Tags
BJP, iftar party, mrm, Narendra Modi, RMM, RSS, RSS Double game, RSS Duplicity, RSS game, RSS-BJP
సత్య
పాపం ఆర్ఎస్ఎస్ ! తన కార్యక్రమాన్ని తానే బహిరంగంగా సమర్ధించుకోలేక భయపడుతోంది. ఒకనాడు తాము చేసిన విమర్శలు లేదా ఆరోపణలే మరోరోజు తమను రచ్చకీడుస్తాయని బహుశా ఆలోచించి వుండదు. పక్షం రోజుల క్రితం తన మైనారిటీ విభాగమైన రాష్ట్రీయ ముస్లిం మంచ్(ఆర్ఎంఎం) ద్వారా జూలై రెండున మన దేశంలోని ఇస్లామిక్ దేశాల రాయబారులతో పాటు మొత్తం 140 దేశాల ప్రతినిధులను, ఇతరప్రముఖులను ఆహ్వానించి రంజాన్ సందర్భంగా ఇప్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ప్రధాన స్రవంతి మీడియాలో ఆర్ఎస్ఎస్ ద్వంద్వ స్వభావం, మైనారిటీ సంతుష్టీకరణ గురించి పెద్దగా చర్చ జరగలేదుగానీ సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అసలే నడుములు విరిగి లేవలేని స్థితిలో వున్న కాంగ్రెస్ మెజారిటీ ఓటర్లను ఆకర్షించాలని అనుకున్నదో ఏమో తొలిసారిగా ఇప్తార్ విందు ఇవ్వకూడదని నిర్ణయించింది. కాంగ్రెస్ వదలి వేసిన ఇప్తార్ విందులను ఆర్ఎస్ఎస్ తొలిసారి ప్రారంభించిందనే రీతిలో వార్తలు వచ్చాయి. ఈ చర్య ద్వారా మెజారిటీ హిందువులలో పలుచనవుతామని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్ధల నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం, యుపి తదితర రాష్ట్రాలలో రాబోయే ఎన్నికలలో హిందువులలో దాని ప్రభావం ఎలా వుంటుందో అన్న గుంజాటన, జూన్ 25న కాశ్మీర్లో పాక్ వుగ్రవాదుల దాడి వంటి వుదంతాలతో పాక్ రాయబారిని ఆహ్వానించి ఇప్తార్ విందు ఇవ్వటం నష్టదాయకమని పునరాలోచించి అబ్బే అసలు మేము అలాంటి కార్యక్రమమే తలపెట్టలేదంటూ పక్షం రోజుల తరువాత జూన్ 30న ఆర్ఎస్ఎస్ ప్రకటించింది. వేరే సంస్ధ పెట్టుకున్న కార్యక్రమాన్ని తాము ఎందుకు వ్యతిరేకించాలని ఎదురు ప్రశ్నించింది.
మెజారిటీ ప్రజానీకాన్ని రెచ్చగొట్టి తమకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పరచుకొనేందుకు మైనారిటీ వ్యతిరేకతను పురికొల్పటం దాని పధకాలలో ఒకటి. బిజెపి , దాని పూర్వ రూపమైన జనసంఘం తప్ప కాంగ్రెస్, వామపక్షాలు, మిగతా పార్టీలన్నీ ఓట్ల కోసం మైనారిటీలను బుజ్జగిస్తున్నాయని పదేపదే ప్రచారం చేసి కొంత మేరకు విద్వేషాన్ని రెచ్చగొట్టటంలో జయప్రదమైంది. ఇప్తార్ విందులు ఇవ్వటం, పర్యటనల సందర్భంగా మతపరమైన కేంద్రాలను సందర్శించటం వంటి చర్యలను అది తప్పుపట్టింది. ఓట్ల కోసం వామపక్షాలు మినహా మిగతా పార్టీలన్నీ అటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డాయనటంలో ఎలాంటి సందేహం లేదు.తాను రాజకీయంగా బలహీనపడినట్లు పసిగట్టిన ఇందిరా గాంధీ ఇలాంటి కార్యక్రమాలకు తొలిసారిగా పెద్ద ఎత్తున తెరతీశారు. తరువాత కాలంలో ఇతర పార్టీలు కూడా ఒక్క మైనారిటీలే కాదు ఆర్ఎస్ఎస్ ఎత్తుగడలకు పోటీగా మెజారిటీ ఓట్లను పోగొట్టుకోకుండా వుండేందుకు కూడా ప్రయత్నించాయన్నదానిలో రెండవ మాట లేదు. దేవాలయాల భూములను ఇతర మతాల పేదలైన కౌలుదార్లు సాగు చేయకూడదని, ఎవరైనా వుంటే వైదొలగాలని ఆంధ్రప్రదేశ్లో తెలుగు దేశం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం, హాజ్ యాత్రలకు ఇచ్చే రాయితీలను రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాత ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వంటి క్షేత్రాల సందర్శనకు రాయితీలు ఇస్తామని ప్రకటించటాన్ని ఏమనాలి ? కాంగ్రెస్ బాబరీ మసీదు తాళాలను తీయటం, షాబానో కేసులో సవరణలు, బాబరీ మసీదును కూల్చివేస్తుంటే చూస్తూ ఊరుకోవటం వంటి వన్నీ వాటిలో భాగమే. అందుకే కుహనా లౌకికవాదులంటూ సైద్దాంతిక దాడి చేయటానికి ఆర్ఎస్ఎస్కు మంచి అవకాశాలు దొరికాయి.
