• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Vladimir Putin

పతన దిశగా ఉక్రెయిన్‌, లొంగిపోతున్న మిలిటరీ – పరారీ క్రమంలో జెలెనెస్కీ !

19 Wednesday Nov 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

#Ukraine Crisis, Donald trump, Ukraine, Ukrainian Troops Abandoning Front, Vladimir Putin, Zelensky

ఎం కోటేశ్వరరావు

నిజమే ! గతవారం రోజులుగా ఉక్రెయిన్‌ పోరులో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పశ్చిమదేశాల నుంచి వస్తున్న వార్తలను చూస్తుంటే భయంకరమైన చలికాలం ముగిసేలోగా ఉక్రెయిన్‌ పతనం అవుతుందా ? చలికి తట్టుకోలేక ఉక్రెయిన్‌ సైన్యం తెల్లజెండా ఎత్తుతుందా ? ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య మంగళవారం నాడు 1,363వ రోజులో ప్రవేశించింది. వేలాది మంది ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోతున్నట్లు వార్తలు, అధ్యక్షుడు వ్లదిమిర్‌ జెలెనెస్కీ విదేశాలకు పారిపోనున్నాడా అంటే మిన్నువిరిగి మీద పడే అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప అందుకు అవకాశాలు లేకపోలేదని అనిపిస్తున్నది. గత కొద్ది వారాలుగా అనేక కీలక ప్రాంతాలను చక్రబంధంలో బిగించిన రష్యా ఒక్కో గ్రామం, ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. పోకరోవస్క్‌ అనే పట్టణంలోకి పుతిన్‌ సేనలు చొరబడ్డాయని ఏక్షణంలోనైనా స్వాధీనం చేసుకోవచ్చని వార్తలు. గత ఏడాదిన్నర కాలంగా ఆ పట్టణాన్ని పట్టుకొనేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతున్నది. అక్కడ ఉన్న దాదాపు ఐదువేల మంది ఉక్రెయిన్‌ మిలిటరీ కదలకుండా బందీ అయిందని, తెల్లజెండా ఊపిందని, పోరు సాగుతున్నదని భిన్నవార్తలు వచ్చాయి. వెలుపలి నుంచి వస్తున్న రష్యన్‌ సేనలను ప్రతిఘటిస్తున్నట్లు కనిపించటం లేదని, అయితే ఇండ్లు, బంకర్లలో ఉన్నవారి కారణంగా ఒక్కో ప్రాంతాన్ని జల్లెడ పట్టి ముందుకు పోతున్నారని, కొన్ని వారాల్లో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్నారు.అది స్వాధీనమైతే అనేక కొత్త ప్రాంతాలను సులభంగా పట్టుకొనేందుకు వీలుకలుగుతుందని, సైనిక చర్య మరో మలుపు తిరుగుతుందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో జరిపే పెద్ద దాడులకు సన్నాహాలలో భాగంగా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉన్న పోలాండ్‌లోని రైల్వేట్రాక్‌ను ధ్వంసం చేసినట్లు రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. సోమవారం నాడు పోలాండ్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఐరోపా దేశాల మీడియా రష్యా కారణమని చెబుతున్నది. ఇదే సమయంలో తాము ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటున్నట్లు శుక్రవారం నాడు జెలెనెస్కీ కూడా అంగీకరించాడు. నాటో కూటమి దేశాలు ఇప్పటికీ పెద్ద మొత్తంలో సాయం అందిస్తున్నప్పటికీ అది వృధా అనే అభిప్రాయంతో నేతలు ఉన్నారు. ఉక్రెయిన్‌ ఇజ్‌మెయిల్‌ రేవు పట్టణం వద్ద ఉన్న టర్కీ ఎల్‌పిజి టాంకర్‌ షిప్‌పై జరిగినదాడిలో అది దగ్దమైంది.దాడి ఎవరు జరిపిందీ తేలనప్పటికీ రష్యా చేసిందని ఆరోపించారు. దాంతో పక్కనే ఉన్న రుమేనియాతన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది. పత్యక్షంగా పాల్గ్గొనేందుకు నాటో నేతలు విముఖత చూపుతున్నారు. గతంలో తగిలిన దెబ్బలతో తలబొప్పి కట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఉక్రెయిన్‌ సమస్యపై ప్రస్తుతం కంటి చూపుతున్న నోటమాట లేదు.జెలెనెస్కీ పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలా ఉంది.

దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిఝఝియాలో మరికొన్ని ప్రాంతాలు రష్యా ఆధీనంలోకి వెళ్లాయి.ఈ ప్రాంతంలో పోరు దిగజారుతున్నదని జెలెనెస్కీ మిలిటరీ అధికారులే అంగీకరించారు.వ్యూహాత్మకంగా తమసేనలను వెనక్కు రప్పిస్తున్నట్లు చెప్పుకున్నారు.హంగరీ ప్రధాని విక్టర్‌ ఒర్బాన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ గెలిచే అవకాశం లేదని, ఐరోపా ఆర్థికసాయం పిచ్చితనం తప్ప మరొకటి కాదన్నాడు. ఇప్పటికే 185బిలియన్‌ యూరోలు తగలేశామని, ఇంకా అంతకంటే ఎక్కువే తగేలేయాలని చూస్తున్నామని, ఎంత చేసినా గెలిచే అవకాశం లేదని జర్మన్‌ మీడియా గ్రూపు అక్సెల్‌ స్ప్రింగర్‌ సిఇఓతో మాట్లాడుతూ చెప్పాడు. యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణుల కోసం జెలెనెస్కీ ప్రస్తుతం ఫ్రాన్సు పర్యటనలో ఉన్నాడు, రానున్న పది సంవత్సరాలలో 100 రాఫేల్‌ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. తరువాత స్పెయిన్‌ వెళతాడని వార్తలు.సరస్సులోని చేపలు పైకి వస్తే మింగివేసేందుకు సిద్దంగా ఉండే కొంగల మాదిరి క్రామాటోరస్క్‌ వంటి చోట్ల రష్యన్‌ లాన్సెట్‌ డ్రోన్లు దాడులకు సిద్దంగా ఉన్నాయని ఉక్రెయిన్‌ నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రతి రోజూ రష్యన్ల చేతిలో నరకం చూస్తున్నట్లు చెబుతున్నారు. సమీప భవిష్యత్‌లో రష్యాతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ జరిగే అవకాశం లేదని మాస్కోతో 1,350 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఫిన్లండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌ చెప్పాడు. సరిహద్దుల్లో ఉన్న పరిస్థితి గురించి తాను ట్రంప్‌తో మాట్లాడతానని, పది అంశాల్లో ఏ ఒక్కదానికి పుతిన్‌ అంగీకరించినా మంచిదే అన్నాడు. ఇటీవలనే ఫిన్లాండ్‌ నాటో కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. రష్యా ఎత్తుగడలు ఏమిటో తమకు బాగా తెలుసని స్టబ్‌ చెప్పాడు.

ఉక్రెయిన్‌ సేనలు యుద్ద రంగం నుంచి పారిపోతున్న వార్తలు గతంలోనే వచ్చినప్పటికీ ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉన్నాయి. వివాదం ప్రారంభమైన 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే పశ్చిమ దేశాల మీడియా వార్తల ప్రకారం అక్టోబరు నెలలో 21వేల మంది పారిపోయారు. రష్యాపై తాము విజయం సాధించబోతున్నామని జెలెనెస్కీ ఎన్ని కబుర్లు చెప్పినా, ఇతర దేశాలు ఇచ్చిన కొన్ని ఆధునిక ఆయుధాలు, సమాచారం ఆధారంగా రష్యాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేసిన తరువాత ఇలా జరగటం, అదీ పశ్చిమ దేశాల మీడియా వెల్లడించట గమనించాల్సిన అంశం. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని ఇటీవలి వరకు ఉక్రెయిన్‌ మిలిటరీలో పనిచేసిన ఇగోర్‌ లుస్టెంకో చెబుతున్నాడు. మిలిటరీ ఇలాంటి అంశాలను బయటకు రాకుండా చూస్తుందని వేరే చెప్పనవసరం లేదు.అధికారిక సమాచారం ప్రకారమే అక్టోబరులో 21,602 మంది పారిపోయారు, వాస్తవంలో ఎక్కువ మంది ఉంటారని లుస్టెంకో చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఇటీవలి కాలంలో రష్యన్‌ సేనలు మరిన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవటానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతుండగా, తాము గెలిచే అవకాశం లేదని ఉక్రెనియన్లు భావించటంతో పోరాడటం, ప్రాణాలు పోగొట్టుకోవటంలో అర్దం లేదని అనేక మంది భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇటీవల ఒక బ్రిటీష్‌ పత్రిక చేసిన విశ్లేషణ ప్రకారం ఆరున్నర లక్షల మంది మిలిటరీలో చేరి పోరాడగలిగిన వయస్సున్నవారు ఉక్రెయిన్‌ వదలి పారిపోయారు. ఆ దేశ పార్లమెంటు సభ్యుడొకరు నాలుగు లక్షలని చెప్పాడు.మిలిటరీ నుంచి పారిపోతున్నవారి గురించి 2024 డిసెంబరులో ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం అంతకు ముందు రెండు సంవత్సరాలతో పోలిస్తే ఆ ఏడాది రెండింతలున్నారు.బ్రిటీష్‌ పత్రిక టెలిగ్రాఫ్‌ ఇటీవల ఇచ్చిన విశ్లేషణ ప్రకారం ప్రతి నెల పారిపోతున్న లేదా విధులకు చెప్పకుండా గైరుహాజరవుతున్నవారి సంఖ్య ఇరవైవేలు ఉంటున్నది. పారి పోయిన వారి మీద 2.9లక్షల కేసులను ప్రభుత్వం నమోదు చేసింది.ఇప్పుడు కనీసం రెండు లక్షల మంది కొరత వున్నట్లు అంచనా. అనేక మంది మాజీ, ప్రస్తుత అధికారులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఈ విషయాలను రాసింది. పోరు జరుగుతున్న ప్రాంతాలలో ఉన్నవారిలో కేవలం 30శాతం మందే యుద్ద సన్నద్దతతో ఉన్నారు. సెప్టెంబరు నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ సేనలలో కేవలం 47-48శాతానికి మించి లేరని చెప్పాడు. సైనికుల కొరత ఉన్నవారి మీద వత్తిడిని కూడా పెంచుతున్నది.వారినే ఒక రంగం నుంచి మరో రంగానికి పదే పదే మారుస్తున్నారు. నిరంతర దాడులను తట్టుకొనే శక్తి తగ్గుతున్నదని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారులు వాపోతున్నారు. కొత్తగా సైన్యంలోకి తీసుకున్నవారికి కూడా తగిన శిక్షణ ఇవ్వకుండా యుద్ద రంగానికి తరలిస్తున్నారు.గ్రామాల నుంచి మిలిటరీలోకి తీసుకున్నవారిలో కొందరికి కేవలం రెండు రోజులు మాత్రమే శిక్షణ ఇచ్చి యుద్ధ రంగానికి పంపుతున్నట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. యుద్ధం జరిగిన సమయాల్లో ఏ పక్షమైనా తమకు జరిగిన నష్టాన్ని మూసిపెడుతుంది.వర్తమాన పోరులో రష్యా, ఉక్రెయిన్‌ గురించి కూడా అలాంటి వార్తలే వచ్చాయి. ఈ ఏడాది ఆగస్టులో వెల్లడైనట్లు చెబుతున్న ఒక పత్రం ప్రకారం 17లక్షల మంది ఉక్రేనియన్‌ సైనికులు మరణించారన్నది అతిశయోక్తితో కూడినదిగా ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ఉంటారన్నది వాస్తవం. మిలిటరీ నుంచి పారిపోవటం పెరగటానికి ఇవి కూడా కారణం.

అనేక చోట్ల ఉక్రెయిన్‌ సేనల లొంగుబాటు, రష్యా ఆధీనంలోకి పలు ప్రాంతాలు పోతున్నట్లు వచ్చిన వార్తల నేపధ్యంలో జెలెస్కీ బ్రిటన్‌ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు, ఉక్రెయిన్‌ గగనతలంపై విమానాలు ఎగరటం ప్రమాదకరంగా ఉండటంతో పక్కనే పోలాండ్‌లో విమానాన్ని సిద్దంగా ఉంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జెలెనెస్కీ ఏ ఐరోపా దేశానికి వెళుతున్నా కూడా చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతున్నారు. భద్రతా కారణాల రీత్యా తమదేశ పర్యటన గురించి వివరాలను వెల్లడించలేమని స్పెయిన్‌ ప్రధాని కార్యాలయం పేర్కొన్నట్లు రేడియో వెల్లడించింది. అయితే జెలెనెస్కీ సోమవారం నాడు ఫ్రాన్సు వెళ్లాడు. మరో వైపున అతగాడి స్థానంలో ఎవరిని గద్దెనెక్కించాలా అని ఆరునెలలుగా డోనాల్డ్‌ ట్రంప్‌ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దానిలో భాగంగానే ఇంథన ఒప్పందాలలో జెలెనెస్కీకి పది కోట్ల డాలర్ల లంచం ముట్టినట్లు, దాని గురించి దర్యాప్తు జరుగుతున్నదనే వార్తలు వచ్చాయి. అనేక దేశాల్లో ఎవరినైనా సాగనంపాలనుకున్నపుడు ఇలాంటి వాటిని ముందుకు తెచ్చి రంగం సిద్దం చేసే సంగతి తెలిసిందే. జెలెనెస్కీ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు రష్యన్‌ వర్గాలు కూడా చెబుతున్నాయి. బ్రిటన్‌ ఆశ్రయం ఇచ్చేందుకుసిద్దంగా ఉన్నప్పటికీ అక్కడ ఎంతకాలం ఉంటారన్న విశ్లేషణ కూడా సాగుతున్నది. ఇప్పటికే బ్రిటన్‌లో భవనాలను కొనుగోలు చేశాడని, రాజు చార్లెస్‌తో సంబంధాలలో ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది నవంబరులో జరిగే అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల నాటికి డెమోక్రటిక్‌ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసేందుకు గాను దాఖలు చేసే కేసులలో జెలెనెస్కీని సాక్షిగా చేసేందుకు చూస్తున్నట్లు, దానికి గాను పారిపోతే బ్రిటన్‌ నుంచి రప్పిస్తారని కూడా చెబుతున్నారు.మరొక దేశం ఇజ్రాయెల్‌ వెళ్లినా అదే జరుగుతుంది. కీలకమైన పోకరోవస్క్‌ పట్టణం పతనమైన తరువాత ఇలాంటి పరిణామం జరుగవచ్చని భావిస్తున్నారు. జెలెనెస్కీ పర్సుగా పరిగణిస్తున్న ఒక టీవీ కార్యక్రమాల స్టూడియో యజమాని తైముర్‌ మిండిచ్‌ మీద ఇప్పుడు జాతీయ అవినీతి నిరోధకశాఖ దర్యాప్తు జరుపుతున్నది. మాజీ ఉప ప్రధాని, ప్రస్తుతం జాతీయ ఐక్యత శాఖ మంత్రిగా ఉన్న ఒలెక్సీ గురించి కూడా దర్యాప్తు జరుగుతున్నది. జెలెనెస్కీ పదవీ కాలం ముగిసింది. పోరు సాగుతున్నదనే పేరుతో పదవిలో కొనసాగుతున్నాడు, ఉక్రెయిన్‌కు తగులుతున్న ఎదురుదెబ్బల పూర్వరంగంలో అతగాడిని బలిపశువుగా చేసి కొత్త బొమ్మను గద్దె నెక్కించి కాలం గడిపేందుకు అమెరికా, ఇతర నాటో దేశాలు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. అక్కడ ఎవరు గద్దె నెక్కినా రష్యాకు వ్యతిరేకంగా నాటో దేశాల కుట్రలకు తెరపడితే తప్ప ప్రయోజనం ఉండదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముందు నుయ్యి – వెనుక గొయ్యి : దూరదృష్టిలేమితో దేశాన్ని ఇరకాటంలోకి నెట్టిన ” సమర్ధ ” నరేంద్రమోడీ !

18 Saturday Oct 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

CHANDRABABU, Donald trump, Narendra Modi 2047, Narendra Modi Failures, visionless Narendra Modi, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

అన్నీ వారే చేశారంటూ గాంధీ, నెహ్రూ వంటి నేతలను ఇప్పటికీ ఆడిపోసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో చేయలేనిదానిని తమ మోడీ ఐదేండ్లలో చేశారు చూడండని డబ్బాకొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంటి వారు రంగంలోకి దిగి జిఎస్‌టిి సంస్కరణలతో బొందితో కైలాసానికి తీసుకుపోతున్నారన్నట్లుగా ఆకాశానికి ఎత్తుతున్నారు. గతంలో ఏం మాట్లాడారో తెలిసిందే ! నిజానికి ఏం జరుగుతోంది ? తాజాగా సెప్టెంబరు మాసంలో దేశ వాణిజ్యలోటు వివరాలు వెల్లడయ్యాయి. ఎగుమతులు 6.7శాతం పెరిగి 36.38 బిలియన్‌ డాలర్లకు చేరగా దిగుమతులు 16.7శాతం పెరిగి 68.53 బిలియన్‌ డాలర్లకు చేరాయి.కిందపడ్డా గెలిచింది మేమే అన్నట్లుగా దిగుమతులు అంటే మేం వస్తుకొనుగోలు శక్తి పెంచిన కారణంగానే అవసరం అవుతున్నాయని సమర్ధించుకుంటున్నారు. రూపాయి పాపాయిని ఆరోగ్యంతో బలిష్టంగా పెంచుతామని చెప్పారు. మోడీ మూడోసారి పాలన ఐదేండ్లు గడిచే సరికి ఇప్పుడున్న 89 డాలరుకు ముచ్చటగా వంద రూపాయలకు పతనమైనా ఆశ్చర్యం లేదు.

వికసిత భారత్‌ 2047 పేరుతో నరేంద్రమోడీ దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామన్నారు, ఇప్పుడు ఎటు తీసుకుపోతున్నారో తెలియదు. కొన్ని చేదు నిజాలను అంగీకరించకతప్పదు. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం మన దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మోడీ అధికారానికి వచ్చిన తరువాత జిడిపిలో 2.1శాతం ఉండగా 2023 నాటికి 0.8శాతానికి దిగజారాయి. అంకెల్లో చూస్తే 2014 నుంచి 2024వరకు వచ్చిన మొత్తం 509.69 బిలియన్‌ డాలర్లు(సగటున ఏడాదికి 46.34బి. డాలర్లు) అధికారానికి వచ్చిన కొత్తలో విమానం వేసుకొని దేశదేశాలూ ఎందుకు తిరుగుతున్నారంటే దిగజారిన దేశ ప్రతిష్ట పునరుద్దరణ, పెట్టుబడుల కోసం అని చెప్పారు. గొర్రెతోక బెత్తెడు అన్నట్లుగా 2016లో 46 బిలియన్‌ డాలర్లు వస్తే 2024లో 53 బిలియన్‌ డాలర్లు ఉంది. చైనాకు 2019 నుంచి 21వరకు మూడు సంవత్సరాల్లో వచ్చిన మొత్తం 787 బిలియన్‌ డాలర్లు. తరువాత కాలంలో చైనాకు మనదేశానికి వచ్చిన మొత్తం కూడా రాలేదు.2021లో 344 బిలియన్‌ డాలర్లు వస్తే 2023లో 51.3, 2024లో 18.6బిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చాయి. దానికి ఉన్న కారణాల గురించి మరోసందర్భంలో చెప్పుకోవచ్చు.చైనాలో పెరిగిన ఉత్పాదకత ఖర్చులతో వచ్చే లాభదాయకత కంటే అమెరికాలో వడ్డీ రేటు ఎక్కువగా ఉండటం ఒకటి. ఇక్కడ ముఖ్యాంశమేమంటే చైనాకు పెట్టుబడులు ఆగిపోయాయి, మనదేశానికి అవి రూటుమార్చాయి, కంపెనీలు వరుసలో నిలుచున్నాయి అని చెప్పిన వారు యాపిల్‌ కంపెనీ గురించి పదే పదే చెప్పటం తప్ప చైనాకు తగ్గిన ఎఫ్‌డిఐ మనకు ఎందుకు రాలేదో చెప్పాలి. చైనా కంపెనీలు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దపడితే గత ఐదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే.ఆశించిన అమెరికా, ఇతర దేశాల కంపెనీల జాడకనిపించకపోవటంతో ఇప్పుడు చైనా పెట్టుబడులకు ద్వారాలు తెరిచేందుకు మోడీ సర్కార్‌ పూనుకుంది.

