• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Politics

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చైనా : పధ్నాలుగు పాలస్తీనా విముక్తి సంస్థల ఒప్పందం !

01 Thursday Aug 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Fatah, Hamas and Fatah agreement, Hamas Israel, Israel genocide, Palestine Solidarity Day, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మధ్యప్రాచ్య చరిత్రలో మరో చారిత్మాత్మక ఘట్టానికి తెరలేచింది.పాలస్తీనా విముక్తికోసం పోరాడుతున్న పధ్నాలుగు ప్రజా సంస్థలు, పార్టీలు తమ విబేధాలకు స్వస్తిపలుకుతూ ఐక్యతను పటిష్ట పరిచేందుకు 2024జూలై చివరి వారంలో చైనా మధ్యవర్తిత్వంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. వీటిలో ఉప్పు-నిప్పుగా ఉన్న ఫతా – హమస్‌ కూడా ఉండటం విశేషం.ఈ ఒప్పందం పధ్నాలుగు సంస్థల ఐక్యత, అవి సమాధానపరుచుకోవటానికి అంకితమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి ప్రకటించాడు. గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్‌ మిలిటరీ పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో సాగిస్తున్న మారణకాండ, పశ్చిమగట్టు ప్రాంతంలో సాగిస్తున్నదాడులు, అరబ్బు ప్రాంతాల ఆక్రమణలు కొనసాగిస్తున్న పూర్వరంగంలో ఈ ఒప్పందం కుదిరింది. పాలస్తీనా పౌరులందరికీ ఏకైక అధీకృత ప్రతినిధిగా పాలస్తీనా విముక్తి సంస్థ(పిఎల్‌ఓ)ను గుర్తించటం దీనిలో కీలకమైన అంశం.ప్రస్తుతం కొనసాగుతున్న గాజా మారణకాండ అనంతర పాలనతో పాటు తాత్కాలిక జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా అంగీకారం కుదిరింది.పశ్చిమాసియాలో చిచ్చుపెట్టి తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకొనేందుకు అమెరికా కుట్రలు పన్నుతుండగా వాటిని వమ్ముచేసే క్రమంలో ఐక్యతను సాధించేందుకు చైనా తన పలుకుబడి, అనుభవాన్ని వినియోగిస్తున్నది. ఈ క్రమంలో ఇది రెండవ ఉదంతం. ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్యను కుదిర్చిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో నాలుగు ప్రధాన అంశాలున్నాయి. తాత్కాలిక జాతీయ ఐక్యతా ప్రభుత్వం ఏర్పాటు,భవిష్యత్‌ ఎన్నికలకు ముందు ఐక్య నాయకత్వ పొందిక, నూతన పాలస్తీనా జాతీయ మండలికి స్వేచ్చగా ఎన్నికలు, ఇజ్రాయెల్‌ దాడుల పూర్వరంగంలో ఐక్యతా ప్రకటన. తాము చారిత్రాత్మక కూడలిలో ఉన్నామని, తమ పోరాటాలకు జనం స్పందిస్తున్నందున ఇంతకు మించి మరొక మార్గం లేదని చర్చలలో పాల్గన్న సంస్థల ప్రతినిధులు చెప్పారు.గాజాలో జరుగుతున్న మారణకాండే ఈ ఐక్యత వెనుక ప్రధాన కారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఐక్యతా ఒప్పందం పాలస్తీనా పార్టీల అంతర్గత వ్యవహారం, అయితే అంతర్జాతీయ సమాజ మద్దతు లేకుండా సాధించలేరని చైనా ప్రతినిధి లిన్‌ జియాన్‌ చెప్పాడు. ఈ ఒప్పందాన్ని వమ్ము చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ సకల యత్నాలూ చేస్తాయి.ముఖ్యంగా ఫతా సంస్థను రెచ్చగొట్టేందుకు, వత్తిడి పెంచేందుకు ఇప్పటికే రంగంలోకి దిగాయి.


పాలస్తీనా విముక్తి సంస్థ అనేక పార్టీలు, సంస్థలతో కూడిన ఒక ఉమ్మడి వేదిక. యాసర్‌ అరాఫత్‌ దీని నేతగా ఉన్న సంగతి తెలిసిందే.1993లో ఇజ్రాయెల్‌తో ఓస్లో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఇజ్రాయెల్‌ ఆక్రమిత గాజా-పశ్చిమ గట్టు ప్రాంతంలో పాలస్తీనా సాధికార సంస్థ(పిఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో, అదే విధంగా పిఎల్‌ఓలో కూడా ఫతా అనే పార్టీ ప్రధాన పాత్రధారిగా ఉంది.ఈజిప్టు కేంద్రంగా పని చేస్తున్న ముస్లిం సోదరత్వం అనే సంస్థ ప్రభావం పక్కనే ఉన్న గాజా ప్రాంతంపై ఉంది. దానితో సంబంధం ఉన్న శక్తులు 1987లో హమస్‌గా ఉనికిలోకి వచ్చాయి. పిఎల్‌ఓ, దానిలో ఉన్న భాగస్వామ్య పక్షాలతో దానికి ఏకీభావం లేదు. ఓస్లో ఒప్పందాలలో భాగస్వామి కాదు. ఇజ్రాయెల్‌ ఉనికిని అది గుర్తించలేదు. పాలస్తీనా సాధనకు సాయుధ పోరాటాన్ని మార్గంగా ఎంచుకుంది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో గాజాలో తిరుగులేని రాజకీయ,మత,సాయుధ శక్తిగా ఎదగటమే కాదు, ఎన్నికల్లో తన సత్తాను చూపి అధికారానికి కూడా వచ్చింది.పశ్చిమగట్టు ప్రాంతంలో ఫతా పార్టీ అధికారంలో ఉంది.పాలస్తీనా విముక్తి కోసం అనేక సంస్థలు తమవైన పద్దతుల్లో పోరాడుతున్నాయి.కొన్ని అంశాలు, పద్దతులపై వాటి మధ్య ఏకీభావం లేని మాటవాస్తవం. దీన్ని అవకాశంగా తీసుకొని సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ అణచివేతకు, తాజాగా గాజాలో మారణకాండకు పూనుకుంది.ఇజ్రాయెల్‌ను అధికారికంగా హమస్‌ గుర్తించకపోయినా 1967నాటి సరిహద్దుల ప్రాతిపదికన పాలస్తీనా ఏర్పాటు జరగాలని 2017లో అది చేసిన ప్రతిపాదనకు అర్ధం పరోక్షంగా అంగీకరించినట్లే.


పాలస్తీనా నేషనల్‌ ఇనీషియేటివ్‌ సంస్థ అధ్యక్షుడు ముస్తఫా బర్గౌటీ తాజా ఒప్పందం గురించి మాట్లాడుతూ అన్ని పక్షాలూ పిఎల్‌ఓలో చేరేందుకు అంగీకరించాయని అదొక్కటే పాలస్తీనియన్ల నిజమైన ప్రతినిధి అన్నాడు. రెండు భిన్న పార్టీల పాలనలో ఉన్న పాలస్తీనాలోని గాజా-పశ్చిమ గట్టు ప్రాంతాలను ఒకే పాలనా వ్యవస్థ కిందకు తెచ్చేందుకు 2017లో హమస్‌-ఫతా మధ్య కుదిరిన ఒప్పందం అమలు కాలేదు.2007వరకు గాజా కూడా ఫతా నాయకత్వంలోని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అదే ఏడాది అధికారానికి వచ్చిన హమస్‌ యంత్రాంగం ఫతాను అక్కడి నుంచి బహిష్కరించింది. కొన్ని అరబ్‌ దేశాలూ, ఈజిప్టు తెచ్చిన ఒత్తిడి మేరకు పదేండ్ల వైరాన్ని విరమించుకొనేందుకు చేసుకున్న ఒప్పందం విఫలమైంది. పాలస్తీనా అధారిటీ ప్రధాన మంత్రి రామీ హమదల్లా 2018లో గాజా సందర్శనకు వచ్చినపుడు హత్యాయత్నం జరిగింది. దానికి హమసే కారణమని ఫతా ఆరోపించింది. గతం కంటే నిర్దిష్టంగా కొన్ని చర్యలు తీసుకొనేందుకు తాజా ఒప్పందంలో అంగీకరించినట్లు ముస్తఫా చెప్పారు. మొత్తంగా పాలస్తీనాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్‌ పూనుకున్నందున దానికి వ్యతిరేకంగా ఐక్యమౌతున్నట్లు చెప్పారు. ఏకాభిప్రాయ సాధనతో ఉమ్మడి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనే అంశంపై కూడా ఒప్పంద పక్షాల్లో స్పష్టత ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు అమెరికా ఇతర దేశాల అండచూసుకొని ఇజ్రాయెల్‌ మారణకాండను కొనసాగిస్తూనే ఉంది. అది ముగిసిన తరువాత ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందా ? బీజింగ్‌ ఐక్యతా చర్చల్లో పాల్గొన్న హమస్‌ ప్రతినిధి హసమ్‌ బద్రన్‌ మాట్లాడుతూ ధ్వంసమైన ప్రాంతాల పునర్‌నిర్మాణం, తగిన సమయంలో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం జరిగిందని, అయితే దాడులు కొనసాగుతున్నప్పటికీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడవచ్చని, అది కాల్పుల విరమణకు దోహదం చేయవచ్చన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజింగ్‌లో హమస్‌-ఫతా ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.తరువాత చైనా నేత షీ జింపింగ్‌ మధ్య ప్రాచ్య దేశాలకు ప్రత్యేక రాయబారిని పంపి అంతర్జాతీయ శాంతి సభ జరపటానికి గల అవకాశాలను పరిశీలించారు. ఈప్రక్రియకు ముందు ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య చెలిమి అసాధ్యం అనుకున్న దాన్ని చైనా సుసాధ్యం గావించింది.మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో అమెరికాతో పోలిస్తే చైనా పాత్ర పరిమితమే. అయినప్పటికీ తంపులు పెట్టే అమెరికాతో పోలిస్తే దానికి భిన్నమైన వైఖరితో ఉన్నందున బీజింగ్‌ పట్ల విశ్వసనీయత పెరుగుతోంది.


గాజాలో మారణకాండ పూర్వరంగంలో అంతర్జాతీయ సమాజ అభిప్రాయం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మారుతున్నది. గత 57 సంవత్సరాలుగా తూర్పు జెరూసలెం, గాజా, పశ్చిమ గట్టు ప్రాంతాలను ఆక్రమించటం చట్టవిరుద్దమని అంతర్జాతీయ న్యాయ స్థానం(ఐసిజె) వ్యాఖ్యానించింది. ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టు ప్రాంతంలలో పాలస్తీనా అధారిటీ పాలన కొనసాగుతున్నప్పటికీ యూదుల నివాసాల ముసుగులో ఇజ్రాయెల్‌ దురాక్రమణలు కొనసాగుతూనే ఉన్నందున ఫతా సంస్థ వైఖరిలో మార్పురాక తప్పలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 23.7చదరపు కిలోమీటర్ల మేర ఇజ్రాయెల్‌ ఆక్రమించిందని పీస్‌ నౌ అనే స్వచ్చంద సంస్థ పేర్కొన్నది.గత రెండు దశాబ్దాల్లో ఆక్రమించినదానికంటే ఇది ఎక్కువ. అమెరికా మధ్యవర్తిత్వలో 1993లో కుదిరిన ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టును ఏబిసి ప్రాంతాలుగా విభజించారు. ఏ తరగతి పాలస్తీనా అధారిటీ ఏలుబడిలో, బి ప్రాంతాలు ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఉమ్మడి పాలన, సి ప్రాంతాలు ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉంటాయి. మూడవ ప్రాంతంలో యూదుల నివాసాల ఏర్పాటుతో పాటు అరబ్బు రైతాంగాన్ని ఇజ్రాయెల్‌ క్రమంగా తొలగిస్తున్నది.పాలస్తీనా పశ్చిమ గట్టు ప్రాంతంలో 1990దశకంలో ఇజ్రాయెల్‌ తీసుకువచ్చిన యూదుల సంఖ్య రెండున్నర లక్షలు కాగా ప్రస్తుతం ఏడు లక్షలకు పెరిగారు. పాలస్తీనా రాజధానిగా ఉండే తూర్పు జెరూసలెంలో అలాంటి వారిని 800 నుంచి మూడు వేలకు పెంచారు. గాజాలో మారణకాండ ప్రారంభించిన ఇజ్రాయెల్‌ పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా దాడులకు పూనుకుంది. ఇప్పటి వరకు 513 మంది పాలస్తీనియన్లను మిలిటరీ చంపివేసింది.వందలాది మందిని గాయపరచింది.ప్రతి ఏటా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది.


ఒప్పందాన్ని తామింకా సమీక్షించలేదంటూ గాజాలో హమస్‌ పాత్రను తాము సమర్ధించే ప్రసక్తే లేదని అమెరికా ప్రకటించింది. ఒక ఉగ్రవాద సంస్థకు ప్రభుత్వంలో పాత్ర ఉండకూడదని ప్రతినిధి మిల్లర్‌ చెప్పాడు.ప్రస్తుత యుద్ధం ముగిసిన తరువాత రెండు ప్రాంతాల్లో ఒకే ప్రభుత్వం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. పాలస్తీనా ఐక్యతా ఒప్పందం అమలు జరుగుతుందా ? భాగస్వామ్య పక్షాలు కట్టుబడి ఉంటాయా, భవిష్యత్‌లో హమస్‌ పాత్ర ఏమిటి అంటూ మీడియా, ప్రభుత్వాలలో చర్చలు జరుగుతున్నాయి. ఐక్యతను దెబ్బతీసేందుకు చాణక్య నీతిని ప్రయోగించేందుకు అమెరికా, ఇతర పశ్చిమదేశాలు చూస్తున్నాయి. సందేహాలు లేవనెత్తుతున్నవారందరినీ ఒకేగాటన కట్టలేము గానీ కొన్ని ఆచరణాత్మక సమస్యలు ముందుకు వచ్చినప్పటికీ మొత్తానికే ఎసరు పెడుతున్న సామ్రాజ్యవాదుల కుట్ర, చర్యల కారణంగా వాటిని పరిష్కరించుకొనే పరిణితిని పాలస్తీనా సంస్థలు ప్రదర్శిస్తాయి.దానిలో పెద్ద ముందడుగే తాజా ఒప్పందం.ఒప్పందమైతే జరిగింది గానీ దాని అమలు గురించి అనేక మందికి సందేహాలున్నా అవసరాలు వివిధ పక్షాల వైఖరుల్లో మార్పులకు దోహదం చేస్తున్నాయి.అనేక పరిణామాలను చూసినపుడు ప్రతి పాలస్తీనా సంస్థ అనేక గుణపాఠాలు నేర్చుకుంది. ఐక్యత కోసం రాజీలకు, సర్దుబాట్లకు సిద్దంగాక తప్పని స్థితిలో పడ్డాయి. మొదటికే మోసం తెస్తున్న ఇజ్రాయెల్‌ను నిలువరించటం ప్రధమ కర్తవ్యంగా భావించాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెనెజులా ఎన్నికల్లో ఫాసిస్టులకు శృంగభంగం : మూడోసారి సోషలిస్టు మదురో విజయం !

31 Wednesday Jul 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Chavez, Nicolás Maduro Moros, Venezuela election 2024, venezuelan chavista


ఎం కోటేశ్వరరావు


జూలై 28న జరిగిన వెనెజులా ఎన్నికల్లో అమెరికా మద్దతు ఉన్న మితవాద,ఫాసిస్టు శక్తులు చావు దెబ్బతిన్నాయి. సోషలిస్టు పార్టీ నేత నికోలస్‌ మదురో మూడవ సారి ఎన్నికయ్యాడు.పదవీ కాలం ఆరు సంవత్సరాలు(2031వరకు) పదవిలో ఉంటాడు. ఈ ఎన్నికల్లో మదురోను ఓడించేందుకు అమెరికా నాయకత్వంలోని వామపక్ష వ్యతిరేకశక్తులన్నీ తీవ్రంగా ప్రయత్నించాయి.ఎన్నికల ఫలితాల తరువాత కూడా అక్రమాలు జరిగాయని, గుర్తించబోమని నానా యాగీ చేస్తున్నాయి.మరోవైపు దేశమంతటా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. మదురోకు మద్దతుగా కూడా అనేక చోట్ల జనం వీధుల్లోకి వస్తున్నట్లు వార్తలు. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన వివరాల మేరకు మదురోకు 53.67శాతం ఓట్లు రాగా ప్రత్యర్థి ఎడ్మండో గోన్‌సాల్వెజ్‌కు 46.33శాతం వచ్చాయి. మరోవైపున ఇతగాడిని సమర్ధించిన డెమోక్రటిక్‌ యూనిటీ ఫ్లాట్‌ ఫాం(డియుపి) గోన్‌సాల్వెజ్‌కు 69.46శాతం రాగా మదురోకు 30.54శాతం వచ్చినట్లు పోటీగా ఫలితాలను ప్రకటించింది. ఇది అమెరికా కనుసన్నలలో పనిచేసే ప్రతిపక్ష పార్టీలు, శక్తుల కూటమి. మదురోకు వ్యతిరేకంగా ప్రదర్శలకు దిగిన శక్తుల మద్దతుదార్లు అనేక చోట్ల దివంగత మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ విగ్రహాలు, చిహ్నాలను ధ్వంసం చేస్తున్నారు. చావెజ్‌ రాజకీయ వారసుడిగా మదురో రంగంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు ఇది రాసిన సమయానికి కొందరు ప్రదర్శకులు అధ్యక్ష భవనంపై దాడికి వెళుతున్నట్లు, దేశమంతటా రోడ్ల దిగ్బంధనానికి పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని నినాదాలు చేస్తున్నారు. ముందే ఇలాంటి పరిణామాలను ఊహించిన కారణంగా రాజధాని కారకాస్‌ నగరంతో సహా దేశమంతటా పోలీసు,జాతీయ భద్రతా దళాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష గోన్‌సాల్వెజ్‌కు పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లు సర్వేలు పేర్కొన్నాయని, ఫలితాలు వాటిని ప్రతిబింబించలేదని అమెరికా వ్యాఖ్యానించింది.ప్రజల ఆకాంక్షను ఫలితాలు ప్రతిబింబించలేదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వ్యాఖ్యానించాడు. చైనా, రష్యా, క్యూబా మరికొన్ని దేశాలు మదురోను అభినందించాయి. 2018 ఎన్నికల్లో కూడా సర్వేలన్నీ మదురోకు వ్యతిరేకంగా, ప్రతిపక్ష అభ్యర్థి ముందంజలో ఉన్నట్లే చెప్పాయి. అవన్నీ మదురోను వ్యతిరేకించే శక్తులు వండి వార్చిన కతలు తప్ప మరొకటి కాదు. తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కూల్చివేసేందుకు కుట్ర జరిగిందని అధ్యక్షుడు మదురో టీవీ ప్రసంగంలో దేశ పౌరులకు చెప్పాడు. దీని గురించి ముందే తెలుసని అయితే చట్టాన్ని గౌరవిస్తామని, తన మద్దతుదార్లు ప్రశాంతంగా ఉండాలని కోరాడు.”నేను నికోలస్‌ మదురో మోరోస్‌ వెనెజులా బొలివేరియన్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాను. మన ప్రజాస్వామ్యం, చట్టం, పౌరులను కాపాడతాను ” అని ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే మదురో ప్రకటించాడు.


