• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Science

సముద్రంలో చైనా డేటా సెంటర్‌ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్‌ దార్శనికులా !

27 Monday Oct 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Environment, Europe, Germany, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

# China underwater data center, BJP, CHANDRABABU, China, Data Centers, Data centers Employment, Narendra Modi Failures, Vizag Google Data Center, Xi Jinping, YS jagan

ఎం కోటేశ్వరరావు

సముద్రంలో చైనా నిర్మించిన పదమూడు వందల టన్నుల బరువుగల డేటా సెంటర్‌ ఆదివారం నాడు(2025 అక్టోబరు26న) ప్రారంభమైంది. ఇది గాలి మరలతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వినియోగించనుంది. హై క్లౌడ్‌ అనే కంపెనీ మొదటి దశలో భాగంగా 24మెగావాట్ల కేంద్రాన్ని షాంఘై తీరంలో నెలకొల్పింది. న్యూస్‌ అట్లాస్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం సముద్రపు ఒడ్డున నిర్మించిన గాలి మరల విద్యుత్‌ కేంద్రం నుంచి 95శాతం విద్యుత్‌ను ఈ కేంద్రానికి సరఫరా చేస్తారు, సముద్రపు నీటిని చల్లబరిచేందుకు వినియోగిస్తారు. మొత్తం 22.6 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేంద్రంలో సాంప్రదాయపు డేటా సెంటర్ల కంటే 23శాతం విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. సముద్రంలో 114 అడుగుల అడుగున ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలోని ఒక్కో గదిలో 4 నుంచి ఐదు వందల సర్వర్లు ఉంటాయి. సముద్రంలో ఏర్పాటు చేసిన టెలికాం కేబుళ్ల ద్వారా ఈస్ట్రన్‌ డేటా, వెస్ట్రన్‌ కంప్యూటింగ్‌ వ్యూహం ప్రకారం ప్రధాన భూభాగంలోని కేంద్రానికి అనుసంధానం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివే మరో వందగదులను నిర్మించి విస్తరిస్తారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ చైనాలో 2015లో పైలట్‌ ప్రాజక్టుగా సముద్రంలో ఒక డాటా కేంద్రాన్ని నిర్మించింది. ప్రాజెక్ట్‌ నాటిక్‌ పేరుతో చేసిన ఈ ప్రయోగానికి స్వస్తి పలికి 2024జూన్‌లో దాన్ని సముద్రంలో ముంచివేసింది. ఆదివారం నాడు సముద్రంలో తొలి వాణిజ్య డాటా కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించిన తొలి దేశంగా చైనా చరిత్రకెక్కింది. ఇలాంటివే మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఈ కేంద్రం చైనాలో అతి పెద్ద తొలి స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఉన్న హైనాన్‌ సమీపంలో ఉంది. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో నిర్మించారు.

విశాఖలో అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీలతో కలసి గూగుల్‌ నిర్మించనున్న డేటా కేంద్రం ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందన్నది చర్చ. లింక్‌డ్‌ఇన్‌లో వచ్చిన ఒక విశ్లేషణ జర్మనీలోని బిఎఎస్‌ఎఫ్‌ రసాయన కంపెనీతో డేటా సెంటర్ల ఉపాధిని పోల్చింది. సదరు జర్మనీ సంస్థ 684మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది, 50వేల మందికి పూర్తి స్థాయి ఉపాధిని కల్పిస్తున్నది. అదే జర్మనీలో డాటా కేంద్రం 2,283మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగించే చోట పూర్తి కాలపు ఉపాధి 6,849 నుంచి 13,699 మందికి చూపుతుంది. రసాయన ఫ్యాక్టరీ ఒక మెగావాట్‌కు 73 మందికి ఉద్యోగ కల్పన చేస్తుంటే డేటా సెంటర్‌ ఒక మెగావాట్‌కు 3 నుంచి ఆరు ఉద్యోగాలను ఇస్తున్నది. గూగుల్‌ ఆధునిక సాంకేతిక ప్రక్రియలను వినియోగిస్తుంది గనుక ఇంకా తగ్గవచ్చు. ఆ లెక్కన చూసినా విశాఖలో నిర్మించే ఒక గిగావాట్‌(వెయ్యి మెగావాట్లు) కేంద్రం మూడు నుంచి ఆరువేల మందికి పర్మనెంటు ఉద్యోగాలను కల్పిస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలు దీనికి దగ్గరగా ఉన్నాయి. దానికి భిన్నంగా రాష్ట్ర మంత్రి లోకేష్‌ చెప్పారు. ఇద్దరికి సమాచార వనరు ఏమిటి ? ఈ విషయాన్ని చెప్పటానికి బిడియపడాల్సిందేముంది. అదే గూగుల్‌ను అడిగితే అందించిన ఇతర విశ్లేషణలు కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలన్నీ సాధ్యమైనమేరకు తక్కువ మందితో పని చేయించుకొనేందుకు చూస్తాయి. కన్సిడర్‌ మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన సిడ్నీలోని డాటా కేంద్రం 2023లో అకస్మాత్తుగా ఆగిపోయింది. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా జరిగిన ఆ అంతరాయం 46 గంటల పాటు సేవల నిలిపివేతకు దారితీసింది. అప్‌టైమ్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ సిబ్బంది కొరత గురించి పేర్కొన్నది. ప్రపంచ డాటా సెంట్లర్లలో 2019లో ఇరవైలక్షల మంది పూర్తి కాలపు ఉద్యోగులు ఉంటే 2025 నాటికి కేంద్రాలు పెరిగినా 23లక్షల మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులా అన్నది వివరణ లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న 122 గిగావాట్ల సామర్థ్యంలో సగటు తీసుకుంటే ఒక్కో గిగావాట్‌కు 18,700 ఉన్నట్లు కనిపిస్తున్నది. విశాఖ గూగుల్‌ సెంటర్‌కు అందరూ కలసి 20 నుంచి 30వేల మంది ఉంటారని కూడా పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. డాటా కంపెనీలు సిబ్బందిని చేర్చుకోవటం, నిలుపుకోవటంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చిన్న కేంద్రాలు(ఒకటి నుంచి ఐదు మెగావాట్లు) 8 నుంచి 15 మంది, ఐదు నుంచి ఇరవై మెగావాట్ల కేంద్రాలు 15 నుంచి 35 మంది, ఇరవై అంతకు మించిన సామర్ధ్యం కలిగినవి 35 మందికి పైగా, 40 మెగావాట్ల సంస్థలు 45 మందిని, వంద మెగావాట్లు అంతకు మించి సామర్ధ్యం కలిగినవి కొద్దిమందితోనే నిర్వహిస్తున్నాయి, ఎందుకంటే యాంత్రీకరణ మరియు నిర్ణీత ప్రమాణాలతో ఉండే వ్యవస్థలు అందుకు దోహదం చేస్తున్నాయి. నియమించుకుంటున్నాయి. డేటా సెంటర్లలో మొత్తం 230 రకాల సిబ్బంది అవసరం అని చెబుతున్నారు. అయితే చిన్న సంస్థలు అంతమందిని నియమించవు, అవి అవసరమైనపుడు పొరుగు సేవలను ఉపయోగించుకుంటాయి. సగం డేటా సెంటర్లు అవసరమైన నిపుణులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి.

రెండును రెండుతో కలిపినా, హెచ్చవేసినా ఫలితం నాలుగే. ఇది చెప్పటానికి గణితమేథావులతో పనిలేదు. డేటా సెంటర్లతో కలిగే పర్యావరణహాని, విషపూరితమైన వ్యర్ధాల వంటి ఇతర దుష్ఫలితాల గురించి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెప్పినా(అఫ్‌ కోర్స్‌ అధికారంలో ఉన్నపుడు ఈ పెద్దమనిషి వీటి గురించి చెప్పలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నోరు విప్పరు) ఆ రంగం గురించి అధ్యయనం చేసినవారు చెప్పినా విషయం ఒకటే. ఎవరైనా రాజకీయాలతో నిమిత్తం లేని వారు చెబితే చూశారా రాష్ట్ర అభివృద్దిని వ్యతిరేకించేవారు జగన్‌తో చేతులు కలిపి అవే వాదనలు చేస్తున్నారంటూ ప్రచారదాడికి దిగుతున్నారు. అంటే నోరు మూయించేందుకు ఇదొక రకం నియంతృత్వపోకడతప్ప మరొకటి కాదు. తేమ కారణంగా యంత్రాలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అమెరికాలోని డేటా కేంద్రాలన్నీ పొడివాతావరణం ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారని చెబుతున్నారు.పెట్టుబడిలో నాలుగో వంతు సబ్సిడీలు, సంవత్సరాల తరబడి రాయితీ ధరలకు నీరు, విద్యుత్‌ అందచేస్తున్న తరువాత ఏ పెట్టుబడిదారుడు మాత్రం చంద్రబాబు నాయుడి దరిచేరడు ! డాటా సెంటర్‌ మాప్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం గూగుల్‌కు ప్రపంచంలో 113 డాటా సెంటర్లు ఉండగా వాటిలో 68 పని చేస్తున్నాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎందరు ఉద్యోగులు పని చేస్తున్నారని అడిగితే సమాచారం లేదని బదులు వచ్చింది. ప్రపంచంలో గూగుల్‌ సంస్థలో లక్షా 83వేల మంది పనిచేస్తున్నారనే సమాచారం ఉంది తప్ప ఏ విభాగంలో ఎందరు అన్నది లభ్యం కావటం లేదు. ఎవరికైనా దొరికితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. మానవహక్కుల ఫోరం(హెచ్‌ఆర్‌ఎఫ్‌) సమాచారం ప్రకారం అమెరికాలోని అష్‌బర్న్‌ మరియు లీస్‌బర్గ్‌ డాటా సెంటర్లు రెండిలోనూ కలిపి ప్రత్యక్షంగా 400 మందికి పరోక్షంగా 3,100 మంది ఉపాధి దొరుకుతున్నట్లు పేర్కొన్నది.లోకేష్‌ చెప్పినట్లు లక్షా 88వేల ఉద్యోగాల్లో 88వేలు పర్మనెంటు అనుకుంటే మొత్తం గూగుల్‌ ఉద్యోగులు విశాఖలోనే ఉంటారన్నట్లుగా భావించాలి, అది జరిగేదేనా !

ఇంటర్నెట్‌ వెతుకులాటలో డాటా సెంటర్ల ఉపాధి గురించి ఎవరెటు తిప్పి చెప్పినా పెట్టుబడులు, స్థలాల విస్తీర్ణం ఎక్కువ, ప్రత్యక్ష ఉపాధి తక్కువ, పరోక్ష ఉపాధి గురించి మాత్రమే వెల్లడవుతున్నది. పరోక్షం అంటే భవనాల నిర్మాణ సమయంలో దొరికే ఉపాధి, వాటి చుట్టూ ఉండే నివాసాలతో కలిగే లబ్ది గురించి మాత్రమే ప్రస్తావన ఉంటున్నది. ఆ లెక్కన బడా పరిశ్రమలు అంతకంటే ఎక్కువ కల్పిస్తున్నాయి. వస్తూత్పత్తిలో చైనాను పక్కకు నెట్టే ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా దేశాన్ని మారుస్తామన్న మాటలు ఇప్పుడు ఎకువగా వినిపించటం లేదు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గురించి కబుర్లు పెరిగాయి.ఒకదానికి ఒకటి పోటీ కాదు, పరస్పరం సాయం చేసుకొనేవే.పెట్టుబడులు ఎక్కువ ఉపాధి తక్కువ ఉండే టెక్‌ కంపెనీల కోసం మోడీ, చంద్రబాబు వంటి వారు వెంపర్లాడుతున్నారు. ఒకసారి భవనాల నిర్మాణాలు పూర్తయిన తరువాత తాత్కాలిక కార్మికులకు పని ఉండదు. ఆటోమేషన్‌ ప్రధాన ప్రక్రియగా నడిచే ఈ కేంద్రాలలో కీలకమైన సిబ్బంది ఎవరంటే సెంటర్ల మేనేజర్లు, నెట్‌వర్క్‌ మరియు వ్యవస్థల అడ్మినిస్ట్రేటర్లు, సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక నిపుణులు, వారికి సహాయ సిబ్బంది.

ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఏటా పదివేల కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. డేటా సెంటర్లు అవసరమే, అయితే అవి కొత్త సమస్యలను సృష్టించకూడదు. మనదేశంలో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం గురించి తెలిసిందే. పాలకులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారంటే ఉత్పత్తులకు తప్ప కాలుష్యానికి కాదు, దాన్ని నివారించేందుకు పరిశ్రమలే చర్యలు తీసుకోవాలన్న నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేస్తే తమ లాభాలు తగ్గుతాయని తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో ఫార్మా, ఇతర సంస్థల నుంచి వెలువడుతున్న కాలుష్యం సమీపంలోని సముద్రంలో కలుస్తున్నది. దాంతో మత్స్యకారుల ఉపాధికి దెబ్బతగులుతున్నది. పరిష్కరించండి మహానుభావా అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అడిగితే ఈ మధ్యే మాట్లాడుతూ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది తాము కాదని, వంద రోజుల గడువులో పరిష్కరిస్తానని చెప్పారు. అధికారానికి వచ్చి 15నెలల తరువాత ఈ మాటలు చెప్పిన పెద్ద మనిషి ఇంతకాలం ఏం చేస్తున్నట్లు ?

డేటా అనేక విధాలుగా కీలక పాత్ర పోషిస్తున్న పూర్వరంగంలో మనదేశం కూడా వెనుకపడకూడదు. కానీ నరేంద్రమోడీ లేదా రెండింజన్ల పాలనలో ఉన్న ప్రభుత్వాలు గానీ ఎంతో నిర్లక్ష్యం చేశాయన్నది అంకెలే చెబుతున్నాయి.2019లో 350 మెగావాట్ల సామర్ధ్యం ఉండగా 2025 నాటికి 1,350 మెగావాట్లకు చేరుతుందని చెబుతున్నారు. ఈ రంగంలో మిగిలిన దేశాలు ఎంతో ముందున్నాయి.దీనికి కూడా నెహ్రూయే కారణం అని చెబుతారేమో తెలియదు. ముందు చూపు లేకపోవటం తప్ప మరొకటి కాదు.చైనాలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు లేవు, మైక్రోసాఫ్ట్‌ కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో తప్ప ప్రభుత్వం వినియోగించటం లేదు.కృత్రిమ మేథ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో చైనా వెనుకబడిందని శత్రువులు కూడా చెప్పలేరు.తాజా సమాచారం ప్రకారం 2024నాటికి చైనాలో డేటా వాణిజ్య విలువ 47.23 బిలియన్‌ డాలర్లు కాగా 2030 నాటికి అది 97.30బి.డాలర్లకు పెరుగుతుందని రిసర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ సంస్థ పేర్కొన్నది. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ మరోవిధంగా ఉంది.అమెరికాలో 2025 నాటికి డాటా సెంటర్ల ఆదాయం 171.9 బిలియన్‌ డాలర్లు, కాగా చైనాలో 103.19 బిలియన్‌ డాలర్లని 2030 నాటికి 142.64 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. మరో సమాచారం ప్రకారం ప్రపంచ డేటా సెంటర్ల సామర్ధ్యం 2024నాటికి 122.2 గిగావాట్లు. దీనిలో అమెరికా 53.7(44శాతం) కలిగి ఉండగా చైనా 31.9 గిగావాట్లు కలిగి ఉంది. మూడో స్థానంలో ఒక కూటమిగా ఐరోపా యూనియన్‌ 11.9 గిగావాట్లు, మనదేశం 3.6గా ఉంది.చైనాలో ఇటీవల జత చేసిన సామర్ధ్యాన్ని పని చేయించటం లేదని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి అర్ధం అవుతున్నదేమిటి ? దేశం వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలన్నింటా వృద్ది చెందితేనే డేటా కేంద్రాలకు చేతినిండా పని ఉంటుంది. గడచిన పదకొండు సంవత్సరాలుగా కబుర్లు తప్ప అభివృద్ధి లేని కారణంగా డేటా సెంటర్ల సామర్ధ్యం కూడా పెరగలేదన్నది స్పష్టం.విశ్లేషణలను కొనుగోలు చేసేవారు లేకపోతే రేపు విశాఖ గూగుల్‌ సెంటర్‌ అయినా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే.

దేశాన్ని, రాష్ట్రాన్ని వికసిత్‌ భారత్‌లో ఎక్కడికో తీసుకుపోతామని ప్రధాని నరేంద్రమోడీ, ఆయన అడుగుజాడల్లో లేదా అడుగులకు మడుగులద్దుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మంది దృష్టిలో దేశంలో అతి పెద్ద దార్శనికులు, ఇతరులకు తట్టనివి అనేకం వారికి కనిపిస్తాయని చెబుతారు. ఆ ప్రచారం వలన దేశానికి ఎంత లాభమో తెలియదు గానీ నష్టం కలిగిస్తున్నారంటే ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి) నేడు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో చెప్పనవసరం లేదు.తన పాలనలో జిడిపిని పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి తెచ్చిన ఘనత నాదే అంటారు మోడీ. కాసేపు అంగీకరిద్దాం, ఆ పురోగతి ఇతర రంగాల్లో ఉందా ? వాటిలో కీలకమైన పరిశోధనకు కేటాయింపుల సంగతేమిటి ? 1995-96 నుంచి 2014-15వరకు రెండు దశాబ్దాల వార్షిక సగటు జిడిపిలో 0.73 శాతం ఉంది. యుపిఏ పాలనలో 2008-09లో జిడిపిలో 0.8శాతం నిధులు కేటాయిస్తే మోడీ ఏలుబడిలో 2017-18లో 0.7, ఇప్పుడు 0.64శాతానికి తగ్గించారు. దీనికైతే జవహర్‌లాల్‌ నెహ్రూ కారణం కచ్చితంగా కాదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే భావజాలంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల ఈ నిర్వాకాన్ని చంద్రబాబు నాయుడు సమర్ధిస్తారా ? 2013 నాటి సైన్స్‌ మరియు టెక్నాలజీ విధానంలో, 2017-18 ఆర్థిక సర్వేలో కూడా కనీసం రెండు శాతం కేటాయించాలని చెప్పిన అంశం ఎవరికీ తెలియదా ? ఇద్దరు నేతలు దేశ దేశాలు తిరుగుతున్నారు కదా ఎక్కడ ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోరా ? ఎందుకీ నిర్లక్ష్యం ? మన అభివృద్ధి మీద గణనీయమైన ప్రభావం చూపాలంటే 2047నాటి వరకు కనీసం ఒక శాతం, ఆదర్శవంతంగా(ఐడియల్‌) ఉండాలంటే మూడుశాతం చొప్పున ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు. పిండికొద్దీ రొట్టె, పరిశోధనా రంగంలో మనం ప్రపంచ బస్‌ను అందుకోకుండా చేసింది ఎవరంటే ఎవరిని చూపాలి ? పరిశోధనలకు మనం తక్కువ కేటాయిస్తున్నా, పరిశోధనా పత్రాలు గణనీయంగానే మనవారు సమర్పిస్తున్నారుగా అని సమర్ధించుకొనే వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు ! ఎలాంటి పాలకులను మోస్తున్నాంరా బాబూ అని తల పట్టుకోవాలి !!

సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు ;

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?
https://vedikaa.com/2025/10/25/are-data-centers-godowns-or-production-houses-what-is-the-truth-about-ycp-and-tdp-claims-on-employment/

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?

25 Saturday Oct 2025

Posted by raomk in AP, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Science, STATES NEWS, TDP, Ycp

≈ Leave a comment

Tags

AI, CHANDRABABU, Nara lokesh, Vizag Google Data Center, YS jagan

ఎం కోటేశ్వరరావు

ఆంధ్ర ప్రదేశ్‌లో కొద్ది రోజుల పాటు చర్చ నడిచింది. ఇప్పుడు పాతబడిపోయింది, జనం కూడా మరచిపోయారేమో ! చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడైన మంత్రి లోకేష్‌ ఎడాపెడా దేశదేశాలు తిరిగి పుంఖాను పుంఖాలుగా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తుంటే ఉబ్బితబ్బిబ్బు అవుతున్నవారు ఎన్నని గుర్తు పెట్టుకుంటారు.ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తున్నారన్నది పట్టించుకోవాల్సిన అంశం కాదు. బాక్సాఫీసు వద్ద తన సినిమాల గురించి ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముందే చెప్పుకున్న చర్చ ఏమిటంటే డేటా సెంటర్‌ అంటే ఏమిటి ? అదో గోడౌన్‌ రెండు వందల మంది కంటే పని చూపదు, కాదు లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి, తెలుగుదేశం, దానికి వంత పాడే జనసేన, బిజెపి నేతల నుంచి వెలువడుతున్న మాటల సారమిది. గూగుల్‌ డేటా సెంటర్‌ వలన 1.88లక్షల ఉద్యోగాలు వస్తాయని మంత్రి లోకేష్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఈ వాదనలను వ్యతిరేకిస్తే ఒక ముద్ర, సమర్ధిస్తే మరో ముద్ర. మూడో పక్షం వారు ఎవరైనా ఈ రెండు వాదనలతో ఏకీభవించినా, లేక అదే మాదిరి చెప్పినా వారితో రంకు కట్టి చీల్చి చెండాడుతున్నారు. అందుకనే మేథావులు నోరు విప్పటం లేదా లేక రంగుపడుద్ది అని భయపడుతున్నారా ? పోనీ మీడియా మంచీ-చెడును విశ్లేషించే వారేం చెబుతున్నారో పాఠకులు, వీక్షకులకు అందించేందుకు చూస్తున్నాదా అంటే అదీ లేదు. తాము సమర్ధించే పార్టీలు, వ్యక్తులు, శక్తుల ప్రయోజనాలకు హాని లేవనుకున్నవాటిని మాత్రమే వడగట్టి అందచేస్తున్నది. అందువలన రాసేవారు కూడా అనవసర ఆయాసం ఎందుకని ఊరుకొని ఉండవచ్చు. రెండు రెళ్లు నాలుగు అని చంద్రబాబో, జగనో చెబితే ఎవరైనా అవును అన్నారా వారి ఖర్మ కాలిందే, రంగుపడుద్ది. జనం విచక్షణా రహితంగా తయారయ్యారా అంటే వారిని అలా తయారు చేశారు అని చెప్పక తప్పదు. జగన్‌కు ఓటేసిన వారందరూ ఆయన చెప్పిందే వేదంగానూ, లేదా మూడు పార్టీల కూటమికి మద్దతు ఇచ్చిన వారందరూ ఆ పార్టీల నేతలు చెప్పిందే పరమ సత్యంగా గుడ్డిగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది, వేరేది ఏదీ వినిపించుకొనే స్థితిలో లేరన్నది ఒక నిజం. ఇంతకీ విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్‌ డేటా సెంటర్‌ గోడవునా, ఉత్పత్తి కేంద్రమా, ఒక ప్రక్రియ నిర్వహించేదా ? కృత్రిమ మేథకేంద్రం అని కూడా కలుపుతున్నారు. దేశంలో, ప్రపంచంలో ఇప్పటికే గూగుల్‌, ఇతర టెక్నాలజీ కంపెనీలు కృత్రిమ మేథ గురించి ఎంతో ముందుకు పోయాయి, వినియోగంలోకి ఇప్పటికే వచ్చేసింది. విశాఖలో కొత్త పరిశోధనలు చేస్తామంటారా ? అదీ చూద్దాం !

