• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: International

రెండు నెలల గాజా మారణకాండ మరింత తీవ్రం – సొరంగాల్లో ఉప్పునీరు !

07 Thursday Dec 2023

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR, Women

≈ Leave a comment

Tags

Gaza Deaths, Gaza Tunnels, HAMAS attacks 2003, Israel Attack 2023, Israel-Hamas war, Joe Biden, Netanyahu


ఎం కోటేశ్వరరావు


మానవాళి చరిత్రలో అత్యంత విషాదానికి దారితీసే విధంగా గాజాలో పరిస్థితి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి రిచర్డ్‌ పీపర్‌కోన్‌ చెప్పాడు. రెండు నెలలుగా మారణకాండ సాగుతోంది. ఐక్యరాజ్యసమితి దీన్ని నివారించటంలో ఘోరంగా విఫలమైంది.గాజాలోని రెండవ పెద్ద పట్టణమైన ఖాన్‌ యూనిస్‌లో ఇజ్రాయెల్‌ మిలిటరీకి అడుగడుగునా ప్రతిఘటన ఎదురవుతున్నట్లు వార్తలు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌ నౌకలపై ఎమెన్‌ సాయుధ శక్తుల దాడి, సంయమనం పాటించాలని అమెరికాను కోరిన సౌదీ అరేబియా.ఇప్పటికైనా మానవతా సంక్షోభాన్ని నివారించండని భద్రతా మండలిని తొలిసారిగా కోరిన ఐరాస ప్రధాన కార్యదర్శి.ఈ పరిణామాలన్నీ గాజాలో సాగుతున్న మారణకాండ, దాని పర్యవసానాలు మధ్యప్రాచ్యం పడుతున్న తీరు, మొత్తం మీద దిగజారుతున్న పరిస్థితిని సూచిస్తున్నాయి. పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా పాలస్తీనా పౌరుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అంబులెన్సులను కూడా ఇజ్రాయెల్‌ మిలిటరీ అడ్డుకుంటున్నది. గాజాలో పౌరుల సామూహిక వధను ఆపాలని, ఐరాస సభ్యదేశాలు ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని పాలస్తీనాలో మానవహక్కులపై ఐరాస ప్రత్యేక నివేదకురాలు ఫ్రాన్సెస్కా అల్బనీస్‌ మంగళవారం నాడు కోరారు. ఈ విషాదం మీద స్పందించటంలో అంతర్జాతీయ సమాజం పక్షవాతానికి గురైనట్లుగా ఉందని, ప్రసుతం తీవ్ర మారణహౌమ ముప్పు ఉందని హెచ్చరించారు. గాజాలో సంభవిస్తున్న మరణాల్లో సగమే వెల్లడౌతున్నాయని గతంలో తాను చేసిన వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టీకరించారు. ఆత్మ రక్షణ కోసం దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్‌ చెప్పటాన్ని కూడా ఆమె తిరస్కరించారు.కేవలం హమస్‌ను మాత్రమే కాదు మొత్తం గాజాను నాశనం చేయటం లక్ష్యమని అల్బనీస్‌ అన్నారు.

ప్రస్తుత యుద్ధం ముగిసిన తరువాత గాజాను మిలిటరీ రహిత ప్రాంతంగా మారుస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. పోరు ఎంతకాలం సాగినా కొనసాగించేందుకు తాము సన్నద్దంగా ఉన్నట్లు హమస్‌ సీనియర్‌ నేత ఒసామా హందన్‌ చెప్పాడు. పాలస్తీనా అనుకూల మరియు పర్యావరణ పరిరక్షణ కోరే బృందాల పట్ల కఠినంగా వ్యవహరించిన తీరు కారణంగా ప్రపంచ పౌరహక్కుల సూచికలో జర్మనీ దిగజారినట్లు ప్రకటించారు. గాజాలో జరుగుతున్న మానవ సర్వనాశనం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, అంతర్జాతీయ చట్టాలను పాటించాలని, రెండు దేశాల ఏర్పాటు పరిష్కారానికి యత్నాలను తీవ్రతరం గావించాలని కతార్‌-సౌదీ సమన్వయ కమిటీ కోరింది. తమ వైమానిక దాడుల్లో అనేక మంది హమస్‌ నేతలను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకుంది..


ఏడు రోజుల విరామంలో హమస్‌ వద్ద ఉన్న వారిలో వంద మంది బందీలు, ఇజ్రాయెల్‌ జైళ్లలో అక్రమంగా నిర్బంధంలో ఉన్న పాలస్తీనా పౌరుల్లో 240 మంది విడుదల తరువాత పెద్ద ఎత్తున గాజా మీద ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. ఇంకా హమస్‌ వద్ద 138 మంది బందీలు, వేలాది మంది పాలస్తీనా పౌరులు జైళ్లలో ఉన్నారు. బుధవారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గత రెండు నెలల దాడుల్లో 16,248 మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 50వేల మంది గాయపడ్డారు.మరికొన్ని వేల మంది శిధిలాల కింద మరణించి ఉంటారని భయపడుతున్నారు. కూల్చిన భవనాల శిధిలాలను తొలగించే అవకాశం కూడా లేదు. దాడులను విరమించే వరకు చర్చల ప్రసక్తే లేదని హమస్‌, దాడులను కొనసాగించి తీరుతామని ఇజ్రాయెల్‌ ప్రకటించాయి. ఇదిలా ఉండగా బందీల విడుదలకు ప్రధాని నెతన్యాహు ప్రయత్నించటం లేదంటూ ఇజ్రాయెల్‌లో కుటుంబసభ్యులతో పాటు అనేక మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇజ్రాయెల్‌ మారణకాండలో 70శాతంపైగా పిల్లలు, మహిళలే ఉండటం, ఆసుపత్రులు, ఐరాస కేంద్రాలతో సహ నిర్వాసితుల శిబిరాలపై కూడా మారణకాండను కొనసాగించటంతో ప్రపంచ మంతటా తీవ్ర నిరసన వెల్లడి అవుతోంది. దీంతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం, దానికి వంతపాడే బిబిసి వంటి మీడియా సంస్థలు, నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న జో బైడెన్‌ వంటి వారు అరవై రోజుల తరువాత కొత్త పల్లవి అందుకున్నారు. గాజాలోని సొరంగాల్లో దాగి ఉన్నారని భావిస్తున్న హమస్‌ సాయుధులను వెలుపలికి రప్పించేందుకు విష పూరిత వాయువులను పంపాలని గతంలో ఇజ్రాయెల్‌ ఆలోచించింది. ఇప్పుడు దాని బదులు మధ్యధరా సమద్రం నుంచి నీటిని తోడి సొరంగాల్లోకి పంపాలని చూస్తున్నది.


హమస్‌ సాయుధులు అక్టోబరు ఏడవ తేదీన ఇజ్రాయెల్‌ మీద జరిపిన దాడి సందర్భంగా అనేక మంది పిల్లలతో సహా మహిళలపై అత్యాచారాలు చేశారని, అంగవిచ్చేదనలకు పాల్పడ్డారంటూ కొత్త కథనాలను ప్రచారంలోకి తెచ్చారు.ఎలాంటి సందిగ్దతకు, మినహాయింపులకు తావు లేకుండా ఇజ్రాయెల్‌ మహిళలపై జరిపిన అత్యాచారాలను ఖండించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నాడు. అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు, బృందాల నుంచి ఎలాంటి ఖండన ప్రకటనలను తాను వినలేదు, చూడలేదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు చెప్పాడు.దక్షిణ గాజాలో రెండు లక్షల మందికి పైగా జనాభా ఉన్న ఖాన్‌యూనిస్‌ పట్టణాన్ని సర్వనాశనం చేసేందుకు మంగళవారం నుండి ఇజ్రాయెల్‌ సేనలు విమానాలు, టాంకులతో దాడులు జరుపుతున్నాయి. అక్కడ ఎందరు ప్రాణాలు కోల్పోయిందీ ఇంకా వెల్లడి కాలేదు. పౌరులు పట్టణాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరింత దక్షిణంగా అంటే ఈజిప్టు సరిహద్దువైపు వెళ్లాలంటూ వెదజల్లిన కరపత్రాలలో పేర్కొన్నారు. తమ భూభాగంలోకి శరణార్ధులు రాకుండా ఈజిప్టు సరిహద్దులను మూసివేసింది. ఉత్తర గాజాతో పోలిస్తే దక్షిణ ప్రాంతంలో జన నష్టం జరగకుండా నిర్దిష్ట సమాచారంతో దాడులు జరుపుతున్నట్లు ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్‌ చూస్తున్నది. జనాన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లిపోవాలని తరుముతున్న ఇజ్రాయెల్‌ మిలిటరీ నుంచి అమాయకులైన పౌరులకు ఎక్కడా రక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయింది. ఒకసారి ఖాళీ చేసిన ప్రాంతానికి తిరిగి అనుమతించటం లేదు. ఖాన్‌ యూనిస్‌ పట్టణం చుట్టూ ఆరుకిలోమీటర్ల పరిధిలో 150 ఇజ్రాయెలీ టాంకులు, సాయుధులతో కూడిన అనేక వాహనాలు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయి.యుద్ధ విమానాలు కూడా దాడులు జరుపుతున్నాయి.మరోసారి అక్టోబరు ఏడున హమస్‌ జరిపిన మాదిరిదాడులు పునరావృతం కాకుండా చూసేందుకు ఆ సంస్థ మిలిటరీ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే దిశగా తాము దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్‌ చెబుతున్నది.


గత రెండు నెలల దాడుల్లో ఐదువేల మంది హమస్‌ తీవ్రవాదులను మట్టుపెట్టామని ఇజ్రాయెల్‌ చెప్పటం తప్ప ఎలాంటి ఆధారాలను చూపలేకపోయింది.తమ దాడుల్లో మరణించిన నిరాయుధులైన పౌరులను హమస్‌ తీవ్రవాదులుగా చిత్రిస్తున్నది. తమ సైనికులు 86 మంది మరణించినట్లు ప్రకటించింది.అన్ని రకాల మత, నైతిక, మానవతా విలువలను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలస్తీనాలో మారణకాండ జరుపుతున్నదని ఏడు రోజుల దాడుల విరామం, బందీలు, ఖైదీల విడుదల చర్చలకు మధ్యవర్తిత్వం వహించి కతార్‌ పాలకుడు హమద్‌ అల్‌ తానీ దోహాలో జరిగిన అరబ్‌ నేతల సమావేశంలో విమర్శించాడు. ఆత్మరక్షణ పేరుతో ఇదంతా చేస్తున్నారని మారణకాండ నేరాన్ని ఆత్మరక్షణ అనుమతిస్తుందా అని ప్రశ్నించారు. కతార్‌లో హమస్‌ రాజకీయ కార్యాలయంతో పాటు అనేక మంది నేతలు అక్కడే ఉంటున్నారు. ఇజ్రాయెల్‌ షిన్‌బెట్‌ భద్రతా సంస్థ అధిపతి రొనెన్‌ బార్‌ ఒక ఆడియో ప్రకటన చేస్తూ కతార్‌తో సహా హమస్‌ నేతలు ఎక్కడ ఉన్నా వారిని అంతం చేస్తామని బెదిరించాడు. గాజా మీద రెండవ దశ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ సరిహద్దులో ఉన్న లెబనాన్ను కూడా కవ్విస్తున్నది.అక్కడ ఉన్న హిజబుల్లా సాయుధులపై జరిపిన దాడిలో లెబనాన్‌ మిలిటరీ పోస్టులో ఉన్న ఒక సైనికుడి ప్రాణాలు పోయినట్లు లెబనాన్‌ ప్రకటించింది. సరిహద్దు ఆవల నుంచి తమ మీద దాడి జరిగిందని, క్షిపణులు జనం లేని చోట పడినట్లు, తమ విమానాలు హిజబుల్లా మిలిటరీ కేంద్రాల మీద దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ చెబుతున్నది. ఇజ్రాయెల్‌ ఆక్రమించిన గోలన్‌ గుట్టల మీద అక్టోబరు ఎనిమిది నుంచి హిజబుల్లా అడపాదడపా దాడులు జరుపుతున్నది.తరువాత మొత్తం సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.


గాజాలో జరుపుతున్న నేరాలను ఇతర ప్రాంతాలకు విస్తరించవద్దని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు హితవు చెప్పాడు. అదే జరిగితే మొత్తం ప్రాంత భద్రతకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించాడు. రాజకీయ మనుగడకోసం నెతన్యాహు మొత్తం ప్రాంతాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాడని విమర్శించాడు. తమ గడ్డ మీద ఉన్న హమస్‌ సభ్యులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపవద్దని టర్కీ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ భద్రతా సంస్థ అధినేత రొనెన్‌ బార్‌ చేసిన ప్రకటనలో లెబనాన్‌, టర్కీ, కతార్‌లలో ఎక్కడ ఉన్నా హతమారుస్తామని బెదిరింపు ప్రకటన తరువాత టర్కీ నుంచి ఈ ప్రకటనవెలువడింది. గతంలో విదేశీ శక్తుల చట్టవిరుద్ద పనులను తాము అడ్డుకున్నట్లు గుర్తు చేసింది. అనేక సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ మొసాద్‌ ఏజంట్లు అనేక దేశాల్లో తమ వ్యతిరేకులను హత్య చేస్తున్న సంగతి తెలిసిందే. హమస్‌ ఒక విముక్త సంస్థ తప్ప ఉగ్రవాది కాదని అందుకు వారికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు గతంలో ఎర్డోగన్‌ ప్రకటించాడు.


హమస్‌ సాయుధుల జాడ కనుగొనటంలో విఫలమైన ఇజ్రాయెల్‌ తొలుత వారు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న సొరంగాల్లో విషవాయువులను నింపి వెలుపలికి వచ్చేట్లు చేయాలని చూసింది. తాజాగా వాటిని సముద్రపు నీటితో నింపాలని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ దుష్ట ఆలోచన గురించి అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. అదే జరిగితే ఇప్పటికే కాలుష్యమైన గాజా ప్రాంతంలో మరిన్ని పర్యావరణ సమస్యలతో పాటు రానున్న అనేక తరాల మీద ప్రతికూల ప్రభావం పడుతుందని, మంచి నీటి వనరులన్నీ ఉప్పునీటితో నిండుతాయని అనేక మంది హెచ్చరిస్తున్నారు. నవంబరు రెండవ వారంలోనే ఆల్‌ షాతి నిర్వాసిత శిబిరం సమీపంలో ఐదు భారీ పంపులను ఏర్పాటు చేసింది. మధ్యధరా సముద్రం నుంచి నీటిని తోడి సొరంగాల్లో నింపేందుకే ఈ ఏర్పాటు. హమస్‌ సాయుధులను ఏరివేసేందుకు తాము అనేక పద్దతుల గురించి పరిశీలిస్తున్నామని వాటిలో ఒకటి నీటితో నింపటమని ఇజ్రాయెల్‌ మిలిటరీ అధికారి చెప్పినట్లు అమెరికా పత్రిక పేర్కొన్నది. అదే జరిగితే అంతర్జాతీయంగా వెలువడే ఖండనలు జో బైడెన్‌ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తాయని అమెరికా మాజీ అధికారి ఒకడు చెప్పాడు. ఈజిప్టు 2015లో తన భూభాగంలో ఉన్న సొరంగాలను ఉప్పునీటితో నింపి దొంగ రవాణాను అరికట్టేందుకు పూనుకున్నపుడు ఆ ప్రాంత పంటలు దెబ్బతినట్లు రైతులు ఆందోళన చేశారు.అమెరికా ఇతర ఐరోపా ధనికదేశాల అండచూసుకొని చెలరేగుతున్న ఇజ్రాయెల్‌ మారణకాండకు ఇంకా ఎంత మంది బలికావాలన్న ప్రశ్న తలెత్తింది. ఈ దారుణాన్ని నివారించటంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ప్రేమ-ద్వేషం : చైనా వద్దు అమెరికన్‌ విద్యుత్‌ కార్లు ముద్దు !

29 Wednesday Nov 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Environment, Europe, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, UK, USA

≈ Leave a comment

Tags

BJP, BYD, Donald trump, Electric car wars, EU, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, Tesla


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో ఎలక్ట్రానిక్‌ కార్ల యుద్ధానికి తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చైనా ఒక వైపు, ఐరోపా సమాఖ్య-అమెరికా మరోవైపు మోహరిస్తున్నాయి. అమెరికా కంపెనీ టెస్లా కార్ల దిగుమతికిి మన కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదరిందని, వచ్చే ఏడాది నుంచి ఓడల్లో కార్లు దిగనున్నాయని వార్తలు. అధికారికంగా జనవరిలో ప్రకటించవచ్చు. రానున్న రెండు సంవత్సరాల్లో కార్ల తయారీ(విడి భాగాలను తీసుకువచ్చి ఇక్కడ అమర్చటం) కూడా ప్రారంభించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ప్రపంచంలో అత్యధిక కార్లను అమ్ముతున్న చైనా బివైడి కంపెనీతో కలసి కార్ల తయారీని ప్రారంభిస్తామన్న మెఘా ఇంజనీరింగ్‌ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. టెస్లా రెండు వందల కోట్ల డాలర్ల మేర కార్ల తయారీ కేంద్రానికి పెట్టుబడి పెడుతుందని మన దేశం నుంచి 1,500 కోట్ల డాలర్ల విలువగల విడి భాగాలను కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ సెప్టెంబరు నెలలో కాలిఫోర్నియాలోని టెస్లా కంపెనీని సందర్శించి వచ్చిన సంగతి తెలిసినదే. వంద కోట్ల డాలర్ల పెట్టుబడితో హైదరాబాదులో ఏటా పది నుంచి పదిహేను వేల కార్ల తయారీ, ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేస్తామని చైనా బివైడి-మెఘా చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలు చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అనుమతించే అవకాశం లేదని కారణం చెప్పింది. మెఘా కంపెనీ పెట్టుబడిపెడితే సాంకేతిక పరిజ్ఞానం చైనా కంపెనీ అందచేస్తుందని చెప్పినప్పటికీ అంగీకరించలేదు. దీనికి కారణం అమెరికన్‌ కంపెనీ టెస్లాను అనుమతించేందుకు సముఖంగా ఉండటమే అని చెప్పవచ్చు. మనం ఎలాగూ తయారు చేయలేనపుడు రెండు విదేశీ కంపెనీలు పోటీ పడి ధరలను తగ్గిస్తే మన వినియోగదారులకు లాభం, కొన్ని విడిభాగాలు ఇక్కడే తయారీ ద్వారా కొంత మేరకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ టెస్లావైపే మొగ్గుచూపటం ఏమిటన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. చైనాలో స్వంతంగా తయారు చేసే కంపెనీలు ఉన్నప్పటికీ టెస్లాను కూడా అనుమతించిన కారణంగా పోటీ బడి అది కూడా తక్కువ ధరలకే అక్కడ కార్లు అమ్ముతున్నది. మెఘా ఇంజనీరింగ్‌ కంపెనీ ఇప్పటికే చైనా కంపెనీతో కలసి ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.దానికి లేని అడ్డంకి కార్లకు వచ్చిందంటే 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణలు, చైనా వ్యతిరేక కూటమిలో మన దేశం మరింతగా భాగస్వామి కావటమే అని చెప్పవచ్చు.


ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిలో చైనా జోరు ప్రపంచ మార్కెట్లను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది.సాంప్రదాయ కార్ల నుంచి ఎలక్ట్రానిక్‌ వాహనాలకు మారితే ప్రస్తుతం తమ సంఘంలోని లక్షా యాభై వేల మంది కార్మికుల్లో 35వేల మందికి ఉపాధిపోతుందని అమెరికా యునైటెడ్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ తెలిపింది. తమ దేశంలో 2032 నాటికి మూడింట రెండువంతులు ఎలక్ట్రానిక్‌ కార్ల విక్రయమే ఉంటుందని అమెరికా ప్రకటించగా, 2035 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ కార్లనే అమ్ముతామని ఐరోపా సమాఖ్య పేర్కొన్నది. ఈ లక్ష్యాలను సాధించటానికి చైనా నుంచి వాహనాల దిగుమతులను అనుమతించాలా వద్దా అని ఆ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కేవలం ఎలక్ట్రిక్‌ మరియు ఇంథనంతోనూ నడిచే హైబ్రిడ్‌ కార్లతో సహా 2022లో ప్రపంచంలో నూటికి 60 చైనాలోనే ఉత్పత్తి చేశారు.చైనాలో ఐదువేల నుంచి 90వేల డాలర్ల వరకు ధర ఉండే 90 రకాల కార్లను అందుబాటులో ఉంచారు. సగటు ధర 53,800 డాలర్లుండగా ఐరోపాలో 94,100 డాలర్లుంది. ఈ ఏడాది చైనాలో మొత్తం కార్ల అమ్మకాల్లో నాలుగో వంతు(80లక్షలు) ఎలక్ట్రిక్‌ కార్లుండగా, ఐరోపా సమాఖ్య దేశాల్లో 22, అమెరికాలో ఆరు, జపాన్‌లో కేవలం మూడు శాతమే ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఐరోపా సమాఖ్య(ఇయు) 2022లో చైనా నుంచి దిగుమతి చేసుకున్న కార్లు సమాఖ్య మొత్తం ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో మూడు శాతమే. అవి 2030నాటికి 20శాతానికి చేరతాయని స్థానిక కార్ల కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. చైనా పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చిన కారణంగా తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపిస్తూ వాటి మీద విచారణ జరపాలని ఇయు నిర్ణయించింది. దిగుమతి సుంకాల మీద ఒక నిర్ణయం తీసుకొనేందుకు పూనుకుంది.ఇయు నిర్ణయం రక్షణాత్మక చర్యలు తప్ప మరొకటి కాదని వెంటనే చైనా స్పందించింది. అక్కడ ఇస్తున్న సబ్సిడీల సంగతేమిటని ప్రశ్నించింది. ఏ హౌదాతో తమపై విచారణ జరుపుతుందని నిలదీసింది. చైనా నుంచి వస్తున్న దిగుమతులతో స్థానికంగా ఉన్న కార్ల గిరాకీ 20శాతం తగ్గుతుందని అంచనా. చైనా కస్టమ్స్‌ సమాచారం ప్రకారం వర్తమాన సంవత్సరం ఏడునెలల్లో గతేడాది కంటే 113శాతం పెరగ్గా, 2020తో పోల్చితే3,205 శాతం ఎక్కువ. చైనా ఇస్తున్న సబ్సిడీలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే పోరాడాల్సిందేనని జర్మనీ మంత్రితో భేటీ అయిన ఫ్రెంచి ఆర్థిక మంత్రి బ్రూనో లీ మెయరే చెప్పాడు. అయితే కొందరు ఐరోపా వాణిజ్యవేత్తలు దర్యాప్తును వ్యతిరేకిస్తున్నారు. దీంతో చైనా కూడా ఎదురుదాడికి దిగితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు అనేక దేశాలు చైనా నుంచి చౌకగా వచ్చే కార్లను దిగుమతి చేసుకోవాలని ఉన్నా స్థానిక కార్మికులకు పని లేకుండా పోతుందనే భయం మరోవైపు ఉంది.ప్రపంచంలో ఆటో పరిశ్రమల్లో కార్మికులు కోటీ నలభై లక్షల మంది ఉండగా చైనాలో 40లక్షలు,ఇయులో 25, అమెరికా, మెక్సికో, జపాన్లలో పది లక్షల వంతున ఉన్నారు. గతేడాది ప్రపంచ కార్ల ఎగుమతి విలువ 780బిలియన్‌ డాలర్లు కాగా ఇయు 407, జపాన్‌ 87, అమెరికా 58, దక్షిణ కొరియా 52, మెక్సికో 47 బి.డాలర్ల వాటా కలిగి ఉండగా చైనా 45 బి.డాలర్ల మేరకే ఎగుమతి చేసింది. ఉక్కు రంగంలో 2021లో మిగతా దేశాలను వెనక్కు నెట్టేసినట్లుగా రానున్న రోజుల్లో కార్లలో కూడా చైనా అగ్రస్థానానికి వస్తుందేమోనన్న భయం వెల్లడవుతోంది.


అమెరికాలో పికప్‌ ట్రక్కుల మీద 25శాతం తప్ప సాధారణ పన్ను 2.5శాతమే, అయితే చైనాతో వాణిజ్యపోరు ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా కార్ల మీద 25శాతం విధించగా దాన్ని జోబైడెన్‌ కొనసాగిస్తున్నాడు. జపాన్‌లో అసలు పన్ను లేదు, పదిశాతం వసూలు చేస్తున్న ఇయు చైనా కార్ల మీద పన్ను పెంచాలని చూస్తున్నది.చైనా కంపెనీలు తక్కువ ధరలకు కార్లను ఎందుకు విక్రయించగలుగుతున్నాయన్నది ప్రశ్న. ఎలక్ట్రిక్‌ కార్లలో కీలకమైనవి. లిథియం – అయాన్‌ బ్యాటరీలు.వీటి పరిశోధన-అభివృద్దికి చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది, ఆ రంగంలో ఉన్నవారికి రాయితీలిచ్చింది. దానికి తోడు వాటి తయారీకి అవసరమైన ముడిపదార్దాలు చైనాలో పుష్కలంగా ఉండటం అక్కడి కంపెనీలకు కలసివచ్చింది. దీంతో స్థానిక వినియోగదారులు ఆకర్షితులౌతున్నారు ప్రపంచంలో వందకార్లు అమ్మితే గతేడాది చైనాలోనే 59 అమ్మారు. ఈ ఊపుతో ప్రపంచ మార్కెట్లకు విస్తరించాలని అక్కడి కంపెనీలు చూస్తున్నాయి. ఐరోపా దేశాల్లో తలెత్తిన కాలుష్యం కారణంగా రోడ్ల మీద ధ్వనితో 40శాతం మంది బ్రిటీష్‌ పౌరులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తేలింది.వాయు కాలుష్యంతో శ్వాస సమస్యలు పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ కార్ల వలన 17 నుంచి 30శాతం వరకు గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ విడుదల తగ్గుతుందని అంచనా. అందుకే 2035నాటికి బ్రిటన్‌లో మొత్తం ఎలక్ట్రిక్‌ కార్లనే అమ్మాలని నిర్ణయించారు. ఒకవైపు చమురు ఇంథన కాలుష్యం తగ్గుతుందనే సానుకూలత ఉన్నా ప్రతికూలతల గురించి కూడా చర్చ మొదలైంది. హరిత ఇంథనం కోసం ధనికదేశాల ప్రయత్నం పేద దేశాల్లో పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నది.


ప్రస్తుత తీరుతెన్నులను చూస్తే చైనా – ఇతర దేశాల మధ్య కార్ల ధరల యుద్దం జరిగే సూచన కనిపిస్తున్నది. అమెరికా కంపెనీ టెస్లా దీనికి నాంది పలికింది.దీంతో చైనాలోని కొన్ని రకాల కార్ల ఉత్పత్తిని ఆపివేయాల్సి వచ్చింది.ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో దేశీయ మార్కెట్లో 114లక్షల కార్లను విక్రయించగా 20లక్షలు ఎగుమతి చేసింది. విదేశీ ఎగుమతులు 80శాతం పెరగ్గా, స్వదేశీ మార్కెట్‌ 1.7శాతమే పెరిగినందున ధరల పోటీకి దిగితే చైనా కూడా నష్టపోవచ్చని కొందరు చెబుతున్నారు.గతేడాది డిసెంబరు నాటికి చైనాలో 4.3 కోట్ల కార్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉందని, ఉన్న సామర్ధ్యంలో 2017లో 66.6శాతం వినియోగిస్తే గతేడాది 54.5శాతంగా ఉందని రాయిటర్స్‌ పేర్కొన్నది.అక్కడ ఆటోపరిశ్రమ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మూడు కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. జపాన్‌ కార్ల పరిశ్రమకు సైతం చైనా సెగతగులుతోంది.టయోటా తదితర కంపెనీలు తమ డిమాండ్‌ పడిపోకుండా చూసుకుంటున్నాయి.చైనాలో హైబ్రిడ్‌ కార్లకు మార్కెట్‌ ఎక్కువగా ఉంది. నిజంగా కార్ల ధర యుద్దమే తీవ్రమైతే చైనాకు తక్షణమే ఇబ్బంది ఉండదు. ఇప్పటికే సామర్ధ్యాన్ని సమకూర్చుకున్నందున పూర్తిస్థాయిలో ఉత్పత్తి వెంటనే జరపవచ్చు, అదే మిగతా దేశాల్లో సామర్ధ్యాన్ని పెంచుకొనేందుకు భారీగా పెట్టుబడులను కూడా పెట్టాల్సి వస్తుంది.


మన దేశంలో ఎలక్ట్రానిక్‌ కార్ల తయారీకి పూనుకుంటే ముడిపదార్దాలు, బ్యాటరీల కోసం చైనా మీద ఆధారపడటం పెరుగుతుందని గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(గిట్రి) ఈ ఏడాది మార్చి నెలలో తన నివేదికలో పేర్కొన్నది. భారత్‌లో తయారయ్యే వాహనాలకు అవసరమైన వాటిలో 70శాతం వస్తువులను చైనా, ఇతర దేశాల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుంది..కాలుష్యం, ఉపాధిపై తలెత్తే పర్యవసానాల వంటి 13 అంశాలను గిట్రి గుర్తించింది.ఈ వాహనాల బ్యాటరీలను దిగుమతి చేసుకోవాలి, ధరలు ఎక్కువగా ఉంటాయి, ఆరేడు సంవత్సరాల తరువాత కొత్తవాటిని వేసుకోవాలి, వాటిని రీసైకిల్‌ చేయాలంటే వెలువడే విషపదార్దాలు సమస్యగా మారతాయి, దీని వలన విద్యుత్‌ గిరాకీ పెరుగుతుంది, బొగ్గుద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ ప్రక్రియలో కాలుష్యం పెరుగుతుంది. దూరప్రయాణాలకు అనువుగా ఉండవు,ప్రజా రవాణాకు పెద్దగా ఉపయోగపడవు,చైనా మీద ఎక్కువగా ఆధారపడటం వంటి అంశాలను పేర్కొన్నది. ఆటో విడిభాగాలను తయారు చేసే ఏడు వందల సంఘటిత రంగ సంస్థలతో పాటు పదివేల అసంఘటిత రంగ సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. విడిభాగాలు అమ్మేవారు, లక్షలాది గారేజ్‌ షాపులు, సర్వీసు సెంటర్ల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని కూడా పేర్కొన్నది. తమ కాలుష్యకారక పరిశ్రమలను రక్షించుకొనేందుకు, ప్రపంచ వాణిజ్యాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లాలని ఐరోపా దేశాల చెబుతున్నాయి తప్ప ప్రపంచమంతా అలా లేదు.ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు చార్జర్లకు ఒక ప్రమాణం లేదు, అందువలన ప్రతి సంస్థ తనదైన నమూనాను ఇస్తున్నది, దేశమంతటా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నదని గిట్రి పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అర్జెంటీనా అధ్యక్షుడిగా పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి !

22 Wednesday Nov 2023

Posted by raomk in COUNTRIES, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Opinion

≈ Leave a comment

Tags

#latin american left, Anti communist, Argentina presidential election 2023, Donald trump, Javier Milei, Joe Biden


ఎం కోటేశ్వరరావు


ఆదివారం నాడు జరిగిన అర్జెంటీనా అధ్యక్ష తుది ఎన్నికల్లో పచ్చి మితవాది జేవియర్‌ మిలై విజయం సాధించాడు. వామపక్షాల మద్దతు ఉన్న అధికార పెరోనిస్టు పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, కూటమి అభ్యర్థి సెర్గియో మాసాకు 44శాతం ఓట్లు రాగా మిలై 56శాతం తెచ్చుకున్నాడు.డిసెంబరు పదవ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నాడు. మార్కెట్‌ అనుకూల మిలై వాగాడంబరానికి మితవాద శక్తులు, అసంతృప్తి చెందిన యువతరం అధికార కూటమికి వ్యతిరేకంగా ఓటు చేసినట్లు కనిపిస్తోంది. ఒక అరాచక కాపిటలిస్టునని తన గురించి మిలై స్వయంగా చెప్పుకున్నాడు. ఎన్నికల ఫలితాలు వెలుబడగానే పెట్టుబడిదారులు సంబరాలు జరుపుకున్నారు. బాండ్ల రేట్లు పెరిగాయి.నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే అధ్యక్ష ఎన్నికలలో అంతకు ముందు అధికారంలో ఉన్న మితవాద శక్తులను ఓడించి 2019లో పెరోనిస్టు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.2015 నుంచి 2019వరకు మితవాద శక్తులు అధికారంలో ఉన్నాయి. వాటి వైఫల్యంతో అంతకు ముందు అధికారంలో ఉన్న పెరోనిస్టు కూటమికి జనం తిరిగి పట్టం కట్టారు. కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్‌, మరింత దిగజారిన ఆర్ధిక వ్యవస్థ కారణంగా జనంలో ప్రభుత్వం మీద అసంతృప్తి తలెత్తింది.జనాభాలో45శాతం మంది దారిద్య్రరేఖకు దిగువ ఉన్నట్లు అంచనా. వందశాతం దాటిన ద్రవ్యోల్బణం అదుపులేదు. కరెన్సీ పెసో విలువ దిగజారింది.గడచిన పదకొండు సంవత్సరాలలో ఏడు సార్లు వృద్ది రేటు తిరోగమనంలో నమోదైంది. ఈ ఏడాది మాంద్యంలోకి జారవచ్చని ఐఎంఎఫ్‌ జోశ్యం చెప్పింది. ఈ పూర్వరంగంలో పెరోనిస్టు కూటమి ఓడింది.


కరోనా, ఇతర వైఫల్యాల కారణంగా తలెత్తిన పరిస్థితిని ఉపయోగించుకొని జేవియర్‌ మిలై 2021 పార్లమెంటు ఎన్నికల్లో కొత్త పార్టీతో రంగంలోకి దిగాడు. వాస్తవ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన అభ్యర్ధిని తాను మాత్రమేనని మిలై చెప్పాడు. అతగాడికి కుక్కలంటే పిచ్చి. వాటి భాషలో మాట్లాడతాడు. ఎన్నికలకు ముందు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రికతో మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం గురించి ఆలోచిస్తున్నానని, అందుకుగాను తన దగ్గర ఐదు కుక్కలున్నాయని, అవి పది లేదా ఇరవై కూడా కావచ్చు అని చెప్పాడు. వాటిని వదిలితే తగ్గుతుందన్నాడు. మిలై దృష్టిలో కుక్కలంటే రాజ్యాన్ని పక్కన పెట్టి మొత్తం వ్యవస్థను పెట్టుబడిదారులకు అప్పగించాలని ప్రబోధించే ప్రముఖులు. ఆర్థిక సమస్యలను పరిష్కరించటానికి రాజ్యం ఒక పరిష్కారం కాదు, అదే అసలు సమస్య అని కూడా చెప్పాడు. ఐరోపా సంతతితో ఏర్పడిన అర్జెంటీనా గత శతాబ్ది తొలి రోజుల్లో సంపద్వంతంగా ఉండేదని, ప్రస్తుత దురవస్థకు ప్రభుత్వాల వైఫల్యమే కారణమనేందుకు ఉదాహరణగా ఉందన్నాడు. దేశంలోని మొత్తం రాజకీయ తరగతి అంతా దొంగలని, పన్నులు విధించాలని కోరటం హింసాత్మక చర్య అన్నాడు. ఇతగాడి నోటి దురుసుతనంతో అసంతృప్తితో ఉన్న జనం మద్దతుదారులుగా మారవచ్చు, ఓట్లు వేయవచ్చు, నిజంగా అధికారం వస్తే ఎలా పాలిస్తాడో ఏ తిప్పలు తెచ్చిపెడతాడో అన్న భయాన్ని వెల్లడించిన వారు కూడా ఉన్నారు.చివరకు అదే నిజమైంది. అర్జెంటీనాలో నాలుగు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. పార్లమెంటు ఉభయ సభలకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దిగువ సభలో సగం సీట్లకు, ఎగువ సభలో మూడోవంతు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటు రద్దు కాదు. ఒకసారి ఎన్నికైన వారు ఎగువ సభలో ఆరు సంవత్సరాలు, దిగువ సభలో నాలుగేండ్లు ఉంటారు.ప్రజాప్రతినిధుల దిగువ సభలో రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన సీట్లు ఖరారు చేస్తారు. అధ్యక్ష ఎన్నికలు రెండు లేదా మూడుదశల్లో జరుగుతాయి.


ప్రాధమిక ఎన్నికల్లోనే అర్జెంటీనాకు పచ్చి మితవాద శక్తుల ముప్పు ముంచుకువస్తున్నట్లు వెల్లడైంది. ఫలితాలు అనేక మందిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. కొత్త రాజకీయ చర్చకు తెరతీశాయి. ఆ ఎన్నికల్లో స్వేచ్చతో ముందుకు (లిబర్టీ అడ్వాన్సెస్‌) పార్టీ నేతగా జేవియర్‌ మిలై అగ్రస్థానంలో నిలిచాడు. దేశంలోని 24 ప్రావిన్సులలో పదహారు చోట్ల ఆధిక్యత కనపరిచాడు.మిలైకు 30.04శాతం, మరో మితవాద పార్టీకి 28.28శాతం, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాతంత్ర, వామపక్ష కూటమికి 27.27శాతం ఓట్లు వచ్చాయి.తొలి దఫా ఓటింగ్‌ 45శాతంపైగా తెచ్చుకున్నవారు ఒకరే ఉంటే సదరు అభ్యర్ధితో పాటు ఉపాధ్యక్షపదవికి పోటీ చేసిన అభ్యర్ధి కూడా నెగ్గినట్లు ప్రకటిస్తారు. అలాగాక 40శాతం తెచ్చుకున్నప్పటికీ విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే రెండవ స్థానంలో ఉన్న అభ్యర్ధికి మొదటి స్థానంలో ఉన్నవారికి తేడా పదిశాతం కంటే ఎక్కువ ఉండాలి. ఒక వేళ ఇద్దరికి 45శాతానికి మించి ఓట్లు వచ్చినా లేక 40శాతం నిబంధన ప్రకారం ఎవరూ నెగ్గకున్నా, ఎక్కువ ఓట్లు వచ్చిన తొలి ఇద్దరి మధ్య రెండవ దఫా ఎన్నిక జరిపి విజేతను ప్రకటిస్తారు. పదహారు సంవత్సరాలకే ఓటింగ్‌ హక్కు ఇచ్చినప్పటికీ 18-70 సంవత్సరాల వయస్సులో ఉన్న వారు విధిగా ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రాధమిక ఎన్నికలలో విధిగా ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. అక్టోబరు 22న జరిగిన తొలి దఫా ఎన్నికల్లో ఐదుగురు పోటీ చేశారు. వారిలో పెరోనిస్టు మెసాకు 36.78శాతం, మిలైకి 29.99శాతం, మూడో అభ్యర్ధికి 23.81 శాతం రాగా మిగిలిన ఇద్దరికీ కలిపి 9.43శాతం వచ్చాయి. దీంతో నవంబరు19న తుది దఫా మెసా-మిలై మధ్య పోటీ జరిగింది.


ప్రాధమిక ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉన్నట్లు ఫలితాలు వెల్లడి కావటంతో మిలై తన మద్దతుదారులతో మాట్లాడుతూ సంబరాలు చేసుకున్నాడు.రాజకీయ నేతలు మారకపోతే వారిని వదిలించుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుత అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ చైనాను అనుమతించి కొన్ని కీలకరంగాలను అప్పగించాడని ఆరోపించాడు. తాను చైనాతో సంబంధాలను తెంచివేస్తానని, కమ్యూనిస్టులతో వ్యాపారం చేయనని అన్నాడు. కమ్యూనిజం ఒక హంతక వ్యవస్థ, సోషలిజం ఆత్మకు పట్టిన జబ్బు అన్నాడు. తాను అధికారానికి వచ్చిన తరువాత దేశ రిజర్వుబాంకును రద్దు చేస్తానని, ప్రభుత్వ ఖర్చు కోత పెడతానని, పతనమౌతున్న దేశ కరెన్సీ పెసోను రద్దు చేసి కొన్ని దేశాల మాదిరి అమెరికా డాలరును చట్టబద్దమైన కరెన్సీగా ప్రకటిస్తానని చెప్పాడు. విధిగా పాఠశాలల్లో లైంగిక విద్య బోధన జరపాలన్న గత ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేస్తానని అన్నాడు.అర్జెంటీనా ఎన్నికలు ఒక్క లాటిన్‌ అమెరికాకే కాదు, మొత్తం ప్రపంచానికే ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు.


