• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: August 2024

తిట్టే నోరు తిరిగే కాళ్లు ఊరికే ఉండవు :‘‘ఎమర్జన్సీ’’ ఇరకాటంలో బిజెపి, రైతులు, కులగణన మీద కంగన నోటి దురుసు !

31 Saturday Aug 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Caste census, Kangana ranaut, Kangana Ranaut’s Emergency ’, Kangana's controversial statement, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


కాలం కలసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు ! లోక్‌సభ ఎన్నికలు, అనంతర పరిణామాలను చూస్తున్నపుడు బిజెపి, దాన్ని నమ్ముకున్న వారు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారా ? అంటే, అవును అని చెప్పాల్సి వస్తోంది. నోటి దురుసు సెలబ్రిటీగా పేరు మోసిన నటి కంగనా రనౌత్‌ ఇందిరా గాంధీ పాత్రలో నటించి, దర్శకురాలిగా ఉన్న ‘‘ ఎమర్జన్సీ’’ సినిమా బిజెపికి తలనొప్పిగా మారింది. చరిత్రను వక్రీకరించటమే గాక తమను దేశద్రోహులు, ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, అది తమపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉన్నందున ఆ చిత్రంపై నిషేధం విధించాలంటూ దేశవ్యాపితంగా సిక్కులు డిమాండ్‌ చేస్తున్నారు. ఖలిస్తాన్‌ మద్దతుదార్లు కంగనను చంపివేస్తామంటూ బెదిరింపులకు దిగారని వార్తలు.దీంతో 2024సెప్టెంబరు ఆరున విడుదల తేదీని ప్రకటించిన కంగన ఇప్పుడు దానికి సెన్సార్‌ బోర్డు ఆమోదం తెలిపినా కొందరి వత్తిడి కారణంగా ధృవీకరణ పత్రం నిలిపివేశారని చెబుతున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం, ఆమె ప్రధానిగా ఉన్నపుడు 21నెలల అత్యవసరపరిస్థితి విధింపు తదితర అంశాల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన 2.43నిమిషాల నిడివిగల ట్రైలర్‌ను విడుదల చేయగా 50లక్షల మంది చూశారని, కేవలం 461 మంది మాత్రమే ఇష్టపడినట్లు నమోదైనట్లు ఇండియా టుడే పేర్కొన్నది.ప్రతి ఒక్క ఓటునూ లెక్కించుకుంటున్న బిజెపికి ఇప్పటికే దేశంలో ఉన్న మూడు కోట్ల మంది సిక్కులు వ్యతిరేకంగా ఉన్నారు.ఈ సినిమాతో వారు మరింత దూరమౌతారని, పక్కా వ్యతిరేకులుగా మారతారని ఆ పార్టీ భయపడుతోంది.అక్టోబరులో జరిగే హర్యానా, కాశ్మీరు ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.గతంలో బిజెపి మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్‌ కూడా అదే డిమాండ్‌ చేసింది.ఆ సినిమా ప్రదర్శనను అనుమతించకూడదని తెలంగాణా సిక్కు సామాజిక తరగతి ప్రతినిధులు ముఖ్యమంత్రి ఏ రేవంతరెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు.


బిజెపి ఎంపీ కంగన రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుమోసిన సంగతి తెలిసిందే.రైతుల గురించి నోరుపారవేసుకున్న ఉదంతం సమసి పోక మందే కులగణన గురించి చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బిజెపి చెప్పుకుంది. ఆ పార్టీలో ఇలాంటి వారికి కొదవలేదు. అవి పార్టీ కొంపముంచుతున్నాయి.తమకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక బిజెపి ఎంపి అనంతకుమార్‌ హెగ్డే, ఫైజాబాద్‌(అయోధ్య) ఎంపీ లాలూ సింగ్‌, మరి కొందరు కూడా ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ముందు చెప్పారు. అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు మోహన్‌ భగవత్‌, మన్మోహన్‌ వైద్య కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన పూర్వరంగం, తాము 50సంవత్సరాల పాటు ఏకధాటిగా అధికారంలో ఉంటామని అమిత్‌ షా చెప్పటం, ఇవన్నీ చూసిన తరువాత రాజ్యాంగాన్ని మార్చివేస్తారన్న అనుమానాలు బలపడ్డాయి. అందుకే బిజెపికి సంపూర్ణమెజారిటీ రాకుండా జనం తీర్పు చెప్పారు. అనంతకుమార్‌కు సీటు ఇవ్వలేదు, లాలూ సింగ్‌ ఓడిపోయారు. తీరా అధికారానికి వచ్చిన రెండు నెలల్లోనే ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా కేంద్రంలో ఐఎఎస్‌ కాడర్‌కు సమానమైన 45 పోస్టులను ప్రయివేటు వారితో భర్తీ చేసేందుకు పూనుకోవటంతో రిజర్వేషన్లకు ఎసరు పెడతారనే ప్రతిపక్షాల మాట నిజమే అని జనం నమ్మటం, అది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని దెబ్బతీస్తుందనే భయంతో వెంటనే నోటిఫికేషన్‌ వెనక్కు తీసుకోవటం తెలిసిందే.వీటన్నింటినీ చూసిన తరువాత బిజెపి నేతలు తమ మనసులోని మాటలను దాచుకోలేకపోతున్నారని కంగన వంటి వారు రుజువు చేస్తున్నారు.


ఆగస్టు చివరి వారంలో దైనిక్‌ భాస్కర్‌ అనే పత్రికతో మాట్లాడిన కంగన 2020`21లో జరిగిన రైతు ఉద్యమం గురించి నోరుపారవేసుకున్నారు. ఆ సందర్భంగా మృతదేహాలు వేలాడాయని,మానభంగాలు జరిగాయని ఆరోపించారు.రైతు ఉద్యమం జరిగిన హర్యానాలో లోక్‌సభ ఎన్నికల్లో పదికి గాను ఐదు సీట్లు పోగొట్టుకున్న బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దూరం కానుందనే భయంతో ఉంది. సరిగ్గా ఈ తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హర్యానా రైతాంగాన్ని మరింతగా రెచ్చగొట్టేవే. పార్టీకి నష్టం కలిగిస్తాయని హర్యానా పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. దాంతో కేంద్ర బిజెపి వెంటనే కంగన మాటలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంది తప్ప కనీసంగా ఆమెను మందలించలేదు. బంగ్లాదేశ్‌లో మాదిరి పరిస్థితిని భారత్‌లో సృష్టించే పథకం ఉందని, రైతుల నిరసనల వెనుక చైనా, అమెరికా హస్తం ఉందని కూడా అంతకు ముందు ఆరోపించారు. పార్టీ విధానాల గురించి ప్రకటనలు చేసేందుకు కంగన రనౌత్‌కు అధికారం లేదా అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్‌లో అలాంటి ప్రకటనలు చేయకూడదని కోరినట్లు బిజెపి ప్రకటించింది. తాను నటించిన ఎమర్జన్సీ సినిమా గురించి ప్రచారం చేసుకొనేందుకు దైనిక భాస్కర్‌ పత్రికతో మాట్లాడినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అందరూ వాటిని ఎక్కడ చదవరో అని లేదా మరింత ప్రచారం కోసం సదరు పత్రిక వార్తను తన ఎక్స్‌ ఖాతాలో ఆగస్టు 25న పోస్టు కూడా చేశారు. ‘‘ బంగ్లాదేశ్‌లో జరిగిందే భారత్‌లో కూడా జరిగే అవకాశం ఉంది.మన అగ్రనాయకత్వం బలంగా లేనపుడు ఇక్కడ(ఢల్లీి శివార్లలో) నిరసనలు తెలిపారు.శవాలు వేలాడాయి, మానభంగాలు జరిగాయి. రైతులకు అనుకూలమైన చట్టాలను వెనక్కు తీసుకున్నపుడు దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది.కానీ ఆ రైతులు ఆ తరువాత కూడా ధర్నాలో కూర్చున్నారు….ప్రభుత్వం చట్టాలను వెనక్కు తీసుకుంటుందని వారెన్నడూ ఊహించలేదు.బంగ్లాదేశ్‌లో జరిగిన మాదిరి పెద్ద పథకంతో వారు వచ్చారు. ఈ పధకాలు రైతులవని మీరు అనుకుంటున్నారా ? కాదు, చైనా, అమెరికా వంటి మనదేశంలో పని చేస్తున్న విదేశీ శక్తులది ’’ అన్నారు.లోక్‌సభ ఎన్నికలపుడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను బిజెపి తరఫున గ్రామాల్లో ప్రచారానికి అక్కడి రైతులు రానివ్వని ఉదంతాలను చూసిన బిజెపి నేతలు కంగన మాటలతో తమపని అయిపోయినట్లే అని భావించారు. నష్ట నివారణ చర్య తీసుకున్నప్పటికీ కంగన మాటలు రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారటం అనివార్యం.ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ హిమచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఒక తీర్మానం కూడా చేసింది.రెండవ సారి శంభు సరిహద్దులో ఆందోళన ప్రారంభించి రెండవందల రోజుల సందర్భం జరిగే నిరసనకు రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ రానున్నట్లు వార్తలు.


తిట్టే నోరు తిరిగే కాళ్లు ఊరికే ఉండవు అంటారు కదా ! రైతులపై నోరుపారవేసుకున్న కంగన మాటలు ఇంకా చెవుల్లో గింగురు మంటుండగా తగ్గేదేలే అంటూ కుల గణన జరగదు అని మరొక ప్రకటన వదిలారు. వెంటనే అది మా వైఖరి కాదు అంటూ దానికి కూడా బిజెపి జనానికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది.న్యూస్‌ 24 అనే టీవీతో మాట్లాడుతూ కుల గణన తప్పకుండా చేయాలా అన్న ప్రశ్నకు అవసరమే లేదు అంటూ కంగన చెప్పేశారు. కుల గణన మీద యోగి ఆదిత్యనాథ్‌ వైఖరే తనదని, అందరం కలసి ఉంటేనే మంచిదని, విడిపోతే నాశనం అవుతామన్నారు.‘‘ కులగణన జరపకూడదు.నటుల కులమేమిటో మనకు తెలియదు.ఎవరికీ ఏమీ తెలియదు.నా చుట్టూ ఉన్నవారు కులం గురించి పట్టించుకోరు. దాన్ని ఎందుకు ఇప్పుడు తేల్చాలి.గతంలో మనం చేయలేదు, ఇప్పుడూ అవసరం లేదు.కేవలం పేదలు, రైతులు, మహిళలు అనే మూడు కులాలు మాత్రమే ఉన్నాయి, నాలుగో కులం ఉండకూడదు’’ అన్నారు.లోక్‌సభ ఎన్నికలకు ముందు కావాలంటే రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చు తప్ప కేంద్ర ప్రభుత్వం చేపట్టదని, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బిజెపి నేతలు పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు ముందు మరోసారి ఎన్‌డిఏ కూటమిలో చేరిన జెడియు నితీష్‌ కుమార్‌ బీహార్‌లో కులగణన చేశారు.అనేక రాష్ట్రాలలో అలాంటి డిమాండ్‌ ముందుకు వచ్చింది.కేంద్రమే జనాభా లెక్కలతో పాటు జరపాలని ప్రతిపక్ష పార్టీలు కోరాయి. ఎన్నికలో బిజెపికి సంపూర్ణ మెజారిటీ రాలేదు, మిత్రపక్షాల మీద ఆధారపడాల్సి వచ్చింది.దాంతో వాటి వత్తిడికి లొంగిపోయింది.కంగన ప్రకటన మరోసారి బిజెపిని ఇరుకున పెట్టింది.‘‘ అవసరం తలెత్తితే తాము కులగణన చేస్తామని హోంమంత్రి చెప్పారని,కనుక కంగన చెప్పిన మాటలు పార్టీ వైఖరిని ప్రతిబింబించవు’’ అని బిజెపి జాతీయ ప్రతినిధి గురు ప్రకాష్‌ పాశ్వాన్‌ ప్రకటించాల్సి వచ్చింది.అయితే ఇంతవరకు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


తోటకూర నాడే మందలించి ఉంటే అనే సామెత తెలిసిందే.గతంలో కంగన రనౌత్‌ చేసిన అనేక వివాదాస్పద ప్రకటనలు, ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగినపుడు బిజెపి నోరు మెదపలేదు.దాడి జరపటాన్ని ఆస్వాదించింది.పరిస్థితి మారిన తరువాత ఇప్పుడు ప్రతి మాటా పార్టీకి ఎదురు తిరుగుతోంది.ఆమె ఎక్కడా తగ్గటం లేదు. తన సినిమా గురించి ప్రచారం చేసుకుంటూ చౌకబారు,తెలివి తక్కువ ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఉచిత ప్రచారం పొందాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని 2021లో చెప్పారు.స్వీయ అనుభవంతో తానీ మాటలు చెబుతున్నట్లు, తన అతి మంచితనం కారణంగా వ్యవస్థ తనను దేశం విడిచి అమెరికా వెళ్లేట్లు చేసిందని, మోడీ అధికారానికి వచ్చాక తాను తిరిగి వచ్చానని అందుకే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. అదే విధంగా కత్రినా కైఫ్‌ వంటి విదేశీ హీరోయిన్లు ఎంతో రాణించారని కానీ 2014తరువాత స్వదేశీ నటీనటులు, కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విదేశీయుల నృత్యాలు ఆపాలని జనం చెప్పారని, ఇటాలియన్‌ ప్రభుత్వాన్ని తొలగించి ఒక చాయ్‌వాలాను ప్రధానిని చేశారని కూడా సెలవిచ్చారు. సుభాస్‌ చంద్రబోస్‌ను భారత ప్రధమ ప్రధాని అని చెప్పటమే కాదు, ఆయన అజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని ఏర్పరచిన కారణంగా బోసే ప్రధమ ప్రధాని అని సమర్ధించుకున్నారు.తనను విమర్శించిన వారికి రెండు రకాల మెదడు కణాలు ఉంటాయని వారికి ఇది అర్ధం కాదని కూడా ఎదురుదాడి చేశారు.రామనాధ్‌ కోవింద్‌ను కోవిడ్‌గా పలకటమేగాక, ప్రధమ దళిత రాష్ట్రపతిగా వర్ణించి తరువాత నాలుక కరుచుకున్నారు. అలాంటి కంగన సినిమా ఎమర్జన్సీ గురించి సెన్సార్‌బోర్డు ఏం చేస్తుందో, బిజెపి ఏం చెబుతుందో వాటి మీద స్పందనలు ఎలా ఉంటాయో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ఉక్రెయిన్‌ పర్యటన, కాషాయ దళ అతిశయోక్తులు,గాలి తీసిన జెలెనెస్కీ !

29 Thursday Aug 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, Hindutva nationalism, Joe Biden, Narendra Modi Failures, Propaganda, RSS, Ukraine crisis, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


