• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Current Affairs

స్వీడన్‌ నాటో సభ్యత్వానికి మెలిక పెట్టి తోకముడిచిన టర్కీ !

12 Wednesday Jul 2023

Posted by raomk in COUNTRIES, Current Affairs, Europe, Germany, Greek, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, NATO, NATO summit in Vilnius, Recep Tayyip Erdoğan, Sweden’s NATO bid, Ukraine crisis, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఐరోపా సమాఖ్య తలుపులు తెరుస్తారేమోనని ఐదు దశాబ్దాలుగా గుమ్మం ముందు పడిగాపులు కాస్తున్నాం. సమయం వచ్చింది గనుక చెబుతున్నా మాకు సమాఖ్యలో సభ్యత్వానికి అంగీకరిస్తే మేము నాటోలో స్వీడన్‌ ప్రవేశానికి అడ్డుతొలుగుతామని టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తాయిప్‌ ఎర్డోవాన్‌ సోమవారం నాడు మెలిక పెట్టాడు.లిథువేనియా రాజధాని విలినస్‌లో మంగళ,బుధవారాల్లో జరగనున్న నాటో కూటమి వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లే ముందు టీవీలో చెప్పాడు. ఆదివారం నాడు తాను అమెరికా అధినేత జో బైడెన్‌తో చర్చలు జరిపినపుడు ఈ అంశాన్ని స్పష్టం చేసినట్లు కూడా వెల్లడించాడు. ఈ అనూహ్యప్రకటనతో పశ్చిమ దేశాలు కంగారు పడ్డాయి. ఇలా వివాదపడితే అంతిమంగా రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ లబ్దిపొందుతాడంటూ నష్టనివారణకు పూనుకున్నాయి. మరోవైపున సోమవారం నాడే విలినస్‌లో ఎర్డోవాన్‌- స్వీడన్‌ ప్రధాని క్రిస్టెర్‌సన్‌ భేటీ జరిగింది. తరువాత స్వీడన్‌కు చారిత్రాత్మక క్షణం అంటూ తమ దేశ టీవీలో ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో టర్కీ వెనక్కు తగ్గిందని, లాంఛనంగా నాటోలో స్వీడన్‌ ప్రవేశానికి త్వరలో తమ పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోద ముద్ర వేసేందుకు ఎర్డోవాన్‌ అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం టర్కీ ఎదుర్కొంటున్న ఆర్థిక, ఇతర ఇబ్బందుల కారణంగా మెత్తబడిందన్నది స్పష్టం. ఎవరి ప్రయోజనం వారు చూసుకుంటున్నందున మీరు మాకది ఇస్తే మేం మీకిది ఇస్తాం అన్నట్లుగా అందుకోసం వేస్తున్న ఎత్తులు జిత్తులలో భాగంగానే ఐరోపా సమాఖ్యలో సభ్యత్వానికి ముడిపెట్టి ప్రకటించినట్లు స్పష్టమైంది. తమ గడ్డ మీద ఉన్న రష్యా సేనల మీద ఎదురుదాడులు జరిపి పోగొట్టుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రతిజ్ఞలు చేసిన ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోతున్నదనే వార్తలు వస్తున్నాయి. జెలెనెస్కీ దళాలకు అవసరమైన ఆయుధాలు, ఇతర సాయం ఎలా అందించాలా అని నాటో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నాటోలో చేరేందుకు ఫిన్లండ్‌, స్వీడన్‌ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ప్రారంభంలో ఫిన్లండ్‌కు ఆమోదం తెలిపారు. సంస్థ నిబంధనల ప్రకారం సభ్యదేశాలన్నీ అంగీకరిస్తేనే కొత్త దేశాలను చేర్చుకోవటానికి వీలుంటుంది.ప్రస్తుతం ఈ కూటమిలో 31 దేశాలు ఉన్నాయి. తాజా వార్తల ప్రకారం ఇప్పటికి ఉక్రెయిన్‌కు సభó్యత్వం లేనట్లే అని స్పష్టమైంది.


విలినస్‌ సమావేశాల్లో స్వీడన్‌ ప్రవేశానికి ఆమోద ముద్ర కూడా అజెండాలో ఉంది.టర్కీ దానికి మోకాలడ్డటంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పోరు ముగిసేంత వరకు నాటోలో ఉక్రెయిన్‌ చేరకూడదని అమెరికా అధినేత జో బైడెన్‌ చేసిన ప్రకటన కూడా తలనొప్పిగా మారింది. టర్కీ షరతులను తాము అంగీకరించేది లేదని ఐరోపా సమాఖ్య ప్రకటించగా స్వీడన్‌కు ఆమోదం తెలిపితేనే తాము ఎఫ్‌ 16 యుద్ధ విమానాలను టర్కీకి విక్రయిస్తామని అమెరికా మెలిక పెట్టింది. ” ముందు ఐరోపా సమాఖ్యలో టర్కీ చేరికకు మార్గాన్ని సుగమం చేయాలి, తరువాత ఫిన్లండ్‌ మాదిరి స్వీడన్‌కూ మేము దారి ఇస్తాము. మేము 50 సంవత్సరాలుగా గేటు ముందు వేచి చూస్తున్నాం, నాటోలోని దేశాలన్నీదాదాపు సమాఖ్యలో సభ్యులే ” అని ఎర్డోవాన్‌ చెప్పాడు. తమ దేశంలో వేర్పాటు వాదులు, కర్దిష్‌ వర్కర్స్‌ పార్టీ వంటి ఉగ్రవాదులను స్వీడన్‌ బలపరస్తున్నదని, ఖురాన్‌ దహనంతో సహా ఇస్లాం వ్యతిరేక ప్రదర్శనలను అనుమతించిన కారణంగా తాము అంగీకరించేది లేదని గతంలో టర్కీ ప్రకటించింది. ఇప్పుడు తమకు ఐరోపా సమాఖ్యలో సభ్యత్వానికి లంకె పెట్టింది. టర్కీని సంతుష్టీకరించేందుకు స్వీడన్‌ ఉగ్రవాద చట్టాల్లో మార్పు చేసింది. వాటితో టర్కీ సంతృప్తి చెందలేదు. సోమవారం రాత్రి టర్కీ వైఖరిలో మార్పు వచ్చిన తరువాత ఐరోపా సమాఖó్యవైపు నుంచి ప్రతికూల స్పందనలు, సంకేతాలు రాలేదు తప్ప సానుకూలత కూడా వెల్లడి కాలేదు. తరువాత ఇప్పుడున్న స్థితి నుంచి టర్కీతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు పూనుకొని సంతుష్టీకరించవచ్చు.


ప్రపంచ రాజకీయాల్లో టర్కీ అనుసరిస్తున్న విధానాలే దానికి అమెరికా యుద్ధ విమానాల విక్రయం, ఐరోపా సమాఖ్యలో చేర్చుకొనేందుకు ప్రధాన ఆటంకాలుగా ఉన్నాయి.ఐరోపా ఆర్థిక సమాఖ్యలో చేరేందుకు 1963 సెప్టెంబరు 12న ఒక ఒప్పందం చేసుకుంది. అది మరుసటి ఏడాది డిసెంబరు ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు చెప్పినప్పటికీ సంపూర్ణం కాలేదు.అది నత్తనడక నడుస్తోంది.మొత్తం 35 నిబంధనలకు గాను ఇంతవరకు టర్కీ 15 మాత్రమే, అదీ పాక్షికంగా నెరవేర్చింది. కేవలం శాస్త్ర, పరిశోధనా రంగాలకు సంబంధించిన అంశమే సంపూర్ణంగా అమలు చేసింది. ఏదో ఒకసాకుతో ఇతర దేశాలు పూర్తి సభ్యత్వానికి అడ్డుపడుతున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం, మానవహక్కులను కాలరాస్తున్నారని విమర్శిస్తున్నాయి. తాజా పరిణామాలకు వస్తే 2016లో ఎర్డోవాన్ను పదవి నుంచి దించేందుకు ఒక విఫల కుట్ర జరిగింది. తరువాత తన పదవిని సురక్షితం కావించుకొనేందుకు చేసిన రాజ్యాంగ సవరణలతో మానవహక్కులు, చట్టపరమైన ఆటంకాలను కల్పిస్తున్నట్లు వాటిని తొలగించి నిబంధనలన్నింటినీ పూర్తి చేస్తేనే చేర్చుకుంటామని సమాఖ్య చెబుతోంది. వీటి కంటే పుతిన్‌తో స్నేహం, ఇతర అంశాలు ప్రధానంగా పని చేస్తున్నాయని చెప్పవచ్చు. సిరియాలో పశ్చిమ దేశాలు మద్దతు ఇస్తున్న కిరాయి మూకలు, ఉగ్రవాదులను అణచేందుకు రష్యా తోడ్పడుతున్నది, దానికి టర్కీ మద్దతు ఇస్తున్నది. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని సృష్టించింది, దాన్ని కొనసాగించాలని చూస్తున్నది పశ్చిమ దేశాలు కాగా తాను మధ్యవర్తిగా ఉంటానని టర్కీ ముందుకు రావటం వాటికి సుతరామూ ఇష్టం లేదు. టర్కీకి అవసరమైన మిలిటరీ పరికరాలను నాటో, అమెరికా నుంచి కొనుగోలుకు వీల్లేకుండా ఆంక్షలు విధించారు. సిరియా నుంచి ఐరోపాకు వచ్చే 40లక్షల మంది కాందిశీకులను రాకుండా చేసినందుకు ఇప్పటి వరకు ఐరోపా సమాఖ్య బిలియన్లమేర యూరోలను అందచేసింది. మరో ఆరు బిలియన్లను అందచేసేందుకు కుదిరిన ఒప్పందాన్ని టర్కీ నిలిపివేసింది. ఐరోపా సమాఖ్య తల మీద తుపాకి గురిపెట్టినట్లుగా తమ షరతులను అంగీకరించకపోతే ఇతర ఐరోపా దేశాలకు కాందిశీకుల వరద పారిస్తామని టర్కీ బెదిరిస్తున్నది.


ఎర్డోవాన్‌ పెట్టిన మెలికను ఐరోపా కమిషన్‌ తిరస్కరించింది. స్వీడన్‌ నాటోలో, టర్కీ ఐరోపా సమాఖ్యలో చేరటం రెండూ వేర్వేరని, సమాంతరంగా జరుగుతున్న పరిణామాలు గనుక ఒకదానికి మరొకదాన్ని పోటీ పెట్టరాదని ప్రతినిధి దానా సిపినాంట్‌ స్పష్టం చేసింది. జర్మన్‌ ఛాన్సలర్‌ షుల్జ్‌ కూడా ఆ వైఖరిని బలపరిచాడు. టర్కీ కోర్కెను తాను సమర్ధిస్తున్నట్లు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ చెప్పాడు. స్వీడన్‌ చేరికను టర్కీ బలపరుస్తుందని కూడా అన్నాడు. ఎర్డోవాన్‌ మెలిక పెట్టినప్పటికీ ఇప్పటికీ ఆమోదించే అవకాశం ఉందనే ఆశాభావం వెల్లడించాడు. విస్తరణకు సంబంధించి 2022 నివేదికలో సమాఖ్య పేర్కొన్న అంశాలు టర్కీ చేరిక అంత తేలిక కాదని స్పష్టం చేస్తున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నదని, చట్టబద్దపాలన, ప్రాధమికహక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థల గురించి తీవ్ర ఆందోళన వెల్లడించింది.


గ్రీసును బెదిరించకుండా ఉండేట్లైతే, నాటోలో స్వీడన్‌ చేరికను ఆమోదిస్తే తాము టర్కీకి ఎఫ్‌ 16 విమానాలను విక్రయించేందుకు సిద్దమే అని అమెరికా గతంలో సందేశం పంపింది. విలినస్‌కు బయలు దేరిన జో బైడెన్‌ ఆదివారం నాడు విమానం నుంచే ఎర్డోవాన్‌తో గంటసేపు సంభాషించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని అమెరికా అధికారవర్గాలు చెప్పినట్లు వార్తలు. గ్రీసు పట్ల శతృత్వం, రష్యానుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు టర్కీ నిర్ణయించిననందున ఎఫ్‌ 16 విమానాలను విక్రయించకూడదని గతంలో అమెరికా నిర్ణయించింది. ఇప్పుడు ఒక అడుగు దిగివచ్చినట్లు కనిపిస్తోంది. స్వీడన్‌ చేరికకు మద్దతు ఇస్తే టర్కీకి విమానాలు విక్రయించేందుకు అమెరికా పార్లమెంటు ఆమోదించవచ్చని వార్తలు వచ్చాయి. వాటిని తమకు వ్యతిరేకంగా వినియోగించరాదని గ్రీసు డిమాండ్‌ చేస్తోంది. ఏజియన్‌ సముద్ర జలాల్లో నౌకా సంచార హక్కుల గురించి వివాదం ఉంది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ రోజూ తమ దీవుల మీదుగా విమానాలు ఎగురుతున్నట్లు గ్రీసు చెబుతున్నది. ఆ దీవుల మీదుగా ఎఫ్‌16 విమానాలను అనుమతించకూడదని ఆరుగురు అమెరికన్‌ ఎంపీలు తమ విదేశాంగ మంత్రికి లేఖలు రాశారు. విలినస్‌ సమావేశాల్లో జరిగిన పరిణామాల్లో వాటిని సరఫరా చేసేందుకు అమెరికా మార్గం సుగమం చేసినట్లు, దీంతో పుతిన్‌కు దూరం జరిగి టర్కీ పశ్చిమ దేశాలకు దగ్గరైనట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. మంగళవారం నాడు అమెరికా భద్రతా సలహాదారు సులివాన్‌ మాట్లాడుతూ స్వీడన్‌కు టర్కీ పచ్చజెండా ఊపినందున 2021లో కుదిరిన ఒప్పందం మేరకు లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ నుంచి 20బిలియన్‌ డాలర్ల విలువ గల కొత్త ఎఫ్‌ 16 విమానాలతో పాటు ఇప్పటికే టర్కీ దగ్గర ఉన్న 80పాత వాటిని నవీకరించేందుకు ముందుకు వెళ్లనున్నట్లు చెప్పాడు.


విలినస్‌ నాటో వార్షిక సమావేశాల్లో ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధ సాయం గురించి తప్ప నాటోలో ప్రవేశం మీద ఎలాంటి నిర్ణయమూ తీసుకొనే అవకాశం లేదు. అక్కడ పోరు ముగిసిన తరువాతే దాన్ని గురించి పరిశీలిస్తామని జో బైడెన్‌ సిఎన్‌ఎన్‌ టీవీతో చెప్పాడు. నాటో కుటుంబంలో ఉక్రెయిన్ను చేర్చుకోవాలా వద్దా అనే అంశం మీద సభ్యదేశాల్లో ఏకీభావం లేదని కూడా అన్నాడు.ఇప్పుడు గనుక చేర్చుకుంటే మేమంతా యుద్ధంలో ఉన్నట్లే అవుతుంది. ఇప్పుడే ఓటింగ్‌ జరపాలనటం అపరిపక్వత అవుతుంది, ఒక దేశాన్ని చేర్చుకోవాలంటే ప్రజాస్వామీకరణతో సహా కొన్ని అర్హతలు ఉండాలి అని కూడా బైడెన్‌ చెప్పాడు. జర్మనీ కూడా అమెరికా వైఖరితో ఏకీభవిస్తోంది. నాటో నిబంధన ఐదును పరీక్షించే అవకాశం పుతిన్‌కు ఇవ్వకూడదని జర్మనీ కోరుకొంటోందని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్‌కు తక్షణమే నాటో సభ్యత్వం అన్న చర్చ అసంగతం, దానికి చేస్తున్న మంచిని మరచి దీని గురించి చర్చను అనుమతించటం విచారకరం.ఎవరూ ఇప్పటికిప్పుడు నాటోలో చేరాలని గట్టిగా చెప్పటం లేదు, దానికి తగిన మార్గం గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఎలా సాయం చేయాలా అని ఆలోచిస్తున్నాం. దీని గురించి గాక సభ్యత్వం గురించి చర్చ పెట్టటం అంటే సమావేశాన్ని పక్కదారి పట్టించటమే, పశ్చిమ దేశాల్లో విబేధాలు ఉన్నట్లు అని చెప్పటమే, దీన్ని రష్యా స్వాగతిస్తుందని నాటో అధికారులు చెప్పినట్లు మీడియా పేర్కొన్నది.


తమను వెంటనో నాటోలో చేర్చుకోవాలని, ఆధునిక అస్త్రాలను పెద్ద ఎత్తున సరఫరా చేయాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేస్తున్నది. అదే గనుక జరిగితే ఉక్రెయిన్‌ సంక్షోభ స్వభావమే మారిపోతుంది. పుతిన్‌ మీద నేరుగా ఆ కూటమి సేనలు యుద్ధానికి దిగవచ్చు. రష్యా దాడులకు దిగకముందుఉన్న పరిస్థితి వేరు, తరువాత తమ ప్రాంతాలను ఆక్రమించుకున్నందున నాటో సభ్వత్వం ఇవ్వాలని గతేడాది సెప్టెంబరులో జెలెనెస్కీ దరఖాస్తు చేశాడు. అనేక దేశాలు అందుకు మద్దతు తెలిపినా అమెరికా, జర్మనీ సిద్దం కాలేదు. కొన్ని ప్రాంతాలు ఉక్రెయిన్నుంచి వేరుపడి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. క్రిమియా ద్వీపం తమదే అంటూ 2014లోనే రష్యా స్వాధీనం చేసుకుంది. మరికొన్ని ప్రాంతాలు ఇప్పుడు దాని ఆధీనంలో ఉన్నాయి, అటువంటపుడు మధ్యలో సభ్యత్వం ఇవ్వటం, గతం నుంచి వర్తింప చేసి ఎదురుదాడులకు పూనుకోవటం నాటో ఐదవ ఆర్టికల్‌ నిబంధన పరిధిలోకి రాదని చెబుతున్నారు. దాన్ని సవరించి నాటోలో చేర్చుకొని రష్యాతో నేరుగా తలపడేందుకు నాటో కూటమి ప్రస్తుతం సిద్దంగా లేదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడు సావర్కర్‌ బ్రిటీష్‌ వారికి లొంగుబాటు – నేడు అమెరికన్ల మీద నరేంద్రమోడీ మౌనమెందుకు ?

11 Tuesday Jul 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, USA

≈ Leave a comment

Tags

BJP, Manipur unrest, Meitei and Kuki, Narendra Modi Failures, Narendra Modi's silence on Manipur, RSS


ఎం కోటేశ్వరరావు


ఏదైనా ఉంటే మన దేశంలో విమర్శించుకోవాలి, దెబ్బలాడుకోవాలి, విదేశీ గడ్డ మీద పరువు తీసుకుంటామా, ఎవరైనా మన దేశాన్ని ఏమైనా అంటే రాజకీయ విబేధాలతో నిమిత్తం లేకుండా అందరం ఒకటై ఖండించాలి.రాహుల్‌ గాంధీ విదేశాల్లో నరేంద్రమోడీ సర్కార్‌ మీద చేసిన విమర్శల సందర్భంగా కాషాయ మార్కు దేశభక్తి ప్రబోధకులు చెప్పిన అంశాల సారమది. నిజమే కదా అంటే నిజమే అని అనేక మంది అనుకుంటున్నారు. కాశ్మీరు వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాని నరేంద్రమోడీ తనను కోరినట్లు నాలుగు సంవత్సరాలనాడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నపుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను ఖండించేందుకు నరేంద్రమోడీకి నోరు రాలేదు. అలాంటిదేమీ లేదని మన విదేశీ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. కరోనా వైరస్‌ చికిత్సకు పనికి వస్తుందో లేదో నిర్ధారణగాని మలేరియా నిరోధక హైడ్రోక్సీక్లోరోక్విన్‌ ఔషధాన్ని తక్షణమే తమకు పంపకపోతే డొక్క చించుతామని అదే ట్రంప్‌ మన దేశాన్ని 2020 ఏప్రిల్లో బెదిరించాడు. కొద్ది గంటల్లోనే మన దేశం అంతకు ముందు ఎగుమతులపై విధించిన నిషేధాన్ని సడలించి గుజరాత్‌లోని మూడు ఫ్యాక్టరీల నుంచి అడిగినంతా పంపింది. దాంతో మోడీ గొప్ప అంటూ ఆకాశానికి ఎత్తాడు ట్రంప్‌.మనది ఒక సర్వసత్తాక దేశం. ఒక దేశాధినేతతో మరొకదేశం అనుసరించాల్సిన కనీస మర్యాదను పాటించకున్నా నరేంద్రమోడీ నోరు మెదపలేదు. మన ఇరుగు పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్‌ అడిగినా వెంటనే స్పందించని మోడీ అమెరికా బెదిరింపుతో వెంటనే పంపారు. ఇవి గతానికి చెందినవి. ఒక సినిమాలో నీ ఊరు వస్తా నీ ఇంటి కొస్తా అన్నట్లుగా మన గడ్డమీద ఉండి ఒక విదేశీయుడు మన అంతర్గత అంశం గురించి మాట్లాడినా రాహుల్‌ గాంధీ గురించి రచ్చ చేసిన వారు నోటికి తాళం వేసుకున్న తాజా ఉదంతాన్ని చూద్దాం.


