• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Congress

దలైలామా వారసుడు : అడుసుతొక్కనేల కాలుకడగనేల ! చైనా అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టటం అవసరమా, దేశానికి ఒరిగేదేమిటి ?

06 Sunday Jul 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, UK, USA

≈ Leave a comment

Tags

anti china, China, Dalai Lama, Dalai Lama succession row, Kiren Rejiju, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


పద్నాలుగవ దలైలామా 90వ జన్మదినోత్సవం హిమచల్‌ ప్రదేశ్‌ ధర్మశాలలో లిటిల్‌ లాసాగా పిలిచే మెక్‌లియోడగంజ్‌లో జూలై ఆరవతేదీ ఆదివారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు కిరణ్‌ రిజుజు, లాలన్‌ సింగ్‌ హాజరయ్యారు.ఒక భక్తుడిగా దలైలామా నిర్ణయమే తనకు శిరోధార్యమని, మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా కిరణ్‌ రిజుజు పునరుద్ఘాటించారు. దలైలామా వారసుడి గురించి కొద్ది రోజులుగా పెద్ద రచ్చే జరిగింది.పరిణామాలు, పర్యవసానాల గురించి భయపడిన టిబెట్‌ బౌద్ద దలైలామా టెంజిన్‌ జియాట్సో ఆ వివాదానికి తాత్కాలికంగా తెరదించారు. సుగలాగ్‌ఖాంగ్‌ ప్రధాన బౌద్ద ఆలయంలో దీర్ఘకాలం ఆయన జీవించాలని కోరుతూ జరిపిన ప్రార్ధనల సందర్భంగా మాట్లాడుతూ తాను మరో 30 నుంచి 40 సంవత్సరాలు జీవిస్తానని ప్రకటించారు. ‘‘ అనేక జోశ్యాలను చూసినపుడు అవలోకితేశ్వర ఆశీస్సులు ఉన్నట్లు భావించాను. ఇప్పటి వరకు చేయగలిగిందంతా చేశాను. ఇంకా 30`40 సంవత్సరాలు జీవించగలనని అనుకుంటున్నాను , ఇప్పటి వరకు మీ ప్రార్ధనలు ఫలించాయి. మనం దేశాన్ని కోల్పోయినప్పటికీ భారత్‌లో ప్రవాసం ఉంటున్నాము. ఇక్కడ నేను ఎన్నో పొందాను, ధర్మశాలలో నివసిస్తున్న వారంతా కూడా అలాగే లబ్దిపొందాలని, నేను చేయగలిగిన సేవ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. అంతకు ముందు తనవారసుడు చైనా వెలుపలే జన్మిస్తాడని చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది.


దలైలామా తరువాత ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో తెలియదు గానీ మనదేశం చైనా అంతర్గత వ్యవహారమైన వారసుడి విషయంలో అనవసరంగా వేలుబెట్టి చైనాతో చెప్పించుకొని, సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది గౌరవప్రదమా, అసలు అవసరమా ! ఐదు సంవత్సరాల తరువాత రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొంటున్న తరుణంలో చైనాను రెచ్చగొట్టటం ద్వారా మనదేశానికి ఒరిగేదేమిటని ప్రతివారూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారసుడి విషయంలో దలైలామా ఆకాంక్షలను అనుసరించాలని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, బౌద్దుడైన కిరెన్‌ రిజుజు చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది.చైనా తీవ్ర అభ్యంతరం తెలిపిన తరువాత మతవ్యవహారాల్లో ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్య చేయలేదని మనవిదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వివరణ ఇచ్చారు. తన తదనంతరం దలైలామా వ్యవస్థ కొనసాగుతుందని, 2011లో తాను ఏర్పాటు చేసిన గాడెన్‌ ఫోడ్రాంగ్‌ ట్రస్టు తన వారసుడిని నిర్ణయిస్తుందని కొద్ది రోజుల క్రితం దలైలామా చేసిన ప్రకటనతో రచ్చ మొదలైంది. గతంలో చేసిన ప్రకటననే పునరుద్ఘాటించారు. గాడెన్‌ ఫోడ్రాంగ్‌ అనేది టిబెట్‌లోని లాసాలో ఉన్న 17వ శతాబ్దం నాటి డ్రెపంగ్‌ సంఘారామంలో ఉన్న దలైలామా నివాసం పేరు. ఆ ట్రస్టుకు దలైలామా చైర్మన్‌, ఆయన సన్నిహితులుగా ఉన్నవారు సభ్యులు, దలైలామా కార్యాలయమే దాని వ్యవహారాలను చూస్తున్నది.పదిహేనవ దలైలామా, తదుపరి పరంపరను నిర్ణయించాల్సింది ఆ ట్రస్టు మాత్రమే అని ప్రభుత్వంతో సహా మరొకరికి అధికారం లేదని దలైలామా ప్రకటించారు. ఈ ట్రస్టుతో పాటు న్యూఢల్లీి, జూరిచ్‌ నగరాల్లో కూడా ట్రస్టులను ఏర్పాటు చేశారు. మతానికి చెందిన లామాలు, ఇతర పెద్దలు వారసుడిని గుర్తించి ప్రతిపాదిస్తే అంతిమంగా ఈ ట్రస్టు ఆమోదిస్తేనే వారసత్వం ఖరారు అవుతుందని ట్రస్టు నిబంధనావళి పేర్కొన్నది.


ఇక్కడే అసలు సమస్య ఉంది. గతంలో ఎంపిక చేసిన వారసుల పేర్లను ఒక బంగరు కలశంలో వేసి లాటరీ పద్దతిద్వారా ఎంపిక చేస్తారు, ఆ పేరును చైనా కేంద్రప్రభుత్వం ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుందని, గతంలో ఇలాగే జరిగిందని బీజింగ్‌ ప్రకటించింది.తన ఎంపిక అలాగే జరిగిందని తెలిసినప్పటికీ ఈ విధానాన్ని 14వ దలైలామా అంగీకరించటం లేదు. అతగాడి ప్రకటనపై తాము ఎలాంటి వ్యాఖ్య చేయబోమని, మత వ్యవహారాలపై ఎలాంటి వైఖరిని తీసుకొనేది లేదని మన కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దలైలామా ప్రకటన సంబంధిత వార్తలను చూశామని, మతాలకు సంబంధించిన విశ్వాసాలు, వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోవటం లేదని. మత స్వేచ్చకు కట్టుబడి ఉన్నామని విదేశాంగశాఖ పేర్కొన్నది. క్వింగ్‌ రాజరిక పాలన నాటి నుంచి బంగారు కలశంలో ఉంచిన పేర్లతో లాటరీ తీసి ఎంపిక చేసిన దానిని చైనా ప్రభుత్వ ఆమోదిస్తే దలైలామా, పెంచన్‌ లామాలను ఖరారు చేస్తారని, ఆ మేరకు ప్రభుత్వ అధికారం కొనసాగుతున్నదని, దానికి తిరుగులేదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ స్పష్టం చేశారు.ప్రస్తుత దలైలామాను కూడా అదే పద్దతిలో ఎంపిక చేయగా నాటి ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. తమ అంతర్గత వ్యవహారాల గురించి జాగ్రత్తగా వ్యాఖ్యానించాలని ఆమె మన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు చేసిన ప్రకటన గురించి పేర్కొన్నారు. టిబెట్‌పై ప్రకటించిన వైఖరికి భారత్‌ కట్టుబడి ఉండాలని, టిబెట్‌ సంబంధిత వ్యవహారాలపై చేసే వ్యాఖ్యలు ఇరుదేశాల సంబంధాల మెరుగుదల, అభివృద్ధికి విఘాతం కలిగించకూడదని హితవు చెప్పారు. దలైలామా ప్రకటనను చైనా ఖండిరచిన తరువాత అతగాడికి మద్దతుగా కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు మాట్లాడటంతో చైనా స్పందించింది. దలైలామా వైఖరిని పునరుద్ఘాటిస్తూ వారసుడి నిర్ణయంలో మరొకరి పాత్ర లేదని మంత్రి మాట్లాడారు. గాల్వన్‌ ఉదంతం తరువాత రెండు దేశాల సంబంధాలు స్థంభించిన సంగతి తెలిసిందే. గతేడాది రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ భేటీ తరువాత ఏడాది కాలంలో సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. కైలాష్‌,మానస సరోవర్‌ యాత్రలను పునరుద్దరించారు.


టిబెట్‌ బౌద్ధ మతానికి ఉన్నత మతాధికారి దలైలామా. మన దేశంలో పీఠాధిపతులకు చాంతాడంత పేర్లు ఉన్నట్లే ప్రస్తుత దలైలామా మతపరమైన పేరు జెస్టన్‌ జాంఫెల్‌ గవాంగ్‌ లొబసాంగ్‌ యెషే టెంజిన్‌ గియాస్టో. పొట్టిగా టెంజిన్‌ గియాస్టో అని పిలుస్తారు. పుట్టినపుడు పెట్టిన పేరు లామో తోండప్‌. ఇతగాడు వివాదాస్పదమైన మతగురువు, 1935 జూలై ఆరున జన్మించారు. దలైలామాలను జీవించి ఉన్న బుద్ధుడు లేక బోధిసత్వుడు అని నమ్ముతారు. మరణానంతరం వారసులను ఎన్నుకుంటారు. దలై అంటే సముద్రం, ఇది మంగోలియన్‌ భాషా పదం.పదమూడవ దలైలామా మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత 1937లో అతడి వారసుడిగా టెంజిన్ను ఎంపిక చేశారు, 1939లో దలైలామాగా ప్రకటించారు. మరుసటి ఏడాది ఫిబ్రవరి 22న చైనా ప్రభుత్వం ఆమోదముద్రవేసింది. అమెరికా, బ్రిటన్‌ కుట్రలో భాగంగా కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1959లో టిబెట్‌లో తిరుగుబాటు పేరుతో సాయుధులను రంగంలోకి దించారు. వారిని చైనా ప్రభుత్వం అణచివేసింది, తిరుగుబాటు కేంద్రంగా దలైలామా కార్యక్షేత్రాన్ని గుర్తించారు.దాంతో 1959 ఏప్రిల్‌ 29న సిఐఏ పథకం ప్రకారం దలైలామాను నేపాల్‌ ద్వారా దాటించి అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న తేజ్‌పూర్‌ పట్టణంలో ప్రవేశపెట్టి ఆశ్రయం కల్పించారు.ఉత్తర ప్రదేశ్‌లోని ముస్సోరీలో దలైలామాతో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు, మరుసటి ఏడాది హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు రప్పించారు.చైనాపై సిఐఏ రూపొందించిన కుట్ర సిద్దాంతాన్ని నమ్మిలేదా అమెరికా వత్తిడికి లొంగి నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దలైలామాకు ఆశ్రయం కల్పించారు. మూడవ ప్రపంచ యుద్ధంలో టిబెట్‌ నుంచి చైనా భారత్‌ ఇతర దేశాల మీద దాడి చేసేందుకు పథకం రూపొందించిందన్నది సిఐఏ కట్టుకథ. అమెరికా, బ్రిటన్‌ కుట్రల కారణంగా కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం తొలి పది సంవత్సరాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. వాటిలో టిబెట్‌లో తిరుగుబాటు కుట్ర ఒకటి. దలైలామా అన్న గయలో తోండుప్‌ సిఐఏ ఏజంట్‌గా మారాడు. తెరవనుక ఉండి కథంతా నడిపించింది అతనే (97 సంవత్సరాల వయస్సులో ఈ ఏడాది ఫిబ్రవరి 8న పశ్చిమబెంగాల్లోని కలింపాంగ్‌లో మరణించాడు) అని, కుట్ర గురించి పూర్తిగా దలైలామాకు తెలియదని కూడా చెబుతారు. ఏమైనప్పటికీ తరువాత కాలంలో తెలిసినా అదే అమెరికా ప్రాపకంలో నాటి నుంచి నేటి వరకు చైనాకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నాడు.2011వరకు టిబెట్‌ ప్రవాస ప్రభుత్వ అధినేతగా చలామణి అయ్యాడు. తరువాత వేరేవారికి బాధ్యతలను అప్పగించాడు.

చైనాను అస్థిరపరచటం సాధ్యం కాదని గ్రహించిన అమెరికా విస్తారమైన దాని మార్కెట్‌లో ప్రవేశించేందుకు పూనుకొని ఐరాసలో కమ్యూనిస్టు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధిగా గుర్తించటంతో పాటు సాధారణ సంబంధాలను ఏర్పరుచుకుంది. దాంతో టిబెట్‌ తిరుగుబాటుదార్లకు అందచేస్తున్న సాయాన్ని 1972 నుంచి తగ్గించింది తప్ప ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది.దలైలామాకు 1989లో నోబెల్‌ శాంతి బహుమతిని కూడా ఇప్పించింది.మనదేశంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ సకల వసతులు కల్పిస్తూ చైనా వ్యతిరేక ప్రచారానికి అన్ని రకాలుగా తోడ్పడుతున్నారు. దలైలామా తరువాత స్వతంత్రుడైౖన పెంచెన్‌ లామా బౌద్దులకు ముఖ్యుడు. అతగాడే పదమూడవ దలైలామా వారసుడిగా గుర్తించిన ముగ్గురిలో ఒకడు లామో ధోండప్‌ తరువాత 14వ దలైలామా అయ్యాడు.క్రీస్తుశకం 1642 నుంచి కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన 1949వరకు చైనా ప్రభుత్వానికి లోబడి పరిమిత అధికారాలతో టిబెట్‌ ప్రాంతంపై దలైలామాలు లేదా అతగాడి ప్రతినిధులు రాజకీయ అధికారాన్ని కూడా చెలాయించేవారు. దీన్నే టిబెట్‌ స్వతంత్రదేశమని వక్రీకరించారు.1912లో చైనాలో తలెత్తిన తిరుగుబాటుతో క్వింగ్‌ రాజరికం పతనమై స్వతంత్రదేశంగా అవతరించింది, ఆ సమయంలో బ్రిటీష్‌ వారి కుట్రలో భాగంగా టిబెట్‌ స్వాతంత్య్రాన్ని పదమూడవదలైలామా ప్రకటించాడు. అయితే సన్‌యేట్‌ సేన్‌ నాయకత్వంలోని జాతీయ ప్రభుత్వం గుర్తించలేదు, టిబెట్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని స్పష్టం చేసింది. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత కూడా అదే విధంగా కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కొందరు టిబెటన్లు జపాన్‌కు అనుకూలంగా వ్యవహరించటంతో వారిని అణచివేసేందుకు నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ మిలిటరీని పంపి అణచివేశాడు. తరువాత జరిగిన పరిణామాల్లో ఖామ్‌ అనే యుద్ద ప్రభువు ఆధీనంలో ఉన్న టిబెట్‌ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు కమ్యూనిస్టు ప్రభుత్వం 1950 అక్టోబరులో ప్రజాసైన్యాన్ని పంపి స్వాధీనం చేసుకుంది. అదే ఏడాది పదిహేనేండ్ల వయస్సులో 14వ దలైలామాను టిబెట్‌ పాలకుడిగా ప్రకటించినప్పటికీ కమ్యూనిస్టు ప్రభుత్వం అంగీకరించలేదు.1951లో చైనా ప్రభుత్వానికి లోబడి స్వయంపాలిత ప్రాంతంగా టిబెట్‌ ఉండేందుకు దలైలామా ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు.1954లో మావోతో భేటీ అయ్యాడు, చైనా పార్లమెంటు స్టాండిరగ్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. మావో తనను ఒక కొడుకు మాదిరి చూశాడని దలైలామా తన ఆత్మకథలో చెప్పాడు.

1954 తరువాత సిఐఏ తనకుట్రను అమలు ప్రారంభించింది.1956లో దలైలామా భారత్‌ను సందర్శించినపుడు ఒకవేళ తాను రాజకీయ ఆశ్రయం కోరితే అంగీకరిస్తారా అని ప్రధాని నెహ్రూను కోరాడు.చైనా ప్రభుత్వంతో అప్పటికే ఒప్పందం ఉన్నందున అలాంటి పని చేస్తే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, రెచ్చగొట్టినట్లు అవుతుందని నెహ్రూ సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత అమెరికా వత్తిడికి లొంగిన నెహ్రూ ఆశ్రయమే కాదు, తిరుగుబాటు ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సహకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశం రెండు దేశాల మధ్య ఒక ప్రధాన సమస్యగానే ఉంటోంది. మన ప్రభుత్వం టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తూనే వేర్పాటు వాదులకు అనధికారిక మద్దతు కొనసాగిస్తున్నది.మనదేశంలో కాలు పెట్టిన తరువాత 1967లో తొలిసారిగా దలైలామా విదేశీ పర్యటనకు జపాన్‌ వెళ్లారు. ఆయనకు వీసా ఇచ్చిన ప్రభుత్వం తమ గడ్డమీద ఉన్నంత వరకు చైనా వ్యతిరేక మాటలు మాట్లాడవద్దని షరతు విధించింది.కానీ మనపాలకులు మాత్రం పూర్తి స్వేచ్చ ఇచ్చారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా సరుకు తుస్సు మంటే మన విమానాలు ఎలా కూలాయి ? ఇరకాటంలో మోడీ, కాషాయ దళాలు ఏమంటాయో మరి !

01 Sunday Jun 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, CDS Anil Chauhan, China, China WEAPONS, Donald trump, Narendra Modi Failures, Op Sindoor losses, RSS, Shangri-La Dialogue, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


‘‘ ఆపరేషన్‌ సిందూర్‌లో భారత యుద్ధ విమానాల కూల్చివేతకు అంత ప్రాధాన్యత లేదు గానీ దానికంటే ఎలా కూలిపోయాయన్నది ముఖ్యం, తొలి రోజు వ్యూహాత్మక తప్పిదాలను 48గంటల్లోనే సరిచేసి పాక్‌ మీద దాడి చేశాం ’’ మన రక్షణ దళాల అధిపతి(సిడిఎస్‌) అనిల్‌ చౌహాన్‌ శనివారం నాడు సింగపూర్‌లో చెప్పిన మాటల సారాంశం. అయితే ఎన్నింటిని కూల్చారన్నది చెప్పటానికి నిరాకరించారు గానీ పాక్‌ ప్రధాని చెప్పినట్లుగా ఆరు అన్నది పచ్చి అవాస్తవం అన్నారు. పాక్‌తో ఘర్షణలో ‘‘ వైమానిక ఆస్తులను కొన్నింటిని కోల్పోయాం ’’ అని చెప్పారు, అంటే విమానాలు అని చెప్పనవసరం లేదు. పరిస్థితి అణుదాడుల వరకు వచ్చిందన్నది కూడా అవాస్తవం అన్నారు.మూడు రాఫేల్‌ విమానాలను పాక్‌ దళాలు కూల్చివేసినట్లు వచ్చిన తొలుత వచ్చిన వార్తలను మన అధికారులు ఖండిరచిన సంగతి తెలిసిందే. యుద్ధం అన్న తరువాత నష్టాలు ఉంటాయని, మన పైలట్లు అందరూ సురక్షితంగా తిరిగి వచ్చినట్లు కొద్ది రోజుల క్రితం మన త్రివిధ దళాల అధిపతులు విలేకర్ల సమావేశంలో చెప్పినపుడే సూచన ప్రాయంగా స్పష్టమైంది. ఇప్పుడు సిడిఎస్‌ మరింత స్పష్టంగా చెప్పారు. మరి ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, ఒక్క విమానమూ కూలలేదని ఊరూవాడా ఊదరగొట్టిన కాషాయ మరుగుజ్జులు, వాటిని ప్రామాణికంగా తీసుకున్న మీడియా నిపుణులు ఏమంటారో తెలియదు. ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సెక్యూరిటీ స్టడీస్‌, సింగపూర్‌ సంస్థ షాంగ్రీ లా డైలాగ్‌(ఎస్‌ఎల్‌డి) పేరుతో ప్రతి ఏటా చర్చలు నిర్వహిస్తున్నది. 2001లో పురుడు పోసుకున్న ఈ సంస్థ 2002లో తొలి సారిగా అనధికార చర్చలు నిర్వహించింది. ఈ చర్చలను ఆసియా భద్రతా వ్యవహారాల సభగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో 22వ సభ మే నెల 30,31, జూన్‌ ఒకటిన జరిగింది. మన దేశం తరఫున 31వ తేదీన మన సిడిఎస్‌ అనిల్‌ చౌహాన్‌ అధికారయుతంగానే పాల్గొన్నారు.ఆ సభలో మాట్లాడటంతో పాటు వెలుపల రాయిటర్స్‌ వార్తా సంస్థ, అంతర్జాతీయ విలేకర్లతో కూడా ఆయన మాట్లాడారు. బ్లూమ్‌బెర్గ్‌ టీవీకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ సమావేశాలకు వివిధ దేశాల అధినేతలు, రక్షణ మంత్రులు,ఉన్నతాధికారులు రావటం జరుగుతున్నది. ప్రపంచమంతా తిరిగి పాకిస్తాన్‌ దుర్మార్గాలను ఎండగట్టాలని పార్లమెంటరీ ప్రతినిధి బృందాలను పంపి హడావుడి చేసిన ప్రభుత్వం కొద్ది ఖర్చుతో ఆసియా ఖండం, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రముఖులు పాల్గొనే ఈ సభలో ప్రభుత్వం ప్రధాని లేదా కనీసం రక్షణ మంత్రి లేదా విదేశాంగ మంత్రిని అయినా పంపలేదంటే వారికి ఎంత శ్రద్ద ఉందో వెల్లడి అవుతున్నది. పోనీ ఇంతకంటే దేశంలో ఉండి పొడుస్తున్నది ఏమైనా ఉందా ! సింగపూర్‌లో సిడిఎస్‌ చెప్పిన మాటలు అనేక అంశాలను ముందుకు తెచ్చాయి.మామ తిట్టినందుకు కాదు గానీ తోడల్లుడు తొంగిచూసి కిసుక్కున నవ్వినందుకు అన్నట్లు సిడిఎస్‌ మాటలపై చర్చ చేస్తే దేశద్రోహం అంటారేమో !