2013లో ఛావెజ్‌ మరణించిన తరువాత అధికారానికి వచ్చిన నికోలస్‌ మదురో అనేక సవాళ్లు, కుట్రలను ఎదుర్కొంటున్నాడు. ప్రధాన రాబడి వనరైన చమురు అమ్మకాలు, రవాణాపై అనేక ఆంక్షలు, దిగ్బంధనాలతో అమెరికా, లాటిన్‌ అమెరికాలోని దాని మిత్రదేశాలు, ఐరోపా యూనియన్‌ దేశాలూ ఇబ్బందులు పెట్టేందుకు, జనాన్ని రెచ్చగొట్టేందుకు చూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలపై ప్రపంచ దేశాల స్పందన వెలువడింది. లాటిన్‌ అమెరికాలో వామపక్ష వాదులను సమర్ధించేదేశాలు మదురోకు శుభాకాంక్షలు పలకగా వ్యతిరేక దేశాలు ప్రతికూలంగా స్పందించాయి. వెనెజులా కమ్యూనిస్టు పార్టీతో సహా చిలీలోని వామపక్ష ప్రభుత్వం ఎన్నికలు సక్రమంగా జరిగినట్లు వివరాలను వెల్లడించాలని ప్రకటించటం గమనించాల్సిన అంశం. సకాలంలో ఫలితాలతో పాటు పోలింగ్‌ కేంద్రాల వారీ ఓటింగ్‌ వివరాలను వెంటనే ప్రకటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కోరినట్లు ప్రతినిధి ప్రకటించాడు. మదురోను వ్యతిరేకించేదేశాలు రంగంలోకి దిగాయి. అమెరికా దేశాల సంస్థ (ఓఏఎస్‌) అత్యవసర సమావేశం జరిపి ఫలితాలను సమీక్షించాలని కోరుతున్నాయి. వాస్తవాలు తేలేవరకు వెనెజులాతో దౌత్య సంబంధాలను స్ధంభింపచేస్తున్నట్లు పనామా ప్రకటించింది. పూర్తి సమీక్ష జరిపే వరకు కారకాస్‌లో ఉన్న తమ దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపిస్తున్నట్లు పేర్కొన్నది. ఫలితాలను అంగీకరించని, వ్యతిరేకించిన పనామా, పెరు, అర్జెంటీనా, చిలీతో సహా ఏడు దేశాల నుంచి తాను కూడా దౌత్య సిబ్బందిని ఉపసంహరిస్తున్నట్లు మదురో ప్రకటించాడు. ఎన్నికల పరిశీలకులను పంపిన కార్టర్‌ సెంటర్‌ కూడా పోలింగ్‌ కేంద్రాల వారీ ఫలితాలను ప్రకటించాలని కోరింది.ఈ సారి ఎలాగైనా మదురో, వామపక్ష శక్తులను దెబ్బతీస్తామని కలలు గన్న తిరోగామి శక్తులు ఆశాభంగం చెందినట్లు స్పందనలు వెల్లడించాయి. ఫలితాలను ఆలశ్యం చేసేందుకు, లెక్కింపు ప్రక్రియను దెబ్బతీసేందుకు జరిగిన ప్రయత్నాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అటార్నీ జనరల్‌ తారెక్‌ సాబ్‌ ప్రకటించాడు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటున్న లిమా విదేశీ శక్తుల బృందాన్ని ఖండిస్తున్నట్లు విదేశాంగ మంత్రి యవన్‌ గిల్‌ ప్రకటించాడు. తొత్తు ప్రభుత్వాన్ని రుద్దేందుకు ఇప్పుడే కాదు 2019లో కూడా ప్రయత్నించారని అన్నాడు.వెనెజులా చట్టం ప్రకారం స్వతంత్ర పరిశీలకు ప్రతి పోలింగ్‌ బూత్‌లో లెక్కింపు జరిగి ఫలితాలను సరి చూసేందుకు, రాతపూర్వంగా ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంది. ఫలితాలు వెలువడి మదురో గెలిచినట్లు ప్రకటించిన తరువాత అంతర్జాతీయ పరిశీలకు తనిఖీకి అనుమతించాలని ప్రతిపక్షాలు కొత్త పల్లవి అందుకున్నాయి.


గత పాతిక సంవత్సరాలుగా వెనెజులాలో వామపక్ష ఉద్యమం, ప్రభుత్వాలను కూల్చివేసేందుకు దేశంలోని తిరోగామి శక్తులు, వాటికి మద్దతు ఇస్తున్న అమెరికా చేయని కుట్ర లేదు. ఫాసిస్టు శక్తులు ఎప్పటికప్పుడు ఊసరవెల్లి మాదిరి రూపాన్ని మార్చుకొని ముందుకు వస్తున్నాయి.జనంలో వాటికి ఆదరణ లేకపోవటంతో జాతీయవాదంతో ఆకర్షించాలని చూస్తున్నాయి. అమెరికా తొత్తులుగా పనిచేస్తున్నాయి. ఎన్నికుట్రలు చేసినా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు కలిగించినా అధికారానికి వచ్చిన వామపక్షశక్తులు ఉన్నంతలో కార్మికవర్గాన్ని కాపాడేందుకు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నాల కారణంగా వాటి ఆటలు సాగటం లేదు. దీని అర్ధం వెనెజులాకు వాటితో ముప్పు లేదని కాదు.మదురో అనుసరిస్తున్న విధానాలన్నీ సరైనవే అని కాదు. వెనెజులా ఎన్నికల్లో పాల్గొనేవారి శాతం క్రమంగా తగ్గుతున్నది. మదురో విధానాలను కాపాడుకోవాలని జనాల్లో కోరిక బలంగా ఉంటే ఎన్నికల్లో పాల్గొనేవారి శాతం పెరగాల్సి ఉంది. కానీ 2013లో 79.65శాతం మంది పాల్గొంటే 2018లో 45.73శాతానికి పడిపోయింది. ఈ సారి 44.85శాతానికి తగ్గింది. 2018 ఎన్నికల్లో మదురోకు 67.85శాతం ఓట్లు రాగా ఇప్పుడు 53.67శాతమే వచ్చాయంటే కొన్ని తరగతుల్లో అసంతృప్తి ఉందన్నది స్పష్టం. పోయిన సారి మదురో మీద పోటీచేసిన ప్రత్యర్ధులలో ఇద్దరికి 20.93-10.75 శాతాల చొప్పున వచ్చాయి. ఈ సారి ఒకే అభ్యర్ధి రంగంలో ఉన్నాడు. ఛావెజ్‌ అనుసరించిన సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలను మదురో కూడా కొనసాగిస్తున్నప్పటికీ అంతర్గత విధానాల మీద వెనెజులా కమ్యూనిస్టు పార్టీ(పిసివి) ఇతర కొన్ని వామపక్ష పార్టీలు విమర్శనాత్మక వైఖరితో ఉన్నాయి.లాటిన్‌ అమెరికాలో అధికారానికి వచ్చిన ఇతర వామపక్ష నేతల మాదిరిగానే మదురో కూడా పెట్టుబడిదారీ విధాన పునాదులను ముట్టుకోకుండా సంస్కరణలతో, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమాన్ని విబేధించిన వామపక్ష శక్తులను సహించటం లేదని కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది.


గతంలో ఛావెజ్‌, మదురో ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు పార్టీ ఇటీవలి సంవత్సరాలలో మదురో విధానాలతో విబేధిస్తున్నది. తన విధానాలను విమర్శించిన వామపక్ష శక్తులను ప్రతి పక్షపార్టీల ఏజంట్లుగా మదురో దాడి చేశాడు. ఛావెజ్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చూస్తే ఏ కమ్యూనిస్టు లేదా వామపక్ష పార్టీగానీ ప్రతిపక్ష మితవాద శక్తులను సమర్దించిన దాఖలా లేదు. విమర్శనాత్మకంగా ఉంటూనే సోషలిస్టు ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చాయి. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీకి పార్లమెంటులో ఒక స్థానం, ఎనిమిది మంది మేయర్లు ఉన్నారు. తమ పార్టీ నేతల మీద విచారణకు ఆదేశించిన ప్రభుత్వ చర్యను వెనెజులా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫిగుయెరా గోన్‌సాల్వెజ్‌ ఖండించాడు.పార్టీ నిబంధనావళి ప్రకారం ఎన్నికైన నేతల స్థానే వేరే వారిని ఎంచుకోవాలని కోర్టు చెప్పటం అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమే అని పార్టీ విమర్శించింది. కోర్టు సూచించిన ఏడుగురు పార్టీ సభ్యులు కూడా కాదని అందువలన అది చట్టవిరుద్దమని కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీ సమావేశం పేర్కొన్నది. వారితో పోటీ పార్టీ సమావేశాలను కూడా ఏర్పాటు చేయించారు. ఛావెజ్‌ హయాంలో ప్రారంభించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను మదురో రద్దుచేశారని, పౌరసేవలు దిగజారినట్లు కూడా పేర్కొన్నది.కార్మికుల ఆదాయాలు, హక్కులకు కోత పెట్టిందని, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వేతనాల పెంపుదల, ప్రైవేటు గుత్త సంస్థల రద్దు వంటి విప్లవాత్మక చర్యలు చేపట్టటానికి బదులు ఉదారవాద సంస్కరణలకే పరిమితం అయ్యారని పేర్కొన్నది. అమెరికా డాలర్ల చలామణిని స్వేచ్చగా అనుమతించటాన్ని, మారకపు విలువపై అదుపును వదలివేశారని, దిగుమతులపై పన్ను రద్దు చేయటాన్ని అనేక మంది ఆర్థికవేత్తలు తప్పు పట్టారు.మదురో ఆచరణాత్మక విధానాలను అనుసరిస్తున్నారని కొందరు సమర్దిస్తే నయా ఉదారవాద విధానాలు తప్ప మరొకటి కాదని కమ్యూనిస్టు పార్టీ స్పష్టం చేసింది. అంతే కాదు, తనతో పాటు కలసివచ్చే వామపక్ష పార్టీలను కలుపుకొని ప్రజా విప్లవ ప్రత్యామ్నాయం పేరుతో ఒక కూటమని ఏర్పాటు చేసింది.ఈ కూటమిలో కమ్యూనిస్టు పార్టీతో సహా మరో నాలుగు పార్టీల నాయకత్వాన్ని మార్చాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యాలయం మీద పోలీసులు దాడి చేశారు. ఇటీవలి కాలంలో అనేక రంగాలలో కార్మికులు జరుపుతున్న పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది, దీంతో కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది కార్మికుల పోరాటాలు అంతకు ముందు ఏడాడి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ పెరిగాయి.కమ్యూనిస్టు పార్టీ లేదా మరొక పార్టీలో అంతర్గత సమస్యలేవైనా ఉంటే వారు తేల్చుకుంటారు తప్ప కోర్టులు నాయకత్వాన్ని సూచించటం అప్రజాస్వామికం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు : అమరావతి రుణం, కేంద్ర సాయంపై శ్వేతపత్రం ప్రకటిస్తారా ?

25 Thursday Jul 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, STATES NEWS, TDP

≈ Leave a comment

Tags

Amaravati capital, Andhra Pradesh Budget 2019-20, BJP, CHANDRABABU, Narendra Modi Failures, nirmala sita raman


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో లేదా ఇతర చోట్ల ఏ ఇద్దరు తెలుగు వారు కలిసినా, రచ్చబండల మీద జరిగిన,కానసాగుతున్న చర్చ ఒక్కటే. అది రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం గురించే, ప్రత్యేకించి రాజధాని అమరావతి పట్టణ అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన పదిహేనువేల కోట్ల రూపాయలు రుణమా లేక దానమా (ఆంగ్లంలో గ్రాంట్‌ అంటే తెలుగులో దానం ) అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కొన్ని మీడియా సంస్థల వార్తల్లో, చర్చల సందర్భంగా తెలుగుదేశం నాయకత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రతినిధులు దానమే అంటే, కొందరైతే మరొక అడుగు ముందుకు వేసి ఐదేండ్లపాటు ఏటా పదిహేనువేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినందున పండగ చేసుకోవాలని చెప్పారు.కాదన్నవారి మీద మండిపడ్డారు. కొందరైతే విదేశీ సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే ప్రాజెక్టుల ఖర్చులో కేంద్రం 90శాతం భరిస్తుందని, కేవలం పదిశాతమే రాష్ట్రం పెట్టుకోవాలని చెప్పారు. అంటే పదమూడున్నరవేల కోట్లు కేంద్రమే భరిస్తుందని, పదిహేను వందల కోట్లు రాష్ట్రం పెట్టుకోవాలన్నది వారి వాదన. అదే నిజమనుకున్నా రాష్ట్రానికి కొంత మేలే. రాష్ట్రం కోరుతున్నది తన మీద భారం మోపని సాయం. కేంద్ర మంత్రి చెప్పిన పదాలకు అర్ధం రుణం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఉన్న రెండు ఇంజన్ల డ్రైవర్లు ఏది నిజమో చెబితే జనం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సినపని లేదు.చెప్పటానికి సిద్దంగా ఉన్నారా ?


దీని గురించి స్పష్టంగా చెప్పకుండా చంద్రబాబు నాయుడు తన పరువును, నరేంద్రమోడీ పరువును కాపాడేందుకు పూనుకున్నారు. గతంలో కేంద్రం ప్రత్యేక హౌదా బదులు పాకేజ్‌ ఇస్తామంటే అదే గొప్పదని చెప్పారు. బిజెపితో బంధం తెగిన తరువాత మాట మార్చారు. ఇప్పుడు ఎలాగైతేనేం డబ్బులు వస్తున్నాయిగా అంటున్నారు.తరువాత ఏమంటారో భవిష్యత్‌కే వదలివేద్దాం.తనదైన శైలిలో చెప్పిందేమిటి ? ” నిధులు ఎక్కడి నుంచి ఎలా వస్తేనేం రాష్ట్రం అభివృద్ది చెందుతుంది.కేంద్రం ముందు ఆంధ్రప్రదేశ్‌ ఉంచిన ప్రతిపాదనల్లో అత్యధికాన్ని ఆమోదించింది. రాజధానికి వచ్చే నిధులతో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి, దీంతో పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. వాగ్దానం చేసిన నిధులతో రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభమౌతుంది.విదేశీ సంస్థల నుంచి రుణాల రూపంలో వచ్చినప్పటికీ వాటిని 20-30 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వివిధ సంస్థల నుంచి వచ్చే రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. రాజధాని సహాయ రూపంలో కొన్ని కేంద్ర గ్రాంటులు వస్తాయి.వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ ఖండ్‌ తరహా సాయం వచ్చే అవకాశం ఉంది.ఈ పాకేజ్‌లో పారిశ్రామిక సబ్సిడీలు కూడా ఉంటాయి.” అన్నారు చంద్రబాబు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తరువాత విలేకర్లతో నిర్మలా సీతారామన్‌ మాట్లాడిన అంశాలు గందరగోళంగా ఉన్నాయి. ” రాజధాని నిర్మాణానికి ఈ ఏడాదే ప్రపంచ బాంకు నుంచి 15వేల కోట్ల రుణం తీసుకుంటాం.ఇందులో రాష్ట్రం వాటాను కూడా భరించాలి.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం తన వాటాను చెల్లించగలదా లేదా కేంద్రమే గ్రాంటు ఇస్తుందా అన్న విషయాలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం ” అని నిర్మలమ్మ చెప్పారు. ప్రపంచబ్యాంకు నుంచి కేంద్రం రుణం తీసుకుంటే దానిలో రాష్ట్రం భరించాల్సిదేమిటి ? ఇచ్చేది రాష్ట్రానికే అయినపుడు రాష్ట్ర వాటా ఏమిటి ? దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రాజెక్టుల రుణాలు తీసుకోవటం కొత్తేమీ కాదు. అవి రాష్ట్రాల్లో అమలు జరిగినా కేంద్రం హామీ ఇవ్వాల్సి ఉంటుంది.నేరుగా రాష్ట్రాలు తీసుకొనేందుకు వీలులేదు. అలా ఇచ్చే రుణాలలో కొన్నింటిలో కొంత గ్రాంటు కూడా వుంటుంది. బాటా కంపెనీ చెప్పుల ధరలు, వెయ్యో, రెండువేలో కాకుండా రు.999, 1,999 మాదిరి ఉంటాయి. వినియోగదారుని మానసిక స్థితిని సొమ్ముచేసుకొనే వాణిజ్య చిట్కా ఇది. అలాగే అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రుణాలకు అనేక షరతులు ఉంటాయి. వాటికి వ్యతిరేకత తలెత్తకుండా ఉండేందుకు అవిచ్చే రుణాల్లో కొంత భాగాన్ని గ్రాంటుగా ఇస్తాయి. చేదు మాత్రను మింగించేందుకు వాటికి పంచదార పూత పూయటం వంటిదే ఇది. రుణ షరతులను వ్యతిరేకించేవారి నోరు మూయించేందుకు గ్రాంటు భాగాన్ని జనానికి చూపుతారు. అమరావతి స్వయం పోషక నగరమని, దాని నిధులతోనే నిర్మాణం జరుపుతామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆర్థిక మంత్రి విదేశీ సంస్థల నుంచి అప్పుతీసుకుంటామంటున్నారు. ఒక వేళ అదే వాస్తవం అనుకుంటే ఆ అప్పును ఎవరు తీర్చాలి ? కేంద్రం అంటే దేశం మొత్తం కదా ! ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చేసే అప్పును దేశం మొత్తం ఎందుకు భరించాలి ? మా రాజధానులను కూడా నవీకరిస్తాం, ప్రపంచ స్థాయి నగరాలుగా చేస్తాం అప్పుచేసి మాకూ నిధులు ఇవ్వాలి అంటే కేంద్రం అంగీకరిస్తుందా ? విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకోవాలంటే ముందుగా ఆ సంస్థలకు ప్రాజెక్టు వివరాలను సమర్పించాలి. పర్యావరణం,వాటి అమలుతో నష్టపోయేవారెవరైనా ఉన్నారా, ఉంటే వారికి పరిహారం ఎలా చెల్లించాలి? తీసుకున్న అప్పులను ఎలా తీరుస్తారు? అందుకుగాను మీదగ్గర ఉన్న ఆదాయవనరులు ఏమిటి ? లేకపోతే ఎలా రాబడతారు ? ఇలా అనేక అంశాలను పరిశీలించి షరతులతో కూడిన రుణాలను మంజూరు చేస్తాయి. ఆదాయాన్ని ఎలా రాబట్టాలో కూడా వినియోగదారుల ఛార్జీల వంటి సూచనల రూపంలో షరతులు విధిస్తాయి. మనం సాధారణంగా బాంకులకు అలా వెళ్లి ఇలా అప్పుతెచ్చుకున్నంత సులభంగా విదేశీ సంస్థల అప్పు ఉండదు. అయినప్పటికీ ఇంకా వర్తమాన ఆర్థిక సంవత్సరంలోనే విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకొని ఇస్తామంటూ నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బహుశా నరేంద్రమోడీగారిని విశ్వగురువుగా, నేతగా ప్రచారం చేస్తున్నారు గనుక అలాంటి నిబంధనలను పక్కన పెట్టే ప్రత్యేక వెసులు బాటు, వివరాలేమీ లేకుండానే ముందుగానే ఇచ్చే అవకాశం ఉందేమో తెలియదు. ఇంతవరకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌)ను కేంద్రానికి సమర్పించినట్లు చంద్రబాబు నాయుడు ఎక్కడా ప్రకటించలేదు, లీకులు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు అమరావతి కోసం విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. వినియోగదారుల దగ్గర రుసుములు వసూలు చేసే షరతులతో ముందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం మారటం, అమరావతిని వదలివేయటంతో కథకంచికి చేరింది. ఒక వేళ ఇప్పుడు మరోసారి ప్రయత్నించాలన్నా, పెరిగిన ధరలకు అనుగుణ్యంగా డిపిఆర్‌ను సమర్పించాలి. అలాంటి ప్రక్రియ ఇంతవరకు లేనందున పదిహేనువేల కోట్లు వెంటనే ఎలా వస్తాయన్నది ప్రశ్న.


ఇలాంటి ప్రశ్నలు, సందేహాలను ఎవరైనా లేవనెత్తితే రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవటం లేదనో, వైసిపి కండువా కప్పుకున్నారనో ఎన్‌డిఏ కూటమి ఎదురుదాడికి దిగవచ్చు.గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నిస్తే వైసిపి వారు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. వాటిని వదలి వేద్దాం.హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికలో 2024 జూలై 18న న్యూఢిల్లీ ప్రతినిధి రాసిన విశ్లేషణ ప్రకారం ”రాష్ట్ర పునర్‌నిర్మాణానికి ” కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల సాయం కావాలని చంద్రబాబు నాయుడు కోరారు. అందుకోసం ప్రధాని నరేంద్రమోడీ, అరడజను మంది కేంద్ర మంత్రులు, పదహారవ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియాను కలిశారు. నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరణాత్మక పత్రాన్ని కూడా అందచేశారు.కేంద్రం ఎందుకు సాయం చేయాలో కూడా వివరించారు.వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి జిడిపిలో మూడుశాతం నిబంధనను సడలిస్తూ 0.5శాతం పెంచాలని, అమరావతి నిర్మాణానికి రు.50వేల కోట్ల సాయం ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు పన్నెండువేల కోట్లు ఇవ్వాలని కోరారు. అలాగే దుగ్గరాజపట్నం రేవు నిర్మాణం, రాష్ట్ర మూలధన పెట్టుబడికి ప్రత్యేక పధకం కింద సాయం,బుందేల్‌ ఖండ్‌ పాకేజ్‌ మాదిరి వెనుకబడిన ప్రాంతాలకు సాయాన్ని, చమురుశుద్ధి కర్మాగారాల ఏర్పాటును కూడా కోరారు.కీలకమైన కేంద్ర మంత్రి పదవులు,లోక్‌సభ ఉపసభాపతి పదవిని కూడా కోరకుండా ఆర్థిక సాయం మీదే కేంద్రీకరించినట్లు కూడా బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ” ఆంధ్రప్రదేశ్‌కు నిర్మల మద్దతు, కానీ నాయుడు కోరిన దానికి చాలా తక్కువ ” అనే శీర్షికతో అదే బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. దానిలోని అంశాల సారం ఇలా ఉంది. కేంద్ర సాయాన్ని ఆశిస్తూ బడ్జెట్‌లో ఏం కేటాయిస్తారో చూసేందుకు గాను చంద్రబాబు రాష్ట్రబడ్జెట్‌ ప్రవేశపెట్టటాన్ని వాయిదా వేసుకున్నారు. స్థానికంగా వనరులను పెంచేందుకు మార్గాలు వెతకాల్సి ఉంటుంది, పదిహేనవ ఆర్థిక సంఘం సూచనను అనుసరిస్తే రాష్ట్ర ప్రభుత్వం పన్నేతర రాబడులను పెంచుకోవాల్సి ఉంది.కేేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక పాకేజ్‌ లేదా ప్రత్యేక హౌదా ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతానికి బడ్జెట్‌ పెట్టకుండా సమయాన్ని తీసుకుంది.అయితే చంద్రబాబు లక్ష్యం అంత తేలిక కాదు.రాష్ట్ర ఆదాయంతో పోల్చితే వడ్డీ చెల్లింపులు గణనీయంగా ఎక్కువగా ఉన్నందున ఆర్థిక పునర్‌నిర్మాణం కోసం ఎంతో ఎంతో చేయాల్సి ఉందని పేర్కొన్నారు.