అంతర్జాతీయంగా నరేంద్రమోడీపై వున్న మైనారిటీ వ్యతిరేక ముద్ర తొలగించుకోవాలని సంఘపరివార్ ఆలోచిస్తున్నది. మిగతా పార్టీలు ఓట్లకోసమే మైనారిటీ పధకాలను ప్రకటిస్తే తాము ఓట్ల దృష్టితో గాక మైనారిటీల సంక్షేమం కోసమే పధకాలను ప్రవేశపెట్టి అమలు జరుపుతున్నామని, అందుకోసం గతం కంటే ఎక్కువ కేటాయింపులు చేశాం చూడమంటూ ప్రచారానికి దిగింది. అసోం వంటి చోట్ల మైనారిటీ వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఎల్లకాలం సాగదు కనుక గణనీయ సంఖ్యలో వున్న మైనారిటీలను ‘సంతృప్తి పరచటం లేదా సంతుష్టీకరణ’ చేయటం ద్వారా వారిని పక్కా వ్యతిరేకులుగా మారకుండా చూసుకొనేందుకు పూనుకుంది. అనేక మంది ప్రముఖులు ఇప్తార్ విందులకు హజరు అవుతున్నారు. కేంద్రమంత్రి రాజనాధ్ సింగ్ పాల్గొన్న ఒక చిత్రం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం.
మన దేశంలో ముస్లిం పాలనకు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర వుంది. వారి ప్రవేశం నుంచి రంజాన్ సందర్భంగా ఇప్తార్ విందులు ప్రారంభమయ్యాయి. మహమ్మద్ ప్రవక్త తన వుపవాసాన్ని మూడు ఖర్జూరాలు తిని ముగించేవారట. అయితే ప్రస్తుతం ఇప్తార్ విందులు ఖర్జూరాలకే పరిమితం కాలేదు, ఆయా దేశాలలో వున్న ఆహార అలవాట్లతో పాటు ఎన్నిరకాలు వడ్డిస్తే అంత గొప్పగా పరిగణించే రోజులు వచ్చాయి. సామూహికంగా జరిగే ఈ క్రతువుకు హాజరు కావటం కాకపోవటం అనేది మత విశ్వాసాలకు సంబంధం లేదు. హిందువుల పండగలను ముస్లింలు జరుపుకోవటం ఎలా జరుగుతోందో ఇప్తార్ విందులకు వుపవాసం పాటించని హిందువులు, ఇతర మతాల వారు కూడా హాజరుకావటం అన్నది ఒక సామాజిక మర్యాద, అంశంగా మారిపోయింది. వాటిని కూడా ఆర్ఎస్ఎస్ వివాదాస్పదం కావించింది. ఒక పార్టీ ఇచ్చిన విందుకారణంగా ముస్లింలందరూ అదే పార్టీకి ఓటు వేస్తారనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ మరొకటి వుండదు. అదే అయితే వినాయకచవితి, దసరా వంటి హిందువుల పండుగల సందర్బంగా బిజెపి నేతలు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అంత మాత్రాన హిందువులందరూ వారికి ఓటు వేయటం లేదు. జర్మనీలో హిట్లర్ యూదు వ్యతిరేకతను రెచ్చగొడితే లాభం వుంటుందని భావించినట్లే మన దేశంలో ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను రెచ్చగొట్టటం ద్వారా లబ్ది పొందవచ్చని ఆర్ఎస్ఎస్ వంటి శక్తులు భావిస్తున్నాయి. అందుకే ఈ రచ్చ.
అధికారంలో వున్నపుడు మతం, మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవటంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరించిందో కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు బిజెపి అంతకంటే ఎక్కువగా చేస్తోందనటంలో అతిశయోక్తి కాదు. వారణాసిలో ఒక హిందూమత కార్యక్రమానికి ప్రధాని హాజరుకావటం, దానిని ప్రత్యక్ష ప్రసారం చేయటం రాజకీయ లబ్ది పొందటంలో భాగం కాదా ? ఇరుగు పొరుగు దేశాలను సందర్శించినపుడు ప్రధాని మతపరమైన పూజలు నిర్వహించటం కూడా ప్రచారంలో ఒక భాగంగా మార్చివేశారు. సినీ హీరో షారూఖ్ ఖాన్ను పాక్ వుగ్రవాది హఫీజ్తో పోల్చిన హిందూమత పూజారి లేదా యోగి, పచ్చి ముస్లిం వ్యతిరేకి అయిన ఆదిత్యనాధ్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.