‘‘ నిజం…మోడీ ది ఉక్కు దౌత్యం…ఉక్రెయిన్‌ వ్యూహాత్మక పరిశ్రమల మంత్రి క్యమిషిన్‌…మోడీ ముప్ఫై గంటల అసాధారణ దౌత్య ప్రక్రియ…పోలాండ్‌ సరిహద్దు పట్టణం జెమిసిల్‌ నుంచి ఉక్రెయిన్‌ కివీవ్‌ కు 700 కిలోమీటర్లు ప్రయాణం…మొత్తం యుద్ధ ప్రమాద ప్రాంతమే….పది గంటలు రానూ… పది గంటలు పోనూ… అక్కడో పది గంటలు…యూరోప్‌..అమెరికా…మరో ప్రక్క రష్యా అసాధారణ ఉత్కంఠ మధ్య..చూపులన్నీ ఈ ఉక్కు మనిషి పైనే…రైల్‌ ఫోర్స్‌ వన్‌…మహా గట్టి రైలు…కదులుతున్న దుర్భేద్యమైన రైలు…దాన్ని అనుసరిస్తూ… రాడార్లు…సైనిక విమానాలు…అంటే ఒక రకంగా మూడు రోజుల పా టు…యుద్ధం ఆగిపోయినట్టే…అక్కడ మాదే విజయం..ఇక్కడ మాదే పై చేయి అంటూ ప్రస్తుతం రష్యా ఉక్రైన్లు ఉత్తుత్తి ప్రకటనలు…పోలాండ్‌..ఒకప్పటి వార్సా సంధికి ప్రసిద్ధి…ఏదో చెప్పాల్సినవి అన్నీ మోడీకి చెప్పేసుకున్నామన్న సంతృప్తి నాటోకి…ప్రపంచానికి తమ బాధ ఆగ్రహం మోడీయే అర్థం చేయించగలుగుతారన్న ఆశ ఉక్రెయిన్దీ….ఒక్కసారిగా పెరిగిపోయిన భారత్‌ ప్రసిద్ధి చూసి…అసూయా ద్వేషాలతో రగిలిపోతున్న ఆయుధ వ్యాపార లాబీలు…భారత్‌ ఆంతరంగిక వైఫల్యాలను ఎత్తి చూపడానికి మనకి ఇక్కడొక రాహువును వదిలిపెట్టారు…ఆటలో ఆటం బాంబు…సరే ఏదేమైనా రష్యా ఆయిల్‌ ఇస్తూనే ఉంటుంది…మన ద్వారా యూరోప్‌ కొంటూనే ఉంటుంది…మన డబ్బులు…మన ఆయిల్‌ రిజర్వులు పెరుగుతూనే ఉంటాయి…ఇది ఒక రకంగా యుద్ధ ఆర్థిక దౌత్యం…శ్రావణ్‌ శుక్రవారం మహాలక్ష్మి అనుగ్రహం…ఇలాంటి విన్యాసాలు కేవలం శక్తిమంతమైన దేశాలు మాత్రమే…తెలివైన దేశాలు మాత్రమే చెయ్యగలుగుతాయి…ఇప్పుడు భారత్‌ అంటే….భారత్‌ అంతే…మీ ఏడుపులే మన ఎదుగుదల…ఈ సమయంలో ఎవరెవరు ఏడుస్తారో చూస్తే చాలు…మనకు అర్థం అయిపోతుంది…రైలు ప్రయాణ సమయంలోనే …శత్రువును గమనించు…! అక్కడా…ఇక్కడా కూడా! జైహింద్‌ ’’
ఆగస్టు నెలాఖరులో నరేంద్రమోడీ ఉక్రెయిన్‌ పర్యటన గురించి ఆకాశానికి ఎత్తుతూ వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో పేరు లేకుండా ఎప్పటి మాదిరే కాషాయ మరుగుజ్జులు పెట్టిన పోస్టు పూర్తి పాఠమది. అలాగే జరిగిందా ? ఎవరేమంటున్నారు, నిజం ఏమిటి ? ఉక్రెయిన్‌ వివాదంలో భారత్‌ తటస్థంగా ఉంది. జూలై నెలలో మోడీ మాస్కో వెళ్లి వ్లదిమిర్‌ పుతిన్ను ఆలింగనం చేసుకున్నారు. దాన్ని తప్పుపట్టిన ఉక్రెయిన్‌ అధినేత జెలెనెస్కీ ఆగస్టు 23న మోడీ తమదేశాన్ని సందర్శించినపుడు అదే చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో పేరు మోసిన రక్త పిపాసి నేరగాడిని మాస్కోలో కౌగలించుకుంది అని నాడు జెలెనెస్కీ ఎక్స్‌ చేశాడు. అదే వ్యక్తిని తాను కూడా కౌగలించుకోవటం ఏమిటి ? అదే నోటితో మోడీ జరిపిన తమ దేశ పర్యటన చరిత్రను సృష్టించిందని కూడా చెప్పాడు. ఆలింగనాల దౌత్యంలో ఎవరూ తక్కువ తినలేదు. మాస్కో వెళ్లినపుడు పశ్చిమదేశాలన్నీ మోడీని దుమ్మెత్తిపోశాయి. అది ఊహించిందే, వాటి ఆగ్రహాున్ని చల్లార్చి సంతుష్టీకరించేందుకు ఉక్రెయిన్‌ వెళ్లారు. కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. అనుమానాలు, సందేహాలు వెల్లడిస్తూ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉక్రెయినుకు సౌహార్ద్రత ప్రకటించటం కంటేతన ప్రయోజనాలకే పెద్ద పీటవేసిందని ఆరోపించిన వారు కూడా ఉన్నారు.
తొలిరోజుల్లో టర్కీ ఒక ప్రయత్నం చేసింది తప్ప భారత్‌ లేదా మోడీని వివాదంలో మధ్యవర్తిగా ఎన్నడూ రష్యా పరిగణించలేదు. మనదేశం ఎన్నడూ అలా ప్రకటించుకోలేదు. తమ అతిధిగా వచ్చిన మోడీని జెలెనెస్కీ అవమానించటమే కాదు, ఇరకాటంలో పెట్టాడు. మోడీ స్వదేశానికి తిరుగు ప్రయాణమైన తరువాత కనీస దౌత్య మర్యాదలను కూడా పాటించకుండా వ్యవహరించాడు. జూన్‌ నెలలో స్విడ్జర్లాండ్‌లో ఒక శాంతి సమావేశం జరిగింది. దానికి రష్యాను అసలు ఆహ్వానించలేదు, చైనా వెళ్లలేదు, భారత్‌తో సహా పదమూడు దేశాలు హాజరైనప్పటికీ ఆ సమావేశం విడుదల చేసిన ప్రకటన మీద సంతకం చేయలేదు. భారత్‌ మరో శాంతి సమావేశం జరిపితే ఆహ్వానిస్తాం గానీ అది జరగటానికి ముందు భారత్‌ స్విస్‌ ప్రకటన మీద సంతకం చేయాలని జెలెనెస్కీ షరతు పెట్టాడు. మనదేశ వైఖరి తెలిసి కూడా విలేకర్లతో అలా మాట్లాడటం చౌకబారు తనం తప్ప మరొకటి . కాదు, పైగా జెలెనెస్కీ ఆహ్వానం మీదనే మోడీ వెళ్లారు. స్వాగతం చాలా మోటుగా లేదా వికారంగా పలికినట్లు బిబిసి వర్ణించింది. ‘‘విశ్వగురువు’’ కు ఇది అవమానమా ? ఘనతా ?
‘‘ పేద దేశాలు రెండవ శాంతి సమావేశం జరిపితే మంచిదని నేను నిజంగా నమ్ముతున్నాను. సౌదీ అరేబియా,కతార్‌,టర్కీ వంటి దేశాలు ఉన్నాయి. భారత్‌లో మనం అలాంటి సమావేశం నిర్వహించవచ్చని నేను నరేంద్రమోడీతో చెప్పాను. అది పెద్ద దేశం, అతిపెద్ద ప్రజాస్వామికదేశం. స్విస్‌ శాంతి సభ ప్రకటనపై సంతకం చేసిన దేశంలోనే సభ జరగాలి.అయితే నేను నిర్మొహమాటంగా చెప్పదలచుకున్నాను. ఈ షరతు కేవలం భారత్‌కు మాత్రమే కాదు. రెండవ సభ జరపాలని సానుకూలంగా కోరుకుంటున్న ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుంది. శాంతి (స్విడ్జర్లాండ్‌) సమావేశ ప్రకటనపై ఇప్పటికీ సంతకం చేయని ఏ దేశంలో కూడా జరపటానికి మాకు కుదరదు ’’ అని మోడీ భారత్‌కు తిరుగు ప్రయాణమైన తరువాత భారతీయ విలేకర్ల సమావేశంలో జెలెనెస్కీ చెప్పినట్లు కీవ్‌ ఇండిపెండెంట్‌ అనే పత్రిక రాసింది.రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ దాని యుద్ధ ఆర్థికానికి భారత్‌ సాయపడుతున్నదని జెలెనెస్కీ చెప్పాడు. మోడీ రష్యా పర్యటన జరిపిన రోజే తమ అతిపెద్దదైన పిల్లల ఆసుపత్రి మీద దాడి జరిపిన పుతిన్‌కు నరేంద్రమోడీ అంటే గౌరవం లేదని వెల్లడి కాలేదా అంటూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. మీరు గనుక చమురు దిగుమతులు నిలిపివేస్తే పుతిన్‌కు పెద్ద సవాలు ఎదురౌతుంది.మోడీ శాంతిని కోరుకుంటున్నారు తప్ప పుతిన్‌ కాదన్నాడు. జెలెనెస్కీ విలేకర్ల సమావేశంలో మొరటుగా మాట్లాడాడు. అంతర్గతంగా మాట్లాడాల్సిన వాటిని విలేకర్ల ముందు చెప్పాడు.
మోడీ రష్యా పర్యటనపై విమర్శలకు దిగిన ఉక్రెయిన్‌, అమెరికాల ఆగ్రహాన్ని తగ్గించే నష్ట నివారణ చర్యగా ఉక్రెయిన్‌ పర్యటన జరిగిందని, శాంతికి కట్టుబడి ఉన్న భారత్‌కు, దానితో రష్యా సంబంధాలకు ఒక సవాలుగా ఈ పర్యటన మారిందన్న ఒక విశ్లేషకుడి వ్యాఖ్యను చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఉటంకించింది. స్విస్‌ ప్రకటనపై మనదేశం సంతకం చేయకపోతే అమెరికాకు, చేస్తే రష్యాకు ఆగ్రహం కలుగుతుంది.ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరి పరిస్థితి ఉంది. రష్యా కురుస్కు ప్రాంతంపై ఉక్రెయిన్‌ దాడి చేసినందున చర్చలకు అవకాశం లేదని పుతిన్‌ ప్రకటించిన తరువాత మోడీ జరిపి కీవ్‌ పర్యటన శాంతికి దోహదం చేస్తుందా ? అసలు ఎవరైనా వినిపించుకుంటారా ? తాము మధ్యవర్తి పాత్రను పోషించాలని కోరుకోవటం లేదని, ఉక్రెయిన్‌`రష్యా కోరితే వర్తమానాలను పరస్పరం తెలియ చేస్తామని భారత అధికారులు చెప్పినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. పశ్చిమ దేశాలలో రష్యా ఒంటరిపాటైతే ఆసియాలో భారత ప్రత్యర్ధిగా ఉన్న చైనాకు మరింత దగ్గర అవుతుందని, అలా కాకుండా ఉండాలంటే యుద్ధానికి ఒక పరిష్కారం అవసరమని భారత్‌ భావిస్తోందని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థంగా ఉన్న చైనా శాంతి ప్రతిపాదన చేసింది. జెలెనెస్కీ నుంచి దాని మీద ఎలాంటి స్పందన లేదు.మన వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదనా లేదు.
తన పర్యటన తరువాత నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మరుసటి రోజు వ్లదిమిర్‌ పుతిన్‌కు ఉక్రెయిన్‌తో జరిపిన చర్చల గురించి వివరించినట్లు ఒక ఎక్స్‌ ద్వారా తెలిపారు. వివాదానికి శాంతియుత ముగింపు పలకాలంటే చర్చలు, దౌత్య పద్దతుల్లో చిత్తశుద్దితో నిమగ్నం కావాలని మోడీ చెప్పినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ కురుస్కు ప్రాంతం మీద ఉక్రెయిన్‌ దాడి చేసిన తరువాత పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. రెండు దేశాల మధ్య పరిస్థితి విషమించటం తప్ప మెరుగుపడే అవకాశాలు లేవు.పరిస్థితి ఇలా ఉండగా అతిశయోక్తులతో కూడిన ఊరూ పేరూ లేని ప్రకటనలు, ప్రచారాలను నమ్మేంత అమాయకంగా వాట్సాప్‌ జనాలు ఉన్నారని భావించటం తప్ప మరొకటి కాదు ! పోలాండ్‌, ఉక్రెయిన్‌ పర్యటన జరిగింది రెండు రోజులైతే మూడు రోజులు యుద్ధం ఆగిపోయిందని చెప్పటాన్ని బట్టి మా ఊరి మిరియాలు తాటికాయలంత ఉంటాయి దొరా అన్నట్లు ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి-పెరిగిన ఉద్రిక్తతలు !

28 Wednesday Aug 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RELIGION, USA, WAR, Women

≈ Leave a comment

Tags

Hamas, Hezbollah, iran, israel attack lebanon, Joe Biden, Netanyahu


ఎం కోటేశ్వర రావు


మధ్య ప్రాచ్యుంలో ఏం జరుగుతోంది ? ఏ క్షణంలోనైనా ప్రాంతీయ యుద్ధం జరగనుందా ? ఇప్పటికే సూయజ్‌ కాలువ గుండా జరుగుతున్న రవాణాకు ఆటంకం కలుగుతూ పడుతున్న ఇబ్బందులు మరింతగా పెరుగుతాయా ? గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసినపుడు సామాన్యులకు తలెత్తుతున్న సందేహాలివి. హమస్‌ సాయుధులను అణచివేస్తామంటూ ప్రగల్భాలు పలికిన ఇజ్రాయెల్‌ అక్టోబరు ఏడు నుంచి ఇంతవరకు ఆ పనిచేయలేకపోయింది. కుట్రలు, దొంగదెబ్బలతో విదేశాల్లో హమస్‌ నేతలను హతమారుస్తున్నది. దానికి ప్రతీకారంగానే తాజాగా జరుగుతున్న పరిణామాలు. ఒక సరిహద్దులో ఉన్న లెబనాన్‌లో కేంద్రీకరించిన హిజబుల్లా సాయుధులు తమ మీద దాడి చేసే అవకాశాన్ని పసిగట్టి వంద విమానాలతో వారి 40 స్థావరాల మీద తామే ముందుగా ఆదివారం నాడు దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంది.ఆదివారం నాడు 30 గ్రామాలు, పట్టణాల మీద ఇజ్రాయెల్‌ వంద విమానాలతో దాడి చేసింది.దానికి ప్రతిగా తాము ఇజ్రాయెల్‌లోని 11 మిలిటరీ స్థావరాల మీద 340 రాకెట్లను ప్రయోగించామని హిజబుల్‌ ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధి నసరల్లా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తాము బలమైన మిలటరీ అని, తొలి దశను విజయవంతంగా పూర్తి చేశామన్నాడు. దీని అర్ధం రానున్న రోజుల్లో దాడులు జరగవని కాదని విశ్లేషకులు చెబుతున్నారు.మరోవైపు గాజాలో ఇజ్రాయెల్‌ దాడులను మరింత తీవ్రం కావించింది. అల్‌ అక్సా ఆసుపత్రిలో ఉన్న రోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టి, దాని మీద దాడి చేసింది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఐరాస సిబ్బంది పని చేసే అవకాశాలు లేకుడా దాడులు జరుపుతున్నది. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్న ఎమెన్‌లోని హౌతీ సాయుధులు కూడా దాడులకు దిగటంతో ఇజ్రాయెల్‌ మరింతగా మారణకాండ సాగిస్తున్నది.హిజబుల్లా దాడిలో జరిగిన నష్టాన్ని ఇజ్రాయెల్‌ వెల్లడి కాకుండా చూస్తున్నది. ఇరాన్‌ నేరుగా పోరుకు దిగకుండా తన మద్దతుదార్లకు అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తున్నది. తాము పూర్తి స్థాయి దాడులకు దిగటం లేదని ఇజాయెల్‌ విదేశాంగ మంత్రి కట్జ్‌ ప్రకటించాడు. తమ పౌరులను రక్షించుకోవటానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకున్నాడు. ఇదే సమయంలో హిజబుల్లా కూడా దాడులను కానసాగించటం లేదు. రెండు వైపులా లక్షా 60వేల మందిని అటూ ఇటూ వేరే ప్రాంతాలకు తరలించినట్లు ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు.


ఒక వైపు గాజాలో దాడుల విరమణ గురించి కైరోలో చర్చలు జరుగుతుండగా తమ మీద దాడులు జరపాలని హిజబుల్లా తలపెట్టిందనే సాకుతో ఇజ్రాయెల్‌ దాడులు జరపటం చర్చలను దెబ్బతీయటం తప్ప మరొకటి కాదు. శాంతి చర్చల కారణంగా చాలా రోజులుగా తాము ప్రతీకార దాడికి దిగలేదని అయితే, ఇజ్రాయెల్‌ తెగబడినందున తాము స్పందించామని,ప్రతి దాడి ముగిసిందని హిజబుల్లా ప్రకటించగా ఇజ్రాయెల్‌ సోమవారం నాడు కూడా లెబనాన్‌ మీద దాడులు చేసింది. తమ గడ్డ మీద హమస్‌ నేత హత్యకు ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్‌ మరోసారి హెచ్చరించింది. ప్రస్తుతానికి పూర్తి స్థాయి యుద్దం లేకున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి ఉంది. హిజబుల్లా దాడిలో తాము పెద్దగా నష్టపోలేదని, తమ మిలిటరీ స్థావరాలకు ఎలాంటి హాని జరగలేదని ఇజ్రాయెల్‌ చెప్పుకుంది. గతేడాది అక్టోబరు 8 నుంచి ఇప్పటి వరకు లెబనాన్‌పై అది జరిపిన దాడుల్లో వంద మంది 566 మంది మరణించగా వారిలో సాధారణ పౌరులు 133 మంది, మిగిలిన వారు సాయుధులు మరణించినట్లు అంచనా. హిజబుల్లా దాడుల్లో 23 మంది యూదు సైనికులు, 26 మంది పౌరులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. రెండువైపులా లక్షలాది మంది జనం నివాసాలను వీడాల్సి వచ్చింది. ఇజ్రాయెల్‌ వద్ద అపార ఆయుధ సంపద ఉంది, ఎప్పటికప్పుడు అమెరికా, ఇతర దేశాలు కొత్తగా అందిస్తున్నాయి. అయితే హిజబుల్లా వద్ద అంత పెద్ద మొత్తంలో లేకున్నా ఇజ్రాయెల్‌లోని అన్ని ప్రాంతాల మీద దాడులు చేసేందుకు అవసరమైన రాకెట్లు ఉన్నట్లు అంచనా. లక్షా 20వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటాయని, అక్టోబరు ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వేలు ప్రయోగించినట్లు అంచనా. ఆధునిక డ్రోన్లతో పాటు నిర్ణీత లక్ష్యాలను తాకే క్షిపణులు కూడా ఉన్నాయి. ఒక వేళ యుద్ధమే ప్రబలితే రెండు వైపులా నష్టాలు తీవ్రంగా ఉంటాయి.2006లో జరిగిన నెల రోజుల పోరులో దక్షిణ లెబనాన్‌, రాజధాని దక్షిణ ప్రాంతాలు దెబ్బ తిన్నాయి. రెండు వైపులా ప్రాణ నష్టం జరిగింది. లెబనాన్‌ నాశనం కాగా ఇజ్రాయెల్‌ ఆర్ధికంగా ఎంతో నష్టపోయింది. అప్పటి నుంచి హిజబుల్లాను తుడిచిపెట్టాలని చూస్తున్నా సాధ్యం కావటం లేదు.


గత పది నెలలుగా ఇజ్రాయెల్‌, అమెరికా లక్ష్యాలుగా సిరియా, ఇరాక్‌, ఎమెన్‌లలో ఉన్న సాయుధ గ్రూపులు దాడులు చేస్తున్నాయి. వాటికి ఇరాన్‌ మద్దతు బహిరంగ రహస్యమే.ఒక వేళ ఇరానే ప్రత్యక్షంగా దాడులకు దిగవచ్చనే అంచనాతో ఇటీవల పెద్ద ఎత్తున తమ నౌకా, వైమానిక దళాలను మధ్య ప్రాచ్యానికి అమెరికా తరలించింది. విమానవాహక యుద్ద నౌకలు కూడా వాటిలో ఉన్నాయి. ఇజ్రాయెల్‌ మీద ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే రక్షణ వ్యవస్థలను అమెరికా అందచేసింది.దాన్నే ఇనుప కప్పుగా పిలుస్తున్నారు. లెబనాన్‌తో ఉన్న సరిహద్దులో పరిస్థితి ఇలాగే ఉంటుందనే నమ్మకం లేదని ఇజ్రాjెల్‌ అంటున్నది. ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించిన తమ పౌరులు డిసెంబరు 31వరకు తిరిగి రావద్దని కోరటాన్ని బట్టి అది ఎంతగా భయపడుతున్నదో అర్ధం అవుతోంది.వచ్చే నెలలో పా ఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రకటన చేసింది. గాజాపై తాను జరుపుతున్న దాడులను అప్పటి వరకు విరమించేది లేదన్న సంకేతం కూడా దీనిలో ఉంది. అందువలన రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు తెగబడే అవకాశం ఉంది.
గాజాలో హమస్‌ ఉనికి లేకుండా చేయాలని, తిరిగి అది తలెత్తకుండా ఉండాలంటే సాధారణ పరిస్థితి ఏర్పడిన తరువాత కూడా తమ మిలిటరీని అక్కడ అనుమతించాలని ఇజ్రాయెల్‌ డిమాండ్‌ చేస్తున్నది, దీని అర్ధం హమస్‌ ఆత్మహత్య చేసుకోవాలని అనటమే అని దానికి ఏ మాత్రం అంగీకరించే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు. గాజాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఉన్న ఆరున్నరలక్షల మంది పిల్లలకు పోలియో వాక్సిన్‌ వచ్చినప్పటికీ దాన్ని వేసేందుకు ఇజ్రాయెల్‌ అనుమతించటం లేదు.ఐరాస సిబ్బందిని కూడా వదల కుండా దాడులు చేస్తున్నది. కాల్పుల విరమణ జరగకుండా వాక్సిన్లు వేసే అవకాశాలు లేవు. గాజాలో తొలిసారిగా పాతిక సంవత్సరాల తరువాత తొలి పోలియో కేసు నమోదైంది.మురుగునీటిని పరీక్షించినపుడు వైరస్‌ ఉన్నట్లు నిర్థారణ అయింది.పిల్లల్లో 95శాతం మందికి వాక్సిన్‌ అవసరమని యూనిసెఫ్‌ ప్రకటించింది.దాడులు ఆగకపోతే వాక్సిన్‌ వేయటం కష్టమని స్పష్టం చేసింది.పారిశుధ్య పరిస్థితి దిగజారటంతో పాటు మంచినీటి సరఫరాకూ ఆటంకం కలుగుతోంది. దీంతో ఇతర వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఆకలి మంటలు, అనాధలుగా రోడ్ల పాలుకావటం సరేసరి.


ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను చూస్తే దౌత్య ఎత్తుగడల పేరుతో అమెరికా ఆడిన నాటకాన్ని యావత్‌ ప్రపంచ ప్రజానీకం గ్రహిస్తున్నది. తాను మధ్యవర్తిని అని చెప్పుకుంటూనే 1990దశకపు ఓస్లో ఒప్పందాల నుంచి నేటి వరకు అనుసరించిన వైఖరి ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. ప్రధాన కారణం ఒక వైపు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తూ భద్రతా మండలిలో దానికి వ్యతిరేకంగా వచ్చిన అన్ని తీరానాలను అడ్డుకోవటమే. పది నెలలుగా గాజా మారణంకాండ సాగుతున్నప్పటికీ దాన్ని ఆపలేకపోయింది. ఇరాన్‌, లెబనాన్లలో హమస్‌ అగ్రనేతల హత్య అమెరికాకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు. నవంబరు ఐదున జరిగే ఎన్నికల్లో ప్రతి అంశాన్ని ఉపయోగించుకొని లబ్ది పొందాలని అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు. ఏ పరిష్కారం జరిగినా అది తమకు అనుకూలంగా ఉండాలని జోబైడెన్‌ భావిస్తున్నాడు. ఇజ్రాయెల్‌ ఓడిపోయినట్లు లేదా వెనక్కు తగ్గిందనే భావనకు వీలులేకుంలేకుా చూడాలని చూస్తే కుదరటం లేదు. అదే సమయంలో ఎన్నికల రోజు దగ్గపడేలోగా ఏదో ఒక పరిష్కారం కుదిరితే తమ విజయంగా చెప్పుకోవాలని కూడా బైడెన్‌ చూస్తున్నాడు. మధ్య ప్రాచ్య యుద్ధం జరగాలని కోరుకుంటున్న అమెరికా వలలో పడేందుకు ఇరాన్‌ సిద్దంగా లేదు.ఎంతగా రెచ్చగొడుతున్నప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉప్పునిప్పు మాదిరి సంబంధాలున్న స్థితిలో చైనా మధ్యవర్తిత్వంలో సౌదీతో అది సయోధ్య కుదుర్చుకోవటాన్ని అమెరికా ఊహించలేదనే చెప్పాలి. ఒక వైపు తమ మద్దతుతో గాజాలో మారణకాండ సాగుతుండగా మానవత్వం గురించి కబుర్లు చెబుతున్న అమెరికా బండారం మరింతగా బయటపడుతున్నది.


అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ కొద్ది రోజుల క్రితం తమ ప్రతిపాదనను ఇజ్రాయెల్‌ అంగీకరించిందని ప్రకటించాడు. అయితే కొద్ది గంటల్లోనే అలాంటిదేమీ లేదని ప్రధాని నెతన్యాహు ప్రకటించి గాలి తీశాడు. ఒప్పందానికి ప్రధాని సుముఖంగా లేనందున శాంతి చర్చల్లో తమ ప్రతినిధి పాల్గొనే అవకాశం లేదని కూడా ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. దీంతో ఒప్పందాన్ని నెతన్యాహు అడ్డుకుంటున్నట్లు రెండుదేశాల అధికారులు లీకులు వదిలారు.గడచిన పదినెలల్లో ఏడు సార్లు ఆంటోని బ్లింకెన్‌ ఇజ్రాయెల్‌ పర్యటన జరిపాడు.శాంతి చర్చలకు ఎప్పటి కప్పుడు నెతన్యాహు కొత్త షరతులను జోడిస్తున్నాడు. అమెరికా అతగాడికి వంతపాడుతూ వివాదాన్ని కొనసాగిస్తున్నదని కొందరు విమర్శి స్తున్నారు. మధ్యవర్తిగా ఉంటూ ఇలాంటి పని చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు తాము పోరాటం కొనసాగిస్తూనే శాంతి చర్చలకు కూడా సిద్దమని హమస్‌ ప్రకటించింది.చైనా మధ్యవర్తిత్వంలో పాలస్తీనాలోని అన్ని విముక్తి సంస్థలతో చేతులు కలుపుతామని, పిఎల్‌ఓ ఆధిపత్యాన్ని అంగీకరించి భాగస్వాములమౌతామని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎగుమతులు డీలా,దిగుమతులు భళా -రైౖతులను గాలికొదిలేసిన నరేంద్రమోడీ !