ఎరిక్‌ గార్సెటీ అనే పెద్ద మనిషి మన దేశంలో అమెరికా రాయబారి. భారత్‌ కోరితే మణిపూర్‌ మంటలను ఆర్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పాడు. అది మన అంతర్గత అంశం, మరొకరు ఎవరూ జోక్యం చేసుకోకూడదు. కానీ గార్సెటీ వేలుదూర్చాడు. కొల్‌కతాలో జూలై ఆరవ తేదీన విలేకర్ల మాట్లాడుతూ ” మణిపూర్‌లో జరుగుతున్న హింస వ్యూహాత్మక సంబంధమైనది కాదని నేను అనుకుంటున్నాను. ఇది మానవ సంబంధమైనది. ఇలాంటి హింసలో పిల్లలు లేదా ఇతరులు మరణిస్తున్నపుడు ఒక భారతీయుడిగా మీరు రక్షించేందుకు చూడరా. అనేక మంచి పరిణామాలు జరగాలంటే ముందు శాంతి నెలకొనాలని మనకు తెలుసు. ఈశాన్యం, తూర్పు భారతాల్లో ఎంతో పురోగతి ఉంది. కోరితే ఏ విధంగానైనా సాయపడేందుకు మేము సిద్దంగా ఉన్నాం. ఇది భారత్‌కు చెందిన అంశమని మాకు తెలుసు, అక్కడ తక్షణమే శాంతి నెలకానాలని మేము ప్రార్ధిస్తాము. ఆ శాంతి నెలకొంటే మేము మరింత భాగస్వామ్యం, మరిన్ని ప్రాజెక్టులు, మరింత పెట్టుబడి తెస్తాము ” అన్నాడు. ఏ విధంగా చూసినప్పటికీ ఏ విదేశీ రాయబారి నోటి వెంటా ఇలాంటి మాటలు రాకూడదు. మరొక దేశమైతే తక్షణమే అతగాడిని పిలిపించి హద్దుల్లో ఉండాలని మందలించి పంపేది. ఎవరికీ తలొగ్గం అని చెబుతున్న మన విదేశంగా శాఖ మంత్రికి, అధికారగణానికి ఇదేమీ పట్టలేదు. ఎందుకంటే అది అపర దేశభక్త ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టం ఉండదు అని వారికి తెలుసు. ఆఫ్రో-అమెరికన్ల మీద జరిగే దాడుల గురించి లోకానికంతటికీ తెలుసు.ఏ రోజు ఎవడు తుపాకులు తీసుకొని ఉత్తి పుణ్యానికి ఎంతమందిని కాల్చి చంపుతాడో తెలియదు. అలాంటి వాటి నివారణలో సహకరిస్తామని మనదేశంతో సహా ఎవరైనా ప్రకటిస్తే అమెరికా ఊరుకుంటుందా ? ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు మన దేశమే అని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ దీని గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. విశ్వగురువులు లేదా బాస్‌లు ఇలాంటి చిన్న చిన్న అంశాల మీద మాట్లాడరని అనుకోవాలి, అంతే ! నాడు జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటీషు వారికి సేవ చేసుకుంటానని , స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనను అని రాసిచ్చిన సావర్కర్‌ తరువాత దానికి కట్టుబడి ఉన్న అపర దేశభక్తుడు. ఇప్పుడు నరేంద్రమోడీ గారు కూడా అమెరికాకు ఖాళీ కాగితం మీద సంతకాలు చేసి ఇచ్చారా ? ఏమిటీ మౌనం, ఎందుకీ బలహీనత, రాయబారిని మందలిస్తే అమెరికాకు ఆగ్రహం వస్తుందని భయపడుతున్నారా ? ప్రపంచంలోనే చక్రం తిప్పుతున్నారని మురిసిపోతున్న భక్తులేం అవుతారో అన్నది ఆలోచించాలి కదా !


చిత్రం ఏమిటంటే రాహుల్‌ గాంధీ విదేశాల్లో మన కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్రమోడీని విమర్శిస్తే అది దేశద్రోహం. కానీ అమెరికా రాయబారి మన గడ్డ మీద మణిపూర్‌ మంటలను మీరు ఆర్పలేకపోయారు, మీరు కోరితే ఆర్పటంలో సాయం చేస్తామని చెప్పటం కంటే మన కేంద్ర ప్రభుత్వానికి అవమానం మరొకటి ఉండదు. అయినప్పటికీ దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉంది. అరిందమ్‌ బాగ్చీ అని మన విదేశాంగశాఖ ప్రతినిధి ఉన్నారు. దాదాపు రోజూ ఏదో ఒక అంశం మీద విలేకర్లతో మాట్లాడుతూ ఉంటారు. ఎరిక్‌ గార్సెటీ మాట్లాడిన అంశాల గురించి తనకు తెలియదని అన్నారు. అంతటితో ఊరుకుంటే వేరు. విదేశీ దౌత్యవేత్తలు మన అంతర్గత అంశాల గురించి మాట్లాడటం అసాధారణం. అతను ఏం మాట్లాడిందీ కచ్చితంగా తెలుసుకొనేంతవరకు తానేమీ వ్యాఖ్యానించలేనని కూడా అరిందమ్‌ చెప్పారు. మణిపూర్‌లో శాంతికోసం భారత ప్రభుత్వం, భద్రతాదళాలు పని చేస్తున్నట్లు చెప్పారు. పదకొండవ తేదీ వరకు విదేశాంగ ప్రతినిధి నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఏ మాట్లాడిందీ ముఖతా తెలుసుకొనేందుకు అమెరికా రాయబారిని పిలిచారన్న వార్తలు కూడా లేవు. నాకు సరిగ్గా తెలియదు అని చెప్పటం అరిందమ్‌ బాగ్చీకి కొత్తకాదు. భారత్‌ తమ వ్యూహాత్మక భాగస్వామి అని ప్రకటనలు గుప్పించటంలో అమెరికా గద్దె మీద ఎవరున్నా తక్కువ తినలేదు. ఇరవైనెలల పాటు ఖాళీగా ఉన్న తరువాత ఎరిక్‌ గార్సెటీని మన దేశంలో రాయబారిగా జో బైడెన్‌ ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆ మేరకు అమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపింది.


పౌరసత్వ చట్ట సవరణ గురించి, భారత్‌లో మానవహక్కుల గురించి గార్సెటీ గతంలో విమర్శలు చేశాడు.రాయబారిగా ఖరారు చేసిన తరువాత వాటి గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా ? ఇటీవల అతను ఏం మాట్లాడాడో తెలియదు, సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఉన్నాయి, అవి చాలా పాతవి, వాటి మీద మన వైఖరి ఏమిటో మీకు బాగా తెలిసిందే అన్నారు. ” తప్పుడు అభిప్రాయాలతో మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొనేందుకు రాజకీయ అజెండాతో అతన్ని పంపుతున్నారు. అతనికేమీ తెలియదు, అహంకారి, అతన్ని ఆమోదించకూడదు ” అని బిజెపి మాజీ ఎంపీ తరుణ్‌ విజయి ట్వీట్‌ చేశారు. అతని నియామకం పశ్చిమ దేశాల వ్యతిరేక మనోభావాలను రగిలిస్తుందని బిజెపి యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్‌ ప్రకాష్‌ అన్నారు.


కేరళలో కమ్యూనిస్టులంటే గిట్టని సత్యదీపం అనే పత్రిక ప్రధాని నరేంద్రమోడీకి ఉక్రెయిన్‌ పోరు గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడటానికి సమయం ఉంటుంది గానీ మణిపూర్‌ గురించి మాత్రం పట్టదు అని విమర్శించింది.మోడీగారు మన్‌కీ బాత్‌లో అడవుల్లో పెరిగే గడ్డి గురించి కూడా మాట్లాడుతారు గానీ మణిపూర్‌లో ఇబ్బందులు పడుతున్నవారి గురించి పట్టించుకోరు. ఈశాన్య రాష్ట్రాలలో 30సార్లకు పైగా పర్యటించి ఉంటారు. మణిపూర్‌కు మాత్రం కావాలనే వెళ్లటం లేదు అని సంపాదకీయంలో పేర్కొన్నది.ఈ పత్రికను అంగామలీ సిరో-మలబార్‌ చర్చ్‌ నడుపుతుంది. ఆ పత్రిక చర్చి నేతలను కూడా వదల్లేదు. తొలి రోజుల్లో మణిపూర్‌ హింసాకాండను చర్చి నేతలు విస్మరించారన్నది నిజం. ప్రకటనలు చేయటం తప్ప వారు ఇప్పటికీ హింసాకాండ జరిగిన ప్రాంతాలను సందర్శించేందుకు లేదా రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్దంగా లేరు, కనీసం ఢిల్లీలో పత్రికా విలేకర్ల సమావేశం పెట్టే ప్రయత్నం కూడా లేదు అని పేర్కొన్నది. మండుతున్న మణిపూర్‌ గురించి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన తరువాత కూడా ప్రధాని మోడీలో చలనం లేదు. ఎవరేమనుకుంటే నాకేం అన్నట్లుగా ఉన్నారు. ఇంత హింసాకాండ, రచ్చకు కారణం మణిపూర్‌లో మెజారిటీగా ఉన్న మెయితీ తెగవారిని షెడ్యూలు కులాల జాబితాలో చేర్చాలని సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించటమే. అలాంటి అధికారం హైకోర్టుకు లేదని సుప్రీం కోర్టు చెప్పిన తరువాత కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరులను వెల్లడించలేదు.

జనాభాలో హిందువులైన మెయితీలు 53శాతం ఉండగా, క్రైస్తవులుగా ఉన్న గిరిజనులు 40శాతం. అరవై మంది ఉన్న అసెంబ్లీలో నలభైమంది మెయితీలు ఉన్నారు. వారు బిజెపి ఓటు బాంకుగా ఉన్నారు. జరుగుతున్న హింసాకాండలో మెయితీలకు పోలీసులే ఆయుధాలు ఇచ్చారని, పోలీస్‌ స్టేషన్ల నుంచి అపహరించినట్లు కేసులు నమోదు చేశారని వార్తలు వచ్చాయి. హింసాకాండ ప్రారంభమైన 70 రోజుల నుంచి ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఎవరి మీద ఎవరికీ విశ్వాసం లేదు.1960లో తెచ్చిన భూ సంస్కరణల చట్ట ప్రకారం కొండ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూమి కొనుగోలు చేసేందుకు, అమ్మేందుకు అవకాశం లేదు. ఆ భూముల మీద కన్నేసిన మెయితీలు తమను గిరిజనులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నారు.ఆర్టికల్‌ 371సి ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. మణిపూర్‌లో హింసాకాండ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం తమాషా చూస్తున్నది.రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలూ లేవు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఓటుబాంకు దెబ్బతింటుంది, మౌనంగా ఉంటే ఏ రోజు ఏం జరుగుతుందో, ఎందరి ప్రాణాలు పోతాయో తెలియదు. అయినా ప్రధానికి పట్టదు. విస్తారమైన భూమిని ఏదో ఒక పద్దతిలో స్వంతం చేసుకోవాలని ఈ సామాజిక తరగతి చూస్తున్నదనే ఆరోపణ ఉంది. అందుకు గాను అక్రమంగా పక్కనే ఉన్న మయన్మార్‌ నుంచి అక్రమంగా గిరిజనుల వలసలను ప్రోత్సహిస్తున్నట్లు ఆ తరగతి ఆరోపిస్తోంది. అక్రమవలసలన్నది ఒక సాకు మాత్రమే అని గిరిజనులు అంటున్నారు. వాస్తవాలను వివరించి రెండు సామాజిక తరగతుల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించటంలో గతంలో ఉన్న ప్రభుత్వాలతో పాటు వర్తమాన బిజెపి కూడా విఫలమైంది, మతం పేరుతో ఓటు బాంకు ఏర్పాటుకు పూనుకుంది. తాజా పరిణామాలో మణిపూర్‌లో తిరిగి ఉగ్రవాదం తలెత్తితే బిజెపిదే బాధ్యత అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ చిప్స్‌ యాపారం మేకింగ్‌ కాదు పాకింగ్‌ : రు. 30పెట్టుబడికి 70 సబ్సిడీ, ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా !

07 Friday Jul 2023

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, India’s Micron deal, Joe Biden, Micron, Narendra Modi Failures, Semiconductor


ఎం కోటేశ్వరరావు


2024 డిసెంబరు నాటికి మేడిన్‌ ఇండియా తొలి చిప్‌ మార్కెట్‌కు వస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా వెళ్లినపుడు ఈ మేరకు మైక్రాన్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, గుజరాత్‌లోని సనంద్‌ వద్ద దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఫాక్స్‌కాన్‌-వేదాంత సంయుక్త భాగస్వామ్యంలో మరో కంపెనీ కూడా దరఖాస్తు చేయనుందని చెప్పారు. జనాలు నిజమే అని ఆహౌ ఓహౌ నరేంద్రమోడీ మంత్రదండం మహిమ ఏమిటో చూడండి, ఇలా ఒప్పందం చేసుకున్నారో లేదా అలా ఉత్పత్తి వచ్చేస్తోంది, ఇదే ఊపుతో త్వరలో చైనాను వెనక్కు నెట్టేస్తాం అన్నట్లుగా స్పందించారు. ఆకలితో ఆవురావురు మంటూ ఎదురు చూస్తున్న అన్నం కనిపిస్తే చాలు కడుపు నిండుతుంది అన్నట్లుగా ఈ వార్త సంతోషం కలిగిస్తుంది, ఆనందాన్ని తెస్తుంది. దీని వెనుక ఉన్న కథ తెలిస్తే వామ్మో గుజరాత్‌ మోడల్‌ ఇలా ఉంటుందా అని గుండెలు బాదుకుంటారు.ఇక్కడ ఒక ప్రశ్న అడిగితే దేశభక్తిని ప్రశ్నిస్తారేమో ? ఫాక్స్‌కాన్‌ – వేదాంత సంస్థ కలసి గుజరాత్‌లో లక్ష మందికి ఉపాధి కల్పించేందుకు 19.5 బిలియన్‌ డాలర్లతో(రు.లక్షా 60వేల కోట్లు ) ఒక చిప్స్‌ ఫ్యాక్టరీని పెడుతున్నట్లు 2022 సెప్టెంబరులో ప్రకటించారు. అది ఇంతవరకు ఏమైందో ఎక్కడుందో చెప్పరు.కొత్తగా పద్దెనిమిది నెలల్లోనే ఐదువేల మందికి పని చూపే మైక్రాన్‌ ఉత్పత్తి మార్కెట్‌కు వస్తుందని చెబుతున్నారు. మోడీ గారు చెప్పింది వినాలి తప్ప అడిగితే మామూలుగా ఉండదు. ప్రశ్న అడిగిన అమెరికా జర్నలిస్టును ఎలా వేధిస్తున్నారో చూస్తున్నాంగా !


మైక్రాన్‌ కంపెనీ పెట్టుబడి 270 కోట్ల డాలర్లు( మన రూపాయల్లో 22,350 కోట్లు) అని చెప్పారు. దీనిలో అది నిజంగా పెట్టే మొత్తం రు.6,830 కోట్లు. మరి మిగతాది ! కేంద్ర ప్రభుత్వం పదకొండువేల కోట్లు ( 50శాతం) , రాష్ట్ర ప్రభుత్వం భూమి, ఇతర రూపాల్లో మరో ఇరవైశాతం సబ్సిడీ ఇస్తుందట. కంపెనీ పెట్టేది కేవలం 30శాతం మాత్రమే.అంటే రు.30 పెట్టుబడి పెట్టిన మైక్రాన్‌ కంపెనీని రు.వందకు స్వంతదారును చేస్తారు.ప్రతి పైసాను కాపాడేందుకు చౌకీదారును అని చెప్పుకున్న మోడీ ఏలుబడిలో తప్ప ఎక్కడైనా ఇలా జరుగుతుందా ? చైనాలో గిట్టుబాటు కావటం లేదని కొన్ని కంపెనీలు ఇతర దేశాల్లో సబ్సిడీలను చూసి అక్కడ నుంచి వెళుతున్నట్లు చెబుతున్నారు. అలాగే మరొక దేశం ఏదైనా ఇంతకంటే ఎక్కువ సబ్సిడీలు ఇస్తామంటే మైక్రాన్‌ కంపెనీ సరకు, సరంజామా మొత్తాన్ని అక్కడికి తరలిస్తే…..2020లో జనరల్‌ మోటార్స్‌ కంపెనీ వెళ్లిపోయినట్లే జరగవచ్చు. అది తీసుకున్న సబ్సిడీ పైసా తిరిగి ఇవ్వదు. అయినా 70శాతం సబ్సిడీ ఇస్తామంటే ఎవరైనా మన దేశానికి రాకుండా ఉంటారా ? అవసరం తీరింతరువాత వెళ్లిపోకుండా ఉంటారా ? అసలు కత వేరే. ఈ కంపెనీ మన దేశంలో చిప్స్‌(సెమీకండక్టర్లు) తయారు చేయదు. ఎక్కడో డిజైన్‌ చేసి మరెక్కడో ఉత్పత్తి చేసిన విడిభాగాలను మన దేశానికి తీసుకువచ్చి వాటి రూపకల్పన ప్రకారం ఒకదగ్గర అమర్చి(ఫాబ్రికేషన్‌), సరిగా ఉన్నాయా లేదా అని పరీక్ష చేసి అట్టపెట్టెల్లో పెట్టి ఎక్కడి కావాలంటే అక్కడికి పంపుతారు. చెప్పేది మేడిన్‌ లేదా మేకిన్‌ ఇండియా జరిగేది, పాకింగ్‌ ఇండియా. అదైనా గొప్పేకదా కొంత మందికి ఉపాధి దొరుకుతుంది కదా అని చెప్పేవారిని మేకింగుకు పాకింగు తేడా తెలుసుకోవాలని చెప్పటం తప్ప చేసేదేమీ లేదు.


మేకిన్‌, మేడిన్‌ ఇండియా పిలుపులు విఫలమైనందున కేంద్ర ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల రూపాయలను పక్కన పెట్టింది. మైక్రాన్‌ సంస్థ మన దేశంలో ఉత్పాదక కంపెనీ కాదు, కానీ దీనికి ఆ సొమ్మును ఇవ్వనుంది. ఇంత వాటంగా ఉంది కనుకనే అమెరికా పాలకులు అక్కడి కంపెనీలను మన దేశంలో పాకింగ్‌ యూనిట్లు పెట్టి ఎంత వీలైతే అంత సొమ్ము చేసుకోమని చెబుతున్నారు. చైనా బాటలో నడచి దేశాన్ని వృద్ది చేస్తామని, దాన్ని వెనక్కు నెడతామని మన పాలకులు చెప్పారు. చైనా కూడా పెట్టుబడులు పెట్టిన వారికి సబ్సిడీలు ఇచ్చింది, ఇలా పాకింగ్‌ రాయితీలు కాదు, ఉత్పత్తి చేసి తన జనానికి పని కల్పించి ఎగుమతులు చేసింది. అమెరికాను మించి జిడిపిలో ముందుకు పోనుంది. సెమికండక్టర్‌ రంగంలో స్వంతంగా ఉత్పత్తికి పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది తప్ప ఇతర దేశాలకు లొంగి వాటి షరతులను, పాకింగ్‌లకు అంగీకరించటం లేదు. గతంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైన చిప్స్‌లో 90శాతం దిగుమతి చేసుకొనేది. ప్రస్తుతం నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ 1,000 రకాల చిప్స్‌ను చైనా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వరంగ కార్ల సంస్థ నిర్ణయించింది. ఆధునిక రకాల రూపకల్పనకు యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోతున్నది.


చైనాతో మైక్రాన్‌ కంపెనీకి ఎక్కడ చెడింది ? ప్రతి దేశం తన భద్రతను తాను చూసుకుంటుంది. అమెరికాలో ఉత్పత్తి అవుతున్న చిప్స్‌ను ఏ దేశంలోనైనా వినియోగిస్తే ఆ దేశానికి లేదా ఉత్పత్తికి సంబంధించిన సమాచారం, రహస్యాలను సేకరించే అవకాశం ఉంది. తన టెలికాం పరికరాల ద్వారా చైనా ఆ పని చేస్తున్నదంటూ అమెరికా, మన దేశం అనేక యాప్స్‌ను నిషేధించించిన అంశం తెలిసిందే. అలాంటి పరీక్షలో మైక్రాన్‌ సంస్థ తన ఉత్పత్తుల్లో అలాంటి దొంగ చెవులు, కళ్లేమీ లేవని నిరూపించుకోలేపోయింది కనుక చైనా తమ మార్కెట్లో వాటి కొనుగోళ్ల మీద ఆంక్షలు ప్రకటించింది. భద్రతా పరీక్షలేమీ లేకుండా వాటిని మన మార్కెట్లో అమ్ముకొనేందుకు, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరించింది. అమెరికా మీద అంతనమ్మకం ఉంచటం ప్రమాదకరం. సెమికండక్టర్ల పరిశ్రమలు పెడితే సబ్సిడీలు ఇచ్చేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల మేరకు నిధులు పక్కన పెడుతున్నట్లు చెప్పింది. ఆ మొత్తాన్ని స్వంతం చేసుకోవాలని అనేక మంది రంగంలోకి వచ్చారు.వాటిలో ఫాక్స్‌కాన్‌-వేదాంత ఒకటి. వీటి దగ్గర డబ్బు ఉంది తప్ప చిప్స్‌ ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవమూ లేదు. రెండూ కలసి ఐరోపాకు చెందిన ఎస్‌టిఎం మైక్రోటెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదించాయి. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పెట్టుబడితో సహా అనేక షరతులను ఎస్‌టిఎం ముందుకు తెచ్చింది. ఐదు-పది సంవత్సరాల తరువాత తాము తప్పుకుంటామని చెప్పగా వేదాంత-ఫాక్స్‌కాన్‌ దీర్ఘకాలం ఉండాలని డిమాండ్‌ చేసినట్లు వార్తలు. వీరి పెట్టుబడి రు.66 వేల కోట్లు కాగా దీనికి కూడా కేంద్రం రు.76వేల కోట్లు సబ్సిడీ ఇస్తామన్నది, గుజరాత్‌ కూడా గణనీయంగా రాయితీలు ఇచ్చేందుకు సిద్దపడినా ముందుకు సాగటం లేదు. ఇది కూడా 30కి 70 సబ్సిడీగానే ఉంటుంది. కర్ణాటకలో పరువు పోయింది. దేశంలో ఆర్థిక స్థితి సజావుగా లేదు. ఐదు రాష్ట్రాలు, తరువాత లోక్‌ సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కనుక పాకింగ్‌ను కూడా మేకింగ్‌గా ఎన్నికల ముందు ప్రచారం చేసుకోవచ్చని మైక్రాన్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది.దేశ ప్రజలందరి సొమ్మును మోడీ సర్కార్‌ గుజరాత్‌కే సబ్సిడీగా ఖర్చు చేసేందుకు పూనుకోవటం మరొక అంశం. ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలకూ లేదు, మోడీకి అణగిమణగి ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, తెలంగాణా వంటి రాష్ట్రాలకూ ఒక్క ప్రాజెక్టూ రావటం లేదు. గుజరాత్‌కు ఇస్తున్న మాదిరి కేంద్రం సబ్సిడీ ఇస్తే ఏ రాష్ట్రంలోనైనా వాటిని పెట్టవచ్చు. మోడీ అంటే గుజరాత్‌ ప్రధాని అనుకుంటున్నారు గనుక అది జరగదన్నది తెలిసిందే.


