడా తేడాలుంటాయి..కొన్ని వాస్తవిక ఆర్థిక సూత్రాలకు, నియమాలకు లోబడి వుంటాయి; మానవుడి ఇష్టాయిష్టాల ప్రకారం వుండవు. వాటిని అవగాహన చేసుకుని, అన్వయించుకోవలసివుంటుంది.  ‘సరకుల ఉత్పత్తి వ్యవస్థ వద్దే వద్దు’ -అని కొందరనుకుంటారు. కానీ అది తప్పు. ఆ వ్యవనను గురించి లెనిన్‌ నుంచి స్టాలిన్ నేర్చుకున్నారు. స్టాలిన్ నుంచి మనం నేర్చుకోవాలి” అంటారు మావో.”సరకుల ఉత్పత్తి వ్యవస్థ కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినదే కాదు..సరకుల ఉత్పత్తి విడిగా ఒంటరిగా వుండదు. సందర్భాన్నిబట్టి- పెట్టుబడి దారీ విధానంలోనా, సోషలిజంలోనా అని దాన్ని చూడాలి. పెట్టుబడిదారీ సందర్భంలో అది పెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తి వ్యవస్థ గాను, సోషలిస్ట్ సందర్భంలో అది సోషలిస్ట్ ఉత్పత్తి వ్యవస్థగాను వుంటుంది. నిజానికి సరుకుల ఉత్పత్తి ప్రాచీనకాలం నుంచీ వుంటూ వచ్చింది”-అని మావో అంటారు. సరకుల ఉత్పత్తి వ్యవస్థ అంటే అది పెట్టుబడిదారీ వ్యవస్థేనని నిర్దారించటానికి వీల్లేదని, దాని చారిత్రిక పూర్వ రంగాన్ని గుర్తు చేస్తారు మావో.

రష్యాలో సోషలిజం నిర్మాణ అనుభవాలతో “రాజకీయ ఆర్థిక శాస్త్రం  పాఠ్యపుస్తకం” ఒకటి రష్యాలో ప్రచురించబడింది. స్టాలిన్ నేతృత్వంలో సోవియట్‌ ఆర్థిక వేత్తల బృందం దాన్ని రూపొందించింది. దాన్ని సమీక్షిస్తూ మావో ఒక “రీడింగ్‌ నోట్స్‌”ని రచించారు. 1961-62లో రచించిన, 1969లో వెలుగుచూ సిన ఈ సమీక్షలో కూడా పైన పేర్కొన్న అవగాహనే వుంది. రష్యాతో విభేదిస్తూనే, కొన్ని ఆర్థిక నియమాలను గుర్తిస్తూ మావో రచించారు. ఇవన్నీ మావో ఆలోచనావిధానంలో భాగంగా, మార్క్సిజం-లెనినిజం కొనసాగింపుగా అధ్యయనం చేయాల్సినవే. మావో తనజీవితకాలమంతటా నమ్మి, వివ రించిన పై సిధ్ధాంతాల్ని ‘సాంస్కృతికవిప్లవ’ (1966 తర్వాత)  కాలంలో పక్కనపెట్టి, అతివాదమార్గం పట్టారు. డెంగ్ ని పెట్టు బడిదారీ మార్గీ యుడని నిందించి, తొలగించారు. రష్యాలో స్టాలిన్ తర్వాత జరిగిన తప్పుల్ని నివారించాలనే ఆదుర్దాతో అలా చేసారు. 

 ధైర్యంగా అనేక ప్రయోగాలు చేసి, ‘సోషలిస్టు నిర్మాణ‘ సిధ్ధాంతాల్ని అభివృధ్ధి చేసిన డెంగ్ 

కానీ అనతికాలంలో తన అతివాద తప్పుని గ్రహించి,1973లోనే  డెంగ్ ని మళ్లీ పిలిచి, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పూర్తి బాధ్యతల్ని పునరుధ్ధరించారు. ఈ వాస్తవాల్ని చూడానిరాకరించే పిడివాదులు కొందరు మావోపేరిట డెంగ్ ని తిట్టిపోస్తుంటారు. వారికి ఒక దశలోని మావోయే వేదం, డెంగ్ విషం!   

