• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi

ఎన్నికలకు ముందే కెనడా ప్రధానికి ఉద్వాసన ? విశ్వగురువు ఇప్పటికైనా కళ్లు తెరిచేనా !

25 Friday Oct 2024

Posted by raomk in Asia, CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

anti india, Donald trump, Joe Biden, Justin Trudeau, khalistan, Narendra Modi, war on terrorism

ఎం కోటేశ్వరరావు


అక్టోబరు నెల మధ్య నుంచి జరుగుతున్న పరిణామాలతో భారత్‌కెనడా సంబంధాలు తీవ్ర వత్తిడికి గురవుతున్నాయి. అమెరికా, దాన్ని అనుసరించే దేశాలన్నీ మన మీద కత్తిగట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో కెనడా పాలకపక్షంలో కొందరు ఎంపీలు ప్రధాని జస్టిన్‌ ట్రుడెవ్‌ 2024 అక్టోబరు 28లోగా పదవి నుంచి తప్పు కోవాలని, మరోసారి ఎన్నికల గోదాలో దిగవద్దని 153 మంది పాలక పార్టీ ఎంపీల్లో 24 మంది డిమాండ్‌ చేసినట్లు కెనడా బ్రాడ్‌కాస్ట్‌ కార్పొరేషన్‌ వార్తను ప్రసారం చేసింది. ఇది ఏ రూపం తీసుకుంటుందో తెలియదు. అంతకు ముందు పరస్పరం కొందరు దౌత్యవేత్తల బహిష్కరణ మిగిలిన సిబ్బందిపై నిఘావంటి ప్రకటనలతో ఇరుదేశాల మధ్య దౌత్య యుద్దం, ప్రచారదాడి జరుగుతోంది. ఇది రాసిన సమయానికి 270కిపైగా భారత విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న సర్వీసులకు బాంబు బెదిరింపులు రావటం ఆందోళన కలిగించే పరిణామం. గురువారం ఒక్కరోజే 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గతంలో ఇలాంటి పరిస్థితిని మనం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఏ విమానం ఎక్కితే బాంబు ఉన్నట్లు సమాచారం వస్తుందో తెలియని డోలాయమానంలోకి ప్రయాణీకులను నెట్టి భయాన్ని సృష్టించమే ఈ ఉదంతాల వెనుక ఉన్న శక్తుల ఎత్తుగడగా కనిపిస్తోంది. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నడిపితే, ఏదైనా విమానంలో నిజంగా బాంబుపెడితే జరిగే ఘోరాన్ని తలచుకోవాలంటేనే వణుకుపుడుతోంది. దేశం 1980 దశకం నాటి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పరిస్థితులకు వెళుతోందా అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. ఉగ్రవాదాన్ని శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూడకూడదు. అలా పరిగణిస్తే దాన్ని నివారించే బాధ్యత, పోలీసు, ఇతర భద్రతా వ్యవస్థలపై పడుతుంది. అలాంటి సంస్థలు ప్రపంచ వ్యాపితంగా అనుసరించిన దగ్గరి దారి ఏమంటే జనం మీద దాడికి దిగటం. కిరాయికి లేదా ప్రత్యేక ముఠాలను రూపొందించి ఉగ్రవాదులు, ఇతర దేశవ్యతిరేకులను మట్టుబెట్టించటం. ఇది ఒక విధంగా అధికారిక ఉగ్రదళం వంటిదే. ఉగ్రవాదులు తలెత్తకుండా ఉండాలంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, అవాంఛనీయ చర్యలకు పాల్పడినపుడు అవసరమైతే ఆయుధ ప్రయోగం చేయవచ్చు.మన కళ్ల ముందే పాలస్తీనా దేశాన్ని విభజించి యూదుల మాతృభూమి పేరుతో ఇజ్రాయెల్‌ ఏర్పాటు జరిగింది.ఉనికిలో ఉన్న పాలస్తీనా అదృశ్యమైంది. దాని పునరుద్దరణకు ఏడు దశాబ్దాలుగా పోరాటం సాగుతున్నది.యావత్‌ పాలస్తీనియన్లు దానిలో పాల్గొంటున్నారు.వారిని కూడా ఉగ్రవాదులుగా అమెరికా చిత్రిస్తున్నది. ప్రపంచంలో వేర్వేరు కారణాలతో అనేక చోట్ల ఆందోళనలు సాగుతున్నాయి. ఈ పూర్వరంగంలో ఖలిస్తాన్‌ ఏర్పాటు అన్న భావనను మెజారిటీ సిక్కులు వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత స్థాయిలో సమర్ధించిన వారందరూ ఉగ్రవాదులు కాదు, దానికోసం ఆయుధాలు చేపట్టి, అవాంఛనీయ చర్యలకు పాల్పడిన వారు మాత్రమే తీవ్రవాదులు.

మనదేశంలో నాగాలాండ్‌, మిజోరాం, కాశ్మీరు, పంజాబ్‌ వేర్పాటు వాదం తలెత్తింది. ఆయుధాలు రంగంలోకి వచ్చాయి. వాటన్నింటికీ అమెరికా, కెనడా,బ్రిటన్‌, వంటి పశ్చిమదేశాలు మద్దతు ఇస్తున్నాయి, ఆ శక్తులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఒక్క మనదేశమే కాదు శ్రీలంక వేర్పాటు వాదుల వెనుక, అనేక దేశాల్లో రకరకాల పేర్లతో ఉన్న శక్తులకు మద్దతు ఇస్తున్నదీ ఈ దేశాలే. దాని వెనుక తమను వ్యతిరేకించేదేశాలను అస్తిరపరచటం లేదా విచ్చిన్నం చేసే సామ్రాజ్యవాదులు ఎత్తుగడ ఉంది, దానికి ఉగ్రవాదం ఒక ఆయుధం. కొన్ని సందర్భాలలో ఉగ్రవాద చర్యలు నిలిచిపోయాయంటే దాని అర్ధం తెరవెనుక పశ్చిమదేశాలకు అనుకూలమైన పరిణామాలు జరిగినట్లే లెక్క. తిరిగి ప్రారంభమయ్యాయంటే పూర్తిగా తమకు లొంగలేదని అవి కథనడిపిస్తున్నట్లే. లేకుంటే ఆకస్మికంగా గత పదిరోజులుగా మాత్రమే మన విమానాలకు బాంబుల బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి ? అవి ఐరోపా ఖండ దేశాల నుంచే ఎలా వస్తున్నట్లు . ప్రపంచ ఉగ్రవాదుల అణచివేతకు తాయత్తు కట్టుకొని బరిలోకి దిగామని చెబుతున్న అమెరికా, కెనడా వంటి దేశాలు ఖలిస్తాన్‌ ఉగ్రవాదులకు ఆశ్రయం ఎందుకు కల్పిస్తున్నట్లు, వారికి పౌరసత్వం ఎందుకు ఇస్తున్నాయి. పంజాబీలందరూ ఖలీస్తానీవాదులు కాదు, ఉగ్రవాదులూ కాదు. మనదేశాన్ని లొంగతీసుకోవాలని కోరుకొనే పశ్చిమదేశాలకు మేకపిల్లతోడేలు కథ మాదిరి ఏదో ఒకసాకుతో ఉగ్రశక్తులను రెచ్చగొట్టేందుకు అవకాశాలున్నాయనేది కెనడా ఉదంతం వెల్లడిస్తోంది.


అమెరికాకెనడా రెండు దేశాల్లోనూ పౌరసత్వం ఉన్న మనదేశానికి చెందిన గురుపత్వంత్‌ సింగ్‌ పన్ను అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని హత్య చేసేందుకు చేసిన కుట్రలో మన గూఢచారి వికాస్‌ యాదవ్‌ ఉన్నట్లు అమెరికా కోర్టు ప్రకటించించింది. దాంతో యాదవ్‌ మీద అరెస్టు వారంట్‌ జారీచేసి ఎఫ్‌బిఐ జాబితాలో అత్యంత కీలక వాంఛనీయ వ్యక్తిగా బహిరంగంగా ప్రకటించారు. ఇలా మన పౌరుడి గురించి ప్రకటించటం ఇదే మొదటిసారి. అమెరికా మనకు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్నదని నరేంద్రమోడీ గతంలో అనేకసార్లు గొప్పగా చెప్పారు. తమ అవసరాల రీత్యా డోనాల్డ్‌ ట్రంప్‌ పలు సందర్భాలలో నరేంద్రమోడీని పొగడ్తల వర్షంతో ముంచెతారు. చెట్టపట్టాలు వేసుకు తిరిగాడు, భారత దేశ పిత అంటూ కితాబులిచ్చాడు. జో బైడెన్‌ తక్కువ తిన్నాడా ‘‘ మోడీజీ మీరు నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టారు. నా కంటే మా దేశంలో మీ పలుకుబడి ఎక్కువగా ఉంది. మీతో కలసి భోంచేసేందుకు దేశమంతటి నుంచి ఎందరో ఎదురు చూస్తున్నారు. ఉన్న సీట్లన్నీ అయిపోయాయి. నేనేదో మిమ్మల్ని ఆటపట్టిస్తున్నా అనుకోవద్దు, ఇది నిజం, కావాలంటే నా బృందాన్ని అడగండి, రోజూఎన్నో ఫోన్లు వస్తున్నాయి నాకు.’’ గతేడాది మే నెలలో చైనాకు వ్యతిరేకంగా జరిగిన క్వాడ్‌(చతుష్టయ) సమావేశానికి ముందు మోడీని మునగ చెట్టు ఎక్కిస్తూ జోబైడెన్‌ పలుకులివి. వీటితో అనేక మంది అమెరికా అధినేతలనే మనకాళ్ల వద్దకు తెచ్చిన మొనగాడిగా నరేంద్రమోడీని పొగిడారు. రాముడు సీతను కోరినట్లుగా ఇప్పుడు దర్యాప్తుకు సహకరించి ఎలాంటి నేరం చేయలేదని నిరూపించుకోండి అంటూ నరేంద్రమోడీని అగ్నిపరీక్షకు పూనుకోవాలంటున్నా పశ్చిమదేశాలు.మరో ఖలిస్తానీ ఉగ్రవాది హరదీప్‌ నిజ్జర్‌ను 2023లో కెనడాలో హత్య చేశారు. దానిలో కూడా భారత అధికారుల హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. నిర్దిష్ట చట్టబద్ద ఆధారాలు లేవంటూనే తమ దగ్గర ‘‘ ఐదు కళ్ల ’’ నిఘా సమాచారం ఉందని చెబుతోంది. దాన్ని నిర్వహిస్తున్న దేశాలు కూడా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ గతేడాది కాలంగా వత్తిడి తెస్తున్నాయి. అమెరికా ఎలా కావాలంటే అలా నివేదికలు తయారు చేస్తే మిగిలిన దేశాలన్నీ సంతకాలు చేస్తాయన్నది తెలిసిందే. నిజానికి వాటి వద్ద ఎలాంటి సమాచారమూ లేదని వార్తలు.

ఇటీవలి కాలంలో విదేశాల్లో మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు, మరికొందరు వ్యక్తులు హత్యలకు గురవుతున్నారు. మనకు వ్యతిరేకంగా ఎవడైనా పని చేస్తూ వారికి ఇదే గతి, చూడండి మన తడాఖా, ఎలా లేపేస్తున్నామో అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్న సంగతి, ఆ ఘనతను ఎవరికి ఆపాదిస్తున్నదీ తెలిసిందే.మన సీనియర్‌ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు నెలకు ఇద్దరు ముగ్గురు చొప్పున ఖలిస్తానీ ఉగ్రవాదులను లేపేసేందుకు యాదవ్‌ అనే అతన్ని కేంద్ర కాబినెట్‌ సచివాలయం కింద నేరుగా కిరాయికి పని చేసేందుకు ‘‘రా’’ నియమించిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు యాదవ్‌ ప్రభుత్వానికి పనిచేయటం లేదని విదేశాంగశాఖ ప్రకటించటం ద్వారా నియామకం వాస్తవమే అని అంగీకరించినట్లయింది. ఇప్పుడు వచ్చిన ఆరోపణలపై మన ప్రభుత్వమే విచారణ జరుపుతుందా లేక అమెరికా దర్యాప్తు సంస్థలకు అతన్ని అప్పగిస్తుందా అన్నది తెలియదు. ఏది జరిగినా పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉండేది ఊహించలేము. విదేశాలలో ఉన్న తమ వ్యతిరేకశక్తులను మట్టుపెట్టేందుకు సిఐఏ,మొసాద్‌, ఐఎస్‌ఐల కిందపనిచేసే హంతక దళాలను ఆయా ప్రభుత్వాలు నియమించటం, వాటి దుర్మార్గాల గురించి మనకు తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ మన ప్రభుత్వం వినియోగించిన దాఖలాలు లేవు.ఇదొక ప్రమాదకరమైన క్రీడ.

కెనడాను మనం ఎంతగా కౌగిలించుకున్నా గతంలో ఎన్నడూ అది మిత్రదేశంగా చూడలేదు. దాన్ని కాదని మనల్ని ఎన్నడూ అమెరికా విశ్వాసంలోకి తీసుకోలేదు.ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్‌ ట్రుడేవ్‌ తండ్రి కూడా గతంలో ప్రధానిగా పనిచేశాడు. రెండు దేశాల మధ్య తాజా వివాదానికి 2018లో జరిగిన ఉదంతం నాంది అని చెప్పవచ్చు. కెనడాలో ఏడు లక్షల 70వేల మంది సిక్కులు ఉన్నారు. జనాభాలో వారి 2.1శాతమే అయినప్పటికీ అక్కడి రాజకీయాల్లో ఎంతో పలుకుబడి కలిగిన వారు. 2018లో ప్రధాని ట్రుడేవ్‌ మనదేశానికి రానున్న సందర్భంగా అతగాడి కార్యాలయం మనదేశానికి చెందిన వారితో సహా 423 మంది పేర్లతో ఒక అతిధుల జాబితాను రూపొందించి వారిని ఆహ్వానించాలని ఆదేశించింది. వారిలో జస్పాల్‌ సింగ్‌ అత్వాల్‌ అనే నేరగాడు ఒకడు.1986లో పంజాబ్‌ మంత్రిగా ఉన్న అకాలీ నేత మల్కాయిత్‌ సింగ్‌ సిద్దు మీద కెనడాలో హత్యాయత్నం జరిగింది. శిక్షపడిన వారిలో అత్వాల్‌ ఒకడు.ట్రుడేవ్‌ సతీమణి సోఫీతో ముంబైలో ఫొటోకూడా దిగాడు. దాంతో వివాదం చెలరేగి తదుపరి ఢల్లీి కార్యక్రమానికి ఆహ్వానాన్ని రద్దు చేశారు.2023 జూన్‌ 18 కెనడా నగరం వాంకోవర్‌ శివారు సురే గురుద్వారా దగ్గర హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే కెనడా పౌరుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. మన గూఢచారులే ఆ పని చేసినట్లు అప్పటి నుంచి కెనడా ఆరోపిస్తోంది.తరువాత మనదేశంలో వాణిజ్య చర్చలను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబరు నుంచి మనపౌరులకు వీసాల నిలిపివేత, దౌత్యవేత్తల బహిష్కరణ వంటి పనులు చేస్తున్నది.మనదేశం కూడా ప్రతి చర్యలు తీసుకుంది.తాజాగా అది మరింత ముదిరింది.

తాజా పరిణామాలపై మీడియాలో అనేక భాష్యాలు వెలువడుతున్నాయి. వాటిలో ఒకటేమంటే అమిత్‌ షా,అజిత్‌ దోవల్‌ను కెనడా లక్ష్యం చేసుకున్నదట.దీని అర్ధం నరేంద్రమోడీని, అన్నింటికంటే మించి దేశాన్ని సహిస్తున్నట్లా ? అమెరికా, కెనడా వాటిని అనుసరించే ధనికదేశాలన్నీ మొత్తంగా మన దేశాన్నే లక్ష్యంగా చేసుకున్నాయి.దానిలో భాగంగా పెద్ద గేమ్‌ ఆడుతున్నాయి. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న భారత వ్యతిరేక ఖలిస్తానీ శక్తుల కార్యకలాపాలు తీవ్ర ఆందోళనకరమేగాక దేశ భద్రత మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని సిపిఐ(ఎం) వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంటుందని ప్రకటించింది.ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని లారెన్స్‌ విష్ణోయ్‌ ముఠా పాత్రతో సహా అన్ని అంశాల మీద ప్రభుత్వం వ్యవహరించాలని కోరింది. మనదేశం పశ్చిమదేశాలతో ప్రస్తుతం ముద్దులాటదెబ్బలాటలాడుతున్నదని చెప్పవచ్చు. ఉక్రెయిన్‌ వివాదంలో పశ్చిమదేశాలకు లొంగటం లేదు, చైనా విషయంలో కొన్ని సార్లు అనుకూలంగా మరికొన్ని సార్లు వాటి వాంఛలకు భిన్నంగా వెళుతున్నది. మొత్తంగా చూసినపుడు తమకు తాన తందాన అనటం లేదనే ఉక్రోషం పశ్చిమదేశాల్లో నానాటికీ పెరిగిపోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికైనా కళ్లు తెరిచి గతంలో మాదిరి అలీన విధానాన్ని అనుసరించి దేశస్వతంత్ర వైఖరిని ప్రదర్శించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

లడ్డు రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టికాయలు : లీకు వీరుడు చంద్రబాబు పప్పులో కాలేశారా ?

02 Wednesday Oct 2024

Posted by raomk in AP, AP NEWS, BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, TDP, Ycp

≈ Leave a comment

Tags

BJP, CHANDRABABU, Narendra Modi, Pawan kalyan, Tirupati Laddu Controversy, YS jagan

ఎం కోటేశ్వరరావు


లడ్డు కల్తీ ఉదంతంలో దోషులుగా ఎవరు తేలతారో, ఏ శిక్షలు అనుభవిస్తారో ఆ భగవంతుడికే ఎరుక. గజం మిధ్య పలాయనం మిధ్య అన్నట్లుగా తయారవుతుందా అన్నది ఒక అనుమానం. కానీ తిరుమల శ్రీనివాసుడితో నిమిత్తం లేకుండా సుప్రీం కోర్టులో దాఖలైన పలు కేసులు, ఈ వివాదం నుంచి చంద్రబాబు ఎలా బయటపడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. కల్తీ గురించి దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వ వేసిన సిట్‌ సరిపోతుందా లేక మరొక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అవసరమో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలంటూ అక్టోబరు మూడవ తేదికి కోర్టు వాయిదా వేసింది. కేంద్రం ఏమి చెబుతుందో కోర్టు ఏమి నిర్ణయిస్తుందో తెలియదు. అయితే అప్పటి వరకు సిట్‌ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ డిజిపి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. నిజానికి సిట్‌ దర్యాప్తు నిలిపివేయాలని కోర్టు ఎలాంటి ఆదేశాలూ జారీ చేయకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే నష్టనివారణ చర్యగా కనిపిస్తున్నది. లడ్డూలలో వాడే నేతిలో కల్తీ ఉందంటూనే దానికి షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా ఇచ్చిన నివేదికలో ఎన్‌డిడిబి లాబ్‌ తన జాగ్రత్తలు తాను తీసుకుంది. దాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా మార్చి జగన్మోహన్‌ రెడ్డిని మరింతగా దెబ్బతీయవచ్చని ఎవరైనా సలహా ఇచ్చారో లేక తనంతట తానే నిర్ణయం తీసుకున్నారో తెలియదుగానీ లాబ్‌ నివేదికను బహిర్గతం చేసి చంద్రబాబు ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. దాని గురించి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వెల్లడిరచిన అభిప్రాయాలు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని ఇరకాటంలోకి నెట్టాయి. లడ్డూలో కల్తీకి పరిహారంగా లడ్డు పోటు, ఇతర ప్రాంతాలను ఆలయం శుద్ది చేసింది. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఏకంగా తానేమీ తక్కువ కాదన్నట్లు పదకొండు రోజుల దీక్ష పేరుతో చేసిన హడావుడి చూశాము. కల్తీ గురించి సిట్‌ వేసినపుడు దాని నివేదిక రాకుండా ముందుగానే ఉన్నట్లు కల్తీ గురించి సిఎం ఎలా ప్రకటిస్తారు ? అంటే మీకే స్పష్టత లేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కోట్లాది మంది మనోభావాల మీద ప్రభావం చూపే అంశాలను నిర్ధారించుకోకుండా ఉన్నత పదవుల్లో ఉన్నవారు మాట్లాడటం సరికాదని, దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని కూడా వ్యాఖ్యానించింది. అనేక కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు తీర్పుల్లో కనిపించవు. ఈ కేసులో ఏం జరుగుతుందో తెలియదు.


నెయ్యి కల్తీ నివేదిక గురించి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తరువాత ప్రతికూల స్పందనలు రావటంతో కొంత మంది కొత్త వాదనలు ముందుకు తెస్తున్నారు. అసలు చంద్రబాబు నివేదికను బయటపెట్టాలనుకోలేదని, వందరోజుల పాలన సందర్భంగా ఎంఎల్‌ఏతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఎన్‌డిడిబి నివేదికను యథాలాపంగా ప్రస్తావించారని చెబుతున్నారు. దాన్ని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి సవాలు చేయటంతో అనివార్యంగా తెలుగుదేశం పార్టీ సదరు నివేదికను విడుదల చేయాల్సి వచ్చిందని సమర్ధించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి లీకు వీరుడు అనే మారు పేరు ఉంది. అనేక అంశాలను కావాలనే వేరే మార్గంలో బయటపెట్టించి స్పందనను బట్టి దాన్ని వాడుకోవటం అలవాటు. గతంలో ప్రపంచ బ్యాంకు పధకాలను అమలు చేసే క్రమంలో వాటికి జనం మద్దతు కూడగట్టటం కోసం ఏ శాఖలో ఎంత అవినీతి ఉందో అనే సర్వేలు చేయించి వాటిని మీడియాకు అందచేసిన తీరు జనం మరచిపోయినా అది వాస్తవం. ఇప్పుడు లడ్డూ కల్తీలో ఆ కోణాన్ని తోసిపుచ్చలేము. ఇప్పుడు ఒకవేళ సుప్రీం కోర్టు స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించితే దాని మీద స్పందన ఎలా ఉంటుందో తెలియదు. అలాగాక ఇప్పుడు వేసిన సిట్‌ను కొనసాగిస్తే ముందే కల్తీ గురించి సిఎం చెప్పిన తరువాత దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వటం తప్ప వేరే ఏముంటుందని జనం భావిస్తారు. ఒకవేళ సిబిఐ విచారణ జరిపితే మూడు పార్టీల కూటమికి అనుకూలంగా దాని నివేదిక ఉంటుందని కూడా అదే జనం భావిస్తారు. విశ్వసనీయత సమస్య తలెత్తుతుంది.


