• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Economics

డోనాల్డ్‌ ట్రంప్‌కు మతి చలించిందా ! సుంకాలను వ్యతిరేకించేవారంతా చైనా అదుపులో ఉన్నట్లేనట !!

04 Tuesday Feb 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Canada, Donald trump, Mexico wall, Trade Protectionism, TRADE WAR, Trump tariffs, US-CHINA TRADE WAR, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ముందునుంచీ ప్రకటించినట్లుగానే ప్రపంచ వాణిజ్య పోరుకు తెరతీశాడు. తన పన్నులను వ్యతిరేకించే విదేశమైనా లేక అమెరికాలో ఉన్న కంపెనీ అయినా సరే వారంతా చైనా అదుపులో ఉన్నట్లే అన్నాడు. ఇది రాసిన సమయంలో చెప్పిన మాటలకు, పాఠకులకు చేరే సమయానికి మార్పులు, విస్తరణ జరిగే రీతిలో ట్రంప్‌ వేగం కనిపిస్తోంది. కెనడా, మెక్సికోల మీద విధించిన పన్నుల అమలు కొంతకాలం వాయిదా వేస్తామనంటతో పాటు ఐరోపా మీద త్వరలో విధిస్తా ,వారు అమెరికా పట్ల భయంకరంగా వ్యవహరించారు, లాభాలకు ఒక అవకాశంగా తీసుకున్నారు, చైనా మీద ప్రకటించిన మొత్తాన్ని పెంచుతా అన్నాడు. స్వంత జనాలు, కంపెనీలతో పాటు ప్రపంచ వృద్ధికి నష్టం, అమెరికా పలుకుబడికీ దెబ్బ అన్న అనేక మంది ఆర్థికవేత్తల హెచ్చరికలను ఖాతరు చేయటం లేదు. కెనడా, మెక్సికోలపై 25శాతం, చైనా వస్తు దిగుమతుల మీద పదిశాతం పన్ను విధిస్తూ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉత్తరువులు జారీ చేశాడు. ఇప్పటి వరకు వెల్లడైన వైఖరులను చూస్తే అదిరించి బెదిరించి దారికి తెచ్చుకోవాలన్న ఎత్తుగడ కనిపిస్తోంది.పన్నులను వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా కుహనా వార్తల వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే(హెడ్జ్‌ ఫండ్స్‌) వారు లేదా సంస్థలు చైనా అదుపుల్లో ఉన్నట్లే అన్నాడు. తన నిర్ణయాలకు అద్భుత స్పందన వస్తున్నదని చెప్పుకున్నాడు. ఇతర దేశాలకు రాయితీల రూపంలో అమెరికా లక్షల కోట్ల డాలర్లు నష్టపోతున్నదన్నాడు. జనాలకు ఆర్థికంగా కొంత నొప్పి కలగవచ్చుగానీ అమెరికా ప్రయోజనాలకు ఆ మాత్రం భరించక తప్పదన్నాడు. దక్షిణాఫ్రికా భూములను గుంజుకుంటున్నదని, కొన్ని సామాజిక తరగతుల పట్ల చెడుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఆ దేశానికి రానున్న రోజుల్లో నిధులు నిలిపివేస్తామని, గతంలో ఇచ్చిన వాటి మీద దర్యాప్తు చేస్తామని చెప్పాడు.


ఖండనలతో పాటు యావత్‌ ప్రపంచం అప్రమత్తమై ఎలా ఎదుర్కోవాలా అన్న శోధనలో పడిరది. అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్‌ నిరోధానికి జాతీయ అత్యవసర పరిస్థితిని ట్రంప్‌ ప్రకటించాడు.కృత్రిమ సింథటిక్‌ మరియు నల్లమందుతో తయారు చేసే నొప్పి నివారణ, మత్తు మందును ఫెంటానిల్‌ అని పిలుస్తున్నారు. దీన్ని ఔషధంగా వినియోగించటానికి అనుమతి ఉంది. మాదక ద్రవ్యంగా కూడా వినియోగిస్తున్నారు.అక్రమంగా దిగుమతి అవుతున్న ఫెంటానిల్‌ అమెరికాలో లక్షల మంది ప్రాణాలు తీసిందని అధ్యక్ష భవన మీడియా కార్యదర్శి కారోలిన్‌ లీవిట్‌ ఆరోపించారు. డోనాల్డ్‌ ట్రంప్‌ అంటే అమెరికా, అమెరికా అంటే ట్రంప్‌ అన్నట్లుగా పరిస్థితి తయారు కావటంతో కొంత మంది ఇప్పుడు ట్రంపెరికా అని పిలుస్తున్నారు. తాము చర్చలను తప్ప ఘర్షణను కోరుకోలేదని, కానీ ప్రతికూల చర్యలకు పూనుకోక తప్పటం లేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షియిన్‌బామ్‌ ఎక్స్‌ ద్వారా ప్రకటించారు. మెక్సికో ప్రయోజనాల రక్షణకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని తమ ఆర్థిక మంత్రిని కోరినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల ముఠాలతో మెక్సికో ప్రభుత్వం కుమ్మక్కు అయినందునే తాము పన్నులు విధించాల్సి వస్తోందంటూ అధ్యక్షభవనం చెప్పిన సాకును ఆమె ఖండిరచారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఏఏ వస్తువులను లక్ష్యంగా చేసుకోవాలో ఇంకా వెల్లడిరచలేదు. స్వతంత్ర మెక్సికో చరిత్రలో జరిగిన అతిపెద్ద దాడులలో ఇదొకటని, అమెరికాకెనడామెక్సికో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇది విరుద్దమని పాలకపార్టీ నేత రికార్డో, ఆర్థిక మంత్రి ఎబ్రార్డ్‌ ప్రకటించాడు. తాము నష్టపడతామని, వారికీ అదే జరుగుతుందన్నారు.ప్రస్తుతం అమెరికాకు ఎగుమతుల్లో చైనాతో మెక్సికో పోటీపడుతోంది. మూడోవంతు మెక్సికో జిడిపి అమెరికాకు ఎగుమతులపై ఆధారపడి ఉంది. ఎగుమతి, దిగుమతుల్లో మెక్సికో వాణిజ్య మిగుల్లో ఉంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పంది మాంసం, జున్ను, వ్యవసాయ ఉత్పత్తులు, ఉక్కు, అల్యూమినియం వస్తువుల మీద ఐదు నుంచి 20శాతం వరకు పన్నులు విధించాలని ఆలోచిస్తున్నది. బీరు,వైన్‌,పండ్లు, పండ్ల రసాలతో సహా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై 25శాతం పన్ను విధించనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ ప్రకటించాడు. తొమ్మిదివేల కిలోమీటర్ల దూరం ఉన్న సరిహద్దులో ఇరు దేశాల వాణిజ్య లావాదేవీలు రోజుకు రెండున్నర బిలియన్ల డాలర్ల మేర జరుగుతున్నాయి. పన్నుల విధింపు తమ మీద ఆర్థిక యుద్ధం ప్రకటించటం, రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని ఉల్లంఘించటమే అంటూ దీన్ని తాము, కెనడియన్లతో కలసి ప్రతిఘటిస్తామని బ్రిటీష్‌ కొలంబియా ప్రధాని డేవిడ్‌ ఇబై ప్రకటించాడు. డాలర్‌కు డాలర్‌ అన్న పద్దతిలో దెబ్బతీస్తామని కెనడాలోని ఓంటారియో రాష్ట్ర నేతలు చెప్పారు. తమ మీద అడ్డగోలుగా పన్ను విధిస్తే గట్టిగా ప్రతి స్పందిస్తామని ఐరోపా యూనియన్‌ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.


ట్రంప్‌ చర్యను ఖండిస్తూ చర్చలకు ద్వారాలను తెరిచే ఉంచామని చైనా వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వశాఖలు ప్రకటించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలో పన్నుల విధింపును సవాలు చేస్తామని ప్రకటించాయి. ఫెంటానిల్‌ అమెరికా సమస్య. దాని మీద ఏ చర్య తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని చైనా స్పష్టం చేసింది. తాము ఇప్పటికే అమెరికాకు సహకరిస్తున్నామని, గణనీయమైన ఫలితాలు కూడా వచ్చాయన్నారు. ట్రంపు పన్నులు చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ కాదని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక రంగం మీద అమెరికా పన్నులు ఎలాంటి ప్రభావితం కలిగిస్తాయో అన్న ఆందోళన చెందుతున్నట్లు జపాన్‌ ఆర్థిక మంత్రి కాటో చెప్పాడు.తమ మీద ప్రభావం ఎలా ఉంటుందో చూసి తగిన చర్యలు తీసుకుంటామన్నాడు. మెక్సికోలో ఉత్పత్తి కేంద్రాలున్న దక్షిణ కొరియా కంపెనీల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో సన్నిహితంగా గమనించాలని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు చోయ్‌ శాంగ్‌ మోక్‌ ప్రభుత్వ సంస్థలను ఆదేశించాడు. కొన్ని కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి జరపాలని ఆలోచిస్తున్నాయి. పీజా, కార్ల ధరలు పెరుగుతాయి సిద్దంగా ఉండండి అంటూ అమెరికా సెనెట్‌లో ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ చార్లెస్‌ ష్కమర్‌ హెచ్చరించాడు. కార్ల విడి భాగాల దిగుమతులపై పన్ను విధించి ధరలు పెరిగేందుకు దోహదం చేయవద్దని అమెరికన్‌ ఆటోమోటివ్‌ పాలసీ మండలి అధ్యక్షుడు మాట్‌ బ్లంట్‌ కోరాడు. పరిణామాలు, పర్యవసానాలను ఎదుర్కొనేందుకు భారత్‌తో సహా వర్ధమాన దేశాలన్నీ సిద్దం కావాలని కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ స్థాపకుడు ఉదయ్‌ కోటక్‌ కోరారు. తమకు నష్టం చేసే దేశాలన్నింటి మీద పన్నులు వేస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా వస్తువులను అన్యాయంగా భారత్‌ అడ్డుకుంటున్నదని ఆరోపించాడు.

ట్రంప్‌ పన్నులతో జరిగేదేమిటి అన్న చర్చ ఎన్నికలకు ముందే ప్రారంభమైంది. బస్తీమే సవాల్‌ అంటూ అన్ని దేశాల మీద తొడగొట్టిన కారణంగా మిగతా దేశాలన్నింటికీ కలిపి ఎంత నష్టం జరుగుతుందో ఒక్క అమెరికాకు అంత ఉంటుంది. ఏ ఏ వస్తువుల మీద పన్నులు విధిస్తారు, చేసిన ప్రకటనలు, ఇచ్చిన ఆదేశాలకు ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా అన్నది కూడా చూడాల్సి ఉంది. బెదిరించటం వెనక్కు తగ్గటం అతని చరిత్ర. తొలిసారి అధికారానికి వచ్చినపుడు అక్రమ వలసలను నివారింటచంలో విఫలమైనందున మెక్సికో వస్తువులపై ఐదు నుంచి 25శాతం పన్నులు విధిస్తానని ప్రకటించాడు. తరువాత వెనక్కు తగ్గాడు. నిఘంటువులో దేవుడు, ప్రేమ, మతం తరువాత అందమైన పదం పన్నులు అని ట్రంప్‌ వర్ణించాడు. అమెరికా చరిత్రలో 1890దశకంలో 25వ అధ్యక్షుడు విలియమ్‌ మెకన్లీ ఎడా పెడా పన్నులు విధించిన నేతగా నమోదయ్యాడు. ఇప్పుడు ట్రంప్‌ అదే బాటలో నడుస్తున్నట్లు వర్ణిస్తున్నారు.ఇప్పటికే పెద్ద ఎత్తున లోటుబడ్జెట్‌తో ఉండగా పన్నులు తగ్గించాలని ట్రంప్‌ తలపెట్టాడు, తద్వారా వచ్చిన నష్టాన్ని విదేశీ దిగుమతులపై పన్ను విధింపుతో పూడ్చాలని చూస్తున్నాడు. అయితే దానికి దేశకార్మికవర్గాన్ని ఫణంగా పెట్టాలని చూస్తున్నాడు. దిగుమతి పన్నులు వేల కోట్ల డాలర్లు బహుశా లక్షల కోట్లు కూడా తమ ఖజానాలోకి వచ్చిపడవచ్చని ప్రపంచ ఆర్థికవేదిక సమావేశాల్లో ట్రంప్‌ చెప్పాడు.
అమెరికా విధించే పన్నులు ఎలా ఉండబోతున్నాయి, సామాన్యుల మీద ఎంత భారం పడుతుందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. టాక్స్‌ ఫౌండేషన్‌ సంస్థ చెబుతున్నదానిని బట్టి కెనడా, మెక్సికోల మీద పన్ను కారణంగా అమెరికా జిడిపి 0.8శాతం దిగజారుతుంది, 1.3 ఎగుమతులు, 2.8శాతాల చొప్పున దిగుమతులు తగ్గుతాయి.లక్షా 84వేల ఉద్యోగాలు పోతాయి. ఎంత భారం పడుతుందనే లెక్కలు అన్నీ ఒకే విధంగా లేవు. పన్ను మొత్తం 272 బిలియన్‌ డాలర్లు ఉంటే కుటుంబానికి ఏటా 2,600 డాలర్లు అదనపు భారం అని కార్పే క్రాస్‌ బోర్డర్‌ సొల్యూషన్స్‌ పేర్కొన్నది. కెనడా, మెక్సికో దిగుమతుల మీద 25శాతం చొప్పున అమలు చేస్తే 232.5 బి.డాలర్లు, చైనా వస్తువులపై 43.2 మొత్తం 275.7బి.డాలర్లని దీని ప్రకారం 33 కోట్ల జనాభాలో తలకు 835 డాలర్ల చొప్పున నలుగురున్న ప్రతి కుటుంబం మీద 3,342 డాలర్లని మరో లెక్క.చైనా వస్తువులపై 60శాతం, మిగతా వాటిపై 20శాతం విధిస్తే ఏటా కుటుంబం మీద 2,600 డాలర్ల భారమని పీటర్సన్‌ ఇనిస్టిట్యూట్‌, మొత్తం మీద పదిశాతం విధిస్తే 2,045 డాలర్లని టాక్స్‌ ఫౌండేషన్‌, నేషనల్‌ రిటెయిల్‌ ఫెడరేషన్‌ అంచనా ప్రకారం 7,600 డాలర్లు ఉంటుంది. ఈ పన్నులతో కంపెనీలు, వినియోగదారుల నుంచి ప్రతిఘటన ఎదురు కావచ్చని కూడా చెబుతున్నారు. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్‌ విధించిన పన్నులకు ప్రతిగా ఐరోపా యూనియన్‌, చైనా చర్యలు తీసుకున్నాయి.వ్యవసాయ రంగంలో ట్రంప్‌ మద్దతుదార్లు, ఇతరులూ నష్టపోయారు. జూరిచ్‌ విశ్వవిద్యాలయం,మచాసుచెట్స్‌, హార్వర్డ్‌, ప్రపంచ బ్యాంకు చేసిన అధ్యయనాల ప్రకారం ట్రంప్‌ విధించిన పన్నులు అమెరికాలో ఉపాధిని పునరుద్దరించలేదని అలాగని ఉపాధిని తగ్గించలేదని కూడా తేలింది. అందువలన ఇప్పుడు ట్రంప్‌ చెబుతున్న మాటలు, చేతల ప్రభావం, పరిణామాలు, పర్యవసానాలు వెంటనే వెల్లడయ్యే అవకాశాలు లేవు.భారత్‌తో సహా వివిధ దేశాలలో స్టాక్‌మార్కెట్లు, కరెన్సీ విలువల్లో ఒడుదుడుకులు మాత్రం కనిపిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

డీప్‌సీక్‌, డీప్‌సీక్‌ – ఒక్క రోజే అమెరికాలో లక్ష కోట్ల డాలర్ల నష్టం, ప్రపంచానికి దడ పుట్టించిన చైనా ఏఐ యాప్‌ !

31 Friday Jan 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

#CHIPS War, ChatGPT, China, CHIPS Act, DeepSeek, Donald trump, Joe Biden, Technology War

ఎం కోటేశ్వరరావు

తెలివి ఒకడబ్బ సొమ్ము కాదు, పశ్చిమ దేశాల, తెల్లతోళ్ల గుత్త అసలే కాదు. రక్షణాత్మక చర్యలతో తన ప్రత్యర్ధులను అణచివేయాలని ఎవరైనా ఎంతగా ప్రయత్నిస్తే అంతగా ప్రతిఘటనే కాదు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కూడా సవాలు విసురుతాయని గతంలో అణుబాంబులు, ఖండాంతర క్షిపణుల వరకు నిరూపించాయి. తాజాగా చైనా డీప్‌సీక్‌ కృత్రిమ మేథ యాప్‌ అమెరికాతో సహా ప్రపంచ మంతటా సంచలనానికి కారణమైంది. అనేక దేశాలో ప్రభుత్వశాఖలు, భారీ సంఖ్యలో కంపెనీలు ఆ యాప్‌ను తమ ఫోన్లు, కంప్యూటర్లలో పెట్టుకోవద్దని, దాని సేవలను వినియోగించవద్దని ఆంక్షలు విధిస్తున్నట్లు వార్తలు. చైనా సాంకేతికంగా ముందుకు పోకుండా అడ్డుకొనేక్రమంలో జో బైడెన్‌ 2022లో తెచ్చిన చిప్స్‌ చట్టం ప్రకారం డ్రాగన్‌ దేశానికి ఎలాంటి పరిజ్ఞానం, చిప్స్‌ను అందనివ్వకూడదు,ఒక వేళ ఇతర దేశాలు ముందుకు పోతే వాటి మీద కూడా ఆంక్షలు విధిస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడవి దానికే ఎదురుతంతున్నాయి. రక్షణాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా అదే జరుగుతుంది. తగిన ప్రోత్సాహం, అవకాశాలను కల్పించాలేగానీ ఎవరైనా అద్భుతాలు సృష్టించగలరని ప్రత్యేకించి చైనా ఇప్పటికే నిరూపించింది. గంగలో మునిగితే కరోనా పారిపోతుందని చెప్పిన వారు ఇప్పుడు కోట్లాది మందిని మహాకుంభమేళా పేరుతో గంగా స్నానం చేయిస్తున్నారు. వారి నుంచి డీప్‌సీక్‌ వంటి నవకల్పనలు వెలువడతాయని ఆశించలేము. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అన్నవారు ఇంకా ఆ పాటనే పాడుతున్నారు. నిజంగా ఉంటే ఘనాపాటీలు ‘‘ దేశం కోసం ధర్మం కోసం ’’ ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పాటికి ఇంథనం, విమానాశ్రయాలతో పని లేకుండా ఎలా అనుకుంటే అటు తిరుగుతూ ఎందరు ఎక్కినా మరొకరికి సీట్లు ఉండే పుష్పక విమానాలను, కృత్రిమ మేథ(ఏఐ) భారతీయ యాప్‌ను ఎందుకు రూపొందించలేదన్నది ప్రశ్న !

