• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Political Parties

కన్వర్‌ యాత్ర నిబంధనలకు సుప్రీం కోర్టు బ్రేక్‌, బిజెపి హిందూత్వకు ఎదురుదెబ్బ, దళితులతో ముందు ముంత వెనుక చీపురు కట్టించినా ఆశ్చర్యం లేదు !

22 Monday Jul 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Hinduthwa, Kangana ranaut, Kanwar Yatra, Narendra Modi Failures, RSS, Sonu Sood, Supreme Court, Yogi Adityanath


ఎం కోటేశ్వరరావు


జూలై 22 నుంచి ఆగస్టు ఆరు వరకు జరిపే కన్వర్‌-కావడి యాత్రల సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌ ప్రభుత్వాలు జారీ చేసిన వివాదాస్పద ఉత్తరువు అమలును సోమవారం నాడు సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది బిజెపి హిందూత్వ అజెండాకు ఎదురు దెబ్బ యాత్రలు జరిగే దారిలో ఉన్న దుకాణాలు,హౌటళ్ల, పానీయాల దుకాణాల యజమానుల పేర్లను సంస్థల ముందు ప్రదర్శించాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. వాటిలో హలాల్‌ ధృవీకరణ పత్రం ఉన్న పదార్థాలను విక్రయించరాదని కూడా పేర్కొన్నారు. యాత్రల పవిత్రతను కాపాడేందుకు అని చెబుతున్నప్పటికీ అధికారిక ఉత్తరువుల్లో శాంతి భద్రతలను సాకుగా చూపారు. ఈ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం పేర్ల ప్రదర్శనకు బ్రేకు పడింది. అయితే ఆహార పదార్ధాల స్వభావాన్ని వినియోగదారులకు ప్రదర్శించాలని కోర్టు పేర్కొన్నది. పోలీసులు తీసుకున్న చర్యలతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని, సామాజికంగా వెనుకబడిన తరగతులు, మైనారిటీలను ఆర్థికంగా విడదీస్తుందని పిటీషనర్ల తరఫున వాదించిన సియు సింగ్‌ చెప్పారు. మరో న్యాయవాది అభిషేక్‌ షింఘ్వి తన వాదనలను వినిపిస్తూ ” నేను గనుక పేరును ప్రదర్శించకపోతే నన్ను మినహాయిస్తారు, నేను పేరును ప్రదర్శించినా మినహాయిస్తారని ” చెప్పారు. అయ్యప్ప, భవానీ వంటి దీక్షలు, కన్వర్‌(కావడి) యాత్ర వంటివి జనాల వ్యక్తిగత అంశాలు. ఇష్టమైన వారు పాటిస్తారు, కాని వారు దూరంగా ఉంటారు. వీరంతా నాస్తికులని గానీ పాటించేవారే పరమ ఆస్తికులని గానీ నిర్ధారించటానికి, ముద్రవేసేందుకు ఎవరికీ హక్కులేదు.పౌరహక్కుల పరిరక్షణ సంస్థ(ఎపిసిఆర్‌) పేరుతో ఉన్న ఒక స్వచ్చంద సంస్థ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టు తలుపుతట్టింది.న్యాయమూర్తులు హృషికేష్‌ రారు, ఎస్‌విఎన్‌ భట్‌ ధర్మాసనం సోమవారం నాడు విచారించింది. ప్రభుత్వ ఉత్తరువుల కారణంగా దుకాణాల యజమానుల మతపరమైన గుర్తింపు వెల్లడి కావటమేగాక ముస్లిం మతానికి చెందిన దుకాణాల యజమానుల పట్ల వివక్ష ప్రదర్శించటమే అని పిటీషన్‌లో పేర్కొన్నారు.ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంటూ, తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని అధికారపక్షానికి స్పష్టం చేశాయి. కోర్టు ఆదేశాలతో దీని మీద చర్చ జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.


బిజెపి మిత్రపక్షాలుగా ఉన్న జెడియు, ఎల్‌జెపి, ఆర్‌ఎల్‌డి పార్టీలు ఇలాంటి ఉత్తరువులు తగవని వ్యతిరేకతను వెల్లడించినా బిజెపి ఖాతరు చేయ లేదు. జనాలను మత ప్రాతిపదికన చీల్చే, ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అజండాను అమలు జరిపేందుకే పూనుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు తాజా పరిణామాల వెనుక ఉన్న కుట్రలేమిటి, ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా, ఆందోళనకరంగా మారింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఆయోధ్యతో సహా అనేక చోట్ల చావుదెబ్బతిన్నది. దీనికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కారణమంటూ కేంద్ర పెద్దల మద్దతుతో బిజెపి స్థానిక నేతలు ధ్వజమెత్తటమే కాదు, నాయకత్వ మార్పు జరగాలని కోరుతున్నారు. మరోవైపున దానికి ప్రతిగా యోగి కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వాటిలో కన్వర్‌ యాత్రల ఆదేశం ఒకటి. శివలింగం మీద తేలును చెప్పుతో కొట్టలేరు, చేతితో తొలగించలేరు అన్నట్లుగా కేంద్ర బిజెపి నాయకత్వం ముందు పరిస్థితి ఉంది. ఇంతకూ ఈ యాత్రీకులు చేసేదేమిటి ? శ్రావణమాసంలో పవిత్ర జలం పేరుతో గంగా నది నుంచి నీరు తెచ్చి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో అభిషేకం చేసి శివుని కృపకు పాత్రులౌతామనే నమ్మకాన్ని వెల్లడిస్తారు. జూలై 22 నుంచి ఆగస్టు ఆరవ తేదీ మధ్య హరిద్వార్‌ వద్ద ఉన్న గంగానది నుంచి తెచ్చే నీటి పాత్రలను కావళ్లలో పెట్టి తీసుకువస్తారు గనుక దీనికి కావడి యాత్ర అనే పేరు వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి వేర్వేరు మార్గాల్లో భక్తులు హరిద్వార్‌ వస్తారు. ఈ మార్గాల్లో యాత్రీకుల కోసం వస్తువుల దుకాణాలు, ఆహార పదార్దాల హౌటళ్లు. దాబాలు, బండ్లు ఏర్పాటు చేస్తారు. కాలినడకన, మోటారు వాహనాలు ఇలా ఎవరికి వీలైన పద్దతుల్లో వారు ఈ యాత్రలో పాల్గొంటారు. 1980దశకం వరకు చాలా పరిమితంగా జరిగే ఈ క్రతువును క్రమంగా పెద్ద కార్యక్రమంగా మార్చారు. అయ్యప్ప దీక్షలకు పోటీగా అనేక దీక్షలను తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా అలాంటిదే.


దుకాణాలు, హౌటళ్ల ముందు యజమానుల పేర్లకు బదులు ” మానవత్వం ” అని ప్రదర్శించాలని ప్రముఖ నటుడు సోనూ సూద్‌ ఎక్స్‌లో సూచన చేశారు.దీని మీద బాలీవుడ్‌ హీరోయిన్‌, బిజెపి లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్‌ స్పందిస్తూ ఉమ్మిన ఆహారం, ఆపని చేసేవారిని సమర్ధించటమే ఇదంటూ ధ్వజమెత్తారు. ముస్లింలు తయారు చేసే ఆహారం, విక్రయించే పండ్లు మొదలైన వాటి మీద ఉమ్ముతారని, హలాల్‌ చేస్తారని,అపవిత్రమైన వాటిని హిందువులు బహిష్కరించాలని, హిందువుల పవిత్ర స్థలాలు, గుడులు గోపురాలు ఉన్న ప్రాంతాలలో ముస్లింల దుకాణాలను అనుమతించరాదని, ఇప్పటికే ఉంటే ఎత్తివేయాలని హిందూత్వ సంస్థలు ఎప్పటి నుంచో రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. సాధారణ పౌరులెవరూ వాటిని పట్టించుకోవటం లేదన్నది కూడా ఎరిగిందే. అయోధ్యలో రామాలయం పేరుతో యోగి సర్కార్‌ బుల్డోజర్లతో కూలదోయించిన కట్టడాల్లో హిందువులవి కూడా ఉన్నాయి. అందుకే అక్కడ బిజెపికి వ్యతిరేకంగా ఓటువేయటం, అభ్యర్థి ఓటమి తెలిసిందే. పాలస్తీనాలో అరబ్బులపై దాడులు, మారణకాండ, స్వతంత్ర దేశ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్‌ ఉత్పత్తులను బహిష్కరించాలని ముస్లిం, అరబ్బుదేశాలలో పలు సంస్థలు గతంలో పిలుపునిచ్చాయి. వాటిని కాపీకొట్టిన కాషాయ దళాలు మనదేశంలో ముస్లింల వ్యాపారాలను దెబ్బతీసేందుకు వినియోగిస్తున్నాయి. అరబ్బు దేశాల చమురును బహిష్కరించమని చెప్పేందుకు వారికి నోరురాదు, ఎందుకంటే వారి యాత్రల వాహనాలు నడవాలంటే అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న ఇంథనమే దిక్కు. అక్కడ పవిత్రత గుర్తుకు రాదు.


ఉమ్ముతారని చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. నిజమే అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అనేక బిర్యానీ హౌటళ్లకు, రంజాన్‌ మాసం సందర్భంగా హలీం కోసం ఎగబడేవారిలో ఎక్కువ మంది ముస్లిమేతరులే ఎందుకు ఉంటున్నారు.దుకాణాలలో విక్రయించే వస్తువులు నాణ్యమైనవా కాదా, హౌటళ్లలో వడ్డించే ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది గీటురాయిగా ఉండాలి తప్ప యజమానుల వివరాలు ఎందుకు ? ఒకవేళ ముస్లిం మతానికి చెందిన వారు యజమానులుగా ఉంటే వాటిని బహిష్కరించాలని పరోక్షంగా చెప్పటమే ఇది. పేర్ల ప్రదర్శన ఒక్క ముస్లింలనే దెబ్బతీస్తుందా ? హిందువులను కూడా నష్టపరుస్తుంది.మన సమాజంలో మత విద్వేషమే కాదు, కుల వివక్ష, విద్వేషం కూడా ఎక్కువే, అందునా దేశ ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలలో మరీ ఎక్కువ.దళితులు వివాహాల సందర్భంగా గుర్రాల మీద, ఇతరత్రా ఊరేగింపులు జరపకూడదని, ఎక్క కూడదని దాడులు చేసిన ఉదంతాలు ఎన్ని లేవు.దుకాణాలపై దళితులు, గిరిజనులు, వెనుకబడిన సామాజిక తరగతులకు చెందిన యజమానుల పేర్లను ప్రదర్శిస్తే ముస్లిం దుకాణాల పట్ల అనుసరించే వైఖరినే మనువాద కులాల వారు పాటిస్తారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే అనేక చోట్ల గతంలో ఆర్యవైశ్య బ్రాహ్మణ హౌటల్‌ అని రాసుకొనే వారు. ఇప్పుడు ఇంకా ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉండి ఉండవచ్చు. వాటి స్థానలో రెడ్డి, చౌదరి హౌటల్స్‌ పేరుతో ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తున్నాయి తప్ప ఇతర కులాలను సూచించే హౌటళ్లు ఎక్కడా కనిపించకపోవటానికి సమాజంలో ఇప్పటికీ ఉన్న చిన్న చూపు, వివక్షే కారణం. అదే ముస్లింల విషయానికి వస్తే మతవిద్వేషం. రాఘవేంద్ర,రామా, కృష్ణా, వెంకటేశ్వర విలాస్‌లు తప్ప ఎక్కడైనా అబ్రహాం, ఇబ్రహీం, ఏసుక్రీస్తు,మహమ్మద్‌ ప్రవక్త విలాస్‌లను చూడగలమా ?


ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ యుపి ప్రభుత్వ చర్యను తప్పు పట్టారు. ఒక మతపరమైన యాత్ర సందర్భంగా పోలీసులు జారీ చేసిన ఆదేశాలు దుకాణాలు, హౌటళ్ల యజమానుల పేర్లను ప్రముఖంగా వాటి ముందు రాసి ఉంచాలని చెప్పారు. సమీప భవిష్యత్‌లో ఇది వాహనాలకు సైతం వర్తింప చేస్తారని, గతంలో నాజీ జర్మనీలో కొన్ని దుకాణాలు, ఇండ్లకు ఇలాంటి గుర్తింపును అమలు చేశారని జావేద్‌ అక్తర్‌ ఎక్స్‌లో స్పందించారు.బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ కూడా తప్పు పట్టారు. ఇది అంటరానితనాన్ని ప్రోత్సహించటం తప్పవేరు కాదన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను నేరుగా విమర్శించలేని నక్వీ దీనికి అధికారయంత్రాంగం కారణమని విరుచుకుపడ్డారు. అత్యుత్సాహపరులైన అధికారులే ఇది చేశారన్నారు.సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌, బిఎస్‌పి నాయకురాలు మాయావతి, మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా విమర్శించారు. ఇది సామాజిక నేరమని, కోర్టులు కలగచేసుకొని నివారించాలన్నారు. తొలుత యజమానుల పేర్లను ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు. దాని మీద విమర్శలు రావటంతో కాదు స్వచ్చందంగా చేయాలన్నారు, చివరికి విధిగా ప్రదర్శించాలని నిర్ణయించారు.స్వచ్చందంగా అన్నప్పటికీ అంతిమంగా ఫలితం మతపరమైన గుర్తింపును విధిగా వెల్లడించేట్లు చేయటమే. పేర్లు ప్రదర్శించని హిందువులను కూడా ముస్లింలుగానే భావించేందుకు ఆస్కారం ఉంటుంది. ముస్లింలు పేర్లు రాసుకొని ప్రదర్శిస్తే వారి దగ్గర కొనవద్దని చెప్పేందుకు తప్ప దీనిలో శాంతి భద్రతల సమస్య ఎక్కడుంది. యాత్రికులకు ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకంటూ ముజఫర్‌ నగర్‌ ఎస్‌పి ప్రకటన సాకు మాత్రమే. కావాల్సిన వస్తువు లేదా ఆహారం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తేనేం, దానిలో యాత్రీకులు పడే గందరగోళం ఏమిటి ? దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్లను వేరు చేసేందుకు సృష్టించిన బంటూస్తాన్‌లకు, మనదేశంలో వెలిగా ఉంచిన దళిత వాడలకు, వీటికీ తేడా ఏముంది? దళితవాడల్లో నివశించేందుకు ఎంత మంది దళితేతరులు సిద్దపడుతున్నారు ? ముస్లింలు మెజారిటీగా ఉన్న అనేక ప్రాంతాల్లో ఇతరులు ఇండ్లు కొనేందుకు జంకే ఇతరుల గురించి తెలియని వారెవరు ?


చరిత్రలో మతపరమైన గుర్తింపు చాలా ప్రమాదకరం అని రుజువు చేసింది.మనతో సహా ఆసియా ఉపఖండంలోని దేశాల్లో మతంతో పాటు ఎక్కడా లేని కులపరమైన గుర్తింపు బోనస్‌.మధ్య యుగాల్లో, తరువాత ఇస్లామిక్‌, క్రైస్తవమతాల ఉన్మాదంతో ఇతర మతాల వారు ప్రత్యేక గుర్తులు ధరించాలని ఆదేశించారు. మౌఢ్యం లేదా నిరంకుశత్వం చోటు చేసుకుంది. నాజీ జర్మనీలో యూదు వ్యతిరేకతలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. మహమ్మద్‌ ప్రవక్త మరణం తరువాత అరేబియాలో అధికారానికి వచ్చిన ఖలీఫా రెండవ ఉమర్‌ 717-20 సంవత్సరాలలో ముస్లిమేతరులు ప్రత్యేక చిహ్నాలను ధరించాలని తొలిసారిగా ఆదేశించినట్లు వికీపీడియా సమాచారం తెలుపుతోంది. నేటి ఇటలీలోని సిసిలీ ప్రాంతంలో రాజ్యాధికారం చలాయించిన అరబ్‌ రాజవంశం అగలాబిద్‌ 887-88లో యూదులు తమ ఇండ్లకు గాడిదలను చిత్రించిన వస్త్రాలను వేలాడదీయాలని, పసుపు పచ్చ బెల్టులు, టోపీలు ధరించాలని ఆదేశించింది. తరువాత 1,212లో మూడవ పోప్‌ ఇన్నోసెంట్‌ ప్రతి క్రైస్తవ ప్రాంతంలో గుర్తించేందుకు వీలుగా యూదులు ప్రత్యేక చిహ్నాలను ధరించాలని ఆదేశించాడు. ప్రష్యాలో 1,710లో అధికారంలో ఉన్న ఒకటవ ఫెడరిక్‌ విలియమ్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం యూదులు ప్రత్యేక చిహ్నాలను ధరించనవసరం లేదు.అయితే అలా ఉండాలంటే ఎనిమిదివేల వెండి నాణాల నగదు చెల్లించాలని షరతు పెట్టాడు. తరువాత రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా జర్మనీలో నాజీ పాలకులు యూదులను గుర్తించేందుకు డేవిడ్‌ బొమ్మ ఉన్న ఏదో ఒక రంగు గుర్తును ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.హిట్లర్‌ యంత్రాంగం కొత్త ఆదేశాలను జారీచేసి యూదుల ఇండ్ల ముఖద్వారాలకు గుర్తులు వేయాలని ఆదేశించింది. అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఇలాంటి గుర్తింపు ఆదేశాలను అమలు చేశారు. హంగరీ ఆక్రమణ తరువాత యూదుల పౌరసత్వాలను రద్దు చేసి వారంతా ప్రత్యేక గుర్తులను ధరించాలని ఆదేశించారు.ఇక వర్తమానంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు 1996-2001 మధ్య తమదేశంలో ఉండే హిందువులు పసుపుపచ్చ గుర్తున్న బాడ్జ్‌లను ధరించాలని, వేధింపులకు గురికాకుండా ఉండేందుకు హిందూ మహిళలు బురఖాలు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కన్వర్‌ యాత్రీకులు గందరగోళపడకుండా ఉండేందుకు, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అనే పేరుతో దుకాణాల యజమానులు తమ పేర్లను ప్రముఖంగా రాసి ప్రదర్శించాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఆకుపచ్చ తాలిబాన్లకు కాషాయ తాలిబాన్లకు పద్దతి తప్ప ఇతరంగా తేడా ఏమిటి ? యోగి సర్కార్‌ ఉత్తరువులు ముస్లింల కోసమేనని,మనకేంటి అని ఇతరులు ఎవరైనా భావిస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. చరిత్రను చూసినపుడు సనాతనం లేదా మనువాదం కారణంగా దళితులకు ఇతరుల వాడల్లో ప్రవేశం నిషేధించారు, ఒకవేళ అనుమతిస్తే ఉమ్మివేయకుండా మెడలో ముంత ధరించాలని, వీపులకు చీపుర్లు కట్టుకొని ఊడ్చుకుంటూ నడిపించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. ఇప్పుడు కన్వర్‌ మరోపేరుతో మతవిద్వేషం రెచ్చగొడుతున్నవారు మనువాదుల వారసులే. సనాతనాన్ని అమలు జరపాలని కోరేశక్తులకు ప్రతిఘటన లేకపోతే దళితులకు ముంతలు, చీపుర్లే గతి, వెనుకబడిన తరగతులు తిరిగి కులవృత్తులకు పోవాల్సిందే ! కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి క్రమశిక్షణ నేతి బీరలో నెయ్యి : మఠం దారిలో యోగి ఆదిత్యనాథ్‌, పావులు కదుపుతున్న మో-షా !!

