• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Loksabha Elections

నోరు విప్పిన పొగబాంబు దాడి నిందితులు- విభ్రాంతి కలిగిస్తున్న మో-షా మౌనం, అడిగిన వారిని పార్లమెంటు నుంచి గెంటిస్తారా !

15 Friday Dec 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Amit Shah, BJP, LOK SABHA, Narendra Modi Failures, Parliament security breach, PM Narendra Modi’s Silence, smoke canisters, UAPA


ఎం కోటేశ్వరరావు


లోక్‌సభలో 2023 డిసెంబరు పదమూడున జరిపిన పొగబాంబు దాడి నిందితులు అందరూ ఒకే రకమైన సమాధానం చెబుతున్నారు. ఎవరో వారి బ్రెయిన్‌ వాష్‌ చేశారని అలా అనుకుందాం. ఇప్పుడు అది ప్రధానం కాదు. దాడి జరిగిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా నోరు విప్పకపోవటమే అసలైన సమస్య. వారి మౌనం, పార్లమెంటుకు రాని కారణంగా గురు, శుక్రవారాల్లో పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన కానసాగింది. ఈ అంశం గురించి చర్చించాలని కోరగా ప్రభుత్వం నిరాకరించింది. దాంతో సభ్యుల పట్టు కారణంగా పలు అంతరాయాల తరువాత సోమవారానికి వాయిదా పడింది. బయట మాట్లాడుతూ సభకు రాకుండా, మౌనంగా ఉండేట్లు వారి బుద్దులను ఎవరు శుద్ధి చేసినట్లు ? దీన్ని రాజకీయం చేయవద్దని కబుర్లు చెబుతున్నారు. ఎవరూ అలాంటి ఆరోపణలూ ఎవరి మీదా చేయలేదు. బిజెపి నోట రాజకీయం మాట ఎందుకు వచ్చింది ?దాడి గురించి చెప్పమని అడిగితే రాజకీయం అంటారా ? దేశ పౌరులు దేని గురించి ఆందోళన చెందాలి ? అసలేం జరుగుతోంది ? ఏ కథనాన్ని వండి వార్చేందుకు తెరవెనుక బిజెపి పెద్దలు మధనం జరుపుతున్నట్లు ? నిందితులు లోక్‌సభ ప్రేక్షకులుగా ప్రవేశించేందుకు మైసూరు బిజెపి ఎంపీ ప్రతాప్‌ సింహ పాసులు ఇచ్చినట్లు తేలింది. అదే ప్రతిపక్షాలకు చెందిన వారెవరైనా ఇచ్చి ఉంటే ఇక చెప్పాల్సిందేముంది? ఈ పాటికి రచ్చో రచ్చ. పార్టీ,లోక్‌సభ స్పీకర్‌ గానీ సదరు ఎంపీ నుంచి వివరణ కోరినట్లు, పోలీసులు ప్రశ్నించినట్లుగానీ ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. అతగాడిని బయటపడవేసేందుకు, తద్వారా బిజెపి పరువు నిలుపుకొనేందుకు చూస్తున్నారా ? దాడి సందర్భంగా నిందితులు చేశారని చెబుతున్న నినాదాలు నిరంకుశత్వం, నిరుద్యోగం, రైతుల ఆందోళన వంటి అంశాలపై నిజమే అయితే వాటి గురించి దేశంలో మరోసారి చర్చ జరిగితే అది కూడా బిజెపికి రాజకీయంగా దెబ్బే. రానున్న ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది, దాన్నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎవరి మీద నెపం నెట్టి జనం దృష్టిని మళ్లించాలని చూస్తున్నారు ? ఇలా జనంలో పరిపరి ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి. ఈ నెల 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగాల్సి ఉంది.


లోక్‌సభలో పొగబాంబు దాడికి సూత్రధారి అని చెబుతున్న కొలకతాకు చెందిన లలిత్‌ మోహన్‌ ఝా అనే యువకుడిని రాజస్థాన్‌లో పట్టుకున్నట్లు, అతనే లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అతను సామ్యవాది సుభాస్‌ సభ పేరుతో ఒక స్వచ్చంద సంస్థ ఒక శాఖకు అధ్యక్షుడిగా ఉన్నాడని చెబుతున్నారు. దాడి తరువాత లోక్‌సభ వెలుపలి దృశ్యాలను ఫోన్‌ ద్వారా వీడియో తీసి వాట్సాప్‌లో పెట్టినట్లు, ఆ ఫోన్‌తో పాటు దాడిలో పాల్గొన్న నలుగురి ఫోన్లనూ ధ్వంసం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దాడి తరువాత బస్‌లో హర్యానా సరిహద్దు సమీపంలో రాజస్థాన్‌లోని కుచమన్‌ వెళ్లి ఆ రాత్రి అక్కడ ఒక హౌటల్లో ఉండి, గురువారం నాడు ఢిల్లీ వచ్చి పోలీసులకు లొంగినట్లు వార్తలు. దాడి జరిపేందుకు గత కొద్ది నెలలుగా పార్లమెంటు పాసుల కోసం ప్రయత్నించినట్లు చెప్పాడట. తన కోసం అనేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు గ్రహించి తానే వచ్చి లొంగినట్లు, తన ఫోన్‌ ద్వారానే వీడియోలు తీస్తున్నట్లు, దాడి నిందితులైన అమోల్‌, మనోరంజన్‌, సాగర్‌, నీలమ్‌ ఫోన్లను రాజస్తాన్‌లో ధ్వంసం చేసినట్లు ఝా చెప్పాడు.రాజస్థాన్‌కు చెందిన ఝా స్నేహితుడు మహేష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ద కార్యకలాపాల నిరోధ చట్టం(ఉపా) కింద వారిని అరెస్టు చేశారు.వారికి బెయిలు రాదు. నిందితులు రెండు సంస్థల పేర్లతో పాటు ఒకే విధమైన సమాధానాలు చెబుతున్నారని, దొరికితే ఏం చెప్పాలో కూడా వారు ముందుగానే నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఆరుగురు ఫేస్‌బుక్‌లో భగత్‌ సింగ్‌ పేరుతో ఒక గ్రూపుగా చేరినట్లు, రైతుల నిరసన, మణిపూర్‌ ఉదంతాలు, నిరుద్యోగం వంటి అంశాల మీద తాము ఆగ్రహం చెందినట్లు అందుకే తామీపని చేసినట్లు అమోల్‌, మిగతావారు కూడా అలాగే చెప్పారని అంటున్నారు. వీరికి ఎలాంటి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు కనిపించటం లేదని పోలీసులు పేర్కొన్నట్లు పిటిఐ తెలిపింది. దుండగులు లోక్‌సభ లోపల, వెలుపల ఎలాంటి హానికరంగాని పొగబాంబులు పేల్చారు. వారంతా ఢిల్లీ శివార్లలోని హర్యానా గురుగ్రామ్‌కు డిసెంబరు పదిన చేరుకున్నారు.పదమూడవ తేదీన పాసులు తీసుకున్న ఇద్దరు గాలరీ నుంచి సభలోకి దూకి పొగ బాంబులు పేల్చారు. బయట ఉన్న వారు వెలుపల పేల్చారు.లోపల ఎంపీలే వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.2001లో పార్లమెంటు భవనంపై ఉగ్రవాదులు దాడి చేసిన రోజునే వీరు ఎంచుకున్నారు.


దాడి ఉదంతం గురించి ప్రకటన చేసేందుకు ప్రధాని మోడీ సభకు రావాలని, హౌంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ఇలా అనుచితంగా ప్రవర్తించారంటూ గురువారం నాడు లోక్‌సభలో 14 మందిని, రాజ్యసభలో ఒకరిని సస్పెండ్‌ చేశారు.లోక్‌సభలో డిఎంకె ఎంపీ పార్థీవన్‌ అసలు సభకు రాలేదని, చెన్నరులో ఉన్నట్లు గుర్తించి నాలుక కరుచుకొని పేరు తొలగించారు. పార్లమెంటు ప్రాంగణంలో భద్రత లోక్‌సభ కార్యాలయానిదని స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించి ప్రభుత్వానికి సంబంధం లేదనే అభిప్రాయం కలిగించేలా చూశారు. ఉదంతం జరిగింది సభలో అయినా దుండగులు వెలుపలి నుంచి వచ్చారు. పార్లమెంటుకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బంది ఉండరు, కేసు నమోదు వెలుపల జరిగింది గనుక ప్రభుత్వమే జవాబు చెప్పాల్సి ఉంటుంది. భద్రత లోపాలకు కారకులంటూ ఎనిమిది మంది సిబ్బందిని లోక్‌సభ కార్యాలయం సస్పెండ్‌ చేసింది.


విపరీత ప్రవర్తన ఉన్న పిల్లలను, లేదా పెద్ద వారిని వైద్యులకు చూపించాల్సి ఉంటుందని తెలిసిందే. ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీ అనేక అంశాలపై మౌనంగా ఉండటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక జనం జుట్టుపీక్కుంటున్నారు.ప్రతి అంశం మీద ప్రధాని మాట్లాడాల్సిన అవసరం లేదని బిజెపి మద్దతుదారులు సమర్ధిస్తారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది.పార్లమెంటు మీద జరిగిన దాడి గురించి కూడా మాట్లాడకపోవటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ! అసలు జవాబుదారీ తనం ఉన్నట్లేనా ? రెండు వందల మందికి పైగా మరణించి, మరికొన్ని వందల మంది గాయపడి, 70వేల మంది నెలవులు తప్పినా మణిపూర్‌ రాష్ట్రాన్ని సందర్శించేందుకు మే మూడవ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రధాని వెళ్లలేదు. ఇద్దరు మహిళలను వివస్త్రలను గావించి తిప్పినట్లు వీడియోలు వెల్లడైన తరువాత మూడు నెలలకు మొక్కుబడిగా స్పందించారు. అందుకే అహమ్మదాబాద్‌లో క్రికెట్‌ మాచ్‌ చూడటానికి, ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌ గురించి పట్టించుకోవటానికి తీరిక ఉంటుంది గానీ మణిపూర్‌ వెళ్లటానికి ప్రధాని కుదరలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మిజోరం వెళ్లి ప్రచారం చేసేందుకు ధైర్యం చేయలేకపోయారు. పక్కనే ఉన్న రాష్ట్రం తగులబడితే చూడటానికి రాలేదుగానీ తగుదునమ్మా ఓట్ల కోసం వచ్చారా అనే విమర్శకు భయపడే అలా చేశారన్నది స్పష్టం.వ్యక్తిగతంగా తనకు, బిజెపికి ఇబ్బంది వచ్చినపుడు మౌనంగా ఉండటం, తరువాత అవకాశం వచ్చినపుడు పార్టీలో తన ప్రత్యర్ధులు, వెలుపల రాజకీయ వ్యతిరేకుల మీద దాడి చేయటం నరేంద్రమోడీ నైజంగా కనిపిస్తున్నది. గుజరాత్‌ బిజెపి కుమ్ములాటలు, అధికార దెబ్బలాటల్లో జరిగింది అదే. చివరికి గురువు వంటి అద్వానీకే ఏ గతి పట్టించిందీ చూశాము. అందువలన మోడీ మౌనం బలహీనత కాదు, ప్రమాదకరమైన ఆయుధం అని గ్రహించాలి. కౌటిల్యుడి ఎత్తుగడలు తప్ప మరొకటి కాదు.ఇలాంటి వైఖరితో ఎంతకాలం ముందుకు పోతారు, ఏమి సాధిస్తారు అన్నది ప్రశ్న. గణితంలో రెండు రెళ్లు ఎక్కడైనా నాలుగే, కానీ రాజకీయాల్లో కాదు.


అధికారం ఉన్నపుడు ఎవరినైనా ఇంద్రుడు, చంద్రుడు అని పొగడటం సహజం. దానిలో భాగంగానే ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంకర్‌ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ గతశతాబ్దిలో మహాత్మా గాంధీ మహాపురుషుడైతే, వర్తమానంలో నరేంద్రమోడీ యుగపురుషుడంటూ కీర్తించారు. దీన్నే నక్కకూ నాగలోకానికి పోలిక పెట్టటం అంటారు. అహింస, సత్యవాదిగా బ్రిటీష్‌ వారి బానిసత్వం నుంచి మనల్ని మహాత్మాగాంధీ విముక్తి చేస్తే నరేంద్రమోడీ దేశాన్ని ప్రగతిబాట పట్టించారని అన్నారు. ముఖస్తుతికీ ఒక హద్దు ఉంటుందని ఇద్దరికీ పోలిక పెట్టటంతో దానిని కూడా చెరిపివేశారని, ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తులకు తగనిపని, సిగ్గుచేటు అని కాంగ్రెస్‌ విమర్శించింది. వర్తమాన రాజకీయాల్లో జయాపజయాలు కొన్ని మినహాయింపులతో అధికారపక్షం చేసే తప్పిదాలే ప్రతిపక్షాలకు అవకాశాలు కల్పిస్తున్నాయి తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్‌ హయాంలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న కారణంగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఏం చేసినా జనం మరొక మార్గం లేక ఆ పార్టీనే గెలిపించారు. దాని వైఫల్యాలు, ప్రజావ్యతిరేక చర్యలే వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించటానికి, బిజెపికి అవకాశాలు రావటానికి దోహదం చేశాయి. ఇటీవల ఎన్నికలు జరిగిన రాజస్థాన్‌, చత్తీస్‌ఘర్‌, మధ్య ప్రదేశ్‌లో బిజెపి గెలవటానికి రెండు చోట్ల పాలకపార్టీగా వైఫల్యం, మూడు చోట్లా కూడా తానే గెలవగలననే అతి విశ్వాసంతో బిజెపిని వ్యతిరేకించే ఇతర పార్టీలను కూడగట్టుకోలేని కాంగ్రెస్‌ రాజకీయ తప్పిదం, బిజెపికి పోటీగా మృదు హిందూత్వతో జనాలకు దగ్గరకావాలనే దగ్గరదారిని ఎంచుకోవటం తప్ప మరొకటి కాదు. రెండు పార్టీల మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉంది. అంతకు ముందు కర్ణాటక, హిమచల్‌ ప్రదేశ్‌లో బిజెపి అధికారాన్ని పోగొట్టుకుంది. అక్కడ యుగపురుషుడు, విశ్వగురువు మంత్రదండం పనిచేయలేదు.


మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను బిజెపి మౌనమునిగా ఎద్దేవా చేసింది. సోనియా గాంధీకి ఆగ్రహం వస్తుందేమో అన్న భయంతో నోరు విప్పేవారు కాదని ప్రచారం చేసింది. ఇప్పుడు నరేంద్రమోడీకి అలాంటి భయం లేదు. పార్టీలో తనకు ప్రత్యర్ధులుగా ఉన్నవారిని ఎలా తొక్కిపెట్టారో తెలిసిందే. అలాంటి వ్యక్తి ఎందుకు అనేక అంశాల మీద మౌనం పాటిస్తున్నారు. అదానీ మీద వచ్చిన ఆరోపణల మీద పార్లమెంటు స్థంభించినా మాట్లాడలేదు, ఏడాది పాటు రైతులు ఆందోళన చేసినా వారు ఢిల్లీలో ప్రవేశించటానికి వీల్లేకుండా రోడ్ల మీద మేకులు కొట్టించి కూర్చున్నారు తప్ప నోరు విప్పలేదు.విధిలేక మూడు సాగు చట్టాలను ఉపసంహరిస్తూ క్షమాపణలు చెప్పి తరువాత రైతులు లేవనెత్తిన అంశాల మీద మౌనం దాల్చుతున్నారు. తమ నేత మౌనం గురించి అడిగితే మాటల మనిషి కాదు చేతల మనిషి అని బిజెపి సమర్ధించుకుంటుంది. పార్లమెంటు మీద జరిగిన దాడి గురించి కూడా మాట్లాడని వారి చేతిలో దేశం భద్రంగా ఉంటుందని ఎలా నమ్మాలి. బిజెపి ప్రతిపక్షంగా ఉన్న చోట ప్రభుత్వాలను నిలదీసే నైతిక హక్కు వారికి ఉంటుందా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎడియూరప్పా మజాకా ! కుటుంబవారసత్వంపై నరేంద్ర మోడీ నోటికే తాళం వేసిన ఘటికుడు !!

11 Saturday Nov 2023

Posted by raomk in BJP, BRS, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP

≈ Leave a comment

Tags

B.Y. Vijayendra, BJP, BJP Dynastic Politics, BS Yediyurappa, Karnataka BJP, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఎక్కడైనా ప్రధాని నరేంద్రమోడీ హవా నడుస్తుందేమో గానీ కన్నడ సీమలో చెల్లదని అధికార రాజకీయాల్లో తలపండిన కర్ణాటక మాజీ సిఎం బిఎస్‌ ఎడియూరప్ప తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు తప్ప మాకుటుంబానికి వర్తించవు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా తన కుమారుడి నియామకంలో నరేంద్రమోడీయే అంతిమ నిర్ణయం తీసుకున్నారని కుండబద్దలు కొట్టారు. బిజెపి విలువల వలువలను నడిబజారులో విప్పేశారు. వారసత్వ రాజకీయం అని ఎవరైనా అంటే అనుకోనివ్వండి లెక్క చేయను అన్నారు. కుటుంబ,వారసత్వ రాజకీయాలు, ఒకే కుటుంబానికి పలు పదవులకు వ్యతిరేకం అని సుభాషితాలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ తన మాటలను తానే దిగమింగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎడియూరప్పవేసిన తాళంతో బహుశా ఇంక ఎక్కడా వారసత్వ రాజకీయాల గురించి ఇతర పార్టీల మీద ఎక్కక పోవచ్చు. ఎడియూరప్ప కుమారుడు, తొలిసారి ఎంఎల్‌ఏగా గెలిచిన బివై విజయేంద్రను కర్ణాటక పార్టీ అధ్యక్షుడిగా బిజెపి అధిష్టానం నియమించింది.ఎడియూరప్ప పార్టీ పార్లమెంటరీ బోర్డు పదవిలో ఉన్నారు. మరో కుమారుడు రాఘవేంద్ర లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. కర్ణాటక రాజకీయాల గురించి తెలిసిన వారికి ఎడియూరప్ప కుటుంబం ఒక రాజకీయ సైనిక పటాలం వంటిది. ముగ్గురు కుమార్తెలు, వారి కుటుంబాలు, ఇద్దరు కుమారులు వారి కుటుంబాలు ఎవరు చక్కపెట్టాల్సినవాటిని వారు చేస్తారు. ఇప్పటి వరకు వారి మధ్య ఎలాంటి పేచీలు రాలేదు. గతంలో ఎడియూరప్ప కాబినెట్‌ మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప పదవిలో ఉండగానే గవర్నర్‌కు ఐదు పేజీల లేఖ రాసి సిఎం కుటుంబం ఎలా జోక్యం చేసుకుంటున్నదో వివరించారు. అనేక మంది విధిలేక మౌనంగా ఉన్నారు. ఇవన్నీ అధిష్టానానికి, ప్రత్యేకించి నరేంద్రమోడికి తెలియదు అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. మనం చేస్తే సంసారం మరొక చేస్తే మరొకటి !


తన కుమారుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించటం గురించి ఎడియూరప్ప నాటకాన్ని రక్తి కట్టించారు. బెంగలూరులో శనివారం నాడు విలేకర్లతో మాట్లాడుతూ మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ నియామకం గురించి మేమెవరం ఊహించలేదు. ఒక్కసారి కూడా ఢిల్లీలో ఈ విషయమై ఏ నాయకుడినీ అడగలేదు. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి అని ఒక విలేకరి ప్రశ్నకు చెప్పారు.” అంతిమ నిర్ణయం ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా తీసుకున్నారు, నాకేమీ సంబంధం లేదు.” అన్నారు. వారు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకున్నారు. విజయేంద్రను అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్రమంతటా ఉత్సవాలు జరుపుకుంటున్నారని ఎడియూరప్ప చెప్పారు. బిజెపిలో వారసత్వ రాజకీయాలకు ఈ నియామకం రుజువు అని కాంగ్రెస్‌ చేసిన వ్యాఖ్య గురించి మాట్లాడుతూ వారు అలాంటి ఆరోపణ చేయనివ్వండి పట్టించుకోను అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 28గాను 25 చోట్ల గెలిచేందుకు తాను, విజయేంద్ర విడివిడిగా రాష్ట్రంలో పర్యటిస్తామని చెప్పారు. తన కుమారుడి నియామకం పట్ల పార్టీలో నేతలెవరూ అసంతృప్తిని వెల్లడించలేదని, అందరూ ఐక్యంగా స్వాగతించారని, ఎవరూ పార్టీని వీడకుండా తాము చూస్తామని, గతంలో వెళ్లిన వారిని కూడా వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ఎడియూరప్ప చెప్పారు.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తిన్న బిజెపి ఆరునెలలుగా దిక్కుతోచని స్థితిలో పడింది. ఎంతగా మైండ్‌బ్లాక్‌ (మెదడు పని చేయకపోవటం) లేదా బ్లాంక్‌ (మెదడు ఖాళీ కావటం) అయిందంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకోలేకపోయింది. ప్రతిపక్ష నేత లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న ఏకైక లక్ష్యంతో బిజెపి ఉంది. కుటుంబ పార్టీ అంటూ గతంలో తెలుగుదేశాన్ని, తెలంగాణాలో బిఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న ఆ పార్టీ కర్ణాటకలో కుటుంబ పార్టీగా ఉన్న జెడిఎస్‌ను తన మిత్రపక్షంగా చేర్చుకుంది. కాంగ్రెస్‌ను కుటుంబవారసత్వ పార్టీ అని ధ్వజమెత్తుతున్న అదే పార్టీ ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా ఎడియూరప్ప కుమారుడిని పదవికి ఎంపిక చేసింది. కర్ణాటక శాఖను ఒక కుటుంబ పార్టీగా మార్చివేసింది. ఎడియూరప్ప గాలి తీసి పక్కన పెట్టాం గనుక లింగాయత్‌ సామాజిక తరగతి దూరం కావటంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం జరిగిందన్న వాదనను పార్టీ గుర్తించినట్లుంది. తిరిగి వారి మద్దతు పొందాలంటే మరోదారి లేదని భావించి ఆ పెద్దమనిషి కుటుంబ వారసుడినే అధ్యక్షుడిగా నియమించింది. ఎంతవారలైనా అధికార కాంతదాసులే, నరేంద్రమోడీ ఆ కోవకు చెందిన వ్యక్తే గనుక చేసేదేముంది, సరే అనక తప్పలేదు. దీంతో పార్టీలో ఇప్పుడు ఎడియూరప్ప వ్యతిరేకులు ఏం చేస్తారన్నది ఆసక్తికరం.కాళ్లబేరానికి వస్తారా ? తిరుగుబాటు చేస్తారా ? తన కుమారుడి నియామకానికి నరేంద్రమోడీ అంతిమ నిర్ణయం తీసుకున్నారని ఎడియూరప్ప చెప్పిన తరువాత దాన్ని ధిక్కరించే సాహసం బిజెపిలో ఎవరికైనా ఉందా అంటే సందేహమే. అవమానాలను దిగమింగి లోలోపల కుములుతూ పార్టీలోనే ఉండాలి లేదా వెళ్లిపోవాలి. పార్టీ పదవి పంచాయతీ తేలింది, ఓట్ల రాజకీయం గనుక వెంటనే శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకుంటారు, లింగాయత్‌ కాని వారే అవుతారు.


