• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Education

సముద్రంలో చైనా డేటా సెంటర్‌ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్‌ దార్శనికులా !

27 Monday Oct 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Environment, Europe, Germany, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

# China underwater data center, BJP, CHANDRABABU, China, Data Centers, Data centers Employment, Narendra Modi Failures, Vizag Google Data Center, Xi Jinping, YS jagan

ఎం కోటేశ్వరరావు

సముద్రంలో చైనా నిర్మించిన పదమూడు వందల టన్నుల బరువుగల డేటా సెంటర్‌ ఆదివారం నాడు(2025 అక్టోబరు26న) ప్రారంభమైంది. ఇది గాలి మరలతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వినియోగించనుంది. హై క్లౌడ్‌ అనే కంపెనీ మొదటి దశలో భాగంగా 24మెగావాట్ల కేంద్రాన్ని షాంఘై తీరంలో నెలకొల్పింది. న్యూస్‌ అట్లాస్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం సముద్రపు ఒడ్డున నిర్మించిన గాలి మరల విద్యుత్‌ కేంద్రం నుంచి 95శాతం విద్యుత్‌ను ఈ కేంద్రానికి సరఫరా చేస్తారు, సముద్రపు నీటిని చల్లబరిచేందుకు వినియోగిస్తారు. మొత్తం 22.6 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేంద్రంలో సాంప్రదాయపు డేటా సెంటర్ల కంటే 23శాతం విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. సముద్రంలో 114 అడుగుల అడుగున ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలోని ఒక్కో గదిలో 4 నుంచి ఐదు వందల సర్వర్లు ఉంటాయి. సముద్రంలో ఏర్పాటు చేసిన టెలికాం కేబుళ్ల ద్వారా ఈస్ట్రన్‌ డేటా, వెస్ట్రన్‌ కంప్యూటింగ్‌ వ్యూహం ప్రకారం ప్రధాన భూభాగంలోని కేంద్రానికి అనుసంధానం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివే మరో వందగదులను నిర్మించి విస్తరిస్తారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ చైనాలో 2015లో పైలట్‌ ప్రాజక్టుగా సముద్రంలో ఒక డాటా కేంద్రాన్ని నిర్మించింది. ప్రాజెక్ట్‌ నాటిక్‌ పేరుతో చేసిన ఈ ప్రయోగానికి స్వస్తి పలికి 2024జూన్‌లో దాన్ని సముద్రంలో ముంచివేసింది. ఆదివారం నాడు సముద్రంలో తొలి వాణిజ్య డాటా కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించిన తొలి దేశంగా చైనా చరిత్రకెక్కింది. ఇలాంటివే మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఈ కేంద్రం చైనాలో అతి పెద్ద తొలి స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఉన్న హైనాన్‌ సమీపంలో ఉంది. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో నిర్మించారు.

విశాఖలో అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీలతో కలసి గూగుల్‌ నిర్మించనున్న డేటా కేంద్రం ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందన్నది చర్చ. లింక్‌డ్‌ఇన్‌లో వచ్చిన ఒక విశ్లేషణ జర్మనీలోని బిఎఎస్‌ఎఫ్‌ రసాయన కంపెనీతో డేటా సెంటర్ల ఉపాధిని పోల్చింది. సదరు జర్మనీ సంస్థ 684మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది, 50వేల మందికి పూర్తి స్థాయి ఉపాధిని కల్పిస్తున్నది. అదే జర్మనీలో డాటా కేంద్రం 2,283మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగించే చోట పూర్తి కాలపు ఉపాధి 6,849 నుంచి 13,699 మందికి చూపుతుంది. రసాయన ఫ్యాక్టరీ ఒక మెగావాట్‌కు 73 మందికి ఉద్యోగ కల్పన చేస్తుంటే డేటా సెంటర్‌ ఒక మెగావాట్‌కు 3 నుంచి ఆరు ఉద్యోగాలను ఇస్తున్నది. గూగుల్‌ ఆధునిక సాంకేతిక ప్రక్రియలను వినియోగిస్తుంది గనుక ఇంకా తగ్గవచ్చు. ఆ లెక్కన చూసినా విశాఖలో నిర్మించే ఒక గిగావాట్‌(వెయ్యి మెగావాట్లు) కేంద్రం మూడు నుంచి ఆరువేల మందికి పర్మనెంటు ఉద్యోగాలను కల్పిస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలు దీనికి దగ్గరగా ఉన్నాయి. దానికి భిన్నంగా రాష్ట్ర మంత్రి లోకేష్‌ చెప్పారు. ఇద్దరికి సమాచార వనరు ఏమిటి ? ఈ విషయాన్ని చెప్పటానికి బిడియపడాల్సిందేముంది. అదే గూగుల్‌ను అడిగితే అందించిన ఇతర విశ్లేషణలు కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలన్నీ సాధ్యమైనమేరకు తక్కువ మందితో పని చేయించుకొనేందుకు చూస్తాయి. కన్సిడర్‌ మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన సిడ్నీలోని డాటా కేంద్రం 2023లో అకస్మాత్తుగా ఆగిపోయింది. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా జరిగిన ఆ అంతరాయం 46 గంటల పాటు సేవల నిలిపివేతకు దారితీసింది. అప్‌టైమ్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ సిబ్బంది కొరత గురించి పేర్కొన్నది. ప్రపంచ డాటా సెంట్లర్లలో 2019లో ఇరవైలక్షల మంది పూర్తి కాలపు ఉద్యోగులు ఉంటే 2025 నాటికి కేంద్రాలు పెరిగినా 23లక్షల మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులా అన్నది వివరణ లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న 122 గిగావాట్ల సామర్థ్యంలో సగటు తీసుకుంటే ఒక్కో గిగావాట్‌కు 18,700 ఉన్నట్లు కనిపిస్తున్నది. విశాఖ గూగుల్‌ సెంటర్‌కు అందరూ కలసి 20 నుంచి 30వేల మంది ఉంటారని కూడా పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. డాటా కంపెనీలు సిబ్బందిని చేర్చుకోవటం, నిలుపుకోవటంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చిన్న కేంద్రాలు(ఒకటి నుంచి ఐదు మెగావాట్లు) 8 నుంచి 15 మంది, ఐదు నుంచి ఇరవై మెగావాట్ల కేంద్రాలు 15 నుంచి 35 మంది, ఇరవై అంతకు మించిన సామర్ధ్యం కలిగినవి 35 మందికి పైగా, 40 మెగావాట్ల సంస్థలు 45 మందిని, వంద మెగావాట్లు అంతకు మించి సామర్ధ్యం కలిగినవి కొద్దిమందితోనే నిర్వహిస్తున్నాయి, ఎందుకంటే యాంత్రీకరణ మరియు నిర్ణీత ప్రమాణాలతో ఉండే వ్యవస్థలు అందుకు దోహదం చేస్తున్నాయి. నియమించుకుంటున్నాయి. డేటా సెంటర్లలో మొత్తం 230 రకాల సిబ్బంది అవసరం అని చెబుతున్నారు. అయితే చిన్న సంస్థలు అంతమందిని నియమించవు, అవి అవసరమైనపుడు పొరుగు సేవలను ఉపయోగించుకుంటాయి. సగం డేటా సెంటర్లు అవసరమైన నిపుణులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి.

రెండును రెండుతో కలిపినా, హెచ్చవేసినా ఫలితం నాలుగే. ఇది చెప్పటానికి గణితమేథావులతో పనిలేదు. డేటా సెంటర్లతో కలిగే పర్యావరణహాని, విషపూరితమైన వ్యర్ధాల వంటి ఇతర దుష్ఫలితాల గురించి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెప్పినా(అఫ్‌ కోర్స్‌ అధికారంలో ఉన్నపుడు ఈ పెద్దమనిషి వీటి గురించి చెప్పలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నోరు విప్పరు) ఆ రంగం గురించి అధ్యయనం చేసినవారు చెప్పినా విషయం ఒకటే. ఎవరైనా రాజకీయాలతో నిమిత్తం లేని వారు చెబితే చూశారా రాష్ట్ర అభివృద్దిని వ్యతిరేకించేవారు జగన్‌తో చేతులు కలిపి అవే వాదనలు చేస్తున్నారంటూ ప్రచారదాడికి దిగుతున్నారు. అంటే నోరు మూయించేందుకు ఇదొక రకం నియంతృత్వపోకడతప్ప మరొకటి కాదు. తేమ కారణంగా యంత్రాలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అమెరికాలోని డేటా కేంద్రాలన్నీ పొడివాతావరణం ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారని చెబుతున్నారు.పెట్టుబడిలో నాలుగో వంతు సబ్సిడీలు, సంవత్సరాల తరబడి రాయితీ ధరలకు నీరు, విద్యుత్‌ అందచేస్తున్న తరువాత ఏ పెట్టుబడిదారుడు మాత్రం చంద్రబాబు నాయుడి దరిచేరడు ! డాటా సెంటర్‌ మాప్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం గూగుల్‌కు ప్రపంచంలో 113 డాటా సెంటర్లు ఉండగా వాటిలో 68 పని చేస్తున్నాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎందరు ఉద్యోగులు పని చేస్తున్నారని అడిగితే సమాచారం లేదని బదులు వచ్చింది. ప్రపంచంలో గూగుల్‌ సంస్థలో లక్షా 83వేల మంది పనిచేస్తున్నారనే సమాచారం ఉంది తప్ప ఏ విభాగంలో ఎందరు అన్నది లభ్యం కావటం లేదు. ఎవరికైనా దొరికితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. మానవహక్కుల ఫోరం(హెచ్‌ఆర్‌ఎఫ్‌) సమాచారం ప్రకారం అమెరికాలోని అష్‌బర్న్‌ మరియు లీస్‌బర్గ్‌ డాటా సెంటర్లు రెండిలోనూ కలిపి ప్రత్యక్షంగా 400 మందికి పరోక్షంగా 3,100 మంది ఉపాధి దొరుకుతున్నట్లు పేర్కొన్నది.లోకేష్‌ చెప్పినట్లు లక్షా 88వేల ఉద్యోగాల్లో 88వేలు పర్మనెంటు అనుకుంటే మొత్తం గూగుల్‌ ఉద్యోగులు విశాఖలోనే ఉంటారన్నట్లుగా భావించాలి, అది జరిగేదేనా !

ఇంటర్నెట్‌ వెతుకులాటలో డాటా సెంటర్ల ఉపాధి గురించి ఎవరెటు తిప్పి చెప్పినా పెట్టుబడులు, స్థలాల విస్తీర్ణం ఎక్కువ, ప్రత్యక్ష ఉపాధి తక్కువ, పరోక్ష ఉపాధి గురించి మాత్రమే వెల్లడవుతున్నది. పరోక్షం అంటే భవనాల నిర్మాణ సమయంలో దొరికే ఉపాధి, వాటి చుట్టూ ఉండే నివాసాలతో కలిగే లబ్ది గురించి మాత్రమే ప్రస్తావన ఉంటున్నది. ఆ లెక్కన బడా పరిశ్రమలు అంతకంటే ఎక్కువ కల్పిస్తున్నాయి. వస్తూత్పత్తిలో చైనాను పక్కకు నెట్టే ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా దేశాన్ని మారుస్తామన్న మాటలు ఇప్పుడు ఎకువగా వినిపించటం లేదు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గురించి కబుర్లు పెరిగాయి.ఒకదానికి ఒకటి పోటీ కాదు, పరస్పరం సాయం చేసుకొనేవే.పెట్టుబడులు ఎక్కువ ఉపాధి తక్కువ ఉండే టెక్‌ కంపెనీల కోసం మోడీ, చంద్రబాబు వంటి వారు వెంపర్లాడుతున్నారు. ఒకసారి భవనాల నిర్మాణాలు పూర్తయిన తరువాత తాత్కాలిక కార్మికులకు పని ఉండదు. ఆటోమేషన్‌ ప్రధాన ప్రక్రియగా నడిచే ఈ కేంద్రాలలో కీలకమైన సిబ్బంది ఎవరంటే సెంటర్ల మేనేజర్లు, నెట్‌వర్క్‌ మరియు వ్యవస్థల అడ్మినిస్ట్రేటర్లు, సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక నిపుణులు, వారికి సహాయ సిబ్బంది.

ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఏటా పదివేల కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. డేటా సెంటర్లు అవసరమే, అయితే అవి కొత్త సమస్యలను సృష్టించకూడదు. మనదేశంలో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం గురించి తెలిసిందే. పాలకులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారంటే ఉత్పత్తులకు తప్ప కాలుష్యానికి కాదు, దాన్ని నివారించేందుకు పరిశ్రమలే చర్యలు తీసుకోవాలన్న నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేస్తే తమ లాభాలు తగ్గుతాయని తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో ఫార్మా, ఇతర సంస్థల నుంచి వెలువడుతున్న కాలుష్యం సమీపంలోని సముద్రంలో కలుస్తున్నది. దాంతో మత్స్యకారుల ఉపాధికి దెబ్బతగులుతున్నది. పరిష్కరించండి మహానుభావా అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అడిగితే ఈ మధ్యే మాట్లాడుతూ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది తాము కాదని, వంద రోజుల గడువులో పరిష్కరిస్తానని చెప్పారు. అధికారానికి వచ్చి 15నెలల తరువాత ఈ మాటలు చెప్పిన పెద్ద మనిషి ఇంతకాలం ఏం చేస్తున్నట్లు ?

డేటా అనేక విధాలుగా కీలక పాత్ర పోషిస్తున్న పూర్వరంగంలో మనదేశం కూడా వెనుకపడకూడదు. కానీ నరేంద్రమోడీ లేదా రెండింజన్ల పాలనలో ఉన్న ప్రభుత్వాలు గానీ ఎంతో నిర్లక్ష్యం చేశాయన్నది అంకెలే చెబుతున్నాయి.2019లో 350 మెగావాట్ల సామర్ధ్యం ఉండగా 2025 నాటికి 1,350 మెగావాట్లకు చేరుతుందని చెబుతున్నారు. ఈ రంగంలో మిగిలిన దేశాలు ఎంతో ముందున్నాయి.దీనికి కూడా నెహ్రూయే కారణం అని చెబుతారేమో తెలియదు. ముందు చూపు లేకపోవటం తప్ప మరొకటి కాదు.చైనాలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు లేవు, మైక్రోసాఫ్ట్‌ కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో తప్ప ప్రభుత్వం వినియోగించటం లేదు.కృత్రిమ మేథ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో చైనా వెనుకబడిందని శత్రువులు కూడా చెప్పలేరు.తాజా సమాచారం ప్రకారం 2024నాటికి చైనాలో డేటా వాణిజ్య విలువ 47.23 బిలియన్‌ డాలర్లు కాగా 2030 నాటికి అది 97.30బి.డాలర్లకు పెరుగుతుందని రిసర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ సంస్థ పేర్కొన్నది. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ మరోవిధంగా ఉంది.అమెరికాలో 2025 నాటికి డాటా సెంటర్ల ఆదాయం 171.9 బిలియన్‌ డాలర్లు, కాగా చైనాలో 103.19 బిలియన్‌ డాలర్లని 2030 నాటికి 142.64 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. మరో సమాచారం ప్రకారం ప్రపంచ డేటా సెంటర్ల సామర్ధ్యం 2024నాటికి 122.2 గిగావాట్లు. దీనిలో అమెరికా 53.7(44శాతం) కలిగి ఉండగా చైనా 31.9 గిగావాట్లు కలిగి ఉంది. మూడో స్థానంలో ఒక కూటమిగా ఐరోపా యూనియన్‌ 11.9 గిగావాట్లు, మనదేశం 3.6గా ఉంది.చైనాలో ఇటీవల జత చేసిన సామర్ధ్యాన్ని పని చేయించటం లేదని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి అర్ధం అవుతున్నదేమిటి ? దేశం వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలన్నింటా వృద్ది చెందితేనే డేటా కేంద్రాలకు చేతినిండా పని ఉంటుంది. గడచిన పదకొండు సంవత్సరాలుగా కబుర్లు తప్ప అభివృద్ధి లేని కారణంగా డేటా సెంటర్ల సామర్ధ్యం కూడా పెరగలేదన్నది స్పష్టం.విశ్లేషణలను కొనుగోలు చేసేవారు లేకపోతే రేపు విశాఖ గూగుల్‌ సెంటర్‌ అయినా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే.

దేశాన్ని, రాష్ట్రాన్ని వికసిత్‌ భారత్‌లో ఎక్కడికో తీసుకుపోతామని ప్రధాని నరేంద్రమోడీ, ఆయన అడుగుజాడల్లో లేదా అడుగులకు మడుగులద్దుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మంది దృష్టిలో దేశంలో అతి పెద్ద దార్శనికులు, ఇతరులకు తట్టనివి అనేకం వారికి కనిపిస్తాయని చెబుతారు. ఆ ప్రచారం వలన దేశానికి ఎంత లాభమో తెలియదు గానీ నష్టం కలిగిస్తున్నారంటే ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి) నేడు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో చెప్పనవసరం లేదు.తన పాలనలో జిడిపిని పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి తెచ్చిన ఘనత నాదే అంటారు మోడీ. కాసేపు అంగీకరిద్దాం, ఆ పురోగతి ఇతర రంగాల్లో ఉందా ? వాటిలో కీలకమైన పరిశోధనకు కేటాయింపుల సంగతేమిటి ? 1995-96 నుంచి 2014-15వరకు రెండు దశాబ్దాల వార్షిక సగటు జిడిపిలో 0.73 శాతం ఉంది. యుపిఏ పాలనలో 2008-09లో జిడిపిలో 0.8శాతం నిధులు కేటాయిస్తే మోడీ ఏలుబడిలో 2017-18లో 0.7, ఇప్పుడు 0.64శాతానికి తగ్గించారు. దీనికైతే జవహర్‌లాల్‌ నెహ్రూ కారణం కచ్చితంగా కాదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే భావజాలంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల ఈ నిర్వాకాన్ని చంద్రబాబు నాయుడు సమర్ధిస్తారా ? 2013 నాటి సైన్స్‌ మరియు టెక్నాలజీ విధానంలో, 2017-18 ఆర్థిక సర్వేలో కూడా కనీసం రెండు శాతం కేటాయించాలని చెప్పిన అంశం ఎవరికీ తెలియదా ? ఇద్దరు నేతలు దేశ దేశాలు తిరుగుతున్నారు కదా ఎక్కడ ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోరా ? ఎందుకీ నిర్లక్ష్యం ? మన అభివృద్ధి మీద గణనీయమైన ప్రభావం చూపాలంటే 2047నాటి వరకు కనీసం ఒక శాతం, ఆదర్శవంతంగా(ఐడియల్‌) ఉండాలంటే మూడుశాతం చొప్పున ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు. పిండికొద్దీ రొట్టె, పరిశోధనా రంగంలో మనం ప్రపంచ బస్‌ను అందుకోకుండా చేసింది ఎవరంటే ఎవరిని చూపాలి ? పరిశోధనలకు మనం తక్కువ కేటాయిస్తున్నా, పరిశోధనా పత్రాలు గణనీయంగానే మనవారు సమర్పిస్తున్నారుగా అని సమర్ధించుకొనే వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు ! ఎలాంటి పాలకులను మోస్తున్నాంరా బాబూ అని తల పట్టుకోవాలి !!

సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు ;

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?
https://vedikaa.com/2025/10/25/are-data-centers-godowns-or-production-houses-what-is-the-truth-about-ycp-and-tdp-claims-on-employment/

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇది కదా కమ్యూనిస్టుల ముందు చూపు – మేథోవలస- తిరిగి రాకపై దశాబ్దాలనాడే చైనా ముందు జాగ్రత్త !

24 Wednesday Sep 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

BJP, Brain drain and Gain, China, china communist party, Donald trump, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

రానున్న రోజుల్లో తమ దేశానికి హెచ్‌ 1 బి వీసా మీద వచ్చే వారు లక్ష డాలర్లు(88 లక్షలరూపాయలు) చెల్లించాల్సి ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయం భారతీయులను విస్మయానికి గురిచేసింది. అనేక మంది డాలర్‌ కలలు కల్లలైనట్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయానికి ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా కార్పొరేట్లు తెచ్చే వత్తిడికి లొంగి సవరించుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ప్రపంచ వ్యాపితంగా మేథోవలస-తిరిగి రాకల గురించి మధనం ప్రారంభమైంది.ట్రంప్‌ నిర్ణయం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది మరికొంత స్పష్టత వచ్చిన తరువాతనే చెప్పుకోవటం మంచిది. ఈ సందర్భంగా వచ్చిన కొన్ని వ్యాఖ్యలు, పత్రికా శీర్షికలు, వాటి వెనుక ఉన్న అంశాల గురించి చూద్దాం. అమెరికా లక్షల డాలర్ల ఫీజు కేవలం ఒక చెడ్డ విధానమేగాక చైనాకు వ్యూహాత్మక బహుమతి అంటూ ఒక బడా ఆంగ్ల పత్రికలో విశ్లేషణ ప్రారంభమైంది. హ్రస్వదృష్టితో ఉన్న అమెరికా వైఖరి కేవలం చైనా సాంకేతిక ప్రగతి పెరగటానికే తోడ్పడుతుందని కూడా వ్యాఖ్యాత వాపోయారు. విలువైన సంపదలను వెండి పళ్లెంలో పెట్టి చైనాకు అప్పగిస్తున్నారంటూ మరొకరు. ఎవరు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా గడచిన ఐదు దశాబ్దాల చరిత్రను చూసినపుడు అమెరికా, ఇతర ధనిక దేశాల విధాన నిర్ణేతలు, మేథావులు అనుసరించిన విధానాలు, అడ్డుకోవటాలు జనచైనా ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయన్నది జగమెరిగిన సత్యం. చైనా గురించి ఈ మాటలు చెబుతున్నవారు ట్రంప్‌ నిర్ణయం భారత్‌కు బహుమతి అని ఎందుకు చెప్పలేకపోయారు ? అత్తారింటికి దారేది సినిమాలో పదిలక్షల రూపాయల సూట్‌కేసును పవన్‌ కల్యాణ్‌ బహుమతిగా ఇస్తే దాన్ని తీసుకు వెళ్లిన ఆలీ తాళం రావటం లేదంటూ తిరిగి వచ్చిన దృశ్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆకస్మికంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని స్థితిలో పదకొండేండ్ల మోడీ పాలన మనదేశాన్ని ఉంచిందని భావించాలా ? ఎందుకంటే ఏది జరిగినా మోడీ కారణంగానే అంటున్నారు గనుక ఇలా వ్యాఖ్యానించాల్సి వస్తోంది.

