• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: International

ఐదేండ్లలో ఎంత మార్పు ! సోషలిజం పట్ల ఆస్ట్రేలియా యువత సానుకూలత !!

06 Friday Sep 2024

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Readers News Service, USA, WAR

≈ Leave a comment

Tags

capitalism or socialism, communism, Failure of Capitalism, Gen Z Flirts With Socialism, Socialism, Young Americans socialism, Young Australians- socialism


ఎం కోటేశ్వరరావు


అక్కడేమీ ప్రభావితం చేసే విధంగా కమ్యూనిస్టు పార్టీ లేదు, పురోగామి ఉద్యమాలూ లేవు. వాటి పట్ల వ్యతిరేకత ఉన్న పాలకవర్గం, మీడియాదే ఆధిపత్యం. కమ్యూనిస్టులు కూడా కొన్ని పత్రికలు, వెబ్‌సైట్లు నడుపుతున్నప్పటికీ వాటి ప్రభావం పరిమితమే. అయినా ఆస్ట్రేలియాలో యువత సోషలిజం పట్ల సానుకూలత చూపుతున్నట్లు తాజా సర్వే వెల్లడిరచింది.అభివృద్ధి చెందినట్లు చెబుతున్న దేశాలన్నింటా జనం ప్రత్యేకించి యువత పెట్టుబడిదారీ వ్యవస్థపట్ల విముఖత చూపుతున్నారు. 2024 జూన్‌ 24న యు గవ్‌ అనే సంస్థ ఆస్ట్రేలియాలో జరిపిన సర్వేలో 1824 ఏండ్ల మధ్య యువతలో 53శాతం మంది సోషలిజం పట్ల సానుకూలత చూపగా తటస్థంగా 25శాతం, పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలత వెల్లడిరచిన వారు 22శాతం ఉన్నట్లు తేలింది. అదే మొత్తం అన్ని వయసుల వారిలో అలాంటి అభిప్రాయాలు వెల్లడిరచిన వారు 274231శాతాల చొప్పున ఉన్నారు. 2019 అక్టోబరులో యుగవ్‌ ప్రశ్నలకు 28శాతం మంది ఆస్ట్రేలియన్లు తమకు సోషలిజం అంటే ఏమిటో తెలియదని చెప్పగా 13శాతం మంది ఆ వ్యవస్థ కలుపుగోలుతనంతో ఉంటుందని చెప్పారు.సోషలిజాన్ని నిర్వచించమని అడిగిన ప్రశ్నకు అమెరికా యువత 60శాతం మంది సరైన సమాధానం చెప్పగా ఆస్ట్రేలియన్లు 30శాతమే ఉన్నారు. అలాంటి యువత 2024లో 53శాతం మంది సానుకూలత చూపటాన్ని గమనించాలి. దీని అర్ధం వారందరికీ సోషలిజం అంటే పూర్తిగా తెలిసిందని కాదు. సోషలిజం అంటేనే అణచివేత అని భావించిన స్థితి నుంచి బయటపడి ‘‘ సోషలిజం ’’ తాము జీవిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ కంటే మెరుగ్గా ఉంటుందనే అభిప్రాయం ఏర్పరుచుకోవటాన్ని ఇక్కడ గమనించాల్సిన, ఆహ్వానించాల్సిన అంశంగా చూడాలి. వీరి శాతం ఏటేటా పెరుగుతున్నది. యుగవ్‌ 2019 అక్టోబరులో ‘‘ కమ్యూనిజం బాధితులు ’’ పేరుతో ఏర్పడిన ఒక సంస్థ తరఫున అమెరికా, ఆస్ట్రేలియాల్లో సర్వే చేసింది.యువతలో సోషలిజం అంటే సమ్మతి లేదా ఆదరణ పెరుగుతున్నదని ఆ సర్వేలో తేలినట్లు ప్రకటించింది. ఇదంతా ఎప్పుడు ? సోషలిజంలో అణచివేస్తారు,భావ ప్రకటన స్వేచ్చ ఉండదు, భవిష్యత్‌ లేదు, అది విఫలమైంది అని ప్రచారం పెద్ద ఎత్తున జరుపుతున్న తరుణంలోనే అన్నది గమనించాలి.ప్రచ్చన్న యుద్ధం పేరుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టిన పరిణామాలను చూసిన పాత తరం వారిలో ఉన్న వ్యతిరేక భావం యువతరంలో లేదని ఆ సర్వేలో తేలింది.ఇప్పుడు కమ్యూనిజానికి వ్యతిరేకంగా తక్కువ ప్రచారం జరుగుతోందా ? కానే కాదు, ఏ మాత్రం తగ్గలేదు. తాజా సర్వే జరిగిన నేపధ్యాన్ని చూస్తే అనేక దేశాల్లో యువత సోషలిజం గురించి అధ్యయనం చేయటంతో పాటు నయా ఫాసిస్టు, మితవాద శక్తులు తమ సమస్యలకు పరిష్కారం చూపగలవేమో అన్న భ్రమలతో అటువైపు కూడా మొగ్గుతున్నారు. ఫ్రాన్సులో, తాజాగా జర్మనీలోని తూర్పు ప్రాంతంలో జరిగిన ఒక రాష్ట్ర ఎన్నికల్లో పచ్చిమితవాదులు పెద్దపార్టీగా అవతరించారు. జీవన ఖర్చు పెరగటం, గృహ సంక్షోభం ఆస్ట్రేలియన్‌ యువతను సోషలిజం గురించి ఆలోచింప చేస్తున్నదని తేలింది.జనాభాలో 1834 ఏండ్ల వయస్సువారిలో 41శాతం మంది సోషలిజాన్ని సమర్ధించగా, 35కు పైబడిన వారిలో 21శాతం మంది ఉన్నారు,అదే వయసులో ఉన్నవారు పెట్టుబడిదారీ విధానాన్ని 34శాతమే సమర్ధించినట్లు విశ్లేషణలో తేలింది. యువత సోషలిజం వైపు ఎందుకు మొగ్గుతున్నారన్న ప్రశ్నకు యుగవ్‌ డైరెక్టర్‌ పాల్‌ స్మిత్‌ మాట్లాడుతూ యువతరం ఎంతో భిన్నమైన ఆర్థిక పరిస్థితిని చవిచూస్తున్నారని, 2008 ద్రవ్య సంక్షోభం తరువాత శ్రామికశక్తిలో చేరిన యువత అసంతృప్తికి లోనై సోషలిజం వైపు మొగ్గుతున్నట్లు చెప్పాడు. పెద్ద తరాలు మంచివేతనాలతో కూడిన జీవితాలను గడపగా యువతకు అలాంటి హామీ లేదని, విద్య, గృహాలకు ఎక్కువగా చెల్లిస్తున్నారని అన్నాడు. ఒక స్థిరమైన ఉపాధి లేకపోవటం, తాత్కాలిక పనివారిని తీసుకొనే వాతావరణం ఎక్కువగా ఉండటంతో వారసత్వంగా వచ్చినవి ఉంటే తప్ప అద్దె ఇండ్లలో నివసించలేని స్థితి ఏర్పడిరది. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. గాజా వంటి చోట్ల జరుగుతున్న దారుణాలను సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నవారు పెట్టుబడిదారీ విధానం యుద్ధాలను ప్రోత్సహించటం ఎందుకని ప్రశ్నలు సంధించటం పెరిగింది.ఆస్ట్రేలియాలో పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు 64శాతం మంది సోషలిజాన్ని అభిమానించగా, లేబర్‌ పార్టీ 31, సంకీర్ణ కూటమి మద్దతుదార్లలో కేవలం 12శాతమే ఉన్నారు. కార్పొరేట్ల లాభాల కంటే జనం ప్రయోజనాలు,భూగోళాన్ని పరిరక్షించాలని కోరుకొనే వారు పెరుగుతున్నారు.


యువతలో ఎందుకీ మార్పు ? కమ్యూనిజం విఫలమైందని ప్రచారం జరిగిన చోటే పెట్టుబడిదారీ విఫలమైందని ఆ విధాన గట్టి సమర్ధకుడైన థామస్‌ పికెట్టి వంటి వారు సాధికారికంగా స్పష్టం చేసిన తరువాత యువత ఆలోచించకుండా ఎలా ఉంటుంది ? సోషలిస్టు చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులనే నిత్యం వాడుతున్నపుడు ఆ వస్తువులను మన దేశంలో ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం అని ఎక్కడికక్కడ యువత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు లేరు. 19952010 మధ్య జన్మించిన వారిని జడ్‌ తరం అని పిలుస్తున్నారు. వీరిని సోషలిజం(ఆకర్షిస్తున్నదని) కవ్విస్తున్నదని కొందరు వర్ణించారు.ముఖ్యంగా అమెరికాలో ఈ ధోరణి కనిపిస్తోంది.అనేక మంది మేం సోషలిస్టులం అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకవైపు అమెరికాలో కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ఇప్పటికీ పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. అయితే అక్కడ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు యువతను ఆలోచింపచేస్తున్నాయి. కమ్యూనిజం, సోషలిజం గురించి వక్రీకరణలు కొనసాగుతున్నప్పటికీ టీచర్లు బోధిస్తున్న అంశాలలో డెన్మార్క్‌, నార్వే వంటి చోట్ల స్కాండినేవియన్‌ సోషలిజం గురించి చెబుతున్న అంశాలు వారిని ఆకర్షిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. అమెరికా కంటే అక్కడి పరిస్థితి మెరుగ్గా ఉన్నందున అలాంటి సోషలిజాన్ని ఎందుకు అమలు చేయకూడదనే ప్రశ్నకు సరైన సమాధానం వారికి దొరకటం లేదు. అయితే ఆ దేశాల్లో ఉన్న జనాభా మొత్తం కూడా అమెరికాలో ఒక రాష్ట్రంలో ఉన్నవారికి సమానమని 30 కోట్ల మందికి సోషలిజాన్ని అమలు చేయటం, దీర్ఘకాలం కొనసాగించటం సాధ్యం కాదని మాత్రమే చెప్పటం వారికి సంతృప్తిని కలిగించటం లేదు. ఆయా దేశాల జిడిపితో పోలిస్తే అమెరికా జిడిపి ఎక్కువగా ఉన్నపుడు ఎందుకు సాధ్యం కాదు ? చైనాలో సంస్కరణల పేరుతో అమలు చేస్తున్నది అమెరికాలో మాదిరి పెట్టుబడిదారీ విధానమే అని అని నమ్మించేందుకు అక్కడి మేథావులు ప్రయత్నించారు. అదేగనుక వాస్తవమైతే మిగతా జర్మనీ,బ్రిటన్‌, జపాన్‌ వంటి దేశాలతో మిత్ర సంబంధాలను కొనసాగిస్తూ చైనాను వ్యవస్థాపరమైన శత్రువుగా మరోవైపు పాలకవర్గం చూడటాన్ని యువతరం గమనిస్తున్నది.మొత్తం మీద చెప్పాలంటే సోషలిజం గురించి ఆసక్తి కనపరుస్తున్న యువతను దారి మళ్లించేందుకు అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు నానా పాట్లు పడుతున్నారు.వారి జీవితానుభవం నుంచే అలాంటి ఆసక్తి కలుగుతున్నదని సామాజిక మాధ్యమం, మీడియా తప్పుదారి పట్టిస్తున్నదని, వ్యక్తిగత స్వార్ధం యువతలో పెరిగిందని, దేశం ఏమైనా ఫర్వాలేదన్నట్లుగా తయారవుతున్నారని పెడబబ్బలు పెడుతున్నారు. దీనికి తమను తామే నిందించుకోవాలంటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కావాలన్న డిమాండ్‌కు యువత మద్దతు ఇవ్వటానికి మేథావుల సైద్దాంతిక బోధన కారణం కాదని, పెరుగుతున్న ఖర్చు, బీమా సౌకర్యం లేకపోవటమే అంటున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లుగానే వాస్తవాలు, జీవిత అనుభవాల నుంచి పక్కదారి పట్టించాలంటే కుదరదు. అనేక దేశాల్లో ఇప్పుడు సోషలిజాన్ని యువత కోరుకోవటానికి పెట్టుబడిదారీ వ్యవస్థలలో వారి కలలు కల్లలు కావటమే కారణం. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారంతో జనాల బుర్రలు నిండటం తప్ప కడుపు నిండదని తేలిపోయింది. అమెరికా, ఐరోపా దేశాలలో సోషలిజం పట్ల పెరుగుతున్న ఆదరణను అడ్డుకొనేందుకు ప్రత్నామ్నాయంగా స్కాండినేవియన్‌ దేశాలలో అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలనే సోషలిజంగా చిత్రించి కమ్యూనిస్టులు చెప్పే వర్గరహిత సోషలిజం, కమ్యూనిజాలవైపు మళ్లకుండా చూశారు. ఇప్పుడు అమెరికాలో, ఇతర చోట్ల పెట్టుబడిదారీ వ్యవస్థలో తమ బతుకులు మెరుగుపడవు అని అర్ధం చేసుకున్నవారు కమ్యూనిస్టు సోషలిజం లేకపోతే పోనివ్వండి కనీసం ‘‘ స్కాండినేవియన్‌ సోషలిజం’’ ‘‘ ప్రజాస్వామిక సోషలిజం ’’ కావాలని, అమలు జరపాలని యువత కోరుతున్నది. సోషలిస్టు భావన కమ్యూనిస్టులతోనే ప్రారంభమైందని ఎవరైనా అనుకుంటే పొరపాటు.సమాజంలో దోపిడీ, అణచివేతలను సహించని అనేక మంది వాటిని వ్యతిరేకించారు, అవిలేని సమాజం కావాలని కోరుకున్నారు. ఉదాహరణకు ఎంతో ఘనమైనదిగా ఉందని చెప్పే మన సమాజంలో గతంలో అందరూ సుఖసంతోషాలతో ఉండి ఉంటే సర్వేజనా సుఖినోభవంతు అనే భావనే వచ్చి ఉండేది కాదు. అదీ సోషలిస్టు భావనే ! కారల్‌ మార్క్స్‌ఫెడరిక్‌ ఎంగెల్స్‌ ముందుకు తెచ్చిన శాస్త్రీయ సోషలిజం, కమ్యూనిజం సిద్దాంతాలకు ముందు ఊహాజనిత సోషలిస్టులు ఉన్నారు.అఫ్‌కోర్సు ఇప్పటికీ అలాంటి వారు లేకపోలేదు.కారల్‌ మార్క్స్‌`ఫెడరిక్‌ ఎంగెల్స్‌ చెప్పిన సోషలిజం ఊహ తప్ప ఎక్కడా అమలు జరగలేదని, ఆచరణ సాధ్యం కాదని చెప్పేవారు ఉన్నారు. అయినా యువత సోషలిజాన్ని ఎందుకు కోరకుంటున్నది ?


మిగతా ఐరోపా, అమెరికాలతో పోలిస్తే స్కాండినేవియన్‌ దేశాలలో సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత మెరుగ్గా ఉంది. అందువలన కమ్యూనిస్టులు చెప్పే సోషలిజాన్ని కాసేపు పక్కన పెడితే ఆ విధానాలనైనా ఎందుకు అమలు జరపరనే డిమాండ్‌ అమెరికాలో ముందుకు వస్తున్నది.కరోనాకు ముందు స్కాండినేవియన్‌ దేశాలలోని డెన్మార్క్‌ జిడిపిలో ప్రభుత్వ ఖర్చు 49.7శాతం ఉండగా, స్వీడన్‌లో 49.1శాతం కాగా అమెరికాలో 38.5శాతమే ఉంది.ట్రేడిరగ్‌ ఎకనమిక్స్‌ తాజా సమాచారం 2023 డిసెంబరు ప్రకారం యూరో ప్రాంతంలో ఖర్చు 49.9శాతం కాగా అమెరికాలో 34.38శాతం, మనదేశంలో 14.92శాతం ఉంది.అందరికీ సమాన అవకాశాలు అని చెప్పే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక అంతరాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పెట్టుబడిదారీ మేథావులు చెప్పిన ఊటసిద్దాంతం ప్రకారం సంపదలు ఎగువ నుంచి దిగువకు ప్రవహించలేదు. ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. అందువలన ఒకశాతం ఎగువ ధనికుల మీద అధిక పన్నులు విధించి పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలనే ప్రశ్నకు 66శాతం మంది అమెరికన్లు మద్దతు ఇచ్చారు.ఎగువ పదిశాతం మంది మీద పెంచాలనే వారు 54శాతం ఉండగా అందరి మీద పన్ను పెంచాలనే ప్రశ్నకు 37శాతమే మద్దతు ఇచ్చారు. దోపిడీ ప్రారంభమైపుడే దానికి గురైనవారు సోషలిజం కావాలంటూ ముందుకు వచ్చి ఉద్యమించలేదు. అనేక ఉద్యమాలు, వాటితో వచ్చిన సంస్కరణలు కూడా దోపిడీని నిర్మూలించని కారణంగానే శాస్త్రీయ సోషలిస్టు సిద్దాంత ప్రతిపాదన ఆచరణ సాధ్యంగా ఉంటుందని జనం నమ్మారు,దానికోసం ఉద్యమించారు.ఆచరణలో దానికి తగిలింది ఎదురుదెబ్బలే తప్ప మరొకటి కాదు. అందువలన కమ్యూనిస్టులు చెప్పే సోషలిజానికి బదులు ఇతర సోషలిజం కోసం ముందుకు వచ్చేవారిని ఆహ్వానిద్దాం. మితవాదం, మతవాదం వైపు వెళ్లేదానితో పోల్చితే ఇదెంతో ఆరోగ్యకర పరిణామమే కదా ! దానికి ఉండే పరిమితులను అర్ధం చేసుకున్న తరువాత వారు కూడా అంతిమంగా శాస్త్రీయ సోషలిస్టు సమాజ నిర్మాణానికే మద్దతు ఇస్తారు. దోపిడీ రహిత సమాజానికి ఎవరైనా వేరే పేరు పెడదాం అంటారా పెట్టనివ్వండి. పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నదే గీటురాయి.పేరులో ఏముంది పెన్నిది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెచ్చిపోతున్న ఇజ్రాయెల్‌ : వెస్ట్‌బాంక్‌కు విస్తరించిన దాడులు !

04 Wednesday Sep 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR, Women

≈ Leave a comment

Tags

Donald trump, Gaza, Hamas Israel, Joe Biden, Netanyahu, West Bank


ఎం కోటేశ్వరరావు


గతేడాది అక్టోబరు ఏడు నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌ గత ఏడు రోజులుగా ఉగ్రవాదులను ఏరివేసే పేరుతో వెస్ట్‌ బాంక్‌ ప్రాంతమంతటా దాడులు చేస్తోంది.అనేక మంది ప్రాణాలు తీసింది. విచక్షణా రహితంగా అరెస్టులు చేస్తోంది.అక్కడేమీ హమస్‌ పార్టీ లేదా దాని మద్దతుదారులెవరూ లేరు.ఒక వైపు గాజాలో పసిపిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెబుతూనే మరోవైపు మిలిటరీదాడులు చేస్తోంది.గాజాలోని ఒక సొరంగంలో శనివారం నాడు ఆరుగురు బందీల మృతదేహాలు దొరకటంతో ఇజ్రాయెల్‌ పౌరులు దేశమంతటా లక్షలాది మంది నిరసన ప్రదర్శనలు జరపటంతో పాటు సాధారణ సమ్మె పాటించారు. ప్రధాని నెతన్యాహు దీనికి బాధ్యత వహించాలని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.తాము బందీల వద్దకు వెళ్లటానికి కొద్దిసేపటి ముందే హమస్‌ వారిని చంపిందని ఇజ్రాయెల్‌ ఆరోపించింది.ఇజ్రాయెల్‌ దాడుల్లోనే వారు మరణించారని హమస్‌ చెబుతోంది.సోమవారం నాటికి ఇజ్రాయెల్‌ దాడులలో గాజాలో 40,786 మంది మరణించగా 94,224 మంది గాయపడ్డారు. మరణాలతో పాటు గాజాలో ఇప్పటి వరకు 60శాతం నివాస గృహాలు, 80శాతం వాణిజ్య సముదాయాలు,65శాతం సాగు భూమి, 65శాతం రోడ్లు పనికి రాకుండా చేశారు.ఆసుపత్రులు 36 ఉండగా వాటిలో 17మాత్రమే పాక్షికంగా పని చేస్తున్నాయి. అదే మాదిరి 85శాతం పాఠశాల భవనాలను నేలమట్టం చేశారు. హమస్‌ సాయుధులు వీటిని కేంద్రాలుగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.గాజాలోని ఒక పాఠశాలలో నిర్వహిస్తున్న హమస్‌ కమాండ్‌ కేంద్రాన్ని తమ వైమానిక దళం నాశనం చేసిందని ఇజ్రాయెల్‌ చెప్పుకుంది. పాలస్తీనాలో జోర్డాన్‌ నది పశ్చిమంగా ఉన్న ప్రాంతానే ్న వెస్ట్‌బాంక్‌ లేదా పశ్చిమ గట్టు అంటున్నారు. అది 5,650చదరపు కిలోమీటర్లలో ఉంది.జనాభా 30లక్షలు.దానికి ఒకవైపు జోర్డాన్‌, మరోవైపు ఇజ్రాయెల్‌,మూడోవైపు మృత సముద్రం(డెడ్‌ సీ) ఉంది.గాజాకు వెళ్లాలంటే ఇజ్రాయెల్‌ ప్రాంతాల నుంచే దారి ఉంది.అది పూర్తిగా పాలస్తీనాకు చెందినప్పటికీ అనేక ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించింది.దాంతో 8లక్షల 71వేల మంది పాలస్తీనియన్లు తమ స్వంతగడ్డమీదే శరణార్ధులుగా శిబిరాలలో ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్‌ వాటి మీద కూడా దాడులు చేస్తున్నది.తక్షణమే హమస్‌తో రాజీకి వచ్చి వారి వద్ద ఉన్న వందకు పైగా ఉన్న బందీలను విడిపించాలని కోరుతున్నట్లు అనేక సర్వేలు వెల్లడిరచినప్పటికీ నెతన్యాహు ఖాతరు చేయటం లేదు.మరోవైపు ఇటీవల ఇరాన్‌ జరిపిన క్షిపణుల దాడి తరువాత సామాన్య జనంలో భయాందోళనలు పెరుగుతున్నాయి.ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరుతో సెకనుకు ఒకటి చొప్పున 100 క్షిపణులను ప్రయోగించి ఉక్కిరిబిక్కిరి చేసింది.దీన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ ఊహించలేదు.మా తడాఖా ఇది అని ఇరాన్‌ ప్రదర్శించిన తరువాత దాడి నిలిపివేసింది. అందువలన ఎప్పుడేం జరుగుతుందో తెలియటం లేదు.