కర్ణాటక రాజకీయాల్లో అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలిపే పక్కా అవకాశవాద పార్టీగా జెడిఎస్‌ పేరు తెచ్చుకుంది.గతంలో దాని మద్దతుదారులుగా ఉన్న అనేక మంది కాంగ్రెస్‌వైపు మొగ్గటంతో 2023 మే నెలలో జరిగిన ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నది. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు దారులు మూసుకుపోవటంతో మరోసారి బిజెపి తలుపుతట్టింది.రాష్ట్రంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే లింగాయత్‌, ఒక్కళిగ సామాజిక తరగతులు కలిస్తే తిరుగుండదు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తామనే బిజెపి అంచనా దీని వెనుక ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌ల ప్రభావం ఉందని చెబుతున్న 69చోట్ల బిజెపి 20, కాంగ్రెస్‌ 40 గెలుచుకుంది. ఒక్కళిగలు ప్రభావం చూపే 64 చోట్ల ఆ సామాజిక తరగతి పార్టీగా ఉన్న జెడిఎస్‌ 14స్థానాలతో సరిపెట్టుకుంది. జెడిఎస్‌ను సంతుష్టీకరించేందుకు మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి మద్దతుతో స్వతంత్రురాలిగా గెలిచిన సినీనటి సుమలతను అక్కడి నుంచి తప్పుకోవాలని, కావాలంటే ప్రస్తుత సభ్యుడు డివి సదానంద గౌడ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు గనుక బెంగలూరు ఉత్తరం నుంచి అవకాశం కల్పిస్తామని బిజెపి చెప్పినట్లు వార్తలు. స్వచ్చందంగా లేదా ఇతర కారణాలతో పోటీకి దూరంగా ఉన్నామని ప్రకటనలు చేయించటం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో మరో ఎనిమిది నుంచి పదమూడు మంది ఎంపీలను కూడా ఇంటికి పంపాలని నిర్ణయించినట్లు లీకులు వదిలారు.ఇలా చేస్తే బిజెపి గెలుస్తుందా అంటే చెప్పలేము. అసెంబ్లీ ఎన్నికల్లో 75 మంది కొత్తవారికి సీట్లిస్తే 14 మందే గెలిచారు. ఇరవై నాలుగు మంది ఎంఎల్‌ఏలను పక్కన పెడితే పది స్థానాల్లో మాత్రమే పార్టీ గెలిచింది.


పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోకపోతే బెలగావిలో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని బిజెపి ఎంఎల్‌ఏలు కేంద్ర నాయకత్వానికి ఈనెల మొదటి వారంలో అల్టిమేటం జారీ చేశారు. ఏ పార్టీకైనా ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు.అధికారపక్షం కాంగ్రెస్‌ చేసే విమర్శలతో మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావటం లేదని వాపోయారు. ఆరునెలలకు పైగా శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేని స్థితి గతంలో ఎన్నడూ లేదని కాంగ్రెస్‌ నేత గుండూరావు అన్నారు. మే పదవ తేదీన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌కు 135, బిజెపికి 66, జెడిఎస్‌కు 19 సీట్లు వచ్చాయి.వచ్చే శుక్రవారం నాడు శాసనసభా పక్ష నేతను నియమిస్తామని బివై విజయేంద్ర విలేకర్లతో చెప్పారు. జెడిఎస్‌తో కూటమి గురించి కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతలతో సంప్రదించలేదని సదానంద గౌడ బహిరంగంగా చెప్పారు. ఆ తరువాత గౌడను ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. ఆ తరువాతే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయటం లేదని ప్రకటించటం గమనార్హం. రాష్ట్రంలో కరవు పరిస్థితి గురించి అధ్యయన కమిటి హసన్‌ పట్టణానికి వచ్చింది. ఆ సందర్భంగా హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గౌడ అసందర్భంగా పోటీలో ఉండనని ప్రకటించారు. అంతకు ముందు అక్టోబరు ఏడవ తేదీన విలేకర్లతో మాట్లాడుతూ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేకపోవటం పార్టీలో సంకటస్థితిని సృష్టించిందని,జెడిఎస్‌తో పొత్తు పట్ల తాను సంతోషంగా లేనని, రాష్ట్రనేతలతో నిమిత్తం లేకుండా చేశారని, తాము దీని గురించి కనీసంగా చర్చించలేదన్నారు. పార్టీ జాతీయ ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించేందుకు చేసి ఉండవచ్చు అన్నారు. ఆ తరువాత అక్టోబరు 25వ తేదీన ఢిల్లీ వచ్చి అలా ఎందుకు మాట్లాడారో సంజాయిషీ ఇవ్వాలని అధిష్టానం కోరింది. బిజెపిలో జరిగిన పరిణామాల గురించి మాజీ సిఎం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన లింగాయత్‌ నేత జగదీష్‌ షెట్టార్‌ మాట్లాడుతూ పర్యవసానాలను త్వరలోనే చూస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఆరునెలల పాటు పార్టీ, శాసనసభా పక్ష నేతలను ఎంపిక చేయలేకపోవటంతో ఎప్పుడు చేస్తారని బిజెపి కార్యకర్తలందరూ ప్రశ్నించారు, ఎట్టకేలకు నేతను ఎంపిక చేశారు, ఆగండి పర్యవసానాలను త్వరలోనే చూస్తారు అని షెట్టార్‌ అన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆకలో రామచంద్రా తప్ప అచ్చేదిన్‌ జాడలేదు – మరో ఐదేండ్లు ఉచిత బియ్యం పధక అర్ధమిదేనా ?

10 Friday Nov 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, Health, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Prices, Women

≈ Leave a comment

Tags

BJP, Free Ration Scheme, Hunger India, India Hunger Index, Narendra Modi Failures, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పధకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చత్తీస్‌ఘర్‌ ఎన్నికల సభలో ప్రకటించారు. గతేడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికలపుడు ప్రకటించి ఏడాది పొడిగింపు డిసెంబరు వరకు ఉంది. కానీ మోడీ కోయిల ముందే కూసింది అంటే ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల గానమే ! వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలు కూడా ఎంతో దూరం లేనందున అప్పుడు కూడా దీని గురించి ఊదరగొడతారని వేరే చెప్పనవసరం లేదు. ఈ పధకం ఖజానా మీద మరింత భారం మోపుతుందని కొందరు అంటున్నారు. కొత్తగా పడేదేమీ లేదన్నది మరొక వాదన.ఏది ఏమైనా పేదలకు మేలు చేస్తుంది. ఉచిత పధకాల వలన రాష్ట్రాలు దివాలా తీస్తాయని నరేంద్రమోడీ కర్ణాటక ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఉచిత ఆహార భారాన్ని భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడదా ? చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదంటే ఎక్కడో తేడా కొడుతోందని మోడీ గ్రహించారనుకోవాలి. పౌరులు గౌరవ ప్రదమైన, ఆరోగ్యకర జీవనం గడపాలంటే తగినంత ఆహారం, పోషకాలు అవసరం. వాటిని హక్కుగా పరిగణిస్తూ 2013 జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా గ్రామాలలో 75శాతం, పట్టణాలలో 50శాతం మంది అర్హులని పేర్కొన్నారు. కొత్తగా నరేంద్రమోడీ సర్కార్‌ దేశంలో ఎక్కడైనా రేషన్‌ పొందేందుకు వీలుగా కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. బహుశా దేశ భద్రతకు సంబంధించిన రహస్యంగా భావించి లేదా పరువు పోతుందని సిగ్గుపడిగానీ ఉచిత పధకాన్ని పొడిగించటానికి కారణం ఏమిటో ప్రధాని చెప్పలేదు అనుకోవాలి. ఒకవైపు ఆహార భద్రతకు తూట్లు పొడిచేందుకు మోడీ మంత్రాంగంలో భాగమైన నీతి ఆయోగ్‌ చూస్తుంటే మరోవైపు ఓట్లకోసం పడుతున్న పాట్లు ! అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు !


మోడీ కేంద్రంలో అధికారానికి వచ్చినపుడు ఆకలి సూచికలో దేశం 120కిగాను 99వ స్థానంలో ఉంది.అది 2022లో 121దేశాల్లో 107కు, 2023లో 125దేశాల్లో 111కు దిగజారింది. ఈ సూచికలను గత పదేండ్లలో ఏనాడూ కేంద్ర ప్రభుత్వం, బిజెపి అంగీకరించలేదు, తప్పుల తడక అని చెప్పటం తప్ప ఆకలి గురించి మాట్లాడదు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పధకాన్ని మరో ఐదేండ్లు పొడిగించటం అంటే పదేండ్ల నాడు చెప్పిన అచ్చేదిన్‌ (మంచి రోజులు) రాలేదని, జనం చచ్చే ఆకలితో ఉన్నారని, పరిస్థితి దిగజారుతున్నది వాస్తవమేనని అంగీకరించటం కాదా ! నిర్దిష్టమైన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించలేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఇతర అంచనాల ప్రకారం పదేండ్ల అమలు తరువాత కుర్రవాళ్లలో 40శాతం మందికి తగినంత ఆహారం లేదు. మూడోవంతు మంది దేశ జనాభా పోషకార లేమితో ఉన్నారు. మనకు రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయి. తగినంత ఆహారం లేక గిడసబారి పోయిన, బానకడుపుల వారు ఒకవైపు, ఉన్న డబ్బుతో విచ్చలవిడిగా తిని పెంచుకున్న ఊబకాయాలతో కార్పొరేట్‌ ఆసుపత్రులను పోషిస్తున్న వారిని మరోవైపు చూడవచ్చు.


తగినంత ఆహారం, పోషకపదార్ధాలు అందుబాటులో లేని కారణంగా దేశంలో ఉన్న ఆడా మగా రక్తహీనతతో ఉన్నారు.ఆహార భద్రతా పధకం ఈ సమస్యను పరిష్కరించటంలో విఫలమైంది. మరోవైపున నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వానికి, బిజెపి పాలిత రాష్ట్రాల పాలకులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసిన సంస్థ ఆరోగ్య భారతి. దేశంలో ” ఉన్నతమైన తెలివితేటలతో అందమైన, పొడవైన ” పిల్లలను పుట్టించేందుకు గర్భవిజ్ఞాన అనుసంధాన కేంద్రం పేరుతో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తలిదండ్రులు నల్లగా ఉన్నా, తెలివితేటలు పెద్దగా లేనివారైనప్పటికీ పురాతన భారత విజ్ఞానంతో పైన పేర్కొన్న లక్షణాలతో పిల్లలను పుట్టించేందుకు సంస్థ నిపుణులు పని చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నది. తరుణ్‌ విజరు అనే బిజెపి నేత నల్లవారితో కలసి సామరస్యపూర్వకంగా జీవిస్తున్నట్లు చేసిన ప్రకటన గురించి తెలిసిందే. ఇదే ఆరోగ్యభారతి మేథావులు ఆకలితో వచ్చే అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని ఎందుకు చూపలేకపోతున్నారు. ప్రాచీన విజ్ఞానం, వేదాల్లో ఉన్నాయంటున్న పరిష్కార మార్గాలను వెలికి తీసి పైసా ఖర్చు లేకుండా లోపాలను సరి చేయవచ్చు కదా !


కరోనా కాలం నుంచి 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు ఇస్తున్నట్లు, రెండు లక్షల కోట్ల రూపాయలను అందుకు ఖర్చు చేస్తున్నట్లు బిజెపి పెద్దలు విజయగాధలను గానం చేస్తుంటారు. వారి జేబుల్లోంచి తీసి ఖర్చు చేయటం లేదు. దేశంలో ఆకలి ఇవాళ కొత్తగా ప్రారంభం కాలేదు.యుపిఏ పాలనకు ముందు అధికారంలో ఉన్న బిజెపి వాజ్‌పాయి సర్కార్‌ ఆహార భద్రతా పధకం గురించి ఎలాంటి ఆలోచనా చేయలేదు. సిఎంగా ఉన్న నరేంద్రమోడీ ఎన్నడూ అలాంటి ప్రతిపాదన కూడా చేసినట్లు తెలియదు. ఇక 80 కోట్ల సంఖ్య ఎలా వచ్చిందంటే గ్రామాల్లో 75శాతం, పట్టణాల్లో 50శాతం లెక్కన 67శాతం మందికి ఆహార భద్రత కల్పించాలని 2013 చట్ట చెప్పింది. అప్పటికి ఉన్న జనాభా 122 కోట్లు వారిలో 67శాతం అంటే 81.74 కోట్లు. ఇప్పుడు 142 కోట్లకు చేరింది, అంటే ఇవ్వాల్సింది 95.14 కోట్ల మందికి. పదిహేను కోట్ల మందికి మొండిచేయి చూపుతున్నారు. మరోవైపు ఆరోగ్య సూచికలేవీ మెరుగుపడిన దాఖలా లేదు. అందువలన ఆహార భద్రత, పోషకాహార పధకాలను సవరిస్తే తప్ప దీనివలన ఎలాంటి ప్రయోజనం లేదని అనేక మంది చెబుతున్నారు. అది వాస్తవం కాదని చెప్పేందుకు ప్రభుత్వం ఎలాంటి సర్వేలను నిర్వహించలేదు.దేశంలో ఆహార సబ్సిడీ కేటాయింపులు తగ్గుతున్నాయి. 2020-21లో కేంద్ర ప్రభుత్వం రు.5.41లక్షల కోట్లు ఖర్చు చేసింది.(2016 నుంచి ఎఫ్‌సిఐ తీసుకున్న అప్పులను ఒక్కసారే కేంద్ర ప్రభుత్వం తీర్చిన కారణంగా ఒక ఏడాదిలో ఇంతగా పెరిగింది) 2021-22లో వాస్తవ ఖర్చు రు.3,06,571 కోట్లు, 2022-23లో సవరించిన అంచనా రు.2,96,523, 2023-24లో ప్రతిపాదించిన మొత్తం రు.2,05,765 కోట్లు. యుపిఏ చివరి సంవత్సరం నుంచి నరేంద్రమోడీ తొలి ఆరు సంవత్సరాలలో ఆహార సబ్సిడీ మొత్తం లక్ష కోట్లకు అటూ ఇటూగా ఉంది. కరోనా లేకున్నా ఇప్పుడు కొనసాగిస్తున్న ఆహార ధాన్యాల ఉచిత పధకం గురించి అంతకు ముందు మోడీకి ఎందుకు తట్టలేదు. తన ఏలుబడిలో పరిస్థితి ఆకస్మికంగా దిగజారిందా ? గతంలో ఏ ప్రభుత్వం చేయలేనంతగా దేశ జిడిపిని పెంచినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కాసేపు అంగీకరిద్దాం, దానికి అనుగుణంగా ఆహార సబ్సిడీ పెంచకపోగా తగ్గించారు.


2014-15లో ఆహార సబ్సిడీ కేటాయింపు జిడిపిలో 0.9శాతం, తరువాత 2019-20 నాటికి 0.5శాతానికి కోత పెట్టారు. కరోనా కాలంలో పాత బకాయిల చెల్లింపుతో 2.7శాతానికి పెరిగింది, క్రమంగా దిగజార్చుతూ 2023-24లో దాన్ని 0.7శాతానికి తగ్గించారు. ఇదేదో ఏదో అలా జరిగిపోయిందని చెప్పినట్లుగా సంభవించింది కాదు.పౌర పంపిణీ వ్యవస్థ(పిడిఎస్‌)ను ప్రైవేటీకరించాలని, ఉచిత ఆహార లబ్దిదారులను, సబ్సిడీలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌ చేసిన సూచనలు తెలిసిందే. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ వేసిన బాటలో నడుస్తున్న రాజు కనుసన్నలలోనే సిబ్బంది పని చేస్తారు.ఆహార భద్రత పధకం కింద లబ్దిదారులను స్థంభింప చేశారని, అదనంగా అవసరమైన వారికి ఇవ్వటం లేదంటూ దాఖలైన పిటీషన్‌ మీద లబ్దిదారులను పెంచాలని సుప్రీం కోర్టు 2021 జూన్‌ 29న చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.( ఎనభై కోట్ల సంఖ్య 2011 జనాభాప్రాతిపదిక అని ముందే చెప్పుకున్నాం.) దాంతో అదే ఏడాది సెప్టెంబరులో పిటీషనర్ల తరఫు లాయర్‌ ప్రశాంత భూషణ్‌ సంబంధిత కేంద్ర మంత్రికి నోటీసు పంపారు. అయినా చలనం లేకపోవటంతో 2022జనవరిలో కోర్టు సూచనలను అమలు జరపాలంటూ మరోపిటీషన్‌ దాఖలు చేశారు.దాంతో విధిలేక కొత్త జనాభా లెక్కలను సేకరించిన తరువాతనే విస్తరణ సాధ్యమని, సమీప భవిష్యత్‌లో విస్తరించే పధకాలేవీ లేవని కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఏదో ఒక మార్గాన్ని చూడాలని కోర్టు కేంద్రానికి చెప్పింది. అయినా ఇంతవరకు చేసిందేమీ లేదు.


జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరుగుతుందో తెలియని స్థితి. అప్పటి వరకు కోట్లాది మంది ఆకలితో మాడాలన్నమాట. కేంద్రం తన వాదనకు మద్దతుగా సమర్పించిన అఫిడవిట్‌లో కొన్ని నీతి ఆయోగ్‌ అభిప్రాయాలను పొందుపరచింది. మూడింట రెండువంతుల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందచేతకు ఉన్న అవకాశాలు, అవసరమా అన్న అంశాలను పరిశీలించాలని ఆ సంస్థ పేర్కొన్నది. అంతేకాదు ఆహార ధాన్యాల సేకరణ, పధకాల పంపిణీకి ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకొనే విధంగా ప్రైవేటు,కార్పొరేట్‌ సంస్థలకు బాధ్యతలను అప్పగించాలని కూడా సూచించింది. అంతకంటే దారుణం ఏమంటే సుప్రీం కోర్టు సూచించింది తప్ప ఆదేశాలు జారీ చేయలేదని, ఆహార భద్రత పధకం వర్తింప చేసేందుకు జనాభా అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో చేసిన చట్టంలో లేదని అందువలన కోర్టు మార్గదర్శనం చట్టంలోని సెక్షన్‌ 9కి విరుద్దమని కూడా నీతి ఆయోగ్‌ 2022 ఆగస్టు 31న జరిపిన సమీక్షా సమావేశంలో ఒక వాదనను కేంద్రానికి అందించింది. అయితే ఈ అంశాలను ప్రభుత్వం కోర్టు ముందు సమర్పించలేదు. నిబంధనల సాకుతో అర్హులైన వారికి ఆహార హక్కు లేకుండా మాడ్చి చంపాలని చట్టం చెప్పిందా ? ఆ తరువాత అంటే అదే ఏడాది సెప్టెంబరులో నీతి ఆయోగ్‌ మేథావులు కొత్త వాదనను ముందుకు తెచ్చారు. ఆహార భద్రత పధక చట్టం అమలు జరిపిన ఎనిమిదేళ్ల కాలంలో జనాభా తలసరి ఆదాయం 33.4శాతం పెరిగిందని, అందువలన జనమంతా 2013-14లో ఉన్న మాదిరి ఉండరు గనుక పెరిగిన తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నీతి ఆయోగ్‌ పెద్దలు వాదించారు. ఇది అసంబద్దమైన వాదన. అంబానీ, అదానీల సంపదను, అడుక్కొనేవారి ఆదాయాన్ని సరాసరి కట్టే లెక్కలవి.