బడ్జెట్‌ కేటాయింపులను పరిశీలించేపేరుతో కొద్ది రోజులు కాలయాపన చేయవచ్చు. కేంద్రం నుంచి ఆశించిన సాయం, దాని గురించి తెలుగుదేశం పార్టీ, జనసేన జనంలో పెద్ద ఎత్తున ఆశలు కలిగించాయి.సూపర్‌సిక్స్‌ పేరుతో చేసిన వాగ్దానాలను బిజెపి ఆమోదించి ఉంటే ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో దాని పేరు కూడా ఉండేది.ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం గురించి 2014-19 మధ్య బిజెపితో కలసి కాపురం చేసినంత కాలం చంద్రబాబు నాయుడు సానుకూలంగా మాట్లాడారు తప్ప జనాలకు వివరాలు చెప్పలేదు. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్న తరువాతే గళమెత్తి, ఢిల్లీలో నిరసనలు, తరువాత 2019ఎన్నికలకు ముందు శ్వేత పత్రాలను ప్రకటించారు. జనం వాటిని నమ్మలేదు.చిత్తుగా ఓడించారు.వైసిపిని గెలిపించారు. ఆ పార్టీ అనుసరించిన వైఖరితో విసిగిపోయి చారిత్మ్రాక స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని గెలిపించారు. రాష్ట్రం ఉన్న స్థితి గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాదిరి గుండెలు బాదుకుంటే, వైసిపి మీద విమర్శలను గుప్పిస్తే కుదరదు. కేంద్ర సాయం గురించి తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలంటే అధికారానికి వచ్చిన తరువాత కేంద్రాన్ని ఏ ఏ రంగాలలో ఎంత సాయం చేయాలని కోరారు, తాజా బడ్జెట్‌లో వాటిలో ఏమేరకు వచ్చింది అనే అంశాలను జనానికి అర్దమయ్యే రీతిలో ఒక శ్వేతపత్రం ద్వారా ప్రకటించి పరిస్థితిని వివరించాలి. అందుకు చంద్రబాబు సిద్దపడతారా ?
హొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండుగా చీలిన అమెరికా సమాజం : డోనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు-ఓటమిపై సమీకరణ ! కమలా హారిస్‌ వైపు మొగ్గు !!

24 Wednesday Jul 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, Politics, USA

≈ Leave a comment

Tags

#US Elections 2024, Donald trump, Joe Biden, Kamala Harris


ఎం కోటేశ్వరరావు


అమెరికా అధ్యక్షుడు, రెండవసారి పోటీచేసేందుకు ప్రయత్నించిన డెమోక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ తాను పోటీ పరుగు నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం నాడు ప్రకటించటమే కాదు, అధ్యక్షపదవి అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను బలపరుస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా చరిత్రలో అధికారంలో ఉండి పోటీ నుంచి తప్పుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ముదిమితో మతి తప్పి మాట్లాడుతున్న 81ఏండ్ల బైడెన్‌ పోటీ నుంచి వైదొలగి వేరొకరికి అవకాశం ఇవ్వాలన్న వత్తిడి గత కొద్ది వారాలుగా వచ్చింది. అయినప్పటికీ పోటీలో ఉంటానని చెప్పిన పెద్దమనిషి ఆకస్మికంగా ప్రకటించటంతో డెమోక్రాట్లు కొత్త అభ్యర్థికోసం హడావుడి పడుతున్నారు. ఆగస్టు 19-22వ తేదీలలో పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఎన్నిక జరుగుతుంది. మరి కొంత మంది కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చినా బైడెన్‌ ప్రకటన తరువాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అనూహ్యపరిణామాలు జరిగే తప్ప డోనాల్డ్‌ ట్రంప్‌ను ఢకొీనబోయేది కమలాహారిస్‌ అని చెప్పవచ్చు. డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి దిగజారినట్లు,హత్యాయత్నం జరిగిన తరువాత ట్రంప్‌ విజయావకాశాలు మరింత పెరిగినట్లు వార్తలు వచ్చిన పూర్వరంగం జో బైడెన్‌ నిర్ణయాన్ని వేగిరం కావించింది. అయితే పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన తరువాత కమలా హారిస్‌ రెండు పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో 44 -42తో ట్రంప్‌పై పైచేయి సాధించినట్లు సోమ, మంగళవారాల్లో రాయిటర్స్‌ జరిపిన ఎన్నికల సర్వేలో వెల్లడైంది. ఇదే ధోరణి ముందుకూడా కొనసాగితే సంకుల సమరం సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో ఫాసిస్టులను ఇంటికి పంపిన మాదిరి మితవాది ట్రంప్‌ను ఓడించే అవకాశాలనూ తోసి పుచ్చలేము.


బైడెన్‌ నిర్ణయం అమెరికా లోపలా వెలుపలా, శత్రువులూ, మిత్రుల మధ్య చర్చనీయాంశమైంది. మిత్రదేశాల నేతలందరూ సానుకూలంగా మాట్లాడారు.” ఇటీవలి సంవత్సరాలలో అమెరికాలో జరుగుతున్న పరిణామాలు మాకు ఒక అంశాన్ని నేర్పాయి, అదేమిటంటే దేని గురించి మేము ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు అని, ఈ అంశం అమెరికా ఓటర్లకు సంబంధించింది తప్ప మాది కాదు, భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నదే మాకు చాలా ముఖ్యం, ఇప్పుడవి చరిత్రలో అత్యంత దిగజారిన స్థితిలో ఉన్నాయి ” అని రష్యా ప్రతినిధి స్పందించారు. ఇది వారి అంతర్గత అంశమని చైనా పేర్కొన్నది.అయితే అక్కడి మీడియా, సామాజిక మాధ్యమంలో పెద్ద స్పందన వెలువడింది.నలభైకోట్ల మంది ఈ వార్తను చూసినట్లు లక్షలది మంది వ్యాఖ్యలు చేసినట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది. అధ్యక్ష పీఠంపై ఎవరు ఉన్నా అమెరికా పెద్దన్నకే అగ్రతాంబూలం అన్నట్లుగా వ్యవహరిస్తారన్నది తెలిసిందే. ఈ కారణంగానే ఎన్నికలు వారి అంతర్గత అంశమైనప్పటికీ అనేక దేశాల నేతలు స్పందించారు. అంతర్గతంగా కమలా హారిస్‌ గెలుస్తారా, ఆమె బలం,బలహీనతలు ఏమిటి అన్న చర్చ మొదలైంది. బైడెన్‌ ప్రకటన వెలువడగానే ఆమె స్పందించారు.” పార్టీని ఐక్యంగా ఉంచేందుకు చేయాల్సిందంతా చేస్తాను. డోనాల్డ్‌ ట్రంప్‌ను, ప్రమాదకరమైన అతగాడి ప్రాజెక్టు 2025 అజెండాను ఓడించేందుకు గాను దేశాన్ని ఐక్యం చేసేందుకు పూనుకుంటానని ” పేర్కొన్నారు.


ప్రపంచంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను పరిష్కరించటంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యం చెందింది.జనం దగ్గర దారిలో పరిష్కారాల కోసం చూస్తున్నారు. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్థతప్ప ఇప్పటికి మరొకటి లేదు. అయితే సోవియట్‌ యూనియన్‌, ఇతర దేశాల్లో జరిగిన ప్రయోగాలు, వాటి గురించి సోషలిజం అనుకూలశక్తులలోనే తలెత్తిన విబేధాలు, వ్యతిరేకులు చేసిన ఎదురుదాడి నేపధ్యంలో జనం గందరగోళంలో ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించేందుకు, కాపాడేందుకు అవసరమైతే నిర్బంధకాండకు సైతం సిద్దపడే పచ్చిమితవాద, ఫాసిస్టు శక్తులు రంగంలోకి వస్తున్నాయి.ఐరోపాలో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది.అమెరికా కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రాజెక్టు 2025ను రూపొందించిన హెరిటేజ్‌ ఫౌండేషన్‌ మితవాద,నిరంకుశుల అజెండా. ట్రంప్‌ అధికారానికి వస్తే అమలు జరుపుతారనే ప్రచారం ఉంది. దీన్ని జనంలోకి తీసుకువెళితే జో బైడెన్‌ మరోసారి ఎన్నికౌతారని డెమోక్రాట్లు భావించారు. ఇప్పుడు రంగం నుంచి తప్పుకున్నప్పటికీ ట్రంప్‌ను దెబ్బకొట్టగలిగే అస్త్రం ఇదే అని వారు ఇప్పటికీ భావిస్తున్నారు.కమలా హారిస్‌ మాటల భావమిదే. అసలేమిటిది ?


పచ్చి మితవాద భావజాల సంస్థ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ 1973లో ఉనికిలోకి వచ్చింది. వందకు పైగా అలాంటి బృందాల సలహాలతో 922 పేజీల విశ్లేషణ, సిఫార్సులే ప్రాజెక్టు 2025. దీని వెనకాల ఉన్నది ఎవరో నాకు తెలియదు.వారితో నాకెలాంటి సంబంధమూ లేదు అని ఇటీవల ట్రంప్‌ చెప్పుకున్నాడు.ఎన్నికలు ముగిసేవరకు ట్రంప్‌ ఇదే నాటకాన్ని కొనసాగిస్తాడన్నది తెలిసిందే. అయితే బుకాయించినా గతంలో అతని దగ్గర పనిచేసిన వారూ, మద్దతుదారులందరూ దాని రూపకల్పనలో భాగస్వాములే కనుక, దాన్నే అమలు జరుపుతారని వేరే చెప్పనవసరం లేదు. మన దేశంలో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ చేసిన సిఫార్సులు, ఆదేశాలను అమలు జరుపుతున్న పార్టీలేవీ ఎక్కడా బహిరంగంగా వాటి గురించి చెప్పరు. అవన్నీ తమ విధానాలే అని జనాన్ని నమ్మించేందుకు చూస్తాయి.తమ ముద్రవేసుకుంటాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌, బిజెపి, తెలుగుదేశం, బిఆర్‌ఎస్‌ ఇలా ఏ పార్టీని చూసినా అదే కనిపిస్తుంది. అందుకే ఈ పార్టీల మధ్య అధికారం కోసం కుమ్ములాటలుంటాయి తప్ప విధానపరంగా ఎలాంటి ఘర్షణ ఉండదు. ఫాసిస్టు శక్తులు అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు వాటిని వ్యతిరేకించే మితవాద, వామపక్ష శక్తులందరూ ఇటీవలి ఫ్రెంచి పార్లమెంటు ఎన్నికల్లో చేతులు కలిపి ప్రస్తుతానికి ఆ ముప్పును తప్పించిన సంగతి తెలిసిందే. అమెరికాలో కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా అదే జరగనుందా ?


అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యేవారు, నియమిత అధికార యంత్రాంగానికి ఇప్పుడున్న వాటి కంటే అధికారాలను మరింతగా కట్టబెట్టటం, మరింత కేంద్రీకరించటం ప్రాజెక్టు 2025లక్ష్యాలలో ఒకటి.అధికార దుర్వినియోగానికి ఇది బాటవేస్తుందని భావిస్తున్నారు. సంక్షేమ పధకాలకు కోతపెట్టాలని, నియంత్రణలను నామమాత్రం చేయాలని కార్పొరేట్‌, మితవాద శక్తులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి, అందువలన వీటి సాధన రెండవది.సామాజిక, మతపరమైన అంశాలలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య వ్యత్యాసం ఉంది.అబార్షన్లను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారాలను వినియోగించాలని, గర్భనిరోధ పద్దతులను పరిమితం చేయాలని, బూతుపై నిషేధం, ఆ ఇతివృత్తంతో తీసే సినిమాలు, సీరియళ్లు, ఇతర ఉత్పత్తులను సృష్టించేవారు, వాటిని పంపిణీ చేసే వారి మీద నిషేధం పెట్టాలని, శిక్షించాలన్న అజండా కూడా దీనిలో ఉంది. ఇవన్నీ నిరంకుశ, తిరోగామి ప్రతిపాదనలని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఇవి కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలూ కావు.వీటిని అమలు జరిపేందుకు తగిన వాడు ట్రంప్‌ అని భావించటమే తాజాదనం. తన ఓటమిని అంగీకరించకుండా, జో బైడెన్‌ ఎన్నికను అధికారికంగా ప్రకటించకుండా అడ్డుకొనేందుకు అమెరికా అధికార కేంద్రం మీద దాడి చేయించిన ట్రంప్‌కే ఈ అజెండాను అమలు చేసే దమ్ముఉంటుదని అనేక మంది గట్టిగా భావిస్తున్నారు. ఇదే మితవాదులను వ్యతిరేకించేవారిలో ఇటీవల ఆందోళనను పెంచుతోంది. లక్షలాది మంది పౌర ఉద్యోగులను తొలగించి తన మద్దతుదార్లను నియమించేందుకు 2020లో ట్రంప్‌ నిర్ణయించాడు. అయితే అమలు జరిపే సమయానికి ఎన్నికల్లో ఓడి పదవి నుంచి దిగిపోయాడు. ఆ నిర్ణయాన్ని బైడెన్‌ రద్దు చేశాడు. ఇప్పుడు ట్రంప్‌ గెలిస్తే తన అజెండాను అమలు జరపవచ్చని భావిస్తున్నారు.విద్యా శాఖను రద్దు చేసి అమ్మవడి-తల్లికి వందనం పేరుతో అమ్మలకు ఇస్తున్న నగదు మాదిరే ప్రయివేటు స్కూళ్లకు పంపే తలిదండ్రులకు నగదు ఇవ్వాలని మితవాదులు కోరుతున్నారు. తక్కువ రాబడి వచ్చే స్కూళ్లకు నిధుల నిలిపివేత, మధ్యాహ్నభోజన పధకాల రద్దు, విద్యారుణాలను విధిగా వసూలు చేయాలనే చర్యలు చేపట్టవచ్చు. పర్యావరణ హాని నివారణ చర్యలను నిలిపివేయాలని, హరిత ఇంథన సబ్సిడీలను ఎత్తివేయాలని, చమురు, గ్యాస్‌ వెలికితీతపై పర్యావరణ ఆంక్షలను రద్దు చేయాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమంగా వచ్చిన వారికి విద్యా రుణాలు ఇవ్వకూడదని,ప్రభుత్వ సహాయం పొందే గృహాల్లో వారికి అవకాశం కల్పించరాదని, అక్రమ ప్రవేశాల నిరోధానికి సరిహద్దుల్లో అశ్వికదళాలను తిరిగి నియమించటమే గాక విస్తరించాలని కోరుతున్నారు.

ఇలాంటి ప్రతిపాదనలతో ఉన్నదే ప్రాజెక్టు 2025. దీని రూపకల్పనలో భాగస్వాములు, వాటితో ఏకీభవించేవారిని యంత్రాంగంలో నియమించి వారి పేరుతో అమలు జరిపించేందుకు ట్రంప్‌ చూస్తున్నారని పురోగామివాదులు అనేక మంది హెచ్చరిస్తున్నారు.
హెరిటేజ్‌ ఫౌండేషన్‌కు నిధుల కొరత లేదు. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక కావాలనేదానికంటే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే రీతిలో తన మనుషులను యంత్రాంగంలోకి పంపేందుకే ఇది ప్రాధాన్యత ఇస్తుంది. ఇరవైవేల మంది సుశిక్షుతులైన కార్యకర్తలు, ఇరవైలక్షల మంది స్వచ్చందకార్యకర్తలు దీనికి ఉన్నట్లు అంచనా.దాని అజెండాను అమలు జరిపేందుకు, ప్రజాప్రతినిధులను ప్రభావితం చేసేందుకు, సామాజిక మాధ్యమంలో జనాన్ని సమీకరించేందుకు వారంతా రంగంలోకి దిగుతారు. అనేక మందిని పార్లమెంటరీ కార్యాలయాల్లోకి ఇప్పటికే చొప్పించింది.ట్రంప్‌ యంత్రాంగంలో 2017నాటికి 70 మంది ఈ సంస్థతో సంబంధం ఉన్నవారున్నారు.వారిలో నలుగురు మంత్రులు. ఈ సంస్థ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి రిపబ్లికన్లు మరింత మితవాదం వైపు మొగ్గేందుకు చేయాల్సిందంతా చేస్తోంది.1981లో రోనాల్డ్‌ రీగన్‌ అధికారంలోకి వచ్చినపుడు దీని అజెండాలో 60శాతం అమలు జరిపాడు. ట్రంప్‌ తొలిసారి అధికారంలో ఉన్నపుడు దీని సిఫార్సుల్లో 64శాతం అమలు చేశాడంటే దీని సత్తా ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. రిచర్డ్‌ నిక్సన్‌ హయాంలో 1973లో ఉనికిలోకి వచ్చిన ఈ సంస్థ నిర్వాహకులు తాము కమ్యూనిజానికి వ్యతిరేకమని, కార్పొరేట్లకు అనుకూలమని, క్రైస్తవ మత భావజాలానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పుకున్నారు. తాజా విషయానికి వస్తే ట్రంపిజాన్ని వ్యవస్థీకృతం కావించేందుకు తాము పనిచేస్తామని ఫౌండేషన్‌ అధ్యక్షుడు కెవిన్‌ డి రాబర్ట్స్‌ న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికతో చెప్పాడు. అమెరికా ఇప్పుడు రెండవ విప్లవ క్రమంలో ఉందని, అది రక్తపాత రహితంగా ఉంటుందని కూడా ఒక టీవీ చర్చలో చెప్పాడు. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఈ అంశాలను జనంలోకి తీసుకువెళ్ల గలిగితే నల్లేరు మీద బండిలా సాగుతుందనుకుంటున్న ట్రంప్‌ ఎన్నిక తిరగబడినా ఆశ్చర్యం లేదు.


అయితే అది అంత తేలిక కాదు. ఇప్పటికే జో బైడెన్‌ ప్రతిష్ట దిగజారింది. దాని ప్రభావం కమలాహారిస్‌ మీద కూడ పడుతుంది.వ్యక్తిగా బైడెన్‌ కంటే అతగాడి విధానాల ఫలితంగానే పలుకుబడి తగ్గటమే దీనికి కారణం. రెండవది ఊపు మీద ఉన్న ట్రంప్‌ మద్దతుదార్లు ఆమె మీద పెద్ద ఎత్తున ప్రచారదాడికి దిగే అవకాశం ఉంది. గార్డియన్‌ పత్రిక పేర్కొన్న సమాచారం ప్రకారం పోటాపోటీగా ఉన్న పెన్సిల్వేనియా, జార్జియా, అరిజోనా వంటి రాష్ట్రాలలో టీవీ ప్రకటనల కోసం 50లక్షల డాలర్లను కుమ్మరించేందుకు సిద్దంగా ఉన్నారు. అదే విధంగా అబార్షన్ల వంటి అంశాలపై ఆమె అభిప్రాయాల మీద రెచ్చగొట్టే అవకాశం ఉంది.కమలా హారిస్‌ తల్లి భారతీయ మూలాలున్న మహిళ, తండ్రి ఆఫ్రికన్‌. అందువలన మనదేశంలోని వారు మనమ్మాయి అన్నట్లుగా ప్రచారం చేసుకున్నా అమెరికాలో ఆమెను ఒక ఆఫ్రికన్‌గానే చూస్తారు. శ్వేతజాతి అహంకారం ఉన్న అమెరికాలో దాన్ని కూడా ముందుకు తీసుకురావచ్చు.ఆమె అభ్యర్థిత్వం ఖరారైన తరువాత తలెత్తే పరిణామాల గురించి మరోసారి చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫాసిస్టు వ్యతిరేక పోరాటం – ఫ్రెంచి ఎన్నికల్లో వామపక్షాలు నేర్పిన పాఠం ఏమిటి !

11 Thursday Jul 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

emmanuel macron, French communist, French Elections 2024, French far right, National Rally (RN), New Popular Front(NFP)


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది ప్రపంచంలో 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటి వరకు 25దేశాల్లో పాలకులు మారారు. ఆ పరంపరలో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ చేరాయి. రెండు చోట్లా మధ్యంతర ఎన్నికలు జరిగాయి, అనూహ్య, ఉత్తేజం కలిగించే పరిణామాలు సంభవించాయి. అధ్యక్ష తరహా పాలన ఉన్న ఫ్రాన్సులో హంగ్‌ పార్లమెంటు ఏర్పడింది. నాలుగు కూటములు, అనేక స్వతంత్ర పార్టీలు పోటీ పడినా ఏ కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యలో సీట్లు తెచ్చుకోలేదు. పార్లమెంటులోని 577 స్థానాలకు గాను వామపక్షాల కూటమి 188సీట్లతో పెద్ద పక్షంగా అవతరించింది. ఫాసిస్టు శక్తుల ముప్పు తప్పింది. బ్రిటన్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘనవిజయం సాధించింది అనటం కంటే టోరీ(కన్సర్వేటివ్‌) పార్టీ చరిత్రలో తొలిసారిగా ఓటర్ల చేతిలో ఊచకోతకు గురైంది, అతి తక్కువ సీట్లు తెచ్చుకుంది. ఈ ఘనత భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ ఏలుబడిలో జరిగింది. పార్లమెంటులోని 650 సీట్లకు గాను లేబర్‌ పార్టీ 411తో తిరుగులేని మెజారిటీ సాధించింది. ఫ్రెంచి పార్లమెంటు ఎన్నికల తొలిదశలో ఫాసిస్టు శక్తులది పైచేయిగా ఉండటమే కాదు,ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 289 సీట్ల కంటే ఎక్కువగా 297 స్థానాలలో ప్రధమ స్థానంలో ఉంది. పచ్చి మితవాద నేషనల్‌ రాలీ-ఆర్‌ఎన్‌ (గతంలో నేషనల్‌ ఫ్రంట్‌) ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో 31శాతం ఓట్లతో విసిరిన సవాలుతో అధ్యక్షుడు మక్రాన్‌ పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు తెరతీశాడు. ఈ ఎన్నికల తొలిరౌండులో 33.21శాతం తెచ్చుకుంది.రెండవ రౌండ్‌లో 37.06శాతానికి పెంచుకుంది.వామపక్షాలతో కూడిన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(ఎన్‌ఎఫ్‌ఇ) తొలి దఫా 28.21శాతం తెచ్చుకోగా మలి దశలో 25.81శాతం పొందింది. అధికారపక్షమైన టుగెదర్‌ కూటమి 21.28 నుంచి 24.53శాతానికి పెంచుకుంది.