‘‘ మే ఏడవ తేదీన జరిగిందాన్ని గురించి నేను చెప్పగలిగిందేమిటంటే తొలి దశలో కొన్ని నష్టాలు ఉన్నాయి.సంఖ్య ముఖ్యం కాదు… ఆ నష్టాలు ఎందుకు జరిగాయి, ఆ తరువాత మనమేమి చేయాలనన్నది ముఖ్యమైన అంశం. మంచి విషయం ఏమంటే వ్యూహాత్మకంగా చేసిన తప్పిదాలను మేము అర్ధం చేసుకోగలిగాం, వాటికి పరిష్కారం ఉంది, వాటిని సరిదిద్దాం, రెండు రోజుల తరువాత దాన్ని అమలు జరిపాం, అన్ని రకాల మందుగుండుతో మన జెట్‌ విమానాలన్నీ మరోసారి దూరంగా ఉన్న లక్ష్యాలను చేధించేందుకు ఎగిరాయి. ఒక మీటరు అటూ ఇటూగా మూడు వందల కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్‌ వైమానిక స్థావరాల మీద దాడి చేయగలిగాం, చైనా వారి ఆయుధాలు ఏమీ పని చేయలేదు. పాకిస్తాన్‌తో చైనా సన్నిహితంగా మెలిగినప్పటికీ వివాద సమయంలో చైనా నుంచి వాస్తవంగా సాయం అందిన సూచనలు లేవు. ఉత్తర సరిహద్దులో పరిస్థితులన్నీ సాధారణంగానే ఉన్నాయి. (వివాదం సందర్భంగా చైనా గూఢచార సమాచారం అందించిందా అన్న ప్రశ్నకు ) అలాంటి దానిని వాణిజ్యపరంగా చైనా నుంచి పొంది ఉండవచ్చు, చైనా లేదా అదేవిధంగా ఇతర వనరులనుంచి కూడా కావచ్చు ’’ అని సిడిఎస్‌ చెప్పారు. మొత్తం మీద సారాంశం ఇది.
ఇక చైనా ఆయుధాలు తుస్సుమన్నాయి, దేనికీ పనికిరానివని తేలిపోయింది, దీంతో మిలిటరీ అధికారులను చైనా జైల్లో పెట్టారని రాశారు. పాకిస్తాన్‌ వారే కొనుగోలు చేసేందుకు విముఖత చూపుతున్నారంటూ విశ్లేషణలు చేసిన వారు, వాటికి ప్రాధాన్యత ఇచ్చిన మీడియా యుద్ధ వీరులు ఇప్పుడు ఎలాంటి కతలు చెబుతారో తెలియదు. మన దగ్గర రష్యా ఇచ్చిన సుదర్శన చక్రం ఎస్‌`400 ఉంది, చైనా దగ్గర ఉన్నవి పని చేయటంలేదు, పనిలో పనిగా దాని ఆధీనంలో ఉన్న ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవటానికి ఇదే తరుణం అని సలహాలు ఇచ్చిన వారు కూడా లేకపోలేదు. అసలు విమానాలు కూలలేదు, తప్పుడు సమాచారం వ్యాపింప చేస్తున్నారంటూ దాడులకు దిగిన సామాజిక మాధ్యమ మరుగుజ్జులు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు, కొన్ని నష్టాలు జరిగినా అంతిమంగా పాకిస్తాన్ను దెబ్బతీశామా లేదా అన్నది చూడాలంటున్నారు. ఈ వితండవాదానికి తిరుగులేదు.

విమానాలు కూలింది మన గడ్డమీదా లేక పాక్‌ భూమిలోనా అన్నది మరింత ఆసక్తికరంగా మారింది. మన పైలట్లు సురక్షితంగా వచ్చారని మన అధికారులు చెప్పటాన్ని బట్టి కూలింది మన దేశంలోనే అని చెప్పవచ్చు.2019లో బాలాకోట్‌ మెరుపుదాడుల సమయంలో పాక్‌ మిలిటరీ మన మిగ్‌ విమానాన్ని వారి భూభాగంలో కూల్చివేసి పైలట్‌ అభినందన్‌ వర్దమాన్ను బందీగా పట్టుకున్న సంగతి తెలిసిందే. మన భూభాగంలోనే మన విమానాల కూల్చివేత జరిగిందంటే అవి ఎగరగానే గతంలో చైనా నుంచి కొనుగోలు చేసిన పాక్‌ రాడార్లు పసిగట్టి కూల్చివేసినట్లు కనిపిస్తోంది. చైనా క్షిపణులు లేవలేదు, లేచినవి మన భూభాగంలో పేలకుండా పడ్డాయి అన్న వార్తలు తెలిసిందే. చైనా ఆయుధాలు పని చేయలేదని సిడిఎస్‌ కూడా చెప్పారు. అదే నిజమైతే అంటే పాకిస్తాన్‌ దగ్గర చైనా లేదా అమెరికా ఆయుధాలు తప్ప వేరే దేశానివి లేవు. అమెరికా వాటితోనే కూల్చివేసి ఉండాలి. వాటిని ఉపయోగించటానికి కొన్ని షరతులు పెట్టామని గతంలో అమెరికా ప్రకటించింది, ఈ సందర్భంగా ట్రంప్‌ వాటిని సడలించి ఉండకపోతే పాక్‌ మిలిటరీ ప్రయోగించి ఉండేది కాదు. ఆ విషయాన్ని చెప్పటం దేశద్రోహం కాదు, జరిగే నష్టమూ లేదు. రష్యా సుదర్శన చక్రంతో దెబ్బతీసినట్లు చెప్పుకున్న మనం అమెరికా ఆయుధాలతో దెబ్బతిన్నామని అంగీకరిస్తే కలిగే నష్టం ఏముంది ? ట్రంప్‌ అంటే భయమా ?


అసలేం జరిగిందో చెప్పాలన్న ప్రతిపక్షాల మీద సైన్యాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అంటూ ఎదురుదాడి చేసిన బిజెపి, కాషాయ దళాలు, సామాజిమాధ్య మరుగుజ్జులు ఇప్పుడెలా ఎగిరిపడతారో చూడాలి. పార్లమెంటు సమావేశం జరపాలన్న డిమాండ్‌ను బిజెపి తిరస్కరిస్తే చాలా మందికి అంతుబట్టలేదు గానీ అనిల్‌ చౌహాన్‌ ప్రకటనతో అసలు సంగతి అర్ధమైంది. నాలుగు రోజుల్లోనే ఆకస్మికంగా దాడులు ఆపివేసి కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవటం వెనుక కూడా విమానాలు కూలిపోయిన ప్రభావం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.మన తప్పిదాలను గుర్తించి సరి చేసుకున్నట్లే పాకిస్తాన్‌ కూడా తన తప్పిదాలను సవరించుకొని ఎదురుదాడులకు సిద్దమైందా ? ఇప్పటికైనా పార్లమెంటును సమావేశపరచి సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం లేదా !

యుద్ధం అన్న తరువాత రెండువైపులా నష్టాలు ఉంటాయనేందుకు రెండవ ప్రపంచ పోరు చక్కటి ఉదాహరణ అన్నది అందరికీ తెలిసిందే. పాక్‌తో జరిగిన యుద్ధాలు, చిన్న చిన్న జగడాలు అయినా అంతే దానికి మన దళాలను తప్పుపట్టాల్సింది గానీ నిరుత్సాహపరచాల్సిందిగానీ ఏమీ లేదు. పాక్‌ ఉగ్రవాదుల మీద కంటే మన జనం మీదనే బిజెపి దళాలు పెద్ద ప్రచారదాడి చేసినట్లు కనిపిస్తోంది. కొందరు నేతలు ఎలా నోరు పారవేసుకున్నదీ ఒక మధ్య ప్రదేశ్‌ మంత్రి మీద విచారణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతీ తెలిసిందే. విదేశీ సంస్థలు ఇచ్చిన విమానాల కూల్చివేత వార్తలను చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఇచ్చింది. మాతో నిర్ధారించుకోకుండా నిరాధార వార్తలను రాస్తారా అంటూ మన విదేశాంగశాఖ నిరసన తెలిపింది. మరి ఇప్పుడు ఏమంటారు ? గతంలో ఇతర దేశాల మీడియా ఇచ్చిన సమాచారాన్ని గ్లోబల్‌ టైమ్స్‌ వార్తగా ఇచ్చినట్లే సిడిఎస్‌ చెప్పిన బ్లూమ్‌బెర్గ్‌ వార్తను ఉటంకిస్తూ అదే పత్రిక రాసింది.పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన సైన్యం ప్రాణాలకు తెగించి దెబ్బకు దెబ్బ తీస్తే అదేదో మోడీ స్వయంగా చేసినట్లు చిత్రించారు.తన వ్యక్తిగత ప్రతిష్టను, దానికి లోబడి బిజెపిని జనంలో ప్రచారం చేసేందుకు నరేంద్రమోడీ పడిన తాపత్రయం, చేసిన ఖర్చు, మీడియాను గోడియాగా మార్చిన తీరు, సామాజిక మాధ్యమ సంస్థలకు ఇచ్చిన పాకేజీల గురించి తెలిసిందే.


జరిగిందాన్ని గురించి కాంగ్రెస్‌ అనేక ప్రశ్నలను సంధించింది.మిలిటరీ చర్యలను సమర్ధించింది. తెలంగాణా మంత్రి కెప్టెన్‌ ఉత్తమకుమార్‌ రెడ్డి, జయరామ్‌ రమేష్‌ విలేకర్లతో మాట్లాడారు. జరిగిందాని మీద ఒక సమీక్షా కమిటీని వేయాలని కోరారు. కార్గిల్‌ యుద్ధం జరిగినపుడు ప్రస్తుత విదేశాంగ మంత్రి జై శంకర్‌ తండ్రి, రక్షణ వ్యవహారాల నిపుణుడు కె సుబ్రమణ్యం అధ్యక్షతన 1999లో వాజ్‌పాయి ఒక సమీక్షా కమిటీని ఏర్పాటు చేసినట్లు జయరామ్‌ రమేష్‌ గుర్తు చేశారు.ఐదు నెలల తరువాత ఆ కమిటీ సమర్పించిన నివేదికను పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశపెట్టారని ఇప్పుడు కూడా సిడిఎస్‌ చెప్పిన అంశాలను సమీక్షించాలని కోరారు.


సింగపూర్‌ సమావేశానికి సిడిఎస్‌ అనిల్‌ చౌహాన్ను పంపి చాణక్యుడు అనుకుంటున్న నరేంద్రమోడీ పప్పులో కాలువేశారా ? సిడిఎస్‌ను సింగపూర్‌కు అనవసరంగా పంపారని అక్కడ ఆయన ఒక ప్రచార విజయాన్ని పాకిస్తాన్‌కు అందచేశారని రక్షణ రంగ వ్యూహకర్త బ్రహ్మ చెలానే విమర్శించారు.పాకిస్తాన్‌కు మనం కలిగించిన నష్ట వివరాలతో పాటు మన విమానాలను కోల్పోయినట్లు మన గడ్డ మీద మాత్రమే చెప్పాలని అన్నారు. సింగపూర్‌ సభకు పాక్‌ మిలిటరీ అధికారి కూడా వచ్చారని ఆ సందర్భంగా మన నష్టాల గురించి చెప్పటం పాకిస్తాన్‌తో అనుసంధానం చేయటమే అన్నారు.భారత నిర్ణయాత్మక విజయాన్ని వివరించేందుకు నరేంద్రమోడీ రోడ్‌ షోలు చేస్తున్నారు. అయినప్పటికీ వాణిజ్య ఆంక్షలు విధిస్తాననే బెదిరింపుతో మిలిటరీ శత్రుత్వాన్ని తానే ఆపినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ పదే పదే చెబుతున్నాడు.మోడీ ప్రయత్నాలను బలహీనపరుస్తున్నాడు. సింగపూర్‌లో మీడియాతో మాట్లాడి సిడిఎస్‌ పరిస్థితిని మరింత సంక్లిష్టం కావించారని చెలానే వ్యాఖ్యానించారు. ఆపరేషన్‌ సింధూర్‌ లక్ష్యాలు ఏమిటో చెప్పకుండా కొన్ని విమానాలు నష్టపోవటం గురించి చెప్పటం ఏమిటని మరో విశ్లేషకుడు సుషాంత్‌ శరీన్‌ అన్నారు.కొన్ని విమానాలు నష్టపోవటం కొలమానం కాదన్నారు. మొత్తం మీద చూసినపుడు మిలిటరీ చర్యలను అధికారంలో ఉన్న పార్టీ తన ప్రతిష్టను పెంచుకొనేందుకు చూస్తే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవని ఇప్పటికే వెల్లడైంది. మణిపూర్‌ పర్యటించి అక్కడి పౌర సమాజంలో తలెత్తిన అపోహలను పొగొట్టేందుకు రెండు సంవత్సరాలుగా దాని మొహం చూడని ప్రధాని నరేంద్రమోడీ పాక్‌తో ఘర్షణపై పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు తిరస్కరించి అప్రజాస్వామికంగా వ్యవహరించారనే విమర్శను మూటగట్టుకున్నారు. నష్ట నివారణకు ఇప్పటికీ సమయం మించి పోలేదు. విదేశాల్లో పర్యటించి వచ్చిన పార్లమెంటరీ బృందాల అనుభవాల పేరుతో పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే పరువు దక్కుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాశ్మీరుపై నమ్మలేని నిజం, వాస్తవాలు : పాకిస్తాన్‌కు అప్పగించటానికి అంగీకరించిన వల్లభాయ్‌ పటేల్‌ !

30 Friday May 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA, WAR

≈ Leave a comment

Tags

Annexation of Hyderabad, BJP, Facts vs Myths, Jammu and Kashmir, Jawaharlal Nehru, Kashmir problem, Narendra Modi Failures, Pakistan-Occupied Kashmir, POK, RSS, Sardar Vallabhbhai Patel

ఎం కోటేశ్వరరావు


ఆక్రమిత కాశ్మీరు(పిఓకె)ను పూర్తిగా స్వాధీనం చేసుకొనే వరకు యుద్ధాన్ని ఆపకూడదని నాటి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చెప్పిన అభిప్రాయాన్ని నాటి ప్రధాని నెహ్రూ అంగీకరించలేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఆమోదించి ఉంటే పహల్గామ్‌ దారుణం జరిగి ఉండేది కాదని మే 27వ తేదీన గుజరాత్‌ పర్యటనలో చెప్పిన మాటలకు మీడియా పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించింది. కాశ్మీరును ఆక్రమించుకొనేందుకు నాటి ముజాహిదిన్‌ దాడుల కొనసాగింపే పహల్గామ్‌ ఉదంతం అని మోడీ వర్ణించారు. నెహ్రూ నాడు యుద్ధాన్ని మధ్యలోనే ఆపివేసి చారిత్రక తప్పిదం చేశారని సంఘపరివార్‌ సంస్థలలో ఒకటైన బిజెపి పదే పదే చెబుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగించి ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేయకుండా నరేంద్రమోడీ సర్కార్‌ వచ్చిన మంచి అవకాశాన్ని విడిచిపెట్టిందని జనం భావిస్తున్నారు. కనీసం ఉగ్రవాదుల మీద పాకిస్తాన్‌ నుంచి ఎలాంటి హామీ పొందకుండా సిందూర్‌ను నిలిపివేసిందని తీవ్ర అసంతృప్తి, విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మోడీ జనం దృష్టిని మళ్లించేందుకు వల్లభాయ్‌ పటేల్‌ మాటున రక్షణ పొందినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గుడ్డిగా నమ్మేవారుంటే అది తాత్కాలికమే, వారు ఒకసారి కళ్లు తెరిస్తే నాన్నా పులి కథే. చివరికి నిజం చెప్పినా నమ్మరు.


కాశ్మీరు సమస్యను ఇరుదేశాలు పరిష్కరించుకోవాలన్నది సిమ్లా ఒప్పంద స్ఫూర్తి.దాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పాలకులు చిత్తశుద్దితో పనిచేసి పరిష్కరించలేదన్నది ఒక విమర్శ. వాస్తవమే, మరి బిజెపి చేసిందేమిటి ? జనతా పార్టీలో అది భాగస్వామి, వాజ్‌పాయి విదేశాంగ మంత్రిగా పని చేశారు. తరువాత ప్రధాని అయ్యారు. పదకొండు సంవత్సరాలుగా నరేంద్రమోడీ ఏలుబడి సాగుతున్నది. బిజెపి, దాని పూర్వ రూపమైన జనసంఫ్‌ు కాశ్మీరు సమస్యను ఓట్ల కోసం వాడుకోవటం తప్ప ఆక్రమిత కాశ్మీరును సాధించేందుకు మనదేశం వైపు నుంచి చేసిన ఒక్క ప్రయత్నాన్ని చూపమనండి. ఎందుకంటే ఆ సమస్య అలానే రావణకాష్టంలా కాలుతూ ఉండాలి. నెహ్రూ, కాంగ్రెస్‌ల మీద విమర్శలు చేస్తూ ఓట్లు దండుకొనేందుకు వినియోగించుకోవాలన్నది తప్ప బిజెపి చిత్తశుద్ది ఏమిటి ? 1994లోనే పార్లమెంటు ఆక్రమిత కాశ్మీరు మనదే అనే తీర్మానాన్ని కూడా ఆమోదించింది. మాకు అధికారమిస్తే పిఒకెను చిటికెలో వెనక్కు తీసుకువస్తాం అని తుపాకి రాముడు కబుర్లు చెప్పటం తప్ప పదకొండు సంవత్సరాల్లో ఒక్క అడుగువేసింది లేదు. ఆపరేషన్‌ సిందూర్‌తో వచ్చిన మంచి అవకాశాన్ని ట్రంప్‌ బెదిరిస్తే వెనక్కు తగ్గినట్లుగా జనం అనుకుంటున్నందున ముఖం మీద చెప్పకపోవచ్చుగానీ బిజెపి కబుర్లను ఇంకేమాత్రం నమ్మేస్థితి లేదు. దుకాణదారులు గోడమీద అప్పు రేపు అని రాసినట్లుగా రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ మరోమారు గురువారం నాడు అదే చెప్పారు. పిఓకెను మనకు పాక్‌ అప్పగించకపోతే ఏం చేస్తారో ఎప్పుడు చేస్తారో చెప్పాలన్న ప్రశ్నలకు సూటిగా చెప్పకుండా తెస్తాం అంటే మరో 75 ఏండ్లు ఆగాలని అర్ధమా !


పాకిస్తాన్‌లో భాగమైన తూర్పు బెంగాల్‌( నేటి బంగ్లాదేశ్‌)లో తలెత్తిన 1971 తిరుగుబాటును నాడు మనదేశం చక్కగా వినియోగించుకొని పాకిస్తాన్లోని ఒక ముక్కను విడగొట్టి ఒక తలనొప్పిని వదిలించుకుంది. నాడు పాకిస్తాన్‌కు మద్దతుగా అమెరికా మనలను బెదిరించేందుకు బంగాళాఖాతంలోకి తన సప్తమ నౌకాదళాన్ని దింపింది. అయినా ఖాతరు చేయకుండా ముందుకు పోవటమే కాదు, సోవియట్‌తో రక్షణ సంధి చేసుకున్నాం. మనకు మద్దతుగా తాను రంగంలోకి దిగాల్సి ఉంటుందనే సందేశం వెలువడటంతో అమెరికా వెనక్కు తగ్గింది. ఇప్పుడు పహల్గాం రూపంలో వచ్చిన అవకాశాన్ని నరేంద్రమోడీ ఎందుకు వినియోగించకోలేదు ? అన్నింటి కంటే ట్రంప్‌ జోక్యం లేదా బెదిరింపులతో వెనక్కు తగ్గి ఏమీ సాధించకుండానే పాకిస్తాన్‌తో రాజకీ కుదుర్చుకున్నట్లు జనం భావిస్తున్నారు. లేదూ పాక్‌ కోరికతో మనమే రాజీపడ్డామని చెబుతున్నారు, దాని ప్రకారమే అయినా ఏం సాధించారని సంధికి అంగీకరించారు. ఇప్పుడు కూడా రష్యాతో రక్షణ ఒప్పందం ఉంది అయినా 56 అంగుళాల ఛాతీ ధైర్యం చేయలేకపోయింది.


నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే కాశ్మీరుపై పటేల్‌ వైఖరిలో రెండూ ఉన్నాయి. పత్రికలు చదివేవారూ, టీవీలు చూసే ప్రతి ఒక్కరు చరిత్రలో ఏం జరిగిందనే శోధన చేయరనే గట్టి విశ్వాసంతో తమకు కావాల్సిందాన్నే కొందరు చెబుతారు.2018 ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో మాట్లాడుతూ ‘‘ సర్దార్‌ పటేల్‌ గనుక భారత తొలి ప్రధాని అయి ఉంటే మొత్తం కాశ్మీరు మనదే అయి ఉండేది ’’ అని చెప్పారు.కానీ అదే పటేల్‌కు అసలు కాశ్మీరు గురించి ఆసక్తి ఉందా ? ఉంటే నాటి రక్షణ మంత్రి బలదేవ్‌ సింగ్‌కు అలా లేఖ రాసేవారా ? కల్నల్‌ కటోచ్‌ను కాశ్మీరులో నియమించాలని, ఒకవేళ కాశ్మీరు గనుక వేరేదేశం(పాకిస్తాన్‌)లోకి వెళ్లిపోతే అతన్ని తిరిగి మనదేశానికి తీసుకురావాలని నరేంద్రమోడీ పుట్టక ముందే 1947 సెప్టెంబరు 13న లేఖ రాశారు. అది ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంది.


