• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Ukraine crisis

గాజాలో ఇజ్రాయెల్‌ శాశ్వత తిష్ట -తెరపైకి రష్యా, ఉక్రెయిన్‌ శాంతి చర్చలు !

08 Wednesday Nov 2023

Posted by raomk in Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Latin America, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, Donald trump, Joe Biden, NATO allies, Ukraine crisis, Vladimir Putin, Volodymyr Zelensky


ఎం కోటేశ్వరరావు


హమస్‌ను అణచే సాకుతో పశ్చిమ దేశాల మద్దతు ఉన్న ఇజ్రాయెల్‌ గాజాలోని పాలస్తీనియన్ల మీద ప్రారంభించిన మారణకాండకు నెలదాటింది. అవే పశ్చిమ దేశాల అండచూసుకొని రష్యాను దెబ్బతీస్తామని బీరాలు పలికిన ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమై 622 రోజులు అవుతున్నది. ఇంతకాలం గడచినా సాధించలేనిది ముందు రోజుల్లో రష్యాను వెనక్కు కొడతారంటే ఎలా నమ్మాలనే సందేహాలు మొదలయ్యాయి. మరోసారి శాంతి చర్చలను తెరమీదకు తెచ్చారు. హమస్‌ సాయుధులను అణచివేసేందుకు నిరవధికంగా గాజా రక్షణ బాధ్యత తీసుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించాడు.” మేము అక్కడ లేకపోతే ఏమి జరిగిందో చూశారు. హమస్‌ తీవ్రవాదం ఇంత పెద్ద ఎత్తున ఉంటుందని మేము ఊహించలేదు. నిరవధికంగా గాజా రక్షణ బాధ్యత తీసుకోవాలని అనుకుంటున్నాము ” అన్నాడు.ఇజ్రాయెల్‌ మారణకాండలో మంగళవారం ఉదయానికి అందిన సమాచారం మేరకు గాజాలో 4,100 మంది పిల్లలతో సహా 10,022 మంది మరణించగా 25,408 మంది గాయపడ్డారు. పశ్చిమగట్టు ప్రాంతంలో మరణించిన వారు 163 కాగా 2,100 మంది గాయపడ్డారు. గాజాలో ఉన్న 35 ఆసుపత్రులలో పదహారింటిని పనికిరాకుండాచేశారు. అదే విధంగా ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు 72కు గాను 51మూత పడ్డాయి. ఇజ్రాయెల్‌ మిలిటరీ బాంబులు, క్షిపణులతో దాడులు జరుపుతూ గాజా జనాభా 23లక్షలకు గాను 16.1లక్షల మందిని నివాసాల నుంచి తరిమివేశారు. మరణించిన వారిలో 88 మంది ఐరాస సహాయ సిబ్బంది ఉన్నారంటే హమస్‌ తీవ్రవాదుల స్థావరాల మీద దాడుఉ చేస్తున్నట్లు చేస్తున్న ప్రచార బండారం ఏమిటో అర్ధం అవుతున్నది. ఇంతవరకు ఏ ఒక్క దేశంలో ఒక ఉదంతంలో ఇంత మంది మరణించిన దాఖలా లేదు. మారణకాండను నిరసిస్తూ బహరెయిన్‌, ఛాద్‌, చిలీ, కొలంబియా, హొండురాస్‌, జోర్డాన్‌, దక్షిణాఫ్రికా, టర్కీ ఇజ్రాయెల్‌లోని తమ దౌత్యవేత్తలను వెనక్కు రప్పించాయి. బొలీవియా అన్ని రకాల సంబంధాలను తెగతెంపులు చేసుకున్నది. వందల కోట్ల డాలర్ల విలువగల మారణాయుధాలను అందిస్తున్న అమెరికా గతంలో ఎర్ర సముద్ర ప్రాంతానికి రెండు విమానవాహక యుద్ధ నౌకలు, క్షిపణి ప్రయోగ యుద్ధ నౌకలను పంపగా ఇప్పుడు ఒక జలాంతర్గామిని ఆ ప్రాంతానికి పంపి ఆ ప్రాంత దేశాలను బెదిరిస్తున్నది. .


తాము అంచనా వేసిన విధంగా రష్యా సేనలను ఎదుర్కోవటంలో ఉక్రెయిన్‌ విఫలం కావటంతో పశ్చిమ దేశాలు పునరాలోచనలో పడటమే గాక, ఏదో విధంగా రాజీచేసుకోవాలంటూ వత్తిడికి శ్రీకారం చుట్టినట్లు వార్తలు వచ్చాయి. రష్యా సైనిక చర్య ప్రారంభమై ఇరవై నెలలు దాటింది. తమ ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చిన పుతిన్‌ సేనలను వెనక్కు కొట్టేందుకు ప్రతిదాడులను ప్రారంభించినట్లు ప్రకటించి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ రష్యా సేనలు ఖాళీ చేసిన ఒకటి రెండు గ్రామాలు, ప్రాంతాలు తప్ప చెప్పుకోదగిన పరిణామాలేవీ లేవు. రష్యా మందుపాతరలను ఏర్పాటు చేసినందున వాటిని తొలగించేందుకు చాలా సమయం పడుతున్నదని ఉక్రెయిన్‌ చెప్పుకుంటున్నది. నిజానికి అదే వాస్తవమైతే ప్రతిదాడులతో ఆ ప్రాంతాలన్నింటినీ స్వాధీనం చేసుకోవటమే తరువాయి అన్నట్లుగా మే, జూన్‌ మాసాలలో మీడియాలో కథనాలను ప్రచురించారు. పశ్చిమ దేశాలన్నీ మధ్యప్రాచ్యం, ఇజ్రాయెల్‌ మీద కేంద్రీకరించటం, భవిష్యత్‌లో సాయం కొనసాగదేమో అన్న సందేహాలు తలెత్తటం, మరోవైపు రష్యా వైమానిక దాడులు నిరంతరం కొనసాగుతుండటం, చలికాలం ముందుంటంతో ఉక్రెయిన్‌ మిలిటరీ, పాలకులకు దిక్కుతోచటం లేదు.నవంబరు ఐదవ తేదీన ఉక్రెయిన్‌ మిలిటరీ అవార్డుల సభమీద జరిగిన దాడిలో కనీసం 20 మంది సైనికులు మరణించటంతో జెలెనెస్కీ కలవర పడ్డాడు.యుద్ధం సాగుతున్నపుడు ఆ ప్రాంతంలో అలాంటి కార్యక్రమం నిర్వహించటం ఏమిటని సామాజిక మాధ్యమంలో జనాలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ను ఒప్పించేందుకు పశ్చిమ దేశాలు పూనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇన్ని నెలల తరువాత రాజీపడితే అసలు ఇంతకాలం ఎందుకు ఆపని చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతాయి. ముందు మీరు రాజీకి అంగీకరిస్తే గౌరవ ప్రదంగా బయటపడటం గురించి మార్గాన్ని చూద్దామని నాటో కూటమి దేశాల ప్రతినిధులు అంటున్నారు. అందువలన అమెరికా కూటమి ముందుగా ఒక స్పష్టమైన వైఖరికి వస్తేనే చర్చలకు దారి ఏర్పడుతుంది.గత నెలలో జరిగిన ఒక సర్వేలో శాంతి కోసం కొంత భూభాగాన్ని వదులు కోవచ్చా అన్న ప్రశ్నకు ససేమిరా అంగీకరించం అని 74శాతం మంది చెప్పినట్లు తేలింది. వచ్చే ఏడాది ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది, అవి జరుగుతాయా లేదా అన్నది ఒకటైతే ఒకవేళ రాజీపడితే జెలెనెస్కీ ఇంటిదారి పట్టాల్సిందే.బహుశా అందుకనే యుద్ధంలో ఉన్నందున అసలు వచ్చే ఏడాదైనా ఎన్నికలేంటి అనేపల్లవిని ఎత్తుకున్నాడు. ఇప్పటికిప్పుడు కాకున్నా కొన్ని నెలల తరువాతైనా జెలెనెస్కీ చర్చలకు దిగిరాక తప్పదనే భావం రోజు రోజుకూ పెరుగుతున్నది. జెలెనెస్కీ ముందుకు తెచ్చిన పది అంశాల శాంతి పధకం గురించి మాల్టాలో జరిగిన సమావేశానికి చైనా హాజరుకాలేదు. ఈ పరిణామం ఉక్రెయిన్‌ కోరుకున్న శాంతి ప్రతిపాదనకు పెద్ద ఎదురుదెబ్బ.