లాటిన్‌ అమెరికాను అమెరికా సామ్రాజ్యవాదం తన పెరటి తోటగా పరిగణించింది. తనకు లోబడిన వారిని గద్దె నెక్కించటం వీలుగాకపోతే మిలిటరీ నియంతలను రంగంలో తెచ్చింది. ఇదే సమయంలో ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ విధానాలను ఆ దేశాల మీద రుద్దారు. అవి వికటించటం, అనేక దేశాల్లో నియంతలు, మితవాద పాలకులకు వ్యతిరేకంగా వామపక్ష శక్తులు పార్లమెంటరీ పోరాటంతో పాటు ఆయుధాలు కూడా పట్టి జనాన్ని సమీకరించారు. దివాలా కోరు ఆర్థిక విధానాలతో పాలకులు ప్రజల నుంచి దూరం కావటం, ప్రతిఘటన తీవ్రమైన తరుణంలో విధిలేక ఎన్నికలు జరపటం వాటిలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది ఒక్కటిగా నిలవటంతో వామపక్ష శక్తులు అధికారానికి వచ్చాయి. వాటికి మద్దతు ఇచ్చిన వారందరూ సోషలిజం, కమ్యూనిజాలకు మద్దతుదార్లు కాదు. నిరంకుశ వ్యతిరేక పోరాటంలో విశాల వేదికల్లో కలసి వచ్చినవారు ఎందరో ఉన్నారు. ప్రజలకు మేలు చేయాలనే వైఖరిని బలపరిచారు.దోపిడీ వ్యవస్థ పునాదులను కూలిస్తే తప్ప జనజీవితాల్లో మౌలిక మార్పులు రావనే అంశాన్ని గుర్తించటంలో, అమలు జరపటంలో ఏకాభిప్రాయం లేదు. అందువల్లనే అధికారానికి వచ్చినచోట వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు గత పునాదులను అలాగే ఉంచి వాటి మీదనే సామాన్య జనానికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో వరుసగా రెండు, మూడు సార్లు గెలుస్తూ వచ్చారు. అయితే వాటికి ఉన్న పరిమితులు వెల్లడి కావటంతో జనంలో తలెత్తిన అసంతృప్తి కారణంగా తిరిగి మితవాద శక్తులు తలెత్తుతున్నాయి.బ్రెజిల్లో, మరికొన్ని చోట్ల అదే జరిగింది. కొన్ని చోట్ల వామపక్షం పేరుతో గెలిచిన వారు మితవాద శక్తులతో చేతులు కలిపారు.


గతంలో మాదిరి నియంతలను రుద్దితే లాభం లేదని గుర్తించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను దెబ్బతీసేందుకు మితవాద శక్తులకు మద్దతు ఇస్తున్నాయి.ఎన్నికల్లో గెలిచినప్పటికీ పెట్టుబడిదారీ, కార్పొరేట్‌ అనుకూల విధానాల కారణంగా అసంతృప్తి తలెత్తి తిరిగి జనం వామపక్షాలకు పట్టంగడుతున్నారు. బ్రెజిల్లో లూలా అదే విధంగా మరోసారి గెలిచాడు. అర్జెంటీనాలోగత ఎన్నికల్లో జరిగింది అదే.ప్రజాతంత్ర, వామపక్ష శక్తులు మౌలిక విధానాల మార్పుల జోలికి పోని కారణంగా జన జీవితాల్లో పెద్ద మార్పులు రాలేదు. అర్జెంటీనాలో ప్రస్తుతం 45శాతం జనం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. వార్షిక ద్రవ్యోల్బణం 143 శాతానికి చేరింది. ప్రభుత్వం వద్ద నగదు నిల్వలు లేవు. దశాబ్దికాలంగా జిడిపి ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది.కరెన్సీ విలువ పతనమైంది. అప్పుల మీదనే దేశం నడుస్తోంది. ఈ కారణంగానే మితవాద ఆర్థికవేత్త కూడా అయిన మిలై చేసిన సైద్దాంతికపరమైన దాడికి నూతన తరం ఆకర్షితమైనట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న వాటన్నింటినీ రద్దు చేసి మొత్తం బాధ్యత అంతటినీ మార్కెట్‌ శక్తులకు వదలి వేస్తే అవే సమస్యలను పరిష్కరిస్తాయంటూ అరచేతిలో స్వర్గం చూపుతున్నాడు. డోనాల్డ్‌ ట్రంప్‌, బ్రెజిల్‌ మితవాది బోల్సనారో బాటలో తాను దేశాన్ని నడిపి ఫలితాలను చూపుతానని నమ్మబలికాడు. ఏ ప్రభుత్వమైతే పెద్ద ఎత్తున సబ్సిడీలు, నగదు బదిలీ చేసిందో ఆ లబ్ది పొందిన పేదలు కూడా దానికి వ్యతిరేకంగా మితవాద మిలైకి ఓటువేసినట్లు స్పష్టమైంది. మితవాద మిలై విప్లవాత్మక మార్పులను నిజంగా తెస్తాడని, మరొక మార్గం లేదని జనం భ్రమలకు గురైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు. నయా ఉదారవాద విధానాలకు శస్త్ర చికిత్స తప్ప పై పూతలతో దాన్ని సంస్కరించి ప్రజానుకూలంగా మార్చలేరన్నది గ్రహించాల్సి ఉంది. జనంలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకొని గద్దె నెక్కినప్పటికీ జేవియర్‌ మిలై తాను ప్రకటించిన అరాచక పెట్టుబడిదారీ విధానాలను అమలు జరపటం అంత తేలిక కాదు. 2021లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తరువాత 257 స్థానాలకు గాను పెరోనిస్టు కూటమికి 118,వర్కర్స్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌కు నాలుగు మినహా మిగిలిన సీట్లన్నింటిలో మితవాద పార్టీల కూటమికి 116, ఇతర మితవాద పార్టీలు, స్వతంత్రులు కలిపితే మెజారిటీ ఉన్నారు. అనేక దేశాల్లో అధికారానికి వచ్చిన మితవాదులు తొలుత తమ దాడిని కార్మికుల మీదనే ప్రారంభించిన నేపధ్యంలో మిలై ఆచరణ కూడా దానికి భిన్నంగా ఉంటుందని భావించలేము. అదే జరిగితే వెంటనే ప్రజా ప్రతిఘటన కూడా ప్రారంభం అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాడలేని భారత ఉత్పత్తి, తయారీ – చైనాతో వాణిజ్యలోటుపై కొత్త డ్రామాకు తెరతీసిన మోడీ సర్కార్‌ !

27 Friday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Boycott of goods made in China, India Trade with China, Make In India, Narendra Modi Failures, Niti Aayog, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


2018 ఏప్రిల్‌ నెలలో మన ప్రధాని నరేంద్రమోడీ చైనాలోని ఊహాన్‌ నగరంలో చైనా నేత షీ జింపింగ్‌తో కలసి ఊయల ఊగేందుకు వెళ్లారు. అప్పుడు నీతి ఆయోగ్‌ ఒక పత్రాన్ని ప్రధాని బృందానికి సమర్పించింది. దానిలో ఏం చెప్పిందంటే గడచిన దశాబ్దకాలంలో చైనాతో వాణిజ్యలోటు పదమూడు రెట్లు పెరిగిందనీ, పాత స్వేచ్చావాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని, నూతన ఒప్పందాల్లో ఏదైనా ఉపేక్ష ఉంటే అది మన మార్కెట్లను దెబ్బతీస్తుందని, భారత్‌ పట్ల చైనా ఔదార్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని, చైనాతో మనదేశం జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. మంచిదే, అంతకంటే కావాల్సిందేముంది ! ఇప్పటికి ఐదున్నర సంవత్సరాలు గడిచాయి. జరిగిందేమిటి ? రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలేమీ కుదరలేదు. ఉన్నవి రద్దు కాలేదు. 2004-05నుంచి 2013-14 మధ్య కాలంలో 148 కోట్ల డాలర్లుగా ఉన్న చైనా-భారత వాణిజ్య లోటు 3,621కోట్లకు చేరిందని, అది 2,346శాతం పెరుగుదల అని అప్పటి నుంచి తమ ఏలుబడిలో 2021-22 నాటికి 7,331 కోట్లకు అంటే కేవలం వందశాతమే పెరిగిందని రాజ్యసభకు వెల్లడించిన సమాచారంలో కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ సమర్ధించుకున్నారు. మరుసటి ఏడాది అంది పదివేల కోట్ల డాలర్లకు చేరింది.ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 5,653 కోట్ల డాలర్లు ఉంది.చైనాతో వాణిజ్య లోటును తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు నవంబరు ఏడవ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చని నీతి ఆయోగ్‌ సంస్థ తాజాగా కన్సల్టెన్సీ సంస్థలను కోరింది. రెండు రకాల అధ్యయనాలు చేస్తారట.సిఫార్సులు చేయటం, నివేదికలను రూపొందించటం తప్ప అధికారాలు లేని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థను నరేంద్రమోడీ ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి నెలకొల్పారు.


వాస్తవానికి చైనా నుంచి విధిగా దిగుమతులు చేసుకోవాలనే ప్రత్యేక ఒప్పందమేమీ మనదేశానికి లేదు. మనకు అవసరం ఎక్కువగా ఉంది గనుక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, వారికి మన నుంచి పెద్దగా దిగుమతులు అవసరం లేదు గనుక లోటు పెరుగుతోంది. అందువలన వాణిజ్య లోటు తగ్గించాలన్నా పూర్తిగా లేకుండా చేయాలన్నా చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే సరిపోతుంది. లేదా మన ఎగుమతులు పెంచాలి. గత పదేండ్లుగా ఈ రెండూ చేతగాని స్థితిలో మోడీ దేశాన్ని ఉంచారా ? ఏం చేయాలో నీతి అయోగ్‌ సంస్థకు తెలియదా ? కొన్ని కోట్లు సమర్పించుకొని సలహలను కొనుక్కోవాలా ? లడక్‌ సరిహద్దులో జరిగిన ఘర్షణ ఉదంతాల తరువాత మన దేశంలో అనేక మంది మనం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పారు. ఇంతకాలం రికార్డు స్థాయిలో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకొని నరేంద్రమోడీ సర్కార్‌ దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. స్టాటిస్టా సంస్థ వివరాల ప్రకారం 2022లో మన దేశం చేస్తున్న ఎగుమతుల్లో 18.5శాతం అమెరికాకు, 6.65శాతం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు, మూడవ స్థానంలో ఉన్న చైనాకు 5.04శాతం ఉన్నాయి. ఇదే కాలంలో చైనా ఎగుమతుల్లో 16.2శాతం అమెరికాకు ఆరవ స్థానంలో ఉన్న మన దేశానికి 3.29శాతమే ఉన్నాయి. అందువలన మనం దిగుమతులు, ఎగుమతులు నిలిపివేస్తే అరిటాకు మీద ముల్లు సామెత అవుతుంది. పదేండ్లుగా చెబుతున్న మేకిన్‌ ఇండియా(భారత ఉత్పత్తి), మేడిన్‌ ఇండియా(భారత తయారీ), ఆత్మనిర్భరత పిలుపుల వలన జరిగిందేమీ లేదు. 2022-23లో మన జిడిపిలో ఉత్పాదకరంగం వాటా 14.7శాతం, మోడీ ఏలుబడి పది సంవత్సరాల్లో దీనికి అటూ ఇటూగానే ఉంది తప్ప 25శాతానికి పెంచాలన్న లక్ష్యం ఎండమావిగానే ఉంది. పన్నెండు రంగాలలో దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు సలహాలు ఇవ్వాలని నీతి అయోగ్‌ కోరుతున్నది. చైనా నుంచి దిగుమతులను తగ్గించాలని 2018లోనే నీతి అయోగ్‌ చెప్పింది కదా ! పోనీ అప్పుడే ఎందుకు అడగలేదు ? తగ్గించకపోగా ఎందుకు పెంచినట్లు ? ఇప్పుడు జనాన్ని మభ్య పెట్టేందుకు తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు నీతి అయోగ్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకం తప్ప ఇది మరొకటి కాదు. అమెరికా, జర్మనీ వంటి దేశాలు మేము చైనా మీద ఆధారపడకుండా ఉండలేంగానీ మీరు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తామని మనలను మునగచెట్టు ఎక్కిస్తున్నాయి.


వాటికే సాధ్యం కానిది మనకెలా కుదురుతుంది ! చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయి. మరి ఎందుకు ఇతర దేశాల నుంచి తెచ్చుకోవటం లేదంటే చైనా మాదిరి తక్కువ ధరలకు మరొకదేశమేదీ ఇవ్వదు. అధిక ధరలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మన చేతి చమురు మరింత వదులుతుంది.ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతాయి. మన జనం కొనాలంటే జిఎస్‌టి పెంచుతారు, విదేశాలకు పద్నాలుగు రకాల వస్తువులను చౌకగా ఎగుమతి చేసేందుకు జనం సొమ్ము రెండు లక్షల కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇస్తున్నా ఎదుగూబొదుగూ లేదు. చైనాను పక్కకు నెట్టి ఆ స్థానాన్ని మనదేశం ఆక్రమిస్తుందని చెప్పటం పరిణితిలేనితనమని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ గతంలో చెప్పాడు. ఐఎంఎఫ్‌ తాజా అంచనా ప్రకారం 2028నాటికి మన జిడిపి 5.94లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే చైనాలో 23.61లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. కానీ కొందరు అప్పటికి మన దేశం చైనాను అధిగమిస్తుందని చెబుతుంటే మరి కొందరు నిజమే కామోసనుకుంటున్నారు. ఎవరి నమ్మకం వారిది ? వినేవారుంటే చెప్పేవారికి కొదవ ఉండదు. చైనా వ్యతిరేక కళ్లద్దాలను పెట్టుకొని చూస్తే అలాగే కనిపిస్తుంది మరి ! గోల్డ్‌మాన్‌ శాచస్‌ సంస్థ అంచనా ప్రకారం 2075 నాటికి చైనా 57లక్షల కోట్ల డాలర్లతో ప్రధమ స్థానంలో 52.5లక్షల కోట్ల డాలర్లతో మనదేశం రెండవదిగా 51.5లక్షల కోట్ల డాలర్లతో అమెరికా మూడవ స్థానంలో ఉంటుందని చెప్పింది. ఇవన్నీ అంచనాలు తప్ప యాభై ఏండ్ల తరువాత రాజెవరో రెడ్డెవరో !


ప్రపంచం రక్షణాత్మక చర్యలు తీసుకుంటోందని, చైనా మీద ఇప్పటికే అమెరికా వాణిజ్యపోరు ప్రారంభించిందని, చైనా మీద అన్ని వైపుల నుంచి వత్తిడి పెరుగుతున్నందున దాన్ని అవకాశంగా మలుచుకోవాలని, మనదేశం చైనా వస్తువులకు మార్కెట్‌ను తెరవకూడదని నీతి అయోగ్‌ 2018 పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. చైనా వస్తువులను మన దేశంలో కుమ్మరించటం గాకుండా చైనా తమ దేశంలో తయారు చేస్తున్నవాటిని మన దేశంలో కూడా పెట్టుబడులు పెట్టి, మన కంపెనీలతో కలసి తయారు చేయించాలని నరేంద్రమోడీకి సలహా ఇచ్చింది. అలా చేస్తే దానికి బదులు ప్రపంచంలో ఇతర దేశాల రక్షణాత్మక చర్యలకు వ్యతిరేకంగా మనదేశ సహాయాన్ని చైనా కోరే అవకాశం ఉందని కూడా చెప్పింది. తెలివితేటలకు తక్కువేం లేదు. అదైనా చేశారా ? లడక్‌ సరిహద్దు ఉదంతం తరువాత చైనాను ఒక శత్రుదేశంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.పోనీ మనలను ఎగదోస్తున్న అమెరికా, ఇతర ఐరోపా దేశాలు మనకేమైనా సాయం చేస్తున్నాయా ? తమ దేశంలో ఒక సిక్కు ఉగ్రవాదిని భారత్‌ దేశమే హత్య చేయించిందన్న కెనడా ఆరోపణకు అమెరికా, ఐరోపా దేశాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.


ప్రతి దేశం తన ప్రయోజనాలను తాను చూసుకుంటున్నది, తన పరిస్థితిని బట్టి అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించుకోవాలి తప్ప చైనా దెబ్బతింటే మనకు అవకాశం వస్తుందని చెప్పేవారి మాటలు వింటే జరిగేదేమీ ఉండదని ఇప్పటికే తేలిపోయింది. ఇతర దేశాల వైఫల్యాల కారణంగా చైనా నేడు ఈ స్థితికి రాలేదు. తన స్వంత విధానాలను రూపొందించుకుంది. కరోనా నిరోధానికి అక్కడ అమలు జరిపిన కఠిన ఆంక్షలు కొంత మేరకు వృద్ధిని దెబ్బతీశాయి తప్ప అనేక మంది ఆశించినట్లు కుప్పకూలలేదు, ఇప్పుడు అలాంటి మాటలు చెప్పేవారి నోళ్లు మూతపడ్డాయి. నాలుగు సంవత్సరాల నాడు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద(ఆర్‌సిఇపి) చర్చల నుంచి మనదేశం వైదొలిగిన తరువాత మనం సాధించిందేమీ లేదు. 2022 జనవరి నుంచి ఆ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దానిలో చేరాలని తాజాగా బంగ్లాదేశ్‌, శ్రీలంక దరఖాస్తు చేసుకున్నాయి. దానిలో మనం చేరితే దిగుమతి వ్యాపారం చేసే శక్తులు లాభపడతామని భావిస్తుండగా నష్టపోతామని పారిశ్రామిక రంగం వ్యతిరేకిస్తోంది. మన దేశానికి తలుపులు తెరిచే ఉంచామని ఆ కూటమి పదే పదే చెబుతోంది.


అసలు చైనాతో మనదేశం పూర్తిగా తెగతెంపులు చేసుకోగలదా ? చైనా సంస్థలను నిరోధించగలదా ? చైనా నుంచి వస్తు దిగుమతులను నిలిపివేయవచ్చు. అదే జరిగితే ఆ దిగుమతులతో లబ్ది పొందుతున్న ఫార్మా, ఇతర రంగాల కార్పొరేట్ల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. చైనా సభ్యురాలిగా ఉన్న ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బాంక్‌(ఎడిబి), ఏఐఐబి, ప్రపంచబాంకు వంటి ఆర్థిక సంస్థలలో మనదేశం కూడా భాగస్వామి. వాటి నుంచి రుణాలు తీసుకొని మనదేశంలో అమలు జరిపే ప్రాజెక్టులలో కాంట్రాక్టులను దక్కించుకొనేందుకు చైనా సంస్థలకు హక్కు ఉంటుంది. వాటికవి దూరంగా ఉంటే లేదా నిబంధనలను ఉల్లంఘిస్తే తప్ప నిరాకరించటానికి కుదరదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత ఢిల్లీ-మీరట్‌ రాపిడ్‌ రైల్‌ మార్గంలో చైనా కంపెనీల కాంటాక్టులను రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్‌ తదితర సంస్థలు ఆందోళన చేసినప్పటికీ కుదరలేదు.ఎందుకంటే అవసరమైన నిధులను ఏడిబి నుంచి రుణాలుగా తీసుకున్నారు. చైనా కంపెనీలు పూర్తి చేసిన మార్గాన్నే ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. మన దేశంలో దాదాపు ఎనిమిది వందల చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌, బైజూస్‌,స్విగ్గీ, జొమాటో,ఉడాన్‌, ఓలా,పేటియం, పేటియం మాల్‌, బిగ్‌బాస్కెట్‌,పోలసీబజార్‌,ఓయో వంటి కంపెనీలలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. వాటన్నింటిని తెల్లవారేసరికి వెళ్లిపొమ్మని నరేంద్రమోడీ చెప్పవచ్చు, వాటికవి వెళ్లిపోతే సరే, లేకుంటే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని ప్రభుత్వం భరిస్తుందా ? ఇష్టం లేదని ఈ రోజు చైనా కంపెనీలను వెళ్లగొడితే మనదేశాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల కంపెనీలు ముందుకు వస్తాయా ? పాలకులకు ఇష్టం లేకపోతే రేపు మనకూ అదే గతి అని ఆలోచించవా ? సరిహద్దు వివాదం తరువాత మనం చైనా వైపు తలుపులు మూసుకున్నాం తప్ప ఇతర దేశాల నుంచి సాధించిందీ లేదు, ఏ ఒక్క చైనా కంపెనీ కూడా వెనక్కు వెళ్లిపోలేదు.