1947 ఆగస్టుఅక్టోబరు మధ్య తొలిసారిగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగింది. అనేక మంది చరిత్రకారులు, విశ్లేషకులు రాసినదాన్ని బట్టి కాశ్మీరును రాబట్టుకోవాలా లేదా అనే అంశంలో నెహ్రూ, పటేల్‌ మధ్య గందరగోళం ఉంది. కనుకనే సెప్టెంబరులో పటేల్‌ అలా లేఖరాశారన్నది స్పష్టం. పటేల్‌ వైఖరి గురించి నరేంద్రమోడీ నోరు విప్పక ముందే అనేక మంది తమ రచనల్లో చర్చించారు. అవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి వారు స్వంత అభిప్రాయాలకు రావచ్చు. 1984లో రాజేంద్ర శరీన్‌ ‘‘పాకిస్తాన్‌ ద ఇండియా ఫాక్టర్‌ ’’ అనేపేరుతో రాసిన పుస్తకంలో అనేక అంశాలను చర్చించారు. అబ్దుల్‌ రాబ్‌ నిష్తార్‌ అనే పాకిస్తాన్‌ మంత్రితో పటేల్‌ సంభాషిస్తూ ‘‘ భాయ్‌ హైదరాబాద్‌, జునాఘడ్‌ల గురించి మాటలొద్దు, కాశ్మీరు గురించి చెప్పండి, కాశ్మీరును తీసుకోండి సమస్యను పరిష్కరించండి ’’ అని చెప్పినట్లుగా పేర్కొన్నారు. మౌంట్‌బాటన్‌ పాక్‌ ప్రధాని లియాకత్‌ అలీతో భేటీ అయినపుడు పాక్‌ రాజ్యాంగపరిషత్‌ సభ్యుడు సర్దార్‌ షౌకత్‌ హయత్‌ కూడా ఉన్నాడు. పాకిస్తాన్‌ గనుక హైదరాబాద్‌ను వదులు కుంటే దానికి బదులుగా కాశ్మీరును భారత్‌ ఇస్తుందని మౌంట్‌బాటన్‌ పటేల్‌ సందేశంగా లియాకత్‌ అలీకి చెప్పాడు. దాని మీద సంభాషణల్లో ‘‘ సర్దార్‌ సాహెబ్‌ మీకేమైనా మతిపోయిందా పంజాబ్‌ కంటే పెద్దదైన ప్రాంతాన్ని మనం ఎందుకు వదులుకోవాలి, దానికి బదులుగా కొన్ని పర్వతాలున్న దాన్ని ఎందుకు తీసుకోవాలి ’’ అన్నాడు. అంతే కాదు రాజేంద్ర శరీన్‌ పుస్తకంలో ఇంకా ఏమి ఉటంకించిదీ చూద్దాం.1947 జూన్‌లో కాశ్మీరు రాజు హరిసింగ్‌తో మౌంట్‌బాటన్‌ భేటీ అయ్యాడు. ఆ సందర్భంగా మౌంట్‌బాటన్‌ మాట్లాడుతూ ‘‘ మీరు పాకిస్తాన్‌తో కలవదలచుకుంటే భారత్‌ దాన్ని ఒక తప్పుగా భావించదు, ఆ మేరకు సర్దార్‌ పటేల్‌ స్వయంగా గట్టి హామీ ఇచ్చారు ’’ అని చెప్పినట్లు నాడు పటేల్‌ రాజకీయ కార్యదర్శిగా ఉన్న వి శంకర్‌ ( సర్దార్‌ పటేల్‌తో నా జ్ఞాపకాలు 1974 ) అనేపుస్తకంలో రాశారు.‘‘ కాశ్మీరు పాలకుడు ఒకవేళ తాను, తన రాజ్యానికి పాకిస్తాన్‌తో కలవాలనే ఆసక్తి ఉంటే ఆ దారికి నేను అడ్డుపడను ’’ అని పటేల్‌ అన్నట్లుగా కూడా శంకర్‌ రాశారు.


కాశ్మీరు గనుక పాకిస్తాన్‌ వైపు వెళ్లాలని ఎంచుకుంటే దాని నిర్ణయాన్ని నేను నిరాక్షేపణీయంగా అంగీకరిస్తానని పేర్కొన్నారు. నిజంగా పటేల్‌ ప్రధాని అయివుంటే అన్నంత పనీ చేసి ఉండేవారు కాదా ! ఈ విషయాన్ని అదే పటేల్‌ ఉపప్రధానిగా ఉన్నపుడు ప్రభుత్వ కార్యదర్శిగా పని చేసిన విపి మీనన్‌ నిర్ధారించారని 1990లో ప్రచురితమైన ‘‘ పటేల్‌ ఏ లైఫ్‌( పటేల్‌ జీవితం ) అనే గ్రంధంలో మహాత్మాగాంధీ మనవడు, చరిత్రకారుడు రాజ్‌మోహన్‌ గాంధీ రాశారు. అదే విషయాన్ని మౌంట్‌బాటన్‌ అప్పుడే మహమ్మదాలీ జిన్నాకు కూడా చేరవేశారు. అంతే కాదు కాశ్మీరు స్వతంత్ర దేశంగా ఉన్నప్పటికీ దాన్ని వ్యతిరేకించబోమని చెప్పినట్లు కూడా మౌంట్‌బాటన్‌ చెప్పాడు. కాశ్మీరును తీసుకొని దాని బదులు జునాఘడ్‌, హైదరాబాద్‌ సంస్థానాలను మనం తీసుకోవాలన్నది పటేల్‌ వైఖరి. అయితే మూడు సంస్థానాలూ తమకే కావాలనే దురాశతో జిన్నా దానికి ఒప్పుకోలేదు. ఒకవేళ అంగీకరించి ఉంటే……
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో సంస్థానాలు ఏ దేశంలో విలీనం కావాలో నిర్ణయించుకొనే స్వేచ్చను ఇచ్చారు. అది తప్పా ఒప్పా అంటే దానికి పటేల్‌ కూడా నాడు అంగీకరించారు. గట్టిగా పటేల్‌ అడ్డుపడి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు, కాశ్మీరు ఆక్రమణకు గురయ్యేదే కాదు. హైదరాబాద్‌ సంస్థానం, కాశ్మీరు స్వతంత్ర దేశాలుగా ఉంటామని ప్రకటించుకోగా జునాఘడ్‌(ప్రస్తుత గుజరాత్‌ రాష్ట్రంలో ఉంది) పాకిస్తాన్‌తో చేరాలని నిర్ణయించుకుంది.కాశ్మీరులో అత్యధికులు ముస్లింలు కాగా పాలకుడు హిందూ రాజు, జునాఘడ్‌, హైదరాబాదులో అత్యధికులు హిందువులు కాగా పాలకులు ముస్లింలు. పటేల్‌కు ఆ నాటికే ముస్లింలంటే పడదో లేక దేశవిభజనకు కారకులయ్యారనే కోపమో ఏమో హైదరాబాద్‌, జునాఘడ్‌లను వదులుకొనేది లేదు, కావాలంటే కాశ్మీరును పాకిస్తాన్‌ తీసుకుంటే వ్యతిరేకించం అని చెప్పినట్లు కనిపిస్తోంది. తరువాత పటేల్‌ వైఖరిలో మార్పు వచ్చిందంటే దానికి కారణం కాశ్మీరు గురించి నెహ్రూ ఇతర నేతలు గట్టిగా నిలవటం, పాకిస్తాన్‌ దురాక్రమణకు పూనుకోవటమే. కాశ్మీరు హిందూ రాజు స్వతంత్ర దేశమంటూ నాటి బ్రిటన్‌, అమెరికా పన్నిన కుట్రలో భాగంగా హడావుడి చేస్తే అక్కడి జనం ముస్లింలు మాత్రం నేషనల్‌ కాన్ఫరెన్సు నాయయకుడు షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో భారత్‌లో విలీనాన్ని కోరుకున్నారు. ఆ కారణంగానే మూడొంతుల కాశ్మీరు మనలో విలీనమైంది. దక్షిణాసియాలో అమెరికా, బ్రిటన్‌ చెప్పుచేతల్లో ఉండే పాకిస్తాన్‌, దానికి మరో స్వతంత్ర దేశంగా కాశ్మీరుకూడా తోడు కావటాన్ని నాటి సోవియట్‌,చైనా తదితర సమీప దేశాలేవీ అంగీకరించలేదు. అదే జరిగి ఉంటే ఎలాంటి ముప్పు వచ్చి ఉండేదో సిక్కిం అనుభవం తరువాత తెలిపింది.

చైనాభారత సరిహద్దులో సిక్కిం మనదేశంలో విలీనం కాలేదు. రాచరిక దేశంగా ఉంది. అక్కడ పాగా వేసేందుకు రాజుకు అమ్మాయిలను ఎరవేసి తనవైపు తిప్పుకోవాలని అమెరికా చేసిన యత్నాన్ని నాటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలోని యంత్రాంగం వమ్ముచేసింది. భారత్‌లో విలీనానికి అవసరమైన కథనడిపి విజయవంతమైంది.ప్రజాభిప్రాయం మేరకు 1975లో మన దేశంలో విలీనమైంది. లేకుంటే హిమాలయాల్లో అమెరికా తొత్తు దేశంగా ఇజ్రాయెల్‌ మాదిరి మనకూ, చైనాకూ సమస్యలను తెచ్చిపెట్టి ఉండేది. కాశ్మీరు సమస్యను ఐరాసకు తీసుకువెళ్లి జవహర్‌లాల్‌ నెహ్రూ పెద్ద తప్పుచేశారన్నది బిజెపి ఆరోపణ. తప్పో ఒప్పో జరిగిపోయింది. అలా తీసుకువెళ్లినందుకు నిరసనగా వల్లభాయ్‌ పటేల్‌ ఎందుకు రాజీనామా చేయలేదు ? అంటే ఆ నిర్ణయానికి ఆయన కూడా అంగీకరించినట్లే, కనుక నెహ్రూనే బాధ్యుడిని చేయటం వక్రీకరణ.భద్రతా మండలి ఒక తీర్మానం చేయాలని 1948 జనవరి ఒకటిన భారత్‌ కోరింది. దాని మీద అదే ఏడాది ఏప్రిల్‌ 21న 47వ నంబరు తీర్మానాన్ని ఆమోదించారు. దాని ప్రకారం ఉభయ దేశాలూ కాల్పుల విరమణ పాటించాలి. ఇతర ప్రాంతాల నుంచి పోరాటానికి వచ్చిన గిరిజనులు, పాక్‌ పౌరులు, ఇతరులు కాశ్మీరు నుంచి వెళ్లిపోవాలి.భారత ప్రభుత్వం తన ఆధీనంలోని ప్రాంతాలలో మిలిటరీని కనీస స్థాయికి తగ్గించాలి. తద్వారా పాకిస్తాన్‌, భారత్‌ ఏ దేశంలో చేరేదీ నిర్ణయించేందుకు ప్రజాభిప్రాయ సేకరణకు వీలు కల్పించాలి.అది 1949 జనవరి ఒకటి వరకు జరగలేదు. ఈలోగా ఐరాస కమిషన్‌ మూడుసార్లు కాశ్మీరు సందర్శించింది. పరిస్థితి మీద ప్రభావితం చూపే విధంగా కాశ్మీరులో పాకిస్తాన్‌ మార్పులకు పాల్పడిరది. అందువలన ముందుగా పాక్‌ తన మిలిటరీ, పౌరులను అక్కడి నుంచి ఉపసంహరించాలి.తరువాత భారత్‌ వెనక్కు తీసుకోవాలి. ఆ తరువాత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని 1948 ఆగస్టులో కమిషన్‌ భద్రతా మండలికి నివేదించింది. దీన్ని మనదేశం అంగీకరించగా పాక్‌ తిరస్కరించింది. చట్టబద్దంగా కాశ్మీరు మనదేశంలో విలీనమైంది, అంటే పాక్‌ మిలిటరీ, అది మద్దతు ఇచ్చిన వారు కాశ్మీరులో ఉండటం అంటే శత్రుపూరిత చర్య, దురాక్రమణకు పాల్పడటమే, ప్రజాభిప్రాయ సేకరణ అంటే విలీనాన్ని నిర్ధారించేందుకు తప్ప అంతకు ముందే అన్ని లాంఛనాలు పూర్తయినట్లు మనదేశం వాదించింది. అయితే ఇతర దేశాలతో ఒప్పందం చేసుకొనే ముందు తొలుత తమతో కాశ్మీరు ప్రభుత్వం యథాతధస్థితి (కాశ్మీరు అంతకు ముందు మాదిరే ఉండేట్లు ) ఒప్పందం చేసుకుందని, కాశ్మీరు పౌరులు తిరుగుబాటు చేశారని, మహరాజు పారిపోయినందున అతగాడికి ఒప్పందం చేసుకొనే హక్కులేదని పాకిస్తాన్‌ వాదించింది. విముక్త కాశ్మీరు ఆందోళనలు, గిరిజనుల తిరుగుబాట్లు వాటికవే పుట్టినవి తప్ప వాటికి తమ మద్దతు గురించి విమర్శకు తావేలేదన్నది. ముందు పాకిస్తాన్‌ తన దళాలను ఉపసంహరించుకోవాలని భారత్‌ అంటే మేము తప్పుకున్న తరువాత భారత్‌ వైదొలుగుతుందన్న గ్యారంటీ ఏమిటి అంటూ పాకిస్తాన్‌ అడ్డం తిరిగింది. అంతే, తరువాత జరిగిందేమీ లేదు.బంగ్లా విముక్తి తరువాత 1972లో ఇరుదేశాలు పరస్పరం చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందంలో నిర్ణయించటంతో ఐరాస పాత్రకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటి వరకు వాజ్‌పాయి, నరేంద్రమోడీ ఎవరు ఏలుబడిలో ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేసిందేమీ లేదు.

హైదరాబాద్‌ సంస్థాన విలీనం గురించి ఎందుకు పటేల్‌ అంతగట్టిగా పట్టుబట్టారనటం ఆసక్తి కలిగించే అంశం. దేశం మధ్యలో మరొక దేశం లేదా పాకిస్తాన్‌ ప్రాంతం ఉండటం అంటే కడుపులో కాన్సరే అని పటేల్‌ వర్ణించాడు. అది వాస్తవమే. మరొక కారణాన్ని కూడా కొట్టి పారవేయటానికి లేదు. నైజాం నవాబు మీద స్వాతంత్య్రానికి ముందు నుంచే కమ్యూనిస్టులు పాలనకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేస్తున్నారు. చైనాలో దీర్ఘకాలం సాగిన కమ్యూనిస్టుల లాంగ్‌ మార్చ్‌ మాదిరి భారత్‌లో కూడా నైజాం సంస్థానం మారితే ప్రమాదకరమని నెహ్రూ ప్రభుత్వాన్ని సిఐఏ హెచ్చరించిందని చెబుతారు. ఆపరేషన్‌ పోలో నాలుగు రోజుల్లోనే ముగిసింది కానీ తరువాత నెహ్రూపటేల్‌ సైన్యాలు కమ్యూనిస్టుల మీద మూడు సంవత్సరాల పాటు అణచివేతకు పాల్పడ్డాయి. నైజాం నవాబు, వాడితో చేతులు కలిపిన జాగీర్దార్లు, దేశముఖల కంటే మిలిటరీ ఎక్కువ మంది కమ్యూనిస్టులను చంపింది, ఒక్క తెలంగాణాలోనే కాదు, దానికి మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రాంతంలో కూడా వందలాది మందిని పొట్టన పెట్టుకుంది. పాకిస్తాన్‌ వైపు నుంచి కాశ్మీరు ఆక్రమణకు పూనుకోవటం, భారత్‌లో విలీనానికి రాజు హరిసింగ్‌ అంగీకరించటం, కేంద్ర ప్రభుత్వం సైన్యాలను పంపిన తరువాత పటేల్‌ వైఖరిలో మార్పు రావటం అనివార్యం. ఉక్కు మనిషి, పట్టిన పట్టు వదలడు కదలడు అని పటేల్‌ గురించి చెబుతారు. కానీ నరేంద్రమోడీ చెప్పినట్లుగా ఆక్రమిత కాశ్మీరును విముక్తి చేసేంత వరకు యుద్ధం కొనసాగించి ఉండాల్సిందనే వైఖరి మీద గట్టిగా పట్టుబట్టినట్లుగానీ, దానికి తిరస్కరించిన నెహ్రూతో విబేధించి మంత్రివర్గం నుంచి బయటకు రావటం గానీ ఎక్కడా మనకు కనిపించదు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలో 1949 జనవరి ఒకటి నుంచి రెండుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. పటేల్‌ కుమార్తె మణిబెన్‌ రాసిన డైరీలలో 1949 జూలై 23నమోదు చేసినదాని ప్రకారం ‘‘ మనం మొత్తం ప్రాంతం కావాలని కోరుతున్నాం… మొత్తం కాశ్మీరు కోసం పోరు సాగించాలి’’ అని ఉన్నట్లు బిజెపి నేత తరుణ్‌ విజయ్‌ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. దానిలో నెహ్రూ నా మాట వినలేదు అనే భావం ఉందా ? అది కూడా యుద్దం ముగిసిన ఆరు నెలల తరువాత నిజంగానే నెహ్రూ వినలేదు అని చెప్పినందువలన ప్రయోజనం ఏముంది ? అంత పట్టుదలగల వ్యక్తి నిజంగా దేశానికి నష్టం జరిగిందని భావిస్తే రాజీనామా చేసి ఉండాలి. అటూ ఇటూ కాందిశీకులుగా వెళ్లిన వారు స్వస్థలాలకు వచ్చి తమ ఆస్తులను విక్రయించుకొనేందుకు వీలు కల్పించే ఒప్పందాన్ని నెహ్రూ పాకిస్తాన్‌తో చేసుకున్నారనే కారణంతో నిరనస తెలిపి వాణిజ్యశాఖ మంత్రిపదవికి శ్యామప్రసాద ముఖర్జీ రాజీనామా చేసి బయటకు వచ్చారు. తరువాత వెంటనే జనసంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికే అంత పట్టుదల ఉంటే మరి ఉక్కు మనిషి పటేల్‌కు కీలకమైన కాశ్మీరు విషయంలో నెహ్రూతో విబేధాలు ఉంటే ఎందుకు బయటకు రానట్లు ? అందువలన కాశ్మీరు సమస్య మీద పటేల్‌ అసలు వైఖరిని వదలి నెహ్రూ మీద మరోసారి దాడి చేసేందుకు, తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.పోనీ నెహ్రూ, తరువాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఆక్రమిత కాశ్మీరు గురించి పట్టించుకోలేదని విమర్శిస్తున్న కాషాయ దళాలు తాము అమితంగా ప్రేమించే వల్లభాయ్‌ పటేల్‌ వాంఛను తీర్చాలనే చిత్తశుద్ది ఉంటే కబుర్లు కాదు, కార్యాచరణను ప్రారంభించాలి,యావత్‌ ప్రతిపక్షం, పౌరులూ సంపూర్ణ మద్దతు ఇస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిలో 4వ స్థానం మోడీ గొప్పతనం – తలసరిలో 136 స్థానం నరేంద్రమోడీ ఘోరవైఫల్యం !

26 Monday May 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Germany, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ 1 Comment

Tags

China, Donald trump, India GDP, India per capita GDP, Narendra Modi, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

జపాన్ను వెనక్కు నెట్టేసి మనదేశం ప్రపంచ జిడిపిలో నాలుగో స్థానానికి చేరిందని, రెండున్నర లేదా మూడు సంవత్సరాల్లో జర్మనీని కూడా పక్కనపెట్టి మూడవ స్థానానికి వెళతామని నీతిఅయోగ్‌ సిఇవో బివిఆర్‌ సుబ్రమణ్యం చేసిన ప్రకటనకు మీడియాలో పెద్ద స్పందనే వచ్చింది. అనేక మంది సంతోషిస్తున్నారు. ఇదొక గొప్పా అని పెదవి విరిచేవారు కూడా ఉన్నారు.నూటనలభై కోట్ల జనాభాలో ఈలెక్కల ఆల్జిబ్రా ఎంతమందికి అర్ధం అవుతుంది ? ‘‘ నేను చెప్పినట్లుగా మనది నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, నాలుగు లక్షల కోట్ల ఆర్థికం, ఇది నేను చెబుతున్న సమాచారం కాదు. ఐఎంఎఫ్‌ చెబుతున్నది, జపాన్‌ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ ’’ అని సుబ్రమణ్యం నీతి అయోగ్‌ పాలకమండలి పదవ సమావేశంలో ప్రకటించారు. మనం రూపొందించిన పథకం ప్రకారం జరిగితే రెండు, రెండున్నర, మూడు సంవత్సరాల్లో మనది మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అన్నారు. ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌ 22 సమాచారం ప్రకారం వర్తమాన ధరల్లో సాధారణ(నామినల్‌) జిడిపి అమెరికా 30.51లక్షల కోట్ల డాలర్లు, చైనా 19.23, జర్మనీ 4.74,భారత్‌ 4.19, జపాన్‌ 4.19, బ్రిటన్‌ 3.84,ఫ్రాన్సు 3.21, ఇటలీ 2.42, కెనడా 2.23, బ్రెజిల్‌ 2.13 లక్షల కోట్లతో మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. 202526 నాటికి మన జిడిపి 4.187.017,జపాన్‌లో 4.186.431 బిలియన్‌ డాలర్లుగా అంచనా. వేసింది. బొమ్మను పాలకులు ఎలాగూ చూపించారు, వారు మూసిపెట్టే బొరుసు ఎలా ఉందో చూడాలి కదా !


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ఐఎంఎఫ్‌ కొద్ది నెలల క్రితం చెప్పింది.అదే సంస్థ తాజాగా విడుదల చేసిన అంచనాలో ఆ మొత్తాన్ని 4.187 లక్షల కోట్లకు తగ్గించింది. జపాన్‌ మొత్తం 4.186 గనుక దాన్ని పక్కన పెట్టి మనకు నాలుగో స్థానాన్ని ఇచ్చింది. తేడా ఎంత 0.001 లక్షల కోట్లు. చెవులప్పగించేవారుంటే కాకమ్మ కతలు చెప్పేవారికి కొదవ ఏముంది. బిజెపి పెద్దలు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా బిజెపి ఐటి సెల్‌ మాలవీయ చెప్పారు.అలా ప్రచారం చేయటమే కదా ఆ పెద్దమనిషి ఉద్యోగం. వాస్తవం ఏమిటి, 2004లో మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు 186 శాతమని, 105కంటే ఎక్కువని కాస్త నిజాయితీ ఉన్నవారు కూడా చెబుతారు.