నేను ఒక సామాన్యుడిని గనుక చాట్‌ జిపిటిని ఇదే ప్రశ్న అడిగా, అది ఇచ్చిన సమాధానం గురించి వివరిస్తా.” మంచి ప్రశ్న- దీన్ని గురించి జాగ్రత్తగా వివరించనివ్వండి. చాట్‌ జిపిటి (నా వంటి వారు-నేను కాదు, చాట్‌ జిపిటి తన గురించి చెప్పుకుంది) ఒక కృత్రిమ సేవ, దీన్ని నడిపేది ఓపెన్‌ ఏఐ.మనం డేటా(సమాచారం) రక్షణ లేదా గోప్యత చట్టాల (జిడిపిఆర్‌ వంటి )గురించి మాట్లాడుకున్నపుడు సాధారణంగా వాటి పాత్ర ఉంటుంది.1. డాటా సేకరణ లేదా ఉత్పత్తిదారు : వీరు ఎందుకు, ఎలా వ్యక్తిగత సమాచార ప్రక్రియ(ప్రోసెస్‌)ను చేయాల్సిందీ నిర్ణయిస్తారు. 2.డేటా ప్రోసెసర్‌ : డాటా కంట్రోలర్‌ తరఫున వ్యక్తిగత సమాచారాన్ని ప్రోసెస్‌ చేస్తుంది. 3. డేటా సెంటర్‌ : ఎక్కడ డేటా నిల్వ చేస్తారో మరియు ప్రోసెస్‌ చేస్తారో దానికి అవసరమైన భౌతిక సదుపాయాలు( సర్వర్స్‌, నిల్వ, నెట్‌వర్కింగ్‌)-సాధారణంగా మైక్రోసాఫ్ట్‌ అజుర్‌, గూగుల్‌ క్లౌడ్‌ లేదా ఎడబ్ల్యుఎస్‌ కంపెనీలు వీటిని నిర్వహిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాట్‌జిపిటి అనేది డాటా ప్రోసెసర్‌ లేదా సేవ అందించే సాధనం, ఓపెన్‌ ఎఐ అంటే డాటాను కంట్రోల్‌ చేసేది, అజూర్‌ లేదా అంతకంటే చిన్నవి డాటా సెంటర్లు లేదా మౌలిక సదుపాయాలను అందించేవి. దీన్నిబట్టి ఎవరికి వారు డేటా సెంటర్‌ గురించి స్వంత అవగాహన ఏర్పరుచుకోవచ్చు, ఇంకా కావాలంటే శోధించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

ఇక చాట్‌ జిపిటి వంటి సాధనాలు ఇప్పటికే కొన్ని ఉన్నాయి,రానున్న రోజుల్లో మరికొన్ని కూడా వస్తాయి.పైన పేర్కొన్న సమాచారాన్ని పొందాలంటే డేటా సెంటర్‌కు అయ్యే విద్యుత్‌, ఇతర నిర్వహణ ఖర్చుల గురించి తెలియదు గానీ ఒక అరలీటరు నీరు ఖర్చు అవుతుందని చదివా.బహుశా పరికరాలు వేడెక్కి దెబ్బతినకుండా చల్లబరిచేందుకు అవసరమైన నీరు కావచ్చు. చాట్‌ జిపిటిని కొద్ది నెలల క్రితం మరో ప్రశ్న అడిగా. అదేమిటంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019వరకు, తరువాత ఐదేండ్లు జగన్‌ అధికారంలో ఉన్నపుడు వివిధ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలెన్ని, అవి వాస్తవరూపందాల్చినవి, వాటి విలువ ఎంత అని అడిగా. ఒక టీవీ చర్చలో వీక్షకులకు నిజం చెప్పేందుకు తప్ప జగన్‌కు అనుకూలంగానో, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగానో కాదు.( ఎవరికైనా కావాలంటే నేను సేకరించిన వాటిని అందచేస్తా) వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి చెప్పిన అంశాలవి, వాటికి రుజువులు,సాధికారిత గురించి అడిగితే ఏ ప్రభుత్వం కూడా తమ ఘనతల గురించి సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో ఎక్కడా సమాచారాన్ని అందుబాటులో ఉంచటం లేదు గనుక నమ్మటమా లేదా అన్నది ఎవరిష్టం వారిది. నేనైతే నమ్మాను గనుకనే చెబుతున్నా.మనోభావాలు గాయపడతాయని భయపడేవారు, ఊరికూరికే గాయపరుచుకొనే వారు వివరాలు చదవకండి అని కూడా చెబుతున్నా.

చాట్‌జిపిటి అందించిన సమాచారం ప్రకారం ” చంద్రబాబు ఏలుబడి 2014 నుంచి 2019 వరకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల విలువ రు.18.87లక్షల కోట్లు.2019 ఏప్రిల్‌ నాటికి వాస్తవరూపం దాల్చిన వాటి విలువ రు.60వేల కోట్లు, పురోగతిలో ఉన్నవి రు.67వేల కోట్లు ( పురోగతి అంటే శంకుస్థాపన మొదలు వివిధ దశల్లో ఉన్నవి(తరువాత కొన్ని రద్దు కూడా కావచ్చు, వాస్తవ రూపం దాల్చినవి సగటున ఏడాదికి రు.పన్నెండువేల కోట్లు.) మరో సందర్భంలో చాట్‌జిపిటి చెప్పినదాని ప్రకారం 2016 నుంచి 2018 వరకు సంతకాలు చేసిన అవగాహన ఒప్పందాల విలువ రు.12.32లక్షల కోట్లు కాగా 309 ప్రాజెక్టులతో వాస్తవ రూపం దాల్చినవి రు.1.39లక్షల కోట్లని పేర్కొన్నది. ఇక వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఏలుబడి గురించి చాట్‌ జిపిటి ఏం చెప్పిందో చూద్దాం. 2019 నుంచి 2022 వరకు ఆమోదం తెలిపిన పథకాల విలువ రు.1,81,221 కోట్లు కాగా ఏడాదికి సగటున అమల్లోకి వచ్చిన వాటి విలువ రు.15,693. వివరాల్లోకి వెళితే 2019 జూన్‌ నుంచి 2021 మే నెల మధ్య కాలంలో 65 పెద్ద పరిశ్రమల పెట్టుబడి రు. 29,781 కోట్లు, కాగా ప్రభుత్వం నివేదించిన దాని ప్రకారం 2019 నుంచి 2022 మార్చి నెల మధ్య వచ్చినట్లు చెప్పిన పెట్టుబడి రు.43వేల కోట్లు, దీనిలో పెద్ద పరిశ్రమల వాటా రు.36,303 కోట్లు, ఎంఎస్‌ఎంఇల వాటా రు.7,018 కోట్లు. నూతన పెట్టుబడుల గురించి చూస్తే 2018-19 నుంచి 2022-23వరకు ప్రకటించిన పథకాల విలువ రు.9,41,020 కోట్లు కాగా పూర్తయిన వాటి విలువ రు.1.34 లక్షల కోట్లు. పెండింగ్‌లో ఉన్న రు.27,110 కోట్ల ప్రాజెక్టును పునరుద్దరించారు. సంక్షిప్తంగా వివరాలు ఇలా ఉన్నాయి.

కాలం×××××వాస్తవ రూపం దాల్చినవి×××ప్రకటించినవి

2019-22×× రు.1,81లక్షల కోట్లు ప్రభుత్వ ఆమోదం పొందినవి

2019-21×× రు.29,781 కోట్లు ×××—-

2019-22×× రు.43,000 కోట్లు ×××—-

2018-19నుంచి 2022-23×× —××× రు.9.41లక్షల కోట్లు

2024-2025 ××—— ×××రు.9.2- 9.34లక్షల కోట్లు.

గమనిక : జగన్మోహనరెడ్డి ఏలుబడి చివరి సంవత్సరం పదకొండు నెలల్లో ఏకంగా తొమ్మిది లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పటం ద్వారా తాము కూడా తక్కువ తినలేదని చెప్పుకొనేందుకు చూసినట్లు కనిపించింది.

చంద్రబాబు నాయుడు జనసేన, బిజెపితో కలసి కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సంగతేమిటని అదే చాట్‌ జిపిటిని అడిగితే చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్‌ చెప్పినదాని ప్రకారం మొదటి ఏడాదిలో నమోదైన లేదా ఆకర్షించిన పెట్టుబడుల ప్రతిపాదనల విలువ రు.14లక్షల కోట్లు, ఈ మొత్తంలో లాంఛనంగా భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలతో ఎస్‌ఐపిబి ఆమోదం తెలిపిన వాటి మొత్తం రు.9.2లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు నిర్ధారించినదాని ప్రకారం కొత్త పెట్టుబడులు 9.62లక్షల కోట్లని, అవి అమల్లోకి వస్తే 8.79లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి.పరిశ్రమల మంత్రి టిజి భరత్‌ పెట్టుబడులు రు.9.4లక్షల కోట్లని, ఉద్యోగాలు 8.5లక్షలని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్‌ ఇద్దరూ ఎడాపెడా తాజాగా కుదుర్చుకుంటున్న ఒప్పందాలతో ఇప్పటి వరకు మొత్తం విలువ ఎంతో అధికారికంగా వెల్లడిస్తే తప్ప తెలియదు, వివరాలు వెల్లడిస్తారని ఆశిద్దాం.

విశాఖ గూగుల్‌ డేటా సెంటర్‌ అని చెబుతున్నప్పటికీ అది గూగుల్‌తో పాటు అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీల భాగస్వామ్యం కలిగిన కంపెనీ. వాటి పెట్టుబడి రు.1.25లక్షల కోట్లు లేదా 15 బిలియన్‌ డాలర్లు. ఆ కంపెనీకి ఇవ్వదలచిన రాయితీల విలువ రు. 22వేల కోట్లని వార్తలు వచ్చాయి. ఇంతేనా ఇంకా ఎక్కువా చెప్పలేము. ఇంత మొత్తం అప్పనంగా ఇస్తున్న తరువాత ఒప్పందాల వెనుక ముడుపులు లేకుండా ఉంటాయా ? సమస్యే లేదు. బహుళజాతి గుత్త కంపెనీలు, దేశీయ బడాకంపెనీలు ఇచ్చే లంచాలను నిరూపించలేముగానీ అవి ఇవ్వటం, పుచ్చుకోవటం నిజం. రాయితీలు, కంపెనీ ఏర్పాటుతో తలెత్తే పర్యావరణ సమస్యలు, పరిష్కారాలు, వచ్చే ఉపాధి గురించి కంపెనీల విశ్లేషణ నివేదికలను బహిర్గత పరిస్తేనే జనాలకు స్పష్టత వస్తుంది. ప్రజల సొమ్మును ఇలాంటి కార్పొరేట్లకు వేల కోట్ల మేర సబ్సిడీలుగా ఇస్తున్నపుడు తెలుసుకోవటం పౌరుల హక్కు, పారదర్శకతను పాటించటం పాలకుల విధి, ఎందుకంటే అవి వారి జేబుల్లోంచి ఇవ్వటం లేదు మరి. అదానీ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు 20 కోట్ల డాలర్లు లేదా 1,750 కోట్ల రూపాయలు ముడుపులుగా ఇచ్చినట్లు అమెరికాలో నమోదైన కేసు గురించి ఆంధ్ర ప్రదేశ్‌ లేదా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి అలాంటిదేమీ జరగలేదు, జగన్‌, అదానీ మచ్చలేని వారు అని నిర్ధారించటమైనా చేయాలి, ఏదీ లేదు, తోడు దొంగల వ్యవహారం తప్ప ఇది మరొకటి కాదని ఎవరైనా అంటే తప్పేముంది ? విశాఖ డేటా కేంద్రం కల్పించే ఉపాధి గురించి తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిందేమిటి ? భారత్‌ ఏఐ శక్తి పేరుతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా ఐదు నుంచి ఆరువేల వరకు పర్మనెంటు ఉద్యోగాలు, మొత్తంగా 20 నుంచి 30వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.( అక్టోబరు 14వ తేదీ పిఐబి విడుదల చేసిన ప్రకటన) ఒకే పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి లోకేష్‌, కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలకు ఇంత తేడా ఎలా ఉంది ? ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది వైసిపి, తెలుగుదేశం వారు ఏమి చెప్పారన్నది పక్కన పెడితే ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న గూగుల్‌ కంపెనీ చెప్పిన సంఖ్య ఎంతో ఎక్కడా కనిపించలేదు. ఎందుకీ దాపరికం ? సదరు కంపెనీ వ్యాపార వ్యూహాలతో మనకు పనిలేదు. ఎన్ని సంవత్సరాల వ్యవధిలో ఎంత పెట్టుబడి పెట్టేది,పర్మనెంటు ఉద్యోగాలు ఎన్నివచ్చేది కచ్చితంగా ప్రకటించాల్సిందే. ఎందుకంటే దానికి జనం సొమ్మును రాయితీలుగా ప్రభుత్వం ఇస్తున్నది గనుక తెలుసుకొనే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది, ప్రభుత్వమైనా అధికారికంగా ప్రకటించాలి, అది దాని బాధ్యత, జవాబుదారీ తనం, కాదంటారా !సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు

సముద్రంలో చైనా డేటా సెంటర్‌ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్‌ దార్శనికులా !
https://vedikaa.com/2025/10/27/china-underwater-data-center-where-socalled-visionaries-narendra-modi-and-chandrababu-failed/

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇది కదా కమ్యూనిస్టుల ముందు చూపు – మేథోవలస- తిరిగి రాకపై దశాబ్దాలనాడే చైనా ముందు జాగ్రత్త !

24 Wednesday Sep 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

BJP, Brain drain and Gain, China, china communist party, Donald trump, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

రానున్న రోజుల్లో తమ దేశానికి హెచ్‌ 1 బి వీసా మీద వచ్చే వారు లక్ష డాలర్లు(88 లక్షలరూపాయలు) చెల్లించాల్సి ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయం భారతీయులను విస్మయానికి గురిచేసింది. అనేక మంది డాలర్‌ కలలు కల్లలైనట్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయానికి ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా కార్పొరేట్లు తెచ్చే వత్తిడికి లొంగి సవరించుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ప్రపంచ వ్యాపితంగా మేథోవలస-తిరిగి రాకల గురించి మధనం ప్రారంభమైంది.ట్రంప్‌ నిర్ణయం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది మరికొంత స్పష్టత వచ్చిన తరువాతనే చెప్పుకోవటం మంచిది. ఈ సందర్భంగా వచ్చిన కొన్ని వ్యాఖ్యలు, పత్రికా శీర్షికలు, వాటి వెనుక ఉన్న అంశాల గురించి చూద్దాం. అమెరికా లక్షల డాలర్ల ఫీజు కేవలం ఒక చెడ్డ విధానమేగాక చైనాకు వ్యూహాత్మక బహుమతి అంటూ ఒక బడా ఆంగ్ల పత్రికలో విశ్లేషణ ప్రారంభమైంది. హ్రస్వదృష్టితో ఉన్న అమెరికా వైఖరి కేవలం చైనా సాంకేతిక ప్రగతి పెరగటానికే తోడ్పడుతుందని కూడా వ్యాఖ్యాత వాపోయారు. విలువైన సంపదలను వెండి పళ్లెంలో పెట్టి చైనాకు అప్పగిస్తున్నారంటూ మరొకరు. ఎవరు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా గడచిన ఐదు దశాబ్దాల చరిత్రను చూసినపుడు అమెరికా, ఇతర ధనిక దేశాల విధాన నిర్ణేతలు, మేథావులు అనుసరించిన విధానాలు, అడ్డుకోవటాలు జనచైనా ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయన్నది జగమెరిగిన సత్యం. చైనా గురించి ఈ మాటలు చెబుతున్నవారు ట్రంప్‌ నిర్ణయం భారత్‌కు బహుమతి అని ఎందుకు చెప్పలేకపోయారు ? అత్తారింటికి దారేది సినిమాలో పదిలక్షల రూపాయల సూట్‌కేసును పవన్‌ కల్యాణ్‌ బహుమతిగా ఇస్తే దాన్ని తీసుకు వెళ్లిన ఆలీ తాళం రావటం లేదంటూ తిరిగి వచ్చిన దృశ్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆకస్మికంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని స్థితిలో పదకొండేండ్ల మోడీ పాలన మనదేశాన్ని ఉంచిందని భావించాలా ? ఎందుకంటే ఏది జరిగినా మోడీ కారణంగానే అంటున్నారు గనుక ఇలా వ్యాఖ్యానించాల్సి వస్తోంది.

ప్రతిభావంతులకు చైనా,బ్రిటన్‌ వల అన్నది ఒక ప్రముఖ తెలుగు పత్రిక శీర్షిక. అమెరికా అడ్డుకుంటే ప్రతిభను వృధా కానివ్వాలా ? ఆ పని మనమెందుకు చేయటం లేదని ప్రశ్నించాల్సిన వారు ఇతర దేశాల గురించి అలాంటి పదజాలంతో కించపరుస్తూ వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి కె వీసాల జారీతో చైనా ఎంతో చురుకుగా ప్రపంచంలోని స్టెమ్‌ (సైన్సు,టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత) మేథావులను ఆకర్షిస్తున్నదని ట్రంప్‌ ప్రకటన తరువాత వార్తలు వెలువడ్డాయి. నిజానికి చైనా నిర్ణయం ఎంతో ముందుగానే తీసుకున్నది. మన మీడియా, అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ మన పాలకులు చైనా చర్యలను గుర్తించలేదు, అసలు ప్రయత్నం కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు.మనం లేకపోతే అమెరికాకు గడవదు అని మనజబ్బలు మనం చరుచుకున్నాం తప్ప అసలు వారెందుకు ప్రపంచమంతటి నుంచీ మేథావంతులను ఆకర్షిస్తున్నారు, తేడా వచ్చి ఆకస్మికంగా అడ్డుకుంటే ప్రత్యామ్నాయం ఏమిటి అని 2047 విజన్‌ గురించి చెబుతున్న నరేంద్రమోడీ గానీ, అంతకు ముందే విజన్లను ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గానీ ఎప్పుడైనా ఆలోచించారా ? కాక మీద ఉన్నపుడే ఇనుము మీద దెబ్బలు వేసి అవసరానికి అనుగుణంగా మలుచుకోవాలి. ఇప్పుడు యువత కూడా ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. అమెరికాగాకపోతే ఆస్ట్రేలియా, అదిగాక పోతే ఆఫ్రికా అన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు. సంచార తెగమాదిరి ఎక్కడికో అక్కడికి పోవటం తప్ప మన దేశం పురోగమించటం గురించి, గౌరవ ప్రదమైన ఉపాధి గురించి ఎందుకు ఆలోచించరు ?

అమెరికా వ్యూహాత్మకంగా స్వయంగా చేసిన తప్పిదం అంటున్నారు సరే, దాంతో మనకు పోయేదేమీ లేదు, మనం ఎందుకు వ్యూహాత్మకంగా ఆలోచించలేదు అని కదా పాఠాలు తీసుకోవాల్సింది. చైనా కె వీసా ఎంతో స్మార్ట్‌గా, వ్యూహాత్మకంగా, నిర్దాక్షిణ్యమైన అవకాశవాదంతో ( రూత్‌లెస్లీ ఆపర్చ్యునిస్టిక్‌) ఉందని కూడా ఉక్రోషం వెలిబుచ్చారు. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకొనేందుకు చైనాలోని ఏదో ఒక కంపెనీ ఇచ్చే అవకాశంతో పని లేదు. అనుభం కూడా అవసరం లేదు. వారు కోరిన అర్హతలు ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతిభావంతులను ఆకర్షించటం ఇప్పుడే ప్రారంభం కాలేదు. వేయి ప్రతిభల పథకం(టిటిపి) పేరుతో చైనా 2008 నుంచే ఆకర్షించటం ప్రారంభించింది. అయితే చైనా మీద ఉన్న తప్పుడు ప్రచారం, అమెరికాతో పోలిస్తే దక్కే ప్రతిఫలం తక్కువగా ఉండటం, కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వం అనే వ్యతిరేక భావనలు ఇలా అనేక అంశాలు చైనా వైపు చూడటానికి యువతను అడ్డుకున్నాయి. అది కూడా చాపకింద నీరులా తన పథకాన్ని అమలు జరిపింది తప్పహడావుడి చేయలేదు. ఇప్పుడు చైనా సాధిస్తున్న పురోగతి, ఇతర దేశాల్లో విధిస్తున్న ఆంక్షలు, జాత్యహంకారం వంటి వివక్ష ఇతర సమస్యల కారణంగా గతంలో మాదిరి అడ్డుకొనే అవకాశాలు పరిమితం. అనేక మంది వైద్య విద్యకోసం చైనా వెళ్లిన సంగతి తెలిసిందే.

