• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Doing business rankings

నాడు ‘విదేశీ’ ముస్లిం మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ బాటలో నేడు ‘స్వదేశీ’ హిందూ బిజెపి నరేంద్రమోడీ !

02 Thursday Nov 2017

Posted by raomk in BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

Doing business India rank, Doing business rankings, mughal king jahangir, Narendra Modi, red carpet to foreign investors

సూరత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు అనుమతి కోరుతూ 1615లో మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ వద్దకు ఇంగ్లండ్‌ రాజు ఒకటవ జేమ్సు ప్రతినిధిగా వచ్చిన సర్‌ థామస్‌ రో

ఎం కోటేశ్వరరావు

దారీతెన్నూ తెలియని అడవిలో తచ్చట్లాడుతున్నవారికి తెల్లవారు ఝామున వేగు చుక్క కనపడినట్లు నరేంద్రమోడీ సర్కార్‌కు ప్రపంచబ్యాంకు వెల్లడించిన తాజా సులభవాణిజ్య సూచిక దొరికింది. మునిగిపోయే వారికి గడ్డిపరక దొరికినా దానిని పట్టుకొని బయటపడాలని చూసినట్లుగా బిజెపి నాయకత్వ ఆత్రం కనిపిస్తోంది. ప్రపంచబ్యాంకు నివేదిక వార్తలతో పాటే ప్రజల సొమ్ముతో పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు జారీ చేయించి పండగ చేసుకుంది. భక్తులు పరమానంద భరితులౌతున్నారు. విమర్శించిన వారి మీద ఎదురుదాడులకు దిగుతున్నారు. ఎందుకటా! ఇప్పటి వరకు 190 దేశాలలో 130వ స్ధానంలో వున్న మనం ఒక్క ఏడాదిలో ఏకంగా100వ స్ధానంలోకి ఎగబాకినందుకట. దానికిగాను తమ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, చర్యలు ఇవీ అంటూ కేంద్ర ప్రభుత్వం పూర్తి పేజీని నింపి జనం మీదకు వదిలింది. నిజానికి అవేవీ కొత్తవి కాదు, మోడీ సర్కార్‌ గద్దె నెక్కిన దగ్గర నుంచీ వూదరగొడుతున్నవి, కొద్ది మంది కార్పొరేట్లకు తప్ప సామాన్య జన సంక్షేమానికి సంబంధం లేనివి, ఒక పట్టాన అర్ధం కానివి.

Bill Bragg illustration on Europe and India and Greece

మోడీ సర్కారు పూర్తి పేజీ ప్రకటనలో లేనిదీ ప్రపంచబ్యాంకు నివేదిక అట్ట మీద వున్నదానిని జనం గమనించాలి. ‘డూయింగ్‌ బిజినెస్‌ 2018, రిఫార్మింగ్‌ టు క్రియేట్‌ జాబ్స్‌’ అన్నది నివేదికకు పెట్టిన నామం. మన ప్రధాని పూర్తి పేజీ ప్రచారంలో జాబ్స్‌ అదే వుపాధి ప్రస్తావనకు ఎగనామం పెట్టారు. నివేదిక పేరును తెలుగులో అనువదించుకుంటే ‘2018లో వ్యాపారం, వుపాధి సృష్టికి సంస్కరణ’ అని అర్ధం. ప్రచార ప్రకటనలో వందవ ర్యాంకు సాధన గురించి పేర్కొని సంస్కరణలు దీనిని సాధ్యం చేశాయి అంటూ పన్నుల చెల్లింపు, అల్పసంఖ్యాక పెట్టుబడిదారులకు రక్షణ, కాట్రాక్ట్‌ సేవకరణ, వ్యాపార ప్రారంభం, సరిహద్దులలో వ్యాపారం, రిసాల్వింగ్‌ ఇన్సాల్వెన్సీ(దివాలా పరిష్కారం) రుణం పొందటం, విద్యుత్‌ పొందుట, అనుమతులు రూపకల్పన విషయాలలో తీసుకున్న చర్యలను క్లుప్తంగా పేర్కొన్నారు. వాటి ఫలితంగా సంభవించాల్సిన వుపాధి కల్పన గురించి ఎక్కడైనా వుందా అని దుర్భిణీవేసి వెతికినా కనిపించలేదు. అందుకే పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడాలన్నట్లుగా ఇంతకాలంగా నరేంద్రమోడీ చేపట్టిన సంస్కరణలు ఇచ్చిన ఫలితాలేమిటన్నది గీటురాయి. సంస్కరణలనే పిల్లికి మన్మోహన్‌ సింగ్‌ పాలుపోసినా లేక నరేంద్రమోడీ మోడీ అంతకంటే మంచి ఆహారం అందించినా అది ఎలుకలను పట్టకపోతే ఎందుకు చేరదీసినట్లు ? వుపాధిని పెంచని, వుద్యోగాలను వూడగొట్టే, సంక్షేమ చర్యలకు మంగళం పాడే సంస్కరణలెందుకు? నరేంద్రమోడీ సంస్కరణలలో ప్రపంచబ్యాంకు సూచికను తయారు చేసే వారిని ప్రధానంగా ఆకర్షించింది కంపెనీల దివాలా పరిష్కారాన్ని సులభతరం చేయటం. అనేక మంది పెద్దలు పరిశ్రమలు, వ్యాపారాల పేరుతో వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవటం, వాటిని వేరే మళ్లించి చివరకు దివాళా, ఐపి పెట్టటం అందరికీ బాగా తెలిసింది. ఈ ప్రక్రియ ఇప్పటివరకు కాస్త కఠినంగా వుంది. అయినప్పటికీ ఎందరో మహానుభావులు లక్షల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టారు.

2014 జూన్‌ నాటికి అంటే నరేంద్రమోడీ అధికారాన్ని స్వీకరించే నాటికి 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్థులుగా వర్గీకరించిన మొత్తం రు.2.34లక్షల కోట్లు కాగా 2016 డిసెంబరు నాటికే ఆ మొత్తం రు.6.46లక్షల కోట్లకు చేరింది. అయితే రద్దు చేసినవి, పునర్‌వ్యవస్థీకరించినవి, పారుబాకీలుగా తేల్చిన మొత్తాన్ని లెక్కకడితే అది 20లక్షల కోట్ల రూపాయల వరకు వుంటుందని రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్‌ కెసి చక్రవర్తి చెప్పారు. కంపెనీల నుంచి గోళ్లూడగొట్టి ఎగవేసిన రుణాలను వసూలు చేయాల్సిన సర్కార్‌ పధకం ప్రకారం దివాలా ప్రకటించిన వారిని సులభంగా బయటపడవేయించేందుకు మోడీ సర్కార్‌ ప్రకటించిన దివాలా సంస్కరణలు ప్రపంచ వాణిజ్యవేత్తలను, వారికి ప్రతినిధిగా వున్న ప్రపంచబ్యాంకుకు సంతోషం కలిగించకుండా ఎలా వుంటాయి. నూతన దివాలా చట్టం నిధులను పక్కదారి పట్టించి కొల్లగొట్టేందుకు అనుమతిస్తుందని, అందువలన ఈ వుదంతంలో వాణిజ్యాన్ని సులభతరం గావిస్తుందా సొమ్ము లూటీని సులభతరం చేస్తుందా అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ వ్యాఖ్యానించారు. వాణిజ్యం చేయటాన్ని సులభతరం చేసేందుకు చేపట్టిన సంస్కరణల లక్ష్యం కొత్త వుద్యోగాల సృష్టి అన్నది ప్రపంచబ్యాంకు చెబుతున్నమాటే. మరి వాటి సంగతిని మోడీ సర్కార్‌ ఎక్కడా చెప్పదేం? భక్తులైనా నోరు విప్పరేం?

ప్రతి ఏటా కోటి కొత్త వుద్యోగాలను సృష్టిస్తానని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మోడీ మంత్రదండంతో నిజంగానే వుద్యోగాలస్తాయనే గట్టి నమ్మకంతో ఆంధ్రప్రదేశ నలో మా బాబస్తే మీ జాబచ్చినట్లే అని తెలుగు దేశం పార్టీ ప్రచారం చేసింది. ఇక కెసిఆర్‌ బంగారు తెలంగాణా గురించి చెప్పాల్సిన పని లేదు. మూడు సంవత్సరాల మోడీ సర్కార్‌ తీరుతెన్నులను చూస్తే పదేండ్ల కనిష్టానికి కొత్త వుపాధి సృష్టి పడిపోయిందని అధికారిక సమాచారమే వెల్లడించింది. మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ 2009లో పదిలక్షల వుద్యోగాలను సృష్టిస్తే మోడీ హయాంలో 2015లో 1.55లక్షలు, 2016లో 2.31లక్షలు మాత్రమే వచ్చాయి. నాటి కోటి వాగ్దానానికి, నేటి ఆచరణకు పొంతన ఎక్కడ? మోడీ విదేశీ పర్యటనలు చేసి విమనాల్లో జీవించే ప్రధాని అని చెడ్డ పేరు తెచ్చుకోవటం తప్ప సాధించిందేమిటి? మేకిన్‌ ఇండియా జాడలెక్కడ? మరోవైపు కొంత తగ్గినప్పటికీ ఏడుశాతం వరకు అభివృద్ధి జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నారు, సంస్కరణలు సరేసరి, ఇన్ని చేసినా వుద్యోగాలెందుకు రావటం లేదు. అలాంటపుడు అభివృద్ధి అంటే ఏమిటి, అది ఎవరికోసం? వుపాధి లేని యువత దేశానికి వరమా? శాపమా ? ఐటి రంగంలో దిగ్గజ సంస్ధలు ఈ ఏడాది 56వేల మందిని ఇంటికి పంపేందుకు పధకాలు వేశాయని ఒకవైపు వార్తలు, మరోవైపు రానున్న మూడు సంవత్సరాలలో ఐటి రంగంలో ఇప్పుడున్న వారిలో సగం మంది అవసరం లేని మిగులుగా తేలుతారని మెకెన్సీ కంపెనీ అంచనా వేసింది.