25 Sunday Aug 2024

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Indian Farmers, BJP, farm crisis, India export and import policy, Narendra Modi Failures, Rice export Ban


ఎం కోటేశ్వరరావు


బాస్మతి బియ్యం ధర 28శాతం పతనం, టమాటా ధర 70 శాతం దిగజారుడు, పదేండ్ల కనిష్టానికి సోయా ధర. బియ్యం ఎగుమతుల పతనం. గత వారంలో వచ్చిన కొన్ని వార్తల సారాంశమిది. కొన్ని చోట్ల తగినన్ని వర్షాలు పడలేదని, మరికొన్ని చోట్ల అధికంగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు.సెప్టెంబరు ఆఖరు వరకు ఖరీఫ్‌ పంటల సాగు చేయవచ్చు, ఇప్పటి వరకు అందిన వార్తల మేరకు గతేడాది కంటే సాగు పెరిగింది. పంటలు పెరిగి రైతాంగానికి తగిన ధరలు వస్తే అంతకంటే కావాల్సిందేముంది ! ఆగస్టు మూడవ వారానికి అందిన వివరాల మేరకు దేశం మొత్తంగా 2024-25 ఖరీఫ్‌ సాధారణ సాగులో 94.13శాతం అంటే 10.316 కోట్ల హెక్టార్లలో పంటలు వేశారు. దీనికి మంచి వర్షాలే కారణమని వ్యవసాయశాఖ పేర్కొన్నది. కీలకమైన ధాన్యం, పప్పుధాన్యాలు,నూనె గింజలు, చెరకు, పత్తి సాధారణం కంటే 2.08శాతం పెరిగితే, ఒక్క వరి సాగే గతేడాదితో పోల్చితే 19.57శాతం పెరిగి 3.69 కోట్ల హెక్టార్లకు(ఒక హెక్టారు రెండున్నర ఎకరాలకు సమానం) చేరింది.చిరుధాన్యాల సాగు పెరిగింది. నూనె గింజల సాగు సాధారణం కంటే తగ్గింది. ఇటీవలి కాలంలో ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల నరేంద్రమోడీ సర్కార్‌కు చెమటలు పట్టించింది.ఖరీఫ్‌ సాగు పెరుగుదల కారణంగా వినియోగదారులకు ధరలు తగ్గవచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచిదే కానీ రైతుల గిట్టుబాటు మాటేమిటి ? ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మొత్తంగా చూసినపుడు ఒక్క కార్పొరేట్‌ వాణిజ్య సంస్థలకు తప్ప ఎవరికీ అలాంటి మేలు చేసిన దాఖలా లేదు. రానున్న రోజుల్లో మేలు చేస్తాయా, కీడు కలిగిస్తాయా అన్నదే అనూహ్యం. ఒక విధంగా చెప్పాలంటే పిచ్చోడి చేతిలో రాయిలా పరిస్థితి ఉంది.
ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌ మరికొన్ని ప్రాంతాల్లో కోటీ 50లక్షల హెక్టార్లలో సాగు చేసే బాస్మతి రకం బియ్యం కొత్త పంట ఇంకా మార్కెట్‌కు రాక ముందే గతేడాది కంటే మూడోవంతు ధర పతనమైంది. క్వింటాలు గతేడాది ఇదే రోజుల్లో రు.3,200 నుంచి 3,500 వరకు ఉంటే ఇప్పుడు రెండున్నర వేలకు తగ్గింది. దీంతో స్వయంగా బిర్యానీ వండుకు తినేవారికి కాస్త కలసి వచ్చిందిగానీ, ఏ హౌటల్లోనూ ధరలు తగ్గించకపోగా పెంచారు. గతేడాది అక్టోబరు, నవంబరు నెలల్లో నాలుగు వేల నుంచి 4,800వరకు పెరిగాయి. ధరల పతనానికిి ప్రధాన కారణం ప్రభుత్వ ఎగుమతి విధానమే అంటున్నారు. ఒక టన్ను బియ్యం కనీస ఎగుమతి ధర(ఎంఇపి) 950 డాలర్లకు తగ్గకూడదని కేంద్రం నిర్ణయించింది. గతేడాది ఉత్పత్తి నాలుగో వంతు పెరిగింది, ఈ ఏడాది వర్షాలు బాగున్న కారణంగా మరో 15శాతం పెరిగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది ఉత్పత్తి నిల్వలు గణనీయంగా ఉన్నాయి. ఇలా పలు కారణాలు ధరల పతనానికి దారితీసింది. ప్రస్తుత సీజన్‌లో ఏ గ్రేడ్‌ రకం వరి మద్దతు ధర రు.2,320గా నిర్ణయించారు. బాస్మతి ధరలు కూడా దానికి దగ్గరగా ఉన్నాయి. కనీస ఎగుమతి ధర 950డాలర్లుగా ఉండటమే ధరల పతనానికి ప్రధాన కారణమని బియ్యం ఎగుమతిదార్ల అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు విజరు సేటియా చెప్పారు. ఇంత ధరతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతికి పోటీ పడలేమని అన్నారు. అది రైతాంగానికి చెల్లించే ధర తగ్గటానికి కూడా దోహదం చేస్తున్నదన్నారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఎగుమతి ధర 700 డాలర్లుగా మాత్రమే ఉందని, అందువలన వారికి ఎక్కువ అవకాశాలుంటాయిని హర్యానా బియ్యం ఎగుమతిదార్ల అధ్యక్షుడు సుశీల్‌ జైన్‌ చెప్పారు.
బాస్మతేతర బియ్యం ఎగుమతుల మీద నిషేధం ఉంది, కొన్ని మినహాయింపులతో ఎగుమతులు చేయాలన్నా థారులాండ్‌, వియత్నాం ధరలతో పోటీపడలేక ఎగుమతులు పతనమయ్యాయి. గతంలో ఈ రెండు దేశాల ధరల కంటే మన బియ్యం ధర తక్కువ ఉంది. ఉదాహరణకు ఐదుశాతం ముక్కలైన పార్‌బాయిల్డ్‌ బియ్యం థారులాండ్‌ టన్ను 565 డాలర్లకు ఇస్తే మనదేశం ఇచ్చే ధర 540 నుంచి 545కు పెరిగింది. దీనికి పన్ను అదనం. ఇలా తేడా తగ్గుతున్న కారణంగా మన ఎగుమతుల మీద ప్రతికూల ప్రభావం పడుతున్నది. మనకంటే ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వియత్నాం ఎగుమతులు ఇటీవలి కాలంలో పెరిగాయి. బాస్మతేతర రకాల బియ్యం, గోధుమ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికలకు ముందు ధరలు పెరిగితే తమ విజయావకాశాల మీద ప్రతికూల ప్రభావం పడుతుందనే ముందు చూపుతోనే ఈ పని చేశారన్నది స్పష్టం.దాన్లో భాగంగానే భారత బియ్యం, గోధుమల పేరుతో కొన్ని అమ్మకాలను ప్రారంభించారు.ఎగుమతులపై నిషేధం వలన జరిగిందేమిటి ? మనం రంగంలో లేకపోవటంతో ప్రపంచ మార్కెట్‌లో ధరలు పెరిగాయి.థారు బియ్యం ధర 20శాతం పెరిగింది, ఆ మేరకు రైతాంగానికి కొంత మేలు జరిగింది. మన నుంచి కొనుగోలు చేసే ఖాతాదారులు ఇతర దేశాల వారితో ఖాతాలు కుదుర్చుకున్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఎగుమతి ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అందువలన ఒక నిర్ణయం తీసుకొనే వరకు అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. రైతుల పంట చేతికి రాక ముందే ఏదో ఒకటి తేల్చాలి. తీరా అయినకాడికి తెగనమ్ముకున్న తరువాత ఎగుమతి ఆంక్షలు ఎత్తివేస్తే అది బడా వ్యాపారులకే లాభం. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో గతంతో పోల్చితే మామూలు బియ్యం ఎగుమతులు 34శాతం తగ్గాయి.
రెండింజన్ల పాలనతో నేరుగా స్వర్గానికి తీసుకుపోతామని బిజెపి చెబుతోంది. అలాంటి స్వర్గదారిలో ఉన్న మధ్య ప్రదేశ్‌లో సోయా గింజల ధరలు క్వింటాలు ధర రు.3,500 నుంచి రు.4,000 పడిపోయిందని ఇది కనీస మద్దతు ధర రు.4,850 కంటే తక్కువే కాదు, పదేండ్ల కనిష్టం అని వార్త. కొత్త పంట చేతికి రాక ముందే ఇలా ఉంటే వచ్చిన తరువాత పరిస్థితి ఏమిటని రైతాంగం ఆందోళన చెందుతోంది. అక్కడ బిజెపి అధికారంలో ఉంది.కేంద్ర సిఏసిపి చెప్పినదాని ప్రకారం ఒక క్వింటాలు ఉత్పత్తి ఖర్చు రు.3,261గా ఉంది. సోయాబీన్‌ ప్రోసెసర్స్‌ అసోసియేషన్‌ సమాచారం ప్రకారం 2013-14లో సగటు మార్కెట్‌ ధర రు.3,823 ఉంది. గతేడాది ఐదువేల వరకు రైతులు పొందారు.దేశంలో మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా సోయా సాగు చేస్తారు.ధరల పతనానికి కారణం ఏమిటి ? వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిన పూర్వరంగంలో ఓటర్ల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకొనేందుకు దిగుమతి చేసుకొనే సోయా నూనె మీద ఉన్న 32శాతం దిగుమతి పన్నును నరేంద్రమోడీ సర్కార్‌ 12.5శాతానికి తగ్గించింది. దీంతో చౌకగా అర్జెంటీనా, బ్రెజిల్‌, అమెరికా నుంచి దిగుమతులు పెరిగాయి.ప్రపంచ ఉత్పత్తిలో ఈ మూడింటి వాటా 95శాతం ఉంది. మన వాటా 2.5 నుంచి మూడుశాతం మధ్య ఉంటోంది. గతేడాది ఆ దేశాల్లో ఉత్పత్తి తగ్గటంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ ఏడాది మంచి పంట ఉంటుందనే అంచనాలు వెలువడటంతో మనదగ్గర ధరలు పతనమయ్యాయి.కొద్ది వారాల క్రితం 25కిలోల టమాటాల ధర రు.900 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నది కాస్తా ఇప్పుడు దేశంలో అనేక చోట్ల రు.300కు పడిపోయింది.పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచాలని చెప్పటమే తప్ప రైతాంగానికి తగిన ప్రోత్సాహం, ఇబ్బందులు లేని పరిస్థితిని కల్పించటం లేదు. మధ్య ప్రదేశ్‌లో పెసర రైతులు పంటను అమ్ముకొనేందుకు నిరసన తెలపాల్సి వచ్చింది, అమ్ముకున్న తరువాత రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డబ్బు చెల్లించని స్థితి. కొనుగోలు తరువాత ఏడు రోజుల్లో ఇస్తామన్నది ఆరువారాలు గడచినా ఖాతాలలో పడటం లేదని వార్తలు. అంతకు ముందు ప్రతి రైతు నుంచి ఎకరానికి ఇన్ని క్వింటాళ్లే అనే నిర్ణీత పరిమాణానికి మించి కొనుగోలు చేసేది లేదని, అది కూడా నిర్ణీత సమయానికి తెస్తేనే అని నిబంధనలు పెట్టటంతో రైతులు ఆందోళన చేయాల్సి వచ్చింది.
ఎన్నికల కోసం తప్ప రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు ఒక జవాబుదారీతనంతో కూడిన విధానం కేంద్రం వద్ద లేదు. ఉదాహరణకు గతంతో పోల్చితే ఎరువుల సబ్సిడీని ఈ ఏడాది తగ్గించింది.మరోవైపు ధరల పెరుగుదల నియంత్రణలో భాగంగా దిగుమతులు చేసుకొనే ముడి పామ్‌, సోయా,పొద్దుతిరుగుడు నూనెల మీద ఉన్న డ్యూటీని పూర్తిగా రద్దు చేసింది.వీటి మీద ఉన్న సెస్‌ను 20 నుంచి ఐదు శాతానికి తగ్గించింది.శుద్ధి చేసిన సోయా, పామ్‌,పొద్దుతిరుగుడు ఆయిల్‌ మీద దిగుమతి పన్ను గణనీయంగా తగ్గించింది. పప్పు ధాన్యాల దిగుమతుల మీద పన్ను పూర్తిగా రద్దుచేసింది. వీటి ప్రభావం రైతుల మీద ప్రతికూలంగా పడే అంశాన్ని విస్మరించింది.దేశంలో పప్పు, చమురు గింజల దిగుబడిని పెంచితేనే రైతు వాటి సాగు పట్ల ఆసక్తి చూపుతాడు. అందుకు ప్రభుత్వాలే అవసరమైన పరిశోధనలు, నూతన వంగడాలను రూపొందించాల్సి ఉంటుంది.అదేమీ పెద్దగా కనిపించదు. ధరల స్థిరీకరణ నిధి(పిఎస్‌ఎఫ్‌) గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పటం తప్ప బడ్జెట్‌ కేటాయింపులు – ఖర్చు చేసిందీ నామమాత్రమే.2023లో 1500 కోట్లు కేటాయించి అసలు ఖర్చేమీ చేయలదని, మరుసటి సంవత్సరం బడ్జెట్‌లో ఖాతా మూతపడకుండా కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే కేటాయించినట్లు వార్తలు వచ్చాయి.
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది ప్రాధాన్యతలతో బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ప్రతి బడ్జెట్‌లో ఇలాంటి కబుర్లనే చెబుతున్నారు. పాతవాటిని మరచిపోతున్నారు. అన్నింటికంటే కేటాయింపులు ప్రకటిత లక్ష్యాల సాధనకు పనికి వస్తాయా ? గత అనుభవం ఏమిటన్న సమీక్ష ఎప్పుడైనా చేశారా అన్న అనుమానం కలుగుతోంది. ద్రవ్యోల్బణ పెరుగుదల రేటులోనైనా నిధులు కేటాయిస్తే అదొకదారి లేకపోతే నిజనిధులు తగ్గినట్లే.లాబ్‌ టు లాండ్‌ అంటే పరిశోధన నుంచి పంటపొలాలకు అనే మాటలు ఎప్పటి నుంచో వింటున్నాము.ఉత్పాదకత పెంపుదల, వాతావరణానికి అనుగుణమైన విత్తనాలు, ఖర్చుల తగ్గింపు, చీడపీడల నివారణ తదితర రంగాల్లో పరిశోధనలు జరిపి వాటిని అభివృద్ధి చేయకుండా రైతాంగానికి ఎలాంటి మేలు చేయలేము. మొత్తం వ్యవసాయ పరిశోధనను సమీక్షిస్తామని నిర్మలమ్మ చెప్పారు. గతేడాది వ్యవసాయ విద్య, పరిశోధనలకు కేటాయించిన మొత్తం రు.9,876 కోట్లు, దీనిలో ఖర్చు పెట్టినదెంతో కోత పెట్టిందెంతో తెలియదు గానీ ఈ ఏడాది కేటాయింపు రు.9,941 కోట్లు కేవలం 65 కోట్ల పెంపుదలతో మొత్తం కార్యకలాపాలను ఎలా పెంచుతారు ? సేంద్రీయ సాగు గురించి ఎన్నో కబుర్లు చెబుతారు.దీనికి గాను గతేడాది రు.459 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం వంద కోట్లు మాత్రమే. రానున్న రెండు సంవత్సరాల్లో రెండు కోట్ల మంది రైతులతో ఈ సాగు చేయిస్తామని కేటాయించిన మొత్తం 365 కోట్లు మాత్రమే. ప్రతి బడ్జెట్‌లో ఇలాంటి కబుర్లే చెబుతున్నారు. ఇలా కాలక్షేప సాగుతో నరేంద్రమోడీ పదేండ్లుగా గడుపుతున్నారు. అందుకే వ్యవసాయ రంగంలో పరిస్థితి దిగజారుతోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రైతాంగం ఇచ్చిన ప్రతికూల తీర్పును చూసైనా నేర్చుకుంటారా అంటే కనిపించటం లేదు. పోగాలము దాపురించినపుడు ఎవరూ ఏమి చేయలేరు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీని గుడ్డిగా సమర్థిస్తే అంతే సంగతులు : ప్రైవేటు అధికారుల నియామకం నిలిపివేత ! అపర చాణుక్యుడు చంద్రబాబు, తాటతీసే పవన్‌ కల్యాణ్‌ మౌనం ఎందుకు ?

22 Thursday Aug 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, employees, History, INDIA, NATIONAL NEWS, Political Parties, TDP

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, lateral entry notification, Narendra Modi Failures, Pawan kalyan, RSS, Rule of reservations, UPSC


ఎం కోటేశ్వరరావు


ప్రైవేటు అధికారుల నియామకానికి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇచ్చిన ప్రకటనను వెనక్కు తీసుకోవాల్సిందిగా 2024 ఆగస్టు 20న కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నియామకాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వ్యతిరేకించిన వారిని ఖండిస్తూ, ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ మాట్లాడిన పెద్దలు తలలు ఎక్కడ పెట్టుకోవాలో వారికే వదలి వేద్దాం. ప్రధాని నరేంద్రమోడీ మార్గదర్శకాల మేరకే రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు లేఖ రాశారు. నష్టనివారణ చర్యగా , అందులోనూ మోడీకి తెలియకుండా ఇదంతా జరిగిందనే భావనను చొప్పించేందుకు, మోడీ సామాజిక న్యాయానికి ఎల్లవేళలా కట్టుబడి ఉన్నారని చెప్పుకున్నారు. ఏ నిర్ణయమైనా ప్రధాని లేదా కార్యాలయానికి తెలియకుండా ఉండవు. అలాంటపుడు యుపిఎస్‌సి ప్రకటన సందర్భంగా ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోముతున్నట్లు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అఫ్‌ కోర్సు అక్కడ జవాబు చెప్పేవారు గానీ జవాబుదారీతనం ఉన్న వారు గానీ కనపడరు. ఈ సందర్భంగా వచ్చిన కొన్ని వాదనలు, అసంబద్దతలను చూద్దాం. మరోవైపు తమ చర్యను సమర్ధించుకుంటూ ప్రైవేటు వ్యక్తులను అధికారులుగా తీసుకోవటాన్ని 2004-09 మధ్య కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపిఏ ప్రభుత్వమే ప్రారంభించిందని, 2005లో ఆ పార్టీకి చెందిన వీరప్ప మొయిలీ ఆధ్యర్యంలోని రెండవ అధికార యంత్రాంగ సంస్కరణల కమిషన్‌(ఏఆర్‌సి) గట్టిగా సిఫార్సు చేసిందని, తరువాత 2017లో నీతి ఆయోగ్‌ కూడా సిఫార్సు చేసిందని బిజెపి, ఇతర పెద్దలు చెబుతున్నారు. అనేక కమిటీలు అనేక సిఫార్సులు చేశాయి.వాటన్నింటినీ అమలు జరుపుతున్నారా ? రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల అమలుకే దిక్కులేదు. పంటల మద్దతు ధరల నిర్ణయానికి స్వామినాధన్‌ కమిషన్‌ ఒక సూత్రాన్ని చెప్పింది. దాన్ని ఎందుకు అమలు చేయటం లేదు ? కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని నరేంద్రమోడీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ స్వయంగా సిఫార్సు చేసింది. తానే ఆ పదవిలో ఉండి దాన్ని అమలు జరిపేందుకు ఎందుకు తిరస్కరిస్తున్నట్లు ? ఇలా చాలా ఉన్నాయి.