‌ పై ప్రాతిపదికనే డెంగ్ వివరించి, విస్తరించి,’సోషలిస్టు మార్కెటు ఆర్థికవ్యవస్థను ప్రతిపాదించి, అమలు చేసి, ధైర్యంగా అనేక ప్రయోగాలు చేసి, చైనాని అనూహ్యంగా ముందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో బూర్జువా లిబరలైజేషన్ ని వ్యతిరేకించే  ఉద్యమాన్ని నడిపించారు; అలాంటి ధోరణులపట్ల మెతకగా ఉన్న ఇద్దరు (హు యావో బాంగ్‌, ఝావో జియాంగ్‌) నాయకులు ప్రధాన కార్యదర్శి పదవినుంచే – డెంగ్‌ మార్గదర్శకత్వంలోనే – తొలగించబడ్డారు. దేశం మొత్తం విధిగా పాటించాల్సిన సూత్రాలను డెంగ్‌ నొక్కిచెప్పి, తమ పార్టీ మౌలిక సిద్ధాంతంలో భాగం చేసారు: సోషలిస్టు మార్గం, జనతాప్రజాతంత్ర నియంతృత్వం, పార్టీ, మాలెమా సిద్ధాంతం – వీటి నాయకత్వ పాత్ర -ఈ ‘నాల్గు మౌలిక సూత్రాల’కి (Four Cardinal Principles)  లోబడిమాత్రమే ఏ సంస్కరణలైనా సాగాల్సి ఉంటుంద’ని నిర్ణయించారు. రష్యాలో గోర్బచేవ్‌ నేతృత్వంలోని సంస్కరణలు పట్టాలు తప్పి, సోవియట్‌ పతనానికి దారితీసాయి; కాగా చైనా గ్లోబలైజేషన్‌ తుఫాన్లనీ,2008 ఆర్థిక సంక్షోభాన్నీ, కోవిడ్ మహమ్మారి పర్యవసానాల్నీ తట్టుకొని ముందుకు సాగుతున్నది.”సోషలిస్ట్ యుగంలో మనం సరకుల వ్యవస్థని సంపూర్ణ వికనన దశవరకూ అభివృద్ధి చేయాలి..యుద్దాన్ని దశాబ్దాల పాటు సాగించాం…తైవాన్‌ విముక్తి కోసం ఇప్పటికీ ఓపిగ్గా ఎదురు చూస్తున్నాం…అలాగే సోషలిజం పరిణతి కోసమూ ఎదురు చూడాల్సి వస్తుంది. మరీ త్వరగా విజయాలు వచ్చేస్తాయని ఆశించవద్దు”  అంటారు మావో. చైనాలో సోషలిజం అంతిమవిజయానికి ‘వెయ్యేళ్లయినా పట్ట వచ్చు, ఇది సుదీర్ఘ ప్రయాణం’ అన్నా రు (1950లలొ) ఒక సందర్భంలో. చైనాలో సోషలిజం ప్రాథమిక దశలోనే వుంది అని డెంగ్‌ సూత్రీకరించింది ఈ అవగాహనతోనే. 

తొమ్మిది కోట్లమంది కమ్యూనిస్టు సభ్యులూ, మూడుతరాల శ్రేణులూ నాయకుల అవిఛ్చిన్న, పటిష్ట నేతృత్వంలో చైనా తనదైన స్వతంత్ర, సోషలిస్టు అభివృద్ధిపధంలో ముందుకు సాగుతున్నది.  ఎవరో కొద్దిమంది  తూలనాడితే, చైనాకి పోయేదేమీ లేదు; ఆ పిడివాదం మనకే నష్టదాయకం. మనదేశంలో ఏం చేయాలి, ఎలా ఉద్యమాల్ని ముందుకు తీసుకువెళ్లాలి అన్నది మనకి ముఖ్యం. చైనాపార్టీ 20వ మహాసభను కీలకమైనదిగా భావించి, ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్నది. ఆ సందర్భంగా పై అవగాహన అవసరం. 

