• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Loksabha Elections

అధికారం కోసం దేశం-ధర్మం పేరుతో అమాయక రైతులకు కాషాయ గుంపు అన్యాయం !

23 Sunday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ 1 Comment

Tags

#Farmers matter, #Farmers Protest, Anti Farmers, BJP, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


మూడవ సారి నరేంద్రమోడీ ప్రధాని పదవి చేపట్టారు. ఎంతో వేగంగా పని చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. దానికి పక్కా నిదర్శనం జమ్మూ-కాశ్మీరుకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 370ని ఎంత వేగంగా రద్దు చేశారో దేశం చూసింది. 2019 జూలై చివరి వారంలో అసాధారణ రీతిలో కాశ్మీరులో భద్రతా దళాలను మోహరించారు.ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం నాడు అమరనాధ్‌ యాత్రీకులకు ముప్పు ఉందంటూ యాత్ర నిలిపివేయాలని భద్రతా హెచ్చరిక కాశ్మీరు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.ఆదివారం నాడు రాష్ట్ర మంతటా 144సెక్షన్‌ ప్రకటించారు, ఇంటర్నెట్‌ నిలిపివేశారు. సోమవారం నాడు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ముందు అదేరోజు రాష్ట్రపతి ఉత్తరువు వెలువడింది. వెంటనే మంత్రివర్గ సమావేశం, అనంతరం అదే రోజు దాని మీద రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు.సభ్యులకు దాని కాపీలు ఇవ్వలేదు. ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశమైతే గంటన్నరలో అంటే 12.30లోగా 57పేజీల పత్రం మీద కావాలంటే సవరణలు ప్రవేశపెట్టవచ్చంటూ చెప్పారు. వాటిని చదివేందుకు కూడా ఆ సమయం చాలదు. అదే రోజు సభలో ఆమోదం కూడా పొందారు.మరుసటి ఏడాది కరోనాను అవకాశంగా తీసుకొని మూడు సాగు చట్టాలనూ అంతే వేగంగా ఆమోదించి అమలు చేసేందుకు పూనుకున్నారు.వేగంగా పనిచేసే నాయకత్వ ఘనత గురించి నరేంద్రమోడీ భక్తులు, గోడీ మీడియా పండితులను అడిగితే కొండవీటి చాంతాడంత జాబితాను మన ముందుంచుతారు. రైతుల మహత్తర ఉద్యమం కారణంగా స్వాతంత్య్రానంతరం దేశంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను క్షమాపణ చెప్పి మరీ 2021లో వెనక్కు తీసుకోవటం కూడా వేగంగా జరిగినట్లే !


ఈ వేగం కోట్లాది మంది కోట్లాది మంది రైతులు కోరుతున్న, గతంలో నరేంద్రమోడీ కూడా డిమాండ్‌ చేసిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు ఎందుకు లేదు ? రెండు సంవత్సరాల క్రితం ఎంఎస్‌పితో సహా రైతాంగ సమస్యలపై నియమించిన కమిటీ నుంచి ఇంతవరకు తాత్కాలిక నివేదికను కూడా ఎందుకు తెప్పించుకోలేదు ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ప్రభుత్వ తీరు ఉంది. మూడు సాగు చట్టాలను 2021నవంబరులో రద్దుచేసినపుడు వెంటనే ఒక కమిటీని వేస్తామన్నారు. వెంటనే అంటే ఎనిమిది నెలలు, 2022 జూలై 12న కమిటీని వేశారు. ఆలస్యం ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని, సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి స్పందన కోసం ఎదురుచూడాల్సి రావటం అని వ్యవసాయ మంత్రి సాకులు చెప్పారు. ఆ కమిటీకి నివేదించిన అంశాలు, కమిటీలో ప్రతిపాదించిన వ్యక్తుల పట్ల అభ్యంతరాలు తెలుపుతూ మోర్చా తన ప్రతినిధులను పంపేందుకు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం-ఎన్నికల కమిషన్‌ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను అందించాలని సమాచార హక్కు కింద కోరగా అలాంటి రికార్డులు లేవని సమాధానం ఇవ్వటాన్ని బట్టి అసలు బండారం వెల్లడైంది.అంతే కాదు రైతు సంఘాలతో సంప్రదింపుల సమాచారం కూడా లేదని 2023 డిసెంబరు నాలుగవ తేదీన మరో సమాచార హక్కు ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఇక ప్రభుత్వం నియమించిన కమిటీ తీరుతెన్నులను చూస్తే ఎస్‌కెఎం ఎందుకు బహిష్కరించిందో వివరణ అవసరం లేదు. మొత్తం 29 మంది సభ్యులలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు, కాలేజీల్లో పనిచేసే వారే 18 మంది ఉన్నారు. మిగిలిన పదకొండు మంది అధికారేతర సభ్యులలో ఎస్‌కెఎం నుంచి ముగ్గురిని నియమిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. మరో ఎనిమిది మంది అధికారపార్టీ కనుసన్నలలో వ్యవహరించే రైతు ప్రతినిధులే ఉన్నారు. ఈ కమిటీకి అధ్యక్షుడు సంజరు అగర్వాల్‌. వివాదాస్పద మూడు సాగు చట్టాలను ప్రతిపాదించినపుడు వ్యవసాయశాఖ కార్యదర్శి. మరో సభ్యుడు ఇఫ్‌కో చైర్మన్‌ దిలీప్‌, ఇతగాడు గుజరాత్‌ బిజెపి మాజీ ఎంపీ. మరొకరు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ బికెఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడైన ప్రమోద్‌ చౌదరి, ఐదవ సభ్యుడు సయ్యద్‌ పాషా పటేల్‌ మహారాష్ట్ర బిజెపి మాజీ ఎంఎల్‌సి, ఇలా అందరూ గత సాగు చట్టాలను అడ్డంగా సమర్దించిన వారితోనే నింపిన తరువాత ఎస్‌కెఎం గళానికి అవకాశం ఎక్కడ ఉంటుంది.


ఇక ఈ కమిటీ తొలి పద్దెనిమిది నెలల కాలంలో 35 సమావేశాలు జరిపినట్లు, ఎప్పుడు నివేదిక సమర్పిస్తుందో చెప్పకుండా పార్లమెంటుకు ప్రభుత్వం జవాబిచ్చింది.ఫిబ్రవరి తరువాత మరో రెండు సార్లు సమావేశమైనట్లు వార్తలు.ఈ కమిటీ అనేక ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. వాటి నివేదికలు ఇవ్వాలని కోరినా అందుబాటులో లేవన్నదే ప్రభుత్వ సమాధానం. గతంలో స్వామినాధన్‌ కమిషన్‌, తరువాత నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన 2016కమిటీ కూడా అనేక అంశాలను చర్చించింది. అందువలన కొత్త కమిటీ చర్చల పేరుతో కాలయాపన తప్ప మరొకటి కాదు. వాటి సిఫార్సులకు వ్యతిరేకంగా మూడు సాగు చట్టాల్లోని అంశాలు ఉన్నాయి. అయినా మోడీ వాటిని రద్దు చేస్తూ 2021లో చేసిన ప్రసంగంలో రైతులకు కొత్త ఆశలను రేకెత్తించారు.2014 ఎన్నికల సమయంలో బిజెపి చేసిన వాగ్దానానికి వ్యతిరేకంగా మోడీ సర్కార్‌ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దేశ 75వ స్వాతంత్య్రదినోత్సవం (2022) నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరి 28 బడ్జెట్‌ సందర్బంగా మోడీ చెప్పారు. అదే ఏడాది ఏర్పాటు చేసిన అశోక్‌ దలవాయి కమిటీ 2012-13 ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అంచనా ప్రాతిపదికన 2015-2016లో ఒక రైతు రాబడి ఏడాదికి రు.96,703, నెలకు రు.8,058 ఉంటుందని అంచనా వేసి 2022-23నాటికి అది రు.2,71,378- రు.22,610 ఉండాలని, దాన్ని సాధించాలంటే ఏటా 10.4శాతం పెరుగుదల ఉండాలని చెప్పింది. ఇప్పుడు ఎంత ఉందో ఎక్కడా ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే 2018-19లో 77వ రైతు కుటుంబాల పరిస్థితి అంచనా సర్వే ప్రకారం రాబడుల మొత్తాలు రు.1,22,616-రు.10,218 ఉన్నట్లు తేలింది. ఈ నివేదికను 2021లో విడుదల చేశారు. దీని ప్రకారం చూస్తే వార్షిక పెరుగుదల కేవలం 2.8శాతమే ఉంది. పదేండ్ల యూపిఏ పాలన సగటు మూడు శాతం కంటే తక్కువ. అయితే ఏ ప్రాతిపదిక లెక్కించారో చెప్పకుండా కొన్ని పంటలకు 2022 ఆర్థిక సంవత్సరంలో రాబడి రెట్టింపు ఉన్నట్లు ఎస్‌బిఐ పరిశోధనా విభాగం చెప్పిన అంకెలను బిజెపి పెద్దలు ఊరూవాడా ప్రచారం చేశారు. గోడీ మీడియా దాన్ని ఇంకా ఎక్కువ చేసింది. నిజంగా అంత పెరిగి ఉంటే రైతాంగం ఈ ఎన్నికల్లో అనేక చోట్ల బిజెపి, దాని మిత్రపక్షాలను ఎందుకు మట్టికరిపించినట్లు ? అనేక చోట్ల రైతులు కనీస మద్దతు ధరలకంటే తక్కువకే అమ్ముకుంటున్నారు. రైతుల రాబడి రెట్టింపు ఎంతవరకు వచ్చిందన్న ప్రశ్నకు 2023 డిసెంబరులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పందిస్తూ వ్యవసాయం రాష్ట్రాల అంశం గనుక అవి చూసుకుంటాయని దాట వేశారు. మూడు సాగు చట్టాలను రాష్ట్రాలతో సంప్రదించకుండా వాటి ఆమోదం లేకుండా అమలుకు పూనుకున్నపుడు ఈ అంశం గుర్తులేదా ? రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తిని గమనించి గత ఎన్నికలకు ముందు కొంత మంది రైతులకు నెలకు రు.500 ఏడాదికి ఆరువేల చొప్పున పిఎం కిసాన్‌ నిధిపేరుతో ఇస్తున్నారు. ఐదేండ్లలో పెరిగిన వ్యవసాయ ఖర్చులతో పోల్చితే ఇది ఏమూలకూ రాదు. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచనుందనే లీకులను వదిలి రైతాంగాన్ని మభ్యపెట్టేందుకు చూసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు.


తాజాగా వర్తమాన ఖరీఫ్‌ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గతేడాది ఏడుశాతం పెంచగా ఇప్పుడు ఓట్లతో నిమిత్తం లేదు గనుక 5.4శాతం మాత్రమే పెంచారు. తాజా ఎన్నికల్లో 159 గ్రామీణ నియోజకవర్గాలలో ఓడిపోయిన బిజెపి దాన్నుంచి ఎలాంటి పాఠం నేర్చుకోలేదన్న సంయుక్త కిసాన్‌ మోర్చా వ్యాఖ్యను గమనించాలి.ఈ సందర్భంగా పదేండ్ల యుపిఏ పాలనలో పెరిగింది ఎంత, రాబడిని రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ ఎంత పెంచారు అన్నది మీడియాలో చర్చకు వచ్చింది. దీన్ని గోడీ మీడియా మూసిపెట్టేందుకు చూసింది.ప్రభుత్వ సమాచారం ప్రకారమే మచ్చుకు సోయాబీన్‌కు గత పాలకులు, 175, పత్తికి 115శాతం పెంచగా మోడీ పదేండ్లలో 80,79శాతాల చొప్పునే పెంచారు. అనేక పంటల ధరల పెరుగుదల శాతాల తీరు తెన్నులు దిగువ విధంగా ఉన్నాయి. దీనికి ఆధారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం.ఈ కనీస మద్దతు ధరలు కూడా రైతాంగంలో కేవలం పద్నాలుగుశాతం మాత్రమే పొందుతున్నారన్నది అంచనా.


పంట××××× యుపిఏ ×× మోడీ ఏలుబడి

వరి ముతక×× 138.2 ×× 66.7
గోధుమ ×× 122.2 ×× 62.5
చెరకు ×× 187.7 ×× 50.0
ఆవాలు ×× 90.6 ×× 85.3
పత్తి ××114.5 ×× 78.9
మొక్క జొన్న ××1594 ×× 59.5
శనగలు ×× 121.4×× 75.5
కందులు ×× 216.2×× 62.8
నరేంద్రమోడీ సర్కార్‌ రైతులకు చేసిన మేలు ఇలా ఉంది గనుకనే అనేక చోట్ల బిజెపి ఎదురుదెబ్బలు తిన్నది, గత ఎన్నికల కంటే సీట్లు, ఓట్ల శాతాన్ని కూడా కోల్పోయింది. దేశాన్ని ఊపివేస్తున్న నీట్‌ పరీక్షా పత్రాల కుంభకోణం ఎన్నికలకు ముందే వెలువడి ఉంటే దాని పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. దేశం కోసం-ధర్మం కోసమంటూ కబుర్లు చెప్పిన కాషాయదళం తీరుతెన్నులు వచ్చే ఐదు సంవత్సరాలూ వ్యవసాయ రంగంలో ఇదే విధంగా ఉండకూడని అనేక మంది కోరుతున్నారు.పెడచెవిన పెడితే రైతాంగ ఉద్యమాలు వెల్లువెత్తుతాయి. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 15-16శాతమే ఉన్నప్పటికీ జనాభాలో 45శాతం మందికి ఉపాధి చూపుతున్నది. ఇది కూడా కుదేలైతే గ్రామీణా ప్రాంతాలలో అలజడి రేగుతుంది. జూలై పదవ తేదీన సంయుక్త కిసాన్‌మోర్చా జనరల్‌ బాడీ సమావేశం ఎన్నికల అనంతర పరిస్థితి గురించి సమీక్ష, కార్యాచరణ గురించి చర్చించనుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ రెండు ముఖాలు : రైౖతుల మద్దతు కోసం పాకులాట – ఉద్యమ సంఘాలపై పగసాధింపు !

22 Saturday Jun 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

#Failed Narendra Modi, #Farmers matter, AIKS, BJP, Minimum Support Prices, MSP demand, Narendra Modi Failures, PM Kisan Nidhi, Samyukta Kisan Morcha, SKM


ఎం కోటేశ్వరరావు


ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన కిసాన్‌ సమ్మాన్‌ యోజన పదిహేడవ విడత నిధులను మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత పెద్ద ఆర్భాటంతో ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు.(ఆంధ్రప్రదేశ్‌ మాజీ సిఎం వైఎస్‌ జగన్‌ మీట నొక్కుడును గుర్తుకు తెచ్చింది) అంతకు ముందు తొలిసంతకం దాని మీదే చేసినట్లు కూడా ప్రచారం జరిగింది.వెంటనే తాను ఎన్నికైన లోక్‌సభ స్థానం వారణాసి వెళ్లి రైతులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎగుమతుల ద్వారా భారత ఆహార వస్తువులను ప్రపంచంలో ప్రతి ఒక్కరి కంచంలో చూడాలని ఉందన్నారు. గతంలో ఎన్నడూ పిఎం కిసాన్‌ యోజన నిధుల విడుదలకు ఇంత హంగామా చేయలేదు. నిజానికి ఈ సొమ్ము ఏ కార్పొరేట్ల నుంచో ధనికుల నుంచో వసూలు చేసి ఇవ్వటం లేదు. మనం కొనుగోలు చేసే పెట్రోలు మీద లీటరుకు రు.2.50, డీజిలు మీద రు.4.00 సెస్‌ల పేరుతో కేంద్రం వసూలు చేసి దాన్నుంచి ఇస్తున్నది. ఇదే కాదు మొత్తం 29 వస్తువులపై ఈ పేరుతో పన్ను మీద 15శాతం సెస్‌ల రూపంలో వినియోగదారుల జేబుల నుంచి కొట్టివేసి దాన్నుంచే కొన్ని పథకాలను అమలు చేస్తున్నది. ఎప్పుడూ లేనిది కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదలను ప్రచారానికి ఎందుకు వినియోగించుకున్నట్లు ? అదేమీ అర్ధంగాని తత్వం లేదా బ్రహ్మ పదార్ధం కాదు.తాజా లోక్‌సభ ఎన్నికల్లో రైతుల నుంచి వెల్లడైన వ్యతిరేకత అనేక ప్రాంతాల్లో ఓటమిలో వారి పాత్రను చూశారు. తత్వం తలకెక్కి రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దగ్గరయ్యే ఎత్తుగడతో వారికోసం తాను తపిస్తున్నట్లు కనిపించేందుకు చేసిన యత్నం తప్ప మరొకటి కాదు.కొందరి విశ్లేషణ ప్రకారం గత లోక్‌సభలో 543 స్థానాలకు గాను బిజెపి 201గ్రామీణ నియోజకవర్గాలలో విజయం సాధించగా తాజా ఎన్నికల్లో 126 చోట్ల మాత్రమే గెలిచింది.వ్యవసాయదారులను నిర్లక్ష్యం చేసిన కారణంగా 159 చోట్ల బిజెపి ఓడిపోయిందని, రైతుల ప్రతినిధులను బడ్జెట్‌ చర్చల ప్రక్రియలో భాగస్వాములను చేయకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తే, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశవ్యాపితంగా ఆందోళన తప్ప మరొక మార్గం లేదని ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకెఎస్‌) స్పష్టం చేసింది.


నిజంగా వ్యవసాయం, దాని మీద ఆధారపడిన రైతులు, కూలీల గురించి కేంద్ర ప్రభుత్వానికి అంతశ్రద్ద ఉందా ? పదేండ్ల ఆచరణ చూస్తే అలా కనిపించదు. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయ రంగంలో రాష్ట్రాలలో చర్చ, ఆమోదంతో నిమిత్తం లేకుండా కరోనా సమయంలో అమల్లోకి తెచ్చిన మూడు రైతు వ్యతిరేక సాగు చట్టాలు, వాటికి వ్యతిరేకంగా ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం తెలిసిందే.విధి లేని స్థితిలో క్షమాపణలు చెప్పిమరీ మోడీ వాటిని వెనక్కు తీసుకున్నారు. ఆ మహత్తర ఉద్యమానికి నాయకత్వం వహించింది అనేక రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం). ఆ వేదికలో కీలక పాత్రపోషించిన ఆలిండియా కిసాన్‌ సభ(ఎఐకెఎస్‌) దేశంలో అతి పెద్ద రైతు ఉద్యమ సంస్థ, తొలి వరుసలో ఉంది. మూడు సాగు చట్టాల రద్దు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు, ఇతర అంశాల గురించి 2022 జూలైలో ఒక కమిటీని వేసింది. అది ఏం చేస్తున్నదో నివేదిక ఎప్పుడు సమర్పిస్తుందో తెలియదు. బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా వివిధ తరగతులు ఏ కోరుకుంటున్నారో తెలుసుకొనేందుకు ప్రభుత్వం సంస్థలు, వ్యక్తులను కూడా పిలిచి ప్రతి ఏడాది సంప్రదింపులు జరుపుతుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆమోదం పొందిన తాత్కాలిక(ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌) స్థానంలో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఇప్పుడు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ చర్చలకు ఎస్‌కెఎం, ఏఐకెఎస్‌లను దూరంగా పెట్టింది. ఇది రైతులను అవమానించటం, కక్ష సాధింపు అనేందుకు పక్కానిదర్శనం.ఈ వైఖరిని ఆలిండియా కిసాన్‌ సభ ఒక ప్రకటనలో తీవ్రంగా నిరసించింది. కనీస మద్దతు ధరలను సిఫార్సు చేసే వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రతి ఏటా ఎఐకెఎస్‌ను ఆహ్వానించి అభిప్రాయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎస్‌కెఎం నాయకులను కూడా చర్చల నుంచి మినహాయించటాన్ని కూడా ఎఐకెఎస్‌ ఖండించింది.


