• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: July 2023

ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ : ఆవు పేడ కాదు, కావాల్సింది సెమీ కండక్టర్ల పరిశోధన !

31 Monday Jul 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, Germany, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

America's tech war with China, India’s R&D, Narendra Modi, Narendra Modi Failures, R&D investment, Research on cow dung, Semicon India 2023, Semiconductor


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారికి,
అయ్యా ప్రతి నెలా మీ మన్‌కీ బాత్‌ అంశాలను చదివేవారిలో నేను ఒకరిని.ఒక జర్నలిస్టుగా జన్‌కీ బాత్‌లో ఉన్న కొన్ని ంటిని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జూలై 28-30 తేదీలలో గుజరాత్‌ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో తమరు సెమికాన్‌ ఇండియా 2023 రెండవ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా దేశమంతటా పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు కూడా జారీ చేశారు. దేశాన్ని సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చుతామని, మూడు వందల కాలేజీల్లో సెమికండక్టర్‌ కోర్సులను ప్రవేశపెడతామని తమరు ప్రకటించటం సంతోషం. గతంలో దేశంలో జరిగిన అనర్ధాలకు, వెనుకబడి ఉండటానికి,మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రాకపోవటానికి నెహ్రూనే కారణం అని బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివారం ఠకీమని సమాధానం చెబుతుంది. సెమికండక్టర్ల రంగంలో వెనుకబడటానికి కూడా నెహ్రూనే నిందిస్తారా ?


అన్నీ మీరే చేశారు అని మా తెలుగు సినిమాలో ఒక పాత్ర తండ్రిని తప్పుపడుతుంది. అలాగే అన్నీ ఆ నెహ్రూ చేశారనే కాసేపు అనుకుందాం.ఆయన అనుసరించిన విధానాల నుంచి కాంగ్రెస్‌ 1990దశకంలోనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వైదొలిగిందని మీకు తెలియంది కాదు. వాటినే మీరు అమలు జరుపుతున్నారు తప్ప కొత్త విధానాలు కాదు, ఎందుకంటే వాటిని మన మీద ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ రుద్దింది. గత పది సంవత్సరాలలో మీకు పూర్తి అధికారం ఉన్నప్పటికీ మీరు అంగీకరించినా లేకున్నా అనేక రంగాలలో వైఫల్యబాటలోనే దేశం ఉండటానికి కారణం ఆ విఫల విధానాలనే మరింత వేగంగా అమలు జరపటమే. అరిగిపోయిన రికార్డు అంటే ఇప్పటివారికి తెలియదు కనుక అన్నీ నెహ్రూనే చేశారు అనే పాచిపాట ఇంకా ఎంతకాలం పాడాలి అని మీ భక్తులు, జనం నుంచి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. మీరు చెప్పిన మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ధి వంటి విఫల నినాదాలను చూసిన తరువాత ఎన్నికల కోసం ఆడుతున్న ఆటలో భాగం ఇదని అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన నినాదం, చెప్పిన మాట మరోసారి మీ నోటి వెంట రాదన్నది స్పష్టమే. మీ శైలి అనితరసాధ్యం. గతంలో అమెరికా, పూర్వపు సోవియట్‌ మధ్య ప్రచ్చన్న పోరులో అణ్వాయుధాలు కేంద్ర స్థానంలో ఉంటే ఇప్పుడు అమెరికా, చైనా మధó్య తలెత్తిన పోరులో సెమీకండక్టర్‌లు ఉన్నాయి.ఆయుధాలలో కూడా ఇవి కీలకంగా మారనున్నాయని విశ్వగురువుగా ప్రపంచాన్ని ఔపోసన పట్టిన మీకు నేను చెప్పాల్సినపని లేదు.


ఎయిర్‌బస్‌లో అనేక దేశాలను అలా వెళ్లి ఇలా చుట్టివచ్చిన మీరు సెమీకండక్టర్‌ బస్‌ను ఎలా మిస్‌ అయ్యారన్నది చాలా మందికి అర్ధం కావటం లేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తరువాత వచ్చిన ప్రధానులెవరికీ(వారిలో అతల్‌ బిహారీ వాజ్‌పాయి ఉన్నదీ లేనిదీ తెలియదు) దూర దృష్టి లేదని విమర్శించే మీ అనుయాయులు (సుబ్రమణ్య స్వామిని పక్కన పెడదాం) మీ గురించి ఏం చెబుతారో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేసిన దాన్ని మీరు తొలి ఐదు సంవత్సరాల్లోనే చేసి చూపించారని గత ఎన్నికలపుడు ప్రచారం చేశారు. చేసిందేమిటో సాధికారిక సమాచారాన్ని జనానికి అందిస్తే వాస్తవం తెలుస్తుంది. మన దేశంలో మీ కంటే ముందు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) పేరుతో వివరాలను సేకరిస్తున్నారు. దానిలో మీ పాలనలో అనేక సూచికలు దిగజారినట్లు కనిపించింది. మీ ఏలుబడిలో నిరుద్యోగం పెరిగిందన్న సమాచారాన్ని గత లోక్‌సభ ఎన్నికల ముందు తొక్కిపెట్టిన సంగతి మీకు చెప్పనవసరం లేదు. వచ్చే సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని సమాచారాన్ని సేకరించే పద్దతిని రూపొందించే సంస్థ అధిపతినే తప్పించారు అని జనం అనుకుంటున్నారు.


నరేంద్రమోడీ పెద్ద విజనరీ అంటే భూత, వర్తమాన, భవిష్యత్‌ను చూడగలిగిన దృష్టి కలవారని అని ప్రచారం చేశారు. నిజమే కావచ్చు, సర్వేల్లో వచ్చే సమాచారం ఎలాంటిదో మీకు ముందే తెలిసి ఉంటుంది గనుక దాని రూపకర్తనే తొలగించారు. అన్నట్లు మరిచాను. ఈ ఏడాది మీ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని మీరు ముందే గ్రహించి ఆ విషయాన్ని ఎన్నో సంవత్సరాల ముందే మీరు చెప్పినట్లు కొందరు సామాజిక మాధ్యమంలో మీ గొప్ప గురించి ప్రచారం చేస్తున్న పోస్టు ఉంది. దాని నిజా నిజాలు మీకే ఎరుక. నిజంగా మీకు తెలిసి ఉంటే మణిపూర్‌ దురంతాన్ని ఎందుకు నివారించలేకపోయారు అన్న ప్రశ్న వస్తోంది. దాన్ని వదలివేద్దాం. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం గురించి కూడా మీరు చెప్పారు. పిండి లేకుండా రొట్టెలు రావు కదా ? దానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి రంగాల ప్రాధాన్యత, దానిలో సెమికండక్టర్ల గురించి ప్రధాని కాగానే లేదా అంతకు ముందు గుజరాత్‌ సిఎంగా ఎందుకు పసిగట్టలేకపోయినట్లు ? ఈ రంగానికి నిధుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు చేయాల్సి ఉంది. రెండూ జరగటం లేదు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న గేట్‌వే హౌస్‌ అనే ఒక మేథో సంస్థ 2015 జనవరి పదహారున టెక్నాలజీ పరుగులో చైనా ముందు భారత్‌ ఓడిపోనుందా అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది. మీ సలహాదారులకు దీని గురించి తెలియదని అనుకోలేము.లేదా ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే మన దేశ ఖర్మ అనుకోవటం తప్ప చేసేదేమీ లేదు. దానిలో పరిశోధన, అభివృద్ది ఖర్చు గురించి చర్చించారు. 1991 నుంచి చైనా పరిశోధన ఖర్చును ఏటా 19శాతం పెంచుతూ 2012నాటికి జిడిపిలో 1.97శాతానికి చేరినట్లు పేర్కొన్నారు.అప్పటికి మనదేశ ఖర్చు 0.9శాతం మాత్రమే ఉంది.ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రికలో 2023 ఫిబ్రవరి ఒకటిన ప్రచురితమైన ఒక విశ్లేషణలో జిడిపిలో మనదేశ తాజా ఖర్చు 0.7శాతమే అని చైనా 2.1శాతంగా పేర్కొన్నారు. జిడిపిలో రెండు శాతం ఖర్చు చేయాలని గతంలో వాజ్‌పాయి సర్కార్‌ కూడా చెప్పింది. దూరదృష్టి గల మీ పాలనలో గతం కంటే తగ్గిందేమిటి ? మన దేశంలో నిపుణులకు, పరిశోధకులకు కొరత ఉన్నదా ?


కుహనా అంశాలమీద పరిశోధనకు మీరు చూపుతున్న శ్రద్ధ సెమికండక్టర్స్‌ వంటి ప్రాధాన్యరంగాల మీద లేదు, ఆవు పేడ, మూత్రం, పాలలో బంగారం ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ పరిశోధనలకు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తున్నదని 2020 సంవత్సరంలో వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వతీరుతెన్నులను తప్పు పడుతూ ఆ పరిశోధనలను ఆపివేయాలని కోరినా మీరు పట్టించుకోలేదు. అంతకు ముందు 2017లో పంచగవ్య గురించి ఆయుర్వేద పుస్తకాల్లో రాసిన వాటిని రుజువు చేసేందుకు పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. మొత్తంగా పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించకుండా ముందుకు పోవటానికి మీ దగ్గర మంత్రదండమేదైనా ఉంటే హాం ఫట్‌ అంటూ తిప్పండి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారని చెప్పటం మీకు ఇష్టముండదని తెలిసినా తప్పటం లేదు.


తినేందుకు బంగాళాదుంప, అరటి చిప్స్‌ లేకున్నా రోజు గడుస్తుందిగానీ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ లేకుండా మనకు క్షణం గడవదంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో నిపుణులైన సెమికండక్టర్‌ రూపకల్పన ఇంజనీర్లు ప్రపంచం మొత్తంలో ఉన్నవారిలో 20శాతం మంది మనదేశంలో ఉన్నారని అంచనా. వారందరినీ విదేశీ కంపెనీలకు చౌక శ్రామికులుగా సమర్పించటం తప్ప ఇప్పుడు జరుగుతున్నదేమైనా ఉందా ? వారు సాధించే పేటెంట్స్‌ మన దేశానికి దక్కవు. మన ఇంజనీర్లు ఐటి రంగంలో ముందున్నారు. దీనికి మీ సర్కార్‌ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. హార్డ్‌వేర్‌ రంగంలో ఆ స్థితి లేదు. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ భాగం మనం దిగుమతి చేసుకుంటున్నార. అదే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో విదేశీ కంపెనీలు రూపకల్పనలో లబ్ది పొందటం తప్ప చిప్స్‌ తయారీ మన దేశంలో ఎంతమేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం అమెరికా మైక్రాన్‌ కంపెనీ ఎక్కడో ఉత్పత్తి చేసిన వాటిని మనదేశంలో పరీక్షించి పాకింగ్‌ చేయిస్తున్నది. దానితోనే పండగ చేసుకుందామా ?


చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరులో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది.తమ దేశంలోనే సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని, అక్కడి నుంచి ఎగుమతులు జరపాలని అమెరికా సర్కార్‌ పట్టుబడుతోంది. తైవాన్‌లోని టిఎస్‌ఎంసి కంపెనీ ఉత్పత్తి మీద అదుపు కలిగి ఉంది.1990లో ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పతిలో అమెరికా వాటా 37శాతం ఉంటే 2020లో 12శాతానికి తగ్గింది. తిరిగి పూర్వపు స్థితికి చేరాలంటూ కొత్త పరిశ్రమలకు ఇచ్చేందుకు 280 బిలియన్‌ డాలర్లను అమెరికా కేటాయించింది.ఈ మొత్తానికి స్థానిక ప్రభుత్వాలు ఇచ్చేది అదనం. ఇప్పటి వరకు అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్‌ సెమీకండక్టర్ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు సబ్సిడీల నిమిత్తం పదివేల కోట్ల డాలర్లు పక్కన పెడుతున్నట్లు ప్రకటించాయి. ఇంటెల్‌ కంపెనీ జర్మనీలో 30బిలియన్‌ యూరోల ప్లాంట్‌ పెట్టాలంటే మూడో వంతు తమకు సబ్సిడీ ఇవ్వాలని బేరమాడింది.పోలాండ్‌, జర్మనీ, ఇజ్రాయెల్లో కొత్త ప్లాంటులు పెట్టేందుకు 50బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇంటెల్‌ పేర్కొన్నది. మొత్తం మీద చూస్తే ఈ రంగంలో ముందున్న కంపెనీలు పెద్ద ఎత్తున లబ్దిపొందనున్నాయి. ఈ పోరులో మనదేశం ఎక్కడ అన్నది ప్రశ్నార్ధకమే.


గత పది సంవత్సరాలుగా ఈ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణం అని మీ మద్దతుదార్లు చెప్పినా ఆశ్చర్యంలేదు. అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండోతో మన మంత్రి పియూష్‌ గోయల్‌ 2023 మార్చి పదవ తేదీన సెమీకండక్టర్ల సరఫరా, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యం గురించి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్లిష్టమైన, వర్ధమాన సాంకేతికతల (ఐసిఇటి) సహకారం గురించి ఒప్పందం జరిగింది. చిత్రం ఏమంటే అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వాస్తవాల పత్రంలో మిగతా అంశాల గురించి ఉంది తప్ప సెమీకండక్టర్ల మీద నిర్దిష్టంగా ఏమీ లేదు అని కార్నెగీ ఇండియా వెబ్‌సైట్‌లో 2023 మే నెల 23వ తేదీన కోణార్క భండారీ రాశారు. మన దగ్గర దానికి భిన్నమైన సమాచారం ఉంటే ఆ పత్రాన్ని విడుదల చేస్తే వాస్తవం తెలుస్తుంది. మనదేశంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే వాటిని ప్రోత్సహించేందుకు ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహక(పిఎల్‌ఐ) పధకాన్ని 2021 నుంచి ఐదేండ్లలో రు.1.97లక్షల కోట్లు ఇచ్చే ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఆచరణలో ఉత్పత్తి బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఒక దగ్గర చేర్చే సెల్‌ఫోన్లకు, చిప్స్‌ పరీక్షలకు ఇస్తున్నారు. అందుకే భలే మంచి పధకం, వదలితే దొరకదని పొలోమంటూ ఆపిల్‌, మైక్రాన్‌ వంటి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయి.


రెండు దిగ్గజదేశాలైన అమెరికా, చైనా సెమీకండక్టర్ల రంగంలో పైచేయి సాధించేందుకు భారీ సబ్సిడీలతో పోటీ పడుతున్నాయి. అదే సమయంలో చైనా తన స్వంత రూపకల్పన, ఉత్పత్తికి గాను భారీ మొత్తంలో పరిశోధనకు నిధులు వెచ్చిస్తున్నది. మనదేశంలో ఒక సమగ్ర విధానాన్ని కూడా ఇప్పటికీ రూపొందించుకోలేకపోయాము.అలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా ఉంటే మన దేశాన్ని సెమీకండక్టర్‌ హబ్‌గా మారుస్తానని మీరు చెబుతున్నారు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ తాజా(2023) సమాచారం ప్రకారం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, అమెరికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఫాబ్రికేషన్‌లో 2022 డిసెంబరు నాటికి జపాన్‌లో 102, తైవాన్‌ 77, అమెరికా 76, చైనా 70, జర్మనీ 20, బ్రిటన్‌ 12, మలేషియా 7 ప్లాంట్లను కలిగి ఉన్నాయి. తరువాత స్థానాల్లో ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గుజరాత్‌లో 70శాతం సబ్సిడీ ఇచ్చి అమెరికా మైక్రాన్‌ కంపెనీతో ఒక పాకింగ్‌ కేంద్రాన్ని పెట్టించి దీంతో ప్రపంచ హబ్‌గా మారుస్తానని మీరు జనాలకు చెబుతున్నారు. ఇది ఎంతకాలం నడుస్తుంది ? అమెరికా మనలను తన సహజ భాగస్వామిగా పరిగణిస్తున్నదని, పిలిచి పెద్ద పీటవేస్తున్నదని చెబుతున్నారు. గతేడాది (2022) మార్చి నెలలో తొలిసారిగా అమెరికా చొరవతో చిప్స్‌ 4 లేదా ఫాబ్‌ 4 కూటమి ఏర్పడింది. దానిలో తైవాన్‌(చైనా తిరుగుబాటు రాష్ట్రం), జపాన్‌, దక్షిణ కొరియా ఇతర భాగస్వాములు తప్ప మనకు చోటు లేదు. ప్రపంచ సెమీకండక్టర్ల పరిశ్రమలో 70శాతం వాటా ఈ నాలుగు దేశాలదే. విధాన రూపకల్పన, ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకొనేందుకు, విస్తరణకు దీన్ని ఏర్పాటు చేశారు.


గత తొమ్మిది సంవత్సరాల్లో దేశ అప్పును విపరీతంగా పెంచివేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు తరువాత మీరు దాన్ని ఎడాపెడా పెంచారు.కేవలం మీరు చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు.మీరు అధికారానికి వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపిలో 67.1 శాతం కాగా 2021లో 88.5 శాతానికి పెరిగింది, 2023 నాటికి అది 83.1శాతంగా ఉంది. ఇంత చేసిన వారు పరిశోధనకు పెంచకపోగా ఎందుకు తగ్గించిందీ ఏదైనా ఒక మన్‌కీ బాత్‌లో చెబితే సంతోషం. ఆవు పేడ పరిశోధన నిధులు సెమీ కండక్టర్లకు మళ్లించండి, సబ్సిడీలతో పాటు పరిశోధనలకూ నిధులు ఇవ్వండి. ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నా.
తోటి భారతీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కమ్యూనిస్టులు బైబిల్‌ను తిరగరాస్తున్నారా ? నిజానిజాలేమిటి ?

29 Saturday Jul 2023

Posted by raomk in CHINA, Communalism, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti communist, chinese communist party, Gospel of John, Jesus, Pope Francis, Rewriting the Bible, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మతాన్ని చైనీకరణ కావించేందుకు గాను అక్కడి కమ్యూనిస్టు పార్టీ (సిసిపి) బైబిల్‌ను తిరగరాస్తున్నదని ప్రచారం చేస్తున్నవారిని అమెరికా ప్రోత్సహిస్తున్నది. దానికి పార్లమెంటరీ కమిటీని వేదికగా చేసుకుంది. అమెరికా పార్లమెంట్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుతెన్నులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ సమావేశంలో రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘెర్‌ చైనా మీద ఆరోపించాడు. జనాలు దేవుడి కంటే పార్టీకి విశ్వాస పాత్రులుగా ఉండేట్లుగా మార్చాలని, దానికి గాను అన్ని మతాలను చైనీకరణ గావించాలని, మతం, సోషలిజం ఒకదానికి ఒకటి తోడుగా ఉనికిలో ఉండేట్లు చూడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగినపుడు 2017లో అధినేత షీ జింపింగ్‌ కోరినట్లు ,దానిలో భాగంగానే బైబిల్‌ను తిరగరాస్తున్నారని కూడా మైక్‌ ఆరోపించాడు. ఈ ప్రచారాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఒక పథకం ప్రకారం సాగిస్తున్నారు. పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగరాసే పని పెట్టుకున్నారన్నది వాటిలో ఒకటి. దీన్ని ఒక్క క్రైస్తవ మతానికే పరిమితం చేయలేదని బౌద్దం, ఇస్లాంకు కూడా వర్తింప చేస్తున్నారని మైక్‌ ఆరోపించాడు.మతం మీద పూర్తి అధికారాన్ని సాధించేందుకు సిసిపి చూస్తున్నదనే ప్రచారాన్ని అనేక క్రైస్తవ మత సంస్థలు, మీడియాలో కూడా గత ఆరు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. మతం, సోషలిజం సహజీవనం అన్నది వక్రీకరణ తప్ప వాస్తవం కాదు. మత స్వేచ్చను అనుమతించటం అంటే ప్రోత్సహించటం, ఉనికిని కాపాడటం కాదు. తరతరాలుగా వేళ్లూనుకున్న భావనలను క్రమంగా పోగొట్టాలి తప్ప ప్రార్ధనా మందిరాలను కూల్చివేసినా, నిషేధాలతో అణచివేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి.


చిత్రం ఏమిటంటే మతాన్ని అణచివేస్తున్నట్లు ఒక వైపు ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే 2018లో చైనా ప్రభుత్వంతో పోప్‌ ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం ఎంపిక చేసిన వారిని చైనాలో కాథలిక్‌ మత అధిపతులుగా పోప్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా టిబెట్‌లో తదుపరి దలైలామాను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు గాను ముందుగా పోప్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక బైబిల్‌ను తిరగరాస్తున్నారని చెప్పేందుకు మైక్‌ గాలఘెర్‌ రెండు ఆరోపణలు చేశాడు. న్యూటెస్ట్‌మెంట్‌ బైబిల్‌లో జాన్‌ సువార్త ప్రకారం వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక మహిళను రాళ్లతో కొట్టటాన్ని చూసిన ఏసు క్రీస్తు వారి వద్దకు వెళ్లి మీలో పాపం చేయనివారెవరైనా ఉంటే ముందుగా వారు వచ్చి కొట్టమని చెప్పారన్న కథ అందరికీ తెలిసిందే.దాన్ని చైనా వారు మార్చి ఏసు క్రీస్తే స్వయంగా రాళ్లు వేసినట్లు రాశారని మైక్‌ ఆరోపించాడు. ఇది తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. మరికొన్ని దీన్నే మరోవిధంగా ప్రచారం చేస్తున్నారు. ఏసుక్రీస్తు జోక్యం చేసుకున్న తరువాత రాళ్లు వేసిన వారు వెళ్లిపోయారని, వారు నిన్ను చంపారా అని సదరు మహిళను అడిగితే లేదని ఆమె చెప్పిన తరువాత వారు గాక పోతే నేనే చంపేస్తా, ఇలాంటి పాపం మరొకసారి చేేయ వద్దు, వెళ్లిపో అన్నట్లుగా బైబిల్‌ను తిరగరాసినట్లు ప్రచారం చేస్తున్నారు.