నరేంద్రమోడీ సర్కార్‌ గత తొమ్మిదేండ్లలో చేసిన అప్పు గురించి ఎవరైనా అడిగితే కరోనా కాలంలో చేసిన సాయం, ఉకితంగా వాక్సిన్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఎదురు ప్రశ్నిస్తారు. అవి నిన్నగాక మొన్న, 2014 నుంచి చేసిన అప్పులు, చమురు మీద విధించిన భారీ సెస్సుల మొత్తం గురించి మాట్లాడరు. మోడీ చేసిన అప్పుకు గబ్బర్‌సింగ్‌ టాక్సు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వచ్చిన డబ్బు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయింది ? అంటూ ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. అచ్చేదిన్‌, తనకు అధికారం ఇస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో తూర్పున పొడిచిన సూర్యుడిని పశ్చిమానికి మారుస్తాను అన్నట్లుగా జనాన్ని నమ్మించిన నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చారు. కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా కేవలం నరేంద్రమోడీ చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. దీనికి పాత అప్పును కలుపుకుంటే 169 లక్షల కోట్లు అవుతుంది. కొత్తగా ప్రభుత్వ రంగంలో ఒక్క పరిశ్రమ లేదు. తొమ్మిదేండ్లలో ఎవరితోనూ యుద్ధాలు లేవు గనుక మిలిటరీ నిర్వహణ తప్ప కొత్తగా ఆయుధాలు పెద్దగా కొన్నది లేదు. ఇంత సొమ్ము ఏం చేశారంటే కార్పొరేట్లు బాంకులకు ఎగవేసిన రుణాలను రద్దు చేసి దాని బదులు ప్రభుత్వ రంగ బాంకులకు కొంత మొత్తం సర్దుబాటు చేశారు.ఏదో ఒక పేరుతో పైన చెప్పిన సెమికండక్టర్‌ పరిశ్రమల రాయితీలు, ఇతర సబ్సిడీల పేరుతో కార్పొరేట్లకు సమర్పించుకున్నారన్నది స్పష్టం. వాటితో పోలిస్తే రైతాంగానికి, ఇతరులకు ఇచ్చిన రాయితీలు నామమాత్రం. అందుకే సొమ్ము పోయే శనీ పట్టే అన్నట్లుగా కార్పొరేట్లు సబ్సిడీలను తమ ఖాతాల్లో వేసుకున్నారు తప్ప తిరిగి పెట్టుబడిగా కూడా పెట్టలేదు. జనానికి ఉపాధిలేదు.


పాబ్రికేషన్‌, పాకింగ్‌ ద్వారా ప్రపంచ సెమికండక్టర్‌ ఉత్పత్తి కేంద్రంగా మన దేశం మారుతుందని ఎవరైనా చెప్పగలరా ? ఇలా ఏ దేశమైనా ఏ ఉత్పత్తిలోనైనా ఇలా మారిందా ?మలేషియా ఇప్పటికే ఈ రంగంలో ఎంతో ముందుంది. వేరే చోట్ల తయారైన చిప్స్‌ పరీక్ష, విడిభాగాల ఫాబ్రికేషన్‌ ప్రపంచ ఉత్పత్తిలో పదమూడుశాతం వరకు అక్కడే అక్కడ జరుగుతోంది. ఒక విధంగా ప్రపంచ హబ్‌గా ఉంది. ఆధునిక చిప్స్‌ కంపెనీలను తమ దేశంలోనే ఉంచుకొని తక్కువ రకం వాటిని ఇతర చోట్ల పరీక్షలకు అమెరికా కంపెనీలు పంపుతున్నాయి.వంద బిలియన్‌ డాలర్ల మెగా ఫాబ్రికేషన్‌ సంస్థను అమెరికా వాషింగ్టన్‌ సమీపంలోని క్లే అనే చోట ఏర్పాటు చేస్తూ 2.75బి.డాలర్ల (దానిలో 70శాతం మన సబ్సిడీ) సంస్థను గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు మైక్రాన్‌ సంస్థ పూనుకుంది. మన దేశంలో చిప్స్‌ అవసరం నానాటికీ పెరుగుతున్నది. ఎంతగా అంటే 2019లో 22.7బిలియన్‌ డాలర్లుగా ఉన్న మార్కెట్‌ 2026 నాటికి 64బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. అందువలన మన దేశం స్వంతంగా ఉత్పత్తి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. ప్రస్తుతం వివిధ రకాల సెమీకండక్టర్లు ఉన్నాయి. వాటి రూపకల్పన,తయారీ, విడిభాగాల అమరిక, పరీక్ష, ఉత్పత్తి చేసే యంత్రాలు ఇలా ఎన్నో ప్రక్రియలు ప్రస్తుతం కొన్ని దేశాల స్వంతం అంటే అతిశయోక్తి కాదు. గుత్తాధిపత్యం, మార్కెటింగ్‌ నిలుపుకొనేందుకు పెద్ద ఎత్తున పోటీపడుతున్నాయి. తైవాన్‌ ప్రాంతం, దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌, నెదర్లాండ్స్‌, చైనా, ఐరోపా సమాఖ్య, ఇజ్రాయెల్‌ ఈ రంగంలో తిరుగులేనివిగా ఉన్నాయి.


ఇతర దేశాల ఉత్పత్తులతో పోల్చితే చైనా వెనుకబడి ఉంది. ఉత్పత్తితో పాటు అవసరాలకు అది ఎక్కువగా దిగుమతుల మీదనే ఆధారపడుతోంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఎగుమతులు, ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను చైనాకు అమ్మకుండా అమెరికా, దానితో చేతులు కలిపిన దేశాలు ప్రస్తుతం చిప్స్‌ వార్‌ జరుపుతున్నాయి. చివరకు తమ పౌరులెవరూ చైనా కంపెనీల్లో పని చేయకూడదని నిషేధం విధించాయి. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఎలక్ట్రిక్‌ వాహనాలు,రక్షణ ఉత్పత్తుల వంటి వాటిలో సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన గాలియం, జెర్మీనియం వంటి లోహాల దిగుమతి, వినియోగం గురించి అమ్మకాలు జరిపే సంస్థలు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటూ పరోక్షంగా చైనా నిషేధం విధించింది. అమెరికాకు చెందిన మైక్రాన్‌ సంస్థ ఉత్పత్తులు రక్షణకు ముప్పు తెస్తాయని వాటిని నిషేధించింది. ఈ పోరు ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించటం లేదు. గతంలో అనేక రంగాల్లో చైనాను ఇబ్బంది పెట్టేందుకు చూస్తే వాటిని సవాలుగా తీసుకొని తనదైన ప్రత్యేకతను నిరూపించుకుంది. ఇప్పుడూ అదే బాటలో ఉంది. మన దేశం మాదిరి పాకింగ్‌తో సంతృప్తి చెందకుండా మేకింగ్‌తో ముందుకు పోతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోలీసు దురాగతం : రెండో వారంలోకి ఫ్రెంచి నిరసనలు !

05 Wednesday Jul 2023

Posted by raomk in Africa, Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

emmanuel macron, French protests, Nahel Merzouk, Riots in France


ఎం కోటేశ్వరరావు


అల్జీరియా-మొరాకో సంతతికి చెందిన 17 సంవత్సరాల నహేల్‌ అనే కుర్రవాడు ట్రాఫిక్‌ సిగల్‌ నిబంధనలను ఉల్లంఘించాడంటూ పోలీసులు గుండెల మీద కాల్చి చంపిన దురంతం ప్రస్తుతం ఫ్రాన్స్‌ను ఊపివేస్తున్నది. జూన్‌ 27న పారిస్‌ శివార్లలోని నాన్‌తెరేలో ఈ దారుణం జరిగింది. ఇరవై తొమ్మిదవ తేదీన అంత్యక్రియల సందర్భంగా దేశమంతటా ఆగ్రహించినవారి తీవ్ర నిరసనలు, దాడులు కొనసాగుతున్నాయి. మధ్యేవాద, వామపక్ష పార్టీలు, శక్తులు ఈ ఉదంతాన్ని ఖండించాయి, నిరసనలో పాల్గొన్నాయి. జాత్యహంకారి, హంతకుడైన పోలీసు అధికారికి మద్దతుగా విరాళాలు ఇవ్వాలని పచ్చిమితవాద నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ నేత మేరీనె లీపెన్‌ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాటికి 17లక్షల డాలర్లకు పైగా వసూలైంది. నాలుగు సంవత్సరాల క్రితం ” పసుపు చొక్కాల ” ఆందోళన జరిగినపుడు పోలీసుల మీద దాడి చేసిన మాజీ బాక్సర్‌కు మద్దతుగా నిధుల సేకరణకు పిలుపు ఇచ్చినపుడు వెంటనే ఆ నిధి సేకరణను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు అలా జరగలేదు. అరబ్బులను చంపండి మీరు మిలియనీర్లు కావచ్చు అని ఈ నిధి సేకరణ సందేశం ఇస్తున్నదని వామపక్ష నేత డేవిడ్‌ గుయిరాడ్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ చర్య అన్యాయం జరుగుతున్నదనే మనోభావాలను రగిలించటంతో పాటు ఉద్రిక్తతలు మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుందని స్లీపింగ్‌ జైంట్స్‌ అనే సంస్థ పేర్కొన్నది. ఒక మేయరు ఇంటి మీద తగులబడుతున్న కారును తోలి దాడికి పాల్పడ్డారంటే జాతి వివక్ష ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో వెల్లడించింది. దేశంలో తలెత్తిన ఉద్రిక్తత కారణంగా అధ్యక్షుడు మక్రాన్‌ జర్మనీ పర్యటనను రద్దు చేసుకున్నాడు. మైనారిటీల పట్ల దేశంలో ఉన్న జాతివివక్ష గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆందోళన రెండో వారంలో ప్రవేశించింది.


ఉదయం ఎనిమిది గంటలపుడు మెర్సిడెజ్‌ కారు నడుపుతున్న నహేల్‌ దురుసుగా ఒక స్టాప్‌ వద్ద ఉన్న ఇద్దరు పోలీసుల మీద దురుసుగా కారును పోనిచ్చేందుకు చూసాడనే కథనాలు వెలువడ్డాయి. అది వాస్తవం కాదని, వారిద్దరూ కారు పక్కనే ఉన్నట్లు, కారు కదలక ముందే ఒక పోలీసు కారులో ఉన్న నహేల్‌ మీద తుపాకి గురిపెట్టినట్లు కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చాయి.కాల్పులు జరిపిన తరువాత అదుపుతప్పిన కారు సమీపంలోని ఒక స్థంభాన్ని ఢకొీట్టి ఆగింది. నీ తలలో బుల్లెట్‌ దిగుతోంది అన్న మాటలు వినిపించినట్లు ఒక టీవీ ఛానల్‌ పేర్కొన్నది. కాల్పులు జరిపినపుడు నహేల్‌తో పాటు కారులో మరో ఇద్దరు ఉన్నారని వారిలో ఒకడు పోలీసులతో మాట్లాడినట్లు, మరొకడు కారు దిగి పారిపోయినట్లు చూసిన వారు చెబుతున్నారు. కాల్పులు జరపటానికి ముందు బస్సులు వెళ్లే మార్గంలో వెళుతున్న కారును ఇద్దరు పోలీసులు మోటారు సైకిళ్ల మీద వెంబడించి ఆపేందుకు చూడగా నహేల్‌ కారును ఆపలేదు, కొంత దూరం వెళ్లిన తరువాత ట్రాఫిక్‌ కారణంగా నిలపాల్సి వచ్చింది. వెనుకనే వచ్చిన పోలీసుల్లో ఒకడు కారు పక్కకు వచ్చి కాల్పులు జరిపాడు. ఈ తీరుతో జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చైనా పర్యాటకులు వెళుతున్న బస్‌పై జరిగిన దాడి తరువాత అనేక దేశాలు తమ పౌరులను హెచ్చరిస్తూ ఫ్రాన్స్‌ వెళ్లవద్దని సలహా ఇచ్చాయి.


గతవారం రోజులుగా దేశమంతటా వేలాది మంది సాయుధ పోలీసులను మోహరించి హింసాకాండను ఆపేందుకు పూనుకున్నారు. వేలాది మందిని అరెస్టు చేశారు. హింసాకాండకు పాల్పడుతున్న వారు తన మనవడి మరణాన్ని సాకుగా చూపుతున్నారని అమ్మమ్మ నాదియా ఒక టీవీలో చెప్పింది. ఆందోళనలు విరమించాలని కోరింది. నహేల్‌ ఉదంతం ఇలాంటి పరిస్థితిని ఎందుకు సృష్టించిందన్నది ప్రశ్న. 2020లో అమెరికాలోని మినియాపోలిస్‌ పట్టణంలో పోలీసులు జార్జి ఫ్లాయడ్‌ అనే నల్లజాతి యువకుడిని ఊపిరాడకుండా చేసి చంపిన తీరును చుట్టుపక్కల ఉన్నవారు తీసిన వీడియో సంచలనంగా మారి ఆందోళనకు దారితీసింది. నహేల్‌ను కాల్చి చంపుతున్న వీడియో కూడా అలాంటి ప్రతిస్పందననే కలిగించింది.2005లో పోలీసులు వెంటాడినపుడు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించినపుడు దేశమంతటా మూడు వారాల పాటు తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఆ తరువాత ఇప్పుడు అదే మాదిరి ఫ్రాన్సులోని మైనారిటీలు ఆందోళనకు పూనుకున్నారు. ఫ్రెంచి పోలీసుల దుర్మార్గపూరిత వైఖరి, జాతి వివక్ష తీరుతెన్నులకు ఈ ఉదంతాలు నిదర్శనం.


నెలల తరబడి సాగిన పెన్షన్‌ సమ్మెలు,ఇతర ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్‌లో అధికారాన్ని నెట్టుకువస్తున్న మక్రాన్‌ ప్రభుత్వానికి తాజా ఆందోళనతో ఎదురైన సవాలు ఎంత తీవ్రమైనదంటే బ్రసెల్స్‌లో జరుగుతున్న ఒక సమావేశం నుంచి ముందుగానే స్వదేశానికి చేరుకోవటం, జర్మనీ పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.పెన్షన్‌ సంస్కరణలకు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న సమయంలో బ్రిటన్‌ రాజు చార్లెస్‌ కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రెంచి టూర్‌ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మన దేశంలోని మణిపూర్‌లో పరిస్థితి ఎంతగా దిగజారిందో తెలిసిందే. శాంతిగా ఉండాలని కనీసం ప్రధాని నరేంద్రమోడీ నోటి వెంట ఒక్క ముక్కరాలేదు, స్వయంగా పరిస్థితిని తెలుసుకొనేందుకు అక్కడకు వెళ్లలేదు. తమ రాష్ట్రంలో శాంతినెలకాల్పాలని కోరుతూ ఢిల్లీ వచ్చిన ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల ప్రతినిధులను కూడా కలుసుకొనేందుకు అవకాశం ఇవ్వలేదు. అమెరికా, ఈజిప్టు వెళ్లి సుభాషితాలు చెప్పివచ్చారు. సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మంగళవారం నాడు దేశంలోని 220 మంది మేయర్లతో(స్థానిక సంస్థల అధిపతులు) సమావేశం కానున్నట్లు వార్తలు వచ్చాయి.


అల్జీరియా ఫ్రెంచి వలసగా ఉన్న కాలంలో ఫ్రెంచి దళాలు జరిపిన దారుణమారణకాండలు ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. అనేక మంది అల్జీరియన్స్‌ ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. అలాంటి కుటుంబానికి చెందిన వాడే గత నెలలో పోలీసుల చేతిలో మరణించిన నహేల్‌. వలస వచ్చిన ఆఫ్రికా అరబ్బులు, ఇతరులు అంటే ఫ్రెంచి అధికార యంత్రాంగానికి చిన్న చూపు, నేరగాండ్లుగా చూస్తారు.వారితో మమేకం కావటానికి బదులు దమనకాండ ప్రదర్శిస్తారు. అందుకే వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తరచూ వివాదాలు జరుగుతుంటాయి. పశ్చిమ దేశాలలో అమెరికా తరువాత ఫ్రాన్స్‌లోనే పోలీసుల చేతుల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, ఆర్థిక దిగజారుడు పరిణామాలు, వలసదారుల అంశాల మీద ఐరోపా దేశాల్లో పరిస్థితి దిగజారుతోంది.ఇటువంటి స్థితిలో జనంలో ఉన్న అసంతృప్తి ఇలాంటి ఉదంతాలు జరిగినపుడు ఊహించని రీతిలో వెల్లడౌతుంది.ఫ్రాన్స్‌ ఆందోళనకు పూర్వరంగమిదే. నహేల్‌ హత్య ఊహించని ఉదంతమైనా దానికి ప్రతికూల స్పందన గూడు కట్టుకున్న అసంతృప్తికి నిదర్శనం. ఇటీవలి కాలంలో ఫ్రెంచి అధినేత మక్రాన్‌ తమకు మరింత వ్యూహాత్మక స్వయం నిర్ణయాధికారం ఉండాలని, ప్రపంచ వ్యవస్థలో బహుళనాయకత్వం ఉండాలని గట్టిగా చెబుతున్నారు. ఇది అమెరికా గురించే అన్నది స్పష్టం. మక్రాన్నుదారిలోకి తెచ్చుకొనేందుకు పెత్తందారీ ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని చూస్తున్న శక్తుల హస్తం కూడా తాజా కొట్లాటల వెనుక ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అమెరికాకు నచ్చని వైఖరిని తీసుకున్నపుడల్లా ఫ్రాన్స్‌లో కొట్లాటలు జరగటాన్ని బట్టి ఇలా అనుమానించాల్సి వస్తోందని చెబుతున్నారు. అందువలన ఇది ఒక్క ఫ్రాన్స్‌కే కాదు, ఐరోపా సమాఖ్యకు, దేశాలకు ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.


ఐరోపాలో ఇటీవలి కాలంలో ముస్లిం వ్యతిరేక వైఖరితో ఉన్న పచ్చిమితవాద శక్తులు రెచ్చిపోతున్నారు.ఫ్రాన్స్‌ కొట్లాటల్లో పాల్గొన్నది వలస వచ్చిన లేదా ఎప్పటి నుంచో అక్కడ స్థిరపడిన ముస్లింలు, అరబిక్‌ లేదా ఆఫ్రికన్‌ దేశాల నుంచి వలస వచ్చిన వారని చెబుతున్నారు. తాజా పరిణామాల గురించి మీడియాలో చర్చ జరుగుతున్నది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులకు మరింత శిక్షణ అవసరమని, జాతి వివక్ష అంశాన్ని పరిష్కరించాలని, పేదలు-ధనికుల మధ్యపెరిగిన అంతరాన్ని తగ్గించాలని, నిరుద్యోగం పెరుగుదల గురించి సూచనలు చేస్తున్నారు. నిజానికి ఇవి కొత్తవి కాదు ఎప్పటి నుంచో ఉన్నవే. ప్రపంచీకరణ తెచ్చిన సంక్లిష్ట సమస్యలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ప్రపంచీకరణ క్రమంలో ఉత్పత్తి ఖర్చు అధికంగా ఉందనే కారణంతో ఇతర దేశాల నుంచి పారిశ్రామిక వస్తువులను దిగుమతి చేసుకొని సేవారంగం మీద కేంద్రీకరించాయి. ఈ విధానంతో నిరంతర వృద్ది సాగదని తేలింది. ప్రపంచ అభివృద్దిలో అసమతూకానికి దారితీసింది, ప్రపంచీకరణకు వ్యతిరేకతను పెంచింది. కరోనా, ఉక్రెయిన్‌ సంక్షోభం సమస్యల తీవ్రతను వేగతరం కావించింది. ఆర్థిక మందగమన ప్రతికూల పర్యవసానాలు పేద, మధ్య తరగతి మీద భారాలను మోపుతున్నాయి.స్థిరమైన ఉపాధి, అవసరాలకు అనుగుణంగా పెరిగే రాబడి, కుటుంబ జీవనం సంతోషంగా ఉంటుందనే అంశాల మీద ఆశలను తుంచివేస్తున్నది. వీటికి జాత్యహంకారం కూడా తోడైతే ఇక చెప్పనవసరం లేదు. అసంతృప్తి కనిపించని గాస్‌ మాదిరి వ్యాపిస్తే మండటం క్షణాల్లో జరుగుతుంది. గడచిన ఐదు దశాబ్దాల్లో ప్రపంచీకరణ తెచ్చిన మార్పు ఫ్రాన్సులోనూ ఇతర పశ్చిమ దేశాల్లోనూ అనేక పరిణామాలు, ఉద్యమాలు, ఆందోళనలకు దారి తీసింది. వస్తు దిగుమతులు తమ ఉపాధిని దెబ్బతీసిందనే అసంతృప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే అభిప్రాయం రోజు రోజుకూ బలపడటానికి దారి తీస్తోంది. గత రెండు దశాబ్దాల్లో ఏ నేతా ఎదుర్కోనటువంటి తీవ్ర సవాలును మక్రాన్‌ ఎదుర్కొంటున్నట్లు కొందరు విశ్లేషించారు. పార్లమెంటులోని 577 స్థానాలకు గాను మక్రాన్‌ నాయకత్వంలోని రినయసెన్స్‌ పార్టీకి 251 సీట్లే ఉన్నాయి. రెండవ సారి ఎన్నికైనపుడు సంపూర్ణ మెజారిటీ రాకపోవటంతో ద్వితీయ రౌండ్‌లో మితవాది మారినే లీపెన్‌ మీద 58శాతం ఓట్లతో గెలిచాడు. మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో కొనసాగేందుకు పార్లమెంటులో ప్రతిపక్షాల సహకారంతోనే గట్టెక్కే అవకాశం ఉంది.వచ్చే ఏడాది జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా మక్రాన్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూతపడుతున్న మసీదులు, ఖాళీగా చర్చ్‌లు, లాభసాటిగా గుళ్ల వ్యాపారం !