దేశ రాజకీయాల మీద చంద్రబాబు చూపిన ప్రభావం గురించి గతంలో ఎన్నో చెప్పుకున్నాం, ఇప్పుడు పలు దేవాలయాల్లో ప్రసాదాల మీద కూడా ‘‘ ప్రభావం ’’ చూపారని వార్తలు. అదేమిటంటే భక్తులు ప్రసాదాల పట్ల ముఖ్యంగా లడ్డుపట్ల అనుమానంగా చూస్తున్నారట. మీడియాలో వచ్చిన వివరాలను బట్టి బయటి సంస్థలు సరఫరా చేసే ప్రసాదాల మీద పూర్తి నిషేధం విధించాలని అయోధ్యలోని రామజన్మ భూమి దేవాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్‌ డిమాండ్‌ చేశారు. తయారీ, పంపిణీలో మార్పులు తేవాలని, ఆలయ పూజారుల పర్యవేక్షణలో తయారు చేయాలని కోరారు. దేవాలయాల్లో వినియోగిస్తున్న నెయ్యి స్వచ్చత పట్ల ఆందోళన వెల్లడిరచారు. నైవేద్యాలలో కల్తీ ద్వారా దేవాలయాలను అపవిత్రం చేయాలన్న అంతర్జాతీయ కుట్ర ఉందని ఆరోపించారు.వాణిజ్య పద్దతిలో తయారు చేసే తీపి పదార్ధాల బదులు పండ్లు, పూల వంటి సహజ వస్తువులతో ప్రసాదాలను తయారు చేయాలని మధుర లోని ధర్మ రక్ష సంఫ్‌ు ప్రకటించింది. సంస్థ జాతీయ అధ్యక్షుడు సౌరవ్‌ గౌర్‌ మాట్లాడుతూ ప్రసాదాల తయారీలో మార్పులు తేవాలని, తిరిగి సాంప్రదాయ పద్దతులకు మరలాలని సంస్థలు, మత నేతలలో ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. సంగం నగరంగా పిలుస్తున్న ప్రయాగ్‌ రాజ్‌ (గతంలో అలహాబాదు) అలోప్‌ శంకరిదేవి, బడే హనుమాన్‌, మంకమేశ్వర వంటి వాటితో సహా అనేక దేవాలయాల్లో భక్తులు తెచ్చే స్వీట్లు తదితర పదార్ధాలను అర్పణలకు అనుమతించకుండా నిషేధించారు. లలితా దేవి ఆలయ ప్రధాన పూజారి శివమూర్తి మిశ్రా మాట్లాడుతూ భక్తులు కేవలం కొబ్బరి కాయలు, పండ్లు, ఎండిన పండ్లు మాత్రమే తేవాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వెల్లడిరచారు.స్వీట్ల స్వచ్చత నిరూపితమయ్యే వరకు వాటిని దేవాలయాల్లో అనుమతించకూడదని లక్నోలోని మంకమేశ్వర దేవాలయ మహంత్‌ శ్రీధరానంద బ్రహ్మచారి జీ మహరాజ్‌ చెప్పారు. వెలుపలి నుంచి భక్తుల ప్రసాదాలు, సీట్లను అనుమతించేది లేదని అలోప్‌ శంకరీదేవి దేవాలయ ప్రధాన పూజారి, శ్రీ పంచాయతీ అఖారా మహానిర్వాణి కార్యదర్శి యమునా పూరీ మహరాజ్‌ ప్రకటించారు. సంగం తీరంలోని బడే హనుమాన్‌ మహంత్‌ బల్బీర్‌ జి మహరాజ్‌ మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణ నిర్మాణం పూర్తయిన తరువాత లడ్డుపేడ ప్రసాదాలను యాజమాన్యమే తయారు చేయనుందన్నారు.పక్కా హిందూత్వవాది యోగి పాలనలోనే పరిస్థితి ఇలా ఉంది.మధ్య ప్రదేశ్‌లోని సేహోర్‌లోని ప్రముఖ వింధ్యవాసినీ బీజాసన్‌ దేవీ దేవాలయ ప్రాంగణంలో స్వయం సహాయక బృందం విక్రయిస్తున్న లడ్డుల విక్రయాన్ని నిలిపివేయాలని ట్రస్టు సభ్యులు జిల్లా కలెక్టకర్‌కు సమర్పించిన వినతి పత్రంలో కోరారు. లడ్లు వాసన వస్తున్నాయని, రుచిలో తేడా ఉందని భక్తులు చెబుతున్నారని ట్రస్ట్‌ చైర్మన్‌ మహేష్‌ ఉపాధ్యాయ చెప్పారు. ఈ దేవాలయం భోపాల్‌కు 70కిలో మీటర్ల దూరంలో ఉంది.అయితే తాను సదరు స్వయం సహాయక బృందంతో మాట్లాడానని సమస్య పరిష్కారమైందని కలెక్టర్‌ చెప్పారు.

మన దేశంలో ప్రసాదాల గురించి భక్తులు అనుమానించటం కొత్తేమీ కాదు. వాటిని సరఫరా చేసే వారు లేదా తయారీకి ఉపయోగించే సరకులు కల్తీ లేదా నాసిరకంగా ఉంటున్నాయని గతంలో అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. నెయ్యి కల్తీ గురించి నాటి కలకత్తాలో వచ్చిన ఆరోపణల గురించి స్పెక్టేటర్‌ అనే పత్రిక 1886 సెప్టెంబరు 25వ తేదీ సంచికలో రాసింది. ఒక చట్టాన్ని చేయాలని భక్తులు కోరినట్లు దానిలో పేర్కొన్నది. నెయ్యిలో పంది, ఆవు కొవ్వు, ఇతర జంతువుల మాంసాలలో ఉన్న కొవ్వు కల్తీ జరుగుతున్నట్లు విశ్లేషణలో పేర్కొన్నది. తరువాత కలకత్తాలో నెయ్యి వ్యాపారం చేసే మార్వాడీలు నెయ్యిలో కల్తీ చేస్తున్న కారణంగా ఒక నాటికి బెంగాలీ జాతే అంతరించి పోతుందంటూ 1917లో ఒక పత్రికలో వచ్చిన వార్త ఆందోళనకు దారితీసింది.దాంతో మార్వాడీ అసోసియేషన్‌ నెయ్యి గోడవున్ల వద్దకు వెళ్లి 67నమూనాలను సేకరించి పరీక్షకు పంపగా కేవలం ఏడు మాత్రమే స్వచ్చంగా ఉన్నట్లు తేలింది. దాంతో వేలాది మంది కలకత్తా బ్రాహ్మలు హుగ్లీ నది(బెంగాల్లో గంగానది పేరు) తీరాన హోమాలు చేసి కల్తీ నెయ్యి ఆరగించినందుకు ప్రాయచిత్తం, శరీరాలను శుద్ది చేసుకున్నారు. దాంతో మార్వాడీ అసోసియేషన్‌ కల్తీ చేసిన వారిని గుర్తించి వారి వద్దనుంచి జరిమానాల రూపంలో రు.75వేలు వసూలు చేసి ఉత్తర ప్రదేశ్‌లోని బృందావనంలో గడ్డి భూములను కొనుగోలు చేసినట్లు ప్రకటించటంతో బ్రాహ్మలు శాంతించారట. అందువలన దేశంలో నెయ్యి కల్తీ వివాదం తిరుపతితోనే ప్రారంభమైందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే వ్యాపారంలాభం ఉంటుందో అక్కడ అవినీతి కూడా తోడుగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. వ్యాపారం చేస్తూ కల్తీ చేసేవారు, వినియోగించేవారు కూడా హిందువులే, ఎక్కడన్నా ఇతర మతాలకు చెందిన వారు కూడా ఉంటే ఉండవచ్చు. నెయ్యి అంటే ఒక్క ఆవు, గేదె(బర్రె) పాలనుంచే కాదు, గొర్రెలు, మేకలు, ఒంటె పాల నుంచి కూడా తయారు చేస్తారు. శాస్త్రీయ పరీక్షలు అందుబాటులో లేని కాలంలో నెయ్యిని చేతిలో వేసుకొని నలపటం, వాసన చూడటం ద్వారా కల్తీ జరిగిందీ లేనిదీ చెప్పేవారటు. శాస్త్రీయ పరీక్షలు వచ్చిన తరువాత కూడా అనుసరించే పద్దతులను బట్టి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుమల తాజా వివాదంలో ఎన్‌డిడిబి అనుసరించిన పద్దతి గురించి నివేదికలో పేర్కొన్నది, దానితో పాటు ఫలితాల గురించి షరతులు వర్తిస్తాయంటూ కొన్ని సార్లు నివేదికలు తప్పుగా రావచ్చని కూడా చెప్పింది. అందుకే మరొక ప్రయోగశాలలో కూడా పరీక్ష చేయించకుండా చంద్రబాబు నాయుడు తొందరపడి నిర్దారణకు వచ్చి బహిర్గత పరిచారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.ఆ చర్య కోట్లాది మంది భక్తుల మనోభావాల మీద ప్రభావం చూపింది. ఎక్కడ ఎన్ని పరీక్షలు జరిపినా నెయ్యి స్వచ్చత గురించి ఏ లాబ్‌లోనూ ఫలితాలు ఒకే విధంగా ఉండవు అని కూడా చెబుతున్నారు. ఆవులు, గేదెలకు పెట్టే మేతను బట్టి కూడా ఫలితాలు భిన్నంగా ఉంటాయి.


బిజెపి బీఫ్‌ రాజకీయం గురించి తెలిసిందే.2014ఎన్నికల్లో దాని ప్రచార అస్త్రాల్లో అదొకటి.ఆవు, ఎద్దు,దున్నపోతులు, గేదెల మాంసాన్ని బీఫ్‌ అంటారు. దీని ఎగుమతులకు వ్యతిరేకంగా నాటి యుపిఏ ప్రభుత్వం మీద నరేంద్రమోడీ ఉత్తరాదిన ఎన్నికల్లో ప్రచారం చేశారు. చిత్రం ఏమిటంటే అధికారానికి వచ్చిన తరువాత వాటి ఎగుమతులకు అనుమతి ఇచ్చారు. ఏటేటా పెరుగుతున్నట్లు ఎగుమతి గణాంకాలు చెబుతున్నాయి. 2023 వివరాల ప్రకారం బ్రెజిల్‌ తరువాత రెండవ స్థానంలో ఉన్న అమెరికాను పక్కకు నెట్టి మనదేశం ఎగబాకింది.బ్రెజిల్‌ అన్నిరకాల బీఫ్‌ను 30.12 లక్షల టన్నులు, దున్న, గేదె మాంసాన్ని భారత్‌ 14.75లక్షల టన్నులు ఎగుమతి చేసింది. తమ కారణంగా చీమలకు సైతం హాని కలగకూడదంటూ జైన మునులు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తారు. కానీ అనేక మంది ఆ మతానికి చెందిన వారు బీఫ్‌ ఎగుమతిదార్లుగా ఉన్నారు.ఒక సందర్భంలో స్వయంగా నరేంద్రమోడీయే ఆ విషయాన్ని చెప్పారు. మాంస ఎగుమతి ఒక సామాజిక తరగతికి మాత్రమే పరిమితమని చెప్పటం వాస్తవం కాదు, జైన్‌ సామాజిక తరగతికి చెందిన అనేక మంది నా స్నేహితులు ఆ వ్యాపారంలో ఉన్నారు, ఏదో ఒక సామాజిక తరగతికి ముడిపెట్టే ప్రయత్నం చేయవద్దంటూ మాట్లాడారు. మన పురాణాలు, నమ్మకాల ప్రకారం ప్రతి జంతువు ఏదో ఒక దేవుడితో ముడిపడి ఉంది.గోవధను కొందరు వ్యతిరేకిస్తారు. గోమూత్రం తాగటం పవిత్రంగా భావిస్తారు. దున్నపోతు యుముడి వాహనం, అయినా వాటిని వధించి ఎగుమతులు చేస్తారు. ఎలుక వినాయకుడి వాహనం అంటారు, కానీ అది కనిపిస్తే చంపేయాలని చూస్తారు.(ఇలా చెబుతున్నానంటే నష్టదాయకమైన ఎలుకలను చంపకుండా వదలివేయమని నా ఉద్దేశ్యం కాదు) మొత్తం మీద నెయ్యి కల్తీ గురించి వచ్చే నివేదికలు ఏ ఒక్కటీ ఒకే విధంగా ఉండదని మాత్రం కొందరు నిపుణులు చెబుతున్నారు. అందువలన ముందే చెప్పుకున్నట్లు తిరుపతి లడ్డు కల్తీ వివాదం ఎలా ముగుస్తుందో తెలియదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాకు తలుపులు మూయలేదు, నరేంద్రమోడీకి ‘‘ అమెరికా మనిషి జయశంకర్‌ సమస్య ’’ గా మారారా?

13 Friday Sep 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, USA

≈ Leave a comment

Tags

anti china, BJP, China, China problem, India’s RCEP dilemma, Jaishankar problem’, Narendra Modi, Narendra Modi Failures, Pro USA, RSS, S Jaishankar


ఎం కోటేశ్వరరావు


‘‘ చైనాతో వాణిజ్యానికి వ్యతిరేకం కాదు, ఏ రంగంలో లావాదేవీలు ఎలా అన్నదే సమస్య అన్న జయశంకర్‌ ’’ ఈటివి భారత్‌ ప్రసారం చేసిన ఒక వార్త శీర్షిక ఇది. ఇంకా మరికొన్ని పత్రికలు కూడా ఇదే వార్తను ఇచ్చాయి. 2024 సెప్టెంబరు పదిన అక్కడి విదేశాంగ మంత్రితో కలసి జర్మనీ నగరమైన బెర్లిన్‌లో ఒక చర్చలో పాల్గొన్న జయశంకర్‌ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘ చైనాతో వాణిజ్యానికి తలుపులు మూయలేదు. ప్రపంచంలో అది రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. అది ఒక ప్రముఖ ఉత్పత్తిదారు. చైనాతో వాణిజ్యం చేయబోమని చెప్పగలిగేవారెవరూ లేరు. ఏఏ రంగాలలో వాణిజ్యం చేయాలి, ఏ షరతులతో చేయాలన్నదే సమస్య అని నేను అనుకుంటున్నాను. ఇది ఎంతో సంక్లిష్టమైనది, నలుపా తెలుపా అన్నంత సులభంగా సమాధానం చెప్పలేము ’’ అన్నారు. జయశంకర్‌ చెప్పిన ‘‘ సమస్య ’’ ఒక్క చైనాతోనే అనే ముంది, ప్రతిదేశంతోనూ ఉండేది కాదా ? చైనాతో ఆచితూచి, మిగతా దేశాలతో ఎలాబడితే అలా చేస్తారా ? 2020లో జరిగిన గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత మనదేశం చైనా పేరు పెట్టకపోయినా దానికి వర్తించే అనేక ఆంక్షలను పెట్టిన సంగతి తెలిసిందే. భద్రత, సమాచార రక్షణ పేరుతో అంతకు ముందు స్వేచ్చగా అనుమతించిన టిక్‌టాక్‌ వంటి యాప్‌లను కూడా నిషేధించింది. ఆగస్టు నెలలో ఒక సందర్భంలో జయశంకర్‌ మాట్లాడుతూ చైనాతో ప్రత్యేక సమస్యలు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఏం జరుగుతోంది ? మన విధానాలను ప్రభావితం చేస్తున్నది ఎవరు ? ప్రధాని నరేంద్రమోడీకి విదేశాంగ మంత్రి జయశంకర్‌ సమస్యగా మారారా ? ఆయన వెనుక ఎవరున్నారు ? జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఇలా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.


ఇటీవలి కాలంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌తో సహా అనేక మంది చైనా పెట్టుబడులకు అనుకూలంగా సంకేతాలివ్వటమేగాక మాట్లాడుతున్నారు.జూలై నెలలో విడుదల చేసిన మనదేశ వార్షిక ఆర్థిక సర్వేలో చైనా సరఫరా గొలుసుతో అనుసంధానం చేసుకోవటం,మరింతగా చెనా పెట్టుబడులను మనదేశంలోకి అనుమతించటం గురించి పేర్కొన్నారు. సూర్యరశ్మి పలకలు, విద్యుత్‌ వాహనాల బ్యాటరీలు, ఇంకా మన దగ్గర తయారీకి నైపుణ్యం లేని, రక్షణ సమస్యలు లేని ఉత్పత్తుల వంటి రంగాలలో చైనా పెట్టుబడుల అనుమతికి, చైనీయులకు నిలిపివేసిన వీసాల జారీ నిబంధనలను భారత్‌ సడలించవచ్చని జూలై నెలలోనే రాయిటర్స్‌ వార్తా సంస్థ నివేదించింది.జై శంకర్‌ జర్మనీ పర్యటనలో ఉండగానే చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో ‘‘ భారత దౌత్యానికి ఎస్‌ జైశంకర్‌ సమస్య ’’ అనే శీర్షికతో ఒక విశ్లేషణ వెలువడిరది. దాన్ని వెబ్‌సైట్‌ నుంచి వెంటనే తొలగించారని కూడా వార్తలు వచ్చాయి.అయితే అది నెటిజన్లకు అందుబాటులో ఉంది. దానిలో పేర్కొన్న అంశాల సారం ఏమిటి ?


ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు, సంప్రదింపులు సంబంధాలు మెరుగుపడటానికి అనువైన వాతావరణాన్ని సృష్టించిన నేపధ్యంలో ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక నిర్వహించిన ప్రపంచ వేదిక సమావేశంలో జై శంకర్‌ చేసిన వ్యాఖ్యలను చైనా విశ్లేషకుడు తప్పు పట్టటమే కాదు, రెండుదేశాల సంబంధాలు మెరుగుపడటం ఇష్టం ఉన్నట్లు లేదని విమర్శించాడు. ‘‘ మామూలుగానే చైనా సమస్య ఉంది.చైనా గురించి చర్చిస్తున్నది ప్రపంచంలో భారత్‌ ఒక్కటే కాదు. భారత్‌కు చైనా సమస్య ఉంది… ప్రపంచానికి ఉన్న సాధారణ చైనా సమస్య కంటే భారత్‌కు ప్రత్యేక సమస్య ఉంది’’ అన్న జై శంకర్‌ వ్యాఖ్యను ఉటంకించాడు. అంతే కాదు కేంద్రంలో నేటి పరిస్థితి గురించి మనదేశ విశ్లేషకుడు ప్రవీణ్‌ సాహ్నే చేసిన వ్యాఖ్యలను కూడా పేర్కొన్నాడు. అవేమిటంటే ‘‘ మోడీ సర్కార్‌లో ఒక బలమైన వర్గం చైనాతో సంబంధాలను సాధారణ స్థాయికి తేవాలని అభిప్రాయపడుతున్నది. జై శంకర్‌ నాయకత్వంలోని మరొక శక్తివంతమైన వర్గం చైనాతో సాధారణ సంబంధాలు నెలకొల్పుకుంటే అమెరికాతో ఉన్న భారత సంబంధాలు సంకటంలో పడతాయి కనుక జరగకూడదని చెబుతున్నది. లబ్ది పొందాలని చూస్తున్న కారణంగా నరేంద్రమోడీ ఎటూ తేల్చుకోలేదు ’’ అని పేర్కొన్నారు. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పకపోయినా జై శంకర్‌ అమెరికన్‌ లాబీయిస్టుగా ఉన్నారని చైనా చెబుతోంది. భారత్‌చైనా సంబంధాలు మెరుగుపడటం, బలపడటం గురించి జై శంకర్‌ భయపడుతున్నారని కూడా గ్లోబల్‌టైమ్స్‌ విశ్లేషణలో ఉంది.ఒక వర్గం తమతో సంబంధాల గురించి అనుకూలంగా ఉన్నపుడు ఇలాంటి వ్యాఖ్యలు అవసరం లేదన్న పునరాలోచనతో దాన్ని వెబ్‌సైట్‌ నుంచి తొలగించి ఉండవచ్చు. చైనా యాప్‌లు, దాని కంపెనీల టెలికాం పరికరాలతో సమాచారాన్నంతా సంగ్రహిస్తుందని, దేశ భద్రతలకు ప్రమాదమని కదా చెబుతోంది. మా పరికరాల ద్వారా అలాంటి ముప్పు ఉందనుకుంటే మరి అమెరికా పరికరాలతో భద్రత ఉంటుందనే హామీ ఇస్తారా అని చైనా అడుగుతోంది. ప్రిజమ్‌ పేరుతో అమెరికా వివిధ మార్గాలలో ఇతర దేశాల సమాచారం మొత్తాన్ని సేకరిస్తోందని దాని రహస్య మెయిళ్లు, ఫైళ్లను బయటపెట్టిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఉదంతం గురించి అది పేర్కొన్నది. మరొక దేశ పరికరాల ద్వారా గూఢచర్యం జరుగుతోందని ప్రతిదాన్నీ అనుమానిస్తే మన పరికరాలు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లను మనం అమ్ముకోగలమా? కొనేవాళ్లు గుడ్డిగా ఉంటారా ?