ఇలాంటివి ఒక్క మన దేశానికే పరిమితం కాలేదు. వివిధ కారణాలతో అనేక దేశాలలో జరిగాయి, జరుగుతున్నాయి. ముస్లిం దండయాత్రలకు గురైన సోమనాధ దేవాలయాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వ నిధులతో తిరిగి నిర్మించారు.దేవాలయ నిర్మాణం జరపండిగాని దానికి ప్రజల నుంచి విరాళాలు సేకరించండి తప్ప ప్రభుత్వ నిధులు వద్దని చెప్పిన మహాత్మాగాంధీ సూచనను నాటి పాలకులు పట్టించుకోలేదు. 1971లో అంతర్యుద్ధం సందర్భంగా నేటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా పట్టణంలో పాక్ సైన్యం ధ్వంసం చేసిన రమణ కాళీ మందిరం స్ధానంలో జాతీయ దేవాలయం(ప్రభుత్వ) కట్టించాలని అక్కడి మైనారిటీ హిందువులు చేసిన వినతి లేదా డిమాండ్కు తలొగ్గిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకేశ్వరీ పేరుతో ఆలయ నిర్మాణం చేయటమే గాక దానిని జాతీయ ఆలయంగా కూడా ప్రకటించింది. పాకిస్థాన్ ప్రభుత్వం అక్కడి మైనారిటీ హిందువుల కోరిక మేరకు హోలీ, దీపావళిని జాతీయ సెలవు దినాలుగా ప్రకటించింది. కెనడాలో పెద్ద సంఖ్యలో వున్న సిక్కు మైనారిటీల కారణంగా వైశాఖీ పూర్ణిమను జరుపుకోవాలని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది.
ఇక ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్ద ఆర్ఎంఎం పార్లమెంట్ భవనంలో జరప తలపెట్టిన ఇప్తార్ పార్టీకి మొత్తం 140 దేశాల ప్రతినిధులతో పాటు మోడీ మంత్రివర్గ సభ్యులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కూడా హాజరౌతారని గొప్పగా ప్రకటించారు.దీని గురించి ఆర్ఎంఎంకు మార్గదర్శనం చేసే ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ఇంద్రేష్ కుమార్ మీడియాతో స్వయంగా మాట్లాడారు. దీనిని ఒక రాజకీయ ప్రయోజనం పొందేందుకు ఏర్పాటు చేసినదిగా చూడవద్దని కూడా చెప్పారు. భారత్లో అన్ని మతాల వారు సహజీవనం చేస్తున్నారని ప్రపంచానికి తెలిపేందుకు వుద్ధేశించినట్లు తెలిపారు.ఈ సంస్థకు ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదని చెప్పటం ఎలా వుందంటే బిజెపి వారు ఆర్ఎస్ఎస్లో వుండవచ్చు, దానికీ తమకూ సంబంధం లేదని బుకాయించటం వంటిదే.
ఆర్ఎంఎం అధిపతి మహమ్మద్ అఫ్జల్ ఈ విందు గురించి చెబుతూ భారత్లో ముస్లింలు శాంతి లేదా సంతోషంగా లేరని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, ముస్లింలకు మోడీ ప్రభుత్వం మంచి చేస్తున్నదని చెప్పటానికే ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని మోడీ హయాంలో ప్రారంభమైన ప్రపంచ సౌహార్ద్ర నూతన అధ్యాయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది, దీనిని రాజకీయమైందని చిత్రిస్తారు, సరిగ్గా ఆ ప్రచారాన్ని ఎదుర్కొనేందుకే దీనిని నిర్వహిస్తున్నాం అని అరటి పండు వలచి చెప్పినట్లు వివరించారు.http://indiatoday.intoday.in/story/rss-tries-to-shed-pro-hindu-image-invites-140-countries-to-iftar-party/1/695911.html
ముస్లింలను సంతృప్తిపరుస్తున్నారని కాంగ్రెస్, ఇతర పార్టీలను ఇప్పటి వరకు విమర్శిస్తూ, ఖండిస్తూ వచ్చిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు తానే ఆ పనిచేస్తున్నదని బిజెపి మిత్రపక్షమైన శివసేన నాయకుడు మనీషా క్యాండే ధ్వజమెత్తారు.’ఒక హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ చెబుతుంటుంది,ఇప్తార్ విందుల వంటి వాటిని కాంగ్రెస్, ఇతర పార్టీలు ఏర్పాటు చేసినపుడు వాటిని ఖండిస్తుంది,అలాంటిది ఇప్పుడు అదే ఆపని చేస్తోంది. దాని అసలు భావజాలం నుంచి పూర్తిగా వైదొలిగింది, ఒకవైపు ఘర్ వాపసీ గురించి చెబుతారు మరోవైపు ఇప్తార్ విందులు ఇస్తారు, దీని ద్వారా ఆర్ఎస్ఎస్ గందరగోళంలో వున్నదని వారే వెల్లడించుకుంటున్నారు అని క్యాండే పేర్కొన్నారు. రిజర్వేషన్లను సమీక్షించాలంటూ వ్యతిరేకంగా మాట్లాడి తరువాత దానిని కాదని చెప్పిన విషయం తెలిసిందే. చరిత్రలో దాని ఆత్మవంచన, పరవంచన ఖాతాలో ఇప్పుడు ఇప్తార్ విందు మరొకటి.