రష్యాను కొద్ది వారాల్లో వెనక్కు నెట్టవచ్చన్న పశ్చిమ దేశాల అంచనాలు తలకిందులయ్యాయి.అక్కడ విజయం సాధించారు, ఇక్కడ ముందుకు పోయారు అంటూ పశ్చిమ దేశాల మీడియా చూపిన దృశ్యాలు, ఇచ్చిన వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది.ఇప్పటికీ మద్దతు ఇస్తామని చెబుతున్నప్పటికీ కొనసాగుతుందన్న హామీ లేదు. 2022 మే నెలలో 400 కోట్ల డాలర్ల సాయం అందించాలన్న అమెరికా నిర్ణయానికి పార్లమెంటులో 368 అనుకూల, 57 వ్యతిరేక ఓట్లు వచ్చాయి. ఈ సెప్టెంబరులో జరిగిన 30కోట్ల డాలర్ల బిల్లు ఆమోదం పొందినప్పటికీ వ్యతిరేకించిన వారు 117 మంది ఉన్నారు.ప్రస్తుతం ప్రతిపక్ష రిపబ్లికన్లు పార్లమెంటులో మెజారిటీ ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో జో బైడెన్ను ఓడించాలని చూస్తున్న వారు ప్రతి ప్రతిపాదనను అడ్డుకొనేందుకు, ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తారు.జాతీయ భద్రతా సహాయ నిధి పేరుతో అమెరికా పక్కన పెట్టిన 105 బిలియన్‌ డాలర్లలో ఉక్రెయిన్‌ ఒక్కదానికే 60బి.డాలర్లు ఇస్తామని చెప్పారు. అంత మొత్తం ఇచ్చేందుకు రిపబ్లికన్‌ పార్టీ సిద్దంగా లేదు. ఆ పార్టీ పార్లమెంటులో మెజారిటీగా ఉన్నందున వారి మద్దతు లేకుండా ఒక్క డాలరు కూడా జో బైడెన్‌ విడుదల చేయలేడు. అది లేకుండా ఉక్రెయిన్‌ ఎంతకాలం నిలబడుతుందన్నది సమస్య. ఇప్పుడు ఇజ్రాయెల్‌-పామస్‌ పోరు ముందుకు రావటంతో అమెరికా దృష్టి అటువైపు మళ్లింది,భారీ ఎత్తున ఇజ్రాయెల్‌కు నిధులు, ఆయుధాలు సమకూరుస్తోంది. ఇది కూడా ఉక్రెయిన్‌కు ఎదురు దెబ్బే. పశ్చిమ దేశాల మీడియా అంతటా నెల రోజుల క్రితం వరకు ఉక్రెయిన్‌ విజయగాధలతో ఉండేవి. ఇప్పుడు వాటి స్థానాన్ని ఇజ్రాయెల్‌ హమస్‌ దాడులు, మధ్యప్రాచ్య పరిణామాలు ఆక్రమించాయి. ఐరోపా యూనియన్‌ అక్టోబరు నెలలో వచ్చే నాలుగు సంవత్సరాల బడ్జెట్‌ గురించి బ్రసెల్స్‌లో జరిపిన సంప్రదింపులలో ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకూడదంటూ పోలాండ్‌, హంగరీ, స్లోవేకియా అడ్డం తిరిగాయి.ఉక్రెయిన్‌ తక్కువ ధరలకు ఆహార ధాన్యాల ఎగుమతి తమ రైతాంగానికి నష్టం కలిగిస్తున్నదంటూ పోలాండ్‌ అభ్యంతరం తెలుపుతున్నది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నందున పోలాండ్‌ ప్రధాని మోరావిక్కీ తన గెలుపు గురించి ఆందోళన చెందుతున్నాడు, ధాన్య ధరలు తన పతనానికి కారణం అవుతాయోమనని భయపడుతున్నాడు.


పశ్చిమ దేశాలు ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆధునిక విమానాలు తప్ప అన్ని రకాల ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందచేశాయి. వాటినే ఇంకా సరఫరా చేయటం తప్ప అంతకు మించి మరో అడుగువేయలేని స్థితి. జెలెనెస్కీని ముందుకు నెట్టటం తప్ప నేరుగా నాటో కూటమి దేశాలు రంగంలోకి దిగే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించటం లేదు. ప్రస్తుతం ఎలాంటి స్థంభన లేదంటూ బింకాలు పలుకుతున్నప్పటికీ ఎంతకాలం అన్న ప్రశ్న ముందుకు వస్తున్నది.రష్యాతో శాంతి చర్చలకు ఉన్న అవకాశాలేమిటి అంటూ అమెరికా, ఐరోపా సమాఖ్య ప్రతినిధులు ఉక్రెయిన్‌ అధికారులను అడిగినట్లు అమెరికా ఎన్‌బిసి టీవి పేర్కొన్నది. ఉక్రెయిన్‌కు మద్దతునిస్తున్న 50కిపైగా దేశాల ప్రతినిధులతో అక్టోబరు నెలలో బ్రసెల్స్‌లో జరిగిన సమావేశం సందర్భంగా ఈ మేరకు కదిలించి చూసినట్లు అది వెల్లడించింది. దీని గురించి జెలెనెస్కీ స్పందిస్తూ చర్చలకు ఇది తరుణం కాదని, అందుకోసం పశ్చిమ దేశాల నేతలెవరూ తనను వత్తిడి చేయటం లేదని చెప్పుకున్నాడు. రష్యాతో తమ పోరు కదలిక లేని, ఘర్షణపూర్వక బలహీన స్థితి ఉండే దశలోకి ప్రవేశిస్తున్నదని, ఇలాంటి పరిస్థితి రష్యా తనమిలిటరీ శక్తిని తిరిగి సమకూర్చుకొనేందుకు వీలు కల్పిస్తుందని ఉక్రెయిన్‌ దళాధిపతి జనరల్‌ వాలెరీ జలుఝని ఎకానమిస్ట్‌ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. ఆ తరువాతే ఎన్‌బిసి వార్త, దాని మీద జలెనెస్కీ స్పందన వెలువడింది. ” కాలం గడిచింది జనాలు అలసిపోయారు, కానీ ఇది ప్రతిష్ఠంభన కాదు ” అని కూడా అన్నాడు. 2014లో రష్యా విలీనం చేసుకున్న క్రిమియా ద్వీపంతో పాటు గత ఏడాది నుంచి ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్‌ చెబుతున్నది. ప్రస్తుతం ఉక్రెయిన్లో స్వాతంత్య్రం ప్రకటించుకున్న రెండు రిపబ్లిక్‌లను రష్యా గుర్తించింది. వాటితో సహా అంతర్జాతీయంగా గుర్తించిన ఉక్రెయిన్లో 17.5శాతం ప్రాంతం రష్యా దళాల అదుపులో ఉంది. ఉక్రెయిన్‌ నాటోలో చేరబోనని, పశ్చిమ దేశాలతో కలసి తమ భద్రతకు ముపు కలిగించబోమని హామీ ఇస్తే క్రిమియా మినహా తమ స్వాధీనంలో ఉన్న వాటిని వెంటనే అప్పగిస్తామని పుతిన్‌ మొదటి నుంచీ చెబుతున్నాడు. పశ్చిమ దేశాలు దాన్ని పడనివ్వకుండా అడ్డుపడటమే కాదు, ఫిన్లండ్‌, స్వీడన్‌లను నాటోలో చేర్చుకొని మరోవైపు నుంచి రష్యాను దెబ్బతీసేందుకు పూనుకున్నాయి.


ప్రస్తుతానికి పశ్చిమ దేశాల సాయం నిలిచిపోతుందని చెప్పలేము గానీ వచ్చే ఏడాది నుంచి జరగవచ్చని ఐరోపా విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న పద్దెనిమిది నెలలు ప్రస్తుత పోరులో కీలకంగా మారనున్నాయని, 2025 వసంత రుతువుకు ముందు రష్యన్లు విజయవంతమైన ఎదురుదాడి చేయలేరని, వచ్చే ఏడాది ఉక్రెయిన్‌ పెద్ద ముందడుగు వేయవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. తాము కోల్పోయిన ప్రాంతాలన్నింటినీ తిరిగి ఇస్తే తప్ప చర్చలు లేవని ఉక్రెయిన్‌ చెబుతుండగా, తమ ఆధీనంలోకి వచ్చిన ప్రాంతాలను వదిలేదని రష్యా చెబుతున్నందున రెండు దేశాల మధ్య చర్చలకు ప్రస్తుతం ప్రాతిపదిక లేదనే పద్దతిలో విశ్లేషణలు సాగుతున్నాయి. రష్యా మమ్మల్నందరినీ చంపిన తరువాత వారు నాటో దేశాల మీద దాడి చేస్తారు, అప్పుడు గాని మీ కొడుకులూ, కుమార్తెలను పోరాటానికి పంపరా అని జెలెనెస్కీ ఒక అమెరికా టీవీ ఎన్‌బిసి ఇంటర్వ్యూలో నాటో కూటమి మీద అసహనాన్ని వెళ్లగక్కాడు. ఒకసారి డోనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశానికి వస్తే కేవలం 24 నిమిషాల్లో అంతా వివరిస్తానని గెలిస్తే 24 గంటల్లో యుద్ధాన్ని అంతం చేస్తాడని అన్నాడు. మొత్తం మీద ఉక్రెయిన్‌ సంక్షోభం మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జి 20 ఢిల్లీ శిఖరాగ్ర సభ : రష్యాను ఖండించకుండా పశ్చిమ దేశాలు ఎందుకు దిగి వచ్చాయి !