20 Saturday Jul 2024

Posted by raomk in BJP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Others, Political Parties

≈ Leave a comment

Tags

Amit Shah, BJP, CM Yogi Adityanath, Modi vs Yogi, Narendra Modi Failures, RSS, Rumblings in Uttar Pradesh BJP, UP BJP poll fate


ఎం కోటేశ్వరరావు


లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి దిమ్మతిరిగింది. గుండెకాయ వంటి ఉత్తర ప్రదేశ్‌లో చెప్పుకోలేని చోట దెబ్బ తగిలింది. దీంతో పార్టీలో చదరంగం, వైకుంఠపాళీ క్రీడలు ప్రారంభమయ్యాయి. దీన్ని అవకాశంగా తీసుకొని సమాజవాది పార్టీ తన తురుపు ముక్కను ప్రయోగించింది. ఎవరైనా వంద మంది ఎంఎల్‌ఏలతో బిజెపి నుంచి వెలుపలికి వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తామని, ఇది వర్షాకాల ధమాకా అని ప్రతిపక్ష నేత అఖిలేష్‌ యాదవ్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఆ రాష్ట్రంలోని 80లోక్‌సభ స్థానాలకు గాను బిజెపికి 2014లో 72, గత ఎన్నికల్లో 62రాగా ఇప్పుడు 33కు పడిపోయాయి. సమాజవాది పార్టీకి 37,దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు ఆరు స్థానాలు వచ్చాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. యోగిని తప్పించి తిరిగి గోరఖ్‌పూర్‌ మఠానికి పంపేందుకు నరేంద్రమోడీ, అమిత్‌ షా పూనుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. రకరకాల కథనాలను ప్రచారంలో పెట్టారు. మరోవైపు పార్టీ, ప్రభుత్వం మొత్తం తన వెనుకే ఉందని చూపేందుకు యోగి వరుసగా సమావేశాలు జరుపుతూ బల ప్రదర్శనకు పూనుకున్నారు.బిజెపి స్వయం ప్రకటిత నిబంధనల ప్రకారం 75 సంవత్సరాలు దాటిన వారు ముఖ్యమైన పదవుల్లో ఉండకూడదు.ఆ సాకుతో అద్వానీని ప్రధాని పదవికి దూరంగా పెట్టారు. ఇప్పుడు నరేంద్రమోడీ వంతు వచ్చింది. ఆ స్థానంలో తదుపరి యోగి ఆదిత్యనాధ్‌ ఉంటారని ఒక ప్రచారం కాగా నితిన్‌ గడ్కరీ పేరు మరోవైపు నుంచి వినిపిస్తున్నది. అమిత్‌ షా ప్రయత్నం సరేసరి. తన పుట్టుక మామూలుగా జరగలేదని, దైవాంశతో జన్మించిన కారణంగానే తనకు శక్తి వస్తున్నదంటూ వయస్సు వచ్చినా గద్దె దిగేది లేదన్నట్లు మోడీ తెగేసి చెప్పారు. ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్‌ ఓటమికి యోగిని బాధ్యుడిగా చేసి ఒకవేళ ప్రధానిగా అమిత్‌ షాకు అవకాశం వస్తే అడ్డుతొలిగించుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని చూస్తున్నట్లుకూడా చెబుతున్నారు. దేన్నీ కాదనలేని స్థితి. మొత్తం మీద మిగతా పార్టీలకూ బిజెపికీ పెద్ద తేడాలేదని జనాల కళ్లు తెరిపిస్తున్నారు.


ఇతర పార్టీల వ్యవహారాల్లో వేలుపెట్టి కెలుకుతున్న బిజెపి నేతలు ఇప్పుడు స్వంత పార్టీలోనే చేస్తున్నారని అఖిలేష్‌ యాదవ్‌ ఊరికే అనలేదు. ఉత్తర ప్రదేశ్‌లో అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌తో సహా అనేక కీలక నియోజకవర్గాలలో బిజెపి మట్టికరచింది. నరేంద్రమోడీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో గతంలో వచ్చిన మెజారిటీ 4.79లక్షల నుంచి 1.52లక్షలకు దిగజారింది. తమను ఓట్ల రొంపిలోకి లాగటం ఏమిటని అటు రాముడు, ఇటు కాశీ విశ్వనాధుడు కన్నెర్ర చేసినట్లు స్పష్టమైంది. అంతా మీరే చేశారు, అన్నింటికీ మీరే కారణం అన్నట్లుగా ఓటమి కారణాలను యోగి మీదకు నెట్టేందుకు పావులు కదుపుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తన ప్రమేయం లేదని యోగి చెబుతున్నారు. నిజానికి యోగి పేరుకు సర్వసంగ పరిత్యాగి తప్ప అతగాడి వెనుక బలమైన రాజపుత్ర ఠాకూర్‌ సామాజిక తరగతి ఉంది. ఓసిలలో బ్రాహ్మణులు, యాదవుల తరువాత ఎనిమిది శాతంతో వీరిదే పెద్ద సంఖ్య. ఆర్థికంగా బలమైన తరగతి. బ్రాహ్మణులు-ఠాకూర్ల మధ్య వైరం ఎప్పటి నుంచో ఉంది. నరేంద్రమోడీ ఈ సామాజిక తరగతులను పక్కన పెట్టి వెనుకబడిన తరగతులను ముందుకు తెచ్చి తనదైన ఓటు బాంకు ఏర్పాటుకు పూనుకున్నారు. నిజానికి ఈ రాష్ట్ర బిజెపిలో ఎప్పటి నుంచో కుమ్ములాటలు ఉన్నాయి.లోక్‌సభ ఎన్నికల తరువాత యోగిని ఇంటికి పంపుతారన్న ప్రచారం ముందే ఉంది. మూడోసారి మోడీ గెలిస్తే యోగికి మూడినట్లే అనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఎన్నికలలో చావు దెబ్బతినటంతో యోగి వ్యతిరేకులకు, అనుకూలురకు కూడా మంచి ఊపు వచ్చింది. బిజెపిలో కించపరిచే పదజాలం ఒక్క ముస్లింలకే పరిమితం కాదు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నియోజకవర్గ అభ్యర్థి, కాబినెట్‌ మంత్రి పురుషోత్తం రూపాలా రాజపుత్రుల మీద విరుచుకుపడ్డారు. రోటీ బేటీ కా సాత్‌ – రాజపుత్రులు బ్రిటీష్‌ వారికి వారి కుమార్తెలనిచ్చి వివాహాలు చేశారని, బ్రిటీష్‌ వారితో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. ఇది గుజరాత్‌తో పాటు ఉత్తర భారతంలో రాజపుత్రులున్న చోటల్లా వారికి కాలింది. మధ్య ప్రదేశ్‌లో ఠాకూర్లను పక్కన పెట్టినట్లుగానే ఉత్తర ప్రదేశ్‌లో వికె సింగ్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌ వంటి కీలక నేతలను ఇంటికి పంపారు. రక్షణ మంత్రిగా ఉన్నప్పటికీ రాజనాధ్‌ సింగ్‌ను కూడా పక్కన పెట్టినట్లుగానే భావిస్తున్నారు. ఆ కారణంగానే ఎక్కడా పెద్దగా మాట్లాడరు. ఆగ్రహంతో ఉన్న ఠాకూర్లను బుజ్జగించేందుకు అధిష్టానం ఇప్పుడు రాజనాధ్‌ను ఎంచుకుందని వార్తలు వచ్చాయి. వారిని సంతుష్టీకరించే ప్రక్రియలో భాగంగా అమిత్‌ షా ఇప్పటికే కొందరు నేతలతో రహస్యమంతనాలు జరిపారు. ఠాకూర్లలో పలుకుబడి కలిగిన రాజా భయ్యాను చేరదీసి వారిలో చీలిక తెచ్చి ఠాకూర్లను విస్మరించలేదనే సందేశంతో యోగికి పోటీ నేతగా ముందుకు తెచ్చే ఎత్తుగడ దీనిలో ఉంది. ఈ పరిణామం మీద ఆ సామాజిక తరగతి ఎలా స్పందించేదీ చూడాల్సి ఉంది. దీంతో యోగిని సాగనంపటం ఎలా అన్నది ఆసక్తికరంగా మారింది.
శాసనసభలో పది స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.వాటిలో మిత్రపక్షాలకు ఒక్కటి కూడా ఇవ్వకుండా బిజెపి ఒక్కటే బరిలో ఉండాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. వీటిలో ఐదు స్థానాలు సమాజవాది పార్టీ, నాలుగు బిజెపి, ఒకటి ఆర్‌ఎల్‌డి గతంలో గెలిచినవే.వీటిలో బిజెపి దెబ్బతింటే దానికి బాధ్యత యోగీదే అని చెప్పేందుకు ప్రత్యర్ధులు సిద్దం అవుతున్నారు. ఇటీవల ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పది చోట్ల ఇండియా కూటమి గెలిచింది. ఉత్తర ప్రదేశ్‌లో ఓటమికి యోగి కంటే ప్రధానిగా నరేంద్రమోడీ ఎక్కువగా ఎక్కువగా బాధ్యత వహించాలి.చివరకు తన మెజారిటీ తగ్గటానికి కూడా వేరే వారిని నిందిస్తే కుదరదు. యోగి ఒక్కరే సర్వస్వం కాదు అన్న సందేశం ఇచ్చేందుకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను అధిష్టానం నియమించింది. ప్రతి చిన్న విషయాన్ని ప్రధాని కార్యాలయం నియంత్రిస్తోందనే విమర్శలూ ఉన్నాయి. రాష్ట్ర డిజిపి నియామకంలో తనకు ఇష్టమైన వారిని ఎంచుకొనేందుకు యోగికి అవకాశం ఇవ్వటం లేదు.తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఎంతో వత్తిడితో ఒకరిని నియమించినా తరువాత నలుగురు తాత్కాలిక డిజిపిలు తప్ప శాశ్వత నియామకాలు లేవు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో కూడా అదే జరిగింది.మంత్రివర్గం నుంచి యోగి అనుకూల సూర్య ప్రతాప షాహిని తొలగించి వ్యతిరేకిగా ఉన్న శివ ప్రతాప శుక్లాకు కట్టబెట్టారు. ఒక విధంగా యోగిని పొమ్మనకుండా పొగబెట్టారు.రెండవసారి గెలిచిన తరువాత కూడా అదే జరిగింది. తీవ్రంగా వ్యతిరేకించినా ఇద్దరిని మంత్రులుగా చేర్చారు. వారిలో ఒకరు ఉప ఎన్నికలో ఓడిన తరువాత సమాజవాది పార్టీలో చేరారు. ప్రస్తుతం ఇద్దరిలో ఒకరైన ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్యకు మోడీ, షా మద్దతు ఉందని, అందువల్లనే ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదని తాజాగా ధ్వజమెత్తినట్లు చెబుతున్నారు.పార్టీ కార్యకర్తల బాధ తనకు తెలుసునని మౌర్య అనటాన్ని యోగి మద్దతుదార్లు తప్పుపడుతున్నారు. అతను ఉపముఖ్యమంత్రి కాదా ? కార్యకర్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదా ?అది చేయకుండా ప్రతికూల ప్రచారం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.


తన పదవికి ఎసరు పెడుతున్నారని గ్రహించిన యోగి జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు.ఇంతవరకు ఎక్కడా బహిరంగంగా ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు.తన అనుచరులను రంగంలోకి దించారు. ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదన్న కేశవ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యపై వెంటనే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పార్టీ నేత సునీల్‌ భరాలా స్పందించారు.” ఎన్నికలలో ఎదురుదెబ్బలు, ఓటమికి పార్టీయే కారణమని గౌరవనీయ ఉపముఖ్యమంత్రి కెపి మౌర్య వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.కనుక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నష్టాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలి ” అని ఎక్స్‌ ద్వారా డిమాండ్‌ చేశారు. ఈ పోస్టును తొలగించేందుకు బిజెపి కేంద్ర పెద్దలు తెచ్చిన వత్తిడికి ఇప్పటివరకైతే భరాలా లొంగలేదు. గతంలో పార్టీ ఓడినపుడు కల్‌రాజ్‌ మిశ్రా, వినరుకతియార్‌ రాజీనామా చేశారని కూడా గుర్తుచేశారు. బిజెపి మురికివాడల విభాగపు జాతీయ కన్వీనర్‌గా భరాలా ఉన్నారు.ఇలాంటి వారు అనేక మంది యోగి కనుసైగల కోసం ఎదురు చూస్తున్నారు. తన అనుచరులకు సీట్లు ఇవ్వకపోతే ఏం చేస్తానో చూడండి అన్నట్లుగా యోగి చూపారు. ఆయన కనుసన్నలలో నడిచే హిందూ యువ వాహిని స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఉప ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు వస్తే తనపై వేటు పడుతుందని గ్రహించిన యోగి ఆ నియోజకవర్గాలకు 16 మంది మంత్రులను కేటాయించారు. ఎన్నికలు ముగిసేవరకు వారంలో రెండు రోజులు మంత్రులు అక్కడే మకాం వేయాలని ఆదేశించారు. గెలిస్తే తన ప్రతిభ లేకపోతే మంత్రులు సరిగా పనిచేయలేదని చెబుతారు.


ఆకస్మికంగా ప్రభుత్వం మీద జనాలకు ఆగ్రహం కలిగేందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటంటూ బిజెపి ఎంఎల్‌సి దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సిఎంకు లేఖ రాశారు.రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నందున కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలన్న ఎంఎల్‌ఏ రమేష్‌ మిశ్రా వీడియో వైరల్‌ అవుతోంది.బిజెపి మిత్ర పక్షం నిషాద్‌ నేత సంజరు నిషాద్‌ కూడా యోగిపై ధ్వజమెత్తారు.బుల్డోజర్లను మాఫియాలు, భూ కబ్జాదారులపై ప్రయోగించాలి తప్ప తగిన పత్రాలు లేని పేదల ఇండ్లు కూల్చివేతకు ఉపయోగించరాదని, అలా చేస్తే ఎన్నికల్లో మనలను ఓడించేందుకు వారు సంఘటితం అవుతారని, అనేక ఉదంతాలలో అధికారులు అలాంటి కూల్చివేతలకు పాల్పడ్డారని అన్నారు. అతి విశ్వాసం, ఓట్ల బదిలీ మన అంచనాలను దెబ్బతీశాయి. గతంలో ప్రతిపక్షం వెంటిలేటర్‌ మీద ఉంది, ఇప్పుడు కొంత ప్రాణవాయువు తీసుకుంటున్నదని ఆదిత్యనాథ్‌ చెప్పారు.ఫైజాబాద్‌(ఆయోధ్య ఉన్న నియోజకవర్గం) వంటి గట్టి ప్రాంతాల్లో ఓడిపోవటానికి కొన్ని కులాలు దూరం కావటమే కారణం, ఓబిసి కులాల,దళితుల మద్దతు తిరిగి పొందాలంటే ఓబిసి నేత, ఉపముఖ్యమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఉన్న మౌర్యకు పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుందని యోగి వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.ప్రధాని నరేంద్రమోడీ కొన్ని రౌండ్లలో వెనుకబడిన తీరు చూస్తే నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్లు ఎంతవారైనా ఓడిపోకతప్పదు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో పది స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని, తరువాత యోగికి ఉద్వాసన ఖాయమని చెబుతున్నారు.అధికారం అందరినీ కలిపి ఉంచుతుంది. దానికి ముప్పు సూచనలు కనిపిస్తే అసలు రంగు తెలుస్తుంది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ బిజెపిలో జరుగుతున్న పరిణామాలు దీన్నే వెల్లడిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ఫైల్స్‌ అట్టర్‌ ఫ్లాఫ్‌ : అప్పుల కుప్పలు, ఉత్పత్తిలో కాదు ఉత్తుత్తి కబుర్లలో చైనాతో పోటీ !

18 Thursday Jul 2024

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, India Exports, India Imports, India imports from China, India TRADE BALANCE, Narendra Modi Failures, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


వచ్చే ఏడాది 2025 మార్చి నెలాఖరుకు మన వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బరత్‌వాల్‌ తాజాగా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరలో 778.2బి.డాలర్లు ఉన్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాలలో 200బి.డాలర్ల మేర ఎగుమతులు జరిగినందున ఇదే ధోరణి మిగిలిన తొమ్మిది మాసాల్లో కూడా కొనసాగుతాయన్నది ఆశాభావం మాత్రమే. దిగుమతులు వెయ్యి బిలియన్‌ డాలర్లకు మించే ఉంటాయని కూడా చెప్పవచ్చు. గడచిన పది సంవత్సరాలలో ట్రైలర్‌ మాత్రమే చూపానని అసలైన సినిమా తరువాత ఉంటుందని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా సినీ ప్రేక్షకులను ట్రైలర్లతో ఆకట్టుకొనేందుకు చూస్తారు. ఈ రీత్యా చూసినపుడు ట్రైలర్‌ చూసిన తరువాత జనానికి నచ్చని కారణంగానే లోక్‌సభలో స్వంతంగా మెజారిటీని తెచ్చుకోలేకపోయారు. కూటమిగా కూడా నాలుగు వందల సీట్లకు చాలా దూరంలో ఉన్నారు. ఇక నరేంద్రమోడీ ఫైల్స్‌ అనే సినిమాలో అనేక అంశాలు ఉన్నాయి. ముందుగా విదేశీ అప్పుల గురించి చూద్దాం.
మోడీ గద్దె నెక్కిన 2014లో మన విదేశీ అప్పులు 446.2బిలియన్‌ డాలర్లు. మోడీ కొత్త అప్పులు చేయలేదు, పాత అప్పులు తీర్చారంటూ భక్తులు గొప్పగా దైవాంశ సంభూతుడి మహిమల గురించి ప్రచారం చేశారు.కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 2024 మార్చినెలలో వెల్లడించిన సమాచారం ప్రకారం 2023 డిసెంబరు ఆఖరుకు 648.2బిలియన్‌ డాలర్ల విదేశీ అప్పు ఉంది. అంటే రెండు వందల బిలియన్‌ డాలర్లు పెరిగింది. పాత అప్పు తీర్చితే బకాయి తగ్గాలి, కానీ పెరిగిందంటే కొత్త అప్పులు చేసినట్లే కదా ! దీనికి బాధ్యులెవరు ? మన విదేశీ మారక ద్రవ్య నిల్వ ప్రస్తుతం 657 బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ఉన్నాయి. ఇవి అప్పులకు సరిపోతాయి. మోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది మన విదేశీ వాణిజ్య లోటు 137 బిలియన్‌ డాలర్లు కాగా తాజాగా నెలకు ఇరవై బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ఉంది, అంటే 240బి.డాలర్లు. లోటు తగ్గించలేకపోతే మానే పెత్తనంలో పెంచకూడదనుకుంటారు, కానీ దాదాపు రెట్టింపుకు దగ్గరగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ సమాచారం మేరకు 2023-24లో మన వాణిజ్యలోటు 238 బిలియన్‌ డాలర్లు.దీనిలో మూడోవంతుకు పైగా 85.09బి.డాలర్లు చైనాకే సమర్పించుకున్నాం, కొన్ని వస్తువులను హాంకాంగ్‌ ద్వారా చైనా ఎగుమతులు చేస్తున్నది కనుక దానితో ఉన్న 12.21 బి.డాలర్లను కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. మన విదేశీ మారక నిల్వలు అప్పులకు సరిపడా ఉన్నాయి. ఎగుమతులతో వచ్చే రాబడి దిగుమతులకు చాలటం లేదు, దేశం ముందుకుపోతున్నట్లా వెనక్కు నడుస్తున్నట్లా ? చివరకు లాటిన్‌ అమెరికా దేశాల మాదిరి అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందా ? విదేశాల్లో ప్రతిష్ట, పలుకుబడి, మార్కెట్లను పెంచానంటారు తప్ప అది దేవతా లేదా మాయవస్త్రంలా మామూలోళ్లకు కనిపించటం లేదు.


మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం ప్రకారం 1970లో ఎనిమిది బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ అప్పు నూతన ఆర్థిక విధానాలను అమల్లోకి తెచ్చిన 1990నాటికి 83బి.డాలర్లకు చేరింది. తరువాత పదేండ్లకు 101, 2010 నాటికి 290, నరేంద్రమోడీ అధికారానికి వచ్చేనాటికి 457 బి.డాలర్లకు చేరింది. అప్పటి నుంచి ఐఎంఎఫ్‌ తాజా విశ్లేషణ ప్రకారం 2024 మార్చి నాటికి 681, మరుసటి ఏడాది మార్చికి 748 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది.ఈ సంవత్సరాలలో వార్షిక అప్పు పెరుగుదల శాతాల్లో ఎగుడుదిగుళ్లు ఉండవచ్చు తప్ప మొత్తంగా చూసినపుడు పెరుగుదల ధోరణే ఉంది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ దేశీయ రుణ భారం 58.6లక్షల కోట్ల నుంచి 156.6లక్షల కోట్లకు 174శాతం పెరిగింది.కరోనా కారణంగా ఇంత అప్పు చేశాము, ఉచితంగా వాక్సిన్లు వేశాము అని బిజెపి పెద్దలు చెప్పవచ్చు. ఇన్ని లక్షల కోట్లు దానికే తెచ్చారా ? బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం 2024 మార్చి నాటికి దేశీయ అప్పు రు.164లక్షల కోట్లు, విదేశీ అప్పు 5లక్షల కోట్లు మొత్తం కలిపితే రు.169లక్షల కోట్లకు, 2025 మార్చి ఆఖరుకు 184లక్షల కోట్లకు చేరనుంది.


