• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi

అయోధ్య రామాలయ వివాదం : ఎరక్కపోయి ఇరుక్కున్న గాయని చిత్ర ! శంకరాచార్యలపై కేంద్ర మంత్రి ధ్వజం !!

17 Wednesday Jan 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

#ks Chithra, #Pinarayi Vijayan, BJP, Kerala CPI(M), Narayan Rane, Narendra Modi, Ram temple, Ram Temple politics, RSS, Sanatan Hindu Dharma, sankaracharya, shiva sena, Singer Chitra


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జరిగేవరకు దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు వివాదాలు కూడా కొనసాగేట్లున్నాయి. మతాన్ని, విశ్వాసాలను పాటించేవారు మౌనంగా ఉండగా ఓట్ల కోసం రాముడిని ముందుకు తెచ్చిన రాజకీయ కుహనా హిందూత్వవాదులదే పైచేయి కావటం ప్రత్యేకత. తెలిసిగానీ తెలియకగానీ చేసిన ప్రకటనలతో సుప్రసిద్ద గాయని చిత్ర తాజాగా సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. జనవరి 22న విగ్రహ ప్రతిష్ట జరిగే 12.20ని సమయంలో శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ సంకీర్తన జరపాలని, జ్యోతులను వెలిగించాలని, లోకసమస్తా సుఖినోభవంతు అంటూ గాయని చిత్ర సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు, విడుదల చేసిన వీడియోలో కోరారు.దీని మీద అనేక మంది అనుకూలంగానూ వ్యతిరేకంగానూ స్పందించారు. బిజెపి నేతలు కేరళ ప్రభుత్వం మీద, కమ్యూనిస్టుల మీద దాడికి ఉపయోగించుకున్నారు. వామపక్ష పాలిత రాష్ట్రంలో అసహనానికి ఇది నిదర్శనమంటూ ఆరోపించారు. సామాజిక మాధ్యమం మీద కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి గానీ ఎలాంటి నియంత్రణ, అధికారం లేదు. వామపక్షాలు, పురోగామి భావాలకు వ్యతిరేకంగా సంఘపరివార్‌, బిజెపి నేతల స్పందనలు అదే సామాజిక మీడియా, సంప్రదాయ మీడియాలో చోటు చేసుకుంటున్నాయంటే అసహనం, వ్యతిరేకత ఉంటే కుదిరేదా ? తన మీద వచ్చిన విమర్శలు లేదా ప్రశంసల గురించి గానీ ఇది రాస్తున్న సమయానికి చిత్ర వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు.


భావ వ్యక్తీకరణ హక్కులో భాగంగా ఇతరుల హక్కులకు భంగం కలుగకుండా ఏమైనా చెప్పవచ్చు. ఆ రీత్యా చూసినపుడు చిత్ర తన భావాన్ని వ్యక్తం చేశారు. అయితే అదే భావ వ్యక్తీకరణలో భాగంగా ఒకరి భావాలను మరొకరు విమర్శించే హక్కు కూడా మన రాజ్యాంగం కల్పించింది. అఫ్‌కోర్సు దానికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. నూరుపూవులు పూయనివ్వండి, వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నట్లుగా భావజాల చర్చ జరగాల్సిందే. చిత్రను సమర్ధించిన వారు కొందరైతే అలాంటి సందేశం ద్వారా రాజకీయ వైఖరులను తీసుకున్నారని మరికొందరు విమర్శించారు. ” చిత్రకు భావ ప్రకటనా స్వేచ్చ ఉంది, ఆమె నచ్చిన వైపు నిలిచే స్వేచ్చ కూడా ఉంది.ఆమె తన ఇంట్లో రామ భజన చేయవచ్చు, దీపాలను వెలిగించుకోవచ్చు. మారణకాండకు, జాత్యంహంకారానికి దారితీసే ఒక కారణాన్ని అమాయకంగా ఉత్సవంగా జరుపుకోవటంలో హానికరమైనది కనిపించకపోవచ్చుగానీ అది వాస్తవానికి అది ఎంతో బాధాకర అనుభవం అని రచయిత్రి ఇందూ మీనన్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో చిత్ర తీరును విమర్శించారు. జనాల రక్తం, వలసలు, వారి బాధలు పట్టకుండా మీరు రామ భజన చేస్తున్నారు.రాముడు లేదా విష్ణువు రాబోవటం లేదు. మీరు ఐదులక్షల దీపాలను వెలిగించినప్పటికీ మీ బుర్ర వెలుగుతో నిండదు. మీ కంఠం కారణంగానే మిమ్మల్ని నైటింగేల్‌(పశ్చిమ దేశాల్లో కోకిల వంటి మధురంగా కూసే పక్షి) అని భావించారు, కానీ మీరు నకిలీ నైటింగేల్‌ అని రుజువైంది అని ఇందూ మీనన్‌ తీవ్రంగా విమర్శించారు.చరిత్రను విస్మరించి ప్రతివారూ సుఖంగా ఉండాలని చెప్పేవారి అమాయకత్వం ఇక్కడ ముఖ్యమైనదని గాయకుడు సూరజ్‌ సంతోష్‌ అన్నారు.మసీదును కూల్చివేసి దేవాలయాన్ని కట్టిన చరిత్రను చిత్ర కావాలనే మరచినట్లు విమర్శించారు. ప్రముఖ గాయకుడు జి వేణుగోపాల్‌ ఒక వైపు చిత్రకు మద్దతు ఇస్తూనే ఆమె ప్రకటనలపట్ల ఏవైనా విబేధాలుంటే విమర్శించేవారు ఆమెను క్షమించాలని వ్యాఖ్యానించారు. ఆమె కేవలం భక్తిభావంతో చెప్పారే తప్ప రాజకీయ కోణం తెలియదని అన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదని, మనకోసం వేలాది పాటలు పాడిందని అన్నారు. క్షమించాల్సినంత తప్పేమి చేసిందని కొందరు వ్యాఖ్యానించారు.గాయని చిత్ర గతాన్ని చూసినపుడు ఎలాంటి వివాదాలలో చిక్కుకోలేదు. వివాదాస్పద వ్యాఖ్యలూ చేసిన చరిత్ర లేదు.ప్రతిదాన్నీ రాజకీయం గావిస్తున్న వర్తమానంలో ప్రజాజీవనంలో ఉన్న ప్రముఖులు తాము చేసే ప్రకటనల పట్ల తగిన జాగరూకత పాటించాలని ఈ ఉదంతం వెల్లడిస్తున్నది.


సుప్రీం కోర్టే ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.విశ్వాసం ఉన్నవారు అయోధ్య రామాలయానికి వెళ్లవచ్చు, లేనివారు వెళ్లకపోవచ్చు, గాయని చిత్ర ప్రకటనను వివాదాస్పదం కావించాల్సిన అవసరం ఏముంది, తమ అభిప్రాయాలను ఎవరైనా వెల్లడించుకోవచ్చని సిపిఎం నేత, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ వ్యాఖ్యానించారు.కేరళ ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత విడి సతీశన్‌ మాట్లాడుతూ భౌతిక దాడులు చేయలేనపుడు సామాజిక మాధ్యమాల ద్వారా దాడి చేయటం ఫాసిజం అన్నారు. మనం చిత్ర వైఖరితో అంగీకరించకపోవచ్చు, ఆమె వైఖరిని ఆమెను వెలిబుచ్చనివ్వండి, ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కుంది, ఎవరైనా అంతకు ముందు చెప్పని వాటి గురించి మాట్లాడటాన్ని ప్రశ్నించవచ్చు అన్నారు. సనాతన ధర్మాన్ని నమ్ముతున్న కారణంగానే గాయని చిత్ర మీద విమర్శలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ ఆరోపించారు. వామపక్ష-జీహాదీ వాతావరణంలో ఉన్నవారే దాడులు చేస్తున్నారన్నారు.ఈ విమర్శలు చేస్తున్నవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. పినరయి విజయన్‌ పాలనలో హిందువులు తోటి వారితో తమ విశ్వాసాలను పంచుకొనే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌ దీని మీద మౌనంగా ఉందని ఎక్స్‌లో ఆరోపించారు. కేరళకు చెందిన కేంద్ర మంత్రి వి మురళీధరన్‌ విలేకర్లతో మాట్లాడుతూ అయోధ్యను అవకాశంగా తీసుకొని హిందూ సమాజాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. వామపక్షం, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో అసహనానికి ఒక ఉదాహరణ చిత్ర మీద చేస్తున్న విమర్శలని జాతీయ మహిళాకమిషన్‌ సభ్యురాలు, బిజెపి నేత కుషఉ్బ ఆరోపించారు.


మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి నారాయణ రాణే శంకరాచార్యల మీద ధ్వజమెత్తటాన్ని కుషఉ్బ వంటి వారు ఎలా వర్ణిస్తారు.నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు, ఇతర మతాల వారిని పక్కన పెడితే హిందూమతాన్ని నమ్మేవారు, పాటించేవారికి నలుగురు శంకరాచార్యలు పూజనీయులు ! ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ ఏదో ఒక సమయంలో వారి పాదాలవద్ద చేరి ఆశీస్సులు పొందిన వారే. రామాలయ ప్రతిష్ట మీద వారు మాట్లాడినదాన్ని ఇప్పుడు ఎందుకు సవాలు చేస్తున్నట్లు ? హిందూ ధర్మానికి మీరేమి చేశారని గతంలో ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదన్నది కీలక అంశం. శంకరాచార్యులను అవమానించినందుకు గాను కేంద్ర మంత్రి రాణేను పదవి, పార్టీ నుంచి తొలగించాలని శివసేన నేత ఉద్దావ్‌ థాకరే డిమాండ్‌ చేశారు. బిజెపి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా కోరారు. రాణేకు వ్యతిరేకంగా ఆదివారం నాడు నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అంతకు ముందు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో మంత్రి రాణే విలేకర్లతో మాట్లాడుతూ శంకరాచార్యలు ప్రధాని నరేంద్రమోడీ,బిజెపిని రాజకీయ కోణం నుంచి చూస్తున్నారని ఆరోపించారు. ఇంతవరకు ఏ ఒక్కరూ ఏమీ చేయలేదని, ప్రధాని మోడీ, బిజెపి బాధ్యతను తీసుకొని రామాలయాన్ని నిర్మించిందని, దాన్ని వారు ఆశీర్వదించాలా లేక విమర్శించాలా ? ఆలయాన్ని రాజకీయాలకోసం కాదు మతం కోసం నిర్మించాము, రాముడు మా దేవుడు.హిందూమతం కోసం తామేమీ చేసిందీ శంకరాచార్యలు చెప్పాలని రాణే డిమాండ్‌ చేశారు. శంకరాచార్యలు రాకపోవటానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా కారకులే అని శివసేన విమర్శించింది. వారు రాకపోతేనే మీ బొమ్మలు కనిపిస్తాయి, వస్తే వారి చిత్రాలనే పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నది.రామాలయాన్ని కూల్చి బాబరీ మసీదును కట్టారని ఇంతకాలం సంఘపరివారం ఆరోపించింది.కానీ పూర్తికాని రామాలయాన్ని ఎన్నికల కోసం ముందే ప్రారంభించారన్న విమర్శలు ఇప్పుడు చరిత్రకెక్కాయి. ఇది వాస్తవం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నయనతారకు ఒక న్యాయం,రామాలయ ట్రస్టుకు మరొకటా ! పవిత్ర కట్టడం కాదు సమాధి అన్న శంకరాచార్య !! హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదెవరు ?

15 Monday Jan 2024

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

# Anti Sanatan Dhrma, #Annapoorani, Ayodhya Ramalayam, BJP, Narendra Modi, Nayanthara's Film, RSS, sankaracharya


ఎం కోటేశ్వరరావు


నయనతార ప్రధాన పాత్రలో నటించిన అన్నపూరణి సినిమా తమ మనోభావాలను గాయపరచిందని హిందూత్వవాదులు ఫిర్యాదు చేసిన కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ ఆ సినిమాను తన వేదిక నుంచి తొలగించింది. ఒక బ్రాహ్మణ పూజారి కుమార్తె బతుకుతెరువు కోసం వంటగత్తెగా మారి ఎలా ఎదిగిందన్నది ప్రధాన కథ. తండ్రి ప్రసాదాలు వండి వడ్డిస్తే, కుటుంబ ఆంక్షలకు భిన్నంగా పాకశాస్త్ర కాలేజీలో చేరి మాంసాహార తయారీ నేర్చుకోవటమే గాక, ఒక రోజు తింటూ కనిపిస్తుంది. ఆ క్రమంలో ఆమెకు బలవంతంగా వివాహం చేసేందుకు తండ్రి చూడటంతో ఇష్టం లేనందున తన స్నేహితుడు ఫర్హాన్‌తో కలసి ఇంటి నుంచి పారిపోతుంది. ఈ సినిమాను సెన్సార్‌ బోర్డు అనుమతించిన తరువాత విడుదలైంది. అయితే కొద్ది రోజుల తరువాత ఆ కథ, చిత్రీకరణలో తమ దేవతలు మాంసాహారాన్ని తింటున్నట్లు చిత్రించారని, ఇది హిందూమత, బ్రాహ్మణ కుల మనోభావాలను గాయపరచిందంటూ ఫిర్యాదులు, పోలీసు కేసుల దాఖలు వరకు హిందూత్వవాదులు వెళ్లారు.లవ్‌ జీహాద్‌ కోణం కూడా ఉందని ఆరోపించారు. ఇదే సమయంలో అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట శాస్త్రవిరుద్దంగా జరుగుతోందంటూ ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏకంగా నలుగురు శంకరాచార్యలు తిరస్కరించారు. వారి మనోభావాలు దెబ్బతిన్న కారణంగానే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. భార్యలేని నరేంద్రమోడీ విగ్రహ ప్రతిష్ట పూజలకు అనర్హులని సామాజిక మాధ్యమంలో వ్యతిరేక, అనుకూల వాదనలు వెల్లువెత్తాయి. శంకరాచార్యుల వ్యాఖ్యల మీద మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రామాలయ ట్రస్టు చేస్తున్నది సనాతన హిందూ ధర్మ విరుద్దమని వారు ప్రకటించినప్పటికీ ఏ ఒక్క హిందూత్వవాది మనోభావాలూ గాయపడలేదు, ఆ కార్యక్రమం మీద ఎలాంటి పోలీసు కేసులు నమోదు చేయలేదు. ఎవరు ఎవరి మనోభావాలను దెబ్బతీశారు. కొందరిపైనే హిందూత్వవాదులు ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారు.శంకరాచార్యులు చెప్పిన మాటలనే ఏ నాస్తికులో, హేతువాదులో చెప్పి ఉంటే ఈ పాటికి ఎంత రచ్చ జరిగి ఉండేది !


బాబరీ మసీదు-రామ మందిర వివాదానికి సుప్రీం కోర్టు తెరదించింది. ఆ తీర్పు గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా దాన్నెవరూ సవాలు చేయలేదు. ఆ మేరకు బాబరీ మసీదును కూల్చిన ప్రాంతంలో రామాలయ నిర్మాణం జరుగుతోంది.అది పూర్తిగాక ముందే ప్రారంభానికి ముహూర్తం పెట్టటంతో కొన్ని వివాదాలు తలెత్తాయి. వాటిని నాస్తికులు, హేతువాదులు, అబ్రహామిక్‌ మతాల వారో చెప్పలేదు. సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధులుగా, భాష్యం చెబుతున్న నలుగురు శంకరాచార్యులే అభ్యంతరాలను లేవనెత్తారు. రామాలయ నిర్మాణం కావించిన నరేంద్రమోడీ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిధిగా రావటాన్ని సహించలేని శంకరాచార్యులు తమ మనోభావాలను గాయపరుస్తున్నారంటూ వారి మీద సామాజిక మాధ్యమంలో మోడీ భక్తులు విరుచుకుపడుతున్నారు. అసలు రామాలయ ఉద్యమంలో వారెక్కడ ఉన్నారని సవాళ్లు విసురుతున్నారు. తమ మనోభావాలను దెబ్బతీస్తూ సనాతన ధర్మ విరుద్ద పద్దతులకు తెరతీశారని శంకరాచార్యులను అనుసరించేవారు కుమిలిపోతున్నారు. ఎవరైనా నరేంద్రమోడీ చేస్తున్నది ధర్మవిరుద్దం అంటూ వీధుల్లోకి వస్తే వారి వీపులకు హామీ లేదనే వాతావరణం నేడుంది అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. హిందూ మతంలోని అసంబద్దతలు, మతం లేదా మనుస్మృతి పేరుతో అమలు జరిపిన వివక్షాపూరితమైన చర్యలను ప్రశ్నించిన నాస్తికులు, హేతువాదులు, సంస్కరణ వాదులు, పురోగామివాదులు, కమ్యూనిస్టులను హిందూ ద్వేషులు, సనాతన ధర్మవిరోధులుగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు హిందూత్వను పరిరక్షిస్తామని చెబుతున్నవారు శంకరాచార్యులను కూడా ఆ జాబితాలో చేరుస్తారా ? లేదా సనాతనాన్ని నిలబెట్టాలని కంకణం కట్టుకున్నాం అనుకుంటున్నవారు రామాలయాన్ని రాజకీయం చేసిన నరేంద్రమోడీ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలను ధర్మం కోసం- దేశం కోసం వ్యతిరేకిస్తారో లేదో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చింది.


హిందూ ఉనికి కోసం పోరాటం(స్ట్రగుల్‌ ఫర్‌ హిందూ ఎగ్జిస్టెన్స్‌.ఓఆర్‌జి) అనే వెబ్‌ సైట్‌ జనవరి ఏడవ తేదీన దైనిక్‌ జాగరణ్‌ అనే పత్రిక ప్రచురించిన ఒక వ్యాసం ఆధారంగా చేసిన వ్యాఖ్యను తన సైట్‌లో ఉంచింది. నలుగురు సనాతన హిందూ ధర్మ గురువులు ఎందుకు రామ మందిర ప్రాణప్రతిష్టలో పాల్గొనటం లేదు అన్నది దాని శీర్షిక. దాన్ని రాసిన వారు ఉపేంద్ర భారతి, శౌనక్‌ రారు చౌదరి. వారి రచనలో పేర్కొన్న కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.” గోవర్ధన మఠ పూరీ పీఠ శంకరాచార్య స్వామి శ్రీ నిశ్చలానంద సరస్వతి అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరస్కరించారు. ఆయనిలా చెప్పారు.” పవిత్ర ఆలయ నిర్మాణంవైపుగా ప్రభుత్వ ప్రయత్నం లేదు ” ఆయన మాటల్లోనే ” ఒక సమాధి ” అని ఆ నిర్మాణాన్ని వర్ణించటాన్ని బట్టి సాంప్రదాయ ఆలయ నిర్మాణానికి ఉండవలసిన పూజ్యభావం మరియు పవిత్రత దానికి లేవు అని సూచించినట్లయింది. తగిన గౌరవంలేని స్థలానికి వెళ్లటం ఇష్టం లేదనే ఆయన నిర్ణయం వెల్లడిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవటం అంటే శ్రీరాముడిని తిరస్కరించటం కాదు. కొందరు నేతల అవకాశవాద, తిమ్మినిబమ్మిని చేసే రాజకీయాలకు వ్యతిరేకం.