నైపుణ్యం కావాలి అంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఇప్పుడు లేదా ? లేనపుడు ఎప్పటికపుడు తగిన శిక్షణ ఇవ్వాలి, ఇప్పించండి.ప్రతి ఏటా అనేక మందిని విదేశాలకు పంపి అధ్యయనాలు చేయిస్తున్నారు కదా ! వేల మంది అధికారులున్న వ్యవస్థలో నలభై అయిదు మంది బయటి వారిని తీసుకు వచ్చి మూడు లేదా ఐదు సంవత్సరాల వ్యవధిలో దేశం మొత్తానికి నైపుణ్యాన్ని తీసుకుస్తామని చెబితే నమ్మేందుకు జనం చెవుల్లో పూలు పెట్టుకున్నారని భావిస్తున్నారా ? ప్రయివేటు రంగంలోని వారు నిజంగా అంతటి నిపుణులైతే అనేక పరిశ్రములు, వ్యాపారాలెందుకు మూతపడుతున్నాయి. అనిల్‌ అంబానీ కంపెనీలను అలాంటి నిపుణులు ఎందుకు కాపాడలేకపోయారు ? ప్రైవేటు రంగ సంస్థలు చైనాలో మాదిరి వస్తు ఉత్పత్తులు, ఎగుమతులు ఎందుకు చేయలేకపోతున్నాయి ? నిజంగా అంతనిపుణులైతే ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, అమ్మివేసేబదులు వాటిని ఉద్దరించేందుకు కావాలంటే కొందరిని నియమించి బాగు చేయవచ్చు. గతంలోనే అమలు జరిపారు, అప్పుడెందుకు అభ్యంతరం చెప్పలేదు, ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ అడ్డుసవాళ్లు ! ఉదాహరణకు ఆర్‌బిఐ గవర్నర్‌గా బయటివారిని నియమించటం ఎప్పటి నుంచో ఉంది. కానీ రోజువారీ నిర్వహణకు ప్రైవేటు అధికారులను నియమిస్తున్నారా ? పాలన తీరు మెరుగుపరచటానికి, కొత్త ఆలోచనలను, నైపుణ్యాలను ప్రవేశపెట్టటానికి ఎవరి సలహాలనైనా తీసుకోవచ్చు. వాటిని అమలు జరపాల్సింది అధికారయంత్రాంగం తప్ప నిపుణులు కాదు. మూడేండ్ల కాలం మాత్రమే ఉండేవారు, పాలనా పద్దతులను నేర్చుకొనేదెన్నడు ? అమలు చేసేదెప్పుడు ? గతంలో ప్రైవేటు వారిని ఎంత మందిని తీసుకున్నారు, వారి సేవల కారణంగా ఒనగూడిన పాలనా ప్రయోజనమెంత, ఎప్పుడైనా మదింపు చేశారా ? గతంలో ఎందుకు మాట్లాడలేదంటున్నారు. మాకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని పదేండ్ల తరువాత బిజెపి ఎంపీలు ఇద్దరు చెప్పారు. 2014లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు ? అందువలన అలాంటి అడ్డుసవాళ్లకు అర్ధం లేదు. ఆ విధాన అసలు లక్ష్యాన్ని వెంటనే గ్రహించకపోవచ్చు, ఒక్కసారే కదా చూద్దాంలే అనుకొని ఉండవచ్చు, దాన్ని నిరంతర ప్రక్రియగా మారిస్తే దాని ప్రమాదాన్ని గ్రహించి ఇప్పుడు గట్టిగా ప్రతిఘటించాలని భావించవచ్చు. ఆ మాటకొస్తే నరేంద్రమోడీ దేశమంతటా గుజరాత్‌ విధానాన్ని అమలు చేస్తామన్నారు ? ఆదర్శం అన్నారుగా, ఎందుకు అమలు జరపటం లేదు, ఇప్పుడసలు ప్రస్తావించటమే లేదు ? అమెరికా, ఐరోపా దేశాల్లో ఇలాంటి విధానం ఉంది. నిజమే, నిరుద్యోగ భృతి, కార్మికుడి ఉద్యోగం పోతే ఎంతోకొంత ఆదుకోవటం ఉంది. మరి వాటి సంగతేమిటి ? వాటిని కూడా ప్రవేశపెట్టండి. పోనీ అక్కడ పాలన అంత నైపుణ్యంతో ఉందా ? ఆర్థికంగా ఆ దేశాల జిడిపి వృద్ధి రేటు ఎంత ? నిపుణులేం చేస్తున్నారు ? మన కళ్ల ముందే వచ్చిన 2008 ఆర్థిక సంక్షోభానికి కారకులు ఎవరు ? బాంకింగ్‌ వ్యవస్థలన్నీ ఎందుకు కూలిపోయాయి? మన ప్రభుత్వ రంగబాంకులెందుకు తట్టుకొని నిలిచాయి ? అమెరికా, ఐరోపాల్లో అలాంటి నిపుణులు ఇచ్చిన తప్పుడు సలహాల వలన అనేక ప్రాంతాల్లో యుద్ధాలు, సంక్షోభాలు రాలేదా ?మనకు అవసరమైన వాటినే కాదు, మిగతా వాటిని కూడా పోల్చుకోవాలి.


దీని వెనుక ఉన్న అసలు కథేమిటి ?
ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ తన ఖాతాదారులైన దేశాల మీద రుద్దే అనేక షరతుల్లో అధికార యంత్రాంగంలో మార్పులు ఒకటి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, ఉపకార్యదర్శులుగా మూడు నుంచి గరిష్టంగా ఐదేండ్ల వరకు పని చేసేందుకు 45 మందిని స్పెషలిస్టుల పేరుతో ఆలిండియా సర్వీసు పరీక్షలతో నిమిత్తం లేకుండా తీసుకోవాలని పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నియామకంలో రిజర్వేషన్లు ఉండవు.ప్రతిపక్షాలు, చివరికి ఎన్‌డిఏ పక్షాలు ఎల్‌జెపి, జెడియు ,వివిధ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. ప్రభుత్వం వెలుపల ఉన్న వారిలో ప్రత్యేక నైపుణ్యం, నవ దృక్పధం కలవారిని తీసుకొని పాలన స్థాయిని పెంచటమే లక్ష్యంగా చెప్పారు. చేదు మాత్ర మింగించటానికి పంచదార పూత పూయటం వంటిదే ఇది.ఈ పేరుతో ప్రైవేటీకరణకు పూనుకోవటమే.సంస్కరణల పేరుతో నూతన విధానాలను ముందుకు తెచ్చినపుడు నష్టాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తామన్నారు, తరువాత వాటిని విక్రయించి సొమ్ము చేస్తామన్నారు, చివరికి ఇప్పుడు చెబుతున్నదేమిటి ? నష్టాలు లాభాలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయటమే విధానం అంటున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసి వంటి లాభాలు వస్తున్న సంస్థల నుంచి కొంత శాతం వాటాలను విక్రయిస్తున్నారు. తరువాత పూర్తిగా అమ్మివేయవచ్చు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తగ్గించేందుకు, రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా ప్రైవేటు వారితో నింపేదురాలోచన దీని వెనుక ఉంది. సేవారంగాలు, ఉత్పత్తి రంగాలలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా మొత్తం ప్రైవేటుకే అప్పగించాలన్నది ప్రపంచ బాంకు ఆదేశం. దానిలో భాగంగానే గత మూడు దశాబ్దాలుగా కేంద్రం లేదా రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టటం నిలిపివేసి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అయిన వారికి కారుచౌకగా కట్టబెట్టేందుకు చూస్తున్నాయి.ఎందరో నిపుణులు ఉన్నారని చెబుతున్న ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు కేవలం సర్టిఫికెట్‌లు ఇచ్చే ఫ్యాక్టరీలుగా ఎందుకు మారినట్లు ? ప్రైవేటు మెడికాలేజీల్లో వేషాలు కొంత మందికి వైద్యుల వేషాలు వేసి తనిఖీల తతంగాన్ని ఎందుకు నడిపిస్తున్నట్లు ?


ప్రైవేటు నియామకాల్లో రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ” అద్భుత ” తెలివి తేటలను చూపారు. మొత్తం 45నియామకాలను కలిపి గాక విడివిడి పోస్టులుగా చేశారు. ఒకే పోస్టు ఉన్నపుడు రిజర్వేషన్‌ నిబంధన వర్తించదు గనుక ఈ చావు తెలివిని ప్రదర్శించారు.2018లో కూడా ఇదే చేసి 63 మందిని నియమించారు. వారిలో ఇప్పుడు 57 మంది పని చేస్తున్నారు. రిజర్వేషన్లు ఉంటేనే ఇప్పుడు ఉన్నతాధికారుల్లో ఎస్‌సిలు 4,ఎస్‌టిలు 4.9శాతం మాత్రమే ఉన్నారు. ఇలా ప్రైవేటు వారిని తీసుకుంటే ఈ తరగతులతో పాటు మొత్తంగా అందరికీ ప్రమోషన్లు తగ్గిపోతాయి.దేశవ్యాపితంగా 1,500 మంది ఐఏఎస్‌ల కొరత ఉందని చెబుతున్నారు. అలాంటపుడు తీసుకొనే వారి సంఖ్యను పెంచుకోవచ్చు. సాంకేతిక,ఆర్థికం, విద్య, వైద్యం వంటి రంగాల్లో నిపుణులుగా ఉన్న వారిని ఈ పోస్టులలో నియమిస్తే అందునా మూడు నుంచి ఐదేండ్లలో వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించటం మీద కేంద్రీకరిస్తారా లేక పాలన మీద దృష్టిపెడతారా ? ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నవారికి కొన్ని నిబంధనలు, జవాబుదారీతనం ఉంటాయి. మూడు లేక ఐదేండ్లు కాంట్రాక్టు ఉద్యోగిగా ఉండే వారికి అలాంటి బాధ్యత ఉంటుందా ? అక్రమాలకు పాల్పడి బయటకు వెళితే చేయగలిందేమిటి ?


కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నట్లు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తమతో చెప్పినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. బీహార్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జెపి),జెడియు రెండూ బిజెపి మిత్రపక్షాలే కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటున్నాయి. అవి రెండూ ప్రైవేటు అధికారుల నియామకాన్ని బహిరంగంగానే వ్యతిరేకించాయి. మరి సామాజిక న్యాయం కోసం నిలబడతామని చెప్పి అపర రాజకీయ చాణుక్యుడిగా పేరున్న చంద్రబాబు, అవసరమైతే ఎవరినైనా తాటతీస్తా, తోలు వలుస్తా అని చెప్పిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? నియామకాల రద్దు నిర్ణయం తరువాత వారు నేర్చుకున్న పాఠం ఏమిటి ? నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకొనే నిర్ణయాల్లో తప్పుంటే తప్పని చెప్పాలి. నల్లధనం రద్దు, ఉగ్రవాదులకు నిధులు అందకూడనే పేరుతో నోట్ల రద్దు అనే పిచ్చిపని చేసినపుడు ఆ చర్యను సమర్దించటమే దేశభక్తిగా అనేక మంది భావించారు. అదెంత బూటకమో నల్లధనం మన కళ్ల ముందే ఎలా డిజెలతో నాట్యం చేస్తున్నదో చూస్తున్నాము. ఆ చర్యను చారిత్రాత్మకమైనదిగా నాడు చంద్రబాబు నాయుడు వర్ణించారు, అలాంటి పని చేయాలని తామే కోరినట్లు కూడా చెప్పుకున్న పెద్ద మనిషి ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చాక దానికి విరుద్దమైన మాటలు మాట్లాడారు.


మూడు సాగు చట్టాలను తీసుకువచ్చినపుడు రైతాంగం ఏడాది పాటు ఢిల్లీ శివార్లలో భైటాయించిన తరువాత గానీ మోడీ క్షమాపణలు చెప్పి వెనక్కు తీసుకోలేదు. కానీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేవలం 45 మందిని ప్రైవేటుగా కాంట్రాక్టు పద్దతిలో తీసుకొనేందుకు తీసుకున్న నిర్ణయం మీద ప్రతిపక్షాల నిరసన ప్రకటనలు తప్ప ఎక్కడా ఆందోళనలు ప్రారంభం కాలేదు. అయినా మోడీ సర్కార్‌ వెంటనే ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చింది ? ప్రతిపక్షాలు, సామాజిక న్యాయంకోరే సంస్థలు, వ్యక్తులు రిజర్వేషన్ల సమస్యను ప్రస్తావించారు. మొండిగా దాన్ని అమలు జరిపేందుకు ముందుకు పోతే రానున్న హర్యానా, కాశ్మీరు, మహారాష్ట్ర, ఝార్కండ్‌, ఢిల్లీ రాష్ట్రాల ఎన్నికల్లో దెబ్బతింటామని బిజెపి భయపడింది.వెనుకబడిన తరగతుల జనాభా వివరాలను సేకరించాలన్న డిమాండ్‌ను ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కావాలంటే రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పారు. కానీ రానున్న జనాభా లెక్కల సేకరణలో కులం వివరాలు నమోదు చేసే అంశాన్ని చేర్చటం గురించి ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెప్పినట్లు తాజాగా వార్త వచ్చింది.(2024 ఆగస్టు 22వ తేదీ హిందూ పత్రిక పతాక శీర్షిక) ఎందుకంటే ఇప్పటికే బిజెపికి ఆ సెగ తగిలింది. వ్యక్తిగా నరేంద్రమోడీ, కేంద్ర బిజెపి సర్కార్‌ నానాటికీ విశ్వసనీయత కోల్పోతున్నది.చెప్పేది ఒకటి చేసేది ఒకటని జనం భావించటం ప్రారంభమైంది. ఒకరిద్దరు బిజెపి ఎంపీలు తమకు లోక్‌సభలో నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చేసిన ప్రకటనను విశ్వసించారు తప్ప అలాంటిదేమీ లేదన్న మోడీ మాటను జనం నమ్మలేదు. ఆ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేకుండా చేశారు. ఎన్నికలు ముగిసి వందరోజులు కూడా గడవక ముందే రిజర్వేషన్లతో నిమిత్తం లేని కేంద్ర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియను చేపట్టటంతో రిజర్వేషన్లకు తిలోదకాలిస్తారన్న ప్రచారం నిజమే అని జనం నిర్ధారణకు వస్తున్న కారణంగానే వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.చివరికి ఇప్పుడు నరేంద్రమోడీ నిజం చెప్పినా జనం అనుమానంతో చూసే పరిస్థితి వచ్చింది. అందుకే మోడీని గుడ్డిగా సమర్ధిస్తే అంతే సంగతులు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : నోటి దురుసు డోనాల్డ్‌ ట్రంప్‌కు చుక్కలు చూపుతున్న కమలా హారిస్‌ !

21 Wednesday Aug 2024

Posted by raomk in COUNTRIES, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#US Elections 2024, Donald trump, Donald Trump foul mouth, Joe Biden, Kamala Harris, Trump attacks Harris


ఎం కోటేశ్వరరావు


చికాగో నగరంలో జరిగిన డెమోక్రటిక్‌ పార్టీ సమావేశం తన అధ్యక్ష అభ్యర్థిగా కమలా దేవి హారిస్‌ను ప్రకటించింది. తనకు ఎదురులేదని విర్రవీగుతున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆమె చుక్కలు చూపిస్తున్నది.దీంతో ముదిమది తప్పినట్లుగా 79 ఏండ్ల ట్రంప్‌ 59 సంవత్సరాల కమలతో పోల్చితే తానే అందంగా ఉంటానంటూ దిగజారుడు ప్రచారానికి పూనుకున్నాడు. పిరికి వారే అలాంటి ప్రచారం చేస్తారంటూ ఆమె తిప్పికొట్టింది. ప్రచారంలో తొలుత అభ్యర్థిగా ఉన్న జో బైడెన్‌ తడబడటం, పొంతన లేకుండా మాట్లాడటం వంటి పరిణామాల పూర్వరంగంలో కమల రంగంలోకి వచ్చింది. నవంబరు ఐదవ తేదీన జరిగే ఎన్నికలకు ముందు సెప్టెంబరు పదవ తేదీన, తరువాత జరిగే చర్చల్లో ఆమెను ఎదుర్కొనేందుకు మాజీ ఎంపీ తులసీ గబ్బార్డ్‌ సాయం తీసుకోవాలని ట్రంప్‌ నిర్ణయించాడు. పార్టీలకు వేసే ఓట్లను బట్టిగాక ఎలక్టరల్‌ కాలేజీలో తెచ్చుకొనే ఓట్లే అధ్యక్ష పదవిలో కూర్చునే వారిని నిర్ణయిస్తాయి. అలాంటి ఓట్లు 538 కాగా, గెలవాలంటే 270 కావాలి. ఆగస్టు నెల 18వ తేదీన ఉన్న పరిస్థితిని బట్టి కమలా హారిస్‌ 225, డోనాల్డ్‌ ట్రంప్‌ 219 ఓట్లతో పోటీ పడుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది. మరికొన్ని కూడా అదే విధమైన వివరాలను ఇస్తున్నాయి.ఎన్నికల నాటికి ఈ అంకెలన్నీ మారిపోతుంటాయి. రెండు పార్టీలకు సాంప్రదాయంగా బలమైన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఎటూ మొగ్గని చోట పలుకుబడి పెంచుకొనేందుకు అభ్యర్థులు పోటీ పడతారు. ఈ క్రమంలో ప్రచారంలో ఎన్నో అవాస్తవాలు, దిగజారుడు పదవిన్యాసాలు, వినిపిస్తాయి, కనిపిస్తాయి. అమెరికాలో ట్రంపు నోరు ఎంతో కంపును వెదజల్లుతోంది. ఏం మాట్లాడతాడో తెలియదు.గతంలో బైడెన్‌ ఒక దొంగ,మోసగాడు, అబద్దాల కోరు, చరిత్రలో చెత్త అధ్యక్షుడు అంటూ నోరుపారవేసుకున్న పెద్ద మనిషి ఇప్పుడు కమలా హారిస్‌ మీద కూడా అదే మాదిరి దాడి చేస్తున్నాడు. ఆమె కూడా దొంగ, అబద్దాల కోరు, ఆమె నిజంగా నల్లజాతీయురాలు కాదు కానీ ఇప్పుడు అలా చెప్పుకుంటున్నది.ఆమె తన పేరును కూడా సరిగా ఉచ్చరించలేదు, ఆమె అసమర్దురాలు, చిత్తకార్తె కుక్క అని మాట్లాడాడు.ఆమె సభలకు జనం రావటం లేదు, కృత్రిమ మేథ ద్వారా పెద్ద ఎత్తున జనం ఉన్నట్లు చిత్రిస్తున్నారు అన్నాడు. అమెరికా ఎన్నికల్లో పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలూ వర్గరీత్యా బహుళజాతి గుత్త సంస్థలు, ఆయుధతయారీదార్లకు అనుకూలమైనవే. ఎవరి హయాంలో ఎక్కడ చిచ్చుపెట్టినా అధికార మార్పిడితో నిమిత్తం లేకుండా ఎవరు గెలిచినా దాన్ని ఆరకుండా చూడటంలో దొందూ దొందే. అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించటంలో రెండు పార్టీలూ విఫలమయ్యాయి. ఈ కారణంగానే పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే భావన అక్కడ రోజు రోజుకూ పెరుగుతోంది. కొన్ని సామాజిక సమస్యల్లోనే రెండు పార్టీల మధ్య తేడాలు ఉన్నాయి. అక్కడి వామపక్ష శక్తులు, ఉదారవాదులు ఏ రాక్షసుడితో తక్కువ ముప్పు అని చూసి చిన్న రాక్షసుడిగా ఉండే డెమోక్రటిక్‌ పార్టీకి మద్దతు ఇస్తుంటారు.


