• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: WAR

ఉక్రెయిన్‌ సంక్షోభం : అలాస్కా సమావేశ ఆంతర్యం ఏమిటి ? జెలెనెస్కీతో చర్చలకు తొందరేం లేదన్న రష్యా !

20 Wednesday Aug 2025

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Alaska meeting, Donald trump, Ukrain failures, Ukraine, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పిన డోనాల్డ్‌ ట్రంప్‌ గద్దె నెక్కి రెండు వందల రోజులు దాటింది. అడుగు ముందుకు పడకున్నా తాజాగా ఇదిగో పరిష్కారం అంటూ యావత్‌ ప్రపంచ దృష్టిని అటువైపు తిప్పాడు. తాజాగా అమెరికాలోని అలాస్కాలో గత శుక్రవారం నాడు జరిగిన ట్రంప్‌ మరియు పుతిన్‌ భేటీ వార్త సేకరణకు భారీ సంఖ్యలో వచ్చిన మీడియా సిబ్బందే దానికి నిదర్శనం. అంతకు ముందు వరకు కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం ముందు జరగాలంటూ చెప్పిన పెద్దమనిషి అలస్కా సమావేశం తరువాత అలాంటివేమీ లేవు. ఏకంగా పరిష్కారానికి మరోసారి మాస్కోలో సమావేశమని ప్రకటించాడు. చిత్రం ఏమిటంటే సోమవారం నాడు ట్రంప్‌తో భేటీ అయిన ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ మర్యాదల ప్రకారం గతానికి భిన్నంగా కోటు ధరించి వచ్చాడు. గతంలో ట్రంప్‌తో సమావేశానికి ఒక సాధారణ పౌరుడి మాదిరి దుస్తులు రావటంతో అవమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. జెలెనెస్కీని ట్రంప్‌ ఎక్కడ బుట్టలో వేస్తాడో తమతో నిమిత్తం లేకుండా ఒప్పందం కుదుర్చుకుంటారేమో అన్న భయం లేదా ముందు చూపుతో అనేక మంది ఐరోపా నేతలు కూడా కట్టగట్టుకు వచ్చి ట్రంప్‌తో చర్చలు జరిపారు.వారితో మాట్లాడుతూనే కాసేపు ఉండండి అన్నట్లు అంతరాయమిచ్చి పుతిన్‌తో ఫోన్లో మాట్లాడి తన ప్రాధాన్యత ఏమిటో వారికి అవగతమయ్యేట్లు చేశాడు.దానికి అనుగుణంగానే ఐరోపా నేతలు కూడా తమ మర్యాదను కాపాడుకుంటూ ట్రంప్‌ యత్నాలను హర్షిస్తూనే నర్మగర్భంగా తమ భిన్నాభిప్రాయాలను వెల్లడిరచారు. భద్రత అన్న తరువాత మేం లేకుండా పుతిన్‌, జెలెనెస్కీ, ట్రంప్‌ ముగ్గురూ మాట్లాడుకుంటే సరిపోతుందా, నాలుగు పక్షాల సమావేశం జరగాలనే సందేశాన్ని వారు కూడా ఇచ్చారు.ఈ నెలాఖరులో సమావేశం ఎక్కడ జరగాలనే అంశంపై కసరత్తు ప్రారంభమైంది. అది కూడా గత సమావేశాల మాదిరే విఫలయత్నం అవుతుందా నిజంగానే రాజీ కుదిరేందుకు వేదిక అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. సోమవారం నాటి ట్రంప్‌ ఫోన్లో మాట్లాడినపుడు నేరుగా ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు పుతిన్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే మంగళవారం నాడు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లోవరోవ్‌ మాట్లాడిన తీరు చూస్తే చర్చలు వెంటనే జరిగే అవకాశం లేదని తేలిపోయింది. క్రమంగా నిపుణుల స్థాయిలో మొదలై తరువాత దశలవారిగా చర్చలు జరగాలని లోవరోవ్‌ చెప్పాడు.ఐరాసలో రష్యా ప్రతినిధి దిమిత్రి పోలియానిస్కీ మాట్లాడుతూ చర్చల కోసం చర్చలు జరగకూడదని వ్యాఖ్యానించాడు.


అలాస్కా సమావేశం తరువాత కొన్ని సరికొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.చైనా మరియు రష్యాల మధ్య ఉన్న బంధాన్ని తెంచేందుకు అమెరికా పూనుకుందన్నది వాటిలో ఒకటి.ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైటు వెలుగుతుందన్నట్లుగా దీనికి ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారం నాంది పలుకుతుందా ! దీనర్ధం వెంటనే ఏదో జరుగుతుందని కాదు గానీ మాజీ కమ్యూనిస్టు మహాప్రమాదకారి అన్నట్లుగా పుతిన్‌ తీరుతెన్నులను ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిందే. వర్తమాన అంశానికి వస్తే మీడియాలో వస్తున్న లీకు వార్తలు, విశ్లేషణలను చూస్తుంటే మొదటి నుంచి రష్యా చెబుతున్నట్లుగానే దాని షరతులు, వైఖరికి అనుగుణంగానే ఒక పరిష్కారం కుదరవచ్చు అనే భావం కొందరిలో కలుగుతోంది. నిజంగా అలా జరిగితే ఐరోపాలో, ప్రపంచంలోనే సరికొత్త సమీకరణలు, పరిణామాలకు, మరింత పెద్ద సంక్షోభాలకు అది నాంది అవుతుంది. తాజా పరిణామాలు, విశ్లేషణలను చూసినపుడు మొత్తం మీద వ్లదిమిర్‌ పుతిన్‌ కూడా ఆశాభావంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకుల వ్యాఖ్య. ఇప్పటికే ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పుతిన్‌కు యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే రాజకీయ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి.అందువల్లనే అతనికీ పరిష్కారం అవసరం.


ట్రంప్‌ యంత్రాంగం రూపొందించినట్లు చెబుతున్న పరిష్కార పద్దతి ప్రకారం ప్రస్తుతం రష్యా స్వాధీనంలో లేని కొన్ని ప్రాంతాలతో సహా డాన్‌బాస్‌ ప్రాంతంలో 6,600 చదరపు కిలోమీటర్లు లేదా 12శాతం భూభాగాన్ని ఉక్రెయిన్‌ వదులుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రతిగా సుమీ, ఖార్కివ్‌ ప్రాంతాలలో 440 చదరపు కిలోమీటర్లను రష్యా ఖాళీ చేసి ఉక్రెయిన్‌కు ఇస్తుంది. ఇదే జరిగితే రష్యాదే పైచేయి అవుతుంది, దాని షరతుల ప్రాతిపదికగానే ఒప్పందం ఉంటుంది. ఇంతవరకు ఏ ఒక్క అంశం మీద కూడా పుతిన్‌ దిగిరాలేదు.ఈ పూర్వరంగంలో అమెరికా ప్రతిపాదనలకు ఉక్రెయిన్‌ అంగీకరిస్తుందా, ఒకవేళ అమెరికా జెలెనెస్కీ మెడలు వంచి ఒప్పించినా ఐరోపా అగ్రదేశాలు తలూపుతాయా, చెప్పలేము. తెల్లవారే సరికి వైఖరులు, పరిణామాలు మారిపోతున్న ఈ రోజుల్లో రష్యా గడ్డమీద తలపెట్టిన తదుపరి భేటీలోపల ఏమైనా జరగవచ్చు.మిలిటరీ దళాల రంగ ప్రవేశంతో సహా ఉక్రెయిన్‌కు ఐరోపా భద్రత కల్పించేందుకు పుతిన్‌ అంగీకరించవచ్చని ట్రంప్‌ యంత్రాంగం చెబుతోంది. దీని మీద పుతిన్‌ వైపు నుంచి ఇది రాస్తున్న సమయానికి ఎలాంటి ప్రతికూల లేదా అనుకూల స్పందనలు లేవు. ఒక వారంలోపే ఒప్పందం జరగాలని ట్రంప్‌ పట్టుబడుతుండగా అదెలా కుదురుతుంది, మంచి చెడ్డలు ఆలోచించటానికి కొన్ని వారాల వ్యవధి కావాలని ఐరోపా నేతలు చెబుతున్నారు.


పరిష్కారం కుదరాలంటే ముందుగా డాంటెస్క్‌, లుహానస్క్‌ ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ వెనక్కు పోవటం తనకు ముఖ్యమని, అది చేస్తే మిలిటరీ చర్య నిలిపివేస్తానని శుక్రవారం నాటి చర్చలలో పుతిన్‌ స్పష్టం చేశాడట.జూన్‌ రెండవ తేదీన ఇస్తాంబుల్‌ సమావేశంలోనే దీన్ని రష్యా ప్రతినిధులు చెప్పారు.దీనితో పాటు క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా అంతర్భాంగా గుర్తించటం, ఉక్రెయిన్‌ మిలిటరీ సంఖ్య తగ్గింపు, ఇతర ప్రాంతాల గురించి కూడా దానిలో పేర్కొన్నారు. రష్యన్లు మరీ ఎక్కువగా అడుగుతున్నారని, దాన్లో వారి స్వాధీనంలో లేని ప్రాంతాలు కూడా ఉన్నాయిని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ వ్యాఖ్యానించటమే కాదు, ఉక్రెయిన్‌ కూడా అంగీకరించలేదు. గతంలో పేర్కొన్న నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ మిలిటరీ ఉపసంహరణ బదులు రెండు ప్రాంతాల గురించి పుతిన్‌ పట్టుబట్టినట్లు వార్తలు. ఉక్రెయిన్‌ భద్రతకు హామీకి తాను అంగీకరిస్తానని అయితే వివిధ దేశాలతో కూడిన అలాంటి వ్యవస్థలో తనకు వీటో అధికారం ఉండాలని రష్యా కోరింది.


శుక్రవారం నాటి చర్చలలో భద్రత గురించి చర్చ వచ్చింది తప్ప అది ఎలా అన్నది తేలలేదు. దీని అర్ధం ఏమిటి ? ఒక ఆలోచన ప్రకారం ఒక వేళ ఉక్రెయిన్‌ మీద తిరిగి రష్యా దాడి చేస్తే భద్రతకు హామీ ఇచ్చిన వారు ఐరోపా వారైతే అమెరికా మద్దతు లేకుండా రష్యా మీద ప్రతిదాడులు జరపవచ్చు. అలాంటి ఒప్పందం కుదిరితే అది అమెరికా మరియు ఐరోపా మధ్య అంతరాన్ని పెంచేందుకు, నాటో కూటమిని పూర్తిగా దెబ్బతీసేందుకు రష్యా వినియోగించుకోవచ్చని యూరోపియన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరొక దృశ్యం ప్రకారం ఉక్రెయిన్‌ భద్రతకు హామీదారుగా ఉన్న ఐరోపా దేశాలపై రష్యా దాడికి పూనుకుంటే ఐరోపాకు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగుతుంది. మూడవ దృశ్యం ప్రకారం భద్రతగా ఉండే ఐరోపా దేశాల మిలిటరీ ఉక్రెయిన్‌లో ఉన్నప్పటికీ రష్యా మీద దాడికి దిగదు, ఉక్రెయిన్‌ మిలిటరీకి అవసరమైన శిక్షణ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు పరిమితంగా అదే చేస్తున్నారు. ఒకవేళ మరోసారి రష్యా దాడికి దిగితే ఇతర దేశాల మిలిటరీ సురక్షితంగా వెనక్కు పోయేందుకు అమెరికా రంగంలోకి దిగుతుంది. ఇవన్నీ పరిపరి విధాల ఊహాగానాలు మాత్రమే.


తమతో భాగస్వామిగా చేసుకొని ప్రపంచ మార్కెట్లపై పెత్తనం చేయాలని జి7 కూటమి ఎనిమిదవ దేశంగా రష్యాను చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే విబేధాలు తలెత్తి రష్యాను పక్కన పెట్టటం, ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వమిచ్చి మాస్కో ముంగిట ఆయుధ మోహరింపుకు పశ్చిమదేశాలు కుట్రపన్నిన తరువాతే గతంలో తన ప్రాంతంగా ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా 2014లో విలీనం చేసుకుంది. సోవియట్‌ ఉనికిలో ఉన్న సమయంలో పాలనా సౌలభ్యం కోసం రష్యన్‌ రిపబ్లిక్‌ ప్రాంతమైన క్రిమియాను ఉక్రెయిన్‌లో కలిపారు. సోవియట్‌ పతనమైన తరువాత రెండూ స్వతంత్ర దేశాలుగా మారినప్పటికీ 24 సంవత్సరాలు రష్యా వైపు నుంచి విలీనానికి ఎలాంటి ప్రయత్నాలు లేవన్నది గమనించాల్సిన అంశం. తమకు విశ్వసనీయమైన భద్రతా హామీ ఇవ్వాలని జెలెనెస్కీ పట్టుబడుతున్నాడు. ఇటీవలి కాలంలో అమెరికా వైఖరిలో వచ్చిన మార్పు ప్రకారం ఆయుధాలు ఎన్నికావాలంటే అన్ని ఇస్తుంది, అవసరమైతే వైమానిక దాడులు జరుపుతుంది తప్ప తన మిలిటరీని కొత్తగా మరేదేశంలోనూ దించేందుకు సిద్దం కావటం లేదు. అందువలన ఐరోపా దేశాలతో కలసి రక్షణ కల్పించేందుకు ట్రంప్‌ అంగీకరించే అంశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు.తనకు వ్యతిరేకంగా పశ్చిమదేశాల కుట్రకు ఉక్రెయిన్‌ దూరంగా ఉంటే అన్ని రకాల భద్రత కల్పించేందుకు అసలు రష్యానే సిద్ధంగా ఉంటుందన్నది వేరే చెప్పనవసరం లేదు. రష్యాకు కొన్ని ప్రాంతాలను అప్పగిస్తే యుద్ధం ఆగిపోవచ్చుగానీ జెలెనెస్కీ పదవీ గండం పొంచి ఉంటుంది. జరిగే ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు చెప్పలేము గానీ అతగాడు గెలిచే సమస్యే లేదు. మంత్రులు, ఉన్నతాధికారులు యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా సంపాదించారనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. భవిష్యత్‌లో రష్యాకు ముప్పు తలెత్తకుండా చూసేందుకు ఇప్పటి వరకు ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను సాధించకుండా ఒప్పందం చేసుకుంటే పుతిన్‌కూ అదే పునరావృతం అవుతుంది. ఇన్ని ప్రాణాలను బలి ఇచ్చి ఆర్థికంగా నష్టం కలిగించటం ఎందుకన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. రష్యాది పైచేయిగా మారితే ట్రంప్‌ కూడా ఇబ్బందుల్లో పడతాడు, వెంటనే ఎన్నికలు లేవు, వచ్చేసారి పోటీ చేస్తాడో లేదో తెలియదు గనుక వ్యక్తిగతంగా కలిగే నష్టం ఉండదు గానీ, ఐరోపాలో ఉన్న పలుకుబడిని అమెరికా కోల్పోవటం ఖాయం, దాని ప్రభావం మొత్తం ప్రపంచం మీదనే పడుతుంది.


విడివిడిగా అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోలేమన్న వాస్తవాన్ని గ్రహించిన ఐరోపా దేశాలు సమాఖ్య (ఇయు)గా ఏర్పడి, ఐక్యత మరియు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఇతర దేశాల మీద పన్నుల దాడిని ప్రకటించినట్లే ట్రంప్‌ ఈ కూటమితో కూడా వ్యవహరించి వత్తిడి చేసి ఒక ఒప్పందానికి వచ్చాడు.మరోవైపున జర్మనీ వంటి దేశాలు భారీ ఎత్తున సైనికీకరణకు పూనుకున్నాయి. గతంలో సోవియట్‌ను, గతమూడున్నరదశాబ్దాలుగా రష్యాను చూపి బెదిరించిన అమెరికా ఇప్పుడు ఆ రష్యాతోనే చేతులు కలిపి మరో రూపంలో ఐరోపాను అదుపులో ఉంచుకోవాలని చూస్తోందా అనే కోణాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది.గతంలో సోవియట్‌ మరియు చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య తలెత్తిన సైద్దాంతిక విబేధాలను ఉపయోగించుకొని లబ్దిపొందేందుకు చూసింది. ఒకటి రాజకీయ, రెండవది చైనా మార్కెట్లో ప్రవేశించి ఆర్థిక లబ్ది.తైవాన్‌ బదులు కమ్యూనిస్టు చైనాకు భద్రతామండలిలో శాశ్వత సభ్వత్యం కల్పించటాన్ని సైద్దాంతిక విబేధాలున్నా నాటి సోవియట్‌ వ్యతిరేకించలేదు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే రష్యా మరియు చైనా నేడు మిత్రదేశాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో పుతిన్‌ కమ్యూనిస్టు కాదు, రష్యా సోషలిస్టు దేశం కాదు.ఈ రెండో అంశాన్ని ఉపయోగించుకొని మిత్రబేధంతో రష్యాను దగ్గరకు తీసుకోవాలని, దాని వనరులు, మార్కెట్‌లో లబ్ది పొందాలని కొందరు అమెరికన్లు కోరుతున్నారు. ఇందుకు ఉక్రెయిన్‌ సంక్షోభం ఆటంకంగా ఉంది గనుక దాన్ని పరిష్కరించాలని వారు చెబుతున్నారు. ఈ పూర్వరంగంలోనే ఎరగా ఉక్రెయిన్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ అంటున్నారు. అయితే అదే జరిగితే ఐరోపాలోని ధనికదేశాలు చైనాతో జట్టుకట్టే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేము. పెట్టుబడిదారులకు లాభాలు తప్ప శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పుతిన్‌ తక్షణ ఆలోచన యుద్ధం నుంచి బయటపడి తద్వారా ఆర్థిక ఆంక్షల బంధాలను బద్దలు కొట్టటం గనుక ఆ కోణంలో దాని మీద కేంద్రీకరించవచ్చు.అమెరికా మద్దతు లేకపోయినా ఐరోపా దేశాలు ఇచ్చే ధైర్యం, ఆయుధ సాయంతో నిలవగలమని ఉక్రెయిన్‌ భావిస్తే వెంటనే ఒప్పందానికి అంగీకరించకపోవచ్చు. లేకపోతే ముందే చెప్పుకున్నట్లు రష్యా షరతుల మీద రాజీకి రావచ్చు కూడా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచమా గాజాను మరచిపోవద్దు : ఇజ్రాయెల్‌ దాడిలో ప్రాణాలు వదలిన ఓ జర్నలిస్టు ఆఖరి కోరిక !!

13 Wednesday Aug 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Don’t forget Gaza, Gaza Deaths, Israel genocide, Netanyahu, Palestine Journalist Anas al-Sharif, Palestinian People


ఎం కోటేశ్వరరావు


2023 అక్టోబరు ఏడున గాజాలో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన మారణకాండ మరోదశలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. హమస్‌ను అంతమొందించేందుకు గాజా స్వాధీనం తప్పదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ఇప్పటి వరకు 75వేల మంది వరకు నిరాయుధులైన పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ మిలిటరీ చంపివేసింది. వీరిలో సగానికి పైగా పిల్లలు, మహిళలు ఉన్నారు. దాదాపు రెండు లక్షల మందిని గాయపరిచారు, లక్షలాది ఇండ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలను నేలమట్టం గావించారు. అయినప్పటికీ హమస్‌, ఇతర సాయుధ బృందాలను పట్టుకోవటంలో విఫలమైంది. వారిని పట్టుకోవాలంటే గాజాను పూర్తిగా తన స్వాధీనంలో తెచ్చుకోవాలని ఇజ్రాయెల్‌ చెబుతోంది. నిజానికి ఒక విధంగా గాజా ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆక్రమణలోనే ఉంది. ఆకలితో మాడుతున్న పసిపిల్లలకు అవసరమైన ఆహారసాయాన్ని కూడా రాకుండా మిలిటరీ అడ్డుకుంటున్నది, సహాయ శిబిరాల వద్దకు వచ్చిన వారిని కూడా చంపివేస్తున్నది. ప్రపంచంలో అనేక యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో వార్తలను సేకరించే జర్నలిస్టులకు రక్షణ ఉంటుంది, ప్రమాదవశాత్తూ గాయపడటం, మరణించటం వేరు. కానీ గాజాలో ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను ఇజ్రాయెల్‌ బలగాలు చంపివేశాయి. తాజాగా అల్‌ జజీరా టీవీ, పత్రికలకు వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను హతమార్చారు, ఏమిటంటే వారంతా హమస్‌ సాయుధులతో కలసి ఉన్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. అనాస్‌ అల్‌ షరీఫ్‌ అనే ఆల్‌ జజీరా విలేకరి తన కుటుంబం, ప్రపంచానికి ఎక్స్‌ ద్వారా ఒక చివరి సందేశం పంపాడు.‘‘ ఇది చివరి వర్తమానం, మీకు అందే సమయానికి ఇజ్రాయెల్‌ నన్ను చంపివేస్తుంది, నా గళాన్ని అణచివేస్తుంది, ప్రపంచం గాజాను మరచిపోవద్దు ’’ అని దానిలో ఉంది. ఆదివారం రాత్రి అది నిజమైంది. గాజాలోని ఆల్‌ షిఫా ఆసుపత్రి సమీపంలో జర్నలిస్టులు ఉన్నారనే చిహ్నాలు ఉన్న గుడారాన్ని లక్ష్యంగా చేసుకొని జరిపిన వైమానిక దాడిలో అల్‌ షరీఫ్‌తో పాటు తమ జర్నలిస్టులు మరో నలుగురితో సహా ఏడుగురిని చంపినట్లు అల్‌ జజీరా తెలిపింది.