శృంగేరి శారదా పీఠ శంకరాచార్య స్వామి శ్రీ భారతీ తీర్ధ ఎందుకు తిరస్కరించారంటే ఆలయ నిర్మాణం అసంపూర్తిగా జరగటమే.అలాంటి దానికి వెళ్లటం సరైన చర్యకాదు. దీనితో పాటే ఆసియాలో అతి పెద్దదైన మసీదును అయోధ్యలో నిర్మించాలని తలపెట్టటం పట్ల ఆయన తన ఆందోళన వెల్లడించారు. దురదృష్టకరమైన పరిణామాలుగా భావిస్తున్నారు.తాను, ఇతరులు కోర్టుకు రామమందిరం సాక్ష్యాలను సమర్పించామని, కానీ రామమందిర ట్రస్ట్‌ లేదా దాని ప్రతినిధులుగానీ ఆలయనిర్మాణంలో తమ సలహాలు తీసుకోలేదని భారతీ తీర్ధ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలో ద్వంద్వ వైఖరి ఉన్నట్లు శంకరాచార్య విమర్శించారు. రామాలయ నిర్మాణం చేసినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మనోభావాలను ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతీ తీర్ధ నిరాకరణకు ప్రాణ ప్రతిష్ట పవిత్రత, నిర్మాణ క్రమం పట్ల అసంతృప్తి, మత వ్యవహారాల పట్ల ప్రభుత్వ వైఖరికి తిరస్కరణగా చెప్పవచ్చు.


ద్వారకా పీఠ శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి అనేక అంశాల మీద ఆందోళన వెల్లడించారు. పుష్య మాసం ప్రాణప్రతిష్టకు శుభప్రదం కాదన్నది మొదటి విమర్శ.దేవతల ప్రతిష్టాపన అశుభ గడియల్లో చేపట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. సరైన సమయం వచ్చే శ్రీరామ నవమి అవుతుంది.రామ నవమి నాటికి ఎన్నికల నియమావళి అడ్డం వస్తుంది గనుక ముందుగానే ఎంచుకోవటం వ్యూహాత్మకమని, అప్పుడు జరిపితే పెద్దగా ఉపయోగం ఉండదని బిజెపి నేతలు భావించిన కారణంగానే నిర్మాణం పూర్తి కాకుండా ముందుగానే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని సదానంద సరస్వతి భావిస్తున్నారు. మతపరమైన అంశాలు, రాజకీయ ఉద్దేశ్యాలు, ప్రాణ ప్రతిష్ట సమయం, నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించటం అనే అంశాలు అయోధ్య రావటం లేదని చెప్పటానికి సదానంద సరస్వతి కారణాలుగా చెప్పవచ్చు.


ఉత్తరాఖండ్‌ జ్యోతిర్‌మఠ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తిరస్కరణకు మతపరమైన, సామాజిక అంశాలు ఉన్నాయి. వేదాలు, హిందూ మత గ్రంధాల్లో బ్రాహ్మణుల పాత్ర గురించి ప్రత్యేక స్థానం ఉంది. పూజారులుగా కేవలం వారినే నియమించాలి.ప్రత్యేకించి శూద్రులను పూజారులుగా నియమించటాన్ని ఆయన విమర్శిస్తున్నారు. మత ఆచారాల ఫలాలను అందరూ పొందటానికి అర్హులే అయినప్పటికీ శూద్రులు సేవకు మాత్రమే పరిమితం, సనాతన హిందూ ధర్మంలో వివక్ష ఉందనటాన్ని ఆయన ఖండిస్తారు.బ్రాహ్మణులకు బదులు పూజారులుగా శూద్రుల నియామకం వేదాలకు విరుద్ధం అని భావిస్తారు. అలాంటి నియామకాలు శ్రీ రాముడితో ముడివడిన ఆదర్శాలకు విరుద్దం, వేదాల్లో చెప్పినట్లు సామాజిక వ్యవస్థ ఉండాలి అంటారు. వీటికి విరుద్దంగా జరుగుతున్న కారణంగానే అవిముక్తేశ్వరానంద హాజరు కావటం లేదు. రాజకీయ లబ్దికోసం ఒకనాడు శంకరాచార్యుల పాదాల ముందు మోకరిల్లిన నరేంద్రమోడీ ఇప్పుడు సనాతన విలువలు, మర్యాదలకు భిన్నంగా అధర్మంగా వ్యవహరించటం దురదృష్టకరం. రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రారు ప్రధాని మోడీలో విష్ణు అవతారాన్ని మాత్రమే చూస్తున్నారు. నలుగురు శంకరాచార్యల్లో శివుడిని చూడలేకపోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్టలో హిందూ ధర్మంలోని ఉన్నత ధర్మ గురువులు భాగస్వాములు గాకపోవటం దురదృష్టకరం. ఇది కేవలం మతపరమైన ఎదురుదెబ్బే కాదు సామాజిక, రాజకీయ చిక్కులను కూడా తీసుకువస్తాయి. ఇదీ స్ట్రగుల్‌ ఫర్‌ హిందూ ఎగ్జిస్టెన్స్‌.ఓఆర్‌జి విశ్లేషణ, వ్యాఖ్య సారం. ఈ భావాలు, అభిప్రాయాలతో నిజమైన హిందువులు ఏకీభవిస్తారు తప్ప రాజకీయ హిందూత్వ వాదులకు మింగుడు పడదు. పురోగామి వాదుల దృష్టిలో మతం వ్యక్తిగతం, రాజీకీయాల్లోకి చొప్పించకూడదని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు మతాన్ని రాజకీయాలకు ముడి పెట్టారని ఏకంగా శంకరాచార్యలు చెప్పటమే కొసమెరుపు.


విశ్వాసుల ఖర్మో లేక రాముడికి పరీక్షో గానీ రామాలయాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు మోసగాండ్లు బయలుదేరారు. జనవరి 22 అయోధ్య రామాలయ ప్రతిష్టకు ఆహ్వానం అంటూ వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో మోసగాండ్లు రెచ్చిపోతున్నారని వార్తలు.” రామజన్మ భూమి గృహసంపర్క్‌ అభియాన్‌.ఏపికే ” పేరుతో ఉన్న యాప్‌ను ఫోన్లో ఏర్పాటు చేసుకోవాలని, దానితో ప్రముఖుల పాస్‌లను పొందాలని కోరుతున్న మెసేజ్‌లు మొదలయ్యాయి.ఎవరైనా ఆ పని చేస్తే తమ సమాచారం మొత్తాన్ని దొంగలకు స్వయంగా అప్పగించినట్లే.ఇక అనేక వెబ్‌సైట్లు కూడా ప్రారంభమై దోచుకోవటం ప్రారంభించాయి. రాముడి ప్రసాదం ఉచితంగా పంపుతామని, మీరు చేయవలసిందల్లా రవాణా ఖర్చులు ముందుగా పంపటమేనని పేర్కొంటున్నాయి. ఇది మీ జేబులోని సొమ్ముతో పాటు మీ సమాచారాన్ని కూడా మోసగాండ్లకు అప్పగించటమే అవుతుంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మలుపు తిరిగిన రామాలయ వివాదం : నలుగురు శంకరాచార్యలూ దూరం ! వారి డిఎన్‌ఏల గురించి బిజెపి ప్రశ్నిస్తుందా !!

12 Friday Jan 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, NATIONAL NEWS, Opinion, Political Parties, Uncategorized

≈ Leave a comment

Tags

Adi Shankara, BJP, Narendra Modi, Ram Temple row, RSS, Sanatan Hindu Dharma, shankaracharyas


ఎం కోటేశ్వరరావు


మొన్న సిపిఎం నేత సీతారాం ఏచూరి, నిన్న కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ అయోధ్య రామాలయ ప్రతిష్టకు రావటం లేదని చెప్పగానే బిజెపి నేతలు అసలు వారి డిఎన్‌ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందంటూ ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ప్రచారదాడి చేస్తున్నారు. రధయాత్ర నిర్వహించిన ఎల్‌కె అద్వానీని ఆ ఛాయలకే రావద్దని చెప్పిన పెద్దలు ఓటు బాంకు రాజకీయం గాకపోతే వారి డిఎన్‌ఏ గురించి ముందే తెలిసినపుడు అసలు ఆహ్వానాలు పంపటం ఎందుకు ? కమ్యూనిస్టులు దేవాలయాలు, మసీదులు, చర్చ్‌ల ప్రారంభాలకు రారని అందరికీ తెలుసు.వారు లేదా కాంగ్రెస్‌ నేతలు గానీ బిజెపి మత రాజకీయాలను విమర్శించటం ఇప్పుడు కొత్తగా చేసింది కాదు. హిందూమతానికి భాష్యకారులుగా, పీఠాధిపతులుగా ఉన్న నలుగురు శంకారాచార్యలూ అయోధ్య వెళ్లటం లేదన్న సమాచారం ఇది రాసిన సమయానికి ఉంది. చివరి నిమిషంలో వారు మనసు మార్చుకుంటారో లేక ఏం చేస్తారు అన్నది పెద్ద సమస్య కాదు. పూరీ శంకరాచార్య నిశ్శలానంద, ఉత్తరాఖండ్‌ జ్యోతిర్‌ మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద తాము రావటం లేదని తమ కారణాలను వివరిస్తూ చెప్పారు. ద్వారకా పీఠం అధిపతి స్వామి సదానంద సరస్వతి, శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్ధ రామాలయ ప్రతిష్టకు ఆశీర్వచనాలు చెప్పారే తప్ప వస్తున్నదీ లేనిదీ ఇంతవరకు ప్రకటించలేదు. ఆలయ నిర్మాణం పూర్తి కానందున నలుగురమూ అయోధ్య వెళ్లటం లేదని అవిముక్తేశ్వరానంద చెప్పిన మాటల మీద వారు మౌనంగా ఉన్నారు. అందరి తరఫున మాట్లాడేందుకు అనుమతించలేదని ఎవరూ ఇంతవరకు ప్రకటించలేదు. హిందూ శాస్త్రాలకు వ్యతిరేకంగా అసంపూర్తి నిర్మాణంలో ఉన్న దేవాలయాన్ని ప్రారంభించటం తగదని అవిముక్తేశ్వరానంద ఎక్స్‌లో ఒక ప్రకటన చేశారు. తమ చర్యలను మోడీ వ్యతిరేకమైనవిగా చూడరాదని, శాస్త్ర వ్యతిరేకులుగా మారటం ఇష్టం లేకనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మేమెందుకు వెళ్లటం లేదు ? మాకు ద్వేషం ఉండి కాదు. శాస్త్ర విధిని పాటించటం, పాటించేట్లు చూడటం శంకరాచార్యుల బాధ్యత, ఇక్కడ శాస్త్ర విధిని విస్మరించారు, ఆలయ నిర్మాణం ఇంకా పూర్తిగాక ముందే ప్రాణ ప్రతిష్టకు పూనుకోవటం ఇక్కడ పెద్ద సమస్య, దీన్ని మేం చెబితే మమ్మల్ని మోడీ వ్యతిరేకులని పిలుస్తున్నారు, ఇక్కడ మోడీ వ్యతిరేకత ఏముంది అని అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. రామాలయాన్ని రాజకీయం చేస్తున్నారని రాజకీయ పార్టీలు చెబితే, శాస్త్రవిరుద్దమని శంకరాచార్యలు భావిస్తున్నారు. రాజకీయ నేతల డిఎన్‌ఏల గురించి ధ్వజమెత్తుతున్న బిజెపి శంకరాచార్యల డిఎన్‌ఏల గురించి ప్రశ్నించగలదా ? వారిని అనుసరించే వారి మనోభావాలను గాయపరచి తట్టుకోగలదా ?


” మోడీ గారు విగ్రహాన్ని తాకి ప్రారంభోత్సవం చేస్తుంటే నేను అక్కడ ఉండి చేసేదేమిటి ?నేను లేచి నిలబడి చప్పట్లు కొట్టాలా ? నాకు పదవి అవసరం లేదు, ఇప్పటికే నేను పెద్ద స్థితిలో ఉన్నాను, నాకు పేరు అవసరం లేదు. శంకరాచార్యలు అక్కడికి వెళ్లి చేసేదేమిటి ఇది అహంకారం కాదు, నేనున్న స్థానపు గౌరవం గురించి నాకు తెలుసు, అందుకే నేను అక్కడికి వెళ్లటం లేదు, నాకు ఆహ్వానం వచ్చింది, దానిలో నాతో పాటు ఒకరిని తీసుకురావచ్చు అని ఉంది, నాతో పాటు ఒకరిని నేనెందుకు తీసుకుపోవాలి ” అని ఒక వీడియోలో స్వామి నిశ్చలానంద ప్రశ్నించారు. మత వ్యవహారాల్లో మోడీ జోక్యం చేసుకుంటున్నారని, తనకు అయోధ్య అంటే వ్యతిరేకత లేదని కూడా చెప్పారు. విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్‌(రామాలయ నిర్మాణ, నిర్వహణ) ప్రధాన కార్యదర్శి చంపత్‌ రారు అమర్‌ ఉజాలా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామాలయం వైష్టవులకు చెందిన రామానంద సాంప్రదాయానికి చెందింది తప్ప సన్యాసులది లేదా శైవులదీ కాదు అని చెప్పారు.ఆది శంకరుడు శైవుడు, ఆయన స్థాపించిన నాలుగు శంకరమఠాధిపతులూ శైవులే, అయితే వారు విష్ణుమూర్తిని కూడా అంగీకరిస్తారు.శైవుల అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ధ్వని చంపత్‌ రారులో వినిపించింది.రారు ప్రకటన తరువాత అవిముక్తేశ్వరానంద స్పందించారు.” ధర్మశాస్త్రాల ప్రకారమే జరగాలని మేమూ, జనం కూడా కోరుకుంటున్నారు. రాముడు మనకు చెప్పిన పాప పుణ్యాలేమిటో మనకు తెలిసినవే. రామాలయ ప్రతిష్టకు రావటం లేదన్న మా నిర్ణయం ఏమిటో బహిర్గతమైంది. అక్కడకు శంకరాచార్యలు రానవసరం లేదని చంపత్‌ రారు చెబుతున్నారు, ఎందుకంటే ఆ స్థలం రామానంద సంప్రదాయానికి చెందినది అంటున్నారు. ఇక్కడ సమస్య ఏమంటే రామాలయం వైష్ణవులదే అయితే చంపత్‌ రారు అక్కడెందుకు ఉన్నారు ? నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా, పూర్వపు అయోధ్య సంస్థానం, రామాలయ ట్రస్టీ రాజా సాహెబ్‌ అక్కడ ఎందుకు ఉన్నట్లు ? వారు రాజీనామా చేసి రామానంద సంప్రదాయ ప్రతినిధులకు ఆలయాన్ని ప్రతిష్టాపనకు ముందే అప్పగించాలి.ప్రతిష్టను రాజకీయం చేశారు, మతాధిపతులను కావాలనే పక్కన పెట్టారు, ఆలయం రామానంద సంప్రదాయవాదులదే అయితే వారు విరాళాలు తీసుకొనే ముందే ఆ ముక్క చెప్పాలి. ఆ సమయంలో మీరు మా నుంచి కూడా విరాళాలు పొందారు.అలయం శంకరాచార్యులది కాదంటే మీరు మానుంచి విరాళాలను ఎందుకు స్వీకరించినట్లు? అని అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. రామానంద పరంపరలో నిర్మోహీ అఖారా మతపరమైన చిహ్నం, సుప్రీం కోర్టు తీర్పు రాకముందు అక్కడ పూజలు నిర్వహిస్తున్న సంస్థ అది, దానికే ఆ బాధ్యతను కూడా మరోసారి అప్పగించాలి, మీరు మరింత మంది పూజారులను ఎందుకు నియమిస్తున్నారు, పూజ బాధ్యతను రామానంద సాంప్రదాయం ప్రకారం నిర్మోహి అఖారాకు అప్పగించాలి, దాన్ని మేము ఆమోదిస్తాము, దీంతో నలుగురు శంకరాచార్యలూ సంతోషిస్తారు అని కూడా ముక్తేశ్వరానంద అన్నారు.


రామాలయ నిర్మాణాన్ని ఓట్లకోసం బిజెపి ఉపయోగిస్తున్నదని లోకం కోడై కూస్తున్నది. వచ్చేలోక్‌సభ ఎన్నికల్లో రామాలయాన్ని ప్రభావితం చేసేందుకు ఐదువేల మంది చొప్పున ప్రతి నియోజకవర్గంలో నియమించాలని బిజెపి పధకం వేసినట్లు ఒక బిజెపి నేత చెప్పినట్లు ది ప్రింట్‌ న్యూస్‌ పోర్టల్‌ తన విశ్లేషణలో పేర్కొన్నది. రానున్న మూడు మాసాలలో దేశమంతటి నుంచి రెండున్నర కోట్ల మందికి రామదర్శనం ఏర్పాటు చేసి హిందూ ఓటు బాంకును ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు కూడా తెలిపింది. అయోధ్యను సందర్శించిన వారు తమ అనుభవాలను ఇతరులకు తెలియచేస్తారని బిజెపి ఎంపీ ప్రదీప్‌ చౌదరి చెప్పినట్లు ప్రింట్‌ రాసింది. రామాలయ ప్రతిష్ట రాజకీయం తప్ప సనాతనం కాదని అయోధ్యలోని మహంతులు కొందరు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించే ప్రాణ ప్రతిష్ట కార్యాక్రమాన్ని వారణాసికి చెందిన లక్ష్మీకాంత దీక్షిత్‌ నిర్వహిస్తున్నారు. దీపావళి ఉత్సవానికి మమ్మల్ని ఆహ్వానించారు ఇప్పుడెందుకు పిలవలేదని మహంత్‌ భానుదాస్‌ ప్రశ్నించారు. విమర్శలు చేసిన శంకరాచార్యలను సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున మోడీ అభిమానులుగా ఉన్న వారు చీల్చి చెండాడుతున్నారు. వారు ఎప్పుడైనా రామాలయం కోసం ఎప్పుడైనా ఆందోళన చేశారా అని ప్రశ్నిస్తున్నారు.శంకరాచార్యులను అనుసరించే వారి మనోభావాలను వారు తీవ్రంగా గాయపరుస్తున్నారు.మొత్తం మీద రాముడిని మరోసారి వివాదాస్పదం కావించారు. వీధుల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు

Share this:

  • Tweet
  • More
Like Loading...