ఆహార సబ్సిడీ అనేది అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకు ఇచ్చేది. ఎఫ్‌సిఐ లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వ విధానాల మేరకు వినియోగదారులకు అందచేస్తాయి. వాటిలో ధరకు విక్రయించేవి, ఉచితంగా అందచేసేవీ ఉంటాయి. ఈ లావాదేవీల్లో వచ్చే తేడా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది.గతంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న దారిద్య్రాన్ని బట్టి ఏ రాష్ట్రానికి ఎంత ఆహారం కేటాయించేదీ నిర్ణయించేవారు. 2017-18 నుంచి దారిద్య్ర సర్వే, కొత్త కార్డులు ఇవ్వటం నిలిపివేశారు. రాష్ట్రాలు జారీ చేస్తే అందుకయ్యే ఖర్చును అవే భరించాల్సి ఉంటుంది. ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి ఎవరు ఎక్కడైనా రేషన్‌ తీసుకోవచ్చని ఒకే కార్డు పద్దతిని ముందుకు తెచ్చారు. మన దేశంలో దారిద్య్రరేఖ నిర్వచనంలో అనేక లోపాలు ఉన్నాయి. ఒక నిర్దిష్టత లేనికారణంగా ఎవరికి తోచిన అంచనాను ఆయా కమిటీలు ఇచ్చాయి. ప్రపంచ బాంకు అంతర్జాతీయ దారిద్య్ర రేఖను రూపొందించింది. దాని ప్రకారం 2011లో రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చే వారు దారిద్య్ర రేఖకు దిగువన(దుర్భరదారిద్య్రంలో) ఉన్నట్లు. దాన్ని 2017 ధరల ప్రకారం 2022 సెప్టెంబరులో 2.15 డాలర్లకు పెంచింది. ప్రస్తుతం డాలరుకు 83 రూపాయలు ఉంది కనుక నెలకు రు.5.353 కంటే తక్కువ ఆదాయం వచ్చిన వారు దుర్భరదారిద్య్రంలో ఉన్నట్లు. కానీ మన ప్రభుత్వం పట్టణాల్లో నెలకు రు.1,260, గ్రామాల్లో రు.1,059గా గీత గీసింది.ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం తన రేఖను నిర్ణయించుకోవచ్చు.వాటిని చూపి దారిద్య్రాన్ని తగ్గించినట్లు చెప్పుకోవచ్చు. ప్రపంచ బాంకు తాజాగా రూపొందించిన మూడు ప్రమాణాల ప్రకారం డాలర్లలో రాబడితో వివిధ దేశాలలో దారిద్య్రం ఎలా ఉందో, ఉంటుందో పేర్కొన్నది.దాని ప్రకారం భారత్‌, చైనాల పరిస్థితి దిగువ విధంగా ఉంది. రాబడి గీతను బట్టిి ఎంత మంది దారిద్య్రంలో ఉన్నారో ఈ పట్టిక సూచిస్తుంది. ఉదాహరణకు రోజుకు 2.15 డాలర్లకంటే తక్కువ ఆదాయం వచ్చే వారు ఆఫ్రికాలోని కాంగో డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌లో 69.9శాతం ఉన్నారు, అంటే వారంతా దుర్భరదారిద్య్రంలో ఉన్నట్లు లెక్క.
దేశం ×× 2.15 ×× 3.65 ×× 6.85
భారత్‌ ×× 11.9 ×× 46.5 ×× 83
చైనా ×× 0.10 ×× 2.00 ×× 24.7
పై అంకెల అర్ధం ఏమంటే చైనా గనుక దారిద్య్ర రేఖను రోజుకు 6.85 డాలర్లుగా నిర్ణయిస్తే అక్కడ 24.7శాతం మంది, అదే మనదేశంలో అయితే 83శాతం మంది దారిద్య్రంలో ఉన్నట్లు భావించాలి. 2.15 డాలర్లంటే చైనాలో దారిద్య్రం లేనట్లే. అందువలన మన పాలకులు దారిద్య్ర రేఖను ఎంతగా నిర్ణయిస్తారో, ఏ దేశంతో పోల్చుకుంటారో చూడాలి. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుకాకుండా చైనాను త్వరలో అధిగమిస్తామని చెబుతున్నారు గనుక దానితో పోల్చుతారా ?


ప్రపంచ ఆకలి సూచికను తయారు చేస్తున్న వారు పిల్లల్లో గిడసబారుతనం,ఎత్తుకు తగిన బరువు లేకపోవటం, బరువు తక్కువగా పుట్టటం, పసి ప్రాయ మరణాలు, తగినన్ని కాలరీల శక్తిని తీసుకోకపోవటాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పిల్లల్లో ఈ లోపాలు ఉన్నాయంటే తలిదండ్రులకు తగిన రాబడి లేకపోవటం తప్ప వేరు కాదు.2019 నుంచి 2021 మధ్య జరిపిన ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల్లో 35.5శాతం మంది గిడసబారిన వారు, 19.3శాతం ఎత్తుకు తగిన బరువు లేమి, 32.1శాతం మంది ఉండాల్సినదాని కంటే తక్కువ బరువుతో ఉన్నట్లు తేలింది. అచ్చేదిన్‌ అని చెప్పి అధికారానికి వచ్చిన వారి ఏలుబడిలో గురజాడ చెప్పినట్లు భావిభారత పౌరులు ఈసురోమంటున్నారు. పోషణ అభియాన్‌ పేరుతో బడుల్లో మధ్యాహ్న భోజన పధకం అమలు చేస్తున్నారు. దాని లక్ష్యం ఏమిటి అంటే ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో 38.4శాతంగా ఉన్న గిడసబారుతనాన్ని 2016 నుంచి 2022 నాటికి ఏటా రెండుశాతం చొప్పున 25శాతానికి తగ్గింపు, పూర్తిగా పోగొట్టాలంటేే మరో పదమూడు సంవత్సరాలు పడుతుంది. ఇదే విధంగా పోషకాహార లేమి, తక్కువ బరువుతో పుట్టే పిల్లల తగ్గింపు కూడా ఏటా రెండు శాతం అని, రక్తహీనతను మూడుశాతం చొప్పున తగ్గిస్తామని పేర్కొన్నారు.రక్త హీనత అనేక అనర్దాలకు హేతువుగా ఉంది. రక్తహీనత ముక్త భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం 2018లో కొన్ని పధకాలను ప్రారంభించింది. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-20 ప్రకారం దేశంలో 15-49 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల్లో 50శాతం మంది, ఆరు నెలల నుంచి ఆరేండ్ల లోపు పిల్లల్లో 59శాతం మంది రక్తహీనతతో ఉన్నారు.ఏటా మూడు శాతం చొప్పున 2018 నుంచి 2022లోపు దాన్ని తగ్గిస్తామని చెప్పారు.ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. సర్వేకు ఎంపిక చేసిన ప్రశ్నావళి నుంచి రక్తహీనత అంశాన్ని తొలగించారు. అంటే వాస్తవ పరిస్థితి తెలవకుండా పాతరేసేందుకు పూనుకున్నారు. ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గురించి కలలు కంటున్నా, ప్రపంచంలో ఐదవ స్థానానికి జిడిపిని వృద్ది చేశామని చెప్పినా ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. జనాలకు ఒక్క బియ్యమో, గోధుమలో ఉచితంగా ఇస్తే సమగ్ర పోషకాహారం లభిస్తుందా ? మిగతా వాటి సంగతేమిటి ? వాటికి కావాల్సిన ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ విధానాలేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహిళా రిజర్వేషన్లపై నరేంద్రమోడీ టక్కు టమారాలు : పదేండ్లు పట్టించుకోలేదు, 2034 తరువాతే అమలు !

25 Monday Sep 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Women

≈ Leave a comment

Tags

BJP, Delimitation Commission of India, Narendra Modi, Narendra Modi Failures, women reservation bill 2023


ఎం కోటేశ్వరరావు


నాటకీయ పరిణామాల మధ్య నరేంద్రమోడీ సర్కార్‌ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చట్ట సభల్లో 33శాతం మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది.అది చట్టం కావటం లాంఛనమే. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే దాని అమలుకు బాటపడుతుంది. ఏ అసెంబ్లీ, లోక్‌సభ సెగ్మెంట్లలోని ఓటర్లలో పురుషులు ఎందరు, మహిళలు ఎందరు అనే వివరాలు ఇప్పటికే ఉన్నాయి గనుక కొందరు ఆ స్థానాలను ఉటంకిస్తూ అవన్నీ మహిళలకు రిజర్వు చేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అసలు ఈ రిజర్వేషన్లు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే 2029 నాటికి అని మరికొందరు 2034 లేదా ఆ తరువాతే అని భాష్యం చెబుతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరిగేదీ, ఎక్కడ ఎన్ని సీట్లు తగ్గేది కూడా కొన్ని అంకెలను కూడా ఉటంకిస్తున్నారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం రిజర్వేషన్లు పదిహేను సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. షెడ్యూలు కులాలు, తరగతులకు నిర్ధేశించిన సీట్లలో కూడా మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. వెనుబడిన తరగతుల మహిళకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఆమోదించిన బిల్లు చట్టమై ఎప్పటికి అమల్లోకి వస్తుంది, అసలు ఏం జరగబోతోంది ?


రాజ్యసభలో 2010లోనే ఆమోదం పొందిన రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందితే సరిపోతుంది. యుపిఏ ఏలుబడిలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీల వ్యతిరేకత లేదా అభ్యంతరాల కారణంగా అది లోక్‌సభలోకి రాలేదు. తమకు పూర్తి మెజారిటీ వస్తే దాన్ని తక్షణమే ఆమోదిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. 2014లో, 2019లో అవసరమైన మెజారిటీ, సగానికంటే ఎక్కువ రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలే ఉన్నందున ఆ బిల్లు ఆమోదానికి ఆటంకం లేదు, అయినప్పటికీ తొమ్మిదేండ్లుగా దాని ప్రస్తావన, అసలు చొరవే చూపలేదు. నిజానికి అధికారానికి వచ్చిన వెంటనే ఆమోదం పొంది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లలోనే మహిళల కోటా అమలు జరిపేందుకు పునర్విభజనతో నిమిత్తం లేకుండా అవసరమైన రాజ్యాంగ సవరణ చేసి ఉంటే అమల్లోకి వచ్చి ఉండేది. చిత్తశుద్ది ముఖ్యం, అది లేదు కనుకనే విమర్శలు. కారణాలు, ఉద్దేశ్యాలు ఏమైనప్పటికీ ముందు రోజు కాబినెట్‌లో ఆమోదించి మరుసటి రోజు లోక్‌సభలో, తరువాత రాజ్యసభలో ఆమోదానికి పెట్టారు.లోక్‌సభలో ఇద్దరున్న మజ్లిస్‌ మినహా మిగిలిన పార్టీలేవీ వ్యతిరేకంగా ఓటు వేయలేదు, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఈ పరిణామాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో, జనానికి ఏం చెబుతుందో, ఓటర్లు ఎలా స్వీకరిస్తారో చూద్దాం.


ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ? పదేండ్లకు ఒకసారి జరిగే జన గణన తరువాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నది స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన నిర్ణయం. దీన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేసే కమిషన్‌కు ఒక విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఉంటారు. దాని నిర్ణయాన్ని ఆమోదించటం తప్ప ఏ కోర్టులోనూ సవాలు చేసే అవకాశం లేదు. ఆ మేరకు 1952, 1963, 1973లో జరిగాయి.1973 తరువాత పాతికేండ్ల పాటు ఆ ప్రక్రియను స్థంభింప చేస్తూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేశారు. ఆ మేరకు 2002లో మరో పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తరువాత మరో పాతికేండ్లపాటు 2026వరకు అదే సంఖ్యను కొనసాగించాలని కూడా నిర్ణయించారు. తొలి లోక్‌సభలో 494 నియోజకవర్గాలుండగా, తరువాత పది సంవత్సరాలకు 522కు పెంచారు. మరో పది సంవత్సరాల తరువాత 542కు పెంచారు. ఆప్రక్రియ తరువాత సిక్కిం మనదేశంలో విలీనం కావటంతో మరొక స్థానాన్ని దానికి కేటాయించటంతో 543 అయ్యాయి. వీటిలో పదమూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి 2026వరకు ఆ సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు. మధ్యలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలలో కొన్ని ప్రాంతాలూ, అసెంబ్లీ సెగ్మెంట్లు అటూ ఇటూ అయ్యాయి. కొన్ని నియోజవర్గాలు రద్దు, కొన్ని కొత్తవి వచ్చాయి. తెలంగాణాలో జనాభా పెరగటంతో ఆంధ్రప్రాంతంలో సీట్లు తగ్గాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తరువాత ఎక్కడ ఉన్న సీట్లు అక్కడే ఉన్నాయి.రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణా సీట్లను 119 నుంచి 153కు, ఆంధ్ర ప్రదేశ్‌లో 175ను 225కు పెంచుతామని వాగ్దానం చేసినందున 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియలో భాగంగా అవి అమల్లోకి వస్తాయి.


2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. గడువు ప్రకారం వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి వుంది. అందువలన జనగణన జరుగుతుందా, మరుసటి ఏడాదికి వాయిదా పడుతుందా అన్నది ప్రస్తుతానికి ఊహాగానమే. 2026లోపు జనగణన జరుగుతుందనే భావనతో తరువాత జరిగే పునర్విభజన ప్రకారం 2029లోక్‌ సభ ఎన్నికలు, గడువు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33శాతం కేటాయించాల్సి ఉంటుందని అందువలన 2029లో అమలు జరుగుతాయని కొందరు భాష్యం చెబుతున్నారు. ఇక పార్లమెంటు ఆమోదించిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియకు ఆ తరువాత జరిగే అంటే 2031లో జరిగే జనగణన ప్రాతిపదికన జరగాల్సి ఉంటుంది. 2021లో జరగాల్సిన జనగణన 2024 లేదా 2025లో జరిగితే పదేండ్లు గడవకుండానే మరోగణన 2031లో జరుపుతారా లేక పదేండ్లు అంటే 2034 లేదా 2035లో జరుపుతారా అన్నది తెలియదు. ఒక వేళ అదే జరిగితే ఆ తరువాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అందుకే కపిల్‌ సిబల్‌ వంటి న్యాయకోవిదులు 2034కు ముందు అమల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. రెండవది పునర్విభజన ప్రక్రియకు నిర్ణీత కాలవ్యవధి లేదు.


అనేక రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధానాలను సక్రమంగా అమలు జరపకపోవటం, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లను కేటాయిస్తున్నందున ఎక్కువ సీట్లు పొందేందుకు జనాభా అదుపును పట్టించుకోవటం లేదనే అభిప్రాయం ఉంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా 1976లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాలలో ఎలాంటి మార్పులు చేయకూడని నిబంధనను సవరించారు. తరువాత జనాభా స్థిరీకరణ అవుతుందనే అంచనాతో మరోసారి 84వ రాజ్యాంగసవరణ ద్వారా 2026వరకు సీట్ల సంఖ్యలో మార్పులేకుండా నిర్ణయించారు. 2002లో ఏర్పాటు చేసిన కమిషన్‌ 1991 జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్ధీకరణ చేపట్టాలని నిర్ణయించారు.కమిషన్‌ పని చేపట్టిన తరువాత 2003లో 87వ రాజ్యాంగసవరణ ద్వారా 2001జనాభా ప్రాతిపదికను నిర్ణయించటంతో తిరిగి నూతన ప్రక్రియను చేపట్టాల్సి వచ్చింది, 2008వరకు పూర్తి కాలేదు. జమ్మూ-కాశ్మీర్‌లో జనగణన జరగలేదు గనుక దీన్నుంచి మినహాయించారు, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ జనాభా లెక్కల్లో తేడాలు ఉన్నందున కోర్టు వివాదాల కారణంగా అక్కడ జరగలేదు. 2009 సాధారణ ఎన్నికల నాటికి 543కు గాను 499చోట్ల పునర్వ్యస్థీకరణ జరిగింది. పన్ను ఆదాయ పంపిణీకి పదిహేనవ ఆర్థిక సంఘం ఎంచుకున్న జనాభా ప్రాతిపదికతో ఎక్కువ మొత్తాలను జమ చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు తక్కువ మొత్తాలను పొందుతూ వివక్షకు గురవుతున్నాయి.అంతకు ముందు 1971 జనాభా ప్రాతికగా ఉన్న కేటాయింపులను 2011కు మార్చటంతో పెద్ద తేడా వచ్చింది. దేశ జనాభాలో 18శాతం ఉన్న రాష్ట్రాలు జిడిపిలో 35శాతం సమకూర్చుతున్నాయి. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉండాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. కానీ 2003లో చేసిన సవరణతో ఎవరు ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చు. అలాంటి వారు ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారా ? అక్కడి సమస్యలను పట్టించుకుంటారా ? వచ్చే పునర్విభజనలో పాత జనాభా పద్దతినే ఆమోదిస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గటం ఖాయం.

పాత విధానాన్ని అనుసరిస్తే పునర్యవస్థీకరణ తరువాత ఇప్పుడున్న 543 సీట్లు( ఇద్దరు ఆంగ్లోఇండియన్‌ల నామినేషన్‌ రద్దు చేశారు గనుక 541 ఉంటాయి) 848కి పెరుగుతాయని కొందరి జోశ్యం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సూచించినట్లుగా గతంలో నిర్ణయించిన దాని కంటే జనాభా రెట్టింపైనందున సీట్ల పెరుగుదల వెయ్యి ఉండవచ్చనేది ఒక వాదన.మరో అంచనా ప్రకారం 753 ఉంటాయి. తదుపరి పునర్యవస్థీకరణ సంవత్సరాన్ని ముందే ఖరారు చేసినందున ఏ ప్రాతిపదికన జరిగేదీ కమిషన్‌ నియామక సమయంలోనే తెలుస్తుంది. దాన్ని బట్టే ఎన్ని సీట్లు అన్నది ఖరారు అవుతుంది. అప్పటి వరకు వెలువడే సంఖ్యలన్నీ ఊహాగానాలే. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81 ప్రకారం జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అన్నది ఖరారు కావాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, కొన్ని చోట్ల తగ్గుదల కారణంగా ఆ సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. రాజ్యాంగం ప్రారంభంలో లోక్‌సభ సీట్లు 500గా ఖరారు చేసింది. తరువాత రాష్ట్రాల పునర్విభజన, ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రాతిపదికన సీట్లను పెంచారు.1971 జనాభా ప్రాతిపదికనే ఇప్పటికీ సీట్ల సంఖ్య కొనసాగటం సహేతుకం కాదని పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు సీట్లు కేటాయించాలన్నది ఒక అభిప్రాయం.ఉదాహరణకు దాని ప్రకారం 2001 జనాభా ప్రాతిపదికన ఉత్తర ప్రదేశ్‌కు ఏడు సీట్లు పెంచాలి, తమిళనాడుకు ఏడు తగ్గించాలి, అదే 2011లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లకు 22 అదనంగా కేటాయించాలి, అదే ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణా, కేరళ, తమిళనాడుకు 17 సీట్లు తగ్గించాలి.2021(ఎప్పుడు జరిగితే అప్పుడు) జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల సీట్లు ఇంకా తగ్గవచ్చు.2019లో జచేసిన ఒక విశ్లేషణ ప్రకారం ఉత్తర భారత్‌కు 32 సీట్లు పెరుగుతాయి, దక్షిణ భారత్‌కు 24 తగ్గుతాయి. కుటుంబ నియంత్రణ పద్దతులను జయప్రదంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అన్నది వినిపిస్తున్నమాట.కార్నెగీ సంస్థ విశ్లేషణ మేరకు 2031 జనాభా ప్రకారమైతే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రెండు రాష్ట్రాలకే 21 సీట్లు అదనంగా పెరిగితే, తమిళనాడు, కేరళకు కలిపి 16 తగ్గుతాయి. మొత్తం సీట్లు 848కి పెరిగితే ఒక్క ఉత్తర ప్రదేశ్‌కే 143, కేరళకు 20 ఉంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికల చర్చ : మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ కమిటీ ఏర్పాటు !

01 Friday Sep 2023

Posted by raomk in Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

'Ram Nath Kovind committee, BJP, Narendra Modi, Narendra Modi Failures, one nation one election


ఎం కోటేశ్వరరావు


సెప్టెంబరు 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకో పార్టీలకూ, జనానికి తెలవదు. ఆ ప్రకటనతో పాటు ఒకేసారి పార్లమెంట్‌-అసెంబ్లీల ఎన్నికలు జరిపే అంశం గురించి నివేదిక ఇవ్వాలని మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. దీంతో జమిలి ఎన్నికల కోసం అవసరమైన బిల్లు, రాజ్యాంగ సవరణల కోసమే ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలన్న చర్చ దేశంలో ప్రారంభమైంది. ఊరకరారు మహాత్ములు అన్నట్లు నరేంద్రమోడీ నాయకత్వం ఏది చేసినా బిజెపికి, తాను, తన ఆశ్రితుల లబ్ది చూస్తారు అన్నది తెలిసిందే. గత శతాబ్దిలోనే ముందుకు వచ్చింది ఒకేసారి ఎన్నికల అంశం. ఇది సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు తిరస్కరించినప్పటికీ 2014 నుంచీ ఒకే దేశం-ఒకే ఎన్నికలంటూ వదలకుండా చెబుతున్నారు.విడివిడిగా ఎన్నికలు జరగటం వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం గనుక ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్చించాలని వాదనలు చేస్తారు.


స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967వరకు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆకాలంలో జరిగిందేమిటి ? దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం తెలిసిందే. దాని ఫలితమే 1969లో కొన్ని అసెంబ్లీల రద్దు, తరువాత ముందుగానే 1970లోపార్లమెంట్‌ రద్దు, 1971 ప్రారంభంలో ఎన్నికలు అన్న విషయం తెలిసిందే. ఒక దేశవృద్ది రేటు ఒకేసారి ఎన్నికలు జరపటం, ఎన్నికల ఖర్చు తగ్గింపు మీద, ఆ సమయంలో ప్రవర్తనా నియమావళి మీద ఆధారపడదు. చివరకు దేశం కోసం ధర్మం కోసం అనే పేరుతో ఈ వాదన అసలు ఎన్నికలే వద్దు అనేదాకా పోతుంది. ఆయా దేశాల జిడిపిలు, ఆదాయాలతో పోల్చితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాల ఖర్చు నామమాత్రమే. పార్టీలు పెట్టే ఖర్చే దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటోంది. దాని నివారణకు ఒకేసారి ఎన్నికలు పరిష్కారం కాదు.2019లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలు ఖర్చుచేసిన మొత్తాలతో సహా అరవైవేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేశారు. ఇది పోటీచేసిన అభ్యర్ధులు ఇచ్చిన సమాచారం మేరకు అంచనా తప్ప, వాస్తవ ఖర్చు దాని కంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. చీటికి మాటికి ఎన్నికలు జరిగితే అభివృద్ధి పధకాల అమలు నిలిచిపోతుందన్నది ఒక పెద్ద తప్పుడు ప్రచారం. ప్రవర్తనా నియమావళి అంటే ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టే కొత్త కార్యక్రమాల ప్రకటనలను నివారించటం తప్ప వాటితో నిమిత్తం లేకుండా ముందే ప్రారంభమై సాగే పధకాల అమలు నిలిపివేత ఉండదు. రైలు మార్గాల నిర్మాణం, విద్యుదీకరణ, ప్రభుత్వ గృహాలు, రోడ్ల నిర్మాణం, పెన్షన్ల చెల్లింపు, చౌకదుకాణాల్లో వస్తువుల సరఫరా వంటివి ఏవీ ఆగటం లేదే.గతంలో గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ గ్రామీణ ఉపాధి పధకం పనులకు విడుదల చేయాల్సిన నిధులకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే ఆ విషయాన్ని మీడియాలో ఎక్కడా వెల్లడించకూడదని షరతు పెట్టింది.