ఓ జర్నలిస్టు చివరి సందేశం
అనాస్‌ అల్‌ షరీఫ్‌ చివరి సారిగా ఎక్స్‌లో పంపిన వర్తమానం ఇలా ఉంది.‘‘ ఇది నా వాంఛ మరియు చివరి వర్తమానం. ఇది మీకు చేరేలోపు ఇజ్రాయెల్‌ నన్ను చంపటంలో జయప్రదం అవుతుంది, నా గళం మూగపోయేట్లు చేస్తుంది. మొదటిది మీకు శాంతి చేకూరాలి, అల్లా దయ మరియు దీవెనలు మీకు కలగాలి. జబాలియా శరణార్ధి శిబిరంలో నేను జన్మించి కళ్లు తెరిచినప్పటి నుంచి అక్కడి వీధులు, సందుల్లో తిరుగాడుతూ నా జనం కోసం గళం విప్పి మద్దతు ఇచ్చిన ప్రతి అంశం గురించి అల్లాకు తెలుసు. మా స్వంత పట్టణమైన ఆక్రమిత అస్కలాన్‌( అల్‌ మజదాల్‌)కు తిరిగి వచ్చేందుకు అల్లా నా జీవితాన్ని పొడిగిస్తాడని ఆశిస్తున్నాను, అందువలన నేను నాకుటుంబం, ప్రేమించేవారిని కలుసుకొనేందుకు తిరిగివస్తాను. అయితే అల్లా వాంఛ ముందు మరియు ఆయన ఆదేశమే అంతిమం.
నేను బాధల మధ్యనే జీవించాను, అనేక నష్టాలు, ఇబ్బందులను చవిచూశాను. అయినప్పటికీ ఎలాంటి వక్రీకరణలు, తప్పుడు సమాచారం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నిజాన్ని చేరవేసేందుకు ఒక్కసారి కూడా నేను వెనుకాడలేదు.ఏడాదిన్నరకు పైగా మన జనాలు ఎదుర్కొంటున్న ఊచకోతను ఆపేందుకు ఏమీ చేయని వారిని, మన పిల్లలు, మహిళల శరీరాలు ఛిద్రమైనా చలించని హృదయాలు కలవారిని, మౌనంగా దూరంగా ఉన్నవారిని, మన హత్యలను ఆమోదించిన వారిని, మన శ్వాసను ఆడనివ్వని వారిని అందరినీ అల్లా చూస్తున్నాడు.
ముస్లిం సమాజ కిరీటంలో మణి, ఈ ప్రపంచంలోని ప్రతి స్వేచ్చా జీవి గుండె చప్పుడు వంటి పాలస్తీనాను మీకు అప్పగిస్తున్నాను. దాని జనాన్ని, తప్పు చేసిన వారినీ, రక్షణ, శాంతిలేకుండా జీవించేందుకు లేదా కలలు కనేందుకు కూడా ఎన్నడూ సమయంలేని అమాయకులైన పిల్లలతో పాటు మీకు అప్పగిస్తున్నాను. వేలాది టన్నుల ఇజ్రాయెలీ బాంబులు, క్షిపణులతో నిర్మలమైన వారి శరీరాలు నలిగిపోయాయి, ఛిద్రమైన వారి భాగాలు అంతటా పడ్డాయి. బంధనాలు మిమ్మల్ని మౌనంగా ఉంచలేవు, సరిహద్దులు ఏమీ చేయలేవు. అపహరించిన మన మాతృభూమిలో స్వేచ్చ, హుందాతనపు సూర్యుడు ఉదయించే వరకు మన భూమి, పౌరుల విముక్తి కోసం మీరు వారధులుగా మారండి.
నా కుటుంబ మంచిచెడ్డలను మీకు అప్పగిస్తున్నాను. నేను కలలు కన్నవిధంగా నా కుమార్తె షామ్‌ ఎదగటాన్ని చూసే అవకాశం నాకు రాలేదు. నాకళ్ల వెలుగైన ఆమెను మీకు అప్పగిస్తున్నాను. నా భారం మోసేంతవరకు మరియు నా లక్ష్యాన్ని సాధించేవరకు అతని పెరుగుదలకు నా ప్రియమైన కుమారుడు సాలాప్‌ాను కూడా మీకు అప్పగిస్తున్నాను. నేను ప్రేమించే నా మాతృామూర్తిని కూడా మీకు అప్పగిస్తున్నాను.నేను ఇలా ఉండటానికి ఆమె చేసిన ప్రార్ధనలే కారణం. అవేనాకు పెట్టని కోట, ఆమె ఇచ్చిన వెలుగు బాట నాది. ఆమెకు శక్తిని ప్రసాదించాలని, శుభం కలగాలని నా తరఫున అల్లాను ప్రార్ధిస్తున్నాను.
నా జీవితకాల సహచరి, భార్య ఉమ్‌ సాలాప్‌ా(బయాన్‌) బాధ్యతను కూడా మీకు అప్పగిస్తున్నాను. యుద్ధం మమ్మల్ని రోజులు, నెలల తరబడి విడదీసింది. వంగని ఆలివ్‌ చెట్టు కొమ్మలా ధీటుగా ఆమె నిలిచింది, బంధానికి కట్టుబడి ఉంది, సహనంతో ఆల్లా మీద విశ్వాసంతో ఉంది. నా పరోక్షంలో ఆమె బాధ్యతలను నిర్వహించేందుకు ఆమె తన యావత్‌ శక్తి, విశ్వాసాన్ని వినియోగిస్తున్నది. వారందరికీ మీరు అండగా నిలవాలని కోరుతున్నాను, అల్లా తరువాత మీరే వారికి మద్దతు ఇవ్వాలి.
నేను గనుక మరణిస్తే, నా సిద్దాంతాలకు గట్టిగా నిలిచి నేను మరణించేందుకు సిద్దం. నేను అల్లా ఆదేశాలకు అనుగుణంగా నడుస్తానని ప్రమాణం చేశాను, నేను ఆయన్ను తప్పకుండా కలుసుకుంటాను. ఆయనతో ఎప్పటికీ నిలిచి ఉంటానని హామీ ఇస్తున్నాను. ఓ అల్లా అమరజీవుల్లో నన్ను ఒకరిగా స్వీకరించు, నా గత, భవిష్యత్‌ పాపాలను క్షమించు. నాజనం, నా కుటుంబం స్వేచ్చా బాటలో నడిచేందుకు అవసరమైన వెలుగునిచ్చేందుకు నా రక్తం తోడ్పడేట్లు చేయి. ఆకాంక్షలకు అనుగుణంగా నేను లేనట్లయితే నన్ను క్షమించు.
నా వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు దాన్ని ఎన్నడూ మార్చుకోకుండా, ద్రోహం చేయకుండా ఉండేందుకు దయతో నాకోసం ప్రార్ధించండి. గాజాను మరచిపోవద్దు. క్షమ మరియు మీలో ఒకడిగా అంగీకరించేందుకు మీరు చిత్తశుద్దితో చేసే ప్రార్ధనల్లో నన్ను మరవకండి.’’


హృదయాలను కదలించే చివరి సందేశం పంపిన అనాస్‌ అల్‌ షరీఫ్‌ 28 సంవత్సరాల యువకుడు, జర్నలిస్టు, వీడియో గ్రాఫర్‌. అతని స్వస్థలం ప్రస్తుతం ఇజ్రాయెల్‌ ఆక్రమణలో ఉంది.పాలస్తీనా విముక్తి పోరులో ప్రాణాలకు తెగించి వార్తలను అందిస్తున్నవారిలో ఒకడు. అతనికి హమస్‌ తీవ్రవాది ముద్రవేసిన ఇజ్రాయెల్‌ మిలిటరీ గత రెండు సంవత్సరాలుగా చంపివేస్తామని అనేక సార్లు బెదిరించింది. అది చంపదలుకున్నవారందరికీ ఏదో ఒక ముద్రవేస్తున్నది. ఇజ్రాయెల్‌ ఆరోపణను ఐరాస తిరస్కరించింది. గాజా మారణకాండకు సంబంధించి అతను తీసిన ఫొటోకు 2024లో పులిట్జర్‌ బహుమతి ఇచ్చారు. రెండు సంవత్సరాలుగా అల్‌ జజీరాలో పనిచేస్తున్నాడు. గత నెలలో ఆకలితో చంపుతున్న ఇజ్రాయెల్‌ దుశ్చర్యను వెలుగులోకి తెచ్చాడు. అప్పటి నుంచి అతని కోసం ఇజ్రాయెల్‌ మిలిటరీ వేట ప్రారంభించి చివరకు ఆగస్టు పది రాత్రి విమానాలతో దాడి చేసి హతమార్చింది.


అల్‌ షరీఫ్‌ వంటి ఎందరో పాలస్తీనియన్లు శరణార్ధి శిబిరాల్లోనే పుట్టి అక్కడే పెరిగి చివరికి అదే ఇజ్రాయెల్‌ దుర్మార్గాలకు అక్కడే మరణిస్తున్నారు. గత ఎనిమిది దశాబ్దాలుగా సాగుతున్న మారణకాండ, పోరు అలాంటి ఎందరినో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్దం చేస్తున్నది తప్ప పిరికిబారేట్లు చేయటం లేదు. 2023 అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను చంపినట్లు ఐరాస పేర్కొన్నది. రెండు ప్రపంచ యుద్దాలు, వియత్నాం, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దురాక్రమణ వంటి అనేక యుద్ధాలన్నింటిలో కూడా ఇంత మంది ప్రాణాలు కోల్పోలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.ఇటీవలి సంవత్సరాలలో జర్నలిస్టులకు ప్రాణాంతక, అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఉదంతం ఈ మారణకాండ. తనకు అనుకూలంగా వార్తలు ఇచ్చే వారిని తప్ప అంతర్జాతీయ జర్నలిస్టులను గాజాలో ప్రవేశించకుండా ఇజ్రాయెల్‌ అడ్డుకుంటున్నది. ఈ నేపధ్యంలో స్థానిక పాలస్తీనియన్లే విలేకర్లుగా మారి ఆల్‌ జజీరా వంటి మీడియా సంస్థలకు వార్తలను అందిస్తున్నారు. అది కూడా లేనట్లయితే అసలు గాజాలో ఏం జరుగుతున్నదో బయటి ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.


గాజాలో తాజా పరిణామాల విషయానికి వస్తే హమస్‌ ఆయుధాలు విసర్జింతవరకు దాడులు చేయటం తప్ప మరొకమార్గం లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ప్రస్తుతం 70నుంచి75శాతం వరకు తమ ఆధీనంలో ఉందని చెప్పాడు.హమస్‌కు రెండు గట్టి స్థావరాలు ఉన్నాయని పూర్తిగా తుదముట్టించాలంటే గాజా స్వాధీనం చేసుకోవాల్సిందే అన్నాడు. ఈ వైఖరిని అనివార్యమై కొన్ని పశ్చిమదేశాలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అమెరికా అండతో ఈ దుర్మార్గానికి పూనుకున్నాడు. గాజాలో దాడులకు ఉపయోగించే ఆయుధాలను ఇజ్రాయెల్‌కు నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అయితే నిజంగా అమలు చేస్తుందా లేక వేరే మార్గాల ద్వారా సరఫరా చేస్తుందా అన్నది చెప్పలేము.హమస్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉన్నదని జర్మనీ ఇదే సందర్భంగా పేర్కొన్నది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్‌ గత ఏడు దశాబ్దాల నుంచి చెబుతున్న ఆత్మరక్షణ కతలను పశ్చిమదేశాలు సమర్ధిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పేరుతో పాలస్తీనాను అడ్డుకోవటం అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు.జర్మనీ గతంలో సరఫరా చేసిన ఫ్రైగేట్స్‌తోనే గాజాపై ఇజ్రాయెల్‌ నౌకాదళం తొలి దాడులు జరిపింది.


గాజా ఆక్రమణను అడ్డుకొనేందుకు ముస్లిం దేశాలన్నీ ఐక్యం కావాలని టర్కీ, ఈజిప్టు పిలుపునిచ్చాయి. ఈజిప్టుతో చర్చలు జరిపిన తరువాత విదేశాంగశాఖ మంత్రి బదర్‌ అబ్దెలెటీతో కలసి టర్కీ విదేశాంగ మంత్రి హకన్‌ ఫిదాన్‌ శనివారం నాడు విలేకర్ల సమావేశంలో ఈ పిలుపునిచ్చారు. రెండు దేశాలూ ఇజ్రాయెల్‌ చర్యను ఖండిరచాయి.తక్షణమే ఇస్లామిక్‌ దేశాల సంస్ధ సమావేశం జరపాలని కోరారు. ఇజ్రాయెల్‌ చర్య ఒక్క పాలస్తీనాకే గాక ఇరుగుపొరుగు దేశాలన్నింటికీ ప్రమాదమే అని పేర్కొన్నారు. ఇస్లామిక్‌ దేశాల సంస్థ విదేశాంగ మంత్రుల కమిటీ కూడా ఖండిరచింది. భద్రతా మండలి, ప్రపంచ అగ్రరాజ్యాలు జోక్యం చేసుకోవాలని కోరింది. లక్షలాది మంది ఇజ్రాయెల్‌ పౌరులు రాజధాని టెల్‌ అవీవ్‌, ఇతర నగరాల్లో గాజా దురాక్రమణ ప్రతిపాదనను ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వ చర్యకు సైనికులు మద్దతు ఇవ్వరాదని నినదించారు. హమస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు అవసరమైతే నెతన్యాహు ప్రభుత్వ వైఖరిని నిరసనగా సాధారణ సమ్మె జరపాలని బందీల కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. స్వజనంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్‌ చర్యలకు నానాటికీ వ్యతిరేకత వెల్లడవుతున్నప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, నిస్సిగ్గుగా మద్దతు ప్రకటిస్తున్నాడు. మరింత పెద్ద ఎత్తున నిరసనోద్యమం జరిగితే తప్ప ఇజ్రాయెల్‌ వెనుకడుగువేసే అవకాశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జలాంతర్గాముల మోహరింపు : రష్యాను కవ్విస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ !

06 Wednesday Aug 2025

Posted by raomk in Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

American Nuclear Submarines, Donald trump, submarines war, Vladimir Putin

ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్య 1,259వ రోజులో ప్రవేశించింది. ఆగస్టు ఎనిమిదిలోగా శాంతి ఒప్పందానికి రానట్లయితే ఆంక్షలను మరింత తీవ్రం గావిస్తామని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించాడు. ఈ పూర్వరంగంలో రెండు దేశాలూ పరస్పరం అణ్వాయుధాలున్న జలాంతర్గాములను మోహరించేందుకు నిర్ణయించాయి. రష్యా చమురు కొనుగోలు వ్యవహారంలో చైనాతో భారత్‌ చేతులు కలిపిందని, ఈ లావాదేవీలతో రష్యాకు ఆర్థికంగా తోడ్పడుతున్నట్లు వైట్‌హౌస్‌ సిబ్బంది ఉప అధికారి స్టెఫాన్‌ మిలర్‌ ఆరోపించాడు. ఈతీరు అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ లావాదేవీల వ్యవహారాన్ని చూస్తే జనాలు దిగ్భ్రాంతి చెందుతారని ఆదివారంనాడు ఫాక్స్‌ న్యూస్‌తో చెప్పాడు.తన ప్రత్యేక దూత స్టీవ్‌ విట్‌కోఫ్‌ బుధ లేదా గురువారాల్లో మాస్కో సందర్శించనున్నట్లు ట్రంప్‌ ఆదివారం నాడు చెప్పాడు. వారంతా జిత్తుల మారి మనుషులు, వారికి ఆంక్షలను తప్పించుకోవటం తెలుసు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. చైనా, రష్యా నౌకాదళాలు జపాన్‌ సముద్రంలో నిర్ణీత కార్యక్రమం మేరకు విన్యాసాలు జరుపుతున్నాయి. అవసరమైన చోట రెండు అణుజలాంతర్గాములను మోహరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన తరువాత రెండు రోజుల పాటు ఇవి జరుగుతున్నాయి. ఎంతో ముందుగానే ఈ విన్యాసాల తేదీలను ప్రకటించినందున తాము అవసరమైతే సన్నద్దగా ఉన్నట్లు బెదిరించేందుకు ట్రంప్‌ ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది.


తాము అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి(ఎన్‌పిటి) పూర్తిగా కట్టుబడి ఉన్నామని, వాటి గురించి మాట్లాడే ముందు అమెరికా సంయమనం పాటించాలని రష్యా ప్రతినిధి దిమిత్రి పెష్కోవ్‌ సోమవారం నాడు హితవు పలికాడు. తమ నాయకత్వం మొత్తాన్ని అంతం చేసినప్పటికీ సోవియట్‌ కాలం నుంచి కొనసాగుతున్న విధానం ప్రకారం చివరి యత్నంగా అణ్వస్త్రాలను ప్రయోగించకతప్పదని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్‌ గురువారం నాడు హెచ్చరించాడు. దాన్ని అవకాశంగా తీసుకున్న ట్రంప్‌ రెండు జలాంతర్గాములను మోహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు శుక్రవారం నాడు చెప్పాడు. అవి ‘‘ తగిన ప్రాంతాలలోనే ’’ ఉన్నాయని ఆదివారం నాడు మరో ప్రకటన చేశాడు. అయితే ఇదేమీ కొత్త కాదని, నిర్ణీత కార్యకలాపాల్లో భాగంగా అవి ఎప్పుడూ మోహరించే ఉంటాయని పెష్కోవ్‌ చెప్పాడు. తాజా పరిణామాలపై అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అణు యుద్ధంలో విజేతలంటూ ఉండరని, అయితే సమరమే తలెత్తితే తాము పూర్తి సన్నద్దంగా ఉన్నామని పెష్కోవ్‌ చెప్పాడు.


అమెరికా దగ్గర మూడు రకాల జలాంతర్గాములున్నాయి.వాటిలో 14 ఓహియో తరగతికి చెందిన ఖండాంతర క్షిపణులను ప్రయోగించేవి, అణ్వాయుధాలను నియంత్రిత మార్గంలో వేగంగా ప్రయోగిస్తాయి.ప్రతి జలాంతర్గామి అనేక అణుబాంబులను మోసుకుపోయే 20 ట్రైడెంట్‌ క్షిపణులను కలిగి ఉంటుంది. అవి ఏడున్నరవేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను దెబ్బతీస్తాయి. అందువలన వాటిని రష్యా సమీపంలోనే మోహరించనవసరం లేదు. ఈ జలాంతర్గామి పొడవు 170 మీటర్లు, బరువు 19వేల టన్నులు,159 మంది సిబ్బంది, గంటకు 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.1990దశకం తరువాత కొత్త జలాంతర్గాములు అవసరం లేదని, ఉన్నవాటిలో కొన్నింటిలో మార్పులు చేసి నియంత్రిత ప్రయోగవాహకాలుగా మార్చారు, అలా తయారు చేసిన నాలుగు జలాంతర్గాములు 154 తోమహాక్‌ క్షిపణులను, వెయ్యి పౌండ్ల బరువుగల పేలుడు పదార్దంతో 1,600కిలోమీటర్ల దూరంలో భూమి మీద ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. సముద్రగర్భంలో ఇతర దేశాల జలాంతర్గాములు, నౌకల మీద కూడా దాడి చేయగలిగినవి ఉన్నాయి. 2025 జూలై ఒకటవ తేదీ నాటికి వేగంగా దాడులు చేసేందుకుగాను 23అధునాతన వర్జీనియా రకం జలాంతార్గాములను వినియోగంలోకి తెచ్చారు, అవి 377 నుంచి 461 అడుగుల పొడవు, 10,200టన్నుల బరువు ఉంటాయి, ఒక్కోదానిలో 145 మంది సిబ్బంది పని చేస్తారు.పాతవాటిలో లాస్‌ ఏంజల్స్‌రకరం మరో 23 పని చేస్తున్నాయి.ఒక్కొక్కదాని ధర మూడు వందల కోట్ల డాలర్లు.


రష్యా భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకొనేందుకు అణు జలాంతర్గాములను విస్తరించాలని పుతిన్‌ పిలుపునిచ్చినట్లు గతనెలాఖరులోనే వార్తలు వచ్చాయి.ఆధునిక తరంతో నౌకాదళాన్ని మరింత పటిష్టం కావిస్తామని చెప్పినట్లు టాస్‌ వార్తా సంస్థ పేర్కొన్నది.ప్రస్తుతం 192 క్షిపణులను ప్రయోగించే పన్నెండు వినియోగంలో ఉన్నాయి. అమెరికాకు చెందిన లాస్‌ ఏంజల్స్‌ రకం జలాంతర్గామి జూలై తొమ్మిదిన నిర్వహణ పనుల పేరుతో తొలిసారిగా ఐస్‌లాండ్‌ రేవులో లంగరువేసింది.తామున్నామని తన మిత్రదేశాలకు అమెరికా పంపిన సందేశం కూడా దీనిలో ఇమిడి ఉంది. 2023 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వాహనాలు ఈ జలాల్లో సంచరించాయి.గ్రీన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, బ్రిటన్‌ కారిడార్‌(జిఐయుకె)లో ఈ ప్రాంతం ఉంది.2019 నుంచి అమెరికా తన బి2 బాంబర్లకోసం ఈ ప్రాంతాన్ని వినియోగిస్తున్నది. ఈ పూర్వరంగంలో రష్యా ఉత్తర నౌకాదళానికి చెందిన అధునాతన యాసెన్‌ తరగతి జలాంతర్గాములు ఈ ప్రాంతంలో ప్రయాణించాయి.అమెరికా, రష్యా, చైనా జలాంతర్గాములు ప్రత్యర్ధుల కదలికలను పసిగట్టటం, పర్యవేక్షించే పనిలో నిరంతరం ఉంటాయి, ఏ దేశం కూడా ఈ వివరాలను బహిరంగంగా వెల్లడిరచదు. ఖనిజ సంపద ఎంతో ఉన్న ఈ ప్రాంతం ఆర్థికంగానే గాక, మిలిటరీ పరంగా కూడా ఇటీవల ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఐదోవంతు రష్యా భూభాగం, సముద్రతీరం సగం ఉన్నదున అది దానికి ఎంతో కీలకం. అమెరికా రాడార్లకు అందకుండా ప్రయాణించే హైపర్‌సోనిక్‌ క్షిపణులను రష్యా పరీక్షిస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం చైనాతో కలసి అలాస్కా వద్ద తనిఖీ నిర్వహించింది. పోలార్‌ సిల్క్‌ మార్గం పేరుతో 2018లో చైనా ఆర్కిటిక్‌ వ్యూహాన్ని ప్రకటించింది. నాటో కూటమిలో ఫిన్లండ్‌, స్వీడన్‌ చేరిన తరువాత రష్యా తన మిలిటరీని ఈ ప్రాంతంలో నవీకరిస్తున్నది. సోవియట్‌ కాలం నాటి వైమానిక కేంద్రాల ఉన్నతీకరణ, కార్యకలాపాల పునరుద్దరణ చేపట్టింది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో రష్యాకు ఎక్కువ మిలిటరీ కేంద్రాలు ఉండటం అమెరికాను కలవర పెడుతున్నది. రష్యా కంటే మిలిటరీ రీత్యా పశ్చిమ దేశాలు పదేండ్లు వెనుకబడి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం నాటో దేశమైన నార్వేలో రష్యన్‌ పౌరులు వీసాతో నిమిత్తం లేకుండా నివసించవచ్చు. గ్రీన్‌లాండ్‌ను తమకు ఇవ్వాలని అమెరికా డిమాండ్‌ చేయటం వెనుక ఈ అంశం కూడా ఉంది. యుద్ధమంటూ వస్తే ఈ ప్రాంతంలో అమెరికా నౌకలను అడ్డుకొనేందుకు రష్యాకు అనేక అవకాశాలు ఉన్నాయి.


