Tags
BJP, Caste census, Kangana ranaut, Kangana Ranaut’s Emergency ’, Kangana's controversial statement, Narendra Modi Failures, RSS
ఎం కోటేశ్వరరావు
కాలం కలసిరాకపోతే తాడే పామై కరుస్తుందంటారు ! లోక్సభ ఎన్నికలు, అనంతర పరిణామాలను చూస్తున్నపుడు బిజెపి, దాన్ని నమ్ముకున్న వారు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారా ? అంటే, అవును అని చెప్పాల్సి వస్తోంది. నోటి దురుసు సెలబ్రిటీగా పేరు మోసిన నటి కంగనా రనౌత్ ఇందిరా గాంధీ పాత్రలో నటించి, దర్శకురాలిగా ఉన్న ‘‘ ఎమర్జన్సీ’’ సినిమా బిజెపికి తలనొప్పిగా మారింది. చరిత్రను వక్రీకరించటమే గాక తమను దేశద్రోహులు, ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, అది తమపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉన్నందున ఆ చిత్రంపై నిషేధం విధించాలంటూ దేశవ్యాపితంగా సిక్కులు డిమాండ్ చేస్తున్నారు. ఖలిస్తాన్ మద్దతుదార్లు కంగనను చంపివేస్తామంటూ బెదిరింపులకు దిగారని వార్తలు.దీంతో 2024సెప్టెంబరు ఆరున విడుదల తేదీని ప్రకటించిన కంగన ఇప్పుడు దానికి సెన్సార్ బోర్డు ఆమోదం తెలిపినా కొందరి వత్తిడి కారణంగా ధృవీకరణ పత్రం నిలిపివేశారని చెబుతున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం, ఆమె ప్రధానిగా ఉన్నపుడు 21నెలల అత్యవసరపరిస్థితి విధింపు తదితర అంశాల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన 2.43నిమిషాల నిడివిగల ట్రైలర్ను విడుదల చేయగా 50లక్షల మంది చూశారని, కేవలం 461 మంది మాత్రమే ఇష్టపడినట్లు నమోదైనట్లు ఇండియా టుడే పేర్కొన్నది.ప్రతి ఒక్క ఓటునూ లెక్కించుకుంటున్న బిజెపికి ఇప్పటికే దేశంలో ఉన్న మూడు కోట్ల మంది సిక్కులు వ్యతిరేకంగా ఉన్నారు.ఈ సినిమాతో వారు మరింత దూరమౌతారని, పక్కా వ్యతిరేకులుగా మారతారని ఆ పార్టీ భయపడుతోంది.అక్టోబరులో జరిగే హర్యానా, కాశ్మీరు ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.గతంలో బిజెపి మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్ కూడా అదే డిమాండ్ చేసింది.ఆ సినిమా ప్రదర్శనను అనుమతించకూడదని తెలంగాణా సిక్కు సామాజిక తరగతి ప్రతినిధులు ముఖ్యమంత్రి ఏ రేవంతరెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు.
బిజెపి ఎంపీ కంగన రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుమోసిన సంగతి తెలిసిందే.రైతుల గురించి నోరుపారవేసుకున్న ఉదంతం సమసి పోక మందే కులగణన గురించి చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బిజెపి చెప్పుకుంది. ఆ పార్టీలో ఇలాంటి వారికి కొదవలేదు. అవి పార్టీ కొంపముంచుతున్నాయి.తమకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక బిజెపి ఎంపి అనంతకుమార్ హెగ్డే, ఫైజాబాద్(అయోధ్య) ఎంపీ లాలూ సింగ్, మరి కొందరు కూడా ఇటీవలి లోక్సభ ఎన్నికలకు ముందు చెప్పారు. అంతకు ముందు ఆర్ఎస్ఎస్ నేతలు మోహన్ భగవత్, మన్మోహన్ వైద్య కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన పూర్వరంగం, తాము 50సంవత్సరాల పాటు ఏకధాటిగా అధికారంలో ఉంటామని అమిత్ షా చెప్పటం, ఇవన్నీ చూసిన తరువాత రాజ్యాంగాన్ని మార్చివేస్తారన్న అనుమానాలు బలపడ్డాయి. అందుకే బిజెపికి సంపూర్ణమెజారిటీ రాకుండా జనం తీర్పు చెప్పారు. అనంతకుమార్కు సీటు ఇవ్వలేదు, లాలూ సింగ్ ఓడిపోయారు. తీరా అధికారానికి వచ్చిన రెండు నెలల్లోనే ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా కేంద్రంలో ఐఎఎస్ కాడర్కు సమానమైన 45 పోస్టులను ప్రయివేటు వారితో భర్తీ చేసేందుకు పూనుకోవటంతో రిజర్వేషన్లకు ఎసరు పెడతారనే ప్రతిపక్షాల మాట నిజమే అని జనం నమ్మటం, అది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని దెబ్బతీస్తుందనే భయంతో వెంటనే నోటిఫికేషన్ వెనక్కు తీసుకోవటం తెలిసిందే.వీటన్నింటినీ చూసిన తరువాత బిజెపి నేతలు తమ మనసులోని మాటలను దాచుకోలేకపోతున్నారని కంగన వంటి వారు రుజువు చేస్తున్నారు.