కొన్నిదేశాల్లో ఒకేసారి జాతీయ, ప్రాంతీయ, స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ విధంగా చేసి ఖర్చును ఆదాచేయటం వల్ల అవి అభివృద్ధి సాధించినట్లు ఎక్కడా రుజువు లేదు. ఉదాహరణకు అమెరికాలో 1962-2019 మధ్య 57 ఏండ్లలో 26 సంవత్సరాలు తిరోగమన, 16 సంవత్సరాలు ఒక శాతంలోపు, ఐదు సంవత్సరాలు ఒకటి-రెండు శాతం మధ్య వృద్ది నమోదైంది.అమెరికాలో ఎన్నికల ప్రకటన నుంచి పోలింగ్‌ రోజువరకు మన దేశంలో మాదిరి ప్రవర్తనా నియమావళితో నిమిత్తం లేకుండా అనేక చర్యలు తీసుకోవటాన్ని చూశాము. అక్కడ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎన్నికల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు, ప్రవర్తనా నియమావళి లేదు. అయినా అక్కడ వృద్ధి రేటు ఎక్కువ సంవత్సరాలు దిగజారింది. కొన్ని లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాలలో నిర్ణీత కాలం వరకు చట్ట సభలు రద్దు కావు, ప్రభుత్వాలు మారుతుంటాయి. అలాంటి దేశాలూ అభివృద్ది సమస్యలను, సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో కూడా ఇలా ఐదేండ్ల పాటు పార్లమెంటు, అసెంబ్లీలు రద్దు కాకుండా రాజ్యాంగ సవరణ చేస్తే ఇప్పుడున్న లోపభూయిష్టమైన పార్టీల ఫిరాయింపు చట్టం అవసరం కూడా ఉండదు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే అది కూలిపోయి కొత్త ప్రభుత్వం వస్తుంది. సభ్యత్వాలు రద్దు కావు, అంటే ప్రజాప్రతినిధులను ఎవరు ఎక్కువ మందిని సమీకరిస్తే అది డబ్బుద్వారా లేదా కండబలం ద్వారా కావచ్చు అధికారం వారికే ఉంటుంది. కొన్ని దేశాల్లో జరుగుతోంది అదే. ధనస్వామ్యం తప్ప ప్రజాస్వామ్య జాడ ఉండదు.


నిజానికి ఇప్పుడు కావాల్సింది ఒకే సారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్దిల్లేవిధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్దతి ఎన్నికల సంస్కరణలు కావాలి. ప్రజాస్వామ్య కబుర్లు చెప్పే అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50రాష్ట్రాల్లో రెండు చోట్ల తప్ప మిగిలిన చోట్ల మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టరల్‌ కాలేజీ ప్రతినిధులను మొత్తంగా కేటాయిస్తారు. అందువలన దేశం మొత్తంలో ఓట్లు తక్కువ తెచ్చుకున్నా కొన్ని రాష్ట్రాలలో వచ్చిన మెజారిటీ ఆధారంగా ఎలక్టరల్‌ కాలేజీలో పైచేయి సాధించి 2016లో అధ్యక్ష పదవిని డోనాల్డ్‌ ట్రంప్‌ గెలిచారు. దామాషా ప్రాతినిధ్య విధానంలో మైనారిటీ ఓట్లకూ ప్రాతినిధ్యం ఉంటుంది. డబ్బుతో ఓట్లు కొన్నప్పటికీ గెలుస్తారో లేదో తెలియదు కనుక ఎవరూ డబ్బు పెట్టరు, నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడి కావటానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలు, వ్యక్తులు డబ్బున్నవారికే పెద్దపీట వేస్తూ అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే దామాషా ప్రాతినిధ్య విధానం గురించి వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ మాట్లాడవు.


తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగుతుందని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పధకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్‌ పేరుతో అజాగళ స్థనం వంటి అధికారాలు లేని సంస్థను ఏర్పాటు చేసిన పెద్దలు గద్దె మీద ఉండగా దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం, జనాన్ని తప్పుదారి పట్టించే వ్యవహారమే.ఒకేసారి అన్నింటికీ ఎన్నికలు అనేది ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం. ఫెడరల్‌ సూత్రాలకు, రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్దం. ఏక వ్యక్తి ఆధిపత్యానికి దారి తీస్తుంది. ఫెడరల్‌ వ్యవస్థను కూలదోసి యూనిటరీకి మళ్లేందుకే బిజెపి ఈ ప్రతిపాదనను పదే పదే ముందుకు తెస్తున్నదనిపిస్తున్నది.1983లో తొలిసారి ఎన్నికల కమిషన్‌ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది. వాజ్‌పేయి హయాంలో 1999లో లా కమిషన్‌ ద్వారా ఈ ప్రతిపాదనన తెచ్చారు. తరువాత యుపిఏ పాలనలో దాని ప్రస్తావన లేదు. నరేంద్రమోడీ తొలిసారి అధికారానికి వచ్చి,బిజెపికి మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం వచ్చినపుడు 2016లో నీతి ఆయోగ్‌ ద్వారా ముందుకు తెచ్చారు.2018లో లా కమిషన్‌ ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమని చెప్పింది. నరేంద్రమోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన వెంటనే మరోసారి చర్చకు తెచ్చారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో కూడా చర్చ సాగించారు. నిర్మాణాత్మక అవిశ్వాసం పేరుతో మరొక ప్రతిపాదనను లా కమిషన్‌ ద్వారా ముందుకు తెచ్చారు. ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టటానికి ముందు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సభ విశ్వాసం పొందాలని చెప్పారు.2022లో నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అందుకు గాను రాజ్యాంగ సవరణ జరపాలని చెప్పారు. అదే ఏడాది డిసెంబరులో లా కమిషన్‌ అన్ని రాజకీయ పార్టీలు, మేథావులు, అధికారులు తమ సూచనలు పంపాలని కోరింది. ఇపుడు రామనాధ్‌ కోవింద్‌ నాయకత్వంలో ఒక కమిటీని వేసి మరోసారి మోడీ సర్కార్‌ ముందుకు తెచ్చింది.వివరాలు తెలియదు.


ఐడిఎఫ్‌సి అనే ఒక సంస్ధ 1999 నుంచి 2014వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమాచారాన్ని విశ్లేషించింది. ఒకేసారి జరిగితే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఓటర్లు ఒకే పార్టీని ఎంచుకొనేందుకు 77శాతం అవకాశాలుంటాయని పేర్కొన్నది. ఐఐఎం అహమ్మదాబాద్‌ డైరెక్టర్‌గా ఉన్న జగదీప్‌ ఛోకర్‌ జరిపిన విశ్లేషణ కూడా దీన్నే చెప్పింది. 1989 నుంచి ఒకేసారి జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 24 ఉదంతాలలో ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో దాదాపు ఒకే విధమైన శాతాలలో ఓట్లు పొందాయి. కేవలం ఏడు సందర్భాలలో మాత్రమే ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఈ కారణంగానే గతంలో కాంగ్రెస్‌ మాదిరి ప్రస్తుతం దేశవ్యాపితంగా ఉన్న బిజెపి ఒకేసారి ఎన్నికలు జరిగితే తనకు ఉపయోగమని, ఉన్న అధికారాన్ని మరింతగా సుస్ధిరపరచుకోవచ్చని, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే అవకాశాలను తగ్గిస్తాయని భావిస్తున్నది. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సింది ఉంది. అదే జరిగితే రాష్ట్రాలలో, కేంద్రంలో ఏ కారణాలతో అయినా ప్రభుత్వాలు కూలిపోతే నిర్ణీత వ్యవధి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంది. దాని అర్ధం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని అధికారమే పరోక్షంగా ఉంటుంది. లేదా ముందే చెప్పుకున్నట్లు అవకాశవాదంతో ఏర్పడే కూటములకు అధికారాన్ని అప్పగించాల్సి వస్తుంది.


కరోనా ప్రభావం గురించి దేశమంతా ఆందోళన చెందుతోంటే దాన్ని పక్కన పెట్టి ప్రధాని కార్యాలయం స్దానిక సంస్ధలతో సహా అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా తయారీ సాధ్యా సాధ్యాల గురించి చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలా చేయాలంటే ముందుగా ఆర్టికల్‌ 243కె, 243జడ్‌, ఏ లకు సవరణలు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది.ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గినప్పటికీ అంతకు ముందున్న స్థితికి అభివృద్ది రేటు పెరగటం గురించి ఎవరికీ విశ్వాసం లేదు. దిగజారిన వృద్ది పునాది మీద పెరుగుదలను చూపి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నారు. దేశ అభివృద్ది, ప్రయోజనాల గురించి తమకు తప్ప మరొకరికి పట్టవని, దేశభక్తి ఇతరులకు లేనట్లుగా, దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నట్లు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక పధకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే 101వసారి నిజంగా మారుతుందని సూత్రీకరణ చేసిన జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ తరహా ప్రచారం ఇది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఉన్న మెజారిటీ, దేన్నయినా బలపరిచే ఇతర పార్టీలు కూడా ఉన్నందున ఒక్క రోజులోనే కాశ్మీర్‌ రాష్ట్రాన్నే రద్దుచేసినట్లు ఒకేసారి ఎన్నికల కోసం జనాభిప్రాయాన్ని తోసిపుచ్చి రాజ్యాంగ సవరణలు చేయటం నరేంద్రమోడీకి ఒక పెద్ద సమస్య కాదు. అలాంటి పరిణామం జరిగినా ఆశ్చర్యం లేదు.రాజ్యాంగాన్ని మార్చకుండానే తూట్లు పొడిచేందుకు వీలైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఫెడరల్‌ అంటూనే అధ్యక్ష తరహా పాలనకు వీలు కల్పించేదే ఒకే సారి ఎన్నికలు అనే భావన.అలాంటి అధికార కేంద్రీకరణ ఉంటేనే సంస్కరణల వేగం పేరుతో దేశ సంపదలను ఆశ్రితులకు అప్పగించేందుకు, కార్మికుల, రైతాంగ హక్కులను హరించి వేసేందుకు అవకాశం ఉంటుంది. స్వేచ్చను హరించుతున్న పాత చట్టాలను రద్దు చేయాలన్నది ఒక ప్రజాస్వామిక డిమాండ్‌. దాన్ని అమలు చేసే పేరుతో మరింత కఠినమైన చట్టాలను రూపొందించేందుకు పూనుకున్నారు. కార్మిక చట్టాలను క్రోడీకరించే పేరుతో కార్మికుల హక్కులకు ఎసరు పెట్టారు. రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే యత్నాన్ని రైతాంగం విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ ఆ కత్తి మెడమీద వేలాడుతూనే ఉంది. ఇండియా కూటమి రూపంలో ముందుకు వచ్చిన పార్టీలు బిజెపి ముక్త భారత్‌కు పిలుపునిచ్చి ముందుకు పోతుండటంతో నరేంద్రమోడీ నాయకత్వానికి భయం పట్టుకుంది.అందుకే జనం దృష్టిని మళ్లించేందుకు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారని అనేక మంది భావిస్తున్నారు. వాటిలో భాగంగానే పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశ పరుస్తున్నారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి అజెండాను ముందుకు తెచ్చిన లా కమిషన్‌ : ఏక రూప పౌరస్మృతిని హిందువులందరూ అంగీకరిస్తారా ?

16 Friday Jun 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

BJP, Hindu Code, Hindu Undivided Family, Indian constitution, Law Commission, Muslim Personal Law, Narendra Modi Failures, RSS, Supreme Court, Uniform Civil Code


ఎం కోటేశ్వరరావు


ఏక రూప పౌర స్మృతి గురించి ఆసక్తి ఉన్న వారు నోటిఫికేషన్‌ జారీ చేసిన జూన్‌ 14వ తేదీ నుంచి నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలపాలంటూ ఇరవై రెండవ లా కమిషన్‌ ఒక ప్రకటన చేసింది. అది లేకపోతే దేశం ఇంకేమాత్రం ముందుకు పోదు, తీవ్ర ఆటంకంగా ఉందన్నట్లు కొందరు గుండెలు బాదుకుంటున్నారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నదే కదా దాన్ని అమలు చేస్తామంటుంటే ఎందుకు లేనిపోని దురుద్దేశాలు అంటగడుతున్నారు అంటూ అమాయకత్వాన్ని నటిస్తున్నారు. అదే గనుక వాస్తవమైతే నరేంద్రమోడీ తొమ్మిది సంవత్సరాలుగా ఏం చేస్తున్నట్లు ? చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. లా కమిషన్‌ సరిగ్గా ఇప్పుడు దాన్ని ఎందుకు ముందుకు తీసుకు వచ్చిందన్నది ప్రశ్న. దీని గురించి దాన్ని ఎవరూ సవాలు చేయటం లేదు, విబేధించటమూ లేదు. ఎన్నో తర్జన భర్జనల తరువాత మన దేశంలోని సంక్లిష్ట పరిస్థితుల కారణంగా ఏకాభిప్రాయసాధనతో సాధించాల్సిన అంశంగా పరిగణించి అర్టికల్‌ 44లో ఇతర అదేశిక సూత్రాలలో దాన్ని చేర్చారు. వాటిని కోర్టులు అమలు జరపలేవని కూడా రాజ్యాంగంలో ఉంది. వాటిలో పని హక్కు, నిరుద్యోగ భృతి వంటి వివాదం లేని వాటిని అమలు జరపటం మీద శ్రద్ద లేని బిజెపి వివాదాస్పద ఏక రూప పౌర స్మృతి మీద కేంద్రీకరిస్తున్నది. మతోన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే మెజారిటీ-మైనారిటీ మతశక్తులు రెచ్చిపోతున్న తరుణంలో అనేక అపోహలు ఉన్న ఈ అంశం ఇప్పుడు తక్షణ అవసరం అంటూ బిజెపి ముందుకు తెస్తున్నది.

మహిళల ఉద్దరణ అని చెబుతున్నది. నిజానికి దానికి అంత శ్రద్ద ఉంటే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ ఎందుకు కల్పించలేదు. ఒక ముసాదాను రూపొందించి జనం ముందు ఎందుకు పెట్టలేదు ? త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇరవై రెండవ లా కమిషన్‌ ద్వారా ఒక ప్రచార అస్త్రంగా తన అజెండాను ముందుకు తెచ్చింది.
ఏక రూప పౌర స్మృతి ఈ దశలో అవసరమూ కాదు వాంఛనీయమూ కాదని 2018 ఆగస్టులో ఇరవై ఒకటవ లా కమిషన్‌ విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. ఆ పత్రం విడుదల చేసి మూడు సంవత్సరాలు దాటినందున నాటి నోటిఫికేషన్‌ గడువు ముగిసిందని, వివిధ కోర్టుల ఉత్తర్వులు దీని మీద ఉన్నందున ఈ అంశం మీద కొత్తగా అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నది. అభిప్రాయాలు తప్ప కోర్టు ఉత్తరువులేమీ లేవు.తాజా సేకరణతో ఏమి చేస్తారో చెప్పలేదు. గత కమిషన్‌ 2016 జూన్‌ 17 నోటి ఫికేషన్‌ ద్వారా అభిప్రాయాలను సేకరించింది. వాటిని క్రోడీకరించి కుటుంబ చట్ట సంస్కరణలు పేరుతో 185 పేజీల పత్రాన్ని విడుదల చేసింది. ఏక రూప దేశం అంటే సమరూపత ఉండనవసరం లేదు. మానవహక్కుల అంశంలో ప్రపంచమంతటా ఉన్న వివాదాలు లేని తర్కాలతో మన భిన్నత్వాన్ని సమ్మతింప చేసేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉందని ఆ పత్రం పేర్కొన్నది. వివిధ మతాలకు సంబంధించి పర్సనల్‌ చట్టాల్లో ఉన్న వివక్ష, అసమానతలను ఎదుర్కొనేందుకు ఇప్పుడున్న కుటుంబ చట్టాలను అవసరమైన మేరకు క్రోడీకరించి, సవరించవచ్చని కూడా పేర్కొన్నది. సుప్రీం కోర్టు తన ముందుకు వచ్చిన వివిధ కేసుల విచారణ సందర్భంగా ఏకరూప పౌర స్మృతి అవసరమని అభిప్రాయపడింది. తాజాగా మార్చి 23వ తేదీన వివిధ పిటీషన్ల మీద తీర్పు చెబుతూ ఇలాంటి పిటీషన్లను ఆమోదించి విచారించటం అంటే అలాంటి చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటును ఆదేశించటమేనని, తామాపని చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దీని గురించి తాజాగా ఆలోచించాలని, ఏ చర్యలు తీసుకున్నది కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. 2022 అక్టోబరులో సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్లపై ప్రభుత్వం స్పందిస్తూ మత ప్రాతిపదికన ఉన్న వ్యక్తిగత చట్టాలు దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్నట్లు, ఏకరూప పౌర స్మృతిని తీసుకువస్తామని పేర్కొన్నది.


దేశ ఐక్యతకు, సామాజిక సమతుల్యతకు ముప్పు తెస్తున్న అంశాలలో విద్వేష పూరిత ప్రసంగాలు, ఇతర వివాదాస్పద అంశాలు, చట్టాన్ని కొందరు చేతుల్లోకి తీసుకోవటం, వ్యవస్థల దుర్వినియోగం వంటివి నేడు ప్రధానంగా ముందుకు వచ్చాయి. అలాంటి వారి మీద ఫిర్యాదు లేకున్నా కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఒకటికి రెండుసార్లు చెప్పాల్సి వచ్చింది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే అలాంటి ప్రసంగాలు చేసిన వారి మీద కేసు నమోదు చేసిన వారికి భద్రత లేదన్నది స్పష్టం. ఆదేశిక సూత్రాల్లోని పని, విద్య, నిరుద్యోగ భృతి వంటి హక్కులను అమల్లోకి తెస్తే కరోనాలో వలస కార్మికులు దిక్కులేని చావులకు, ఇబ్బందులకు గురయ్యేవారు కాదు. వలస కూలీలు తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని స్థానికులు దాడులకు దిగేవారూ కాదు.రిజర్వేషన్ల కోసం తన్నుకు చచ్చేవారూ కాదు.తాజాగా మణిపూర్‌ మంటలూ ఉండేవి కాదు, ప్రధాని మోడీ కనిపించటం లేదనే పోస్టర్లూ వెలువడేవి కాదు.


ఏకరూప పౌర స్మృతి అంటే ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి ఎలాంటి మార్పులు చేసేదీ జనంలో చర్చకు పెడితే దాని గురించి ఉన్న అనేక అపోహలు తొలుగుతాయి. ఏమైనా సరే వెంటనే అమలు జరపాలని కోరుతున్న మోడీ సర్కార్‌ గత తొమ్మిది సంవత్సరాలుగా అలాంటిదేమీ తీసుకురాలేదు. రూపు రేఖలు లేని ఒక ప్రతిపాదన మీద అభిప్రాయాలు చెప్పమంటే ఏమి చెబుతారు ? గతంలో చెప్పిన అభిప్రాయాలకు కాలదోషం పట్టిందని వర్తమాన లా కమిషన్‌ ఏ ప్రాతిపదికన నిర్దారించింది. అసలది ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ తప్ప రాజ్యాంగబద్దమైనది కాదు, ప్రభుత్వం దాని ద్వారా అభిప్రాయసేకరణ జరపమని కోరింది గాని రాజ్యాంగ ఆదేశం లేదు. ఏకరూప పౌర స్మృతిని ముస్లింలు లేదా ఏమతం వారైనా ఎలాంటి హేతుబద్దత లేకుండా గుడ్డిగా తిరస్కరించనవసరంలేదు, భిన్న అభిప్రాయం వెల్లడించవచ్చు, ముసాయిదాను ముందుపెడితే వివరణలు కోరవచ్చు.