కీలకమైన రాష్ట్రాలలో కమలాహారిస్‌ది పైచేయిగా కనిపించటంతో ట్రంప్‌ రెచ్చిపోతున్నాడు.పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన సభల్లో మాట్లాడుతూ సలహాదారులు రాసి ఇచ్చిన ప్రసంగాన్ని పక్కన పెట్టి కమలాహారిస్‌ కమ్యూనిస్టు, ఫాసిస్టు అజెండాలను పాటిస్తున్నారని ఆరోపించాడు.ట్రంప్‌ ప్రసంగం విసుగు పుట్టించి సభికులు మధ్యలోనే లేచిపోతుండటంతో కమలా హారిస్‌ మీద వ్యక్తిగత దూషణలతో ఆకర్షించేందుకు చూశాడు.జో బైడెన్‌ పాలనలో ధరలు పెరిగాయని, కుటుంబాల మీద పెరిగిన భారాన్ని ” కమలా హారిస్‌ ద్రవ్యోల్బణ పన్ను ” అని, కామ్రేడ్‌ కమల ముందు రోజు చేసిన ప్రసంగంలో ఒక కమ్యూనిస్టు మాదిరి మాట్లాడారని, సోషలిస్టు వ్యవస్థలో మాదిరి ధరల నియంత్రణ కోరుతున్నారని, అంటే సరకుల కొరత, ఆకలి, ధరల పెరుగుదల అని ఆరోపించాడు.ఆమెను బైడెన్‌ ద్వేషిస్తాడు, అతగాడి మీద కుట్ర చేసి ఆమె అభ్యర్థిగా నిలిచారన్నాడు. మీరు ఎప్పుడైనా ఆమె నవ్వటాన్ని చూశారా ? ఒక పిచ్చిదానిలా నవ్వుతుంది అంటూ నోరుపారవేసుకున్నాడు. ఇంకా అనేక అవాస్తవాలను ప్రస్తావించాడు.పెన్సిల్వేనియా గవర్నర్‌గా ఉన్న జోష్‌ షాపిరోను ఉపాధ్యక్ష పదవికి ఎందుకు అభ్యర్థిగా ఎంచుకోలేదో తెలుసా అని ప్రశ్నిస్తూ అతను ఒక యూదుడు గనుక, యూదులెవరైనా కమల లేదా డెమోక్రాట్లకు ఓటు వేస్తే వారి బుర్రలను ఆసుపత్రిలో పరీక్ష చేయించాలని రెచ్చగొట్టాడు.పోటీ నుంచి తప్పుకున్న జో బైడెన్‌ గురించి ఎక్కువగా మాట్లాడవద్దని వారిస్తున్నా ట్రంప్‌ ఆగలేదు.నేను అతన్ని దెబ్బతీశాను గనుక, ఇప్పుడు ఆమెను కూడా అదే చేయకపోవటం అన్యాయం అంటూ కేకలతో వీరంగం వేశాడు.కమల వయసులో ఉండగా ఆమెతో సహజీవనం చేసిన కాలిఫోర్నియా అసెంబ్లీ మాజీ స్పీకర్‌ విలీ బ్రౌన్‌ ఆమె గురించి భయంకరమైన అంశాలు చెప్పాడంటూ వ్యక్తిగత అంశాలను ప్రస్తావించాడు. ముగ్గుర్ని వివాహాలు చేసుకొన్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఎలాంటి తిరుగుబోతో కేేసులను ఎలా ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే. 2023లో న్యూయార్క్‌ కోర్టు ఒక రచయిత్రిని లైంగికంగా దూషించినందుకు నష్టపరిహారంగా ఐదుమిలియన్‌ డాలర్లు చెల్లించాలని తీర్పు నిచ్చింది. ఆ తీర్పు మీద మరోసారి నోరు పారవేసుకోవటంతో ఇ జీన్‌ కరోల్‌ అనే రచయిత్రి మరో పది మిలియన్‌ డాలర్ల నష్టపరిహార కేసు దాఖలు చేసింది. ట్రంప్‌ ఆస్తుల విలువ 767 కోట్ల డాలర్లు (మన రూపాయల్లో 64వేల కోట్లు ) ఇంత డబ్బున్న వాడికి ఆ జరిమానా ఒక లెక్కలోనిది కాదు. ఆ డబ్బు,దురహంకారం నోటి దురుసుకు కారణం. మహిళల గురించి ట్రంప్‌ అనుచితంగా మాట్లాడిన 74 ఉదంతాలను పేర్కొంటూ ది వీక్‌ అనే పత్రిక వివరాలను ఇచ్చింది.అలాంటి వ్యక్తి ప్రత్యర్థుల మీద దాడి చేస్తున్నాడు. ప్రతికూల ప్రచారం చేసేందుకు పూనుకున్న ట్రంప్‌ చివరికి బ్రిటన్‌ చరిత్రలో తనను తాను గొప్పగా ఊహించుకొని పరిపాలనకే అర్హత లేని పిచ్చి రాజుగా ప్రఖ్యాతి గాంచిన మూడవ జార్జి మాదిరి ఉన్నాడని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ఆ రాజు రెచ్చిపోకుండా పక్కనున్నవారు అదుపుచేయటంలో జయప్రదమయ్యారని, కానీ ట్రంప్‌ అనుచరులు ప్రయత్నించి విఫలమైనట్లు వ్యాఖ్యానించారు. ప్రత్యర్ధులను ఇరుకున పెట్టబోయి తానే ఇరుక్కునట్లు పేర్కొంటున్నారు.


ఎన్నికల్లో ఒకవేళ ఓడిపోతే ఓటమిని అంగీకరించకుండా ఉండేందుకు ఇప్పటినుంచే పూర్వరంగాన్ని సిద్దం చేసుకుంటున్నాడని డెమోక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్‌ తాజాగా ట్రంప్‌ గురించి ఓటర్లను హెచ్చరించాడు.మిచిగన్‌ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున కమలా హారిస్‌ ఆమె ఉపాధ్యక్ష అభ్యర్థి,మినెసోటా గవర్నర్‌ వాల్జ్‌కు వేలాది మంది స్వాగతం పలికారు. మీడియా దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. అదంతా కృత్రిమ సృష్టి అని వర్ణించిన ట్రంప్‌ వెర్రి వాడిలా కనిపించవచ్చు గాని బుద్ధి హీనుడు కాదని, తెలివిగా ఓటమిని తిరస్కరించేందుకు పధకం వేస్తున్నాడని శాండర్స్‌ అన్నాడు.ప్రజాస్వామ్యాన్ని తక్కువచేయటం ఫాసిజం తప్ప మరొకటి కాదని అందుకే ట్రంప్‌ను ఓడించేందుకు చేయాల్సిందంతా చేయాలని శాండర్స్‌ అన్నాడు. గత ఎన్నికలలో ఓడిన తరువాత ఓటమిని అంగీకరించని ట్రంప్‌ 2021జనవరి ఆరవ తేదీన అమెరికా అధికార కేంద్రంపైకి తన అనుచరులను ఉసిగొల్పిన సంగతి తెలిసిందే.ఇప్పటికీ ఆ కేసుల విచారణ కొనసాగుతున్నది.కమల-వాల్జ్‌ రంగంలోకి దిగటంతో అంతకు ముందు బైడెన్‌ మీద ఉన్న వ్యతిరేకత, హత్యాప్రయత్నంతో వచ్చిన ఆధిక్యత ఆవిరైపోతుండటంతో గతాన్ని పునరావృతం కావించేందుకు పూనుకున్నాడని అనేక మంది భావిస్తున్నారు.గత ఎన్నికను వమ్ము చేసేందుకు చూసిన దేశమంతటా ఉన్న గాంగులో 35 మంది ఇప్పటికీ ప్రభుత్వంలో వివిధ బాధ్యతల్లో ఉన్నారు, వారు తిరిగి రెచ్చిపోవచ్చు.అయితే గత అనుభవాలను గమనంలో ఉంచుకొని సరికొత్త పద్దతుల్లో వారు ప్రవర్తించవచ్చని కూడా హెచ్చరికలు వెలువడ్డాయి.


జో బైడెన్‌తో జరిపిన తొలి సంవాదం సందర్భంగా ట్రంప్‌ ఇతరుల సాయం తీసుకున్నాడు. మారిన పరిస్థితుల్లో కమలా హారిస్‌తో ఎన్నికల సంవాదానికి డోనాల్డ్‌ ట్రంప్‌కు మాజీ మిలిటరీ అధికారిణి, డెమోక్రటిక్‌ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యురాలు, తరువాత రిపబ్లికన్‌ పార్టీకి ఫిరాయించిన తులసీ గబ్బార్డ్‌ సాయం కావాల్సి వచ్చింది. డెమోక్రటిక్‌ పార్టీలో ఉండగా కమలా హారిస్‌ మంచి చెడ్డలు, ఆమె రాజకీయ, ఇతర అంశాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి తులసి. 2020లో అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం కమలాహారిస్‌తో పాటు పార్టీలో పోటీ పడింది. 2022లో ఆమె రిపబ్లికన్‌ పార్టీలో చేరింది. అందుకే ట్రంప్‌ ఆమెను ఎంచుకున్నాడు. తులసి తిరోగమన భావాలు ట్రంప్‌కు ప్రతిరూపంగా ఉంటాయి. అమెరికా ఎన్నికల్లో పోటీకి దిగిన వారు ఎంత సీనియర్లు అయినా ఓటర్లను ఆకర్షించేందుకు అనుసరించాల్సిన అంశాలు, చర్చ సందర్భంగా ప్రదర్శించాల్సి హావభావాలు తదితర అంశాలన్నింటి మీద ఆయా రంగాలలో నిపుణులుగా పేరుపొందిన వ్యక్తులు, సంస్థల ప్రతినిధుల వద్ద శిక్షణ తీసుకుంటారు. కమలా హారిస్‌ కూడా నాలుగుదశాబ్దాల క్రితం తాను చదివిన వాషింగ్టన్‌లోని హౌవార్డ్‌ విశ్వవిద్యాలయంలో శిక్షణా తరగతులకు హాజరైంది.డోనాల్డ్‌ ట్రంప్‌ గతం, అతను ఎలాంటి వాడు, బలం, బలహీనతలు తదితర అంశాలపై అవగాహన పెంచుకొనేందుకే ఈ కసరత్తు.


తులసీ గబ్బార్డ్‌ను ఎంచుకోవటంలో తనకూ కమలతో సమానమైన మహిళ తులసి మద్దతు ఉందని చెప్పుకొనేందుకు, అమెరికాలో స్థిరపడిన హిందువుల ఓట్ల వేట కూడా ఇమిడి ఉంది..కమలా హారిస్‌ భారతీయ మూలాలు ఉన్న ఆఫ్రికన్‌. ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌, భారతీయురాలు. తండ్రి డోనాల్డ్‌ జె హారిస్‌ జమైకా నుంచి అమెరికా వచ్చాడు. వారి సంతానమే కమలా హారిస్‌.సోదరి పేరు మాయా హారిస్‌. తలిదండ్రులు విడిపోవటంతో తల్లిదగ్గరే పెరిగారు, ఆఫ్రికన్లే వారిని ఆదరించారు.అదే వాతావరణంలో ఎదిగారు.తులసీ గబ్బార్డ్‌ తల్లి కరోల్‌ అమెరికా ఇండియానా రాష్ట్ర పౌరురాలు కాగా తండ్రి మైక్‌ గబ్బార్డ్‌ ఐరోపా మూలాలున్న వలస కుటుంబానికి చెందిన వ్యక్తి. అమెరికాకు చెందినప్పటికీ దానిలో విలీనం కాని దక్షిణ పసిఫిక్‌ సముద్రంలోని సమోవా దీవుల్లో జన్మించాడు. వారు హవాయి చేరిన తరువాత కరోల్‌ హిందూమతం పట్ల ఆకర్షితురాలు కావటమే గాన తన ఐదుగురు బిడ్డలకు హిందువుల పేర్లు పెట్టింది. వారిలో తులసి ఒకరు.ఆమె తాను చైతన్య వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పుకుంటుంది.డెమోక్రటిక్‌ పార్టీలో ఉన్నపుడు 2020 ఎన్నికల్లో పార్టీలో కమలతో పోటీపడి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే కమల కంటే తులసికి తక్కువ ఓట్లు వచ్చాయి. తరువాత ఇద్దరూ పోటీ నుంచి తప్పుకొన్నారు. జో బైడెన్‌ తన ఉపాధ్యక్ష అభ్యర్ధిగా కమలను ఎంచుకోవటంతో సహించలేక తరువాత తులసీ పార్టీ ఫిరాయించారు.మన దేశంలో ఉన్నట్లే అమెరికాలో కూడా జ్యోతిష్కులకు కొదవ లేదు.ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచేదీ, ఓడేదీ జోశ్యాలు మొదలయ్యాయి. డోనాల్డ్‌ ట్రంప్‌కు పరిస్థితి నల్లేరు మీద బండిలా లేకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడని ఆమీ ట్రిప్‌ అనే జ్యోతిష్కురాలు ఇండియా టుడేతో చెప్పింది.జో బైడెన్‌ బరినుంచి తప్పుకుంటాడని తాను సరిగానే చెప్పానని ఆమె చెప్పుకుంది. మీడియా సర్వేలు ఇప్పటి వరకు ఇచ్చిన విశ్లేషణల ప్రకారం కమలా హారిస్‌ ముందంజలో ఉన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే….. మహారాష్ట్ర ఎన్నికల రాజకీయం ! బిజెపి చేతిలో కీలుబొమ్మ ఎన్నికల కమిషన్‌ !!

18 Sunday Aug 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, STATES NEWS

≈ Leave a comment

Tags

Ajit Pawar, BJP, Chief Election Commissioner Rajiv Kumar, Congress-NCP alliance, Eknath Shinde, Maha Vikas Aghadi, Maharashtra assembly politics 2024, Narendra Modi Failures, NCP, Sarad pawar, shiva sena, Uddhav Thackeray


ఎం కోటేశ్వరరావు


హర్యానా, ఎట్టకేలకు జమూాకాశ్మీరు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పోయిన సారి హర్యానాతో పాటు మహారాష్ట్ర ఎన్నికలు జరిగినా ఈ సారి జరగటం లేదు. శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ విలేకర్లతో మాట్లాడుతూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటన ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు తరువాత వెల్లడిస్తామన్నారు. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డి ఎక్కడ దొరుకుతుందో చూద్దామని అని కుంటి సాకు చెప్పి వెనకటి కెవడో కల్లు దొంగతనాన్ని తప్పించుకోచూశాడట.కొన్ని దేశాల్లో జరుగుతున్న మాదిరి పార్లమెంటు, అసెంబ్లీ, ఇతర ఎన్నికలన్నింటినీ ఒకే రోజు జరపాలంటూ బిజెపి చెబుతున్న కబుర్లకు మద్దతు ఇస్తున్న ఎన్నికల కమిషన్‌ తనదాకా వచ్చే సరికి కుంటి సాకులు చెబుతున్నది. వర్షాలు, భద్రతా సమస్యలంటూ మహారాష్ట్ర ఎన్నికలను తరువాత జరుపుతామంటున్నది. ఈ సమస్యలు హర్యానాలో ఉండవా ? మహారాష్ట్రలో వినాయకచవితి, పిత్ర పక్షం, దసరా, దీపావళి పండుగలు వరుసగా వస్తాయన్న కారణం కూడా ఎన్నికల కమిషన్‌ చూపింది. 2019లో కూడా ఇవన్నీ ఉన్నాయిగా అప్పుడెలా సాధ్యమైంది. ఉదాహరణకు వినాయకచవితి 2019లో సెప్టెంబరు రెండున వస్తే ఈ ఏడాది ఏడవ తేదీ వస్తున్నది. మిగతా పండగలు కూడా అదే మాదిరి కొద్ది రోజుల తేడాతో ఉంటాయి. ఈ పండగలు హర్యానాలో, జమ్మూ ప్రాంతంలో కూడా జరుగుతాయి కదా ? అక్కడ లేని ఆటంకాలు మహారాష్ట్రలోనే ఎలా ఉంటాయి ? ఇలాంటి కారణాలు బిజెపి కూటమిని ఓటమి నుంచి గట్టెక్కిస్తాయా !


అధికారదాహం, రాజకీయ అవకాశవాదానికి మహారాష్ట్రలో మారుపేరుగా తయారైన అజిత్‌ పవార్‌ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి తనకు లేదని, ఇప్పటికే ఏడెనిమిది ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పాడు. ఇదొక ఎత్తుగడని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తన భార్య సునేత్రను సోదరి సుప్రీయా (శరద్‌ పవార్‌ కుమార్తె) మీద పోటీకి నిలిపి తప్పుచేశానని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానంలో(బారామతి) తన కుమారుడు జరు పవార్‌ పోటీ చేసేదీ లేనిదీ పార్టీయే నిర్ణయిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో జనం, మద్దతుదార్లు కోరితే జరును పోటీకి నిలుపుతారు, పార్టీ పార్లమెంటరీ బోర్డు దాన్ని చర్చిస్తుంది అన్నారు. లోక్‌సభ ఎన్నికలలో బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుప్రియకు 47వేల మెజారిటీ వచ్చింది. అందువలన అజిత్‌ పవార్‌ పోటీ చేసినా గెలిచే అవకాశం అనుమానమే గనుక మర్యాద నిలుపుకొనేందుకు గాను తనకు ఆసక్తి లేదని ప్రకటించినట్లు స్పష్టం అవుతోంది.ఒకవేళ శరద్‌ పవార్‌తో సయోధ్య కుదిరితే కుమారుడికి అక్కడ మద్దతు కోసం బేరమాడవచ్చు. అసలా నియోజకవర్గంలో శరద్‌ పవార్‌ కుటుంబ సభ్యులెవరూ పోటీచేయకుండా ఉంటే మంచిదనే సంకేతాలు పంపుతున్నట్లు కూడా చెబుతున్నారు.రాజకీయాల్లో ఒకసారి అడుగుజారితే ఎంత గొప్పవారికైనా పట్టువుండదు, ఇప్పుడు అజిత్‌ పవార్‌ కూడా అదే స్థితిలో ఉన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడక ముందే రాజకీయ పార్టీలు తమ తురుపు ముక్కలను ప్రయోగిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో శివసేన నేత ఉద్దావ్‌థాకరే ఎంతో కష్టపడ్డారని కానీ ఫలితం కాంగ్రెస్‌, ఎన్‌సిపికి ఎక్కువ దక్కిందని బిజెపి వ్యాఖ్యానించింది. ఎన్‌పిసి ఓట్లను చీల్చేందుకు అజిత్‌ పవార్‌ పార్టీని విడిగా పోటీచేయించే అవకాశం ఉందని శరద్‌ పవార్‌ ఎన్‌సిపి భావిస్తోంది. ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో, అనూహ్య పరిణామాలు ఏం జరుగుతాయో చూడాల్సి ఉంది. అసెంబ్లీలోని 288 స్థానాలకు గాను తమ కూటమికి 225 వస్తాయని నెల రోజుల క్రితమే శరద్‌ పవార్‌ జోశ్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ప్రాతిపదికన ఈ అంచనాకు వచ్చి ఉండవచ్చు.


2019లో ఒకే సారి ఫలితాలు వెలువడినా బిజెపి కూటమిలో సిఎం పదవి ఎవరికి అనే కుమ్ములాటల కారణంగా ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బిజెపి-శివసేన విడిపోయాయి. ఎవరూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవటంతో అదే ఏడాది నవంబరు 23న రాష్ట్రపతి పాలన విధించారు. యుపిఏ కూటమిలోని ఎన్‌సిపిలో చీలిక తెచ్చి బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ సిఎం, అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అవసరమైన మెజారిటీ లేకపోవటంతో బలనిరూపణ గడువుకు ముందే నవంబరు 26న ఆ ప్రభుత్వం రాజీనామా చేసింది. రెండు రోజుల తరువాత శివసేన, కాంగ్రెస్‌, మిగిలిన ఎన్‌సిపి నేతలు ఉద్దావ్‌ థాకరే సిఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబరు 26వరకు ఉంది.మరోవైపున హర్యానాలో 2019లో నూతన ప్రభుత్వం వెంటనే ఏర్పడిన కారణంగా 2024 నవంబరు మూడవ తేదీతో రాష్ట్ర అసెంబ్లీ గడువు పూర్తి కానుంది. ఈ వివరాలను చూసినపుడు మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే నాటికి హర్యానా, కాశ్మీరు ఎన్నికల ఫలితాలు వస్తాయి. అఫ్‌కోర్స్‌ అక్కడ బిజెపి గెలిస్తే వాటిని చూపి బరిలోకి దిగేందుకు తప్ప మరొకటి దీని వెనుక కనిపించటం లేదు. ఒకవేళ ఓడితే…. తరువాత వెంటనే ఢిల్లీ, ఝార్కండ్‌ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. పోగాలము దాపురించినపుడు అంటారు కదా అదే జరుగుతుంది. సాధ్యమైన మేరకు బిజెపి ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని వ్యవస్థలను వినియోగించుకొనేందుకు చూస్తున్నది. అఫ్‌ కోర్స్‌ ఇలాంటి పనులలో గతంలో కాంగ్రెస్‌ కూడా తక్కువ తినలేదు. అందుకే తగిన శాస్తి పొందింది. బిజెపి కూడా అదే బాటలో నడుస్తున్నది.


మధ్యలో రెండున్నర సంవత్సరాలు తప్ప మహారాష్ట్రలో రెండింజన్ల పాలనే సాగింది. గడచిన పది సంవత్సరాలలో జరిగిన ఎన్నికలను చూసినపుడు బిజెపి-శివసేన కూటమి ఓట్లు, సీట్లు తగ్గిపోవటం తప్ప పెరిగిన తీరు కనిపించదు.లోక్‌సభ ఎన్నికలు జరిగిన తరువాతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ బిజెపి విజయ ప్రభావం అసెంబ్లీ మీద కనిపించలేదు.అవిభక్త శివసేన-బిజెపి కలసి ఉన్న 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏకు 57.86శాతం ఓట్లు రాగా తరువాత 51.34శాతానికి, 2024లో ఒక ముక్కతో కలసి 43.55శాతం తెచ్చుకుంది. సీట్ల రీత్యా 42 నుంచి 17కు పడిపోయాయి.ఎన్‌సిపి అజిత్‌ పావర్‌ వర్గానికి 3.60శాతం ఓట్లు వచ్చాయి. బిజెపితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు అజిత్‌ పవార్‌ గురించి వార్తలు వస్తున్నాయి. అతగాడి బలం, బలహీనతలేమిటో వెల్లడైనందున అతను బిజెపితో ఉన్నా ఆ ఓటింగ్‌ ఈసారి రాదు. ఇండియా కూటమి సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోగా ఓట్ల రీత్యా 43.71శాతంతో స్వల్పంగా ఆధిక్యతలో ఉంది.ఈ ఓటింగ్‌ను చూసే బిజెపి భయపడుతోంది. రైతులు, ఇతర తరగతులు కూడా ఆ పార్టీకి దూరమైన తీరు వెల్లడైంది. అందుకే అసెంబ్లీ ఎన్నికలను కుంటి సాకులతో విడిగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ద్వారా పావులు కదిపింది. ఒకేసారి మూడు రాష్ట్రాల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించలేనంత బలహీనంగా ఉన్నపుడు దేశమంతటా ఒకేసారి జమిలి ఎన్నికలు పెట్టాలని ఎలా చెబుతున్నట్లు ? రాష్ట్రంలో ఇండియా కూటమి పటిష్టంగా ఉండటం, దేశమంతటా బిజెపి పూర్తి మెజారిటీని తెచ్చుకోవటంలో విఫలం కావటం, కాంగ్రెస్‌ పుంజుకున్న స్థితి, శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ విచ్చిన్నాలను ఎదుర్కొని తమ స్థానం పదిలమే అని నిరూపించుకోవటాన్ని చూశాము.ఈ పూర్వరంగంలో మరింత ఉత్సాహంతో ఇండియా కూటమి బరిలోకి దిగనుంది. సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు.లోక్‌సభ ఎన్నికలలో పోటీలో లేని వామపక్షాలు, ఇతర పార్టీలను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది.