చైనాతో సత్సంబంధాలు , రష్యాతో మైత్రి అమెరికన్లకు మింగుడుపడదన్నది బహిరంగ రహస్యం. అందుకే వాటితో పాటు అమెరికాతో కూడా అదే మాదిరి ఉంటున్నాం కదా అని మెప్పించేందుకు మోడీ ఇటీవల ఉక్రెయిన్‌ పర్యటన జరిపినట్లు అనేక మంది భావిస్తున్నారు. నరేంద్రమోడీయే స్వయంగా చైనా సంబంధాల గురించి సానుకూలంగా లేకపోతే ఒక బలమైన వర్గం అనుకూలంగా తయారయ్యే అవకాశమే ఉండదని జై శంకర్‌కూ తెలుసు. మోడీకి చైనా మీద ప్రత్యేక ప్రేమ ఉండి అనుకూలంగా ఉంటున్నారని దీని అర్ధం కాదు, కార్పొరేట్ల ప్రయోజనం, వత్తిడే కారణం. ఇక జై శంకర్‌ వివరాలను చూసినపుడు నరేంద్రమోడీ పాలనలో 2015 నుంచి 18వరకు విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత టాటా కంపెనీ విదేశీ వ్యవహారాలను చూసే కీలక బాధ్యతల్లో పని చేశారు. ఆ సమయంలో టాటా కంపెనీల అవసరాల కోసం చైనాతో సంబంధాల మెరుగుదలకు తీవ్రంగా కృషి చేశారని అలాంటి వ్యక్తి ఇప్పుడు చైనా వ్యతిరేకత కలిగి ఉన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.(అదే టాటా కంపెనీ తన విద్యుత్‌ కార్లకు అవసరమైన బ్యాటరీలను చైనా నుంచి కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ) ఒక బలమైన వర్గం చైనా పెట్టుబడులు, వాణిజ్యాన్ని కోరుకుంటున్న కారణంగానే బెర్లిన్‌లో జై శంకర్‌ చైనాతో సంబంధాలు ఉండవని మేమెప్పుడు చెప్పాం, అసలుదానితో సంబంధాలు లేనివారు ఉంటారా అంటూ మాట్లాడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే తెగేదాకా లాగదలుచుకోలేదు. అందుకే భారత దౌత్య అసలు సమస్యను జై శంకర్‌ సమస్యగా చైనా పరిగణిస్తోంది.

మన కార్పొరేట్ల ప్రయోజనాలను దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ ఇటీవల గట్టిగా ప్రతిబింబిస్తున్నారు. చైనా సరఫరా(గొలుసు) వ్యవస్థతో అనుసంధానించుకోవటం తప్పనిసరని చెప్పినట్లు 2024సెప్టెంబరు 11వ తేదీన రాయిటర్స్‌ వార్త పేర్కొన్నది. మనం పూర్తిగా దిగుమతులు చేసుకోవాలా లేక చైనా పెట్టుబడులతో ఇక్కడే తయారు చేయాలా అన్నది భారత్‌ నిర్ణయించుకోవాలని నాగేశ్వరన్‌ చెప్పారు.అమెరికా, ఐరోపాలు చైనా నుంచి సేకరణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నందున మనం చైనా నుంచి దిగుమతులు చేసుకోవటం, వాటికి కొంత విలువను జోడిరచి తిరిగి ఎగుమతి చేయటం కంటే చైనా కంపెనీల పెట్టుబడులతో మనదేశంలో వస్తువులను ఉత్పత్తి చేసి ఆ మార్కెట్లకు ఎగుమతి చేయటం మరింత ప్రభావం చూపుతుంది అని జూలై నెలలో విడుదల చేసిన దేశ వార్షిక ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు. దాని రూపకల్పన నాగేశ్వర్‌ మార్గదర్శకత్వంలోనే జరిగిందని వేరే చెప్పనవసరం లేదు. మోడీ సర్కార్‌ గతంలో విధించిన ఆంక్షలను సడలించటమే కాదు స్థానిక ఉత్పత్తులను పెంపొందించటానికి సబ్సిడీలు కూడా ఇచ్చేందుకు రూపకల్పన చేసిందని రాయిటర్స్‌ పేర్కొన్నది.‘‘ చైనా సరఫరా గొలుసులలో భాగస్వామి కాకుండా ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన ఉత్పత్తులైన సోలార్‌ సెల్స్‌, విద్యుత్‌ వాహనాల రంగంలో ఏమీ చేయలేమని ’’ అమెరికా ఏలే విశ్వవిద్యాలయ లెక్షరర్‌ సుశాంత సింగ్‌ చెప్పారు. చైనా వస్తువుల మీద దిగుమతి పన్నులు విధించాలని చెబుతున్న మనదేశంలోని ఉక్కు పరిశ్రమ దిగ్గజం నవీన్‌ జిందాల్‌ కూడా చైనాతో ఆచరణాత్మక వైఖరిని అవలంభించాలని చెప్పారు.‘‘ అనేక ఉక్కు కంపెనీలు చైనా నుంచి పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి, చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు ఉత్పత్తిదారు కొన్నింటిలో అది ఎంతో ముందుంది, అన్నింటిలో కాదు ’’ అని జిందాల్‌ అన్నారు.చైనా పెట్టుబడులపై నాలుగు సంవత్సరాల ఆంక్షల తరువాత ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు సన్నిహితం కావటానికి చూస్తున్నారు, తన మేక్‌ ఇండియా లక్ష్యాలకు కొత్త జీవితాన్ని ఇవ్వటానికి చూస్తున్నారని కూడా రాయిటర్స్‌ పేర్కొన్నది. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా నుంచి మన దిగుమతులు 56శాతం పెరిగాయి.వాణిజ్యలోటు రెట్టింపైంది.

చైనా పెట్టుబడుల గురించే కాదు, ఇతర అంశాలలో కూడా పునరాలోచన చేయాలని మన కార్పొరేట్‌ శక్తులు నరేంద్రమోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తున్నాయి.‘‘ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి) పేరుతో పని చేస్తున్న ఆర్థిక కూటమిలో చేరితే మన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు హాని జరుగుతుందనే విమర్శలు, వ్యతిరేకత వెల్లడి కావటంతో మన దేశం దానికి 2019లో దూరంగా ఉంది. అయితే భారత్‌కు తలుపులు తెరిచే ఉంచామని ఆర్‌సిఇపి ప్రకటించింది. మనకు ఇప్పటికీ ముప్పు పొంచి ఉన్నప్పటికీ దానిలో చేరటం గురించి సానుకూలంగా ఆలోచించాలనే వత్తిడి క్రమంగా పెరుగుతోంది.దానికి దూరంగా ఉండటం కంటే చేరి మరింత వాణిజ్యం చేయవచ్చని చెబుతున్నారు. గత పది సంవత్సరాల్లో భారత్‌ వృద్ధి ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ప్రపంచ వాణిజ్యంలో దాని వాటా తక్కువగా ఉందని,వేగాధిక్యత తగ్గుతోందని ఇటీవల ప్రపంచబ్యాంకు చెప్పింది. 2030 నాటికి భారత్‌ లక్ష కోట్ల డాలర్ల మేర ఎగుమతి చేయాలన్న లక్ష్యాన్ని చేరాలంటే ఇప్పుడున్న విధానాలను మార్చుకోవాలని చెప్పింది. మనదేశం ఆర్‌సిఇపిలో ఉంటే చైనాకు పోటీగా ఉంటుందని అనేక దేశాలు భావించాయి. మన దేశ ప్రయోజనాల కంటే చైనాతో దగ్గర అవుతున్నామన్న భావన అమెరికాకు కలిగితే నష్టమని మోడీ సర్కార్‌ ఎక్కువగా భయపడిరది. దీన్లో భాగస్వామిగా మారేందుకు అమెరికా తిరస్కరించింది.చైనాకు పోటీగా అమెరికా నాయకత్వంలోని కూటమి ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకోనుందని మోడీ నాయకత్వం ఆశపడిరది. అయితే అది ఎండమావిగానే మిగిలిపోవటంతో పునరాలోచనలో పడిరది. మరోవైపున మన ఉత్పత్తిదారులు చైనా పోటీని ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఈ కూటమిలోని 15కు గాను 13 దేశాలతో మనకు స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలగటం లేదు.200709 నుంచి 2020`22 మధ్య కాలంలో ఈ దేశాలతో మన వాణిజ్యలోటు 303శాతం పెరిగింది, మనదేశం దీనిలో చేరితే దిగుమతి పన్నులు సున్నా అవుతాయి, అప్పుడు దిగుమతులు మరింతగా పెరుగుతాయి. అయినప్పటికీ కూటమి బయట ఉండటం కంటే లోపలే ఉండటం మేలని మన కార్పొరేట్‌లు భావిస్తున్నాయి.


అయితే ఆర్‌సిఇపిలో చేరితే కలిగే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయనే వాదనలు గతంలోనే ముందుకు వచ్చాయి. వస్తూత్పత్తిదారులు పోటీని తట్టుకోలేమని వ్యతిరేకిస్తుండగా దిగుమతి వ్యాపారులు లబ్ది పొందవచ్చనే ఆశతో అనుకూలంగా ఉన్నారు.పదేండ్లుగా మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా అంటూ లక్షల కోట్ల మేర సబ్సిడీలు ఇచ్చినా ఉత్పాదకత, ఎగుమతులు పెరగలేదని రెండవ వర్గం చేస్తున్నవాదనకు బలం చేకూరుతోంది. సేవల ఎగుమతికి అవకాశాలు పెరుగుతాయని దాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు. మనకంటే ఉత్పాదకశక్తి ఎక్కువగా ఉన్న జపాన్‌, దక్షిణ కొరియా, కొన్ని ఆసియన్‌ దేశాలు ఆర్‌సిఇపిలో చేరిన తరువాత తమదేశ వాణిజ్యలోటు పెరిగిందని గగ్గోలు పెడుతున్నాయి. అలాంటిది మన దేశం చేరితే చైనా,మరికొన్ని దేశాల ఉత్పత్తులను ఇబ్బడి ముబ్బడిగా కుమ్మరిస్తాయనే ఆందోళన కూడా ఉంది.ఇప్పటికే చైనాతో వాణిజ్య లోటు భారీగా ఉందని అది మరింతగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.మోడీ సర్కార్‌ ఏం చేస్తుందో, పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లాదేశ్‌లో హసీనా పతనానికి ముందు ఏం జరిగింది : అమెరికా మానసపుత్రుడు మహమ్మద్‌ యూనిస్‌ !

09 Friday Aug 2024

Posted by raomk in Asia, Communalism, Current Affairs, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, RELIGION, USA

≈ Leave a comment

Tags

cia, coup against Sheikh Hasina, Hillary Clinton, Muhammad Yunus, Narendra Modi, Sheikh Hasina, Sheikh Hasina's ouster



ఎం కోటేశ్వరరావు


బంగ్లాదేశ్‌లో జరిగిన అనూహ్య పరిణామాల పూర్వరంగలో మైక్రో ఫైనాన్స్‌ ద్వారా ప్రపంచ వ్యాపితంగా గుర్తింపు పొందిన నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనిస్‌(84)ను అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ప్రభుత్వ సారధిగా నియమించింది. గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రమాణ స్వీకారం చేశాడు.ఎంతకాలం ఈ ఏర్పాటు అమల్లో ఉంటుంది ? ఎప్పుడు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిస్తారు ? ఎన్నికల నిర్వహణకు ”తగిన పరిస్థితులు” లేవని తాత్కాలిక ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. మరోవైపున మనదేశంలో ఆశ్రయం పొందిన మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఇక్కడే ఉండేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరిస్తుందా ? లేకపోతే ఆమె ఎక్కడకు వెళతారు ? ఇలాంటి అంశాల మీద కూడా ఇది రాసిన సమయానికి స్పష్టత లేదు. ఎవరీ యూనస్‌ అనే శోధన అంతర్జాలంలో జరుగుతున్నక్రమంలో సూదికోసం సోదికి పోతే పాత బాగోతాలన్నీ బయట పడినట్లుగా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ నాటి పరిణామాల పూర్వరంగంలో వెలువడిన వార్తలు, విశ్లేషణలు, బయటపడిన అంశాలే. అవన్నీ కూడా అతగాడు అమెరికా మనిషి అని చూపుతున్నాయి. తోలుమ్మలాటలో తెర వెనుక ఉన్నవారు బొమ్మలను ఎలా ఆడించేదీ, వాటిపేరిట పలికే మాటలూ తెలిసిందే. బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అదే క్రీడకు తెరలేచినట్లు చెప్పవచ్చు.


ఈ పెద్ద మనిషి గతంలోనే రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నట్లు , ప్రధాని పదవికోసం ప్రయత్నించినట్లు వెల్లడైంది. 2007 ఫిబ్రవరి 13న కొల్‌కతాలోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ తమ ప్రభుత్వానికి పంపిన ఒక వర్తమానం వికీలీక్స్‌ వెల్లడించిన పత్రాల్లో ఉంది. దానిలో ఉన్న సమాచార సారం ఇలా ఉంది. యూనస్‌ రాజకీయాల్లోకి రావాలని దానికి గాను తన పథకాల గురించి అమెరికా అధికారికి వెల్లడించాడు. రాజకీయాల్లోకి వస్తే తలెత్తే ముప్పు గురించి కూడా చెప్పాడు. అక్కడ అంతర్యుద్ధం చెలరేగ కుండా ఉండేందుకు మిలిటరీ మద్దతు ఉన్న తాత్కాలిక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించటాన్ని సమర్ధించాడు. దేశంలో అవినీతి, హింసాకాండ నుంచి కాపాడేందుకు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు, ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని ఫిబ్రవరి 11న ఒక బహిరంగ లేఖ రాశాడు.(పరిస్థితి తనకు అనుకూలంగా లేదని గ్రహించి రెండు నెలల తరువాత సదరు ఆలోచన విరమించుకున్నాడు) హసీనా-ఖలీదా జియా మధ్య అధికార క్రీడలో నలుగుతున్న ప్రజాస్వామ్య క్రమంలో గొప్ప నైతిక వ్యక్తిత్వం మరియు బలమైన సంస్థాగత నైపుణ్యాలు ఉన్న యూనస్‌ అభ్యర్థిత్వం ప్రత్యామ్నాయాన్ని చూపగలదు అని అమెరికా అధికారి తమ ప్రభుత్వానికి నివేదించాడు. ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం ఆ లేఖను ధృవీకరించి స్వదేశానికి పంపింది.


ఇన్నేండ్ల తరువాత యూనస్‌ను గద్దె నెక్కించటానికి అమెరికాకు అవకాశం దొరికింది. అతని మీద వందకు పైగా కేసులు నమోదయ్యాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపితమని అతను కొట్టిపారవేశాడు.మైక్రో ఫైనాన్స్‌ పేరుతో పేదల రక్తం తాగే మనిషి అని ఒక సందర్భంగా షేక్‌ హసీనా వర్ణించింది.ఇతగాడు అమెరికా మానసపుత్రుడు.ప్రతి దేశంలో తనకు అవసరమైన వారికోసం అమెరికా సిఐఏ గాలం వేస్తుంది.ఒకసారి చిక్కిన తరువాత తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. వర్ధమాన దేశాల వారిని ఆకర్షించేందుకు వేసే ఎరల్లో విద్య, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే పేరుతో అమెరికా ప్రభుత్వం ఎన్నో ఎత్తులు వేసింది, వాటిలో ఫుల్‌బ్రైట్‌ స్కాలర్‌షిప్‌ ఒకటి.యూనస్‌ను దానికి ఎంపిక చేశారు.సిఐఏ నేరుగా ఎంపిక చేయదు గాని ఎంపిక తరువాత అది రంగ ప్రవేశం చేస్తుంది.ఈ స్కాలర్‌ షిప్‌ను 1965లో యూనస్‌ పొందాడు. అర్ధశాస్త్రంలో పిహెచ్‌డి కూడా అమెరికాలోనే చేశాడు.1983లో గ్రామీణ బ్యాంకును ప్రారంభించి మైక్రోఫైనాన్స్‌ ద్వారా దారిద్య్రాన్ని తొలగించవచ్చనే చిట్కాను ముందుకు తెచ్చాడు. దానికి గాను 2006లో మరొకరితో కలసి నోబెల్‌ బహుమతి పొందాడు. ఆ బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్‌క్లింటన్‌ లాబీయింగ్‌ చేశాడు.మైక్రోఫైనాన్స్‌ పధకాన్ని అమలు చేసిన బంగ్లాదేశ్‌లో పేదరికం గణనీయంగానే ఉంది. ఇప్పుడు రోజుకు 6.85డాలర్ల దారిద్య్రరేఖలో(ప్రపంచబాంక్‌ 2022) 74.1శాతం మంది ఉన్నారు. (అఫ్‌ కోర్స్‌ మనదేశంలో కూడా మైక్రోఫైనాన్స్‌ తారక మంత్రంగా చంద్రబాబు నాయుడు వంటి వారు ఊదరగొట్టారు, అమలు చేశారు.ప్రైవేటు కంపెనీలు జనాల రక్తాన్ని పీల్చాయి, అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటంతో తరువాత సదరు కంపెనీలన్నీ జెండా ఎత్తేశాయి.) అయితే పైన చెప్పుకున్న అదే ప్రమాణం ప్రకారం భారత్‌లో 81.8శాతం ఉన్నారు.పాకిస్తాన్‌లో 84శాతంపైగా ఉన్నారు గనుక బిజెపి వారు తరచూ దానితో పోల్చి చూడండి మా మోడీ ఘనత అంటారన్నది తెలిసిందే.పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగానికి తోడు ప్రతిపక్షాల అణచివేత షేక్‌ హసీనా మీద జనంలో వ్యతిరేకత పెరగటానికి, దాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా కుట్రలో భాగంగా ప్రభుత్వ కూల్చివేత జరిగింది. తమ మానసపుత్రుడు గనుక యూనస్‌కు అమెరికా అనేక అవార్డులు ఇచ్చి స్థాయిని పెంచింది. ఇక షేక్‌ హసీనా విషయానికి వస్తే యూనస్‌ కార్యకలాపాలపై దర్యాప్తును ప్రారంభించి రుణాల వసూలుకు బలప్రయోగ పద్దతులను ప్రయోగించినట్లు వెల్లడించించారు. పదవీ విరమణ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో 2011లో అతగాడిని బాంకు బాధ్యతల నుంచి తొలగించింది. సుప్రీం కోర్టు ఆ చర్యను సమర్ధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా నోబెల్‌ బహుమతి సొమ్ముతో సహా పుస్తకాల మీద సొమ్మును స్వీకరిస్తున్నారంటూ 2013లో కేసు నమోదు చేశారు. యూనస్‌ స్థాపించిన గ్రామీణ టెలికాం కంపెనీలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.2023లో సదరు కంపెనీ సిబ్బంది తమ సొమ్మును స్వాహా చేసినట్లు ఒక కేసును దాఖలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆ కేసులో శిక్ష పడి ప్రస్తుతం బెయిలు మీద ఉన్నాడు. సిఐఏ ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆ తీర్పును తప్పుపట్టింది.


అంతర్జాలంలో వెల్లడైన సమాచారం ప్రకారం అమెరికాలో డెమోక్రటిక్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌కు యూనస్‌ అత్యంత సన్నిహితుడు. ఆర్కాన్సాస్‌ గవర్నరుగా ఉన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి. బిల్‌ క్లింటన్‌ సతి హిల్లరీ క్లింటన్‌ పేరుతో ఉన్న ఫౌండేషన్‌కు భారీ మొత్తంలో నిధులు ఇచ్చాడు. వాటి వివరాలను ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌ నుంచి తరువాత తొలగించారు. దీర్ఘకాలం పాటు సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే డెమోక్రటిక్‌ పార్టీ అధికారంలో ఉంది. ఏడుదేశాల మీద దాడులు జరిపించి మానవహక్కులను హరించిన మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు శాంతిదూతగా నోబెల్‌ బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.అదే పెద్ద మనిషి చేతుల మీదుగా యూనస్‌ అనేక అవార్డులు అందుకున్నాడు.ఒబామా నుంచి అమెరికా అధ్యక్షుడి పేరుతో ఉన్న స్వేచ్చా పతకాన్ని, అమెరికా పార్లమెంటు బంగారు పతకం, సిఐఏతో సంబంధమున్న రాక్‌ఫెల్లర్‌ సోదరులు, ఫోర్డు ఫౌండేషన్‌ సంస్థలు ఏర్పాటు చేసిన రామన్‌ మెగాసెసే అవార్డు వాటిలో ఉన్నాయి. విదేశాంగ మంత్రిగా హిల్లరీ క్లింటన్‌ పనిచేసిన సమయంలో పద్దెనిమిది రకాల లావాదేవీలతో యుఎస్‌ ఎయిడ్‌ అనే సంస్థ యూనస్‌కు గ్రాంటులు, రుణాలు, కాంట్రాక్టుల రూపంలో కోటీ 30లక్షల డాలర్ల మేర లబ్దిచేకూర్చినట్లు తరువాత వెల్లడైంది. గ్రామీన్‌ అమెరికా పేరుతో హిల్లరీ క్లింటన్‌ పలుకుబడితో అమెరికా ఆర్థికశాఖ ఆరు లక్షల డాలర్ల గ్రాంటు ఇచ్చింది.యూనస్‌ మీద బంగ్లా ప్రభుత్వం జరుపుతున్న విచారణను విరమించుకోవాలని ఆమె వత్తిడి తెచ్చినట్లు అమెరికా పార్లమెంటరీ డాక్యుమెంట్లు స్పష్టం చేశాయి.హిల్లరీ ఫౌండేషన్‌ అంతర్జాతీయ విధాన డైరెక్టర్‌గా ఉన్న అమితాబ్‌ దేశారు ద్వారా ఆమె బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చారు.2012 జూన్‌ 11వ తేదీన అతగాడు పంపిన ఒక ఇమెయిల్‌ వర్తమానంలో ” ఒకవేళ మీరు ఇప్పటికే దాన్ని చూసి ఉండనట్లయితే వెంటనే చూడాలని డబ్లుజెసి(బిల్‌క్లింటన్‌), హెచ్‌ఆర్‌సి( హిల్లరీ క్లింటన్‌) కోరారు.” అని పేర్కొన్నారు.ప్రపంచబాంకులోని ఇద్దరు కీలక అధికారులను ఎఫ్‌బిఐ, సిఐదే ద్వారా బ్లాక్‌మెయిల్‌ కూడా చేయించారు. ఆ కారణంగానే పద్మానదిపై వంతెన నిర్మాణానికి మంజూరు చేసిన 120 కోట్ల డాలర్ల రుణాన్ని నిలిపివేసింది, దాని నిర్మాణంలో అవినీతి జరిగినట్లు సాకు చూపింది.(అవమానానికి గురైన హసీనా తరువాత అదే వంతెనకు చైనా నిధులు తెచ్చి పూర్తి చేసింది, దాంతో చైనాకు దగ్గరైనట్లు చెబుతారు) అంతే కాదు హసీనా మీద కక్ష కట్టిన అమెరికా సర్కార్‌ న్యూయార్క్‌లో ఉంటున్న ఆమె కుమారుడు సాజీబ్‌ వాజెద్‌ జారు (ఇప్పుడు బంగ్లాదేశ్‌లోనే ఉన్నట్లు వార్తలు) కంపెనీ మీద దాడులు జరపాలని 2017లో నాటి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ చుక్‌ గ్రాసీ వత్తిడి తెచ్చినట్లు కూడా వెల్లడైంది.మైనస్‌ టూ ఫార్ములా ( షేక్‌ హసీనా, ఖలీదా జియా ) ప్రకారం వారిద్దరికీ రిటైర్మెంట్‌ ఇచ్చి ప్రవాసం పంపి మహమ్మద్‌ యూనస్‌ను నూతన నేతగా చేసే అవకాశాన్ని పరిశీలించాలని బంగ్లా కీలక అధికారులతో హిల్లరీ క్లింటన్‌ 2007లో విశ్వప్రయత్నాలు చేసినట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే నూతన నేతగా మహమ్మద్‌ యూనస్‌ను మిలిటరీ ముందుకు తేవచ్చునని 2007 ఏప్రిల్‌ ఏడున బిబిసి ఒక వార్తను ప్రసారం చేసింది. అదే ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకాన్సులేట్‌ జనరల్‌ సానుకూలత వ్యక్తం చేస్తూ పంపిన వర్తమానం గురించి ముందే చెప్పుకున్నాం.