మన ఎగుమతుల తీరుతెన్నులను చూద్దాం. సిఎంఐఇ సేకరించిన సమాచారం ప్రకారం మన ఎగుమతుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం. బాగా పలుకుబడి పెరిగిందని చెప్పుకున్న కారణంగా జనం రెండోసారి అధికారాన్ని కట్టబెట్టారు. సంవత్సరాల వారీ మొత్తం ఎగుమతుల్లో వస్తువుల శాతాలు ఇలా ఉన్నాయి.
వస్తువులు×××××××2019-20×2020-21×2021-22×2022-23×2023-24
చమురు ఉత్పత్తులు××× 13.2 ××× 8.8 ××× 16.0 ××× 21.6 ××× 19.3
చమురేతర ఉత్పత్తులు×× 86.8 ××× 91.2 ×× 84.0 ××× 78.4 ××× 80.7
వ్యవసాయ ఉత్పత్తులు×× 11.2 ××× 14.2 ×× 11.8 ××× 11.6 ××× 11.0
ఖనిజ ఉత్పత్తులు ×××× 01.5 ××× 02.4 ×× 01.4 ××× 01.1 ××× 01.5
పారిశ్రామికవస్తువులుు×× 73.0 ××× 73.5 ×× 69.8 ×× ×64.3 ××× 66.8
ఎగువన ఉన్న వివరాలు చెబుతున్నదేమిటి ? కరోనా సమయంలో పెద్దగా చర్చ లేకుండా ఎవరూ వ్యతిరేకించరనే ఎత్తుగడతో మూడు సాగు చట్టాలను తీసుకువచ్చినపుడు రైతులకు చెప్పిందేమిటి ? మన వ్యవసాయ ఉత్పత్తులకు పెద్గగా మార్కెట్‌ను పెంచాం, నేరుగా ఎక్కడికైనా ఎగుమతులు చేసుకొనేందుకు వీలుగా ఈ చట్టాలను తీసుకువచ్చామని చెప్పారు.కానీ మన ఉత్పత్తులకు మోడీ చెప్పినంత మార్కెట్‌, ఎగుమతి అవకాశాలు లేని కారణంగానే ఎదుగూబొదుగూ లేకపోవటం లేదా గిడసబారిన తీరు కనిపిస్తోంది.ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ఎగుమతులను పెంచామని తమ జబ్బలను తామే చరుచుకుంటారు. మొత్తం ఎగుమతుల్లో అవి 4.1 నుంచి ఐదేండ్లలో 7.1శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఎగుమతుల ప్రోత్సాహక పథకం వంటి కబుర్లు ఎన్ని చెప్పినా మొత్తం పారిశ్రామిక వస్తువుల ఎగుమతుల వాటా తగ్గుతోంది.మనం ముడి చమురును దిగుమతి చేసుకొని దాన్నుంచి ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేయటం ఒక్కటే పెరుగుతోంది.అది కూడా రష్యా నుంచి చౌకగా దిగుమతులు చేసుకొని ఎగుమతులు పెరిగినందున ఆ మేరకు ఉంది. చమురుకు విదేశాల మీద ఆధారపడటం తగ్గించాలని గద్దెనెక్కగానే చెప్పారు. స్వదేశీ ఉత్పత్తి పెంచుతామన్నారు.2014-15లో మొత్తం దేశీయ ముడిచమురు ఉత్పత్తి 37.46మిలియన్‌ టన్నులు కాగా అదేమి దరిద్రమో పదేండ్లలో 30మి.టన్నులకు పడిపోయింది.దీనిలో 22.6 మిలియన్‌ టన్నులు పనికిరాని వంటూ నిత్యం ఆడిపోసుకొనే ప్రభుత్వ రంగ సంస్థలే చేస్తున్నాయి.రిలయన్స్‌ వంటి ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించేందుకు వాటిని కూడా సరిగా పని చేయనివ్వకుండా చేస్తున్నందున వాటి ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కిందా అంటే ప్రయివేటు కంపెనీలు పొడిచిందేమీ లేదు.


చైనా వృద్ధి రేటు భారత్‌ కంటే ఎంతో తక్కువగా ఉందని,రియలెస్టేట్‌ రంగం సంక్షోభంలో పడిందని, మొత్తం ఆర్థిక వ్యవస్తే కుప్పకూలిపోనుందన్నట్లుగా రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. జూన్‌ మాసంలో మన ఎగుమతులు 2.5శాతం పెరగ్గా, దిగుమతుల వృద్ధి రేటు ఐదు శాతం ఉన్నట్లు వెల్లడించిన తరుణంలోనే చైనా గురించి కూడా వార్తలు వచ్చాయి. రాయిటర్స్‌ విశ్లేషణ ప్రకారం జూన్‌లో చైనా ఎగుమతులు అంచనాలకు మించి జరగ్గా దిగుమతులు తగ్గాయి. ఇలా జరగటం అంటే స్థానిక డిమాండ్‌ తగ్గటం ఆందోళన కలిగించే పరిణామం, గిరాకీని పెంచాలంటే ఉద్దీపన పథకాలను అమలు జరపాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. గడచిన పదిహేను మాసాల్లో ఎగుమతులు జూన్‌లో వేగంగా పెరిగినట్లు కూడా ఆ వార్త పేర్కొన్నది. ప్రపంచంలో డిమాండ్‌ పెరిగిన కారణంగా చైనా ఎగుమతులు 8.6శాతం పెరిగినట్లు జపాన్‌ ఆసియా నికీ డాట్‌కామ్‌ పేర్కొన్నది. చైనా వస్తువుల దిగుమతులను అడ్డుకొనేందుకు అనేక దేశాలు భారీ మొత్తాలలో దిగుమతి పన్నులను విధించినప్పటికీ ఈ పెరుగుదల ఉంది. ఇదే సమయంలో మన వస్తువుల మీద అలాంటి పన్నులు లేకున్నా ఎగుమతులు 2.5శాతానికే ఎందుకు పరిమితం అయినట్లు ? చైనా దిగుమతులు తగ్గినందున గిరాకీ పెంచేందుకు ఉద్దీపన ప్రకటించాలని కోరుతున్నవారు విదేశీ కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప వేరు కాదు. స్వదేశీ వస్తు వినియోగం తగ్గితే ఆందోళన చెందాలి లేదా పెంచటానికి ప్రోత్సాహకాలు ఇస్తే ఏ దేశానికైనా లాభం, గిరాకీ పెరిగితే పరిశ్రమలు పని చేస్తాయి, కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, జనాలకు రాబడి పెరిగితే గిరాకీ పెరుగుతుంది తప్ప విదేశీ వస్తువులకు రాయితీలు ఇస్తే ఆయా దేశాల పరిశ్రమలకు, కార్మికులకు లబ్ది ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్నది అదే.అయితే చైనా దిగుమతుల్లో మూడో వంతు పరికరాలు తిరిగి ఎగుమతి చేసేందుకు ఉద్దేశించిన విడి భాగాలే. ఈ రీత్యా చైనాకు సమస్యలొస్తే వాటిని ఎగుమతి చేసే దేశాలకూ వచ్చినట్లే. కనుక అవి కూడా చైనాతో సంబంధాలను పునరాలోచించుకోవాలి. ఇతర దేశాల ఆంక్షల కారణంగా దిగుమతులకు అవకాశం లేని సెమీ కండక్టర్ల వంటి వాటిని చైనా స్వయంగా తయారు చేసుకోవటం కూడా ప్రారంభించింది. తొలి ఆరు నెలల కాలంలో చైనా ఎగుమతులు 3.6శాతం పెరిగి 1.71లక్షల కోట్ల డాలర్లకు, దిగుమతులు రెండుశాతం పెరిగి 1.27లక్షల కోట్ల డాలర్లకు చేరాయి. వాణిజ్య మిగులు 435బిలియన్‌ డాలర్లు. మన అధికారులు చెప్పినట్లు మొత్తం ఎగుమతులు 800బిలియన్‌ డాలర్లకు పెరిగినప్పటికీ అది చైనా వాణిజ్య మిగులు కంటే తక్కువే.అమెరికా వంటి వ్యతిరేక దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచుకోవటం కంటే అదిరించి బెదిరించి తమ వస్తువులను కొనిపించాలని లేదా చైనాను ఎలా దెబ్బతీయాలా అన్నదాని మీదే ఎక్కువ కేంద్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. అనేక దేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకున్నాయి. చైనా వస్తువుల మీద అవి కేంద్రీకరిస్తున్నప్పటికీ అంతిమంగా ఇతర దేశాల మీద కూడా ఆంక్షలకు పూనుకుంటాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనంతీసుకున్న నిర్ణయాల గురించి అనేక దేశాలు ఎదురు చూస్తున్నాయి.


అధికారానికి వచ్చినప్పటి నుంచీ చైనాను అధిగమిస్తామని, దేశాన్ని ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తామని నరేంద్రమోడీ చెబుతూనే ఉన్నారు. పదేండ్లలో ఒక్క ఏడాదైనా వాణిజ్య మిగులును సాధించలేకపోయారు.మోడీకి పొగడ్తలు తప్ప మన వస్తువులకు మార్కెట్‌లేదు. దిగుమతులు పెరిగినప్పుడు తమ ఘనతే, దేశంలో కొనుగోలు శక్తి పెరగటానికి నిదర్శనం అంటారు.ఎప్పుడైనా తగ్గితే చూశారా దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించాం, విజయం కాదా అంటారు. వాణిజ్య విషయాలకు వస్తే 2022-23తో పోలిస్తే వస్తు ఎగుమతులు 451 నుంచి 437 బి.డాలర్లకు తగ్గగా సేవలు 325 నుంచి 339బి.డాలర్లకు పెరిగాయి.దిగుమతులు 752 నుంచి 677 బి.డాలర్లకు, సేవలు 182 నుంచి 177 బి.డాలర్లకు తగ్గాయి. జిడిపిలో ఐదవ స్థానానికి చేర్చటం తమ ఘనత అని, త్వరలో మూడో స్థానానికి తీసుకుపోతాం అని చెప్పుకుంటున్న మోడీ బృందం వస్తు ఎగుమతుల్లో ఎక్కడ ఉందో ఎందుకు చెప్పదు. గత పది సంవత్సరాల్లో ప్రపంచంలో 19 నుంచి 17వ స్థానానికి ఎగబాకింది. మొదటి స్థానంలో ఉన్న చైనా 3,380 బిలియన్‌ డాలర్ల మేర 2023లో ఎగుమతి చేయగా మనం 432బి.డాలర్ల దగ్గర (స్టాటిస్టా సమాచారం) ఉన్నాం. చివరకు చైనా ఏలుబడిలో 70లక్షలకు పైగా జనాభా ఉన్న హాంకాంగ్‌ 573బి.డాలర్లతో పదవ స్థానంలో ఉంది.చైనాతో పోటీ పడాల్సిందే ! దేనిలో, ఉత్పత్తిలో తప్ప ఉత్తుత్తి కబుర్లలో కాదు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

చికిత్సలేని హిందూత్వ వైరస్‌ – వాళ్లంతే ! అదో టైపు !! ఓటేయని ముస్లింలు, యాదవులను పట్టించుకోరట-ప్రమాణాన్ని ఉల్లంఘించిన కేంద్ర మంత్రి !

14 Sunday Jul 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

#Hindutva, Anti Muslim, Communal Sentiments, Himanta Biswa Sarma, Hindu Rashtra, Hindu Supremacists, Hindutva fanatics, Narendra Modi Failures, RSS, Union Minister Giriraj Singh


ఎం కోటేశ్వరరావు


” ముస్లింలు నాకు ఓటు వేయలేదు.కాబట్టి ఇప్పుడు నేను కూడా వారికోసం పని చేయటం లేదు. నా ప్రాంతంలోని ఒక మౌల్వీ ఒక ఇల్లు, ఉజ్వల గ్యాస్‌, ఐదులక్షల రూపాయల ఆయుష్మాన్‌, మరుగుదొడ్డి, రేషన్‌ కార్డు కూడా పొందాడు. నాకు ఓటు వేసి ఉంటే ప్రమాణం చేసి చెప్పాలని నేను అడిగాను, అతనా పనిచేయలేదు. నా హృదయం ముక్కలైంది. ఇది సనాతన ధర్మాన్ని బలహీన పరిచేందుకు, భారత్‌పై ముస్లిం యుద్ధం (ఘజ్వా ఏ హింద్‌ ) చేసేందుకు పక్కాగా రూపొందించిన ఒక వ్యూహం ” తెల్లారగానే సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌ సుప్రభాతంతో జనాన్ని నిద్రలేపే కారణజన్ముడైన దేవుని బిడ్డ నరేంద్రమోడీ గురించి తెలిసిందే. అలాంటి దైవాంశసంభూతుడి మంత్రివర్గ సభ్యుడైన జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత తాజాగా ఎక్స్‌ ఖాతాలో వెల్లడించిన అభిప్రాయమిది. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రిగా ” నా బాధ్యతలను నమ్మకంగా మరియు మనస్సాక్షిగా నిర్వర్తిస్తాను. మరియు రాజ్యాంగం మరియు చట్ట ప్రకారం అన్ని రకాల ప్రజలకు భయం లేదా అభిమానం, ఆప్యాయత లేదా దురుద్దేశ్యం లేకుండా న్యాయం చేస్తాను ” అని ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రి దాన్ని ఉల్లంఘించారు. ఇందుకు గాను అతగాడిని మంత్రి వర్గం నుంచి ప్రధాని తొలగించాలి, లేదా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాష్ట్రపతి తన బాధ్యతను నిర్వర్తించాలి. ఏదీ జరిగే సూచనలు లేవు.


ఘజ్వా ఏ హింద్‌ అనే పదాన్ని ఇటీవల అనేక మంది ముఖ్యంగా హిందూ-ముస్లిం మతోన్మాదులు, ఉగ్రవాదులు, కొన్ని మీడియా సంస్థల జర్నలిస్టులు రెండు మతాలవారినీ రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్నారు. కొంత మంది ఇస్లామిక్‌ పండితులు దాని అసలు అర్దాన్ని వక్రీకరిస్తున్నారని వివరణ ఇచ్చారు. దాని సారం ఏమిటంటే మహమ్మద్‌ ప్రవక్త ప్రవచనాలకు తప్పుడు భాష్యం చెబుతున్నారు.దానితో విబేధించే పండితులు కూడా ఉన్నారు. క్రైస్తవం మీద తిరుగుబాటులో భాగంగా ఇస్లాం ఉద్భవించింది. క్రీస్తుశకం 530వ సంవత్సరంలో జన్మించిన మహమ్మద్‌ ప్రవక్త 632జూన్‌ ఎనిమిదిన మరణించాడు.ఎవరి భాష్యం ఎలా ఉన్నప్పటికీ నాడు చెప్పిన అంశాలు నేడు వర్తించవన్నది తెలిసిందే. ఈ అంశాలలో హిందూ-ముస్లిం మతశక్తులు బొమ్మా- బొరుసు వంటివి. సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని రెండూ చెబుతున్నాయి. అరబ్బీలో ఘజ్వా అంటే యుద్ధం. భారత ఉపఖండం మీద దాడి చేసి ఇస్లాం భావజాలాన్ని వ్యాపింప చేయాలని ప్రవక్త చెప్పాడని, దాన్ని కొనసాగించాలని ముస్లిం తిరోగమనవాదులు నిత్యం రెచ్చగొడుతుంటారు. ముస్లింలు ఇప్పటికీ ఘజ్వాను వదల్లేదని అందువలన వారి దాడి నుంచి హిందూ లేదా సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ హిందూ తిరోగమన వాదులు పదే పదే దాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు.నిజానికి సనాతనం అంత గొప్పదైతే మరి అంటరానితనం, వివక్షలనే కాన్సర్లు మన సమాజంలో ఎలా విస్తరించాయి ? మహానుభావుడు అంబేద్కర్‌కు సనాతనం గురించి తెలియదా ? పక్కాగా తెలుసు, నాటి సనాతనుల ఆచరణను చూసే దాన్ని వ్యతిరేకించి బౌద్దంలోకి మారిన సంగతి తెలిసిందే.అంటరాని తనంతో సహా అనేక వివక్షలను రుద్దిన మనుస్మృతిని అమలు జరపాలని అంటే దళితులు, గిరిజనులు, వెనుక బడిన తరగతుల వారు బిజెపికి దూరం అవుతారనే భయంతో దాని బదులు సనాతన ధర్మం అనే పల్లవిని అందుకున్నారు. ఇది కూడా ఎంతో కాలం నడవదన్నది వేరే సంగతి.


దానిలో భాగంగానే హిందూ దేవాలయాలు, యాత్రా ప్రాంతాలలో ఉన్న ముస్లింల దుకాణాలను మూసివేయాలి. ముస్లిం పేర్లతోనే ముస్లింలు దాబాలను ఎందుకు తెరవరు ? కన్వర్‌ యాత్రీకులను మోసం చేసేందుకు ముస్లిం దాబాల యజమానులు హిందూ పేర్లు పెడుతున్నారు,పేర్లు ఎందుకు మార్చాలి, దాబాలను ఎందుకు తెరవాలి అంటూ విశ్వహిందూ పరిషత్‌ ప్రశ్నిస్తోంది. సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్థలకు చెందిన వారు, దాని మతోన్మాద వైరస్‌ బారిన పడిన వారు ఇలాంటి విద్వేషాన్ని వెళ్లగక్కటం తెలిసిందే. అఫ్‌ కోర్సు అలాంటి వాటిని అలఓకగా వెల్లడించే వారిలో పేరుమోసిన వ్యక్తి గిరిరాజ్‌ సింగ్‌ అన్నది తెలిసిందే. ఇలా మాట్లాడటం తగదని తన సహచరులకు నరేంద్రమోడీ అంతర్గతంగానైనా చెప్పి ఉంటే గిరిరాజ్‌ సింగ్‌ లాంటి వారు, విశ్వహిందూ పరిషత్‌ వంటి సంస్థలు పదే పదే రెచ్చిపోతాయా ? దైవాంశ సంభూతుడిని తిరస్కరిస్తాయా ? మీరంతా నిమిత్త మాత్రులు, మీతో చెప్పించేది, చేయించేదీ అన్నీ నేనే అనే భగవద్గీత సారం తెలిసిందే. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి…గుడిసెలు అనే సామెత తెలిసిందే కనుక టీకా తాత్పర్యాలు అవసరం లేదు.


మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది గనుకనే నరేంద్రమోడీ మూడవసారి అధికారానికి వచ్చిన తరువాత అమెరికా మత స్వేచ్చ నివేదికలో మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు, విద్వేష ప్రచారం గురించి పేర్కొన్నారు. ప్రతి ఏటా అమెరికా నివేదికల్లో ఈ అంశాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు.వాటిని ఒక వైపు మోడీ సర్కార్‌ ఖండిస్తున్నదీ, తిరస్కరిస్తున్నది. మరోవైపున కాషాయ దళం తనపని తాను చేస్తున్నది. నిజం ఏమిటో మన జనానికి తెలియదా ? మణిపూర్‌లో క్రైస్తవులైన గిరిజన కుకీల మీద జరిగిన దాడులు,హత్యాకాండ, ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన వైనం అక్కడి బిజెపి రాష్ట్ర ప్రభుత్వం దాచినా దాగలేదు.గిరిజనులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలోనే కాదు, చివరకు హిందువులైన మెయితీలు అధికంగా ఉన్న చోట కూడా బిజెపి రెండు చోట్లా తాజా లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరచింది. గిరిరాజ్‌ సింగ్‌ కేంద్ర మంత్రిగా ఎవరి పట్లా వివక్ష చూపనంటూ చేసిన ప్రమాణస్వీకారాన్ని ఉల్లంఘించి మాట్లాడారు గనుకనే ఆ పెద్ద మనిషి గురించి చెప్పుకోవాల్సి వస్తున్నది. ముస్లింలు దుకాణాలు తెరవకూడదు, ఉన్నవాటిని మూసివేయాలంటూ వీరంగం వేసిన అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో హిందువులే మెజారిటీ అయినప్పటికీ అక్కడ బిజెపి ఓడిపోయింది. ప్రతిపక్షాలు గెలిస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని స్వయంగా నరేంద్రమోడీ చెప్పినా అక్కడి జనాలు పట్టించుకోకుండా చెంపదెబ్బ కొట్టినట్లుగా తీర్పు చెప్పారు.