05 Wednesday Jul 2023

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Europe, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

American religious landscape, BJP, Building temples, church congregation, Closed mosques, RSS


ఎం కోటేశ్వరరావు


భగవంతుడు ఉన్నట్లు తాము చెప్పలేమని సగం మంది అమెరికన్లు భావిస్తున్నారని ఇటీవలి జనరల్‌ సోషల్‌ సర్వే చికాగో విశ్వవిద్యాలయం వెల్లడించింది.1972 నుంచి ఈ సంస్థ అమెరికా సామాజిక ధోరణుల మీద జరుగుతున్న సర్వేల ప్రకారం ప్రస్తుతం సగం మంది అమెరికన్లు మాత్రమే దేవుడి ఉనికి గురించి గట్టి విశ్వాసంతో ఉన్నారట. 1993లో మూడింట రెండు వంతులు, 2008లో 60 శాతం నుంచి ఇప్పుడు 50శాతానికి తగ్గారు.జనాభాలో అసలు చర్చ్‌కు వెళ్లని వారు 34శాతం ఉన్నారని, గడచిన ఐదు దశాబ్దాల్లో ఇది అధికమని తేలింది. మరణం తరువాత జీవితం ఉంటుందనే నమ్మకం మాత్రం ఎక్కువ మందిలో ఉంది. తాము క్రైస్తవులమని చెప్పుకున్న వారు 1990 దశకంలో 90శాతం ఉండగా ఇప్పుడు మూడింట రెండువంతులకు తగ్గారు. పిఆర్‌ఆర్‌ఐ సర్వే ప్రకారం 2008లో తమకెలాంటి మత అనుబంధం లేదని చెప్పిన వారు 16శాతం కాగా 2022లో 27శాతానికి పెరిగారు. ఏసు క్రీస్తును రక్షకుడు, ప్రభువు అని గట్టిగానమ్మే ఇవాంజెలికల్‌ ప్రొటెస్టెంట్స్‌ ఇదే కాలంలో 23 నుంచి 13.6శాతానికి తగ్గారు.1965-81 కాలంలో పుట్టిన జనరేషన్‌ ఎక్స్‌లో 25శాతం,1982-2004 మధ్య పుట్టిన మిలీనియల్స్‌లో 29శాతం 1996-2010 మధ్య జన్మించిన జడ్‌ తరంలో 34శాతం మంది ఏ చర్చ్‌కు అనుబంధంగా లేరు.” మతం నుంచి స్వేచ్చ ఫౌండేషన్‌ ” సహ అధ్యక్షుడు డాన్‌ బార్కర్‌ ప్రపంచంలో మతం గురించి మారుతున్న వైఖరి మీద స్పందిస్తూ అమెరికాలో బలమైన మతవిశ్వాసాలు ఉన్నవారు తగ్గటాన్ని హర్షిస్తూ, ఇతర ఐరోపా దేశాలతో అమెరికా పోటీ పడుతున్నదన్నాడు.


ఒక దేశంలో మెజారిటీ మతం మరొక చోట మైనారిటీగా ఉండవచ్చు. మన దేశంలో హిందూ అని పిలుస్తున్న మతంలో వివిధ శాఖలు ఉన్నట్లుగానే క్రైస్తవం, ఇస్లాం, ఇతర మతాల్లో కూడా ఉన్నాయి. తమ దేశంలోని 75వేల మసీదుల్లో 50వేలను మూసివేసినట్లు ఇరాన్‌ మౌలానా మహమ్మద్‌ అబోలఘాసిమ్‌ దౌలబీ జూన్‌ ఒకటిన చెప్పాడు. మసీదులకు వచ్చేవారు గణనీయంగా తగ్గటమే దీనికి కారణం అన్నాడు. ఇతగాడు ప్రభుత్వం-మత సంస్థల సమన్వయకర్తలలో ఒకడు. దీని గురించి హిందూత్వకు పక్కాగా మద్దతు పలికే, ముస్లింల మీద విద్వేషాన్ని వెదజల్లుతుందనే విమర్శ ఉన్న ఓపి ఇండియా వెబ్‌పోర్టల్‌ రాసింది. ఇస్లామిక్‌ విశ్వాసాలతో ఛాందసవాదుల హవా నడుస్తున్న చోట ఇలాంటి పరిణామం మన దేశాన్ని హిందూ ఛాందసవాదం, మనువాద హిందూత్వం వైపు తీసుకుపోవాలని చూస్తున్న శక్తులకు ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పవచ్చు. హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనకు దిగిన ఇరాన్‌ మహిళలకు ప్రపంచమంతా జేజేలు పలికింది. అదే తీరున మన దేశంలో కూడా మతఛాందసులు, మతోన్మాదుల అజెండా మేరకు సమాజాన్ని నడిపితే ఇక్కడ కూడా వ్యతిరేకత వెల్లడైతే హిందూత్వ అజెండా కుప్పకూలుతుందన్న భయం ఆశక్తులకు కలగటం సహజం. ఇరాన్‌ మతశక్తులు పౌరుల జీవితాల మీద మతాన్ని రుద్దటాన్ని అక్కడి సమాజం తిరస్కరించటం నానాటికీ పెరుగుతోంది. శిక్షించటాన్ని సహించటం లేదు. ” సమాజంలోని బలమైన మత భావనలు అంతరిస్తున్నాయి. మతం ఇచ్చేదాన్ని జనం చూస్తారు, మతం పేరుతో జనాలను అవమానించటం, మత బోధనలు, భావనల పేరుతో మతపరమైన కల్పనలతో సహా అనేక కారణాలు, ఇంకా మతం పేరుతో పౌరులకు గౌరవ ప్రదమైన జీవితాన్ని నిరాకరించటం, వారిని దారిద్య్రంలో నెట్టటం వంటి అంశాలను బట్టి ఆ మతంలో చేరాలా లేక దాన్ని వదలి వెళ్లాలా అని నిర్ణయించుకుంటారు.” అని కూడా మౌలానా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. హిజాబ్‌ను సరిగా ధరించలేదనే కారణంతో నైతిక పోలీసులు గతేడాది సెప్టెంబరులో మహసా అమిని అనే యువతిని దారుణంగా కొట్టి చంపటంతో పెద్ద ఎత్తున ఇరాన్‌లో నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రార్ధనలకు వచ్చేవారు లేక 60శాతం మసీదులను మూసినట్లు వార్తలు వచ్చాయి.


లవ్‌ జీహాద్‌, లాండ్‌ జీహాద్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా పురోలా పట్టణంలో ఉన్న ముస్లింలందరూ వెళ్లిపోవాలంటూ హిందూత్వ పేరుతో ఉన్న శక్తులు జూన్‌ 15వ తేదీ గడువు నిర్ణయించి బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. హిందువుల్లో ఒక కులం వారు మరొక కులం వారిని వివాహం చేసుకోకూడదంటూ ఉత్తరాది రాష్ట్రాలలో తీర్పులు చెప్పే పంచాయత్‌లను చూస్తున్నాము. ఇది వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవటం తప్ప వేరు కాదు. ఇదే పని ఇతర మతఛాందసులు చేసినా అదే అవుతుంది. రెచ్చిపోతున్న మతశక్తులను చూస్తే మన దేశం కూడా ఈ రోజుగాకపోతే రేపు మరో ఇరాన్‌ అవుతుంది. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు తమ దేశంలో బౌద్ధం అంతరించటానికి కారకులౌతున్నారంటూ శ్రీలంకలోని బౌద్ధ మత ఛాందసులు రెచ్చిపోతున్నారు.రెచ్చగొట్టి దాడులకు పాల్పడేందుకు చూస్తున్నారు.


మతంతో నిమిత్తం లేని వారు అమెరికాలో పెరుగుతున్న కారణంగా ప్రతి ఏటా అనేక చర్చ్‌లు మూతపడుతున్నట్లు వార్తలు.చర్చి ప్రాంగణాలను కొనుగోలు చేసే వారికి భలే మంచి చౌకబేరం అన్నట్లుగా ఉంది. 2019లో నాలుగున్నరవేల ప్రొటెస్టెంట్‌ చర్చ్‌లు మూతపడితే, గతేడాది మూడువేల కొత్త చర్చ్‌లు ప్రారంభమైనట్లు వార్తలు.మొత్తం మీద జనాలు చర్చ్‌లకు రాకపోవటం తాత్కాలికమా లేక అదే ధోరణి ముందుకూడా కొనసాగుతుందా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గడచిన మూడు సంవత్సరాల ధోరణులను చూసినపుడు మూసివేతలకే ఎక్కువ అవకాశాలున్నట్లు కొందరు భావిస్తున్నారు. కరోనా తరువాత చర్చ్‌లకు వస్తున్నవారిని చూస్తే అంతకు ముందువచ్చే వారిలో 85శాతమే ఉన్నట్లు ప్రొటెస్టెంట్‌ పాస్టర్లు నివేదించారట. కరోనాకు ముందు ఏడాదికి కనీసం ఒకసారి చర్చ్‌కు వచ్చినవారు 75శాతం ఉంటే గతేడాది 67కు తగ్గారు. కుర్రకారు హైస్కూలు చదువులో ఉండగా కనీసం ఒక ఏడాది పాటు చర్చ్‌కు ప్రతివారం వచ్చేవారని 2017 వివరాలు వెల్లడించగా ఇప్పడు ప్రతి పదిమందిలో ఏడుగురు రావటం లేదని లైఫ్‌వే పరిశోధనలో తేలింది. మతంతో సంబంధం లేకుండా పిల్లల్ని పెంచుతున్నవారు పెరగటం దీనికి ఒక కారణం అంటున్నారు. పూ సంస్థ విశ్లేషకులు చెప్పినదాని ప్రకారం 1972లో 92శాతం మంది అమెరికన్లు క్రైస్తవులుగా చెప్పుకోగా 2070 నాటికి 50శాతం లోపుకు పడిపోవచ్చట. ఇప్పుడున్న వారిలో తాతలు ప్రతివారం చర్చ్‌కు వెళ్లి ఉంటారని, వారి పిల్లలు తమకు దేవుడు అంటే విశ్వాసం అని చెప్పారు తప్ప ప్రతివారం విధిగా చర్చ్‌కు వెళ్ల లేదని, మిలీయన్‌ మనవల దగ్గరకు వచ్చే సరికి చర్చికి వెళ్లే సంబంధాలు గానీ మతంతో గానీ అనుభవం తక్కువని కొందరు విశ్లేషకులు చెప్పారు. కాథలిక్‌ చర్చ్‌లో సెక్స్‌ కుంభకోణాల కారణంగా జనాలు చర్చ్‌లకు దూరంగా ఉంటున్నారని, దానికి కరోనా కూడా తోడైందని కూడా తేలింది.


కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఇలాంటి పరిణామం ముందే జరిగిందని, అమెరికాలో మెల్లగా జరుగుతోందని చెబుతున్నారు. దీనికి సోషలిస్టు దేశాలతో అమెరికా జరిపిన ప్రచ్చన్న యుద్ధం కారణమని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. క్రైస్తవ అమెరికా-దేవుడు లేని కమ్యూనిజం మధ్య పోరు జరుగుతోందని, మతం లేని వారు అసలు అమెరికన్లే కాదని రెచ్చగొట్టారు.(ఇప్పుడు మన దేశంలో ఎవరైనా బిజెపి, సంఘపరివార్‌, హిందూత్వ సంస్థలను లేదా మతంలోని అవలక్షణాలను, మూఢవిశ్వాసాలను ఎవరైనా విమర్శిస్తే లేదా వారితో ఏకీభవించకపోతే మీరు హిందువులే కాదంటూ రెచ్చగొడుతున్న తీరు చూస్తున్నదే). మూడు దశాబ్దాల క్రితం ప్రచ్చన్న పోరులో గెలిచినట్లు అమెరికా ప్రకటించిన తరువాత వారి దగ్గర కమ్యూనిజం గురించి చెప్పటానికేమీ లేదు. అందువలన యువతలో ఒక్క మతం గురించే కాదు, సోషలిజం, పెట్టుబడిదారీ విధానం గురించి కూడా మధనం ప్రారంభమైంది. చివరకు అది ఇప్పుడు సోషలిస్టు వైఫల్యం గురించిగాక తాము ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ దివాలాకోరు తనం గురించి మాట్లాడేందుకు దారి తీసింది. అమెరికా చర్చ్‌ ఆస్తుల లావాదేవీల్లో అగ్రగామి సంస్థగా ఉన్న ఎడి ఎడ్వైజర్స్‌ ఎండి బ్రెయిన్‌ డోల్‌హైడ్‌ మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో విక్రయాలు పెరిగినట్లు చెప్పాడు. కొన్నింటిని గృహాలుగా, కొన్నింటిని సంరక్షణ కేంద్రాలుగా మార్చగా కొన్ని చర్చ్‌లు విస్తరణలో భాగంగా కొనుగోలు చేసినట్లు చెప్పాడు.


వయస్సులో దేవుడు, మతం గురించి పెద్దగా పట్టించుకోని అనేక మంది ముసలితనం వచ్చేసరికి పక్కా భక్తులుగా, చాదస్తులుగా కూడా మారుతున్నవారిని చూస్తున్నాం. ఇది ఒక్క మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో ఇలాంటి వైఖరే ఉంది. చిత్రం ఏమిటంటే ప్రస్తుతం ఐరోపా దేశాల్లో కుర్రకారుకంటే వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. కానీ అక్కడ యువతరంతో పాటు వృద్ధుల్లో కూడా మతం మీద గట్టిగా ఉన్న భావన తగ్గుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఎందుకు ఇలా జరుగుతోందని అక్కడి పరిశోధకులు కుస్తీపడుతున్నారు.మన దేశంలో ప్రస్తుతం కుర్రకారులో తాతగారి నాన్నగారి అశాస్త్రీయ, మతభావనలు, అంతరించిన ఆచారాల పునరుద్దరణ జరగాలనే తిరోగమన ధోరణులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


యువత మతానికి దూరం జరిగితే అమెరికా సమాజం ఎటుపోనుంది అనే అందోళన అనేక మందిలో తలెత్తుతోంది.వారిలో మతాన్ని మత్తు మందుగా మార్చి దోపిడీకి మార్గం సుగమం చేయాలనే వారు తప్పకుండా ఉంటారు. మతం స్థానంలో ఆత్మ స్వరూపత్వం(స్పిరిట్యువాలిటీ) పెరుగుతున్నదని కొందరు విశ్లేషకులు చెప్పగా మరికొందరు దాన్ని పూర్వపక్షం చేస్తూ ఎక్కువ మంది లౌకికవాదం వైపు మళ్లుతున్నారని కొన్ని సర్వేల గణాంకాలను చూపుతున్నారు. త్రమ బిడ్డలను చర్చి ప్రార్ధనలు, మత సేవలకు తీసుకురావటానికి చేస్తున్న పెనుగులాటలో తలిదండ్రులు ఓడిపోతున్నారు. అమెరికాలో వ్యక్తివాద సంస్కృతి నానాటికీ పెరుగుతున్నకారణంగా మతానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు.మతం అధికారాన్ని సమర్ధిస్తుంది- వ్యక్తివాద సంస్కృతి ప్రతిఘటిస్తుంది. మత పెత్తనం లేదా ప్రాధాన్యతను కూడా తగ్గిస్తుంది. ఐరోపా దేశాలలో వివాహం అన్నది విధి కాదు.ఎక్కువ మంది యువత వివాహ బంధంతో నిమిత్తం లేకుండానే పిల్లలను కూడా కంటున్నారు. ఇది అమెరికాకూ విస్తరించింది.అమెరికాలో 1981లో 18శాతం మంది మహిళలు వివాహంతో నిమిత్తం లేకుండా పిల్లల్ని కనగా 2021లో 40శాతానికి పెరిగింది. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఇసిడి) దేశాలలో 42శాతం మంది పిల్లలు వివాహాలతో నిమిత్తం లేకుండానే పుడుతున్నారు. ఈ కూటమిలోని చిలిలో 75శాతం మంది,కోస్టారికాలో 73 మెక్సికోలో 70శాతం మంది ఉండగా జపాన్‌, దక్షిణ కొరియా, టర్కీలలో రెండు-మూడు శాతం మధ్య ఉన్నారు. అమెరికాలోని ఆఫ్రో-అమెరికన్లలో చాలా ఎక్కువ మంది పుడుతున్నారు.


తమ జీవితాల్లో మతం అత్యంత ప్రాముఖ్యత కలిగినదని భావిస్తున్న వారు కేవలం పదహారుశాతం మందేనని తాజాగా ఒక సర్వేలో తేలింది. పదేండ్ల క్రితం ఇరవై శాతం ఉన్నారు.దేవుడి మీద నమ్మకం లేదంటూనే జ్యోతిషం, క్షుద్రవిద్యల పట్ల సగం మంది అమెరికా మిలీనియల్స్‌ నమ్మకాలు పెంచుకుంటున్నారని, అదే చైనాలో కేవలం ఎనిమిది శాతమే అని తేలింది. అమెరికాలో ఇలాంటి మానసిక సేవల పరిశ్రమ లావాదేవీల విలువ రెండు వందల కోట్ల డాలర్లకు పెరిగింది. దేవుడి వ్యాపారం దేశమంతటా మంచి వాణిజ్యమని ఒకనాడు బిజెపిలో పని చేసి, కేంద్రంలో ఆర్థిక మంత్రికి సలహాదారు, రచయితగా ఉన్న మోహన్‌ గురుస్వామి 2021 ఏప్రిల్‌ 24న డక్కన్‌ క్రానికల్‌ పత్రికలో ఒక విశ్లేషణ రాశారు. సారం ఇలా ఉంది. రాజకీయాల్లోనే కాదు మతం ఆర్థిక రంగంలో కూడా రోజు రోజుకూ ప్రాధాన్యత పెంచుకుంటోంది. మధ్య ప్రాచ్య దేశాల్లో ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు పెరగటంతో పెద్ద ఎత్తున డబ్బు దేశానికి చేరింది.దాంతో అనేక మసీదుల నిర్మాణం జరిగింది. బ్రిటిష్‌ వారి కాలంలో చర్చ్‌లకు ప్రాధాన్యత ఉన్నందున మంచి ప్రదేశాల్లో అవి వచ్చాయి.మిషనరీల నిధులు ఇప్పటికీ వస్తున్నాయి. మహా చర్చ్‌లు కాకున్నా చిన్న చిన్న వాటిని పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. మసీదులు, చర్చ్‌ల నిర్మాణాల మీద నియంత్రణ ఉంది. దానికి స్పందనగా వెలిసిన గుళ్ల విస్తరణ మీద ఎలాంటి అదుపు లేదు. ఇటీవల తెలంగాణాను సందర్శించినపుడు చిన్న చిన్న గ్రామాల్లో కూడా రెండు మూడు గుళ్లు కనిపించాయి. ఇది హిందువులకు భిన్నమైన దేవుళ్లను ఎంచుకొనే స్వేచ్చ ఉండి కాదు, భిన్న కులాలు, గోత్రాలకు చెందిన వారు నిర్మించినవీ, పక్క పక్కనే ఉన్నాయి, ఒకరితో ఒకరు పోటీ పడి నిర్మించుతున్నారు. ఈ అంశంలో చీరలు, నగలు, మిఠాయి దుకాణాలకు వాటికీ పెద్ద తేడా లేదు. అనుమతుల్లేకుండానే అక్రమ ఇసుక తవ్వకం, అనుమతి లేని మద్యం అమ్మకాల మాదిరి ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారు.

దేశంలో టూరిజం ద్వారా జిడిపిలో 9.6శాతం వస్తోంది. దీనిలో స్వదేశీ వాటా 88శాతం ఉంది. 2019లో విదేశీ యాత్రీకులు తొమ్మిది కోట్ల మంది రాగా స్వదేశీ 140 కోట్లు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో విదేశీ, స్వదేశీ టూరిస్టులు ఎక్కువ మంది తిరుపతి, మధురై వంటి మతపరమైన కేంద్రాలను సందర్శించారు. మత పరమైన టూరిజం ఇప్పుడు పెద్ద వ్యాపారం, దీన్ని చూసి మనం ఆందోళన చెందాలా ? పూ సంస్థ ప్రపంచ వైఖరుల గురించి చేసిన సర్వేలో గడచిన నాలుగైదు సంవత్సరాలలో 25శాతానికి పైగా భారతీయులు మరింత మతపరమైన వారిగా మారారు.2007-15 సంవత్సరాల మధ్య మతపరమైన టూరిజం మీద పెడుతున్న ఖర్చు రెట్టింపైంది. వేగంగా పెరుగుతున్న ఈ వాణిజ్య ధోరణులను చూస్తుంటే ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. పెరుగుతున్న మత ధోరణుల పర్యవసానాలను కూడా చూడాలి. గుడ్డి విశ్వాసాలు, మూఢభక్తి, జగడాల మారి మత ధోరణులు పెరుగుతున్నాయి. గుళ్ల నిర్మాణం లాభసాటిగా ఉండటంతో అవాంఛనీయ శక్తులు బహిరంగ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. ఒకసారి నిర్మించి దేవుడు, దేవతలను ప్రతిష్టించిన తరువాత వాటిని తొలగించలేరు, ట్రాపిక్‌ సమస్యలను సృష్టిస్తున్నాయి.” మోహన గురుస్వామి పరిశీలనే కాదు, ఈ రోజు ఎక్కడ చూసినా పూజలు, భక్తి వేలం వెర్రిగా మారటాన్ని ఎవరైనా చూడవచ్చు. ఇది విద్యావంతులలో మరీ ఎక్కువగా ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పుతిన్‌పై కిరాయి సేన విఫల తిరుగుబాటు – సమాధానం లేని ప్రశ్నలు !