ఆదేశిక సూత్రాల్లో అనేక అంశాలు ఉన్నప్పటికీ మిగతావాటిని అమలు జరపకుండా ఏకరూప పౌర స్మృతి మీద బిజెపి కేంద్రీకరణ అన్నది ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ఆ మతానికి చెందినవారితో పాటు ఇతర మతాల వారు, మతం, కుల పట్టింపులు లేనివారు కూడా బలంగా నమ్ముతున్నారు. దాన్ని ఏకాభిప్రాయంతో సాధించాల్సి ఉందని అంబేద్కర్‌తో సహా మెజారిటీ భావించిన కారణంగానే ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు పది సంవత్సరాలు చాలని నాడు భావించారు. ఆ లక్ష్యం నెరవేర లేదు గనుక పొడిగిస్తూ వస్తున్నారు. తరువాత ఓబిసిలకూ వర్తింప చేశారు. పౌర స్మృతి మీద ఇప్పటికీ ఏకాభిప్రాయ పరిస్థితి ఉందా అంటే లేదు. అసలు హిందువులందరూ దానితో ఏకీభవిస్తారా అన్నది ప్రశ్న. కర్ణాటకలో ఎక్కువగా ఉన్న లింగాయతుల తమను ప్రత్యేక మతానికి చెందిన వారిగా పరిగణించాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.శైవులు, వైష్ణవులు వారిలో కులాల వారీ భిన్న ఆచారాలు, ఇలా ఎన్నో విభిన్నతలు ఉన్నాయి. వాటన్నింటిలో బిజెపి లేదా కేంద్ర ప్రభుత్వం వేలు బెట్టాలని, ఫలానా పద్దతి పాటించాలని ఆదేశించాలని చూస్తున్నదా ? అందుకే ముసాయిదా చట్టాన్ని ముందుపెడితే ఇలాంటి అనుమానాలకు తెరపడుతుంది లేదా కొత్త అంశాలు ముందుకు రావచ్చు. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే అదేదో ముస్లింలకు సంబంధించిందని అనేక మంది భావించి మద్దతు ఇచ్చారు. రాముడి గుడి కడతామంటే సరే అన్నారు. వ్యక్తిగత అంశాల్లో తమదాకా వస్తే అలాగే ఉంటారా ? ఒక కులానికి చెందిన వారు మరో కులం, మతానికి చెందిన వారిని వివాహం చేసుకోకూడదని తీర్మానాలు చేస్తున్న పంచాయత్‌లు సాగుతూనే ఉన్నాయి.ఎవరికి వారు తమ కులాన్ని, మతాన్ని పవిత్రంగా మార్చాలని చూస్తున్నారు. అలాంటి స్థితిలో అందరూ సమానమే, ఒకటే అనే భావనను అంగీకరిస్తాయా ?


గోవాలో ఏకరూప పౌర స్మృతి అమలు జరుపుతున్నపుడు ఇతర చోట్ల ఎందుకు అమలు జరపకూడదు అని కొందరు వాదిస్తున్నారు. పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా 1961లో దేశంలో విలీనమైంది. అప్పటి వరకు అక్కడ అమల్లో ఉన్న పౌర స్మృతిని మార్చి కొత్త విధానాన్ని వర్తింప చేయాల్సిన అగత్యం తలెత్తలేదు. దాన్నే వర్తింప చేసేందుకు నాడు కేంద్రం అంగీకరించింది, ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అలాంటి చట్టాన్ని మిగతా దేశంలో అమలు జరపవద్దని ఎవరూ అనటం లేదు, బలవంతంగా రుద్దటం గాక అనుమానాలను తీర్చి అమలు జరపాలని చెబుతున్నారు. అందుకు అనువైన వాతావరణం లేదు గనుక తొందరపడవద్దంటున్నారు. మిగిలిన ఆదేశిక సూత్రాలు అమలు జరిపిన తరువాత దీన్ని కూడా చేపట్టవచ్చు. గోవాలో ఉన్న చట్టం ప్రకారం వివాహమైన వెంటనే ఏ మతం వారికైనా భర్త ఆస్తిలో భార్యకు సగం వాటా మీద హక్కు దఖలు పడుతుంది. దేశంలో దాన్ని అమలు చేస్తే ఇప్పుడున్న హిందూ అవిభక్త కుటుంబం, దానితో పాటే ఆ పేరుతో పొందుతున్న పన్ను రాయి రద్దవుతుంది. దీన్ని దేశంలోని హిందువులందరూ సమ్మతిస్తారా ? ఉత్తరాదిన సప్తపది హౌమం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తేనే వివాహం జరిగినట్లు, దక్షిణాదిన అదే హిందువుల్లో ఎవరైనా పాటించ వచ్చు తప్ప విధి కాదు. లేదు. ఇలాంటి అనేక తేడాలు ఉన్నప్పుడు ఏక రూప చట్టం ఎలా ఉంటుందో ఎవరిని ఎలా ప్రభావితం చేస్తుందో, ఎలా స్పందిస్తారో తెలియదు. పంజాబ్‌లో వారసత్వహక్కులు హిందువులకు ఒక విధంగా సిక్కులకు మరొక విధంగా ఉన్నాయి. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం ఆ మతానికి చెందిన పురుషులు నలుగురిని వివాహం చేసుకోవచ్చు, ఆ మేరకు వివాహాలు చేసుకుంటూ హిందువులు మెజారిటీగా ఉన్న దేశాన్ని ముస్లిం మెజారిటీగా మార్చేందుకు కుట్రపన్నుతున్నారంటూ కాషాయదళాలు నిరంతరం చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం తెలిసిందే.


నిషేధం ఉన్నప్పటికీ ముస్లింలలో కంటే హిందువులు, ఇతరుల్లోనే ఎక్కువగా బహుభార్యాత్వం ఉందని గతంలో జరిపిన విశ్లేషణలో తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2005-06 ప్రకారం హిందువుల్లో 1.9, ముస్లింలలో 2.9, ఇతరుల్లో 2.9శాతం ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్నారు. అదే 2019-20 సర్వే ప్రకారం 1.3,1.9,1.6 శాతాలకు తగ్గారు. తగ్గుదల అందరిలోనూ ఉంది. అందువలన ముస్లింలు పనిగట్టుకొని ఎక్కువ మందిని వివాహమాడి పిల్లలను కని దేశాన్ని ఆక్రమిస్తున్నారనే ప్రచారం వాస్తవం కాదు. విద్యలేని వారు, పేదలు, చిన్న వయస్సులోనే వివాహాలు చేసుకున్న వారిలో ఈ దురాచారం ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారిక సర్వే వెల్లడించింది. కులాల వారీ చూసినపుడు తాజా సర్వే ప్రకారం గిరిజనుల్లో 2.4, ఎస్‌సి 1.5, ఒబిసి 1.3, ఇతరుల్లో 1.2శాతం చొప్పున, మతాలవారీ హిందూ 1.3, ముస్లిం 1.9, క్రైస్తవులు 2.1, బౌద్దులు 1.3, సిక్కులు 0.5, ఇతరులు 2.5 శాతం మంది ఉన్నారు. ముస్లింలకు మినహా ఇతరుల్లో ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉండటం నిషేధం. దేశంలో జరిపిన నేషనల్‌ శాంపుల్‌ సర్వే ప్రకారం ఓబిసిలు 40.94, దళితులు 19.59, గిరిజనులు 8.63 శాతం ఉన్నారు. వీరిలో అనేక కులాలు, ఉపకులాలు ఆచారాలు, సాంప్రదాయాలన్నీ ఒకటే కాదు, వీరందరూ హిందువులే, ఎంతో భిన్నత్వం కలిగిన వారందరికీ ఒకే పౌరస్మృతిని అమలు జరిపే ముందు వీరిలో ఉన్న అనుమానాలను తొలగించాలా లేదా ? దానికి మార్గం నమూనా చట్టం జనం ముందు పెట్టటమే.


ప్రస్తుతం వివిధ మతాల వ్యక్తిగత చట్టాల ప్రకారం ఒకే అంశంపై ఏకీ భావం లేదు. ఎవరి భాష్యాలు వారు చెబుతున్నారు. జనంలో అనేక అనుమానాలు, గందరగోళం ఉంది. ఏక రూప పౌరస్మృతిని బిజెపి బలవంతంగా రుద్దాలనుకుంటే ప్రస్తుతం దానికి అడ్డులేదు. పార్లమెంటులో దానికి గుడ్డిగా మద్దతు ఇచ్చే పార్టీలు ఉన్నందున అదేమీ పెద్ద అంశం కాదు. దాన్ని ఒక ఎన్నికల ప్రచార అస్త్రంగా, ముస్లింల మీద విద్వేషాలు, వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకు సృష్టికి, సంతుష్టీకరణకు పూనుకుంది. దీనికి ఇస్లాం లేదా దేశంలోని ముస్లింలు వ్యతిరేకమనే ప్రచారం చేస్తున్నారు. దీనిలో వాస్తవం-వక్రీకరణ రెండూ ఉన్నాయి. ముస్లిం మతశక్తులు గుడ్డిగా సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయి తప్ప సామాన్య ముస్లింలందరూ అలా లేరు, అదే విధంగా హిందూత్వ పేరుతో వీరంగం వేస్తున్న వారు ముస్లింల పట్ల గుడ్డి ద్వేషాన్ని వెళ్లగక్కుతుంటే మొత్తం హిందువులందరూ అలా లేరు. ఏ మతమైనా వర్తమానానికి అనుగుణంగా మారకపోతే మౌఢ్యం పెరుగుతుంది. ఉన్న మతాల్లో హిందూ అని చెబుతున్న అనేక సామ్యాలున్న శైవ, వైష్ణవ ఇతర వివిధ మతాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నందున అనేక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. లేకపోతే జనం మతాలను పక్కన పెట్టేస్తారు. అమెరికా వెళ్లి హిందూమత గొప్పతనం గురించి ప్రసంగించిన స్వామి వివేకానందుడి గురించి గొప్పగా చెబుతారు. సముద్రయానం చేశాడనే కారణంగా తిరిగి వచ్చిన తరువాత అదే హిందూమతం వివేకానంద దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకుంది. ఇటీవలి కాలంలో ఆ మూఢనమ్మకాన్ని సవరించుకొని పరిహారంగా కొన్ని క్రతువులు చేస్తే చాలని సరిపుచ్చుతున్నారు. ఎందుకంటే అనేక మంది స్వామీజీలు విదేశాల సందర్శన సరదాను అణుచుకోలేకపోయారు. మడిని గట్టున పెట్టి వెళ్లారు. సముద్రం దాటిన వారు కులాన్ని కోల్పోతారని శాస్త్రాల్లో రాసి ఉంది మరి. ఎవరైనా కులం పోగొట్టుకున్నవారు ఉన్నారా ? లేకపోగా విదేశాల్లో కూడా కుల గజ్జిని వ్యాపింప చేస్తున్నారు. దేశ పరువును గంగలో కలుపుతున్నారు. ఉన్న మతాలలో తాజాది ఇస్లాం గనుక ఆ మతం మీద ముల్లా ” అగ్రహారికుల ” ప్రభావం ఎక్కువగా ఉంది. వివాహం, విడాకులు, ఆస్తి హక్కులు, సంరక్షణ, దత్తత వంటి అంశాలు ఎంతో సున్నితమైనవి గనుక వాటిని సమానత్వ ప్రాతిపదికన, లింగవివక్ష లేకుండా ఎలా చట్టాన్ని రూపొందించాలన్నది పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అన్ని మతాలూ మహిళను చిన్న చూపు చూసేవే, అణచేందుకు చూసేవే. అందువలన వారికి అనుకూలమైన ఏ చట్టం రూపొందాలన్నా చట్ట సభల్లో వారికి హక్కుగా ప్రవేశించే హక్కు కల్పించటం ముందుగా జరగాలి. అప్పుడే పితృస్వామిక సమాజ పెత్తనాన్ని చట్టబద్దంగా కూడా అడ్డుగోగలరు. అనుమానాలను తొలగిస్తూ, విశ్వాసాన్ని పాదుకొల్పుతూ తేవాల్సిన ఏకరూప పౌరస్మృతిని బిజెపి కోరుకుంటున్నట్లుగా ఏకపక్షంగా రుద్దకూడదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ పక్కకెళ్లొద్దురో డింగరీ : పన్నెండు గంటలపని, మూడు రోజుల సెలవు కుర్రకారుకు గాలమే !

30 Sunday Apr 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

#May Day 2023, 4-day work week, Anti labour measures, BJP, Four 12-hour days, Labour Reforms INDIA, May Day 2023, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మే డే అంటే కార్మికులు కొన్ని చోట్ల సంబరాలు జరుపుతున్నారు. మరికొన్ని చోట్ల దీక్షాదినంగా పాటిస్తున్నారు. అసలు ఏదీ పాటించకుండా, మే డే అంటే ఏమిటో కూడా తెలియకుండా ఆ రోజున కూడా పనిలో ఉండేవారు ఉన్నారు. కరోనా సమయంలో శ్రామికులు తక్కువగా అందుబాటులో ఉన్నందున రోజుకు పన్నెండు గంటలపాటు పని చేయించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదని సుప్రీం కోర్టు 2020 అక్టోబరు ఒకటవ తేదీన తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చేసిన విధాన నిర్ణయం ప్రకారం వారానికి నాలుగు రోజులు, రోజుకు పన్నెండు గంటల చొప్పున పని గంటలు ఉన్నాయి. వాటిని అమలు జరపాల్సింది రాష్ట్రాలు గనుక అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంది. ఇప్పటికే కర్ణాటకలో ఆమోదించారు. తాజాగా తమిళనాడులో ఆమోదం మీద తీవ్ర నిరసన వెల్లడి కావటంతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది తప్ప రద్దు చేయలేదు. అది తాత్కాలికం, దేశమంతటా ఆ కత్తి కార్మికుల మెడమీద వేలాడుతూనే ఉంది.మూడు సాగు చట్టాలను ప్రతిఘటిస్తూ రైతాంగం సాగించిన ఏడాది పోరాటం, దానికి తలొగ్గి క్షమాపణలు చెప్పి మరీ వాటిని రద్దు చేసిన తీరు తెలిసిందే. రైతన్నల పోరు, దేశంలో దిగజారుతున్న ఆర్థిక స్థితి, వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికల కారణంగా లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మికుల మీద రుద్దనున్న చట్టాలను ఆలశ్యం చేస్తున్నారు తప్ప వెనక్కు తగ్గే ధోరణిలో లేరు. ఇప్పటికే పార్లమెంటు ఆమోదించింది. అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని అంశాలపై ముసాయి నిబంధనలను ప్రకటించాయి. ఒక విధానంగా చట్ట సవరణ చేస్తే దాన్ని కోర్టులు కొట్టివేసేందుకు అవకాశాలు దాదాపు లేవు. కార్మికులను కోర్టులు కూడా ఆదుకోలేవు. ఇప్పుడున్న ఎనిమిది గంటల షిప్టులను పన్నెండు గంటలకు పెంచుకోవటమా లేదా అన్నది యజమానులు నిర్ణయించుకోవచ్చని, దీనికి కార్మికుల అంగీకారం కూడా అవసరమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.తమకు వచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలనో మరో సాకునో యజమానులు చూపితే పన్నెండు గంటలు ఏకబిగిన పని చేయక తప్పదు.చట్టాలు యజమానులకు చుట్టాలు తప్ప కార్మికులకు కాదు. చట్టాల ఆటంకం కారణంగానే మన దేశానికి విదేశీపెట్టుబడిదారులు రావటం లేదని, ఎగుమతుల్లో పోటీ పడలేమని అందువలన వారు కోరుకున్నట్లుగా భూమి, కార్మిక చట్టాలను మార్చాలని ఎప్పటి నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ మార్పులన్నీ వారి కోసం తప్ప కార్మికుల కోసం కాదు.


ఆసుపత్రులు, మరికొన్ని చోట్ల ఇప్పటికే అరకొర వేతనాలతో పన్నెండు గంటల షిప్టుల్లో పని చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. వారికి వారానికి ఒక రోజు సెలవు తప్ప అదనంగా ఇవ్వటం లేదు. ఇప్పుడు వారికి మూడు రోజులు సెలవులు, వాటికి వేతనం ఇస్తారా, ప్రభుత్వం ఇప్పిస్తుందా ? నాలుగు రోజులు పని చేస్తే వచ్చే వేతనంతో ఏడు రోజులు ఎలా గడుపుకుంటారు ? కొన్ని చోట్ల పని స్థలాలకు వెళ్లి వచ్చేందుకు కార్మికులకు రెండు నుంచి నాలుగు గంటలు పడుతున్నది. అంటే పదహారు గంటలు కుటుంబాలకు దూరంగా ఉండి ఇంటికి వెళ్లిన తరువాత కుటుంబ సభ్యులతో గడిపేందుకు, విశ్రాంతి తీసుకొనేందుకు వ్యవధి దొరుకుతుందా ? ఇదే అమలు జరిగితే వారానికి నాలుగు రోజులు వారు ఇంటికి దూరమై ఫ్యాక్టరీల గేట్ల ముందు పడుకున్న 150 సంవత్సరాల నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయంటే అతిశయోక్తి కాదు. ఈ విధానం అమల్లోకి వస్తే తొలి బాధితులు, పనికి దూరమయ్యేది మహిళలు. వారు ఇంట్లో పని చేసుకొని పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయాన్ని పనికి వెచ్చించగలరా ? పసి పిల్లలను సంరక్షించుకోగలరా ? పన్నెండు గంటల షిఫ్టులు పెడితే ఆహారపు అలవాట్లు, వేళలు మారతాయి. మూడు పూటలా తినేందుకు వీలుండదు, మూడుసార్లు తినాల్సినదాన్ని రెండుసార్లు కుక్కటం జరిగేదేనా ? ఇవి అలసట, ఆరోగ్య, మానసిక వత్తిడి, తాగుడు వంటి వాటికి దారితీస్తాయి.ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు, కుటుంబ జీవనానికి కొత్త వాటిని జోడిస్తాయి.


అదనపు వేతనం ఇచ్చేందుకు నిరాకరిస్తూ, ఇచ్చినా అరకొరా చెల్లిస్తూ అడిగిన వారిని పని నుంచి తొలగిస్తున్న యజమానులకు చట్టబద్దంగా అధికారమిచ్చి ఎనిమిది గంటలకు ఇస్తున్న వేతనంతోనే పన్నెండు గంటలు చేయించినా అడిగేవారు ఉండరు. దశాబ్దాల తరబడి కనీస వేతనాలను పెంచని పాలకులు కళ్ల ముందు కనిపిస్తున్నపుడు ఇంతకు మించి కార్మికులకు ఒరిగేదేమీ ఉండదు.చట్టవిరుద్ద దోపిడీని చట్టబద్దం చేస్తుంది. కొత్త చట్టాల ప్రకారం మొత్తం వేతనంలో మూలవేతనం సగం ఉండాలని చెబుతున్నారు. అంటే ఆ మేరకు కార్మికులు, యజమానులు చెల్లించే ప్రావిడెంట్‌ ఫండ్‌ వాటా పెరుగుతుందని, ఉద్యోగ విరమణ చేసినపుడు గ్రాట్యూటీ పెరిగి పెద్ద మొత్తాలు చేతికి అంది సుఖంగా జీవించవచ్చని ఆశ చూపుతున్నారు. పిఎఫ్‌ వాటా పెరగటం అంటే తమ పెన్షన్‌కు తామే ముందుగా చెల్లించటం తప్ప మరొకటి కాదు. దీని వలన వచ్చే వేతనాల మొత్తం తగ్గి రోజువారీ గడవటం ఎలా అన్నది అసలు సమస్య. అలవెన్సులు, కరువు భత్యం వంటివి మూలవేతనంలో సగానికి మించకూడదంటే అది కార్మికులకు నష్టమే.
కొత్త చట్టం వస్తే సెలవులేమీ పెరగవు. ఇప్పుడు 45 రోజులకు ఒక వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నారని, దాన్ని ఇరవై రోజులకు ఒకటి వచ్చేట్లు చేస్తున్నామని చెబుతున్నారు. ఎనిమిదికి బదులు నాలుగు గంటలు పని చేస్తే ఓవర్‌టైమ్‌ వేతనం చెల్లించాలి. ఇప్పుడు మామూలు వేతనానికే అదనంగా రోజుకు నాలుగు గంటలు పని చేయాలి.కంపెనీలో చేరిన 240 రోజుల తరువాత సెలవు పెట్టుకొనే దానిని ఇప్పుడు 180రోజులకే తగ్గిస్తున్నట్లు ఆశచూపుతున్నారు. ఇప్పుడు ఏడాదికి వారాంతపు సెలవులు 52 పోగా పని రోజులు 300 వరకు ఉంటున్నాయి. నాలుగు రోజులే పని అమల్లోకి వస్తే పని రోజులు రెండువందలకు తగ్గుతాయి. ఏదైనా ఒకటే కదా ! వాస్తవంగా నిబంధనలు అమల్లోకి వస్తే తప్ప కార్మికులు ఎంత పొగొట్టుకొనేది, యజమానులకు కలిగే లబ్ది ఏమిటనేది స్పష్టం కాదు.