ప్రతిభావంతులకు చైనా,బ్రిటన్‌ వల అన్నది ఒక ప్రముఖ తెలుగు పత్రిక శీర్షిక. అమెరికా అడ్డుకుంటే ప్రతిభను వృధా కానివ్వాలా ? ఆ పని మనమెందుకు చేయటం లేదని ప్రశ్నించాల్సిన వారు ఇతర దేశాల గురించి అలాంటి పదజాలంతో కించపరుస్తూ వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి కె వీసాల జారీతో చైనా ఎంతో చురుకుగా ప్రపంచంలోని స్టెమ్‌ (సైన్సు,టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత) మేథావులను ఆకర్షిస్తున్నదని ట్రంప్‌ ప్రకటన తరువాత వార్తలు వెలువడ్డాయి. నిజానికి చైనా నిర్ణయం ఎంతో ముందుగానే తీసుకున్నది. మన మీడియా, అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ మన పాలకులు చైనా చర్యలను గుర్తించలేదు, అసలు ప్రయత్నం కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు.మనం లేకపోతే అమెరికాకు గడవదు అని మనజబ్బలు మనం చరుచుకున్నాం తప్ప అసలు వారెందుకు ప్రపంచమంతటి నుంచీ మేథావంతులను ఆకర్షిస్తున్నారు, తేడా వచ్చి ఆకస్మికంగా అడ్డుకుంటే ప్రత్యామ్నాయం ఏమిటి అని 2047 విజన్‌ గురించి చెబుతున్న నరేంద్రమోడీ గానీ, అంతకు ముందే విజన్లను ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గానీ ఎప్పుడైనా ఆలోచించారా ? కాక మీద ఉన్నపుడే ఇనుము మీద దెబ్బలు వేసి అవసరానికి అనుగుణంగా మలుచుకోవాలి. ఇప్పుడు యువత కూడా ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. అమెరికాగాకపోతే ఆస్ట్రేలియా, అదిగాక పోతే ఆఫ్రికా అన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు. సంచార తెగమాదిరి ఎక్కడికో అక్కడికి పోవటం తప్ప మన దేశం పురోగమించటం గురించి, గౌరవ ప్రదమైన ఉపాధి గురించి ఎందుకు ఆలోచించరు ?

అమెరికా వ్యూహాత్మకంగా స్వయంగా చేసిన తప్పిదం అంటున్నారు సరే, దాంతో మనకు పోయేదేమీ లేదు, మనం ఎందుకు వ్యూహాత్మకంగా ఆలోచించలేదు అని కదా పాఠాలు తీసుకోవాల్సింది. చైనా కె వీసా ఎంతో స్మార్ట్‌గా, వ్యూహాత్మకంగా, నిర్దాక్షిణ్యమైన అవకాశవాదంతో ( రూత్‌లెస్లీ ఆపర్చ్యునిస్టిక్‌) ఉందని కూడా ఉక్రోషం వెలిబుచ్చారు. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకొనేందుకు చైనాలోని ఏదో ఒక కంపెనీ ఇచ్చే అవకాశంతో పని లేదు. అనుభం కూడా అవసరం లేదు. వారు కోరిన అర్హతలు ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతిభావంతులను ఆకర్షించటం ఇప్పుడే ప్రారంభం కాలేదు. వేయి ప్రతిభల పథకం(టిటిపి) పేరుతో చైనా 2008 నుంచే ఆకర్షించటం ప్రారంభించింది. అయితే చైనా మీద ఉన్న తప్పుడు ప్రచారం, అమెరికాతో పోలిస్తే దక్కే ప్రతిఫలం తక్కువగా ఉండటం, కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వం అనే వ్యతిరేక భావనలు ఇలా అనేక అంశాలు చైనా వైపు చూడటానికి యువతను అడ్డుకున్నాయి. అది కూడా చాపకింద నీరులా తన పథకాన్ని అమలు జరిపింది తప్పహడావుడి చేయలేదు. ఇప్పుడు చైనా సాధిస్తున్న పురోగతి, ఇతర దేశాల్లో విధిస్తున్న ఆంక్షలు, జాత్యహంకారం వంటి వివక్ష ఇతర సమస్యల కారణంగా గతంలో మాదిరి అడ్డుకొనే అవకాశాలు పరిమితం. అనేక మంది వైద్య విద్యకోసం చైనా వెళ్లిన సంగతి తెలిసిందే.

మన దేశానికి ట్రంప్‌ మంచి అవకాశాన్ని కల్పించాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవటం మన విధాన నిర్ణేతలు, పాలకుల చేతుల్లో ఉంది. సేవారంగంలో మన యువత ముందంజలో ఉంది.మొత్తంగా చూసినపుడు సాధించాల్సింది ఇంకా ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది. ప్రపంచంలో పరిశోధన మరియు అభివృద్ధి మీద చేస్తున్న ఖర్చు వంద రూపాయలు అనుకుంటే మనం చేస్తున్నది కేవలం రు.2.90 మాత్రమే. అదే అమెరికా 24.8, చైనా 22.80 ఖర్చు చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ప్రపంచంలో నవకల్పనలకు పేటెంట్‌ హక్కులు లభిస్తున్నాయి. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం 2023లో చైనా అత్యధికంగా 16,19,268 దరఖాస్తులు సమర్పించగా 7,98,347 మంజూరయ్యాయి. రెండవ స్థానంలో ఉన్న అమెరికా 5,94,340కి గాను 3,20,410 పొందింది. మన విషయానికి వస్తే ఐదవ స్థానంలో 70,068 మాత్రమే సమర్పించి 30,490 పొందాము. మూడవ స్థానంలో ఉన్న జపాన్‌ 2,89,530కి గాను 2,01,420, నాలుగవది దక్షిణ కొరియా 2,37,633కు గాను 1,35,180 పొందాయి. ఏదైనా పిండికొద్దీ రొట్టె.గడచిన పదకొండు సంవత్సరాలుగా అంతకు ముందు కూడా పరిశోధన, అభివృద్ధికి మనదేశం చేసిన ఖర్చు పెరగలేదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తే ఇలాగే ఉంటుంది.పోనీ వాటినైనా వెలికి తీస్తారా అంటే అదీ చేయరు. పడక కుర్చీ కబుర్లు చెబుతుంటారు. యుద్ద ప్రాతిపదికన కొన్ని సంవత్సరాల పాటు అవసరమైన నిధులు కేటాయించి ప్రోత్సహిస్తే మనం కనీసం మూడవ స్థానానికి చేరుకుంటాం.ఈ అవకాశాన్ని మోడీ సర్కార్‌ సద్వినియోగం చేస్తుందా ? చౌకబారు రాజకీయాల మీదనే కేంద్రీకరిస్తుందా ? కొంత మంది అంచనా వేస్తున్నట్లు రానున్న రోజుల్లో ప్రావీణ్యం అసలైన శక్తిగా ముందుకు రానుంది. దీన్ని చైనా ఎప్పుడో గుర్తించింది, అమెరికా ఇప్పుడు నేర్చుకుంటున్నది, మరి మనం ? అవు సైన్సును నమ్ముకుంటే గోమూత్రం, పేడ దగ్గరే ఉండిపోతాం. వార్షిక ప్రపంచ రాంకింగ్‌లను చూసినపుడు చైనా విద్యా సంస్థల పురోగతి స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పటికీ చైనాను గుడ్డిగా వ్యతిరేకించే వారు అది అనుకరించేది తప్ప నవకల్పనలు చేసేది కాదని వాదిస్తారు. వారిని అలాగే ఉండనిద్దాం, వాస్తవాలను చూద్దాం. అమెరికాకు చెందిన న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ నివేదికలో 105 దేశాలకు చెందిన 2,250 ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ సంవత్సరం బీజింగ్‌లోని సిన్హువా విశ్వవిద్యాలయం ప్రపంచ రాంకుల్లో పదకొండవ స్థానం పొందింది. పెకింగ్‌, ఝెజియాంగ్‌ 25,45వ స్థానాల్లో ఉన్నాయి. 2018లో సిన్హువా, పెకింగ్‌ 50, 68 స్థానాలతో తొలి వందలో ఉన్నాయి.ఈ ఏడాది వాటి సంఖ్య పదిహేనుకు చేరింది.చైనాలో అమలు జరిపిన కరోనా ఆంక్షలు, అంతకు ముందే 2018లో ట్రంప్‌ తొలి పాలనా కాలంలో ప్రారంభమైన అమెరికా వేధింపులు పెరగటంతో 2019-20లో 3,72,532గా అమెరికాలో చదివిన చైనా విద్యార్థుల సంఖ్య 2023-24లో 2,77,398కి తగ్గింది. దీంతో ఇప్పుడు మన దేశం మొదటి స్థానంలోకి వెళ్లింది.

ఇప్పటి వరకు చైనా నుంచి అమెరికాకు మేథోవలస జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగి రావటం ప్రారంభమైంది. దీనికి అక్కడ పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు పెరగటంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులో చైనాను విస్మరించలేని స్థితికి చేరుకోవటం, అక్కడ కూడా అనేక స్టార్టప్‌లు ప్రారంభించటానికి ప్రభుత్వం అవకాశం కల్పించటం వంటి కారణాలు దీనికి దోహదంచేస్తున్నాయి.2035 నాటికి ప్రపంచ అగ్రస్థానంలో సాంకేతిక రంగాన్ని నిలబెట్టేందుకు చైనా పూనుకుంది. అందుకు అవసరమైన పెట్టుబడిలో అమెరికాతో పోటీపడుతోంది.ఓయిసిడి సంస్థ సమాచారం ప్రకారం పదేండ్ల క్రితం అమెరికా చేసిన పరిశోధన ఖర్చులో 72శాతం చేసిన చైనా 2023నాటికి 780 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 96శాతానికి చేరుకుంది. పరిశోధన ఉత్పత్తిలో 2017లోనే అమెరికాను అధిగమించింది. డీప్‌ సీక్‌ సంచలనం తెలిసిందే. దానిలో పనిచేసిన వారందరూ చైనా యువకులే.కొంత మందికి ఎక్కడా పని చేసిన అనుభవం కూడా లేదు. దీనితో పాటు ఝజియాంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాడ్యుయేట్లు డీప్‌ రోబోటిక్స్‌లో ప్రావీణ్యం పొందారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ప్రమాదకరమైన హై ఓల్టేజి సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తున్నారు. సిలికాన్‌ వాలీతో పోటీ పడేట్లుగా చైనా ప్రోత్సహిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞాన ఎగుమతులపై అమెరికా విధించిన నిషేధాలను సవాలుగా తీసుకుంది.అవకాశాలను అందిపుచ్చుకోవటంలో చైనాను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 1970దశకంలో అనివార్యమైన స్థితిలో ఐరాస భద్రతా మండలిలో కమ్యూనిస్టు చైనాను అసలైన శాశ్వత ప్రతినిధిగా అమెరికా గుర్తించాల్సి వచ్చింది.

దాని కొనసాగింపుగా చైనా ప్రారంభించిన సంస్కరణలను సొమ్ము చేసుకోవాలని అమెరికా భావించింది. తాత్కాలిక లాభాలను అమెరికన్లు చూస్తే దీర్ఘకాలిక లక్ష్యంతో సంస్కరణలను చైనా తలపెట్టింది.1978 వరకు అమెరికా ఉన్నత విద్యా సంస్థలలో చైనీయులకు ప్రవేశం లేదు. సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకొనే ప్రక్రియలో భాగంగా అమెరికా సైన్సు సలహాదారు ఫ్రాంక్‌ ప్రెస్‌ బీజింగ్‌ సందర్శనకు వచ్చాడు. అక్కడి నుంచి నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు ఫోన్‌ చేసి తమ విద్యార్థులు ఐదువేల మందిని అమెరికా విద్య కోసం పంపేందుకు ఆసక్తితో ఉన్నట్లు చైనా చెప్పిందని, ఏం చేయమంటారని అడిగాడు. ఐదువేలేం ఖర్మ లక్ష మందిని పంపవచ్చని వారికి చెప్పండని కార్టర్‌ సమాధానమిచ్చాడట. అలా వెళ్లిన లక్షలాది మంది చైనా విద్యార్ధులు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏటా 15 బిలియన్‌ డాలర్ల లబ్ది కలించారు.ఆ విధంగా అమెరికా మేథోవలసను ప్రోత్సహించి ఎంతోలబ్ది పొందింది. అక్కడి మార్కో పోలో అనే మేథో సంస్థ ప్రపంచ కృత్రిమే మేథ సర్వే చేసింది. అమెరికాలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధకుల్లో 37శాతం మంది అమెరికన్లు కాగా చైనీయులు 38శాతం ఉన్నట్లు తేలింది.చాట్‌ జిపిటి 4 ప్రాజెక్టులో కీలకమైన సేవలు అందించిన వారిలో 20శాతం మంది చైనీయులే. వీటన్నింటిని చూసిన తరువాత భయపడిన అమెరికన్లు పొమ్మనకుండా చైనీయులకు పొగ పెట్టారు. మా దేశంలో చదువుకొనేందుకు రావచ్చు గానీ స్టెమ్‌ కోర్సుల బదులు, మావవ, సామాజిక శాస్త్రాలను ఎంచుకోవాలని వత్తిడి తెస్తున్నది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన కోర్సులో ప్రవేశాన్ని పరిమితం చేసింది. అందుకే చైనీయులు వేలాది మంది స్వదేశం బాట పట్టి అమెరికాకు పాఠం చెప్పేందుకు పూనుకున్నారు. మోడీ సర్కార్‌ మనవారికి అలాంటి అవకాశాలను కల్పిస్తుందా అన్న శేష ప్రశ్న !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ : ముగ్గురు పిల్లల్ని కనాలంటున్న బ్రహ్మచారి ఆర్‌ఎస్‌ఎస్‌ మోహన భగవత్‌ !

29 Friday Aug 2025

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Economics, Education, Europe, Gujarat, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence, RUSSIA, USA, Women

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Hindu Fundamentalism, hindutva, Mohan Bhagwat, Narendra Modi Failures, RSS, Three Child Families

ఎం కోటేశ్వరరావు

మీ కుటుంబంలో తరతరాల వారికి పుణ్యం రావాలంటే కాశీ దాకా తాటిపట్టె మీద దేకమన్నాడట ఒక సనాతనవాది. ముడ్డి మీది కాదుగనుక ఏమైనా చెబుతారు మీ పుణ్యం వద్దు మీరు వద్దు అంటూ ఒక పామరుడు చక్కాలేచిపోయాడని ఒక కథ.జనాభా తగ్గకుండా ఉండాలంటే ప్రతి మహిళ కనీసం ముగ్గురు పిల్లలను కనాలని బ్రహ్మచారి అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ సంఫ్‌ు వందేళ్ల సభలో చెప్పారు. మోసే గాడిదలకు తెలుస్తుంది మోపిన బరువెంతో అన్నట్లుగా పిల్లలున్నవారికి తెలుస్తుంది వారిని పెంచటంలో ఉన్న ఇబ్బంది. బ్రహ్మచారులు, కుటుంబ జీవనం లేని సాధువులు, సన్యాసులు, సాధ్విలకు ఏమి తెలుస్తుంది. మోహన్‌ భగవత్‌ ముగ్గురు పిల్లల గురించి చెప్పటం ఇదే మొదటిసారి కాదు. అయితే సంఘపరివార్‌ సభ్యులు లేదా దాని గురించి గొప్పగా చెప్పుకొనే వారు ఎంత మంది ముగ్గురు పిల్లలను కంటున్నారన్నది సమస్య.వారు ఎప్పటి నుంచో చెబుతున్నా జనాలు పట్టించుకోవటం లేదు. జననాల రేటు తగ్గుతూనే ఉంది. అయినా చెబుతూనే ఉండటం వెనుక పెద్ద ఓట్ల రాజకీయం ఉంది. అయితే జనాభా తగ్గుదల గురించి ఇతరులు అనేక మంది చెబుతున్నారు గదా భగవత్‌ చెప్పిందాంట్లో తప్పేముందని ఎవరైనా అడగవచ్చు. నిజమే, ముఖ్యమంత్రులు స్టాలిన్‌, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు తప్పు వారు మతాన్ని జోడిరచలేదు. అదే అసలు సమస్య. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి 2022 అక్టోబరులో జనాభా అదుపుకు సమగ్ర విధానం ఉండాలని, మత ప్రాతిపదికన అసమతూకం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మనదేశంలోకి ఇస్లాం, క్రైస్తవం రాకముందు ఇక్కడ పుట్టిన మతాలు తప్ప మరొకటి లేవుగా, మరి అవి జనానికి ఒరగబెట్టిందేమిటి. అందరూ ఒకే మతం వారంటూ సమానంగా చూసిన పాపాన పోలేదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కులవివక్ష, పీడన అదనంగా ప్రసాదించటం తెలిసిందే.

నేడు దేశంలో ఉన్న వాతావరణం ఏమిటి ? హిందూ మతం బతికి బట్టకట్టాలంటే హిందువులు ఎనిమిది నుంచి పది మంది పిల్లలను కనాలని ఆర్‌ఎస్‌ఎస్‌ గుంపుకు చెందిన విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా చెప్పారు.ఆయన కన్నది ఇద్దరిని, అలాంటి వారి కబుర్లన్నీ ఇలాగే ఉంటాయి. బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ నలుగురిని కనాలన్నారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా 2006 ఏప్రిల్‌ 20వ తేదీన ‘‘కాషాయ జనాభా శాస్త్రం ’’ పేరుతో ప్రచురించిన విశ్లేషణ వివరాల ప్రకారం విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు అశోక్‌ సింఘాల్‌ 2004లో మాట్లాడుతూ హిందువులు ఎక్కువ మంది పిల్లల్ని కనకపోవటం ఆత్మహత్యా సదృశ్యమన్నారు.2005 ఫిబ్రవరిలో విహెచ్‌పి మార్గదర్శక మండల్‌ సమావేశంలో శ్రీకృష్ణుడి తలిదండ్రుల మాదిరి సంతానాన్ని కనాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు.సుభాష్‌ చంద్రబోస్‌ కృష్ణుడి మాదిరి ఎనిమిదవ సంతానమని, రవీంద్రుడు తొమ్మిదవ సంతానమని దానిలో పేర్కొన్నారు.హిందూ మహిళలు విచ్చల విడిగా అబార్షన్లు చేయించుకోకుండా చూడాలని విహెచ్‌పి కోరింది.ముస్లింల జనాభా అదుపులేకుండా పెరుగుతోందని, వారికి పోటీగా హిందువులు పిల్లలను ఎక్కువగా కనాలని హరిద్వార్‌లో జరిగిన విశ్వహిందూపరిషత్‌ మార్గదర్శక్‌ మండల్‌ పిలుపు ఇచ్చిందని రెడిఫ్‌ న్యూస్‌ 2006 జూన్‌ 15న ‘‘ హిందువులు జనాభాను పెంచాలని కోరిన విహెచ్‌పి ’’ అనే శీర్షికతో వార్త ఇచ్చింది. ఇలా కాషాయ గుంపునేతల మాటలను ఎన్నయినా ఉటంకించవచ్చు. హిందూ జాతి అంతరిస్తున్నదని, మతానికి ముప్పు వచ్చిందని, త్వరలో ముస్లిం జనాభా మెజారిటీగా మారుతుందని హిందూ మహాసభ నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులంతా పదే పదే చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం తెలిసిందే.జనాభా సమతూకంలో ఉండాలని చెబుతారు.ఇప్పుడు ముస్లింల గురించి చెబుతున్నప్పటికీ తరువాత హిందువుల్లో ఏ కులం వారు ఎందరుంటే సమతూకం ఉంటుందో కూడా నిర్దేశించరని, సమాజం సమతూకంగా ఉండాలంటే చాతుర్వర్ణ వ్యవస్థ ఉండాలనే అజెండాను ముందుకు తీసుకురారనే హామీ ఏముంటుంది. అంటే వీరు చెప్పినట్లే జనం కులం, మతాన్ని పాటించాలి, ఎందరు పిల్లల్ని కనమంటే ఆ సంఖ్యలోనే కనాలి.


జనాభా పెరుగుదల తరుగుదల సమస్యలను మతకోణంలో చూడటం అవాంఛనీయ వైఖరి. ముస్లిం ఛాందసులు అధికారంలో ఉన్న ఇరాన్‌లో సంతానోత్పత్తి రేటు పడిపోతున్నది. 1950లో అక్కడ 6.9 ఉండగా 2024లో 2.08కి తగ్గింది. క్రైస్తవుల్లో కూడా ఛాందసులు తక్కువేమీ కాదు, కానీ ఐరోపాలో సంతానోత్పత్తి రేటు 1.5, సగం ఐరోపా, సగం ఆసియాలో ఉన్న టర్కీ ముస్లిం దేశం, అక్కడ కూడా అంతే ఉంది.ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న దేశాలను ముస్లిం దేశాలని పిలుస్తున్నారు.2011నుంచి 21 సంవత్సరాల కాలంలో ఈ దేశాల్లో సంతనోత్పత్తి రేటు 3.3 నుంచి 2.7కు తగ్గింది.విద్య, పట్టణీకరణ, ఆర్థిక, సామాజిక,ఆరోగ్య, శిశుమరణాలు తదితర పరిస్థితులను బట్టి తప్ప ప్రపంచంలో ఎక్కడా మత ప్రాతిపదికన పిల్లలను కనటం, మానటం లేదు. మేం సనాతనులం, పక్కా హిందువులం అని చెప్పుకుంటున్న కుటుంబాలలో తొగాడియా చెప్పినట్లు ఎంత మంది పదేసి మంది పిల్లలు కలిగి ఉన్నదీ చెప్పమనండి. తమ ఉన్మాద చర్యలకు ఉపయోగించుకోవటం తప్ప ఏ మతమూ పిల్లల బాగోగులకు బాధ్యత తీసుకోవటం లేదు.