హర్యానాతో పాటు జరిగే జమ్మూాకాశ్మీరు ఎన్నికలు బిజెపికి ఇష్టం లేకపోయినా సెప్టెంబరు 30వ తేదీలోగా జరపాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తప్పలేదు.లోక్‌సభ ఎన్నికల్లో విచిత్రమైన స్థితి ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న మహబూబా మప్తి నాయకత్వంలోని పిడిపి పార్టీ మరో భాగస్వామి నేషనల్‌ కాన్ఫరెన్సు పోటీ చేసిన మూడు స్థానాల్లో పోటీకి దిగింది.జమ్మూలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. నేషనల్‌ కాన్ఫరెన్సు రెండు చోట్ల గెలుపొందగా రెండు చోట్ల బిజెపి, మరోస్థానంలో స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందాడు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 22.3శాతం, పిడిపికి 8.48, కాంగ్రెస్‌కు 19.38, బిజెపికి 24.36శాతం చొప్పున వచ్చాయి. వాస్తవాలను అర్ధం చేసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో పిడిపి సర్దుబాటుకు వస్తుందా రాదా అన్నది చూడాల్సి ఉంది. కాంగ్రెస్‌ తన బలాన్ని పెంచుకుంటే ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్యానా విషయానికి వస్తే గడచిన 2014 లోక్‌సభ ఎన్నికలలో త్రిముఖ పోటీ కారణంగా బిజెపి 34.7శాతం ఓట్లతో పదికి గాను ఏడు సీట్లు తెచ్చుకుంది.2019లో 58.21శాతం ఓట్లతో పదికి పది స్థానాలను గెలుచుకుంది.2024లో 46.11శాతంతో ఐదు స్థానాలతో సరిపెట్టుకుంది.లోక్‌సభ తరువాత జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ పోటీలో బిజెపి 33.2శాతం, 2019లో 36.49 ఓట్లు తెచ్చుకుంది. మరోవైపున కాంగ్రెస్‌ 2024లోక్‌సభ ఎన్నికలలో తొమ్మిది సీట్లకు పోటీ చేసి 43.67 శాతం ఓట్లు ఐదు సీట్లు, మిత్రపక్షం ఆమ్‌ ఆద్మీ ఒక చోట 3.68ఓట్లు, కూటమిగా 47.61శాతం తెచ్చుకుంది. బిజెపి 2014లో 90కి గాను 47, తదుపరి ఎన్నికల్లో 40 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. జననాయక్‌ జనతా పార్టీ పది సీట్లు తెచ్చుకోవటంతో ఫలితాల తరువాత దానితో కలసి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా లోక్‌సభ ఎన్నికల నాటికి బిజెపితో విడిపోయి పదిసీట్లకు పోటీ చేసి నామమాత్రంగా ఓట్లు తెచ్చుకుంది.అసెంబ్లీ ఎన్నికలలో ఎలా ఉండేది చూడాల్సి ఉంది. బిజెపి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లాదేశ్‌లో దాడులు : ప్రముఖ హిందూ నేతల మౌనాన్ని ప్రశ్నిస్తున్న సామాజిక మాధ్యమం ! ఇతర పార్టీల కంటే బిజెపి అదనంగా చేసిందేమిటి ?

15 Thursday Aug 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, Women, Women

≈ Leave a comment

Tags

Awami League, Bangla Hindus, BJP, coup against Sheikh Hasina, Coup In Bangladesh, CPI(M), Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన, ఆమెను దేశం నుంచి వెళ్లగొట్టిన సందర్భంగా జరిపిన హింసాకాండ గురించి, దానిలో భాగంగా అక్కడ మైనారిటీలైన హిందువులపై జరిపిన దాడుల వార్తలతో మనదేశంలో అనేక మంది ఆందోళన వెలిబుచ్చారు. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూసే బాపతు మాదిరి కొందరు ప్రయత్నించారు. ”హిందువుల ఊచకోత, మారణహౌమం ” ఇటీవలి పరిణామాలపై మన మీడియాలో వచ్చిన కొన్ని శీర్షికలివి.ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ 2024 ఆగస్టు 13వ తేదీన వెబ్‌ ఎడిషన్‌లో ” బంగ్లాదేశ్‌లో హిందూ జాతి సంహారం : మతహింస క్రూరత్వ వాస్తవం ” అనే పేరుతో ఒక విశ్లేషణ చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన దాడులను మనదేశంలోని అన్ని పార్టీలు బిజెపి మాదిరే ఖండించాయి. ఖండించాల్సిందే, బంగ్లా ప్రభుత్వానికి మన ఆందోళన వెల్లడించాల్సిందే. బంగ్లా హిందువులే కాదు, పాకిస్తాన్‌లో హిందువులు, క్రైస్తవులు, శ్రీలంక హిందువులు, ముస్లిం, క్రైస్తవులు, మయన్మార్‌ రోహింగ్యాలు ఇలా ఏ దేశంలో మైనారిటీలపై దాడులు జరిగినా మానవతా పూర్వక స్పందన ఉండాల్సిందే. బంగ్లా పరిణామాలు, వాటి తీరుతెన్నులను వివరించటం, పోలికలు తేవటం, వాస్తవాలివి అని చెప్పటం అంటే దాడుల తీవ్రతను తక్కువ చేసి చూపటం కాదు. ప్రతి భాషలోనూ తీవ్రతను వెల్లడించే పద ప్రయోగాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో పోలికలు కూడా తెలిసిందే.బంగ్లాదేశ్‌ పరిణామాల సందర్భంగా హిందూత్వనేతలు, సంస్థలు ఒక పోలికను తెచ్చాయి. ఎక్కడో పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులను ఖండిస్తూ ఇక్కడ ప్రదర్శనలు జరుపుతున్నవారు మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్నదాడులకు వ్యతిరేకంగా ఎందుకు ప్రదర్శనలు చేయటం లేదు అని ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమంలో ఊరూపేరూలేని పోస్టులతో రెచ్చగొడుతూ ప్రతికూల మనోభావాలను, ముస్లింల పట్ల విద్వేషాన్ని రేకెత్తించేందుకు చూస్తున్నారు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటారు. ఈ ప్రశ్నను అడిగేవారు రెండు రకాలు. మొదటి రకం జనాలు నిజంగా పాలస్తీనా పౌరుల మీదనే కాదు, అసలు మానవత్వం మీద కూడా అభిమానం ఉన్నవారు కాదు. ఎందుకంటే వారు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ఎన్నడూ ప్రశ్నించిన వారు కాదు. రెండవ తరగతి జనాలు మొదటి తరగతి బాపతు ప్రచారానికి లోనై ప్రశ్నించేవారు. వీరిని అర్దం చేసుకోవచ్చు. మొదటి తరగతి వారు ఎన్నడైనా తమ జీవితాల్లో పాలస్తీనా వాసుల మీద జరుగుతున్న దారుణమారణకాండకు నిరసనగా అయ్యోపాపం అని ఏదైనా ప్రదర్శన సంగతి అటుంచండి కనీసం ప్రకటన అయినా చేశారా ? ఎందుకు ఈ పోలిక తెస్తున్నారు, ఇదే కాదు మనదేశంలో జరిగినట్లు చెబుతున్న ఉదంతాలకు కూడా పాలస్తీనా, ఇతర సమస్యలను జోడించి అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. ప్రతిదాన్నీ మత కళ్లద్దాలతో చూస్తే వచ్చే సమస్య ఇది.


మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత అమెరికా, బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాదులు కుట్ర చేసి పాలస్తీనా ప్రాంతంలోకి ఇతర దేశాల నుంచి యూదులను రప్పించారు. స్థానికంగా ఉన్న అరబ్బుల మీద దాడులు చేయించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను చూడాలి. వికీపీడియా సమాచారం ప్రకారం 1920 నుంచి 1948వరకు 20,631మరణాలు సంభవించాయి, ఇంకా లెక్కకు రానివి మరికొన్ని వేలు ఉన్నాయి. వీటిలో అత్యధికులు పాలస్తీనియన్లే.1948లో పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసింది ఐక్యరాజ్యసమితి. ఎవరికి ఏ ప్రాంతమో కేటాయించింది. నాటి నుంచి ఇజ్రాయెల్‌ ఏర్పడింది తప్ప పాలస్తీనా ఎక్కడ ? దానికి కేటాయించిన ప్రాంతాలను క్రమక్రమంగా ఆక్రమిస్తూ అసలు పాలస్తీనా దేశాన్ని ఇంతవరకు ఉనికిలోకి రాకుండా చేసింది ఇజ్రాయెల్‌, దానికి మద్దతు ఇస్తున్న అమెరికా. తమ మాతృభూమి కోసం పోరాడుతున్నవారిని వేల మందిని దురహంకారులైన యూదులు, వారికి మద్దతుగా ఉన్న మిలిటరీ హత్యలు చేస్తున్నది. అప్పటి నుంచి (1948 ) ఇప్పటి వరకు మరణించిన వారు 1,44,963 మంది, వీరిలో అరబ్బులే అత్యధికం. గతేడాది అక్టోబరు ఏడు నుంచే గాజాలో దాదాపు 40వేల మందిని బాంబులు, విమానదాడులతో ఇజ్రాయెల్‌ మిలిటరీ చంపివేసింది, వారిలో 80శాతం మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. ఆసుపత్రులను ధ్వంసం చేసిన కారణంగా, వ్యాధులు ప్రబలి మరోలక్ష మంది మరణించారు. దాడుల్లో లక్ష మందివరకు గాయపడ్డారు. లక్షలాది ఇండ్లను నేలమట్టంగావించారు. ఇరవై మూడు లక్షల మందిని నిర్వాసితులను గావించారు.మారణకాండ, జాతిహననం అంటే ఇది. ఇవి యూదులు-పాలస్తీనీయన్ల మధ్య జరుగుతున్న ఘర్షణలు కావు. ఏకపక్ష దాడులు, ఒక దేశ మిలిటరీ మరొక దేశ పౌరుల మీద జరుపుతున్న మారణకాండ. దీనికీ బంగ్లాదేశ్‌లో జరిగిన దానికి పోలిక పెట్టటాన్ని ఏమనాలి. ప్రపంచమంతా పాలస్తీనియన్లకు సంఘీభావం తెలుపుతున్నది.ఏదైనా సందర్భం వస్తే హమస్‌ జరిపిన హత్యాకాండ సంగతేమిటని బిజెపి పెద్దలు ఎదురుదాడికి దిగుతారు. సాధారణ పౌరులపై వారి డాడిని సమర్థిస్తూ మనదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా చేసిన ప్రకటనను చూపమనండి.దాడులు, ప్రతిదాడులను ఖండిస్తూ 2023 అక్టోబరు ఎనిమిదిన సిపిఐ(ఎం) ఒక ప్రకటన చేసింది. కాంగ్రెస్‌ కూడా హమస్‌దాడులను ఖండించింది. ఇంతవరకు బిజెపి లేదా ఇతర సంఘపరివార్‌ సంస్థలు గానీ గాజా మారణకాండను ఖండించాయా ? పాలస్తీనాకు మనదేశం మద్దతు ఇస్తున్నది, కానీ దానికి సంఘీభావం తెలుపకుండా కేంద్ర ప్రభుత్వం కాశ్మీరులో నిషేధాలు విధించిందని, ఇజ్రాయెల్‌, అమెరికాలను సంతుష్టీకరించిందనే అంశం ఎంత మందికి తెలుసు ?


తమ మీద దాడులు జరిపిన వారి మీద చర్యలు తీసుకోవాలంటూ ఆగస్టు పది, పదకొండు తేదీలలో ఢాకా నగరంలో హిందువులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు.వారికి భరోసా కల్పించేందుకు తాత్కాలిక ప్రభుత్వ నేతగా ఉన్న మహమ్మద్‌ యూనస్‌ ఢాకేశ్వరి దేవాలయాన్ని సందర్శించాడు. తగినంత భద్రత కల్పించలేకపోయినందుకు క్షమించాలని హౌంమంత్రిత్వశాఖ సలహాదారు(మంత్రితో సమానం) సఖావత్‌ హుసేన్‌ ఆగస్టు12న కోరాడు. ఇలాంటి పరిస్థితి మనదేశంలో అధికారంలో ఉన్న బిజెపి నేతల నుంచి ఎన్నడైనా చూశామా ? బంగ్లాదేశ్‌ హిందువుల సంగతి పట్టదు గానీ పాలస్తీనియన్ల గురించి మాట్లాడతారంటూ బిజెపి, దాని మద్దతుదార్లు ఎదురుదాడి చేస్తున్నారు. అన్ని పార్టీలూ బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడిని ఖండించాయి.మిగతా పార్టీల మాదిరిగానే ఒక ఖండన ప్రకటన చేయటం తప్ప బిజెపి అదనంగా చేసిందేమిటి ? మణిపూర్‌ రాష్ట్రంలో మైనారిటీ మతావలంబకులుగా ఉన్న కుకీ గిరిజనులపై జరిగిన దాడులు, మహిళలపై అత్యాచార ఉదంతాల పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ ఐరోపా యూనియన్‌ పార్లమెంటులో చర్చ జరిగింది. సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ అని చెప్పుకుంటూ మరోవైపు హిందువుల కోసం బరాబర్‌ మేము ఏమైనా చేస్తాం, పోరాడతాం అని బిజెపి నేతలు చెబుతారు. బంగ్లాపరిణామాలపై కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు కూడా అదే సమయంలో జరిగాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగితే ఒక తీర్మానం, చర్చ పెట్టి ఖండించటానికి, వారికి సానుభూతి తెలిపేందుకు బిజెపికి ఎవరు అడ్డుపడ్డారు ? పదవీ బాధ్యతలు చేపట్టిన మహమ్మద్‌ యూనస్‌కు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు చెబుతూ పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని, హిందువులతో సహా మైనారిటీలందరికీ భద్రత, రక్షణ కల్పించాలని కోరుతూ ఆగస్టు ఎనిమిది రాత్రి ఒక ఎక్స్‌ సందేశం పంపారు.


బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగితే స్పందించరేమిటని సంఘపరివార్‌ శక్తులు అడుగుతున్నాయి. తప్పులేదు. మణిపూర్‌లో గత పదిహేను నెలలుగా స్వంత పౌరుల మధ్య జరుగుతున్న హింసాత్మక ఉదంతాల పట్ల మీ స్పందన, కార్యాచరణ ఏమిటని ఎప్పుడైనా నరేంద్రమోడీని ప్రశ్నించాయా ? మహిళలను నగంగా ఊరేగించారే ! గట్టిగా అడిగితే ఆ ఉదంతాల్లో విదేశీ, చొరబాటుదారుల హస్తం ఉందంటూ తప్పించుకుంటున్నారు. కాసేపు వాదన కోసం ఉన్నదనే అనుకుందాం. సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత, చొరబాటుదార్లను అడ్డుకొని వారి కుట్రలను ఛేదించాల్సిన పని ఎవరిది ? కేంద్ర పెద్దలదే కదా ! ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారు. ఆ బాధ్యత ఢిల్లీ పెద్ద ఇంజనుదైతే రాష్ట్రంలో పౌరుల మాన ప్రాణాలను రక్షించాల్సిన కర్తవ్యం చిన్న ఇంజనుది కాదా ? అదేమి చేస్తున్నట్లు ? ప్రభుత్వ సమాచారం ప్రకారం 2024 మే మూడవ తేదీ నాటికి ఏడాది కాలంలో జరిగిన ఘర్షణలు, దాడుల్లో క్రైస్తవ గిరిజనులు గానీ, హిందూ మెయితీలుగానీ 221 మంది మరణించారు.మరో 32 మంది జాడ తెలియటం లేదు.వెయ్యి మంది గాయపడ్డారు. 4,786 ఇండ్లను దగ్దం చేశారు.దేవాలయాలు, చర్చ్‌లు 386 ధ్వంసమయ్యాయి. అరవై వేల మంది నెలవులు తప్పారు. వారికి ఓదార్పుగా ఇంతవరకు ప్రధాని మోడీ ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. ఇంత జరుగుతుంటే బిజెపి శ్రేణులు, వారికి మద్దతు ఇచ్చే వారు గానీ మణిపూర్‌ దారుణాలకు నిరసనగా లేదా కనీసం శాంతిని కోరుతూ ఎన్నడైనా ప్రదర్శనలు చేశారా ? ఎందుకు చేయలేదు ? మతకోణంలో చూసినా మణిపూర్‌ మెయితీలు హిందువులు , ఇంతకాలం వారిని ఓట్లకోసం ఉపయోగించుకున్నారా లేదా ? బిజెపి బండారం బయట పడింది గనుకనే మెయితీలు, గిరిజనులు ఇద్దరూ బిజెపిని లోక్‌సభ ఎన్నికల్లో ఉన్న రెండు సీట్లలో ఓడించారు. అందుకే బంగ్లాదేశ్‌ హిందువుల గురించి కారుస్తున్న కన్నీళ్లు నిజమైనవి కాదు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లకోసం గ్లిజరీన్‌ సరకు అని ఎవరైనా అంటే తప్పేముంది.


సామాజిక మాధ్యమంలో వచ్చిన అనేక అంశాలలో సంధించిన ఒక ప్రశ్న దిగువ విధంగా ఉంది.” అత్యంత పలుకుబడి కలిగిన హిందువులు బంగ్లాదేశ్‌ గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు ” అన్నది దాని శీర్షిక. ” బంగ్లాదేశ్‌లో ఏమీ జరగటం లేదన్నట్లుగా ప్రఖ్యాతి గాంచిన వారిలో ఎక్కువ మంది ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు తెలియటం లేదు.జై శంకర్‌ నుంచి వచ్చిన ఒకటి తప్ప భారత ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. మన ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మౌనంగా ఉన్నారు, మంత్రులందరూ, ఇతర రాజకీయనేతలు గమ్మున ఉన్నారు. చివరికి జై శంకర్‌ ప్రకటనలో కూడా ”మైనారిటీ” అనే పదాన్ని ఉపయోగించారు తప్ప ”హిందువులు ” అనలేదు. వారే కాదు ఒక అధికారి, ఒక న్యాయమూర్తి, ”ప్రముఖ ” టీచర్‌, ప్రముఖులు, ఒక పారిశ్రామికవేత్త ఎవ్వరూ హిందువుల కోసం నోరు తెరవ లేదు. కొంత మంది యూట్యూబర్లు మాత్రమే గళమెత్తారు. అయితే అది చాలదు.వీరంతా హిందువులే అయినా అందరూ ఇంకా మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష పార్టీల మౌనం గురిచి నేను మాట్లాడదలచుకోలేదు.ఎందుకంటే వారికి ఇప్పుడు అవకాశం లేదు. రాహుల్‌, అఖిలేష్‌,మమత, ఉద్దావ్‌ లేదా ఇతర రాజకీయనేతలు గళం విప్పుతారని నేను ఆశించను. కానీ బిజెపి ఎందుకు మౌనంగా ఉంది. మన హిందూ సోదరులు బాధలు పడుతుంటే మనమంతా మొద్దుబారిపోయామా ? ” (రెడిట్‌ డాట్‌కాం) బిజెపి మొద్దుబారలేదు, ఇలాంటి అవకాశాలు ఎప్పుడు వస్తాయా ? ఎలా సొమ్ముచేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది, చురుకుగా వ్యవహరిస్తుంది అన్న విషయం పై ప్రశ్న వేసిన వారికి తెలియదేమో !