అనేక దేశాల్లో మాదిరి సంస్కరణల్లో భాగంగా షిప్టులను మారిస్తే తప్పేమిటి అని కొందరు వాదించవచ్చు. ఒక సినిమాలో దేన్నీ ఒక వైపే చూడకు అన్న డైలాంగ్‌ తెలిసిందే. వీటినీ అంతే. చైనాలో సంస్కరణలు అక్కడ సంపదలను సృష్టిస్తే మన దేశంలో అలాంటిదేమీ జరగలేదు. అదే చైనాలో పన్నెండుగంటల పనికి అనుమతి ఉంది అని కొందరు కొన్ని కంపెనీలను చూపి ఉదాహరించవచ్చు.వాస్తవాలేమిటి ? చైనాలో రోజుకు ఎనిమిది గంటలపని, వారానికి 44 గంటలు అన్న చట్టాన్ని మార్చి పన్నెండుగంటలుగా, నాలుగు రోజులుగా మార్చలేదు. ప్రభుత్వం ఇచ్చిన కొన్ని వెసులుబాట్లను అవకాశంగా తీసుకొని కొన్ని కంపెనీలు వారానికి ఆరు రోజులు, రోజుకు పన్నెండు గంటల షిప్టులను అమలు జరిపాయి. దాన్నే 996 పని సంస్కృతి అని పిలిచారు. ఆలీబాబా కంపెనీ అధినేత జాక్‌ మా వంటి వారు దాన్ని అమలు జరిపారు. అలాంటి పని పద్దతులను అమలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చైనా ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేసింది. అనేక కోర్టులు పన్నెండు గంటలపని చట్టవిరుద్దమని తీర్పులు చెప్పాయి. 2021 సెప్టెంబరు 21 చైనా సుప్రీం కోర్టు, కార్మిక మంత్రిత్వశాఖ సంయుక్తంగా ఒక ప్రకటనలో పది కోర్టు తీర్పులను ఉటంకిస్తూ కార్మికుల చేత చట్టాలకు భిన్నంగా ఏ రంగంలోనూ బలవంతంగా పని చేయించటాన్ని సహించేది లేదని స్పష్టం చేశాయి. విశ్రాంతి సమయంలో, సెలవు రోజుల్లో కార్మికులతో పని చేయిస్తే చట్టపరంగా చెల్లింపు లేదా పరిహారాన్ని కోరే హక్కు కార్మికులకు ఉందని పేర్కొన్నాయి. టెక్నాలజీ (ఐటి) కంపెనీలు నిబంధనలకు విరుద్దంగా ఎక్కువ సేపు పని చేయించినట్లు, పరిహారం చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.2019లో కొంత మంది ప్రోగ్రామర్లు రంగంలోకి దిగి అందరికీ అందుబాటులో ఉండే (ఓపెన్‌ సోర్స్‌ కోడ్స్‌ ) సంకేతాలను ఉపయోగించుకొని పని చేసే అంకుర సంస్థలు చట్టాలను ఉల్లంఘిస్తే వాటిని బ్లాక్‌ లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. అలా ఎక్కువ గంటలు పనిచేసి అనారోగ్యాలకు గురై కొందరు నిపుణులు మరణించిన తరువాత నిరసనలు వెల్లువెత్తాయి. మన దగ్గర స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల తరఫున ఆహారాన్ని అందించే కార్మికులు తమకు చట్టాలను వర్తింప చేయటం లేదని ఫిర్యాదు చేసిన తరువాత చైనా ప్రభుత్వం అలాంటి సంస్థలను కట్టడి చేసి కార్మికులకు రక్షణ కల్పించింది. అనేక సంస్థలు దారికి వచ్చాయి. అలాంటి చిత్తశుద్ది మన ప్రభుత్వాలకు ఉన్నాయా అన్నది ప్రశ్న.చైనాలో కార్మిక చట్టాలను కఠినతరం గావించటం, కనీసవేతనాల పెంపుదల వంటి కారణాలతో అక్కడ ఇంకేమాత్రం వాణిజ్యం, ఫ్యాక్టరీలను నడపటం లాభసాటి కానందున అక్కడి నుంచి వచ్చే కంపెనీలను మన దేశం ఆకర్షించాలని మన దేశంలో అనేక మంది చెబుతున్నారు. ఇదే తరుణంలో ఇక్కడ కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేసే, జీవితాలను ఫణంగా పెట్టే పని పద్దతులను రుద్దేందుకు చూస్తున్నారు. ఏదో దేశంలో తొడకోసుకుంటే మన దేశంలో మెడకోసుకోవాల్సిన అవసరం లేదు. విదేశీ సిద్దాంతాలు, విదేశీ పద్దతులు వద్దని చెప్పేవారు కార్మికుల మీద విదేశీ పద్దతులనే ఎందుకు బలవంతంగా రుద్దుతున్నట్లు ?


అంబేద్కర్‌ అంటే దళితుల నాయకుడని, ( కొంత మంది దళితులలో ఒక ఉప కులానికే పరిమితం చేస్తున్నారు) మహాత్మా జ్యోతిరావు పూలే అంటే బిసిల నేతగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది.ఈ ఇద్దరికీ కమ్యూనిస్టులు వ్యతిరేకమనే తప్పుడు ప్రచారం కొందరు చేస్తున్నారు.మరికొందరు వారిని తమ మనువాద, తిరోగామి చట్రంలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వారి స్ధానాన్ని తక్కువ చేసి చూపటమే. మన దేశంలో కార్మికోద్యమ పితామహుడు, కార్మిక, సామాజిక సమస్యలపై కేంద్రీకరించిన తొలి పత్రిక ‘దీన బంధు ‘ సంపాదకుడు నారాయణ్‌ మేఘాజీ లోఖండే అని, ఆయన మహాత్మా జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన సత్య శోధక సమాజ కార్యక్రమాల వుత్తేజంతోనే దేశంలోనే తొలి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారనే విషయం ఎందరికి తెలుసు. కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడిన 1848లో జన్మించిన నారాయణ్‌ కేవలం 49 సంవత్సరాలకే ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవలందిస్తూ అనారోగ్యంతో మరణించారు. రైల్వే, తపాల శాఖలో పని చేసిన ఆయన 1870లో మాండవీ బట్టల మిల్లులో స్టోరు కీపరుగా చేరారు. ఆ సమయంలో మిల్లు కార్మికుల దయనీయ స్ధితిని ప్రత్యక్షంగా చూశారు. కార్మికులు పది నుంచి 14 గంటలు పని చేసేవారు.

బాంబే మిల్‌ హాండ్స్‌ అసోసియేషన్‌ పేరుతో తొలి కార్మిక సంఘాన్ని 1884లో నారాయణ్‌ ఏర్పాటు చేశారు. అదే ఏడాది ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్మికుల సంక్షేమ చర్యలలో భాగంగా ప్రమాదానికి గురైనపుడు సాయం, మరణించినపుడు గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ వంటి వాటిని అమలు జరపాలని కోరుతూ మిల్లు కార్మిక సంఘ అధ్యక్షుడి హౌదాలో ఆ కమిషన్‌కు ఒక పిటీషన్‌ అందచేశారు.దానిపై వేలాది మంది కార్మికుల సంతకాలను సేకరించారు. ఒకవైపు వాటితో పాటు 1884 సెప్టెంబరు 23న తొలిసారిగా కార్మికుల సభను ఏర్పాటు చేసి అవే డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ వారానికి ఒక రోజు ఆదివారం సెలవు ఇవ్వాలని, వుదయం ఆరున్నర నుంచి సాయంత్రం పొద్దుగూకే వరకు మాత్రమే పని చేయించాలని, మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి ఇవ్వాలని కూడా సభ ఒక తీర్మానం చేసింది.అయితే వాటిని యజమానులు అంగీకరించలేదు. 1890 నాటికి ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో ఒక సంక్షోభం వచ్చింది. వస్త్రాలకు డిమాండ్‌ లేని కారణంగా మిల్లులను మూసివేస్తున్నామని యజమానులు ఏకపక్ష చర్యలకు పూనుకున్నారు. దానికి నిరసనగా 1890 ఏప్రిల్‌ 24న లోఖండే ఒక పెద్ద కార్మిక సభను నిర్వహించారు. అదే ఏడాది జూన్‌ పదిన యజమానుల సమావేశంలో ఆదివారం రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. సంఘటిత కార్మికవుద్యమానికి లభించిన విజయమది. మాంద్యం ఎంతకాల కొనసాగుతుందో తెలియదు కనుక ఒక రోజు సెలవు ఇస్తే వచ్చే నష్టం కంటే పని చేస్తే తమపై పడే భారం ఎక్కువ కనుక యజమానులు సెలవుకు అంగీకరించారన్నది మరొక కోణం.


దీన్ని బట్టి యజమానులకు ఏది లాభంగా ఉంటే దాన్నే కోరుకుంటారన్నది స్పష్టం. పన్నెండు గంటల షిప్టు, మూడు రోజుల సెలవు వెనుక ఉన్నది కూడా అదే.మన దేశంతో సహా ప్రపంచమంతటా వినిమయ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు.ఎనిమిది గంటల బదులు పన్నెండు గంటలు చేసి వారానికి మూడు రోజులు సెలవు తీసుకుంటే కుటుంబాలతో సంతోషంగా గడపవచ్చంటూ రంగుల కలను చూపుతున్నారు. ఇలా మార్చాలని అసలు ఎవరు అడిగారు. అన్ని రోజులు సెలవులు గడిపి ఖర్చు చేసేందుకు ఎందరి వద్ద మిగులు ఉంటుంది. పశ్చిమ దేశాలలో జనం ఎంత ఖర్చు చేస్తే అక్కడి కార్పొరేట్లు, వాణిజ్య సంస్థలకు లబ్ది. అందుకోసం అప్పులూ ఇప్పిస్తారు, వాటిని ఖర్చు చేసేందుకు సెలవులూ ఇస్తున్నారు. మన దేశం ఆ స్థితికి ఇంకా చేరిందా? అక్కడున్న మాదిరి సామాజిక రక్షణలు ఇక్కడ ఉన్నాయా ?


2005లో ఆయన స్మారకార్ధం పోస్టల్‌ స్టాంపును విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ లోంఖడేలో జ్యోతిబా పూలే సామాజిక సంస్కరణ, మహిళాభ్యుదయంతో పాటు కారల్‌ మార్క్సు-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ కార్మిక పక్షపాతం కూడా మిళితమై వుందని చెప్పారు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు రావు బహద్దూర్‌ బిరుదును ప్రకటించటాన్ని బట్టి ఒక సంస్కర్తగానే చూసిందన్నది స్పష్టం. ఒక కార్మిక నేతకు అలాంటి బిరుదులను వూహించలేము. అంతమాత్రాన కార్మికోద్యమానికి ఆయన వేసిన బలమైన పునాదిని విస్మంరించకూడదు. మే డే సందర్భంగా పూలే, అంబేద్కర్‌లను విస్మరించలేము. పూలే, ఆయన సత్యశోధక సమాజం, సంస్కరణలకోసం కషే నారాయణ మేఘజీ లోఖండేను కార్మిక పక్షపాతిగా కూడా మార్చిందన్నది స్పష్టం.ఈ సందర్భంగా పూలే, లోఖండే, అంబేద్కర్‌లను వామపక్ష వుద్యమం విస్మరించిందనే ఒక విమర్శ వుంది. అది గత చరిత్ర. నేడు వామపక్షాలు గతం కంటే వారి కషిని గుర్తించిన మాట వాస్తవం. పూలే, అంబేద్కర్‌లను వామపక్షాలు సముచిత స్ధానంతో గౌరవించలేదని విమర్శించే వారు తాజా వైఖరిలో వచ్చిన మార్పును గమనించవచ్చు. ఈ సందర్భంగానే పూలే-అంబేద్కరిస్టులుగా ముద్రపడిన వారు కుల వివక్ష సమస్యకే పరిమితమై కార్మికవర్గ, ఇతర పోరాటాలను విస్మరిస్తున్నారనే విమర్శను మరచి పోకూడదు. అందువలన ఎవరి వైఖరికి వారు కట్టుబడి వున్నప్పటికీ రెండు సమస్యల మీద ఐక్య వుద్యమాలు చేయటానికి అవి ఆటంకం కానవసరం లేదు. అవి శత్రువైరుధ్యాలు కావు.


కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయే తప్ప తగ్గవు అన్నది స్పష్టం. పన్నెండు గంటల షిప్టు నిబంధన అందరికీ వర్తిస్తుంది. దానిలో ఎవరికీ మినహాయింపులు ఉండవు. అందువలన తామేం చేయాలో కూడా కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. అదే మే డే సందేశం. ఎనిమిది గంటల పని దినం కోసం జరిపిన పోరాటాలకు ప్రతి రూపమే మే డే. ఇప్పుడు ఆ విజయాన్ని వమ్ము చేసి పన్నెండు గంటల పనిని రుద్దబోతున్నారు. కార్మికులు ఈ సవాల్‌ను స్వీకరించాలా వద్దా ? ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ల లాభాలు తగ్గేకొద్దీ శ్రమజీవుల సంక్షేమ చర్యల మీద ముందు దాడి జరుగుతుంది. అందువలన ప్రతి పరిణామాన్ని జాగరూకులై పరిశీలించాల్సి వుంది.ఈ రోజుల్లో కూడా మేడే ఏమిటండీ. ప్రపంచమంతా సోషలిజం, కమ్యూనిజం అంతరించిపోయింది. కొంత మంది పొద్దున్నే జండాలు ఎగరేసి, మధ్యాహ్నం నుంచి తాగి తందనాలాడటం, లేకపోతే మొక్కుబడిగా ఒక ర్యాలీ, సభో జరపటం తప్ప చేస్తున్నదేమిటి? అయినా అసలు మేడే గురించి దానిని పాటించే వారికి ఎందరికి తెలుసు, ఒక రోజు పని మానివేయటం తప్ప ఎందుకిది అని పెదవి విరిచే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతోంది. ప్రపంచవ్యాపితంగా కార్మికోద్యమాలు వెనుక పట్టుపట్టిన కారణంగా ఇటువంటి చైతన్య రహిత భావాలు ప్రబలుతున్నాయి. తెల్లచొక్కాల వారు తాము కార్మికులం కాదనుకుంటున్నారు.యాజమాన్యంలో భాగం కాకుండా వేతనం తీసుకొనే ప్రతివారూ కార్మికులే. మే డేని ఎలా జరుపుకోవాలా అన్నది వారి చైతన్యానికి గీటురాయి. ఇది ఒక్క రోజుతో ముగిసేది కాదు. దోపిడీకి గురవుతున్న ప్రతి కార్మికుడు ప్రతి రోజూ మేడేను స్మరించుకుంటూ కార్యోన్ముఖులు కావాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బిజెపి మిత్రోం అదానీ, బికినీలను కాదు సామాన్య జనాన్ని చూడండి !

04 Saturday Feb 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, Farmers, Filims, Health, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Prices, RELIGION, Women

≈ Leave a comment

Tags

BJP, Budget-2023-24, Farmers, Fertilizers subsidies, Food Subsidy, india debt, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసింది. మేం చెప్పాల్సింది చెప్పాం ఇక మీ ఇష్టం అని మంత్రి నిర్మలా సీతారామన్‌ సెలవిచ్చారు. రెండవ సారి తిరుగులేని మెజారిటీతో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ 2.0కు ఇది చివరి బడ్జెట్‌. మూడో సారి 2024లో తిరిగి వస్తారా, ఇంతటితో సరిపెట్టుకుంటారా అన్నది తరువాత చూద్దాం. వివిధ రాష్ట్రాలలో ఈ ఏడాది, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు గనుక ఇప్పటి వరకు మోడీ సర్కార్‌ సాధించిన ఘనత, తాజా బడ్జెట్‌ గురించి బిజెపి శ్రేణులు ప్రచారం చేసేందుకు జనం ముందుకు రానున్నారు. ఈ తీరు తెన్నులన్నింటినీ ఒక్క విశ్లేషణలో వివరించలేం గనుక కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం.


” మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రు.169లక్షల 46వేల 666 కోట్లు. ఈ ఏడాది కొత్తగా చేస్తున్న అప్పులు రు.16 లక్షల 85వేల కోట్లు. కడుతున్న వడ్డీలు రు.10లక్షల 79వేల కోట్లు.1947 నుంచి 2014వరకు 67 ఏండ్లలో 14 మంది ప్రధానులు చేసిన అప్పు 56లక్షల కోట్లు. ఎనిమిదేండ్లలో మోడీ చేసిన అప్పు 114లక్షల కోట్లు. దీనికి గబ్బర్‌సింగ్‌ టాక్సు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వచ్చిన డబ్బు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయింది ? ” అంటూ ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. ఈ వివరాలు మింగుడుపడని మోడీ వీర భక్తులు నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు. స్వల్ప సవరణలతో అవి తిరుగులేని వివరాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌లో చెప్పిన అంశాలే అని గమనించాలి. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లుగా ఉంటుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.


అచ్చేదిన్‌, తనకు అధికారం ఇస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో తూర్పున పొడిచిన సూర్యుడిని పశ్చిమానికి మారుస్తాను అన్నట్లుగా జనాన్ని నమ్మించిన నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన నాటికి ఉన్న అప్పు 56లక్షల కోట్లు కాదు. కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ విదేశీ, స్వదేశీ అప్పు మొత్తం రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు పెంచారు. దాని ప్రకారం ఇప్పటి వరకు మోడీ ఒక్కరే చేసిన అప్పు రు.101,92,887 కోట్లను 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. అందువలన ఇంత అప్పుచేసి సాధించిన ప్రగతి ఏమిటి అని అడగటం తప్పంటారా ? కానేకాదు. కాంగ్రెస్‌ పాలకులు 50 ఏండ్లలో సాధించలేని దానిని తాను తొలి ఐదు సంవత్సరాల్లోనే సాధించానని చెప్పుకున్న నరేంద్రమోడీ ఎలాగూ దీని గురించి నోరు విప్పరు.


గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు శక్తి తగ్గినట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగుదల వలన రోజు రోజుకూ మానవ శ్రమ పని దినాలు తగ్గుతున్నాయి.వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది వలసలే అందుకు పక్కా నిదర్శనం.కనీసం వంద రోజులు పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి పధకానికి 2021-22లో రు.98,468 కోట్లు ఖర్చు చేస్తే 2022-23లో 89,400 కోట్లకు దాన్ని 2023-24లో రు.60వేల కోట్లకు(32.9శాతం) తగ్గించారు. అంటే గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా పని పెరిగింది అనుకోవాలి. ఈ పధకం కింద ఏడాదికి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలని నిర్దేశించారు. గతేడాది సగటున 40 రోజులకు మించలేదు. అందువలన కనీసం లక్షా 40 నుంచి రెండు లక్షల 20వేల కోట్లకు బడ్జెట్‌ను పెంచాలని అనేక మంది డిమాండ్‌ చేశారు. ఏడాది పాటు సాగిన రైతుల ఆందోళనతో దిగి వచ్చి క్షమాపణ చెప్పి మరీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటూ కనీస మద్దతు ధరకు హామీ కల్పించాలన్న డిమాండ్‌ను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామని నరేంద్రమోడీ చెప్పారు. అది ఏమైందో మోడీకే ఎరుక. క్షమాపణ చెప్పే స్థితికి రైతులు తనను నెట్టారన్న కోపమో, పగసాధింపో మరొకటో తెలియదు గానీ 2022-23లో ఎరువులకు ఖర్చు చేసిన రు.2,27,681 కోట్లను రు.1,78,482 కోట్లకు(21.6శాతం) తగ్గించారు.


అదే విధంగా ఆహార సబ్సిడీ రు.2,87,194 నుంచి రు.1,97,350 కోట్లకు(31.3) శాతం కోత పెట్టారు. మొత్తంగా సబ్సిడీలను రు. 5,62,080 నుంచి 4,03,084 కోట్లకు(28.3) శాతం కోత పెట్టారు. వ్యవసాయం-రైతు సంక్షేమ పద్దు కింద 2021-22లో రు.1,22,836 కోట్లు ఖర్చు చేశారు.దాన్ని 2022-23 బడ్జెట్‌లో రు.1,32,14 కోట్లకు పెంచినట్లు గొప్పలు చెప్పారు. ఆచరణలో రు.1,18,913 కోట్లకు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో దాన్ని రు.1,25,036 కోట్లకు పెంచామని చంకలు కొట్టుకుంటున్నారు. దేశంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో చేరి అప్పుల పాలై తిప్పలు తెచ్చుకున్న కుటుంబాలు మనకు ప్రతి చోటా కనిపిస్తాయి. అలాంటి స్థితిలో కేటాయించిన మొత్తాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయకపోవటాన్ని ఏమనాలి ? 2022-23లో విద్యా రంగానికి రు.1,04,278 కోట్లు కేటాయించి రు.99,881 కోట్లు ఖర్చు చూపారు, వర్తమాన బడ్జెట్‌లో రు.1,12,899 కోట్లు ఖర్చు చేస్తామని ప్రతిపాదిస్తే నమ్మేదెలా ? ఇదే పరిస్థితి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉంది. గతేడాది రు.86,201 కోట్లని చెప్పి రు.79,145 కోట్లకు కోత పెట్టారు, ఇప్పుడు 89,155 కోట్లు ఖర్చు పెడతామని మనల్ని నమ్మించేందుకు చూస్తున్నారు.


పైన చెప్పుకున్నట్లుగా ఈ ఏడాది కొత్తగా తీసుకోనున్న 16.85లక్షల కోట్ల అప్పును రైతులు, గ్రామీణ కార్మికులు, జనం కోసం గాక ఎవరికోసం ఖర్చు చేయనున్నట్లు ? పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తితో ముడిపెట్టి బోనస్‌ ఇస్తామని చెబుతున్నవారు పంట పండించే రైతులను ఎందుకు విస్మరిస్తున్నట్లు ? ఏమిటీ వివక్ష – ఎందుకీ కక్ష ? పఠాన్‌ సినిమాలో హీరోయిన్‌ ధరించిన బికినీ కాషాయ రంగులో ఉన్నందున హిందూ మతానికి ముప్పు వచ్చిందని, సినిమా హాళ్లు తగులబెడతామని నానా రచ్చ చేసిన వారే ఇప్పుడు అదానీ దేశభక్తి గురించి అతని కంపెనీల మీద మన శత్రువులు దాడి చేస్తున్నట్లు గుండెలు బాదుకుంటున్నారు. ఆ పెద్ద మనుషులకు కోట్లాది మంది గ్రామీణులున్న రంగాలు, సబ్సిడీల తగ్గింపు ఎందుకు పట్టలేదు, ఒక్కరు కూడా ఎందుకు నోరు విప్పలేదు, ఏ టీవీ ఛానల్‌ కూడా వీటి మీద ప్రత్యేక చర్చలు ఎందుకు పెట్టలేదు. జనం ఆలోచించాలి, దేవదూతగా భావిస్తున్న మోడీ నోట సినిమాల గురించి అనవసరంగా మాట్లాడవద్దని నేరుగా వెలువడింది, హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదంలో అదానీ కంపెనీల గురించి గాక బడ్జెట్‌ గురించి జనంలో మాట్లాడండని బిజెపి అధిష్టానం నేతలను కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కనుక మోడీ భక్తులు గతంలో ఉద్రేకంలో ఏ మాట్లాడినా ఇప్పుడు దాన్ని తగ్గించుకొని పునరాలోచించాలి. ఎవరూ మాట మార్చినట్లు అనుకోరు.