ఎందుకీ పరిస్ధితి? నిరుద్యోగం, దారిద్య్ర భూతాల వంటివి మోడీని వ్యతిరేకించే వారినే పట్టి పీడిస్తాయి, అభిమానించేవారి జోలికి రావని ఎవరైనా అనుకుంటే జాలిపడటం తప్ప చేసేదేమీ లేదు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి ఎవరినీ వదల్లేదని ఇప్పటికే రుజువైంది కదా ! పెట్టుబడిదారులకు కావాల్సింది లాభాలు తప్ప మరొకటి కాదు. ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువైనా కార్మికులు తక్కువగా వుండే పరిశ్రమలు, వ్యాపార సంస్ధల కోసం మన దేశంలో తీవ్రవెతుకులాట ప్రారంభమైంది. పశ్చిమ దేశాలలో ఇప్పటికే వుపాధి రహిత అభివృద్ధి దశలో వున్నాయి. మనం కూడా అదేబాట పట్టాము. మరోవైపు చైనాలో వేతనాలు పెరుగుతున్నాయి కనుక మా దేశంలో చౌక శ్రమశక్తితో పని చేయించుకోవచ్చు రండహో అని మోడీ, చంద్రబాబు, కెసిఆర్‌ లేకపోతే వారి తనయులు ప్రపంచమంతా తిరిగి చెప్పినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. మేకిన్‌ ఇండియా అంటే అదొక ప్రహసనంగా తయారైంది. సింఫనీ టెక్నాలజీ గ్రూపు కంపెనీల అధిపతి రమేష్‌ వాధ్వానీ ఒక పత్రికలో రాసిన దాని ప్రకారం ‘ 2005-12 మధ్య భారత జిడిపి 54శాతం పెరగ్గా నిఖర వుద్యోగ పెరుగుదల మూడుశాతం మాత్రమే. కేవలం కోటీ యాభైలక్షల కొత్త వుద్యోగాలు మాత్రమే వచ్చాయి.ఈ అంతరం రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. వార్షిక వృద్ధి రేటు 7-8శాతం మధ్య వుంటుందనే అంచనా ప్రకారం 2025నాటికి దేశ జిడిపి రెట్టింపు అవుతుంది. కొత్తగా వుద్యోగాలు కావాల్సిన వారు ఎనిమిది కోట్ల మంది వుంటారు, అయితే ఇప్పుడున్న రేటులో కేవలం మూడు కోట్ల కొత్త వుద్యోగాలు మాత్రమే, అవీ ఎక్కువగా అసంఘటితరంగం, తక్కువ వేతనాలున్నవి మాత్రమే సృష్టి అవుతాయి.’ ఇప్పుడున్న పరిస్ధితి ప్రకారం 2020 నాటికి దేశ జనాభా సగటు వయస్సు 29 వుంటుంది, ప్రతి ఏటా వుద్యోగాలవేటలో చేరేవారి సంఖ్య కోటీ ఇరవై నుంచి కోటిన్నర వరకు వుండవచ్చు. వారిని సంతృప్తి పరచపోతే సామాజిక అశాంతి ఏ రూపంలో బద్దలు అవుతుందో చెప్పలేము. నిరుద్యోగం పెరగటం లేదా కొత్త వుద్యోగాల సృష్టి లేకపోవటానికి దారితీసే కారణాలలో పెట్టుబడి సమీకరణ(ఆస్థుల సమీకరణ అని కూడా అంటారు) పురోగతి నెమ్మదించటం ఒకటని నిపుణులు చెబుతారు. ఆ మేరకు 2016 ఆర్ధిక సంవత్సరంతో పోల్చితే 2017లో పెరుగుదల కేవలం రెండుశాతమే వుంది.జర్మన్‌ డచ్‌ బ్యాంకు నివేదిక ప్రకారం నెమ్మదిగా సాగే పెట్టుబడి సమీకరణ జిడిపి పురోగతిపై పరిమితులు విధించటం, వుపాధి కల్పనను నిరోధిస్తుంది.’

వాణిజ్య సులభతరం సూచనలో 130న నుంచి 100కు 30 పాయింట్ల పురోగతి సాధించామని బిజెపి తనకు తానే కితాబునిచ్చుకుంటున్నది. సంస్కరణలతో పాటు అవినీతి నిరోధం గురించి కూడా నరేంద్రమోడీ అంతే గట్టిగా చెప్పారు. అవినీతిని అరికట్టి వాణిజ్యాన్సి సులభతరం గావించామని ఆర్ధిక మంత్రి అరుణ్‌ జెట్లీ కాంగ్రెస్‌ నేతలకు ఒక ట్వీట్‌లో చురకలంటించారు. అయితే అవినీతి నిరోధక సూచికలో మోడీ సర్కార్‌ 176 దేశాలలో 2016లో తన సూచికను 76 నుంచి 79కి మూడు పాయింట్లు మాత్రమే మెరుగుపరచుకుంది. అంటే మోడీ సర్కార్‌కు కార్పొరేట్లకు వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు తీసుకొనే చర్యల పట్ల వున్న శ్రద్ద అవినీతి నిరోధకంలో లేదని ఈ సూచిక స్పష్టం చేయటం లేదూ !

పదహారవ శతాబ్ది ప్రారంభంలో నాటి మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ బ్రిటీష్‌ ఈస్టిండియా కంపెనీ మన దేశంలో సులభంగా వాణిజ్యం చేసుకొనేందుకు ఎర్రతివాచీ పరిచాడు. పద్దెనిమిదవ శతాబ్ది చివరికి ఆ కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్‌ వారు చివరకు మన దేశాన్ని ఆక్రమించుకొని వలస దేశంగా చేసుకున్నారు. ఇప్పుడు 130 నుంచి 100వ స్ధానానికి ఎగబాకించటం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ మరో జహంగీర్‌గా చరిత్రకు ఎక్కారు. దీని పర్యవసానాలు ఎలా వుంటాయో చెప్పనక్కరలేదు. నాడు బ్రిటీష్‌ వారు ప్రత్యక్ష పాలకులుగా మారితే అంతర్జాతీయ కార్పొరేట్లు పరోక్షంగా చక్రం తిప్పి ప్రతి జీవన రంగాన్ని శాసించేందుకు మోడీ ద్వారాలు బార్లా తెరిచినట్లుగా వేరే చెప్పనవసరం లేదు. అసలు ద్వారాలే లేకుండా చేసే ప్రయత్నాల్లో వున్నారు.

అవథ్‌ నవాబు రాజ్యాన్ని తిరిగి అప్పగించినందుకు బహుమానంగా నాటి బెంగాల్‌ ప్రాంతం(బెంగాల్‌,బీహార్‌,ఒడిషా)లో పన్నులు వసూలు చేసుకొనే అధికారాన్ని నాటి బ్రిటీష్‌ రాజ్య ప్రతినిధి రాబర్టు క్లైవ్‌కు 1765 అగస్టు పన్నెండున అప్పగిస్తున్న మొఘల్‌ రాజు రెండవ రెండవ షా ఆలమ్‌.

ఇప్పటికే వాణిజ్యాన్ని సులభతరం చేసే పేరుతో మన సంపదలను విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టటాన్ని కాంగ్రెస్‌ పాలకులు ప్రారంభించారు. సంస్కరణల పేరుతో 1990 దశకంలో ప్రారంభించిన చర్యలతో సులభవాణిజ్యంలో మన దేశాన్ని 130వ స్ధానానికి తెచ్చారు. కాంగ్రెస్‌ వారు మూడు దశాబ్దాలలో చేయలేని దానిని స్వదేశీ నరేంద్రమోడీ అత్యంత వేగంతో విదేశీయులకు విందు చేసేందుకు మూడు సంవత్సరాలలో 100కు తెచ్చారు. విశాఖలోని గంగవరం రేవును ప్రయివేటు రంగానికి కట్టబెట్టారు. ఒక పత్రికలో వచ్చిన వార్త ప్రకారం ఈ రేవులో అమెరికా సంస్ధ వార్‌బర్గ్‌ పింకస్‌ తనకున్న 31.5శాతం వాటాను దుబాయ్‌ కంపెనీకి విక్రయించాలని చూస్తోందని, పదేండ్ల క్రితం 150 కోట్లు పెట్టుబడి పెట్టిన అది ఇప్పుడు తన వాటాను రు.2560 కోట్ల రూపాయలకు విక్రయించాలని చూస్తోందన్నది వార్త సారాంశం. వ్యాపార సులభతరంలో భాగమే ఇది. అంటే అంత మొత్తం మన దేశం నుంచి సంపద అమెరికాకు తరలిపోయినట్లే. మన స్ధానం వంద నుంచి ఒకటికి తెచ్చేందుకు మోడీ సర్కార్‌ కృషి చేయవచ్చు, దాని వలన అంత మొత్తానికి వాటా కొనుగోలు చేసిన దుబాయ్‌ అదిగాక పోతే మరొక విదేశీ సంస్ధ మరో పదేండ్ల తరువాత అదే దామాషాలో సంపదను తరలించుకుపోతే మన జనానికి ఒరిగేదేమిటి ? మూడు సంవత్సరాల నుంచి తీసుకున్న చర్యలతో విదేశీ కంపెనీల పని సులభం అయిందిగానీ మన బతుకులు దుర్భరం అయ్యాయని మోడీ ప్రభుత్వ విధానాలు స్పష్టం చేయటం లేదా? అందువలన సంఘపరివార్‌ అదే, బిజెపి మాతృసంస్ధ భాషలో చెప్పాలంటే ‘విదేశీ ‘ ముస్లిం మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ మన దేశం బ్రిటీషు వారి పాలనలోకి పోవటానికి ఆద్యుడైతే నేడు ‘స్వదేశీ ‘ హిందూ నరేంద్రమోడీ విదేశీ కార్పొరేట్ల చేతుల్లోకి దేశాన్ని అప్పనంగా అప్పగించేందుకు పూనుకున్న వారిలో నెంబర్‌ ఒన్‌ రాంక్‌ పొందినట్లే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచీకరణకు అనుకూలమెవరు, వ్యతిరేకమెవరు ? ఎందుకు ?