మూడవసారి అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ వ్యవసాయం గురించి సరికొత్తగా ఆలోచించి కార్యాచరణ చేపట్టాలని అనేక మంది చెబుతున్నారు. మోడీ సర్కార్‌ పారిశ్రామిక వస్తు ఎగుమతుల్లో విఫలమైంది. సముద్ర ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులకు జతచేసిి మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిగా చూపుతున్నారు.2014-15 సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 36.18బిలియన్‌ డాలర్లుండగా 2020-21నాటికి 38.32 బి.డాలర్లకు పెరిగినట్లు ఏటా పెరుగుదల శాతం 0.96శాతంగా ఉన్నట్లు ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపినట్లు బిజినెస్‌ టుడే పత్రిక 2021 డిసెంబరు 10న ప్రచురించిన వార్తలో పేర్కొన్నది.సముద్ర, తోటల ఉత్పత్తులను మినహాయించి కేవలం వ్యవసాయ ఉత్పత్తుల విలువ 2020-21లో 29.81 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మోడీ అధికారానికి రాకముందు 2013-14 సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 37.292బి.డాలర్లు. ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించినట్లు పిఐబి 2014జూలై తొమ్మిదిన తెలిపింది.దీంతో పోల్చుకున్నా, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ విలువ తిరోగమనంలోనే ఉంటుంది. జనాన్ని మభ్యపరిచేందుకు పాలకుల కనుసన్నలలో పనిచేసే అధికార యంత్రాంగం ఎన్నితిప్పలు పడుతుందో పిఐబి 2024 ఫిబ్రవరి 17న వెల్లడించిన మరో సమాచారాన్ని చూస్తే తెలుస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన పదేండ్లలో సాధించిన విజయాల గురించి కీర్తించటం తెలిసిందే. దానిలో భాగంగానే 1987-88లో అపెడా( వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ) ఎగుమతులు కేవలం 0.6బిలియన్‌ డాలర్లేనని అలాంటిది 2022-23నాటికి 26.7బి.డాలర్లకు పెరిగినట్లు , ఇది మోడీ గొప్పతనం అన్నట్లు చిత్రించింది. ఈ ఏడాదిలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 53.1బి.డాలర్లని కూడా తెలిపింది. ఈ లెక్కన చూసుకున్నా పదేండ్లలో పెరిగింది 53.1-37.29=15.81 బి.డాలర్లు మాత్రమే. తాను వచ్చిన తరువాత భారత ప్రతిష్టను, విదేశాల్లో తిరిగి మార్కెట్లను పెంచానని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు చేశామని చెప్పుకున్న నరేంద్రమోడీ ప్రచారానికి ధీటుగా ఈ పెరుగుదల లేదు. యాహూ న్యూస్‌ 2024 మార్చి 21వ తేదీ విశ్లేషణ ప్రకారం 2022లో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే 20 అగ్రదేశాలలో మనది 11వ స్థానం, చైనా ఆరవదిగా ఉంది.


మన రైతులు నేరుగా ఏ దేశానికైనా ఎగుమతులు చేసుకొనేందుకు, దేశంలో ఎక్కడైనా అమ్ముకొనేందుకు వీలుగా మూడు సాగు చట్టాలను తీసుకొచ్చినట్లు నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే.కానీ అదే ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలు, నిషేధం ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి పండే ప్రాంతాలలో ఎక్కువ చోట్ల బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్నది. ఆంక్షల వలన 2023 ఏప్రిల్‌-అక్టోబరు మాసాల మధ్య బాస్మతి బియ్యం ఎగుమతులు 16శాతం పెరిగినా ఇతర ఉత్పత్తుల్లో నాలుగు బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరగలేదు. తొమ్మిదిశాతం ఎగుమతులు తన పరిధిలో తగ్గినట్లు అపెడా పేర్కొన్నది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా బిజెపి రైతుల ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా నేపాల్‌, ఇతర దేశాలు మన బదులు పాకిస్తాన్‌, చైనాల నుంచి కొనుగోలుకు పూనుకున్నాయి. అంటే ఎగుమతి అవకాశాన్ని తన ఎన్నికల లబ్దికోసం మోడీ అనిశ్చితిలో పడేశారు. పోనీ మనదేశంలో ఉల్లి దిగుబడిని పెంచేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ కనపడదు. చైనాలో హెక్టారుకు 21.85 టన్నుల దిగుబడి ఉండగా మనదేశంలో 16.12 టన్నులు మాత్రమే ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో రెండు దేశాలూ ఒకటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి.


వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలకు బదులు రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు సాగు చట్టాల పేరుతో చేసిన యత్నం బెడిసి కొట్టింది. తరువాత కూడా అదే వైఖరి. కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి) విధానాన్ని ఎత్తివేయాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల అమలుకు చూస్తున్నారు. ఆ కారణంగానే ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నారు. మరో ఐదు సంవత్సరాల వరకు పార్లమెంటు ఎన్నికలు లేవు గనుక ఎగుమతి వ్యాపారంలో ఉన్న బడా సంస్థల కోసం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలను త్వరలో ఎత్తివేసి అవి రైతులకోసమే అని చెప్పినా ఆశ్చర్యం లేదు. మూడు సాగు చట్టాల తరువాత వేసిన కమిటీతో మరో రూపంలో ఆ చట్టాల్లోని అంశాలనే చెప్పించి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటానికి సాకుల కోసం చూస్తున్నారు. ఆ పేరుతో ప్రపంచవాణిజ్య సంస్థ, ఐఎంఎఫ్‌, ప్రపంచ బాంకులను సంతుష్టీకరించేందుకు పూనుకోవచ్చు.మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన నరేంద్రమోడీ మరోవైపు పప్పుధాన్యాలు, ఖాద్యతైలాల దిగుమతులపై పన్నులు తగ్గించారు. దీంతో మనదేశంలో వీటిని సాగుచేసే రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ద్రవ్యోల్బణ అదుపు చర్యలంటూ ఎగుమతులపై ఆంక్షలు, దిగుమతులపై పన్నుల తగ్గింపు కారణంగా అంతిమంగా నష్టపోయింది రైతులు మాత్రమే. ఎన్నికలు జరుగుతున్నపుడు కిలో ఇరవై రూపాయలున్న ఉల్లి ఫలితాలు వచ్చిన వెంటనే యాభై రూపాయలకు పెరిగింది. దీంతో రైతులెంత లబ్దిపొందుతారో తెలియదు గానీ వినియోగదారుల జేబులకు చిల్లి పడింది.

తొలిసారి నరేంద్రమోడీ అధికారానికి రావటానికి, కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోవటానికి కారణాల్లో ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదల కూడా ఒకటి.అందుకే తాజా ఎన్నికలకు ముందు దాన్ని కృత్రిమంగా అదుపులో ఉంచేందుకు పైన పేర్కొన్న చర్యలను తీసుకున్నారు.అయినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం 2023 నవంబరు నుంచి ఎనిమిదిశాతానికి అటూ ఇటూగా ఉంది. ఆ మేరకు పప్పులు, నూనెలు, ఇతర ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. బిజెపిని దెబ్బతీసిన అంశాలలో ఇది కూడా ఒకటి. ఈ నేపధ్యంలో బడ్జెట్‌లో రైతులు ఏం కోరుతున్నారో తెలుసుకోవాలంటే వారి సమస్యలపట్ల నిత్యం పని చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా, ఆలిండియా కిసాన్‌ సభ వంటి సంస్థలను, రైతాంగ సమస్యలపై అధ్యయనం చేస్తున్న మేధావులను సంప్రదించకుండా కుదిరేది కాదు. ఆ దిశగా కేంద్ర తీరు లేదంటే దాని అర్ధం ఏమిటి ? చర్చలకు పిలిస్తే ఎవరేం కోరుతున్నారో రైతులకు స్పష్టత వస్తుంది, వాటిని అమలు జరపకపోతే పాలకుల మీద వత్తిడి పెరుగుతుంది. అందుకే దూరంగా పెట్టారు.తన కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తానని ఒక ముసలమ్మ అనుకుందట.అలాగే ప్రభుత్వం అవకాశం కల్పించనంత మాత్రాన ఉద్యమ సంస్థల వాణి రైతులకు చేరకుండా ఉంటుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరంలేని నాలుకల సుభాషితాల రచ్చ మామూలుగా లేదు : నరేంద్రమోడీని తప్పించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ రంగం సిద్దం ?

15 Saturday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

BJP, Corporates and Modi, godi media, Mohan Bhagwat, Narendra Modi Failures, RSS, RSS Hypocrisy


ఎం కోటేశ్వరరావు


నేతిబీరలో నెయ్యి, మైసూరు పాక్‌లో మైసూరు – పాకిస్తాన్‌, మమకారంలో కారం ! ఇలాంటివి పిల్లల ఆటల్లో చూస్తాం. నరేంద్రమోడీ ఆకర్షణ కూడా అలాంటిదే అని సంఘపరివారం భావిస్తోందా ? వాజ్‌పాయి, అద్వానీలనే పక్కన పెట్టిన వారికి మోడీ ఒక లెక్కా ? ఒక ప్రకటన చేయటం, దాని మీద స్పందన చూసి సానుకూలంగా ఉంటే కొనసాగింపు లేకుంటే వెంటనే మాట మార్చటం తెలిసిందే. మోడీ కూడా పరివారంలో ఇతరుల మాదిరే తప్ప ప్రత్యేకతేమీ లేదనే సందేశాన్ని లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చేసిన ఉపన్యాసంలో వెల్లడించారు. ఈ సందర్భంగా దానితో పాటు కలగలిపి చెప్పిన సుభాషితాల్లో విశ్వసనీయత,చిత్తశుద్ధి, నిజాయితీ గురించి అనేక మంది ప్రశ్నిస్తున్నారు.రచ్చ కూడా మొదలైంది. మోడీ ఎలా స్పందిస్తారో, తన మద్దతుదార్లను ఎలా సమీకరిస్తారో చూడాల్సి ఉంది. గందరగోళం సృష్టించటానికి తమ నేత మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలకు తప్పుడు భాష్యం చెప్పారని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు చెప్పినట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. సంఫ్‌ు-బిజెపి మధ్య ఎలాంటి వివాదాలు లేవని, భగవత్‌ వ్యాఖ్యలను అసందర్భంగా పేర్కొన్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. 2014,2019 ఎన్నికల తరువాత చేసిన ఉపన్యాసాలకు, తాజా ఎన్నికల తరువాత చేసిన దానికి పెద్దగా తేడాలేదని. నరేంద్రమోడీ లేదా ఏ బిజెపి నేతను ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పుకుంది.తమ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం తప్ప సంస్థ అధికారిక వైఖరికి ప్రతిబింబం కాదన్నది.


నిజమైన సంఘసేవకులు పొగరుబోతులుగా ఉండరని మోహన్‌ భగవత్‌ తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ నాగపూర్‌ శిక్షణా సమావేశంలో సెలవిచ్చారు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పారంటే మోడీనే అని మీడియాలో కొందరు వ్యాఖ్యానించారు. మోడీని హెచ్చరించే ధైర్యం పరివార్‌కు ఉందా, తమకు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు అవసరం లేదని చెప్పిన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను ఉద్దేశించి అని కొందరన్నారు. తన జన్మ మామూలుది కాదని, దైవాంశ సంభూతుడనని నరేంద్రమోడీ చెప్పుకున్నపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి చప్పుడు చేయలేదు. 2018 నుంచి ఎన్‌డిఏ కూటమి కన్వీనర్‌ లేరు, సమావేశాలు జరిపింది లేదు, మిత్రపక్షాలను ముఖ్యమైన అంశాల మీద సంప్రదించిన దాఖలాలు లేవు. అహంకారం, ఏకపక్ష ధోరణే. రైతుల ఆందోళన పట్ల అనుసరించిన వైఖరిని చెప్పనవసరం లేదు. చివరికి అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వంటి పెద్దలతో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసి దానితో ఒక్క సమావేశం జరపకపోయినా, రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ రావద్దని చెప్పినపుడు గానీ ఆర్‌ఎస్‌ఎస్‌ స్పందించలేదు, సుద్దులు-బుద్దులు చెప్పలేదు. పదేండ్ల పాలన తరువాత సంపూర్ణ మెజారిటీ రాకపోవటం, అయోధ్య రామాలయం ఉన్న చోట బిజెపి మట్టికరవటం, మణిపూర్‌లో పరాభవం వంటి పరిణామాల తరువాత మోడీని కాపాడేందుకే భగవత్‌ రంగంలోకి దిగారనే అభిప్రాయం కూడా ఉంది. గతంలో కూడా అలాగే జరిగిందని కొందరు గుర్తు చేస్తున్నారు. కాదు తమ హిందూత్వ అజెండాకు మొదటికే మోసం వచ్చినందున మోడీని మందలించటం, తరువాత తప్పించేందుకు ముందుగానే పావులు కదిపారన్న అభిప్రాయాలూ ఉన్నాయి.


రెండు నాలుకలతో మాట్లాడటం, ఆ జేబులో ఒక స్టేట్‌మెంటు ఈ జేబులో మరో స్టేట్‌మెంటు పెట్టుకొని తిరిగే వారిలో సంఘపరివార్‌ దళం కూడా ఉంది. ఉదాహరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ మాట్లాడుతూ అహంకారం కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సీట్లను భగవంతుడు రాముడు 241 సీట్ల దగ్గరనే నిలిపివేసినట్లు, సంపూర్ణ మెజారిటీకి దూరంగా పెట్టినట్లు ధ్వజమెత్తారు. జైపూర్‌ సమీపంలోని కనోటా వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో జూన్‌ 13వ తేదీన మాట్లాడుతూ రామభక్తులు క్రమంగా అహంకారులుగా మారారు. ఆ కారణంగానే రాముడు ఆ పార్టీని అతిపెద్దపార్టీగా 241 సీట్ల వద్ద నిలిపాడని అన్నారు. ఇదంతా మోహన భగవత్‌ వ్యాఖ్యల తరువాతే జరిగింది. ఇంద్రేష్‌ కుమార్‌ వ్యాఖ్యలపై బిజెపి నుంచి నిరసన వెల్లడికావటంతో నష్టనివారణ చర్యగా ఆ సేవక్‌ మాటమార్చారు. రాముడిని వ్యతిరేకించిన వారు అధికారానికి దూరంగా ఉన్నారు. అనుసరించిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మరుసటి రోజు చెప్పారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వం రాత్రి పగలు పనిచేస్తుందని,దేశం ఎంతో పురోగతి సాధిస్తుందన్న నమ్మకంతో జనం ఉన్నారని ఆకాశానికి ఎత్తారు.మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలపై తలెత్తిన రచ్చ గురించి ప్రశ్నించగా దాని గురించి సంఫ్‌ు అధికారిక ప్రతినిధులను అడిగితే మంచిదని పిటిఐ వార్తా సంస్థతో అన్నారు.
మోహన్‌ భగవత్‌ చెప్పిన హితవులో మణిపూర్‌ హింసాకాండ అంశం కూడా ఉంది. ” ఈ ఈశాన్య రాష్ట్రంలో చూస్తుంటే ఎట్టకేలకు తుపాకి సంస్కృతి అంతమైనట్లుగా కనిపించింది, అయినప్పటికీ ”ఆకస్మికంగా” హింసాకాండ చెలరేగింది. ఎలాంటి ఆలశ్యం లేకుండా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది ” అని మోహన్‌ భగవత్‌ చెప్పారు.” గత పది సంవత్సరాల్లో మణిపూర్‌లో హింసాకాండ లేదు. కానీ పరిస్థితి దిగజారింది.శాంతియుత పరిస్థితి కోసం గత ఏడాదిగా ఆ రాష్ట్రం ఎదురుచూస్తోంది.” అన్నారు. మణిపూర్‌, కేంద్రంలోనూ రెండు చోట్లా స్వయం సేవకులే పాలకులుగా ఉన్నారు. హింసాకాండ చెలరేగి వందలాది మంది మరణించారు, వేలాది మంది నెలవులు తప్పారు. గిరిజన మహిళలను వివస్త్రలుగా ఊరేగించిన ఉదంతం వెలుగుచూడకుండా చేసేందుకు అదే సేవకులు పాటుపడ్డారు. అది బయటకు వచ్చిం తరువాత అక్కడకు వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పిరావాల్సిన కేంద్ర సేవక్‌ కదలేదు, మెదల్లేదు. ఇదేం పని అంటూ ప్రధాన సేవక్‌ ప్రశ్నించిన దాఖల్లాలేవు.చెంపదెబ్బ మాదిరి లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లోని రెండు స్థానాల్లో బిజెపి ఓడిపోయిన తరువాత మోహన్‌ భగవత్‌ సుభాషితాలకు పూనుకున్నారు. అక్కడ హిందువులైన మెయితీలు, క్రైస్తవులైన గిరిజన కుకీలు బిజెపిని మట్టికరిపించారు. రెండింజన్లు పనికిరానివిగా తేల్చారు. గుజరాత్‌ మారణకాండ సందర్భంగా రాజధర్మం పాటించాలని చెప్పిన అతల్‌ బిహారీ వాజ్‌పేయి మాటలనే పూచికపుల్లగా తీసిపారేసిన, మార్గదర్శక మండల్‌ పేరుతో సీనియర్ల కమిటీ అంటూ వేసి దాన్ని విస్మరించిన మోడీ గురించి జనానికి తెలిసినా మోహన్‌ భగవత్‌కు తెలియదంటే నమ్మలేము. స్వయం సేవకుల మీద ఎలాంటి నియంత్రణ ఉండదు అని చెప్పారు.


మణిపూర్‌ గురించి మోహన్‌ భగవత్‌ స్పందించటం ఇదే తొలిసారి కాదు. అక్కడ ఉన్న సామాజిక తరగతులైన మెయితీ-కుకీల మధ్య దీర్ఘకాలంగా ఉన్న పరస్పర అనుమానాలు, విబేధాల పూర్వరంగంలో బిజెపి మత అజండాతో మెయితీలను దగ్గరకు తీసి అధికారాన్ని పొందింది.హిందువుల సంతుష్టీకరణ, ఓటుబ్యాంకు రాజకీయాలకు తెరలేపింది. మెయితీలను కూడా గిరిజనులుగా పరిగణిస్తూ వారికి రిజర్వేషన్లను వర్తింప చేయాలంటూ తనకు లేని అధికారంతో హైకోర్టు సిఫార్సు చేసింది. దానికి నిరసన తెలిపిన గిరిజనులను అణచివేసేందుకు పూనుకోవటంతో హింసాకాండ తలెత్తింది.దారుణాలు చోటు చేసుకున్నాయి.ఈ వాస్తవాన్ని మూసిపెట్టేందుకు హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ గతేడాది అక్టోబరు 24న విజయదశమి సందేశంలో మోహన్‌ భగవత్‌ బిజెపి పాటను పాడారు. 2023 మే నెల మూడవ తేదీ నుంచి హింసాకాండ జరుగుతుంటే అక్టోబరు వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ స్పందించలేదు. విదేశీ హస్తమే వాస్తవం అనుకుంటే విదేశీ సరిహద్దులు ఉన్న ఆ రాష్ట్రంలో స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు సదరు హస్తాన్ని ఖండించకుండా, కట్టడి చేయకుండా ఏ గుడ్డిగుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? అప్పటి వరకు మాట్లాడని మాదక ద్రవ్యాల ఉగ్రవాదం, అక్రమంగా ప్రవేశించిన కుకీలు అంటూ కొత్త కతలను చెప్పారు. ఒక మాదక ద్రవ్య మాఫియా నేత (కుకీ) పట్ల నిదానంగా వ్యవహరించాలని ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌(మెయితీ) హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు ఒక పోలీసు అధికారి చెప్పిన మాటలను మరచిపోరాదు.మెయితీ-కుకీల మధ్య సంబంధాలకు ఎవరో మతం రంగు పులిమేందుకు చూశారని కూడా విజయదశమి ఉపన్యాసంలో భగవత్‌ ఆరోపించటం దొంగేదొంగని అరిచినట్లుగా ఉంది. అందువలన మణిపూర్‌ సమస్యను పట్టించుకోవాలని ఇప్పుడు మోహన్‌ భగవత్‌ చెప్పటంలో చిత్తశుద్ది ఉందా ? మణిపూర్‌ను సందర్శించటానికి నరేంద్రమోడీకి తీరిక దొరకలేదు, వెళ్లి సమీక్ష జరపాలని చెప్పటానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆలోచన తట్టలేదంటే నమ్మే అమాయకులు కాదు జనం.


ఎన్నికలలో నరేంద్రమోడీ, బిజెపి పెద్దల దిగజారుడు ప్రసంగాల తీరు తెలిసిందే. దాన్ని తక్కువ చేసి చూపేందుకు అందరూ అలాగే నోరుపారవేసుకున్నారంటూ భగవత్‌ మాట్లాడారు. నిజమైన ” సేవక్‌ ” ఎల్లవేళలా గౌరవం, వినయాన్ని ప్రదర్శించాలన్నారు. మోడీ ఎన్నికల ప్రసంగాల్లో అలాంటివి మచ్చుకైనా కనిపించాయా ? అడుగడుగునా అహంకార ప్రదర్శన, అబద్దాలు, వక్రీకరణలు, స్వంతడబ్బా, ప్రతిపక్షాలపై వ్యంగ్యాలు తప్ప ఒక ప్రధాని స్థాయిలో మాట్లాడింది లేదు. మోడీ గ్యారంటీలంటూ పెద్ద ఎత్తున వ్యక్తిపూజకు తెరలేపారు. దాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ మేథావులు అంగీకరించబట్టే కొనసాగింది. తీరా ఎదురుతన్నిన తరువాత ఇప్పుడు దానికి బాధ్యత తమది కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు.తమకు ఆర్‌ఎస్‌ఎస్‌తో అవసరం లేదని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన వ్యాఖ్య యధాలాపంగా చేసిందనుకుంటే పొరపాటు.రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత నరేంద్రమోడీ చుట్టూ ఉన్నవారిలో అంతర్లీనంగా పెరుగుతున్న అభిప్రాయమే ఇది. సంఘపరివార్‌కు బదులు మోడీ పరివారాన్ని రూపొందించే క్రమంలో వ్యక్తిపూజను ముందుకు తెచ్చారు. గతంలో చౌకీదార్‌ అన్నట్లుగానే కేంద్ర మంత్రులతో సహా అందరూ మోడీకాపరివార్‌ అని తమ సామాజిక మాధ్యమాల్లో పేర్లకు తగిలించుకున్నారు. భజనబృందంలో చేరారు. ప్రతి విజయం వెనుక ఉన్నది మోడీ మాత్రమే అని చెప్పటమే కాదు, తాజా ఎన్నికల్లో మోడీ హామీల పేరుతో జనాన్ని ఊదరగొట్టటం దాని కొనసాగింపే. దీనికి గోడీ మీడియా ఎంతగానో సహకరించింది. తాను మామూలుగా జన్మించలేదని మోడీ చెప్పుకోవటం దానికి పరాకాష్ట. దీన్ని సంఘసేవక్‌లు కొందరు జీర్ణించుకోలేదని, వారిని సంతుష్టీకరించేందుకు మోడీ కూడా సంఘసేవకుల్లో ఒకరే అన్న సందేశమిస్తూ మోహన్‌ భగవత్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారని చెప్పవచ్చు. నరేంద్రమోడీ మాదిరి మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పాయి కూడా సంఘసేకుడే, దాని తిరోగామి భావజాల ప్రతినిధే అన్నది నిస్సందేహం. అయితే మోడీ మాదిరి దిగజారిన ప్రసంగాలు చేయలేదు.అద్వానీ మాదిరి కరడుగట్టిన హిందూత్వవాదిగా బయటకు కనిపించేందుకు చూడలేదు.