చైనా టెక్‌ కంపెనీల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే తమ సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని, రక్షణకు ముప్పని అమెరికా, ఐరోపా దేశాలు చెబుతున్నాయి.ఇప్పుడు మన దేశమూ అదే చెబుతోంది. నిజమే అనుకుందాం. ఇంటెల్‌ వంటి అమెరికా, ఐరోపా కంపెనీల ఉత్పత్తులను దశాబ్దాల తరబడి చైనా దిగుమతి చేసుకుంది.వాటితో చైనాకూ భద్రతా ముప్పు ఉన్నట్లే కదా ! పోనీ మన దేశం చైనా బదులు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే వాటి నుంచి మనకు ముప్పు ఉండదా ? మన సమాచారాన్ని అవి తస్కరించవా ? జపాన్‌ నాగసాకీ నగరంలో 2023 మే నెలలో జరిగిన జి7 దేశాల సమావేశం చైనాతో ఉన్న సరఫరా గొలుసు నుంచి విడగొట్టుకుంటామని చెబుతూ మన దేశాన్ని చైనా స్థానంలోకి నెడతామని చెప్పాయి.వాటిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరిని దాటేందుకు చూసినట్లే ! దశాబ్దాల తరబడి చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్న పశ్చిమ దేశాలకు ఇప్పుడెందుకు జ్ఞానోదయం కలిగినట్లు ? వాటి మాటలు నమ్మి చైనా అనే కొండను ఢ కొడతామని మనం అనుకోవటం సరైందేనా ? చైనాతో తెగతెంపులు చేసుకుంటే తమ ఆర్ధిక వ్యవస్థలు మెరుగుపడతాయని పశ్చిమ దేశాలు అనుకుంటున్నాయి. అలాంటివి తమ దేశాల్లోనే పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టుకుంటాయి తప్ప మనదేశం ఎందుకు వస్తాయి ? చైనా మీద ఆధారపడి చేతులు కాల్చుకున్నామని భావిస్తున్నవారు మన మీద ఆధారపడి మరోసారి అదే తప్పు చేస్తారా ? సొల్లు మాటలను కట్టిపెట్టి ముందు చైనాతో విడగొట్టుకోమనండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌ దుర్మార్గానికి 500 మంది రోగులు బలి, జో బైడెన్‌ పర్యటన తరువాత గాజాపై ముప్పేట దాడి !

18 Wednesday Oct 2023

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR, Women

≈ 1 Comment

Tags

2023 Israel–Hamas war, China, HAMAS attacks 2003, Iran protests, israel massacre, Joe Biden, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


హమస్‌ సాయుధులను మట్టుపెట్టే పేరుతో ఇజ్రాయెల్‌ ప్రారంభించిన దాడుల్లో మంగళవారం నాడు ఐదు వందల మంది రోగులు మరణించారు. గాజాలోని ఒక ఆసుపత్రి మీద జరిపిన వైమానిక దాడికి వారు బలయ్యారు.మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు ఉన్నట్లు వార్తలు. ఈ దుర్మార్గానికి నిరసనగా బుధవారం నాడు అమెరికా అధినేత జో బైడెన్‌, ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌ శశితో అమ్మాన్‌ నగరంలో జరగాల్సిన భేటీని రద్దు చేసినట్లు జోర్డాన్‌ ప్రకటించింది. అరబ్బు దేశాలు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ దుర్మార్గాన్ని ఖండిస్తూ జనం ప్రదర్శనలు జరుపుతున్నారు.హమస్‌ దాడుల నుంచి ఆత్మరక్షణకు పూనుకోవటం ఇజ్రాయెల్‌కు ఉన్న హక్కు, దాని బాధ్యత అని నొక్కివక్కాణించేందుకు అమెరికా అధినేత జో బైడెన్‌ బుధవారం నాడు ఇజ్రాయెల్‌ వచ్చి కొన్ని గంటల పాటు అక్కడ గడపుతాడని తాజా వార్తలు.నిరంతరం మానవహక్కుల గురించి ప్రపంచానికి బోధ చేస్తున్న అమెరికా నేత ఇజ్రాయెల్‌ గడ్డ మీద కూర్చొని ఇంకా కొట్టండి, చంపండి అని గాక ఇంకా ఏం చెబుతాడో చూద్దాం.


” హంతకుల మీద ఈ రోజు మనం నెపం నెట్టకూడదు. మన పట్ల వారి తీవ్ర ద్వేషాన్ని ఎందుకు గర్హించాలి ? ఎనిమిది సంవత్సరాలుగా గాజాలోని శరణార్ధి శిబిరాలలో వారు కూర్చున్నారు. వారు, వారి తండ్రులు నివశించిన చోట వారి భూములు, గ్రామాలను వారి కళ్ళ ముందే మన ఎస్టేట్లుగా మార్చి వేయటాన్ని వారు చూస్తున్నారు ” ఈ మాటలు చెప్పింది జనరల్‌ మోషే డయాన్‌. నూటికి నూరుపాళ్లు యూదు దురహంకారే.1948లో ఇజ్రాయెల్‌ మిలిటరీ పాలస్తీనా అరబ్బు ప్రాంతాల మీద జరిపిన దురాక్రమణ, హత్యాకాండకు నాయకత్వం వహించిన అధికారులలో ఒకడు. తరువాత మిలిటరీ ప్రధాన అధికారిగా పని చేశాడు.1956లో పాలస్తీనా గెరిల్లాలు జరిపిన దాడుల తరువాత డయాన్‌ చేసిన వ్యాఖ్యలివి. తరువాత కాలంలో పాలస్తీనియన్లతో శాంతి పరిష్కారం కోరుకున్న కారణంగా అదే యూదు దురహంకారులు అతన్ని పక్కన పెట్టారు. ఈ రోజు హమస్‌ చేసిన దాడులతో మొత్తం పాలస్తీనా వాసులను నిందిస్తున్న వారు అర్ధం చేసుకోవాల్సిన కీలక అంశం ఏమిటో డయాన్‌ చెప్పాడు.


పాలస్తీనా – ఇజ్రాయెల్‌ వివాదంలో ఒక యూదు దురంహంకారికి తెలిసిన మేరకు కూడా అర్ధం కానంత అమాయకంగా అమెరికా ఉందా ? 1948 నుంచి పాలస్తీనియన్ల ప్రాంతాలను ఆక్రమించి వారిని తరమివేయటంతో విదేశాల్లో శరణార్ధులుగా, ఇజ్రాయెలీ పాలకులు బహిరంగ జైలుగా మార్చిన పాలస్తీనా ప్రాంతాలలో బందీల మాదిరి క్షణం క్షణం ఏం జరుగుతుందో తెలియని భయం, అనిశ్చితిలో బతుకుతున్నారు. మంగళవారం నాడు అల్‌జజీరా వెల్లడించిన సమాచారం మేరకు హమస్‌ దాడుల్లో 1,400 మందికి పైగా మరణించగా దానికి ప్రతిగా ఇప్పటి వరకు గత పదకొండు రోజుల్లో ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడుల్లో గాజాలోని పాలస్తీనియన్లు 2,808 మంది మరణించారు. వారిలో మూడోవంతు మంది పిల్లలు.ఆసుపత్రి మీద జరిపిన దాడిలో మరణాలతో ఈ సంఖ్య పెరిగింది. అయినా రక్తదాహం తీరలేదు. త్రివిధ దళాలతో గాజాలోని సామాన్య పౌరుల మీద దాడులకు ఇప్పటికే సన్నాహాలు పూర్తి అయ్యాయి. బైడెన్‌ తిరిగి అమెరికా వెళ్లిన తరువాత విరుచుకుపడవచ్చు. ఈ పూర్వరంగంలో మరోవైపున లెబనాన్‌-ఇజ్రాయెల్‌ సరిహద్దులో పరస్పరం దాడులకు దిగినట్లు, కొందరు మరణించినట్లు వార్తలు. రానున్న కొద్ది గంటల్లో ఇజ్రాయెల్‌ మీద ఆ ప్రాంతంలోని కొన్ని బృందాలు దాడులకు దిగవచ్చని ఇరాన్‌ విదేశాంగ మంత్రి చెప్పాడు. వివాదం మరింతగా ముదరకూడదని తాము కోరుకుంటున్నామని ఇరాన్‌ ఒక సందేశాన్ని పంపింది. అయితే గాజాలో పరిస్థితి దిగజారితే తాను జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు కూడా వార్తలు. ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తే పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఇరాన్‌ భాగస్వామి అవుతుందని కొందరు చెబుతున్నారు.


పాలస్తీనా విముక్తి కోసం పలు పద్దతులలో పోరాడుతున్నవారు ఉన్నారు.హమస్‌ సాయుధపోరాట మార్గాన్ని ఎంచుకుంది. అదీ ఎప్పుడు ? ఇజ్రాయిల్‌ ఆక్రమణలకు పాల్పడి అరబ్బుల తరిమివేత, హత్యాకాండను ప్రారంభించిన ఐదు దశాబ్దాల తరువాత. పాలస్తీనా ప్రాంతాలను అక్కడి జనాలకు అప్పగించి ఇజ్రాయెల్‌ తప్పుకుంటే సమస్య ఒక్క రోజులో పరిష్కారం అవుతుంది.అంతా అమెరికా చేతిలో ఉంది. ఐక్యరాజ్య సమితి తాను చేసిన తీర్మానాన్ని ఉల్లంఘించిన వారి మీద చర్యకు ఎందుకు ఉపక్రమించటం లేదు ? భద్రతా మండలి చేసే తీర్మానాన్ని ఇజ్రాయెల్‌కు అనుకూలమైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వీటో చేస్తాయి. సాధారణ అసెంబ్లీ చేసే తీర్మానాలకు విలువ ఉండదు. నాలుగున్నర దశాబ్దాల తరువాత అమెరికా మధ్యవర్తిత్వంలో ఓస్లో ఒప్పందం కుదిరింది. ఆ మేరకు పాలస్తీనాలో పరిమిత అధికారాలున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఇజ్రాయెల్‌ తాను ఆక్రమించిన ప్రాంతాలను క్రమంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలి. ఈ ఒప్పందాన్ని పాలస్తీనా విమోచనా సంస్థ(పిఎల్‌ఓ) చేసుకుంది. దాన్ని ఇతర పార్టీలు, సంస్థలు ఆమోదించలేదు. లొంగుబాటుగా వర్ణించాయి. వాటిలో హమస్‌ ఒకటి. ఎందుకంటే దానిలో అసలు పాలస్తీనా దేశం అనే పదాలే లేవు. ఆ ఒప్పందాలు జరిగి మూడు దశాబ్దాలు గడచింది. మొత్తం మీద చూసినపుడు ఒక్క నిబంధనను కూడా అమలు జరపలేదు. ఆక్రమణల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగలేదు, పాలస్తీనాకు అప్పగించలేదు.ఆక్రమణలు ఇంకా పెరిగాయి. జెరూసలెం పట్టణాన్ని కూడా ఆక్రమించేందుకు పూనుకుంది. మధ్యవర్తిగా ఉన్న అమెరికా అమలు జరిపేందుకు వత్తిడితేవటంమాని యూదుల పక్షాన నిలబడింది.ఓస్లో ఒప్పందంపై సంతకాలు చేసి దాన్ని అమలు జరిపేందుకు పూనుకోవాలి అని చెప్పిన ఇజ్రాయెల్‌ ప్రధాని యత్జిక్‌ రబిన్‌పై తీవ్రవాదులైన యూదు దురహంకారులు కుట్ర చేసి 1995లో హత్య చేశారు. ఎవరైనా అమలుకు పూనుకుంటే వారికి ఇదే గతి అన్న హెచ్చరికే అది.


ఇక హమస్‌ తాజా దాడులకు ఎందుకు పాల్పడింది అన్న అంశం మీద ప్రచారంలో ఉన్న కుట్ర సిద్దాంతాలలో ఒకటేమిటంటే ఇజ్రాయెల్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్య కుదిర్చేందుకు అమెరికా చేస్తున్న యత్నాలను దెబ్బతీసేందుకు అన్నది ఒకటి. పాలస్తీనా అరబ్బులకు మద్దతు ఇస్తున్న దేశాలలో సౌదీ ఒకటి. అది ఇజ్రాయెల్‌తో కుదుర్చుకొనే ఒప్పందాలకు ప్రాతిపదికలు ఏమిటో బహిర్గతం కాలేదు.మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం జెరూసలెంతో సహ పశ్చిమ గట్టు, గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న ప్రాంతాలను పాలస్తీనాకు బదలాయిస్తేనే రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలను నెలకొల్పుకొనేందుకు అవకాశం ఉందని సౌదీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఉగ్రవాదులైన ఇజ్రాయెల్‌ మంత్రులు, యంత్రాంగానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ కారణంగానే హమస్‌ సాయుధులు క్షిపణులతో సహా గాజా కంచెను దాటి ఇజ్రాయెల్‌ ప్రాంతంలోకి ప్రవేశించి దాడులు చేసేందుకు కావాలనే అవకాశం ఇచ్చారని, దాడులను సాకుగా చూపి ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఒప్పందాన్ని అడ్డుకోవాలన్నది ఒక కుట్ర కోణం. దాడి జరిగిన ఐదు గంటల తరువాత మాత్రమే ఇజ్రాయెల్‌ భద్రతాదళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.ఈ కుట్రను అర్ధం చేసుకోలేని హమస్‌ వచ్చిన అవకాశాన్ని దాడికి ఉపయోగించుకున్నట్లు కొందరు చెబుతున్నారు.


గాజాపై దాడికి ఇజ్రాయెల్‌ పూనుకున్న పూర్వరంగంలో పశ్చిమాసియాలో పర్యవసానాలు, చైనా పాత్ర గురించి కూడా విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్‌తో ఒప్పందాన్ని సౌదీ పక్కన పెట్టినట్లు, ఇరాన్‌తో సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజా పరిస్థితికి బాధ్యత ఇజ్రాయెల్‌దే అన్న సౌదీ, పరిణామాలను దగ్గరగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది, హమస్‌ చర్యను ఖండించలేదు. గతంలో ఇజ్రాయెల్‌ను హెచ్చరించినట్లు కూడా పేర్కొన్నది. ఈ స్పందన మీద అమెరికా మండిపడింది. తమతో సాధారణ సంబంధాలను కోరుకోవాలనుకొనే వారి నుంచి రావాల్సిన సాధారణ ప్రకటన ఇలా ఉండకూడదని వ్యాఖ్యానించింది.ఉప్పు-నిప్పుగా ఉన్న సౌదీ-ఇరాన్‌లను ఒక దగ్గరకు చేర్చి సంబంధాల ఏర్పాటుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా మధ్యవర్తిత్వం వహించింది.బ్రిక్స్‌ కూటమిలోకి ఈజిప్టు, సౌదీ, యుఏఇ, ఇరాన్‌లను తెచ్చేందుకు కూడా చూస్తున్నది. ఈ పూర్వరంగంలో చైనా నుంచి దూరంగా జరిగితే పౌర అణు కార్యక్రమంలో భాగంగా ఒక విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మిస్తామని అమెరికా ఇటీవల సౌదీకి ఒక బిస్కెట్‌ వేసింది. గత కొన్ని దశబ్దాలుగా అమెరికా మిత్ర దేశంగా ఉన్నప్పటికీ గతంలో అలాంటి ప్రతిపాదన చేయలేదు. ఇరాన్‌తో కుదిరిన మైత్రిని దెబ్బతీసేందుకు పావులు కదుపుతోంది. మరోవైపున మధ్య ప్రాచ్యంలో తన పట్టుతగ్గలేదని, తనను ఎదిరిస్తే అంతుచూస్తానని బెదిరించేందుకు రెండు విమానవాహక యుద్ద నౌకలను, యుద్ధ ఓడలను ఆ ప్రాంతానికి పంపింది. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థంగా ఉన్న మన దేశం ఇప్పుడు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది.


చైనా వైఖరిని ఇజ్రాయెల్‌, అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాలు జీర్ణించుకోకపోగా మండిపడుతున్నాయి. తటస్థం అంటే ఇజ్రాయెల్‌ వ్యతిరేక వైఖరిని తీసుకోవటంగా చిత్రిస్తున్నాయి. అరబ్‌ దేశాల్లో తనకు అనుకూలమైన స్థితిని సృష్టించుకొనేందుకు చూస్తున్నదని, తన ప్రపంచ అజండాను ముందుకు తీసుకుపోవటంలో ఇది భాగమని ఉక్రోషం వెల్లడిస్తున్నాయి.ఒకవైపున జనాలను వీధుల్లో హతమారుస్తున్నపుడు దాని గురించి మాట్లాడకుండా పాలస్తీనా ఏర్పాటు గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పాలస్తీనా పాలనా మండలి అధ్యక్షుడు అబ్బాస్‌ను ఒక దేశాధినేత హౌదాలో చైనా ఆహ్వానించింది. పాలస్తీనా పౌరుల న్యాయమైన జాతీయ హక్కులకు మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ ప్రధానిని కూడా చైనా ఆహ్వానించింది. పాలస్తీనా పౌరులహక్కులను హరించినందుకు గాను గతంలో దౌత్య సంబంధాలు పెట్టుకొనేందుకు నిరాకరించిన చైనా ఇటీవలి కాలంలో వైఖరిని మార్చుకొని అటు పాలస్తీనా ప్రతినిధులతో పాటు ఇటు ఇజ్రాయెల్‌తో కూడా సంబంధాలను నిర్వహిస్తున్నది. మరోవైపున చైనా మీడియాలో అమెరికా పాత్రను ఎండగడుతూ విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఒక వైపున అరబ్‌ దేశాలను ఇజ్రాయెల్‌కు దగ్గర చేసేందుకు, మరోవైపున యూదు దురహంకారులకు మద్దతు ఇస్తూ పాలస్తీనియన్ల మీద భరించరాని వత్తిడిని అమెరికా పెంచుతున్నదని, ఒకవైపు కొమ్ముకాస్తున్నదని పేర్కొంటున్నారు. చైనా పశ్చిమాసియా తాజా వివాదంలో తటస్థంగా ఉంది. ఉభయ పక్షాలు శాంతం వహించాలని కోరింది తప్ప హమస్‌ను ఖండించలేదు. మావో కాలం నుంచీ పాలస్తీనా పక్షమే వహిస్తున్నది. ఆత్మ రక్షణ పేరుతో తన దాడులను ఇజ్రాయెల్‌ సమర్ధించుకుంటున్నది.చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్‌ బిన్‌ ఫర్హాన్‌తో మాట్లాడుతూ ఆత్మ రక్షణ పరిధికి మించి ఇజ్రాయెల్‌ చర్యలు ఉన్నాయి.అది అంతర్జాతీయ పిలుపులను వినాలి, గాజా పౌరులందరినీ శిక్షించాలని చూస్తున్న చర్యలను ఐరాస ప్రధాన కార్యదర్శి నిలిపివేయించాలని, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడాలని కూడా చైనా మంత్రి స్పష్టం చేశాడు. చైనా ఇస్తున్న గట్టి మద్దతు అరబ్‌ ప్రపంచంలో పాలస్తీనీయన్లకు మరింత బలాన్ని ఇస్తుందని, అరబ్‌ దేశాలు వారి వైపున నిలిచే అవకాశం ఉందని, చైనా కోరుకుంటోంది కూడా అదేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా తటస్థత అంటూ రష్యా దాడులను ఖండించలేదని మరోవైపున దానితో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకుందని పశ్చిమదేశాల విశ్లేషకులు చైనా మీద మండిపడుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌పై హమస్‌ దాడులకు కారణం ఏమిటి ! ఆజ్యం పోస్తున్న అమెరికా కూటమి !!