అయోధ్య రామాలయ రాజకీయం : అద్వానీని రావద్దన్నారు ! పిలిచినా వెళ్లేది లేదన్నారు పూరీ శంకరాచార్య !!

08 Monday Jan 2024

Posted by raomk in BJP, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

AYODHYA, BJP, Narendra Modi, Ram Temple politics, RSS, Swami Nischalananda Saraswati


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావటం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.దీని మీద మోడీ భక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నారు. వస్తే ఎంత రాకపోతే ఎంత అసలు రామాలయం కోసం పూరీ శంకరాచార్య ఏం చేశారంటూ నిలదీస్తున్నారు.రధయాత్ర నిర్వహించి, బాబరీ మసీదు కూల్చివేత కేసులను ఎదుర్కొన్న ఎల్‌కె అద్వానీకి ఆహ్వానం ఇస్తూనే అసలు కార్యక్రమానికి రావద్దని చెప్పినట్లు నిర్వాహకులు ప్రకటించారు. చిత్రం ఏమిటంటే రామాలయంతో ఎలాంటి సంబంధంలేని, బాబరీ మసీదు కూల్చివేతను ఖండించిన సీతారాం ఏచూరి, ఇతర పార్టీల నేతలనూ ఆహ్వానించారు గానీ రావద్దని చెప్పలేదు. హాజరు కావటం లేదని చెప్పిన వారి మీద ప్రచారదాడులు చేస్తున్నారు. అద్వానీ(96), మురళీమనోహర్‌ జోషి(90) ఏండ్ల పెద్దవారు గనుక వారు వచ్చి ఇబ్బంది పడతారని అందువల్లనే రావద్దని చెప్పామని విమర్శలు చెలరేగిన తరువాత వివరణ ఇచ్చుకున్నారు. తరువాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా విశ్వహిందూపరిషత్‌ నేతలు ఆహ్వానించినట్లు ప్రకటించారు. కానీ మాజీ ప్రధాని దేవెగౌడకూ 90 ఏండ్లే అయినప్పటికీ ఆయన వయసు రీత్యా రావద్దని నిర్వాహకులు చెప్పలేదు.ఎందుకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత దేవెగౌడ-కుమారస్వామి పార్టీ జెడిఎస్‌ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపితో జట్టుకట్టాలని నిర్ణయించింది. అందుకే అయోధ్య రామాలయ రాజకీయం రంజుగా నడుస్తోంది అని చెప్పాల్సి వస్తోంది. ఈ మాట అంటే కొందరు మనోభావాలను ముందుకు తెచ్చుకొని బాధపడితే చేసేదేమీ లేదు. వయసు రీత్యా కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ శుభ కార్యాలు జరిగినపుడు ఆహ్వానం పలకటం, వారు రాలేమని చెప్పినపుడు వీలు చూసుకొని రావాలని ఆకాంక్ష వెలిబుచ్చటం మన భారతీయ సంప్రదాయం. కానీ దాన్ని తుంగలో తొక్కి రావద్దని మేమే చెప్పామని నిర్వాహకులు చెప్పటాన్ని ఏ సంప్రదాయం అంటారో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.రధయాత్ర పేరుతో బిజెపి నేత ఎల్‌కె అద్వానీ నిర్వహించిన కార్యక్రమం అది సృష్టించిన వినాశకర, అవాంఛనీయ ఉదంతాల గురించి తెలిసిందే. వారు వస్తారా లేదా స్పందన ఏమిటో చూడాల్సి ఉంది. ఒక వేళ వారు నిజంగా రాగలిగినా రానిచ్చేవారా అన్న సందేహాలు కూడా వారిని వద్దన్న తరువాత జనంలో తలెత్తాయి. తనదారిని సుగమం చేసుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన వెంటనే అద్వానీ, ఎంఎ జోషి వంటి వారితో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అది ఇంతవరకు ఒక్కసారి కూడా సమావేశమైన సమాచారంగానీ, ఇచ్చిన మార్గదర్శనం గురించి గానీ ఎవరికీ తెలియదు. గుడులకు పరిమితం కావాల్సిన రాముడిని ఓట్ల కోసం వీధుల్లోకి తెచ్చారు.


ఆది శంకరాచార్య ఏర్పాటు చేసిన నాలుగు పీఠాల్లో పూరీలోని గోవర్ధన మఠం ఒకటి. దాని అధిపతిగా ఉన్న స్వామి నిశ్చలానంద సరస్వతి(80)కి కూడా రామాలయ నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దాన్ని తిరస్కరించినట్లు స్వామి చెప్పారు, గతవారంలో ఒక టీవీ ఛానల్‌తో, అదే విధంగా మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన ఒక సనాతన ధర్మ సభకు హాజరైనపుడు విలేకర్లతో మాట్లాడారు. తనకు పంపిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఒక వేళ హాజరు కావాలని అనుకుంటే తోడుగా గరిష్టంగా ఒకరిని మాత్రమే తెచ్చుకోవాలని దానిలో పేర్కొన్నట్లు చెబుతూ ఒక్కరు కాదు వందమందిని అనుమతించినా ఆ రోజు తాను వెళ్లేది లేదని నిశ్చలానంద చెప్పారు. గతంలో కూడా వెళ్లానని భవిష్యత్‌లో కూడా అయోధ్య వెళ్లి రాముడిని సందర్శిస్తానని అన్నారు. రాముడి విగ్రహాన్ని శాస్త్ర విధి ప్రకారం ఏర్పాటు చేయాలని ఇప్పుడు అలా జరగటం లేదన్నారు. తమ మఠపరిధి ప్రయాగ వరకు ఉందని అయినప్పటికీ తమ సలహా, మార్గదర్శనం కానీ కోరలేదని చెప్పారు. ఈ పరిణామాల గురించి ” నేను ఏ మాత్రం ఆశాభంగం చెందలేదు. ఇతర హిందూ సనాతనుల మాదిరి సంతోషంగా ఉన్నాను. ప్రత్యేకించి ప్రస్తుత ప్రధాని ఒక లౌకికవాదిగా కనిపించేందుకు తాపత్రయపడటం లేదు.విగ్రహారాధన, హిందూత్వ అంశాలలో అతనెంతో ధైర్యశాలి, వాటి పట్ల గర్వపడతారు. తనను ఒక లౌకికవాదిగా ప్రదర్శించుకొనేందుకు అతనేమీ పిరికివాడు కాదు.అయితే ఒక శంకరాచార్యగా నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి ? మోడీగారు విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే చప్పట్లు కొట్టి పొగడాలా ? అని ప్రశ్నించారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే ముందు తనను నరేంద్రమోడీ ఎలా కలిశారో నిశ్చలానంద గుర్తు చేసుకున్నారు.కరోనాకు ముందు యోగి ఆదిత్యనాధ్‌ ఏడాదికి రెండు మూడు సార్లు కలిసేవారు. విశ్వహిందూ పరిషత్‌ మాజీ అధ్యక్షుడు దివంగత అశోక్‌ సింఘాల్‌ కనీసం 70సార్లు కలిశారని చెప్పారు.తీర్థస్థలాలను అభివృద్ధి పేరుతో భోగస్థలాలుగా మార్చుతున్నారు,టూరిజం కేంద్రాలుగా చేస్తున్నారని అన్నారు. ఇదే అంశంపై సోమవారం నాడు మరోసారి నిశ్చలానంద తన వ్యతిరేకతను వెల్లడించారు. చత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయపూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 17న ఒడిషా ప్రభుత్వం ప్రారంభించనున్న శ్రీమందిర్‌ పరికర్మ ప్రకల్ప పధకం గురించి స్పందించారు.పుణ్య స్థలాలను విహార కేంద్రాలుగా మార్చటం అంటే వాటిని విలాస కేంద్రాలుగా మార్చటమే అన్నారు.హౌటళ్ల వారు, రవాణా రంగంలో ఉన్నవారు లబ్ది పొందుతారు తప్ప ఆ కేంద్రాలకు ఉన్న ప్రత్యేకత తగ్గుతుందన్నారు.ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని అయితే వెళ్లాలా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. రామాలయ ప్రతిష్టాపన గురించి చేసిన వ్యాఖ్యల మీద నిశ్చలానందపై కాషాయ మరుగుజ్జు దళాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నాయి.


సిఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 టీవీ ఛానల్‌తో 30 నిమిషాలు మాట్లాడిన శంకరాచార్య రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించేటపుడు క్రతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.చాతుర్వర్ణ వ్యవస్థకు భగవద్గీతలోని కృష్ణుడి బోధనల్లోనే మూలాలు ఉన్నాయి.గుణము, చర్యలను బట్టి నాలుగు వర్ణాలుగా సమాజాన్ని వర్గీకరించారు.ఇది పుట్టుకను బట్టి అని చెప్పటంగాక చేసే పనులు, వాటి స్వభావాన్ని వర్ణాలు ఉంటాయి.పశ్చిమ దేశాల్లో కూడా వర్ణ వ్యవస్థ మాదిరే విద్య, ఆర్థికం, రక్షణ, సేవా రంగాలు ఉన్నాయి.ఇప్పుడు వర్తమాన సమాజంలో పోలీసుల లేదా ప్రధానులు ఏలాంటి పాత్రను పోషించారో వర్ణ వ్యవస్థలో కూ ఎవరికి వారు తమ స్థితిని బట్టి సమతూకాన్ని నిర్వహించారు. శివపురాణంలో వివిధ రకాల బ్రాహ్మలు ఉన్నారని ఒక కుటుంబంలో పుట్టినంత మాత్రాన్నే బ్రాహ్మలుకాదన్నారు.ఒక బ్రాహ్మడు వ్యాపారం చేస్తే వైశ్య బ్రాహ్మణ అని పిలవాలి, పురాతన గ్రంధాలలో చెప్పిన వాటిని అచరిస్తేనే ఒకబ్రాహ్మడిని బ్రాహ్మడిగా పరిగణించాలి అన్నారు.


ఏసుక్రీస్తు, మహమ్మద్‌ ప్రవక్త పూర్వీకులు సనాతన హిందువులే అని స్వామీజి గతేడాది సెలవిచ్చారు(ఫిబ్రవరి 1, 2023 ఓపి ఇండియా పోర్టల్‌) అమెరికా ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారని అది రుజువైందని నిశ్చలానంద చెప్పారు. వారు క్రైస్తవం, ఇస్లాం స్వీకరించే ముందు హిందువులే అన్నారు. ఏసు క్రీస్తు పది సంవత్సరాలు భారత్‌లో ఉన్నారని దాన్ని ఎక్కడా పేర్కొనలేదన్నారు. పూరీలో మూడు సంత్సరాలు ఉన్నారని క్రీస్తు వైష్ణవుడని హిందూ క్రతువులన్నీ చేసినట్లు చెప్పారు. ఏసు క్రీస్తుకంటే ముందే హిందూయిజం ఉందని అందువలన ఆయన పూర్వీకులు హిందువులే అన్నది స్వామి వారి అభిప్రాయమని ఎన్నోసార్లు చెప్పారని, పూరీ మఠ ప్రజా సంబంధాల అధికారి మాతృదత్తా చెప్పారు. ప్రభుత్వాలకు మఠాలు, దేవాలయాల మీద అదుపు ఉండకూడదని, ప్రతి మూలను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అనుసరిస్తున్నారంటూ తన మీద వచ్చిన విమర్శలు నిశ్చలానంద ఖండించారు, నేను అనుసరించటం లేదు, కావాలంటే వారే నా వెనుక నడవొచ్చు,ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ నాముందు బాలగోపాలుడి మాదిరి కూర్చుంటారని అన్నారు.


రామాలయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్న బిజెపి ఒడిషాలో అక్కడి సిఎం నవీన్‌ పట్నాయక్‌ శ్రీమందిర్‌ పరిక్రమ రధాల ద్వారా ఎన్నికల రాజకీయం చేస్తున్నారని బిజెపి నేత పృధ్వీరాజ్‌ హరిచందన్‌ ఆరోపించారు. జగన్నాధ సంస్కృతిని రూపుమాపేందుకు కుట్ర జరుగుతోందని, తన మాజీ ప్రయివేటు కార్యదర్శి ద్వారా ఒరియా పౌరుల మీద దక్షిణ భారత సంస్కృతిని బలవంతంగా రుద్దేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు.దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.శ్రీమందిర్‌ పధకం ఒక రాజకీయ నాటకమని, ఎన్నికల ముందు తమ అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు తలపెట్టారని, 160 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును బిజెడి తన ఎన్నికల ప్రచారానికి వినియోగించటం గర్హనీయమైన చర్య అన్నారు. బిజెపి నేతల విమర్శలను బిజెడి నేత, ఎంఎల్‌ఏ పద్మనాభ బెహరా తిప్పికొట్టారు. మనమంతా జగన్నాధుని పిల్లలం, మనంగాకపోతే భగవంతుడి పేరును ఎవరు తీసుకుంటారు, దీని గురించి మాట్లాడేందుకేమీ లేదు, రాజకీయం అసలే లేదన్నారు. భువనేశ్వర్‌ నగరంలోని అరవై ఏడు వార్డుల్లో శ్రీమందిర్‌ పరిక్రమ పధకంలోని రధాలను రెండు రోజుల పాటు తిప్పుతారు. ప్రతి ఇంటి నుంచి ఆకు వక్కలను, ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ పధకంలో భాగంగా పూరీలోని జగన్నాధ ఆలయ పరిసరాలలో రధయాత్ర వేగంగా కదలటాన్ని సులభతరం చేసేందుకు, తొక్కిడి లేకుండా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జగన్నాధ దేవాలయం చుట్టూ 75 మీటర్ల పరిధిలో ఉన్న కట్టడాలను తొలగించేందుకు యాత్రకు అవసరమైన పద్దతుల్లో తీర్చిదిద్దేందుకు అవసరమైన భూ,భవనాలను సేకరించారు. జనాలకు అవసరమైన మరుగుదొడ్లు, మంచినీరు, సామాన్లు భద్రపరుచుకొనే గదులతో పాటు భద్రతకు అవసరమైన కేంద్రాల వంటివి ఈ పధకంలో ఏర్పాటు చేశారు. దీన్ని బిజెపి రాజకీయం చేస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ క్మిస్మస్‌ విందు రాజకీయం – కేరళ మంత్రి వ్యాఖ్య టీకప్పులో తుపాను !

05 Friday Jan 2024

Posted by raomk in BJP, Communalism, CPI(M), Current Affairs, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, RELIGION

≈ Leave a comment

Tags

a storm in a tea cup, BJP, CPI()M, Narendra Modi, Pinarayi Vijayan, Saji Cherian, wine and cake christmas politics


ఎం కోటేశ్వరరావు


క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవ పూజార్లకు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో విందు ఇచ్చారు. దానిలో పాల్గొన్న బిషప్పులు మణిపూర్‌లో తమ సామాజిక తరగతికి చెందిన వారి మీద జరుగుతున్నదాడుల గురించి ప్రధానితో ప్రస్తావించలేదని కేరళ మంత్రి సాజి చెరియన్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.జనవరి మూడున కేరళ సిఎం పినరయి విజయన్‌ ఇచ్చిన క్రిస్మస్‌ విందుకు చెరియన్‌ వ్యాఖ్యలను తప్పుపట్టిన బిషప్పుల కౌన్సిల్‌ నేత క్లిమిస్‌తో సహా అనేక మంది హాజరయ్యారు. అంతకు ముందు చెరియన్‌ తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతో ఆ వివాదం ముగిసింది. ఈ విందుకు గవర్నర్‌ మహమ్మద్‌ ఆరిఫ్‌ ఖాన్‌ హాజరు కాలేదు. సిఎం ఆహ్వానించని కారణంగానే రాలేదని వచ్చిన వార్తలపై గవర్నర్‌ స్పందించారు. కావాలంటే రాజభవన్‌కు వచ్చి తనిఖీ చేసుకోవచ్చు, నేను ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించానో మీరు శోధించవచ్చు, ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నలు అడగవచ్చు అన్నారు. ప్రధాని విందు వివాదం గురించి చూద్దాం. న్యూ ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఇచ్చిన క్రిస్మస్‌ విందుకు ఆహ్వానం అందగానే కొందరు బిషప్పులకు వెంట్రుకలు నిక్కబొడుచుకొని అక్కడ అందించిన పండ్లరసాలు, ద్రాక్ష రసాలు, కేకుల మీద చూపిన శ్రద్ద తమ స్వంత సామాజిక తరగతి మీద మణిపూర్‌లో జరిగిన హింసను మరిచిపోయారని, వారికది ఒక సమస్యగా కనిపించలేదని కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెరియన్‌ ఒక సభలో అన్నారు. చెరియన్‌ సిపిఎం నేత, క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారు. దాని మీద కేరళ కాథలిక్‌ బిషప్పుల కౌన్సిల్‌(కెసిబిసి) అధ్యక్షుడు కార్డినల్‌ మార్‌ బెసిలియోస్‌ క్లిమిస్‌ మండిపడుతూ మంత్రి మాటలను ఉపసంహరించుకొనేంత వరకు తాము ప్రభుత్వానికి సహకరించేది లేదని ప్రకటించారు. వివాదాన్ని పొడిగించకుండా ఉండేందుకు తాను చేసిన విమర్శలో వెంట్రుకలు నిక్కపొడుచుకోవటం, కేకులు, డ్రాక్ష రసం పదాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే మణిపూర్‌ హింసాకాండపై క్రైస్తవ మతాధికారులు స్పందించలేదన్న విమర్శకు కట్టుబడి ఉన్నట్లు చెరియన్‌ స్పష్టం చేశారు. కెసిబిసి ప్రతినిధి ఫాదర్‌ జాకబ్‌ పాలకపిలి మాట్లాడుతూ దేశానికి క్రైస్తవులు చేసిన సేవల గురించి చర్చించేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశమని పేర్కొన్నారు.మణిపూర్‌ జనాభాలో 41శాతాల చొప్పున క్రైస్తవులు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఎనిమిదిశాతంపైగా ఉన్నారు. అక్కడ గతేడాది మే 3వ తేదీన ప్రారంభమైన మెయితీ-గిరిజన ఘర్షణలు వందలాది మంది ప్రాణాలు తీశాయి. వేలాది ఇండ్లు, వందలాది ప్రార్ధనా మందిరాలను ధ్వంసమయ్యాయి. దాదాపు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. గిరిజన మహిళలను ఇద్దరిని వివస్త్రలను గావించి రోడ్ల మీద తిప్పిన దుర్మార్గం వెలుగులోకి వచ్చిన తరువాత ప్రధాని మొక్కుబడిగా ఖండించారు తప్ప ఇంత వరకు ఆ రాష్ట్రానికి వెళ్లి భరోసా కల్పించేందుకు పూనుకోలేదు..