గతంలో ప్రధాని చెప్పిన కొన్ని అతిశయోక్తుల గురించి చెప్పుకుందాం. ‘‘ గత పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేయటం అంకెలు కాదు, 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ దాటించి నూతన మధ్యతరగతిని సృష్టించాం. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు, సచేతనంగా ఆర్థికవృద్ధికి తోడ్పడుతున్నారు ’’. ప్రధాని నోటి నుంచి జాలువారిన ఈ మాటలను చూసి నవ్వాలా ఏడవాలో తెలియటం లేదు. ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి ఎగువకు లాగాం అంటూనే కనీసం ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న 140కిగాను 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార భద్రతా పధకం కింద గోధుమలు, బియ్యం ఇస్తున్నామని, మరికొన్నేండ్లు ఇస్తామని ఒక ఘనతగా చెప్పుకుంటారు. ప్రపంచ ఆకలి సూచికలో తాజాగా 127లో 105వ దేశంగా ఉన్నాం. ఆకలి లేని(9.9), స్వల్ప (10 నుంచి 19.9), తీవ్రం(20 నుంచి 34.9), ఆందోళనకరం(35నుంచి 49.9) , అత్యంత ఆందోళనకరం(50పైన) అనే ఐదు తరగతులుగా దేశాలను విభజిస్తే మన దేశం తీవ్ర తరగతిలో అంతకు ముందు, గత పదేండ్లుగా కూడా ఉంది. పదేండ్లలో జిడిపి రెట్టింపు అని ఇతర గొప్పలు కానీ పది సంవత్సరాల్లో 2014 నుంచి 2014వరకు మన ఆకలి సూచిక స్కోరు 28.2 నుంచి 27.3కు మాత్రమే తగ్గింది,దీనిలో అంత అభివృద్ధి ఎందుకు రాలేదు ? ఇదే కాలంలో పాకిస్తాన్‌ స్కోరు 29.6 నుంచి 27.9కి తగ్గింది, దీని గురించి చెబితే ఈ దేశంలో పుట్టీ, ఈ దేశంలో పెరిగీ, అన్నం తింటూ పక్కదేశాన్ని పొగుడుతున్నట్లు ఎదురు దాడి చేస్తారు. పాక్‌ రాంకు మన తరువాత 109, ఆకలిని ఎవరు ఎక్కువగా తగ్గించినట్లు ? గత పదేండ్లలో చైనా స్కోరు ఐదు కంటే తక్కువే ఉందన్న వాస్తవాన్ని చెబితే నానా యాగీ చేస్తారు. మోడీ సాధించిన విజయాలు మీకు పట్టవా అంటారు కొందరు. నిజమే 188 దేశాల జిడిపిలో మనలను నాలుగవ స్థానంలోకి తీసుకు వెళ్లినందుకు మోడీ ఘనత ఖాతాలో వేద్దాం. అదే తలసరి జిడిపిలో 136వ స్థానంలో ఉంచిన ఘనుడని కూడా కీర్తించాలా ! తలసరి జిడిపి కూడా నిజానికి ఒక మైండ్‌గేమ్‌ తప్ప మరొకటి కాదు. కొందరి దగ్గర సంపదలు పోగుపడటం అంటే ఆర్థిక అసమానతలు పెరుగుతున్నట్లే, మోడీ ఏలుబడిలో పెరిగినట్లు స్పష్టంగా తేలింది. సర్‌ గోచిపాతరాయుడు సంపద ఒక రూపాయి, 50,49 చొప్పున అంబానీ, అదానీల సంపదలు ఒక దగ్గర చేర్చి మూడుతో భాగిస్తే వచ్చే 33 గోచిపాతరాయుడి సంపద అంటే నవ్విపోతారు. అంబానీ ఇంట వివాహానికి విమానాలు,హెలికాప్టర్లు వేసుకొని వచ్చిన అతిధులు గోచిపాతరాయుడి ఇంటికి వస్తారా !


అసలు జిడిపి చర్చలోకి వెళితే బుర్ర బద్దలవుతుందంటే అతిశయోక్తి కాదు. దీన్ని సాధారణ(నామినల్‌), పిపిపి(పవర్‌ పర్చేజింగ్‌ పారిటీ) పద్దతుల్లో లెక్కిస్తున్నారు. రెండవదే వాస్తవానికి దగ్గరగా ఉంటుందన్నది కొందరి సమర్ధన. దాని ప్రకారం చూస్తే నరేంద్రమోడీ అధికారానికి వచ్చే నాటికే మన దేశం సాధారణంలో పది, రెండవ లెక్కలో మూడవ స్థానంలో ఉంది. మోడీ గణం రెండవ లెక్కలను ఎందుకు చెప్పటం లేదు. ఎందుకంటే దేశాన్ని ఇప్పటికీ అదే స్థానంలోనే మోడీ ఉంచారు గనుక. ఐఎంఎఫ్‌ 2025 పిపిపి అంచనా ప్రకారం చైనా 42.72, అమెరికా 30.51, భారత్‌ 17.65 లక్షల కోట్ల డాలర్లతో మూడవదిగా, రష్యా నాలుగు, జపాన్‌ ఐదవదిగా ఉంది. 2027 తొలి ఆరునెలల్లోనే సాధారణంలో 4.9లక్షల కోట్ల డాలర్లతో జర్మనీని కూడా దాటించేస్తారని ఊదరగొడుతున్నారు.అవన్నీ గిడసబారిన దేశాలుగా మారుతున్నాయి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఆంబోతుల్లో అన్నట్లుగా చెప్పుకుంటే కుదరదు. మనం పోల్చుకోవాల్సింది చైనాతో కదా ! మన వృద్ధి రేటు చైనా, అమెరికా, జర్మనీ కంటే ఎక్కువగా ఉందని, గడచిన పదేండ్లలో భారత్‌ 105శాతం పెరుగుదల సాధించగా చైనా 76, అమెరికా 66, జర్మనీ 44, ఫ్రాన్సు 38, బ్రిటన్‌ 28శాతం పెరుగుదల సాధించిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. లక్ష కోట్ల డాలర్ల కిలోమీటర్‌(మైలు) రాయిని దేశం 2007లో దాటింది.తదుపరి 2014లో రెండు లక్షల కోట్లు, 2025లో నాలుగు లక్షల కోట్లు దాటింది. 2032నాటికి పదిలక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగిన దేశంగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు జోశ్యం చెప్పారు. వారి తర్కం ఏమిటి ? 2021లో మూడు లక్షల కోట్లకు విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రతి 18నెలలకు ప్రస్తుత వేగంలో ఒక లక్ష కోట్ల డాలర్లు పెరుగుతున్నది. ఇదే కొనసాగితే 2032 నాటికి 10లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.


రానున్న కొద్ది సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నందుకు ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకుంటున్న వారిని చూసి ఆర్థిక నిపుణుడు డి ముత్తుకృష్ణన్‌ ఉత్సవాలు జరుపుకోవాల్సినంత ఘనత ఏమి సాధించామని 2024లోనే ప్రశ్నించారు. జిడిపిలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు తలసరి రాబడిలో ప్రపంచంలో మనం 140వ స్థానంలో ఉన్నామని, మనకంటే 139దేశాలు ముందున్నాయని గుర్తించాలని చెప్పారు.(తాజాగా 136 గనుక 135 ముందున్నాయి) పిపిపి ప్రకారం చూసినా మన స్థానం 119 అని చెప్పారు. పదేండ్లలో మన జిడిపి 105శాతం పెరిగిందని ఏ ఐఎంఎఫ్‌ చెప్పిందో అదే సంస్థ 2025 తలసరి జిడిపిలో 141వ స్థానం అని కూడా జోశ్యం చెప్పింది. దివాలా తీసిందని చెప్పిన శ్రీలంక 133, బంగ్లాదేశ్‌ 143, పాకిస్తాన్‌ 159, షీ జింపింగ్‌ ఏలుబడిలో కుప్పకూలిపోయిందని కొంత మంది చెప్పే చైనా 71వ స్థానంలో (తాజాగా 70) ఉందని కూడా ఐఎంఎఫ్‌ చెప్పింది. మన తలసరి రాబడి పదివేల డాలర్లకు చేరాలంటే కనీసం 30 సంవత్సరాలు కష్టపడి పని చేయాలని, దానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండాలని ముత్తు కృష్ణన్‌ చెప్పారు. చైనా తలసరి జిడిపి 2025లో 13,873 డాలర్లు, ఇప్పుడున్న మన 2,937 డాలర్ల నుంచి ఎదిగి ప్రధమ స్థానంలో ఉన్న మొనాకో 2,56,581( 2023 ప్రపంచ బ్యాంకు సమాచారం) లేదా డాలర్‌ దేవుడున్న అమెరికా 89,678(2025 ఐఎంఎఫ్‌) స్థాయికి, చివరికి పడకకుర్చీ మేథావులు చెబుతున్నట్లుగా అధిగమించే దూరం ఎంతో లేని చైనాను అయినా కనీసం అధిగమించాలంటే ఎంత సమయం పడుతుందో వేరే చెప్పనవసరం లేదు.


ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ నరేంద్రమోడీ నాయకత్వం కారణంగా ప్రపంచ వెలుగు దివ్వెగా భారత్‌ ముందుకు వచ్చిందని బిజెపినేత ప్రదీప్‌ బండారీ చెప్పిన మాటలు భజనరాయుళ్ల గళం తప్ప మరొకటి కాదు. పదకొండు సంవత్సరాలుగా వేసిన పునాదులే కారణమన్నారు. ఐరోపా దేశాలు, జపాన్‌ ఆర్థిక వ్యవస్థలు పెరుగుదల లేక గిడసబారిపోయాయి. రెండవ ప్రపంచయుద్ధానికి ముందు ఉన్న వలసలను కోల్పోయిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మాజీ రాజుల వలే ఉన్నాయి. మిలిటరీలను నిషేధించిన కారణంగా అందుకు వెచ్చించే సొమ్మును పరిశోధనలకు మళ్లించి జర్మనీ, జపాన్‌, అమెరికా ఇచ్చిన దన్నుతో దక్షిణ కొరియా వేగంగా వృద్ధి చెందాయి. ఇప్పుడు వాటికి పరిమితి ఏర్పడిరది కనుకనే మనం ముందుకు వస్తున్నాం. ఒక నాడు మనకంటే వెనుకబడి ఉన్న చైనాతో తప్ప వాటితో పోల్చుకుంటే అవ్వతో వసంతమాడినట్లే ! అదేమంటే చైనా కమ్యూనిస్టు దేశమంటారు, మనది ప్రజాస్వామ్యం, స్వేచ్చ ఎక్కువ గనుక దాని కంటే ఎంతో ముందు ఎందుకు లేదు అంటే సమాధానం ఉండదు. ఒక ఐదు సంవత్సరాల పాటు ఐదులక్షల కోట్ల డాలర్ల గురించి ఊదరగొట్టారు. ఇప్పుడు పదిలక్షల కోట్ల గురించి చెప్పబోతున్నారు. 1950లో మన దేశంలో 20 కోట్ల మంది జనం ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు భూమి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అన్న లెక్కలను పక్కన పెట్టి స్థిరంగా ఉందనుకున్నప్పటికీ అదే భూమి మీద 2023`24లో జనాభాలో 46.1శాతం మంది ఆధారపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ఆరు సంవత్సరాల క్రితంతో పోల్చితే రెండు శాతం పెరిగారు. అంటే ఇప్పుడు 67 కోట్ల మంది పని చేస్తున్నారు.చైనాలో 24.1 శాతం లేదా 17.66 కోట్ల మంది(2023) పని చేస్తున్నారు. భూమి మీద ఆధారపడే వారు తగ్గటం అభివృద్ధి చెందిన దేశాల లక్షణం. వెనుకటికి ఒకడు మాది నూటొక్క అరకల వ్యవసాయం అని గొప్పలు చెప్పాడట. మీది అంటున్నావు ఎవరెవరికి ఎన్ని అంటే నాది ఒకటి మా అయ్యగారివి వంద అన్నాడట. జిడిపి కూడా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కులగణనపై నీ వ్యాఖ్యయే నీరజాక్షా : బీహార్‌ ఓట్ల కోసం అర్బన్‌ నక్సల్‌గా మారిన ప్రధాని నరేంద్రమోడీ !

03 Saturday May 2025

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Politics, RELIGION, Uncategorized

≈ 1 Comment

Tags

Bihar elections, BJP, Caste census, Have Modi, Modi govt’s U-turn on caste census, Narendra Modi Failures, Nitish Kumar, RSS, Urban naxals


ఎం కోటేశ్వరరావు


ఒక సినిమాలో రాజకీయ నేతలు కుడి జేబులో ఒకటి, ఎడమదానిలో మరో ప్రకటన పెట్టుకు తిరగటం గురించి పరుచూరి బ్రదర్స్‌ చెప్పారు. ఇప్పుడు విశ్వగురువు నరేంద్రమోడీ ఆ కోవలో చేరిపోయారు. చరిత్రలో ఎప్పుడో జరిగినదానికి వక్రీకరణలు తెలిసిందే, మన కళ్ల ముందు జరిగిన వాటిని కూడా బిజెపి నేతలు ఎలా మార్చి వేస్తున్నారో కులగణనకు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయంపై సమర్ధన స్పందన వెల్లడిస్తున్నది.జనం మరీ అంత బుర్రలేని వారిగా కనిపిస్తున్నారా ! కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వార్తగా ఇచ్చిన తరువాత ఈ అంశంపై ఆకస్మికంగా మాట మార్చింది అంటూ కొన్ని మీడియా సంస్థలు విశ్లేషణలు వెలువరిస్తున్నాయి. వార్తను సంతోష పడే బిజెపి మద్దతుదారులు ఇప్పుడు ఇవెందుకు అని చిరాకు పడుతున్నారు. ఇప్పటికీ కొందరు స్వతంత్రంగా ఆలోచించే జర్నలిస్టులు ఉన్నందుకు మండిపడుతున్నారు,విమర్శనాత్మకంగా చూడకుండా పాకేజ్‌లతో మొత్తం గోడీ మీడియాగా ఎందుకు మారలేదని చిందులు వేస్తున్నారు. అవును మరి హిట్లర్‌ బాటలో నడుస్తున్న కాషాయ దళాల ప్రజాస్వామ్యంలో నందంటే నంది కాదు పందంటే పంది అనాలి కదా ! లేకపోతే వీపులు పగులుతాయి మరి !!


కులగణన చేయాలని కోరే వారు ప్రత్యేకించి కాంగ్రెస్‌ పేదల అనుభూతులతో ఆటలాడుకుంటున్నదని, కులం పేరుతో విడదీస్తున్నదని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు.(2023 అక్టోబరు 2, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా) గతంలో వారు దేశాన్ని చీల్చారని ఇప్పుడు కూడా అదే చేస్తున్నారన్నారు. మధ్య ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు బీహార్‌ కుల సర్వే వివరాల విడుదల సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బీహార్‌ ఎన్నికల్లో ఓట్లు అవసరం గనుక కులగణనకు అంగీకరిస్తూ కాబినెట్‌లో తీర్మానించారు. ఆకలేస్తే తినేందుకు ఏదీ దొరకనపుడు మొరటు పనిని తెలుగులో మర్యాద పూర్వకంగా దుప్పి భోజనం అనటాన్ని బిజెపి ఓట్ల ఆకలి గుర్తుకు తెచ్చింది.బీహార్‌ సర్వే ఫలితాలు అవాస్తవమని, పేదల కంటినీరు తుడిచే ఎత్తుగడ అని బిజెపి వర్ణించింది. అంతేనా ప్రతిపక్ష పార్టీలు కుల గణన చేయాలని కోరటం అర్బన్‌ నక్సల్స్‌ ఆలోచనలకు ఒక సూచిక అని 2024లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే అర్బన్‌ నక్సల్‌గా అధికారికంగానే మారినట్లు కాదా ? ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఒక్కటిగా ఉంటేనే ఐక్యంగా ఉంటాం అని చెప్పారు, అంటే ఇప్పుడు కులాల వారీ విడతీసేందుకు పూనుకున్నారా ? విశ్వగురువు గనుక రాత్రి ఒక సుభాషితం పగలు ఒకటి వల్లిస్తారా ! మోడీ తరువాత వారసుల్లో ఒకరని భావిస్తున్న ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాధ్‌ కులంపేరుతో విడతీస్తే హత్య చేసినట్లే అన్నారు. ఓటు బాంకు రాజకీయాలకు మేం వ్యతిరేకం అని సుద్దులు చెప్పే బిజెపి బుద్ది ఇప్పుడు అదే ఓట్ల కోసం అర్రులు చాస్తున్నదని, విధిలేకనే దిగివచ్చిందని జనం భావిస్తున్నారు. నేషనల్‌ ఫ్రంట్‌ నేతగా ప్రధాని విపి సింగ్‌ వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేస్తే దానికి పోటీ కమండల్‌గా అద్వానీ రామ్‌ రథయాత్ర చేపట్టారనే విమర్శలు అప్పుడే వచ్చాయి. ఓబిసిలో వర్గీకరణకు మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి రోహిణీ కమిషన్‌ వేశారు, అది సమర్పించిన నివేదికను రెండేండ్లు కావస్తున్నా ఇంతవరకు బయటపెట్టలేదు. అలాంటి పాలకులు ఇప్పుడు బిసిల మీద ఎక్కడలేని ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. కుల గణన చేస్తే హిందూ సమాజం విడిపోతుందని చెప్పటమే అసలు హిమాలయమంత అబద్దం, సాకు. ఇప్పుడు ఒక్కటిగా ఉందా ? ఎన్ని రకాలుగా విడిపోయి ఉందో జనాలకు తెలియదా, గ్రామాల్లో గోడలతో విభజిస్తున్నారు, చివరకు చచ్చిన తరువాత శ్మశానాల్లో కూడా మతాలు, కులాలవారీ లేవా ? ఇంకా కులం ఎక్కడ, మతం ఎక్కడా అనిపడక కుర్చీల్లో కూర్చొని వాదించేవారు కనిపిస్తారు. ఇంత అభివృద్ది, విద్య తరువాత కూడా సమాజంలో కులాంతర వివాహాలు కేవలం ఐదుశాతమే అని చెప్పాలంటే సిగ్గుపడాలి. ఏ నియోజకవర్గంలో ఏ కులం, మతం, ప్రాంతం వారు ఎందరున్నారో ఎన్నికలపుడు అందరికీ తెలిసిందే కదా ?


కులగణనను గతంలో కాంగ్రెస్‌ కూడా వ్యతిరేకించిన మాట నిజం. నిజానికి బిజెపి దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం కూడా వ్యతిరేకమే. రెండిరటికీ కారణాలు వేర్వేరు. బిజెపికి 2014లో సంపూర్ణ అధికారం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు సముఖత చూపలేదు. ఇప్పుడు సామాజిక న్యాయం కోసం చేశామని చెబుతున్నవారు తమ పార్టీ నేత వాజ్‌పాయ్‌ హయాంలోనే 2001 జనగణన జరిగిందని, అప్పుడే ఎందుకు చేయలేదో చెప్పాలి. కుల గణన జరిగితే రిజర్వేషన్లు, వర్గీకరణ డిమాండ్లతో పాటు, బిజెపి నాయకత్వంలో ఉన్న కొన్ని కులాల వారి ఆధిపత్యానికి గండిపడుతుంది గనుకనే ఆ పార్టీ సుముఖంగా లేదు. కొన్ని పదవుల్లో కొందరికి అవకాశం కల్పించినప్పటికీ సంఘపరివార్‌ సంస్థలలో పునాది ఆధిపత్య కులాలదే. కొన్ని సంక్షేమ పధకాలు అమలు జరపవచ్చు, రాజకీయ సాధికారత అప్పగించటానికిసిద్దపడుతుందా అన్నదే సమస్య. మోడీ సామాజిక తరగతి ఓబిసి అయినప్పటికీ గత పదకొండు సంవత్సరాల్లో వారికి ఒరగబెట్టిందేమీ లేదు, ఆర్థికంగా పరిస్థితి మెరుగుపరచిందీ లేదు. బిజెపి మతం కార్డుతో రాజకీయం చేస్తున్నదానికి విరుగుడుగా కాంగ్రెస్‌ ఇప్పుడు కులగణన ముందుకు తెచ్చింది. దానికంటే ముందు బిసి సంఘాలు ఈ డిమాండ్‌ను ముందుకు తెచ్చాయి. దీనికి మూలం అస్థిత్వ భావజాలం విస్తరించిన కారణంగా దేశంలో అత్యధికులుగా ఉన్న వెనుకబడిన తరగతుల వారు మేమెంత మందిమో మాకంత వాటా పేరుతో రాజకీయ ప్రాతినిధ్యం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయటమే. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో రాజ్యాంగం అన్ని కులాలను సమంగానే చూస్తున్నప్పటికీ ఆచరణలో మనువాదం ప్రకారం పైనున్న ప్రతివారూ దిగువన ఉన్న వారిని తక్కువగా చూస్తున్నారు. వివాహాలు, కలసి భోజనం చేసేందుకు కూడా అంగీకరించటం లేదు. దాడులు చేసి చంపేస్తున్నారు. అంబేద్కర్‌ కుల నిర్మూలన జరగాలని కోరుకున్న నాటికీ ఇప్పటికీ చివరికి వివక్షకు గురవుతున్న దళితుల్లోనూ కుల ధోరణులు మరింత పెరిగాయి.ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి తాజాగా అందరికీ ఒకే దేవాలయం, ఒకే బావి, ఒకే స్మశానం ఉండాలని చెప్పారు గానీ కులం, మతం విద్వేషాలు పోవాలని కోరలేదు.


ఇప్పుడు బిజెపి ఎందుకు కులగణనకు అంగీకరించింది ? ఆయారాం గయారాం పాత మాట. నితీష్‌ ఆయా నితీష్‌ గయా అన్నది కొత్త మాట, కూటముల ఫిరాయింపులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బీహార్‌లో ఎదురీదుతున్నట్లు అర్ధమైంది, తన కులగణన సర్వే గురించి చెప్పుకోవాలంటే సిగ్గుపడే స్థితి.అన్నింటికీ మించి మోడీ సర్కార్‌ నిలిచేందుకు రెండు పంగటి కర్రలలో ఒకటి నితీష్‌. అదువలన గతంలో మోడీ కులగణన గురించి ఎంత ఠలాయించినా ఇప్పుడు కుదరదు, నితీష్‌తో పాటు బిజెపి మునగటం ఖాయం. కనుక నితీష్‌ కూడా కులగణనకు అంగీకరిస్తారా లేదా అని పట్టుబట్టినట్లు కనిపిస్తోంది. అందుకే తక్షణ ప్రయోజనంగా బీహార్‌ ఓట్ల కోసం అన్నది స్పష్టం. అయితే ఆ ఎన్నికల నాటికి గణన జరగదు, ఒక ప్రచార అస్త్రంగా మాత్రమే ఉంటుంది. మతం కార్డుతో నూటికి 80శాతంగా ఉన్న హిందువుల ఓట్లు తమకే పడతాయని ఆశించిన వారికి అంత సీన్‌ లేదని, హిందువులు అంత అమాయకంగా బిజెపి వెంటనడవరని, చివరికి అయోధ్యలో ఆ పార్టీని ఓడిరచిన తీరు, మోడీకి గణనీయంగా మెజారిటీ పడిపోవటం, గత ఎన్నికల కంటే ఓట్లు, సీట్లు తగ్గటంతో దిగజారుడు మొదలైనట్లు గ్రహించారు. కులగణన కార్డు ఎంత కాలం పని చేస్తే అంతవరకు ఉపయోగించుకోవాలని నిర్ణయించారని వేరే చెప్పనవసరం లేదు. సంఘపరివార్‌ సంస్థలలో బిసిలు పెద్ద సంఖ్యలో ఉన్నారు,హిందూత్వ భావజాలాన్ని వారిలో గణనీయంగా ఎక్కించామనే విశ్వాసం ఆర్‌ఎస్‌ఎస్‌లో కలిగి ఉండాలి, 2013 నుంచి నరేంద్రమోడీని ఓబిసిగా చూపుతూ తమది బిసిల పార్టీ అని బిజెపి ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే. అందువలన గణన జరిగినా తమ ఓట్లు పదిలంగా ఉంటాయనే అంచనాకు వచ్చి ఉండాలి, ఈ నిర్ణయానికి ముందు ప్రధానితో మోహన్‌భగవత్‌ భేటీ కూడా దాని గురించి చర్చించటానికే అన్నది వేరే చెప్పనవసరం లేదు. అయితే వారి అంచనా ప్రకారమే జరుగుతుందా ?