2019 నుంచి 21 వరకు జరిగిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో సంతానోత్పత్తి రేటు 2.1 ఉంటే దక్షిణాది రాష్ట్రాలలో 1.64,ఉత్తరాదిన 2.0, పశ్చిమాన 1.81, తూర్పున 2.0, మధ్య ప్రాంతంలో 2.1 ఈశాన్య ప్రాంతంలో 2.15 ఉంది. రాష్ట్రాలన్నింటా ఒకే విధంగా లేదు.బీహార్‌లో 3.02, పక్కనే ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో 2.38, దాన్నుంచి ఏర్పాటు చేసిన ఉత్తరా ఖండ్‌లో 1.87, పశ్చిమ బెంగాల్లో 1.56 పక్కనే ఉన్న ఒడిషాలో 2.14 చొప్పున ఉంది. ఒకే రాష్ట్రంలో చూస్తే గుజరాత్‌ గ్రామీణంలో 2.15, పట్టణాల్లో 1.63, మధ్యప్రదేశ్‌లో 2.23 1.62, తెలంగాణాలో 1.95 1.63, ఆంధ్రప్రదేశ్‌లో 1.74 1.62 ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలు, దేశమంతటా కాషాయదళాలు చెప్పినట్లుగా హిందువులు ఎనభైశాతం ఉన్నప్పటికీ సంతానోత్పత్తి ఒకే విధంగా ఎందుకు లేదు ? 201516 జాతీయ కుటుంబ సర్వే వివరాల ప్రకారం అత్యంత ఎక్కువ విద్యావంతులున్న జైన్‌ సామాజిక తరగతిలో 1.2శాతమే. ఇంత తక్కువ ఏ సామాజిక తరగతిలోనూ లేదు. అత్యంత పేదల్లో 3.2 ఉండగా ధనికుల్లో 1.5 మాత్రమే ఉంది. ముస్లిం సామాజిక తరగతిలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉండటానికి వారు ఆలశ్యంగా మేలుకోవటమే. దానికి కుట్ర సిద్దాంతాలతో విద్వేష ప్రచారం చేయటం తగనిపని.దేశంలోని కొన్ని ప్రాంతాలలో మైనారిటీలు పైచేయి సాధించటాన్ని నివారించాలంటే పెద్ద హిందూ కుటుంబాలు ఉండాలని, ఉన్నత హిందూ కుటుంబాల వారు కుటుంబనియంత్రణ గురించి తీవ్రంగా సమీక్షించుకోవాని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కేరళలోని కొచ్చిలో 2013లో జరిగిన ఒక సభలో పిలుపునిచ్చారు. కుటుంబ నియంత్రణ అన్నది హిందువులకు ఇంకేమాత్రం వ్యక్తిగత సమస్య కాదని, ఒక బిడ్డ చాలని వారు అనుకుంటే ముస్లింలు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని విశ్వహిందూ పరిషత్‌ నేత చంపత్‌ రాయ్‌ 2015లో ఒక పత్రికా గోష్టిలో చెప్పారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు పిల్లల్ని కనాలని చెబుతున్నారు సరే, వారి బాగోగుల గురించి శ్రద్ద తీసుకోవాలని తమ మార్గదర్శకత్వంలో నడిచే కేంద్రం, 15 రాష్ట్ర ప్రభుత్వాలు, వారికి మద్దతుగా ఉన్న మరో ఆరు మిత్ర ప్రభుత్వాలకు ఎందుకు చెప్పటం లేదు ? ఎంత సేపటికీ మతం తప్ప శిశుసంరక్షణకు కేటాయింపులు, వివిధ పథకాల వైఫల్యం గురించి మీడియాలో వస్తున్న విశ్లేషణలు వారికి పట్టవా, కనిపించవు, వినిపించవా ! మతంతో నిమిత్తం లేకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి ఒక్క బిడ్డకు ఏడాదికి రు.44వేల చొప్పున మూడు స ంవత్సరాల పాటు నగదు ఇచ్చే పధకాన్ని చైనా ప్రవేశపెట్టింది. వారి జనాభా మనతో సమానంగా ఉంది. హంగరీలో ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలుంటే పన్నుల రాయితీ, గృహరాయితీ, పోలాండ్‌లో రెండవ బిడ్డ తరువాత ఎందరుంటే అందరికీ నెలవారీ నగదు, రష్యాలో 25 ఏండ్ల లోపు యువతులు పిల్లలను కంటే నగదు బదిలీ, అమెరికాలో తొలిసారి తల్లులయ్యేవారికి బేబీ బోనస్‌ పేరుతో ఐదువేల డాలర్లు, దక్షిణ కొరియాలో కూడా రాయితీలు ఇస్తున్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులు అని కబుర్లు చెప్పటం తప్ప వారి సక్రమపెరుగుదలకు మనదేశంలో తీసుకుంటున్న చర్యలేమిటి ? కార్పొరేట్‌ కంపెనీలకు గణనీయంగా పన్ను మొత్తాలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం మరోవైపున శిశు సంరక్షణ కేటాయింపులకు కోత పెడుతున్నది.


పోషకాహార లేమితో పిల్లలు గిడసబారి పోవటం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవటం, రక్తహీనత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. పేద పిల్లల్లో ఉండాల్సినదానికంటే బరువు తక్కువగా ఉంటే, ధనికుల పిల్లల్లో హానికరమైన ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఐదేండ్లలోపు పిల్లలు 35.5శాతం మంది పోషకాహారం లేక గిడసబారినట్లు, 19.3శాతం ఎత్తుకు తగ్గ బరువు లేరని, 32.1శాతం మంది బరువు తక్కువ, మూడు శాతం ఎక్కువ బరువు ఉన్నట్లు 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది.49 ఏండ్ల పురుషుల్లో 25, మహిళల్లో 57శాతం మందికి రక్తహీనత ఉంది.దేశంలో 74శాతం జనాభాకు ఆరోగ్యవంతమైన ఆహారం లేదని సర్వేలు తెలుపుతున్నాయి, ఆకలి సూచికలో మనం దిగువన ఉన్నాం. ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌ అని ఎన్నడో మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన పరిస్థితులే నేడు కూడా ఉన్నాయని చెప్పుకోవాల్సి రావటం సిగ్గుచేటు. బాల్యంలో పోషకాహారలోపం ఉంటే అది ఆర్థిక వ్యవస్థకు నష్టమేగాక ఆరోగ్యపరంగా భారంగా మారుతున్నది. అంగన్‌వాడీల నుంచి ఆరేండ్లలోపు పిల్లలు కేవలం 50.3శాతమే ఏదో ఒక సేవను పొందుతున్నారు. కేంద్ర బడ్జెట్‌, రాష్ట్రాల బడ్జెట్ల గురించి పాలకులు గొప్పలు చెప్పుకోవటం తప్ప పిల్లల సంక్షేమానికి కేటాయిస్తున్నదేమిటి ? 2017 కేంద్ర బడ్జెట్‌లో 3.2శాతం కేటాయిస్తే 2021లో అది 1.9శాతానికి తగ్గి 2024లో 2.3దగ్గర ఉంది. జిడిపిలో 2000సంవత్సరంలో 0.12శాతం కాగా 2024కు 0.10కి తగ్గింది. బీహార్‌లో 2020 నుంచి 2022వరకు మూడు సంవత్సరాల్లో కేటాయించిన బడ్జెట్లో ఖర్చు చేసిన మొత్తాలు 83,76,77శాతాలు మాత్రమే ఉన్నాయి.దేశానికి ఆదర్శంగా చెప్పిన గుజరాత్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పరిగణిస్తారు. అక్కడ నరేంద్రమోడీ ఏలుబడి సాగింది. రక్తహీనతలో అగ్రస్థానంలో దేశానికే ‘‘ ఆదర్శం ’’గా ఉంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చరిత్ర గమనాన్ని మార్చివేస్తున్న కమ్యూనిస్టులు : ప్రతిభావంతులను ఆకర్షిస్తున్న చైనా, బెంబేలెత్తుతున్న అమెరికా !

21 Thursday Aug 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Education, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

China “young talent” K visa, china communist party, China vs US, Donald trump, global scientific talent China, STEM experts, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


అవును ఎవరు అవునన్నా కాదన్నా, మరొకటన్నా ఇది నిజం. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లుగా మేథావులందరూ పశ్చిమదేశాలలోనే పుట్టారు, మిగతా దేశాల వారు అక్కడికే వెళతారు అన్నట్లుగా కొందరు చాలాకాలంగా జనాల మెదళ్లకు ఎక్కించారు. ఇప్పుడు చైనా కమ్యూనిస్టులు దాన్ని తలకిందులు చేస్తున్నారు. గత శతాబ్దిలో ప్రపంచాన్ని ఏలిన చమురుకు ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది. అయితే అదే సర్వస్వం కాదని తేలిపోయింది. దాన్ని పక్కన పెట్టే ‘‘ ప్రతిభ ’’ ప్రత్యామ్నాయ హరిత ఇంథనం, క్వాంటమ్‌, కృత్రిమ మేథ వంటి రూపాల్లో ముందుకు వస్తున్నది. చమురుతో పని లేకుండా నడిచే విద్యుత్‌ వాహనాలు రోడ్లను ముంచెత్తటం తెలిసిందే. ఈ పూర్వరంగంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో 2035 నాటికి అమెరికాను అధిగమించేందుకు చైనా నడుంకట్టటం గురించి కొద్ది నెలలుగా మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి, అవేవీ కమ్యూనిస్టులు నడిపేవి కాదు, చివరికి కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదుల పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక ‘‘స్వరాజ్య ’’లో 2025 జూన్‌ 27న అమిత్‌ మిశ్రా అనే విశ్లేషకుడు కూడా రాశారు.దాన్ని నవీకరించి ఆగస్టు మూడున తిరిగి ప్రచురించారు. ‘‘ మేథోవంతుల ఆకర్షణ : వేయి ప్రతిభల చైనా వ్యూహం దాని ఔన్నత్యాన్ని ఎలా ముందుకు నెడుతున్నది ’’ అనే శీర్షిక( కోర్టింగ్‌ జీనియసెస్‌ : హౌ చైనా స్‌ థౌసెండ్‌ టాలంట్స్‌ స్ట్రాటజీ ఈస్‌ ఫ్యూయలింగ్‌ ఇట్స్‌ ఎసెంట్‌)తో ఒక విశ్లేషణ వెలుండిరది. ఇక్కడ దీన్ని ప్రస్తావించటం అంటే చైనాకు మిత,మతవాదుల సర్టిఫికెట్‌ లేదా ప్రశంసల గురించి కాదు. చైనా ఎలా దూసుకుపోతున్నదో చూడండి అనే ఉక్రోషం, అసూయ ప్రదర్శన దాని వెనుక ఉందని చెప్పేందుకే.


ఇక సందర్భానికి వస్తే ఈ ఏడాది అక్టోబరు ఒకటి నుంచి అంటే విప్లవదినోత్సం రోజు నుంచి చైనా ప్రభుత్వం ప్రపంచంలోని యువ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కె రకం వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఎందుకు అంటే 2035నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామి దేశంగా మారేందుకు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. కొత్తగా పట్టా పుచ్చుకున్న స్వదేశీయులు లేదా విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారు, ఇతర దేశాల్లో ఇప్పటికే ఆయా రంగాలలో పని చేస్తున్న వారిని ఆకర్షించేందుకు పూనుకుంది. ఇటీవలి కాలంలో చైనా విధాన నిర్ణయాలలో ఇది పెద్దదని భావిస్తున్నారు. తనకు ఎదురులేనంతవరకు చైనాను ఎదగనిచ్చిన అమెరికా ఎప్పుడైతే తన ఆధిపత్యానికి అన్ని రంగాలలో ప్రతిఘటన ఎదురవుతున్నదని గ్రహించిందో అప్పటి నుంచి అడ్డుకోవటం ప్రారంభించింది. వైట్‌హౌస్‌లో ఏ పార్టీ వారున్నా అదే చేస్తున్న పూర్వరంగంలో దానికి ధీటుగా చైనా కమ్యూనిస్టు పార్టీ చేసిన కసరత్తు నుంచి వెలువడిరదే తాజా నిర్ణయం. ప్రధాని లీ క్వియాంగ్‌ సంతకంతో అది చట్టంగా మారింది. స్టెమ్‌(సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణితం) రంగాలలో ప్రతిభావంతులైన విదేశీ యువతను ఆకర్షించేందుకు సరికొత్త ‘‘ యువ ప్రతిభ ’’ కె వీసా ప్రత్యేకత ఏమంటే చైనాలో ఉన్న కంపెనీల యజమానులు లేదా సంస్థల నుంచి సిఫార్సులు అవసరం లేదు.నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రతిభావంతులైన యువశాస్త్రవేత్తల కార్యక్రమంలో వయస్సు గరిష్ట పరిమితి 45 సంవత్సరాలు, మరో పధకానికి 40 ఏండ్లు. దీనికి ఎలాంటి పరిమితి నిబంధన లేదు. ఇతర దేశాలతో పోటీ పడుతూ వేతనాలు, వసతి, బోనస్‌, పిల్లలకు విద్య వంటి ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.దేశ విధానానికి లోబడి పరిశోధనలో స్వేచ్చ ఉంటుంది. ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడులకు ఎలాంటి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించారో ఇప్పుడు ప్రతిభావంతులైన వారిని ఆకర్షించేందుకు అలాంటి విధానాన్నే ముందుకు తెచ్చారని చెప్పవచ్చు. ఇలాంటి ప్రత్యేక వీసాలు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి.

అమెరికాలో చైనా సంతతికి చెందిన వారి మీద పెరుగుతున్న జాత్యహంకార వివక్ష, ఆంక్షలు, పరిశోధనలకు కేటాయింపుల కోత, గూఢచర్య ఆరోపణలతో వేధింపులు, రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల పూర్వరంగంలో అనేక మంది అక్కడి నుంచి బయటపడేందుకు చూస్తున్నారు. మంచి పండ్లను ఏరి దిగుమతి చేసుకున్నట్లుగా దశాబ్దాల తరబడి, అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మేథోవలసతో ఎంతగానో లబ్దిపొందాయి. ఇప్పుడు అటునుంచి వలసలకు చైనాతో నాంది పడిరదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు.చైనా కమ్యూనిస్టు పార్టీ నేత లి యువాన్‌చావో 2008లో ‘‘వేయి ప్రతిభావంతుల పథకాని(టిటిపి)కి రూపకల్పన చేశారు .విదేశాల్లో ఉన్న చైనా సంతతికి చెందిన వారిలో కనీసం రెండువేల మందిని స్వదేశానికి ఆహ్వానించి ఒక నవకల్పన సమాజంగా దేశాన్ని మార్చాలని తలపెట్టారు. 2011ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినపుడు ఏటా 50 నుంచి వందమందిని పదేండ్ల పాటు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దానికి మించి ఇప్పటి వరకు ఏడువేల మంది శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు,వాణిజ్య,పారిశ్రామికవేత్తలు వచ్చారని అంచనా, వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నారు. మరొక సమాచారం ప్రకారం 2010 నుంచి 2021 మధ్య కాలలో కనీసం 20వేల మంది చైనా జాతీయులు అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లారు. ఇలాంటి వారు చూపుతున్న ప్రతిభను బట్టి మిలియన్ల యువాన్లను బోనస్‌, ఇతర రాయితీలను ప్రతిఫలంగా చెల్లించుతున్నారు. అమెరికా నుంచి వచ్చే వారు విద్రోహచర్యల నిమిత్తం వస్తున్నారా నిజంగానే పని చేసేందుకే అని నిర్ధారించుకొనేందుకు సునిశిత పరిశీలనలు కూడా చేశారని వార్తలు. ఈ పధకానికి చైనా పెద్ద ప్రచారం ఇవ్వలేదు గాని దాని తీరుతెన్నులు గమనించిన అమెరికా జాతీయ గూఢచార సంస్థ, ఎఫ్‌బిఐ గుండెలు బాదుకుంటూ నివేదికలు రూపొందించాయి. చైనా ఆర్థిక, మిలిటరీ రంగాలలో పురోగమించటానికి చట్టబద్దంగా, అక్రమ పద్దతుల్లో అమెరికా మేథో సంపదను చైనా కొల్లగొడుతున్నదని ఆరోపించారు. ఈ ప్రచారం పెరగటంతో చైనా కొత్త పద్దతుల్లో క్విమింగ్‌ పేరుతో ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పూనుకుంది.2019 నుంచి 2023వరకు ఐదు వందలకు పైగా ప్రభుత్వ పత్రాలను పరిశీలించిన రాయిటర్స్‌ వార్తా సంస్థ చైనా ఇస్తున్న నగదు, ఇతర మొత్తాల గురించి పేర్కొన్నది.

దశాబ్దాలుగా భారత్‌, చైనా వంటి దేశాల నుంచి ఎందరో ప్రతిభావంతులు ఎక్కువగా అమెరికా, ఇతర పశ్చిమదేశాలకు వలస వెళ్లారు.వ్యక్తిగతంగా వారితో పాటు ఆయా దేశాల పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. ఆర్థికంగా నిలదొక్కుకొని ఎదగటం ప్రారంభమైన తరువాత మరింత ముందుకు పోవాలంటే అలాంటి అవసరం ఎంతో ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీ గుర్తించింది.కమ్యూనిస్టులు ప్రతిభావంతుల మీద కూడా తమ సిద్దాంతాలను రుద్దుతారని, వారికి స్వేచ్చ ఇవ్వరని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.చైనా కమ్యూనిస్టులు దాన్ని కూడా గమనంలో ఉంచుకున్నారు. నూటనలభై కోట్ల జనాభా జీవితాలను ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దాన్లో భాగంగానే తమ దగ్గరలేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించారు. అవి తమ నుంచి లబ్దిపొందుతాయని తెలిసినప్పటికీ దాని కంటే తాము ఎక్కువ ప్రయోజనం పొందుతామనే ముందు చూపు, ధైర్యంతో ఎన్ని విమర్శలు వచ్చినా సంస్కరణలకు తెరతీశారు, విజయం సాధించారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది గనుక అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రతిభావంతులను అక్కున చేర్చుకుంటున్నారు.దాని ఫలితాలు కనిపించాయి. సెమికండక్టర్లు, వైమానిక రంగం, 5జి, క్వాంటమ్‌ వంటి అనేక రంగాల్లో మరొకదాని వెనుక వెళ్లే పరిస్థితి నుంచి పోటీదారుగా మారింది. జీవశాస్త్రంలో అమెరికాను అధిగమించి 2017లోనే ఎక్కువగా పరిశోధక పత్రాలను చైనీయులు ప్రచురించారు.

గత నాలుగున్నర దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, విధానాల గురించి కొంత మంది విమర్శలు చేయవచ్చు.ఇప్పుడు చైనా మరొకదశలో ప్రవేశించింది. అధికారాన్ని కార్మికవర్గం చేతిలో పెట్టటం ద్వారా విప్లవం చేయాల్సినపని చేసింది. సాధించిన అధికారం ఒక్కటే జన జీవితాలను మెరుగుపరచదని గుర్తించిన తరువాత తీసుకున్న చర్యలకు తగిన ఫలితాలు వచ్చాయి. వాటికి ఉన్న పరిమితులను గమనించి మరొక అడుగు ముందుకు వేస్తున్నది. విదేశీ పెట్టుబడులకు కొంత ప్రతిఫలాన్ని చెల్లించినట్లుగా, స్వదేశంలోనే సంస్థల పెరుగుదలకు వ్యక్తులను ప్రోత్షహించిన తీరు చూశాము. అలాగే ప్రతిభావంతులకు మిగతావారితో పోలిస్తే అధికమొత్తాలను ఇవ్వాల్సి ఉంటుందని గ్రహించింది. మరిన్ని పరిశోధనల ద్వారా జనకల్యాణానికి వినియోగించేందుకు పూనుకున్నది. ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతులను చైనా ఆకర్షించటం అమెరికా మాదిరి కార్పొరేట్ల లాభాలకు కాదు, జనాల కోసం.ఈ ప్రయత్నం వెనుక వ్యూహాత్మక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి. నిజానికి ఇది చైనా కమ్యూనిస్టు పార్టీకి కత్తిమీద సామువంటిదే.వచ్చేవారు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి, శాస్త్ర రంగ నాయకత్వంతో పాటు రాజకీయ నాయకత్వంలో ఇమిడి పోయే విధంగా ఉండాలి. కమ్యూనిస్టుల గురించి అనేక తప్పుడు ప్రచారాలు జరిగిన నేపధ్యం,అన్యవర్గ ప్రభావంతో అలాంటి వారు ప్రతి చర్యనూ అనుమానంతో చూసే అవకాశం ఉంటుంది, సహజం. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొనే చైనా కమ్యూనిస్టులు ఒక ప్రయోగం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు అది చేసిన వన్నీ మొత్తం మీద ఫలించాయి.