13 Wednesday Sep 2023

Posted by raomk in Africa, BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, G 20, G20 Delhi summit, Joe Biden, Narendra Modi, Ukraine crisis, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో జి 20 దేశాల 2023 శిఖరాగ్ర సమావేశం జయప్రదంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఒక సభ్య దేశ ఆతిధ్యంలో సమావేశాలు జరుగుతాయి. గత ఏడాది ఇండోనేషియాలో జరగ్గా వచ్చే ఏడాది బ్రెజిల్‌ వేదిక కానుంది. మరుసటి ఏడాది దక్షిణాఫ్రికాలో జరుగుతుంది, కాగా 2026లో జరగాల్సిన సభకు అమెరికా వేదిక కావటాన్ని చైనా ప్రశ్నించినప్పటికీ చివరికి అంగీకరించింది. ప్రతి సమావేశం తరువాత విడుదల చేసే సంయుక్త ప్రకటన విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తినప్పటికీ చివరికి విడుదల చేశారు. ఈ కూటమిలోని కొన్ని దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్ర విబేధాలు, పరస్పర అనుమానాలు తదితర కారణాల వలన చైనా అధినేత షీ జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హాజరు కాలేదు. దీని గురించి ఎవరికి తోచిన ఊహాగానాలను వారుచేశారు తప్ప అధికారికంగా సదరు దేశాల నుంచి ఎలాంటి ప్రకటనలూ విడుదల కాలేదు. చైనా తరఫున ప్రధాని లీ చియాంగ్‌, రష్యా నుంచి విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావరోవ్‌ ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించారు. ఈ కూటమిలో ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వం ఇవ్వటంతో ఇప్పటి నుంచి అది జి21గా మారింది. దీనిలో 19 దేశాలు ఉన్నాయి. వాటిలో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా,ఇండోనేషియా, రష్యా, చైనా, అర్జెంటీనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, మెక్సికో, కెనడా, బ్రిటన్‌, జర్మనీ,ఫ్రాన్స్‌, టర్కీ, ఇటలీ, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా ఉన్నాయి. ఆఫ్రికా యూనియన్‌, ఐరోపా యూనియన్‌ పూర్తి సభ్యత్వం గల సంస్థలు, ఐరాసతో సహా కొన్ని శాశ్వత ఆహ్వానితుల జాబితా ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తినపుడు ఒక పరిష్కార మార్గంగా ఈ కూటమి ఏర్పాటుకు 1999లో జి7 దేశాల కూటమి ఆలోచన చేసింది. 2008లో ధనిక దేశాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తినపుడు ప్రతి ఏటా శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.


ఈ కూటమిలో ఇప్పటి వరకు ఆహ్వానితురాలిగా ఉన్న ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వ హౌదా కల్పిస్తూ ఢిల్లీ సభ ఆమోదం తెలిపింది. దీనికి కారకులం తామంటే తామని మన దేశంతో పాటు రష్యా, చైనాలు కూడా ప్రకటించుకున్నాయి.ఈ చర్య ద్వారా పేద దేశాల గొంతుక వినిపించేందుకు అవకాశం వచ్చిందన్నది స్పష్టం. సభ్యత్వం ఇచ్చిన ఖ్యాతిని ఎవరి ఖాతాలో వేసుకోవటం అన్నది ముఖ్యం కాదు. వాటికి తోడ్పడుతున్నది ఎవరు అన్నదే గీటురాయి. దాన్ని పరిశీలించినపుడు ఇటీవలి కాలంలో ఆఫ్రికా ఖండంలో రష్యా, చైనా సాయంతో పాటు వాటి పలుకుబడి కూడా పెరుగుతోందన్నది అందరికీ తెలిసిందే. న్యూఢిల్లీ సభ జరిగిన తీరుతెన్నులు, పర్యవసానాలు, ఫలితాల గురించి సమీక్షలు వెలువడుతున్నాయి. తీసుకున్న నిర్ణయాలపై నవంబరు నెలలో వీడియో కాన్ఫరెన్సుద్వారా సమీక్ష జరుపుతారు. ఆమోదించాల్సిన తీర్మానాలు, నిర్ణయాల మీద ఏకాభిప్రాయం సాధించే బాధ్యత ఆతిధ్య దేశం కలిగి ఉంటుంది. అందుకు అనుగుణ్యంగానే దాన్ని మన దేశం కూడా నిర్వహించింది.ఐరాస తీర్మానాలు, పారిస్‌ ఒప్పందాల వంటి వాటినే అంగీకరించకుండా, అమలు జరపకుండా ఠలాయిస్తున్న దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి.నిర్ణయాలను స్వచ్చందంగా అమలు జరపటం తప్ప విధి కాదు. కొన్ని స్పందనలు, కొన్ని అభిప్రాయాలకు భిన్నంగా దేశాలు వ్యవహరిస్తున్న తీరు తెన్నుల గురించి స్థూలంగా చూద్దాం. ఈ సమావేశాలను తన రాజకీయ ప్రయోజనాలకు నరేంద్రమోడీ ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం మనదేశంలో ఇప్పటికే ఉంది. సభ జరిగిన తీరు మీద బిజెపి, నరేంద్రమోడీ మద్దతుదారుల స్పందన కూడా దానికి అనుగుణంగానే ఉంది.


పశ్చిమాసియాలో ప్రముఖ మీడియా సంస్థ ” అల్‌ జజీరా ” లో రాసిన ఒక విశ్లేషణ ఇలా ప్రారంభమైంది.” నరేంద్రమోడీ మోము, భారత దౌత్య మహత్తు(లేదా వివేకము) ప్రదర్శితమైంది.కానీ భారత భిన్నత్వ ప్రదర్శనకు అవకాశాన్ని నిరాకరించారు.భారత్‌ 140 కోట్ల జనాభా ఉన్న దేశం. కానీ సమావేశ రోజుల్లో రాజధాని నగరంలో ఎక్కడ చూసినా కేవలం ఒక ముఖమే కనిపించింది. జి 20 కూటమి నేతలకు ఆతిధ్యం ఇస్తున్న ప్రధాని నరేంద్రమోడీదే అది. కేవలం విమానాశ్రయం వద్దనే కాదు, సభకోసం ఇటీవల జరిపిన నిర్మాణం వరకు చూస్తే ప్రతి రోడ్డు, కొన్ని చోట్ల ప్రతి కొన్ని అడుగులకు, ఎక్కువ చోట్ల రెండుకార్ల పొడవునా ఒక వ్యక్తి ప్రదర్శన మాత్రమే కనిపించింది. దౌత్య ఆడంబర ప్రదర్శనలో మోడీ హీరో కాగా మధ్య ఢిల్లీలో సభ నిర్వహణ ప్రాంతానికి సమీపంలోని విదేశీరాయబార కార్యాలయాలు, హౌటళ్ల వద్ద సంచరించే కోతులను భయపెట్టేందుకు వాటి బొమ్మలతో కూడిన భారీ కటౌట్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సభ జరిగిన చోట వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతీకగా ఉన్న మోడీ బొమ్మలు ఎక్కువగా కనిపించాయి. ప్రగతి మైదాన్‌గా పిలుస్తున్న ప్రాంతంలో కొత్త సభా భవనాన్ని నిర్మించి దానికి భారత మండపం అని పేరు పెట్టారు. దీంతో లౌకిక ముద్ర నుంచి దూరంగా జరిగినట్లయింది. హిందూ దేవాలయాల్లో ముందు వసారాలను మండపం అని పిలుస్తారు. ” ఈ విశ్లేషణలో వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు.


శిఖరాగ్ర సభ ఒక రోజు ముందే సంయుక్త ప్రకటనను ఆమోదించింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్‌ అని దానిలో పిలుపునిచ్చారు. ఈ సుభాషితంతో ఎవరికీ ఇబ్బంది లేదు, అభినందనీయమే. దానికి కట్టుబడి ఉన్నది ఎవరన్నదే ప్రశ్న. ఇది యుద్ధాలకు తగిన యుగం కాదు అన్నది ప్రకటనలోని ఒక అంశం. ఈ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్ల మీద ఈ కూటమిలోని దేశాలు దురాక్రమణలకు పాల్పడిన చరిత్ర, అనేక దేశాల మీద దాడులకు ఉగ్రవాదులను,కిరాయి మూకలను ఉసిగొల్పుతున్న తీరు తెలిసిందే. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోసిందీ, రష్యా ప్రాదేశిక భద్రత మీద ఎలాంటి హామీ ఇవ్వకుండా ఆయుధాలను సరిహద్దుల్లోకి చేర్చటం ప్రారంభించిన తరువాతే పుతిన్‌ సైనిక చర్యకు పాల్పడినదాన్ని ప్రపంచం చూసింది. దాన్ని పరిష్కరించాల్సిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు తమ ఆయుధ సంపత్తిని అందిస్తూ ప్రోత్సహిస్తూ మరోవైపు సుద్దులు చెప్పటం హాస్యాస్పదం. తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని ఐరాస గుర్తించింది. దాన్ని విలీనం చేసుకొనే హక్కు చైనాకు ఉంది. దానికి తగిన సమయం రాలేదంటూ తైవాన్‌కు ఆయుధాలు ఇస్తూ చైనా మీద దాడికి ఉసిగొల్పుతున్న దేశాల నిజాయితీ ఏమిటన్నది ప్రశ్న. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో చైనా ఇంతవరకు ఏ దేశ నౌకనూ అడ్డుకున్న దాఖలా లేదు.