దౌత్యం, వాణిజ్యాలను ఆయుధాలు మార్చుకోవటం రోజు రోజుకూ పెరుగుతున్నది. తన మిత్రదేశమైన పాకిస్తాన్‌ మీద భారత్‌ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ను నిలిపివేయించేందుకు వాణిజ్యాన్ని చూపి బెదిరించిట్లు స్వయంగా ట్రంప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. పరువు పోతుందని భావించి నరేంద్రమోడీ ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించేందుకు సిద్దం కావటం లేదన్నది వేరే సంగతి.మిలిటరీ ఖర్చును భారీగా పెంచేందుకు నాటో కూటమి నిర్ణయించింది. ఉక్రెయిన్‌ పోరును సంప్రదింపుల ద్వారా ముగించేందుకు అది సిద్దంగా లేదు. పోరును దీర్ఘకాలం పొడిగించి రష్యాను కొన్ని సంవత్సరాల్లో దివాలా తీయించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ఐరోపా సమాఖ్య జనాభా 49 కోట్లు, జిడిపి 20లక్షల కోట్లు ఉండగా కేవలం 15కోట్ల జనాభా, రెండు లక్షల కోట్ల డాలర్ల జిడిపి మాత్రమే ఉన్న రష్యాను ఓడిరచలేమా అనే ప్రమాదకర ధోరణి కనిపిస్తున్నది. రష్యా తన వద్ద ఉన్న అణ్వస్త్రాలను చూపి భయపెడుతున్నది. అమెరికా కూడా భయపడుతున్నది ఈ కారణంగానే అన్నది తెలిసిందే. ఐరోపాలో బలమైన జర్మనీ మరోసారి పదాతిదళాలను పెంచుతున్నది. మూడువేల బాక్సర్‌ సాయుధ శకటాలు, మూడున్నరవేల పాట్రియా ఇన్‌ఫాంట్రీ యుద్ధ వాహనాలను కొనుగోలు చేస్తున్నది, ఇవిగా యూరోజెట్‌ ఫైటర్లను సమీకరిస్తున్నది. ఐరోపాలో బలమైన సాంప్రదాయ మిలిటరీని సాయుధంకావించేందుకు తాను లక్ష కోట్ల యూరోలను ఖర్చు చేయనున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఫెడరిక్‌ మెర్జ్‌ ఇటీవల ప్రకటించిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇతర ధనిక ఐరోపా దేశాలేమీ తక్కువ తినటం లేదు.ఫ్రాన్సు, ఇటలీ, పోలాండ్‌ పెద్ద సంఖ్యలో టాంక్‌లు, సాయుధశకటాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించాయి. అవసరమైతే ఫ్రెంచ్‌ లేదా ఐరోపా యూనియన్‌ దేశాలు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు కాల్బలాలను కూడా పంపేందుకు సిద్దం కావాలని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ గతేడాది చేసిన ప్రతిపాదనను అందరూ వ్యతిరేకించారు.పశ్చిమ ఐరోపాలో 89శాతం మంది వ్యతిరేకించినట్లు సర్వేలు వెల్లడిరచాయి.


రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్‌ చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకొని డోనాల్డ్‌ ట్రంప్‌ తన అక్కసును జలాంతర్గాముల మోహరింపు రూపంలో వ్యక్తం చేశాడని స్పష్టంగా కనిపిస్తోంది.రెచ్చగొట్టటంలో ఎవరూ తక్కువ తినలేదు. ట్రంప్‌ పన్నుల విధింపు పేరుతో బెదిరింపు ఆటకు దిగాడని మెద్వెదేవ్‌ వర్ణించాడు ‘‘ రష్యా అంటే ఇజ్రాయెల్‌ లేదా కనీసం ఇరాన్‌ కూడా కాదు, ప్రతి కొత్త బెదిరింపు యుద్ధంవైపు మరోఅడుగువేసినట్లే, అయితే ఉక్రెయిన్‌ మరియు రష్యా మధ్య కాదు, అతగాడి స్వంతదేశంతోనే, అది ఎలా ఉంటుందో ఒక టీవీలో వస్తున్న ది వాకింగ్‌ డెడ్‌ అనే సీరియల్‌ చూడవచ్చు ’’ అన్నాడు. తీవ్రంగా రెచ్చగొట్టిన మెద్వెదేవ్‌ కారణంగానే తాను రెండు అణుజలాంతర్గాములను మోహరించాలని ఆదేశించినట్లు ట్రంప్‌ చెప్పుకున్నాడు. వీటన్నింటిని చూస్తుంటే ప్రధాన దేశాల మధ్య వాణిజ్య , మిలిటరీ విబేధాలు అదుపుతప్పి దిగజారుతున్నట్లు కనిపిస్తున్నది.అన్ని దేశాలను అదుపులోకి తెస్తానని చెప్పిన ట్రంప్‌ స్వజనంలో పలుచనయ్యాడు, పుతిన్నుదారికి తెచ్చి ఉక్రెయిన్‌ పోరును 24 గంటలలో ఆపివేస్తానని ప్రగల్భాలు పలికి ఐరోపాలో పరువు పోగొట్టుకున్నాడు.గత కొద్ది రోజులుగా ట్రంప్‌తో పాటు అతగాడి యంత్రాంగంలో ముఖ్యులు నిరాశాపూరితంగా మాట్లాడుతున్నారు. ఆంక్షలు రష్యాను నిలువరించేట్లు కనిపించటం లేదన్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్‌ బెదిరింపులను ఖాతరు చేయకుండా రష్యా నుంచి భారత్‌, చైనా చమురుకొనుగోళ్లను నిలిపివేసే సూచనలు కనిపించటం లేదు. భారత్‌ నిలిపివేస్తే నరేంద్రమోడీకి, కొనుగోలు కొనసాగిస్తే ట్రంప్‌కు ఇరకాటం తప్పదు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయటంలో అత్యంత కీలక భాగస్వామి పుతిన్ను చైనా నేత షి జింపింగ్‌ మధ్యలో వదలివేస్తారని ఊహించటం కష్టమని న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక గురువారం నాడు వ్యాఖ్యానించింది. ఐరోపా యూనియన్‌ కూడా ఆంక్షలను ప్రకటించినప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా టర్కీ, ఫ్రాన్సు,హంగరీ, బెల్జియం,స్లోవేకియా, ఇటలీ జెకియా గ్యాస్‌, చమురు కొనుగోలు చేస్తున్నాయి. భారత్‌ చౌకగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని బహిరంగ మార్కెట్‌లో అధికధరలకు అమ్ముకుంటున్నదని, అందువలన తాను భారీగా పన్నులు వేస్తానని సోమవారం నాడు ట్రంప్‌ పునరుద్ఘాటించాడు. ఒక్క ఈ అంశమే కాదు, పెట్టుబడిదారీ వర్గం తన లాభాలకు దెబ్బ తగలకుండా మరోవైపున కార్మికవర్గం మీద కూడా దాడులను ప్రారంభించింది. అనేక దేశాల్లో రకరకాల సాకులతో సంక్షేమ, సామాజిక భద్రతా పథకాలకు కోత పెడుతున్నారు. ఇలాంటి పోకడలను ఎదిరించి అడ్డుకట్టవేయాలంటే అమెరికా, ఐరోపాల్లోని కార్మికవర్గం వీధుల్లోకి వస్తే తప్ప పాలకవర్గాలు వెనకడుగువేసేట్లు కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌ పోరుకు 50 రోజుల గడువు : తగ్గేదేలే అన్న పుతిన్‌, మాటమార్చిన ట్రంప్‌!

16 Wednesday Jul 2025

Posted by raomk in Current Affairs, Economics, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Trump 50 days ultimatum, Ukraine crisis, US Patriot to Ukraine via Europe, Vladimir Putin, Volodymyr Zelensky

ఎం కోటేశ్వరరావు


రానున్న యాభై రోజుల్లో ఉక్రెయిన్‌పై దాడులను ఆపకపోతే తీవ్రమైన ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా గడువు ప్రకటించాడు.దీనితో పాటు ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌ క్షిపణులు అందిస్తానని కూడా వెల్లడిరచాడు. ఈ బెదిరింపు, ఆయుధ సరఫరాను చూసి భయపడేదేలేదని, పోరు కొనసాగింపుకే వ్లదిమిర్‌ పుతిన్‌ ముందుకు పోవాలనే వైఖరితో ఉన్నట్లు మాస్కో వర్గాలు చెప్పినట్లు రాయిటర్‌ వార్త పేర్కొన్నది. ఇదిలా ఉండగా మాస్కోపై ఎలాంటి దాడులు చేయవద్దని ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీని ట్రంప్‌ ఆదేశించాడు, బెదిరించిన ఒక రోజులోనే ట్రంప్‌ మాట మార్చాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం బుధవారం నాటికి 1,238వ రోజులో ప్రవేశించింది. పరస్పరదాడులు సాగుతున్నాయి, కొత్త ప్రాంతాలను రష్యా ఆధీనంలోకి తెచ్చుకుంటూనే ఉంది. అధికారం స్వీకరించిన 24గంటల్లో పోరును ఆపివేస్తానని ప్రకటించిన ట్రంప్‌ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మాటలు మార్చాడో, ప్రగల్భాలు పలికాడో తెలిసిందే. పోరును గనుక ఆపకపోతే రష్యా నుంచి దిగుమతులు చేసుకొనే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని తాజాగా బెదిరించాడు, కొద్ది రోజుల క్రితం 500శాతం అని చెప్పిన సంగతి తెలిసిందే. జూన్‌ నెల సమాచారం ప్రకారం మనదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు రోజుకు 20.8లక్షల పీపాలకు చేరి పదకొండు నెలల గరిష్ట రికార్డును సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం రష్యా నుంచి తమ అవసరాల్లో చైనా 47, భారత్‌ 38, ఐరోపా యూనియన్‌, టర్కీ ఆరేసి శాతాల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశం ఇతర దేశాల నుంచి చూస్తే ఇరాక్‌ 18.2, సౌదీ అరేబియా 12.1, యుఏయి 10.2, అమెరికా నుంచి 6.3శాతాల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాము.

సోమవారం నాడు ప్రగల్భాలు పలికిన ట్రంప్‌ మంగళవారం నాడు మాట మార్చాడు.దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు లేదు, ఆలాంటి ఆలోచన చేయటం లేదని చెప్పాడు. జూలై నాలుగవ తేదీన మాస్కో, సెంట్‌పీటర్స్‌బర్గ్‌లపై దాడి చేయగలరా అంటూ ఫోన్లో జెలెనెస్కీని ట్రంప్‌ అడగ్గా కచ్చితంగా మీరు గనుక మాకు ఆయుధాలిస్తే కొడతాం, రష్యా పట్టణాల మీద దాడి చేసి వారికి నొప్పితెలిసేట్లు చేయండని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. హత్యలను ఆపాలని కోరుతున్న తాను, పోరు ఆపాలని, మానవత్వంవైపు తప్ప ఎవరి పక్షమూ కాదని మంగళవారం నాడు అధ్యక్ష భవనంలో ట్రంప్‌ విలేకర్లతో చెప్పాడు. అధ్యక్షుడు కేవలం ప్రశ్నలను అడిగాడు తప్ప హింసాకాండను ప్రోత్సహించేందుకు కాదని ట్రంప్‌ ప్రతినిధి చెప్పాడు. సైనిక చర్య ముగింపు గడువు విధింపు, ఆధునిక ఆయుధాలు అందచేయాలన్న ట్రంప్‌ ప్రకటనను రష్యా నేత పుతిన్‌ ఖాతరు చేయలేదని రాయిటర్స్‌ పేర్కొన్నది. మిలిటరీ చర్యను ముగించే ఆలోచనలో కూడా లేదని, లక్ష్యాన్ని సాధించేవరకు కొనసాగుతుందని క్రెమ్లిన్‌ వర్గాలు తెలిపినట్లు వెల్లడిరచింది. ట్రంప్‌, పశ్చిమదేశాల బెదిరింపులకు భయపడటం లేదని యుద్ధం కొనసాగించటానికి వీలుగా తమ ఆర్థిక పరిస్థితి ఉందని అన్నట్లు కూడా రాసింది.


గత కొద్ది నెలలుగా ముఖ్యంగా ట్రంప్‌ గెలిచిన తరువాత ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరాల గురించి అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలు తర్జన భర్జనలో ఉన్నాయి. ట్రంప్‌ ఓవల్‌ ఆఫీసులో సోమవారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రూటే భేటీ జరిపినపుడు ట్రంప్‌ తమ నిర్ణయాన్ని వెల్లడిరచాడు. యాభై రోజుల్లో గనుక పోరు విరమణ ఒప్పందం కుదరకపోతే వందశాతం పన్నులు విధిస్తాం, దాని అర్ధం మీకు తెలిసిందే, అనేక అంశాలపై వాణిజ్యాన్ని వినియోగిస్తాను, అవి యుద్ధాల పరిష్కారాలకు ఎంతో దోహదం చేస్తాయి అన్నాడు. ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేసి పాకిస్తాన్‌తో రాజీకి వచ్చే విధంగా భారత్‌ను రప్పించేందుకు వాణిజ్య ఆయుధాన్ని వినియోగించినట్లు చెప్పిన అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవటం అవసరం. తమ అధ్యక్షుడు చెప్పిన పన్నుల విధింపు అంటే రష్యాతో వాణిజ్యం చేసే ఇతర దేశాల మీద అని అధికారవర్గాలు వివరించాయి. రష్యాతో అమెరికా వాణిజ్యం పెద్దగా ఏమీ లేదు గనుక దాని మీద అపరాధ సుంకాలు విధించేదేమీ ఉండదు. వాస్తవానికి రష్యా మీద ఆంక్షలేమీ ఉండవని, దాని దగ్గర నుంచి చమురు కొనుగోలు చేసేవారి మీద విధించే పన్నుల గురించి ట్రంప్‌ చెప్పినట్లు నాటోలో అమెరికా రాయబారి వైట్‌కర్‌ మాట్‌ చెప్పాడు.ఈ చర్యతో రష్యాపై నాటకీయంగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అన్నాడు. అయితే అమెరికా బెదిరింపులను గతంలోనే అమెరికా, భారత్‌ ఖాతరు చేయని సంగతి తెలిసిందే. రష్యా కూడా లెక్క చేయలేదు.


గత ఆరునెలలుగా పుతిన్‌తో సంప్రదింపుల గురించి చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్‌పై దాడులు పెరుగుతున్నాయే తప్ప తగ్గలేదని రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై 500శాతం పన్ను విధించాలనే తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతానని చెప్పిన సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ చెప్పాడు. గొప్పలు చెప్పుకున్న ట్రంప్‌ అది జరగకపోవటంతో అవమానభారంతో ఏం
మాట్లాడుతున్నాడో, ఏం చేస్తాడో తెలియని స్థితిలో ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. పుతిన్‌ సేనలు, రష్యాపై దాడులు చేసేందుకు పేట్రియాట్‌ క్షిపణులు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించి సంక్షోభాన్ని మరోమలుపు తిప్పాడు. పరిష్కరించాలనే చిత్తశుద్ది అమెరికాకు లేదన్నది స్పష్టం. ఈ క్షిపణి విధ్వంసక వ్యవస్థ ధర ఒక్కొక్కటి 40లక్షల డాలర్లు ఉంటుంది. ఉక్రెయిన్‌కు సరఫరా చేసే ఆయుధాలను ఐరోపాకు విక్రయించి అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు తరలించే విధంగా అమెరికా నిర్ణయించింది. కీలక ఆయుధ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి రష్యాను బుట్టలో వేసుకోవాలని ట్రంప్‌ చూశాడు. ఆ పప్పులు ఉడకలేదు, దాంతో ఆయుధాల సరఫరా పునరుద్దరించనున్నట్లు అమెరికా అధికారులు వెల్లడిరచారు. మరోవైపున శాంతి చర్చలకు చొరవ చూపేందుకు పోప్‌ లియో సుముఖంగా ఉన్నారని ఆయనను కలిసిన తరువాత జెలెనెస్కీ ప్రకటించాడు. దాని గురించి ఎటూ తేలక ముందే సరికొత్త ఆంక్షల గురించి ట్రంప్‌ ప్రకటించాడు. పుతిన్‌ గురించి నోరుపారవేసుకున్న ట్రంప్‌ తీరును తాము పట్టించుకోవటం లేదని గతవారంలో రష్యా స్పందించింది.ఆయుధ ఒప్పందం ఆటతీరునే మార్చి వేస్తుందని రూటే వర్ణించాడు.జర్మనీతో సహా ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే వంటివి అమెరికా నుంచి తీసుకొని నూతన ఆయుధాలను సరఫరా చేస్తాయని చెప్పాడు. తాను ముందుగా ఐరోపా దేశాలు ఇలాంటి చొరవ తీసుకుంటాయని అనుకోలేదని కానీ అవి చేశాయని ట్రంప్‌ అభినందించాడు.త్వరలో మరికొన్ని క్షిపణులను కూడా అందించేందుకు అమెరికా పూనుకుంది. రష్యా క్షిపణులను అడ్డుకొనేందుకు పేట్రియాట్‌ వ్యవస్థలను వినియోగిస్తామని, అయితే ఎదురుదాడి చేసే ఆయుధాలను కూడా ఇచ్చే అవకాశం ఉందని నాటోలో అమెరికా రాయబారి చెప్పాడు. నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు విక్రయిస్తే వచ్చే విమర్శల నుంచి తప్పుకొనేందుకు, తన చేతికి మట్టి అంటకుండా, ఖజానా మీద భారం మోపకుండా ఐరోపా దేశాలకు ఆయుధాలను విక్రయించి అటు నుంచి తరలించేందుకు ట్రంప్‌ వేసిన ఎత్తుగడ ఇది.


అధికారానికి వచ్చిన తరువాత ఆర్భాటంగా పుతిన్‌తో నేరుగా మాట్లాడాడు. రష్యాకు రాయితీలు ఇవ్వాల్సిందే, కొన్ని ప్రాంతాలు వదులుకోవాల్సిందే, మేం 350 బిలియన్‌ డాలర్లు ఇచ్చినా యుద్దంలో గెలిచేది లేదు చచ్చేది లేదని జెలెనెస్కీతో చెప్పాడు. అతగాడిని మంచి హాస్యనటుడు అంటూనే ఎన్నికలు జరపని నియంత అన్నాడు.ఫిబ్రవరి 28న అధ్యక్ష భవనంలో బహిరంగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెనెస్కీని అవమానించి ఐరోపా భాగస్వాములను నిర్ఘాంతపరిచాడు. రష్యాను ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించాడు.ఐరోపా దేశాలన్నీ ఈ తీరును చూసి నిజంగానే ట్రంప్‌ తమను వదలి పుతిన్‌తో చేతులు కలిపి ఉక్రెయిన్ను అప్పగిస్తాడా అన్నంతగా భయపడ్డాయి. చివరికి భద్రతా మండలిలో రష్యామీద ఎలాంటి విమర్శలు లేని తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. ఈలోగా ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలున్న ప్రాంతాన్ని తమకు అప్పగించాలని అమెరికా రాయించుకొని ఒప్పందం చేసుకుంది. ఎత్తుగడ ఏమిటో తెలియదు గానీ పదేండ్ల క్రితమే పుతిన్‌ గురించి ట్రంప్‌ పొగడ్తలు ప్రారంభించాడు. గత వారంలో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది. పుతిన్‌ పైకి కనిపించేంత మంచి వాడు కాదు, నేను ఎంతో ఆశాభంగం చెందాను, అతన్ని హంతకుడు అని చెప్పాలనుకోవటం లేదు కానీ గట్టి పిండం అని ఎన్నో సంవత్సరాలుగా రుజువైంది. బిల్‌క్లింటన్‌, బుష్‌,ఒబామా,జో బైడెన్‌ అందరినీ వెర్రి వెంగళప్పలను గావించాడు గానీ నన్ను చేయలేకపోయాడు.. ఒక రోజు ఇంటికి వెళ్లి నా సతీమణితో మాట్లాడుతూ నేను ఈ రోజు పుతిన్‌తో మాట్లాడాను, అద్భుతతమైన సంభాషణ చేశాను తెలుసా అని చెప్పాను. ఆమె తాపీగా అవునా నిజమేనా అంటూ మరో(ఉక్రెయిన్‌) పట్టణంపై దాడి జరిగింది అని చెప్పింది అన్నాడు. ఎవరైనా నేతలు అతగాడితో ఫోన్లో మాట్లాడుతుండగానే ఉక్రెయిన్‌పై దాడులు చేయిస్తుంటాడు అని ట్రంప్‌ చెప్పాడు.


గత గురువారం నాడు రోమ్‌ నగరంలో ఉక్రెయిన్‌ స్వస్థత సమావేశం జరగటానికి ముందు జెలెనెస్కీ ఇటలీలో ట్రంప్‌ ప్రతినిధి కెయిత్‌ కెలోగ్‌తో సమావేశం సందర్భంగా రష్యా దాడులను తీవ్రం కావించింది. పోప్‌ లియోను రెండు నెలల్లోనే జెలెనెస్కీ రెండుసార్లు కలిశాడు. పోరు ఇంకా కొనసాగుతుండగానే ఉక్రెయిన్‌ పునరుద్దరణ పథకాలు దానికి అవసరమైన పెట్టుబడులు, దానిలో పాలుపంచుకొనే దేశాలు, నిర్మాణ సంస్థల గురించి పశ్చిమదేశాలు వాణిజ్య చర్చలు జరిపాయి. ఇప్పటికే ఐరోపాలో ఉన్న పేట్రియాట్‌ క్షిపణులను వెంటనే ఉక్రెయిన్‌కు తరలించి మిగతావాటిని అమెరికా ఫ్యాక్టరీల్లో తయారు చేసి అందచేస్తారు. మీరు గనుక ఉక్రెయిన్‌ మీద దాడి చేస్తే నేను మాస్కో మీద బాంబులు వేయిస్తానని పుతిన్‌తో మాట్లాడినపుడు ట్రంప్‌ బెదిరించాడన్న వార్త గుప్పుమన్నది. అయితే వారి మధ్య ఆ సంభాషణ ఎప్పుడు జరిగిందో, అది నిజమో కాదో నిర్ధారణ కాలేదు గానీ, ఆధునిక ఆయుధాలను ఇస్తాన్న ట్రంప్‌ మాటలు దాన్ని నిర్ధారిస్తున్నాయి.కొద్ది వారాల క్రితం రష్యా భూభాగంలో ప్రవేశించి అనేక చోట్ల ఉక్రెయిన్‌ జరిపిన దాడుల వెనుక అమెరికా హస్తం లేదని ఎవరూ చెప్పలేరు.