ప్రపంచంలో అనేక తిరోగామి, ఫాసిస్టు, నాజీ లక్షణాల సంస్థల వంటిదే ఆర్‌ఎస్‌ఎస్‌. అది మత తీవ్రవాద పులిని ఎక్కింది. దాని మీద నుంచి దిగితే మింగివేస్తుంది, ప్రాణాలు నిలుపుకోవాలంటేే స్వారీ చేయాల్సిందే. దేశం, సమాజం మీద పట్టు సాధించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక మందిని జనసంఘం, బిజెపి వంటి రాజకీయ పార్టీ, మత సంస్థల రూపంలో మరికొందరిని ముందుకు తెచ్చింది. ఉపయోగించుకోవటం, పనికిరారు,అజెండాను అమలు జరపలేరు అనుకుంటే పక్కన పెట్టేయటం అనేక మందిని చూశాము. అద్వానీ, వాజ్‌పాయిలను కూడా అది సహించలేదు.నరేంద్రమోడీని కూడా ఉపయోగపడినంత వరకు పల్లెత్తుమాట అనలేదు, మద్దతు ఇచ్చింది, తన అజెండాను అమలు చేయించింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో అది వికటించిన తీరు గమనించిన తరువాత మరో బొమ్మను తెచ్చేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. తన అజెండాను ముందుకు తీసుకుపోయే సాధనంగా పనికి వస్తారా లేదా అన్నదే దానికి గీటురాయి. అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో ఓడిపోవటం, వారణాసిలో గతంలో వచ్చిన మెజారిటీతో పోలిస్తే గణనీయంగా తగ్గటంతో నరేంద్రమోడీ బలహీనత ఏమిటో వెల్లడైంది. ఇంకేమాత్రం తమ అజెండాను ముందుకు తీసుకుపోయే అవకాశం లేదన్న సంశయం మొదలై ఉండాలి. నరేంద్రమోడీని ఒకందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు తెస్తే మరొకందుకు కార్పొరేట్‌ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. అందువలన మోడీని సేవక్‌ల గుంపులో ఒకరిగా ఆర్‌ఎస్‌ఎస్‌ చూస్తే పప్పులో కాలేసినట్లే. సంఘపరివారం మెచ్చిన నేతలు ఉండవచ్చు తప్ప కార్పొరేట్లకు నచ్చిన వ్యక్తిని వెంటనే ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయటం అంత తేలికకాదు. ఇది సంఫ్‌ు బలహీనత. ఈ పూర్వరంగంలో మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు టీకప్పులో తుపానులా సమసిపోతాయా ? 75సంవత్సరాల వయస్సు వచ్చిన వారు పదవుల నుంచి తప్పుకోవాలనే పేరుతో 73 సంవత్సరాల మోడీని కొన్ని రాష్ట్రాల ఎన్నికల తరువాత 2026లో గౌరవంగా సాగనంపుతారా ? దానికి కార్పొరేట్లు అంగీకరిస్తాయా ? చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కంగన రనౌత్‌కు చెంపదెబ్బ – ఒక సిక్కు మహిళకు ఎందుకు, ఎలా అంత ధైర్యం వచ్చింది !

09 Sunday Jun 2024

Posted by raomk in BJP, Current Affairs, Farmers, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Women, Women

≈ Leave a comment

Tags

BJP, CISF, Kangana ranaut, Kangana Ranaut 'slapped', Kulwinder Kaur


ఎం కోటేశ్వరరావు


చండీఘర్‌ విమానాశ్రయంలో 2024 జూన్‌ ఆరవ తేదీన ఒక అనూహ్య ఉదంతం జరిగింది.హిమచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున గెలుపొందిన సినీనటి కంగన రనౌత్‌ ఢిల్లీ వెళ్లేందుకు విమానం ఎక్కాల్సి ఉంది. ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఒక సిఐఎస్‌ఎఫ్‌ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. రోజుకు వంద, రెండు వందల రూపాయలు తీసుకొని మహిళలు ఢిల్లీ రైతు ఉద్యమంలో పాల్గొన్నారని గతంలో కంగన నిందించారని, ఆ మహిళల్లో తన తల్లి కూడా ఉన్నందున ఆమెను అవమానించినందుకు గాను తాను కొట్టానని కుల్విందర్‌ కౌర్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆమె మీద కేసు నమోదు చేయటమే గాక విధి నిర్వహణ నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టారు. అరెస్టు చేశారు. చట్టాల ప్రకారం ఆమెకు ఎంత శిక్ష వేస్తారు, ఏం చేస్తారు అనేది చూద్దాం. పంజాబ్‌ సుల్తాన్‌పూర్‌ లోధీ ప్రాంతంలో ఉన్న ఆమె తలిదండ్రుల ఇంటికి పెద్ద సంఖ్యలో రైతులు, ఇతరులు వచ్చి మద్దతు తెలుపుతున్నారు.కుటుంబ సభ్యులందరికీ సిక్కు మత గౌరవ చిహ్నాలలో ఒకటైన కాషాయ రంగు సిరోప్స్‌(శాలువ వంటి వస్త్రం) కప్పి గౌరవిస్తున్నారు.కుల్విందర్‌ కౌర్‌ సోదరుడు షేర్‌ సింగ్‌ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష కమిటీ స్థానిక నేత. కుటుంబం మొత్తం రైతుల ఉద్యమంలో పాల్గొన్నది. కుల్విందర్‌ భర్త కూడా సిఐఎస్‌ఎఫ్‌లోనే పని చేస్తున్నారు.ఆమెకు మద్దతుగా రైతు సంఘాలు ప్రకటనలు చేశాయి.


కంగన వ్యాఖ్యానించినట్లుగా నేను పనికిమాలినదాన్నా అంటూ కుల్విందర్‌ కౌర్‌ తల్లి వీర్‌ కౌర్‌ ప్రశ్నించారు. కంగన తొలిసారిగా తప్పు మాట్లాడి ఉండవచ్చు, కానీ అంతకు ముందు ఆమె ప్రవర్తన బాగానే ఉంది. ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. నేను రైతు ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నాను. కొంత మంది మా సన్నిహిత బంధువులు మిలిటరీలో పనిచేశారు, ఇప్పటికీ కొనసాగుతున్నారు. నా భర్త ఇద్దరు అన్నలు కూడా మిలిటరీలో ఉన్నారు, 1965యుద్ధంలో పాల్గొన్నారని ఆమె మీడియాతో చెప్పారు. కుటుంబమంతా రైతు ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ దాని గురించి తన సోదరితో ఎప్పుడూ పెద్దగా చర్చించలేదని షేర్‌ సింగ్‌ చెప్పారు. ఘటన తరువాత ఆమెతో మాట్లాడటం కుదరలేదని, భర్తతో మాట్లాడి ఇద్దరు పిల్లలను తమ ఇంటికి తీసుకువచ్చామని, మీడియా, సామాజిక మాధ్యమం ద్వారానే విషయాలు తెలుసుకుంటున్నామని, అందువలన ఉదంతానికి సంబంధించి వీడియో మొత్తాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని షేర్‌ సింగ్‌ కోరారు.


కుల్విందర్‌ కౌర్‌కు మద్దతు తెలపటం మీద కంగన రౌనత్‌ తనదైన శైలిలో విరుచుకు పడ్డారు.సినిమా పరిశ్రమ మౌనంగా ఉందని ఆరోపించారు. అఫ్‌కోర్సు అది ఆమె ఇష్టం. తన అనుమతి లేకుండా తన శరీరాన్ని తాకారంటూ చెంపదెబ్బ కొట్టటాన్ని సమర్ధించేవారి గురించి ఆమె మండి పడ్డారు. ” ఏ కారణం లేకుండా ఏ నేరమూ ఎప్పుడూ జరగదు.నేరం చేసిన వారి మానసిక ధోరణులేమిటో కుల్విందర్‌ కౌర్‌ను సమర్ధిస్తున్నవారు చూడాలి. అత్యాచారం, హత్య చేసిన వారికి లేదా దొంగలకు కూడా బలమైన భావోద్వేగ, భౌతిక, మానసిక లేదా ఆర్థికపరమైన కారణాలు ఎల్లవేళలా ఉంటాయి.అయినప్పటికీ వారికి శిక్ష విధించి జైలుకు పంపుతారు. బలమైన భావోద్వేగాలతో నేరాలకు పాల్పడిన నేరగాండ్లతో మీరు చేతులు కలుపుతున్నారంటే దేశంలో ఉన్న చట్టాలన్నింటినీ ఉల్లంఘించటమే. అనుమతి లేకుండా కొంతమంది శరీర భాగాలను తాకి వారి అంతరంగిక పరిధిలోకి చొరబడటాన్ని అంగీకరిస్తున్నారంటే, గుర్తుపెట్టుకోండి మీరు అత్యాచారం, హత్యలను కూడా సమర్ధించినట్లే. వాటిలో మాత్రం పెద్ద ఏముంది కేవలం దూర్చటం,పొడవటమేగా అని ఇతరులు చెప్పుకోలేని, చూడకూడని చోట్లకు వెళ్లటమే. మీరు మీ మానసిక, నేరపూరిత ధోరణుల్లోకి లోతుగా చూడండి, దయచేసి యోగా, ధ్యానం చేయండని మనవి చేస్తున్నా లేకపోతే జీవితం మీకు దుర్భరమౌతుంది, మరీ అంత పగ,ద్వేషం, అసూయలను పెంచుకోకండి, వాటి నుంచి దూరం కండి ” అంటూ ఎక్స్‌ల మీద ఎక్స్‌లు(ట్వీట్లు) చేశారు.అంతేకాదు ఆమె పోస్టు చేసిన ఒక వీడియోలో పంజాబ్‌లో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరుగుతున్నదని అంటూ మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలని ప్రశ్నించారు.


తనను చెంపదెబ్బ, అదీ ఒక మహిళ కొట్టినందుకు, ఆ చర్యను కొందరు తప్పేముంది అన్నందుకు ఇంతలా దిగ(భాష) జారి నోరుపారవేసుకోవటం పద్మ అవార్డు గ్రహీత కంగనకే చెల్లింది. అత్యాచారం అంటే లైంగిక దాడి తప్ప దూర్చటమేగా అని ఏ నాగరికజీవీ ఇంతవరకు ఎక్కడా అన్నట్లు వినలేదు, అలా అంటారేమో అని కంగన చెప్పారు.బహుశా తన పరివారంలో అలాంటి దిగజారుడు భాష వాడతారేమో ! కంగనను మహిళా కానిస్టేబుల్‌ చెంపదెబ్బ కొట్టింది తప్ప అంతకు మించి జరిగిన ఇతర పరాభవమేమీ లేదు.(దీని అర్ధం చెంపదెబ్బను సమర్ధిస్తున్నానని కాదు, అనేక ఉదంతాల్లో మహిళలే మహిళల మీద దాడి చేసి కొట్టటంతో పాటు వివస్త్రలను చేసిన ఉదంతాలు తెలిసిందే.) చెంపదెబ్బను సమర్ధించినందుకే ఇంతగా మండిపడుతున్న సాధ్వీమణి గుజరాత్‌లో బిలికిస్‌ బానూ సామూహిక అత్యాచారం కేసులో శిక్షపడి బిజెపి పెద్దల ఆశ్వీరచనాలతో జైలు శిక్ష నుంచి మినహాయింపు పొందిన నేరగాండ్లకు అదే బిజెపి ప్రజాప్రతినిధులు మిఠాయిలు పంచి మంచి ప్రవర్తన కలిగిన బ్రాహ్మలని కితాబులిచ్చినపుడు కంగనకు ఎలాంటి తప్పూ కనిపించలేదు. మణిపూర్‌లో గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించినపుడూ కంగనకు ఎలాంటి అవమానమూ కనిపించలేదు, నోటికి తాళం వేసుకున్నారు.చివరకు ఎంత దిగజారుడు అంటే బిలికిస్‌ బానూ ఉదంతం మీద సినిమా తీసి సొమ్ము చేసుకోవాలని చూస్తే ఏ ఓటిటి సంస్థా, టీవీ కూడా అంగీకరించలేదు.తను చెంపదెబ్బ కొట్టిన మహిళలో ఉగ్రవాదం, తీవ్రవాదం కనిపించింది గానీ, పార్లమెంటు మీద పొగబాంబులతో దాడి చేసిన వారి ప్రవేశానికి పాసులిచ్చిన బిజెపి మైసూరు ఎంపీలో మాత్రం దేశభక్తి కనిపించింది గనుక మౌనంగా ఉన్నారు.


తనకు కంగన మీద ప్రేమ దోమా వంటివేమీ లేవు గానీ, ఆమెను చెంపదెబ్బ కొట్టినందుకు ఉత్సవంలో పాల్గొనటం లేదని ప్రముఖ సినీనటి షబనా ఆజ్మీ స్పందించారు. హింస, గూండాయిజం అంటూ రవీనా టాండన్‌ వర్ణించారు.తాను హింసాకాండను ఎప్పుడూ సమర్ధించనని అయితే కుల్విందర్‌ కౌర్‌ను ఉద్యోగం నుంచి తీసివేస్తే ఆమెకు ఉపాధి కల్పిస్తానని సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్‌ దద్లానీ ప్రకటించాడు. ఒక మహిళ తన ఉద్యోగ స్థానాన్ని వినియోగించుకొని మరొక మహిళ మీద దాడి చేయటం విచారకరమని, చట్టపరంగా దర్యాప్తు జరపాలని అనుపమ ఖేర్‌,శేఖర్‌ సుమన్‌, అతని కుమారుడు అధ్యాయన్‌ సుమన్‌ కూడా ఖండించారు. తనను చెంపదెబ్బ కొట్టటంపై సినిమా పరిశ్రమ మౌనంగా ఉందంటూ కంగన తప్పు పట్టారు.ఇలాంటిదే రేపు మీకు, మీ పిల్లలకూ జరగవచ్చు, ఒకరి మీద జరిగిన ఉగ్రదాడిని మీరు ఉత్సవంగా జరుపుకుంటే అలాంటి రోజే మీకూ ఎదురౌతుంది సిద్దంగా ఉండండి అని శాపనార్ధాలు పెట్టారు. రైతులను వంద, రెండు వందలు తీసుకొని వచ్చిన కిరాయిబాపతు అని ఆమె నిందించినపుడు కూడా సినిమా పరిశ్రమ మౌనంగానే ఉంది మరి.అప్పుడు మోదం-ఇప్పుడు ఖేదం !


కంగన రనౌత్‌ 2020 డిసెంబరు మొదటి వారంలో రైతులను నిందిస్తూ ట్వీట్‌ చేశారు. అప్పుడే పెద్ద రచ్చ జరిగింది. మూడున్నర సంవత్సరాల తరువాత దానికి ప్రతిగా కంగన చెంపదెబ్బ తిన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఢిల్లీలో జరిగిన షాహిన్‌ బాగ్‌ నిరసనల్లో ప్రముఖంగా పాల్గొన్న 82 సంవత్సరాల బిలికిస్‌ అనే మహిళ రైతు ఉద్యమంలో కూడా పాల్గొంటున్నదను కొని వంద రెండు వందలకు దొరికే ఆమె తిరిగి వచ్చిందంటూ కంగన్‌ నోరు పారవేసుకున్నారు. తరువాత తన తప్పు తెలుసుకొని ఆ ట్వీట్‌ను తొలగించారు. అయితే అప్పటికే దాని మీద పెద్ద రచ్చ జరిగింది. ఉడతా పంజాబ్‌ సినిమా నటుడు-గాయకుడు అయిన దిల్జిత్‌ దోసాంజ్‌ కంగన మీద తీవ్రంగా విరుచుకు పడ్డాడు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాడు.దిల్జిత్‌ను ఒక జంతువు అని ఆమె నిందించారు. సిక్కు మహిళ మహిందర్‌ కౌర్‌ను ఉద్దేశించి కంగన నోరుపారవేసుకున్నారని ఒక వీడియో రుజువు చూపాడు. దాంతో కంగన వెనక్కు తగ్గింది.తనను కరణ్‌ జోహార్‌ పెంపుడు జంతువు అన్న కంగన్‌ బాలీవుడ్‌లో అనేక మందితో కలసి పనిచేశారని ఆమెకూడా ఆమె వారందరికీ పెంపుడు జంతువుగా ఉన్నట్లా అంటూ ఇది బాలీవుడ్‌ కాదు, పంజాబ్‌, పౌరుల మనోభావాలతో ఆడుకోవద్దని దిల్జిత్‌ హెచ్చరించాడు. సరిగ్గా అదే పంజాబీ మనోభావం ఇంకా ఉన్నందున కుల్విందర్‌ కౌర్‌తో చెంపదెబ్బ కొట్టించింది.


ఇన్ని సంవత్సరాల తరువాత ఆమె ఎందుకు స్పందించిందన్న ప్రశ్న అనేక మందిలో తలెత్తింది. గతంలో ఢిల్లీలో నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులను అడ్డుకొని నెలల తరబడి అడ్డుకున్న బిజెపి సర్కార్‌ తీరుతో పంజాబీ రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో లోక్‌సభ ఎన్నికల్లో వెల్లడైంది. 2019లోక్‌సభ ఎన్నికలలో అకాలీదళ్‌, బిజెపి ఉమ్మడిగా పది, మూడు సీట్ల చొప్పున పోటీ చేసి 27.76-9.63శాతాల చొప్పు ఓట్లు రెండేసి సీట్లు తెచ్చుకున్నాయి. కాంగ్రెస్‌కు ఎనిమిది, ఆమ్‌ఆద్మీకి ఒకటి వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏడు, ఆమ్‌ ఆద్మీకి మూడు, అకాలీదళ్‌కు ఒకటి, స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. బిజెపికి ఒక్కసీటూ రాలేదు.ఓట్ల రీత్యా కాంగ్రెస్‌, ఆప్‌ తరువాత మూడవ పార్టీగా వచ్చింది. ఎన్నికలకు ముందు కూడా రైతులు ఆందోళనకు దిగటం దాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీకి వచ్చే రోడ్ల మీద కందకాలు తవ్వటం, బండరాళ్లతో కూడిన ట్రక్కులను ఏర్పాటు చేయటం వంటి పనులకు మోడీ సర్కార్‌ పాల్పడింది.హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు ఒక పంజాబీరైతు ప్రాణాన్ని బలిగొన్నారు, అణచివేసేందుకు చూశారు.నిజానికి రైతు ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన బిజెపి, దాన్ని గుడ్డిగా సమర్దించిన పెద్దలందరికీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పంజాబ్‌లో ప్రచారానికి వెళ్లగా అనేక గ్రామాల్లో ప్రవేశం కష్టమైంది, తీవ్ర నిరసన తెలిపారు. అలాంటి నేతలందరూ గత మూడు సంవత్సరాలుగా అనేక బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూనే ఉన్నారు. ఆకస్మికంగా ఎవరైనా వెళ్లి చెంపదెబ్బ కొట్టటమో, మరో రూపంలో నిరసన తెలపటానికి అనేక అవకాశాలు ఉంటాయి. కానీ ఆ పని చేయలేదు. ఈ ఎన్నికల్లో బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగినన్ని సీట్లు రాకపోవటం, నరేంద్రమోడీ గ్యారంటీలను జనం నమ్మకపోవటం, చివరికి అయోధ్యలోనే బిజెపి ఓడటం, మోడీ గెలుపు మెజారిటీ గణనీయంగా తగ్గటం, ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చిన బలహీనత వెల్లడైంది. అంతకు ముందు బిజెపిని చూసి భయపడిన వారంతూ ఇప్పుడు దాన్ని కూడా జనం ఓడించగలరని రుజువు కావటంతో అనేక మందిలో ఉత్సాహం కట్టలు తెంచుకున్నది. దానికి ప్రతిస్పందనే కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ. ప్రజా ఉద్యమాలను కించపరుస్తూ అధికారగర్వంతో విర్రవీగిన వారందరికీ ఈ ఉదంతం ఒక హెచ్చరిక కావాలి. అయితే ప్రజా ఉద్యమాలను అణచేందుకు చూసిన వారికి, తూలనాడిన వారికి చేయాల్సింది చెంపదెబ్బల శాస్తి కాదు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడకుండా తమ చేతులతో ఎన్నికల యంత్రాల మీట నొక్కి అలాంటి పార్టీలు, శక్తులకు రాజకీయంగా పీకనొక్కాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

విధి వైపరీత్యం : ముస్లిం అనుకూల పార్టీల దయ మీద నరేంద్ర మోడీ ! హిందూ దేవునిబిడ్డకేమిటీ పరిస్థితి !!