కుండలో కూడు కదల కూడదు బిడ్డడు దుడ్డులా ఉండాలన్నది మన ఆలోచనా విధానంగా ఉంది. అది మారనంత వరకు అటూ ఇటూ కాని స్థితే. ఇతర అభివృద్ధి చెందిన, చైనా వంటి దేశాలతో పోల్చితే మనదేశంలో కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల పరిమితం, బలహీనమైన మౌలిక సదుపాయాలు ఆకర్షణీయంగా లేనపుడు రాజకీయ నేతలు, వారికి భజన చేసే మీడియా ఎన్ని కబుర్లు చెప్పినా ఉపయోగం ఉండదు.” విదేశీ కంపెనీలకు భారత్‌ శ్మశానం వంటిది ” అని ఏకంగా ప్రపంచబ్యాంకే వాణిజ్య నివేదికలో పేర్కొన్నది.ఆ ముద్ర నుంచి ఇంతవరకు బయటపడిందా అన్నది సందేహమే. ఇంతే కాదు 2014 నుంచి 2021 వరకు మన దేశంలో ఉన్న 2,800 విదేశీ కంపెనీలు దుకాణాలు మూసుకొని వేరేచోట్లకు వెళ్లిపోయాయి.మన దేశానికి రావాలనుకొనే వారు ఇలాంటి వాటన్నింటినీ ఒకటికి రెండుసార్లు చూసుకుంటారు. ఇప్పుడు అమెరికా విధించిన పన్నులతో ఇక్కడ పరిశ్రమలే ఎలా మనుగడ సాగించాలా అని ఆలోచిస్తుండగా కొత్తగా వచ్చేవారి సంగతి వేరే చెప్పనవసరం లేదు. మన కార్పొరేట్ల తీరుతెన్నులు చూస్తే మిగతావారి మాదిరే తమ లాభాలు తప్ప వేరే పట్టవు. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా తమకు అనుకూలమైన విధానాలను అమలు చేయిస్తారు. ఇప్పుడు అమెరికా, ఇతర దేశాలతో తలెత్తిన పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచటం లేదని చెప్పవచ్చు.గతంలో ఆసియన్‌ దేశాలతో కూడిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) కూటమిలో లేదా పసిఫిక్‌ భాగస్వామ్య కూటమి సిపిటిపిపి(కాంప్రహెన్సివ్‌ అండ్‌ ప్రోగ్రెసివ్‌ ఎగ్రిమెంట్‌ ఫర్‌ ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌)లో చేరాలా ? చేరితే వచ్చే లాభాలేమిటి ? నష్టాలేమిటనే గుంజాటనలో పాలకవర్గం దాని ప్రతినిధిగా ప్రస్తుతం ఉన్న నరేంద్రమోడీ సర్కార్‌ ఉంది. ఏదో ఒక కూటమిలో చేరాలనే వత్తిడి ప్రారంభమైంది.చేరితో పౌరుల నుంచి వచ్చే వ్యతిరేకత తమ అధికారానికే ఎసరు తెస్తుందేమో అన్న భయం బిజెపి, దాని మద్దతుదార్లలో కూడా తలెత్తింది. పైకి చెప్పుకోకపోవచ్చు.

ముందుగా ఆర్‌సిఇపి గురించి చూద్దాం. ఈ కూటమి ఒప్పందంపై 2020 నవంబరు 15 సంతకాలు చేసింది. అది 2022 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది.దీనిలో ఆస్ట్రేలియా,బ్రూనీ, కంపూచియా, చైనా, ఇండోనేషియా, జపాన్‌, దక్షిణ కొరియా, లావోస్‌, మయన్మార్‌, మలేసియా, న్యూజీలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌,థారులాండ్‌, వియత్నాం ఉన్నాయి. ఏడు సంవత్సరాలు తర్జన భర్జన పడిన తరువాత 2019 నవంబరులో ఈ కూటమిలో చేరకూడదని నరేంద్రమోడీ సర్కార్‌ నిర్ణయించింది. ముందు ఎట్టిపరిస్థితిలోనూ చేరకూడదని రైతు, వ్యవసాయ కార్మిక, పారిశ్రామిక కార్మికులు, ఇతరులూ స్పష్టం చేశారు. చైనా ఉన్న ఏ వాణిజ్య కూటమిలోనూ చేరకూడదని పారిశ్రామికవేత్తలు గట్టిగా పట్టుబట్టారు. దాంతో ఈ కూటమికి మనదేశం దూరంగా ఉంది. అయితే ఇప్పటికీ ఆర్‌సిఇపి మన దేశానికి ఆహ్వానం పలుకుతూనే ఉంది. గతంలో వ్యతిరేకించిన కార్పొరేట్‌ శక్తులే డోనాల్డ్‌ట్రంప్‌ దెబ్బతో పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. వారెందుకు నాడు వ్యతిరేకించారంటే ఒకటి, చైనాతో అప్పటికే ఉన్న వాణిజ్యలోటు మరింత పెరుగుతుంది, రెండు, ఆ కూటమిలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తమ పాడి ఉత్పత్తులకు మన మార్కెట్‌ను తెరవాలని డిమాండ్‌ చేస్తున్నాయి, అదే జరిగితే మన పాడి పరిశ్రమలో ఉన్న కోట్లాది మంది రైతులు నష్టపోతారు.రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో సున్నితమైన అంశం. మూడవది, సేవారంగానికి ఇతర దేశాలు తమ మార్కెట్లను తెరిచే అంశంపై మన ప్రతిపాదనలకు ప్రత్యేకించి నిపుణుల రాకపోకలకు సంబంధించి తగిన మద్దతు రాకపోవటం.

అయితే ఇప్పుడు కార్పొరేట్లలో పునరాలోచనకు పరిస్థితులేమైనా మారాయా ? ఒక్క మాటలో చెప్పాలంటే లేదు. చైనాతో వాణిజ్య లోటు ఆరేళ్ల క్రితం 48.6 బిలియన్‌ డాలర్లు ఉంటే ఇప్పుడు వంద బిలియన్‌ డాలర్లకు చేరింది. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై మన వైఖరిలో అప్పుడూ ఇప్పుడూ ఒకటిగానే ఉంది. అందుకే ఆస్ట్రేలియా, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటానికి మోడీ సర్కార్‌ భయపడుతోంది. నయా ఉదారవాదం ప్రకారం మనకు లబ్ది కలిగించే సేవారంగ మార్కెట్‌లను తెరవాలన్న మన ప్రతిపాదనలకు ఇతర దేశాలు సుముఖంగా లేవు. దీని అర్ధం ఎవరి రక్షణ చర్యలకు వారు కట్టుబడి ఉన్నారు. ఈ స్థితిలో పునరాలోచన చేయాలని కొందరు ఎందుకు కోరుతున్నారంటే ట్రంప్‌ ఇచ్చిన షాక్‌తో ప్రభావితమైన రంగాలకు ఏం చేయాలో తోచక ఈ ప్రయత్నం ఏమైనా ఉపయోగపడుతుందా అని భావిస్తున్నారని చెప్పవచ్చు.పోనీ చేరితే వెంటనే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఉండదు. దాని నిబంధనావళి ప్రకారం 2022 నుంచి ఇరవై సంవత్సరాల వ్యవధిలో నాడున్న పన్నులను 92శాతం తగ్గించాల్సి ఉంటుంది. అదే విధంగా ఎగుమతి, దిగుమతుల కోటాలను ఖరారు చేస్తారు. తెల్లవారేసరికి మన సరుకులను ఎగుమతి చేసి లాభాలు సంపాదించాలంటే కుదరదు. మన రైతాంగానికి, పాడి, కోళ్ల పరిశ్రమల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకొని మార్కెట్‌ను తెరిస్తే అదొక తీరు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటానికే మొరాయిస్తున్న నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందంటే నమ్మేదెవరు ? రైతాంగమే కాదు కొన్ని పరిశ్రమలు కూడా దెబ్బతింటాయి.

ఇక రెండో ఆర్థిక కూటమి సిపిటిపిపిని చూద్దాం. దీనిలో ఆర్‌సిఇపిలో ఉన్న కొన్నింటితో పాటు ఇతర దేశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, వియత్నాం, సింగపూర్‌, బ్రూనీ,కెనడా, మలేసియా,జపాన్‌, చిలీ, పెరూ, బ్రిటన్‌,మెక్సికో ఉన్నాయి. వీటి మధ్య ఒప్పందం 2018లో ఉనికిలోకి వచ్చింది. దీని ప్రకారం 99శాతం వరకు పన్నులను తగ్గించాల్సి ఉంటుంది.ఆర్‌సిఇపి కంటే నిబంధనలు గట్టిగా ఉన్నాయి. అంతకు ముందు ట్రాన్స్‌ ఫసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ (టిపిపి) పేరుతో కుదిరిన ఒప్పందం నుంచి అమెరికా వైదొలగటంతో అది మూలన పడి దాని స్థానంలో కొత్తగా ఉనికిలోకి వచ్చింది.దీనిలో సభ్యత్వం కోసం చైనా దరఖాస్తు చేసినప్పటికీ దానికి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆర్ధిక సేవారంగాన్ని తెరవాలన్న నిబంధనతో పాటు సమాచారాన్ని స్వేచ్చగా ఇచ్చిపుచ్చుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించాలనే షరతులు ఉన్నాయి. వాటిని చైనా అంగీకరించటం లేదు. అమెరికా, చైనా రెండూ లేవు గనుక మనం చేరితే ఉపయోగం ఉంటుందన్న ఆశతో సిపిటిపిపిలో చేరితే ఎలా ఉంటుందని మన కార్పొరేట్లు ఆలోచన చేస్తున్నారు. ఆర్‌సిఇపి కంటే మరింతగా ఉదారవాద విధానాలను అమలు జరపాల్సి ఉంటుంది.ప్రస్తుతం నరేంద్రమోడీ చేస్తున్నవాటికే ప్రతిఘటన ఎలా ఉంటుందో రైతాంగ ఉద్యమం స్పష్టం చేసింది. ఇప్పుడు కార్మిక చట్టాలలో తెస్తున్న మార్పులకు వ్యతిరేకంగా కార్మికవర్గం కూడా ఆందోళనకు సిద్దం అవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను పరిమితం చేసే యత్నాలకు వాటి సిబ్బంది కూడా వ్యతిరేకత వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అందువలన ఈ కూటమిలో చేరటం కూడా అంత తేలిక కాదు.

ఏ దేశానికైనా ఒక దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు ఎత్తుగడలు అవసరం. నరేంద్రమోడీ సర్కార్‌కు అలాంటి ఆలోచనగానీ, ఆచరణగానీ లేదు. అందువల్లనే అమెరికా మనమీద పెద్ద ఎత్తున వత్తిడి తెస్తున్నది.దాన్ని తప్పించుకొనేందుకు మాటల్లేవ్‌, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్లుగా ఐదేండ్ల క్రితం అన్ని సంబంధాలను తెంచుకున్న చైనాతో తిరిగి చేయి కలపటం, అవసరమైతే రష్యా, చైనా, భారత్‌ ఒక కూటమిగా ఏర్పడతాయనే సందేశాన్ని షాంఘై సహకార సంస్థ సమావేశాల సందర్భంగా ఇచ్చారు. అయితే అమెరికాతో సంబంధాలకు కూడా తహతహలాడుతున్నారు.అందుకే చైనా, రష్యా బహిరంగంగా చెప్పనప్పటికీ ప్రతి అడుగూ అనుమానంతో వేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ఐరోపా సమాఖ్యతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని, స్థానిక గిరాకీని పెంచేందుకు పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలని, అదనపు రిస్కులను తీసుకోకుండా అన్ని దేశాలతో ఉన్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో గరిష్టంగా లబ్దిపొందేందుకు చర్యలు తీసుకోవాలని మనకార్పొరేట్లు కోరుతున్నారు. పదేండ్ల మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో చైనా ప్లస్‌ 1పేరుతో కొత్త పల్లవి అందుకున్నారు.

బహుళజాతి కంపెనీలు ముందుకు తెచ్చిన ఈ వ్యూహం వాణిజ్యపరమైనది. సరఫరా వ్యవస్థ లేదా గొలుసులో చైనాను విస్మరించలేరు.కనుచూపు మేరలో ప్రత్యామ్నాయం కనిపించటం లేదు. చైనాలో కార్మికవేతనాలు పెరుగుతున్నందున, ఇతర నిబంధనలతో ఉత్పాదక ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే 140 కోట్ల జనాభా ఉన్న మార్కెట్‌ను వదులుకోలేరు. అందుకే చైనాతో పాటు మరొక దేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించాలన్నదే చైనా ప్లస్‌ 1 అర్ధం. మన దేశంలో యాపిల్‌ కంపెనీ కార్యకలాపాలకు కారణమిదే. దీని భావం అన్ని కంపెనీలు మన దేశానికి బారులు తీరాయని కాదు. వియత్నాం,ఇండోనేషియా,థారులాండ్‌ ఇలా ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ఎంచుకోవచ్చు.మన విషయానికి వస్తే సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి. యువజనాభా గణనీయంగా ఉండటం, కార్మికవేతన ఖర్చు తక్కువ(2023 సర్వే ప్రకారం చైనా కంటే వేతనాలు 47శాతం తక్కువ.) ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాలు ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇవి సానుకూల అంశాలు కాగా సవాళ్లు కూడా ఉన్నాయి. 2013 నుంచి చైనాలో వేతనాలు పెరుగుతున్నందున కంపెనీలు మనదేశానికి వస్తాయని చెప్పినా వాటి జాడలేదు. నియంత్రణలు ఎక్కువ ( అంబానీ, అదానీలకు ఎవరూ పోటీ రాకూడదు, అందుకే అమెజాన్‌ అధిపతి బెజోఫ్‌కు గతంలో మోడీ కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించలేదు) మౌలిక సదుపాయాలు అంటే ” తోలు ” వలిచే రోడ్లు మాత్రమే కాదు. వియత్నాం, థారులాండ్‌ వంటి చిన్నదేశాల నుంచి కూడా మనకు పోటీ ఎక్కువగా ఉంది. కబుర్లు ఎక్కువ ఆచరణ తక్కువ.మొత్తంగా చూసినపుడు సమర్ధుడైన నావికుడిగా భావించి మన నావను నరేంద్రమోడీకి అప్పగిస్తే ఇప్పుడది చుక్కాని లేనట్లు ఎటు పోతుందో తెలియకుండా నడి సముద్రంలో ఉంది. చిత్రం ఏమిటంటే దీనికి కూడా నెహ్రూ కారణమని చెప్పగల సమర్ధులుంటే నిజమే అని నమ్మే అమాయకులు పుష్కలంగా ఉండటం అసలైన సమస్య !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పశ్చిమ దేశాల తీరు : ఒకవైపు కార్మికవర్గంపై దాడి మరోవైపు రష్యాతో లడాయి !

08 Wednesday Oct 2025

Posted by raomk in Current Affairs, Economics, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Another Cold war, Cold War, Donald trump, Europe workers struggle, Putin warns US, Tomahawk missiles, Ukraine, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు

నాటో కూటమితో చేతులు కలిపి తమ మీద చేస్తున్న కుట్రకు ప్రతిక్రియగా ఉక్రెయిన్‌ మీద రష్యా ప్రారంభించిన సైనిక చర్య బుధవారం నాడు 1,322వ రోజులో ప్రవేశించింది. పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఐరోపా అంతటా దోపిడీకి గురౌతున్న కార్మికుల సమ్మెలు ఒక వైపు, మరోవైపు రష్యాను దెబ్బతీసేందుకు అమెరికాతో కలసి పాలకవర్గాల కుట్రలు కనిపిస్తున్నాయి. తమ మీద దాడులు చేసేందుకు అమెరికా గనుక తోమహాక్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తే సంబంధాలు నాశనం అవుతాయని రష్యన్‌ అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ అమెరికానుద్దేశించి చెప్పాడు. నిజానికి ఇది ట్రంప్‌కే కాదు, కయ్యానికి ఎగదోస్తున్న యావత్‌ ఐరోపా ధనిక దేశాలకు చేసిన హెచ్చరిక. ఆ ప్రకటన మరుసటి రోజు డోనాల్డ్‌ ట్రంప్‌ విలేకర్లు అడిగిన ప్రశ్నలపై స్పందించాడు.” నేనూ కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాను, ఆ పోరు మరింతగా పెరగాలని కోరుకోవటం లేదు ” అన్నాడు. పశ్చిమ దేశాలతో మరో ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నట్లు తమ మీద చేస్తున్న ఆరోపణను రష్యా తోసిపుచ్చింది. తమ మీద దాడులు చేసేందుకు, మిలటరీ ఖర్చు పెంచేందుకు నెపాన్ని తమ మీద నెట్టాలని ఐరోపా యూనియన్‌, నాటో కూటమి దేశాలు లేని పోని కథలను వ్యాపింప చేస్తున్నాయని గత ప్రచ్చన్న యుద్దంతో పోల్చటాన్ని అంగీకరించటం లేదని రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా ఝకరోవా గత వారంలో స్పష్టం చేశారు.క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెష్కోవ్‌ మాట్లాడుతూ ఐరోపా అంతటా ఇటీవల కనిపించిన డ్రోన్లకు రష్యా కారణమని నిందించటానికి ఎలాంటి హేతుబద్దత లేదన్నాడు.డ్రోన్ల వెనుక రష్యా ఉందని భావిస్తున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్య తరువాత ఐరోపాలోని అనేక మంది రాజకీయవేత్తలు అన్నింటికీ రష్యా కారణమని నిందిస్తున్నారన్నాడు.

క్యూబన్‌ క్షిపణుల సంక్షోభం 1962 తరువాత రష్యా మరియు పశ్చిమ దేశాల మధ్య ఉక్రెయిన్‌ సంక్షోభ రూపంలో తలెత్తిన ఘర్షణ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో తీవ్రమైనది,అతి పెద్దది. తాము ఇప్పటికే మరో రూపంలో ఉన్న ఘర్షణలో ఉన్నామని, అదేమాత్రం ప్రచ్చన్న యుద్ధం కాదు ఇప్పటికే ఇక్కడ మంటలు ఉన్నాయని మరియ ఝకరోవా చెప్పారు. అలాస్కా భేటీ తరువాత శాంతి అవకాశాలు ఆవిరవుతున్నట్లు జరిగే పరిణామాలు వెల్లడిస్తున్నాయి. తమ అజెండాను అమలు జరిపేందుకు పశ్చిమ దేశాలు సరికొత్త ప్రచారదాడిని మొదలు పెట్టాయి. తమ గగనతలాన్ని అతిక్రమిస్తున్నందంటూ వివిధ దేశాలు ఒక పథకం చేస్తున్న ప్రచారాన్ని రష్యా తిరస్కరించినప్పటికీ గోబెల్స్‌ ప్రచారం సాగుతున్నది. ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా మెల్ల మెల్లగా కొత్త ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది.దానికి పోటీగా పశ్చిమ దేశాల గగనతల అతిక్రమణ కతలను ముందుకు తెచ్చాయి. ఆ పేరుతో మిలిటరీ బడ్జెట్‌లను పెంచేందుకు, సంక్షేమ పథకాలకు కోత విధించేందుకు పూనుకున్నారు. తమకు వ్యతిరేకంగా నాటో కూటమి కుట్రపన్నిందని పుతిన్‌ ఉక్రెయిన్‌ సంక్షోభ ప్రారంభానికి ముందు నుంచీ చెబుతున్నాడు.సోవియట్‌ పతనమైన 1991లో నాటో కూటమిని తూర్పు వైపు విస్తరించబోమని చెప్పి దాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించాయి. రష్యా సరిహద్దుల్లో ఉన్న ఉక్రెయిన్‌, జార్జియా వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మాస్కో వ్యవహారాలను నియంత్రించేందుకు చూశాయని అదే తమ మిలిటరీ చర్యకు కారణమని, అలాంటి కుట్రకు స్వస్థి పలికితే వెంటనే దాడులను నిలిపివేస్తామని పదే పదే చెబుతున్నాడు.

రష్యా చెబుతున్న అంశాలను విననట్లు నటిస్తున్న పశ్చిమ దేశాలు తీవ్రమైన ఆంక్షలను ప్రకటించి దిగ్బంధనం కావించేందుకు చూసినప్పటికీ వాటన్నింటిని మాస్కో ఇప్పటి వరకు అధిగమించింది. మూడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు అందించి దాడులు చేయించాయి.ఫలితం లేకపోవటంతో ఇప్పుడు మాస్కోతో సహా రష్యాలోని ఐరోపా ప్రాంతాలన్నింటిపైనా దాడులు చేయగల రెండున్నరవేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే తమ తోమహాక్‌ క్షిపణులను అందచేయాలని అమెరికా చూస్తున్నది. అనేక ఐరోపా దేశాలు వాటిని అడుగుతున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వారం రోజుల క్రితం ప్రకటించాడు.నేరుగా ఉక్రెయిన్‌కు అందిస్తే విమర్శలపాలు కావాల్సి వస్తుందనే భయంతో ఇతర దేశాలకు విక్రయించి అక్కడి నుంచి మళ్లించాలన్నది ఎత్తుగడ. అయితే జెలెనెస్కీ సేనలకు వాటిని అందచేసినప్పటికీ ఉపయోగించే సామర్ధ్యం లేదు. ఆ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. ఆ క్షిపణులు తమ దగ్గర ఉంటే పుతిన్‌పై వత్తిడి పెంచటానికి తోడ్పడతాయని అన్నాడు. అందుకే అదే జరిగితే పశ్చిమ దేశాలతో సంబంధాల విచ్చిన్నానికి దారితీస్తుందని పుతిన్‌ హెచ్చరించాడు. ఇవ్వాలా లేదా అన్నది అమెరికా తేల్చుకోవాల్సి ఉంది. ఇస్తామంటే ఎలాంటి స్పందనలు వస్తాయో తెలుసుకొనేందుకు వాన్స్‌ ద్వారా ట్రంప్‌ మాట్లాడించాడు. రష్యా ఇంథన మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని ఉక్రెయిన్‌కు అందచేసేందుకు వాషింగ్టన్‌ నిర్ణయించిందని, వాటిని ధ్వంసం చేయాలంటే దీర్ఘశ్రేణి క్షిపణులు అవసరమౌతాయని వాటిని ఇవ్వటమా లేదా అన్న గుంజాటనలో ఉన్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసింది.