పార్లమెంటులోని 577 స్థానాలకు గాను జూన్‌ 30న జరిగిన ఎన్నికల్లో 76 నియోజకవర్గాలలో ఫలితాలు తేలాయి. ఆర్‌ఎన్‌ పార్టీ 37, వామపక్ష కూటమి 32, అధికార పక్షం రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరులు ఐదు చోట్ల గెలిచారు. మిగిలిన స్థానాలకు ఏడవ తేదీన పోలింగ్‌ జరిగింది. త్రిముఖ పోటీ జరిగితే దేశ చరిత్రలో తొలిసారిగా పచ్చిమితవాదులు అధికారాన్ని కైవశం చేసుకుంటారని తేలింది. ఈ ముప్పును తప్పించేందుకు విధానపరంగా ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ వామపక్ష కూటమి, అధికార పార్టీ ఒక అవగాహనకు వచ్చాయి. అదేమంటే ఆర్‌ఎన్‌ పార్టీ ఆధిక్యత ఉన్న చోట రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థికి అనుకూలంగా మూడవ అభ్యర్థి ఉపసంహరించుకొని మద్దతు ఇవ్వటంతో ఫాసిస్టు పార్టీ ఓట్ల రీత్యా పెద్దదిగా ఉన్నా సీట్లలో మూడవ స్థానానానికి పడిపోయింది. రెండవ దశలో సీట్ల సర్దుబాటు కారణంగా వామపక్ష కూటమి, అధికార కూటమి లబ్ది పొందాయి. వామపక్ష సంఘటనలో ఉన్న పార్టీలకు గతంలో 130 ఉండగా ఈ సారి 188, అధికార ఐక్యత కూటమికిి 245 నుంచి 161కి పడిపోగా ఆర్‌ఎన్‌ పార్టీ కూటమికి 89 నుంచి 142కు పెరిగాయి. ప్రస్తుతానికి ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ముప్పు తప్పినా ఓట్లపరంగా 37శాతానికి పెంచుకోవటం ప్రమాదకరపరిణామం. వామపక్ష కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి అధికార ఐక్యత కూటమి మద్దతు ఇవ్వటం లేదా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి కావటం తప్ప మరొక మార్గం లేదు. ఈ పరిణామంతో రానున్న రోజుల్లో అనేక అంశాలపై మక్రాన్‌ వైఖరిలో మార్పులు కూడా ఉంటాయని భావిస్తున్నారు.


ఫలితాల్లో ఫాసిస్టు పార్టీ అధికారానికి రాదనే తీరు కనిపించగానే పారిస్‌తో సహా దేశమంతటా జనం వీధుల్లోకి వచ్చారు. సంతోషం, ఆనందంతో కన్నీటి బాష్పాలు రాల్చారు.ఫలితాల మీద తొలి ప్రకటన వెలువడగానే ఎదురుగా ఉన్న వారు పరిచితులా, అపరిచితులా అన్నదానితో నిమిత్తం లేకుండా ఎవరుంటే వారిని వారిని హత్తుకున్న దృశ్యాలు కనిపించాయి. నిమిషాల తరబడి చప్పట్లు చరిచారు. ఫాసిస్టు శక్తులను ఓడించేందుకు పరస్పర విరుద్ద వైఖరులతో పని చేస్తున్న పార్టీలు ఐక్యమైనపుడు విబేధాలను పక్కన పెట్టి అదే జనం మద్దతు ఇచ్చి గెలిపించినపుడు ఇలాంటి దృశ్యాలు ఆశ్చర్యం కలిగించవు. ఐరోపా పార్లమెంటు, తొలిదశ ఎన్నికల్లో ఫాసిస్టు పార్టీ పెద్దదిగా అవతరించటంతో ఆందోళనకు గురైన అనేక మంది బరువు దించుకున్నారు. మరోవైపు ఫాసిస్టు పార్టీ అభిమానులు చిక్కినట్లే చిక్కి అధికారం దూరమైందన్నట్లుగా తీవ్ర ఆశాభంగం చెందారు.అయినా తమ కూటమి ప్రతిసారీ బలం పెంచుకుంటున్నదని సంతృప్తిని కూడా వెల్లడిస్తున్నారు. 2027లో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఏ కూటమి కూడా పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రకటించిన విధానాల నుంచి వైదొలిగే అవకాశాలు ఉండవు. ప్రజలిచ్చిన తీర్పుతో ఫ్రెంచి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయా, మక్రాన్‌ సర్కార్‌కు కొత్త ప్రభుత్వం గుదిబండగా మారుతుందా ? విదేశీ, అంతర్గత విధానాలపై మక్రాన్‌తో వామపక్షాలు విబేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అనేక సందేహాల మీద చర్చ ప్రారంభమైంది. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధాని గాబ్రియెల్‌ అతల్‌ రాజీనామా లేఖను పంపాడు. దాన్ని తాను ఆమోదించటం లేదని మక్రాన్‌ ప్రకటించాడు.ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశాన్ని తమకే ఇవ్వాలని, ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్దంగా ఉన్నామని వామపక్ష కూటమి నేత జీన్‌ లక్‌ మెలెన్‌చోన్‌ ప్రకటించాడు. తాము గెలిస్తే హమస్‌ అణచివేత పేరుతో మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే వైఖరి ఉపసంహరించుకుంటామని, జనానికి ఉపశమనం కలిగించేందుకు భారీ మొత్తంలో ప్రభుత్వ ఖర్చు పెంచుతామని వామఫక్షాలు ఎన్నికల ప్రణాళికల్లో వాగ్దానం చేశాయి. వామపక్షాల తీరు తీవ్రంగా ఉందని, ప్రభుత్వ ఖర్చు పెంచేందుకు అవసరమైన నిధులు కొన్ని సంపద పన్ను, అధికాదాయం వచ్చేవారి మీద పన్ను పెంపుదల వంటి అంశాలను అమలు జరిపితే దేశం నాశనం అవుతుందని, ఇప్పటికే దేశం అప్పుల ఊబిలో ఉందని మక్రాన్‌ వ్యాఖ్యానించాడు.


అనూహ్యంగా పెద్ద కూటమిగా అవతరించిన వామపక్ష న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(ఎన్‌ఎఫ్‌పి) గురించి అనేక మందిలో ఆసక్తి నెలకొన్నది, ఇది ఫాసిస్టు శక్తులను మట్టి కరిపించింది.ఐరోపాలో ఇలాంటి శక్తుల వ్యతిరేకులకు ఒక దారి చూపిందంటే అతిశయోక్తి కాదు. కొన్ని అంశాలపై తేడాలతో గతేడాది అక్టోబరులో వామపక్ష ఫ్రంట్‌ విడిపోయింది.ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో ఆర్‌ఎన్‌ పార్టీ పెద్దదిగా అవతరించటం, అధ్యక్షుడు మక్రాన్‌ పార్లమెంటు రద్దు చేయటంతో తలెత్తిన నూతన పరిస్థితుల్లో వామపక్షాలు తమ విబేధాలను పక్కన పెట్టి జూన్‌ 13న ఎన్‌ఎఫ్‌పి ఏర్పాటుకు అంగీకరించాయి. దీనికి ఒక చారిత్రక నేపధ్యం ఉంది. ఫాసిజానికి వ్యతిరేకంగా 1930దశకంలో పాపులర్‌ ఫ్రంట్‌ ఏర్పడింది, ఆ పేరుకు న్యూ(కొత్త) అని చేర్చారు నెల రోజుల్లోనే పెద్ద పక్షంగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీనిలో నాలుగు పార్టీలు ఉన్నాయి. కూటమిలో 75 సీట్లు ఫ్రాన్స్‌ అన్‌బౌవ్‌డ్‌ -తలవంచని పార్టీ (ఎల్‌పిఐ)కు వచ్చాయి. ఇది సోషలిస్టు పార్టీ నుంచి విడిపోయిన వారితో ఏర్పడింది. భావజాలంలో కమ్యూనిస్టు పార్టీ కంటే తక్కువ సోషలిస్టు పార్టీ కంటే ఎక్కువ అంటే మధ్యస్థంగా ఉంటుందని విశ్లేషకులు వర్ణించారు. రెండవది 65 సీట్లు తెచ్చుకున్న సోషలిస్టు పార్టీ. దీన్ని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీగా పేర్కొంటారు. మూడవ పక్షం ది ఇకోలజిస్ట్స్‌(ఎల్‌ఇ)-పర్యావరణ పార్టీ, దీనికి 33 స్థానాలు వచ్చాయి.నాలుగవది ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ. దీనికి తొమ్మిది స్థానాలు వచ్చాయి. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు సమాజాలను కూల్చివేసిన తరువాత పార్టీ బలహీనపడినప్పటికీ ఇతర దేశాలలో కమ్యూనిస్టుల మాదిరి తన ఉనికిని కాపాడుకుంటున్నది. మరికొన్ని చిన్న పార్టీలు కూడా దీనిలో ఉన్నాయి. అధ్యక్షుడు మక్రాన్‌ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న ఈ కూటమితో అతగాడి నాయకత్వంలోని మితవాద కూటమి కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, బయట ఉండి మద్దతు ఇస్తుందా అన్నది స్పష్టం కాలేదు. ఫాసిస్టులకు వ్యతిరేకంగా రెండు కూటములు ఎన్నికల సర్దుబాటు చేసుకున్నాయి.


ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌లో కూడా కొన్ని నెలల ముందే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి.పద్నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టోరీ(కన్సర్వేటివ్‌ పార్టీ)ని ఓటర్లు ఊచకోత కోశారని కొందరు వ్యాఖ్యానించారు. రిషి సునాక్‌ను నేతగా ఎన్నుకొని తప్పుచేశామని అనేక మంది టోరీలు తలలు పట్టుకుంటున్నారు.గడచిన వందేండ్లలో ఇంత తక్కువ సీట్లు ఎప్పుడూ రాలేదని అంటున్నారు. పొదుపు చర్యల పేరుతో అమలు జరిపిన విధానాలతో జనజీవితం అతలాకుతలం అయింది. అందుకనే ఈ సారి 650 స్థానాలకు గాను ఆ పార్టీకి 53 నుంచి 131 మధ్యలో సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొనగా 121 వచ్చాయి.గతంలో ఉన్నవాటిలో 251 స్థానాలను కోల్పోయారు. మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌,పన్నెండు మంది మంత్రులు మట్టికరిచారు.ఆశ్చర్యం ఏమిటంటే మూడవ పక్షమైన లిబరల్‌ పార్టీ ఈ ఎన్నికల్లో పదకొండు నుంచి 72 స్థానాలకు తన బలాన్ని పెంచుకుంది. టోరీ ప్రధానులుగా పనిచేసిన డేవిడ్‌ కామెరాన్‌, థెరెసా మే ప్రాతినిధ్యం వహించిన స్థానాలను ఈ పార్టీ కైవశం చేసుకుంది.ఈ ఎన్నికలు మరొక రికార్డును కూడా సృష్టించాయి. 1918 తరువాత రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు 57.4 శాతమే. లేబర్‌ పార్టీ 33.7శాతం ఓట్లతో 411 సీట్లు(63.2శాతం) తెచ్చుకోగా టోరీ 23.7శాతం ఓట్లు, 121 సీట్లు(18.6శాతం) తెచ్చుకున్నాయి. గ్రీన్స్‌ పార్టీకి 6.7శాతం ఓట్లు వచ్చినప్పటికీ కేవలం నాలుగు స్థానాలు(0.6శాతం) మాత్రమే వచ్చాయి. రిఫామ్‌(సంస్కరణ) యుకె పార్టీకి లిబరల్స్‌ కంటే ఎక్కువగా 14.3శాతం ఓట్లు వచ్చినా కేవలం 5(0.8శాతం) సీట్లు వచ్చాయి. డెమోక్రటిక్‌ యూనియనిస్టు పార్టీకి కూడా ఐదు సీట్లు వచ్చినా దానికి వచ్చిన ఓట్లు కేవలం 0.6శాతమే ఈ తీరును చూసిన కొందరు ఎన్నికల సంస్కరణలు అవసరమని సూచించారు.బ్రిటన్‌ పార్లమెంటు చరిత్రలో అధికారానికి వచ్చిన పార్టీ తక్కువ ఓట్లు తెచ్చుకోవటం ఒక రికార్డు, దాన్ని లేబర్‌ పార్టీ సొంతం చేసుకుంది.మూడు ప్రధాన పార్టీలకు 69.6 శాతం ఓట్లు 92.9 శాతం సీట్లు వచ్చాయి. చిన్న పార్టీలు ఓట్లు గణనీయంగా తెచ్చుకున్నట్లు ఈ గణాంకాలు వెల్లడించాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 7.4శాతం తగ్గి 59.9శాతం ఓట్లు పోలయ్యాయి. దీన్ని బట్టి ఓటర్లు ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదన్నది స్పష్టమైంది. లేబర్‌ పార్టీ గత ఎన్నికల కంటే కేవలం 1.7శాతం, లిబరల్‌ పార్టీ 0.6శాతం మాత్రమే అదనంగా తెచ్చుకోగా టోరీలు 19.9శాతం కోల్పోయారు.అధికారంలోకి లేబర్‌ పార్టీ వస్తుందా లేదా అన్నదాని కంటే టోరీ పార్టీని వదిలించుకోవాలని ఓటర్లు భావించినట్లు ఈ అంకెలు స్పష్టం చేశాయి.


లేబర్‌ పార్టీ పెద్ద విజయాన్ని సాధించగానే సమస్యలన్నీ పరిష్కారమైనట్లు భావించనవసరం లేదు. దాని ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.ప్రతిపక్షంలో ఉండగా పౌరుల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చే లేబర్‌ పార్టీ నేతలు అధికారానికి వచ్చిన తరువాత జనాన్ని మరచిపోతారనే నానుడి ఉంది. గతంలో అది నిరూపితమైంది. దాని నేత కెయిర్‌ స్టామర్‌ కార్పొరేట్లకు అనుకూలమనే అభిప్రాయం ఉంది. దీనికి అనుగుణంగానే ఫలితాలు వెలువడిన తరువాత తొలిరోజు స్టాక్‌మార్కెట్‌ సూచీ0.86పెరిగిందన్నది ఒక అభిప్రాయం.ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ది కేవలం 0.6శాతమే పెరగ్గా ధరలు రెండు పెరిగాయి. ఇతర అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే కరోనాకు ముందున్న ఉత్పాదకత, పెట్టుబడి రేట్లు తక్కువగా ఉన్నాయి. 1980దశకంలో పెట్టుబడి రేటు 23శాతం ఉండగా రెండువేల సంవత్సరం నుంచి 17శాతానికి అటూ ఇటూగా ఉంది. అదే ఇతర జి7 దే శాలలో 20-25శాతంగా ఉంది.ఆదాయపన్నుతో సహా ఇతర పన్నులేవీ పెంచబోమని లేబర్‌ పార్టీ ఎన్నికల్లో చెప్పింది. పెంచకపోతే మరింత అప్పులపాలౌతామని, స్పష్టంగా వైఖరిని వివరించాలని టోరీల నేత రిషి సునాక్‌ పదే పదే లేబర్‌ పార్టీ నేతలను ప్ర శ్నించాడు. ప్రస్తుతం జిడిపితో పోలిస్తే 100శాతం అప్పుల్లో,ద్రవ్యలోటుతో బ్రిటన్‌ ఉంది.దాన్ని అధిగమించాలంటే జనాన్ని పన్నులతో బాదాలని టోరీలు చెబుతున్నారు. జనంలో వ్యతిరేకత కనిపించటంతో మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ సర్కార్‌ పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నది. గత పద్నాలుగు సంవత్సరాలుగా ఏదో ఒక పేరుతో ప్రభుత్వ రంగ సిబ్బందికి వేతనాలను స్థంభింపచేశారు. కార్మిక సంఘాలన్నీ లేబర్‌ పార్టీ నిర్వహణలో ఉన్నందున వేతన సమస్య ప్రధానంగా ముందుకు రానుంది. దేశంలోని అతి పెద్ద థేమ్స్‌ నీటి కంపెనీ అప్పులపాలైంది.అయినా వాటాదార్లకు డివిడెండ్లు చెల్లిస్తున్నది. దివాలా తీసే స్థితిలో ఉన్నదాన్ని నిలబెట్టటం ఒక సమస్య. దీన్ని జాతీయం చేయవచ్చని, అందుకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. జైళ్లన్నీ 99శాతం నిండి ఉన్నాయి.న్యాయవ్యవస్థ విఫలమైందనే విమర్శకూడా ఉంది. నేరాలను ఎలా తగ్గించాలనేదాని కంటే కొత్తగా జైళ్ల నిర్మాణం గురించి పాలకులు ఆలోచిస్తున్నారు.విశ్వవిద్యాలయాల నిర్వహణ ఖర్చు పెరిగింది, 2012తరువాత ట్యూషన్‌ ఫీజులను పెంచలేదు.విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా తగ్గుతున్నారు.దీంతో వాటి రాబడి పడిపోతున్నది.బ్రిటన్‌ పెద్ద సమస్యల్లో ఇదొకటి. ఆరోగ్య రంగ బడ్జెట్‌లోటులో ఉంది.చికిత్సకు పట్టే వ్యవధి రోజు రోజుకూ పెరుగుతోంది, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి.సేవలను మెరుగుపరచాల్సి ఉంది.టోరీల పొదుపు చర్యల కారణంగా స్థానిక సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. 2018 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సంస్థలు దివాలా ప్రకటించాయి.ప్రస్తుతం ప్రతి ఐదింటిలో ఒకటి అదే బాటలో ఉన్నది.ఈ పూర్వరంగంలో లేబర్‌ పార్టీ ముందు పెద్ద సవాలే ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ ఫాసిస్టు సంస్థ, ఊసరవెల్లి : సోషలిస్టు నేత మధు లిమాయే చెప్పిన వాస్తవాలేమిటి ?

17 Monday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

# Anti Muslims, Adolf Hitler, BJP, Guru Golwalkar, Hindu Rashtra, Madhu Limaye, Narendra Modi, Savarkarites, What is RSS


మధులిమాయే


నేను 1937లో రాజకీయ జీవితంలో ప్రవేశించాను. ఆ రోజుల్లో పూనాలో ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు సావర్కర్‌వాదులు( వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనుచరులు) ఒక వైపు, మరోవైపు జాతీయవాదులు, సోషలిస్టులు మరియు వామపక్ష రాజకీయ సంస్థలు ఎంతో చురుకుగా ఉండేవి.1938 మే ఒకటవ తేదీన మే దినోత్సవాన్ని పాటించేందుకు మేము ఒక ప్రదర్శన జరిపాము. దాని మీద ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌వాదులు దాడి చేశారు. ఆ సందర్భంగా సుపరిచితులైన విప్లవవాది సేనాపతి బాపట్‌, మా సోషలిస్టు నేత ఎస్‌ఎం జోషి కూడా గాయపడిన వారిలో ఉన్నారు. హిందూత్వ సంస్థలతో అప్పటి నుంచి మాకు తీవ్రమైన విబేధాలు ఉండేవి. జాతీయవాద సమస్య మీద ఆర్‌ఎస్‌ఎస్‌తో మా తొలి విబేధం ఉంది. భారత దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని మేము నమ్మాము. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌ వాదులు హిందూ రాష్ట్ర అనే భావంతో వచ్చారు. మహమ్మదాలీ జిన్నా కూడా అలాంటి లోకపు భావన బాధితుడే. భారత్‌ రెండు – ముస్లిం, హిందూ దేశాలతో ఏర్పడిందని అతను నమ్మారు, సావర్కర్‌ కూడా అదే చెప్పారు.