గాజాతో పాటు వెస్ట్‌బాంక్‌ ప్రాంతం మీద కూడా జరుపుతున్న దాడులను చూస్తే పశ్చిమాసియాలో మరో ప్రాంతీయ యుద్ధానికి రెచ్చగొడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా అమెరికా కనుసన్నల్లోనే అని వేరే చెప్పనవసరం లేదు.అయితే ఈ దాడులతో ఇజ్రాయెల్‌ మరింతగా సంక్షోభంలో కూరుకుపోతున్నదని చెప్పవచ్చు.పాలస్తీనియన్ల రెండవ తిరుగుబాటు 2000 నుంచి 2005వరకు జరిగింది. ఆ సందర్భంగా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మూడువేల మందికిపైగా మరణించారు. తరువాత మరోసారి ఇప్పుడు తెగబడుతోంది.ఇరాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదులను అణచే సాకుతో ఇప్పుడు దాడులకు దిగుతోంది.ఈ పరిణామాన్ని గాజా 2.0గా వర్ణిస్తున్నారు. గాజా మారణకాండ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు వెస్ట్‌బాంక్‌లో అడపాదడపా జరుపుతున్న దాడుల్లో 150 మంది పిల్లలతో సహా 650 మంది మరణించారు.ఇప్పటి వరకు 10,300 దాడులు జరిగాయి, ఆ ప్రాంతంలోని యూదు ఆక్రమణదార్లకు వేలాది ఆయుధాలను అందించి అరబ్బులపై దాడులకు రెచ్చగొడుతున్నది. గతవారం రోజులుగా అనేక పట్టణాల్లో ఉన్న నిర్వాసితుల శిబిరాలపై మిలిటరీ దాడులు చేస్తున్నది. ఓస్లో ఒప్పందాల ప్రకారం వెస్ట్‌ బాంక్‌లో పాలస్తీనా ఫతా ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ అది చేసేదేమీ లేదు. అడుగడుగునా ఇజ్రాయెల్‌ మిలిటరీ, సాయుధ దళాలు ఉన్నాయి.పాలస్తీనియన్‌ ప్రాంతాల ఆక్రమణ, వాటిలో యూదుల నివాసాల ఏర్పాటు, జనాభా నిష్పత్తిని మార్చివేసే కుట్ర కొనసాగుతూనే ఉంది.వాటిని ప్రతిఘటించేవారిని అణచివేసేందుకు యూదుల రక్షణ పేరుతో ఇజ్రాయల్‌ మిలిటరీ తిష్టవేసింది. విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ మాట్లాడుతూ ‘‘ గాజాలో ఉగ్రవాదుల వ్యవస్థను దెబ్బతీస్తున్నట్లుగానే ఇక్కడ కూడా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, విజయం సాధించాలని ’’ ప్రకటించాడు. వెస్ట్‌బాంక్‌పై దాడికి ఇజ్రాయెల్‌ చెబుతున్న సాకులన్నీ అబద్దాలేనని జోర్డాన్‌ విదేశాంగ మంత్రి అయమాన్‌ సఫాదీ వర్ణించాడు.పాలస్తీనియన్లను తమ ప్రాంతాల నుంచి తరిమివేసే ఏ చర్యనైనా తాము వ్యతిరేకిస్తామన్నాడు.


తాజా పరిణామాలో వెస్ట్‌బాంక్‌లో కూడా ప్రతిఘటించటం మినహా పాలస్తీనియన్లకు మరోదారి లేదు.ఇజ్రాయెల్‌ కోరుకుంటున్నది కూడా అదే కావటంతో కావాలని రెచ్చగొడుతున్నది. ఇటీవల చైనా మధ్యవర్తిత్వంలో పాలస్తీనా విముక్తి సంస్థలన్నీ ఒక అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు హమస్‌ను వ్యతిరేకిస్తున్న పరిమిత అధికారాలున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌ కూడా పిఎల్‌ఓలో హమస్‌ భాగస్వామ్యాన్ని అంగీకరించాడు. గత కొద్ది సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ దిగ్బంధనంతో వెస్ట్‌బాంక్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. సహజంగానే అబ్బాస్‌ మీద వ్యతిరేకతను పెంచుతుంది. నేడు గాజాలో జరుగుతున్నది రేపు తమ మీద కూడా జరగవచ్చనే ఆందోళన వెస్ట్‌బాంక్‌లో తలెత్తింది.దీన్ని గమనించే అబ్బాస్‌ కూడా గత వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది.హమస్‌ కూడా ఒక అడుగు వెనక్కు తగ్గింది. ఈ కారణంగానే వెస్ట్‌బాంక్‌లో రాజకీయ విబేధాలతో నిమిత్తం లేకుండా పాలస్తీనియన్లు ప్రతిఘటిస్తున్నారు.ఇది అమెరికా, ఇజ్రాయెల్‌ మీద వత్తిడిని పెంచుతుంది, మరో మాటలో చెప్పాలంటే ఊహించని పరిణామం. తాజా దాడులకు ఇది ఒక కారణం. దీన్ని చూపి దిగజారుతున్న తన ప్రతిష్టను నిలుపుకొనేందుకు నెతన్యాహు చూస్తున్నాడు. రెండుదశాబ్దాల నాటి పరిస్థితికీ ఇప్పటికీ వచ్చిన తేడాను యూదు దురహంకారులు గుర్తించటం లేదు.గాజా పరిణామాలు పక్కనే ఉన్న జోర్డాన్‌ రాజు అబ్దుల్లాకు ఎసరుతెచ్చేవిగా ఉన్నాయి.వెస్ట్‌బాంక్‌లో దాడుల కారణంగా పాలస్తీనియన్లు నిర్వాసితులైతే జోర్డాన్‌ వారికి ఆశ్రయం కల్పించే స్థితిలో లేదు. తిరస్కరించే పరిస్థితి కూడా రాజుకు లేదు. పాలస్తీనియన్ల మీద దాడులు పెరిగితే జోర్డానియన్లు సహించరు.ఈజిప్టు,యుఏయి,మొరాకో, బహరెయిన్‌ దేశాల పాలకులు ఇజ్రాయెల్‌తో మిత్ర సంబంధాలు కలిగి ఉన్నారు.వారి మీద కూడా జనం నుంచి వత్తిడి పెరుగుతుంది.ఒక్క గాజా, వెస్ట్‌బాంక్‌ ప్రాంతాల నుంచే కాదు, గోలన్‌ గుట్టలు,లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి కూడా ఇజ్రాయెల్‌ వైదొలగాలనే డిమాండ్‌ పెరుగుతుంది.వెస్ట్‌ బాంక్‌ ప్రాంతంలో రెండవ తిరుగుబాటు జరిగినపుడు 2002లో 70వేల యూదుల నివాసాలు ఉంటే వాటిని ఇజ్రాయెల్‌ 2024నాటికి ఎనిమిది లక్షలకు పెంచింది. వాటన్నింటినీ ఖాళీ చేసి అక్రమంగా ప్రవేశపెట్టిన యూదులందరినీ అక్కడి నుంచి తరలించాల్సి ఉంది.తూర్పు జెరూసలెం రాజధానిగా గణతంత్ర పాలస్తీనా ఏర్పడాలన్న ఐరాస తీర్మానం అమలు తప్ప మరొక పరిష్కారం లేదు.
ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండకు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నాయి.గాజా మారణకాండకు నిరసనగా ఇరాన్‌ ఒకవేళ దాడులకు దిగితే అడ్డుకొనేందుకు అమెరికా తన నౌక,వైమానిక దళాలను పెద్ద ఎత్తున ఎర్ర సముద్ర ప్రాంతానికి తరలించింది.

ఒకేసారి పలు రంగాలలో దాడులకు నెతన్యాహు ఎందుకు పాల్పడుతున్నాడనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.లెబనాన్‌,ఇరాన్‌లలో హమస్‌ నేతలను హత్య చేయటం,హిజబుల్లాను రెచ్చగొట్టటం,గాజాతో పాటు ఇప్పుడు వెస్ట్‌బాంక్‌పై దాడులకు దిగటం చూస్తున్నాము.నెతన్యాహు అమెరికా పర్యటన జరిపి చర్చలు జరిపి వచ్చిన తరువాత వెస్ట్‌బాంక్‌ మీద దాడులకు దిగింది.ఎవరెన్ని వివరణలు, భాష్యాలు చెప్పినప్పటికీ పొసగటం లేదు. అమెరికా ఎన్నికలు ముగిసేవరకు వర్తమాన పరిణామాలు ఇలాగే కొనసాగవచ్చు.ఉద్రిక్తతలను మరింత పెంచటం ద్వారా బైడెన్‌ మీద వత్తిడి పెరుగుతుందని అది తన విజయానికి బాట వేస్తుందనే అంచనాతో ట్రంప్‌ ఉన్నట్లు, అతగాడి నుంచి వచ్చిన సూచన మేరకు నెతన్యాహు రెచ్చిపోతున్నట్లు ఒక భాష్యం.బైడెన్‌ అమెరికాలో పలుకుబడి కలిగిన యూదుల మద్దతు పొందటానికి వారిని సంతుష్టీకరించేందుకు దాడులకు మద్దతు ఇస్తున్నాడని, దానికి అనుగుణ్యంగానే ఇజ్రాయెల్‌ వ్యవహరిస్తున్నదనే కథనాలు కూడా ఉన్నాయి. ప్రాంతీయ యుద్ధం తలెత్తితే అది ఎన్నికల్లో తమకు లాభిస్తుందని డెమోక్రాట్లు భావిస్తున్నారని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఉక్రెయిన్లో తగులుతున్న ఎదురుదెబ్బలు, భారీ ఖర్చును చూసిన తరువాత అమెరికా మరో రంగంలో చేతులు కాల్చుకుంటుందా, పరువు పోగొట్టుకొని పలుచన అవుతుందా ? కారణాలేమైనప్పటికీ అమెరికా పన్నిన వలలో చిక్కుకొనేందుకు ఇరాన్‌ తదితర దేశాలు సిద్దంగా లేవు.అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అది సిద్దమౌతోంది.సౌదీతో ఉన్న విబేధాలను పరిష్కరించుకోవటంలో అదే కనిపిస్తున్నది. హమస్‌తో రాజీకి వచ్చినా తనదే పైచేయి అని చెప్పుకొనేట్లుగా నెతన్యాహు చూస్తున్నాడు, లేనట్లయితే ప్రతిపక్షం వెంటనే దాడి ప్రారంభిస్తుంది. అందుకే అసాధ్యమైన షరతులను విధిస్తున్నట్లు చెబుతున్నారు.గాజా`ఈజిప్టు సరిహద్దులో ఫిలడెల్ఫీ,నెట్‌జారిమ్‌ కారిడార్లలో తమ మిలిటరీని అనుమతించాలన్నది వాటిలో ఒకటి. దానికి హమస్‌ ససేమిరా అంటున్నది.అక్కడ తీవ్రమైన ప్రతిఘటన ఉన్నప్పటికీ మిలిటరీ కొనసాగాల్సిందేనని ఇజ్రాయెల్‌ యుద్ధ కాబినెట్‌ తీర్మానించింది. అమెరికాలో నవంబరులో ఎన్నికలు జరిగి జనవరిలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాలస్తీనాలో మారణకాండ సాగేట్లు కనిపిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ఉక్రెయిన్‌ పర్యటన, కాషాయ దళ అతిశయోక్తులు,గాలి తీసిన జెలెనెస్కీ !

29 Thursday Aug 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, Hindutva nationalism, Joe Biden, Narendra Modi Failures, Propaganda, RSS, Ukraine crisis, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


‘‘ నిజం…మోడీ ది ఉక్కు దౌత్యం…ఉక్రెయిన్‌ వ్యూహాత్మక పరిశ్రమల మంత్రి క్యమిషిన్‌…మోడీ ముప్ఫై గంటల అసాధారణ దౌత్య ప్రక్రియ…పోలాండ్‌ సరిహద్దు పట్టణం జెమిసిల్‌ నుంచి ఉక్రెయిన్‌ కివీవ్‌ కు 700 కిలోమీటర్లు ప్రయాణం…మొత్తం యుద్ధ ప్రమాద ప్రాంతమే….పది గంటలు రానూ… పది గంటలు పోనూ… అక్కడో పది గంటలు…యూరోప్‌..అమెరికా…మరో ప్రక్క రష్యా అసాధారణ ఉత్కంఠ మధ్య..చూపులన్నీ ఈ ఉక్కు మనిషి పైనే…రైల్‌ ఫోర్స్‌ వన్‌…మహా గట్టి రైలు…కదులుతున్న దుర్భేద్యమైన రైలు…దాన్ని అనుసరిస్తూ… రాడార్లు…సైనిక విమానాలు…అంటే ఒక రకంగా మూడు రోజుల పా టు…యుద్ధం ఆగిపోయినట్టే…అక్కడ మాదే విజయం..ఇక్కడ మాదే పై చేయి అంటూ ప్రస్తుతం రష్యా ఉక్రైన్లు ఉత్తుత్తి ప్రకటనలు…పోలాండ్‌..ఒకప్పటి వార్సా సంధికి ప్రసిద్ధి…ఏదో చెప్పాల్సినవి అన్నీ మోడీకి చెప్పేసుకున్నామన్న సంతృప్తి నాటోకి…ప్రపంచానికి తమ బాధ ఆగ్రహం మోడీయే అర్థం చేయించగలుగుతారన్న ఆశ ఉక్రెయిన్దీ….ఒక్కసారిగా పెరిగిపోయిన భారత్‌ ప్రసిద్ధి చూసి…అసూయా ద్వేషాలతో రగిలిపోతున్న ఆయుధ వ్యాపార లాబీలు…భారత్‌ ఆంతరంగిక వైఫల్యాలను ఎత్తి చూపడానికి మనకి ఇక్కడొక రాహువును వదిలిపెట్టారు…ఆటలో ఆటం బాంబు…సరే ఏదేమైనా రష్యా ఆయిల్‌ ఇస్తూనే ఉంటుంది…మన ద్వారా యూరోప్‌ కొంటూనే ఉంటుంది…మన డబ్బులు…మన ఆయిల్‌ రిజర్వులు పెరుగుతూనే ఉంటాయి…ఇది ఒక రకంగా యుద్ధ ఆర్థిక దౌత్యం…శ్రావణ్‌ శుక్రవారం మహాలక్ష్మి అనుగ్రహం…ఇలాంటి విన్యాసాలు కేవలం శక్తిమంతమైన దేశాలు మాత్రమే…తెలివైన దేశాలు మాత్రమే చెయ్యగలుగుతాయి…ఇప్పుడు భారత్‌ అంటే….భారత్‌ అంతే…మీ ఏడుపులే మన ఎదుగుదల…ఈ సమయంలో ఎవరెవరు ఏడుస్తారో చూస్తే చాలు…మనకు అర్థం అయిపోతుంది…రైలు ప్రయాణ సమయంలోనే …శత్రువును గమనించు…! అక్కడా…ఇక్కడా కూడా! జైహింద్‌ ’’
ఆగస్టు నెలాఖరులో నరేంద్రమోడీ ఉక్రెయిన్‌ పర్యటన గురించి ఆకాశానికి ఎత్తుతూ వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో పేరు లేకుండా ఎప్పటి మాదిరే కాషాయ మరుగుజ్జులు పెట్టిన పోస్టు పూర్తి పాఠమది. అలాగే జరిగిందా ? ఎవరేమంటున్నారు, నిజం ఏమిటి ? ఉక్రెయిన్‌ వివాదంలో భారత్‌ తటస్థంగా ఉంది. జూలై నెలలో మోడీ మాస్కో వెళ్లి వ్లదిమిర్‌ పుతిన్ను ఆలింగనం చేసుకున్నారు. దాన్ని తప్పుపట్టిన ఉక్రెయిన్‌ అధినేత జెలెనెస్కీ ఆగస్టు 23న మోడీ తమదేశాన్ని సందర్శించినపుడు అదే చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో పేరు మోసిన రక్త పిపాసి నేరగాడిని మాస్కోలో కౌగలించుకుంది అని నాడు జెలెనెస్కీ ఎక్స్‌ చేశాడు. అదే వ్యక్తిని తాను కూడా కౌగలించుకోవటం ఏమిటి ? అదే నోటితో మోడీ జరిపిన తమ దేశ పర్యటన చరిత్రను సృష్టించిందని కూడా చెప్పాడు. ఆలింగనాల దౌత్యంలో ఎవరూ తక్కువ తినలేదు. మాస్కో వెళ్లినపుడు పశ్చిమదేశాలన్నీ మోడీని దుమ్మెత్తిపోశాయి. అది ఊహించిందే, వాటి ఆగ్రహాున్ని చల్లార్చి సంతుష్టీకరించేందుకు ఉక్రెయిన్‌ వెళ్లారు. కానీ వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. అనుమానాలు, సందేహాలు వెల్లడిస్తూ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఉక్రెయినుకు సౌహార్ద్రత ప్రకటించటం కంటేతన ప్రయోజనాలకే పెద్ద పీటవేసిందని ఆరోపించిన వారు కూడా ఉన్నారు.
తొలిరోజుల్లో టర్కీ ఒక ప్రయత్నం చేసింది తప్ప భారత్‌ లేదా మోడీని వివాదంలో మధ్యవర్తిగా ఎన్నడూ రష్యా పరిగణించలేదు. మనదేశం ఎన్నడూ అలా ప్రకటించుకోలేదు. తమ అతిధిగా వచ్చిన మోడీని జెలెనెస్కీ అవమానించటమే కాదు, ఇరకాటంలో పెట్టాడు. మోడీ స్వదేశానికి తిరుగు ప్రయాణమైన తరువాత కనీస దౌత్య మర్యాదలను కూడా పాటించకుండా వ్యవహరించాడు. జూన్‌ నెలలో స్విడ్జర్లాండ్‌లో ఒక శాంతి సమావేశం జరిగింది. దానికి రష్యాను అసలు ఆహ్వానించలేదు, చైనా వెళ్లలేదు, భారత్‌తో సహా పదమూడు దేశాలు హాజరైనప్పటికీ ఆ సమావేశం విడుదల చేసిన ప్రకటన మీద సంతకం చేయలేదు. భారత్‌ మరో శాంతి సమావేశం జరిపితే ఆహ్వానిస్తాం గానీ అది జరగటానికి ముందు భారత్‌ స్విస్‌ ప్రకటన మీద సంతకం చేయాలని జెలెనెస్కీ షరతు పెట్టాడు. మనదేశ వైఖరి తెలిసి కూడా విలేకర్లతో అలా మాట్లాడటం చౌకబారు తనం తప్ప మరొకటి . కాదు, పైగా జెలెనెస్కీ ఆహ్వానం మీదనే మోడీ వెళ్లారు. స్వాగతం చాలా మోటుగా లేదా వికారంగా పలికినట్లు బిబిసి వర్ణించింది. ‘‘విశ్వగురువు’’ కు ఇది అవమానమా ? ఘనతా ?
‘‘ పేద దేశాలు రెండవ శాంతి సమావేశం జరిపితే మంచిదని నేను నిజంగా నమ్ముతున్నాను. సౌదీ అరేబియా,కతార్‌,టర్కీ వంటి దేశాలు ఉన్నాయి. భారత్‌లో మనం అలాంటి సమావేశం నిర్వహించవచ్చని నేను నరేంద్రమోడీతో చెప్పాను. అది పెద్ద దేశం, అతిపెద్ద ప్రజాస్వామికదేశం. స్విస్‌ శాంతి సభ ప్రకటనపై సంతకం చేసిన దేశంలోనే సభ జరగాలి.అయితే నేను నిర్మొహమాటంగా చెప్పదలచుకున్నాను. ఈ షరతు కేవలం భారత్‌కు మాత్రమే కాదు. రెండవ సభ జరపాలని సానుకూలంగా కోరుకుంటున్న ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుంది. శాంతి (స్విడ్జర్లాండ్‌) సమావేశ ప్రకటనపై ఇప్పటికీ సంతకం చేయని ఏ దేశంలో కూడా జరపటానికి మాకు కుదరదు ’’ అని మోడీ భారత్‌కు తిరుగు ప్రయాణమైన తరువాత భారతీయ విలేకర్ల సమావేశంలో జెలెనెస్కీ చెప్పినట్లు కీవ్‌ ఇండిపెండెంట్‌ అనే పత్రిక రాసింది.రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ దాని యుద్ధ ఆర్థికానికి భారత్‌ సాయపడుతున్నదని జెలెనెస్కీ చెప్పాడు. మోడీ రష్యా పర్యటన జరిపిన రోజే తమ అతిపెద్దదైన పిల్లల ఆసుపత్రి మీద దాడి జరిపిన పుతిన్‌కు నరేంద్రమోడీ అంటే గౌరవం లేదని వెల్లడి కాలేదా అంటూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. మీరు గనుక చమురు దిగుమతులు నిలిపివేస్తే పుతిన్‌కు పెద్ద సవాలు ఎదురౌతుంది.మోడీ శాంతిని కోరుకుంటున్నారు తప్ప పుతిన్‌ కాదన్నాడు. జెలెనెస్కీ విలేకర్ల సమావేశంలో మొరటుగా మాట్లాడాడు. అంతర్గతంగా మాట్లాడాల్సిన వాటిని విలేకర్ల ముందు చెప్పాడు.
మోడీ రష్యా పర్యటనపై విమర్శలకు దిగిన ఉక్రెయిన్‌, అమెరికాల ఆగ్రహాన్ని తగ్గించే నష్ట నివారణ చర్యగా ఉక్రెయిన్‌ పర్యటన జరిగిందని, శాంతికి కట్టుబడి ఉన్న భారత్‌కు, దానితో రష్యా సంబంధాలకు ఒక సవాలుగా ఈ పర్యటన మారిందన్న ఒక విశ్లేషకుడి వ్యాఖ్యను చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఉటంకించింది. స్విస్‌ ప్రకటనపై మనదేశం సంతకం చేయకపోతే అమెరికాకు, చేస్తే రష్యాకు ఆగ్రహం కలుగుతుంది.ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరి పరిస్థితి ఉంది. రష్యా కురుస్కు ప్రాంతంపై ఉక్రెయిన్‌ దాడి చేసినందున చర్చలకు అవకాశం లేదని పుతిన్‌ ప్రకటించిన తరువాత మోడీ జరిపి కీవ్‌ పర్యటన శాంతికి దోహదం చేస్తుందా ? అసలు ఎవరైనా వినిపించుకుంటారా ? తాము మధ్యవర్తి పాత్రను పోషించాలని కోరుకోవటం లేదని, ఉక్రెయిన్‌`రష్యా కోరితే వర్తమానాలను పరస్పరం తెలియ చేస్తామని భారత అధికారులు చెప్పినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. పశ్చిమ దేశాలలో రష్యా ఒంటరిపాటైతే ఆసియాలో భారత ప్రత్యర్ధిగా ఉన్న చైనాకు మరింత దగ్గర అవుతుందని, అలా కాకుండా ఉండాలంటే యుద్ధానికి ఒక పరిష్కారం అవసరమని భారత్‌ భావిస్తోందని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థంగా ఉన్న చైనా శాంతి ప్రతిపాదన చేసింది. జెలెనెస్కీ నుంచి దాని మీద ఎలాంటి స్పందన లేదు.మన వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదనా లేదు.
తన పర్యటన తరువాత నరేంద్రమోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మరుసటి రోజు వ్లదిమిర్‌ పుతిన్‌కు ఉక్రెయిన్‌తో జరిపిన చర్చల గురించి వివరించినట్లు ఒక ఎక్స్‌ ద్వారా తెలిపారు. వివాదానికి శాంతియుత ముగింపు పలకాలంటే చర్చలు, దౌత్య పద్దతుల్లో చిత్తశుద్దితో నిమగ్నం కావాలని మోడీ చెప్పినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ కురుస్కు ప్రాంతం మీద ఉక్రెయిన్‌ దాడి చేసిన తరువాత పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. రెండు దేశాల మధ్య పరిస్థితి విషమించటం తప్ప మెరుగుపడే అవకాశాలు లేవు.పరిస్థితి ఇలా ఉండగా అతిశయోక్తులతో కూడిన ఊరూ పేరూ లేని ప్రకటనలు, ప్రచారాలను నమ్మేంత అమాయకంగా వాట్సాప్‌ జనాలు ఉన్నారని భావించటం తప్ప మరొకటి కాదు ! పోలాండ్‌, ఉక్రెయిన్‌ పర్యటన జరిగింది రెండు రోజులైతే మూడు రోజులు యుద్ధం ఆగిపోయిందని చెప్పటాన్ని బట్టి మా ఊరి మిరియాలు తాటికాయలంత ఉంటాయి దొరా అన్నట్లు ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లాదేశ్‌లో దాడులు : ప్రముఖ హిందూ నేతల మౌనాన్ని ప్రశ్నిస్తున్న సామాజిక మాధ్యమం ! ఇతర పార్టీల కంటే బిజెపి అదనంగా చేసిందేమిటి ?