ఈ రంగంలో చైనా కంపెనీ విడుదల చేసిన డీప్‌సీక్‌ఆర్‌ఐ యాప్‌ పెను సంచలనం సృష్టించటమే కాదు, అమెరికా కంపెనీల వాటాల ధరలు పతనమై దాని చరిత్రలో లేని విధంగా దాదాపు లక్ష కోట్ల డాలర్లు( 96,900) నష్టపోయేందుకు దోహదం చేసింది.పది సంవత్సరాల క్రితం అమెరికా ఓపెన్‌ ఎఐ కంపెనీ (చాట్‌ జిపిటి సృష్టికర్త) నాలుగున్నరవేల మంది సిబ్బంది, 660 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైంది. అదే చైనా డీప్‌సీక్‌ 200 మంది సిబ్బందితో ప్రారంభమై రెండు సంవత్సరాలు కూడా నిండలేదు.కోటి డాలర్లలోపు ఖర్చుతోనే యాప్‌ను అభివృద్ధి చేసినట్లు ది కొబెఇసీ న్యూస్‌లెటర్‌ స్థాపకుడు ఆడమ్‌ కొబెఇసీ ఎక్స్‌లో పేర్కొన్నాడు. ఈ రెండు కంపెనీలు ఇప్పుడు ఎలా పోటీబడుతున్నాయో చూడండని పేర్కొన్నాడు. ఒక్క ఎన్విడియా కంపెనీ వాటాల ధరలే 60వేల కోట్ల మేర నష్టపోయాయి. ఆ కంపెనీ సిఇఓ 2,100, ఒరాకిల్‌ అధిపతి సంపద 2,760 కోట్ల డాలర్లు నష్టపోయారు. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఇంత నష్టం ఇదే ప్రధమం. తరువాత ఆ కంపెనీలు పుంజుకోవచ్చు, మార్కెట్లో నిలదొక్కుకోవచ్చు, అది వేరే అంశం. ఒక్కటి మాత్రం స్పష్టం వందల కోట్ల డాలర్లు ఖర్చుచేసిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారు, వాటాలను కొనుగోలు చేసేవారు ఒకటికి వందసార్లు ఆలోచించే విధంగా ఊరూపేరులేని డీప్‌సీక్‌ అంకుర సంస్థ మేల్కొలిపింది. దాని మీద ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో సైబర్‌దాడులు జరుగుతున్నాయి. అమెరికా కంపెనీలు ఒక యాప్‌ను తయారు చేసేందుకు పది కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే చైనా కంపెనీ కేవలం 60లక్షల డాలర్లతో వాటికి ధీటైనదాన్ని రూపొందించింది.

ఆధునిక చిప్‌లను, వాటిని తయారు చేసే యంత్రాలను చైనా కంపెనీలకు విక్రయించరాదని అమెరికా ఆంక్షలు విధించిన తరువాత డీప్‌సీక్‌ తన సత్తాచాటింది. చిత్రం ఏమిటంటే అమెరికాకు చెందిన ఎన్వీడియా కంపెనీ తన వద్ద పాత తరం హెచ్‌800 రకం చిప్స్‌ను రెండువేలు కొనుగోలు చేసి వాటిని వినియోగించామని డీప్‌సీక్‌ ఇంజనీర్లు వెల్లడిరచారు. అందువలన చైనాకు ఆధునిక పరిజ్ఞానం అందకుండా మడిగట్టుకొని మంత్రాలు వేసిన వారు ఇప్పుడేం చేస్తారన్నది ప్రపంచానికి ఆసక్తి కలిగించే అంశం.చివరికి రద్దును అమ్మాలన్నా చైనా గనుక కొనుగోలుకు ముందుకు వస్తే ధనిక దేశాల కంపెనీలు భయపడే స్థితి వచ్చింది. ఇంత తక్కువ ఖర్చుతో చైనా యాప్‌లు తయారు చేస్తున్నపుడు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేయటం అవసరమా అని అమెరికన్లలో సందేహాలు తలెత్తాయి. తాజా యాప్‌ను విడుదల చేయక ముందే అంటే జనవరి ప్రారంభం నుంచి డీప్‌సీక్‌ కంపెనీ మీద సైబర్‌ దాడులు ప్రారంభమయ్యాయని చైనా భద్రతా సంస్థ ఎక్స్‌లాబ్‌ వెల్లడిరచింది. అమెరికా, సింగపూర్‌, నెదర్లాండ్స్‌, జర్మనీ చివరికి చైనాలో చిరునామాలు కలిగిన సంస్థలు వేల సంఖ్యలో దాడులు జరుపుతున్నాయని, రానున్న రోజుల్లో ఇంకా పెరగవచ్చని కూడా హెచ్చరించింది. ఈ దాడులు జరుగుతుండగానే జనవరి 28వ తేదీన డీప్‌సీక్‌ఆర్‌ఐ మోడల్‌ యాప్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది అమెరికన్‌ ఏఐకి హెచ్చరిక అని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వర్ణించినట్లు సమాచారశాఖ మంత్రి కరోలిన్‌ లీవిట్‌ పేర్కొన్నారు.

చైనా యాప్‌ విడుదలకు వారం రోజుల ముందు డోనాల్డ్‌ ట్రంప్‌ స్టార్‌గేట్‌ పేరుతో సాంకేతిక రంగంలో తనకు అనుకూలమైన కొందరిని సమావేశపరచి కృత్రిమ మేథ, సంబంధిత రంగాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 500బిలియన్‌ డాలర్ల మేర ప్రాధమిక సదుపాయాలను కల్పించనున్నట్లు, అది సాంకేతికరంగ భవిష్యత్‌కు తోడ్పడుతుందని ప్రకటించాడు. చైనాకు అడ్డుకట్ట వేసేందుకు కన్న కలలను అదే చైనా వారం రోజుల్లోనే ఆటతీరునే మార్చి వేస్తుందని ట్రంప్‌ ఊహించలేకపోయాడు. నిజానికి ఇతర చైనా కంపెనీలు ప్రపంచానికి సుపరిచతం తప్ప డీప్‌సీక్‌ గురించి పెద్దగా తెలియదు. అలాంటి కంపెనీ అమెరికా సాంకేతిక రంగాన్ని, ఖరీదైన ట్రంప్‌ పథకాలను ఒకేసారి దెబ్బతీసింది. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్‌, తరువాత జోబైడెన్‌ కూడా సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలు చైనాకు అందకుండా చూసేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ నేపధ్యంలో అనేక రంగాల్లో చైనా ముందున్నప్పటికీ మైక్రో చిప్స్‌, ఏఐ రంగంలో వెనుకబడి ఉందని వెంటనే అమెరికాను అధిగమించటం జరిగేది కాదని అనేక మంది భావిస్తున్న తరుణంలో అది వాస్తవం కాదని స్పష్టం చేసింది, ఇప్పటికే చిప్స్‌ తయారీకి శ్రీకారం చుట్టిన చైనా ఆ రంగంలో కూడా త్వరలో తన సత్తా నిరూపించటం ఖాయం. ఏఐలో సంచలనాలు సృష్టించిన చాట్‌ జిపిటిని రూపొందించిన ఓపెన్‌ ఏఐ సంస్థ మరికొన్నింటిని పెంపొందించటానికి ట్రంప్‌ స్టార్‌గేట్‌ పేరుతో ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు పూనుకున్నాడు. ఈ రంగంలో అతిపెద్ద సంస్థలైన గూగుల్‌, మేటా, ఇతర పెద్ద సంస్థలను దీన్నుంచి మినహాయించాడు. చాట్‌ జిపిటిపై ప్రతి ఖాతాదారు మీద నెలకు రెండువందల డాలర్లు ఖర్చు అవుతున్నదని, నష్టాల్లో ఉన్నట్లు ఓపెన్‌ ఏఐ చెప్పింది.నిజానికి ఇప్పటి వరకు ఈ సేవద్వారా లాభాలు ఎలా వచ్చేదీ స్పష్టం కాలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన డీప్‌సీక్‌ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు.బైట్‌ డాన్స్‌ రూపొందించిన టిక్‌టాక్‌, అలీబాబా,మూన్‌షాట్‌,రిaపు వంటి చైనా కంపెనీలు ఇప్పటికే ఏదో ఒక రూపంలో అమెరికా సంస్థలను సవాలు చేస్తున్నాయి. మరోసారి అమెరికాను గొప్పదిగా చేయాలన్న ట్రంప్‌ మీద భ్రమలు పెట్టుకున్నవారు నేడు గాకపోతే రేపైనా కళ్లు తెరవక తప్పదు.

సంచలనాత్మక డీప్‌సీక్‌ గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. వాటన్నింటినీ నమ్మటానికి లేదు.దాని దగ్గర ఉన్న సమాచారంలో పదిలక్షల రికార్డులను ఎవరైనా చూడవచ్చని విజ్‌ అనే ఒక సంస్థప్రకటించింది. అయితే ఒక అరగంట వ్యవధిలోనే వాటికి తాళం వేశారని అనుమతి లేకుండా ఎవరూ చూడటానికి లేదని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ సమాచారం ఏమిటి ? ఎవరైనా తీసుకున్నారా ? దానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిది అన్నది కూడా తెలియలేదు. టిక్‌టాక్‌ ఇతర యాప్‌ల ద్వారా చైనా సమాచారాన్ని సేకరిస్తున్నదనే ఆరోపణల మాదిరే ఇప్పడు దీని మీద కూడా అనేక దేశాల్లో హెచ్చరికలు చేస్తున్నారు. ఏ స్థాయిలో ఉన్న వారు కూడా దీని సేవలను పొందవద్దని అమెరికా నౌకా దళం తన సిబ్బందిని ఆదేశించింది.ఈ యాప్‌ మరో స్పూత్నిక్‌ క్షణాలను గుర్తుకు తెచ్చిందని కొందరు వ్యాఖ్యానించారు. నిజానికి ప్రపంచ తొలి సోవియట్‌ యూనియన్‌ కృత్రిమ ఉపగ్రహం స్పూత్నిక్‌1 ప్రయోగం అమెరికా ఒక్కదాన్నే కలవరపెట్టింది. ఇప్పుడు డీప్‌సీక్‌ చైనాను అడ్డుకోవాలని చూసే ప్రతి వారూ కాళ్లు విరగదొక్కుకొనేట్లు చేసింది.స్పూత్నిక్‌ ప్రయోగం పెను సంచలనం సృష్టించింది.అప్పటి నుంచి పెద్ద సంచలనాలను స్పూత్నిక్‌ క్షణాలు అంటున్నారు.

ప్రచ్చన్న యుద్ధం కారణంగానే అమెరికన్లు నాసాను రంగంలోకి తెచ్చారు.1950 దశకం ప్రారంభంలో అమెరికాకు చెందిన యుా2 అనే గూఢచార విమానం ద్వారా తమ రహస్యాలను సేకరించిందని గ్రహించిన సోవియట్‌ ప్రతి చర్యలను చేపట్టింది. దాని గురించి అమెరికా రాబట్టిన సమాచారం ప్రకారం 1955 నుంచి 61 సంవత్సరాలలో తమ దేశంలో ఉన్న శాస్త్రవేత్తలకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ మందితో పరిశోధనలను జరిపించిందని అమెరికన్లు గ్రహించారు. దాని ఫలితమే 1957 అక్టోబరు నాలుగున ప్రపంచ తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్‌1 ప్రయోగం. అది ఎంత సంచలనం అంటే న్యూయార్క్‌ టైమ్స్‌ సేకరించిన సమాచారం ప్రకారం అక్టోబరు 6`31వ తేదీల మధ్య 279 వ్యాసాలు, రోజుకు పదకొండు చొప్పున అమెరికా పత్రికల్లో వచ్చాయి. అమెరికా ద్వితీయ శ్రేణి శక్తిగా మారిందని మీడియా వ్యాఖ్యాతలు రెచ్చగొట్టారు. సోవియట్‌ సాంకేతికంగా ఎంతో ముందున్నదని, అది అమెరికా భద్రతకు ముప్పు అని భాష్యం చెప్పారు.అమెరికన్లలో తలెత్తిన కలవరపాటును తగ్గించేందుకు అసలు మనం 1956లోనే ఎక్స్‌ప్లోరర్‌1 అనే ఉపగ్రహాన్ని సిద్దం చేశామని ప్రచారం చేశారు. అయితే అది ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సోవియట్‌ ఉపగ్రహ ప్రయోగానికి ఖండాంతర క్షిపణి పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఉపగ్రహంతో పాటు దాన్ని నింగిలోకి మోసుకుపోయిన ఆర్‌ా7 రాకెట్‌ పదిలక్షల పౌండ్ల శక్తిని విడుదల చేసిందని గ్రహించిన అమెరికన్లు దాన్ని చూసి కూడా కలవరపడ్డారు. ఆ రాకెట్‌ ద్వారా అణ్వాయుధాన్ని కొన్ని నిమిషాల్లోనే ఆరువేల కిలోమీటర్ల దూరం మోసుకుపోగల శక్తి కలిగిందన్నది మరింత ఆందోళన కలిగించి అంతరిక్ష రంగంలో తాము ఎంతో వెనుకబడి ఉన్నామని తరువాత కాలంలో వేగాన్ని పెంచారు. స్పుత్నిక్‌ వలన ఎలాంటి ముప్పు లేదని గ్రహించి ఐదు రోజుల తరువాత నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హోవర్‌ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ అదొక శాస్త్రప్రయోగ విజయం తప్ప భద్రకు ముప్పులేదని చెప్పారు. (తరువాత అమెరికా రెండు ఉపగ్రహాలను ప్రయోగించినా అవి విఫలమయ్యాయి) అదే పెద్ద మనిషి 1958లో మాట్లాడుతూ అంతరిక్ష శాస్త్ర, సాంకేతిక రంగంలో అమెరికా, ఇతర స్వేచ్చా ప్రపంచ దేశాలను సోవియట్‌ అధిగమించిందని, అమెరికా ప్రతిష్ట, నాయకత్వాన్ని ఖాతరు చేయకుండా ఉండేందుకు ఒక సాధనంగా వినియోగించుకోవచ్చని, గగన తలంలో ఉన్నతమైన మిలిటరీ సామర్ధ్యాన్ని ప్రదర్శించిన తొలిదేశంగా సోవియట్‌ అవతరించిందని అంగీకరించక తప్పలేదు.


డీప్‌సీక్‌ కంపెనీ 2023 చివరిలో ప్రారంభమైంది. అంతకు ముందు దాని అధినేత లియాంగ్‌ వెన్‌ఫెంగ్‌ ఒక వెంచర్‌ కాపిటల్‌ సంస్థను నడుపుతున్నాడు. దాని వాణిజ్య వ్యూహాలను రూపొందించేందుకు కృత్రిమ మేథను వినియోగించాడు. తరువాత కంప్యూటర్‌ ప్రాతిపదికగా పని చేసే రెండు కంపెనీలను పదేండ్ల క్రితం ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో తలెత్తిన ఆసక్తి నుంచి డీప్‌సీక్‌ యాప్‌ వెలువడిరది. ఇటీవలి కాలంలో చైనా తనదైన శైలిలో అమెరికన్లకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నది. ప్రపంచంలో అతి పెద్ద నౌకాదళ శక్తిగా రూపొందింది. ఆరవ తరం యుద్ధ విమానాన్ని ప్రయోగించింది. ఇప్పుడు కృత్రిమ మేథ రంగంలో షాకిచ్చింది. అమెరికా కంపెనీలు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే కేవలం 60లక్షల డాలర్లు, అంతగా ఆధునికం కాని, పరిమిత కంప్యూటర్‌ చిప్స్‌తో యాప్‌ను తయారు చేశారు. ఒక ఊరూపేరులేని సంస్థే ఆ ఘనతను సాధించటంతో సిలికాన్‌ వాలీలోని అగ్రశ్రేణి కంపెనీలు భయాలను వ్యక్తం చేశాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వేతన పెంపుదల : కమ్యూనిస్టులు పోరాడితే సంస్థలకు వ్యతిరేకం-అదే కార్పొరేట్లు కోరితే….?

25 Saturday Jan 2025

Posted by raomk in CPI(M), Current Affairs, Economics, employees, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BRS, CHANDRABABU, fair wages, indian corporate, minimum wage, Narendra Modi Failures, Revanth Reddy, tdp

ఎం కోటేశ్వరరావు

బడ్జెట్‌ ప్రక్రియలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హల్వా వంటకాన్ని ప్రారంభించారు. అంటే బడ్జెట్‌ ప్రతుల ముద్రణకు శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో ప్రవేశపెట్టేంత వరకు సిబ్బంది ముద్రణాలయం నుంచి బయటకు వచ్చేందుకు వీల్లేదు. గతంలో ఏ వస్తువు మీద ఎంత పన్ను వేస్తారో, ఎంత తగ్గిస్తారో ముందుగానే వెల్లడి కాకూడదని అలా చేసేవారు. ఇప్పుడు పార్లమెంటుతో పని లేకుండానే జిఎస్‌టి కౌన్సిల్లో ముందుగానే అన్నీ నిర్ణయిస్తున్న తరువాత నిజానికి బడ్జెట్‌లో అంత రహస్యమేమీ ఉండదు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేబోయే ముందు కేంద్ర ప్రభుత్వం వివిధ తరగతులతో సంప్రదింపులు జరపటం ఒక నాటకం తాము కోరుకున్న వారికి పెద్ద పీట వేయటం చేదు వాస్తవం. నిర్మలా సీతారామన్‌ వరుసగా ఆరు బడ్జెట్‌లు, ఒక తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రికార్డును అధిగమించారు.మరో బడ్జెట్‌కు సిద్దం అవుతున్నారు. ఏ బడ్జెట్‌ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా కార్పొరేట్లకు పెద్ద పీటవేయటంలో కూడా ఆమె రికార్డు సృష్టించారు. తాజా బడ్జెట్‌ గురించి అన్ని తరగతులను చర్చలకు ఆహ్వానించారు గానీ రైతులను కావాలనే విస్మరించారు. ఎందుకంటే నరేంద్రమోడీకి ఇష్టం ఉండదు గనుక. అంచనాలకు దూరంగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు ఉంది. ఎందుకు అంటే జనాల వినియోగం తగ్గిపోవటం ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. చిన్నప్పటి ఏడు చేపల కథను గుర్తుకు తెచ్చుకుంటే అందులో ఏడ్చిన పిల్లవాడు ఒక్కడైతే వర్తమాన కథలో ఎందరో. కానీ కేంద్రీకరణ అంతా వారిలో ఒకరైన వినియోగదారు మీదే ఉంది.