మరొక కథనం ప్రకారం ఫార్సీ(నాటి చట్టాల గురించి తెలిసినవారు) యూదులు ఒక మహిళను తీసుకు వచ్చి ఏసుక్రీస్తు ముందు నిలిపారు. బోధకుడా ఈ మహిళ వ్యభిచారం చేస్తూ పట్టుబడినది. చట్టం , మోజెస్‌ మాకు చెప్పినదాని ప్రకారం అలాంటి మహిళను రాళ్లతో కొట్టాలి. ఇప్పుడు మీరేమి చెబుతారు అని ప్రశ్నించారట. ఇదంతా ఏసుక్రీస్తును ఉచ్చులో ఇరికించేందుకు యూదునేతలు చేశారట. అప్పుడు ఏసు క్రీస్తు నేల మీద వేలితో ఏదో రాస్తూ (అదేమిటో ఇప్పటికీ తెలియదట) మీలో పాపం చేయని వారెవరైనా ఉంటే ముందుగా వారు రాళ్లతో కొట్టండి అన్నారట. దాంతో వణికిపోయి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారట. అప్పుడు ఏసు మహిళా వారెక్కడ, ఎవరూ నీ మీద దాడి చేయలేదు కదా అంటే అవునయ్యా అందట. నేను కూడా నిన్ను కొట్టను వెళ్లిపో నీ జీవితంలో ఇంక పాపం చేయవద్దు అన్నాడట. అలా అందరూ వెళ్లిన తరువాత ఏసు ఆమెను స్వయంగా రాయితో కొట్టి నేను కూడా పాపినే అని చెప్పినట్లు చైనా కమ్యూనిస్టులు తిరగరాస్తున్న బైబిల్‌లో ఉందని, దాన్ని తరగతి పుస్తకాల్లో పెట్టారని కొన్ని క్రైస్తవ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.ఇది ఏసు దైవత్వాన్ని కించపరచటమే అని ఆరోపిస్తున్నారు.


ప్రస్తుతం చైనా, మన దేశం,ఇంకా అనేక దేశాల్లో ఉన్న చట్టం ప్రకారం అక్రమ సంబంధం నేరం కాదు. అందువలన దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టాలని, ఏసుక్రీస్తే ఆపని చేశారు గనుక మీరూ చేయవచ్చని చైనాలో ఉన్న క్రైస్తవులకు గానీ మరొకరికి గానీ చెప్పాల్సిన అవసరం కమ్యూనిస్టులకు లేదు, అందుకుగాను బైబిల్‌ను తిరగరాయాల్సిన అగత్యమూ లేదు. దానికీ సోషలిస్టు సమాజ నిర్మాణానికి సంబంధం లేదు. అలాగని అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తున్నదీ లేదు. ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చని చైనా చట్టాలలో ఉంది. వివాహం చేసుకున్నప్పటికీ స్త్రీ సదరు పురుషుడి ఆస్తికాదు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్య పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే సదరు పరపురుషుడు అవివాహితుడైనప్పటికీ అభియోగం రుజువైతే ఐదు సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. వివాహిత మహిళకు ఎలాంటి శిక్ష ఉండదు. ఈ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్దమని 2018 సెప్టెంబరు 27న సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. మరొకరి భాగస్వామి అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే నగదు జరిమానా విధించవచ్చని సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ చెప్పింది.


చైనాలోని హేనాన్‌ రాష్ట్రంలోని ప్రొటెస్టెంట్‌ చర్చిలలో టెన్‌కమాండ్‌మెంట్స్‌ బదులు చైనా అధినేత షీ జింపింగ్‌ చెప్పిన మాటలను బోధించాలని కమ్యూనిస్టు పార్టీ నేతలు బలవంతం చేస్తున్నారని, ఈ మేరకు మొదటి కమాండ్‌మెంట్‌ను మార్చి రాశారని కూడా అమెరికన్‌ ఎంపీ ఆరోపించాడు. పశ్చిమ దేశాల భావజాలాన్ని చొరనివ్వకుండా ఇలా చేస్తున్నారని, తిరస్కరించిన ఇద్దరు పాస్టర్లను శిక్షించినట్లు, ఇతరులను అడ్డుకుంటున్నట్లు ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ కన్సరన్‌(ఐసిసి) నివేదించినట్లు పార్లమెంటు కమిటీ ముందు చెప్పాడు. బైబిల్‌ రెండు రకాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఓల్డ్‌ టెస్టిమెంట్‌, న్యూ టెస్టిమెంట్‌ అన్న గ్రంధాలు మనం ఎక్కడైనా చూడవచ్చు. వాటిని తిరగ రాసింది క్రైస్తవులు తప్ప కమ్యూనిస్టులు కాదు.వివిధ మత గ్రంధాల మీద అనేక మంది భిన్నమైన భాష్యాలు రాశారు. కైస్తవం కమ్యూనిజానికి అనుకూలమని, వ్యతిరేకమని బైబిల్‌లో ఉన్న అంశాలకు వ్యాఖ్యానం చెప్పిన వారు లేకపోలేదు. అసలు ఏసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు, బైబిల్‌ అంశాలను ఎవరు ఎప్పుడు ప్రబోధించారు లేదా ఎప్పుడు రాశారు ? అప్పటికీ అసలు కమ్యూనిజం, సోషలిజం అన్న ప్రాధమిక భావనలు కూడా లేవు. అలాంటపుడు ప్రబోధకులు లేదా రాసిన వారు వాటికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలా వాదనలు చేయగలరు. బైబిల్‌ను తిరగరాసి దానిలో ఇలా ఉంది అని చెప్పి జనాన్ని కమ్యూనిజానికి అనుకూలంగా మార్చేంత భావ దారిద్య్రంలో ప్రపంచంలో ఏ కమ్యూనిస్టులూ లేరు. దోపిడీకి వ్యతిరేకంగా జరిపే పోరాటాలను పక్కదారి పట్టించేందుకు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు ప్రతి మతం యత్నించటాన్ని రోజూ మనం చూస్తున్నదే.

మనదేశంలో మనుధర్మం పేరుతో అమలు జరిపిన వివక్ష, దుర్మార్గాలు చేస్తున్నపుడే సర్వేజనా సుఖినోభవంతు అని కూడా చెప్పారు. అందువలన అలా చెప్పిన వారిని మన దేశంలో తొలి సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంటారా ? ప్రతి సమాజంలో దుర్మార్గాలను చూడలేని అనేక మంది తమ వాంఛలను వెల్లడించారు. వాటిని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే శాస్త్రీయ సిద్దాంతం, ఆచరణలను కమ్యూనిస్టులు చెప్పారు. వ్యక్తులకు, వారి ఇండ్లకు, ప్రార్ధనా స్థలాలకు పరిమితం కావాల్సిన మతాన్ని వీధులు, రాజకీయాలు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు తీసుకురావటాన్ని కమ్యూనిస్టులే కాదు, హేతువాదులు, పురోగామివాదులెవరూ అంగీకరించరు. రాజ్యం, పౌరుల మీద మత పెత్తనాన్ని చివరికి పెట్టుబడిదారులు కూడా అంగీకరించరు.ఐరోపాలో ఒక దశలో భూమిలో అత్యధిక భాగం మత సంస్థల చేతుల్లోనే ఉండేది. దాన్ని బద్దలు కొట్టటం ఫ్రెంచి విప్లవంలో ఒక భాగం, ఫ్యూడల్‌ బంధాలను,మత పట్టును అది బద్దలు చేసింది.పేదలు,అణగారిన వర్గాలను రక్షించేందుకే క్రైస్తవం తొలి రోజుల్లో ముందుకు వచ్చింది గనుకనే జనం ఖండాలు, రంగు, భాషా బేధాలతో నిమిత్తం లేకుండా ఆదరించారు. కానీ అదే మతం కష్టజీవుల మూలుగులను పీల్చే పెట్టుబడిదారులు,యుద్ధాలతో రక్తపుటేరులు పారించిన నియంతల పట్ల దాని వైఖరి ఏమంటే సానుకూలమే. మత యుద్ధాలకు పాల్పడిన చరిత్ర కూడా తెలిసిందే. దోపిడీని అంతం చేయాలన్న సోషలిస్టు, కమ్యూనిజం మతానికి వ్యతిరేకం అని ఆ మత పెద్దలే రోజూ తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.


దేశాల మీద మతపెత్తనం కుదరదు, మత రాజ్యాలు అంతరించాయి. మతం పేరుతో విద్రోహానికి పూనుకుంటే సహించాల్సిన అవసరం ఉందా? తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలు, సోవియట్‌ కూల్చివేతలో క్రైస్తవమత పెద్దలు కూడా అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన చరిత్ర మన కళ్ల ముందు ఉంది. అటువంటి కుట్రలను చైనా సాగనివ్వటం లేదు గనుక దాని మీద తప్పుడు ప్రచారాలు అన్నది స్పష్టం. చైనాలో బైబిల్‌, ఖురాన్‌ ఏ పవిత్ర గ్రంధాన్ని కూడ సహించరని ప్రచారం చేస్తున్న క్రైస్తవ సంస్థలు నేడు ఐరోపాలో పెరుగుతున్న ముస్లిం వ్యతిరేకత, ఖురాన్‌ గ్రంధాలను తగులపెడుతున్న ఉదంతాల గురించి ఎక్కడా మాట్లాడవు.స్టాక్‌హౌమ్‌లోని టర్కీ ఎంబసీ ముందు ఖురాన్‌ ప్రతిని తగుల బెట్టేందుకు స్వీడన్‌ ప్రభుత్వం ఏకంగా అధికారిక అనుమతి మంజూరు చేసింది. ఇంకా అనేక దేశాల్లో పచ్చి ముస్లిం వ్యతిరేకులు ఇలానే రెచ్చిపోతున్నారు. వాటి గురించి అమెరికా ఎంపీలెవరూ మాట్లాడరు. చైనా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 36 ప్రకారం మత స్వేచ్చ ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులు ఫలానా మతాన్ని నమ్మాలని లేదా వద్దని గానీ వత్తిడి తేకూడదు.వివక్ష చూపకూడదు.ప్రజా జీవనాన్ని విచ్చిన్నం చేసేందుకు లేదా పౌరుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు చూడకూడదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదు. ఏ మత సంస్థకూడా విదేశీ పెత్తనాన్ని అంగీకరించకూడదు. ఇదే విధంగా మత సంస్థలు విద్యాసంస్థలను ఏర్పాటు చేయవచ్చు తప్ప వాటిలో మత బోధన చేయకూడదు. ఇలా మతాన్ని పరిమితం చేసే నిబంధనలు ఉన్నాయి. అంతే తప్ప మా మతం ఇలా చెప్పింది లేదా మత కేంద్రం ఫలానా చోట ఉంది, వారు చెప్పినట్లు నడచుకుంటాం, దేశంలోని చట్టాలు మాకు వర్తించవు అంటే కుదరదు. మేం చెప్పినట్లే నడవాలి అంటే అసలు కుదరదు. ఇది అన్ని మతాలకూ వర్తిస్తుంది. బౌద్దం పేరుతో జనాన్ని రెచ్చగొట్టి తిరుగుబాటు చేసిన టిబెట్‌ దలైలామా పారిపోయి మన దేశంలో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.


అమర జీవుల గళం(విఓఎం) పేరుతో పని చేస్తున్న ఒక సంస్థ ప్రతినిధి టోడ్‌ నెటెల్టన్‌ ఒక పత్రికతో మాట్లాడుతూ పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగ రాయాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 2019లో నిర్ణయించిందని. దానిలో కన్ఫూసియస్‌, బౌద్ద సూత్రాలను కూడా చొప్పించి పార్టీకి మద్దతు ఇచ్చేవిధంగా రాస్తారని ఆరోపించాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే 140 కోట్ల చైనా జనాభాలో ఇండెక్స్‌ ముండీ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం క్రైస్తవులు కేవలం 5.2, ముస్లింలు రెండు శాతమే.ఏ మతానికీ చెందని వారు 51.8, స్థానిక తెగల మతాల వారు 21.9, బౌద్దులు 18.3 శాతాల చొప్పున ఉన్నారు. మనదేశంలో మాదిరి 80శాతం మంది ఉన్న హిందూమతానికి ముస్లిం, క్రైస్తవుల నుంచి ముప్పు వచ్చిందని చెప్పేవారెవరూ అక్కడ లేరు. ప్రపంచంలో ఎక్కడా వర్తమాన కాలంలో ఏ దేశంలోనూ ఒక మతస్తులు తమ జనాభాను విపరీతంగా పెంచి మరొక మతానికి ముప్పు తెచ్చిన ఉదంతమేదీ జరగలేదు. చైనాలో నిజంగా బైబిల్‌ను తిరగరాస్తూ దానిలో కొన్ని భాగాలను ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో పెట్టి ఉంటే రోమ్‌లో ఉన్న క్రైస్తవమత కేంద్రానికి, పోప్‌కు తెలియకుండా ఉంటుందా ? తెలిస్తే అధికారికంగానే దాని మీద స్పందించిన దాఖలా ఇంతవరకు లేదు.


క్రైస్తవుల కోసం పని చేస్తున్నామంటూ ప్రచారం చేసుకొనే వారూ, పత్రికల్లో రాతలు రాసేవారూ చివరికి పోప్‌ ఫ్రాన్సిస్‌ను కూడా వదలటం లేదు. చైనా అక్రమంగా నియమించిన షాంఘై బిషప్‌ను అంగీకరించినట్లు ధ్వజమెత్తారు.2018లో చైనాతో పోప్‌ కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పటికీ రహస్యమేనని, దాన్ని ఇప్పటికి రెండు సార్లు సమీక్షించినట్లు జూలై 27న ఒక విశ్లేషకుడు పేర్కొన్నాడు. ఒప్పందం ప్రకారం బిషప్పులను ఎంపిక చేసేది చైనా అయినా అధికారికంగా ప్రకటించాల్సింది పోప్‌ అని దానికి విరుద్దంగా షాంఘై బిషప్‌ వ్యవహారం ఉందని, వాటికన్‌కు ఆ సంగతి పత్రికా వార్తల ద్వారా తెలిసిందని కూడా ఆరోపించాడు. ఏప్రిల్‌ నాలుగున నియామకం జరిగితే జూలై 15న పోప్‌ అధికారికంగా ప్రకటించారని వాపోయాడు. గొడవలెందుకని ఊరుకొని ఆమోదించాంగానీ చైనా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వాటికన్‌ విదేశాంగ మంత్రి కార్డినల్‌ పెట్రో పరోలిన్‌ చెప్పినట్లు కూడా రాశాడు. 2018 ఒప్పందం ప్రకారం అనుమతి లేకుండా చర్చి సమావేశాలు నిర్వహించటాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదు. అలాంటి వారంతా చైనా ప్రభుత్వం గుర్తించిన దేశభక్త కాథలిక్‌ చర్చిలో విలీనం కావాలి.కానీ ఇప్పటికీ రహస్య చర్చ్‌లు కొనసాగుతున్నట్లు వాటికన్‌ మంత్రి అంగీకరించాడు. అలా చేరని వారి మనోభావాలను గౌరవించాలని కూడా ఇప్పుడు మంత్రి చెప్పటాన్ని బట్టి దాని అర్ధం వారికి వెలుపలి నుంచి మద్దతు లభిస్తున్నది. వారికి రక్షణ కల్పించాలని అనేక మంది పత్రికల్లో డిమాండ్‌ చేస్తున్నారంటే పోప్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి తూట్లు పొడవటం, ధిక్కరణ తప్ప మరొకకాదు. బైబిల్‌ను తిరగరాయాలంటే ఎక్కడైనా పది సంవత్సరాలు అవసరం లేదు. తెల్లవారేసరికి పోటీ గ్రంధాలను రాసేవారున్నారు. కమ్యూనిస్టులు అలాంటి పనికిమాలిన పని పెట్టుకోరు. గతంలో మతాన్ని అనుమతించరని, ప్రార్ధనా మందిరాలను కూల్చివేశారని చేసిన ప్రచారం అబద్దమని తేలింది. అందువలన ఎత్తుగడలను మార్చి మతాన్ని తమకు అనుకూలంగా మారుస్తున్నారని, మత గ్రంధాలను తిరగరాస్తున్నారనే తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా మరో ముందడుగు : అమెరికాను హడలెత్తిస్తూ జెట్‌ ఇంజన్‌ రూపకల్పన, ఉత్పత్తి ! మనదేశం ఎక్కడ ?

27 Thursday Jul 2023

Posted by raomk in CHINA, Current Affairs, Europe, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

AVIC, Chengdu J-20 stealth fighter, China’s J-20 fighter, F 35, F-22, Joe Biden, Narendra Modi Failures, PENTAGON, PRC


ఎం కోటేశ్వరరావు


కాపీ కొట్టేందుకు వీలుగాక స్వంత జెట్‌ ఇంజన్‌ చైనా యత్నం అనే శీర్షికతో రాయిటర్స్‌ వార్తా సంస్థ ఒక విశ్లేషణను వెలువరించింది. అణు క్షిపణులను రూపొందించింది, వ్యోమగాములను రోదసీలోకి పంపింది గానీ ఇంతవరకు ఎంతో కీలకమైన జెట్‌ ఇంజన్లను తయారు చేయలేకపోయింది అన్న మాటలతో ప్రారంభమైంది. ఇది 2012 అక్టోబరు 30న రాసింది. కథ అల్లింది వార్తా సంస్థ కావచ్చుగానీ దానిలో ఉన్న అంశాలు పశ్చిమ దేశాల నిపుణుల బుర్రలో ఉన్నవే అన్నది స్పష్టం. చైనా వాటిని సవాలుగా తీసుకొని పది సంవత్సరాల్లో తన స్వంత జెట్‌ ఇంజన్ను ఎగురవేసింది. అది చైనా ప్రత్యేకత. చైనా అంటే కాపీ అన్న తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఇది చెంపపెట్టు. కాపీకి వీలైతే ఎవరైనా ఆపని చేయవచ్చు. చైనాకు ధీటుగా మన దేశాన్ని రూపొందిస్తామని చెబుతున్న వారు ఈ రంగంలో మనం ఎక్కడున్నామో కూడా చెప్పాల్సి ఉంది. జెట్‌ ఇంజను రూపకల్పనకు చైనా 1600 కోట్ల డాలర్ల(10000 కోట్ల యువాన్ల) పధకాన్ని రూపొందించినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. అంత మొత్తం మన దగ్గర లేదా ? నిపుణులకు మన దేశంలో కొదవ లేదు, కాంగ్రెస్‌ పాలకులు పట్టించుకోలేదనుకుందాం, నరేంద్రమోడీ ఎందుకు పూనుకోలేదు, ఒక వేళ పూనుకుంటే మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం ? కొందరు పశ్చిమ దేశాల నిపుణులు రానున్న రెండు దశాబ్దాల్లో చైనా 4,900 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుందని కూడా అంచనాలు చెప్పారు. వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక పెద్ద ముందడుగు వేసింది. పశ్చిమ దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. ఒకసారి బండి కదిలిన తరువాత ఊపందుకోవటం పెద్ద పని కాదు. ” ఐరోపా, అమెరికా, రష్యాలను కలిపి చూస్తే అవి కొన్ని వందల సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాయి. కానీ చైనా మాత్రం 30 సంవత్సరాల నుంచే పని చేస్తున్నది ” అని హాంకాంగ్‌ నుంచి వెలువడే కానవా ఆసియన్‌ డిఫెన్స్‌ మాగజైన్‌ సంపాదకుడు ఆండ్రెయి చాంగ్‌ అన్నాడు.


అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అందువలన ప్రతి దేశం తన భద్రత గురించి జాగ్రత్తపడటం సాధారణ అంశమే. ఇటీవలి కాలంలో కొన్ని దేశాలను బూచిగా చూపి ఆ పేరుతో మిలిటరీ ఖర్చు పెంచేట్లు అమెరికా కుట్రలు చేస్తోంది, తప్పుడు సమాచారం అందిస్తోంది. ఉదాహరణకు మనకు చైనాతో విరోధాన్ని పెంచేందుకు అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులు మన ప్రాంతంలో చైనా కొత్త గ్రామాలను నిర్మిస్తున్నట్లు కొన్ని ఫొటోలను అమెరికా విడుదల చేసింది. అది వాస్తవం కాదని, తమ ప్రాంతంలోనే పాతబడిన ఇండ్ల స్థానంలో కొత్తవాటిని నిర్మిస్తున్నట్లు మన మిలిటరీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అమెరికా మాటలను నమ్మి అవసరం కంటే అధికంగా మిలిటరీ ఖర్చు చేసిన దేశమేదీ బాగుపడిన దాఖలాల్లేవు. సాధారణ పరిస్థితుల్లో కూడా ప్రతిదేశం తన మిలిటరీ పరికరాలను నవీకరించుకోవటం అవసరం, దానికి మన దేశం మినహాయింపు కాదు. ఇటీవలనే ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్‌ వెళ్లి కొత్తగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చారు. ఫ్రెంచి కంపెనీతో కలసి జెట్‌ ఇంజన్ల అభివృద్ధికి ఒప్పందం చేసుకున్నట్లు కూడా ప్రకటించారు.