07 Friday Jun 2024

Posted by raomk in AP, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Gujarat, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, STATES NEWS, tdp, USA

≈ Leave a comment

Tags

#Balk Ram, Anti Muslim, appeasement politics, BJP, CHANDRABABU, Donald trump, Dwan, India defeats hate, India Elections 2024, Narendra Modi Failures, Nithish Kumar, RSS


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో విధిని నమ్మేవారు ఎక్కువ, నమ్మనివారు తక్కువ. విధి వైపరీత్యం గురించి చెప్పే బాబాలు, జ్యోతిష్కులు,ప్రవచనకారులను రోజూ చూస్తూనే ఉన్నాం. పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం అంటూ కొత్త కొత్త అంశాల గురించి అనేక మంది చెబుతారు. ఫ్రెంచి జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్‌ 1,555లోనే నరేంద్రమోడీ గురించి జోశ్యం చెప్పాడని కేంద్ర మంత్రి కిరెన్‌ రిజుజు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014లో హిందువులు అధికారానికి వస్తారని ( అతల్‌ బిహారీ వాజ్‌పాయిను హిందువుగా గుర్తించలేదా లేక దుర్భిణికి కనిపించలేదా) భూమ్యాకాశాలను పాలిస్తారని, ఆసియాలో వారిని ఎవరూ నిరోధించలేరని,భారత అధినాయకుడు గుజరాత్‌లో జన్మిస్తాడని,అతని తండ్రి టీ అమ్ముతారని,అతని మొదటి నామం నరేన్‌దసు అని, 2026వరకు అధికారంలో ఉంటారని రాతపూర్వకంగా ఉందని సదరు మంత్రి సెలవిచ్చారు. ఇన్ని చెప్పిన సదరు జ్యోతిష్కుడు బాబరీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ మారణకాండల గురించి, ఆ కారణంగా అమెరికా తన గడ్డమీద అడుగు పెట్టనివ్వదనీ, 2024లో ముస్లిం అనుకూల పార్టీల దయతో ఏలుబడిలోకి వస్తారని ఎలా పసిగట్టలేకపోయారన్నది ప్రశ్న. ఇంకా చాలా ఉన్నాయి. అయోధ్యలో రామమందిరం కట్టిస్తారని, ఓట్ల కోసం దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని, చివరకు అక్కడ పార్టీని గెలిపించటంలో మోడీ చతికిల పడతారని, రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని నరేంద్రమోడీ ఎవరి గురించి చెప్పారో ఆ సమాజవాది పార్టీ ప్రతినిధిని ఆ రాముడే తన ఆలయ రక్షణకు గెలిపిస్తారని, బిజెపిని ఓడిస్తారని ఎందుకు చెప్పలేదు. హిందూ హృదయ సామ్రాట్టుగా మన్ననలను అందుకున్న, ముస్లింల సంతుష్టీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన 56 అంగుళాల ఛాతీ ఉన్న ధైర్యవంతుడిగా స్తోత్రపాఠాలు అందుకున్న నేతపట్ల విధి ఎందుకు ఇంత విపరీతంగా ప్రవర్తించినట్లు ?నోస్ట్రాడామస్‌ను పక్కన పెడదాం, సాధారణ మానవుల మాదిరిగాక దైవాంశ సంభూతుడిగా జన్మించినట్లు చెప్పుకున్న కారణజన్ముడు సైతం రాగల పరిణామాలను ఎందుకు ఊహించలేకపోయారు.


తాను బతికి ఉండగా ముస్లిం రిజర్వేషన్లను అనుమతించే ప్రసక్తి లేదని నరేంద్రమోడీ ప్రతిజ్ఞ చేశారు, దేశానికి గ్యారంటీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే నాలుగుశాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. నితీష్‌ కుమార్‌ కూడా ముస్లింలకు అనుకూలంగానే వ్యవహరించారు.బీహార్‌లో కుల గణన సర్వే వివరాలు నిలిపివేయాలని కోరిన కేసులో సుప్రీం కోర్టు తిరస్కరించిన తీర్పు మరుసటి రోజు 2023 అక్టోబరు ఏడున నితీష్‌ కుమార్‌ తన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సుదీర్ఘసమావేశం జరిపారు.మైనారీటీల సంక్షేమం, సామాజిక భద్రత గురించి వారికి హామీ ఇచ్చి లోక్‌సభ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కుల సర్వే వివరాల ప్రకారం బీహార్‌లో ముస్లిం జనాభా 17.7శాతం ఉంది.కులగణనలో ముస్లింలలో ఉన్న పాతిక కులాల వారిని అత్యంత వెనుకబడిన తరగతి(ఇబిసి)గా పరిగణించి లెక్కించారు.స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లకు అర్హత కల్పించారు.నితీష్‌ కుమార్‌ రిజర్వేషన్‌ ఫార్ములా ప్రకారం దళితులకు 16, గిరిజనులకు ఒకటి, ఇబిసిలకు 18, ఓబిసిలకు 12, ఇబిసి మహిళలకు మూడు శాతం అని చెప్పారు.ఇదంతా చేసిన తరువాత ఆ పెద్ద మనిషి ఇండియా కూటమినుంచి ఫిరాయించి తిరిగి ఎన్‌డిఏ కూటమిలో చేరి బిజెపితో అధికారాన్ని పంచుకున్నారు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వచ్చే ఏడాది అక్టోబరు-నవంబరు మాసాల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. నితీష్‌ కుమార్‌కు అవి పెద్ద పరీక్షగా మారతాయి.తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏ పార్టీలకు వచ్చిన ఓట్లను చూసినపుడు 2019లో వచ్చిన ఓట్లకంటే ఆరుశాతం తగ్గగా ఇండియా కూటమి ఓట్లు 3.5శాతం పెరిగాయి. ఓట్లపరంగా చూసినపుడు ఆర్‌జెడి 22.41శాతం ఓట్లతో పెద్ద పార్టీగా ఉంది.బిజెపి 20.5శాతంతో ద్వితీయ, 18.52శాతంతో జెడియు మూడవ స్థానంలో ఉంది.బిజెపి, జెడియు రెండూ గతంలో ఉన్న లోక్‌సభ స్ధానాలలో తొమ్మిదింటిని కోల్పోయాయి.తెలుగు ప్రాంతాలలో ఇంత బతుకూ బతికి ఇంటివెనకాల చచ్చినట్లు అనే లోకోక్తి తెలిసిందే. తమ పార్టీ ఓట్ల కోసం ఎవరినీ సంతుష్టీకరించదు, మిగతా పార్టీలన్నీ మైనారిటీల సంతుష్టీకరణకు పాల్పడుతున్నట్లు వూరూ వాడా చెడా మడా ప్రచారం చేసిన బిజెపి గురించి తెలిసిందే. ముస్లిం సంతుష్టీకరణకు వ్యతిరేకం, ఎట్టి పరిస్థితిలోనూ దానికి లొంగేది లేదని చెప్పిన వారు ఇప్పుడు ముస్లిం అనుకూల విధానాలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు, నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని పార్టీల దయమీద కేంద్రంలో అధికారానికి రావటాన్ని ఏమనాలి ? ముస్లిం రిజర్వేషన్లు అమలు జరిపితీరుతామని చెప్పిన చంద్రబాబుతో మోడీ రాజీపడతారా లేక చంద్రబాబు నాయుడు నితీష్‌ కుమార్‌ ఇద్దరూ మోడీతో సర్దుకుపోదాం పదండి అంటారా ? విధి వైపరీత్యం ఎవరితో ఎలా ఆడుకుంటుందో, వారిని నమ్మిన వారిని ఏం చేస్తుందో చూద్దాం.


నరేంద్రమోడీని ఇప్పటి వరకు అనేక మంది విశ్వగురువుగా, ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే నేతగా ప్రచారం చేశారు. నిజమే అని నమ్మి అబ్‌కీబార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బాహాటంగా ప్రకటించిన నరేంద్రమోడీ అమెరికాలో చేతులు కాల్చుకున్నది తెలిసిందే. సదరు ట్రంప్‌ అధికారం పోయింది. స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకుండా మోడీకి జనం తగిన పాఠం చెప్పారు.అదే ట్రంప్‌ మనదేశం వచ్చి నరేంద్రమోడీకి అనుకూలంగా చెప్పి ఉంటే ఏం జరిగేదో అనూహ్యం.ఎన్నికల తరువాత మోడీ గురించి ప్రపంచం ఏమనుకుంటోంది అంటే మీడియా వ్యాఖ్యలను చూడాల్సిందే. బిజెపి పెద్దలు తరచూ పాకిస్తాన్‌తో పోల్చి తాము సాధించిన విజయాల గురించి చెప్పుకుంటారు.అదే పాక్‌ ఆంగ్ల పత్రిక ”డాన్‌ ” మన ఎన్నికల గురించి పతాకశీర్షిక పెట్టింది.” విద్వేషాన్ని ఓడించిన భారత్‌, ముస్లిం అనుకూల పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన మోడీ ” అని రాసింది. దీన్ని చూస్తే మోడీ భక్తులకు మామూలుగా మండదు. మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగిచూసి కిసుక్కున నవ్వినందుకు అనే ఒక సామెత గుర్తుకు రావటం లేదూ ! అందరూ ఈ వార్తను చూస్తారో లేదోనని ఆ పత్రిక మొదటి పేజీని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి తన ఎక్స్‌ ఖాతాలో పంచుకొని మోడీని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ హిందూత్వ ఉత్సాహం, ముస్లింలు, ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవటాన్ని అంగీకరించని బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌లోని లౌకిక పార్టీల దయమీద ఆధారపడాల్సి వచ్చిందని, కేరళలో తొలిసారిగా విజయం సాధించిన బిజెపి అభ్యర్థికూడా మైనారిటీలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తని కూడా డాన్‌ పేర్కొన్నది. బలహీన పడినప్పటికీ ఇంకా ప్రాణాంతకమే అంటూ బిజెపి, నరేంద్రమోడీ గురించి అదే పత్రిక మరో విశ్లేషణలో హెచ్చరించింది.


”భారత్‌లో మోడీ పార్టీ బిజెపి తన ఆధిక్యతను ఎలా కోల్పోయింది ” అనే ప్రశ్నార్ధక శీర్షికతో అంతర్జాతీయ ఎఎఫ్‌పి సంస్థ వార్త ఇచ్చింది.పది సంవత్సరాల క్రితం హిందూ జాతీయనేత అధికారానికి వచ్చిన తరువాత తొలిసారిగా సంపూర్ణ మెజారిటీని సాధించటంలో భారత ప్రధాని నాయకత్వంలోని బిజెపి విఫలమైంది అని వ్యాఖ్యానించింది.వరుసగా మూడవ సారి భారీ మెజారిటీ సాధించటంలో వైఫల్యానికి కారణాలను పేర్కొన్నది.విభజన వాద ప్రచారం దెబ్బతీసింది.హిందూ మెజారిటీని సమీకరించుకొనేందుకు అసాధారణ రీతిలో ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ మాట్లాడారు.తన సభల్లో వారిని చొరబాటుదార్లు అన్నారు, ప్రతిపక్ష కాంగ్రెస్‌ అధికారానికి వస్తే దేశ సంపదలను ముస్లింలకు పంచుతుందని చెప్పారు. ఇది హిందూ ఓటర్లను ఉత్సాహపరచలేకపోయింది, మైనారిటీల మద్దతు ప్రతిపక్షానికి గట్టిపడేట్లు చేసింది.ఎన్నికల సందర్భంగా తాము ఓటర్లను కదిలించినపుడు ప్రభుత్వ భావజాల(హిందూత్వ) అజెండా కంటే తమకు నిరుద్యోగ సమస్య ప్రధానమని చెప్పినట్లు పేర్కొన్నది. జనం తమ జీవనం, నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి ఎక్కువ ఆవేదన చెందినట్లు , మోడీ, బిజెపి చెబుతున్నవి తమకు సంబంధం లేని అంశాలుగా జనం భావించారని మోడీ జీవిత చరిత్రను రాసిన నిలంజన్‌ ముఖోపాధ్యాయ కూడా అన్నట్లు ఈ వార్తా సంస్థ పేర్కొన్నది. పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లలో విఫలం కావటం, దక్షిణాది రాష్ట్రాలలో బలం పెంచుకొనేందుకు పదేపదే పర్యటించినా ఫలితం లేకపోవటం, అయోధ్యలో ఓటమి తదితర అంశాలను అది ఉటంకించింది.


”భారత ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు, మోడీ విజయం” అంటూ అమెరికా టీవీ సిఎన్‌ఎన్‌ వార్తలను ఇచ్చింది.ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటర్లు ప్రజాకర్ష హిందూ దేశానికి అగ్రతాంబూలం అనే దృక్పధాన్ని ఓటర్లు పాక్షికంగా తిరస్కరించారని విశ్లేషణలో పేర్కొన్నది.మోడీ ముద్రగల హిందూ దేవాలయం ఉన్న పెరటితోటలో తిరుగులేని ఓటమి అంటూ అయోధ్య గురించి న్యూస్‌వీక్‌ పత్రిక పేర్కొన్నది. ఎట్టకేలకు మేలుకున్న భారతీయ ఓటర్లు అంటూ న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక శీర్షిక పెట్టి విశ్లేషణ రాసింది.అజేయమైన శక్తి అనే మోడీ ప్రతిష్టకు చిల్లుపడింది, సంకీర్ణ రాజకీయాలు తిరిగి వచ్చాయి అని పేర్కొన్నది. మోడీ, ఆయన పార్టీకి తిరుగులేని దెబ్బ అని వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. మోడీ పేలవ ప్రదర్శన ప్రతిపక్షం పుంజుకోవటానికి నిదర్శనం అని బ్రిటన్‌ పత్రిక ఇండిపెండెంట్‌ పేర్కొన్నది. ”మోడీ విజయంతో చైనా, అమెరికాలతో భారత్‌ మరింత దగ్గర ” అంటూ చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ విశ్లేషణ శీర్షిక పెట్టింది.మోడీ ఏలుబడి తొలి ఐదు సంవత్సరాలలో చైనాతో ముద్దులతో మొదలై గుద్దులదాకా వచ్చింది, తరువాత మరింత ఆర్థిక సహకారం కోసం ఉద్రిక్తతలను సడలించింది.2019 నుంచి సరిహద్దు ప్రతిష్ఠంభను ఒక ప్రధాన సమస్యగా చేసింది. మూడవసారి మరింత జాగ్రత్తలతో కూడిన మార్పులు జరగవచ్చు.శాంతియుత, స్థిరమైన సంబంధాలు రెండుదేశాలకూ కీలకం, సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ రెండు దేశాల మధ్య వాణిజ్యం 2023లో అమెరికా-భారత్‌ లావాదేవీలను అధిగమించింది. గుడ్డిగా వివాదపడితే ఎవరికీ ఉపయోగం ఉండదని రుజువైందని పేర్కొన్నది.


అనేక అంతర్జాతీయ మీడియా సంస్థల విశ్లేషణలు ఇంకా రానున్న రోజుల్లో వెలువడతాయి. వాటితో మోడీ ప్రతిష్ట మరింత మసకబారేదే తప్ప వెలిగేది కాదు. దేశీయంగా సంపూర్ణ మెజారిటీ లేని నరేంద్రమోడీ ఇతర పక్షాల మీద ఆధారపడి ఎలా పని చేస్తారో చూడాల్సి ఉంది. అజేయశక్తి అనుకున్న నేత బలహీనత వెల్లడైన తరువాత ప్రపంచ దేశాలు, నేతలు గతం మాదిరే గౌరవిస్తారా ?ఎలా స్పందిస్తాయన్నది ప్రశ్న.మూడోసారి ప్రధానిగా పదవీ స్వీకారం చేయనున్న నరేంద్రమోడీ రానున్న రోజుల్లో తన ప్రాధాన్యతలు ఏమిటో వెల్లడిస్తారని ఎదురు చూసిన దేశానికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు వినిపించారు.శుక్రవారం నాడు జరిగిన ఎన్‌డిఏ ఎంపీల సమావేశంలో మోడీని తమ నేతగా ఎన్నుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ మీద దాడికి ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఇప్పుడున్న సీట్లు కూడా రావన్న మోడీ మనిషి పదేండ్లలో వంద సీట్లు కూడా తెచ్చుకోలేకపోయిందన్నారు. స్వంతంగా 370, కూటమిగా 400కు పైగా సీట్లు తెచ్చుకుంటామన్న బిజెపి తన బలాన్ని కోల్పోయి 240కి ఎందుకు పరిమితమైందనే చర్చ దేశంలో జరుగుతుండగా దాన్ని తక్కువ చేసి చూపేందుకు కాంగ్రెస్‌ మీద దాడికి దిగారు.బిజెపి, నరేంద్ర మోడీ బలహీన పడివుండవచ్చు తప్ప ప్రమాదకరంగా ఉంటారన్నది ఇండియా కూటమే కాదు, ఎన్‌డిఏ పక్షాలు కూడా గ్రహించాలి.తన మిత్రపక్షాలను అది ఎలా మింగివేసిందో తెలుగుదేశానికి, శివసేనకూ తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహాత్మాగాంధీకి ప్రపంచ గుర్తింపు – నరేంద్రమోడీ అజ్ఞానమా ? అవమానించారా ?

01 Saturday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Congress, COUNTRIES, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, UK, USA

≈ Leave a comment

Tags

BJP, GANDHI INTERNATIONAL FAME, Mahatma Gandhi, Narendra Modi Failures, Nathuram Godse, RSS


ఎం కోటేశ్వరరావు


పద్దెనిమిదవ లోక్‌సభ చివరిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. భక్తులకు వినసొంపుగా వారు కోరుకున్నట్లుగా, వ్యతిరేకులకు అనేక విమర్శనాస్త్రాలు అందిస్తూ, నిష్పాక్షికంగా వాస్తవాలను పరిశీలించేవారు అవాక్కయ్యే విధంగా ఎన్నికల ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ ప్రక్షాళన కోసమో, మరొకదానికోసమో 45 గంటల పాటు కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో ధ్యానదీక్ష చేశారు.నువ్వు చెయ్యాల్సింది చెయ్యి, ఫలితాలు, పర్యవసానాలు, విమర్శల గురించి పట్టించుకోకు మౌనవ్రతమే నీ ఆయుధం అన్నట్లుగా దేవుడి అంశతో జన్మించినట్లు చెప్పుకున్న మోడీ కార్యాచరణలో నిమిత్తమాత్రుడు తప్ప ఆటాడించిందీ, మాట్లాడించిందీ ఆ దేవుడే గనుక ప్రతిష్టో అప్రతిష్టో ఆయన ఖాతాకు తప్ప మోడీకి కాదని వేరే చెప్పనవసరం లేదు. పచ్చి అవాస్తవాలు,ఎడారిలో సముద్రాల మాదిరి మాటలు, ప్రలోభాలు, బెదరింపులు,బ్రతిమిలాటలు ఇలా ఎన్నో. సకలకళా వల్లభుల ప్రదర్శనలను దేశం చూసింది. మంచో చెడో ఒక నిర్ణయం తీసుకొని ఓటర్లు తమ తీర్పునిచ్చారు. జూన్‌ నాలుగున వెలువడే ఫలితాలలో గెలిచిన పార్టీల, అభ్యర్థుల హడావుడి, ఓడిన పార్టీలు, అభ్యర్థుల వాదనలు, వేదనలు సరేసరి.. ఏ పార్టీ లేదా ఏ కూటమికి మెజారిటీ రాకుండా హంగ్‌ ఏర్పడితే ఏం జరుగుతుందో అనూహ్యం. ఎన్‌డిఏ-ఇండియా కూటమి రెండూ మెజారిటీ సాధనకు తలపడతాయి. చిన్న పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు వరకు కింగ్‌మేకర్లుగా మారతాయి.తరువాత వాటి భవిష్యత్‌ చెప్పలేము.చిన పాముపు పెద పాము, చిన చేపను పెద చేప మింగినట్లుగా జరిగే అవకాశం ఉంది. లోక్‌సభలోని 543 స్థానాలకు గాను మెజారిటీ 272 సాధించుకున్న పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.గత ఎన్నికలను చూసినపుడు 2014లో బిజెపి 31శాతం ఓట్లతో 282 సీట్లు తెచ్చుకుంది,2019లో 37.3శాతం ఓట్లు 303 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 2014లో 19.31శాతం ఓట్లు 44 సీట్లు, తదుపరి ఎన్నికల్లో 19.46శాతం ఓట్లు, 52 సీట్లు తెచ్చుకుంది. బిజెపి హిందూత్వను ఎంతగా రెచ్చగొట్టినా, నరేంద్రమోడీని హిందూ హృదయ సామ్రాట్టుగా జనం ముందుకు తెచ్చినా గత రెండు ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు రాలేదు. అదే కాంగ్రెస్‌ను చూస్తే ఓట్ల శాతంలో పెద్ద మార్పు లేదు.2014కు ముందు జరిగిన ఎన్నికల్లో బిజెపి తెచ్చుకున్న 18.8శాతం ఓట్లను 31శాతానికి పెంచుకోగా, కాంగ్రెస్‌ 28.55 నుంచి 19.31శాతానికి కోల్పోయింది. అంతకు ముందు ఎన్నికలతో పోల్చితే 2014లో బిజెపి 12.2శాతం అదనంగా తెచ్చుకోగా 2019లో అదనంగా 6.36శాతం తెచ్చుకుంది. కాంగ్రెస్‌ 2014తో పోల్చితే 2019లో 0.18శాతం ఓట్లు అదనంగా తెచ్చుకుంది. తినబోతూ రుచెందుకు అన్నట్లుగా 2024లో తీరుతెన్నుల గురించి జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.