హసీనాకు ఉద్వాసన మహమ్మద్‌ యూనస్‌కు పట్టం గట్టటం వెనుక ఉన్న సంబంధం ఏమిటో ఇప్పటికే అర్ధమై ఉంటుంది.యూనస్‌ పట్ల 2009లో అధికారానికి వచ్చిన హసీనా కఠిన వైఖరి ఎందుకు తీసుకున్నారో విశ్లేషిస్తూ మనదేశంలోని స్టేట్స్‌మన్‌ పత్రికలో 2019 ఏప్రిల్‌ ఐదున అమెరికాకు చెందిన జర్నలిస్టు బిజడ్‌ ఖుస్రూ రాశాడు. మిలిటరీతో చేతులు కలిపి తనను, ఖలీదాను ప్రవాసం పంపేందుకు యూనస్‌ కుట్ర చేశాడని, రాజకీయాల్లోకి రావాలని స్వయంగా సిద్దపడినట్లు ఆమె భావించారు. దశాబ్దాలపాటు సాగిన గిరిజన తిరుగుబాట్లకు స్వస్తిపలికిన తనకు నోబెల్‌ బహుమతి ఇవ్వకుండా యూనస్‌కు ఇచ్చారని ఆమె అసూయ చెందినట్లు ఖుస్రూ పేర్కొన్నారు. రాసిన అంశాల సారం ఇలా ఉంది.హసీనా 2009లో అధికారానికి రాక ముందు తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా తనను నియమిస్తే సంతోషిస్తానని యూనస్‌ ఢాకాలో ఒక సభలో ప్రకటించాడు. ఆ మరుసటి రోజు అవామీ లీగ్‌ ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ జలీల్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. దానికి ఐదు నెలల ముందు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు యూనస్‌ చెప్పాడని, అంతేగాక పాలన పట్ల అతని అభిప్రాయాలతో తాము విబేధిస్తున్నట్లు కూడా జలీల్‌ చెప్పాడు. ఈ వైఖరి తీసుకోవటానికి హసీనాకు ఢిల్లీ నుంచి అందిన సమాచారం కూడా ఒక కారణం. అదేమంటే హసీనా స్థానంలో యూనస్‌ను ఉంచాలని అమెరికా కోరుకుంటున్నదని దాని పట్ల భారత్‌ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. అంతే కాదు, మతవాద జమాతే ఇస్లామీకి రాజకీయ రంగంలో చోటు కల్పించకూడదన్నది భారత వైఖరి కాగా జమాతే మీద చర్య తీసుకుంటే దాన్ని అజ్ఞాతవాసంలోకి నెట్టడమే అవుతుందని అమెరికా చెప్పిందట. జమాతే ప్రధాన రాజకీయ స్రవంతిలో ప్రవేశిస్తే అది మతవాదాన్ని తగ్గించుకుంటుందన్న తమ వైఖరిని భారత్‌ అర్ధం చేసుకోవటం లేదని అమెరికా చెప్పింది. తన పట్ల ఉన్న వైఖరిని మార్చుకోవాల్సిందిగా హసీనాను కోరాలని అమెరికా రాయబారిని కోరగా, తాను ఆపని చేస్తానని ఆమెతో ఒక మంచిమాట చెప్పిస్తానని హామీ ఇచ్చాడని అయితే హసీనా అందుకు అంగీకరించకపోగా యూనస్‌ను బాంకు పదవి నుంచి తప్పించారు.


హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసిన మిలిటరీ అధికారులు కేవలం 45 నిమిషాల సమయమిచ్చి ఆమెను బలవంతంగా భారత్‌కు పంపిన సంగతి తెలిసిందే. డెయిలీ స్టార్‌ అనే పత్రిక వెల్లడించిన సమాచారం ప్రకారం ఫ్రాన్సులో ఉన్న యూనస్‌ స్వదేశానికి తిరిగి వచ్చి బాధ్యతలు స్వీకరించాలని విద్యార్థులు కోరారు. తాను పూర్తి చేయాల్సిన పనులెన్నో ఉన్నందున రాలేనని యూనస్‌ తొలుత చెప్పాడు.విద్యార్థులు పదే పదే కోరటంతో అంగీకరించాడు. దేశంలో ఆరాచకాన్ని తొలగించే క్రమంలో హసీనాను గద్దెదించటం పట్ల సంతోషం వెలిబుచ్చాడు. విద్యార్థులు, దేశ పౌరులు ఎన్నో త్యాగాలు చేసినపుడు నాకు సైతం కొంత బాధ్యత ఉంది, అందుకే అంగీకరించాను అన్నాడట.హసీనాను గద్దె దించిన రోజును రెండవ విముక్తి దినంగా యూనస్‌ వర్ణించినట్లు ఒక జర్నలిస్టు చెప్పాడు. ఇలాంటి వ్యక్తి సారధ్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం స్వేచ్చగా ఎన్నికలు నిర్వహిస్తుందా అన్ని పార్టీలకు అవకాశం కల్పిస్తుందా ? ఏదో ఒక ముసుగులో అమెరికా అనుకూల బిఎన్‌పి-జమాతే మతశక్తులకు అధికారం కట్టబెడుతుందా ? బంగ్లాదేశ్‌లో అమెరికా మిలిటరీ స్థావరాన్ని ఏర్పాటు చేసి అటు చైనా ఇటు భారత్‌కూ ముప్పు తెస్తుందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోలవరంలో మునిగి తేలుతున్న చంద్రబాబు : బీహార్‌కు అధిక కేటాయింపుల వెనుక అసలు కథేంటి ?

26 Friday Jul 2024

Posted by raomk in AP NEWS, BJP, Current Affairs, Economics, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, tdp, TDP

≈ Leave a comment

Tags

Amaravathi capital, BJP, BJP-JDU, CHANDRABABU, Narendra Modi, Nirmala Sitaraman stimulus package, Nithish Kumar


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికార యంత్రాంగం సహకరించటం లేదా ? ఆర్థిక ఇబ్బందుల ఆత్రంతో చేయాల్సింది చేయటం లేదా ? రాజకీయంగా నరేంద్రమోడీ చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నారా ? మొత్తం మీద ఏదో జరుగుతోంది. నీతి ఆయోగ్‌ సమావేశాలకు వెళ్లిన సందర్భంగా మరోసారి సిఎం కేంద్ర మంత్రులను కలుస్తారని చెబుతున్నారు. బడ్జెట్‌ పెట్టక ముందు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పర్యటన జరిపి అనేక అంశాలను కేంద్రానికి నివేదించారు. ఎన్నికలకు ముందు బిజెపి పెద్దలు చెప్పింది ఒకటి తరువాత చేస్తున్నది ఒకటి అన్న సంగతి అమరావతికి అప్పు ఇప్పిస్తామనటంలోనే వెల్లడైంది. బయటకు చెప్పుకోలేక చంద్రబాబు అదియును మంచిదే అన్నారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి మాత్రమే తెలుసు. కేంద్రం ఇచ్చేదేమిటో చంద్రబాబుకు ముందే తెలుసు గనుకనే వచ్చేదేమీ ఉండదని బడ్జెట్‌ను రెండునెలలు వాయిదా వేసుకున్నారు. బడ్జెట్‌ కేటాయింపులు చూసిన తరువాత అది వాస్తవమని తేలింది. అసలేమీలేని దానికంటే పదే పదే రాష్ట్రం పేరును ప్రస్తావించటాన్ని చూసి కడుపు నింపుకున్న వారు కొందరు ఉన్నారు. అమరావతికి గ్రాంటు బదులు అప్పు ఇప్పిస్తామంటే పండగ చేసుకున్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామంటే ఆహా ఓహౌ అన్నారు. కానీ ఆకస్మికంగా ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు పోలవరం గురించి చర్చించి ఒక తీర్మానాన్ని ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. బడ్జెట్‌కు ముందు జరిగిన కాబినెట్‌లో ఆ తీర్మానాన్ని ఎందుకు చేయలేదు ? దాని అవసరం గురించి అధికార యంత్రాంగం తప్పుదారి పట్టించిందా ? ఇంతకూ ఏమిటా తీర్మానం ?


పోలవరం ప్రాజక్టు డయాఫ్రం వాల్‌ 2020వరదల్లో దెబ్బతిన్నది. ఏది జరిగినా అందుకయ్యే ఖర్చును భరించాల్సింది కేంద్రమే. దేవుడు చేసిన దానికి మా బాధ్యత లేదంటే కుదరదు. అది జాతీయ ప్రాజెక్టు, ఖర్చంతా భరించేందుకు ఎప్పుడో అంగీకరించారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని జూలై మూడున నిపుణుల సమక్షంలో కేంద్ర జలసంఘం చైర్మన్‌ కుశ్చిందర్‌ ఓహ్రా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దానికి అవసరమైన నిధులు ఇవ్వటమే తరువాయి, అంచనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే తన నిపుణులను పంపవచ్చు లేదా రాష్ట్రం పంపిన వాటిని పరిశీలించి ఆమోదముద్ర వేయవచ్చు. డిపిఆర్‌లో లేని కొత్త అంశమైతే అర్ధం చేసుకోవచ్చు, అలాకానపుడు ముద్ద ముద్దకు గోవిందా గోవిందా లేదా బిస్మిల్లా బిస్మిల్లా అనాల్సిన అవసరం ఏమిటి ? దీనికి గాను ఆకస్మికంగా మంత్రి వర్గ సమావేశం, తీర్మానంతో పనేమిటి ? కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి రు.900 కోట్లు కేటాయించాలని, తొలిదశ సవరించిన అంచనా రు.30,437 కోట్లకు గాను ఇంకా రు.12,157 కోట్లు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ముందుస్తుగా మంజూరు చేయాలని మంత్రివర్గ తీర్మానంలో పేర్కొన్నారు. సాంకేతికంగా అలాంటి తీర్మానం అవసరం అయితే బడ్జెట్‌కు ముందే కేంద్రానికి పంపివుంటే నిర్మలా సీతారామన్‌ కేటాయించి ఉండేవారు కదా ! ఎందుకు పంపలేదు ? అధికార యంత్రాంగానికి తెలియదా ? ఇప్పుడు బడ్జెట్‌ను సవరించి కేటాయిస్తారా ? లోగుట్టు పెరుమాళ్లకెరుక !


తమ ప్రభుత్వ హయాంలోనే డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరినా అనుమతి రానందున తామేమీ చేయలేకపోయినట్లు వైసిపి నేతలు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చర్చల్లో చెప్పారు. అంతకు ముందు కేంద్ర నిర్వాకాన్ని గురించి జగన్‌ మోహనరెడ్డి లేదా పార్టీ పెద్దలు ఎవరూ ఎక్కడా చెప్పిన, లేదా అనుమతికి కేంద్రం మీద వత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. గురువారం నాడు రాష్ట్రమంత్రి వర్గం ఆకస్మిక సమావేశం జరిపి తీర్మానం చేసిన వార్తతో పాటు శుక్రవారం నాడు సాక్షి పత్రిక కొన్ని విషయాలను ప్రస్తావించింది. దాని కథనం ప్రకారం ” దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన ప్రతిపాదన మేరకు 2022 మార్చి నాలుగవ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించాలని అప్పట్లోనే ప్రతిపాదించారు.వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి మేరకు తొలిదశ పూర్తి చేయడానికి రు.10,911 కోట్లు, డయాఫ్రం వాల్‌ పునరుద్దరణ, మరమ్మతులకు రు.2వేల కోట్లు వెరసి రు.12,911 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్‌ ఐదున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నోట్‌ జారీచేశారు. ఆ నిధులు విడుదల చేయాలంటే కేంద్ర కాబినెట్‌ ఆమోదం తప్పనిసరి. ఎందుకంటే 2016 సెప్టెంబరు ఆరున పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకొనే క్రమంలో 2013-14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తానని చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 2014 ఏప్రిల్‌ ఒకటి నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయం అంటే రు.15,667.90 కోట్లు ఇవ్వాలని 2017 మార్చి 15న కేంద్రకాబినెట్‌నిర్ణయించింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రు.15,146.28 కోట్లు విడుదల చేసింది.దీనికి తోడు రు.12,157.52 కోట్లు విడుదల చేయాలంటే 2017 మార్చి 15న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర కాబినెట్‌ మారుస్తూ తీర్మానం చేయాలి. ఈ మేరకు కేంద్రజలశక్తి శాఖ ఈ ఏడాది మార్చి ఆరున కేంద్ర కాబినెట్‌కు ప్రతిపాదన పంపింది.”


అయితే అప్పటికే ఎన్‌డిఏలో చేరిన టిడిపి అధినేత చంద్రబాబు ఆ నిధులు ఇస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వ పెద్దల చెవుల్లో ఊదారని, దాంతో కేంద్రం పక్కన పెట్టిందని కూడా సాక్షి కథనం ఆరోపించింది. రు.30,436.95 కోట్లకు ఆమోదం తెలిపిన అంశాన్ని చంద్రబాబు కాబినెట్‌ సమావేశం గుర్తు చేసిందని ఆంధ్రజ్యోతి వార్తలో పేర్కొన్నారు. అదే నిజమైతే మిగిలిన మొత్తం రు.12,157కోట్లు విడుదల చేయాలంటూ ఆకస్మికంగా రాష్ట్ర కాబినెట్‌ తీర్మానించాల్సిన అవసరం ఏమిటి అన్నది ప్రశ్న. దీనిపై కేంద్ర ప్రభుత్వం అదే మాదిరి చంద్రబాబు నాయుడు కూడా వాస్తవాలేమిటో జనానికి వెల్లడించాలి. తాజాగా పోలవరంపై విడుదల చేసి శ్వేత పత్రంలో సవరించిన ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం ఆమోదించినట్లు చెప్పలేదు. 2013-14 సంవత్సర సిఫార్సులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.ఇక 2017-18 సంవత్సరాల సవరించిన అంచనాలను 2019 ఫిబ్రవరి 11న చంద్రబాబు నాయుడు సిఎంగా ఉండగానే టెక్నికల్‌ అసిస్టెన్స్‌ కమిటీ రు.55,657 కోట్లకు ఆమోదం తెలిపింది. దానికి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఒకవేళ రు.30వేల కోట్లకు ఆమోదం తెలిపితే విడుదల కోసం ప్రత్యేకంగా తీర్మానంతో పనిలేదు. తరువాత పెరిగిన ధరల ఖర్చు సంగతేమిటి ? నీతి అయోగ్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని చెబుతున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు చేసేది ఉంటుందా ? ప్రతిపాదనలను సవరించేందుకు కేంద్రం అంగీకరిస్తుందా ? అదే జరిగితే మిగతా రాష్ట్రాలు చేస్తున్న వత్తిడి మరింత పెరగదా ? చూద్దాం ఏం జరుగుతుందో !


కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అప్పు ఇప్పిస్తామని చెప్పి బీహార్‌కు పెద్ద మొత్తంలో పథకాలకు నిధులు ఇస్తామని ప్రకటించింది. ఎందుకిలా చేసింది ? ఏమిటీ వివక్ష ? ఆ రాష్ట్రానికి మొత్తం 62వేల కోట్ల రూపాయల విలువగల పథకాలను ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. వీటిలో రోడ్లు, వంతెనలకు రు.26వేల కోట్లు, 2,400 మెగావాట్ల నూతన విద్యుత్‌ కేంద్రంతో సహా విద్యుత్‌ ప్రాజెక్టులకు రు.21,400 కోట్లు, వరదల నిరోధంతో సహా సాగునీటి పథకాలకు రు.11,500 కోట్లు, ఇవిగాక మెడికల్‌ కాలేజీలు, విమానాశ్రయాలు, క్రీడలకు మౌలిక సదుపాయాలు, దేవాలయాల టూరిజం పాకేజ్‌లు ఉన్నాయి. వీటిని బీహార్‌కు ఇచ్చినందుకు ఎవరూ తప్పుపట్టటం లేదు. అయితే ఒక్కసారిగా ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారన్నది ప్రశ్న. బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి-జెడియు కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది సీట్లతో పాటు దాదాపు తొమ్మిదిశాతం ఓట్లను కూడా కోల్పోయింది. నరేంద్రమోడీకి ఎదురులేదని భావించిన నితీష్‌ కుమార్‌ అంచనా తప్పింది, బిజెపి స్వంతంగా మెజారిటీని సాధించలేకపోయింది. మోడీ, బిజెపి బలహీనత వెల్లడైనందున దాని ప్రభావం వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడుతుంది. పలుకుబడి ఇంకా దిగజారక ముందే జాగ్రత్త పడేందుకు ముందస్తు ఎన్నికలకు పోయినా ఆశ్చర్యం లేదు. ఈ కేటాయింపులను చూస్తే ఈ ఏడాది మహారాష్ట్ర, హర్యానాలతో కలిపి జరుపుతారా అన్న అనుమానం కలుగుతోంది. ఈ రాష్ట్రాలలో కూడా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు తగిలాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగితే బీహార్‌ను వదులు కోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో తిరిగి తనకే సిఎం కుర్చీ కావాలని అడిగే అవకాశాలు నితీష్‌కుమార్‌కు సన్నగిల్లుతున్నాయి. లోక్‌సభ ఓటింగ్‌ వివరాల ప్రకారం ఆర్‌జెడి తరువాత బీహార్‌లో బిజెపి పెద్ద పార్టీ, అది అక్కడ నిలవాలంటే జెడియు నితీష్‌ కుమార్‌ అవసరం ఉంది.

అదే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మీద బిజెపి ఆధారపడాల్సి ఉంది. అక్కడ పెద్ద పార్టీగా ఎదిగే అవకాశాలు లేవు. అందువలన నితీష్‌ కుమార్‌ కంటే తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు బిజెపి బీహార్‌ మీద వరాల వాన కురిపించింది.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి, ఎక్కువ సాయం చేస్తే అది తెలుగుదేశం, జనసేనకే రాజకీయ లబ్దితప్ప బిజెపికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. తెలుగుదేశం పార్టీ తాను తప్ప మరొక పార్టీని ఎదగనివ్వదు. అయినా ఇంకా ఐదు సంవత్సరాల వరకు జనంతో సంబంధం ఉండదు, అడిగేవారు ఎవరూ ఉండరు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలు గనుక నోటికి తాళం వేసుకుంటాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తమకే అధికారం కట్టబెట్టాలని అడగాలంటే తెలుగుదేశం బలపడకూడదు.దానికి తోకగా ఎంతకాలం ఉండాలి. అప్పులు ఇప్పిస్తామనటం అంటే పొమ్మనకుండా పొగపెట్టటమే. పోలవరానికి పెరిగిన అంచనాను ఆలశ్యం చేస్తే అది పూర్తిగాక విమర్శలను ఎదుర్కోవాల్సింది చంద్రబాబే. బహుశా ఈ తర్కంతో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీసేందుకు కూడా వెనకాడటం లేదా ? ఏమో దేన్నీ కాదనలేం !!

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ ఫాసిస్టు సంస్థ, ఊసరవెల్లి : సోషలిస్టు నేత మధు లిమాయే చెప్పిన వాస్తవాలేమిటి ?

17 Monday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

# Anti Muslims, Adolf Hitler, BJP, Guru Golwalkar, Hindu Rashtra, Madhu Limaye, Narendra Modi, Savarkarites, What is RSS


మధులిమాయే


నేను 1937లో రాజకీయ జీవితంలో ప్రవేశించాను. ఆ రోజుల్లో పూనాలో ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు సావర్కర్‌వాదులు( వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనుచరులు) ఒక వైపు, మరోవైపు జాతీయవాదులు, సోషలిస్టులు మరియు వామపక్ష రాజకీయ సంస్థలు ఎంతో చురుకుగా ఉండేవి.1938 మే ఒకటవ తేదీన మే దినోత్సవాన్ని పాటించేందుకు మేము ఒక ప్రదర్శన జరిపాము. దాని మీద ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌వాదులు దాడి చేశారు. ఆ సందర్భంగా సుపరిచితులైన విప్లవవాది సేనాపతి బాపట్‌, మా సోషలిస్టు నేత ఎస్‌ఎం జోషి కూడా గాయపడిన వారిలో ఉన్నారు. హిందూత్వ సంస్థలతో అప్పటి నుంచి మాకు తీవ్రమైన విబేధాలు ఉండేవి. జాతీయవాద సమస్య మీద ఆర్‌ఎస్‌ఎస్‌తో మా తొలి విబేధం ఉంది. భారత దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని మేము నమ్మాము. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌ వాదులు హిందూ రాష్ట్ర అనే భావంతో వచ్చారు. మహమ్మదాలీ జిన్నా కూడా అలాంటి లోకపు భావన బాధితుడే. భారత్‌ రెండు – ముస్లిం, హిందూ దేశాలతో ఏర్పడిందని అతను నమ్మారు, సావర్కర్‌ కూడా అదే చెప్పారు.