మన దేశానికి ట్రంప్‌ మంచి అవకాశాన్ని కల్పించాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవటం మన విధాన నిర్ణేతలు, పాలకుల చేతుల్లో ఉంది. సేవారంగంలో మన యువత ముందంజలో ఉంది.మొత్తంగా చూసినపుడు సాధించాల్సింది ఇంకా ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది. ప్రపంచంలో పరిశోధన మరియు అభివృద్ధి మీద చేస్తున్న ఖర్చు వంద రూపాయలు అనుకుంటే మనం చేస్తున్నది కేవలం రు.2.90 మాత్రమే. అదే అమెరికా 24.8, చైనా 22.80 ఖర్చు చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ప్రపంచంలో నవకల్పనలకు పేటెంట్‌ హక్కులు లభిస్తున్నాయి. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం 2023లో చైనా అత్యధికంగా 16,19,268 దరఖాస్తులు సమర్పించగా 7,98,347 మంజూరయ్యాయి. రెండవ స్థానంలో ఉన్న అమెరికా 5,94,340కి గాను 3,20,410 పొందింది. మన విషయానికి వస్తే ఐదవ స్థానంలో 70,068 మాత్రమే సమర్పించి 30,490 పొందాము. మూడవ స్థానంలో ఉన్న జపాన్‌ 2,89,530కి గాను 2,01,420, నాలుగవది దక్షిణ కొరియా 2,37,633కు గాను 1,35,180 పొందాయి. ఏదైనా పిండికొద్దీ రొట్టె.గడచిన పదకొండు సంవత్సరాలుగా అంతకు ముందు కూడా పరిశోధన, అభివృద్ధికి మనదేశం చేసిన ఖర్చు పెరగలేదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తే ఇలాగే ఉంటుంది.పోనీ వాటినైనా వెలికి తీస్తారా అంటే అదీ చేయరు. పడక కుర్చీ కబుర్లు చెబుతుంటారు. యుద్ద ప్రాతిపదికన కొన్ని సంవత్సరాల పాటు అవసరమైన నిధులు కేటాయించి ప్రోత్సహిస్తే మనం కనీసం మూడవ స్థానానికి చేరుకుంటాం.ఈ అవకాశాన్ని మోడీ సర్కార్‌ సద్వినియోగం చేస్తుందా ? చౌకబారు రాజకీయాల మీదనే కేంద్రీకరిస్తుందా ? కొంత మంది అంచనా వేస్తున్నట్లు రానున్న రోజుల్లో ప్రావీణ్యం అసలైన శక్తిగా ముందుకు రానుంది. దీన్ని చైనా ఎప్పుడో గుర్తించింది, అమెరికా ఇప్పుడు నేర్చుకుంటున్నది, మరి మనం ? అవు సైన్సును నమ్ముకుంటే గోమూత్రం, పేడ దగ్గరే ఉండిపోతాం. వార్షిక ప్రపంచ రాంకింగ్‌లను చూసినపుడు చైనా విద్యా సంస్థల పురోగతి స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పటికీ చైనాను గుడ్డిగా వ్యతిరేకించే వారు అది అనుకరించేది తప్ప నవకల్పనలు చేసేది కాదని వాదిస్తారు. వారిని అలాగే ఉండనిద్దాం, వాస్తవాలను చూద్దాం. అమెరికాకు చెందిన న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ నివేదికలో 105 దేశాలకు చెందిన 2,250 ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ సంవత్సరం బీజింగ్‌లోని సిన్హువా విశ్వవిద్యాలయం ప్రపంచ రాంకుల్లో పదకొండవ స్థానం పొందింది. పెకింగ్‌, ఝెజియాంగ్‌ 25,45వ స్థానాల్లో ఉన్నాయి. 2018లో సిన్హువా, పెకింగ్‌ 50, 68 స్థానాలతో తొలి వందలో ఉన్నాయి.ఈ ఏడాది వాటి సంఖ్య పదిహేనుకు చేరింది.చైనాలో అమలు జరిపిన కరోనా ఆంక్షలు, అంతకు ముందే 2018లో ట్రంప్‌ తొలి పాలనా కాలంలో ప్రారంభమైన అమెరికా వేధింపులు పెరగటంతో 2019-20లో 3,72,532గా అమెరికాలో చదివిన చైనా విద్యార్థుల సంఖ్య 2023-24లో 2,77,398కి తగ్గింది. దీంతో ఇప్పుడు మన దేశం మొదటి స్థానంలోకి వెళ్లింది.

ఇప్పటి వరకు చైనా నుంచి అమెరికాకు మేథోవలస జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగి రావటం ప్రారంభమైంది. దీనికి అక్కడ పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు పెరగటంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులో చైనాను విస్మరించలేని స్థితికి చేరుకోవటం, అక్కడ కూడా అనేక స్టార్టప్‌లు ప్రారంభించటానికి ప్రభుత్వం అవకాశం కల్పించటం వంటి కారణాలు దీనికి దోహదంచేస్తున్నాయి.2035 నాటికి ప్రపంచ అగ్రస్థానంలో సాంకేతిక రంగాన్ని నిలబెట్టేందుకు చైనా పూనుకుంది. అందుకు అవసరమైన పెట్టుబడిలో అమెరికాతో పోటీపడుతోంది.ఓయిసిడి సంస్థ సమాచారం ప్రకారం పదేండ్ల క్రితం అమెరికా చేసిన పరిశోధన ఖర్చులో 72శాతం చేసిన చైనా 2023నాటికి 780 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 96శాతానికి చేరుకుంది. పరిశోధన ఉత్పత్తిలో 2017లోనే అమెరికాను అధిగమించింది. డీప్‌ సీక్‌ సంచలనం తెలిసిందే. దానిలో పనిచేసిన వారందరూ చైనా యువకులే.కొంత మందికి ఎక్కడా పని చేసిన అనుభవం కూడా లేదు. దీనితో పాటు ఝజియాంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాడ్యుయేట్లు డీప్‌ రోబోటిక్స్‌లో ప్రావీణ్యం పొందారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ప్రమాదకరమైన హై ఓల్టేజి సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తున్నారు. సిలికాన్‌ వాలీతో పోటీ పడేట్లుగా చైనా ప్రోత్సహిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞాన ఎగుమతులపై అమెరికా విధించిన నిషేధాలను సవాలుగా తీసుకుంది.అవకాశాలను అందిపుచ్చుకోవటంలో చైనాను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 1970దశకంలో అనివార్యమైన స్థితిలో ఐరాస భద్రతా మండలిలో కమ్యూనిస్టు చైనాను అసలైన శాశ్వత ప్రతినిధిగా అమెరికా గుర్తించాల్సి వచ్చింది.

దాని కొనసాగింపుగా చైనా ప్రారంభించిన సంస్కరణలను సొమ్ము చేసుకోవాలని అమెరికా భావించింది. తాత్కాలిక లాభాలను అమెరికన్లు చూస్తే దీర్ఘకాలిక లక్ష్యంతో సంస్కరణలను చైనా తలపెట్టింది.1978 వరకు అమెరికా ఉన్నత విద్యా సంస్థలలో చైనీయులకు ప్రవేశం లేదు. సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకొనే ప్రక్రియలో భాగంగా అమెరికా సైన్సు సలహాదారు ఫ్రాంక్‌ ప్రెస్‌ బీజింగ్‌ సందర్శనకు వచ్చాడు. అక్కడి నుంచి నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు ఫోన్‌ చేసి తమ విద్యార్థులు ఐదువేల మందిని అమెరికా విద్య కోసం పంపేందుకు ఆసక్తితో ఉన్నట్లు చైనా చెప్పిందని, ఏం చేయమంటారని అడిగాడు. ఐదువేలేం ఖర్మ లక్ష మందిని పంపవచ్చని వారికి చెప్పండని కార్టర్‌ సమాధానమిచ్చాడట. అలా వెళ్లిన లక్షలాది మంది చైనా విద్యార్ధులు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏటా 15 బిలియన్‌ డాలర్ల లబ్ది కలించారు.ఆ విధంగా అమెరికా మేథోవలసను ప్రోత్సహించి ఎంతోలబ్ది పొందింది. అక్కడి మార్కో పోలో అనే మేథో సంస్థ ప్రపంచ కృత్రిమే మేథ సర్వే చేసింది. అమెరికాలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధకుల్లో 37శాతం మంది అమెరికన్లు కాగా చైనీయులు 38శాతం ఉన్నట్లు తేలింది.చాట్‌ జిపిటి 4 ప్రాజెక్టులో కీలకమైన సేవలు అందించిన వారిలో 20శాతం మంది చైనీయులే. వీటన్నింటిని చూసిన తరువాత భయపడిన అమెరికన్లు పొమ్మనకుండా చైనీయులకు పొగ పెట్టారు. మా దేశంలో చదువుకొనేందుకు రావచ్చు గానీ స్టెమ్‌ కోర్సుల బదులు, మావవ, సామాజిక శాస్త్రాలను ఎంచుకోవాలని వత్తిడి తెస్తున్నది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన కోర్సులో ప్రవేశాన్ని పరిమితం చేసింది. అందుకే చైనీయులు వేలాది మంది స్వదేశం బాట పట్టి అమెరికాకు పాఠం చెప్పేందుకు పూనుకున్నారు. మోడీ సర్కార్‌ మనవారికి అలాంటి అవకాశాలను కల్పిస్తుందా అన్న శేష ప్రశ్న !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చరిత్ర గమనాన్ని మార్చివేస్తున్న కమ్యూనిస్టులు : ప్రతిభావంతులను ఆకర్షిస్తున్న చైనా, బెంబేలెత్తుతున్న అమెరికా !

21 Thursday Aug 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Education, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

China “young talent” K visa, china communist party, China vs US, Donald trump, global scientific talent China, STEM experts, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


అవును ఎవరు అవునన్నా కాదన్నా, మరొకటన్నా ఇది నిజం. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లుగా మేథావులందరూ పశ్చిమదేశాలలోనే పుట్టారు, మిగతా దేశాల వారు అక్కడికే వెళతారు అన్నట్లుగా కొందరు చాలాకాలంగా జనాల మెదళ్లకు ఎక్కించారు. ఇప్పుడు చైనా కమ్యూనిస్టులు దాన్ని తలకిందులు చేస్తున్నారు. గత శతాబ్దిలో ప్రపంచాన్ని ఏలిన చమురుకు ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది. అయితే అదే సర్వస్వం కాదని తేలిపోయింది. దాన్ని పక్కన పెట్టే ‘‘ ప్రతిభ ’’ ప్రత్యామ్నాయ హరిత ఇంథనం, క్వాంటమ్‌, కృత్రిమ మేథ వంటి రూపాల్లో ముందుకు వస్తున్నది. చమురుతో పని లేకుండా నడిచే విద్యుత్‌ వాహనాలు రోడ్లను ముంచెత్తటం తెలిసిందే. ఈ పూర్వరంగంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో 2035 నాటికి అమెరికాను అధిగమించేందుకు చైనా నడుంకట్టటం గురించి కొద్ది నెలలుగా మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి, అవేవీ కమ్యూనిస్టులు నడిపేవి కాదు, చివరికి కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదుల పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక ‘‘స్వరాజ్య ’’లో 2025 జూన్‌ 27న అమిత్‌ మిశ్రా అనే విశ్లేషకుడు కూడా రాశారు.దాన్ని నవీకరించి ఆగస్టు మూడున తిరిగి ప్రచురించారు. ‘‘ మేథోవంతుల ఆకర్షణ : వేయి ప్రతిభల చైనా వ్యూహం దాని ఔన్నత్యాన్ని ఎలా ముందుకు నెడుతున్నది ’’ అనే శీర్షిక( కోర్టింగ్‌ జీనియసెస్‌ : హౌ చైనా స్‌ థౌసెండ్‌ టాలంట్స్‌ స్ట్రాటజీ ఈస్‌ ఫ్యూయలింగ్‌ ఇట్స్‌ ఎసెంట్‌)తో ఒక విశ్లేషణ వెలుండిరది. ఇక్కడ దీన్ని ప్రస్తావించటం అంటే చైనాకు మిత,మతవాదుల సర్టిఫికెట్‌ లేదా ప్రశంసల గురించి కాదు. చైనా ఎలా దూసుకుపోతున్నదో చూడండి అనే ఉక్రోషం, అసూయ ప్రదర్శన దాని వెనుక ఉందని చెప్పేందుకే.


ఇక సందర్భానికి వస్తే ఈ ఏడాది అక్టోబరు ఒకటి నుంచి అంటే విప్లవదినోత్సం రోజు నుంచి చైనా ప్రభుత్వం ప్రపంచంలోని యువ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కె రకం వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఎందుకు అంటే 2035నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామి దేశంగా మారేందుకు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. కొత్తగా పట్టా పుచ్చుకున్న స్వదేశీయులు లేదా విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారు, ఇతర దేశాల్లో ఇప్పటికే ఆయా రంగాలలో పని చేస్తున్న వారిని ఆకర్షించేందుకు పూనుకుంది. ఇటీవలి కాలంలో చైనా విధాన నిర్ణయాలలో ఇది పెద్దదని భావిస్తున్నారు. తనకు ఎదురులేనంతవరకు చైనాను ఎదగనిచ్చిన అమెరికా ఎప్పుడైతే తన ఆధిపత్యానికి అన్ని రంగాలలో ప్రతిఘటన ఎదురవుతున్నదని గ్రహించిందో అప్పటి నుంచి అడ్డుకోవటం ప్రారంభించింది. వైట్‌హౌస్‌లో ఏ పార్టీ వారున్నా అదే చేస్తున్న పూర్వరంగంలో దానికి ధీటుగా చైనా కమ్యూనిస్టు పార్టీ చేసిన కసరత్తు నుంచి వెలువడిరదే తాజా నిర్ణయం. ప్రధాని లీ క్వియాంగ్‌ సంతకంతో అది చట్టంగా మారింది. స్టెమ్‌(సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణితం) రంగాలలో ప్రతిభావంతులైన విదేశీ యువతను ఆకర్షించేందుకు సరికొత్త ‘‘ యువ ప్రతిభ ’’ కె వీసా ప్రత్యేకత ఏమంటే చైనాలో ఉన్న కంపెనీల యజమానులు లేదా సంస్థల నుంచి సిఫార్సులు అవసరం లేదు.నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రతిభావంతులైన యువశాస్త్రవేత్తల కార్యక్రమంలో వయస్సు గరిష్ట పరిమితి 45 సంవత్సరాలు, మరో పధకానికి 40 ఏండ్లు. దీనికి ఎలాంటి పరిమితి నిబంధన లేదు. ఇతర దేశాలతో పోటీ పడుతూ వేతనాలు, వసతి, బోనస్‌, పిల్లలకు విద్య వంటి ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.దేశ విధానానికి లోబడి పరిశోధనలో స్వేచ్చ ఉంటుంది. ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడులకు ఎలాంటి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించారో ఇప్పుడు ప్రతిభావంతులైన వారిని ఆకర్షించేందుకు అలాంటి విధానాన్నే ముందుకు తెచ్చారని చెప్పవచ్చు. ఇలాంటి ప్రత్యేక వీసాలు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి.

అమెరికాలో చైనా సంతతికి చెందిన వారి మీద పెరుగుతున్న జాత్యహంకార వివక్ష, ఆంక్షలు, పరిశోధనలకు కేటాయింపుల కోత, గూఢచర్య ఆరోపణలతో వేధింపులు, రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల పూర్వరంగంలో అనేక మంది అక్కడి నుంచి బయటపడేందుకు చూస్తున్నారు. మంచి పండ్లను ఏరి దిగుమతి చేసుకున్నట్లుగా దశాబ్దాల తరబడి, అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మేథోవలసతో ఎంతగానో లబ్దిపొందాయి. ఇప్పుడు అటునుంచి వలసలకు చైనాతో నాంది పడిరదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు.చైనా కమ్యూనిస్టు పార్టీ నేత లి యువాన్‌చావో 2008లో ‘‘వేయి ప్రతిభావంతుల పథకాని(టిటిపి)కి రూపకల్పన చేశారు .విదేశాల్లో ఉన్న చైనా సంతతికి చెందిన వారిలో కనీసం రెండువేల మందిని స్వదేశానికి ఆహ్వానించి ఒక నవకల్పన సమాజంగా దేశాన్ని మార్చాలని తలపెట్టారు. 2011ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినపుడు ఏటా 50 నుంచి వందమందిని పదేండ్ల పాటు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దానికి మించి ఇప్పటి వరకు ఏడువేల మంది శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు,వాణిజ్య,పారిశ్రామికవేత్తలు వచ్చారని అంచనా, వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నారు. మరొక సమాచారం ప్రకారం 2010 నుంచి 2021 మధ్య కాలలో కనీసం 20వేల మంది చైనా జాతీయులు అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లారు. ఇలాంటి వారు చూపుతున్న ప్రతిభను బట్టి మిలియన్ల యువాన్లను బోనస్‌, ఇతర రాయితీలను ప్రతిఫలంగా చెల్లించుతున్నారు. అమెరికా నుంచి వచ్చే వారు విద్రోహచర్యల నిమిత్తం వస్తున్నారా నిజంగానే పని చేసేందుకే అని నిర్ధారించుకొనేందుకు సునిశిత పరిశీలనలు కూడా చేశారని వార్తలు. ఈ పధకానికి చైనా పెద్ద ప్రచారం ఇవ్వలేదు గాని దాని తీరుతెన్నులు గమనించిన అమెరికా జాతీయ గూఢచార సంస్థ, ఎఫ్‌బిఐ గుండెలు బాదుకుంటూ నివేదికలు రూపొందించాయి. చైనా ఆర్థిక, మిలిటరీ రంగాలలో పురోగమించటానికి చట్టబద్దంగా, అక్రమ పద్దతుల్లో అమెరికా మేథో సంపదను చైనా కొల్లగొడుతున్నదని ఆరోపించారు. ఈ ప్రచారం పెరగటంతో చైనా కొత్త పద్దతుల్లో క్విమింగ్‌ పేరుతో ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పూనుకుంది.2019 నుంచి 2023వరకు ఐదు వందలకు పైగా ప్రభుత్వ పత్రాలను పరిశీలించిన రాయిటర్స్‌ వార్తా సంస్థ చైనా ఇస్తున్న నగదు, ఇతర మొత్తాల గురించి పేర్కొన్నది.

దశాబ్దాలుగా భారత్‌, చైనా వంటి దేశాల నుంచి ఎందరో ప్రతిభావంతులు ఎక్కువగా అమెరికా, ఇతర పశ్చిమదేశాలకు వలస వెళ్లారు.వ్యక్తిగతంగా వారితో పాటు ఆయా దేశాల పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. ఆర్థికంగా నిలదొక్కుకొని ఎదగటం ప్రారంభమైన తరువాత మరింత ముందుకు పోవాలంటే అలాంటి అవసరం ఎంతో ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీ గుర్తించింది.కమ్యూనిస్టులు ప్రతిభావంతుల మీద కూడా తమ సిద్దాంతాలను రుద్దుతారని, వారికి స్వేచ్చ ఇవ్వరని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.చైనా కమ్యూనిస్టులు దాన్ని కూడా గమనంలో ఉంచుకున్నారు. నూటనలభై కోట్ల జనాభా జీవితాలను ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దాన్లో భాగంగానే తమ దగ్గరలేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించారు. అవి తమ నుంచి లబ్దిపొందుతాయని తెలిసినప్పటికీ దాని కంటే తాము ఎక్కువ ప్రయోజనం పొందుతామనే ముందు చూపు, ధైర్యంతో ఎన్ని విమర్శలు వచ్చినా సంస్కరణలకు తెరతీశారు, విజయం సాధించారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది గనుక అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రతిభావంతులను అక్కున చేర్చుకుంటున్నారు.దాని ఫలితాలు కనిపించాయి. సెమికండక్టర్లు, వైమానిక రంగం, 5జి, క్వాంటమ్‌ వంటి అనేక రంగాల్లో మరొకదాని వెనుక వెళ్లే పరిస్థితి నుంచి పోటీదారుగా మారింది. జీవశాస్త్రంలో అమెరికాను అధిగమించి 2017లోనే ఎక్కువగా పరిశోధక పత్రాలను చైనీయులు ప్రచురించారు.