న్యూఢిల్లీ ప్రకటనలో పేర్కొన్న లక్ష్యానికి భిన్నంగా ప్రపంచంలో పరిణామాలు జరుగుతున్నాయి. అణ్వాయుధాల వినియోగం గురించి ప్రకటన హెచ్చరించింది. కానీ తానుగా వాటిని వినియోగించబోనని ప్రకటించేందుకు ఇంతవరకు అమెరికా అంగీకరించ లేదు. అణ్వాయుధాలను మోసుకుపోయే ఆధునిక క్షిపణులు, విమానాలను రోజు రోజుకూ మెరుగుపరుస్తోంది. ఐరాస నిబంధనావళి ప్రకారం ఏ దేశమూ బలప్రయోగం చేయకూడదని పేర్కొన్నది. దీని మీద కూటమి దేశాలు రాజీపడినట్లు ఉక్రెయిన్‌ మండిపడింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడతామని రష్యా కూడా అంగీకరించిందని అందుకే దిగి వచ్చి సంతకం చేసిందని కొందరు పశ్చిమ దేశాల వారు వక్రీకరించారు. వాస్తవానికి పశ్చిమ దేశాల వలలో చిక్కుకొని నాటోలో చేరి తమ ప్రాదేశిక భద్రతకు ముప్పు తలపెట్టినందున ఉక్రెయిన్ను దారికి తెచ్చేందుకు సైనిక చర్య జరుపుతున్నాం తప్ప దాన్ని ఆక్రమించుకొనే లక్ష్యం లేదని రష్యా ప్రారంభం నుంచీ చెబుతున్నది. రష్యా,ఉక్రెయిన్ల నుంచి ఆహారం, ధాన్యాలు, ఎరువుల సరఫరాను పునరుద్దరించాలని, ఎగుమతి దిగుమతులను అడ్డుకోరాదని, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కూడా జి21 కూటమి కోరింది. టర్కీ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించి తమను దెబ్బతీస్తున్న కారణంగానే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ కారణంగా అనేక పేద దేశాలు అధిక ధరలకు ఇతర దేశాల నుంచి ఆహారాన్ని దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితికి పశ్చిమ దేశాలే కారణం. రైతులు విదేశాలకు సైతం ఎగుమతులు చేసుకొని లబ్దిపొందవచ్చంటూ మూడు సాగు చట్టాలను రైతుల మీద రుద్దినపుడు కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ జి20 అధ్యక్ష స్థానంలో ఉన్నపుడే గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లి ఎగుమతులను కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.


ఢిల్లీ సమావేశానికి షీ జింపింగ్‌ హాజరు కాకపోవటం గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.గతంలో జరిగిన ఇలాంటి శిఖరాగ్ర సమావేశాలకు కొన్ని దేశాల నేతలు రాకపోవటం తెలిసిందే. కానీ జింపింగ్‌ రాలేదంటే దాని వెనుక బలమైన కారణాలేమీ లేవంటే ఎవరూ నమ్మరు, తప్పుకుండా ఉండి ఉంటాయి. చతుష్టయ కూటమి(క్వాడ్‌) అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియా కూటమి తనకు వ్యతిరేకమే అని చైనా భావిస్తున్నది. ఈ కూటమి నేతలను వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవ అతిధులుగా పిలవాలని మన ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీలో ఒక గదిలో చైనా ప్రధాని ఉండగా మరొక పక్క గదిలో జో బైడెన్‌-నరేంద్రమోడీ సమావేశమై క్వాడ్‌ పటిష్టత గురించి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్చా నౌకారవాణా గురించి చర్చలు జరిపారు. ఇవి చైనాను రెచ్చగొట్టేవే అన్నది స్పష్టం. వీటికంటే ముందే చైనా రూపొందించిన ప్రపంచ పటంలో మన భూభాగాలను కొన్నింటిని మినహాయించటం, దాని మీద వివాదం చెలరేగిన సంగతీ తెలిసిందే. గతేడాది ఇండోనేషియా నగరమైన బాలిలో జరిగిన సమావేశ ప్రకటనలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండిస్తూ చేర్చిన పేరా వివాదాస్పదమైంది. రాజీమార్గంగా చివరకు ఎక్కువ మంది సభ్యులు ఖండించారని, పరిస్థితి మీద ఇతరులు భిన్నమైన వైఖరులను వెల్లడించారని పేర్కొన్నారు. మొత్తం మీద ఖండన దానిలో కనిపించింది. ఆ సమావేశంలో వీడియో కాన్ఫరెన్సుద్వారా మాట్లాడిన ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కూటమిని జి20 బదులు జి19 అని సంబోధించటం(రష్యాను గుర్తించకుండా) కూడా రచ్చకు దారి తీసింది. సమావేశం జరుగుతుండగా పోలాండ్‌లో క్షిపణి పేలుడు జరిగింది. వాస్తవాలు నిర్ధారించుకోకుండానే దానికి రష్యా కారణమని ఆరోపించటం, సభలో ఉన్న జి7, నాటో కూటమి దేశాల నేతలు అక్కడే విడిగా సమావేశం కావటం, వాటన్నింటికంటే ముందే రష్యా ప్రతినిధి వర్గ నేత లావరోవ్‌తో ఫొటో దిగేందుకు అనేక మంది నేతలు తిరస్కరించటంతో అసలు బాలిలో పాల్గన్నవారి కుటుంబ చిత్రమే లేకుండా పోయింది. తరువాత జరిగిన అనేక పరిణామాలు చైనా, రష్యాలతో అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల సంబంధాలు మరింతగా దిగజారాయే తప్ప మెరుగుపడలేదు. బాలిలో షీ జింపింగ్‌-జో బైడెన్‌ భేటీ జరిగింది, సంబంధాలను, మాటా మంతిని పునరుద్దరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన వెలువడింది. కానీ ఆ వెంటనే అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నానీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పంతంతో తైవాన్‌ వెళ్లటం తెలిసిందే. తరువాత అమెరికా సర్కార్‌ మరింతగా మిలిటరీ సాయాన్ని ప్రకటించింది. ఈ పూర్వరంగంలో వెళ్లకపోవటమే మంచిదని షీ జింపింగ్‌, పుతిన్‌ భావించి ఉండాలి.సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించి బాలి ప్రకటనలో ఉన్న పదజాలానికి భిన్నంగా రష్యా పేరు లేకుండా యుద్ధం కారణంగా జనం పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే పేర్కొన్నారు. ఇది పశ్చిమ దేశాలకు ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. బాలిలో మాదిరి ఖండిస్తే చైనా, రష్యా అంగీకరించకపోతే అసలు ప్రకటనే వెలువడి ఉండేది కాదు. అది జరిగితే తాము బలపరస్తున్న నరేంద్రమోడీ ప్రతిష్టకు భంగం అని భావించి పశ్చిమ దేశాలు అయిష్టంగానే రష్యా మిలిటరీ చర్య ప్రస్తావన లేకుండా అంగీకరించినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి క్లస్టర్‌ బాంబులు-మరో మలుపు తిరిగిన సంక్షోభం !

19 Wednesday Jul 2023

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

cluster munitions, Joe Biden, Ukraine crisis, US Cluster Munitions, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