మా మధ్య రెండో ప్రధాన విబేధం ఏమిటంటే మేము ఒక ప్రజాస్వామిక సర్వసత్తాక రాజ్యం ఉద్భవించాలని కలగన్నాము, ప్రజాస్వామ్యం పశ్చిమదేశాల భావన, భారత్‌కు పనికిరాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది. ఆ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు అడాల్ఫ్‌ హిట్లర్‌ను ఎంతగానో పొగిడేవారు. గురూజీ(మాధవ సదాశివ గోల్వాల్కర్‌) ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగానే కాదు సైద్దాంతిక గురువుగా కూడా ఉండేవారు.గురూజీ మరియు నాజీల మధ్య ఆలోచనల్లో అద్భుతమైన సామీప్యతలు ఉన్నాయి. ఆయన ఉత్తమ రచనల్లో ఒకటిగా ఉన్న ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” అనే గ్రంధం అనేక ప్రచురణలు పొందింది. హిందువులు కాని వారిని పౌరులుగా పరిగణించకూడదని స్పష్టంగా దానిలో చెప్పారు.వారి పౌరసత్వహక్కులను రద్దుచేయాలని కోరారు. ఈ ఆలోచనలు కొత్తగా రూపుదిద్దుకున్నవి కాదు. మేము కాలేజీలో ఉన్న రోజుల నుంచి(1930 దశకం మధ్యలో) హిట్లర్‌ భావజాలం వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు మొగ్గుచూపేవారు. వారి దృష్టి ప్రకారం జర్మనీలో యూదుల పట్ల హిట్లర్‌ ఎలా వ్యవహరించాడో అదే మాదిరి భారత్‌లో ముస్లింలు, క్రైస్తవుల పట్ల వ్యవహరించాలి.నాజీ పార్టీ భావాల పట్ల గురూజీ ఎంతలా సానుకూలంగా ఉన్నారో ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” గ్రంధంలో దిగువ పేరాయే సాక్ష్యం.” తన జాతి, సంస్మృతిని పరిశుద్దంగా ఉంచేందుకు సెమిటిక్‌ జాతులను-యూదులను అంతమొందించి జర్మనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతి ఔన్నత్యం దాన్ని ఉన్నతిని ఇక్కడ స్పష్టం చేసింది. జాతులు,సంస్కృతుల మధ్య ఉన్న విబేధాలకు కారణాలు తెలుసుకొంటే వాటిని తొలగించటం అసాధ్యం కాదని, ఐక్యంగా ఉంచటానికి సమీకృతం చేసేందుకు ప్రపంచానికి జర్మనీ దారి చూపింది, దాన్నుంచి నేర్చుకొనేందుకు, లబ్దిపొందేందుకు హిందూస్తాన్‌లో మనకు మంచి పాఠం ”


కుల సమస్య మీద గురూజీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌తో మా మూడో ప్రధాన విబేధం. ఒక సోషలిస్టుగా నా వంటి వారికి అది ఒక పెద్ద శత్రువు కాగా కుల వ్యవస్థ సమర్ధకులు వారు. కుల వ్యవస్థ దాని పునాదిగా ఉన్న అసమానతలను నిర్మూలించకుండా భారత్‌లో ఆర్థిక, సామాజిక సమానత్వం సాధ్యం కాదన్నది నా గట్టి వైఖరి. మేము విబేధించిన నాలుగో అంశం భాష. పౌరుల భాషలను ప్రోత్సహించేందుకు మేము అనుకూలం. అన్ని ప్రాంతీయ భాషలు దేశీయమైనవే. కానీ దీని మీద చెప్పిందేమిటి ? అందరికీ ఉమ్మడి భాషగా ప్రస్తుతానికి హిందీని, తరువాత అంతిమంగా జాతీయ భాషగా సంస్కృతాన్ని చేయాలని గురూజీ చెప్పారు. ఐదవది, స్వాతంత్య్రం కోసం తలెత్తిన జాతీయ ఉద్యమం ఫెడరల్‌ రాజ్యం అనే భావనను ఆమోదించింది. ఒక సమాఖ్య దేశంలో కొన్ని నిర్దేశిత విషయాలలో కేంద్రం కొన్ని తప్పనిసరి అధికారాలను కలిగి ఉంటుంది, ఇతర అన్ని అంశాలు రాష్ట్రాలకు చెందినవిగా ఉండాలి. కానీ దేశ విభజన తరువాత కేంద్రాన్ని పటిష్టపరిచేందుకు ఉమ్మడి జాబితాను నిర్దేశించారు. ఈ జాబితా ప్రకారం అనేక అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. వాటి మీద కేంద్రం, రాష్ట్రాలకు సమానమైన అధికారపరిధి ఉంది.ఆ విధంగా సమాఖ్య రాజ్యం ఉనికిలోకి వచ్చింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు దాని ప్రధాన సిద్దాంతవేత్త గురు గోల్వాల్కర్‌ ఈ మౌలిక రాజ్యాంగ ఏర్పాటును వ్యతిరేకించారు. రాష్ట్రాల సమాఖ్య భావననే వీరు అపహాస్యం చేశారు. రాష్ట్రాల సమాఖ్యను కోరిన రాజ్యాంగాన్నే రద్దు చేయాలన్నారు. తన ” బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ ” అనే గ్రంధంలో రాజ్యాంగాన్ని సమీక్షించాలని, కొత్త రాజ్యాంగంలో ఏక(యూనిటరీ) రాజ్య ఏర్పాటును లిఖించాలని పేర్కొన్నారు. ఏక లేదా మరో మాటలో చెప్పాలంటే కేంద్రీకృత రాజ్యాన్ని గురూజీ కోరారు.రాష్ట్రాల వ్యవస్థను వదిలించుకోవాలని చెప్పారు.


జాతీయోద్యమం ఎంచుకున్న త్రివర్ణ పతాకం మరొక సమస్య. మనం ఎంచుకున్న జాతీయ పతాక గౌరవం, ఔన్నత్యం కోసం వందలాది మంది భారతీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, వేలాది మంది లాఠీ దెబ్బలను తిన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ త్రివర్ణాన్ని జాతీయ జెండాగా ఎన్నడూ ఆమోదించలేదు. అది ఎల్లవేళలా కాషాయపతాకానికే వందనం చేస్తుంది.స్మృతికందని కాలం నుంచీ అది హిందూ రాజ్య పతాకంగా ఉందని చెబుతుంది.ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల గురూజీకి విశ్వాసం లేదు. ప్రజాస్వామ్య భావన పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదనే ధృడ వైఖరిని కలిగి ఉన్నారు. భారతీయ నాగరికత, ఆలోచనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తగినది కాదన్నారు. ఏక నాయకత్వ సూత్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నమ్ముతుంది.ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక మానసిక దృక్పధాన్ని సృష్టిస్తుందని అది పూర్తిగా క్రమశిక్షణతో కూడుకున్నదిగా ఉంటుందని అది ఏం చెబితే దాన్ని జనం అంగీకరిస్తారని గురూజీ కూడా స్వయంగా చెప్పారు. ఈ సంస్థ ఏక వ్యక్తి నాయకత్వ సూత్రం మీదనే పనిచేస్తుంది. సోషలిజం గురూజీ దృష్టిలో పూర్తిగా వెలుపలి భావజాలం, సోషలిజం, ప్రజాస్వామ్యంతో పాటు అన్ని ఇజాలూ విదేశీ ఆలోచనలే, వాటిని తిరస్కరించాలని, భారతీయ సమాజాన్ని భారతీయ సంస్కృతి ఆధారంగా నిర్మించాలని అతను పదే పదే చెప్పారు. మా గురించి చెప్పాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం,సోషలిజం పట్ల మాకు విశ్వాసం ఉంది. శాంతియుత పద్దతుల్లో గాంధియన్‌ సూత్రాలకు అనుగుణంగా సోషలిజాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. మరోవైపు ఒక ప్రత్యేక మూసలో యువ మెదళ్లను తయారు చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక నైపుణ్యాన్ని సంతరించుకుంది. తొలుత అది పిల్లలు, యువత మెదళ్లలోకి ఏమీ ప్రవేశించకుండా ఘనీభవింపచేస్తుంది. ఆ తరువాత వారు ఇతర భావజాలాలకు స్పందించలేని అశక్తులుగా మారిపోతారు.


పేదల పట్ల కనికరం అవసరం లేదని గురూజీ భావించారు. తన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ గ్రంధంలో దేశంలో జమిందారీ వ్యవస్థ రద్దు పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆ వ్యవస్థ రద్దు పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేయటమే కాదు, తీవ్రంగా కలత చెందారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని రుద్దినపుడు వీరితో(ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు జనసంఫ్‌ు) మేము ఒక కూటమి కట్టామన్నది ఒక వాస్తవం. ఒక పార్టీగా ప్రతిపక్షాలు ఐక్యంగాకపోతే ఇందిరా గాంధీని ఓడించలేమని లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ నమ్మారు.చౌదరి చరణ్‌ సింగ్‌ కూడా అలాంటి వైఖరినే కలిగి ఉన్నారు గనుక మేము ఒకే పార్టీగా ఐక్యమయ్యాము. మేము జైల్లో ఉండగా ఒక పార్టీని ఏర్పాటు చేయటం, ఎన్నికల్లో పోటీ చేయటం గురించి అబిప్రాయాలు చెప్పమని మమ్మల్ని అడిగారు. మనం తప్పనిసరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక సందేశాన్ని పంపిన అంశాన్ని గుర్తు చేసుకున్నాను. కోట్లాది మంది జనం ఎన్నికల్లో పాల్గొంటారు. ఎన్నికలు ఒక క్రియాశీల క్రమం. ఎన్నికల వాతావరణం పెరిగే కొద్దీ అత్యవసర పరిస్థితి సంకెళ్లు తెగుతాయి,జనం తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకుంటారు. అందువలన మనం ఎన్నికల్లో పాల్గొనాలని నేను గట్టిగా చెప్పాను. ఒకే పార్టీ పతాకం కిందకు అందరూ రాకపోతే విజయం సాధించలేమని లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఇతర నేతల వైఖరి ఉన్న కారణంగా సోషలిస్టులంగా మా అంగీకారం తెలిపాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పదలచాను. రాజకీయ పార్టీలు-జనసంఫ్‌ు, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్‌(ఓ), భారతీయ లోక్‌దళ్‌(బిఎల్‌డి), కాంగ్రెస్‌ ముఠాలలోని కొన్ని అసంతృప్త తరగతుల మధ్య మాత్రమే అవగాహన కుదిరింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలాంటి ఏర్పాటుకు మేము రాలేదు, దాని డిమాండ్లను వేటినీ అంగీకరించలేదు. ఇంకా చెప్పాల్సిందేమంటే జైల్లో ఉన్న మా మధ్య పంపిణీ అయిన మనూభారు పటేల్‌ లేఖ ద్వారా 1976 జూలై 7న మేము తెలుసుకున్నదేమంటే కొత్త పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు కూడా పార్టీ సభ్యులైతే ద్వంద్వ సభ్యత్వ వివాదం తలెత్తవచ్చని చౌదరి చరణ్‌ సింగ్‌ ఒక సమస్యను లేవనెత్తారు. దీని మీద అప్పుడు జనసంఫ్‌ు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఓమ్‌ ప్రకాష్‌ త్యాగి స్పందిస్తూ కొత్త పార్టీ సభ్యత్వాన్ని ఎలా కావాలంటే అలా రూపొందిచుకోవచ్చని స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నందున రద్దయినట్లేనని, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వ సమస్య తలెత్తదని కూడా చెప్పారు.


తరువాత ప్రతిపాదిత జనతా పార్టీ నిబంధనావళిని రూపొందించేందుకు ఒక ఉపసంఘాన్ని నియమించారు. జనతా పార్టీ లక్ష్యాలు, విధానాలు, కార్యక్రమాలతో విబేధించే ఏ సంస్థకు చెందిన వారికీ జనతా పార్టీలో సభ్యత్వం ఇవ్వకూడదని ముసాయిదా నిబంధనావళిలో పెట్టారు. దీని అర్ధం ఏమంటే ఎవరూ ఈ నిబంధనను వ్యతిరేకించకూడదన్నది స్పష్టం.అయినప్పటికీ దీనికి వచ్చిన ఒకే ఒక అభ్యంతరం జనసంఫ్‌ుకు చెందిన సుందర్‌ సింగ్‌ భండారీ నుంచి వెలువడటం గమనించాలి. తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు 1976 డిసెంబరులో ఏర్పాటు చేసిన సమావేశానికి జనసంఫ్‌ు, ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున అతల్‌ బిహారీ వాజ్‌పాయి రాసిన లేఖలో ప్రతిపాదిత పార్టీలో ఒక తరగతి నేతలు జనతా పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్‌ సమస్యను లేవనెత్తకూడదని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అయితే అనేక మంది నేతలు అలాంటి హామీ ఇవ్వలేదని నాకు చెప్పారు. ఎందుకంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విలీనం కావాలని తలపెట్టినపుడు రంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడా లేదు గనుక అన్నారు. నేను ఒకటి స్పష్టం చేయదలచాను. ఆ సమయంలో నేను జైల్లో ఉన్నాను. ఒక వేళ ఒక రహస్య అవగాహనకు వచ్చి ఉండి ఉంటే దానిలో నాకు భాగస్వామ్యం లేదు.


నేను ఒకటి విస్పష్టంగా చెప్పగలను. జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఏ రీత్యా చూసినా ఆర్‌ఎస్‌ఎస్‌ అంశాలను ప్రతిబింబించలేదు. వాస్తవానికి ప్రణాళికలోని ప్రతి అంశమూ స్పష్టంగా ఉంది. లౌకిక, ప్రజాస్వామిక, గాంధియన్‌ సూత్రాల ప్రాతిపదికగా సోషలిస్టు సమాజం గురించి జనతా పార్టీ ప్రణాళిక ఉంది.దానిలో హిందూ దేశం గురించిన ప్రస్తావన లేదు.మైనారిటీలకు సమానహక్కులకు హామీ ఇవ్వటమే కాదు, వారి హక్కులకు రక్షణ కల్పిస్తామని కూడా చెప్పింది. కుల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిందా ? ఇతరుల సేవకు శూద్రులు తమ జీవితాలను అర్పించాలని చెప్పిందా ? దానికి విరుద్దంగా వెనుకబడిన తరగతుల పురోగమనానికి వాగ్దానం చేయటమే కాదు పూర్తి అవకాశాలు కల్పిస్తామని చెప్పింది, వారికోసం ప్రత్యేక విధానాలు తీసుకొస్తామని పేర్కొన్నది. వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 25-33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. గురూజీ కేంద్రీకరణ జరపాలని గట్టిగా చెప్పగా వికేంద్రీకరిస్తామని జనతా పార్టీ అంగీకరించింది. రాష్ట్రాలను రద్దు చేయాలని, అసెంబ్లీలను, మంత్రివర్గాలను కూడా రద్దు చేయాలని అతను కోరగా మరింత వికేంద్రీకరణ జరగాలని జనతా పార్టీ నొక్కివక్కాణించింది. మరో విధంగా చెప్పాలంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని లాక్కోవాలన్న వాంఛ జనతా పార్టీకి లేదు.


పార్టీ ఎన్నికల ప్రణాళికలోని అంశాలను స్వచ్చందంగా అంగీకరించలేదన్నది నిజం. ఇది నా అభ్యంతరం, అంతే కాదు రాతపూర్వకంగా ఒకసారి కుష్‌భాహు థాకరేకు ఫిర్యాదు చేశాను. చర్చల సందర్భంగా మీవారు(ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్‌ు) వెంటనే అంగీకరించినా హృదయపూర్వకంగా పూర్తిగా వ్యతిరేకించారని నేను చెప్పాను. అందుకే మీ ఉద్దేశ్యాలను అనుమానించాల్సి వస్తోంది.ఈ లేఖను నేను ఎంతో కాలం క్రితమే రాశాను, ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి నాకు ఎప్పుడూ సందేహమే.నిరంకుశత్వాన్ని వ్యతిరేకించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలన్న లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ వాంఛ, ఎలాంటి రాజీలు లేకుండా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉండటం వలన మన ఐక్యతకు నేను ఆమోదం తెలిపాను. అదే సమయంలో నేను ఒకటి చెప్పదలచుకున్నాను. ప్రారంభం నుంచి నాకు ఒక స్పష్టత ఉంది ఐక్య, విశ్వసనీయమైన జనతా పార్టీ ఆవిర్భవించాలంటే రెండు పనులు చేయాల్సి ఉంటుందని నా మనసులో ఉంది. ఒకటి, ఆర్‌ఎస్‌ఎస్‌ తన భావజాలాన్ని మార్చుకోవాలి మరియు లౌకిక,ప్రజాస్వామిక రాజ్య భావనను అంగీకరించాలి.రెండవది, సంఘపరివార్‌లో భాగంగా ఉన్న వివిధ సంస్థలు భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు, విద్యార్ధి పరిషత్‌ వంటివి తమను తాము రద్దు చేసుకొని లౌకిక భావజాలం ఉన్న కార్మిక సంఘాల్లో, జనతా పార్టీ విద్యార్థి విభాగంలో విలీనం కావాలి. జనతా పార్టీ కార్మిక విభాగం, విద్యార్థి విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించమని పార్టీ నాకు విధి అప్పగించిన నాటి నుంచీ నేను దీని గురించి స్పష్టతతో ఉన్నాను. ఈ రెండు సంస్థలూ ప్రత్యేక ఉనికిని రద్దు చేసుకోవాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. హిందువులను మాత్రమే సంఘటితపరచాలనే మీ భావజాలాన్ని వదలి వేసుకోవాలని, మీ సంస్థలో అన్ని మతాల వారికీ చోటు కల్పించాలని,జనతా పార్టీలో ఉన్న భిన్నమైన తరగతుల ప్రాతిపదికన ఉన్న సంస్థలలో విలీనం కావాలని నేను ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులకు చెప్పాను. అది వెంటనే జరిగేది కాదని, అనేక ఇబ్బందులు ఉన్నాయని, కానీ కొద్ది కొద్దిగా మారాలని కోరుకుంటున్నట్లు వారి స్పందన ఉంది. వారు అలా తప్పించుకొనే జవాబులను కొనసాగించారు.


వారి ప్రవర్తన చూసిన తరువాత వారిలో మార్పు ఉద్దేశ్యం లేదన్న నిర్దారణకు వచ్చాను.ప్రత్యేకించి 1977జూన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత వారు నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారానికి రాగలిగారు. అప్పటి నుంచి కొత్తగా వచ్చిన ప్రతిష్టతో మారాల్సిన అవసరం లేదని వారు ఆలోచించటం ప్రారంభించారు.ఇప్పటికే వారు నాలుగు రాష్ట్రాలను కైవశం చేసుకున్నారు. క్రమంగా ఇతర రాష్ట్రాలను, చివరకు కేంద్రాన్ని కూడా పట్టుకొనేందుకు చూస్తారు. జనతా పార్టీలోని ఇతర రాజకీయ నేతలు పెద్ద వారు, వారు ఎంతో కాలం జీవించలేరు. పార్టీలో ఉన్న ఉన్నత స్థానాలకు ఎదిగేట్లు ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘేతర నేతలను చేయలేరు. అయినప్పటికీ నేను ప్రయత్నించాను. ఒక సందర్భంగా అన్ని కార్మిక సంఘాలనేతల సమావేశం ఏర్పాటు చేశాను. జనతా పార్టీలోని అన్ని పక్షాల ప్రతినిధులు వచ్చారు, భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు సమావేశాన్ని బహిష్కరించింది. అంతే కాదు ఎలాంటి కారణం లేకుండానే వారు నన్ను దూషించారు. విద్యార్థి పరిషత్‌, యువమోర్చాలతో అలాంటి ప్రయత్నమే జరిగింది. విలీనం కోసం జరిగిన అన్ని ప్రయత్నాలకూ వారు దూరంగా ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే పార్టీ మీద పెత్తనం చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాంఛ కారణంగానే. ప్రజల ప్రతి జీవనరంగంలోకి ప్రవేశించాలన్నది వారి లక్ష్యం, అంతేకాదు దాన్ని అదుపు చేయాలన్నది కూడా. ఇలాంటి అభిప్రాయాలను గురూజీ తన ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్డ్‌ అనే గ్రంధంలో పదే పదే వక్కాణించారు. నిరంకుశ సంస్థ ఏదీ స్వేచ్చను అనుమతించదు. దాని వేర్లు కళలు, సంగీతం, ఆర్థికం, సాంస్కృతిక రంగం ప్రతిచోటా ఉంటాయి. ప్రతి ఫాసిస్టు సంస్థ సారం ఇదే. వీరు అరుదైన సందర్భాలలో చేసేదానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. గురూజీ బాటలో ఆలోచనలను వదలి వేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ చెప్పలేదు. జైళ్లలో ఉన్నపుడు వీరు క్షమాభిక్ష కోసం ప్రార్ధించారు. రాజనారాయణ్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇందిరా గాంధీకి అనుకూలంగా వచ్చినపుడు బాలాసాహెబ్‌ దేవరస్‌ ఆమెను అభినందించారు. అందువలన వీరి ఉద్ఘాటనల మీద నాకు నమ్మకం లేదు. నేను వీరిని (జనతా పార్టీలో పూర్వపు జనసంఫ్‌ు నేతలు) ఎప్పుడు నమ్ముతానంటే పార్టీ, కార్యవర్గ కమిటీల నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను బహిష్కరించినపుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల మీద ఆంక్షలు విధించినపుడు, ప్రత్యేకించి నానాజీ దేశముఖ్‌, సుందర్‌ సింగ్‌ బండారీ వారి అనుచరులను బహిష్కరించినపుడే నమ్ముతాను.