28 Wednesday Jun 2023

Posted by raomk in COUNTRIES, Current Affairs, History, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Failed Russian Mercenary group revolt, Joe Biden, Vladimir Putin, Wagner, Yevgeny Prigozhin


ఎం కోటేశ్వరరావు


ఇరవై రెండు సంవత్సరాల పాటు రష్యాలో తిరుగులేని అధినేతగా ఉన్న వ్లదిమిర్‌ పుతిన్‌ నాయకత్వానికి తొలిసారిగా వాగర్‌ కిరాయి సాయుధ మూక రూపంలో విఫల సవాలు ఎదురైంది. ఒక్క తూటా కూడా పేల కుండా తిరుగుబాటు ముగిసినప్పటికీ పుతిన్‌ బలహీనత వెల్లడైంది. తన లక్ష్యం పుతిన్ను అధికారం నుంచి తొలగించటం కాదని, తిరుగుబాటు నేత ఎవగెనీ ప్రిగోఝిన్‌ సోమవారంనాడు ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ ఉదంతానికి సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానం లేదు.దీని గురించి ఊహించిందే అన్నట్లుగా పశ్చిమ దేశాల స్పందన ఉంది. అధికార గణం తగిన సన్నద్దతను ప్రదర్శించలేదని మాస్కో మీడియా విమర్శించింది. మిలిటరీ అధికారులతో వచ్చిన పేచీలే దీనికి మూలమా లేక నాటో హస్తం ఉందా అన్నది తేలాల్సి ఉంది. పరస్పర విరుద్దంగా మాట్లాడిన ప్రిగోఝిన్‌ తన బలాన్ని ఎక్కువ అంచనా వేసుకొని తిరుగుబాటు జరిపాడా లేక మరొకటా అన్నది స్పష్టం కాలేదు.ఈ తిరుగుబాటు విఫలం తరువాత ఉక్రెయిన్‌ మీద తిరిగి దాడులు కొనసాగుతున్నాయి.


మాస్కోను పట్టుకుంటామంటూ ఉక్రెయిన్‌లోని రష్యా ఆధీనంలో ప్రాంతాల నుంచి బయలు దేరిన ఈ ప్రైవేటు దండు (పిఎంసి) జూన్‌ 24 శనివారం నాడు ఒక్క తూటాను కూడా పేల్చకుండానే సరిహద్దులోని రష్యా నగరమైన రోస్టోవ్‌ అన్‌ డాన్‌లోని మిలిటరీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకొన్నది. అక్కడి నుంచి మాస్కో నగరానికి 360 కిలోమీటర్ల దూరంలో ఉండగా(కొన్ని వార్తల ప్రకారం రెండు వందల కిమీ) నాటకీయ పరిణామాల మధ్య తన దళాలు వెనక్కు తిరుగుతున్నట్లు, తిరిగి ఉక్రెయిన్లో పోరు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లాలని వాగర్‌ కంపెనీ అధిపతి ఎవగెనీ ప్రిగోఝిన్‌ ప్రకటించాడు. రష్యా మిత్రదేశమైన బెలారస్‌ అధినేత అలెగ్జాండర్‌ లుకషెంకో మధ్య వర్తిత్వంలో కుదిరినట్లు చెబుతున్న రాజీ మేరకు వాగర్‌ దళం, దాని అధిపతి మీద ఎలాంటి విచారణ ఉండదు. దళాలు తిరిగి ఉక్రెయిన్లో ఉన్న ప్రాంతానికి వెళతాయి. అధిపతి ప్రిగోఝిన్‌కు బెలారస్‌ ఆశ్రయం కల్పిస్తుంది. వాగర్‌ దళాలు తమ వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే అప్పగిస్తే వారి మీద ఎలాంటి విచారణ ఉండదు. తిరుగుబాటులో పాల్గొనని వారిని మిలిటరీ కాంట్రాక్టుదళంలో సర్దుబాటు చేస్తారు. జూలై ఒకటవ తేదీలోగా వారు దరఖాస్తు చేసుకోవాలి. రాజీ వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే స్వాధీనం చేసుకున్న రోస్టోవ్‌ నగరం నుంచి వాగర్‌ దళం వైదొలిగింది. ప్రిగోఝిన్‌ శుక్రవారం నాడు ఒక ప్రకటన చేస్తూ అవసరం లేకున్నా ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ పోరుకు దిగాడని, దాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాడు. తమ దళాల మీద రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదేశాల మేరకు రాకెట్లు, హెలికాప్టర్లు, ఫిరంగులతో మిలిటరీ దాడి చేసి రెండువేల మందిని హతమార్చినట్లు ఆరోపించాడు. తమ తిరుగుబాటుకు కారణం ఇదే అని చెప్పాడు. షోయిగుతో భేటీ తరువాత సైనిక దళాల చీఫ్‌ వాలెరె గెరాసిమోవ్‌ తమ దండు మీద దాడులకు ఆదేశించినట్లు ఆరోపించాడు. ఈ ఆరోపణను మిలిటరీ తిరస్కరించింది. ఉక్రెయిన్లోని బఖుమట్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటంలో వాగర్‌ దళం కీలకపాత్ర పోషించింది.


అంతకు ముందు దేశ పౌరులనుద్దేశించి టీవీలో మాట్లాడిన పుతిన్‌ తిరుగుబాటును వెన్నుపోటుగా, విద్రోహంగా వర్ణిస్తూ దీనివెనుక ఉన్న వారిని శిక్షించాలని చెప్పాడు. ఈ కారణంగా ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్య ఆగదన్నాడు. తిరుగుబాటు ప్రారంభం కాగానే బెలారస్‌ నేత లుకషెంకో ఒక ప్రకటన చేస్తూ పుతిన్‌కు మద్దతు ప్రకటించాడు. మరో ప్రైవేటు దండు చెచెన్‌ దళాల నేత కదరివ్‌ కూడా ఉక్రెయిన్లో ఉన్న మూడువేల మంది తమ వారిని వాగర్‌ దళం మీద పోరుకు పంపుతున్నట్లు చెప్పాడు. వాగర్‌ దళాలు వస్తున్న మార్గంలో అనేక చోట్ల తనిఖీ కేంద్రాలు, భారీ ఎత్తున రష్యన్‌ మిలిటరీ సాయుధ శకటాలను రంగంలోకి దించారు, మాస్కో చుట్టూ భద్రతను పటిష్టం కావించారు.


అరవై రెండు సంవత్సరాల ప్రిగోఝిన్‌ ఒక నేరగాడు.పదేళ్ల పాటు జైలులో ఉండి విడుదలైన తరువాత ఆహార సరఫరా కాంట్రాక్టరు అవతారమెత్తాడు. ఆక్రమంలో పుతిన్‌ వంట వాడని ఎగతాళి చేసేంతగా దగ్గరయ్యాడు. మిలిటరీ అధికారులతో సంబంధాలు పెట్టుకొని వారి మద్దతుతో జైళ్లలోని నేరగాండ్లు, నిరుద్యోగులను చేరదీసి వాగర్‌ కంపెనీ పేరుతో కిరాయి సాయుధ దళాన్ని ఏర్పాటు చేశాడు. మిలిటరీ అందచేసిన ఆయుధాలు, నిధులతో లిబియా, సిరియా తదితర దేశాల్లో అమెరికా వినియోగించిన ఐఎస్‌ కిరాయి మూకలను ఎదుర్కొనేందుకు పని చేశాడు. దాని కొనసాగింపుగానే ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ మిలిటరీతో తలపడి ఆప్రాంతాలను పట్టుకోవటంలో, క్రిమియాను స్వాధీనం చేసుకోవటంలో కూడా కీలక పాత్ర పోషించాడు.2016 ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా కొంత మందితో కలసి సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసినట్లు కూడా వెల్లడైంది.తమ వద్ద పాతికవేల మంది ఉన్నట్లు ప్రిగోఝిన్‌ ప్రకటించాడు. మరో పాతిక వేల మంది కలుస్తారని, తిరుగుబాటులో కలసి వచ్చే వారందరినీ కలుపుకుంటామన్నాడు. తాము ఎందుకోసమైతే బయలు దేరామో అది ముగిసిన తరువాత మాతృదేశాన్ని కాపాడు కొనేందుకు తిరిగి వస్తామని చెప్పాడు. రక్షణ మంత్రి దేశాన్ని, పుతిన్ను కూడా తప్పుదారి పట్టించాడన్నాడు.


ఎక్కడైనా మిలిటరీ లేదా పారామిలిటరీ తిరుగుబాట్ల గురించే ఇప్పటి వరకు ప్రపంచానికి తెలుసు. తొలిసారిగా కిరాయి మిలిటరీ ఒక పెద్ద దేశంలో విఫల కుట్రకు పాల్పడటం ఇదే ప్రధమం.ప్రపంచంలో ఇలాంటి సంస్థలు 16వేల వరకు ఉన్నట్లు అంచనా. వీటిలో ఓడలు, గనులు, చమురు బావుల వంటి వాటికి సాయుధ కాపలాతో పాటు ఎవరు డబ్బులిస్తే వారి తరఫున ఇతర దేశాలు మీద యుద్ధాలు చేసేందుకు కూడా జనాలను పంపుతాయి. కొంత మంది వర్ణించినట్లు పురాతన వృత్తులలో రెండవదిగా కిరాయి మిలిటరీ ఉంది. అధికారికంగా లేదా అనధికారికంగా మన దేశంతో సహా దాదాపు అన్ని దేశాలూ పిఎంసిలను కలిగి ఉన్నాయి. వివిధ దాడుల్లో అమెరికా సైనికులు మరణించటంపై తలెత్తిన నిరసన కారణంగా గడచిన మూడు దశాబ్దాలుగా అమెరికా కిరాయి మూకలను రంగంలోకి దించుకతోంది. దీంతో సైనికుల మరణాలను తగ్గించుకోవచ్చు, పౌరుల నుంచి నిరసనలు ఉండవు. నిరంతరం మిలిటరీని పోషించాలంటే ఖర్చుకూడా ఎక్కువ. రాబోయే రోజుల్లో అధికారిక మిలిటరీ బదులు ఇలాంటి వారితోనే యుద్ధాలు జరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. 1990 దశకంలో ప్రతి 50 మంది మిలిటరీ సిబ్బందికి ఒకరు కాంట్రాక్టు ప్రైవేటు మిలిటరీ మిలిటరీ ఉండగా ఇప్పుడు పదికి ఒకరు ఉన్నట్లు అంచనా.ఆయుధాలతో పాటు పిఎంసిల నిర్వహణ పెద్దలాభసాటి వ్యాపారంగా మారింది. లాటిన్‌ అమెరికాలో పోలీసుల కంటే కిరాయి సిబ్బంది ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. 1990లో అమెరికా త్రివిధ దళాల్లో 21లక్షల మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం 14లక్షలకు కుదించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారిక మిలిటరీ కంటే ఇలాంటి కిరాయి దళాలనే అమెరికా ఎక్కువగా దింపింది. అక్కడ అమెరికా 14లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టగా మూడో వంతు ప్రైవేటు మిలిటరీ కాంట్రాక్టర్లకే వెళ్లింది.2001లో 140 బి.డాలర్లు చెల్లించగా 2019 నాటికి 370 బి.డాలర్లకు పెరిగింది. ఇరాక్‌ మీద దాడి చేసిన అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా అదే చేశాయి. కొన్ని కంపెనీలు పిఎంసి కంపెనీల పేరుతో స్టాక్‌ మార్కెట్లో వాటాలను కూడా అమ్ముతున్నాయి.


సిరియా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా పిఎంసిలను రంగంలోకి దింపగా వాటిని ఎదుర్కొనేందుకు రష్యా కూడా వాగర్‌ వంటి కంపెనీలను మోహరించింది. చమురు సంపదలున్న అరేబియా దేశాలు ఇలాంటి వాటిని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాయి. ఎమెన్‌ వంటి చోట్ల అదే జరిగింది.లాటిన్‌ అమెరికాలో నిరంకుశ పాలకులు ఇలాంటి దళాలతో ప్రతిపక్షాల నేతలు, ఇతరుల మీద దాడులు, హతమార్చటం వంటి దారుణాలకు పాల్పడ్డారు. ఇప్పటికీ కొనసాగుతోంది. ఏ ప్రైవేటు మిలిటరీ చరిత్రను చూసినా వారి వెనుక మిలిటరీ అధికారులు ఉంటారు. వారికి శిక్షణ ఇచ్చేది కూడా వారే.ప్రపంచ మిలిటరీ చరిత్రను చూసినపుడు క్రీస్తుపూర్వం నుంచి తరువాత కూడా కిరాయి సైనికుల ప్రస్తావన,వినియోగం కనిపిస్తుంది. ఆసియా దేశాలపై దండెత్తిన అలెగ్జాండర్‌ సేనలో ఐదువేల మంది వరకు ఉన్నారని చరిత్రకారులు చెప్పారు. అతన్ని ఎదుర్కొన్న పర్షియా మిలటరీలో పదివేల మంది గ్రీకులు ఉన్నారు. మన దేశంలోని పాలకులు కూడా కొందరు గ్రీకులను తెచ్చుకున్నట్లు వారిని యవనులుగా వర్ణించినట్లు చరిత్రలో ఉంది. రోమ్‌ పాలకులు తమ సామ్రాజ్యాన్ని కాపాడుకొనేందుకు, దానిపై దాడులు చేసేందుకు ఇతర దేశాలూ కూడా వేలాది మంది కిరాయి బంట్లను సమకూర్చుకున్నాయి. చైనా యుద్ధ ప్రభువులు కూడా ఇరుగుపొరుగు దేశాలకు చెందిన వారిని కిరాయికి తెచ్చుకున్నారు. చివరికి క్రైస్తవ మతంలో పోప్‌లు కూడా కిరాయి మూకలను రంగంలోకి దించారు. దక్షిణ ఫ్రాన్సులోని కాథర్స్‌ అనే క్రైస్తవ తెగవారి మీద 1.209లో పోప్‌ మూడవ ఇన్నోసెంట్‌ పవిత్ర యుద్ధం పేరుతో కిరాయి మూకలతో దాడి చేయించినట్లు ఉంది.


ఇక వర్తమాన అంశానికి వస్తే వాగర్‌ కంపెనీ నేత తిరుగుబాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా గూఢచారులు పసిగట్టి జోబైడెన్‌కు సమాచారమందించినట్లు అమెరికా మీడియా పేర్కొన్నది. ఈ సమాచారం పుతిన్‌కు ఎందుకు అందలేదు అన్నది ప్రశ్న. ఒక వేళ తెలిసి ఉంటే తగిన జాగ్రత్తలతో రోస్టోవ్‌ నగరంలోని మిలిటరీ కేంద్రం వద్ద భద్రతా చర్యలెందుకు తీసుకోలేదు ? అనేక ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానాలు లేవు. తమకు చెల్లించాల్సిన మొత్తాలకు కోత పెట్టారని విమర్శించినట్లు , దళాన్ని మిలిటరీ ఆధీనంలో ఉంచేందుకు వాగర్‌ తిరస్కరించినట్లు వార్తలు వచ్చినప్పటికీ జాగ్రత్తలు తీసుకోలేదు. నాటో నేతలతో ప్రిగోఝిన్‌ సంబంధాల్లో ఉన్నట్లు కుట్ర తరువాత కొన్ని సూచనలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌పై అవసరం లేకున్నా దాడికి దిగినట్లు పుతిన్‌ మీద ఆరోపణే అందుకు నిదర్శనం. మూడు వారాలుగా జరుపుతున్న ఎదురుదాడుల్లో ఉక్రెయిన్‌ భారీగా నష్టపోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు ఆశ్చర్యం కలిగించలేదన్నట్లుగా అమెరికా, పశ్చిమ దేశాల స్పందన ఉంది. బెలారస్‌ నేత లుకషెంకోతో వాగర్‌ యజమాని జరిపిన రాజీ చర్చల్లో రష్యా రక్షణ మంత్రి షొయిగు, సైనిక అధికారి వాలెరీ గెరాసిమోవ్‌ను తొలగించేందుకు, వాగర్‌ దళాన్ని ఆఫ్రికా పంపేందుకు అంగీకరించినట్లు నిర్ధారణకాని వార్తలు వచ్చాయి. ప్రిగోఝిన్‌పై దేశద్రోహ విచారణ కొనసాగుతుందని కూడా సోమవారం నాడు కొన్ని వార్తలు పేర్కొన్నాయి.తిరుగుబాటుకు తగినంత మద్దతు లభించకపోవటం, వాగర్‌ దళంలోని కొందరు కమాండర్లు కూడా సిద్దం కాలేదని వార్తలు వచ్చినందున నేత తోకముడిచినట్లు చెబుతున్నప్పటికీ ఎక్కడా మిలిటరీ ఎందుకు ప్రతిఘటించలేదు, విఫలమైన తరువాత అణచివేయకుండా పుతిన్‌ రాజీకి ఎందుకు అంగీకరించాడు ? ఒక వేళ శిక్షిస్తే ఇతర కిరాయి దళాలు తన పట్టునుంచి జారతాయని భావించారా ? పుతిన్‌ ఒక బూర్జువా, వాగర్‌ కంపెనీని పెంచి పోషించటంలో అతగాడేమీ తక్కువ తినలేదు.పశ్చిమ దేశాలు చెబుతున్నట్లు పుతిన్‌-రక్షణ మంత్రి- మిలిటరీ అధికారుల మధ్య నిజంగానే సంబంధాలు సజావుగా లేవా ? పుతిన్‌ మీద కాదు నా తిరుగుబాటు అని చెబుతున్న ప్రిగోఝిన్‌ ఎవరి మీద కుట్రకు తెరలేపినట్లు ? ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది ? ప్రస్తుతానికి సశేషమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేడిపండు చూడ మేలిమై ఉండు…. మోడీ ఏలుబడిలో దేశ ప్రతిష్ట పెరిగిందా ? తరిగిందా ?

24 Saturday Jun 2023

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BJP, India press freedom, India’s prestige, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, Narendra Modi marketing


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజు అమెరికా పర్యటన తరువాత ఈజిప్టు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏమి సాధించారో మోడీ మాటల్లో విన్న తరువాత వాటి మంచి చెడ్డల గురించి చూద్దాం. ఏదేశమేగినా ఎందుకాలిడినా మోడీ వెంట మన బడా కొర్పొరేట్‌ పెద్దలు పొలోమంటూ వెళతారు. వెళ్లిన చోట అక్కడి బడా సంస్థల వారితో కొలువు తీరతారు, ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వాటితో మన 140 కోట్ల జనానికి కలిగే లబ్ది ఎంత ? వేళ్ల మీద లెక్కించగలిగిన బడా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కలిగే లాభం ఏమిటి అన్నదాన్ని బట్టే టూరు ఎందుకో అవగతం అవుతుంది. గత తొమ్మిది సంవత్సరాలుగా జరిపిన అన్ని విదేశీ టూర్లను ఈ ప్రాతిపదికగానే చూడాల్సి ఉంది. గతంలో పదేండ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌, ఇతర ప్రధానులు కూడా విదేశాలకు వెళ్లారు. మోడీ మాదిరి పొగడ్తలు, బిరుదులు, ఆహా ఓహౌలను వెంట తీసుకురాలేదన్నది నిజం. ఎవరినైనా కౌగలించుకొనే చొరవ అందరికీ ఉంటుందా ? ప్రపంచంలో నాడున్న పరిస్థితి, అంతర్జాతీయ రాజకీయాలు, వాటిలో భారత నేతలను మునగచెట్టు ఎక్కిస్తే తమకెంత లాభం అన్నదాన్ని బట్టి పొగడ్తలు ఉంటాయి. ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి. గత ప్రధానులను విదేశాల్లో పొగడనంత మాత్రాన మన జనానికి కలిగిన నష్టం లేదు-మోడీని పొగిడినదానికి వచ్చిన లాభమూ లేదు. విదేశాల్లో మోడీ పొందిన బహుమతులను వేలం వేస్తే ఖజనాకు నాలుగు డబ్బులు వస్తాయి. పొగడ్తలను కొనుగోలు చేసే వారెవరూ ఉండరు. వాటిని చూపి ప్రపంచంలో మోడీ హయాంలో దేశ ప్రతిష్ట విపరీతంగా పెరిగిందని బిజెపి నేతలు, మోడీ సర్కార్‌తో అవసరం ఉన్నవారందరూ ఆకాశానికి ఎత్తుతున్నారు. అమెరికా, ఈజిప్టు టూర్‌లో ఇంకెన్ని తీసుకువస్తారో చూడాల్సి ఉంది. రాహుల్‌ గాంధీ బ్రిటన్‌, అమెరికా వెళ్లి మన ప్రభుత్వ విధానాలను విమర్శించి దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చారని బిజెపి నానా రచ్చ చేసింది. మోడీ వెళ్లిన చోట కూడా మన అంతర్గత విధానాలు, వైఖరి గురించి రచ్చ జరుగుతూనే ఉంది. అమెరికాలో కూడా జరిగింది. దాన్ని దేశానికి గౌరవాన్ని తెచ్చినట్లు ఎవరైనా వర్ణిస్తారా ?