ప్రేమ కోసం, యుద్ధంలో గెలుపుకోసం అబద్దాలు చెప్పవచ్చు అన్నట్లుగా ఈ ఎన్నికలలో నరేంద్రమోడీ, బిజెపి నేతల ప్రసంగాల తీరు ఉంది. ఎవరేమనుకుంటే మాకేటి అన్నట్లు వ్యవహరించారు.చివరి దశలో ప్రధాని నరేంద్రమోడీ ఎబిపి టీవీ ఛానల్‌కు జర్నలిస్టులతో మాట్లాడుతూ రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ సినిమా తీసిన తరువాతే మహాత్మాగాంధీ ఎవరు అనే ఉత్సుకత ప్రపంచంలో పెరిగిందని చెప్పారు. నిజానికి ఇది ఎన్నికల అంశంగా ఏ పార్టీ కూడా ప్రస్తావన తేలేదు. ఆకర్షణీయమైన నేతలు తప్పులు ఎందుకు చేస్తారంటూ ”అవెంటస్‌ ” పార్టనర్స్‌ అనే ఒక వెబ్‌సైట్‌లో తేదీలేని ఒక సర్వే విశ్లేషణ ఉంది. నేతలు అందునా ఉత్తమ నేతలు కూడా అవివేకమైన తప్పులు తరచుగా చేస్తుంటారని పేర్కొన్నది.పదవి మరియు తెలివితేటల కారణంగా మితిమీరిన విశ్వాసం మరియు అధికారంతో తీవ్రమైన తప్పులు చేస్తుంటారని దీన్ని సైద్దాంతిక వేత్తలు (హ్యూమన్‌ ఫోలీ) మానవ అజ్ఞానం లేదా మూర్ఖత్వమని పిలిచారని పేర్కొన్నది. దానిలో పేర్కొన్న ఐదు తప్పుల సారం ఇలా ఉంది. సంవత్సరాల తరబడి నిరంతరం అందుకునే ప్రశంసల కారణంగా అత్యధిక నేతలు తమ తెలివితేటలు, సామర్ధ్యాల గురించి తిరుగులేని విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటారట.కీలకమైన నిర్ణయాలు తీసుకొనే సమయంలో తమ మీద తమకు ఏర్పడిన అతివిశ్వాసం కారణంగా ఇతరులు వెల్లడించే అభిప్రాయాలు, సూచనలను పట్టించుకోరు, దీంతో చురుకైన నేతలు తప్పుడు నిర్ణయాలు తీసుకొనే ముప్పు ఎక్కువగా ఉంటుందట. సూక్ష్మ నిర్వహణ(మైక్రోమేనేజ్‌మెంట్‌) సమస్య నేతలకు మాత్రమే కాదు సంస్థలలోనూ ఉంది.నాయకత్వ స్థానాల్లో సూక్ష్మ నిర్వహణ, బదలాయింపు లేకపోతే మొత్తం జట్టు మీద ప్రభావం చూపుతుంది. సంక్షోభ సమయాల్లో చురుకైన నేతలు జట్టు హస్తం అందుకొనేందుకు చూస్తారు, కానీ కొత్త ఆలోచనల అన్వేషణలో వారి ఆసరా తీసుకోరు. చురుకైన నేతలు తాము రూపొందించిన నిబంధనలను పాటించటంలో విఫలమైనపుడు ఆ సంస్థల విలువలు, సూత్రాల మీదనే సందేహాలు తలెత్తుతాయి. తరువాత వాటన్నింటినీ పరిరక్షించాల్సిన వ్యక్తి విశ్వసనీయతే ప్రశ్నార్ధకం అవుతుంది. చురుకైన వారు ఇతరులు చెప్పేదానికి విలువ ఇవ్వరు. తమకు సలహాలు ఇచ్చేంత గొప్పవారా అనుకుంటారు.తమ తప్పును అంగీకరించరు. తరచుగా మంచిచెడ్డల స్వీకరణ నిలిపివేత వీరు చేసే అవివేకమైన తప్పు. బలమైన నేతలకు అవకాశాలు సులభంగా వచ్చినపుడు అన్నింటినీ చేసేయగలమనే వ్యక్తిత్వాలను పెంచుకుంటారు. లక్ష్యాలను పెద్దగా నిర్ణయించుకుంటారు, అనుకున్న విధంగా జరగకపోతే తగిన ప్రయత్నం లేకపోవటం అనుకుంటారు.వాస్తవ విరుద్దమైన లక్ష్యాలను నిర్ణయించుకొని ఎలాగైనా సాధించాలనుకొని జనాలను ఇబ్బందుల్లోకి నెడతారు. చురుకైన తెలివితేటలు కలిగిన వారందరూ పైన పేర్కొన్న లక్షణాలు, ధోరణులు గల నేతలు ఎవరన్నది ఎవరికి వారు అన్వయించుకొని ఒక అంచనాకు రావచ్చు.


నరేంద్రమోడీని అనేక మంది చురుకైన, ఆకర్షణ కలిగిన నేత అని చెబుతారు. ఆయనకు ఉందని చెబుతున్న పట్టా రాజకీయ శాస్త్రంలో అని కూడా అందరం చదువుకున్నదే. అలాంటి వ్యక్తికి చరిత్ర తెలియదా లేక కావాలనే ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలను వక్రీకరించినట్లుగా జాతిపిత గురించి కూడా మాట్లాడారా ? రెండూ వాస్తవం కావచ్చు. ప్రపంచ వలస దేశాల చరిత్రను చూసినపుడు మనదేశమంత పెద్దది బ్రిటీష్‌ సామ్రాజ్యంలో మరొకటి లేదు. వారి పాలనను అంతం చేసిన స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారెవరు అన్న చర్చ జరిగినపుడు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే మహాత్మాగాంధీ అని ప్రపంచం తెలుసుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో గాడ్సే గురించి తప్ప గాంధీ గురించి పెద్దగా బోధించి ఉండరు. భగవద్గీత వంటి గ్రంధాల కంటే ” నేనెందుకు గాంధీని చంపాను ” అంటూ గాడ్సే కోర్టులో మాట్లాడిన అంశాలను పెద్ద ఎత్తున బోధిస్తారని వినికిడి. ఆ పుస్తకాన్ని అచ్చువేసి, పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన అంశం తెలిసిందే.మహాత్మాగాంధీ జాతిపిత అని ఎవరు చెప్పారు, ఎలా అయ్యారంటూ, దేశానికి చేసిన ద్రోహాలంటూ వాట్సాప్‌ యూనివర్సిటీలో ప్రచారం చేసే ఊరూపేరు చెప్పుకొనేందుకు ధైర్యం లేని చీకటి బతుకుల బాపతు ఎవరు అన్నది వేరే చెప్పనవసరం లేదు.


మహాత్ముడు కాక ముందు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే బహుశా ఆయన తండ్రి లాగూలు(అప్పటికి నిక్కర్లు వచ్చి ఉండవు) వేసుకొంటున్న సమయానికే 1920దశకంలోనే మోహనదాస్‌ కరంచంద్‌ గాంధీ గురించి పశ్చిమ దేశాలలో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం చరిత్రను ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి అనుగుణ్యంగా తిరగరాస్తున్నది. గాంధీ హత్య నేపధ్యం గురించి భావితరాలకు తెలియకూడదు అనే లక్ష్యంతో ఎన్‌సిఇఆర్‌టి ద్వారా 2022జూన్‌లో రాజకీయ శాస్త్రంలో ఉన్న అంశాలను తొలగింపచేయించిన ఉదంతం తెలిసిందే.ఏమిటవి ? ” పాకిస్తాన్‌ ముస్లింలకు అన్నట్లుగా ఇండియా హిందువుల దేశంగా మారాలని లేదా హిందువులు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నవారికి ప్రత్యేకించి ఆయన(గాంధీ) అంటే అయిష్టం…హిందువులు-ముస్లింలు ఐక్యంగా ఉండాలనే స్థిరమైన అనుసరణతో రెచ్చిపోయిన హిందూ ఉగ్రవాదులు ఆ మేరకు అనేక సార్లు గాంధీజీని హత్య చేసేందుకు చూశారు….గాంధీజీ మరణం దేశంలో ఉన్న మతపరిస్థితిపై దాదాపు మాయా ప్రభావం(మేజికల్‌ ఎఫెక్ట్‌) చూపింది…..మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్న సంస్థలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు వంటి సంస్థలపై కొంత కాలం నిషేధం విధించింది…” ఇలాంటి కుదురు నుంచి వచ్చిన నరేంద్రమోడీ నోట మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి అని వెలువడటం వెనుక చిత్తశుద్ది ఉందని ఎవరైనా అనుకోగలరా ?


ఇంతకీ మహాత్ముడి గురించి నరేంద్రమోడీ సెలవిచ్చిందేమిటి ? ప్రతిపక్షాలు రామమందిర ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు, ఎన్నికలలో దీని ప్రభావం ఉంటుందా అని ఎబిపి విలేకర్లు అడిగిన ప్రశ్నపై స్పందించిన మోడీ ప్రతిపక్షం బానిసత్వ భావనలనుంచి బయటకు రాలేదు అంటూ ” మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి. మహాత్మా గాంధీ గురించి ప్రపంచం తెలుసుకొనే విధంగా ఈ 75 సంవత్సరాలలో చేయాల్సిన బాధ్యత మనది కాదా ? మహాత్మా గాంధీ గురించి ఎవరికీ తెలియదు. గాంధీ సినిమా తీసిన తరువాత మాత్రమే ఈ మనిషి ఎవరన్న జిజ్ఞాస ప్రపంచంలో పెరిగింది.మనమాపని చేయలేదు. అది మన బాధ్యత. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ గురించి ప్రపంచానికి తెలిసిందంటే, దక్షిణాఫ్రికానేత నెల్సన్‌ మండేలా ప్రపంచానికి తెలిశారంటే వారికంటే గాంధీ తక్కువేమీ కాదు. మీరు దీన్ని అంగీకరించాలి.ప్రపంచమంతా తిరిగిన తరువాత నేను ఈ విషయాన్ని చెబుతున్నాను” అని మోడీ చెప్పారు. బ్రిటీష్‌ సినిమా దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ సినిమాతీశాడు, బెన్‌కింగ్‌స్లే గాంధీ పాత్ర పోషించాడు. దానికి పదకొండు అకాడమీ అవార్డులు వచ్చాయి. ఆ సినిమా తరువాతే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందని చెప్పటం మహాత్ముడిని అవమానించటం తప్ప మరొకటి కాదు.ఆ సినిమా తరువాతనే నాకు గాంధీ గురించి తెలిసిందని మోడీ చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటం మీద గాంధీ ప్రభావం గురించి స్వయంగా నెల్సన్‌ మండేలానే చెప్పారు. ఆ పోరాటం గాంధీ సినిమా చూసిన తరువాత ప్రారంభం కాలేదు.


మహాత్మా గాంధీ పుట్టిన గుజరాత్‌కు సిఎంగా పని చేసిన నరేంద్రమోడీ అమ్మా గూగులమ్మా మా గాంధీ గురించి కాస్త చెప్పమ్మా అని మోడీ అడిగినా, ఆయన సిబ్బంది అడిగినా గాంధీ సినిమాకు ముందు, తరువాత కూడా ఎన్నో విషయాలు తెలిసి ఉండేవి. సామాజిక మాధ్యమంలో ప్రతిపక్షాల నుంచి ఇప్పుడు ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది కాదు. గాంధీ గురించి ఉన్న వెబ్‌సైట్‌ను అసలు ఒక్కసారైనా చూసి ఉంటారా అన్నది అనుమానమే. చూసి ఉంటే ఇలా మాట్లాడేందుకు ధైర్యం చేసి ఉండేవారు కాదు.బ్రిటన్‌ వార పత్రిక గ్రాఫిక్‌లో 1922లో గాంధీ అరెస్టయినపుడు గాంధీ గురించి రాశారు. నైరోబీలో గాంధీ అరెస్టు గురించి చేసిన ఆందోళనపై రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన వార్తను అదే ఏడాది లాహౌర్‌ నుంచి వెలువడిన సివిల్‌ మరియు మిలిటరీ గెజెట్‌లో ప్రచురించారు.” సదాచార గాంధీ :1930వ సంవత్సర పురుషుడు ” అంటూ టైమ్‌ పత్రిక 1931 జనవరి ఐదవ తేదీన ప్రచురించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా 1930లో గాంధీతో పాటు అరెస్టు అయిన 30వేల మందిని ఏం చేయాలా అని బ్రిటీష్‌ సామ్రాజ్యం భయంతో ఉంది. ఆ ఏడాది చివరిలో ఒక అర్దనగ మనిషిని చూసింది, ప్రపంచ చరిత్ర 1930లో ఆ మనిషి సంకేతం నిస్సందేహంగా అన్నింటికంటే పెద్దది ” అని దానిలో రాసింది. అదే ఏడాది సెప్టెంబరు 20న అమెరికా నుంచి వెలువడే బర్లింగ్టన్‌ హాక్‌ ఐ అనే పత్రిక ఒక పూర్తి పేజీ కేటాయించి గాంధీ గురించి రాసింది.” ప్రపంచంలో ఎక్కువ మంది చర్చించిన మనిషి ” అనే శీర్షిక పెట్టింది. రాట్నం వడుకుతున్న మహాత్మాగాంధీ ఫొటో ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. అమెరికా ఫొటోగ్రాఫర్‌ మార్గరెట్‌ బుర్కే వైట్‌ తీసిన దాన్ని 1946 మే 27వ తేదీన లైఫ్‌ అనే పత్రిక ” భారత నేతలు ‘ అనే శీర్షికతో ప్రచురించింది.


మహాత్మాగాంధీ హత్య గురించి న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఒక పతాక శీర్షికతో ప్రచురించింది.” ఒక హిందూ చేతిలో గాంధీ హత్య, కంపించిన భారత్‌,కొట్లాటల్లో బాంబేలో 15 మంది మృతి ” అని రాసింది.గార్డియన్‌, వాషింగ్టన్‌ పోస్టు, డెయిలీ టెలిగ్రాఫ్‌ వంటి పత్రికలన్నీ పతాక శీర్షికలతో గాంధీ హత్య వార్తను ప్రచురించాయి. గాంధీతో ప్రముఖ సినిమా నటుడు చార్లీ చాప్లిన్‌ భేటీ, ఆల్బర్ట్‌ ఐనిస్టీన్‌ ఉత్తర ప్రత్యుత్తరాలు, గాంధీ గురించి మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ రాసిన అంశాలన్నీ సుపరిచతమే.అమెరికా జర్నలిస్టు లూయీస్‌ ఫిశ్చర్‌ 1950లో ” మహాత్మాగాంధీ జీవితం ” పేరుతో రాసిన జీవిత చరిత్రను ఎంతో మంది చదివారు. గాంధీ సినిమాకు ముందే అనేక దేశాలు గాంధీ గౌరవార్ధం పోస్టల్‌ స్టాంపులను ప్రచురించాయి. ఇంత ప్రాచుర్య చరిత్ర ఉంటే నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్దమే గాక అసహ్యం కలిగిస్తున్నట్లు విమర్శలు వెలువడ్డాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఈజిప్టు ఫారోలా ! దేవరాజులా !! దేవదూత నరేంద్రమోడీ ఎవరి సరసన ? చరిత్రలో ఇలాంటి వారు చేసిన దుర్మార్గాలేమిటి ?

27 Monday May 2024

Posted by raomk in Africa, BJP, CHINA, Communalism, Europe, Germany, Greek, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, USA

≈ 2 Comments

Tags

Act of God, ‘Sent by god’, Biological, BJP, Donald trump, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఎన్నికలు చివరిదశకు చేరాయి, 2024జూన్‌ నాలుగున ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. అది సక్రమంగా ఉంటుందా అంటూ ” దేవుడు లేదా దేవుడి ప్రతినిధి ” గురించి అనేక మంది ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి నరేంద్రమోడీ తిరిగి అధికారానికి వస్తే లేదా కోల్పోతే ఏం జరుగుతుంది. మొదటిదాని గురించి ఇండియా కూటమి ఇప్పటికే ప్రచారంలో పేర్కొన్నట్లు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగం, సామాజిక న్యాయానికి ముప్పు ఏర్పడుతుందని నమ్ముతున్నవారు ఉన్నారు.మోడీని ఒక వైపు కాంగ్రెస్‌కు గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావంటారు, ఇండియా కూటమి వస్తే ఏడాదికొకరు ప్రధాని పదవి చేపడతారంటారు. అదే నోటితో కాంగ్రెస్‌ అధికారానికి వస్తే మెజారిటీ భారతీయులు రెండవ తరగతి పౌరులుగా మారిపోతారని, మహిళల మెడల్లో ఉన్న పుస్తెలతో సహా ఆభరణాలన్నీ తీసుకొని చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలు కలవారికి పంపిణీ చేస్తారని,క్రికెట్‌ జట్లలో ఎక్కువ మంది ముస్లింలను చేర్చుతారని, అయోధ్యలో రామాలయాన్ని కూల్చేందుకు బుల్డోజర్లు పంపుతారని ఆరోపిస్తారు. పరుచూరి బ్రదర్స్‌ చెప్పినట్లు ఒక జేబులో ఒకటి, మరోజేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే రాజకీయనేతగా మోడీ కనిపించటం లేదూ ! ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని సంఘపరివారం నిరంతరం చేస్తున్న ప్రచారం తెలిసిందే. తాను వారి గురించి కాదు అని తరువాత మోడీ మార్చారు. మరి ఎవరిని అన్నట్లు ? సమాజంలో ధనికులుగా ఉన్నవారు, ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసీ సామాజిక తరగతులతో పోల్చితే ఇతరులు పిల్లలను ఎక్కువగా కనటం లేదన్నది తెలిసిందే. అంటే ఆ మూడు సామాజిక తరగతుల మీదనే మోడీ ధ్వజమెత్తారని అనుకోవాలి మరి.లేకపోతే నరం లేని నాలుక అనుకోవాలి. ఇక రెండవ దృశ్యానికి వస్తే మోడీ జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫలితాన్ని గుర్తించను అంటూ అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌ మీదకు తన మద్దతుదార్లను ఉసిగొల్పిన ఉదంతం ఇక్కడ ప్రతిబింబిస్తుందా ? అన్నది చూడాల్సి ఉంది.


నరేంద్రమోడీ నోటి వెంట ప్రమాదాన్ని సూచించే మరో మాట వెలువడింది. రాజులు దైవాంశ సంభూతులని వంది మాగధులు వర్ణించారు, పొగిడారు. ఏకంగా తామే దైవాంశ అని, దేవుళ్లమని చెప్పుకున్న వారిని చరిత్ర ఎందరినో చూసింది. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా మా నమో లీలలు వర్ణించతరమా అన్న పూనకంతో బిజెపి నేత సంబిత్‌ పాత్ర ఏకంగా పూరీ జగన్నాధుడే నరేంద్రమోడీ భక్తుడుగా మారినట్లు ”వెల్లడించిన” సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ పూరీలో రోడ్‌ షో జరిపిన తరువాత అక్కడ పోటీ చేస్తున్న సంబిత్‌ పాత్ర ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ” ప్రభువు పూరీ జగన్నాధుడు నరేంద్రమోడీ భక్తుడు, మేమంతా మోడీ కుటుంబసభ్యులం.ఇలాంటి మహత్తర క్షణాలను చూసిన తరువాత నా భావావేశాలను ఆపుకోలేను, ఒరియా వారందరికీ ఇది ఒక ప్రత్యేకమైన రోజు ” అని మాట్లాడారు.దీని మీద ప్రతికూల స్పందనలు తలెత్తటంతో క్షమించమని వేడికోళ్లకు పూనుకున్నారు.ఈ తప్పుకు గాను ఉపవాసం ఉండి ప్రాయచిత్తం చేసుకుంటానని చెప్పిన ఈ పెద్దమనిషిని ఎన్నికల్లో పూరీ జగన్నాధుడు ఏం చేస్తాడో చూడాలి.