01 Tuesday Nov 2016

Posted by raomk in BJP, CHINA, Economics, Environment, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, Others, UK, USA

≈ Leave a comment

Tags

anti globalisation, anti globalization movement, anti-neoliberal, Doing business rankings, globalization, India-Pakistan, Narendra Modi, WB Doing business ranking

ప్రపంచీకరణ పర్యవసానాలు-2

     ప్రపంచీకరణ గురించి రెండు అభిప్రాయాలు వున్నాయి. అది ప్రపంచానికి మంచి చేస్తుందని కొందరంటే చెడు చేస్తుందని మరికొందరు చెబుతారు. చరిత్రలో వర్గాలు లేనటు వంటి ఆదిమ సమాజాన్ని( దాన్నే ఆదిమ కమ్యూనిస్టు సమాజం అని కూడా పిలుస్తారు) మినహాయిస్తే సమాజంలో వర్గ విభజన జరిగినప్పటి నుంచి ప్రతి కొత్త దశలోనూ దాని మంచి చెడ్డలపై రెండు అభిప్రాయాలు వెలువడుతూనే వున్నాయి. బానిస, అర్ధబానిస లేదా ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ వ్యవస్థలన్నింటా ఒక వర్గానికి మేలు జరుగుతూనే వుంది. అలాంటి వారంతా దానిని కాపాడుకొనేందుకు అవసరమైన సాహిత్యం, మూఢనమ్మకాలు, నమ్మకాలు, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేశారు. నష్టపోయిన వర్గం ఆ వ్యవస్ధలను కూల్చివేసేందుకు, జనాన్ని కూడగట్టేందుకు తనదైన సాహిత్యం, తత్వశాస్త్రాలను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం చర్చనీయాంశంగా వున్న ప్రపంచీకరణ భావన, పద్దతుల గురించి కూడా ఇదే విధమైన రెండు రకాల సాహిత్యాలు వెలువడుతున్నాయి. ఒక గుణాత్మక మార్పు పరిమాణాత్మక మార్పుకు దారితీయాలంటే అందుకు అనువైన పరిస్థితులు తయారు కావాలి. ఆవిరి రావాలంటే నీరు వంద డిగ్రీల వుష్ణోగ్రత వరకు మరగాల్సిందే. ఆలోగా కుండ లేదా పాత్ర లోని నీటిలో అనేక మార్పులు జరుగుతాయి తప్ప అవి మనకు కనిపించవు. అందరూ ఇష్టపడే అందమైన సీతాకోక చిలుక అవతరించటానికి ముందు అది అసహ్యించుకొనే గొంగళి పురుగు రూపంలో వుంటుంది. ప్రపంచీకరణ అన్నది పెట్టుబడిదారీ వర్గం రూపొందించిన తాజా అధునాతన దోపిడీ అస్త్రం.కార్మికవర్గం గుర్తించలేనంత సమ్మోహనంగా వుండి, వారి మద్దతు కూడా పొందేంత అంటే అతిశయోక్తికాదు. తెలిసో తెలియకో కార్మికవర్గం మద్దతు లేదా వుపేక్ష కారణంగానే అదింకా బతికి బట్టగలుగుతోంది. బానిస, ఫ్యూడల్‌ వ్యవస్ధలను అదుపు చేసిన వర్గాలు అవి కూలిపోయేంత వరకు శాశ్వతమనే భ్రమించాయి,భావించాయి. జనంలో చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఆ వ్యవస్ధలలో కూడా పాలకవర్గం సంస్కరణలు ప్రవేశపెట్టకపోలేదు. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్ధ కూడా అదే భావంతో, అదే బాటలో వుంది. సహజం.

     ప్రపంచీకరణను వ్యతిరేకించే వారు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారా ? కానే కాదు, ముందటి సమాజాలు, తరతరాల అనుభవసారం నుంచి దానిని గ్రహించారు.ఒక విధానం మంచిదా కాదా అని నిర్ధారించటానికి ఎంత కాలం కావాలి? ప్రాతిపదికలేమిటి ? ప్రపంచీకరణ పేరుతో తీసుకున్న లేదా ఇంకా ప్రతిపాదిస్తున్న చర్యలన్నీ సామాన్య జనానికి తక్షణం హాని చేసేవి, అయితే శరీరంలో దెబ్బతిన్న భాగాన్ని తొలగించాలంటే శస్త్ర చికిత్స చేయాలి, తొలుత బాధగానే వున్నప్పటికీ తరువాత జీవితాంతం సుఖం అనుభవిస్తారు కనుక తాత్కాలిక బాధను భరించాలని ప్రపంచీకరణ వాదులు నమ్మబలుకుతారు.చిత్రం ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచీకరణ కోరుకున్న వారే భిన్న స్వరాలు వినిపిస్తున్నారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/world-faces-long-period-of-stagnation-ahead  సత్యజిత్‌ దాస్‌ అనే ఒక బ్యాంకరు ‘ నిండుకున్న ప్రపంచ అమ్ముల పొది’ అనే పేరుతో బ్లూమ్‌బెర్గ్‌ వెబ్‌సైట్‌లో ఒక వ్యాసం రాశారు. ‘ పురోభివృద్ధిని పునరుద్దరించేందుకు, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు తాము చేయగలిగినవి ఇంకా ఎన్నో వున్నాయని చెబుతూనే వున్న ప్రపంచ విధాన రూపకల్పనవేత్తలు ఎవరూ కూడా ఓటమిని అంగీకరించటానికి సిద్ధ పడటం లేదు. రెండు కాళ్లూ పొగొట్టుకొని దారిలో పడివున్న మల్లయ్య నేను లేస్తే మనిషిని కాను అని విజయం సాధించిన వారిని బెదిరించే మాదిరి వారి తీరు వుంది. వాస్తవం ఏమిటంటే ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకుల దగ్గర ఇంక ఆయుధాలేమీ మిగల్లేదు.’ ఇలా ప్రారంభమైంది.

     ‘ ప్రపంచవ్యాపితంగా డిమాండ్‌ మందగించటం, అనేక పరిశ్రమలు సామర్ధానికి మించి వుండటం వంటి పర్యవసానాలతో పెట్టుబడి నలిగిపోతోంది. కొన్ని బ్యాంకుల దగ్గర కొండల మాదిరి కారుచౌకగా దొరికే డబ్బు పేరుకుపోతున్నప్పటికీ రుణాలు తీసుకొనే వారు ముందుకు రావటం లేదు. ధన చలన వేగం చాలా తక్కువగా వుంది. తక్కువ లేదా ప్రతికూల వడ్డీ రేట్ల కారణంగా నిధులు సమకూర్చటం, బ్యాంకుల లాభాలు దెబ్బతింటున్నాయి. తమ పొదుపును మరోచోటికి బదలాయించుకోవటం, నగదుగా మార్చుకోవటం వంటి చర్యలను ప్రభుత్వాలు నిషేధించటం వంటి చర్యలు చేపడితే తప్ప వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు వాటిని ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు. పెన్షన్‌ నిధులు, వుద్యోగ విరమణ తరువాత ఇచ్చే లబ్ది గురించి చేసుకున్న ఒప్పందాలు, బీమా కంపెనీల సామర్ధ్యాలను ఇప్పటికే ప్రతికూల వడ్డీ రేట్లు ప్రశ్నిస్తున్నాయి. అనేక ప్రభుత్వ, కార్పొరేట్‌ బాండ్లు, చివరికి కంపెనీల వాటాలను కూడా కొనుగోలు చేయటం ద్వారా విత్త మార్కెట్లను ప్రభావితం చేస్తున్నప్పటికీ జపాన్‌ రిజర్వు బ్యాంకు ఇప్పటికే ఆ పని చేసింది.ఆర్ధిక వ్యవస్ధపై ప్రభుత్వ పట్టు పూర్తిగా వుండేందుకు లెనిన్‌ హయాంలో సోవియట్‌ యూనియన్లో జరిగిన మాదిరి రిజర్వుబ్యాంకులు తమ అధికార కత్తులను ఝళిపించటం పెరిగిందన్నది నిజం. ఇదే సమయంలో ఈ విధానాల పరిమితులన్నీ అయిపోతున్నట్లు అందరికీ కనిపిస్తోంది. జపాన్‌, ఐరోపా దేశాల రిజర్వు బ్యాంకులకు కొనుగోలు చేసేందుకు తగిన బాండ్లు కనిపించటం లేదు. అంతా అనివార్యమని చెప్పలేముగాని వడ్డీ రేట్ల మరింత తగ్గింపు, పరిమాణాత్మక ఆంక్షలు మరింత సడలింపు మార్కెట్‌ రేట్లు, ఆస్థుల ధరలు లేదా నగదు విలువలపై పెద్ద ప్రభావమే చూపుతాయి.

     ఈ పరిస్ధితి మాంద్యంగా వున్న వాటికి ప్రభుత్వాలు ఆర్ధిక వుద్దీపనలు కలిగించటం అనే ఒక నూతన ఏకాభిప్రాయాన్ని పురికొల్పింది. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలు లోటుతో నడుస్తున్నాయి.కొన్ని వ్యవస్ధాగతమైన లోపాలతో వున్నాయి. వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు అదనంగా ఖర్చు చేస్తే తరువాత అది ప్రభావశీలంగా వుండాలంటే తరువాత కూడా కొనసాగించాల్సిందే. మౌలిక వసతుల వంటి వాటికి పెట్టుబడులు పెడితే తరువాత ప్రాజెక్టును బట్టి దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయి. ఎందుకంటే ప్రభుత్వాలు కృత్రిమంగా తక్కువ వడ్డీ రేటు లేదా ప్రతికూల వడ్డీ రేట్లతో డబ్బు తీసుకు వచ్చి ఖర్చు చేయటం అంటే దాని అర్ధం ప్రతిఫలం లభిస్తుందని కాదు. పెద్దగా ప్రయోజనం లేని ఆస్థులపై పెట్టిన పెట్టుబడిగా మారే ప్రమాదం వుంది.’