చైనాలో ప్రస్తుతం ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాల పర్యావరణం నానాటికీ పెరుగుతున్నది.ప్రపంచ స్థాయి సంస్థలలో చైనా వాటికి చోటుదక్కుతున్నది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోమెడిసిన్‌, కృత్రిమ మేథ, ప్రత్యామ్నాయ ఇంథన రంగాలలో సాధించే పురోగతితో అగ్రగామిగా ఉన్న అమెరికాను అధిగమించాలన్నది కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన లక్ష్యం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ క్రమంలో తలెత్తే మిత్రవైరుధ్యాలు ఎలా ఉంటాయి, వాటిని పార్టీ ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం.మరోవైపున చూస్తే అమెరికా, ఇతర పెట్టుబడిదారీ ధనిక దేశాలు పరిశోధకులను, వారితో కలిగే లాభాలను కోల్పోతే చూస్తూ ఊరుకోవు. ప్రమాణాలకు గీటురాళ్లుగా ఇప్పటి వరకు కొనసాగిన అమెరికా విశ్వవిద్యాలయాలు ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటాయా ? ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పోటీ పడటంలో కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, జర్మనీ, అరబ్‌ ఎమిరేట్స్‌ వంటివి కూడా ఉన్నాయన్నది మరచిపోరాదు. గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టే విధంగా రానున్న రోజుల్లో పోటీ మరింత పెరగటం మంచిదే. వ్యక్తుల ప్రతిభకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది, అయితే అది పూర్తిగా వారి స్వంతం కాదు, సమాజం నేర్పినదానికి తమ సృజనాత్మకతను జోడిరపు మాత్రమే. ఉదాహరణకు విద్యుత్‌ బల్బ్‌ను చూస్తే, 1,799 సంవత్సరం నుంచి బల్బులు, బ్యాటరీల తయారీకి పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అనేక మంది చేసిన కృషి 1870, 80 దశకాల్లో పోటీ మరింత పెరిగింది.బ్రిటన్‌లో జోసెఫ్‌ స్వాన్‌, అమెరికాలో థామస్‌ ఎడిసన్‌ ఒకేసారి బల్బులను కనుగొన్నారు.స్వాన్‌ బల్బులు విలియమ్‌ స్టెయిట్‌ రూపొందించన నమూనాల ప్రకారం ఉన్నాయి. వాటి ఫిలమెంటు చాలా మందంగా ఉంది. ఎడిసన్‌ బల్బులో పలుచగా ఉండటంతో వాణిజ్య పరంగా అది విజయవంతమైంది. స్వాన్‌, ఎడిసన్‌ మధ్య పోటీ చివరకు వారిద్దరినీ ఒక దగ్గరకు చేర్చి ఎడిసన్‌ మరియు స్వాన్‌ ఎలక్ట్రిక్‌ లైట్‌ కంపెనీగా ఏర్పడి స్వాన్‌ రూపొందించిన ఫిలమెంట్‌తో మార్కెట్‌ చేశారు. కానీ పేరు ఎడిసన్‌కు వచ్చింది, దాని వెనుక ఎందరో ఉన్నారు. ఆ తరువాత బల్బుల్లో ఎన్ని మార్పులు, చేర్పులు జరిగాయో మనకు తెలిసిందే. అందువలన ప్రతి నవకల్పన సమాజానికి ఉపయోగపడుతుందా, కార్పొరేట్ల లాభాలకా అన్నదాన్ని బట్టి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల వర్గదృకృధం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. చైనా కార్మికవర్గ వైఖరితో ప్రతిభకు పట్టం కడుతున్నదని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ ఏలుబడిలో మరింత దిగజారిన లింగ అంతరం : జిడిపికి 2.9లక్షల కోట్ల డాలర్లనష్టం, అడిగేవారు లేరనేగా ఇంత అన్యాయం !

16 Monday Jun 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, Education, employees, Health, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

#Failed Narendra Modi, Beti Bachao Beti Padhao, BJP, Gender Inequality, India’s gender gap 131 Rank, inequality, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఇన్ని మంచి విషయాలు చెప్పారు కదా మీ వాడిలో ఉన్న రెండు లోపాలు చెబుతారా అని పిల్లనివ్వటానికి వచ్చిన పెద్దలు తండ్రిని అడిగారట. ఓస్‌ అంతేనా ఒకటి వాడికి తెలియదు, రెండు ఇతరులు చెప్పేది వినడు అన్నాడట. కొందరు పాలకులను చూస్తుంటే అదే అనిపిస్తోంది. పదకొండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలన విజయోత్సవాలంటూ బిజెపి, దాని మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి.సగం మందిగా ఉన్న మహిళల స్థితి బాగుపడకుండా ఎన్నికబుర్లు చెప్పినా అది నిజమైన వృద్ధి కాదు. పచ్చి నిజం ఏమిటంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత దేశంలో లింగఅంతరం తగ్గలేదు కదా , అంతకు ముందు ఉన్నదానికంటే దిగజారింది. దీని వలన జిడిపికి జరుగుతున్న నష్టం మామూలుగా లేదు.2015లో మెకెన్సీ గ్లోబల్‌ సంస్థ చెప్పినదాని ప్రకారం(2015 సెప్టెంబరు 25వ తేదీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా) పురుషులతో సమంగా ఉపాధి, సమానపనికి సమానవేతనం గనుక అమలు జరిపితే ప్రపంచ జిడిపికి 2025నాటికి 12లక్షల కోట్ల డాలర్లు తోడవుతుందని, దానిలో ఎక్కువ మొత్తం 2.9లక్షల కోట్ల డాలర్లు భారత్‌లో తోడవుతుందిని స్పష్టంగా పేర్కొన్నది. అది నాటి వేతనాలు, ద్రవ్యోల్బణం తదితరాల ప్రాతిపదికన వేసిన అంచనా అది. ఈ మొత్తం ఇప్పుడు అంచనా వేస్తున్న 4.187లక్షల కోట్ల డాలర్లకు అదనం, జర్మనీని కూడా దాటి మూడో స్థానంలోకి వెళ్లిపోయి ఉండేది. అసమానతల తగ్గింపు కృషికి మోడీని ఎంపిక చేసినట్లు చెప్పటం మరొక ప్రహసనం. అధికారానికి వచ్చిన మూడేండ్లకే అలాంటి నిర్ణయానికి సియోల్‌ బహమతి ఎంపికదార్లు ఎలా వస్తారు.ప్రధాని నరేంద్రమోడీకి 2018 సియోల్‌(దక్షిణ కొరియా) శాంతి బహమతి ఇచ్చారు.దేనికటా ! 2018 అక్టోబరు 24వ తేదీ మనవిదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో పెట్టిన సమాచారం మేరకు మోడినోమిక్స్‌ ద్వారా ప్రపంచ ఆర్థిక పురోగతిని పెంచటానికి, ఆర్థిక వృద్ధితో భారతీయుల మానవాభివృద్దిని వేగవంతం చేసేందుకు, ప్రజాస్వామ్య వృద్ధి, దేశంలో పేదలు, ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చేసిన కృషిని బహుమతి కమిటీ గుర్తించి ఎంపిక చేసిందని పేర్కొన్నారు. పదేండ్ల అనుభవం ఏమిటి ? 1961లో మన దేశంలో ధనికులుగా ఉన్న ఎగువ ఒకశాతం మంది వద్ద జాతీయ సంపదలో 12.9శాతం పోగుపడితే అది ఇప్పుడు 40శాతం దాటింది. నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన 1991లో 20శాతంగా ఉన్న కేంద్రీకరణ మోడీ అధికారానికి వచ్చే నాటికి 30శాతానికి చేరింది, మోడీ దాన్ని 40శాతానికి చేర్చారు, అసమానత తగ్గింది ఎక్కడ ? దిగువ 50శాతం మంది సంపద 1961నుంచి 2023 మధ్య 11.4 నుంచి 6.5శాతానికి దిగజారింది, మధ్యతరగతి అనుకొనేవారిది కూడా 43.7 నుంచి 29శాతానికి దిగజారింది, అంటే వారు కూడా పేదల్లోకి వచ్చారు. చిత్రం ఏమిటంటే ఇంత అసమానతలు పెరుగుతుంటే నిష్టదారిద్య్రం నుంచి పాతిక కోట్ల మందిని మెరుగైన స్థితిలోకి నెట్టామని చెప్పుకుంటున్నారు. ఇదొక ప్రహసనం, అంకెల గారడీ !


కేంద్రంలోనూ, మెజారిటీ రాష్ట్రాలలో మేము, మామిత్రులు ఉన్నాం అని చెబుతున్న నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎంగా అనుభవంఉన్నప్పటికీ మెకెన్సీ నివేదిక చెప్పిందేమిటో అర్ధం కాలేదా, వారేమిటి మాకు చెప్పేది అని ఖాతరు చేయలేదా ? ఇంతవరకు లింగ అంతరం, ఆర్థిక అసమానతల తగ్గింపుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ? మోడీ విజయగీతాలాపనలో తలమునకలుగా ఉన్న మీడియాలో ఎక్కడా దీని ప్రస్తావన కనిపించదు, వినిపించదు.2014లో ప్రపంచ ఆర్థికవేదిక విడుదల చేసిన నివేదిక ప్రకారం లింగఅంతరంలో 142 దేశాల్లో మన స్థానం 114, వచ్చిన పాయింట్లు 0.6455 కాగా అదే సంస్థ విడుదల చేసిన 2025 నివేదికలో 148దేశాలకు గాను 131వ స్థానంలో ఉన్నాం, వచ్చిన మార్కులు 0.644, గతం కంటే తగ్గాయి. జపాన్‌ కంటే ఈ ఏడాది కొన్నివేల కోట్ల డాలర్లు ఎక్కువగా ఉండి నాలుగో స్థానంలోకి వస్తుందన్న అంచనాలను చూసి పండగచేసుకున్న వారు లింగ అంతరం దిగజారటం గురించి మాట్లాడరేం ! మహిళలంటే చిన్నచూపు, నిర్లక్ష్యం, దీని గురించి చర్చ జరిగితే మోడీ విజయ బండారం బయటపడుతుందని తప్ప మరొక కారణం ఏముంది ?


పదకొండు సంవత్సరాలుగా ఎన్ని కబుర్లు చెప్పినా తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి అంతం లేదు. ఉట్టికొట్టలేనయ్య స్వర్గానికి ఎగురుతాడా అన్నట్లుగా 2047నాటికి దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతానని చెబుతున్నారు.లింగ అంతరం అంటే స్త్రీ, పురుషుల మధ్య ఉన్న సమానత్వంలో ఉన్న తేడా మదింపు. అవకాశాలు, విద్య, ఆరోగ్యం, రాజకీయ సాధికారత, బతికి ఉండటం సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే మార్కుల ఆధారంగా సూచికలను తయారు చేస్తారు, వాటికి ఆయా దేశాలు ఇచ్చే సమాచారమే ప్రాతిపదిక. ఆర్థికభాగస్వామ్యం, విద్య,వైద్యం,రాజకీయ సాధికారత అనే నాలుగు అంశాలపై విడివిడిగా సూచికలు రూపొందిస్తారు, వాటన్నింటిని కలిపి సాధారణ లింగఅంతర సూచికను తయారు చేస్తారు. వీటిలో కొన్ని పెరుగుదల తగ్గుదల ఉన్నప్పటికీ పది సంవత్సరాలలో మొత్తం మీద స్వల్ప తగ్గుదల నమోదైంది. పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బిల్లు ఆమోదించినప్పటికీ గత ఎన్నికలలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అందువలన మహిళా సాధికారత సూచికలో 2023 కంటే 2025లో 14.7 నుంచి 13.8కి పాయింట్లు తగ్గిపోయాయి.మహిళలకు మంత్రిపదవులు కూడా 6.5 నుంచి 5.6శాతానికి పడిపోయాయి. మరోవైపు త్వరలో జిడిపిలో మూడో స్థానానికి ఎదుగుతాం, అభివృద్ధి చెందిన దేశంగా మారనున్నాం అని అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు మన ఇరుగు పొరుగుదేశాల స్థితి గతులను చూద్దాం. అన్నింటికంటే అధమ స్థానంలో ఉన్న పాకిస్తాన్‌తో 148తో పోల్చుకుంటే 131లో మెరుగ్గా ఉన్నాం. తాజా సూచికలో ఏకంగా 75 స్థానాలను మెరుగుపరచుకొన్న బంగ్లాదేశ్‌ 24, చైనా 103,భూటాన్‌ 119, నేపాల్‌ 125, శ్రీలంక 130, మాల్దీవులు 138వ స్థానంలో ఉన్నాయి.

బేటీ పడావో బేటీ బచావో (ఆడపిల్లల్ని చదివించండి, ఆడపిల్లల్ని రక్షించండి) అంటూ పదేండ్ల క్రితం పెద్దగా ఒక పధకాన్ని నరేంద్రమోడీ ప్రారంభించారు.దరిద్రం ఏమిటంటే దానికి కేటాయించిన నిధులే స్వల్పం కాగా ఆ మొత్తాన్ని కూడా ఖర్చు చేయటం లేదు. ఆరేండ్లలోపు బాలబాలికల నిష్పత్తి 1961నుంచి మనదేశంలో పడిపోతోంది.1991లో ప్రతి వెయ్యి మంది బాలురకు గాను 945 మంది బాలికలు ఉండగా క్రమంగా తగ్గుతూ 2011 నాటికి 918కి పడిపోయింది, తరువాత ఇంతవరకు జనాభా లెక్కలు జరగలేదు గనుక కేవలం అంచనాలు మాత్రమే చెబుతున్నారు.2019 21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం అంతకు ముందు 201516తో పోల్చితే 919 నుంచి 929పెరిగిందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 934, తెలంగాణాలో 894 మంది ఉన్నారు. కేంద్ర గణాంకశాఖ 2023లో విడుదల చేసిన భారత్‌లో స్త్రీ, పురుషులు అనే నివేదిక ప్రకారం 2036నాటికి ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 952 మంది ఆడపిల్లలు ఉంటారని అంచనా వేశారు. మొత్తంగా స్త్రీ, పురుషుల నిష్పత్తిని చూస్తే 2025లో ప్రతి 106.453 మంది పురుషులకు వందమంది మహిళలు ఉన్నారని, దీని ప్రకారం జనాభాలో పురుషులు 51.56 శాతం ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 48.44శాతంగా ఉన్న మహిళలు 2036 నాటికి 48.8శాతానికి పెరుగుతారని అంచనా.2010లో ప్రతి వంద మంది ఆడపిల్లలకు 109.6 మంది మగపిల్లలు ఉన్నారని అంచనా. ఈ కారణంగానే అనేక మంది యువకులకు వివాహాలు కావటం లేదు. మంచి ఉద్యోగం, సంపద, రాబడి ఉన్నవారిని మాత్రమే అమ్మాయిలు ఎంచుకుంటున్నారని, వ్యవసాయంలో ఉన్నవారికి ఆలశ్యం అవుతోందని చెబుతున్నారు. జనాభా లెక్కలను 2027లో సేకరించనున్నందున వాటిని నిర్ధారించిన తరువాత మాత్రమే వాస్తవ పరిస్థితి వెల్లడి అవుతుంది. అప్పటి వరకు చెప్పేవన్నీ అంచనాలు మాత్రమే. ఉదాహరణకు 2025లో మన జనాభా 144కోట్లని గతంలో అంచనా చెప్పారు. ఇప్పుడు 146.39 కోట్లంటున్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష, లింగనిర్దారణ పరీక్షలు చేయించి అబార్షన్లు చేయించటం వంటి దుర్మార్గం జరుగుతున్న కారణంగా బేటీ బచావో పథకాన్ని 2015 జనవరి 22న ప్రవేశపెట్టారు గానీ ఆచరణలో అలాంటి చర్యలను ఆపేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు.లింగ అంతరం తగ్గకపోగా మరింతగా పడిపోవటానికి కారణం ఏమిటో ప్రధాని లేదా ఆయన మద్దతుదారులు చెప్పాలి. ఇంతవరకు ఏ బిజెపీ నేతా కాషాయదళాల మేథావులు కూడా స్పందించలేదు.

లింగ అంతరంలో ఆడపిల్లలు బతికి బట్టకట్టటాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు, ఈ పథకంలో బేటీ బచావో అన్నా అదే. అందుకే ఈ పథకం వైఫల్యం కూడా అంతరం మరింతగా పతనం కావటానికి దోహదం చేసిందని చెప్పాల్సి వస్తోంది. ఈ పథకానికి కేటాయించిన నిధులతో నరేంద్రమోడీ బొమ్మతో ప్రచారానికే ఎక్కువ ఖర్చు చేశారు. ఏడాదికి రెండు పాయింట్ల చొప్పున మెరుగుదల సాధించాలన్నది లక్ష్యం. అది జరిగినట్లు కనిపించటం లేదు. మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీ 2021 సమీక్షలో ఈ పథకానికి కేటాయించిన సొమ్ములో కేవలం 25.13శాతమే ఖర్చు చేసినట్లు, వాటిలో కూడా 80శాతం ప్రకటనలకే వెచ్చించినట్లు, ప్రత్యేకించి పంజాబ్‌, హర్యానాలతో పాటు అనేక రాష్ట్రాలలో పథక లక్ష్యాలు నెరవేరలేదని కూడా తేలింది. కాగ్‌ నివేదికలు కూడా దీన్నే సూచించాయి. పదేండ్లు దాటుతున్నా దీని అమలు గురించి సర్వేలే చేయలేదు.2019లో ప్రభుత్వమే పార్లమెంటుకు ఈ విషయాన్ని చెప్పింది. లింగ నిష్పత్తి ఏమాత్రం పెరిగినా దానికి ఈ పథకమే కారణం అని చెప్పే స్థితిలో పాలకులు లేరు. లింగ నిష్పత్తి ఈ పధకం ప్రారంభమైన తరువాత కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో 2014లో 1107 ఉండగా 201617 నాటికి 976కు, నికోబార్‌ దీవుల్లో 985 నుంచి 839కు పడిపోయిందని వార్తలు రాగా 201921 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పుదుచ్చేరిలో 959, అండమాన్‌, నికోబార్‌లో 914 ఉన్నట్లు పేర్కొన్నారు.


2024 లింగ అంతరం నివేదిక ప్రకారం పురుషుడు రు.100 సంపాదిస్తే అదే పనికి మహిళకు ఇస్తున్నది రు. 39.80 మాత్రమే.ఇది ఒక్క చిన్న చిన్న ఉపాధి, ఉద్యోగాలకే కాదు, టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాల్లో కూడా ఇదే పరిస్థితి అంటే అతిశయోక్తి కాదు.ప్రఖ్యాత హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ 2021 ఆగస్టులో ప్రతిఫల చెల్లింపులో వివక్షను ప్రశ్నించారు. తన భర్త రణవీర్‌ సింగ్‌ ఎంత కష్టపడతారో తానూ అదే చేస్తానని తనకు తక్కువ మొత్తం ఇవ్వచూపినందుకు సంజయ్‌ లీలా బన్సాలీ సినిమా బైజు బావరాలో నటించేందుకు తిరస్కరించినట్లు ఆమె బహిరంగంగా చెప్పారు. ఆమె ఒక స్థాయికి ఎదిగారు గనుక అలా చెప్పగలిగారు, ఎందరికి అలాంటి అవకాశం ఉంది. నిజానికి ఇది బాలీవుడ్‌లోనే కాదు దేశంలోని అన్ని సినిమా రంగాల్లో , ఇతర చోట్ల ఉంది.హాకీలో పది రెట్లు ఉన్నట్లు ఫెమినిజమ్‌ ఇండియా నివేదిక అదే ఏడాది పేర్కొన్నది. 2015లో కేరళలో జరిగిన జాతీయ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో బహుమతిగా పురుషులకు రు.1.2లక్షలు, మహిళలకు రు.50వేలుగా నిర్ణయించటాన్ని నిరసిస్తూ తాను పోటీలలో పాల్గొనటం లేదని దీపికా పాలికల్‌ నిరాకరించింది. మనదేశ శ్రమశక్తి మార్కెట్‌లో వేతన వ్యత్యాసం పెద్ద సమస్యగా ఉంది. నరేంద్రమోడీ తన మన్‌కీ బాత్‌లో ఎన్నడూ దీని గురించి ప్రముఖంగా ప్రస్తావించినట్లు, తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎక్కడా కనిపించదు. కరోనా సమయంలో అంతకు ముందున్నదానికంటే వేతన వ్యత్యాసం ఏడుశాతం పెరిగిందని పిఎల్‌ఎఫ్‌ఎస్‌ సర్వే సమాచారం వెల్లడిరచింది.
ఉద్యోగాల్లో చేరటంలో ఒకే స్థాయిలో 46శాతం ఉన్నప్పటికీ సిఇఓ,సిఎఫ్‌ఓ, సివోవో వంటి ఉన్నత స్థానాలో 25శాతానికి మించి మహిళలు లేరని కెపిఎంజి, మరియు ఏఐఎంఏ 2024 సర్వేలో తేలింది.అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి సమానవేతనాలు లేకపోవటం ప్రసూతి సెలవు వంటి సామాజిక భద్రత లేని విషయం తెలిసిందే.శ్రామిక మహిళలకు 26వారాల ప్రసూతి సెలవు ఇవ్వాలనే చట్టసవరణ తరువాత అనేక మంది యజమానులు పిల్లల్ని కనేవయస్సులో ఉన్నవారిని పనిలో పెట్టుకోవటం తగ్గించటం లేదా రాజీనామా చేయించి తరువాత చేర్చుకోవటం వంటి పనులకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. స్త్రీని దేవతగా పూజించే దేశం కదా ! కొన్నిదేశాల్లో తండ్రులకు కూడా పిల్లల సంరక్షణ సెలవులు ఇస్తున్నకారణంగా మహిళల నియామక వివక్ష కొంత మేర తగ్గింది. మనదేశంలో సైతం ఎందుకు దాన్ని ప్రవేశపెట్టకూడదు ? చట్టసభల్లో మూడోవంతు సీట్లు ఇవ్వటానికే వామపక్షాలు మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఎన్ని నాటకాలాడాయో చూశాము. ? భూస్వామిక వ్యవస్థ భావజాలం నుంచి బయపడతారా ? ఒకవైపు పురోగమనంలో ఉన్నామని చెబుతూ మహిళలను అణచివేసిన సనాతన ధర్మాన్ని, మనువాదాన్ని తలకెత్తుకుంటున్న శక్తులు రెచ్చిపోతున్న తరుణంలో పురుషులతో సమంగా స్త్రీలను చూసేందుకు అంగీకరిస్తారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుంభమేళా లాభ నష్టాలు : అమెరికా చాట్‌ జిపిటి, చైనా డీప్‌సీక్‌, మనం గంగలో మునిగి తేలుతున్నాం !