పారిస్‌లో ఇటీవలనే విమాన ఎగ్జిబిషన్‌ జరిగింది. ఈ సందర్భంగా నాటో కూటమి గూఢచార సంస్థలో పని చేసి రిటైరైన ఒక అధికారి బ్రేకింగ్‌ డిఫెన్స్‌ అనే మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఉంది.” చైనా స్వంతంగా జెట్‌ ఇంజన్ల రూపకల్పన, ఉత్పత్తి చేసేదిగా మారాలని ఎవ్వరూ కోరుకోవటం లేదని ” అన్నాడు. అది ఒక్క చైనాకే వర్తిస్తుందని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఇప్పటికే ఆ రంగంలో ఉన్న దేశాలు ఎవరికైనా షరతులతో అమ్ముతాయి తప్ప ఎవరినీ స్వంతంగా ఎదగనివ్వవు. పశ్చిమ దేశాలు ఎంతగా అడ్డుకుంటున్నప్పటికీ సవాలుగా తీసుకొని చైనా ముందుకు పోవటం వాటికి ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికా ఇతర దేశాలను భయపెట్టేందుకు ముందుగానే హడావుడి ప్రకటనలు చేస్తాయి. ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తాయి. చైనా అంశానికి వస్తే అది చేసి చూపించిన తరువాతే చెబుతుంది. పారిస్‌ విమాన ప్రదర్శన 2023 జూన్‌ 24న ముగిసింది. అక్కడ చైనా స్టాల్‌ ఉన్నప్పటికీ ఎవరూ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. తరువాత నాలుగు రోజులకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రాడార్లకు దొరకని, గురిచూసి దాడి చేసే చైనా ఐదవ తరం చెంగుడు జె-20 బాంబరు వీడియోను విడుదల చేసింది. దాని సత్తా గురించి పశ్చిమ దేశాలు ఇప్పుడు జుట్టుపీక్కుంటున్నాయి. అంతకు ముందు పరీక్షించినప్పటికీ తొలిసారిగా జె-20ని రెండు డబ్ల్యుఎస్‌-15 కొత్త ఇంజన్లతో విడుదల చేశారు. దీంతో అమెరికా, దాని మిత్ర దేశాలు ఆందోళన చెందుతున్నాయి.


గతంలో చైనా తమ విమానాలకు అవసరమైన జెట్‌ ఇంజన్లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. అవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. ఎంత కాలం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తాం, మనమే ఎందుకు రూపకల్పన చేసి ఉత్పత్తికి పూనుకోకూడదని 2016 ఆగస్టులో జెట్‌ ఇంజన్ల విడిభాగాలు తయారు చేసే యూనిట్లను ఒక దగ్గరకు చేర్చి 750 కోట్ల డాలర్ల పెట్టుబడి, 96వేల మంది సిబ్బందితో ఏరో ఇంజిన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా(ఎఇసిసి)ను ఏర్పాటు చేశారు. అది చేపట్టిన అనేక ప్రాజెక్టులలో డబ్ల్యుఎస్‌-15 ఇంజిన్‌ ఒకటి. రెండు సార్లు విఫల పరీక్షల తరువాత ఇటీవలే దాన్ని జయప్రదంగా ఎగురవేశారు. అంతకు ముందే అదే సీరీస్‌లో తక్కువ సామర్ధ్యం కలిగిన ఇంజన్లు తయారు చేసి జె-20 విమానాలకు అమర్చారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న జెట్‌ ఇంజన్లను కూడా వాటికి అమర్చుతున్నారు, జె-20 బాంబరును 2011 నుంచీ నిర్వహిస్తున్నారు.సమర్దవంతమైన స్వంత ఇంజన్లతో నడపటమే తాజా ప్రత్యేకత. ఎక్కడి నుంచైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేసినపుడు రెండు నుంచి ఎనిమిది వరకు ఇంజన్లను అదనంగా కొనుగోలు చేస్తారు. ఖర్చు రీత్యా అన్ని దేశాలు ఇలా చేయలేవు. ఇంజన్లు విడిగా కావాలంటే తమ సుఖోయి-35 ఫైటర్‌ జెట్‌లను ఎక్కువగా కొనుగోలు చేయాలని రష్యా షరతు పెట్టింది. అందువలన ఎల్ల వేళలా దాని మీద ఆధారపడటం సాధ్యం కాదని చైనా భావించింది. జూన్‌ 28న ఎగిరిన జె-20 బాంబరుకు ఒక కొత్త ఇంజను, మరొక పాత ఇంజను అమర్చారు. ఒకటి విఫలమైతే రెండవది పని చేస్తుంది. పరీక్షలో నిగ్గుతేలినప్పటికీ ఇంకా అనేక పరీక్షలు, మెరుగుపరచిన తరువాతే ఆ ఇంజన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తారని చైనా మాజీ సైనికాధికారి సాంగ్‌ ఝోంగ్‌పింగ్‌ చెప్పాడు.


ఈ ఏడాది ప్రారంభంలో ఒక చైనా పత్రికలో రాసిన విశ్లేషణలో తమ జె -20 ఐదవ తరం బాంబరు అమెరికా తయారీ ఎఫ్‌ – 35, ఎఫ్‌ -22 కంటే ఉన్నతమైనదని పేర్కొన్నారు. ఒక ఉదంతంలో తూర్పు చైనా సముద్రంలో చైనా-అమెరికా విమానాలు చాలా దగ్గరగా వచ్చాయి. ఆ సందర్భంగా అమెరికన్‌ పైలట్లు చైనా విమానాన్ని చూసి ప్రభావితులైనట్లు అమెరికా పసిఫిక్‌ ఎయిర్‌ఫోర్సు కమాండర్‌ జనరల్‌ కెనెత్‌ విల్స్‌బాచ్‌ చెప్పిన మాటలను ఆ పత్రిక ఉటంకించింది. నవీకరణ అవసరాన్ని గురించి చెప్పేటపుడు చైనా ఆయుధ వ్యవస్థల గురించి అటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారని వాటిని పట్టించుకోనవసరం లేదని కొందరు కొట్టిపారవేశారు. కానీ విమానం ఎగిరిన తీరు చూస్తే దాని కంట్రోలు వ్యవస్థలు సక్రమంగానే ఉన్నట్లు కనిపిస్తోందని, గతంలో ఈ మాత్రం కూడా తెలియలేదనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. ీ చైనా విమానం గురించి సమాచారం పెద్దగా తెలియదంటూనే అమెరికా పత్రికల్లో రెండింటి గురించి విశ్లేషణలు చేస్తున్నారు.


జె-20 విమాన సామర్ధ్యం గురించి పశ్చిమ దేశాలు నిర్ధారణకు రాలేకపోతున్నాయి. ఒక వేళ చైనా వాటిని వినియోగంలోకి తెస్తే ఎఫ్‌ 22తో చైనాను ఢకొీట్టగలమా, తగినన్ని అందుబాటులో ఉన్నాయా అని తర్జనభర్జన పడుతున్నాయి. చైనా డబ్ల్యుఎస్‌-15 జెట్‌ ఇంజన్‌ ఉత్పత్తి ఆలశ్యం అవుతున్నదని గతంలో వార్తలు వచ్చాయి. 2019 చివరి నాటికే 50 జె-20 విమానాలను చైనా తయారు చేయనుందని పశ్చిమ దేశాలు అంచనా వేశాయి. ఒక వేళ 50 లేదా వంద తయారు చేసినా అమెరికా వద్ద ప్రస్తుతం ఉన్నవాటి కంటే చాలా తక్కువ అని, లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ నివేదిక ప్రకారం 195 ఎఫ్‌-22 విమానాలను ఇప్పటికే అంద చేయగా వాటిలో 186పోరుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపున వికీపీడియా సమాచారం ప్రకారం చైనా వద్ద జె-20 విమానాలు మూడు రకాలు 210కి పైగా ఉన్నాయి. ఇలాంటి బాంబర్లను అమెరికా తరువాత చైనా మాత్రమే రూపొందించింది. తాజా సమాచారం ప్రకారం 2023లో లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ 147 నుంచి 153 ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్లను తన ఖాతాదార్లకు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది, అయితే వాటిలో 50 వరకు ఈ ఏడాది తయారుకాకపోవచ్చునని బల్గేరియన్‌ మిలిటరీ డాట్‌ కామ్‌ జూలై 22న పేర్కొన్నది. ఇదే సమయంలో చైనా జె-20 ఉత్పత్తి ఏడాదికి 120 మించనున్నదని కూడా తెలిపింది. ఎఫ్‌-35ఏ, సి రకాల బాంబర్లు నాలుగు నుంచి ఆరు క్షిపణులను, అదే జె-20 ఎనిమిది క్షిపణుల వరకు మోసుపోగలదని కూడా ఆ వార్తలో పేర్కొన్నారు.
అమెరికా, జపాన్‌ ఇతర సామ్రాజ్యవాదుల నుంచి తమకు ఎప్పుడైనా ముప్పు తప్పదని కమ్యూనిస్టు చైనా తొలి నుంచీ భావిస్తూనే ఉంది. దానికి ఆధునిక పరిజ్ఞానం అందనివ్వకూడదని రష్యాతో పాటు పశ్చిమ దేశాలు కూడా చూస్తున్నాయి. దాన్ని సవాలుగా తీసుకొని కసితో చైనా ముందుకు పోతోంది. రష్యా నుంచి యుద్ధ విమానాల ఇంజన్లు కొనుగోలు చేస్తూనే స్వంత తయారీకి పూనుకుంది. 2031 నాటికి పదేండ్ల క్రితం ఉన్న వాటి కంటే 5,260 ప్రయాణీకుల విమానాలు, 2,400 బిజినెస్‌ జెట్‌లు అవసరమని వాటికిగాను 16 వేల ఇంజన్లు అవసరమని అంచనా వేశారు.


స్టాక్‌హౌమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) 2022 వార్షిక నివేదికలో ప్రపంచంలో మిలిటరీ ఖర్చు కొత్త రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నది. అంతరిక్షం, సైబర్‌ రంగాలలో అమెరికా ముందున్నందున మిగిలిన దేశాలతో పాటు చైనా కూడా తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటున్నది. సైబర్‌ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్‌ అని చైనా వర్ణిస్తున్నది. చైనా రూపొందిస్తున్న సైబర్‌ ఆయుధాలతో ఉపగ్రహాలను కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చని సిఐఏ తన నివేదికలలో పేర్కొన్నది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్‌ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా రష్యా సేనల గురించి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ మిలిటరీ ఖర్చు 2021తో పోల్చితే 2022లో 3.7శాతం పెరిగింది. డాలర్లలో 2022 ఖర్చు 2,240బిలియన్లు, ఇది ప్రపంచ జిడిపిలో 2.2శాతం. మొత్తం ఖర్చులో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాల వాటా 63శాతం. అమెరికా 39, చైనా 13, రష్యా 3.9,భారత్‌ 3.6, సౌదీ 3.3శాతం చొప్పున కలిగి ఉన్నాయి. ఇక రష్యా ఖర్చు దాని జిడిపిలో ఒక ఏడాది కాలంలో 3.7 నుంచి 4.1శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఉక్రెయిన్‌ ఖర్చు 640శాతం పెరిగి జిడిపిలో 3.2 నుంచి 34శాతానికి పెరిగింది. దక్షిణ చైనా సముద్రం గురించి అమెరికా లేవనెత్తుతున్న వివాదం, తైవాన్‌పై చైనాను రెచ్చగొడుతున్న కారణంగా ఈ ప్రాంతంలోని అనేక దేశాలు ఆయుధాల కొనుగోలుకు పూనుకున్నాయి.


అమెరికా రక్షణ ఖర్చు 877 బి.డాలర్లతో పోలిస్తే చైనా 292 బి.డాలర్లు తక్కువే. ఆత్మరక్షణ సిబ్బంది తప్ప మిలిటరీ ఖర్చు లేదని చెప్పుకొనే జపాన్‌ ఖర్చు 46బి.డాలర్లకు చేరింది.దక్షిణ కొరియా 46.4బి.డాలర్లకు పెరచింది.ఈ రెండు దేశాలూ అమెరికా రక్షణలో ఉన్నాయి. మన దేశం 2021తో పోలిస్తే మరుసటి ఏడాది ఖర్చు(81.4బి.డాలర్లు) ఆరుశాతం పెంచినట్లు సిప్రి పేర్కొన్నది. స్టాక్‌హౌం సంస్థ పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం ప్రపంచంలో 40దేశాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. వాటిలో మన దేశం మూడవ స్థానంలో ఉండగా మన పొరుగునే ఉన్న పాకిస్తాన్‌ 10.3 బి.డాలర్లతో 24వదిగా ఉంది. తలసరి మిలిటరీ ఖర్చును డాలర్లలో చూస్తే అమెరికా 2,240,చైనా 163, శ్రీలంక 116, పాకిస్తాన్‌ 50, మయన్మార్‌ 48, భారత్‌ 43,బంగ్లాదేశ్‌ 27, నేపాల్‌ 7 చొప్పున ఖర్చు చేస్తున్నది. అమెరికా, ఇతర ధనిక దేశాల కూటమి ప్రపంచాన్ని ఉద్రిక్తతల వైపు నడిపిస్తూ వినాశనం వైపు నడిపిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇది ఎన్నికల ఏడాది : కాషాయ గోబెల్స్‌ దళం రెచ్చిపోతుంది జర జాగ్రత్త !

23 Sunday Jul 2023

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

BJP, FDI, India's outward FDI, Joseph Goebbels, Narendra Modi Failures, Nazi Joseph Goebbels, RBI data, RSS, saffron brigade hypocrisy


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? కేంద్ర ప్రభుత్వ, పాలకపక్ష భజనరాయుళ్లు ఏమి చెబుతున్నారో బేరీజు వేసుకొని చూడకపోతే జనం మోసపోతూనే ఉంటారు. బుద్ది జీవులు తమ మెదళ్లు, రాతలకు పదును పెట్టాల్సి ఉంది. ఎన్నికల సంవత్సరం గనుక అవాస్తవాలు, అతిశయోక్తులు, అర్థ సత్యాలను జనం ముందు కుమ్మరిస్తారు, కాషాయ దళాలు గోబెల్స్‌ ప్రచారంతో వాట్సాప్‌ను నింపేస్తారు. దానిలో భాగంగానే గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో పెట్టుబడులు,నవకల్పనలో ముందు పీఠీన ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో జూలై 21న అమరజిత్‌ వర్మ అనే పరిశోధకుడు రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు. కియర్‌నే డాట్‌ కామ్‌ నివేదిక ప్రకారం అగ్రశ్రేణిలో ఉన్న పాతిక దేశాల ఎఫ్‌డిఐ కాన్ఫిడెన్స్‌(విశ్వాస) సూచిక జాబితాలో 2020,21,22 సంవత్సరాల్లో మన దేశానికి చోటు లేదు. అంతకు ముందు 2017లో ఎనిమిది,2018లో 11, 2019లో 16వ స్థానాల్లో ఉన్నది. 2023 సూచిక ప్రకారం 16వ స్థానంలో ఉంది.2022లో పదవ స్థానంలో ఉన్న చైనా 2023లో ఏడవ స్థానానికి చేరింది. ఇక నవకల్పనలు అనేవి పరిశోధన-అభివృద్ది రంగాలలో పెట్టే పెట్టుబడులను బట్టి ఉంటాయి.2013లో ఈ సూచికలో మన దేశం 66వది కాగా 2022లో 40వ స్థానంలో ఉంది.(ఆర్గనైజర్‌ పత్రిక విశ్లేషకుడు 2015లో ఉన్న 81వ స్థానాన్ని తీసుకొని 2022లో 40వదిగా ఉందంటే మోడీ పాలనలో ఎంత పెరిగిందో చూడండని జనాన్ని నమ్మించేందుకు చూశారు) ఇదే కాలంలో చైనా 35 నుంచి 11వ స్థానానికి ఎదిగింది. ఈ సూచికలు స్థిరంగా ఉండవు, ఏడాదికేడాది మారుతుంటాయి. ధోరణి ఎలా ఉందన్నదే గీటురాయి.

మన దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల పెట్టుబడులను 2007 నాటికి జిడిపిలో రెండుశాతానికి పెంచాలని 2003లో నాటి వాజ్‌పాయి సర్కార్‌ విధాన పత్రంలో పేర్కొన్నది. తరువాత 2013లో యుపిఏ ప్రభుత్వం 2018 నాటికి ఆ మేరకు పెంచాలని గడువు పెంచింది. దాన్ని నరేంద్రమోడీ సర్కార్‌ 2020 విధాన పత్రంలో 2030 సంవత్సరంగా పేర్కొన్నారు. ఇక ఆచరణను చూద్దాం. ప్రపంచ బాంకు 2022 అక్టోబరు 24న తాజా పరిచిన సమాచారం ప్రకారం 1996లో మన దేశం ఈరంగానికి చేసిన ఖర్చు జడిపిలో 0.64శాతం.2004లో 0.76, 2008లో 0.86, 2014లో 0.7, 2018లో 0.66, 2023లో 0.7శాతం ఉంది. ప్రపంచ సగటు 1.8లో సగం కూడా మన దేశం ఖర్చు చేయటం లేదు. ఇంత తక్కువగా ఉండటానికి కార్పొరేట్‌ రంగం తగినంత ఖర్చు చేయకపోవటమే అని చెబుతున్నారు. (2023 ఫిబ్రవరి 24, హిందూ వార్త)


సులభతర వాణిజ్యం పేరుతో భారీ మొత్తంలో ఇచ్చిన పన్ను రాయితీల కారణంగా గతంతో పోలిస్తే ఎఫ్‌డిఐలు పెరిగాయి. వాటి మాదిరి మన పారిశ్రామిక ఉత్పత్తి లేదా వస్తు ఎగుమతులు పెరగలేదు. ఆత్మనిర్భరత గురించి ఊదరగొడుతున్నారు.ఉత్పాదకతతో ముడిపెట్టిన బోనస్‌ పధకం (పిఎల్‌ఐ) పెద్ద ఎత్తున విజయవంతమైందని, 14 రంగాలలో రు.2.74లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ పధకం 2020లో ప్రారంభమైంది. ఆరు సంవత్సరాల కాలంలో రు.1.9లక్షల కోట్ల మేర సబ్సిడీకోసం పక్కన పెట్టినట్లు చెప్పారు. దీని కింద 2023 మార్చి నాటికి రు.3,400 కోట్లు తమకు చెల్లించాలని కొన్ని కంపెనీలు కోరగా రు.2,900 కోట్లు చెల్లించారు. ఈ పధకం కింద ఇచ్చే సబ్సిడీతో ఉత్పాదక రంగానికి పెద్ద ఊపు వస్తుందని చెప్పారు. ఆపిల్‌ ఫోన్ల అసెంబ్లింగ్‌ను ఒక విజయగాధగా చెబుతున్నారు. దాని వెనుక ఉన్న అసలు కథేంటి ? వివిధ దేశాల్లో ఉత్పత్తి చేసిన విడి భాగాలను దిగుమతి చేసుకొని మన దేశంలో వాటిని ఒక దగ్గర కూర్చటం తప్ప అది ఉత్పత్తి చేసేది కాదు. ఆ ఫోన్లను మన మార్కెట్లో, విదేశాలకూ ఎగుమతి చేస్తున్నది. ఉదాహరణకు మన దేశంలో అసెంబ్లింగ్‌ చేసిన అలాంటి ఒక ఫోను విలువ రు. పదివేలు అనుకుందాం. దానిలో తొమ్మిదివేల విలువ గల విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని మన దేశంలో ఉత్పత్తి అవుతున్న విడి భాగాల విలువ మరొక వెయ్యి జత చేసిందనుకుందాం. దాన్ని రు.200 లాభంతో అమ్మింది, లేదు ఎలాంటి లాభం లేకుండా అసలు ధరకే అమ్మిందనుకుందాం. పిఎల్‌ఐ పధకం కింద మన ప్రభుత్వం ఐదు శాతం సబ్సిడీ ఇస్తే ఒక ఫోను మీద రు.500 లాభం వచ్చినట్లే. ఆ మేరకు ఇతర దేశాల్లో ధర తగ్గించి ఇతర ఫోన్‌ కంపెనీలను వెనక్కు నెట్టవచ్చు. ఇంత లాభసాటిగా ఉన్నపుడు చైనా నుంచో మరొక చోట నుంచో కంపెనీలు మన దేశానికి ఎందుకు రావు, అసెంబ్లింగ్‌ కేంద్రాలను ఎందుకు ప్రారంభించవు. ఈ పధకం కానసాగినంత కాలం ఇక్కడ ఉంటాయి. తరువాత వేరే చోటకు వెళతాయి.


మన దేశంలో పరిశ్రమలకు ఊపు నిచ్చే రాయితీలు ఆత్మనిర్భర పధకంతో మాత్రమే ప్రారంభం కాలేదు. 1991 నుంచి నూతన ఆర్థిక విధానాల పేరుతో అనేక రాయితీలు ఇచ్చారు, అనుకూల విధానాలు తీసుకువచ్చారు. దీని వలన వచ్చిన ఫలితాలను చూస్తే జిడిపిలో పారిశ్రామిక సంబంధిత సెకండరీ సెక్టర్‌ వాటా 1991-92లో ఉన్న 24.7 నుంచి 27.3 శాతానికి 2019-20 సంవత్సరం నాటికి పెరిగింది. ఇప్పుడు 24శాతం ఉంది. మనవంటి దేశాల్లో ఉత్పాదక రంగం గణనీయంగా పెరగాల్సి ఉంది. జిడిపిలో సెకండరీ సెక్టర్‌లో భాగమైన ఉత్పాదక రంగ వాటా 17శాతం దాటటం లేదు. పిఎల్‌ఐ పధకం వలన ఉత్పత్తి పెరుగుతుందన్నది నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ సబ్సిడీ పొందేందుకు బడాకంపెనీలతో చిన్న సంస్థలు పోటీపడలేవు. దాంతో అవి మూతపడతాయి. అసెంబ్లింగ్‌ రంగంలో యాంత్రీకరణ, రోబోలు రంగంలోకి వస్తున్నందున కార్మికులకు ఉపాధికూడా పరిమితమే. ఉన్నది కూడా ఊడిపోతుంది. అందుకే ఉపాధి రహిత వృద్ధి అని చెప్పాల్సి వస్తున్నది. దీనితో పాటు పెద్ద మొత్తంలో పన్ను తగ్గింపు కారణంగా ఇటీవలి సంవత్సరాల్లో మనదేశ కార్పొరేట్ల లాభాలు పెరిగాయి, వాటాదార్లకు క్రమం తప్పకుండా డివిడెండ్లు ఇస్తున్నాయి. అందుకే విదేశీ మదుపుదార్లు మన వాటాల మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా వచ్చే డాలర్లను చూపి అది తమ ఘనతే అని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. స్టాక్‌మార్కెట్ల సూచీలు, కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. దీన్ని తాము సాధించిన వృద్ధికి ప్రతీక అని బిజెపి చెబుతోంది. ఈ సూచికలు పెరిగినట్లుగా ఎగుమతులు, ఉపాధి సూచికలు ఎందుకు లేవో చెప్పదు. ఉపాధి రహిత వృద్ధి వలన సమాజంలో గిరాకీ తగ్గుతుంది. వస్తువుల కొనుగోలు తగ్గితే ఎన్నిరాయితీలు ఇచ్చినా ఉత్పత్తి చేసేందుకు ఎవరూ ముందుకురారు. దాంతో వృద్ధి రేటు తగ్గుతుంది. అది కొత్త సమస్యలను సృష్టిస్తుంది. దీన్ని మూసిపెట్టేందుకే కేంద్రంలోని మోడీ సర్కార్‌ గారడీలు చేస్తున్నది.