గత తొమ్మిది సంవత్సరాలలో మోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారా తగ్గించారా అన్నది ఒక చర్చ. అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ తాజాగా అమెరికా వెళ్లిన మన ప్రధాని గురించి మన టీవీల తీరు తెన్నుల మీద రాసిన కొన్ని అంశాలను చూద్దాం. ” అమెరికాలో అడుగుపెట్టిన బాస్‌, దౌత్య రారాజు, చరిత్ర సృష్టిస్తున్నారు చూడండి, దౌత్యంలో మోడీ వినూత్న పరిణామం ” ఇలా టీవీల శీర్షికలున్నాయి. జో బైడెన్‌, నరేంద్రమోడీ కరచాలనం చేస్తున్న దృశ్యంలో వారి హావ భావాలను చూస్తే ఒకరికొకరు లేకపోతే అసంపూర్ణం అన్నట్లుగా ఉందని ఒక యాంకర్‌ వర్ణించారట.( గతంలో మోడీ-డోనాల్డ్‌ ట్రంప్‌ కౌగిలింతలు, చెట్టపట్టాలు వేసుకు తిరిగినపుడు కూడా చాలా మందికి వారు అలానే కనిపించారు. మోడీ, బైడెన్‌, ట్రంప్‌ మహానటులు అనటంలో సందేహం లేదు) ఎంతో యుక్తితో జాగ్రత్తగా సంప్రదాయ వార్తా సంస్థలతో సంబంధాలను మోడీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రోత్సాహకాలు, వత్తిడి ఎత్తుగడల సమ్మిళితంతో ఎక్కువ సంస్థలను తనవైపు ఉండేట్లు చేసుకున్నారు.ఇబ్బందికరమైన సమస్యలు తలెత్తినపుడు అంటే ఒక రాష్ట్రంలో ఎన్నికల్లో ఓటమి, ఈశాన్య రాష్ట్రంలో తెగల మధ్య తలెత్తిన పోరులో రక్తపాతం, అశాంతి, ప్రాణాంతకమైన మూడు రైళ్ల ఢ వంటి వాటితో మోడీకేమీ సంబంధం లేదని తప్పుదారి పట్టించటంలో అవి వేగంగా ఉంటాయి. మోడీ అమెరికా టూరు గురించి వార్తలు ఇచ్చిన తీరు ఒక వరం. వచ్చే ఏడాది జరగాల్సిన పార్లమెంటు ఎన్నికల్లో తన ప్రచారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన అజెండాను రూపొందించేందుకు తోడ్పడుతుంది అని కూడా ఆ పత్రిక రాసింది. దీన్ని బట్టి జరుగుతున్నదేమిటో చెప్పేందుకు అరటి పండు ఒలిచి చేతుల్లో పెట్టాల్సిన పనిలేదు. కొస మెరుపు ఏమిటంటే బైడెన్‌తో కలసి మోడీ పాల్గొన్న పత్రికా గోష్టిలో భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. దాన్నే ఎంతో ధైర్యంగా ఆప్రశ్నను మోడీ ఎదుర్కొన్నట్లు ఒక హిందీ ఛానల్‌ యాంకరమ్మ వర్ణించినట్లు కూడా అమెరికా పత్రిక పేర్కొన్నది. రాజులు, రంగప్పల ఆస్థానాల్లో ఉన్న భట్రాజులు(కుల ప్రస్తావన, కించపరచటంగా భావించవద్దని మనవి) స్వర్గం నుంచి చూస్తూ తమ స్థానాన్ని ప్రజాస్వామ్యంలో కొందరు టీవీ యాంకర్లు, విశ్లేషకులు భర్తీ చేశారని భావిస్తూ తమ పొగడ్తలతో పోల్చుకొని ఉండాలి.


గతంలో వారం రోజుల పాటు జరిపిన అమెరికా టూర్‌ నుంచి తిరిగి వచ్చిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ తన పాలనలో విదేశాల్లో దేశ ప్రతిష్ట పెద్ద ఎత్తున పెరిగిందని స్వయంగా చెప్పుకున్నారు. అప్పుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు జో బైడెన్‌ ఉన్నాడు. తాజా పర్యటన గురించి ఇంకెన్ని కబుర్లు చెబుతారో చూద్దాం. అమెరికా పార్లమెంటులో మోడీ ప్రసంగంలో 79సార్లు హర్వధ్వానాలు చేశారని, 15సార్లు లేచి నిలిచి చప్పట్లు కొట్టారని, ప్రసంగం ముగిసిన వెంటనే ఎంపీలు మోడీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడినట్లు వార్తలు, దృశ్యాలను చూపారు. భారత సంతతివారు పోటెత్తినట్లు పేర్కొన్నారు.


లండన్‌ కేంద్రంగా ఉన్న హెన్లే పాస్‌ పోర్ట్‌ విశ్లేషణ ప్రకారం 2013లో మన సూచిక 199 దేశాలలో 74లో ఉండగా (52 దేశాలకు ముందుగా వీసాలతో పని లేకుండా వెళ్లి రావచ్చు) అది 2021లో 90కి దిగజారింది. ఆ మధ్యలో ఎగుడు దిగుడులు ఉన్నాయి. ఒక దేశ పాస్‌ పోర్టుతో వీసాలతో నిమిత్తం లేకుండా ఎన్ని దేశాలకు స్వేచ్చగా వెళ్లి రావచ్చు అనేదాన్ని బట్టి ఆ దేశ ప్రతిష్టకు కొలబద్దగా ఈ సూచికను పరిగణిస్తున్నారు. కరోనా కారణంగా అనేక దేశాలు రాకపోకల మీద ఆంక్షలు విధించినందున 2020,21 సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకోనవసరం లేదు. 2023లో మన దేశం ఈ సూచికలో 82వ స్థానంలో ఉంది, 59 దేశాలకు స్వేచ్చగా వెళ్లి రావచ్చు. పెరుగుదల ఏడు దేశాలు మాత్రమే. ఇదే పెద్ద గొప్ప అంటారా? ప్రపంచంలో మన దేశ ప్రతిష్ట పెరిగితే నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ఉన్న స్థానం కంటే ఇప్పుడు ఎందుకు దిగజారినట్లో మోడీ భక్తులు చెప్పాలి. ఈ కాలంలోనే ప్రపంచంలో ఒంటరిదౌతున్నదని చెబుతున్న చైనా రాంకు 82 నుంచి 62కు పెరిగింది. దేశాల సంఖ్య 81గా ఉంది. ఎవరి పలుకుబడి పెరిగినట్లు ? మొదటి మూడు స్థానాల్లో సింగపూర్‌ 194, జపాన్‌ 192,జర్మనీ, దక్షిణ కొరియా,స్పెయిన్‌,ఇటలీ 191 దేశాలతో మూడవ స్థానంలో ఉన్నాయి. మనకు ఎగువన 140కిపైగా దేశాలు మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఇతర అంతర్జాతీయ సూచికల్లో మన స్థానం గురించి వార్తలు వచ్చినపుడు వాటిని మేము గుర్తించం అని బిజెపి సర్కార్‌ చెబుతున్నది. మరి మోడీ దేశ ప్రతిష్టను పెంచినట్లు బిజెపి నేతలు చెప్పేదానికి ప్రాతిపదిక ఏమిటి ? కరోనా నిరోధంలో మోడీ సర్కార్‌ ప్రపంచంలోనే గొప్పగా ప్రశంసలు పొందిందని చెప్పారు, అలాంటపుడు దాని తరువాత వీసా ఆంక్షలను ఇతర దేశాలు మన వారికి ఎందుకు సడలించలేదు ? ఏ దేశమూ వేయనన్ని వాక్సిన్లు వేసినట్లు చెప్పుకుంటారు. ఇంత మంది జనాభా మరో దేశంలో లేదు. మన దేశంలో ఈ ఏడాది జనవరి నాటికి 220 కోట్ల టీకాలు వేస్తే చైనాలో మార్చి 23వ తేదీ నాటికి 351 కోట్లు వేశారు.


ఎన్నికల ప్రజాస్వామ్య సూచికలో మన దేశం అంతకు ముందు ఏడాది వందవ స్థానంలో ఉన్నది కాస్తా 2023లో 108వ స్థానానికి దిగజారినట్లు వి డెమ్‌ (ప్రజాస్వామ్య రకాలు) సంస్థ పేర్కొన్నది.మన కాషాయ దళాలు నిరంతరం పారాయణం చేస్తూ గుర్తు చేసే పాకిస్తాన్‌ మనకు దగ్గరగా 110వదిగా ఉంది. ఎగువన లేకపోవటం మోడీ భక్తులకు కాస్త ఊరట కలిగించే అంశం. నిరంకుశత్వం వైపు వెళుతున్న దేశాల గురించి కూడా ఆ సంస్థ సూచికలను ఇచ్చింది. ప్రపంచ ప్రజాస్వామ్య స్థితి నివేదికల్లో వెల్లడించిన సమాచారం ప్రకారం 1975 నుంచి 1995వరకు మన మార్కులు 59 నుంచి 69కి పెరగ్గా, 2015లో 72, తరువాత 2020లో 61కు తగ్గాయి. ఇలా ఏ సూచికను చూసినా తగ్గుదల తప్ప పెరిగింది లేదు. అలాంటపుడు ప్రపంచ దేశాల్లో మన ప్రతిష్ట పెరుగుతుందని ఎలా నమ్మబలుకుతున్నారో అర్ధం కాదు. సరిహద్దులు లేని విలేకర్ల పేరుతో ఉన్న సంస్థ విడుదల చేసిన సూచిక ప్రకారం పత్రికా స్వేచ్చలో మన స్థానం 2023లో అంతకు ముందున్న స్థితి నుంచి పదకొండు స్థానాలు దిగజారి 180 దేశాలలో 161 దగ్గర ఉన్నాం. మన దేశం ప్రజాస్వామ్య పుట్టిల్లు అని చెప్పిన తరువాత ఉన్న స్థితి ఇది. 2002లో 139 దేశాల్లో 80 మెట్టు దగ్గర ఉంటే 2023నాటికి 81 మెట్లు దిగజారి 180 దేశాల్లో 161 దగ్గర ఉన్నాం. ప్రధాని నరేంద్రమోడీ గద్దె నెక్కినపుడు 140లో ఉన్నాం. తొమ్మిదేండ్లలో మన ప్రతిష్టను మోడీ పెంచారా తగ్గించారా ?


నరేంద్రమోడీ పలుకుబడి అంతగా పెరిగితే పదే పదే ఐరాస సంస్కరణల గురించి చెబుతుంటే విడదీయరాని బంధంలో ఉన్నట్లు చెబుతున్న అమెరికా, ఇతర శాశ్వత దేశాలు భారత్‌కు శాశ్వత ప్రాతినిధ్యం గురించి ఇంతవరకు ఒక నిర్దిష్ట ప్రతిపాదనను ఎందుకు చేయలేదో ఎవరైనా చెబుతారా ? చైనా వీటో చేస్తుందేమో అని కొందరు గొణగవచ్చు, ముందు ప్రతిపాదించాలి గదా ! చైనా మీద ప్రేమతో జవహర్‌లాల్‌ నెహ్రూ మనకు అవకాశం వచ్చినపుడు వదులుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.స్వాతంత్య్రం రాకముందే ఐరాస ఏర్పడిందని, ప్రారంభంలోనే చైనా శాశ్వత దేశమని చరిత్ర తెలియని వారికి ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాదు. ఒక దేశాన్ని తొలగించి తాను ఎవరికి కావాలంటే వారికి ఇవ్వటానికి ఐరాస ఏమైనా అమెరికా జేబు సంస్థా ? దానికి నిర్ణయాత్మక సత్తా, అధికారం ఉంటే ఇప్పుడు ఇమ్మనండి ఎవరు వద్దన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే వారి మీద ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదరించింది. మోడీ పలుకుబడి కారణంగా వెనక్కు తగ్గిందని చెబుతున్నారు, మరి అదే పలుబడి, చాణక్యం భద్రతా మండలి అంశంలో ఏమైంది ? పుతిన్‌ దగ్గర నుంచి చమురు కొని దాన్ని డీజిల్‌, పెట్రోలు, ఇతర ఉత్పత్తులుగా మార్చి అదే అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు గనుక అమెరికా చూసీ చూడనట్లు ఉంటోంది తప్ప మోడీ ఘనత ఏముంది ?


అట్లాంటిక్‌ కౌన్సిల్‌ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో 2033 వరకు అసలు భద్రతా మండలి విస్తరణే ఉండదని 64శాతం మంది చెప్పారు. శాశ్వత సభ్యత్వం భారత్‌కు ఇవ్వాలని 26, జపాన్‌కు 11,బ్రెజిల్‌కు 9, జర్మనీకి 7,నైజీరియాకు 4, దక్షిణాఫ్రికాకు రెండు శాతం మంది మద్దతు తెలిపారు. విస్తరణ అంశం నరేంద్రమోడీతో ప్రారంభం కాలేదు, స్వస్తి పలికే అవకాశమూ లేదు.1990 దశకం నుంచే విస్తరణను అడ్డుకోవాలని కొన్ని దేశాలూ కంకణం కట్టుకున్నాయి. దీన్ని కాఫీ క్లబ్‌ అని నిక్‌నేమ్‌ పెట్టారు. దీన్లో ఇటలీ, ఈజిప్టు, పాకిస్తాన్‌, మెక్సికో, కెనడా, టర్కీ, స్పెయిన్‌, అర్జెంటీనా తదితర దేశాలు ఉన్నాయి. ఏకాభిప్రాయ సాధనతో ఏదైనా జరగాలని ఇవి మోకాలడ్డుతున్నాయి. ఈ పూర్వరంగంలో బ్రెజిల్‌, జర్మనీ, భారత్‌, జపాన్‌ 2005లో జి 4 కూటమిగా ఏర్పడి ఉమ్మడిగా మద్దతు సాధించాలని నిర్ణయించుకున్నాయి. ఈ బృందంలో భారత్‌కు మద్దతు ఇస్తాం గానీ జపాన్ను అంగీకరించేది లేదని గతంలోనే చైనా స్పష్టం చేసింది. ఇప్పుడు సంబంధాలు దెబ్బతిన్న పూర్వరంగంలో పూర్వ వైఖరికి కట్టుబడి ఉంటుందని చెప్పలేము. మొత్తంగా చెప్పాలంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్లుగా నరేంద్రమోడీ రంగంలోకి వచ్చిన తరువాత ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదు. విశ్వగురువు పలుకుబడి పని చేయటం లేదన్నది స్పష్టం.


మోడీ ఏలుబడిలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విమానవాహక యుద్ధ నౌకను ప్రారంభించారని గొప్పగా చెబుతారు. దాని చరిత్రను చూసిన వారెవరూ ఆ ఖ్యాతిని మోడీ ఖాతాలో వేయరు. నౌక రూపకల్పన 1999లో ప్రారంభమై 2022 నాటికి సర్వీసులోకి వచ్చింది. అగ్ని 5 క్షిపణి, ఇస్రో కూడా అలాంటిదే.ఎప్పటి నుంచో ఉన్న కార్యక్రమం అది. వీటి వలన ప్రపంచంలో మన దేశం కూడా అగ్రదేశాల సరసన చేరిందనే పేరు తెచ్చుకుంది. గత ప్రభుత్వాల కొనసాగింపుగా మోడీ సర్కార్‌ కూడా ఈ పధకాలను కొనసాగిస్తున్నది తప్ప మోడీతోనే ప్రారంభమైనట్లు చెప్పుకుంటే ఎలా ? ఇలాంటి వాటిని ఏ దేశమూ స్వల్పకాలంలో సాధించలేదు. కానీ పత్రికా స్వేచ్చ, ప్రజాస్వామ్యం,ఆకలి వంటి అంశాలను మెరుగుపరచేందుకు దశాబ్దాల కాలం అవసరం లేదు. మరి వాటిలో పురోగతి లేకపోగా దేశద్రోహం వంటి చట్టాలు కొనసాగాలని చెబుతుంటే, పరిస్థితులు ఇంకా దిగుజారుతుంటే విదేశాల్లో మన ప్రతిష్ట పెరుగుతుందా ? విదేశాల వారు మరీ అంత అమాయకులా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

విదేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్ల పిట్టకథల వెనుక సిఐఏ హస్తం !

21 Wednesday Jun 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#Anti China, china’s economic growth, CHINESE POLICE STATION, cia, Joe Biden, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఒకటి మాత్రం వాస్తవం. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా తీవ్రత తగ్గిన తరువాత వివిధ దేశాల ఆర్థిక రంగాలు ఎలా కోలుకుంటాయి, ఉక్రెయిన్‌ సంక్షోభం ఎలా ముగుస్తుంది.చైనా ఆర్థిక వ్యవస్థ ఏమౌతుంది అన్నవి ఎక్కువగా చర్చలో ఉన్న అంశాలు.కొద్ది రోజులుగా చైనా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి సోషల్‌ మీడియా, సంప్రదాయ మీడియాలో కూడా కొందరు తెగ స్పందిస్తున్నారు. విదేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్లంటూ ప్రచారం సాగుతున్నది. ప్రపంచ ఆర్థిక రంగంతో చైనా ముడిపడి ఉన్నంతగా ప్రపంచంలో ప్రస్తుతం మరొక దేశం లేదని గ్రహించాలి. 2018 తరువాత తొలిసారిగా చైనా పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చైనా మంత్రి క్విన్‌ గాంగ్‌తో రహస్య చర్చలు జరిపినట్లు జపాన్‌ వార్తా సంస్థ నికెయి పేర్కొన్నది. దాపరికం ఏమీ లేదు, చైనాతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దం అంటూ చొక్కా చేతులు మడుస్తున్న అమెరికా మూసిన తలుపుల వెనుక ఏమి చర్చించి ఉంటుంది. రెండు దేశాల సంబంధాల గురించి సుభాషితాలు చెప్పటం కాదు, ఆచరణలో చూపండి అని చైనా అధినేత షీ జింపింగ్‌ చెప్పినట్లు వెల్లడైంది. మరోసందర్భంలో దాని గురించి చూద్దాం.


చైనా ఆర్థిరంగం మందగించిందంటూ అనేక కథనాలు వెలువడుతున్న తరుణంలో అమెరికా విదేశాంగ మంత్రి బీజింగ్‌ వచ్చాడు. అందరూ చెబుతున్నట్లు నిజంగా ఆర్థికంగా కుంగిపోతుందా ? గడచిన నాలుగు దశాబ్దాలుగా అనేక మంది ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉన్నారు. మరింకేమీ పని లేనట్లు కొందరు వాటిని మన జనానికి సరఫరా గొలుసు ద్వారా పంపిణీ చేస్తున్నారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడిస్తున్నారు. మే నెలలో ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి ప్రభుత్వం వివరాలను వెల్లడిస్తున్నది. మన సర్కార్‌ మాదిరే చైనా కూడా అదే చేసింది. ఏప్రిల్‌ మాసంతో పోలిస్తే ఆర్థికరంగం పురోగతి మందగించిందని పేర్కొన్నది.దాన్ని చూపి ఇంకేముంది ఫినిష్‌ అన్నట్లుగా సంబరపడిపోతున్నారు.వేగం తగ్గటం వేరు, ప్రతికూల వృద్ది నమోదు వేరు. చైనా తనను తాను సమర్ధించుకోగలదు,లోపాలు ఉంటే సరిచేసుకోగలదు. దాన్ని ఎవరూ భుజాన వేసుకొని మోయాల్సిన అవసరం లేదు. వామపక్ష శక్తులే కాదు, ఇతరులకూ అక్కడి పరిణామాల వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారి కోసం కొన్ని మాటలు చెప్పుకోక తప్పదు. అంతర్జాతీయ వాతావరణం ఇప్పటికీ సంక్లిష్టంగాను, తీవ్రంగా ఉందని, ప్రపంచ ఆర్థిక పరిస్థితి స్థబ్దుగా ఉందని, తమ ఆర్థికరంగం సరిగానే కోలుకుంటున్నప్పటికీ, మార్కెట్‌ గిరాకీ ఇంకా తక్కువగా ఉందని చైనా ప్రతినిధి విలేకర్లతో చెప్పారు. ఏ రంగంలో ఎంత పురోగతి ఉంది, దేనిలో ఎంత తిరోగమనం ఉందో కూడా అంకెలను వెల్లడించారు. మందగమనాన్ని అరికట్టి వేగాన్ని పెంచేందుకు ఉద్దీపన పాకేజీ గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానిలో భాగంగానే 2.75 శాతం ఉన్న వడ్డీ రేటును 2.65కు తగ్గించింది.


ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ అనే అంతర్జాతీయ సంస్థ జరిపిన సర్వే గురించి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక ఒక వార్తను ప్రచురించింది. దాని ప్రకారం 74శాతం మంది జీవన వ్యయ పెరుగుదల, తమ వ్యక్తిగత ఆర్థిక స్థితి గురించి ఆందోళన వెల్లడించగా, 63శాతం మంది సేవలు, అత్యవసరం గాని వస్తువుల గురించి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నట్లు చెప్పారట. మరి మన కేంద్ర ప్రభుత్వం పాకేజీలేమైనా ప్రకటిస్తుందా ? ఆరున్నరశాతంగా ఉన్న వడ్డీ రేటును తగ్గిస్తుందా ? ఎందుకంటే చైనా కంటే మన పరిస్థితి మెరుగ్గా వుందని చెబుతున్నారు కదా !చైనాలో వేతనాలు పెరుగుతున్నందున తక్కువ ధరలకు అక్కడ సరకులను ఉత్పత్తి చేసేందుకు వీలు లేని కారణంగా కంపెనీలు మనవైపు చూస్తున్నాయని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఎర్రతివాచీలు పరచి ఏమేమి రాయితీలు ఇచ్చేది చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మి కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. బండి గుర్రానికి గడ్డి చూపించి పరుగెత్తిస్తున్నట్లు తాము సూచించిన సంస్కరణలను అమలు జరిపితే అప్పుల పరిమితి పెంచుతామని చెబుతోంది తప్ప జన జీవన వ్యయ పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వమూ ముందుకు రావటం లేదు, రాష్ట్రాలనూ కోరిన దాఖలాలు లేవేమి ?