గత నాలుగున్నర దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, విధానాల గురించి కొంత మంది విమర్శలు చేయవచ్చు.ఇప్పుడు చైనా మరొకదశలో ప్రవేశించింది. అధికారాన్ని కార్మికవర్గం చేతిలో పెట్టటం ద్వారా విప్లవం చేయాల్సినపని చేసింది. సాధించిన అధికారం ఒక్కటే జన జీవితాలను మెరుగుపరచదని గుర్తించిన తరువాత తీసుకున్న చర్యలకు తగిన ఫలితాలు వచ్చాయి. వాటికి ఉన్న పరిమితులను గమనించి మరొక అడుగు ముందుకు వేస్తున్నది. విదేశీ పెట్టుబడులకు కొంత ప్రతిఫలాన్ని చెల్లించినట్లుగా, స్వదేశంలోనే సంస్థల పెరుగుదలకు వ్యక్తులను ప్రోత్షహించిన తీరు చూశాము. అలాగే ప్రతిభావంతులకు మిగతావారితో పోలిస్తే అధికమొత్తాలను ఇవ్వాల్సి ఉంటుందని గ్రహించింది. మరిన్ని పరిశోధనల ద్వారా జనకల్యాణానికి వినియోగించేందుకు పూనుకున్నది. ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతులను చైనా ఆకర్షించటం అమెరికా మాదిరి కార్పొరేట్ల లాభాలకు కాదు, జనాల కోసం.ఈ ప్రయత్నం వెనుక వ్యూహాత్మక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి. నిజానికి ఇది చైనా కమ్యూనిస్టు పార్టీకి కత్తిమీద సామువంటిదే.వచ్చేవారు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి, శాస్త్ర రంగ నాయకత్వంతో పాటు రాజకీయ నాయకత్వంలో ఇమిడి పోయే విధంగా ఉండాలి. కమ్యూనిస్టుల గురించి అనేక తప్పుడు ప్రచారాలు జరిగిన నేపధ్యం,అన్యవర్గ ప్రభావంతో అలాంటి వారు ప్రతి చర్యనూ అనుమానంతో చూసే అవకాశం ఉంటుంది, సహజం. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొనే చైనా కమ్యూనిస్టులు ఒక ప్రయోగం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు అది చేసిన వన్నీ మొత్తం మీద ఫలించాయి.

చైనాలో ప్రస్తుతం ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాల పర్యావరణం నానాటికీ పెరుగుతున్నది.ప్రపంచ స్థాయి సంస్థలలో చైనా వాటికి చోటుదక్కుతున్నది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోమెడిసిన్‌, కృత్రిమ మేథ, ప్రత్యామ్నాయ ఇంథన రంగాలలో సాధించే పురోగతితో అగ్రగామిగా ఉన్న అమెరికాను అధిగమించాలన్నది కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన లక్ష్యం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ క్రమంలో తలెత్తే మిత్రవైరుధ్యాలు ఎలా ఉంటాయి, వాటిని పార్టీ ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం.మరోవైపున చూస్తే అమెరికా, ఇతర పెట్టుబడిదారీ ధనిక దేశాలు పరిశోధకులను, వారితో కలిగే లాభాలను కోల్పోతే చూస్తూ ఊరుకోవు. ప్రమాణాలకు గీటురాళ్లుగా ఇప్పటి వరకు కొనసాగిన అమెరికా విశ్వవిద్యాలయాలు ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటాయా ? ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పోటీ పడటంలో కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, జర్మనీ, అరబ్‌ ఎమిరేట్స్‌ వంటివి కూడా ఉన్నాయన్నది మరచిపోరాదు. గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టే విధంగా రానున్న రోజుల్లో పోటీ మరింత పెరగటం మంచిదే. వ్యక్తుల ప్రతిభకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది, అయితే అది పూర్తిగా వారి స్వంతం కాదు, సమాజం నేర్పినదానికి తమ సృజనాత్మకతను జోడిరపు మాత్రమే. ఉదాహరణకు విద్యుత్‌ బల్బ్‌ను చూస్తే, 1,799 సంవత్సరం నుంచి బల్బులు, బ్యాటరీల తయారీకి పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అనేక మంది చేసిన కృషి 1870, 80 దశకాల్లో పోటీ మరింత పెరిగింది.బ్రిటన్‌లో జోసెఫ్‌ స్వాన్‌, అమెరికాలో థామస్‌ ఎడిసన్‌ ఒకేసారి బల్బులను కనుగొన్నారు.స్వాన్‌ బల్బులు విలియమ్‌ స్టెయిట్‌ రూపొందించన నమూనాల ప్రకారం ఉన్నాయి. వాటి ఫిలమెంటు చాలా మందంగా ఉంది. ఎడిసన్‌ బల్బులో పలుచగా ఉండటంతో వాణిజ్య పరంగా అది విజయవంతమైంది. స్వాన్‌, ఎడిసన్‌ మధ్య పోటీ చివరకు వారిద్దరినీ ఒక దగ్గరకు చేర్చి ఎడిసన్‌ మరియు స్వాన్‌ ఎలక్ట్రిక్‌ లైట్‌ కంపెనీగా ఏర్పడి స్వాన్‌ రూపొందించిన ఫిలమెంట్‌తో మార్కెట్‌ చేశారు. కానీ పేరు ఎడిసన్‌కు వచ్చింది, దాని వెనుక ఎందరో ఉన్నారు. ఆ తరువాత బల్బుల్లో ఎన్ని మార్పులు, చేర్పులు జరిగాయో మనకు తెలిసిందే. అందువలన ప్రతి నవకల్పన సమాజానికి ఉపయోగపడుతుందా, కార్పొరేట్ల లాభాలకా అన్నదాన్ని బట్టి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల వర్గదృకృధం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. చైనా కార్మికవర్గ వైఖరితో ప్రతిభకు పట్టం కడుతున్నదని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూడువందల మంది చైనా ఇంజనీర్లు వెనక్కు- దీని వెనుక కుట్ర ఉందా , మోడీ సర్కార్‌ నిర్వాకం సంగతేంటి !

04 Friday Jul 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

#Anti China, anti china, Apple iPhones, BJP, Narendra Modi Failures, Narendra Modi skill development failure

ఎం కోటేశ్వరరావు

గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత రెండు దేశాలూ సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాయి. సరిహద్దు సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని తాజాగా మన రక్షణ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ ఆకాంక్ష వెలిబుచ్చారు. ఐదేండ్ల పాటు నిషేధించిన చైనా పెట్టుబడులను అనుమతించేందుకు మోడీ సర్కార్‌ దిగివచ్చింది. రెండు దేశాల మధ్య విమానరాకపోకలకు, వీసాల జారీకి అంగీకారం కుదిరింది. అంతా బాగుందని అందరూ భావిస్తున్న తరుణంలో మనదేశంలో యాపిల్‌ కంపెనీ తయారు చేస్తున్న ఫోన్ల ఫ్యాక్టరీల నుంచి 300 మంది చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు గత రెండు నెలల్లో స్వదేశానికి వెళ్లినట్లు, చైనా ప్రభుత్వమే తిరిగి రావాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.వారితో పోటీపడి ఫోన్లు తయారు చేస్తున్నామన్న దుగ్దతో మనదేశం మీద జరిగిన కుట్రగా ఈ పరిణామాన్ని వర్ణించారు. అయితే మన కేంద్ర ప్రభుత్వం గానీ, యాపిల్‌ కంపెనీగానీ నోరెత్తలేదు. మన వాహన పరిశ్రమలకు అవసరమైన మాగ్నెట్లను ఎగుమతికి అనుమతించకుండా చైనా ఆంక్షలు విధించి ఆ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు చూసిందని కూడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.మాగ్నట్ల సరఫరా నిలిచిపోయిన ప్రతికూల ప్రభావం తొలుత అంచనావేసినదాని కంటే ఎక్కువగా ఉందని భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) అధ్యక్షుడు రాజీవ్‌ మెమానీ గురువారం నాడు మీడియాతో చెప్పారు. పంటల దిగుబడిని గణనీయంగా పెంచే ఎరువులను కూడా మనకు రాకుండా తగ్గిస్తున్నదని, ఈ ఏడాది నిషేధం లేకపోయినా పూర్తిగా నిలిపివేసిందని సొల్యుబుల్‌ ఫర్జిలైజర్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ అధ్యక్షుడు రజివ్‌ చక్రవర్తి చెప్పారు. ఐదు సంవత్సరాల క్రితం గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా యాప్‌లు, విమానాలు, పెట్టుబడులు, టెలికాం పరికరాల కొనుగోలుపై మనదేశం నిషేధం విధించింది. మాగ్నట్‌లు, ఎరువులు నిలిచిపోయింది ఈ ఏడాదే అని చెబుతున్నారు తప్ప ఐదేండ్లుగా సజావుగానే వచ్చాయి. మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ఎపిఐ వంటి కీలక ముడిసరకుల వంటి వాటిని మనకు అందకుండా చైనా ఎలాంటి నిషేధాలు పెట్టలేదు. ఇలాంటి వాటిని ఐదేండ్లుగా అడ్డుకొని ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాల్సిందే.చైనాగాక పోతే మరొకచోట నుంచి తెచ్చుకొనేవారం అనవచ్చు, ఆ పని ఇప్పుడూ చేయవచ్చు కదా, తర్కానికి నిలవని కుట్ర కతలెందుకు ?

బిజెపి నేతలు, మోడీ సమర్ధకులు మనదేశం కూడా ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇటీవల దుబాయిలో జరిగిన రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన సందర్భంగా బ్రహ్మోస్‌ క్షిపణిని మాకు విక్రయిస్తారా అని పాకిస్తాన్‌ మిలిటరీ అధికారి ఒకరు దాని రూపకర్త డాక్టర్‌ అపతుకాంత శివథాను పిళ్లేను అడిగారట. ఏమి సమాధానం చెప్పిఉంటారో ఊహించుకోండి ! మన క్షిపణులను అమ్మి వాటినే మనమీద వేయించుకుంటామా ! ఎవరైనా అంతే కదా !! డోనాల్డ్‌ ట్రంప్‌తో మన మోడీ ఎంత రాసుకుపూసుకు తిరిగినా అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక మిలిటరీ పరికరాలను మనకు ఇచ్చారా ? వారు ఇవ్వకపోగా రష్యా నుంచి ఎస్‌ 400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయరాదని మన మీద వత్తిడి తెచ్చిన దుశ్చర్యను మనం మరచిపోగలమా ! రామాయణంలో రావణుడు సవతిసోదరుడు కుబేరుడిని ఓడిరచి అతగాడి దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడని చెబుతారు. కాసేపు నిజమే అనుకుందాం. సీతను రక్షించేందుకు రాముడికి కూడా నిర్మాణ కంపెనీ పుష్పక విమానం ఇచ్చి ఉన్నా లేదా సాంకేతిక పరిజ్ఞాన బదిలీ చేసినా లంకకు వెళ్లేందుకు వారధితో అవసరం లేకపోయేది, రాముడు ఇలా వెళ్లి అలా సీతను ఎక్కించుకు వచ్చేవాడు కదా ! ఎందుకు విమానం కొనుగోలు చేయలేదు ? విధి అలా రాసి ఉంది అంటారు, అదే అయితే ఇప్పుడు కూడా అదే అని సరిపెట్టుకోకుండా చైనా కుట్ర అంటున్నారెందుకు ?

జూన్‌ 30 నుంచి జూలై రెండవ తేదీ వరకు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డిసిలో క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కూడిన కూటమి నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2017 నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు జరిపి, ప్రకటనలు చేస్తున్నది.చైనాను దెబ్బతీసేందుకు ఏర్పడిన ఈ కూటమి ఏడవ అధినాయక సమావేశం ఈడాది చివరిలో మనదేశంలో జరగనుంది.దీనికి సన్నాహంగానే కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం వాషింగ్టన్‌డిసిలో జరిగింది. చైనాను ఉద్దేశించి ఆర్ధికబలవంతం, ధరల తిమ్మినిబమ్మిని,సరఫరా వ్యవస్థల విచ్చిన్నం, అక్రమ మార్కెట్‌ పద్దతులు, కీలకమైన ఖనిజాల ఉత్పత్తి మీద కేంద్రీకరణ వంటి చర్యలకు పాల్పడుతున్న దేశాలంటూ ధ్వజమెత్తుతూ ఒక తీర్మానం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో నౌకల స్వేచ్చారవాణాకు ఆటంకం కలిగించకూడదంటూ చర్చలు చేశారు. ఈ పరిణామాలకు ఏదైనా కార్యాకారణ సంబంధం ఉందా ?

నిజంగా చైనా నుంచి మనదేశానికి ముప్పు ఉందని భావిస్తే లేదా కుట్ర జరుగుతోందని అనుకుంటే జరుగుతున్న పరిణామాలకు, అనుమానాలకు పొంతన కుదరటం లేదు. లావాదేవీలు తగ్గించుకోకపోగా ఇంకా పెంచుకొనేందుకు మన ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనాను మనకాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలంటే దిగుమతులు నిలిపివేసి డ్రాగన్‌ పీకనొక్కాలంటూ కాషాయ అలగా జనం వీధుల్లో వేసిన వీరంగం తెలిసిందే.మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు నిలిపివేసిన చైనా పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచి స్వాగతం పలుకుతున్నది. ఐదేండ్ల క్రితం నిలిపివేసిన విమానాలు, వీసాల జారీని పునరుద్దరించేందుకు నిర్ణయించారు. వస్తు దిగుమతుల్లో మోడీ తన రికార్డులను తానే బద్దలు కొట్టుకున్నారు. చైనా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి పారిపోయి వచ్చిన దలైలామాకు మనదేశం ఆశ్రయం ఇచ్చింది. అనేక మంది చైనా వ్యతిరేక టిబెటన్లు దేశంలో ఉన్నారు.వారిలో కొందరితో ప్రత్యేక మిలిటరీ దళాలను తయారు చేసి సరిహద్దుల్లో నియమించారు.దలైలామా తరచూ చైనా వ్యతిరేక వ్యాఖ్యలతో కార్యకలాపాలు చేస్తుంటే అనుమతిస్తున్నారు. వారసుడిని నిర్ణయించే అధికారం దలైలామాకే ఉందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజు స్వంత అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పారు. ఇది చైనా వ్యవహారాల్లో జోక్యం తప్ప మరొకటి కాదు. ఉన్న సరిహద్దు వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించుకోవాలని రక్షణ మంత్రి బీజింగ్‌లో ప్రతిపాదిస్తారు, చైనా నుంచి మన రక్షణకు ముప్పు ఉందంటూ పరోక్షంగా వాషింగ్టన్‌లో విదేశాంగమంత్రి ప్రకటనలు చేస్తారు.

తమదేశాన్ని మరోసారి అగ్రస్థానంలో నిలపాలనే నినాదంతో ముందుకు పోతున్న అమెరికా నేతలు మనతో సహా ఇతరదేశాలు తమకంటే ముందుకు పోవటానికి అనుమతిస్తారా ? జాతీయవాదం ప్రబలి ప్రతిదేశమూ రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్న తరుణమిది. దానికి విరుగుడు ఏమిటో కనుక్కోవాలి. అలాంటి ప్రయత్నం మనదేశంలో జరుగుతున్నదా ? అవసరమైన నిపుణులను తయారు చేసుకోవటంలో వైఫల్యమే దానికి నిదర్శనం.బొమ్మరిల్లు సినిమాలో అన్నీ మీరే చేశారని అన్నట్లుగా ఎప్పుడో కాలం చేసిన గాంధీ, నెహ్రూలను ఆడిపోసుకోవటం తప్ప బిజెపి వారు చేసిందేమిటి ? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి శాస్త్రవేత్తలకే పాఠాలు చెప్పగలిగిన చంద్రబాబు నాయుడి వంటి ముందుచూపు కలిగిన మిత్రులు ఉన్నప్పటికీ అడుగుముందుకు కదలటం లేదు.

యాపిల్‌ కంపెనీ 2017 నుంచి మనదేశంలో ఫోన్లు ఉత్పత్తి చేస్తున్నది. దాన్నుంచి మూడువందల మంది చైనా నిపుణులు స్వదేశానికి వెళ్లిపోతే కుట్ర అని గుండెలుబాదుకుంటున్నవారు కనీసం ప్రత్నామ్నాయంగా అంతమందిని అందించలేని దుస్థితి దేశంలో ఎందుకు ఉన్నది, ఎనిమిది సంవత్సరాలు గడచినా మనం ఎందుకు తయారు చేసుకోలేకపోయామని మన పాలకులను, రాయితీలు, కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో లక్షల కోట్ల మేర లబ్దిపొందుతున్న పరిశ్రమల వారిని ఎందుకు ప్రశ్నించరు. సదరు యాపిల్‌ కంపెనీ ఎగుమతులతో లాభాలు పోగేసుకోవటం తప్ప తనకు అవసరమైన స్థానిక నిపుణులను ఎందుకు తయారుచేయలేకపోయింది ? మన ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నామా ? వేతన అసమానతలు మనదేశంలో 25శాతం ఉంటే చైనాలో 5 నుంచి 12శాతం మధ్య ఉన్నాయి. వేతనాల్లేకుండా కష్టపడి, నైపుణ్యంతో పని చేయాల్సిన అవసరం ఏముందన్న భావన అసమానత ఎక్కువగా ఉన్న చోట ఉంటుంది. చైనాలో విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు.హైస్కూలు, ఆపై స్థాయి విద్యగలవారు 25శాతం మంది వృత్తి విద్యా శిక్షణలో చేరితే మనదేశంలో కేవలం రెండుశాతమే ఉన్నారు.

రోజు రోజుకూ సాంకేతికరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఆవు పేడ, మూత్రం నుంచి బంగారాన్ని ఎలా తయారు చేయాలా అన్న దగ్గరదారి మీద మీద పెట్టిన శ్రద్ధ ఉత్పాదకరంగంపై లేదు ! మిగతా అన్నింటిలో ప్రావీణ్యం సంపాదించిన తరువాత జనాలను ఖాళీగా ఉంచకుండా ప్రతి ఇంటికి ఒక గోవును ఇచ్చి పేడ, మూత్రంతో పరిశోధనలు చేయించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. దేశంలో పరిశోధనలకు చేసే ఖర్చు జిడిపిలో 0.7శాతానికి లోపుగానే ఉంది. అదే చైనాలో రెండున్నర శాతం దాటింది. నరేంద్రమోడీ వచ్చిన తరువాత పెరిగిందేమీ లేదు.కుండలో కూడు అలాగే ఉండాలి బిడ్డ దుడ్డుగా పెరగాలంటే కుదురుతుందా ! 2015 నుంచి రకరకాల నైపుణ్యాలను వృద్ధి చేసే పేరుతో పలు పథకాలను ప్రకటించారు పద్దెనిమిది రకాల చేతివృత్తుల వారికి ప్రధాని విశ్వకర్మ పధకం ఒకటి.2024 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పింది. దాని ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో దీని కింద నమోదు చేసుకున్నవారు 2,30,47,956 కాగా శిక్షణకు వచ్చిన వారు కేవలం 14,43,129 మాత్రమే. బిజెపి పాలిత ఉత్తర ప్రదేశ్‌లో 28.68లక్షలకు 39వేలు, మధ్య ప్రదేశ్‌లో 29లక్షలకు 82వేలు, బీహార్‌లో 15.6లక్షలకు గాను 32వేలు మాత్రమే అని పేర్కొన్నారు, తమిళనాడులో 8.4లక్షలు, పశ్చిమబెంగాల్లో 7.74లక్షలకు ఒక్కొక్కరు మాత్రమే హాజరైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2015 నుంచి ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(పిఎంకెవివై) కింద కోటీ 40లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు 2023 డిసెంబరు 26న పిఐబి జారీ చేసిన వివరాల్లో పేర్కొన్నారు. అంతమందిలో యాపిల్‌ కంపెనీలో పనిచేసేందుకు 300 మంది ప్రత్యామ్నాయ నిపుణులు లేరా ? చైనా కుట్ర అని మాట్లాడటమే దేశభక్తి అనుకుంటున్నారా ? ఈ రాతలు, మాటలు చైనా దృష్టిలో పడవా, రాగద్వేషాలకు వారు అతీతంగా ఉంటారా ? జనాలు ఇలాంటి వాటన్నింటినీ ఆలోచించాలి.

మన దేశం నుంచి ప్రతి ఏటా పెద్ద మొత్తంలో డాలర్లను పొందుతున్న చైనా మనకు వ్యతిరేకంగా కుట్ర చేయటం ఏమిటంటూ కొందరు ఉడుక్కుంటున్నారు. బీజింగ్‌లోని మన రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం 201415 నుంచి 2024`25 వరకు చైనాతో మనం జరిపిన వాణిజ్య లావాదేవీల్లో చైనా మిగులు 702.05 బిలియన్‌ డాలర్లు అంటే అంతమొత్తం నరేంద్రమోడీ సమర్పించినట్లే, మేకిన్‌ ఇండియా విఫలం కాబట్టే కదా ఇదంతా ! చైనా నుంచి స్వచ్చందంగానే దిగుమతి చేసుకున్నాం. అమెరికా మాదిరి పరస్పరం ప్రతికూల సుంకాలను విధించుకోలేదు. చైనా మీద ప్రతిదానికీ మనం ఆధారపడకూడదని కొందరు పదే పదే చెబుతుంటారు. నిజమే, ఎవరు వద్దన్నారు ? అమెరికాకు పోటీగా చైనా ఎదిగితే ఎవరైనా అడ్డుకోగలిగారా ?కొందరు చెబుతున్నట్లు నిజంగా చైనా మనల్ని అడ్డుకుంటే మనం భాగస్వామ్య, మిత్రదేశాలుగా పరిగణిస్తున్న అమెరికా, ఐరోపా ధనికదేశాలు మనకు ఎందుకు సాయంగా రాలేదు ? దేవుడి మీద భారం వేసి కూర్చుంటే లాభం లేదు మానవ ప్రయత్నం కూడా చేయాలని అంటారు కదా, అలాంటపుడు చైనా నుంచి కంపెనీలు వస్తాయని, నిపుణులు కూడా అక్కడి నుంచే వస్తారు, మనకు వస్తువులను ఉత్పత్తి చేస్తారని ఆశపెట్టుకోవటం ఏమిటి ? మన ప్రయత్నం మనం ఎందుకు చేయటం లేదు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ ఉగ్రవాదం : చైనా మీద ఆరోపణ మాత్రమే, అమెరికా అధ్యక్షుడు కెనడీ, బ్రిటన్‌ దుర్మార్గం గురించి తెలుసా !