మా మధ్య రెండో ప్రధాన విబేధం ఏమిటంటే మేము ఒక ప్రజాస్వామిక సర్వసత్తాక రాజ్యం ఉద్భవించాలని కలగన్నాము, ప్రజాస్వామ్యం పశ్చిమదేశాల భావన, భారత్‌కు పనికిరాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది. ఆ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు అడాల్ఫ్‌ హిట్లర్‌ను ఎంతగానో పొగిడేవారు. గురూజీ(మాధవ సదాశివ గోల్వాల్కర్‌) ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగానే కాదు సైద్దాంతిక గురువుగా కూడా ఉండేవారు.గురూజీ మరియు నాజీల మధ్య ఆలోచనల్లో అద్భుతమైన సామీప్యతలు ఉన్నాయి. ఆయన ఉత్తమ రచనల్లో ఒకటిగా ఉన్న ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” అనే గ్రంధం అనేక ప్రచురణలు పొందింది. హిందువులు కాని వారిని పౌరులుగా పరిగణించకూడదని స్పష్టంగా దానిలో చెప్పారు.వారి పౌరసత్వహక్కులను రద్దుచేయాలని కోరారు. ఈ ఆలోచనలు కొత్తగా రూపుదిద్దుకున్నవి కాదు. మేము కాలేజీలో ఉన్న రోజుల నుంచి(1930 దశకం మధ్యలో) హిట్లర్‌ భావజాలం వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు మొగ్గుచూపేవారు. వారి దృష్టి ప్రకారం జర్మనీలో యూదుల పట్ల హిట్లర్‌ ఎలా వ్యవహరించాడో అదే మాదిరి భారత్‌లో ముస్లింలు, క్రైస్తవుల పట్ల వ్యవహరించాలి.నాజీ పార్టీ భావాల పట్ల గురూజీ ఎంతలా సానుకూలంగా ఉన్నారో ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” గ్రంధంలో దిగువ పేరాయే సాక్ష్యం.” తన జాతి, సంస్మృతిని పరిశుద్దంగా ఉంచేందుకు సెమిటిక్‌ జాతులను-యూదులను అంతమొందించి జర్మనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతి ఔన్నత్యం దాన్ని ఉన్నతిని ఇక్కడ స్పష్టం చేసింది. జాతులు,సంస్కృతుల మధ్య ఉన్న విబేధాలకు కారణాలు తెలుసుకొంటే వాటిని తొలగించటం అసాధ్యం కాదని, ఐక్యంగా ఉంచటానికి సమీకృతం చేసేందుకు ప్రపంచానికి జర్మనీ దారి చూపింది, దాన్నుంచి నేర్చుకొనేందుకు, లబ్దిపొందేందుకు హిందూస్తాన్‌లో మనకు మంచి పాఠం ”


కుల సమస్య మీద గురూజీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌తో మా మూడో ప్రధాన విబేధం. ఒక సోషలిస్టుగా నా వంటి వారికి అది ఒక పెద్ద శత్రువు కాగా కుల వ్యవస్థ సమర్ధకులు వారు. కుల వ్యవస్థ దాని పునాదిగా ఉన్న అసమానతలను నిర్మూలించకుండా భారత్‌లో ఆర్థిక, సామాజిక సమానత్వం సాధ్యం కాదన్నది నా గట్టి వైఖరి. మేము విబేధించిన నాలుగో అంశం భాష. పౌరుల భాషలను ప్రోత్సహించేందుకు మేము అనుకూలం. అన్ని ప్రాంతీయ భాషలు దేశీయమైనవే. కానీ దీని మీద చెప్పిందేమిటి ? అందరికీ ఉమ్మడి భాషగా ప్రస్తుతానికి హిందీని, తరువాత అంతిమంగా జాతీయ భాషగా సంస్కృతాన్ని చేయాలని గురూజీ చెప్పారు. ఐదవది, స్వాతంత్య్రం కోసం తలెత్తిన జాతీయ ఉద్యమం ఫెడరల్‌ రాజ్యం అనే భావనను ఆమోదించింది. ఒక సమాఖ్య దేశంలో కొన్ని నిర్దేశిత విషయాలలో కేంద్రం కొన్ని తప్పనిసరి అధికారాలను కలిగి ఉంటుంది, ఇతర అన్ని అంశాలు రాష్ట్రాలకు చెందినవిగా ఉండాలి. కానీ దేశ విభజన తరువాత కేంద్రాన్ని పటిష్టపరిచేందుకు ఉమ్మడి జాబితాను నిర్దేశించారు. ఈ జాబితా ప్రకారం అనేక అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. వాటి మీద కేంద్రం, రాష్ట్రాలకు సమానమైన అధికారపరిధి ఉంది.ఆ విధంగా సమాఖ్య రాజ్యం ఉనికిలోకి వచ్చింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు దాని ప్రధాన సిద్దాంతవేత్త గురు గోల్వాల్కర్‌ ఈ మౌలిక రాజ్యాంగ ఏర్పాటును వ్యతిరేకించారు. రాష్ట్రాల సమాఖ్య భావననే వీరు అపహాస్యం చేశారు. రాష్ట్రాల సమాఖ్యను కోరిన రాజ్యాంగాన్నే రద్దు చేయాలన్నారు. తన ” బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ ” అనే గ్రంధంలో రాజ్యాంగాన్ని సమీక్షించాలని, కొత్త రాజ్యాంగంలో ఏక(యూనిటరీ) రాజ్య ఏర్పాటును లిఖించాలని పేర్కొన్నారు. ఏక లేదా మరో మాటలో చెప్పాలంటే కేంద్రీకృత రాజ్యాన్ని గురూజీ కోరారు.రాష్ట్రాల వ్యవస్థను వదిలించుకోవాలని చెప్పారు.


జాతీయోద్యమం ఎంచుకున్న త్రివర్ణ పతాకం మరొక సమస్య. మనం ఎంచుకున్న జాతీయ పతాక గౌరవం, ఔన్నత్యం కోసం వందలాది మంది భారతీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, వేలాది మంది లాఠీ దెబ్బలను తిన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ త్రివర్ణాన్ని జాతీయ జెండాగా ఎన్నడూ ఆమోదించలేదు. అది ఎల్లవేళలా కాషాయపతాకానికే వందనం చేస్తుంది.స్మృతికందని కాలం నుంచీ అది హిందూ రాజ్య పతాకంగా ఉందని చెబుతుంది.ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల గురూజీకి విశ్వాసం లేదు. ప్రజాస్వామ్య భావన పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదనే ధృడ వైఖరిని కలిగి ఉన్నారు. భారతీయ నాగరికత, ఆలోచనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తగినది కాదన్నారు. ఏక నాయకత్వ సూత్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నమ్ముతుంది.ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక మానసిక దృక్పధాన్ని సృష్టిస్తుందని అది పూర్తిగా క్రమశిక్షణతో కూడుకున్నదిగా ఉంటుందని అది ఏం చెబితే దాన్ని జనం అంగీకరిస్తారని గురూజీ కూడా స్వయంగా చెప్పారు. ఈ సంస్థ ఏక వ్యక్తి నాయకత్వ సూత్రం మీదనే పనిచేస్తుంది. సోషలిజం గురూజీ దృష్టిలో పూర్తిగా వెలుపలి భావజాలం, సోషలిజం, ప్రజాస్వామ్యంతో పాటు అన్ని ఇజాలూ విదేశీ ఆలోచనలే, వాటిని తిరస్కరించాలని, భారతీయ సమాజాన్ని భారతీయ సంస్కృతి ఆధారంగా నిర్మించాలని అతను పదే పదే చెప్పారు. మా గురించి చెప్పాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం,సోషలిజం పట్ల మాకు విశ్వాసం ఉంది. శాంతియుత పద్దతుల్లో గాంధియన్‌ సూత్రాలకు అనుగుణంగా సోషలిజాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. మరోవైపు ఒక ప్రత్యేక మూసలో యువ మెదళ్లను తయారు చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక నైపుణ్యాన్ని సంతరించుకుంది. తొలుత అది పిల్లలు, యువత మెదళ్లలోకి ఏమీ ప్రవేశించకుండా ఘనీభవింపచేస్తుంది. ఆ తరువాత వారు ఇతర భావజాలాలకు స్పందించలేని అశక్తులుగా మారిపోతారు.


పేదల పట్ల కనికరం అవసరం లేదని గురూజీ భావించారు. తన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ గ్రంధంలో దేశంలో జమిందారీ వ్యవస్థ రద్దు పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆ వ్యవస్థ రద్దు పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేయటమే కాదు, తీవ్రంగా కలత చెందారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని రుద్దినపుడు వీరితో(ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు జనసంఫ్‌ు) మేము ఒక కూటమి కట్టామన్నది ఒక వాస్తవం. ఒక పార్టీగా ప్రతిపక్షాలు ఐక్యంగాకపోతే ఇందిరా గాంధీని ఓడించలేమని లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ నమ్మారు.చౌదరి చరణ్‌ సింగ్‌ కూడా అలాంటి వైఖరినే కలిగి ఉన్నారు గనుక మేము ఒకే పార్టీగా ఐక్యమయ్యాము. మేము జైల్లో ఉండగా ఒక పార్టీని ఏర్పాటు చేయటం, ఎన్నికల్లో పోటీ చేయటం గురించి అబిప్రాయాలు చెప్పమని మమ్మల్ని అడిగారు. మనం తప్పనిసరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక సందేశాన్ని పంపిన అంశాన్ని గుర్తు చేసుకున్నాను. కోట్లాది మంది జనం ఎన్నికల్లో పాల్గొంటారు. ఎన్నికలు ఒక క్రియాశీల క్రమం. ఎన్నికల వాతావరణం పెరిగే కొద్దీ అత్యవసర పరిస్థితి సంకెళ్లు తెగుతాయి,జనం తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకుంటారు. అందువలన మనం ఎన్నికల్లో పాల్గొనాలని నేను గట్టిగా చెప్పాను. ఒకే పార్టీ పతాకం కిందకు అందరూ రాకపోతే విజయం సాధించలేమని లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఇతర నేతల వైఖరి ఉన్న కారణంగా సోషలిస్టులంగా మా అంగీకారం తెలిపాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పదలచాను. రాజకీయ పార్టీలు-జనసంఫ్‌ు, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్‌(ఓ), భారతీయ లోక్‌దళ్‌(బిఎల్‌డి), కాంగ్రెస్‌ ముఠాలలోని కొన్ని అసంతృప్త తరగతుల మధ్య మాత్రమే అవగాహన కుదిరింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలాంటి ఏర్పాటుకు మేము రాలేదు, దాని డిమాండ్లను వేటినీ అంగీకరించలేదు. ఇంకా చెప్పాల్సిందేమంటే జైల్లో ఉన్న మా మధ్య పంపిణీ అయిన మనూభారు పటేల్‌ లేఖ ద్వారా 1976 జూలై 7న మేము తెలుసుకున్నదేమంటే కొత్త పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు కూడా పార్టీ సభ్యులైతే ద్వంద్వ సభ్యత్వ వివాదం తలెత్తవచ్చని చౌదరి చరణ్‌ సింగ్‌ ఒక సమస్యను లేవనెత్తారు. దీని మీద అప్పుడు జనసంఫ్‌ు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఓమ్‌ ప్రకాష్‌ త్యాగి స్పందిస్తూ కొత్త పార్టీ సభ్యత్వాన్ని ఎలా కావాలంటే అలా రూపొందిచుకోవచ్చని స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నందున రద్దయినట్లేనని, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వ సమస్య తలెత్తదని కూడా చెప్పారు.


తరువాత ప్రతిపాదిత జనతా పార్టీ నిబంధనావళిని రూపొందించేందుకు ఒక ఉపసంఘాన్ని నియమించారు. జనతా పార్టీ లక్ష్యాలు, విధానాలు, కార్యక్రమాలతో విబేధించే ఏ సంస్థకు చెందిన వారికీ జనతా పార్టీలో సభ్యత్వం ఇవ్వకూడదని ముసాయిదా నిబంధనావళిలో పెట్టారు. దీని అర్ధం ఏమంటే ఎవరూ ఈ నిబంధనను వ్యతిరేకించకూడదన్నది స్పష్టం.అయినప్పటికీ దీనికి వచ్చిన ఒకే ఒక అభ్యంతరం జనసంఫ్‌ుకు చెందిన సుందర్‌ సింగ్‌ భండారీ నుంచి వెలువడటం గమనించాలి. తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు 1976 డిసెంబరులో ఏర్పాటు చేసిన సమావేశానికి జనసంఫ్‌ు, ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున అతల్‌ బిహారీ వాజ్‌పాయి రాసిన లేఖలో ప్రతిపాదిత పార్టీలో ఒక తరగతి నేతలు జనతా పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్‌ సమస్యను లేవనెత్తకూడదని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అయితే అనేక మంది నేతలు అలాంటి హామీ ఇవ్వలేదని నాకు చెప్పారు. ఎందుకంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విలీనం కావాలని తలపెట్టినపుడు రంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడా లేదు గనుక అన్నారు. నేను ఒకటి స్పష్టం చేయదలచాను. ఆ సమయంలో నేను జైల్లో ఉన్నాను. ఒక వేళ ఒక రహస్య అవగాహనకు వచ్చి ఉండి ఉంటే దానిలో నాకు భాగస్వామ్యం లేదు.


నేను ఒకటి విస్పష్టంగా చెప్పగలను. జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఏ రీత్యా చూసినా ఆర్‌ఎస్‌ఎస్‌ అంశాలను ప్రతిబింబించలేదు. వాస్తవానికి ప్రణాళికలోని ప్రతి అంశమూ స్పష్టంగా ఉంది. లౌకిక, ప్రజాస్వామిక, గాంధియన్‌ సూత్రాల ప్రాతిపదికగా సోషలిస్టు సమాజం గురించి జనతా పార్టీ ప్రణాళిక ఉంది.దానిలో హిందూ దేశం గురించిన ప్రస్తావన లేదు.మైనారిటీలకు సమానహక్కులకు హామీ ఇవ్వటమే కాదు, వారి హక్కులకు రక్షణ కల్పిస్తామని కూడా చెప్పింది. కుల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిందా ? ఇతరుల సేవకు శూద్రులు తమ జీవితాలను అర్పించాలని చెప్పిందా ? దానికి విరుద్దంగా వెనుకబడిన తరగతుల పురోగమనానికి వాగ్దానం చేయటమే కాదు పూర్తి అవకాశాలు కల్పిస్తామని చెప్పింది, వారికోసం ప్రత్యేక విధానాలు తీసుకొస్తామని పేర్కొన్నది. వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 25-33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. గురూజీ కేంద్రీకరణ జరపాలని గట్టిగా చెప్పగా వికేంద్రీకరిస్తామని జనతా పార్టీ అంగీకరించింది. రాష్ట్రాలను రద్దు చేయాలని, అసెంబ్లీలను, మంత్రివర్గాలను కూడా రద్దు చేయాలని అతను కోరగా మరింత వికేంద్రీకరణ జరగాలని జనతా పార్టీ నొక్కివక్కాణించింది. మరో విధంగా చెప్పాలంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని లాక్కోవాలన్న వాంఛ జనతా పార్టీకి లేదు.


పార్టీ ఎన్నికల ప్రణాళికలోని అంశాలను స్వచ్చందంగా అంగీకరించలేదన్నది నిజం. ఇది నా అభ్యంతరం, అంతే కాదు రాతపూర్వకంగా ఒకసారి కుష్‌భాహు థాకరేకు ఫిర్యాదు చేశాను. చర్చల సందర్భంగా మీవారు(ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్‌ు) వెంటనే అంగీకరించినా హృదయపూర్వకంగా పూర్తిగా వ్యతిరేకించారని నేను చెప్పాను. అందుకే మీ ఉద్దేశ్యాలను అనుమానించాల్సి వస్తోంది.ఈ లేఖను నేను ఎంతో కాలం క్రితమే రాశాను, ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి నాకు ఎప్పుడూ సందేహమే.నిరంకుశత్వాన్ని వ్యతిరేకించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలన్న లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ వాంఛ, ఎలాంటి రాజీలు లేకుండా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉండటం వలన మన ఐక్యతకు నేను ఆమోదం తెలిపాను. అదే సమయంలో నేను ఒకటి చెప్పదలచుకున్నాను. ప్రారంభం నుంచి నాకు ఒక స్పష్టత ఉంది ఐక్య, విశ్వసనీయమైన జనతా పార్టీ ఆవిర్భవించాలంటే రెండు పనులు చేయాల్సి ఉంటుందని నా మనసులో ఉంది. ఒకటి, ఆర్‌ఎస్‌ఎస్‌ తన భావజాలాన్ని మార్చుకోవాలి మరియు లౌకిక,ప్రజాస్వామిక రాజ్య భావనను అంగీకరించాలి.రెండవది, సంఘపరివార్‌లో భాగంగా ఉన్న వివిధ సంస్థలు భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు, విద్యార్ధి పరిషత్‌ వంటివి తమను తాము రద్దు చేసుకొని లౌకిక భావజాలం ఉన్న కార్మిక సంఘాల్లో, జనతా పార్టీ విద్యార్థి విభాగంలో విలీనం కావాలి. జనతా పార్టీ కార్మిక విభాగం, విద్యార్థి విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించమని పార్టీ నాకు విధి అప్పగించిన నాటి నుంచీ నేను దీని గురించి స్పష్టతతో ఉన్నాను. ఈ రెండు సంస్థలూ ప్రత్యేక ఉనికిని రద్దు చేసుకోవాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. హిందువులను మాత్రమే సంఘటితపరచాలనే మీ భావజాలాన్ని వదలి వేసుకోవాలని, మీ సంస్థలో అన్ని మతాల వారికీ చోటు కల్పించాలని,జనతా పార్టీలో ఉన్న భిన్నమైన తరగతుల ప్రాతిపదికన ఉన్న సంస్థలలో విలీనం కావాలని నేను ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులకు చెప్పాను. అది వెంటనే జరిగేది కాదని, అనేక ఇబ్బందులు ఉన్నాయని, కానీ కొద్ది కొద్దిగా మారాలని కోరుకుంటున్నట్లు వారి స్పందన ఉంది. వారు అలా తప్పించుకొనే జవాబులను కొనసాగించారు.


వారి ప్రవర్తన చూసిన తరువాత వారిలో మార్పు ఉద్దేశ్యం లేదన్న నిర్దారణకు వచ్చాను.ప్రత్యేకించి 1977జూన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత వారు నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారానికి రాగలిగారు. అప్పటి నుంచి కొత్తగా వచ్చిన ప్రతిష్టతో మారాల్సిన అవసరం లేదని వారు ఆలోచించటం ప్రారంభించారు.ఇప్పటికే వారు నాలుగు రాష్ట్రాలను కైవశం చేసుకున్నారు. క్రమంగా ఇతర రాష్ట్రాలను, చివరకు కేంద్రాన్ని కూడా పట్టుకొనేందుకు చూస్తారు. జనతా పార్టీలోని ఇతర రాజకీయ నేతలు పెద్ద వారు, వారు ఎంతో కాలం జీవించలేరు. పార్టీలో ఉన్న ఉన్నత స్థానాలకు ఎదిగేట్లు ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘేతర నేతలను చేయలేరు. అయినప్పటికీ నేను ప్రయత్నించాను. ఒక సందర్భంగా అన్ని కార్మిక సంఘాలనేతల సమావేశం ఏర్పాటు చేశాను. జనతా పార్టీలోని అన్ని పక్షాల ప్రతినిధులు వచ్చారు, భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు సమావేశాన్ని బహిష్కరించింది. అంతే కాదు ఎలాంటి కారణం లేకుండానే వారు నన్ను దూషించారు. విద్యార్థి పరిషత్‌, యువమోర్చాలతో అలాంటి ప్రయత్నమే జరిగింది. విలీనం కోసం జరిగిన అన్ని ప్రయత్నాలకూ వారు దూరంగా ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే పార్టీ మీద పెత్తనం చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాంఛ కారణంగానే. ప్రజల ప్రతి జీవనరంగంలోకి ప్రవేశించాలన్నది వారి లక్ష్యం, అంతేకాదు దాన్ని అదుపు చేయాలన్నది కూడా. ఇలాంటి అభిప్రాయాలను గురూజీ తన ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్డ్‌ అనే గ్రంధంలో పదే పదే వక్కాణించారు. నిరంకుశ సంస్థ ఏదీ స్వేచ్చను అనుమతించదు. దాని వేర్లు కళలు, సంగీతం, ఆర్థికం, సాంస్కృతిక రంగం ప్రతిచోటా ఉంటాయి. ప్రతి ఫాసిస్టు సంస్థ సారం ఇదే. వీరు అరుదైన సందర్భాలలో చేసేదానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. గురూజీ బాటలో ఆలోచనలను వదలి వేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ చెప్పలేదు. జైళ్లలో ఉన్నపుడు వీరు క్షమాభిక్ష కోసం ప్రార్ధించారు. రాజనారాయణ్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇందిరా గాంధీకి అనుకూలంగా వచ్చినపుడు బాలాసాహెబ్‌ దేవరస్‌ ఆమెను అభినందించారు. అందువలన వీరి ఉద్ఘాటనల మీద నాకు నమ్మకం లేదు. నేను వీరిని (జనతా పార్టీలో పూర్వపు జనసంఫ్‌ు నేతలు) ఎప్పుడు నమ్ముతానంటే పార్టీ, కార్యవర్గ కమిటీల నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను బహిష్కరించినపుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల మీద ఆంక్షలు విధించినపుడు, ప్రత్యేకించి నానాజీ దేశముఖ్‌, సుందర్‌ సింగ్‌ బండారీ వారి అనుచరులను బహిష్కరించినపుడే నమ్ముతాను.