మణిపూర్‌ ఉదంతాల గురించి మౌనంగా ఉండటంపై కేరళ క్రైస్తవ మత పత్రికల్లోనే తీవ్ర విమర్శలు చాలా నెలల క్రితమే వచ్చాయి. ఈ పూర్వరంగంలోనే మంత్రి చెరియన్‌ మాట్లాడారు. కేరళలో ఓటు బాంకు ఏర్పాటు చేసుకొనే ఎత్తుగడతో క్రైస్తవ మతాధికారులను ప్రసన్నం చేసుకొనేందుకు బిజెపి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది.లౌ జీహాద్‌ పేరుతో హిందూ, క్రైస్తవ యువతులను కూడా ఆకర్షించి మతమార్పిడికి పూనుకుంటున్నారని క్రైస్తవుల-ముస్లింల మధ్య విబేధాలు సృష్టించే విధంగా బిజెపి నేతలు గతంలో కొందరు వ్యాఖ్యానించారు. క్రైస్తవులు దేశానికి చేసిన సేవ గురించి చర్చించేందుకు ప్రధాని విందు ఏర్పాటు చేసినట్లు చెప్పటమే విచిత్రం.సంఘపరివార్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఏర్పాటు చేసిన బిజెపి, ఇతర అనేక సంస్థలు క్రైస్తవ మిషనరీల గురించి, ప్రలోభాలతో మతమార్పిడులు చేస్తున్నారంటూ నిత్యం చేస్తున్న ప్రచారం, ఆ పేరుతో చేస్తున్న దాడుల గురించి తెలిసిందే. వాటిని నివారించటం గురించి ప్రధాని నరేంద్రమోడీ గడచిన పది సంవత్సరాల్లో ఎలాంటి సమావేశాల ఏర్పాటు లేదా ప్రయత్నాలుగానీ కనిపించవు.
2014లో నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ముస్లింలు, క్రైస్తవులు అభద్రతా భావానికి గురయ్యారు.భారత్‌లో ఇతర మతాల్లో ఉన్నప్పటికీ వారంతా గతంలో హిందువులే అన్న ప్రచారాన్ని తీవ్రం చేయటంతో పాటు ఘర్‌వాపసీ పేరుతో ఇతర మతాల వారిని తిరిగి హిందువులుగా మార్చే పేరుతో పెద్ద హడావుడి చేశారు. దానికి స్పందన రాలేదు. గుజరాత్‌లో జరిపిన మారణకాండను నివారించటంలో విఫలమైన నరేంద్రమోడీ తమ దేశంలో అడుగుపెట్టకూడదంటూ 2005 అమెరికా అనుమతి నిరాకరించింది. తరువాత అదే అమెరికా మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత ఆహ్వానం పలికింది. 2014 అక్టోబరు, 2015 జనవరిలో నరేంద్రమోడీతో భేటీ అయినపుడు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా,మత స్వేచ్చపై అమెరికా కమిషన్‌ కూడా భారత్‌లో మతస్వేచ్చకు భంగం కలుగుతున్నదని, మైనారిటీ మతాల వారి మీద దాడులు జరుపుతున్నట్లు విమర్శలు చేసింది. భారత్‌లో కనిపిస్తున్న అసహనాన్ని మహాత్మాగాంధీ చూసి ఉంటే దిగ్భ్రాంతికి గురై ఉండేవాడని బరాక్‌ ఒబామా వ్యాఖ్యానించాడు. ఈ పూర్వరంగంలో అమెరికాను సంతుష్టీకరించేందుకు, ప్రపంచంలో తన ప్రతిష్టకు కలిగిన మచ్చను కనిపించకుండా చేసుకొనేందుకు నరేంద్రమోడీ చూశారు. తమ ప్రభుత్వం ఎలాంటి వత్తిడీ, ప్రభావం లేకుండా పౌరులు ఏ మతాన్నైనా అనుసరించటానికి, లేదా నిలుపుకోవటానికి స్వేచ్చను అన్ని విధాలుగా పరిరక్షిస్తుందని, మెజారిటీ లేదా మైనారిటీ మతాలకు చెందిన వారు ఎవరైనా ఇతరుల మీద విద్వేషాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా రెచ్చగొట్టినప్పటికీ సహించదని పార్లమెంటులో చెప్పాల్సి వచ్చింది. విదేశాల వారిని ఆకట్టుకొనేందుకు ఈ ముక్కలను ఆంగ్లంలో చెప్పారని కొందరు వ్యాఖ్యానించారు. ఈ మాత్రం మాట్లాడటాన్ని కూడా సహించలేని హిందూ జాతీయవాదులు ” లౌకిక నరేంద్రమోడీ ” అంటూ ఎద్దేవా చేశారని వాషింగ్టన్‌ పోస్టు, గార్డియన్‌ పత్రికలు రాశాయి. క్రైస్తవ మతాధికారులతో సమావేశాన్ని కూడా మోడీ నిర్వహించారు.


నరేంద్రమోడీ చేసిన ప్రకటన ఇంకా చెవుల్లో వినిపిస్తుండగానే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్‌ భగవత్‌ మదర్‌ తెరెసాను విమర్శిస్తూ తన గణాన్ని సంతృప్తి పరచేందుకు చూశారు. మిషనరీలు తమ సాయం కోరి వచ్చిన వారిని మతం మారాలని కోరినట్లు ఆరోపించారు.ఆమె సేవలు మంచివే కావచ్చు, కానీ వాటిని వినియోగించుకున్న వారిని క్రైస్తవులుగా మార్చే లక్ష్యంతో చేశారని అన్నారు. ప్రభుత్వేతర సంస్థలు కూడా సేవలు చేస్తాయి అవి మదర్‌ తెరేసా వంటివి కాదు అన్నారు. అంతకు ముందు మతపరమైన మైనారిటీలను అపహరణకు గురైన వస్తువులుగా వర్ణిస్తూ నా వస్తువులను నేను తిరిగి పొందుతా అన్నారు. మదర్‌ తెరేసాపై మోహన్‌ భగవత్‌ మాటలతో తీవ్ర విమర్శలు రావటంతో తమ నేత మాటలను మీడియా వక్రీకరించిందంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. విదేశీ నిధులతో క్రైస్తవ మిషనరీలు, సంస్థలు మత మార్పిడికి పాల్పడుతున్నాయంటూ చేస్తున్న ప్రచారం ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. క్రైస్తవం మన దేశానికి రెండువేల సంవత్సరాల నాడే వచ్చింది. రెండు వందల సంవత్సరాల బ్రిటీష్‌ పాలన, తరువాత కూడా చూస్తే ప్రస్తుతం దేశంలో క్రైస్తవుల సంఖ్య కేవలం 2.3శాతమే. అంటరానితనం వంటి తీవ్ర వివక్ష కారణంగా అనేక మంది క్రైస్తవంలోకి మారారు. ఆ సమస్యతో నిమిత్తం లేని వారు ఆర్థిక, ఇతర ప్రయోజనాల కోసం క్రైస్తవం పుచ్చుకున్నారు. మొఘల్‌ పాలనా కాలంలో కూడా జరిగింది అదే. రిజర్వేషన్ల కారణంగా అనేక మంది క్రైస్తవంలోకి మారనప్పటికీ దేవాలయాలకు బదులు చర్చ్‌లకు వెళ్లి క్రీస్తును పూజిస్తున్నారన్నది హిందూత్వవాదుల దుగ్ద.


గతంలో జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలసి అహమ్మదాబాద్‌లో ఒక పురాతన మసీదును మోడీ సందర్శించారు. సందర్శన వేరు, చర్చిలో మాదిరి పూజా క్రతువులో భాగంగా కొవ్వొత్తి వెలిగించినట్లుగా మసీదులో ఎక్కడా చూడలేదు.విదేశాలకు వెళ్లినపుడు అబూదాబీలో మోడీ మసీదును సందర్శించారు. ఇవన్నీ ఇస్లామిక్‌, క్రైస్తవ దేశాల పాలకుల మెప్పు పొందేందుకే అన్నది స్పష్టం. గతేడాది ఈస్టర్‌ పండగనాడు మోడీ చర్చికి వెళ్లటానికి ముందు క్రైస్తవుల మీద అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ ముంబైలో పదివేల మంది ప్రదర్శన చేశారు.” ఈస్టర్‌ పండగ రోజు కెథడ్రల్‌ చర్చిని సందర్శించాలన్న వాంఛను ప్రధాని మోడీ వెలిబుచ్చారు. మేము ఏర్పాటు చేశాము. దీని మీద స్పందన ఏమిటని అనేక మంది జర్నలిస్టులు ఎందుకు అడుగుతున్నారో తెలియటం లేదని ” అన్న ఢిల్లీ ఆర్చిబిషప్‌ అనిల్‌ కౌటో అంతకు మించి మాట్లాడేందుకు తిరస్కరించారు.ప్రధాని కోరితే కుదరదని చెప్పలేం అని ఫరీదాబాద్‌ సిరో మలబార్‌ చర్చి అధిపతి కురియకోస్‌ భరణికులనగార అన్నారు. ప్రధాని చర్చిలో ఉండగా మూడు స్తోత్రాలను ఆలపించాము, రైసెన్‌ క్రీస్టు విగ్రహం ముందు కొవ్వొత్తిని కూడా వెలిగించారని చెప్పారు.అరగంటపాటు అక్కడే ఉన్న మోడీ ప్రాంగణంలో ఒక మొక్క నాటారు.ముంబైలో క్రైస్తవుల ప్రదర్శన నిర్వాహకులలో ఒకరైన డోల్ఫీ డి సౌజా మాట్లాడుతూ నరేంద్రమోడీ చర్చికి రావటానికి మాకెలాంటి సమస్య లేదు. స్వాగతిస్తాం, కానీ మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత క్రైస్తవుల మీద హింసాకాండ పెరిగింది, దాడులకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి మోడీ నిరాకరిస్తున్నారు, అదే మాకు ఆందోళన కలిగిస్తోంది అని కూడా డి సౌజా చెప్పారు.అలాంటి ప్రధాని మణిపూర్‌ గురించి మౌనంగా ఉండటాన్ని ఎందుకు ప్రశ్నించలేదనే కేరళ మంత్రి తప్పుపట్టారు.


ఈస్టర్‌ పండుగ రోజున బిజెపి నేతలు కేరళలో పదివేల చర్చ్‌లు, క్రైస్తవుల ఇండ్లను సందర్శించి వారిని సంతుష్టీకరించేందుకు, ఓటు బాంకుగా మార్చుకునేందుకు చూశారు. ఈస్టర్‌ రోజున ఆడించిన నాటకమిదని కేరళకు చెందిన కురియకోస్‌ భరణికులనగార విమర్శించారు. కేరళలో సిరో మలబార్‌ చర్చ్‌ ఆర్చిబిషప్‌ కార్డినల్‌ జార్జి అలెంచెరీ నరేంద్రమోడీని ప్రశంసించినట్లు, దేశంలో క్రైస్తవులు అభద్రతతో లేరని చెప్పినట్లు న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. దేశంలో ఆందోళనకరంగా ఉన్న వాస్తవం కార్డినల్‌ అలెంచెరీ మాటల్లో ప్రతిబింబించలేదని కేరళలో ప్రచురితమయే సత్యదీపమ్‌ అనే కాథలిక్‌ పత్రిక సంపాదకుడు ఫాదర్‌ పాల్‌ తెలక్కాట్‌ వ్యాఖ్యానించారు. మోడీ పాలనను ప్రశంసించటం క్రైస్తవులకు విభ్రాంతి కలిగించిందని కూడా అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మిజోరం వెళ్లలేదు. మణిపూర్‌ తగులబడుతుంటే రాని ప్రధాని తగుదునమ్మా అంటూ పక్కనే ఉన్న మిజోరంలో ఓట్ల కోసం వచ్చారనే విమర్శను మూటగట్టుకోవాల్సి వస్తుందనే కారణం తప్ప మరొకటి కాదు. లోక్‌సభ ఎన్నికల పూర్వరంగంలో నరేంద్రమోడీ క్రిస్మస్‌ రాజకీయం చేశారు. ఈ పూర్వరంగంలో ప్రధాని విందుకు వెళ్లిన బిషప్పులు మణిపూర్‌లో జరుగుతున్న ఉదంతాలను పట్టించుకోలేదని కేరళ మంత్రి సాజీ చెరియన్‌ చేసిన వ్యాఖ్యలను చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

క్యా బాత్‌ హై, క్యా సీన్‌ హై : 2004 వెలిగిపోతున్న భారత్‌, 2014 అచ్చేదిన్‌, 2024లో వికసిత భారత్‌ !

31 Sunday Dec 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ 1 Comment

Tags

BJP, BJP mind game, IMF about India, India Exports, Make In India, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


సంకీర్ణ ప్రభుత్వాలతో మూడు దశాబ్దాల కాలం వృధా అయిందని, పాలన లేకపోవటాన్ని, సంతుష్టీకరణ రాజకీయాలను జనం చూశారని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. ఈ కారణంగానే బిజెపిని సహజ ఎంపికగా జనం పరిగణిస్తున్నారని, 2024లో తాము ఎవరి మీదా ఆధారపడని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇండియా టుడే మాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పదేండ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు అన్ని రంగాలు మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని ఉద్ఘాటించారు. ఇలాంటి ముఖాముఖిలో మోడీ చెప్పింది రాసుకోవటం తప్ప విమర్శనాత్మక ప్రశ్నలు అడిగే అవకాశం ఉండదన్నది తెలిసిందే.మోడీ-హిజ్‌ మాస్టర్‌ వాయిస్‌ మీడియా ఆడుతున్న మైండ్‌ గేమ్‌లో ఇలాంటివి కొత్తకాదు. ఎప్పుడైనా విలేకర్ల సమావేశం పెట్టి ఎదురయ్యే ప్రశ్నలకు జవాబు చెబితే జనానికి నాణానికి మరోవైపు ఏముందో తెలుస్తుంది. 2014 ఎన్నికల సమయంలో సెలవిచ్చిన అచ్చే దిన్‌, నల్లధనం వెలికితీత, గుజరాత్‌ తరహా అభివృద్ధి వంటి అంశాలను ఏమేరకు సాధించారో ఎక్కడా చెప్పటం లేదు. జనాలను మార్కెటింగ్‌ మాయాజాలంలో ముంచి తమ ఉత్పత్తులను అమ్ముకొనేందుకు వ్యాపార సంస్థలు విడుదల చేసే వాణిజ్య ప్రకటనల గురించి తెలిసిందే. దేశంలో పలు పార్టీలు ఇప్పుడు ఇస్తున్న నినాదాలు, చేసే ప్రసంగాలు, ప్రదర్శించే హావభావాల వెనుక అలాంటి మార్కెటింగ్‌ నిపుణులు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. గతంలో ప్రజా ఉద్యమాల నుంచి నినాదాలు పుట్టేవి.ఇప్పుడు అనేక పార్టీలకు వాటితో పనిలేదు.


వాజ్‌పాయి ప్రధానిగా ఉండగా బిజెపి 2004 ఎన్నికల్లో ఇచ్చిన నినాదం ” వెలిగిపోతున్న భారత్‌ ”. తరువాత అదే బిజెపి 2014లో ముందుకు తెచ్చిన నినాదం ” అచ్చేదిన్‌ ”, తాజాగా ప్రధాని నరేంద్రమోడీ డిసెంబరు రెండవ వారంలో ”వికసిత భారత్‌ ” ప్రభుత్వ సంకల్పమని ప్రకటించారు. 2024లో ఎన్నికల్లోపు ఎలాంటి అనూహ్య ఉదంతాలు జరగక లేదా జరపకపోతే దాన్నే బిజెపి స్వీకరించి ఎన్నికల గోదాలోకి దిగనుంది. మూడు నినాదాలకు తేడా ఉంది. మొదటిది తమ విఫలమైన పాలనను కప్పిపుచ్చుకొనేందుకు భారత్‌ వెలిగిపోతోంది అన్నారు. కాంగ్రెస్‌ పాలన మీద ధ్వజమెత్తేందుకు తాము అధికారానికి వస్తే అచ్చేదిన్‌(మంచిరోజులు) తెస్తామని ఆశచూపారు. పదేండ్ల తరువాత వాటి జాడ కనిపించటం లేదు, దీంతో మరో పాతికేండ్లలో 2047 నాటికి అభివృద్ది చెందిన వికసిత భారత్‌గా దేశాన్ని మారుస్తామని నమ్మబలుకుతున్నారు. అప్పటికి రాజెవరో రెడ్డెవరో !


వికసిత భారత్‌ 2047 రోడ్‌మాప్‌ ప్రకారం ఆ సంవత్సరానికి మన దేశం అభివృద్ది చెందిన జాబితాలో చేరుతుందని చెబుతున్న దాన్ని జనం నమ్మేదెలా ? అభివృద్ధి లక్షణాలలో అధిక తలసరి రాబడి ఒకటి. దాన్లో ఇప్పుడు మనం ఎక్కడున్నాం ? ప్రపంచబాంకు రూపొందించిన అట్లాస్‌ పద్దతి ప్రకారం 2022 సంవత్సర వివరాల మేరకు 190 దేశాల జాబితాలో జిఎన్‌ఐ తలసరి ఆదాయంలో ముందున్న తొలి 59 దేశాల్లో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకే చోటు లేదు. ఎగువ మధ్య తరగతి ఆదాయ జాబితాలో రెండవదిగా, మొత్తం దేశాలలో 61వ స్థానంలో ఉంది. మన దేశం దిగువ మధ్య తరగతి జాబితాలో 26వ స్థానంలో మొత్తం దేశాల్లో 140వదిగా ఉంది. సంకీర్ణ ప్రభుత్వాలతో దేశం వెనుకబడిందని మోడీ అన్నారు.జనానికి సమాచారం అందుబాటులో ఉన్నా చూసే ఓపిక, ఆసక్తి కూడా లేని బలహీనతను పాలకులు సొమ్ము చేసుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఉన్న 2004లో భారత జిఎన్‌ఐ 600 డాలర్లు 2013 నాటికి 1,500కు చేరింది.వార్షిక సగటు వృద్ది రేటు 11.48శాతం. కాగా స్థిరమైన, స్పష్టమైన విధానాలు అమలు జరిపినట్లు చెప్పుకున్న నరేంద్రమోడీ పాలనలో 2022 నాటికి అది 2,380 డాలర్లకు, వార్షిక వృద్ది రేటు 5.44శాతమే పెరిగింది. సంతోష సూచికలో 146 దేశాలకు గాను మనదేశం 137వ స్థానంలో ఉంది. కొంత మంది అంగీకరించినా లేకున్నా మన కంటే ఎగువన చైనా 82, నేపాల్‌ 85, బంగ్లాదేశ్‌ 99,పాకిస్థాన్‌ 103, శ్రీలంక 126వ స్థానాల్లో ఉన్నాయి. అయినప్పటికీ భారత్‌ను వికసింప చేస్తామని చెప్పటం నరేంద్రమోడీకే చెల్లింది.