వందకు రు.30 పెట్టుబడి పెట్టించి రు.70 సబ్సిడీ ఇచ్చి ఇరవై రెండువేల కోట్లకు అమెరికా కంపెనీ మైక్రాన్ను అధిపతిగా చేసిన ప్రధాని నరేంద్రమోడీ నిర్వాకాన్ని దేశం ఇటీవలనే చూసింది. మేడ్‌లేదా మేకిన్‌ ఇండియా బదులు ప్యాకిన్‌ ఇండియా సంస్థను పెట్టించేందుకు, అదీ గుజరాత్‌లో ఏర్పాటుకు అమెరికా వెళ్లి మరీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటిదే 70శాతం సబ్సిడీని (దాదాపు లక్షా పాతికవేల కోట్లు) జేబులో వేసుకొనేందుకు చూసిన వేదాంత-ఫాక్స్‌కాన్‌ కంపెనీకి సెమీకండక్టర్లను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో చివరకు దాన్ని రద్దు చేసుకున్నది. తాజా వార్త ఏమంటే మనదేశ కంపెనీ టాటా సన్స్‌ బ్రిటన్‌లో 5.2బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ కార్ల బాటరీలను తయారు చేసేందుకు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అదే కంపెనీ మనదేశంలో పెట్టకుండా అక్కడికి ఎందుకు పెట్టుబడులను తరలిస్తున్నట్లు అన్నది ప్రశ్న.అది 2026 నాటికి మేడిన్‌ బ్రిటన్‌ పేరుతో ఉత్పత్తి ప్రారంభిస్తుందని, నాలుగువేల మందికి నేరుగా పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు కూడా వెల్లడించారు. అది ఐరోపాలోనే అతి పెద్ద సంస్థగా ఉంటుందని, ఏటా 40గిగావాట్‌ గంటల బాటరీలను ఉత్పత్తి చేస్తుందని, తమ దేశ అవసరాల్లో సగం తీరుస్తుందని బ్రిటన్‌ ఇంథన భద్రతా శాఖ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ చెప్పాడు. టాటా కంపెనీకి బ్రిటన్‌ సర్కార్‌ పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ వివరాలు వెల్లడించలేదు.


ఒక దేశం నుంచి మరొక దేశానికి పెట్టుబడులు వెళ్లటం ఒక సాధారణ అంశంగా మారింది. తొలిసారిగా ప్రధాని పదవిలోకి వచ్చినపుడు విదేశాలకు తరచూ ఎందుకు వెళుతున్నారన్న ప్రశ్నకు కాంగ్రెస్‌ ఏలుబడిలో దిగజారిన దేశ ప్రతిష్టను తిరిగి తెచ్చేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అని మోడీ మద్దతుదార్లు చెప్పారు. మరోవైపు మోడీ అధికారానికి వచ్చిన తరువాత మనదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు పెరిగాయి. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడికి చీమలు చేరినట్లు ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పెట్టుబడి పరుగులు తీస్తుంది తప్ప ఒక నేత పలుకుబడిని బట్టి ఉండదు.నరేంద్రమోడీ ప్రపంచ నేత అని అందరూ కీర్తిస్తున్నారని, ఎక్కడకు వెళ్లినా బ్రహ్మరధం పడుతున్నారని భక్తులు తన్మయత్వంతో ఊగిపోతారు. అంత పలుకుబడి ఉంటే టాటా కంపెనీ బ్రిటన్‌లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? ఫాక్స్‌కాన్‌ ఎందుకు తప్పుకుంది ? ఐరాస సంస్థ ఆంక్టాడ్‌ సమాచారం ప్రకారం 2004లో మనదేశానికి ఐదువందల కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తే 2021లో అవి 8,300 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో మనదేశం నుంచి విదేశాలకు వెళ్లిన పెట్టుబడులు 200 నుంచి 1,500 కోట్ల డాలర్లకు చేరాయి. చైనా నుంచి కూడా పెట్టుబడులు పెద్ద మొత్తంలోనే ఇతర దేశాలకు వెళుతున్నాయి. అది ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది, ఆక్రమంలో పెట్టుబడులు తరలాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టకపోతే అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులు జరగకపోవటం వంటి అనేక షరతులు, ఆటంకాల పూర్వరంగంలో అది జరిగింది. మన దేశం కూడా మోడీ చెప్పినట్లు గుజరాత్‌ నమూనాను దేశమంతటా విస్తరించి చైనాను వెనక్కు నెట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా మారి ఉన్నా, ఆ దిశలో ప్రగతి ఉన్నా టాటా వంటి కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లాయంటే అర్ధం చేసుకోవచ్చు.


మనదేశం నుంచి వెళుతున్న పెట్టుబడుల గురించి రిజర్వుబాంక్‌ ఇచ్చిన వివరాల ప్రకారం 2007 నుంచి 2021వరకు 68 శాతం పెట్టుబడులు విదేశాల్లో ఉన్న ద్రవ్య సంబంధ కేంద్రాలకు వెళుతున్నాయి. వాటి వలన మనదేశానికి సాంకేతిక పరిజ్ఞానం, మరొకటో ఏమీ రాదు. పన్నులు తక్కువగా ఉండే సింగపూర్‌, మారిషస్‌, బెర్ముడా, కేమాన్‌ ఐలండ్స్‌, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, నెదర్లాండ్స్‌ వంటి వాటికి 51శాతం వెళుతున్నాయి. ఈ దేశాలు, ప్రాంతాల్లో నమోదైన కార్పొరేషన్ల మీద అక్కడి ప్రభుత్వాలు నామమాత్ర పన్ను లేదా కొన్ని సార్లు అసలు పన్నే లేకుండా అనుమతిస్తాయి, అంటే పన్నులను తప్పించుకొనేందుకే అన్నది స్పష్టం. ఈ నిధులు చివరికి ఎక్కడికి చేరుతున్నదీ తెలియటం లేదు. హిండెన్‌బర్గ్‌ నివేదికలో ఇలాంటి డొల్ల కంపెనీలతో లావాదేవీల గురించి ఉంది. మారు పేర్లతో ఎక్కడి నుంచి వచ్చాయో ఆ దేశాలకే విదేశీ పెట్టుబడుల పేరుతో వచ్చి రాయితీలు పొందుతున్నాయి. అక్కడున్న డొల్ల కంపెనీలకు అధికారికంగా లేదా అక్రమ పద్దతుల్లో పెట్టుబడులు చేరుతున్నాయి. నల్లధనం తెల్లధనంగా మారుతున్నది. మన దేశానికి 2000 నుంచి 2023లో ఇప్పటి వరకు వచ్చిన విదేశీ పెట్టుబడులను చూస్తే మారిషస్‌ నుంచి 26, సింగపూర్‌ 23 అంటే రెండు చోట్ల నుంచే 49శాతం వచ్చాయి. దీని వలన మన ఖజానాకు ఎంతో నష్టం జరుగుతోంది. మన ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు విదేశాలకు వెళ్లిన పెట్టుబడులను ఉపయోగిస్తున్నారనేది కూడా స్పష్టంగా తెలియదు. మన దేశం నుంచి వెళుతున్న పెట్టుబడులతో కొన్ని దేశాల్లో అప్పటికే ఉన్న సంస్థల కొనుగోలు లేదా విలీనాలకు పూనుకుంటున్నారు. ఇదంతా సదరు కంపెనీల మార్కెట్‌ విస్తరణ, లాభాలను పెంచుకొనేందుకు తప్ప మన దేశంలో ఉపాధి కల్పించేందుకు ఏమాత్రం తోడ్పడదు. ఆర్థిక వ్యవహారాల కేంద్ర ప్రభుత్వ శాఖ సమాచారం ప్రకారం మనదేశం విదేశాల్లో నేరుగా పెట్టిన పెట్టుబడుల మొత్తం 2021-22లో 17.53 బిలియన్‌ డాలర్లు కాగా అత్యంత ధనిక దేశమైన అమెరికా పెట్టిన పెట్టుబడులు 12.1 బి.డాలర్లు మాత్రమే. అక్కడి సంస్థలు పన్నులను తప్పించుకొనేందుకు మారిషస్‌ వంటి పన్నులు లేని చోట్ల నుంచి పెట్టుబడులు పెడతాయి. భారీ మొత్తాల్లో సబ్సిడీలు ఇచ్చి పాకింగ్‌ కంపెనీలను తెస్తున్న నరేంద్రమోడీ బాటరీలను ఉత్పత్తి చేసే టాటా కంపెనీ బ్రిటన్‌ ఎందుకు వెళ్లిందో మన జనాలకు చెప్పాలా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి క్లస్టర్‌ బాంబులు-మరో మలుపు తిరిగిన సంక్షోభం !

19 Wednesday Jul 2023

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

cluster munitions, Joe Biden, Ukraine crisis, US Cluster Munitions, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


శాంతి నెలకానాల్సిన చోట మరింత అశాంతి తలెత్తేలా జో బైడెన్‌ సర్కార్‌ ఉక్రెయిన్‌కు క్లస్టర్‌ బాంబులు పంపింది. సంక్షోభాన్ని మరింత తీవ్రతరం కావించేందుకు, రష్యా మీద మరిన్ని ఆంక్షలతో నష్టపరిచేందుకు నాటో కూటమి పూనుకుంది. దానికి ప్రతిగా దాడులను మరింత తీవ్రం గావించటంతో పాటు, ఉక్రెయిన్నుంచి నల్లసముద్రం ద్వారా జరుగుతున్న ధాన్య ఎగుమతుల ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంది. ఆదివారంతో ముగిసిన ఒప్పందాన్ని అది పొడిగించలేదు. దీంతో 45 దేశాలకు ఉక్రెయిన్‌ ధాన్య ఎగుమతులపై అనిశ్చితి ఏర్పడింది.నౌకలకు భద్రత లేనందున రవాణా నిలిచిపోనుంది. గత ఏడాది టర్కీ చొరవతో ఐరాస మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం మేరకు ఉక్రెయిన్‌ రేవుల దిగ్బంధనాన్ని రష్యా ఎత్తివేసింది. దానికి ప్రతిగా తమ ఆహార ధాన్యాలు, ఎరువుల ఎగుమతులపై పశ్చిమ దేశాలు ఆంక్షలను తొలగించలేదని పుతిన్‌ విమర్శించాడు.మూడు ఉక్రెయిన్‌ రేవుల నుంచి వివిధ దేశాలకు 3.28 కోట్ల టన్నుల గోధుమలు,ఇతర ధాన్యాలు, పొద్దుతిరుగుడు పువ్వుల నూనె ఎగుమతి జరిగింది. వీటిలో 46శాతం ఆసియా, 40శాతం పశ్చిమ ఐరోపా, 12శాతం ఆఫ్రికా, రెండు శాతం తూర్పు ఐరోపా దేశాలకు వెళ్లాయి. దాంతో గత ఏడాది మార్చి నుంచి ఇటీవలి వరకు ప్రపంచ మార్కెట్లో ఆహార ధరలు 23శాతం వరకు తగ్గినట్లు తేలింది. తిరిగి పరిస్థితి మొదటికి రావటంతో సోమవారం నాడు చికాగో మార్కెట్లో గోధుమల ముందస్తు ధర 3.5శాతం పెరిగింది. వెంటనే ఒప్పంద పునరుద్దరణ జరగకపోతే భారత్‌తో సహా అనేక దేశాల మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఒప్పందాన్ని కొనసాగించలేదనే ఆగ్రహంతో క్రిమియా ద్వీపాన్ని రష్యా ప్రధాన భూ భాగాన్ని కలిపే వంతెన పేల్చివేసేందుకు ఉక్రెయిన్‌ దాడిజరిపింది. పాక్షికంగా దెబ్బతిన్న వంతెనను వెంటనే రాకపోకలకు పునరుద్దరించినటు పుతిన్‌ సర్కార్‌ ప్రకటించింది. దీనికి ప్రతిగా భారీ ఎత్తున నల్లసముద్రంలోని రేవు, ఉక్రెయిన్‌ ఇతర ప్రాంతాల మీద రష్యా పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరుపుతున్నట్లు మంగళవారం నాడు వార్తలు వచ్చాయి. తమ తూర్పు ప్రాంతంలో పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నప్పటికీ తమ అదుపులోనే ఉందని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి చెప్పాడు. లక్ష మందికి పైగా మిలిటరీ, తొమ్మిది వందలకు మించి టాంకులను రష్యా మోహరించిందని అన్నాడు.


మానవ హక్కుల బృందాలు విమర్శించినా ఖాతరు చేయకుండా నిషేధిత క్లస్టర్‌ బాంబులను ( పలు రకాల బాంబుల గుత్తి ) ఉక్రెయిన్‌కు సరఫరా చేసి సంక్షోభాన్ని ప్రమాదకర మలుపు తిప్పేందుకు అమెరికా పూనుకుంది. ఎనభై కోట్ల డాలర్ల విలువగల పాకేజ్‌లో భాగంగా ఇప్పటికే వాటిని అక్కడకు తరలించింది. ఒక వేళ వాటిని తమ మీదకు వదిలితే తాము కూడా ప్రయోగించేందుకు తమ వద్ద భారీగా నిల్వలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించాడు. ఒక రష్యా జర్నలిస్టుతో మాట్లాడినపుడు ఈఅంశాన్ని చెప్పాడు. గతంలో అమెరికా వీటిని ప్రయోగించిన ప్రాంతాలలో జరిగిన ప్రాణ నష్టం, వనరుల విధ్వంసం కారణంగా వాటిని నిషేధించారు. కొన్ని సందర్భాలలో కొన్ని బాంబులు పేలవు. వాటి గురించి తెలియక ఎవరైనా ముట్టుకుంటే సంవత్సరాల తరువాత కూడా మందుపాతరల మాదిరి పేలే ముప్పు ఉంది. గగనతలం నుంచి విమానాలు, భూమి, సముద్రాల మీద నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు. గతంలో ఇవి పేలినపుడు మరణించిన వారిలో 94శాతం మంది పౌరులు కాగా 40శాతం మంది పిల్లలు ఉన్నారు. వీటిని రూపొందించే పద్దతిని బట్టి ఒక్కో గుత్తిలో కొన్ని డజన్ల నుంచి గరిష్టంగా ఆరువందల బాంబులను అమర్చవచ్చు. తక్కువ మంది మిలిటరీ, పరిమితమైన విమానాలు, ఓడలు, రాకెట్‌ వాహనాలతో భారీ నష్టం కలిగించవచ్చు.


ఈ బాంబులను రకరకాలుగా రూపొందిస్తున్నారు. మామూలుగా ఒక బాంబును వేస్తే ఒక చోటే నష్టం కలిగిస్తుంది. కానీ ఈ గుత్తి బాంబు వేసిన తరువాత అది అనేకంగా విడిపోయి విసృత ప్రాంతంలో పేలుళ్లకు కారణమౌతుంది. మనుషులను చంపటంతో పాటు రోడ్లు,వాహనాలు, విద్యుత్‌ లైన్లు ఇలా ఆ ప్రాంతంలో ఏవి ఉంటే వాటిని ధ్వంసం చేస్తాయి. కొన్ని సందర్భాలలో మానవాళి, పంటలకు ముప్పు కలిగించే జీవ, రసాయనాలతో కూడా బాంబులను రూపొందిస్తున్నారు. యుద్ధం, ఇతర సందర్భాలలో పౌరులను హెచ్చరించేందుకు, బెదిరించేందుకు రూపొందించిన కరపత్రాలను కూడా ఈ బాంబుల ద్వారా వెదజల్లిన ఉదంతాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో ఇవి కలిగించిన అపార నష్టాన్ని చూసిన తరువాత 2008 మే 30వ తేదీన డబ్లిన్‌ నగరంలో 107 దేశాలు వీటి ఉత్పత్తి, వినియోగం, బదిలీ, నిల్వ చేయరాదని ఒక అవగాహనకు వచ్చాయి, అదే ఏడాది డిసెంబరు మూడున ఓస్లో నగరంలో ఒప్పందం మీద సంతకాలు చేశాయి. 2010 ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం 111 దేశాలు సంతకాలు చేసి పార్లమెంట్లలో ఆమోద ముద్ర వేశాయి, మరో పన్నెండు దేశాలు సంతకాలు చేసినా తదుపరి ప్రక్రియను పూర్తి చేయలేదు. మన దేశం, అమెరికా, చైనా, రష్యా, ఉక్రెయిన్‌, పాకిస్తాన్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు ఒప్పందంలో చేరలేదు. నాటోలోని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ వంటి పద్దెనిమిది దేశాలు కూడా ఒప్పందాన్ని అమలు చేస్తున్నవాటిలో ఉన్నాయి. అవి కూడా అమెరికాను నివారించేందుకు పూనుకోలేదు. అయిష్టంగానే తాము ఉక్రెయిన్‌కు అందచేస్తున్నట్లు జో బైడెన్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో దురాక్రమణకు పూనుకున్న నాజీ సేనల మీద 1943లో నాటి సోవియట్‌ కురుస్క్‌ ప్రాంతంలో వీటిని వేసింది. అదే ఏడాది ఇంగ్లాండ్‌లోని గ్రిమ్స్‌బై ప్రాంతం మీద నాజీ సేనలు వెయ్యి బటర్‌ ఫ్లై బాంబులు వేశాయి. ఇండో చైనాను ఆక్రమించుకొనేందుకు పూనుకున్న అమెరికా 1960,70 దశకాల్లో వియత్నాం, లావోస్‌, కంపూచియాల మీద వాటిని వేసింది. ఒక్క వియత్నాం మీదనే 4,13,130 టన్నుల బాంబులు, లావోస్‌ మీద 27 కోట్లు వేసింది. రెడ్‌క్రాస్‌ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం లావోస్‌లోని 17 రాష్ట్రాలలో ఇప్పటికీ ఏటా మూడు వందల మంది చొప్పున అవి పేలి మరణిస్తున్నారు. అక్కడ ఎనిమిది కోట్ల బాంబులు పేలలేదని అంచనా. అవి ఎక్కడ పడిందీ కనుగొనటం ఎంతో కష్టం. ఎప్పుడైనా పేలవచ్చు. 1975-88 సంవత్సరాల్లో మొరాకో మిలిటరీ వీటిని తిరుగుబాటుదార్ల మీద వేసింది.1978లో లెబనాన్‌పై దురాక్రమణ జరిపిన ఇజ్రాయెల్‌ వాటితో దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌-అమెరికా రెండూ కూడా వాటితో దాడులు జరిపాయి. బ్రిటన్‌ 1982 ఫాక్‌లాండ్స్‌ దాడిలో అర్జెంటీనా మీద వేసింది. ఇరాక్‌పై దురాక్రమణ దాడిలో అమెరికా, దాని మిత్ర పక్షాలు 61వేల వైమానిక దాడులలో వీటిని వదిలాయి. బోస్నియాపై 1992-95లో యుగోస్లావ్‌ సేనలు, 1994-96లో చెచెన్‌ తిరుగుబాటుదార్లపై రష్యా,1995లో క్రోషియాపై సెర్బ్‌, 1996-99లో సూడాన్‌ మిలిటరీ దక్షిణ సూడాన్‌ తిరుగుబాటుదార్ల మీద, ఇంకా ఎరిట్రియా, ఇథియోపియా,అల్బేనియా, కొసావా వార్‌లో నాటో సేనలు, జార్జియాపై 2008లో రష్యా,సిరియా, ఎమెన్‌ తదితర చోట్ల కూడా వీటిని వినియోగించారు.


రష్యా ఉక్రెయిన్‌ మీద వేసినట్లు గతంలో నాటో కూటమి ఆధారం లేని ఆరోపణలు చేసింది. తాజాగా అమెరికా వాటిని ఇవ్వటాన్ని సమర్ధించుకొనేందుకు ముందుగానే ఈ ప్రచారం చేసినట్లు దీన్ని బట్టి అర్ధం అవుతోంది. పట్టణాల మీద వీటిని వేయకూడదని రాతపూర్వకంగా ఉక్రెయిన్నుంచి హామీ పొందినట్లు నమ్మించేందుకు అమెరికా చూస్తోంది. కొంత మంది ఇలా అందచేతతో తలెత్తే చట్టపరమైన అంశాల గురించి చర్చలు చేస్తున్నారు. నాటోలోని కొన్ని అమెరికా మిత్రదేశాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. తప్పని చెబుతూనే ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు ఇస్తున్నారు గనుక అర్ధం చేసుకున్నామంటూ సమర్ధించాయి. ఐదు వందల రోజుల సంక్షోభం తరువాత ఎందుకు ఇప్పుడు వీటిని అమెరికా సరఫరా చేస్తున్నది అనే ప్రశ్న తలెత్తటం సహజం. రష్యా అదుపులో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు తాము ప్రతిదాడులు జరుపుతున్నట్లు జెలెనెస్కీ ప్రకటించాడు. దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఎలాంటి పురోగతి లేకపోగా భారీ నష్టాలను చవి చూస్తున్నట్లు వార్తలు. టాంకులు, శతఘ్నులను పెద్ద ఎత్తున నష్టపోయింది. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతాలలో రష్యన్లు భారీ సంఖ్యలో మందుపాతరలను అమర్చినట్లు, కందకాలను తవ్వినట్లు వెల్లడికావటంతో ఉక్రెయిన్‌, నాటో మిలిటరీ అంచనాలు తప్పాయి. వాటిని దాటుకొని ముందుకు పోవటం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవటమే. అందుకే ఆ ప్రాంతాల మీద క్లస్టర్‌ బాంబులను వేయటం తప్ప మరొక మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇవి కందకాల మీద, బహిరంగంగా ఉన్న టాంకులు, శతఘ్నులను పేలుళ్లు జరిపి నష్టపరుస్తాయి. పేలని బాంబులు, వాటితో పాటు జారవిడిచే మందుపాతరలను తప్పించుకొని పుతిన్‌ సేనలు ముందుకు పోవటం కూడా ఇబ్బందే.