గమనిక : మధు లిమాయే(1922 -1995 ) పూనాలో జన్మించారు. కాంగ్రెస్‌లో, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ, తరువాత ప్రజా సోషలిస్టు పార్టీ నేతగా వ్యవహరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వంపై వివాదం కారణంగా జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘనేతలు వేరు పడి బిజెపిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అధికారం కోసం అవసరాలకు అనుగుణంగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చింది తప్ప మౌలిక స్వభావం, లక్ష్యాలలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు దశాబ్దాల నాడు (1979) రాసిన ఈ వ్యాసంలో లేవనెత్తిన అంశాలు నేటికీ సంగతమైనవేే గనుక జనతా వార పత్రిక నుంచి సేకరించి అనువదించి అందించాను, : ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా విద్యార్థి ఉద్యమం : నాటి వియత్నాం, నేటి పాలస్తీనాకు తేడా ఏమిటి !!

15 Wednesday May 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Left politics, Opinion, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Andi War protests, Donald trump, Israel genocide, Joe Biden, Pro-Palestinian protests, US Student Protests


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనా ప్రాంతమైన గాజాలో ఇజ్రాయెల్‌ మిలిటరీ రాఫా, తదితర ప్రాంతాల్లో మారణకాండను తీవ్రం చేస్తోంది. చివరకు ఐరాస తరఫున పనిచేస్తున్న సహాయసిబ్బందిని కూడా వదలటం లేదు.సోమవారం జరిపిన దాడుల్లో ఐరాస తరఫున పనిచేస్తున్న వారిలో మనదేశానికి చెందిన వ్యక్తి మరణించాడు. రాఫాలోని ఐరోపా ఆసుపత్రికి ఒక వాహనంలో ఇతరులతో కలసి వెళుతుండగా ఇజ్రాయెల్‌ మిలిటరీ జరిపిన దాడిలో అతడు మరణించగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 35వేల మందికి పైగా మరణించారు. వారిలో 70శాతంపైగా పిల్లలు, మహిళలు ఉన్నారు.పాలస్తీనియన్ల ఊచకోత గురించి అణుమాత్రమైనా పట్టని అమెరికా, ఇతర పశ్చిమదేశాలు యూదు వ్యతిరేకత పెరుగుతోందని మాత్రం గుండెలు బాదుకుంటున్నాయి. ఆ సాకుతో ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి. కొద్ది వారాల క్రితం అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలోనే ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడు కెనడా, ఐరోపా ముఖ్యంగా బ్రిటన్‌కు విస్తరించింది.అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం తమను గుర్తించి వీసాలను రద్దు చేసినా, అమెరికా నుంచి వెనక్కు తిప్పిపంపినా నష్టపోతామనే భయమే దీనికి కారణంగా ఉన్నట్లు కొందరు చెప్పారు.రఫా మీద దాడులను అంగీకరించేది లేదన్నది అమెరికా ఉత్తుత్తి బెదిరింపు మాత్రమే అని తేలిపోయింది. మంగళవారం నాటికి అందిన సమాచారం మేరకు ఆ నగరం పరిసరాలలో ఉన్న 14 లక్షల మంది జనాభాలో సగం మంది దాడులను తప్పించుకొనేందుకు ఇతర ప్రాంతాలకు పారిపోయారు.


ప్రతి మతంలోనూ దురహంకారులు ఉంటారు. దానికి యూదు అతీతం కాదు.ఐరోపాలో ముందుకు తెచ్చిన యూదు వ్యతిరేకత వారిని అష్టకష్టాలపాలు చేసింది. లక్షలాది మంది ప్రాణాలు తీసింది. ఆ దుర్మార్గాన్ని యావత్‌ ప్రపంచం ఖండించింది. కానీ ఇప్పుడు అదే మత ప్రాతిపదికన ఏర్పడిన ఇజ్రాయెల్‌ పాలకుల అరబ్‌ లేదా ముస్లిం వ్యతిరేకతను అనేక పశ్చిమదేశాలు నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నాయి.పాలస్తీనా సాగిస్తున్న మారణకాండకు మద్దతు ఇస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించి మానవహక్కులను కాపాడాలని కోరుతున్నారే తప్ప యూదు వ్యతిరేకతను ముందుకు తీసుకురాలేదు. ఇజ్రాయెల్‌ పాలకులు యూదు దురహంకారులు తప్ప అక్కడ ఉన్న సామాన్య పౌరులందరూ అలాంటి వారే అనటం లేదు. ఐరాస తీర్మానం ప్రకారం పాలస్తీనా ఏర్పడకుండా అడ్డుకుంటున్నది అక్కడి పాలకులు, యూదు ఉన్మాదం తలకెక్కించిన మిలిటరీ, వారిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న పశ్చిమదేశాలు తప్ప పౌరులు కాదు. పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు, తూర్పుజెరూసలెం ప్రాంతాలలోని పౌరులపై దశాబ్దాల తరబడి సాగిస్తున్న దమనకాండ గురించి తన పౌరులకు బోధ చేసేందుకు ఎన్నడూ ఒక చట్టం చేయని అమెరికా పార్లమెంటు దిగువసభ ఇటీవల ” యూదు వ్యతిరేక జాగృతి బిల్లు ” తెచ్చింది. దానికి 91 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా 320 మంది మద్దతు తెలిపారు.యూదు వ్యతిరేకత అమెరికాలో ఉన్న యూదు విద్యార్థుల మీద ప్రభావం చూపుతుందని చట్టం ప్రకటించింది. దాన్ని సెనెట్‌ కూడా ఆమోదిస్తే అధ్యక్షుడి ఆమోదంతో చట్టంగా మారుతుంది. ఒకసారి అది ఉనికిలోకి వస్తే వివాదాస్పద యూదు వ్యతిరేక నిర్వచనాలతో విద్యార్థులు, ఇజ్రాయెల్‌ దమనకాండపై గళమెత్తే ఇతరులను అణచివేసే అవకాశం ఉంది. ఈ బిల్లును సెనెట్‌ ఆమోదించకూడదని అనేక మంది కోరుతున్నారు. విద్యార్థులు చేస్తున్నది మరొక యుద్ధ వ్యతిరేక ఉద్యమం కాగా దాన్ని యూదు వ్యతిరేకమైనదిగా పశ్చిమదేశాల మీడియా చిత్రించటం పాలకవర్గాల కనుసన్నలలో నడవటం తప్ప మరొకటి కాదు.


గతంలో వియత్నాంపై జరిపిన దురాక్రమణ, హత్యాకాండ, అత్యాచారాలకు నిరసనగా 1968లో అమెరికా యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. చివరకు బతుకుజీవుడా అంటూ అమెరికన్లు అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. అక్కడ కనీసం 30లక్షల మంది అమాయక పౌరులను అమెరికన్లు హతమార్చారు. గతంలో వియత్నాంలో మాదిరి ఇప్పుడు 2024లో గాజాలో జరుగుతున్న మారణకాండలో అమెరికా ప్రత్యక్ష భాగస్వామి కాదు. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటాన్ని వ్యతిరేకించటం అమెరికా యువతలో పెరిగిన చైతన్యానికి ఒక నిదర్శనం. గతంలో మాదిరి జరుగుతున్నవాటిని మూసి పెట్టటం ఇప్పుడు సాధ్యం కాదు. అమెరికాలో జరుగుతున్నదాని గురించి ఒక విశ్లేషకుడు ఒక సినిమా కథతో పోల్చాడు. మోర్ఫస్‌ అనే చిత్రంలో ఒక వ్యక్తి తన వద్దకు వచ్చిన ఆశ్రితుడికి ఎరుపు, నీల వర్ణపు రంగుల మాత్రలు ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమంటాడు.ఎరుపు రంగుదాన్ని సేవించిన వారికి తమ చుట్టూ జరుగుతున్న భయంకర అంశాలన్నీ కనిపిస్తాయి. అదే నీలి రంగు మాత్ర వేసుకుంటే నిజంగా జరుగుతున్నదాన్ని మరిపింపచేస్తుంది. ఆ సినిమాలో ఆశ్రితుడు ఎర్ర రంగు మాత్ర తీసుకున్నట్లుగా ఇప్పుడు అమెరికా సమాజంలోని నవతరం కూడా అదే మాదిరి పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న అకృత్యాలను చూస్తున్నారని, వ్యతిరేకంగా స్పందిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో ఒక్క ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వటమే కాదు తమ ప్రభుత్వం అనేక చోట్ల ఉగ్రవాద వ్యతిరేక చర్యల పేరుతో జరుపుతున్న దారుణాలను కూడా ఇప్పుడు విద్యార్థులు స్పష్టంగా చూస్తున్నారు.


అమెరికా జరుపుతున్న దారుణాలను ప్రపంచం చూస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో అమెరికన్లు వాటిని ఏ మేరకు గమనించారన్న చర్చ ఒకటి ఉంది. ఏదైనా శృతిమించితే వారు కూడా స్పందిస్తారని తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. పాలస్తీనా విముక్తి కోసం పోరాడుతున్నవారిని ఉగ్రవాదులని అమెరికా ఎప్పటి నుంచో చిత్రిస్తున్నది.ప్రతి దేశంలో సామ్రాజ్యవాదం, నిరంకుశపాలకులు చేసింది అదే. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా సాగిస్తున్న చర్యలతో నిజానికి ఉగ్రవాదం పెరిగింది తప్ప తగ్గలేదు. అనేక మందిని ఉగ్రవాదులుగా మార్చిందంటే అతిశయోక్తి కాదు. బ్రౌన్‌ విశ్వవిద్యాలయం జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం వివిధ దేశాలలో అమెరికా కారణంగా 45లక్షల మంది మరణించారు.వారిలో అమెరికా మిలిటరీ ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల మందిని చంపివేసింది.కనీసం 3.8కోట్ల మంది తమ నెలవులు తప్పారు. ఎమెన్‌ అంతర్యుద్ధంలో అమెరికా మద్దతు, పధకం ప్రకారం జోక్యం చేసుకున్న సౌదీ అరేబియా కారణంగా దశాబ్ది కాలంలో 2.33లక్షల మంది మరణించారు.ఐరాస కార్యాలయం 2020లో చెప్పినదాని ప్రకారం వారిలో ఆహారం, ఆరోగ్యసేవలు, మౌలిక సదుపాయాల లేమి వంటి పరోక్ష కారణాలతో మరణించిన వారు 1.31లక్షల మంది ఉన్నారు. ఇటీవలి ప్రపంచ పరిణామాల్లో సౌదీ అరేబియా-ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎమెన్‌లో జోక్యానికి స్వస్తిపలికింది. సద్దాం హుస్సేన్ను తమ పలుకుబడికిందకు తెచ్చుకొనేందుకు ఇరాక్‌పై అమెరికా అమలు జరిపిన ఆంక్షల కారణంగా ఐదు లక్షల మంది పిల్లలు మరణించారని అంచనా. ఇంకా ఇలాంటి అనేక దారుణాల్లో తమ నేతల, దేశ పాత్ర గురించి విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో గుడారాల్లో తిష్టవేసి నిరసన తెలుపుతున్న విద్యార్థులు అరచేతిలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అధ్యయనం చేస్తున్నారు.


అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనటమే కాదు, అనేక దేశాల పాలకులను ప్రోత్సహించి లక్షలాది మంది మరణాలకు బాధ్యురాలైంది.ప్రస్తుత బంగ్లాదేశ్‌ 1971కి ముందు పాకిస్తాన్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేసేందుకు పాక్‌ మిలిటరీ ఆపరేషన్‌ సెర్చ్‌లైట్‌ పేరుతో జరిపిన మారణకాండలో మూడు లక్షల మంది మరణించగా కోటి మంది తమ ప్రాంతాల నుంచి పారిపోవాల్సివచ్చింది.దానికి అమెరికా పూర్తి మద్దతు ఇచ్చింది.మనదేశం జోక్యం చేసుకొని పాక్‌ మిలిటరీని ఓడించి బంగ్లాదేశ్‌ విముక్తికి తోడ్పడింది. అంతకు కొద్ది సంవత్సరాల ముందు ఇండోనేషియాలో కమ్యూనిస్టులను అణచివేసేందుకు మిలిటరీ నియంత సుహార్తోను గద్దెమీద కూర్చోబెట్టి కనీసం పదిలక్షల మందిని ఊచకోత కోయించటంలో సిఐఏ ప్రధాన పాత్ర పోషించింది. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా మిత్రపక్ష దేశాల మీద యుద్దం ప్రకటించిన హిట్లర్‌ వంటి వారిని తప్ప ప్రపంచంలో నియంతగా పేరు మోసిన ప్రతివాడినీ అమెరికా బలపరిచింది.హిట్లర్‌కు సైతం ఆయుధాలు అమ్మి తొలి రోజుల్లో మద్దతు ఇచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంతో బ్రిటన్‌ ప్రపంచాధిపత్యం అంతరించి అమెరికా రంగంలోకి వచ్చింది.అప్పటి నుంచి సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలతో సాగించిన ప్రచ్చన్న యుద్ధంలో తాము విజేతలం అని ప్రకటించుకొనే వరకు అంటే 1949 నుంచి 1989వరకు వివిధ దేశాలలో పాలకులను మార్చేందుకు అమెరికా 72 ప్రయత్నాలు చేయగా 29 సందర్భాలలో అమెరికా కుట్రలో భాగస్వాములైన వారు జయప్రదమయ్యారు. కూల్చిన వాటిలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఆరు ఉన్నాయని బోస్టన్‌ కాలేజీ రాజకీయ శాస్త్ర అధ్యాపకురాలు లిండ్సే ఓ రూర్‌కే పేర్కొన్నారు. ఒక వలసవాదిగా అమెరికా దుర్మార్గం చిన్నదేమీ కాదు. ఆసియాలోని ఫిలిప్పైన్స్‌ను ఆక్రమించకొని అక్కడ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే రెండు నుంచి ఆరులక్షల మందిని జాత్యహంకారం, ఇతర కారణాలతో అమెరికన్‌ పాలకులు హత్య చేశారని అంచనా.


1968లో వియత్నాంలో దురాక్రమణ, మారణకాండలకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన ఆందోళనకు, ఇప్పుడు గాజాలో జరుపుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి విద్యార్థిలోకం గళమెత్తటానికి గల పోలికలు చర్చలోకి వచ్చాయి. అప్పుడూ ఇప్పుడూ ఆందోళన కాలేజీ ప్రాంగణాల్లోనే ప్రారంభమైంది.నాడూ నేడు పోలీసులను పిలిపించి అణచివేతకు పాల్పడ్డారు.నవతరం-పాతవారి మధ్య కొన్ని సైద్దాంతిక విబేధాలు గతంలోనూ వర్తమానంలోనూ ఉన్నాయి. నిజానికి ఇవి పెద్ద అంశాలు కావు. ఫ్రెంచి వలస ప్రాంతంగా ఉన్న ఇండోచైనాను రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఆక్రమించింది. అది ఓడిన తరువాత తిరిగి ఫ్రాన్సు ఆక్రమించిన వియత్నాంలో విముక్తి పోరాటం కారణంగా 1954లో స్వాతంత్య్రం వచ్చింది. ఉత్తర, దక్షిణ వియత్నాంలుగా దాన్ని విభజించారు. ఫ్రెంచి పాలకులు తప్పుకున్న తరువాత దక్షిణ వియత్నాం కేంద్రంగా అమెరికా రంగంలోకి వచ్చి ఉత్తర వియత్నాంను ఆక్రమించేందుకు, దక్షిణ వియత్నాంలో విముక్తి పోరాటాన్ని అణచేందుకు చూసింది. స్వతంత్ర పాలస్తీనాను రెండవ ప్రపంచ యుద్దం తరువాత రెండుగా చీల్చి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. ఆ వెంటనే పాలస్తీనా ప్రాంతాలను పశ్చిమదేశాల మద్దతుతో అది అక్రమించి ఇప్పటి వరకు పాలస్తీనా స్వతంత్రదేశం ఏర్పడకుండా అడ్డుకుంటున్నది. నాడు వియత్నాంలో 5.36లక్షల మంది అమెరికన్‌ సైనికులు ఉన్నారు.నేడు ఇజ్రాయెల్‌లో కొద్ది మంది ఉన్నప్పటికీ వారు దాడులలో భాగస్వాములు కావటం లేదు. వియత్నాంలో దాదాపు అరవై వేల మంది అమెరికా సైనికులు మరణించారు, మూడు లక్షలకు పైగా గాయపడ్డారు. తమ సైనికుల ప్రాణనష్టం సాధారణ అమెరికన్లను కలచివేసింది. పాలస్తీనాలో ఒక్క అమెరికనూ చావలేదు, గాయపడలేదు. అయినప్పటికీ మానవత్వానికి ముప్పు తెచ్చిన కారణంగా విద్యార్థులు వీధుల్లోకి రావటం చైతన్యానికి నిదర్శనం.రాఫాలో దాడులను అడ్డుకోవటంలో విఫలమైన తమ ప్రభుత్వం మీద విద్యార్థులు మరింతగా వీధుల్లోకి వస్తారా , ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దొంగ డబ్బు కేసు : కేరళ బిజెపి నేతలను కాపాడుతున్న ఇడి !!

11 Saturday May 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

APP, BJP, ED and IT, Kerala BJP, Kerala CPI(M), Kodakara Black Money Heist, Narendra Modi, RSS, The Enforcement Directorate


ఎం కోటేశ్వరరావు


కేేరళ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌, ఇతర బిజెపి నేతల ప్రమేయంపై ఆరోపణలు ఉన్న హవాలా కేసులో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు వినోద్‌ మాథ్యూ విల్సన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) ద్వారా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నందున దాన్ని అనుమతించవద్దని ఇడి న్యాయవాదులు కోర్టును కోరింది. ఆమ్‌ ఆద్మీనేత కోరికపై తీర్పును రిజర్వుచేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దోపిడీ, దొంగతనం వంటి ఆరోపణలతో ఈ కేసులో దాఖలైన ప్రాధమిక ఎఫ్‌ఐఆర్‌ను ఇడి కోర్టుకు సమర్పించింది. 2021లో తాము జరిపిన ప్రాధమిక దర్యాప్తు గురించి కూడా కోర్టుకు తెలిపింది.ప్రాధమిక ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టును 2023లో తెరిచి దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి పేర్కొన్నది. ఇప్పటికే తాము అనేక మందిని ప్రశ్నించి వారు చెప్పిన అంశాలను నమోదు చేశామని, డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అన్న అంశాలను దర్యాప్తు చేస్తున్నామని, సమగ్రంగా దర్యాప్తు జరిపి తరువాత నివేదిక సమర్పిస్తామని చెప్పింది. రాష్ట్ర పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నింటి మీద తాము దర్యాప్తు జరపలేమని ఇడి వాదించింది. పిటీషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించిన అంశాలలో హవాలా మార్గం ద్వారా 2021 ఎన్నికల కోసం బిజెపికి సంబంధించిన వారు డబ్బుతెచ్చినట్లు రిపోర్టులో పేర్కొన్నారని, కానీ దీని గురించి ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి పేర్కొన్నదని, మూడు సంవత్సరాల తరువాత కూడా ఎలాంటి చర్యలు లేవని హవాలా గొలుసు గురించి ఉపా చట్టం కింద ఇడి మరియు ఎన్‌ఐఏ దర్యాప్తు జరపాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ కోరింది.


వాద ప్రతివాదనల సందర్భంగా విచారణ జరిపిన విచారణ బెంచ్‌లోని న్యాయమూర్తి గోపీనాధ్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర్ర పోలీసు లేదా సిబిఐ వంటి సంస్థలు ఒక నేరంపై ఎఫ్‌ఐఆర్‌ సమర్పించిన తరువాత ఇడి పాత్ర ఏమిటని ప్రశ్నించారు.” సిబిఐ లేదా మరేదైనా కావచ్చు వాటి ఎఫ్‌ఐఆర్‌లను పక్కన పెట్టి దర్యాప్తు జరిపేందుకు వాటి మీద ఉన్న సంస్థ ఇడి కాదు. వారి పని రెండు అంశాలకే పరిమితం ఒకటి విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం(ఫెమా) రెండవది మనీలాండరింగ్‌ నిరోధ చట్టం(పిఎంఎల్‌ఏ). ఒక కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో అది గానీ ఇది గానీ ఉందా అన్నది, ఉంటే వాటిని ఉపయోగించటం తప్ప ఒక దర్యాప్తు సంస్థ మాదిరి దర్యాప్తు చేయటానికి ఇడి దర్యాప్తు సంస్థ కాదు.పిఎంఎల్‌ఏ కింద ఆస్తులను స్వాధీనం చేసుకోవటం లేదా పోయిన వాటిని స్వాధీనం చేసుకోవటానికి మించి సదరు చట్టంలో ఇంకా ఏమైనా ఉందా అన్నది కోర్టుకు చెప్పండి. మీరు ఉన్న దర్యాప్తు సంస్థలకు అతీతమైన ఉన్నత దర్యాప్తు సంస్థకాదు అని న్యాయమూర్తి అన్నారు.