ఆగస్టు చివరి వారంలో దైనిక్ భాస్కర్ అనే పత్రికతో మాట్లాడిన కంగన 2020`21లో జరిగిన రైతు ఉద్యమం గురించి నోరుపారవేసుకున్నారు. ఆ సందర్భంగా మృతదేహాలు వేలాడాయని,మానభంగాలు జరిగాయని ఆరోపించారు.రైతు ఉద్యమం జరిగిన హర్యానాలో లోక్సభ ఎన్నికల్లో పదికి గాను ఐదు సీట్లు పోగొట్టుకున్న బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దూరం కానుందనే భయంతో ఉంది. సరిగ్గా ఈ తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హర్యానా రైతాంగాన్ని మరింతగా రెచ్చగొట్టేవే. పార్టీకి నష్టం కలిగిస్తాయని హర్యానా పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. దాంతో కేంద్ర బిజెపి వెంటనే కంగన మాటలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంది తప్ప కనీసంగా ఆమెను మందలించలేదు. బంగ్లాదేశ్లో మాదిరి పరిస్థితిని భారత్లో సృష్టించే పథకం ఉందని, రైతుల నిరసనల వెనుక చైనా, అమెరికా హస్తం ఉందని కూడా అంతకు ముందు ఆరోపించారు. పార్టీ విధానాల గురించి ప్రకటనలు చేసేందుకు కంగన రనౌత్కు అధికారం లేదా అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్లో అలాంటి ప్రకటనలు చేయకూడదని కోరినట్లు బిజెపి ప్రకటించింది. తాను నటించిన ఎమర్జన్సీ సినిమా గురించి ప్రచారం చేసుకొనేందుకు దైనిక భాస్కర్ పత్రికతో మాట్లాడినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అందరూ వాటిని ఎక్కడ చదవరో అని లేదా మరింత ప్రచారం కోసం సదరు పత్రిక వార్తను తన ఎక్స్ ఖాతాలో ఆగస్టు 25న పోస్టు కూడా చేశారు. ‘‘ బంగ్లాదేశ్లో జరిగిందే భారత్లో కూడా జరిగే అవకాశం ఉంది.మన అగ్రనాయకత్వం బలంగా లేనపుడు ఇక్కడ(ఢల్లీి శివార్లలో) నిరసనలు తెలిపారు.శవాలు వేలాడాయి, మానభంగాలు జరిగాయి. రైతులకు అనుకూలమైన చట్టాలను వెనక్కు తీసుకున్నపుడు దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది.కానీ ఆ రైతులు ఆ తరువాత కూడా ధర్నాలో కూర్చున్నారు….ప్రభుత్వం చట్టాలను వెనక్కు తీసుకుంటుందని వారెన్నడూ ఊహించలేదు.బంగ్లాదేశ్లో జరిగిన మాదిరి పెద్ద పథకంతో వారు వచ్చారు. ఈ పధకాలు రైతులవని మీరు అనుకుంటున్నారా ? కాదు, చైనా, అమెరికా వంటి మనదేశంలో పని చేస్తున్న విదేశీ శక్తులది ’’ అన్నారు.లోక్సభ ఎన్నికలపుడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను బిజెపి తరఫున గ్రామాల్లో ప్రచారానికి అక్కడి రైతులు రానివ్వని ఉదంతాలను చూసిన బిజెపి నేతలు కంగన మాటలతో తమపని అయిపోయినట్లే అని భావించారు. నష్ట నివారణ చర్య తీసుకున్నప్పటికీ కంగన మాటలు రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారటం అనివార్యం.ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ హిమచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఒక తీర్మానం కూడా చేసింది.రెండవ సారి శంభు సరిహద్దులో ఆందోళన ప్రారంభించి రెండవందల రోజుల సందర్భం జరిగే నిరసనకు రెజ్లర్ వినేష్ ఫోగట్ రానున్నట్లు వార్తలు.