కమ్యూనిస్టులు వేతన పెంపుదల కోరగానే అనేక మంది విరుచుకుపడుతుంటారు. వీరికి పరిశ్రమలు,వ్యాపారాలు ఎలాపోయినా ఫరవాలేదు, కార్మికులకు వేతనాలు, అలవెన్సులు, బోనస్‌లు ఇంకా ఏవేవో పెంచాలంటారు, మొత్తం సంస్థలనే అప్పగించాలంటారు, వేరే పనేలేదని దుమ్మెత్తి పోస్తారు. నిజమే, వాటి గురించి చట్టాలు, నిబంధనలు ఉన్నవే కదా, వాటినే కమ్యూనిస్టులు అడుగుతున్నారు, దీనమ్మ జీవితం ! చట్టాలు అమలు జరగాలని, వాటి మేరకు పాలన జరగాలని కోరుకోవటం కూడా తప్పంటారా ? ఇది ప్రమాదకర పోకడ, తమదాకా వస్తే గానీ తెలియదు. కమ్యూనిస్టుల సంగతి సరే సాక్షాత్తూ కార్పొరేట్ల అధిపతులే వేతనాలు పెంచాలని, న్యాయంగా ఉండాలని చెబుతున్న సంగతి కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని వారికి ఎలా చెప్పాలి ! బెంగలూరు కేంద్రంగా పని చేస్తున్న వెంచర్‌ కాపిటల్‌ సంస్థ ఆరిన్‌, దాని చైర్మన్‌ మోహనదాస్‌ పాయ్‌. గతంలో ఇన్ఫోసిస్‌ కంపెనీ సిఎఫ్‌ఓగా పని చేశారు. ఆయన వేతనాల గురించి చెప్పిన మాటల సారం ఇలా ఉంది.(ఎకనమిక్‌ టైమ్స్‌ డిసెంబరు 19,2024) ‘‘ 2011లో ఇన్పోసిస్‌లో కొత్తగా చేరిన ఉద్యోగి ఏడాదికి రు.3.25లక్షలు పొందితే ఇప్పుడు రు.3.5 లేదా 3.75లక్షలు మాత్రమే తీసుకుంటున్నారు. పదిహేను శాతం ఎక్కువగా ఇస్తుండవచ్చు, పదమూడేండ్ల తరువాత దీన్ని ఎలా సమర్ధించాలి ? 2011లో కంపెనీ సిఇఓ ఎంత పొందారు ? ఇప్పుడు ఎంత ? న్యాయంగా ఉండాలి కదా ! మన వాణిజ్యం ద్రవ్యాశతో నీచకార్యాలకు పాల్పడే సంస్థలుగా(మెర్సినరీస్‌)గా మారాలని మనం కోరుకోకూడదు.లాభాల కోసం ప్రయత్నించటం తప్పుకాదు.తామెంతో న్యాయంగా ఉంటున్నట్లు యజమానులు చెప్పుకుంటున్నారు గనుక కంపెనీలు కూడా న్యాయంగా ఉండాలి. సిబ్బంది అత్యంత విలువైన సంపద అని చెబుతున్నారు గనుక దయచేసి చెప్పినట్లుగా చేయండి’’ అన్నార్‌ పాయ్‌. ఇదే ఒక కమ్యూనిస్టు చెబితే ఏ మీడియా అయినా దాన్ని అంత ప్రముఖంగా ప్రచురిస్తుందాప్రసారం చేస్తుందా ? అసలు వార్తగా అయినా ఇస్తుందా !

వేతన పెరుగుదల లేదా స్థంభన, నిజవేతనాలు పెరగకపోవటం గురించి తరచూ కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు మాట్లాడుతుంటాయి. కానీ ఇప్పుడు ఇతరులు మాట్లాడుతున్నారంటే నిజంగా వారికి కష్టజీవుల జీవితాల మీద ప్రేమ పుట్టుకువచ్చినట్లా ? ఇటీవలి కాలంలో కార్పొరేట్లకు ఆకాశాన్నంటే రీతిలో లాభాలు రావటం వెనుక నరేంద్రమోడీ అనుసరించే విధానాలు కారణం. అయితే ఆ మేరకు కార్మికులకు వేతనాలు పెరగకపోతే వినిమయ గిరాకీ తగ్గి మొదటికే మోసం వస్తుందని అదే మోడీ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ స్వయంగా హెచ్చరించారు. పండుగల సమయాల్లో కూడా అమ్మకాల గురించి వాణిజ్యవేత్తలు పెదవి విరిచారు. ఇంటి దగ్గర భార్య ముఖాన్ని చూస్తూ ఎన్నిగంటలు గడుపుతారు, ఆదివారాలతో నిమిత్తం లేకుండా వారానికి 90గంటలు పని చేయాలని ఎల్‌ అండ్‌ టి అధిపతి సుబ్రమణ్యన్‌ సెలవిచ్చారు.పిల్లలు, పెద్ద వారిని వదిలేసి ఇద్దరూ 90 గంటలు పని చేయాలని అనలేదు. ఇన్పోసిస్‌ నారాయణ మూర్తి మరో 20 గంటలు తగ్గించి 70 అన్నారు. వీరందరికీ స్ఫూర్తి ఎవరంటే అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రస్తుతం జైలుపాలైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సక్‌ యోల్‌, అతగాడు 120 గంటలు చేయాలన్నాడు. యంత్రాలు కూడా నిరంతరం పని చేస్తే అరిగి చెడిపోతాయి గనుక కొంత విరామం, నిర్వహణ పనులు చేస్తారు. కార్మికులకు అదేమీ అవసరం లేదన్నది ఈ అపరమానవతా మూర్తుల ఉవాచ.

కంపెనీలు వేతనాలు సక్రమంగా ఇస్తున్నాయా అంటే లేదు, పని మాత్రం చేయాలి.నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో నమోదైన 500 కంపెనీలకు 2024 ఆర్థిక సంవత్సరంలో పన్నుల చెల్లింపు అనంతరం వచ్చిన లాభాలు 15 ఏండ్ల గరిష్టం అని అనంత నాగేశ్వరన్‌ చెప్పారు.జిడిపి వృద్ధి రేటు అంచనాలకంటే తగ్గినప్పటికీ ప్రపంచంలో అధికవృద్ధి మన దగ్గరే అని పాలకపార్టీ పెద్దలు తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు. ఉపాధి రహిత వృద్ధి, వేతన వృద్ధి బలహీనంగా ఉన్నపుడు కార్పొరేట్లకు లాభాలు తప్ప శ్రామికులకు ఒరిగేదేమీ లేదు.ద్రవ్యోల్బణం పెరుగుదలతో వారిలో కొనుగోలు శక్తి పడిపోతున్నది. ఐటి రంగంలో వేతన వృద్ధి దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే పడిపోయింది. దానికి తోడు రూపాయి విలువ పతనంతో ఎగుమతులు ప్రధానంగా ఉన్న ఆ రంగంలోని కంపెనీలకు లాభాలే లాభాలు. వివిధ రంగాల్లోని నిపుణులైన కార్మికులు(వారిని బ్లూ కాలర్‌ వర్కర్స్‌ అంటున్నారు) జీవన వేతనం కోసం నిరంతరం సతమతం అవుతున్నారు. వర్క్‌ ఇండియా అనే సంస్థ నివేదిక ప్రకారం దేశంలో 57శాతం మంది ఈ కార్మికుల వేతనాలు నెలకు రు.20 వేలకంటే తక్కువే, 29శాతం మంది 2040వేల మధ్య పొందుతున్నారు. కార్పొరేట్ల నిలయం దవోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ పెట్టుబడులను ఆకర్షించేందుకు పడుతున్న తాపత్రయం మంచిదే. కానీ కార్మికులకు ఆర్థిక న్యాయం, గౌరవాన్ని కలిగించేందుకు అవసరమైన వేతనాలు ఇప్పించేందుకు ఏం చేస్తున్నారు. రెండు చోట్లా కోట్లాది మందిగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కనీస అవసరాలు తీర్చే విధంగా దశాబ్దాలతరబడి సవరణకు నోచుకోని కనీసవేతనాల గురించి ఒక్క పలుకూ చేతా లేదు. వారి విజన్లలో కార్పొరేట్లు తప్ప కార్మికులకు చోటు లేదు.ఆకలి కేకలతో ఉన్న 80 కోట్ల మందికి మరికొన్ని సంవత్సరాలు ఉచితంగా ఐదేసి కిలోల ఆహార ధాన్యాలు ఇస్తానంటారు తప్ప చేసేందుకు ఉపాధి కల్పించి ఆత్మగౌరవంతో బతకటం విశ్వగురువు నరేంద్రమోడీ అజెండాలో లేదు.శ్రమజీవులు ముష్టిని కోరుకోరుకుంటారా ?

నైపుణ్యం పెంచినట్లు మోడీ పదేండ్లుగా చెబుతున్నారు.వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. రేవంత రెడ్డి విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి కబుర్లు చెబుతుంటే చంద్రబాబు నాయుడు నిపుణులు ఎంత మంది ఉన్నారో ముందు లెక్కతేలాలంటున్నారు.పదేండ్ల నుంచి నైపుణ్యాలు నిజంగా పెంచితే దానికి తగిన విధంగా వేతనాలు వాటికి అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగాలి, కానీ తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని రంగాల్లో ఆటోమేషన్‌ , దాంతో ఉత్పాదకత పెరుగుతోంది ఉపాధి తగ్గుతోంది, కంపెనీల లాభాలు పెరుగుతున్నాయి. న్యాయమైన వేతనాలు చెల్లించటం కేవలం నైతిక విధాయకమే కాదు నిరంతర వినియోగ గిరాకీ పెరగటానికి కూడా అవసరమే అని అనంత నాగేశ్వరన్‌ నొక్కి చెప్పారు. కార్పొరేట్ల లాభదాయకతకార్మికుల సంక్షేమం మధ్య తేడాను తగ్గించకపోతే దీర్ఘకాలంలో దేశ ఆర్థిక స్థిరత్వానికి పెద్ద ముప్పు పొంచి ఉన్నట్లే. దేశంలో కాంటాక్టు కార్మికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది, పరిశ్రమలను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తారు, కార్మికులను మాత్రం తాత్కాలికం పేరుతో నియమిస్తారు. ఐటి రంగంలో సిఇఓవేల వేతనాలు చూస్తే గత ఐదేండ్లలో 5060శాతం పెరగ్గా దిగువ 20శాతం సిబ్బంది వేతనాలు 2025శాతం మాత్రమే పెరిగినట్లు మోహనదాస్‌ పాయ్‌ చెప్పారు. దిగువ 50శాతం మంది సిబ్బంది పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతున్నారని కార్పొరేట్‌ సంస్థలు వారికి మెరుగైన వేతనాలివ్వాలని కూడా చెప్పారు. ఎక్కడైనా కమ్యూనిస్టులు లేదా కార్మిక సంఘాల నాయకత్వాన విధిలేని స్థితిలో కార్మికులు సమ్మెలకు దిగితే ఇంకేముంది సంస్థలు దివాలా అంటూ గుండెలు బాదుకొనే వారు పాయ్‌ చెప్పిందాన్ని ఏమంటారు ? దుకాణాలు, పరిశ్రమల్లో సహాయకులుగా ఉండే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు గత ఐదేండ్లలో ఒకటి రెండుశాతమే పెరిగినట్లు అధ్యయనాలు తెలిపాయి.

కార్పొరేట్లు సంపదల పంపిణీకి వ్యతిరేకం, కానీ పరిమితంగా వేతనాలు పెరగాలని కోరకుంటున్నాయి. ఎందుకని ? మనదేశంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం జరుపుతున్నారు, తమ ప్రయాణాలు సుఖవంతం, వేగవంతంగా జరిపేందుకు వేస్తున్నారని జనం భావిస్తారు, దాన్లో వాస్తవం లేకపోలేదు, టోల్‌ రూపంలో తగిన మూల్యం చెల్లిస్తున్నారన్నది వేరే అంశం. అదొక్కటే కాదు, జనం సొమ్ముతో రోడ్లను ప్రభుత్వం వేస్తే కాంట్రాక్టులు తీసుకొని లాభాలు పొందేది, నిర్వహణను తీసుకొని టోలు వసూలు చేసుకొనేది ప్రయివేటు కంపెనీలే.ఆర్థిక వ్యవస్థ మందగించినపుడు అమెరికాలో పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి వివిధ కంపెనీల ఉత్పత్తులు పడిపోకుండా ఉద్దీపన ఇచ్చారు. మనదేశంలో జరుగుతున్నది కూడా అదే. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రాణాపాయంగా మారిన గర్భిణులను డోలీల ద్వారా ఆసుపత్రులకు చేర్చటం ఒకవైపు జర్రున జారే రోడ్ల మీద తుర్రుమంటూ ప్రయాణించే తీరు మరోవైపు చూస్తున్నాం. ఎందుకిలా ? ఎక్కడ లాభం ఉంటే అక్కడే పెట్టుబడులు. గతంలో కూడా కార్మికులకు యజమానులు వేతనాలిచ్చేవారు, అవి కుటుంబ సభ్యులు, వారు మరుసటి రోజు పనిచేయటానికి అవసరమైన శక్తినిచ్చేందుకు సరిపడా మాత్రమే. ఇప్పుడు ఉత్పాదకత ఎన్నో రెట్లు పెరిగి ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సరకులు, సేవలు అమ్ముడు పోవాలంటే తగినంత మంది వినిమయదారులు కూడా ఉండాలి. అందుకే అవసరమైతే జనాలకు సబ్సిడీలు ఇచ్చి ఆ మేరకు మిగిలే సొమ్ముతో కొనుగోలు చేయించేందుకు చూస్తున్నారు. ఇంత చేసినా వినియోగం పెరగటం లేదు. ఎక్కువకాలం ఇలాగే ఉంటే పరిశ్రమలు, వాణిజ్యాలను మూసుకోవాలి. అప్పుడు కార్పొరేట్ల పెట్టుబడి వృధా అవుతుంది. కరోనా సమయంలో ఉచితంగా నగదు బదిలీ కూడా జరగాలని కొందరు సూచించారు, ఇప్పుడు వేతనాలు పెంచాలని తద్వారా జనం జేబుల్లోకి డబ్బు చేరాలని తమ సరకులు, సేవలకు మార్కెట్‌ కల్పించాలని చెబుతున్నారు. కమ్యూనిస్టులు చెబుతున్నట్లుగా హక్కుగా కోరేందుకు మాత్రం అంగీకరించరు.అవసరమైతే అణచివేస్తారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పనామా కాలువే కాదు…సప్త సముద్రాలూ, యావత్‌ భూమండలం కావాలంటాడు – డోనాల్డ్‌ ట్రంప్‌కు ఇచ్చేద్దామా !

23 Thursday Jan 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

Canada, Donald trump, Green Land, Gulf of Mexico, panama canal

ఎం కోటేశ్వరరావు

వెనుకటికి ఎవడో మీకు భయంగా ఉంటే అందరూ నా చుట్టూ ఉండండి అన్నాడట. డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా భద్రతకు ప్రపంచమంతా తనకు కావాలంటున్నాడు. ఇప్పటికే అన్ని ఖండాలలోని 80దేశాల్లో అమెరికాకు 800కు పైగా చిన్నా పెద్దా సైనిక స్థావరాలు, కేంద్రాలూ ఉన్నాయి, అవి చాలవట. ఏది కావాలంటే దాన్ని ఇచ్చేద్దామా ? అధికార స్వీకరణకు ముందు చెప్పిన మాటలను చూసి అనేక మంది డోనాల్డ్‌ ట్రంప్‌ పిచ్చివాగుడులే గద్దె నెక్కిన తరువాత బుద్ధిగా ఉంటాడు అనుకున్నారు. కానీ తరువాత వెలువడిన తొలి పలుకుల నుంచీ ఏదో తేడా కొడుతోంది అనుకుంటున్నారు. తమ కాలువ గురించి చేసిన వ్యాఖ్యలతో ఉలిక్కి పడిన పనామా దాన్ని బలవంతగా ఆక్రమించుకొనేందుకు అమెరికా చూస్తోందంటూ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. ప్రపంచ పరిణామాల్లో అమెరికా నానాటికీ ఒంటరి అవుతోంది. దానికి అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంకేమాత్రం ప్రజాస్వామిక పద్దతుల్లో వ్యవహరిస్తే లాభం లేదని భావిస్తోందా ? తన రక్షణ మరొక పేరుతో ఏది కావాలని అమెరికా కోరుకుంటే దాన్ని ప్రపంచం ఇచ్చివేయాలా ? తమ నౌకలు సప్త సముద్రాల్లో తిరుగుతాయి, వాటి మధ్యన దేశాలు ఉంటాయి గనుక అవన్నీ తమ ఆధీనంలోకి రావాలంటే పుచ్చుకోబాబూ అంటూ సమర్పించుకోవాలా ? ప్రమాణ స్వీకారానికి ముందు కెనడా తమ దేశంలో 51వ రాష్ట్రంగా విలీనం కావాలన్నాడు, పనామా కాలువను తిరిగి తీసుకుంటా, డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌ లాండ్‌ కూడా కావాల్సిందే అన్నాడు. అసలు ట్రంప్‌ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు. అధ్యక్ష ప్రసంగంలో పనామా గురించి మాత్రమే ప్రస్తావించాడు. గతంలో తమ నేతలు తెలివి తక్కువగా దాన్ని అప్పగించారని అన్నాడు. దాన్ని తిరిగి తీసుకోకుండా ప్రశాంతంగా ఒక అధ్యక్షుడు ఎలా ఉండగలడన్నాడు. అందువలన పనామా కాలువ గురించి చూద్దాం.

వలస వచ్చిన ఐరోపా శ్వేతజాతీయులు అమెరికా ఖండమంతటా విస్తరించటానికి దేవుడు తమకు ఆదేశమిచ్చాడంటూ స్థానికంగా ఉన్న రెడ్‌ ఇండయన్లను ఊచకోత కోసి ఆక్రమించుకున్నారు. తరువాత మరో రూపంలో ప్రపంచాధిపత్యం కోసం అమెరికా పూనుకుంది. డోనాల్డ్‌ ట్రంప్‌ అజెండా దాని కొనసాగింపే. దక్షిణ అమెరికాను ఆక్రమించుకున్న స్పానిష్‌ పాలకులు తమ దేశం నుంచి పెరూ చేరుకోవాలంటే నౌకల రవాణా కోసం అట్లాంటిక్‌పసిఫిక్‌ సముద్రాలను కలుపుతూ ఒక కాలువ తవ్వాలనే ఆలోచనను పదహారవ శతాబ్ది ప్రారంభంలోనే చేశారు. ఎందుకంటే పదకొండువేల కిలోమీటర్ల మేర సముద్రంలో ప్రయాణించి చేరటం దూరా భారం కనుక వారికి ఆ ఆలోచన వచ్చింది. అమెరికన్లు తొలుత నికరాగువా ద్వారా అనుసంధానం చేయాలనే ఆలోచన చేశారు, తరువాత పనామాను ఎంచుకున్నారు. దాని కంటే ముందు ఈజిప్టులో సూయజ్‌ కాలువ తవ్వారు. ఐరోపా నుంచి ఆసియాకు నౌకలు రావాలంటే ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వచ్చేవి. సమయం, ఖర్చు తగ్గించేందుకుగాను మధ్య ధ సముద్రంఎర్ర సముద్రం మధ్య ఒక కాలువ తవ్వితే అరేబియా, హిందూ మహాసముద్రాల్లోకి సులభంగా ప్రవేశించవచ్చని ఫ్రెంచి ఇంజనీర్లు ఆలోచనచేసి 185969 మధ్య కాలువ తవ్వి రవాణాకు వీలు కల్పించారు. దానిని చూసిన తరువాత పనామా కాలువను అదే ఫ్రెంచి ఇంజనీర్లు 188089 మధ్య కొంత మేరకు తవ్వి అనేక అవాంతరాలు రావటంతో నిలిపివేశారు. తరువాత అమెరికన్లు ఆ కాలువను స్వాధీనం చేసుకొని మిగతా భాగాన్ని పూర్తి చేసి 1914 నాటికి సిద్దం చేశారు. అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావటంతో ఎలాంటి ప్రారంభోత్సవాలు లేకుండా నౌకలను అనుమతించారు. ఆ యుద్దంలో అమెరికా మిలిటరీకి అది ఎంతో ఉపయోగపడిరది.1977 వరకు అమెరికా ఆధీనంలోనే ఉన్న ఆ కాలువను అనివార్య స్థితిలో పనామాకు అప్పగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దాన్ని ఒక పట్టాన వదులుకొనేందుకు సిద్దపడకుండా 1999 వరకు సాగదీసింది.తరువాత దాన్ని పనామా నవీకరించి పెద్ద ఓడలకు వీలుగా విస్తరించింది.