ఆరునెల్లు గడిస్తే వారు వీరవుతారు అన్నట్లుగా బిజెపితో చేతులు కలిపిన ఇతర పార్టీలు కూడా దాని భావజాలాన్ని, విద్వేషాన్ని తలకెక్కించుకుంటున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటు వేయని యాదవులు, ముస్లింల కోసం తాను ఎలాంటి పనులు చేయనని బీహార్‌లోని నితీష్‌ కుమార్‌ పార్టీ జెడియు సీతామరి ఎంపీ దేవేష్‌ చంద్ర ఠాకూర్‌ ఇటీవల ప్రకటించారు. యాదవులు, ముస్లింలు తనవద్దకు వస్తే స్వీట్లు పెట్టి, టీ ఇచ్చి పంపుతాను తప్ప వారికి ఎలాంటి పనులూ చేయనని అన్నారు.హృదయంలో చెలరేగిన భావాలతోనే ఠాకూర్‌ అలా మాట్లాడినట్లు అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అతగాడిని సమర్ధించారు.కేంద్రం, రాష్ట్రం అమలు జరిపిన పధకాలతో లబ్ది పొందిన ముస్లింలు తనకూ ఓట్లు వేయలేదన్నారు. దీనికంతటికీ మంగళసూత్రాలు లాక్కుంటారంటూ ప్రతిపక్షాల మీద ప్రధాని నరేంద్రమోడీ చేసిన తప్పుడు ప్రచారమే కారణని ఆర్‌జెడి విమర్శించింది. ఎంపీలు, ఎంఎల్‌ఏలు నియోజకవర్గాల్లో ఉన్న అందరికీ చెందిన వారు తప్ప ఒక కులం, మతానికో ప్రాతినిధ్యం వహించేవారు కాదని, రాజ్యాంగం మేరకు దేశం నడుస్తున్నది తప్ప కొంత మంది బుర్రల్లో పుట్టినదాని ప్రకారం కాదని పేర్కొన్నది. ఇలాంటి ఎంపీలు, కేంద్ర మంత్రుల వద్దకు కేవలం టీ తాగేందుకు ఆత్మగౌరవం కలవారు ఎవరైనా వెళతారా ?యాదవులు, ముస్లింలే కాదు, వీరికి ఓటేయని ఏ సామాజిక తరగతికీ మినహాయింపు ఉండదని అందరూ గమనించాలి.ఇలాంటి వారు బిజెపి, దాని మిత్రపక్షాల్లో ఎంతగా వర్ధిల్లితే అంతగా జనం అసలు రంగు తెలుసుకుంటారు.


గిరిరాజ్‌ సింగ్‌ ఏం మాట్లాడినా బిజెపి పెద్దలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 2019లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నాటి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలోనే బీహార్‌ బెగుసరారు నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు జిల్లా కలెక్టర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బహుశా ఈ పెద్ద మనిషి డిఎన్‌ఏలోనే ముస్లిం ద్వేషం ఉన్నట్లు అతగాడి వదరుబోతుతనం వెల్లడిస్తున్నది.దేశ విభజన సందర్భంగా ముస్లింలందరినీ పాకిస్తాన్‌ పంపకపోవటం మన పూర్వీకులు చేసిన పెద్ద తప్పిదం అన్నారు.2014లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీకి ఓటు వేయని వారిని పాకిస్తాన్‌ పంపాలని సెలవిచ్చినందుకు బహుమతిగా నాడు సహాయ కేంద్ర మంత్రి పదవి, తరువాత మరింతగా రెచ్చిపోయినందుకు 2019లో కాబినెట్‌ మంత్రిగా, మరోసారి ఇప్పుడు కొనసాగించారు మోడీ. బీహార్‌లో మిత్ర పక్షాలుగా ఉన్న ఎల్‌జెపి, జెడియు నేతలు ఈ పెద్దమనిషి వ్యాఖ్యలను విమర్శించటం తప్ప గట్టిగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు. మోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్థలలో ఇలాంటి విద్వేష ప్రసంగీకులకు కొదవ లేదు. విశ్వహిందూ పరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా వారిలో ఒకరు. ” మనం అధికులుగా ఉన్న ప్రాంతాలలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ముస్లింలను భయపెట్టాలి ” అన్నారు. నోటిదూల, నోటి తుత్తర లేదా విద్వేష గళాల పీఠాధిపతుల్లో గిరిరాజ్‌ సింగ్‌ను ఒకరిగా చెప్పవచ్చు.ప్రపంచ జనాభా దినం సందర్భంగా 2019 జూలై 11న మంత్రి హౌదాలో ఒక ట్వీట్‌ ( ప్రస్తుతం ఎక్స్‌) చేశారు. ” ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ఓటింగ్‌ హక్కు రద్దు చేయాలన్నది నా వైఖరి ” అని పేర్కొన్నారు. ఇది ముస్లింలను ఉద్దేశించే చేసినప్పటికీ ఇతర మతాలలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి కూడా వర్తిస్తుంది కనుక వారు కూడా ఇలాంటి వ్యక్తులు, వారి పార్టీ గురించి ఆలోచించుకోవాలి.


బిజెపి నేతలు హిందూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని బహిరంగంగానే ప్రకటిస్తారు. తనకు మియా(అసోంలోని ముస్లింలకు మరోపేరు)ల ఓట్లు అవసరం లేదని సాక్షాత్తూ ఆ రాష్ట్ర సిఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. తాను వారి ప్రాంతాలలో అసలు ప్రచారానికే వెళ్లనని కూడా చెప్పారు. మియాల్లో బాల్య వివాహాలు అంతరించేవరకు వారి ఓట్లను తాను కోరనని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని కూడా చెప్పారు. ముస్లిం సామాజిక తరగతి ఉద్దారకుడిగా ఫోజు పెడుతూ వారి మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటం తప్ప ఇది మరొకటి కాదు. దేశంలో బాల్యవివాహాల సామాజిక రుగ్మత ఉంది. దాన్ని రూపుమాపాలంటే జనాల ఆర్థిక, విద్యా స్థాయిని మెరుగుపరచాలి. అసలు వాస్తవం ఏమంటే దేశంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 84శాతం హిందువుల్లోనే ఉన్నట్లు ఇండియా స్పెండ్‌ అనే మీడియా సంస్థ జనాభా లెక్కలను విశ్లేషించి చెప్పింది. ముస్లింలలో పదకొండుశాతం, ఇతరులు మిగతా మతాల్లో ఉన్నారు. అదే హిమంత బిశ్వశర్మ బాల్య వివాహాలు చేసే హిందువుల ఓట్లు, అంటరానితనం పాటించేవారి ఓట్లు తమకు అవసరం లేదని చెప్పగలరా ? బిజెపి నేతల నాలికలకు నరం లేదు. ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది మాట్లాడతారు. తనకు ఓట్లు వేయని కారణంగా ముస్లింల కోసం తాను పనిచేయనని రాజ్యాంగ విరుద్దమైన మాటలను కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వల్లిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో బిజెపి సీనియర్‌ నేత కెఎస్‌ ఈశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు ఒక్కటి కూడా అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఆవు చేలో మేస్తుంటే దూడగట్టున ఉంటుందా ? అధినేత నరేంద్రమోడీ స్వయంగా ఇటీవలి ఎన్నికల్లో ముస్లిం విద్వేషాన్ని ఎలా రెచ్చగొట్టారో తెలిసిందే. మోడీ ముందు హిమంత బిశ్వశర్మలూ, గిరిరాజ్‌ సింగ్‌లూ మరుగుజ్జులే. తన ఉపన్యాసాలు, వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశం అవుతాయని, భారత ప్రతిష్ట మురికి గంగలో కలుస్తుందని తెలిసి కూడా మోడీ వెనక్కు తగ్గలేదు.ఏది ఎటుపోతేనేం ! కావాల్సింది ఓట్లు, అధికారం ! రామరాజ్యం కోరుకొనే శక్తులకు ఓటు వేస్తారా లేక ఓట్‌ జీహాదీలకు వేస్తారా అంటూ మోడీ ఓటర్లను అడగటం తెలిసిందే.కాంగ్రెస్‌ అధికారానికి వస్తే చొరబాటుదార్లకు, ఎక్కువ మంది పిల్లలున్న వారికి సంపదలు పంచుతారని, పుస్తెలను కూడా లాక్కుంటారని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి మాట్లాడిందీ తెలిసిందే. దేశాన్ని ఆక్రమించుకొనేందుకు ముస్లింలకు కాంగ్రెస్‌ సహాయం చేస్తోందని కూడా ఆరోపించారు. మోడీ దిగజారి మాట్లాడినట్లు, అది కూడా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం అవాంఛనీయమని బిజెపి నేత అలోక్‌ వత్స తమతో వ్యాఖ్యానించినట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది. సంవత్సరాల తరబడి గుడ్డిగా మోడీకి మద్దతు ఇచ్చిన వారు కూడా ఆయన వ్యాఖ్యలను ఆమోదించరని, ప్రధాని స్థాయికి తగని మాటలని వత్స అన్నట్లు పేర్కొన్నది. ఇలాంటి నేత అనుచర గణం ప్రసన్నం చేసుకొనేందుకు మరింత రెచ్చిపోతుంది తప్ప వెనక్కు తగ్గదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పలుకుబడి, ప్రతిష్ట, నరేంద్రమోడీ చిత్తశుద్ధికి పోలవరం ఒక పెద్ద సవాలు !

30 Sunday Jun 2024

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP, Uncategorized, Ycp

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Janasena, Narendra Modi Failures, Pawan kalyan, Polavaram Irrigation Project, YS jagan


ఎం కోటేశ్వరరావు


రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఒకటి. అప్పులు చేయటంలో నరేంద్రమోడీ అంతకు ముందున్న ప్రధానుల రికార్డులను తునాతునకలు చేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది. వర్తమానంలో మరో 16-17లక్షల కోట్లు అప్పు చేయనున్నారు. అందువలన పోలవరానికి నిధుల సమస్య ఉండదని, చంద్రబాబు అడగాలే గానీ ఎంత కావాలంటే అంత ఇస్తారని అందరూ భావిస్తున్నారు.అది సాకారం కావాలని కోరుకుందాం. గడచిన పది సంవత్సరాలలో జరిగిన పోలవరం ప్రాజక్టు నిర్మాణం-సంభవించిన నష్టం, ప్రస్తుత పరిస్థితి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్‌ 28న శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి చెప్పాయి. పునరుద్దరణే కాదు, సంక్షేమ పధకాలను మరింతగా అమలు చేస్తామని వాగ్దానం చేశాయి. అలవిగాని హామీలు ఇచ్చిన తెలంగాణా కాంగ్రెస్‌ వాటిని ఎలా అమలు చేయనుందో చెప్పాలని ఆ రాష్ట్ర బిజెపి డిమాండ్‌ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మీ కూటమి కూడా అంతకంటే ఎక్కువే వాగ్దానాలు చేసింది, వాటి సంగతేమిటంటే ఆ ఎన్నికల ప్రణాళికతో బిజెపికి సంబంధం లేదని నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఆంధ్రప్రదేశ్‌ బిజెపి నేతలకు కంటిచూపే తప్ప నోటమాట ఉండటం లేదు. మరీ గట్టిగా అడిగితే చంద్రబాబుకు ఉన్న అనుభవంతో అన్నింటినీ అమలు చేస్తారంటూ ఆయన మీద నెడుతున్నారు. ఇక్కడ పోలవరం ప్రాజక్టు శ్వేత పత్రంలోని అంశాలను చూద్దాం.


గోదావరి నదిపై రాజమండ్రి కాటన్‌ బారేజ్‌కు ఎగువన 42కిలో మీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లా రామయ్య పేట సమీపంలో బహుళార్ధసాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం జాతీయ హౌదా ఇవ్వక ముందే దీనికి అనుమతులతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని పనులు జరిగాయి. సముద్ర మట్టానికి 45.72 మీటర్ల ఎత్తున ఆనకట్ట నిర్మిస్తే 194.6టిఎంసిల నీటిని నిలువ చేయవచ్చని అంచనా. ఈ నీటితో 3.2లక్షల ఎకరాలు కుడి, నాలుగు లక్షల ఎకరాలకు ఎడమ కాలువ ప్రాంతంలో కొత్తగా సాగునీరు, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతంలోని 23.5లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణ, 80టిఎంసి నీటిని ప్రకాశం బారేజ్‌కు ఎగువన కృష్ణా నదికి మళ్లింపు, 960మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలు, పరిసరాల్లో ఉన్న జనావాసాలకు 23.44 టీఎంసీల నీటి సరఫరా, కాలువలు వెళ్లే ప్రాంతాలలోని 540 గ్రామాలకు మంచి నీటి సరఫరా కలుగుతుంది. అందుకే దీన్ని జీవనాడిగా పరిగణిస్తున్నారు. పైన చెప్పుకున్న 80టిఎంసిల మళ్లింపు జలాలు వాడుకున్నందుకు గాను కృష్ణా నదీ జలాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ వాటా తగ్గుతుంది. ఈ నీటిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు 45,కర్ణాటకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసిలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణా విడిపోయినందున దానికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంది.పోలవరంపై బ్రిటీష్‌ వారి హయాంలో తొలిసారిగా 1941లో ప్రతిపాదన రాగా 1942-44 సంవత్సరాలలో ప్రాధమిక పరిశీలన జరిగింది. ఆనకట్ట ఎత్తు 170 నుంచి 208 అడుగులు ఉంటే 340 నుంచి 700 టిఎంసిల వరకు నీటిని నిల్వచేయవచ్చని చెప్పారు.ఇపుడు అంత ఎత్తుకు ఎగువ రాష్ట్రాలు అంగీకరించే ప్రసక్తే లేదు గనుక ఆ ప్రతిపాదన చరిత్రగా మిగిలింది. ప్రస్తుతం 150 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రంలో ఉన్న సంగతులు, వాటిని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రానున్న ఐదేండ్లలో సాకారం గురించి, ఇతర అంశాల గురించి చెప్పుకుందాం.
ఒక ప్రధాన సమస్య కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించినపుడే మొదలైంది, అదే పునరావాసం.ముందే చెప్పుకున్నట్లుగా ప్రాజక్టు నిర్మాణం ముందే ప్రారంభమైన కారణంగాగా 2014 ఏప్రిల్‌ ఒకటి నుంచి అప్పటి అంచనా ప్రకారం నీటి పారుదల(ఆనకట్ట, కాలువలు) నిమిత్తమయ్యే ఖర్చు నూటికి నూరుశాతం భరిస్తామని కేంద్రం చెప్పింది. దానిలో ప్రధానమైన ముంపు బాధితుల పునరావాసం, విద్యుత్‌ ప్రాజక్టు ఖర్చు లేదు. విద్యుత్‌ ప్రాజక్టుకు అయ్యే వ్యవయం రు.4,560 కోట్లే గనుక తామే భరిస్తామని నాటి తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించింది. పునరావాసానికి అయ్యే ఖర్చు తామే భరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితి శాతాల గురించి శ్వేత పత్రంలో దిగువ విధంగా పేర్కొన్నారు.
అంశం×××× 2019 మే××× 2024 మే
సివిల్‌ పని ×× 71.93 ××× 75.77
హెడ్‌ వర్క్స్‌ × 65.67 ××× 72.63
కాంక్రీటు ×× 91.14 ××× 92.75
ఎల్‌ఎంసి ×× 70.99 ××× 73.07
పునరావాసం× 18.66 ××× 22.55
ఖర్చురు.కోట్లు×16493.18××21489.71


దీని ప్రకారం రానున్న రోజుల్లో ప్రధానమైన సమస్యగా పునరావాసం ముందుకు రానుంది.ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసిన తరువాత రిజర్యాయర్లో మునిగే ప్రాంతం, అక్కడి వారి పునరావాసం గురించి మాట్లాడకుండా శ్వేత పత్రంలోనూ, విడిగా చంద్రబాబు నాయుడు అశ్వద్ధామ కుంజరహ అన్నట్లుగా గత ఐదేండ్ల జగన్‌మోహన రెడ్డి పాలనలో జరిగిన తప్పిదాల గురించే పెద్ద ఎత్తున చర్చలోకి తీసుకువస్తున్నారు. శ్వేత పత్రంలో పునరావాసం గురించి ప్రస్తావించినప్పటికీ అందుకు అవసరమైన మొత్తాలను కేంద్రం నుంచి తెస్తారా, రాష్ట్రమే భరిస్తుందా అన్న ప్రస్తావన లేదా వివరణ లేదు.మొదటి దశ అంటే ఆనకట్ట ఎత్తు 41.15 మీటర్లు లేదా 130 అడుగుల వరకు నిర్మిస్తే లక్షా 98 ఎకరాల భూసేకరణకు గాను 83,659 ఎకరాలను స్వాధీనం చేసుకోగా మిగిలిన మొత్తాన్ని 2025 జనవరి నాటికి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలోని 38,060కు గాను 12,797 కుటుంబాలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారిని 2026 మార్చి నాటికి తరలిస్తారు. రెండవ దశ 150 అడుగుల ఎత్తుకు ఆనకట్ట నిర్మాణం జరిపితే మునిగే మరో 67,665 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 29,465ఎకరాలను స్వాధీనం చేసుకోగా మిగతా ప్రాంతాన్ని రెండవ దశలో చేపడతారు. ఈ ప్రాంతంలో 2017-18 సంవత్సరంలో చేసిన సర్వే ప్రకారం 1,06,006 కుటుంబాలను తరలించాల్సి ఉంటుంది.అయితే సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం 96,660 కుటుంబాలను మాత్రమే గుర్తించారు. ఈ లెక్క ప్రకారమైనా రెండు దశల్లో ఇప్పటికి తరలించిన 12,797పోను మరో 83,863 కుటుంబాలను ఇంకా తరలించాల్సి ఉంది. తొలి సర్వే ప్రకారమైతే 93,209 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. దీనికి గాను తొలి దశ భూసేకరణ-పునరావాసానికి రు.7,116, రెండవ దశకు రు.18,801 కోట్లు, మొత్తం రు.25.917 కోట్లు కావాల్సి ఉన్నట్లు శ్వేత పత్రం తెలిపింది. ఇతర వ్యయం పెరిగినట్లే దీనికి కూడా కచ్చితంగా పెరుగుతుంది. ఈ మొత్తం రు.35వేల కోట్ల వరకు ఉండవచ్చని చెబుతున్నారు.దీని గురించి శ్వేత పత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదు. బాధితులకు చెల్లించాల్సిన మొత్తాల గురించి కూడా ఒక స్పష్టత లేదు.


ప్రాజెక్టు పూర్తి చేయటం, నీటి విడుదల గురించి గతంలో, ప్రస్తుతం తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాల సిఎంలు చెప్పిన కబుర్లు మొదటి దశ గురించే అన్నది గమనించాలి.ఏజన్సీని మార్చకుండా, పథకం ప్రకారం పనులు జరిగి ఉంటే 2020 నాటికే నీటిని సరఫరా చేసి ఉండేవారని చెప్పారు, తరువాత వాయిదాలు వేసి 2023జూన్‌కు పొడిగించారు, ఇప్పుడు మరో ఏడాది గడచింది. ఇది ఎప్పుడు పూర్తవుతుందంటే సిఎం చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు అని చెబుతున్నారు.కుడి, ఎడమ కాలవల్లో మిగతా భాగాలు పూర్తి కావాలి. పంట కాలువల తవ్వకం ఇంతవరకు చేపట్టలేదు. అందువలన రెండవ దశ ఎప్పటికి అన్నది అసలు చర్చకే రాలేదు. ఇక ప్రాజెక్టు వ్యయం ఇబ్బడి ముబ్బడి అయింది. దాన్ని ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు.గతంలో నిర్మాణ వ్యయానికి సంబంధించిన వివరాలు దిగువ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కోట్ల రూపాయల్లో అని గమనించాలి.టిఏసి-టెక్నికల్‌ అసిస్టెస్స్‌ కమిటి, సిడబ్ల్యుసి-కేంద్ర జల కమిషన్‌, ఆర్‌సిసి-సవరించిన ధరల కమిటీ
అంశం ××××××××× 2010-11××××××2013-14××××××××2017-18
అంశం ××××××××× టిఏసి ××× టిఏసి × సిడబ్ల్యుసి × ఆర్‌సిసి × సిడబ్ల్యుసి
నీటిపారుదల ×××××× 12,944 ×××24,467 × 26,158ి × 43,165 × 51,096
విద్యుత్‌ ఉత్పత్తి×××××× 3,716 ××× 4,561 × 4,561ి × 4,561 × 4,561
మొత్తం ఖర్చు ×××××× 16,010 ×××29,028 × 30.719 × 47,725 × 55,657


పైన పేర్కొన్న వివరాలలో 2013-14 సంవత్సర సిఫార్సులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.ఇక 2017-18 సంవత్సరాల సవరించిన అంచనాలను 2019 ఫిబ్రవరి 11న చంద్రబాబు నాయుడు సిఎంగా ఉండగానే టెక్నికల్‌ అసిస్టెన్స్‌ కమిటీ రు.55,657 కోట్లకు ఆమోదం తెలిపింది. జగన్‌మోహన రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో అనేక సార్లు మోడీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందటానికి ఏం చేసిందీ తెలియదు. లేఖలు రాశారా, కేంద్రం ఏం సమాధానమిచ్చిందీ తెలియదు. ఆమోదం లభించలేదని తాజా శ్వేతపత్రం తెలిపింది. ఈ అంచనా సవరణ జరిగి ఆరు సంవత్సరాలైంది. అప్పటి నుంచి ధరలు మరింత పెరిగాయి.పైన పేర్కొన్నట్లుగా కేవలం మూడు సంవత్సరాల్లోనే వ్యయం 30 నుంచి 55వేల కోట్లకు పెరిగితే తరువాత ఆరు సంవత్సరాల్లో పెరుగుదల అంచనా వేయాల్సి ఉంది. ఆరేండ్ల నాటి దానికే మోడీ సర్కార్‌ ఆమోదం తెలపలేదు, ఇప్పుడు తాజా అంచనాలు ఇంకా వేయలేదు, వాటికి ఎప్పుడు ఆమోదం లభించేదీ అగమ్యగోచరమే.