దేవుడు దేశానికి ఇచ్చిన బహుమతి నరేంద్రమోడీ అని కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఎం వెంకయ్యనాయుడు 2016 మార్చి నెలలో సెలవిచ్చారు.బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ పేదల పాలిట దైవాంశగల ఒక మహా పురుషుడు(మేషయ) అని కూడా వర్ణించారు. తరువాత విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మరో కేంద్ర మంత్రి రాజనాధ్‌ సింగ్‌ను విలేకర్లు ప్రశ్నించగా వెంకయ్యనాయుడి వ్యాఖ్యలను తాను వినలేదని, ఆ ప్రసంగాన్ని అంతగా ఆలకించలేదని చెప్పారు.(బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక 2016 మార్చి 21వ తేదీ) ఇంతగా వ్యక్తి పూజ తలకెక్కిన తరువాత నిజంగానే తాను దేవుడు పంపిన దూతను అని నరేంద్రమోడీ నమ్మటంలో ఆశ్చర్యం ఏముంది. ఇతరులు మాట్లాడితే విమర్శలు తలెత్తటం, రభస ఎందుకు ఏకంగా తానే రంగంలోకి దిగి మాట్లాడితే నోరెత్తే మీడియా ఉండదు కదా అనుకున్నారేమో ! ” కారణ జన్ములు ” అనే శీర్షికతో సంపాదకీయం రాసిన ఒక ప్రముఖ తెలుగు పత్రిక నరేంద్రమోడీ పేరెత్తటానికి భయపడిందంటే గోడీ మీడియా అని ఎవరైనా అంటే తప్పేముంది. అత్యవసర పరిస్థితి సమయంలో దేవకాంత బారువా అనే కాంగ్రెస్‌ నేత ఇందిరే ఇండియా-ఇండియాయే ఇందిర అని పొగడ్తలకు దిగి అభాసుపాలైన సంగతి తెలిసిందే.óఅప్పుడు కూడా మీడియా నోరెత్తలేదు, ఎత్తిన వాటిని ఎలా సెన్సార్‌ చేశారో తెలిసిందే.


తన పుట్టుక అందరి మాదిరి కాదని, తనను దేవుడు పంపినట్లు నమ్మకం కలిగిందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.న్యూస్‌ 18 అనే ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడారు.” నా తల్లి జీవించి ఉన్నంత వరకు నేను జీవసంబంధం (అందరి మాదిరే అమ్మా నాన్నలకు పుట్టినట్లు)గా పుట్టినట్లు భావించేవాడినని, ఆమె మరణం తరువాత నా అనుభవాలను చూస్తే నన్ను దేవుడు పంపినట్లు నిర్ధారించుకున్నాను. అందుకే దేవుడు నాకు సామర్ధ్యం, శక్తి, స్వచ్చమైన హృదయం, ఈ పనులు చేసేందుకు దైవావేశం కూడా ఇచ్చినట్లు భావిస్తున్నాను. దేవుడు పంపిన ఒక సాధనాన్ని తప్ప నేను మరొకటి కాదు ” అని చెప్పారు. కల్యాణమొచ్చినా కక్కొచ్చినా(వాంతి) ఆగదంటారు, ఇప్పుడు దీనికి మోడీ మనసులోకి ఏది వచ్చినా అనే దాన్ని కూడా జతచేసుకొని నవీకరించాలి. చివరి దశ ఎన్నికల్లోగా లేదా తరువాత అయినా తన జన్మ ఏ దేవుడి అంశో అన్న రహస్యాన్ని వెల్లడించినా ఆశ్చర్యం లేదు. అప్పటి వరకు గుజరాత్‌ ద్వారక కృష్ణుడా, అయోధ్య రాముడా, వారణాసి శివుడా ఎవరు పంపారన్నది జనాలు జుట్టుపీక్కోవాల్సిందే. జర్మన్‌ నాజీ హిట్లర్‌ స్వచ్చమైన ఆర్య సంతతి అని భావించిన సావిత్రీదేవి ముఖర్జీ అనే ఫ్రాన్సులో పుట్టిన గ్రీకు ఫాసిస్టు రాసిన పుస్తకంలో హిట్లర్‌ను విష్ణువు అవతారమని చెప్పింది. సదరు అవతారి ఒక మారణహౌమానికి ఎలా కారకుడయ్యాడో తెలిసిందే. అజిత్‌ కృష్ణ ముఖర్జీ అనే బెంగాలీని వివాహం చేసుకొన్న సావిత్రిదేవీ కొల్‌కతాలో జీవించి రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాలకు వ్యతిరేకంగా జర్మన్‌ గూఢచారిగా పనిచేసి తరువాత నాజీగా జీవించింది.


ముందే చెప్పుకున్నట్లు చరిత్రను చూస్తే ఈజిప్టులో ఫారోలుగా వర్ణితమైన పురాతన రాజులు తమను దేవుళ్లుగా భావించుకోవటమే కాదు, పేర్లు కూడా అలాగే పెట్టుకొనే వారు. తదుపరి జన్మ కొనసాగింపుకోసం చచ్చిన రాజుల శవాలను మమ్మీలుగా మార్చి పిరమిడ్‌లను నిర్మించిన సంగతి తెలిసిందే. కొందరు చైనా రాజులు కూడా తమను స్వర్గ పుత్రులని వర్ణించుకున్నారు. చరిత్రలో అలెగ్జాండర్‌ ది గ్రేట్‌గా పిలిచే గ్రీకు చక్రవర్తి ఈజిప్టు ఫారోల మాదిరే తాను కూడా దైవాంశ సంభూతుడిగానే భావించుకున్నాడు.తన నిజమైన తండ్రి జీయస్‌ అమన్‌ అనే ఈజిప్టు పురాతన దేవుడని భావించాడు.ఇండోనేషియాలో అనేక మంది పురాతన రాజులు తాము హిందూ దేవుళ్ల అంశగా చెప్పుకున్నారని చరిత్ర చెబుతోంది.ఆగేయాసియా దేశాలలో దేవరాజ అని పిలుచుకున్న అనేక మంది శివుడు లేదా విష్ణువు అవతారాలు లేదా వారసుల మని చెప్పుకున్నారు. సూర్య, చంద్ర వంశీకులమని చెప్పుకున్న వారి సంగతి తెలిసిందే.టిబెట్‌లో దలైలామాలు ఇప్పటికీ తాము బుద్దుని అవతారమని చెప్పుకుంటున్నారు. నేపాల్లో షా వంశ రాజులు కూడా తమను విష్టు అవతారాలుగా వర్ణించుకున్నారు. సత్యసాయి బాబాను దత్తాత్రేయ అవతారంగా భావించే భక్తులు సరేసరి. చరిత్రలో తమను తాము దేవుళ్లుగా, దేవదూతలుగా వర్ణించుకున్నవారు, మతాన్ని కాపాడతామని చెప్పేవారు, కలుషితమైన జాతిని పరిశుద్ధం చేయాలనే వారు చేయించిన లేదా చేసిన దుర్మార్గాలు ఎన్నో. ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం పేరుతో అధికారానికి వచ్చిన మతశక్తులు ప్రత్యర్ధులను ముఖ్యంగా కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు ”దేవుని శత్రువు ”లు అనే సాకుతో వేలాది మందిని బూటకపు విచారణలతో ఉరితీశారు. జపాన్‌లో షోకో అసహరా అనే వాడు తనను క్రీస్తుగా చెప్పుకున్నాడు. తరువాత బౌద్దం-హిందూ విశ్వాసాలలను కలగలిపి ప్రచారం చేశాడు. యుగాంతం ముంచుకువస్తుందని తన భక్తులను నమ్మించాడు.టోక్యోలో 1995లో శరీన్‌ గాస్‌ను ప్రయోగించి వేలాది మందిని గాయపరచి 13 మంది ప్రాణాలు తీశారు. చివరకు మరో ఏడుగురితో కలిపి అసహరాను అక్కడి ప్రభుత్వం విచారించి ఉరితీసింది. అమెరికాలో ఆస్కార్‌ రామిరో ఓర్టేగా హెర్నాండెస్‌ అనే పెద్ద నేరగాడు తనను దేవదూతగా, ఏసుక్రీస్తుగా వర్ణించుకున్నాడు.అమెరికా అధ్యక్ష భవనం మీద దాడికి దేవుడు తనను ఆదేశించినట్లు చెప్పుకున్నాడు.


తనను దేవుడు ఆవహించినట్లు చెప్పుకున్నా, కొన్ని పనులు చేసేందుకు పంపినట్లు భావించినా, వంది మాగధులు అలాంటి వాతావరణం కల్పించినా చరిత్రలో జరిగిన నష్టాలు ఎన్నో. అనేక మంది ఎలాంటి ఆలోచన లేకుండా వారేం చేసినా సమర్ధించే ఉన్మాదానికి ఎందుకు లోనవుతారు అన్నది అంతుచిక్కని ప్రశ్న. జర్మనీలో జరిగింది అదే.జర్మన్‌ జాతికి యూదుల నుంచి ముప్పు ఏర్పడిందని, వారు జర్మనీకి ద్రోహం చేశారనే ప్రచారాన్ని సామాన్య జనం నిజంగా నమ్మబట్టే హిట్లర్‌ ఆటలు సాగాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తాను చెప్పిన వక్రీకరణలు, అవాస్తవాలను జనాలు నిజాలుగా భావిస్తారన్న గట్టి విశ్వాసం ఉన్నకారణంగానే నరేంద్రమోడీ ప్రసంగాలు చేశారు. తన జన్మ మామూలుది కాదని చెప్పుకున్నారు. హిట్లర్‌ను దేవుడే పంపాడని జర్మనీ పిల్లలకు నూరిపోశారు, దాంతో వాడిని ఒక సాధారణ రాజకీయవేత్తగా చూడటానికి బదులు దేవుడు పంపిన దూతగా చూశారు. మతాన్ని రాజకీయాలను జోడిస్తే జరిగేది ఇదే. జర్మనీ పూర్వపు ఔన్నత్యాన్ని నిలపాలంటే యూదులను అంతం చేయాలని చెబితే నిజమే అని నమ్మారు.ఇప్పుడు మనదేశంలో కూడా అన్ని రకాల అనర్ధాలకు ముస్లిం పాలకుల దండయాత్రలు, ఆక్రమణ, హిందువుల జనాభా తగ్గుతూ ముస్లింల జనాభాను పెంచుతూ ఒక నాటికి హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందన్న ప్రచారాన్ని నమ్ముతున్న వారు ఉన్నారు. దాన్ని అడ్డుకోవాలంటే మెజారిటీ హిందూత్వ పాలన రావాలన్నదానికి మద్దతు పెరుగుతోంది. మంచి చెడుల ఆలోచన లేదు. ప్రజాస్వామ్యం ఎక్కువ కావటం కూడా మంచిది కాదంటూ అనాలోచితంగా మాట్లాడుతున్న జనాలు రోజు రోజుకూ పెరుగుతున్నారు.


ఇందిరా గాంధీ ఉపన్యాసాలు, విన్యాసాలు చూసిన జనం ఆకర్షితులయ్యారు.గరీబీహటావో అంటే నిజమే అని నమ్మారు. చివరకు అత్యవసర పరిస్థితిని ప్రకటించి దేశాన్ని ప్రమాదపు అంచుల్లోకి నెట్టారు. ఇప్పుడు నరేంద్రమోడీ అద్భుతాలు చేస్తారని, తమ జీవితాలను మార్చివేస్తారని అనేక మంది నమ్ముతున్నారు. ఒక వైపు సంపదలన్నీ కొంత మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంటే అలాంటి వారిని మోడీ వెనకేసుకు వస్తుంటే మార్పు సాధ్యం కాదనే ఆలోచనకు తావివ్వటం లేదు.గోవులను వధిస్తున్నారనే పేరుతో రోజూ తమ కళ్ల ముందు తిరిగే వారి మీద మూకదాడులకు పాల్పడుతుంటే చూస్తూ ఏమీ చేయలేని వారిని చూశాం.” నాజీ అంతరాత్మ ” పేరుతో 2003లో వెలువరించిన ఒక పుస్తకంలో క్లాడియా కూంజ్‌ అనే చరిత్రకారిణి ఒక ఉదంతాన్ని వివరించారు.ఆల్ఫోన్స్‌ హెక్‌ అనే యువకుడు హిట్లర్‌ యూత్‌లో ఉన్నాడు. (ఇప్పుడు మనదేశంలో ”దళ్‌ ” పేరుతో ఉన్న సంస్థల మాదిరి.) తన గ్రామంలో నాజీ పోలీసులు యూదులను నరహంతక శిబిరాలకు తరలించేందుకు ఒక దగ్గర పోగుచేస్తూ ఉంటే వారిలో హెయినిజ్‌ అనే తన మంచి స్నేహితుడు ఉన్నప్పటికీ ఎంత అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని తనలో తాను కూడా అనుకోలేకపోయాడట. యూదుల నుంచి ముప్పు ఉందనే అంశాన్ని బుర్రకు ఎక్కించుకొని ఉండటంతో హెయినిజ్‌ దురదృష్టం ఏమిటంటే అతను యూదుగా పుట్టటమే అని, వారిని తరలించటం సమంజసమే అని అనుకున్నట్లు తరువాత గుర్తు చేసుకున్నాడట. ఒక ఉన్మాదం తలెత్తినపుడు మనుషుల ఆలోచనల్లో వచ్చే మార్పును కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.” నా భాష జర్మన్‌, నా సంస్కృతి, అనుబంధాలు అన్నీ కూడా జర్మనే.జర్మనీ, జర్మనీ ఆస్ట్రియాలో యూదు వ్యతిరేకత పెరుగుతున్నదని గుర్తించేవరకు నేను కూడా జర్మన్‌ మేథావినే అనుకున్నాను. కానీ యూదు వ్యతిరేకత పెరిగిన తరువాత ఒక యూదును అని నన్ను నేను అనుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చాను” అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది కూడా అదే. హిట్లర్‌ పుట్టుకతోనే నాజీ కాదు. కేవలం జర్మన్‌ జాతి ఒక్కటే నాగరికతకు తగినది అనే భావజాలం విస్తరిస్తున్న సమయంలో అనేక మంది దానికి ఆకర్షితులయ్యారు. అదే భావజాలం మరింత ముదిరి హిట్లర్‌ను నియంత, నరహంతకుడిగా మార్చాయి. అందుకే నేడు కావాల్సింది నిరంకుశత్వానికి దారితీసే మితవాద భావజాలం వైపు ఆకర్షితులౌతున్నవారిని నిందిస్తూ కూర్చోవటం కాదు, ఆ భావజాలాన్ని ఎదుర్కొనే పోరును మరింత ముందుకు తీసుకుపోవటం, దీనికి అధ్యయనం తప్ప దగ్గరదారి లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎమితిని సెపితివి కపితము : కడప, విశాఖ ఉక్కు మాటెత్తకుండా కూరగాయలు, అరటి పండ్ల కబుర్లు, రాహుల్‌పై అసత్యాలు చెప్పిన నరేంద్రమోడీ !

10 Friday May 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Adani, Ambani and Adani, ANDHRA PRADESH, BJP, CHANDRABABU, India Elections 2024, Modi distortions, Narendra Modi escapement, Narendra Modi Failures, YS jagan


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి, దానితో చేతులు కలిపిన తెలుగుదేశం, జనసేనలు తబ్బిబ్బులౌతున్నాయి. పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయితేనేం అన్నట్లుగా తిరిగి వైసిపి గెలుస్తుందా ? మూడు పార్టీల కూటమి గెలుస్తుందా అన్నది తప్ప ఎవరు గెలిచినా కొత్తగా రాష్ట్రానికి, జనానికి ఒరిగేదేమీ లేదని మోడీ మాటలతో తేలిపోయింది. చిత్రం ఏమిటంటే తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి సంవత్సరాల తరబడి బిజెపి నేతలు ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది, అనుమతులు మంజూరు చేసింది మీరు, ఆరోపణలను ఎందుకు ఒక కమిషన్‌తో విచారించటం లేదని ప్రశ్నిస్తే కేంద్రం అవసరమైన సమాచారం అంతా సేకరిస్తున్నది త్వరలో చర్య ఏమిటో మీరే చూస్తారంటూ కబుర్లు చెప్పేవారు. చేసిందేమీ లేదు. ఐదు సంవత్సరాల తరువాత నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి పాలకుల మీద రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు. అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే జుమ్లా (అవసరానికి తగినట్లుగా మాట్లాడటం) తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు పోలవరంను ఏటిఎంగా వాడుకున్నట్లుగానే కాళేశ్వరాన్ని బిఆర్‌ఎస్‌ నేతలు వాడుకున్నారని కూడా మోడీ చెప్పారు. కాళేశ్వరానికి కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పోలవరం కేంద్ర ప్రాజెక్టు. దాన్నుంచి పిండుకున్నారని విమర్శించిన మోడీ ఐదేండ్లు చేసిదేమీ లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో వైసిపి పాలకుల మీద చర్య తీసుకుంటామంటే జనానికి చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు.


బిజెపి నుంచి ఆంధ్రప్రదేశ్‌ పౌరులు ఆశిస్తున్నదీ, తెలుగుదేశం, జనసేన ఆశలు కల్పించిందీ విభజన హామీల అమలు గురించి తప్ప వట్టిస్తరి మంచినీళ్ల గురించి కాదు.కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తారా లేదా విశాఖలో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తారా, అది సక్రమంగా పని చేయాలంటే అవసరమైన ఇనుప ఖనిజ గనులను కేటాయిస్తారా లేదా ఏం చెబుతారోనని ఎదురు చూస్తుంటే అవేమీ తనకు సంబంధం లేనట్లుగా రాజంపేట ఎన్నికల సభలో కూరగాయల శీతల గిడ్డంగులు,పులివెందులలో అరటి పరిశ్రమ గురించి మాట్లాడారు. పోనీ వాటినైనా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులతో ఏర్పాటు చేస్తామన్నారా అంటే అదీ లేదు.ఆంధ్రప్రదేశ్‌ పౌరులను మరీ అమాయకులుగా భావించినట్లు కనిపిస్తోంది.పదేండ్ల క్రితం ఏర్పాటు చేయాల్సిన విశాఖ రైల్వే జోన్‌కు ఇంతవరకు అతీగతి లేదు, దాని గురించి చెప్పకుండా మీకు బుల్లెట్‌ రైలు వద్దా అని ప్రశ్నించారు.వద్దని ఎవరు చెప్పారు. రద్దు చేసిన పాసింజరు రైళ్లను పూర్తిగా పునరుద్దరించలేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్తవాటిని వేయటం లేదు గానీ సామాన్యులు భరించలేని టిక్కెట్‌ ధరలతో నడిచే బుల్లెట్‌ రైలు వద్దా అంటున్నారు. తక్కువ ఛార్జీలతో నడిచే రైళ్లకు బదులు రాబోయే రోజుల్లో ప్రైవేటు వారికి గిట్టుబాటుగా ఉండేందుకు గాను రద్దీ మార్గాల్లో సాధారణ సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు బదులు వందేభారత్‌లను ప్రవేశపెడుతున్నారు.వాటిని కూడా ప్రవేశపెట్టండి కలిగిన వారు ఎక్కుతారు. కానీ మధ్యతరగతి, దిగువ ఆదాయవర్గాల అవసరాలకు అనుగుణంగా ఇతర రైళ్లను ఎందుకు వేయరు.


మూడు పార్టీలు ఒక కూటమిగా పోటీ చేస్తున్నప్పటికీ తెలుగుదేశం-జనసేన పార్టీలు మాత్రమే ఉమ్మడి మానిఫెస్టోను విడుదల చేశాయి. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌తో కలసి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఆవిష్కరించేందుకు బిజెపి నేత సిద్దార్దనాధ్‌ తిరస్కరించిన వీడియోలను జనమంతా చూశారు. తమ కేంద్ర మానిఫెస్టో తెలుగు కాపీని మాత్రమే బిజెపి విడుదల చేసింది. బహిరంగ సభల్లో వెనుకబడిన తరగతుల జాబితాలో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పటం తప్ప ఎక్కడ బిజెపికి ఆగ్రహం వస్తుందో అన్న భయంతో తమ మానిఫెస్టోలో దాన్ని పెట్టలేదు. పోలవరం ప్రాజెక్టు కిందనిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం సంగతి తేల్చటం లేదు. ప్రాజెక్టు నిర్మిస్తున్న కేంద్రం ఇచ్చేదీ, రాష్ట్రమే భరించేదీ ఇంతవరకు తేల్చలేదు.ఇచ్చేందుకు కేంద్రం మొరాయిస్తున్నది.తన పర్యటనలో నరేంద్రమోడీ దాని గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ కేంద్రాన్నైనా మరొకరినైనా తాట వలుస్తాం, తోలు తీస్తాం అని సినిమా డైలాగులు చెప్పిన పవన్‌ కల్యాణ్‌ పోలవరం నిర్వాసితులకు చెల్లించేందుకు అవసరమైన వేల కోట్ల రూపాయలను సెస్‌ రూపంలో, విరాళాలు వసూలు చేసి చెల్లిస్తామని ప్రకటించటం గమనించాల్సిన అంశం. ఇలా ఇంతవరకు ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా ? తెలుగుదేశం-జనసేన మానిఫెస్టో అమలుకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి తెస్తారని అడిగితే ముందు అధికారమివ్వండి తరువాత చంద్రబాబు నాయుడు తన అనుభవంతో చక్రం తిప్పి కేంద్రం నుంచి సాధిస్తారు, రాష్ట్రంలో వనరుల వృద్ధికి అల్లా ఉద్దీన్‌ అద్బుత దీపం ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు. గత ఐదు సంవత్సరాల్లో అలాంటి దాఖలాలు లేవు కదా అంటే ఈ సారి చూడండి అంటున్నారు. తెలంగాణాలో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ మరిన్ని అప్పులు చేస్తే తప్ప రోజు గడవని స్థితిలో ఉంది. తెలంగాణా కంటే వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ఎక్కువ అప్పులు చేసిందని చెబుతున్న తెలుగుదేశం పార్టీకి నిజంగానే అధికారం దక్కితే ఎలా నెట్టుకొస్తుందన్నది ప్రశ్న.