Share this:

  • Tweet
  • More
Like Loading...

తైవాన్‌పై అమెరికా-చైనా తాజా వివాదం 2 : నాడు మావో జెడాంగ్‌ ఎందుకు వెనక్కు తగ్గారు – నేడు షీ జింపింగ్‌ ఎందుకు ముందుకు పోతున్నారు !

12 Friday Aug 2022

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

china communist party, imperialism, Joe Biden, Mao Zedong, Taiwan independence, Taiwan Matters, US-China standoff over Taiwan, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


” నూతన యుగంలో తైవాన్‌ సమస్య మరియు చైనా పునరేకీకరణ ” అనే పేరుతో ఆగస్టు పదవ తేదీన చైనా ఒక శ్వేత పత్రాన్ని ప్రకటించింది. తైవాన్‌ తనలో అంతర్భాగమే అని మరోసారి స్పష్టం చేసింది. ఒకే చైనా సూత్రానికి ఐరాస సాధారణ అసెంబ్లీ 2758వ తీర్మానం ద్వారా కల్పించిన చట్టబద్దతపై ఎలాంటి సందేహం లేదని, ప్రపంచమంతటా గుర్తింపు పొందిందని దానిలో పేర్కొన్నారు. శాంతియుతంగా పునరేకీకరణ జరగాలని, తప్పనిసరైతే బలప్రయోగం తప్పదని కూడా స్పష్టం చేశారు. ఒకే దేశం-రెండు వ్యవస్థలనే విధానం కింద తైవాన్‌కు హామీ ఇస్తున్నట్లు తెలిపింది. అమెరికా కాంగ్రెస్‌( పార్లమెంటు దిగువ సభ ) స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన మరుసటి రోజు నుంచి తైవాన్‌ చుట్టూ ఐదు రోజుల పాటు (ఆగస్టు 4-7తేదీలు) మిలిటరీ విన్యాసాలు జరిపింది. తరువాత మరుసటి రోజు నుంచి చైనా నిరవధిక విన్యాసాలు కొనసాగిస్తున్నది.


ఏ దేశమైనా తన వద్ద ఉన్న ఆధునిక ఆయుధ సంపత్తిని మిలిటరీ విన్యాసాలలో రేఖా మాత్రంగానే వెల్లడిస్తుందన్నది తెలిసిందే. ఇప్పుడు తైవాన్ను ఎలా దిగ్బంధనం చేయగలదో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా, జపాన్‌లకు చైనా చూపుతున్నది. తొలుత నాలుగు రోజులు, తరువాత కొనసాగిస్తున్న నిర్ణీత గడువులేని డ్రిల్లు లక్ష్యం అదే అని షీ జింపింగ్‌ పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా తన వద్ద ఉన్న ఆధునిక ” హైమర్స్‌” క్షిపణి వ్యవస్థలను అంద చేసింది. దానికి ధీటుగా చైనా వద్ద ఉన్న ఎంఎల్‌ఆర్‌ వ్యవస్థలను తైవాన్‌ చుట్టూ జరిపిన డ్రిల్సులో ప్రయోగించినట్లు, ఈ పరిణామం తైవాన్‌పై అమెరికా ఆడుతున్న ఆట తీరునే మార్చి వేస్తుందని యురేసియన్‌ టైమ్స్‌ పత్రిక ఆగస్టు ఎనిమిదిన ప్రకటించింది.చేయాల్సిందంతా చేసి నెపాన్ని ఇతరుల మీద నెట్టినట్లుగా తాజా పరిణామాలపై జో బైడెన్‌ తీరు ఉన్నదని, ఇది మరింతగా రెచ్చగొట్టటమే అని చైనా వర్గాలు పేర్కొన్నాయి. తైవాన్‌కు సంబంధించి ఇంతకు మించి వారు చేసేదేమీ ఉండదు కానీ వారి తీరే ఆందోళన కలిగిస్తున్నదని బైడెన్‌ విలేకర్లతో అన్నాడు. చైనా స్పందనకు ప్రతిగా అమెరికా యుద్ధనౌకలను తరలిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అదేమీ లేదు. దాంతో ఉక్రెయిన్‌ మాదిరి తమను కూడా ముందుకు నెట్టి అమెరికా వెలుపలే ఉంటుందా అని అనేక మందిలో తలెత్తిన సందేహాల పూర్వరంగంలో అమెరికన్లు, తైవాన్‌ వేర్పాటు వాదులను సంతృప్తిపరచేందుకు బైడెన్‌ ఇలాంటి చౌకబారు ప్రకటనలు, జిమ్మిక్కులకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. తన ప్రమాణ స్వీకార ఉత్సవానికి తైవాన్‌ ప్రతినిధులను ఆహ్వానించిన తొలి అమెరికా నేతగా కూడా గతేడాది ఇలాంటి జిమ్మిక్కునే చేశాడు.


ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు జో బైడెన్‌ పలుకుబడి గురించి వెలువడుతున్న సర్వేల వివరాలు డెమోక్రటిక్‌ పార్టీకి కంగారు పుట్టిస్తున్నాయి.ఆగస్టు పదిన స్టాటిస్టా ప్రకటించిన వివరాల ప్రకారం కేవలం పదిశాతం మంది అమెరికన్ల దృష్టిలో మాత్రమే జో బైడెన్‌ బలమైన నేత. మరో 25శాతం మంది కొంత మేరకు అని చెప్పగా నలభైమూడు శాతం చాలా బలహీనుడు, 23శాతం కాంత మేర బలహీనుడు అని వెల్లడైంది. మొత్తం మీద చూసినపుడు 66శాతం మంది బలహీనుడిగా భావిస్తున్నారు. ప్రపంచ చరిత్రను చూసినపుడు పాలకులు బలహీనపడినపుడు పిచ్చిపనులకు, జిమ్మిక్కులకు – ఎన్నికలు వచ్చినపుడు మన దేశంలో ఏదో ఒక ఉదంతం జరుగుతుందని జనం నమ్ముతున్నట్లుగా- పాల్పడతారని తేలింది. ఇప్పుడు జో బైడెన్‌ కూడా అదే స్థితిలో ఉన్నారన్నది కొందరి భావన. తైవాన్ను తురుపుముక్కగా వాడుతున్న అమెరికా రానున్న రోజుల్లో మరింతగా రెచ్చగొట్టవచ్చని, దానిలో భాగంగానే నేడు ఉక్రెయిన్‌ రేపు తైవాన్‌ అన్న ప్రచారం ప్రారంభించిందని అది ఎలా ఆలోచించినా, ఏమి చేసినా తాము దేనికైనా సిద్దంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేయదలచుకుంది.తాజాగా మిలిటరీకి అందచేసినవాటితో సహా విన్యాసాల్లో భూ, సముద్ర, గగన తల అస్త్రాలన్నింటినీ బహిరంగంగానే చూపింది. మరికొన్నింటిని కూడా ప్రయోగించనుంది. బహుశా ఈ కారణంగానే తైవాన్‌ జలసంధిలోకి అమెరికా నౌకలు రాలేదన్నది కొందరి విశ్లేషణ. రానున్న రోజుల్లో తమ దళ నౌకలు చైనా ప్రాంతంలో స్వేచ్చా విహారం చేయవచ్చని అమెరికా పేర్కొన్నది. ఒక వేళ వచ్చినా దూర దూరంగా తిరగటం తప్ప చైనా విధించిన తాత్కాలిక ఆంక్షలు అమల్లో ఉన్నంతవరకు తైవాన్‌ ప్రాంతానికి చైనా విన్యాసాలు ముగిసిన తరువాతే తప్ప జరుగుతుండగా వచ్చే అవకాశం లేదు.