గమనిక : మధు లిమాయే(1922 -1995 ) పూనాలో జన్మించారు. కాంగ్రెస్‌లో, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ, తరువాత ప్రజా సోషలిస్టు పార్టీ నేతగా వ్యవహరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వంపై వివాదం కారణంగా జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘనేతలు వేరు పడి బిజెపిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అధికారం కోసం అవసరాలకు అనుగుణంగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చింది తప్ప మౌలిక స్వభావం, లక్ష్యాలలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు దశాబ్దాల నాడు (1979) రాసిన ఈ వ్యాసంలో లేవనెత్తిన అంశాలు నేటికీ సంగతమైనవేే గనుక జనతా వార పత్రిక నుంచి సేకరించి అనువదించి అందించాను, : ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిప్‌ ఖరాబైందా ? నరేంద్రమోడీని హిట్లర్‌, గోబెల్స్‌ ఆవహించారా !

19 Sunday May 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Uncategorized, WAR

≈ 1 Comment

Tags

Adolf Hitler, BJP, Donald trump, Narendra Modi, Narendra Modi Failures, Nazi Joseph Goebbels, Nazism, RSS


ఎం కోటేశ్వరరావు


రంభా, ఊర్వశి, మేనక వంటి వారితో సంతోషంగా గడుపుతున్న జర్మన్‌ నాజీ మాజీ మంత్రి జోసెఫ్‌ గోబెల్స్‌ భారత్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి గనుక తన ఆరాధకులు ఎలా పని చేస్తున్నారో చూద్దామని వచ్చినట్లు కనిపిస్తున్నది. (విడ్డూరంగాకపోతే ఎంతైతే మాత్రం మన భారతీయ సంప్రదాయాలు, విలువలకు కట్టుబడిన అప్సరసలు ఒక మ్లేచ్చుడితో ఆడిపాడతారా, ఇంకా ఏదైనా చేస్తారా అని కొంత మంది సనాతనవాదులకు కోపం రావచ్చు.కంచంలో తేడా ఉంటుంది గానీ మంచంలో ఎలాంటి బేధాలను పాటించని ”విశాల భావాలు” మనవి అన్నది తెలిసిందే.అందులోనూ జర్మన్‌ గోబెల్స్‌ మనవా(ఆర్యు)డే అని భావిస్తున్నపుడు, స్వర్గంలో మాట్లాడేది ఎలాగూ సంస్మృతమే, అయినా భాషతో పనేముంది, అంటూ సొంటూ ఏముంటుంది) ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా దేశంకోసం-ధర్మకోసం పని చేస్తున్నట్లు చెప్పుకుంటున్న మన నరేంద్రమోడీ, ఇతర సంఘపరివార్‌ నేతలను గోబెల్స్‌ ఆవహించినట్లు కనిపిస్తోంది. లేకుంటే ఉత్తర ప్రదేశ్‌లో సమాజవాది పార్టీ-కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వారు ఆయోధ్య రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని, బాలరాముడిని తిరిగి గుడారాల్లో కూర్చో పెడతారని నరేంద్రమోడీ చెప్పేవారు కాదేమో ! ఎందుకిలా మాట్లాడినట్లు ?
వాట్సాప్‌లో తిరుగుతున్న ఒక వర్తమానంలో రచయిత ఎవరో తెలియదు గానీ నరేంద్రమోడీ-హిట్లర్‌ మధ్య ఒక పోలిక తెచ్చారు.హిట్లర్‌ వివాహం చేసుకోలేదు.(మోడీ వివాహం చేసుకున్నా కాపురం చేయకుండా విడాకులు కూడా ఇవ్వకుండా వదలివేశారు. భారతీయ ధర్మాన్ని, రాజ్యాంగాన్నీ పాటించలేదు).ఒక మతం వారు దేశానికి వ్యతిరేకులనే భావాన్ని హిట్లర్‌ తలకు ఎక్కించుకున్నాడు. హిట్లర్‌ను ఎవరైనా విమర్శిస్తే మద్దతుదార్లు సహించేవారు కాదు. అన్ని రకాల మీడియాను తన గురించి గొప్పలు చెప్పుకోవటానికి హిట్లర్‌ ఉపయోగించుకున్నాడు.తన వ్యతిరేకులందరినీ అణచివేశాడు. వారు దేశ ద్రోహులని, జాతి వ్యతిరేకులని ఎల్లవేళలా పిలిచాడు. అన్ని సమస్యలనూ స్వల్పకాలంలోనే పరిష్కరిస్తానని వాగ్దానం చేశాడు.మంచి రోజులు రానున్నాయన్నది హిట్లర్‌ నినాదం. మంచి దుస్తులు వేసుకొని అందంగా కనిపించేందుకు హిట్లర్‌ చూశేవాడు. అబద్దాలను నిజాలుగా భ్రమింపచేసే కళను హిట్లర్‌ ప్రదర్శించేవాడు.రేడియోలో ఉపన్యాసాలు ఇచ్చేందుకు హిట్లర్‌ ఇష్టపడేవాడు.స్నేహితులు, సోదరులు, సోదరీమణులంటూ తన ప్రతి ప్రసంగంలో హిట్లర్‌ మాట్లాడేవాడు.హిట్లర్‌కు ఫొటోలు తీయించుకోవటమంటే పిచ్చి.


పైన పేర్కొన్నవాటిలో నరేంద్రమోడీకి ఏ లక్షణాలు, ఏమి ఉన్నాయో లేవో ఎవరికి వారు బేరీజు వేసుకోవచ్చు. చిన్న తనంలో ఒక రైల్వే స్టేషన్‌లో టీ అమ్మినట్లు మోడీ చెప్పుకున్న సంగతి తెలిసిందే. దానికి ఆధారాలు లేవని చెబుతారు. హిట్లర్‌ చిన్న తనంలో, కాస్త వయస్సు వచ్చాక కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడినట్లు, అనాధ గృహాల్లో గడిపినట్లు చరిత్ర చెబుతున్నది.హిట్లర్‌ హైస్కూలు విద్యను కూడా పూర్తి చేయకపోవటంతో ఉన్నత విద్యకు అర్హÛత సాధించలేకపోయాడు. నరేంద్రమోడీ ఉన్నత విద్య చదివినట్లు చెప్పుకున్నా దానికి తగిన ఆధారాలు లేవు. నాజీగా హిట్లర్‌, నాజీల బాటలో నడుస్తుందనే విమర్శలున్న ఆర్‌ఎస్‌ఎస్‌లో మోడీ చాలా తక్కువ కాలంలోనే ప్రముఖ స్థానాలకు ఎగబాకారు.హిట్లర్‌ ఒకనాడు జర్మనీలో దేవుడిగా ఒక వెలుగు వెలిగాడు. నరేంద్రమోడీని కూడా అభిమానులు అలాగే చూస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే స్వయంగా మోడీ దేవుడి బహుమతి, పేదల పట్ల దేవదూత అని చెప్పిన సంగతి తెలిసిందే.


2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన లేదా జరిపిన ప్రచారంలో ఇండియా కూటమి బిజెపి విధానాలపై విమర్శలతో పాటు ఆ కూటమిలోని పార్టీలు విడివిగా ప్రకటించిన మానిఫెస్టోలోని అంశాలను, బిజెపి చెబుతున్నట్లుగా నాలుగువందల సీట్లు ఎందుకు కోరుతున్నదో, ఏం చేసేందుకు అన్నిసీట్లు కోరుతున్నదో స్పష్టంగానే ప్రచారం చేశాయి. బిజెపి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను ఎత్తివేస్తుందన్నది ప్రధానమైన విమర్శ. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బిజెపి ఎంతసేపూ ఎన్నిమరుగుదొడ్లు కట్టించిందీ, ఎన్ని ఉజ్వల గాస్‌ కనెక్షన్లు ఇచ్చిందీ, రోడ్లు వేసిందీ చెప్పుకోవటం తప్ప జన జీవితాలను మెరుగుపరిచేందుకు చేసిందేమిటో పెద్దగా చెప్పలేదు. పచ్చి అవాస్తవాలను, ఆధారంలేని ఆరోపణలను ఎన్నింటినో స్వయంగా నరేంద్రమోడీ ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఇంతగా వక్రీకరణ, అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారం చేసిన ప్రభుత్వ నేత మరొకరు లేరన్నది వేరే చెప్పనవసరం లేదు. మీడియాలో ఎన్ని టీవీ ఛానళ్లు వాటి గురించి చర్చలు పెట్టాయి, ఎన్ని పత్రికలు ప్రముఖంగా విశ్వేషణలు, వాస్తవాలను వెల్లడించాయి ? ఇదేం ప్రచారం అన్నట్లుగా కొందరు గొణగినట్లు విమర్శించటం తప్ప గట్టిగా బట్టబయలు చేసే ధైర్యం చేయటం లేదు. విదేశీ మీడియాలో కూడా ఇదే వ్యక్తమైంది.


నరేంద్రమోడీ ఇన్ని పచ్చి అబద్దాలను ప్రచారం చేయటం వెనుక ఉన్న మతలబు ఏమిటి ? పలుకుబడి దిగజారుతున్న పూర్వరంగంలో మైనారిటీ విద్వేషంతో లాభం లేదని గ్రహించి కాబోలు ముందే చెప్పుకున్నట్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారంటూ హిందువులను రెచ్చగొట్టి లబ్దిపొందాలన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి మసీదులు, చర్చీలను కూల్చివేసిన చరిత్ర కాషాయ దళాలది తప్ప ఇతర పార్టీలది కాదు. రోడ్ల విస్తరణ పేరుతో నరేంద్రమోడీ సిఎంగా ఉండగా అహమ్మదాబాద్‌లో కొన్ని మందిరాలను కూడా తొలగించారన్న వార్తలు తెలిసిందే.హిట్లర్‌ నాయకత్వంలోని నాజీల ప్రచారం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. విశ్లేషణలు వెలువడుతూనే ఉన్నాయి. రాజకీయ,చరిత్ర,మతం, కులం, సాంస్కృతిక అంశం ఏదైనా సరే తమకు అనుకూలంగా ఉంటుందని ఎవరు భావించినా వాటిని వక్రీకరించి తమకు అనుకూలంగా మలుచుకోవటం వెనుక రెండు రెళ్లు నాలుగు అన్న విశ్వవ్యాప్త సూత్రం ఒకటే ప్రాతిపదిక. అదే ” పర్వతమంత అబద్దం ” చెప్పటం, వాస్తవానికి వక్రీకరణ, వక్రభాష్యం చెప్పి జనాన్ని బురిడీ కొట్టించటం. ఒక అబద్దాన్ని పదే పదే చెబితే చివరికి నిజమై కూర్చుంటుంది. ఎంతైతే మాత్రం ఫలానావారు అంత నిస్సిగ్గుగా అబద్దం అడతారంటే నేను నమ్మను అనే విశ్వాసాన్ని సొమ్ము చేసుకోవాలని తొలిసారిగా హిట్లర్‌ 1925లో మెయిన్‌ కాంఫ్‌ అనే గ్రంధంలో చెప్పాడు. మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయినపుడు జర్మనీలో చర్చ జరిగింది. జర్మనీ మిలిటరీలో లక్షమందికి పైగా యూదులు సైనికులుగా ఉన్నారు.యుద్ధరంగంలో యూదులు సరిగా పోరాడని కారణంగానే జర్మనీ ఓడిపోయిందని ఒక ప్రచారం జరిగింది.ఓటమి గురించి ప్రభుత్వం విచారణ జరిపింది. పేరు పెట్టి ఫలానా సామాజిక తరగతి అని చెప్పలేదు గానీ వెన్ను పోటు కారణంగానే జర్మనీ ఓడిపోయిందనే ప్రచారాన్ని నిజమే అని చాలామంది నమ్మారు. నిజానికి దానిలో ఎలాంటి వాస్తవం లేదు. దాన్ని హిట్లర్‌ వంటి జాతీయవాదులు భుజానవేసుకొని యూదులే వెన్నుపోటుదారులంటూ రెచ్చగొట్టారు. అప్పటికే మతరీత్యా యూదులపై ఉన్న అభిప్రాయాలు, అనుమానాలతో ఉన్న జనం నిజమని నమ్మారు. చివరకు అది ఎంతవరకు దారి తీసిందంటే జర్మనీ ఆత్మరక్షణకు యూదులను అంతమొందించటానికి జర్మన్లకు హక్కు ఉందన్నవరకు పోయి మారణకాండకు దారితీసిన సంగతి తెలిసిందే. తన పార్లమెంటు భవనాన్ని(రీచ్‌స్టాగ్‌) తానే తగులబెట్టించి ఆ నెపాన్ని కమ్యూనిస్టుల మీద మోపి అణచివేసిన దుర్మార్గం తెలిసిందే. హిట్లర్‌ ప్రచార పద్దతులను ఎన్నికల్లో ఓడిన డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వినియోగించుకొనేందుకు చూశాడు.ఎన్నికల్లో డెమోక్రాట్లు అక్రమాలకు పాల్పడ్డారని, ఫలితాలను తారుమారు చేశారని, తాను ఓటమిని అంగీకరించనని చెప్పటమే కాదు, అమెరికా అధికార కేంద్రంపై తన అనుచరులతో దాడి చేయించిన దుండగాన్ని కూడా చూశాము. తాను నిజంగానే ఓడినట్లు ట్రంప్‌కు ముందే తెలిసినా కావాలని రెచ్చగొట్టినట్లు తరువాత వెల్లడైంది. అలాంటి ట్రంప్‌ను గెలిపించాలని పిలుపు ఇచ్చిన మోడీ గురించి తెలిసిందే.


కొందరు పనిగట్టుకొని పదే పదే తప్పుడు సమాచారాన్ని మెదళ్లలోకి ఎక్కిస్తే జనం ఎందుకు నమ్ముతున్నారు అనేది ప్రశ్న. దీని గురించి భిన్న కోణాలు వెలువడుతున్నాయి. తమ ముందుకు వచ్చిన ఒక సమాచారం వాస్తవం కాదని తెలిసినప్పటికీ అది పదే పదే వేర్వేరు మార్గాల్లో చేరితే ఏమో నిజమేనేమో అనే సందేహంలో పడతారు.బ్రాహ్మణుడు-మేకపిల్ల కథ తెలిసిందే. దానికి ప్రతిగా సమాచారం లేకపోతే చివరికి నిజమని నమ్ముతారు. ఉదాహరణకు వైరస్‌తో జలుబు చేస్తుంది. నిజానికి దానికి మందు లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిన వైరస్‌కు వెంటనే మందు కనుగొనటం సాధ్యం కాదు. ఏదైనా బిళ్ల వాడితే వారంలో వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందన్న లోకోక్తి తెలిసిందే. మనశరీరంలోని రోగనిరోధకశక్తి ఆ వైరస్‌ను ఎదుర్కొన్న తరువాత అదే తగ్గిపోతుంది కానీ అనేక మంది ఫలానా బిళ్ల వేసుకుంటే మాకు తగ్గింది అని చెప్పారనుకోండి, కొంతకాలానికి మిగతావారు పోయేదేముంది మనమూ చూద్దాం అని ఆ బిళ్లలనే వాడతారు. ఇది వ్యక్తులకు సంబంధించిన అంశం కనుక పెద్దగా నష్టం ఉండదు. పొట్టను తగ్గించాలంటే సూక్ష్మంలో మోక్షంలా ఫలానా మిషన్‌ వాడితే తగ్గిపోతుందనే ప్రచారం తెలిసిందే. ఒకసారి చూద్దాం పోయేదేముంది అనుకొని అనేక మంది కొనుగోలు చేయటం, ఆయిల్‌ పుల్లింగ్‌, మంచినీటి వైద్యాల వంటి వాటికి బుర్రలను అప్పగించటం చాలా మందికి తెలిసిందే. ఇలాంటి వాటి వలన వ్యక్తులు నష్టపోతారు. అదే ఒక ప్రతికూల భావజాలానికి చెవి అప్పగిస్తే యావత్‌ సమాజానికే ప్రమాదకరం. ప్రతి మనిషి సగటున రోజు 35వేల నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కొందరు పరిశోధకులు చెప్పారు. ఒక షర్టు ఆరటానికి అర్ధగంట పడితే పది షర్కులు ఎంతసేపటిలో ఆరతాయంటే ఐదు గంటలు అనేవారు, ఒక కిలో దూది బరువా ఒక కిలో ఇనుము బరువా అంటే ఇనుము అని చెప్పేవారి గురించి తెలిసిందే.అంటే ప్రతి క్షణానికి మన మెదళ్లకు ఎంతో సమాచారం అందుతుంటుంది.బహుశా ఈకారణంగానే వెంటనే బుర్రకు తర్కం కూడా తట్టదు. మన బుర్రలో రెండు రకాల ఆలోచనా వ్యవస్థలుంటాయట. ఒకటి అదుపులేని సృహతో తక్షణమే స్పందించేది, రెండవది సృహతో దీర్ఘంగా, లోతుగా ఆలోచించి నిర్ణయించేది. జనాలు మొదటిదానికే ఎక్కువగా పనిపెడతారని,అందువలన లోతుగా ఆలోచించకుండా చేసే పద్దతులు, సమాచారాన్ని కొన్ని శక్తులు మనబుర్రలకు చేరవేస్తాయని భావిస్తున్నందున హిట్లర్‌ వంటి నియంతలు, మార్కెటింగ్‌ నిపుణులు, రంగులు మార్చే రాజకీయవేత్తలు ప్రతితరాన్ని ఏదో విధంగా మభ్యపెట్టగలుగుతూనే ఉన్నారు.


ఫేక్‌,వక్రీకరించిన సమాచారం ఈ రోజు సామాజిక మాధ్యమాన్ని ఊపివేస్తున్నది. ఇవి పెద్దగా జనానికి అందుబాటులో లేని రోజుల్లో వినాయకుడు పాలు తాగాడన్న వార్త ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. సైన్సు పత్రికలో ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం వాస్తవ కథనాలకంటే తప్పుడు వార్తలు జనాలకు ఆరు రెట్లు వేగంగా చేరతాయని తేలింది.సంఘపరివార్‌ వంటి సంస్థలకు చెందిన వారు తొలిసారిగా చెప్పిన అంశాలను అనేక మంది తొలిరోజుల్లో నమ్మలేదు. కానీ పదే పదే వాటిని ప్రచారం చేస్తుండటంతో అనేక భ్రమాత్మక అంశాలు నిజమై కూర్చున్నాయి. ఉదాహరణకు రాహుల్‌ గాంధీకి అసలు గాంధీ పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించటం తెలిసిందే. రాహుల్‌ తాత ఫిరోజ్‌ గాంధీ, అతని తలిదండ్రులు జొరాస్ట్రియన్‌ మతానికి చెందిన వారు. వందల సంవత్సరాల క్రితం పర్షియాపై దండయాత్ర చేసిన ఇస్లాం పాలకులు జొరాస్ట్రియన్లను అణచేందుకు పూనుకున్నపుడు అనేక మంది అరేబియా సముద్ర మార్గం ద్వారా గుజరాత్‌కు వలస వచ్చిన పూర్వీకుల కుటుంబాలలో ఫిరోజ్‌ గాంధీది ఒకటి. పర్షియాకు మరో పేరు ఇరాన్‌, అక్కడి నుంచి వచ్చారు గనుక ఇరానీలు, పార్సీలయ్యారు.వారి సంఖ్య ప్రస్తుతం లక్షమందికి లోపే.గతంలో పర్షియాలో ఉన్నపుడే వాణిజ్యంలో ముందున్నారు గనుక మన దేశం వచ్చిన వారు కూడా దాన్ని అందిపుచ్చుకొని దేశంలో నేడు ప్రముఖ వాణిజ్య, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. మహాత్మాగాంధీలో గాంధీ పేరుతో ఎలాంటి సంబంధం లేదు, పార్సీలలో గాందే పేరుతో ఉన్నవారు చివరికి గాంధీలుగా నామాంతరం చెందారు.ఫిరోజ్‌ అని ఉంది గనుక అతను మనవాడే అని అనేక మంది ముస్లింలు భావించారు.దీన్ని ఎంత మంది గూగుల్లో వెతికి నిర్ధారించుకుంటారు. వాట్సాప్‌ ద్వారా పనిగట్టుకు చేస్తున్న ప్రచారం కూడా అలాంటిదే. అనేక తప్పుడు ప్రచారాలు ప్రారంభిస్తే కొన్నాళ్లకవి నిజాలై కూర్చుకుంటాయి. మతోన్మాదశక్తులు ఇంతకాలం చేసింది అదే. వాటితో జనాలు ప్రభావితులౌతున్నారు. అఫ్‌కోర్సు పెరుగుట విరుగుట కొరకే. హిట్లర్‌ను ఆరాధించిన జర్మన్లే ఇప్పుడు ఆ పేరు ఎత్తటానికి కూడా ఇచ్చగించరు వాడొక కుక్క అంటారు.ఎవరికైనా అదే గతి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దొంగ డబ్బు కేసు : కేరళ బిజెపి నేతలను కాపాడుతున్న ఇడి !!

11 Saturday May 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

APP, BJP, ED and IT, Kerala BJP, Kerala CPI(M), Kodakara Black Money Heist, Narendra Modi, RSS, The Enforcement Directorate


ఎం కోటేశ్వరరావు


కేేరళ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌, ఇతర బిజెపి నేతల ప్రమేయంపై ఆరోపణలు ఉన్న హవాలా కేసులో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు వినోద్‌ మాథ్యూ విల్సన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) ద్వారా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేసు ఇంకా దర్యాప్తులో ఉన్నందున దాన్ని అనుమతించవద్దని ఇడి న్యాయవాదులు కోర్టును కోరింది. ఆమ్‌ ఆద్మీనేత కోరికపై తీర్పును రిజర్వుచేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దోపిడీ, దొంగతనం వంటి ఆరోపణలతో ఈ కేసులో దాఖలైన ప్రాధమిక ఎఫ్‌ఐఆర్‌ను ఇడి కోర్టుకు సమర్పించింది. 2021లో తాము జరిపిన ప్రాధమిక దర్యాప్తు గురించి కూడా కోర్టుకు తెలిపింది.ప్రాధమిక ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టును 2023లో తెరిచి దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి పేర్కొన్నది. ఇప్పటికే తాము అనేక మందిని ప్రశ్నించి వారు చెప్పిన అంశాలను నమోదు చేశామని, డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అన్న అంశాలను దర్యాప్తు చేస్తున్నామని, సమగ్రంగా దర్యాప్తు జరిపి తరువాత నివేదిక సమర్పిస్తామని చెప్పింది. రాష్ట్ర పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నింటి మీద తాము దర్యాప్తు జరపలేమని ఇడి వాదించింది. పిటీషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించిన అంశాలలో హవాలా మార్గం ద్వారా 2021 ఎన్నికల కోసం బిజెపికి సంబంధించిన వారు డబ్బుతెచ్చినట్లు రిపోర్టులో పేర్కొన్నారని, కానీ దీని గురించి ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లు ఇడి పేర్కొన్నదని, మూడు సంవత్సరాల తరువాత కూడా ఎలాంటి చర్యలు లేవని హవాలా గొలుసు గురించి ఉపా చట్టం కింద ఇడి మరియు ఎన్‌ఐఏ దర్యాప్తు జరపాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ కోరింది.