      ప్రపంచీకరణ వెనక్కు నడుస్తోంది అనే పేరుతో మరొక సమర్ధకుడు ఒక విశ్లేషణ చేశారు.https://www.bloomberg.com/view/articles/2016-10-26/globalization-goes-into-reverse ఇది కూడా ఆసక్తి కలిగించేదే. నోవా స్మిత్‌ అనే రచయిత తన విశ్లేషణను ఇలా ప్రారంభించాడు.’ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అనేక పశ్చిమ దేశాలలో ప్రతి క్రియ జరుగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం, వలసలకు సంబంధించి అమెరికన్లు ఇప్పటికీ సానుకూల అంశాల గురించి చెప్పవచ్చు, రాజకీయ అభ్యర్ధులైన ట్రంప్‌, బెర్నీ శాండర్స్‌ వంటివారు ఒక దశాబ్దం క్రితం వూహించటానికే అవకాశం లేని ఈ రెండింటిని వ్యతిరేకించే వారిని నుంచి ఒక పరిధి మేర ఎంతో మద్దతు పొందుతున్నారు. వాణిజ్య లావాదేవీలలో అంతగా తెలియని పసిఫిక్‌ సముద్ర రాజ్యాల భాగస్వామ్య (టిపిపి) ఒప్పందం ప్రమాదంలో పడింది. ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడాకులు తీసుకోవటాన్ని కూడా ప్రపంచీకరణకు తిరస్కరణే అన్నది ఏక కంఠంతో చెప్పిన భాష్యం. కానీ నేటి ప్రపంచీకరణ వ్యతిరేక యుద్ధ వీరులు నిన్నటి యుద్ధం గురించి పోరాడుతున్నారు. ఏ విధంగా చూసినప్పటికీ 2008 సంక్షోభం నాటి నుంచి ప్రపంచీకరణ పూర్తి తిరోగమనంలో వుంది. మొదటిది వాణిజ్య విషయానికి వస్తే 2008 వరకు ఆరోగ్యకరంగా పెరిగింది. సంక్షోభం, మాంద్యం తరువాత ఇంతవరకు పూర్వపు స్థాయికి చేరుకోలేదు. రెండవది వలసల విషయానికి వస్తే ప్రపంచవ్యాపితంగా నెమ్మదిగా వలసలు పెరుగుతున్నాయి. అమెరికాకు అనూహ్య పెరుగుదల ఆగిపోయింది. మెక్సికో నుంచి అమెరికాకు వలసలు ఒక పెద్ద రాజకీయ వివాదంగా వుండేవి కాస్తా ఆ సమస్య ఇప్పుడు అటుదిటు అయింది. 2008 నుంచి 2014 వరకు అమెరికాలో నివశించే మెక్సికన్ల జనాభా పదిలక్షల మంది తగ్గిపోయారు.కారణం, అధికారికంగా నమోదు కానటువంటి మెక్సికన్‌ వలసదారులు పెద్ద సంఖ్యలో తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. తరువాత ఆర్ధికం గురించి, సంక్షోభానికి ముందు వున్న స్ధాయితో పోల్చితే అంతర సరిహద్దుల మధ్య జరిగే నగదు బదిలీలు తగ్గినట్లు యుబిఎస్‌ బ్యాంకు వివరాలు వెల్లడిస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే ప్రపంచీకరణ అనూహ్య పెరుగుదల ఇరవయ్యవ శతాబ్ది చివరి నాటికే అంతమైంది. ఇరవై ఒకట శతాబ్ది ప్రారంభం ముగిసింది, ప్రపంచీకరణ చుట్ట విడిపోవటం ప్రారంభం కూడా కావచ్చు. పది సంవత్సరాల ఆలస్యంగా ప్రపంచీకరణ అపస్మారకం గురించి ఆందోళన పడుతున్నట్లుగా వుంది.’

   ఇంత త్వరగా ప్రపంచీకరణపై పెట్టుబడిదారీ మేథావులలో భ్రమలు వైదొలగటం ప్రారంభం అవుతుందని ఎవరూ వూహించలేదంటే అతిశయోక్తి కాదు.మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో వచ్చిన సంక్షోభాలు, తీవ్ర ఆర్ధిక మాంద్యం కారణంగా అనేక దేశాలు తమ పరిశ్రమలు, వాణిజ్య రక్షణ చర్యలను తీవ్రతరం చేశాయి.రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి చిన్నా, చితకా దేశాలు తప్ప వలసలు పూర్తిగా అంతరించటంతో యుద్ధ సమయంలోనే అమెరికా-బ్రిటన్‌లు యుద్ధం ముగిసిన తరువాత వాణిజ్య ఏర్పాటు ఎలా వుండాలో చర్చలు ప్రారంభించాయి. వాటి ఫలితమే 1947 ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు జెనీవాలో 23 దేశాల చర్చలు ఫలించి ప్రపంచీకరణకు తెరతీసిన పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (గాట్‌) కుదిరింది. అక్కడే అత్యంత సానుకూల దేశ హోదా కూడా పురుడు పోసుకుంది. ఒప్పందాన్ని అంగీకరించిన దేశాలు సభ్య దేశాల వస్తువులకు పన్నులు, ఇతర ఆటంకాలను తగ్గించటం, ఎత్తివేయటమే గాట్‌లోని కీలకాంశం. తరువాత 2000 సంవత్సరం నుంచి దాని కొనసాగింపుగా ప్రపంచ వాణిజ్య సంస్ద రంగంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

    ప్రపంచీకరణను ముందుకు తెచ్చిన ధనిక దేశాల ఆశలు, ఆకాంక్షలు, అంచనాలకు భిన్నంగా, వివిధ దేశాల మధ్య అసమాన ప్రయోజనాలు వస్తున్నాయని అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. చైనాను చూసి ప్రయివేటు పెట్టుబడులు అక్కడ పొందుతున్న లబ్దిని చూసి భారత్‌ సంస్కరణలు మొదలు పెట్టిందా లేక సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తరువాత పెట్టుబడిదారీ ధనిక దేశాలతో అంటకాగితే ప్రయోజనం వుంటుందని పాలకవర్గం భావించి సంస్కరణలకు శ్రీకారం చుట్టిందా అన్నది ఒక చర్చ నీయాంశం. సోవియట్‌ కూలిపోక ముందే 1988లో ప్రధాని రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన జరపటం ఒక కీలకాంశం. నూతన ఆర్ధిక విధానం పేరుతో రాజీవ్‌ గాంధీ మాట్లాడిన పూర్వరంగం సంస్కరణలలో భాగమే. తరువాత సోవియట్‌, తూర్పు ఐరోపా రాజ్యాల సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత పీవీ నరసింహారావు రూపంలో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను తెరిచేందుకు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్కరణలు ఏ దేశానికి ఎక్కువ ప్రయోజనం కలిగించాయో తెలిసిందే. జపాన్‌కు చెందిన ‘రీతి’ సంస్ధ పరిశోధన ప్ర కారం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో మన వ్యవస్థను ముడివేసిన కారణంగా మన పరిశ్రమలు లబ్ది పొందటంతో పాటు వుపాధి అవకాశాలు కూడా పెరిగాయి. http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html అయితే అవి చైనాతో పోల్చుకుంటే చాలా పరిమితం. ఈ రెండింటితో పాటు మరికొన్ని దేశాలు లబ్ది పొందితే ఆ మేరకు ధనిక దేశాలు నష్టపోయాయి. 1995-2011 మధ్య కాలంలో ప్రపంచ విలువ గొలుసులో భారత పరిశ్రమలు చేసిన వుత్పత్తిలో తమ ఆదాయ వాటాను దాదాపు రెట్టింపు చేసుకున్నాయి. అందువలన మిగతా పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయని వేరే చెప్పనవసరం లేదు.ఈ విషయంలో మన పరిశ్రమలు రెండు నుంచి నాలుగుకు పెరిగితే చైనా నాలుగు నుంచి 16కు ఎదిగింది. ఇదే సమయంలో కేవలం విదేశాల కోసం చేసిన వుత్పత్తి విలువ మన దేశంలో 18 నుంచి 28కి పెరిగితే చైనాలో 35 నుంచి 42కు మాత్రమే పెరిగింది. అంటే చైనా కంటే విదేశాల కోసం తయారు చేసే సరకుల విషయంలో మన దేశం ఎంతో ముందుకు పోయింది. ఈ కారణంగానే మన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వంటి వారు మేకిన్‌ ఇండియా, మేకిన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో భారత్‌లో సరకులు తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేసుకోండి మంచి అవకాశాలు కల్పిస్తామని వెంపర్లాడుతున్నారు. రాయితీలు ప్రకటిస్తున్నారు. కేవలం ఎగుమతుల మీద ఆధారపడి ఆర్ధిక వ్యవస్థలను నిర్మించుకోవటం మంచిది కాదని లాటిన్‌ అమెరికా అనుభవం గ్రహించిన చైనా 2008 సంక్షోభం తరువాత తన అంతర్గత డిమాండ్‌ను పెంచటంపై కేంద్రీకరించింది. ఈ కారణంగానే సంక్షోభ ప్రభావం దాని ఆర్ధిక వ్యవస్ధపై పరిమితంగా పడిందన్నది కొందరి విశ్లేషణ.

     వస్తూత్పత్తి రంగంలో నానాటికీ నిపుణులైన కార్మికుల అవసరం పెరుగుతోంది. ఈ విషయంలో కూడా మనం చైనాతో పోల్చుకోవటానికి లేదు. 1995-2011 మధ్య మన దేశంలో వున్నత నిపుణులైన కార్మికులు 106.8శాతం పెరిగితే చైనాలో 211.2 శాతం పెరిగారు, పరిమిత నిపుణులైన వారు చైనాలో 35.6, భారత్‌లో 49.4 శాతం పెరిగారు. నైపుణ్యం లేని కార్మికుల శాతాలు 6.3, 4.4 శాతం చొప్పున మాత్రమే పెరిగారు. మన దేశంలో మధ్య తరగతి, చివరికి కార్మికవర్గంలో కూడా ప్రపంచీకరణకు అనుకూలత వ్యక్తం చేయటానికి ఈ పరిణామం కూడా దోహదం చేసినట్లుగా కనిపిస్తున్నది. మిగతావారితో పోల్చితే నిపుణులైన కార్మికులకు వేతనాలు సహజంగానే ఎక్కువ వుంటాయి కనుక, అవి ప్రపంచీకరణ పేరుతో మన ఆర్ధిక వ్యవస్ధను ప్రపంచ వ్యవస్ధతో ముడిపెట్టిన కారణంగానే వచ్చాయి కనుక ఆ విధానాలకు ఆకర్షితులు అవుతున్నారు. 1991-2014 మధ్య మన దేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులు పని చేసే పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగింది. నైపుణ్యం లేని కార్మికులు పని చేసే పరిశ్రమలు అంతకంటే ఎక్కువగా తగ్గిపోయాయి.

Image result for globalisation: why do people are opposing and supporting ?