పనామాకు ఇచ్చింది మేం గనుక తిరిగి మాకు కావాలని ఇప్పుడు ట్రంప్‌ చెబుతున్నాడు. అదే గనుక అయితే ముందు ప్రారంభించినందున మా సంగతేమిటని ఫ్రాన్సు అడిగితే....? ఎవరైనా ఎవడబ్బ సొమ్మని అడుగుతారు ! ట్రంప్‌ చెబుతున్న కారణం ఏమిటి ? అప్పగింత ఒప్పందాన్ని ఉల్లంఘించి పనామా ఆ కాలువను చైనాకు అప్పగించినట్లు ఆరోపించాడు.సర్వసత్తాక దేశమైన తమకు తమ కాలువ నిర్వహణను ఎవరికైనా అప్పగించే హక్కుందని పనామా అధ్యక్షుడు జోస్‌ రావుల్‌ ములినో వెంటనే స్పందించాడు. కాలువను తమకు ఏదో అప్పనంగా ఇచ్చినట్లు చెప్పటాన్ని ఖండిరచాడు. ఈ మార్గంలో అమెరికా చమురు, కంటెయినర్‌ ఓడల్లో 40శాతం ప్రయాణిస్తాయంటే అదెంత కీలకమో అర్ధం అవుతోంది. తమనుంచి ఎక్కువ మొత్తంలో టోల్‌ వసూలు చేస్తున్నట్లు ట్రంప్‌ ఆరోపించాడు. ఈ కాలువ రెండు వైపులా ఉన్న రేవులను 1997 ఒప్పందం ప్రకారం హాంకాంగ్‌ కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ కంపెనీ సికె హచిసన్‌ నిర్వహిస్తున్నది. తరువాత రెండు సంవత్సరాలకు చైనాలో ప్రత్యేక ప్రాంతంగా అనుసంధానమైంది. ఆ కంపెనీలో జపాన్‌ మిత్సుబిషి, అమెరికా కంపెనీ బీచ్‌టెల్‌ కూడా భాగస్వాములే. 2049వరకు హంకాంగ్‌ చైనాలో విలీనం కాదని, అప్పటి వరకు ఆ కంపెనీతో సహా అన్నీ కూడా లావాదేవీలు జరిపేందుకు చైనా అనుమతించింది, అప్పటి వరకు ప్రత్యేక ప్రాంతంగానే ఉంటుంది.అమెరికన్లు కాలువను పూర్తిగా 1999 డిసెంబరు 31న పనామాకు అప్పగించారు. ట్రంప్‌ అసలు ఏడుపు ఏమంటే ఇటీవలి కాలంలో పనామాచైనా సంబంధాలు విస్తరించాయి.2017వరకు అమెరికా కనుసన్నలలో నడిచిన పనామా తైవాన్ను తప్ప చైనాను అసలు గుర్తించలేదు. తరువాత చైనాను గుర్తించటమే గాక బిఆర్‌ఐలో భాగస్వామిగా మారింది. పనామా కాలువకు సమాంతరంగా చమురు, గ్యాస్‌ పైప్‌ లైన్‌ ఏర్పాటు ద్వారా అదనపు రాబడి పొందవచ్చని పనామా ఆలోచిస్తున్నది. అది జరిగితే అమెరికా ఇంథనం కూడా దాని ద్వారానే సరఫరా చేయాల్సి ఉంటుంది. అంతే కాదు ప్రపంచ వాణిజ్యంలో ఆరుశాతం ఈ కాలువ ద్వారా జరుగుతున్నది, దీని వలన పనామాకు 2024లో ఐదు బిలియన్‌ డాలర్ల మేర లాభం వచ్చింది, ప్రతి డాలరును లెక్కవేసుకొనే అమెరికా కార్పొరేట్లు ఇంత మొత్తాన్ని వదులుకుంటారా ! ఈ కారణంగా కూడా ట్రంప్‌ ఆ కాలువను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాడు. మెక్సికో గల్ఫ్‌గా వ్యవహరిస్తున్నదానిని అమెరికా గల్ఫ్‌గా పేరు మారుస్తూ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశాడు. అయితే అమెరికా మాప్‌లో మాత్రమే ఆ పేరుతో ఉంటుంది, మిగతా దేశాలు తమ పటాల్లో పేరు మార్చాల్సిన అవసరం లేదు.తన చేతిలో పని గనుక పేరు మార్చాడు, పనామా కాలువను కలం పోటుతో స్వాధీనం చేసుకోగలడా ?

పనామాతో కుదురిన ఒప్పందం ప్రకారం అ కాలువ నిర్వహణలో తటస్థంగా ఉంటూ అన్ని దేశాలకు చెందిన నౌకలను అనుమతించాలని మాత్రమే ఉంది తప్ప తిరిగి అమెరికా తీసుకోవటానికి ఎలాంటి నిబంధన లేదు. హంకాంగ్‌ కంపెనీకి నిర్వహణను అప్పగించటాన్ని తటస్థ నిబంధన ఉల్లంఘన, చైనాకు అప్పగింతగా ట్రంప్‌ చిత్రించాడు. 2024 జూలైలో పనామా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ములినో ఒక మితవాది. తమ దేశంలో చైనా పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని, అమెరికా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు గతంలో చెప్పాడు.దాన్ని అవకాశంగా తీసుకోవాలని ట్రంప్‌ చూస్తున్నట్లు ఉంది. ఒక వేళ అతగాడు లొంగిపోయినా జనం అంగీకరించరు. అందుకే వ్యతిరేకిస్తూ ప్రకటన చేయాల్సి వచ్చింది.ఈ కాలువను చైనా తన మిలిటరీ అవసరాల కోసం వినియోగించుకోవచ్చని అమెరికా ఆరోపిస్తున్నది.గత పదేండ్లలో ఒక్క చైనా మిలిటరీ నౌక కూడా ఆ కాలువలో ప్రయాణించలేదు. సరకు రవాణాలో కూడా చైనా వాటా చాలా తక్కువ. ఇక పనామాలో పెట్టుబడుల విషయానికి వస్తే అమెరికా నుంచి 13 బిలియన్‌ డాలర్లు ఉంటే చైనా 51.5కోట్ల డాలర్లు మాత్రమే. అందువలన ఏ విధంగా చూసినా అమెరికాకు పోటీ కాదు, ముప్పు కూడా కాదు. పనామా కాలువను మిలిటరీ లేదా ఆర్థికపరమైన బెదిరింపుల ద్వారా అదుపులోకి తీసుకోవటం గురించి ట్రంప్‌ ఆలోచన కూడా చేయవద్దని రష్యా హెచ్చరించింది. పనామాను మరోసారి దురాక్రమణ చేస్తే తప్ప కాలువను స్వాధీనం చేసుకొనే అవకాశం లేదు. ఆ కాలువ ఐదువందల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంది. దేశ జనాభా 45 లక్షలు. దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే 90వేల మంది సైనికుల అవసరం ఉంటుందని మిలిటరీ అధికారులు అంచనావేశారు. దీన్ని బట్టి ఎక్కడ ఎలా దాడి చేయాలో ఎంత మంది సైనికులు అవసరమో అన్నీ సిద్దం చేసుకున్నదనుకోవాలా ? అలాంటి దుండగానికి పాల్పడితే దక్షిణ అమెరికా దేశాలన్నీ మౌనంగా ఉంటాయా ! ఫ్రెంచి కంపెనీ పనామా కాలువ తవ్వకం ప్రారంభించిన సమయంలో పనామా ప్రాంతం కొలంబియాలో ఉంది. ఆ కాలువను అమెరికా తీసుకోవాలని నిర్ణయించిన తరువాత కొలంబియా అంగీకరించకపోవటంతో పనామాకు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ అమెరికా తన మిలిటరీని పంపింది. తరువాత కాలువ పరిసరాలను ఆక్రమించి పనామాను రెండుగా మార్చింది. కాలువ కోసం తరువాత పనామాలో అనేక ఉద్యమాలు జరిగాయి. దాంతో అమెరికా వైదొలగక తప్పలేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతు నేత దల్లేవాల్‌కు వైద్యం : ఫిబ్రవరి 14నచర్చలు ! మద్దతు ధరల చట్టబద్దతపై మోడీ దిగివచ్చేనా !!

19 Sunday Jan 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

BJP, farm crisis, Farmers agitations, Jagjit Singh Dallewal, MSP demand, Narendra Modi Failures, SKM

ఎం కోటేశ్వరరావు


నవంబరు 26వ తేదీ నుంచి రైతుల సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చారాజకీయ రహిత సంస్థ కన్వీనర్‌ జగత్‌సింగ్‌ దల్లేవాల్‌ జనవరి 18వ తేదీ అర్ధరాత్రి వైద్య చికిత్సకు అంగీకరించారు, ఆ మేరకు ప్రభుత్వ వైద్యులు తగిన చర్యలను ప్రారంభించారు. ఫిబ్రవరి 14వ తేదీన చండీఘర్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయ రహిత), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ప్రతినిధులతో కేంద్ర అధికారులు చర్చలు జరిపారు. ఏడు పదుల వయస్సున్న దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్న పూర్వరంగంలో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు పోవాలని చర్చలు జరపటం, బిజెపికి కీలకమైన ఢల్లీి ఎన్నికలు, దల్లేవాల్‌కు మద్దతుగా మరో 121 మంది నిరవధిక దీక్షలకు పూనుకోవటం, కేంద్ర ప్రభుత్వంపై రోజు రోజుకూ వత్తిడి పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ మేరకు దిగివచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ రైతుల గురించి మాట్లాడరు, రైతు ప్రతినిధులతో మాట్లాడేందుకు సమయం లేదంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు.కోట్లాది మంది రైతుల గురించి చర్చించేందుకు సమయం లేదనటాన్ని బట్టి ఎవరి ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టం అయింది. బడ్జెట్‌పై చర్చలంటూ రైతు ప్రతినిధులను మినహా మిగిలిన వారందరినీ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించి చర్చలను జరిపింది. వీటన్నింటినీ చూసినపుడు వచ్చే నెలలో జరిగే చర్చల్లో ఒరిగేదేమిటి అన్నది పెద్ద ప్రశ్న.ఈనెల 31న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇతర సమస్యలతో పాటు రైతుల గురించి ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, గతంలో రైతు ఉద్యమం సందర్భంగా మరణించిన వారికి పరిహారం, లఖింపూర్‌ ఖేరీ హింసా కాండ బాధితులకు న్యాయం,2013 భూసేకరణ పరిహార చట్ట పునరుద్దరణ,రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌, రైతుల రుణమాఫీ వంటి అంశాలపై రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.

బడ్జెట్‌ ప్రవేశపెట్టబోయే ముందు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వివిధ తరగతుల ప్రతినిధులతో చర్చలు జరపటం ఒక తంతుగా జరుగుతున్నది. అన్ని రోడ్లూ రోమ్‌కే అన్నట్లుగా ఏ పార్టీ చరిత్ర చూసినా గర్వకారణం ఏమీ లేదు. సంపదలలో పెద్ద పీట కార్పొరేట్‌ శక్తులకే వేస్తున్న కారణంగానే అసమానతలు ఏటేటా పెరుగుతున్నాయి. తంతుగా అయినా బడెట్‌ చర్చకు రైతు సంఘాలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు. కొంత మంది కొన్ని పోలికలు తెస్తున్నారు. వాటిలో ఉద్యోగులకు వేతన కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయించిందిగానీ రైతులకు ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించటం లేదన్నది వాటిలో ఒకటి. దీనిలో రెండవది వాస్తవం, ఉద్యోగులకు పది సంవత్సరాల తరువాత వేతన కమిషన్‌ ఏర్పాటును దీనికి ముడి పెట్టనవసరం లేదు. పదేండ్లకు ఒకసారి వేతన సవరణ ద్వారా వారికి అన్యాయమే జరుగుతున్నది తప్ప న్యాయం కాదు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, ఇతర అంశాల గురించి పరిశీలించేందుకు 2022 జూలైలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతవరకు అది ఏమి చేసిందో ఎవరికీ తెలియదు, వారు నివేదిక సమర్పించరు, ప్రభుత్వమూ అడగదు, అంతా ఒక నాటకంగా మారింది. ఈ లోగా 2021లో క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తీసుకున్న మూడు సాగు చట్టాలను మరో రూపంలో ముందుకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశంలో భూ కమతాలు పద్నాలుగు కోట్లకు పైగా ఉన్నాయి. వాటిలో 88శాతం రెండున్నర ఎకరాల లోపు కలిగిన రైతులే ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదంటూ వారందరినీ కార్పొరేట్లకు అప్పగించేందుకు తన బాధ్యతను వదిలించుకొనేందుకు కేంద్రం చూస్తున్నది.ఒకసారి అది జరిగితే రాష్ట్రాలు కూడా అదేబాట పడతాయి.పరిశ్రమలు, వాణిజ్యాలకు అనేక రక్షణలు, రాయితీలు ఉన్నాయి. వాటి మాదిరిగానే తమకూ కల్పించాలని రైతులు కోరటం గొంతెమ్మ కోర్కె కాదు. కనీస మద్దతు ధరను ఒక్క హక్కుగా చట్టబద్దం చేయాలని కోరుతున్నారు.

పారిశ్రామిక ఉత్పత్తులకు, ఎగుమతులకు, దిగుమతులకూ రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతులను ఎందుకు విస్మరిస్తున్నది, పోనీ వ్యవసాయం ఉపాధి కల్పించటం లేదా పరిశ్రమలు, సేవారంగాల కంటే ఎక్కువ 44శాతం మందికి కల్పిస్తున్నది. సంఘటితంగా పోరాడే స్థితిలో వారు లేకపోవటం తప్ప మరొకటి కనిపించటం లేదు. మనకు అవసరమైన వంట నూనెల్లో 60శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, దానికి ఎన్నో రాయితీలు ఇస్తున్నది ప్రభుత్వం కానీ ఇక్కడ నూనె గింజలు పండిరచేవారికి ధరల గురించి ఒక హామీ ఇవ్వటానికి ముందుకు రావటం లేదు.మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదలివేస్తున్నది. గతేడాది సోయా, ఆవ రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువే పొందారు. మరోవైపున బియ్యం, గోధుమలు, ఉల్లి, పంచదార వంటి వాటి ఎగుమతుల మీద నిషేధం పెట్టి మార్కెట్లో రైతులకు అన్యాయం చేశారు. వినియోగదారులకు మేలు చేయటం అంటే రైతుల నోట్లో మట్టికొట్టటం కాదు కదా ! ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే తక్కువకు రైతుల నుంచి చెరకును మిల్లులు కొనుగోలు చేయకూడదు(అది గిట్టుబాటు కావటం లేదు). అదే మాదిరి ఇతర పంటలకు ప్రభుత్వం ఎందుకు హామీ ఇవ్వటానికి నిరాకరిస్తున్నది ? కనీస వేతన చట్టాన్ని అమలు జరపకపోతే కార్మికులు కోర్టులకు ఎక్కే హక్కు ఉంది, కానీ రైతులకు కనీస మద్దతు ధరలకు అలాంటి అవకాశం లేదు. దాదాపు పదిహేను కోట్ల మంది రైతులు ఉండగా వారిలో తొమ్మిది కోట్ల మందికి ఏటా ఆరువేల రూపాయలు ఇచ్చి అదే మహాభాగ్యం అని చెబుతున్నది. తప్పుల తడకలతో కూడిన గణాంకాలు( వివిధ సూచికలను ప్రకటించినపుడు ప్రభుత్వమే అలా చెబుతున్నది. ఉదా : దేశ ఆకలి సూచిక) వెల్లడిరచినదాని ప్రకారం 2004-05లో వ్యవసాయ వాణిజ్య సూచిక 87.72గా ఉన్నది 2010-11 నాటికి 102.95కు పెరిగింది.దాని ప్రకారం పెట్టుబడుల కంటే పంటల అమ్మకం ద్వారా ఎక్కువ పొందారని భాష్యం చెప్పారు. అదే 202223లో ఆ సూచిక 97.21కి పడిపోయింది. అంటే రైతులు పొందుతున్నది తగ్గిపోయింది. అందుకే రైతుల కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కోరుతున్నారు.


రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మూడు సంవత్సరాల తరువాత కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన మరో రూపంలో ముందుకు తీసుకురావటం ఆందోళన కలిగించే అంశం. నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ పాలసీ(నాంప్‌)ని 2024 నవంబరు 25న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ఆధ్వర్యాన డిసెంబరు 23న దేశమంతటా నిరసన తెలిపారు. అనేక మంది నిపుణులు విమర్శించారు. దాని మీద అభిప్రాయాలు తెలిపేందుకు కేవలం పదిహేను రోజులు మాత్రమే కేంద్రం గడువు ఇచ్చింది. ఇప్పుడున్న మార్కెటింగ్‌ వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవని కాదు, దాన్ని సంస్కరించకూడదని ఎవరూ చెప్పటం లేదు. అయితే ఆ పేరుతో ఇప్పుడున్నదాని కంటే ప్రమాదకరమైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయద్రవ్య పెట్టుబడి సంస్థలు సూచించిన పద్దతిలో సమూల మార్పులు ప్రతిపాదించటం ఆందోళనకరం. దాని ప్రకారం దేశమంతటిని అనుసంధానించే ఒకే మార్కెట్‌ను ఏర్పాటు చేస్తారు. ఇదంతా చిన్న రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాల కంటే కార్పొరేట్లకే ప్రాధాన్యత ఇచ్చే వ్యవహారం.రైతులు ముడి సరకును సరఫరా చేసేవారిగా మాత్రమే ఉంటారు.వాటి నుంచి ఉత్పత్తులు తయారు చేయటం,వాణిజ్యం, ఎగుమతి అంతా కార్పొరేట్లదే. ఈ క్రమంలో తేలే మిగులులో రైతుల వాటా గురించి ఎక్కడా స్పష్టత లేదు. అంతే కాదు కనీస మద్దతు ధరలకు ఎలాంటి హామీ ప్రస్తావన కూడా లేదు.అలాంటి ఉద్దేశ్యం ఉంటే ఈ పాటికి కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఒక స్పష్టత ఇచ్చి ఉండేది. రైతాంగానికి గరిష్ట ప్రయోజనం, డిజిటల్‌, పారదర్శకత, జాతీయ మార్కెట్‌ సమాచారం వంటి పదజాలం ఎంతగా వల్లించినా వాటిని వినియోగించుకొనే అవకాశం ఎంత మంది రైతులకు ఉంటుందన్నది ప్రశ్న. ఇప్పుడు అనేక నియంత్రణలు ఉన్నా వాటిని ఖాతరు చేయకపోవటం, దొడ్డిదారిన ఉల్లంఘిస్తున్న కంపెనీలపై అసలు ఎలాంటి నియంత్రణలు ఉండకూడదని ఈ ప్రతిపాదనల్లో ఉన్నది. వ్యవసాయ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఈ విధానంతో రాష్టాల హక్కులు, నియంత్రణలకు నీళ్లదులుకోవాల్సిందే. అమల్లోకి వచ్చిన తరువాత గానీ ఇతర మంచి చెడ్డలు వెల్లడి కావు.