ప్రపంచమంతా మోడీని పొగడుతోందని బిజెపి ప్రచారం చేసుకుంటుంది. నిజమే, మనతో అవసరం ఉన్నవారు ఎన్నిమాటలైనా చెబుతారు. గతంలో గ్రామాల్లో హరికథలు, బుర్రకథలు చెప్పేవారు ప్రతి ఊరులో మీ గ్రామం చుట్టుపక్కల అరవై ఆరుగ్రామాలకు పోతుగడ్డ అన్నట్లుగా పొగిడితే పొంగిపోవటం మామూలే. ఉదాహరణకు ఒక ఉదంతం చూద్దాం. 2014లో ఎన్నికల ఫలితాలు రాగానే నరేంద్రమోడీ ” భారత్‌ గెలిచింది, మంచి రోజులు రానున్నాయి ” అని ట్వీట్‌ చేశారు.2015నవంబరు 13న లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో నాటి బ్రిటీష్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ మాట్లాడుతూ దాన్ని కాపీకొట్టాడు, నరేంద్రమోడీని మునగచెట్టు ఎక్కించాడు.” అతి పెద్ద ప్రజాస్వామిక దేశాన్ని ఒక చారు వాలా పాలించలేడు అని వ్యతిరేకులు చెప్పారు. కానీ వారిది తప్పని మోడీ నిరూపించారు. మంచి రోజులు రానున్నాయని మోడీ సరిగానే చెప్పారు. కానీ మోడీ శక్తి, మోడీ స్వప్నం, మోడీ తృష్ణను చూసిన తరువాత నేను మరొకటి చెబుతున్నాను మంచి రోజులు కచ్చితంగా రానున్నాయి ” అన్నాడు. మనకు మంచి రోజుల సంగతేమో గానీ ఆ పెద్దమనిషి మరుసటి ఏడాదే ఉద్యోగం పొగొట్టుకున్నాడు. నరేంద్రమోడీని ఆకాశానికి ఎత్తి దేశపిత అని ఉబ్బేసిన డోనాల్డ్‌ ట్రంపుకూ పదవి ఊడింది. ఇటీవలే కామెరాన్‌ విదేశాంగ మంత్రిగా కొత్త కొలువులో కుదిరాడు. భారత్‌ అప్పుల పాలు కానుందని సరిగ్గా వికసిత భారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) రూపొందించిన నివేదిక హెచ్చరించింది.

ప్రపంచంలో మనదేశ స్థానం గురించి వివిధ సంస్థలు వెల్లడిస్తున్న సూచికలను అధికార బిజెపి, అది నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించదు, తప్పుల తడకలని, వారికి లెక్కలు వేయటం రాదని బుకాయించటం తెలిసిందే.పోనీ వారు నమ్మే వేదగణితం ప్రకారం మనం నిజంగా ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో ఎప్పుడైనా చెప్పారా ? ఇప్పుడు ఐఎంఎఫ్‌ చెప్పిందాన్ని కూడా తాము అంగీకరించటం లేదని, అవన్నీ ఊహాగానాలు తప్ప వాస్తవం కాదని కేంద్ర ప్రభుత్వం గింజుకుంది. నెరవేరని ఐదు లక్షల కోట్ల డాలర్ల జిడిపి కబుర్లు కూడా ఊహాగానమే, వర్తమాన వికసిత భారత్‌ కూడా అదే, వాస్తవం కాదు. వికసిత భారత్‌, తమ విజయం నల్లేరు మీద బండిలా సాగుతుందని చెప్పుకుంటున్న పూర్వరంగంలో ఐఎంఎఫ్‌ విశ్లేషణ గొంతులో పచ్చివెలక్కాయ వంటిదే. ఇంతకీ అదేమి చెప్పింది ? ప్రతికూల దెబ్బలు తగిలితే 2028నాటికి జిడిపి ఎంత ఉంటుందో ప్రభుత్వ అప్పు అంతకు (వందశాతం) చేరుతుందని హెచ్చరించింది. ఒక శతాబ్దిలో ఒకసారి వచ్చే కరోనా -19 మాదిరి విపరీత పరిణామాలు సంభవిస్తే అని ఐఎంఎఫ్‌ చెప్పిందని, అలాంటివేమీ జరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం అన్నది.


తమ నేత అధికారానికి వచ్చిన తరువాత విదేశీ అప్పులేమీ చేయటం లేదని ప్రచారం చేస్తున్న భక్తులను సంతుష్టీకరించలేము. మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం ప్రకారం 1970లో ఎనిమిది బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ అప్పు నూతన ఆర్థిక విధానాలను అమల్లోకి తెచ్చిన 1990నాటికి 83కి చేరింది. తరువాత పదేండ్లకు 101, 2010 నాటికి 290, నరేంద్రమోడీ అధికారానికి వచ్చేనాటికి 457 బి.డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్‌ తాజా విశ్లేషణ ప్రకారం 2024 మార్చి నాటికి 681, మరుసటి ఏడాది మార్చికి 748 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. వార్షిక అప్పు పెరుగుదల శాతాల్లో ఎగుడుదిగుళ్లు ఉండవచ్చు తప్ప మొత్తంగా చూసినపుడు పెరుగుదల ధోరణే ఉంది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ దేశీయ రుణ భారం 58.6లక్షల కోట్ల నుంచి 156.6లక్షల కోట్లకు 174శాతం పెరిగింది.కరోనా కారణంగా ఇంత అప్పు చేశాము, ఉచితంగా వాక్సిన్లు వేశాము అని బిజెపి పెద్దలు చెప్పవచ్చు. ఇన్ని లక్షల కోట్లు దానికే తెచ్చారా ? బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం 2024 మార్చి నాటికి దేశీయ అప్పు రు.164లక్షల కోట్లు, విదేశీ అప్పు 5లక్షల కోట్లు మొత్తం కలిపితే రు.169లక్షల కోట్లకు చేరనుంది.


ఐఎంఎఫ్‌ ఒక్క రుణం గురించి మాత్రమే చెప్పలేదు. నవంబరు 20నాటికి సంస్థ సిబ్బంది మనదేశ ఆర్థిక అంశాల గురించి రూపొందించిన 142పేజీల నివేదికను డిసెంబరు మూడవ వారంలో బహిర్గతం చేశారు. దానిలో గత పది సంవత్సరాల పాలన డొల్లతనం, వైఫల్యాల గురించి పేర్కొన్నారు. నివేదిక పదజాలంలో ఆ మాటలు లేకపోవచ్చు గానీ అచ్చేదిన్‌ పాలనలో అంకెలు చెబుతున్న అంశాల సారమిదే. వస్తు ఎగుమతులు 2019-20లో 320 బిలియన్‌ డాలర్లు ఉంటే తదుపరి రెండు సంవత్సరాల్లో వరుసగా 296, 429 బి.డాలర్లుగా ఖరారు చేసిన లెక్కలు చెబుతున్నాయి. తరువాత 2022-23లో 456, వర్తమాన సంవత్సరంలో 436, వచ్చే ఏడాది 460 బిలియన్‌ డాలర్ల అంచనాలుగా ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. ఎగుమతుల ప్రోత్సాహకం పేరుతో పక్కన పెట్టిన రెండు లక్షల కోట్ల రూపాయల వలన అదనంగా పెరిగిందేముంది ? మేకిన్‌, మేడిన్‌ ఇండియాల జాడ ఎక్కడ ? పిఐబి 2022 జూలై 29న విడుదల చేసిన సమాచారం ప్రకారం 2017-18లో జిడిపిలో వస్తు ఎగుమతుల శాతం 11.4కాగా 2021-22లో 13.3శాతంగా పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల సగటు 11.78శాతం ఉంది. వస్తువులు, సేవల ఎగుమతులు ఈ కాలంలోనే 18.8 శాతం నుంచి 21.4శాతం మధ్య ఉన్నాయి. సగటు 19.5శాతమే ఉంది. అందువలన వాటిలో కూడా పెద్దగా పెరుగుదల లేదు.మాక్రోట్రెండ్స్‌ అనే పోర్టల్‌ నిర్వహిస్తున్న సమాచారం ప్రకారం 2004 నుంచి 2013వరకు ఏటా సగటున 22.1శాతం ఎగుమతులు జరిగాయి. ఈలెక్కన మోడీ ఏలుబడిలో దిగుమతులు పడిపోయినట్లా పెరిగినట్లా ? దేశ ప్రతిష్టను, మార్కెట్లను పెంచేందుకు నరేంద్రమోడీ విదేశాలు తిరిగినట్లు, విశ్వగురువుగా మారినట్లు ఎంతగా చెప్పుకున్నా మోడీ లావూ పొడుగూ చూసి ఎవరూ ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు చేసుకోవటం లేదు. యుపిఏ హయాంలో దేశ దిగుమతులు జిడిపిలో వార్షిక సగటు 26.4శాతం ఉంది.నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత తొమ్మిది సంవత్సరాలలో సగటున 22.9శాతం చొప్పున ఉన్నాయి.

మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఎందుకు ఉన్నాయంటే తాము చేసిన ఆర్థికవృద్ధి కారణంగా జనంలో కొనుగోలు శక్తి పెరిగి దిగుమతులకు గిరాకీ ఏర్పడిందంటారు బిజెపి నేతలు. ఒకవేళ అదే వాస్తవమైతే జిడిపిలో దిగుమతుల శాతం యుపిఏ హయాంలోనే ఎక్కువ ఉంది, అంటే బిజెపి కంటే మెరుగైన పాలన అందించినట్లుగా భావించాలి. విదేశీ వాణిజ్యలోటు యుపిఏ పాలనా కాలంలో సగటున ఏటా జిడిపిలో 2.26శాతం ఉంది. 2004లో 0.3శాతం నుంచి మధ్యలో 4.8శాతానికి పెరిగి 2013నాటికి 1.7శాతానికి తగ్గింది. నరేంద్రమోడీ ఏలుబడిలో ఎనిమిది సంవత్సరాలలో వార్షిక సగటు 1.45శాతం ఉండగా మధ్యలో ఒక ఏడాది 0.9శాతం మిగులు ఉంది. 2014లో 1.3శాతంగా ఉన్న లోటు 2022లో 2.6శాతానికి పెరిగింది. సూచిక పైకి చూస్తున్నది తప్ప కిందికి రావటం లేదు. మొత్తంగా చూసినపుడు వికసిత భారత్‌ కనుచూపులో కనిపించకపోయినా పట్టపగలు అరుంధతి నక్షత్రాన్ని చూపిన మాదిరి చెబుతున్నారు. ఒకసారి చెప్పినదాన్ని మరొకసారి మాట్లాడకుండా కొత్త పాట అందుకుంటున్నారు, అదే బిజెపి, నరేంద్రమోడీ ప్రత్యేకత !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇప్పుడు ఎవరైనా కాశ్మీరులో భూమి కొనవచ్చా !

12 Tuesday Dec 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Women

≈ Leave a comment

Tags

Article 370 and 35A, BJP, Kashmir, Narendra Modi, RSS, Supreme Court of India


ఎం కోటేశ్వరరావు


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 ద్వారా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హౌదా, ఆర్టికల్‌ 35ఏ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు ఆమోదం తెలిపింది. అది తాత్కాలికమే గనుక రద్దు సబబే అన్నది. తీర్పు ఇచ్చిన కోర్టు, న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు. తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు ఉంది గనుక ఆ మేరకు అనేక మంది అనుకూలంగా, వ్యతిరేకంగానూ స్పందిస్తున్నారు.భిన్న అభిప్రాయం చెప్పటం దేశద్రోహం లేదా ఉన్నత న్యాయస్థానాన్ని ధిక్కరించటం కాదు. ఈ తీర్పుతో రాష్ట్రంలోని ఒక తరగతి జనం సంతోషించరు అని కాశ్మీరు మాజీ రాజు హరిసింగ్‌ కుమారుడు, కేంద్ర మంత్రిగా పని చేసిన కాంగ్రెస్‌ నేత కరణ్‌ సింగ్‌ స్పందించారు. తీర్పుతో ఆశాభంగం చెందాం తప్ప నిరుత్సాహపడటం లేదని మాజీ సిఎం ఒమర్‌ అబ్దుల్లా చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి వెలుపలికి వచ్చి బిజెపికి దగ్గరగా ఉంటున్న గులాం నబీ అజాద్‌ కూడా ఆశాభంగం చెందినట్లు ప్రకటించారు. తీర్పు వెలువరిస్తున్న సందర్భంగా కాశ్మీరులోయలో ఆర్టికల్‌ రద్దును వ్యతిరేకించిన రాజకీయ పార్టీలకు చెందిన వారిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఆ వార్తలను సహజంగానే ప్రభుత్వం కొట్టిపడవేసింది. కోర్టు తీర్పును ఆమోదించటం తప్పనిసరి అంటూ దీనికి వ్యతిరేకంగా అనవసరంగా గోడకేసి తలలను కొట్టుకోవాల్సిన పనిలేదు.వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు శక్తిని సమీకరించుకోవాలని కరణ్‌ సింగ్‌ సలహా ఇచ్చారు.


ఆర్టికల్‌ 370 వలన దేశంలోని ఇతర ప్రాంతాల వారెవరూ అక్కడ ఉండటానికి, భూములు కొనుక్కోనేందుకు అవకాశం లేదని, కాశ్మీరు వేరే దేశం అన్నట్లుగా ఉందని రకరకాల ప్రచారాలు చేశారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాలను జోడించారు. కాశ్మీరుకు ప్రత్యేక హౌదా తొలగించిన గత నాలుగున్నర సంవత్సరాలలో జరిగిందేమిటి? వాటిలో కొన్నింటిని చూద్దాం. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తరువాత ” నూతన కాశ్మీరు ” ఎంతో అభివృద్ది చెందిందని ప్రచారం చేస్తున్నారు. 2018-19 కాశ్మీరు రాష్ట్ర ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం మానవాభివృద్ది రంగాల్లో గుజరాత్‌ కంటే ముందున్నట్లు పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఇంకా జరిగిందని చెబుతున్నట్లా ? 2019జూన్‌లో ఎకనమిక్‌ టైమ్స్‌ ప్రచురించిన వార్త ప్రకారం 15-29 సంవత్సరాల వారిలో నిరుద్యోగం 15.89శాతం ఉంది. రాష్ట్రాన్ని కేంద్రం స్వాధీనం చేసుకున్న తరువాత 2020లో 17.8శాతం ఉన్నట్లు లేబర్‌ సర్వేలో తేలింది. ఇక తాజా సమాచారం ప్రకారం 18.3 శాతం ఉందని కేంద్ర మంత్రి నిత్యానందరారు పార్లమెంటులో చెప్పినట్లు హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక 2023 జూలై 26న ప్రచురించింది. కేంద్ర పాలనలో సాధారణ పరిస్థితి ఏర్పడిందని, ఉపాధి పెరిగిందని చేస్తున్న ప్రచారానికి పొంతన కనిపించటం లేదు. ఉగ్రవాదులు చెలరేగుతూనే ఉన్నారు. ఆ కారణంగానే రాష్ట్ర ప్రతిపత్తిని ఇంకా పునరుద్దరించలేదు.


ఆర్టికల్‌ 370కు అనుబంధంగా రాష్ట్రపతి ఉత్తరువు ద్వారా 1954లో రాజ్యాంగానికి ఆర్టికల్‌ 35ఏ తోడైంది. అనేక రాష్ట్రాలలో కల్పించిన మాదిరి కాశ్మీరులో ఉన్న శాశ్వత నివాసులకు కొన్ని ప్రత్యేక అవకాశాలు, హక్కులను ఇది కల్పించింది. రాష్ట్రం వెలుపల ఉన్న వారికి స్థిర ఆస్తులను కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. ఎవరు శాశ్వత నివాసులన్న నిర్వచనాన్ని మూడింట రెండువంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మాత్రమే మార్చగలదు.ఈ ఆర్టికల్‌ వలన దేశంలోని ఇతరులు కాశ్మీరులో రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడుతున్నట్లు , ఇది పౌరుల మౌలిక హక్కులకే విరుద్దం అని రాష్ట్రం వెలుపలి వారిని వివాహం చేసుకున్న కాశ్మీరీ మహిళకు జన్మించిన సంతానానికి కూడా ఆస్తిహక్కు ఉండదని ఇది వివక్ష కాదా అని కొందరు భాష్యం చెప్పారు. నిజానికి కాశ్మీరు శాశ్వత నివాసుల గురించి 1927లోనే నాటి రాజు హరిసింగ్‌ ఉత్తరువులు జారీ చేశారు. విలీనం సందర్భంగా వాటికి హమీ ఇచ్చినందున రాజ్యాంగంలో పొందు పరచినట్లు సమర్ధకులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక హక్కులు మరికొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నాయని వాటి సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా సవరించిన దాని ప్రకారం కాశ్మీరులో స్థానికత నిర్దారణకు నిబంధనలు ఇలా ఉన్నాయి. పదిహేను సంవత్సరాలు కాశ్మీరులో నివసించిన వారు, రాష్ట్రంలో ఏడు సంవత్సరాల పాటు చదివి పది లేదా పన్నెండవ తరగతి పరీక్షకు హాజరైన వారు, వలస వచ్చినట్లు పునరావాస, సహాయ కమిషనర్‌ వద్ద నమోదు చేయించుకున్నవారు, పదేండ్లకు పైగా కాశ్మీరులో పని చేసిన ఆలిండియా సర్వీసు అధికారులు, ప్రభుత్వ రంగసంస్థలు, బాంకులు, పరిశోధనా సంస్థలు, చట్టబద్ద ఇతర సంస్థలలో వారు పని చేసినా స్థానికులుగా పరిగణించబడతారు. అలాంటి వారి పిల్లలు రాష్ట్రం వెలుపల ఉపాధి, వాణిజ్యం, వంటి వాటికోసం ఉంటే వారినీ స్థానికులుగా పరిగణిస్తారు.