రష్యా ఆధీనంలోని జపోర్‌రిaయా ప్రాంతంలో ఉన్న అణువిద్యుత్‌ కేంద్రంపై వందలాది రౌండ్ల కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ చెప్పింది. అక్కడ అణు ప్రమాదం జరిగితే దానికి రష్యాను బాధ్యురాలిగా చేసి వత్తిడి తేవాలన్న కుట్ర దీనిలో కనిపిస్తోంది. దీని వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందని వేరే చెప్పనవసరం లేదు. పేట్రియాట్స్‌తో సహా ఆధునిక ఆయుధాలను అందచేయాలన్న నిర్ణయం నాటకీయంగా జరగలేదు. గత కొద్ది వారాలుగా మల్లగుల్లాలు పడుతున్నారు. వీటితో పుతిన్‌ దారికి వస్తాడని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. జూన్‌ లో జరిగిన నాటో సమావేశాల్లో ఒక కొలిక్కి వచ్చిన ఈ ఆలోచనపై అంతకు ముందే విధి విధానాల గురించి చర్చ మొదలైంది.నాటో నేరుగా ఆయుధాలు పంపితే అది రష్యాకు ఒక అస్త్రంగా మారుతుంది, అన్నింటికీ మించి నాటో కూడా యుద్ధంలో పాల్గ్గొన్నట్లే, అందుకే కొన్ని దేశాలను ఎంపిక చేసి వాటి ద్వారా కథనడిపిస్తున్నారు. ఒకవేళ అమెరికా తప్పుకుంటే తామే ఉక్రెయిన్‌కు బాసటగా నిలవాలని ఐరోపా దేశాలు స్థూలంగా ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత అయితే మా దగ్గర ఆయుధాలు కొని మీరే జెలెనెస్కీకి ఇవ్వండని అమెరికన్లు వారిని కట్టుబడేట్లు చేసినట్లు కూడా చెప్పవచ్చు. మీరు ఆధునిక ఆయుధాలు ఇస్తారు, అవి రష్యా క్షిపణులను అడ్డుకుంటాయి సరే, మా కుటుంబాల ప్రాణాలను కాపాడతాయో లేదో చెప్పండని ఉక్రేనియన్‌ సైనికులు కొందరు సిఎన్‌ఎన్‌తో మాట్లాడిన మాటలు ఒక్క మిలిటరీలోనే కాదు, యావత్తు ఉక్రేనియన్లలో ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే జెలెనెస్కీ అవమానాలు భరించి కూడా ఆయుధాల కోసం విలువైన ఖనిజాలున్న ప్రాంతాలను అమెరికాకు రాసి ఇచ్చిన తరువాత దేశం మొత్తాన్ని నాటో కూటమికి తాకట్టు పెట్టినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికాకు హడలు పుట్టిస్తున్న చైనా అంతరిక్ష కార్యక్రమం !

02 Wednesday Jul 2025

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, China’s space tech boom, Narendra Modi Failures, Orbital arms race, Space War, Star Wars, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఆర్థిక రంగంలోనే కాదు, అంతరిక్షంలోనూ సోషలిస్టు చైనా ప్రస్తుతం అమెరికాను హడలెత్తిస్తున్నదా ? అంటే వాషింగ్టన్‌ స్పందన చూస్తే అలాగే ఉంది, అయితే వక్రీకరణ షరా మామూలే అని చెప్పనవసరం లేదు. అమెరికా అంతరిక్ష దళాల(యుఎస్‌ఎస్‌ఎఫ్‌) జనరల్‌ కమాండర్‌ స్టీఫెన్‌ వైటింగ్‌ మనదేశంతో పాటు ప్రపంచాన్ని భయపెట్టేందుకు పూనుకున్నాడు. చైనా గురించి అనేక కుట్ర సిద్దాంతాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అందువలన ఈ పూర్వరంగంలోనే అతగాడు ఇటీవల ‘‘ బ్రేకింగ్‌ డిఫెన్స్‌ ’’ అనే వెబ్‌సైట్‌తో మాట్లాడిన అంశాలను చూడాల్సి ఉంది.ప్రపంచ వ్యాపితంగా 80దేశాలలో 750 చిన్నా, పెద్ద మిలిటరీ కేంద్రాలను నిర్వహిస్తున్న అమెరికా ఇతర దేశాల నుంచి ముప్పు ఉన్నట్లు స్వంత జనాలను నిరంతర భయపెడుతున్నది. దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమంటే స్వంత పౌరులు భారీ మిలిటరీ బడ్జెట్‌ను ప్రశ్నించకుండా ఉండేందుకు, ఇతర దేశాలను మిలిటరీ శక్తిని చూపి భయపెట్టేందుకు, దాడులు చేసేందుకు చేసేందుకు తప్ప వేరుకాదు. ఆశ్చర్యకరమైన వేగంతో చైనా ఉపగ్రహాల ప్రయోగం ఇండోపసిఫిక్‌ ప్రాంతానికి ప్రమాదకరంగా మారటం అత్యంత ముఖ్యమైన సమస్యల్లో ఒకటని వైటింగ్‌ చెప్పాడు. దొంగే దొంగని అరచినట్లుగా 2019లో డోనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నపుడు అమెరికా అంతరిక్ష దళం పేరుతో మిలిటరీ విభాగాన్ని ఏర్పాటు చేశాడు. అది మినహా మరోదేశమేదీ ఇప్పటి వరకు అలాంటి విభాగాలను ఏర్పాటు చేసినట్లు వార్తలు లేవు.

అంతరిక్షంలో ఎన్ని ఉపగ్రహాలు లేదా అలాంటివి ఉన్నాయన్నది ఒక అంచనా తప్ప నిర్దిష్ట సంఖ్య చెప్పటం కష్టం. వాటిలో పనిచేసేవాటితో పాటు చేయనివీ ఉన్నాయి. గడువు మీరిన తరువాత కూడా అవి పరిభ్రమిస్తూనే ఉంటాయి. తొలి ఉపగ్రహం స్పుత్నిక్‌ నాటి సోవియట్‌ యూనియన్‌లో 1957 అక్టోబరు నాలుగున నింగిలో ప్రవేశించింది. ఈ ఏడాది మార్చి నెల నాటికి 20,985 ప్రయోగించగా భూకక్ష్యలో 14,904 ఉన్నట్లు తేల్చారు. కొన్ని భూ కక్ష్యలో ఉండగా మరికొన్ని అంతకు మించి ఎగువన ఉన్నాయి. అయితే ఇవన్నీ పనిచేస్తున్నట్లు చెప్పటానికి లేదు. కొన్ని అదుపుతప్పినవి, మరికొన్ని ఇంథనం అయిపోయి పనిచేయనివి, మరికొన్ని కాలం చెల్లినవి, ఇలా రకరకాలుగా దాదాపు నాలుగువేలు మన తలల మీద గంటకు 28వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి.1972లో నాటి సోవియట్‌ యూనియన్‌ ప్రయోగించిన కాస్మోస్‌ 482 ఉపగ్రహం ఈ ఏడాది భూఉపరితలంలో నాలుగు ముక్కలై హిందూమహా సముద్రంలో గుర్తు తెలియని చోట కూలిపోయింది. అందువలన ఇలాంటివి ఏదో రూపంలో తిరిగి రావటానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చని భావిస్తున్నారు. అమెరికా తొలిసారిగా 1958 మార్చి 17న వాన్‌గార్డ్‌ ఒకటి ఉపగ్రహాన్ని పంపింది.గడచిన ఐదు సంవత్సరాల్లో(63 నెలల్లో) 11,951 ప్రయోగించగా అంతకు ముందు 9,034 మాత్రమే ప్రయోగించారంటే ఇటీవలి కాలంలో అంతరిక్ష ప్రయోగాలు, మార్కెట్‌ ఎంతవేగంగా విస్తరించిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 639 ప్రయోగాలు జరిగాయి. ఈ స్థితిలో ఫలానా దేశం ముందుందని ఏడ్చి పెడబొబ్బలు పెడుతూ సమయాన్ని వృధాచేసుకోవటంకంటే వెనుకబడి ఎందుకున్నామని ప్రతిదేశం ఆలోచించుకోవటం ఆరోగ్యకరం. తొలి స్పుత్నిక్‌ బరువు 83.4కిలోలు కాగా అతిపెద్ద ఎన్విశాట్‌ 8211 కిలోలు ఉంది. డబుల్‌ డెక్కర్‌ బస్సంత పరిమాణంలో ఉంది. 2003లో ప్రయోగించిన తొలి అతిచిన్న క్యూబ్‌ఉపగ్రహం బరువు కేవలం రెండు కిలోలు మాత్రమే.తరువాత ఒక కిలో, కొన్ని గ్రాములు మాత్రమే ఉన్నవాటిని కూడ నింగిలోకి పంపారు. ఇలాంటి వాటిని జతచేసి పంపేవి కొన్ని కాగా కేవలం ఒకటి మాత్రమే నింగిలో తిరిగేవి కూడా ఉన్నాయి. ఉదహరణకు ఎలన్‌మస్క్‌ స్టార్‌లింక్‌ ఏడువేలు ఉండగా, ప్లానెట్‌ ఇవో 150 కలిగి ఉంది. క్యూబ్‌ ఉపగ్రహాల తయారీకి చాలా తక్కువ ఖర్చు కావటంతో అనేక దేశాలు ఇతర దేశాల్లో ఉన్న కేంద్రాల నుంచి వాటిని ప్రయోగించటానికి దోహదం చేసింది. ఇది వాణిజ్యంగా మారింది. అంతే కాదు, పరస్పర అనుమానాలతో రక్షణ చర్యల్లో భాగంగా అనేక దేశాలు నింగితో పాటు ఉపగ్రహాలను కూడా మిలిటరీ అవసరాలకు వినియోగిస్తున్నాయి. ఈ పోటీలో ఎవరు వెనుకబడితే వారికి అదొక లోపంగా మారుతుంది.

ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయల్‌ జరిపినదాడుల వెనుక తాము గూఢచర్యంతో సమాచారం సేకరించామని ఎంతగా చెప్పుకున్నప్పటికీ మిలిటరీ ఉపగ్రహాల సమాచారం ఎంతో దోహదం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా కూడా అదే జరిగినట్లు కొందరు చెప్పిన అంశం తెలిసిందే. అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు ఈ రంగంలో ముందుండటమే కాదు, తన చుట్టూ కుట్రలు జరుపుతున్నపుడు చైనా దూరంగా ఉండజాలదు.తనపై కుట్ర చేస్తున్న దేశాలకు సంబంధించిన మిలిటరీ కదలికలు, స్థావరాలు,అంతరిక్షంలో మిలిటరీ ఉపగ్రహాలు వాటి కార్యకలాపాలపై నిఘావేసేందుకు తనదైన జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నది.ప్రత్యర్థి కదలికలు,లక్ష్యాలను గుర్తించటం, వాటి మీద నిర్దిష్టంగా దాడులు ఎలా జరపాల్సిందీ సంబంధిత అంశాలు ఒక్క యుద్దం లేదా ఉద్రిక్తతలు తలెత్తినపుడు మాత్రమే చేసేవి కాదు. నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మిలిటరీ పరిభాషలో కిల్‌ చైన్‌ అంటున్నారు. చైనా పెద్ద ఎత్తున అలాంటివాటిలో నిమగ్నమైందని అమెరికా ఆరోపిస్తోంది. ఉదాహరణకు రష్యాలో కొన్ని వందల కిలోమీటర్ల లోపలికి వెళ్లి సైనిక కేంద్రాల మీద డ్రోన్లతో ఒకరోజు దాడులు చేసేందుకు పద్దెనిమిది నెలల పాటు పని చేశామని ఉక్రెయిన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా పథకాలు సిద్దం చేసుకుంటే అవసరమైనపుడు వాటిని అమలు చేస్తారు, లేదా మార్పులకు అనుగుణంగా సవరిస్తారు.మనదేశానికి తగినన్ని మిలిటరీ ఉపగ్రహాలు లేని కారణంగా అమెరికా, ఇతర దేశాల ప్రయివేటు ఉపగ్రహాల నిఘా సమాచారాన్ని మన మిలిటరీ తీసుకుంటున్నది.మన మీడియా కూడా వాటిని కథనాలుగా ముందుకు తెస్తున్నది. మనం ఇతరుల నుంచి తీసుకున్నట్లే పాకిస్తాన్‌ కూడా ఇటీవల అదేపని చేసి మన విమానాలను కూల్చినట్లు చెబుతున్నారు. ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో ఉన్న తమ, మిత్రదేశాల మిలిటరీ కేంద్రాలను గుర్తించేందుకు, వెంబడిరచేందుకు, లక్ష్యాలుగా చేసుకొనేందుకు చైనా మెరుపువేగంతో పని చేస్తున్నదని అమెరికా అధికారి వైటింగ్‌ ఆరోపించాడు.


నిజంగా చైనా అలాంటి సాంకేతిక పరిజ్ఞానం సంపాదించిందా లేదా అన్నది నిర్ధారణ కాలేదు, అమెరికా అనుమానిస్తున్నది.తమ, మిత్రదేశాల విమానవాహక నౌకలతో సహా ఎక్కడ ఎలాంటి మిలిటరీ కార్యకలాపాలు జరుగుతున్నదీ కచ్చితత్వంతో కనిపెట్టగల సత్తాను చైనా సంపాదించిందని, దాని ఆయుధ వ్యవస్థలుసుదూరంగా ఉన్న లక్ష్యాల మధ్య అంతరం తగ్గిపోయిందని వైటింగ్‌ చెబుతున్నాడు. ఉపగ్రహ వ్యతిరేక ఆయుధాల మోహరింపు,అంటే సైబర్‌ దాడులు, ఉపగ్రహాలు, జిపిఎస్‌ పనిచేయకుండా స్థంభింపచేయటం, లేజర్‌ కిరణాల ద్వారా ధ్వంసం చేయటం వంటివి చేయగలదన్నాడు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని మిలిటరీతో అనుసంధానం చేయటం కూడా అమెరికా ఊహించని పరిణామం. ఇరాన్‌పై ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హామర్‌ పేరుతో అమెరికా జరిపిన దాడిలో ఇలాంటి మిలిటరీ ఉపగ్రహాలు నిర్దేశిత లక్ష్యాలను గుర్తించటం, వాటిపై బాంబులు వేయటంలో ఎంతో కీలకపాత్ర పోషించటాన్ని చూసిన తరువాత అమెరికా అధికారి ఈ విషయాలను మీడియాతో చెప్పాడు. రానున్న రోజుల్లో చైనా తమను మించిపోతుందేమో అన్న భయం అమెరికాను వెన్నాడుతున్నదంటే అతిశయోక్తి కాదు.2008లో పని చేయని తన ఉపగ్రహాలలో ఒకదానిని భూమి మీద నుంచి ప్రయోగించిన క్షిపణితో చైనా కూల్చివేసిందని, అయినప్పటికీ అమెరికా దాన్ని పట్టించుకోలేదని కొందరు చెబుతున్నారు. మిలిటరీ ఉపగ్రహాలు అందచేసే సమాచారాన్ని త్రివిధ దళాలతో అనుసంధానించటంలో గతంలో అమెరికా, చైనాల మధ్య అంతరం ఎంతో ఎక్కువగా ఉండదని, ఇటీవల క్రమంగా తగ్గిందని అంచనా వేస్తున్నారు.చైనా ఉపగ్రహ కెమెరాలు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని మిల్లీ మీటర్ల వరకు ఫొటోలు తీయగలవని చెబుతున్నారు. 2024లో యుఎస్‌ఎస్‌ఎఫ్‌ నివేదిక ప్రకారం చైనా మిలిటరీ అవసరాల కోసం 500 ఉపగ్రహాలను వినియోగిస్తున్నది, వాటిలో గత ఒక్క ఏడాదిలోనే 67 ప్రయోగించింది. దాదాపు ఎనిమిదివేల ఉపగ్రహాలను నిర్వహిస్తున్న అమెరికా కేవలం వెయ్యి ఉన్న చైనా గురించి ఇలాంటి భయాలను రెచ్చగొడుతున్నది. చైనా వద్ద డ్రోన్ల దిశను మార్చగల, క్షిపణులు పని చేయకుండా చేయగల, కీలకమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయగల పరిజ్ఞానం ఉందని యుఎస్‌ఎస్‌ఎఫ్‌ ఇండోపసిఫిక్‌ కమాండర్‌ జనరల్‌ ఆంథోనీ మాస్టలర్‌ చెప్పాడు.


అమెరికా తన గగనతల రక్షణతో పాటు ఇజ్రాయెల్‌, మరికొన్ని చోట్ల క్షిపణులను అడ్డుకోగల రక్షణ వ్యవస్థలను డోమ్‌ పేరుతో ఏర్పాటు చేసింది.చైనా, ఉత్తర కొరియా, రష్యా నుంచి ఎదురవుతున్న సవాళ్ల పూర్వరంగంలో డోనాల్డ్‌ ట్రంప్‌ గతంలోనే ముందుకు తెచ్చిన గోల్డెన్‌ డోమ్‌(అంతరిక్షంలో ఆయుధాలు) పధకాన్ని ఇప్పటికే అమలు జరపాల్సిందని విమర్శకులు తప్పుపడుతున్నారు. అలాంటి పథకాలతో అంతరిక్షం పోరుకేంద్రంగా మారుతుందని చైనా గతంలోనే హెచ్చరించింది. సాయుధ సంఘర్షణకు అంతరిక్షాన్ని కేంద్రంగా మారుస్తున్నట్లు చైనా, రష్యా కొద్ది వారాల క్రితం అమెరికాను విమర్శించాయి. తమ నుంచి ముప్పు ఉందనే ప్రచారాన్ని అమెరికా చేస్తున్నదని తమ ఉపగ్రహాలు వాతావరణ మార్పుల పరిశీలన, తదితర ప్రజోపయోగ అవసరాలకు మాత్రమే పని చేస్తున్నాయని చైనా పదే పదే చెబుతున్నది. స్టాటిస్టా సంస్థ సేకరించి విశ్లేషించిన సమాచారం మేరకు అనేక దేశాలు గగనతల కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి, ఏటేటా బడ్జెట్‌లను పెంచుతున్నాయి. ఈ విషయంలో అమెరికా మిగతా దేశాలకు ఎంతో ఎత్తున ఉంది. 2021 నుంచి 2024 మధ్య 51బిలియన్‌ డాలర్ల నుంచి 80కి పెంచగా ఇదే కాలంలో చైనా పది నుంచి 20, జపాన్‌ 4నుంచి ఏడు బిలియన్‌ డాలర్లకు పెంచాయి. తరువాత స్థానాలలో ఉన్న రష్యా, ఫ్రాన్స్‌, ఐరోపా యూనియన్‌, జర్మనీ, ఇటలీ బడ్జెట్‌లలో స్వల్ప మార్పులు తప్ప భారీ పెరుగుదల లేదు. తొమ్మిదవ స్థానంలో ఉన్న మనదేశం 1.96 నుంచి 1.89 బిలియన్‌ డాలర్లకు తగ్గించింది.మన తరువాత స్థానంలో ఉన్న బ్రిటన్‌ కేటాయింపులో పెద్ద మార్పులేదు. చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రధాన భూభాగంలో విలీనం కాకుండా చూసేందుకు అమెరికా చేయని యత్నం లేదు. ఒక వేళ మిలిటరీ చర్య ద్వారా అందుకు పూనుకుంటే తైవాన్‌లో ఉన్న ఆధునిక చిప్స్‌ తయారీ కేంద్రాలను పేల్చివేస్తామని గతంలో అమెరికా బెదిరించింది. ఏటేటా తైవాన్‌ ప్రభుత్వానికి ఆధునిక ఆయుధాలను అందచేస్తున్నది. విలీనాన్ని వ్యతిరేకించే శక్తులకు మద్దతు ఇస్తూ ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది. తైవాన్‌ పేరుతో తూర్పు ఆసియాలో అవసరమైతే మరో యుద్ద రంగాన్ని తెరిచేందుకు పావులు కదుపుతున్నది, ఆ దిశగా కొత్త కూటములను ఏర్పాటు చేస్తున్నది. ఈ నేపధ్యంలో తన రక్షణకు తగిన చర్యలు తీసుకోవటంలో చైనా తప్పు కనిపించటం లేదు, అదే స్థానంలో మనదేశం ఉన్నప్పటికీ చేసేది అదే కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనదేశం సురక్షితమైన హస్తాల్లోనే ఉందా ! నరేంద్రమోడీ తీరుతెన్నులేమిటి ?అంతరిక్షంలో చైనా ఆధిపత్యం !!