01 Saturday Mar 2025

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, Current Affairs, Education, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Science, USA, Women

≈ Leave a comment

Tags

BJP, Kumbha Mela, Narendra Modi Failures, R&D China and India, R&D Expenditures, RSS, Science, scientific temper, Yogi Adityanath

ఎం కోటేశ్వరరావు


జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌ రాజ్‌ పాతపేరు అలహాబాద్‌లో మహాకుంభమేళా, ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ సైన్సు దినోత్సం జరిగింది. మీడియా దేనికి ఎంత ప్రచారమిచ్చింది ? కుంభమేళాకు ఇచ్చిన ప్రచారంలో వెయ్యోవంతైనా శాస్త్రవిజ్ఞానం, మూఢవిశ్వాసాలు సంబంధిత లాభనష్టాల గురించి పాఠకులు, వీక్షకులకు చెప్పిందా ? కుంభమేళా స్నానాలకుసైన్సును జోడిరచిన ప్రవచనాలకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరి నమ్మకాలు వారివి. ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం 66 కోట్ల మంది గంగ, యమున, అంతర్వాహిని అని చెబుతున్న సరస్వతి నది త్రివేణీ సంగమంలో మునకలేసి స్నానాలు చేశారు. దీని వెనుక అనేక నమ్మకాలు ఉన్నాయి. కొందరు పుణ్యం కోసం అంటే మరికొందరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా, పాపాలను కడిగి వేసుకొనేందుకని రకరకాల కారణాలు చెప్పారు. ఎవరికి ఏమి లభించిందో తెలియదు. ఎవరి గోల, ఎవరి లెక్కలు వారివి. వెళ్లినవారు తమ యాత్ర, స్నానం జరిగిన తీరు గురించి చెప్పుకుంటుంటే ఈ కార్యక్రమం వలన రెండున్నరలక్షల కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు కొందరు అంచనా వేశారు. జాతీయ స్థూల ఉత్పత్తికి నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర లబ్ది కలిగిందని దీన్ని ‘‘ శాస్త్రీయం ’’ గా లెక్కలు కట్టి రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత రంగానికి కలిగిన లబ్ది, ఉపాధి గురించి నిర్ధారించాలని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించినట్లు వార్తలు(దైనిక జాగరణ్‌,2025 ఫిబ్రవరి 27) వచ్చాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రచార అస్త్రంగా దీన్ని మార్చుకుంటారు గనుక అలాంటి లెక్కలను తేల్చాలని కోరటం అర్ధం చేసుకోదగిందే. ఒక అశాస్త్రీయ అంశాన్ని ప్రోత్సహించి దాని ద్వారా కలిగిన ఆర్థిక లబ్దిని శాస్త్రీయంగా తేల్చాలనటం కొందరికే సాధ్యం. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్న లోకోక్తి ఊరికే రాలేదు.

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జు 2012 ఏప్రిల్‌ నాలుగవ తేదీన జనాన్ని వెర్రివెంగళప్పలు చేసేందుకు పది మార్గాలంటూ ఒక వ్యాసం రాశారు. మన దేశంలోని 90శాతం మంది జనాలకు శాస్త్రీయ దృక్పధం లేదని పేర్కొన్నారు. ఈ శాతాన్ని మీరు ఎలా చెప్పారంటూ అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఢల్లీి విలేకరి కట్జును ప్రశ్నించారట. ఇది గణాంకం కాదు, ఒక అంచనా మాత్రమే అంటూ అది 85శాతం లేదా 95శాతం కూడా కావచ్చని చెప్పానని, తాను రాసిన దానికి అర్ధం భారతీయులు అత్యధికులు వెర్రి వెంగళప్పలు అని చెప్పినట్లు తరువాత ఆయనే మరో వ్యాసంలో రాశారు. కుంభమేళా గురించి మీడియా కల్పించిన ప్రచారం, దానికి ప్రభావితులైన వారిని చూస్తే కట్జూ చెప్పినట్లు ఆ సంఖ్య ఇంకా పెరిగిందా, తగ్గిందా అన్నది ఎవరికి వారే అంచనావేసుకోవచ్చు. ఈ పదమూడు సంవత్సరాలలో దేశాంలో శాస్త్రీయ దృక్పధం పెరిగిందని, కట్జూ చెప్పింది తప్పని, శాస్త్రీయంగానే 66 కోట్ల మంది గంగలో మునిగారని ఎవరైనా శాస్త్రీయంగా నిరూపిస్తే అంగీకరించటానికి ఇబ్బంది లేదు. ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాల్లో కూడా ఇలాంటివి గాకపోయినా పెద్ద సంఖ్యలో గుమికూడే వారికి ఇదే వర్తిస్తుంది. మతం, అది వ్యాపింపచేసే నమ్మకాలు మత్తు మందు.

అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే శాస్త్రవేత్తలు అవి కూలిపోకుండా ఎగరాలంటూ దేవుళ్లు, దేవతలను ప్రార్ధించటం తెలిసిందే. బిజెపి వాగ్దానాలలో సైన్సు అభివృద్ధి ఒకటి. చూడండి మా మోడీ కారణంగానే డిజిటల్‌ ఇండియా ఉనికిలోకి వచ్చింది, బిచ్చగాండ్లు కూడా బాంకు ఖాతా ఓపెన్‌ చేసి స్కానర్‌ పెట్టి అడుక్కుంటున్నారు అని తమ భుజాలను తామే చరుచుకొనేవారు ఉన్నారు. నిజమే, ఎలా వచ్చిందనేది అందరికీ తెలుసు గనుక ఆ ఖ్యాతిని మొత్తం నరేంద్రమోడీ తన ఖాతాలో వేసుకున్నా దేశానికి నష్టం లేదు, గతంలో ఒక సిఎం హైదరాబాదును తానే నిర్మించానన్నట్లుగా చెప్పుకున్నారు. కానీ బిచ్చగాండ్ల సంగతేమిటి ? అందుకే సైన్స్‌, సాంకేతిక పరిజ్ఞానం అంటే ఒక్క డిజిటల్‌ ఇండియా మాత్రమే కాదు. ఆ పరిజ్ఞానం ద్వారా అమెరికా కంటే ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి, కానీ ఆర్థికంగా దానికి మనం ఎంతదూరంలో ఉన్నాం ? పని చేసే ప్రభుత్వ నేతగా మోడీ గురించి చెబుతారు. పరిశోధన మరియు అభివృద్ధి రంగం(ఆర్‌ అండ్‌ డి) గురించి ఒక విధాన నిర్ణయానికే తొమ్మిదేండ్లు పట్టింది. జాతీయ పరిశోధనా ఫౌండేషన్‌ 2023లో ఉనికిలోకి వచ్చింది. ఐదేండ్లలో ఆరువందల కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అంటే అన్నారని గింజుకుంటారు గానీ ఇష్టంలేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా దీని వ్యవహారం ఉంది. గత కాంగ్రెస్‌ పాలకులు, నరేంద్రమోడీకి పెద్ద తేడా ఏమీలేదు.

అమెరికా చాట్‌ జిపిటి, చైనా డీప్‌ సీక్‌లో మునిగితేలుతుంటే మనం గంగలో మునకలేస్తున్నాం. మన వారు డీప్‌ సీక్‌ రూపొందించలేకపోవటానికి మనదేశాన్ని విదేశీ పాలకులు ఆక్రమించుకోవటమే అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో మత కోణాన్ని జోడిరచి విశ్లేషణ చేశారు.వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని లొట్టలు వేసుకుంటూ చెబుతారు. ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాలో జ్యోతిష్కుడు చెప్పినదాన్ని నమ్మి పనిపాటాలేకుండా గడిపిన పాత్ర మాదిరి కాలక్షేపం చేస్తున్నారు. గత పది సంవత్సరాల్లో పురాణాల్లో చెప్పిన పుక్కిటి కబుర్లను వల్లెవేస్తూ మనదేశంలో ఎప్పుడో అవయవ మార్పిడి జరిగిందనటానికి వినాయకుడికి ఏనుగు తొండం అమర్చటం, కృత్రిమ గర్భం ద్వారా పిల్లలకు ఉదాహరణకు కౌరవులని, ఎంత మంది ఎక్కినా ఒకరికి చోటుండే పుష్పక విమానాలను రూపొందించారని సొల్లు కబుర్లు చెబుతున్నారు తప్ప వేదాల్లో ఉన్నవాటిని వెలికి తీసింది లేదు. శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగం నిర్దేశించగా దానికి విరుద్దంగా సిలబస్‌ నుంచి డార్విన్‌ జీవ పరిణామ సిద్దాంతాన్ని తొలగించారు.మనుషులు బ్రహ్మ ముఖం కాళ్లు చేతులు ఇతర భాగాల నుంచి పుట్టారని టీచర్లు చెప్పాలన్నమాట. ఎలాంటి వారి చేతులో చిక్కుకున్నాం ! రాజ్యాంగాన్ని దెబ్బతీయటం అంటే ఇదే. ఇలాంటి పాలకులు సైన్సు గురించి జనానికి ఎందుకు బోధిస్తారు.పరిశోధనలకు నిధులు ఎందుకు కేటాయిస్తారు.

నేషనల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేయాలని 2005లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు జాతీయ సైన్సు సలహా మండలి సిఫార్సు చేసింది, 2008లో ఆమోదం తెలిపారు.ఆ మేరకు ఒక చట్టాన్ని చేశారు. తరువాత మోడీ సర్కార్‌ అనుసంధాన్‌ నేషనల్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌(ఎన్‌ఆర్‌ఎఫ్‌) పేరుతో 2023లో ఒక చట్టాన్ని తెచ్చింది. అంతకు ముందు ఎన్ని కబుర్లు చెప్పినా ఇక చూడండి అంటూ 2023 నుంచి 2028 కాలంలో 50వేల కోట్ల రూపాయలతో పరిశోధనలు చేపడతామని చెప్పారు. ఈ మొత్తాన్ని సమీకరించేందుకు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు, 70శాతం నిధులు ప్రెవేట్‌ రంగం నుంచి సేకరిస్తామన్నారు. దీనికి ప్రధాన మంత్రే అధ్యక్షత వహిస్తారు. త్వరలో దేశాన్ని అమెరికా, చైనాల సరసన నిలబెడతామంటున్నారు. మహానుభావులు ఊరికే కబుర్లు చెప్పకూడదు కదా ! ఆ స్థాయికి చేరటానికి ఒక మార్గం పరిశోధనా రంగానికి పెద్ద మొత్తంలో కేటాయించాలి. ప్రపంచంలో ఈ కేటాయింపు జిడిపిలో సగటున రెండుశాతం ఉంది. మన దేశంలో 200910లో గరిష్టంగా 0.82శాతం ఉండగా అది మోడీ అధికారానికి వచ్చేనాటికి 0.7శాతానికి తరువాత 202425 ఆర్థిక సర్వే పేర్కొన్నదాని ప్రకారం 0.64శాతానికి దిగజారింది. ఎన్‌ఆర్‌ఎఫ్‌ ద్వారా ఐదేండ్లలో ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా 202324లో రు.2,000 కోట్లు కేటాయించి తరువాత దాన్ని కేవలం రు.258.6 కోట్లకు సవరించారు. వీరు దేశాన్ని ఉద్ధరిస్తారు, యువ పరిశోధకులను ప్రోత్సహిస్తారని ఆశించి భజన చేయాలి.

చైనాను త్వరలో అధిగమిస్తామని, ప్రపంచ వస్తుఉత్పత్తిదారుగా మారతామని కొంత మంది చెబుతుంటారు. మంచిదే, నరేంద్రమోడీ, ఆయనను గద్దె మీద కూర్చోపెట్టేందుకు ఊతమిస్తున్న చంద్రబాబు వంటి వారి 2047 రంగుల కలను కూడా నిజమే అనుకుందాం. కానీ ఆచరణ ఏమిటన్నది ప్రశ్న.1990దశకంలో భారత్‌చైనా రెండూ కూడా పరిశోధనలకు జిడిపిలో కేటాయించిన మొత్తం 0.7శాతమే. కానీ నేడు చైనా 2024లో 2.68శాతం ఖర్చు చేసింది. 202526 మన కేంద్ర బడ్జెట్‌ డాలర్లలో 584 బిలియన్లు కాగా 2024లో చైనా ఒక్క పరిశోధనకు ఖర్చు చేసిన మొత్తమే 496 బిలియన్‌ డాలర్లు.అర్ధం అవుతోందా ! కేంద్ర ప్రభుత్వం 2024నవంబరు 29న పార్లమెంటులో వెల్లడిరచిన సమాచారం ప్రకారం పది సంవత్సరాలలో మన పరిశోధన ఖర్చు జిడిపిలో 0.60.7శాతం మధ్య ఉండగా ఇజ్రాయెల్‌ 5.4, అమెరికా 3.5 శాతాల చొప్పున ఖర్చు చేస్తున్నాయి.మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అన్నట్లు కబుర్లు చెబితే దేశం ముందుకు పోదు. అన్నీ నెహ్రూయే చేశారు అని చెప్పే పెద్దలు పరిశోధనకు నిధులు పెంచకుండా ఎవరు అడ్డుకున్నారు? కుండలో కూడు అలాగే ఉండాలి పిల్లాడు భీముడిలా తయారు కావాలంటే కుదురుతుందా ?

పోనీ మన దేశం పరిశోధనలకు దూరంగా ఉందా అంటే లేదు.గోమూత్రంలో బంగారం ఎంతుంది, పేడలో ఏముంది అంటూ శోధిస్తున్నారు. సంఘపరివార్‌ భావజాలానికి అనుగుణంగా ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు జన్యు పరిశోధనలు చేసి దేశంలో ఉన్న జనాభా ‘‘ శుద్ధమైన జాతి ’’ జాతి ఏదో తేల్చేందుకు 2022లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిధులు ఇస్తున్నదనే వార్తలు వచ్చాయి. ఇది ప్రమాదకరమని, విరమించాలని జన్యుశాస్త్రంలో నిపుణులు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు 120 మంది నాడు కేంద్రానికి లేఖ రాశారు. జన్యు చరిత్రను తెలుసుకోవటం అనే కారణాన్ని ప్రభుత్వం చెప్పింది.వివిధ ప్రజా సమూహాల నుంచి గతంలో డిఎన్‌ఏలను సేకరించి చేసిన విశ్లేషణ ప్రకారం అనేకవాటి సమ్మిళితం అని తేలింది. ఫలానా జన్యువులు ఉన్నవారు పరిశుద్దులు అంటే మిగతావారిని అవమానించే తీర్పు తప్ప సైన్సు కాదు. ఇలాంటి పనులన్నింటికీ స్ఫూర్తి జర్మన్‌ హిట్లర్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతవేత్త , గురువుగా పరిగణించే ఎంఎస్‌ గోల్వాల్కర్‌ 1960 డిసెంబరులో గుజరాత్‌ విశ్వవిద్యాలయ విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగించారు. దానిలో చెప్పిన అంశాల గురించి రచయిత, గతంలో ఆర్థికశాఖ సలహాదారుగా పనిచేసిన మోహన్‌ గురుస్వామి ప్రాంటియర్‌ పత్రిక 2018వ సంవత్సరం40వ సంచికలో ఒక వ్యాసం రాశారు. ‘‘ఉత్తమ జాతి సృష్టిక్రియేటింగ్‌ ఏ మాస్టర్‌ రేస్‌ ’’ శీర్షిక పెట్టారు. దాని ప్రకారం గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలు ఇలా ఉన్నాయి.‘‘ మనం కేవలం జంతువులలో మాత్రమే సంకర జాతిని సృష్టించేందుకు ప్రయోగాలు చేశాం. మానవ సంకరం ద్వారా మెరుగైన మనుషు సృష్టించేందుకు మన పూర్వీకులు ధైర్యవంతమైన ప్రయోగాలు చేశారు.ఉత్తరాదికి చెందిన నంబూద్రీ బ్రాహ్మణులు కేరళలో స్దిరపడ్డారు. ఒక సాహసోపేతమైన నిబంధన తెచ్చారు. దాని ప్రకారం ఏ తరగతికి చెందిన వారైనా వివాహిత మహిళ ముందుగా ఒక నంబూద్రీ బ్రాహ్మణుడిని కూడి ఒక బిడ్డను కనాలి, తరువాతే ఆమె భర్తతో పిల్లలను కనాలి.( ఆర్‌ఎస్‌ఎస్‌ వాణి ఆర్గనైజర్‌ పత్రిక 1961 జనవరి రెండు సంచికలో ఉపన్యాస పూర్తి పాఠం ఉంది) ’’.

ఇలాంటి గురువుల శిష్యులు చేస్తున్నదేమిటి ? సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన అనేక సంస్థలలో ఆరోగ్యభారతి ఒకటి. అది గర్భ విజ్ఞాన సంస్కార్‌ పేరుతో ఒక ప్రాజెక్టు నడుపుతున్నది. ఆజానుబాహులు, మంచి రంగు, రూపుతో ఉండే పిల్లలను పుట్టించటానికి పూనుకుంది. గుజరాత్‌లో మొదలెట్టి దేశమంతటా దీన్ని విస్తరించేందుకు తలపెట్టారు. అనేక చోట్ల ఈ మేరకు సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. జర్మన్‌ హిట్లర్‌ ఆర్యజాతి ఉత్తమమైనదని చెప్పినట్లుగానే ఉత్తమ హిందూజాతిని, హిందూ దేశభక్తులను రూపొందించేందుకు ఈ ప్రయత్నాలని జనాలను నమ్మిస్తున్నారు. జర్మన్‌ కాని సైన్సు పుస్తకాలను 1933లో నాజీలు తగులబెట్టారు. వాటిలో నాజీల భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నవాటితో పాటు యూదు రచయితలు రాసినవి ఉన్నాయి. బెర్లిన్‌లో ఉన్న లైంగిక విజ్ఞాన సంస్థను లూటీ చేసి విధ్వంసకాండ సృష్టించారు. అంతే కాదు దేశంలో వివిధ సంస్థలలో శాస్త్రవేత్తలైనా, విద్యావేత్తలు, మేథావులు ఆర్యనేతరులు ఉంటే వారి స్థానాల నుంచి తొలగించారు. ఆర్య జాతి పవిత్రతను పరిశోధించి తేల్చే పేరుతో, తమ భావజాల లక్ష్యాలకు అనుగుణంగా జైళ్లలోని వేలాది మంది ఖైదీలపై అమానుషంగా పరీక్షలు, ప్రయోగాలు చేశారు.


మన దేశంలో అలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. 2025 ఫిబ్రవరి ఎనిమిదిన తిరుపతి పుస్తక మహోత్సవంలో కాషాయ మూకలు దాడులకు పాల్పడ్డాయి.ఖురాన్‌ గ్రంధంలోని అంశాలను ఉటంకిస్తూ ఇస్లామిక్‌`హిందూ విలువల గురించి పోల్చిన ఖురాన్‌ అనాలసిస్‌ అనే పుస్తకాన్ని విక్రయించినందుకు ఒక స్టాల్‌మీద దాడి జరిగింది. దాన్ని రాసింది శర్మ అనే హిందువే. అలాగే పెరియార్‌ రచనలతో పాటు రంగనాయకమ్మ రచన రామాయణ విషవృక్షం అనే గ్రంధాలను ఎందుకు విక్రయిస్తున్నారంటూ విశాలాంధ్ర స్టాల్‌ మీద దాడి చేశారు. అంతకు ముందు హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో తిరుపతి బాలాజీ విగ్రహం గురించిన ఒక పుస్తకాన్ని ఉంచినందుకు వీక్షణం స్టాల్‌ మీద అదే చేశారు. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం మీద దాడి చేశారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాము.కొన్నింటిని నాశనం చేస్తే తరువాత వేలాది యంత్రాలు వచ్చాయి, వస్తాయి. అలాగే పుస్తకాలను అడ్డుకుంటే భావజాల వ్యాప్తి ఆగుతుందా ? పురాతన తక్షశిల విద్యాకేంద్రాన్ని ధ్వంసచేసినంత మాత్రాన మనదేశంలో భావజాల వ్యాప్తి ఆగిందా ! అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలని చూసే బాపతు గురించి వేరే చెప్పాలా ? ఇలాంటి వారు అజ్ఞానాన్ని తప్ప విజ్ఞాన శాస్త్రాలను ప్రోత్సహిస్తారా ? వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని నమ్మేవారు పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కేటాయిస్తారా ? దేశాన్ని మధ్యయుగాల నాటికి తప్ప ముందుకు తీసుకుపోతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ వట్టిస్తరి మంచినీళ్లు : భారత్‌లో మహిళా సమానత్వ సాధనకు 152 ఏళ్లు !