చైనా నుంచి తరలి పోతున్నట్లు కొన్ని కంపెనీలు ప్రకటించిన మాట నిజం, అవి మన దేశానికి వస్తాయని చెప్పిన వారి అంచనాలు తప్పిందీ అంతే వాస్తవం.2022 డిసెంబరు నాటికి తొమ్మిది నెలల కాలంలో మన దేశానికి వచ్చిన ఎఫ్‌డిఐలు 36.7 బి.డాలర్లు, అదే అంతకు ముందు ఏడాది వచ్చిన మొత్తం 43.2 బి.డాలర్లని మార్చి 20 వ తేదీ బిజినెస్‌స్టాండర్డ్‌ పత్రిక వార్త పేర్కొన్నది.చైనాలో కూడా ఎఫ్‌డిఐ పెరుగుదల తగ్గినప్పటికీ 2022లో కొత్తగా 18,532 విదేశీ పెట్టుబడి సంస్థలు నమోదైనట్లు, అంతకు ముందేడాదితో పోలిస్తే 38.3 శాతం ఎక్కువని చైనా పేర్కొన్నది. ప్రపంచమంతటా కరోనా లాక్‌డౌన్లు ఎత్తివేసినా చైనాలో 2022 డిసెంబరు వరకు దాదాపు దేశమంతటా సున్నా కోవిడ్‌ కేసులు అనే విధానంలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగింది, తరువాత ఎత్తివేశారు. ఈ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి తిరిగి అనేక రంగాల్లో వినిమయం పెరిగి మే నెలలో తగ్గిందని చెబుతున్నారు. దాన్ని నమ్మటమా లేదా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. అంతర్గత మార్కెట్‌తో పాటు అనేక ధనిక దేశాల్లో తలెత్తిన మాంద్యం కూడా తోడైంది. మన దేశంలో ఈ ఏడాది మార్చినెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటుతో పోలిస్తే వర్తమాన సంవత్సరం రేటు తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అదే చైనాకూ వర్తించుతుంది.


చైనాలో 16-24 సంవత్సరాల వయస్సు గల వారిలో మే నెలలో 20.8శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సర్వే వెల్లడించింది. మన దేశంలో ఎంత ఉందో ప్రభుత్వం ప్రకటించిన దాఖలాల్లేవు. ఇక్కడి పరిస్థితి మామూలేగా, అద్భుతాలు సృష్టిస్తున్నదని చెబుతున్న చైనాలో అలా ఉండటం ఏమిటని కొందరు అమాయకత్వాన్ని నటిస్తారు. చైనా పురోగతి అద్భుతమనటంలో ఎలాంటి సందేహం లేదు. నూటనలభై కోట్ల మంది అవసరాలను తీర్చగల స్థాయికి ఇంకా పెరగలేదు గనుకనే కొన్ని సమస్యలు. వాటిని తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చూస్తున్నదా లేదా లేక మన ప్రధాని చెప్పినట్లు పకోడీ, బజ్జీల బండి పెట్టుకొని ఉపాధి చూసుకోండని గాలికి వదలివేసిందా అన్నదే ప్రశ్న.మన దేశంలో ఏటా 65లక్షల మంది డిగ్రీలు తీసుకొని కాలేజీల నుంచి వెలుపలికి వస్తుంటే చైనాలో దానికి రెట్టింపుగా రికార్డు స్థాయిలో 115.8లక్షల మంది ఈ ఏడాది వచ్చారు. మే నెలలో మొత్తం 3.3 కోట్ల మందికి గాను 2.6 కోట్ల మంది ఏదో ఒక ఉపాధిలో చేరారని, 60లక్షల మంది వేచి ఉన్నారని కూడా చైనా సర్వే పేర్కొన్నది. మన దేశంలోని సిఎంఐఇ సంస్థ పేర్కొన్న సమాచారం ప్రకారం పాతికేండ్ల లోపు యువత మన జనాభాలో 40శాతం ఉన్నారు. వారిలో 2022 డిసెంబరు నాటికి 45.8శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. చైనాలో 20శాతంపైన ఉంటే అక్కడి వారి గురించి కడవల కొద్దీ కన్నీరు కారుస్తున్నవారు మన దేశంలో దానికి రెట్టింపుకు మించి ఉన్నవారి గురించి మాట్లాడరేం ? చైనాలో మే నెలలో నిరుద్యోగులు మే నెలలో 4.1శాతం, అదే మన దేశంలో ఏప్రిల్‌ నెలలో 8.11శాతం ఉంది.


చైనా గడచిన నాలుగు దశాబ్దాలలో అనేక విజయాలతో పాటు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొన్నది. వాటిని అధిగమించి ముందుకు పోతున్నది. ఇప్పుడు కూడా అంతే. అక్కడి నాయకత్వం మరింత పరిణితి చెందింది. కిటికీ తెరిచినపుడు మంచి గాలితో పాటు క్రిమి కీటకాలు కూడా లోనికి వస్తాయి, వాటిని ఎలా అరికట్టాలో మాకు తెలుసు అని సంస్కరణలకు ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ చైనా మార్కెట్‌ను తెరిచేటపుడు చెప్పాడు. ఇప్పుడూ ఎదురైన సవాళ్లను అదిగమించగలదని గత చరిత్రను బట్టి చెప్పవచ్చు. మన దేశంతో సహా విదేశాలలో 110 చైనా పోలీస్‌ స్టేషన్లు అంటూ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తన వ్యతిరేకులను పట్టుకొనేందుకు అనధికారికంగా వాటిని తెరిచిందనే ప్రచారం ఇప్పటికీ సాగుతోంది.దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయమన్నట్లుగా ఈ కట్టు కథలను పిట్ట కతలను నమ్ముతున్నవారు లేకపోలేదు.


తమ రాజధాని సియోల్‌, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న చైనా రహస్య పోలీస్‌ స్టేషన్ల గురించి విచారణ జరుపుతున్నట్లు దక్షిణ కొరియా అధికారులు తాజాగా చెప్పారు. ఒక చైనా రెస్టారెంట్‌ కేంద్రంగా పని చేస్తున్నట్లు గుర్తించారట. స్పెయిన్‌ కేంద్రంగా పని చేస్తున్న సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ అనే ఒక స్వచ్చంద సంస్థ చేస్తున్న ప్రచారం ప్రకారం 53 దేశాల్లో చైనా పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయట.కరోనా మహమ్మారి విజృంభించినపుడు వివిధ దేశాల్లో ఉన్న తమ జాతీయులను స్వదేశానికి రప్పించేందుకు కొన్ని సంస్థలు పని చేశాయి తప్ప పోలీస్‌ స్టేషన్లు లేవని మే 15వ తేదీన చైనా విదేశాంగశాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. చైనా జాతీయులు నిర్వహించే రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థల ముసుగులో పోలీస్‌ స్టేషన్లు నడుపుతున్నారని గత కొద్ది నెలలుగా ప్రచారం చేస్తున్నారు. న్యూయార్క్‌ నగరంలో అలాంటి ఒక పోలీస్‌ స్టేషన్ను పట్టుకున్నామని, 1998 నుంచి పని చేస్తున్న ఒక ధార్మిక సంస్థకు చెందిన ఇద్దర్ని గుర్తించినట్లు అమెరికా పోలీసులు ప్రకటించారు. నగరంలోని చైనీయులకు అవసరమైన సేవలు అందిస్తామంటూ ఆ సంస్థ బహిరంగంగానే మీడియాలో చిరునామాతో సహా ప్రకటనలు జారీ చేసినప్పటికీ అమెరికా పోలీసులు అది రహస్యంగా పని చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశారు. బ్రిటన్‌లో కూడా ఇలాంటివే ఉన్నట్లు సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ చెప్పటంతో మూడు అనుమానిత ప్రాంతాల్లో సోదా చేసిన పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు, చట్ట ఉల్లంఘనలు కనిపించలేదని బ్రిటన్‌ భద్రతా మంత్రి టామ్‌ ప్రకటించాడు.


చైనా పోలీస్‌ స్టేషన్ల ప్రచారం సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ సంస్థ నుంచే జరుగుతోందన్నది స్పష్టం. దీని కథను చూస్తే అది అమెరికా సిఐఏ ఏర్పాటు చేసినది అని స్పష్టం అవుతున్నది. మానవహక్కుల కార్యకర్త పేరుతో స్వీడిష్‌ జాతీయుడైన పీటర్‌ డాహిలిన్‌ చైనాలో 2009లో కుర్ర లాయర్లు, గ్రామీణులకు సాయం చేసే పేరుతో చైనా యాక్షన్‌ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. చేస్తున్న సాయం సంగతి పక్కన పెడితే ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టటం అసలు లక్ష్యంగా వెల్లడి కావటంతో 2016 చైనా అధికారులు డాహ్లిన్‌తో సహా పని చేస్తున్న వారందరినీ పట్టుకొని జైల్లో పెట్టారు. కొందరు కనిపించకుండా పోయారు. డాహ్లిన్‌ కేవలం 23 రోజులు మాత్రమే జైల్లో ఉన్నాడు. తాను చట్టవిరుద్దంగా పని చేశానని అంగీకరించటంతో విడుదల చేసి పది సంవత్సరాల పాటు తిరిగి చైనాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించారు. అప్పటి నుంచి చైనా గురించి ప్రపంచానికి కట్టుకథలు చెప్పటం ప్రారంభించాడు. నేషనల్‌ ఎండోమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ(ఎన్‌ఇడి) అనే పేరుతో పనిచేసే అమెరికా సంస్థ ప్రపంచంలో తప్పుడు ప్రచారం, కట్టుకథలు అల్లే వారికి, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారకులకు పెద్ద మొత్తంలో నిధులు అందచేస్తుంది. దీనికి సిఐఏ మార్గదర్శకత్వం ఉంది. ఆ సంస్థ నుంచి డాహ్లిన్‌ నిధులు పొందినట్లు 2017లో హాంకాంగ్‌ ఫ్రీ ప్రెస్‌ అనే కమ్యూనిస్టు వ్యతిరేక పత్రికతో చెప్పాడు. అమెరికా ఎన్‌ఇడి మాదిరి ఐరోపా ఇఇడి సంస్థ డాహ్లిన్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందచేసింది. ఈ సంస్థలు అనేక దేశాల్లో అక్కడి పాలకుల మీద జనాలను రెచ్చగొట్టి వాటికి రంగుల విప్లవాలని పేరు పెట్టి ప్రచారం చేసిన చరిత్ర ఉంది, ఇప్పటికీ అదే జరుగుతోంది.చైనా గురించి ఎన్నిక కథలు చెప్పినా దాని పురోగతి ఆగటం లేదు, ఆగదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి అజెండాను ముందుకు తెచ్చిన లా కమిషన్‌ : ఏక రూప పౌరస్మృతిని హిందువులందరూ అంగీకరిస్తారా ?

16 Friday Jun 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

BJP, Hindu Code, Hindu Undivided Family, Indian constitution, Law Commission, Muslim Personal Law, Narendra Modi Failures, RSS, Supreme Court, Uniform Civil Code


ఎం కోటేశ్వరరావు


ఏక రూప పౌర స్మృతి గురించి ఆసక్తి ఉన్న వారు నోటిఫికేషన్‌ జారీ చేసిన జూన్‌ 14వ తేదీ నుంచి నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలపాలంటూ ఇరవై రెండవ లా కమిషన్‌ ఒక ప్రకటన చేసింది. అది లేకపోతే దేశం ఇంకేమాత్రం ముందుకు పోదు, తీవ్ర ఆటంకంగా ఉందన్నట్లు కొందరు గుండెలు బాదుకుంటున్నారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నదే కదా దాన్ని అమలు చేస్తామంటుంటే ఎందుకు లేనిపోని దురుద్దేశాలు అంటగడుతున్నారు అంటూ అమాయకత్వాన్ని నటిస్తున్నారు. అదే గనుక వాస్తవమైతే నరేంద్రమోడీ తొమ్మిది సంవత్సరాలుగా ఏం చేస్తున్నట్లు ? చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. లా కమిషన్‌ సరిగ్గా ఇప్పుడు దాన్ని ఎందుకు ముందుకు తీసుకు వచ్చిందన్నది ప్రశ్న. దీని గురించి దాన్ని ఎవరూ సవాలు చేయటం లేదు, విబేధించటమూ లేదు. ఎన్నో తర్జన భర్జనల తరువాత మన దేశంలోని సంక్లిష్ట పరిస్థితుల కారణంగా ఏకాభిప్రాయసాధనతో సాధించాల్సిన అంశంగా పరిగణించి అర్టికల్‌ 44లో ఇతర అదేశిక సూత్రాలలో దాన్ని చేర్చారు. వాటిని కోర్టులు అమలు జరపలేవని కూడా రాజ్యాంగంలో ఉంది. వాటిలో పని హక్కు, నిరుద్యోగ భృతి వంటి వివాదం లేని వాటిని అమలు జరపటం మీద శ్రద్ద లేని బిజెపి వివాదాస్పద ఏక రూప పౌర స్మృతి మీద కేంద్రీకరిస్తున్నది. మతోన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే మెజారిటీ-మైనారిటీ మతశక్తులు రెచ్చిపోతున్న తరుణంలో అనేక అపోహలు ఉన్న ఈ అంశం ఇప్పుడు తక్షణ అవసరం అంటూ బిజెపి ముందుకు తెస్తున్నది.

మహిళల ఉద్దరణ అని చెబుతున్నది. నిజానికి దానికి అంత శ్రద్ద ఉంటే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ ఎందుకు కల్పించలేదు. ఒక ముసాదాను రూపొందించి జనం ముందు ఎందుకు పెట్టలేదు ? త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇరవై రెండవ లా కమిషన్‌ ద్వారా ఒక ప్రచార అస్త్రంగా తన అజెండాను ముందుకు తెచ్చింది.
ఏక రూప పౌర స్మృతి ఈ దశలో అవసరమూ కాదు వాంఛనీయమూ కాదని 2018 ఆగస్టులో ఇరవై ఒకటవ లా కమిషన్‌ విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. ఆ పత్రం విడుదల చేసి మూడు సంవత్సరాలు దాటినందున నాటి నోటిఫికేషన్‌ గడువు ముగిసిందని, వివిధ కోర్టుల ఉత్తర్వులు దీని మీద ఉన్నందున ఈ అంశం మీద కొత్తగా అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నది. అభిప్రాయాలు తప్ప కోర్టు ఉత్తరువులేమీ లేవు.తాజా సేకరణతో ఏమి చేస్తారో చెప్పలేదు. గత కమిషన్‌ 2016 జూన్‌ 17 నోటి ఫికేషన్‌ ద్వారా అభిప్రాయాలను సేకరించింది. వాటిని క్రోడీకరించి కుటుంబ చట్ట సంస్కరణలు పేరుతో 185 పేజీల పత్రాన్ని విడుదల చేసింది. ఏక రూప దేశం అంటే సమరూపత ఉండనవసరం లేదు. మానవహక్కుల అంశంలో ప్రపంచమంతటా ఉన్న వివాదాలు లేని తర్కాలతో మన భిన్నత్వాన్ని సమ్మతింప చేసేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉందని ఆ పత్రం పేర్కొన్నది. వివిధ మతాలకు సంబంధించి పర్సనల్‌ చట్టాల్లో ఉన్న వివక్ష, అసమానతలను ఎదుర్కొనేందుకు ఇప్పుడున్న కుటుంబ చట్టాలను అవసరమైన మేరకు క్రోడీకరించి, సవరించవచ్చని కూడా పేర్కొన్నది. సుప్రీం కోర్టు తన ముందుకు వచ్చిన వివిధ కేసుల విచారణ సందర్భంగా ఏకరూప పౌర స్మృతి అవసరమని అభిప్రాయపడింది. తాజాగా మార్చి 23వ తేదీన వివిధ పిటీషన్ల మీద తీర్పు చెబుతూ ఇలాంటి పిటీషన్లను ఆమోదించి విచారించటం అంటే అలాంటి చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటును ఆదేశించటమేనని, తామాపని చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దీని గురించి తాజాగా ఆలోచించాలని, ఏ చర్యలు తీసుకున్నది కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. 2022 అక్టోబరులో సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్లపై ప్రభుత్వం స్పందిస్తూ మత ప్రాతిపదికన ఉన్న వ్యక్తిగత చట్టాలు దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్నట్లు, ఏకరూప పౌర స్మృతిని తీసుకువస్తామని పేర్కొన్నది.


దేశ ఐక్యతకు, సామాజిక సమతుల్యతకు ముప్పు తెస్తున్న అంశాలలో విద్వేష పూరిత ప్రసంగాలు, ఇతర వివాదాస్పద అంశాలు, చట్టాన్ని కొందరు చేతుల్లోకి తీసుకోవటం, వ్యవస్థల దుర్వినియోగం వంటివి నేడు ప్రధానంగా ముందుకు వచ్చాయి. అలాంటి వారి మీద ఫిర్యాదు లేకున్నా కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఒకటికి రెండుసార్లు చెప్పాల్సి వచ్చింది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే అలాంటి ప్రసంగాలు చేసిన వారి మీద కేసు నమోదు చేసిన వారికి భద్రత లేదన్నది స్పష్టం. ఆదేశిక సూత్రాల్లోని పని, విద్య, నిరుద్యోగ భృతి వంటి హక్కులను అమల్లోకి తెస్తే కరోనాలో వలస కార్మికులు దిక్కులేని చావులకు, ఇబ్బందులకు గురయ్యేవారు కాదు. వలస కూలీలు తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని స్థానికులు దాడులకు దిగేవారూ కాదు.రిజర్వేషన్ల కోసం తన్నుకు చచ్చేవారూ కాదు.తాజాగా మణిపూర్‌ మంటలూ ఉండేవి కాదు, ప్రధాని మోడీ కనిపించటం లేదనే పోస్టర్లూ వెలువడేవి కాదు.


ఏకరూప పౌర స్మృతి అంటే ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి ఎలాంటి మార్పులు చేసేదీ జనంలో చర్చకు పెడితే దాని గురించి ఉన్న అనేక అపోహలు తొలుగుతాయి. ఏమైనా సరే వెంటనే అమలు జరపాలని కోరుతున్న మోడీ సర్కార్‌ గత తొమ్మిది సంవత్సరాలుగా అలాంటిదేమీ తీసుకురాలేదు. రూపు రేఖలు లేని ఒక ప్రతిపాదన మీద అభిప్రాయాలు చెప్పమంటే ఏమి చెబుతారు ? గతంలో చెప్పిన అభిప్రాయాలకు కాలదోషం పట్టిందని వర్తమాన లా కమిషన్‌ ఏ ప్రాతిపదికన నిర్దారించింది. అసలది ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ తప్ప రాజ్యాంగబద్దమైనది కాదు, ప్రభుత్వం దాని ద్వారా అభిప్రాయసేకరణ జరపమని కోరింది గాని రాజ్యాంగ ఆదేశం లేదు. ఏకరూప పౌర స్మృతిని ముస్లింలు లేదా ఏమతం వారైనా ఎలాంటి హేతుబద్దత లేకుండా గుడ్డిగా తిరస్కరించనవసరంలేదు, భిన్న అభిప్రాయం వెల్లడించవచ్చు, ముసాయిదాను ముందుపెడితే వివరణలు కోరవచ్చు.


ఆదేశిక సూత్రాల్లో అనేక అంశాలు ఉన్నప్పటికీ మిగతావాటిని అమలు జరపకుండా ఏకరూప పౌర స్మృతి మీద బిజెపి కేంద్రీకరణ అన్నది ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ఆ మతానికి చెందినవారితో పాటు ఇతర మతాల వారు, మతం, కుల పట్టింపులు లేనివారు కూడా బలంగా నమ్ముతున్నారు. దాన్ని ఏకాభిప్రాయంతో సాధించాల్సి ఉందని అంబేద్కర్‌తో సహా మెజారిటీ భావించిన కారణంగానే ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు పది సంవత్సరాలు చాలని నాడు భావించారు. ఆ లక్ష్యం నెరవేర లేదు గనుక పొడిగిస్తూ వస్తున్నారు. తరువాత ఓబిసిలకూ వర్తింప చేశారు. పౌర స్మృతి మీద ఇప్పటికీ ఏకాభిప్రాయ పరిస్థితి ఉందా అంటే లేదు. అసలు హిందువులందరూ దానితో ఏకీభవిస్తారా అన్నది ప్రశ్న. కర్ణాటకలో ఎక్కువగా ఉన్న లింగాయతుల తమను ప్రత్యేక మతానికి చెందిన వారిగా పరిగణించాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.శైవులు, వైష్ణవులు వారిలో కులాల వారీ భిన్న ఆచారాలు, ఇలా ఎన్నో విభిన్నతలు ఉన్నాయి. వాటన్నింటిలో బిజెపి లేదా కేంద్ర ప్రభుత్వం వేలు బెట్టాలని, ఫలానా పద్దతి పాటించాలని ఆదేశించాలని చూస్తున్నదా ? అందుకే ముసాయిదా చట్టాన్ని ముందుపెడితే ఇలాంటి అనుమానాలకు తెరపడుతుంది లేదా కొత్త అంశాలు ముందుకు రావచ్చు. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే అదేదో ముస్లింలకు సంబంధించిందని అనేక మంది భావించి మద్దతు ఇచ్చారు. రాముడి గుడి కడతామంటే సరే అన్నారు. వ్యక్తిగత అంశాల్లో తమదాకా వస్తే అలాగే ఉంటారా ? ఒక కులానికి చెందిన వారు మరో కులం, మతానికి చెందిన వారిని వివాహం చేసుకోకూడదని తీర్మానాలు చేస్తున్న పంచాయత్‌లు సాగుతూనే ఉన్నాయి.ఎవరికి వారు తమ కులాన్ని, మతాన్ని పవిత్రంగా మార్చాలని చూస్తున్నారు. అలాంటి స్థితిలో అందరూ సమానమే, ఒకటే అనే భావనను అంగీకరిస్తాయా ?