అందువలన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడి వర్తమాన హయాంలో మొదటి దశ పూర్తి కావటం కూడా ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పవచ్చు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే అదేమీ అసాధ్యం కాదు. ఎన్నికలకు ముందు పోలవరం బాధితుల పునరావాసానికి అయ్యే 30వేల కోట్లను విరాళాల ద్వారా సేకరించి ఇవ్వవచ్చని దానికి గాను తన వంతు వాటాగా కోటి రూపాయలు ఇస్తానని పవన్‌ కల్యాణ్‌ ఒక సందర్భంగా చెప్పారు.దేశ విదేశాల్లో చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌కు ఎంతో పలుకుబడి ఉందని చెబుతున్నారు గనుక కేంద్రం ఇవ్వకపోతే ఆమొత్తాన్ని వారు సేకరించి బాధితులకు న్యాయం చేయాలి. కావాల్సింది పునరావాసం తప్ప నిధులు ఎక్కడి నుంచి తెచ్చారన్నదానితో బాధితులకు సంబంధం ఉండదు.పోలవరం సత్వర నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు, పునరావాస ఖర్చు భరింపుకు ఆమోదం పొందటం కోసం చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ తమ ప్రతిష్ట, పలుకుబడిని ఉపయోగించగలరని జనం గట్టిగా నమ్ముతున్నారు.అయితే ఆంధ్రప్రదేశ్‌ పట్ల బిజెపి చిత్తశుద్దితో ఉన్నదా అన్న అనుమానాలు ఇప్పటికీ జనంలో ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రణాళికకు అది దూరంగా ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలు సర్దుకుపోయాయి. వాగ్దానాలకే ముందుకు రాని బిజెపి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తారా ? చంద్రబాబు చెప్పినట్లు ఏపి అంటే అమరావతి, పోలవరం కాదు. అవి రెండు ప్రధాన సమస్యలు మాత్రమే. మొత్తం రాష్ట్ర సమగ్రవృద్దికి పని చేస్తున్నారనే అభిప్రాయం జనంలో కలగకపోతే రాజకీయంగా పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాతో గిల్లి కజ్జా : అమెరికా రాజకీయ క్రీడలో పావుగా దలైలామా !

26 Wednesday Jun 2024

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, USA

≈ 1 Comment

Tags

#Anti China, 14th Dalai Lama, Anti communist, China, cia, Nancy Pelosi, Tibet


ఎం కోటేశ్వరరావు


ధర్మశాలలో ప్రవాస జీవితం గడుపుతున్న 88 ఏండ్ల దలైలామా మోకాలి చికిత్సకోసం అమెరికా వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ రాజకీయ నేతలతో చర్చలు జరుపుతారా లేదా అన్నది ఇంకా స్ఫష్టం కాలేదు. గతవారంలో అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసి హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో దలైలామాను కలిశారు.ఈ సందర్భంగానే ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కూడా ఆమె నాయకత్వంలో వచ్చిన ఏడుగురు ఎంపీల బృందం భేటీ జరిపింది. ఇతర పని మీద భారత్‌ పర్యటనలో భాగంగా ఏదో ఇంతదూరం వచ్చాం కదా మర్యాద పూర్వకంగా అనుకుంటే దలైలామాను కలవటం పెద్ద వార్తే కాదు.రావటమే కాదు,నేను చైనాను విమర్శిస్తే అది దలైమాకు అంగీకారం కాదని తెలిసినా అంటూ అక్కడే చైనా అధినేత షీ జింపింగ్‌ మీద ధ్వజమెత్తింది. అందుకే ఇది పక్కా రాజకీయ, చైనా వ్యతిరేక పర్యటనే అనటంలో ఎలాంటి సందేహం లేదు.దలైలామా వారసత్వం ఎప్పటికీ ఉండిపోతుంది, కానీ చైనా అధ్యక్షపదవిలో ఉన్న మీరు శాశ్వతంగా ఉండరు,ఎవరూ, దేనికీ మిమ్మల్ని గుర్తుంచుకోరు అంటూ నాన్సీ పెలోసి నోరుపారవేసుకుంది. దలైలామాతో చైనా ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కూడా చెప్పింది.
ఈ పరిణామం మీద మన విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ భారత వైఖరిలో ఎలాంటి మార్పులేదు, స్థిరంగా ఉందని చెప్పారు.మనదేశంలో మతపరమైన,ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించేందుకు మాత్రమే దలైలామాకు ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. నాన్సీ పెలోసీ చేసిన రాజకీయ వ్యాఖ్యలకు-మన ప్రభుత్వానికి సంబంధం లేదని, వాటి గురించి మీరు అమెరికానే ప్రశ్నించాలని విలేకర్లతో చెప్పారు. ధర్మశాలలో ఉందని చెబుతున్న టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం ఒక వేర్పాటు వాద రాజకీయ సంస్థ, చైనా రాజ్యాంగం, చట్టాల ప్రకారం అది చట్టవిరుద్దం, ఆ సంస్థకు ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు లేదు, ఇక దలైలామాతో సంప్రదింపులు, మాటల విషయానికి వస్తే అది చైనా ప్రభుత్వం-పద్నాలుగవ దలైలామాకు సంబంధించిన వ్యవహారం అన్నది ఎప్పుటి నుంచో మేము చెబుతున్నాం అని చైనా స్పందించింది. ఈ సందర్భంగా కొన్ని అభిప్రాయాలు, వక్రీకరణలు, భాష్యాలు వెలువడ్డాయి.టిబెటన్ల హక్కుల పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆడుతున్న నాటకం తెలిసిందే. అమెరికా, దానికి తాన తందాన పలికే దేశాలు చెబుతున్నదాని ప్రకారం టిబెట్‌ ఒక స్వతంత్ర దేశం, కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్ని చైనా ఆక్రమించింది. కనుక టిబెటన్ల హక్కును పరిరక్షించాలి అంటూ వేర్పాటు వాదాన్ని సమర్ధిస్తున్నది.మనదేశంలో బ్రిటీష్‌ ప్రభుత్వానికి లోబడిన సామంత రాజరిక సంస్థానాల మాదిరే చైనాలో రాజరిక కాలంలో టిబెట్‌ కూడా అలాంటిదే.చైనాకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చైనా ప్రభుత్వానికి లోబడిన ఒక స్వయం పాలిత ప్రాంతంగా ఉంది, దాని అధిపతిగా దలైలామా కొనసాగాడు.


చైనా కమ్యూనిస్టు పార్టీ లాంగ్‌ మార్చ్‌ లేదా విప్లవపోరాట కాలంలో అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ ప్రభుత్వం కూలిపోవటం తధ్యమని గ్రహించిన అమెరికా, బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు ఒక వ్యూహం ప్రకారం నాడు ఫార్మోజా దీవిగా నేడు తైవాన్‌గా పిలుస్తున్న ప్రాంతానికి మిలిటరీ, ఆయుధాలను తరలించి అక్కడే తిష్టవేయించింది. చైనా రాజులు ఆ దీవిని 1895లో జపాన్‌కు ధారాదత్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన తరువాత 1945లో దాన్ని తిరిగి చైనా ప్రభుత్వానికి అప్పగించారు. మిగతా ప్రధాన ప్రాంతంలో కమ్యూనిస్టులు కేంద్రీకరించి తరువాత తైవాన్‌ సంగతి చూద్దాం లెమ్మని భావించారు.తరువాత అనేక కారణాలతో స్వాధీనం చేసుకోలేదు. ఈ లోగా అమెరికా, ఇతర దేశాలు తైవాన్‌ పాలకులకు భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చి ఒక దేశం మాదిరి తయారు చేశారు. దాన్నే అసలైనా చైనాగా భద్రతా మండలిలో గుర్తించారు. 1970దశకంలో అనివార్య స్థితిలో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తీర్మానం ప్రకారం చైనా అంటే తైవాన్‌తో కూడిన ప్రాంతం తప్ప రెండు చైనాలు లేవు. దీనికి అమెరికా కూడా అంగీకరించింది. అయితే శాంతియుతంగా విలీనం జరగాలంటూ కొత్త నాటకం ప్రారంభించింది. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటే తాము సహించేది లేదని అమెరికా అంటున్నది. తైవాన్‌ వ్యవహారాలను చూసేందుకు ఏ ఒక్కదేశానికీ భద్రతా మండలి అనుమతి ఇవ్వలేదు. తనకు తానే రక్షకురాలిగా అమెరికా ప్రకటించుకుంది. ఆధునిక ఆయుధాలన్నీ ఇచ్చి ఎదురుదాడులకు కూడా అనుగుణంగా తయారు చేస్తున్నది.


ఇక టిబెట్‌ విషయానికి వస్తే కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్తతో వ్యవహించి సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ముచేసింది. మతం, దలైలామా పేరుతో జరిపిన తిరుగుబాటును అణచివేసింది.టిబెట్‌లో తిరుగుబాటు చేసేందుకు పూనుకున్న వేర్పాటు వాదులకు సిఐఏ అనేక చోట్ల రహస్యంగా సాయుధ శిక్షణ, పెద్ద మొత్తంలో నిధులు అందచేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ 1949లో అధికారానికి వచ్చిన తరువాత ” ఇంకే ముంది మనం చైనాను నష్టపోయాం, మన అదుపు నుంచి పోయింది, మనకు కొత్త విరోధి ఉనికిలోకి వచ్చింది ” అన్నట్లుగా అమెరికా పాలకవర్గం భావించింది. విప్లవ కాలంలోనే చైనాలో కమ్యూనిస్టు పార్టీని అడ్డుకోవటంలో విఫలం కావటం గురించి అది బెంగపెట్టుకుంది. ఇరాన్‌లో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు1953లో మహమ్మద్‌ మొసాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు చేసిన ఖర్చుతో పోలిస్తే సిఐఏ 1949-51కాలంలో ఇరవై రెట్లు మొత్తాన్ని చైనా కోసం వెచ్చించింది.రహస్య కార్యకలాపాలకు పది రెట్లు సిబ్బందిని పెట్టింది.కార్యస్థానంగా టిబెట్‌ను ఎంచుకుంది.చరిత్రను చూస్తే టిబెట్‌ ప్రాంతంలో చైనా రాజులకు సామంత రాజ్యంగా ఉంది తప్ప స్వతంత్రదేశం కాదు.1912లో క్వింగ్‌ రాజరిక వ్యవస్థకూలిపోయిన మరుసటి ఏడాది పదమూడవ దలైలామా తమకు స్వాతంత్య్రం కావాలని ప్రకటించాడు.చైనా ఆశీస్సులతో నిమిత్తం లేకుండా ఆధ్యాత్మిక, రాజకీయ అధికారాన్ని చెలాయిస్తానని చెప్పుకున్నాడు.దాన్ని చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత టిబెట్‌ను పూర్తిగా చైనాలో విలీనం చేసేందుకు చూస్తున్నట్లు 1941డిసెంబరు 20వ తేదీ డైరీలో నాటి ప్రధానిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ రాశాడు.


కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత ముందే చెప్పుకున్నట్లు సిఐఏ రంగంలోకి దిగింది. దీన్ని పసిగట్టిన మావో జెడాంగ్‌ ముందు జాగ్రత్త చర్యగా 1950లో అక్కడికి 40వేల మంది మిలిటరీని పంపాడు.దీంతో పాటు చైనాతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకున్నాడు. అదే ఏడాది అక్టోబరు 6-24వ తేదీల మధ్య తూర్పు టిబెట్‌లో తిరుగుబాటుకు తెరతీసిన వేర్పాటు వాదులను చామడో పోరులో మిలిటరీ అణచివేసింది, మూడు వేల మందిని బందీలుగా పట్టుకుంది. టిబెట్‌ పౌరుల మీద ఎలాంటి దాడులు జరపలేదు. ప్రస్తుతం మనదేశంలో ఉన్న 14వ దలైలామా టెంజిన్‌ జియాస్టో ఆ పరిణామం తరువాత తాను క్రమశిక్షణతో మెలుగుతానని ప్రకటించాడు. కాశ్మీరు, హైదరాబాదు సంస్థానాలను మనదేశంలో విలీనం చేసినట్లుగానే టిబెట్‌ సంస్థానాన్ని చైనా 1951 మే నెలలో విలీనం చేసింది. టిబెట్‌ రాజకీయం చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రావటానికంటే ముందే మొదలైంది.మన దేశం తొలిసారిగా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం టిబెట్‌తోనే మొదలైంది.చైనా మిలిటరీ చర్య గర్హనీయమని, అది చైనా ప్రయోజనాలకు, శాంతికి కూడా దోహదం చేయదని నాటి నెహ్రూ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి వెంటనే అమెరికా, బ్రిటన్‌ తదితర ఆ గుంపు దేశాలు కూడా మద్దతు ఇచ్చాయి.


దలైలామాకు 1940దశకంలోనే సిఐఏతో సంబంధాలు, నిధుల అందచేత ఉన్నట్లు తరువాత వెల్లడైంది. అమెరికాలోని కొలరాడోలో టిబెట్‌ తిరుగుబాటుదార్లకు శిక్షణ ఇచ్చింది. వారిని అక్కడికి విమానాల్లో తరలించి తరువాత తిరిగి టిబెట్‌కు చేర్చింది. ఆయుధాలను ఇచ్చింది. అలాంటి వారి నాయకత్వంలో 1956లో తూర్పు టిబెట్‌లో రెండు చోట్ల తిరుగుబాటును ప్రకటించారు. దలైలామా అన్న గయాలో తోండప్‌ 1951లో అమెరికా వెళ్లాడు.అక్కడే ఉండి ఎప్పటికప్పుడు చైనా, టిబెట్‌లో పరిస్థితుల గురించి అక్కడ ఎందరు సైనికులు ఉన్నదీ మొదలైన సమాచారాన్ని అందచేసేవాడు. దానికి ప్రతిగా చైనాకు వ్యతిరేకంగా తమకు సాయం చేయాలని కోరాడు. అందుకోసం భారత్‌, నేపాల్లో అమెరికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జపాన్‌లోని ఒకినావా, మైక్రోనేసియా ప్రాంతంలోని ఫసిపిక్‌ దీవుల్లో అమెరికా ఆధీనంలో ఉన్న గువామ్‌లో టిబెటన్లకు శిక్షణ ఇచ్చారు. ఢిల్లీలో సిఐఏ-మనదేశ సంస్థ కలసి ఒక కేంద్రాన్ని కూడా నడిపినట్లు తరువాత వెల్లడైంది. ఆపరేషన్‌ ఎస్‌టి సర్కస్‌ పేరుతో ఒక పధకాన్ని రూపొందించి 1959లో దలైలామా సోదరుడి నాయకత్వంలో గెరిల్లా తిరుగుబాటు ప్రారంభించారు. అయితే దాన్ని చైనా మిలిటరీ రెండు వారాల్లోనే అణచివేసింది. లాసా నుంచి పారిపోయిన దలైలామా నాటి భారత ప్రభుత్వ సహకారంతో నేటి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతం ద్వారా మనదేశానికి 1959 మార్చి 31న వచ్చాడు. ధర్మశాలలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో కాందిశీకుల పేరుతో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత తాను వైదొలిగి ఇతరులకు అప్పగించాడు. ఈ ప్రభుత్వాన్ని మనదేశం గుర్తించనప్పటికీ నాటి నుంచి నేటి వరకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నది. అమెరికా విదేశాంగశాఖ 1998లో వెల్లడించిన పత్రాలలో ఉన్న సమాచారం మేరకు దలైలామా 1970దశకం మధ్య వరకు ఏటా లక్షా 80వేల డాలర్లను అమెరికా సిఐఏ నుంచి పొందినట్లు ఉంది. ఇప్పటికీ అమెరికా మద్దతు కొనసాగుతోంది. నాన్సీ పెలోసీ గుంపు పర్యటన అదే.


దలైలామాతో చర్చలు జరపాలని చైనాను డిమాండ్‌ చేసే హక్కు అమెరికాకు లేదు. తాను చేసిన చట్టాలు, లేదా అవగాహన ప్రకారం బిన్‌లాడెన్‌ లాంటి కొంత మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. అలాంటి వారితో ఎవరైనా చర్చలు జరపాలని కోరితే అంగీకరిస్తుందా. చైనా దృష్టిలో తిరుగుబాటు చేసిన దలైలామా వేర్పాటువాది. అలాంటి వారితో చర్చలు జరిపేది లేదని గతంలోనే ప్రకటించింది.దలైలామా ఒక్క మతనాయకుడే కాదు, ప్రవాసంలో ఉన్న రాజకీయవాది కూడా అని తాజాగా స్పష్టం చేసింది. అతగాడి వైఖరిలో మార్పు లేదు. ఇప్పుడు దలైలామాకు వృద్దాప్యం వచ్చింది. తదుపరి వారసుడు ఎవరన్నది తేలాల్సి ఉంది. తన వారసుడు భారత్‌లో ఉన్నట్లు దలైలామా చెబుతున్నారు. కొత్త దలైలామాను తాము ఆమోదించాల్సిందేనని చైనా అంటున్నది.జూన్‌ పన్నెండున అమెరికా పార్లమెంటు టిబెట్‌-చైనా వివాద బిల్లును ఆమోదించింది.అధ్యక్షుడు ఆమోదిస్తే చట్టం అవుతుంది. అది ఉభయ దేశాల సంబంధాల మీద ప్రభావం చూపుతుంది గనుక అలాంటి పనికి పూనుకోవద్దని చైనా హితవు పలికింది. పురాతన కాలం నుంచి చైనాలో టిబెట్‌ భాగం కాదని దానిలో పేర్కొన్నారు. అసలు అలాంటి చట్టం చేసే అధికారం అమెరికా పార్లమెంటుకు ఎవరిచ్చారు. దలైలామా గురించి ప్రపంచంలో ఆసక్తి తగ్గిపోతున్న తరుణంలో అమెరికా ఈ పని చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అధికారం కోసం దేశం-ధర్మం పేరుతో అమాయక రైతులకు కాషాయ గుంపు అన్యాయం !

23 Sunday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ 1 Comment

Tags

#Farmers matter, #Farmers Protest, Anti Farmers, BJP, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మూడవ సారి నరేంద్రమోడీ ప్రధాని పదవి చేపట్టారు. ఎంతో వేగంగా పని చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. దానికి పక్కా నిదర్శనం జమ్మూ-కాశ్మీరుకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 370ని ఎంత వేగంగా రద్దు చేశారో దేశం చూసింది. 2019 జూలై చివరి వారంలో అసాధారణ రీతిలో కాశ్మీరులో భద్రతా దళాలను మోహరించారు.ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం నాడు అమరనాధ్‌ యాత్రీకులకు ముప్పు ఉందంటూ యాత్ర నిలిపివేయాలని భద్రతా హెచ్చరిక కాశ్మీరు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.ఆదివారం నాడు రాష్ట్ర మంతటా 144సెక్షన్‌ ప్రకటించారు, ఇంటర్నెట్‌ నిలిపివేశారు. సోమవారం నాడు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ముందు అదేరోజు రాష్ట్రపతి ఉత్తరువు వెలువడింది. వెంటనే మంత్రివర్గ సమావేశం, అనంతరం అదే రోజు దాని మీద రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు.సభ్యులకు దాని కాపీలు ఇవ్వలేదు. ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశమైతే గంటన్నరలో అంటే 12.30లోగా 57పేజీల పత్రం మీద కావాలంటే సవరణలు ప్రవేశపెట్టవచ్చంటూ చెప్పారు. వాటిని చదివేందుకు కూడా ఆ సమయం చాలదు. అదే రోజు సభలో ఆమోదం కూడా పొందారు.మరుసటి ఏడాది కరోనాను అవకాశంగా తీసుకొని మూడు సాగు చట్టాలనూ అంతే వేగంగా ఆమోదించి అమలు చేసేందుకు పూనుకున్నారు.వేగంగా పనిచేసే నాయకత్వ ఘనత గురించి నరేంద్రమోడీ భక్తులు, గోడీ మీడియా పండితులను అడిగితే కొండవీటి చాంతాడంత జాబితాను మన ముందుంచుతారు. రైతుల మహత్తర ఉద్యమం కారణంగా స్వాతంత్య్రానంతరం దేశంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను క్షమాపణ చెప్పి మరీ 2021లో వెనక్కు తీసుకోవటం కూడా వేగంగా జరిగినట్లే !