శాంతి నెలకానాల్సిన చోట మరింత అశాంతి తలెత్తేలా జో బైడెన్‌ సర్కార్‌ ఉక్రెయిన్‌కు క్లస్టర్‌ బాంబులు పంపింది. సంక్షోభాన్ని మరింత తీవ్రతరం కావించేందుకు, రష్యా మీద మరిన్ని ఆంక్షలతో నష్టపరిచేందుకు నాటో కూటమి పూనుకుంది. దానికి ప్రతిగా దాడులను మరింత తీవ్రం గావించటంతో పాటు, ఉక్రెయిన్నుంచి నల్లసముద్రం ద్వారా జరుగుతున్న ధాన్య ఎగుమతుల ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంది. ఆదివారంతో ముగిసిన ఒప్పందాన్ని అది పొడిగించలేదు. దీంతో 45 దేశాలకు ఉక్రెయిన్‌ ధాన్య ఎగుమతులపై అనిశ్చితి ఏర్పడింది.నౌకలకు భద్రత లేనందున రవాణా నిలిచిపోనుంది. గత ఏడాది టర్కీ చొరవతో ఐరాస మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం మేరకు ఉక్రెయిన్‌ రేవుల దిగ్బంధనాన్ని రష్యా ఎత్తివేసింది. దానికి ప్రతిగా తమ ఆహార ధాన్యాలు, ఎరువుల ఎగుమతులపై పశ్చిమ దేశాలు ఆంక్షలను తొలగించలేదని పుతిన్‌ విమర్శించాడు.మూడు ఉక్రెయిన్‌ రేవుల నుంచి వివిధ దేశాలకు 3.28 కోట్ల టన్నుల గోధుమలు,ఇతర ధాన్యాలు, పొద్దుతిరుగుడు పువ్వుల నూనె ఎగుమతి జరిగింది. వీటిలో 46శాతం ఆసియా, 40శాతం పశ్చిమ ఐరోపా, 12శాతం ఆఫ్రికా, రెండు శాతం తూర్పు ఐరోపా దేశాలకు వెళ్లాయి. దాంతో గత ఏడాది మార్చి నుంచి ఇటీవలి వరకు ప్రపంచ మార్కెట్లో ఆహార ధరలు 23శాతం వరకు తగ్గినట్లు తేలింది. తిరిగి పరిస్థితి మొదటికి రావటంతో సోమవారం నాడు చికాగో మార్కెట్లో గోధుమల ముందస్తు ధర 3.5శాతం పెరిగింది. వెంటనే ఒప్పంద పునరుద్దరణ జరగకపోతే భారత్‌తో సహా అనేక దేశాల మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఒప్పందాన్ని కొనసాగించలేదనే ఆగ్రహంతో క్రిమియా ద్వీపాన్ని రష్యా ప్రధాన భూ భాగాన్ని కలిపే వంతెన పేల్చివేసేందుకు ఉక్రెయిన్‌ దాడిజరిపింది. పాక్షికంగా దెబ్బతిన్న వంతెనను వెంటనే రాకపోకలకు పునరుద్దరించినటు పుతిన్‌ సర్కార్‌ ప్రకటించింది. దీనికి ప్రతిగా భారీ ఎత్తున నల్లసముద్రంలోని రేవు, ఉక్రెయిన్‌ ఇతర ప్రాంతాల మీద రష్యా పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరుపుతున్నట్లు మంగళవారం నాడు వార్తలు వచ్చాయి. తమ తూర్పు ప్రాంతంలో పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నప్పటికీ తమ అదుపులోనే ఉందని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి చెప్పాడు. లక్ష మందికి పైగా మిలిటరీ, తొమ్మిది వందలకు మించి టాంకులను రష్యా మోహరించిందని అన్నాడు.


మానవ హక్కుల బృందాలు విమర్శించినా ఖాతరు చేయకుండా నిషేధిత క్లస్టర్‌ బాంబులను ( పలు రకాల బాంబుల గుత్తి ) ఉక్రెయిన్‌కు సరఫరా చేసి సంక్షోభాన్ని ప్రమాదకర మలుపు తిప్పేందుకు అమెరికా పూనుకుంది. ఎనభై కోట్ల డాలర్ల విలువగల పాకేజ్‌లో భాగంగా ఇప్పటికే వాటిని అక్కడకు తరలించింది. ఒక వేళ వాటిని తమ మీదకు వదిలితే తాము కూడా ప్రయోగించేందుకు తమ వద్ద భారీగా నిల్వలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించాడు. ఒక రష్యా జర్నలిస్టుతో మాట్లాడినపుడు ఈఅంశాన్ని చెప్పాడు. గతంలో అమెరికా వీటిని ప్రయోగించిన ప్రాంతాలలో జరిగిన ప్రాణ నష్టం, వనరుల విధ్వంసం కారణంగా వాటిని నిషేధించారు. కొన్ని సందర్భాలలో కొన్ని బాంబులు పేలవు. వాటి గురించి తెలియక ఎవరైనా ముట్టుకుంటే సంవత్సరాల తరువాత కూడా మందుపాతరల మాదిరి పేలే ముప్పు ఉంది. గగనతలం నుంచి విమానాలు, భూమి, సముద్రాల మీద నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు. గతంలో ఇవి పేలినపుడు మరణించిన వారిలో 94శాతం మంది పౌరులు కాగా 40శాతం మంది పిల్లలు ఉన్నారు. వీటిని రూపొందించే పద్దతిని బట్టి ఒక్కో గుత్తిలో కొన్ని డజన్ల నుంచి గరిష్టంగా ఆరువందల బాంబులను అమర్చవచ్చు. తక్కువ మంది మిలిటరీ, పరిమితమైన విమానాలు, ఓడలు, రాకెట్‌ వాహనాలతో భారీ నష్టం కలిగించవచ్చు.


ఈ బాంబులను రకరకాలుగా రూపొందిస్తున్నారు. మామూలుగా ఒక బాంబును వేస్తే ఒక చోటే నష్టం కలిగిస్తుంది. కానీ ఈ గుత్తి బాంబు వేసిన తరువాత అది అనేకంగా విడిపోయి విసృత ప్రాంతంలో పేలుళ్లకు కారణమౌతుంది. మనుషులను చంపటంతో పాటు రోడ్లు,వాహనాలు, విద్యుత్‌ లైన్లు ఇలా ఆ ప్రాంతంలో ఏవి ఉంటే వాటిని ధ్వంసం చేస్తాయి. కొన్ని సందర్భాలలో మానవాళి, పంటలకు ముప్పు కలిగించే జీవ, రసాయనాలతో కూడా బాంబులను రూపొందిస్తున్నారు. యుద్ధం, ఇతర సందర్భాలలో పౌరులను హెచ్చరించేందుకు, బెదిరించేందుకు రూపొందించిన కరపత్రాలను కూడా ఈ బాంబుల ద్వారా వెదజల్లిన ఉదంతాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో ఇవి కలిగించిన అపార నష్టాన్ని చూసిన తరువాత 2008 మే 30వ తేదీన డబ్లిన్‌ నగరంలో 107 దేశాలు వీటి ఉత్పత్తి, వినియోగం, బదిలీ, నిల్వ చేయరాదని ఒక అవగాహనకు వచ్చాయి, అదే ఏడాది డిసెంబరు మూడున ఓస్లో నగరంలో ఒప్పందం మీద సంతకాలు చేశాయి. 2010 ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం 111 దేశాలు సంతకాలు చేసి పార్లమెంట్లలో ఆమోద ముద్ర వేశాయి, మరో పన్నెండు దేశాలు సంతకాలు చేసినా తదుపరి ప్రక్రియను పూర్తి చేయలేదు. మన దేశం, అమెరికా, చైనా, రష్యా, ఉక్రెయిన్‌, పాకిస్తాన్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు ఒప్పందంలో చేరలేదు. నాటోలోని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ వంటి పద్దెనిమిది దేశాలు కూడా ఒప్పందాన్ని అమలు చేస్తున్నవాటిలో ఉన్నాయి. అవి కూడా అమెరికాను నివారించేందుకు పూనుకోలేదు. అయిష్టంగానే తాము ఉక్రెయిన్‌కు అందచేస్తున్నట్లు జో బైడెన్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో దురాక్రమణకు పూనుకున్న నాజీ సేనల మీద 1943లో నాటి సోవియట్‌ కురుస్క్‌ ప్రాంతంలో వీటిని వేసింది. అదే ఏడాది ఇంగ్లాండ్‌లోని గ్రిమ్స్‌బై ప్రాంతం మీద నాజీ సేనలు వెయ్యి బటర్‌ ఫ్లై బాంబులు వేశాయి. ఇండో చైనాను ఆక్రమించుకొనేందుకు పూనుకున్న అమెరికా 1960,70 దశకాల్లో వియత్నాం, లావోస్‌, కంపూచియాల మీద వాటిని వేసింది. ఒక్క వియత్నాం మీదనే 4,13,130 టన్నుల బాంబులు, లావోస్‌ మీద 27 కోట్లు వేసింది. రెడ్‌క్రాస్‌ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం లావోస్‌లోని 17 రాష్ట్రాలలో ఇప్పటికీ ఏటా మూడు వందల మంది చొప్పున అవి పేలి మరణిస్తున్నారు. అక్కడ ఎనిమిది కోట్ల బాంబులు పేలలేదని అంచనా. అవి ఎక్కడ పడిందీ కనుగొనటం ఎంతో కష్టం. ఎప్పుడైనా పేలవచ్చు. 1975-88 సంవత్సరాల్లో మొరాకో మిలిటరీ వీటిని తిరుగుబాటుదార్ల మీద వేసింది.1978లో లెబనాన్‌పై దురాక్రమణ జరిపిన ఇజ్రాయెల్‌ వాటితో దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌-అమెరికా రెండూ కూడా వాటితో దాడులు జరిపాయి. బ్రిటన్‌ 1982 ఫాక్‌లాండ్స్‌ దాడిలో అర్జెంటీనా మీద వేసింది. ఇరాక్‌పై దురాక్రమణ దాడిలో అమెరికా, దాని మిత్ర పక్షాలు 61వేల వైమానిక దాడులలో వీటిని వదిలాయి. బోస్నియాపై 1992-95లో యుగోస్లావ్‌ సేనలు, 1994-96లో చెచెన్‌ తిరుగుబాటుదార్లపై రష్యా,1995లో క్రోషియాపై సెర్బ్‌, 1996-99లో సూడాన్‌ మిలిటరీ దక్షిణ సూడాన్‌ తిరుగుబాటుదార్ల మీద, ఇంకా ఎరిట్రియా, ఇథియోపియా,అల్బేనియా, కొసావా వార్‌లో నాటో సేనలు, జార్జియాపై 2008లో రష్యా,సిరియా, ఎమెన్‌ తదితర చోట్ల కూడా వీటిని వినియోగించారు.