లెక్కతేలినంత మాత్రాన ఒరిగేది, జరిగేది ఏమిటి ? ఎవరెంత అన్న వివాదానికి తెరపడుతుంది. కొత్త డిమాండ్లు ముందుకు వస్తాయి, వాటికి రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే దళితులు, గిరిజనుల సంఖ్య ఎంతో తెలిసిందే.201112 జాతీయ నమూనా సర్వే ప్రకారం, 201516 కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చూసినా జనరల్‌ తరగతులతో పోలిస్తే ఎస్‌సి,ఎస్‌టి,ఓబిసిలు చేస్తున్న ఖర్చు చాలా తక్కువ.జనరల్‌ తరగతుల్లో దారిద్య్రం 15.6శాతం ఉంటే గిరిజనుల్లో 50.6, దళితుల్లో 33.3, ఓబిసీల్లో 27.2శాతాల చొప్పున దారిద్య్రంలో ఉన్నట్లు తేలింది. విద్య, ఉద్యోగాలు, చట్టసభలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉపశమనం తప్ప అసమానతలు, దారిద్య్రాన్ని తగ్గించే సాధనాలు కాదని తేలిపోయింది. ముస్లింలలో కూడా దారిద్య్రం ఎక్కువగానే ఉంది. కులగణన తరువాత ఈ పరిస్థితిని మార్చేందుకు పథకాలేమైనా ఉంటే ఉపయోగం, లేకుంటే ఎప్పటికాలు ఇట్టిట్టే ! దాని గురించి ఎలాంటి ప్రకటన లేదు. దళితుల వర్గీకరణ న్యాయసమ్మతమే అయినప్పటికీ ఒకే తరగతిగా ఉన్నపుడు లబ్ది పొందిన సామాజిక తరగతులు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అదే విధంగా ఓబిసి వర్గీకరణ డిమాండ్‌ కూడా ఉంది, దాన్ని చేసేందుకు మోడీ సర్కార్‌కు చెమటలు పడుతున్నాయి. రోహిణీ కమిషన్‌ వేసి అనేకసార్లు గడువు పొడిగించి నివేదిక రాకుండా చూసినప్పటికీ 2023 ఆగస్టులో ఇచ్చిన నివేదికను ఇంతవరకు బహిర్గత పరచలేదు.


బ్రిటీష్‌ పాలనా కాలంలో 1881 నుంచి 1931వరకు కులగణన జరిగింది.అణగారిన తరగతుల ఉద్దరణకు గాక విభజించి పాలించు అనే ఎత్తుగడతో ఆ లెక్కలను తీసిందన్నది స్పష్టం. దాని పర్యవసానాలలో ముస్లింలను వేరుగా సంఘటిత పరచేందుకు ముస్లిం లీగ్‌ ఆవిర్భావం ఒకటి. మద్రాస్‌ ప్రావిన్స్‌లో కులాల వారీ కోటాల నిర్ణయానికి దారితీసింది.దేశంలో దళితుల కోసం ద్విసభ్య నియోజకవర్గాలూ, తరువాత రిజర్వేషన్లూ దాని ఫలితమే. కులగణన జరిగితే సామాజిక విభజనకు దారి తీస్తుందని,అణగారిన తరగతులకు సంక్షేమ పథకాలను అమలు జరిపి ఉద్దరించాలనే వైఖరితో దళితులు, గిరిజనులకు తప్ప 1951 నుంచి నెహ్రూ సర్కార్‌ కులగణన నిలిపివేసింది.అయితే నాటి నుంచి నేటి వరకు చూస్తే అలాంటి ఉద్దరణ జరగకపోగా కొంత మంది దగ్గర సంపద పోగుపడటం, ముఖ్యంగా 1990 దశకం నుంచి ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాల అమలు తరువాత కనిపిస్తున్నది. గత పదేండ్లలో దాని తీవ్రత మరింత పెరిగింది. అందుకే తిరిగి కులగణన, రాజకీయ, ఆర్థిక సాధికారత సామాజిక న్యాయ డిమాండ్లు ముందుకు వచ్చాయి.1931 తరువాత జరిగిన మార్పుల్లో వివిధ తరగతుల జనాభా పొందికలో అనేక మార్పులు వచ్చాయి. మొత్తంగా జనాభా పెరుగుదల తగ్గినప్పటికీ ఇతరులతో పోల్చినపుడు భూమి, ఆస్థి కేంద్రీకృతమైన వారిలో సంతానోత్పత్తి గణనీయంగా తగ్గింది. ఇప్పుడు బిసిల జనాభా 52శాతమని చెబుతున్నవన్నీ అంచనా లేదా 1931 లెక్కల ప్రాతిపదికన చెబుతున్నవి మాత్రమే.వచ్చే జనాభా గణనలో లెక్కలు తేలిన తరువాత తలెత్తే కొత్త సమస్యలను ఇప్పుడే ఊహించటం, వ్యాఖ్యానించటం తొందరపాటు అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రాహుల్‌ గాంధీవి పిల్ల చేష్టలైతే….నరేంద్రమోడీ పెద్దరికం ఎక్కడ ?

23 Wednesday Apr 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Modi attacked Congress, Modi Self-congratulation, Narendra Modi Failures, Rahul gandhi


ఎం కోటేశ్వరరావు


రామాయణంలో రాముడికి పేరు ఎలా వచ్చిందంటే ప్రధాన కారకుడు రావణ పాత్రధారి అని కొందరు అంగీకరించకపోవచ్చు. సీత గీత దాటకపోతే రామకథే లేదు అన్నవారు కూడా ఉన్నారు. అలాగే రాహుల్‌ గాంధీకి ప్రాచుర్యం కల్పించటంలో బిజెపి నేతలు, వారి కనుసన్నలలో నడిచే మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి అంతకు ముందు లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే పెద్ద సంఖ్యలో ఓట్లు పెరగటం, సాయంత్రం 5.30 నుంచి 7.30 మధ్యలో 65లక్షల ఓట్లు పోల్‌ కావటం గురించి గతంలో చేసిన విమర్శలు లేదా ఆరోపణలనే రాహుల్‌ గాంధీ మరోసారి చేశారు. అది అమెరికాలోని బోస్టన్‌ నగరంలో పునశ్చరణ చేయటాన్ని బిజెపి తప్పు పడుతూ దేశద్రోహం అన్నట్లుగా దాడికి దిగింది. మన గడ్డమీద ఎన్నయినా అనుకోవచ్చుగానీ విదేశాల్లో మన రాజ్యాంగ సంస్థలను విమర్శించటం ఏమిటి అంటూ మనోభావాలను ముందుకు తెచ్చింది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం, వాటి మీద దాడి చేయటంలో బిజెపి తీరు అనితర సాధ్యం. ఎన్నికల కమిషనర్లు, ప్రధాన కమిషనర్‌ నియామక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న పద్దతిని మార్చి సిజె స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టారు. అంటే ముగ్గురిలో రెండు ఓట్లు అధికారంలో ఉన్నవారికి ఉంటాయి గనుక ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు, అలాంటి వారు ఎలా పని చేస్తారో వేరే చెప్పనవసరం లేదు. రాహుల్‌ గాంధీ చెప్పినట్లు అలా నియామకం పొందిన వారు రాజీపడక ఏం చేస్తారు, నియమించిన వారికి వ్యతిరేకంగా వ్యవహరించగలరా ? వారేమైనా టిఎన్‌ శేషన్‌ వంటి వారా ?

ఈ పూర్వరంగంలోనే ఎన్నికల కమిషన్‌ రాజీపడుతున్నదని, వ్యవస్థలోనే లోపం ఉన్నదని రాహుల్‌ గాంధీ బోస్టన్‌లో చేసిన వ్యాఖ్యలను బిజెపి వివాదం కావించింది.ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పోలింగ్‌ గురించి ఎన్నికల కమిషన్‌ గతంలోనే తన చర్యను సమర్ధించుకున్నది. మొత్తం 9.7కోట్ల మంది ఓటర్ల గురించి కేవలం 90 అప్పీళ్లు మాత్రమే వచ్చినందున జాబితా సరైనదే అని ఎన్నికల కమిషన్‌ సమర్ధించుకుంది, 30లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైతే ఆ స్థాయిలో ఫిర్యాదులు రాలేదెందుకని ఎదురు ప్రశ్నించింది.రెండు గంటల సమయంలో 65లక్షల ఓట్లు వేయటం ఎలా సాధ్యమని రాహుల్‌ గాంధీ ప్రశ్న, వీడియో చిత్రాలను కూడా అడిగేందుకు వీల్లేకుండా చట్టాలను సవరించారని పేర్కొన్నారు. వీటికి సమాధానం లేదు. రిగ్గింపు ఎప్పుడు ఎలా చేస్తారో మనకు తెలియదా ! రాహుల్‌ గాంధీవి పిల్లచేష్టలని,విదేశీ గడ్డ మీద ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నట్లు బిజెపి ధ్వజమెత్తింది. విదేశీ పర్యటనల్లో విమర్శలు చేయటం కొత్త కాదు, గతంలో కూడా చేశారు. ఆ మాటకు వస్తే వయసులో పెద్దమనిషి, ఒక ప్రధానిగా నరేంద్రమోడీ చేసిందేమిటి ? పెద్దలు నడిచిన బాటనే పిల్లలూ అనుసరిస్తారు. ఒక రాజకీయ నేత తన ప్రత్యర్ధి పార్టీ లేదా ప్రభుత్వం, వ్యవస్థల గురించి స్వదేశంలో విమర్శించి విదేశాల్లో పొగడాలా, ఆ పని చేస్తే సమావేశాలకు వచ్చిన వారు గడ్డి పెట్టరా లేదా నేను మాట్లాడను అని నోరుమూసుకోవాలా ? నరేంద్రమోడీ అదే చేశారా ? కాంగ్రెస్‌ను స్వదేశంలో విమర్శించినట్లే విదేశాల్లోనూ ధ్వజమెత్తారు. ఆ పార్టీనే కాదు, అవినీతిదేశం అంటూ జాతి పరువునే తీశారు.


2015లో జర్మనీ వెళ్లినపుడు కాంగ్రెస్‌ పార్టీ వదలివెళ్లిన చెత్తనంతా శుద్ధి చేయాల్సి ఉందని మోడీ చెప్పారు, భారత్‌ అంటే కుంభకోణాల దృశ్యమని, దాన్ని తాను నైపుణ్య దేశంగా మార్చనున్నట్లు కెనడాలో చెప్పారు. ఓమన్‌లో కూడా అదే చెప్పారు. కాంగ్రెస్‌ పాలనా కాలమంతా కుంభకోణాల మయమని, తప్పుడు పాలనా పద్దతులను సరిదిద్దేందుకు తాను ఎంతో కష్టపడుతున్నట్లు చెప్పుకున్నారు. గత జన్మల్లో ఏ పాపం చేశామో భారత్‌లో పుడుతున్నామని జనాలు చెప్పుకుంటున్నారని దక్షిణ కొరియా సియోల్‌లో మోడీ సెలవిచ్చారు.ఇలాంటి పరిస్థితిలో వదిలేసి వేరే చోటకు పోదామని అనుకున్నారు అలాగే వెళ్లారు.ఇప్పుడు నేను గట్టి విశ్వాసంతో చెప్పగలను, అన్ని జీవన రంగాలకు చెందిన ఆ తెలివైన వారు, ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా వారు విదేశాల్లో పెద్ద మొత్తాలను సంపాదిస్తున్నప్పటికీ వారంతా తిరిగి రావటానికి, తక్కువ ఆదాయాలకు కూడా సిద్దపడి భారత్‌లో స్థిరపడటానికి రావాలని చూస్తున్నారని మోడీ చెప్పారు. చైనాలోని షాంఘై నగరంలో భారత సంతతి సమావేశంలో మాట్లాడుతూ గతంలో మీరు భారత్‌ గురించి సిగ్గుపడేవారు, ఇప్పుడు (తాను ప్రధాని అయిన తరువాత) దేశం గురించి గర్వపడుతున్నారన్నారు. ప్రతిపక్షం మీద ధ్వజం, స్వంతడబ్బా ప్రతిచోటా కనిపిస్తుంది. 2014లో ఎన్నిక తరువాత న్యూయార్క్‌ పర్యటనలో మీరు ఓట్లు వేసి ఉండకపోవచ్చుగానీ ఫలితాలు వచ్చినపుడు మీరంతా పండగ చేసుకున్నారని ప్రవాస భారతీయులతో చెప్పారు. ప్రధానిగా 70దేశాలు తిరిగారని 50చోట్ల తన ప్రత్యర్ధుల మీద రాజకీయ దాడి చేశారని పరిశీలకులు చెబుతున్నారు. అప్పుడు అది విదేశీ గడ్డా స్వదేశీ అడ్డా అన్నది గుర్తుకు రాలేదా ? కంటికి కన్ను, పంటికి పన్ను, కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరి రాహుల్‌ గాంధీ కూడా అదే బాటలో నడుస్తూ విమర్శలు చేస్తున్నారు. తేడా ఏమిటంటే మోడీ మాట్లాడిన వాటిని గోడీ మీడియా పెద్దగా ప్రచారంలో పెట్టలేదు, చర్చల రచ్చ చేయలేదు, అంతే ! మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మా నెట్‌వర్క్‌ వస్తుందనే హచ్‌ కుక్క ప్రకటన మాదిరి నరేంద్రమోడీ ఏ విదేశ పర్యటన చేస్తే తాము కూడా ఒక సీనియర్‌ నేతను అక్కడకు పంపుతామని, అక్కడేమైనా తప్పుడు ప్రచారం, ఆరోపణలు చేస్తే అదే స్థాయిలో సమాధానం చెబుతామని, దేశాన్ని కించపరుస్తూ,ప్రతిపక్షం మీద ఆరోపణలతో మాట్లాడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోడీ అని 2015లోనే కాంగ్రెస్‌ నేత ఆనందశర్మ విమర్శించారు.మోడీ ప్రధానిగా దేశాలు తిరుగుతున్నారు తప్ప ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ లేదా బిజెపి ప్రతినిధిగా కాదన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తున్నారంటూ రాహుల్‌ గాంధీ మీద ధ్వజమెత్తుతున్న బిజెపి నేతలు ఏం చేస్తున్నారో దేశంతో పాటు ప్రపంచమంతా చూస్తోంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పులనే వారు సవాలు చేస్తున్నారు. పార్లమెంటు సుప్రీం అంటూ ఉపరాష్ట్రపతి జగదీప్‌ థంకర్‌ మరోసారి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి, గవర్నర్లు తమ దగ్గరకు వచ్చిన బిల్లుల మీద మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని లేకుంటే వాటిని ఆమోదించినట్లు పరిగణించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉపరాష్ట్రపతి విమర్శించారు. అది ప్రజాస్వామిక శక్తులపై అణుక్షిపణి వంటిదని వర్ణించారు. సుప్రీం కోర్టుకు అలాంటి అధికారం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఆమోదించిన బిల్లులను తిప్పి పంపే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు ఉంది. అయితే వాటిని తిరిగి చట్టసభలు మరోసారి ఆమోదించి పంపితే చట్టాలుగా ఆమోద ముద్రవేయటం తప్ప తిరస్కరించే అధికారం లేదు. అయితే రాష్ట్రపతి, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్లు నెలల తరబడి తిప్పి పంపకుండా ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్న పూర్వరంగంలో తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు ఆ తీర్పు ఇచ్చింది. న్యాయవ్యవస్థ సూపర్‌ పార్లమెంటుగా వ్యవహరించజాలదని జగదీప్‌ తప్పుపట్టారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత రాష్ట్రపతి, గవర్నర్లదైతే, రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతున్నదా లేదా అన్న భాష్యం చెప్పేందుకు సుప్రీం కోర్టుకు అధికారం ఉంది.చట్టసభలు చేసిన నిర్ణయాలను కాదనే హక్కు లేదు గానీ, అవి నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అన్నది నిర్ణయించవచ్చు. ఇప్పుడు వక్ఫ్‌ సవరణ చట్టం గురించి సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దాని పరిధికి మించినా లేక ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా షాబానో తీర్పు మాదిరి పార్లమెంటులో బిల్లు పెట్టి దాన్ని రద్దు చేసే దమ్ము బిజెపి కేంద్ర ప్రభుత్వానికి ఉందా అన్నది సమస్య. ఉపరాష్ట్రపతి చెప్పినట్లుగా దేశానికి పార్లమెంటు, రాష్ట్రాలకు అసెంబ్లీలు ఉన్నతం, అవి ఆమోదించిన బిల్లులను నెలల తరబడి గవర్నర్లు తొక్కిపట్టటాన్ని ఏమనాలి, తానే స్వయంగా అలాంటి పనికి పాల్పడిరది గుర్తులేదా, అప్పుడు అసెంబ్లీ సుప్రీం అన్న జ్ఞానం లేదా ?

ఉపరాష్ట్రపతి సుప్రీం కోర్టు మీద ధ్వజమెత్తటంతో కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్‌ గవాయ్‌ సున్నితంగా బిజెపి నేతలకు చురకలు అంటించారు. పశ్చిమ బెంగాల్‌ ముర్షిదాబాద్‌లో హింస కారణంగా అక్కడకు పారామిలిటరీని పంపాలంటూ రాష్ట్రపతికి ప్రవర్తకాది లేఖ జారీ చేయాలన్న పిటీషన్‌పై స్పందించారు. ఇప్పటికే మేము కార్యనిర్వహణ పరిధిని ఆక్రమిస్తున్నామన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నాం అందువలన ఈ వినతిని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు.కోర్టు పేరుతో పశ్చిమబెంగాల్లో కేంద్ర బలగాలను దించాలన్న ఎత్తుగడ పిటీషనర్‌ వినతిలో ఉంది.మమతా బెనర్జీని సమర్ధించనవసరం లేదుగానీ విష్టు శంకర్‌ జైన్‌ అనే న్యాయవాది ఈ పిటీషన్‌కు ముందు రాష్ట్రపతి పాలన విధించాలని 2021లో కూడా కేసు వేశారు. పార్లమెంటూ కాదు, కార్యనిర్వాహక వ్యవస్థా కాదు రాజ్యాంగమే ఉన్నతమైనదని జగదీప్‌ థంకర్‌ వ్యాఖ్యల మీద రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ స్పందించారు. సిబల్‌ ప్రస్తుతం సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. నోటి తుత్తర బిజెపి నేతల్లో నిషికాంత్‌ దూబే ఒకరు. వక్ప్‌ చట్ట సవరణ చెల్లుతుందా లేదా అన్నదాని గురించి విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు దేశంలో మత యుద్ధాలను రెచ్చగొడుతున్నదని, తన హద్దులను దాటుతున్నదని నోరుపారవేసుకున్నాడు. తరువాత ఎన్నికల కమిషన్‌ మాజీ ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషీ ముస్లిం కమిషనర్‌ తప్ప ఎన్నికల కమిషనర్‌ కాదని వదరుబోతుతనంతో మాట్లాడారు.దూబే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బిజెపి ప్రకటించటం ఒక నాటకం తప్ప మరొకటి కాదు. అలా ప్రకటించిన తరువాతే ఖురేషీ గురించి మాట్లాడాడు. ఎందుకంటే వక్ఫ్‌ చట్టాన్ని ఖురేషీ విమర్శించారు.తానుగా అధికారికంగా చేయలేని వ్యాఖ్యలను దూబే వంటి వారితో బిజెపి చేయించటం దానికి వెన్నతో పెట్టిన విద్య. దూబే అంతటితో ఊరుకోలేదు, దేశం హిందువులదని, గిరిజనులు, జైనులు, బౌద్దులు వారితో కలసి ఉన్నారని కూడా సెలవిచ్చారు. రెచ్చగొట్టే మాటలు మాట్లానికి దూబె పెట్టింది పేరు, అగ్రనేతల మనసులో ఉన్నదాన్ని వెల్లడిరచిన దూబే మీద ఎలాంటి చర్య ఉండదని, తప్పనిసరైతే ఏదో మమఅనిపిస్తారని ఒక ఎంపీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. సుప్రీం కోర్టు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కోర్టు ధిక్కరణ నేరం కింద దూబేపై చర్యలు తీసుకోవాలని వక్ప్‌ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్న వారి తరఫు లాయర్‌ అనాస్‌ తన్వీర్‌ అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణికి లేఖ రాశారు, బిజెపి చర్యతీసుకుంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వినదగునెవ్వరు చెప్పిన…..: ప్రశ్నించమన్నాడు స్వామి వివేకానంద, సందేహించమన్నాడు కారల్‌ మార్క్స్‌ – అది మోడీ, రాహుల్‌ మరెవరైనా సరే !