ఈ వేగం కోట్లాది మంది కోట్లాది మంది రైతులు కోరుతున్న, గతంలో నరేంద్రమోడీ కూడా డిమాండ్‌ చేసిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు ఎందుకు లేదు ? రెండు సంవత్సరాల క్రితం ఎంఎస్‌పితో సహా రైతాంగ సమస్యలపై నియమించిన కమిటీ నుంచి ఇంతవరకు తాత్కాలిక నివేదికను కూడా ఎందుకు తెప్పించుకోలేదు ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ప్రభుత్వ తీరు ఉంది. మూడు సాగు చట్టాలను 2021నవంబరులో రద్దుచేసినపుడు వెంటనే ఒక కమిటీని వేస్తామన్నారు. వెంటనే అంటే ఎనిమిది నెలలు, 2022 జూలై 12న కమిటీని వేశారు. ఆలస్యం ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని, సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి స్పందన కోసం ఎదురుచూడాల్సి రావటం అని వ్యవసాయ మంత్రి సాకులు చెప్పారు. ఆ కమిటీకి నివేదించిన అంశాలు, కమిటీలో ప్రతిపాదించిన వ్యక్తుల పట్ల అభ్యంతరాలు తెలుపుతూ మోర్చా తన ప్రతినిధులను పంపేందుకు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం-ఎన్నికల కమిషన్‌ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను అందించాలని సమాచార హక్కు కింద కోరగా అలాంటి రికార్డులు లేవని సమాధానం ఇవ్వటాన్ని బట్టి అసలు బండారం వెల్లడైంది.అంతే కాదు రైతు సంఘాలతో సంప్రదింపుల సమాచారం కూడా లేదని 2023 డిసెంబరు నాలుగవ తేదీన మరో సమాచార హక్కు ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఇక ప్రభుత్వం నియమించిన కమిటీ తీరుతెన్నులను చూస్తే ఎస్‌కెఎం ఎందుకు బహిష్కరించిందో వివరణ అవసరం లేదు. మొత్తం 29 మంది సభ్యులలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు, కాలేజీల్లో పనిచేసే వారే 18 మంది ఉన్నారు. మిగిలిన పదకొండు మంది అధికారేతర సభ్యులలో ఎస్‌కెఎం నుంచి ముగ్గురిని నియమిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. మరో ఎనిమిది మంది అధికారపార్టీ కనుసన్నలలో వ్యవహరించే రైతు ప్రతినిధులే ఉన్నారు. ఈ కమిటీకి అధ్యక్షుడు సంజరు అగర్వాల్‌. వివాదాస్పద మూడు సాగు చట్టాలను ప్రతిపాదించినపుడు వ్యవసాయశాఖ కార్యదర్శి. మరో సభ్యుడు ఇఫ్‌కో చైర్మన్‌ దిలీప్‌, ఇతగాడు గుజరాత్‌ బిజెపి మాజీ ఎంపీ. మరొకరు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ బికెఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడైన ప్రమోద్‌ చౌదరి, ఐదవ సభ్యుడు సయ్యద్‌ పాషా పటేల్‌ మహారాష్ట్ర బిజెపి మాజీ ఎంఎల్‌సి, ఇలా అందరూ గత సాగు చట్టాలను అడ్డంగా సమర్దించిన వారితోనే నింపిన తరువాత ఎస్‌కెఎం గళానికి అవకాశం ఎక్కడ ఉంటుంది.


ఇక ఈ కమిటీ తొలి పద్దెనిమిది నెలల కాలంలో 35 సమావేశాలు జరిపినట్లు, ఎప్పుడు నివేదిక సమర్పిస్తుందో చెప్పకుండా పార్లమెంటుకు ప్రభుత్వం జవాబిచ్చింది.ఫిబ్రవరి తరువాత మరో రెండు సార్లు సమావేశమైనట్లు వార్తలు.ఈ కమిటీ అనేక ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. వాటి నివేదికలు ఇవ్వాలని కోరినా అందుబాటులో లేవన్నదే ప్రభుత్వ సమాధానం. గతంలో స్వామినాధన్‌ కమిషన్‌, తరువాత నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన 2016కమిటీ కూడా అనేక అంశాలను చర్చించింది. అందువలన కొత్త కమిటీ చర్చల పేరుతో కాలయాపన తప్ప మరొకటి కాదు. వాటి సిఫార్సులకు వ్యతిరేకంగా మూడు సాగు చట్టాల్లోని అంశాలు ఉన్నాయి. అయినా మోడీ వాటిని రద్దు చేస్తూ 2021లో చేసిన ప్రసంగంలో రైతులకు కొత్త ఆశలను రేకెత్తించారు.2014 ఎన్నికల సమయంలో బిజెపి చేసిన వాగ్దానానికి వ్యతిరేకంగా మోడీ సర్కార్‌ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దేశ 75వ స్వాతంత్య్రదినోత్సవం (2022) నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరి 28 బడ్జెట్‌ సందర్బంగా మోడీ చెప్పారు. అదే ఏడాది ఏర్పాటు చేసిన అశోక్‌ దలవాయి కమిటీ 2012-13 ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అంచనా ప్రాతిపదికన 2015-2016లో ఒక రైతు రాబడి ఏడాదికి రు.96,703, నెలకు రు.8,058 ఉంటుందని అంచనా వేసి 2022-23నాటికి అది రు.2,71,378- రు.22,610 ఉండాలని, దాన్ని సాధించాలంటే ఏటా 10.4శాతం పెరుగుదల ఉండాలని చెప్పింది. ఇప్పుడు ఎంత ఉందో ఎక్కడా ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే 2018-19లో 77వ రైతు కుటుంబాల పరిస్థితి అంచనా సర్వే ప్రకారం రాబడుల మొత్తాలు రు.1,22,616-రు.10,218 ఉన్నట్లు తేలింది. ఈ నివేదికను 2021లో విడుదల చేశారు. దీని ప్రకారం చూస్తే వార్షిక పెరుగుదల కేవలం 2.8శాతమే ఉంది. పదేండ్ల యూపిఏ పాలన సగటు మూడు శాతం కంటే తక్కువ. అయితే ఏ ప్రాతిపదిక లెక్కించారో చెప్పకుండా కొన్ని పంటలకు 2022 ఆర్థిక సంవత్సరంలో రాబడి రెట్టింపు ఉన్నట్లు ఎస్‌బిఐ పరిశోధనా విభాగం చెప్పిన అంకెలను బిజెపి పెద్దలు ఊరూవాడా ప్రచారం చేశారు. గోడీ మీడియా దాన్ని ఇంకా ఎక్కువ చేసింది. నిజంగా అంత పెరిగి ఉంటే రైతాంగం ఈ ఎన్నికల్లో అనేక చోట్ల బిజెపి, దాని మిత్రపక్షాలను ఎందుకు మట్టికరిపించినట్లు ? అనేక చోట్ల రైతులు కనీస మద్దతు ధరలకంటే తక్కువకే అమ్ముకుంటున్నారు. రైతుల రాబడి రెట్టింపు ఎంతవరకు వచ్చిందన్న ప్రశ్నకు 2023 డిసెంబరులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పందిస్తూ వ్యవసాయం రాష్ట్రాల అంశం గనుక అవి చూసుకుంటాయని దాట వేశారు. మూడు సాగు చట్టాలను రాష్ట్రాలతో సంప్రదించకుండా వాటి ఆమోదం లేకుండా అమలుకు పూనుకున్నపుడు ఈ అంశం గుర్తులేదా ? రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తిని గమనించి గత ఎన్నికలకు ముందు కొంత మంది రైతులకు నెలకు రు.500 ఏడాదికి ఆరువేల చొప్పున పిఎం కిసాన్‌ నిధిపేరుతో ఇస్తున్నారు. ఐదేండ్లలో పెరిగిన వ్యవసాయ ఖర్చులతో పోల్చితే ఇది ఏమూలకూ రాదు. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచనుందనే లీకులను వదిలి రైతాంగాన్ని మభ్యపెట్టేందుకు చూసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు.


తాజాగా వర్తమాన ఖరీఫ్‌ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గతేడాది ఏడుశాతం పెంచగా ఇప్పుడు ఓట్లతో నిమిత్తం లేదు గనుక 5.4శాతం మాత్రమే పెంచారు. తాజా ఎన్నికల్లో 159 గ్రామీణ నియోజకవర్గాలలో ఓడిపోయిన బిజెపి దాన్నుంచి ఎలాంటి పాఠం నేర్చుకోలేదన్న సంయుక్త కిసాన్‌ మోర్చా వ్యాఖ్యను గమనించాలి.ఈ సందర్భంగా పదేండ్ల యుపిఏ పాలనలో పెరిగింది ఎంత, రాబడిని రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ ఎంత పెంచారు అన్నది మీడియాలో చర్చకు వచ్చింది. దీన్ని గోడీ మీడియా మూసిపెట్టేందుకు చూసింది.ప్రభుత్వ సమాచారం ప్రకారమే మచ్చుకు సోయాబీన్‌కు గత పాలకులు, 175, పత్తికి 115శాతం పెంచగా మోడీ పదేండ్లలో 80,79శాతాల చొప్పునే పెంచారు. అనేక పంటల ధరల పెరుగుదల శాతాల తీరు తెన్నులు దిగువ విధంగా ఉన్నాయి. దీనికి ఆధారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం.ఈ కనీస మద్దతు ధరలు కూడా రైతాంగంలో కేవలం పద్నాలుగుశాతం మాత్రమే పొందుతున్నారన్నది అంచనా.


పంట××××× యుపిఏ ×× మోడీ ఏలుబడి

వరి ముతక×× 138.2 ×× 66.7
గోధుమ ×× 122.2 ×× 62.5
చెరకు ×× 187.7 ×× 50.0
ఆవాలు ×× 90.6 ×× 85.3
పత్తి ××114.5 ×× 78.9
మొక్క జొన్న ××1594 ×× 59.5
శనగలు ×× 121.4×× 75.5
కందులు ×× 216.2×× 62.8
నరేంద్రమోడీ సర్కార్‌ రైతులకు చేసిన మేలు ఇలా ఉంది గనుకనే అనేక చోట్ల బిజెపి ఎదురుదెబ్బలు తిన్నది, గత ఎన్నికల కంటే సీట్లు, ఓట్ల శాతాన్ని కూడా కోల్పోయింది. దేశాన్ని ఊపివేస్తున్న నీట్‌ పరీక్షా పత్రాల కుంభకోణం ఎన్నికలకు ముందే వెలువడి ఉంటే దాని పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. దేశం కోసం-ధర్మం కోసమంటూ కబుర్లు చెప్పిన కాషాయదళం తీరుతెన్నులు వచ్చే ఐదు సంవత్సరాలూ వ్యవసాయ రంగంలో ఇదే విధంగా ఉండకూడని అనేక మంది కోరుతున్నారు.పెడచెవిన పెడితే రైతాంగ ఉద్యమాలు వెల్లువెత్తుతాయి. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 15-16శాతమే ఉన్నప్పటికీ జనాభాలో 45శాతం మందికి ఉపాధి చూపుతున్నది. ఇది కూడా కుదేలైతే గ్రామీణా ప్రాంతాలలో అలజడి రేగుతుంది. జూలై పదవ తేదీన సంయుక్త కిసాన్‌మోర్చా జనరల్‌ బాడీ సమావేశం ఎన్నికల అనంతర పరిస్థితి గురించి సమీక్ష, కార్యాచరణ గురించి చర్చించనుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ రెండు ముఖాలు : రైౖతుల మద్దతు కోసం పాకులాట – ఉద్యమ సంఘాలపై పగసాధింపు !

22 Saturday Jun 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Failed Narendra Modi, #Farmers matter, AIKS, BJP, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, PM Kisan Nidhi, Samyukta Kisan Morcha, SKM


ఎం కోటేశ్వరరావు


ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన కిసాన్‌ సమ్మాన్‌ యోజన పదిహేడవ విడత నిధులను మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత పెద్ద ఆర్భాటంతో ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు.(ఆంధ్రప్రదేశ్‌ మాజీ సిఎం వైఎస్‌ జగన్‌ మీట నొక్కుడును గుర్తుకు తెచ్చింది) అంతకు ముందు తొలిసంతకం దాని మీదే చేసినట్లు కూడా ప్రచారం జరిగింది.వెంటనే తాను ఎన్నికైన లోక్‌సభ స్థానం వారణాసి వెళ్లి రైతులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎగుమతుల ద్వారా భారత ఆహార వస్తువులను ప్రపంచంలో ప్రతి ఒక్కరి కంచంలో చూడాలని ఉందన్నారు. గతంలో ఎన్నడూ పిఎం కిసాన్‌ యోజన నిధుల విడుదలకు ఇంత హంగామా చేయలేదు. నిజానికి ఈ సొమ్ము ఏ కార్పొరేట్ల నుంచో ధనికుల నుంచో వసూలు చేసి ఇవ్వటం లేదు. మనం కొనుగోలు చేసే పెట్రోలు మీద లీటరుకు రు.2.50, డీజిలు మీద రు.4.00 సెస్‌ల పేరుతో కేంద్రం వసూలు చేసి దాన్నుంచి ఇస్తున్నది. ఇదే కాదు మొత్తం 29 వస్తువులపై ఈ పేరుతో పన్ను మీద 15శాతం సెస్‌ల రూపంలో వినియోగదారుల జేబుల నుంచి కొట్టివేసి దాన్నుంచే కొన్ని పథకాలను అమలు చేస్తున్నది. ఎప్పుడూ లేనిది కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదలను ప్రచారానికి ఎందుకు వినియోగించుకున్నట్లు ? అదేమీ అర్ధంగాని తత్వం లేదా బ్రహ్మ పదార్ధం కాదు.తాజా లోక్‌సభ ఎన్నికల్లో రైతుల నుంచి వెల్లడైన వ్యతిరేకత అనేక ప్రాంతాల్లో ఓటమిలో వారి పాత్రను చూశారు. తత్వం తలకెక్కి రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దగ్గరయ్యే ఎత్తుగడతో వారికోసం తాను తపిస్తున్నట్లు కనిపించేందుకు చేసిన యత్నం తప్ప మరొకటి కాదు.కొందరి విశ్లేషణ ప్రకారం గత లోక్‌సభలో 543 స్థానాలకు గాను బిజెపి 201గ్రామీణ నియోజకవర్గాలలో విజయం సాధించగా తాజా ఎన్నికల్లో 126 చోట్ల మాత్రమే గెలిచింది.వ్యవసాయదారులను నిర్లక్ష్యం చేసిన కారణంగా 159 చోట్ల బిజెపి ఓడిపోయిందని, రైతుల ప్రతినిధులను బడ్జెట్‌ చర్చల ప్రక్రియలో భాగస్వాములను చేయకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తే, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశవ్యాపితంగా ఆందోళన తప్ప మరొక మార్గం లేదని ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకెఎస్‌) స్పష్టం చేసింది.


నిజంగా వ్యవసాయం, దాని మీద ఆధారపడిన రైతులు, కూలీల గురించి కేంద్ర ప్రభుత్వానికి అంతశ్రద్ద ఉందా ? పదేండ్ల ఆచరణ చూస్తే అలా కనిపించదు. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయ రంగంలో రాష్ట్రాలలో చర్చ, ఆమోదంతో నిమిత్తం లేకుండా కరోనా సమయంలో అమల్లోకి తెచ్చిన మూడు రైతు వ్యతిరేక సాగు చట్టాలు, వాటికి వ్యతిరేకంగా ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం తెలిసిందే.విధి లేని స్థితిలో క్షమాపణలు చెప్పిమరీ మోడీ వాటిని వెనక్కు తీసుకున్నారు. ఆ మహత్తర ఉద్యమానికి నాయకత్వం వహించింది అనేక రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం). ఆ వేదికలో కీలక పాత్రపోషించిన ఆలిండియా కిసాన్‌ సభ(ఎఐకెఎస్‌) దేశంలో అతి పెద్ద రైతు ఉద్యమ సంస్థ, తొలి వరుసలో ఉంది. మూడు సాగు చట్టాల రద్దు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు, ఇతర అంశాల గురించి 2022 జూలైలో ఒక కమిటీని వేసింది. అది ఏం చేస్తున్నదో నివేదిక ఎప్పుడు సమర్పిస్తుందో తెలియదు. బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా వివిధ తరగతులు ఏ కోరుకుంటున్నారో తెలుసుకొనేందుకు ప్రభుత్వం సంస్థలు, వ్యక్తులను కూడా పిలిచి ప్రతి ఏడాది సంప్రదింపులు జరుపుతుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆమోదం పొందిన తాత్కాలిక(ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌) స్థానంలో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఇప్పుడు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ చర్చలకు ఎస్‌కెఎం, ఏఐకెఎస్‌లను దూరంగా పెట్టింది. ఇది రైతులను అవమానించటం, కక్ష సాధింపు అనేందుకు పక్కానిదర్శనం.ఈ వైఖరిని ఆలిండియా కిసాన్‌ సభ ఒక ప్రకటనలో తీవ్రంగా నిరసించింది. కనీస మద్దతు ధరలను సిఫార్సు చేసే వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రతి ఏటా ఎఐకెఎస్‌ను ఆహ్వానించి అభిప్రాయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎస్‌కెఎం నాయకులను కూడా చర్చల నుంచి మినహాయించటాన్ని కూడా ఎఐకెఎస్‌ ఖండించింది.


మూడవసారి అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ వ్యవసాయం గురించి సరికొత్తగా ఆలోచించి కార్యాచరణ చేపట్టాలని అనేక మంది చెబుతున్నారు. మోడీ సర్కార్‌ పారిశ్రామిక వస్తు ఎగుమతుల్లో విఫలమైంది. సముద్ర ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులకు జతచేసిి మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిగా చూపుతున్నారు.2014-15 సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 36.18బిలియన్‌ డాలర్లుండగా 2020-21నాటికి 38.32 బి.డాలర్లకు పెరిగినట్లు ఏటా పెరుగుదల శాతం 0.96శాతంగా ఉన్నట్లు ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపినట్లు బిజినెస్‌ టుడే పత్రిక 2021 డిసెంబరు 10న ప్రచురించిన వార్తలో పేర్కొన్నది.సముద్ర, తోటల ఉత్పత్తులను మినహాయించి కేవలం వ్యవసాయ ఉత్పత్తుల విలువ 2020-21లో 29.81 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మోడీ అధికారానికి రాకముందు 2013-14 సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 37.292బి.డాలర్లు. ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించినట్లు పిఐబి 2014జూలై తొమ్మిదిన తెలిపింది.దీంతో పోల్చుకున్నా, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ విలువ తిరోగమనంలోనే ఉంటుంది. జనాన్ని మభ్యపరిచేందుకు పాలకుల కనుసన్నలలో పనిచేసే అధికార యంత్రాంగం ఎన్నితిప్పలు పడుతుందో పిఐబి 2024 ఫిబ్రవరి 17న వెల్లడించిన మరో సమాచారాన్ని చూస్తే తెలుస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన పదేండ్లలో సాధించిన విజయాల గురించి కీర్తించటం తెలిసిందే. దానిలో భాగంగానే 1987-88లో అపెడా( వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ) ఎగుమతులు కేవలం 0.6బిలియన్‌ డాలర్లేనని అలాంటిది 2022-23నాటికి 26.7బి.డాలర్లకు పెరిగినట్లు , ఇది మోడీ గొప్పతనం అన్నట్లు చిత్రించింది. ఈ ఏడాదిలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 53.1బి.డాలర్లని కూడా తెలిపింది. ఈ లెక్కన చూసుకున్నా పదేండ్లలో పెరిగింది 53.1-37.29=15.81 బి.డాలర్లు మాత్రమే. తాను వచ్చిన తరువాత భారత ప్రతిష్టను, విదేశాల్లో తిరిగి మార్కెట్లను పెంచానని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు చేశామని చెప్పుకున్న నరేంద్రమోడీ ప్రచారానికి ధీటుగా ఈ పెరుగుదల లేదు. యాహూ న్యూస్‌ 2024 మార్చి 21వ తేదీ విశ్లేషణ ప్రకారం 2022లో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే 20 అగ్రదేశాలలో మనది 11వ స్థానం, చైనా ఆరవదిగా ఉంది.