15 Thursday Aug 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence, Social Inclusion, Women, Women

≈ Leave a comment

Tags

Awami League, Bangla Hindus, BJP, coup against Sheikh Hasina, Coup In Bangladesh, CPI(M), Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన, ఆమెను దేశం నుంచి వెళ్లగొట్టిన సందర్భంగా జరిపిన హింసాకాండ గురించి, దానిలో భాగంగా అక్కడ మైనారిటీలైన హిందువులపై జరిపిన దాడుల వార్తలతో మనదేశంలో అనేక మంది ఆందోళన వెలిబుచ్చారు. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూసే బాపతు మాదిరి కొందరు ప్రయత్నించారు. ”హిందువుల ఊచకోత, మారణహౌమం ” ఇటీవలి పరిణామాలపై మన మీడియాలో వచ్చిన కొన్ని శీర్షికలివి.ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ 2024 ఆగస్టు 13వ తేదీన వెబ్‌ ఎడిషన్‌లో ” బంగ్లాదేశ్‌లో హిందూ జాతి సంహారం : మతహింస క్రూరత్వ వాస్తవం ” అనే పేరుతో ఒక విశ్లేషణ చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన దాడులను మనదేశంలోని అన్ని పార్టీలు బిజెపి మాదిరే ఖండించాయి. ఖండించాల్సిందే, బంగ్లా ప్రభుత్వానికి మన ఆందోళన వెల్లడించాల్సిందే. బంగ్లా హిందువులే కాదు, పాకిస్తాన్‌లో హిందువులు, క్రైస్తవులు, శ్రీలంక హిందువులు, ముస్లిం, క్రైస్తవులు, మయన్మార్‌ రోహింగ్యాలు ఇలా ఏ దేశంలో మైనారిటీలపై దాడులు జరిగినా మానవతా పూర్వక స్పందన ఉండాల్సిందే. బంగ్లా పరిణామాలు, వాటి తీరుతెన్నులను వివరించటం, పోలికలు తేవటం, వాస్తవాలివి అని చెప్పటం అంటే దాడుల తీవ్రతను తక్కువ చేసి చూపటం కాదు. ప్రతి భాషలోనూ తీవ్రతను వెల్లడించే పద ప్రయోగాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో పోలికలు కూడా తెలిసిందే.బంగ్లాదేశ్‌ పరిణామాల సందర్భంగా హిందూత్వనేతలు, సంస్థలు ఒక పోలికను తెచ్చాయి. ఎక్కడో పాలస్తీనాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్నదాడులను ఖండిస్తూ ఇక్కడ ప్రదర్శనలు జరుపుతున్నవారు మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్నదాడులకు వ్యతిరేకంగా ఎందుకు ప్రదర్శనలు చేయటం లేదు అని ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమంలో ఊరూపేరూలేని పోస్టులతో రెచ్చగొడుతూ ప్రతికూల మనోభావాలను, ముస్లింల పట్ల విద్వేషాన్ని రేకెత్తించేందుకు చూస్తున్నారు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అంటారు. ఈ ప్రశ్నను అడిగేవారు రెండు రకాలు. మొదటి రకం జనాలు నిజంగా పాలస్తీనా పౌరుల మీదనే కాదు, అసలు మానవత్వం మీద కూడా అభిమానం ఉన్నవారు కాదు. ఎందుకంటే వారు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ఎన్నడూ ప్రశ్నించిన వారు కాదు. రెండవ తరగతి జనాలు మొదటి తరగతి బాపతు ప్రచారానికి లోనై ప్రశ్నించేవారు. వీరిని అర్దం చేసుకోవచ్చు. మొదటి తరగతి వారు ఎన్నడైనా తమ జీవితాల్లో పాలస్తీనా వాసుల మీద జరుగుతున్న దారుణమారణకాండకు నిరసనగా అయ్యోపాపం అని ఏదైనా ప్రదర్శన సంగతి అటుంచండి కనీసం ప్రకటన అయినా చేశారా ? ఎందుకు ఈ పోలిక తెస్తున్నారు, ఇదే కాదు మనదేశంలో జరిగినట్లు చెబుతున్న ఉదంతాలకు కూడా పాలస్తీనా, ఇతర సమస్యలను జోడించి అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. ప్రతిదాన్నీ మత కళ్లద్దాలతో చూస్తే వచ్చే సమస్య ఇది.


మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత అమెరికా, బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాదులు కుట్ర చేసి పాలస్తీనా ప్రాంతంలోకి ఇతర దేశాల నుంచి యూదులను రప్పించారు. స్థానికంగా ఉన్న అరబ్బుల మీద దాడులు చేయించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను చూడాలి. వికీపీడియా సమాచారం ప్రకారం 1920 నుంచి 1948వరకు 20,631మరణాలు సంభవించాయి, ఇంకా లెక్కకు రానివి మరికొన్ని వేలు ఉన్నాయి. వీటిలో అత్యధికులు పాలస్తీనియన్లే.1948లో పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసింది ఐక్యరాజ్యసమితి. ఎవరికి ఏ ప్రాంతమో కేటాయించింది. నాటి నుంచి ఇజ్రాయెల్‌ ఏర్పడింది తప్ప పాలస్తీనా ఎక్కడ ? దానికి కేటాయించిన ప్రాంతాలను క్రమక్రమంగా ఆక్రమిస్తూ అసలు పాలస్తీనా దేశాన్ని ఇంతవరకు ఉనికిలోకి రాకుండా చేసింది ఇజ్రాయెల్‌, దానికి మద్దతు ఇస్తున్న అమెరికా. తమ మాతృభూమి కోసం పోరాడుతున్నవారిని వేల మందిని దురహంకారులైన యూదులు, వారికి మద్దతుగా ఉన్న మిలిటరీ హత్యలు చేస్తున్నది. అప్పటి నుంచి (1948 ) ఇప్పటి వరకు మరణించిన వారు 1,44,963 మంది, వీరిలో అరబ్బులే అత్యధికం. గతేడాది అక్టోబరు ఏడు నుంచే గాజాలో దాదాపు 40వేల మందిని బాంబులు, విమానదాడులతో ఇజ్రాయెల్‌ మిలిటరీ చంపివేసింది, వారిలో 80శాతం మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. ఆసుపత్రులను ధ్వంసం చేసిన కారణంగా, వ్యాధులు ప్రబలి మరోలక్ష మంది మరణించారు. దాడుల్లో లక్ష మందివరకు గాయపడ్డారు. లక్షలాది ఇండ్లను నేలమట్టంగావించారు. ఇరవై మూడు లక్షల మందిని నిర్వాసితులను గావించారు.మారణకాండ, జాతిహననం అంటే ఇది. ఇవి యూదులు-పాలస్తీనీయన్ల మధ్య జరుగుతున్న ఘర్షణలు కావు. ఏకపక్ష దాడులు, ఒక దేశ మిలిటరీ మరొక దేశ పౌరుల మీద జరుపుతున్న మారణకాండ. దీనికీ బంగ్లాదేశ్‌లో జరిగిన దానికి పోలిక పెట్టటాన్ని ఏమనాలి. ప్రపంచమంతా పాలస్తీనియన్లకు సంఘీభావం తెలుపుతున్నది.ఏదైనా సందర్భం వస్తే హమస్‌ జరిపిన హత్యాకాండ సంగతేమిటని బిజెపి పెద్దలు ఎదురుదాడికి దిగుతారు. సాధారణ పౌరులపై వారి డాడిని సమర్థిస్తూ మనదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా చేసిన ప్రకటనను చూపమనండి.దాడులు, ప్రతిదాడులను ఖండిస్తూ 2023 అక్టోబరు ఎనిమిదిన సిపిఐ(ఎం) ఒక ప్రకటన చేసింది. కాంగ్రెస్‌ కూడా హమస్‌దాడులను ఖండించింది. ఇంతవరకు బిజెపి లేదా ఇతర సంఘపరివార్‌ సంస్థలు గానీ గాజా మారణకాండను ఖండించాయా ? పాలస్తీనాకు మనదేశం మద్దతు ఇస్తున్నది, కానీ దానికి సంఘీభావం తెలుపకుండా కేంద్ర ప్రభుత్వం కాశ్మీరులో నిషేధాలు విధించిందని, ఇజ్రాయెల్‌, అమెరికాలను సంతుష్టీకరించిందనే అంశం ఎంత మందికి తెలుసు ?


తమ మీద దాడులు జరిపిన వారి మీద చర్యలు తీసుకోవాలంటూ ఆగస్టు పది, పదకొండు తేదీలలో ఢాకా నగరంలో హిందువులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు.వారికి భరోసా కల్పించేందుకు తాత్కాలిక ప్రభుత్వ నేతగా ఉన్న మహమ్మద్‌ యూనస్‌ ఢాకేశ్వరి దేవాలయాన్ని సందర్శించాడు. తగినంత భద్రత కల్పించలేకపోయినందుకు క్షమించాలని హౌంమంత్రిత్వశాఖ సలహాదారు(మంత్రితో సమానం) సఖావత్‌ హుసేన్‌ ఆగస్టు12న కోరాడు. ఇలాంటి పరిస్థితి మనదేశంలో అధికారంలో ఉన్న బిజెపి నేతల నుంచి ఎన్నడైనా చూశామా ? బంగ్లాదేశ్‌ హిందువుల సంగతి పట్టదు గానీ పాలస్తీనియన్ల గురించి మాట్లాడతారంటూ బిజెపి, దాని మద్దతుదార్లు ఎదురుదాడి చేస్తున్నారు. అన్ని పార్టీలూ బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడిని ఖండించాయి.మిగతా పార్టీల మాదిరిగానే ఒక ఖండన ప్రకటన చేయటం తప్ప బిజెపి అదనంగా చేసిందేమిటి ? మణిపూర్‌ రాష్ట్రంలో మైనారిటీ మతావలంబకులుగా ఉన్న కుకీ గిరిజనులపై జరిగిన దాడులు, మహిళలపై అత్యాచార ఉదంతాల పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ ఐరోపా యూనియన్‌ పార్లమెంటులో చర్చ జరిగింది. సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ అని చెప్పుకుంటూ మరోవైపు హిందువుల కోసం బరాబర్‌ మేము ఏమైనా చేస్తాం, పోరాడతాం అని బిజెపి నేతలు చెబుతారు. బంగ్లాపరిణామాలపై కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు కూడా అదే సమయంలో జరిగాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగితే ఒక తీర్మానం, చర్చ పెట్టి ఖండించటానికి, వారికి సానుభూతి తెలిపేందుకు బిజెపికి ఎవరు అడ్డుపడ్డారు ? పదవీ బాధ్యతలు చేపట్టిన మహమ్మద్‌ యూనస్‌కు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు చెబుతూ పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని, హిందువులతో సహా మైనారిటీలందరికీ భద్రత, రక్షణ కల్పించాలని కోరుతూ ఆగస్టు ఎనిమిది రాత్రి ఒక ఎక్స్‌ సందేశం పంపారు.


బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగితే స్పందించరేమిటని సంఘపరివార్‌ శక్తులు అడుగుతున్నాయి. తప్పులేదు. మణిపూర్‌లో గత పదిహేను నెలలుగా స్వంత పౌరుల మధ్య జరుగుతున్న హింసాత్మక ఉదంతాల పట్ల మీ స్పందన, కార్యాచరణ ఏమిటని ఎప్పుడైనా నరేంద్రమోడీని ప్రశ్నించాయా ? మహిళలను నగంగా ఊరేగించారే ! గట్టిగా అడిగితే ఆ ఉదంతాల్లో విదేశీ, చొరబాటుదారుల హస్తం ఉందంటూ తప్పించుకుంటున్నారు. కాసేపు వాదన కోసం ఉన్నదనే అనుకుందాం. సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత, చొరబాటుదార్లను అడ్డుకొని వారి కుట్రలను ఛేదించాల్సిన పని ఎవరిది ? కేంద్ర పెద్దలదే కదా ! ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నారు. ఆ బాధ్యత ఢిల్లీ పెద్ద ఇంజనుదైతే రాష్ట్రంలో పౌరుల మాన ప్రాణాలను రక్షించాల్సిన కర్తవ్యం చిన్న ఇంజనుది కాదా ? అదేమి చేస్తున్నట్లు ? ప్రభుత్వ సమాచారం ప్రకారం 2024 మే మూడవ తేదీ నాటికి ఏడాది కాలంలో జరిగిన ఘర్షణలు, దాడుల్లో క్రైస్తవ గిరిజనులు గానీ, హిందూ మెయితీలుగానీ 221 మంది మరణించారు.మరో 32 మంది జాడ తెలియటం లేదు.వెయ్యి మంది గాయపడ్డారు. 4,786 ఇండ్లను దగ్దం చేశారు.దేవాలయాలు, చర్చ్‌లు 386 ధ్వంసమయ్యాయి. అరవై వేల మంది నెలవులు తప్పారు. వారికి ఓదార్పుగా ఇంతవరకు ప్రధాని మోడీ ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు. ఇంత జరుగుతుంటే బిజెపి శ్రేణులు, వారికి మద్దతు ఇచ్చే వారు గానీ మణిపూర్‌ దారుణాలకు నిరసనగా లేదా కనీసం శాంతిని కోరుతూ ఎన్నడైనా ప్రదర్శనలు చేశారా ? ఎందుకు చేయలేదు ? మతకోణంలో చూసినా మణిపూర్‌ మెయితీలు హిందువులు , ఇంతకాలం వారిని ఓట్లకోసం ఉపయోగించుకున్నారా లేదా ? బిజెపి బండారం బయట పడింది గనుకనే మెయితీలు, గిరిజనులు ఇద్దరూ బిజెపిని లోక్‌సభ ఎన్నికల్లో ఉన్న రెండు సీట్లలో ఓడించారు. అందుకే బంగ్లాదేశ్‌ హిందువుల గురించి కారుస్తున్న కన్నీళ్లు నిజమైనవి కాదు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లకోసం గ్లిజరీన్‌ సరకు అని ఎవరైనా అంటే తప్పేముంది.


సామాజిక మాధ్యమంలో వచ్చిన అనేక అంశాలలో సంధించిన ఒక ప్రశ్న దిగువ విధంగా ఉంది.” అత్యంత పలుకుబడి కలిగిన హిందువులు బంగ్లాదేశ్‌ గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు ” అన్నది దాని శీర్షిక. ” బంగ్లాదేశ్‌లో ఏమీ జరగటం లేదన్నట్లుగా ప్రఖ్యాతి గాంచిన వారిలో ఎక్కువ మంది ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు తెలియటం లేదు.జై శంకర్‌ నుంచి వచ్చిన ఒకటి తప్ప భారత ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. మన ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మౌనంగా ఉన్నారు, మంత్రులందరూ, ఇతర రాజకీయనేతలు గమ్మున ఉన్నారు. చివరికి జై శంకర్‌ ప్రకటనలో కూడా ”మైనారిటీ” అనే పదాన్ని ఉపయోగించారు తప్ప ”హిందువులు ” అనలేదు. వారే కాదు ఒక అధికారి, ఒక న్యాయమూర్తి, ”ప్రముఖ ” టీచర్‌, ప్రముఖులు, ఒక పారిశ్రామికవేత్త ఎవ్వరూ హిందువుల కోసం నోరు తెరవ లేదు. కొంత మంది యూట్యూబర్లు మాత్రమే గళమెత్తారు. అయితే అది చాలదు.వీరంతా హిందువులే అయినా అందరూ ఇంకా మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష పార్టీల మౌనం గురిచి నేను మాట్లాడదలచుకోలేదు.ఎందుకంటే వారికి ఇప్పుడు అవకాశం లేదు. రాహుల్‌, అఖిలేష్‌,మమత, ఉద్దావ్‌ లేదా ఇతర రాజకీయనేతలు గళం విప్పుతారని నేను ఆశించను. కానీ బిజెపి ఎందుకు మౌనంగా ఉంది. మన హిందూ సోదరులు బాధలు పడుతుంటే మనమంతా మొద్దుబారిపోయామా ? ” (రెడిట్‌ డాట్‌కాం) బిజెపి మొద్దుబారలేదు, ఇలాంటి అవకాశాలు ఎప్పుడు వస్తాయా ? ఎలా సొమ్ముచేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది, చురుకుగా వ్యవహరిస్తుంది అన్న విషయం పై ప్రశ్న వేసిన వారికి తెలియదేమో !


ఇండియా టుడే పత్రిక 2024 ఆగస్టు 13న ఒక విశ్లేషణ ప్రచురించింది. షేక్‌ హసీనా ప్రభుత్వ పతనం తరువాత తలెత్తిన అరాచకంలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై ఐదు హత్యలతో సహా రెండు వందలకు పైగా ప్రాంతాలలో దాడులు జరిగాయి. విడిగా దాడులను చూస్తే కొన్ని వందలు ఉంటాయి. అత్యాచార ఉదంతాలు కూడా జరిగాయి.దాడుల వీడియోలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తాయి. వాస్తవాల నిర్ధారకులు వాటిని ప్రశ్నించారు.బాధితుల్లో రాజకీయాలతో నిమిత్తం ఉన్నవారితో పాటు లేని వారు కూడా ఉన్నారు. ఆగస్టు ఐదు నుంచి మూడు రోజుల్లో 205ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇండ్లు, దుకాణాలపై ఎక్కువగా ఉన్నాయి, కావాలని లూటీలు, దహనాలు చేశారు.రాజకీయాల నుంచి మతాన్ని విడదీసి చూడాల్సిన అవసరం ఉంది, నిజమైన విచారణ వాస్తవాలను వెల్లడించుతుంది. సమగ్రమైన విచారణ జరపకుండా ఫలానా సంస్థ లేదా పార్టీ దీని వెనుక ఉందనే నిర్ధారణలకు రాలేము. ఇదీ ఇండియా టుడే పేర్కొన్న అంశాల సారం. మతపరమైన దాడులు ఎన్ని, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎన్ని అత్యాచారాలు జరిగాయనే అంకెలు తీవ్రతను వెల్లడిస్తాయి తప్ప ఒక్క ఉదంతమైనా తీరని నష్టం, తీవ్రంగా ఖండించాల్సిందే. అన్ని దేశాల్లో మతం, భాషా మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను బంగ్లాదేశ్‌లో మైనారిటీలు కూడా ఎదుర్కొంటున్నారు.