గోవాలో ఏకరూప పౌర స్మృతి అమలు జరుపుతున్నపుడు ఇతర చోట్ల ఎందుకు అమలు జరపకూడదు అని కొందరు వాదిస్తున్నారు. పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా 1961లో దేశంలో విలీనమైంది. అప్పటి వరకు అక్కడ అమల్లో ఉన్న పౌర స్మృతిని మార్చి కొత్త విధానాన్ని వర్తింప చేయాల్సిన అగత్యం తలెత్తలేదు. దాన్నే వర్తింప చేసేందుకు నాడు కేంద్రం అంగీకరించింది, ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అలాంటి చట్టాన్ని మిగతా దేశంలో అమలు జరపవద్దని ఎవరూ అనటం లేదు, బలవంతంగా రుద్దటం గాక అనుమానాలను తీర్చి అమలు జరపాలని చెబుతున్నారు. అందుకు అనువైన వాతావరణం లేదు గనుక తొందరపడవద్దంటున్నారు. మిగిలిన ఆదేశిక సూత్రాలు అమలు జరిపిన తరువాత దీన్ని కూడా చేపట్టవచ్చు. గోవాలో ఉన్న చట్టం ప్రకారం వివాహమైన వెంటనే ఏ మతం వారికైనా భర్త ఆస్తిలో భార్యకు సగం వాటా మీద హక్కు దఖలు పడుతుంది. దేశంలో దాన్ని అమలు చేస్తే ఇప్పుడున్న హిందూ అవిభక్త కుటుంబం, దానితో పాటే ఆ పేరుతో పొందుతున్న పన్ను రాయి రద్దవుతుంది. దీన్ని దేశంలోని హిందువులందరూ సమ్మతిస్తారా ? ఉత్తరాదిన సప్తపది హౌమం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తేనే వివాహం జరిగినట్లు, దక్షిణాదిన అదే హిందువుల్లో ఎవరైనా పాటించ వచ్చు తప్ప విధి కాదు. లేదు. ఇలాంటి అనేక తేడాలు ఉన్నప్పుడు ఏక రూప చట్టం ఎలా ఉంటుందో ఎవరిని ఎలా ప్రభావితం చేస్తుందో, ఎలా స్పందిస్తారో తెలియదు. పంజాబ్‌లో వారసత్వహక్కులు హిందువులకు ఒక విధంగా సిక్కులకు మరొక విధంగా ఉన్నాయి. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం ఆ మతానికి చెందిన పురుషులు నలుగురిని వివాహం చేసుకోవచ్చు, ఆ మేరకు వివాహాలు చేసుకుంటూ హిందువులు మెజారిటీగా ఉన్న దేశాన్ని ముస్లిం మెజారిటీగా మార్చేందుకు కుట్రపన్నుతున్నారంటూ కాషాయదళాలు నిరంతరం చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం తెలిసిందే.


నిషేధం ఉన్నప్పటికీ ముస్లింలలో కంటే హిందువులు, ఇతరుల్లోనే ఎక్కువగా బహుభార్యాత్వం ఉందని గతంలో జరిపిన విశ్లేషణలో తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2005-06 ప్రకారం హిందువుల్లో 1.9, ముస్లింలలో 2.9, ఇతరుల్లో 2.9శాతం ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్నారు. అదే 2019-20 సర్వే ప్రకారం 1.3,1.9,1.6 శాతాలకు తగ్గారు. తగ్గుదల అందరిలోనూ ఉంది. అందువలన ముస్లింలు పనిగట్టుకొని ఎక్కువ మందిని వివాహమాడి పిల్లలను కని దేశాన్ని ఆక్రమిస్తున్నారనే ప్రచారం వాస్తవం కాదు. విద్యలేని వారు, పేదలు, చిన్న వయస్సులోనే వివాహాలు చేసుకున్న వారిలో ఈ దురాచారం ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారిక సర్వే వెల్లడించింది. కులాల వారీ చూసినపుడు తాజా సర్వే ప్రకారం గిరిజనుల్లో 2.4, ఎస్‌సి 1.5, ఒబిసి 1.3, ఇతరుల్లో 1.2శాతం చొప్పున, మతాలవారీ హిందూ 1.3, ముస్లిం 1.9, క్రైస్తవులు 2.1, బౌద్దులు 1.3, సిక్కులు 0.5, ఇతరులు 2.5 శాతం మంది ఉన్నారు. ముస్లింలకు మినహా ఇతరుల్లో ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉండటం నిషేధం. దేశంలో జరిపిన నేషనల్‌ శాంపుల్‌ సర్వే ప్రకారం ఓబిసిలు 40.94, దళితులు 19.59, గిరిజనులు 8.63 శాతం ఉన్నారు. వీరిలో అనేక కులాలు, ఉపకులాలు ఆచారాలు, సాంప్రదాయాలన్నీ ఒకటే కాదు, వీరందరూ హిందువులే, ఎంతో భిన్నత్వం కలిగిన వారందరికీ ఒకే పౌరస్మృతిని అమలు జరిపే ముందు వీరిలో ఉన్న అనుమానాలను తొలగించాలా లేదా ? దానికి మార్గం నమూనా చట్టం జనం ముందు పెట్టటమే.


ప్రస్తుతం వివిధ మతాల వ్యక్తిగత చట్టాల ప్రకారం ఒకే అంశంపై ఏకీ భావం లేదు. ఎవరి భాష్యాలు వారు చెబుతున్నారు. జనంలో అనేక అనుమానాలు, గందరగోళం ఉంది. ఏక రూప పౌరస్మృతిని బిజెపి బలవంతంగా రుద్దాలనుకుంటే ప్రస్తుతం దానికి అడ్డులేదు. పార్లమెంటులో దానికి గుడ్డిగా మద్దతు ఇచ్చే పార్టీలు ఉన్నందున అదేమీ పెద్ద అంశం కాదు. దాన్ని ఒక ఎన్నికల ప్రచార అస్త్రంగా, ముస్లింల మీద విద్వేషాలు, వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకు సృష్టికి, సంతుష్టీకరణకు పూనుకుంది. దీనికి ఇస్లాం లేదా దేశంలోని ముస్లింలు వ్యతిరేకమనే ప్రచారం చేస్తున్నారు. దీనిలో వాస్తవం-వక్రీకరణ రెండూ ఉన్నాయి. ముస్లిం మతశక్తులు గుడ్డిగా సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయి తప్ప సామాన్య ముస్లింలందరూ అలా లేరు, అదే విధంగా హిందూత్వ పేరుతో వీరంగం వేస్తున్న వారు ముస్లింల పట్ల గుడ్డి ద్వేషాన్ని వెళ్లగక్కుతుంటే మొత్తం హిందువులందరూ అలా లేరు. ఏ మతమైనా వర్తమానానికి అనుగుణంగా మారకపోతే మౌఢ్యం పెరుగుతుంది. ఉన్న మతాల్లో హిందూ అని చెబుతున్న అనేక సామ్యాలున్న శైవ, వైష్ణవ ఇతర వివిధ మతాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నందున అనేక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. లేకపోతే జనం మతాలను పక్కన పెట్టేస్తారు. అమెరికా వెళ్లి హిందూమత గొప్పతనం గురించి ప్రసంగించిన స్వామి వివేకానందుడి గురించి గొప్పగా చెబుతారు. సముద్రయానం చేశాడనే కారణంగా తిరిగి వచ్చిన తరువాత అదే హిందూమతం వివేకానంద దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకుంది. ఇటీవలి కాలంలో ఆ మూఢనమ్మకాన్ని సవరించుకొని పరిహారంగా కొన్ని క్రతువులు చేస్తే చాలని సరిపుచ్చుతున్నారు. ఎందుకంటే అనేక మంది స్వామీజీలు విదేశాల సందర్శన సరదాను అణుచుకోలేకపోయారు. మడిని గట్టున పెట్టి వెళ్లారు. సముద్రం దాటిన వారు కులాన్ని కోల్పోతారని శాస్త్రాల్లో రాసి ఉంది మరి. ఎవరైనా కులం పోగొట్టుకున్నవారు ఉన్నారా ? లేకపోగా విదేశాల్లో కూడా కుల గజ్జిని వ్యాపింప చేస్తున్నారు. దేశ పరువును గంగలో కలుపుతున్నారు. ఉన్న మతాలలో తాజాది ఇస్లాం గనుక ఆ మతం మీద ముల్లా ” అగ్రహారికుల ” ప్రభావం ఎక్కువగా ఉంది. వివాహం, విడాకులు, ఆస్తి హక్కులు, సంరక్షణ, దత్తత వంటి అంశాలు ఎంతో సున్నితమైనవి గనుక వాటిని సమానత్వ ప్రాతిపదికన, లింగవివక్ష లేకుండా ఎలా చట్టాన్ని రూపొందించాలన్నది పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అన్ని మతాలూ మహిళను చిన్న చూపు చూసేవే, అణచేందుకు చూసేవే. అందువలన వారికి అనుకూలమైన ఏ చట్టం రూపొందాలన్నా చట్ట సభల్లో వారికి హక్కుగా ప్రవేశించే హక్కు కల్పించటం ముందుగా జరగాలి. అప్పుడే పితృస్వామిక సమాజ పెత్తనాన్ని చట్టబద్దంగా కూడా అడ్డుగోగలరు. అనుమానాలను తొలగిస్తూ, విశ్వాసాన్ని పాదుకొల్పుతూ తేవాల్సిన ఏకరూప పౌరస్మృతిని బిజెపి కోరుకుంటున్నట్లుగా ఏకపక్షంగా రుద్దకూడదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎక్కడైనా బావే గానీ సిఎం కుర్చీ దగ్గర కాదు : మహారాష్ట్రలో బిజెపి, షిండే శివసేన కుమ్ములాట – ముద్దులాట !

14 Wednesday Jun 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BJP-Sena rift, Maharashtra, Narendra Modi Failures, Siva Sena


ఎం కోటేశ్వరరావు


మహారాష్ట్రలో అసలు సిసలు మహత్తర హిందూత్వ శక్తులం, హిందుమత ఉద్దారకులం తామే అంటున్న బిజెపి – షిండే శివసేన నేతలు ఎంతవారలైనా అధికార కాంత దాసులే అన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో సిఎం కుర్చీ కోసం కొట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది.” ఢిల్లీలో నరేంద్రమోడీ – రాష్ట్రంలో ఫడ్నవీస్‌ ” అంటూ బిజెపి ఒక నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానికి పోటీగా ” దేశంలో మోడీ – మహారాష్ట్రలో షిండే ” అంటూ తాజాగా షిండే శివసేన సోమవారం నాటి పత్రికల్లో ఇచ్చిన ప్రకటన రెండు పార్టీల మధ్య కాక పుట్టించింది.మంగళవారం నాడు కొల్లాపూర్‌లో సిఎం ఏకనాధ్‌ షిండే పాల్గొన్న కార్యక్రమాలను దేవేంద్ర ఫడ్నవిస్‌ బహిష్కరించారు, అనారోగ్యసాకు చెప్పినట్లు వార్తలు. దాంతో రెండు పార్టీలు నష్ట నివారణకు పూనుకొని బుధవారం నాటి పత్రికల్లో ఐక్యంగా ఉన్నట్లు కనిపించేందుకు శివసేన మరొక ప్రకటన ఇచ్చింది.” అందరూ ప్రేమించిన అద్భుతమైన బృందం ” అనే శీర్షికతో నష్ట నివారణకు గాను శివసేన మరొక ప్రకటన జారీ చేసింది. దానిలో నరేంద్రమోడీ, అమిత్‌ షా, బాలాసాహెబ్‌ థాకరే, ఆనంద దిఘేల బొమ్మలతో పాటు ఏకనాధ్‌ షిండే -దేవేంద్ర ఫడ్నవిస్‌ ఇద్దరూ జట్టుగా చేతులూపుతున్న చిత్రాన్ని ప్రదర్శించారు. వాటితో పాటు శివసేన ఎన్నికల గుర్తు బాణం, బిజెపి గుర్తు కమలం కూడా చోటు చేసుకుంది. తొలి ప్రకటనలో షిండేకు 26.1శాతం, ఫడ్నవిస్‌కు 23.2 శాతం మద్దతు అని పేర్కొనగా తాజా ప్రకటనలో ఇద్దరికీ కలిపి 49.3 శాతం మద్దతు అని పేర్కొన్నారు. ఈ పరిణామం మిగతా రాష్ట్రాలలో బిజెపితో చేతులు కలిపే ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఒక పాఠంగా పనికివస్తుంది. మరోవైపు కొద్ది రోజుల క్రితం సకాల్‌ అనే మరాఠీ దినపత్రిక వెల్లడించిన ఒక సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్‌సిపిా థాకరే శివసేన పార్టీ (ఎంవిఏ) మెజారిటీ సీట్లను సాధిస్తుంది. నిర్ణీత గడువు ప్రకారమైతే లోక్‌సభ తరువాత వచ్చే ఏడాది అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు, అలాగాక రెండింటినీ కలుపుతారా అన్నది చెప్పలేము.


శివసేనను చీల్చి బిజెపి మద్దతుతో బిజెపి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏదో ఒక అంశం రెండు పార్టీల మధ్య అనుమానాలను పెంచింది. రెండుసార్లు సిఎంగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఉప ముఖ్యమంత్రిగా పెట్టి అసలు కథ నడిపించాలన్నది బిజెపి పన్నాగం. ఏకనాధ్‌ షిండే తాత్కాలికమే, సిఎం పదవి తనదే అన్నట్లుగా ఫడ్నవిస్‌ ” ఢిల్లీలో నరేంద్రమోడీ- రాష్ట్రంలో ఫడ్నవీస్‌ ” అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. దానికి పోటీగా ఏకనాధ్‌ షిండే రంగంలోకి దిగారు. ఒక టీవీ ఛానల్‌-ఒక ఏజన్సీ నిర్వహించిన సర్వేలో తిరిగి సిఎంగా షిండేను కోరుతున్నవారు 26.1శాతం, ఫడ్నవిస్‌ను కోరుతున్నవారు 23.2శాతం అని తేలిందని పేర్కొంటూ శివసేన పేరుతో ఒక ప్రకటన జారీ చేశారు. అంతే కాదు బిజెపికి 30.2శాతం, షిండే సేనకు 16.2శాతం ఓటర్ల మద్దతు ఉందని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో షిండే అమలు జరుపుతున్న పధకాల వలన ప్రజా మద్దతు పెరిగిందని కూడా పేర్కొనటం గమనించాల్సిన అంశం. బాలాసాహెబ్‌ థాకరే ఫొటో లేకుండా ఆ ప్రకటన జారీ చేయటం అంటే మోడీ, అమిత్‌ షాలను చూసి షిండే భయపడుతున్నారని తేలిందని ఉద్ధావ్‌ ధాకరే సేన నేత సంజయ రౌత్‌ ధ్వజమెత్తారు. ఈ ప్రకటనను బట్టి ఏకనాధ్‌ షిండేను సిఎంగా అంగీకరించినట్లేనని ఫడ్నవిస్‌కు ఇది విచారకరమైన రోజని ఎన్‌సిపి స్పందించింది. ఈ ప్రకటన గురించి బిజెపి పెద్దలకు తెలిపామని, వారి అంగీకారంతోనే విడుదల చేసినట్లు షిండే వర్గం చెప్పుకుంది. సిఎంను పొగడటం వరకు ఓకే , ఇద్దరికీ కలిపి ఉన్న బలం గురించి ప్రతిపక్షాలకు చెప్పాలి మనలో ఎవరికి ఎంత బలం ఉందో, తమ నేత ఫడ్నవిస్‌కు జనంలో ఆదరణ లేదని చెప్పటాన్ని అంగీకరించేది లేదని బిజెపి నేతలు మండిపడ్డారు. షిండే తనతో పాటు తీసుకువచ్చిన 40 మంది ఎంఎల్‌ఏల కారణంగానే బిజెపికి అధికారం దక్కిందని గుర్తించాలని షిండే వర్గం తిప్పి కొట్టింది. ఇలాంటి ప్రకటనల రాజకీయాలు కొత్త కాదు. 2019 ఎన్నికల్లో మోడీ దేశానికి దేవేంద్ర రాష్ట్రానికి అంటూ బిజెపి ప్రకటనలు జారీ చేసింది.


షిండే సేన ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలు తమవే అని బిజెపి చెబుతోందని, అదే విధంగా షిండే వర్గానికి చెందిన ఐదుగురు మంత్రులను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మంత్రులు ఉద్దావ్‌ధాక్రేపై తిరుగుబాటులో కీలకపాత్ర పోషించారు. వారి ప్రవర్తనతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని ఫడ్నవిస్‌ ఇటీవల అమిత్‌ షా వద్ద మొరపెట్టుకున్నారని వార్తలు. ఇటీవల ఎవరికి వారు తమ ఎంఎల్‌ఏలతో విడివిడి సమావేశాలు జరపటం, నిధులు సరిగా కేటాయించటం లేదని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నట్లు షిండే కుమారుడు, ఎంపీ డాక్టర్‌ శ్రీకాంత్‌ షిండేపై బిజెపి నేతలు ధ్వజమెత్తారు. శ్రీకాంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కల్యాణ్‌ లోక్‌సభ సీటు తమదే అని కూడా వారు బహిరంగంగా చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో బలపరచకూడదని తీర్మానాలు కూడా చేశారు. ఈ పూర్వరంగంలో అవసరమైతే తాను రాజీనామా చేస్తానని శ్రీకాంత్‌ గతవారంలో ప్రకటించారు. సిఎంగా తండ్రి తీసుకొనే నిర్ణయాల వెనుక కుమారుడి ప్రభావం ఉందన్న పేరుంది. ఏకనాధ్‌ షిండేను అదుపులో ఉంచేందుకు, అవసరమైతే తప్పించేందుకు ఎన్‌సిపి నేత అజిత్‌ పవార్‌కు బిజెపి గాలం వేసింది. రాష్ట్ర రాజకీయాలలో అధికారం కోసం అర్రులు చాస్తారన్న పేరున్న అజిత్‌ బిజెపిలో చేరటం లాంఛనమే అన్న వార్తలు కూడా వచ్చాయి. అదే జరిగితే తాము కూటమి నుంచి తప్పుకుంటామని బిజెపిని షిండేసేన హెచ్చరించింది. అజిత్‌ పవార్‌ గతంలో బిజెపితో చేతులు కలిపి దొంగచాటుగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 80 గంటల తరువాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష కూటమి నేతగా ఉన్నారు.


మరాఠీ పత్రిక సకాల్‌ ఇటీవల ప్రకటించిన సర్వే ప్రకారం మహారాష్ట్రలో నరేంద్రమోడీని ప్రధానిగా కోరుకుంటున్నవారు 42.1శాతంగా కాగా వద్దన్నవారు 41.5శాతం ఉన్నారు. మిగిలిన వారు చెప్పేందుకు నిరాకరించటం లేదా తెలియదని చెప్పారు. దాదాపు 70శాతం మంది ఆర్థిక రంగంలో మోడీ విఫలం చెందినట్లు పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ తరువాత ఎక్కువ 48 స్థానాలున్న ఇక్కడ మోడీ పట్ల అనుకూలత ఎంతో ప్రతికూలత కూడా అంతే ఉంది. కోర్టులో శివసేన పేరు, గుర్తును షిండే వర్గం దక్కించుకోవచ్చుగానీ ఈ సర్వే ప్రకారం ఓటర్లు 12.5శాతం మంది ఉద్దావ్‌ ధాక్రే శివసేనకు మద్దతు ప్రకటిస్తే కేవలం 5.5శాతమే షిండేకు అనుకూలమని చెప్పారు. బిజెపికి 33.7శాతం మొగ్గుచూపారు. బిజెపి కూటమికి 39.2 శాతం మద్దతు పలకగా ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్‌సిపి, ఉద్దావ్‌ శివసేన కూటమికి 48శాతం మంది అనుకూలం అన్నారు. అరమరికలు లేకుండా ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఓటు బదిలీ చేసుకుంటే బిజెపి శంకరగిరి మాన్యాలు పడుతుందని అంకెలు చెబుతున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్‌-ఎన్‌సిపి ఒక కూటమిగా పోటీ చేశాయి. బిజెపికి 27.84, శివసేనకు 23.5, కూటమికి 51.34 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌, ఎన్‌సిపిలకు 16.41,15.66 మొత్తం 32.07శాతం రాగా 47 చోట్ల బరిలోకి దిగిన వంచిత్‌ బహుజన్‌ అగాధీకి 6.92 శాతం దానితో కలసి ఒక చోట పోటీ చేసి దాన్ని గెలుచుకున్న మజ్లిస్‌కు 0.73 ఓట్లు వచ్చాయి. వంచిత్‌ బహుజన్‌ అగాధీ ప్రస్తుతం ఉద్దావ్‌ శివసేనకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2019 అక్టోబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, శివసేన కూటమికి 25.75,16.41 చొప్పున మొత్తం 42.16 శాతం మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌, ఎన్‌సిపి కూటమికి 15.87, 16.71 చొప్పున, మొత్తం 32.58 శాతం వచ్చాయి. ఇక కుమ్ములాటలు-ముద్దులాటలుగా ఉన్న బిజెపి-షిండే సేన కూటమి తాత్కాలికంగా కలసి ఉన్నట్లు కనిపించేందుకు పూనుకున్నప్పటికీ అధికార కుమ్ములాటలు,పరిణామాలు ఏ రూపం తీసుకొనేది చెప్పలేము.కలసి ఉన్నా ఎంవిఏ కూటమిని ఎంత మేరకు ఎదుర్కొనేది ప్రశ్నార్ధకమే.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 239 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d