11 Wednesday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, International, NATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, China, Gaza, Hamas, Israel, Joe Biden, Narendra Modi Failures, Palestinian People, RSS, USS Gerald R Ford


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనా సమరయోధుల సంస్థ హమస్‌- ఇజ్రాయెల్‌ మధ్య మరోసారి చెలరేగిన పోరు ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందా అని ఒకవైపు ప్రపంచం ఆందోళన చెందుతుంటే మరోవైపు అమెరికా స్టాక్‌మార్కెట్‌లో ఆయుధ ఉత్పత్తి కంపెనీల వాటాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూడటం అంటే ఇదే. గత మూడు సంవత్సరాల్లో ఎంతగా లేనంతగా సోమవారం ఒక్కరోజే ఎనిమిది శాతం ఎగువకు దూసుకుపోయాయంటే తమకు లాభాల పంట పండుతుందని మదుపుదార్లు వాటాల కొనుగోలు ఎగబడిన ఫలితమే అది. ఇజ్రాయెల్‌కు మరింతగా సాయం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించటంతో ఆయుధ కంపెనీలకు చేతినిండా పని అన్నది తెలిసిందే. తాజా పరిణామాల్లో అటూ ఇటూ పెద్ద ఎత్తున జననష్టం, ఆస్థి విధ్వంసం గురించి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. తక్షణమే దాడులు నిలిపివేయాలన్న అభిప్రాయం వెల్లడి అవుతోంది. ఎవరు ముందు ప్రారంభించారు, ఎవరు ప్రతిఘటిస్తున్నారు అన్న విచక్షణలోకి పోతే పైకి హమస్‌ దాడులు కనిపించవచ్చుగానీ అంతకు ముందు ఇజ్రాయెల్‌ చేసిన దారుణాలు తక్కువేమీ కాదు.ఇది ప్రారంభం కాదు, అంతమూ కాదు. ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామాలకు కారణాలు ఏమిటన్నది చూద్దాం. ఒకటి పాలస్తీనా ఏర్పాటును అడ్డుకోవటమే కాదు, ఐరాస దానికి కేటాయించిన ప్రాంతాలను క్రమంగా ఆక్రమించుకుంటున్న ఇజ్రాయెల్‌, దానికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాల వైఖరి ఒకటైతే, తక్షణ కారణాలేమిటన్నది మరొక అంశం. తాజాగా తలెత్తిన వివాదానికి అమెరికా మరింతగా ఆజ్యం పోస్తున్నది, ఇజ్రాయెల్‌కు మద్దతుగా మధ్యధరా సముద్రానికి తన సప్తమ నౌకా దళం, జెట్‌ యుద్ధ విమానాలను పంపుతున్నది. మధ్యవర్తిగా ఉన్న ఒక దేశం ఇలా ఒకపక్ష కొమ్ముకాయటం దుర్మార్గం.


పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదంలో జరూసలెం పట్టణం ఎవరికి చెందాలన్నది ఒక అంశం. ఇటీవలి వరకు టెల్‌ అవీవ్‌లో ఉన్న తన ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించాలని అమెరికా నిర్ణయించటం ఏకపక్షం, పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమిస్తున్న ఇజ్రాయెల్‌ దుర్మార్గానికి మద్దతు ఇవ్వటమే. ఇంకా అమెరికా కనుసన్నలలో నడిచే అనేక దేశాలు అదే మాదిరి తమ కార్యాలయాలను కూడా జెరూసలెంకు తరలించాలని చూడటం యూదుల ఆక్రమణలను శాశ్వతం చేసే కుట్రలో భాగమే. జెరూసలెంలోని చారిత్రాత్మక అల్‌ అక్సా మసీదును ఆక్రమించుకొనేందుకు ఇజ్రాయెల్‌ పూనుకోవటమే తాజాగా హమస్‌ను దాడులకు పురికొల్పిందని చెప్పవచ్చు. 2021 ఏప్రిల్‌లో రంజాన్‌, యూదుల పండుగ పాసోవర్‌ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ముస్లిమేతరులు ఆ మసీదు ప్రాంగణాన్ని సందర్శించాలంటే అనుమతి తీసుకోవాలి. ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో మసీదు పరిసరాలను ఆక్రమించిన యూదులు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాసోవర్‌ పండగ సందర్భంగా ప్రాంగణాన్ని దురాక్రమించి ప్రార్ధనలు జరిపారు. ఏప్రిల్‌ 14వ తేదీన ఇజ్రాయెల్‌ పోలీసులు బలవంతంగా ప్రవేశించి మసీదులో ఉన్న మైకుల వైర్లను తెంచివేశారు.ఎందుకు అంటే మసీదు పక్కనే జరుగుతున్న ఇజ్రాయెలీ అధ్యక్షుడి కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని సాకు చెప్పారు. తరువాత రెండు రోజులకు పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ పోలీసుల ఆంక్షలను తోసిపుచ్చి వేలాది మంది చేరి ప్రార్ధన చేశారు. మరుసటి నెలలో యూదు దురాక్రమణదార్లు పాలస్తీనియన్ల మీద జరిపిన దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. అదే ఏడాది ఇజ్రాయెల్‌ – హమస్‌ మధ్య పదకొండురోజుల పాటు దాడులు ప్రతిదాడులు జరిగాయి. గతేడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెలీ దళాలు ప్రవేశించి పాలస్తీనియన్ల మీద దాడులు చేశాయి. మసీదులో తిష్టవేసిన వారు తమ మీద రాళ్లు వేసినట్లు సాకు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఐదున కూడా ఇజ్రాయెల్‌ దళాలు మసీదు మీద దాడి జరిపాయి. మసీదులో ఉన్నవారు రాళ్లు విసిరినట్లు పాత కథనే తిరిగి వల్లించారు. అప్పటి నుంచి ఏదో ఒక సాకుతో అల్‌ అక్సా మసీదు, పరిసరాల్లో ఉన్న పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు ఇజ్రాయలీలు రెచ్చగొడుతుండటమే ఈనెల ఆరున హమస్‌ దాడులకు కారణంగా చెబుతున్నారు. యాభై సంవత్సరాల క్రితం 1973 అక్టోబరు ఆరున ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలపై అరబ్బులు ఆకస్మికంగా దాడులు జరిపారు. నాటి ఉదంతాల గురించి ఇజ్రాయెలీ మీడియాలో గత కొద్ది రోజులుగా పాలస్తీనియన్లను రెచ్చగొడుతూ వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.దాన్లో భాగంగానే సిమ్‌చాట్‌ తోరా పేరుతో యూదులు పండుగ చేసుకుంటున్న పూర్వరంగంలో దాడులకు ఆక్టోబరు ఆరవ తేదీనే హమస్‌ కూడా ఎంచుకున్నదని, ” ఆపరేషన్‌ అల్‌ అక్సా ఫ్లడ్‌ ” పేరు పెట్టినట్లు చెబుతున్నారు. దీని గురించి ఇజ్రాయెలీ గూఢచారులు ఏ మాత్రం పసిగట్టలేకపోయారు. తాడిని ఎక్కేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడు.


ఆయుధాలతో అరబ్బులను బెదిరించి వారి ప్రాంతాలను ఆక్రమించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న బ్రిటీష్‌ పాలకుల చర్యలను 1938లోనే గాంధీ మహత్ముడు హరిజన్‌ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో వ్యతిరేకించారు.యూదులు ఏదేశంలో ఉంటే అదే వారి మాతృదేశం అవుతుందని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా 1948లో పాలస్తీనాలో కొన్ని ప్రాంతాలను గుర్తించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. తరువాతే అసలు కుట్ర బయటపడింది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించి తన రక్షణకు అవి అవసరమంటూ నాటి నుంచి నేటి వరకు అసలు పాలస్తీనా ఉనికినే లేకుండా చేసింది ఇజ్రాయెల్‌. అంతకు ముందు ఎక్కడెక్కడో ఉన్న యూదులందరినీ సమీకరించి బ్రిటీష్‌ పాలకులు అక్రమంగా పాలస్తీనాలో ప్రవేశపెట్టారు. వారికి ఆయుధాలతో శిక్షణ, నిధులు అందచేశారు.ఐరాస చేసిన విభజన తీర్మానాన్ని పాలస్తీనా అంగీకరించలేదు. ఇతర దేశాల్లోని యూదులను చేర్చటంతో అప్పటి వరకు పాలస్తీనాలో 90శాతంగా ఉన్న అరబ్బులు 67శాతానికి తగ్గారు. సారవంతమైన ప్రాంతాలతో సహా పాలస్తీనాలో 55శాతాన్ని యూదులకు కేటాయిస్తూ విభజన పధకంలో చేర్చారు. అరబ్బులకు 42శాతం, మూడుశాతం విస్తీర్ణంలో ఉన్న జెరూసలేం ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యవేక్షణలో ఉంచేందుకు నిర్ణయించారు.ప్రస్తుతం పశ్చిమ గట్టు, గాజా పాలస్తీనా పాలిత ప్రాంతాలుగా పేరుకు 23శాతం విస్తీర్ణంలో ఉన్నప్పటికీ వాటిలో కూడా ఇజ్రాయెల్‌ ఆక్రమణలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పాలస్తీనాను విభజించినపుడు ఏడున్నరలక్షల మంది అరబ్బులు నిర్వాసితులై విదేశాలకు శరణార్ధులుగా వెళ్లారు. గడచిన 75 సంవత్సరాల్లో వారి వారసుల సంఖ్య అరవైలక్షలకు పెరిగింది. వారంతా పాలస్తీనాలోని కొన్ని శిబిరాలు, ఈజిప్టు, లెబనాన్‌, జోర్డాన్‌, సిరియాల్లో తలదాచుకుంటున్నారు.
తాజాగా హమస్‌ దాడుల గురించి పశ్చిమ దేశాల వార్తా సంస్థలు ఇచ్చిన వార్తల్లో వారి ఆధీనంలో ఉన్న గాజా ప్రాంతంలో వంద మంది ఐరోపావాసులు బందీలుగా ఉన్నట్లు పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చాయి. ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న వేలాది మంది తమవారిని విడిచిపెడితే వారిని తాము కూడా స్వదేశాలకు పంపుతామని హమస్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.పశ్చిమ దేశాలు, అక్కడి మీడియాను అనుసరించే మన దేశంలోని కొందరు హమస్‌ను ఉగ్రవాదులుగానూ, ఇజ్రాయెల్‌ను ప్రజాస్వామిక శక్తిగా చిత్రిస్తున్నారు. ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న తమ దేశాన్ని విముక్తి కావించేందుకు అనేక శక్తులు అనేక పద్దతుల్లో పోరాడుతున్నాయి. పాలస్తీనా విమోచనా సంస్థ యాసర్‌ అరాఫత్‌నే ఉగ్రవాదిగా చిత్రించిన వారు హమస్‌ను మరొక విధంగా పేర్కొంటారని అనుకోలేము.హమస్‌ గాజా ప్రాంతంలో అధికారంలో ఉంది.అది సాయుధపోరాటాన్ని ఒక మార్గంగా ఎంచుకుంది. పశ్చిమ దేశాల మద్దతు, బలమైన మిలిటరీ ఉన్న ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని సందర్భాల్లో గెరిల్లా పద్దతిలో దాడులు జరుపుతుంది. మన దేశ చరిత్రలో శివాజీ కూడా ఔరంగజేబు సేనల మీద, అల్లూరి సీతారామ రాజు బ్రిటీష్‌ వారి పాలకుల మీద గెరిల్లా పద్దతిలో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. వారిని ఉగ్రవాదులందామా ? బ్రిటీష్‌ వారు భగత్‌ సింగ్‌నే ఉగ్రవాది అని నిందించిన సంగతి తెలిసిందే.


చరిత్రలో హిట్లర్‌ మూకలు యూదులను నిర్బంధ శిబిరాల్లో చిత్రహింసలు పెట్టి చంపిన దారుణ మారణకాండను ప్రపంచం చూసింది. గాజా ప్రాంతంలో ఇరవైలక్షల మందికి పైగా అరబ్బులు నివశిస్తున్నారు. ప్రపంచంలో అదొక పెద్ద జైలు అంటే అతిశయోక్తి కాదు. అక్కడి జనం బయటకు రావాలన్నా, పరిసరాల్లో పనిపాటలు చేసుకోవాలన్నా ఇజ్రాయెల్‌ మిలిటరీ అనుమతి తీసుకోవాల్సిందే. తనిఖీ లేందే జనాలను కదలనివ్వరు.హమస్‌ దాడులకు ముందే ఇజ్రాయెల్‌ పోలీసులు 5,250 మంది పాలస్తీనియన్లను బందీలుగా ఉంచుకున్నారు, వారిలో 170 మంది పిల్లలు కూడా ఉన్నారు. వీరి గురించి మీడియా, పశ్చిమ దేశాల మానవతావాదులు పట్టించుకోరు. ఉగ్రవాదం మీద దాడులు చేయండి తప్ప పాలస్తీనియన్ల మీద కాదంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏడున్నర దశాబ్దాలుగా దాడులు చేస్తున్నది సామాన్యజనం మీదనే అన్న వాస్తవాన్ని దాచేందుకే ఈ పదజాలం.పాలస్తీనా వాసులు పోరులోనే పుట్టి ,పోరులోనే పెరిగి ,పోరులోనే మరణిస్తున్నారు. అంతకంటే వారికి పోయేదేమీ లేదు. వారి మాతృదేశ కాంక్ష మరింతగా పెరుగుతుందే తప్ప నిర్భంధంతో అణిగేది కాదు. జెరూసలెంతో సహా అరబ్బులకు నిర్దేశించిన ప్రాంతాలను పూర్తిగా తిరిగి వారికి అప్పగించకుండా, వారి ప్రాంతాలలో యూదుల నివాసాలను ఖాళీ చేయించకుండా సమస్య పరిష్కారం కాదు. పాలస్తీనియన్ల మాతృదేశ కాంక్ష తీరదు.


ఇప్పటికే మాతృగడ్డమీద దశబ్దాల తరబడి బందీలుగా మారిన పాలస్తీయన్ల భవితవ్యం గురించి ఒకవైపు ప్రపంచం ఆలోచిస్తుంటే మరోవైపు వారిని మరింతగా అణచివేసేందుకు అవసరమైన ఆయుధాలను అమ్ముకొనేందుకు అమెరికా పూనుకుంది. ఇజ్రాయెల్‌ మీద దాడి చేసినందుకు ప్రతీకారంగా పాలస్తీనాకు అందచేస్తున్న సాయాన్ని సమీక్షించే నెపంతో ఐరోపా నిలిపివేసింది. అదే పాలస్తీనా మీద యుద్ద విమానాలతో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. యూదుల అణచివేతను ఆయుధంగా చేసుకొని హిట్లర్‌ మారణకాండకు పాల్పడ్డాడు. అదే యూదులకు మాతృదేశాన్ని ఏర్పాటు చేయాలనే సాకుతో పశ్చిమాసియాలో ఉన్న చమురు, ఇతర సహజ సంపదలను ఆక్రమించాలని చూసిన బ్రిటన్‌, అమెరికా తదితర పశ్చిమ దేశాలు అందుకోసం తమ తొత్తుగా పనిచేసే ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న ఎత్తుగడలను ప్రపంచం చూసింది.ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థవిధానాన్ని అనుసరించిన మనదేశం పశ్చిమాసియాలోనే కాదు, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను ఖండించాల్సిందిపోయి ఇప్పుడు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది. ఇది గడచిన ఏడుదశాబ్దాలుగా అనుసరిస్తున్న మన విదేశాంగ విధానానికే విరుద్దం. నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరి బిజెపితో సహా సంఘపరివార్‌ సంస్థల ముస్లిం వ్యతిరేకతకు ప్రతిబింబం తప్ప మరొకటి కాదు. ఇలాంటి వైఖరితో తలెత్తే పర్యవసానాల గురించి ఎవరెన్ని హెచ్చరికలు చేసినా, సుద్దులు చెప్పినా పట్టించుకోకపోవటం విచారకరమే కాదు గర్హనీయం.స్వాతంత్య్రపోరాటంలో భాగస్వామ్యం లేకపోవటమే కాదు దానికి వ్యతిరేకంగా పని చేసిన శక్తుల వారసులు పాలస్తీనియన్ల మాతృదేశ విముక్తి వాంఛ, దురాక్రమణ వ్యతిరేక పోరాటాన్ని అర్ధం చేసుకొంటారని భావించటం అత్యాశే అవుతుంది. ఇజ్రాయెల్‌ను సమర్ధిస్తున్న అమెరికా తదితర దేశాల వైఖరిని యావత్‌ శాంతి శక్తులు ఎలుగెత్తి ఖండించాలి, పాలస్తీనా విముక్తికి పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిన్న దేశం మాల్దీవుల ఎన్నికలు – చైనాకు అనుకూలమా ? భారత్‌ ఎదురు దెబ్బా !

04 Wednesday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, Maldives election 2023, Maldives presidency, Mohamed Muizzu, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మాల్దీవులు,ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటి. ఆసియాలో రెండవది. కేవలం ఐదు లక్షల 21వేల జనాభా మాత్రమే కలిగిన ఈ దేశం ఇప్పుడు ప్రపంచ మీడియాలో పెద్ద స్థానాన్ని ఆక్రమించింది.కారణం గతనెల 30న అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. వాటి మీద ప్రపంచ మీడియాలో వచ్చిన కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి.” మాల్దీవుల ఎన్నికల్లో మహమ్మద్‌ ముయిజ్జు గెలుపు చైనా అనుకూల శిబిరానికి విజయం ” భారత్‌కు మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఒక దౌత్యసవాలుకు ప్రతినిధి ” ” చైనా చెవులకు సంగీత విందు ” ” భారత్‌ వెళ్లిపోవాలంటున్న మాల్దీవుల చైనా అనుకూల నూతన అధ్యక్షుడు ” ఇలా పదజాలాల్లో మార్పు ఉన్నప్పటికీ స్పందన స్వభావమిది.హిందూ మహా సముద్రంలో మనదేశం, శ్రీలంకకు 750 కిలోమీటర్ల దూరంలో ఈ దేశం ఉంది. నామమాత్రంగా క్రైస్తవులు తప్పు నూటికి నూరుశాతం ముస్లింలు ఉన్న 1,200 చిన్నా పెద్ద దీవుల దేశానికి ఎవరితోనూ సరిహద్దు తగాదాలు లేవు. దేశ రాజధాని మాలె దీవిలో దేశంలోని సగం జనాభా ఉంది. చైనా నుంచి విమాన మార్గం 4,900 కిలోమీటర్ల దూరం ఉంది. సముద్ర మార్గంలో 4,682 నాటికల్‌ మైళ్లు లేదా 8,670 కిలోమీటర్ల దూరంలో ఉంది.ప్రపంచంలో ఏ దేశమూ మరొక దేశాన్ని విశ్వసించక పరస్పరం అనుమానంతో చూస్తున్న అంశం తెలిసిందే. ప్రాంతీయ, ప్రపంచ యుద్దాలు తలెత్తితే సముద్రాల్లోని ఒక చిన్న దీవి, దాని మీద పెత్తనం లేదా ఎవరి ప్రభావంలో ఉంది అన్న అంశం కూడా ఎంతో కీలకమైనదే. అందువల్లనే ఆయా దేశాల మిలిటరీ వ్యూహకర్తలు రూపొందించిన ప్రణాళికలు, ఎత్తుగడల ప్రకారం ఇరుగు పొరుగు, దూరంగా ఉన్న దేశాలు కూడా సంబంధాలను నిర్వహిస్తుంటాయి. అలాంటి కీలక ప్రాంతాలలో ఒకటిగా మాల్దీవులు ఉన్న కారణంగానే అక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ప్రపంచం జాగ్రత్తగా గమనిస్తుంది.


ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇబ్రహీం మహమ్మద్‌ సాలి 2018లో అధికారానికి వచ్చాడు. అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యామీన్‌ మీద అవినీతి ఆరోపణల కేసులు పెట్టి పదకొండు సంవత్సరాల పాటు జైలు శిక్ష వేయించాడని ఆరోపణ ఉంది. సదరు యామీన్‌ ప్రభుత్వంలో మంత్రి, రాజకీయ వారసుడే నూతన అధ్యక్షుడు ముయిజ్జు.అక్కడి విధానం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఎందరైనా పోటీ పడవచ్చు. పోలైన ఓట్లలో 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ అలా తెచ్చుకోని పక్షంలో అధిక ఓట్లు తెచ్చుకొని మొదటి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య 21వ రోజున తిరిగి పోటీ నిర్వహిస్తారు. సెప్టెంబరు 9న జరిగిన ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది పోటీ చేశారు. వారిలో పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ తరఫున 45 ఏండ్ల మహమ్మద్‌ ముయిజ్జు 46.06శాతం ఓట్లు తెచ్చుకోగా రెండవ స్థానంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇబ్రహీం మహమ్మద్‌ సాలి 39.05 తెచ్చుకున్నాడు. సాలి నాయకత్వంలోని మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీలో ఎన్నికల ముందు చీలిక వచ్చింది. విడిపోయిన వారు డెమోక్రాట్స్‌ పేరుతో పోటీ చేసి 7.18శాతం తెచ్చుకున్నారు. సెప్టెంబరు 30న రెండవసారి ఎన్నిక జరిగింది. ముయిజ్జు 54.04శాతం తెచ్చుకున్నాడు.నవంబరు 17న అధికారాన్ని స్వీకరిస్తాడు, ప్రస్తుతం రాజధాని మాలె నగర మేయర్‌గా పని చేస్తున్నాడు. ఈ ఎన్నికల నిర్వహణ గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. మాల్దీవుల ట్రాన్సఫరెన్సీ అనే సంస్థ ఎన్నికల హింసాకాండ ఉదంతాలు కొన్ని జరిగినట్లు చెప్పటం తప్ప వివరాలను వెల్లడించలేదు. అర్హులైన రెండు లక్షల 82వేల మంది ఓటర్లలో తొలి దఫా 79.85, తుది విడత 87.31 శాతం ఓట్లు వేశారు.


ఈ ఎన్నిక ఒక విధంగా చెప్పాలంటే చైనా – భారత్‌ మధ్య పోటీగా జరిగిందంటే అతిశయోక్తి కాదు. బహుశా ఎక్కడా ఇంత బాహాటంగా రాజకీయ పార్టీలు పోటీ చేసి ఉండవు. ఈ ఎన్నికలు తమ పౌరుల దేశ భక్తికి ఒక ప్రతిబింబమని, మా ఇరుగు పొరుగు వారు, భాగస్వాములు తమ స్వాతంత్య్రం, సర్వసత్తాకతను పూర్తిగా గౌరవించాలని ఇచ్చిన ఒక పిలుపు అని పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ కూటమి ప్రతినిధి వ్యాఖ్యానించాడు. చైనా బిఆర్‌ఐ పధకం కింద పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వంలో గృహశాఖ మంత్రిగా ముయిజ్జు పని చేశాడు. తాను అధికారానికి వస్తే రెండు దేశాల మధ్య మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతానని గతేడాదే ప్రకటించాడు. 2018లో అధికారానికి వచ్చిన సాలి తన పాలనా కాలంలో విచక్షణా రహితంగా భారత ప్రవేశానికి అవకాశమిచ్చినట్లు విమర్శలు చేశాడు. చివరికి భారత మిలిటరీని కూడా దేశంలో అనుమతించాడని, తాను అధికారానికి వస్తే దళాలను వెనక్కు పంపటమే గాక ప్రస్తుతం భారత్‌కు అనుకూలంగా వాణిజ్య సంబంధాలను సమతూకంలో ఉండేట్లు చూస్తానని వాగ్దానం చేశాడు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం మేరకు ఒక డాక్‌యార్డ్‌ నిర్మాణ పర్యవేక్షణకు మాత్రమే భారత సైనికులు ఉన్నారని సాలి సమర్ధించుకున్నాడు. కొత్త ప్రభుత్వం భారత్‌-చైనాల పట్ల ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనే అంశంపై విమర్శకులు భిన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. చైనాకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ భారత్‌ను తక్కువ చేయదన్నది వాటిలో ఒకటి.


రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. ఈ కారణంగానే బ్రిటీష్‌ ఆక్రమించిన మారిషస్‌కు చెందిన డిగోగార్సియా దీవులను అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఖాళీ చేసేందుకు మొరాయిస్తున్నది. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది. మనదేశంలోని కన్యాకుమారికి ఆ దీవులు 1,796కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అది మనదేశంతో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకూ ఆందోళన కలిగించే అంశమే. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఆ వరుసలో మాల్దీవులు కూడా చేరితే ఏమిటన్నదే వారి ఆందోళన. ఈ పరిణామం భారత భద్రతకు ముప్పు అని మన దేశానికి అవి చెబుతున్నాయి. ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా 1965లో బ్రిటన్‌ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది. అనేక విధాలుగా సాయం చేసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. తమను అదుకోవాలని అనేక దేశాలను గయూమ్‌ కోరినా ఎవరూ ముందుకు రాలేదు. భారత్‌ స్పందించింది, ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపర్లను ఎక్కడా ఆపకుండా నేరుగా మాల్దీవుల్లో దించి కుట్రను విఫలం గావించింది. అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి.


తరువాత జరిగిన పరిణామాల్లో దీవుల ఆర్థిక సమస్యలను, పౌరుల జీవితాలను మెరుగుపరచటంలో పాలకుల వైఫల్యం కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. సరిగ్గా అదే సమయంలో చైనా తన బిఆర్‌ఐ పధకాన్ని ముందుకు తెచ్చింది. ఐఎంఎఫ్‌, ప్రపంచబాంక్‌, అమెరికా, ఇతర పశ్చిమదేశాల మాదిరి కఠినమైనవి కాకుండా సాధారణ షరతులతో ప్రాజెక్టులకు చైనా రుణాలు ఇచ్చింది. దాంతో 2013లో అధికారానికి వచ్చిన అబ్దుల్లా యామిన్‌ చైనాతో సంబంధాలను పెంచుకున్నాడు.2018లో గెలిచిన ఇబ్రహీం సాలి భారత్‌కు పెద్ద పీట అనే విధానంతో మన దేశానికి సన్నిహితంగా భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాడు. అది తాజా ఎన్నికల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.2020లో ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక కూటమిగా ఏర్పడి ” భారత్‌ను బయటకు పంపాలి( భారత్‌ అవుట్‌) ” అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించాయి. జనంలో ఉన్న భారత వ్యతిరేక మనోభావాలు కూడా దీనికి దోహదం చేశాయి. 1978లో అధ్యక్షుడిగా నియమితుడైన అబ్దుల్‌ గయూమ్‌ ప్రజాస్వామిక స్వేచ్చకు తిలోదకాలిచ్చి 2008లో ఓడిపోయే వరకు పదవిలో కొనసాగాడు. అతడి మీద జరిగిన కుట్రను భారత్‌ అడ్డుకొని అధికారంలో కొనసాగేందుకు దోహదం చేసింది.2013లో పోటీ చేసిన యామిన్‌ ఈ గయూమ్‌కు సవతి సోదరుడు. ఆ ఎన్నికల్లో గయూమ్‌ అతనికి మద్దతు ఇచ్చాడు. తరువాత ఇద్దరి మధ్య తలెత్తిన విబేధాలతో గయూమ్‌ పార్టీని చీల్చి ప్రతిపక్షంతో చేతులు కలిపాడు. తరువాత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రచేశాడనే ఆరోపణతో 2018లో అతన్ని అరెస్టు చేశారు. తరువాత బెయిలు మీద విడుదల చేశారు. మనదేశానికి చెందిన జిఎంఆర్‌ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక అధ్యక్షుడు నషీద్‌ మద్దతు కూడా ఉందని చెబుతారు. అదే పెద్ద మనిషి మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్‌ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది.దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి.


2013లో అధికారానికి వచ్చిన యామీన్‌ మరుసటి ఏడాది చైనా అధినేత షీ జింపింగ్‌ను పర్యటనకు ఆహ్వానించాడు. అధికారికంగా భారత్‌కు అగ్రస్థానం అనే విధానం నుంచి వైదొలగనప్పటికీ చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. మౌలిక సదుపాయాల పధకాలకు ఒప్పందం చేసుకున్నాడు.చైనాతో కలసి సాగర పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిపాడు.చైనాతో బంధం బలపడిన తరువాత 2018లో అప్పటి వరకు మాల్దీవుల్లో నిర్వహిస్తున్న భారత హెలికాప్టర్లు, నిర్వహణ సిబ్బంది తమ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు, గూఢచర్యం జరుపుతున్నట్లు ఆరోపించి వెంటనే వెనక్కు తీసుకోవాలని మనదేశాన్ని కోరాడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. అధికారానికి వచ్చిన ఇబ్రహీం సాలి చైనా రుణ పధకాలనుంచి దేశాన్ని కాపాడినట్లు చెప్పుకున్నాడు.జనం విశ్వసించలేదు. ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ మాదిరి విధానపరమైన షరతులను ఎవరి మీద చైనా రుద్దలేదు. చైనా రుణాలు పుచ్చుకున్న దేశాలు, అందుకు చొరవ చూపిన అక్కడి పాలకులు అనుసరించిన విధానాల్లో ఏవైనా లోపాలు, అక్రమాలు, అవినీతి ఉంటే అవి ఆ దేశాల అంతర్గత అంశాలు. వాటి మంచి చెడ్డలను జనం చూసుకుంటారు. కానీ చైనా వ్యతిరేక పశ్చిమ దేశాలు, వాటికి వంతపాడే ఇతర దేశాల పాలకులు, మీడియా అనేక కట్టుకధలను వ్యాపింప చేస్తోంది. మాల్దీవుల్లో కూడా అదే జరిగింది. 2018లో యామీన్‌ పదవి నుంచి దిగిపోయేనాటికి ఉన్న పరిస్థితిని తిరిగి కొనసాగిస్తామని ముయిజ్జు ఎన్నికలకు ముందే స్పష్టం చేశాడు. అందువలన ఆ విధానాలకు అనుకూలంగా జనం ఇచ్చిన తీర్పుగా దీన్ని పరిగణించాలి తప్ప, భారత్‌కు ఎదురుదెబ్బ అనో మరో విధంగానో చిత్రించటం మన ప్రయోజనాలను కాపాడుకోవాలనే సరైన ఆలోచనలో భాగం కాదు. మాల్దీవులే కాదు మరేదేశానికైనా మన దేశం కూడా అభివృద్ధికి తోడ్పడి మనకు మిత్రదేశాలుగా ఉండేట్లు చూసుకోవాలి తప్ప అమెరికా రాజకీయంలో భాగంగా వ్యవహరించకూడదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టుగా ఎలన్‌ మస్క్‌ కుమార్తె, కసితో భావజాలాన్ని అడ్డుకొనేందుకే ట్విటర్‌ కొనుగోలు !

09 Saturday Sep 2023

Posted by raomk in BJP, CHINA, Communalism, COUNTRIES, Current Affairs, Europe, Germany, imperialism, International, INTERNATIONAL NEWS, Latin America, Left politics, Opinion, USA

≈ 2 Comments

Tags

Anti China Propaganda, Anti communist, BJP, China, communist, Elon Musk, Elon Musk daughter, Karl Marx, RSS


ఎం కోటేశ్వరరావు


కమ్యూనిజం భావజాల వ్యాప్తిని అరికట్టేందుకు తొలుత ఐరోపాను ఆవరించిన భూతంగా నిందించారు. కారల్‌ మార్క్స్‌ను జర్మనీ, బెల్జియంల నుంచి వెళ్లగొట్టారు. తొలి సోషలిస్టు రాజ్యం ఏర్పడిన తరువాత కమ్యూనిజం విస్తరణను అడ్డుకొనేందుకు అమెరికా ఇతర ధనిక దేశాలు ప్రచ్చన్న యుద్ద్ధం సాగించాయి. అనేక దేశాల్లో కుట్రలు చేశాయి. అలెండీ వంటి వారిని హత్య చేశాయి. మిలిటరీ నియంతలను గద్దెలపై కూర్చో పెట్టాయి. సైనిక కూటములను ఏర్పాటు చేశాయి. వియత్నాం, లావోస్‌, కంపూచియా, ఉత్తర కొరియాలపై భౌతిక దాడులకు పాల్పడి భంగపడ్డాయి. విధిలేని స్థితిలో వియత్నాం నుంచి అమెరికన్లు బతుకు జీవుడా అంటూ పారిపోయారు.కమ్యూనిజం అంతమే తమ పంతం అని ప్రకటించిన అమెరికా గడ్డమీదే ప్రపంచ ధనికుడైన ఎలన్‌ మస్క్‌ కుమార్తె కమ్యూనిస్టుగా మారింది. అక్కడే లక్షలాది మంది యువత నేడు అక్కడ అవును మేము సోషలిస్టులం, కమ్యూనిస్టులం అంటూ ముందుకు వస్తున్నారు.


తన కుమార్తె కమ్యూనిస్టుగా మారిందన్న ఉక్రోషం, కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి ఒక వేదికగా ఉన్నందున నిరోధించేందుకు ఏకంగా సామాజిక మాధ్యమం ట్విటర్‌నే కొనుగోలు చేసినట్లు త్వరలో వెలువడనున్న ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్రలో వెల్లడించారు. ఎలన్‌ మస్క్‌ 2000 నుంచి 2016వరకు మూడు వివాహాలు చేసుకొని ముగ్గురికీ విడాకులు ఇచ్చాడు, తరువాత 2018 నుంచి 2021వరకు ఒకామెతో సహజీవనం చేశాడు. ఇప్పుడెలా ఊరేగుతున్నాడో తెలవదు. పది మంది పిల్లల్ని కన్నాడు. వారిలో ఒకడైన గ్జేవియర్‌ అలెగ్జాండర్క్‌ మస్క్‌ 2004లో పుట్టాడు. 2022 జూన్‌లో కాలిఫోర్నియా కోర్టుకు సమర్పించిన ఒక వినతిలో తన పేరును వివియన్‌ జెనా విల్సన్‌ అని మార్చుకొనేందుకు అంగీకరించాలని, తాను యువతిగా లింగమార్పిడి చేయించుకున్నట్లు పేర్కొన్నాడు. తన తండ్రి ఎలన్‌ మస్క్‌తో గానీ, అతని ఆస్తిపాస్తులతో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని క్రటించాడు.2021లో లింగమార్పిడి జరిగింది.


తన కుమారుడు లింగ మార్పిడి చేయించున్నదాని కంటే స్కూల్లో వామపక్ష భావజాలానికి ప్రభావితుడు కావటం ఎలన్‌ మస్క్‌కు ఆగ్రహం తెప్పించింది. పచ్చి మితవాది అయిన మస్క్‌ తన కుమార్తెను కమ్యూనిస్టుగా వర్ణించాడు.కాలిఫోర్నియాలోని ఒక స్కూల్లో ఏడాదికి 50వేల డాలర్ల ఫీజు చెల్లించి చదివిస్తుండగా కమ్యూనిస్టు భావజాల వైరస్‌కు గురైందని, తన పట్ల కుమార్తె వైఖరి మారటానికి కొంత వరకు క్రాస్‌రోడ్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు స్కూలు పురోగామి విధానాలు కూడా కారణమని ఆరోపించాడు. తన కుమార్తె సోషలిజాన్ని అధిగమించి ధనవంతులందరూ దుష్టులని భావించే పూర్తి స్థాయి కమ్యూనిస్టుగా మారిందని చెప్పాడు. తొలి రోజుల్లో ఉదారవాద భావాలతో కొడుకు లేదా కుమార్తె ఉన్నట్లు సరిపెట్టుకున్న తరువాత తెగతెంపులు చేసుకున్నాడు. అంతే కాదు, దీనంతటికీ కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి వేదికగా ఉపయోగపడుతున్న ట్విటర్‌ కూడా తన బిడ్డ వంటి అనేక మందిని కమ్యూనిస్టులుగా మార్చుతున్నదని, ట్విటర్‌ వేదికగా ఆ భావజాలం రోజు రోజుకు పెరుగుతున్నదని భావించాడు.అది ప్రజాస్వామ్యం, స్వేచ్చా భావ ప్రకటనకు ముప్పుగా మారిందని, దాని విధానాలను మార్చేందుకు ఏకంగా 44 బిలియన్‌ డాలర్లతో ఆ సంస్థను కొనుగోలు చేశాడు. అంటే పురోగామి భావాలను అడ్డుకొని మితవాద ప్రచారానికి దాన్ని వేదికగా మార్చనున్నాడన్నది స్పష్టం. దానికి అనుగుణంగానే గత యాజమాన్యం రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి పచ్చి మితవాదుల ఖాతాలన్నింటినీ పునరుద్దరించాడు. ట్విటర్‌ పేరు ఎక్స్‌గా మార్చాడు. వాల్టర్‌ ఇసాక్‌సన్‌ రాసిన ఎలన్‌ మస్క్‌ జీవిత చరిత్రను సెప్టెంబరు 12న మార్కెట్‌కు విడుదల చేయనున్నారు. దాని గురించి ఆసక్తి కలిగించేందుకు కొన్ని భాగాలను మీడియాకు విడుదల చేశారు.


ఎలన్‌ మస్క్‌ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద భావజాలం ఉన్న వారు అమెరికాలో తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఒక బంతిని ఎదురుగా ఉన్న గోడవైపు ఎంత గట్టిగా విసిరితే అంతే వేగంతో తిరిగి మనవైపు వస్తుంది. భావజాలం కూడా అంతే. దేన్నయినా అణచివేయాలని చూస్తే అంతేవేగంతో విస్తరిస్తుంది. కొత్త రాతియుగం నుంచి చైనా నేత షీ జింపింగ్‌ వరకు కమ్యూనిజం చరిత్ర పేరుతో జర్నలిస్టు పాల్‌ మాసన్‌ రాస్తున్న పుస్తకం 2026లో విడుదల కానుంది. ఒక భావం, ఒక ఉద్యమం, ఒక పాలన వరకు ఎలా పరిణమించిందీ దానిలో ఉంటుందని చెబుతున్నారు. పురాతన, మధ్యయుగాలలో సంభవించిన తిరుగుబాట్ల నుంచి కమ్యూనిస్టులు ఈ భావ చరిత్రను గుర్తించారు. పందొమ్మిదవ శతాబ్ది పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాల పెరుగుదలతోనే ఈ కధ ముగియలేదు అన్నాడు పాల్‌ మాసన్‌. ” పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యాలు గిడసబారాయి, తమ మీద తమకే విశ్వాసం లేకుండా ఉన్నాయి. వాతావరణం గురించి పెరుగుతున్న ఆందోళన విప్లవాత్మక ఆర్థిక సమాధానాలను డిమాండ్‌ చేస్తున్నది. ప్రపంచ పేద దేశాల్లోని కోట్లాది మంది జనం దృష్టిలో చైనా ముందుకు తెచ్చిన అధికారతత్వ(ఇది రచయిత పదజాలం కాదు), రాజ్య నేతృత్వంలోని అభివృద్ధి ప్రత్నామ్నాయ నమూనాగా చూస్తున్నారు. ఇరవై సంవత్సరాల క్రితం కమ్యూనిజం అంతాన్ని చూశామని అనుకున్నాం.. ఈ రోజు ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీయే.ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది. కావున ప్రచ్చన్న యుద్ధంలో భావజాల విజేతలు సెలవు తీసుకుంటూ రాసిన ఉద్గ్రంధాలన్నిటినీ భిన్నమైన చరిత్రగా చూడాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాను. ఇప్పటికీ అనేక మంది ఆర్థిక పురోగతి సాధనకు స్వేచ్చకోసం ఎందుకు సిద్దం అవుతున్నారో అర్ధం చేసుకోవటానికి తోడ్పడుతుంది.” అని పాల్‌ మాసన్‌ చెప్పాడు.