మన దేశంలో బిజెపి దానికి ముందు ఉన్న జనసంఘం, ఈ రెండు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరి కారణంగా మైనారిటీలు దూరంగా లేదా వ్యతిరేకంగా ఉన్నారు, వారి హక్కులు, భద్రత గురించి పట్టించుకుంటున్నకారణంగా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నారు.దాన్ని ముస్లిం సంతుష్టీకరణగా బిజెపి ఇప్పటికీ ప్రచారం చేస్తున్నది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులు అత్యధికులు అక్కడి నేషనల్‌ అవామీలీగ్‌ పార్టీ మద్దతుదార్లుగా ఉన్నారు. ఆ పార్టీ మద్దతుదార్లలో నాలుగోవంతు వారే అని చెబుతున్నారు, అంటే అవామీలీగ్‌ను కూడా హిందువులను సంతుష్టీకరించే పార్టీగా బిజెపి చిత్రిస్తుందా ? అవామీ లీగ్‌పై దాడులు, అరాచకం చెలరేగినపుడల్లా ఆ పార్టీలో ఉన్న హిందువుల మీద కూడా జరుగుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేనివారి మీద కూడా జరిగిన దాడులను చూస్తే ముస్లిం మతోన్మాదశక్తులు ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారన్నది స్పష్టం. ఇంట్లో ఆవు మాంసం ఉంది, గోవులను వధిస్తున్నారంటూ గోరక్షకుల ముసుగులో ఉన్న మతోన్మాదులు మనదేశంలో సామూహిక దాడులకు, హత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తిమ్మినిబమ్మినిగా చూపే వీడియోలు, వాట్సాప్‌ సమాచారం మనదేశంలో కుప్పలు తెప్పలుగా సృష్టిస్తూ బుర్రలు ఖరాబు చేసే పార్టీలు, సంస్థల గురించి తెలిసిందే.బంగ్లాదేశ్‌ కూడా దీనికి మినహాయింపు కాదు. అక్కడ జరగని ఉదంతాలను జరిగినట్లు ప్రచారం చేయటంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాటిలో కొన్నింటిని మన దేశంలోనే తయారు చేస్తున్నారట, అవాంఛనీయ శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం వైరల్‌ చేస్తున్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలించిన నిజ నిర్ధారకులు వాస్తవాలు కాదని తేల్చారు. దీని అర్ధం అసలు దాడులే జరగలేదు, హిందువులను నష్టపరచలేదని కానేకాదు.


మనదేశంలో ఉన్న కొన్ని సంస్థలకు చెందిన నిజ నిర్ధారకులు గతంలో అనేక తప్పుడు ప్రచారాల నిగ్గుతేల్చారు.వారికి రాజకీయ అనుబంధాలను అంటగడుతూ కాషాయ మరుగుజ్జుదళాలు జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూశాయి.మన దూరదర్శన్‌ మాదిరి జర్మనీ ప్రభుత్వ మీడియా సంస్థ డ్వట్చ్‌ విలా. దీన్ని పొట్టి రూపంలో డిడబ్ల్యు అని కూడా పిలుస్తారు. దానికి కూడా దురుద్ధేశ్యాలను ఆపాదిస్తే ఎవరూ చేసేదేమీ లేదు. వైరల్‌ కావించిన అంశాలను లక్షలాది మంది చూశారు, ఇతరులతో పంచుకున్నారు. వీటిలో బంగ్లాదేశ్‌ హిందూ క్రెకెటర్‌ లిటన్‌ దాస్‌ ఇంటిని తగుల పెట్టారు అన్నది ఒకటి. దుండగులు జరిపిన దాడుల్లో దహనం చేసిన ఆ ఇల్లు మాజీ క్రికెటర్‌ మష్రఫీ మోర్తజాది తప్ప లిటన్‌దాస్‌ది కాదు అని తేలింది. ఫొటో లిటన్‌దాస్‌ది,ఇల్లు అతనిది కాదు.మోర్తజా రాజకీయంగా హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌ కార్యకలాపాల్లో పాల్గొనటం, ఇటీవలి ఎన్నికలు, అంతకు ముందు కూడా ఆ పార్టీ ఎంపీగా గెలవటం అతని ఇంటిని తగులబెట్టటానికి కారణంగా తేలింది. హిందూ మహిళలపై అత్యాచారాలు, వేధింపులు అంటూ మరోరెండు ఉదంతాలను వైరల్‌ చేశారు. అవి తాజా సంఘటనలు కాదు, వాటిని కూడా అసందర్భంగా జత చేసినట్లు తేలింది.. హిందూ మహిళ లోదుస్తులను ప్రదర్శిస్తున్న ముస్లిం పురుషుల దృశ్యాలను పోస్టు చేస్తూ హిందు బాలికల బ్రాలను తొలగించారని అత్యాచారం చేసిన తరువాత వాటిని ప్రదర్శించి తమ మగతనాన్ని ప్రదర్శించుకున్నారని వ్యాఖ్యానాలు జోడించారు.నిజానికి ఆ వీడియో దృశ్యం,దానిలో కనిపించిన దుస్తులు మాజీ ప్రధాని షేక్‌ హసీనా దేశం వదలి వెళ్లిన తరువాత ఆమె నివాసంలో ప్రవేశించిన వారు చేసిన అరాచకంలో భాగం, అవి మీడియాలో ప్రచురించిన, టీవీలలో చూపించినవిగా తేలింది. అత్యాచారానికి గురైన హిందూ మహిళంటూ వైరల్‌ ఆయిన ఫొటోల బండారాన్ని కూడా జర్మన్‌ టీవీ బయటపెట్టింది. వాటిలో ఒక చిత్రంలో ఉన్న మహిళ 2023లో మణిపూర్‌లో హిందూ పురుషులు అపహరించి, సామూహిక అత్యాచారం చేసిన ఒక క్రైస్తవ యువతిగా తేలింది. మరొక చిత్రం 2021లో ఇండోనేషియాలో వైరల్‌ అయింది. ఐదుగురు బంగ్లాదేశీయులు ఇండోనేషియా వలస మహిళను చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసినట్లు దానిలో పేర్కొన్నారు. దాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందూ మహిళలపై అత్యాచారంగా చిత్రించారు. మరొక వీడియో అత్యాచారం చేసినట్లుగా వైరల్‌ అయింది. అది బెంగలూర్‌ రామ్మూర్తినగర్‌లో 2021వ సంవత్సరం మే నెలలో జరిగిన అత్యాచార ఉదంతంలో ముగ్గురు మహిళలతో సహా పన్నెండు మంది బంగ్లా జాతీయులను అరెస్టు చేసిన వీడియోగా మన దేశానికి చెందిన వెబ్‌సైట్‌ బూమ్‌ తేల్చింది. ఇలా సామాజిక మాధ్యమంలో తిప్పుతున్న వీడియో, ఫొటోలను గుడ్డిగా నమ్మించి భావోద్రేకాలను రెచ్చగొట్టేందుకు పనిగట్టుకు చేస్తున్నవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు వాదనలపై హేతుబద్దంగా ఆలోచించాలి. ఎవరు దాడులకు పాల్పడినా ఖండించాలి, నిరసించాలి. దానికి సరిహద్దులు ఎల్లలూ ఉండనవసరం లేదు. మతం కళ్లద్దాలు తొలగించి మానవత్వ అద్దాలను పెట్టుకోవాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రష్యాపై ఉక్రెయిన్‌ ఎదురుదాడి : వెనక్కి కొడుతున్న పుతిన్‌ సేనలు !

14 Wednesday Aug 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Russia-Ukraine War, Ukraine crisis, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


ఉక్రెయిన్‌పై 2022లో రష్యా ప్రారంభించిన సైనిక చర్యకు 900 రోజులు పూర్తయ్యాయి.తాజా పరిణామం ఏమంటే తమ సేనలు రష్యాలోని కురుస్క్‌ ప్రాంతంలో వెయ్యిచదరపు కిలోమీటర్ల మేరకు ఆక్రమించుకున్నట్లు జెలెనెస్కీ ప్రకటించాడు.విస్తీర్ణం ఎంత అనేదాని మీద భిన్న కథనాలు వచ్చాయి. తమ భద్రత కోసమే ఈ దాడులన్నాడు. రష్యా ప్రభుత్వం అక్కడి జనాభాను ఇతర ప్రాంతాలకు తరలించింది. బుధవారం నాడు వెలువడిన వార్తల ప్రకారం చొచ్చుకు వచ్చిన ఉక్రెయిన్‌ సేనలను వెనక్కు కొట్టేందుకు రష్యా పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించింది. తాము అక్కడ తిష్టవేసేందుకు దాడులకు దిగలేదని, న్యాయమైన శాంతి ప్రతిపాదనలతో రష్యా ముందుకు వస్తే వెనక్కు పోతామని జెలెనెస్కీ ప్రకటించినట్లు కూడా సమాచారం. అంతకు ముందు తగిన శాస్తి అనుభవించటానికి ఉక్రెయిన్‌ సిద్దంగా ఉండాలని రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించాడు. ఇప్పటి వరకు ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్‌ తన బలాలన్నింటినీ కూడగట్టుకొని ఈ దాడి ద్వారా సాధించేదేమిటి, ఆక్రమించుకున్న ప్రాంతాలను ఎంతకాలం నిలుపుకుంటుంది అన్నది ఒక ప్రశ్న. ఈ పరిణామం సంక్షోభ తీరుతెన్నులనే మార్చివేసిందా అన్న రీతిలో మథనం జరుగుతోంది. కొందరు వర్ణిస్తున్నట్లు నాటకీయంగా, ఆకస్మికంగా జరిగిన ఈ దాడితో రష్యా ఆశ ్చర్యపోయిందా ? ఏ మాత్రం పసిగట్టలేదా ? ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున సిబ్బందిని, సాయుధ వాహనాలను తరలిస్తున్నట్లు రష్యా మిలిటరీ ప్రకటించింది. నలభై కిలోమీటర్ల వెడల్పున పన్నెండు కిలోమీటర్ల మేరకు ఉక్రెయిన్‌ సేనలు చొచ్చుకొని వచ్చాయని 28 జనావాసాలు ఆ ప్రాంతంలో ఉన్నట్లు మొత్తం లక్షా 80వేల మంది పౌరులకు గాను లక్షా 21 వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించినట్లు కురుస్క్‌ గవర్నర్‌ సోమవారం నాడు ప్రకటించాడు. ఉక్రెయిన్‌ సేనల నష్టాలు పెరుగుతున్నాయని, పోరుకు సిద్దంగా ఉన్న దళాలన్నింటినీ జెలెనెస్కీ సరిహద్దులకు తరలిస్తున్నాడని, తగిన శాస్తి అనుభవిస్తారని పుతిన్‌ టీవీ ప్రసంగంలో చెప్పాడు. అయితే కురుస్క్‌ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఉక్రెయిన్‌ భూభాగంలో ఉన్న జనాన్ని కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.ప్రస్తుతం ఐరోపాలో అతి పెద్దదైన ఉక్రెయిన్‌ జపోర్‌ఝియా అణువిద్యుత్‌ కేంద్రం రష్యా అదుపులో ఉంది. మూతపడి ఉన్న ఆ కేంద్రంలో మంటలు చెలరేగాయి. దానికి కారకులు మీరే అంటూ ఉక్రెయిన్‌-రష్యా పరస్పరం ఆరోపించుకున్నాయి. అయితే ఎలాంటి అణుధూళి వెలువడలేదని. మంటలను ఆర్పివేసినట్లు వార్తలు.మరోవైపున ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్రిక్తతలు సడలటానికి మూడు సూత్రాలను పాటించాలని ఈ వివాదంలో తటస్థంగా ఉన్న చైనా సూచించింది.యుద్ద రంగాన్ని విస్తరించకుండా,పోరు మరింతగా దిగజారకుండా చూడటంతో పాటు ఏ పక్షమూ మంటను ఎగదోయవద్దని పేర్కొన్నది. తాము ఏ పక్షానికీ మారణాయుధాలను అందించటం లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పాడు.


తనకు వ్లదిమిర్‌ పుతిన్‌,ఉత్తర కొరియా నేత కిమ్‌ బాగా తెలుసునని, వారిద్దరూ ఎంతో హుందా అయిన వారని, ఉక్రెయిన్‌ పోరుకు కారకుడు అధ్యక్షుడు బైడెన్‌ అని డోనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఆరోపించాడు. అతను గెలిచి ఉండకపోతే పోరు వచ్చేదే కాదన్నాడు. ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుతిన్‌తో తనకు బలమైన సంబంధాలున్నందున తానైతే వివాదాన్ని నివారించి ఉండేవాడినని మరోమారు అన్నాడు.ట్రంప్‌ చెప్పింది నిజమే అని ఎలన్‌ మస్క్‌ అన్నాడు. ఉక్రెయిన్‌ మీద దాడి చేయవద్దని, అది నీవల్ల కాదని తాను పుతిన్‌తో చెప్పానని అయితే తనకు మరొక మార్గం లేదని అన్నాడని, కాదు మార్గం ఉందని తాను చెప్పినట్లు ట్రంప్‌ వెల్లడించాడు.తాను ఎన్నికైతే అధికారం చేపట్టక ముందే 24 గంటల్లో వివాదాన్ని పరిష్కరిస్తానని కూడా పునరుద్ఘాటించాడు.తాను ఎన్నికైతే ఉక్రెయిన్‌కు సాయం కొనసాగిస్తాననే హామీ ఇవ్వలేనని గతేడాది మేనెలలోనే ట్రంప్‌ బహిరంగంగా చెప్పాడు. క్రిమియా, డాన్‌బాస్క్‌ ప్రాంతాలను రష్యాకు అప్పగిస్తే వెంటనే సైనిక చర్య ముగుస్తుందని ప్రైవేటు సంభాషణల్లో ట్రంప్‌ చెబుతున్నాడు.


తమకు పూర్తి స్థాయిలో గగనతల రక్షణ వ్యవస్థలను అందించాలని మిత్రదేశాలకు జెలెనెస్కీ విజ్ఞప్తి చేశాడు.పోరు దీర్ఘకాలం సాగుతుందని, కష్టతరంగా ఉంటుందని ఉక్రెయిన్‌ మాజీ మిలిటరీ అధికారి ఒకడు చెప్పాడు.రష్యా ప్రాంతంపై జరుగుతున్నదాడిలో తొమ్మిది అంతస్తుల భవనం మీద పడిన ఉక్రెయిన్‌ క్షిపణి కారణంగా 13 మంది గాయపడినట్లు తప్ప ప్రాణ నష్టం గురించి ఇంతవరకు ఇతరంగా వార్తలు రాలేదు. తాము నాలుగు ఖండాంతర క్షిపణులను, 14డ్రోన్లను కూల్చివేయటంతో పాటు చొరబాటును నిలువరించినట్లు రష్యా ప్రకటించింది.సైనిక చర్య ప్రారంభమైన తరువాత తమ గడ్డపై కొన్ని సందర్భాల్లో ఎదురుదాడులు చేసినా రష్యా భూభాగంపై దాడికి దిగటం ఇదే ప్రధమం. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని ఐదోవంతు ప్రాంతం రష్యా లేదా దాని అనుకూల శక్తుల ఆధీనంలో ఉంది. దాన్ని విడిపించుకొనేందుకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మెల్లమెల్లగా కొత్త ప్రాంతాలను రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఉక్రెయిన్‌ మౌలిక సదుపాయాలను దెబ్బతీసి వెన్ను విరుస్తున్నది.అమెరికా, ఇతర నాటో దేశాలు అందిస్తున్న వందల కోట్ల డాలర్లు, టన్నుల కొద్దీ ఆయుధాలు దేనికీ కొరగాకుండా పోతున్నాయి. ఆగస్టు ఐదవ తేదీ నుంచి జెలెనెస్కీ సేనలు దాడులను ప్రారంభించినప్పటికీ రష్యన్లు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. వ్యూహాత్మకంగా రానిచ్చారా, పసిగట్టలేకపోయారా లేక తగిన సన్నాహాలు లేవా ? బాగా లోపలకు రానిచ్చి చుట్టుముట్టాలన్న ఎత్తుగడ కూడా ఉందంటున్నారు. గతేడాది అక్టోబరులో చీమ చిటుక్కుమన్నా పసిగట్టే యంత్రాంగం, నిఘావున్న ఇజ్రాయెల్‌ కూడా ఇనుపకంచెను బద్దలు కొట్టి తమ భూభాగంలోకి వచ్చి దాడి చేయటం, అనేక మందిని హతమార్చి, కొందరిని బందీలుగా పట్టుకుపోయిన హమస్‌ సాయుధుల చర్యలను పసిగట్టలేకపోవటాన్ని చూశాము. ఇప్పటికీ ఎలా జరిగిందో చెప్పలేకపోతున్నది. దీని అర్ధం ఇజ్రాయెల్‌ మిలిటరీ కంటే హమస్‌ గొప్పదనా ? అలాగే రష్యన్లు ఆదమరచి ఉన్న సమయంలో ఉక్రెయిన్‌ కూడా ఈ దాడికి పాల్పడి ఉండవచ్చు. పెద్దగా ఆయుధాలు లేని కాపలాదారులు, పదాతి దళాలు తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని గతంలో మాదిరి చిన్న చిన్న బృందాలకు బదులు భారీ సంఖ్యలో వారం రోజుల క్రితం పలు వైపుల నుంచి మెరుపుదాడులు చేసినట్లు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో డ్రోన్లతో పదివేల మంది సైనికులు ఈ దాడిలో పాల్గొన్నట్లు, రష్యన్‌ డ్రోన్లను పనికిరాకుండా చేసినట్లు పరిశీలకులు చెబుతున్నారు. యుద్ద విమానాలు, హెలికాప్టర్లతో దాడిని నిలువరించినట్లు, నాలుగు రోజుల్లో 945 మంది ఉక్రెయిన్‌ సైనికులను హతమార్చినట్లు రష్యా చెబుతున్నది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య 1,974కిలో మీటర్ల భూ, 321కిలో మీటర్ల సముద్ర సరిహద్దు ఉంది. ఇంతపొడువునా సేనలను మోహరించటం ఏ దేశానికీ సాధ్యం కాదు.ఈ కారణంగానే కేంద్రీకరణ తక్కువగా ఉన్న కురుస్క్‌ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతం మాస్కోకు 530కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడ్య రష్యానుంచి ఐరోపాకు సరఫరా చేసే సుదఝా సహజవాయు పంప్‌ స్టేషన్‌ తప్ప ఇతరంగా ముఖ్యమైనవేవీ లేవు.దాన్ని ముట్టడించేందుకు ఉక్రెయిన్‌ చూస్తున్నది.


ఉక్రెయిన్‌ దాడితో ఏం జరిగింది ? ఏం జరగనుందన్నది చర్చ.ఉక్రెయిన్‌లోని డాంటెస్క్‌ ప్రాంతంపై కేంద్రీకరించి ముందుకు సాగుతున్న రష్యా సహజంగానే తన బలగాలను కురుస్క్‌వైపు కేంద్రీకరిస్తుంది. రష్యా మిత్రదేశమైన బెలారస్‌ మిలటరీ ఉక్రెయిన్‌తో ఉన్న తమ సరిహద్దులో బలగాలను కేంద్రీకరిస్తున్నట్లు సంకేతాలు పంపింది. కురుస్క్‌ మీద దాడి సందర్భంగా ఉక్రెయిన్‌ తమ గగనతలాన్ని అతిక్రమించిందని బెలారస్‌ నేత అలెగ్జాండర్‌ లుకషెంకో పేర్కొన్నాడు. తమ దళాలు అనేక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు కూడా చెప్పాడు.ఇది తమను రెచ్చగొట్టటం తప్ప మరొకటి కాదని, తిప్పికొడతామని రక్షణ మంత్రి ప్రకటించాడు. అంటే జెలెనెస్కీ సేనలు పూర్తిగా రష్యా మీద కేంద్రీకరించటం సాధ్యం కాదు. ఇది కూడా రష్యా ఎత్తుగడల్లో భాగమే అన్నది స్పష్టం.ఎవరి తురుపు ముక్కలను వారు ప్రయోగిస్తారు, యుద్దంలో ఏదైనా జరగవచ్చు. తాజా దాడి రష్యాతో బేరసారాలాడేందుకు జెలెనెస్కీ వేసిన ఎత్తుగడగా కూడా కొందరు వర్ణిస్తున్నారు. సోమవారం నాడు పుతిన్‌ కూడా అదే చెప్పాడు. శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో తన పశ్చిమ దేశాల యజమానుల సాయంతో పరిస్థితిని మెరుగుపరచుకొనే ఎత్తుగడ ఇది అన్నాడు. ఒక వేళ ఉక్రెయిన్‌ పరాభవం పాలైతే దానికి కొత్తగా పోయేదేమీ లేదు.రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపా గడ్డ మీద 900 రోజులు సాగిన మిలిటరీ చర్య లేదా యుద్ధం ఇది తప్ప మరొకటి లేదు. రష్యాను ఓడించేందుకు మనమెందుకు ఉక్రెయిన్‌కు సాయం చేయాలి, దాని వలన మనకొచ్చే లాభం ఏమిటన్న ప్రశ్న అమెరికాలో తలెత్తుతున్నది. నవంబరులో జరిగే అధ్యక్ష, ఇతర ఎన్నికల్లో ఈ అంశాన్ని ముందుకు తెచ్చి లబ్ది పొందేందుకు రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. ట్రంపు గెలిస్తే తాము మునిగినట్లే అని ఉక్రెయిన్‌ భయపడుతున్నది.డెమోక్రాట్లు గెలిచినా ఎంత మేరకు, ఎంతకాలం మద్దతు ఇస్తారన్నది సందేహమే. ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదన్నది రష్యా ప్రధానమైన షరతు. దానికి అమెరికా, ఇతర నాటో దేశాలు ససేమిరా అంటున్నాయి. రష్యా సైనిక చర్యవెనుక ఉన్న కీలక అంశమిదే. క్రిమియాతో పాటు స్వాతంత్య్రం ప్రకటించుకున్న, రష్యా ప్రభావంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ తమకు అప్పగించి సార్వభౌమత్వానికి హామీ ఇవ్వాలని ఉక్రెయిన్‌ కోరుతున్నది. యుద్ధ సమయంలో శత్రు సంహరణకంటే ముందు నిజం చచ్చిపోతుంది. రష్యా మిలిటరీ చర్య ప్రారంభించిన నాటి నుంచి పశ్చిమదేశాల మీడియా ప్రచారం అంతా పుతిన్‌ సేనల ఓటమి ఈ క్షణమో మరో క్షణంలోనో జరగబోతోదని గత 900 రోజులుగా చెబుతూనే ఉంది. అదే మాదిరి పుతిన్‌ కూడా కొద్ది రోజుల్లోనే జెలెనెస్కీని తన కాళ్ల వద్దకు రప్పించుకుంటానని చెప్పాడు. రెండూ జరగలేదు. దాడుల పద్దతులు, ఎత్తుగడలూ మారాయి.ఇంతవరకు ఎటువైపు ఎంత మంది మరణించిందీ ఎవరూ నిజం చెప్పటం లేదు.కురుస్క్‌ ప్రాంతం నుంచి ఈ ఏడాది తమ మీద రెండువేల సార్లు వైమానిక దాడులు జరిపినట్లు ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌ తాజా దాడితో పెను మార్పులు వచ్చే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భిన్న వైఖరులు : నాడు దలైలామా – నేడు షేక్‌ హసీనా, కొన్ని వాదనలు, కుట్ర సిద్దాంతాలు ! అమెరికాను చూసి నరేంద్రమోడీ భయపడుతున్నారా !!