రష్యా ఉక్రెయిన్‌ మీద వేసినట్లు గతంలో నాటో కూటమి ఆధారం లేని ఆరోపణలు చేసింది. తాజాగా అమెరికా వాటిని ఇవ్వటాన్ని సమర్ధించుకొనేందుకు ముందుగానే ఈ ప్రచారం చేసినట్లు దీన్ని బట్టి అర్ధం అవుతోంది. పట్టణాల మీద వీటిని వేయకూడదని రాతపూర్వకంగా ఉక్రెయిన్నుంచి హామీ పొందినట్లు నమ్మించేందుకు అమెరికా చూస్తోంది. కొంత మంది ఇలా అందచేతతో తలెత్తే చట్టపరమైన అంశాల గురించి చర్చలు చేస్తున్నారు. నాటోలోని కొన్ని అమెరికా మిత్రదేశాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. తప్పని చెబుతూనే ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు ఇస్తున్నారు గనుక అర్ధం చేసుకున్నామంటూ సమర్ధించాయి. ఐదు వందల రోజుల సంక్షోభం తరువాత ఎందుకు ఇప్పుడు వీటిని అమెరికా సరఫరా చేస్తున్నది అనే ప్రశ్న తలెత్తటం సహజం. రష్యా అదుపులో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు తాము ప్రతిదాడులు జరుపుతున్నట్లు జెలెనెస్కీ ప్రకటించాడు. దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఎలాంటి పురోగతి లేకపోగా భారీ నష్టాలను చవి చూస్తున్నట్లు వార్తలు. టాంకులు, శతఘ్నులను పెద్ద ఎత్తున నష్టపోయింది. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతాలలో రష్యన్లు భారీ సంఖ్యలో మందుపాతరలను అమర్చినట్లు, కందకాలను తవ్వినట్లు వెల్లడికావటంతో ఉక్రెయిన్‌, నాటో మిలిటరీ అంచనాలు తప్పాయి. వాటిని దాటుకొని ముందుకు పోవటం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవటమే. అందుకే ఆ ప్రాంతాల మీద క్లస్టర్‌ బాంబులను వేయటం తప్ప మరొక మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇవి కందకాల మీద, బహిరంగంగా ఉన్న టాంకులు, శతఘ్నులను పేలుళ్లు జరిపి నష్టపరుస్తాయి. పేలని బాంబులు, వాటితో పాటు జారవిడిచే మందుపాతరలను తప్పించుకొని పుతిన్‌ సేనలు ముందుకు పోవటం కూడా ఇబ్బందే.


క్లస్టర్‌ బాంబులను గతంలో ప్రయోగించిన ప్రాంతాలన్నీ మిలిటరీ, పౌరులు కలసి ఉన్న ప్రాంతాలే కావటంతో అనేక మంది వీటిని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ బాంబులలో రెండు నుంచి నలభై శాతం వరకు పేలే అవకాశం లేదని, చెట్లు, గుట్టలు, బురద ప్రాంతాల్లో పడినవి తరువాత ఎవరైనా వాటిని కదిలించినపుడు లేదా అవేమిటో తెలియని పిల్లలు, ఇతరులు వాటిని ముట్టుకున్నపుడు పేలి ప్రాణాలు తీస్తాయి. తాము ఉక్రెయిన్‌కు పంపిన ఈ బాంబుల్లో పేలనివి 2.35శాతమే ఉంటుందని, ఎంతో మెరుగుపరచిన పరిజ్ఞానంతో రూపొందించినట్లు అమెరికా నమ్మించచూస్తోంది. అయితే దాని రక్షణశాఖ జరిపిన పరీక్షల్లో పేలనివి 14 నుంచి 20శాతం అంతకంటే ఎక్కువే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌కు వాటిని అందించటమంటే అక్కడి సంక్షోభాన్ని మరో మలుపు తిప్పటమే కాదు, తీవ్ర పర్యవసానాలకూ దారి తీస్తుంది. ఉద్రిక్తతలను ఎగదోసే యుద్ధోన్మాదాన్ని ఎండగట్టాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

స్వీడన్‌ నాటో సభ్యత్వానికి మెలిక పెట్టి తోకముడిచిన టర్కీ !

12 Wednesday Jul 2023

Posted by raomk in COUNTRIES, Current Affairs, Europe, Germany, Greek, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, NATO, NATO summit in Vilnius, Recep Tayyip Erdoğan, Sweden’s NATO bid, Ukraine crisis, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఐరోపా సమాఖ్య తలుపులు తెరుస్తారేమోనని ఐదు దశాబ్దాలుగా గుమ్మం ముందు పడిగాపులు కాస్తున్నాం. సమయం వచ్చింది గనుక చెబుతున్నా మాకు సమాఖ్యలో సభ్యత్వానికి అంగీకరిస్తే మేము నాటోలో స్వీడన్‌ ప్రవేశానికి అడ్డుతొలుగుతామని టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తాయిప్‌ ఎర్డోవాన్‌ సోమవారం నాడు మెలిక పెట్టాడు.లిథువేనియా రాజధాని విలినస్‌లో మంగళ,బుధవారాల్లో జరగనున్న నాటో కూటమి వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లే ముందు టీవీలో చెప్పాడు. ఆదివారం నాడు తాను అమెరికా అధినేత జో బైడెన్‌తో చర్చలు జరిపినపుడు ఈ అంశాన్ని స్పష్టం చేసినట్లు కూడా వెల్లడించాడు. ఈ అనూహ్యప్రకటనతో పశ్చిమ దేశాలు కంగారు పడ్డాయి. ఇలా వివాదపడితే అంతిమంగా రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ లబ్దిపొందుతాడంటూ నష్టనివారణకు పూనుకున్నాయి. మరోవైపున సోమవారం నాడే విలినస్‌లో ఎర్డోవాన్‌- స్వీడన్‌ ప్రధాని క్రిస్టెర్‌సన్‌ భేటీ జరిగింది. తరువాత స్వీడన్‌కు చారిత్రాత్మక క్షణం అంటూ తమ దేశ టీవీలో ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో టర్కీ వెనక్కు తగ్గిందని, లాంఛనంగా నాటోలో స్వీడన్‌ ప్రవేశానికి త్వరలో తమ పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోద ముద్ర వేసేందుకు ఎర్డోవాన్‌ అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం టర్కీ ఎదుర్కొంటున్న ఆర్థిక, ఇతర ఇబ్బందుల కారణంగా మెత్తబడిందన్నది స్పష్టం. ఎవరి ప్రయోజనం వారు చూసుకుంటున్నందున మీరు మాకది ఇస్తే మేం మీకిది ఇస్తాం అన్నట్లుగా అందుకోసం వేస్తున్న ఎత్తులు జిత్తులలో భాగంగానే ఐరోపా సమాఖ్యలో సభ్యత్వానికి ముడిపెట్టి ప్రకటించినట్లు స్పష్టమైంది. తమ గడ్డ మీద ఉన్న రష్యా సేనల మీద ఎదురుదాడులు జరిపి పోగొట్టుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రతిజ్ఞలు చేసిన ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోతున్నదనే వార్తలు వస్తున్నాయి. జెలెనెస్కీ దళాలకు అవసరమైన ఆయుధాలు, ఇతర సాయం ఎలా అందించాలా అని నాటో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నాటోలో చేరేందుకు ఫిన్లండ్‌, స్వీడన్‌ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ప్రారంభంలో ఫిన్లండ్‌కు ఆమోదం తెలిపారు. సంస్థ నిబంధనల ప్రకారం సభ్యదేశాలన్నీ అంగీకరిస్తేనే కొత్త దేశాలను చేర్చుకోవటానికి వీలుంటుంది.ప్రస్తుతం ఈ కూటమిలో 31 దేశాలు ఉన్నాయి. తాజా వార్తల ప్రకారం ఇప్పటికి ఉక్రెయిన్‌కు సభó్యత్వం లేనట్లే అని స్పష్టమైంది.