వాద ప్రతివాదనల సందర్భంగా విచారణ జరిపిన విచారణ బెంచ్‌లోని న్యాయమూర్తి గోపీనాధ్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర్ర పోలీసు లేదా సిబిఐ వంటి సంస్థలు ఒక నేరంపై ఎఫ్‌ఐఆర్‌ సమర్పించిన తరువాత ఇడి పాత్ర ఏమిటని ప్రశ్నించారు.” సిబిఐ లేదా మరేదైనా కావచ్చు వాటి ఎఫ్‌ఐఆర్‌లను పక్కన పెట్టి దర్యాప్తు జరిపేందుకు వాటి మీద ఉన్న సంస్థ ఇడి కాదు. వారి పని రెండు అంశాలకే పరిమితం ఒకటి విదేశీ మారక ద్రవ్య యాజమాన్య చట్టం(ఫెమా) రెండవది మనీలాండరింగ్‌ నిరోధ చట్టం(పిఎంఎల్‌ఏ). ఒక కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో అది గానీ ఇది గానీ ఉందా అన్నది, ఉంటే వాటిని ఉపయోగించటం తప్ప ఒక దర్యాప్తు సంస్థ మాదిరి దర్యాప్తు చేయటానికి ఇడి దర్యాప్తు సంస్థ కాదు.పిఎంఎల్‌ఏ కింద ఆస్తులను స్వాధీనం చేసుకోవటం లేదా పోయిన వాటిని స్వాధీనం చేసుకోవటానికి మించి సదరు చట్టంలో ఇంకా ఏమైనా ఉందా అన్నది కోర్టుకు చెప్పండి. మీరు ఉన్న దర్యాప్తు సంస్థలకు అతీతమైన ఉన్నత దర్యాప్తు సంస్థకాదు అని న్యాయమూర్తి అన్నారు.


కేరళ అసెంబ్లీ 2021ఎన్నికల్లో అనూహ్య విజయం సాధిస్తామని, వీలైతే అధికార చక్రం తిప్పుతామని కేరళ బిజెపినేతలు ఢిల్లీ పెద్దలకు త్రిడి సినిమా చూపించారు. దాంతో పక్కనే ఉన్న కర్ణాటకలో అధికారంలో ఉన్న బిజెపి పెద్దలు కోరినంత నల్లధనాన్ని పంపారు. త్రిస్సూరు జిల్లాలో కొడక్కర పోలీస్‌ స్టేషన్‌లో ఏప్రిల్‌ ఏడవ తేదీన అంటే ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు ఒక క్రిమినల్‌ కేసు నమోదైంది. ఏప్రిల్‌ మూడవ తేదీన కోజికోడ్‌ నుంచి కొచ్చి వస్తున్న తన కారును కొడక్కర వంతెన మీద నిలిపి కొందరు దుండగులు పాతిక లక్షల రూపాయలను దోచుకొని, కారును కూడా అపహరించినట్లు షంజీర్‌ షంషుద్దీన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తీగలాగితే అది అంతర్జాతీయ లేదా కర్ణాటక నుంచి వచ్చిన హవాలా సొమ్ము అనే అనుమానం వచ్చింది. సొమ్ము పాతిక లక్షలు కాదు మూడున్నర కోట్లుగా తేలింది ఒక ఘటనలోనే ఇంత వుంటే ఎన్నికల్లో మొత్తంగా ఎంత తెచ్చి ఉంటారన్నది ఊహించుకోవాల్సిందే. రెండు స్ధానాల్లో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ హెలికాప్టర్లలో తిరిగారంటే ఏ స్ధాయిలో డబ్బు ఖర్చు చేసి ఉంటారో చెప్పనవసరం లేదు. దీనికి సంబంధించి త్రిస్సూర్‌ జిల్లాలో బిజెపిలో రెండు ముఠాల మధ్య వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. తరువాత ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిషి పలపును పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నేతలు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత ఆ సొమ్ముతో తమకెలాంటి సంబంధం లేదని బిజెపి నేతలు బుకాయించారు. ఇప్పటికే ఎన్నికల కోసం పార్టీకి వచ్చిన సొమ్ము పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. కొడక్కర ఉదంతం గురించి పార్టీ రాష్ట్రనేతలు రెండుగా చీలిపోయారు. పార్టీలోని కుమ్ములాటల కారణంగానే ఈ ఉదంతం బయటికి వచ్చిందన్నది స్పష్టం. సురేంద్రన్‌కు అనుకూలంగా లేని వారికి ఆకుల్లోనూ అయిన వారికి కంచాల్లోనూ వడ్డించారన్నది తీవ్ర ఆరోపణ. కొందరికి కోట్లలో ఇస్తే మరికొందరికి లక్షల్లోనే ఇచ్చారనే ఫిర్యాదులు కేంద్ర పార్టీకి పంపారు. ప్రచార బాధ్యతలను నిర్వహించింది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు కావటం, కేంద్ర ప్రతినిధులు రాష్ట్రంలో తిష్టవేసినప్పటికీ ఈ పరిణామాలను గమనించలేదా లేక వారు కూడా కుమ్మక్కై నిధులను బొక్కారా అన్నది అప్పుడు జరిగిన చర్చ. ఇదిలా ఉండగా ఈ దొంగడబ్బు కేసులో సురేంద్రన్‌ ప్రకటనను నమోదు చేయనున్నట్లు అప్పుడు రాష్ట్ర పోలీసులు నిర్ణయించారు.ఈ మేరకు పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.అలపూజ జిల్లా బిజెపి నేత చెప్పిన అంశాల ప్రకారం నల్లధనాన్ని రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తి ఎవరో బిజెపి రాష్ట్రనేతలకు తెలుసు, పంపిణీ గురించి కూడా తెలియచేశారని పేర్కొన్నారు.


ధర్మరంజన్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త దొంగడబ్బును ఎవరికి ఎంత, ఎలా పంపిణీ చేసిందీ పోలీసులకు చెప్పాడు. ఆ మేరకు అనేక మంది బిజెపి నేతలు, వారి బంధువులను పోలీసులు ప్రశ్నించారు. కోజికోడ్‌, కన్నూరు జిల్లాలకు చెందిన నేతలు ఎక్కువ మంది ఉన్నారు. అతను కరపత్రాల పంపిణీ బాధ్యతను చూస్తున్నందున ఒక హౌటల్లో రూము ఏర్పాటు చేశామని బిజెపి నేతలు బుకాయించారు. నిజానికి అది డబ్బు పంపిణీ కేంద్రంగా పని చేసినట్లు ఆరోపణ. అతను ఎప్పుడూ ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయలేదని తేలింది. కొడకరలో అతని కోసం కోజికోడ్‌ నుంచి వచ్చిన కారులో దొంగ సొమ్ము తప్ప ఎన్నికల సామగ్రి లేదు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులను పోలీసులకు ఫిర్యాదు అందక ముందే బిజెపి నేతలు పార్టీ ఆఫీసుకు పిలిపించి వారు విచారణ చేసినట్లు వెల్లడైంది. త్రిస్సూర్‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు కెకె అనీష్‌ కుమార్‌ ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీరించారు.
ఈ కేసులో ఇడి వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది. ఢిల్లీ మద్యం కేసులో ఇడి అరెస్టు చేసిన నిందితులు చెప్పిన అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి కేజరీవాల్‌, కల్వకుంట్ల కవిత తదితరులను అరెస్టు చేసి బెయిలు రాకుండా అడ్డుపడుతున్నది. అదే ఒక రాష్ట్ర పోలీసుశాఖ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నది. పట్టుబడిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అన్న అంశం తేల్చటానికి మూడు సంవత్సరాలు దాటినా ఇంకా దర్యాప్తు జరుపుతూనే ఉన్నామని చెప్పటం అసమర్ధత లేదా ఆ కేసులో ప్రమేయం ఉన్న బిజెపి నేతలు, వారికి నిధులు ఇచ్చిన వారిని రక్షించేందుకు వీలైనంత వరకు కాలయాపన చేయటం తప్ప మరొకటి కాదు. ఇడి కొందరి పట్ల దయగల దేవత, మరికొందరి పట్ల వేధించే దయ్యం మాదిరిగా మారిందన్నది ఈ కేసులో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాధమిక ఆధారాలు, డబ్బు రవాణా చేసిన వారి వివరాలు ఉన్నప్పటికీ ఇంత చిన్న కేసును కూడా సంవత్సరాల తరబడి పరిష్కరించలేని దుస్థితిలో ఇడి ఉందా ?


బిజెపికి అనుకూలంగా ఇడి, ఐటి పని చేయటంలో భాగంగానే త్రిసూర్‌లో తమ పార్టీ బాంకు ఖాతాలను స్థంభింపచేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విమర్శించారు. సిపిఎం ఎన్నికల పనిని దెబ్బతీసేందుకే ఇలా చేశారని అన్నారు. పార్టీకి దేశవ్యాపితంగా ఒకే పాన్‌ నంబరు ఉందని, ఆదాయపన్ను సంబంధిత వివరాలను ఆ శాఖకు సమర్పించినప్పటికీ అక్రమంగా ఐటిశాఖ తనకు లేని అధికారాన్ని ఉపయోగించి ఖాతాను నిలిపివేసిందన్నారు.తమ ఖాతాలున్న బాంకు సిబ్బంది వేరే పాన్‌ నంబరు నమోదు చేసినకారణంగా అనవసర చర్చ ఎందుకని తాము మౌనంగా ఉన్నామని, తమ సిబ్బంది చేసిన తప్పిదాన్ని అంగీకరిస్తూ సదరు బాంకు తమకు ఒక లేఖ కూడా రాసిందని గోవిందన్‌ చెప్పారు. బాంకు తప్పిదం వెల్లడైన తరువాత కూడా తమ ఖాతాల స్థంభన కొనసాగించటం వేధింపు గాక ఏమిటని ప్రశ్నించారు. తప్పుడు పాన్‌ నంబరును ఆధారం చేసుకొని త్రిసూర్‌ జిల్లా పార్టీ కార్యదర్శిని విచారణ పేరుతో వేధించారని, పాన్‌ నంబరు గురించి వివరించినా పట్టించుకోలేదన్నారు.ఈ విచారణను మీడియా పెద్దఎత్తున సిపిఎంకు వ్యతిరేక ప్రచారానికి వాడుకుందని అన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుటుంబ సభ్యులతో కలసి విదేశీ పర్యటన చేయటాన్ని కాంగ్రెస్‌, బిజెపి నేతలు వివాదాస్పదం కావించారు. పర్యటన వివరాలను రహస్యంగా ఉంచారని, అందుకయ్యే ఖర్చును ఎవరు భరించాలో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. మిగతా రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా బిజెపిని మంచిచేసుకొనేందుకే విదేశాలకు వెళుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. పర్యటన పూర్తిగా కుటుంబపరమైందని, ఖర్చంతా వారే భరిస్తారని సిపిఎ స్పష్టం చేసింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

క్రైస్తవ సంతుష్టీకరణ-బెదిరింపు : అద్భుతం ! అనితర సాధ్యం !! బిజెపి ఇలాంటి పనులు కూడా చేస్తుందా !

04 Saturday May 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

appeasement politics, BJP, BJP Appeasement, BJP Christian appeasement, Clean church premises, Nagaland BJP, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


నాగాలాండ్‌ ! ఈశాన్య రాష్ట్రాలలో ఒకటి. జనాభా ఇరవైలక్షలకు పైబడి. భాషలెన్నో తెలుసా 17, అక్షరాలా పదిహేడు. ఆంగ్లం అధికార భాష, అత్యధికులు గిరిజనులే, 2011 జనాభా లెక్కల ప్రకారం 87.92 శాతం మంది క్రైస్తవులు,8.75శాతం హిందువులు. ఇప్పుడు ఈ చిన్న రాష్ట్రం గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే….తమ పూర్వీకుడు, జనసంఫ్‌ు పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన శ్యామ ప్రసాద ముఖర్జీ జూన్‌ 23న 70వ వర్ధంతిని పురస్కరించుకొని మే 11న రాష్ట్రంలోని చర్చ్‌లను శుభ్రపరచాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బెంజమిన్‌ యప్తోమి తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు.దీని మీద మీ మహత్తర సేవలను వేరే చోట ఉపయోగించాలని నాగాలాండ్‌ బాప్టిస్టు చర్చి కౌన్సిల్‌ సున్నితంగా తిరస్కరించింది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(ఎన్‌డిపిపి) అనే ప్రాంతీయ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి ఉంది. నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చిన తరువాత క్రైస్తవుల మీద అసాధారణ రీతిలో హింసాకాండ జరుగుతోందని అందువలన బిజెపి అలాంటి మార్గదర్శకాలను జారీ చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చర్చి కౌన్సిల్‌ సలహా ఇచ్చింది. రాజకీయ పార్టీలు మతపరమైన అంశాలను తీసుకోరాదని హెచ్చరించింది. నాగాలాండ్‌ క్రిస్టియన్‌ రివైవల్‌ చర్చి కౌన్సిల్‌((ఎన్‌సిఆర్‌సిసి) విడిగా ఒక ప్రకటన చేస్తూ స్వార్ధ ప్రయోజనాలకు పవిత్ర స్థలాలను రాజకీయం చేయవద్దని కోరింది. మన సమాజంలో మౌలిక విలువలైన సహనం,గౌరవం, మత స్వేచ్చలను కాపాడాలని పేర్కొన్నది. నాగాలాండ్‌లో చర్చ్‌లను ఊడ్చే కార్యక్రమం బదులు దేశమంతటా వేధింపులకు గురవుతున్న క్రైస్తవుల రక్షణ గురించి కేంద్రీకరించాలని కౌన్సిల్‌ అధ్యక్షుడు రెవరెండ్‌ ఎన్‌ పాఫినో వ్యాఖ్యానించారు.దేశంలో ఇతర ప్రాంతాల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే నాగాలాండ్‌లో చర్చ్‌లను శుభ్రపరచటం ఏమిటని ప్రశ్నించారు.మొత్తం మీద బిజెపి సంతుష్టీకరణ యత్నం వికటించింది. అది బుద్ది తక్కువ నిర్ణయమని ఆ పార్టీ ఎంఎల్‌ఏ ఇమ్‌కాంగ్‌ ఇంచెన్‌ బహిరంగంగానే వర్ణించారు.అలాంటి నిర్ణయం తీసుకొనే ముందు చర్చి అధికారులతో చర్చించి ఉండాల్సిందన్నారు.ముందస్తు అనుమతి లేకుండా ఇతరుల ప్రాంగణాల్లోకి వెళ్లాలనటం అక్రమ ప్రవేశం కిందకు వస్తుందని విమర్శించారు.చర్చ్‌లన్నీ శుభ్రంగా ఉంటాయి, అయినా ఒక రాజకీయ పార్టీ అలాంటి నిర్ణయాలు చేయకూడదన్నారు. తమ ప్రయత్నాన్ని అపార్ధం చేసుకున్నారని, అయితే తమ పార్టీ ఇచ్చిన పిలుపులో చర్చ్‌లని కాకుండా ప్రార్ధనా స్థలాలను శుభ్రం చేయాలని రాసి ఉండాల్సిందని బిజెపి ప్రతినిధి థామస్‌ మాV్‌ా వివరణ ఇచ్చుకున్నారు. ఏ మతాన్ని కించపరచాలని తాము భావించటం లేదన్నారు. ఇంతకూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జారీ చేసిన మార్గదర్శకాలలో కేవలం చర్చ్‌ ప్రాంగణాలను ఊడ్చటమేనా లేక స్నానాల గదులు, మరుగుదొడ్లను కూడా శుభ్రపరచాలని ఉందా ? చర్చ్‌లను ఊడ్చాలనటం మణిపూర్‌లో చర్చ్‌ల మీద, క్రైస్తవులుగా ఉన్న గిరిజనుల మీద జరిపిన దాడుల నివారణలో విఫలమైన బిజెపి ప్రభుత్వ పాపపరిహారార్ధం తీసుకున్న సంతుష్టీకరణ కార్యక్రమమా ?

అధికారం, ఓట్ల కోసం ఇతర పార్టీలు మైనారిటీలసు సంతుష్టీకరిస్తున్నాయని నిత్యం పారాయణం చేస్తున్న బిజెపి ఒక వైపు ముస్లింల మీద విద్వేషాన్ని వెళ్లగక్కుతూ మరోవైపు వారి మీద క్రైస్తవులను ఉసిగొల్పుతూ సంతుష్టీకరించేందుకు చూస్తున్నది. ప్రధాని మోడీ స్వయంగా చర్చ్‌కు వెళ్లటమే గాక కేరళలో, ఇతర మరికొన్ని చోట్ల బిజెపి పడుతున్న పాట్లు తెలిసిందే. మొత్తంగా చూసినపుడు దాడులతో బెదిరింపులు ఒక వైపు సంతుష్టీకరణ మరోవైపు కనిపిస్తున్నది. బిజెపి నేత సినీ హీరో సురేష్‌ గోపి తన కుమార్తె వివాహం శ్రీ కృష్ణ దేవాలయంలో చేయబోయే రెండు రోజుల ముందు త్రిసూర్‌లోని ఒక చర్చికి భార్య, కుమార్తెతో సహా వెళ్లి వర్జిన్‌ మేరీకి ఐదు సావరిన్ల బంగారు కిరీటాన్ని సమర్పించుకున్నారు. ఇదంతా తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లకోసమే చేశారనే విమర్శలు వచ్చాయి.తాము తప్ప ఇతర పార్టీలు మైనారిటీల సంతుష్టీకరణకు చూస్తున్నాయని ఆరోపించే ఆ పార్టీ హిందువుల సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. క్రైస్తవులు ఆంగ్లేయులు, వారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదని ఆరు సంవత్సరాల క్రితం ముంబై ఉత్తర లోక్‌సభ నియోజకవర్గ బిజెపి ఎంపీ గోపాల్‌ షెట్టి ఆరోపించారు.2019 ఎన్నికలకు ముందు అది వివాదాస్పదం కావటంతో తాను రాజీనామా చేస్తానని సదరు ఎంపీ ముందుకు వచ్చారు. దీని గురించి శివసేన పత్రిక సామ్నా ధ్వజమెత్తింది.ఒడిషాలో ఆస్ట్రేలియన్‌ మిషనరీ గ్రాహమ్‌ స్టెయిన్ను చంపినపుడు అక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జెబి పట్నాయక్‌తో కాంగ్రెస్‌ రాజీనామా చేయించింది.వాటికన్‌ చర్చి నుంచి వత్తిడి రావటం, సోనియా గాంధీ క్రైస్తవురాలు కావటం వల్లనే అలా జరిగిందని హిందూత్వ నేతలు విమర్శించారు. ఇప్పుడు ఏమైంది ? సోనియా గాంధీ అధికారంలో లేరు, వాటికన్‌ నుంచి వత్తిడి వచ్చే అవకాశమూ లేదు, గోపాల్‌ షెట్టిని ఒక నేరస్తుడిగా ఎందుకు చూస్తున్నారని, ఇదంతా రాజకీయం,2019 ఎన్నికలకు ముందు క్రైస్తవులను సంతుష్టీకరించే ప్రయోగమే అని శివసేన పత్రిక ధ్వజమెత్తింది. పాల్ఘర్‌ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంలో ఓట్ల కోసం ముఖ్యమంత్రిగా ఉన్న బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ ముంబై వాసైలోని చర్చ్‌లు, మిషనరీల చుట్టూ ప్రదక్షిణలు చేశారని,క్రైస్తవ సమాజ దేశభక్తిని ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని శివసేన పేర్కొన్నది.


చర్చ్‌లు, క్రైస్తవులపై పెరుగుతున్న దాడులకు భయపడిన లేదా లొంగిపోయిన కొందరు క్రైస్తవ మతాధికారులు ” ముందు రక్షణకు ప్రాధాన్యత ” అనే పేరుతో బిజెపితో చేతులు కలిపేందుకు పూనుకున్నారు.దానిలో భాగంగానే గతేడాది ఢిల్లీలో క్రిస్‌మస్‌ విందు ఏర్పాటు దానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరు.దానికి అనేక మంది మతాధికారులతో పాటు కేరళలో రుణ, బంగారం వ్యాపారంలో దిట్టలుగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల దాడుల నుంచి తమ విద్యాసంస్థలు, వ్యాపారాల రక్షణకే వారంతా బిజెపికి అనుకూలంగా మారేందుకు సిద్దపడినట్లు వేరే చెప్పనవసరం లేదు. వివిధ పార్టీలలో ఉన్న వాణిజ్య, పారిశ్రామికవేత్తలను తనవైపు తిప్పుకొనేందుకు ఐటి,సిబిఐ, ఇడిలను ప్రయోగిస్తున్న బిజెపి క్రైస్తవ మతాధిపతులు, వారి ప్రభావంలో ఉన్న సామాన్యుల ఓట్ల కోసం మతాధికారుల మీద కూడా ఆ సంస్థలను ప్రయోగించి దారికి తెచ్చుకుంటున్నది. రకరకాల పేర్లతో ఉన్న సంఘపరివార్‌ సంస్థలు, క్రైస్తవ, ఇస్లామిక్‌ సంస్థలకు విదేశాల నుంచి నిధులు అందుతున్న సంగతి తెలిసిందే. క్రైస్తవ, ఇస్లామిక్‌ సంస్థలకు అందే నిధులను ఏదో ఒకసాకుతో నిలిపివేయించి నిర్వాహకులను దారికి తెచ్చుకొనేందుకు చూస్తున్నారు. ఇడి, ఐటి దాడులకు గురైన కేరళలోని బిలీవర్స్‌ ఈస్టరన్‌ చర్చి స్థాపకుడు ఇవాంజలిస్ట్‌ కెపి యోహనన్‌ కేరళ పత్తానం తిట్ట నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ నేత, మాజీ సిఎం ఏకె ఆంటోని కుమారుడు అనిల్‌ అంటోనికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. వందమంది పాస్టర్లు, ఇతర చర్చినేతలను తిరువళ్ల పట్టణంలో ఒక చోట సమావేశపరిచి మరీ ఈ పని చేశారు. ఒక చర్చి ఒక రాజకీయ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించటం ఇదే ప్రధమం అని అనిల్‌ ఒక ప్రకటనలో సంతోషం వెలిబుచ్చారు. ఈ చర్చికి అనుబంధంగా ఏర్పాటు చేసిన స్వచ్చంద సంస్థలు విదేశాల నుంచి నిధులు పొందుతున్నట్లు ఆరోపించి 2017లో నిధులు పొందకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తరువాత దాని కొనసాగింపుగా చర్చి సంస్థలు, వ్యక్తుల మీద 2020,2022లో ఐటి, ఇడి దాడులు జరిగాయి.విదేశాల నుంచి 2015-16లో రు.2,397 కోట్ల నిధులను పొంది దాన ధర్మాల కోసం వినియోగించాల్సిన వాటిలో వెయ్యి కోట్లు రియలెస్టేట్‌ పెట్టుబడులుగా పెట్టినట్లు వార్తలు వచ్చాయి.కెపి యోహనన్‌ ప్రమేయం ఉన్న గోస్పెల్‌ ఫర్‌ ఆసియా అనే సంస్థ మీద అమెరికాలో నిధుల దుర్వినియోగం కేసు నమోదు కాగా రు.261 కోట్లు చెల్లించి పరిష్కారం చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ పూర్వరంగంలో సదరు చర్చి బహిరంగంగా బిజెపికి మద్దతు ప్రకటించింది.