29 Sunday Jun 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, USA, WAR

≈ Leave a comment

Tags

'Hypersonic missiles, China’s Space Edge, Ex-ISRO chief warning, ISRO scientists, Narendra Modi Failures, Op Sindoor losses

ఎం కోటేశ్వరరావు

         హైపర్‌సోనిక్‌(ధ్వనికంటే ఐదురెట్లు వేగంగా ప్రయాణించే) క్షిపణులను అడ్డుకోవటం ఎంతో కష్టం, అందువలన భారత్‌కు వందలాది ఉపగ్రహాలు అవసరం అని ఇస్రో మాజీ అధిపతి ఎస్‌ సోమనాథ్‌ వ్యాఖ్యానించారు. జూన్‌ పదవ తేదీన కొన్ని పత్రికల్లో పెద్ద ప్రాధాన్యత లేకుండా ఈ వార్త వచ్చింది. సోమనాథ్‌ మాటల సారం ఏమిటంటే పెద్ద సంఖ్యలో  ఉపగ్రహాలు లేకపోతే సంక్షోభాలు తలెత్తినపుడు దేశ సాయుధ దళాలకు ముప్పు. ఇటీవలి కొన్ని ఉదంతాల్లో ఇది ప్రదర్శితమైంది. ఉదాహరణకు ఉక్రెయిన్‌ పోరులో అది ఎంత కీలక పాత్ర పోషించిందో బాగా కనిపించింది, అంతేగాదు ఇటీవల భారత్‌కూ అది అనుభవమైంది. క్షిపణుల ప్రయోగాలను ముందుగానే పసిగట్టేందుకు హెచ్చరికలు చేయటంతో పాటు వాటికి ప్రతి చర్యలను సూచించేందుకు ఐదువందల ఉపగ్రహాల రాసి అవసరమని అమెరికా పథకం రూపొందించింది.ఈ స్థాయికి భారత్‌కూడా ఎదగాలి.ఒక ఉపగ్రహం 15 నిమిషాల లోపు మాత్రమే పరిశీలించగలదు, అది వెళ్లిపోగానే వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు మరొకటి రావాలి. ఆధునిక యుద్ధాలలో ఉపగ్రహాల అవసరం, ప్రయోజనం గురించి సోమనాథ్‌ చాలా స్పష్టంగా చెప్పారు. మన పాలకులు చెప్పినా చెప్పకపోయినా ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాక్‌ మిలిటరీ మన విమానాలను కొన్నింటిని కూల్చిందన్నది వాస్తవం, యుద్ధం అన్న తరువాత నష్టాలు లేకుండా ఉంటాయా అని మన మిలిటరీ అధికారులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

     అంతరిక్షంలో చైనా తీక్షణత కారణంగా కీలకమైన సాయం చేయగలిగిందని దాంతో పాకిస్తాన్‌ విజయవంతంగా అడ్డుకోగలిగాయని భారతీయ మిలిటరీ వర్గాలు చెప్పినట్లు డిఫెన్స్‌ సెక్యూరిటీ ఆసియా అనే వెబ్‌సైట్‌ జూన్‌7వ తేదీన ప్రచురించిన విశ్లేషణలో పేర్కొన్నది. చైనా తెరవెనుక పాత్ర కారణంగానే ఆరు భారతీయ యుద్ద విమానాలను కూల్చివేయగలిగింది. సమాచారాన్ని పంచుకోవటం, దానికి అనుగుణంగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవటం వలన భారత విమానాలను పసిగట్టగలిగింది.‘‘ వారి వైమానిక రాడార్‌ను అవసరానికి అనుగుణంగా మోహరించటానికి అది(చైనా) వారికి(పాకిస్తాన్‌) సాయపడిరది. అందువలన మన వైమానిక మార్గంలో చేసే చర్యలు వావారికి తెలిసిపోతుంది ’’ అని భారత రక్షణ శాఖ పర్యవేక్షణలో పని చేసే సెంటర్‌ ఫర్‌ జాయింట్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్‌ చేసిన ప్రకటనను ఆ వెబ్‌సైట్‌ విశ్లేషణ ఉటంకించింది. ఆపరేషన్‌ సిందూర్‌ ఘర్షణను కేవలం తన సన్నిహిత ప్రాంతీయ అనుయాయికి మద్దతు ఇచ్చే వ్యూహాత్మక అవకాశంగానే గాక  తను అధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞానం ఆచరణలో ఎలా పని చేస్తుందో పరీక్షించటానికి కూడా చైనా వినియోగించుకుందని అశోక్‌ కుమార్‌ చెప్పారు.చైనా యావోగాన్‌ ఐఎస్‌ఆర్‌ ఉపగ్రహాలు భారత విమానాలు, మిలిటరీ జాడను కనిపెట్టటంలో నిర్ణయాత్మక పాత్రను పోషించాయని, పాకిస్తాన్‌ పైచేయి సాధించటానికి తోడ్పడినట్లు భారత రక్షణశాఖ వర్గాలు తెలిపినట్లు సదరు విశ్లేషణ పేర్కొన్నది. ఒక మేథావి, అధ్యయనవేత్తగా అశోక్‌ కుమార్‌ చెప్పిన ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎందుకు చెప్పలేకపోయిందన్నది సామాన్యులకు అంతుబట్టటం లేదు. .

     యావోగాన్‌ ఉపగ్రహాలు దక్షిణ చైనా సముద్రం నుంచి హిమాలయాల వరకు నిఘావేయగల వ్యవస్థలను కలిగి ఉన్నాయి.2023 డిసెంబరులో ప్రయోగించిన యావోగాన్‌ 41 ఉపగ్రహం ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా భారత ఉపఖండంపై కీలకమైన వైమానిక స్థావరాలు, ప్రాంతాల వివరాలను సేకరించినట్లు ఆరోపిస్తున్నారు. దీన్ని తాము వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల యాజమాన్యం కోసం దీన్ని ప్రయోగించినట్లు చైనా చెబుతోంది.  మిలిటరీ అవసరాలకూ వినియోగించవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చైనా ప్రస్తుతం లియో(లోఎర్త్‌ ఆర్బిట్‌), ఎంఇఓ(మీడియం ఎర్త్‌ ఆర్బిట్‌), జియో(జియో స్టేషనరీ అర్బిట్‌) అనే మూడు రకాల ఉపగ్రహాలు మొత్తం 5,330 కలిగి ఉందని, వీటిలో మిలిటరీ, ఇతర అవసరాలకు ఎన్నింటిని వినియోగిస్తున్నారన్నది వివరాలు తెలియకపోయినా, మనదేశానికి ఉన్న అన్నిరకాలు  218 ఉపగ్రహాలతో పోలిస్తే చైనా ఆధిపత్యం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీటిలో ఎక్కువ భాగం పౌరఅవసరాల కోసం అంటున్నారు.2030 నాటికి మిలిటరీ అవసరాల కోసం 52 ఉపగ్రహాలను ప్రయోగించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది.     నిఘా,సమాచారం,లక్ష్యాల నిర్దేశానికి వీటిని వినియోగిస్తారు. మనదేశం ఎన్‌విఎస్‌ 02 రకం ఉపగ్రహాలతో మనదేశ సరిహద్దులకు పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలో నిఘావేయగలదని, దాని ప్రయోగాలకు సిద్దం చేస్తున్నారు. ఇది అమెరికా జిపిఎస్‌, చైనా బెయిడౌ వ్యవస్థలతో సమానమైదని భావిస్తున్నారు. ఇస్రో మాజీ అధికారి మాధవన్‌కు ఇవన్నీ తెలిసినవే అయినప్పటికీ పెద్ద సంఖ్యలో ఉపగ్రహాల అవసరాల గురించి చెప్పిన మాటలను మన విధాన నిర్ణేతలు విస్మరించకూడదు. ఎవరో ఏదో చేస్తారని గాకపోయినా నేడున్న ప్రపంచ పరిస్థితులలో ఎవరి జాగ్రత్తలో వారుండటం అవసరం. పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి పాకిస్తాన్‌ దుర్మార్గాన్ని ప్రపంచానికి వివరించేందుకు మన పార్లమెంటరీ బృందాలు పర్యటించిన సంగతి తెలిసిందే.అమెరికా ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో రెండు దేశాలూ తమకు ముఖ్యమే అని చెప్పటమే కాదు, ఐరాసలో ఉగ్రవాద నిరోధ కమిటీ ఉపాధ్యక్ష పదవిని పాకిస్తాన్‌కు కట్టబెట్టటం, అన్నింటినీ మించి జి7 సమావేశం నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చి పాక్‌ ఫీల్డ్‌ మార్షల్‌ మునీర్‌ అసిమ్‌కు విందు ఏర్పాటు చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీరు మన పుండు మీద కారం రాసినట్లుగా ఉంది.

     సురక్షితమైన చేతుల్లో దేశం ఉందని ప్రధాని నరేంద్రమోడీ గురించి గొప్పగా ప్రచారం చేశారు.ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో మనలోపాలు వెల్లడయ్యాయి, వెంటనే వాటిని అధిగమించి పాక్‌ను దెబ్బతీశామని మన అధికారులు చెప్పారు. విదేశీ మీడియా సంస్థలు ఏ విషయాన్నీ దాచటం లేదు. రాఫెల్‌ విమానాలు కూలిపోయిన అంశాన్ని అధికారికంగా అంగీకరించనప్పటికీ దాని సామర్ధ్యం గురించి తలెత్తిన సమస్యల గురించి చర్చించేందుకు, దెబ్బతిన్న సంబంధాలను మరమ్మతు చేసేందుకు మనవిదేశాంగ మంత్రి జై శంకర్‌ ఫ్రాన్సు పర్యటించినట్లు డిఫెన్స్‌ సెక్యూరిటీ ఆసియా జూన్‌ పదిన రాసింది.తమ విమానాల కూల్చివేత గురించి భిన్నమైన వార్తలు వచ్చిన నేపధ్యంలో వాటిని విక్రయించిన దసాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీ భారత్‌లో ఉన్న తమ విమానాలను తనిఖీ చేసేందుకు ఒక స్వతంత్ర బృందాన్ని పంపుతామని ప్రతిపాదించగా మన దేశం తిరస్కరించినట్లు ఆ విశ్లేషణలో ఉంది.(ఒకసారి తనిఖీకి అనుమతిస్తే తమ విమానాలు ఎన్ని ఉన్నాయో వారికి తెలుస్తుంది, ఎన్ని లేకపోతే అన్ని కూలినట్లే, తరువాత అయినా ఆ వివరాలు వెల్లడైతే ఇబ్బంది గనుక మనదేశం తిరస్కరించి ఉండవచ్చు. తమ విమానాల గురించి అనుమానాలు పెరిగితే మార్కెట్‌లో పరువు పోతుంది, కొనుగోళ్లకు సందేహిస్తారన్నది దసోల్ట్‌ సమస్య)  తమ విమానాల్లో ఎలాంటి లోపం లేదని భారత వైమానిక దళంలోనే వ్యవస్థాపరమైన వైఫల్యాలు ఉన్నట్లు దసాల్ట్‌ భావిస్తోందట.అనవసరంగా తమ విమానాలను బదనాం చేశారని అది ఆగ్రహిస్తోందని వార్తలు.  మధ్యప్రాచ్యం, లిబియాల్లో తమ విమానాలు అద్భుతంగా పనిచేశాయని, తగినంత అనుభవం ఉన్న సిబ్బంది, సమన్వయం ఉంటే రాఫేల్‌కు తిరుగులేదని చెప్పుకుంటోంది.  అవసరమైన పైలట్లు కూడా భారత్‌లో లేరని కొరత, నిర్వహణ సమస్యలు ఉన్నట్లు వెబ్‌సైట్‌ విశ్లేషణలో పేర్కొన్నారు. పాక్‌తో ఇటీవలి వివాదానికి ముందు 2015లో 486 మంది ఉండగా తరువాత ఉన్న గణనీయంగా పెరిగినప్పటికీ ఇంకా 596 మంది పైలట్ల కొరత భారత వాయుసేనలో ఉన్నట్లు పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన కాగ్‌ నివేదికలో ఉన్నట్లు ఉటంకించారు.2016 నుంచి 2021 మధ్య ఏటా 222 మంది కొత్త పైలట్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ తక్కువ మందినే ఎంపిక చేసినట్లు పేర్కొన్నది. అవసరమైతే చైనా, పాకిస్తాన్‌లను ఎదుర్కొనేందుకు మన వాయుసేన 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలకు అనుమతి ఉండగా ప్రస్తుతం 31 మాత్రమే ఉన్నాయి. 2024 సెప్టెంబరు 19వ తేదీన వచ్చిన ఒక విశ్లేషణలో 30 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయని, 2025 చివరి నాటికి రెండు మిగ్‌`21 విమానాలతో కూడిన రెండు దళాలు సర్వీసు నుంచి తప్పుకుంటాయని పేర్కొన్నారు. ఒక స్క్వాడ్రన్‌ అంటే సంఖ్య ఎంత అనేదానిలో అన్ని చోట్లా ఒకే విధంగా లేవు. సాధారణంగా పన్నెండు నుంచి 24వరకు ఉంటాయి, కొన్ని  సందర్భాలలో అంతకంటే తక్కువతో కూడా ఉండవచ్చు.పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడుల తరువాత 2019లో నరేంద్రమోడీ దేశం సురక్షిత హస్తాల్లో ఉందని ఒక సభలో చెప్పారు. దీనికి రెండు రకాల భాష్యాలు చెప్పవచ్చు. ఒకటి మన మిలిటరీ, దాని గురించి వేరే చెప్పనవసరం లేదు,ప్రాణలను ఫణంగా పెట్టి పని చేస్తున్నది తెలిసిందే. రెండవది పరోక్షంగా నరేంద్రమోడీ గురించి. ఆయన భక్తులు రెండోదాన్నే ఎక్కువగా ప్రచారం చేశారు. పదకొండు సంవత్సరాలుగా రక్షణ రంగంలో తీరుతెన్నులను చూశాం గనుక వాస్తవం ఏమిటో వేరే చెప్పనవసరం లేదు.

   మిలిటరీ గూఢచర్యం, నిఘా వంటి అవసరాలకు స్వంత ఉపగ్రహాలు లేని కారణంగా విదేశీ సంస్థల మీద ఆధారపడుతున్నాం. వారిచ్చే సమాచారం ఒక్కోసారి మనలను తప్పుదారి పట్టించేదిగా ఉంటోంది.గాల్వన్‌ ఉదంతాలలో అదే జరిగిందని చెబుతారు.లండన్‌ కేంద్రంగా పని చేస్తున్న  మిలిటరీ బాలన్స్‌ 2024నివేదిక ప్రకారం చైనా 245 మిలిటరీ ఉపగ్రహాలను నిర్వహిస్తుండగా మనం 26 మాత్రమే కలిగి ఉన్నాం.రెండోసారి వినియోగించే అంతరిక్ష నౌక  కూడా చైనా వద్ద ఉంది. ప్రత్యర్ధులను అడ్డుకొనేందుకు అంతరిక్షంలో ఆధిపత్యాన్ని సాధించేందుకు చైనా ఆసక్తితో ఉందని ఆస్ట్రేలియన్‌ వ్యూహాత్మక విధాన సంస్ధ సీనియర్‌ విశ్లేషకుడు మాల్కమ్‌ డేవిస్‌ చెప్పాడు. అమెరికా దాని అనుబంధ ఉపగ్రహాలకు ప్రతిగా అంతరిక్ష సామర్ధ్యాలను అభివృద్ధి చేస్తున్నదని, ఏ విధంగా చూసినా అమెరికాను అధిగమించేందుకు పూనుకున్నదన్నారు.

      గూఢచర్యం, నిఘా, ముందుగా సర్వే చేసే శక్తి కలిగిన ఐఎస్‌ఆర్‌ రకం 290ఉపగ్రహాలను చైనా మిలిటరీ నిర్వహిస్తున్నదని, మొత్తం ప్రపంచంలో ఉన్నవాటిలో అవి సగమని అమెరికా రక్షణ శాఖ 2023లో పేర్కొన్నది. కొరియా ద్వీపకల్పం, దక్షిణ చైనా సముద్రం, హిందూమహాసముద్రాలను పరిశీలించేందుకు వీలుకలుగుతుందని కూడా చెప్పింది.క్వాంటమ్‌ సమాచార ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించిందని, ఎలాంటి అంతరాయం లేకుండా సమాచారాన్ని అందుకోగలదని కూడా అమెరికా నివేదిక చెప్పింది. అయితే మనదేశం, ఇతర దేశాలను భయపెట్టి తన అదుపులోకి తెచ్చుకొనేందుకు అమెరికా కొన్ని కల్పిత అంశాలను కూడా నివేదికల్లో పొందుపరుస్తుందని గమనించాలి. అమెరికా, నాటో కూటమి మిలిటరీలతో పోలుస్తూ ఆధునిక ధోరణులను అనుసరించటంలో చైనా మిలిటరీ ఎంతో వేగంగా పనిచేస్తుందని లండన్‌లోని సిటీ యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ డేవిస్‌ స్టుపుల్స్‌ చెప్పాడు. అమెరికాకు పోటీగా  ఐదు మీటర్ల సమీపం వరకు వెళ్లి సమాచారాన్ని పంపే స్వంత జిపిఎస్‌ వ్యవస్థలో చైనా 45ఉపగ్రహాలను కలిగి ఉంది. అంతే కాదు ఉపగ్రహాలను కూల్చివేయగల సామర్ధ్యాలను కూడా అది సమకూర్చుకుంటున్నది. అయితే ఇంతవరకు అలా కూల్చిన ఉదంతాలు లేవు గానీ అలాంటి సామర్ధ్యం తమకు ఉన్నట్లు వారు ప్రదర్శిస్తున్నారని డేవిస్‌ చెప్పాడు. ఉపరితలం నుంచి లేజర్‌ కిరణాల ద్వారా అంతరిక్షంలోని ఉపగ్రహాలు పనిచేయకుండా చేయటం, చిందరవందర చేయటం లేదా నష్టపరచగలదని అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ అనుమానిస్తున్నది.పని చేయని ఒక ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు చైనా 2007లో ఒక క్షిపణి ప్రయోగం చేసింది, తరువాత వాటిని కొనసాగిస్తున్నది, ఇది చాలా తీవ్ర విషయమని భావిస్తున్నారు.మనదేశం కూడా 2019లో అలాంటి ప్రయోగమే చేసింది. అమెరికా కూడా అదే పనిచేస్తున్నప్పటికీ దాన్ని పశ్చిమ దేశాలు తీవ్ర అంశంగా పరిగణించకపోవటం గమనించాల్సిన అంశం.  అమెరికాలోని ఎలన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌ ప్రైవేటు రంగంలో ఉపగ్రహ ఇంటర్నెట్‌ రంగంలో ముందున్నది, దానికి ధీటుగా చైనా ప్రభుత్వ రంగ సంస్థ శాట్‌నెట్‌ పదమూడువేల ఉపగ్రహాలను ఇంటర్నెట్‌కోసం అనుసంధానం చేసేందుకు గువోవాంగ్‌ పేరుతో పని చేస్తున్నది.

     చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో మన ఇస్త్రో శాస్త్రవేత్తల కృషి కూడా తక్కువేమీ కాదు. చైనాతో పోల్చితే మన వేగం చాలా తక్కువగా ఉంది. ఇలా చెప్పటాన్ని కొందరు ఇస్రో కృషిని తక్కువ చేసి చూపటంగానూ, దేశద్రోహంగానూ చిత్రించేవారున్నారు. వాస్తవాన్ని దాచి జనాలను భ్రమల్లో ఉంచటం దేశభక్తా, వంచనా ? నైపుణ్య వృద్ధి పేరుతో వేలాది కోట్లు తగలేస్తున్నారు.ముందే చెప్పుకున్నట్లుగా ఇంత పెద్ద దేశంలో మన వాయుసేనకు అవసరమైన సంఖ్యలో శిక్షణ ఇవ్వటానికి పైలట్లుగా ఎవరూ దొరకలేదంటే నవ్విపోతారు.పరిశోధన మరియు అభివృద్దికి మన దేశం జిడిపిలో 0.7శాతానికి అటూ ఇటూగా ఖర్చు ఉంది, అదే చైనా 2.7శాతం వరకు ఖర్చు చేస్తున్నది. ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి అని చతికిల పడిన తరువాత నాలుగు లక్షల కోట్లు, జపాన్‌ అధిగమించామని చంకలు కొట్టుకోవటం కాదు, చేయాల్సిన చోట ఖర్చు చేయటం ముఖ్యం. ప్రభుత్వ రంగం అసమర్ధంగా ఉందని చిత్రించి 1990దశకం నుంచి పూర్తిగా ప్రైవేటు రంగానికి అప్పగించటమే కాదు ఉన్న ప్రభుత్వ రంగాన్ని మూసివేసి ఆస్తులను తెగనమ్ముతున్నారు. మూడున్నర దశాబ్దాల ప్రైవేటు రంగం సాధించిందేమిటి ? చైనాను అనుకరిస్తామని చెబుతారు, అక్కడేమీ ప్రభుత్వ రంగ ప్రాధాన్యతను తగ్గించలేదు, పెంచుతూనే ఉన్నారు.మన ప్రయివేటు రంగం అంత సమర్ధత కలిగితే ఎందుకని చైనా కంటే జిడిపిలో మనదేశం అంతవెనుక బడి ఉంది.

          మన దేశం ఇటీవల ఏడాదికి మూడు ఉపగ్రహప్రయోగాలు జరుపుతుండగా ఈ ఒక్క ఏడాదే చైనా వంద ప్రయోగాలకు ప్రణాళిక రూపొందించింది.చైనా నిఘా ఉపగ్రహాలు కక్ష్య నుంచి ఐదు వందల కిలోమీటర్ల వరకు యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో ప్రత్యర్ధుల మిలిటరీ కదలికలను పసిగట్టటం, లక్ష్యాలను గురిచూడటం వంటి పనులు చేయగలవు. రష్యా, ఉక్రెయిన్‌ పోరులో పశ్చిమ దేశాలకు చెందిన ఇలాంటి ఉపగ్రహాలు ఇచ్చిన సమాచారంతోనే ఉక్రెయిన్‌ దాడులు చేయగలుగుతున్నట్లు చెబుతున్నారు. పశ్చిమ దేశాల ముఖ్యంగా అమెరికా ప్రైవేటు సంస్థలు టిటెట్‌ తదితర సరిహద్దు ప్రాంతాల్లో చైనా మోహరింపు గురించి మన దేశానికి సమాచారాన్ని అందచేస్తున్నాయి.ఇటీవల చైనా కూడా పాకిస్తాన్‌కు అలాంటి సాయమే చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మనం ఇతరుల మీద ఆధారపడుతుండగా చైనా స్వంతంగా సమకూర్చుకుంటోంది. పెట్రోలు, డీజిలుపై భారీ మొత్తం సెస్‌ విధించి వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తే దేశ రక్షణ అవసరాలకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. అదే నిజమైతే చైనా కంటే ఇంతగా ఎందుకు వెనుకబడి ఉన్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆగిన పరస్పర దాడులు : ఇరాన్‌ అణు కేంద్రాలు సురక్షితం, ఒప్పందం భవిష్యత్‌ ఏమిటి !