కేరళ అసెంబ్లీ 2021ఎన్నికల్లో అనూహ్య విజయం సాధిస్తామని, వీలైతే అధికార చక్రం తిప్పుతామని కేరళ బిజెపినేతలు ఢిల్లీ పెద్దలకు త్రిడి సినిమా చూపించారు. దాంతో పక్కనే ఉన్న కర్ణాటకలో అధికారంలో ఉన్న బిజెపి పెద్దలు కోరినంత నల్లధనాన్ని పంపారు. త్రిస్సూరు జిల్లాలో కొడక్కర పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ ఏడవ తేదీన అంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఒక క్రిమినల్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ మూడవ తేదీన కోజికోడ్‌ నుంచి కొచ్చి వస్తున్న తన కారును కొడక్కర వంతెన మీద నిలిపి కొందరు దుండగులు పాతిక లక్షల రూపాయలను దోచుకొని, కారును కూడా అపహరించినట్లు షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే అది అంతర్జాతీయ లేదా కర్ణాటక నుంచి వచ్చిన హవాలా సొమ్ము అనే అనుమానం వచ్చింది. సొమ్ము పాతిక లక్షలు కాదు మూడున్నర కోట్లుగా తేలింది ఒక ఘటనలోనే ఇంత వుంటే ఎన్నికల్లో మొత్తంగా ఎంత తెచ్చి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. రెండు స్ధానాల్లో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ హెలికాప్టర్లలో తిరిగారంటే ఏ స్ధాయిలో డబ్బు ఖర్చు చేసి ఉంటారో చెప్పనవసరం లేదు. దీనికి సంబంధించి త్రిస్సూర్‌ జిల్లాలో బిజెపిలో రెండు ముఠాల మధ్య వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తరువాత ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషి పలపును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నేతలు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత ఆ సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించారు. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీకి వచ్చిన సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. కొడక్కర ఉదంతం గురించి పార్టీ రాష్ట్రనేతలు రెండుగా చీలిపోయారు. పార్టీలోని కుమ్ములాటల కారణంగానే ఈ ఉదంతం బయటికి వచ్చిందన్నది స్పష్టం. సురేంద్రన్‌కు అనుకూలంగా లేని వారికి ఆకుల్లోనూ అయిన వారికి కంచాల్లోనూ వడ్డించారన్నది తీవ్ర ఆరోపణ. కొందరికి కోట్లలో ఇస్తే మరికొందరికి లక్షల్లోనే ఇచ్చారనే ఫిర్యాదులు కేంద్ర పార్టీకి పంపారు. ప్రచార బాధ్యతలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు కావటం, కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో తిష్టవేసినప్పటికీ ఈ పరిణామాలను గమనించలేదా లేక వారు కూడా కుమ్మక్కై నిధులను బొక్కారా అన్నది అప్పుడు జరిగిన చర్చ. ఇదిలా ఉండగా ఈ దొంగడబ్బు కేసులో సురేంద్రన్‌ ప్రకటనను నమోదు చేయనున్నట్లు అప్పుడు రాష్ట్ర పోలీసులు నిర్ణయించారు.ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.అలపూజ జిల్లా బిజెపి నేత చెప్పిన అంశాల ప్రకారం నల్లధనాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి ఎవరో బిజెపి రాష్ట్రనేతలకు తెలుసు, పంపిణీ గురించి కూడా తెలియచేశారని పేర్కొన్నారు.


ధర్మరంజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దొంగడబ్బును ఎవరికి ఎంత, ఎలా పంపిణీ చేసిందీ పోలీసులకు చెప్పాడు. ఆ మేరకు అనేక మంది బిజెపి నేతలు, వారి బంధువులను పోలీసులు ప్రశ్నించారు. కోజికోడ్‌, కన్నూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. అతను కరపత్రాల పంపిణీ బాధ్యతను చూస్తున్నందున ఒక హౌటల్లో రూము ఏర్పాటు చేశామని బిజెపి నేతలు బుకాయించారు. నిజానికి అది డబ్బు పంపిణీ కేంద్రంగా పని చేసినట్లు ఆరోపణ. అతను ఎప్పుడూ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయలేదని తేలింది. కొడకరలో అతని కోసం కోజికోడ్‌ నుంచి వచ్చిన కారులో దొంగ సొమ్ము తప్ప ఎన్నికల సామగ్రి లేదు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులను పోలీసులకు ఫిర్యాదు అందక ముందే బిజెపి నేతలు పార్టీ ఆఫీసుకు పిలిపించి వారు విచారణ చేసినట్లు వెల్లడైంది. త్రిస్సూర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు కెకె అనీష్‌ కుమార్‌ ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీరించారు.
ఈ కేసులో ఇడి వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది. ఢిల్లీ మద్యం కేసులో ఇడి అరెస్టు చేసిన నిందితులు చెప్పిన అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి కేజరీవాల్‌, కల్వకుంట్ల కవిత తదితరులను అరెస్టు చేసి బెయిలు రాకుండా అడ్డుపడుతున్నది. అదే ఒక రాష్ట్ర పోలీసుశాఖ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నది. పట్టుబడిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అన్న అంశం తేల్చటానికి మూడు సంవత్సరాలు దాటినా ఇంకా దర్యాప్తు జరుపుతూనే ఉన్నామని చెప్పటం అసమర్ధత లేదా ఆ కేసులో ప్రమేయం ఉన్న బిజెపి నేతలు, వారికి నిధులు ఇచ్చిన వారిని రక్షించేందుకు వీలైనంత వరకు కాలయాపన చేయటం తప్ప మరొకటి కాదు. ఇడి కొందరి పట్ల దయగల దేవత, మరికొందరి పట్ల వేధించే దయ్యం మాదిరిగా మారిందన్నది ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాధమిక ఆధారాలు, డబ్బు రవాణా చేసిన వారి వివరాలు ఉన్నప్పటికీ ఇంత చిన్న కేసును కూడా సంవత్సరాల తరబడి పరిష్కరించలేని దుస్థితిలో ఇడి ఉందా ?


బిజెపికి అనుకూలంగా ఇడి, ఐటి పని చేయటంలో భాగంగానే త్రిసూర్‌లో తమ పార్టీ బాంకు ఖాతాలను స్థంభింపచేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విమర్శించారు. సిపిఎం ఎన్నికల పనిని దెబ్బతీసేందుకే ఇలా చేశారని అన్నారు. పార్టీకి దేశవ్యాపితంగా ఒకే పాన్‌ నంబరు ఉందని, ఆదాయపన్ను సంబంధిత వివరాలను ఆ శాఖకు సమర్పించినప్పటికీ అక్రమంగా ఐటిశాఖ తనకు లేని అధికారాన్ని ఉపయోగించి ఖాతాను నిలిపివేసిందన్నారు.తమ ఖాతాలున్న బాంకు సిబ్బంది వేరే పాన్‌ నంబరు నమోదు చేసినకారణంగా అనవసర చర్చ ఎందుకని తాము మౌనంగా ఉన్నామని, తమ సిబ్బంది చేసిన తప్పిదాన్ని అంగీకరిస్తూ సదరు బాంకు తమకు ఒక లేఖ కూడా రాసిందని గోవిందన్‌ చెప్పారు. బాంకు తప్పిదం వెల్లడైన తరువాత కూడా తమ ఖాతాల స్థంభన కొనసాగించటం వేధింపు గాక ఏమిటని ప్రశ్నించారు. తప్పుడు పాన్‌ నంబరును ఆధారం చేసుకొని త్రిసూర్‌ జిల్లా పార్టీ కార్యదర్శిని విచారణ పేరుతో వేధించారని, పాన్‌ నంబరు గురించి వివరించినా పట్టించుకోలేదన్నారు.ఈ విచారణను మీడియా పెద్దఎత్తున సిపిఎంకు వ్యతిరేక ప్రచారానికి వాడుకుందని అన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుటుంబ సభ్యులతో కలసి విదేశీ పర్యటన చేయటాన్ని కాంగ్రెస్‌, బిజెపి నేతలు వివాదాస్పదం కావించారు. పర్యటన వివరాలను రహస్యంగా ఉంచారని, అందుకయ్యే ఖర్చును ఎవరు భరించాలో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. మిగతా రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా బిజెపిని మంచిచేసుకొనేందుకే విదేశాలకు వెళుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. పర్యటన పూర్తిగా కుటుంబపరమైందని, ఖర్చంతా వారే భరిస్తారని సిపిఎ స్పష్టం చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల పాలనలో నరేంద్రమోడీ చైనాకు ఎన్ని లక్షల కోట్లు సమర్పించారో తెలుసా !

30 Tuesday Apr 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

Anti China Propaganda, BJP, CHINA TRADE, India Trade with China, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


పేరు పెట్టి చెప్పకపోయినా చైనాకు పరోక్ష హెచ్చరికలు చేయటంలో మననేతలు తక్కువ తినలేదు. అవి సరిహద్దు సమస్యల మీద కావచ్చు, చైనా స్థానంలో ప్రపంచ ఫ్యాక్టరీగా మనం మారబోతున్నాం అన్న కోతలు ఏవైనా కావచ్చు. మాటలు కోటలు దాటినా చేతలు గడపదాటటం లేదన్న సామెత తెలిసిందే. గత పదేండ్లుగా మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత వంటి నినాదాలు మన చెవుల తుప్పు వదలగొడుతున్నాయి. కానీ పదేండ్ల పాలనలో చైనాకు నరేంద్రమోడీ సమర్పించిన మొత్తం ఎంతో తెలుసా ? యాభై లక్షల కోట్ల రూపాయలకు పైమాటే అంటే ఎవరైనా నమ్ముతారా ? తమ విశ్వగురువు ఇలా చేశారంటే వీర భక్తులు అసలు నమ్మరు. కానీ చేదు నిజం. గడచిన పది సంవత్సరాలలో చైనాతో మన వాణిజ్య లోటు 614బిలియన్‌ డాలర్లు.(గత ఐదేండ్లలో 387బి.డాలర్లు) బిలియన్‌కు వంద కోట్లు అంటే 61,400, ఒక డాలర్‌కు మన రూపాయి మారకం విలువ ఇది రాసిన సమయంలో 83.47 ఉంది. ఆ లెక్కన చైనాకు మనం సమర్పించుకున్న మొత్తం రు.51,25,058 కోట్లు. ఈ వివరాలను 2024 ఫిబ్రవరి 29న ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో విశ్లేషణ రాసిన గ్రూప్‌ కెప్టెన్‌ ప్రవీర్‌ పురోహిత్‌(ఐఎఎఫ్‌ విశ్రాంత ఉద్యోగి) పేర్కొన్నారు.” చైనాతో పెరుగుతున్న భారత వాణిజ్యలోటు వ్యూహాత్మక దుర్బలత్వం ” అనే శీర్షికతో సదరు విశ్లేషణ ఉంది. ఒక వైపు ఏటికేడు చైనా నుంచి దిగుమతులను పెంచుకుంటూ మరోవైపు చైనా నుంచి ముప్పువస్తోంది గనుక అమెరికాతో చేతులు కలపాలి, ఆయుధాలు కొనుగోలు చేయాలి అంటూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న నరేంద్రమోడీ విధానాలను ఎలా అర్ధం చేసుకోవాలి ?మన దేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడి వృద్ధి చెందాలని, జనానికి ఉపాధి కల్పించి సరిపడా ఆదాయకల్పన చేసి మెరుగైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి అనువైన విధానాలను అనుసరించటం లేదనేదే పాలకుల మీద విమర్శ. మనోభావాలను రేకెత్తించటం మీద ఉన్న శ్రద్ద అభివృద్ది మీద లేదు. తమ సరకులను దిగుమతి చేసుకోవాలని ఏ దేశాన్నీ చైనా దేబిరించటం లేదు. మా ఊళ్లో దుకాణం తెరవాలని గ్రామస్తులు ఎవరినైనా వేడుకుంటారా ? ఉన్న దుకాణానికి తోడు కొత్తది వెలిస్తే అక్కడ తక్కువ ధరలకు వస్తువులను అమ్మితే జనం అక్కడే కొనుక్కుంటారు.ప్రపంచ మార్కెట్‌లో ఎప్పటినుంచో ఉన్న అమెరికా, జపాన్‌, జర్మనీ,బ్రిటన్‌ సరసనే చైనా కూడా దుకాణం తెరిచింది.అక్కడ సరసమైన ధరలకు ఇస్తున్నందున ప్రపంచ దేశాలన్నీ ఎగబడి కొనుక్కుంటున్నాయి. గిరాకీని తట్టుకోలేకపోతున్నాము, ఎవరైనా వచ్చి మా దేశంలోనే వస్తూత్పత్తి చేయండి అంటే వివిధ దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడకు వెళ్లి ఉత్పత్తి చేసి నాలుగురాళ్లు వెనుకేసుకుంటున్నారు. ఆపని చేయలేక మనం కూడా చైనా, ఇతర దేశాల నుంచి కావాల్సినవి కొనుక్కుంటున్నాం.ఎవరూ ఎవరిని బలవంతం చేయటం లేదు. చైనా వస్తువులను బహిష్కరించాలని మనదేశంలో చాలా మంది వాట్సాప్‌ ద్వారా సందేశాలను పంపారు. పెద్ద జోకేమిటంటే అందుకోసం వారు కూడా చైనా ఫోన్లనే వాడుతున్నారు.


తాజాగా గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(జిటిఆర్‌ఐ) అనే సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం పదిహేను సంవత్సరాల క్రితం మనం దిగుమతి చేసుకున్న పారిశ్రామిక వస్తువులలో చైనా వాటా 21 ఉంటే ఇప్పుడు 30శాతానికి పెరిగింది. విదేశాల మీద ప్రత్యేకించి చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించటమే కాదు, అసలు మనమే ప్రపంచానికి ఎగుమతి చేద్దామంటూ నరేంద్రమోడీ ఎంతో హడావుడి చేస్తున్నపుడే ఇదంతాజరిగింది.ఇప్పటికి తాను చేసింది ట్రైలర్‌ మాత్రమే అని చెప్పిన మోడీ రానున్న రోజుల్లో చైనా నుంచి ఇంకా పెద్ద ఎత్తున దిగుమతులకు పూనుకుంటారా ? మరింత గట్టిగా పని చేస్తానంటూ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత గత ఐదేండ్లలో చైనాకు మన ఎగుమతులు ఏటా 16బిలియన్‌ డాలర్లకు అటూ ఉండగా అక్కడి నుంచి దిగుమతులు 70.3 నుంచి 101 బి.డాలర్లకు పెరిగాయి. ఇది సమర్ధతా, అసమర్ధతకు చిహ్నమా ? చైనా మీద ఆధారపడటం పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని జిటిఆర్‌ఐ అన్నది, దేశం కోసం, ధర్మం కోసం అంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీలో అలాంటిదేమైనా ఉందా ? రామాలయం మీద, దాని ద్వారా ఓట్లు దండుకోవాలన్న యావలో కొంచెమైనా పారిశ్రామికీకరణ మీద ఉందా ? రాజ్యసభలో వైసిపి సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి చైనాతో పెరుగుతున్న మనదేశ వాణిజ్య లోటు గురించి ఒక ప్రశ్న అడిగితే దానికి 2023 డిసెంబరు ఎనిమిదిన కేంద్ర ప్రభుత్వం ఒక సమాధానమిచ్చింది.దానిలో గడచిన తొమ్మిది సంవత్సరాల్లో ఎంతో మార్పు వచ్చిందంటూ గాలిపోగేసి రోజూ చెప్పే కబుర్లను పునరుద్ఘాటించటం తప్ప అసలు సంగతి మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదో దిగుమతులు రికార్డులను ఎందుకు బద్దలు కొడుతున్నదీ చెప్పలేదు.


మనకు అవసరమైన వస్తువులు లేదా ముడి పదార్దాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవాలా మరొక దేశం నుంచా అన్న అంశం మీద కూడా చర్చ జరుగుతున్నది. మనవి కానపుడు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నా ఒకటే. ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరాం గనుక చైనా నుంచి కొన్ని దిగుమతులు చేసుకోక తప్పదు అంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. అదే వాస్తవమైతే పాకిస్తాన్‌ కూడా దానిలో సభ్యురాలే కదా ? అక్కడి నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవటం లేదు. పూర్తిగా చైనా మీద ఆధారపడితే ప్రపంచ రాజకీయాల్లో తేడా వస్తే, అక్కడి నుంచి నిలిచిపోతే పరిస్థితి ఏమిటని కొందరు అంటున్నారు. అసలు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి. మన విధానాలు సరిగా ఉంటే ఎవరితో నైనా వివాదాలు ఎందుకు వస్తాయి. అమెరికా లేదా దాని కనుసన్నలలో పనిచేసే దేశాల మీద ఆధారపడినా అదే జరగదా ? గతంలో అంతర్జాతీయంగా తమ కూటమిలో చేరకుండా ఉన్నందుకే కదా పరిశ్రమలు, అంతరిక్ష ప్రయోగాలకు అలాంటి సహకారం అందించేందుకు అమెరికా నిరాకరించింది. ఆ కారణంగానే మన దేశం సోవియట్‌ వైపు మొగ్గింది.చైనాను మనదేశం శత్రుదేశంగా భావిస్తే ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలను రికార్డు స్థాయిలో నరేంద్రమోడీ ఎందుకు కలసినట్లు ? ఇరు నేతలూ అటు ఊహాన్‌ ఇటు మహాబలిపురంలో కలసి ఉయ్యాలలూగారు. గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత చైనా నుంచి వచ్చే పెట్టుబడులు మనదేశానికి ముప్పు తెస్తాయంటూ కేంద్ర అనుమతి లేకుండా అంగీకరించకూడదని గిరిగీసుకున్నది మనమే. దానికి ప్రతిగా చైనా మన దిగుమతుల మీద లేదా అక్కడి నుంచి వస్తుదిగుమతుల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. మరింత పెరిగాయి, వాటితో ముప్పురాదా ?


పోనీ చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించారా అంటే అదీ లేదు. ఇతర దేశాలతో పోలిస్తే చైనా నుంచి దిగుమతుల వేగం 2.3రెట్లు పెరిగిందని, 2023-24 మనదేశం 677.2 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే దానిలో 101.8 బి.డాలర్లు చైనా నుంచి అంటే 15శాతం ఉన్నట్లు జిటిఆర్‌ఐ నివేదిక పేర్కొన్నది.కీలక రంగాలలో దిగుమతులు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరి మధ్య మనదేశం మొత్తం 67.8 బి.డాలర్ల మేర ఎలక్ట్రానిక్స్‌, టెలికాం, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే వాటిలో చైనా నుంచి చేసుకున్నవాటి విలువ 26.1 బిలియన్‌ డాలర్లు, 38.4శాతం,యంత్రాల దిగుమతిలో కూడా అక్కడి నుంచి 39.6శాతం,రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు 29.2శాతం ఉంది.మొత్తం దిగుమతుల్లో 50శాతం యంత్రాలు, ఇతర ఉత్పాదక సంబంధమైనవే ఉన్నాయి. శత్రుదేశమంటూ మన మీడియా, సంఘపరివార్‌కు చెందిన సంస్థలు సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోస్తున్నా చైనా వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవటం లేదు. జపాన్‌ తదితర దేశాల సముద్ర ఉత్పత్తులను తిరస్కరించినట్లుగా, ఆస్ట్రేలియా ఉత్పత్తుల మీద ఆంక్షలు విధించినట్లుగా మన వస్తువులను తిప్పిపంపిన దాఖలాలు లేవు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఇతర దేశాల్లో కూడా దొరుకుతాయి, అయితే అంత చౌకగా దొరకవు గనుక మోడీ ప్రభుత్వ మెడలు వంచి దిగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు విదేశీమారకద్రవ్యాన్ని కేటాయింప చేసుకొని వస్తు దిగుమతులు చేసుకుంటున్నారు. మనదేశంలో చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.ఎంఎస్‌ఎంఇ సంస్థలు మనదేశంలో ఉత్పత్తి చేయగలిగిన వస్త్రాలు, దుస్తులు,గాజువస్తువులు, ఫర్నీచర్‌, కాగితం, చెప్పులు, బొమ్మలను కూడా దిగుమతి చేసుకుంటున్నట్లు జిటిఆర్‌ఐ నివేదిక ఆవేదన వెలిబుచ్చింది.రానున్న రోజుల్లో మనదేశ రోడ్ల మీద తిరిగే ప్రతి మూడు విద్యుత్‌ వాహనాల్లో ఒకటి చైనా సంస్థలు లేదా వాటితో భాగస్వామ్యం కుదుర్చుకున్న లేదా దిగుమతి చేసుకున్నవే ఉంటాయని జిటిఆర్‌ఐ పేర్కొన్నది.మన మార్కెట్‌లోకి చైనా సంస్థలు ప్రవేశిస్తే వాటి ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాలన్నింటినీ చైనా నుంచి దిగుమతి చేసుకొనేందుకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నందున దిగుమతులు మరింతగా పెరుగుతాయని తెలిపింది.మన జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి ఇప్పుడున్న 17 లేక 18శాతం స్థితి నుంచి 25శాతానికి పెరగాలంటే చైనా నుంచి మరిన్ని దిగుమతులు అవసరమని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.


అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో భాగంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద భారీ మొత్తంలో దిగుమతి పన్ను విధిస్తున్నారు. ఆ మొత్తం అక్కడి వినియోగదారుల మీదనే మోపుతున్నారు తప్ప దిగుమతులను నిలిపివేయలేదు. ప్రత్యక్షంగా వాణిజ్య పోరుకు దిగినట్లు ప్రకటించకపోయినా మనదేశం కూడా చేస్తున్నది అదే. రెండుదశాబ్దాల క్రితం ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ప్రవేశించినపుడు మనదేశంతో వాణిజ్య లావాదేవీల విలువ 3.6బిలియన్‌ డాలర్లు మాత్రమే. దానిలో మనలోటు కేవలం 0.19బి.డాలర్లు మాత్రమే. అదే 2022లో ద్విపక్ష వాణిజ్యం 136 బి.డాలర్లకు చేరగా మనలోటు 101బి.డాలర్లు ఉంది.మరుసటి ఏడాది పరిస్థితి కూడా అలాగే ఉంది.దిగుమతులు మన పరిశ్రమలు, వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి దిగుమతి పన్ను 500 రెట్లు పెంచింది. అయినా తగ్గలేదు, అంటే పెంచిన పన్ను మొత్తాలను భరిస్తున్నది మన వినియోగదారులే. మన దేశంలోనే వస్తూత్పత్తి చేసి జనానికి ఉపాధితో పాటు చౌకగా సరకులను అందించాల్సిన నరేంద్రమోడీ దిగుమతి చేసుకున్న వస్తువుల మీద కూడా పన్నులు మోపి జనం జేబులు గుల్లచేస్తున్నారు.రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడి చమురు మీద కూడా అంతే చేస్తున్న సంగతి ఎరిగిందే.వినియోగదారులకు ఒక్క పైసా అయినా తగ్గించారా ? ఫార్మాదిగుమతులపై పన్ను పెంపును మనదేశంలోని పరిశ్రమ వర్గాలు వ్యతిరేకించటంతో 76 ఔషధాలపై పెంపుదలను వెనక్కు తీసుకున్నారు. అనేక వస్తువులపై దిగుమతి పెంపును ఉత్పత్తిదారులు స్వాగతిస్తే దిగుమతిదారులు వ్యతిరేకించారు. ఆర్థికశాఖ తీసుకున్న నిర్ణయాలను ఇతర మంత్రిత్వశాఖలు వ్యతిరేకించాయి.ఈ ఏడాది తాత్కాలిక బడ్జెట్‌కు ముందు అనేక వస్తువులపై పన్నులను తగ్గించారు. ఉత్పాదకత ఎగుమతులతో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకం(పిఎల్‌ఐ) రాయితీలను ఉపయోగించుకున్న సంస్థలు పన్నెండింటిలో పదకొండు చైనా సరఫరా గొలుసు భాగస్వాములు లేదా సేవలు అందించే సంస్థలున్నట్లు వార్తలు వచ్చాయి. గత పది సంవత్సరాల కాలంలో అనేక ప్రోత్సాహాకాలు, రక్షణ చర్యలు చేపట్టినా మన పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో 15శాతం చుట్టూ తిరుగుతున్నది తప్ప పెరగలేదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత మనదేశం నుంచి ఎగుమతులు నిలిపివేస్తే చైనా మన కాళ్లదగ్గరకు వస్తుందని అనేక మంది కలలు గని అలాంటి పిలుపులే ఇచ్చారు. మొత్తం చైనా చేసుకునే దిగుమతుల్లో మనదేశ వాటా కేవలం మూడుశాతమే, అదే మనం దిగుమతి చేసుకుంటున్నది 15శాతం ఉన్నాయి.చెరువు మీద అలగటం మంచిది కాదని మన విధాన నిర్ణేతలకు అర్ధమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పేరు మార్చం, ఎర్రజెండాను వదలం అన్నఆస్ట్రియా కమ్యూనిస్టులు !

28 Sunday Apr 2024

Posted by raomk in Current Affairs, History, INTERNATIONAL NEWS, Left politics, Opinion

≈ Leave a comment

Tags

Austria Communist Party, Communist history, Communist mayor of Graz Elke Kahr, Communist Party of Austria (KPÖ)


ఎం కోటేశ్వరరావు


సోవియట్‌ యూనియన్‌ పతనం కాగానే అనేక దేశాల్లో కమ్యూనిస్టులు కొందరు ఎర్ర జెండాలను పక్కన పడేశారు, మరికొన్ని చోట్ల పేర్లు మార్చుకున్నారు.కమ్యూనిస్టు గతానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదంటూ అదే పేరును కొనసాగించిన వాటిలో మధ్య ఐరోపాలోని ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ ఒకటి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీకి వస్తున్న ఆదరణను చూసి పేరు మార్చుకుంటే ఇంకా ఎక్కువ మద్దతు పెరుగుతుందేమో అన్న ఆశతో కొందరు మరోసారి ఆ ప్రస్తావనను చేసిన పూర్వరంగంలో అలాంటి మార్పు అవసరం లేదని పార్టీ చరిత్రకారుడు మాన్‌ఫ్రెడ్‌ మగ్రార్‌ తాజాగా జాకోబిన్‌ పత్రిక ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించాడు. ఆటుపోట్లను ఎదుర్కొన్న వాటిలో ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ (కెపిఓ) ఒకటి.ఐరోపాలో మరోమారు కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్న నేపధ్యంలో ఎన్నికలలో ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టులు పొందిన విజయాలను చూసిన తరువాత పార్టీ పేరు మార్చాలని కొందరు కోరారు.2021లో జరిగిన ఎన్నికలలో దేశంలో రెండవ పెద్ద పట్టణమైన గ్రాజ్‌ మేయర్‌గా పార్టీ నాయకురాలు ఎకె కాహర్‌ ఎన్నికయ్యారు.ఆమె 2023 ప్రపంచ ఉత్తమ మేయర్‌గా ఎన్నికైంది. తాజాగా నాలుగో పెద్ద నగరమైన సాల్జ్‌బర్గ్‌లో కమ్యూనిస్టు అభ్యర్ది కే మైఖేల్‌ డాంకల్‌ ఉప మేయర్‌గా గెలిచాడు. అక్కడి నిబంధనల ప్రకారం ప్రత్యక్ష ఎన్నికలలో 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్నవారు మేయర్‌గా, రెండోవారు ఉపమేయర్‌ అవుతారు. మార్చినెల పదిన జరిగిన ఎన్నికల్లో సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధికి 29.4, డాంకల్‌కు 28శాతం ఓట్లు వచ్చాయి. గెలుపుకు అవసరమైన 50శాతంపైగా ఓట్లను తెచ్చుకోవటంలో బహుముఖ పోటీలో ఎవరూ లేకపోవటంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య మార్చి 24వ తేదీన తుది ఎన్నిక జరిగింది. దానిలో డాంకల్‌కు 36.9శాతం ఓట్లు వచ్చాయి. కమ్యూనిస్టు వ్యతిరేక పార్టీలు సోషల్‌ డెమోక్రటిక్‌ అభ్యర్దికి మద్దతు ఇవ్వటంతో 63.1శాతం ఓట్లతో మేయర్‌గా గెలిచాడు.ఆస్ట్రియా జనాభా 90లక్షలు.మితవాదశక్తులదే ఆధిపత్యం.అయినప్పటికీ కమ్యూనిస్టులకు మద్దతు పెరగటం ఒక మంచి పరిణామం.సాల్జ్‌బర్క్‌ రాష్ట్ర ఎన్నికలలో 2018లో కేవలం 0.4శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఇటీవల 2023లో 11.7శాతానికి పెంచుకుంది. అదే సాల్జ్‌బర్గ్‌ నగరంలో చూస్తే 21.5శాతం వచ్చాయి. అక్కడ ఈ ఏడాది మున్సిపల్‌ ఎన్నికల్లో 28శాతానికి పెరిగాయి. రెండోదశ ముఖాముఖీ పోటీలో 36.9శాతం వచ్చాయి. అంతకు ముందు తొలిదఫా జరిగిన ఎన్నికల్లో నగర కౌన్సిల్లో అంతకు ముందు ఉన్న ఒక స్థానం నుంచి పదికి పెంచుకుంది. మేయర్‌గా గెలిచిన పార్టీకి వచ్చింది పదకొండు మాత్రమే. మరో రెండు చిన్న నగరాల్లో కమ్యూనిస్టులకు మూడు సీట్లు వచ్చాయి. ఆస్ట్రియాలో అందరికీ తెలిసిన పెద్దదైన వియన్నా నగరంతో సహా మొత్తం రాష్ట్ర రాజధానుల నగరాలు తొమ్మిది ఉన్నాయి. ఆస్ట్రియాలో ఇండ్లు పెద్ద సమస్యగా ఉన్నాయి. కమ్యూనిస్టులు దాని మీద ప్రధానంగా కేంద్రీకరించారు.ఈ ఏడాది జరిగే జాతీయ పార్లమెంటు ఎన్నికల్లో కనీసమైన ఐదుశాతానికి మించి ఓట్లు సాధించి 1959 తరువాత తొలిసారిగా ప్రాతినిధ్యం పొందేందుకు కమ్యూనిస్టులు కృషి చేస్తున్నారు.


ఈ క్రమంలోనే పేరు మార్చుకుంటే జనం ఆదరణ పెరుగుతుందనే సూచనలు ఎక్కువగా వస్తున్నాయి. కమ్యూనిస్టులంగానే ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేశామని తమ గురించి తెలిసే జనం తమకు ఓట్లు వేస్తున్నారని పార్టీ నేతలు స్పష్టం చేశారు.పార్టీ చరిత్రకారుడు మాన్‌ఫ్రెడ్‌ మగ్రార్‌ తాజాగా జాకోబిన్‌ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది. ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఆదరణ పెరగటాన్ని కార్పొరేట్‌ మీడియా తీవ్రంగా పరిగణిస్తున్నది. కమ్యూనిస్టులు నియంతలను ఆరాధిస్తారని, ఎన్నికైన కమ్యూనిస్టులు తమకు వచ్చే వేతనాలను విరాళాలుగా ఇవ్వటం జనాకర్షకం తప్ప మరొకటి కాదని, గతంలో జరిగిన కమ్యూనిస్టు అకృత్యాలను సమర్దిస్తారంటూ విష ప్రచారం చేస్తున్నది. గ్రాజ్‌ కమ్యూనిస్టు మేయర్‌ కాహర్‌ను 2022లో ఇంటర్వ్యూ చేసిన ఒక ప్రధాన పత్రిక సంపాదకుడు సగం సమయాన్ని బెలారస్‌, పుతిన్‌, టిటో,లెనిన్‌ల గురించి అడగటానికే వెచ్చించాడు.దాన్ని ప్రసారం చేసిన తరువాత వీక్షకుల నుంచి వెల్లడైన నిరసనతో క్షమాపణలు చెప్పటాన్ని మరచిపోలేము. అయినప్పటికీ తరువాత కూడా అదే ధోరణి కొనసాగుతోంది. గతంలో పార్టీ అనుసరించిన వైఖరిని ఎక్కడా దాచుకోవటం లేదు. నాజీ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసిన త్యాగాలను దాచలేరు.అయితే రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలతో కమ్యూనిస్టు పార్టీ సంబంధాల కారణంగా ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ త్యాగాలు జనం దృష్టిలో మరుగునపడ్డాయి.సోషలిస్టు వ్యవస్థలున్న దేశాల్లో జరిగిన పరిణామాల పట్ల ముఖ్యంగా సోవియట్‌ యూనియన్‌ గురించి విమర్శనాత్మక వైఖరిని తీసుకోకపోవటం ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీకి ఒక సమస్యగా మారింది. ప్రచ్చన్న యుద్ధకాలంలో జనం నుంచి దూరం చేసింది. కార్మిక, సామాజిక ఉద్యమాల్లో రోజువారీ పని చేయటం కూడా కష్టంగా మారింది.


1990 దశకం నుంచి (సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల పతనం తరువాత) గతంలో అనుసరించిన వైఖరి మీద విమర్శనాత్మక సమీక్షలు జరిగాయి. దాని గురించి అన్ని అంశాలను పార్టీ ప్రచురించింది.వీటిని మితవాద శక్తులు, మీడియా పరిగణనలోకి తీసుకోకపోవటం అంటే వారికి బురద చల్లటం తప్ప వాటి పట్ల ఆసక్తి లేదు.పాత కమ్యూనిస్టు వ్యతిరేకత నుంచి బయటపడటం లేదు.ఇటీవలి ఎన్నికల విజయాల తరువాత పార్టీ గురించి ఆసక్తి వెల్లడిస్తున్న ”వామపక్ష ఉదారవాదులు ” కూడా పార్టీ ఆత్మవిమర్శను పరిగణనలోకి తీసుకోవటం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకత ప్రచ్చన్న యుద్దానికి ముందే అనేక మార్పులకు లోనైంది. ఇప్పుడు గ్రాజ్‌,సాల్జ్‌బర్గ్‌ నగరాల్లో 30శాతం జనం ” కమ్యూనిస్టు ” పేరు చూసి భయపడటం లేదని రుజువైంది. ఇప్పుడు ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తున్న నిర్దిష్ట విధానాలు, అభ్యర్ధుల విశ్వసనీయతనే జనం చూస్తున్నారు. ప్రచ్చన్న యుద్ద కాలం నాటి కమ్యూనిస్టు వ్యతిరేక పడికట్టు పదాలు,దుర్భ్రమలు ఇప్పుడు లేవు. కమ్యూనిస్టులు జాతీయ పార్లమెంటులో అడుగుపెట్టిన తరువాత జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు కూడా గుర్తించుతారు. అత్యంత కష్ట కాలంలోనే పార్టీపేరులో కమ్యూనిస్టు పదాన్ని తొలగించలేదు. గతంలో పార్టీలో కూడా అంతర్గతంగా పేరు మార్పు గురించి మాట్లాడిన వారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు.చారిత్రక నేపధ్యం, అనేక అంశాలను చర్చించిన తరువాత పార్టీ పేరు మార్చాల్సిన అవసరం లేదని భావించుతున్నాము.కొన్ని సోషలిస్టు దేశాలతో కొన్ని సమస్యలున్నప్పటికీ పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదన్న సానుకూల అభిప్రాయం జనంలో కూడా ఉంది, కమ్యూనిస్టులు దాన్నేమీ దాచటం లేదు అని మాన్‌ఫ్రెడ్‌ మగ్రార్‌ చెప్పాడు.


పలుచోట్ల రివల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు !
దశాబ్దాల తర్జనభర్జనల తరువాత అనేక దేశాలలో రివల్యూషనరీ కమ్యూనిస్టు పేరుతో మరో కొత్త పార్టీ అవతరించింది.దాని విధానాలు, సిద్దాంత వైఖరులు ఎలా ఉండేది ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ కమ్యూనిజానికి కాలం చెల్లిందని ప్రచారం చేస్తున్న రోజుల్లో మరో పార్టీ ఉనికిలోకి రావటం చిన్న విషయమేమీ కాదు. ఈ పార్టీ గురించి పత్రికల్లో రాజకీయ, మీడియా వర్గాల్లో గందరగోళం, ఆగ్రహం వెల్లడైంది. కమ్యూనిస్టు పార్టీని ఆహ్వానిస్తే అనుమానించాలిగాని పాలకవర్గాలు వ్యతిరేకించాయంటే మంచిదే. ”అంతర్జాతీయ మార్క్సిస్టు ధోరణులు” (ఐఎండి) అనే సంస్థకు చెందిన వారు వివిధ దేశాలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.త్వరలో ప్రధమ మహాసభలు జరిపేందుకు నిర్ణయించారు. లెనిన్‌ బోధనలను తాము అధ్యయనం చేస్తున్నామని, వాటి ఆధారంగా విధానాలు, వైఖరులు నిర్ణయించకుంటామని చెబుతున్నారు. మీరు కమ్యూనిస్టా ? మనకు విప్లవం కావాలి అనే పేరుతో ఐఎండి నలభై దేశాలలో ఇంటర్నెట్‌ ద్వారా ప్రచారం చేసి యువతరాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఫ్రాజర్‌ సంస్థ బ్రిటన్‌,అమెరికా,ఆస్ట్రేలియా,కెనడాలలో ఒక సర్వే నిర్వహించిందని, ఆయా దేశాలలోని 18-34 సంవత్సరాల యువతను ప్రశ్నించగా వరుసగా 29,20,18,13శాతాల చొప్పున సరైన ఆర్థిక వ్యవస్థ కమ్యూనిజంలో ఉంటుందని భావించినట్లు వెల్లడైందని, ఇతర దేశాల్లో సర్వే చేసినా ఇదే మాదిరి ఉంటుందని, అన్ని ఖండాలలో మిలియన్ల మంది కమ్యూనిస్టులు ఉన్నట్లు దీని అర్ధమని ఐఎండి పేర్కొన్నది.కమ్యూనిస్టు భావజాలాన్ని అంగీకరించటంతో సరిపోదని కారల్‌ మార్క్స్‌ చెప్పినట్లు పెట్టుబడిదారీ విధానాన్ని తొలగించి కమ్యూనిస్టు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఒక పార్టీ అవసరమన్న అవగాహన మేరకు అలాంటి పార్టీని అనేక దేశాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఐఎండి పేర్కొన్నది.


సోషలిస్టు దేశాల్లో మత స్వేచ్చ !
సోషలిస్టు దేశాలు మతాన్ని అణచివేస్తాయన్నది ప్రపంచంలో ఒక తప్పుడు ప్రచారం. కమ్యూనిస్టులు ఏ దేశంలోనూ ఒక చర్చి, మసీదు, గుడిని కూల్చివేసిన చరిత్ర లేదు. మతాలకు చెందిన అనేక చారిత్రక కట్టడాలను ప్రతి చోటా పరిరక్షించుతున్నారు తప్ప పడగొట్టటం లేదు.దోపిడీ వర్గాలు మతాన్ని ఒక మత్తు మందుగా మార్చి జనాన్ని చైతన్య రహితంగా ఉంచుతాయని కమ్యూనిస్టులు నమ్ముతారు. ప్రచారం చేస్తారు, కమ్యూనిస్టులుగా ఉన్నవారు మతాలకు దూరంగా ఉండాలని చెబుతారు తప్ప జనం మీద బలవంతం చేయరు. శాస్త్రీయ ఆలోచనలను పెంపొందిస్తారు. పార్టీలో సభ్యులుగా చేర్చుకొనే అర్హతల్లో మతాన్ని పాటిస్తున్నారా లేదా అనేది ఉండదు. ఒకసారి పార్టీలో చేరిన తరువాత భౌతిక వాదులుగా వారిని మార్చేందుకు చూస్తారు. ఎక్కడైనా అలాంటిది జరగటం లేదంటే స్థానిక నాయకత్వాల లోపం తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టుల మీద ఉన్న అనేక తప్పుడు ప్రచారాలు, అపోహలను తొలగించుకుంటూ మత సంస్థలు కమ్యూనిస్టు దేశాలతో సంబంధాల కోసం చూస్తున్నాయి. తాజాగా వాటికన్‌ పెద్దలు సోషలిస్టు వియత్నాంతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకొనేందుకు పూనుకున్నారు. మత సంస్థల మీద అనేక నియంత్రణలు ఉన్న దేశాల్లో వియత్నాం ఒకటి. రాజ్యాన్ని కూలదోసే ఒక సాధనంగా మతాన్ని, మతావలంబలకును మార్చేందుకు, జనం మధ్య విభజనలు తెచ్చేందుకు చేసే యత్నాలను ఏ దేశమూ అంగీకరించదు.


వియత్నాం జనాభాలో ఆరుశాతం మంది కాథలిక్కులు ఉన్నారు. అక్కడ మతాన్ని అవలంభిస్తున్నట్లు చెప్పుకున్న మొత్తం జనాభా పన్నెండుశాతం ఉన్నట్లు 2019లెక్కలు వెల్లడించాయి. వాటికన్‌ విదేశాంగ మంత్రి ఆర్చిబిషప్‌ పాల్‌ రిచర్డ్‌ గలాఘర్‌ నాయకత్వంలో ఒక బృందం ఏప్రిల్‌లో ఆరు రోజుల పాటు పర్యటించింది. ఈ ఏడాది పోప్‌ ఫ్రాన్సిస్‌ కూడా పర్యటనకు వస్తారన్న వార్తల పూర్వరంగంలో వారు వచ్చారు. వియత్నాంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా క్రైస్తవమత పెద్దలు జపాన్‌, ఫ్రాన్స్‌, అమెరికాతో కలసి నిర్వహించిన ప్రజా వ్యతిరేక పాత్ర తెలిసిందే. ఈ కారణంగా వాటికన్‌ ప్రతినిధులను దశాబ్దాలుగా అక్కడికి అనుమతించటం లేదు. గతేడాది ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత వాటికన్‌ ప్రతినిధులు వచ్చారు.దశాబ్దాల తరువాత గత డిసెంబరులో వియత్నాంలో వాటికన్‌ తన శాశ్వత ప్రతినిధిని నియమించింది.ఈ ఏడాది జనవరిలో పోప్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. మత సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలంటే ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకొని అనుమతి పొందాలని 2018లో ప్రభుత్వం ఒక చట్టం చేసింది. మత సంస్థల ముసుగులో విదేశాలు జోక్యం చేసుకొనే అవకాశం ఉన్న కారణంగా నిబంధనలను పటిష్టం గావించింది.
గ్రీకు కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్‌ కౌట్‌సౌంపస్‌ నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం అమెరికాలోని ఆర్చిబిషప్‌ ఎపిడోఫరోస్‌ను ఏప్రిల్‌ 26న కలుసుకున్నారు. గ్రీకు అమెరికన్ల గురించి, గ్రీసులోని చర్చికి సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.మతాధికారి అయిన కౌట్‌సౌంపస్‌ తాత 1944లో నాజీల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన తీరును, ఆ వారసత్వ కొనసాగింపుగా గ్రీకు దేశం కోసం పని చేయాలని అర్చిబిషప్‌ అభిలషించారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d