విలినస్‌ సమావేశాల్లో స్వీడన్‌ ప్రవేశానికి ఆమోద ముద్ర కూడా అజెండాలో ఉంది.టర్కీ దానికి మోకాలడ్డటంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పోరు ముగిసేంత వరకు నాటోలో ఉక్రెయిన్‌ చేరకూడదని అమెరికా అధినేత జో బైడెన్‌ చేసిన ప్రకటన కూడా తలనొప్పిగా మారింది. టర్కీ షరతులను తాము అంగీకరించేది లేదని ఐరోపా సమాఖ్య ప్రకటించగా స్వీడన్‌కు ఆమోదం తెలిపితేనే తాము ఎఫ్‌ 16 యుద్ధ విమానాలను టర్కీకి విక్రయిస్తామని అమెరికా మెలిక పెట్టింది. ” ముందు ఐరోపా సమాఖ్యలో టర్కీ చేరికకు మార్గాన్ని సుగమం చేయాలి, తరువాత ఫిన్లండ్‌ మాదిరి స్వీడన్‌కూ మేము దారి ఇస్తాము. మేము 50 సంవత్సరాలుగా గేటు ముందు వేచి చూస్తున్నాం, నాటోలోని దేశాలన్నీదాదాపు సమాఖ్యలో సభ్యులే ” అని ఎర్డోవాన్‌ చెప్పాడు. తమ దేశంలో వేర్పాటు వాదులు, కర్దిష్‌ వర్కర్స్‌ పార్టీ వంటి ఉగ్రవాదులను స్వీడన్‌ బలపరస్తున్నదని, ఖురాన్‌ దహనంతో సహా ఇస్లాం వ్యతిరేక ప్రదర్శనలను అనుమతించిన కారణంగా తాము అంగీకరించేది లేదని గతంలో టర్కీ ప్రకటించింది. ఇప్పుడు తమకు ఐరోపా సమాఖ్యలో సభ్యత్వానికి లంకె పెట్టింది. టర్కీని సంతుష్టీకరించేందుకు స్వీడన్‌ ఉగ్రవాద చట్టాల్లో మార్పు చేసింది. వాటితో టర్కీ సంతృప్తి చెందలేదు. సోమవారం రాత్రి టర్కీ వైఖరిలో మార్పు వచ్చిన తరువాత ఐరోపా సమాఖó్యవైపు నుంచి ప్రతికూల స్పందనలు, సంకేతాలు రాలేదు తప్ప సానుకూలత కూడా వెల్లడి కాలేదు. తరువాత ఇప్పుడున్న స్థితి నుంచి టర్కీతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు పూనుకొని సంతుష్టీకరించవచ్చు.


ప్రపంచ రాజకీయాల్లో టర్కీ అనుసరిస్తున్న విధానాలే దానికి అమెరికా యుద్ధ విమానాల విక్రయం, ఐరోపా సమాఖ్యలో చేర్చుకొనేందుకు ప్రధాన ఆటంకాలుగా ఉన్నాయి.ఐరోపా ఆర్థిక సమాఖ్యలో చేరేందుకు 1963 సెప్టెంబరు 12న ఒక ఒప్పందం చేసుకుంది. అది మరుసటి ఏడాది డిసెంబరు ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు చెప్పినప్పటికీ సంపూర్ణం కాలేదు.అది నత్తనడక నడుస్తోంది.మొత్తం 35 నిబంధనలకు గాను ఇంతవరకు టర్కీ 15 మాత్రమే, అదీ పాక్షికంగా నెరవేర్చింది. కేవలం శాస్త్ర, పరిశోధనా రంగాలకు సంబంధించిన అంశమే సంపూర్ణంగా అమలు చేసింది. ఏదో ఒకసాకుతో ఇతర దేశాలు పూర్తి సభ్యత్వానికి అడ్డుపడుతున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం, మానవహక్కులను కాలరాస్తున్నారని విమర్శిస్తున్నాయి. తాజా పరిణామాలకు వస్తే 2016లో ఎర్డోవాన్ను పదవి నుంచి దించేందుకు ఒక విఫల కుట్ర జరిగింది. తరువాత తన పదవిని సురక్షితం కావించుకొనేందుకు చేసిన రాజ్యాంగ సవరణలతో మానవహక్కులు, చట్టపరమైన ఆటంకాలను కల్పిస్తున్నట్లు వాటిని తొలగించి నిబంధనలన్నింటినీ పూర్తి చేస్తేనే చేర్చుకుంటామని సమాఖ్య చెబుతోంది. వీటి కంటే పుతిన్‌తో స్నేహం, ఇతర అంశాలు ప్రధానంగా పని చేస్తున్నాయని చెప్పవచ్చు. సిరియాలో పశ్చిమ దేశాలు మద్దతు ఇస్తున్న కిరాయి మూకలు, ఉగ్రవాదులను అణచేందుకు రష్యా తోడ్పడుతున్నది, దానికి టర్కీ మద్దతు ఇస్తున్నది. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని సృష్టించింది, దాన్ని కొనసాగించాలని చూస్తున్నది పశ్చిమ దేశాలు కాగా తాను మధ్యవర్తిగా ఉంటానని టర్కీ ముందుకు రావటం వాటికి సుతరామూ ఇష్టం లేదు. టర్కీకి అవసరమైన మిలిటరీ పరికరాలను నాటో, అమెరికా నుంచి కొనుగోలుకు వీల్లేకుండా ఆంక్షలు విధించారు. సిరియా నుంచి ఐరోపాకు వచ్చే 40లక్షల మంది కాందిశీకులను రాకుండా చేసినందుకు ఇప్పటి వరకు ఐరోపా సమాఖ్య బిలియన్లమేర యూరోలను అందచేసింది. మరో ఆరు బిలియన్లను అందచేసేందుకు కుదిరిన ఒప్పందాన్ని టర్కీ నిలిపివేసింది. ఐరోపా సమాఖ్య తల మీద తుపాకి గురిపెట్టినట్లుగా తమ షరతులను అంగీకరించకపోతే ఇతర ఐరోపా దేశాలకు కాందిశీకుల వరద పారిస్తామని టర్కీ బెదిరిస్తున్నది.


ఎర్డోవాన్‌ పెట్టిన మెలికను ఐరోపా కమిషన్‌ తిరస్కరించింది. స్వీడన్‌ నాటోలో, టర్కీ ఐరోపా సమాఖ్యలో చేరటం రెండూ వేర్వేరని, సమాంతరంగా జరుగుతున్న పరిణామాలు గనుక ఒకదానికి మరొకదాన్ని పోటీ పెట్టరాదని ప్రతినిధి దానా సిపినాంట్‌ స్పష్టం చేసింది. జర్మన్‌ ఛాన్సలర్‌ షుల్జ్‌ కూడా ఆ వైఖరిని బలపరిచాడు. టర్కీ కోర్కెను తాను సమర్ధిస్తున్నట్లు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ చెప్పాడు. స్వీడన్‌ చేరికను టర్కీ బలపరుస్తుందని కూడా అన్నాడు. ఎర్డోవాన్‌ మెలిక పెట్టినప్పటికీ ఇప్పటికీ ఆమోదించే అవకాశం ఉందనే ఆశాభావం వెల్లడించాడు. విస్తరణకు సంబంధించి 2022 నివేదికలో సమాఖ్య పేర్కొన్న అంశాలు టర్కీ చేరిక అంత తేలిక కాదని స్పష్టం చేస్తున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నదని, చట్టబద్దపాలన, ప్రాధమికహక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థల గురించి తీవ్ర ఆందోళన వెల్లడించింది.


గ్రీసును బెదిరించకుండా ఉండేట్లైతే, నాటోలో స్వీడన్‌ చేరికను ఆమోదిస్తే తాము టర్కీకి ఎఫ్‌ 16 విమానాలను విక్రయించేందుకు సిద్దమే అని అమెరికా గతంలో సందేశం పంపింది. విలినస్‌కు బయలు దేరిన జో బైడెన్‌ ఆదివారం నాడు విమానం నుంచే ఎర్డోవాన్‌తో గంటసేపు సంభాషించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని అమెరికా అధికారవర్గాలు చెప్పినట్లు వార్తలు. గ్రీసు పట్ల శతృత్వం, రష్యానుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు టర్కీ నిర్ణయించిననందున ఎఫ్‌ 16 విమానాలను విక్రయించకూడదని గతంలో అమెరికా నిర్ణయించింది. ఇప్పుడు ఒక అడుగు దిగివచ్చినట్లు కనిపిస్తోంది. స్వీడన్‌ చేరికకు మద్దతు ఇస్తే టర్కీకి విమానాలు విక్రయించేందుకు అమెరికా పార్లమెంటు ఆమోదించవచ్చని వార్తలు వచ్చాయి. వాటిని తమకు వ్యతిరేకంగా వినియోగించరాదని గ్రీసు డిమాండ్‌ చేస్తోంది. ఏజియన్‌ సముద్ర జలాల్లో నౌకా సంచార హక్కుల గురించి వివాదం ఉంది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ రోజూ తమ దీవుల మీదుగా విమానాలు ఎగురుతున్నట్లు గ్రీసు చెబుతున్నది. ఆ దీవుల మీదుగా ఎఫ్‌16 విమానాలను అనుమతించకూడదని ఆరుగురు అమెరికన్‌ ఎంపీలు తమ విదేశాంగ మంత్రికి లేఖలు రాశారు. విలినస్‌ సమావేశాల్లో జరిగిన పరిణామాల్లో వాటిని సరఫరా చేసేందుకు అమెరికా మార్గం సుగమం చేసినట్లు, దీంతో పుతిన్‌కు దూరం జరిగి టర్కీ పశ్చిమ దేశాలకు దగ్గరైనట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. మంగళవారం నాడు అమెరికా భద్రతా సలహాదారు సులివాన్‌ మాట్లాడుతూ స్వీడన్‌కు టర్కీ పచ్చజెండా ఊపినందున 2021లో కుదిరిన ఒప్పందం మేరకు లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ నుంచి 20బిలియన్‌ డాలర్ల విలువ గల కొత్త ఎఫ్‌ 16 విమానాలతో పాటు ఇప్పటికే టర్కీ దగ్గర ఉన్న 80పాత వాటిని నవీకరించేందుకు ముందుకు వెళ్లనున్నట్లు చెప్పాడు.