25 Wednesday Jun 2025

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, USA, WAR

≈ Leave a comment

Tags

Donald trump, Iran NPT, Iran nuclear weapon, Iran-Israel Tensions, Israel-Iran truce, Supreme Leader Ali Khamenei, US ‘did not destroy’ Iranian nuclear sites


ఎం కోటేశ్వరరావు


నాటకీయ పరిణామాలు జరుగుతున్న పూర్వరంగంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.అదే జరిగినట్లు కనిపిస్తోంది.పన్నెండు రోజుల పాటు సాగిన ఇజ్రాయెల్‌`ఇరాన్‌ పోరు ముగిసిందని, రెండు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు.మంగళవారం నాడు రెండు దేశాలూ దీన్ని ధృవీకరించాయి. తరువాత ఇరాన్‌ మీద ఆరోపణలు చేస్తూ ఇజ్రాయెల్‌ టెహరాన్‌మీద దాడులకు తెగబడినట్లు వార్తలు.అంతకు ముందు ఇరాన్‌ కూడా దాడి జరిపి నలుగురి ప్రాణాలు తీసిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. టెల్‌అవీవ్‌ చర్యలను ట్రంప్‌ ఖండిరచాడు, పనిలో పనిగా ఇరాన్‌ మీద కూడా విమర్శలు చేశాడు. మూడు పక్షాలూ విజయం తమదంటే తమదే అని ప్రకటించుకున్నాయి. దాని సంగతి ఎలా ఉన్నా మూడు దేశాలకూ తలబొప్పి కట్టింది. ప్రపంచ దేశాలకు పెద్ద ప్రమాదం తప్పినందుకు శాంతిని కోరుకొనే వారందరూ సంతోషించే పరిణామం ఇది.తాము అనుకున్నవన్నీ సాధించామని, ఉల్లంఘనలకు పాల్పడితే తిరిగి దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ ప్రదాని నెతన్యాహు ప్రకటించాడు. అంతకు ముందు ట్రంప్‌ ప్రకటన తరువాత ఇరాన్‌ దాడులు కొనసాగిస్తున్నదని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌, ఇజ్రాయెల్‌ ఆక్రమణలోని జెరూసలెంలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. దక్షిణ ఇజ్రాయెల్‌ పట్టణం బీర్‌షిబాపై జరిగిన దాడిలో నలుగురు మరణించారు. అంతకు ముందు కతార్‌ రాజధాని దోహా సమీపంలో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరం మీద ఇరాన్‌ క్షిపణిదాడి చేసింది. ట్రంప్‌ ప్రకటనతో ముడిచమురు మార్కెట్లో ధరలు పడిపోయాయి. ప్రామాణిక బ్రెంట్‌ రకం ధర జూన్‌ 12న 69.36 డాలర్లు ఉండగా 78 డాలర్లు దాటింది, మంగళవారం 67 డాలర్లకు పడిపోయి బుధవారం ఉదయానికి 68కి పెరిగింది. బి2 బాంబర్లతో అమెరికా జరిపిన దాడిలో ఇరాన్‌ అణుకేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని వార్తలు రాగా అమెరికా వాటిని ఖండిరచింది. మొత్తం మీద అమెరికా సామర్ధ్యం ప్రశ్నార్ధకంగా మారింది, నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ ఒప్పందం సజావుగా అమలు జరుగుతుందా, ఇతర సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారు అన్న చర్చ మొదలైంది.


పశ్చిమాసియాలో ఏం జరగనుంది, కాల్పుల విరమణ అమలు జరుగుతుందా, ఆకస్మికంగా జరుగుతున్న పరిణామాల వెనుక ఏం జరిగిందీ అని పరిపరివిధాలుగా చర్చలు సాగుతున్నాయి. వాటన్నింటికీ కొద్ది రోజుల తరువాతే ఒక సమాధానం దొరుకుతుంది. యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో ముందుగా బలయ్యేది ‘‘నిజం ’’. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక అన్నట్లుగా ఎవరేమి చెప్పినా దాన్ని యధాతధంగా తీసుకుంటే ఇబ్బందుల్లో పడతాము. ట్రంప్‌ ప్రకటనకు ముందు తరువాత ఏం జరిగిందన్నది ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. రెండు వారాల తరువాత తాము యుద్ధంలో పాల్గ్గొనేదీ లేనిదీ వెల్లడిస్తామని ప్రపంచాన్ని తప్పుదారి పట్టించిన ట్రంప్‌ రెండు రోజుల్లోనే బి2 బాంబర్లతో ఇరాన్‌లోని అణుకేంద్రాలున్నట్లు భావిస్తున్న ప్రాంతాలపై దాడులు చేసి వాటిని పనికిరాకుండా చేశామని ప్రకటించాడు. అయితే అదింకా నిర్దారణ కాలేదని అమెరికన్‌ అధికారులే చెప్పారు. ముందుగానే ఊహించిన ఇరాక్‌ పాక్షికంగా శుద్ది చేసిన 408కిలోల యురేనియం, పరికరాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వార్తలు.దీనికి ప్రతీకారంగా సోమవారం నాడు కతార్‌లోని అల్‌ ఉదీద్‌ అమెరికా మిలిటరీ స్థావరంపై ఇరాన్‌ దాడి చేసింది. తమలక్ష్యం ఇరాన్‌లోని అణుశుద్ధి సామర్ధ్యాన్ని దెబ్బతీయటమేనని, దాన్ని జయప్రదం కావించినట్లు ట్రంప్‌ చెప్పాడు. అలాంటిదేమీ లేదని ఇరాన్‌ చెప్పగా, కొత్తగా రేడియేషన్‌ ముప్పు లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెప్పింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు ఖాళీ చేసిన తరువాత ఎవరూ లేని భవనాలను మనదేశం దెబ్బతీసినట్లుగా అమెరికా దాడి ఉన్నట్లు చెప్పుకోవచ్చు.గగనతలంలోనే ఇంథనం నింపుకుంటూ దాదాపు పన్నెండువేల కిలోమీటర్ల దూరం 37 గంటల పాటు ప్రయాణించి బి2 బాంబర్లు దాడి చేసి వెనక్కు వెళ్లిపోయాయి. ఆటముగియలేదు అని దాడి తరువాత ఇరాన్‌ ప్రకటించింది.తామెవరికీ హనితలపెట్టలేదని అయితే ఎవరి నుంచీ ఎట్టిపరిస్థితిలోనూ వేధింపులను సహించేది లేదని అధినేత అలీ ఖమేనీ ప్రకటించాడు.


రెండు దేశాలూ శాంతికోసం తనను సంప్రదించాయని డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకున్నాడు. కాల్పుల విరమణకు ట్రంప్‌ తమను అభ్యర్ధించినట్లు ఇరాన్‌ ప్రకటించింది.రెండు దేశాలూ ఏదో విధంగా ఒప్పందం కుదరాలనే చూశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాల్పుల విరమణ వెనుక కతార్‌ కూడా ఉందనే వార్తలు వచ్చాయి. దోహా సమీపంలో ఉన్న అమెరికా వైమానిక స్థావరం మీద తాము దాడి చేయనున్నట్లు ముందుగానే ఇరాన్‌ తెలియచేసింది. తమ సత్తా ఏమిటో చూపేందుకే టెహరాన్‌ క్షిపణి దాడి చేసినట్లు కనిపిస్తోంది. యుద్ధం అన్న తరువాత ఉభయపక్షాలకూ నష్టమే. ఇప్పటికే ఆంక్షలతో బాగా దెబ్బతిన్నది ఇరాన్‌. గాజా మీద దాడులు చేస్తూ ఇజ్రాయెల్‌ కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోయింది.ఇరాన్‌ మీద దాడులకు కూడా దానికి భారీగానే చేతిచమురు వదిలింది. అన్నింటికీ మించి పశ్చిమదేశాలు అందించిన రక్షణ కవచం ఐరన్‌ డ్రోమ్‌ తమను పూర్తిగా కాపాడుతుంది అన్న భ్రమల్లో ఉన్న ఇజ్రాయెలీలు అది పూర్తిగా వాస్తవం కాదని తొలిసారి తెలుసుకున్నారు. దీంతో సాధారణ పౌరుల నుంచి వచ్చిన వత్తిడి కూడా నెతన్యాహు మీద పని చేసిందనే చెప్పాలి. అమెరికాదీ అదేపరిస్థితి, ఇజ్రాయెల్‌కు ఎంతగా ఆయుధాలు అమ్మినా దాని వలన అమెరికన్‌ కంపెనీలకు లాభాలు తప్ప సాయం రూపంలో ఇచ్చే మొత్తం అమెరికా ఖజానా నుంచే భరించాల్సి ఉంది.ఇరాన్‌ అణుకేంద్రాలపై దాడి తరువాత దాని గురించి అమెరికా జనంలో పరిణామాలు, పర్యవసానాల గురించి, అసలు ఇది సరైన చర్యేనా అని పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. భవిష్యత్‌లో అమెరికా ఏ యుద్దంలోనూ పాల్గొనదని ప్రకటించిన ట్రంప్‌ ఇలా చేశాడేమిటి అని తర్జనభర్జనలు పడ్డారు. ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పటంతో ప్రపంచంలోని అమెరికన్లందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ట్రంప్‌ సర్కార్‌ హెచ్చరించటం కూడా దీనికి తోడైంది. ట్రంప్‌ చర్యను డెమోక్రటిక్‌ పార్టీ విమర్శించటం, అనేక చోట్ల యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరగటంతో ట్రంప్‌పై వత్తిడి పెరిగింది.


ఇరాన్‌ అణుశుద్ధి సామర్ధ్యాన్ని పూర్తిగా దెబ్బతీశామని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అందువలన అంతకు ముందు మాదిరి తమతో మరోసారి ఒప్పందానికి రావాలని డిమాండ్‌ చేసే అవకాశం లేదు. దానికి భిన్నంగా ఒప్పందానికి పట్టుబడితే చెప్పిన మాటలన్నీ డొల్ల అని యావత్‌ ప్రపంచం భావించటమే కాదు, అమెరికా పరువు పోతుంది. ఈ పూర్వరంగంలో అమెరికా ఏకపక్షంగా వైదొలిగిన ఒప్పందం భవిష్యత్‌ ఏమిటి ? ఇరాన్‌ తిరిగి తన కార్యక్రమాన్ని కొనసాగిస్తుందా ? ఇవన్నీ శేష ప్రశ్నలు.దౌత్య తరుణం తప్ప 2015లో కుదిరిన ఒప్పందాన్ని పునరుద్దరించే అవకాశాలు లేవని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రయబకోవ్‌ వ్యాఖ్యానించాడు.అయితే ట్రంప్‌ ప్రకటనకు ముందే ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఐరాస, అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటే అణుకార్యక్రమం నుంచి ఇరాన్‌ తప్పుకోవాలని, దానికి బదులు శాంతియుత ప్రయోజనాలకు సహకరిస్తామని హామీ ఇచ్చిన ఒప్పందాన్ని సులభంగా ఇరాన్‌ అణు ఒప్పందం అని పిలుస్తున్నారు. దాని పూర్తి పేరు ‘‘ సంయుక్త సమగ్ర కార్యాచరణ పధకం(జెసిపిఓఏ). ఇరాన్‌తో పాటు భద్రతా మండలిలో ఉన్న ఐదు శాశ్వత సభ్యదేశాలైన అమెరికా,రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్సు, ఐరోపాయూనియన్‌తో పాటు జర్మనీ దీనిలో భాగస్వాములు.2013లో సంప్రదింపులు ప్రారంభమై 2015లో ఒప్పందం కుదిరింది.మరుసటి ఏడాది జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చింది.ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియా వ్యతిరేకించగా ఇరాన్‌, అమెరికాల్లో ప్రభుత్వ వ్యతిరేకులు కూడా వ్యతిరేకించారు. దీన్నుంచి 2018లో అమెరికా వైదొలగటమే గాక మరిన్ని కఠినమైన ఆంక్షలను ప్రకటించింది.ఇరాన్‌తో ఎవరు వాణిజ్య లావాదేవీలు జరిపినా ఆ దేశాల మీద కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దాంతో మనదేశం అక్కడి నుంచి చమురు కొనుగోలు నిలిపివేసింది.


ఒప్పందం ప్రకారం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 13 సంవత్సరాల్లో మధ్యతరహా శుద్ది చేసిన యురేనియం మొత్తాన్ని తొలగించాలి, నిల్వల్లో 98శాతం కోత పెట్టాలి, గ్యాస్‌ సెంట్రిఫ్యూజుల్లో మూడోవంతు తగ్గించాలి.పదిహేను సంవత్సరాల పాటు భారజల కేంద్రాలను నిర్మించరాదు,యురేనియంను 3.67శాతమే శుద్ధి చేయాలి.పదేండ్లలో తొలితరం శుద్ధి కేంద్రానికే పరిమితం కావాలి, మిగిలిన కేంద్రాలను అణువ్యాప్తి నిరోధించే కేంద్రాలుగా మార్చాలి. వీటన్నింటినీ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణకు అంగీకరించాలి.దీనికి ప్రతిఫలంగా అమెరికా, ఐరోపాయూనియన్‌, ఐరాస భద్రతా మండలి విధించిన అణుసంబంధ ఆంక్షలన్నీ ఎత్తివేయాలి. ఈ ఒప్పందం ఎనిమిది సంవత్సరాలు లేదా ఒప్పందం అమలు జరిగినట్లు అణు ఇంధన సంస్థ నిర్ధారించేవరకు అమల్లో ఉండాలని భద్రతామండలి తీర్మానించింది.2016లో అధికారానికి వచ్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ ఒప్పంద నుంచి వైదొలుగనున్నట్లు సాంకేతికంగా చెప్పకపోయినా 2017 అక్టోబరు 12న తమ దేశ చట్టాల ప్రకారం ఒప్పందాన్ని నిర్దారించలేమని ప్రకటించాడు.2018 మార్చి నెలలో ఐఏఇఏ సమర్పించిన నివేదికలో ఒప్పందానికి ఇరాన్‌ కట్టుబడి అమలు చేస్తున్నదని పేర్కొన్నది. అయితే ఇరాన్‌ రహస్యంగా అమలు చేస్తున్న ఆయుధకార్యక్రమం గురించి ఈ సంస్థకు వెల్లడిరచలేదని ఏప్రిల్‌ 30న అమెరికా, ఇజ్రాయెల్‌ ఆరోపించాయి. మే 18వ తేదీన ఒప్పందం నుంచి తాను వైదొలుగుతున్నట్లు అమెరికా ఏకపక్షంగా ప్రకటించింది.తరువాత నవంబరు నుంచి అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. తాము ఒప్పందానికి కట్టుబడి ఉండేది లేదని 2020జనవరి ఐదున ఇరాన్‌ ప్రకటించింది, అయితే అణుఇంధన సంస్థతో సమన్వయం చేసుకుంటామని ప్రకటించింది.


ఈ ఒప్పంద పూర్వరంగాన్ని పరిశీలించకపోతే సమగ్రత రాదు.1970లో ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఆనాడు అక్కడ అమెరికా అనుకూల రాజు ఉండటంతో శాంతికోసం అణువులు అనే కార్యక్రమం కింద సాయం చేస్తామని, దానికి ప్రతిగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి) మీద సంతకం చేయించింది అమెరికా. 1979 ఇరాన్‌ రివల్యూషన్‌లో అమెరికా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి అయాతుల్లా రుహల్లా ఖొమైనీ అధికారానికి వచ్చాడు. ఎన్‌పిటి అమలు సందేహాస్పదమైంది. అనేక మంది అణుశాస్త్రవేత్తలు ఇరాన్నుంచి పారిపోయారు. అణుపరిజ్ఞానం పట్ల ఖొమైనీ కూడా తొలిరోజుల్లో ఆసక్తి చూపలేదు.1980దశకం చివరిలో ఎన్‌పిటిని పక్కన పెట్టి చైనా సాయంతో అణుకార్యక్రమాన్ని ప్రారంభించారు, తరువాత పాకిస్తాన్‌, రష్యా కూడా దానికి సహకరించింది.2002లో పారిస్‌లో ఉన్న ఇరాన్‌ అసమ్మతివాదులు ఇరాన్‌ అణుకార్యక్రమం, కేంద్రాల గురించి వెల్లడిరచారు. తరువాత ప్రభుత్వం కూడా వాస్తవమే అని చెప్పింది.2003లో అణువిద్యుత్‌ కేంద్రాల సందర్శనకు ఐఎయిఏ ప్రతినిధులను అనుమతించారు తప్ప నమూనాలను సేకరించేందుకు తిరస్కరించారు.ఎన్‌పిటి రక్షణ జాగ్రత్తలు తీసుకోవటం లేదని ఆ సంస్థ నివేదించింది.2004లో కుదిరిన పారిస్‌ ఒప్పందం ప్రకారం తాత్కాలికంగా యురేనియం శుద్ధిని నిలిపివేసేందుకు అంగీకరించింది. అయితే తమ ప్రతినిధులు దేశద్రోహానికి పాల్పడ్డారని ప్రకటించిన ఇరాన్‌ 2006లో ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది. తాము అణువిద్యుత్‌ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకుంటున్నాం తప్ప అయుధాల కోసం కాదని ప్రకటించింది. దాంతో భద్రతా మండలి చేసిన తీర్మానంలో అణుశుద్ది నిలిపివేయాలని కోరింది. క్షిపణి పరిజ్ఞానాన్ని అందచేయకూడదని ఇతర దేశాలను ఆదేశించింది, కొందరి ఆస్తులను స్తంభింపచేసింది.తరువాత మరో ఐదు తీర్మానాలు చేసి ఆంక్షలు విధించింది. తరువాత 2013లో అమెరికా చొరవతో చర్చలకు తెరతీశారు. ఆ తరువాత ఏం జరిగిందీ పైన చూశాం. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఏం చేస్తారు, తదుపరి చర్యలేమిటి అన్నది పెద్ద ప్రశ్న.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ అంచనా తప్పిందా, బంకర్‌లో నెతన్యాహు, జి7 సభ నుంచి అర్ధంతరంగా వెనుదిరిగిన ట్రంప్‌ !

18 Wednesday Jun 2025

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Ayatollah Ali Khamenei, Donald trump, Iran nuclear weapon, Israel Attack on Iran, Netanyahu


ఎం కోటేశ్వరరావు


ఇరాన్‌లో తెల్లవారు రaామున మూడు గంటల సమయంలో 2025 జూన్‌ 13వ తేదీ ఇజ్రాయెల్‌ వైమానిక దళం విరుచుకుపడిరది.రెండువందల జెట్‌లతో వంద లక్ష్యాలపై దాడి చేసింది. అనేక మంది మిలిటరీ ఉన్నతాధికారులు, అణుశాస్త్రవేత్తలను హత్యచేసింది. మరోవైపున ఆకస్మికదాడిని ఊహించని ఇరాన్‌ వెంటనే కోలుకొని ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రాణ భయంతో బంకర్‌లోకి వెళ్లిపోయాడు, నలభై లక్షల జనాభా ఉన్న రాజధాని టెల్‌అవీవ్‌ నగరం దాడులతో అతలాకుతలం అయినట్లు చెబుతున్నారు.కెనడాలో జరుగుతున్న జి7 కూటమి సమావేశాల నుంచి అర్ధంతరంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక రోజు ముందుగానే వెనుదిరిగాడు. ఇది రాసిన సమయానికి రెండు దేశాల మధ్య పరస్పరదాడులు కొనసాగుతున్నాయి. కోటీ 70లక్షల జనాభా ఉన్న టెహరాన్‌ నగరాన్ని వదలి వెళ్లాలని ఇజ్రాయెల్‌, దానికి వెన్నుదన్నుగా ఉన్న డోనాల్డ్‌ ట్రంప్‌ పిలుపు ఇవ్వగా టెల్‌అవీవ్‌ను ఖాళీ చేయాలని ఇరాన్‌ ప్రకటించింది. ఇటీవలి కాలంలో నివాసిత ప్రాంతాల నుంచి జనం ఖాళీ చేయాలన్న పిలుపులు సర్వసాధారణంగా మారాయి. యుద్ధ సమయంలో జరిగిన నష్టాల గురించి ఎవరు ఏమి చెప్పినా అతిశయోక్తులు ఉంటాయన్నది తెలిసిందే. తమ పౌర నివాసాలపై ఇరాన్‌ దాడులు చేస్తున్నదంటూ ఇజ్రాయెల్‌ గుండెలు బాదుకుంటున్నది.దానికి పశ్చిమ దేశాల మీడియా సమర్ధన, కావాలంటే వారు కూడా మిలిటరీ కేంద్రాల మీద దాడులు చేయవచ్చు కదా అన్నట్లు ఫోజుపెడుతున్నాయి. ఇజ్రాయెల్‌ తొలిరోజు జరిపిన దాడి టెహరాన్‌లోని పౌరనివాస భవనం మీదే, అక్కడ నివశిస్తున్న అణుశాస్త్రవేత్తలతో సహా 60 మంది మరణించారు. నిత్యం గాజాలో ఆసుపత్రులు, పాఠశాలలతో సహా, నివాసభవనాలు చివరికి సహాయశిబిరాలు, సహాయ కేంద్రాల వద్ద ఉన్న పౌరుల మీద మారణకాండ జరుపుతున్నది, వేలాది మంది పిల్లలు, మహిళలు, కదలలేని వృద్దుల ఉసురుతీస్తున్న తీరు ప్రపంచం చూడటం లేదా !


కెనడాలో జరుగుతున్న జి7 కూటమి సమావేశాల నుంచి ముందే ఎందుకు వెనుదిరిగి వెళ్లిపోతున్నారన్న ప్రశ్నకు ఇంతకంటే ముఖ్యమైన పనులున్నాయని ట్రంప్‌ బదులిచ్చాడు. అటువంటపుడు అసలా సమావేశానికి ఎందుకు వెళ్లినట్లు ? ఈ పరిణామం గురించి భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఊహించినదానికి భిన్నంగా ఇరాన్‌ దాడులకు దిగటంతో తలెత్తిన పరిస్థితిలో ఏం చేయాలన్న తర్జన భర్జనలకు అన్నది ఒకటైతే, ఇరాన్‌పై స్వయంగా అమెరికా దాడులకు పూనుకోవాలన్న వత్తిడి పెరిగిన కారణం అని రెండవదిగా చెబుతున్నారు. రెండూ ఒకదానితో ఒకటి సంబంధాలు కలిగిన అంశాలే గనుక ఏం చేయనున్నారనేదాన్ని బట్టి పరిణామాలు ఉంటాయి. ఇరాన్‌ అణుబాంబులు తయారు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుందని గతంలో వార్తలు వచ్చాయి. అందుకే ట్రంప్‌ 60రోజుల్లో ఒప్పందానికి రాకపోతే మీ అంతు చూస్తానని ట్రంప్‌ బెదిరించాడు. ఆ గడువు ముగిసిన మరుసటి రోజే ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. అంతకు ముందు జాతీయ గూఢచార సంస్థ అధిపతి తులసీ గబ్బార్డ్‌ సెనెట్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఇరాన్‌ అణుబాంబును తయారు చేయటం లేదని గూఢచారులు అంచనాకు వచ్చినట్లు చెప్పారు. అణుకార్యక్రమం నుంచి వైదొలిగేట్లు చేసే వత్తిడిలో భాగంగా ఇజ్రాయెల్‌ దాడులకు ట్రంప్‌ పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో కొన్ని కేంద్రాలు పాక్షికంగా దెబ్బతినటం తప్ప భూగర్భంలో ఉన్న అసలైన కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వార్తలు వచ్చాయి. వాటిని దెబ్బతీయాలంటే బి2 బాంబర్లు లేదా 30వేల పౌండ్లు(13,607కిలోలు) భారీ బాంబులు అవసరం, అవి ఇజ్రాయెల్‌ వద్దలేవు గనుక నేరుగా అమెరికా రంగంలోకి దిగాలని వత్తిడి వస్తున్నదట. ఇంతకంటే ముఖ్యమైన పనులన్న ట్రంప్‌ వ్యాఖ్యకు ఇదే అర్ధమా ? లేక గౌరవ ప్రదంగా ఇజ్రాయెల్‌ను ఎలా బయటపడవేయాలని చూస్తున్నాడా ?