    ఇదే సమయంలో ధనిక దేశాలలో పరిస్థితి ఏమిటి ? అమెరికాలో వున్నత నైపుణ్యం, పరిమిత నైపుణ్యం, నైపుణ్యం లేని కార్మికుల సంఖ్య స్ధిరంగా కూడా లేకపోగా 9.6,32.6,46.6 శాతాల చొప్పున, జపాన్‌లో 7.7, 29.8, 65.7 శాతాల చొప్పున తగ్గారు. ‘రీతి’ సర్వే చేసిన దేశాలలో ఒక్క చైనా, భారత్‌లో తప్ప మిగతా ప్రధాన దేశాలైన దక్షిణ కొరియాలో 66.5, తైవాన్‌లో 36.7, జర్మనీలో 17.7, ఇండోనేషియాలో 12.3 శాతం చొప్పున తగ్గారు. అందువలన సహజంగానే అక్కడి పౌరులలో ప్రపంచీకరణ వుత్పత్తి విధానం పట్ల తద్వారా ఆదాయాలు తగ్గటం వలన ప్రపంచీకరణ వ్యతిరేకత పెరుగుతోందన్నది స్పష్టం. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన అక్కడ ఆర్ధిక అసమానతలు వున్నప్పటికీ కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగాయన్నది అందరూ అంగీకరిస్తున్న సత్యం. అక్కడ పెరుగుతున్న వేతనాలను చూస్తే http://money.cnn.com/2016/03/17/news/economy/china-cheap-labor-productivity/ అనుకున్నంత చౌక కాదని అమెరికన్లే చెబుతున్నారు. అమెరికాతో పోల్చితే నాలుగు శాతమే తక్కువని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ చెప్పిన విషయాన్ని నిర్ధారించుకోవాల్సి వుంది. చైనాతో పోల్చితే మన దేశంలో అత్యంత నిపుణులైన కార్మికులకు కూడా వేతనాలు తక్కువే అన్నది తెలిసిందే. ఇది కూడా మోడీ వంటి వారిని మేకిన్‌ ఇండియా నినాదాలకు పురికొల్పింది. ఒకవైపు ఇది పారిశ్రామికవేత్తలను వుత్సాహపరుస్తుంటే మరోవైపు ప్రపంచీకరణ ఫలితాలు కొంత మంది చెప్పినట్లు ఊట మాదిరి దిగువకు దిగటంలేదు. అందుకే ఆర్ధిక అసమానతలు తీవ్రం అవుతున్నాయి.నైపుణ్యం లేని, పరిమిత నైపుణ్యం గల కార్మికులందరూ కాంట్రాక్టు వుద్యోగులుగా, తక్కువ వేతనాలకు పని చేసే అసంఘటి పని వారిగా మారిపోతున్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలన్నీ ఆటోమేషన్‌ కొద్ది మంది కార్మికులతో నడిచేవి తప్ప ఎక్కువ మందితో అవసరం వుండదు. అందువలన అంకెలలో అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ అది వుపాధి రహితంగా వుంటోంది. రానున్న రోజుల్లో ఈ ధోరణిని మరింతగా పెంచాలని, వున్న కార్మిక చట్టాలను కూడా క్రమంగా ఎత్తివేయాలన్నది పాలకుల లక్ష్యంగా వుంది.

    సరళీకరణ, ప్రపంచీకరణ వలన కలిగే లాభాలను ఎలా చూడాలి ? తాజ్‌ మహల్‌ కట్టించిందెవరు అని కాదు, దానికి రాళ్లెత్తిన కూలీల గురించి చూడాలని శ్రీశ్రీ చెప్పినట్లుగా మన దేశంలో ఏటేటా పెరుగుతున్న ధనికుల గురించి వార్తలను లొట్టలు వేసుకుంటూ చదువుతున్నాం, చూస్తున్నాం తప్ప అందుకు దోహదం చేసిన స్ధితి గురించి ఎందరు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రతి వ్యక్తికి ఎంత లాభం, నష్టం వచ్చిందని చూడటం సాధ్యం కాని మాట నిజమే. ఈ విధానాలకు అనుగుణ్యంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు, మినహాయింపులు ఇస్తున్నాయి. ప్రస్తుతం అవి ఏడాదికి ఆరులక్షల కోట్ల రూపాయలు దాటాయి. విద్య, వైద్యం వంటి సేవలకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను చూస్తే మనకు పరిస్ధితి అర్ధం అవుతుంది. ప్రభుత్వ స్కూళ్లలో కనీసం విద్యార్ధినులకు కూడా అన్ని చోట్లా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోతే సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇవ్వాల్సిన దుస్ధితి ఈ సంస్కరణల కాలంలోనే జరిగింది.http://www.freshwateraction.net/content/all-govt-schools-must-have-toilet-november-end-supreme-court-india నిజానికి ఇతర సబ్సిడీలను కలుపు కుంటే అంతకంటే ఎక్కువే వుంటాయి.అన్నింటి కంటే దారుణం ఏమంటే కార్పొరేట్‌ కంపెనీలు సకల రాయితీలు పొందుతూనే చెల్లించాల్సిన పన్నులను కూడా ఏదో ఒక రూపంలో ఎగవేస్తున్నాయి.http://timesofindia.indiatimes.com/budget-2016/union-budget-2016/Budget-2016-Tax-forgone-gets-a-fancy-name-but-still-a-burden/articleshow/51202028.cms కార్పొరేట్‌ పన్ను 32.45 శాతం చెల్లించాల్సి వుండగా కేవలం 24.67 శాతమే చెల్లిస్తున్నాయని 2014-15 సంవత్సరం గురించి కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అంటే దయామయులైన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు రాయితీలు పొంది, పన్నులు పూర్తిగా చెల్లించటం లేదన్నది స్పష్టం. ధనికులకు మరిన్ని రాయితీలిచ్చేందుకు చూపుతున్న శ్రద్ధ ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతులు కల్పించేందుకు కూడా ప్రభుత్వాలకు లేకపోయిందంటే ప్రపంచీకరణ ఎవరికోసం ? ఎవరికి వుపయోగపడినట్లు ?  ధనిక దేశాలలో ప్రపంచీకరణ వ్యతిరేకత ఏ రూపాలలో వ్యక్తమౌతోంది ? వచ్చే భాగంలో చదవండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచబ్యాంకు ర్యాంకుల పోటీలో పాకిస్థాన్‌ కంటే వెనుకబడిన మోడీ !

30 Sunday Oct 2016

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Politics

≈ Leave a comment

Tags

anti globalization movement, Doing business rankings, globalization, India-Pakistan, Narendra Modi, WB Doing business ranking

ప్రపంచీకరణ – పర్యవసానాలు -1

ఎం కోటేశ్వరరావు

   ప్రపంచంలో నిత్యం అనేక అంశాల గురించి చర్చలు జరుగుతూనే వుంటాయి. చర్చ అంటేనే విరుద్ధ అంశాల మధనం. పురాణాలలో చెప్పిన దాని గురించి నమ్ముతున్నారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే నమ్మే వారు చెప్పిన క్షీర సాగర మధనం అమృతం కోసమే జరిపినప్పటికీ ఆ క్రమంలో అనేకం బయట పడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన మధనం ప్రపంచీకరణ లేదా దాని మరోపేరు సరళీకరణ ఫలితాలు, పర్యవసానాల గురించే అన్నది తెలిసిందే. నేతి బీరకాయలో నెయ్యి మాదిరి దానికి పెట్టిన పేరు వుదారవాదం. పెట్టుబడిదారీ విధానం దుష్టమైందన్న పేరు బాగా ప్రాచుర్యంలోకి రావటంతో ఎంతో తెలివిగా దాని పేరు మార్చారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ప్రపంచవాణిజ్య సంస్ధ ఇలా అనేకం ఏ పేరుతో పని చేసినా కార్పొరేట్ల లాభాలను, ఆ వ్యవస్ధను కాపాడే రూపాలు, ఆయుధాలే. మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఎన్ని అవతారాలేత్తినా దుష్ట సంహారం కోసమే అని చెప్పినట్లుగా పెట్టుబడిదారులు కూడా కార్మికవర్గాన్ని దోచుకొనేందుకు వర్తమానంలో ఎత్తిన అవతారమే ప్రపంచీకరణ. దానిపై జరుగుతున్న మధనంలో అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.

   ప్రపంచబ్యాంకు 2017వ సంవత్సరానికి మనకు ప్రధానం లేదా దానం చేసిన వ్యాపార ర్యాంకు 131, అంతకు ముందు సంవత్సరం 130 వుంది.మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు బాధ పడి నట్లుగా మన ప్రధాని, కేంద్ర మంత్రుల పరిస్థితి తయారైందంటే అతిశయోక్తి కాదు. ఎలాగంటే మన దేశం ఒక ర్యాంకును మెరుగుపరచుకుంటే పొరుగుదేశం పాకిస్థాన్‌ 148 నుంచి 144కు పెరిగి నాలుగు స్ధానాల ఎగువకు వెళ్లింది. చైనా 80 నుంచి 78 కి పెంచుకొని తన స్ధానాన్ని మెరుగు పరుచుకుంది. దాంతో మన కంటే ఇతర దేశాలు మంచి సామర్ధ్యాన్ని ప్రదర్శించినట్లే అనే కొందరు చేసిన వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లయింది. తాను అనేక సంస్కరణలను చేపట్టినా ప్రపంచబ్యాంకు వాటిని ఎందుకు పట్టించుకోలేదు, గతేడాది కంటే మన ర్యాంకును గణనీయంగా ఎందుకు పెంచలేదు అని ప్రధాని నరేంద్రమోడీ ఒక రాత్రంతా తనలో తాను తెగ మధన పడిపోయారు. తన మంత్రులు, అధికారులతో కూడా మధించి నెలరోజుల్లో నివేదిక ఇమ్మని ఆదేశించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన ర్యాంకు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌ను మరింత కుంగదీసింది. రానున్న కొద్ది సంవత్సరాలలో మన ర్యాంకు 50కి చేర నుందని ఈ ఏడాది మే నెలలోనే ఆమె ఆనందంగా ఆశాభావం వెలిబుచ్చారు. తీరా దరిదాపుల్లో లేకపోవటంతో తీసుకున్న చర్యలన్నీ ప్రపంచబ్యాంకు విధించిన గడువులోగా అమలులోకి రానందున వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, వచ్చే ఏడాది ర్యాంకులో ఫలితం కనిపిస్తుందని ట్వీట్‌ చేశారు.