చైనా వైఖరిలో వచ్చిన ఈ మార్పు గురించి ఆలోచించాల్సి ఉంది. ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత చైనా-రష్యా బంధం మరింతగా బలపడిన పూర్వరంగంలో చైనా మీద మరింతగా కేంద్రీకరించాలని అమెరికా గూఢచార సంస్థలు తాజాగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల మీద ఇప్పటికీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ దాని కంటే చైనా మీద ఎక్కువగా వనరులు, నిధులను ఖర్చు చేయాలని అధికారులు స్పష్టం చేశారని వార్తలు. ఆఫ్ఘనిస్తాన్నుంచి అమెరికా తోకముడిచి ఏడాది గడచిన సందర్భంగా బైడెన్‌ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చారు. చైనా గురించి ఇప్పటికే ఆలశ్యం చేసినట్లు కొందరు బైడెన్‌ సమీక్షపై స్పందించారు. అమెరికా తరహా జీవన విధానాన్ని చైనా దెబ్బతీస్తున్న మాదిరి ఉగ్రవాద సంస్థలు చేయలేవని డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ జాసన్‌ క్రో అన్నాడు. అవసరానికి మించి ఉగ్రవాదం మీద గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రీకరించామన్నాడు. క్వాంటమ్‌ సైన్సు, కృత్రిమ మేథ,ఇతర సాంకేతిక పరిజ్ఞానాలపై చైనా లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసిందని దాని గురించి సమాచారం వెల్లడి కావటం లేదని అమెరికన్లు ఆందోళన చెందటమే తాజా కేంద్రీకరణకు కారణం. చైనా గురించి ఒకటి, చైనా సాంకేతిక పరిజ్ఞానం గురించి కేంద్రీకరించేందుకు రెండు పధకాలను గతేడాది సిఐఏ ప్రకటించింది.


అమెరికాకు ప్రజాస్వామ్యం అంటే అక్కడి ఆయుధపరిశ్రమలకు లాభసాటి లావాదేవీ మాత్రమే. ఇతర దేశాల మీద అమెరికా దాడులకు దిగటం తప్ప చరిత్రలో అమెరికా మీద అలాంటి దాడి ప్రయత్నాలు కూడా లేవు. 2022 ఆగస్టు నాటికి ప్రపంచంలోని 14దేశాల వద్ద 47 విమానవాహక యుద్ధ నౌకలు పని చేస్తున్నాయి. వాటిలో ఒక్కొక్కటి 80 విమానాలను మోసుకుపోగలిగిన పదకొండు అమెరికా వద్దే ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కొక్కటి 13-14 బిలియన్‌ డాలర్ల విలువ చేసే పది కొత్త విమానవాహక నౌకల తయారీకి డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఆర్డరు పెట్టింది. ఇవి అణ్వాయుధాలు ప్రయోగించేందుకు వీలైనవి.ఇన్ని ఉన్నప్పటికీ లేని చిన్న దేశాలను తప్ప వాటితో చైనా, రష్యాలను అమెరికా బెదిరించలేదు. ఎందుకంటే అవి కూడా స్వంతంగా విమానవాహక నౌకలను రూపొందించగలిగినవే. వాటి వద్దా అణ్వాయుధాలు ఉన్నాయి.


అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా తైవాన్‌ గడ్డ మీద అడుగు పెట్టి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. నిజానికి అమెరికా వ్యూహకర్తల ఎత్తుగడ అది. ముందే చెప్పుకున్నట్లు ప్రస్తుతం జనంలో పలుకుబడి లేని జో బైడెన్‌ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు, ప్రపంచ రాజకీయాలను తాను శాసిస్తున్నట్లు ప్రదర్శించుకొనేందుకు ఈ అవకాశాన్ని ఎంచుకున్నారు. ఇక గతానికి సంబంధించి చూస్తే1949లో చైనా విముక్తి జరిగినప్పటికీ దాన్ని సుస్థిరం కావించుకొనేందుకు కమ్యూనిస్టులకు పది సంవత్సరాలు పట్టింది.అమెరికా ప్రభుత్వం బహిర్గతపరచిన కొన్ని పత్రాల్లో ఉన్న సమాచారం తైవాన్‌ విలీనం గురించి కొన్ని అంశాలను వెల్లడించింది. .1958లో తైవాన్‌ విలీనానికి పూనుకోవాలని మావో నిర్ణయించారు. దాన్ని గ్రహించిన అమెరికన్లు వెంటనే ఉన్నత సమావేశం జరిపి తైవాన్‌ రక్షణకు మిలిటరీని పంపుతామని ప్రకటించారు. వెంటనే సప్తమ నౌకా దళాన్ని దాడికి వీలైన దూరానికి నడిపించారు. ఒక వేళ మిలిటరీ తైవాన్ను కాపాడలేకపోతే అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ అనుమతి ఇచ్చాడు. తైవాన్‌ పాలకుడు చాంగ్‌కై షేక్‌ను, తైవాన్ను ఎలాగైనా కాపాడటం అమెరికాకు ప్రాముఖ్యత కలిగిన అంశం. అందుకు పూనుకొని విఫలం కావటం ఆసియాలో పరువు తక్కువ, దాన్ని కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగించాల్సిందేనని మిలిటరీ జనరల్స్‌ చెప్పారు. అప్పటికే అవసరం లేకున్నా జపాన్‌పై అణు దాడి జరిపిన అమెరికా కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు ఎంతకైనా తెగించేందుకు పూనుకుంది. తైవాన్‌కు సమీపంలోని ప్రధాన భూభాగంలో ఒక చిన్న మిలిటరీ కేంద్రం తప్ప చైనా వద్ద అప్పటికి అణుబాంబులు గానీ, విమానవాహక నౌకలుగానీ లేవు. ఆర్దికంగా పటిష్టత కూడా లేదు. సోవియట్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.1959లో టిబెట్‌లో దలైలామా తిరుగుబాటు, అదే ఏడాది చైనా అణుకార్యక్రమానికి సహకరించేది లేదని సోవియట్‌ ప్రకటించింది. రెండు దేశాల పార్టీల మధ్య సైద్దాంతిక విబేధాలు తీవ్రమౌతున్న తరుణంలో అన్ని అంశాలను చూసినపుడు వెనక్కు తగ్గటమే మంచిదని నాటి చైనా నాయకత్వం భావించింది. తరువాత దేశాన్ని పటిష్టం గావించటం మీద శ్రద్ద పెట్టింది.


సోవియట్‌ మీద ఆధారపడకుండా స్వంత అణుకార్యక్రమానికి చైనా పూనుకుంది.1964 అక్టోబరు 16న తొలి అణుపరీక్ష జరిపింది. అంతే కాదు అప్పటికి చైనా వద్ద విమానవాహక నౌకలు కూడా లేవు. పాతబడిన ఒక నౌకను ఆస్ట్రేలియా రద్దు కింద అమ్ముతామని 1985లో ప్రకటించగా చైనా దానిని కొనుగోలు చేసింది. దానిలో కీలకమైన భాగాలన్నింటినీ తొలగించినందున పనికి రాదని అందరూ భావించారు. అయితే దాన్ని చైనా రద్దుకింద మార్చకుండా తన మిలిటరీకి శిక్షణకు, తాను సొంతంగా రూపొందించిన నౌకలకు నమూనాగా ఉపయోగించినట్లు తరువాత వెల్లడైంది.1995, 2000 సంవత్సరాల్లో రష్యా నుంచి రెండు నౌకలను కొనుగోలు చేసి వాటినీ రద్దు కింద మార్చకుండా చైనా నిపుణులు పరిశీలించారు. ఒక నౌకను విలాసవంతమైన టూరిస్టు హౌటల్‌గా, మరొక నౌకను ప్రదర్శనశాలగా మార్చారు. మకావు ప్రయివేటు కంపెనీ ద్వారా మరొక రష్యా నౌకను 1998లో కొనుగోలు చేసి దాన్ని 2007 నాటికి పరిమితంగా పునరుద్దరించినట్లు వార్తలు. తరువాత దాన్ని పూర్తి స్థాయిలో పునరుద్దరించి కొత్త పేరుతో 2012లో నౌకా దళంలో తొలి స్వంత నౌకగా ప్రవేశపెట్టారు.తరువాత పూర్తిగా స్వంత పరిజ్ఞానంతో రూపొందించిన నౌకను 2017లో ప్రారంభించారు. సరికొత్త నౌక మూడవ దానిని ఈ ఏడాది జూన్‌లో రంగంలోకి దించారు. నాలుగవ నౌక ఇప్పుడు నిర్మాణంలో ఉంది, 2030నాటికి మరో రెండు చేరవచ్చని భావిస్తున్నారు.