ఒకే దేశం, పౌరులంతా సమానమే అని చెప్పినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో వెలుపలి వారు భూములు కొనేందుకు లేదు. జమ్మూకాశ్మీరులో నిబంధనలు సడలించినప్పటికీ భూముల కొనుగోలు మినహాయింపు అది పరిశ్రమలకే తప్ప ఎవరుబడితే వారు కొనుగోలు చేసేందుకు కాదని లెప్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా చెప్పారు. సవరించిన కాశ్మీరు రెవెన్యూ చట్టం ప్రకారం వ్యవసాయదారులు కాని వారు సాగు భూమి కొనుగోలు చేసేందుకు లేదు. ఎవరు వ్యవసాయదారు అంటే స్వంతంగా చేసే వారు అని స్పష్టం చేశారు. ఎవరు కొనుగోలుకు అర్హులో నిర్ణయించాల్సి ఉంది. తిరిగి రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఏర్పడే ప్రభుత్వం తలచుకుంటే ఆంక్షలను తిరిగి ప్రవేశపెట్టవచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 371 ప్రకారం అనేక రాష్ట్రాలలో ప్రత్యేక హక్కులను కల్పించారు. ఇరవై సంవత్సరాలకు పైగా నివాసం ఉన్నవారే హిమచల్‌ ప్రదేశ్‌లో ఎక్కడైనా భూమికొనుగోలుకు అర్హులు.ఎవరైనా నిజమైన స్థానికుడిని హిమాచలీ కాని మహిళ వివాహం చేసుకుంటే అలాంటి వారికి మినహాయింపు ఉంటుంది. స్థానికులైనా వ్యవసాయదారులు కాని వారు సాగు భూములు కొనటానికి లేదు. నివాసానికి కొనుగోలు చేయాలన్నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.వ్యవసాయేతర భూమిని వెలుపలి వారు కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు పెట్టుబడిదారులు భూమి కొనుగోలు చేయవచ్చు. నాగాలాండ్‌లో ఆర్టికల్‌ 371ఏ ప్రకారం అక్కడి భూముల బదిలీ, యాజమాన్య హక్కులపై కేంద్రం కూడా చట్టాలు చేయటానికి లేదు. భూమి పుత్రులు తప్ప ఇతరులు భూమికొనే అవకాశం లేదు. సిక్కింలో ఆర్టికల్‌ 371ఎఫ్‌ ప్రకారం వెలుపలి వారు భూమి, ఆస్తులు కొనుగోలు మీద ఆంక్షలు ఉన్నాయి. కొన్ని మునిసిపల్‌ ప్రాంతాల్లో తప్ప సిక్కిం వాసులు ఆస్తి కొనుగోలు చేయవచ్చు, వారు కూడా గిరిజన ప్రాంతాల్లో కొనటానికి లేదు అక్కడ వారికి మాత్రమే కొనే అమ్మే హక్కు ఉంటుంది.ఎవరైనా పరిశ్రమలు పెడితే వెలుపలి వారు కొనుగోలు చేయవచ్చు. అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం,పశ్చిమబెంగాల్లో రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలులో పేర్కొన్న స్వయం పాలిత గిరిజన ప్రాంతాల్లో ఇతరులు భూములు కొనటానికి లేదు. మిజోరంలో ఆర్టికల్‌ 371జి ప్రకారం గిరిజనేతర ప్రాంతాల్లో భూబదలాయింపుల్లో పరిమితులు ఉన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో సాంకేతికంగా, సంప్రదాయంగా స్థానిక నివాసులు, కానివారికీ ఎవరికీ భూమిపై హక్కులు లేవు.2018లో చేసిన చట్టం ప్రకారం స్థానికులకు వ్యక్తిగత ఆస్తి హక్కులు కల్పించారు. వెలుపలి వారు, గిరిజనేతరులు స్వంత ఆస్తి కలిగి ఉండటానికి లేదు. ఝార్ఖండ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌లలో గిరిజనేతరులు గిరిజనుల భూములు కొనుగోలు చేయటంపై ఆంక్షలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో 2003లో చేసిన చట్టం ప్రకారం వెలుపలి వారు నివాసం కోసం కేవలం 250 చదరపు మీటర్ల భూమిని మాత్రమే కొనుగోలు చేయవచ్చు.


తమిళనాడులో జిల్లాకలెక్టర్‌ అనుమతితో గరిష్టంగా 59.95 ఎకరాల వ్యవసాయ భూమిని మాత్రమే కొనుగోలు చేయవచ్చు. గడచిన పది సంవత్సరాల్లో సాగులేని భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యవసాయ భూములు కొనవచ్చు.ఏ తరగతి ప్రాంతాల్లో గరిష్టంగా పది ఎకరాలు అంటే నీటి వసతి ఉన్నచోట, కె తరగతి ప్రాంతాల్లో మెట్ట, నీటివసతి లేని చోట 54 ఎకరాలను కొనుగోలు చేయవచ్చు.కేరళలో ఎవరైనా భూములు కొనవచ్చు. అయితే వివాహం కాని పెద్దలు లేదా కుటుంబంలో ఒకరే ఉంటే ఐదు నుంచి ఏడున్నర ఎకరాలు మాత్రమే కొనుగోలు చేయవచ్చు.ఐదుగురి వరకు ఉన్న కుటుంబం పది నుంచి పదిహేను ఎకరాలు కొనుక్కోవచ్చు.పదికి మించి ఉన్న కుటుంబం గరిష్టంగా ఇరవై ఎకరాల వరకు కొనవచ్చు.మహారాష్ట్రలో కేవలం వ్యవసాయదారులు మాత్రమే గరిష్టంగా 54ఎకరాల వరకు సాగు భూములు కొనవచ్చు.హర్యానాలో అదుపులో ఉన్న ప్రాంతాలుగా ప్రకటించిన చోట వ్యవసాయేతర అవసరాల కోసం సాగు భూములు కొనాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. గుజరాత్‌లో ఉన్న నిబంధనల ప్రకారం వ్యవసాయం చేయని వారు సాగు భూములు కొనేందుకు లేదు. గుజరాతీలకు మాత్రమే వ్యవసాయ భూముల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉంది.2012లో గుజరాత్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుప్రకారం దేశంలోని ఏ సాగుదారైనా గుజరాత్‌లో వ్యవసాయ భూములు కొనుగోలు చేయవచ్చు. వివిధ నేపధ్యాల పూర్వరంగంలో ఒకే దేశమైనప్పటికీ భూములు కొనుగోలుపై ఆంక్షలు ఉన్నాయి. కాశ్మీరులో కూడా అదే జరిగింది. ప్రస్తుతం అది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. రేపు తిరిగి రాష్ట్రంగా ఏర్పడితే భూమి హక్కులు, ఇతర అంశాలకు సంబంధించి తనదైన చట్టాలను చేసుకొనేందుకు అవకాశాలు లేకపోలేదు. కేంద్రం రద్దు చేసిన 35ఏ ఆర్టికల్‌లోని అంశాలను మరో చట్టం రూపంలో తెచ్చినా ఆశ్చర్యం లేదు.
వాట్సాప్‌లో కాషాయదళాలు అనేక తప్పుడు ప్రచారాలు చేశాయి. కాశ్మీరులో హిందువులు, సిక్కులు మైనారిటీలు వారికి అక్కడ రిజర్వేషన్లు లేవు అన్నది ఒకటి.హిందూ మతం దేశంలో మైనారిటీ కాదు. రాష్ట్రాలలో ఉన్న జనాభా ప్రాతిపదికను బట్టి నిర్ణయిస్తే ఈశాన్య రాష్ట్రాలలో అనేక చోట్ల క్రైస్తవులు మెజారిటీ, కానీ అక్కడ హిందువులకు రిజర్వేషన్లు అడగలేదు.మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే మా ప్రాణాలైనా ఇస్తాంగానీ అమలు జరగనివ్వం అని చెబుతున్న బిజెపి వారు కాశ్మీర్‌లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా అడుగుతారు ? కాశ్మీరు 2005 రిజర్వేషన్‌ చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలవారికి 8, మాజీ సైనికులకు 6, వికలాంగులకు మూడు, వాస్తవాధీన రేఖ సమీపంలో వున్నవారికి మూడు, వెనుక బడిన తరగతులకు రెండుశాతం వున్నాయి. వీటిని 2020లో కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ ద్వారా షెడ్యూలు తరగతులకు 10,షెడ్యూలు కులాలకు 8, ఇడబ్ల్యుఎస్‌ 10, వెనుకబడిన ప్రాంతాల వారికి పది, మాజీ సైనికులకు ఆరు,పహారీ భాష మాట్లాడేవారికి, వికలాంగులు, వాస్తవాధీన రేఖ వెంబడి ఉండేవారికి, బలహీన వర్గాల(సామాజిక కులాలు)కు నాలుగేసి శాతాల చొప్పున సవరించారు. మొత్తం రిజర్వేషన్లు అరవైశాతం ఉన్నాయి. వర్తమాన పార్లమెంటు సమావేశాల్లో వాటిని చట్టబద్దం చేస్తూ బిల్లులను ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం కాశ్మీరులో హిందువులకు ప్రత్యేక రిజర్వేష్లన్లను ఎందుకు పెట్టలేదో బిజెపి వారు చెప్పగలరా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ ప్రేమ-ద్వేషం : చైనా వద్దు అమెరికన్‌ విద్యుత్‌ కార్లు ముద్దు !

29 Wednesday Nov 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Environment, Europe, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, UK, USA

≈ Leave a comment

Tags

BJP, BYD, Donald trump, Electric car wars, EU, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, Tesla


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో ఎలక్ట్రానిక్‌ కార్ల యుద్ధానికి తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చైనా ఒక వైపు, ఐరోపా సమాఖ్య-అమెరికా మరోవైపు మోహరిస్తున్నాయి. అమెరికా కంపెనీ టెస్లా కార్ల దిగుమతికిి మన కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదరిందని, వచ్చే ఏడాది నుంచి ఓడల్లో కార్లు దిగనున్నాయని వార్తలు. అధికారికంగా జనవరిలో ప్రకటించవచ్చు. రానున్న రెండు సంవత్సరాల్లో కార్ల తయారీ(విడి భాగాలను తీసుకువచ్చి ఇక్కడ అమర్చటం) కూడా ప్రారంభించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ప్రపంచంలో అత్యధిక కార్లను అమ్ముతున్న చైనా బివైడి కంపెనీతో కలసి కార్ల తయారీని ప్రారంభిస్తామన్న మెఘా ఇంజనీరింగ్‌ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. టెస్లా రెండు వందల కోట్ల డాలర్ల మేర కార్ల తయారీ కేంద్రానికి పెట్టుబడి పెడుతుందని మన దేశం నుంచి 1,500 కోట్ల డాలర్ల విలువగల విడి భాగాలను కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ సెప్టెంబరు నెలలో కాలిఫోర్నియాలోని టెస్లా కంపెనీని సందర్శించి వచ్చిన సంగతి తెలిసినదే. వంద కోట్ల డాలర్ల పెట్టుబడితో హైదరాబాదులో ఏటా పది నుంచి పదిహేను వేల కార్ల తయారీ, ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేస్తామని చైనా బివైడి-మెఘా చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలు చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అనుమతించే అవకాశం లేదని కారణం చెప్పింది. మెఘా కంపెనీ పెట్టుబడిపెడితే సాంకేతిక పరిజ్ఞానం చైనా కంపెనీ అందచేస్తుందని చెప్పినప్పటికీ అంగీకరించలేదు. దీనికి కారణం అమెరికన్‌ కంపెనీ టెస్లాను అనుమతించేందుకు సముఖంగా ఉండటమే అని చెప్పవచ్చు. మనం ఎలాగూ తయారు చేయలేనపుడు రెండు విదేశీ కంపెనీలు పోటీ పడి ధరలను తగ్గిస్తే మన వినియోగదారులకు లాభం, కొన్ని విడిభాగాలు ఇక్కడే తయారీ ద్వారా కొంత మేరకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ టెస్లావైపే మొగ్గుచూపటం ఏమిటన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. చైనాలో స్వంతంగా తయారు చేసే కంపెనీలు ఉన్నప్పటికీ టెస్లాను కూడా అనుమతించిన కారణంగా పోటీ బడి అది కూడా తక్కువ ధరలకే అక్కడ కార్లు అమ్ముతున్నది. మెఘా ఇంజనీరింగ్‌ కంపెనీ ఇప్పటికే చైనా కంపెనీతో కలసి ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.దానికి లేని అడ్డంకి కార్లకు వచ్చిందంటే 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణలు, చైనా వ్యతిరేక కూటమిలో మన దేశం మరింతగా భాగస్వామి కావటమే అని చెప్పవచ్చు.


ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిలో చైనా జోరు ప్రపంచ మార్కెట్లను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది.సాంప్రదాయ కార్ల నుంచి ఎలక్ట్రానిక్‌ వాహనాలకు మారితే ప్రస్తుతం తమ సంఘంలోని లక్షా యాభై వేల మంది కార్మికుల్లో 35వేల మందికి ఉపాధిపోతుందని అమెరికా యునైటెడ్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ తెలిపింది. తమ దేశంలో 2032 నాటికి మూడింట రెండువంతులు ఎలక్ట్రానిక్‌ కార్ల విక్రయమే ఉంటుందని అమెరికా ప్రకటించగా, 2035 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ కార్లనే అమ్ముతామని ఐరోపా సమాఖ్య పేర్కొన్నది. ఈ లక్ష్యాలను సాధించటానికి చైనా నుంచి వాహనాల దిగుమతులను అనుమతించాలా వద్దా అని ఆ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కేవలం ఎలక్ట్రిక్‌ మరియు ఇంథనంతోనూ నడిచే హైబ్రిడ్‌ కార్లతో సహా 2022లో ప్రపంచంలో నూటికి 60 చైనాలోనే ఉత్పత్తి చేశారు.చైనాలో ఐదువేల నుంచి 90వేల డాలర్ల వరకు ధర ఉండే 90 రకాల కార్లను అందుబాటులో ఉంచారు. సగటు ధర 53,800 డాలర్లుండగా ఐరోపాలో 94,100 డాలర్లుంది. ఈ ఏడాది చైనాలో మొత్తం కార్ల అమ్మకాల్లో నాలుగో వంతు(80లక్షలు) ఎలక్ట్రిక్‌ కార్లుండగా, ఐరోపా సమాఖ్య దేశాల్లో 22, అమెరికాలో ఆరు, జపాన్‌లో కేవలం మూడు శాతమే ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఐరోపా సమాఖ్య(ఇయు) 2022లో చైనా నుంచి దిగుమతి చేసుకున్న కార్లు సమాఖ్య మొత్తం ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో మూడు శాతమే. అవి 2030నాటికి 20శాతానికి చేరతాయని స్థానిక కార్ల కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. చైనా పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చిన కారణంగా తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపిస్తూ వాటి మీద విచారణ జరపాలని ఇయు నిర్ణయించింది. దిగుమతి సుంకాల మీద ఒక నిర్ణయం తీసుకొనేందుకు పూనుకుంది.ఇయు నిర్ణయం రక్షణాత్మక చర్యలు తప్ప మరొకటి కాదని వెంటనే చైనా స్పందించింది. అక్కడ ఇస్తున్న సబ్సిడీల సంగతేమిటని ప్రశ్నించింది. ఏ హౌదాతో తమపై విచారణ జరుపుతుందని నిలదీసింది. చైనా నుంచి వస్తున్న దిగుమతులతో స్థానికంగా ఉన్న కార్ల గిరాకీ 20శాతం తగ్గుతుందని అంచనా. చైనా కస్టమ్స్‌ సమాచారం ప్రకారం వర్తమాన సంవత్సరం ఏడునెలల్లో గతేడాది కంటే 113శాతం పెరగ్గా, 2020తో పోల్చితే3,205 శాతం ఎక్కువ. చైనా ఇస్తున్న సబ్సిడీలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే పోరాడాల్సిందేనని జర్మనీ మంత్రితో భేటీ అయిన ఫ్రెంచి ఆర్థిక మంత్రి బ్రూనో లీ మెయరే చెప్పాడు. అయితే కొందరు ఐరోపా వాణిజ్యవేత్తలు దర్యాప్తును వ్యతిరేకిస్తున్నారు. దీంతో చైనా కూడా ఎదురుదాడికి దిగితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు అనేక దేశాలు చైనా నుంచి చౌకగా వచ్చే కార్లను దిగుమతి చేసుకోవాలని ఉన్నా స్థానిక కార్మికులకు పని లేకుండా పోతుందనే భయం మరోవైపు ఉంది.ప్రపంచంలో ఆటో పరిశ్రమల్లో కార్మికులు కోటీ నలభై లక్షల మంది ఉండగా చైనాలో 40లక్షలు,ఇయులో 25, అమెరికా, మెక్సికో, జపాన్లలో పది లక్షల వంతున ఉన్నారు. గతేడాది ప్రపంచ కార్ల ఎగుమతి విలువ 780బిలియన్‌ డాలర్లు కాగా ఇయు 407, జపాన్‌ 87, అమెరికా 58, దక్షిణ కొరియా 52, మెక్సికో 47 బి.డాలర్ల వాటా కలిగి ఉండగా చైనా 45 బి.డాలర్ల మేరకే ఎగుమతి చేసింది. ఉక్కు రంగంలో 2021లో మిగతా దేశాలను వెనక్కు నెట్టేసినట్లుగా రానున్న రోజుల్లో కార్లలో కూడా చైనా అగ్రస్థానానికి వస్తుందేమోనన్న భయం వెల్లడవుతోంది.