కెనడా నుంచి అర్ధంతరంగా ట్రంప్‌ వాషింగ్టన్‌ వెళ్లటం ఇరాన్‌ మరియు ఇజ్రాయెల్‌ మధ్య సయోధ్య కుదర్చటానికే అని ఫ్రెంచి అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మక్రాన్‌ వ్యాఖ్యానించాడు. అయితే మక్రాన్‌ చెప్పింది తప్పని, మీడియాలో ప్రచారం కోసం తాపత్రయపడుతున్నాడని, తన తిరుగు ప్రయాణానికి సయోధ్యకు సంబంధమే లేదని ట్రంప్‌ చెప్పాడు. అతగాడి మాటలను విశ్వసించాల్సినపని లేదు. ఇజ్రాయెల్‌ చర్యల గురించి పరిపరి విధాలుగా చర్చ జరుగుతున్నది. గతంలో మారణాయుధాలను గుట్టలుగా పోసిన ఇరాక్‌ నేత సద్దాం హుస్సేన్‌ ప్రమాదకరంగా మారినందున తాము దాడిచేశామని అమెరికా తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్‌ అణుబాంబు కార్యక్రమంలో ఉందని అది తమకు ముప్పు అని అందుకే ముందు జాగ్రత్తగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూస్తున్నది. దానికి అమెరికా, ఐరోపా ధనిక దేశాలు వంతపాడాయి. వర్తమాన ప్రపంచంలో అణుబాంబులు కలిగిన దేశాలు కొన్ని తమకు లొంగని వారిని బెదిరించేందుకు పూనుకున్నాయి. అందువలన ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని ఏ దేశమైనా అణ్వాయుధాలను తయారు చేయవచ్చు. మనదేశం కూడా ఆ విధంగానే తయారు చేసింది. అణువిద్యుత్‌ కేంద్రాలు కలిగిన ఏ దేశమైనా ఆయుధాల తయారీకి అవసరమైన యురేనియంను శుద్ది చేసే సత్తా కలిగి ఉంటుంది.అమెరికా తొత్తు ప్రభుత్వాన్ని కూల్చివేసిన తరువాత మరోసారి అమెరికా కుట్రలకు సమాధానం చెప్పేందుకు ఇరాన్‌ నూతన నాయకత్వం అణుకార్యక్రమం చేపట్టింది.


నేడు పశ్చిమాసియాలో యుద్ధం చెలరేగటానికి అసలైన నేరస్తురాలు అమెరికా. ఇరాన్‌ తనకు కొరకరాని కొయ్యగా మారినప్పటి నుంచి దానికి వ్యతిరేకంగా చేయని కుట్ర లేదు. ఇజ్రాయెల్‌ తనకు ఇరుగు పొరుగు అరబ్‌, ఇస్లామిక్‌ దేశాల నుంచి ముప్పు ఉందంటూ పాలస్తీనాకు కేటాయించిన ప్రాంతాలతో పాటు ఇరుగుపొరుగుదేశాల ప్రాంతాలను ఆక్రమించింది. యూదులను తరలించి ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో జనాభా నిష్పత్తిని మార్చి అవి తమ ప్రాంతాలే అని చెప్పేందుకు పూనుకుంది. ఇప్పుడు ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని బూచిగా చూపి రక్షణ కావాలంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నది. ఇరాన్‌ అణుసమస్య పదమూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. నాటోలో చేరాలా లేదా అన్నది ఒక సార్వభౌత్వ దేశంగా ఉన్న ఉక్రెయిన్‌కు ఉందని వాదిస్తున్న అమెరికా అదే సార్వభౌమత్వం కలిగిన ఇరాన్‌ అణుబాంబును తయారు చేస్తుంటే చేయటానికి వీల్లేదని చెప్పటం అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదు. నాటోను విస్తరించబోమని గతంలో రష్యాతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగానే ఇరాన్‌తో చేసుకున్న 2015నాటి అణు నిరోధ ఒప్పందాన్ని అమలు జరపకుండా 2018లో ఏకపక్షంగా వైదొలిగింది. నాటోలో చేరే ఉక్రెయిన్‌తో తనకు ముప్పు ఉన్నందున రష్యా దాని మీది సైనిక చర్యను ప్రారంభించినట్లుగానే అమెరికా స్వయంగా వైదొలిగినందున తన కార్యక్రమాన్ని ఇరాన్‌ కొనసాగిస్తున్నది.ఇప్పుడు అది ఒక దశకు వచ్చినట్లు పసిగట్టింది గనుక ఆపివేయాలంటూ ఏకపక్షంగా బెదిరింపులకు దిగింది. ఆ ఒప్పందాన్ని అమెరికా పూర్తిగా అమలు జరిపి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు, ఇరాన్‌ మరియు ఇజ్రాయెల్‌ కూడా సురక్షితంగా ఉండేవి. అందువలన అసలు నేరస్తురాలు అమెరికా. చరిత్రను చూసినపుడు అది అడుగుపెట్టిన ప్రతి చోటా సమస్య పరిష్కారం సంగతి తరువాత కొత్త వివాదానికి తెరలేపటాన్ని చూడవచ్చు. ఒక విషవలయంగా మార్చి తన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకోసం చూస్తున్నది. పశ్చిమాసియాలో అది ఇంతవరకు ఎలాంటి నిర్మాణాత్మక పాత్రను పోషించటం లేదు, ప్రతినాయకుడిగా మారుతున్నది. పాలస్తీనా సమస్యను పరిష్కరించకుండా చూస్తున్నది, గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని విహార ప్రాంతంగా మారుస్తానని ట్రంప్‌ చెప్పటం మరింత అగ్నికి ఆజ్యం పోయటం గాక మరేమిటి ? మధ్యప్రాచ్య అడవిలో రారాజు సింహం లాంటిది అమెరికా, దానిలో కందిరీగవంటిది ఇరాన్‌, దాన్ని చంపటానికి అవసరమైతే మొత్తం అడవిని తగలబెట్టాల్సి ఉంటుందంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో ఒక రచయిత పేర్కొన్నాడంటే అమెరికన్ల ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

తాజా దాడులలో ఇప్పటి వరకు కనిపించినదాన్ని బట్టి ఇజ్రాయెల్‌కు ఉన్న పరిమితులు ఏమిటో అది అమెరికాను కూడా ఎలా యుద్దానికి లాగేందుకు చూస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇరాన్‌ శక్తిని అది తక్కువ అంచనా వేసింది. లెబనాన్‌లో ప్రభుత్వేతర సాయుధ శక్తిగా ఉన్న హిజబుల్లా నెట్‌వర్క్‌లో ప్రవేశించి గత ఏడాది దానికి భారీ నష్టం చేకూర్చింది. అదే మాదిరి ఇరాన్‌లో చేయాలని చూసింది, కొందరు విద్రోహులను చేరదీసి కొంత మేరకు నెరవేరినట్లు కనిపిస్తున్నది. ఇరాన్‌లో ఎందరు మిలిటరీ కమాండర్లను హతమార్చినా ప్రత్యామ్నాయం ఉంటారన్న అంశాన్ని విస్మరించింది.హిజబుల్లాలోనే అలాంటి నేతలు ఉన్నపుడు ఇరాన్‌లో కొదవేముంటుంది. తన తొత్తుతో దాడులు చేయించి ఇరాన్‌న్ను దారికి తెచ్చుకోవాలన్నది అమెరికా దుష్ట ఎత్తుగడ, రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్‌తో ఇటీవల భారీ ఎత్తున దాడులు చేయించినప్పటికీ పుతిన్‌ లొంగలేదు, అలాంటిది ఇరాన్‌ సలాం కొడుతుందా ? ఇరాన్‌ దాడులతో అమెరికా, ఇతర పశ్చిమదేశాలు ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్‌ ఐరన్‌ డ్రోమ్‌ దాన్ని కాపాడలేకపోయింది. రాజధాని, ఇతర నగరాలపై క్షిపణులతో విరుచుకుపడటంతో అది నివ్వెరపోయింది. చివరకు ప్రధాని నెతన్యాహు కూడా బంకర్‌లో దాక్కోవాల్సి వచ్చింది. మీకు రెండో అవకాశం ఇస్తున్నా అంటూ ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ కెనడా నుంచి ఆకస్మికంగా వెనుదిరగాల్సి వచ్చింది. తాను కూడా ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనాలా లేదా అని అమెరికా మల్లగుల్లాలు పడుతున్నది. నిజానికి ఇజ్రాయెల్‌ దాడికి దిగినప్పటికీ అమెరికాయే దాడి చేస్తున్నట్లు ఇరాన్‌ పరిగణిస్తున్నది.


ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డుల మాజీ జనరల్‌ కమాండర్‌ మొహసెన్‌ రెజాయి ఒక మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్‌కు ఇస్తున్న మద్దతు, ఆయుధాలను అమెరికా, ఐరోపా వెంటనే విరమించుకోవాలి. కొనసాగితే గగనతలంలో తమ క్షిపణులు తలపడతాయని, అవి అమెరికా, బ్రిటీష్‌, ఫ్రెంచి విమానాలు ఏవైనా తమకు ఒకటే అని అన్ని పరిణామాలు, పర్యవసానాలకు తాము సిద్దపడి ఉన్నామని చెప్పాడు. మేం ముందుగా దాడులు చేయంగానీ ముగించేది మాత్రం మేమే అన్నాడు. పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న తమ చమురు కేంద్రాలను ధ్వంసం చేస్తే ఏ దేశం కూడా చమురును వినియోగించుకోకుండా చేస్తామని ఇరాన్‌ అధినేత అలీ ఖమేనీ సలహాదారు మహమ్మద్‌ జావేద్‌ లారిజాని కూడా స్పష్టం చేశాడు.హార్ముజ్‌ జలసంధిని మూసివేస్తామని ఇరాన్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ పశ్చిమ ప్రాంతంలో ఉన్న కొన్ని కేంద్రాలను ఇజ్రాయెల్‌ దెబ్బతీయగలిగింది గానీ మధ్య,తూర్పు ప్రాంతాలో ఉన్న ముఖ్యమైన వాటిని అది తాకలేకపోయింది. తాము దాడులు చేయగానే అలీ ఖమేని వ్యతిరేకులు పెద్ద ఎత్తున రంగంలోకి వస్తారని అధికార మార్పిడికి ఆజ్యం పోయవచ్చని ఇజ్రాయెల్‌ భావించినట్లు కనిపిస్తోందని, దానికి భిన్నంగా పరిణామాలు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.విబేధాలు ఉన్నప్పటికి ఉమ్మడి శత్రువుగా ఇజ్రాయెల్‌ దానికి మద్దతు ఇస్తున్న అమెరికా, ఇతర దేశాలను వారు చూస్తున్నారు.పశ్చిమాసియా అంతటా అమెరికా వ్యతిరేక ధోరణులు పెరుగుతున్నపుడు ఖమేనీ పాలనపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ జనంలో జాతీయ భావాలు పెరిగినట్లు కనిపిస్తోంది, యుద్ధం ఎన్నిరోజులు సాగుతుందో, ఎలా ముగుస్తుందో తెలియదు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నియంతృత్వం దిశగా అమెరికా ! మిలిటరీ ముట్టడిలో లాస్‌ ఏంజల్స్‌ నగరం !!

11 Wednesday Jun 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Opinion, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Democratic party, Donald trump, Immigrants, L.A. Mayor Karen Bass, L.A. Riots, Los Angeles, Republican party


ఎం కోటేశ్వరరావు


అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసి, ఆర్థిక రాజధాని న్యూయార్క్‌, ప్రపంచ సినిమా హాలీవుడ్‌ రాజధాని లాస్‌ ఏంజల్స్‌. ఇప్పుడు ఈ నగరంపై ముట్టడికి అమెరికా మిలిటరీలోని నేషనల్‌ గార్డ్స్‌, మెరైన్లను అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దించాడు. 1965లో పౌరహక్కుల ప్రదర్శకులను అడ్డుకొనేందుకు అలబామా రాష్ట్రానికి అక్కడి ప్రభుత్వ అనుమతి లేకుండా నాటి అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ కూడా ఇదే మాదిరి మిలిటరీని పంపాడు, ఆ తరువాత ఇదే ప్రధమం. అక్రమ వలసదారులను ఏరివేసే పేరుతో ఇమ్మిగ్రేషన్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసిఇ) సిబ్బంది నగరమంతటా వందలాది మందిని అరెస్టు చేయటాన్ని జనం నిరసిస్తున్నారు. వారిని అణచివేసేందుకు శనివారం నాడు రెండువేల మంది మిలిటరీ నేషనల్‌ గార్డులను పంపిన ట్రంప్‌ సోమవారం నాడు మరో రెండువేల మందితో పాటు , 700 మంది మెరైన్లను కూడా రంగంలోకి దించాడు. తమ అధికారాన్ని అతిక్రమించి మిలిటరీని దించటాన్ని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ న్యూసమ్‌ కోర్టులో సవాలు చేశాడు. నిరసనలను తెలుపుతున్నవారి సమీపంలో ఉన్న జర్నలిస్టులను మిలిటరీ దూరంగా తరిమివేస్తోంది, ప్రజాప్రతినిధులను కూడా ఆ ప్రాంతాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నది. తమ అధ్యక్షుడు వెనక్కు తగ్గేది లేదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ మరింతగా రెచ్చగొడుతూ ప్రకటించాడు. విదేశీ వ్యతిరేకత, ఉన్మాదాలను రెచ్చగొడుతున్నారు. లాటినోలు ఎక్కువగా ఉన్న పారామౌంట్‌ వంటి చోట్ల నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగాయి. స్థానికంగా ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినపుడు అమెరికాలో మిలిటరీని దించటం అసాధారణం. అలాంటిది కేవలం నిరసన ప్రదర్శనలు జరిగిన వెంటనే ట్రంప్‌ తీసుకున్న ఈ అసాధారణ చర్య ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది. లాస్‌ ఏంజల్స్‌ పాత నగర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు, అనేక పట్టణాల్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.


ట్రంప్‌ ప్రాజెక్టు 2025పేరుతో అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల్లో భాగంగా అధికారంలోకి రాగానే అనేక అంశాల్లో వేలు పెట్టాడు, సాధారణ భాషలో చెప్పాలంటే కెలికాడు. అక్రమంగా వలస వచ్చిన వారిని స్వదేశాలకు పంపాలి లేకపోతే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఇచ్చిన ఆదేశాలతో లాస్‌ ఏంజల్స్‌ నగరం ఇప్పుడు ఆందోళనలతో అట్టుడుకుతోంది. న్యూయార్క్‌ నగరంలో వలస వచ్చిన కుటుంబాలకు చెందిన వారు 59లక్షల మంది ఉండగా తరువాత 44లక్షల మందితో ఈ నగరం ఉంది. మొత్తం జనాభాలో వీరు 33శాతం మంది. కొద్ది రోజులుగా అక్రమ వలసదారుల పేరుతో కొంత మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టటంతో వారంతా వీధుల్లోకి వస్తున్నారు.వారిని అదుపు చేసేందుకు ట్రంప్‌ సర్కార్‌ మిలిటరీని పంపింది. వలసదారులు శత్రుదేశాల మాదిరి లాస్‌ ఏంజల్స్‌ను ఆక్రమించుకున్నట్లుగా చిత్రించి నగరాన్ని విముక్తి చేయాలని ట్రంప్‌ ఆదేశించాడు. ఒక నాడు గొప్పనగరంగా విలసిల్లిన దానిని విదేశీ చొరబాటుదార్లు, నేరగాండ్లు ఆక్రమించినట్లు ట్రంప్‌ వర్ణించాడు. అక్రమ వలసదారులుగా చెబుతున్నవారు అమెరికాలో కోట్లాది మంది ఉన్నారు. అక్కడ తలెత్తిన ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించటంలో విఫలమైన పాలకులు వలస వచ్చిన వారే అన్నింటికీ కారణమంటూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు, వారిలో ట్రంప్‌ ముందున్నాడు. ఐరోపా దేశాలలో కూడా ఇదే ధోరణి, ఎన్నికల సమస్యగా ఉంది.


ప్రస్తుతం లాస్‌ ఏంజల్స్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, అణచివేత ఏ రూపం తీసుకుంటుందో, దానికి ప్రతిఘటనలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.చౌకగా పని చేయించుకొని లాభాలు పొందేందుకు అమెరికా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, వ్యవసాయ క్షేత్రాల వారు వలసలను ప్రోత్సహించారు. చట్టబద్దంగా వచ్చిన వారితో పాటు అక్రమంగా వచ్చిన వారిని చూసీ చూడనట్లు అధికార యంత్రాంగం వ్యవహరించింది. ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర తక్కువేమీ కాదు. వ్యవసాయం, సేవారంగం, నిర్మాణ రంగాలలో వారి పాత్ర పెద్దది.అధికారికంగా నమోదు కాని వారి సంఖ్య గురించి అంచనాలు మాత్రమే, కోటి మందికి పైగా ఉంటారని ఒక అంచనా. శ్రామిక శక్తిలో రికార్డుల్లో నమోదు కాని వారితో సహా విదేశాల్లో జన్మించిన కార్మికులు 18.6 శాతం లేదా 2.91 కోట్ల మంది అని 2023 కార్మిక శాఖ వివరాలు తెలిపాయి.అంతకు ముందు ఏడాది 18.1శాతం ఉన్నారు. వీరిలో 47.6 శాతం మంది మెక్సికో, ఇతర లాటిన్‌ అమెరికా దేశాల నుంచి వచ్చిన వారు కాగా25.1శాతం ఆసియా ఖండం నుంచి ఉన్నారు. అధికారికంగా నమోదు కాని వారు 83 లక్షల మంది ఉన్నట్లు, వారిలో 30శాతం మెక్సికో నుంచి మధ్య, దక్షిణ అమెరికా దేశాల నుంచి 20, ఆసియా నుంచి 15శాతం ఉన్నట్లు న్యూయార్క్‌ వలస అధ్యయనకేంద్రం అంచనా వేసింది. రానున్న సంవత్సరాల్లో వంట, ఇంటిపనివారు, డ్రైవర్లు, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ వంటి పనులు చేసేందుకు డిమాండ్‌ పెరగనుందని చెబుతున్నారు.


కరోనా తరువాత ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు,ద్రవ్యోల్బణం తగ్గటానికి వలస కార్మికులు తోడ్పడ్డారని డల్లాస్‌ ఫెడరల్‌ రిజర్వుబ్యాంకు అధ్యయనం తెలిపింది. అమెరికాలో పుట్టి పెరిగిన వారు ఉద్యోగవిరమణ చేయటం, జననాలరేటు తగ్గిన కారణంగా 2019`21 మధ్య 20లక్షల మంది కార్మికులు తగ్గినట్లు, రానున్న పది సంవత్సరాలలో వలస కార్మికులు లేకపోతే వివిధ రంగాలలో ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణలో ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరికలు వెలువడ్డాయి.జనాభాలో వలస వచ్చిన వారు 13.8శాతం, వీరిలో కొందరు వాణిజ్యాలను కూడా ప్రారంభించారు, వారి ద్వారా 2022 ఒక్క ఏడాదే 110 బిలియన్‌ డాలర్ల రాబడి వచ్చింది.అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే ప్రకారం వలస వచ్చిన వారు ఫెడరల్‌ ప్రభుత్వానికి 2022లో 383 బిలియన్‌ డాలర్లు, రాష్ట్ర, స్థానిక సంస్థలకు 196 బిలియన్‌ డాలర్లు రాబడి చేకూర్చారు. నమోదు కాని కార్మికులు, ఆదాయ, సామాజిక భద్రత పన్నులే మొత్తం వందబిలియన్‌ డాలర్లకు పైగా ఉన్నాయి. చిత్రం ఏమిటంటే నిరుద్యోగ, ఆరోగ్యబీమా వారికి వర్తించకపోయినా పన్ను చెల్లించారు. 2033 నాటికి మరో 5.2శాతం వలస కార్మికులు పెరుగుతారని వారి వలన ఏడులక్షల కోట్ల డాలర్ల మేరతోడవుతుందని, జిడిపి 8.7లక్షల కోట్ల డాలర్లు పెరగటంతో పాటు ఫెడరల్‌ ప్రభుత్వానికి 1.2లక్షల కోట్ల పన్ను ఆదాయం పెరిగి, 900బిలియన్‌ డాలర్ల లోటు తగ్గుతుందని అంచనాలు వెలువడ్డాయి.వలస వచ్చిన వారి కారణంగానే స్థానికులకు అందాల్సిస సౌకర్యాలకు కోతపడుతున్నదని కొందరు సర్వేలు, బడ్జెట్ల పేరుతో రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. వలస వచ్చిన వారి గృహవసతి కోసం న్యూయార్క్‌ వంటి నగరాల్లో బడ్జెట్‌ కేటాయింపులు చేస్తూ ఇతరులకు కోతపెడుతున్నారని చిత్రిస్తున్నారు. నిజానికి పైనచెప్పుకున్నట్లుగా వలస వచ్చిన వారి నుంచి వచ్చే రాబడితో పోల్చుకున్నపుడు ఇవి పెద్ద మొత్తాలేమీ కాదు. వారు పని చేస్తున్న పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ రంగాల నుంచి వారి సంక్షేమానికి ప్రభుత్వం పన్నులు మరొక రూపంలో అదనంగా నిధులు సేకరించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ వారికి నానాటికీ మరిన్ని రాయితీలు ఇస్తున్నారు తప్ప అదనపు రాబడికి పూనుకోవటం లేదు తక్కువ వేతనాలకు పని చేసే నైపుణ్యం అంతగా అవసరం లేని కార్మికులు ఇప్పుడు అమెరికాకు అవసరమని తెలిసినప్పటికీ ట్రంప్‌ వారి మీద దాడి ప్రారంభించాడు, లబ్ది పొందే కార్పొరేట్లు సహిస్తారా ?