19 Wednesday Jun 2024

Posted by raomk in BJP, Current Affairs, Economics, Education, Health, History, INDIA, NATIONAL NEWS, Political Parties, Women

≈ Leave a comment

Tags

BJP, Global Gender Gap India, Global Gender Gap Report 2024, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


బేటీ బచావో బేటీ పఢావో, మహిళా సురక్ష కేంద్ర, మహిళా పోలీసు వలంటీర్స్‌, రాష్ట్రీయ మహిళా కోష్‌, సుకన్య సమృద్ధి యోజన, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ… ఇవన్నీ మన దేశంలో ఉన్న పధకాలు, ఎవరికో చెప్పనవసరం లేదు.కొన్ని రాష్ట్రాల్లో వీటికి పేర్లు మార్చి అమలు జరుపుతున్నారు. మొత్తం మీద ఇన్ని జరిగిన తరువాత కూడా ప్రపంచంలో స్త్రీ, పురుష సమానత్వ తేడాలో 2024 ప్రపంచ 146దేశాల జాబితా ప్రకారం మన స్థానం 129. పదేండ్లతో పోల్చుకుంటే దిగజారింది. మహిళల అభ్యున్నతి గురించి గత పది సంవత్సరాలుగా తమ భుజాలను తామే చరుచుకొని రొమ్ములు విరుచుకొని గొప్పలు చెప్పుకున్న, మహిళలను వంచించిన వారు, అంతకంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లు వారికి భజన చేసిన ఘనులు తలలెక్కడ పెట్టుకుంటారో చూడాలి. పధకాలన్నీ మావే, రాష్ట్రాలు పేర్లు మార్చుకుంటున్నాయి, అందువలన మా ఫొటోలు పెట్టాలి, వాటి ” ఖ్యాతి ”లో మాకూ వాటా రావాలని కోరుతున్న బిజెపి పెద్దలు ఆ మొత్తాన్ని వారే తీసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. డిఎంకె సభ్యురాలు కనిమొళి రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు నాడు మంత్రిగా ఉన్న మేనకా గాంధీ 2015 మే 7వ తేదీన ఇచ్చిన జవాబు సారం ఇలా ఉంది. ప్రపంచ ఆర్థికవేదిక (డబ్ల్యుఇఎఫ్‌) లింగసమానత్వ తేడా నివేదిక 2014 ప్రకారం 142దేశాలలో భారత్‌ 114వదిగా ఉంది. అంతకు ముందు సంవత్సర నివేదిక ప్రకారం 136 దేశాలలో 101వదిగా ఉంది. ఏడాది కాలంలోనే ఇంతగా దిగజారి పోవటానికి కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం తగ్గటం, అవకాశాలు లేకపోవటమే అని పేర్కొన్నారు. అలాంటిది కొన్ని మార్పులు జరిగినా పదేండ్ల తరువాత 101 నుంచి 129వ స్థానానికి దిగజారింది. కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బిజెపి, మిత్రపక్షాలే, మెరుగుపరచకపోయినా దిగజారటానికి నెపం నెహ్రూ మీదో, గాంధీ మీదో నెడితే కుదరదు.


ఈ సూచికలను రూపొందించటానికి నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.1.ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం, అవకాశాలు, 2. విద్యా అవకాశాలు, 3. ఆరోగ్యం,బతుకు, 4.రాజకీయ సాధికారత. వీటన్నింటిలో ఏ దేశం ఎక్కడుందనే సూచికలు, పాయింట్లు వేస్తారు. వాటన్నింటిని కలిపి మొత్తంగా సాధారణ సూచికలను రూపొందిస్తారు. ఇలాంటి నివేదికలను 2006 నుంచి ప్రతి ఏటా రూపొందిస్తున్నారు. పరిగణనలోకి తీసుకున్న 146దేశాల సగటు లింగ సమానత్వ తేడా 2024లో 68.5శాతం ఉంది. గతేడాది కంటే కేవలం 0.1శాతమే మెరుగైంది. అంటే 31.5శాతాన్ని పూరించాల్సి ఉంది. ఇప్పుడున్న వేగంతో తేడాను పూర్తిగా తగ్గించాలంటే 134 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచంలో నూటికి నూరుశాతం సమానత్వం సాధించిన దేశమేమీ లేదు. మొదటి స్థానంలో ఉన్న ఐస్‌లాండ్‌లో 93.5శాతం సాధించారు.భారత్‌లో 64.1శాతం ఉంది. ఈ లెక్కన పూర్తి సమానత్వం సాధించటానికి కనీసం 152 సంవత్సరాలు పడుతుంది. దక్షిణాసియా దేశాల సగటు తేడా 63.7శాతమే. పది సంవత్సరాల నాడు మొత్తం రాంకు మార్కులను చూస్తే 0.6455 కాగా తాజా సూచికలో 0.641కి దిగజారింది.


మన దేశంలో లింగ బేధాలను తగ్గించటంలో పదేండ్ల నరేంద్రమోడీ పాలన ఘోరంగా విఫలమైంది. మరింత దిగజారింది.ఇరుగుపొరుగు దేశాలలో బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌ తరువాత ఐదవదిగా మనదేశం ఉంటే బిజెపి పెద్దలు నిత్యం స్మరించే పాకిస్తాన్‌ ఏడవదిగా ఉంది.ఆర్థిక భాగస్వామ్యం, ఆరోగ్యంలో 146కు గాను 142వదిగా ఉంది.(మన తరువాత పాకిస్తాన్‌ ఉంది) విద్య అందుబాటులో 112, రాజకీయ రంగంలో 65, కార్మికశక్తి భాగస్వామ్యంలో 134వదిగా ఉంది. విద్యాఅవకాశాలు, రాజకీయ సాధికారత తగ్గుదల కారణంగానే గతేడాది వచ్చిన 127వ రాంకు 129కి దిగజారింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినప్పటికీ ఆ స్ఫూర్తిని రాజకీయ పార్టీలేవీ పాటించలేదు. దాని ఘనత తమదే అని భుజాలు చరుచుకున్న బిజెపి 30 మంది కాబినెట్‌ మంత్రులకు గాను కేవలం ఇద్దరికి, మొత్తం మంత్రివర్గంలో గతంలో ఉన్న పది మందిని ఈ సారి ఏడుకు తగ్గించింది. నేపాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న మంత్రులలో 23.5శాతం మంది మహిళలే ఉన్నారు. చట్టసభల్లో మహిళల ప్రపంచ సగటు 33శాతం కాగా అక్కడ 49.9శాతం ఉంది.


జనాభాలో సగంగా ఉన్న మహిళలకు ఉత్పాదక రంగంలో భాగస్వామ్యం కల్పించకుండా వారి సాధికారత గురించి ఎన్ని కబుర్లు చెప్పినా వట్టిస్తరి మంచి నీళ్లు తప్ప మరొకటి కాదు. గడచిన పది సంవత్సరాల్లో జరిగింది అదే. లింగసమానత్వ తాజా నివేదికలో మనదేశంలో కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం 35.09శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కూడా ప్రభుత్వం అందచేసిన తప్పుడు లెక్కల కారణంగానే. నిజంగానే అంత ఉందా ? లోక్‌సభ ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశట్టే ముందు నరేంద్రమోడీ తన పాలనలో మహిళాభ్యున్నతిని చూసి ప్రతిపక్షాలు ఆత్మశోధన చేసుకోవాలని చెప్పారు. తన పదేండ్ల ఏలుబడిలో దిగజారిన రాంకును చూసి తలవంచుకుంటారా ? ప్రతిపక్షాలకు సుభాషితాలు చెబుతూనే ఉంటారా ? ప్రభుత్వం ప్రకటించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్న అంకెలకు, ప్రభుత్వ లెక్కలకు పొంతన కుదరటం లేదు. స్టాటిస్టా విశ్లేషణ ప్రకారం 2014 నుంచి 2022వరకు తొమ్మిదేండ్ల సగటు 26.81శాతం కాగా 2023లో 32.68శాతం ఉన్నట్లు అదే సంస్థ పేర్కొన్నది.ఒక్కసారిగా అంత ఎలా పెరిగింది ? ప్రపంచ బాంకు లెక్క 32.7శాతం అన్నది. దేశంలో 2022-23లో నియమిత కాల కార్మిక శక్తి సర్వే ప్రకారం మహిళలు అంతకు ముందుతో పోలిస్తే 4.2శాతం పెరిగి యూజువల్‌ స్టేటస్‌ లెక్కింపు అవగాహన ప్రకారం 37శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదిన ప్రకటించింది. అందుకే అంకెల గారడీ అనాల్సి వస్తోంది.


ఇండియా టుడే వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు మహిళలు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. మహిళల భాగస్వామ్యం పెరిగితే 2025 నాటికి జిడిపిలో 70వేల కోట్ల డాలర్లు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 52శాతం మంది మహిళలు వేతన ఉపాధి లేదా లేదా కుటుంబ సంరక్షణలో రెండింటిలో ఉంటామని చెప్పారు. కానీ 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది. ప్రముఖ మీడియా సంస్థ అల్‌ జజీరా. అది 2023 ఏప్రిల్‌ పదిన ఒక విశ్లేషణ ప్రచురించింది.” జనాభాలో భారత్‌ దూసుకుపోతున్నా శ్రామిక శక్తిలో తగ్గుతున్న మహిళలు ” అని పేరు పెట్టింది.ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న భారత్‌ మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని అతితక్కువ 20దేశాల్లో ఒకటిగా ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నట్లు పేర్కొన్నది. పెరుగుతున్న జనాభాకు ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని చూపటంలో విఫలమైతే భారత్‌కు అది గుదిబండగా మారుతుంది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి 25శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పిన అంశాన్ని అల్‌ జజీరా ఉటంకించింది. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నాయని సిఎంఐఇ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ చెప్పిన మాటలను ఉటంకించింది.శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మహిళలకు అన్ని గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం, ఇన్ని మరుగుదొడ్లు కట్టించాం అని ఊరూ వాడా ప్రచారం చేసే బిజెపి ప్రచార దళాలు తమ రెండింజన్ల డ్రైవర్లు సాధించిందేమిటో, పదేండ్లలో పరిస్థితి ఎందుకు దిగజారిందో ఎక్కడా మాట్లాడటం లేదు. గోడీ మీడియా సంగతి సరేసరి తేలుకుట్టిన దొంగల్లా నోరెత్తటం లేదు. ఈ అంశాన్ని పట్టించుకోవాల్సింది కాదన్నట్లుగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటీని కోల్పోవటానికి మహిళా ఉపాధి తగ్గటం కూడా ఒక కారణమే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అచ్చేదిన్‌ పదేండ్లలో ఆవిరైన సంతోషం, పాకిస్థాన్‌ కంటే దిగువనే : నాడు బ్రిటీష్‌ రాజ్యం – నేడు బిలియనీర్ల భోజ్యం !!

22 Friday Mar 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, Education, Health, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Religious Intolarence

≈ Leave a comment

Tags

BILLIONAIRE RAJ, BJP, ECONOMIC INEQUALITY IN INDIA, Narendra Modi Failures, RSS, World Happiness Report 2024


ఎం కోటేశ్వరరావు


తెల్లోడి రాజ్యమే బాగుంది, కమ్యూనిస్టులే మంచోళ్లు అని మా తాత చెప్పేవాడు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్ల పాలకులు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచండి అన్న విధానంలో భాగంగా బండి పట్టాలకు అవసరమైన ఇనుము ఇచ్చారట, వాటిని పంపిణీ చేయటంలో ఆ నాడే కాంగ్రెస్‌ వారు తన, పర బేధాన్ని పాటిస్తే కమ్యూనిస్టులు అందరికీ ఇప్పించేందుకు చూశారట. తెల్లోడి పాలనను తప్పు పట్టనందుకు మా తాతను విమర్శించాలా ? ఒక రైతుగా తన పరిమిత ప్రయోజనాన్ని చూసి సంతోషించినందుకు విమర్శించాలా ? ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. జనజీవితాలను దిగజారుస్తూ కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీని వ్యతిరేకించాలా ? రామాలయం కట్టినందుకు సానుకూలంగా ఉండాలా ? ముఖ్యవైరుధ్యం ఏమిటన్నదే కీలకం. నరేంద్రమోడీ పదేండ్ల విజయ గీతాలాపన వికసిత భారత్‌ చెవుల తుప్పు వదిలిస్తున్నది. అఫ్‌ కోర్స్‌ 2004 ఇదే బిజెపి దేశం వెలిగిపోతోందంటూ తాను ఆరిపోయిందనుకోండి. ఇప్పుడూ అదే జరగనుందా ? ఎవరి అంచనాలు వారివి ! పదేండ్లలో తమను మరింతగా పెంచిన మోడీ ఏలుబడిని బిలియనీర్లు అంత తేలికగా వదులుకోరు, వారి చేతుల్లో ఉన్న మీడియాలో మోడీ భజన మరింత పెరుగుతుంది, దీనికి మత మత్తు ఎలాగూ ఉంది. ఈ అంశాన్ని తక్కువ అంచనా వేయకూడదు.


వికసిత భారత్‌ అంటూ బిజెపి ప్రచార గాలి తీస్తూ రెండు నివేదికలు తాజాగా వెలువడ్డాయి. ఒకటి ప్రపంచ సంతోష సూచికలో మనదేశ స్థానం గత పది సంవత్సరాల్లో దిగజారింది తప్ప జనానికి అచ్చేదిన్‌ జాడలేదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి రూపొందిస్తున్నది గనుక సంతోష సూచికను మేం అంగీకరించం అని బిజెపి ఠలాయిస్తే కుదరదు.తలసరి జిడిపి, సామాజిక మద్దతు,ఆరోగ్యం, జీవన విధానాన్ని ఎంచుకొనే స్వేచ్చ,ఉదారత, ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో అవినీతిని జనం ఎలా చూస్తున్నారు అనే ప్రాతిపదికల మీద ప్రతిదేశం తెచ్చుకొనే మార్కులను బట్టి సూచికలను ప్రకటిస్తారు. ప్రతి ఏడాది సూచిక అంతకు ముందు రెండు సంవత్సరాల తీరుతెన్నుల ప్రాతిపదిన ఉంటుంది. కొన్ని సార్లు పరిగణనలోకి తీసుకొనే దేశాల సంఖ్యలో తేడాలు ఉండవచ్చు. అందువలన మార్కులను బట్టి దిగజారిందా మెరుగుపడిందా అన్నది కూడా చెప్పవచ్చు. మన ఇరుగు పొరుగు దేశాల వివరాలను చూద్దాం. 1.సూచిక, మార్కులు అంటే 2014-16 పంవత్సరాలకు సంబంధించి 2017వ సంవత్సర నివేదిక, 2 సూచిక, మార్కులు అంటే 2021-23కు సంబంధించి 2024 నివేదిక వివరాలు అని గమనించాలి.
దేశంపేరు×1.సూచిక×1.మార్కులు×2.సూచిక××2.మార్కులు
భారత్‌ ×× 118 ×× 4.407 ×× 126 ×× 4.054
చైనా ×× 83 ×× 5.245 ×× 60 ×× 5.979
పాకిస్థాన్‌ ×× 92 ×× 5.132 ×× 108 ×× 4.657
నేపాల్‌ ×× 107 ×× 4.793 ×× 93 ×× 5.158
బంగ్లాదేశ్‌ ×× 110 ×× 4.643 ×× 129 ×× 3.886
శ్రీలంక ×× 117 ×× 4.415 ×× 128 ×× 3.898
నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ప్రపంచ జిడిపిలో పదవ స్థానంలో ఉన్నదానిని ఐదవ స్థానానికి చేర్చారని గొప్పలు చెప్పుకుంటారు.త్వరలో చైనాను అధిగమించి పోతామని అందుకే వికసిత భారత్‌ అని చెబుతున్నారు.వచ్చే రోజుల్లో రాజెవరో రెడ్డెవరో అన్నట్లుగా వాటి గురించి వదలివేద్దాం. గడచిన పదేండ్లలో చైనాకు పోటీగా దేశాన్ని నిలబెడతానని చెప్పిన మోడీ దానితో పోలిస్తే దేశాన్ని ఎక్కడ ఉంచారోపైన పేర్కొన్న సంతోష సూచికల్లోనే డొల్లతనం వెల్లడైంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా కూడా ఉంచటంలో విఫలమయ్యారు. పదేండ్ల క్రితం ప్రపంచ జిడిపిలో చైనా వాటా 13.1శాతంగా ఉన్నదాన్ని 2023లో 17.7శాతానికి పెంచుకోగా మన వాటా 2.6 నుంచి 3.73కు పెరిగింది. పాకిస్థాన్‌ జిడిపి 2014లో 271.4బిలియన్‌ డాలర్ల నుంచి మధ్యలో ఒక ఏడాది 374.66 బి.డాలర్లకు పెరిగి 2023లో 340.64బి.డాలర్ల వద్ద ఉంది. జిడిపి పెరిగినా సంతోష సూచిక పతనంలో మనకూ పాకిస్థాన్‌కూ తేడా ఏముంది ? అచ్చేదిన్‌, వికసిత భారత్‌ నినాదాలు ఇచ్చిన వారూ, విదేశాల్లో దేశ ప్రతిష్ట పెంచినట్లు చెప్పుకున్నవారూ అక్కడ లేరు. బిజెపి వారు చెబుతున్నట్లు మనకు అన్నీ ఉన్నా జనాలు ఎందుకు సంతోషంగా లేకపోతున్నారు ?


నాటి బ్రిటీష్‌ వలస పాలనలో కంటే నేటి స్వతంత్ర పాలనలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా పెరిగినట్లు తాజాగా ప్రపంచ అసమానతల ప్రయోగశాల(వరల్డ్‌ ఇనీక్వాలిటీ లాబ్‌) 2024 మనదేశం గురించి ప్రకటించిన విశ్లేషణలో పేర్కొన్నది. నాడు మన జనాన్ని విదేశీ దొరలు దోచుకుంటే నేడు స్వదేశీ దొరలు ఆపని చేస్తున్నారు. అనేక అంశాల మీద అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఆర్థికవేత్తలు నితిన్‌ కుమార్‌ భర్తీ, లూకాస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెట్టీ, అన్‌మోల్‌ సోమాంచీ ఒక పత్రాన్ని రూపొందించారు.దానిలో పేర్కొన్న ప్రధాన అంశాలేమిటి ? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1980దశకం వరకు అసమానతలు తగ్గాయి. తరువాత ముఖ్యంగా 1990దశకంలో సంస్కరణలు ప్రారంభించిన పదేండ్ల తరువాత విపరీతంగా పెరిగాయి.నరేంద్రమోడీ ఏలుబడిలో అది మరింత ఎక్కువైంది. 1982 నాటికి దేశంలోని ఎగువ ఒకశాతం మంది రాబడి 6.1శాతం, అది 2014-15 నుంచి 2022-23 వరకు పరిశీలించినపుడు 22.6శాతం ఉంటే వారి వద్ద పోగుబడిన సంపదలు 40.1శాతంగా ఉన్నాయి. ఎగువ పదిశాతం మంది వద్ద 2022 నాటికి దేశ సంపదల్లో 60శాతం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు.అంతరాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, అమెరికాల్లో కూడా ఆదాయరాబడి వాటా ఇంతగా లేదు. పన్నుల విధానం, ప్రపంచీకరణ దీనికి కారణం.ధనికులుగా ఉన్న 167 కుటుంబాల సంపదపై రెండుశాతం పన్ను విధిస్తే జాతీయ ఆదాయం 0.5శాతం పెరుగుతుందని అంచనా వేశారంటే సంపద ఎలా గుట్టలుగా పడి ఉందో అర్ధం చేసుకోవచ్చు. సక్రమంగా లేని సమాచారం మేరకే తాము అసమానతల గురించి చెబుతున్నామని, నాణ్యమైన, సమగ్ర సమాచారం ఉంటే అసమానతలు ఇంకా ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ధనికుల్లో ఉన్న ఎగువ తరగతిలో కూడా మిగతావారితో పోలిస్తే వారిలో 0.1శాతం మంది పదిశాతం రాబడిని పొందారు. ప్రస్తుతం రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయని కొందరు చెప్పిన మాటలను నరేంద్రమోడీ నిజం చేస్తున్నారు. అందుకే కార్పొరేట్‌ మీడియా, ధనికుల ప్రతినిధులందరూ మరోసారి వచ్చే ఎన్నికల్లో మోడీని కోరుకుంటున్నారన్నది స్పష్టం.


దేశంలో అనేక సమస్యలకు జనాభా పెరుగుదలే కారణం అని గతంలో ఊదరగొట్టారు, కుటుంబనియంత్రణ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటి పాలకులు అధిక జనాభా మన దేశానికి వరం అని ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా మారటానికి అవసరమైన చౌక శ్రామిక శక్తి అందుబాటులో ఉందని తమ జబ్బలను తామే చరుచుకుంటున్నారు. మరోవైపు గత పదేండ్లుగా కేంద్రంలో, వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాషాయ దళాలు ముస్లిం జనాభా పెరిగి హిందువుల కంటే మెజారిటీగా మారనున్నదనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అది నిజమా, సంతోషం ఆవిరి అవుతున్న స్థితిలో ఏ మతానికి చెందిన వారైనా ప్రతి కుటుంబమూ పరిమితం చేసుకొనేందుకు చూస్తున్నాయని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి.జనన-మరణాల రేటును ప్రాతిపదికగా తీసుకున్నపుడు జననాల రేటు 2.1గా ఉండాలని ఆ రంగనిపుణులు పేర్కొన్నారు. కానీ తాజా సర్వ ప్రకారం రెండుశాతమే ఉన్నందున రానున్న రోజుల్లో జనాభా తగ్గుతుంది తప్ప పెరగదని చెబుతున్నారు. జనాభాలో పదిహేనేండ్ల లోపు వారు 2015-16లో 28.6శాతం ఉండగా 2019-21లో 26.5శాతానికి తగ్గారు. అంటే కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గుతోంది. జమ్మూ-కాశ్మీరు జనాభాలో 68శాతం ముస్లింలే ఉన్నారు. అక్కడ జననాల రేటు దేశ సగటు కంటే తక్కువగా 1.4శాతమే ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ముస్లిం జననాల సగటు కంటే కూడా ఇది తక్కువ. విద్య, ఉపాధి, వైద్య, ఆరోగ్య రంగాల్లో కేటాయింపులు ఎక్కువగా ఉండి జనాల పరిస్థితి మెరుగుపడితే కులం, మతంతో నిమిత్తం లేకుండా కుటుంబనియంత్రణ ఎవరికి వారు పాటిస్తారన్నది అందరికీ తెలిసిన సత్యం.