తిట్టే నోరు తిరిగే కాళ్లు ఊరికే ఉండవు అంటారు కదా ! రైతులపై నోరుపారవేసుకున్న కంగన మాటలు ఇంకా చెవుల్లో గింగురు మంటుండగా తగ్గేదేలే అంటూ కుల గణన జరగదు అని మరొక ప్రకటన వదిలారు. వెంటనే అది మా వైఖరి కాదు అంటూ దానికి కూడా బిజెపి జనానికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది.న్యూస్ 24 అనే టీవీతో మాట్లాడుతూ కుల గణన తప్పకుండా చేయాలా అన్న ప్రశ్నకు అవసరమే లేదు అంటూ కంగన చెప్పేశారు. కుల గణన మీద యోగి ఆదిత్యనాథ్ వైఖరే తనదని, అందరం కలసి ఉంటేనే మంచిదని, విడిపోతే నాశనం అవుతామన్నారు.‘‘ కులగణన జరపకూడదు.నటుల కులమేమిటో మనకు తెలియదు.ఎవరికీ ఏమీ తెలియదు.నా చుట్టూ ఉన్నవారు కులం గురించి పట్టించుకోరు. దాన్ని ఎందుకు ఇప్పుడు తేల్చాలి.గతంలో మనం చేయలేదు, ఇప్పుడూ అవసరం లేదు.కేవలం పేదలు, రైతులు, మహిళలు అనే మూడు కులాలు మాత్రమే ఉన్నాయి, నాలుగో కులం ఉండకూడదు’’ అన్నారు.లోక్సభ ఎన్నికలకు ముందు కావాలంటే రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చు తప్ప కేంద్ర ప్రభుత్వం చేపట్టదని, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బిజెపి నేతలు పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు ముందు మరోసారి ఎన్డిఏ కూటమిలో చేరిన జెడియు నితీష్ కుమార్ బీహార్లో కులగణన చేశారు.అనేక రాష్ట్రాలలో అలాంటి డిమాండ్ ముందుకు వచ్చింది.కేంద్రమే జనాభా లెక్కలతో పాటు జరపాలని ప్రతిపక్ష పార్టీలు కోరాయి. ఎన్నికలో బిజెపికి సంపూర్ణ మెజారిటీ రాలేదు, మిత్రపక్షాల మీద ఆధారపడాల్సి వచ్చింది.దాంతో వాటి వత్తిడికి లొంగిపోయింది.కంగన ప్రకటన మరోసారి బిజెపిని ఇరుకున పెట్టింది.‘‘ అవసరం తలెత్తితే తాము కులగణన చేస్తామని హోంమంత్రి చెప్పారని,కనుక కంగన చెప్పిన మాటలు పార్టీ వైఖరిని ప్రతిబింబించవు’’ అని బిజెపి జాతీయ ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్ ప్రకటించాల్సి వచ్చింది.అయితే ఇంతవరకు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
తోటకూర నాడే మందలించి ఉంటే అనే సామెత తెలిసిందే.గతంలో కంగన రనౌత్ చేసిన అనేక వివాదాస్పద ప్రకటనలు, ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగినపుడు బిజెపి నోరు మెదపలేదు.దాడి జరపటాన్ని ఆస్వాదించింది.పరిస్థితి మారిన తరువాత ఇప్పుడు ప్రతి మాటా పార్టీకి ఎదురు తిరుగుతోంది.ఆమె ఎక్కడా తగ్గటం లేదు. తన సినిమా గురించి ప్రచారం చేసుకుంటూ చౌకబారు,తెలివి తక్కువ ప్రకటనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఉచిత ప్రచారం పొందాలని చూస్తున్నట్లు కనిపిస్తున్నది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని 2021లో చెప్పారు.స్వీయ అనుభవంతో తానీ మాటలు చెబుతున్నట్లు, తన అతి మంచితనం కారణంగా వ్యవస్థ తనను దేశం విడిచి అమెరికా వెళ్లేట్లు చేసిందని, మోడీ అధికారానికి వచ్చాక తాను తిరిగి వచ్చానని అందుకే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. అదే విధంగా కత్రినా కైఫ్ వంటి విదేశీ హీరోయిన్లు ఎంతో రాణించారని కానీ 2014తరువాత స్వదేశీ నటీనటులు, కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విదేశీయుల నృత్యాలు ఆపాలని జనం చెప్పారని, ఇటాలియన్ ప్రభుత్వాన్ని తొలగించి ఒక చాయ్వాలాను ప్రధానిని చేశారని కూడా సెలవిచ్చారు. సుభాస్ చంద్రబోస్ను భారత ప్రధమ ప్రధాని అని చెప్పటమే కాదు, ఆయన అజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పరచిన కారణంగా బోసే ప్రధమ ప్రధాని అని సమర్ధించుకున్నారు.తనను విమర్శించిన వారికి రెండు రకాల మెదడు కణాలు ఉంటాయని వారికి ఇది అర్ధం కాదని కూడా ఎదురుదాడి చేశారు.రామనాధ్ కోవింద్ను కోవిడ్గా పలకటమేగాక, ప్రధమ దళిత రాష్ట్రపతిగా వర్ణించి తరువాత నాలుక కరుచుకున్నారు. అలాంటి కంగన సినిమా ఎమర్జన్సీ గురించి సెన్సార్బోర్డు ఏం చేస్తుందో, బిజెపి ఏం చెబుతుందో వాటి మీద స్పందనలు ఎలా ఉంటాయో చూద్దాం !