ఫిబ్రవరి 14వ తేదీన కేంద్ర, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరిగే చర్చల అజెండా ఏమిటో తెలియదు. ఎవరెవరు పాల్గ్గొనేదీ ఇంకా స్పష్టం కాలేదు. ఒకటి మాత్రం స్పష్టం, ఇది ఒక రోజులో తేలే వ్యవహారం కాదు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని 2012లోనే సిఎంగా ఉండగా నరేంద్రమోడీ కమిటీ నాటి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీని గురించి తాజా పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసినా మోడీ మొరాయిస్తున్నారు. పార్లమెంటరీ కమిటీ సిఫార్సును అమలు చేయాలంటూ కేంద్రానికి సూచించాలని రైతు సంఘాల నేతలు సుప్రీం కోర్టును కోరారు. వ్యవసాయ గ్రాంట్లపై ఏర్పాటైన కమిటీ 202425 నివేదికను గతేడాది డిసెంబరు 20న పార్లమెంటుకు సమర్పించింది.దీన్ని కేంద్రం ఆమోదిస్తే అమలుకు ఉపక్రమించాలి తిరస్కరిస్తే కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటరీ కమిటీ చేసిస సిఫార్సు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజన మొత్తం రు. ఆరువేలను పన్నెండు వేలకు పెంచాలి.(దాన్ని చూసి కొంత మంది అమలు జరగనున్నట్లు ప్రచారం చేశారు) ఈ ప్రోత్సహకాన్ని కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు కూడా ఇవ్వాలి. కనీస మద్దతు ధరల చట్టబద్దతకు ఒక రోడ్‌ మాప్‌ను సాధ్యమైనంత త్వరలో ప్రకటించాలి. వ్యవసాయ కార్మికులకు కనీస జీవన వేతనాల నిమిత్తం జాతీయ కమిషన్‌ ఏర్పాటు. రైతులు, వ్యవసాయ కార్మికులకు రుణాల రద్దు పధకాన్ని ప్రవేశ పెట్టాలి.వ్యవసాయ శాఖ పేరులో వ్యవసాయ కార్మికుల పేరును కూడా చేర్చాలి.

కనీస మద్దతు ధరలకు అనుకూల వాదనల సారం ఇలా ఉంది. రైతులకు ధరల మీద ఒక చట్టబద్దత ఉంటుంది. మార్కెట్‌ వడిదుడుకుల నుంచి రక్షణ ఉంటుంది. మధ్యవర్తుల దోపిడీ నిరోధంగా ఉంటుంది.ఉత్పత్తి ఖర్చులను భరించేందుకు, ఆర్థిక పరమైన భద్రతను మెరుగుపరచుకొనేందుకు స్థిరమైన రాబడికి వీలు కలిగిస్తుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉత్పాదకత, సామర్ధ్యాలను పెంచుతుంది. ఆహార భద్రత, కొరతలను తీరుస్తుంది, దారిద్య్ర తగ్గింపుకు తోడ్పడుతుంది.రైతాంగ జీవనాన్ని మెరుగుపరుస్తుంది. మార్కెట్‌ వడిదుడుకులను తగ్గిస్తుంది. వ్యతిరేకించే వారేమంటారంటే.. మార్కెట్లో అసమతూకానికి దారితీస్తుంది, కొన్ని పంటలను అవసరాలకు మించి ప్రోత్సహిస్తుంది. సరఫరాఅవసరాల తీరు తెన్నులను విచ్చిన్నం చేస్తుంది.ప్రభుత్వాల మీద భారం మోపుతుంది, మిగులును కొని నిల్వచేయాల్సిన అవసరాన్ని పెంచుతుంది.వనరుల కేటాయింపులో అసమర్ధతకు దారి తీస్తుంది. పంటల వైవిధ్యానికి బదులు కొన్ని పంటలనే ప్రోత్సహిస్తుంది.అవినీతిని ప్రోత్సహిస్తుంది. మధ్యవర్తులు అవకాశంగా తీసుకొని రైతులకు లబ్దిని తగ్గిస్తారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలను అడ్డుకుంటుంది,ప్రతిదానికీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సి ఉంటుంది. మార్కెట్‌ వ్యవస్థలో పోటీని తగ్గిస్తుంది. రైతులు కొత్త పద్దతులవైపు చూడకుండా కనీస మద్దతు ధరల మీద ఆధారపడతారు,మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మారరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాకేజ్‌ ఉపశమనమే : విశాఖ ఉక్కుపై వేలాడుతున్న ప్రయివేటు కత్తి !

18 Saturday Jan 2025

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

:vizag steel package, BJP, CHANDRABABU, Narendra Modi Failures, VISVESVARAYA IRON AND STEEL FACTORY, vizag-steel-plant


ఎం కోటేశ్వరరావు


ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కును ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం రు.11,440 కోట్ల పాకేజ్‌ను ప్రకటించింది.ఆ మొత్తంలో రు.10,300 కోట్లు ఈక్విటీ వాటా సొమ్ముగా, మిగిలిన మొత్తం నిర్వహణ రుణం. అది గ్రాంటు కాదు.అయినా కనుక కొంత మేలు కలుగుతుంది. తీవ్రంగా ఉన్న రోగికి నొప్పి తగ్గించే మాత్ర ఇస్తే తాత్కాలిక ఉపశమనం తప్ప జబ్బు పోయినట్లు కాదు.ఈ మాత్రానికే తెలుగుదేశం శ్రేణులు సంబంరాలు చేసుకుంటున్నాయి. ఇది రెండిరజన్ల పాలన కారణంగానే జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపి పలుకులు వల్లిస్తున్నారు. ప్రయివేటీకరణ ముప్పు తొలగిపోయినట్లు నమ్మించేందుకు చూస్తున్నారు. ఆంధ్రుల ఆకాంక్షలను కేంద్రం గమనించిందని చిత్రిస్తున్నారు. ఈ పదజాలం నరేంద్రమోడీని పొగిడేందుకు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.నిజానికి బిజెపికి మతపరమైన మనోభావాలు తప్ప ఇతర అంశాలు పట్టవు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్దం ఆయన పేరు పెట్టిన భద్రావతి ఉక్కునే అమ్మేందుకు చూసిన వారికి విశాఖ ఉక్కు ఒక లెఖ్కా. దాన్ని రక్షించుకొనేందుకు 1,390 రోజులుగా కార్మికులు,వామపక్ష పార్టీలకు చెందిన వారు ఏదో ఒక రూపంలో నిరసన తెలియచేస్తూనే ఉన్నారు. ఈ ప్లాంట్‌ ఉనికిలోకి వచ్చిన నాలుగుదశాబ్దాల కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగానే ఉంది తప్ప ఆ సంస్థను నిలబెట్టేందుకు అవసరమైన మౌలిక చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రెండిరజన్ల పాలన కారణంగానే పదకొండువేల కోట్ల పాకేజ్‌ వస్తే కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండగా అక్కడి భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఉక్కు కర్మాగారానికి నెల రోజుల క్రితమే ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి పదిహేనువేల కోట్ల పాకేజ్‌ను ప్రకటించటాన్ని ఎలా చూడాలి. ఆ సంస్థ పునరుద్దరణకు పదివేల కోట్లు అవసరమని గతంలో చెప్పిన మంత్రి పదిహేనువేల కోట్ల పాకేజ్‌ ప్రకటించారు, 26వేల కోట్ల అప్పులున్న విశాఖ స్టీలుకు పదకొండున్నరవేల కోట్లా ? గొప్పలు చెప్పుకొనేందుకు కాస్త వెనుకా ముందు చూసుకోవాల్సిన అవసరం లేదా ? జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ? విశాఖ ఉక్కు లాభాలతో నడిచేందుకు అవసరమైన స్వంత గనుల గురించి, సెయిల్‌ సంస్థలో విలీనం గురించి రెండిరజన్ల పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు.


భద్రావతి ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారాలను గమనించినపుడు ఒక వేళ విశాఖ ఉక్కును సెయిల్‌ సంస్థలో విలీనం చేసినా ప్రైవేటీకరణ ముప్పు ఉండదనే హామీ లేదు.భద్రావతి ఉక్కు సెయిల్లోనే ఉంది. అయినప్పటికీ దాన్ని మూసివేయాలని, విక్రయించాలని అదే సంస్థగతంలో నిర్ణయించటమే గాదు టెండర్లను కూడా పిలిచింది. లోక్‌సభ ఎన్నికలు జరిగి మూడోసారి నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2024జూన్‌ 30వ తేదీన మంత్రి కుమారస్వామి ఆ సంస్థను సందర్శించి తిరిగి పనిచేయిస్తామని వాగ్దానం చేశారు.అది జరిగిన నెల రోజులకు జూలై 30వ తేదీన అదే మంత్రిత్వశాఖ లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో దాన్ని ఇప్పటికే మూసివేయాలని నిర్ణయించామని అందువలన తిరిగి పనిచేయించే ఉద్దేశ్యం లేదని స్పష్టంగా పేర్కొన్నది. ప్రశ్న అడిగింది ఎవరో కాదు, షిమోగా బిజెపి ఎంపీ బివై రాఘవేంద్ర(మాజీ సిఎం ఎడియూరప్ప కుమారుడు). దానికి ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సమాధానం ఇచ్చారు. 2016 అక్టోబరులోనే సూత్రప్రాయంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానం కింద ఫ్యాక్టరీని అమ్మివేసేందుకు అనుమతి ఇచ్చినట్లు, అయితే దరఖాస్తు చేసిన వాటిలో ఎంపిక చేసిన సంస్థలు తదుపరి ముందుకు పోయేందుకు ఆసక్తి చూపకపోవటంతో అమ్మివేయాలనే నిర్ణయాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. తరువాత దాన్ని మూసివేసేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు.ఈ విషయాన్ని 2022 అక్టోబరు 14వ తేదీన పెట్టుబడుల మరియు ప్రభుత్వ ఆస్తుల యాజమాన్యశాఖకు తెలియచేసినట్లు కూడా మంత్రి తెలిపారు.ప్రస్తుతం 245 మంది పర్మనెంటు ఉద్యోగులు ఉన్నట్లు అనుబంధ సంస్థలు పంపిన కొన్ని పూర్తిగాని ఉత్పత్తులకు మెరుగులు దిద్దుతున్నట్లు, 202324లో అమ్మకానికి వీలైన పదమూడువేల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. నాలుగోసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ ఉక్కు ఫ్యాక్టరీని పునరుద్దరింప చేయటంలో విఫలమైనట్లు కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున రాఘవేంద్రపై విమర్శల దాడికి దిగటంతో ప్రశ్న అడగాల్సి వచ్చింది.

వంద సంవత్సరాల క్రితం మైసూరు రాజు నలవాది కృష్జరాజ వడయార్‌ రాజ్యంలో దివానుగా ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీ మైసూర్‌ ఐరన్‌ వర్క్స్‌ పేరుతో 1923లో భద్ర నది తీరంలో ప్రారంభమైంది.ఇతర లోహాలతో మిళితం చేసి ప్రత్యేకమైన ఉక్కును తయారు చేసిన దేశంలోని తొలి ఫ్యాక్టరీ ఇది. తరువాత మైసూర్‌ ఐరన్‌ మరియు స్టీల్‌ వర్క్స్‌గా మారింది. 1962లో 40:60శాతం వాటాలతో కేంద్రకర్నాటక ప్రభుత్వ కంపెనీగా ఉనికిలోకి వచ్చింది.1975లో విశ్వేశ్వరయ్య ఐరన్‌ మరియు స్టీల్‌ లిమిటెడ్‌ అని నామకరణం చేశారు. 1989లో సెయిల్‌ అనుబంధ సంస్థగా జతచేసి 1998లో విలీనం చేశారు.2004లో లాభాల బాట పట్టిన సంస్థ తరువాత నష్టాలపాలైంది.తరువాత సెయిల్‌ దాన్ని మూసివేసి విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఫ్యాక్టరీ మూసివేత, అమ్మివేత నిర్ణయం రెండిరజన్ల పాలనలోనే జరిగింది.కర్ణాటకలో అప్పుడు బిజెపి అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత కూడా మూసివేతకే కట్టుబడి ఉన్నట్లు అది స్పష్టంగా చెప్పింది.ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, తక్కువ పరిమాణంలో ఉత్పత్తి ఉందని, పాతబడిన సాంకేతిక పరిజ్ఞానం, కాపిటివ్‌ మైన్స్‌ కూడా లేవని, అల్లాయ్‌ ఉక్కు రంగంలో పోటీ ఎక్కువగా ఉందని 2023లో ఉక్కుశాఖ మంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా పార్లమెంటులో వాదించారు. నాటకీయ పరిణామాల మధ్య గతేడాది డిసెంబరులో దాని పునరుద్దరణకు పదిహేనువేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు.అయితే నిర్దిష్ట చర్యలేవీ ఇంతవరకు ప్రారంభం కాలేదు, అది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందా లేక ఏదో ఒకసాకుతో అయినకాడికి తెగనమ్మి వదిలించుకుంటారా అన్నది చెప్పలేము.


భద్రావతి ఉక్కుతో పోలిస్తే విశాఖ ఉక్కు ఎంతో అధునాతనమైన సంస్థ.ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖలోని అతి పెద్ద కంపెనీ. ఏది పెద్దది ఏది చిన్నది అన్న చర్చ అవసరం లేదు. రెండిరటినీ రక్షించుకోవాల్సిందే. ఇప్పుడు రెండు సంస్థలకూ కేంద్ర ప్రభుత్వం పాకేజీలను ప్రకటించాల్సి వచ్చింది.దీనికి కారణం కేంద్రంలో బలాబలాల్లో వచ్చిన మార్పే అన్నది స్పష్టం. ఎవరి మద్దతు అవసరం లేకుండా స్వంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం నరేంద్రమోడీకి లోక్‌సభ వచ్చినపుడు కళ్లు నెత్తికెక్కాయంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి అధికారానికి వచ్చినపుడు విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గట్టిగా అడిగింది లేదు, జగన్మోహనరెడ్డి ఏలుబడి సంగతి తెలిసిందే. రెండు పార్టీలూ మోడీకి మద్దతు ఇవ్వటంలో పోటీ పడ్డాయి. భద్రావతి ఉక్కును పునరుద్దరించాలని బిజెపి నేత యడియూరప్ప నాయకత్వంలో ఆ పార్టీ ప్రతినిధివర్గం నరేంద్రమోడీని కలిసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.బిజెపికి దూరంగా ఉన్న కారణంగా అప్పుడు దేవెగౌడ పాలనలో తగిన చర్యలు తీసుకొని ఉంటే మూతపడే పరిస్థితి వచ్చేది కాదని ఎడియూరప్ప కుమారుడు, ఎంపీ రాఘవేంద్ర నెపాన్ని ఆయన మీదకు నెట్టేందుకు చూశారు. భద్రావతి ఉక్కును కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాని కారణంగా అది అలాగే ఉండిపోయింది తప్ప లేకుంటే తుక్కు కింద ఎప్పుడో మారి ఉండేది.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 33వేల ఎకరాల్లో ఉంది.అందువలన అమ్మకానికి పెడితే దాన్ని ఎగరేసుకు పోయేందుకు సిద్దంగా ఉన్నారు.ఆ ఫ్యాక్టరీ కోసం ప్రాణాలర్పించిన వారుగానీ, దానికి భూములు ఇచ్చిన వారు గానీ పప్పుబెల్లాల్లా పందారం చేసి కారుచౌకగా ఎవరికో కట్టబెట్టేందుకు కాదు. ఇప్పటి వరకు ప్రైవేటీకరణ విధానంలో మార్పు చేసినట్లు కేంద్రం ఎక్కడా చెప్పటం లేదు. అందువలన తెలుగుదేశం, జనసేన నేతల మాటలు నమ్మనవసరం లేదు. తీరా వేటు పడిన తరువాత మేము చేయాల్సిందంతా చేశామని చేతులు దులుపుకుంటారు. ఇప్పటివరకు ఎంతో పట్టుదలతో ఉన్న కార్మికులు, వారికి మద్దతుగా ఉన్న వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలను మరింతగా జనం ఆదరించి నిలబడితే ప్రైవేటీకరణ ముప్పును తిప్పికొట్టటం అసాధ్యం కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల క్రితం వెలిగిన ప్రభ మసకబారింది, కెనడా ప్రధాని రాజీనామా !

08 Wednesday Jan 2025

Posted by raomk in Current Affairs, Economics, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Canada Political Crisis, Donald trump, Justin Trudeau

ఎం కోటేశ్వరరావు


అతడు పది సంవత్సరాల క్రితం లిబరల్‌ పార్టీకి అనూహ్య విజయం చేపట్టిన నేతగా నీరాజనాలు అందుకున్నాడు. ఇప్పుడు అతని ఉనికి పార్టీని పాతాళానికి దించుతుందంటూ అదే పార్టీ నేతలు తూర్పారపడుతున్నారు. అతడే కెనడా ప్రధాని, అంతకు ముందు ప్రకటనల మోడల్‌గా పనిచేసిన 53 సంవత్సరాల జస్టిన్‌ ట్రుడేవ్‌. ఇంటా బయటా తలెత్తిన పరిస్థితి కారణంగా ఉక్కిరి బిక్కిరితో పార్టీ, ప్రభుత్వ పదవి నుంచి తప్పుకొంటూ సోమవారం నాడు ఆకస్మికంగా రాజీనామా ప్రకటన చేశాడు.ఈ నెల 27న ప్రారంభం కావాల్సిన పార్లమెంటు సమావేశాలను మార్చి 24వరకు సస్పెండ్‌ చేశారు. వెంటనే పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. పార్లమెంట్‌ ప్రారంభం కాగానే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతామని మూడు ప్రధాన పార్టీలు ప్రకటించాయి. అదే జరిగితే ప్రభుత్వ పతనం ఖాయం. ట్రుడేవ్‌ ప్రకటన వెలువడిన వెంటనే డోనాల్డ్‌ ట్రంప్‌ స్పందించాడు. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా విలీనం కావటం మంచిదని గతంలో చేసిన ప్రకటనను పునరుద్ఘాటించాడు. అది అందరికీ మంచిదన్నాడు, రష్యా, చైనాల నుంచి పోటీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదన్నాడు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎన్నుకొనేంత వరకు ట్రుడోవ్‌ పదవుల్లో కానసాగుతాడు. వారం రోజుల్లో కొత్తనేతను ఎంపిక చేస్తామని లిబరల్‌ పార్టీ ప్రకటించింది. పార్టీలో తలెత్తిన కుమ్ములాటల కారణంగా పలుకుబడి పాతాళానికి పడిపోవటం, ఆర్థిక మంత్రి రాజీనామా, ఆర్థికంగా అనిశ్చితి, వాణిజ్య యుద్ధానికి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన తదితర అనేక కారణాలతో ట్రుదేవ్‌ రాజీనామా ప్రకటన చేస్తూనే తాను పోరాటయోధుడనని కొందరి మాదిరి వెనక్కు తగ్గేవాడిని కాదని చెప్పుకుంటూనే దేశానికి నిజమైన నేత అవసరమని, పార్టీలో అంతర్గత పోరు కారణంగా వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించటానికి తాను తగిన వాడిని కాదని, ఈ అంశంతో పాటు ప్రభుత్వంలో సంక్షోభం రాజీనామాకు కారణాలని కూడా చెప్పుకున్నాడు. తాను తొలిసారి పదవిలోకి వచ్చినప్పటికంటే రెండోసారి మెరుగైన విజయాలను సాధించానని, ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టకపోవటం పట్ల విచారిస్తున్నా అన్నాడు. రాజీనామా చేయటానికి ముందు అనేక మంది స్వంత పార్టీ ఎంపీలు గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.ట్రుడేవ్‌ ఏ మాత్రం కొనసాగినా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని అనేక సర్వేలు వెల్లడిరచాయి. గడచిన రెండు ఎన్నికల్లోనూ లిబరల్‌ పార్టీ తక్కువ శాతం ఓట్లతో ఎక్కువ సీట్లు తెచ్చుకొని మైనారిటీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.2021లో జరిగిన ఎన్నికల్లో 338 పార్లమెంటు స్థానాలకు గాను 160 సీట్లు తెచ్చుకున్న లిబరల్‌ పార్టీకి 32.62శాతం ఓట్లు రాగా ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ పార్టీకి 33.74శాతం ఓట్లు 119 సీట్లు వచ్చాయి. న్యూడెమోక్రటిక్‌ పార్టీ(ఎన్‌డిపి)కి 17.82శాతం ఓట్లు 25 సీట్లు వచ్చాయి. ఈ పార్టీ మద్దతుతో ట్రుడేవ్‌ నెట్టుకువచ్చాడు.