మోడీ బృందం ఎందుకు భంగపాటుకు గురైంది ? నిజానికి ఈ ర్యాంకులు అంకెల గారడీ తప్ప మరొకటి కాదు. మన విద్యావిధానాల మాదిరి ఒకేడాది నిర్ణయించిన ప్రమాణాలు మరొక ఏడాది వుండవు. వాటికి ఇచ్చే మార్కులు కూడా అంతే. కొన్ని ర్యాంకుల తీరుతెన్నులను గమనించండి. నా చిన్న తనంలో గ్రామాలలో బుర్ర కథలు, హరికథల వంటి కళారూపాలను ప్రదర్శించే వారు తమకు మంచి భోజనాలు, భారీ ఎత్తున ధన ధాన్యాలతో సత్కారాలు పొందేందుకు ఏ వూరు వెళితే ఆ వూరి వారిని వుబ్చించేవారు. చుట్టుపక్కల 66 వూళ్లకు మీ వూరు పోతుగడ్డ అని చెప్పగానే నిజమే కావాలనుకొని ప్రతి వూరి వారూ నరేంద్రమోడీ చెప్పినట్లు రొమ్ములు చరుచుకొనే వారు. తమ వ్యాపారాలకు రాయితీలు పొందేందుకు, సులభంగా అనుమతులు సంపాదించుకొనేందుకు కాస్త రూపం మార్చి ‘పోతుగడ్డ’ టెక్నిక్‌ను వాడుతున్నారు.

ఆ క్రమంలో గత రెండున్నర సంవత్సరాలలో అనేక సంస్ధలు నరేంద్రమోడీ సర్కార్‌ను ఆకాశానికి ఎత్తుతున్నాయి. ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్‌ ఒక్కసారిగా 16 దేశాలను దాటి 39వ ర్యాంకుకు చేరినట్లు ప్రపంచ ఆర్ధిక వేదిక( డబ్ల్యుఇఎఫ్‌ ) ప్రకటించింది. చంద్రబాబు నాయుడు వంటి వారికి ఇదొక పవిత్ర స్ధలం. ప్రతి ఏటా వెళ్లి వచ్చి ఆర్భాటం చేస్తుంటారు. వెళ్లి రావటం ఒక ఘనతగా ప్రచారం చేసుకుంటారు. అవినీతి విషయంలో అవినీతి విషయంలో ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్ధ సూచికలో ఏకంగా భారత్‌ తొమ్మిది పాయింట్లను మెరుగుపరచుకుందని వార్తలు వచ్చాయి. http://timesofindia.indiatimes.com/india/Indias-ranking-on-global-corruption-index-improves/articleshow/45358144.cms  చిత్రం ఏమిటంటే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన ఆరునెలలు పూర్తి అవుతున్న సమయంలో ఈ ర్యాంకుల ప్రకటన జరిగింది. దాని ప్రకారం మన్మోహన్‌ సింగ్‌ అధికార చివరి సంవత్సరం 2013లో 94వ ర్యాంకులో వుండగా 2014లో 85వ స్ధానానికి మెరుగుపరచుకుంది. దీనికి మోడీ ప్రభుత్వం తీసుకున్న అవినీతి రహిత చర్యలే కారణమంటూ ఆయన భక్తులు బాపు సినిమా ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు ఏర్పాట్లను గుర్తు చేశారు. మరుసటి ఏడాదికి ఆ ర్యాంకు 76కు చేరింది. మరో తొమ్మిది ర్యాంకులను పెంచారు.http://www.transparency.org/cpi2015#results-table  ఇది ఆ సంస్ధ అధికారిక వెబ్‌సైట్‌ చిరునామా. దీని ప్రకారం 2012,13 మనకు వచ్చిన మార్కులు నూటికి 36, మోడీ హయాం 2014,15లో వచ్చినవి 38. ఇదే సమయంలో పాకిస్థాన్‌ 27 నుంచి 30కి పెంచుకుంది. మిగిలిన దేశాలలో అవినీతి పెరిగి మన ర్యాంకు మెరుగుపడింది తప్ప మన మార్కులు పెరిగి కాదన్నది స్పష్టం అవుతోంది.

ఇక కొత్త కల్పనల సూచిక వరుసగా ఐదు సంవత్సరాలు పడిపోతూ వున్నది కాస్తా 81నుంచి 2015లో 66కు పెరగటం కూడా నరేంద్రమోడీ ఘనతే అని చెప్పారు.http://www.dnaindia.com/money/report-india-s-rank-on-global-innovation-index-improves-to-66-2247413 కొత్త కల్పనలు రహస్యంగా వుండేవేమీ కాదు. దేశ ప్రజలకు తెలియకుండా అల్లా వుద్దీన్‌ అద్బుత దీపం ఏమైనా మోడీ సర్కార్‌కు దొరికిందా అన్న అనుమానం వచ్చింది. మంత్రులు చెప్పేది, మీడియాలో వచ్చే వార్తలు ఎలా వుంటాయో తెలుసు కనుక సంస్ధ అధికారిక వెబ్‌ సైట్‌ను ఆశ్రయిస్తే http://www.wipo.int/edocs/pubdocs/en/economics/gii/gii_2013.pdf ప్రకారం 2013లో మనకు వచ్చిన మార్కులు 36.17 శాతంగానూ ర్యాంకు 66గానూ దర్శన మిచ్చింది. దీంతో మరింత ఆసక్తి పెరిగి 2016 ర్యాంకింగ్‌ల కోసం చూస్తే దానిలో మన మార్కులు 33.61శాతానికి తగ్గినా ర్యాంకు మాత్రం 66గానే వుంది. ఇదే సమయంలో మన ఇరుగు పొరుగుదేశాల స్ధితి ఎలా వుంది అన్న సందేహం కలగటం సహజం కదా ! పాకిస్తాన్‌ 23.33 మార్కులు, 137 ర్యాంకు నుంచి 22.63 మార్కులు 119వ ర్యాంకుకు మెరుగు పడింది. ఇదే సమయంలో చైనా విషయానికి వస్తే తన మార్కులు 44.66, ర్యాంకు 35 నుంచి 50.57 ర్యాంకు 25 తెచ్చుకుంది.

వివిధ వసతుల కల్పనాంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచబ్యాంకు లాజిస్టిక్స్‌ సామర్ధ్య సూచికలను ప్రకటిస్తుంది.http://www.dnaindia.com/money/report-india-moves-up-to-35th-rank-on-world-bank-s-logistics-performance-index-2230168 దీని ప్రకారం 2014లో 54వ స్ధానంలో వున్నది కాస్తా 2016 నాటికి 35వ ర్యాంకుకు చేరిందని ప్రశంసలు కురిపించారు. ప్రపంచబ్యాంకు రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే వివరాల ప్రకారం 2007లో మన ర్యాంకు 39, మనకు వచ్చిన మార్కులు 3.07, 2012లో 46 -3.08, 2014లో 54 – 3.08, 2016లో 35 -3.42 వచ్చాయి. మార్కులలో పెద్ద తేడాలు లేకపోయినప్పటికి 2007-14 మధ్య ర్యాంకు 39 నుంచి 54కు పడిపోయింది. అందువలన ఈ ర్యాంకుల గురించి సంబరపడి, అది తమ సామర్ధ్యమే అని చెప్పుకుంటే అంతకు మించి జనాన్ని మోసం చేయటం మరొకటి వుండదు.

ఇక సులభతర వాణిజ్య ర్యాంకుల విషయానికి వస్తే 2007లో మనకు వచ్చిన ర్యాంకు 116 అక్షరాలా నూట పదహారు. అది 2014 నాటికి 142కు పడిపోయింది. ర్యాంకులు కేటాయించిన పద్దతిని ప్రపంచబ్యాంకు సవరించటంతో అది 134గా నిర్ధారణ అయింది. 2015 జూన్‌ నాటికి మన ర్యాంకు 130కి మెరుగు పడింది, తరువాత దానిని 131కి సవరించారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన ర్యాంకు 130 అంటే ఎదుగూ బొదుగూ లేకుండా వుండి పోయింది. ఇది జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యవేత్తలలో నరేంద్రమోడీ పలుకుబడిని తగ్గించేది లేదా అనుమానాలను రేకెత్తించేది కనుకనే నరేంద్రమోడీ, ఆయన మంత్రులు అంతగా కంగారు పడుతున్నారు.

    ప్రపంచీకరణ అంటే విదేశీ సంస్ధలు మన దేశంలో సులభంగా వ్యాపారం చేసుకొనే అవకాశాలను కల్పించటం, దానికి ప్రశంసగా ప్రపంచబ్యాంకు ఇచ్చే ర్యాంకుల పిచ్చి ముదిరి వాటి కోసం మన ప్రధాని, దానికి అనుకరణగా కేంద్రం ప్రవేశ పెట్టిన ర్యాంకు కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పడుతున్న తపన అంతా ఇంతా కాదు. అదింతటితో ఆగదు, మరిన్ని పర్యవసానాలకు దారితీస్తుందని గుర్తించాలి. ప్రపంచ పెట్టుబడిదారులకు మన ఆర్ధిక వ్యవస్ధను మరింతగా తెరిచేందుకు రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోనున్నారు.

    ప్రస్తుతం ప్రపంచీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నది ఎవరు అంటే కొంత మంది విశ్లేషణ ప్రకారం ధనిక దేశాలలోని కార్మికవర్గం, దానితో పాటు అక్కడి పెట్టుబడిదారీ వర్గం అంటే అతిశయోక్తి కాదు. గతంలో వర్ధమాన, తృతీయ ప్రపంచ దేశాలలో ప్రపంచీకరణకు వ్యతిరేక గళాలు బలంగా వినిపించాయి, ఇప్పటికీ అడపాతడపా వినిపిస్తూనే వున్నాయి. అయితే గతం మాదిరి పెద్ద ఎత్తున లేవన్నది వాస్తవం. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గతంలో మాదిరి సామాజిక వేదికల (సోషల్‌ ఫోరాలు) సదస్సులు ఇప్పుడు జరగటం లేదు, వెనుక పట్టు పట్టాయి. అవి సాధించిన విజయాలేమిటి ? వాటికి వున్న పరిమితులు ఎంతవరకు అన్న విషయాలను ఇక్కడ విశ్లేషించటం లేదు. మొత్తం మీద ప్రపంచీకరణ కోరుకున్న పెట్టుబడిదారులు, వారి సమర్ధకులదే పైచేయిగా వుంది, దానితో లాభాలు పొందవచ్చని కార్పొరేట్లు భావిస్తున్న కారణంగానే మరింతగా సంస్కరణల పేరుతో చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అందుకు నరేంద్రమోడీ సమర్ధకుడు అని భావించిన కారణంగానే గద్దెనెక్కించటమే గాక, తమ చేతులలో వున్న ప్రచార మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున వూదరగొడుతున్నారు. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగిన వుద్యమాలు సాధించిన ఫలితాలు, కార్మికులు కోల్పోయిన వాటి గురించి, పర్యవసానాల గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి వుంది. కండ్లు లేనివారు ఏనుగును వర్ణించినట్లుగా ఎవరికి వారు తమ అనుభవంలోకి వచ్చిన అంశాల గురించి రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. వాటన్నింటినీ కొట్టి వేయలేము, అలాగని వాటినే అంతిమ నిర్ధారణలుగా అంగీకరించలేము. అందువలన ఆ పరిమితులకు లోబడి ఈ సందర్భంగా కొన్ని విషయాలను పాఠకుల దృష్టికి తెస్తున్నాను.