మన రైతులు నేరుగా ఏ దేశానికైనా ఎగుమతులు చేసుకొనేందుకు, దేశంలో ఎక్కడైనా అమ్ముకొనేందుకు వీలుగా మూడు సాగు చట్టాలను తీసుకొచ్చినట్లు నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే.కానీ అదే ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలు, నిషేధం ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి పండే ప్రాంతాలలో ఎక్కువ చోట్ల బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్నది. ఆంక్షల వలన 2023 ఏప్రిల్‌-అక్టోబరు మాసాల మధ్య బాస్మతి బియ్యం ఎగుమతులు 16శాతం పెరిగినా ఇతర ఉత్పత్తుల్లో నాలుగు బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరగలేదు. తొమ్మిదిశాతం ఎగుమతులు తన పరిధిలో తగ్గినట్లు అపెడా పేర్కొన్నది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా బిజెపి రైతుల ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా నేపాల్‌, ఇతర దేశాలు మన బదులు పాకిస్తాన్‌, చైనాల నుంచి కొనుగోలుకు పూనుకున్నాయి. అంటే ఎగుమతి అవకాశాన్ని తన ఎన్నికల లబ్దికోసం మోడీ అనిశ్చితిలో పడేశారు. పోనీ మనదేశంలో ఉల్లి దిగుబడిని పెంచేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ కనపడదు. చైనాలో హెక్టారుకు 21.85 టన్నుల దిగుబడి ఉండగా మనదేశంలో 16.12 టన్నులు మాత్రమే ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో రెండు దేశాలూ ఒకటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి.


వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలకు బదులు రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు సాగు చట్టాల పేరుతో చేసిన యత్నం బెడిసి కొట్టింది. తరువాత కూడా అదే వైఖరి. కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి) విధానాన్ని ఎత్తివేయాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల అమలుకు చూస్తున్నారు. ఆ కారణంగానే ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నారు. మరో ఐదు సంవత్సరాల వరకు పార్లమెంటు ఎన్నికలు లేవు గనుక ఎగుమతి వ్యాపారంలో ఉన్న బడా సంస్థల కోసం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలను త్వరలో ఎత్తివేసి అవి రైతులకోసమే అని చెప్పినా ఆశ్చర్యం లేదు. మూడు సాగు చట్టాల తరువాత వేసిన కమిటీతో మరో రూపంలో ఆ చట్టాల్లోని అంశాలనే చెప్పించి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటానికి సాకుల కోసం చూస్తున్నారు. ఆ పేరుతో ప్రపంచవాణిజ్య సంస్థ, ఐఎంఎఫ్‌, ప్రపంచ బాంకులను సంతుష్టీకరించేందుకు పూనుకోవచ్చు.మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన నరేంద్రమోడీ మరోవైపు పప్పుధాన్యాలు, ఖాద్యతైలాల దిగుమతులపై పన్నులు తగ్గించారు. దీంతో మనదేశంలో వీటిని సాగుచేసే రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ద్రవ్యోల్బణ అదుపు చర్యలంటూ ఎగుమతులపై ఆంక్షలు, దిగుమతులపై పన్నుల తగ్గింపు కారణంగా అంతిమంగా నష్టపోయింది రైతులు మాత్రమే. ఎన్నికలు జరుగుతున్నపుడు కిలో ఇరవై రూపాయలున్న ఉల్లి ఫలితాలు వచ్చిన వెంటనే యాభై రూపాయలకు పెరిగింది. దీంతో రైతులెంత లబ్దిపొందుతారో తెలియదు గానీ వినియోగదారుల జేబులకు చిల్లి పడింది.

తొలిసారి నరేంద్రమోడీ అధికారానికి రావటానికి, కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోవటానికి కారణాల్లో ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదల కూడా ఒకటి.అందుకే తాజా ఎన్నికలకు ముందు దాన్ని కృత్రిమంగా అదుపులో ఉంచేందుకు పైన పేర్కొన్న చర్యలను తీసుకున్నారు.అయినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం 2023 నవంబరు నుంచి ఎనిమిదిశాతానికి అటూ ఇటూగా ఉంది. ఆ మేరకు పప్పులు, నూనెలు, ఇతర ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. బిజెపిని దెబ్బతీసిన అంశాలలో ఇది కూడా ఒకటి. ఈ నేపధ్యంలో బడ్జెట్‌లో రైతులు ఏం కోరుతున్నారో తెలుసుకోవాలంటే వారి సమస్యలపట్ల నిత్యం పని చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా, ఆలిండియా కిసాన్‌ సభ వంటి సంస్థలను, రైతాంగ సమస్యలపై అధ్యయనం చేస్తున్న మేధావులను సంప్రదించకుండా కుదిరేది కాదు. ఆ దిశగా కేంద్ర తీరు లేదంటే దాని అర్ధం ఏమిటి ? చర్చలకు పిలిస్తే ఎవరేం కోరుతున్నారో రైతులకు స్పష్టత వస్తుంది, వాటిని అమలు జరపకపోతే పాలకుల మీద వత్తిడి పెరుగుతుంది. అందుకే దూరంగా పెట్టారు.తన కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తానని ఒక ముసలమ్మ అనుకుందట.అలాగే ప్రభుత్వం అవకాశం కల్పించనంత మాత్రాన ఉద్యమ సంస్థల వాణి రైతులకు చేరకుండా ఉంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ వట్టిస్తరి మంచినీళ్లు : భారత్‌లో మహిళా సమానత్వ సాధనకు 152 ఏళ్లు !

19 Wednesday Jun 2024

Posted by raomk in BJP, Current Affairs, Economics, Education, Health, History, INDIA, NATIONAL NEWS, Political Parties, Women

≈ Leave a comment

Tags

BJP, Global Gender Gap India, Global Gender Gap Report 2024, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


బేటీ బచావో బేటీ పఢావో, మహిళా సురక్ష కేంద్ర, మహిళా పోలీసు వలంటీర్స్‌, రాష్ట్రీయ మహిళా కోష్‌, సుకన్య సమృద్ధి యోజన, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ… ఇవన్నీ మన దేశంలో ఉన్న పధకాలు, ఎవరికో చెప్పనవసరం లేదు.కొన్ని రాష్ట్రాల్లో వీటికి పేర్లు మార్చి అమలు జరుపుతున్నారు. మొత్తం మీద ఇన్ని జరిగిన తరువాత కూడా ప్రపంచంలో స్త్రీ, పురుష సమానత్వ తేడాలో 2024 ప్రపంచ 146దేశాల జాబితా ప్రకారం మన స్థానం 129. పదేండ్లతో పోల్చుకుంటే దిగజారింది. మహిళల అభ్యున్నతి గురించి గత పది సంవత్సరాలుగా తమ భుజాలను తామే చరుచుకొని రొమ్ములు విరుచుకొని గొప్పలు చెప్పుకున్న, మహిళలను వంచించిన వారు, అంతకంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లు వారికి భజన చేసిన ఘనులు తలలెక్కడ పెట్టుకుంటారో చూడాలి. పధకాలన్నీ మావే, రాష్ట్రాలు పేర్లు మార్చుకుంటున్నాయి, అందువలన మా ఫొటోలు పెట్టాలి, వాటి ” ఖ్యాతి ”లో మాకూ వాటా రావాలని కోరుతున్న బిజెపి పెద్దలు ఆ మొత్తాన్ని వారే తీసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. డిఎంకె సభ్యురాలు కనిమొళి రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు నాడు మంత్రిగా ఉన్న మేనకా గాంధీ 2015 మే 7వ తేదీన ఇచ్చిన జవాబు సారం ఇలా ఉంది. ప్రపంచ ఆర్థికవేదిక (డబ్ల్యుఇఎఫ్‌) లింగసమానత్వ తేడా నివేదిక 2014 ప్రకారం 142దేశాలలో భారత్‌ 114వదిగా ఉంది. అంతకు ముందు సంవత్సర నివేదిక ప్రకారం 136 దేశాలలో 101వదిగా ఉంది. ఏడాది కాలంలోనే ఇంతగా దిగజారి పోవటానికి కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం తగ్గటం, అవకాశాలు లేకపోవటమే అని పేర్కొన్నారు. అలాంటిది కొన్ని మార్పులు జరిగినా పదేండ్ల తరువాత 101 నుంచి 129వ స్థానానికి దిగజారింది. కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బిజెపి, మిత్రపక్షాలే, మెరుగుపరచకపోయినా దిగజారటానికి నెపం నెహ్రూ మీదో, గాంధీ మీదో నెడితే కుదరదు.


ఈ సూచికలను రూపొందించటానికి నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.1.ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం, అవకాశాలు, 2. విద్యా అవకాశాలు, 3. ఆరోగ్యం,బతుకు, 4.రాజకీయ సాధికారత. వీటన్నింటిలో ఏ దేశం ఎక్కడుందనే సూచికలు, పాయింట్లు వేస్తారు. వాటన్నింటిని కలిపి మొత్తంగా సాధారణ సూచికలను రూపొందిస్తారు. ఇలాంటి నివేదికలను 2006 నుంచి ప్రతి ఏటా రూపొందిస్తున్నారు. పరిగణనలోకి తీసుకున్న 146దేశాల సగటు లింగ సమానత్వ తేడా 2024లో 68.5శాతం ఉంది. గతేడాది కంటే కేవలం 0.1శాతమే మెరుగైంది. అంటే 31.5శాతాన్ని పూరించాల్సి ఉంది. ఇప్పుడున్న వేగంతో తేడాను పూర్తిగా తగ్గించాలంటే 134 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచంలో నూటికి నూరుశాతం సమానత్వం సాధించిన దేశమేమీ లేదు. మొదటి స్థానంలో ఉన్న ఐస్‌లాండ్‌లో 93.5శాతం సాధించారు.భారత్‌లో 64.1శాతం ఉంది. ఈ లెక్కన పూర్తి సమానత్వం సాధించటానికి కనీసం 152 సంవత్సరాలు పడుతుంది. దక్షిణాసియా దేశాల సగటు తేడా 63.7శాతమే. పది సంవత్సరాల నాడు మొత్తం రాంకు మార్కులను చూస్తే 0.6455 కాగా తాజా సూచికలో 0.641కి దిగజారింది.


మన దేశంలో లింగ బేధాలను తగ్గించటంలో పదేండ్ల నరేంద్రమోడీ పాలన ఘోరంగా విఫలమైంది. మరింత దిగజారింది.ఇరుగుపొరుగు దేశాలలో బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌ తరువాత ఐదవదిగా మనదేశం ఉంటే బిజెపి పెద్దలు నిత్యం స్మరించే పాకిస్తాన్‌ ఏడవదిగా ఉంది.ఆర్థిక భాగస్వామ్యం, ఆరోగ్యంలో 146కు గాను 142వదిగా ఉంది.(మన తరువాత పాకిస్తాన్‌ ఉంది) విద్య అందుబాటులో 112, రాజకీయ రంగంలో 65, కార్మికశక్తి భాగస్వామ్యంలో 134వదిగా ఉంది. విద్యాఅవకాశాలు, రాజకీయ సాధికారత తగ్గుదల కారణంగానే గతేడాది వచ్చిన 127వ రాంకు 129కి దిగజారింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినప్పటికీ ఆ స్ఫూర్తిని రాజకీయ పార్టీలేవీ పాటించలేదు. దాని ఘనత తమదే అని భుజాలు చరుచుకున్న బిజెపి 30 మంది కాబినెట్‌ మంత్రులకు గాను కేవలం ఇద్దరికి, మొత్తం మంత్రివర్గంలో గతంలో ఉన్న పది మందిని ఈ సారి ఏడుకు తగ్గించింది. నేపాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న మంత్రులలో 23.5శాతం మంది మహిళలే ఉన్నారు. చట్టసభల్లో మహిళల ప్రపంచ సగటు 33శాతం కాగా అక్కడ 49.9శాతం ఉంది.


జనాభాలో సగంగా ఉన్న మహిళలకు ఉత్పాదక రంగంలో భాగస్వామ్యం కల్పించకుండా వారి సాధికారత గురించి ఎన్ని కబుర్లు చెప్పినా వట్టిస్తరి మంచి నీళ్లు తప్ప మరొకటి కాదు. గడచిన పది సంవత్సరాల్లో జరిగింది అదే. లింగసమానత్వ తాజా నివేదికలో మనదేశంలో కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం 35.09శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కూడా ప్రభుత్వం అందచేసిన తప్పుడు లెక్కల కారణంగానే. నిజంగానే అంత ఉందా ? లోక్‌సభ ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశట్టే ముందు నరేంద్రమోడీ తన పాలనలో మహిళాభ్యున్నతిని చూసి ప్రతిపక్షాలు ఆత్మశోధన చేసుకోవాలని చెప్పారు. తన పదేండ్ల ఏలుబడిలో దిగజారిన రాంకును చూసి తలవంచుకుంటారా ? ప్రతిపక్షాలకు సుభాషితాలు చెబుతూనే ఉంటారా ? ప్రభుత్వం ప్రకటించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్న అంకెలకు, ప్రభుత్వ లెక్కలకు పొంతన కుదరటం లేదు. స్టాటిస్టా విశ్లేషణ ప్రకారం 2014 నుంచి 2022వరకు తొమ్మిదేండ్ల సగటు 26.81శాతం కాగా 2023లో 32.68శాతం ఉన్నట్లు అదే సంస్థ పేర్కొన్నది.ఒక్కసారిగా అంత ఎలా పెరిగింది ? ప్రపంచ బాంకు లెక్క 32.7శాతం అన్నది. దేశంలో 2022-23లో నియమిత కాల కార్మిక శక్తి సర్వే ప్రకారం మహిళలు అంతకు ముందుతో పోలిస్తే 4.2శాతం పెరిగి యూజువల్‌ స్టేటస్‌ లెక్కింపు అవగాహన ప్రకారం 37శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదిన ప్రకటించింది. అందుకే అంకెల గారడీ అనాల్సి వస్తోంది.


ఇండియా టుడే వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు మహిళలు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. మహిళల భాగస్వామ్యం పెరిగితే 2025 నాటికి జిడిపిలో 70వేల కోట్ల డాలర్లు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 52శాతం మంది మహిళలు వేతన ఉపాధి లేదా లేదా కుటుంబ సంరక్షణలో రెండింటిలో ఉంటామని చెప్పారు. కానీ 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది. ప్రముఖ మీడియా సంస్థ అల్‌ జజీరా. అది 2023 ఏప్రిల్‌ పదిన ఒక విశ్లేషణ ప్రచురించింది.” జనాభాలో భారత్‌ దూసుకుపోతున్నా శ్రామిక శక్తిలో తగ్గుతున్న మహిళలు ” అని పేరు పెట్టింది.ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న భారత్‌ మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని అతితక్కువ 20దేశాల్లో ఒకటిగా ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నట్లు పేర్కొన్నది. పెరుగుతున్న జనాభాకు ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని చూపటంలో విఫలమైతే భారత్‌కు అది గుదిబండగా మారుతుంది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి 25శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పిన అంశాన్ని అల్‌ జజీరా ఉటంకించింది. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నాయని సిఎంఐఇ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ చెప్పిన మాటలను ఉటంకించింది.శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మహిళలకు అన్ని గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం, ఇన్ని మరుగుదొడ్లు కట్టించాం అని ఊరూ వాడా ప్రచారం చేసే బిజెపి ప్రచార దళాలు తమ రెండింజన్ల డ్రైవర్లు సాధించిందేమిటో, పదేండ్లలో పరిస్థితి ఎందుకు దిగజారిందో ఎక్కడా మాట్లాడటం లేదు. గోడీ మీడియా సంగతి సరేసరి తేలుకుట్టిన దొంగల్లా నోరెత్తటం లేదు. ఈ అంశాన్ని పట్టించుకోవాల్సింది కాదన్నట్లుగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటీని కోల్పోవటానికి మహిళా ఉపాధి తగ్గటం కూడా ఒక కారణమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ ఫాసిస్టు సంస్థ, ఊసరవెల్లి : సోషలిస్టు నేత మధు లిమాయే చెప్పిన వాస్తవాలేమిటి ?

17 Monday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

# Anti Muslims, Adolf Hitler, BJP, Guru Golwalkar, Hindu Rashtra, Madhu Limaye, Narendra Modi, Savarkarites, What is RSS


మధులిమాయే


నేను 1937లో రాజకీయ జీవితంలో ప్రవేశించాను. ఆ రోజుల్లో పూనాలో ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు సావర్కర్‌వాదులు( వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనుచరులు) ఒక వైపు, మరోవైపు జాతీయవాదులు, సోషలిస్టులు మరియు వామపక్ష రాజకీయ సంస్థలు ఎంతో చురుకుగా ఉండేవి.1938 మే ఒకటవ తేదీన మే దినోత్సవాన్ని పాటించేందుకు మేము ఒక ప్రదర్శన జరిపాము. దాని మీద ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌వాదులు దాడి చేశారు. ఆ సందర్భంగా సుపరిచితులైన విప్లవవాది సేనాపతి బాపట్‌, మా సోషలిస్టు నేత ఎస్‌ఎం జోషి కూడా గాయపడిన వారిలో ఉన్నారు. హిందూత్వ సంస్థలతో అప్పటి నుంచి మాకు తీవ్రమైన విబేధాలు ఉండేవి. జాతీయవాద సమస్య మీద ఆర్‌ఎస్‌ఎస్‌తో మా తొలి విబేధం ఉంది. భారత దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని మేము నమ్మాము. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌ వాదులు హిందూ రాష్ట్ర అనే భావంతో వచ్చారు. మహమ్మదాలీ జిన్నా కూడా అలాంటి లోకపు భావన బాధితుడే. భారత్‌ రెండు – ముస్లిం, హిందూ దేశాలతో ఏర్పడిందని అతను నమ్మారు, సావర్కర్‌ కూడా అదే చెప్పారు.