అమెరికన్లు ప్రత్యక్షంగా పాల్గ్గొంటే తప్ప తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించటం అసాధ్యమని, అదే జరిగితే ఉద్రిక్తలు నూతన దశకు చేరతాయని పుతిన్‌ గతవారంలో హెచ్చరించాడు. అలాంటి క్షిపణులను ఇచ్చేది లేదని గతంలో ట్రంప్‌ ప్రకటించాడు. అయితే ఉక్రెయిన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి కెయిత్‌ కెల్లాగ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రష్యా మీద దీర్ఘశ్రేణి లక్ష్యాలపై దాడులను చేసే స్థితిలో ఉక్రెయిన్‌ ఉందని ట్రంప్‌ సూచన ప్రాయంగా చెప్పినట్లు తెలిపాడు.తన పాటలకు అనుగుణ్యంగా పుతిన్‌ నృత్యం చేయటం లేదనే ఉక్రోషంతో ఈ విపరీత చర్య గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పవచ్చు. పిచ్చివాడి చేతిలో రాయి మాదిరి ఎప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అమెరికా మీడియా క్సియోస్‌తో మాట్లాడిన జెలెనెస్కీ తాము కూడా రష్యా ఏది చేస్తే ప్రతిక్రియగా అదే చేస్తామన్నాడు.తమ ఇంథన వనరులపై పుతిన్‌ సేనలు దాడి చేస్తే తాము కూడా అదే చేస్తామన్నాడు.కెయిత్‌ కెలోగ్‌ ఒక మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ ఇప్పటికే రష్యాలో ఉన్న కొన్ని ప్రత్యేక లక్ష్యాలపై దాడులకు కీవ్‌ను అనుమతిస్తున్నట్లు చెప్పాడని తెలిపాడు. సురక్షిత ప్రాంతాలనేవి లేవని అన్నాడు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు నిలిపివేయాలని కోరుతున్న శక్తులపై ఇటీవల గెలిచిన చెక్‌ అధ్యక్షుడు పీటర్‌ పావెల్‌ మాట్లాడుతూ సరఫరా కొనసాగించాల్సిందే అన్నాడు. తగ్గించినా, నిలిపివేసినా మనకు మనమే హాని చేసుకున్నట్లని వ్యాఖ్యానించాడు. 650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల మీద దాడులు చేయగల డ్రోన్‌ క్షిపణి వ్యవస్థలను తాము స్వంతంగా తయారు చేసుకున్నట్లు ఉక్రెయిన్‌ చెప్పింది, అది నిజమో కాదో తెలియదు గానీ నిజమైతే దాని వెనుక నాటో దేశాల హస్తం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అంతే ఫ్లెమింగో పేరుతో తాము మూడువేల కిలోమీటర్ల దూరం ప్రయణించే క్షిపణిని తయారు చేసినట్లు కూడా కీవ్‌ చెప్పుకుంది. అంటే పశ్చిమదేశాల ఆయుధాలకు ఉక్రెయిన్‌ ముద్రవేసి రష్యా మీద దాడులకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పవచ్చు.బహుశా వీటిని గమనించే పుతిన్‌ చేసిన తాజా హెచ్చరిక పరమార్ధం.

మరోవైపున ఐరోపా అంతటా ఇటీవల జరుగుతున్న వివిధ రంగాల సమ్మెలను గమనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నెలలో అనేక దేశాల్లో విమానాశ్రయాల సిబ్బంది సమ్మెకు పిలుపులు ఇచ్చారు. అందువలన ప్రయాణీకులు ఒకటికి రెండుసార్లు తమ విమానాలు నడిచేదీ లేనిదీ తనిఖీ చేసుకోవాలని ఆ రంగానికి చెందిన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పని పరిస్థితులు, వేతన పెంపుదల వంటి అంశాలు ప్రధానంగా సమ్మెలకు పురికొల్పుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల సమ్మెలు, ఇతర రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 నుంచి స్పెయిన్‌లోని అనేక విమానాశ్రయాలలో సిబ్బంది ఆందోళన కారణంగా అనేక విమానాలు నిలిచిపోయాయి. ప్రతి బుధ,శుక్ర, శనివారాల్లో విమానాలు దిగేందుకు పని చేసే సిబ్బంది ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు సమ్మెలు చేస్తున్నారు, ఈ ఆందోళన డిసెంబరు 31వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఫ్రాన్సులో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ నియమించిన ఏడవ ప్రధాని లికోర్ను రాజీనామా చేశాడు. సెప్టెంబరు 9న పదవీ బాధ్యతలు స్వీకరించి కేవలం 26 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ఏలుబడిలో ఉన్న వ్యక్తిగా చరిత్రకెక్కాడు. అంతకు ముందు బడ్జెట్లో కోతలను ప్రతిపాదించిన ఫ్రాంకోయిస్‌ బేయరు నాటకీయంగా గద్దె దిగాల్సి వచ్చింది.కేవలం రెండు సంవత్సరాల్లోనే ఐదుగురు ప్రధానులను నియమించారు. పోర్చుగల్‌లో వచ్చే జనవరి వరకు ప్రకటించిన 71 రోజుల ఆందోళన పిలుపును కోర్టు ఆదేశాల కారణంగా వెనక్కు తీసుకున్నారు. కనీస సిబ్బంది విధుల్లో ఉండాల్సిందే అని కోర్టు ఆదేశించింది. ఇది సమ్మెహక్కుపై నిజమైన దాడి అని కార్మిక సంఘం విమర్శించింది. ఇటలీ రవాణా రంగంలో అనేక అంశాలపై ఒప్పందాలకు రావటంలో విఫలం కావటంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. దీనికి తోడు గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండను నిరసిస్తూ జరిగిన సాధారణ సమ్మెకు కార్మికులు మద్దతు ప్రకటించి లక్షలాది మంది ప్రదర్శనల్లో పాల్గన్నారు. చాలీ చాలని వేతనాలతో బతుకులీడుస్తున్నామని స్వంత ఇల్లు కొనుగోలు చేసేందుకు అవసరమైన రీతిలో తమవేతనాలను పెంచాలని బ్రిటన్‌లో రైల్‌,మారిటైమ్‌ మరియు ట్రాన్ప్‌పోర్ట్‌ (ఆర్‌ఎంటి) యూనియన్‌ ప్రచార ఆందోళన నిర్వహిస్తున్నది.వేతన పెంపుదలను కోరుతూ రెండు రోజుల పాటు సమ్మె జరపాలని ట్రాన్స్‌పోర్ట్‌ ఫర్‌ లండన్‌ (టిఎఫ్‌ఎల్‌) పిలుపు ఇవ్వగా 4.5శాతం పెంపుదలకు అంగీకరించటంతో ఆందోళన విరమించారు. కార్మికవర్గం జరుపుతున్న సమ్మెలకు వ్యతిరేకంగా మీడియాలో ఉన్న యాజమాన్య అనుకూల వ్యాఖ్యాతలు వక్రీకరణలతో విశ్లేషణలు రాస్తున్నారు. స్వంత ఇల్లు కొనుగోలు బ్రిటన్‌లో ఒక హక్కుగా లేదన్నది వాటిలో ఒకటి. బ్రిటన్‌లో 1947 నుంచి ప్రతి ఏటా రైల్వే కార్మికులు సమ్మెలు చేస్తున్నారంటూ ఒక వ్యాఖ్యాత ఉక్రోషం వెలిబుచ్చాడు.బడ్జెట్‌లోటు ఏర్పడినపుడల్లా ఫ్రాన్సులో ఆ భారాన్ని కార్మికవర్గం మీద నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో జిడిపిలో ఐదుశాతం ఉన్నపుడు 1995లో జరిగిన ఆందోళనల్లో ఇరవై లక్షల మంది రోడ్ల మీదకు వచ్చారు. నాటి ప్రధాని అలైన్‌ జుపే అంతకు ముందు ప్రతిపాదించిన అనేక పొదుపు చర్యలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అధ్యక్షుడు మక్రాన్‌ 2023లో ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 64 సంవత్సరాలకు పెంచి పెన్షన్‌ బిల్లును తగ్గించేందుకు చూశాడు.ఇప్పుడు మరో మితవాద ప్రధాని లీకొర్ను అదే విధానాలతో ఇంటిదారి పట్టాడు.ఐరోపా పాలకవర్గ సంక్షోభం, దానికి కార్మికవర్గం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనకు ఇది ఒక సాక్ష్యం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

షాంఘై సహకారం : ట్రంప్‌ను హెచ్చరించిన జింపిగ్‌, భారత పర్యటన రద్దు, స్వరం మార్చిన అమెరికా !

03 Wednesday Sep 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BJP, Donald trump, Narendra Modi, RSS, SCO Summit 2025, Shanghai Cooperation Organisation, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


కొన్ని సమయాలలో కొందరు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేం. అదే మాదిరి అంతర్జాతీయ రాజకీయాల ఎత్తులు జిత్తులలో భాగంగా సంభవించే పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. ఆగస్టు 31, సెప్టెంబరు ఒకటవ తేదీలలో చైనాలోని రేవు పట్టణమైన తియాన్‌జిన్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) 25 వార్షిక సమావేశం జయప్రదంగా జరిగింది. దాని చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం అని చెప్పవచ్చు.ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పేందుకు ఈ సభ నాంది పలుకుతుందా ? పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయంటూ సానుకూలంగా, ప్రతికూలంగా ఉండే పండితులందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. చైనా, భారత్‌ మధ్య వెల్లవిరిసిన స్నేహం మరింతగా విస్తరిస్తుందా లేదా అని కమ్యూనిస్టులు, పురోగామి శక్తులలో ఒకింత ఆనందం, అదే స్థాయిలో సందేహాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఒక్క ఈ తరగతికి చెందిన వారే కాదు చైనా, కమ్యూనిజాలను వ్యతిరేకించే, అమెరికాను భక్తితో కొలిచే కాషాయ దళాలు, ఇతరులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. జరుగుతున్న పరిణామాలు వారికి ఏమాత్రం మింగుడు పడటం లేదంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు తియాన్‌జిన్‌లో నరేంద్రమోడీ చైనా ఎర్రజెండా కారులో ప్రయాణం, ఉపన్యాసాలు, కరచాలనాలు, ఆత్మీయపలకరింపులు జరుగుతుండగానే అమెరికాలో కలవరం మొదలై స్వరం మార్చి ప్రకటనలు చేయటం ప్రారంభించారు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియకుండా గందరగోళంగా మాట్లాడారు. తమ కౌగిలిలోకి వస్తారని భావించిన నరేంద్రమోడీ షీ జింపింగ్‌, పుతిన్‌తో చేతులు కలపటంతో డోనాల్డ్‌ ట్రంప్‌లో ఉక్రోషం కట్టలు తెగింది. ఈ ఏడాది చివరిలో తలపెట్టిన క్వాడ్‌ సమావేశంలో పాల్గొనేందుకు రావాల్సిన మనదేశ పర్యటనను రద్దు చేసుకున్నాడు. చివరి క్షణంలో మనసు మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. అయితే తెగేదాకా లాగామా అన్న మలి ఆలోచనలో అమెరికన్లు పడ్డారనే చెప్పాలి.బహుశా ఆ కారణంగానే నవంబరులో వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పారా ? చైనాకు దగ్గర అవుతున్నామన్న సందేశంతో అమెరికాతో మోడీ బేరమాడేందుకు పూనుకున్నారా ? ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. ఒకటి మాత్రం నిజం రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ఎవరు తగ్గినా జనంలో గబ్బుపట్టటం ఖాయం.


షాంఘై ఐదు పేరుతో 1996 ఏప్రిల్‌ 26న చైనా, పూర్వపు సోవియట్‌ యూనియన్‌ విచ్చిన్నమైన తరువాత స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన రష్యా, కజకస్తాన్‌, కిర్ఖిరిaస్తాన్‌, తజికిస్తాన్‌లతో పాటు చైనా భాగస్వామిగా ఒక బృందం ప్రారంభమైంది. వాటిన్నిటికీ చైనాతో సరిహద్దు సంబంధాలు కొత్తగా ఏర్పడటంతో మిలిటరీ ఖర్చు తగ్గించుకొనేందుకు, పరస్పరం విశ్వాసం పాదుకొల్పటం వాటి ఒప్పంద అసలు లక్ష్యం. రెండవ సమావేశంలోనే బహుధృవ ప్రపంచం గురించి 1997 మాస్కో సమావేశంలో చైనా, రష్యా నేతలు ఒక ప్రకటన చేశారు. అంటే చక్రవర్తి, సామంత రాజులు అని గాకుండా ఎవరి స్వతంత్రవైఖరిని వారు కలిగి ఉండటం, పెత్తందారీ పోకడలకు దూరంగా, సహకరించుకోవటాన్ని సంకల్పంగా ప్రకటించారు. తరువాత 2001 జూన్‌ 21న ఆరవ దేశంగా ఉజ్బెకిస్తాన్ను చేర్చుకోవటమే కాదు షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) ఏర్పడి భాగస్వాముల మధ్య సహకారాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. తరువాత వివిధ సంస్థల ఏర్పాటుతో పాటు ఆర్థిక, భద్రతా విషయాల్లో కూడా చొరవ తీసుకొనేందుకు ముందుకు పోయారు. తరువాత దానిలో భారత్‌, పాకిస్తాన్‌, ఇరాన్‌, బెలారస్‌ సభ్య దేశాలుగా చేరాయి. ఇవి గాక 17దేశాలు చర్చల భాగస్వాములుగా, ఐక్యరాజ్యసమితి, ఆసియన్‌ కూటమి, పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లుగా ఉండి స్వతంత్రదేశాలైన వాటితో కూడిన కామనవెల్త్‌ ఇండిపెండెంట్‌ కంట్రీస్‌(సిఐఎస్‌) సంస్థ, తుర్క్‌మెనిస్తాన్‌ అతిధులుగా ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో ఈ దేశాలు ఉన్నాయి.మొత్తం 50 రంగాలలో సహకరించుకుంటున్నాయి. ఈ దేశాల జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు ఉండగా ప్రపంచ జనాభాలో 42శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.


తియాన్‌జిన్‌ సమావేశాన్ని ప్రారంభించి చైనా నేత షీ జింపింగ్‌ పేరు ప్రస్తావించకుండానే అమెరికాకు తీవ్రమైన హెచ్చరిక చేశాడు. ప్రచ్చన్న యుద్ధ మానసిక స్థితి నుంచి బయటపడాలని, అంతర్జాతీయ సంబంధాలలో అదిరించి బెదిరించే ఎత్తుగడలు, కూటముల ఘర్షణలు సాగవని, నిజాయితీ, న్యాయంతో వ్యవహరించాలని ప్రపంచ నేతలను కోరాడు.సంస్థ సభ్యదేశాలు భద్రత, అభివృద్ధి రంగాలలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని, సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పాడు.మిలిటరీ వ్యవహారాల్లో పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు ప్రారంభమైన ఎస్‌సిఓ ఇప్పుడు సరిహద్దులను అధిగమించి స్నేహ బంధంగా, పరస్పర విశ్వాసం,సహకారంతో విస్తరించిందని, ఈ స్పూర్తిని ముందు ముందు కూడా కొనసాగించాలని షీ జింపింగ్‌ ఆకాంక్షించాడు.విబేధాలను పక్కన పెట్టి పరస్పర లాభదాయకమైన అంశాల మీద కేంద్రీకరించాలని, ఆచరణ ప్రాతిపదికన నిజమైన ఫలితాల సాధన, ఉన్నతమైన సామర్ధ్యంతో వ్యవహరించాలని కోరాడు. సభ్యదేశాలన్నీ స్నేహితులు, భాగస్వాములే అన్నాడు. విబేధాలను గౌరవించాలని, వ్యూహాత్మక సంప్రదింపులతో ఏకాభిప్రాయ సాధనకు రావాలని కోరాడు. భద్రత, ఆర్థికపరమైన సహకారంలో భాగంగా సాధ్యమైనంత త్వరలో ఎస్‌సిఓ అభివృద్ధి బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకుందామని షీ ప్రతిపాదించాడు.ఈ ఏడాదే సభ్యదేశాలకు తాము రెండు బిలియన్‌ యువాన్ల మేర గ్రాంట్లు ఇస్తామని, వాటితో పాటు పది బిలియన్‌ యువాన్లు రానున్న మూడు సంవత్సరాలలో సభ్యదేశాల బాంకుల కన్సార్టియంకు రుణాలు కూడా ఇస్తామన్నాడు. కూటమి దేశాలలో ఇప్పటి వరకు చైనా 84బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది, దాని వాణిజ్య లావాదేవీల విలువ 2024లో 890 బిలియన్‌ డాలర్లు దాటింది. ప్రపంచ జిడిపిలో 23, జనాభాలో 42, ప్రపంచ చమురు నిల్వల్లో 20, గ్యాస్‌లో 44శాతాల చొప్పున ఈ కూటమి దేశాలు కలిగి ఉన్నాయి. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకులకు పోటీగా పెద్దగా షరతులు లేకుండా బ్రిక్స్‌ కూటమి నూతన అభివృద్ది బ్యాంకును కూడా ఏర్పాటు చేసింది, ఇప్పుడు షాంఘై సహకార సంస్థ కూడా మరో బ్యాంకును ఏర్పాటు చేసేందుకు పూనుకుంది.


షాంఘై సహకార సంస్థ సమావేశాలకు ముందే ఆదివారం నాడు షీ జింపింగ్‌ మరియు నరేంద్రమోడీ భేటీ జరిగింది.చైనాతో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవాలని వాంఛిస్తున్నట్లు మోడీ చెప్పారు. భారత్‌పై అమెరికా పన్నులు, జరిమానాలు అమల్లోకి వచ్చిన తరువాత జరిగిన ఈ సమావేశానికి పరిశీలకులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పరస్పర మన్నన, విశ్వాసం, సున్నితత్వాల ప్రాతిపదికన ఇరుదేశాల సంబంధాలను పెంచుకొనేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. ఏడు సంవత్సరాల తరువాత చైనాను తొలిసారిగా సందర్శించారు. ఇరుదేశాల సంబంధాలను మరింతగా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని, నిరంతరం ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన అభివృద్దిని ముందుకు తీసుకుపోవాలని షీ జింపింగ్‌ ప్రతిస్పందించాడు. ఇరు దేశాల సంబంధాలలో సరిహద్దు సమస్యల నిర్ధారణ అంశాన్ని ముందుకు తేవద్దని, రెండు దేశాల ఆర్థిక అభివృద్ధి మీద ప్రధానంగా కేంద్రీకరించాలని, మనం ప్రత్యర్ధులు గాకుండా భాగస్వాములుగా ఉండాలని కట్టుబడి ఉన్నంతకాలం బెదిరింపులుగాక అభివృద్ధి అవకాశాల మీద దృష్టిపెట్టాలని రెండు దేశాల సంబంధాలు మరింతగా ముందుకు పోయి ఫలించాలన్నాడు.


ఈ వాంఛలను రెండు దేశాలూ వెల్లడిరచటాన్ని చైనాకు భారత్‌ మరింత దగ్గర అవుతున్నట్లు అమెరికా పరిగణిస్తోంది. సరిహద్దుల యాజమాన్యం గురించి ఒక ఒప్పందం, సరిహద్దు వాణిజ్యం, వీసాలు, విమానాల రాకపోకల పునరుద్దరణ, చైనా పెట్టుబడులకు అనుమతి, టిబెట్‌లోని మానససరోవరాన్ని భారత యాత్రీకులకు తెరవటం, విలువైన ఖనిజాలు, ఉత్పత్తులపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయటం, ఎరువుల సరఫరా పునరుద్దరణ, సొరంగాలను తవ్వే యంత్రాల సరఫరా, అన్నింటికీ మించి చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రముఖుడు, విదేశాంగ మంత్రిగా ఉన్న వాంగ్‌ యి భారత పర్యటనలను ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారానికి వచ్చి ఏడాది కూడా గడవక ముందే ఇవన్నీ జరగటాన్ని అమెరికా జీర్జించుకోలేకపోతోంది. వీటితో పాటు షాంఘై సహకార సంస్థ అమెరికా నాయకత్వంలోని నాటో మిలిటరీ కూటమికి పోటీగా తయారు అవుతుందేమో అన్న భయం కూడా దాన్ని పట్టిపీడిస్తోంది. నిజానికి అలాంటి ఆలోచనలు కూటమిలోని ఏ దేశ అంజండాలో కూడా లేదు. పశ్చిమదేశాల అధికార కూటములకు భిన్నంగా నూతన అంతర్జాతీయ సంబంధాలకు ప్రయత్నిస్తున్నట్లు పాతిక సంవత్సరాల తీరు తెన్నులు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా పెత్తందారీతనాన్ని వ్యతిరేకించటం అంటే మరో మిలిటరీ కూటమిని కట్టటం కాదు.