గతేడాది సెప్టెంబరులో న్యూడెమోక్రటిక్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవటంతో అస్థిర పరిస్థితి ఏర్పడిరది. 2025 అక్టోబరు వరకు పార్లమెంటు వ్యవధి ఉన్నప్పటికీ ఏ క్షణంలోనైనా పార్లమెంటు రద్దు, మధ్యంతర ఎన్నికలు రావచ్చని భావించారు. అయితే సమస్యను బట్టి తాము మద్దతు లేదా వ్యతిరేకించటం చేస్తామని ఎన్‌డిపి ప్రకటించటంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అయితే డిసెంబరు 16న ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీ లాండ్‌ రాజీనామాతో పాలకపార్టీలో లుకలుకలు తీవ్రమయ్యాయని చెప్పవచ్చు. ఆమెతో జరిపిన ‘‘ప్రైవేటు సంభాషణ’’ ల గురించి తాను చెప్పలేనని, ఆమె రాజీనామాయే తన నిర్ణయానికి దారితీసిందని గానీ లేదని తాను చెప్పనని ట్రుడేవ్‌ విలేకర్లతో చెప్పాడు.ఇటీవలి వరకు ట్రుడేవ్‌ మైనారిటీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వామపక్ష న్యూ డెమోక్రటిక్‌ పార్టీ నేత జగ్‌మీత్‌ సింగ్‌ తాజా పరిణామాలపై వ్యాఖ్యానిస్తూ తరువాత లిబరల్‌ పార్టీ నేత ఎవరుంటారన్నది సమస్య కాదు.వారు జనాన్ని మోసం చేశారు, మరోసారి అవకాశానికి అనర్హులు అన్నాడు. 


2015 ఎన్నికల్లో అనూహ్యంగా లిబరల్‌ పార్టీ అంతకు ముందు మూడవ పెద్ద పార్టీగా 36 సీట్ల నుంచి ఏకంగా 184 సంపాదించి తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.2019లో 157 సీట్లకు పడిపోయింది, మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ట్రడేవ్‌ 2021లో పార్లమెంటును రద్దు చేసి సెప్టెంబరులో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఓట్లు తగ్గినా 160 సీట్లతో మరోసారి మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు లిబరల్‌ పార్టీ ఎన్నుకొనే కొత్త నాయకత్వం పార్లమెంటులో బలనిరూపణ చేసుకుంటుందా, పార్లమెంటును రద్దు చేసి ముందస్తుకు వెళతారా అన్నది తెలియదు. ఎవరు బాధ్యతలు చేపట్టినప్పటికీ ట్రుడెవ్‌ తెచ్చిన అపఖ్యాతిని మోయాల్సి ఉంటుంది.2019 ఎన్నికల్లో ట్రుడేవ్‌పై అనేక విమర్శలు వచ్చాయి. వయస్సు తక్కువగా కనిపించేందుకు ముఖానికి రంగువేసుకొని తీయించుకున్న ఫొటోలతో ప్రచారం చేసుకున్నాడని ప్రతిపక్షాలు విమర్శించాయి.అనేక అవకతవకల విమర్శలు వచ్చాయి. ధనికదేశాల జి7 కూటమిలో అత్యధికంగా తొమ్మిది సంవత్సరాలు అధికారంలో కొనసాగిన రికార్డును ట్రుడేవ్‌ నెలకొల్పాడు.


పెరుగుతున్న ధరలు రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయని రెండు సంవత్సరాల క్రితం 33శాతం మంది కెనడా పౌరులు చెబితే 2024లో 45శాతానికి పెరిగినట్లు సామాజిక సర్వే వెల్లడిరచింది. ఇండ్ల అద్దెలు భరించలేకుండా ఉన్నామని 38శాతం చెప్పారు.2021 నుంచి ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల వలన ప్రతి ఐదుగురిలో ఒకరు సామాజిక సంస్థల నుంచి తక్కువగానో ఎక్కువగానో ఆహారాన్ని పొందినట్లు చెప్పారు. ఆర్థిక సమస్యలతో స్వల్పంగా లేదా తీవ్రంగా మానసిక వత్తిడికి గురైనట్లు 35శాతం చెప్పారు. తక్కువ ఆదాయం వచ్చే వారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అద్దె ఇండ్లలో ఉండేవారిలో జీవన సంతృప్తి చాలా తక్కువగా ఉంది.వయసు మీరిన వారికంటే యువత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది.2544 సంవత్సరాల వయస్సులో ఉన్నవారిలో 55శాతం మంది ధరల పెరుగుదల గురించి ఆందోళన వెల్లడిరచారు.వృద్ధులలో 28శాతం ఉన్నారు. ఫుడ్‌ బాంకులు, సామాజిక సంస్థల నుంచి ఆహారాన్ని పొందుతున్నవారు యువకులలో 4647శాతం ఉండగా వృద్దులలో 27`28శాతం ఉన్నారు. పిల్లలపై ధరల పెరుగుదల ప్రతికూల ప్రభావం గురించి చెప్పనవసరం లేదు. ఆర్థికంగా కెనడా తీవ్రమైన అనిశ్చితిని ఎదుర్కొంటోంది.


2008లో ధనిక దేశాల్లో తలెత్తిన సంక్షోభం నాటి నుంచి నేటి వరకు కెనడాలో అనిశ్చితి సూచిక తీవ్ర వడిదుడులకు లోనవుతున్నది. రెండువేల సంవత్సరం నుంచి 2008 వరకు 50 నుంచి 200 మధ్య కదలాడగా తరువాత అది వంద నుంచి 400 మధ్య ఊగిసలాడిరది. 2020 కరోనా సమయంలో గరిష్టంగా 690, గతేడాది 650గా ఉంది.ట్రుడేవ్‌ ప్రకటనతో ఈ ఏడాది అది మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్టోబరులోగా ఎన్నికలు జరగాల్సి ఉండగా పెట్టుబడిదారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేదు, తమ ప్రాజెక్టులను తాత్కాలింగా నిలిపివేయటం లేదా వాయిదా వేసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఇది ఉపాధి మీద కూడా తీవ్ర ప్రభావం చూపటం అనివార్యం. నూతన నియామకాలు పరిమితం అవుతాయి. కరెన్సీ కెనడా డాలరు విలువ కూడా గత వారంలో పతనమై కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధాని రాజీనామా ప్రకటన తరువాత స్వల్పంగా పెరిగినప్పటికీ అనిశ్చితిలో కొనసాగ వచ్చు. కెనడా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. దిగుమతి చేసుకొనే వస్తువులపై 25శాతం పన్ను విధిస్తానని డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన గురించి తెలిసిందే.ఆర్థిక రంగంలో అనిశ్చిత పరిస్థితి ఉన్న కారణంగా దీని గురించి బేరమాడే శక్తి కెనడాకు తగ్గుతుంది.ట్రంప్‌ చర్య అమెరికా వినియోగదారుల మీద భారాలు మోపినప్పటికీ కెనడా ఎగుమతుల మీద కూడా ప్రతికూల ప్రభావం చూపనుంది.1985 నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలలో కెనడా మిగులులో ఉంది. తమ వస్తువులను మరింతగా దిగుమతి చేసుకోవాలని అమెరికా ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది.


గత కొద్ది నెలలుగా పార్టీ ఎంపీలు అనేక మంది డిమాండ్‌ చేసినప్పటికీ రాజీనామాకు ససేమిరా అన్న ట్రుడేవ్‌ డిసెంబరు నెలలో జరిగిన పరిణామంతో దిగిరాక తప్పలేదు. ప్రధానితో తన విబేధాల గురించి ఫ్రీలాండ్‌ రాజీనామా లేఖలో వెల్లడిరచారు. రాజకీయ జిమ్మిక్కులు భారీ మూల్యం చెల్లిస్తున్నాయంటూ పరోక్షంగా చేసిన విమర్శల లేఖను బహిర్గతం చేయటంతో వత్తిడి మరింత పెరిగింది. ఈ ఏడాది బడ్జెట్‌లోటు 20 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా వేయగా అది 60బిలియన్‌ డాలర్లకు పెరిగింది.బడ్జెట్‌ లోటు, ఆర్థిక అసమానతలను తగ్గిస్తానంటూ యువకుడిగా రంగంలోకి దిగిన ట్రుడెవ్‌కు యువతరం బ్రహ్మరధం పట్టటంతో 2015లో ఘనవిజయం లభించింది, ఆచరణలో దానికి భిన్నంగా వ్యవహరించాడు. తీవ్రమైన అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కొన్నాడు.ట్రుడెవ్‌ రాజీనామాతో పాలక లిబరల్‌ పార్టీ, ప్రతిపక్ష కన్సర్వేటివ్‌ పార్టీ నుంచి ప్రధాని పదవికి పోటీ పెరిగింది. మంత్రి పదవికి రాజీనామా చేసిన క్రిస్టియా ఫ్రీలాండ్‌, ప్రస్తుతం రవాణాశాఖ మంత్రిగా ఉన్న భారతీయ సంతతికి చెందిన అనిత ఇందిరా ఆనంద్‌, విదేశాంగ మంత్రి మెలీనా జోలీ కూడా ప్రధాన పోటీదారుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, బాంక్‌ ఆఫ్‌ కెనడా గవర్నర్‌గా పనిచేసి ట్రడేవ్‌కు సలహాదారుగా ఉన్న మార్క్‌ కార్నే కూడా రేసులో ఉన్నాడు.ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చిన కార్బన్‌ పన్ను విధింపు ఇతగాడి సలహామేరకే జరిగింది.మూడు సార్లు ఓట్లు అధికంగా తెచ్చుకున్నప్పటికీ అవసరమైన సీట్లు తెచ్చుకోవటంలో విఫలమైన ప్రతిపక్ష నేత పిరే పోయిలివరే ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దం అవుతున్నాడు. ఒక టీవీ జరిపిన సర్వేలో పిరేకు 44.2శాతం మంది మద్దతు ప్రకటించగా ట్రుడెవ్‌కు 24శాతం ఉన్నారు.కరోనా తరువాత వివిధ దేశాలలో జరిగిన ఎన్నికల తీరుతెన్నులను చూస్తే అధికారంలో ఉన్నవారందరూ దాదాపు ఓడిపోయారు. కెనడాలో కూడా లిబరల్‌ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. రకరకాల ఆకర్షక వాగ్దానాలతో మద్దతు పొందిన వారిని హృదయ సామ్రాట్టులుగా జేజేలు కొట్టిన జనమే తీరు మారితే ఏ విధంగా తరిమి కొట్టారో బంగ్లాదేశ్‌, శ్రీలంక పరిణామాలు స్పష్టం చేశాయి. మన దేశంలో పాలక పార్టీలు వీటి నుంచి గుణపాఠాలు తీసుకుంటాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రూపాయి విలువ 101కి పతనం ! జవాబుదారీతనపు జాడలేదు !! గుడ్లప్పగించి చూస్తున్న నరేంద్రమోడీ !!!

28 Saturday Dec 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Donald trump, Inflation, Narendra Modi Failures, RSS, Rupee depreciation, Rupee Fall


ఎం కోటేశ్వరరావు


రూపాయి పతనంలో రికార్డుల మీద రికార్డులను బద్దలు కొడుతుంటే ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌ మాటా పలుకూ లేకుండా గుడ్లప్పగించి చూస్తున్నది. ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నట్లు ? మోడీ అంటే విశ్వగురువు గనుక ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోరని, ప్రపంచ రాజకీయాలను చక్కపెడుతున్నారని అనుకుందాం. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌, ఇతర పెద్దలు ఏమయ్యారు. శుక్రవారం నాడు 85.80వరకు పతనమై 85.48దగ్గర స్థిరపడిరది, అంతకు ముందు రోజు 85.27కు దిగజారింది. నరేంద్రమోడీ గురించి చరిత్రలో ఇప్పటికే అనేక వైఫల్యాలు నమోదయ్యాయి.ఒకసారి చెప్పిన మాట మరోసారి చెప్పరు, వైఫల్యం గురించి వాటి వలన జనానికి కలిగిన ఇబ్బందులకు విచార ప్రకటన లేదు. రూపాయి పతనం గురించి తాను మాట్లాడిన మాటలను జనం మరచిపోయి ఉంటారన్న గట్టి నమ్మకం కారణంగానే మాట్లాడటం లేదు. బిజెపి ప్రచార కమిటీ నేతగా 2014 ఎన్నికలకు ముందు రూపాయి పతనాన్ని కాంగ్రెస్‌పై దాడికి ఒక ఆయుధంగా వాడుకున్నారు. విలువలువలువల గురించి నిత్యం తమ భుజాలను తామే చరుచుకొనే సంఘపరివార్‌కు చెందిన వ్యక్తి నుంచి అనేక మంది జవాబుదారీతనాన్ని ఆశించారు, నమ్మారు.వారందరూ కూడా మౌనంగా ఉంటున్నారు, దేశం ఏమై పోతున్నా పట్టని ఈ బలహీనత ఎందుకు ?

రూపాయి విలువ పతనమౌతుంటే గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమన్నారో తెలుసా ! ‘‘ ఆర్థికం లేదా రూపాయి విలువ పతనం గురించి ప్రభుత్వానికి ఎలాంటి చింత లేదు, తన కుర్చీని ఎలా కాపాడుకోవాలన్నదే దాని ఏకైక ఆందోళన. ఈ కారణంగా దేశం ఈ రోజు ఆశాభంగం చెందింది. గత మూడు నెలలుగా పతనం అవుతున్న రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దాన్ని అవకాశంగా తీసుకుంటాయి. గడచిన ఐదు సంవత్సరాలుగా ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెబుతున్నారు తప్ప జరిగిందేమీ లేదు ’’ (2013 ఆగస్టు 20, బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో పిటిఐ వార్త).మోడీ ఈ ఆరోపణలు చేసిన రోజు డాలరుకు రూపాయి విలువ 64.11గా ఉంది, తరువాత కొంత మేరకు పెరిగినా గత పదేండ్లలో మొత్తం మీద చూసినపుడు 2024 డిసెంబరు 27వ తేదీ 85.80కు దిగజారింది. పార్లమెంటులో బిజెపికి, దానికి వంతపాడుతున్న పార్టీల బలాన్ని బట్టి 2029వరకు మధ్యలో అనూహ్య రాజకీయ సంక్షోభం ఏర్పడితే తప్ప ప్రధానిగా మోడీ పదవికి ఎలాంటి ఢోకా ఉండదు. పదేండ్ల క్రితం రూపాయి విలువ పతనం గురించి గుండెలు బాదుకొన్న నరేంద్రమోడీ పదిహేనేండ్లు అధికార వ్యవధిని పూర్తి చేసుకొనే నాటికి 101కి పతనం అవుతుందని ద్రవ్యవ్యాపార నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతన చరిత్రను చూసినపుడు ఇంకా ఎక్కువ మొత్తంలో దిగజారేందుకే అవకాశం ఉంది తప్ప బలపడే లక్షణాలు కనిపించటం లేదు. 2024 డిసెంబరు 27న రూపాయి 85.80కి దిగజారి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ పతనం కొందరికి మోదం ఎందరికో ఖేదాన్ని తెస్తుంది. ఎగుమతులు చేసే వారికి, విదేశాల నుంచి మనదేశానికి డబ్బు పంపేవారికి సంతోషం కలిగిస్తే, విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల భారంతో కోట్లాది సామాన్యులకు జేబు గుల్ల అవుతుంది.అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయిన నవంబరు ఐదున రూపాయి విలువ 84.11 ఉంటే డిసెంబరు చివరి వారంలో ముందే చెప్పుకున్నట్లు 85.80ని తాకింది. జనవరి 20న అధికారాన్ని స్వీకరించే సమయానికి, తరువాత ఏమౌతుందో తెలియదు. రూపాయి విలువ పతనాన్ని అరికట్టేందుకు రిజర్వుబాంకు రంగంలోకి దిగి విదేశీ కరెన్సీ విక్రయాలకు పాల్పడి స్థిరంగా ఉండేట్లు చేస్తుంది. ఇప్పుడూ చేసింది, గతంలోనూ చేసింది, అయినప్పటికీ మొత్తం మీద పతనం ఆగటంలేదు. దేశం వెలిగిపోతోంది అని బిజెపి చెప్పుకున్న వాజ్‌పాయి ఏలుబడిలో 2000 సంవత్సరంలో రూపాయి విలువ 43.35 ఉంది. అది మన్మోహన్‌ సింగ్‌ అధికారానికి వచ్చిన 2004లో 45.10, మోడీ పదవీ స్వీకారంచేసిన 2014లో 62.33గా ఉంది. ఇప్పుడు 85.80 దగ్గర ఉంది.1947లో స్వాతంత్య్రం వచ్చినపుడు రూపాయి విలువ డాలరుకు 3.30 ఉంది. మోడీ అధికారానికి వస్తే ఆయనకు ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవంతో రూపాయిని 45కు తిరిగి తీసుకువస్తారని అనేక మంది పండితులు జోశ్యాలు చెప్పారు. గల్లా పట్టుకు అడుగుదామంటే వారెక్కడా ఇప్పుడు మనకు కనిపించరు. మోడీ నోరుతెరవరు.