అమెరికాలో పికప్‌ ట్రక్కుల మీద 25శాతం తప్ప సాధారణ పన్ను 2.5శాతమే, అయితే చైనాతో వాణిజ్యపోరు ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా కార్ల మీద 25శాతం విధించగా దాన్ని జోబైడెన్‌ కొనసాగిస్తున్నాడు. జపాన్‌లో అసలు పన్ను లేదు, పదిశాతం వసూలు చేస్తున్న ఇయు చైనా కార్ల మీద పన్ను పెంచాలని చూస్తున్నది.చైనా కంపెనీలు తక్కువ ధరలకు కార్లను ఎందుకు విక్రయించగలుగుతున్నాయన్నది ప్రశ్న. ఎలక్ట్రిక్‌ కార్లలో కీలకమైనవి. లిథియం – అయాన్‌ బ్యాటరీలు.వీటి పరిశోధన-అభివృద్దికి చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది, ఆ రంగంలో ఉన్నవారికి రాయితీలిచ్చింది. దానికి తోడు వాటి తయారీకి అవసరమైన ముడిపదార్దాలు చైనాలో పుష్కలంగా ఉండటం అక్కడి కంపెనీలకు కలసివచ్చింది. దీంతో స్థానిక వినియోగదారులు ఆకర్షితులౌతున్నారు ప్రపంచంలో వందకార్లు అమ్మితే గతేడాది చైనాలోనే 59 అమ్మారు. ఈ ఊపుతో ప్రపంచ మార్కెట్లకు విస్తరించాలని అక్కడి కంపెనీలు చూస్తున్నాయి. ఐరోపా దేశాల్లో తలెత్తిన కాలుష్యం కారణంగా రోడ్ల మీద ధ్వనితో 40శాతం మంది బ్రిటీష్‌ పౌరులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తేలింది.వాయు కాలుష్యంతో శ్వాస సమస్యలు పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ కార్ల వలన 17 నుంచి 30శాతం వరకు గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ విడుదల తగ్గుతుందని అంచనా. అందుకే 2035నాటికి బ్రిటన్‌లో మొత్తం ఎలక్ట్రిక్‌ కార్లనే అమ్మాలని నిర్ణయించారు. ఒకవైపు చమురు ఇంథన కాలుష్యం తగ్గుతుందనే సానుకూలత ఉన్నా ప్రతికూలతల గురించి కూడా చర్చ మొదలైంది. హరిత ఇంథనం కోసం ధనికదేశాల ప్రయత్నం పేద దేశాల్లో పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నది.


ప్రస్తుత తీరుతెన్నులను చూస్తే చైనా – ఇతర దేశాల మధ్య కార్ల ధరల యుద్దం జరిగే సూచన కనిపిస్తున్నది. అమెరికా కంపెనీ టెస్లా దీనికి నాంది పలికింది.దీంతో చైనాలోని కొన్ని రకాల కార్ల ఉత్పత్తిని ఆపివేయాల్సి వచ్చింది.ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో దేశీయ మార్కెట్లో 114లక్షల కార్లను విక్రయించగా 20లక్షలు ఎగుమతి చేసింది. విదేశీ ఎగుమతులు 80శాతం పెరగ్గా, స్వదేశీ మార్కెట్‌ 1.7శాతమే పెరిగినందున ధరల పోటీకి దిగితే చైనా కూడా నష్టపోవచ్చని కొందరు చెబుతున్నారు.గతేడాది డిసెంబరు నాటికి చైనాలో 4.3 కోట్ల కార్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉందని, ఉన్న సామర్ధ్యంలో 2017లో 66.6శాతం వినియోగిస్తే గతేడాది 54.5శాతంగా ఉందని రాయిటర్స్‌ పేర్కొన్నది.అక్కడ ఆటోపరిశ్రమ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మూడు కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. జపాన్‌ కార్ల పరిశ్రమకు సైతం చైనా సెగతగులుతోంది.టయోటా తదితర కంపెనీలు తమ డిమాండ్‌ పడిపోకుండా చూసుకుంటున్నాయి.చైనాలో హైబ్రిడ్‌ కార్లకు మార్కెట్‌ ఎక్కువగా ఉంది. నిజంగా కార్ల ధర యుద్దమే తీవ్రమైతే చైనాకు తక్షణమే ఇబ్బంది ఉండదు. ఇప్పటికే సామర్ధ్యాన్ని సమకూర్చుకున్నందున పూర్తిస్థాయిలో ఉత్పత్తి వెంటనే జరపవచ్చు, అదే మిగతా దేశాల్లో సామర్ధ్యాన్ని పెంచుకొనేందుకు భారీగా పెట్టుబడులను కూడా పెట్టాల్సి వస్తుంది.


మన దేశంలో ఎలక్ట్రానిక్‌ కార్ల తయారీకి పూనుకుంటే ముడిపదార్దాలు, బ్యాటరీల కోసం చైనా మీద ఆధారపడటం పెరుగుతుందని గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(గిట్రి) ఈ ఏడాది మార్చి నెలలో తన నివేదికలో పేర్కొన్నది. భారత్‌లో తయారయ్యే వాహనాలకు అవసరమైన వాటిలో 70శాతం వస్తువులను చైనా, ఇతర దేశాల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుంది..కాలుష్యం, ఉపాధిపై తలెత్తే పర్యవసానాల వంటి 13 అంశాలను గిట్రి గుర్తించింది.ఈ వాహనాల బ్యాటరీలను దిగుమతి చేసుకోవాలి, ధరలు ఎక్కువగా ఉంటాయి, ఆరేడు సంవత్సరాల తరువాత కొత్తవాటిని వేసుకోవాలి, వాటిని రీసైకిల్‌ చేయాలంటే వెలువడే విషపదార్దాలు సమస్యగా మారతాయి, దీని వలన విద్యుత్‌ గిరాకీ పెరుగుతుంది, బొగ్గుద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ ప్రక్రియలో కాలుష్యం పెరుగుతుంది. దూరప్రయాణాలకు అనువుగా ఉండవు,ప్రజా రవాణాకు పెద్దగా ఉపయోగపడవు,చైనా మీద ఎక్కువగా ఆధారపడటం వంటి అంశాలను పేర్కొన్నది. ఆటో విడిభాగాలను తయారు చేసే ఏడు వందల సంఘటిత రంగ సంస్థలతో పాటు పదివేల అసంఘటిత రంగ సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. విడిభాగాలు అమ్మేవారు, లక్షలాది గారేజ్‌ షాపులు, సర్వీసు సెంటర్ల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని కూడా పేర్కొన్నది. తమ కాలుష్యకారక పరిశ్రమలను రక్షించుకొనేందుకు, ప్రపంచ వాణిజ్యాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లాలని ఐరోపా దేశాల చెబుతున్నాయి తప్ప ప్రపంచమంతా అలా లేదు.ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు చార్జర్లకు ఒక ప్రమాణం లేదు, అందువలన ప్రతి సంస్థ తనదైన నమూనాను ఇస్తున్నది, దేశమంతటా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నదని గిట్రి పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎడియూరప్పా మజాకా ! కుటుంబవారసత్వంపై నరేంద్ర మోడీ నోటికే తాళం వేసిన ఘటికుడు !!

11 Saturday Nov 2023

Posted by raomk in BJP, BRS, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP

≈ Leave a comment

Tags

B.Y. Vijayendra, BJP, BJP Dynastic Politics, BS Yediyurappa, Karnataka BJP, Narendra Modi, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


దేశంలో ఎక్కడైనా ప్రధాని నరేంద్రమోడీ హవా నడుస్తుందేమో గానీ కన్నడ సీమలో చెల్లదని అధికార రాజకీయాల్లో తలపండిన కర్ణాటక మాజీ సిఎం బిఎస్‌ ఎడియూరప్ప తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు తప్ప మాకుటుంబానికి వర్తించవు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా తన కుమారుడి నియామకంలో నరేంద్రమోడీయే అంతిమ నిర్ణయం తీసుకున్నారని కుండబద్దలు కొట్టారు. బిజెపి విలువల వలువలను నడిబజారులో విప్పేశారు. వారసత్వ రాజకీయం అని ఎవరైనా అంటే అనుకోనివ్వండి లెక్క చేయను అన్నారు. కుటుంబ,వారసత్వ రాజకీయాలు, ఒకే కుటుంబానికి పలు పదవులకు వ్యతిరేకం అని సుభాషితాలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ తన మాటలను తానే దిగమింగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎడియూరప్పవేసిన తాళంతో బహుశా ఇంక ఎక్కడా వారసత్వ రాజకీయాల గురించి ఇతర పార్టీల మీద ఎక్కక పోవచ్చు. ఎడియూరప్ప కుమారుడు, తొలిసారి ఎంఎల్‌ఏగా గెలిచిన బివై విజయేంద్రను కర్ణాటక పార్టీ అధ్యక్షుడిగా బిజెపి అధిష్టానం నియమించింది.ఎడియూరప్ప పార్టీ పార్లమెంటరీ బోర్డు పదవిలో ఉన్నారు. మరో కుమారుడు రాఘవేంద్ర లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. కర్ణాటక రాజకీయాల గురించి తెలిసిన వారికి ఎడియూరప్ప కుటుంబం ఒక రాజకీయ సైనిక పటాలం వంటిది. ముగ్గురు కుమార్తెలు, వారి కుటుంబాలు, ఇద్దరు కుమారులు వారి కుటుంబాలు ఎవరు చక్కపెట్టాల్సినవాటిని వారు చేస్తారు. ఇప్పటి వరకు వారి మధ్య ఎలాంటి పేచీలు రాలేదు. గతంలో ఎడియూరప్ప కాబినెట్‌ మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప పదవిలో ఉండగానే గవర్నర్‌కు ఐదు పేజీల లేఖ రాసి సిఎం కుటుంబం ఎలా జోక్యం చేసుకుంటున్నదో వివరించారు. అనేక మంది విధిలేక మౌనంగా ఉన్నారు. ఇవన్నీ అధిష్టానానికి, ప్రత్యేకించి నరేంద్రమోడికి తెలియదు అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. మనం చేస్తే సంసారం మరొక చేస్తే మరొకటి !


తన కుమారుడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించటం గురించి ఎడియూరప్ప నాటకాన్ని రక్తి కట్టించారు. బెంగలూరులో శనివారం నాడు విలేకర్లతో మాట్లాడుతూ మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ నియామకం గురించి మేమెవరం ఊహించలేదు. ఒక్కసారి కూడా ఢిల్లీలో ఈ విషయమై ఏ నాయకుడినీ అడగలేదు. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి అని ఒక విలేకరి ప్రశ్నకు చెప్పారు.” అంతిమ నిర్ణయం ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా తీసుకున్నారు, నాకేమీ సంబంధం లేదు.” అన్నారు. వారు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకున్నారు. విజయేంద్రను అధ్యక్షుడిగా నియమించినందుకు రాష్ట్రమంతటా ఉత్సవాలు జరుపుకుంటున్నారని ఎడియూరప్ప చెప్పారు. బిజెపిలో వారసత్వ రాజకీయాలకు ఈ నియామకం రుజువు అని కాంగ్రెస్‌ చేసిన వ్యాఖ్య గురించి మాట్లాడుతూ వారు అలాంటి ఆరోపణ చేయనివ్వండి పట్టించుకోను అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 28గాను 25 చోట్ల గెలిచేందుకు తాను, విజయేంద్ర విడివిడిగా రాష్ట్రంలో పర్యటిస్తామని చెప్పారు. తన కుమారుడి నియామకం పట్ల పార్టీలో నేతలెవరూ అసంతృప్తిని వెల్లడించలేదని, అందరూ ఐక్యంగా స్వాగతించారని, ఎవరూ పార్టీని వీడకుండా తాము చూస్తామని, గతంలో వెళ్లిన వారిని కూడా వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని ఎడియూరప్ప చెప్పారు.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తిన్న బిజెపి ఆరునెలలుగా దిక్కుతోచని స్థితిలో పడింది. ఎంతగా మైండ్‌బ్లాక్‌ (మెదడు పని చేయకపోవటం) లేదా బ్లాంక్‌ (మెదడు ఖాళీ కావటం) అయిందంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకోలేకపోయింది. ప్రతిపక్ష నేత లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న ఏకైక లక్ష్యంతో బిజెపి ఉంది. కుటుంబ పార్టీ అంటూ గతంలో తెలుగుదేశాన్ని, తెలంగాణాలో బిఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న ఆ పార్టీ కర్ణాటకలో కుటుంబ పార్టీగా ఉన్న జెడిఎస్‌ను తన మిత్రపక్షంగా చేర్చుకుంది. కాంగ్రెస్‌ను కుటుంబవారసత్వ పార్టీ అని ధ్వజమెత్తుతున్న అదే పార్టీ ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా ఎడియూరప్ప కుమారుడిని పదవికి ఎంపిక చేసింది. కర్ణాటక శాఖను ఒక కుటుంబ పార్టీగా మార్చివేసింది. ఎడియూరప్ప గాలి తీసి పక్కన పెట్టాం గనుక లింగాయత్‌ సామాజిక తరగతి దూరం కావటంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం జరిగిందన్న వాదనను పార్టీ గుర్తించినట్లుంది. తిరిగి వారి మద్దతు పొందాలంటే మరోదారి లేదని భావించి ఆ పెద్దమనిషి కుటుంబ వారసుడినే అధ్యక్షుడిగా నియమించింది. ఎంతవారలైనా అధికార కాంతదాసులే, నరేంద్రమోడీ ఆ కోవకు చెందిన వ్యక్తే గనుక చేసేదేముంది, సరే అనక తప్పలేదు. దీంతో పార్టీలో ఇప్పుడు ఎడియూరప్ప వ్యతిరేకులు ఏం చేస్తారన్నది ఆసక్తికరం.కాళ్లబేరానికి వస్తారా ? తిరుగుబాటు చేస్తారా ? తన కుమారుడి నియామకానికి నరేంద్రమోడీ అంతిమ నిర్ణయం తీసుకున్నారని ఎడియూరప్ప చెప్పిన తరువాత దాన్ని ధిక్కరించే సాహసం బిజెపిలో ఎవరికైనా ఉందా అంటే సందేహమే. అవమానాలను దిగమింగి లోలోపల కుములుతూ పార్టీలోనే ఉండాలి లేదా వెళ్లిపోవాలి. పార్టీ పదవి పంచాయతీ తేలింది, ఓట్ల రాజకీయం గనుక వెంటనే శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకుంటారు, లింగాయత్‌ కాని వారే అవుతారు.


కర్ణాటక రాజకీయాల్లో అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలిపే పక్కా అవకాశవాద పార్టీగా జెడిఎస్‌ పేరు తెచ్చుకుంది.గతంలో దాని మద్దతుదారులుగా ఉన్న అనేక మంది కాంగ్రెస్‌వైపు మొగ్గటంతో 2023 మే నెలలో జరిగిన ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నది. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు దారులు మూసుకుపోవటంతో మరోసారి బిజెపి తలుపుతట్టింది.రాష్ట్రంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే లింగాయత్‌, ఒక్కళిగ సామాజిక తరగతులు కలిస్తే తిరుగుండదు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తామనే బిజెపి అంచనా దీని వెనుక ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్‌ల ప్రభావం ఉందని చెబుతున్న 69చోట్ల బిజెపి 20, కాంగ్రెస్‌ 40 గెలుచుకుంది. ఒక్కళిగలు ప్రభావం చూపే 64 చోట్ల ఆ సామాజిక తరగతి పార్టీగా ఉన్న జెడిఎస్‌ 14స్థానాలతో సరిపెట్టుకుంది. జెడిఎస్‌ను సంతుష్టీకరించేందుకు మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి మద్దతుతో స్వతంత్రురాలిగా గెలిచిన సినీనటి సుమలతను అక్కడి నుంచి తప్పుకోవాలని, కావాలంటే ప్రస్తుత సభ్యుడు డివి సదానంద గౌడ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు గనుక బెంగలూరు ఉత్తరం నుంచి అవకాశం కల్పిస్తామని బిజెపి చెప్పినట్లు వార్తలు. స్వచ్చందంగా లేదా ఇతర కారణాలతో పోటీకి దూరంగా ఉన్నామని ప్రకటనలు చేయించటం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో మరో ఎనిమిది నుంచి పదమూడు మంది ఎంపీలను కూడా ఇంటికి పంపాలని నిర్ణయించినట్లు లీకులు వదిలారు.ఇలా చేస్తే బిజెపి గెలుస్తుందా అంటే చెప్పలేము. అసెంబ్లీ ఎన్నికల్లో 75 మంది కొత్తవారికి సీట్లిస్తే 14 మందే గెలిచారు. ఇరవై నాలుగు మంది ఎంఎల్‌ఏలను పక్కన పెడితే పది స్థానాల్లో మాత్రమే పార్టీ గెలిచింది.


పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోకపోతే బెలగావిలో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని బిజెపి ఎంఎల్‌ఏలు కేంద్ర నాయకత్వానికి ఈనెల మొదటి వారంలో అల్టిమేటం జారీ చేశారు. ఏ పార్టీకైనా ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు.అధికారపక్షం కాంగ్రెస్‌ చేసే విమర్శలతో మొహాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావటం లేదని వాపోయారు. ఆరునెలలకు పైగా శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేని స్థితి గతంలో ఎన్నడూ లేదని కాంగ్రెస్‌ నేత గుండూరావు అన్నారు. మే పదవ తేదీన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌కు 135, బిజెపికి 66, జెడిఎస్‌కు 19 సీట్లు వచ్చాయి.వచ్చే శుక్రవారం నాడు శాసనసభా పక్ష నేతను నియమిస్తామని బివై విజయేంద్ర విలేకర్లతో చెప్పారు. జెడిఎస్‌తో కూటమి గురించి కేంద్ర నాయకత్వం రాష్ట్ర నేతలతో సంప్రదించలేదని సదానంద గౌడ బహిరంగంగా చెప్పారు. ఆ తరువాత గౌడను ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. ఆ తరువాతే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తాను పోటీ చేయటం లేదని ప్రకటించటం గమనార్హం. రాష్ట్రంలో కరవు పరిస్థితి గురించి అధ్యయన కమిటి హసన్‌ పట్టణానికి వచ్చింది. ఆ సందర్భంగా హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గౌడ అసందర్భంగా పోటీలో ఉండనని ప్రకటించారు. అంతకు ముందు అక్టోబరు ఏడవ తేదీన విలేకర్లతో మాట్లాడుతూ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేకపోవటం పార్టీలో సంకటస్థితిని సృష్టించిందని,జెడిఎస్‌తో పొత్తు పట్ల తాను సంతోషంగా లేనని, రాష్ట్రనేతలతో నిమిత్తం లేకుండా చేశారని, తాము దీని గురించి కనీసంగా చర్చించలేదన్నారు. పార్టీ జాతీయ ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించేందుకు చేసి ఉండవచ్చు అన్నారు. ఆ తరువాత అక్టోబరు 25వ తేదీన ఢిల్లీ వచ్చి అలా ఎందుకు మాట్లాడారో సంజాయిషీ ఇవ్వాలని అధిష్టానం కోరింది. బిజెపిలో జరిగిన పరిణామాల గురించి మాజీ సిఎం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన లింగాయత్‌ నేత జగదీష్‌ షెట్టార్‌ మాట్లాడుతూ పర్యవసానాలను త్వరలోనే చూస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఆరునెలల పాటు పార్టీ, శాసనసభా పక్ష నేతలను ఎంపిక చేయలేకపోవటంతో ఎప్పుడు చేస్తారని బిజెపి కార్యకర్తలందరూ ప్రశ్నించారు, ఎట్టకేలకు నేతను ఎంపిక చేశారు, ఆగండి పర్యవసానాలను త్వరలోనే చూస్తారు అని షెట్టార్‌ అన్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

భారత – కెనడా కలహంపై పశ్చిమ దేశాల్లో ఆందోళన ఎందుకు, చైనా ఏమంటోంది !