01 Tuesday Apr 2025

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, INDIA, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

anti china, BJP, CHANDRABABU, India arms imports, India GDP, India index, Narendra Modi Failures, RSS

ఎం కోటేశ్వరరావు


చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి. అదే బతికున్నవి ఎదురీదుతాయి. మనుషుల్లో తరతరాలుగా ఈ రెండు రకాలూ ఉంటూనే ఉన్నారు. స్వామి వివేకానందుడితో సహా అనేక మంది మనకు ప్రశ్నించటం నేర్పారు.ప్రశ్న లేకపోతే అసలు కిక్కుండదు. యువకుడిగా ఉన్నపుడు వివేకానందుడు రామకృష్ణ పరమమహంస దగ్గరకు వెళ్లి మీరు దేవుడిని చూశారా అని ప్రశ్నించాడు. దానికి అవును చూశాను అని సమాధానం వచ్చింది, అయితే నాకు దర్శన భాగ్యం కల్పిస్తారా అని అడిగితే, నీకా ధైర్యం ఉందా అని రామకృష్ణుడు ప్రశ్నించాడు. తరువాత వివేకానందుడు దేవుడ్ని చూశాడా, ఏం చేశాడన్నది ఆసక్తి కలిగిన వారు చదువుకోవచ్చు. ఇక్కడ సమస్య ప్రశ్నించటం అనే మహత్తర లక్షణం గురించే. సమాజంలో ఎందరికి ఉంది ? ప్రశ్నించేతత్వం ఉంటే రాజకీయ నేతలు జనాలకు ఇన్ని కబుర్లు చెప్పేవారా, ఆచరించని వాగ్దానాలను వర్షంలా కురిపించేవారా !


పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేశామని ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక మంది ఊదరగొడుతున్నారు.దేశాభివృద్ధి అంటే జిడిపి ఒక సూచిక తప్ప అదే సర్వస్వం కాదు, సమగ్రతను సూచించదు. పిల్లో, పిల్లాడో పుట్టిన తరువాత లావు, పొడవు పెరుగుతారు. అవి వయస్సుకు తగ్గట్లు ఉన్నాయా, ఆరోగ్యంతో ఉన్నారా లేదా అన్నది గీటురాయి తప్ప చిన్నప్పటికంటే ఎంతో పెరిగారు కదా అంటే కుదరదు. దేశం, మానవాభివృద్ధి అన్నా అలాంటిదే. జిడిపి గురించి పదే పదే చెబుతున్నవారు మిగతా సూచికల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాలా వద్దా ? వాటి పట్ల నిర్లక్ష్యం వహించారా లేక విఫలమయ్యారా ? ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో మన వాటా 2014లో 2.6శాతం, మోడీ అండ్‌ కో చెబుతున్నదాని ప్రకారం జిడిపి మాదిరి అది కనీసం 5.2శాతానికి పెరగాలి, కానీ 2024లో 2.9 మాత్రమే నమోదైంది. అంతేనా జిడిపిలో వాటా 15.02 నుంచి 12.84శాతానికి(2023) తగ్గింది.2024 వస్తూత్పత్తి విలువ జోడిరపులో ప్రపంచ బాంకు సమాచారం మేరకు తొలి స్థానంలో చైనా 5.04 లక్షల కోట్ల డాలర్లతో ఉండగా అమెరికా 2.6లక్షల కోట్లతో రెండవ, భారత్‌ 0.45లక్షల కోట్లతో ఆరవ స్థానంలో ఉంది. తలసరి ఉత్పత్తిని చూస్తే 10,704 డాలర్లతో జర్మనీ, 9,685తో దక్షిణ కొరియా,8,791తో జపాన్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.చైనా 3,569 డాలర్లు, మనదేశం కేవలం 318 డాలర్లు మాత్రమే కలిగి ఉంది. గుజరాత్‌ నమూనాను అమలు జరుపుతానని చెప్పిన తమ నేత మోడీ నాయకత్వంలో ఈ రంగంలో ఇంత తక్కువ ఎందుకు ఉందో బిజెపి నేతలు, ఆ పార్టీ సమర్ధకులు ఎవరైనా చెప్పగలరా ?


త్వరలో మనం చైనాను అధిగమించబోతున్నాం, మరికొందరైతే డ్రాగన్ను మన కాళ్ల వద్దకు రప్పించుకోబోతున్నాం అన్నట్లుగా మాట్లాడుతుంటారు. కోతలు కోసే స్వేచ్చ ఉంది కాదనలేం. దేని ప్రాతిపదికన అలా చెబుతున్నారో మనలో మనమైనా తర్కించుకోవాలి కదా ! ఐరాస గణాంక విభాగం నుంచి తీసుకొని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా సమాచారం 2024 ఆగస్టులో వెల్లడిరచిన దాని ప్రకారం మీడియా సంస్థలు పారిశ్రామిక ఉత్పత్తి చేస్తున్న పది దేశాల గురించి సమీక్షించాయి. ప్రతి వంద వస్తువులు లేదా వంద కిలోల ఉత్పతిలో చైనా 31.6, అమెరికా 15.9, జపాన్‌ 6.5, జర్మనీ 4.8, భారత్‌ 2.9, దక్షిణ కొరియా 2.7, రష్యా 1.8, ఇటలీ 1.8, మెక్సికో 1.7,ఫ్రాన్సు 1.6 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. మన దేశంలోని రాష్ట్రాలంత ఉన్న దేశాలు మనతో పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంటే దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతున్నామని కబుర్లు చెప్పేవారిని పగటి వేషగాళ్లు, తుపాకి వీరులు అంటే తప్పేముంది ! నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ఆయనకున్న అనుభవం తక్కువేమీ కాదు, అందుకే తనకు ఇతరుల మాదిరి హానీమూన్‌ అవసరం లేదన్నారు. గుజరాత్‌ మాదిరి పారిశ్రామికంగా మార్చుతానంటే జనం నిజమే అని నమ్మి ఒకటికి మూడుసార్లు దేశాన్ని అప్పగించారు.కాని జరిగిందేమిటి ? ఇదే కాలంలో చైనా ఉత్పాదకత 20 నుంచి 31.6శాతానికి పెరిగితే, మన దగ్గర 2.6 నుంచి ముక్కుతూ మూలుగుతూ 2.9శాతానికి చేరింది. మన ఉత్పత్తుల విలువ 450 బిలియన్‌ డాలర్లు కాగా చైనా 5.04లక్షల కోట్లు, అమెరికా 2.6లక్షల కోట్ల డాలర్లతో ఉన్నాయి. పెంచకుండా నరేంద్రమోడీని ఎవరు అడ్డుకున్నారు ?

అంతా మీరే చేశారంటూ కాంగ్రెస్‌ పాలకుల మీద ఎన్ని రోజులు దుమ్మెత్తి పోస్తారు. ఆటంకాలు మనకే కాదు, చైనా, అమెరికాలకు ఎదురు కాలేదా ? నిజానికి కరోనా ఆంక్షల పేరుతో మరీ కఠినంగా వ్యవహరించి చైనా స్వయంగా ఉత్పత్తిని దెబ్బతీసుకుందని అనేక మంది సంబరపడ్డారు. దాని ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవాలని ఎందరో చెప్పారు.సర్వేజనా సుఖినో భవంతు అని కోరుకునే మనం చైనాను అధిగమించాలనే ఆధిపత్య ధోరణి కంటే దానితో పాటు మనమూ ఎదగాలని ఆశించటం వాంఛనీయం. మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి గతంతో పోల్చుకుంటే విలువలో చూస్తే పరిమితంగా పెరిగింది.తలసరి ఉత్పత్తిలో అగాధంలో ఉన్నాం. చిత్రం ఏమిటంటే పదేండ్లుగా నరేంద్రమోడీ కార్మికుల నైపుణ్యాలను పెంచినట్లు చెబితే, చంద్రబాబు నాయుడికి వారెంత మంది ఉన్నారో తెలియక లెక్కలు తీస్తున్నట్లు చెబుతున్నారు. కాలయాపన, కాలక్షేప కబుర్లు తప్పితే ఇంజనీరింగ్‌ పట్టాలు, పాలిటెక్నిక్‌ డిప్లోమాలు, ఫార్మసీ పట్టాలు ఎందరికి ఉన్నాయో లెక్కలు తెలియనంత దుస్థితిలో దేశం ఉందా ? దేశం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 54శాతం కేవలం మహారాష్ట్ర, తమిళనాడు,గుజరాత్‌,కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌ నుంచే జరుగుతోంది.కొత్తగా వచ్చే పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రాలవైపే చూస్తుంటాయి.


ఒక పరిశ్రమ రావాలంటే ఏటిఎం యంత్రంలో కార్డు పెట్టగానే డబ్బులు వచ్చినంత సులభంగా రావని తల మీద మెడ ఉన్నవారందరికీ తెలుసు. పదేండ్లు తక్కువేమీ కాదు, ప్రగతి జాడ ఎక్కడ, రెండిరజన్ల పాలన ప్రభావం ఏమిటి ? చైనాతో పోల్చుకుంటే వేతనాలు మన దగ్గర తక్కువ, అయినప్పటికీ విదేశీ కంపెనీలు ఇక్కడికి ఎందుకు రావటం లేదో పెద్దలు చెప్పాలి. మీడియాలో వెలువడుతున్న అభిప్రాయాల ప్రకారం చైనా మాదిరి తక్కువ ధరలకు ఇక్కడ కూడా ఉత్పత్తి చేయవచ్చు. కానీ జరగటం లేదు. చైనాలో విధానాలను రూపొందించేది అమలు జరిపేదీ అక్కడి కమ్యూనిస్టు పార్టీ.ఇక్కడ పార్టీలు మారుతుంటాయి కనుక సాధ్యం కావటం లేదన్నది వెంటనే చెప్పే సమాధానం. ఇది తర్కానికి నిలిచేది కాదు. అమెరికా, ఐరోపా, జపాన్‌, దక్షిణ కొరియాలో కూడా పార్టీలు, పాలకులు మారుతూనే ఉన్నారు. మరి అక్కడ సాధ్యమైంది ఇక్కడెందుకు జరగటం లేదు. అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా విధానాలు ఒక్కటే. 1990 నుంచి మన దేశంలో జరుగుతున్నది కూడా అదేగా ! ఎవరు అధికారంలో ఉన్నా నూతన సంస్కరణలను ముందుకు తీసుకుపోవటమేగా. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టవద్దన్నారు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత లేక తెగనమ్మాలన్నారు. వాజ్‌పాయి, మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ ఎవరున్నా చేస్తున్నది అదేగా. మరింత వేగంగా, సమర్దవంతంగా అమలు చేస్తానని మోడీ చెప్పారు, అయినా ఎందుకు ముందుకు పోవటం లేదు ?


ఎంత సేపూ ఐదు లక్షల కోట్ల జిడిపి, కొద్ది వారాలుగా పదేండ్లలో రెట్టింపు కబుర్లు చెబుతున్నారు.మిగతా సూచికల్లో మనం ఎక్కడున్నాం. వాటన్నింటి సమాహారమే దేశం ఎక్కడుందో,ఎలా ఉందో తెలియ చేస్తుంది. 2024, అంతకు ముందు ప్రకటించిన కొన్ని సూచికల్లో భారత స్థానం గురించి చూద్దాం. ఇవన్నీ అంతర్జాతీయ సంస్థలు వెల్లడిరచేవే. మన్మోహన్‌ సింగ్‌ ఉన్నపుడూ ఇప్పుడూ అవే ఉన్నాయి తప్ప నరేంద్రమోడీ సర్కార్‌ను బదనాం చేసేందుకు కొత్తగా పుట్టుకురాలేదు.చిత్రాతి చిత్రం ఏమిటంటే తమకు ప్రతికూలంగా ఉన్న వాటిని మేం అంగీకరించం అంటారు. ఫేక్‌ వార్తలు, ఫేక్‌ నివేదికలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు.అంతర్జాతీయ సంస్థలు మన దేశం ప్రకటించిన సమాచారం నుంచే వివరాలు తీసుకుంటాయి తప్ప మరొకటి కాదు. ప్రారంభంలో సరిగా మదింపు లేదన్నారు, పదేండ్ల తరువాత పరిస్థితి ఏమిటి ? అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించిన 55 దేశాల అంతర్జాతీయ మేథోసంపత్తి సూచికలో మనం 42లో ఉన్నాం. ప్రపంచ నవకల్పన సూచికలో 113 దేశాల్లో చైనా పదకొండు, భారత్‌ 39వదిగా ఉంది. ఐరాస మానవాభివృద్ధి సూచికలో 193 దేశాల్లో 134, గడచిన పదేండ్లలో దేశ ప్రతిష్టను మోడీ పెంచారని చెప్పిన తరువాత వీసాలు లేకుండా మన పౌరులను అనుమతించే దేశాలను సూచించే హానెల్‌ పాస్‌పోర్టు సూచికలో 80వ స్థానం, ఐరాస లింగసమానత్వంలో 193కు గాను 108,ప్రపంచ సంతోష సూచిక 126, మోడీ సర్కార్‌ 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు కరోనా సమయం నుంచి చెప్పుకుంటున్నప్పటికీ 2024లో ఆకలి సూచికలో 126దేశాలకు గాను 105గా ఉన్నాం. ప్రపంచ శాంతి సూచికలో 163కు గాను 116వ స్థానం, అవినీతికి తమ పాలనలో తావు లేదు, మోడీ మీద ఒక్క కుంభకోణమన్నా ఉందేమో చూడండని బిజెపి పెద్దలు సవాళ్లు విసురుతుంటారు. అధికారాంతమందు చూడవలె ఆ ఆయ్య సాభాగ్యముల్‌ అన్నాడు ఒక కవి. దేశం మొత్తంగా అవినీతి గురించి ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్‌ సూచికలో 2022లో 85వదిగా ఉంటే 2024లో 96వ స్థానానికి దిగజారింది. ప్రపంచ పత్రికా స్వేచ్చలో 180 దేశాల్లో 159వ స్థానం, పాయింట్ల వారీ చూస్తే అంతకు ముందు సంవత్సరంలో 36.62 కాగా 2024లో 31.28కి పడిపోయాయి. చట్టబద్ద పాలన సూచికలో 142దేశాల్లో 79వ స్థానం. మంచి జీవనానికి అనువైన నగరాలేమిటని 173 నగరాలను ఎంచుకోగా వాటిలో న్యూఢల్లీి, ముంబై నగరాలకు 141వ స్థానం రాగా ఆ తరువాత చెన్నయ్‌,అహమ్మదాబాద్‌, బెంగలూరు చోటు దక్కించుకున్నాయి. యుపిఏ పాలనా కాలంలో ప్రపంచ జీడిపిలో 11వదిగా ఉన్న మన దేశాన్ని ఐదవ స్థానానికి తెచ్చామని చెప్పుకుంటున్నవారు పైన పేర్కొన్న సూచికల్లో ఎందుకు విఫలమైనట్లు ?


వైఫల్యాల గురించేచెబుతారా మోడీ సాధించిందేమీ లేదా అని ఎవరైనా అడగవచ్చు. స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) సమాచారం ప్రకారం 2020 నుంచి 2024వరకు ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశం ఉక్రెయిన్‌, తరువాత మనదే. రష్యాతో మూడేండ్లుగా యుద్ధం చేస్తోంది గనుక ఉక్రెయిన్‌ ఆ పని చేసింది, మనం ఎవరితో యుద్దంలో ఉన్నాం, ఎవరి మేలుకోసం ఆయుధాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు ? వాస్తవం ఇలా ఉంటే మన దేశం కూడా ఆయుధాలను ఎగుమతి చేస్తోందన్న ప్రచారం బిజెపి చేస్తోంది. నిజమే ! గ్లోబల్‌ ఎకానమీ డాట్‌ కాం 2022 సమాచారం మేరకు 48దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా 14,515 మిలియన్ల డాలర్ల మేరకు ఎగుమతి చేయగా, నాలుగవ స్థానంలో ఉన్న చైనా 2,017 మిలియన్‌ డాలర్లు, 40 స్థానంలో ఉన్న భారత్‌ 11 మిలియన్‌ డాలర్లు అని పేర్కొన్నది. వెనుకటికెవడో మాది 101 అరకల వ్యవసాయం అని వేరే ఊరిలో గొప్పలు చెప్పాడట, మాది అంటున్నావ్‌ ఎవరెవరు ఏమిటి అని అడిగితే మా అయ్యగారివి వంద, నాది ఒకటి అన్నాడట. అందుకే,
వినదగునెవ్వరు చెప్పిన
వినినంతనే వేగపడక వివరింపదగున్‌
గనికల్ల నిజము తెలిసిన
మనుజుడేపో నీతిపరుడు మహిలో సుమతీ
దీని అర్ధం బిజెపి, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీ ఏం చెప్పినా వెంటనే తొందరపడకూడదు, నిజానిజాలేమిటో బాగా పరిశీలించాలి.అది తెలుసుకున్న మనిషే భూమి మీద నిజాయితీ పరుడు. మనలో ఎందరం దీన్ని పాటిస్తున్నామో ఎవరికి వారే ఆలోచించుకోవాలి,ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి.దేన్నీ గుడ్డిగా నమ్మకు అని పెద్దలు చెబితే ప్రతిదాన్నీ ప్రశ్నించు అని వివేకానందుడు చెబితే అన్నింటినీ సందేహించు అని మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కారల్‌ మార్క్స్‌ చెప్పాడు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత జిడిపి వృద్ధి స్వంత డబ్బా, అతిశయోక్తులు : నరేంద్రమోడీ సుభాషితాలు, చేదునిజాలు !

29 Saturday Mar 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

BJP, BJP hypocrisy, China, China vs India GDP, Hypersonic missile, India GDP, Narendra Modi Failures, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ఐఎంఎఫ్‌ చెప్పింది.అయితే ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ ఇంతటి అభివృద్ధి సాధించలేదని బిజెపి ఐటి సెల్‌ అధినేత అమిత్‌ మాలవీయ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. జాతీయ, ప్రాంతీయ పత్రికలు కూడా ఈ వార్తకు పెద్ద ఎత్తున ప్రాచుర్యమిచ్చాయి. భజనపరుల సంగతి చెప్పేదేముంది, కీర్తి గీతాలు పాడుతున్నారు. బుర్రకు పని చెప్పకుండా చెవులప్పగించేవారుంటే కాకమ్మ కతలు చెప్పేవారికి కొదవ ఏముంది. బిజెపి పెద్దలు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా మాలవీయ చెప్పారు.అలా ప్రచారం చేయటమే కదా ఆ పెద్దమనిషి ఉద్యోగం. వాస్తవం ఏమిటి, 2004లో మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు 186 శాతమని, 105కంటే ఎక్కువని చెబుతారు. లేదు మా వేదగణితం, మోడీ లెక్కల ప్రకారం 105శాతమే ఎక్కువ అంటే అంతేగా అంతేగా మరి అనటం తప్ప చేసేదేముంది ! ఎవరన్నా గట్టిగా కాదు అంటే మున్సిపల్‌ అధికారులు వచ్చి నిబంధనలన్నీ సక్రమంగానే పాటించినా వారి ఇళ్ల గోడల నిర్మాణంలో ఇసుక, సిమెంటు పాళ్లలో తేడా కనిపిస్తోందని,హానికారక రంగులు వేశారంటూ వెంటనే బుల్డోజర్లతో కూల్చివేసే రోజులివి. వ్యంగ్యాన్ని భరించలేక ముంబైలో కునాల్‌ కమ్రా ప్రదర్శన జరిగిన హాలును ఎలా కూల్చివేశారో చూశాంగా !

టీవీ9 నిర్వహించిన సమావేశంలో ప్రధాని చెప్పిన కొన్ని అతిశయోక్తుల గురించి చూద్దాం. ‘‘ నేడు ప్రపంచ కళ్లన్నీ భారత్‌ మీదే ’’. 2014 మే 26న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచీ పదాలు మార్పు ఉండవచ్చు తప్ప ఇదే పాట. ఏ ఒక్క అంతర్జాతీయ సమస్యలో అయినా లేదా వివాద పరిష్కారంలోనైనా భారత పాత్రను కోరిన దేశాలు గానీ, మోడీ ప్రమేయంగానీ ఉన్న ఉదంతం ఒక్కటంటే ఒక్కటి ఉందా ? కానీ మోడీ చెప్పిందాన్ని మరోవైపు నుంచి చూస్తే నూటికి నూరుపాళ్లూ వాస్తవం. ఏమిటంటే మన మార్కెట్‌లో తమ వస్తువులను అమ్ముకోవటానికి, తమకు అవసరం లేని వాటిని మనకు అంటగట్టటానికి (ప్రపంచంలో నిషేధించిన అనేక పురుగుమందులు, రసాయనాలు, ఔషధాలు మన దగ్గర పుష్కలంగా దొరుకుతున్నాయి), ఇక్కడి కార్పొరేట్లకు మోడీ సర్కార్‌ ఇస్తున్న రాయితీల కారణంగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు తరలించుకుపోవటానికి మనవైపు చూస్తున్న మాట వాస్తవం.


‘‘ గత పదేండ్లలో జిడిపిని రెట్టింపు చేయటం అంకెలు కాదు, 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ దాటించి నూతన మధ్యతరగతిని సృష్టించాం. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు, సచేతనంగా ఆర్థికవృద్ధికి తోడ్పడుతున్నారు ’’. ప్రధాని ఈ మాటలను చూసి నవ్వాలా ఏడవాలో తెలియటం లేదు. ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి ఎగువకు లాగాం అంటూనే కనీసం ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార భద్రతా పధకం కింద గోధుమలు, బియ్యం ఇస్తున్నామని అదే నోటితో చెప్పటం విన్నాం. ప్రపంచ ఆకలి సూచికలో తాజాగా 127లో 105వ దేశంగా ఉన్నాం. ఆకలి లేని(9.9), స్వల్ప (10 నుంచి 19.9), తీవ్రం(20 నుంచి 34.9), ఆందోళనకరం(35నుంచి 49.9) , అత్యంత ఆందోళనకరం(50పైన) అనే ఐదు తరగతులుగా దేశాలను విభజిస్తే మన దేశం తీవ్ర తరగతిలో అంతకు ముందు గత పదేండ్లుగా కూడా ఉంది. అనూహ్య అద్భుతాలు లేదా నరేంద్రమోడీకి కొత్తగా దైవిక శక్తులు వస్తే తప్ప దాన్నుంచి సమీప భవిష్యత్‌లో బయటపడే దరిదాపుల్లో కూడా లేదు. పదేండ్లలో జిడిపి రెట్టింపు అని ఇతర గొప్పలు చెప్పుకుంటూ తమ భుజాలను తామే చరుచుకుంటూ శభాష్‌ అని చెప్పుకుంటున్నాం. అ పది సంవత్సరాల్లో 2014 నుంచి 2014వరకు మన ఆకలి సూచిక స్కోరు 28.2 నుంచి 27.3కు మాత్రమే తగ్గింది,దీనిలో అంత అభివృద్ధి ఎందుకు రాలేదు ? దీనికే పొంగిపోతున్నాం. ఇదే కాలంలో పాకిస్తాన్‌ స్కోరు 29.6 నుంచి 27.9కి తగ్గింది, మనకంటే మెరుగైన అభివృద్ధి అంటే పాకిస్తాన్‌ ఏజంట్లని ఎదురు దాడి చేస్తారు. పాక్‌ రాంకు మన తరువాత 109, ఆకలిని ఎవరు ఎక్కువగా తగ్గించినట్లు ? గత పదేండ్లలో చైనా స్కోరు ఐదు కంటే తక్కువే ఉందన్న వాస్తవాన్ని చెబితే నానా యాగీ చేస్తారు. అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలు అన్నట్లుగా నరేంద్రమోడీ అతిశయోక్తుల గురించి చెప్పుకోవటానికి ఈ ఒక్కటి చాలు.