అమెరికా స్కూళ్లలో విద్యార్ధులు కమ్యూనిస్టులుగా మారుతున్నారని గుండెలు బాదుకుంటున్నది ఒక్క ఎలన్‌ మస్క్‌ మాత్రమే కాదు. అనేక మంది మితవాద రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా కమ్యూనిస్టు, చైనా వ్యతిరేకతతో ఊగిపోతున్నారు.అమెరికా స్కూళ్లు, విశ్వవిద్యాలయాలు చైనా సంస్థలతో పరిశోధనా ప్రాజక్టులలో భాగస్వాములు కావటాన్ని నిషేధించాలని సెనెటర్‌ జేమ్స్‌ లాంక్‌ఫోర్డ్‌ డిమాండ్‌ చేశాడు. అంతర్జాతీయంగానే కాదు, అమెరికా గడ్డ మీద కూడా దేశాన్ని చైనా సవాలు చేస్తున్నదని, విద్యా సంస్థలలో పాతుకుపోతున్నదని ఒక ప్రకటనలో తాజాగా ఆరోపించాడు. అమెరికా పరిశోధనలను తస్కరిస్తున్నదని, రాజకీయంగా విద్యార్థులు, బోధకులు, వారి కుటుంబాల మీద ప్రభావం చూపుతున్నదని చెప్పుకున్నాడు. అమెరికాలో తన ప్రతిష్టను పెంచేందుకు అనేక పధకాలను రూపొందించిందని, వాటి ద్వారా గూఢచర్యం జరుపుతున్నదని ఆరోపించాడు. ఆగస్టు 27న చైనాతో పరిశోధన ఒప్పందం ముగిసినప్పటికీ జో బైడెన్‌ సర్కార్‌ మరో ఆరునెలలు పొడిగించిందని వాపోయాడు.
కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదం అమెరికా పక్కనే ఉన్న మెక్సికోకు కూడా పాకింది. పాఠ్యపుస్తకాలకు కమ్యూనిస్టు వైరస్‌ సోకిందంటూ కొన్ని చోట్ల క్రైస్తవ మత బృందాలు తలిదండ్రుల పేరుతో కొందరిని సమీకరించి పుస్తకాలను తగులబెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పుస్తకాల్లో లైంగిక విజ్ఞానం, లింగసమానత్వం వంటి అంశాలు ఉన్నాయన్నది వారి ఆరోపణ. వాటి పంపిణీ నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఆ పుస్తకాల్లో మార్క్సిస్టు-కమ్యూనిస్టు సిద్దాంతాలను చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారవేసింది. పాఠ్య అంశాలను టీచర్లు, నిపుణులు రూపొందించినట్లు పేర్కొన్నది.


అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర శాసనసభలో రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి మరియ ఎలివిరా సాలాజార్‌ ఒక బిల్లును ప్రవేశపెట్టారు.దానిలో కమ్యూనిజం, నిరంకుశత్వాలను ఒకే గాటన కడుతూ వాటివలన సంభవించే నష్టాలను విద్యార్ధులకుచెప్పాలని పేర్కొన్నారు. అమెరికా యువత కమ్యూనిస్టుల పాలనలో జరిగిన నేరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కమ్యూనిజం బాధితుల ఫౌండేషన్‌కు పాఠాలను రూపొందించే బాధ్యత అప్పగించాలని ప్రతిపాదించారు. గతంలో కూడా సాలాజార్‌ ఇదే బిల్లును ప్రవేశపెట్టగా దాన్ని చర్చించక ముందే మురిగిపోయింది. ఈ బిల్లును ప్రతిపాదించినపుడు అధికారంలో డెమోక్రాట్లు ఉన్నారు. ఇప్పుడు రిపబ్లికన్లు ఉన్నందున తిరిగి ప్రవేశపెట్టారు.క్యూబా, కొరియా, వియత్నాం తదితర దేశాల నుంచి పారిపోయి వచ్చిన కమ్యూనిస్టువ్యతిరేకులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.


కమ్యూనిస్టు వ్యతిరేక వైరస్‌ ఒక్క అమెరికా, ఐరోపాల్లోనే కాదు మనదేశంలో కూడా ఉంది. ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌ విశ్వవిద్యాలయం ఎంఎ చరిత్ర విద్యార్ధుల సిలబస్‌లో అధ్యయనం చేయాల్సిన అంశాల్లో బిజెపి, రామజన్మభూమిని చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించింది. నూతన విద్యా విధానంలో భాగంగా సిలబస్‌లో మార్పులు చేర్పులు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇదే విశ్వవిద్యాలయం గతంలో బిఏ విద్యార్ధులకు ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి పాఠాన్ని సిలబస్‌లో చేర్చింది. కమ్యూనిస్టు ఉద్యమం, పార్టీల గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలనే ఆసక్తి కలగాలేగానీ పాఠ్యపుస్తకాలు, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లతో పనేముంది. అవేవీ లేనపుడు ప్రపంచమంతా వ్యాప్తి చెందలేదా ? కమ్యూనిస్టు సిద్దాంతాలకు సంబంధించిన పుస్తకాలను బ్రిటీష్‌వారు, ఇతర సామ్రాజ్యవాదులు,అనేక దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించినపుడు జనం వాటిని సంపాదించుకోలేదా అధ్యయనం చేయలేదా ? ఈ చరిత్ర తెలిసి కూడా ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాము. ఐరోపాలో చేనేత రంగంలో మరమగ్గాలు వచ్చినపుడు తమ వృత్తిని అవి దెబ్బతీస్తున్నాయని ఆగ్రహించిన కార్మికులు వాటిని ధ్వంసం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించి కొన్ని చోట్ల ఆపని చేశారు. సమస్య యంత్రాలది కాదు, వాటిని ధ్వంసం చేస్తే యాంత్రీకరణ ఆగదు. అదే విధంగా భూస్వాములను అంతం చేస్తే భూస్వామిక వ్యవస్థ రద్దవుతుందని నమ్మి ఆ పని చేసిన వారి సంగతి తెలిసిందే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నది ఎంత వాస్తవమో నిషేధాలద్వారా ఒక భావజాల వ్యాప్తిని అడ్డుకోవటం కూడా సాధ్యం కాదన్నది కూడా అంతే నిజం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన అగ్ని క్షిపణులు చైనాను భయపెడతాయా ? పరిజ్ఞానంలో ఏ దేశం ఎక్కడుంది ?

06 Wednesday Sep 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Agni V, BJP, China, Missile technology, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


చైనాను చంద్రయాన్‌-3 విజయవంతం కావటంతో యావత్‌ దేశం మన ఇస్రో శాస్త్రవేత్తలను వేనోళ్ల కొనియాడుతున్నది. ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరొక దారి అన్న సామెత తెలిసిందే.మన ఇస్రో విజయాన్ని కూడా మతకళ్లతో చూసే బాపతు రెచ్చిపోతున్నది. మన దేశంలో మిసైల్‌ మహిళగా పేరు తెచ్చుకున్న కేరళకు చెందిన టెసీ థామస్‌ గురించి సామాజిక మాధ్యమంలో తాజాగా ఒక పోస్టును పెట్టారు.యునైటెడ్‌ బ్రాహ్మిన్స్‌ ఫ్రెండ్స్‌(ఆల్‌ ఇండియన్‌ బ్రాహ్మిన్‌ కమ్యూనిటీస్‌)కు చెందిన ఒకరు పెట్టిన ఆ పోస్టులో ఉన్న అంశం ఏమంటే అగ్ని క్షిపణి రూపకర్త టెసీ థామస్‌ అనీ ఆమె నుదుట బొట్టు, దాని మీద చిన్న గంధపు గీత ఉందని రాశారు. ఆమె క్రిస్టియన్‌ అయినప్పటికీ హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు చెప్పటం దీని లక్ష్యం. క్షిపణి రూపకర్తలలో ప్రముఖురాలు ఆమె అనటంలో ఎవరికీ పేచీ లేదు. అందరూ అభినందించాల్సిన అంశమే. బిజెపి ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన కంగన రనౌత్‌ చంద్రయాన్‌-3 విజయం గురించి స్పందించారు. అందరికీ ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభ పాటవాలు కనిపిస్తే ఆమె వేరే విధంగా చూశారు. మహిళా శాస్త్రవేత్తలు ఉన్న ఒక ఫోటోను తన ఇనస్టాగ్రామ్‌లో పోస్టు చేసి వారంతా బిందీ, సింధూరాలు, తాళిడబొట్లు ధరించి ఉన్నారని, ఉన్నత ఆలోచనలు, సాధారణ జీవితాల భారతీయతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలా చెప్పటం ద్వారా బొట్టు లేనివారు కాదని ఆమె జనాలకు సందేశం ఇవ్వదలచుకున్నారు. దాని తరువాతే టెసీ థామస్‌ బొట్టు, చందనం గురించి బ్రాహ్మణ సంఘాలు పోస్టు పెట్టాయి. రెండవ అంశం ఏమంటే 145 కోట్ల చైనీయుల గుండెల్లో భయం పుట్టించిన మహిళ అని చెప్పారు. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అణువార్‌ హెడ్‌తో చైనాలోని ఏ ప్రదేశాన్నైనా ఖచ్చితత్వంతో ఢకొీట్టగల అగ్ని-5 క్షిపణి రూపకర్త టెసీ థామస్‌ అని రాశారు.(ఆమె క్రిస్టియన్‌ అయినప్పటికీ బ్రాహ్మణ క్రైస్తవురాలని, అందుకే బ్రాహ్మణ సంఘాలు ఆమె గురించి రాసినట్లు సామాజిక మాధ్యమంలో కొందరు స్పందించారు ) ఆ క్షిపణిని 2018లోనే పరీక్షించారు, మిలిటరీకి అందచేశారు, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమిటి ?


అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అని చెప్పిన వారే ఇప్పుడు శాస్త్రవేత్తలకు మతం, కులం ఆపాదించుతున్న తీరును చూస్తున్నాం.వారిలో ఎవరైనా బొట్టు పెట్టుకోలేదో దేశవ్యతిరేక మతాల ముద్రవేస్తారు. వాటిని పక్కన పెడితే చంద్రయాన్‌ విజయం, అగ్ని క్షిపణితో మన మిలిటరీ సామర్ధ్యం పెరుగుతుందన్నది స్పష్టం. కానీ చైనీయులకు భయం పుట్టించిందని చెప్పటం అవసరమా ? అసలది నిజమా ? అతిశయోక్తులు మాత్రమే. అంతరిక్ష ప్రయోగాల్లో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, క్షిపణుల రంగంలోనూ అదే పరిస్థితి. తాజా సమాచారం ప్రకారం జూలై రెండవ వారంలో గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌(జిఎఫ్‌పి) అనే సంస్థ మిలిటరీ బల రాంకులు-2023 ప్రకారం శక్తివంతమైన పది దేశాల్లో వరుసగా అమెరికా, రష్యా, చైనా, భారత్‌,బ్రిటన్‌, దక్షిణ కొరియా,పాకిస్థాన్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ ఉన్నాయి. నూటనలభై దేశాలలో అత్యంత బలహీనమైన దేశాల మిలిటరీలో భూటాన్‌ తొలి స్థానంలో ఉంది. ఈ రాంకులు ప్రతి ఏడాదీ మారుతుంటాయి. గతేడాది తొలి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాల్లో ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు. గతేడాది ఎనిమిదో స్థానంలో ఉన్న బ్రిటన్‌ తాజాగా ఐదవ స్థానంలోకి వచ్చింది. పాకిస్థాన్‌ తొలిసారిగా మొదటి పదిలో ఏడవ స్థానం పొందింది. ఇక ఈ రాంకులు ఇచ్చేందుకు అన్ని దేశాలు అంగీకరించిన ఒక ప్రామాణిక సంస్థ ఏదీ లేదు.


ఉదాహరణకు ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వచ్చిన వార్తల ప్రకారం అమెరికాకు చెందిన ఫెయిర్‌ బృందం రాంకులను యుఎస్‌ న్యూస్‌ ప్రకటించింది. దాని ప్రకారం అత్యంత శక్తివంతమైన మిలిటరీలో చైనాకు రెండవ, భారత్‌కు 14స్థానం ఇచ్చారు. వీటిని తయారు చేసింది అమెరికా సంస్థలు, అక్కడి ఆయుధ తయారీదారుల హస్తం దీని వెనుక ఉన్నట్లు కనిపిస్తున్నది. చైనాతో పోల్చితే భారత్‌ ఎంతో వెనుకబడి ఉంది కనుక ఆయుధాలను మరింతగా కొనాలని వత్తిడి తెచ్చే ఎత్తుగడ ఉందన్నది స్పష్టం. ఎందుకంటే అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు వెంట తన ఆధీనంలోని భూ భాగంలో గతంలో ఎప్పుడో నిర్మించిన గృహాల స్థానంలో చైనా కొత్తవాటిని నిర్మిస్తే ఇంకే ముంది అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా వారు గ్రామాలను నిర్మిస్తున్నట్లు మన దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు అమెరికా సంస్థలు చూసిన సంగతి తెలిసిందే.మన దేశం ప్రపంచంలో అన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో పదకొండుశాతం వాటాతో ప్రధమ స్థానం కలిగి ఉండగా చైనా 4.6శాతమే కలిగి ఉంది. అంటే ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడటం తక్కువగా ఉంది. గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ సంస్థ పేర్కొన్న సమాచారం ప్రకారం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న చైనా-భారత్‌ మిలిటరీ బలాల పోలిక దిగువ విధంగా ఉంది.
అంశం ××××××× చైనా ××××× భారత్‌
రాంకు ××××××× 3 ××××× 4
అందుబాటులో జనం ××76,16,91,468×× 65,31,29,600
మిలిటరీకి అర్హులు ××62,48,69,113×× 51,55,55,492
ఏటా మిలిటరీవయస్సు వారు××1,97,47,552 ×× 2,36,23,837
రక్షణ బడ్జెట్‌, బి.డాలర్లు ×× 230 ×× 50.2
విమానాలు ×× 3,284 ×× 2,210
యుద్ద విమానాలు ×× 1,199 ×× 577
హెలికాప్టర్లు ×× 913 ×× 807
విమానాశ్రయాలు ×× 507 ×× 346
యుద్ద టాంకులు ×× 4,950 ×× 4,614
యుద్ద నౌకలు ×× 730 ×× 295
వి.వాహకనౌకలు ×× 3 ×× 2
హెలికాప్టర్‌ నౌకలు ×× 3 ×× 0
జలాంతర్గాములు ×× 78 ×× 18
డెస్ట్రాయర్లు ×× 50 ×× 11
రేవులు ×× 22 ×× 13
స్వయంచలిత ఆర్టిలరీ ×× 2,720 ×× 100
రాకెట్‌ ఆర్టిలరీ ×××××× 3,140 ×× 960
సాయుధ శకటాలు ×× 14,130 ××× 8,600


భారత్‌ వద్ద మిగ్‌-21 రకం 107, మిగ్‌-29 రకం 66 ఉన్నాయి. చైనా వద్ద స్వంత తయారీ జె-11 రకం 442, జె-7 రకం 388, జె-18 రకం 96, యస్‌యు-30 రకం 121 ఉన్నాయి. బహుముఖ పాత్ర పోషించే యుద్ద విమానాలు మన దేశం దగ్గర సుఖోరు -30 రకం 272, మిరేజ్‌ 49, మిగ్‌ – 29 రకం 36, రాఫెల్‌ 26, తేజస్వి 22, కమోవ్‌ 14 మొత్తం 393 ఉన్నాయి. అదే చైనా వద్ద అన్ని రకాలు కలసి 1,130 ఉన్నాయి. మన దగ్గర మిలిటరీ డ్రోన్లు 12 ఉండగా, చైనా వద్ద 151ఉన్నాయి. రాఫెల్‌ 4.5 తరం విమానాలను మనం కొనుగోలు చేయగా, దాని కంటే మెరుగైన స్వంత తయారీ 5వ తరం జె-20 విమానాలు చైనా వద్ద ఉన్నాయి.మిలిటరీ ఆయుధాలకు సంబంధించి ప్రపంచ సంస్థలు చెప్పే అంకెలు కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ మిలిటరీ బలాబలాల ధోరణులు తెలుసుకొనేందుకు ఉపయోగపడతాయి.వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ 2023 అంచనా ప్రకారం చైనా వద్ద 350, పాకిస్థాన్‌ దగ్గర 165, మనదగ్గర 156 అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాలను ఉపయోగించబోమని భారత్‌-చైనా ప్రకటించాయి. అందువలన ఎవరి దగ్గర ఎంత ఎక్కువ దూరం ప్రయాణించే క్షిపణులు ఉన్నప్పటికీ వాటితో అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం లేదు. ఎవరైనా దాన్ని ఉల్లంఘించి అణుదాడులకు పాల్పడితే ఎవరూ మిగలరు. అందువలన మన అగ్ని క్షిపణిని చూసి చైనా వారు గానీ వారి వద్ద 12 నుంచి 15వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే డిఎఫ్‌-41క్షిపణులను చూసి మన జనం భయపడుతున్నారా అంటే లేదు.మన అణుక్షిపణి పరిధి ఏడువేల కిలోమీటర్లని మన శాస్త్రవేత్తలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మన దేశంతో సహా అన్ని దేశాలూ అలాంటివి మరింత వేగంతో, ఎక్కువ దూరం ప్రయాణించేందుకు నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉంటాయి. ది కంట్రీస్‌ ఆఫ్‌ డాట్‌ కామ్‌ ఆగస్టు ఎనిమిదిన వెల్లడించిన సమాచారం ప్రకారం 2023లో క్షిపణి సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో వున్న పది దేశాల వరుస ఇలా ఉంది. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, భారత్‌, ఇజ్రాయెల్‌, పాకిస్థాన్‌, ఇరాన్‌, ఉత్తర కొరియా ఉన్నాయి.మన పొరుగునే ఉన్న పాకిస్థాన్‌ ఇప్పటికే 2,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఘౌరీ, షాహిన్‌ క్షిపణులను కలిగి ఉంది, వాటిని ఇంకా విస్తరించే పరిశోధనలో ఉంది. దాని దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అంత మాత్రాన భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. మనకు పాక్‌, చైనా ఎంత దూరమో, మనం కూడా వాటికి అంతేదూరంలో ఉన్నాము.


ఒకరు బాంబులు విసురుతుంటే రెండోవారు గులాబ్‌ జాములు అందిస్తూ స్పందించేంత ఉత్తములు ఈ రోజుల్లో ఎవరూ ఉండరు. అలా ఉండాలన్నా ఉండనివ్వరు. శత్రుదేశాల ఉపగ్రహాల మీద దాడి చేసేందుకు అవసరమైన ఆయుధాలను చైనా రూపొందిస్తున్నట్లు, ఇతర దేశాల ఉప గ్రహాలను అదుపులోకి తెచ్చే సత్తా ఉన్నదని సిఐఏ నివేదించినట్లు బహిర్గతమైన అమెరికా గూఢచార, ఇతర కీలక పత్రాల్లో ఉంది.చైనా ఆయుధాల గురించి సిఐఏ పత్రాలను ఉటంకిస్తూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రికలో పేర్కొన్నారు. స్టాక్‌హౌమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) విడుదల చేసిన 2022 వార్షిక నివేదికలో ప్రపంచంలో మిలిటరీ ఖర్చు కొత్త రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నది. అంతరిక్షం, సైబర్‌ రంగాలలో అమెరికా ముందున్నది. తాజాగా చంద్రయాన్‌ -3 విజయం, ఇతర ఉపగ్రహాల ప్రయోగాలతో మన దేశం కూడా ధీటుగా ఉండేందుకు అవకాశాలు పెరుగుతున్నాయి. సైబర్‌ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్‌గా ఉంది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్‌ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా రష్యా సేనల సమాచారం గురించి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందచేస్తున్న సంగతి తెలిసిందే. దాని ద్వారా మనతో సహా ఏ దేశ సమాచారాన్నైనా అమెరికా తెలుసుకోవచ్చు. దీని మాతృసంస్థ ఎలాన్‌ మస్క్‌ అధిపతిగా ఉన్న స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ ఇప్పటి వరకు 3,580 చిన్న ఉపగ్రహాలను పంపి 53 దేశాలకు సమాచారాన్ని అందచేస్తున్నది, వాటిని పన్నెండువేలకు పెంచాలని కూడా చూస్తున్నది. అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యానికి ఇదొక నిదర్శనం.