తెలంగాణాలో నరేంద్రమోడీ కొత్త సంగతి చెప్పారు. ఏదైనా పార్టీతో ఒప్పందం చేసుకుంటే అంబానీ-అదానీలు టెంపోల ద్వారా నోట్ల కట్టలను వారికి పంపుతారట. ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ నోట అంబానీ-అదానీ మాటలు రావటం లేదని, వారితో కాంగ్రెస్‌ ఒప్పందం కుదుర్చుకుందా ? టెంపోలలో నోట్లు వారికి చేరాయా అని ప్రధానికరీంనగర్‌ జిల్లా వేములవాడ ఎన్నికల సభలో ప్రశ్నించారు.” ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి వీరు అంబానీ-అదానీలను దుర్భాషలాడటం మానుకున్నారు. నేను తెలంగాణా గడ్డ నుంచి అడగదలుచుకున్నాను.అంబానీ-అదానీల నుంచి ఎంత సొమ్ము తీసుకున్నారో రాకుమారుడిని వెల్లడించమనండి. టెంపోల కొద్దీ నోట్లు కాంగ్రెస్‌కు చేరాయా ? తెల్లవారేసరికి అంబానీ-అదానీలను దూషించటం ఆగిపోయింది కనుక ఏ ఒప్పందం కుదిరింది. మీరు వారిని ఐదేండ్లుగా దూషించటాన్ని ఆకస్మికంగా ఆపివేశారంటే ఏదో నీచం జరిగింది( జరూర్‌ దాల్‌ మే కుచ్‌ కాలా హై(పప్పులో కంపు కొట్టేది ఏదో పడింది) ” అని మోడీ అన్నారు. రాహుల్‌ గాంధీ వెంటనే దానికి తగిన జవాబు ఇచ్చారు.” నమస్కారం మోడీ గారూ, మీరు భయపడుతున్నారు.సాధారణంగా మీరు తలుపులు మూసుకొని రహస్యంగా అంబానీ-అదానీల గురించి మాట్లాడతారు.తొలిసారిగా మీరు వారి గురించి బహిరంగంగా మాట్లాడారు.వారు టెంపోలలో డబ్బు ఇస్తారని మీకు తెలుసు, అది మీ వ్యక్తిగత అనుభవమా ? సాధ్యమైనంత త్వరలో దీని గురించి ఒక విచారణ జరపండి ” అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన రోజు నుంచి దేశంలో అనేక చోట్ల తనిఖీలు జరుపుతూ భారీ మొత్తాలలో నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. మరి టెంపోలలో తరలిస్తున్న సొమ్ము పట్టుకున్నట్లుగానీ, అవి అంబానీ, అదానీలవని ఎక్కడా వార్తలు రాలేదు. వారి కంపెనీలన్నీ బిజెపి పాలిత రాష్ట్రాలలోనే ఎక్కువగా ఉన్నాయి. నరేంద్రమోడీ ఆరోపించినట్లుగా నిజంగానే ఎన్నికల ప్రకటన తేదీ నుంచి రాహుల్‌ గాంధీ ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలను విమర్శించలేదా ? అది పచ్చి అవాస్తవమని హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక వాస్తవ నిర్ధారణ వార్త వెల్లడించింది. తొలిదశ ఓటింగ్‌ (ఏప్రిల్‌ 19) నుంచి తమ బృందం రాహుల్‌ గాంధీ,కాంగ్రెస్‌ యూట్యూబ్‌ ఉపన్యాసాలను పరిశీలించగా అనేక సందర్భాలలో విమర్శించినట్లు ఉందని మే తొమ్మిదవ తేదీన ప్రచురించిన వార్తలో వివరాలను ఇచ్చింది. ఇదీ విశ్వగురువు బండారం.


నిజానికి ఇది ఎదురుదాడి తప్ప మరొకటి కాదు. అదానీ కంపెనీల అక్రమాలపై హిండెన్‌బర్గ్‌ నివేదిక అనేక ఆరోపణలు చేసింది. సూట్‌ కేసు కంపెనీల గురించి చెప్పింది. ఆ నివేదికలోని అంశాల మీద పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని, అదానీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదనైనా మీ నోటితో చెప్పండని ప్రతిపక్షాలు కోరితే అంగీకరించలేదు. అసలు పార్లమెంటులో లేదా వెలుపల అదానీ పేరే మోడీ ఉచ్చరించలేదు. దీని వెనుక ఏదైనా ఒప్పందం, టెంపోల కొద్దీ నోట్లు అందాయా ? ఎందుకంటే అంబానీ, అదానీ ఇతర బడా కార్పొరేట్ల కంపెనీల పేర్లు ఎక్కడా ఎన్నికల బాండ్ల జాబితాలో పెద్దగా కనిపించలేదు. రాజకీయ పార్టీలకు అవి విరాళాలు ఇవ్వలేదంటే నమ్మే అమాయకులు ఎవరైనా ఉన్నారా ? అంబానీలు, అదానీలు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రాపకంతో మరింత ధనవంతులౌతున్నారని కాంగ్రెస్‌, వామపక్షాలు, మరికొన్ని పార్టీలు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు ఎవరైనా వ్యాపార, పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై పరస్పరం లబ్దిపొందే నిర్ణయాలు తీసుకొని మాకది-మీకిది అని పంచుకోవటం బహిరంగ రహస్యం.చట్టబద్దంగా జరుగుతున్న అవినీతి. వేములవాడ సభలో నరేంద్రమోడీ చలోక్తి విసిరారని కొందరు భాష్యం చెబుతున్నారు.అదానీ కంపెనీల అక్రమాల గురించి మోడీ మాట్లాడకపోవటాన్ని ప్రతిపక్షాలు జోక్‌గా విమర్శించలేదు,సీరియస్‌గానే చెప్పాయి.


రెండింజన్ల పాలన పుణ్యమా అని మధ్యప్రదేశ్‌ ఎంతో వెనుకబడింది. దానికి అనుగుణంగానే అక్కడి జనంలో వెనుకబాటుతనం కూడా ఎక్కువేకావచ్చు. నరేంద్రమోడీ మంచి మాటకారి, జనాన్ని బుట్టలో వేయటంలో దిట్ట అనటంలో సందేహం లేదు. కానీ ఏం చెబితే దాన్ని గుడ్డిగా నమ్ముతారా ? లేకపోతే విశ్వగురువు అంతధైర్యంగా మాట్లాడగలరా ? అది జన అమాయకత్వమా ? నేతల దిగజారుడా ? మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ నాలుగు వందల సీట్లు ఎందుకు కావాలంటున్నానంటే అని చెబుతూ క్రికెట్‌ జట్టులో ఎక్కువ మంది ముస్లింలను కాంగ్రెస్‌ చేర్చకుండా ఉండేందుకు అని చెప్పారని మేనెల ఏడవ తేదీన ది వైర్‌ పోర్టల్‌ నివేదించింది. నాలుగు వందల సీట్లు కావాలని బిజెపి అడగటం రాజ్యాంగాన్ని మార్చేందుకు, రిజర్వేషన్లు తొలగించేందుకు అని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే నరేంద్రమోడీ ముస్లిం విద్వేష అజండాను ఎంచుకున్నారు.” కాంగ్రెస్‌ ఉద్దేశ్యం ఏమంటే క్రీడల్లో మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వటం. దీని అర్ధం ఏమిటి ? మత ప్రాతిపదికన క్రికెట్‌ టీములో ఎవరు ఉండాలో లేదో అది నిర్ణయిస్తుందన్నమాట. నేను కాంగ్రెస్‌ను ఈ రోజు అడుగుతున్నాను.ఇలా వారు కోరుకోబట్టే, ఇందుకే 1947లో స్వాతంత్య్రం వచ్చినపుడు భారతమాతను మూడు ముక్కలు చేశారు. వారు 1947లో దేశం మొత్తాన్ని పాకిస్తాన్‌గా మార్చాలనుకున్నారు, తరువాత భారత ఆనవాళ్లు చెరిపివేయాలనుకున్నారు.నేను ఈ రోజు స్పష్టంగా చెబుతున్నా. కాంగ్రెస్‌ వారందరూ, వారిని అభిమానించేవారు జాగ్రత్తగా వినాలి…. మోడీ బతికి ఉన్నంత కాలం నకిలీ లేదా తప్పుడు లౌకికవాదం పేరుతో భారత గుర్తింపును చెరిపేందుకు ప్రయత్నిస్తే అతను అనుమతించడు ” అని మోడీ చెప్పారు.


దశాబ్దాలుగా ఉన్న బాబరీ మసీదు తాళాలను తీయించింది రాజీవ్‌ గాంధీ అన్నది తెలిసిందే. కాంగ్రెస్‌ అధికారానికి వస్తే రామాలయం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసి ఆలయానికి కాంగ్రెస్‌ తాళం వేస్తుందని, జమ్మూ-కాశ్మీరుకు ఆర్టికల్‌ 370 తిరిగి తీసుకువస్తుందని దాన్ని నివారించాలన్నా, రిజర్వేషన్లను కాంగ్రెస్‌ తస్కరించకుండా, వాటిని ముస్లింలకు అప్పగించకుండా ఉండాలన్నా, పది సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లను పొడిగించాలన్నా తనకు నాలుగు వందల సీట్లు అవసరం అని కూడా నరేంద్రమోడీ చెప్పారు. ఇది భారతీయ తర్కమా, అడ్డగోలు మాటలా ? అధికారంలో కాంగ్రెస్‌ ఉండి తనకు నాలుగు వందల సీట్లు కావాలని కోరితే పైన చెప్పినవన్నీ జరగకుండా ఉండాలంటే తమకు అధికారం ఇవ్వాలనో, అంత భారీ మెజారిటీ ఇవ్వకూడదనో జనానికి చెబితే అర్ధం వుంది. ఆ సంఖ్య కోరుతున్న తమ మీద వస్తున్న విమర్శలను కాంగ్రెస్‌కు ఆపాదించి జనాన్ని తప్పుదారి పట్టించటం తప్ప ఇది మరొకటి కాదు.జనం మరీ అంత అమాయకంగా ఉన్నారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పు చేసినట్లు : బిజెపిలో పెరుగుతున్న వారసత్వం ! తుస్సుమన్న నరేంద్ర మోడీ అస్త్రం !!

05 Sunday May 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, TDP, Ycp

≈ Leave a comment

Tags

BJP, BJP Dynastic Politics, Family Politics in India, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఆరునెలల్లో వారు వీరవుతారు అన్న సామెత తెలిసిందే, అంతేనా అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు అనే లోకోక్తి కూడా తెలిసిందే.లోక్‌సభ ఎన్నికలలో ప్రకటిస్తున్న అభ్యర్థులను చూసిన తరువాత బిజెపి ఈ సామెతలను రుజువు చేస్తున్నదని వేరే చెప్పనవసరం లేదు. కాంగ్రెస్‌ దశాబ్దాల కాలంలో వారసత్వ రాజకీయాలకు అలవాటు పడితే బిజెపి ఒక దశాబ్దిలోనే ఎంతో వేగంగా కాంగ్రెస్‌ను అధిగమించుతోందా అనిపిస్తోంది.మహిళా రెజలర్లను వేధించిన తమ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ మీద బేటీ బచావో-బేటీ పఢావో (ఆడపిల్లల్ని రక్షించండి-ఆడపిల్లల్ని చదివించండి) అనే నినాదమిచ్చిన బిజెపి ఎలాంటి చర్య తీసుకోలేదు. తిరిగి అతగాడిని నిలిపితే పరువుపోతుందని భయపడి కొడుకు కరణ్‌కు సీటు ఇచ్చింది. ఎందుకు అంటే కైసర్‌గంజ్‌ నియోజకవర్గం, పరిసరాలలో బ్రిజ్‌ భూషణ్‌ కుటుంబాన్ని ఎదిరించి బిజెపిలో మరొకరు పోటీకి ముందుకు వచ్చే అవకాశం లేదు.భార్య గతంలో జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌గా పని చేశారు. ఒక కొడుకు ఇప్పుడు ఎంఎల్‌ఏ.బాబరీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న ”యోధుడు ”,రౌడీ, గూండా చట్టాల కింద అనేక కేసులు, కండబలంతో పెద్ద ఎత్తున సంపదలను కూడబెట్టుకున్న నేపధ్యంలో బిజెపి ఆ కుటుంబాన్ని వదులుకుంటుందా ! మహిళల వలువలను వలిస్తేనేం ” దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ విలువలను ” కాపాడేందుకు ఇలాంటి జనాలు కావాలి కదా !బ్రిజ్‌ భూషణ్‌ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు కుమారుడు నామినేషన్‌ వేసే సందర్భంగా ఏడు వందల కార్లు, పదివేల మందితో ప్రదర్శన చేయించినట్లు, ఆ సందర్భంగా తాను కనిపిస్తే రచ్చ అవుతుందని వాటికి దూరంగా తెరవెనుక ఉండి నడిపించినట్లు వార్తలు వచ్చాయి.


దేశంలో ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడరు. రాజకీయాలను శాసించే కుటుంబాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఒకసారి అధికారం, దానితో ఎలా సంపాదించుకోవచ్చో అనుభవంలోకి వచ్చిన తరువాత ఎంత సేపూ అధికార యావ, వారసులను రంగంలోకి తేవటం తెలిసిందే. దీనికి ఎన్‌డిఏ, ఇండియా కూటమిలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ అతీతం కాదు. ఏడున్నర దశాబ్దాల తరువాత కుటుంబ రాజకీయాలు సాధారణ స్థితికి వచ్చాయి, జనం కూడా ఆమోదం తెలుపుతున్నారు. ఎందుకు అనే ప్రశ్న వేయకుండా అసలు ప్రశ్నించటమే తప్పు అనేట్లు, గొర్రెదాటు వైఖరిని జనాల బుర్రలోకి ఎక్కించటంలో మతం, పురాణాలు, కులం, ప్రాంతాలు, అవకాశవాద రాజకీయాలు ఇలా తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా ఎవరి పాత్రను అవి పోషించాయి. జరిగిందాంట్లో తమ తప్పేమీ లేదని సమర్ధించుకుంటాయి. స్వాతంత్య్ర ఉద్యమ నేపధ్యం ఉంది గనుక కాంగ్రెస్‌లో మోతీలాల్‌ నెహ్రూ, కుమారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ, కుమార్తె ఇందిరా గాంధీ, కుమారుడు రాజీవ్‌ గాంధీ, కుమారుడు, కుమార్తె రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను చూపి వారసత్వ రాజకీయాలు అంటూ విమర్శించేందుకు బిజెపికి మంచి అవకాశం దొరికింది. ఆ పార్టీ లేదా దాని పూర్వీకులకు దేశభక్తి, స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన పూర్వ చరిత్ర లేదు.జనసంఘం స్థాపకులలో ఒకరు విజయరాజె సింధియా, తరువాత అది పేరు మార్చుకొన్న బిజెపిలో ఆమె కుమార్తె రాజస్తాన్‌ మాజీ సిఎం వసుంధర రాజే ఇటీవల మరోసారి ఆ పదవికి పోటీ పడ్డారు. ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌(ఎంపీ), ఇప్పుడు నాలుగవసారి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం స్థాపకుడు ఎన్‌టి రామారావు, కుమార్తె పురందరేశ ్వరి, కుమారులు హరికృష్ట, బాలకృష్ట, అల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు, కుమారుడు లోకేష్‌.ఈ కుటుంబానికి చెందిన వారు అన్నతెలుగుదేశం పార్టీని పెట్టారు. తెలుగుదేశం,కాంగ్రెస్‌, వైసిపి, బిజెపిలో చేరారు. బాలకృష్ణ మరొక అల్లుడు శ్రీ భరత్‌ విశాఖ లోక్‌సభ తెదే అభ్యర్ధి, గతంలో భరత్‌ తాత ఎంవివిఎస్‌ మూర్తి తెలుగుదేశం ఎంపీగా చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంతానం జగన్‌మోహనరెడ్డి, వైఎస్‌ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మహారాష్ట్రలో శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియ సూలే బారామతి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తుండగా ఎన్‌సిపి నుంచి ఫిరాయించి బిజెపితో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర ఇప్పుడు అక్కడ బిజెపి కూటమి తరఫున పోటీలో ఉన్నారు. ఇలా వివిధ రాష్ట్రాలలో కుటుంబాల నేపధ్య ప్రాతినిధ్యం పెరుగుతోంది.ఎక్కడైనా సీటు రాకపోతే, ఉన్న పార్టీలో గెలిచే అవకాశాలు లేకున్నా వేరే పార్టీలో చేరిపోతున్నారు.చత్రపతి శివాజీ వారసులమని చెప్పుకుంటూ తమను గెలిపించాలని కొల్లాపూర్‌లో ఒకరు కాంగ్రెస్‌ తరఫున మరొకరు బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. జనాన్ని మోసం చేయటం గాకపోతే శివాజీ వారసత్వానికి ఈ ఎన్నికలకు సంబంధం ఏమిటి ?


కాశ్మీరును స్వతంత్ర దేశంగా ఉంచాలని నాటి రాజు హరిసింగ్‌ చూస్తే దానికి వ్యతిరేకంగా భారత్‌లో విలీనం కోసం ఉద్యమించిన నేత షేక్‌ అబ్దుల్లా, కుమారుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ ఫరూక్‌ అబ్దుల్లా. నేషనల్‌ కాన్ఫరెన్సు పార్టీ నేతలుగా ఉన్నారు. ఆ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించి తరువాత దాన్నుంచి విడివడి కాంగ్రెస్‌, జనతాదళ్‌లో పని చేసి స్వంత పార్టీ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీని ఏర్పాచేసిన ముప్తీ మహమ్మద్‌ సయీద్‌ రెండుసార్లు సిఎంగా పని చేశారు. ఆయన కుమార్తె మెహబూబా ముప్తి ముఖ్యమంత్రి పదవి కోసం బిజెపితో చేతులు కలిపారు.ఈ రెండు పార్టీల నేతల కుటుంబ సభ్యులు, బంధువులు అనేక మంది ముఖ్యమైన పదవులను అనుభవించారు. కర్ణాటకలో అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న జెడిఎస్‌ నేత కుమారస్వామి గురించి తెలిసిందే. సిఎం పదవి కోసం బిజెపి, కాంగ్రెస్‌ రెండింటితో చేతులు కలిపారు. తండ్రి దేవెగౌడ జెడిఎస్‌కు జాతీయ నేత,ఒక కుమారుడు కుమారస్వామి, మరోకుమారుడు రేవన్న ఎంఎల్‌ఏ, ఇప్పుడు అత్యాచారం, కిడ్నాప్‌ కేసులో అరెస్టయ్యారు. రేవన్న కుమారుడు ప్రజ్వల్‌ ఎంపీ,మహిళలపై అత్యాచార వీడియోలు, కేసుల కారణంగా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు. ఈ పెద్దమనిషిని గెలిపించాలని నరేంద్రమోడీ కర్ణాటకలో ప్రచారం తెలిసిందే. కర్ణాటకలో యెడియూరప్ప కుటుంబ రాజకీయాలు, పదవి కోసం అవకాశం వాదం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌లో సమాజవాదీ, ఆర్‌జెడి నేతలు, హర్యానాలో దేవీలాల్‌, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌ కుటుంబ సభ్యుల పదవుల గురించి తెలిసిందే.