రూపాయి పతనంతో జన జీవితాలు అతలాకుతలం అవుతుంటే ఇతర కొన్నింటితో పోల్చితే మన కరెన్సీ పతనం తక్కువ అని అధికారపార్టీ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. వీళ్లను ఏమనాలో అర్ధం కాదు. దాని వలన మనకు ఒరిగేదేమిటి ? పెట్రోలు, డీజిలు లేకపోతే క్షణం గడవదు. వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నెలలో మనం దిగుమతి చేసుకున్న ముడి చమురు పీపా ధర రవాణా ఖర్చులను కూడా కలుపుకొని 89.44 డాలర్లు, అది నవంబరు నెలలో 73.02కు తగ్గింది.తొమ్మిది నెలల సగటు చూసినా 79.20 డాలర్లు. ఈ మేరకు పెట్రోలు, డీజిలు ధరలను ఎందుకు తగ్గించలేదు, కారణం జనం పట్టించుకోకపోవటమే. నిలబెట్టి జేబులు కత్తిరిస్తున్నా మౌనంగా భరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గిస్తాం అన్న విధానాన్ని ఎందుకు పక్కన పెట్టినట్లు ? రూపాయి విలువ పతనంతో వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు మన ఎగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి మన విదేశీ వాణిజ్య లోటు తగ్గుతున్నదా అంటే ఆ జాడలేదు. రూపాయి పతనం ఎంత పెరిగితే అంతగా ద్రవ్యోల్బణంధరల పెరుగుదల ఉంటుంది. డాలర్లు, ఇతర కరెన్సీలను రప్పించేందుకు విదేశాల్లో ఉన్న భారతీయుల బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేపు పెంపుదలకు ఆర్‌బిఐ అనుమతిస్తున్నది. అమెరికాలో వడ్డీ రేటు కోత, రూపాయి విలువ పతనం కారణంగా విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళుతున్నాయి. మన స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలటానికి ఇదొక కారణం. ముడిచమురు, ఎలక్ట్రానిక్స్‌, పరిశ్రమల యంత్రాల దిగుమతులకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. వస్తు ఎగుమతిదార్లు, ఐటి రంగ కంపెనీలు ప్రధాన లబ్దిదారులుగా ఉంటున్నాయి.

రూపాయి విలువ పతనం చెందినప్పుడల్లా పండితుల జోశ్యాలు చెబుతారు. అవి కూడా పరిస్థితి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే అనే ప్రాతిపదిక మీద చెప్పేవే. లాంగ్‌ ఫోర్‌కాస్ట్‌ డాట్‌ కాం గతంలో చెప్పిన జోశ్యం ప్రకారం 2025 జనవరిలో 79.79తో ప్రారంభమై ఏడాది చివరికి 86.97గా ఉంటుందని పేర్కొన్నది. జనవరిలో రూపాయి విలువ పెరగాలి. ఏఐ పికప్‌ అనే సంస్థ 2027 నాటికి రూపాయి 74.97కు బలపడుతుందని చెప్పింది. అయితే 2024లో రికార్డు పతనం 84.35 తరువాత 2030లో 72.6కు బలపడుతుందట.కృత్రిమ మేథ జోశ్యాలు తప్పు కావచ్చని కూడా కొందరు హెచ్చరించారు. రానున్న సంవత్సరాలలో ఏడాది ప్రారంభం, చివరిలో రూపాయి ముగింపు విలువలు దిగువ విధంగా ఉంటాయి. దిగువ పట్టికలో మొదటి వరుస జోశ్యం లాంగ్‌ ఫోర్‌కాస్ట్‌ డాట్‌ కాంది కాగా, రెండవ వరుసలో ఉన్నది వాలెట్‌ ఇన్వెస్టర్‌ డాట్‌కాం అంకెలుగా గమనించాలి
.ఏడాది–జనవరి– డిసెంబరు
2024– RRRR– 85.06
2025– 85.27– 86.67
2025II 84.62II 88.13
2026II 86.27II 87.16
2026II 87.89II 91.40
2027II 88.60II 96.78
2027II 91.16II 94.66
2028II 96.09II 98.68
2028II 94.47II 97.92
2029II 97.41II RRRRR
2029II 97.77II 101.20
ఇవే గాక అనేక సంస్థలు తమ తమ అంచనాలను చెబుతున్నాయి. ఎవరు చెప్పినా అంకెల తేడాలున్నప్పటికీ పతనం వాస్తవం.రూపాయి పతనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బిఐ చెబుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించటం లేదు. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో డాలరుకు 84 దాటకుండా చూడాలని లక్ష్యంగా చెప్పుకున్నప్పటికీ ఇప్పటికే 86వరకు రావటాన్ని చూశాము.రోగనిరోధక శక్తి సన్నగిల్లితే అన్ని రకాల జబ్బులు వస్తున్నట్లు కరెన్సీ విలువ పతనం కూడా ఆర్థిక వ్యవస్థకు అలాంటిదే. ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తటానికి మూడు ప్రధాన కారణాలను చెబుతున్నారు. విదేశీ మదుపుదార్లు(ఎఫ్‌ఐఐ) స్టాక్‌, రుణ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కు తీసుకొని ఎక్కడ లాభాలు వస్తే అక్కడికి తరలిస్తుండటం. అవి డాలర్ల రూపంలో ఉండటంతో వాటికి డిమాండ్‌ పెరిగి రూపాయి విలువ తగ్గుతున్నది. అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నిక, అక్కడ వడ్డీ రేట్లను పెంచటంతో మదుపుదార్లందరూ ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు ఎగబడుతున్నారు. వారి చెలగాటం మన వంటి ఆర్థిక వ్యవస్థలకు ప్రాణ సంకటం. మోడీని ఆయన భక్తులు విశ్వగురువుగా కీర్తిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌ సంక్షోభం, మధ్య ప్రాచ్యంపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, తమకు లొంగని దేశాలపై ట్రంప్‌ బెదిరింపులు, వాణిజ్య పోరు వంటి అనేక సమస్యలు కూడా అనేక దేశాల కరెన్సీల విలువ పతనానికి కారణం అవుతున్నాయి. వాటిని పరిష్కరించటంలో ఎవరూ కూడా మోడీ ప్రమేయాన్ని కోరటం లేదు.

రూపాయి పతనం వలన లబ్ది కంటే మనకు నష్టమే ఎక్కువ.ద్రవ్యోల్బణం, దాంతో ధరల పెరుగుదలకు దారితీస్తుంది.దీని వలన కొనుగోలు శక్తి తగ్గుతుంది. చమురు దిగుమతి బిల్లు పెరిగి అందరి మీదా భారం పెరుగుతుంది. విదేశాల నుంచి రుణాలు పొందిన కంపెనీల మీద భారం పెరుగుతుంది, పరోక్షంగా పెట్టుబడుల మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. రూపాయి విలువ పతనం కాకుండా కాపాడేందుకు ఆర్‌బిఐ తన వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యంలో కొన్ని డాలర్లను విక్రయిస్తుంది, దాంతో వాటి సరఫరా పెరిగి రూపాయి విలువ స్థిరంగా ఉంటుందన్నది ఆశ. అయితే తాత్కాలికంగా కొద్ది రోజులు అలా ఉన్నప్పటికీ పతనం సాగుతూనే ఉంది. అదే విధంగా రూపాయల కొనుగోలు, వడ్డీల సవరణ ద్వారా విలువను పెంచేందుకు చూసినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. గడచిన ఇరవై సంవత్సరాల్లో సగటున ఏటా 3.2శాతం పతనం అవుతున్నది.ట్రంప్‌ ఏలుబడి నాలుగేండ్ల కాలంలో 810శాతం వరకు రూపాయి పతనం చెందవచ్చని ఎస్‌బిఐ పరిశోధన విశ్లేషణ తెలిపింది. కనీసం ఈ పతనాన్ని అయినా నరేంద్రమోడీ నివారించగలరా ? వంది మాగధుల భజనలతో కాలక్షేపం చేస్తారా ? రోమ్‌ తగులబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి మాదిరి ఉంటారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

08 Sunday Dec 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, Causes of Inflation, CORRUPTION, India Price Rise, Inflation in India, Narendra Modi Failures, Rupee depreciation, Rupee fall under Modi rule

ఎం కోటేశ్వరరావు

మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక ఎగిరెగిరి తన్నినా కిమ్మనటం లేదనే సామెతను నిజం చేస్తున్నారా ? మనది కర్మభూమి అనుకుంటున్నాం గనుక తప్పదు ! పదేండ్ల క్రితం డాలరుతో మారకంలో రూపాయి విలువ పతనం గురించి నరేంద్రమోడీ మొదలు బిజెపి నేతలందరూ ఎన్ని మాట్లాడారు ! ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పతనమైనా పల్లెత్తు మాటల్లేవేమి ? రూపాయి పతనం, జిడిపి వృద్ధి రేటు పతనం, ఎగుమతుల్లో ఎదుగుదల పతనం ఇలా పదేండ్ల పాలనలో అవే ఎక్కువ. మరక మంచిదే అని ఒక వాణిజ్య ప్రకటనలో చెప్పినట్లుగా రూపాయి విలువ తగ్గటం మనకు మంచిదే అని కొంత మంది సమర్థిస్తారు. కొన్ని అంశాలలో వాస్తవమే, ఎగుమతిదార్లకు, విదేశాల నుంచి డబ్బు పంపేవారికి లబ్ది, దిగుమతిదార్లకు, తద్వారా జనాలందరికీ భారం. కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్న లోకోక్తి తెలిసిందే. మన దేశంలో అదే జరుగుతోంది. మన కరెన్సీ పతనం కొంత మందికి కాసుల వర్షం కురిపిస్తుండగా అత్యధికుల జేబులు గుల్లవుతున్నాయి. ఏటా వేల కోట్ల డాలర్లను విదేశాలకు సమర్పించుకుంటున్నాము. ఉదాహరణకు 202223లో రు.21,45,690, 202324లో రు.19,54,060 కోట్లు విదేశాలకు సమర్పించుకున్నాము. దీనిలో ఎక్కువ చైనాకే రు.6,73,0006,97,000 చొప్పునవెళ్లింది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఈ భారం మొత్తాన్ని మన జనం మీద మోపారు. కార్పొరేట్లు లేదా ప్రభుత్వ కంపెనీలు లాభాలతో సహా దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలను వినియోగదారులనుంచే కదా వసూలు చేసేది.


కొందరు వర్ణిస్తున్నట్లుగా ముచ్చటగానో లేదా మరికొందరంటున్నట్లుగా దేశానికి మూడిగానీ మోడీ పాలనలో పదకొండో ఏడులో ఉంది. 2014లో ఒక వస్తువు ధర రు.106 ఉంటే ద్రవ్యోల్బణం పెరిగిన కారణంగా అదే ఇప్పుడు రు.156 పెట్టి కొనాల్సి వస్తోంది.ద్రవ్యోల్బణం సగటున 5.12శాతం పెరిగిన ఫలితమే. ఈ నిర్వాకం సంగతేమిటి ? ఈ మేరకు జనానికి రాబడి పెరుగుతోందా ? 2024 అక్టోబరులో పద్నాలుగు నెలల గరిష్టం 6.21శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం అంతకు మించి 15నెలల గరిష్టం 10.87శాతానికి చేరింది.ఏడాది క్రితం అక్టోబరు నెలలో 6.61శాతమే ఉంది. వినియోగదారులు కొనేటట్లు లేదు కడుపు నిండాతినేట్లు లేదు. అన్నదాతల పరిస్థితి ఏమిటి ? ప్రస్తుతం రబీ సీజన్‌ నడుస్తున్నది, దేశమంతటా ఈ పంటలకు ముఖ్యమైన డిఏపి ఎరువుల కొరత, దాన్ని ఆసరా చేసుకొని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.యూరియాయేతర ఎరువుల కోసం రబీ తరుణంలో ఎరువుల సబ్సిడీ నిమిత్తం రు.24,474 కోట్ల సబ్సిడీ ఇవ్వనున్నట్లు, అది గత ఏడాది కంటే పదిశాతం ఎక్కువ అని గొప్పగా కేంద్ర పెద్దలు చెప్పారు. డిఏపి మే నెలలో టన్ను దిగుబడి ధర 510 డాలర్లు ఉండగా నవంబరు మొదటి వారంలో 645కు పెరిగింది.అది రు.54,000కు సమానం. ఈ స్థితిలో కేంద్రం గరిష్ట ధరగా రు.27వేలు నిర్ణయించి సబ్సిడీగా రు.21.911గా ప్రకటించింది. కొరత ఏర్పడిన స్థితిలో మరో మూడున్నరవేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఏ వ్యాపారి 54వేలు చెల్లించి దిగుమతి చేసుకుంటాడు ? ఒకవేళ దిగుమతి చేస్తే అంత ధరలో రైతులు కొనుగోలు చేయగలరా ?

గతేడాది అక్టోబరు ఒకటి నాటికి 30లక్షల టన్నుల మేర నిల్వలుండగా ఈ ఏడాది 16లక్షలకు తగ్గింది. పోనీ దేశీయంగా ఉత్పత్తి పెరిగిందా అంటే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఏడు శాతం తగ్గింది. దిగుమతులను చూస్తే గతేడాది ఏప్రిల్‌సెప్టెంబరు మధ్య 34.5లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది అది 19.6లక్షలకు పడిపోయింది. ఏడాదికి 100 నుంచి 110లక్షల టన్నులు అవసరం కాగా దీనిలో 60శాతం దిగుమతి చేసుకుంటున్నాము. ఈ ఏడాది ఇప్పటి వరకు దిగుమతులు సగం తగ్గటానికి కేంద్రం ఎరువుల మీద సబ్సిడీలో భారీ కోత విధించటమే అసలు కారణం. 202223లో రు.2.51లక్షల కోట్లు కేటాయించిన మోడీ సర్కార్‌, 202324లో రు.1.88, 202425లో ఆ మొత్తాన్ని రు.1.64లక్షల కోట్లకు కోత పెట్టింది. యుపిఏ సర్కార్‌ 2010లో అమల్లోకి తెచ్చిన విధానం ప్రకారం నిర్ణీత మొత్తాన్ని మాత్రమే సబ్సిడీగా ఇస్తారు, దాన్ని విమర్శించిన నరేంద్రమోడీ తనదాకా వచ్చేసరికి దాన్నే అమలు జరిపారు. అయితే మధ్యలో అంతర్జాతీయంగా ధరలు విపరీతంగా పెరగటం, రైతాంగం ఏడాది పాటు ఢల్లీి శివార్లలో ఉద్యమించిన నేపధ్యంలో సబ్సిడీ మొత్తాన్ని పెంచారు. తిరిగి పైన పేర్కొన్న విధంగా కోత మొదలు పెట్టారు.ద్రవ్యోల్బణం అదుపులో ఉండాలంటే సబ్సిడీలకు కోతపెట్టి ప్రభుత్వ ఖర్చు తగ్గించటానికి పూనుకున్నారు. ఎరువుల సబ్సిడీ తగ్గటానికి దిగుమతి చేసుకొనే ఎరువులు, గ్యాస్‌ ధర తగ్గటమే అని కొందరు చెబుతున్నారు. అదే ప్రాతిపదిక అయితే అవసరాలకు అనుగుణంగా డిఏపి దిగుమతి చేసుకొని పంటలు పండేందుకు తోడ్పడాల్సిందిపోయి, ధరలు పెరిగాయనే పేరుతో దిగుమతులు ఎందుకు తగ్గించినట్లు ?


రూపాయి పతనం అన్నది ఆర్థిక స్థిరత్వం మీద పెద్ద ప్రభావం చూపుతుంది.అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది.యుపిఏ పాలన మీద ధ్వజమెత్తటానికి బిజెపి ప్రచార కమిటీ నేతగా 2014 ఎన్నికలకు ముందు దీన్ని ఒక అయుధంగా వాడుకున్నారు. రూపాయి విలువ పతనమౌతుంటే గతంలో ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఏమన్నారో తెలుసా ! ‘‘ ఆర్థికం లేదా రూపాయి విలువ పతనం గురించి ప్రభుత్వానికి ఎలాంటి చింత లేదు, తన కుర్చీని ఎలా కాపాడుకోవాలన్నదే దాని ఏకైక ఆందోళన. ఈ కారణంగా దేశం ఈ రోజు ఆశాభంగం చెందింది. గత మూడు నెలలుగా పతనం అవుతున్న రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. ఇలా పతనం అవుతుంటే ఇతర దేశాలు దాన్ని అవకాశంగా తీసుకుంటాయి. గడచిన ఐదు సంవత్సరాలుగా ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెబుతున్నారు తప్ప జరిగిందేమీ లేదు ’’ (2013 ఆగస్టు 20, బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో పిటిఐ వార్త). మోడీ ఈ ఆరోపణలు చేసిన రోజు డాలరుకు రూపాయి విలువ 64.11గా ఉంది. పదేండ్ల తరువాత ఇప్పుడు 84.73కు దిగజారింది.అడిగేవారు లేక గానీ పైన చెప్పిన అంశాలన్నీ మోడీకి వర్తించవా ? ఈ దిగువ ఆయా సంవత్సరాలలో రూపాయి సగటు విలువ ఎలా ఉందో చూడవచ్చు. 2024 విలువను రాసిన సమయానికి ఉన్నదిగా పరిగణించాలి.
సంవత్సరం = రూ.విలువ
2014 = 62.33
2015 = 62.97
2016 = 66.46
2017 = 67.79
2018 = 70.09
2019 = 70.39
2020 = 76.38
2021 = 74.57
2022 = 81.35
2023 = 81.94
2024 = 83.47
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. యుపిఏ చివరి సంవత్సరాలలో ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం, ధరలు కూడా పెరిగాయి. మోడీ పదవిలోకి రాగానే ముడి చమురు ధర బాగాపడిపోయి దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గింది, ఆ సమయంలో వినియోగదారులకు ఆ మేరకు లబ్ది చేకూరకుండా వివిధ సెస్సులను భారీగా విధించి, పెద్ద మొత్తంలో కేంద్రం రాబడిని పొందింది. రూపాయి విలువ తగ్గితే మన ఎగుమతులు పెరుగుతాయన్నది కూడా వాస్తవం కాదు. 2013లో మన ఎగుమతులు 472 బిలియన్‌ డాలర్లు కాగా 2023లో అవి 777 బి.డాలర్లకు పెరిగాయి. దీన్నే జిడిపిలో చూస్తే ఎందుకంటే దాన్ని పెంచిన ఘనత తమదే అని బిజెపి చెప్పుకొంటోంది గనుక25.43 నుంచి మధ్యలో 18.66శాతానికి పడిపోయినా 2023లో 21.89శాతంగా ఉంది. అంటే మొత్తంగా చూసినపుడు పతనం తప్ప పెరుగుదల లేదు. దిగుమతులు వినియోగదారులకు భారం కాకూడదు. వజ్రాలు, బంగారం వంటి వాటిని దిగుమతి చేసుకుంటే వాటి మీద పన్ను విధించవచ్చు, ఇబ్బంది లేదు, కానీ ముడిచమురు దిగుమతుల మీదకూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు లాభాలను పిండుకుంటున్నాయి.

నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాదికి ఇప్పటికీ తేడాను చూద్దాం. యుపిఏ పాలన చివరి ఏడాది నుంచి ఇప్పటి వరకు మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు పీపా సగటు ధరలు ఇలా ఉన్నాయి.
ఏడాది = డాలర్లు ——–ఏడాది = డాలర్లు
2013-14 =105.52 2014-15 = 84.16
2015-16 = 46.17 2016-17 = 47.56
2017-18 = 56.43 2018-19 = 69.88
2019-20 = 60.47 2020-21 = 44.82
2021-22 I 79.18 2022-23 = 93.15
2023-24 = 82.58

వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు 81.95 డాలర్లు ఉంది. దీనికి అనుగుణంగా ధరలు తగ్గించకుండా గడచిన రెండున్నర సంవత్సరాలుగా వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ ధరలను బట్టే రాష్ట్రాలు వ్యాట్‌ వసూలు చేస్తున్నాయి. కేంద్రం ధర తగ్గిస్తే ఆ మేరకు రాష్ట్రాలూ తగ్గిస్తాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత డీజిలు, పెట్రోలు మీద సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేశారు,గ్యాస్‌ మీద ముష్టి మాదిరి విదుల్చుతున్నారు. 201415 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 202021 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 202324 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. 2024 ఆగస్టు ఒకటవ తేదీన ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన సమాచారం ప్రకారం 201920లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చమురు రంగంలో వచ్చిన పన్ను, తదితరాల రాబడి మొత్తం రు.5,55,370 కోట్లు కాగా దీనిలో కేంద్ర వాటా రు.3,34,315 కోట్లు, ఈ మొత్తాలు 202324 తాత్కాలిక అంచనాలో పెరిగిన మొత్తం రు.7,51,156 కోట్లు కాగా కేంద్ర వాటా రు.4,32,394 కోట్లు ఉంది. ఇంత మొత్తం సంపాదిస్తున్న కేంద్రం ఉజ్వల గాస్‌ పధకం పేరుతో ఒక్కొక్క వినియోగదారుకు ఏడాదికి ఇస్తున్న సబ్సిడీ రు.1,114 కాగా ఇతర వినియోగదారులకు ఇస్తున్న మొత్తం రు.670 మాత్రమే. దేశంలో ముడిచమురు ఉత్పత్తి పెంచుతామంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీ ఏలుబడి నిర్వాకం ఎలా ఉందో తెలుసా ? 201415లో ప్రభుత్వప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023`24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. ఇలాంటి పాలనతో 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు. అదుపులేని రూపాయి పతనం,ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరుగుతూ నడ్డి విరుస్తున్నాయి. పదేండ్ల క్రితం మోడీ చెప్పిన అచ్చే దిన్‌ ( మంచి రోజులు ) బిజెపి మద్దతుదార్లకైనా వచ్చాయా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడినోమిక్స్‌ జిడిపి ఢమాల్‌ : జాడలేని ఆత్మనిర్భరత, రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తున్నారా !

01 Sunday Dec 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

#Failed Narendra Modi, Aatmanirbhar Bharat, BJP, India GDP, Made in India, Narendra Modi Failures

ఎం కోటేశ్వరరావు

     వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాస కాలంలో మన జిడిపి వృద్ధి రేటు అంతకు ముందున్న 7.5శాతం నుంచి 5.4శాతానికి దిగజారింది.దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు లోక్‌సభ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోడీ చూపిన రంగుల కలను ఇది భగ్నం చేసింది. మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు విఫలమైన తరువాత 20లక్షల కోట్ల రూపాయలతో 2020లో ఆత్మనిర్భర అభియాన్‌ పేరుతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించిన తరువాత పరిస్థితి ఇది. ఈ ఉద్దీపన కూడా విఫలమైనట్లు వేరే చెప్పనవసరం లేదు. జాతీయ గణాంక సంస్థ(ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన ఈ వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో జిడిపిలో రుణ భారం 49.9శాతం కాగా 2023 నాటికి అది 83.1శాతానికి పెరిగింది. తాము చేస్తున్న అప్పు దేశ ఆభివృద్ధికి వినియోగిస్తున్నామని చెబుతున్న బిజెపి ఆచరణలో అప్పు తప్ప అభివృద్ధిని చూపటం లేదు. పోనీ దేశ జనం మీద పన్నుల భారం ఏమైనా తగ్గిందా అంటే లేదు. గోడదెబ్బ`చెంపదెబ్బ అన్నట్లుగా రోడ్ల అభివృద్ధి పేరుతో చమురు మీద పెద్ద మొత్తంలో సెస్‌ వసూలు, ఆ రోడ్ల మీద ప్రయాణించిన వారి నుంచి ముక్కు పిండి టోల్‌ టాక్సు వసూలు చేస్తున్నారు. ఇంత అప్పు చేస్తున్నా మూల ధన పెట్టుబడుల మొత్తం పెంచటం లేదు, జిడిపి వృద్ధి రేటు పడిపోవటానికి ఇది ఒక ప్రధాన కారణమని తేలింది గనుకనే అప్పుల గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. మూల ధన పెట్టుబడులు ఎంత ఎక్కువ ఉంటే అంతగా శాశ్వత, రాబడిని తెచ్చే ఆస్తులు సమకూరుతాయి.  కాగ్‌ నివేదిక ప్రకారం గతేడాది రెండవ త్రైమాస కాలంలో  ప్రభుత్వ మూలధన  పెట్టుబడి 49శాతం( రు.4.9లక్షల కోట్లు) ఉండగా ఈ ఏడాది రు.4.14లక్షల కోట్లు 37.3శాతానికి పడిపోయిందని కేర్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్థికవేత్త రజనీ సిన్హా చెప్పారు. ప్రైవేటు రంగ మూలధన పెట్టుబడులు లేనపుడు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవటం ప్రతిదేశంలోనూ జరుగుతున్నదే.ప్రభుత్వం ద్రవ్యలోటు తగ్గించుకొనేందుకు చూస్తున్నందున ప్రయివేటు రంగం ముందుకు రావాలని క్రిసిల్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్థికవేత్త డికె జోషి చెప్పారు. పెట్టుబడులు తగ్గిపోవటమే కాదు, గృహస్తులు చేసే ఖర్చు కూడా 7.4 నుంచి ఆరుశాతానికి పతనమైంది. జనాన్ని మభ్యపెట్టేందుకు గతేడాది పెట్టుబడుల మొత్తం రు.9.48లక్షల కోట్లను ఈ ఏడాది రు.11.11లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అయితే తొలి ఐదు మాసాల్లో ఈ మొత్తంలో ఖర్చు చేసింది రు.3.09లక్షల కోట్లు 27శాతం మాత్రమే. గతేడాది ఇదే కాలానికి 37.4శాతం ఖర్చు చేసింది. అందువలన రానున్న ఏడు నెలల్లో 73శాతం ఖర్చు చేసే అవకాశం లేదని, కోత పెడతారని చెబుతున్నారు.

        ఉత్పాదక రంగ వృద్ధి సగటు జిడిపి కంటే తక్కువగా కేవలం 2.2శాతమే ఉంది. గతేదాది ఇదే కాలంలో 14.3శాతం ఉంది. విద్యుత్‌ 10.4 నుంచి 3.3శాతానికి తగ్గింది. ఉత్పాదక రంగం పడిపోయిన తరువాత విద్యుత్‌ వినియోగం కూడా పడిపోతుంది.వ్యవసాయం రెండు నుంచి 3.5శాతానికి పెరిగింది. గనుల రంగం వార్షిక ప్రాతిపదికన గతంలో 11.1శాతం, తొలి త్రైమాసంలో 7.2శాతం ఉండగా రెండవ త్రైమాసంలో 0.1శాతానికి దిగజారింది. నిర్మాణ రంగం 10.5 నుంచి 7.7కు,ద్రవ్య, రియలెస్టేట్‌, ఇతర సేవల రంగం 7.1 నుంచి 6.7శాతానికి పడిపోయింది. రవాణా,హోటల్స్‌ వంటి సేవారంగం 5.7 నుంచి 6 కు పెరిగింది.   మేడిన్‌ ఇండియా,మేకిన్‌ ఇండియా, అత్మనిర్భరత వంటి మాటలు, పథకాలన్నీ ఏమైనట్లు ? ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ప్రైవేటు రంగం, ప్రైవేటు వినియోగం, పారిశ్రామిక ఉత్పత్తి నిస్తేజంగా ఉంది. వ్యవసాయం,ప్రభుత్వ రంగ వ్యయమే మద్దతుగా నిలిచింది.అయితే ఏడాది మొత్తం వృద్ధి రేటు 7.5శాతం ఉంటుందని చెబుతున్నారు.

          దేశంలో మూల ధన పెట్టుబడుల పథకాలు దెబ్బతినటానికి నెపం ఇతర దేశాల మీద నెడుతున్నారు.చైనా, ఇతర ఆగ్నేయాసియా దేశాలు తమ దేశాలలో విస్తరణ మీద కేంద్రీకరించటం, ప్రపంచ ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో రవాణాకు ఆటంకం ఏర్పడటం వంటి కారణాల వలన మనదేశానికి అవసరమైన భారీ యంత్రాల రాక ఆలస్యం అవుతున్నదని సాకుగా చూపుతున్నారు.వేగంగా అమ్ముడు పోయే వినియోగదారుల వస్తువుల తయారీకి అవసరమైన యంత్రాల దిగుమతిలో రిలయన్స్‌ వంటి కంపెనీలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. కాంపాకోలా డ్రిరకుల తయారీకి అవసరమైన యంత్రాల కోసం ఏడాది అంతకు ముందు నుంచి ఎదురుచూస్తున్నదని ఈ ఏడాది మే నెలలో వార్తలు వచ్చాయి. చైనా ఉత్పాదక రంగం దెబ్బతిన్నదని చెప్పేవారే మన దేశానికి యంత్రాలు సకాలంలో రాకపోవటానికి అక్కడి ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణకు తీసుకుంటున్న చర్యలే కారణమని అదే నోటితో చెబుతారు. వెయ్యి కోట్లతో ఈ ఏడాది యంత్రాలు అమర్చాలని తాము తలపెట్టగా ఆలశ్యం కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు హావెల్స్‌ ఇండియా ఇడి రాజీవ్‌ గోయల్‌ చెప్పారు. చైనా తన పరిశ్రమలను నవీకరించుకొనేందుకు 140 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు, సాంకేతిక రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. స్థానికంగా గిరాకీని పెంచేందుకు పాత వస్తువులను ధ్వంసం చేసేందుకు, పాత కార్లకు బదులు విద్యుత్‌ వాహనాలను వినియోగించేందుకు ప్రోత్సాహకాలనిస్తున్నది, అక్కడ ఫ్యాక్టరీ కార్యకలాపాలు విస్తరించాయి. పిల్లి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా ఇజ్రాయెల్‌ గాజాలో సాగిస్తున్న మారణకాండను అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో పాటు మనదేశం కూడా సమర్థిస్తున్న కారణంగా ఎర్ర సముద్రంలో నౌకల రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. దాని వలన మనదేశం దిగుమతి చేసుకొనే వస్తువుల రవాణా ఖర్చులు పెద్ద మొత్తంలో పెరుగుతున్నాయి.

       మన దేశంలో ఉత్పాదక రంగం పెరగకపోవటానికి ఒక ప్రధాన కారణం మన జనాల వినియోగం పెరగకపోవటమే అన్నది స్పష్టం. ఆహారం మీద చేసే ఖర్చు తక్కువగా ఉందంటే  అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు. ఉదాహరణకు అమెరికాలో కుటుంబ ఆదాయంలో ఆహారానికి చేసే ఖర్చు కేవలం 12.9శాతం, ఫ్రాన్సులో 13.3 శాతమే, అదే మన దేశంలో నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆఫీస్‌( ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సర్వే ప్రకారం   2011`12లో 53శాతం ఉండగా 2022`23లో 46.5శాతానికి తగ్గింది. జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనాను మనదేశం వెనక్కు నెట్టింది.చైనాలో కూడా ఆహారం మీద చేసే ఖర్చు ఎక్కువగానే ఉన్నప్పటికీ తగ్గుతున్నతీరు అక్కడి సమాజం అభివృద్ది వైపు వెళుతున్నట్లుగా చెబుతున్నారు. అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డాటా పోర్టల్‌ సమాచారం ప్రకారం 2022లో చైనా కుటుంబ మొత్తం వినియోగం 4,805 డాలర్లు కాగా దానిలో ఆహారం కోసం 20.1శాతం వినియోగిస్తున్నారు. భారత్‌లో 1,553 డాలర్లకు గాను 32శాతం ఖర్చు చేస్తున్నారు.( గమనిక ఈ సమాచారంలో పరిగణనలోకి తీసుకొనే వాటిని బట్టి అంకెల్లో తేడాలు ఉన్నందున ధోరణిని అర్ధం చేసుకొనేందుకు మాత్రమే వీటిని పరిగణనలోకి తీసుకోవటం మంచిది) రావూస్‌ ఐఏఎస్‌ అకాడమీ విశ్లేషణలో అందచేసిన 2022 సమాచారం ప్రకారం భారత్‌, చైనాల్లో వినియోగానికి చేసే ఖర్చు దిగువ విధంగా ఉంది. ఆహారం అంటే పొగాకుతో, దుస్తులు అంటే పాదరక్షలతో కలిపి అని పరికరాలు అంటే గృహవినియోగ వస్తువులు అని గమనించాలి.

దేశం IIఆహారంIIదుస్తులుIIరవాణాIIఇల్లుII విద్యII ఆరోగ్యంIIపరికరాలుII ఇతరం

భారత్‌II 32.5 II 6.1  II 16.3 II13.2II4.5 II  5.2  II   3  IIII 17

చైనా II  30.5 II 5.6  II 13.0 II24.0II10.1II 8.6  II   5.8 IIII 2.5

       నేషనల్‌  శాంపుల్‌ సర్వేను పరిగణనలోకి తీసుకున్నపుడు మనదేశంలో ఆహారం మీద చేసే ఖర్చు తగ్గుదల సంతృప్తి చెందాల్సినదా లేక ఆందోళన పడాల్సిన అంశమా అన్న మీమాంస ఉంది. పట్టణ ప్రాంతాల్లో 42.7 నుంచి 39.2శాతానికి తగ్గింది. మొత్తం మీద తృణ ధాన్యాలు, కూరగాయల మీద చేసే ఖర్చు తక్కువగా ఉండటం వలన ఈ తగ్గుదలకు దోహదం చేసిందని దీన్ని సంతోషించాలా లేక దేన్నయినా కోల్పోతున్నామా అన్నది చర్చ. ఆహారం కోసం నెలవారీ రాబడిలో సగం ఖర్చు చేయాల్సి వస్తోందంటే దాన్ని మరో రకంగా చెప్పుకోవాలంటే కుటుంబ ఆదాయం తగినంత లేనట్లు, పొదుపు చేసుకొనేందుకు ఏమీ మిగలటం లేదనే. రాబడి పెరిగితే ఇతర వాటి మీద  ఖర్చు చేస్తారు. సర్వే చేసిన కాలంలో నెలవారీ ఖర్చు గ్రామీణ ప్రాంతాలలో 164, పట్టణాల్లో 146శాతం పెరిగినట్లు తేలింది. ఆహారం మీద చేసే ఖర్చులో తగ్గుదల కనిపించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత లేదా సబ్సిడీ ఆహారధాన్యాల కోణం ఉందన్నది ఒక అభిప్రాయం. దీనిలో మరో కోణం కూడా ఉంది. ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు బిజెపి గొప్పలు చెప్పుకుంటున్నది. దీని కోసం ఏటా రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు సబ్సిడీ మొత్తాన్ని భరిస్తున్నట్లు చెబుతున్నది. ఒకటి జనంలో కొనుగోలు శక్తి లేనపుడు దాన్ని పెంచటానికి సబ్సిడీలు ఒక మార్గం. ఆహార సబ్సిడీ లేకపోతే జనాలు ఆ మేరకు భారం భరించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదే సబ్సిడీ ఇస్తే ఆ మొత్తాన్ని ఇతర వస్తువులు లేదా సేవల కోసం వినియోగిస్తే పరోక్షంగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు మేలు జరుగుతుంది. కరోనా సమయంలో జనాలు ఉచితంగా నగదు అందచేయాలని కోటక్‌ మహింద్ర బ్యాంక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపక్‌ గుప్తా సూచించారు.ఇది జనాల మీద ప్రేమతో కాదు. అలా చేస్తే ఏడాది కాలంలో ఆర్థికరంగం పుంచుకుంటుందని  గుప్తా అసలు విషయం కూడా చెప్పారు. జనాల్లో ఉన్న పేదరికం, దారిద్య్రం తీరదు గానీ అంతిమంగా అది పారిశ్రామికవేత్తలను ఆదుకొనేందుకు దారితీస్తుంది. కరోనా సమయంలో ఉచితంగా ఇచ్చారంటే నరేంద్రమోడీ జనాలకు మేలు చేస్తున్నారని అనుకుందాం. అంతకు ముందు ఐదేండ్లలో ఎందుకు ఇవ్వలేదు, కరోనా తరువాత సాధారణ పరిస్థితులు నెలకాన్నాయని చెప్పిన తరువాత మరికొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా ఇస్తామని ప్రకటించటం వెనుక దేశ ఆర్థిక వ్యవస్థ, జనాల నిజరాబడి దిగజారుడే కారణం. ఆ విషయాలను చెప్పకుండా మేలు చేస్తున్నట్లు ఫోజుపెడుతున్నారు. మొత్తంగా చూసినపుడు మన వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగటం లేదు.పారిశ్రామిక వస్తువులకు గిరాకీ లేకపోవటానికి ఇది ప్రధాన కారణం.

    ఇప్పటికీ మనది ఉపాధి రీత్యా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్తే. దాని ద్వారా జిడిపికి గత రెండు దశాబ్దాల్లో 17`20శాతం మధ్యనే ఊగిసలాడుతోంది, తగ్గుదల ధోరణిలో ఉంది. వ్యవసాయంపై ఆధారపడే వారు 1993`94లో 64.6శాతం ఉండగా ప్రస్తుతం 46 శాతానికి అటూ ఇటూగా ఉంది. ఇదే కాలంలో పరిశ్రమలు గొప్పగా అభివృద్ధి చెందాయని చెబుతున్నప్పటికీ ఆ రంగంలో ఉపాధి 1993`94 నుంచి 2021`22 మధ్య 10.4 నుంచి మధ్యలో 12.6కు పెరిగినా 11.6శాతంగా ఉంది. అంటే ఉపాధి రహిత పారిశ్రామిక వృద్ధి అన్నది స్పష్టం. వ్యవసాయంపై ఆధారపడే ఎక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో 2019`2024 మధ్య కాలంలో వేతనాలు 5.2శాతం పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణనాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవంలో 0.4శాతం తగ్గింది, అంటే ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదు. ఈ కారణంగానే వినియోగంపై ఖర్చు పెరగలేదు, పారిశ్రామిక వస్తువులకు గిరాకీ ఉండటం లేదు.మోడినోమిక్స్‌ పేరుతో తనదైన ఆర్థిక విధానాలను అమలు జరుపుతున్నట్లు చెబుతున్నారు, పదేండ్ల తరువాత అన్ని ప్రధాన రంగాలు దిగజారటం తప్ప మెరుగుపడటం లేదు. రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d