క్లస్టర్‌ బాంబులను గతంలో ప్రయోగించిన ప్రాంతాలన్నీ మిలిటరీ, పౌరులు కలసి ఉన్న ప్రాంతాలే కావటంతో అనేక మంది వీటిని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ బాంబులలో రెండు నుంచి నలభై శాతం వరకు పేలే అవకాశం లేదని, చెట్లు, గుట్టలు, బురద ప్రాంతాల్లో పడినవి తరువాత ఎవరైనా వాటిని కదిలించినపుడు లేదా అవేమిటో తెలియని పిల్లలు, ఇతరులు వాటిని ముట్టుకున్నపుడు పేలి ప్రాణాలు తీస్తాయి. తాము ఉక్రెయిన్‌కు పంపిన ఈ బాంబుల్లో పేలనివి 2.35శాతమే ఉంటుందని, ఎంతో మెరుగుపరచిన పరిజ్ఞానంతో రూపొందించినట్లు అమెరికా నమ్మించచూస్తోంది. అయితే దాని రక్షణశాఖ జరిపిన పరీక్షల్లో పేలనివి 14 నుంచి 20శాతం అంతకంటే ఎక్కువే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌కు వాటిని అందించటమంటే అక్కడి సంక్షోభాన్ని మరో మలుపు తిప్పటమే కాదు, తీవ్ర పర్యవసానాలకూ దారి తీస్తుంది. ఉద్రిక్తతలను ఎగదోసే యుద్ధోన్మాదాన్ని ఎండగట్టాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేదరికం మీద పరిహాసం : మన ” దరిద్రపు ” లెక్కలేంటి , మనమెక్కడున్నాం ?

17 Monday Jul 2023

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Uncategorized, Women

≈ 1 Comment

Tags

Anemia, BJP, Multidimensional Poverty Index (MPI), Narendra Modi Failures, Poverty in India, POVERTY LINE IN INDIA, poverty reduction


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ బహుముఖ దారిద్య్ర సూచిక (ఎంపిఐ) 2023 ప్రకారం మన దేశం గడచిన పదిహేను సంవత్సరాలలో 41.5 కోట్ల మందిని దారిద్య్రనుంచి విముక్తి కలిగించినట్లు ప్రకటించారు. ఎందరో ఈ వార్తను చదివి సంతోషించారు. జీవన పరిస్థితులను ”గణనీయం” గా మెరుగుపరచినందున ఈ పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. గత కాంగ్రెస్‌ -వర్తమాన బిజెపి పాలన కలసి ఉంది గనుక, మరీ డబ్బా కొట్టుకుంటే జనం నవ్విపోతారు గనుక కాషాయ దళాలు కాస్త తగ్గి ఉన్నట్లు కనిపిస్తోంది. సున్నా కంటే ఒకటి విలువ ఎంతో ఎక్కువ అన్నట్లుగా దీని గురించి సానుకూల వైఖరితోనే మంచి చెడ్డలను చూద్దాం. ఈ సూచికను ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యుఎన్‌డిపి), ఆక్స్‌ఫర్డ్‌ దారిద్య్ర, మానవ అభివృద్ధి చొరవ (ఓపిహెచ్‌ఐ) సంస్థ ఉమ్మడిగా రూపొందించాయి. ప్రభుత్వాలు అందించిన సమాచారాన్ని విశ్లేషించి వివరాలను వెల్లడించారు. ఇది ఒక్క మన దేశం గురించే కాదు, అన్ని దేశాల గురించీ 2010 ప్రతి ఏటా ఇలాంటి సమాచారాన్ని ప్రకటిస్తున్నారు.వివిధ అంశాల ప్రాతిపదికన జీవన నాణ్యతను లెక్కిస్తున్నారు. మన దేశంలో 2005-06 నుంచి 2019-2021వరకు పదిహేను సంవత్సరాలలో వచ్చిన మార్పు ప్రకారం పోషకాహారం, శిశుమరణాలు, స్కూలు వెళ్లే సంవత్సరాలు, బడికి హాజరు, వంట గాస్‌, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ అందుబాటు, ఇంటివసతి, ఆస్తులు ఎంత మేరకు కలిగి ఉన్నారనేదాని ప్రాతిపదికగా అంచనా వేశారు. 2005-06లో ఇవి లేని వారు దేశ జనాభాలో 55.1శాతం, 2015-16లో 27.7శాతం, 2019-2021లో 16.4 శాతం మంది ఉన్నారని ఎంపిఐ సూచికలో పేర్కొన్నారు. మన దేశంలో 41.5 కోట్ల మంది జీవితాలు మెరుగుపడితే చైనాలో 2010-14 మధ్య 6.9 కోట్ల మంది జీవితాలు మెరుగుపడ్డాయి. ప్రపంచమంతటా 110 దేశాల్లో 110 కోట్ల మంది ఇంకా దారిద్య్రంలో మగ్గుతున్నారు. మన దేశంలో 23 కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఆరుగురిలో ఐదుగురు ఆఫ్రికాలోని సబ్‌ సహారా, దక్షిణాసియాలో ఉన్నారు. ఈ విశ్లేషణలన్నీ కరోనాకు ముందు ఉన్న సమాచారం ప్రాతిపదికగా చేసినవే, ఆ మహమ్మారి కలిగించిన ప్రతికూల ప్రభావం వలన దారిద్య్రంలోకి దిగజారిన వారు ఇంకా పెరిగారని చెబుతున్నారు.


దారిద్య్రం నుంచి ఇంత మంది బయపడ్డారు అన్నది ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు. దీనికి ఆయా దేశాలు నిర్ణయించిన ప్రమాణాలు తప్ప ప్రపంచమంతటికీ వర్తించే ప్రాతిపదిక లేదు. ప్రపంచబాంకు నిర్వహించే దారిద్య్రం, అసమానతల వేదిక – పావర్టీ అండ్‌ ఇనీక్వాలిటీ ప్లాట్‌ఫాం(పిఐపి) విశ్లేషణ ప్రకారం రోజుకు 2.25 డాలర్లు, అంతకంటే తక్కువ వచ్చే వారు మన దేశంలో 2019లో 11.88శాతం ఉన్నారు. త్వరలో మన దేశం చైనాను అధిగమించనుందని అనేక మంది చెబుతున్నారు గనుక, దానితో పోలిక ఎలా ఉందో చూద్దాం. 2017 పిపిపి పద్దతిలో లెక్కించిన మేరకు 2019నాటి వివరాలు. ఆ ఏడాది సగటున ఒక డాలరుకు రు.70 మారకపు విలువ ఉంది.(జూలై 15న ఒక డాలరుకు రు.82గా ఉంది) కనుక ఎవరికి వారు ఆ రోజున ఉన్న విలువ ప్రకారం లెక్కించుకోవచ్చు. ప్రామాణికంగా డాలర్లను తీసుకున్నారు గనుక ఇక్కడ కూడా దాన్నే తీసుకుందాం. విశ్లేషకులు తీసుకొనే రాబడి అంకెలలో స్వల్ప తేడాలుంటే జనాభా శాతాలు ఎలా మారతాయో కూడా చూద్దాం. ప్రపంచ బాంకు పేర్కొన్న ప్రమాణం ప్రకారమే రోజుకు 2.15 డాలర్ల రాబడిని ప్రాతిపదిక తీసుకుంటే 2015 – 2019 కాలంలో దారిద్య్రరేఖకు దిగువ ఉన్న జనాభా మన దేశంలో 18.7 నుంచి 10శాతానికి తగ్గగా చైనాలో 1.2 నుంచి 0.1 శాతానికి తగ్గింది. పిఐపి వేదిక సమాచారం మేరకు దిగువ విధంగా ఉన్నారు.
దేశం××× డాలర్లలో రాబడి×× జ. శాతం ×× డాలర్లలో రాబడి×× జ. శాతం ×× డాలర్లలో రాబడి×× జ. శాతం
భారత్‌ ×× 2.25 ×× 11.88 ×× 3.60 ×× 43.66 ×× 6.95 ×× 84.31
చైనా ×× 2.25 ×× 0.18 ×× 3.70 ×× 3.24 ×× 6.80 ×× 24.34


ఎగువ అంకెలను బట్టి రోజుకు ఎక్కువ సంపాదించే వారు చైనాలో చాల ఎక్కువ మంది ఉన్నారు. రాబడిని బట్టి జీవన ప్రమాణాలు, నాణ్యత ఆధారపడి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. జనాల రాబడితో పాటు ప్రభుత్వాలు అందించే సేవలు కూడా వాటికి తోడౌతాయి. బిజెపి పెద్దలు, కొన్ని మీడియా సంస్థలు మన దేశాన్ని పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌(2016), పాకిస్తాన్‌(2018)లతో పోల్చి చూపటం తెలిసిందే. వాటి స్థితి ఎలా ఉందో కూడా చూద్దాం. అచ్చేదిన్‌ గురించి ప్రతి దేశంలోని పాలకులూ చెప్పే కబుర్లే కనుక ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి వారే పోల్చుకోవచ్చు.
దేశం××× డాలర్లలో రాబడి×× జ. శాతం ×× డాలర్లలో రాబడి×× జ. శాతం ×× డాలర్లలో రాబడి×× జ. శాతం
బంగ్లాదేశ్‌ ×× 2.20 ×× 14.62 ×× 3.65 ×× 51.63 ×× 6.95 ×× 87.43
పాకిస్తాన్‌ ×× 2.15 ×× 4.93 ×× 3.65 ×× 39.84 ×× 6.95 ×× 85.16


దక్షిణాసియాలో మన ఇరుగు పొరుగు దేశాల్లో శ్రీలంక పరిస్థితి మెరుగ్గా ఉంది. మన దేశంలో దారిద్య్రరేఖ గురించి ఎవరికి వారే తమదైన సూత్రీకరణలు చేశారు, భాష్యాలు చెప్పారు. వాటి తీరు తెన్నుల గురించి చూద్దాం. ప్రపంచ బాంకు రోజుకు 1.90 డాలర్లుగా అంతకు ముందు నిర్ణయించిన దానిని 2022లో 2.15 డాలర్లకు పెంచింది. దారిద్య్రరేఖ నిర్ణయానికి అన్ని దేశాల ప్రమాణాలు ఒకే విధంగా లేవని ముందే చెప్పుకున్నాం. మన దేశంలో కూడా వివిధ కమిటీలు భిన్న ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకున్నాయి. అలఫ్‌ు కమిటీ (1979) ప్రతి రోజూ పెద్దవారికి గ్రామాలలో 2,400, పట్టణాలలో 2,100 కాలరీల శక్తి అవసరమని, అందుకు అవసరమైన ఆహారం, దాని ధరలను ప్రాతిపదికగా తీసుకుంది. తరువాత లకడావాలా కమిటీ(1993), టెండూల్కర్‌ కమిటీ(2009), రంగరాజన్‌ కమిటీ (2012)లు దీని గురించి నివేదికలు ఇచ్చాయి. రంగరాజన్‌ కమిటీ పట్టణాల్లో రోజుకు తల ఒక్కింటికి నెలకు రు.1,407, గ్రామాలలో రు.972 ఖర్చును దారిద్య్రరేఖ నిర్ధారణకు ప్రామాణికంగా తీసుకుంది.


మన దేశంలో దారిద్య్రానికి కారణాలుగా దిగువ వాటిని పేర్కొంటున్నారు. జనాభా పెరుగుదల నిరంతరం జరుగుతున్నది, దానికి అనుగుణంగా వస్తు వినియోగ డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉండటం. దీనికి కారణం కమతాలు చిన్నవిగా ఉండటం, రైతులకు పెట్టుబడి లేమి, నూతన సాంకేతిక పద్దతుల గురించి తెలియని తనం, సాంప్రదాయ పద్దతుల్లోనే సాగు, వృధాను అరికట్టలేకపోవటం, దీని వలన జీవన ప్రమాణాలు పెరగటం లేదు అని చెబుతున్నారు. వనరులను సమర్ధవంతంగా ఉపయోగించకపోవటం, ఆర్థిక వృద్ధి తక్కువగా ఉండటం, పెట్టుబడుల లేమి, ధరల పెరుగుదల,నిరుద్యోగం, వారసత్వం, కుల వ్యవస్థ కూడా కారణాలుగా పేర్కొంటున్నారు. ఇవి నాణానికి ఒక వైపు మాత్రమే.ఈ అంశాల పరిష్కారానికి పాలకులు అనుసరించిన దివాలా కోరు విధానాలు అసలైన కారణాలు. ఆపరేషన్‌ అవసరమైన చోట పూత మందులు పూసి చికిత్స చేసినట్లుగా అనేక ఉపశమన పథకాలను అమలు జరిపినా ఫలితం ఉండటం లేదు. పరిమితమైన మెరుగుదలను చూపి మొత్తం దారిద్య్రం నుంచి జనాలను బయటపడవేసినట్లు చెబుతున్నారు. దానికి జీవన ప్రమాణాలు మెరుగుపడినట్లు అందమైన పేరు. ప్రపంచ బాంకు చెప్పినట్లు రోజుకు 2.15 డాలర్లు అంటే (ఇప్పటి మారకపు రేటు ప్రకారం) రు.172 రాబడి ఉంటే దారిద్య్రం నుంచి వెలుపలికి వచ్చినట్లే. దీని ప్రకారం నెలంతా పని ఉందనుకుంటే రాబడి రు5160 వస్తుంది. రంగరాజన్‌ కమిటీ ప్రతి వ్యక్తి నెలకు రు.1,407 ఖర్చు చేస్తే చాలని చెప్పింది. ఇవి నేడున్న స్థితిలో వాస్తవాల ప్రాతిపదికన వేసిన అంచనాలేనా ? మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన కనీసవేతనం కూడా నెలకు ఐదున్నరవేలకు అటూ ఇటూగా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్‌గా 200, 500 చొప్పున నిర్ణయించింది అరవై, ఎనభై ఏండ్లు దాటిని వారికి ఇది ఏమూలకు వస్తుందో, ఇతర ఏ ఆధారం లేని పని చేయలేని వారు దానితో ఎలా బతుకులీడుస్తారో అచ్చేదిన్‌ కబుర్లు చెప్పేవారు ఎన్నడైనా ఆలోచించారా ? దారుణమైన అంశం ఏమంటే 2013లోనే టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పెన్షన్లు పెంచాలని సిఫార్సు చేసింది. దాన్ని పట్టించుకోవాల్సినంత గొప్పది కాదన్నట్లుగా గత తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్రమోడీ సర్కార్‌ పక్కన పెట్టింది. డిఎంకె సభ్యురాలు కనిమొళి సారధిగా ఉన్న పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ 2023 మార్చి నెలలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో దీర్ఘకాలంగా ఎదుగబొదుగూ లేకుండా ఉన్న ఈ మొత్తాలు ఇప్పుడు దేనీకీ చాలవని, పెంచాలని చేసిన సిఫార్సును కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నది పచ్చి నిజం.


మన దరిద్రం గురించి మనమే చెప్పుకుంటే ప్రపంచంలో పలుచనకామా అని కొంతమంది మండి పడతారు. మూసిపెడితే పాచిపోతుంది. మన గురించి ప్రపంచం ఎన్నో అంశాలను చెబుతోంది. మన పాలకులు వాటిని దాచిపెడుతున్నారు. ఎవరైనా లేవనెత్తితే దేశద్రోహం అంటున్నారు. ఈ అంశాలను ఎక్కడ చర్చించాలి ? ప్రపంచ సంస్థలు ఇచ్చే రాంకులు, సూచికలను అంగీకరించేది లేదు, వాస్తవాలకు ప్రతిబింబం కాదు అంటారు.పోనీ వారు అసలైన అంకెలను వెల్లడిస్తారా అంటే అదీ లేదు. నిజంగా మన దేశం దరిద్రం నుంచి 41.5 కోట్ల మందిని విముక్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణాంకాలు చెబుతున్నదేమిటి ? కేంద్ర ప్రభుత్వం 2018లో అనీమియా(రక్తహీనత) ముక్త భారత్‌ పధకాన్ని ప్రకటించింది. జీవన ప్రమాణాలను ప్రతిబింబించేవాటిలో ఇది ఒకటి. ప్రధాని నరేంద్రమోడీ కేంద్రంలో అధికారానికి వచ్చిన తరువాత రెండుసార్లు 2015-16లో నాలుగవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌), 2019-21 ఐదవ సర్వే చేశారు. రక్తహీనత పెరుగుదల తగ్గుదల గురించి ఈ రెండు సర్వేలను పోలుస్తూ కేంద్ర ప్రభుత్వం 2022 ఫిబ్రవరిలో పిఐబి ద్వారా సమాచారాన్ని విడుదల చేసింది. దాని ప్రకారం ఒకటి రెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తప్ప దేశమంతటా, మెజారిటీ రాష్ట్రాలలో రక్తహీనత ఉన్నవారి సంఖ్య పెరిగింది. దరిద్రం తగ్గితే ఇది కూడా తగ్గాలి కదా ! మన దేశంలో రక్త హీనత గురించి కొన్ని వివరాలు చూడవచ్చు.
గణన × రాష్ట్రం × పిల్లలు×15 -49 స్త్రీలు×15 -49గర్భిణులు×మొ.స్త్రీలు× బాలికలు× బాలురు
సర్వే 4 × దేశం × 58.6 × 53.2 × 50.4 × 53.1 × 54.1 × 29.2
సర్వే 5 × దేశం × 67.1 × 57.2 × 52.2 × 57 × 59.1 × 31.1
సర్వే 4 × గుజరాత్‌ × 62.6 × 55.1 × 51.3 × 54.9 × 56.5 × 31.9
సర్వే 5 × గుజరాత్‌ × 79.7 × 65.1 × 62.6 × 65 × 69.0 × 36.0
సర్వే 4 × కేరళ × 35.7 × 34.7 × 22.6 × 34.3 × 37.8 × 14.3
సర్వే 5 × కేరళ × 39.4 × 36.5 × 31.4 × 36.3 × 32.5 × 27.4

జనాభాను ఆరు బృందాలుగా విభజించి ఎవరిలో పరిస్థితి ఎలా ఉందో విశ్లేషించారు. ఇక్కడ బాలికలు, బాలురు అంటే 15-19 సంవత్సరాల వారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనాను దేశమంతటా విస్తరిస్తాను అని నరేంద్రమోడీ 2014 ఎన్నికల్లో చెప్పిన సంగతి తెలిసిందే. కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ గానీ సిపిఎం గానీ తమది నమూనా అనే మాటలు చెప్పలేదు. దేశ సగటు కంటే ధనిక రాష్ట్రం గుజరాత్‌లో రక్తహీనత అన్ని తరగతుల వారిలో ఎక్కువగా ఉంది. దానికి విరుద్దంగా కేరళలో మెరుగైన స్థితి ఉంది. ప్రపంచ ఆకలి సూచికలో 2022లో 121 దేశాలకు గాను మన రాంక్‌ 107గా ఉంది. మెజారిటీ రాష్ట్రాలలో బిజెపి, నరేంద్రమోడీ కేంద్రంలో అధికారానికి రాక ముందు 2013లో 120 దేశాలకు మన రాంకు 63గా ఉంది. ఇండెక్స్‌ ముండీ డాట్‌ కామ్‌ సమాచారం 2019 ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నవారు 186 దేశాలకు గాను మనం 32వ స్థానంలో ఉన్నాం, అదే చైనా 141వ స్థానంలో ఉంది. మన కంటే మెరుగైన స్థానాల్లో శ్రీలంక 98, బంగ్లాదేశ్‌ 55, నేపాల్‌ 51, భూటాన్‌ 50, మయన్మార్‌ 41, పాకిస్తాన్‌ 33వ స్థానంలో ఉంది. రెండింజన్ల పాలన ఉంటేనే అభివృద్ది అని చెప్పేవారు దీనికి ఏ సమాధానం చెబుతారు. పిల్లలను ఆరోగ్యంగా ఉంచలేని వారు జిడిపి గురించి ఎన్నిక కబుర్లు చెప్పినా దాని వలన ఫలితం ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

స్వీడన్‌ నాటో సభ్యత్వానికి మెలిక పెట్టి తోకముడిచిన టర్కీ !