ఇక బిజెపి వారసత్వ రాజకీయాల గురించి చూస్తే లోక్‌సభ, రాజ్యసభల్లో ఉన్న 388 మంది ఎంపీల్లో 45 మంది కుటుంబ నేపధ్యం ఉన్నవారే. బిజెపి ఇటీవలి సంవత్సరాలలోనే వివిధ రాష్ట్రాలలో అధికారానికి వచ్చింది కనుక రాజకీయ వారసులు పుట్టుకు వచ్చారు. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతారు. అసలు బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌లో రాజరిక లక్షణాలు ఉంటాయి. ఒకసారి ఆ సంస్థకు అధిపతిగా నియమితులైన వారు జీవితాంతం కొనసాగుతారు. దానికి ఎన్నికలు ఉండవు. తాజా ఎన్నికల్లో ఏప్రిల్‌ పదవ తేదీనాటికి ప్రకటించిన అభ్యర్ధుల జాబితా ప్రకారం 250 మంది కాంగ్రెస్‌ వారిలో 65 అంటే ప్రతి నలుగురిలో ఒకరు, 424 బిజెపి జాబితాలో 87, ప్రతి ఐదుగురిలో ఒకరు రాజకీయ కుటుంబాల వారసులే ఉన్నారని హిందూస్తాన్‌ టైమ్స్‌ విశ్లేషించింది. కేవలం ఒక పార్టీలో ఉంటూ వారసత్వంగా పదవుల్లోకి రావటాన్నే వారసత్వం అనటానికి లేదు. వీరంతా కేవలం బిజెపి నేతల రాజకీయ వారసులే కాదు, వివిధ పార్టీలో పదవులు అనుభవించిన వారి వారసులు కూడా ఉన్నారు. ఉదాహరణకు బిజెపి అభ్యర్ధిగా ఉన్న మాజీ సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఆయన తండ్రి అమరనాధరెడ్డి కాంగ్రెస్‌లో పదవులు అనుభవించిన వారే. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు నీరజ్‌ మరొకరు. మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి కుమారులు, మనవలు డొల్లుపుచ్చకాయల్లా ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఒక మనవడు సిద్దార్దనాద్‌ సింగ్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ బిజెపి ఎన్నికల పర్యవేక్షకుడిగా ఉన్నారు. తండ్రి అమిత్‌ షా కేంద్ర మంత్రిగా ఉన్న కారణం తప్ప అసలు క్రికెట్‌ ఆడకుండానే బిసిసిఐ కార్యదర్శిగా జరు షా ఎన్నికకాలేదా అని ఆమ్‌ ఆద్మీ నేత సంజరు సింగ్‌ ప్రశ్నించారు. దేశంలో కుటుంబవారసత్వ రాజకీయాలంటే నెహ్రూ కుటుంబాన్నే ముందు చెబుతారు.ఇప్పుడు అనేక కుటుంబాలు రంగంలోకి వచ్చాయి.ఐదు సంవత్సరాల క్రితం ప్రింట్‌ అనే పత్రిక అలాంటి 34 కుటుంబాలను గుర్తించింది.ఇరవై రాష్ట్రాలలో వీరు ఉన్నట్లు పేర్కొన్నది. కనీసం ముగ్గురు కుటుంబ సభ్యులు రాజకీయాల్లో వున్నవారిని పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటాయి.


కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకమని, తమ నేత తమ కుటుంబ సభ్యులను ఎవరినైనా రాజకీయాల్లోకి తీసుకు వచ్చారా చూడండని బిజెపి నేతలు అడ్డుసవాళ్లు విసురుతారు.దేశం కోసం-ధర్మం కోసం కట్టుకున్న భార్యను భారతీయ సంప్రదాయం ప్రకారం వదలి పెట్టకూడదు.రాజ్యాంగం ప్రకారం విడాకులు ఇవ్వకుండా, పట్టించుకోకుండా భార్యను వదలి పెట్టటం చట్ట విరుద్దం.నరేంద్రమోడీకి తనదంటూ కుటుంబం లేకపోవచ్చు గానీ, కుటుంబవారసులను రంగంలోకి తెస్తుంటే ఎందుకు అనుమతిస్తున్నట్లు ? అభ్యర్ధుల జాబితాల్లో నేర చరిత్ర ఉన్నవారు, కోటీశ్వరులు రోజు రోజుకూ పెరుగుతున్నారు. అలాంటి వారు లేకపోతే నరేంద్రమోడీ ఉండరు అన్నది దిగమింగలేని నిజం కనుక. గతంలో బిజెపి నేతలు ఇతర పార్టీల వారినే కుటుంబ వారసత్వం, రాజకీయాల గురించి వేలెత్తి చూపేవారు. ఇప్పుడు బిజెపిలోనే అది ప్రారంభమైంది. కర్ణాటకలో ఎడియూరప్ప తన కుమారుడిని రానున్న రోజుల్లో సిఎం చేసేందుకు చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీకి దిగి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కెఎస్‌ ఈశ్వరప్ప ధ్వజమెత్తారు. ఏ హిందూత్వ పేరుతో బిజెపి రాజకీయం చేస్తున్నదో దాన్నే ముందుకు తెచ్చి పార్టీలో హిందూత్వకోసం పని చేస్తున్న నేతలను ఎడియూరప్ప పక్కన పెడుతున్నారని కూడా విమర్శించారు. బిజెపిలో ఇది ఆరంభం మాత్రమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

క్రైస్తవ సంతుష్టీకరణ-బెదిరింపు : అద్భుతం ! అనితర సాధ్యం !! బిజెపి ఇలాంటి పనులు కూడా చేస్తుందా !

04 Saturday May 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

appeasement politics, BJP, BJP Appeasement, BJP Christian appeasement, Clean church premises, Nagaland BJP, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


నాగాలాండ్‌ ! ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. జనాభా ఇరవైలక్షలకు పైబడి. భాషలెన్నో తెలుసా 17, అక్షరాలా పదిహేడు. ఆంగ్లం అధికార భాష, అత్యధికులు గిరిజనులే, 2011 జనాభా లెక్కల ప్రకారం 87.92 శాతం మంది క్రైస్తవులు,8.75శాతం హిందువులు. ఇప్పుడు ఈ చిన్న రాష్ట్రం గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే….తమ పూర్వీకుడు, జనసంఫ్‌ు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన శ్యామ ప్రసాద ముఖర్జీ జూన్‌ 23న 70వ వర్ధంతిని పురస్కరించుకొని మే 11న రాష్ట్రంలోని చర్చ్‌లను శుభ్రపరచాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బెంజమిన్‌ యప్తోమి తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు.దీని మీద మీ మహత్తర సేవలను వేరే చోట ఉపయోగించాలని నాగాలాండ్‌ బాప్టిస్టు చర్చి కౌన్సిల్‌ సున్నితంగా తిరస్కరించింది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(ఎన్‌డిపిపి) అనే ప్రాంతీయ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి ఉంది. నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన తరువాత క్రైస్తవుల మీద అసాధారణ రీతిలో హింసాకాండ జరుగుతోందని అందువలన బిజెపి అలాంటి మార్గదర్శకాలను జారీ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చర్చి కౌన్సిల్‌ సలహా ఇచ్చింది. రాజకీయ పార్టీలు మతపరమైన అంశాలను తీసుకోరాదని హెచ్చరించింది. నాగాలాండ్‌ క్రిస్టియన్‌ రివైవల్‌ చర్చి కౌన్సిల్‌((ఎన్‌సిఆర్‌సిసి) విడిగా ఒక ప్రకటన చేస్తూ స్వార్ధ ప్రయోజనాలకు పవిత్ర స్థలాలను రాజకీయం చేయవద్దని కోరింది. మన సమాజంలో మౌలిక విలువలైన సహనం,గౌరవం, మత స్వేచ్చలను కాపాడాలని పేర్కొన్నది. నాగాలాండ్‌లో చర్చ్‌లను ఊడ్చే కార్యక్రమం బదులు దేశమంతటా వేధింపులకు గురవుతున్న క్రైస్తవుల రక్షణ గురించి కేంద్రీకరించాలని కౌన్సిల్‌ అధ్యక్షుడు రెవరెండ్‌ ఎన్‌ పాఫినో వ్యాఖ్యానించారు.దేశంలో ఇతర ప్రాంతాల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే నాగాలాండ్‌లో చర్చ్‌లను శుభ్రపరచటం ఏమిటని ప్రశ్నించారు.మొత్తం మీద బిజెపి సంతుష్టీకరణ యత్నం వికటించింది. అది బుద్ది తక్కువ నిర్ణయమని ఆ పార్టీ ఎంఎల్‌ఏ ఇమ్‌కాంగ్‌ ఇంచెన్‌ బహిరంగంగానే వర్ణించారు.అలాంటి నిర్ణయం తీసుకొనే ముందు చర్చి అధికారులతో చర్చించి ఉండాల్సిందన్నారు.ముందస్తు అనుమతి లేకుండా ఇతరుల ప్రాంగణాల్లోకి వెళ్లాలనటం అక్రమ ప్రవేశం కిందకు వస్తుందని విమర్శించారు.చర్చ్‌లన్నీ శుభ్రంగా ఉంటాయి, అయినా ఒక రాజకీయ పార్టీ అలాంటి నిర్ణయాలు చేయకూడదన్నారు. తమ ప్రయత్నాన్ని అపార్ధం చేసుకున్నారని, అయితే తమ పార్టీ ఇచ్చిన పిలుపులో చర్చ్‌లని కాకుండా ప్రార్ధనా స్థలాలను శుభ్రం చేయాలని రాసి ఉండాల్సిందని బిజెపి ప్రతినిధి థామస్‌ మాV్‌ా వివరణ ఇచ్చుకున్నారు. ఏ మతాన్ని కించపరచాలని తాము భావించటం లేదన్నారు. ఇంతకూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జారీ చేసిన మార్గదర్శకాలలో కేవలం చర్చ్‌ ప్రాంగణాలను ఊడ్చటమేనా లేక స్నానాల గదులు, మరుగుదొడ్లను కూడా శుభ్రపరచాలని ఉందా ? చర్చ్‌లను ఊడ్చాలనటం మణిపూర్‌లో చర్చ్‌ల మీద, క్రైస్తవులుగా ఉన్న గిరిజనుల మీద జరిపిన దాడుల నివారణలో విఫలమైన బిజెపి ప్రభుత్వ పాపపరిహారార్ధం తీసుకున్న సంతుష్టీకరణ కార్యక్రమమా ?

అధికారం, ఓట్ల కోసం ఇతర పార్టీలు మైనారిటీలసు సంతుష్టీకరిస్తున్నాయని నిత్యం పారాయణం చేస్తున్న బిజెపి ఒక వైపు ముస్లింల మీద విద్వేషాన్ని వెళ్లగక్కుతూ మరోవైపు వారి మీద క్రైస్తవులను ఉసిగొల్పుతూ సంతుష్టీకరించేందుకు చూస్తున్నది. ప్రధాని మోడీ స్వయంగా చర్చ్‌కు వెళ్లటమే గాక కేరళలో, ఇతర మరికొన్ని చోట్ల బిజెపి పడుతున్న పాట్లు తెలిసిందే. మొత్తంగా చూసినపుడు దాడులతో బెదిరింపులు ఒక వైపు సంతుష్టీకరణ మరోవైపు కనిపిస్తున్నది. బిజెపి నేత సినీ హీరో సురేష్‌ గోపి తన కుమార్తె వివాహం శ్రీ కృష్ణ దేవాలయంలో చేయబోయే రెండు రోజుల ముందు త్రిసూర్‌లోని ఒక చర్చికి భార్య, కుమార్తెతో సహా వెళ్లి వర్జిన్‌ మేరీకి ఐదు సావరిన్ల బంగారు కిరీటాన్ని సమర్పించుకున్నారు. ఇదంతా తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లకోసమే చేశారనే విమర్శలు వచ్చాయి.తాము తప్ప ఇతర పార్టీలు మైనారిటీల సంతుష్టీకరణకు చూస్తున్నాయని ఆరోపించే ఆ పార్టీ హిందువుల సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. క్రైస్తవులు ఆంగ్లేయులు, వారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదని ఆరు సంవత్సరాల క్రితం ముంబై ఉత్తర లోక్‌సభ నియోజకవర్గ బిజెపి ఎంపీ గోపాల్‌ షెట్టి ఆరోపించారు.2019 ఎన్నికలకు ముందు అది వివాదాస్పదం కావటంతో తాను రాజీనామా చేస్తానని సదరు ఎంపీ ముందుకు వచ్చారు. దీని గురించి శివసేన పత్రిక సామ్నా ధ్వజమెత్తింది.ఒడిషాలో ఆస్ట్రేలియన్‌ మిషనరీ గ్రాహమ్‌ స్టెయిన్ను చంపినపుడు అక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జెబి పట్నాయక్‌తో కాంగ్రెస్‌ రాజీనామా చేయించింది.వాటికన్‌ చర్చి నుంచి వత్తిడి రావటం, సోనియా గాంధీ క్రైస్తవురాలు కావటం వల్లనే అలా జరిగిందని హిందూత్వ నేతలు విమర్శించారు. ఇప్పుడు ఏమైంది ? సోనియా గాంధీ అధికారంలో లేరు, వాటికన్‌ నుంచి వత్తిడి వచ్చే అవకాశమూ లేదు, గోపాల్‌ షెట్టిని ఒక నేరస్తుడిగా ఎందుకు చూస్తున్నారని, ఇదంతా రాజకీయం,2019 ఎన్నికలకు ముందు క్రైస్తవులను సంతుష్టీకరించే ప్రయోగమే అని శివసేన పత్రిక ధ్వజమెత్తింది. పాల్ఘర్‌ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంలో ఓట్ల కోసం ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ ముంబై వాసైలోని చర్చ్‌లు, మిషనరీల చుట్టూ ప్రదక్షిణలు చేశారని,క్రైస్తవ సమాజ దేశభక్తిని ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని శివసేన పేర్కొన్నది.


చర్చ్‌లు, క్రైస్తవులపై పెరుగుతున్న దాడులకు భయపడిన లేదా లొంగిపోయిన కొందరు క్రైస్తవ మతాధికారులు ” ముందు రక్షణకు ప్రాధాన్యత ” అనే పేరుతో బిజెపితో చేతులు కలిపేందుకు పూనుకున్నారు.దానిలో భాగంగానే గతేడాది ఢిల్లీలో క్రిస్‌మస్‌ విందు ఏర్పాటు దానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరు.దానికి అనేక మంది మతాధికారులతో పాటు కేరళలో రుణ, బంగారం వ్యాపారంలో దిట్టలుగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల దాడుల నుంచి తమ విద్యాసంస్థలు, వ్యాపారాల రక్షణకే వారంతా బిజెపికి అనుకూలంగా మారేందుకు సిద్దపడినట్లు వేరే చెప్పనవసరం లేదు. వివిధ పార్టీలలో ఉన్న వాణిజ్య, పారిశ్రామికవేత్తలను తనవైపు తిప్పుకొనేందుకు ఐటి,సిబిఐ, ఇడిలను ప్రయోగిస్తున్న బిజెపి క్రైస్తవ మతాధిపతులు, వారి ప్రభావంలో ఉన్న సామాన్యుల ఓట్ల కోసం మతాధికారుల మీద కూడా ఆ సంస్థలను ప్రయోగించి దారికి తెచ్చుకుంటున్నది. రకరకాల పేర్లతో ఉన్న సంఘపరివార్‌ సంస్థలు, క్రైస్తవ, ఇస్లామిక్‌ సంస్థలకు విదేశాల నుంచి నిధులు అందుతున్న సంగతి తెలిసిందే. క్రైస్తవ, ఇస్లామిక్‌ సంస్థలకు అందే నిధులను ఏదో ఒకసాకుతో నిలిపివేయించి నిర్వాహకులను దారికి తెచ్చుకొనేందుకు చూస్తున్నారు. ఇడి, ఐటి దాడులకు గురైన కేరళలోని బిలీవర్స్‌ ఈస్టరన్‌ చర్చి స్థాపకుడు ఇవాంజలిస్ట్‌ కెపి యోహనన్‌ కేరళ పత్తానం తిట్ట నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ నేత, మాజీ సిఎం ఏకె ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోనికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. వందమంది పాస్టర్లు, ఇతర చర్చినేతలను తిరువళ్ల పట్టణంలో ఒక చోట సమావేశపరిచి మరీ ఈ పని చేశారు. ఒక చర్చి ఒక రాజకీయ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించటం ఇదే ప్రధమం అని అనిల్‌ ఒక ప్రకటనలో సంతోషం వెలిబుచ్చారు. ఈ చర్చికి అనుబంధంగా ఏర్పాటు చేసిన స్వచ్చంద సంస్థలు విదేశాల నుంచి నిధులు పొందుతున్నట్లు ఆరోపించి 2017లో నిధులు పొందకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తరువాత దాని కొనసాగింపుగా చర్చి సంస్థలు, వ్యక్తుల మీద 2020,2022లో ఐటి, ఇడి దాడులు జరిగాయి.విదేశాల నుంచి 2015-16లో రు.2,397 కోట్ల నిధులను పొంది దాన ధర్మాల కోసం వినియోగించాల్సిన వాటిలో వెయ్యి కోట్లు రియలెస్టేట్‌ పెట్టుబడులుగా పెట్టినట్లు వార్తలు వచ్చాయి.కెపి యోహనన్‌ ప్రమేయం ఉన్న గోస్పెల్‌ ఫర్‌ ఆసియా అనే సంస్థ మీద అమెరికాలో నిధుల దుర్వినియోగం కేసు నమోదు కాగా రు.261 కోట్లు చెల్లించి పరిష్కారం చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ పూర్వరంగంలో సదరు చర్చి బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించింది.


దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా కేరళలో 18శాతం క్రైస్తవులు ఉన్నారు.ఆర్థికంగా కూడా బలమైన తరగతి.2014 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నియోజకవర్గంలో బిజెపి నేత ఓ రాజగోపాల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శశి ధరూర్‌పై పదిహేనువేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అక్కడి లాటిన్‌ చర్చి నేతలే తన ఓటమికి కారణమని రాజగోపాల్‌ వాపోయారు. దాంతో క్రైస్తవుల ఓట్లు లేకుండా ముందుకు పోలేమని గ్రహించిన బిజెపి 2019లో చర్చిల చుట్టూ తిరిగినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.శబరిమల దేవాలయంలో మహిళల ప్రవేశాన్ని పెద్ద వివాదంగా మార్చినపుడే బిజెపికి కేరళలో హిందువుల మద్దతు లేదని దానికి వచ్చిన 14.88శాతం ఓట్లు వెల్లడించాయి. తరువాత బిజెపి ఒక సర్వే నిర్వహించి క్రైస్తవ ఓటర్లను ప్రభావితం చేయగలవారెవరు, ఎవరు ఏ సంస్థలను నడుపుతున్నారు, వాటి మంచి చెడ్డలేమిటి అన్న జాబితాను రూపొందించుకొని వారిని తమవైపు తిప్పుకొనేందుకు ఏ అవకాశం దొరుకుతుందా అని బిజెపి చూస్తోంది. ఆక్రమంలో యోహనన్‌ బిజెపి వలకు చిక్కారు. కేరళలో సిరో-మలబార్‌ చర్చి ఒకటి.దానిలో తలెత్తిన వివాదంలో ఒక వర్గం బిజెపికి దగ్గరైంది. అవాస్తవాలు, ముస్లింల పట్ల విద్వేషంతో కూడిన కేరళ స్టోరీ అనే సినిమాను ఎన్నికల ముందు ప్రదర్శించి వారు తమ భక్తిని ప్రదర్శించుకున్నారు. అదే చర్చిలో మరికొందరు అంతే తీవ్రంగా బిజెపిని వ్యతిరేకిస్తున్నారు. బిజెపిని సమర్ధిస్తున్న వారిని ”క్రిసంఘీ” (క్రిస్టియన్‌ + సంఘపరివార్‌) అని పిలుస్తున్నారు. చర్చి నేతలతో సంద్రింపులు జరిపామని తిరువనంతపురం, త్రిసూర్‌,పత్తానంతిట్ట,అట్టింగల్‌ నియోజకవర్గాలలో క్రైస్తవుల మద్దతు కోరినట్లు బిజెపి నేతలు చెప్పినట్లు ఇండియా టుడే పేర్కొన్నది.సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ వికె సక్సేనా కేరళలోని చర్చి అధికారులను కలసి మద్దతును కోరారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమే అని కాంగ్రెస్‌ విమర్శించింది.తిరువనంతపురం సమీపంలోని విఝినం అదానీ రేవు నిర్మాణాన్ని చర్చి తరఫున వ్యతిరేకించినందుకు బిజెపి సర్కార్‌ తమ బాంకు ఖాతాలను స్థంభింప చేసిందని ఏప్రిల్‌ 21న తిరువనంతపురం లాటిన్‌ చర్చి ఆర్చిబిషప్‌ థామస్‌ జె నెట్టో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వికె సక్సేనాను కలిసేందుకు నెట్టో తిరస్కరించారు.సిరో మలంకర, బాసిలోస్‌ మార్తమ్మ మాథ్యూస్‌, కాథలిక్స్‌ ఆఫ్‌ ఈస్ట్‌, మలంకర చర్చినేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ ప్రయత్నాలు బిజెపికి ఎంతమేరకు ఉపయోగపడతాయో చూడాల్సి ఉంది. మొత్తం మీద బిజెపి క్రైస్తవ సంతుష్టీకరణ కొత్త పుంతలు తొక్కుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d