08 Sunday Jun 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, Farmers, Germany, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Agro Terrorism, Amarican Virus, Biological weapons, Bioterrorism, chemical weapons


ఎం కోటేశ్వరరావు


వ్యవసాయ ఉగ్రవాదం ప్రపంచమంతటా పురాతన కాలం నుంచి ఉన్నదే. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే అస్సీరియన్లు తమ శత్రువుల ప్రాంతాలలోని బావులలో విషాన్ని కలిపేవారు. మొదటి ప్రపంచ యుద్ద కాలంలో ఫ్రాన్సుకు రవాణా అయ్యే గుర్రాలు, పశువులకు అమెరికాలో జర్మన్‌ ఏజంట్లు విషం ఇచ్చేవారు. కత్తి, బాకు, బల్లెం వంటి వాటిని కనుగొన్న తొలి మానవుడు వాటిని ప్రమాదకర జంతువుల నుంచి రక్షణకు, ఆహారం కోసం ఉపయోగించాడు. తరువాత అవే యుద్దాల్లో ఆయుధాలుగా మారాయి. శాస్త్రవేత్త చార్లెస్‌ డార్విన్‌ 1880దశకంలో చేసిన పరిశోధనలు పంటల్లో కలుపు మొక్కల నివారణకోసం రసాయనాలను కనిపెట్టేందుకు దారితీశాయి. తరువాత కాలంలో బ్రిటన్‌, అమెరికా, తదితర సామ్రాజ్యవాదులు, నియంతలు ఏకంగా పంటలు, అడవులనే నాశనం చేసేందుకు, లక్షలాది మంది మానవులు, జంతుజాలాన్ని అంతమొందించేందుకు వినియోగించిన చరిత్ర తెలుసా ? శాస్త్రవిజ్ఞానాన్ని మానవ, ప్రకృతి వినాశనానికి వినియోగించింది మానవ కల్యాణానికి బదులు వినాశనాన్ని కోరుకున్న దుర్మార్గులే అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ప్రమాదకరమైన ఫంగస్‌ను అమెరికా వ్యవసాయక్షేత్రాల్లో ప్రవేశపెట్టి దాని ఆహార వనరును దెబ్బతీయాలని చైనా కుట్రపన్నింది, దానిలో భాగంగా ఇద్దరు చైనా జాతీయులు ఆ ఫంగస్‌ను అక్రమంగా తెస్తూ ఎఫ్‌బిఐకి దొరికి పోయారు. ఇదీ వార్త, ఒక ఆరోపణ, సదరు ఫంగస్‌ను ఎక్కడా ప్రయోగించలేదు. పరిశోధనల కోసం తెచ్చారన్నది ఒక అభిప్రాయం. అమెరికా మనదేశంలోకి వయ్యారి భామ అనే వినాశకారి అయిన కలుపు మొక్కను ఎలా ప్రవేశ పెట్టిందీ వేరే విశ్లేషణలో చూశాము. గుండెలు బాదుకుంటున్న అమెరికా కొన్ని దశాబ్దాల నాడే ఆ దుర్మార్గానికి పాల్పడిరది అనే అంశం ఎక్కడా మీడియాలో చర్చకు రావటం లేదు.పురాతన, ఆధునిక యుద్ధాలలో ఆహార ఉత్పత్తి వ్యవస్థలను దెబ్బతీయటం ఒక ఆయుధం. అందుకే చరిత్రను చదివినపుడు శత్రుదేశాలు కోటలను చుట్టుముట్టినపుడు నెలల తరబడి తట్టుకొనేందుకు ఆహారం, నీటిని నిల్వచేసుకొనే ఏర్పాట్లు చేసుకున్నట్లు అనేక దుర్గాలు, కోటల చరిత్రలు వెల్లడిరచాయి. ఆధునిక కాలంలో అందుకు జీవ, రసాయనాలను అమెరికా అస్త్రంగా వాడుకున్నది. అదెలా జరిగిందో చూద్దాం !


1953లో కొరియా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే నెల రోజుల ముందు ఉత్తర కొరియా ప్రాంతంలో అమెరికా వైమానిక దళం చేసిన దాడుల్లో 75శాతం వరి ఉత్పత్తికి నీటిని అందించే ప్రాజెక్టులను నాశనం చేసింది. ఇది తరువాత కాలంలో అక్కడ కరవుకు దారి తీసింది. కమ్యూనిస్టుల పాలనలో జనాన్ని ఆకలితో మాడ్చి చంపారని ప్రచారం చేసే మానవతావాదులకు ఈ విషయం పట్టలేదు. వియత్నాంపై దాడిచేసిన అమెరికా మొక్కలను నాశనం చేసే ఏజంట్‌ ఆరెంజ్‌ అనే రసాయనాన్ని ఆపరేషన్‌ రాంచ్‌ హాండ్‌ పేరుతో 1962 నుంచి 1971వరకు వెదజల్లింది. దీనికి ఆదర్శం ఎవరు అంటే మలయా యుద్ధంలో ప్రయోగించిన బ్రిటీష్‌ దుర్మార్గులు. అమెరికాలో రైలు మార్గాలు, విద్యుత్‌ లైన్లు వేసే ప్రాంతాలలో పిచ్చి మొక్కలు పెరగకుండా చూసేందుకు 1940దశకంలో దీన్ని తయారు చేశారు. మనందరికీ తెలిసిన మానశాంటో సహా తొమ్మిది కంపెనీల నుంచి వియత్నాంలో చల్లేందుకు అమెరికన్‌ మిలిటరీ 7.6 కోట్ల లీటర్లు కొనుగోలు చేసింది. దాన్ని చల్లిన చోట 40లక్షల మంది మీద ప్రతికూల ప్రభావాలను చూపింది,30లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ అంచనా ప్రకారం పది లక్షల మంది వికలాంగులయ్యారు. ఈ దుర్మార్గ ప్రక్రియలో భాగస్వాములైన అమెరికా మిలిటరీలో అనేక మందికూడా దీని ప్రభావంతో కాన్సర్‌, లింఫోమా వంటి వ్యాధులకు గురైనట్లు తేలింది. వారికి పుట్టిన పిల్లలకు జన్యు సంబంధమైన వ్యాధులు వచ్చాయి, వారి దుర్మార్గానికి పిల్లలు బలయ్యారు. వియత్నాంలో పర్యావరణానికి కలిగిన హాని గురించి చెప్పనవసరం లేదు, 77లక్షల ఎకరాల్లో పంటలు పండలేదు, అడవుల్లో మొక్కలు పెరగలేదు. అనేక జంతువులకు హాని కలిగింది.మానవ మారణకాండను జనోసైడ్‌ అని వర్ణిస్తే పర్యావరణానికి చేసిన హానిని ఎకోసైడ్‌ అని వర్ణించారు. అమెరికా దురాక్రమణను వ్యతిరేకించిన వియత్నాం వీరులు అడవుల్లో ఉండటంతో వియత్నాం సరిహద్దుల్లో ఉన్న లావోస్‌, కంపూచియా అడవులను కూడా అమెరికా దుర్మార్గులు వదల్లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రసాయన, జీవ ఆయుధాలను తయారు చేశాయి. ఆ సమయంలో అనేక ప్రాంతాల్లో వాటిని పరీక్షించి చూశారు. జపాన్‌పై అణుబాంబును వేసిన అమెరికా యుద్దం గనుక కొనసాగితే 1946లో జపాన్‌పై ఏజంట్‌ ఆరెంజ్‌ను ప్రయోగించాలని పథకం వేసింది. బ్రిటీష్‌ పాలనలో ఉన్న మనదేశం, ఆస్ట్రేలియాలతో సహా మొత్తం 1,100 కేంద్రాల్లో దాని పనితీరును పరీక్షించారు. అమెరికాను కూడా వదల్లేదు. ఉష్ణప్రదేశాల్లో ఎలా పని చేస్తుందో చూసేందుకు కెన్యాలో కూడా చల్లారు. మలయా ప్రాంత దేశాల్లో రబ్బరు తోటల్లో పెరిగే కలుపు మొక్కలను నివారించేందుకు తయారు చేసిన రసాయనాన్ని తమ మీద తిరుగుబాటు చేసిన మలయన్లు ఉన్న అడవుల్లో 1960వరకు బ్రిటీష్‌ మిలిటరీ ప్రయోగించింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని అమెరికా తరువాత ఇండోచైనా ప్రాంతంలో అమలు చేసింది.ముఖ్యంగా దక్షిణ వియత్నాం బలైంది. అనేక మంది గొప్పగా పొగిడే నాటి అమెరికా అధ్యక్షుడు కెనడీ ఈ దుర్మార్గానికి అనుమతి ఇచ్చాడు. ఈ దుర్మార్గం గురించి తెలుసుకున్న తరువాత అమెరికాలో వియత్నాం యుద్ధవ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది.తప్పుడు వాదనలతో ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాలను అమెరికా, బ్రిటన్‌ వ్యతిరేకించాయి.


అమెరికా ముందుగా ఎవరి మీద జీవ, రసాయన ఆయుధాలను ప్రయోగించదని, అయితే శత్రుదేశం ఏదైనా వినియోగిస్తే మాత్రం రసాయన ఆయుధాలను వదులుతామని అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ గొప్పగా చెప్పాడు, ఏ దేశమూ వినియోగించకుండానే అణుబాంబుతో సహా ఆ దుండగాలకు అమెరికా పాల్పడిరది. జపాన్‌లో వరి పొలాలను నాశనం చేసేందుకు అమెరికా వినియోగించింది.వియత్నాంలో ఏజంట్‌ ఆరంజ్‌ చల్లిన ప్రాంతాల్లో గత ఐదు దశాబ్దాలుగా చెట్లలో సాధారణ పెరుగుదల లేదు, మామూలు స్థితికి రావాలంటే చాలాకాలం పడుతుందని చెబుతున్నారు.వియత్నాం దురాక్రమణ, దాడుల్లో పాల్గొన్న అమెరికా సైనికులు ఏజంట్‌ ఆరంజ్‌ తదితర విషపూరిత రసాయనాలను వెదజల్లుతున్నపుడు వారికి కూడా వాటి ప్రభావం సోకిన కారణంగా 1984లో కోర్టు వెలుపల రసాయన కంపెనీలు 18 కోట్ల డాలర్లు పరిహారంగా చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇజ్రాయెల్‌ ఆక్రమించిన పాలస్తీనా ప్రాంతాల్లోకి సముద్రపు నీరు, తమ నివాసాల నుంచి వెలువడే మురుగునీటిని పాలస్తీనియన్ల నివాసాలు, వ్యవసాయ భూముల్లోకి వదలి పనికి రాకుండా చేయటం నిత్యకృత్యం. ఇది కూడా ఒక రకంగా వ్యవసాయ ఉగ్రవాదమే. పంటలు పండకుండా అరబ్బులను మాడ్చే ఎత్తుగడ.

నీవు నేర్పియే నీరజాక్షా అని తమ వ్యవసాయం మీద చైనా దాడి చేయనుందని అమెరికా గగ్గోలు పెడుతోంది. దానికి ఇదేమీ కొత్త కాదు. ప్రతి దేశం మీద కుట్ర సిద్దాంతాలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే. తద్వారా తాను చేసే దుర్మార్గాలను స్వంత జనం ప్రశ్నించకుండా సమర్ధించేందుకు అది ఎంచుకున్న ఎత్తుగడ.తాను పెంచి పోషించిన ఉగ్రవాదానికి అదే బలికావటం కూడా వాస్తవం న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై వైమానికదాడి అదే. తాను పెంచిన తాలిబన్లే దానికి పాల్పడ్డారు.అమెరికా జిడిపిలో వ్యవసాయం తక్కువే అయినప్పటికీ గణనీయ మొత్తం ఎగుమతులకు ఉపయోగపడుతున్నది. ఆల్‌ఖైదాతో చెడిన తరువాత తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని అనేక కేంద్రాలపై దాడులు చేసినపుడు దొరికిన పత్రాలలో అమెరికా వ్యవసాయ వివరాలున్న పత్రాలు దొరికాయి. వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీయాలా అన్నది ఆల్‌ఖైదా శిక్షణలో భాగంగా బయటపడిరది.అమెరికాకు నాలుగు తరగతుల నుంచి వ్యవసాయ ఉగ్రవాద ప్రమాదం ఉందని 2012లో ఎఫ్‌బిఐ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక విశ్లేషణలో పేర్కొన్నారు. ఒకటి ఆల్‌ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు, రెండవది మార్కెట్లను తిమ్మినిబమ్మిని చేసి లబ్దిపొందాలని చూసే ఆర్థిక నేరగాండ్లు లేదా అవకాశవాదుల నుంచి ప్రధానంగా ముప్పు ఉన్నట్లుపేర్కొన్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి(ఎఫ్‌ఎండి అంటే ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌)ని వ్యాపింప చేస్తే మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నది తెలిసిందే. మూడవ తరగతి అసంతృప్తి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు తమ కసి తీర్చుకొనేందుకు చేసే ఉగ్రవాద చర్యలు, నాలుగవ తరగతిగా జంతుహక్కుల రక్షకులు, పర్యావరణ ప్రేమికులు అని పేర్కొన్నారు. న్యూయార్క్‌ ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని పేల్చివేసిన తరువాత అమెరికాలో ఆగ్రో టెర్రరిజం ఆకర్షణీయంగ ఉన్నట్లు కనిపించిందట.


అమెరికా ప్రపంచ మిలిటరీ శక్తిగా ప్రపంచానికి కనిపించకుండా చేయాలంటే దాని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఒసామా బిన్‌లాడెన్‌ పదే పదే వాదించేవాడట.2004 అమెరికా ఎన్నికల సమయంలో ఒక వీడియోలో పదేండ్ల పాటు రష్యా రక్తమోడిరది, అమెరికా కూడా దివాలా తీసేంతవరకు అదే విధానాన్ని అనుసరించాలని చెప్పాడట. 2011 సెప్టెంబరులో అమెరికా ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడికి ఆల్‌ఖైదాకు అయిన ఖర్చు కేవలం ఐదు లక్షల డాలర్లేనని , అమెరికాకు కలిగిన నష్టం 500బిలియన్‌ డాలర్లని ఒసామా చెప్పాడు. ఉగ్రవాద సంస్థలు నిజంగా అలా ఆలోచిస్తున్నాయో, పథకాలు వేస్తున్నాయో తెలియదు గానీ అమెరికా విశ్లేషకులు మాత్రం ఏం చేస్తే ఎలా,ఎంతటి నష్టం జరుగుతుందో వారికి విడమరచి చెబుతున్నారు. ఆహార ధాన్యాలు విషపూరితం అయితే వాటి ఎగుమతులు ఆగిపోతాయి లేదా నిల్వలు పేరుకు పోతాయి. పశువుల్లో వ్యాధులను వ్యాపింప చేస్తే వాటిని హతమార్చాల్సి ఉంటుంది. పరోక్షంగా రైతాంగానికి భారీ మొత్తాలను పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.పరిశ్రమలకూ పరిహారంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి, ఖర్చులూ పెరుగుతాయి. పశువుల్లో గాలికుంటు వ్యాధిని అమెరికాలో 1929లోనే నిర్మూలించారు. ఇతర ప్రాంతాల్లో ఉంది. ఇది మసూచి కంటే 20 రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ కేవలం నలభై ఎనిమిది గంటల్లో వంద కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందగలదు. ఏదైనా వస్త్రానికి అంటుకుంటే నెల రోజుల పాటు బతికి ఉంటుంది. దీని గురించి తెలుసుకొనే లోపే అమెరికాలోని 25 రాష్ట్రాలకు కేవలం ఐదు రోజుల్లో వ్యాపింపగలదని అంచనా. అమెరికాకు పక్కనే దక్షిణ అమెరికాలో ఈ వ్యాధి ఉంది. అమెరికాలో ఒక్కో రైతు 1,500 నుంచి పదివేల వరకు ఆవులను పెంచుతాడు. ఒక దగ్గర ఈ వైరస్‌ను ప్రవేశపెడితే జరిగే నష్టాన్ని ఊహించుకోవచ్చు.2001లో బ్రిటన్‌లో ఈ వ్యాధి వ్యాపించటంతో 40లక్షల పశువులను వధించాల్సి వచ్చింది. అదే అమెరికాలో సంభవిస్తే 60 బిలియన్‌ డాలర్ల నష్టం(2012అంచనా) అని పరిశోధకులు పేర్కొన్నారు.ఇలాంటి దుర్మార్గాలకు తాము పాల్పడిన ఉదంతాలు అమెరికా అధికార యంత్రాంగానికి తెలుసుగనుక వారు నిరంతరం భయపడుతూనే ఉంటారు, ఎందుకు అంటే అమెరికాను ప్రతి ఒక్కరూ ద్వేషిస్తున్నారు గనుక. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అది అమెరికా నుంచి కూడా కావచ్చు !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వ్యవసాయ ఉగ్రవాదం : వయ్యారి భామను భారత్‌పై దాడికి పంపిన వగలమారి మామ !

06 Friday Jun 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Environment, Farmers, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, Uncategorized, USA, WAR

≈ 1 Comment

Tags

Agro Terrorism, Bioterrorism, China, FBI, invasive herb, parthenium seeds, US Attacked India

ఎం కోటేశ్వరరావు


అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు ఫుసారియమ్‌ గ్రామినియారమ్‌ అనే ఫంగన్‌ను చైనా పంపిందని, దాన్ని తీసుకువచ్చిన ఇద్దరు చైనా జాతీయులను అమెరికా ఎఫ్‌బిఐ అరెస్టు చేసినట్లు అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. దీన్ని ఆగ్రో టెర్రరిజం(వ్యవసాయ ఉగ్రవాదం లేదా దాడి ) అని పిలుస్తున్నారు. ఆ ఫంగస్‌ను పరిశోధనలకోసం తెచ్చారన్నది ఒక కథనమైతే అమెరికా వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు తీసుకువచ్చారనేది మరొక ఆరోపణ. ఎవరినైనా కేసుల్లో ఇరికించదలిస్తే పోలీసులు లేదా క్రిమినల్‌ గాంగ్స్‌ మాదక ద్రవ్యాలను ప్రత్యర్థుల నివాసాలు లేదా కార్యాలయాల్లో పెట్టి కేసుల్లో ఇరికించటం తెలిసిందే. రెండు దేశాల మధ్య వైరుధ్యాలు ముదిరితే ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల సిబ్బంది గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించి వెళ్లగొట్టటం సాధారణమే. అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వైరం పూర్వరంగంలో ఫుసారియమ్‌ ఫంగస్‌ను అమెరికా ఏజంట్లే చైనీయుల చేతిలో పెట్టి అరెస్టు చేసి ఉండవచ్చు. ఎందుకంటే అది అమెరికాలో కూడా దొరుకుతుంది. అరెస్టు చేసిన ఎఫ్‌బిఐ కథనం ప్రకారం జున్‌యోంగ్‌ లియు అనే 34 ఏండ్ల పరిశోధకుడు చైనాలో పని చేస్తున్నాడు.తన స్నేహితురాలు యంగింగ్‌ జియాన్‌ (33) అమెరికాలోని మిచిగాన్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నది. ఆమెను కలిసేందుకు 2024జూలైలో అమెరికా వచ్చాడు, తనతో పాటు ఫంగస్‌ను తెచ్చాడు. జియాన్‌ పని చేస్తున్న ప్రయోగశాలలో పరిశోధన కోసం పంగస్‌ను తెచ్చినట్లు ఆరోపణ. వారి చర్యలు అమెరికా పౌరుల భద్రతకు పెను ముప్పు అంటూ కేసు నమోదు చేశారు. వారు కమ్యూనిస్టు పార్టీకి విధేయులు కావటం మరింత ముప్పని అమెరికా అటార్నీ చెప్పాడు. మన దేశంలో నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లు చేసినపుడు వారి వద్ద ఎర్ర అట్టలున్న విప్లవ సాహిత్యం దొరికినట్లు పోలీసులు చెప్పే పిట్టకతలు తెలిసినవే. అలాగే వారు చైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యులని కూడా అమెరికా పోలీసులు తెలుసుకున్నారట. తప్పుడు సమాచారం, తప్పుడు వీసాల ఆరోపణల గురించి చెప్పనవసరం లేదు. చైనా తన ఏజంట్లు, పరిశోధకులను అమెరికా సంస్థలలోకి చొప్పించి విద్రోహ చర్యలతో అమెరికా ఆహార సరఫరా వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ పని చేస్తోందని భారతీయ సంతతికి చెందిన ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ ఆరోపించాడు. ఆ కేసు ఏమౌతుంది ఏమిటి అన్నది ముందు ముందు చూద్దాం.

అసలు ఆగ్రో టెర్రరిజం గురించి అమెరికా గుండెలు బాదుకోవటాన్ని చూస్తే దొంగే దొంగని అరవటం గుర్తుకు వస్తోంది. మన దేశం గడచిన ఏడున్నర దశాబ్దాలుగా అమెరికా ఆగ్రో టెర్రరిజానికి బలి అవుతున్నది. ఇది నమ్మలేని నిజం, మన మీడియాకు కనిపించని వాస్తవం. మీరు ఎప్పుడైనా వయ్యారి భామ, కాంగ్రెస్‌ గడ్డి, పార్ధీనియమ్‌ అనే మాటలను విన్నారా ? మూడూ ఒకటే, మన రైతాంగాన్ని, మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అమెరికా కలుపు మొక్క. దీని శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టరోఫోరస్‌. ఇది చూడటానికి అందంగా ఉంటుంది గనుక వయ్యారి భామ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్‌ గడ్డి అని పిలిచారు. అమెరికా అమ్మాయి కూడా అంటారు. ఒక మొక్క ఎంతో ఏపుగా పెరిగి చాలా త్వరగా పుష్పించి వేలాది విత్తనాలను విడుదల చేస్తుంది.చాలా చిన్నవిగా ఉండటంతో గాలిలో మూడు కిలోమీటర్ల వరకు వ్యాపించి మొలకలెత్తుతాయి. ఒక్కో మొక్క 60 కోట్ల పుప్పొడి రేణువులను వదులుతుందట. ఇవి మొలిస్తే పంటల దిగుబడి 40శాతం తగ్గుతుంది, వాటిని తాకితే, తింటే పశువులు, మనుషులకూ వ్యాధికారకాలవుతాయి.దేశంలో 35 మిలియన్ల హెక్టార్లలో ఇది వ్యాపించి ఉన్నట్లు అంచనా. ఇంకా ఎక్కువే అన్నది మరొక అభిప్రాయం. మొక్కగా ఉన్నపుడు దాన్ని నాశనం చేయకపోతే పుష్పించినపుడు రెచ్చిపోతుంది.