12 Wednesday Jul 2023

Posted by raomk in COUNTRIES, Current Affairs, Europe, Germany, Greek, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, NATO, NATO summit in Vilnius, Recep Tayyip Erdoğan, Sweden’s NATO bid, Ukraine crisis, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఐరోపా సమాఖ్య తలుపులు తెరుస్తారేమోనని ఐదు దశాబ్దాలుగా గుమ్మం ముందు పడిగాపులు కాస్తున్నాం. సమయం వచ్చింది గనుక చెబుతున్నా మాకు సమాఖ్యలో సభ్యత్వానికి అంగీకరిస్తే మేము నాటోలో స్వీడన్‌ ప్రవేశానికి అడ్డుతొలుగుతామని టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తాయిప్‌ ఎర్డోవాన్‌ సోమవారం నాడు మెలిక పెట్టాడు.లిథువేనియా రాజధాని విలినస్‌లో మంగళ,బుధవారాల్లో జరగనున్న నాటో కూటమి వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లే ముందు టీవీలో చెప్పాడు. ఆదివారం నాడు తాను అమెరికా అధినేత జో బైడెన్‌తో చర్చలు జరిపినపుడు ఈ అంశాన్ని స్పష్టం చేసినట్లు కూడా వెల్లడించాడు. ఈ అనూహ్యప్రకటనతో పశ్చిమ దేశాలు కంగారు పడ్డాయి. ఇలా వివాదపడితే అంతిమంగా రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ లబ్దిపొందుతాడంటూ నష్టనివారణకు పూనుకున్నాయి. మరోవైపున సోమవారం నాడే విలినస్‌లో ఎర్డోవాన్‌- స్వీడన్‌ ప్రధాని క్రిస్టెర్‌సన్‌ భేటీ జరిగింది. తరువాత స్వీడన్‌కు చారిత్రాత్మక క్షణం అంటూ తమ దేశ టీవీలో ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో టర్కీ వెనక్కు తగ్గిందని, లాంఛనంగా నాటోలో స్వీడన్‌ ప్రవేశానికి త్వరలో తమ పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోద ముద్ర వేసేందుకు ఎర్డోవాన్‌ అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం టర్కీ ఎదుర్కొంటున్న ఆర్థిక, ఇతర ఇబ్బందుల కారణంగా మెత్తబడిందన్నది స్పష్టం. ఎవరి ప్రయోజనం వారు చూసుకుంటున్నందున మీరు మాకది ఇస్తే మేం మీకిది ఇస్తాం అన్నట్లుగా అందుకోసం వేస్తున్న ఎత్తులు జిత్తులలో భాగంగానే ఐరోపా సమాఖ్యలో సభ్యత్వానికి ముడిపెట్టి ప్రకటించినట్లు స్పష్టమైంది. తమ గడ్డ మీద ఉన్న రష్యా సేనల మీద ఎదురుదాడులు జరిపి పోగొట్టుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రతిజ్ఞలు చేసిన ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోతున్నదనే వార్తలు వస్తున్నాయి. జెలెనెస్కీ దళాలకు అవసరమైన ఆయుధాలు, ఇతర సాయం ఎలా అందించాలా అని నాటో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నాటోలో చేరేందుకు ఫిన్లండ్‌, స్వీడన్‌ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ప్రారంభంలో ఫిన్లండ్‌కు ఆమోదం తెలిపారు. సంస్థ నిబంధనల ప్రకారం సభ్యదేశాలన్నీ అంగీకరిస్తేనే కొత్త దేశాలను చేర్చుకోవటానికి వీలుంటుంది.ప్రస్తుతం ఈ కూటమిలో 31 దేశాలు ఉన్నాయి. తాజా వార్తల ప్రకారం ఇప్పటికి ఉక్రెయిన్‌కు సభó్యత్వం లేనట్లే అని స్పష్టమైంది.


విలినస్‌ సమావేశాల్లో స్వీడన్‌ ప్రవేశానికి ఆమోద ముద్ర కూడా అజెండాలో ఉంది.టర్కీ దానికి మోకాలడ్డటంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పోరు ముగిసేంత వరకు నాటోలో ఉక్రెయిన్‌ చేరకూడదని అమెరికా అధినేత జో బైడెన్‌ చేసిన ప్రకటన కూడా తలనొప్పిగా మారింది. టర్కీ షరతులను తాము అంగీకరించేది లేదని ఐరోపా సమాఖ్య ప్రకటించగా స్వీడన్‌కు ఆమోదం తెలిపితేనే తాము ఎఫ్‌ 16 యుద్ధ విమానాలను టర్కీకి విక్రయిస్తామని అమెరికా మెలిక పెట్టింది. ” ముందు ఐరోపా సమాఖ్యలో టర్కీ చేరికకు మార్గాన్ని సుగమం చేయాలి, తరువాత ఫిన్లండ్‌ మాదిరి స్వీడన్‌కూ మేము దారి ఇస్తాము. మేము 50 సంవత్సరాలుగా గేటు ముందు వేచి చూస్తున్నాం, నాటోలోని దేశాలన్నీదాదాపు సమాఖ్యలో సభ్యులే ” అని ఎర్డోవాన్‌ చెప్పాడు. తమ దేశంలో వేర్పాటు వాదులు, కర్దిష్‌ వర్కర్స్‌ పార్టీ వంటి ఉగ్రవాదులను స్వీడన్‌ బలపరస్తున్నదని, ఖురాన్‌ దహనంతో సహా ఇస్లాం వ్యతిరేక ప్రదర్శనలను అనుమతించిన కారణంగా తాము అంగీకరించేది లేదని గతంలో టర్కీ ప్రకటించింది. ఇప్పుడు తమకు ఐరోపా సమాఖ్యలో సభ్యత్వానికి లంకె పెట్టింది. టర్కీని సంతుష్టీకరించేందుకు స్వీడన్‌ ఉగ్రవాద చట్టాల్లో మార్పు చేసింది. వాటితో టర్కీ సంతృప్తి చెందలేదు. సోమవారం రాత్రి టర్కీ వైఖరిలో మార్పు వచ్చిన తరువాత ఐరోపా సమాఖó్యవైపు నుంచి ప్రతికూల స్పందనలు, సంకేతాలు రాలేదు తప్ప సానుకూలత కూడా వెల్లడి కాలేదు. తరువాత ఇప్పుడున్న స్థితి నుంచి టర్కీతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు పూనుకొని సంతుష్టీకరించవచ్చు.


ప్రపంచ రాజకీయాల్లో టర్కీ అనుసరిస్తున్న విధానాలే దానికి అమెరికా యుద్ధ విమానాల విక్రయం, ఐరోపా సమాఖ్యలో చేర్చుకొనేందుకు ప్రధాన ఆటంకాలుగా ఉన్నాయి.ఐరోపా ఆర్థిక సమాఖ్యలో చేరేందుకు 1963 సెప్టెంబరు 12న ఒక ఒప్పందం చేసుకుంది. అది మరుసటి ఏడాది డిసెంబరు ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు చెప్పినప్పటికీ సంపూర్ణం కాలేదు.అది నత్తనడక నడుస్తోంది.మొత్తం 35 నిబంధనలకు గాను ఇంతవరకు టర్కీ 15 మాత్రమే, అదీ పాక్షికంగా నెరవేర్చింది. కేవలం శాస్త్ర, పరిశోధనా రంగాలకు సంబంధించిన అంశమే సంపూర్ణంగా అమలు చేసింది. ఏదో ఒకసాకుతో ఇతర దేశాలు పూర్తి సభ్యత్వానికి అడ్డుపడుతున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం, మానవహక్కులను కాలరాస్తున్నారని విమర్శిస్తున్నాయి. తాజా పరిణామాలకు వస్తే 2016లో ఎర్డోవాన్ను పదవి నుంచి దించేందుకు ఒక విఫల కుట్ర జరిగింది. తరువాత తన పదవిని సురక్షితం కావించుకొనేందుకు చేసిన రాజ్యాంగ సవరణలతో మానవహక్కులు, చట్టపరమైన ఆటంకాలను కల్పిస్తున్నట్లు వాటిని తొలగించి నిబంధనలన్నింటినీ పూర్తి చేస్తేనే చేర్చుకుంటామని సమాఖ్య చెబుతోంది. వీటి కంటే పుతిన్‌తో స్నేహం, ఇతర అంశాలు ప్రధానంగా పని చేస్తున్నాయని చెప్పవచ్చు. సిరియాలో పశ్చిమ దేశాలు మద్దతు ఇస్తున్న కిరాయి మూకలు, ఉగ్రవాదులను అణచేందుకు రష్యా తోడ్పడుతున్నది, దానికి టర్కీ మద్దతు ఇస్తున్నది. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని సృష్టించింది, దాన్ని కొనసాగించాలని చూస్తున్నది పశ్చిమ దేశాలు కాగా తాను మధ్యవర్తిగా ఉంటానని టర్కీ ముందుకు రావటం వాటికి సుతరామూ ఇష్టం లేదు. టర్కీకి అవసరమైన మిలిటరీ పరికరాలను నాటో, అమెరికా నుంచి కొనుగోలుకు వీల్లేకుండా ఆంక్షలు విధించారు. సిరియా నుంచి ఐరోపాకు వచ్చే 40లక్షల మంది కాందిశీకులను రాకుండా చేసినందుకు ఇప్పటి వరకు ఐరోపా సమాఖ్య బిలియన్లమేర యూరోలను అందచేసింది. మరో ఆరు బిలియన్లను అందచేసేందుకు కుదిరిన ఒప్పందాన్ని టర్కీ నిలిపివేసింది. ఐరోపా సమాఖ్య తల మీద తుపాకి గురిపెట్టినట్లుగా తమ షరతులను అంగీకరించకపోతే ఇతర ఐరోపా దేశాలకు కాందిశీకుల వరద పారిస్తామని టర్కీ బెదిరిస్తున్నది.


ఎర్డోవాన్‌ పెట్టిన మెలికను ఐరోపా కమిషన్‌ తిరస్కరించింది. స్వీడన్‌ నాటోలో, టర్కీ ఐరోపా సమాఖ్యలో చేరటం రెండూ వేర్వేరని, సమాంతరంగా జరుగుతున్న పరిణామాలు గనుక ఒకదానికి మరొకదాన్ని పోటీ పెట్టరాదని ప్రతినిధి దానా సిపినాంట్‌ స్పష్టం చేసింది. జర్మన్‌ ఛాన్సలర్‌ షుల్జ్‌ కూడా ఆ వైఖరిని బలపరిచాడు. టర్కీ కోర్కెను తాను సమర్ధిస్తున్నట్లు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ చెప్పాడు. స్వీడన్‌ చేరికను టర్కీ బలపరుస్తుందని కూడా అన్నాడు. ఎర్డోవాన్‌ మెలిక పెట్టినప్పటికీ ఇప్పటికీ ఆమోదించే అవకాశం ఉందనే ఆశాభావం వెల్లడించాడు. విస్తరణకు సంబంధించి 2022 నివేదికలో సమాఖ్య పేర్కొన్న అంశాలు టర్కీ చేరిక అంత తేలిక కాదని స్పష్టం చేస్తున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నదని, చట్టబద్దపాలన, ప్రాధమికహక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థల గురించి తీవ్ర ఆందోళన వెల్లడించింది.


గ్రీసును బెదిరించకుండా ఉండేట్లైతే, నాటోలో స్వీడన్‌ చేరికను ఆమోదిస్తే తాము టర్కీకి ఎఫ్‌ 16 విమానాలను విక్రయించేందుకు సిద్దమే అని అమెరికా గతంలో సందేశం పంపింది. విలినస్‌కు బయలు దేరిన జో బైడెన్‌ ఆదివారం నాడు విమానం నుంచే ఎర్డోవాన్‌తో గంటసేపు సంభాషించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని అమెరికా అధికారవర్గాలు చెప్పినట్లు వార్తలు. గ్రీసు పట్ల శతృత్వం, రష్యానుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు టర్కీ నిర్ణయించిననందున ఎఫ్‌ 16 విమానాలను విక్రయించకూడదని గతంలో అమెరికా నిర్ణయించింది. ఇప్పుడు ఒక అడుగు దిగివచ్చినట్లు కనిపిస్తోంది. స్వీడన్‌ చేరికకు మద్దతు ఇస్తే టర్కీకి విమానాలు విక్రయించేందుకు అమెరికా పార్లమెంటు ఆమోదించవచ్చని వార్తలు వచ్చాయి. వాటిని తమకు వ్యతిరేకంగా వినియోగించరాదని గ్రీసు డిమాండ్‌ చేస్తోంది. ఏజియన్‌ సముద్ర జలాల్లో నౌకా సంచార హక్కుల గురించి వివాదం ఉంది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ రోజూ తమ దీవుల మీదుగా విమానాలు ఎగురుతున్నట్లు గ్రీసు చెబుతున్నది. ఆ దీవుల మీదుగా ఎఫ్‌16 విమానాలను అనుమతించకూడదని ఆరుగురు అమెరికన్‌ ఎంపీలు తమ విదేశాంగ మంత్రికి లేఖలు రాశారు. విలినస్‌ సమావేశాల్లో జరిగిన పరిణామాల్లో వాటిని సరఫరా చేసేందుకు అమెరికా మార్గం సుగమం చేసినట్లు, దీంతో పుతిన్‌కు దూరం జరిగి టర్కీ పశ్చిమ దేశాలకు దగ్గరైనట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. మంగళవారం నాడు అమెరికా భద్రతా సలహాదారు సులివాన్‌ మాట్లాడుతూ స్వీడన్‌కు టర్కీ పచ్చజెండా ఊపినందున 2021లో కుదిరిన ఒప్పందం మేరకు లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ నుంచి 20బిలియన్‌ డాలర్ల విలువ గల కొత్త ఎఫ్‌ 16 విమానాలతో పాటు ఇప్పటికే టర్కీ దగ్గర ఉన్న 80పాత వాటిని నవీకరించేందుకు ముందుకు వెళ్లనున్నట్లు చెప్పాడు.


విలినస్‌ నాటో వార్షిక సమావేశాల్లో ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధ సాయం గురించి తప్ప నాటోలో ప్రవేశం మీద ఎలాంటి నిర్ణయమూ తీసుకొనే అవకాశం లేదు. అక్కడ పోరు ముగిసిన తరువాతే దాన్ని గురించి పరిశీలిస్తామని జో బైడెన్‌ సిఎన్‌ఎన్‌ టీవీతో చెప్పాడు. నాటో కుటుంబంలో ఉక్రెయిన్ను చేర్చుకోవాలా వద్దా అనే అంశం మీద సభ్యదేశాల్లో ఏకీభావం లేదని కూడా అన్నాడు.ఇప్పుడు గనుక చేర్చుకుంటే మేమంతా యుద్ధంలో ఉన్నట్లే అవుతుంది. ఇప్పుడే ఓటింగ్‌ జరపాలనటం అపరిపక్వత అవుతుంది, ఒక దేశాన్ని చేర్చుకోవాలంటే ప్రజాస్వామీకరణతో సహా కొన్ని అర్హతలు ఉండాలి అని కూడా బైడెన్‌ చెప్పాడు. జర్మనీ కూడా అమెరికా వైఖరితో ఏకీభవిస్తోంది. నాటో నిబంధన ఐదును పరీక్షించే అవకాశం పుతిన్‌కు ఇవ్వకూడదని జర్మనీ కోరుకొంటోందని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్‌కు తక్షణమే నాటో సభ్యత్వం అన్న చర్చ అసంగతం, దానికి చేస్తున్న మంచిని మరచి దీని గురించి చర్చను అనుమతించటం విచారకరం.ఎవరూ ఇప్పటికిప్పుడు నాటోలో చేరాలని గట్టిగా చెప్పటం లేదు, దానికి తగిన మార్గం గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఎలా సాయం చేయాలా అని ఆలోచిస్తున్నాం. దీని గురించి గాక సభ్యత్వం గురించి చర్చ పెట్టటం అంటే సమావేశాన్ని పక్కదారి పట్టించటమే, పశ్చిమ దేశాల్లో విబేధాలు ఉన్నట్లు అని చెప్పటమే, దీన్ని రష్యా స్వాగతిస్తుందని నాటో అధికారులు చెప్పినట్లు మీడియా పేర్కొన్నది.


తమను వెంటనో నాటోలో చేర్చుకోవాలని, ఆధునిక అస్త్రాలను పెద్ద ఎత్తున సరఫరా చేయాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేస్తున్నది. అదే గనుక జరిగితే ఉక్రెయిన్‌ సంక్షోభ స్వభావమే మారిపోతుంది. పుతిన్‌ మీద నేరుగా ఆ కూటమి సేనలు యుద్ధానికి దిగవచ్చు. రష్యా దాడులకు దిగకముందుఉన్న పరిస్థితి వేరు, తరువాత తమ ప్రాంతాలను ఆక్రమించుకున్నందున నాటో సభ్వత్వం ఇవ్వాలని గతేడాది సెప్టెంబరులో జెలెనెస్కీ దరఖాస్తు చేశాడు. అనేక దేశాలు అందుకు మద్దతు తెలిపినా అమెరికా, జర్మనీ సిద్దం కాలేదు. కొన్ని ప్రాంతాలు ఉక్రెయిన్నుంచి వేరుపడి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. క్రిమియా ద్వీపం తమదే అంటూ 2014లోనే రష్యా స్వాధీనం చేసుకుంది. మరికొన్ని ప్రాంతాలు ఇప్పుడు దాని ఆధీనంలో ఉన్నాయి, అటువంటపుడు మధ్యలో సభ్యత్వం ఇవ్వటం, గతం నుంచి వర్తింప చేసి ఎదురుదాడులకు పూనుకోవటం నాటో ఐదవ ఆర్టికల్‌ నిబంధన పరిధిలోకి రాదని చెబుతున్నారు. దాన్ని సవరించి నాటోలో చేర్చుకొని రష్యాతో నేరుగా తలపడేందుకు నాటో కూటమి ప్రస్తుతం సిద్దంగా లేదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లొంగుబాటు – నేడు అమెరికన్ల మీద నరేంద్రమోడీ మౌనమెందుకు ?

11 Tuesday Jul 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, USA

≈ Leave a comment

Tags

BJP, Manipur unrest, Meitei and Kuki, Narendra Modi Failures, Narendra Modi's silence on Manipur, RSS


ఎం కోటేశ్వరరావు


ఏదైనా ఉంటే మన దేశంలో విమర్శించుకోవాలి, దెబ్బలాడుకోవాలి, విదేశీ గడ్డ మీద పరువు తీసుకుంటామా, ఎవరైనా మన దేశాన్ని ఏమైనా అంటే రాజకీయ విబేధాలతో నిమిత్తం లేకుండా అందరం ఒకటై ఖండించాలి.రాహుల్‌ గాంధీ విదేశాల్లో నరేంద్రమోడీ సర్కార్‌ మీద చేసిన విమర్శల సందర్భంగా కాషాయ మార్కు దేశభక్తి ప్రబోధకులు చెప్పిన అంశాల సారమది. నిజమే కదా అంటే నిజమే అని అనేక మంది అనుకుంటున్నారు. కాశ్మీరు వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాని నరేంద్రమోడీ తనను కోరినట్లు నాలుగు సంవత్సరాలనాడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను ఖండించేందుకు నరేంద్రమోడీకి నోరు రాలేదు. అలాంటిదేమీ లేదని మన విదేశీ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. కరోనా వైరస్‌ చికిత్సకు పనికి వస్తుందో లేదో నిర్ధారణగాని మలేరియా నిరోధక హైడ్రోక్సీక్లోరోక్విన్‌ ఔషధాన్ని తక్షణమే తమకు పంపకపోతే డొక్క చించుతామని అదే ట్రంప్‌ మన దేశాన్ని 2020 ఏప్రిల్లో బెదిరించాడు. కొద్ది గంటల్లోనే మన దేశం అంతకు ముందు ఎగుమతులపై విధించిన నిషేధాన్ని సడలించి గుజరాత్‌లోని మూడు ఫ్యాక్టరీల నుంచి అడిగినంతా పంపింది. దాంతో మోడీ గొప్ప అంటూ ఆకాశానికి ఎత్తాడు ట్రంప్‌.మనది ఒక సర్వసత్తాక దేశం. ఒక దేశాధినేతతో మరొకదేశం అనుసరించాల్సిన కనీస మర్యాదను పాటించకున్నా నరేంద్రమోడీ నోరు మెదపలేదు. మన ఇరుగు పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్‌ అడిగినా వెంటనే స్పందించని మోడీ అమెరికా బెదిరింపుతో వెంటనే పంపారు. ఇవి గతానికి చెందినవి. ఒక సినిమాలో నీ ఊరు వస్తా నీ ఇంటి కొస్తా అన్నట్లుగా మన గడ్డమీద ఉండి ఒక విదేశీయుడు మన అంతర్గత అంశం గురించి మాట్లాడినా రాహుల్‌ గాంధీ గురించి రచ్చ చేసిన వారు నోటికి తాళం వేసుకున్న తాజా ఉదంతాన్ని చూద్దాం.