ఆర్థిక విస్తరణలో జి7, జి20, బ్రిక్స్‌ దేశాలన్నింటి కంటే అసాధారణ వృద్ధి సాధించినట్లు వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ వర్ణించారు. త్వరలో జిడిపిలో భారత్‌ మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని బిజెపి పెద్దలు, వారి సమర్ధకులు నిత్యం ఊదరగొడుతుంటారు. ఇదొక మైండ్‌ గేమ్‌. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఉంటుందా ? ప్రస్తుతం జపాన్ను అధిగమించేందుకు మోడీ చూస్తున్నారని, 2027 తొలి ఆరునెలల్లోనే 4.9లక్షల కోట్ల డాలర్లతో జర్మనీని కూడా దాటించేస్తారని ఊదరగొడుతున్నారు.అవన్నీ గిడసబారిన దేశాలుగా మారుతున్నాయి, మన పోల్చుకోవాల్సింది చైనాతో కదా ! మన వృద్ధి రేటు చైనా, అమెరికా, జర్మనీ కంటే ఎక్కువగా ఉందని, గడచిన పదేండ్లలో భారత్‌ 105శాతం పెరుగుదల సాధించగా చైనా 76, అమెరికా 66, జర్మనీ 44, ఫ్రాన్సు 38, బ్రిటన్‌ 28శాతం పెరుగుదల సాధించిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. లక్ష కోట్ల డాలర్ల కిలోమీటర్‌(మైలు) రాయిని దేశం 2007లో దాటింది.తదుపరి 2014లో రెండు లక్షల కోట్లు దాటింది. 2032నాటికి పదిలక్షల కోట్ల డాలర్ల జిడిపి కలిగిన దేశంగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు జోశ్యం చెప్పారు. వారి తర్కం ఏమిటి ? 2021లో మూడు లక్షల కోట్లకు విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రతి 1.5 సంవత్సరాలకు (18నెలలకు) ప్రస్తుత వేగంలో ఒక లక్ష కోట్ల డాలర్లు పెరుగుతున్నది. ఇదే కొనసాగితే 2032 నాటికి 10లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.


కొంత మందికి అంకెలతో ఆడుకోవటం వెన్నతో పెట్టిన విద్య. అంతా అద్భుతంగా ఉందని చెబుతూనే 2025 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5శాతం ఉంటుందని సన్నాయి నొక్కులు. రానున్న కొద్ది సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నందుకు ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకుంటున్నారు కొందరు. చెన్నయ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆర్థిక నిపుణుడు డి ముత్తుకృష్ణన్‌ ఉత్సవాలు జరుపుకోవాల్సినంత ఘనత ఏమి సాధించామని ప్రశ్నించారు. జిడిపిలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు తలసరి రాబడిలో ప్రపంచంలో మనం 140వ స్థానంలో ఉన్నామని, మనకంటే 139దేశాలు ముందున్నాయని గుర్తించాలని చెప్పారు. పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ(పిపిపి) పద్దతి జీవన ప్రమాణాలను మెరుగ్గా వెల్లడిస్తుందని కొందరు చెబుతారు, దాని ప్రకారం చూసినా మన స్థానం 119 అని చెప్పారు. పదేండ్లలో మన జిడిపి 105శాతం పెరిగిందని ఏ ఐఎంఎఫ్‌ చెప్పిందో అదే సంస్థ 2025 తలసరి జిడిపిలో 141వ స్థానం అని కూడా చెప్పింది. మనకంటే పేద దేశమైన కంపూచియా పైన ఉంది, దివాలా తీసిందని చెప్పిన శ్రీలంక 133, బంగ్లాదేశ్‌ 143, పాకిస్తాన్‌ 159, షీ జింపింగ్‌ ఏలుబడిలో కుప్పకూలిపోయిందని కొంత మంది చెప్పే చైనా 71వ స్థానంలో ఉందని కూడా ఐఎంఎఫ్‌ చెప్పింది. మన తలసరి రాబడి పదివేల డాలర్లకు చేరాలంటే కనీసం 30 సంవత్సరాలు కష్టపడి పని చేయాలని, దానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండాలని ముత్తు కృష్ణన్‌ చెప్పారు. చైనా తలసరి జిడిపి 2025లో 13,873 డాలర్లు, ఇప్పుడున్న మన 2,937 డాలర్ల నుంచి ఎదిగి ప్రధమ స్థానంలో ఉన్న మొనాకో 2,56,581( 2023 ప్రపంచ బ్యాంకు సమాచారం) లేదా డాలర్‌ దేవుడున్న అమెరికా 89,678(2025 ఐఎంఎఫ్‌) స్థాయికి, చివరికి పడకకుర్చీ మేథావులు త్వరలో అధిగమించే దూరం ఎంతో దూరం లేదని నమ్మించేందుకు చూస్తున్న చైనాను అయినా కనీసం అధిగమించాలంటే ఎంత సమయం పడుతుందో ఆల్జిబ్రా లేదా వేద గణితం ఏదో ఒక అడ్డగోలు పద్దతిలో లెక్క వేసుకోవాల్సిందే.

పదకొండు సంవత్సరాల విశ్వగురువు మోడినోమిక్స్‌ సమర్ధ పాలన తరువాత పరిస్థితి గురించి కమ్యూనిస్టులో ఇతర పురోగామి వాదులో చెబుతున్న మాటలను కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే ఎండమావుల వెంట పరిగెడుతున్న జనం వారి మాటలను తలకు ఎక్కించుకొనే స్థితిలో లేరు. బిజినెస్‌ టుడే పత్రిక 2025 మార్చి 21వ తేదీ సంచికలో వైట్‌ కాలర్‌ భారత్‌లో 500 డాలర్ల ఉద్యోగాలింకేమాత్రం లేవు అంటూ ఒక వార్త వచ్చింది.విజ్‌డమ్‌ హాచ్‌ అనే సంస్థ స్థాపకుడు అక్షత్‌ శ్రీవాత్సవ చెప్పిన అంశాలను దానిలో చర్చించారు. శ్రీవాస్తవ చెప్పిన అంశాలు, వార్తలోని వ్యాఖ్యల సారం ఇలా ఉంది.సాంప్రదాయకంగా ఉపాధి కల్పించే రంగాలు, వృద్ధి పడిపోతున్నది, యువత ఎలా ముందుకు పోవాలో ఎంచుకోవటం కష్టంగా మారుతున్నది. దేశ అభివృద్ధి నమూనా గతం మీద ఇంకేమాత్రం ఆధారపడలేదు. భారత ఐటి మార్కెట్‌ నిర్ణయాత్మక మార్పుకు లోనవుతున్నది, అది మంచిదారిలో కాదు. ఐటిలో మంచి ఉద్యోగాలు అంతరిస్తున్నాయి, అవి వెనక్కు తిరిగి రావు. ‘‘ ఒక తెల్లవాడికి వెయ్యి డాలర్లు ఇచ్చే బదులు భారతీయులకు 500 డాలర్లు ఇచ్చారు. ఆ సొమ్ముతో మనం సంతోష పడ్డాం. ఎందుకంటే ఇప్పటికీ అది గొప్ప ఉద్యోగమే.అది మన జీవన ప్రమాణాలను పెంచింది. కానీ అది ఆ కాలం కనుమరుగుతున్నది.’’ అని శ్రీవాత్సవ పేర్కొన్నారు.‘‘ ప్రభుత్వం ఒక పరిష్కారం చూపుతుందేమోనని ఆశించటం అర్ధలేనిది, ఆ మార్పు రావాలంటే దశాబ్దాలు పడుతుంది, అప్పటికి మీరు వృద్ధులు కావచ్చు ’’ అని కూడా చెప్పారు.

పదకొండు సంవత్సరాల క్రితం 2014లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ ఒక బిజెపి నేత, గుజరాత్‌ సిఎంగా చెప్పిందేమిటి ? మిగతా అంశాలను పక్కన పెడదాం. గుజరాత్‌ నమూనా అభివృద్ధిని దేశమంతటా విస్తరిస్తాం అన్నారు. అంటే పారిశ్రామికంగా వృద్ధి చేస్తామన్నారు. ప్రధాని పదవిలోకి రాగానే విదేశాలకు ఎందుకు పదే పదే వెళుతున్నారంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం అన్నారు. కానీ జరిగిందేమిటి ? తరువాత ఎప్పుడైనా గుజరాత్‌ నమూనా గురించి ఎక్కడైనా మాట్లాడారా ? 1950లో మన దేశంలో 20 కోట్ల మంది జనం ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా కొంత భూమి సాగులోకి వచ్చింది, కొంత వ్యవసాయేతర అవసరాలకు మళ్లింది. ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అన్న లెక్కలను పక్కన పెడితే స్థిరంగా ఉందనుకున్నప్పటికీ అదే భూమి మీద నాడు 20 కోట్ల మంది బతికితే ఇప్పుడు 2023`24లో జనాభాలో 46.1శాతం మంది ఆధారపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ఆరు సంవత్సరాల క్రితంతో పోల్చితే రెండు శాతం పెరిగారు. అంటే ఇప్పుడు 67 కోట్ల మంది పని చేస్తున్నారు.చైనాలో 24.1 శాతం లేదా 17.66 కోట్ల మంది(2023) పని చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఏటా రెండు కోట్ల మేరకు పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాటలేమైనట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

విదూషకుడు కునాల్‌ కమ్రా హాస్య వీడియో వివాదం : గూండాయిజం, బుల్డోజర్లతో భావ ప్రకటనా స్వేచ్చ హరించే యత్నం !

27 Thursday Mar 2025

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Amit Shah, BJP, comedy controversy, Eknath Shinde, freedom of expression, Kangana ranaut, Kunal Kamra, Narendra Modi Failures, nirmala sita raman, parody, Siva Sena, vandalism


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఏం జరుగుతోంది ? చిన్న పాటి వ్యంగ్యం, జోక్‌, విమర్శలను కూడా సహించని శక్తులు రెచ్చిపోతున్నాయి. అధికార యంత్రాంగం అలాంటి వారి చేతుల్లో పనిముట్టుగా మారుతోంది. విదూషకుడు కునాల్‌ కమ్రా వంటి వారు, మిమిక్రి కళాకారులు,చతురోక్తులతో విమర్శలు చేసే వారు, కార్టూనిస్టులు, సినిమా వారు ఎవరైనా కావచ్చు, అధికారంలో ఉన్న రాజకీయ నేతల తీరుతెన్నులను హాస్య భరితంగా జనం ముందు ఎండగట్టారో వారికి మూడిరదే. వెంటనే గూండాలు రంగంలోకి దిగి విధ్వంసం సృష్టిస్తారు. వీధుల్లో తిరగనీయం, ప్రాణాలు తీస్తామని బెదిరిస్తారు. సంబంధిత వ్యక్తులు, సంస్థల భవన నిర్మాణాల్లో ఉల్లంఘనలు స్థానిక సంస్థల సిబ్బందికి అప్పుడే గుర్తుకు వస్తాయి, వెంటనే బుల్డోజర్లతో ఆఘమేఘాల మీద కూల్చివేస్తారు. ఎక్కడబడితే అక్కడ వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తారు. సినిమాల్లో మాదిరి అంతా అయిపోయాక రావటం గాక పోలీసులు సిద్దం సుమతీ అన్నట్లు ఉంటారు. ఇక మద్దతు ఇచ్చే రాజకీయ నేతలు, అవే రంగాలకు చెందిన తోటి వారు సైతం రంగంలోకి దిగి దాడులు మొదలు పెడతారు, సుభాషితాలు వల్లిస్తారు.ఈ గూండాయిజాన్ని సిపిఎం, ఉద్దావ్‌ ధాకరే శివసేన ఖండిరచాయి.


చట్ట ప్రకారం తప్పు చేసిన వారిని ఎవరూ సమర్ధించరు. భావప్రకటనా స్వేచ్చ హద్దులేమిటో చట్టాల్లోనే ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తే వాటి ప్రకారం ఎంత పెద్దవారినైనా విచారించి శిక్షలు వేయవచ్చు. కానీ కొంత మంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వారిని చూసీ చూడనట్లు వదలివేయటంతో కొత్త వారికి ప్రోత్సాహం వస్తోంది. గతంలో ఇటలీ, జర్మనీ వంటి చోట్ల ఫాసిస్టులు, నాజీలు, కమ్యూనిస్టు వ్యతిరేకులు అదేపని చేశారు. తమ మీద విమర్శలు చేసిన వారిని తమకు నచ్చనివారిని వెంటాడారు, వేధించారు.నాగరికులమని చెప్పుకున్న, భావించిన వారిలో అనేక మంది మౌనంగా ఉన్నారు. నేటి మాదిరి అడ్డగోలు చర్యలను సమర్ధించిన మేథావులూ, కళాకారులూ నాడున్నారు, జరిగిందేమిటి ? అలాంటి వారిని చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టింది.1940,50 దశకాల్లో తెలంగాణా సాయుధ పోరాటం జరిగిన సమయంలో సాయుధ పోలీసులు గ్రామాల మీద దాడులు జరిపారు. కోస్తా ప్రాంతంలో గ్రామాలలో గాంధీ విగ్రహాలు నెలకొల్పిన కూడళ్లలో జనాన్ని మందవేసి మీలో కమ్యూనిస్టులెవరో, కాని వారెవరో స్వచ్చందంగా చెప్పండి అని ఆదేశించేవారు. కమ్యూనిస్టులు నిజాయితీగా ముందుకు వస్తే కాని వారు మేం యాంటీ కమ్యూనిస్టులం అని కొన్ని చోట్ల గొప్పగా చెప్పుకున్నారట. ఉన్న కమ్యూనిస్టులతోనే వేగలేక చస్తుంటే వారికి తోడు మరొకరు యాంటీ కమ్యూనిస్టులా అంటూ వారిని కూడా చావబాదినట్లు, బట్టలిప్పించి గాంధీ విగ్రహాల చుట్టూ తిప్పించినట్లు పెద్దలు చెప్పారు. నాటి బ్రిటీష్‌, నిజాం, నెహ్రూ సైన్యం, రిజర్వు పోలీసులకు ఆ రోజుల్లో కమ్యూనిస్టు అన్న పదం వినిపిస్తే అలా ఉండేది మరి. ఆ గుణపాఠాలను మనం తీసుకోవాలా వద్దా, మనకెందుకులే అని తప్పించుకు తిరగాలా ? అన్యాయం, అధర్మాన్ని వ్యతిరేకించకుండా మౌనంగా ఉంటే వాటికి పాల్పడేవారు సహిస్తారని భావిస్తే పొరపాటు. సమర్ధించకుండా మౌనం అంటే మమ్మల్ని వ్యతిరేకించటమే అని మౌనమునుల సంగతి కూడా చూస్తారు. దేశంలో ఇదే జరగనుంది !


ఇటీవల ముంబై హాబిటాట్‌ హాస్య కేంద్రంలో ప్రదర్శించిన కునాల్‌ కమ్రా ప్రదర్శనలో విసిరిన ఒక చతురోక్తి తమ నేత ఏకనాధ్‌ షిండేను ఉద్దేశించే అని అతగాడి నాయకత్వంలోని శివసేన మద్దతుదారులు ఆ కేంద్రంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అక్కడ ఉన్న స్టూడియో నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెంటనే కొంత భాగాన్ని కూల్చివేశారు. నాగపూర్‌లో ఇటీవల జరిగిన అల్లర్లకు సూత్రధారి అంటూ కొందరిని పోలీసులు ఆరోపించటం, వెంటనే వారిలో ఒకరి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ మునిసిపల్‌ అధికారులు కూల్చివేయటాన్ని చూస్తే పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పిన విపరీతాలు గుర్తుకు వస్తున్నాయి. ఆయా ఉదంతాలు జరిగే వరకు సదరు మున్సిపల్‌ అధికారులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతుంటారో ఎవరి సేవలో తరిస్తుంటారో తెలియదు. బిజెపి, దాని మద్దతుదారులు అధికారంలో ఉన్నచోట చిన్న నొప్పి అనిపిస్తే చాలు వెంటనే వారికి క్షణాల మీద అతిక్రమణలు ఎలా గుర్తుకు వస్తున్నాయో ఆఘమేఘాల మీద ఎలా కూల్చివేస్తున్నారో అంతుబట్టటం లేదు.


తెలుగు ప్రాంతాల్లో కొన్ని పదాలు ‘‘ కో పైలట్‌, జామాతా దశమ గ్రహం, వెన్నుపోటు,వైస్‌రాయ్‌ హోటల్‌ బ్యాచి, తోలు తీసేవారు, తాటవలిచే వారు, పాచిపోయిన లడ్డూలు, మాట తప్పను మడమతిప్పను, మీట నొక్కుడు, వాట్‌ అయామ్‌ సేయింగ్‌, అలా ముందుకు పోతున్నాం, ఆ రెండు పత్రికలు, సన్నాసులు, ఫాంహౌస్‌, పొట్టోడు, ట్విటర్‌ పిట్ట, గడకర్ర, భాయియోం` బహినోం, సూపర్‌ సిక్స్‌ ’’ వంటి పదాలు చలోక్తులు విసిరేందుకు,రచనలు చేసేందుకు వస్తువుగా మారుతున్నాయి. వాటితో పాటు ఇంకా అనేక పదాలను పేరు పెట్టకుండా ఎవరు ఉచ్చరించినా ఎవరిని ఉద్దేశించి అనేది అందరికీ ఎరుకే. తమ నేతలనే అంటున్నారని మద్దతుదారులు కత్తులు, కటార్లు పట్టుకొని వీధులోకి వస్తే కుదురుతుందా ! మహారాష్ట్రలో అలాంటి పదాలలో ‘‘ ద్రోహి, గౌహతి ప్రయాణం,ఆటోవాలా ’’ అనేవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. కునాల్‌ కమ్రా అలాంటి పదాలతో ఎవరి పేరూ ప్రస్తావించకుండా చతురోక్తులు విసిరాడు. మా నాయకుడినే అంటూ ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సిఎం ఏకనాథ్‌ షిండే శివసేనకు చెందిన వారు హాబిటేట్‌ స్టూడియోలో విధ్వంసకాండ సృష్టించారు.కునాల్‌ కమ్రాను నరికి వేస్తామంటూ వీరంగం వేస్తున్నారు. అమెరికా, లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాల్లో అనేక మంది దేశాధినేతలు, డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి వారిని మీడియాలో, ఇతరంగా అనేక మంది ఫాసిస్టు, నాజీలని నేరుగానే సంబోధించి విమర్శిస్తున్నారు.నోరుబట్టని బూతులను కూడా వినియోగిస్తున్నారు.మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా రాజకీయ పార్టీల నేతలు ఇలాంటి పదాలను ఎలాంటి సంకోచం లేకుండా పరస్పరం వాడేస్తుంటారు. కానీ అదే కళాకారులు వాటిని వ్యంగ్యాస్త్రాలుగా వాడితే మాత్రం సహించరు. మేం మేం వందనుకుంటాం మీరెవరు అన్నట్లుగా స్పందిస్తారు.


తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్దమే అని కునాల్‌ కమ్రా చెప్పాడు. చట్టానికి కట్టుబడి ఉంటానని చెప్పటమే అది. అంతే కాదు గూండా గుంపులను ఉద్దేశించి మరో పేరడీ పాటతో రెండో వీడియోను కూడా విడుదల చేశాడు. తమ దగ్గర కేసు నమోదైంది గనుక వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు, తనకు వారం రోజుల సమయం కావాలని కునాల్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ మేరకు వివరణ ఇవ్వకపోతే చట్టం తనపని తాను చేసుకుపోవాలి. కానీ అతను ప్రదర్శన నిర్వహించిన క్లబ్బు మీద దాడి, అతిక్రమణలంటూ కూల్చివేతలు ఏమిటి ? వచ్చిన జనాల మీద కూడా దాడిచేస్తారా ? అంటే ఎవరూ కునాల్‌ వంటి విమర్శకులు, చతురోక్తులు విసిరే వారికి వేదికలను ఎవరైనా ఇస్తే వాటన్నింటికీ ఇదే గతి పడుతుందని చెప్పటమే కదా ! ఎంతకాలం ఇలా బెదిరిస్తారు, ఎందరి నోరు మూయిస్తారు, ఇదా అసలైన ప్రజాస్వామ్యం అంటే ? దేశం, ఇతర దేశాల నుంచి కునాల్‌కు మద్దతు వెల్లువెత్తుతున్నది, చట్టపరంగా ఎదుర్కొనేందుకు, ధ్వంసమైన స్టూడియోకు చెల్లించేందుకు అనేక మంది లక్షలాది రూపాయలను విరాళంగా కూడా పంపినట్లు వార్తలు వచ్చాయి. రాజకీయ పార్టీల నేతలు, వారిద్రోహాలు, అధికార దాహాల గురించి జనంలో ఉన్న అసంతృప్తి, ఆగ్రహాలకు ఇది నిదర్శనం, గళమెత్తాలని కోరటం తప్ప మరొకటి కాదు. ఏకనాధ్‌ షిండే అనుచరులుగా ఉన్నవారు విధ్వంసకాండకు పాల్పడ్డారు తప్ప, మానేతను అంటారా అని సామాన్య జనం వీధులకు ఎక్కినట్లు ఎక్కడా వార్తలు రాలేదు. కునాల్‌ పరోక్షంగా చతురోక్తులు వేసిన వారిలో ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ, అంతకంటే శక్తివంతుడిగా పేరున్న అమిత్‌ షా కూడా ఉన్నారు. బాద్‌షా బాద్‌షా అనే సినిమా పాటను అనుకరించి హాస్యం పండిరచాడు. మిస్టర్‌ ఇండియా సినిమాలోని హవా హవాయి పాటకు పేరడీతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మీద కూడా సెటైర్లు వేస్తూ వీడియోను తాజాగా విడుదల చేశాడు.సినిమా హాళ్లలో అమ్మే పాప్‌ కార్న్‌( మొక్క జొన్న పేలాలు) మీద వివిధ రకాల జిఎస్‌టిలను విధిస్తూ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కుమ్రా బాంకు ఖాతాలు, వాటి లావాదేవీల గురించి తనిఖీలు, విచారణలు తప్ప వారి అభిమానులు గూండాయిజానికి పాల్పడిన ఉదంతాలేవీ ఇంతవరకు నమోదు కాలేదు.