మనదేశం స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొన్నది. ఆసమయంలో అమెరికాతో ఉన్న సంబంధాలతో ప్రధాని నెహ్రూ అక్కడి నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటే వాటితో అమెరికా ఈ కలుపు మొక్కనూ కావాలనే మనకు బహుమతిగా పంపింది. అంతకు ముందు అసలు మన రైతాంగానికి దీని గురించి తెలియదు. ఇది పంటలను దెబ్బతీస్తుందని అమెరికన్లకు పూర్తిగా తెలుసు. గోధుమలతో పాటు పంపింది అంటే మన పొలాల్లో వ్యాపించి పంటలను దెబ్బతీయాలని, తద్వారా శాశ్వతంగా తమ మీద ఆహార ధాన్యాలకు ఆధారపడేట్లు చేసుకోవాలన్నది అమెరికా ఎత్తుగడ. నాడు పిఎల్‌ (పబ్లిక్‌ లా)480 పధకం కింద 1950దశకంలో కేవలం రెండు మిలియన్‌ టన్నుల గోధుమలను సాయంగా తెచ్చుకున్నందుకు ఇప్పటికీ మనం మూల్యం చెల్లిస్తూనే ఉన్నాం. అనేక మంది ఊపిరితిత్తులు, చర్మ వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు, నోరులేని పశువుల సంగతి సరేసరి. వ్యాధులతో పాటు పాలదిగుబడీ తగ్గిపోతుంది.దీన్ని అమెరికా మన ఒక్క దేశానికే కాదు 46దేశాలకు వ్యాపింప చేసిందంటే దాని కుట్ర ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు, ఇది అతి పెద్ద ఆగ్రో టెర్రరిజం కాదా ! నాడు మనదేశం అలీన విధానాన్ని అనుసరిస్తున్నది, ఆహార ధాన్యాలు కావాలని కోరినపుడు తమతో కలిస్తే వెంటనే ఇస్తామని 1949లో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ ఒక బిస్కెట్‌ వేశాడు. నెహ్రూ అంగీకరించలేదు, ఉచితంగా వద్దు డబ్బుతీసుకోవాలని ప్రతిపాదించాడు.1955వరకు ఎటూ తేల్చలేదు, మరోవైపు దేశంలో ఆహార కొరత పెరుగుతుండటంతో అమెరికా సాయంగానే ఇస్తూ ప్రపంచంలో పది ప్రమాదకర మొక్కల్లో ఒకటైన వయ్యారి భామను మన మీదకు వదిలింది. కావాలనే వదలినట్లు ఇంత వరకు అంగీకరించకపోగా తామే పంపినట్లు ఆధారాలేమిటో చూపాలని మనలను దబాయిస్తోంది.

ప్రమాదకరమైన కలుపు మొక్కలు, విత్తనాలు ఇతర దేశాల నుంచి రాకుండా అరికట్టేందుకు అవసరమైన గట్టి చట్టాలు, నిబంధనల మనదేశంలో లేని కారణంగా అనేకం మన దేశంలో ప్రవేశించాయి. మెక్సికో, అమెరికా, లాటిన్‌ అమెరికా నుంచి వయ్యారి భామ ఇతర దేశాలకు వ్యాపించింది. మన దేశంలో దీన్ని పూర్తిగా తొలగించాలంటే పదేండ్ల పాటు ఏడాదికి 18,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని 2010లో శాస్త్రవేత్తలు చెప్పారు, 1955 నుంచి మనకు జరిగిన నష్టం రు. 2,06,716 కోట్లు అని ఒక అంచనా. ఇది గాక మనుషుల, పశువుల అనారోగ్య ఖర్చు అదనం. జీవ వైవిధ్యానికి జరిగిన నష్టం, పునరుద్దరణలను పరిగణనలోకి తీసుకుంటే ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ నష్టం అంటున్నారు. జమ్మూ`కాశ్మీరులో పాకిస్తాన్‌ ఉగ్రవాద సమస్య గురించి మాత్రమే మనకు తెలుసు, కార్గిల్‌ వంటి ప్రాంతాలలో వయ్యారి భామ తిష్టవేసింది, ప్రధాన భూభాగానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అండమాన్‌కు సైతం ఇది విస్తరించిందంటే దాని వేగం, ప్రమాదం ఏమిటో అర్దం చేసుకోవచ్చు. మన కళ్ల ముందు వయ్యారాలు పోతూ సవాలు చేస్తున్న ఈ ఆగ్రో ఉగ్రవాదిని అరికట్టేందుకు దేశమంతటా ఒకేసారి చర్యలు తీసుకొని ఉంటే నిరోధించి ఉండేవారు. కానీ జరగలేదు. దీని విస్తరణ ఎంత ప్రాంతంలో జరిగిందన్నది కూడా సమగ్ర అధ్యయనం లేదు. ఒక అంచనా ప్రకారం ఎక్కువగా పెరిగిన ప్రాంతం నుంచి దీన్ని తొలగించాలంటే హెక్టారుకు నలభై పనిదినాలు అవసరమని తేల్చారు. ఆయా సమయాలను బట్టి అందుకయ్యే ఖర్చును లెక్కకట్టాలి.


ఆగ్రో ఉగ్రవాది వయ్యార భామ గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం, వ్యవసాయంతో అనుబంధంగా ఉండే వాటిపై మరికొన్ని దాడుల గురించి చూద్దాం. వీర, రౌద్ర,శోక,హాస్య,శృంగార తదితర రసాలతో పాటు భీభత్స రసం అంటే ఉగ్రవాదమే. ఇతిహాసాలు, పురాణాల్లో వీరులు శత్రువులకు ఈరసాన్ని చవి చూపించినట్లు చదువుకున్నాం. కానీ ఆధునిక మిలిటరీ దుర్మార్గాల్లో బయో ఉగ్రవాదం కూడా ఒక ఆయుధం.అనేక ప్రమాదకర వైరస్‌లను ప్రత్యేకంగా ఎవరో పనిగట్టుకొని వ్యాపింప చేయనవసరం లేదు. అయితే సహజంగా తలెత్తినవి ఏవో ఇతరులు ప్రయోగించినవి ఏవో తెలుసుకోవటం అవసరం, అదేమీ కష్టం కూడా కాదు. ఆఫ్రికన్‌ హార్స్‌ సిక్‌నెస్‌(ఎహెచ్‌ఎస్‌) వైరస్‌ను తొలిసారిగా 1600 సంవత్సరాల్లో ఆఫ్రికాలోని సహారా ఎడారి కనుగొన్నారు. అది క్రమంగా మనదేశానికి వ్యాపించి మిలిటరీలో ఉన్నవాటితో సహా 20లక్షల గుర్రాల మరణానికి కారణమైంది. రిఫ్ట్‌వాలీ వైరస్‌ అనేది ఒంటెల ద్వారా వ్యాపిస్తుంది, అనేక దేశాలను అది చుట్టుముట్టింది,మన దేశం సంగతి తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. మన వ్యవసాయానికి అనుబంధంగా ఉండేది పశుపాలన, చేపలు, రొయ్యలు, కోళ్ల పెంపకం వంటివి. వాటికి అనేక వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. సంతలు, మార్కెట్‌లు పెద్ద వ్యాపక కేంద్రాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఆరేండ్ల నాటి అంచనా ప్రకారం దేశంలో ఎలుకలు, పందికొక్కుల సంఖ్య 240 కోట్లు, అవి ఇప్పుడిరకా పెరిగి ఉంటాయి. ప్రతి ఆరు ఒక మనిషి ఆహారాన్ని తింటున్నాయి. ఏటా 24లక్షల నుంచి 2.6కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. వాటితో వచ్చే వ్యాధులు, వాటి నివారణ ఖర్చులపై అంచనాల్లేవు. వీటన్నింటినీ ఎవరు ప్రవేశపెట్టినట్లు ? ఇప్పుడైతే కుట్ర సిద్దాంతవేత్తలు, వారిని అనుసరించే మీడియా పండితులు వెంటనే చైనా అనేస్తారు. గతంలో ప్రపంచలో కోట్లాది మంది ప్రాణాలు తీసిన ప్లేగు, స్పానిష్‌ ఫ్లూ వంటి వాటికి కూడా అదే అని చెప్పినా ఆశ్చర్యం లేదు.బ్రిటీష్‌ పాలనా కాలంలో 1943లో వచ్చిన బెంగాల్‌ కరువుకు 30లక్షల మంది మరణించారు.వారి ఆకలి బాధ తీర్చటానికి ఆ రోజు ప్రపంచంలో ఆహారం లేదా అంటే ఉంది,బ్రిటీష్‌ వారికి పట్టలేదంతే ! ఇటీవలి సంవత్సరాల్లో తెల్లదోమ ఎంతటి వినాశనాన్ని కలిగించిందో చూశాము. తెగుళ్ల నివారణకు తయారు చేసిన సింథటిక్‌ పైరిత్రాయిడ్స్‌ వినియోగంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని కొత్త సమస్యలు తలెత్తాయి. అనేక పశ్చిమ దేశాలలో వాటిని నిషేధించినప్పటికీ మనదేశంలో వాటిని విక్రయించేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. బహుళజాతి గుత్త సంస్థలు చేస్తున్న ఆగ్రో ఉగ్రదాడి తప్ప మరొకటి కాదు. అసలు అమెరికా గతంలో చేసిన ఆగ్రో ఉగ్రదాడులకు బలైన దేశాలు, ఉదంతాలు గురించి మరో విశ్లేషణలో చూద్దాం !

Share this:

  • Tweet
  • More
Like Loading...

కుంభమేళా లాభ నష్టాలు : అమెరికా చాట్‌ జిపిటి, చైనా డీప్‌సీక్‌, మనం గంగలో మునిగి తేలుతున్నాం !

01 Saturday Mar 2025

Posted by raomk in BJP, CHINA, Communalism, Congress, Current Affairs, Education, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Science, USA, Women

≈ Leave a comment

Tags

BJP, Kumbha Mela, Narendra Modi Failures, R&D China and India, R&D Expenditures, RSS, Science, scientific temper, Yogi Adityanath

ఎం కోటేశ్వరరావు


జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌ రాజ్‌ పాతపేరు అలహాబాద్‌లో మహాకుంభమేళా, ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ సైన్సు దినోత్సం జరిగింది. మీడియా దేనికి ఎంత ప్రచారమిచ్చింది ? కుంభమేళాకు ఇచ్చిన ప్రచారంలో వెయ్యోవంతైనా శాస్త్రవిజ్ఞానం, మూఢవిశ్వాసాలు సంబంధిత లాభనష్టాల గురించి పాఠకులు, వీక్షకులకు చెప్పిందా ? కుంభమేళా స్నానాలకుసైన్సును జోడిరచిన ప్రవచనాలకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరి నమ్మకాలు వారివి. ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం 66 కోట్ల మంది గంగ, యమున, అంతర్వాహిని అని చెబుతున్న సరస్వతి నది త్రివేణీ సంగమంలో మునకలేసి స్నానాలు చేశారు. దీని వెనుక అనేక నమ్మకాలు ఉన్నాయి. కొందరు పుణ్యం కోసం అంటే మరికొందరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా, పాపాలను కడిగి వేసుకొనేందుకని రకరకాల కారణాలు చెప్పారు. ఎవరికి ఏమి లభించిందో తెలియదు. ఎవరి గోల, ఎవరి లెక్కలు వారివి. వెళ్లినవారు తమ యాత్ర, స్నానం జరిగిన తీరు గురించి చెప్పుకుంటుంటే ఈ కార్యక్రమం వలన రెండున్నరలక్షల కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు కొందరు అంచనా వేశారు. జాతీయ స్థూల ఉత్పత్తికి నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర లబ్ది కలిగిందని దీన్ని ‘‘ శాస్త్రీయం ’’ గా లెక్కలు కట్టి రాష్ట్రంలోని సంఘటిత, అసంఘటిత రంగానికి కలిగిన లబ్ది, ఉపాధి గురించి నిర్ధారించాలని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించినట్లు వార్తలు(దైనిక జాగరణ్‌,2025 ఫిబ్రవరి 27) వచ్చాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రచార అస్త్రంగా దీన్ని మార్చుకుంటారు గనుక అలాంటి లెక్కలను తేల్చాలని కోరటం అర్ధం చేసుకోదగిందే. ఒక అశాస్త్రీయ అంశాన్ని ప్రోత్సహించి దాని ద్వారా కలిగిన ఆర్థిక లబ్దిని శాస్త్రీయంగా తేల్చాలనటం కొందరికే సాధ్యం. భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్న లోకోక్తి ఊరికే రాలేదు.

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జు 2012 ఏప్రిల్‌ నాలుగవ తేదీన జనాన్ని వెర్రివెంగళప్పలు చేసేందుకు పది మార్గాలంటూ ఒక వ్యాసం రాశారు. మన దేశంలోని 90శాతం మంది జనాలకు శాస్త్రీయ దృక్పధం లేదని పేర్కొన్నారు. ఈ శాతాన్ని మీరు ఎలా చెప్పారంటూ అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఢల్లీి విలేకరి కట్జును ప్రశ్నించారట. ఇది గణాంకం కాదు, ఒక అంచనా మాత్రమే అంటూ అది 85శాతం లేదా 95శాతం కూడా కావచ్చని చెప్పానని, తాను రాసిన దానికి అర్ధం భారతీయులు అత్యధికులు వెర్రి వెంగళప్పలు అని చెప్పినట్లు తరువాత ఆయనే మరో వ్యాసంలో రాశారు. కుంభమేళా గురించి మీడియా కల్పించిన ప్రచారం, దానికి ప్రభావితులైన వారిని చూస్తే కట్జూ చెప్పినట్లు ఆ సంఖ్య ఇంకా పెరిగిందా, తగ్గిందా అన్నది ఎవరికి వారే అంచనావేసుకోవచ్చు. ఈ పదమూడు సంవత్సరాలలో దేశాంలో శాస్త్రీయ దృక్పధం పెరిగిందని, కట్జూ చెప్పింది తప్పని, శాస్త్రీయంగానే 66 కోట్ల మంది గంగలో మునిగారని ఎవరైనా శాస్త్రీయంగా నిరూపిస్తే అంగీకరించటానికి ఇబ్బంది లేదు. ముస్లిం, క్రైస్తవం, ఇతర మతాల్లో కూడా ఇలాంటివి గాకపోయినా పెద్ద సంఖ్యలో గుమికూడే వారికి ఇదే వర్తిస్తుంది. మతం, అది వ్యాపింపచేసే నమ్మకాలు మత్తు మందు.

అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే శాస్త్రవేత్తలు అవి కూలిపోకుండా ఎగరాలంటూ దేవుళ్లు, దేవతలను ప్రార్ధించటం తెలిసిందే. బిజెపి వాగ్దానాలలో సైన్సు అభివృద్ధి ఒకటి. చూడండి మా మోడీ కారణంగానే డిజిటల్‌ ఇండియా ఉనికిలోకి వచ్చింది, బిచ్చగాండ్లు కూడా బాంకు ఖాతా ఓపెన్‌ చేసి స్కానర్‌ పెట్టి అడుక్కుంటున్నారు అని తమ భుజాలను తామే చరుచుకొనేవారు ఉన్నారు. నిజమే, ఎలా వచ్చిందనేది అందరికీ తెలుసు గనుక ఆ ఖ్యాతిని మొత్తం నరేంద్రమోడీ తన ఖాతాలో వేసుకున్నా దేశానికి నష్టం లేదు, గతంలో ఒక సిఎం హైదరాబాదును తానే నిర్మించానన్నట్లుగా చెప్పుకున్నారు. కానీ బిచ్చగాండ్ల సంగతేమిటి ? అందుకే సైన్స్‌, సాంకేతిక పరిజ్ఞానం అంటే ఒక్క డిజిటల్‌ ఇండియా మాత్రమే కాదు. ఆ పరిజ్ఞానం ద్వారా అమెరికా కంటే ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి, కానీ ఆర్థికంగా దానికి మనం ఎంతదూరంలో ఉన్నాం ? పని చేసే ప్రభుత్వ నేతగా మోడీ గురించి చెబుతారు. పరిశోధన మరియు అభివృద్ధి రంగం(ఆర్‌ అండ్‌ డి) గురించి ఒక విధాన నిర్ణయానికే తొమ్మిదేండ్లు పట్టింది. జాతీయ పరిశోధనా ఫౌండేషన్‌ 2023లో ఉనికిలోకి వచ్చింది. ఐదేండ్లలో ఆరువందల కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అంటే అన్నారని గింజుకుంటారు గానీ ఇష్టంలేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుగా దీని వ్యవహారం ఉంది. గత కాంగ్రెస్‌ పాలకులు, నరేంద్రమోడీకి పెద్ద తేడా ఏమీలేదు.

అమెరికా చాట్‌ జిపిటి, చైనా డీప్‌ సీక్‌లో మునిగితేలుతుంటే మనం గంగలో మునకలేస్తున్నాం. మన వారు డీప్‌ సీక్‌ రూపొందించలేకపోవటానికి మనదేశాన్ని విదేశీ పాలకులు ఆక్రమించుకోవటమే అంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌లో మత కోణాన్ని జోడిరచి విశ్లేషణ చేశారు.వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని లొట్టలు వేసుకుంటూ చెబుతారు. ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాలో జ్యోతిష్కుడు చెప్పినదాన్ని నమ్మి పనిపాటాలేకుండా గడిపిన పాత్ర మాదిరి కాలక్షేపం చేస్తున్నారు. గత పది సంవత్సరాల్లో పురాణాల్లో చెప్పిన పుక్కిటి కబుర్లను వల్లెవేస్తూ మనదేశంలో ఎప్పుడో అవయవ మార్పిడి జరిగిందనటానికి వినాయకుడికి ఏనుగు తొండం అమర్చటం, కృత్రిమ గర్భం ద్వారా పిల్లలకు ఉదాహరణకు కౌరవులని, ఎంత మంది ఎక్కినా ఒకరికి చోటుండే పుష్పక విమానాలను రూపొందించారని సొల్లు కబుర్లు చెబుతున్నారు తప్ప వేదాల్లో ఉన్నవాటిని వెలికి తీసింది లేదు. శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగం నిర్దేశించగా దానికి విరుద్దంగా సిలబస్‌ నుంచి డార్విన్‌ జీవ పరిణామ సిద్దాంతాన్ని తొలగించారు.మనుషులు బ్రహ్మ ముఖం కాళ్లు చేతులు ఇతర భాగాల నుంచి పుట్టారని టీచర్లు చెప్పాలన్నమాట. ఎలాంటి వారి చేతులో చిక్కుకున్నాం ! రాజ్యాంగాన్ని దెబ్బతీయటం అంటే ఇదే. ఇలాంటి పాలకులు సైన్సు గురించి జనానికి ఎందుకు బోధిస్తారు.పరిశోధనలకు నిధులు ఎందుకు కేటాయిస్తారు.

నేషనల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేయాలని 2005లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు జాతీయ సైన్సు సలహా మండలి సిఫార్సు చేసింది, 2008లో ఆమోదం తెలిపారు.ఆ మేరకు ఒక చట్టాన్ని చేశారు. తరువాత మోడీ సర్కార్‌ అనుసంధాన్‌ నేషనల్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌(ఎన్‌ఆర్‌ఎఫ్‌) పేరుతో 2023లో ఒక చట్టాన్ని తెచ్చింది. అంతకు ముందు ఎన్ని కబుర్లు చెప్పినా ఇక చూడండి అంటూ 2023 నుంచి 2028 కాలంలో 50వేల కోట్ల రూపాయలతో పరిశోధనలు చేపడతామని చెప్పారు. ఈ మొత్తాన్ని సమీకరించేందుకు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు, 70శాతం నిధులు ప్రెవేట్‌ రంగం నుంచి సేకరిస్తామన్నారు. దీనికి ప్రధాన మంత్రే అధ్యక్షత వహిస్తారు. త్వరలో దేశాన్ని అమెరికా, చైనాల సరసన నిలబెడతామంటున్నారు. మహానుభావులు ఊరికే కబుర్లు చెప్పకూడదు కదా ! ఆ స్థాయికి చేరటానికి ఒక మార్గం పరిశోధనా రంగానికి పెద్ద మొత్తంలో కేటాయించాలి. ప్రపంచంలో ఈ కేటాయింపు జిడిపిలో సగటున రెండుశాతం ఉంది. మన దేశంలో 200910లో గరిష్టంగా 0.82శాతం ఉండగా అది మోడీ అధికారానికి వచ్చేనాటికి 0.7శాతానికి తరువాత 202425 ఆర్థిక సర్వే పేర్కొన్నదాని ప్రకారం 0.64శాతానికి దిగజారింది. ఎన్‌ఆర్‌ఎఫ్‌ ద్వారా ఐదేండ్లలో ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా 202324లో రు.2,000 కోట్లు కేటాయించి తరువాత దాన్ని కేవలం రు.258.6 కోట్లకు సవరించారు. వీరు దేశాన్ని ఉద్ధరిస్తారు, యువ పరిశోధకులను ప్రోత్సహిస్తారని ఆశించి భజన చేయాలి.