ప్రస్తుతం జరుపుతున్న మిలిటరీ డ్రిల్లును అమెరికా, ఇతర దేశాలు కూడా పరిశీలించి తమ ఎత్తుగడలను రూపొందించుకుంటాయని తెలియనంత ఆమాయకంగా నేడు చైనా లేదు. నిజమో కాదో చెప్పలేము గాని ఇప్పుడు చైనా గురించి అమెరికన్లకు ఒక భయం పట్టుకుంది. మెదడును అదుపు చేసే జీవ ఆయుధాలను రూపొందిస్తున్నట్లు అనుమానంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ప్రాజెక్టులో భాగస్వాములన్న అనుమానంతో అనేక కంపెనీలపై అమెరికా ఆంక్షలు పెట్టింది.ఇది ఒక ప్రచార ఎత్తుగడ, దాడిలో భాగం కూడా కావచ్చు. గతంలో ఐసెన్‌ హౌవర్‌ మాదిరే ఇప్పుడు జో బైడెన్‌ కూడా ఉక్రెయిన్‌ మాదిరి కాకుండా అవసరమైతే మిలిటరీని దింపుతామని ప్రకటించాడు. గతంలో మావో మాదిరి ఇప్పుడు షీ జింపింగ్‌ వెనక్కు తగ్గేందుకు సిద్దం కాదు. అన్ని రంగాల్లో ఢ అంటే ఢ అనేందుకు ధీటుగా దేశాన్ని రూపొందిస్తున్నాడు. సరిహద్దులో ఉన్న నాటో దేశాలే ఉక్రెయిన్‌కు మిలిటరీని పంపేందుకు సిద్దం కాలేదు. తైవాన్‌ అంశానికి వస్తే దానికి సమీపంలోని జపాన్‌ ఒకినావా దీవుల్లో, దక్షిణకొరియాలో ఉన్న అమెరికా మిలిటరీ తప్ప పన్నెండువేల కిలోమీటర్ల నుంచి అమెరికా తన సేనలను తీసుకురావాల్సి ఉంది. చైనాకు మద్దతుగా అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా ఉంది. పక్కనే రష్యా కూడా తన వంతు పాత్ర పోషించనుంది. ఇప్పటికిప్పుడు చూస్తే మరోఅణుశక్తి దేశమైన పాకిస్తాన్‌ వివిధ కారణాలతో అమెరికా కంటే చైనాకు దగ్గరగా ఉంది. మరో దేశమైన ఇరాన్‌ కూడా చైనాకు దగ్గరగా ఉంది. మావో కాలంలో ఇలాంటి సానుకూల అంశాలు చైనాకు లేవు. అందుకే షీ జింపింగ్‌ బైడెన్‌తో భేటీలో నిప్పుతో చెలగాటాలాడవద్దని హెచ్చరించగలిగాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d