గతంలో కొందరు రాజకీయ నేతల రూపలావణ్యాలతో చిత్రించిన పాత్రలతో సినిమాలు వచ్చాయి. అంతెందుకు కునాల్‌ కమ్రాను విమర్శించిన బిజెపి ఎంపీ కంగన రనౌత్‌ నిర్మించి స్వయంగా నటించిన ఎమర్జన్సీ సినిమా ఇందిరా గాంధీని విమర్శించటానికి తప్ప మరొకందుకు కాదు. కానీ ఆమె కునాల్‌ కమ్రాకు నీతులు చెబుతున్నారు. ఎమర్జన్సీ సినిమాలో తమ సామాజిక తరగతిని కించపరిచారు, చరిత్రను వక్రీకరించారంటూ సిక్కులు సినిమా థియేటర్ల ముందు ప్రజాస్వామిక పద్దతుల్లో నిరసన తెలిపారు తప్ప వాటి మీద, లేదా సినిమా నిర్మించిన స్టూడియోల మీద దాడులు చేయలేదు. కానీ పద్మావత్‌ సినిమా విడుదల సమయంలో అలాంటి దాడులు జరిగాయి. సినిమాల ద్వారా సెటైర్లు వేయటం కొత్త కాదు. ప్రఖ్యాత చార్లీ చాప్లిన్‌ గ్రేట్‌ డిక్టేటర్‌ పేరుతో హిట్లర్‌ మీద తీసిన సినిమా గురించి తెలిసిందే. పూర్వపు సోవియట్‌ కెజిబి ఏజంట్లను వెర్రి వెంగళప్పలుగా, సిఐఏ వారిని ఎంతో తెలివితేటలు కలిగిన వారిగా చిత్రించిన సినిమాలు అనేకం, అలాగే కమ్యూనిస్టులను దుర్మార్గులుగా రూపొందించినవీ తెలిసిందే. తెలుగులో రాజకీయ కారణాలతో అలాంటి సినిమాలు రాలేదా ! కానీ తమకు నచ్చని భావజాలం, వార్తలు, కార్టూన్లు, కామెడీ, సినిమాల మీద దాడి చేయటం దుర్మార్గం.


తమకు నచ్చని రచనలు చేసినందుకు, విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న రోజులివి. కేసులు కూడా పెడుతున్నారు. పార్టీ ఫిరాయించిన వారందరికీ పెడుతున్న ముద్దు పేరు ద్రోహి అనే కదా ! నైజాం నవాబును వ్యతిరేకించిన జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ను నైజాం గూండాలు కాల్చిచంపి, కసి తీరక రచనలు చేసే కుడిచేతిని నరికిన దుర్మార్గం చరిత్రలో చెరిగి పోదు. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన కన్నడ నటి, నిర్మాత స్నేహలతా రెడ్డిని నాటి కాంగ్రెస్‌ పాలకుల బరోడా డైనమెట్‌ అనే తప్పుడు కేసులో ఇరికించి జైల్లో చిత్రహింసలు పెట్టారు, దాంతో ఆమె ఆరోగ్యం దెబ్బతినటంతో విడుదల చేసిన ఐదు రోజులకే ఆమె కన్నుమూశారు.హేతువాదులు, వామపక్ష పవాదులుగా ఉన్న నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, జర్నలిస్టుగా ఉన్న గౌరీ లంకేష్‌, మేథావి, రచయిత కులుబుర్గిని మతోన్మాదులు మన కళ్ల ముందే బలితీసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా పిరికిబారకుండా తాను నమ్మిన, తగినవి అనుకున్న ఇతివృత్తాలతో కునాల్‌ కమ్రా తన హాస్య కార్యక్రమాలతో అనేక మందితోపాటు, ధోరణులను చీల్చి చెండాడుతున్నారు.తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నారు. ఇలాంటి మూకలను చూసి భయపడి మంచాల కింద దాక్కొనే వాణ్ణి కాదని చెప్పారు. ప్రఖ్యాత కార్టూనిస్టు శంకర్‌ తన కుంచెతో మహాత్మా గాంధీని, జిన్నా, జవహర్‌లాల్‌ నెహ్రూతో సహా ఎవరినీ వదల్లేదు. హిందూస్థాన్‌ టైమ్స్‌ పత్రికలో ఉద్యోగాన్ని వదులుకున్నాడు తప్ప కుంచెపదును తగ్గించుకోలేదు. నన్ను కూడా వదలకుండా కార్టూన్లు వేయి శంకర్‌ అన్న నెహ్రూ వంటి నేతలు పుట్టిన దేశంలో చిన్న పాటి వ్యంగ్యాన్ని కూడా సహించని వారు నేడు రాజకీయాల్లో పెత్తనం చేస్తున్నారు.తన మీద విసిరిన వ్యంగోక్తిని ఏకనాధ్‌ షిండే వదలివేసి ఉంటే కునాల్‌ వీడియో చూసే వారికి మాత్రమే అది పరిమితమై ఉండేది.అనుచరులతో చేయించిన రచ్చతో ఆ ఉదంతానికి ఎంత ప్రాచుర్యం వచ్చిందో చూస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే పాత్ర మరింతగా బహిర్గతమైంది. తనకు తానే పరువును బజారుకు ఈడ్చుకున్నట్లు లేదూ !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంతన్నాడిoతన్నాడే మోడీ తాత : ఘోరంగా విఫలమమైన ‘‘ చైనా ఫ్యాక్టరీల ’’ ఆకర్షక ‘‘ ఆత్మ నిర్భర ’’ పధకం !

23 Sunday Mar 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Aatmanirbhar Bharat, anti china, BJP, china+1, Made in India, Make In India, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు

చైనా నుంచి బయటకు వచ్చే ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలను ఆకర్షించేందుకు, మేకిన్‌, మేడిన్‌ ఇండియా పధకాలను కొనసాగింపుగా అత్మనిర్భరత పధకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఉత్పాదకతతో ముడిపడిన నగదు ప్రోత్సాహక పధకాన్ని (పిఎల్‌ఐ) ప్రధాని నరేంద్రమోడీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. అది ఆశించిన లక్ష్యాలకు సుదూరంగా ఉండటంతో నిలిపివేయాలని నిర్ణయించినట్లు రాయిటర్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. జాతీయ పత్రికలన్నీ ప్రముఖంగా ఈ వార్తను ఇచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పిఐబి ద్వారా ఒక ప్రకటనను విడుదల చేసింది. దాన్ని కొనసాగిస్తున్నట్లు లేదా నిలిపివేస్తున్నట్లుగానీ చెప్పకుండా ఆ పధకం ద్వారా జరిగిందాని గురించి పెద్ద వివరణ ఇచ్చింది. పిఎల్‌ఐ పధకం కింద రు.1.97లక్షల కోట్ల రూపాయలను(డాలర్లలో 23 బిలియన్లు) కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు పక్కన పెట్టింది. ఈ మొత్తాన్ని 2019`20 ఆర్థిక సంవత్సరంతో ప్రారంభించి నాలుగు లేదా ఆరు సంవత్సరాలలో ఉత్పత్తి, ఎగుమతులు చేసే సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని అమలు జరిపితే జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25శాతానికి పెరుగుతుందని చెప్పారు. ఈ పధకాన్ని గతంలో ప్రకటించిన 14పైలట్‌ రంగాలు, నిర్దేశించిన గడువును పొడిగించకూడదని నిర్ణయించినట్లు వార్త. వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ పధకాన్ని సమీక్షించి ఈ మేరకు నిర్ణయించిందని, తనకు అందిన ఆ నివేదిక వెల్లడిరచిందని రాయిటర్స్‌ పేర్కొన్నది. ఈ పధక వైఫల్యం గురించి వ్యాఖ్యానించాలని కోరగా ప్రధాని కార్యాలయం, వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందించలేదని వార్తా సంస్థ పేర్కొన్నది. ఈ పధకాన్ని నిలిపివేసినంత మాత్రాన ఉత్పాదక లక్ష్య్యాలను వదలివేసినట్లు కాదని, ప్రత్యామ్నాయాలను రూపొందిస్తారని ఇద్దరు అధికారులు చెప్పినట్లు కూడా పేర్కొన్నది.కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్న వివరాలు కూడా పిఎల్‌ఐ పథక వైఫల్యాలను నిర్ధారించాయి.


రాయిటర్స్‌ వార్త సారాంశం దిగువ విధంగా ఉంది. యాపిల్‌ ఫోన్లను సరఫరా చేసే ఫాక్స్‌కాన్‌, రిలయన్స్‌తో సహా 750 కంపెనీలు ఈ పధకం కింద రాయితీ పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. పథకం గడువును పెంచాలని అనేక సంస్థలు కోరినప్పటికీ అంగీకరించకూడదని అధికారులు తమ అభిప్రాయాలను సమీక్షలో నమోదు చేశారు. అనేక సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించలేదు. దారిలో ఉన్నవారు కూడా నత్తనడక నడుస్తున్నట్లు తేలింది. 2024 అక్టోబరు నాటికి కొన్ని సంస్థలు 151.93 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తూత్పత్తి చేశాయని, ఇది నిర్దేశిత లక్ష్యంలో 37శాతమే అని తేలింది. ప్రోత్సాహకం కింద పక్కన పెట్టిన 2,300 కోట్ల డాలర్లకు గాను ఇప్పటివరకు సంస్థలకు చెల్లించింది కేవలం 173 కోట్ల డాలర్లు లేదా ఎనిమిది శాతం మాత్రమేనని కూడా తేలింది. ఈ పధకం ప్రారంభించినపుడు ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక ఉత్పాదకత వాటా 15.4శాతం ఉండగా ప్రస్తుతం 14.3శాతానికి పడిపోయింది. పిఎల్‌ఐ పధకం వలన ఔషధ, సెల్‌ఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగినట్లు గతేడాది ప్రభుత్వం సమర్ధించుకుంది. కనీస వృద్ధి లక్ష్యాలను చేరుకోని కారణంగా కొన్ని నమోదైన సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదని సమీక్ష నివేదికలో పేర్కొన్నారు. సోలార్‌ రంగంలో పన్నెండు కంపెనీల నమోదు కాగా వాటిలో రిలయన్స్‌, అదానీ, జెఎస్‌డబ్ల్యుతో సహా ఎనిమిది లక్ష్యాలకు చేరే అవకాశం లేదని 2024 డిసెంబరు సమీక్షలో తేలింది. 2027 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించినదానిలో రిలయన్స్‌ కంపెనీ కూడా 50శాతానికి మించే అవకాశం లేదని వెల్లడైంది. అప్పటికి పధకం గడువు ముగిసిపోతుంది. అదానీ కంపెనీ తయారీకి అవసరమైన పరికరాలనే కొనుగోలు చేయలేదు. పథకం గడువు 2027 తరువాత పొడిగించాలని పునరుత్పాదక ఇంథన మంత్రిత్వశాఖ చేసిన వినతిని వాణిజ్యశాఖ తిరస్కరించింది. అసలు పనిచేయని వారికి లబ్ది చేకూర్చటం తగనిపని అని పేర్కొన్నది. ఉక్కు రంగంలో నమోదైన 58 కంపెనీలలో ఎలాంటి పురోగతి లేని 14ను జాబితా నుంచి తొలగించారు.


రాయిటర్స్‌ వార్త తరువాత శనివారం నాడు పిఐబి విడుదల చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. పిఎల్‌ఐ పధకంతో స్థానిక ఉత్పత్తి పెరిగింది, కొత్త ఉపాధి వచ్చింది, ఎగుమతులకు ప్రోత్సాహం వచ్చింది.2024 నవంబరు నాటికి ప్రోత్సాహక మొత్తం కారణంగా రు.1.61లక్షల కోట్ల పెట్టుబడి రాగా, 14లక్షల కోట్ల మేర ఉత్పత్తి జరిగింది,రు.5.31లక్షల కోట్ల మేర ఎగుమతులు జరిగాయి, 11.5లక్షల ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగాలు వచ్చాయి. పద్నాలుగు రంగాలలో 764 దరఖాస్తులను ఆమోదించగా వాటిలో 176ఎంఎస్‌ఎంఇ సంస్థలున్నాయి. పది రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహక మొత్తం రు.14,020 కోట్లు విడుదల చేశారు. అనేక పరిశ్రమలు అమలు దశలో ఉన్నాయి, తరువాత అవి ప్రోత్సాహకాలకు దరఖాస్తులు చేస్తాయి. ఉక్కు రంగంలో రు.27,106 కోట్ల మేరకు పెట్టుబడులు పెడతామని చెప్పిన కంపెనీలు రు.20వేల కోట్లు పెట్టాయని, తొమ్మిది వేల మందికి ఉపాధి దొరికిందని, ఇప్పటి వరకు 48 కోట్లు ప్రోత్సాహకం ఇచ్చినట్లు, 58 ప్రాజెక్టులకు గాను 14 వెనక్కు తగ్గినట్లు, పిఎల్‌ఐ రెండవ దశలో ఇరవై అయిదు వేల కోట్ల పెట్టుబడులతో 35 కంపెనీలు ఆసక్తి చూపినట్లు పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పినప్పటికీ నాలుగు సంవత్సరాల తరువాత రు.1.97లక్షల కోట్ల సబ్సిడీ మొత్తంలో విడుదల చేసింది రు.14,100 కోట్లే అని స్వయంగా చెప్పిందంటే ఏడుశాతం మొత్తం కూడా ఖర్చు కాలేదు, రాయిటర్స్‌ కథనం వాస్తవమే అని తేలింది. మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత పేర్లతో పదేండ్లుగా కాలక్షేపం చేసినా ఫలితం దక్కలేదు గనుక మరొక పేరుతో ప్రయోగాలు చేస్తారేమో చూడాల్సి ఉంది.


అంతా వారే చేశారని గోబెల్స్‌ను పూజిస్తూ కాంగ్రెస్‌ మీద పదే పదే ప్రచారం చేయటం తప్ప పదేండ్లలో మోడీ ఏం చేశారన్నది ప్రశ్న. సమావేశాల మీద సమావేశాలు, ముసాయిదా విధానాల పేరుతో భారత్‌ కాలక్షేపం చేస్తుండగా చైనా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఒక్క గుండుకూడా పేల్చకుండా, చేయాల్సింది చేస్తోందని బిజినెస్‌ టుడే పత్రిక 2025 మార్చి 22న ఒక కథనాన్ని ప్రచురించింది. వివేక్‌ ఖత్రి అనే చార్టడ్‌ ఎకౌంటెంట్‌, ఇన్ఫ్లుయెన్సర్‌ చేసిన ఎక్స్‌ పోస్టును, అభిప్రాయాలను ఉటంకించింది. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి క్రీడలో ఎలాంటి శబ్దం, పతాకశీర్షికలు లేకుండా మౌనంగా భారత్‌ను పక్కకు నెట్టే వ్యూహాన్ని చైనా అనుసరించిందని అతను ఆరోపించాడు. చైనా లక్షకోట్ల డాలర్ల వాణిజ్య మిగులు అంటే కేవలం ఆర్థిక గణాంకం కాదని భూ భౌతిక రాజకీయ అస్త్రమన్నాడు. ప్రపంచ కంపెనీలు చైనా ప్లస్‌ ఒన్‌ అనే వ్యూహంతో బీజింగ్‌ను వెనక్కు నెట్టకుండా హంగరీ, మెక్సికో, మొరాకో, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు చక్కగా చైనాతో చేతులు కలుపుతున్నాయని, చైనాతో పోటీ లేని ఉత్పాదక వాతావరణంలో ఉదారంతో విదేశీ పెట్టుబడులను పొందుతున్నాయని వివేక్‌ ఖత్రి పేర్కొన్నాడు.


భారత్‌ను ఎదగనీయకుండా చైనా చూస్తున్నదని వివేక్‌ వంటి వారు చెప్పటం ఆడలేక మద్దెల ఓడు అనటం తప్ప మరొకటి కాదు. భారత పరిశ్రమలకు అవసరమైన కీలక విద్యుత్‌ వాహనాల విడిభాగాలు, సోలార్‌ మాడ్యూల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పతికి అవసరమైన పరికరాలను చైనా అడ్డుకుంటున్నదని, భారత సరఫరా గొలుసు సామర్ద్యాన్ని నిర్మించకుండా తన కార్పొరేట్లను నిరోధిస్తూ ఫాక్స్‌కాన్‌,బివైడి కంపెనీల విస్తరణను నిరుత్సాహపరుస్తున్నదని వివేక్‌ ఖత్రి ఆరోపించారు. ప్రపంచ ఐఫోన్‌ ఉత్పత్తిలో నాలుగో వంతు భారత్‌లో చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 15శాతమే జరుగుతున్నన్నారు. భారత్‌ 26 బిలియన్‌ డాలర్ల విలువగల ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతి చేస్తుండగా వియత్నాం 126 బిలియన్‌ డాలర్లు చేస్తున్నదని , తైవాన్‌, జపాన్‌ సంస్థలు వెనక్కు పోతున్నట్లు చెప్పారు. జపాన్‌కు చెందిన పదింటిలో ఒక కంపెనీ మాత్రమే భారత్‌లో పెట్టుబులు పెట్టేందుకు చూస్తున్నదని అది కూడా నియంత్రణల సంక్లిష్టత, రెడ్‌టేప్‌, అమలు జరపగలమా లేదా అన్న అనిశ్చితి ఉన్నట్లు చెప్పిందని వెల్లడిరచారు. తక్కువ విలువగల పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను భాగస్వామ్య దేశాలకు అప్పగిస్తూ కీలకమైన, మేథోసంపత్తి హక్కులున్నవాటిని చైనా అట్టిపెట్టుకుంటున్నదని, దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద మొరాకో నుంచి మెక్సికో వరకు పారిశ్రామిక నడవాలను నిర్మిస్తున్నదని, తన అవసరాలకు అనుగుణంగా ప్రపంచీకరణను మలుచుకుంటున్నదని ఖత్రి విమర్శించారు.


భారత్‌ ముందుకు పోతుంటే అడ్డుకుంటున్నదని చైనాను నిందించేవారు నిత్యం కనిపిస్తారు. గతంలో చైనాను చక్రబంధం చేస్తే దాన్నుంచి బయటపడేందుకు అది అనుసరించిన విధానాలు తప్ప ప్రత్యేకించి ఎవరూ చేయూతనిచ్చి పైకి లేపలేదు. ధనిక దేశాలు తమ వద్ద మూలుగుతున్న పెట్టుబడులను అలాగే ఉంచుకుంటే వడ్డీ కూడా రాని స్థితిలో చైనాలో పెట్టుబడులు పెట్టాయి తప్ప కమ్యూనిస్టుల మీద ప్రేమతో కాదు.జపాన్‌లో ఎవరన్నా డబ్బుదాచుకోవాలంటే బ్యాంకులకు ఎదురు చెల్లించాలి తప్ప ఎలాంటి వడ్డీ ఉండదు.ధనిక దేశాల్లో శ్రామికులకు ఎక్కువ మొత్తాలు వేతనాలు చెల్లించాలి, చైనాలో జనాభా ఎక్కువ గనుక చౌకగా పనిచేయించుకొని ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాలని అవే ధనికదేశాలు చూశాయి. తమ జనానికి పని చూపాలి, అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు కావాలి గనుక చైనా సంస్కరణల బాట పట్టి నేటి స్థితికి ఎదిగింది, దానికి అది అనుసరించిన స్థిరమైన, విశ్వసనీయమైన విధానాలే కారణం. ఆత్మనిర్భరత పేరుతో రెండు లక్షల కోట్ల నగదు ప్రోత్సాహం ఇస్తామన్నా కంపెనీలు ఎందుకు రాలేదో, వచ్చినవి ఎందుకు ఉత్పత్తిచేయలేదో ఆలోచించాల్సిందిపోయి, చైనా అడ్డుకున్నదని చెబితే కుదురుతుందా !


ఇప్పటికీ చైనా గురించి అనేక అతిశయోక్తులు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. చౌకరకం వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేస్తుందన్నది వాటిలో ఒకటి. అలాంటి వస్తువులను దిగుమతి చేసుకోవటంలో నరేంద్రమోడీ రికార్డులను బద్దలు కొట్టారు, అమెరికా, ఐరోపా దేశాలకు అవి లేకపోతే రోజు గడవదు. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నట్లు ? మరోవైపు చైనా మీద పడి ఎందుకు ఏడుస్తున్నట్లు ? చైనా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని, అక్కడి నుంచి విదేశీ పరిశ్రమలు, కంపెనీలు బయటకు వెళుతున్నాయని, అవి హిమాలయాలను దాటి భారత్‌ వస్తున్నట్లుగా అనేక మంది చిత్రించారు. కరోనా తరువాత అతిశయోక్తులు ఎన్నో. ఏ ఒక్కటీ నిజం కాలేదు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ ఇంతటి అభివృద్ధి సాధించలేదని బిజెపి ఐటి సెల్‌ అధినేత అమిత్‌ మాలవీయ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా చెప్పారు. 2004మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు ఎక్కువని చెబుతారు. అబద్దాలలో పుట్టి అబద్దాలలో పెరుగుతున్నవారు తప్ప ఇలాంటి తప్పుడు ప్రకటనలు మరొకరు చేయరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d