రెండు సంవత్సరాల క్రితం ఆక్స్‌ఫామ్‌ ఇండియా సంస్థ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం కేవలం 98 మంది ధనికులైన భారతీయులు రు.49.15లక్షల కోట్ల సంపదలను అదుపు చేస్తుండగా పేదల్లోని 55.5 కోట్ల మంది వద్ద అంత ఉందని పేర్కొన్నది. 2021లో ఒక వ్యక్తి జాతీయ ఆదాయ సగటు రు.2,04,200గా లెక్కించగా దిగువ 50శాతం మంది ఆదాయం రు.53,610 ఉంది. ఎగువ పదిశాతం మంది జనాల సగటు రాబడి రు.11,66,520గా ఉంది. కరోనా తరువాత పేదలలో 20శాతం మంది రాబడి 2020-21లో 53శాతం తగ్గగా ఇదే సమయంలో ఎగువ 20శాతం మంది రాబడి 39శాతం పెరిగింది. కరోనా కారణంగా ఆరు కోట్లుగా ఉన్న పేదలు 13.4 కోట్లకు పెరిగారు. వైద్య ఖర్చుల కారణంగా 2017లో 5.5 కోట్ల మంది పేదరికంలోకి దిగజారారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా దిగువ తరగతి జనాల రాబడి పెరగకపోతే వారి జీవితాలు అతలాకుతలం అవుతాయి. విద్య, వైద్య రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటూ ప్రయివేటు వారిని ప్రోత్సహిస్తున్నాయి. రుణగ్రస్తులు కావటానికి వీటి మీద పెట్టే ఖర్చు కూడా ఒక అంశంగా మారింది.జిడిపిలో విద్య మీద ఆరుశాతం ఖర్చు పెట్టాలన్నది లక్ష్యం. కానీ నరేంద్రమోడీ తొలి ఐదు సంవత్సరాలలో మూడు శాతానికి మించలేదు, ఏటేటా తగ్గుతున్నది.జిడిపిలో ఐదవ స్థానానికి దేశాన్ని చేర్చామని గొప్పలు చెప్పుకోవటం కాదు. మన కంటే ఎంతో తక్కువగా ఉన్న బ్రెజిల్‌ విద్యకు 6.1, వైద్యానికి 9.5శాతం, రష్యా 4.7-5.3 చొప్పున దక్షిణాఫ్రికా 6.8-8.2శాతాల చొప్పున కేటాయిస్తున్నాయి. సంతోష సూచికలో సామాజిక రంగాల మీద పెట్టే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటారని గమనించాలి. వాటి కేటాయింపులు సరిగా లేకపోతే,తగ్గుతుంటే సంతోషం ఆవిరి అవుతుంది. గడచిన పదేండ్లలో సూచికలో దిగజారటానికి కారణం ఇదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రామ్‌దేవ్‌ బాబా పతంజలి బండారాన్ని సుప్రీం కోర్టు విచారణ బయటపెడుతుందా ! రెచ్చిపోతున్న కాషాయ దళం !!

25 Saturday Nov 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, Economics, Education, Health, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Baba Ramdev, Bogus claims, love for pseudoscience, Patanjali Ayurved, saffron brigade hypocrisy, saffron nationalists, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


వివాదం తలెత్తిన ప్రతిసారీ రు.48వేల కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన పతంజలి ఆయుర్వేద కంపెనీ ఉత్పత్తులకు పైసా ఖర్చు లేకుండా భారీ ఎత్తున ఉచిత ప్రచారం లభిస్తున్నది.మరోసారి అదే జరిగింది. ఎవరు అంగీకరించినా లేకున్నా వాస్తవమిది. సేవించిన వారికి కంపెనీ ఉత్పత్తులు ఎంత మేర ఉత్తేజమిస్తాయో తెలియదు గానీ అధినేత రామ్‌దేవ్‌ బాబా కాషాయ వేషంతో చేసే ఉపన్యాసాలు హిందూత్వ శక్తులకు స్టెరాయిడ్లలా కిక్కునిస్తున్నాయి. అందుకే వివాదం తలెత్తినపుడల్లా సామాజిక మాధ్యమంలో వారు రెచ్చిపోతున్నారు. అడ్డగోలు వాదనలతో జాతీయోన్మాదాన్ని ముందుకు తెస్తూ జనాల బుర్రలను ఖరాబు చేస్తున్నారు. అల్లోపతి(ఇంగ్లీషు మందులుగా జనానికి తెలిసినవి) ఔషధాల గురించి జనాన్ని తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనలు, ఆధారం లేని అంశాలను ప్రచారంలో పెడుతున్నారన్న వివాదంలో నవంబరు 21వ తేదీన సుప్రీం కోర్టు సర్వరోగ నివారిణి అని చెప్పుకుంటున్న వాటి ప్రకటనలు వెలువడకుండా చూసేందుకు పద్దతిని కనుగొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అటువంటి పనులకు పాల్పడితే పతంజలి ఉత్పత్తుల మీద జరిమానా విధించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు అహసనుద్దీన్‌, ప్రశాంత కుమార్‌ వ్యాఖ్యానించారు.అలాంటి ప్రకటనల జారీ నిలిపివేయాలని, వాటి గురించి మీడియాతో మాట్లాడకూడదని, పతంజలి ఉత్పత్తుల గురించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని పేర్కొన్నారు.దీంతో మరోసారి చర్చ, ఖండన మండనలు ప్రారంభమయ్యాయి.ఈ కేసును ఫిబ్రవరి 5కు కోర్టు వాయిదా వేసింది.


పతంజలి సంస్థ అల్లోపతి వైద్యాన్ని, వైద్యులను కించపరుస్తున్నదని, తమ ఉత్పత్తులతో వ్యాధులు నయం గావటం గురించి అవాస్తవ ప్రకటనలు చేస్తున్నదని, కరోనా గురించి పుకార్ల వ్యాప్తి, వాక్సిన్ల పట్ల వైముఖ్యతను రెచ్చగొడుతున్నదని గతేడాది ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. జీవనశైలి కారణంగా తలెత్తే సమస్యలను, ఎడతెగకుండా ఉండే అస్వస్తత, జన్యుపరమైన, చర్మ వ్యాధులు, కీళ్లనొప్పులు,ఆస్మా,వెన్నెముక కండరాల బాధల వంటి వాటన్నింటినీ తమ ఉత్పత్తి శాశ్వతంగా నివారిస్తుందనే తప్పుడు ప్రచారాన్ని పతంజలి చేస్తున్నదని ఐఎంఎ ఫిర్యాదు చేసింది. దీని మీద తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే రామ్‌దేవ్‌ బాబా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజాలు, అవాస్తవాలను డబ్బు నిర్ణయించకూడదని, అల్లోపతి ఆసుపత్రులు, వైద్యులు ఎక్కువగా ఉండవచ్చు, వారి గళాన్ని ఎక్కువ మంది వినవచ్చు గానీ తమకు రుషుల జ్ఞానవారసత్వం ఉందని, తాము దానిలో పేదలం కాదని చెప్పుకున్నారు.యోగా, ఆయుర్వేద, ప్రకృతి వైద్యం, తమ సనాతన విలువలకు వ్యతిరేకంగా కొంత మంది అల్లోపతి వైద్యుల బృందం తప్పుడు ప్రచారం చేస్తున్నదని తమ కంపెనీ ఎలాంటి అబద్దాలు చెప్పటం లేదన్నారు.తప్పుడు ప్రచారం చేస్తున్నందున తమను సుప్రీం కోర్టు మందలించినట్లు వెలువడిన ఒక వార్తా కథనం గురించి చెబుతూ తామలాంటిదేమీ చేయటం లేదని, సుప్రీం కోర్టు అంటే గౌరవం ఉందన్నారు.తప్పుచేసినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్దమే, మేము అబద్దాలకోరులమైతే వెయ్యికోట్ల రూపాయల జరిమానాకు, మరణశిక్షకూ సిద్దమని కాదని తేలిదే మా మీద ప్రచారం చేస్తున్నవారిని శిక్షించాలన్నారు. కరోనా నివారణకు తాము తయారు చేసిన కరోనిల్‌ పని చేస్తుందని 2020 జూన్‌లో పతంజలి చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది. రోగనిరోధక శక్తిని పెంచుతుందనే ఏకైక కారణంతో దానికి అనుమతి ఇచ్చాం తప్ప కరోనా నిరోధం గురించి కాదని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ దాన్ని కరోనా నిరోధ ఔషధంగా ప్రచారం చేయటంతో జనాలు ఎగబడి కొనుగోలు చేశారు. దాని సామర్ధ్యం, రక్షణ గురించి ఎలాంటి వివరాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వెల్లడించింది. నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్న మోసకారులుగా పేర్కొంటూ బీహార్‌, రాజస్థాన్‌లలో రామ్‌దేవ్‌ బాబా, పతంజలి సంస్థ చైర్మన్‌ బాలకృష్ణ మీద కేసులను దాఖలు చేశారు. ఇంత జరిగిన తరువాత కరోనిల్‌ ఉత్పత్తులు కొనుగోలుకు దొరుకుతున్నాయి.


యోగా చేస్తే ఎయిడ్స్‌ నివారణ అవుతుందని, స్వలింగ సంపర్క అలవాటును మానుకుంటారని రామ్‌దేవ్‌ బాబా చెప్పినదానికి నిజమే నిజమే అని తలలూపేవారికి కొదవలేదు.తాము ఉత్పత్తి చేసిన ” దివ్య పుత్రజీవక్‌ సీడ్‌ ”ను తీసుకుంటే పుత్రులు పుడతారని 2015 నుంచి ప్రచారం చేస్తున్నారు. దీన్ని సహజ ఔషధ మొక్కల నుంచి తయారు చేశామని, సంతానలేమి చికిత్సకు ఉపయోగపడుతుందని మార్కెటింగ్‌ చేస్తున్నారు. బుర్రల్లో గుంజులేని జనం దాన్ని నమ్ముతూనే ఉన్నారు. మాగీ నూడిల్స్‌లో సీసం శాతం నెస్లే కంపెనీ చెప్పినదానికంటే వెయ్యిరెట్లు ఎక్కువ ఉందని రుజువు కావటంతో 2015లో దాని మీద నిషేధం విధించారు. వెంటనే రామ్‌దేవ్‌ బాబా తన నూడిల్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇక్కడ అసలు కథ ఏమిటంటే కేంద్రంలో నీకది నాకిది అనే పాలకులు అధికారంలో ఉన్నందున ఎలాంటి అనుమతులు లేకుండానే భారత ఆహార భద్రత, ప్రమాణాల ఆధారిటీ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పేరుతో ఒక లేని నంబరును ఆ ఉత్పత్తి మీద ముద్రించి అమ్మి సొమ్ము చేసుకొనే అక్రమానికి పాల్పడ్డారు.దాన్ని గుర్తించిన అధారిటీ అధ్యక్షులు ఆషిష్‌ బహుగుణ ఆ ఉత్పత్తికి అంగీకారం, అనుమతుల్లేేవంటూ తిరస్కరించారు.కాషాయం ధరించిన వారు ఏం చేసినా చెల్లుతుందనే భరోసా కేంద్రంలో ఉన్న పెద్దలు ఇవ్వకుండా ఇలాంటి అక్రమానికి పాల్పడతారని అనుకోగలమా ? తరువాత 2017లో ఆయుర్వేద ఉసిరికాయ రసం పేరుతో మార్కెటింగ్‌ ప్రారంభించారు. అది తాగేందుకు పనికిరాదని ప్రభుత్వ ప్రయోగశాల ప్రకటించటంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్పత్తిని పక్కన పెట్టినప్పటికీ ఇప్పుడు కూడా దాన్ని విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు.తాజాగా ఒక రకపు చేప ఎముకల పొడితో కూడిన దివ్య దంత మంజన్‌ పేరుతో పండ్లుతోముకొనే పేస్టును మార్కెట్‌ చేయటంపై ఒక లాయర్‌ ఆ సంస్థకు నోటీసులు ఇచ్చారు. అది శాఖాహార పదార్ధాలతో తయారు చేసిందని నమ్మకం కలిగించేందుకు ఆకుపచ్చ గుర్తువేసి మరీ అమ్ముతున్నారు. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించటమే అన్నది అభ్యంతరం.లాయర్‌ సాషా జైన్‌ పంపిన నోటీసులో తమ సామాజిక తరగతి, ఇతర శాఖాహారుల మీద జరిపిన దాడిగా ఆమె అభివర్ణించారు.


అల్లోపతి వైద్యులపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కరోనా మీద చేసి వ్యాఖ్యలపై తన మీద పాట్నా, రాయపూర్‌లలో నమోదైన కేసులను ఎత్తివేయాలని లేదా ఢిల్లీలో విచారించాలని రామదేవ్‌బాబా సుప్రీం కోర్టును కోరారు. అక్టోబరు నెలలో దీని మీద న్యాయమూర్తులు ఏఎస్‌ బోపన్న, ఎంఎ సుందరేష్‌లతో కూడిన బెంచ్‌ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేసింది. విద్వేష పూరిత ప్రసంగం కేసులో దర్యాప్తు అధికారి ముందుకు అక్టోబరు ఐదవ తేదీన రావాలని రాజస్థాన్‌ హైకోర్టు సెప్టెంబరులో ఆదేశించింది. దాని మీద గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తరువులను అక్టోబరు 16 వరకు పొడిగించింది. అప్పటి వరకు అరెస్టు చేయరాదని ఆదేశించింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఫిబ్రవరి రెండవ తేదీన ఒక మతపరమైన కార్యక్రమంలో రామ్‌దేవ్‌ బాబా మాట్లాడుతూ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు కేసు నమోదు చేశారు. ముస్లింలు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని, హిందూ మహిళలను అపహరిస్తున్నారంటూ మాట్లాడిన అంశాలతో కూడిన వీడియోను సమర్పిస్తూ పాథైఖాన్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. తమ ఆయుర్వేద ఔషధాలు సర్వరోగ నివారిణి అని ప్రచారం చేసుకుంటున్న పతంజలి కంపెనీ అధికారి బాలకృష్ణ 2019 అగస్టులో 23న తనకు తల తిరుగుతోందని, గుండెలో నొప్పి ఉందంటూ రిషికేష్‌లోని ఆలిండియా మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రిలో చేరారు.తొలుత హరిద్వార్‌లోని ఒక ఆసుపత్రికి తీసుకుపోగా వారు ఎయిమ్స్‌కు పంపారు.ఉల్లి-హరిదాసు కథ తెలిసిందే. తమదాకా వస్తే గాని అసలు సంగతి వెల్లడి కాదంటారు ఇందుకే.
ఇలాంటి వివాదాస్పద వ్యక్తులు, శాస్త్రీయత లేని వారి ఉత్పత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో కొందరు కుహనా దేశభక్తులు రెచ్చిపోతున్నారు. అదానీ కంపెనీ అక్రమాలపై హిండెన్‌ బర్గ్‌ చేసిన ఆరోపణల సందర్భంగా కూడా ఇదే జరిగింది. దేశభక్తుడైన వాణిజ్య, పారిశ్రామికవేత్త మీద దేశద్రోహులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇది దేశం మీద జరుగుతున్నదాడే అన్నారు. పతంజలి వివాదం గురించి వారు చేస్తున్న కొన్ని వాదనల తీరు తెన్నులు చూద్దాం.


” 100 సంవత్సరాలుగా సినిమా యాక్టర్స్‌ను చూపించి లక్స్‌ వాడితే తెల్లబడతాం అంటే ఏం ప్రశ్నించకుండా ఎగబడి కొన్నది మనమే కదా? ”
భావజాలం, మతం, సనాతనం, ఆచారం పేరు ఏది పెట్టినా తరతరాలుగా అసలు మన జనాన్ని ప్రశ్నించకుండా, మెదళ్లను ఎదగకుండా పనికిరాకుండా చేసిన ప్రబుద్దుల గురించి ముందుగా ఆలోచించాలి. ఎందుకు అని ఎవరూ ప్రశ్నించకూడదు. నేర్పకున్నా చూసి నేర్చుకోవటం కూడా అపరాధమే. అర్జునుడి కంటే గొప్ప విలుకాడిగా తయారైన గిరిజన ఏకలవ్యుడి కుడిచేతి బొటనవేలిని ద్రోణుడు గురుదక్షిణగా అడిగి అసలు విల్లుపట్టకుండానే చేశాడు కదా ! నిజమే, లక్స్‌ గురించి అడగలేదు అని ఎద్దేవా చేస్తున్నవారు పతంజలి ” సౌందర్య ” బ్రాండ్‌ సబ్బు కూడా అలాంటిదే అని ఎందుకు చెప్పటం లేదు. గుడ్డిగా కొనేవారున్నారు గనుకనే సొమ్ము చేసుకుంటున్నారు.లక్స్‌ వంటి వాటిని చూసే కదా రామ్‌దేవ్‌ సంపాదనకు దిగింది.
” కాంప్లాన్‌ తాగండి జిరాఫీ అంత పొడుగు అవ్వండీ అంటే ఏనాడూ ప్రశ్నించని మనం మన ఆయుర్వేదిక్‌ ఉత్పత్తులపై మాత్రం నానా యాగీ చేస్తాం. కోర్టులూ అంతే. ”
ప్రశ్నించవద్దని ఎవరు వద్దన్నారు. స్వదేశీ జాగరణ మంచ్‌ కార్యకర్తలు, ఈ ప్రశ్నలు వేసేవారు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? కోర్టులూ అంతే అంటే ఎవరైనా కోర్టుకు వెళితేనే కదా అవి తమ పరిధి మేరకు జోక్యం చేసుకొనేది.తప్పుడు సమాచారం ఇచ్చి వినియోగదారులను మోసం చేస్తున్న కంపెనీలు ఏవైనా ప్రశ్నించాల్సిందే, కోర్టులకు లాగాల్సిందే. ఆయుర్వేదంతో సహా పొడవును పెంచే ఉత్పత్తులేవీ ప్రపంచంలో లేవు.
” తప్పు ఏం ఉంది ఆయన మార్కెటింగ్‌ చేసుకుని సంపాదించింది దేశంలోనే ఉంటోంది కదా లీవర్‌ కంపనీ నెస్లే కంపెనీల వాళ్ళ లాగా విదేశాలకు పట్టుకుపోవడం లేదు కదా? ”
ఈ ప్రశ్న వేసేవారు విదేశాలకు పట్టుకుపోయే కంపెనీల మీద చర్యలు తీసుకోవటానికి అడ్డుపడుతున్నదెవరో చెప్పాలి. పతంజలి సంపాదించిందంతా దేశంలోనే ఉంటే ఒరిగేదేమిటి ? జన సంక్షేమానికేమీ ఖర్చు పెట్టటం లేదుగా ! దేశభక్త అదానీ అని చెప్పిన వారు విదేశాల్లో అతని సూట్‌కేసు కంపెనీల గురించి ఎందుకు చెప్పరు. ఇక్కడ సంపాదించిన సొమ్మును అడ్డంగా తరలించి ఆ సొమ్మునే తిరిగి విదేశీ పెట్టుబడుల పేరుతో తీసుకువచ్చి రాయితీలు భారీగా పొందుతున్న పెద్దల సంగతి తెలియందెవరికి ? గతంలో ఉన్న కాంగ్రెస్‌ పాలకులు, దేశం కోసం, ధర్మం కోసమే అంతా అంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే విదేశాలకు తరలింపుకు అవకాశం కలిగిస్తోంది.
”అన్ని మందుల కంపెనీలు, అన్ని కాస్మెటిక్‌ కంపెనీలు అబద్ద ప్రకటనలతోనే, డాక్టర్లకు కోట్లలో మూడుపులు ఇస్తూ వంద సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాయి కదా? ”
నేను తినను ఇతరులను తిననివ్వను అని చెప్పిన నరేంద్రమోడీకీ ఈ విషయాలు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు. అలాంటి పనులు ఎవరు చేసినా అక్రమమే. వాటి సరసన పతంజలి కూడా చేరింది. తన ఉత్పత్తుల మార్కెటింగ్‌కు పతంజలి ఏమీ ఇవ్వకుండానే వ్యాపారులు అమ్మిపెడుతున్నారా ? అల్లోపతి వైద్యులే డబ్బుతీసుకుంటున్నారా, ఆయుర్వేద వైద్యులకు డబ్బు చేదా ! మనవాడని చెప్పి సుత్తితో కొట్టించుకుంటే తలపగలదా ! మెదడు చితకదా !! చితికితే ఆయుర్వేదంతో కుట్లు వేస్తారా ?
”వాడితే తెల్లగా అయిపోతారు అనే ఫెయిర్‌ అండ్‌ లవ్లీ ని ప్రశ్నించం. వాడి మార్కెటింగ్‌ మోసాన్ని హాయిగా ఎంజారు చేస్తాం.”
గర్భ సంస్కారం పేరుతో బలశాలులైన పక్కాహిందూ పిల్లల్ని పుట్టిస్తామని చెబుతున్న బాపతు గురించి లొట్టలేసుకుంటూ చెప్పుకుంటాం. తమ ” దివ్యపుత్రజీవక్‌ సీడ్‌ ”తో మగపిల్లలను పుట్టిస్తామంటే ఎలా అని రామ్‌దేవ్‌బాబాను ప్రశ్నించం ! పతంజలి ” సౌందర్య స్వర్ణ క్రాంతి క్రీమ్‌” కు ఫెయిర్‌ అండ్‌ లవ్లీ క్రీమ్‌కు తేడా ఏమిటన్న ప్రశ్నే మన మెదళ్లకు తట్టదు. ప్రతి వాడి మోసాన్ని, వేషాన్ని ప్రశ్నిద్దాం !
” మరి ఒక్క దేశీయ కంపెనీలపై మాత్రమే ఈ దాడి దేనికి? ”
ఏ కంపెనీ అయినా మోసానికి, జనాన్ని తప్పుదారి పట్టిస్తే ఎవరైనా ప్రశ్నిస్తారు. ప్రశ్నించటాన్నే దాడి అని వర్ణించటం ప్రమాదకరపోకడ. ఇప్పుడు దేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిని ఎదిరించిన వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న పూర్వరంగంలో పతంజలిని కాషాయ భక్తులు వెనకేసుకురావటం విశేషమేమీ కాదు.
” మన కళ్లను మనమే ఎలా పొడిపించుకోవచ్చో ఎంఎన్‌సిలకు ఉగ్గుతో అబ్బిన విద్య.తెల్ల తొక్క వాడు ఏది చెప్పినా అది మనకు వేదమే. వెధవ దేశీయ నల్లవాడు ఏది చెప్పినా ఎలా ఎదిగినా తప్పే. ”
ఏ రంగువాడు చెప్పాడన్నది కాడు, ఏం చెప్పాడన్నది, ఎవడు ఏం చేశాడన్నది ముఖ్యం. మన వారిలోనే తెల్లవాడిని ఎదిరించే క్రమంలో ప్రాణార్పించిన దేశభక్తులను చూశాం. అండమాన్‌ జైల్లో పెట్టగానే పిరికిబారి బయటపడేస్తే సేవ చేసుకుంటా అని ప్రేమలేఖలు రాసి తనను తానే ”వీర ” అని రాసుకున్న దొంగదేశభక్తుడి గురించీ తెలిసిందే. చిన చేపను పెద చేప మింగినట్లుగా దేశం మారకుండా చూసేందుకు 1969లో గుత్త సంస్థల పరిమిత వాణిజ్య చట్టాన్ని(ఎంఆర్‌టిపి) తెచ్చారు. దాన్ని2002 ఎన్‌డిఏ పాలకులు పోటీ చట్టం తెచ్చి చెత్తబుట్టలో పడేశారు. పోటీ పెరిగినందున జనానికి జరిగిన మేలేమిటి ? ప్రతిదీ దేశీయమే అని చెప్పేవారు అదే తెల్ల విదేశీ కంపెనీలు, పెట్టుబడుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నట్లు ?
” ప్రపంచ సంస్ధ లతో పోటీ పడే పెద్ద ఎంఎన్‌సిలు దేశంలో 70 సం. లుగా ఎందుకు తయారు కాలేదు అంటే మన ఈ మనస్తత్వమే.. ఆలోచన విధానమే కారణం.”
ప్రపంచ ఎంఎన్‌సిలు ఇతర దేశాల జనాన్ని కొల్లగొట్టి బలిశాయి. అందుకు ఆ దేశాల పాలకులు ప్రపంచమంతటినీ వలసలుగా చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు గనుక మనవంటి దేశాల మార్కెట్లను ఆక్రమిస్తున్నాయి. మనం కూడా ఇతర దేశాలను ఆక్రమించి ఉంటే ఎంఎన్‌సిలు వచ్చి ఉండేవి. మనం తక్కువ తినటం లేదు. అదానీని మరింత పెద్ద శక్తిగా మార్చటానికి శ్రీలంకలో విద్యుత్‌ కేంద్రాన్ని అప్పగించమని నరేంద్రమోడీ స్వయంగా వత్తిడి చేసినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. అంబానీ రిలయన్స్‌ను మరింత బలపరచటానికే కదా అమెజాన్‌ కంపెనీని మోడీ అడ్డుకుంటున్నది.
”స్వతంత్ర పోరాటం చేశాం, దేశభక్తి అని చెప్పి గత 75 సం. లలో ఎంత మంది కాంగ్రెస్‌ నేతలు వేల కోట్లకు అధిపతులు అయ్యారు?”
అవును, ఆ పేరుతో కొంత మంది సంపాదించుకున్నారు, ప్రభుత్వ రంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మేమే అసలైన దేశభక్తులం అని చెబుతున్నవారు దేశం కోసం-ధర్మం కోసం అనే పేరుతో కొత్త పెట్టుబడులేవీ పెట్టకుండా గతంలో సమకూర్చిన ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ అయినకాడికి తెగనమ్మేస్తున్నారు. కావాలని ఎగవేసిన వారికి లక్షల కోట్ల బాంకు రుణాలను రద్దు చేశారు. వారికి 75 ఏండ్లు అవకాశం ఇచ్చాం, వీరికీ మరో 75 ఏండ్లు అవకాశమిద్దామా ? ఎలాంటి శషభిషలు లేకుండా మన కళ్ల ముందే దేశాన్నే తెగనమ్మేస్తారు !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