ఎరిక్‌ గార్సెటీ అనే పెద్ద మనిషి మన దేశంలో అమెరికా రాయబారి. భారత్‌ కోరితే మణిపూర్‌ మంటలను ఆర్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పాడు. అది మన అంతర్గత అంశం, మరొకరు ఎవరూ జోక్యం చేసుకోకూడదు. కానీ గార్సెటీ వేలుదూర్చాడు. కొల్‌కతాలో జూలై ఆరవ తేదీన విలేకర్ల మాట్లాడుతూ ” మణిపూర్‌లో జరుగుతున్న హింస వ్యూహాత్మక సంబంధమైనది కాదని నేను అనుకుంటున్నాను. ఇది మానవ సంబంధమైనది. ఇలాంటి హింసలో పిల్లలు లేదా ఇతరులు మరణిస్తున్నపుడు ఒక భారతీయుడిగా మీరు రక్షించేందుకు చూడరా. అనేక మంచి పరిణామాలు జరగాలంటే ముందు శాంతి నెలకొనాలని మనకు తెలుసు. ఈశాన్యం, తూర్పు భారతాల్లో ఎంతో పురోగతి ఉంది. కోరితే ఏ విధంగానైనా సాయపడేందుకు మేము సిద్దంగా ఉన్నాం. ఇది భారత్‌కు చెందిన అంశమని మాకు తెలుసు, అక్కడ తక్షణమే శాంతి నెలకానాలని మేము ప్రార్ధిస్తాము. ఆ శాంతి నెలకొంటే మేము మరింత భాగస్వామ్యం, మరిన్ని ప్రాజెక్టులు, మరింత పెట్టుబడి తెస్తాము ” అన్నాడు. ఏ విధంగా చూసినప్పటికీ ఏ విదేశీ రాయబారి నోటి వెంటా ఇలాంటి మాటలు రాకూడదు. మరొక దేశమైతే తక్షణమే అతగాడిని పిలిపించి హద్దుల్లో ఉండాలని మందలించి పంపేది. ఎవరికీ తలొగ్గం అని చెబుతున్న మన విదేశంగా శాఖ మంత్రికి, అధికారగణానికి ఇదేమీ పట్టలేదు. ఎందుకంటే అది అపర దేశభక్త ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టం ఉండదు అని వారికి తెలుసు. ఆఫ్రో-అమెరికన్ల మీద జరిగే దాడుల గురించి లోకానికంతటికీ తెలుసు.ఏ రోజు ఎవడు తుపాకులు తీసుకొని ఉత్తి పుణ్యానికి ఎంతమందిని కాల్చి చంపుతాడో తెలియదు. అలాంటి వాటి నివారణలో సహకరిస్తామని మనదేశంతో సహా ఎవరైనా ప్రకటిస్తే అమెరికా ఊరుకుంటుందా ? ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు మన దేశమే అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ దీని గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. విశ్వగురువులు లేదా బాస్‌లు ఇలాంటి చిన్న చిన్న అంశాల మీద మాట్లాడరని అనుకోవాలి, అంతే ! నాడు జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటీషు వారికి సేవ చేసుకుంటానని , స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనను అని రాసిచ్చిన సావర్కర్‌ తరువాత దానికి కట్టుబడి ఉన్న అపర దేశభక్తుడు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు కూడా అమెరికాకు ఖాళీ కాగితం మీద సంతకాలు చేసి ఇచ్చారా ? ఏమిటీ మౌనం, ఎందుకీ బలహీనత, రాయబారిని మందలిస్తే అమెరికాకు ఆగ్రహం వస్తుందని భయపడుతున్నారా ? ప్రపంచంలోనే చక్రం తిప్పుతున్నారని మురిసిపోతున్న భక్తులేం అవుతారో అన్నది ఆలోచించాలి కదా !


చిత్రం ఏమిటంటే రాహుల్‌ గాంధీ విదేశాల్లో మన కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్రమోడీని విమర్శిస్తే అది దేశద్రోహం. కానీ అమెరికా రాయబారి మన గడ్డ మీద మణిపూర్‌ మంటలను మీరు ఆర్పలేకపోయారు, మీరు కోరితే ఆర్పటంలో సాయం చేస్తామని చెప్పటం కంటే మన కేంద్ర ప్రభుత్వానికి అవమానం మరొకటి ఉండదు. అయినప్పటికీ దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉంది. అరిందమ్‌ బాగ్చీ అని మన విదేశాంగశాఖ ప్రతినిధి ఉన్నారు. దాదాపు రోజూ ఏదో ఒక అంశం మీద విలేకర్లతో మాట్లాడుతూ ఉంటారు. ఎరిక్‌ గార్సెటీ మాట్లాడిన అంశాల గురించి తనకు తెలియదని అన్నారు. అంతటితో ఊరుకుంటే వేరు. విదేశీ దౌత్యవేత్తలు మన అంతర్గత అంశాల గురించి మాట్లాడటం అసాధారణం. అతను ఏం మాట్లాడిందీ కచ్చితంగా తెలుసుకొనేంతవరకు తానేమీ వ్యాఖ్యానించలేనని కూడా అరిందమ్‌ చెప్పారు. మణిపూర్‌లో శాంతికోసం భారత ప్రభుత్వం, భద్రతాదళాలు పని చేస్తున్నట్లు చెప్పారు. పదకొండవ తేదీ వరకు విదేశాంగ ప్రతినిధి నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఏ మాట్లాడిందీ ముఖతా తెలుసుకొనేందుకు అమెరికా రాయబారిని పిలిచారన్న వార్తలు కూడా లేవు. నాకు సరిగ్గా తెలియదు అని చెప్పటం అరిందమ్‌ బాగ్చీకి కొత్తకాదు. భారత్‌ తమ వ్యూహాత్మక భాగస్వామి అని ప్రకటనలు గుప్పించటంలో అమెరికా గద్దె మీద ఎవరున్నా తక్కువ తినలేదు. ఇరవైనెలల పాటు ఖాళీగా ఉన్న తరువాత ఎరిక్‌ గార్సెటీని మన దేశంలో రాయబారిగా జో బైడెన్‌ ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆ మేరకు అమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపింది.


పౌరసత్వ చట్ట సవరణ గురించి, భారత్‌లో మానవహక్కుల గురించి గార్సెటీ గతంలో విమర్శలు చేశాడు.రాయబారిగా ఖరారు చేసిన తరువాత వాటి గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా ? ఇటీవల అతను ఏం మాట్లాడాడో తెలియదు, సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఉన్నాయి, అవి చాలా పాతవి, వాటి మీద మన వైఖరి ఏమిటో మీకు బాగా తెలిసిందే అన్నారు. ” తప్పుడు అభిప్రాయాలతో మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొనేందుకు రాజకీయ అజెండాతో అతన్ని పంపుతున్నారు. అతనికేమీ తెలియదు, అహంకారి, అతన్ని ఆమోదించకూడదు ” అని బిజెపి మాజీ ఎంపీ తరుణ్‌ విజయి ట్వీట్‌ చేశారు. అతని నియామకం పశ్చిమ దేశాల వ్యతిరేక మనోభావాలను రగిలిస్తుందని బిజెపి యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్‌ ప్రకాష్‌ అన్నారు.


కేరళలో కమ్యూనిస్టులంటే గిట్టని సత్యదీపం అనే పత్రిక ప్రధాని నరేంద్రమోడీకి ఉక్రెయిన్‌ పోరు గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడటానికి సమయం ఉంటుంది గానీ మణిపూర్‌ గురించి మాత్రం పట్టదు అని విమర్శించింది.మోడీగారు మన్‌కీ బాత్‌లో అడవుల్లో పెరిగే గడ్డి గురించి కూడా మాట్లాడుతారు గానీ మణిపూర్‌లో ఇబ్బందులు పడుతున్నవారి గురించి పట్టించుకోరు. ఈశాన్య రాష్ట్రాలలో 30సార్లకు పైగా పర్యటించి ఉంటారు. మణిపూర్‌కు మాత్రం కావాలనే వెళ్లటం లేదు అని సంపాదకీయంలో పేర్కొన్నది.ఈ పత్రికను అంగామలీ సిరో-మలబార్‌ చర్చ్‌ నడుపుతుంది. ఆ పత్రిక చర్చి నేతలను కూడా వదల్లేదు. తొలి రోజుల్లో మణిపూర్‌ హింసాకాండను చర్చి నేతలు విస్మరించారన్నది నిజం. ప్రకటనలు చేయటం తప్ప వారు ఇప్పటికీ హింసాకాండ జరిగిన ప్రాంతాలను సందర్శించేందుకు లేదా రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్దంగా లేరు, కనీసం ఢిల్లీలో పత్రికా విలేకర్ల సమావేశం పెట్టే ప్రయత్నం కూడా లేదు అని పేర్కొన్నది. మండుతున్న మణిపూర్‌ గురించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన తరువాత కూడా ప్రధాని మోడీలో చలనం లేదు. ఎవరేమనుకుంటే నాకేం అన్నట్లుగా ఉన్నారు. ఇంత హింసాకాండ, రచ్చకు కారణం మణిపూర్‌లో మెజారిటీగా ఉన్న మెయితీ తెగవారిని షెడ్యూలు కులాల జాబితాలో చేర్చాలని సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించటమే. అలాంటి అధికారం హైకోర్టుకు లేదని సుప్రీం కోర్టు చెప్పిన తరువాత కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరులను వెల్లడించలేదు.

జనాభాలో హిందువులైన మెయితీలు 53శాతం ఉండగా, క్రైస్తవులుగా ఉన్న గిరిజనులు 40శాతం. అరవై మంది ఉన్న అసెంబ్లీలో నలభైమంది మెయితీలు ఉన్నారు. వారు బిజెపి ఓటు బాంకుగా ఉన్నారు. జరుగుతున్న హింసాకాండలో మెయితీలకు పోలీసులే ఆయుధాలు ఇచ్చారని, పోలీస్‌ స్టేషన్ల నుంచి అపహరించినట్లు కేసులు నమోదు చేశారని వార్తలు వచ్చాయి. హింసాకాండ ప్రారంభమైన 70 రోజుల నుంచి ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఎవరి మీద ఎవరికీ విశ్వాసం లేదు.1960లో తెచ్చిన భూ సంస్కరణల చట్ట ప్రకారం కొండ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూమి కొనుగోలు చేసేందుకు, అమ్మేందుకు అవకాశం లేదు. ఆ భూముల మీద కన్నేసిన మెయితీలు తమను గిరిజనులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నారు.ఆర్టికల్‌ 371సి ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. మణిపూర్‌లో హింసాకాండ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం తమాషా చూస్తున్నది.రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలూ లేవు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఓటుబాంకు దెబ్బతింటుంది, మౌనంగా ఉంటే ఏ రోజు ఏం జరుగుతుందో, ఎందరి ప్రాణాలు పోతాయో తెలియదు. అయినా ప్రధానికి పట్టదు. విస్తారమైన భూమిని ఏదో ఒక పద్దతిలో స్వంతం చేసుకోవాలని ఈ సామాజిక తరగతి చూస్తున్నదనే ఆరోపణ ఉంది. అందుకు గాను అక్రమంగా పక్కనే ఉన్న మయన్మార్‌ నుంచి అక్రమంగా గిరిజనుల వలసలను ప్రోత్సహిస్తున్నట్లు ఆ తరగతి ఆరోపిస్తోంది. అక్రమవలసలన్నది ఒక సాకు మాత్రమే అని గిరిజనులు అంటున్నారు. వాస్తవాలను వివరించి రెండు సామాజిక తరగతుల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించటంలో గతంలో ఉన్న ప్రభుత్వాలతో పాటు వర్తమాన బిజెపి కూడా విఫలమైంది, మతం పేరుతో ఓటు బాంకు ఏర్పాటుకు పూనుకుంది. తాజా పరిణామాలో మణిపూర్‌లో తిరిగి ఉగ్రవాదం తలెత్తితే బిజెపిదే బాధ్యత అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ చిప్స్‌ యాపారం మేకింగ్‌ కాదు పాకింగ్‌ : రు. 30పెట్టుబడికి 70 సబ్సిడీ, ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా !

07 Friday Jul 2023

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, India’s Micron deal, Joe Biden, Micron, Narendra Modi Failures, Semiconductor


ఎం కోటేశ్వరరావు


2024 డిసెంబరు నాటికి మేడిన్‌ ఇండియా తొలి చిప్‌ మార్కెట్‌కు వస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా వెళ్లినపుడు ఈ మేరకు మైక్రాన్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, గుజరాత్‌లోని సనంద్‌ వద్ద దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఫాక్స్‌కాన్‌-వేదాంత సంయుక్త భాగస్వామ్యంలో మరో కంపెనీ కూడా దరఖాస్తు చేయనుందని చెప్పారు. జనాలు నిజమే అని ఆహౌ ఓహౌ నరేంద్రమోడీ మంత్రదండం మహిమ ఏమిటో చూడండి, ఇలా ఒప్పందం చేసుకున్నారో లేదా అలా ఉత్పత్తి వచ్చేస్తోంది, ఇదే ఊపుతో త్వరలో చైనాను వెనక్కు నెట్టేస్తాం అన్నట్లుగా స్పందించారు. ఆకలితో ఆవురావురు మంటూ ఎదురు చూస్తున్న అన్నం కనిపిస్తే చాలు కడుపు నిండుతుంది అన్నట్లుగా ఈ వార్త సంతోషం కలిగిస్తుంది, ఆనందాన్ని తెస్తుంది. దీని వెనుక ఉన్న కథ తెలిస్తే వామ్మో గుజరాత్‌ మోడల్‌ ఇలా ఉంటుందా అని గుండెలు బాదుకుంటారు.ఇక్కడ ఒక ప్రశ్న అడిగితే దేశభక్తిని ప్రశ్నిస్తారేమో ? ఫాక్స్‌కాన్‌ – వేదాంత సంస్థ కలసి గుజరాత్‌లో లక్ష మందికి ఉపాధి కల్పించేందుకు 19.5 బిలియన్‌ డాలర్లతో(రు.లక్షా 60వేల కోట్లు ) ఒక చిప్స్‌ ఫ్యాక్టరీని పెడుతున్నట్లు 2022 సెప్టెంబరులో ప్రకటించారు. అది ఇంతవరకు ఏమైందో ఎక్కడుందో చెప్పరు.కొత్తగా పద్దెనిమిది నెలల్లోనే ఐదువేల మందికి పని చూపే మైక్రాన్‌ ఉత్పత్తి మార్కెట్‌కు వస్తుందని చెబుతున్నారు. మోడీ గారు చెప్పింది వినాలి తప్ప అడిగితే మామూలుగా ఉండదు. ప్రశ్న అడిగిన అమెరికా జర్నలిస్టును ఎలా వేధిస్తున్నారో చూస్తున్నాంగా !


మైక్రాన్‌ కంపెనీ పెట్టుబడి 270 కోట్ల డాలర్లు( మన రూపాయల్లో 22,350 కోట్లు) అని చెప్పారు. దీనిలో అది నిజంగా పెట్టే మొత్తం రు.6,830 కోట్లు. మరి మిగతాది ! కేంద్ర ప్రభుత్వం పదకొండువేల కోట్లు ( 50శాతం) , రాష్ట్ర ప్రభుత్వం భూమి, ఇతర రూపాల్లో మరో ఇరవైశాతం సబ్సిడీ ఇస్తుందట. కంపెనీ పెట్టేది కేవలం 30శాతం మాత్రమే.అంటే రు.30 పెట్టుబడి పెట్టిన మైక్రాన్‌ కంపెనీని రు.వందకు స్వంతదారును చేస్తారు.ప్రతి పైసాను కాపాడేందుకు చౌకీదారును అని చెప్పుకున్న మోడీ ఏలుబడిలో తప్ప ఎక్కడైనా ఇలా జరుగుతుందా ? చైనాలో గిట్టుబాటు కావటం లేదని కొన్ని కంపెనీలు ఇతర దేశాల్లో సబ్సిడీలను చూసి అక్కడ నుంచి వెళుతున్నట్లు చెబుతున్నారు. అలాగే మరొక దేశం ఏదైనా ఇంతకంటే ఎక్కువ సబ్సిడీలు ఇస్తామంటే మైక్రాన్‌ కంపెనీ సరకు, సరంజామా మొత్తాన్ని అక్కడికి తరలిస్తే…..2020లో జనరల్‌ మోటార్స్‌ కంపెనీ వెళ్లిపోయినట్లే జరగవచ్చు. అది తీసుకున్న సబ్సిడీ పైసా తిరిగి ఇవ్వదు. అయినా 70శాతం సబ్సిడీ ఇస్తామంటే ఎవరైనా మన దేశానికి రాకుండా ఉంటారా ? అవసరం తీరింతరువాత వెళ్లిపోకుండా ఉంటారా ? అసలు కత వేరే. ఈ కంపెనీ మన దేశంలో చిప్స్‌(సెమీకండక్టర్లు) తయారు చేయదు. ఎక్కడో డిజైన్‌ చేసి మరెక్కడో ఉత్పత్తి చేసిన విడిభాగాలను మన దేశానికి తీసుకువచ్చి వాటి రూపకల్పన ప్రకారం ఒకదగ్గర అమర్చి(ఫాబ్రికేషన్‌), సరిగా ఉన్నాయా లేదా అని పరీక్ష చేసి అట్టపెట్టెల్లో పెట్టి ఎక్కడి కావాలంటే అక్కడికి పంపుతారు. చెప్పేది మేడిన్‌ లేదా మేకిన్‌ ఇండియా జరిగేది, పాకింగ్‌ ఇండియా. అదైనా గొప్పేకదా కొంత మందికి ఉపాధి దొరుకుతుంది కదా అని చెప్పేవారిని మేకింగుకు పాకింగు తేడా తెలుసుకోవాలని చెప్పటం తప్ప చేసేదేమీ లేదు.


మేకిన్‌, మేడిన్‌ ఇండియా పిలుపులు విఫలమైనందున కేంద్ర ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల రూపాయలను పక్కన పెట్టింది. మైక్రాన్‌ సంస్థ మన దేశంలో ఉత్పాదక కంపెనీ కాదు, కానీ దీనికి ఆ సొమ్మును ఇవ్వనుంది. ఇంత వాటంగా ఉంది కనుకనే అమెరికా పాలకులు అక్కడి కంపెనీలను మన దేశంలో పాకింగ్‌ యూనిట్లు పెట్టి ఎంత వీలైతే అంత సొమ్ము చేసుకోమని చెబుతున్నారు. చైనా బాటలో నడచి దేశాన్ని వృద్ది చేస్తామని, దాన్ని వెనక్కు నెడతామని మన పాలకులు చెప్పారు. చైనా కూడా పెట్టుబడులు పెట్టిన వారికి సబ్సిడీలు ఇచ్చింది, ఇలా పాకింగ్‌ రాయితీలు కాదు, ఉత్పత్తి చేసి తన జనానికి పని కల్పించి ఎగుమతులు చేసింది. అమెరికాను మించి జిడిపిలో ముందుకు పోనుంది. సెమికండక్టర్‌ రంగంలో స్వంతంగా ఉత్పత్తికి పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది తప్ప ఇతర దేశాలకు లొంగి వాటి షరతులను, పాకింగ్‌లకు అంగీకరించటం లేదు. గతంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైన చిప్స్‌లో 90శాతం దిగుమతి చేసుకొనేది. ప్రస్తుతం నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ 1,000 రకాల చిప్స్‌ను చైనా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వరంగ కార్ల సంస్థ నిర్ణయించింది. ఆధునిక రకాల రూపకల్పనకు యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోతున్నది.


చైనాతో మైక్రాన్‌ కంపెనీకి ఎక్కడ చెడింది ? ప్రతి దేశం తన భద్రతను తాను చూసుకుంటుంది. అమెరికాలో ఉత్పత్తి అవుతున్న చిప్స్‌ను ఏ దేశంలోనైనా వినియోగిస్తే ఆ దేశానికి లేదా ఉత్పత్తికి సంబంధించిన సమాచారం, రహస్యాలను సేకరించే అవకాశం ఉంది. తన టెలికాం పరికరాల ద్వారా చైనా ఆ పని చేస్తున్నదంటూ అమెరికా, మన దేశం అనేక యాప్స్‌ను నిషేధించించిన అంశం తెలిసిందే. అలాంటి పరీక్షలో మైక్రాన్‌ సంస్థ తన ఉత్పత్తుల్లో అలాంటి దొంగ చెవులు, కళ్లేమీ లేవని నిరూపించుకోలేపోయింది కనుక చైనా తమ మార్కెట్లో వాటి కొనుగోళ్ల మీద ఆంక్షలు ప్రకటించింది. భద్రతా పరీక్షలేమీ లేకుండా వాటిని మన మార్కెట్లో అమ్ముకొనేందుకు, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరించింది. అమెరికా మీద అంతనమ్మకం ఉంచటం ప్రమాదకరం. సెమికండక్టర్ల పరిశ్రమలు పెడితే సబ్సిడీలు ఇచ్చేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల మేరకు నిధులు పక్కన పెడుతున్నట్లు చెప్పింది. ఆ మొత్తాన్ని స్వంతం చేసుకోవాలని అనేక మంది రంగంలోకి వచ్చారు.వాటిలో ఫాక్స్‌కాన్‌-వేదాంత ఒకటి. వీటి దగ్గర డబ్బు ఉంది తప్ప చిప్స్‌ ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవమూ లేదు. రెండూ కలసి ఐరోపాకు చెందిన ఎస్‌టిఎం మైక్రోటెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదించాయి. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పెట్టుబడితో సహా అనేక షరతులను ఎస్‌టిఎం ముందుకు తెచ్చింది. ఐదు-పది సంవత్సరాల తరువాత తాము తప్పుకుంటామని చెప్పగా వేదాంత-ఫాక్స్‌కాన్‌ దీర్ఘకాలం ఉండాలని డిమాండ్‌ చేసినట్లు వార్తలు. వీరి పెట్టుబడి రు.66 వేల కోట్లు కాగా దీనికి కూడా కేంద్రం రు.76వేల కోట్లు సబ్సిడీ ఇస్తామన్నది, గుజరాత్‌ కూడా గణనీయంగా రాయితీలు ఇచ్చేందుకు సిద్దపడినా ముందుకు సాగటం లేదు. ఇది కూడా 30కి 70 సబ్సిడీగానే ఉంటుంది. కర్ణాటకలో పరువు పోయింది. దేశంలో ఆర్థిక స్థితి సజావుగా లేదు. ఐదు రాష్ట్రాలు, తరువాత లోక్‌ సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కనుక పాకింగ్‌ను కూడా మేకింగ్‌గా ఎన్నికల ముందు ప్రచారం చేసుకోవచ్చని మైక్రాన్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది.దేశ ప్రజలందరి సొమ్మును మోడీ సర్కార్‌ గుజరాత్‌కే సబ్సిడీగా ఖర్చు చేసేందుకు పూనుకోవటం మరొక అంశం. ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలకూ లేదు, మోడీకి అణగిమణగి ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, తెలంగాణా వంటి రాష్ట్రాలకూ ఒక్క ప్రాజెక్టూ రావటం లేదు. గుజరాత్‌కు ఇస్తున్న మాదిరి కేంద్రం సబ్సిడీ ఇస్తే ఏ రాష్ట్రంలోనైనా వాటిని పెట్టవచ్చు. మోడీ అంటే గుజరాత్‌ ప్రధాని అనుకుంటున్నారు గనుక అది జరగదన్నది తెలిసిందే.