     కొద్ది నెలల క్రితం ఐరోపా యూనియన్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలా వద్దా అనే విషయమై బ్రిటన్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. దానిలో ఎక్కువ మంది వైదొలగటానికే మొగ్గు చూపారు. సభ్య దేశాలపై పొదుపు చర్యల పేరుతో కార్పొరేట్ల లాభాలలో కోత పడకుండా చూసేందుకు ఐరోపా యూనియన్‌ రుద్దిన పొదుపు చర్యలకు జనంలో వ్యతిరేకత వ్యక్తం కావటంతో పాటు, ఒక యూనియన్‌లో వుండి దాని తరఫున ఒక సభ్య దేశంగా ప్రపంచ మార్కెట్‌ వాటాను పరిమితంగా పంచుకోవటం కంటే విడిగా వుండి ఎక్కువ వాటాను తెచ్చుకోవచ్చన్న బ్రిటన్‌ కార్పొరేట్ల వత్తిడికూడా ఈ నిర్ణయాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ముగిసిన ప్రచారంలో కూడా వాణిజ్యంపై చర్చకు పెద్ద పీట వేయటం, ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి అమెరికా బయటకు రావాలని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించటం, కెనడా-ఐరోపా యూనియన్‌ మధ్య చర్చలలో వున్న సమగ్ర ఆర్ధిక, వాణిజ్య ఒప్పందం(సిఇటిఏ) పట్ల వెల్లడౌతున్న వ్యతిరేకత ధనిక దేశాలలో ప్రపంచీకరణకు కార్మికవర్గం కంటే పెట్టుబడిదారీ వర్గంలోనే పెరుగుతున్న వ్యతిరేకతను సూచిస్తోంది. ఇది ఆయా దేశాల పారిశ్రామిక, వాణిజ్య సంస్ధల రక్షణాత్మక చర్యలకు దారితీస్తోంది. ధనిక దేశాల నుంచి ప్రారంభమైన ఈ క్రమం అన్ని దేశాలకు తరతమ తేడాలతో విస్తరించటం అనివార్యం.

    ఒక తత్వం ప్రకారం ఎప్పుడూ ప్రపంచీకరణ అనుకూలత, ప్రపంచీకరణ వ్యతిరేకత వ్యక్తమౌతూనే వుంటాయి. రుతువుల మాదిరి పెట్టుబడిదారీ వ్యవస్ధలో మాంద్యాలు రావటం, దాని నుంచి ఏదో విధంగా బయట పడటం సైకిలు చక్రం మాదిరి ఒకదాని వెంట ఒకటి సంభవిస్తుంటాయి. దాని పర్యవసానాలు ప్రపంచీకరణ మీద పడతాయి. గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రపంచీకరణ పర్యవసానంగా ధనిక దేశాలలో నష్టపోయిన సాంప్రదాయ మధ్యతరగతి ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో వుంది.లబ్ది పొందిన వారిలో ప్రస్తుతం ప్రపంచీకరణ విధానానికి వున్న పరిమితులు తమ శక్తి సామర్ధ్యాలను పూర్తిగా ప్రదర్శించటానికి వీలు కల్పించటం లేదనే తరగతి కూడా అదే ధనిక దేశాలలో ప్రపంచీకరణను మరొక వైపు నుంచి విమర్శిస్తుంది. ప్రపంచీకరణ విధానాన్ని కనిపెట్టిన వారు దాని పర్యవసానాలను వూహించలేకపోయారు. ప్రపంచీకరణ ఆర్ధిక అసమానతలను జెట్‌ వేగంతో పెంచింది. ఫలితంగా వలసలు పెరిగిపోయాయి. వలసలకు ఇతర అనేక కారణాలు వున్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం ప్రపంచీకరణే. ఇది కొన్ని దేశాల నుంచి వలసలను పెంచితే మరికొన్నింటి నుంచి తగ్గించిందని కూడా వెల్లడైంది. శ్రమను కారుచౌకగా ఆమ్ముకొనే వలస కూలీలను ప్రోత్సహించటం కూడా ప్రపంచీకరణలో భాగమే అన్నది ఇక్కడ మరిచి పోరాదు. ధనిక దేశాలలో ప్రపపంచీకరణ తెచ్చిన అసంతృప్తికి, పేద దేశాల నుంచి సామూహికంగా వస్తున్న వలస కార్మికుల సమస్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.2008లో ప్రారంభమైన ధనిక దేశాల ఆర్ధిక మాంద్యం సమస్యను మరింత సంక్లిష్టం గావించింది. అనేక చోట్ల నిరుద్యోగం, దారిద్య్రం, వేతనాలలో కోతలు పెరిగిపోయాయి. పర్మనెంటు వుద్యోగాలు తగ్గి తక్కువ వేతనాలు లభించే తాత్కాలిక వుపాధిలో చేరే పరిస్థితికి కార్మికవర్గం చేరింది. ఇవన్నీ ప్రపంచీకరణ ఫలితమే అని భావించటంతో ధనిక దేశాలలో వ్యతిరేక గళం వినిపించటం ప్రారంభమైంది. ఇది ఒక కోణం. మరోవైపు నుంచి పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కూడా పర్యవసానాలు ప్రతికూలంగా తయారయ్యాయి. అదెలా వుందో తాజాగా వెల్లడైంది.

    ఇటీవల రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకానమీ, ట్రేడ్‌, ఇండస్ట్రీ అనే సంస్ధ ఒక పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది.http://www.rieti.go.jp/en/publications/summary/16080003.html దానిలో వున్న వివరాల ప్రకారం ప్రపంచీకరణ వివిధ దేశాల మధ్య అసమాన లబ్దికి దారితీసింది. అలా లబ్ది పొందిన వాటిలో భారత్‌ ఒకటి, అయితే చైనాతో పోల్చితే చాలా తక్కువ ప్రయోజనం కలిగింది. ఈ లబ్ది పారిశ్రామికవేత్తలతో పాటు కార్మికవర్గానికి కూడా దక్కింది. ఎవరు ఎక్కువ అంటే ఈ కాలంలో దేశంలో పెరిగిన ఆదాయ, ఆర్ధిక అసమానతలు, పెరిగిన బిలియనీర్లను చూస్తే కార్మికుల కంటే పారిశ్రామిక, వాణిజ్యవర్గాలే ఎక్కువ లబ్ది పొందాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే నరేంద్రమోడీ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని వారంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ సంస్కరణలు కొత్త సమస్యలను తీసుకువస్తాయని తెలిసినప్పటికీ తక్షణం లాభదాయకంగా వుంది కనుక రాబోయే పర్యవసానాల గురించి వారు అంతగా ఆలోచించటం లేదు.అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా తిరుగులేని శక్తిగా అవతరించింది. జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది. తనకున్న ఆర్ధిక శక్తి కారణంగా స్వేచ్చా వాణిజ్య నిబంధనలు, విధానాన్ని మరింత గట్టిగా అమలు జరపాలని అది కోరుతోంది. దాని దెబ్బకు గిలగిలలాడుతున్న ధనిక దేశాలు తాము ముందుకు తెచ్చిన స్వేచ్ఛా వాణిజ్యవిధానాన్ని పక్కన పెట్టాలని కోరుతున్నాయనటానికి ముందే చెప్పినట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ వాణిజ్య సంస్ధ నుంచి వైదొలుగుతానని బెదిరించటం పక్కా నిదర్శనం. పైన పేర్కొన్న పరిశోధనా పత్రంలో ప్రపంచీకరణ పర్యవసానాల గురించి ఏం చెప్పారు ? వచ్చే భాగంలో చూడండి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రపంచబ్యాంకు అక్కర తీర్చే తహ తహ ! ఔరా ఏమిటీ వైపరీత్యము !!

26 Wednesday Oct 2016

Posted by raomk in AP, Current Affairs, Economics, Gujarat, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS

≈ Leave a comment

Tags

Doing business, Doing business India rank, Doing business rankings, WB Doing business ranking

ఎం కోటేశ్వరరావు

   వ్యాపార సరళతరం సూచికలో భారత్‌ తన స్ధానాన్ని 131 నుంచి 130కి పెంచుకొని గత ఏడాది కంటే ఒక పాయింట్‌ అదనంగా సాధించిందని ప్రపంచబ్యాంక్‌ 2017 నివేదికలో ప్రకటించింది. నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రకటించిన సంస్కరణలన్నీ వూకదంపుడు వుపన్యాసాలే తప్ప ఆచరణ రూపం దాల్చనందున ప్రపంచ బ్యాంకు వాటిని పరిగణనలోకి తీసుకోలేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. భారత్‌లో వ్యాపార విషయాలను చూసే కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి రమేష్‌ అభిషేక్‌ తాజా సూచికపై స్పందిస్తూ ప్రభుత్వం అమలు జరుపుతున్న 12 సంస్కరణలను ప్రపంచబ్యాంకు పరిగణనలోకి తీసుకోలేదని, వచ్చే ఏడాది నివేదికలో ఈ అంశాలను చేర్చేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు అక్కర లేదా ఆవేదనలను తీర్చుతామని కూడా వెల్లడించారు. దివాలా, ఐపి నిబంధనలను ఈ ఏడాది చివరికి ఖరారు చేస్తామని, జిఎస్‌టిని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి అమలు జరిపితే మన సూచిక గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.http://www.livemint.com/Industry/uOrtVTE4CgFpPnwV3wATmK/India-ranked-130-in-World-Banks-Doing-Business-survey.html