చైనాను త్వరలో అధిగమిస్తామని, ప్రపంచ వస్తుఉత్పత్తిదారుగా మారతామని కొంత మంది చెబుతుంటారు. మంచిదే, నరేంద్రమోడీ, ఆయనను గద్దె మీద కూర్చోపెట్టేందుకు ఊతమిస్తున్న చంద్రబాబు వంటి వారి 2047 రంగుల కలను కూడా నిజమే అనుకుందాం. కానీ ఆచరణ ఏమిటన్నది ప్రశ్న.1990దశకంలో భారత్‌చైనా రెండూ కూడా పరిశోధనలకు జిడిపిలో కేటాయించిన మొత్తం 0.7శాతమే. కానీ నేడు చైనా 2024లో 2.68శాతం ఖర్చు చేసింది. 202526 మన కేంద్ర బడ్జెట్‌ డాలర్లలో 584 బిలియన్లు కాగా 2024లో చైనా ఒక్క పరిశోధనకు ఖర్చు చేసిన మొత్తమే 496 బిలియన్‌ డాలర్లు.అర్ధం అవుతోందా ! కేంద్ర ప్రభుత్వం 2024నవంబరు 29న పార్లమెంటులో వెల్లడిరచిన సమాచారం ప్రకారం పది సంవత్సరాలలో మన పరిశోధన ఖర్చు జిడిపిలో 0.60.7శాతం మధ్య ఉండగా ఇజ్రాయెల్‌ 5.4, అమెరికా 3.5 శాతాల చొప్పున ఖర్చు చేస్తున్నాయి.మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అన్నట్లు కబుర్లు చెబితే దేశం ముందుకు పోదు. అన్నీ నెహ్రూయే చేశారు అని చెప్పే పెద్దలు పరిశోధనకు నిధులు పెంచకుండా ఎవరు అడ్డుకున్నారు? కుండలో కూడు అలాగే ఉండాలి పిల్లాడు భీముడిలా తయారు కావాలంటే కుదురుతుందా ?

పోనీ మన దేశం పరిశోధనలకు దూరంగా ఉందా అంటే లేదు.గోమూత్రంలో బంగారం ఎంతుంది, పేడలో ఏముంది అంటూ శోధిస్తున్నారు. సంఘపరివార్‌ భావజాలానికి అనుగుణంగా ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు జన్యు పరిశోధనలు చేసి దేశంలో ఉన్న జనాభా ‘‘ శుద్ధమైన జాతి ’’ జాతి ఏదో తేల్చేందుకు 2022లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిధులు ఇస్తున్నదనే వార్తలు వచ్చాయి. ఇది ప్రమాదకరమని, విరమించాలని జన్యుశాస్త్రంలో నిపుణులు, చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు 120 మంది నాడు కేంద్రానికి లేఖ రాశారు. జన్యు చరిత్రను తెలుసుకోవటం అనే కారణాన్ని ప్రభుత్వం చెప్పింది.వివిధ ప్రజా సమూహాల నుంచి గతంలో డిఎన్‌ఏలను సేకరించి చేసిన విశ్లేషణ ప్రకారం అనేకవాటి సమ్మిళితం అని తేలింది. ఫలానా జన్యువులు ఉన్నవారు పరిశుద్దులు అంటే మిగతావారిని అవమానించే తీర్పు తప్ప సైన్సు కాదు. ఇలాంటి పనులన్నింటికీ స్ఫూర్తి జర్మన్‌ హిట్లర్‌. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతవేత్త , గురువుగా పరిగణించే ఎంఎస్‌ గోల్వాల్కర్‌ 1960 డిసెంబరులో గుజరాత్‌ విశ్వవిద్యాలయ విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగించారు. దానిలో చెప్పిన అంశాల గురించి రచయిత, గతంలో ఆర్థికశాఖ సలహాదారుగా పనిచేసిన మోహన్‌ గురుస్వామి ప్రాంటియర్‌ పత్రిక 2018వ సంవత్సరం40వ సంచికలో ఒక వ్యాసం రాశారు. ‘‘ఉత్తమ జాతి సృష్టిక్రియేటింగ్‌ ఏ మాస్టర్‌ రేస్‌ ’’ శీర్షిక పెట్టారు. దాని ప్రకారం గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలు ఇలా ఉన్నాయి.‘‘ మనం కేవలం జంతువులలో మాత్రమే సంకర జాతిని సృష్టించేందుకు ప్రయోగాలు చేశాం. మానవ సంకరం ద్వారా మెరుగైన మనుషు సృష్టించేందుకు మన పూర్వీకులు ధైర్యవంతమైన ప్రయోగాలు చేశారు.ఉత్తరాదికి చెందిన నంబూద్రీ బ్రాహ్మణులు కేరళలో స్దిరపడ్డారు. ఒక సాహసోపేతమైన నిబంధన తెచ్చారు. దాని ప్రకారం ఏ తరగతికి చెందిన వారైనా వివాహిత మహిళ ముందుగా ఒక నంబూద్రీ బ్రాహ్మణుడిని కూడి ఒక బిడ్డను కనాలి, తరువాతే ఆమె భర్తతో పిల్లలను కనాలి.( ఆర్‌ఎస్‌ఎస్‌ వాణి ఆర్గనైజర్‌ పత్రిక 1961 జనవరి రెండు సంచికలో ఉపన్యాస పూర్తి పాఠం ఉంది) ’’.

ఇలాంటి గురువుల శిష్యులు చేస్తున్నదేమిటి ? సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన అనేక సంస్థలలో ఆరోగ్యభారతి ఒకటి. అది గర్భ విజ్ఞాన సంస్కార్‌ పేరుతో ఒక ప్రాజెక్టు నడుపుతున్నది. ఆజానుబాహులు, మంచి రంగు, రూపుతో ఉండే పిల్లలను పుట్టించటానికి పూనుకుంది. గుజరాత్‌లో మొదలెట్టి దేశమంతటా దీన్ని విస్తరించేందుకు తలపెట్టారు. అనేక చోట్ల ఈ మేరకు సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. జర్మన్‌ హిట్లర్‌ ఆర్యజాతి ఉత్తమమైనదని చెప్పినట్లుగానే ఉత్తమ హిందూజాతిని, హిందూ దేశభక్తులను రూపొందించేందుకు ఈ ప్రయత్నాలని జనాలను నమ్మిస్తున్నారు. జర్మన్‌ కాని సైన్సు పుస్తకాలను 1933లో నాజీలు తగులబెట్టారు. వాటిలో నాజీల భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నవాటితో పాటు యూదు రచయితలు రాసినవి ఉన్నాయి. బెర్లిన్‌లో ఉన్న లైంగిక విజ్ఞాన సంస్థను లూటీ చేసి విధ్వంసకాండ సృష్టించారు. అంతే కాదు దేశంలో వివిధ సంస్థలలో శాస్త్రవేత్తలైనా, విద్యావేత్తలు, మేథావులు ఆర్యనేతరులు ఉంటే వారి స్థానాల నుంచి తొలగించారు. ఆర్య జాతి పవిత్రతను పరిశోధించి తేల్చే పేరుతో, తమ భావజాల లక్ష్యాలకు అనుగుణంగా జైళ్లలోని వేలాది మంది ఖైదీలపై అమానుషంగా పరీక్షలు, ప్రయోగాలు చేశారు.


మన దేశంలో అలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. 2025 ఫిబ్రవరి ఎనిమిదిన తిరుపతి పుస్తక మహోత్సవంలో కాషాయ మూకలు దాడులకు పాల్పడ్డాయి.ఖురాన్‌ గ్రంధంలోని అంశాలను ఉటంకిస్తూ ఇస్లామిక్‌`హిందూ విలువల గురించి పోల్చిన ఖురాన్‌ అనాలసిస్‌ అనే పుస్తకాన్ని విక్రయించినందుకు ఒక స్టాల్‌మీద దాడి జరిగింది. దాన్ని రాసింది శర్మ అనే హిందువే. అలాగే పెరియార్‌ రచనలతో పాటు రంగనాయకమ్మ రచన రామాయణ విషవృక్షం అనే గ్రంధాలను ఎందుకు విక్రయిస్తున్నారంటూ విశాలాంధ్ర స్టాల్‌ మీద దాడి చేశారు. అంతకు ముందు హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో తిరుపతి బాలాజీ విగ్రహం గురించిన ఒక పుస్తకాన్ని ఉంచినందుకు వీక్షణం స్టాల్‌ మీద అదే చేశారు. చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం మీద దాడి చేశారు. చరిత్రలో యంత్ర విధ్వంసకుల గురించి చదివాము.కొన్నింటిని నాశనం చేస్తే తరువాత వేలాది యంత్రాలు వచ్చాయి, వస్తాయి. అలాగే పుస్తకాలను అడ్డుకుంటే భావజాల వ్యాప్తి ఆగుతుందా ? పురాతన తక్షశిల విద్యాకేంద్రాన్ని ధ్వంసచేసినంత మాత్రాన మనదేశంలో భావజాల వ్యాప్తి ఆగిందా ! అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలని చూసే బాపతు గురించి వేరే చెప్పాలా ? ఇలాంటి వారు అజ్ఞానాన్ని తప్ప విజ్ఞాన శాస్త్రాలను ప్రోత్సహిస్తారా ? వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని నమ్మేవారు పరిశోధన మరియు అభివృద్ధికి నిధులు కేటాయిస్తారా ? దేశాన్ని మధ్యయుగాల నాటికి తప్ప ముందుకు తీసుకుపోతారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

దివ్యాస్త్రం అగ్ని క్షిపణి చైనా, పాకిస్థాన్లను దెబ్బతీస్తుందా ?

12 Tuesday Mar 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Science, USA, WAR

≈ 1 Comment

Tags

Ababeel Missile, Agni V, Agni-V missile test, Arms race, BJP, China, Dongfeng 41, MIRV technology, Missile Matters, Mission Divyastra, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


ఒకేసారి పలు లక్ష్యాలను దెబ్బతీసే ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో అగ్నిా5 తరం క్షిపణి తొలి ప్రయోగం జయప్రదంగా జరిగినట్లు ప్రధాని నరేంద్రమోడీ 2024 మార్చి 11న ప్రకటించారు. దాన్ని దివ్యాస్త్రంగా వర్ణించారు. ఈ విజయానికి కారకులైన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.ఈ ప్రకటనతో మీడియా, సామాజిక మాధ్యమంలో పలు రకాల స్పందనలు వెలువడ్డాయి. ఒక్క క్షిపణితో చైనాలోని పలు లక్ష్యాలను దెబ్బతీయవచ్చు అని కాషాయ దళాలు నడిపే పత్రిక స్వరాజ్య ఒక విశ్లేషణను ప్రచురించింది. మిలిటరీ ఉన్మాదంతో ఊగిపోయే వారికి అలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. పరస్పర అనుమానాలు, కుట్ర సిద్దాంతాలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న నేపధ్యంలో ఏ దేశానికి ఆ దేశం తన రక్షణకు అవసరమైన పాటవాన్ని సమకూర్చుకుంటున్నది, అది ప్రతిదేశానికి ఉన్న హక్కు. అందుకే మనదేశం అణుపరీక్షలు జరిపినా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి) మీద సంతకం చేయకపోయినా కమ్యూనిస్టులతో సహా అందరూ మనదేశ వైఖరిని సమర్ధించారు. సరిగ్గా ఎన్నికల ముందు పరీక్ష నిర్వహించటం, దాని గురించి ప్రధాని ప్రకటించటం, దానికి చైనా వ్యతిరేకతను నూరిపోస్తూ మీడియా స్పందించటం అర్ధం కానంత బ్రహ్మవిద్యేమీ కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన విజయాలు తమ ఘనతే అని రాజకీయపార్టీలు చెప్పుకోవటం ఓట్ల రాజకీయమే. ప్రధాని నరేంద్రమోడీ లాగులు లేదా నిక్కర్లు వేసుకొని తిరుగుతున్న వయస్సులోనే 1958లో అంతకు ముందు విడిగా ఉన్న కొన్ని సంస్థలను కలిపి డిఆర్‌డిఓ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సమిష్టి కృషితో అనేక విజయాలను మన శాస్త్రవేత్తలు సాధించారు, అదే క్రమం కొనసాగుతోంది. మన జాగ్రత్తలో మనం ఉండటం సమర్ధనీయమే, బస్తీమే సవాల్‌ అని ఎదుటివారి మీద తొడగొట్టటం వేరు. రెండవది ప్రమాదకరం అని ప్రపంచ చరిత్ర చెబుతున్నది.


ఓట్ల కోసం మనోభావాలను ముందుకు తేవటం, విద్వేషాన్ని నూరిపోయటం గత పది సంవత్సరాలు, అంతకు ముందు నుంచీ చూస్తున్నదే. కొన్ని వాస్తవాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఐదవతరం అగ్ని క్షిపణితో నిజంగా పాకిస్థాన్‌, చైనాలను దెబ్బతీయగలమా ! కచ్చితంగా తీయగలం, ఎప్పుడు ? వాటి దగ్గర అలాంటివి లేనపుడు, ఉన్నా సన్నద్దంగా లేనపుడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా ? ప్రతి దేశమూ పోటా పోటీగా ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. మనం జరిపింది తొలి పరీక్ష మాత్రమే, ఇది ఐదువేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను దెబ్బతీయవచ్చునని చెబుతున్నారు. ఇలాంటి క్షిపణులను మనకంటే ఎంతో ముందుగా అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, పాకిస్థాన్‌ సమకూర్చుకున్నాయి. మన క్షిపణి ఒకేసారి ఎన్ని బాంబులను మోసుకుపోగలదో తెలియదు, నాలుగు అంటున్నారు. మిగతా దేశాల(రష్యా శాటన్‌-2) దగ్గర 16 బాంబులు(అదే సంఖ్యలో లక్ష్యాలు) మోసుకుపోగలవి ఉన్నట్లు మీడియాలో వెతికితే వివరాలు ఉన్నాయి.మనం తొలిపరీక్ష ఇప్పుడు చేస్తే చైనా 2016నాటికే ఏడు పరీక్షలు జరిపింది, తరువాత కూడా చేస్తున్నది. చైనా వద్ద ఆధునిక డిఎఫ్‌-41క్షిపణి 12 నుంచి 15వేల కిలోమీటర్లు అంటే అమెరికాలో ఉన్న లక్ష్యాలను కూడా తాకగలదు.మనం గనుక ఎదురుదాడికి దిగి క్షిపణిని వదిలితే ఎవరూ పసిగట్టలేరని చెబుతున్నారు. ఇదే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఏ దేశం ఎదురుదాడికి దిగినా అదే జరుగుతుంది. మనకు ఇతరులెంత దూరమో వారికి మనమూ అంతేదూరంలో ఉంటాం. దక్షిణాసియాలో తొలిసారిగా ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్థాన్‌ అబాబీల్‌ క్షిపణిని రూపొందించిందని గమనంలో ఉంచుకోవాలి. దాని పరిధి 2,200కిలోమీటర్లని వార్తలు. ఒకసారి పరీక్షలు మొదలైన తరువాత విస్తరించటం పెద్ద కష్టమేమీ కాదు. మీడియాలో వచ్చినట్లుగా మనమే ఎదురుదాడికి దిగితే మనకంటే బలంగా ఉన్న చైనా ఊరుకుంటుందా ? ఇప్పటికే అది భూమి,మోటారు వాహనాలు, రైళ్ల మీద నుంచి ప్రయోగించే ఎంఐఆర్‌వి క్షిపణులను కలిగి ఉంది.2019లోనే అలాంటి వాటిని మిలిటరీకి అందచేసింది. మనం పరీక్షించిన తాజా క్షిపణిని మిలిటరీకి అందించాలంటే మరికొన్ని సంవత్సరాలు పడుతుంది.


గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ అనే సంస్థ ప్రతిదేశానికి సంబంధించి 60అంశాలను పరిగణనలోకి తీసుకొని 145 దేశాలకు 2024 సంవత్సర సూచికలను ఇచ్చింది.దాని ప్రకారం 0.0000 పాయింట్లు వస్తే ఆ దేశం పక్కాగా ఉన్నట్లు. ఈ ప్రాతిపదికన మొదటి స్థానంలో ఉన్న అమెరికాకు 0.0699, రెండవదిగా ఉన్న రష్యాకు 0.0702, మూడవది చైనాకు 0.0706 రాగా నాలుగవ స్థానంలో ఉన్న మనదేశానికి 0.1023 మార్కులు వచ్చాయి. అంటే చైనా కంటే ఎంతో దిగువన ఉంది. తొలి పది స్థానాల్లో మన తరువాత దక్షిణ కొరియా, బ్రిటన్‌,జపాన్‌, టర్కీ, పాకిస్థాన్‌, ఇటలీ ఉన్నాయి. ఒక వేళ యుద్దమే వస్తే ఇప్పుడున్న ప్రపంచ రాజకీయాలు, సమీకరణల్లో చైనా, పాకిస్థాన్‌ ఒక్కటయ్యే అవకాశం, రష్యా పరోక్షంగా చైనాకు సహరించే పరిస్థితి ఉందని యుద్దం గురించి రంకెలు వేసేవారు గమనించాలి. మన దేశానికి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు పాకిస్థాన్ను అమెరికా ప్రోత్సహించిన కారణంగానే అది ప్రపంచ మిలిటరీలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మిలిటరీ ఖర్చుకు వెనకాడటం లేదు. దాని ఆర్థిక స్థితి దిగజారటానికి ఇది కూడా ఒక కారణం.చైనా జిడిపి, దాని విదేశీమారక ద్రవ్యనిల్వల వంటి అంశాలు మిలిటరీకి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేందుకు వీలు కల్పిస్తున్నది, మనమాపరిస్థితిలో ఉన్నామా ? మనకు వచ్చే ముప్పు గురించి స్వంత నిఘా, సమాచారాన్ని బట్టి వ్యవహరించాల్సి ఉంటుంది. అమెరికా చెప్పేదాన్ని నమ్ముకుంటే నట్టేటమునుగుతాం. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా దళాల కదలికల గురించి అమెరికా చెప్పిన మాటలను నమ్మి ముందుగానే మన మిలిటరీ లడక్‌ పర్వతాల మీదకు వెళ్లి కూర్చున్నది.తరువాతే చైనా దళాలను మోహరించినట్లు వెల్లడైంది. ఇప్పుడు మనం కొండలనుంచి దిగిరాలేని స్థితి, ఖర్చు విపరీతంగా అవుతున్నది.చైనా వైపునుంచి కొత్తగా దురాక్రమణ యత్నాలు ఉన్నట్లు మన ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు.అరుణాచల్‌ సరిహద్దులో చైనా కొత్తగా గ్రామాలను కడుతున్నట్లు కూడా కొన్ని బొమ్మలను చూపి అమెరికా మనలను తప్పుదారి పట్టించేందుకు చూసిన సంగతి తెలిసిందే. ఆధునిక ఆయుధాలు, నిధులతో ఉక్రెయిన్‌లో రష్యా సేనలను ఒక్కదెబ్బతో వెనక్కు కొట్టగలమని అమెరికన్లు ఇతర నాటో దేశాలను నమ్మించారు. రెండు సంవత్సరాలు గడిచినా అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. మధ్యలో ఇరుక్కున్న ఉక్రెయిన్‌ చావుదెబ్బలు తింటున్నది.


అంతరిక్షంలో అమెరికా మిలిటరీ ఆధిపత్యాన్నే సవాలు చేసే స్థితికి చైనా చేరుకుందనే అంశం మనదేశంలో యుద్ధం గురించి కలలు కనేవారికి తెలుసా? ఇటీవలి కాలంలో ఈ రంగంలో అమెరికాకు దగ్గరగా చైనా వచ్చిందని, అమెరికా నిశ్చింతగా లైటార్పి పడుకున్నట్లుగా కనిపిస్తోందని ఆ రంగంలో నిపుణుడు డీన్‌ చెంగ్‌ చెప్పినట్లు 2023 డిసెంబరు 13న అమెరికా ఎన్‌బిసి న్యూస్‌ పేర్కొన్నది. ప్రపంచమంతటా అంతరిక్ష ఉపగ్రహాల ద్వారా మిలిటరీ నియంత్రణలో అమెరికా ముందున్నది.వాటిని దెబ్బతీసే, పనికిరాకుండా చేసే, ఆయుధాలను చైనా తయారు చేస్తున్నదని అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ నివేదికలు గగ్గోలు పెడుతున్నాయి. చైనా 2019-21 సంవత్సరాలలో తన ఉపగ్రహాల సంఖ్యను 250 నుంచి 499కి పెంచుకుందని రక్షణ నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఆధునిక నిఘా బెలూన్లు,హైపర్‌సోనిక్‌ క్షిపణులను ఉపగ్రహాలకు దిగువన, విమానాలు ఎగిరే ఎత్తుకు ఎగువన చైనా మోహరించింది. ఇటీవల ఉపగ్రహాలకు తిరిగి ఇంథనాన్ని నింపే ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది.భూమి లేదా గగనతలం నుంచి క్షిపణులను, లేజర్లను ప్రయోగించి అంతరిక్షంలోని శత్రు ఉపగ్రహాలను ధ్వంసం చేసే పరిశోధనలు కూడా చేస్తున్నదని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు.ధ్వనికంటే కనీసం 20రెట్ల వేగంతో ప్రయాణించే క్షిపణులు భూమిని చుట్టివచ్చి లక్ష్యాలను దెబ్బతీసేవాటిని చైనా పరీక్షిస్తున్నదని కూడా అమెరికా భయపడుతోంది. అందువలన మన అగ్ని క్షిపణితో చైనాను దెబ్బతీయగలమని ఎవరైనా కలగన్నా, చెప్పినా అది వాస్తవ విరుద్దం తప్ప మరొకటి కాదు. భూతలం నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణుల అంశంలో రెండు దేశాల మధ్య ఉన్న తీవ్ర అంతరం కొంత మేర తగ్గుతుంది.నౌకా దళ బలాబలాల్లో మన దేశం ఎంతో వెనుకబడి ఉంది. జలాంతర్గాములు చైనా వద్ద 61 ఉండగా మనకు 18 మాత్రమే ఉన్నాయి.