11 Sunday Aug 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA, Women

≈ Leave a comment

Tags

Bangladesh liberation struggle, BJP, BNP, China, cia, coup against Sheikh Hasina, Narendra Modi Failures, pakistan, RSS


ఎం కోటేశ్వరరావు


జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన తప్పిదాలు అన్నిన్ని కావు అన్నీ అతనే చేశాడు అంటూ బొమ్మరిల్లు డైలాగులతో బిజెపి నేతలు, కాషాయదళాల నిత్యపారాయణంలో దలైలామాకు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన అంశం ఎక్కడా వినిపించదు, రాతల్లో కనిపించదు. మిగతా అన్ని విషయాల్లో తప్పు చేసి నెహ్రూ ఒక్క దీనిలోనే మంచి చేశారా ?చేస్తే ఆ విషయం ఎందుకు చెప్పరు అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా ? షేక్‌ హసీనా ! బంగ్లా ప్రధానిగా ఆమె పదవీ కాలంలో మనదేశానికి ఇబ్బందులు కలిగించినట్లు ఎవరూ చెప్పలేరు. ఆమె ప్రత్యర్థి బంగ్లానేషనలిస్టు పార్టీ(బిఎన్‌పి), దానికి వెన్నుదన్నుగా జమాతే ఇస్లామీ అనే మతోన్మాద సంస్థ మన దేశానికి వ్యతిరేకమని ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. అఫ్‌కోర్స్‌, వారు అసలు బంగ్లాదేశ్‌ విముక్తికే వ్యతిరేకులు, అమెరికా సప్తమనౌకా దళాన్ని బంగాళాఖాతంలోకి రప్పించి విముక్తి పోరాటాన్ని అణచేందుకు, దానికి వెన్నుదన్నుగా ఉన్న భారత్‌ను బెదిరించేందుకు చూసిన చరిత్ర జగమెరిగినదే. టిబెట్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించి చైనా మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు రాజకీయ ఆశ్రయం కల్పించటమే గాక హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు నాటి ప్రధాని నెహ్రూ ఎంతగానో సహకరించారు.మిలిటరీ కుట్ర కారణంగా షేక్‌ హసీనా 2024 ఆగస్టు ఐదవ తేదీన మనదేశానికి వచ్చి ఆశ్రయం పొందారు. ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ వద్ద ఉన్న వైమానిక స్థావరంలో ఆమె ఉన్నారు. ఇది రాస్తున్న సమయానికి ఆమె శరణార్ధిగా లేదా రాజకీయ ఆశ్రయం పొందిన వ్యక్తిగా గానీ లేరు. కేవలం వీసా మీద వచ్చిన ఒక సాధారణ బంగ్లా పౌరురాలిగా మాత్రమే ఉన్నారు. అలా ఎన్ని రోజులు ఉంటారు ? వీసా గడువును పొడిగిస్తారా ? నరేంద్రమోడీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. బంగ్లాదేశ్‌ పరిణామాల గురించి మీడియా, సామాజిక మాధ్యమంలో అనేక అంశాలు చక్కర్లు కొడుతున్నాయి.కుట్ర సిద్దాంతాలను వండి వారుస్తున్నారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయం సరేసరి. పక్కనే ఉన్న దేశంలో జరిగే పరిణామాలు మన మీద అనుకూలంగానో ప్రతికూలంగానో ప్రభావం చూపుతాయి. అందునా ఇరుగు పొరుగుదేశాలన్నీ మనకు దూరంగా జరుగుతున్న తీరు తెలిసి కూడా మన జేమ్స్‌బాండ్‌ అజిత్‌ దోవల్‌ ఏం చేస్తున్నట్లు అన్న ప్రశ్న తలెత్తుతోంది. పసిగట్టి హసీనాను హెచ్చరించినట్లు, లేదని గానీ వార్తలు రాలేదు. ఎందుకు అంటే మన నేతలందరూ ఎన్నికల్లో నిమగమైనట్లు కొందరు వారి తరఫున సంజాయిషీ ఇస్తున్నారు. అంటే ఎన్నికల్లో బిజెపి లబ్దికోసం చూడటం తప్ప దేశం ఇరుగుపొరుగున ఏం జరిగినా పట్టదా ? ఎవరి పని వారు చేయాలి. ఎక్కడో మన ”రా” ఏజంట్లు మన వ్యతిరేకులను లేపేశారంటే ఎంత గొప్పో అని పొగిడేవారు, ఇప్పుడా ఏజంట్లు బంగ్లాదేశ్‌లో ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగారా ?దేశం సురక్షితమైన నరేంద్రమోడీ చేతుల్లో ఉందని, అమెరికాను సైతం మెడలు వంచగల విశ్వగురువుగా భావించేవారు, పొగిడేవారు గానీ ఇప్పుడేం చెబుతారు ?


టిబెట్‌ చరిత్రను చూసినపుడు అది చైనాలో భాగంగా ఉన్న సామంత రాజ్యంగా(మన దేశంలో నిజాం హైదరాబాదు సంస్థానం మాదిరి) ఉంది తప్ప స్వతంత్రదేశంగా ఎన్నడూ లేదు. చైనాలో ఒక స్వయం పాలిత ప్రాంతం. బౌద్దంలో లామా అంటే గురువు లేదా బోధకుడు. కేంద్రంగా ఉండే దలైలామా చైనా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రాక ముందు టిబెట్‌లో లామాల మార్గదర్శనంతో పాలనా వ్యవహారాలు సాగేవి. తరువాత ఆ పాలన స్థానంలో పౌరపాలనా వ్యవస్థ ఏర్పాటుకు 14వ దలైలామాతో సంప్రదించి 1951లో 17 అంశాలతో కూడిన ఒప్పందానికి చైనా కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఆ క్రమం పూర్తిగాక ముందే 1959లో 14వ దలైలామా తిరుగుబాటు ప్రకటించటం, దాన్ని చైనా ప్రభుత్వం అణచివేయటం అదే ఏడాది ఏప్రిల్‌ 18న అమెరికా సిఐఏ పర్యవేక్షణ, భారత ప్రభుత్వ సహకారంతో నేటి అసోంలోని తేజ్‌పూర్‌ దగ్గర మనదేశంలోకి వచ్చాడు. అమెరికా,బ్రిటన్‌ ఏజంట్లు ఒక పధకం ప్రకారం వ.ునదేశానికి చేర్చారు. రాజకీయ ఆశ్రయం ఇప్పించారు. 1956లోనే దలైలామా మన బుద్ద జయంతి కార్యక్రమం పేరుతో మనదేశం వచ్చి ఒకవేళ కోరితే తనకు రాజకీయ ఆశ్రయం ఇస్తారా అని నెహ్రూను అడగ్గా చైనాతో ఉన్న సంబంధాల రీత్యా అది కుదరదని సున్నితంగా తిరస్కరించారు. అయితే మూడు సంవత్సరాల తరువాత అదే నెహ్రూ ఎందుకు అంగీకరించారంటే సిఐఏ తెచ్చిన వత్తిడికి లొంగారన్నది స్పష్టం. అతనేమీ దేశాధినేత కాదు, మనదేశంతో రాజకీయంగా, అధికారికంగా ఎలాంటి సంబంధాలు లేవు.షేక్‌ హసీనా వచ్చిన నేపధ్యం భిన్నం. విద్యార్థుల ఆందోళన ముసుగులో అక్కడి మిలిటరీ దేశం వదలి వెళ్లాలని ఆదేశించటం, వారే ఒక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసి మన దేశానికి పంపించారు.(గతంలో లాటిన్‌ అమెరికాలోని హొండూరాస్‌లో అధ్యక్షుడు జెలయా మీద తిరుగుబాటు చేసిన మిలిటరీ జెలయాతో పాటు నిద్ర మంచాల మీద ఉన్న భార్యను కూడా బలవంతంగా తీసుకువెళ్లి పక్కనే ఉన్న కోస్టారికా అనేదేశంలో వదలి వచ్చారు)మానవహక్కులు, ప్రజాస్వామ్యం పేరుతో నాడు దలైలామాకు ఆశ్రయం ఇవ్వటాన్ని సమర్ధించే బిజెపి ఇప్పుడు మనదేశానికి మిత్రురాలిగా ఉన్న హసీనాకు అలాంటి ఏర్పాటుకు ఎందుకు తటపటాయిస్తున్నట్లు ?


హసీనా ప్రజాస్వామ్యాన్ని అణచి ప్రతిపక్షాలను వేధించారని ఆలాంటి వ్యక్తికి ఆశ్రయం ఎందుకు ఇవ్వాలని కొందరు వాదిస్తున్నారు. నిజమే, అది వారి అంతర్గత వ్యవహారం.మన దేశం ఎవరికీ రాజకీయ ఆశ్రయం కల్పించలేదా ? జోక్యం చేసుకోలేదా ? 1971లో బంగ్లాదేశ్‌ విముక్తికి మన మిలిటరీని నడిపాము. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. గయూమ్‌ కోరిక మేరకు ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపర్లను నేరుగా మాల్దీవుల్లో దించి మనదేశం కుట్రను విఫలం గావించింది. అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అబ్దుల్‌ గయూమ్‌ ప్రజాస్వామిక స్వేచ్చకు తిలోదకాలిచ్చి 2008లో ఓడిపోయే వరకు పదవిలో కొనసాగాడు. అతడి మీద జరిగిన కుట్రను భారత్‌ అడ్డుకొని అధికారంలో కొనసాగించింది. తరువాత అధ్యక్షుడు నషీద్‌ మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్‌ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. దీన్ని ఎలా చూడాలి ? దలైలామా పాలనలో ఫ్యూడల్‌ శక్తులు టిబెటన్లను అణచివేసిన తీరు ప్రపంచానికి, మనదేశానికి తెలియదా ? ఏ దలైలామా ఏలుబడిలోనైనా అక్కడసలు ఎన్నికలు, ప్రజాస్వామిక పౌరపాలన ఉందా ? లేనపుడు దలైలామాకు ఆశ్రయం ఇవ్వటాన్ని బిజెపి ఇతర శక్తులు ఎలా సమర్థిస్తున్నట్లు ? అందువలన ఆ కారణం తర్కానికి నిలవదు. దలైలామా కమ్యూనిస్టులను ఎదిరించాడు గనుక మనదేశంలో ఉన్న కొన్ని శక్తులకు కమ్యూనిజం, చైనా అంటే వ్యతిరేకత గనుక మన శత్రువు శత్రువు మనకు మిత్రుడన్నట్లుగా దలైలామాకు ఆశ్రయం ఇచ్చారని చెబుతారా ? ఆ చర్యతో చైనాతో అదనపు తగాదా కొని తెచ్చుకోవటం తప్ప మనదేశానికి ఒరిగిందేమైనా ఉందా ? ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న శక్తులు మనదేశానికి మిత్రులా ? వారిని మన ప్రభుత్వం సమర్థిస్తున్నదా ? అక్కడ మతశక్తులు రెచ్చిపోయి మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద దాడులు చేస్తున్నారని, దేవాలయాలను కూల్చివేస్తున్నారని బిజెపి అనుకూల శక్తులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అవి చేసింది ఎవరు ? హసీనాను వ్యతిరేకించే, మనదేశాన్ని శత్రువుగా చూసే శక్తులే ? హసీనా ఏలుబడిలో అలాంటి ఉదంతాలేమీ లేవు గనుక ఆమెకు మద్దతు ఇచ్చి ఒక మంచి సందేశాన్ని మోడీ ఎందుకు పంపలేకపోతున్నారు ?


బంగ్లాదేశ్‌లో పాలకులను మార్చి భారత పలుకుబడిని తగ్గించాలని పాకిస్తాన్‌, చైనా చూస్తున్నదని దానిలో భాగంగా హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన వెనుక వాటి హస్తం ఉందని, బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ, జమాతే ఇస్లామీ విద్యార్థి విభాగంతో చేతులు కలిపియాన్నది ఒక కథనం. వాటికి నిర్దిష్ట ఆధారాలు లేకపోయినా నడుస్తున్న భూ భౌతిక రాజకీయాలను చూసినపుడు ఈ కోణాన్ని చూడాలని చెబుతున్నారు. వాస్తవం ఏమిటి ? తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల వెనుక పాక్‌ హస్తం ఉందని తరచూ హసీనా గతంలో బహిరంగంగానే ప్రకటించించారు గాని చైనా గురించి అలాంటివేమీ లేవు. చైనా వైపు మొగ్గుచూపుతున్న కారణంగా ఆమె ప్రభుత్వాన్ని కూల్చివేశారని మరొక విశ్లేషణ. తొలిసారిగా బంగ్లాదేశ్‌తో కలసి చైనా మిలిటరీ విన్యాసాలు జరపాలని నిర్ణయించటం భారత్‌, అమెరికాలకు ఆందోళన కలిగించిందన్నది ఒక అంశం.(2009 నుంచి 2023వరకు హసీనా ఏలుబడిలో భారత్‌-బంగ్లాదేశ్‌ మిలిటరీ సంయుక్త విన్యాసాలు పదకొండుసార్లు జరిగాయి. వీటిని చైనా తనకు వ్యతిరేకం అని భావించి ఉంటే బంగ్లాదేశ్‌లో భారీమొత్తాలను పెట్టుబడులుగా పెడుతుందా ?) అంతే కాదు కాక్స్‌బజార్‌ ప్రాంతంలోని పెకూ వద్ద ఒక జలాంతర్గామి కేంద్రాన్ని నిర్మించేందుకు హసీనా సర్కార్‌ చైనాకు అనుమతివ్వటం,మింగ్‌ తరగతికి చెందిన రెండు జలాంతర్గాములను బంగ్లాదేశ్‌ కొనుగోలు చేయటం మీద కూడా అమెరికా ప్రతికూలంగా స్పందించింది. దీనికి తోడు చైనా నుంచి ఇతర మిలిటరీ పరికరాలు, ఆయుధాలు కొనుగోలు చేయటం వంటి అంశాలను చైనా వైపు మొగ్గుచూపటంగా విశ్లేషకులు పేర్కొన్నారు. మరి అది నిజమైతే తాజా పరిణామాల వెనుక పాకిస్తాన్‌ హస్తం లేదా అమెరికా కుట్ర వుండవచ్చు తప్ప చైనా ఎందుకు ఉంటుంది ? రెండు దేశాల మధ్య 40బిలియన్‌ డాలర్ల విలువగల ఒప్పందాలు జరిగాయి, వాటిలో సగానికి పైగా పథకాలు నిర్మాణంలో ఉన్నపుడు హసీనాను కూలదోసి మరొకరిని గద్దెమీద కూర్చోపెట్టాల్సిన అవసరం చైనాకు ఉంటుందా ? చైనా తన భాగస్వామిని కోల్పోయిందని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది తప్ప భారత మిత్ర ప్రభుత్వాన్ని పోగొట్టుకుంది అనలేదు.


జూన్‌ నెలలో ధర్మశాలలో ఉన్న దలైలామాను అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ ప్రతినిధులు కలిశారు. ఇది చైనాకు ఆగ్రహం కలిగించినప్పటికీ మోడీ సర్కార్‌ ఖాతరు చేయలేదు.అధికారికంగా టిబెట్‌ను చైనా అంతర్భాగంగా గుర్తిస్తూనే దలైలామాకు మద్దతు ఇవ్వటం మనదేశం అనుసరిస్తున్న వైఖరి. ఇది అమెరికాను సంతుష్టీకరించటం తప్ప మరొకటి కాదు. ఇది నెహ్రూ నాటి నుంచి మోడీ వరకు కొనసాగుతూనే ఉంది. మతనేతగా ఆశ్రయం కల్పించామని చెబుతున్నప్పటికీ దలైలామా, అతగాడితో టిబెట్‌ నుంచి వచ్చిన వారు చేస్తున్నదంతా రాజకీయం, చైనా వ్యతిరేక కార్యకలాపాలు తప్ప వారు వచ్చి మనదేశంలో చేసే మత కార్యక్రమాలేమిటి ? వారు రాక ముందు మనదేశంలో బౌద్ద మత భిక్షువులు లేరా ? ఆరామాలు లేవా ? బంగ్లా పరిణామాల వెనుక నిజంగా పాక్‌ హస్తం ఉంటే హసీనాకు ఆశ్రయం కల్పించటానికి తటపటాయించాల్సిన అవసరం ఏమిటి ? పాకిస్తాన్‌ వైపు నుంచి వ్యతిరేక స్పందనను తట్టుకోలేమని భావిస్తున్నారా ? లేదూ చైనా హస్తమే ఉందని నమ్మితే దలైలామా ప్రవాస ప్రభుత్వాన్నే అనుమతించిన మనదేశం హసీనాకు కనీసం రాజకీయ ఆశ్రయమైనా ఎందుకు వెంటనే ప్రకటించలేదు ? అనేక మంది అనుమానిస్తున్నట్లు లేదా తాజాగా తన పతనం వెనుక అమెరికా హస్తం ఉందని ఆమె మన దేశంలో ఒక ప్రకటన ద్వారా గళం విప్పారు. అంటే ఇవన్నీ తెలిసే 56 అంగుళాల ఛాతీ ఉన్న నరేంద్రమోడీ అమెరికాకు భయపడుతున్నారా ? ఇలా ఆలోచించటం లేదా చర్చించటం, సందేహాన్ని వెలిబుచ్చటం దేశద్రోహమేమీ కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

హసీనా పతనం వెనుక అమెరికా ….. తాత్కాలిక సారధిగా నోబెల్‌ గ్రహీత యూనిస్‌ !

07 Wednesday Aug 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Bangladesh Elections 2024, China, cia, Coup In Bangladesh, Joe Biden, Sheikh Hasina


ఎం కోటేశ్వరరావు


ఆకస్మిక, అనూహ్య, నాటకీయ పరిణామాల మధ్య సోమవారం నాడు బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితికి తెరలేచింది. రాజీనామా కోరుతూ పెద్ద సంఖ్యలో జనం ప్రధాని షేక్‌ హసీనా నివాసం మీదకు దండెత్తటం,తరువాత పార్లమెంటుపై దాడి, దేశం విడిచిపోవాల్సిందిగా మిలిటరీ ఆదేశించటం, పదవికి రాజీనామా చేసి ఆమె మిలిటరీ హెలికాప్టర్‌లోనే సోదరితో కలసి ఢిల్లీ రావటం, మిలిటరీ చీఫ్‌ జనరల్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ తానే అధికారాన్ని చేపడుతున్నట్లు ప్రకటించటం అంతా కొద్ది గంటల్లోనే జరిగిపోయాయి. డెబ్బయ్యారు సంవత్సరాల షేక్‌ హసీనా వరుసగా జనవరిలోనే నాలుగవ సారి అధికారానికి వచ్చారు. ఏడాది కూడా గడవక ముందే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. పార్లమెంటును రద్దు చేసిన దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాడు.ప్రతిపక్ష నాయకురాలు బేగం ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేశారు. అవినీతి కేసులో 17 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్న 78 ఏండ్ల మాజీ ప్రధాని ఖలీదా అనారోగ్యంతో ప్రస్తుతం జైలు ఆసుపత్రిలో ఉన్నారు. హసీనా రాజీనామా తరువాత కూడా నిరసనలు కొనసాగాయి. ఇది రాసిన సమయానికి హసీనాకు ఏ దేశం రాజకీయ ఆశ్రయం ఇచ్చేది స్పష్టం కాలేదు.గతంలో జారీ చేసిన వీసాను అమెరికా రద్దు చేసింది. నిబంధనల సాకుతో బ్రిటన్‌ కూడా నిరాకరించినట్లు వార్తలు. తాత్కాలిక ప్రభుత్వ సారధిగా గ్రామీణ బాంకుతో దారిద్య్ర నిర్మూలనకు స్వల్ప మొత్తంలో రుణాలు ఇచ్చే మైక్రోక్రెడిట్‌ పథకంతో ముందుకు వచ్చి ప్రాముఖ్యత పొందిన మహమ్మద్‌ యూనిస్‌ను తాత్కాలిక ప్రభుత్వ సారధిగా నియమించారు.ప్రస్తుతం 83 ఏండ్ల వయస్సులో అదే యూనిస్‌, మరో 13మందిని రెండు నెలల క్రితం అవినీతి కేసులో దోషులుగా తేల్చి ఆరునెలల జైలు శిక్ష వేశారు,బెయిలు మీద ఉన్నాడు.తన టెలికాం కంపెనీ సిబ్బంది సంక్షేమ నిధులలో రెండు కోట్ల డాలర్లమేరకు విదేశాలకు తరలింపు, దుర్వినియోగం చేసినట్లు ఆరోపణ. అయితే తన మీద తప్పుడు కేసులు పెట్టినట్లు అంటున్నాడు.అతని మీద ఇంకా వందకేసులు ఉన్నాయి.తాజా పరిణామాల వెనుక ఏం జరిగిందనేది వెల్లడి కావాల్సి ఉంది.అమెరికా హస్తం ఉన్నట్లు చెబుతున్నారు.