ఇండియా టుడే పత్రిక 2024 ఆగస్టు 13న ఒక విశ్లేషణ ప్రచురించింది. షేక్‌ హసీనా ప్రభుత్వ పతనం తరువాత తలెత్తిన అరాచకంలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై ఐదు హత్యలతో సహా రెండు వందలకు పైగా ప్రాంతాలలో దాడులు జరిగాయి. విడిగా దాడులను చూస్తే కొన్ని వందలు ఉంటాయి. అత్యాచార ఉదంతాలు కూడా జరిగాయి.దాడుల వీడియోలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తాయి. వాస్తవాల నిర్ధారకులు వాటిని ప్రశ్నించారు.బాధితుల్లో రాజకీయాలతో నిమిత్తం ఉన్నవారితో పాటు లేని వారు కూడా ఉన్నారు. ఆగస్టు ఐదు నుంచి మూడు రోజుల్లో 205ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇండ్లు, దుకాణాలపై ఎక్కువగా ఉన్నాయి, కావాలని లూటీలు, దహనాలు చేశారు.రాజకీయాల నుంచి మతాన్ని విడదీసి చూడాల్సిన అవసరం ఉంది, నిజమైన విచారణ వాస్తవాలను వెల్లడించుతుంది. సమగ్రమైన విచారణ జరపకుండా ఫలానా సంస్థ లేదా పార్టీ దీని వెనుక ఉందనే నిర్ధారణలకు రాలేము. ఇదీ ఇండియా టుడే పేర్కొన్న అంశాల సారం. మతపరమైన దాడులు ఎన్ని, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎన్ని అత్యాచారాలు జరిగాయనే అంకెలు తీవ్రతను వెల్లడిస్తాయి తప్ప ఒక్క ఉదంతమైనా తీరని నష్టం, తీవ్రంగా ఖండించాల్సిందే. అన్ని దేశాల్లో మతం, భాషా మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను బంగ్లాదేశ్‌లో మైనారిటీలు కూడా ఎదుర్కొంటున్నారు.


మన దేశంలో బిజెపి దానికి ముందు ఉన్న జనసంఘం, ఈ రెండు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి కారణంగా మైనారిటీలు దూరంగా లేదా వ్యతిరేకంగా ఉన్నారు, వారి హక్కులు, భద్రత గురించి పట్టించుకుంటున్నకారణంగా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నారు.దాన్ని ముస్లిం సంతుష్టీకరణగా బిజెపి ఇప్పటికీ ప్రచారం చేస్తున్నది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులు అత్యధికులు అక్కడి నేషనల్‌ అవామీలీగ్‌ పార్టీ మద్దతుదార్లుగా ఉన్నారు. ఆ పార్టీ మద్దతుదార్లలో నాలుగోవంతు వారే అని చెబుతున్నారు, అంటే అవామీలీగ్‌ను కూడా హిందువులను సంతుష్టీకరించే పార్టీగా బిజెపి చిత్రిస్తుందా ? అవామీ లీగ్‌పై దాడులు, అరాచకం చెలరేగినపుడల్లా ఆ పార్టీలో ఉన్న హిందువుల మీద కూడా జరుగుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేనివారి మీద కూడా జరిగిన దాడులను చూస్తే ముస్లిం మతోన్మాదశక్తులు ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారన్నది స్పష్టం. ఇంట్లో ఆవు మాంసం ఉంది, గోవులను వధిస్తున్నారంటూ గోరక్షకుల ముసుగులో ఉన్న మతోన్మాదులు మనదేశంలో సామూహిక దాడులకు, హత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తిమ్మినిబమ్మినిగా చూపే వీడియోలు, వాట్సాప్‌ సమాచారం మనదేశంలో కుప్పలు తెప్పలుగా సృష్టిస్తూ బుర్రలు ఖరాబు చేసే పార్టీలు, సంస్థల గురించి తెలిసిందే.బంగ్లాదేశ్‌ కూడా దీనికి మినహాయింపు కాదు. అక్కడ జరగని ఉదంతాలను జరిగినట్లు ప్రచారం చేయటంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాటిలో కొన్నింటిని మన దేశంలోనే తయారు చేస్తున్నారట, అవాంఛనీయ శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం వైరల్‌ చేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలించిన నిజ నిర్ధారకులు వాస్తవాలు కాదని తేల్చారు. దీని అర్ధం అసలు దాడులే జరగలేదు, హిందువులను నష్టపరచలేదని కానేకాదు.


మనదేశంలో ఉన్న కొన్ని సంస్థలకు చెందిన నిజ నిర్ధారకులు గతంలో అనేక తప్పుడు ప్రచారాల నిగ్గుతేల్చారు.వారికి రాజకీయ అనుబంధాలను అంటగడుతూ కాషాయ మరుగుజ్జుదళాలు జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూశాయి.మన దూరదర్శన్‌ మాదిరి జర్మనీ ప్రభుత్వ మీడియా సంస్థ డ్వట్చ్‌ విలా. దీన్ని పొట్టి రూపంలో డిడబ్ల్యు అని కూడా పిలుస్తారు. దానికి కూడా దురుద్ధేశ్యాలను ఆపాదిస్తే ఎవరూ చేసేదేమీ లేదు. వైరల్‌ కావించిన అంశాలను లక్షలాది మంది చూశారు, ఇతరులతో పంచుకున్నారు. వీటిలో బంగ్లాదేశ్‌ హిందూ క్రెకెటర్‌ లిటన్‌ దాస్‌ ఇంటిని తగుల పెట్టారు అన్నది ఒకటి. దుండగులు జరిపిన దాడుల్లో దహనం చేసిన ఆ ఇల్లు మాజీ క్రికెటర్‌ మష్రఫీ మోర్తజాది తప్ప లిటన్‌దాస్‌ది కాదు అని తేలింది. ఫొటో లిటన్‌దాస్‌ది,ఇల్లు అతనిది కాదు.మోర్తజా రాజకీయంగా హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ కార్యకలాపాల్లో పాల్గొనటం, ఇటీవలి ఎన్నికలు, అంతకు ముందు కూడా ఆ పార్టీ ఎంపీగా గెలవటం అతని ఇంటిని తగులబెట్టటానికి కారణంగా తేలింది. హిందూ మహిళలపై అత్యాచారాలు, వేధింపులు అంటూ మరోరెండు ఉదంతాలను వైరల్‌ చేశారు. అవి తాజా సంఘటనలు కాదు, వాటిని కూడా అసందర్భంగా జత చేసినట్లు తేలింది.. హిందూ మహిళ లోదుస్తులను ప్రదర్శిస్తున్న ముస్లిం పురుషుల దృశ్యాలను పోస్టు చేస్తూ హిందు బాలికల బ్రాలను తొలగించారని అత్యాచారం చేసిన తరువాత వాటిని ప్రదర్శించి తమ మగతనాన్ని ప్రదర్శించుకున్నారని వ్యాఖ్యానాలు జోడించారు.నిజానికి ఆ వీడియో దృశ్యం,దానిలో కనిపించిన దుస్తులు మాజీ ప్రధాని షేక్‌ హసీనా దేశం వదలి వెళ్లిన తరువాత ఆమె నివాసంలో ప్రవేశించిన వారు చేసిన అరాచకంలో భాగం, అవి మీడియాలో ప్రచురించిన, టీవీలలో చూపించినవిగా తేలింది. అత్యాచారానికి గురైన హిందూ మహిళంటూ వైరల్‌ ఆయిన ఫొటోల బండారాన్ని కూడా జర్మన్‌ టీవీ బయటపెట్టింది. వాటిలో ఒక చిత్రంలో ఉన్న మహిళ 2023లో మణిపూర్‌లో హిందూ పురుషులు అపహరించి, సామూహిక అత్యాచారం చేసిన ఒక క్రైస్తవ యువతిగా తేలింది. మరొక చిత్రం 2021లో ఇండోనేషియాలో వైరల్‌ అయింది. ఐదుగురు బంగ్లాదేశీయులు ఇండోనేషియా వలస మహిళను చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసినట్లు దానిలో పేర్కొన్నారు. దాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందూ మహిళలపై అత్యాచారంగా చిత్రించారు. మరొక వీడియో అత్యాచారం చేసినట్లుగా వైరల్‌ అయింది. అది బెంగలూర్‌ రామ్మూర్తినగర్‌లో 2021వ సంవత్సరం మే నెలలో జరిగిన అత్యాచార ఉదంతంలో ముగ్గురు మహిళలతో సహా పన్నెండు మంది బంగ్లా జాతీయులను అరెస్టు చేసిన వీడియోగా మన దేశానికి చెందిన వెబ్‌సైట్‌ బూమ్‌ తేల్చింది. ఇలా సామాజిక మాధ్యమంలో తిప్పుతున్న వీడియో, ఫొటోలను గుడ్డిగా నమ్మించి భావోద్రేకాలను రెచ్చగొట్టేందుకు పనిగట్టుకు చేస్తున్నవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు వాదనలపై హేతుబద్దంగా ఆలోచించాలి. ఎవరు దాడులకు పాల్పడినా ఖండించాలి, నిరసించాలి. దానికి సరిహద్దులు ఎల్లలూ ఉండనవసరం లేదు. మతం కళ్లద్దాలు తొలగించి మానవత్వ అద్దాలను పెట్టుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యాపై ఉక్రెయిన్‌ ఎదురుదాడి : వెనక్కి కొడుతున్న పుతిన్‌ సేనలు !

14 Wednesday Aug 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Russia-Ukraine War, Ukraine crisis, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై 2022లో రష్యా ప్రారంభించిన సైనిక చర్యకు 900 రోజులు పూర్తయ్యాయి.తాజా పరిణామం ఏమంటే తమ సేనలు రష్యాలోని కురుస్క్‌ ప్రాంతంలో వెయ్యిచదరపు కిలోమీటర్ల మేరకు ఆక్రమించుకున్నట్లు జెలెనెస్కీ ప్రకటించాడు.విస్తీర్ణం ఎంత అనేదాని మీద భిన్న కథనాలు వచ్చాయి. తమ భద్రత కోసమే ఈ దాడులన్నాడు. రష్యా ప్రభుత్వం అక్కడి జనాభాను ఇతర ప్రాంతాలకు తరలించింది. బుధవారం నాడు వెలువడిన వార్తల ప్రకారం చొచ్చుకు వచ్చిన ఉక్రెయిన్‌ సేనలను వెనక్కు కొట్టేందుకు రష్యా పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించింది. తాము అక్కడ తిష్టవేసేందుకు దాడులకు దిగలేదని, న్యాయమైన శాంతి ప్రతిపాదనలతో రష్యా ముందుకు వస్తే వెనక్కు పోతామని జెలెనెస్కీ ప్రకటించినట్లు కూడా సమాచారం. అంతకు ముందు తగిన శాస్తి అనుభవించటానికి ఉక్రెయిన్‌ సిద్దంగా ఉండాలని రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించాడు. ఇప్పటి వరకు ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్‌ తన బలాలన్నింటినీ కూడగట్టుకొని ఈ దాడి ద్వారా సాధించేదేమిటి, ఆక్రమించుకున్న ప్రాంతాలను ఎంతకాలం నిలుపుకుంటుంది అన్నది ఒక ప్రశ్న. ఈ పరిణామం సంక్షోభ తీరుతెన్నులనే మార్చివేసిందా అన్న రీతిలో మథనం జరుగుతోంది. కొందరు వర్ణిస్తున్నట్లు నాటకీయంగా, ఆకస్మికంగా జరిగిన ఈ దాడితో రష్యా ఆశ ్చర్యపోయిందా ? ఏ మాత్రం పసిగట్టలేదా ? ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున సిబ్బందిని, సాయుధ వాహనాలను తరలిస్తున్నట్లు రష్యా మిలిటరీ ప్రకటించింది. నలభై కిలోమీటర్ల వెడల్పున పన్నెండు కిలోమీటర్ల మేరకు ఉక్రెయిన్‌ సేనలు చొచ్చుకొని వచ్చాయని 28 జనావాసాలు ఆ ప్రాంతంలో ఉన్నట్లు మొత్తం లక్షా 80వేల మంది పౌరులకు గాను లక్షా 21 వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించినట్లు కురుస్క్‌ గవర్నర్‌ సోమవారం నాడు ప్రకటించాడు. ఉక్రెయిన్‌ సేనల నష్టాలు పెరుగుతున్నాయని, పోరుకు సిద్దంగా ఉన్న దళాలన్నింటినీ జెలెనెస్కీ సరిహద్దులకు తరలిస్తున్నాడని, తగిన శాస్తి అనుభవిస్తారని పుతిన్‌ టీవీ ప్రసంగంలో చెప్పాడు. అయితే కురుస్క్‌ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఉక్రెయిన్‌ భూభాగంలో ఉన్న జనాన్ని కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.ప్రస్తుతం ఐరోపాలో అతి పెద్దదైన ఉక్రెయిన్‌ జపోర్‌ఝియా అణువిద్యుత్‌ కేంద్రం రష్యా అదుపులో ఉంది. మూతపడి ఉన్న ఆ కేంద్రంలో మంటలు చెలరేగాయి. దానికి కారకులు మీరే అంటూ ఉక్రెయిన్‌-రష్యా పరస్పరం ఆరోపించుకున్నాయి. అయితే ఎలాంటి అణుధూళి వెలువడలేదని. మంటలను ఆర్పివేసినట్లు వార్తలు.మరోవైపున ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్రిక్తతలు సడలటానికి మూడు సూత్రాలను పాటించాలని ఈ వివాదంలో తటస్థంగా ఉన్న చైనా సూచించింది.యుద్ద రంగాన్ని విస్తరించకుండా,పోరు మరింతగా దిగజారకుండా చూడటంతో పాటు ఏ పక్షమూ మంటను ఎగదోయవద్దని పేర్కొన్నది. తాము ఏ పక్షానికీ మారణాయుధాలను అందించటం లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పాడు.


తనకు వ్లదిమిర్‌ పుతిన్‌,ఉత్తర కొరియా నేత కిమ్‌ బాగా తెలుసునని, వారిద్దరూ ఎంతో హుందా అయిన వారని, ఉక్రెయిన్‌ పోరుకు కారకుడు అధ్యక్షుడు బైడెన్‌ అని డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఆరోపించాడు. అతను గెలిచి ఉండకపోతే పోరు వచ్చేదే కాదన్నాడు. ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుతిన్‌తో తనకు బలమైన సంబంధాలున్నందున తానైతే వివాదాన్ని నివారించి ఉండేవాడినని మరోమారు అన్నాడు.ట్రంప్‌ చెప్పింది నిజమే అని ఎలన్‌ మస్క్‌ అన్నాడు. ఉక్రెయిన్‌ మీద దాడి చేయవద్దని, అది నీవల్ల కాదని తాను పుతిన్‌తో చెప్పానని అయితే తనకు మరొక మార్గం లేదని అన్నాడని, కాదు మార్గం ఉందని తాను చెప్పినట్లు ట్రంప్‌ వెల్లడించాడు.తాను ఎన్నికైతే అధికారం చేపట్టక ముందే 24 గంటల్లో వివాదాన్ని పరిష్కరిస్తానని కూడా పునరుద్ఘాటించాడు.తాను ఎన్నికైతే ఉక్రెయిన్‌కు సాయం కొనసాగిస్తాననే హామీ ఇవ్వలేనని గతేడాది మేనెలలోనే ట్రంప్‌ బహిరంగంగా చెప్పాడు. క్రిమియా, డాన్‌బాస్క్‌ ప్రాంతాలను రష్యాకు అప్పగిస్తే వెంటనే సైనిక చర్య ముగుస్తుందని ప్రైవేటు సంభాషణల్లో ట్రంప్‌ చెబుతున్నాడు.


తమకు పూర్తి స్థాయిలో గగనతల రక్షణ వ్యవస్థలను అందించాలని మిత్రదేశాలకు జెలెనెస్కీ విజ్ఞప్తి చేశాడు.పోరు దీర్ఘకాలం సాగుతుందని, కష్టతరంగా ఉంటుందని ఉక్రెయిన్‌ మాజీ మిలిటరీ అధికారి ఒకడు చెప్పాడు.రష్యా ప్రాంతంపై జరుగుతున్నదాడిలో తొమ్మిది అంతస్తుల భవనం మీద పడిన ఉక్రెయిన్‌ క్షిపణి కారణంగా 13 మంది గాయపడినట్లు తప్ప ప్రాణ నష్టం గురించి ఇంతవరకు ఇతరంగా వార్తలు రాలేదు. తాము నాలుగు ఖండాంతర క్షిపణులను, 14డ్రోన్లను కూల్చివేయటంతో పాటు చొరబాటును నిలువరించినట్లు రష్యా ప్రకటించింది.సైనిక చర్య ప్రారంభమైన తరువాత తమ గడ్డపై కొన్ని సందర్భాల్లో ఎదురుదాడులు చేసినా రష్యా భూభాగంపై దాడికి దిగటం ఇదే ప్రధమం. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ఐదోవంతు ప్రాంతం రష్యా లేదా దాని అనుకూల శక్తుల ఆధీనంలో ఉంది. దాన్ని విడిపించుకొనేందుకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మెల్లమెల్లగా కొత్త ప్రాంతాలను రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఉక్రెయిన్‌ మౌలిక సదుపాయాలను దెబ్బతీసి వెన్ను విరుస్తున్నది.అమెరికా, ఇతర నాటో దేశాలు అందిస్తున్న వందల కోట్ల డాలర్లు, టన్నుల కొద్దీ ఆయుధాలు దేనికీ కొరగాకుండా పోతున్నాయి. ఆగస్టు ఐదవ తేదీ నుంచి జెలెనెస్కీ సేనలు దాడులను ప్రారంభించినప్పటికీ రష్యన్లు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. వ్యూహాత్మకంగా రానిచ్చారా, పసిగట్టలేకపోయారా లేక తగిన సన్నాహాలు లేవా ? బాగా లోపలకు రానిచ్చి చుట్టుముట్టాలన్న ఎత్తుగడ కూడా ఉందంటున్నారు. గతేడాది అక్టోబరులో చీమ చిటుక్కుమన్నా పసిగట్టే యంత్రాంగం, నిఘావున్న ఇజ్రాయెల్‌ కూడా ఇనుపకంచెను బద్దలు కొట్టి తమ భూభాగంలోకి వచ్చి దాడి చేయటం, అనేక మందిని హతమార్చి, కొందరిని బందీలుగా పట్టుకుపోయిన హమస్‌ సాయుధుల చర్యలను పసిగట్టలేకపోవటాన్ని చూశాము. ఇప్పటికీ ఎలా జరిగిందో చెప్పలేకపోతున్నది. దీని అర్ధం ఇజ్రాయెల్‌ మిలిటరీ కంటే హమస్‌ గొప్పదనా ? అలాగే రష్యన్లు ఆదమరచి ఉన్న సమయంలో ఉక్రెయిన్‌ కూడా ఈ దాడికి పాల్పడి ఉండవచ్చు. పెద్దగా ఆయుధాలు లేని కాపలాదారులు, పదాతి దళాలు తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని గతంలో మాదిరి చిన్న చిన్న బృందాలకు బదులు భారీ సంఖ్యలో వారం రోజుల క్రితం పలు వైపుల నుంచి మెరుపుదాడులు చేసినట్లు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో డ్రోన్లతో పదివేల మంది సైనికులు ఈ దాడిలో పాల్గొన్నట్లు, రష్యన్‌ డ్రోన్లను పనికిరాకుండా చేసినట్లు పరిశీలకులు చెబుతున్నారు. యుద్ద విమానాలు, హెలికాప్టర్లతో దాడిని నిలువరించినట్లు, నాలుగు రోజుల్లో 945 మంది ఉక్రెయిన్‌ సైనికులను హతమార్చినట్లు రష్యా చెబుతున్నది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య 1,974కిలో మీటర్ల భూ, 321కిలో మీటర్ల సముద్ర సరిహద్దు ఉంది. ఇంతపొడువునా సేనలను మోహరించటం ఏ దేశానికీ సాధ్యం కాదు.ఈ కారణంగానే కేంద్రీకరణ తక్కువగా ఉన్న కురుస్క్‌ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతం మాస్కోకు 530కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడ్య రష్యానుంచి ఐరోపాకు సరఫరా చేసే సుదఝా సహజవాయు పంప్‌ స్టేషన్‌ తప్ప ఇతరంగా ముఖ్యమైనవేవీ లేవు.దాన్ని ముట్టడించేందుకు ఉక్రెయిన్‌ చూస్తున్నది.