    భారత్‌లో సులభంగా వ్యాపారం చేసుకోవటానికి చర్యలు తీసుకోవటం అంటే ఏమిటో ఈ పాటికే కొంత అర్ధమయ్యే వుంటుంది. సూటిగా చెప్పాలంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలా వచ్చి వ్యాపారాన్ని పెట్టి అలా లాభాలు తీసుకుపోయేందుకు అనువైన పరిస్ధితులు కల్పించటమే. ఒక వేళ అలా వచ్చిన వారు ఎవరైనా ఇలా దివాలా తీస్తే వారికి నష్టం కలగకుండా చూసేందుకు దివాలా, ఐపి నిబంధనలను కూడా సరళతరం చేస్తామన్నదే మన పరిశ్రమల శాఖ కార్యదర్శి వివరణ ఆంతర్యం. వీటికి సంస్కరణలని ముద్దు పేరు. మన దేశానికి ఈస్టిండియా కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్‌, పోర్చుగీసు, డచ్‌, ఫ్రెంచి వారందరూ సులభంగా వ్యాపారం చేసుకొనేందుకే కదా వచ్చారు. వారికి నాటి మన రాజులు, రంగప్పలు సులభంగా అనుమతులు ఇవ్వబట్టే కదా ఏకులా వచ్చి మేకులా మారి మన తలపై కూర్చున్నారు. మరి దానికీ దీనికీ పెద్ద తేడా ఏమిటి అన్నది మౌలిక ప్రశ్న. నాడు వంశపారంపర్య రాజులు అనుమతిస్తే నేడు వారి స్ధానంలో ప్రజలెన్నుకున్న ప్రభువులు ఇవ్వటం తప్ప మరొకటి ఏమైనా వుందా ? విదేశీ కంపెనీలను అనుమతిస్తే అవి మన మూలుగులను పీల్చి పిప్పి చేయటమే కాదు, మన మీద పెత్తనం చెలాయిస్తాయని నాటి మేథావి వర్గానికి తెలిసినా లేదా వేదాల్లో అవి కూడా రాసి వున్నాయని నాటి సంస్కృత పండితులు ఎవరికైనా అనుమానం వచ్చినా కచ్చితంగా వ్యతిరేకించి వుండేవారు. కానీ ఇప్పుడు అన్నీ వేదాల్లో వునాయష అని చెబుతున్నవారు, చరిత్రను తిరగేసి మరగేసి చూసిన మేథావులనబడేవారు కూడా విదేశీ కంపెనీలకు స్వదేశీ ఎర్రతివాచీ పరిచి, దేశ భక్తి భాజా భజంత్రీలతో స్వాగతం పలుకుతున్నారు. నాడు తెలియక చేస్తే నేడు తెలిసి చేస్తున్నారు. దీనికి భిన్నమైనదేమైనా వుంటే చరిత్రకారులు, మేథావులు చెప్పాలి.

    ప్రపంచబ్యాంకును సంతృప్తి పరచటం అంటే అది ప్రాతినిధ్యం వహించే అంతర్జాతీయ కార్పొరేేట్ల అక్కర తీర్చటమే. ఈ విషయంలో మన్మోహన్‌ సింగ్‌తో నరేంద్రమోడీ పోటీ పడుతున్నారు. తానే పెద్ద సంస్కరణ వాదిని అని నిరూపించుకొనేందుకు తహతహలాడుతున్నారు. సింగ్‌ గారి హయాంలో అంటే 2012లో సరళతర వ్యాపారంలో మన దేశ ర్యాంకు 131 అన్న విషయం గుర్తు చేయటం అవసరం.http://www.thehindu.com/business/Economy/india-slips-in-ease-of-doing-business-list-world-bank/article5286594.ece తరువాత అది 134కు పడిపోయింది.అందువలన ఈ ర్యాంకులను చూసి లేదా చూపి పాలకులు తాము సాధించిన ఘనత అని చెప్పుకుంటే జనాన్ని మోసం చేయటం తప్ప మరొకటి కాదు. ప్రతి ఏటా ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకులు కేటాయించే పద్దతులలో మార్పులు చేస్తూ వుంటుంది. దేశాల సంఖ్య కూడా మారిపోతూ వుంటుంది. నిజానికి ఇదొక అంకెల గారడీ. మన దేశ ర్యాంకు పెరగటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న అంశాలలో విద్యుత్‌ సరఫరా, కనెక్షన్ల ప్రక్రియను సులభతరం చేయటం ప్రధానంగా పని చేస్తున్నది.

  మన దేశంలో వ్యవసాయానికి విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వటానికి రైతాంగాన్ని ఎంత సతాయిస్తారో తెలిసిందే. కానీ అదే పారిశ్రామికవేత్తల విషయానికి వస్తే పరిశ్రమ పెట్టకుండానే కనెక్షన్‌ సిద్ధం అన్నట్లుగా వుంటుంది. వుపాధి కల్పిస్తున్నదనే పేరుతో దానికి రాయితీలు అదనం. మన పాలకులు ప్రతి ఏటా అన్ని లక్షల కోట్లు ,ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులుగా తెచ్చామని ఎంత వూదర గొడుతున్నప్పటికీ మన దేశంలో విద్యుత్‌ వినియోగంలో పరిశ్రమల వాటా తగ్గిపోతున్నది.2012లో 32శాతం వుండగా 2014నాటికి 29శాతానికి పడిపోయింది. దానిలో స్వల్ప మార్పు లేదా స్ధిరంగా వుంటున్నది తప్ప పెరగటం లేదు. దానికి కారణాలలో పరిశ్రమల మూత, ఖాయిలా ఒక ప్రధాన కారణం,అయితే వాటి స్ధానంలో కొత్తవి రాకపోవటం మరొకటి. విద్యుత్‌ సరఫరా మెరుగు పడటానికి గతంలో శంకుస్థాపన చేసిన అనేక విద్యుత్‌ కేంద్రాలు ఈ రెండు సంవత్సరాల కాలంలో వుత్పాదన ప్రారంభించటం కూడా ఒకటి. అందువలన సరేంద్రమోడీ సంస్కరణలకు దీనికి సంబంధం వుందని చెప్పలేము.

   గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ దేశమంతటా చేసిన ప్రచారంలో గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధి ఒకటి. ఎన్నికలు ముగిసిన తరువాత ఒక్కసారి కూడా దాని గురించి మాట్లాడినట్లు ఎక్కడా నేను వినలేదు. తిరిగి వచ్చే ఎన్నికలలో చెబుతారేమో తెలియదు. ప్రస్తుతం వుత్తర ప్రదేశ్‌ సంక్షేమాన్ని తాము తప్ప మరొకరు పట్టించుకోరు అని అక్కడ ఎన్నికల సభల్లో చెబుతున్నారు.http://indianexpress.com/article/business/economy/gujarat-clocks-over-48000-sick-msme-units-in-2014/ నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా వుండి గుజరాత్‌ను ఎలా అభివృద్ధి చేశారో పై వార్తను చూస్తే ఆ ప్రచార బండారం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. 2014లో రిజర్వుబ్యాంకు రూపొందించిన సమాచారంతో చిన్న, సన్నకారు, మధ్యతరగతి పరిశ్రమల శాఖ లోక్‌సభలో మోడీ సర్కారే ఒక ప్రశ్నకు సమాధానంగా విడుదల చేసిన సమాచార సంక్షిప్త వివరాలు ఇలా వున్నాయి. 2014 మార్చి ఆఖరు నాటికి వుత్తర ప్రదేశ్‌లో 63,268, గుజరాత్‌లో నమోదైన చిన్న, సన్నకారు పరిశ్రమలలో ఐదో వంతు అంటే 48,000 ఖాయిలా పడ్డాయి. ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ పాలన చివరి సంవత్సరంలో మూత పడిన వాటి సంఖ్య 20,452 నుంచి 48వేలకు పెరిగాయి. అంతకు ముందు 2011లో ఖాయిలా యూనిట్లు 4321 మాత్రమే. 2013 సచేతన గుజరాత్‌( వైబ్రంట్‌ గుజరాత్‌) పేరుతో నిర్వహించిన హంగామాకు ముందు స్వయంగా గుజరాత్‌ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం కేవలం ఐదుశాతం మాత్రమే చిన్న పరిశ్రమలు ఖాయిలా పడ్డాయి. కానీ సచేతన గుజరాత్‌ వుత్సవాల సందర్భంగా తీసిన లఘుచిత్రాలలో చిన్న పరిశ్రమలు ఎంతో గొప్పగా వున్నట్లు చిత్రించారు. ఏ ఏటికాయేడు ఎన్నో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవగాహనా ఒప్పందాలు జరిగినట్లు అంకెలను ప్రకటించారు.

   నరేంద్రమోడీయే సచేతన గుజరాత్‌ పేరుతో అంత హడావుడి చేసి చిన్న పరిశ్రమల మూతకు పుణ్యం కట్టుకుంటే అంతకంటే పెద్ద జాదూతనంతో అలరిస్తున్న చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌ వారి వారసులు తెస్తున్నట్లు చెబుతున్న పెట్టుబడుల గురించి చెప్పాల్సిందేముంది. రాష్ట్రాలలో వాణిజ్య సంస్కరణల విషయమై ర్యాంకుల గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు.అసలు పరీక్ష రాయకుండానే మొదటి ర్యాంకులు ఎలా తెచ్చుకుంటారో ఇటీవల మనం చూశాం. అందువలన రాష్ట్రాల ర్యాంకులు కూడా అదే విధంగా వున్నాయా ?ఏమో తెలియదు. ప్రస్తుతం 99.09శాతంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు రాష్ట్రాలు మొదటి ర్యాంకులో వున్నాయట. ప్రశ్నా పత్రం ముందే లీకైతే తప్ప ఒకే మార్కులు ఎలా సాధ్యం అన్న అనుమానం ఎవరికైనా రావచ్చు.ఈ ఏడాది ర్యాంకులను త్వరలో ప్రకటించనున్నట్లు వార్తలు. ర్యాంకులు అనేవి సాధించిన విజయాలుగా ప్రచారం చేసుకోవటానికి తప్ప సామాన్య జనానికి కల్పిస్తున్న వుపాధి, మరొక ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. ఒక పాత సినిమాలో మీలో పెద్ద వెధవను నేను ప్రేమిస్తాను అంటే ఎవరు ఎలాంటి ‘ఘనకార్యం’ చేశారో చెప్పుకొనేందుకు పోటీ పడతారు. ఇక్కడ మెరుగైన వాణిజ్య వాతావరణం అంటే గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన నీకది, నాకిది పద్దతిలో వాటాల లెక్కలను మరింత పకడ్బందీగా అమలు జరపటం, ప్రజల సొమ్మును పంచుకోవటం తప్ప మరొకటి కాదని ఇప్పటికే తెలుగు జనాలందరికీ అర్ధం అయింది. రాబోయే రోజుల్లో ఈ పోటీ మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d