27 Wednesday Sep 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Europe, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, UK, USA

≈ Leave a comment

Tags

Canada, Canada-India row, China, Hardeep Singh Nijjar, Joe Biden, Justin Trudeau, Narendra Modi, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే పంజాబ్‌ వేర్పాటువాద, ఉగ్రవాది హత్య ప్రస్తుతం భారత్‌-కెనడా మధ్య సంబంధాలు దిగజారటానికి దారి తీసింది. నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ సెప్టెంబరు 18న పార్లమెంటులో చేసిన ఆరోపణను మనదేశం తిరస్కరించింది. దానికి ఎలాంటి ఆధారాలు లేవంది. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు అక్కడ విద్యాభ్యాసం, ఉపాధికోసం వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ వివాదం తమ చైనా వ్యతిరేక ఎత్తుగడలు, సమీకరణలకు ఎక్కడ దెబ్బతగులుతుందో అన్న భయం అమెరికా కూటమి దేశాల్లో వెల్లడి అవుతోంది. భౌగోళిక రాజకీయాల మీద చూపే ప్రభావమే కాదు, భారత్‌కు ఆగ్రహం కలిగిస్తే దాని మార్కెట్‌లో ప్రవేశించేందుకు అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళన కూడా వాటిలో ఉంది. చైనా మీద ఆధారపడకుండా భారత్‌ను ప్రత్యామ్నాయ వస్తు ఎగుమతి దేశంగా మార్చేందుకు సాయం చేస్తామని, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకుంటామని చేస్తున్న ప్రకటనలు తెలిసినవే. చేసిన ఆరోపణను కెనడా వెనక్కు తీసుకోవాలని మనదేశం డిమాండ్‌ చేస్తోంది. ఉగ్రవాదులకు కెనడా సురక్షిత స్వర్గంగా ఉందని వర్ణించింది. మూడునెలల పరిశోధన తరువాత భారత హస్తం ఉందని నిర్ధారించుకున్నామని కెనడా అంటోంది. ఈ ఆరోపణను ఉపసంహరించుకుంటే తప్ప మనదేశం వెనక్కు తగ్గదు, అదే జరిగితే కెనడా అభాసుపాలవుతుంది కనుక వెనక్కు తగ్గే అవకాశాలు తక్కువ. ఇది చినికి చినికి గాలివానగా మారితే జరిగే పర్యవసానాల గురించి ఆందోళన చెందుతున్న జి 7 కూటమిలో పెద్దన్న అమెరికా, ఇతర దేశాలు ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించాయి.


ఈ ఏడాది జూన్‌ 18న కెనడా వాంకోవర్‌ సమీపంలోని సురే అనే చోట ఒక గురుద్వారా వెలుపల హత్యకు గురైన నిజ్జర్‌ 1977లో పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని ఒక గ్రామంలో జన్మించాడు.పంజాబ్‌లో తీవ్రవాదులపై 1995లో చర్యలను ముమ్మరం చేయటంతో 1997లో నిజ్జర్‌ నకిలీ పాస్‌పోర్టుతో కెనడా పారిపోయాడు. అక్కడ తప్పుడు సమాచారం వెల్లడికావటంతో కేసులు, వివాదాల తరువాత 2007లో కెనడా పౌరసత్వం ఇచ్చారు. ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అనే ఉగ్రవాద సంస్థతో అతనికి సంబంధాలు ఉన్నాయని, ఒక వేర్పాటువాది, నేరగాడు అని అతన్ని అరెస్టు చేసి అప్పగించాలని గతంలో మనదేశం కెనడాను కోరింది. దాన్ని అది ఖాతరు చేయలేదు. స్వేచ్చగా తిరగనిస్తున్నది. అతడు ఒక మానవహక్కుల కార్యకర్త, శాంతియుత పద్దతుల్లో సిక్కు దేశం ఏర్పాటుకు మద్దతు ఇచ్చినట్లు అతని మద్దతుదార్లు వాదిస్తారు. తమ దేశంలో భావ ప్రకటన స్వేచ్చ ఉందని అందువలన అతను మాట్లాడేదానితో తమకు సంబంధం లేదని కెనడా వాదించింది. అతను 2019లో సురే గురుద్వారా నేతగా మారాడు.2020లో ఖలిస్తాన్‌ ప్రజాభిప్రాయ సేకరణలో, వేర్పాటువాదాన్ని సమర్ధిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అతని హత్యకేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.


నిజ్జర్‌కు ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అనే మిలిటెంట్‌ గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని భారత్‌ చేసిన వినతి మేరకు 2014లో ఇంటర్‌ పోల్‌ అరెస్టు వారంటు జారీ చేసింది. అతడు 2013-14లో పాకిస్తాన్‌ వెళ్లాడని అక్కడ పాక్‌ ఐఎస్‌ఐ చేర్చుకున్న బబ్బర్‌ ఖాల్సా అనే సంస్థకు చెందిన జగతార్‌ సింగ్‌ తారాను కలిశాడని మన ప్రభుత్వం పేర్కొన్నది. అతని మీద నిఘా పెట్టాలని 2015లో కేంద్ర ప్రభుత్వం కోరింది. తరువాత రెండోసారి కూడా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.తన మీద భారత ప్రభుత్వం చేసిన ఆరోపణలు వాస్తవం కాదని, రాజకీయపరమైనవని నిజ్జర్‌ 2016లో కెనడా ప్రధానికి లేఖ రాశాడు. అతగాడు అనేక హత్యలకు కారకుడని, తమకు కావాల్సిన ముఖ్యులలో ఒకడని 2018లో కేంద్రం కెనడాకు తెలిపింది. పంజాబ్‌ను విముక్తి చేసి ఖలిస్తాన్‌ ఏర్పాటు చేయాలన్న ప్రచారానికి నిజ్జర్‌ మద్దతు తెలిపాడు.2020లో మన ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ ఏడాది మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమం వెనుక అతడు ఉన్నాడని ఆరోపించి కేసులు కూడా దాఖలు చేసింది. పంజాబ్‌లోని ఒక హిందూ పూజారిని హత్య చేసేందుకు కుట్ర పన్ని లక్ష రూపాయల బహుమతి ప్రకటించాడని 2022లో ఎన్‌ఐఏ పేర్కొన్నది.


కెనడా రాజకీయాల్లో సిక్కులు ఒక ప్రభావిత శక్తిగా ఉన్నారు. పంజాబ్‌ తరువాత ప్రపంచంలో సిక్కు సామాజిక తరగతి ఎక్కువగా ఉన్నది కెనడాలోనే, అక్కడ జనాభాలో 2.1శాతం ఉన్నారు. ముప్పై మందితో కూడిన జస్టిన్‌ ట్రుడేవ్‌ మంత్రివర్గంలో నలుగురు సిక్కులు మంత్రులుగా ఉన్నారు. ఈ కారణంగా నిజ్జర్‌ మరణానికి బాధ్యులను తేల్చాలన్న డిమాండ్‌ సహజంగానే అక్కడ ముందుకు వచ్చింది. అందువలన మరొకదారి లేని పరిస్థితిలో అంతర్జాతీయ కర్తవ్యం సంగతి తరువాత ముందు తన ప్రభుత్వం గురించి చూసుకోవాలని హత్య గురించి ట్రుడేవ్‌ పార్లమెంటులో మాట్లాడాల్సి వచ్చింది. జూన్‌ మొదటి వారంలో మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఖలిస్తాన్‌ వేర్పాటువాదులకు కెనడా మద్దతు ఇవ్వటం రెండు దేశాల సంబంధాలకు మంచిది కాదని విమర్శించారు. ఆ తరువాత నిజ్జర్‌ హత్య జరిగింది. ఢిల్లీలో జరిగిన జి 20 కూటమి సమావేశాలకు జస్టిన్‌ ట్రుడేవ్‌ వచ్చినప్పటికీ ఇతర దేశాధినేతలతో మాదిరి ఫ్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక చర్చలు జరపలేదు. అంతే కాదు కెనడాలో ఉగ్రవాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఇటీవలి కాలంలో జరిగిన ఉదంతాల గురించి మోడీ కెనడా దృష్టికి తేగా, ప్రతిగా కెనడా కూడా మనదేశం మీద ఆరోపణలు చేసిందని వెల్లడైంది. తిరుగు ప్రయాణంలో ట్రుడేవ్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడగా ప్రత్యామ్నాయంగా విమానం ఏర్పాటు చేస్తామని మన దేశం ప్రతిపాదించినా రెండు రోజులు వేచి ఉండి తన విమానంలోనే వెళ్లిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవని ఈ ఉదంతం వెల్లడించింది. ఆ తరువాతే పార్లమెంటులో మన దేశం మీద ఆరోపణ చేశాడు. ఈ అంశాన్ని తాము భారత్‌కు ఎంతో ముందుగానే తెలిపామని ట్రడేవ్‌ చెబుతుండగా ఎలాంటి సమాచారం లేదని మన అధికారులు అంటున్నారు.


ఈ వివాదంలో పశ్చిమ దేశాల వైఖరిని చూస్తే మన దేశాన్ని ఖండించ లేదుగానీ విచారణ జరగాలి అని మాట్లాడుతున్నాయి. మీడియాలో వచ్చిన వార్తలను బట్టి కెనడా ప్రధాని బహిరంగంగా మన దేశం మీద ఆరోపణ చేయటానికి ముందే ” ఐదు కళ్ల గూఢచార యంత్రాంగం ” లో భాగస్వాములుగా ఉన్న అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ అధికారులకు కెనడా నిజ్జర్‌ హత్యలో మన దేశ ప్రమేయం గురించి వెల్లడించటమే గాక ఒక సంయుక్త ప్రకటనలో ఖండించాలని ప్రతిపాదించగా మిగిలిన దేశాలు నష్టదాయకమంటూ తిరస్కరించినట్లు వెల్లడైంది. తమకు ముందుగానే చెప్పినట్లు కెనడాలోని అమెరికా రాయబారి డేవిడ్‌ కోహెన్‌ నిర్ధారించాడు. విదేశాల్లో హత్యలను సహించరాదని, తాము కెనడాను కేవలం సంప్రదించటం లేదని దర్యాప్తులో భాగస్వాములవుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చెప్పాడు. భారత్‌కూడా దర్యాప్తులో భాగస్వామి కావాలని అమెరికా కోరింది. ఆరోపణలు ఆందోళనకరమైనవని, తాను భారత దేశం వద్ద ఈ అంశాన్ని లేవనెత్తినట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిణి పెనీ వాంగ్‌ చెప్పింది. ఆరోపణలు తీవ్రమైనవని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లవర్లీ, వస్తున్న వార్తులు నిజమే అయితే తీవ్ర ఆందోళన కలిగించే అంశమని తమ భాగస్వాములతో సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నట్లు న్యూజిలాండ్‌ విదేశాంగ మంత్రి నానియా మహుతా అన్న వ్యాఖ్యలు కెనడాకు అనుకూలంగా చేసినట్లు స్పష్టమౌతున్నాయి.


పంజాబ్‌, కాశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటు, తీవ్రవాద దుశ్చర్యలకు పాల్పడిన అనేక మందికి అమెరికా, కెనడా, ఐరోపా ధనిక దేశాలు ఆశ్రయం ఇచ్చిన సంగతి తెలిసిందే. పక్కనే ఉన్న శ్రీలంకలో ఉగ్రవాదులు సైతం పశ్చిమ దేశాల్లోనే స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాదుల అడ్డా, శిక్షణా కేంద్రం అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా అమెరికా, ఇతర ఐరోపా దేశాల కుట్రలో భాగంగానే జరిగింది. కెనడా ప్రధాని ఏమి చెప్పినప్పటికీ ఖలిస్తాన్‌ త్రీవ్రవాదుల అడ్డాగా ఆ దేశం మారింది. ప్రపంచంలో ఇతర దేశాల మీద దాడులు చేసేందుకు ఉగ్రవాదుల ఏరివేత అని సాకులు చెప్పే పశ్చిమ దేశాలు తమ సంరక్షణలో ఉన్నవారి గురించి పల్లెత్తు మాట మాట్లాడవు. ఇప్పుడు పశ్చిమ దేశాల ఆందోళన అంతా కెనడాలో ఆశ్రయం పొంది మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రవాదుల ఏరివేత, అదుపు గురించి కాదు. కెనడా – భారత్‌ మధ్య వివాదం ముదిరితే చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను నిలపాలన్న తమ ఎత్తుగడ ఎక్కడ విఫలమౌతుందో అన్న భయమే ఎక్కువ కనిపిస్తోంది. పశ్చిమ దేశాల నుంచి వెలువడుతున్న అన్ని వ్యాఖ్యానాల్లో బహిరంగంగానే దీని గురించి ప్రస్తావిస్తున్నారు. పశ్చిమ దేశాల ఇండో-పసిఫిక్‌ ఎత్తుగడలో కెనడా కూడా ఒక ప్రధాన భాగస్వామే. మన దేశంలో నిరంకుశ పోకడలు, మానవహక్కులకు భంగం కలుగుతున్నదంటూ అమెరికాలోని అనేక సంస్థలు ఒకవైపు నిరంతరం ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద వత్తిడి పెంచుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు 75 మంది ఎంపీలు మోడీ ప్రసంగాన్ని బహిష్కరించారు. అధ్యక్షుడు జో బైడెన్‌ వారి ప్రచారాన్ని అనుమతించి చోద్యం చూశాడు. మౌనంగా ఉన్నాడు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని నిలబెట్టాలన్న ఎత్తుగడలో భాగమే అది. అదే ఎంపీలు చైనా గురించి చేసిన ఆరోపణల మీద అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఎలా స్పందిస్తున్నదీ చూస్తున్నాము.


పశ్చిమ దేశాలు కట్టగట్టుకొని మౌనం పాటిస్తున్నాయని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నట్లు భారత్‌-కెనడా వివాదం గురించి చైనా మీడియా స్పందించింది. తమ వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ను తీసుకుపోవాలని చూస్తున్నాయి గనుక కెనడా మిత్ర దేశాలు మౌనంగా ఉన్నాయి తప్ప తమ మిత్రులు కాకుంటే వెంటనే ఖండనలకు దిగేవని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది. తమ ప్రయోజనాలు లేకపోతే పశ్చిమ దేశాలు నీతి సూత్రాలు, నిబంధనలు వల్లించి ఉండేవని, భారత మానవహక్కుల సమస్యల గురించి కళ్లు మూసుకున్నట్లు పేర్కొన్నది. మనదేశం చైనాను ఎలా చూస్తున్నదో చైనా కూడా మనలను అలాగే చూస్తుంది, మరోవైపు కెనడాతో దాని సంబంధాలు సజావుగా లేవు. ఇప్పుడు తలెత్తిన వివాదాన్ని వారెలా చూస్తున్నారన్నది సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. చైనా అధికారికంగా మాట్లాడకపోయినప్పటికీ అధికారిక పత్రికల్లో వస్తున్న వ్యాఖ్యల ద్వారా వైఖరిని అర్ధం చేసుకోవచ్చు. ఈ వివాదంతో తమ వ్యూహం నుంచి భారత్‌ ఎక్కడ వైదొలుగుతుందో అన్న భయం పశ్చిమ దేశాల్లో ఉంటే, పశ్చిమ దేశాలు – భారత్‌ మధ్య దూరం పెరగాలని సహజంగానే చైనా కోరుకుంటుంది. కెనడా ఒక దేశంగా ఉన్నప్పటికీ అది అమెరికాలో 51వ రాష్ట్రం మాదిరి ఉంటుందని చైనా భావిస్తున్నది. అందుకే భారత్‌ పట్ల అమెరికా మోసకారి తనం, ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని, వివాదం మరింత ముదిరితే గందరగోళానికి గురికానుందని చైనా గ్లోబల్‌ టైమ్స్‌లో ప్రచురితమైన విశ్లేషణలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాల వలసవాద వైఖరి భారత్‌ను సమాన స్థాయిలో చూస్తూ సహకరించేందుకు ముందుకు రావటం అసాధ్యమని బీజింగ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అన్నాడు. అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ ప్రవర్తించే కెనడా గతంలో చైనా మీద కాలు దువ్విందని ఇప్పుడు అమెరికా ప్రేరేపణతో భారత్‌ను రెచ్చగొడుతున్నదని చైనా వెబ్‌సైట్‌ ఒక విశ్లేషణలో రాసింది. మరికొందరు విశ్లేషకులు భారత్‌ పెద్ద ఇబ్బందుల్లో పడిందని పేర్కొన్నారు.


అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ మాట్లాడుతూ తమకు భారత్‌ ఎంతో కీలకమైన దేశంగానే ఉంటుందని, అది ఒక్క దక్షిణాసియా ప్రాంతానికే కాదు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి కూడా అని చెప్పాడు. అమెరికాకు ఇది కలవరం కలిగించేదే, దానికి విశాల ప్రయోజనాలు ఉన్నాయి, ట్రుడేవ్‌ ఆరోపణలు గనుక నిజమే అయితే నరేంద్రమోడీ సర్కార్‌ ప్రజాస్వామ్యానికి కట్టుబడి లేదన్నది అర్ధం, ఇదే విధానాన్ని పుతిన్‌ కూడా అనుసరించాడు అని కెనడాలోని టొరొంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ బోత్‌వెల్‌ అన్నాడు. తన శత్రువులను రష్యాలోపల, వెలుపల బ్రిటన్‌తో సహా ఇతర దేశాల్లో పుతిన్‌ చంపించాడని అన్నాడు. కరవ మంటే కప్పకు కోపం- విడవ మంటే పాముకు ఆగ్రహం అన్నట్లుగా ప్రస్తుతం పశ్చిమ దేశాల పరిస్థితి ఉంది.చివరకు ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d