దేశంలోని పెద్ద రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా కేరళలో 18శాతం క్రైస్తవులు ఉన్నారు.ఆర్థికంగా కూడా బలమైన తరగతి.2014 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నియోజకవర్గంలో బిజెపి నేత ఓ రాజగోపాల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శశి ధరూర్‌పై పదిహేనువేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అక్కడి లాటిన్‌ చర్చి నేతలే తన ఓటమికి కారణమని రాజగోపాల్‌ వాపోయారు. దాంతో క్రైస్తవుల ఓట్లు లేకుండా ముందుకు పోలేమని గ్రహించిన బిజెపి 2019లో చర్చిల చుట్టూ తిరిగినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.శబరిమల దేవాలయంలో మహిళల ప్రవేశాన్ని పెద్ద వివాదంగా మార్చినపుడే బిజెపికి కేరళలో హిందువుల మద్దతు లేదని దానికి వచ్చిన 14.88శాతం ఓట్లు వెల్లడించాయి. తరువాత బిజెపి ఒక సర్వే నిర్వహించి క్రైస్తవ ఓటర్లను ప్రభావితం చేయగలవారెవరు, ఎవరు ఏ సంస్థలను నడుపుతున్నారు, వాటి మంచి చెడ్డలేమిటి అన్న జాబితాను రూపొందించుకొని వారిని తమవైపు తిప్పుకొనేందుకు ఏ అవకాశం దొరుకుతుందా అని బిజెపి చూస్తోంది. ఆక్రమంలో యోహనన్‌ బిజెపి వలకు చిక్కారు. కేరళలో సిరో-మలబార్‌ చర్చి ఒకటి.దానిలో తలెత్తిన వివాదంలో ఒక వర్గం బిజెపికి దగ్గరైంది. అవాస్తవాలు, ముస్లింల పట్ల విద్వేషంతో కూడిన కేరళ స్టోరీ అనే సినిమాను ఎన్నికల ముందు ప్రదర్శించి వారు తమ భక్తిని ప్రదర్శించుకున్నారు. అదే చర్చిలో మరికొందరు అంతే తీవ్రంగా బిజెపిని వ్యతిరేకిస్తున్నారు. బిజెపిని సమర్ధిస్తున్న వారిని ”క్రిసంఘీ” (క్రిస్టియన్‌ + సంఘపరివార్‌) అని పిలుస్తున్నారు. చర్చి నేతలతో సంద్రింపులు జరిపామని తిరువనంతపురం, త్రిసూర్‌,పత్తానంతిట్ట,అట్టింగల్‌ నియోజకవర్గాలలో క్రైస్తవుల మద్దతు కోరినట్లు బిజెపి నేతలు చెప్పినట్లు ఇండియా టుడే పేర్కొన్నది.సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ వికె సక్సేనా కేరళలోని చర్చి అధికారులను కలసి మద్దతును కోరారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించటమే అని కాంగ్రెస్‌ విమర్శించింది.తిరువనంతపురం సమీపంలోని విఝినం అదానీ రేవు నిర్మాణాన్ని చర్చి తరఫున వ్యతిరేకించినందుకు బిజెపి సర్కార్‌ తమ బాంకు ఖాతాలను స్థంభింప చేసిందని ఏప్రిల్‌ 21న తిరువనంతపురం లాటిన్‌ చర్చి ఆర్చిబిషప్‌ థామస్‌ జె నెట్టో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వికె సక్సేనాను కలిసేందుకు నెట్టో తిరస్కరించారు.సిరో మలంకర, బాసిలోస్‌ మార్తమ్మ మాథ్యూస్‌, కాథలిక్స్‌ ఆఫ్‌ ఈస్ట్‌, మలంకర చర్చినేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ ప్రయత్నాలు బిజెపికి ఎంతమేరకు ఉపయోగపడతాయో చూడాల్సి ఉంది. మొత్తం మీద బిజెపి క్రైస్తవ సంతుష్టీకరణ కొత్త పుంతలు తొక్కుతున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

దివ్యాస్త్రం అగ్ని క్షిపణి చైనా, పాకిస్థాన్లను దెబ్బతీస్తుందా ?

12 Tuesday Mar 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Science, USA, WAR

≈ 1 Comment

Tags

Ababeel Missile, Agni V, Agni-V missile test, Arms race, BJP, China, Dongfeng 41, MIRV technology, Missile Matters, Mission Divyastra, Narendra Modi, RSS


ఎం కోటేశ్వరరావు


ఒకేసారి పలు లక్ష్యాలను దెబ్బతీసే ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో అగ్నిా5 తరం క్షిపణి తొలి ప్రయోగం జయప్రదంగా జరిగినట్లు ప్రధాని నరేంద్రమోడీ 2024 మార్చి 11న ప్రకటించారు. దాన్ని దివ్యాస్త్రంగా వర్ణించారు. ఈ విజయానికి కారకులైన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.ఈ ప్రకటనతో మీడియా, సామాజిక మాధ్యమంలో పలు రకాల స్పందనలు వెలువడ్డాయి. ఒక్క క్షిపణితో చైనాలోని పలు లక్ష్యాలను దెబ్బతీయవచ్చు అని కాషాయ దళాలు నడిపే పత్రిక స్వరాజ్య ఒక విశ్లేషణను ప్రచురించింది. మిలిటరీ ఉన్మాదంతో ఊగిపోయే వారికి అలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. పరస్పర అనుమానాలు, కుట్ర సిద్దాంతాలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న నేపధ్యంలో ఏ దేశానికి ఆ దేశం తన రక్షణకు అవసరమైన పాటవాన్ని సమకూర్చుకుంటున్నది, అది ప్రతిదేశానికి ఉన్న హక్కు. అందుకే మనదేశం అణుపరీక్షలు జరిపినా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి) మీద సంతకం చేయకపోయినా కమ్యూనిస్టులతో సహా అందరూ మనదేశ వైఖరిని సమర్ధించారు. సరిగ్గా ఎన్నికల ముందు పరీక్ష నిర్వహించటం, దాని గురించి ప్రధాని ప్రకటించటం, దానికి చైనా వ్యతిరేకతను నూరిపోస్తూ మీడియా స్పందించటం అర్ధం కానంత బ్రహ్మవిద్యేమీ కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన విజయాలు తమ ఘనతే అని రాజకీయపార్టీలు చెప్పుకోవటం ఓట్ల రాజకీయమే. ప్రధాని నరేంద్రమోడీ లాగులు లేదా నిక్కర్లు వేసుకొని తిరుగుతున్న వయస్సులోనే 1958లో అంతకు ముందు విడిగా ఉన్న కొన్ని సంస్థలను కలిపి డిఆర్‌డిఓ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సమిష్టి కృషితో అనేక విజయాలను మన శాస్త్రవేత్తలు సాధించారు, అదే క్రమం కొనసాగుతోంది. మన జాగ్రత్తలో మనం ఉండటం సమర్ధనీయమే, బస్తీమే సవాల్‌ అని ఎదుటివారి మీద తొడగొట్టటం వేరు. రెండవది ప్రమాదకరం అని ప్రపంచ చరిత్ర చెబుతున్నది.


ఓట్ల కోసం మనోభావాలను ముందుకు తేవటం, విద్వేషాన్ని నూరిపోయటం గత పది సంవత్సరాలు, అంతకు ముందు నుంచీ చూస్తున్నదే. కొన్ని వాస్తవాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఐదవతరం అగ్ని క్షిపణితో నిజంగా పాకిస్థాన్‌, చైనాలను దెబ్బతీయగలమా ! కచ్చితంగా తీయగలం, ఎప్పుడు ? వాటి దగ్గర అలాంటివి లేనపుడు, ఉన్నా సన్నద్దంగా లేనపుడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా ? ప్రతి దేశమూ పోటా పోటీగా ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. మనం జరిపింది తొలి పరీక్ష మాత్రమే, ఇది ఐదువేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను దెబ్బతీయవచ్చునని చెబుతున్నారు. ఇలాంటి క్షిపణులను మనకంటే ఎంతో ముందుగా అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, పాకిస్థాన్‌ సమకూర్చుకున్నాయి. మన క్షిపణి ఒకేసారి ఎన్ని బాంబులను మోసుకుపోగలదో తెలియదు, నాలుగు అంటున్నారు. మిగతా దేశాల(రష్యా శాటన్‌-2) దగ్గర 16 బాంబులు(అదే సంఖ్యలో లక్ష్యాలు) మోసుకుపోగలవి ఉన్నట్లు మీడియాలో వెతికితే వివరాలు ఉన్నాయి.మనం తొలిపరీక్ష ఇప్పుడు చేస్తే చైనా 2016నాటికే ఏడు పరీక్షలు జరిపింది, తరువాత కూడా చేస్తున్నది. చైనా వద్ద ఆధునిక డిఎఫ్‌-41క్షిపణి 12 నుంచి 15వేల కిలోమీటర్లు అంటే అమెరికాలో ఉన్న లక్ష్యాలను కూడా తాకగలదు.మనం గనుక ఎదురుదాడికి దిగి క్షిపణిని వదిలితే ఎవరూ పసిగట్టలేరని చెబుతున్నారు. ఇదే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఏ దేశం ఎదురుదాడికి దిగినా అదే జరుగుతుంది. మనకు ఇతరులెంత దూరమో వారికి మనమూ అంతేదూరంలో ఉంటాం. దక్షిణాసియాలో తొలిసారిగా ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్థాన్‌ అబాబీల్‌ క్షిపణిని రూపొందించిందని గమనంలో ఉంచుకోవాలి. దాని పరిధి 2,200కిలోమీటర్లని వార్తలు. ఒకసారి పరీక్షలు మొదలైన తరువాత విస్తరించటం పెద్ద కష్టమేమీ కాదు. మీడియాలో వచ్చినట్లుగా మనమే ఎదురుదాడికి దిగితే మనకంటే బలంగా ఉన్న చైనా ఊరుకుంటుందా ? ఇప్పటికే అది భూమి,మోటారు వాహనాలు, రైళ్ల మీద నుంచి ప్రయోగించే ఎంఐఆర్‌వి క్షిపణులను కలిగి ఉంది.2019లోనే అలాంటి వాటిని మిలిటరీకి అందచేసింది. మనం పరీక్షించిన తాజా క్షిపణిని మిలిటరీకి అందించాలంటే మరికొన్ని సంవత్సరాలు పడుతుంది.


గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ అనే సంస్థ ప్రతిదేశానికి సంబంధించి 60అంశాలను పరిగణనలోకి తీసుకొని 145 దేశాలకు 2024 సంవత్సర సూచికలను ఇచ్చింది.దాని ప్రకారం 0.0000 పాయింట్లు వస్తే ఆ దేశం పక్కాగా ఉన్నట్లు. ఈ ప్రాతిపదికన మొదటి స్థానంలో ఉన్న అమెరికాకు 0.0699, రెండవదిగా ఉన్న రష్యాకు 0.0702, మూడవది చైనాకు 0.0706 రాగా నాలుగవ స్థానంలో ఉన్న మనదేశానికి 0.1023 మార్కులు వచ్చాయి. అంటే చైనా కంటే ఎంతో దిగువన ఉంది. తొలి పది స్థానాల్లో మన తరువాత దక్షిణ కొరియా, బ్రిటన్‌,జపాన్‌, టర్కీ, పాకిస్థాన్‌, ఇటలీ ఉన్నాయి. ఒక వేళ యుద్దమే వస్తే ఇప్పుడున్న ప్రపంచ రాజకీయాలు, సమీకరణల్లో చైనా, పాకిస్థాన్‌ ఒక్కటయ్యే అవకాశం, రష్యా పరోక్షంగా చైనాకు సహరించే పరిస్థితి ఉందని యుద్దం గురించి రంకెలు వేసేవారు గమనించాలి. మన దేశానికి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు పాకిస్థాన్ను అమెరికా ప్రోత్సహించిన కారణంగానే అది ప్రపంచ మిలిటరీలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మిలిటరీ ఖర్చుకు వెనకాడటం లేదు. దాని ఆర్థిక స్థితి దిగజారటానికి ఇది కూడా ఒక కారణం.చైనా జిడిపి, దాని విదేశీమారక ద్రవ్యనిల్వల వంటి అంశాలు మిలిటరీకి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేందుకు వీలు కల్పిస్తున్నది, మనమాపరిస్థితిలో ఉన్నామా ? మనకు వచ్చే ముప్పు గురించి స్వంత నిఘా, సమాచారాన్ని బట్టి వ్యవహరించాల్సి ఉంటుంది. అమెరికా చెప్పేదాన్ని నమ్ముకుంటే నట్టేటమునుగుతాం. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా దళాల కదలికల గురించి అమెరికా చెప్పిన మాటలను నమ్మి ముందుగానే మన మిలిటరీ లడక్‌ పర్వతాల మీదకు వెళ్లి కూర్చున్నది.తరువాతే చైనా దళాలను మోహరించినట్లు వెల్లడైంది. ఇప్పుడు మనం కొండలనుంచి దిగిరాలేని స్థితి, ఖర్చు విపరీతంగా అవుతున్నది.చైనా వైపునుంచి కొత్తగా దురాక్రమణ యత్నాలు ఉన్నట్లు మన ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు.అరుణాచల్‌ సరిహద్దులో చైనా కొత్తగా గ్రామాలను కడుతున్నట్లు కూడా కొన్ని బొమ్మలను చూపి అమెరికా మనలను తప్పుదారి పట్టించేందుకు చూసిన సంగతి తెలిసిందే. ఆధునిక ఆయుధాలు, నిధులతో ఉక్రెయిన్‌లో రష్యా సేనలను ఒక్కదెబ్బతో వెనక్కు కొట్టగలమని అమెరికన్లు ఇతర నాటో దేశాలను నమ్మించారు. రెండు సంవత్సరాలు గడిచినా అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. మధ్యలో ఇరుక్కున్న ఉక్రెయిన్‌ చావుదెబ్బలు తింటున్నది.


అంతరిక్షంలో అమెరికా మిలిటరీ ఆధిపత్యాన్నే సవాలు చేసే స్థితికి చైనా చేరుకుందనే అంశం మనదేశంలో యుద్ధం గురించి కలలు కనేవారికి తెలుసా? ఇటీవలి కాలంలో ఈ రంగంలో అమెరికాకు దగ్గరగా చైనా వచ్చిందని, అమెరికా నిశ్చింతగా లైటార్పి పడుకున్నట్లుగా కనిపిస్తోందని ఆ రంగంలో నిపుణుడు డీన్‌ చెంగ్‌ చెప్పినట్లు 2023 డిసెంబరు 13న అమెరికా ఎన్‌బిసి న్యూస్‌ పేర్కొన్నది. ప్రపంచమంతటా అంతరిక్ష ఉపగ్రహాల ద్వారా మిలిటరీ నియంత్రణలో అమెరికా ముందున్నది.వాటిని దెబ్బతీసే, పనికిరాకుండా చేసే, ఆయుధాలను చైనా తయారు చేస్తున్నదని అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ నివేదికలు గగ్గోలు పెడుతున్నాయి. చైనా 2019-21 సంవత్సరాలలో తన ఉపగ్రహాల సంఖ్యను 250 నుంచి 499కి పెంచుకుందని రక్షణ నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఆధునిక నిఘా బెలూన్లు,హైపర్‌సోనిక్‌ క్షిపణులను ఉపగ్రహాలకు దిగువన, విమానాలు ఎగిరే ఎత్తుకు ఎగువన చైనా మోహరించింది. ఇటీవల ఉపగ్రహాలకు తిరిగి ఇంథనాన్ని నింపే ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది.భూమి లేదా గగనతలం నుంచి క్షిపణులను, లేజర్లను ప్రయోగించి అంతరిక్షంలోని శత్రు ఉపగ్రహాలను ధ్వంసం చేసే పరిశోధనలు కూడా చేస్తున్నదని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు.ధ్వనికంటే కనీసం 20రెట్ల వేగంతో ప్రయాణించే క్షిపణులు భూమిని చుట్టివచ్చి లక్ష్యాలను దెబ్బతీసేవాటిని చైనా పరీక్షిస్తున్నదని కూడా అమెరికా భయపడుతోంది. అందువలన మన అగ్ని క్షిపణితో చైనాను దెబ్బతీయగలమని ఎవరైనా కలగన్నా, చెప్పినా అది వాస్తవ విరుద్దం తప్ప మరొకటి కాదు. భూతలం నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణుల అంశంలో రెండు దేశాల మధ్య ఉన్న తీవ్ర అంతరం కొంత మేర తగ్గుతుంది.నౌకా దళ బలాబలాల్లో మన దేశం ఎంతో వెనుకబడి ఉంది. జలాంతర్గాములు చైనా వద్ద 61 ఉండగా మనకు 18 మాత్రమే ఉన్నాయి.


ప్రతి దేశమూ తన మిలిటరీ పాటవాన్ని పెంచుకొనేందుకే చూస్తున్నది. ఈ విషయంలో పాకిస్థాన్‌ కూడా వెనుకబడిలేదు.మనకంటే ముందే 2023 అక్టోబరు చివరిలో ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో అబాబీల్‌ అనే క్షిపణి ప్రయోగం జరిపినట్లు డిప్లోమాట్‌ పత్రిక నవంబరు 18న ఒక విశ్లేషణ వెలువరించింది.మనదేశం బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ(బిఎండి)ను ఏర్పాటు చేస్తున్నందున దానికి విరుగుడుగా ఎంఐఆర్‌వి క్షిపణులను పాకిస్థాన్‌ రూపొందించినట్లు దానిలో పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ సమీపంలో నిర్మిస్తున్న బిఎండి రాడార్‌ కేంద్రం 2024లో అందుబాటులోకి వస్తుందని, మరో కేంద్రాన్ని మధ్య ప్రదేశ్‌లో నిర్మిస్తున్నట్లు కూడా డిప్లొమాట్‌ రాసింది. నౌకల మీద కూడా ఇలాంటి రాడార్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఐఎన్‌ఎస్‌ అన్వేష్‌ అలాంటి నౌకే. ఇవి రెండు నుంచి ఐదువేల కిలోమీటర్ల పరిధిలో క్షిపణులను పసిగట్టి మధ్యలోనే కూల్చివేస్తాయి. తొలిదశలో న్యూఢిల్లీ, ముంబై నగరాలకు రక్షణ కల్పిస్తారు.


మార్చి 11-16 తేదీల మధ్య ఎప్పుడైనా తాము మూడున్నర వేల కిలోమీటర్ల పరిధిలో క్షిపణి ప్రయోగం జరపవచ్చని ఆ పరిధిలోకి వచ్చేవారు తగు జాగ్రత్తలు పాటించాలని మన రక్షణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేయటం తెలిసిందే. ఆ సంగతి తెలిసే అగ్ని – 5 క్షిపణి ప్రయోగాన్ని చూసి భయపడిన చైనా తన గూఢచారి నౌకను విశాఖపట్టణానికి 260 నాటికల్‌ మైళ్ల దూరంలో లంగరు వేసినట్లు ఒక పత్రిక రాసింది.చైనా తాను జరుపుతున్న ప్రయోగాల గురించి కూడా ముందుగానే ప్రకటిస్తుంది. మనం కూడా చైనా సమీపంలోని అంతర్జాతీయ జలాల్లోకి నౌకలను పంపి నిఘావేయవచ్చు. ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకొనేందుకు 2012 నుంచి మన శాస్త్రవేత్తలు పని చేస్తున్నది, మన అగ్ని క్షిపణుల సామర్ధ్యం బహిరంగ రహస్యం.గతంలో ఒక చైనా నౌక శ్రీలంకకు వచ్చినపుడు,ప్రస్తుతం మాల్దీవుల సమీపంలో ఉన్న మరొక నౌక గురించి కూడా ఇలాగే రాశారు. ఇతరుల బలాబలాలను తెలుసుకొనేందుకు మనదేశం ఎలా ప్రయత్నిస్తుందో ప్రతిదేశమూ అదే చేస్తుందన్నది కూడా అందరికీ తెలిసిందే.మనకే అలాంటి హక్కు ఉండాలి, ఇతరులకు కూడదు అంటే కుదురుతుందా ! అమెరికా విమానవాహక యుద్ధ నౌకలు, ఇతర మిలిటరీ నౌకలు నిత్యం ప్రపంచమంతటా తిరుగుతుంటాయి, అనేక ప్రాంతాల్లో లంగరు వేయటం తెలిసిందే. అవి విహారయాత్రలు చేస్తున్నట్లు చెప్పగలమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d