మా మధ్య రెండో ప్రధాన విబేధం ఏమిటంటే మేము ఒక ప్రజాస్వామిక సర్వసత్తాక రాజ్యం ఉద్భవించాలని కలగన్నాము, ప్రజాస్వామ్యం పశ్చిమదేశాల భావన, భారత్‌కు పనికిరాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది. ఆ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు అడాల్ఫ్‌ హిట్లర్‌ను ఎంతగానో పొగిడేవారు. గురూజీ(మాధవ సదాశివ గోల్వాల్కర్‌) ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగానే కాదు సైద్దాంతిక గురువుగా కూడా ఉండేవారు.గురూజీ మరియు నాజీల మధ్య ఆలోచనల్లో అద్భుతమైన సామీప్యతలు ఉన్నాయి. ఆయన ఉత్తమ రచనల్లో ఒకటిగా ఉన్న ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” అనే గ్రంధం అనేక ప్రచురణలు పొందింది. హిందువులు కాని వారిని పౌరులుగా పరిగణించకూడదని స్పష్టంగా దానిలో చెప్పారు.వారి పౌరసత్వహక్కులను రద్దుచేయాలని కోరారు. ఈ ఆలోచనలు కొత్తగా రూపుదిద్దుకున్నవి కాదు. మేము కాలేజీలో ఉన్న రోజుల నుంచి(1930 దశకం మధ్యలో) హిట్లర్‌ భావజాలం వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు మొగ్గుచూపేవారు. వారి దృష్టి ప్రకారం జర్మనీలో యూదుల పట్ల హిట్లర్‌ ఎలా వ్యవహరించాడో అదే మాదిరి భారత్‌లో ముస్లింలు, క్రైస్తవుల పట్ల వ్యవహరించాలి.నాజీ పార్టీ భావాల పట్ల గురూజీ ఎంతలా సానుకూలంగా ఉన్నారో ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” గ్రంధంలో దిగువ పేరాయే సాక్ష్యం.” తన జాతి, సంస్మృతిని పరిశుద్దంగా ఉంచేందుకు సెమిటిక్‌ జాతులను-యూదులను అంతమొందించి జర్మనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతి ఔన్నత్యం దాన్ని ఉన్నతిని ఇక్కడ స్పష్టం చేసింది. జాతులు,సంస్కృతుల మధ్య ఉన్న విబేధాలకు కారణాలు తెలుసుకొంటే వాటిని తొలగించటం అసాధ్యం కాదని, ఐక్యంగా ఉంచటానికి సమీకృతం చేసేందుకు ప్రపంచానికి జర్మనీ దారి చూపింది, దాన్నుంచి నేర్చుకొనేందుకు, లబ్దిపొందేందుకు హిందూస్తాన్‌లో మనకు మంచి పాఠం ”


కుల సమస్య మీద గురూజీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌తో మా మూడో ప్రధాన విబేధం. ఒక సోషలిస్టుగా నా వంటి వారికి అది ఒక పెద్ద శత్రువు కాగా కుల వ్యవస్థ సమర్ధకులు వారు. కుల వ్యవస్థ దాని పునాదిగా ఉన్న అసమానతలను నిర్మూలించకుండా భారత్‌లో ఆర్థిక, సామాజిక సమానత్వం సాధ్యం కాదన్నది నా గట్టి వైఖరి. మేము విబేధించిన నాలుగో అంశం భాష. పౌరుల భాషలను ప్రోత్సహించేందుకు మేము అనుకూలం. అన్ని ప్రాంతీయ భాషలు దేశీయమైనవే. కానీ దీని మీద చెప్పిందేమిటి ? అందరికీ ఉమ్మడి భాషగా ప్రస్తుతానికి హిందీని, తరువాత అంతిమంగా జాతీయ భాషగా సంస్కృతాన్ని చేయాలని గురూజీ చెప్పారు. ఐదవది, స్వాతంత్య్రం కోసం తలెత్తిన జాతీయ ఉద్యమం ఫెడరల్‌ రాజ్యం అనే భావనను ఆమోదించింది. ఒక సమాఖ్య దేశంలో కొన్ని నిర్దేశిత విషయాలలో కేంద్రం కొన్ని తప్పనిసరి అధికారాలను కలిగి ఉంటుంది, ఇతర అన్ని అంశాలు రాష్ట్రాలకు చెందినవిగా ఉండాలి. కానీ దేశ విభజన తరువాత కేంద్రాన్ని పటిష్టపరిచేందుకు ఉమ్మడి జాబితాను నిర్దేశించారు. ఈ జాబితా ప్రకారం అనేక అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. వాటి మీద కేంద్రం, రాష్ట్రాలకు సమానమైన అధికారపరిధి ఉంది.ఆ విధంగా సమాఖ్య రాజ్యం ఉనికిలోకి వచ్చింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు దాని ప్రధాన సిద్దాంతవేత్త గురు గోల్వాల్కర్‌ ఈ మౌలిక రాజ్యాంగ ఏర్పాటును వ్యతిరేకించారు. రాష్ట్రాల సమాఖ్య భావననే వీరు అపహాస్యం చేశారు. రాష్ట్రాల సమాఖ్యను కోరిన రాజ్యాంగాన్నే రద్దు చేయాలన్నారు. తన ” బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ ” అనే గ్రంధంలో రాజ్యాంగాన్ని సమీక్షించాలని, కొత్త రాజ్యాంగంలో ఏక(యూనిటరీ) రాజ్య ఏర్పాటును లిఖించాలని పేర్కొన్నారు. ఏక లేదా మరో మాటలో చెప్పాలంటే కేంద్రీకృత రాజ్యాన్ని గురూజీ కోరారు.రాష్ట్రాల వ్యవస్థను వదిలించుకోవాలని చెప్పారు.


జాతీయోద్యమం ఎంచుకున్న త్రివర్ణ పతాకం మరొక సమస్య. మనం ఎంచుకున్న జాతీయ పతాక గౌరవం, ఔన్నత్యం కోసం వందలాది మంది భారతీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, వేలాది మంది లాఠీ దెబ్బలను తిన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ త్రివర్ణాన్ని జాతీయ జెండాగా ఎన్నడూ ఆమోదించలేదు. అది ఎల్లవేళలా కాషాయపతాకానికే వందనం చేస్తుంది.స్మృతికందని కాలం నుంచీ అది హిందూ రాజ్య పతాకంగా ఉందని చెబుతుంది.ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల గురూజీకి విశ్వాసం లేదు. ప్రజాస్వామ్య భావన పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదనే ధృడ వైఖరిని కలిగి ఉన్నారు. భారతీయ నాగరికత, ఆలోచనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తగినది కాదన్నారు. ఏక నాయకత్వ సూత్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నమ్ముతుంది.ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక మానసిక దృక్పధాన్ని సృష్టిస్తుందని అది పూర్తిగా క్రమశిక్షణతో కూడుకున్నదిగా ఉంటుందని అది ఏం చెబితే దాన్ని జనం అంగీకరిస్తారని గురూజీ కూడా స్వయంగా చెప్పారు. ఈ సంస్థ ఏక వ్యక్తి నాయకత్వ సూత్రం మీదనే పనిచేస్తుంది. సోషలిజం గురూజీ దృష్టిలో పూర్తిగా వెలుపలి భావజాలం, సోషలిజం, ప్రజాస్వామ్యంతో పాటు అన్ని ఇజాలూ విదేశీ ఆలోచనలే, వాటిని తిరస్కరించాలని, భారతీయ సమాజాన్ని భారతీయ సంస్కృతి ఆధారంగా నిర్మించాలని అతను పదే పదే చెప్పారు. మా గురించి చెప్పాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం,సోషలిజం పట్ల మాకు విశ్వాసం ఉంది. శాంతియుత పద్దతుల్లో గాంధియన్‌ సూత్రాలకు అనుగుణంగా సోషలిజాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. మరోవైపు ఒక ప్రత్యేక మూసలో యువ మెదళ్లను తయారు చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక నైపుణ్యాన్ని సంతరించుకుంది. తొలుత అది పిల్లలు, యువత మెదళ్లలోకి ఏమీ ప్రవేశించకుండా ఘనీభవింపచేస్తుంది. ఆ తరువాత వారు ఇతర భావజాలాలకు స్పందించలేని అశక్తులుగా మారిపోతారు.


పేదల పట్ల కనికరం అవసరం లేదని గురూజీ భావించారు. తన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ గ్రంధంలో దేశంలో జమిందారీ వ్యవస్థ రద్దు పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆ వ్యవస్థ రద్దు పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేయటమే కాదు, తీవ్రంగా కలత చెందారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని రుద్దినపుడు వీరితో(ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు జనసంఫ్‌ు) మేము ఒక కూటమి కట్టామన్నది ఒక వాస్తవం. ఒక పార్టీగా ప్రతిపక్షాలు ఐక్యంగాకపోతే ఇందిరా గాంధీని ఓడించలేమని లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ నమ్మారు.చౌదరి చరణ్‌ సింగ్‌ కూడా అలాంటి వైఖరినే కలిగి ఉన్నారు గనుక మేము ఒకే పార్టీగా ఐక్యమయ్యాము. మేము జైల్లో ఉండగా ఒక పార్టీని ఏర్పాటు చేయటం, ఎన్నికల్లో పోటీ చేయటం గురించి అబిప్రాయాలు చెప్పమని మమ్మల్ని అడిగారు. మనం తప్పనిసరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక సందేశాన్ని పంపిన అంశాన్ని గుర్తు చేసుకున్నాను. కోట్లాది మంది జనం ఎన్నికల్లో పాల్గొంటారు. ఎన్నికలు ఒక క్రియాశీల క్రమం. ఎన్నికల వాతావరణం పెరిగే కొద్దీ అత్యవసర పరిస్థితి సంకెళ్లు తెగుతాయి,జనం తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకుంటారు. అందువలన మనం ఎన్నికల్లో పాల్గొనాలని నేను గట్టిగా చెప్పాను. ఒకే పార్టీ పతాకం కిందకు అందరూ రాకపోతే విజయం సాధించలేమని లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఇతర నేతల వైఖరి ఉన్న కారణంగా సోషలిస్టులంగా మా అంగీకారం తెలిపాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పదలచాను. రాజకీయ పార్టీలు-జనసంఫ్‌ు, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్‌(ఓ), భారతీయ లోక్‌దళ్‌(బిఎల్‌డి), కాంగ్రెస్‌ ముఠాలలోని కొన్ని అసంతృప్త తరగతుల మధ్య మాత్రమే అవగాహన కుదిరింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలాంటి ఏర్పాటుకు మేము రాలేదు, దాని డిమాండ్లను వేటినీ అంగీకరించలేదు. ఇంకా చెప్పాల్సిందేమంటే జైల్లో ఉన్న మా మధ్య పంపిణీ అయిన మనూభారు పటేల్‌ లేఖ ద్వారా 1976 జూలై 7న మేము తెలుసుకున్నదేమంటే కొత్త పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు కూడా పార్టీ సభ్యులైతే ద్వంద్వ సభ్యత్వ వివాదం తలెత్తవచ్చని చౌదరి చరణ్‌ సింగ్‌ ఒక సమస్యను లేవనెత్తారు. దీని మీద అప్పుడు జనసంఫ్‌ు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఓమ్‌ ప్రకాష్‌ త్యాగి స్పందిస్తూ కొత్త పార్టీ సభ్యత్వాన్ని ఎలా కావాలంటే అలా రూపొందిచుకోవచ్చని స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నందున రద్దయినట్లేనని, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వ సమస్య తలెత్తదని కూడా చెప్పారు.


తరువాత ప్రతిపాదిత జనతా పార్టీ నిబంధనావళిని రూపొందించేందుకు ఒక ఉపసంఘాన్ని నియమించారు. జనతా పార్టీ లక్ష్యాలు, విధానాలు, కార్యక్రమాలతో విబేధించే ఏ సంస్థకు చెందిన వారికీ జనతా పార్టీలో సభ్యత్వం ఇవ్వకూడదని ముసాయిదా నిబంధనావళిలో పెట్టారు. దీని అర్ధం ఏమంటే ఎవరూ ఈ నిబంధనను వ్యతిరేకించకూడదన్నది స్పష్టం.అయినప్పటికీ దీనికి వచ్చిన ఒకే ఒక అభ్యంతరం జనసంఫ్‌ుకు చెందిన సుందర్‌ సింగ్‌ భండారీ నుంచి వెలువడటం గమనించాలి. తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు 1976 డిసెంబరులో ఏర్పాటు చేసిన సమావేశానికి జనసంఫ్‌ు, ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున అతల్‌ బిహారీ వాజ్‌పాయి రాసిన లేఖలో ప్రతిపాదిత పార్టీలో ఒక తరగతి నేతలు జనతా పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్‌ సమస్యను లేవనెత్తకూడదని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అయితే అనేక మంది నేతలు అలాంటి హామీ ఇవ్వలేదని నాకు చెప్పారు. ఎందుకంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విలీనం కావాలని తలపెట్టినపుడు రంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడా లేదు గనుక అన్నారు. నేను ఒకటి స్పష్టం చేయదలచాను. ఆ సమయంలో నేను జైల్లో ఉన్నాను. ఒక వేళ ఒక రహస్య అవగాహనకు వచ్చి ఉండి ఉంటే దానిలో నాకు భాగస్వామ్యం లేదు.


నేను ఒకటి విస్పష్టంగా చెప్పగలను. జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఏ రీత్యా చూసినా ఆర్‌ఎస్‌ఎస్‌ అంశాలను ప్రతిబింబించలేదు. వాస్తవానికి ప్రణాళికలోని ప్రతి అంశమూ స్పష్టంగా ఉంది. లౌకిక, ప్రజాస్వామిక, గాంధియన్‌ సూత్రాల ప్రాతిపదికగా సోషలిస్టు సమాజం గురించి జనతా పార్టీ ప్రణాళిక ఉంది.దానిలో హిందూ దేశం గురించిన ప్రస్తావన లేదు.మైనారిటీలకు సమానహక్కులకు హామీ ఇవ్వటమే కాదు, వారి హక్కులకు రక్షణ కల్పిస్తామని కూడా చెప్పింది. కుల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిందా ? ఇతరుల సేవకు శూద్రులు తమ జీవితాలను అర్పించాలని చెప్పిందా ? దానికి విరుద్దంగా వెనుకబడిన తరగతుల పురోగమనానికి వాగ్దానం చేయటమే కాదు పూర్తి అవకాశాలు కల్పిస్తామని చెప్పింది, వారికోసం ప్రత్యేక విధానాలు తీసుకొస్తామని పేర్కొన్నది. వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 25-33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. గురూజీ కేంద్రీకరణ జరపాలని గట్టిగా చెప్పగా వికేంద్రీకరిస్తామని జనతా పార్టీ అంగీకరించింది. రాష్ట్రాలను రద్దు చేయాలని, అసెంబ్లీలను, మంత్రివర్గాలను కూడా రద్దు చేయాలని అతను కోరగా మరింత వికేంద్రీకరణ జరగాలని జనతా పార్టీ నొక్కివక్కాణించింది. మరో విధంగా చెప్పాలంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని లాక్కోవాలన్న వాంఛ జనతా పార్టీకి లేదు.


పార్టీ ఎన్నికల ప్రణాళికలోని అంశాలను స్వచ్చందంగా అంగీకరించలేదన్నది నిజం. ఇది నా అభ్యంతరం, అంతే కాదు రాతపూర్వకంగా ఒకసారి కుష్‌భాహు థాకరేకు ఫిర్యాదు చేశాను. చర్చల సందర్భంగా మీవారు(ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్‌ు) వెంటనే అంగీకరించినా హృదయపూర్వకంగా పూర్తిగా వ్యతిరేకించారని నేను చెప్పాను. అందుకే మీ ఉద్దేశ్యాలను అనుమానించాల్సి వస్తోంది.ఈ లేఖను నేను ఎంతో కాలం క్రితమే రాశాను, ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి నాకు ఎప్పుడూ సందేహమే.నిరంకుశత్వాన్ని వ్యతిరేకించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలన్న లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ వాంఛ, ఎలాంటి రాజీలు లేకుండా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉండటం వలన మన ఐక్యతకు నేను ఆమోదం తెలిపాను. అదే సమయంలో నేను ఒకటి చెప్పదలచుకున్నాను. ప్రారంభం నుంచి నాకు ఒక స్పష్టత ఉంది ఐక్య, విశ్వసనీయమైన జనతా పార్టీ ఆవిర్భవించాలంటే రెండు పనులు చేయాల్సి ఉంటుందని నా మనసులో ఉంది. ఒకటి, ఆర్‌ఎస్‌ఎస్‌ తన భావజాలాన్ని మార్చుకోవాలి మరియు లౌకిక,ప్రజాస్వామిక రాజ్య భావనను అంగీకరించాలి.రెండవది, సంఘపరివార్‌లో భాగంగా ఉన్న వివిధ సంస్థలు భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు, విద్యార్ధి పరిషత్‌ వంటివి తమను తాము రద్దు చేసుకొని లౌకిక భావజాలం ఉన్న కార్మిక సంఘాల్లో, జనతా పార్టీ విద్యార్థి విభాగంలో విలీనం కావాలి. జనతా పార్టీ కార్మిక విభాగం, విద్యార్థి విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించమని పార్టీ నాకు విధి అప్పగించిన నాటి నుంచీ నేను దీని గురించి స్పష్టతతో ఉన్నాను. ఈ రెండు సంస్థలూ ప్రత్యేక ఉనికిని రద్దు చేసుకోవాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. హిందువులను మాత్రమే సంఘటితపరచాలనే మీ భావజాలాన్ని వదలి వేసుకోవాలని, మీ సంస్థలో అన్ని మతాల వారికీ చోటు కల్పించాలని,జనతా పార్టీలో ఉన్న భిన్నమైన తరగతుల ప్రాతిపదికన ఉన్న సంస్థలలో విలీనం కావాలని నేను ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులకు చెప్పాను. అది వెంటనే జరిగేది కాదని, అనేక ఇబ్బందులు ఉన్నాయని, కానీ కొద్ది కొద్దిగా మారాలని కోరుకుంటున్నట్లు వారి స్పందన ఉంది. వారు అలా తప్పించుకొనే జవాబులను కొనసాగించారు.


వారి ప్రవర్తన చూసిన తరువాత వారిలో మార్పు ఉద్దేశ్యం లేదన్న నిర్దారణకు వచ్చాను.ప్రత్యేకించి 1977జూన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత వారు నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారానికి రాగలిగారు. అప్పటి నుంచి కొత్తగా వచ్చిన ప్రతిష్టతో మారాల్సిన అవసరం లేదని వారు ఆలోచించటం ప్రారంభించారు.ఇప్పటికే వారు నాలుగు రాష్ట్రాలను కైవశం చేసుకున్నారు. క్రమంగా ఇతర రాష్ట్రాలను, చివరకు కేంద్రాన్ని కూడా పట్టుకొనేందుకు చూస్తారు. జనతా పార్టీలోని ఇతర రాజకీయ నేతలు పెద్ద వారు, వారు ఎంతో కాలం జీవించలేరు. పార్టీలో ఉన్న ఉన్నత స్థానాలకు ఎదిగేట్లు ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘేతర నేతలను చేయలేరు. అయినప్పటికీ నేను ప్రయత్నించాను. ఒక సందర్భంగా అన్ని కార్మిక సంఘాలనేతల సమావేశం ఏర్పాటు చేశాను. జనతా పార్టీలోని అన్ని పక్షాల ప్రతినిధులు వచ్చారు, భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు సమావేశాన్ని బహిష్కరించింది. అంతే కాదు ఎలాంటి కారణం లేకుండానే వారు నన్ను దూషించారు. విద్యార్థి పరిషత్‌, యువమోర్చాలతో అలాంటి ప్రయత్నమే జరిగింది. విలీనం కోసం జరిగిన అన్ని ప్రయత్నాలకూ వారు దూరంగా ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే పార్టీ మీద పెత్తనం చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాంఛ కారణంగానే. ప్రజల ప్రతి జీవనరంగంలోకి ప్రవేశించాలన్నది వారి లక్ష్యం, అంతేకాదు దాన్ని అదుపు చేయాలన్నది కూడా. ఇలాంటి అభిప్రాయాలను గురూజీ తన ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్డ్‌ అనే గ్రంధంలో పదే పదే వక్కాణించారు. నిరంకుశ సంస్థ ఏదీ స్వేచ్చను అనుమతించదు. దాని వేర్లు కళలు, సంగీతం, ఆర్థికం, సాంస్కృతిక రంగం ప్రతిచోటా ఉంటాయి. ప్రతి ఫాసిస్టు సంస్థ సారం ఇదే. వీరు అరుదైన సందర్భాలలో చేసేదానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. గురూజీ బాటలో ఆలోచనలను వదలి వేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ చెప్పలేదు. జైళ్లలో ఉన్నపుడు వీరు క్షమాభిక్ష కోసం ప్రార్ధించారు. రాజనారాయణ్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇందిరా గాంధీకి అనుకూలంగా వచ్చినపుడు బాలాసాహెబ్‌ దేవరస్‌ ఆమెను అభినందించారు. అందువలన వీరి ఉద్ఘాటనల మీద నాకు నమ్మకం లేదు. నేను వీరిని (జనతా పార్టీలో పూర్వపు జనసంఫ్‌ు నేతలు) ఎప్పుడు నమ్ముతానంటే పార్టీ, కార్యవర్గ కమిటీల నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను బహిష్కరించినపుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల మీద ఆంక్షలు విధించినపుడు, ప్రత్యేకించి నానాజీ దేశముఖ్‌, సుందర్‌ సింగ్‌ బండారీ వారి అనుచరులను బహిష్కరించినపుడే నమ్ముతాను.


గమనిక : మధు లిమాయే(1922 -1995 ) పూనాలో జన్మించారు. కాంగ్రెస్‌లో, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ, తరువాత ప్రజా సోషలిస్టు పార్టీ నేతగా వ్యవహరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వంపై వివాదం కారణంగా జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘనేతలు వేరు పడి బిజెపిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అధికారం కోసం అవసరాలకు అనుగుణంగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చింది తప్ప మౌలిక స్వభావం, లక్ష్యాలలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు దశాబ్దాల నాడు (1979) రాసిన ఈ వ్యాసంలో లేవనెత్తిన అంశాలు నేటికీ సంగతమైనవేే గనుక జనతా వార పత్రిక నుంచి సేకరించి అనువదించి అందించాను, : ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d