నాటో, ధనికదేశాలతో కూడిన జి7, ఐరోపా సమాఖ్యకు పోటీగా తయారవుతుందేమో అన్న భయ సందేహాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి అజెండా ఎస్‌సిఓలో ఇంతవరకు లేదు. బ్రిక్స్‌, ఎస్‌సిఓ రెండూ కూడా విస్తరణ దశలో ఉన్నాయి. స్థానిక కరెన్సీలతో వాణిజ్య లావాదేవీలు జరపాలనటంలో వాటి మధ్య ఏకీభావం ఉంది. తొలుత అది విజయవంతమైన తరువాత డాలరుకు పోటీగా మరోకరెన్సీని తీసుకురావచ్చు. రష్యా, భారత్‌, చైనాలతో కూడిన(రిక్‌) కూటమి గురించి కూడా కొందరు చర్చిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి ఆ దిశగా ఎలాంటి పరిణామాలు లేవు.అమెరికా చేసే దాడుల తీవ్రతను బట్టి అజెండాలోకి రావచ్చు. తెగేదాకా లాగినట్లు భావించి లేదా దిద్దుబాటు చర్యల్లో భాగంగా అమెరికా స్వరం మార్చింది. గత కొన్ని దశాబ్దాలుగా వాణిజ్యంలో భారత్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న తమనేత ట్రంప్‌ వ్యాఖ్యల పూర్వరంగంలో రెండు దేశాలూ ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చునని విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ వ్యాఖ్యానించాడు.తాము భారత్‌ నుంచి ఎంతో ఎక్కువగా కొనుగోలు చేయగా తమ నుంచి తక్కువ దిగుమతి చేసుకున్నట్లు ట్రంప్‌ చెప్పాడు. తమ వస్తువుల మీద ఎలాంటి పన్నులు ఉండవని భారత్‌ చెప్పిందనీ అయితే ఇప్పటికే సమయం మించిపోయింది గనుక తాను వెనక్కు తగ్గేదేలేదన్నట్లు మాట్లాడాడు. బెసెంట్‌ ఫాక్స్‌ టీవీతో మాట్లాడుతూ విబేధాలను కూడా పరిష్కరించుకోవచ్చన్నాడు. అన్ని అవకాశాలూ తమ ముందు ఉన్నాయని చెప్పాడు. చిత్రం ఏమిటంటే ట్రంప్‌ కంటే ముందు అమెరికా మరియు భారత సంబంధాల గురించి అమెరికా రాయబార కార్యాలయం పొగిడిరది. ఇరుదేశాల సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయంటూ తమ విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో చేసిన వ్యాఖ్యలను అది ఉటంకించింది. ట్రంప్‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే బెసెంట్‌ భారత్‌ను సంతుష్టీకరించే స్వరంతో మాట్లాడాడు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పాడు. షాంఘై సహకార సంస్థ సమావేశం మొత్తం మీద నాటకీయ వ్యవహారం, తద్దినం లాంటిదని, భారత్‌ ప్రపంచంలో అత్యధిక జనాభాగల ప్రజాస్వామిక దేశం, వారి విలువలు చైనా, రష్యాల కంటే అమెరికాకే దగ్గరగా ఉంటాయన్నాడు. అధ్యక్షుడు, రాయబార కార్యాలయం, ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను చూసినపుడు వారి మధ్య సమన్వయం లేకపోవటంతో పాటు నష్టనివారణకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా చూసినపుడు భారత్‌ను దువ్వేందుకు అమెరికా పూనుకుంది. ఈ నెలలో ఐరాస సమావేశాలకు వెళ్లిన సమయంలో ప్రధాని నరేంద్రమోడీ బృందం ట్రంప్‌తో భేటీ కానున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి, అది జరుగుతుందా లేదా జరిగితే ఏమిటి అన్నది చూడాల్సివుంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ సంక్షోభం : అలాస్కా సమావేశ ఆంతర్యం ఏమిటి ? జెలెనెస్కీతో చర్చలకు తొందరేం లేదన్న రష్యా !

20 Wednesday Aug 2025

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Alaska meeting, Donald trump, Ukrain failures, Ukraine, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ గద్దె నెక్కి రెండు వందల రోజులు దాటింది. అడుగు ముందుకు పడకున్నా తాజాగా ఇదిగో పరిష్కారం అంటూ యావత్‌ ప్రపంచ దృష్టిని అటువైపు తిప్పాడు. తాజాగా అమెరికాలోని అలాస్కాలో గత శుక్రవారం నాడు జరిగిన ట్రంప్‌ మరియు పుతిన్‌ భేటీ వార్త సేకరణకు భారీ సంఖ్యలో వచ్చిన మీడియా సిబ్బందే దానికి నిదర్శనం. అంతకు ముందు వరకు కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం ముందు జరగాలంటూ చెప్పిన పెద్దమనిషి అలస్కా సమావేశం తరువాత అలాంటివేమీ లేవు. ఏకంగా పరిష్కారానికి మరోసారి మాస్కోలో సమావేశమని ప్రకటించాడు. చిత్రం ఏమిటంటే సోమవారం నాడు ట్రంప్‌తో భేటీ అయిన ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ మర్యాదల ప్రకారం గతానికి భిన్నంగా కోటు ధరించి వచ్చాడు. గతంలో ట్రంప్‌తో సమావేశానికి ఒక సాధారణ పౌరుడి మాదిరి దుస్తులు రావటంతో అవమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. జెలెనెస్కీని ట్రంప్‌ ఎక్కడ బుట్టలో వేస్తాడో తమతో నిమిత్తం లేకుండా ఒప్పందం కుదుర్చుకుంటారేమో అన్న భయం లేదా ముందు చూపుతో అనేక మంది ఐరోపా నేతలు కూడా కట్టగట్టుకు వచ్చి ట్రంప్‌తో చర్చలు జరిపారు.వారితో మాట్లాడుతూనే కాసేపు ఉండండి అన్నట్లు అంతరాయమిచ్చి పుతిన్‌తో ఫోన్లో మాట్లాడి తన ప్రాధాన్యత ఏమిటో వారికి అవగతమయ్యేట్లు చేశాడు.దానికి అనుగుణంగానే ఐరోపా నేతలు కూడా తమ మర్యాదను కాపాడుకుంటూ ట్రంప్‌ యత్నాలను హర్షిస్తూనే నర్మగర్భంగా తమ భిన్నాభిప్రాయాలను వెల్లడిరచారు. భద్రత అన్న తరువాత మేం లేకుండా పుతిన్‌, జెలెనెస్కీ, ట్రంప్‌ ముగ్గురూ మాట్లాడుకుంటే సరిపోతుందా, నాలుగు పక్షాల సమావేశం జరగాలనే సందేశాన్ని వారు కూడా ఇచ్చారు.ఈ నెలాఖరులో సమావేశం ఎక్కడ జరగాలనే అంశంపై కసరత్తు ప్రారంభమైంది. అది కూడా గత సమావేశాల మాదిరే విఫలయత్నం అవుతుందా నిజంగానే రాజీ కుదిరేందుకు వేదిక అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. సోమవారం నాటి ట్రంప్‌ ఫోన్లో మాట్లాడినపుడు నేరుగా ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు పుతిన్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే మంగళవారం నాడు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లోవరోవ్‌ మాట్లాడిన తీరు చూస్తే చర్చలు వెంటనే జరిగే అవకాశం లేదని తేలిపోయింది. క్రమంగా నిపుణుల స్థాయిలో మొదలై తరువాత దశలవారిగా చర్చలు జరగాలని లోవరోవ్‌ చెప్పాడు.ఐరాసలో రష్యా ప్రతినిధి దిమిత్రి పోలియానిస్కీ మాట్లాడుతూ చర్చల కోసం చర్చలు జరగకూడదని వ్యాఖ్యానించాడు.


అలాస్కా సమావేశం తరువాత కొన్ని సరికొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.చైనా మరియు రష్యాల మధ్య ఉన్న బంధాన్ని తెంచేందుకు అమెరికా పూనుకుందన్నది వాటిలో ఒకటి.ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైటు వెలుగుతుందన్నట్లుగా దీనికి ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారం నాంది పలుకుతుందా ! దీనర్ధం వెంటనే ఏదో జరుగుతుందని కాదు గానీ మాజీ కమ్యూనిస్టు మహాప్రమాదకారి అన్నట్లుగా పుతిన్‌ తీరుతెన్నులను ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిందే. వర్తమాన అంశానికి వస్తే మీడియాలో వస్తున్న లీకు వార్తలు, విశ్లేషణలను చూస్తుంటే మొదటి నుంచి రష్యా చెబుతున్నట్లుగానే దాని షరతులు, వైఖరికి అనుగుణంగానే ఒక పరిష్కారం కుదరవచ్చు అనే భావం కొందరిలో కలుగుతోంది. నిజంగా అలా జరిగితే ఐరోపాలో, ప్రపంచంలోనే సరికొత్త సమీకరణలు, పరిణామాలకు, మరింత పెద్ద సంక్షోభాలకు అది నాంది అవుతుంది. తాజా పరిణామాలు, విశ్లేషణలను చూసినపుడు మొత్తం మీద వ్లదిమిర్‌ పుతిన్‌ కూడా ఆశాభావంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకుల వ్యాఖ్య. ఇప్పటికే ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పుతిన్‌కు యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే రాజకీయ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.అందువల్లనే అతనికీ పరిష్కారం అవసరం.


ట్రంప్‌ యంత్రాంగం రూపొందించినట్లు చెబుతున్న పరిష్కార పద్దతి ప్రకారం ప్రస్తుతం రష్యా స్వాధీనంలో లేని కొన్ని ప్రాంతాలతో సహా డాన్‌బాస్‌ ప్రాంతంలో 6,600 చదరపు కిలోమీటర్లు లేదా 12శాతం భూభాగాన్ని ఉక్రెయిన్‌ వదులుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రతిగా సుమీ, ఖార్కివ్‌ ప్రాంతాలలో 440 చదరపు కిలోమీటర్లను రష్యా ఖాళీ చేసి ఉక్రెయిన్‌కు ఇస్తుంది. ఇదే జరిగితే రష్యాదే పైచేయి అవుతుంది, దాని షరతుల ప్రాతిపదికగానే ఒప్పందం ఉంటుంది. ఇంతవరకు ఏ ఒక్క అంశం మీద కూడా పుతిన్‌ దిగిరాలేదు.ఈ పూర్వరంగంలో అమెరికా ప్రతిపాదనలకు ఉక్రెయిన్‌ అంగీకరిస్తుందా, ఒకవేళ అమెరికా జెలెనెస్కీ మెడలు వంచి ఒప్పించినా ఐరోపా అగ్రదేశాలు తలూపుతాయా, చెప్పలేము. తెల్లవారే సరికి వైఖరులు, పరిణామాలు మారిపోతున్న ఈ రోజుల్లో రష్యా గడ్డమీద తలపెట్టిన తదుపరి భేటీలోపల ఏమైనా జరగవచ్చు.మిలిటరీ దళాల రంగ ప్రవేశంతో సహా ఉక్రెయిన్‌కు ఐరోపా భద్రత కల్పించేందుకు పుతిన్‌ అంగీకరించవచ్చని ట్రంప్‌ యంత్రాంగం చెబుతోంది. దీని మీద పుతిన్‌ వైపు నుంచి ఇది రాస్తున్న సమయానికి ఎలాంటి ప్రతికూల లేదా అనుకూల స్పందనలు లేవు. ఒక వారంలోపే ఒప్పందం జరగాలని ట్రంప్‌ పట్టుబడుతుండగా అదెలా కుదురుతుంది, మంచి చెడ్డలు ఆలోచించటానికి కొన్ని వారాల వ్యవధి కావాలని ఐరోపా నేతలు చెబుతున్నారు.


పరిష్కారం కుదరాలంటే ముందుగా డాంటెస్క్‌, లుహానస్క్‌ ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ వెనక్కు పోవటం తనకు ముఖ్యమని, అది చేస్తే మిలిటరీ చర్య నిలిపివేస్తానని శుక్రవారం నాటి చర్చలలో పుతిన్‌ స్పష్టం చేశాడట.జూన్‌ రెండవ తేదీన ఇస్తాంబుల్‌ సమావేశంలోనే దీన్ని రష్యా ప్రతినిధులు చెప్పారు.దీనితో పాటు క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా అంతర్భాంగా గుర్తించటం, ఉక్రెయిన్‌ మిలిటరీ సంఖ్య తగ్గింపు, ఇతర ప్రాంతాల గురించి కూడా దానిలో పేర్కొన్నారు. రష్యన్లు మరీ ఎక్కువగా అడుగుతున్నారని, దాన్లో వారి స్వాధీనంలో లేని ప్రాంతాలు కూడా ఉన్నాయిని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వ్యాఖ్యానించటమే కాదు, ఉక్రెయిన్‌ కూడా అంగీకరించలేదు. గతంలో పేర్కొన్న నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ ఉపసంహరణ బదులు రెండు ప్రాంతాల గురించి పుతిన్‌ పట్టుబట్టినట్లు వార్తలు. ఉక్రెయిన్‌ భద్రతకు హామీకి తాను అంగీకరిస్తానని అయితే వివిధ దేశాలతో కూడిన అలాంటి వ్యవస్థలో తనకు వీటో అధికారం ఉండాలని రష్యా కోరింది.


శుక్రవారం నాటి చర్చలలో భద్రత గురించి చర్చ వచ్చింది తప్ప అది ఎలా అన్నది తేలలేదు. దీని అర్ధం ఏమిటి ? ఒక ఆలోచన ప్రకారం ఒక వేళ ఉక్రెయిన్‌ మీద తిరిగి రష్యా దాడి చేస్తే భద్రతకు హామీ ఇచ్చిన వారు ఐరోపా వారైతే అమెరికా మద్దతు లేకుండా రష్యా మీద ప్రతిదాడులు జరపవచ్చు. అలాంటి ఒప్పందం కుదిరితే అది అమెరికా మరియు ఐరోపా మధ్య అంతరాన్ని పెంచేందుకు, నాటో కూటమిని పూర్తిగా దెబ్బతీసేందుకు రష్యా వినియోగించుకోవచ్చని యూరోపియన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరొక దృశ్యం ప్రకారం ఉక్రెయిన్‌ భద్రతకు హామీదారుగా ఉన్న ఐరోపా దేశాలపై రష్యా దాడికి పూనుకుంటే ఐరోపాకు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగుతుంది. మూడవ దృశ్యం ప్రకారం భద్రతగా ఉండే ఐరోపా దేశాల మిలిటరీ ఉక్రెయిన్‌లో ఉన్నప్పటికీ రష్యా మీద దాడికి దిగదు, ఉక్రెయిన్‌ మిలిటరీకి అవసరమైన శిక్షణ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు పరిమితంగా అదే చేస్తున్నారు. ఒకవేళ మరోసారి రష్యా దాడికి దిగితే ఇతర దేశాల మిలిటరీ సురక్షితంగా వెనక్కు పోయేందుకు అమెరికా రంగంలోకి దిగుతుంది. ఇవన్నీ పరిపరి విధాల ఊహాగానాలు మాత్రమే.


తమతో భాగస్వామిగా చేసుకొని ప్రపంచ మార్కెట్లపై పెత్తనం చేయాలని జి7 కూటమి ఎనిమిదవ దేశంగా రష్యాను చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే విబేధాలు తలెత్తి రష్యాను పక్కన పెట్టటం, ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి మాస్కో ముంగిట ఆయుధ మోహరింపుకు పశ్చిమదేశాలు కుట్రపన్నిన తరువాతే గతంలో తన ప్రాంతంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా 2014లో విలీనం చేసుకుంది. సోవియట్‌ ఉనికిలో ఉన్న సమయంలో పాలనా సౌలభ్యం కోసం రష్యన్‌ రిపబ్లిక్‌ ప్రాంతమైన క్రిమియాను ఉక్రెయిన్‌లో కలిపారు. సోవియట్‌ పతనమైన తరువాత రెండూ స్వతంత్ర దేశాలుగా మారినప్పటికీ 24 సంవత్సరాలు రష్యా వైపు నుంచి విలీనానికి ఎలాంటి ప్రయత్నాలు లేవన్నది గమనించాల్సిన అంశం. తమకు విశ్వసనీయమైన భద్రతా హామీ ఇవ్వాలని జెలెనెస్కీ పట్టుబడుతున్నాడు. ఇటీవలి కాలంలో అమెరికా వైఖరిలో వచ్చిన మార్పు ప్రకారం ఆయుధాలు ఎన్నికావాలంటే అన్ని ఇస్తుంది, అవసరమైతే వైమానిక దాడులు జరుపుతుంది తప్ప తన మిలిటరీని కొత్తగా మరేదేశంలోనూ దించేందుకు సిద్దం కావటం లేదు. అందువలన ఐరోపా దేశాలతో కలసి రక్షణ కల్పించేందుకు ట్రంప్‌ అంగీకరించే అంశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు.తనకు వ్యతిరేకంగా పశ్చిమదేశాల కుట్రకు ఉక్రెయిన్‌ దూరంగా ఉంటే అన్ని రకాల భద్రత కల్పించేందుకు అసలు రష్యానే సిద్ధంగా ఉంటుందన్నది వేరే చెప్పనవసరం లేదు. రష్యాకు కొన్ని ప్రాంతాలను అప్పగిస్తే యుద్ధం ఆగిపోవచ్చుగానీ జెలెనెస్కీ పదవీ గండం పొంచి ఉంటుంది. జరిగే ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు చెప్పలేము గానీ అతగాడు గెలిచే సమస్యే లేదు. మంత్రులు, ఉన్నతాధికారులు యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించారనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. భవిష్యత్‌లో రష్యాకు ముప్పు తలెత్తకుండా చూసేందుకు ఇప్పటి వరకు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను సాధించకుండా ఒప్పందం చేసుకుంటే పుతిన్‌కూ అదే పునరావృతం అవుతుంది. ఇన్ని ప్రాణాలను బలి ఇచ్చి ఆర్థికంగా నష్టం కలిగించటం ఎందుకన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. రష్యాది పైచేయిగా మారితే ట్రంప్‌ కూడా ఇబ్బందుల్లో పడతాడు, వెంటనే ఎన్నికలు లేవు, వచ్చేసారి పోటీ చేస్తాడో లేదో తెలియదు గనుక వ్యక్తిగతంగా కలిగే నష్టం ఉండదు గానీ, ఐరోపాలో ఉన్న పలుకుబడిని అమెరికా కోల్పోవటం ఖాయం, దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీదనే పడుతుంది.


విడివిడిగా అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోలేమన్న వాస్తవాన్ని గ్రహించిన ఐరోపా దేశాలు సమాఖ్య (ఇయు)గా ఏర్పడి, ఐక్యత మరియు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఇతర దేశాల మీద పన్నుల దాడిని ప్రకటించినట్లే ట్రంప్‌ ఈ కూటమితో కూడా వ్యవహరించి వత్తిడి చేసి ఒక ఒప్పందానికి వచ్చాడు.మరోవైపున జర్మనీ వంటి దేశాలు భారీ ఎత్తున సైనికీకరణకు పూనుకున్నాయి. గతంలో సోవియట్‌ను, గతమూడున్నరదశాబ్దాలుగా రష్యాను చూపి బెదిరించిన అమెరికా ఇప్పుడు ఆ రష్యాతోనే చేతులు కలిపి మరో రూపంలో ఐరోపాను అదుపులో ఉంచుకోవాలని చూస్తోందా అనే కోణాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది.గతంలో సోవియట్‌ మరియు చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన సైద్దాంతిక విబేధాలను ఉపయోగించుకొని లబ్దిపొందేందుకు చూసింది. ఒకటి రాజకీయ, రెండవది చైనా మార్కెట్లో ప్రవేశించి ఆర్థిక లబ్ది.తైవాన్‌ బదులు కమ్యూనిస్టు చైనాకు భద్రతామండలిలో శాశ్వత సభ్వత్యం కల్పించటాన్ని సైద్దాంతిక విబేధాలున్నా నాటి సోవియట్‌ వ్యతిరేకించలేదు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే రష్యా మరియు చైనా నేడు మిత్రదేశాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో పుతిన్‌ కమ్యూనిస్టు కాదు, రష్యా సోషలిస్టు దేశం కాదు.ఈ రెండో అంశాన్ని ఉపయోగించుకొని మిత్రబేధంతో రష్యాను దగ్గరకు తీసుకోవాలని, దాని వనరులు, మార్కెట్‌లో లబ్ది పొందాలని కొందరు అమెరికన్లు కోరుతున్నారు. ఇందుకు ఉక్రెయిన్‌ సంక్షోభం ఆటంకంగా ఉంది గనుక దాన్ని పరిష్కరించాలని వారు చెబుతున్నారు. ఈ పూర్వరంగంలోనే ఎరగా ఉక్రెయిన్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ అంటున్నారు. అయితే అదే జరిగితే ఐరోపాలోని ధనికదేశాలు చైనాతో జట్టుకట్టే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేము. పెట్టుబడిదారులకు లాభాలు తప్ప శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పుతిన్‌ తక్షణ ఆలోచన యుద్ధం నుంచి బయటపడి తద్వారా ఆర్థిక ఆంక్షల బంధాలను బద్దలు కొట్టటం గనుక ఆ కోణంలో దాని మీద కేంద్రీకరించవచ్చు.అమెరికా మద్దతు లేకపోయినా ఐరోపా దేశాలు ఇచ్చే ధైర్యం, ఆయుధ సాయంతో నిలవగలమని ఉక్రెయిన్‌ భావిస్తే వెంటనే ఒప్పందానికి అంగీకరించకపోవచ్చు. లేకపోతే ముందే చెప్పుకున్నట్లు రష్యా షరతుల మీద రాజీకి రావచ్చు కూడా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

జలాంతర్గాముల మోహరింపు : రష్యాను కవ్విస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ !

06 Wednesday Aug 2025

Posted by raomk in Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

American Nuclear Submarines, Donald trump, submarines war, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్య 1,259వ రోజులో ప్రవేశించింది. ఆగస్టు ఎనిమిదిలోగా శాంతి ఒప్పందానికి రానట్లయితే ఆంక్షలను మరింత తీవ్రం గావిస్తామని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. ఈ పూర్వరంగంలో రెండు దేశాలూ పరస్పరం అణ్వాయుధాలున్న జలాంతర్గాములను మోహరించేందుకు నిర్ణయించాయి. రష్యా చమురు కొనుగోలు వ్యవహారంలో చైనాతో భారత్‌ చేతులు కలిపిందని, ఈ లావాదేవీలతో రష్యాకు ఆర్థికంగా తోడ్పడుతున్నట్లు వైట్‌హౌస్‌ సిబ్బంది ఉప అధికారి స్టెఫాన్‌ మిలర్‌ ఆరోపించాడు. ఈతీరు అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ లావాదేవీల వ్యవహారాన్ని చూస్తే జనాలు దిగ్భ్రాంతి చెందుతారని ఆదివారంనాడు ఫాక్స్‌ న్యూస్‌తో చెప్పాడు.తన ప్రత్యేక దూత స్టీవ్‌ విట్‌కోఫ్‌ బుధ లేదా గురువారాల్లో మాస్కో సందర్శించనున్నట్లు ట్రంప్‌ ఆదివారం నాడు చెప్పాడు. వారంతా జిత్తుల మారి మనుషులు, వారికి ఆంక్షలను తప్పించుకోవటం తెలుసు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. చైనా, రష్యా నౌకాదళాలు జపాన్‌ సముద్రంలో నిర్ణీత కార్యక్రమం మేరకు విన్యాసాలు జరుపుతున్నాయి. అవసరమైన చోట రెండు అణుజలాంతర్గాములను మోహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన తరువాత రెండు రోజుల పాటు ఇవి జరుగుతున్నాయి. ఎంతో ముందుగానే ఈ విన్యాసాల తేదీలను ప్రకటించినందున తాము అవసరమైతే సన్నద్దగా ఉన్నట్లు బెదిరించేందుకు ట్రంప్‌ ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది.


తాము అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి(ఎన్‌పిటి) పూర్తిగా కట్టుబడి ఉన్నామని, వాటి గురించి మాట్లాడే ముందు అమెరికా సంయమనం పాటించాలని రష్యా ప్రతినిధి దిమిత్రి పెష్కోవ్‌ సోమవారం నాడు హితవు పలికాడు. తమ నాయకత్వం మొత్తాన్ని అంతం చేసినప్పటికీ సోవియట్‌ కాలం నుంచి కొనసాగుతున్న విధానం ప్రకారం చివరి యత్నంగా అణ్వస్త్రాలను ప్రయోగించకతప్పదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్‌ గురువారం నాడు హెచ్చరించాడు. దాన్ని అవకాశంగా తీసుకున్న ట్రంప్‌ రెండు జలాంతర్గాములను మోహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు శుక్రవారం నాడు చెప్పాడు. అవి ‘‘ తగిన ప్రాంతాలలోనే ’’ ఉన్నాయని ఆదివారం నాడు మరో ప్రకటన చేశాడు. అయితే ఇదేమీ కొత్త కాదని, నిర్ణీత కార్యకలాపాల్లో భాగంగా అవి ఎప్పుడూ మోహరించే ఉంటాయని పెష్కోవ్‌ చెప్పాడు. తాజా పరిణామాలపై అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అణు యుద్ధంలో విజేతలంటూ ఉండరని, అయితే సమరమే తలెత్తితే తాము పూర్తి సన్నద్దంగా ఉన్నామని పెష్కోవ్‌ చెప్పాడు.


అమెరికా దగ్గర మూడు రకాల జలాంతర్గాములున్నాయి.వాటిలో 14 ఓహియో తరగతికి చెందిన ఖండాంతర క్షిపణులను ప్రయోగించేవి, అణ్వాయుధాలను నియంత్రిత మార్గంలో వేగంగా ప్రయోగిస్తాయి.ప్రతి జలాంతర్గామి అనేక అణుబాంబులను మోసుకుపోయే 20 ట్రైడెంట్‌ క్షిపణులను కలిగి ఉంటుంది. అవి ఏడున్నరవేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీస్తాయి. అందువలన వాటిని రష్యా సమీపంలోనే మోహరించనవసరం లేదు. ఈ జలాంతర్గామి పొడవు 170 మీటర్లు, బరువు 19వేల టన్నులు,159 మంది సిబ్బంది, గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.1990దశకం తరువాత కొత్త జలాంతర్గాములు అవసరం లేదని, ఉన్నవాటిలో కొన్నింటిలో మార్పులు చేసి నియంత్రిత ప్రయోగవాహకాలుగా మార్చారు, అలా తయారు చేసిన నాలుగు జలాంతర్గాములు 154 తోమహాక్‌ క్షిపణులను, వెయ్యి పౌండ్ల బరువుగల పేలుడు పదార్దంతో 1,600కిలోమీటర్ల దూరంలో భూమి మీద ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. సముద్రగర్భంలో ఇతర దేశాల జలాంతర్గాములు, నౌకల మీద కూడా దాడి చేయగలిగినవి ఉన్నాయి. 2025 జూలై ఒకటవ తేదీ నాటికి వేగంగా దాడులు చేసేందుకుగాను 23అధునాతన వర్జీనియా రకం జలాంతార్గాములను వినియోగంలోకి తెచ్చారు, అవి 377 నుంచి 461 అడుగుల పొడవు, 10,200టన్నుల బరువు ఉంటాయి, ఒక్కోదానిలో 145 మంది సిబ్బంది పని చేస్తారు.పాతవాటిలో లాస్‌ ఏంజల్స్‌రకరం మరో 23 పని చేస్తున్నాయి.ఒక్కొక్కదాని ధర మూడు వందల కోట్ల డాలర్లు.


రష్యా భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు అణు జలాంతర్గాములను విస్తరించాలని పుతిన్‌ పిలుపునిచ్చినట్లు గతనెలాఖరులోనే వార్తలు వచ్చాయి.ఆధునిక తరంతో నౌకాదళాన్ని మరింత పటిష్టం కావిస్తామని చెప్పినట్లు టాస్‌ వార్తా సంస్థ పేర్కొన్నది.ప్రస్తుతం 192 క్షిపణులను ప్రయోగించే పన్నెండు వినియోగంలో ఉన్నాయి. అమెరికాకు చెందిన లాస్‌ ఏంజల్స్‌ రకం జలాంతర్గామి జూలై తొమ్మిదిన నిర్వహణ పనుల పేరుతో తొలిసారిగా ఐస్‌లాండ్‌ రేవులో లంగరువేసింది.తామున్నామని తన మిత్రదేశాలకు అమెరికా పంపిన సందేశం కూడా దీనిలో ఇమిడి ఉంది. 2023 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వాహనాలు ఈ జలాల్లో సంచరించాయి.గ్రీన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, బ్రిటన్‌ కారిడార్‌(జిఐయుకె)లో ఈ ప్రాంతం ఉంది.2019 నుంచి అమెరికా తన బి2 బాంబర్లకోసం ఈ ప్రాంతాన్ని వినియోగిస్తున్నది. ఈ పూర్వరంగంలో రష్యా ఉత్తర నౌకాదళానికి చెందిన అధునాతన యాసెన్‌ తరగతి జలాంతర్గాములు ఈ ప్రాంతంలో ప్రయాణించాయి.అమెరికా, రష్యా, చైనా జలాంతర్గాములు ప్రత్యర్ధుల కదలికలను పసిగట్టటం, పర్యవేక్షించే పనిలో నిరంతరం ఉంటాయి, ఏ దేశం కూడా ఈ వివరాలను బహిరంగంగా వెల్లడిరచదు. ఖనిజ సంపద ఎంతో ఉన్న ఈ ప్రాంతం ఆర్థికంగానే గాక, మిలిటరీ పరంగా కూడా ఇటీవల ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఐదోవంతు రష్యా భూభాగం, సముద్రతీరం సగం ఉన్నదున అది దానికి ఎంతో కీలకం. అమెరికా రాడార్లకు అందకుండా ప్రయాణించే హైపర్‌సోనిక్‌ క్షిపణులను రష్యా పరీక్షిస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం చైనాతో కలసి అలాస్కా వద్ద తనిఖీ నిర్వహించింది. పోలార్‌ సిల్క్‌ మార్గం పేరుతో 2018లో చైనా ఆర్కిటిక్‌ వ్యూహాన్ని ప్రకటించింది. నాటో కూటమిలో ఫిన్లండ్‌, స్వీడన్‌ చేరిన తరువాత రష్యా తన మిలిటరీని ఈ ప్రాంతంలో నవీకరిస్తున్నది. సోవియట్‌ కాలం నాటి వైమానిక కేంద్రాల ఉన్నతీకరణ, కార్యకలాపాల పునరుద్దరణ చేపట్టింది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో రష్యాకు ఎక్కువ మిలిటరీ కేంద్రాలు ఉండటం అమెరికాను కలవర పెడుతున్నది. రష్యా కంటే మిలిటరీ రీత్యా పశ్చిమ దేశాలు పదేండ్లు వెనుకబడి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం నాటో దేశమైన నార్వేలో రష్యన్‌ పౌరులు వీసాతో నిమిత్తం లేకుండా నివసించవచ్చు. గ్రీన్‌లాండ్‌ను తమకు ఇవ్వాలని అమెరికా డిమాండ్‌ చేయటం వెనుక ఈ అంశం కూడా ఉంది. యుద్ధమంటూ వస్తే ఈ ప్రాంతంలో అమెరికా నౌకలను అడ్డుకొనేందుకు రష్యాకు అనేక అవకాశాలు ఉన్నాయి.


దౌత్యం, వాణిజ్యాలను ఆయుధాలు మార్చుకోవటం రోజు రోజుకూ పెరుగుతున్నది. తన మిత్రదేశమైన పాకిస్తాన్‌ మీద భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ను నిలిపివేయించేందుకు వాణిజ్యాన్ని చూపి బెదిరించిట్లు స్వయంగా ట్రంప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. పరువు పోతుందని భావించి నరేంద్రమోడీ ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించేందుకు సిద్దం కావటం లేదన్నది వేరే సంగతి.మిలిటరీ ఖర్చును భారీగా పెంచేందుకు నాటో కూటమి నిర్ణయించింది. ఉక్రెయిన్‌ పోరును సంప్రదింపుల ద్వారా ముగించేందుకు అది సిద్దంగా లేదు. పోరును దీర్ఘకాలం పొడిగించి రష్యాను కొన్ని సంవత్సరాల్లో దివాలా తీయించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ఐరోపా సమాఖ్య జనాభా 49 కోట్లు, జిడిపి 20లక్షల కోట్లు ఉండగా కేవలం 15కోట్ల జనాభా, రెండు లక్షల కోట్ల డాలర్ల జిడిపి మాత్రమే ఉన్న రష్యాను ఓడిరచలేమా అనే ప్రమాదకర ధోరణి కనిపిస్తున్నది. రష్యా తన వద్ద ఉన్న అణ్వస్త్రాలను చూపి భయపెడుతున్నది. అమెరికా కూడా భయపడుతున్నది ఈ కారణంగానే అన్నది తెలిసిందే. ఐరోపాలో బలమైన జర్మనీ మరోసారి పదాతిదళాలను పెంచుతున్నది. మూడువేల బాక్సర్‌ సాయుధ శకటాలు, మూడున్నరవేల పాట్రియా ఇన్‌ఫాంట్రీ యుద్ధ వాహనాలను కొనుగోలు చేస్తున్నది, ఇవిగా యూరోజెట్‌ ఫైటర్లను సమీకరిస్తున్నది. ఐరోపాలో బలమైన సాంప్రదాయ మిలిటరీని సాయుధంకావించేందుకు తాను లక్ష కోట్ల యూరోలను ఖర్చు చేయనున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఫెడరిక్‌ మెర్జ్‌ ఇటీవల ప్రకటించిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇతర ధనిక ఐరోపా దేశాలేమీ తక్కువ తినటం లేదు.ఫ్రాన్సు, ఇటలీ, పోలాండ్‌ పెద్ద సంఖ్యలో టాంక్‌లు, సాయుధశకటాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించాయి. అవసరమైతే ఫ్రెంచ్‌ లేదా ఐరోపా యూనియన్‌ దేశాలు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు కాల్బలాలను కూడా పంపేందుకు సిద్దం కావాలని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ గతేడాది చేసిన ప్రతిపాదనను అందరూ వ్యతిరేకించారు.పశ్చిమ ఐరోపాలో 89శాతం మంది వ్యతిరేకించినట్లు సర్వేలు వెల్లడిరచాయి.


రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్‌ చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకొని డోనాల్డ్‌ ట్రంప్‌ తన అక్కసును జలాంతర్గాముల మోహరింపు రూపంలో వ్యక్తం చేశాడని స్పష్టంగా కనిపిస్తోంది.రెచ్చగొట్టటంలో ఎవరూ తక్కువ తినలేదు. ట్రంప్‌ పన్నుల విధింపు పేరుతో బెదిరింపు ఆటకు దిగాడని మెద్వెదేవ్‌ వర్ణించాడు ‘‘ రష్యా అంటే ఇజ్రాయెల్‌ లేదా కనీసం ఇరాన్‌ కూడా కాదు, ప్రతి కొత్త బెదిరింపు యుద్ధంవైపు మరోఅడుగువేసినట్లే, అయితే ఉక్రెయిన్‌ మరియు రష్యా మధ్య కాదు, అతగాడి స్వంతదేశంతోనే, అది ఎలా ఉంటుందో ఒక టీవీలో వస్తున్న ది వాకింగ్‌ డెడ్‌ అనే సీరియల్‌ చూడవచ్చు ’’ అన్నాడు. తీవ్రంగా రెచ్చగొట్టిన మెద్వెదేవ్‌ కారణంగానే తాను రెండు అణుజలాంతర్గాములను మోహరించాలని ఆదేశించినట్లు ట్రంప్‌ చెప్పుకున్నాడు. వీటన్నింటిని చూస్తుంటే ప్రధాన దేశాల మధ్య వాణిజ్య , మిలిటరీ విబేధాలు అదుపుతప్పి దిగజారుతున్నట్లు కనిపిస్తున్నది.అన్ని దేశాలను అదుపులోకి తెస్తానని చెప్పిన ట్రంప్‌ స్వజనంలో పలుచనయ్యాడు, పుతిన్నుదారికి తెచ్చి ఉక్రెయిన్‌ పోరును 24 గంటలలో ఆపివేస్తానని ప్రగల్భాలు పలికి ఐరోపాలో పరువు పోగొట్టుకున్నాడు.గత కొద్ది రోజులుగా ట్రంప్‌తో పాటు అతగాడి యంత్రాంగంలో ముఖ్యులు నిరాశాపూరితంగా మాట్లాడుతున్నారు. ఆంక్షలు రష్యాను నిలువరించేట్లు కనిపించటం లేదన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్‌ బెదిరింపులను ఖాతరు చేయకుండా రష్యా నుంచి భారత్‌, చైనా చమురుకొనుగోళ్లను నిలిపివేసే సూచనలు కనిపించటం లేదు. భారత్‌ నిలిపివేస్తే నరేంద్రమోడీకి, కొనుగోలు కొనసాగిస్తే ట్రంప్‌కు ఇరకాటం తప్పదు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయటంలో అత్యంత కీలక భాగస్వామి పుతిన్ను చైనా నేత షి జింపింగ్‌ మధ్యలో వదలివేస్తారని ఊహించటం కష్టమని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక గురువారం నాడు వ్యాఖ్యానించింది. ఐరోపా యూనియన్‌ కూడా ఆంక్షలను ప్రకటించినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా టర్కీ, ఫ్రాన్సు,హంగరీ, బెల్జియం,స్లోవేకియా, ఇటలీ జెకియా గ్యాస్‌, చమురు కొనుగోలు చేస్తున్నాయి. భారత్‌ చౌకగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని బహిరంగ మార్కెట్‌లో అధికధరలకు అమ్ముకుంటున్నదని, అందువలన తాను భారీగా పన్నులు వేస్తానని సోమవారం నాడు ట్రంప్‌ పునరుద్ఘాటించాడు. ఒక్క ఈ అంశమే కాదు, పెట్టుబడిదారీ వర్గం తన లాభాలకు దెబ్బ తగలకుండా మరోవైపున కార్మికవర్గం మీద కూడా దాడులను ప్రారంభించింది. అనేక దేశాల్లో రకరకాల సాకులతో సంక్షేమ, సామాజిక భద్రతా పథకాలకు కోత పెడుతున్నారు. ఇలాంటి పోకడలను ఎదిరించి అడ్డుకట్టవేయాలంటే అమెరికా, ఐరోపాల్లోని కార్మికవర్గం వీధుల్లోకి వస్తే తప్ప పాలకవర్గాలు వెనకడుగువేసేట్లు కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ పోరుకు 50 రోజుల గడువు : తగ్గేదేలే అన్న పుతిన్‌, మాటమార్చిన ట్రంప్‌!

16 Wednesday Jul 2025

Posted by raomk in Current Affairs, Economics, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Trump 50 days ultimatum, Ukraine crisis, US Patriot to Ukraine via Europe, Vladimir Putin, Volodymyr Zelensky

ఎం కోటేశ్వరరావు


రానున్న యాభై రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడులను ఆపకపోతే తీవ్రమైన ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా గడువు ప్రకటించాడు.దీనితో పాటు ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ క్షిపణులు అందిస్తానని కూడా వెల్లడిరచాడు. ఈ బెదిరింపు, ఆయుధ సరఫరాను చూసి భయపడేదేలేదని, పోరు కొనసాగింపుకే వ్లదిమిర్‌ పుతిన్‌ ముందుకు పోవాలనే వైఖరితో ఉన్నట్లు మాస్కో వర్గాలు చెప్పినట్లు రాయిటర్‌ వార్త పేర్కొన్నది. ఇదిలా ఉండగా మాస్కోపై ఎలాంటి దాడులు చేయవద్దని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీని ట్రంప్‌ ఆదేశించాడు, బెదిరించిన ఒక రోజులోనే ట్రంప్‌ మాట మార్చాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం బుధవారం నాటికి 1,238వ రోజులో ప్రవేశించింది. పరస్పరదాడులు సాగుతున్నాయి, కొత్త ప్రాంతాలను రష్యా ఆధీనంలోకి తెచ్చుకుంటూనే ఉంది. అధికారం స్వీకరించిన 24గంటల్లో పోరును ఆపివేస్తానని ప్రకటించిన ట్రంప్‌ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మాటలు మార్చాడో, ప్రగల్భాలు పలికాడో తెలిసిందే. పోరును గనుక ఆపకపోతే రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని తాజాగా బెదిరించాడు, కొద్ది రోజుల క్రితం 500శాతం అని చెప్పిన సంగతి తెలిసిందే. జూన్‌ నెల సమాచారం ప్రకారం మనదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు రోజుకు 20.8లక్షల పీపాలకు చేరి పదకొండు నెలల గరిష్ట రికార్డును సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం రష్యా నుంచి తమ అవసరాల్లో చైనా 47, భారత్‌ 38, ఐరోపా యూనియన్‌, టర్కీ ఆరేసి శాతాల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం ఇతర దేశాల నుంచి చూస్తే ఇరాక్‌ 18.2, సౌదీ అరేబియా 12.1, యుఏయి 10.2, అమెరికా నుంచి 6.3శాతాల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాము.

సోమవారం నాడు ప్రగల్భాలు పలికిన ట్రంప్‌ మంగళవారం నాడు మాట మార్చాడు.దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు లేదు, ఆలాంటి ఆలోచన చేయటం లేదని చెప్పాడు. జూలై నాలుగవ తేదీన మాస్కో, సెంట్‌పీటర్స్‌బర్గ్‌లపై దాడి చేయగలరా అంటూ ఫోన్లో జెలెనెస్కీని ట్రంప్‌ అడగ్గా కచ్చితంగా మీరు గనుక మాకు ఆయుధాలిస్తే కొడతాం, రష్యా పట్టణాల మీద దాడి చేసి వారికి నొప్పితెలిసేట్లు చేయండని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. హత్యలను ఆపాలని కోరుతున్న తాను, పోరు ఆపాలని, మానవత్వంవైపు తప్ప ఎవరి పక్షమూ కాదని మంగళవారం నాడు అధ్యక్ష భవనంలో ట్రంప్‌ విలేకర్లతో చెప్పాడు. అధ్యక్షుడు కేవలం ప్రశ్నలను అడిగాడు తప్ప హింసాకాండను ప్రోత్సహించేందుకు కాదని ట్రంప్‌ ప్రతినిధి చెప్పాడు. సైనిక చర్య ముగింపు గడువు విధింపు, ఆధునిక ఆయుధాలు అందచేయాలన్న ట్రంప్‌ ప్రకటనను రష్యా నేత పుతిన్‌ ఖాతరు చేయలేదని రాయిటర్స్‌ పేర్కొన్నది. మిలిటరీ చర్యను ముగించే ఆలోచనలో కూడా లేదని, లక్ష్యాన్ని సాధించేవరకు కొనసాగుతుందని క్రెమ్లిన్‌ వర్గాలు తెలిపినట్లు వెల్లడిరచింది. ట్రంప్‌, పశ్చిమదేశాల బెదిరింపులకు భయపడటం లేదని యుద్ధం కొనసాగించటానికి వీలుగా తమ ఆర్థిక పరిస్థితి ఉందని అన్నట్లు కూడా రాసింది.