ఇటీవలనే ఆక్స్‌ఫామ్‌ సంస్థ కొంత మంది చేతుల్లో పోగుపడుతున్న సంపదలు, ఏటేటా పెరుగుతున్న శత కోటీశ్వరుల గురించి చెప్పింది. కొత్తగా వస్తున్న పరిశ్రమలు, నరేంద్రమోడీ తన పలుకుబడితో తెచ్చిన విదేశీ పెట్టుబడులు, కార్మికుల పిఎఫ్‌ ఖాతాల పెరుగుదల అంకెలను చూడండని ఊదరగొట్టిన అంశాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.పరిశ్రమలు పెరిగితే, వాటి నుంచి ఖజానాకు తగినంత పన్ను రావటం లేదు, పోనీ ప్రయివేటు కంపెనీలు తాము పొందిన రాయితీలను తిరిగి పెట్టుబడులు పెట్టిన దేశభక్తికి నిదర్శనంగా ఉపాధి పెరగక పోగా నిరుద్యోగ రేటు ఎందుకు పెరుగుతున్నట్లు ? నరేంద్రమోడీ అధికారానికి రాక ముందు కేంద్ర ప్రభుత్వానికి వివిధ రంగాల నుంచి వస్తున్న పన్నులు, మోడీ ఏలుబడిలో వస్తున్న పన్నుల వసూలు తేడాల గురించి చూద్దాం. అంకెలను కోట్ల రూపాయలుగా గమనించాలి.
వనరు×××× 2014-15 ××× 2022-23××× 2023-24అంచనా
కార్పొరేట్‌×× 4,28,925 ××× 8,35,000 ××× 9,22,675
ఆదాయ ×× 2,65,733 ××× 8,15,000 ××× 9,00,575
కస్టమ్స్‌ ×× 1,88,016 ××× 2,10,000 ××× 2,33,100
ఎక్సైజ్‌ ×× 1,89,953 ××× 3,20,000 ××× 3,39,000
జిఎస్‌టి ×× 1,67,969 ××× 8,54,000 ××× 9,56,600
మొత్తంపన్ను××13,64,524×× 30,43,067×× 33,60,858
రాష్ట్రాలకు ×× 3,82,216××× 9,48,405 ×× 10,21,448
ఎగువ అంకెల్లో గమనించాల్సిన అంశాలు 2014-15లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు దక్కిన వాటా 28శాతం కాగా 2020-21లో అది 33.16 శాతం, 2022-23లో31.16శాతం, 2023-24లో 30.3 శాతంగా ఉండనుంది.గత ప్రభుత్వం రాష్ట్రాలకు 32శాతం ఇస్తే తాము 41శాతం ఇచ్చినట్లు బిజెపి చెప్పుకుంది. మరి ఈ అంకెల మతలబు ఏమిటి ? ఈ అంకెలను ఎవరైనా కాదనగలరా ? కార్పొరేట్‌ పన్ను క్రమంగా తగ్గిస్తున్న కారణంగానే గత తొమ్మిది సంవత్సరాల్లో రెండు రెట్లు పెరగ్గా జనాన్ని బాదుతున్న జిఎస్‌టి మాత్రం ఐదు రెట్లు పెరిగింది. ఈ కారణంగానే కార్పొరేట్ల సంపదల పెరుగుదల జన సంపదల తరుగుదల.


కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు బదలాయిస్తున్న తీరు తెన్నులు ఎలా ఉన్నదీ చూద్దాం. దీనిలో రాష్ట్రాలకు కేటాయిస్తున్నది పోను మిగిలిందంతా కేంద్రం వద్దనే ఉంటుంది.
వనరు ××× ఏడాది×××× కేంద్రం ×××× రాష్ట్రాలకు ఇస్తున్నది, శాతం
కార్పొరేట్‌×× 2014-15 ×× 4,28,925 ××× 1,18,235 (27.56)
కార్పొరేట్‌×× 2020-21 ×× 5,57,719 ××× 1,79,716 (32.22)
ఆదాయ ×× 2014-15 ×× 2,65,733 ××× 84.431(31.77)
ఆదాయ ×× 2020-21 ×× 4,70,719 ××× 184.271(39.14)
కస్టమ్స్‌ ×× 2014-15 ×× 1,88,016 ××× 54,759 (29.1)
కస్టమ్స్‌ ×× 2020-21 ×× 1,34,750××× 31,529 (23.39)
ఎక్సైజ్‌ ××2014-15 ×× 1,89,953 ××× 30,920 (16.3)
ఎక్సైజ్‌ ××2020-21 ×× 3,89,667 ××× 19,793 (5.07)
జిఎస్‌టి ××2014-15 ×× 1,67,969 ××× 49,142 (29.25)
జిఎస్‌టి ××2020-21 ×× 5,48,778 ××× 1,76,451 (32.15)
ఎగువ అంకెలను చూసినపుడు మోడీ పాలన తొలి సంవత్సరం ఎక్సైజ్‌ మొత్తంలో రాష్ట్రాలకు కేటాయించిన మొత్తానికి, ఏడు సంవత్సరాల తరువాత మొత్తానికి చాలా తేడా ఉన్నది. కారణం ఏమంటే పెట్రోలు, డీజిలు, ఇతర పెట్రో ఉత్పత్తుల మీద ఎక్సైజ్‌ పన్ను తగ్గించి, సెస్‌లను భారీ మొత్తంలో పెంచారు. సెస్‌లో రాష్ట్రాలకు వాటా ఉండదు కనుక కేంద్రానికి అది కామధేనువుగా మారింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే రోడ్డు సెస్‌ వసూలు చేస్తారు, అదే రోడ్లకు టోల్‌ టాక్సు వసూలు చేస్తారు, వ్యవసాయ సెస్‌ వేస్తారు ఆ రంగానికి కేటాయింపులు తగ్గిస్తారు, స్వచ్చభారత్‌ సెస్‌ వేస్తారు, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా చెత్త పన్ను జనం నుంచి వసూలు చేస్తారు. ఈ తీరు తెన్నుల గురించి ఆలోచించాలా లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఒకే సారి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు : మరోసారి నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడారు ?

28 Saturday Nov 2020

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Election Mode, India Elections, Simultaneous Elections


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఒకే సారి పార్లమెంట్‌-అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్‌ ముందుకు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు తిరస్కరించినప్పటికీ 2014 నుంచీ ఒకే దేశం-ఒకే ఎన్నికలంటూ వదలకుండా చెబుతున్నారు.నవంబరు 26వ తేదీన సభాపతుల 80 జాతీయ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ ప్రతిపాదన ఆలోచన కాదు దేశానికి అవసరం అని, ప్రతి నిర్ణయం జాతీయ ప్రయోజనాల లక్ష్యంగా ఉండాలని చెప్పారు. విడివిడిగా ఎన్నికలు జరగటం వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతున్నందున ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్చించాలని కోరారు. చట్ట సభలతో పాటు స్ధానిక సంస్ధలకూ ఉపయోగపడే ఒకే ఓటర్ల జాబితా తయారు చేస్తే సమయం, నిధులు ఆదా అవుతాయన్నారు. జనం మీద రాజకీయాలే పైచేయి సాధిస్తే జాతి ప్రతికూల మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు.


మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967వరకు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆకాలంలో జరిగిందేమిటి దేశ ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం తెలిసిందే. దాని ఫలితమే 1969లో కొన్ని అసెంబ్లీల రద్దు, తరువాత ముందుగానే 1970లోపార్లమెంట్‌ రద్దు, 1971 ప్రారంభంలో ఎన్నికలు అన్న విషయం తెలిసిందే. ఒక దేశవృద్ది రేటు ఎన్నికల ఖర్చు మీద, ఆ సమయంలో ప్రవర్తనా నియమావళి మీద ఆధారపడదు. ఆయా దేశాల జిడిపిలు, ఆదాయాలతో పోల్చితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాల ఖర్చు నామమాత్రమే. పార్టీలు పెట్టే ఖర్చే దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటోంది. దాని నివారణకు ఒకేసారి ఎన్నికలు పరిష్కారం కాదు. ఏ స్ధానం అభ్యర్ధి ఆ ఓట్ల కొనుగోలు, ప్రచారానికి ఇప్పుటి మాదిరే డబ్బు ఖర్చు చేస్తారు తప్ప మరొకటి జరగదు. ప్రవర్తనా నియమావళి అంటే ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టే కొత్త కార్యక్రమాల ప్రకటనలను నివారించటం తప్ప వాటితో నిమిత్తం లేకుండా ముందే ప్రారంభమై సాగే పధకాల అమలు నిలిపివేత ఉండదు. రైలు మార్గాల నిర్మాణం, విద్యుదీకరణ, ప్రభుత్వ గృహాలు, రోడ్ల నిర్మాణం, పెన్షన్ల చెల్లింపు, చౌకదుకాణాల్లో వస్తువుల సరఫరా వంటివి ఏవీ ఆగటం లేదే.


గతంలో గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ గ్రామీణ ఉపాధి పధకం పనులకు విడుదల చేయాల్సిన నిధులకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే ఆ విషయాన్ని మీడియాలో ఎక్కడా వెల్లడించకూడదని షరతు పెట్టింది. అందువలన ఎన్నికలు జరిగితే పనులు ఆగిపోతాయన్నది ఒక ప్రచార అంశమే తప్ప మరొకటి కాదు. అంతెందుకు హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రకటన తరువాత కూడా అంతకుముందు నుంచి స్వీకరిస్తున్న వరద సహాయ దరఖాస్తులను తీసుకోవచ్చని ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిజెపి ఫిర్యాదు చేసిన తరువాతనే నిలిపివేసింది. అయితే తాము అలాంటి ఫిర్యాదు చేయలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని బిజెపి నేత చెప్పారు.

కొన్నిదేశాల్లో ఒకేసారి జాతీయ, ప్రాంతీయ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ విధంగా చేసి ఖర్చును ఆదాచేయటం వల్ల అభివృద్ధి సాధించినట్లు ఎక్కడా రుజువు లేదు. ఉదాహరణకు అమెరికాలో 1962-2019 మధ్య 57 ఏండ్లలో 26 సంవత్సరాలు తిరోగమన, 16 సంవత్సరాలు ఒక శాతంలోపు, ఐదు సంవత్సరాలు ఒకటి-రెండు శాతం మధ్య వృద్ది నమోదైంది.అమెరికాలో ఎన్నికల ప్రకటన నుంచి పోలింగ్‌ రోజువరకు డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశంలో మాదిరి ప్రవర్తనా నియమావళితో నిమిత్తం లేకుండా అనేక చర్యలు తీసుకోవటాన్ని చూశాము. అక్కడ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎన్నికల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు, ప్రవర్తనా నియమావళి లేదు. అయినా అక్కడ వృద్ధి రేటు తీరుతెన్నులు ఏమిటో చూశాము. కొన్ని ఐరోపా దేశాలలో నిర్ణీత కాలం వరకు చట్ట సభలు రద్దు కావు, ప్రభుత్వాలు మారుతుంటాయి. అలాంటి దేశాలూ అభివృద్ది సమస్యలను, సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి.


ఎప్పుడూ ఏదో ఒక ఎన్నికల వాతావరణమే ఉంటోందని కొందరు పెద్దలు చీదరించుకోవటం చూస్తున్నాం. వీరు ఎన్నికలతో నిమిత్తం లేకుండా నిరంతరం కొనసాగుతున్న ఇతర ‘వాతావరణాల’ గురించి పట్టించుకోరు. మహా అయితే ఐదు సంవత్సరాల కాలంలో మూడు సార్లు ఎన్నికలు జరుగుతాయి. ఈ మాత్రానికే చీదరింపులైతే నిరంతరం కొనసాగుతున్న నిరుద్యోగం, దారిద్య్రం, ధరల పెరుగుదల వంటి ఈతిబాధల వాతావరణం సంగతేమిటి ? ఎప్పుడూ ఎన్నికల వాతావరణమే ఉంటోందని చిరాకు పడుతున్న కడుపు నిండిన వారు కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యల మీద చేసే ఆందోళనలను కూడా వ్యతిరేకిస్తున్నారని గుర్తించాలి. సమ్మెలు, బంద్‌లు చేయటం ఎవరికీ సరదా కాదు, అనివార్యంగా చేస్తున్నవే. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కూడా అలాంటివే.


నిజానికి ఇప్పుడు కావాల్సింది ఒకే సారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్దిల్లే విధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్దతి ఎన్నికల సంస్కరణలు కావాలి. ఒకేసారి ఎన్నికలు జరపాలని సూచన చేసిన పార్లమెంటరీ స్ధాయీ సంఘం నివేదికలో దక్షిణాఫ్రికా, స్విడ్జర్లాండ్‌లను ఉదహరిస్తూ నిర్ణీత తేదీకి అక్కడ ఎన్నికలు జరుపుతారని పేర్కొన్నారు. (అమెరికా కూడా అలాంటిదే.) అయితే ఈ రెండు దేశాల్లో పార్టీల జాబితాలతో దామాషా ప్రాతిపదికన చట్ట సభల్లో సీట్లు కేటాయిస్తారు. ఆ విషయం మాత్రం స్ధాయీ సంఘానికి పట్టలేదు. అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50రాష్ట్రాల్లో రెండు చోట్ల తప్పు మిగిలిన చోట్ల మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్ట్రరల్‌ కాలేజీ ప్రతినిధులను మొత్తంగా కేటాయిస్తారు. అందువలన గత ఎన్నికల్లో మొత్తంగా ఓట్లు తక్కువ తెచ్చుకున్నా అధ్య క్ష పదవిని ట్రంప్‌ గెలిచారు. మన మాదిరి నియోజకవర్గాల ప్రాతిపదిక విధానంలో డబ్బున్న పార్టీలే ప్రాతినిధ్యం పొందగలుగుతున్నాయి. కొన్ని పార్టీలకు వచ్చిన ఓట్ల మేరకు ప్రాతినిధ్యం ఉండటం లేదు. దామాషా ప్రాతినిధ్య విధానంలో డబ్బుతో ఓట్లు కొన్నప్పటికీ అలాంటివారు ఎన్నికయ్యే అవకాశం ఉండదు కనుక ఎవరూ డబ్బు పెట్టరు, నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడి కావటానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలు, వ్యక్తులు డబ్బున్నవారికే పెద్దపీట వేస్తూ అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే దామాషా ప్రాతినిధ్యం(ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు) గురించి వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ మాట్లాడవు.


తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగతుందని కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో నేటి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు వాదించారు. ఒకే సారి ఎన్నికలు జరిగితే ఇలాంటి అవకాశం ఉండదని చెప్పారు. ఇంకా కొందరు ఇదే విధమైన వాదనలు చేస్తున్నారు. పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పధకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన పెద్దలు దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం, జనాన్ని తప్పుదారి పట్టించే వ్యవహారమే.
ప్రతిదానికీ ప్రజాస్వామ్య జపం చేసే వ్యక్తులు, శక్తులూ అభివృద్ధి, ఖర్చు తగ్గించాలనే పేరుతో ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం కలిగించే ప్రతిపాదన ముందుకు తెస్తున్నారు. ఇది ఫెడరల్‌ సూత్రాలకు, రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్దం. ఏక వ్యక్తి ఆధిపత్యానికి దారి తీస్తుంది. అందువలన ఇది ఇక్కడికే పరిమితం అవుతుందన్న హామీ ఏముంది ? అసలు బిజెపి ఈ ప్రతిపాదనను పదే పదే ఎందుకు ముందుకు తెస్తున్నది ? దీన్ని మూడు దశలుగా చూడాలి. ఒకటి వాజ్‌పేయి హయాం, మరొకటి రెండవ సారి బిజెపికి కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం వచ్చిన తరుణం, కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయం అని మూడు అంశాలుగా చూడాల్సి ఉంది. అతల్‌ బిహారీ వాజ్‌పాయి ప్రధానిగా ఉన్న 1999లో లా కమిషన్‌ ద్వారా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. తరువాత యుపిఏ పాలనలో దాని ప్రస్తావన లేదు. తిరిగి నరేంద్రమోడీ వచ్చిన తరువాత దానికి దుమ్ముదులిపారు. నీతి ఆయోగ్‌ ద్వారా ముందుకు తెచ్చారు. తరువాత లా కమిషన్‌ నిర్మాణాత్మక అవిశ్వాసం పేరుతో మరొక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టటానికి ముందు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సభ విశ్వాసం పొందాలని చెప్పారు.


ఐడిఎఫ్‌సి అనే ఒక సంస్ధ 1999 నుంచి 2014వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమాచారాన్ని విశ్లేషించింది. ఒకేసారి జరిగితే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఓటర్లు ఒకే పార్టీని ఎంచుకొనేందుకు 77శాతం అవకాశాలుంటాయని పేర్కొన్నది. ఐఐఎం అహమ్మదాబాద్‌ డైరెక్టర్‌గాగా ఉన్న జగదీప్‌ ఛోకర్‌ జరిపిన విశ్లేషణ కూడా దీన్నే చెప్పింది. 1989 నుంచి ఒకేసారి జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 24 ఉదంతాలలో ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో దాదాపు ఒకే విధమైన శాతాలలో ఓట్లు పొందాయి. కేవలం ఏడు సందర్భాలలో మాత్రమే ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఈ కారణంగానే గతంలో కాంగ్రెస్‌ మాదిరి ప్రస్తుతం దేశవ్యాపితంగా ఉన్న బిజెపి ఒకేసారి ఎన్నికలు జరిగితే తనకు ఉపయోగమని, ఉన్న అధికారాన్ని మరింతగా సుస్ధిరపరచుకోవచ్చని, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే అవకాశాలను తగ్గిస్తాయని గత ఆరు సంవత్సరాలుగా పార్టీ భావిస్తున్నది. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సింది ఉంది. అదే జరిగితే రాష్ట్రాలలో, కేంద్రంలో ఏ కారణాలతో అయినా ప్రభుత్వాలు కూలిపోతే నిర్ణీత వ్యవధి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంది. దాని అర్ధం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని అధికారమే పరోక్షంగా ఉంటుంది.


ఇది కరోనాకు ముందున్న నేపధ్యం.ఈ మహమ్మారితో నిమిత్తం లేకుండానే వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం కారణంగా తలెత్తిన రైతాంగ ఉద్యమాలు, పదిహేనేండ్ల పాటు అధికారంలో కొనసాగిన రాష్ట్రాలలో బిజెపికి తగిలిన ఎదురు దెబ్బలు తెలిసిందే.కరోనా వ్యాప్తి ప్రారంభానికి ముందే దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారింది. ఈ కాలంలో మరింత దిగజారి వరుసగా రెండు త్రైమాస కాలాల్లో తిరోగమన వృద్ది నమోదై తొలిసారిగా దేశం మాంద్యంలోకి పోయింది. వచ్చే ఆరు నెలల కాలంలో కూడా పరిస్ధితి పెద్దగా మెరుగుపడే అవకాశాలు లేవని పాలక పార్టీ పెద్దలకు ముందే తెలుసు. వచ్చే రెండు సంవత్సరాల కాలంలో కూడా పూర్వపు స్దాయికి చేరుకొనే అవకాశాలు కష్టమని అనేక మంది ఆర్ధికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. అదే జరిగితే ఇంతకాలం దేశం వెలిగిపోతోందని బిజెపి చేస్తున్న ప్రచారం తుస్సుమంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం అనివార్యం. అందువలన ముందుగానే రాజ్యాంగ సవరణల వివాదాన్ని ముందుకు తెచ్చి అభివృద్ది నినాదం మాటున జమిలి ఎన్నికలకు పోవాలన్న ఆలోచన కనిపిస్తోంది. కరోనా ప్రభావం గురించి దేశమంతా ఆందోళన చెందుతోంటే ఆగస్టు 13న ప్రధాని కార్యాలయం స్దానిక సంస్ధలతో సహా అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా తయారీ సాధ్యా సాధ్యాల గురించి చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలా చేయాలంటే ముందుగా ఆర్టికల్‌ 243కె, 243జడ్‌, ఏ లకు సవరణలు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది. దీనికి ప్రధాని ముఖ్యకార్యదర్శి పికె మిశ్రా అధ్యక్షత వహించారు. ఇప్పుడు ప్రధాని మరోసారి ముందుకు తెచ్చారు. పాలకపార్టీ, అధికార యంత్రాంగంలో జరుగుతున్న ఈ చర్చ, కదలికల కారణంగానే అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నాయి.


దేశ అభివృద్ది, ప్రయోజనాల గురించి తమకు తప్ప మరొకరికి పట్టవని, అలాగే దేశభక్తి ఇతరులకు లేనట్లుగా, దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నట్లు గత ఆరున్నర సంవత్సరాలుగా ఒక పధకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే 101వసారి నిజంగా మారుతుందని సూత్రీకరణ చేసిన జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ తరహా ప్రచారం ఇదని కొందరు చెప్పటాన్ని కొట్టిపారవేయలేము. స్వాతంత్య్రమా-పరాయి పాలనా దేన్ని ఎంచుకోవాలన్నదాని మీద సాగిన స్వాతంత్య్ర ఉద్యమంలో బిజెపిని ఏర్పాటు చేసిన సంఘపరివార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర లేకపోగా సావర్కర్‌ వంటి కొందరు బ్రిటీష్‌ వారికి లొంగిపోయి ప్రభుత్వానికి సేవ చేస్తామని రాసి ఇచ్చిన చరిత్ర కళ్ల ముందు ఉంది. దాని కొనసాగింపుగానే క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారు. ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన ముస్లింలీగుతో కలసి రాష్ట్ర ప్రభుత్వాల్లో పాల్గొన్న హిందూమహాసభలోని వారు ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులే అన్నది తెలిసిందే. ప్రధాని మోడీ సభాధ్యక్షుల సమావేశంలో చెప్పిన దేశ అభివృద్ది, ప్రయోజనాల కబుర్లు రాజ్యాంగ మౌలిక స్వభావానికి తూట్లు పొడిచి జమిలి ఎన్నికలను రుద్దేందుకు పూనుకున్నారా అన్న అనుమానాలను ముందుకు తెస్తున్నాయి.