నాడట్లుండె, నేడిట్లుండె – దేశంలో తెలంగాణా ఎక్కడుండె !

22 Wednesday Nov 2023

Posted by raomk in BJP, BRS, Congress, Current Affairs, Economics, Education, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, STATES NEWS, Telangana, Women, Women

≈ Leave a comment

Tags

BRS, KCR, Telagana politics, Telangana BJP, Telangana CM, telangana Congress, Telengana Elections 2023


ఎం కోటేశ్వరరావు


తెలంగాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాదే అంటూ మూడు ప్రధాన పార్టీలు ఓటర్ల ముందుకు ఎన్నికల ప్రణాళికలు, ఓట్లు దండుకునే ప్రచారం, పధకాలతో ముందుకు వచ్చాయి. అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌ నాడెట్లుండె-నేడెట్లుండే రేపు ఎలా ఉండబోతుందో చూడండి అంటూ రంగుల కలను జనం ముందు ఉంచింది. అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీ తాను ప్రకటించిన ప్రణాళికను ఎలా అమలు జరుపుతుంది ? దానికి తగిన నిధులు అందుబాటులో ఉన్నాయా ? ఏమి చూసుకొని జనాన్ని వాగ్దానాల జడివానలో తడుపుతున్నది అన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి, కేంద్రంలో ఏలుబడి సాగిస్తున్న బిజెపి ఇతర రాష్ట్రాలలో, కేంద్రంలో అమలు జరపని పధకాలను ఇక్కడ ఎందుకు జనానికి చెబుతున్నది, ఎలా అమలు చేస్తుంది ? రాష్ట్ర అధికారపక్షం బిఆర్‌ఎస్‌ గత పది సంవత్సరాలుగా అమలు జరపని వాటిని రానున్న రోజుల్లో అమలు జరుపుతామంటే నమ్మేదెలా అన్న ప్రశ్న సహజంగానే వస్తున్నది. బిఆర్‌ఎస్‌ చెబుతున్నట్లు నిజంగానే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుస్తున్నదా ? దాని పని తీరు ఎట్లుండె అన్నది బడ్జెట్లలో చూస్తే అర్ధం అవుతుంది. అందుకే దాని పని తీరును ఒక్కసారి అవలోకించాల్సిందిగా మనవి.


ఒక పెద్ద మనిషి పదేండ్ల తరువాత బంధువుల ఇంటికి వచ్చాడు. అప్పుడు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడిని చూశా ఇప్పుమో నడుస్తూ గంతులేస్తున్నడు, ఎంతగా ఎదిగిండో కదా అన్నడట.పిల్లవాడు పుట్టిన తరువాత పెరగకుండా ఎట్లుంటడు ? ఎలా పెరిగిండు, కడుపు నిండా తింటున్నడా, మంచిగా ఆడుకుంటున్నడా, ఆరోగ్యంగా ఉన్నడా లేడా బడికిపోతున్నడా లేదా అన్నది ముఖ్యం. రాష్ట్రమైనా అంతే పదేండ్లనాడు ఉన్న మాదిరే ఇప్పుడు ఎట్లుంటది, మార్పులు వస్తాయి. అవి ఎలా ఉన్నాయన్నదే ముఖ్యం. రాష్ట్రం, దేశం ఏదైనా అంతే ! దిగువ చూపుతున్న వివరాలలో గత సంవత్సరాల కేటాయింపులు 2023-24 బడ్జెట్‌ ప్రతిపాదనలుగా గమనించాలి. అంకెలు రు. కోట్లు అని గమనించాలి. ఓ.మా రుణం అంటే ఓపెన్‌ మార్కెట్‌ రుణం.
అంశం×××× 2014-15 ××× 2022-23 ×× 2023-24
జిడిపి ×××× 5,05,849 ××× 12,93,000 ×× 14,00,000
అప్పులు ×× 75,577 ××× 4.50,000 ×× 5,00,000
ప్ర.రుణచెల్లింపు× 587 ××× 8,336 ×× 9,341
వడ్డీ,అసలు ×× 6,291 ××× 18.912 ×× 22,400
ఓ.మా.రుణం ×× 8,211 ××× 44, 970 ×× 40,615
లిక్కర్‌ రాబడి×× 10,883 ××× 31,077 ×× 35,000
కే.పన్నువాటా ×× 8,185 ××× 19,668 ×× 21,470
కాపిటల్‌ ఖర్చు×× 8,372 ××× 26,934 ×× 37,525
మూలధన పెట్టుబడి అన్నది రాష్ట్రం, దేశానికైనా కీలకమైనది.2014-15లో ఖర్చు బడ్జెట్‌ మొత్తం ఖర్చు రు.62,306 కోట్లు కాగా దీనిలో మూలధన పెట్టుబడి రు.11,633 కోట్లు, 18.6శాతం ఉంది. 2022-23లో సవరించిన అంచనా ప్రకారం ఖర్చు బడ్జెట్‌ రు.2,26,010 కోట్లు కాగా దీనిలో మూలధన పెట్టుబడి రు.26,934 కోట్లు,11.9శాతానికి దిగజారింది.2023-24 సంవత్సర ఖర్చు బడ్జెట్‌ రు.2,77,690 కోట్లు కాగా మూలధన పెట్టుబడి రు.37,525 కోట్లుగా ప్రతిపాదించారు.దీన్ని మొత్తం ఖర్చు చేస్తే 13.5శాతం అవుతుంది. బడ్జెట్‌ వివరాలను చూసినపుడు 2021-22లో రు.28,874 కోట్లు వాస్తవ ఖర్చు ఉంది. మరుసటి ఏడాది రు.29,728 కోట్లు ప్రతిపాదించి రు.26,934 కోట్లకు సవరించారు. వాస్తవ ఖర్చు ఇంకా తగ్గవచ్చు. అందువలన వర్తమాన బడ్జెట్‌లో ఎంత కోతపెడతారో తెలియదు. మొత్తం తెలంగాణా వచ్చినపుడు 18.6శాతంగా ఉన్న ఖర్చు క్రమంగా దిగజారటం ఆందోళన కలిగించే అంశం.


పెంచకపోయినా తొలి ఏడాది మూలధన పెట్టుబడి శాతం ఎంత ఉందో దాన్నయినా కొనసాగించాలి కదా ? తెలంగాణా ఏర్పడిన తొలి ఏడాది 2014-15లో రాష్ట్ర జిడిపిలో అప్పులు16.06శాతం ఉన్నాయి.పదిహేనవ ఆర్థిక సంఘం నిబంధనల(ఎఫ్‌ఆర్‌బిఎం) ప్రకారం అప్పులు 29.5శాతం ఉండవచ్చు. కాగ్‌ నివేదిక 2020-21 ప్రకారం ఆ సంవత్సరంలో అప్పులు 28.1శాతానికి పెరిగాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు. ఇవిగాక ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసిస సంస్థలకు హామీగా ఇప్పించిన రుణాలను కూడా పరిగణనలోకి తీసుకొంటే 38.1శాతంగా ఉన్నాయి. బంగారు బదులు అప్పుల తెలంగాణాగా మార్చారు. పరిమితికి మించి రుణాలు తీసుకున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల వలన రుణ అర్హత పరిమితి తగ్గింది. పేరుకు పోయిన అప్పుల మొత్తం పెరుగుతున్నట్లు అంకెలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర జిడిపి ఏటేటా పెరుగుతున్నందున దానితో పోల్చుకున్నపుడు తగ్గుదల కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ అంకెలనే తనకు అనుకూలంగా చూపుతుంది. కొత్తగా తీసుకొనే రుణాల మీద కోత విధించటం కూడా తగ్గుదలకు ఒక కారణం.2023-24 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రుణభారం జిడిపిలో 23.8శాతంగా ఉంటుందని చూపారు. రానున్న రెండు సంవత్సరాల్లో 2025,26 ఆర్థిక సంవత్సరాల్లో ఆ మొత్తం 25శాతానికి పెరుగుతుందని కూడా పేర్కొన్నారు అంతకు ముందు సంవత్సరం 24.3శాతం ఉంది. ముందే చెప్పుకున్నట్లు వీటికి ప్రభుత్వం హామీగా ఉన్న రుణాల మొత్తం 2022-23లో రు.1,29,244 కోట్లు, ఇది జిడిపిలో 11.3శాతం, దీన్ని కూడా కలుపుకుంటే అప్పుల మొత్తం 35.6శాతం ఉంది.


కొన్ని సంక్షేమ పధకాలను చూపి వాటిని తెలంగాణా నమూనాగా ప్రచారం చేస్తున్నారు, అభివృద్ధిలో ముందుందని అంటున్నారు.ఇది వాస్తవమా ? రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్ల వంటి కొన్ని సంక్షేమ పధకాలు అందరికీ తెలిసినవే.ఆరు కీలక రంగాలలో తెలంగాణా దేశంలో ఎక్కడుందో తెలుపుతూ పిఆర్‌ఎస్‌ అనే స్వచ్చంద సంస్థ విశ్లేషణలను అందించింది.2022-23లో తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాల బడ్జెట్‌ కేటాయింపులను పోల్చి చూపింది.ఎంతో పురోగమించింది, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాం, అందుకే టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా అవతరించాం అని చెప్పుకోవటంలో వాస్తవం ఎంతో చూద్దాం. బిఇ అంటే బడ్జెట్‌ అంచనా, ఆర్‌ఇ అంటే సవరించిన బడ్జెట్‌ అంచనా.ఆయా రంగాలకు మొత్తం ఖర్చులో తెలంగాణా కేటాయింపు శాతం, చివరి కాలంలో అన్ని రాష్ట్రాల సగటు శాతాలు దిగువ విధంగా ఉన్నాయి.ఆర్‌డి అంటే గ్రామీణాభివృద్ధి.ప.అ అంటే పట్టణ అభివృద్ధి,
రంగం×××2021-22××22-23బిఇ××22-23ఆర్‌ఇ××23-24బిఇ××అ.రా 22-23బిఇ
విద్య ××× 8.7 ×× 7.3 ×× 8.0 ×× 7.6 ××14.8
వైద్యం××× 4.2 ×× 5.0 ×× 5.5 ×× 5.0 ×× 6.3
ఆర్‌డి ××× 4.5 ×× 3.9 ×× 4.3 ×× 3.6 ×× 5.7
ప.అ ××× 1.6 ×× 3.0 ×× 3.2 ×× 2.8 ×× 3.5
పోలీస్‌ ××× 4.6 ×× 4.0 ×× 4.4 ×× 3.6 ×× 4.3
రోడ్లు ××× 1.4 ×× 3.2 ×× 3.3 ×× 3.7 ×× 4.5
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు ఆయా రంగాలలో మూడు సంవత్సరాలలో ధనిక రాష్ట్రంగా చెప్పుకొనే తెలంగాణా దేశ సగటు కంటే తక్కువే ఖర్చు చేస్తున్నది. కెజి నుంచి పిజి వరకు ఉచితం అని చెబుతున్న పాలకులు విద్యలో సగం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కార్పొరేట్లకు ఈ రంగాన్ని అప్పగించటమే అన్నది స్పష్టం. ప్రభుత్వ విద్యా సంస్థలలో తగిన సౌకర్యాలు, సిబ్బంది, చదువుకొనే వాతావరణం ఉంటే తలిదండ్రులు ప్రైవేటు సంస్థలవైపు చూడరు.


ఇక వైద్యం, తల్లీ పిల్లల ఆరోగ్యం, పోషకాహారం గురించి చూద్దాం.2015-16 సంవత్సరాలలో నాలుగవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, 2019-21లో ఐదవ సర్వే జరిగింది.ఈ రెండు సర్వేల వివరాలను చూసినపుడు దేశం మొత్తం మీద రక్తహీనత సమస్య పెరిగింది.శరీరంలో తగినంత రక్తం లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది తెలిసిందే.రక్తహీనత పెరుగుదల బడుగు, బలహీన వర్గాలలోనే ఎక్కువగా ఉంది.తాము తిన్నా తినకపోయినా పిల్లలకు పెట్టేందుకు చూసే తలితండ్రులు తమ బిడ్డలను ఆరోగ్యంగా పెంచలేకపోవటానికి ప్రధాన కారణం వారికి తగినంత కుటుంబ ఆదాయం లేక పోషకాహారం తీసుకోకపోవటమే అని వేరే చెప్పనవసరం లేదు.వివరాలు దిగువ చూడవచ్చు.1.ఆరు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లలు, 2.గర్భిణులు కాని మహిళలు 15 నుంచి 49 ఏండ్లు , 3. గర్భిణులు 15 నుంచి 49 ఏండ్లు,4.మహిళందరు 15-49 ఏండ్లు, 5.యువతులు 15-19 ఏండ్లు, 6.యువకులు 15-19 ఏండ్లు.దేశం 4 అంటే నాలుగవ సర్వే, దేశం 5 అంటే ఐదవ సర్వే శాతాలు.
ఏరియా ×× 1 × 2 × 3 × 4 × 5 × 6
దేశం 4 ××58.6 ×52.3 ×50.4×53.1 ×54.1× 29.2
దేశం 5 ××67.1 ×57.2 ×52.2×57.0 ×59.1× 31.2
తెలంగాణా4××60.7 ×56.9 ×48.2×56.6 ×57.9× 19.2
తెలంగాణా5××70.0 ×57.8 ×53.2×57.6 ×64.7× 25.1
పై పట్టిక చూసినపుడు పసిపిల్లలో రక్తహీనత చాలా ఎక్కువగా ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు ఇంత అనారోగ్యంగా ఉంటే ఎలా ! ఒకే వయసు ఉన్న యువతీ యువకుల్లో రక్తహీనత తేడాలు ఎంతగా ఉన్నాయో చూస్తే ఆడపిల్లల పట్ల వివక్ష, నిర్లక్ష్యం కనిపిస్తుంది. దేశంలోని యువకుల్లో రెండు సర్వేల మధ్య తేడా రెండుశాతం కాగా తెలంగాణాలో ఆరుశాతానికి పెరగటాన్ని గమనించవచ్చు. తల్లీ, పిల్లల ఆరోగ్యం, పోషణ అంశంలో దేశం మొత్తం మీద చూపుతున్న నిర్లక్ష్యం కంటే తెలంగాణాలో ఎక్కువగా ఉన్నట్లు అంకెలు చెబుతున్నాయి.అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు కీలక రంగాలకు తగిన కేటాయింపులు జరపక, తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని పట్టించుకోక తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నట్లు ? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి దిగజారిందా మెరుగుపడిందా ? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా వివక్షకు గురైందని చెప్పిన పాలకులు దేశ సగటు కంటే తక్కువ కేటాయింపులు ఎందుకు చేసినట్లు ?


రాష్ట్ర ప్రభుత్వం రెండులక్షల రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం చేస్తామని 2016-17బడ్జెట్‌లోనే చెప్పింది. ఒక లక్ష హైదరాబాద్‌, మరోలక్ష ఇతర చోట్ల అని పేర్కొన్నది.దాని ఆచరణ ఎలా ఉందంటే 2021-22 బడ్జెట్‌లో ఇండ్ల నిర్మాణానికి రు.11,151 కోట్లు కేటాయించి ఖర్చు చేసిందెంతో తెలుసా కేవలం రు.299 కోట్లు మాత్రమే.2022-23లో రు.12,172 కోట్లు కేటాయించి రు.8,112కోట్లకు తగ్గించి సవరణ బడ్జెట్‌లో చూపారు. ఆచరణలో ఇంకా తగ్గవచ్చు.కానీ 2023-24లో రు.12,140 కోట్లుగా ప్రతిపాదించి అంతకు ముందు కంటే 50శాతం పెంచినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు కొంత మేర నిధులు కేటాయించి నామ మాత్రంగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామనిపించి వాటినే గొప్పగా ప్రచారం చేస్తున్నారు.అదే విధంగా అదే ఏడాది పట్టణాభివృద్ధికి రు.10,555 కోట్లు ప్రకటించి 75శాతం కోత పెట్టి రు.2,665 కోట్లు ఖర్చు చేశారు.సగానికిపైగా జనాభా పట్టణాల్లో నివసిస్తున్న పూర్వరంగంలో ఎంత నిర్లక్ష్యం చేసిందీ వేరే చెప్పనవసరం లేదు. అదే బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమం-పోషకాహారానికి రు.18,997 కోట్లు కేటాయించి 35శాతం,రోడ్లు, వంతెనలకు రు.5,187 కోట్లు ప్రకటించి 55శాతం, వ్యవసాయం, అనుబంధ రంగాల ప్రతిపాదనల్లో 27శాతం కోత పెట్టారు.ఇలా కోతలను దాచి వర్తమాన బడ్జెట్‌లో పెంచినట్లు మాటల్లో కోతలు కోస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d