గత కొద్ది నెలలుగా ముఖ్యంగా ట్రంప్‌ గెలిచిన తరువాత ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాల గురించి అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు తర్జన భర్జనలో ఉన్నాయి. ట్రంప్‌ ఓవల్‌ ఆఫీసులో సోమవారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రూటే భేటీ జరిపినపుడు ట్రంప్‌ తమ నిర్ణయాన్ని వెల్లడిరచాడు. యాభై రోజుల్లో గనుక పోరు విరమణ ఒప్పందం కుదరకపోతే వందశాతం పన్నులు విధిస్తాం, దాని అర్ధం మీకు తెలిసిందే, అనేక అంశాలపై వాణిజ్యాన్ని వినియోగిస్తాను, అవి యుద్ధాల పరిష్కారాలకు ఎంతో దోహదం చేస్తాయి అన్నాడు. ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేసి పాకిస్తాన్‌తో రాజీకి వచ్చే విధంగా భారత్‌ను రప్పించేందుకు వాణిజ్య ఆయుధాన్ని వినియోగించినట్లు చెప్పిన అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. తమ అధ్యక్షుడు చెప్పిన పన్నుల విధింపు అంటే రష్యాతో వాణిజ్యం చేసే ఇతర దేశాల మీద అని అధికారవర్గాలు వివరించాయి. రష్యాతో అమెరికా వాణిజ్యం పెద్దగా ఏమీ లేదు గనుక దాని మీద అపరాధ సుంకాలు విధించేదేమీ ఉండదు. వాస్తవానికి రష్యా మీద ఆంక్షలేమీ ఉండవని, దాని దగ్గర నుంచి చమురు కొనుగోలు చేసేవారి మీద విధించే పన్నుల గురించి ట్రంప్‌ చెప్పినట్లు నాటోలో అమెరికా రాయబారి వైట్‌కర్‌ మాట్‌ చెప్పాడు.ఈ చర్యతో రష్యాపై నాటకీయంగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అన్నాడు. అయితే అమెరికా బెదిరింపులను గతంలోనే అమెరికా, భారత్‌ ఖాతరు చేయని సంగతి తెలిసిందే. రష్యా కూడా లెక్క చేయలేదు.


గత ఆరునెలలుగా పుతిన్‌తో సంప్రదింపుల గురించి చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్‌పై దాడులు పెరుగుతున్నాయే తప్ప తగ్గలేదని రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 500శాతం పన్ను విధించాలనే తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతానని చెప్పిన సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ చెప్పాడు. గొప్పలు చెప్పుకున్న ట్రంప్‌ అది జరగకపోవటంతో అవమానభారంతో ఏం
మాట్లాడుతున్నాడో, ఏం చేస్తాడో తెలియని స్థితిలో ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. పుతిన్‌ సేనలు, రష్యాపై దాడులు చేసేందుకు పేట్రియాట్‌ క్షిపణులు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించి సంక్షోభాన్ని మరోమలుపు తిప్పాడు. పరిష్కరించాలనే చిత్తశుద్ది అమెరికాకు లేదన్నది స్పష్టం. ఈ క్షిపణి విధ్వంసక వ్యవస్థ ధర ఒక్కొక్కటి 40లక్షల డాలర్లు ఉంటుంది. ఉక్రెయిన్‌కు సరఫరా చేసే ఆయుధాలను ఐరోపాకు విక్రయించి అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు తరలించే విధంగా అమెరికా నిర్ణయించింది. కీలక ఆయుధ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి రష్యాను బుట్టలో వేసుకోవాలని ట్రంప్‌ చూశాడు. ఆ పప్పులు ఉడకలేదు, దాంతో ఆయుధాల సరఫరా పునరుద్దరించనున్నట్లు అమెరికా అధికారులు వెల్లడిరచారు. మరోవైపున శాంతి చర్చలకు చొరవ చూపేందుకు పోప్‌ లియో సుముఖంగా ఉన్నారని ఆయనను కలిసిన తరువాత జెలెనెస్కీ ప్రకటించాడు. దాని గురించి ఎటూ తేలక ముందే సరికొత్త ఆంక్షల గురించి ట్రంప్‌ ప్రకటించాడు. పుతిన్‌ గురించి నోరుపారవేసుకున్న ట్రంప్‌ తీరును తాము పట్టించుకోవటం లేదని గతవారంలో రష్యా స్పందించింది.ఆయుధ ఒప్పందం ఆటతీరునే మార్చి వేస్తుందని రూటే వర్ణించాడు.జర్మనీతో సహా ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే వంటివి అమెరికా నుంచి తీసుకొని నూతన ఆయుధాలను సరఫరా చేస్తాయని చెప్పాడు. తాను ముందుగా ఐరోపా దేశాలు ఇలాంటి చొరవ తీసుకుంటాయని అనుకోలేదని కానీ అవి చేశాయని ట్రంప్‌ అభినందించాడు.త్వరలో మరికొన్ని క్షిపణులను కూడా అందించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా క్షిపణులను అడ్డుకొనేందుకు పేట్రియాట్‌ వ్యవస్థలను వినియోగిస్తామని, అయితే ఎదురుదాడి చేసే ఆయుధాలను కూడా ఇచ్చే అవకాశం ఉందని నాటోలో అమెరికా రాయబారి చెప్పాడు. నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు విక్రయిస్తే వచ్చే విమర్శల నుంచి తప్పుకొనేందుకు, తన చేతికి మట్టి అంటకుండా, ఖజానా మీద భారం మోపకుండా ఐరోపా దేశాలకు ఆయుధాలను విక్రయించి అటు నుంచి తరలించేందుకు ట్రంప్‌ వేసిన ఎత్తుగడ ఇది.


అధికారానికి వచ్చిన తరువాత ఆర్భాటంగా పుతిన్‌తో నేరుగా మాట్లాడాడు. రష్యాకు రాయితీలు ఇవ్వాల్సిందే, కొన్ని ప్రాంతాలు వదులుకోవాల్సిందే, మేం 350 బిలియన్‌ డాలర్లు ఇచ్చినా యుద్దంలో గెలిచేది లేదు చచ్చేది లేదని జెలెనెస్కీతో చెప్పాడు. అతగాడిని మంచి హాస్యనటుడు అంటూనే ఎన్నికలు జరపని నియంత అన్నాడు.ఫిబ్రవరి 28న అధ్యక్ష భవనంలో బహిరంగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీని అవమానించి ఐరోపా భాగస్వాములను నిర్ఘాంతపరిచాడు. రష్యాను ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించాడు.ఐరోపా దేశాలన్నీ ఈ తీరును చూసి నిజంగానే ట్రంప్‌ తమను వదలి పుతిన్‌తో చేతులు కలిపి ఉక్రెయిన్ను అప్పగిస్తాడా అన్నంతగా భయపడ్డాయి. చివరికి భద్రతా మండలిలో రష్యామీద ఎలాంటి విమర్శలు లేని తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. ఈలోగా ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు అప్పగించాలని అమెరికా రాయించుకొని ఒప్పందం చేసుకుంది. ఎత్తుగడ ఏమిటో తెలియదు గానీ పదేండ్ల క్రితమే పుతిన్‌ గురించి ట్రంప్‌ పొగడ్తలు ప్రారంభించాడు. గత వారంలో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది. పుతిన్‌ పైకి కనిపించేంత మంచి వాడు కాదు, నేను ఎంతో ఆశాభంగం చెందాను, అతన్ని హంతకుడు అని చెప్పాలనుకోవటం లేదు కానీ గట్టి పిండం అని ఎన్నో సంవత్సరాలుగా రుజువైంది. బిల్‌క్లింటన్‌, బుష్‌,ఒబామా,జో బైడెన్‌ అందరినీ వెర్రి వెంగళప్పలను గావించాడు గానీ నన్ను చేయలేకపోయాడు.. ఒక రోజు ఇంటికి వెళ్లి నా సతీమణితో మాట్లాడుతూ నేను ఈ రోజు పుతిన్‌తో మాట్లాడాను, అద్భుతతమైన సంభాషణ చేశాను తెలుసా అని చెప్పాను. ఆమె తాపీగా అవునా నిజమేనా అంటూ మరో(ఉక్రెయిన్‌) పట్టణంపై దాడి జరిగింది అని చెప్పింది అన్నాడు. ఎవరైనా నేతలు అతగాడితో ఫోన్లో మాట్లాడుతుండగానే ఉక్రెయిన్‌పై దాడులు చేయిస్తుంటాడు అని ట్రంప్‌ చెప్పాడు.


గత గురువారం నాడు రోమ్‌ నగరంలో ఉక్రెయిన్‌ స్వస్థత సమావేశం జరగటానికి ముందు జెలెనెస్కీ ఇటలీలో ట్రంప్‌ ప్రతినిధి కెయిత్‌ కెలోగ్‌తో సమావేశం సందర్భంగా రష్యా దాడులను తీవ్రం కావించింది. పోప్‌ లియోను రెండు నెలల్లోనే జెలెనెస్కీ రెండుసార్లు కలిశాడు. పోరు ఇంకా కొనసాగుతుండగానే ఉక్రెయిన్‌ పునరుద్దరణ పథకాలు దానికి అవసరమైన పెట్టుబడులు, దానిలో పాలుపంచుకొనే దేశాలు, నిర్మాణ సంస్థల గురించి పశ్చిమదేశాలు వాణిజ్య చర్చలు జరిపాయి. ఇప్పటికే ఐరోపాలో ఉన్న పేట్రియాట్‌ క్షిపణులను వెంటనే ఉక్రెయిన్‌కు తరలించి మిగతావాటిని అమెరికా ఫ్యాక్టరీల్లో తయారు చేసి అందచేస్తారు. మీరు గనుక ఉక్రెయిన్‌ మీద దాడి చేస్తే నేను మాస్కో మీద బాంబులు వేయిస్తానని పుతిన్‌తో మాట్లాడినపుడు ట్రంప్‌ బెదిరించాడన్న వార్త గుప్పుమన్నది. అయితే వారి మధ్య ఆ సంభాషణ ఎప్పుడు జరిగిందో, అది నిజమో కాదో నిర్ధారణ కాలేదు గానీ, ఆధునిక ఆయుధాలను ఇస్తాన్న ట్రంప్‌ మాటలు దాన్ని నిర్ధారిస్తున్నాయి.కొద్ది వారాల క్రితం రష్యా భూభాగంలో ప్రవేశించి అనేక చోట్ల ఉక్రెయిన్‌ జరిపిన దాడుల వెనుక అమెరికా హస్తం లేదని ఎవరూ చెప్పలేరు.


రష్యా ఆధీనంలోని జపోర్‌రిaయా ప్రాంతంలో ఉన్న అణువిద్యుత్‌ కేంద్రంపై వందలాది రౌండ్ల కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చెప్పింది. అక్కడ అణు ప్రమాదం జరిగితే దానికి రష్యాను బాధ్యురాలిగా చేసి వత్తిడి తేవాలన్న కుట్ర దీనిలో కనిపిస్తోంది. దీని వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందని వేరే చెప్పనవసరం లేదు. పేట్రియాట్స్‌తో సహా ఆధునిక ఆయుధాలను అందచేయాలన్న నిర్ణయం నాటకీయంగా జరగలేదు. గత కొద్ది వారాలుగా మల్లగుల్లాలు పడుతున్నారు. వీటితో పుతిన్‌ దారికి వస్తాడని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. జూన్‌ లో జరిగిన నాటో సమావేశాల్లో ఒక కొలిక్కి వచ్చిన ఈ ఆలోచనపై అంతకు ముందే విధి విధానాల గురించి చర్చ మొదలైంది.నాటో నేరుగా ఆయుధాలు పంపితే అది రష్యాకు ఒక అస్త్రంగా మారుతుంది, అన్నింటికీ మించి నాటో కూడా యుద్ధంలో పాల్గ్గొన్నట్లే, అందుకే కొన్ని దేశాలను ఎంపిక చేసి వాటి ద్వారా కథనడిపిస్తున్నారు. ఒకవేళ అమెరికా తప్పుకుంటే తామే ఉక్రెయిన్‌కు బాసటగా నిలవాలని ఐరోపా దేశాలు స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత అయితే మా దగ్గర ఆయుధాలు కొని మీరే జెలెనెస్కీకి ఇవ్వండని అమెరికన్లు వారిని కట్టుబడేట్లు చేసినట్లు కూడా చెప్పవచ్చు. మీరు ఆధునిక ఆయుధాలు ఇస్తారు, అవి రష్యా క్షిపణులను అడ్డుకుంటాయి సరే, మా కుటుంబాల ప్రాణాలను కాపాడతాయో లేదో చెప్పండని ఉక్రేనియన్‌ సైనికులు కొందరు సిఎన్‌ఎన్‌తో మాట్లాడిన మాటలు ఒక్క మిలిటరీలోనే కాదు, యావత్తు ఉక్రేనియన్లలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే జెలెనెస్కీ అవమానాలు భరించి కూడా ఆయుధాల కోసం విలువైన ఖనిజాలున్న ప్రాంతాలను అమెరికాకు రాసి ఇచ్చిన తరువాత దేశం మొత్తాన్ని నాటో కూటమికి తాకట్టు పెట్టినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తొంభై రోజులు ముగిసినా 90 ఒప్పందాలు లేవు, భంగపడిన ‘‘ రారాజు ’’ డోనాల్డ్‌ ట్రంప్‌ ! బంతి అమెరికా మైదానంలో ఉందన్న భారత్‌ !!

09 Wednesday Jul 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, Farmers, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BJP, Donald trump, Narendra Modi Failures, Tariff Fight, Trade agreement with US, Trade war Expanding, Trump Letters, Trump tariffs, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


తొంభై రోజుల్లో తొంభై ఒప్పందాలు ఏప్రిల్‌ రెండవ తేదీ అమెరికా విముక్తి దినం పేరుతో డోనాల్డ్‌ ట్రంప్‌ పలికిన ప్రగల్భాలలో ఒకటి. ఆ గడువు జూలై 9వ తేదీతో ముగిj. అనుకున్నది పగటికలగా మారింది. దాంతో తమతో ఒప్పందాలకు రాకపోతే అపరాధ సుంకాలు విధిస్తానని ఆగస్టు ఒకటి వరకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించాడు. బెదిరింపులో భాగంగా పద్నాలుగు దేశాలు ఎంతెంత సుంకాన్ని ఎదుర్కోవాల్సిందీ వెల్లడిస్తూ లేఖల రూపంలో ఆదేశాలను పంపాడు. ఒప్పందాలు కుదుర్చుకోవటం లేదా సిద్దంగా ఉన్నట్లు తిరుగులేఖలు రాయకపోతే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి తన సుంకాలు అమల్లోకి వస్తాయన్నాడు. చర్చలకు ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయని కూడా చెప్పాడు. మాటి మాటికి గడువు పొడిగిస్తా అనుకుంటున్నారేమో నూటికి నూరు శాతం గట్టిగా చెబుతున్నా, వారు గనుక తనకు ఫోన్‌ చేసి వేరే పద్దతులను ఆలోచిస్తున్నట్లు చెబితే సరే, దానికి అవకాశం ఇస్తున్నా లేకపోతే ఏం చేస్తానో తెలుసుగా అన్నట్లుగా పొడిగించిన గడువుకు అయినా కట్టుబడి ఉంటారా లేదా అని అడిగిన విలేకర్లతో చెప్పాడు. ఏప్రిల్‌లో వివిధ దేశాల సరకులపై ఎంత మేరకు పన్ను విధించేది ప్రకటించిన ట్రంప్‌ ఏ దేశమూ ముందుకు రాకపోవటంతో మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు, జూలై 9వ తేదీతో గడువు ముగుస్తుందన్నాడు. అయినప్పటికీ స్పందన లేకపోవటంతో ఆగస్టు వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడిరచాడు. ఆలోగా ఒప్పందానికి రాకుంటే ఏప్రిల్‌ రెండవ తేదీన ప్రకటించిన విధంగా పన్నులను విధిస్తామని వాణిజ్యశాఖ మంత్రి లుటినిక్‌ చెప్పాడు. మనదేశంతో ఎనిమిదవ తేదీలోగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు లీకులు వదిలిన సంగతి తెలిసిందే. తాజా వార్తలను బట్టి ఆ గడువు ఆగస్టు ఒకటి వరకు పొడిగించినట్లు చెబుతున్నారు. నాటకీయంగా ఏదో కుదిరిందని మొక్కుబడి ప్రకటన చేస్తే చెప్పలేము.మేం చెప్పాల్సింది చెప్పాం, తేల్చుకోవాల్సింది ట్రంపే, బంతి అమెరికా కోర్టులో ఉంది అని మనదేశం తరఫున చర్చల్లో పాల్గొన్న ఒక అధికారి చెప్పినట్లు ఒక వార్త. ఏం జరుగుతుందో చూద్దాం !


రష్యాతో వాణిజ్యం చేస్తే భారత్‌, చైనాలపై 500శాతం పన్నులు విధిస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిక్స్‌ సమావేశాల్లో అమెరికా బెదిరింపు వైఖరిని విమర్శించిన తరువాత తమ వ్యతిరేక విధానాలను అనుసరించే బ్రిక్స్‌ దేశాలతో వాణిజ్యం జరిపే దేశాల మీద కూడా పదిశాతం పన్ను విధిస్తానని బెదిరింపులకు దిగాడు.ఏకపక్ష పన్ను ప్రకటనలు ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని బ్రిక్స్‌ పేర్కొన్నది. వివిధ దేశాలపై డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన పన్నుశాతాలు గతంలో ప్రకటించినవి కొన్నింటిలో మార్పులేదు, మరికొన్నింటిని సవరించాడు. ఆయా దేశాల వస్తువులపై జపాన్‌ 25,దక్షిణ కొరియా 25, థాయ్‌లాండ్‌ 36, మలేసియా 25, ఇండోనేషియా 32, దక్షిణాఫ్రికా 30,కంపూచియా 36, బంగ్లాదేశ్‌ 35,కజకస్తాన్‌ 25, ట్యునీసియా 25, సెర్బియా 35,లావోస్‌ 40, మయన్మార్‌ 40 శాతం పన్నులు ఉంటాయి. ఒక వేళ ఈ దేశాలు గనుక ప్రతి సుంకాలు పెంచినట్లయితే తాను ప్రకటించిన మొత్తాల మీద మరో అంత మొత్తం పెంచుతామని కూడా ట్రంప్‌ బెదిరించాడు. రానున్న రోజుల్లో మిగిలిన దేశాలకు కూడా ఎంత పన్ను విధించేదీ లేఖల రూపంలో తెలియచేస్తామని అధ్యక్ష భవన మీడియా అధికారిణి కారాలోని లీవిట్‌ చెప్పారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై పన్ను మొత్తాలను పెంచితే ఆ భారం అమెరికా వినియోగదారుల మీదనే పడుతుందన్నది తెలిసిందే.ఆర్థికవేత్తలు చెప్పినదాని ప్రకారం ఒక్కో కుటుంబం మీద 3,800 నుంచి నాలుగువేల డాలర్ల వరకు భారం పడుతుందని, అది ఒకటి నుంచి ఒకటిన్నర శాతం వరకు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.


జపాన్నుంచి కార్లు, ఎలక్ట్రానిక్స్‌, వైద్య పరికరాలు, దక్షిణ కొరియా నుంచి సెమీకండక్టర్లు, ఆటోవిడి భాగాలు, ఓడలు, మలేషియా నుంచి సెమికండక్టర్లు, రబ్బరు, బంగ్లాదేశ్‌ నుంచి దుస్తులు, పాదరక్షలు, కంపూచియా నుంచి తక్కువ వెలగల దుస్తులు, ఫర్నీచర్‌, ఇండోనేషియా ఓడల్లో ధరించే పాదరక్షలు, పామ్‌ఆయిల్‌, ఎలక్ట్రానిక్స్‌, దక్షిణాఫ్రికా లోహాలు, పండ్లు, ఆభరణాలు, తాజా వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోవిడి భాగాలు, సెర్బియా యంత్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు లావోస్‌ పాదరక్షలు, కలప వస్తువులు, మయన్మార్‌ నుంచి చౌకగా లభించే ఉత్పత్తులు, బోస్నియా కలప, లోహాలు, కజకస్తాన్‌ లోహాలు, తైలాలు, రసాయనాలు, టునీసియా ఆలివ్‌ ఆయిల్‌ వంటి వాటిని అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. వాటి మీద ఎంత పన్ను విధిస్తే అంత మొత్తాన్ని వినియోగదారులు అదనంగా చెల్లించాలి, ఆమొత్తాలతో ట్రంప్‌ లోటుబడ్జెట్‌ పూడ్చుకొనేందుకు లేదా కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇచ్చేందుకు వినియోగించాలన్నది అసలు ఎత్తుగడ. జూలై తొమ్మిదవ తేదీలోగా ఒప్పందాలు చేసుకోని దేశాలకు ఆగస్టు ఒకటవ తేదీ వరకు అవకాశం ఇస్తున్నామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ చెప్పాడు. వచ్చే మూడు రోజులు తాము ఊపరిసలపని పనిలో ఉంటామని ఆదివారం నాడు సిఎన్‌ఎస్‌ టీవితో అన్నాడు. ఆగస్టు ఒకటవ తేదీని కొత్తగడువుగా అభివర్ణించకూడదని, పనులు వేగంగా జరగాలంటే ఏదో ఒకటి ఉండాలన్నాడు. కొత్త పన్నులు కావాలా లేదా గతంలో ప్రకటించినవే కావాలా అన్నది లేఖలు అందుకున్నదేశాలు తేల్చుకోవాలని చెప్పాడు.తాము పద్దెనిమిది ప్రధాన వాణిజ్య భాగస్వాముల మీద కేంద్రీకరిస్తున్నామని అనేక పెద్ద ఒప్పందాలు పూర్తి కావచ్చాయన్నాడు. ఏ దేశ ఉత్పత్తులపై తామెంత పన్ను విధించేది 100 చిన్న దేశాలకు లేఖల ద్వారా తెలియచేస్తామని అన్నాడు. ఇది అమెరికా దురహంకారం తప్ప మరొకటి కాదు.పూర్వం పెద్ద దేశాల రాజులు చిన్న లేదా సామంత దేశాలు తమకు ఏటా ఇంత కప్పం కట్టాలని లేకపోతే తమ తడాఖా చూపుతామని బెదిరించేవారు. అయితే బెసెంట్‌ మాటలను బట్టి ఏదీ ఖరారు కాలేదన్నది స్పష్టం. అమెరికాలో వాషింగ్టన్‌ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నానికల్లా తన లేఖలు సంబంధిత దేశాలకు అందుతాయని ఆదివారం నాడు ట్రంప్‌ చెప్పాడు. కొన్ని దేశాలు బుధవారం లోగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు లేదా లేఖలు అందించే అవకాశం ఉందన్నాడు.