2022నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు నిండుతుంది. ఆ సమయానికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తానని చెప్పిన ప్రధాని ఆ బాటలో తీసుకున్న చర్యలేమీ లేవు. కానీ ఒకే దేశం ఒకే ఎన్నికలంటూ పదే పదే మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఉన్న మెజారిటీ, దేన్నయినా బలపరిచే ఇతర పార్టీలు కూడా ఉన్నందున ఒక్క రోజులోనే కాశ్మీర్‌ రాష్ట్రాన్నే రద్దుచేసినట్లు ఒకేసారి ఎన్నికల కోసం జనాభిప్రాయాన్ని తోసిపుచ్చి రాజ్యాంగ సవరణలు చేయటం నరేంద్రమోడీకి ఒక పెద్ద సమస్య కాదు. అలాంటి పరిణామం జరిగినా ఆశ్చర్యం లేదు. అందువలన ఈ నేపధ్యంలో అలాంటి ఎన్నికలకు వ్యతిరేకత తెలపటం తప్ప ఉన్న ఆటంకాలు, లాభనష్టాలు ఏమిటి అని తలలు బద్దలుకొట్టుకోవటం కంఠశోష తప్ప మరొకటి కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతులకు పెట్టుబడి సాయం- మోడీ సర్కార్‌ బండారం !

08 Saturday Jun 2019

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, Literature., Loksabha Elections, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

agriculture in india, cash support schemes for farmers, Distressed farm sector, Modi sarkar secrecy, PM-KISAN scheme

Image result for cash support schemes for farmers

ఎం కోటేశ్వరరావు

ఢిల్లీ మెట్రోలో మహిళలకు వుచిత ప్రయాణం కల్పించాలనే ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వ ఆలోచన లేదా నిర్ణయం రాబోయే ఎన్నికలలో లబ్ది పొందేందుకే అని బిజెపి గోలగోల చేసింది. ఐదేండ్లూ చేయని ఆలోచన ఇప్పుడు చేస్తున్నారని రుసరుసలాడింది. అధికారమే యావగా వున్న పార్టీలకు ప్రత్యర్ధుల ఎత్తులు బాగా అర్ధం అవుతాయి. చిన్న, సన్నకారు రైతాంగానికి ఏడాదికి ఆరువేల రూపాయలు వ్యవసాయ పెట్టుబడి సొమ్ము చెల్లించాలని నరేంద్రమోడీ సర్కార్‌ ఐదేండ్లూ ఏమీ చేయకుండా హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు తాత్కాలిక బడ్జెట్‌లో వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే పధకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్నేమనాలి ? రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలలో బిజెపి ఓడిపోవటం, అంతకు ముందు పలుచోట్ల రైతాంగ ఆందోళనల నేపధ్యంలో ఓట్లకోసం మోడీ సర్కార్‌ ఆ పని చేసిందన్నది బహిరంగ రహస్యం. ఆమ్‌ ఆద్మీ కూడా అంతే !

ఆమధ్య, బహుశా ఇప్పటికీ సామాజిక మాధ్యమంలో తిరుగుతూనే వుండి వుంటుంది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ వెనెజులాలో అమలు జరుపుతున్న సంక్షేమ పధకాల మాదిరే మన దేశంలో కూడా ప్రకటిస్తున్నారు, దేశాన్ని దివాలా తీయిస్తారు జాగ్రత్త అనే అర్ధంలో ఒక పోస్టు పెట్టారు. సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిన ప్రతిసారీ ప్రతి చోటా దేశాన్ని దివాలా తీయించటంతో పాటు జనాన్ని సోమరులుగా మారుస్తున్నారనే వాదనలు వినిపిస్తూనే వున్నాయి. కిలో రెండు రూపాయల బియ్యం పధకం, గతంలో పనికి ఆహార పధకం, ఇప్పుడు మహాత్మాగాంధీ గ్రామీణ వుపాధి పధకం, నిరుద్యోగ భృతి ఇలా ఒకటేమిటి ప్రతిదానికి ఏదో ఒక కారణం చూపి వ్యతిరేకించే వారు మనకు కనిపిస్తారు. ఇది మనదేశం లేదా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. అమెరికాలో కూడా ఆరోగ్యబీమా, ఆహార కూపన్లు( మన దగ్గర రెండురూపాయల బియ్యం పధకం మాదిరి), నిరుద్యోగభృతి, స్కూళ్లలో వుచిత మధ్యాహ్నభోజన పధకం, బలహీనవర్గాలకు గృహనిర్మాణం, పిల్లల సంరక్షణ సహాయం వంటి పధకాలన్నీ జనాన్ని ప్రభుత్వం మీద ఆధారపడే విధంగా చేస్తాయని, పనిచేయటానికి ఇష్టపడని వాతావరణాన్ని సృష్టిస్తాయనే అభిప్రాయాలు బలంగా వ్యక్తం చేసే పార్టీలు, శక్తులలో రిపబ్లికన్లు ముందుంటారు. ఓడిపోయినా సరే పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేయకూడదు, సోమరిపోతులను తయారు చేయకూడదని చెప్పేవారు మనకు అన్ని చోట్లా కనిపిస్తారు. పన్నుల రూపంలో తాము చెల్లించిన మొత్తాలను సంక్షేమ పధకాల పేరుతో కొంత మందికి దోచిపెడుతున్నారని, ఎందుకు పెట్టాలనే భావం దీని వెనుక వుంటుంది. ఇలాంటి వారు మహాఅయితే వికలాంగులు, పని చేయలేని వారి వరకు ఏదో దయా దాక్షిణ్యంగా సాయం చేసేందుకు సరే అంటారు.

Image result for cash support schemes for farmers

ఈ వాదన నిజమే అనుకుందాం, సంక్షేమ పధకాల పేరుతో పొందుతున్న నిధులను కుటుంబ అవసరాలు లేదా వినియోగానికి ఖర్చు చేస్తారనే అంగీకరిద్దాం. దాని వలన లబ్ది పొందేది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులే కదా ! అంటే వారి వుత్పత్తులు వినియోగించేవారు లేకపోతే పరిశ్రమలూ నడవవు, వ్యాపారాలూ సాగవు. వుదాహరణకు వృద్దులకు ఇచ్చే పెన్షన్లూ, పిల్లలను బడికి పంపిన తలిదండ్రులకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాల వంటివి వాటిని ఏదో ఒక అవసర నిమిత్తం ఖర్చు చేసుకొనేందుకు తప్ప మరొకందుకు కాదు. అసలేమీ ఆదాయం లేకపోతే వారికి ఇచ్చే సొమ్ము వస్తు లేదా సేవల మార్కెట్లోకి వచ్చే అవకాశం వుండదు. ఆ మేరకు లావాదేవీలు తగ్గిపోతాయి. పెట్టుబడిదారీ వ్యవస్ధలో అనారోగ్యంతో వుంటూ పని చేయలేకపోతే అలాంటి వారిని భారంగా ఆ సమాజం భావిస్తుంది. పని చేస్తేనే పెట్టుబడిదారులకు లాభం. అందుకోసమైనా జనానికి వైద్య రాయితీలు ఇచ్చేందుకు పెట్టుబడిదారులకు అనుకూలమైన పాలకులు ముందుకు వస్తారు. అవి తమ ఘనతగా ఫోజు పెడతారు. ఎన్నికల ప్రచారానికి వాడుకుంటారు పని చేయగలిగిన వారు అనారోగ్యాలకు గురైతే సంభవించే నష్టం ఎంతో గతంలో అనేక సర్వేలు, పరిశోధకులు అంచనా వేశారు. సంక్షేమ పధకాల వెనుక దాగి వున్న అంశాలలో ఇవి కొన్ని. అన్నింటి కంటే వీటి గురించి ప్రపంచ బ్యాంకు ఏమి చెప్పిందనేది మరొక ముఖ్యాంశం.

ఎస్కే వాన్‌ గిల్స్‌, ఎర్డెమ్‌ ఓరక్‌ అనే ఇద్దరు పరిశోధకుల వ్యాసాన్ని సేజ్‌ వెబ్‌సైట్‌ 2015లో ప్రచురించింది. దానిలో అంశాల సారాంశాన్ని చూద్దాం.(అసక్తి వున్నవారు ఇక్కడ ఇస్తున్న లింక్‌లో దానిని పూర్తిగా చదువుకోవచ్చు). ‘ అభివృద్ధి చెందుతున్న మరియు సంధి దశలో వున్న దేశాలలో సామాజిక సాయం: రాజకీయ మద్దతు సాధన, రాజకీయ అశాంతిని అదుపు చేసేచర్య ‘ అన్నది దాని శీర్షిక. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధల ఏర్పాటుతో రెండవ ప్రపంచ యుద్దం తరువాత మార్కెట్లను అదుపులోకి తెచ్చుకొనేందుకు సూచించిన విధానాలనే నయా వుదారవాద విధానాలు లేదా నూతన ఆర్ధిక విధానాలు అని పిలుస్తున్నారు. ఆ విధానాలను అమలు జరుపుతున్నామని చెప్పుకొనే ధైర్యం లేని పాలకవర్గం వాటికి సంస్కరణలు అనే ముద్దు పేరు పెట్టి జనం మీద రుద్దారు. తామే ప్రవేశపెట్టామని చెప్పుకున్నారు. ప్రపంచ బ్యాంకు 1980-2013 మధ్య సిఫార్సు చేసిన 447 విధానపరమైన పత్రాలను ప్రచురించింది. వాటిని తీసుకున్న పరిశోధకులు తేల్చిన సారం పైన పేర్కొన్న శీర్షికలో వుంది. తమకు అభివృద్ధి తప్ప రాజకీయ అజెండా లేదు అని ప్రపంచబ్యాంకు ఎంతగా చెప్పుకున్నా, అవి వెల్లడించిన పత్రాలలో పరోక్షంగా చేసిన ప్రస్తావనల ప్రకారం ఆయా దేశాలలో తలేత్తే సామాజిక అశాంతిని చల్లార్చేందుకు, పక్కదారి పట్టించేందుకు, తమ విధానాలను అమలు జరుపుతున్న పాలకులకు రాజకీయ మద్దతు వుండాలంటే ఏమి చేయాలో ప్రపంచబ్యాంకు నిపుణులు సూచించారు. వాటిలో భాగమే సంక్షేమ పధకాలు.

Image result for cash support schemes for farmers-ysrcp

లాటిన్‌ అమెరికాలో అనేక దేశాలలో మిలిటరీ, ఇతర నియంతలను సమర్ధించటం, గద్దెనెక్కించి తమ ప్రయోజనాలను నెరవేర్చుకున్న అమెరికా, ఇతర ధనిక దేశాలు వుక్కు పాదాలతో జనంలో తలెత్తిన అసంతృప్తి, తిరుగుబాటును అణచలేమని గ్రహించి వారిని తప్పించి ప్రజాస్వామ్య పునరుద్దరణ పేరుతో తమకు అనుకూలమైన శక్తులను అధికారంలోకి తెచ్చారు. ఇది కూడా ప్రపంచబ్యాంకు సలహా ప్రకారమే అన్నది గమనించాలి.లాటిన్‌ అమెరికాలో జరిపిన ప్రయోగంలో నియంతలను తొలగించినా జనంలో అసంతృప్తి తొలగలేదని గ్రహించారు. అందువల్లనే సామాజిక సహాయ పధకాలను ముందుకు తెచ్చారు. ఈ పూర్వరంగంలో మన దేశంలో 1990దశకంలో తలుత్తిన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ బ్యాంకు షరతులను మన పాలకులు ఆమోదించారు. వాటికే సంస్కరణలు, నూతన ఆర్ధిక విధానాలు, నూతన శతాబ్దంలోకి తీసుకుపోతామనే తీపి కబుర్లు చెప్పారు. పాలకులకు ప్రజల నుంచి నిరసన ఎదురు కాకుండా చూసేందుకు 1995లో మన దేశంలో సామాజిక సహాయపధకాలకు శ్రీకారం చుట్టారు. వాటిలో భాగమే వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్‌లు తదితరాలు. తరువాత అవి ఇంకా విస్తరించాయి.

రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పిన నరేంద్రమోడీ 2014లో గద్దెనెక్కిన తరువాత అనుసరించిన విధానాలు రైతాంగంలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. చివరికి పదిహేను ఏండ్లుగా ఎదురులేని రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ రైతాంగాన్ని బుజ్జగించేందుకు, ఆ పరిస్ధితిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకొనేందుకు రూపొందించిందే ఎన్నికలకు ముందు రైతులకు పెట్టుబడి సాయం పధకం. రెండవ సారి గద్దెనెక్కిన తరువాత నరేంద్రమోడీ సర్కార్‌ ప్రకటించిన రైతుల భాగస్వామ్య పెన్షన్‌ పధకం అన్నది స్పష్టం. ఇలాంటి పధకాల గురించి ప్రపంచబ్యాంకు గతంలోనే సూచించింది. తెలంగాణాలో చంద్రశేఖరరావుకు రైతు బంధు పధకం గురించి సలహాయిచ్చిన అధికార యంత్రాంగానికి వాటి గురించి తెలుసు, కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని కూడా అవగాహన వుంది కనుకనే ముందుగా ప్రకటించి అమలు జరిపిన ఖ్యాతిని పొంది ఎన్నికల్లో ఎలా వినియోగించుకున్నారో చూశాము.

Image result for cash support schemes for farmers

నయా విధానాలు రైతాంగానికి గిట్టుబాటుగా లేవు, అందుకే వారు పదే పదే రుణగ్రస్తులౌతున్నారు. ఒకవైపు వారికి రుణమాఫీలు చేస్తాం, సాగు చేసినా చేయకపోయినా భూయజమానులకు నేరుగా వ్యవసాయ ఖర్చుల సాయం పేరుతో నేరుగా నగదు అందిస్తాం అని పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలలో అమలు జరుపుతున్నాయి.రాబోయే రోజుల్లో ఇంకా రావచ్చు కూడా. ఈ సంక్షేమ పధకాలు శాశ్వతమా అంటే అవునని ఎవరూ చెప్పలేరు. వీటితో సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే కావని లాటిన్‌ అమెరికా అనుభవాలే తిరిగి చెబుతున్నాయి. అక్కడ అధికారంలోకి వచ్చిన వామపక్ష శక్తులు మౌలిక విప్లవ సంస్కరణల జోలికి పోలేదు. నయా వుదారవాద పునాదుల మీద నిర్మించిన వ్యవస్ధల పరిధిలోనే అనేక సంక్షేమ పధకాలను అమలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. వాటిని కూలదోసేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు చేసే నిరంతర కుట్రలు ఒక భాగమైతే, వామపక్ష ప్రభుత్వాలు అనుసరించిన విధానలకు వున్న పరిమితులు కూడా వెల్లడయ్యాయి. అందుకే పదిహేనేండ్లు, ఇరవై సంవత్సరాల తరువాత ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. జనం ప్రజాకర్షక మితవాదులను గుడ్డిగా నమ్ముతున్నారు. తెలంగాణా పసుపు రైతులు, ఎర్రజొన్నల రైతులు కూడా రైతు బంధు పధకంతో లబ్ది పొందిన వారే. అయినా సరే మార్కెట్లో తమ వుత్పత్తులకు పడిపోయిన ధరలు అంతకంటే ఎక్కువ నష్టాన్ని కలిగించాయి గనుకనే ఎన్నికలు ముగిసిన వెంటనే రోడ్డెక్కారు. లోక్‌సభ ఎన్నికలలో దాన్నొక సమస్యగా ముందుకు తెచ్చారు.

Image result for cash support schemes for farmers

మన ఆహార వుత్పత్తి పెరగటానికి దోహదం చేసిన వాటిలో రసాయన ఎరువుల వినియోగం ఒక ముఖ్యపాత్రపోషించింది. రైతులకు తగినంత ఆదాయం లేదు కనుక ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. సంస్కరణల పేరుతో అమలు జరుపుతున్న నయా వుదారవాద విధానాలు వాటికి మంగళం పాడమని వత్తిడి చేసి విజయం సాధించాయి. పోషకాల ప్రాతిపదికన(ఎన్‌బిఎస్‌) సబ్సిడీ విధానం మరొక పేరు ఏదైనా పెట్టనివ్వండి, ఒక్క యూరియా మినహా మిగిలిన అన్ని మిశ్రమ, ఇతర రకాల ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సమాచారం ప్రకారం 2017 నవంబరు నుంచి 2018నవంబరు మధ్యకాలంలో మనం దిగుమతి చేసుకొనే యూరియా, డిఏపి, ఎంఓపి, ఫాస్పారిక్‌ యాసిడ్‌, రాక్‌ ఫాస్ఫేట్‌, అమోనియా, సల్పర్‌లలో మొదటి ఐదు రకాల ధరలు సగటున 21.47శాతం పెరిగాయి. చివరి రెండింటి ధర 8.51శాతం తగ్గింది. అంటే ఒక కిలో ధర వంద రూపాయలు అనుకుంటే ఏడు కిలోల ఎరువులు కొంటే ఏడాది కాలంలో ఐదింటికి అదనంగా చెల్లించింది రు.107 .35, రెండింటికి తగ్గిన ధర రు 17.02 నికరంగా రైతుమీద పడిన భారం 90రూపాయలకు పైమాటే. 2010-11లో డిఏపి క్వింటాలు ధర రు.1075, ఎంఓపి రు.505రులు వుండగా, మరుసటి ఏడాదికి అవి రు.1775, రు.1036కు పెరిగాయి.2018 నవంబరులో గరిష్ట ధరలు రు.2,862, రు.1799గా వున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో ఎరువుల సబ్సిడీ రు.74570 కోట్లనుంచి 70100 కోట్లకు తగ్గాయి. ఆరు సంవత్సరాల సగటు రు.73,024 కోట్లు అంటే ధరల పెరుగుదలతో నిమిత్తం లేకుండా సబ్సిడీ మొత్తం స్ధిరంగా వుందంటే పెరుగుతున్న ధరల భారాన్ని రైతాంగమే మోస్తోంది. ఈ కాలంలో రూపాయి విలువ పతనమై అదనపు భారాన్ని మోపింది. ఇది యుపిఏ మన్మోహన్‌ సింగ్‌-బిజెపి మోడీ పాలనా కాలం.పాలకులు మారినా సబ్సిడీ మొత్తం మారలేదు.

2002-03 నుంచి 2008-09 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తంలో ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీల వాటా 26.56శాతం నుంచి 62.22 శాతానికి పెరిగింది. అంటే వంద రూపాయల సబ్సిడీ ఇస్తే దానిలో ఎరువులకు రూ 62.22, దీన్ని జిడిపితో పోల్చి చూస్తే మొత్తం జిడిపిలో 0.48 నుంచి 1.51శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ 2018-19నాటికి నిఖర ఎరువుల సబ్సిడీ 26.51 శాతానికి జిడిపిలో 0.43శాతానికి తగ్గింది. రైతులకు ఎంతో మేలు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ హయాం తొలి ఏడాది 2014-15లో 0.62శాతం వుండగా ఐదేండ్లలో అది 0.43శాతానికి పడిపోయింది. ఐదేండ్ల సగటు నిఖర సబ్సిడీ 28.73శాతంగానూ, జిడిపిలో సగటు 0.51శాతంగా వుంది. అంటే చివరి ఏడాది గణనీయ మొత్తం తగ్గిపోయింది. అక్కడ మిగిల్చిన మొత్తంలో కొంత రైతులకు పెట్టుబడి సాయం పేరుతో బదలాయించి అదనపు సాయం అన్నట్లుగా ప్రచారం చేసుకొని ఎన్నికల్లో రైతాంగాన్ని మాయచేసిన తీరును చూశాము.

Image result for cash support schemes for farmers

జరిగిన మోసం, దగా ఎలా వుందో చూద్దాం. ఎరువుల సబ్సిడీ విధానంలో మార్పు పేరుతో నూట్రియంట్స్‌ ప్రాతిపదికన సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. నిజానికి ఇది ఎడమ చేయి కాదు పుర చేయి అని చెప్పటమే.ఎన్‌పికె మిశ్రమ ఎరువును రైతు ఒక కిలో కొనుగోలు చేశారని అనుకుందాం. ఆ మూడింటికి కలిపి 2010లో ఇచ్చిన సబ్సిడీ రూ.24.66 వుంటే 2014-15 నాటికి రూ.18.35కు, 2018-19కి రూ.15.08కి తగ్గిపోయింది. అందువల్లనే పైన పేర్కొన్నట్లుగా బడ్జెట్‌లో సబ్సిడీ మొత్తాలను పెంచలేదు. గత పదేండ్ల కాలంలో పది రూపాయల వరకు రైతుల సబ్సిడీ కోత పడింది. ఇదిగాక మార్కెట్లో పెరిగిన ధరలు అదనం. దీన్నే చెంపదెబ్బ గోడదెబ్బ అంటారు. వ్యవసాయ పెట్టుబడుల మొత్తం పెరగటానికి ,రైతాంగానికి గిట్టుబాటు కాకపోవటానికి ఇదొక కారణం కాదా ! ఒక దగ్గర తగ్గించి మరొక దగ్గర ఇవ్వటం వలన అసలు సమస్య పరిష్కారం కాదు. సంక్షేమ పధకాలు శాశ్వతం అని చెప్పలేము. ఏదో ఒకసాకుతో రద్దు చేసినా ఆశ్చర్యం లేదు. ఒక వేళ కొనసాగించినా పెరుగుతున్న ఖర్చులతో పోల్చితే అవి ఏమూలకు సరిపోతాయన్న ప్రశ్న వుండనే వుంది. అసలు లేని దాని కంటే ఎంతో కొంత సాయం చేస్తున్నారుగా ! అని ఎవరైనా అనవచ్చు. అదే ఆ సంతృప్తితో వ్యవసాయ రంగంలో తలెత్తుతున్న ఆగ్రహాన్ని చల్లార్చటమే అసలు లక్ష్యం. పోగాలము దాపురించినపుడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పసుపు-కుంకము పేరుతో బదలాయించిన డబ్బు తెలుగుదేశం పార్టీని కాపాడగలిగిందా ! ఎవరికైనా అదే గతి, వెనుకా ముందూ తేడా అంతే !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d