నరేంద్రమోడీ సర్కార్‌ గత తొమ్మిదేండ్లలో చేసిన అప్పు గురించి ఎవరైనా అడిగితే కరోనా కాలంలో చేసిన సాయం, ఉకితంగా వాక్సిన్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఎదురు ప్రశ్నిస్తారు. అవి నిన్నగాక మొన్న, 2014 నుంచి చేసిన అప్పులు, చమురు మీద విధించిన భారీ సెస్సుల మొత్తం గురించి మాట్లాడరు. మోడీ చేసిన అప్పుకు గబ్బర్‌సింగ్‌ టాక్సు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వచ్చిన డబ్బు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయింది ? అంటూ ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. అచ్చేదిన్‌, తనకు అధికారం ఇస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో తూర్పున పొడిచిన సూర్యుడిని పశ్చిమానికి మారుస్తాను అన్నట్లుగా జనాన్ని నమ్మించిన నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చారు. కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా కేవలం నరేంద్రమోడీ చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. దీనికి పాత అప్పును కలుపుకుంటే 169 లక్షల కోట్లు అవుతుంది. కొత్తగా ప్రభుత్వ రంగంలో ఒక్క పరిశ్రమ లేదు. తొమ్మిదేండ్లలో ఎవరితోనూ యుద్ధాలు లేవు గనుక మిలిటరీ నిర్వహణ తప్ప కొత్తగా ఆయుధాలు పెద్దగా కొన్నది లేదు. ఇంత సొమ్ము ఏం చేశారంటే కార్పొరేట్లు బాంకులకు ఎగవేసిన రుణాలను రద్దు చేసి దాని బదులు ప్రభుత్వ రంగ బాంకులకు కొంత మొత్తం సర్దుబాటు చేశారు.ఏదో ఒక పేరుతో పైన చెప్పిన సెమికండక్టర్‌ పరిశ్రమల రాయితీలు, ఇతర సబ్సిడీల పేరుతో కార్పొరేట్లకు సమర్పించుకున్నారన్నది స్పష్టం. వాటితో పోలిస్తే రైతాంగానికి, ఇతరులకు ఇచ్చిన రాయితీలు నామమాత్రం. అందుకే సొమ్ము పోయే శనీ పట్టే అన్నట్లుగా కార్పొరేట్లు సబ్సిడీలను తమ ఖాతాల్లో వేసుకున్నారు తప్ప తిరిగి పెట్టుబడిగా కూడా పెట్టలేదు. జనానికి ఉపాధిలేదు.


పాబ్రికేషన్‌, పాకింగ్‌ ద్వారా ప్రపంచ సెమికండక్టర్‌ ఉత్పత్తి కేంద్రంగా మన దేశం మారుతుందని ఎవరైనా చెప్పగలరా ? ఇలా ఏ దేశమైనా ఏ ఉత్పత్తిలోనైనా ఇలా మారిందా ?మలేషియా ఇప్పటికే ఈ రంగంలో ఎంతో ముందుంది. వేరే చోట్ల తయారైన చిప్స్‌ పరీక్ష, విడిభాగాల ఫాబ్రికేషన్‌ ప్రపంచ ఉత్పత్తిలో పదమూడుశాతం వరకు అక్కడే అక్కడ జరుగుతోంది. ఒక విధంగా ప్రపంచ హబ్‌గా ఉంది. ఆధునిక చిప్స్‌ కంపెనీలను తమ దేశంలోనే ఉంచుకొని తక్కువ రకం వాటిని ఇతర చోట్ల పరీక్షలకు అమెరికా కంపెనీలు పంపుతున్నాయి.వంద బిలియన్‌ డాలర్ల మెగా ఫాబ్రికేషన్‌ సంస్థను అమెరికా వాషింగ్టన్‌ సమీపంలోని క్లే అనే చోట ఏర్పాటు చేస్తూ 2.75బి.డాలర్ల (దానిలో 70శాతం మన సబ్సిడీ) సంస్థను గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు మైక్రాన్‌ సంస్థ పూనుకుంది. మన దేశంలో చిప్స్‌ అవసరం నానాటికీ పెరుగుతున్నది. ఎంతగా అంటే 2019లో 22.7బిలియన్‌ డాలర్లుగా ఉన్న మార్కెట్‌ 2026 నాటికి 64బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. అందువలన మన దేశం స్వంతంగా ఉత్పత్తి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. ప్రస్తుతం వివిధ రకాల సెమీకండక్టర్లు ఉన్నాయి. వాటి రూపకల్పన,తయారీ, విడిభాగాల అమరిక, పరీక్ష, ఉత్పత్తి చేసే యంత్రాలు ఇలా ఎన్నో ప్రక్రియలు ప్రస్తుతం కొన్ని దేశాల స్వంతం అంటే అతిశయోక్తి కాదు. గుత్తాధిపత్యం, మార్కెటింగ్‌ నిలుపుకొనేందుకు పెద్ద ఎత్తున పోటీపడుతున్నాయి. తైవాన్‌ ప్రాంతం, దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌, నెదర్లాండ్స్‌, చైనా, ఐరోపా సమాఖ్య, ఇజ్రాయెల్‌ ఈ రంగంలో తిరుగులేనివిగా ఉన్నాయి.


ఇతర దేశాల ఉత్పత్తులతో పోల్చితే చైనా వెనుకబడి ఉంది. ఉత్పత్తితో పాటు అవసరాలకు అది ఎక్కువగా దిగుమతుల మీదనే ఆధారపడుతోంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఎగుమతులు, ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను చైనాకు అమ్మకుండా అమెరికా, దానితో చేతులు కలిపిన దేశాలు ప్రస్తుతం చిప్స్‌ వార్‌ జరుపుతున్నాయి. చివరకు తమ పౌరులెవరూ చైనా కంపెనీల్లో పని చేయకూడదని నిషేధం విధించాయి. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఎలక్ట్రిక్‌ వాహనాలు,రక్షణ ఉత్పత్తుల వంటి వాటిలో సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన గాలియం, జెర్మీనియం వంటి లోహాల దిగుమతి, వినియోగం గురించి అమ్మకాలు జరిపే సంస్థలు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటూ పరోక్షంగా చైనా నిషేధం విధించింది. అమెరికాకు చెందిన మైక్రాన్‌ సంస్థ ఉత్పత్తులు రక్షణకు ముప్పు తెస్తాయని వాటిని నిషేధించింది. ఈ పోరు ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించటం లేదు. గతంలో అనేక రంగాల్లో చైనాను ఇబ్బంది పెట్టేందుకు చూస్తే వాటిని సవాలుగా తీసుకొని తనదైన ప్రత్యేకతను నిరూపించుకుంది. ఇప్పుడూ అదే బాటలో ఉంది. మన దేశం మాదిరి పాకింగ్‌తో సంతృప్తి చెందకుండా మేకింగ్‌తో ముందుకు పోతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోలీసు దురాగతం : రెండో వారంలోకి ఫ్రెంచి నిరసనలు !

05 Wednesday Jul 2023

Posted by raomk in Africa, Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

emmanuel macron, French protests, Nahel Merzouk, Riots in France


ఎం కోటేశ్వరరావు


అల్జీరియా-మొరాకో సంతతికి చెందిన 17 సంవత్సరాల నహేల్‌ అనే కుర్రవాడు ట్రాఫిక్‌ సిగల్‌ నిబంధనలను ఉల్లంఘించాడంటూ పోలీసులు గుండెల మీద కాల్చి చంపిన దురంతం ప్రస్తుతం ఫ్రాన్స్‌ను ఊపివేస్తున్నది. జూన్‌ 27న పారిస్‌ శివార్లలోని నాన్‌తెరేలో ఈ దారుణం జరిగింది. ఇరవై తొమ్మిదవ తేదీన అంత్యక్రియల సందర్భంగా దేశమంతటా ఆగ్రహించినవారి తీవ్ర నిరసనలు, దాడులు కొనసాగుతున్నాయి. మధ్యేవాద, వామపక్ష పార్టీలు, శక్తులు ఈ ఉదంతాన్ని ఖండించాయి, నిరసనలో పాల్గొన్నాయి. జాత్యహంకారి, హంతకుడైన పోలీసు అధికారికి మద్దతుగా విరాళాలు ఇవ్వాలని పచ్చిమితవాద నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ నేత మేరీనె లీపెన్‌ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాటికి 17లక్షల డాలర్లకు పైగా వసూలైంది. నాలుగు సంవత్సరాల క్రితం ” పసుపు చొక్కాల ” ఆందోళన జరిగినపుడు పోలీసుల మీద దాడి చేసిన మాజీ బాక్సర్‌కు మద్దతుగా నిధుల సేకరణకు పిలుపు ఇచ్చినపుడు వెంటనే ఆ నిధి సేకరణను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు అలా జరగలేదు. అరబ్బులను చంపండి మీరు మిలియనీర్లు కావచ్చు అని ఈ నిధి సేకరణ సందేశం ఇస్తున్నదని వామపక్ష నేత డేవిడ్‌ గుయిరాడ్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ చర్య అన్యాయం జరుగుతున్నదనే మనోభావాలను రగిలించటంతో పాటు ఉద్రిక్తతలు మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుందని స్లీపింగ్‌ జైంట్స్‌ అనే సంస్థ పేర్కొన్నది. ఒక మేయరు ఇంటి మీద తగులబడుతున్న కారును తోలి దాడికి పాల్పడ్డారంటే జాతి వివక్ష ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో వెల్లడించింది. దేశంలో తలెత్తిన ఉద్రిక్తత కారణంగా అధ్యక్షుడు మక్రాన్‌ జర్మనీ పర్యటనను రద్దు చేసుకున్నాడు. మైనారిటీల పట్ల దేశంలో ఉన్న జాతివివక్ష గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆందోళన రెండో వారంలో ప్రవేశించింది.


ఉదయం ఎనిమిది గంటలపుడు మెర్సిడెజ్‌ కారు నడుపుతున్న నహేల్‌ దురుసుగా ఒక స్టాప్‌ వద్ద ఉన్న ఇద్దరు పోలీసుల మీద దురుసుగా కారును పోనిచ్చేందుకు చూసాడనే కథనాలు వెలువడ్డాయి. అది వాస్తవం కాదని, వారిద్దరూ కారు పక్కనే ఉన్నట్లు, కారు కదలక ముందే ఒక పోలీసు కారులో ఉన్న నహేల్‌ మీద తుపాకి గురిపెట్టినట్లు కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చాయి.కాల్పులు జరిపిన తరువాత అదుపుతప్పిన కారు సమీపంలోని ఒక స్థంభాన్ని ఢకొీట్టి ఆగింది. నీ తలలో బుల్లెట్‌ దిగుతోంది అన్న మాటలు వినిపించినట్లు ఒక టీవీ ఛానల్‌ పేర్కొన్నది. కాల్పులు జరిపినపుడు నహేల్‌తో పాటు కారులో మరో ఇద్దరు ఉన్నారని వారిలో ఒకడు పోలీసులతో మాట్లాడినట్లు, మరొకడు కారు దిగి పారిపోయినట్లు చూసిన వారు చెబుతున్నారు. కాల్పులు జరపటానికి ముందు బస్సులు వెళ్లే మార్గంలో వెళుతున్న కారును ఇద్దరు పోలీసులు మోటారు సైకిళ్ల మీద వెంబడించి ఆపేందుకు చూడగా నహేల్‌ కారును ఆపలేదు, కొంత దూరం వెళ్లిన తరువాత ట్రాఫిక్‌ కారణంగా నిలపాల్సి వచ్చింది. వెనుకనే వచ్చిన పోలీసుల్లో ఒకడు కారు పక్కకు వచ్చి కాల్పులు జరిపాడు. ఈ తీరుతో జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చైనా పర్యాటకులు వెళుతున్న బస్‌పై జరిగిన దాడి తరువాత అనేక దేశాలు తమ పౌరులను హెచ్చరిస్తూ ఫ్రాన్స్‌ వెళ్లవద్దని సలహా ఇచ్చాయి.


గతవారం రోజులుగా దేశమంతటా వేలాది మంది సాయుధ పోలీసులను మోహరించి హింసాకాండను ఆపేందుకు పూనుకున్నారు. వేలాది మందిని అరెస్టు చేశారు. హింసాకాండకు పాల్పడుతున్న వారు తన మనవడి మరణాన్ని సాకుగా చూపుతున్నారని అమ్మమ్మ నాదియా ఒక టీవీలో చెప్పింది. ఆందోళనలు విరమించాలని కోరింది. నహేల్‌ ఉదంతం ఇలాంటి పరిస్థితిని ఎందుకు సృష్టించిందన్నది ప్రశ్న. 2020లో అమెరికాలోని మినియాపోలిస్‌ పట్టణంలో పోలీసులు జార్జి ఫ్లాయడ్‌ అనే నల్లజాతి యువకుడిని ఊపిరాడకుండా చేసి చంపిన తీరును చుట్టుపక్కల ఉన్నవారు తీసిన వీడియో సంచలనంగా మారి ఆందోళనకు దారితీసింది. నహేల్‌ను కాల్చి చంపుతున్న వీడియో కూడా అలాంటి ప్రతిస్పందననే కలిగించింది.2005లో పోలీసులు వెంటాడినపుడు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించినపుడు దేశమంతటా మూడు వారాల పాటు తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఆ తరువాత ఇప్పుడు అదే మాదిరి ఫ్రాన్సులోని మైనారిటీలు ఆందోళనకు పూనుకున్నారు. ఫ్రెంచి పోలీసుల దుర్మార్గపూరిత వైఖరి, జాతి వివక్ష తీరుతెన్నులకు ఈ ఉదంతాలు నిదర్శనం.


నెలల తరబడి సాగిన పెన్షన్‌ సమ్మెలు,ఇతర ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్‌లో అధికారాన్ని నెట్టుకువస్తున్న మక్రాన్‌ ప్రభుత్వానికి తాజా ఆందోళనతో ఎదురైన సవాలు ఎంత తీవ్రమైనదంటే బ్రసెల్స్‌లో జరుగుతున్న ఒక సమావేశం నుంచి ముందుగానే స్వదేశానికి చేరుకోవటం, జర్మనీ పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.పెన్షన్‌ సంస్కరణలకు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న సమయంలో బ్రిటన్‌ రాజు చార్లెస్‌ కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రెంచి టూర్‌ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మన దేశంలోని మణిపూర్‌లో పరిస్థితి ఎంతగా దిగజారిందో తెలిసిందే. శాంతిగా ఉండాలని కనీసం ప్రధాని నరేంద్రమోడీ నోటి వెంట ఒక్క ముక్కరాలేదు, స్వయంగా పరిస్థితిని తెలుసుకొనేందుకు అక్కడకు వెళ్లలేదు. తమ రాష్ట్రంలో శాంతినెలకాల్పాలని కోరుతూ ఢిల్లీ వచ్చిన ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల ప్రతినిధులను కూడా కలుసుకొనేందుకు అవకాశం ఇవ్వలేదు. అమెరికా, ఈజిప్టు వెళ్లి సుభాషితాలు చెప్పివచ్చారు. సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మంగళవారం నాడు దేశంలోని 220 మంది మేయర్లతో(స్థానిక సంస్థల అధిపతులు) సమావేశం కానున్నట్లు వార్తలు వచ్చాయి.


అల్జీరియా ఫ్రెంచి వలసగా ఉన్న కాలంలో ఫ్రెంచి దళాలు జరిపిన దారుణమారణకాండలు ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. అనేక మంది అల్జీరియన్స్‌ ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. అలాంటి కుటుంబానికి చెందిన వాడే గత నెలలో పోలీసుల చేతిలో మరణించిన నహేల్‌. వలస వచ్చిన ఆఫ్రికా అరబ్బులు, ఇతరులు అంటే ఫ్రెంచి అధికార యంత్రాంగానికి చిన్న చూపు, నేరగాండ్లుగా చూస్తారు.వారితో మమేకం కావటానికి బదులు దమనకాండ ప్రదర్శిస్తారు. అందుకే వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తరచూ వివాదాలు జరుగుతుంటాయి. పశ్చిమ దేశాలలో అమెరికా తరువాత ఫ్రాన్స్‌లోనే పోలీసుల చేతుల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, ఆర్థిక దిగజారుడు పరిణామాలు, వలసదారుల అంశాల మీద ఐరోపా దేశాల్లో పరిస్థితి దిగజారుతోంది.ఇటువంటి స్థితిలో జనంలో ఉన్న అసంతృప్తి ఇలాంటి ఉదంతాలు జరిగినపుడు ఊహించని రీతిలో వెల్లడౌతుంది.ఫ్రాన్స్‌ ఆందోళనకు పూర్వరంగమిదే. నహేల్‌ హత్య ఊహించని ఉదంతమైనా దానికి ప్రతికూల స్పందన గూడు కట్టుకున్న అసంతృప్తికి నిదర్శనం. ఇటీవలి కాలంలో ఫ్రెంచి అధినేత మక్రాన్‌ తమకు మరింత వ్యూహాత్మక స్వయం నిర్ణయాధికారం ఉండాలని, ప్రపంచ వ్యవస్థలో బహుళనాయకత్వం ఉండాలని గట్టిగా చెబుతున్నారు. ఇది అమెరికా గురించే అన్నది స్పష్టం. మక్రాన్నుదారిలోకి తెచ్చుకొనేందుకు పెత్తందారీ ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని చూస్తున్న శక్తుల హస్తం కూడా తాజా కొట్లాటల వెనుక ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అమెరికాకు నచ్చని వైఖరిని తీసుకున్నపుడల్లా ఫ్రాన్స్‌లో కొట్లాటలు జరగటాన్ని బట్టి ఇలా అనుమానించాల్సి వస్తోందని చెబుతున్నారు. అందువలన ఇది ఒక్క ఫ్రాన్స్‌కే కాదు, ఐరోపా సమాఖ్యకు, దేశాలకు ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.


ఐరోపాలో ఇటీవలి కాలంలో ముస్లిం వ్యతిరేక వైఖరితో ఉన్న పచ్చిమితవాద శక్తులు రెచ్చిపోతున్నారు.ఫ్రాన్స్‌ కొట్లాటల్లో పాల్గొన్నది వలస వచ్చిన లేదా ఎప్పటి నుంచో అక్కడ స్థిరపడిన ముస్లింలు, అరబిక్‌ లేదా ఆఫ్రికన్‌ దేశాల నుంచి వలస వచ్చిన వారని చెబుతున్నారు. తాజా పరిణామాల గురించి మీడియాలో చర్చ జరుగుతున్నది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులకు మరింత శిక్షణ అవసరమని, జాతి వివక్ష అంశాన్ని పరిష్కరించాలని, పేదలు-ధనికుల మధ్యపెరిగిన అంతరాన్ని తగ్గించాలని, నిరుద్యోగం పెరుగుదల గురించి సూచనలు చేస్తున్నారు. నిజానికి ఇవి కొత్తవి కాదు ఎప్పటి నుంచో ఉన్నవే. ప్రపంచీకరణ తెచ్చిన సంక్లిష్ట సమస్యలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ప్రపంచీకరణ క్రమంలో ఉత్పత్తి ఖర్చు అధికంగా ఉందనే కారణంతో ఇతర దేశాల నుంచి పారిశ్రామిక వస్తువులను దిగుమతి చేసుకొని సేవారంగం మీద కేంద్రీకరించాయి. ఈ విధానంతో నిరంతర వృద్ది సాగదని తేలింది. ప్రపంచ అభివృద్దిలో అసమతూకానికి దారితీసింది, ప్రపంచీకరణకు వ్యతిరేకతను పెంచింది. కరోనా, ఉక్రెయిన్‌ సంక్షోభం సమస్యల తీవ్రతను వేగతరం కావించింది. ఆర్థిక మందగమన ప్రతికూల పర్యవసానాలు పేద, మధ్య తరగతి మీద భారాలను మోపుతున్నాయి.స్థిరమైన ఉపాధి, అవసరాలకు అనుగుణంగా పెరిగే రాబడి, కుటుంబ జీవనం సంతోషంగా ఉంటుందనే అంశాల మీద ఆశలను తుంచివేస్తున్నది. వీటికి జాత్యహంకారం కూడా తోడైతే ఇక చెప్పనవసరం లేదు. అసంతృప్తి కనిపించని గాస్‌ మాదిరి వ్యాపిస్తే మండటం క్షణాల్లో జరుగుతుంది. గడచిన ఐదు దశాబ్దాల్లో ప్రపంచీకరణ తెచ్చిన మార్పు ఫ్రాన్సులోనూ ఇతర పశ్చిమ దేశాల్లోనూ అనేక పరిణామాలు, ఉద్యమాలు, ఆందోళనలకు దారి తీసింది. వస్తు దిగుమతులు తమ ఉపాధిని దెబ్బతీసిందనే అసంతృప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే అభిప్రాయం రోజు రోజుకూ బలపడటానికి దారి తీస్తోంది. గత రెండు దశాబ్దాల్లో ఏ నేతా ఎదుర్కోనటువంటి తీవ్ర సవాలును మక్రాన్‌ ఎదుర్కొంటున్నట్లు కొందరు విశ్లేషించారు. పార్లమెంటులోని 577 స్థానాలకు గాను మక్రాన్‌ నాయకత్వంలోని రినయసెన్స్‌ పార్టీకి 251 సీట్లే ఉన్నాయి. రెండవ సారి ఎన్నికైనపుడు సంపూర్ణ మెజారిటీ రాకపోవటంతో ద్వితీయ రౌండ్‌లో మితవాది మారినే లీపెన్‌ మీద 58శాతం ఓట్లతో గెలిచాడు. మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో కొనసాగేందుకు పార్లమెంటులో ప్రతిపక్షాల సహకారంతోనే గట్టెక్కే అవకాశం ఉంది.వచ్చే ఏడాది జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా మక్రాన్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d