ట్రంప్‌ లేఖలు అంటే ఏకపక్షంగా జారీ చేసినవి, బెదిరించే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.చైనాతో ఒప్పందం కుదిరిందని ఏకపక్షంగా ట్రంప్‌ ప్రకటించటం తప్ప వివరాలేమిటో ఇంతవరకు తెలియదు. అదే విధంగా వియత్నాంతో వచ్చినట్లు చెబుతున్న అవగాహన కూడా అదే స్థితిలో ఉంది.అంశాలు ఇంకా ఖరారు కాలేదు.మనదేశంతో ఒప్పందం గురించి కూడా రకరకాల వార్తలను ప్రచారంలో పెట్టారు. అసలు ఒకసారి కుదిరిందని ట్రంప్‌ చెప్పాడు. అంతిమ ఒప్పందం అని, తరువాత తాత్కాలిక ఒప్పందం, మరోసారి చిన్న ఒప్పందం ఇలా రకరకాలుగా వర్ణించారు. మధ్యలో అమెరికా వస్తువులపై పన్నులను తగ్గించేందుకు భారత్‌ అంగీకరించటం లేదని లీకులు వదిలారు.మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి ఒప్పందం గురించి ఎలాంటి వార్తలు లేవు. రాజకీయంగా, మిలిటరీ, ఆర్థికంగా ఏ రీత్యా చూసినప్పటికీ జపాన్‌, దక్షిణ కొరియా ఇప్పటి వరకు అమెరికా కనుసన్నలలోనే వ్యవహరించాయి. అలాంటి దేశాలపై 25శాతం పన్ను విధిస్తానని ఏకపక్షంగా ప్రకటించాడు ట్రంప్‌.అమలుకు ఆగస్టు ఒకటి వరకు గడువు ఉందన్నాడు. ఇప్పటి వరకు వివిధ దేశాల వైఖరుల సారాంశం దిగువ విధంగా ఉంది.

జపాన్‌లో కూడా ఆటోపరిశ్రమ పెద్దదే. తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, ఏ పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు, తట్టుకొనేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆదివారం నాడు ప్రధాని షిగెరు షిబా ఫూజీ టీవీ కార్యక్రమంలో ఆదివారం నాడు చెప్పాడు. అమెరికా వస్తువుల మీద దిగుమతి పన్ను తగ్గిస్తామని మనదేశం సంకేతాలిచ్చినప్పటికీ దానికంటే మన పాడి,వ్యవసాయ రంగాలను అమెరికా ఉత్పత్తులకు తెరవాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు వార్తలు.ఏం జరుగుతుందో తెలియదు.ఇరవై ఏడు దేశాలతో కూడిన ఐరోపా యూనియన్‌తో చర్చల్లో మంచి పురోగతి ఉందని అమెరికా చెప్పటం తప్ప అలాంటి సూచనలు కనిపించటం లేదు. సమాఖ్యదేశాల కార్లపై 50శాతం పన్ను విధిస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలుకే మోసం రాకుండా ఒప్పందం ఉందాలని జర్మనీ చెబుతుండగా హానికరమైన ఒప్పందానికి తాము వ్యతిరేకమని ఫ్రాన్సు పేర్కొన్నది. బ్రిటన్ను అదిరించి బెదిరించి ఒప్పందం కుదుర్చుకున్నారు.పదిశాతం కనీస పన్నులు విధిస్తారు, దానికి ప్రతిగా అమెరికా కార్లు, విమానాలకు బ్రిటన్‌ తలుపులు తెరిచింది. తాము జూలై 21లో ఒప్పందం కుదుర్చుకుంటామని కెనడా చెప్పటంతో దానికి లేఖ పంపలేదు. ఎవరైనా ఇదే మాదిరి ఒప్పందానికి దగ్గరగా ఉంటే వాటికి వ్యవధిని పెంచుతామని ట్రంప్‌ సలహాదారు కెవిన్‌ హాసెట్‌ చెప్పాడు.


చైనాతో ఒప్పందం కుదిరిందని లండన్‌ భేటీ తరువాత డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. దాని మీద చైనా అవుననిగానీ కాదని గానీ ప్రకటించలేదు. నువ్వెంత దిగివస్తే నేనంత తగ్గుతాను అన్నట్లుగా చైనా వ్యవహరిస్తున్నది.లాభం లేదని గ్రహించిన ట్రంప్‌ తొలుత ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాడు.ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థలు చైనాకు ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ అందించేందుకు, విమాన ఇంజన్ల ఎగుమతులకు అవకాశం కల్పించాడు. దానికి ప్రతిగా ఆంక్షలున్న ఎనిమిది వస్తువుల ఎగుమతులపై నిబంధనలను సడలించేందుకు చైనా చర్యలు తీసుకుంది. ఈ విధంగా ఇరుదేశాల వాణిజ్య యుద్ధ రాజీ ఒప్పందం ముందుకు పోతున్నదని రాయిటర్స్‌ పేర్కొన్నది.అమెరికా దిగిరావటానికి అక్కడి బహుళజాతి గుత్త సంస్థలు ట్రంప్‌ మీద తెస్తున్న వత్తిడే ప్రధాన కారణం. ఉదాహరణకు 2014లో ఇంటెల్‌ కంపెనీ మొత్తం రాబడిలో 27శాతం ఉంది. క్వాల్‌కామ్‌ ఆదాయంలో 50శాతం చైనా నుంచి ఉంది. దీనికి తోడు చైనా పారిశ్రామిక ఉత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టటంతో ఆ ఉత్పత్తులున్న అమెరికన్‌ కంపెనీలకు అది పెద్ద మార్కెట్‌గా మారింది. ట్రంప్‌ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత అమెరికా అనేక పాఠాలు నేర్చుకుంది. ఇతర దేశాల మాదిరి లేఖల ఆదేశాలు పంపి గరిష్టంగా వత్తిడితో అదిరించి బెదిరిస్తే లొంగే ఘటం కాదు అన్నది ఒకటి. కలసి ఉంటే కలదు సుఖం ఘర్షణ పడితే లాభం లేదని, పరస్పరం లాభదాయకమైన అంశాల్లో రాజీపడటమే మేలని గ్రహించటం రెండవది.కృత్రిమ గోడలు కట్టి సరఫరా వ్యవస్థలను విచ్చిన్నం చేస్తే అమెరికా పొందే లాభం లేదని, తన స్వంత చట్టాలతో ఇతర దేశాలను శిక్షించినట్లుగా చైనాతో వ్యవహరిస్తే కుదరదని గ్రహించటం వంటి అంశాలు ప్రభావతం చేశాయి.అయితే ఇంకా బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, నూతన ఇంథనం వంటి కొన్ని రంగాల్లో చైనాను కట్టడి చేసేందుకు అమెరికా చూస్తూనే ఉంది. చైనాలో పెట్టుబడులు పెట్టేవారి మీద పన్నులు విధిస్తున్నది. దానికి తగినట్లుగా చైనా కూడా తన తురుపు ముక్కలను వాడుతున్నది. ఐరోపా యూనియన్‌, ఇతర దేశాలు అమెరికా మాదిరి మడికట్టుకు కూర్చోవటం లేదు, అది ఆడమన్నట్లుగా ఆడకుండా చైనాతో తమ ప్రయోజనాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఇది కూడా అమెరికా మీద ప్రభావం చూపుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యాపై ఉక్రెయిన్‌ భారీ దాడి పర్యవసానాలేమిటి ? నాలుగు రోజులైనా నోరు విప్పని ట్రంప్‌, పుతిన్‌ !

04 Wednesday Jun 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Ukraine attack on Russia, Ukraine crisis, Vladimir Putin, Zelensky

ఎం కోటేశ్వరరావు

నాటో కూటమి దేశాలు సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభం అక్షరాలా పదకొండు వందల తొంభై ఆరవ రోజులో ప్రవేశించింది. ఎప్పుడు, ఎలా ముగుస్తుందో తెలియదు.ఆదివారం నాడు రష్యా గడ్డమీద ఆపరేషన్‌ స్పైడర్‌ వెబ్‌ (సాలెగూడు) పేరుతో ఉక్రెయిన్‌ జరిపిన డ్రోన్ల దాడిలో భారీ మొత్తంలో నష్టం చేకూర్చినట్లు జెలెనెస్కీ ప్రకటించాడు. దాన్ని ఉగ్రవాద చర్యగా వర్ణించిన రష్యా ప్రతిగా వెంటనే పెద్ద ఎత్తున దాడి చేసింది. ఉక్రెయిన్‌ చర్య మీద బుధవారం నాడు ఇది రాసిన సమయానికి అటు డోనాల్డ్‌ ట్రంప్‌ వైపు నుంచి ఇటు వ్లదిమిర్‌ పుతిన్‌ నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. దాడి గురించి ఉక్రెయిన్‌ తమకు ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వలేదనే ఒక్క మాట మాత్రమే అమెరికా అధ్యక్ష భవనం నుంచి వెలువడిరది. సోమవారం నాడు టర్కీ నగరమైన ఇస్తాంబుల్‌లో రెండు దేశాల మధ్య యుద్ధ ఖైదీలు, మరణించిన వారి మృతదేహాల మార్పిడికి సంబంధించిన అవగాహన కుదిరింది. మూడు రోజుల పాటు కాల్పుల విరమణ చేస్తామని రష్యా ప్రతిపాదిస్తే బేషరుతుగా అంగీకరించాలని ఉక్రెయిన్‌ చేసిన ప్రతిపాదనను పుతిన్‌ దూతలు తిరస్కరించారు.పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. రెండు శిబిరాలూ తాజా పరిస్థితికి అనుగుణంగా ఎత్తుగడలను రూపొందించుకొనే కసరత్తులో ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. బందీల విడుదల గురించి గతంలోనే ఒక అవగాహన కుదిరి అమలు జరిపారు, మరోసారి మిగిలిన వారి గురించి చర్చలలో పాల్గ్గొనటానికి ఇరువురికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. దానికి ఉక్రెయిన్‌ జరిపినదాడికీ సంబంధం లేదు. గడచిన మూడున్నర సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య ఇలాంటి దాడులు, ప్రతిదాడులూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆదివారం నాడు ఉక్రెయిన్‌ జరిపిన దాడికి ఉన్న ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయనవసరం లేదు. యుద్ధం అన్న తరువాత రెండు వైపులా నష్టం ఉంటుంది. మూడున్నరేండ్ల రష్యా మిలిటరీ చర్యలో ఉక్రెయిన్‌ ఇప్పటి వరకు కోల్పోయిన ప్రాంతం, ఇతర వాటితో పోల్చితే ఆదివారం నాటి రష్యా నష్టం పెద్దదేమీ కాదు.ఇక ఇస్తాంబుల్‌ చర్చల విషయానికి వస్తే జూన్‌ రెండవ తేదీన ఖైదీల మార్పిడి గురించి తప్ప శాంతి ప్రతిపాదనల మీద ఎలాంటి పురోగతీ లేదు. ఉక్రెయిన్‌ దాడిని అవకాశంగా తీసుకొని పశ్చిమ దేశాల పండితులు రష్యన్‌ సామర్ధ్యం గురించి కథనాలు వండి వారుస్తున్నారు, ప్రచారదాడికి పూనుకున్నారు.

వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియాతో సహా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ డ్రోన్లను ఎలా పంపింది. ఏక కాలంలో ఐదు వైమానిక స్థావరాల మీద ఎలా దాడి చేసింది అన్నది ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది. ఈ పథకాన్ని రచించేందుకు తమకు పద్దెనిమిది నెలలు పట్టిందని జెలెనెస్కీ చెప్పుకున్నప్పటికీ పశ్చిమ దేశాలన్నింటి ఉమ్మడి హస్తం దీనివెనుక లేకుండా ఉక్రెయిన్‌కు అంతసీన్‌ లేదు. అంతర్గతంగా రష్యాలో కొందరు చేతులు కలిపిన కారణంగానే డ్రోన్ల రవాణా జరిగిందన్నది ప్రాధమిక సమాచారం. రష్యా పత్రిక మాస్కో టైమ్స్‌ కథనం సారాంశం ఇలా ఉంది. ఉక్రెయిన్‌ నగరాల మీద బాంబులు వేసేందుకు ఉపయోగించే 41టియు 95 మరియు టియు 22 బాంబర్లు, ఏ 50 అనే రాడార్‌ విమానాన్ని ధ్వంస చేసినట్లు ఉక్రెయిన్‌ చెప్పినదాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంది. వీటిలో పదికంటే తక్కువే మిలిటరీ సర్వీసులో ఉన్నాయి.మరో రెండిరటిని 2024లో ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులతో ఉక్రెయిన్‌ కూల్చివేసింది. మూడున్నర సంవత్సరాలలో ఇది రష్యాకు మూడవ పెద్ద దెబ్బ. ఈ రకం విమానాలను ఇప్పుడు రష్యా ఉత్పత్తి చేయటం లేదు. టియు 160 రకం బాంబర్లు గాక ఇవి ఒకే సారి 16క్షిపణులను రెండు వేల కిలోమీటర్ల దూరం మోసుకుపోగలవు. ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులతో అనేక విమానాలకు నిప్పంటుకున్నట్లు, ఆర్పివేసినట్లు, ఎలాంటి మరణాలు లేవని, అనుమానితులను అరెస్టు చేసినట్లు రష్యన్‌ రక్షణ మంత్రిత్వశాఖ నిర్ధారించింది. రష్యా వూహాత్మక బాంబర్లలో 34శాతాన్ని ధ్వంసం చేశామని వాటి నష్టం 7 బిలియన్‌ డాలర్లని ఉక్రెయిన్‌ భద్రతా సంస్థలు చెప్పాయి.ఉపగ్రహ చిత్రాల ఆధారంగా విశ్లేషించిన వారు మొత్తం 13 విమానాలు నాశనం లేదా దెబ్బతినట్లు చెప్పారు. ఎనిమిదని వాషింగ్టన్‌ డిసికి చెందిన నిపుణుడు క్రిస్‌ బిగ్గర్స్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు.మరోచోట ఐదు అని ఉక్రెయిన్‌ ఓకో హోరా గ్రూపు విశ్లేషకులు పేర్కొన్నారు.


చెక్క పెట్టెలలో 117 డ్రోన్లను ఉంచి రష్యా ట్రక్కులలోనే రహస్యంగా తరలించామని, రిమోట్‌ కంట్రోలుతో చెక్క పెట్టెల మూతలను తొలగించి డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ పేర్కొన్నది. వైమానిక కేంద్రాల సమీపం నుంచి వాటిని ప్రయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెప్పింది.ఒక వైమానిక కేంద్రం ఉక్రెయిన్‌ నుంచి సైబీరియాలో 4,300 కిలోమీటర్లు, మరొకటి 1,900కి.మీ దూరంలో ఉంది. మూడు కేంద్రాల మీద జరిగిన దాడిని తిప్పికొట్టిన్లు పేర్కొన్నది. పర్యవసానాలు, రష్యన్‌ మిలిటరీ సామర్ద్యాన్ని అంచనా వేయటం ఈ దశలో కష్టం. ఇదీ మాస్కో టైమ్స్‌ మరుసటి రోజు విశ్లేషణ. ఉక్రెయిన్‌ దాడి మీద రష్యా ఎలా స్పందిస్తుందోనని ప్రపంచమంతా ఎదురుచూస్తున్నది.అది అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ మీద ఆధారపడి ఉంటుందన్నది ఒక తర్కం. తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే పరిష్కరిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఫారిన్‌ పోలిసీ అనే పత్రిక సిఐఏలో రష్యా గురించి విశ్లేషణ చేసిన మాజీ డైరెక్టర్‌ జార్జి బీబీతో మాట్లాడిరది. పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకురావాల్సింది డోనాల్డ్‌ ట్రంప్‌ అని బీబీ చెప్పాడు. ఉక్రెయిన్‌ దాడి మీడియా ప్రత్యేకించి పశ్చిమదేశాల దృష్టిని పెద్దగా ఆకర్షించవచ్చు, రష్యా మీద పెద్ద ప్రభావం చూపుతుందని అనుకోవటం లేదు, దాని సామర్ద్యాన్ని దెబ్బతీయదని, రెండు దేశాల మధ్య పెద్ద మార్పులు తెస్తుందని అనుకోవటం లేదన్నాడు.