ప్రతి దేశమూ తన మిలిటరీ పాటవాన్ని పెంచుకొనేందుకే చూస్తున్నది. ఈ విషయంలో పాకిస్థాన్‌ కూడా వెనుకబడిలేదు.మనకంటే ముందే 2023 అక్టోబరు చివరిలో ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో అబాబీల్‌ అనే క్షిపణి ప్రయోగం జరిపినట్లు డిప్లోమాట్‌ పత్రిక నవంబరు 18న ఒక విశ్లేషణ వెలువరించింది.మనదేశం బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ(బిఎండి)ను ఏర్పాటు చేస్తున్నందున దానికి విరుగుడుగా ఎంఐఆర్‌వి క్షిపణులను పాకిస్థాన్‌ రూపొందించినట్లు దానిలో పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ సమీపంలో నిర్మిస్తున్న బిఎండి రాడార్‌ కేంద్రం 2024లో అందుబాటులోకి వస్తుందని, మరో కేంద్రాన్ని మధ్య ప్రదేశ్‌లో నిర్మిస్తున్నట్లు కూడా డిప్లొమాట్‌ రాసింది. నౌకల మీద కూడా ఇలాంటి రాడార్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఐఎన్‌ఎస్‌ అన్వేష్‌ అలాంటి నౌకే. ఇవి రెండు నుంచి ఐదువేల కిలోమీటర్ల పరిధిలో క్షిపణులను పసిగట్టి మధ్యలోనే కూల్చివేస్తాయి. తొలిదశలో న్యూఢిల్లీ, ముంబై నగరాలకు రక్షణ కల్పిస్తారు.


మార్చి 11-16 తేదీల మధ్య ఎప్పుడైనా తాము మూడున్నర వేల కిలోమీటర్ల పరిధిలో క్షిపణి ప్రయోగం జరపవచ్చని ఆ పరిధిలోకి వచ్చేవారు తగు జాగ్రత్తలు పాటించాలని మన రక్షణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేయటం తెలిసిందే. ఆ సంగతి తెలిసే అగ్ని – 5 క్షిపణి ప్రయోగాన్ని చూసి భయపడిన చైనా తన గూఢచారి నౌకను విశాఖపట్టణానికి 260 నాటికల్‌ మైళ్ల దూరంలో లంగరు వేసినట్లు ఒక పత్రిక రాసింది.చైనా తాను జరుపుతున్న ప్రయోగాల గురించి కూడా ముందుగానే ప్రకటిస్తుంది. మనం కూడా చైనా సమీపంలోని అంతర్జాతీయ జలాల్లోకి నౌకలను పంపి నిఘావేయవచ్చు. ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకొనేందుకు 2012 నుంచి మన శాస్త్రవేత్తలు పని చేస్తున్నది, మన అగ్ని క్షిపణుల సామర్ధ్యం బహిరంగ రహస్యం.గతంలో ఒక చైనా నౌక శ్రీలంకకు వచ్చినపుడు,ప్రస్తుతం మాల్దీవుల సమీపంలో ఉన్న మరొక నౌక గురించి కూడా ఇలాగే రాశారు. ఇతరుల బలాబలాలను తెలుసుకొనేందుకు మనదేశం ఎలా ప్రయత్నిస్తుందో ప్రతిదేశమూ అదే చేస్తుందన్నది కూడా అందరికీ తెలిసిందే.మనకే అలాంటి హక్కు ఉండాలి, ఇతరులకు కూడదు అంటే కుదురుతుందా ! అమెరికా విమానవాహక యుద్ధ నౌకలు, ఇతర మిలిటరీ నౌకలు నిత్యం ప్రపంచమంతటా తిరుగుతుంటాయి, అనేక ప్రాంతాల్లో లంగరు వేయటం తెలిసిందే. అవి విహారయాత్రలు చేస్తున్నట్లు చెప్పగలమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

భూసంస్కరణలపై స్వామినాధన్ సిఫారసుల విస్మరణ

08 Sunday Oct 2023

Posted by raomk in Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Prices, Science

≈ Leave a comment

Tags

Father of the Green revolution, Green Revolution, land reforms importance in india, ms swaminathan

డాక్టర్ కొల్లా రాజమోహన్

ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ యం. యస్. స్వామినాథన్ గారి మరణం భారత దేశ రైతాంగానికి తీవ్రమైన విషాదం కలిగించింది. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి విత్తనాలను అభివృద్ధిచేసి వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర వహించిన డాక్టర్ స్వామినాధన్, భారత దేశం గర్వించ దగ్గ వ్యవసాయ శాస్త్రవేత్త. ఇంటర్నేషనల్ బోర్డ్ ఫర్ జెనిటిక్ రీసెర్చ్, ఇక్రిసాట్ రూపకల్పన, యం. యస్. స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండేషన్ లను స్థాపించారు. ఫిలిప్పీన్స్ లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్ధ ను రాక్ ఫెల్లర్, ఫోర్డ్ ఫౌండేషన్ల సహాయంతోస్ధాపించి, అధిక దిగుబడి వరి వంగడాలను కనుగొన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 1987 లోనే ప్రప్రధమంగా అందుకున్నారు. ఆ ప్రైజ్ మనీ 2 లక్షల డాలర్లను భావితరాల పరిశోధనకు యం.యస్.స్వామినాధన్ రీసర్చి ఫౌండేషన్ కి ఇచ్చారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, రామన్ మెగసెసే అవార్డ్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రపంచ సైన్స్ అవార్డ్, ఇందిరాగాంధీ శాంతి బహుమతి, ఇందిరా గాంధీ సమైక్యతా పురస్కారాలను అందుకున్నారు.

వరి, గోధుమ పంటలపై ఆయన చేసిన పరిశోధనల మూలంగా భారత దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. హరిత విప్లవంగా పిలిచే గ్రీన్ రివల్యూషన్ సృష్టికర్త స్వామినాధన్. అమెరికా షరతులను ఒప్పుకుని, పీ యల్ 480 నిధులద్వారా గోధుమలను దిగుమతి చేసుకున్న భారతదేశాన్ని, ఆహారాన్ని ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దారు.జాతీయ రైతు కమిషన్ అధ్యక్షులుగా, భారత వ్యవసాయాన్ని పరిశోధించి 5 సంపుటాలను భారత జాతికి అంకితమిచ్చారు. రైతు అభివృధికి కొన్ని ఫార్ములాలు రూపొందించి సిఫార్సులను చేశారు. అందులో మొట్టమొదటిది భూసంస్కరణలు.  తర్వాత ప్రాధాన్యత నీరు.  రైతు శ్రమ, రైతు పెట్టుబడి, భూమికౌలు, సమగ్ర వ్యవసాయ ఖర్చులు అన్నీ కలిపి దానికి 50 శాతం చేర్చి, కనీస మద్దతు ధర వుండాలని C2+50 ఫార్ములా రూపొందించారు. దీనిని అన్ని రాజకీయపార్టీలు, రైతుసంఘాలు ఆహ్వానించాయి. దీనికై ఢిల్లీ సరిహద్దలలో సంవత్సరం పైగా చారిత్రాత్మకంగా ఆందోళనలు చేశారు . కానీ ఇప్పటికీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించనందున రైతాంగ పోరాటం కొనసాగుతోంది.

వ్యవసాయం లో ఉత్పత్తిని పెంచుకుంటూ, వాతావరణాన్నికాపాడుకుంటూ, వ్యవసాయ విప్లవం నిరంతరం సాగాలన్నారు. దానికి “ ఎవర్ గ్రీన్ రివల్యూషన్ ” అని పేరుపెట్టారు. వ్యవసాయ టెక్నాలజీని రైతులకు అందించి ఆకలిని దూరంచేయటమే కాకుండా రైతుల స్ధితిగతులను అభివృద్ధిచేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రైతుల ఆదాయాలు పెరగాలన్నారు. చిన్న ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం కన్నా రైతుల ఆదాయం తక్కువగావున్న విషయాన్ని నిరసించారు. బ్రిటిష్ ప్రభుత్వ వలస విధాన ఒత్తిడి వలన ఆహార పంటలకు బదులుగా నీలి మందు, తేయాకు, పొగాకు లాంటి వ్యాపారపంటలను రైతులు బలవంతంగా సాగు చేశారు. వలసపాలన వలన పండించిన పంటలకు సరైన ధర లేదు. పెరుగుతున్న భారత దేశ జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగలేదు. స్వాతంత్ర్యం వచ్చే సమయానికి మన దేశంలో ఏటా 60 లక్షల టన్నుల గోధుమలు మాత్రమే పండేవి. 1960 లో గోధుమల ఉత్పత్తి కోటి టన్నులు మాత్రమే. 1965, 66 రెండు సంవత్సరాలు వరసగా వర్షాభావం వలన సంభవించిన కరువు కారణంగా కోటి టన్నుల గోధుమలను అమెరికా షరతులకు లోబడి దిగుమతి చేసుకోవలసి వచ్చింది. “షిప్ టు మౌత్” అంటే ఓడ లో ఆహారధాన్యాలు వస్తేనే మన నోట్లోకి ముద్ద దిగని పరిస్ధితి. 1960 కి ముందు హెక్టారుకు 2 టన్నులున్న వరి దిగుబడి స్వామినాధన్ గారి నూతన విత్తనాల వలన రెట్టింపయింది. 21 వ శతాబ్దం నాటికి 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయగలుగుతున్నాము.

మన దేశం క్లిష్ట సమయంలో వుండటానికి ప్రధాన కారణం వ్యవసాయ సంక్షోభం అని నమ్మిన మేధావులలో స్వామినాధన్ గారు ముఖ్యులు. వ్యవసాయంలో ఆయన శాస్త్రజ్ఞుడిగా అపారమైన కృషి చేసి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించి దేశానికి ఆహార భధ్రత కల్పించారు.

జాతీయ రైతు కమిషన్ (National commission on Farmers) 

భారత ప్రభుత్వం నవంబరు 18, 2004 న నియమించిన జాతీయ రైతు కమిషన్ (NCF) ప్రొఫెసర్ MS స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటైంది. కమిటీ లో రైతు నాయకులు అతుల్ కుమార్ అంజన్ తో సహా 8 మంది సభ్యులున్నారు. NCF వరుసగా డిసెంబర్ 2004, ఆగస్టు 2005, డిసెంబర్ 2005 మరియు ఏప్రిల్ 2006లో నాలుగు నివేదికలను సమర్పించింది. సిఫారుసులతో కూడిన 5 వ రిపోర్టును అక్టోబర్ 4 2006 న సమర్పించింది.

జాతీయ రైతు కమిషన్ (NCF) అధ్యయనానికి ప్రభుత్వం చేసిన సూచనలు.

1. ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పాదకత, లాభదాయకత పెంపొందించడం; 2. ఆహార భద్రత, పోషకాహార భద్రత  వ్యూహం; 3.  రైతుల ఋణాలను పెంచడానికి విధాన సంస్కరణలు; 4.  ట్ట ప్రాంతాలు, నిస్సార భూములు, పోడు భూములు, కొండ, తీర ప్రాంతాల్లోని రైతులకు  వ్యవసాయం కోసం ప్రత్యేక కార్యక్రమాలు; 5. వ్యవసాయ వస్తువుల నాణ్యత పెంచి, ధరలలో పోటీతత్వాన్ని పెంపొందించి , తద్వారా వాటిని ప్రపంచవ్యాప్త పోటీగా మార్చడం; 6.  అంతర్జాతీయ ధరలు బాగా పడిపోయినప్పుడు దిగుమతుల నుండి రైతులను రక్షించడం; 7. స్థిరమైన వ్యవసాయం కోసం, పర్యావరణ పరిరక్షణకు, ఎన్నికైన స్థానిక సంస్థలకు అధికారం ఇవ్వడం;

జాతీయ రైతు కమిషన్ (NCF) అభిప్రాయాలు మరియు కీలక సిఫార్సులు.

రైతుల కష్టాలు – ఆత్మహత్యలకు కారణాలు

జాతీయ రైతు వ్యవసాయ కమీషన్ ( NCF ) కు స్వామినాధన్ గారే ఛైర్మన్. రైతుల కష్టాలకు, ఆత్మహత్యల పెరుగుదలకు కారణాలపై దృష్టి సారించి పరిష్కారాలను సూచించారు. వాటిలో మొదటిది భూ సంస్కరణల అసంపూర్తి కార్యక్రమం. తరువాత నీటిపారుదల అసౌకర్యాలు, అందుబాటు లో లేని వ్యవసాయ సాంకేతికత, సరైన సమయంలో అందని  సంస్థాగత ఋణాలు,  ప్రతికూల వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు.  భీమా, సాంకేతిక పరిజ్ఞానం. మార్కెట్‌లతో సహా ప్రాథమిక వనరులపై రైతులకు భరోసా, నియంత్రణ ఉండాలన్నారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో “వ్యవసాయం” చేర్చాలని NCF సిఫార్సు చేసింది.

భూమి గురించి 1) దేశంలోని మొత్తం భూయాజమాన్యంలో దిగువన వున్న 50 శాతం గ్రామీణ కుటుంబాల వాటా కేవలం 3 శాతం మాత్రమే అని,  ఎగువన వున్న 10 శాతం మంది చేతిలో54 శాతం భూమి వున్నదన్న గణాంకాలను రిపోర్టులో ఎత్తి చూపించారు. వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికి భూసంస్కరణలే కీలకమన్నారు. మిగులు భూముల, బంజరు భూముల పంపిణీనే పరిష్కార మన్నారు. 2) ప్రధాన వ్యవసాయ భూములను, అటవీ భూములను కార్పొరేట్ రంగానికి మళ్ళించటాన్ని నిరోధించాలన్నారు. 3) అడవి లో వున్న గిరిజనుల అటవీ హక్కులను రక్షించాలన్నారు. 4) భూమిని , వాతావరణాన్ని రక్షించటానికి జాతీయ భూమి వినియోగ కమిషన్ ను ఏర్పరచమన్నారు.  భూమి, నీరు, జీవన వనరులు, రైతుల ఆదాయం మరియు భీమా, సాంకేతిక విజ్ఞాన నిర్వహణ, మార్కెట్ తో సహా ప్రాధమిక వనరులపై జాతీయ భూమి వినియోగ కమిషన్ కు నియంత్రణ వుండాలన్నారు. 5) వ్యవసాయ భూమి పరిమాణం, వినియోగం, కొనుగోలుదారుల వర్గాన్ని బట్టి భూమి విక్రయం నియంత్రించాలన్నారు.

డా.స్వామినాదన్  చేసిన ప్రధాన సిఫారసు అయిన భూసంస్కరణల సంగతి ఎత్తిన వారే లేకపోవటం, వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్ధలకు కట్టపెట్టటాన్ని ఎదుర్కోలేక పోవటం దేశ దౌర్భాగ్యానికి పట్టిన దుర్గతికి తార్కాణం. భూమి గురించి వ్యవసాయ కమీషన్ చేసిన సిఫారసులను రైతు సంఘాలు, జాతీయ పార్టీలు విస్మరించాయి. వ్యవసాయ రంగం అభివృధి చెందటానికి కీలకం భూసంస్కరణలు అని స్వామినాధన్ కమీషన్ రిపోర్టు మొదటి రికమండేషన్ గా పేర్కొంది. తెలిసి చేసినా తెలియక చేసినా, భూసంస్కరణల ఎజెండాను పక్కన పెట్టడం తీవ్రమైన పొరపాటు. పాలక వర్గ పార్టీల అవినీతి వ్యవహారాలన్నీ భూమి చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గ్రహించాలి. భూసంస్కరణలకు భూమి ఎక్కడుందంటూనే వేల ఎకరాలను కార్పోరేట్లకు అప్పగిస్తున్నారు.

భూమి వ్యాపార వస్తువై ధనవంతుల స్పెక్యులేషన్ లో ఆటవస్తువైపోతున్నది. వ్యవసాయం చేసేవారి చేతిలో భూమి లేదు. అమెరికాలోనో, హైదరాబాద్ లోనో వున్న వారికే  గ్రామాలలో భూములు ఎక్కువగా వుంటున్నాయి.  భూమి కోసం పోరాటాలు చేయలేమని, పోరాటాలు చేసినా పాలక వర్గాలు అంగీకరించవని, ప్రజలు రావటం లేదని, ప్రస్తుత ఉద్యమ కారుల వాదన. సోవియట్ పతనం తరువాత కమ్యూనిస్టు పార్టీ చీలికలయినా  ఉద్యమకారులలో ఆశయాలపట్ల ఆరాధన తగ్గలేదు. కానీ ఆచరణ గణనీయంగా తగ్గింది.

ఎరువులు-పురుగు మందులు-కలుపు మందులు

భూ సారాన్ని గమనించకుండా, భూమిని తీవ్రంగా సాగు చేయటంవలన భూమి ఎడారిగా మారుతుందన్నారు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు విచక్షణారహితంగా వాడటంవలన ఆహార పదార్ధాలలో వాటి అవశేషాలు కేన్సర్ జబ్బులకు కారణమౌతాయన్నారు. భూగర్భ జలాలను అశాస్త్రీయంగా ట్యాపింగ్ చేయటం వలన అద్భుతమైన భూజల వనరు అంతమౌతుందన్నారు.ఇరిగేషన్, డ్రైనేజ్ కు పెట్టుబడిని గణనీయంగా పెంచాలని కమిషన్ చెప్పింది. సాయిల్ టెస్టింగ్, భూమి లో  సూక్ష్మపోషకాల పరీక్షకు ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలన్నారు.

ఋణం , భీమా . ప్రాధమిక అవసరాలకు సరైన సమయంలో సరిపోను ఋణాలను 4శాతం సాధారణ వడ్డీకి ప్రభుత్వం అందించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో, రైతులు నష్టాలలో వున్నపుడు తాత్కాలికంగా రైతుల పరిస్ధితి మెరుగయ్యేంతవరకూ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్ధల అప్పు వసూళ్ళను నిలిపివేయాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని తట్టుకోవటానికి ఒక నిధిని ప్రభుత్వం ఏర్పరచాలన్నారు. రైతుల ఆరోగ్యానికి, అప్పులకు, పంటకు, పశువులకు, ఒకటే భీమా ప్యాకేజీ ని ఏర్పాటు చేయాలన్నారు. స్వయం సహకార సంఘాలను ఏర్పాటు చేసి మానవ వనరులను అభివృధి చేసి ఆర్ధిక సేవలు, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ అందరికి అందించాలన్నారు.

ఆహార భద్రత. 2400 కేలరీల కన్నా తక్కువ ఆహారం తీసుకునే పేదలు గ్రామీణ ప్రాంతాలలో 77 శాతం మంది వున్నారన్నారు. పేదరికం, సరైన ఆహారం లేకపోవటం గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలో  కేంద్రీకృతమై వుందన్నారు. సార్వత్రిక పంపిణీవ్యవస్ధను అమలు చేసి, జాతీయ ఆహార పధకాలను అమలుపరచుటకు జీడీపీ లో 1 శాతం నిధులు సరిపోతాయన్నారు. పనికి ఆహార పధకం వలన పేదలకు ఉపాధి, ఆహారం లభిస్తాయన్నారు.

ఎక్కువ రిస్క్ తో కూడిన బీ టీ కాటన్ లాంటి పంటలకు దూరంగా వుంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చే పంటలను సాగుచేయాలన్నారు.దిగుమతి సుంకాలను విధించి ఇతర దేశాల దిగుమతుల పోటీ నుండి రైతులను రక్షించాలన్నారు. రైతులకు వినియోగదారులకు మధ్య అనుసంధాన్ని పెంచి దళారులులేని మార్కెట్ ను ఏర్పాటుచేయాలన్నారు.

కనీస మద్దతు ధర

వ్యవసాయ ఖర్చులకు 50 శాతం కలిపి కనీస మద్దతు ధరను నిర్ణయించాలన్నారు. C2+50 ఫార్ములా ను రూపొందించారు. C2 అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కు (సమగ్ర వ్యవసాయ ఖర్చులకు) 50 శాతం కలపాలన్నారు.వరి, గోధుమ లతోపాటు జొన్న, పప్పుధాన్యాలు లాంటి పంటలన్నిటికీ కనీస మద్దతు ధర నిర్ణయించి ఆ ధరకు కొనేటట్లు గా చట్టం చేయాలన్నారు.రైతుల నికర ఆదాయం ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయంతో పోల్చదగినదిగా వుండాలన్నారు.రైతు పండించిన పంటకు మద్దతు ధర C2+50 అమలుపరచటమే కీలక సమస్యగా రైతు సంఘాలు  ముందుకు తెచ్చాయి. కనీస మద్దతు ధర పై చట్టం చేయటమే ముఖ్య డిమాండ్ గా రైతుల ఐక్యత ను సాధించి, ప్రశంసనీయమైన చారిత్రాత్మక మహోద్యమాన్ని నడిపారు. భారత రాజకీయ ఎజెండాలో కనీసమద్దతు ధర పై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కానీ అమలు కానందున ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

డాక్టర్ స్వామినాధన్ చేసిన రికమండేషన్లు అన్నిటినీ అమలు చేసినపుడే వారి కృషికి సార్ధకత చేకూరుతుంది. రైతుకు భద్రత- దేశానికి ఆహార భద్రత లభిస్తుంది. భూసంస్కరణలు, నీటి వనరులు, కనీసమద్దతు ధరకు చట్టబధతతో సహా అన్ని సిఫారసులను అమలు చేయటమే వారికి సరైన నివాళి. రైతు కమీషన్ సిఫారసులన్నిటినీ అమలు చేయాలని రైతులు పోరాడాలి.

డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం, ఫోన్ నెం. 9000657799.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d