అమెరికా, అది ఎగదోస్తున్న దేశాలు ఇటీవలి కాలంలో మిలిటరీ ఖర్చు పెంచటం, కొత్త కూటములను కడుతుండటంతో మన దేశం, చైనా కూడా తన ఖర్చును పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టాక్‌హౌం సంస్థ పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం ప్రపంచంలో 40దేశాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. వాటిలో మన దేశం మూడవ స్థానంలో ఉండగా మన పొరుగునే ఉన్న పాకిస్తాన్‌ 24వదిగా ఉంది. ఏ దేశమైనా మిలిటరీ ఖర్చును పెంచి అది జనాల మీద భారం,జీవితాలు మెరుగుపడే అవకాశం లేదన్నది అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ఉగ్రవాదం కారణంగా పక్కనే ఉన్న శ్రీలంక తన వనరులన్నింటినీ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు గాను మిలిటరీని విపరీతంగా పెంచింది. ఉగ్రవాదులను నిర్మూలించినా వెంటనే దాని మిలిటరీ ఖర్చు వెంటనే తగ్గదని తేలింది.మనతో గిల్లికజ్జాలు పెట్టుకొనే పాకిస్తాన్‌ తలసరి ఖర్చు మనకంటే ఎక్కువే. అది ఇప్పుడు ఆర్థికంగా ఎంత దివాళా తీసిందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నదో చూస్తున్నదే. మన దేశంలో ఉన్న కొంత మంది చైనాను బూచిగా చూపి మిలిటరీ బడ్జెట్‌ను గణనీయంగా పెంచాలని చెప్పటం వెనుక అమెరికా మిలిటరీ కార్పొరేట్‌ లాబీ ఉందన్నది స్పష్టం.మన జిడిపితో పోలిస్తే చైనా ఐదురెట్లు ఎక్కువ.అందువలన దానితో మిలిటరీ ఖర్చులో మనం పోటీ పడాలంటే వనరులన్నింటినీ మళ్లించాల్సి ఉంటుంది. అది జరిగితే ఆర్థికవృద్ది కుంటుపడుతుంది.అలాగని మన రక్షణ ఏర్పాట్లను నిర్లక్ష్యం చేయనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ : ఆవు పేడ కాదు, కావాల్సింది సెమీ కండక్టర్ల పరిశోధన !

31 Monday Jul 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, Germany, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

America's tech war with China, India’s R&D, Narendra Modi, Narendra Modi Failures, R&D investment, Research on cow dung, Semicon India 2023, Semiconductor


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారికి,
అయ్యా ప్రతి నెలా మీ మన్‌కీ బాత్‌ అంశాలను చదివేవారిలో నేను ఒకరిని.ఒక జర్నలిస్టుగా జన్‌కీ బాత్‌లో ఉన్న కొన్ని ంటిని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జూలై 28-30 తేదీలలో గుజరాత్‌ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో తమరు సెమికాన్‌ ఇండియా 2023 రెండవ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా దేశమంతటా పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు కూడా జారీ చేశారు. దేశాన్ని సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చుతామని, మూడు వందల కాలేజీల్లో సెమికండక్టర్‌ కోర్సులను ప్రవేశపెడతామని తమరు ప్రకటించటం సంతోషం. గతంలో దేశంలో జరిగిన అనర్ధాలకు, వెనుకబడి ఉండటానికి,మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రాకపోవటానికి నెహ్రూనే కారణం అని బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివారం ఠకీమని సమాధానం చెబుతుంది. సెమికండక్టర్ల రంగంలో వెనుకబడటానికి కూడా నెహ్రూనే నిందిస్తారా ?


అన్నీ మీరే చేశారు అని మా తెలుగు సినిమాలో ఒక పాత్ర తండ్రిని తప్పుపడుతుంది. అలాగే అన్నీ ఆ నెహ్రూ చేశారనే కాసేపు అనుకుందాం.ఆయన అనుసరించిన విధానాల నుంచి కాంగ్రెస్‌ 1990దశకంలోనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వైదొలిగిందని మీకు తెలియంది కాదు. వాటినే మీరు అమలు జరుపుతున్నారు తప్ప కొత్త విధానాలు కాదు, ఎందుకంటే వాటిని మన మీద ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ రుద్దింది. గత పది సంవత్సరాలలో మీకు పూర్తి అధికారం ఉన్నప్పటికీ మీరు అంగీకరించినా లేకున్నా అనేక రంగాలలో వైఫల్యబాటలోనే దేశం ఉండటానికి కారణం ఆ విఫల విధానాలనే మరింత వేగంగా అమలు జరపటమే. అరిగిపోయిన రికార్డు అంటే ఇప్పటివారికి తెలియదు కనుక అన్నీ నెహ్రూనే చేశారు అనే పాచిపాట ఇంకా ఎంతకాలం పాడాలి అని మీ భక్తులు, జనం నుంచి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. మీరు చెప్పిన మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ధి వంటి విఫల నినాదాలను చూసిన తరువాత ఎన్నికల కోసం ఆడుతున్న ఆటలో భాగం ఇదని అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన నినాదం, చెప్పిన మాట మరోసారి మీ నోటి వెంట రాదన్నది స్పష్టమే. మీ శైలి అనితరసాధ్యం. గతంలో అమెరికా, పూర్వపు సోవియట్‌ మధ్య ప్రచ్చన్న పోరులో అణ్వాయుధాలు కేంద్ర స్థానంలో ఉంటే ఇప్పుడు అమెరికా, చైనా మధó్య తలెత్తిన పోరులో సెమీకండక్టర్‌లు ఉన్నాయి.ఆయుధాలలో కూడా ఇవి కీలకంగా మారనున్నాయని విశ్వగురువుగా ప్రపంచాన్ని ఔపోసన పట్టిన మీకు నేను చెప్పాల్సినపని లేదు.


ఎయిర్‌బస్‌లో అనేక దేశాలను అలా వెళ్లి ఇలా చుట్టివచ్చిన మీరు సెమీకండక్టర్‌ బస్‌ను ఎలా మిస్‌ అయ్యారన్నది చాలా మందికి అర్ధం కావటం లేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తరువాత వచ్చిన ప్రధానులెవరికీ(వారిలో అతల్‌ బిహారీ వాజ్‌పాయి ఉన్నదీ లేనిదీ తెలియదు) దూర దృష్టి లేదని విమర్శించే మీ అనుయాయులు (సుబ్రమణ్య స్వామిని పక్కన పెడదాం) మీ గురించి ఏం చెబుతారో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేసిన దాన్ని మీరు తొలి ఐదు సంవత్సరాల్లోనే చేసి చూపించారని గత ఎన్నికలపుడు ప్రచారం చేశారు. చేసిందేమిటో సాధికారిక సమాచారాన్ని జనానికి అందిస్తే వాస్తవం తెలుస్తుంది. మన దేశంలో మీ కంటే ముందు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) పేరుతో వివరాలను సేకరిస్తున్నారు. దానిలో మీ పాలనలో అనేక సూచికలు దిగజారినట్లు కనిపించింది. మీ ఏలుబడిలో నిరుద్యోగం పెరిగిందన్న సమాచారాన్ని గత లోక్‌సభ ఎన్నికల ముందు తొక్కిపెట్టిన సంగతి మీకు చెప్పనవసరం లేదు. వచ్చే సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని సమాచారాన్ని సేకరించే పద్దతిని రూపొందించే సంస్థ అధిపతినే తప్పించారు అని జనం అనుకుంటున్నారు.


నరేంద్రమోడీ పెద్ద విజనరీ అంటే భూత, వర్తమాన, భవిష్యత్‌ను చూడగలిగిన దృష్టి కలవారని అని ప్రచారం చేశారు. నిజమే కావచ్చు, సర్వేల్లో వచ్చే సమాచారం ఎలాంటిదో మీకు ముందే తెలిసి ఉంటుంది గనుక దాని రూపకర్తనే తొలగించారు. అన్నట్లు మరిచాను. ఈ ఏడాది మీ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని మీరు ముందే గ్రహించి ఆ విషయాన్ని ఎన్నో సంవత్సరాల ముందే మీరు చెప్పినట్లు కొందరు సామాజిక మాధ్యమంలో మీ గొప్ప గురించి ప్రచారం చేస్తున్న పోస్టు ఉంది. దాని నిజా నిజాలు మీకే ఎరుక. నిజంగా మీకు తెలిసి ఉంటే మణిపూర్‌ దురంతాన్ని ఎందుకు నివారించలేకపోయారు అన్న ప్రశ్న వస్తోంది. దాన్ని వదలివేద్దాం. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం గురించి కూడా మీరు చెప్పారు. పిండి లేకుండా రొట్టెలు రావు కదా ? దానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి రంగాల ప్రాధాన్యత, దానిలో సెమికండక్టర్ల గురించి ప్రధాని కాగానే లేదా అంతకు ముందు గుజరాత్‌ సిఎంగా ఎందుకు పసిగట్టలేకపోయినట్లు ? ఈ రంగానికి నిధుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు చేయాల్సి ఉంది. రెండూ జరగటం లేదు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న గేట్‌వే హౌస్‌ అనే ఒక మేథో సంస్థ 2015 జనవరి పదహారున టెక్నాలజీ పరుగులో చైనా ముందు భారత్‌ ఓడిపోనుందా అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది. మీ సలహాదారులకు దీని గురించి తెలియదని అనుకోలేము.లేదా ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే మన దేశ ఖర్మ అనుకోవటం తప్ప చేసేదేమీ లేదు. దానిలో పరిశోధన, అభివృద్ది ఖర్చు గురించి చర్చించారు. 1991 నుంచి చైనా పరిశోధన ఖర్చును ఏటా 19శాతం పెంచుతూ 2012నాటికి జిడిపిలో 1.97శాతానికి చేరినట్లు పేర్కొన్నారు.అప్పటికి మనదేశ ఖర్చు 0.9శాతం మాత్రమే ఉంది.ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రికలో 2023 ఫిబ్రవరి ఒకటిన ప్రచురితమైన ఒక విశ్లేషణలో జిడిపిలో మనదేశ తాజా ఖర్చు 0.7శాతమే అని చైనా 2.1శాతంగా పేర్కొన్నారు. జిడిపిలో రెండు శాతం ఖర్చు చేయాలని గతంలో వాజ్‌పాయి సర్కార్‌ కూడా చెప్పింది. దూరదృష్టి గల మీ పాలనలో గతం కంటే తగ్గిందేమిటి ? మన దేశంలో నిపుణులకు, పరిశోధకులకు కొరత ఉన్నదా ?


కుహనా అంశాలమీద పరిశోధనకు మీరు చూపుతున్న శ్రద్ధ సెమికండక్టర్స్‌ వంటి ప్రాధాన్యరంగాల మీద లేదు, ఆవు పేడ, మూత్రం, పాలలో బంగారం ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ పరిశోధనలకు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తున్నదని 2020 సంవత్సరంలో వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వతీరుతెన్నులను తప్పు పడుతూ ఆ పరిశోధనలను ఆపివేయాలని కోరినా మీరు పట్టించుకోలేదు. అంతకు ముందు 2017లో పంచగవ్య గురించి ఆయుర్వేద పుస్తకాల్లో రాసిన వాటిని రుజువు చేసేందుకు పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. మొత్తంగా పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించకుండా ముందుకు పోవటానికి మీ దగ్గర మంత్రదండమేదైనా ఉంటే హాం ఫట్‌ అంటూ తిప్పండి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారని చెప్పటం మీకు ఇష్టముండదని తెలిసినా తప్పటం లేదు.


తినేందుకు బంగాళాదుంప, అరటి చిప్స్‌ లేకున్నా రోజు గడుస్తుందిగానీ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ లేకుండా మనకు క్షణం గడవదంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో నిపుణులైన సెమికండక్టర్‌ రూపకల్పన ఇంజనీర్లు ప్రపంచం మొత్తంలో ఉన్నవారిలో 20శాతం మంది మనదేశంలో ఉన్నారని అంచనా. వారందరినీ విదేశీ కంపెనీలకు చౌక శ్రామికులుగా సమర్పించటం తప్ప ఇప్పుడు జరుగుతున్నదేమైనా ఉందా ? వారు సాధించే పేటెంట్స్‌ మన దేశానికి దక్కవు. మన ఇంజనీర్లు ఐటి రంగంలో ముందున్నారు. దీనికి మీ సర్కార్‌ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. హార్డ్‌వేర్‌ రంగంలో ఆ స్థితి లేదు. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ భాగం మనం దిగుమతి చేసుకుంటున్నార. అదే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో విదేశీ కంపెనీలు రూపకల్పనలో లబ్ది పొందటం తప్ప చిప్స్‌ తయారీ మన దేశంలో ఎంతమేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం అమెరికా మైక్రాన్‌ కంపెనీ ఎక్కడో ఉత్పత్తి చేసిన వాటిని మనదేశంలో పరీక్షించి పాకింగ్‌ చేయిస్తున్నది. దానితోనే పండగ చేసుకుందామా ?


చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరులో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది.తమ దేశంలోనే సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని, అక్కడి నుంచి ఎగుమతులు జరపాలని అమెరికా సర్కార్‌ పట్టుబడుతోంది. తైవాన్‌లోని టిఎస్‌ఎంసి కంపెనీ ఉత్పత్తి మీద అదుపు కలిగి ఉంది.1990లో ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పతిలో అమెరికా వాటా 37శాతం ఉంటే 2020లో 12శాతానికి తగ్గింది. తిరిగి పూర్వపు స్థితికి చేరాలంటూ కొత్త పరిశ్రమలకు ఇచ్చేందుకు 280 బిలియన్‌ డాలర్లను అమెరికా కేటాయించింది.ఈ మొత్తానికి స్థానిక ప్రభుత్వాలు ఇచ్చేది అదనం. ఇప్పటి వరకు అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్‌ సెమీకండక్టర్ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు సబ్సిడీల నిమిత్తం పదివేల కోట్ల డాలర్లు పక్కన పెడుతున్నట్లు ప్రకటించాయి. ఇంటెల్‌ కంపెనీ జర్మనీలో 30బిలియన్‌ యూరోల ప్లాంట్‌ పెట్టాలంటే మూడో వంతు తమకు సబ్సిడీ ఇవ్వాలని బేరమాడింది.పోలాండ్‌, జర్మనీ, ఇజ్రాయెల్లో కొత్త ప్లాంటులు పెట్టేందుకు 50బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇంటెల్‌ పేర్కొన్నది. మొత్తం మీద చూస్తే ఈ రంగంలో ముందున్న కంపెనీలు పెద్ద ఎత్తున లబ్దిపొందనున్నాయి. ఈ పోరులో మనదేశం ఎక్కడ అన్నది ప్రశ్నార్ధకమే.


గత పది సంవత్సరాలుగా ఈ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణం అని మీ మద్దతుదార్లు చెప్పినా ఆశ్చర్యంలేదు. అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండోతో మన మంత్రి పియూష్‌ గోయల్‌ 2023 మార్చి పదవ తేదీన సెమీకండక్టర్ల సరఫరా, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యం గురించి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్లిష్టమైన, వర్ధమాన సాంకేతికతల (ఐసిఇటి) సహకారం గురించి ఒప్పందం జరిగింది. చిత్రం ఏమంటే అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వాస్తవాల పత్రంలో మిగతా అంశాల గురించి ఉంది తప్ప సెమీకండక్టర్ల మీద నిర్దిష్టంగా ఏమీ లేదు అని కార్నెగీ ఇండియా వెబ్‌సైట్‌లో 2023 మే నెల 23వ తేదీన కోణార్క భండారీ రాశారు. మన దగ్గర దానికి భిన్నమైన సమాచారం ఉంటే ఆ పత్రాన్ని విడుదల చేస్తే వాస్తవం తెలుస్తుంది. మనదేశంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే వాటిని ప్రోత్సహించేందుకు ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహక(పిఎల్‌ఐ) పధకాన్ని 2021 నుంచి ఐదేండ్లలో రు.1.97లక్షల కోట్లు ఇచ్చే ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఆచరణలో ఉత్పత్తి బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఒక దగ్గర చేర్చే సెల్‌ఫోన్లకు, చిప్స్‌ పరీక్షలకు ఇస్తున్నారు. అందుకే భలే మంచి పధకం, వదలితే దొరకదని పొలోమంటూ ఆపిల్‌, మైక్రాన్‌ వంటి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయి.


రెండు దిగ్గజదేశాలైన అమెరికా, చైనా సెమీకండక్టర్ల రంగంలో పైచేయి సాధించేందుకు భారీ సబ్సిడీలతో పోటీ పడుతున్నాయి. అదే సమయంలో చైనా తన స్వంత రూపకల్పన, ఉత్పత్తికి గాను భారీ మొత్తంలో పరిశోధనకు నిధులు వెచ్చిస్తున్నది. మనదేశంలో ఒక సమగ్ర విధానాన్ని కూడా ఇప్పటికీ రూపొందించుకోలేకపోయాము.అలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా ఉంటే మన దేశాన్ని సెమీకండక్టర్‌ హబ్‌గా మారుస్తానని మీరు చెబుతున్నారు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ తాజా(2023) సమాచారం ప్రకారం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, అమెరికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఫాబ్రికేషన్‌లో 2022 డిసెంబరు నాటికి జపాన్‌లో 102, తైవాన్‌ 77, అమెరికా 76, చైనా 70, జర్మనీ 20, బ్రిటన్‌ 12, మలేషియా 7 ప్లాంట్లను కలిగి ఉన్నాయి. తరువాత స్థానాల్లో ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గుజరాత్‌లో 70శాతం సబ్సిడీ ఇచ్చి అమెరికా మైక్రాన్‌ కంపెనీతో ఒక పాకింగ్‌ కేంద్రాన్ని పెట్టించి దీంతో ప్రపంచ హబ్‌గా మారుస్తానని మీరు జనాలకు చెబుతున్నారు. ఇది ఎంతకాలం నడుస్తుంది ? అమెరికా మనలను తన సహజ భాగస్వామిగా పరిగణిస్తున్నదని, పిలిచి పెద్ద పీటవేస్తున్నదని చెబుతున్నారు. గతేడాది (2022) మార్చి నెలలో తొలిసారిగా అమెరికా చొరవతో చిప్స్‌ 4 లేదా ఫాబ్‌ 4 కూటమి ఏర్పడింది. దానిలో తైవాన్‌(చైనా తిరుగుబాటు రాష్ట్రం), జపాన్‌, దక్షిణ కొరియా ఇతర భాగస్వాములు తప్ప మనకు చోటు లేదు. ప్రపంచ సెమీకండక్టర్ల పరిశ్రమలో 70శాతం వాటా ఈ నాలుగు దేశాలదే. విధాన రూపకల్పన, ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకొనేందుకు, విస్తరణకు దీన్ని ఏర్పాటు చేశారు.


గత తొమ్మిది సంవత్సరాల్లో దేశ అప్పును విపరీతంగా పెంచివేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు తరువాత మీరు దాన్ని ఎడాపెడా పెంచారు.కేవలం మీరు చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు.మీరు అధికారానికి వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపిలో 67.1 శాతం కాగా 2021లో 88.5 శాతానికి పెరిగింది, 2023 నాటికి అది 83.1శాతంగా ఉంది. ఇంత చేసిన వారు పరిశోధనకు పెంచకపోగా ఎందుకు తగ్గించిందీ ఏదైనా ఒక మన్‌కీ బాత్‌లో చెబితే సంతోషం. ఆవు పేడ పరిశోధన నిధులు సెమీ కండక్టర్లకు మళ్లించండి, సబ్సిడీలతో పాటు పరిశోధనలకూ నిధులు ఇవ్వండి. ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నా.
తోటి భారతీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d