రష్యన్‌ మిలిటరీ వైమానిక, పెద్ద డ్రోన్ల దాడిని ఎలా ఎదుర్కోవాలా అన్నదాని మీదే భద్రత గురించి దృష్టి సారించింది తప్ప భూమి మీద నుంచి డ్రోన్లను ప్రయోగించి దెబ్బతీసే ఎత్తుగడల గురించి కేంద్రీకరించలేదన్నది ప్రాధమికంగా కనిపిస్తున్నది.తక్కువ ఎత్తులో సమీపం నుంచి దాడి చేసే చిన్న డ్రోన్ల గురించి దృష్టి సారించలేదు. ఇది ఒక్క రష్యాకే కాదు యావత్‌ ప్రపంచానికి ఒక మిలిటరీ గుణపాఠం. ఎలాంటి అనుమానం కలగకుండా రష్యన్‌ డ్రైవర్లు వాటిని ట్రక్కులలో వైమానిక స్థావరాల వద్దకు తీసుకు వెళ్ల గలిగారు. మాస్కోలోని ప్రధాన గూఢచార కార్యాలయం సమీపం నుంచే స్పైడర్‌వెబ్‌ కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి రిమోట్‌ కంట్రోలతో పని చేయించారని చెబుతున్నారు, నిర్ధారించుకోవాల్సి ఉంది. ఈ దాడి కారణంగా రెండు దేశాల చర్చల క్రమంలో మార్పు రాదని మరుసటి రోజే జరిగిన సమావేశం వెల్లడిరచింది. అయితే దీనికి, ఎవరికి వారు వేసే ఎత్తుగడలకు సంబంధం ఉండదు. ఈ దాడి తరువాత పుతిన్‌పై ట్రంప్‌ పట్టు పెరుగుతుందని కొందరు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రష్యాకు అనుకూలంగా పరిస్థితి ఉందని వేసిన అంచనాలను సవరించుకోవాలని సూచిస్తున్నారు. అందువలన రష్యా డిమాండ్‌ చేస్తున్న షరతులతో ఒప్పందానికి అంగీకరించే అవకాశం ఉండదని సూత్రీకరిస్తున్నారు. ఇంతకు ముందే ఆ షరతులకు ట్రంప్‌ అంగీకరించలేదని, ఇప్పుడు మరింతగా వైఖరి గట్టిపడుతుందని అంటున్నారు. దాడికి ముందే గత కొద్ది రోజులుగా రష్యా మీద మరింత కఠిన వైఖరి తీసుకోవాలని, ఆంక్షల తీవ్రతను పెంచాలనే వత్తిడి ట్రంప్‌ మీద వస్తున్నది, ఐరోపా దేశాలు బహిరంగంగానే చెప్పాయి. పుతిన్‌ స్వయంగా కాల్పుల విరమణకు అంగీకరించకపోతే కొత్త ఆంక్షలను అమలు జరుపుతామనే సందేశాన్ని పంపగలడని విశ్లేషకులు చెబుతున్నారు. కొద్ది వారాల క్రితం ట్రంప్‌ తన ఓవల్‌ కార్యాలయంలో జెలెనెస్కీతో మాట్లాడుతూ ప్రయోగించటానికి తురుపుముక్కలేవీ లేవని చెప్పిన సంగతి తెలిసిందే. నాటో ప్రధాన కార్యాలయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేత్‌ ఫిబ్రవరిలో మాట్లాడుతూ 2014కు ముందు కలిగి ఉన్న ప్రాంతాలన్నీ తిరిగి వస్తాయని ఉక్రెయిన్‌ భావించటం వాస్తవ విరుద్దమన్నాడు. ఇప్పుడు ధ్వంసం చేశామని చెబుతున్న ఫైటర్‌లు రష్యా దగ్గర ఉన్నవాటిలో ఒక చిన్న భాగమే.
రష్యా మిలిటరీ బలగంతో పోల్చితే ఉక్రెయిన్‌ ఏ మాత్రం పోల్చటానికి లేదు. అయినప్పటికీ మూడున్నర సంవత్సరాలుగా అది నిలిచి ఎదిరిస్తున్నది.కొందరు చెబుతున్నదాని ప్రకారం ఉక్రెయిన్‌ తన సమాచారం మొత్తాన్ని మైక్రోసాఫ్ట్‌కు తరలించింది. దాని క్లౌడ్‌ సేవలను ఉపయోగించుకుంది. పలు పశ్చిమ దేశాలు సమన్వయం చేసుకొని రష్యా మీద సైబర్‌దాడులు జరిపాయి. ఎలన్‌ మస్క్‌ స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ స్టార్‌లింక్‌ను అందచేసింది. ఇది ఉక్రెయిన్‌ సమాచార వ్యవస్థలను పటిష్టం కావించింది. మైక్రోసాఫ్ట్‌తో పాటు క్లౌడఫేర్‌, పాలన్‌టిర్‌ వంటి అనేక సంస్ధలు సైబర్‌దాడుల్లో ఉక్రెయిన్‌కు తోడ్పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికాతో సహా నాటో దేశాలన్నీ తమ సర్వశక్తులను ఉక్రెయిన్‌ మీద వడ్డి అనేక విధాలుగా సాయపడ్డాయి. వాటిలో ఆధునిక డ్రోన్ల ఉత్పత్తి ఒకటి.ఇది రష్యాకంటే ఆధునికమైన వాటిని ముందుగానే రూపొందించేందుకు తోడ్పడిరది. గూఢచార సమాచారం, ఆధునిక ఆయుధాల అందచేత గురించి చెప్పనవసరం లేదు. ఒక చిన్న దేశం రష్యాను ఓడిరచిందనే ప్రచారదాడికి దాన్ని ఒక సాధనం చేసుకోవాలని చూశాయి. మరోవైపున ఆర్థికంగా ఆంక్షలతో ఎలా దెబ్బతీశాయో చెప్పనవసరం లేదు. ఇంత చేసినప్పటికీ వాటన్నింటినీ రష్యా అధిగమిస్తూ ఇప్పటి వరకు ఐదోవంతు ఉక్రెయిన్‌ భూభాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది. అనేక మౌలిక వ్యవస్థలను ధ్వంసం చేయగలిగింది.
నాటో దేశాలు ఉక్రెయిన్ను నిలిపేందుకు ఎంత చేసినా అవి సఫలం కాలేకపోతున్నాయి. ఆయుధాలు ఇచ్చినా వాటిని వినియోగించే నైపుణ్యం ఉక్రెయిన్‌ మిలిటరీకి లేదని తేలింది, అంతే కాదు అవసరమైన సంఖ్యలో సైనికుల సంఖ్య కూడా లేదు. రష్యాలో ఉన్న రక్షణ ఉత్పత్తుల మౌలిక వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది, రోజు రోజుకూ రష్యాకు అనుకూలంగా పరిస్థితులు మారటంలో అది కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నది. అయితే తెల్లవారేసరికి రష్యా పైచేయి సాధిస్తుందని అర్ధం కాదు. పోరు దీర్ఘకాలం సాగినందున ఉక్రెయిన్‌కు లభించిన సాయాలన్నీ తాత్కాలికం తప్ప ముఖ్యంగా ఆయుధాలు శాశ్వతం కాదు. ముందే చెప్పుకున్నట్లు అనేక ప్రాంతాలు రష్యా స్వాధీనంలోకి వచ్చాయి. ఇది రష్యాకు అనుకూలతలను పెంచింది.మిలిటరీ జవాన్ల సంఖ్యలో రష్యాదే ఆధిపత్యం. అందువల్లనే దాని ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాల మీద పట్టు నిలుపుకుంటోంది. ఉక్రెయిన్‌కు తగినన్ని బలగాలు లేని కారణంగా రష్యాలో ఆక్రమించుకున్న కురుస్కు ప్రాంతాన్ని అది నిలుపుకోలేకపోయింది. అనేక అనుభవాలను చూసిన తరువాత పుతిన్‌ సేనలు వ్యూహాన్ని మార్చాయి. పశ్చిమ దేశాలు ఆశించినట్లు ఆంక్షలతో రష్యా కుదేలు కాలేదు.పోరు విషయంలో తటస్థంగా ఉన్నప్పటికీ భారత్‌, చైనా దాని నుంచి చమురు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసి ఒక విధంగా ఆర్థికంగా ఎంతగానో ఆదుకున్నాయి. అవి కూడా లబ్దిపొందాయి, ఇదొక కొత్త అనుభవం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పుతిన్‌తో ఫోన్‌ తరువాత చేతులెత్తేసిన ట్రంప్‌, దిగ్భ్రాంతిలో ఐరోపా, మధ్యవర్తిగా పోప్‌ ?

21 Wednesday May 2025

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Donald trump hands off, Trump Phone call to Putin, Ukraine crisis, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌ శాంతి ఒప్పంద చర్చల నుంచి తప్పుకుంటానంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించటతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐరోపా హతాశురాలైంది.ప్రత్యక్ష పాత్ర పోషించలేననటమే కాదు, పుతిన్‌పై వత్తిడి తెచ్చేందుకు మరిన్ని ఆంక్షలు విధించాలన్న ఐరోపా నేతల సూచనలను కూడా తిరస్కరించినట్లు వార్తలు రావటంతో ఐరోపా దిగ్భ్రాంతికి గురైందనే విశ్లేషణలు వెలువడ్డాయి. తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ పోరు నిలిపివేస్తానన్నాడు డోనాల్డ్‌ ట్రంప్‌. పుతిన్‌తో భేటీ తరువాతే అది జరుగుతుందని కొద్ది రోజుల క్రితం చెప్పాడు. సోమవారం నాడు రెండు గంటలకు పైగా ఫోన్‌ సంభాషణ చేశాడు.చర్చలు అద్భుతంగా జరిగాయని ట్రంప్‌ వర్ణిస్తే అంతసీన్‌ లేదన్నట్లుగా పుతిన్‌ స్పందన ఉంది. పోప్‌ సాయంతో రెండు దేశాలూ సంప్రదించుకోవటం ద్వారా మాత్రమే శాంతి ఒప్పందం కుదురుతుందని, తక్షణమే చర్చలు ప్రారంభమౌతాయని ట్రంప్‌ ప్రకటించాడు.అమెరికా నుంచి ఎన్నికైన పోప్‌ 14వ లియో మధ్యవర్తిత్వం గురించి కొద్ది రోజల క్రితం వచ్చిన ఊహాగానాలను ట్రంప్‌ ఒక విధంగా నిర్దారించినట్లే. దీన్ని బట్టి శాంతి చర్చల కేంద్రంగా వాటికన్‌ మారనున్నదని చెప్పవచ్చు. అయితే ట్రంప్‌ మాటలకు విశ్వసనీయత, అక్కడేం జరుగుతుందన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌ చేయటాన్ని మాస్కో విజయంగా కొందరు వర్ణిస్తున్నారు. కాల్పుల విరమణపై అవగాహనకు సిద్దంగా ఉన్నట్లు పుతిన్‌ చెప్పాడని రష్యా అధికారిక వార్తా సంస్థ నొవోస్తి పేర్కొన్నది.అయితే షరతులు వర్తిసాయన్నట్లుగా తమ ప్రతిపాదనల గురించి వెనక్కు తగ్గేదేలేని పుతిన్‌ కుండబద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానాలు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీ, ఇతర నాటో నేతలతో కూడా ట్రంప్‌ మాట్లాడిన తరువాత ఏం జరగనుందనేది ఆసక్తికరంగా తయారైంది.నాటకీయ పరిణామాలు జరుగుతాయా లేక ఎవరి తురుపుముక్కలను వారు ప్రయోగిస్తున్నారా అన్నది చూడాలి.‘‘ అహాలు పెద్దగా ఉన్నాయి. అయితే ఏదో ఒకటి జరుగుతుందని భావిస్తున్నా, అది జరగకపోతే నేను తప్పుకుంటా, వాళ్లే చూసుకుంటారు ’’ అని ట్రంప్‌ చెప్పటాన్ని బట్టి పుతిన్‌ గతంలో స్పష్టం చేసిన మూలకారణాలకు పరిష్కారం కుదిరితేనే శాంతి అన్న అంశాన్ని మరోసారి స్పష్టం చేసినట్లు చెప్పవచ్చు. కరవమంటే కప్పుకు విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉక్రెయిన్‌,దానికి బాసటగా నిలుస్తున్న ఐరోపా అగ్రరాజ్యాలు పుతిన్‌ షరతులను అంగీకరించే అవకాశం కనిపించకపోతే మధ్యలో నాకెందుకు అంటూ ట్రంప్‌ తప్పుకొనేందుకు పూనుకున్నట్లు కూడా కనిపిస్తోంది.దీనికి తోడు మిలిటరీ, గూఢచార సమాచారం అందచేత కూడా నిలిపివేస్తే ఉక్రెయిన్‌ గిలగిలా కొట్టుకుంటుందని విశ్లేషణలు వెలువడ్డాయి. శాంతి చర్చల నుంచి అమెరికా దూరంగా జరగకూడదని, మా అందరికీ అది కీలకమని సోమవారం నాడు పుతిన్‌తో ట్రంప్‌ ఫోన్‌ తరువాత జెలెనెస్కీ వ్యాఖ్యానించాడు. రష్యా దౌత్యపరమైన విజయం సాధించిందని కోమ్సోమోలస్కయా ప్రావదా పత్రిక వర్ణించింది.


ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో పోరు ఆగటం లేదు. దీనికి కారకులెవరు ? రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతినా లేక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంపా ? సోమవారం నాడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడతానని ట్రంప్‌ చెప్పాడు. మాట్లాడే ముందు ఐరోపాలో ఉన్న నాటో దేశాల నేతలందరూ ట్రంప్‌తో చర్చించారు. బేషరతుగా చర్చలకు పుతిన్‌ వస్తే సరి లేకుంటే రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాలని చెప్పారు.అణ్వాయుధాలతో పని లేకుండానే ఉక్రెయిన్లో తమ లక్ష్యాలను సాధిస్తామని పుతిన్‌ చెప్పటమేగాక ఆదివారం నాడు రికార్డుస్థాయిలో 273 డ్రోన్లతో దాడి చేయించాడు. సంక్షోభానికి మూల కారణాలను గమనంలోకి తీసుకొని పరిష్కారానికి పూనుకోవాలని, ఆ దిశగా చర్చలకు తాను సిద్ధమే అని పుతిన్‌ మరోసారి చెప్పాడు. ప్రభుత్వ టీవీ విలేకరితో మాట్లాడుతూ అణ్వాయుధాలను ప్రయోగించే తప్పు తమతో చేయించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని అయితే వాటితో నిమిత్తం లేకుండానే పని పూర్తి చేయగలమని అన్నాడు.తమను భయపెట్టేందుకు ఖండాంతర క్షిపణులతో కవాతు చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. పుతిన్‌ ఇంటర్వ్యూను ఆదివారం నాడు టీవీ ప్రసారం చేసంది. సోవియట్‌ పూర్వపు రిపబ్లిక్‌ అయిన ఉక్రెయిన్ను నాజీకరణ, మిలిటరీ రహితం కావించేందుకు,తటస్థంగా ఉండేందుకు సైనిక చర్యను ప్రారంభించినట్లు 2022 ఫిబ్రవరిలో రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యన్‌ భాష మాట్లాడే పౌరుల హక్కుల పరిరక్షణ కూడా మిలిటరీ చర్య ఉద్దేశమని పుతిన్‌ చెప్పాడు. సంక్షోభానికి మూలకారణాల్లోకి వెళ్లే వారు రష్యా ప్రయోజనాలను కూడా గమనంలోకి తీసుకోవాలని పదే పదే చెప్పాడు, అప్పుడే శాశ్వత శాంతి నెలకొంటుందన్నాడు. ఈనెల 16న ఇస్తాంబుల్‌(టర్కీ)లో రష్యాఉక్రెయిన్‌ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పంద చర్చలు విఫలమయ్యాయి. ఇరుదేశాల వద్ద ఉన్న యుద్ధ ఖైదీల మార్పిడికి మాత్రమే అంగీకారం కుదిరింది. అమెరికన్లు అంటే అధ్యక్షుడితో సహా మొత్తం అమెరికా జనాలు, నాయకత్వానికి వారి స్వంత జాతీయ ప్రయోజనాలు ఉంటాయి, వాటిని మేము గౌరవిస్తాము, మాక్కూడా అలాగే ఉంటాయి, అదేమాదిరి వాటిని కూడా మన్నించాలని పుతిన్‌ అన్నాడు.

సోమవారం నాడు పుతిన్‌కు ఫోన్‌ చేస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన తరువాత తన మనస్సులో ఏమున్నదో, ఏమి కోరుకుంటున్నాడో పుతిన్‌ టీవీ ఇంటర్వ్యూ రూపంలో ముందుగానే వెల్లడిరచటం తప్ప మరొకటి కాదు. దానికి భిన్నంగా చేసే ప్రతిపాదనలను అంగీకరించేది లేదని బహిరంగంగానే స్పష్టం చేశాడు.తమ షరతులకు ఆమోదం తెలిపే వరకు ఒకవైపు చర్చలు జరుపుతూనే సైనిక చర్యను కూడా కొనసాగిస్తామన్న సందేశమిస్తూ ఆదివారం నాడు భారీ ఎత్తున 273 డ్రోన్లతో రష్యా దాడి చేసింది. ఈ దాడి తరువాత రోమ్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో జెలెనెస్కీ సమావేశమై రష్యా మీద మరింత వత్తిడి తేవాలని కోరాడు. ట్రంప్‌ సమక్షంలో ఓవల్‌ ఆఫీసులో ఇద్దరూ గొడవ పడిన తరువాత జరిగిన తొలి భేటీ ఇది.బేషరతుగా, పూర్తిగా యుద్ధాన్ని ఆపకతప్పదు అనుకొనేవరకు రష్యాపై వత్తిడి పెంచాల్సిందే అని జెలెనెస్కీ తరువాత ఒక ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నాడు. కాల్పుల విరమణ గురించి మాట్లాడేందుకు ఇతగాడు ఇస్తాంబుల్‌ రాగా పుతిన్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా కనీసం ఒక మంత్రిని కూడా పంపలేదు. దాంతో ఉక్రెయిన్లో జరుగుతున్న రక్తపాతాన్ని ఆపేందుకు తాను ఫోన్లో మాట్లాడతానని ట్రంప్‌ ప్రకటించాడు. పుతిన్‌ వైఖరితో ఐరోపా నాటో దేశాలకు దిక్కుతోచటం లేదు.భయంకరమైన యుద్ధాన్ని త్వరలో ఆపేందుకు అమెరికన్లు, యూరోపియన్లు కలసి పని చేయాలని జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ ఆదివారం నాడు చెప్పాడు. ప్రస్తుత దశలో ఉక్రెయిన్‌కు శాంతి స్థాపక దళాలను పంపటం గురించి మాట్లాటటానికి ఏమీ లేదని, దానికి సుదూరంగా ఉన్నామని, ముందు ఆయుధ ప్రయోగం, మరణాలను ఆపాలి అన్నాడు.తమ ప్రమేయం లేకుండా శాంతి ఒప్పందం కుదరటాన్ని అంగీకరించేందుకు ఐరోపా నేతలు సముఖంగా లేరని మెర్జ్‌ మాటల్లో మారోసారి వెల్లడైంది. అంతకు ముందు అల్బేనియా రాజధాని టిరానాలో రష్యా మీద మరిన్ని ఆంక్షల విధింపు గురించి ఐరోపా నేతలు చర్చలు జరిపారు.

రష్యా సైనిక చర్య ప్రారంభమైన 2022లో టర్కీ చొరవతో తొలిసారి ఇస్తాంబుల్‌ నగరంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇతర నాటో దేశాల మాట విని జెలెనెస్కీ సాకులతో ముందుకు రాలేదు. ఆ తరువాత తిరిగి మలిసారిగా గత శుక్రవారం నాడు అక్కడే ప్రత్యక్ష చర్చలు జరిగాయి. కేవలం రెండు గంటల పాటు జరిగిన సంప్రదింపుల్లో వెయ్యి మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్పిడి చేసుకొనేందుకు రెండు దేశాల ప్రతినిధి బృందాలు అంగీకరించాయి. దీనికి ఎలాంటి షరతులు లేవు. శాశ్వత శాంతి ఒప్పందానికి ముందుగా తాత్కాలిక కాల్పుల విరమణకు రష్యా అంగీకరించాలని, అటువైపు నుంచి స్పందన లేదని ఉక్రెయిన్‌ ప్రతినిధి చెప్పాడు. జరిగిందానిపట్ల తాము సంతృప్తిగా ఉన్నామని, నిరంతరం మాట్లాడేందుకు అందుబాటులో ఉంటామని రష్యన్‌ ప్రతినిధి అన్నాడు. కాల్పుల విరమణ ప్రతిపాదనలను రెండు పక్షాలూ పరస్పరం అందచేసుకోవాలని నిర్ణయించారు. రష్యా ఆధీనంలోకి వెళ్లిన తమ భూభాల నుంచి ఖాళీ చేసేందుకు తమకు ఏమాత్రం అంగీకారం గాని కొత్త షరతులను రష్యా ప్రతిపాదించినట్లు ఉక్రెయిన్‌ ప్రతినిధి చెప్పాడు. ఉక్రెయిన్‌ యుద్ధ పూర్వరంగంలో తలెత్తిన పరిణామాలను చర్చించేందుకు అల్బేనియా రాజధాని టిరానాలో 47ఐరోపా దేశాల నేతలు సమావేశమయ్యారు.అమెరికా, ఉక్రెయిన్‌, ఐరోపాదేశాలు చేసిన ప్రతిపాదనలకు రష్యా స్పందించలేదని, కొత్త ఆంక్షల గురించి చర్చించారు. అయితే ఐరోపా సమాఖ్య వాటి మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. పుతిన్‌ స్పందించకపోయినా ప్రయత్నాలు కొనసాగించాల్సిందేనని భావించారు.నెల రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌ సరే అన్నది. రష్యా తిరస్కరించింది. ఉన్నత స్థాయిలో చర్చలు అవసరమేనని అయితే ట్రంప్‌పుతిన్‌ భేటీకి సమయం పడుతుందని రష్యా ప్రతినిధి పెష్కోవ్‌ చెప్పాడు.రష్యన్‌ మిలిటరీ సరికొత్త దాడులకు సిద్దం అవుతున్నదని పశ్చిమదేశాల మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. బెలారస్‌కు కొత్త ఆయుధాలు ఇవ్వటంతో పాటు సెప్టెంబరులో సంయుక్తవిన్యాసాలు జరిపేందుకు రష్యా నిర్ణయించటాన్ని వారు చెబుతున్నారు. ఒకవేళ సరికొత్త దాడులు జరిగితే తూర్పు ఐరోపాలోని నాటో సభ్యదేశాలు లాత్వియా, లిథువేనియా, పోలాండ్‌లు ఒక రక్షణగా పనికి వస్తాయని భావిస్తున్నారు. రానున్నది వేసవి గనుక యుద్ధానికి అనువుగా ఉంటుందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. ఇస్తాంబుల్‌ చర్చలు విఫలమైన నేపధ్యాన్ని బట్టి పోరు సంవత్సరాల తరబడి కొనసాగవచ్చని, తాము భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఉక్రేనియన్లు భావిస్తున్నట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. ‘‘ మమ్మల్ని రష్యా నాశనం చేయలేదు, మేము దాని ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతాలను విముక్తి చేయలేము, అమెరికా సాయం లేకుండా ఇప్పుడున్న పరిస్థితిని మార్చలేము,కొంతకాలం తరువాత త్రాసు రష్యావైపు మొగ్గుతుంది, మేము భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మేము యుద్ధాన్ని కోరుకోవటం లేదు, ఒకటి, రెండు, మూడు ఇంకా దీర్ఘకాలం పట్టినా పోరుకు సిద్దమే. మేము స్వీడన్‌తో 21 సంవత్సరాలు పోరాడాము ’’ అని ఒక అధికారి చెప్పినట్లు గార్డియన్‌ పత్రిక రాసింది. తమ ఆధీనంలో ఉన్న ఐదు ప్రాంతాల నుంచే గాక లేని చోట్ల కూడా ఉక్రెయిన్‌ మిలిటరీని ఉపసంహరించాలని రష్యా డిమాండ్‌ చేస్తున్నట్లు వార్తలు.


శాంతి ఒప్పందం కుదరలాంటే దానికి ముందు తేలాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి.ఏకపక్షంగా ఏదీ జరగదు. శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా, ఐరోపా దేశాలు బెదిరించినా పుతిన్‌ వాటిని పూచికపుల్లలా తీసివేశాడు. ఉడుత ఊపులకు భయపడేది లేదని స్పష్టం చేశాడు. ఉభయపక్షాలకూ ముందు విశ్వాసం కుదరాలి.తమ మీద విధించిన ఆంక్షల సంగతి ముందు తేల్చాలని రష్యా కోరనుంది.అది జరిగిన తరువాత ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం సంగతి ఏమిటని పుతిన్‌ పట్టుబట్టటం ఖాయం. మూడు సంవత్సరాలుగా రష్యా స్వాధీనంలోకి వచ్చిన ప్రాంతాల సంగతి తేలాల్సి ఉంది. ఇవేవీ పరిష్కారం కాకుండా శాంతికి రష్యా అంగీకరించే అవకాశం లేదు. వీటిని అంగీకరించటమంటే ఐరోపా దేశాలు ఓడిపోయినట్లే గనుక అందుకు అవి అంగీకరిస్తాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d