అమెరికా సిఐఏ కుట్ర గురించి మీడియాలో వెలువడిన సమాచారం ప్రకారం పరిణామ క్రమం ఇలా ఉంది. బంగ్లాదేశ్‌లో తమ వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతిస్తే తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని ఒక తెల్లవాడు తెచ్చిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు హసీనా చెప్పిన అంశం మే 23న మీడియాలో వచ్చింది. తూర్పు తైమూరు మాదిరి చిట్టగాంగ్‌, మయన్మార్‌లో కొన్ని ప్రాంతాలతో కలిపి క్రైస్తవ దేశం ఏర్పాటుకు కుట్రలు జరుగుతున్నట్లు కూడా ఆమె చెప్పారు. తన తండ్రి మాదిరి తనను కూడా హతమార్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లను రద్దు చేస్తూ 2018లో హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ జూన్‌ ఐదున హైకోర్టు తీర్పు చెప్పింది.రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జూలై ఒకటిన విద్యార్థులు ఆందోళనకు దిగారు.జూలై 16 ఆందోళన హింసాత్మక రూపం తీసుకుంది.హసీనా ప్రభుత్వం ప్రకటించిన 30శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ ఐదుశాతానికి కుదించి సుప్రీం కోర్టు 21వ తేదీన తీర్పు చెప్పింది.దాంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.అయితే ఆగస్టు నాలుగున మాజీ మిలిటరీ ప్రధాన అధికారి ఇక్బాల్‌ కరీమ్‌ భుయాన్‌ అంతకు ముందు నిరసనకారుల మీద జరిపిన అణచివేతను ఖండించాడు.మిలిటరీని వెనక్కు పిలిపించాలని కోరాడు.నూతన మిలిటరీ అధికారి వాకర్‌ ఉజ్‌ జమాన్‌ నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తూ మిలిటరీ తటస్థంగా ఉండాలని చెప్పాడు.హసీనా రాజీనామా కోరుతూ ఐదవ తేదీన నిరసకారులు ఢాకా ప్రదర్శనకు పిలుపునిచ్చారు. అదే రోజు హసీనా రాజీనామా చేయాలని జమాన్‌ 45 నిమిషాల గడువు ఇచ్చాడు.దేశం వదలి వెళ్లేందుకు హెలికాప్టర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. దాన్ని అమెరికా స్వాగతించింది.
అనేక దేశాలలో సిఐఏ చేసిన కుట్రలో భాగంగా పరిణామాలన్నీ దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఏదో ఒక కరాణంతో నిరసన ప్రారంభం, అది కూడా విద్యార్థులతో చేయించటం. దానికి ముందు సిఐఏతో చేతులు కలిపిన మీడియా నిరసనకు అవసరమైన నేపధ్యాన్ని తప్పుడు ప్రచారం ద్వారా ఏర్పాటు చేయటం. తరువాత భద్రతా దళాలపై దాడి చేసి రెచ్చగొట్టి వాటిని రంగంలో దిగేట్లు చేయటం, బలప్రయోగం చేశారంటూ న్యాయవ్యవస్థ ద్వారా చెప్పించటం,ప్రజలకు సేవ పేరుతో తరువాత మిలిటరీ నిరసనలకు మద్దతు ప్రకటించటం, ప్రధాని లేదా అధ్యక్ష భవనాలు, పార్లమెంట్ల ముట్టడికి నిరసనకారులను అనుమతించటం. ఇదే పద్దతి శ్రీలంకలో అనుసరించారు. బంగ్లాదేశ్‌లో అదే జరిగింది. నిజానికి మన స్వాతంత్య్రానికి ముందే ఈశాన్య ప్రాంతంలో కుట్రద్వారా కొన్ని దేశాల ఏర్పాటుకు బ్రిటన్‌, సిఐఏ కుట్రలు చేసింది. ఇటీవలి సంవత్సరాలలో మన ఇరుగు పొరుగుదేశాలలో తన అనుకూల ప్రభుత్వాల ఏర్పాటుకు అమెరికా అనేక కుట్రలు చేసింది.


రద్దయిన పార్లమెంటులో 350కి గాను అవామీ లీగ్‌కు 306 స్థానాలున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బిఎన్‌పి), పరిమితమైన బలం కలిగిన కమ్యూనిస్టు, ఇతర వామపక్షాలతో కూడిన కూటమి, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికలను తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని, ప్రతిపక్షాల అణచివేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి.2018లో జరిగిన ఎన్నికల్లో 80.2, అంతకు ముందు 61.29శాతం ఓట్లు పోలుకాగా ఈ ఏడాది 41.8శాతమే నమోదైంది.జనం అసంతృప్తి వెల్లడైంది. పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కోసం సాగించిన పోరు ఫలించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఏర్పడింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగ బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కుమార్తె షేక్‌ హసీనా. 1975లో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్‌ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపివేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా, ఆమె సోదరి రెహనా, హసీనా భర్త ఎంఎ వాజెద్‌ మియా ఢిల్లీలో అణుశాస్త్రవేత్తగా పని చేస్తుండటతో అతను, వారి పిల్లలు కూడా హత్యా కాండ నుంచి తప్పించుకున్నారు. తొలుత వారు జర్మనీలో, తరువాత మనదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె ప్రవాసంలో ఉండగానే 1981లో అవామీ లీగ్‌ నేతగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆ తరువాత 1996 నుంచి 2001వరకు తొలిసారి ప్రధానిగా పని చేశారు.రెండవ సారి 2009లో బాధ్యతలు చేపట్టి సోమవారం నాడు రాజీనామా చేసేవరకు అదే పదవిలో కొనసాగారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఆమె మీద పందొమ్మిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినట్లు చెబుతారు. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా పేరుతెచ్చుకున్నారు. ముజిబుర్‌ రహమాన్‌ హత్య తరువాత మిలిటరీ నియంత జియావుర్‌ రహమాన్‌ అధ్యక్షుడిగా అధికారానికి వచ్చాడు. 1978లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు.1981లో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యాడు. తరువాత ఆ పార్టీకి భార్య ఖలీదా జియా నేతృత్వం వహించటమే కాదు, రెండుసార్లు ప్రధానిగా పని చేశారు.తాజా ఎన్నికలను బహిష్కరించారు. జియావుర్‌ రహమాన్‌ అధికారంలో ఉండగా ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు చూశాడు. బిఎన్‌పి మితవాద పార్టీ, దానికి జమాయతే ఇస్లామీ పార్టీ మద్దతు ఇస్తున్నది. మరో మిలిటరీ నియంత ఎర్షాద్‌ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో అతగాడిని గద్దె దించేందుకు షేక్‌ హసీనా-ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళనలు నిర్వహించారు. ఎర్షాద్‌ పదవి నుంచి దిగిన తరువాత ఇద్దరూ ప్రత్యర్దులుగా మారారు.


షేక్‌ హసీనా పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.కరోనా ముందు వరకు మెరుగ్గా కనిపించిన ఆర్థిక స్థితి తరువాత ఇప్పటి వరకు కోలుకోలేదు.దాంతో 470 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ధరలు ప్రత్యేకించి ఆహారద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.కరెన్సీ విలువను తగ్గించటంతో జనజీవితాలు అతలాకుతలమయ్యాయి. బంగ్లాదేశ్‌లో ఉన్న ఏకైక అణువిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించిన రష్యా రానున్న రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది. చైనా ఇస్తున్న అప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందని ప్రచారం చేశారు. ఇటీవలి కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావటమే దీనికి ప్రధాన కారణం. గంగోత్రి నుంచి ప్రారంభమైన గంగానదిని బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు. దాని మీద కట్టిన పెద్ద వంతెన నిర్మాణంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచబాంకు బహిరంగంగా ప్రకటించి నిధులు నిలిపివేసింది. బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా 2012లో 360 కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజధాని ఢాకాతో 21 జిల్లాలను అది అనుసంధానం గావించింది. బిఆర్‌ఐ పధకంలో చేరి విద్యుత్‌ కేంద్రాలు, రైల్వే లైన్లు,రోడ్లు, రేవులు, సొరంగాల వంటి పదిహేడు ప్రాజెక్టులకు రుణాలు పొందింది. అంతే కాదు, తనకు అవసరమైన ఆయుధాల్లో 74శాతం చైనా నుంచి పొందుతున్నది. పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతో లాభసాటిగా ఉండటమే చైనా పెట్టుబడుల వైపు మొగ్గుకు కారణం.


తన దారికి రాని దేశాల మీద మానవహక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కారణంగా కూడా హసీనా సర్కార్‌ చైనాకు మరింత చేరువైంది.2021లో అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బంగ్లాదేశ్‌ను ఆహ్వానించలేదు. అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు.తన ఇండో-పసిఫిక్‌ వ్యూహం(క్వాడ్‌)లో చైనాకు వ్యతిరేకంగా కలసి రావాలని జోబైడెన్‌ తెచ్చిన వత్తిడిని బంగ్లా తిరస్కరించింది. అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరిస్తామని ప్రకటించింది. కొల్‌కతాకు 212 నాటికల్‌ మైళ్ల దూరంలో బంగాళఖాత తీరంలోని కాక్స్‌బజార్‌ రేవు ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గామి కేంద్రానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయంచేసినంత మాత్రాన భారత్‌ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్‌ ప్రకటించింది. చైనా తమకు ఆర్థిక భాగస్వామి తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్‌ కూడా లబ్దిపొందుతుందని ఈశాన్య భారతానికి వేగంగా భూ, జలమార్గాల ద్వారా సరకు రవాణా చేయవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్‌కు ఎలాటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడి కంటే లాభాలు ఎక్కువ అని జహంగీర్‌ నగర్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సాహెబా నామ్‌ ఖాన్‌ చెప్పాడు. బంగ్లాదేశ్‌ మీద అమెరికా తెస్తున్న వత్తిడి, సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాకు నివేదించినట్లు 2023 ఆగస్టు 28వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక రియాజుల్‌ హెచ్‌ లస్కర్‌ పేరుతో రాసిన ఒక సమీక్ష పేర్కొన్నది.


బంగ్లా పరిణామాలు మరోసారి అమెరికాకు అనుకూలంగా మారితే అది చైనాను దెబ్బతీయాలని కోరుకొనే శక్తులకు సంతోషం కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే అదే సమయంలో మనకూ ఇబ్బందే. ఉక్రెయిన్‌ సంక్షోభంలో తటస్థంగా ఉన్నందుకు మనమీద కసి ఉన్నా, ఇతర అంశాలలో మద్దతు ఇస్తున్న కారణంగా మింగా కక్కలేకుండా ఉంది. ప్రతిపక్ష బిఎన్‌పికి మతోన్మాద జమాతే ఇస్లామీ మద్దతు , దానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నందున షేక్‌ హసీనా గెలవటం మన దేశానికి ఊరట కలిగించే అంశంగా భావించారు. ఇప్పుడు అమెరికా అనుకూల మిలిటరీ లేదవ బిఎన్‌పి అధికారానికి వస్తే మనకు తలనొప్పి వ్యవహారమే. మన మీద వత్తిడి తెచ్చేందుకు, ఇరకాటంలో పెట్టేందుకు అమెరికా చూస్తుంది. బంగ్లా పరిణామాల గురించి వివరించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ప్రతిపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రకటించారు. మిలిటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకోవటాన్ని అమెరికా స్వాగతించింది. అనధికారిక చొరబాట్లను నిరోధించేందుకు మన ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన అనేక పరిణామాల వెనుక గతంలో అమెరికా హస్తం ఉన్నందున ఇప్పుడు కూడా ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. హసీనా ప్రభుత్వ వైఫల్యాలతో నిరుద్యోగం, దారిద్య్రం పెరిగిన కారణంగా అసంతృప్తి తలెత్తింది.ఈ స్థితిలో బంగ్లా విముక్తి పోరులో పాల్గొన్న వారి వారసులకు 30శాతం రిజర్వేషన్లు ప్రకటించటం ప్రభుత్వ వ్యతిరేకులకు కలసి వచ్చింది. సుప్రీం కోర్టు దాన్ని ఐదు శాతానికి, మొత్తంగా రిజర్వేషన్లను ఏడు శాతానికి పరిమితం చేయటంతో యువత ఆందోళన సద్దుమణిగింది. అయితే అనూహ్యంగా హసీనా రాజీనామా డిమాండ్‌తో మరోసారి వీధులకు ఎక్కారు. వారిని అధికార అవామీలీగ్‌ మద్దతుదారులు ఎదుర్కోవటంతో మరోసారి నెత్తురోడింది. అప్పటి వరకు ప్రభుత్వ ఆదేశాలను అమలు జరిపిన మిలిటరీ ఆది, సోమవారాల్లో జరిగిన పరిణామాల్లో వ్యతిరేకంగా మారింది.హసీనా జాతి నుద్దేశించి టీవీలో మాట్లాడకూడదని ఆదేశించటంతో పాటు రాజీనామా చేసి 45నిమిషాల్లో దేశం వదలి పోవాలని అల్టిమేటం జారీచేసినట్లు వార్తలు వచ్చాయి. కేవలం నెలన్నర క్రితమే మిలిటరీ నూతన అధికారిగా బాధ్యతలు చేపట్టిన వాకర్‌ ఉజ్‌ జమాన్‌ తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు ఇన్ని వారాలు చూసినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చైనా : పధ్నాలుగు పాలస్తీనా విముక్తి సంస్థల ఒప్పందం !

01 Thursday Aug 2024

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

Fatah, Hamas and Fatah agreement, Hamas Israel, Israel genocide, Palestine Solidarity Day, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మధ్యప్రాచ్య చరిత్రలో మరో చారిత్మాత్మక ఘట్టానికి తెరలేచింది.పాలస్తీనా విముక్తికోసం పోరాడుతున్న పధ్నాలుగు ప్రజా సంస్థలు, పార్టీలు తమ విబేధాలకు స్వస్తిపలుకుతూ ఐక్యతను పటిష్ట పరిచేందుకు 2024జూలై చివరి వారంలో చైనా మధ్యవర్తిత్వంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. వీటిలో ఉప్పు-నిప్పుగా ఉన్న ఫతా – హమస్‌ కూడా ఉండటం విశేషం.ఈ ఒప్పందం పధ్నాలుగు సంస్థల ఐక్యత, అవి సమాధానపరుచుకోవటానికి అంకితమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి ప్రకటించాడు. గతేడాది అక్టోబరు ఏడు నుంచి ఇజ్రాయెల్‌ మిలిటరీ పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో సాగిస్తున్న మారణకాండ, పశ్చిమగట్టు ప్రాంతంలో సాగిస్తున్నదాడులు, అరబ్బు ప్రాంతాల ఆక్రమణలు కొనసాగిస్తున్న పూర్వరంగంలో ఈ ఒప్పందం కుదిరింది. పాలస్తీనా పౌరులందరికీ ఏకైక అధీకృత ప్రతినిధిగా పాలస్తీనా విముక్తి సంస్థ(పిఎల్‌ఓ)ను గుర్తించటం దీనిలో కీలకమైన అంశం.ప్రస్తుతం కొనసాగుతున్న గాజా మారణకాండ అనంతర పాలనతో పాటు తాత్కాలిక జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా అంగీకారం కుదిరింది.పశ్చిమాసియాలో చిచ్చుపెట్టి తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకొనేందుకు అమెరికా కుట్రలు పన్నుతుండగా వాటిని వమ్ముచేసే క్రమంలో ఐక్యతను సాధించేందుకు చైనా తన పలుకుబడి, అనుభవాన్ని వినియోగిస్తున్నది. ఈ క్రమంలో ఇది రెండవ ఉదంతం. ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య సయోధ్యను కుదిర్చిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో నాలుగు ప్రధాన అంశాలున్నాయి. తాత్కాలిక జాతీయ ఐక్యతా ప్రభుత్వం ఏర్పాటు,భవిష్యత్‌ ఎన్నికలకు ముందు ఐక్య నాయకత్వ పొందిక, నూతన పాలస్తీనా జాతీయ మండలికి స్వేచ్చగా ఎన్నికలు, ఇజ్రాయెల్‌ దాడుల పూర్వరంగంలో ఐక్యతా ప్రకటన. తాము చారిత్రాత్మక కూడలిలో ఉన్నామని, తమ పోరాటాలకు జనం స్పందిస్తున్నందున ఇంతకు మించి మరొక మార్గం లేదని చర్చలలో పాల్గన్న సంస్థల ప్రతినిధులు చెప్పారు.గాజాలో జరుగుతున్న మారణకాండే ఈ ఐక్యత వెనుక ప్రధాన కారణం అని వేరే చెప్పనవసరం లేదు. ఐక్యతా ఒప్పందం పాలస్తీనా పార్టీల అంతర్గత వ్యవహారం, అయితే అంతర్జాతీయ సమాజ మద్దతు లేకుండా సాధించలేరని చైనా ప్రతినిధి లిన్‌ జియాన్‌ చెప్పాడు. ఈ ఒప్పందాన్ని వమ్ము చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ సకల యత్నాలూ చేస్తాయి.ముఖ్యంగా ఫతా సంస్థను రెచ్చగొట్టేందుకు, వత్తిడి పెంచేందుకు ఇప్పటికే రంగంలోకి దిగాయి.


పాలస్తీనా విముక్తి సంస్థ అనేక పార్టీలు, సంస్థలతో కూడిన ఒక ఉమ్మడి వేదిక. యాసర్‌ అరాఫత్‌ దీని నేతగా ఉన్న సంగతి తెలిసిందే.1993లో ఇజ్రాయెల్‌తో ఓస్లో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఇజ్రాయెల్‌ ఆక్రమిత గాజా-పశ్చిమ గట్టు ప్రాంతంలో పాలస్తీనా సాధికార సంస్థ(పిఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో, అదే విధంగా పిఎల్‌ఓలో కూడా ఫతా అనే పార్టీ ప్రధాన పాత్రధారిగా ఉంది.ఈజిప్టు కేంద్రంగా పని చేస్తున్న ముస్లిం సోదరత్వం అనే సంస్థ ప్రభావం పక్కనే ఉన్న గాజా ప్రాంతంపై ఉంది. దానితో సంబంధం ఉన్న శక్తులు 1987లో హమస్‌గా ఉనికిలోకి వచ్చాయి. పిఎల్‌ఓ, దానిలో ఉన్న భాగస్వామ్య పక్షాలతో దానికి ఏకీభావం లేదు. ఓస్లో ఒప్పందాలలో భాగస్వామి కాదు. ఇజ్రాయెల్‌ ఉనికిని అది గుర్తించలేదు. పాలస్తీనా సాధనకు సాయుధ పోరాటాన్ని మార్గంగా ఎంచుకుంది. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో గాజాలో తిరుగులేని రాజకీయ,మత,సాయుధ శక్తిగా ఎదగటమే కాదు, ఎన్నికల్లో తన సత్తాను చూపి అధికారానికి కూడా వచ్చింది.పశ్చిమగట్టు ప్రాంతంలో ఫతా పార్టీ అధికారంలో ఉంది.పాలస్తీనా విముక్తి కోసం అనేక సంస్థలు తమవైన పద్దతుల్లో పోరాడుతున్నాయి.కొన్ని అంశాలు, పద్దతులపై వాటి మధ్య ఏకీభావం లేని మాటవాస్తవం. దీన్ని అవకాశంగా తీసుకొని సామ్రాజ్యవాదుల మద్దతుతో ఇజ్రాయెల్‌ అణచివేతకు, తాజాగా గాజాలో మారణకాండకు పూనుకుంది.ఇజ్రాయెల్‌ను అధికారికంగా హమస్‌ గుర్తించకపోయినా 1967నాటి సరిహద్దుల ప్రాతిపదికన పాలస్తీనా ఏర్పాటు జరగాలని 2017లో అది చేసిన ప్రతిపాదనకు అర్ధం పరోక్షంగా అంగీకరించినట్లే.