వలస కార్మికులను వెనక్కు పంపుతానని ట్రంప్‌ పెద్ద ప్రకటనలు చేస్తున్నాడు.అందరినీ పంపాలంటే ఏడాదికి 500 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతాయని, రానున్న పది సంవత్సరాలలో కార్మికుల కొరత ఏర్పడుతుందని, జిడిపి 5.1లక్షల కోట్ల డాలర్లు తగ్గుతుందని తెలిసినా వ్యాపారవేత్త, లాభనష్టాలు తెలిసిన ట్రంప్‌ అలాంటి పనులకు ఎందుకు పాల్పడుతున్నట్లు ?ఎన్నికలకు ముందే వలస కార్మికులను పంపివేస్తానని ట్రంప్‌ వాగ్దానం చేశాడు. ఇప్పుడు లాస్‌ ఏంజల్స్‌ నగరంలో చిచ్చు పెట్టాడు. సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ డిమాండ్‌ చేశాడు, ట్రంప్‌ చర్య రాష్ట్ర సార్వభౌమత్వాన్ని హరించటమే అన్నాడు. శాంతి భద్రతలకు విఘాతం కలగాలని వాంఛిస్తున్న ట్రంప్‌కు అలాంటి అవకాశం ఇవ్వవద్దని పౌరులను కోరాడు. నగర మేయర్‌ కరేన్‌ బాస్‌ కూడా గవర్నర్‌ను సమర్దిస్తూ ట్రంప్‌ చర్య అశాంతిని రెచ్చగొట్టినట్లు ఆమె వ్యాఖ్యానించారు. నగర కౌన్సిల్లోని 15 మంది సభ్యులు కూడా మిలిటరీ చర్యను ఖండిరచారు. వారి వైఫల్యం కారణంగానే తాను మిలిటరీని పంపినట్లు ట్రంప్‌ సమర్ధించుకున్నాడు.ట్రంప్‌ను సమర్ధించే మితవాద మీడియా నిరసన తెలుపుతున్నవారి మీద దుమ్మెత్తిపోస్తూ వార్తలు ఇస్తున్నది.

2024 నవంబరులో నగరపాలక సంస్థ వలసదారులను రక్షించేందుకు ‘‘ శరణ నగరం ’’ అని ఏకగ్రీవంగా తీర్మానించింది. వలస నిరోధ అధికారులను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం చేశారు. అంతకు ముందు వలసదారులను బహిష్కరిస్తామని ట్రంప్‌ వాగ్దానం చేశాడు. మిలిటరీని దించటాన్ని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన 22 రాష్ట్రాల గవర్నర్లు ఒక ప్రకటనలో ఖండిరచారు. ట్రంప్‌ అధికార దుర్వినియోగం, దుర్మార్గమైన, విభజించే చర్య అన్నారు. మెక్సికన్లు లాస్‌ ఏంజల్స్‌ నగరంలో నివశించటాన్ని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్‌ సమర్ధించారు. వారు మంచి వారు, నిజాయితీ పరులు, నేరస్తులు కాదు, తమ కుటుంబాలకు తోడుగా ఉండేందుకు, మెరుగైన జీవితం కోసం వారంతట వారే వెళ్లారని ఆమె అన్నారు. నిరసనకారులు అమెరికా పతాకాలతో పాటు మెక్సికో జాతీయ జెండాలను కూడా ప్రదర్శించుతున్నారు. వాటిని చూపుతూ చూడండి విదేశీయులు మన దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారో వారిని బయటికి పంపవద్దా అంటూ రెచ్చగొడుతున్నారు. తాము అమెరికాకు వలస వచ్చామని, ఇక్కడే పిల్లలను కని పౌరులమయ్యామని తమ వారసత్వానికి చిహ్నంగా మెక్సికో పతాకాలను ప్రదర్శిస్తూ దమనకాండకు నిరసన తెలుపుతున్నట్లు ప్రదర్శకులు సమర్ధించుకుంటున్నారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని రెచ్చగొట్టేందుకు ముసుగులు ధరించిన రహస్య పోలీసులను వినియోగించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిరసనకారులు అనుమానం వచ్చి ఎవరని ప్రశ్నిస్తే సమాధానం లేకపోగా బెదిరింపులకు దిగుతున్నారు.ముసుగులు ధరించిన ఐసిఇ సిబ్బంది ఒక రెస్టారెంటులో చొరబడి వంటవారిని అదుపులోకి తీసుకోవటంతో కస్టమర్లు అడ్డం తిరిగి ప్రశ్నించారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో. అవాంఛనీయ చర్యలకు పాల్పడి ఆ నెపాన్ని వలస కార్మికులు మీద నెట్టే కుట్ర కనిపిస్తోంది. ఇలాంటి దుర్మార్గం ఫాసిస్టులు మాత్రమే చేయగలరన్నది చరిత్ర చెప్పిన సత్యం. తమకు అడ్డు పడితే గవర్నర్‌, నగర మేయర్లనూ అరెస్టు చేస్తామని ట్రంప్‌ యంత్రాంగం బెదిరించింది. ఈ దమనకాండకు నిరసనగా అనేక నగరాల్లో ప్రదర్శనలు జరపాలని పిలుపు నిచ్చారు. కార్మిక నేతల అరెస్టును కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిరది. వలస వచ్చిన వారిపై రాజ్యమే హింసాకాండకు పూనుకుందని కార్మిక సంఘాలు విమర్శించాయి. అనేక మంది స్థానిక అమెరికన్లు వలస వచ్చిన వారు తమ సోదరులే అంటూ మద్దతు తెలుపుతున్నారు. దమనకాండ అమెరికా విలువలకే వ్యతిరేకమని టీచర్స్‌ యూనియన్‌ ఒక ప్రకటనలో విమర్శించింది. ట్రంప్‌ జారీ చేస్తున్న ఆదేశాలను చూస్తుంటే నియంతృత్వంవైపు దేశాన్ని నడిపిస్తున్నట్లుందని డెమోక్రటిక్‌ సోషలిస్టు సెనెటర్‌ బెర్నీశాండర్స్‌ విమర్శించాడు.ఒకవైపు ప్రతికూల పన్నులతో ప్రపంచ దేశాల మీద దాడికి దిగిన ట్రంప్‌ దేశీయంగా వలసలు వచ్చారనే పేరుతో మిలిటరీ దాడులకు దిగాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ముదురుతున్న సమస్యలకు ప్రతిరూపాలే ఈ దాడులు. అందువలన అమెరికా సాధారణ పౌరులతో పాటు యావత్‌ ప్రపంచమూ డోనాల్డ్‌ ట్రంప్‌ దుర్మార్గాలపై గళమెత్తాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ ఉగ్రవాదం : చైనా మీద ఆరోపణ మాత్రమే, అమెరికా అధ్యక్షుడు కెనడీ, బ్రిటన్‌ దుర్మార్గం గురించి తెలుసా !

08 Sunday Jun 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, Farmers, Germany, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Agro Terrorism, Amarican Virus, Biological weapons, Bioterrorism, chemical weapons


ఎం కోటేశ్వరరావు


వ్యవసాయ ఉగ్రవాదం ప్రపంచమంతటా పురాతన కాలం నుంచి ఉన్నదే. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే అస్సీరియన్లు తమ శత్రువుల ప్రాంతాలలోని బావులలో విషాన్ని కలిపేవారు. మొదటి ప్రపంచ యుద్ద కాలంలో ఫ్రాన్సుకు రవాణా అయ్యే గుర్రాలు, పశువులకు అమెరికాలో జర్మన్‌ ఏజంట్లు విషం ఇచ్చేవారు. కత్తి, బాకు, బల్లెం వంటి వాటిని కనుగొన్న తొలి మానవుడు వాటిని ప్రమాదకర జంతువుల నుంచి రక్షణకు, ఆహారం కోసం ఉపయోగించాడు. తరువాత అవే యుద్దాల్లో ఆయుధాలుగా మారాయి. శాస్త్రవేత్త చార్లెస్‌ డార్విన్‌ 1880దశకంలో చేసిన పరిశోధనలు పంటల్లో కలుపు మొక్కల నివారణకోసం రసాయనాలను కనిపెట్టేందుకు దారితీశాయి. తరువాత కాలంలో బ్రిటన్‌, అమెరికా, తదితర సామ్రాజ్యవాదులు, నియంతలు ఏకంగా పంటలు, అడవులనే నాశనం చేసేందుకు, లక్షలాది మంది మానవులు, జంతుజాలాన్ని అంతమొందించేందుకు వినియోగించిన చరిత్ర తెలుసా ? శాస్త్రవిజ్ఞానాన్ని మానవ, ప్రకృతి వినాశనానికి వినియోగించింది మానవ కల్యాణానికి బదులు వినాశనాన్ని కోరుకున్న దుర్మార్గులే అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రమాదకరమైన ఫంగస్‌ను అమెరికా వ్యవసాయక్షేత్రాల్లో ప్రవేశపెట్టి దాని ఆహార వనరును దెబ్బతీయాలని చైనా కుట్రపన్నింది, దానిలో భాగంగా ఇద్దరు చైనా జాతీయులు ఆ ఫంగస్‌ను అక్రమంగా తెస్తూ ఎఫ్‌బిఐకి దొరికి పోయారు. ఇదీ వార్త, ఒక ఆరోపణ, సదరు ఫంగస్‌ను ఎక్కడా ప్రయోగించలేదు. పరిశోధనల కోసం తెచ్చారన్నది ఒక అభిప్రాయం. అమెరికా మనదేశంలోకి వయ్యారి భామ అనే వినాశకారి అయిన కలుపు మొక్కను ఎలా ప్రవేశ పెట్టిందీ వేరే విశ్లేషణలో చూశాము. గుండెలు బాదుకుంటున్న అమెరికా కొన్ని దశాబ్దాల నాడే ఆ దుర్మార్గానికి పాల్పడిరది అనే అంశం ఎక్కడా మీడియాలో చర్చకు రావటం లేదు.పురాతన, ఆధునిక యుద్ధాలలో ఆహార ఉత్పత్తి వ్యవస్థలను దెబ్బతీయటం ఒక ఆయుధం. అందుకే చరిత్రను చదివినపుడు శత్రుదేశాలు కోటలను చుట్టుముట్టినపుడు నెలల తరబడి తట్టుకొనేందుకు ఆహారం, నీటిని నిల్వచేసుకొనే ఏర్పాట్లు చేసుకున్నట్లు అనేక దుర్గాలు, కోటల చరిత్రలు వెల్లడిరచాయి. ఆధునిక కాలంలో అందుకు జీవ, రసాయనాలను అమెరికా అస్త్రంగా వాడుకున్నది. అదెలా జరిగిందో చూద్దాం !


1953లో కొరియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే నెల రోజుల ముందు ఉత్తర కొరియా ప్రాంతంలో అమెరికా వైమానిక దళం చేసిన దాడుల్లో 75శాతం వరి ఉత్పత్తికి నీటిని అందించే ప్రాజెక్టులను నాశనం చేసింది. ఇది తరువాత కాలంలో అక్కడ కరవుకు దారి తీసింది. కమ్యూనిస్టుల పాలనలో జనాన్ని ఆకలితో మాడ్చి చంపారని ప్రచారం చేసే మానవతావాదులకు ఈ విషయం పట్టలేదు. వియత్నాంపై దాడిచేసిన అమెరికా మొక్కలను నాశనం చేసే ఏజంట్‌ ఆరెంజ్‌ అనే రసాయనాన్ని ఆపరేషన్‌ రాంచ్‌ హాండ్‌ పేరుతో 1962 నుంచి 1971వరకు వెదజల్లింది. దీనికి ఆదర్శం ఎవరు అంటే మలయా యుద్ధంలో ప్రయోగించిన బ్రిటీష్‌ దుర్మార్గులు. అమెరికాలో రైలు మార్గాలు, విద్యుత్‌ లైన్లు వేసే ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరగకుండా చూసేందుకు 1940దశకంలో దీన్ని తయారు చేశారు. మనందరికీ తెలిసిన మానశాంటో సహా తొమ్మిది కంపెనీల నుంచి వియత్నాంలో చల్లేందుకు అమెరికన్‌ మిలిటరీ 7.6 కోట్ల లీటర్లు కొనుగోలు చేసింది. దాన్ని చల్లిన చోట 40లక్షల మంది మీద ప్రతికూల ప్రభావాలను చూపింది,30లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ అంచనా ప్రకారం పది లక్షల మంది వికలాంగులయ్యారు. ఈ దుర్మార్గ ప్రక్రియలో భాగస్వాములైన అమెరికా మిలిటరీలో అనేక మందికూడా దీని ప్రభావంతో కాన్సర్‌, లింఫోమా వంటి వ్యాధులకు గురైనట్లు తేలింది. వారికి పుట్టిన పిల్లలకు జన్యు సంబంధమైన వ్యాధులు వచ్చాయి, వారి దుర్మార్గానికి పిల్లలు బలయ్యారు. వియత్నాంలో పర్యావరణానికి కలిగిన హాని గురించి చెప్పనవసరం లేదు, 77లక్షల ఎకరాల్లో పంటలు పండలేదు, అడవుల్లో మొక్కలు పెరగలేదు. అనేక జంతువులకు హాని కలిగింది.మానవ మారణకాండను జనోసైడ్‌ అని వర్ణిస్తే పర్యావరణానికి చేసిన హానిని ఎకోసైడ్‌ అని వర్ణించారు. అమెరికా దురాక్రమణను వ్యతిరేకించిన వియత్నాం వీరులు అడవుల్లో ఉండటంతో వియత్నాం సరిహద్దుల్లో ఉన్న లావోస్‌, కంపూచియా అడవులను కూడా అమెరికా దుర్మార్గులు వదల్లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రసాయన, జీవ ఆయుధాలను తయారు చేశాయి. ఆ సమయంలో అనేక ప్రాంతాల్లో వాటిని పరీక్షించి చూశారు. జపాన్‌పై అణుబాంబును వేసిన అమెరికా యుద్దం గనుక కొనసాగితే 1946లో జపాన్‌పై ఏజంట్‌ ఆరెంజ్‌ను ప్రయోగించాలని పథకం వేసింది. బ్రిటీష్‌ పాలనలో ఉన్న మనదేశం, ఆస్ట్రేలియాలతో సహా మొత్తం 1,100 కేంద్రాల్లో దాని పనితీరును పరీక్షించారు. అమెరికాను కూడా వదల్లేదు. ఉష్ణప్రదేశాల్లో ఎలా పని చేస్తుందో చూసేందుకు కెన్యాలో కూడా చల్లారు. మలయా ప్రాంత దేశాల్లో రబ్బరు తోటల్లో పెరిగే కలుపు మొక్కలను నివారించేందుకు తయారు చేసిన రసాయనాన్ని తమ మీద తిరుగుబాటు చేసిన మలయన్లు ఉన్న అడవుల్లో 1960వరకు బ్రిటీష్‌ మిలిటరీ ప్రయోగించింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని అమెరికా తరువాత ఇండోచైనా ప్రాంతంలో అమలు చేసింది.ముఖ్యంగా దక్షిణ వియత్నాం బలైంది. అనేక మంది గొప్పగా పొగిడే నాటి అమెరికా అధ్యక్షుడు కెనడీ ఈ దుర్మార్గానికి అనుమతి ఇచ్చాడు. ఈ దుర్మార్గం గురించి తెలుసుకున్న తరువాత అమెరికాలో వియత్నాం యుద్ధవ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది.తప్పుడు వాదనలతో ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి.


అమెరికా ముందుగా ఎవరి మీద జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించదని, అయితే శత్రుదేశం ఏదైనా వినియోగిస్తే మాత్రం రసాయన ఆయుధాలను వదులుతామని అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ గొప్పగా చెప్పాడు, ఏ దేశమూ వినియోగించకుండానే అణుబాంబుతో సహా ఆ దుండగాలకు అమెరికా పాల్పడిరది. జపాన్‌లో వరి పొలాలను నాశనం చేసేందుకు అమెరికా వినియోగించింది.వియత్నాంలో ఏజంట్‌ ఆరంజ్‌ చల్లిన ప్రాంతాల్లో గత ఐదు దశాబ్దాలుగా చెట్లలో సాధారణ పెరుగుదల లేదు, మామూలు స్థితికి రావాలంటే చాలాకాలం పడుతుందని చెబుతున్నారు.వియత్నాం దురాక్రమణ, దాడుల్లో పాల్గొన్న అమెరికా సైనికులు ఏజంట్‌ ఆరంజ్‌ తదితర విషపూరిత రసాయనాలను వెదజల్లుతున్నపుడు వారికి కూడా వాటి ప్రభావం సోకిన కారణంగా 1984లో కోర్టు వెలుపల రసాయన కంపెనీలు 18 కోట్ల డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇజ్రాయెల్‌ ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాల్లోకి సముద్రపు నీరు, తమ నివాసాల నుంచి వెలువడే మురుగునీటిని పాలస్తీనియన్ల నివాసాలు, వ్యవసాయ భూముల్లోకి వదలి పనికి రాకుండా చేయటం నిత్యకృత్యం. ఇది కూడా ఒక రకంగా వ్యవసాయ ఉగ్రవాదమే. పంటలు పండకుండా అరబ్బులను మాడ్చే ఎత్తుగడ.

నీవు నేర్పియే నీరజాక్షా అని తమ వ్యవసాయం మీద చైనా దాడి చేయనుందని అమెరికా గగ్గోలు పెడుతోంది. దానికి ఇదేమీ కొత్త కాదు. ప్రతి దేశం మీద కుట్ర సిద్దాంతాలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే. తద్వారా తాను చేసే దుర్మార్గాలను స్వంత జనం ప్రశ్నించకుండా సమర్ధించేందుకు అది ఎంచుకున్న ఎత్తుగడ.తాను పెంచి పోషించిన ఉగ్రవాదానికి అదే బలికావటం కూడా వాస్తవం న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై వైమానికదాడి అదే. తాను పెంచిన తాలిబన్లే దానికి పాల్పడ్డారు.అమెరికా జిడిపిలో వ్యవసాయం తక్కువే అయినప్పటికీ గణనీయ మొత్తం ఎగుమతులకు ఉపయోగపడుతున్నది. ఆల్‌ఖైదాతో చెడిన తరువాత తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక కేంద్రాలపై దాడులు చేసినపుడు దొరికిన పత్రాలలో అమెరికా వ్యవసాయ వివరాలున్న పత్రాలు దొరికాయి. వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీయాలా అన్నది ఆల్‌ఖైదా శిక్షణలో భాగంగా బయటపడిరది.అమెరికాకు నాలుగు తరగతుల నుంచి వ్యవసాయ ఉగ్రవాద ప్రమాదం ఉందని 2012లో ఎఫ్‌బిఐ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. ఒకటి ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు, రెండవది మార్కెట్లను తిమ్మినిబమ్మిని చేసి లబ్దిపొందాలని చూసే ఆర్థిక నేరగాండ్లు లేదా అవకాశవాదుల నుంచి ప్రధానంగా ముప్పు ఉన్నట్లుపేర్కొన్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి(ఎఫ్‌ఎండి అంటే ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌)ని వ్యాపింప చేస్తే మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నది తెలిసిందే. మూడవ తరగతి అసంతృప్తి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు తమ కసి తీర్చుకొనేందుకు చేసే ఉగ్రవాద చర్యలు, నాలుగవ తరగతిగా జంతుహక్కుల రక్షకులు, పర్యావరణ ప్రేమికులు అని పేర్కొన్నారు. న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసిన తరువాత అమెరికాలో ఆగ్రో టెర్రరిజం ఆకర్షణీయంగ ఉన్నట్లు కనిపించిందట.


అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తిగా ప్రపంచానికి కనిపించకుండా చేయాలంటే దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఒసామా బిన్‌లాడెన్‌ పదే పదే వాదించేవాడట.2004 అమెరికా ఎన్నికల సమయంలో ఒక వీడియోలో పదేండ్ల పాటు రష్యా రక్తమోడిరది, అమెరికా కూడా దివాలా తీసేంతవరకు అదే విధానాన్ని అనుసరించాలని చెప్పాడట. 2011 సెప్టెంబరులో అమెరికా ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడికి ఆల్‌ఖైదాకు అయిన ఖర్చు కేవలం ఐదు లక్షల డాలర్లేనని , అమెరికాకు కలిగిన నష్టం 500బిలియన్‌ డాలర్లని ఒసామా చెప్పాడు. ఉగ్రవాద సంస్థలు నిజంగా అలా ఆలోచిస్తున్నాయో, పథకాలు వేస్తున్నాయో తెలియదు గానీ అమెరికా విశ్లేషకులు మాత్రం ఏం చేస్తే ఎలా,ఎంతటి నష్టం జరుగుతుందో వారికి విడమరచి చెబుతున్నారు. ఆహార ధాన్యాలు విషపూరితం అయితే వాటి ఎగుమతులు ఆగిపోతాయి లేదా నిల్వలు పేరుకు పోతాయి. పశువుల్లో వ్యాధులను వ్యాపింప చేస్తే వాటిని హతమార్చాల్సి ఉంటుంది. పరోక్షంగా రైతాంగానికి భారీ మొత్తాలను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.పరిశ్రమలకూ పరిహారంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి, ఖర్చులూ పెరుగుతాయి. పశువుల్లో గాలికుంటు వ్యాధిని అమెరికాలో 1929లోనే నిర్మూలించారు. ఇతర ప్రాంతాల్లో ఉంది. ఇది మసూచి కంటే 20 రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ కేవలం నలభై ఎనిమిది గంటల్లో వంద కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందగలదు. ఏదైనా వస్త్రానికి అంటుకుంటే నెల రోజుల పాటు బతికి ఉంటుంది. దీని గురించి తెలుసుకొనే లోపే అమెరికాలోని 25 రాష్ట్రాలకు కేవలం ఐదు రోజుల్లో వ్యాపింపగలదని అంచనా. అమెరికాకు పక్కనే దక్షిణ అమెరికాలో ఈ వ్యాధి ఉంది. అమెరికాలో ఒక్కో రైతు 1,500 నుంచి పదివేల వరకు ఆవులను పెంచుతాడు. ఒక దగ్గర ఈ వైరస్‌ను ప్రవేశపెడితే జరిగే నష్టాన్ని ఊహించుకోవచ్చు.2001లో బ్రిటన్‌లో ఈ వ్యాధి వ్యాపించటంతో 40లక్షల పశువులను వధించాల్సి వచ్చింది. అదే అమెరికాలో సంభవిస్తే 60 బిలియన్‌ డాలర్ల నష్టం(2012అంచనా) అని పరిశోధకులు పేర్కొన్నారు.ఇలాంటి దుర్మార్గాలకు తాము పాల్పడిన ఉదంతాలు అమెరికా అధికార యంత్రాంగానికి తెలుసుగనుక వారు నిరంతరం భయపడుతూనే ఉంటారు, ఎందుకు అంటే అమెరికాను ప్రతి ఒక్కరూ ద్వేషిస్తున్నారు గనుక. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అది అమెరికా నుంచి కూడా కావచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d