ఉక్రెయిన్‌ దాడితో ఏం జరిగింది ? ఏం జరగనుందన్నది చర్చ.ఉక్రెయిన్‌లోని డాంటెస్క్‌ ప్రాంతంపై కేంద్రీకరించి ముందుకు సాగుతున్న రష్యా సహజంగానే తన బలగాలను కురుస్క్‌వైపు కేంద్రీకరిస్తుంది. రష్యా మిత్రదేశమైన బెలారస్‌ మిలటరీ ఉక్రెయిన్‌తో ఉన్న తమ సరిహద్దులో బలగాలను కేంద్రీకరిస్తున్నట్లు సంకేతాలు పంపింది. కురుస్క్‌ మీద దాడి సందర్భంగా ఉక్రెయిన్‌ తమ గగనతలాన్ని అతిక్రమించిందని బెలారస్‌ నేత అలెగ్జాండర్‌ లుకషెంకో పేర్కొన్నాడు. తమ దళాలు అనేక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు కూడా చెప్పాడు.ఇది తమను రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదని, తిప్పికొడతామని రక్షణ మంత్రి ప్రకటించాడు. అంటే జెలెనెస్కీ సేనలు పూర్తిగా రష్యా మీద కేంద్రీకరించటం సాధ్యం కాదు. ఇది కూడా రష్యా ఎత్తుగడల్లో భాగమే అన్నది స్పష్టం.ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తారు, యుద్దంలో ఏదైనా జరగవచ్చు. తాజా దాడి రష్యాతో బేరసారాలాడేందుకు జెలెనెస్కీ వేసిన ఎత్తుగడగా కూడా కొందరు వర్ణిస్తున్నారు. సోమవారం నాడు పుతిన్‌ కూడా అదే చెప్పాడు. శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో తన పశ్చిమ దేశాల యజమానుల సాయంతో పరిస్థితిని మెరుగుపరచుకొనే ఎత్తుగడ ఇది అన్నాడు. ఒక వేళ ఉక్రెయిన్‌ పరాభవం పాలైతే దానికి కొత్తగా పోయేదేమీ లేదు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపా గడ్డ మీద 900 రోజులు సాగిన మిలిటరీ చర్య లేదా యుద్ధం ఇది తప్ప మరొకటి లేదు. రష్యాను ఓడించేందుకు మనమెందుకు ఉక్రెయిన్‌కు సాయం చేయాలి, దాని వలన మనకొచ్చే లాభం ఏమిటన్న ప్రశ్న అమెరికాలో తలెత్తుతున్నది. నవంబరులో జరిగే అధ్యక్ష, ఇతర ఎన్నికల్లో ఈ అంశాన్ని ముందుకు తెచ్చి లబ్ది పొందేందుకు రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. ట్రంపు గెలిస్తే తాము మునిగినట్లే అని ఉక్రెయిన్‌ భయపడుతున్నది.డెమోక్రాట్లు గెలిచినా ఎంత మేరకు, ఎంతకాలం మద్దతు ఇస్తారన్నది సందేహమే. ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదన్నది రష్యా ప్రధానమైన షరతు. దానికి అమెరికా, ఇతర నాటో దేశాలు ససేమిరా అంటున్నాయి. రష్యా సైనిక చర్యవెనుక ఉన్న కీలక అంశమిదే. క్రిమియాతో పాటు స్వాతంత్య్రం ప్రకటించుకున్న, రష్యా ప్రభావంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ తమకు అప్పగించి సార్వభౌమత్వానికి హామీ ఇవ్వాలని ఉక్రెయిన్‌ కోరుతున్నది. యుద్ధ సమయంలో శత్రు సంహరణకంటే ముందు నిజం చచ్చిపోతుంది. రష్యా మిలిటరీ చర్య ప్రారంభించిన నాటి నుంచి పశ్చిమదేశాల మీడియా ప్రచారం అంతా పుతిన్‌ సేనల ఓటమి ఈ క్షణమో మరో క్షణంలోనో జరగబోతోదని గత 900 రోజులుగా చెబుతూనే ఉంది. అదే మాదిరి పుతిన్‌ కూడా కొద్ది రోజుల్లోనే జెలెనెస్కీని తన కాళ్ల వద్దకు రప్పించుకుంటానని చెప్పాడు. రెండూ జరగలేదు. దాడుల పద్దతులు, ఎత్తుగడలూ మారాయి.ఇంతవరకు ఎటువైపు ఎంత మంది మరణించిందీ ఎవరూ నిజం చెప్పటం లేదు.కురుస్క్‌ ప్రాంతం నుంచి ఈ ఏడాది తమ మీద రెండువేల సార్లు వైమానిక దాడులు జరిపినట్లు ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌ తాజా దాడితో పెను మార్పులు వచ్చే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భిన్న వైఖరులు : నాడు దలైలామా – నేడు షేక్‌ హసీనా, కొన్ని వాదనలు, కుట్ర సిద్దాంతాలు ! అమెరికాను చూసి నరేంద్రమోడీ భయపడుతున్నారా !!

11 Sunday Aug 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA, Women

≈ Leave a comment

Tags

Bangladesh liberation struggle, BJP, BNP, China, cia, coup against Sheikh Hasina, Narendra Modi Failures, pakistan, RSS


ఎం కోటేశ్వరరావు


జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన తప్పిదాలు అన్నిన్ని కావు అన్నీ అతనే చేశాడు అంటూ బొమ్మరిల్లు డైలాగులతో బిజెపి నేతలు, కాషాయదళాల నిత్యపారాయణంలో దలైలామాకు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన అంశం ఎక్కడా వినిపించదు, రాతల్లో కనిపించదు. మిగతా అన్ని విషయాల్లో తప్పు చేసి నెహ్రూ ఒక్క దీనిలోనే మంచి చేశారా ?చేస్తే ఆ విషయం ఎందుకు చెప్పరు అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా ? షేక్‌ హసీనా ! బంగ్లా ప్రధానిగా ఆమె పదవీ కాలంలో మనదేశానికి ఇబ్బందులు కలిగించినట్లు ఎవరూ చెప్పలేరు. ఆమె ప్రత్యర్థి బంగ్లానేషనలిస్టు పార్టీ(బిఎన్‌పి), దానికి వెన్నుదన్నుగా జమాతే ఇస్లామీ అనే మతోన్మాద సంస్థ మన దేశానికి వ్యతిరేకమని ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. అఫ్‌కోర్స్‌, వారు అసలు బంగ్లాదేశ్‌ విముక్తికే వ్యతిరేకులు, అమెరికా సప్తమనౌకా దళాన్ని బంగాళాఖాతంలోకి రప్పించి విముక్తి పోరాటాన్ని అణచేందుకు, దానికి వెన్నుదన్నుగా ఉన్న భారత్‌ను బెదిరించేందుకు చూసిన చరిత్ర జగమెరిగినదే. టిబెట్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించి చైనా మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు రాజకీయ ఆశ్రయం కల్పించటమే గాక హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు నాటి ప్రధాని నెహ్రూ ఎంతగానో సహకరించారు.మిలిటరీ కుట్ర కారణంగా షేక్‌ హసీనా 2024 ఆగస్టు ఐదవ తేదీన మనదేశానికి వచ్చి ఆశ్రయం పొందారు. ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ వద్ద ఉన్న వైమానిక స్థావరంలో ఆమె ఉన్నారు. ఇది రాస్తున్న సమయానికి ఆమె శరణార్ధిగా లేదా రాజకీయ ఆశ్రయం పొందిన వ్యక్తిగా గానీ లేరు. కేవలం వీసా మీద వచ్చిన ఒక సాధారణ బంగ్లా పౌరురాలిగా మాత్రమే ఉన్నారు. అలా ఎన్ని రోజులు ఉంటారు ? వీసా గడువును పొడిగిస్తారా ? నరేంద్రమోడీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. బంగ్లాదేశ్‌ పరిణామాల గురించి మీడియా, సామాజిక మాధ్యమంలో అనేక అంశాలు చక్కర్లు కొడుతున్నాయి.కుట్ర సిద్దాంతాలను వండి వారుస్తున్నారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయం సరేసరి. పక్కనే ఉన్న దేశంలో జరిగే పరిణామాలు మన మీద అనుకూలంగానో ప్రతికూలంగానో ప్రభావం చూపుతాయి. అందునా ఇరుగు పొరుగుదేశాలన్నీ మనకు దూరంగా జరుగుతున్న తీరు తెలిసి కూడా మన జేమ్స్‌బాండ్‌ అజిత్‌ దోవల్‌ ఏం చేస్తున్నట్లు అన్న ప్రశ్న తలెత్తుతోంది. పసిగట్టి హసీనాను హెచ్చరించినట్లు, లేదని గానీ వార్తలు రాలేదు. ఎందుకు అంటే మన నేతలందరూ ఎన్నికల్లో నిమగమైనట్లు కొందరు వారి తరఫున సంజాయిషీ ఇస్తున్నారు. అంటే ఎన్నికల్లో బిజెపి లబ్దికోసం చూడటం తప్ప దేశం ఇరుగుపొరుగున ఏం జరిగినా పట్టదా ? ఎవరి పని వారు చేయాలి. ఎక్కడో మన ”రా” ఏజంట్లు మన వ్యతిరేకులను లేపేశారంటే ఎంత గొప్పో అని పొగిడేవారు, ఇప్పుడా ఏజంట్లు బంగ్లాదేశ్‌లో ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగారా ?దేశం సురక్షితమైన నరేంద్రమోడీ చేతుల్లో ఉందని, అమెరికాను సైతం మెడలు వంచగల విశ్వగురువుగా భావించేవారు, పొగిడేవారు గానీ ఇప్పుడేం చెబుతారు ?


టిబెట్‌ చరిత్రను చూసినపుడు అది చైనాలో భాగంగా ఉన్న సామంత రాజ్యంగా(మన దేశంలో నిజాం హైదరాబాదు సంస్థానం మాదిరి) ఉంది తప్ప స్వతంత్రదేశంగా ఎన్నడూ లేదు. చైనాలో ఒక స్వయం పాలిత ప్రాంతం. బౌద్దంలో లామా అంటే గురువు లేదా బోధకుడు. కేంద్రంగా ఉండే దలైలామా చైనా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రాక ముందు టిబెట్‌లో లామాల మార్గదర్శనంతో పాలనా వ్యవహారాలు సాగేవి. తరువాత ఆ పాలన స్థానంలో పౌరపాలనా వ్యవస్థ ఏర్పాటుకు 14వ దలైలామాతో సంప్రదించి 1951లో 17 అంశాలతో కూడిన ఒప్పందానికి చైనా కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఆ క్రమం పూర్తిగాక ముందే 1959లో 14వ దలైలామా తిరుగుబాటు ప్రకటించటం, దాన్ని చైనా ప్రభుత్వం అణచివేయటం అదే ఏడాది ఏప్రిల్‌ 18న అమెరికా సిఐఏ పర్యవేక్షణ, భారత ప్రభుత్వ సహకారంతో నేటి అసోంలోని తేజ్‌పూర్‌ దగ్గర మనదేశంలోకి వచ్చాడు. అమెరికా,బ్రిటన్‌ ఏజంట్లు ఒక పధకం ప్రకారం వ.ునదేశానికి చేర్చారు. రాజకీయ ఆశ్రయం ఇప్పించారు. 1956లోనే దలైలామా మన బుద్ద జయంతి కార్యక్రమం పేరుతో మనదేశం వచ్చి ఒకవేళ కోరితే తనకు రాజకీయ ఆశ్రయం ఇస్తారా అని నెహ్రూను అడగ్గా చైనాతో ఉన్న సంబంధాల రీత్యా అది కుదరదని సున్నితంగా తిరస్కరించారు. అయితే మూడు సంవత్సరాల తరువాత అదే నెహ్రూ ఎందుకు అంగీకరించారంటే సిఐఏ తెచ్చిన వత్తిడికి లొంగారన్నది స్పష్టం. అతనేమీ దేశాధినేత కాదు, మనదేశంతో రాజకీయంగా, అధికారికంగా ఎలాంటి సంబంధాలు లేవు.షేక్‌ హసీనా వచ్చిన నేపధ్యం భిన్నం. విద్యార్థుల ఆందోళన ముసుగులో అక్కడి మిలిటరీ దేశం వదలి వెళ్లాలని ఆదేశించటం, వారే ఒక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసి మన దేశానికి పంపించారు.(గతంలో లాటిన్‌ అమెరికాలోని హొండూరాస్‌లో అధ్యక్షుడు జెలయా మీద తిరుగుబాటు చేసిన మిలిటరీ జెలయాతో పాటు నిద్ర మంచాల మీద ఉన్న భార్యను కూడా బలవంతంగా తీసుకువెళ్లి పక్కనే ఉన్న కోస్టారికా అనేదేశంలో వదలి వచ్చారు)మానవహక్కులు, ప్రజాస్వామ్యం పేరుతో నాడు దలైలామాకు ఆశ్రయం ఇవ్వటాన్ని సమర్ధించే బిజెపి ఇప్పుడు మనదేశానికి మిత్రురాలిగా ఉన్న హసీనాకు అలాంటి ఏర్పాటుకు ఎందుకు తటపటాయిస్తున్నట్లు ?


హసీనా ప్రజాస్వామ్యాన్ని అణచి ప్రతిపక్షాలను వేధించారని ఆలాంటి వ్యక్తికి ఆశ్రయం ఎందుకు ఇవ్వాలని కొందరు వాదిస్తున్నారు. నిజమే, అది వారి అంతర్గత వ్యవహారం.మన దేశం ఎవరికీ రాజకీయ ఆశ్రయం కల్పించలేదా ? జోక్యం చేసుకోలేదా ? 1971లో బంగ్లాదేశ్‌ విముక్తికి మన మిలిటరీని నడిపాము. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. గయూమ్‌ కోరిక మేరకు ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపర్లను నేరుగా మాల్దీవుల్లో దించి మనదేశం కుట్రను విఫలం గావించింది. అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అబ్దుల్‌ గయూమ్‌ ప్రజాస్వామిక స్వేచ్చకు తిలోదకాలిచ్చి 2008లో ఓడిపోయే వరకు పదవిలో కొనసాగాడు. అతడి మీద జరిగిన కుట్రను భారత్‌ అడ్డుకొని అధికారంలో కొనసాగించింది. తరువాత అధ్యక్షుడు నషీద్‌ మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్‌ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. దీన్ని ఎలా చూడాలి ? దలైలామా పాలనలో ఫ్యూడల్‌ శక్తులు టిబెటన్లను అణచివేసిన తీరు ప్రపంచానికి, మనదేశానికి తెలియదా ? ఏ దలైలామా ఏలుబడిలోనైనా అక్కడసలు ఎన్నికలు, ప్రజాస్వామిక పౌరపాలన ఉందా ? లేనపుడు దలైలామాకు ఆశ్రయం ఇవ్వటాన్ని బిజెపి ఇతర శక్తులు ఎలా సమర్థిస్తున్నట్లు ? అందువలన ఆ కారణం తర్కానికి నిలవదు. దలైలామా కమ్యూనిస్టులను ఎదిరించాడు గనుక మనదేశంలో ఉన్న కొన్ని శక్తులకు కమ్యూనిజం, చైనా అంటే వ్యతిరేకత గనుక మన శత్రువు శత్రువు మనకు మిత్రుడన్నట్లుగా దలైలామాకు ఆశ్రయం ఇచ్చారని చెబుతారా ? ఆ చర్యతో చైనాతో అదనపు తగాదా కొని తెచ్చుకోవటం తప్ప మనదేశానికి ఒరిగిందేమైనా ఉందా ? ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న శక్తులు మనదేశానికి మిత్రులా ? వారిని మన ప్రభుత్వం సమర్థిస్తున్నదా ? అక్కడ మతశక్తులు రెచ్చిపోయి మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద దాడులు చేస్తున్నారని, దేవాలయాలను కూల్చివేస్తున్నారని బిజెపి అనుకూల శక్తులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అవి చేసింది ఎవరు ? హసీనాను వ్యతిరేకించే, మనదేశాన్ని శత్రువుగా చూసే శక్తులే ? హసీనా ఏలుబడిలో అలాంటి ఉదంతాలేమీ లేవు గనుక ఆమెకు మద్దతు ఇచ్చి ఒక మంచి సందేశాన్ని మోడీ ఎందుకు పంపలేకపోతున్నారు ?


బంగ్లాదేశ్‌లో పాలకులను మార్చి భారత పలుకుబడిని తగ్గించాలని పాకిస్తాన్‌, చైనా చూస్తున్నదని దానిలో భాగంగా హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన వెనుక వాటి హస్తం ఉందని, బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ, జమాతే ఇస్లామీ విద్యార్థి విభాగంతో చేతులు కలిపియాన్నది ఒక కథనం. వాటికి నిర్దిష్ట ఆధారాలు లేకపోయినా నడుస్తున్న భూ భౌతిక రాజకీయాలను చూసినపుడు ఈ కోణాన్ని చూడాలని చెబుతున్నారు. వాస్తవం ఏమిటి ? తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల వెనుక పాక్‌ హస్తం ఉందని తరచూ హసీనా గతంలో బహిరంగంగానే ప్రకటించించారు గాని చైనా గురించి అలాంటివేమీ లేవు. చైనా వైపు మొగ్గుచూపుతున్న కారణంగా ఆమె ప్రభుత్వాన్ని కూల్చివేశారని మరొక విశ్లేషణ. తొలిసారిగా బంగ్లాదేశ్‌తో కలసి చైనా మిలిటరీ విన్యాసాలు జరపాలని నిర్ణయించటం భారత్‌, అమెరికాలకు ఆందోళన కలిగించిందన్నది ఒక అంశం.(2009 నుంచి 2023వరకు హసీనా ఏలుబడిలో భారత్‌-బంగ్లాదేశ్‌ మిలిటరీ సంయుక్త విన్యాసాలు పదకొండుసార్లు జరిగాయి. వీటిని చైనా తనకు వ్యతిరేకం అని భావించి ఉంటే బంగ్లాదేశ్‌లో భారీమొత్తాలను పెట్టుబడులుగా పెడుతుందా ?) అంతే కాదు కాక్స్‌బజార్‌ ప్రాంతంలోని పెకూ వద్ద ఒక జలాంతర్గామి కేంద్రాన్ని నిర్మించేందుకు హసీనా సర్కార్‌ చైనాకు అనుమతివ్వటం,మింగ్‌ తరగతికి చెందిన రెండు జలాంతర్గాములను బంగ్లాదేశ్‌ కొనుగోలు చేయటం మీద కూడా అమెరికా ప్రతికూలంగా స్పందించింది. దీనికి తోడు చైనా నుంచి ఇతర మిలిటరీ పరికరాలు, ఆయుధాలు కొనుగోలు చేయటం వంటి అంశాలను చైనా వైపు మొగ్గుచూపటంగా విశ్లేషకులు పేర్కొన్నారు. మరి అది నిజమైతే తాజా పరిణామాల వెనుక పాకిస్తాన్‌ హస్తం లేదా అమెరికా కుట్ర వుండవచ్చు తప్ప చైనా ఎందుకు ఉంటుంది ? రెండు దేశాల మధ్య 40బిలియన్‌ డాలర్ల విలువగల ఒప్పందాలు జరిగాయి, వాటిలో సగానికి పైగా పథకాలు నిర్మాణంలో ఉన్నపుడు హసీనాను కూలదోసి మరొకరిని గద్దెమీద కూర్చోపెట్టాల్సిన అవసరం చైనాకు ఉంటుందా ? చైనా తన భాగస్వామిని కోల్పోయిందని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది తప్ప భారత మిత్ర ప్రభుత్వాన్ని పోగొట్టుకుంది అనలేదు.


జూన్‌ నెలలో ధర్మశాలలో ఉన్న దలైలామాను అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ ప్రతినిధులు కలిశారు. ఇది చైనాకు ఆగ్రహం కలిగించినప్పటికీ మోడీ సర్కార్‌ ఖాతరు చేయలేదు.అధికారికంగా టిబెట్‌ను చైనా అంతర్భాగంగా గుర్తిస్తూనే దలైలామాకు మద్దతు ఇవ్వటం మనదేశం అనుసరిస్తున్న వైఖరి. ఇది అమెరికాను సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు. ఇది నెహ్రూ నాటి నుంచి మోడీ వరకు కొనసాగుతూనే ఉంది. మతనేతగా ఆశ్రయం కల్పించామని చెబుతున్నప్పటికీ దలైలామా, అతగాడితో టిబెట్‌ నుంచి వచ్చిన వారు చేస్తున్నదంతా రాజకీయం, చైనా వ్యతిరేక కార్యకలాపాలు తప్ప వారు వచ్చి మనదేశంలో చేసే మత కార్యక్రమాలేమిటి ? వారు రాక ముందు మనదేశంలో బౌద్ద మత భిక్షువులు లేరా ? ఆరామాలు లేవా ? బంగ్లా పరిణామాల వెనుక నిజంగా పాక్‌ హస్తం ఉంటే హసీనాకు ఆశ్రయం కల్పించటానికి తటపటాయించాల్సిన అవసరం ఏమిటి ? పాకిస్తాన్‌ వైపు నుంచి వ్యతిరేక స్పందనను తట్టుకోలేమని భావిస్తున్నారా ? లేదూ చైనా హస్తమే ఉందని నమ్మితే దలైలామా ప్రవాస ప్రభుత్వాన్నే అనుమతించిన మనదేశం హసీనాకు కనీసం రాజకీయ ఆశ్రయమైనా ఎందుకు వెంటనే ప్రకటించలేదు ? అనేక మంది అనుమానిస్తున్నట్లు లేదా తాజాగా తన పతనం వెనుక అమెరికా హస్తం ఉందని ఆమె మన దేశంలో ఒక ప్రకటన ద్వారా గళం విప్పారు. అంటే ఇవన్నీ తెలిసే 56 అంగుళాల ఛాతీ ఉన్న నరేంద్రమోడీ అమెరికాకు భయపడుతున్నారా ? ఇలా ఆలోచించటం లేదా చర్చించటం, సందేహాన్ని వెలిబుచ్చటం దేశద్రోహమేమీ కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d