పాలస్తీనా నేషనల్‌ ఇనీషియేటివ్‌ సంస్థ అధ్యక్షుడు ముస్తఫా బర్గౌటీ తాజా ఒప్పందం గురించి మాట్లాడుతూ అన్ని పక్షాలూ పిఎల్‌ఓలో చేరేందుకు అంగీకరించాయని అదొక్కటే పాలస్తీనియన్ల నిజమైన ప్రతినిధి అన్నాడు. రెండు భిన్న పార్టీల పాలనలో ఉన్న పాలస్తీనాలోని గాజా-పశ్చిమ గట్టు ప్రాంతాలను ఒకే పాలనా వ్యవస్థ కిందకు తెచ్చేందుకు 2017లో హమస్‌-ఫతా మధ్య కుదిరిన ఒప్పందం అమలు కాలేదు.2007వరకు గాజా కూడా ఫతా నాయకత్వంలోని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అదే ఏడాది అధికారానికి వచ్చిన హమస్‌ యంత్రాంగం ఫతాను అక్కడి నుంచి బహిష్కరించింది. కొన్ని అరబ్‌ దేశాలూ, ఈజిప్టు తెచ్చిన ఒత్తిడి మేరకు పదేండ్ల వైరాన్ని విరమించుకొనేందుకు చేసుకున్న ఒప్పందం విఫలమైంది. పాలస్తీనా అధారిటీ ప్రధాన మంత్రి రామీ హమదల్లా 2018లో గాజా సందర్శనకు వచ్చినపుడు హత్యాయత్నం జరిగింది. దానికి హమసే కారణమని ఫతా ఆరోపించింది. గతం కంటే నిర్దిష్టంగా కొన్ని చర్యలు తీసుకొనేందుకు తాజా ఒప్పందంలో అంగీకరించినట్లు ముస్తఫా చెప్పారు. మొత్తంగా పాలస్తీనాను అంతం చేసేందుకు ఇజ్రాయెల్‌ పూనుకున్నందున దానికి వ్యతిరేకంగా ఐక్యమౌతున్నట్లు చెప్పారు. ఏకాభిప్రాయ సాధనతో ఉమ్మడి ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనే అంశంపై కూడా ఒప్పంద పక్షాల్లో స్పష్టత ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక వైపు అమెరికా ఇతర దేశాల అండచూసుకొని ఇజ్రాయెల్‌ మారణకాండను కొనసాగిస్తూనే ఉంది. అది ముగిసిన తరువాత ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందా ? బీజింగ్‌ ఐక్యతా చర్చల్లో పాల్గొన్న హమస్‌ ప్రతినిధి హసమ్‌ బద్రన్‌ మాట్లాడుతూ ధ్వంసమైన ప్రాంతాల పునర్‌నిర్మాణం, తగిన సమయంలో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం జరిగిందని, అయితే దాడులు కొనసాగుతున్నప్పటికీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడవచ్చని, అది కాల్పుల విరమణకు దోహదం చేయవచ్చన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజింగ్‌లో హమస్‌-ఫతా ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.తరువాత చైనా నేత షీ జింపింగ్‌ మధ్య ప్రాచ్య దేశాలకు ప్రత్యేక రాయబారిని పంపి అంతర్జాతీయ శాంతి సభ జరపటానికి గల అవకాశాలను పరిశీలించారు. ఈప్రక్రియకు ముందు ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య చెలిమి అసాధ్యం అనుకున్న దాన్ని చైనా సుసాధ్యం గావించింది.మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో అమెరికాతో పోలిస్తే చైనా పాత్ర పరిమితమే. అయినప్పటికీ తంపులు పెట్టే అమెరికాతో పోలిస్తే దానికి భిన్నమైన వైఖరితో ఉన్నందున బీజింగ్‌ పట్ల విశ్వసనీయత పెరుగుతోంది.


గాజాలో మారణకాండ పూర్వరంగంలో అంతర్జాతీయ సమాజ అభిప్రాయం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మారుతున్నది. గత 57 సంవత్సరాలుగా తూర్పు జెరూసలెం, గాజా, పశ్చిమ గట్టు ప్రాంతాలను ఆక్రమించటం చట్టవిరుద్దమని అంతర్జాతీయ న్యాయ స్థానం(ఐసిజె) వ్యాఖ్యానించింది. ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టు ప్రాంతంలలో పాలస్తీనా అధారిటీ పాలన కొనసాగుతున్నప్పటికీ యూదుల నివాసాల ముసుగులో ఇజ్రాయెల్‌ దురాక్రమణలు కొనసాగుతూనే ఉన్నందున ఫతా సంస్థ వైఖరిలో మార్పురాక తప్పలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 23.7చదరపు కిలోమీటర్ల మేర ఇజ్రాయెల్‌ ఆక్రమించిందని పీస్‌ నౌ అనే స్వచ్చంద సంస్థ పేర్కొన్నది.గత రెండు దశాబ్దాల్లో ఆక్రమించినదానికంటే ఇది ఎక్కువ. అమెరికా మధ్యవర్తిత్వలో 1993లో కుదిరిన ఓస్లో ఒప్పందం ప్రకారం పశ్చిమ గట్టును ఏబిసి ప్రాంతాలుగా విభజించారు. ఏ తరగతి పాలస్తీనా అధారిటీ ఏలుబడిలో, బి ప్రాంతాలు ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఉమ్మడి పాలన, సి ప్రాంతాలు ఇజ్రాయెల్‌ ఆధీనంలో ఉంటాయి. మూడవ ప్రాంతంలో యూదుల నివాసాల ఏర్పాటుతో పాటు అరబ్బు రైతాంగాన్ని ఇజ్రాయెల్‌ క్రమంగా తొలగిస్తున్నది.పాలస్తీనా పశ్చిమ గట్టు ప్రాంతంలో 1990దశకంలో ఇజ్రాయెల్‌ తీసుకువచ్చిన యూదుల సంఖ్య రెండున్నర లక్షలు కాగా ప్రస్తుతం ఏడు లక్షలకు పెరిగారు. పాలస్తీనా రాజధానిగా ఉండే తూర్పు జెరూసలెంలో అలాంటి వారిని 800 నుంచి మూడు వేలకు పెంచారు. గాజాలో మారణకాండ ప్రారంభించిన ఇజ్రాయెల్‌ పశ్చిమ గట్టు ప్రాంతంలో కూడా దాడులకు పూనుకుంది. ఇప్పటి వరకు 513 మంది పాలస్తీనియన్లను మిలిటరీ చంపివేసింది.వందలాది మందిని గాయపరచింది.ప్రతి ఏటా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది.


ఒప్పందాన్ని తామింకా సమీక్షించలేదంటూ గాజాలో హమస్‌ పాత్రను తాము సమర్ధించే ప్రసక్తే లేదని అమెరికా ప్రకటించింది. ఒక ఉగ్రవాద సంస్థకు ప్రభుత్వంలో పాత్ర ఉండకూడదని ప్రతినిధి మిల్లర్‌ చెప్పాడు.ప్రస్తుత యుద్ధం ముగిసిన తరువాత రెండు ప్రాంతాల్లో ఒకే ప్రభుత్వం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పాడు. పాలస్తీనా ఐక్యతా ఒప్పందం అమలు జరుగుతుందా ? భాగస్వామ్య పక్షాలు కట్టుబడి ఉంటాయా, భవిష్యత్‌లో హమస్‌ పాత్ర ఏమిటి అంటూ మీడియా, ప్రభుత్వాలలో చర్చలు జరుగుతున్నాయి. ఐక్యతను దెబ్బతీసేందుకు చాణక్య నీతిని ప్రయోగించేందుకు అమెరికా, ఇతర పశ్చిమదేశాలు చూస్తున్నాయి. సందేహాలు లేవనెత్తుతున్నవారందరినీ ఒకేగాటన కట్టలేము గానీ కొన్ని ఆచరణాత్మక సమస్యలు ముందుకు వచ్చినప్పటికీ మొత్తానికే ఎసరు పెడుతున్న సామ్రాజ్యవాదుల కుట్ర, చర్యల కారణంగా వాటిని పరిష్కరించుకొనే పరిణితిని పాలస్తీనా సంస్థలు ప్రదర్శిస్తాయి.దానిలో పెద్ద ముందడుగే తాజా ఒప్పందం.ఒప్పందమైతే జరిగింది గానీ దాని అమలు గురించి అనేక మందికి సందేహాలున్నా అవసరాలు వివిధ పక్షాల వైఖరుల్లో మార్పులకు దోహదం చేస్తున్నాయి.అనేక పరిణామాలను చూసినపుడు ప్రతి పాలస్తీనా సంస్థ అనేక గుణపాఠాలు నేర్చుకుంది. ఐక్యత కోసం రాజీలకు, సర్దుబాట్లకు సిద్దంగాక తప్పని స్థితిలో పడ్డాయి. మొదటికే మోసం తెస్తున్న ఇజ్రాయెల్‌ను నిలువరించటం ప్రధమ కర్తవ్యంగా భావించాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఫాసిస్టు వ్యతిరేక పోరాటం – ఫ్రెంచి ఎన్నికల్లో వామపక్షాలు నేర్పిన పాఠం ఏమిటి !

11 Thursday Jul 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

emmanuel macron, French communist, French Elections 2024, French far right, National Rally (RN), New Popular Front(NFP)


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది ప్రపంచంలో 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటి వరకు 25దేశాల్లో పాలకులు మారారు. ఆ పరంపరలో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ చేరాయి. రెండు చోట్లా మధ్యంతర ఎన్నికలు జరిగాయి, అనూహ్య, ఉత్తేజం కలిగించే పరిణామాలు సంభవించాయి. అధ్యక్ష తరహా పాలన ఉన్న ఫ్రాన్సులో హంగ్‌ పార్లమెంటు ఏర్పడింది. నాలుగు కూటములు, అనేక స్వతంత్ర పార్టీలు పోటీ పడినా ఏ కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యలో సీట్లు తెచ్చుకోలేదు. పార్లమెంటులోని 577 స్థానాలకు గాను వామపక్షాల కూటమి 188సీట్లతో పెద్ద పక్షంగా అవతరించింది. ఫాసిస్టు శక్తుల ముప్పు తప్పింది. బ్రిటన్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘనవిజయం సాధించింది అనటం కంటే టోరీ(కన్సర్వేటివ్‌) పార్టీ చరిత్రలో తొలిసారిగా ఓటర్ల చేతిలో ఊచకోతకు గురైంది, అతి తక్కువ సీట్లు తెచ్చుకుంది. ఈ ఘనత భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ ఏలుబడిలో జరిగింది. పార్లమెంటులోని 650 సీట్లకు గాను లేబర్‌ పార్టీ 411తో తిరుగులేని మెజారిటీ సాధించింది. ఫ్రెంచి పార్లమెంటు ఎన్నికల తొలిదశలో ఫాసిస్టు శక్తులది పైచేయిగా ఉండటమే కాదు,ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 289 సీట్ల కంటే ఎక్కువగా 297 స్థానాలలో ప్రధమ స్థానంలో ఉంది. పచ్చి మితవాద నేషనల్‌ రాలీ-ఆర్‌ఎన్‌ (గతంలో నేషనల్‌ ఫ్రంట్‌) ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో 31శాతం ఓట్లతో విసిరిన సవాలుతో అధ్యక్షుడు మక్రాన్‌ పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు తెరతీశాడు. ఈ ఎన్నికల తొలిరౌండులో 33.21శాతం తెచ్చుకుంది.రెండవ రౌండ్‌లో 37.06శాతానికి పెంచుకుంది.వామపక్షాలతో కూడిన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(ఎన్‌ఎఫ్‌ఇ) తొలి దఫా 28.21శాతం తెచ్చుకోగా మలి దశలో 25.81శాతం పొందింది. అధికారపక్షమైన టుగెదర్‌ కూటమి 21.28 నుంచి 24.53శాతానికి పెంచుకుంది.


పార్లమెంటులోని 577 స్థానాలకు గాను జూన్‌ 30న జరిగిన ఎన్నికల్లో 76 నియోజకవర్గాలలో ఫలితాలు తేలాయి. ఆర్‌ఎన్‌ పార్టీ 37, వామపక్ష కూటమి 32, అధికార పక్షం రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరులు ఐదు చోట్ల గెలిచారు. మిగిలిన స్థానాలకు ఏడవ తేదీన పోలింగ్‌ జరిగింది. త్రిముఖ పోటీ జరిగితే దేశ చరిత్రలో తొలిసారిగా పచ్చిమితవాదులు అధికారాన్ని కైవశం చేసుకుంటారని తేలింది. ఈ ముప్పును తప్పించేందుకు విధానపరంగా ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ వామపక్ష కూటమి, అధికార పార్టీ ఒక అవగాహనకు వచ్చాయి. అదేమంటే ఆర్‌ఎన్‌ పార్టీ ఆధిక్యత ఉన్న చోట రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థికి అనుకూలంగా మూడవ అభ్యర్థి ఉపసంహరించుకొని మద్దతు ఇవ్వటంతో ఫాసిస్టు పార్టీ ఓట్ల రీత్యా పెద్దదిగా ఉన్నా సీట్లలో మూడవ స్థానానానికి పడిపోయింది. రెండవ దశలో సీట్ల సర్దుబాటు కారణంగా వామపక్ష కూటమి, అధికార కూటమి లబ్ది పొందాయి. వామపక్ష సంఘటనలో ఉన్న పార్టీలకు గతంలో 130 ఉండగా ఈ సారి 188, అధికార ఐక్యత కూటమికిి 245 నుంచి 161కి పడిపోగా ఆర్‌ఎన్‌ పార్టీ కూటమికి 89 నుంచి 142కు పెరిగాయి. ప్రస్తుతానికి ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ముప్పు తప్పినా ఓట్లపరంగా 37శాతానికి పెంచుకోవటం ప్రమాదకరపరిణామం. వామపక్ష కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి అధికార ఐక్యత కూటమి మద్దతు ఇవ్వటం లేదా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి కావటం తప్ప మరొక మార్గం లేదు. ఈ పరిణామంతో రానున్న రోజుల్లో అనేక అంశాలపై మక్రాన్‌ వైఖరిలో మార్పులు కూడా ఉంటాయని భావిస్తున్నారు.


ఫలితాల్లో ఫాసిస్టు పార్టీ అధికారానికి రాదనే తీరు కనిపించగానే పారిస్‌తో సహా దేశమంతటా జనం వీధుల్లోకి వచ్చారు. సంతోషం, ఆనందంతో కన్నీటి బాష్పాలు రాల్చారు.ఫలితాల మీద తొలి ప్రకటన వెలువడగానే ఎదురుగా ఉన్న వారు పరిచితులా, అపరిచితులా అన్నదానితో నిమిత్తం లేకుండా ఎవరుంటే వారిని వారిని హత్తుకున్న దృశ్యాలు కనిపించాయి. నిమిషాల తరబడి చప్పట్లు చరిచారు. ఫాసిస్టు శక్తులను ఓడించేందుకు పరస్పర విరుద్ద వైఖరులతో పని చేస్తున్న పార్టీలు ఐక్యమైనపుడు విబేధాలను పక్కన పెట్టి అదే జనం మద్దతు ఇచ్చి గెలిపించినపుడు ఇలాంటి దృశ్యాలు ఆశ్చర్యం కలిగించవు. ఐరోపా పార్లమెంటు, తొలిదశ ఎన్నికల్లో ఫాసిస్టు పార్టీ పెద్దదిగా అవతరించటంతో ఆందోళనకు గురైన అనేక మంది బరువు దించుకున్నారు. మరోవైపు ఫాసిస్టు పార్టీ అభిమానులు చిక్కినట్లే చిక్కి అధికారం దూరమైందన్నట్లుగా తీవ్ర ఆశాభంగం చెందారు.అయినా తమ కూటమి ప్రతిసారీ బలం పెంచుకుంటున్నదని సంతృప్తిని కూడా వెల్లడిస్తున్నారు. 2027లో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఏ కూటమి కూడా పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రకటించిన విధానాల నుంచి వైదొలిగే అవకాశాలు ఉండవు. ప్రజలిచ్చిన తీర్పుతో ఫ్రెంచి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయా, మక్రాన్‌ సర్కార్‌కు కొత్త ప్రభుత్వం గుదిబండగా మారుతుందా ? విదేశీ, అంతర్గత విధానాలపై మక్రాన్‌తో వామపక్షాలు విబేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అనేక సందేహాల మీద చర్చ ప్రారంభమైంది. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధాని గాబ్రియెల్‌ అతల్‌ రాజీనామా లేఖను పంపాడు. దాన్ని తాను ఆమోదించటం లేదని మక్రాన్‌ ప్రకటించాడు.ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశాన్ని తమకే ఇవ్వాలని, ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్దంగా ఉన్నామని వామపక్ష కూటమి నేత జీన్‌ లక్‌ మెలెన్‌చోన్‌ ప్రకటించాడు. తాము గెలిస్తే హమస్‌ అణచివేత పేరుతో మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే వైఖరి ఉపసంహరించుకుంటామని, జనానికి ఉపశమనం కలిగించేందుకు భారీ మొత్తంలో ప్రభుత్వ ఖర్చు పెంచుతామని వామఫక్షాలు ఎన్నికల ప్రణాళికల్లో వాగ్దానం చేశాయి. వామపక్షాల తీరు తీవ్రంగా ఉందని, ప్రభుత్వ ఖర్చు పెంచేందుకు అవసరమైన నిధులు కొన్ని సంపద పన్ను, అధికాదాయం వచ్చేవారి మీద పన్ను పెంపుదల వంటి అంశాలను అమలు జరిపితే దేశం నాశనం అవుతుందని, ఇప్పటికే దేశం అప్పుల ఊబిలో ఉందని మక్రాన్‌ వ్యాఖ్యానించాడు.


అనూహ్యంగా పెద్ద కూటమిగా అవతరించిన వామపక్ష న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(ఎన్‌ఎఫ్‌పి) గురించి అనేక మందిలో ఆసక్తి నెలకొన్నది, ఇది ఫాసిస్టు శక్తులను మట్టి కరిపించింది.ఐరోపాలో ఇలాంటి శక్తుల వ్యతిరేకులకు ఒక దారి చూపిందంటే అతిశయోక్తి కాదు. కొన్ని అంశాలపై తేడాలతో గతేడాది అక్టోబరులో వామపక్ష ఫ్రంట్‌ విడిపోయింది.ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో ఆర్‌ఎన్‌ పార్టీ పెద్దదిగా అవతరించటం, అధ్యక్షుడు మక్రాన్‌ పార్లమెంటు రద్దు చేయటంతో తలెత్తిన నూతన పరిస్థితుల్లో వామపక్షాలు తమ విబేధాలను పక్కన పెట్టి జూన్‌ 13న ఎన్‌ఎఫ్‌పి ఏర్పాటుకు అంగీకరించాయి. దీనికి ఒక చారిత్రక నేపధ్యం ఉంది. ఫాసిజానికి వ్యతిరేకంగా 1930దశకంలో పాపులర్‌ ఫ్రంట్‌ ఏర్పడింది, ఆ పేరుకు న్యూ(కొత్త) అని చేర్చారు నెల రోజుల్లోనే పెద్ద పక్షంగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీనిలో నాలుగు పార్టీలు ఉన్నాయి. కూటమిలో 75 సీట్లు ఫ్రాన్స్‌ అన్‌బౌవ్‌డ్‌ -తలవంచని పార్టీ (ఎల్‌పిఐ)కు వచ్చాయి. ఇది సోషలిస్టు పార్టీ నుంచి విడిపోయిన వారితో ఏర్పడింది. భావజాలంలో కమ్యూనిస్టు పార్టీ కంటే తక్కువ సోషలిస్టు పార్టీ కంటే ఎక్కువ అంటే మధ్యస్థంగా ఉంటుందని విశ్లేషకులు వర్ణించారు. రెండవది 65 సీట్లు తెచ్చుకున్న సోషలిస్టు పార్టీ. దీన్ని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీగా పేర్కొంటారు. మూడవ పక్షం ది ఇకోలజిస్ట్స్‌(ఎల్‌ఇ)-పర్యావరణ పార్టీ, దీనికి 33 స్థానాలు వచ్చాయి.నాలుగవది ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ. దీనికి తొమ్మిది స్థానాలు వచ్చాయి. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు సమాజాలను కూల్చివేసిన తరువాత పార్టీ బలహీనపడినప్పటికీ ఇతర దేశాలలో కమ్యూనిస్టుల మాదిరి తన ఉనికిని కాపాడుకుంటున్నది. మరికొన్ని చిన్న పార్టీలు కూడా దీనిలో ఉన్నాయి. అధ్యక్షుడు మక్రాన్‌ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న ఈ కూటమితో అతగాడి నాయకత్వంలోని మితవాద కూటమి కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, బయట ఉండి మద్దతు ఇస్తుందా అన్నది స్పష్టం కాలేదు. ఫాసిస్టులకు వ్యతిరేకంగా రెండు కూటములు ఎన్నికల సర్దుబాటు చేసుకున్నాయి.


ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌లో కూడా కొన్ని నెలల ముందే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి.పద్నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టోరీ(కన్సర్వేటివ్‌ పార్టీ)ని ఓటర్లు ఊచకోత కోశారని కొందరు వ్యాఖ్యానించారు. రిషి సునాక్‌ను నేతగా ఎన్నుకొని తప్పుచేశామని అనేక మంది టోరీలు తలలు పట్టుకుంటున్నారు.గడచిన వందేండ్లలో ఇంత తక్కువ సీట్లు ఎప్పుడూ రాలేదని అంటున్నారు. పొదుపు చర్యల పేరుతో అమలు జరిపిన విధానాలతో జనజీవితం అతలాకుతలం అయింది. అందుకనే ఈ సారి 650 స్థానాలకు గాను ఆ పార్టీకి 53 నుంచి 131 మధ్యలో సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొనగా 121 వచ్చాయి.గతంలో ఉన్నవాటిలో 251 స్థానాలను కోల్పోయారు. మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌,పన్నెండు మంది మంత్రులు మట్టికరిచారు.ఆశ్చర్యం ఏమిటంటే మూడవ పక్షమైన లిబరల్‌ పార్టీ ఈ ఎన్నికల్లో పదకొండు నుంచి 72 స్థానాలకు తన బలాన్ని పెంచుకుంది. టోరీ ప్రధానులుగా పనిచేసిన డేవిడ్‌ కామెరాన్‌, థెరెసా మే ప్రాతినిధ్యం వహించిన స్థానాలను ఈ పార్టీ కైవశం చేసుకుంది.ఈ ఎన్నికలు మరొక రికార్డును కూడా సృష్టించాయి. 1918 తరువాత రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు 57.4 శాతమే. లేబర్‌ పార్టీ 33.7శాతం ఓట్లతో 411 సీట్లు(63.2శాతం) తెచ్చుకోగా టోరీ 23.7శాతం ఓట్లు, 121 సీట్లు(18.6శాతం) తెచ్చుకున్నాయి. గ్రీన్స్‌ పార్టీకి 6.7శాతం ఓట్లు వచ్చినప్పటికీ కేవలం నాలుగు స్థానాలు(0.6శాతం) మాత్రమే వచ్చాయి. రిఫామ్‌(సంస్కరణ) యుకె పార్టీకి లిబరల్స్‌ కంటే ఎక్కువగా 14.3శాతం ఓట్లు వచ్చినా కేవలం 5(0.8శాతం) సీట్లు వచ్చాయి. డెమోక్రటిక్‌ యూనియనిస్టు పార్టీకి కూడా ఐదు సీట్లు వచ్చినా దానికి వచ్చిన ఓట్లు కేవలం 0.6శాతమే ఈ తీరును చూసిన కొందరు ఎన్నికల సంస్కరణలు అవసరమని సూచించారు.బ్రిటన్‌ పార్లమెంటు చరిత్రలో అధికారానికి వచ్చిన పార్టీ తక్కువ ఓట్లు తెచ్చుకోవటం ఒక రికార్డు, దాన్ని లేబర్‌ పార్టీ సొంతం చేసుకుంది.మూడు ప్రధాన పార్టీలకు 69.6 శాతం ఓట్లు 92.9 శాతం సీట్లు వచ్చాయి. చిన్న పార్టీలు ఓట్లు గణనీయంగా తెచ్చుకున్నట్లు ఈ గణాంకాలు వెల్లడించాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 7.4శాతం తగ్గి 59.9శాతం ఓట్లు పోలయ్యాయి. దీన్ని బట్టి ఓటర్లు ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదన్నది స్పష్టమైంది. లేబర్‌ పార్టీ గత ఎన్నికల కంటే కేవలం 1.7శాతం, లిబరల్‌ పార్టీ 0.6శాతం మాత్రమే అదనంగా తెచ్చుకోగా టోరీలు 19.9శాతం కోల్పోయారు.అధికారంలోకి లేబర్‌ పార్టీ వస్తుందా లేదా అన్నదాని కంటే టోరీ పార్టీని వదిలించుకోవాలని ఓటర్లు భావించినట్లు ఈ అంకెలు స్పష్టం చేశాయి.


లేబర్‌ పార్టీ పెద్ద విజయాన్ని సాధించగానే సమస్యలన్నీ పరిష్కారమైనట్లు భావించనవసరం లేదు. దాని ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.ప్రతిపక్షంలో ఉండగా పౌరుల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చే లేబర్‌ పార్టీ నేతలు అధికారానికి వచ్చిన తరువాత జనాన్ని మరచిపోతారనే నానుడి ఉంది. గతంలో అది నిరూపితమైంది. దాని నేత కెయిర్‌ స్టామర్‌ కార్పొరేట్లకు అనుకూలమనే అభిప్రాయం ఉంది. దీనికి అనుగుణంగానే ఫలితాలు వెలువడిన తరువాత తొలిరోజు స్టాక్‌మార్కెట్‌ సూచీ0.86పెరిగిందన్నది ఒక అభిప్రాయం.ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ది కేవలం 0.6శాతమే పెరగ్గా ధరలు రెండు పెరిగాయి. ఇతర అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే కరోనాకు ముందున్న ఉత్పాదకత, పెట్టుబడి రేట్లు తక్కువగా ఉన్నాయి. 1980దశకంలో పెట్టుబడి రేటు 23శాతం ఉండగా రెండువేల సంవత్సరం నుంచి 17శాతానికి అటూ ఇటూగా ఉంది. అదే ఇతర జి7 దే శాలలో 20-25శాతంగా ఉంది.ఆదాయపన్నుతో సహా ఇతర పన్నులేవీ పెంచబోమని లేబర్‌ పార్టీ ఎన్నికల్లో చెప్పింది. పెంచకపోతే మరింత అప్పులపాలౌతామని, స్పష్టంగా వైఖరిని వివరించాలని టోరీల నేత రిషి సునాక్‌ పదే పదే లేబర్‌ పార్టీ నేతలను ప్ర శ్నించాడు. ప్రస్తుతం జిడిపితో పోలిస్తే 100శాతం అప్పుల్లో,ద్రవ్యలోటుతో బ్రిటన్‌ ఉంది.దాన్ని అధిగమించాలంటే జనాన్ని పన్నులతో బాదాలని టోరీలు చెబుతున్నారు. జనంలో వ్యతిరేకత కనిపించటంతో మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ సర్కార్‌ పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నది. గత పద్నాలుగు సంవత్సరాలుగా ఏదో ఒక పేరుతో ప్రభుత్వ రంగ సిబ్బందికి వేతనాలను స్థంభింపచేశారు. కార్మిక సంఘాలన్నీ లేబర్‌ పార్టీ నిర్వహణలో ఉన్నందున వేతన సమస్య ప్రధానంగా ముందుకు రానుంది. దేశంలోని అతి పెద్ద థేమ్స్‌ నీటి కంపెనీ అప్పులపాలైంది.అయినా వాటాదార్లకు డివిడెండ్లు చెల్లిస్తున్నది. దివాలా తీసే స్థితిలో ఉన్నదాన్ని నిలబెట్టటం ఒక సమస్య. దీన్ని జాతీయం చేయవచ్చని, అందుకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. జైళ్లన్నీ 99శాతం నిండి ఉన్నాయి.న్యాయవ్యవస్థ విఫలమైందనే విమర్శకూడా ఉంది. నేరాలను ఎలా తగ్గించాలనేదాని కంటే కొత్తగా జైళ్ల నిర్మాణం గురించి పాలకులు ఆలోచిస్తున్నారు.విశ్వవిద్యాలయాల నిర్వహణ ఖర్చు పెరిగింది, 2012తరువాత ట్యూషన్‌ ఫీజులను పెంచలేదు.విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా తగ్గుతున్నారు.దీంతో వాటి రాబడి పడిపోతున్నది.బ్రిటన్‌ పెద్ద సమస్యల్లో ఇదొకటి. ఆరోగ్య రంగ బడ్జెట్‌లోటులో ఉంది.చికిత్సకు పట్టే వ్యవధి రోజు రోజుకూ పెరుగుతోంది, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి.సేవలను మెరుగుపరచాల్సి ఉంది.టోరీల పొదుపు చర్యల కారణంగా స్థానిక సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. 2018 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సంస్థలు దివాలా ప్రకటించాయి.ప్రస్తుతం ప్రతి ఐదింటిలో ఒకటి అదే బాటలో ఉన్నది.ఈ పూర్వరంగంలో లేబర్‌ పార్టీ ముందు పెద్ద సవాలే ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా-రష్యాలను మరింత దగ్గర చేసిన జి7 కూటమి !

19 Wednesday Jun 2024

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Environment, Europe, Germany, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

#Anti China, China, G7 Apulia, Joe Biden, Narendra Modi Failures, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఇటలీలోని అపూలియాలో 2024 జూన్‌ 13-15 తేదీలలో జరిగిన జి7 50వ శిఖరాగ్ర వార్షిక సమావేశ తీరుతెన్నులు, పరిణామాలు, పర్యవసానాల గురించి చర్చ జరుగుతున్నది. ఈ సమావేశాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రధాని నరేంద్రమోడీతో సహా పన్నెండు దేశాధినేతలను,ఆఫ్రికా యూనియన్‌ ప్రతినిధిని ఆహ్వానించారు. ఇలాంటి వేదికలన్నింటా పూసల్లో దారంలా ప్రపంచ దేశాల బలాబలాల సమీకరణ లక్ష్యం ఉంటుంది. ధనికదేశాలు తమకు సవాలు విసురుతున్న చైనా, రష్యాలను దెబ్బతీసేందుకుగాను వర్దమాన,పేద దేశాలను తమ వైపు తిప్పుకొనేందుకు అపూలియాలో గట్టి ప్రయత్నమే చేసినా ఫలితం ఏమిటన్నది ప్రశ్నార్ధకమే. అనేక అంశాల మీద ఈ కూటమి ఒక ప్రకటన చేసినప్పటికీ దానిలో ప్రధానమైన వాటిని చూద్దాం. ఆతిధ్యం ఇచ్చిన దేశం తనకు నచ్చిన, తాను మెచ్చిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు అల్జీరియా, అర్జెంటీనా,బ్రెజిల్‌,భారత్‌,జోర్డాన్‌, కెన్యా, మారిటేనియా, ఆఫ్రికన్‌ యూనియన్‌,ట్యునీసియా, టర్కీ,యునైటెడ్‌ అరబ్‌ఎమిరేట్స్‌,ఉక్రెయిన్‌, వాటికన్‌ నగరం నుంచి అధిపతులు వచ్చారు. ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా, రష్యా దేశాలకు ఆహ్వానం లేనప్పటికీ మూడు రోజుల సమావేశాలు వాటి నామజపంతోనే ముగిశాయంటే అతిశయోక్తి కాదు. సమావేశ ప్రకటనలో 28 సందర్భాలలో చైనా పేరును ప్రతికూలంగా ప్రస్తావించారంటే దాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీని అర్ధం ఘర్షణకు సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.గతేడాది జపాన్‌-ఒసాకాలో జరిగిన కూటమి ప్రకటనలో 20సార్లు ప్రస్తావించారు.ప్రస్తుతం ధనికదేశాల కూటమికి చైనాను ఢకొీనే సత్తా ఉందా అన్నది ప్రశ్న. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం చైనా అని నెపం నెట్టేందుకు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు పశ్చిమ దేశాలు చూస్తున్నాయి.


అసలు జి 7 కూటమి, ఎందుకు ఎలా ఉనికిలోకి వచ్చిందీ చూద్దాం. అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తూ ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. ఆ పర్యవసానంతో పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 1975లో నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో తొలి సమావేశం జరిగింది. అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు వచ్చారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న పూర్వపు తన క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి రష్యాను తొలగించటంతో తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. శిఖరాగ్ర సమావేశాలకు ఎవరు ఆతిధ్యం ఇస్తే తదుపరి సమావేశం వరకు ఏడాది పాటాదేశాధినేత అధ్యక్ష స్థానంలో ఉంటారు.ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ లేరు. సమావేశాల్లో ఐరాసతో సహా వివిధ ప్రపంచ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. అపూలియా సభలో ఉక్రెయిన్‌, వాతావరణ సంక్షోభాలు, సైబర్‌ భద్రతకు ముప్పు, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం, మానవహక్కుల హరింపు, అవసరాలకు మించి అదనంగా ఉత్పత్తి చేస్తూ విద్యుత్‌ వాహనాలను ప్రపంచం మీద కుమ్మరిస్తున్నదంటూ చైనా మీద దుమ్మెత్తి పోశారు. రష్యాకు ఆయుధాలను సరఫరా చేయకపోయినా, వాటి ఉత్పత్తికి అవసరమైన వాటిని అందిస్తున్నదంటూ విధించిన ఆంక్షలకు ఆమోదం తెలిపింది. ప్రతికూల చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగింది.


ఈ సమావేశాలకు హాజరైన నేతలందరి పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్లుగా ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నారు. అయినా లేస్తే మనుషలం కాదన్నట్లుగా ఫోజు పెట్టారు.చైనాను దెబ్బతీసేందుకు మిత్రదేశాలను అమెరికా ఎలా కూడగడుతున్నదో తనను తాను రక్షించుకొనేందుకు బీజింగ్‌ కూడా అదే చేయనుందని వేరే చెప్పనవసరం లేదు. ” ఆరుగురు అసమర్ధులు మరియు జార్జియా మెలోనీ 2024 జి7 తరగతిలో కూడిక ” అన్న శీర్షికతో పొలిటికో పత్రిక ఒక బలహీన సమావేశం అంటూ విశ్లేషణ రాసింది. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పచ్చిమితవాద పార్టీలు బలపడటంతో ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ ఏకంగా పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాడు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా అంతకు ముందే అదేపని చేశాడు. జర్మనీ ఛాన్సలర్‌ షఉల్జ్‌ కూడా చావు దెబ్బతిన్నాడు, ఎప్పుడైనా అదేపని చేయవచ్చు. తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ ”వెర్రి(క్రేజీ)” పదవి నుంచి తప్పుకోనున్నట్లు బహిరంగంగానే ప్రకటించాడు.జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా పలుకుబడి అధ్వాన్నంగా ఉంది. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్‌ తిరిగి అధికారానికి రావటం అనుమానంగానే ఉంది. ఇలాంటి వాటన్నింటినీ మూసిపెట్టేందుకు రష్యాతో పాటు చైనాను కూడా బూచిగా చూపేందుకు కసరత్తు చేశారు.


ఉక్రెయిన్‌-రష్యా వివాదం ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. అయితే దాన్ని పరిష్కరించటానికి బదులు మరింత ఎగదోసేదిగా కనిపించింది. ఈ సమావేశం ఫలితాలు, పర్యవసానాల విషయానికి వస్తే ఇప్పటికే దగ్గరైన చైనా-రష్యాలను మరింత దగ్గరగా చేసేందుకు దోహదం చేసిందని చెప్పవచ్చు.ఉక్రెయిన్‌ యుద్ధంలో చైనా ఆయుధాలను రష్యాకు సరఫరా చేయటం లేదు, కానీ వాటిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సామర్ధ్యాన్ని సమకూరుస్తున్నది, కాబట్టి నిజానికి అది రష్యాకు సాయం చేయటమే అని జో బైడెన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పాడు. రష్యా యుద్ధ యంత్రాంగ రక్షకురాలిగా చిత్రించటం తప్ప వేరు కాదు.గత కొద్ది సంవత్సరాలుగా చైనా మీద సాగిస్తున్న విమర్శ మరింత పదును తేలింది. గత రెండు సమావేశాల్లో చైనా పాత్ర గురించి దాదాపు లేవనెత్తలేదని, ఉక్రెయిన్‌పై వ్లదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాన్ని పేల్చుతారన్న భయాలు తలెత్తినపుడు షీ జింపింగ్‌ అంతదాకా పోనివ్వని నియంత్రణశక్తిగా భావించారని, ఈసారి దానికి భిన్నంగా సమావేశ ప్రకటన ప్రారంభమైందని న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది.రష్యా యుద్ధ యంత్రాంగానికి వస్తు సరఫరా చేస్తున్న చైనా, మూడవ పక్షదేశాల సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటం కొనసాగిస్తామని ప్రకటనలో పేర్కొన్నట్లు ఉటంకించింది. గత సమావేశాల్లో వాతావరణ ప్రతికూల మార్పులను అడ్డుకొనేందుకు,ఉగ్రవాదం, అణ్వాయుధ నిరోధం కోసం చైనాతో చేతులు కలుపుతామంటూ మాట్లాడిన ధనికదేశాలు ఇప్పుడు శత్రువుగా చూస్తున్నాయంటే ఆ సమస్యల పట్ల వాటి చిత్తశుద్ది ఏమిటో స్వయంగా వెల్లడించుకున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ షీ జింపింగ్‌ చైనా ఆధిపత్య లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అపూలియా అంతరంగిక సమావేశంలో అభిప్రాయపడినట్లు అమెరికా అధికారి ఒకరు విలేకర్లతో చెప్పాడు. ఉక్రెయిన్‌ వివాదంలో చైనా పాత్ర గురించి షీ జింపింగ్‌ వైఖరిలో గత ఏడాది కాలంలో మార్పు వచ్చినట్లు అమెరికా ప్రచారం చేస్తున్నది.రష్యాతో అవధులు లేని భాగస్వామ్యంగా ప్రకటించినప్పటి నుంచి అది ప్రారంభమైందని ఆరోపిస్తోంది. స్విడ్జర్లాండ్‌లో పశ్చిమదేశాలు నిర్వహించిన ఉక్రెయిన్‌ శాంతి సదస్సులో పాల్గొనవద్దని దేశాలను నిరుత్సాహపరచిందని కూడా ఆరోపించింది. చిత్రం ఏమిటంటే ఈ సమావేశంలో భాగస్వామిగా ఉన్న మనదేశం సమావేశ ప్రకటనను ఆమోదించటానికి తిరస్కరించింది. దీని వెనుక కూడా చైనా హస్తం ఉందని చెప్పగలరా ?


అవసరానికి మించి చైనా ఉత్పత్తులు చేస్తున్నదనే ప్రచారం పెద్ద ఎత్తున పశ్చిమదేశాలు చేస్తున్నాయి. ఇటలీ సభలో కూడా ఇది ఒక ప్రధాన అజెండాగా ఉంది. పెట్టుబడిదారీ విధాన సూత్రం ప్రకారం అవసరానికి మించి ఉత్పత్తి చేస్తే కొనేవారు లేక సంక్షోభానికి దారితీస్తుంది. ఈ కనీస ఇంగితం చైనా నాయకత్వానికి లేదని భావిస్తున్నారా ? చైనా ఉత్పత్తులు, సరఫరా గొలుసు మీద ఆధారపడకూడదని, విడగొట్టుకోవాలని చెబుతున్నవారిని ఎవరూ బలవంతంగా ఆపలేదే. వస్తు తయారీకి ధనిక దేశాల వద్ద పెట్టుబడులు లేవా, సాంకేతిక పరిజ్ఞానం లేదా, పని చేసే కార్మికులు లేరా ? చైనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నది అనుకుంటే ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేయవచ్చు. అమెరికా, ఐరోపా యూనియన్‌ కూడా చైనా ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను పెంచి రక్షణాత్మక చర్యలు తీసుకొని కూడా గగ్గోలు పెడుతున్నాయి. తమ బలహీనతలను కప్పిపుచ్చుకొనేందుకు తమమీద నిందలు వేస్తున్నట్లు చైనా విమర్శిస్తున్నది.


చైనా మీద వ్యతిరేకతను పెంచేందుకు చేయని తప్పుడు ప్రచారం లేదు. అవసరమైనపుడు అమెరికా, ఐరోపా దేశాలలోని అన్నిరకాల వ్యవస్థలను పనిచేయకుండా చేసేందుకు వాటిలో కంప్యూటర్‌ వైరస్‌లను పెట్టి సిద్ధంగా ఉంచిందని అమెరికా ఆరోపించింది. దీనికి ” ఓల్ట్‌ టైఫూన్‌ ” అనే పేరు పెట్టారు. దీని ప్రకారం విద్యుత్‌,నీరు,రేవుల వంటి వ్యవస్థలను అమెరికా, దాని మిత్రదేశాలలో పనిచేయకుండా చేసేందుకు చైనా ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించి సదరు వ్యవస్థలలో ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. ఐటి, అన్ని రకాల సాంకేతిక రంగాలలో తమకు మించిన వారు లేరని విర్రవీగుతున్న పశ్చిమదేశాలు తమ వ్యవస్థలకు రక్షణ ఏర్పాట్లు చేసుకోలేనంత అసమర్ధంగా ఉన్నాయా ? అంటే ఎవరూ నమ్మరు, చైనాను బూచిగా చూపి జనంలో దిగజారుతున్న తమ పలుకుబడిని నిలుపుకొనేందుకు, ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ఒక మైండ్‌ గేమ్‌ తప్ప మరొకటి కాదు. ఒకవేళ బలవంతంగా తైవాన్‌ విలీనానికి చైనా పూనుకుంటే అక్కడి చిప్స్‌ తయారీ కేంద్రాలను పేల్చివేస్తామని అమెరికా బెదిరించిన సంగతి తెలిసిందే. అందువలన ఒక వేళ నిజంగా చైనా అలాంటి వైరస్‌ను చొప్పించిందంటే దెబ్బకు దెబ్బ తీసే జాగ్రత్త అని అర్ధం చేసుకోవాలి.
ఇక అపూలియా సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ హాజరైపుడు ఫొటో తీసుకొనేందుకు హాజరైన నేతలందరూ చుట్టుముట్టారని, నేతల మధ్యలో మోడీ ఉండటమే దానికి నిదర్శనం అన్నట్లు సమావేశ గ్రూపు ఫొటోను చూపి కొంత మంది చౌకబారు ప్రచారం చేస్తున్నారు. ఐదుసార్లు ఈ సమావేశాలకు మోడీ వెళ్లారన్నది మరొకటి. యుపిఏ పదేండ్ల కాలంలో మన్మోహన్‌ సింగ్‌ కూడా ఐదుసార్లు హాజరయ్యారు.(2006 సెంట్‌పీటర్స్‌బర్గ్‌ సమావేశానికి మనదేశం నుంచి తీసుకువెళ్లిన జర్నలిస్టుల బృందంలో ఈ రచయిత కూడా ఒకరు ) భారత్‌ ఈ కూటమి సభ్యదేశంగా చేరనుందనే భావం కల్పిస్తూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. ఏ ఒక్కదేశమూ ఈ గ్రూపును విస్తరించే ప్రతిపాదనలు ముందుకు తేలేదు. ఒకవేళ విస్తరించినా మనదేశాన్ని చేర్చుకుంటారన్నది సందేహమే. ఆ గ్రూపులోని ఐదు దేశాల జిడిపి కంటే మనది ఎక్కువగా ఉన్నది తప్ప ధనికదేశ వర్గీకరణకు ఎంతో దూరంలో ఉంది. యాభై ఏండ్లుగా ఉన్న ఆ బృందం ప్రపంచ పరిణామాలను నియంత్రించటంలో నానాటికీ బలహీనపడుతున్న తరుణంలో మనదేశం చేరినంత మాత్రాన మన జనానికి ఒరిగేదేమిటి ? ఒకవేళ నిజంగా చేరితే చైనా, రష్యాలతో ఒక శత్రుకూటమిగా మనదేశం కూడా లడాయికి దిగటమే. అటువంటి దుస్సాహసానికి నరేంద్రమోడీ పాల్పడతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d