విలినస్‌ నాటో వార్షిక సమావేశాల్లో ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధ సాయం గురించి తప్ప నాటోలో ప్రవేశం మీద ఎలాంటి నిర్ణయమూ తీసుకొనే అవకాశం లేదు. అక్కడ పోరు ముగిసిన తరువాతే దాన్ని గురించి పరిశీలిస్తామని జో బైడెన్‌ సిఎన్‌ఎన్‌ టీవీతో చెప్పాడు. నాటో కుటుంబంలో ఉక్రెయిన్ను చేర్చుకోవాలా వద్దా అనే అంశం మీద సభ్యదేశాల్లో ఏకీభావం లేదని కూడా అన్నాడు.ఇప్పుడు గనుక చేర్చుకుంటే మేమంతా యుద్ధంలో ఉన్నట్లే అవుతుంది. ఇప్పుడే ఓటింగ్‌ జరపాలనటం అపరిపక్వత అవుతుంది, ఒక దేశాన్ని చేర్చుకోవాలంటే ప్రజాస్వామీకరణతో సహా కొన్ని అర్హతలు ఉండాలి అని కూడా బైడెన్‌ చెప్పాడు. జర్మనీ కూడా అమెరికా వైఖరితో ఏకీభవిస్తోంది. నాటో నిబంధన ఐదును పరీక్షించే అవకాశం పుతిన్‌కు ఇవ్వకూడదని జర్మనీ కోరుకొంటోందని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్‌కు తక్షణమే నాటో సభ్యత్వం అన్న చర్చ అసంగతం, దానికి చేస్తున్న మంచిని మరచి దీని గురించి చర్చను అనుమతించటం విచారకరం.ఎవరూ ఇప్పటికిప్పుడు నాటోలో చేరాలని గట్టిగా చెప్పటం లేదు, దానికి తగిన మార్గం గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఎలా సాయం చేయాలా అని ఆలోచిస్తున్నాం. దీని గురించి గాక సభ్యత్వం గురించి చర్చ పెట్టటం అంటే సమావేశాన్ని పక్కదారి పట్టించటమే, పశ్చిమ దేశాల్లో విబేధాలు ఉన్నట్లు అని చెప్పటమే, దీన్ని రష్యా స్వాగతిస్తుందని నాటో అధికారులు చెప్పినట్లు మీడియా పేర్కొన్నది.


తమను వెంటనో నాటోలో చేర్చుకోవాలని, ఆధునిక అస్త్రాలను పెద్ద ఎత్తున సరఫరా చేయాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేస్తున్నది. అదే గనుక జరిగితే ఉక్రెయిన్‌ సంక్షోభ స్వభావమే మారిపోతుంది. పుతిన్‌ మీద నేరుగా ఆ కూటమి సేనలు యుద్ధానికి దిగవచ్చు. రష్యా దాడులకు దిగకముందుఉన్న పరిస్థితి వేరు, తరువాత తమ ప్రాంతాలను ఆక్రమించుకున్నందున నాటో సభ్వత్వం ఇవ్వాలని గతేడాది సెప్టెంబరులో జెలెనెస్కీ దరఖాస్తు చేశాడు. అనేక దేశాలు అందుకు మద్దతు తెలిపినా అమెరికా, జర్మనీ సిద్దం కాలేదు. కొన్ని ప్రాంతాలు ఉక్రెయిన్నుంచి వేరుపడి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. క్రిమియా ద్వీపం తమదే అంటూ 2014లోనే రష్యా స్వాధీనం చేసుకుంది. మరికొన్ని ప్రాంతాలు ఇప్పుడు దాని ఆధీనంలో ఉన్నాయి, అటువంటపుడు మధ్యలో సభ్యత్వం ఇవ్వటం, గతం నుంచి వర్తింప చేసి ఎదురుదాడులకు పూనుకోవటం నాటో ఐదవ ఆర్టికల్‌ నిబంధన పరిధిలోకి రాదని చెబుతున్నారు. దాన్ని సవరించి నాటోలో చేర్చుకొని రష్యాతో నేరుగా తలపడేందుకు నాటో కూటమి ప్రస్తుతం సిద్దంగా లేదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

షీ జింపింగ్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ : ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార ప్రతిపాదనలపై పశ్చిమ దేశాల ఇరకాటం !

22 Wednesday Mar 2023

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China's peace plan, Donald trump, imperialism, Joe Biden, NATO allies, Ukraine crisis, Vladimir Putin, Xi Jinping, Xi Jinping-Vladimir Putin summit : west in a tight spot on China's peace plan


ఎం కోటేశ్వరరావు


చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ మూడు రోజుల రష్యా పర్యటన బుధవారం నాడు ముగిసింది. మార్చి 20 నుంచి 22వ తేదీ వరకు మాస్కోలో ఉన్నారు. మూడవ సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జింపింగ్‌ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇది. దీని ఫలితాలు, పర్యవసానాల గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. బద్దశత్రువులుగా ఉన్న ఇరాన్‌-సౌదీ అరేబియా సాధారణ సంబంధాలు ఏర్పరచుకొనేట్లు చూడటంలో చైనా పాత్ర గురించి అనేక మంది ఇంకా నమ్మటం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి పన్నెండు అంశాలతో చైనా ఒక ప్రతిపాదనను ముందుకు తెచ్చిన పూర్వరంగంలో ఆసక్తి మరింతగా పెరిగింది. ఉభయ దేశాలూ ఈ సందర్భంగా చేసిన ప్రకటన మీద స్పందించిన తీరు చూస్తే ఈ పరిణామం అమెరికా, ఇతర నాటో కూటమి దేశాలకు ఇది మింగా కక్కలేని పరిస్థితిని ఏర్పరచింది. చైనా ప్రతిపాదనలపై చర్చించేందుకు తమకు అభ్యంతరం లేదని రష్యా స్పష్టంగా స్పందించింది. తాము కూడా వాటిని పరిగణనలోకి తీసుకుంటామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఈ అంశాలపైనే ప్రధానంగా జింపింగ్‌-పుతిన్‌ చర్చలు జరిపినట్లు వార్తలు. మాస్కో చర్చల గురించి అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ మాట్లాడుతూ ఐరాస నిబంధనల ప్రకారం ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని నివారించాలన్న చైనా ప్రతిపాదనల్లోని ఒక అంశం మీద నిజానికి చైనా దానికి కట్టుబడితే ఇదే ప్రాతిపదిక మీద వ్లదిమిర్‌ జెలెనెస్కీ, ఉక్రెయిన్‌తో కూడా షీ జింపింగ్‌ మాట్లాడాలని అన్నాడు. తమ మీద జరుపుతున్న దాడికి స్వస్తి పలికేందుకు చైనా తన పలుకుబడిని ఉపయోగించగలదని, జెలెనెస్కీ, షీ మధ్యనేరుగా చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒలెగ్‌ నికొలెంకో కోరాడు. వీలైనపుడు తమ దేశాన్ని సందర్శించాలని పుతిన్ను కోరినట్లు షీ జింపింగ్‌ వెల్లడించాడు.


షీ జింపింగ్‌-వ్లదిమిర్‌ భేటీ అవకాశవాద కూడిక తప్ప మరొకటి కాదని అమెరికా పేర్కొన్నది. ఆ దేశ భద్రతా సలహాదారు జాన్‌ కిర్బీ మాట్లాడుతూ ప్రపంచంలో పుతిన్‌కు స్నేహితులెవరూ లేరని, జింపింగ్‌ను పెద్ద మద్దతుదారుగా పరిగణిస్తున్నాడని అన్నాడు. చైనాకు రష్యా జూనియర్‌ భాగస్వామిగా మారిందని రెచ్చగొడుతూ మాట్లాడాడు. జింపింగ్‌ పర్యటన సందర్భంగా ఉభయ దేశాలు వివిధ రంగాల్లో పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. కీలకమైన ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారం గురించి సానుకూలంగా స్పందించాయి. ఉక్రెయిన్‌ అంశంపై ఏ వైపూ మొగ్గు చూపకుండా చైనా తీసుకున్న వాస్తవిక వైఖరిని సానుకూల వైఖరితో రష్యా మదింపు చేసింది. మిలిటరీ, రాజకీయ ఇతరంగా అనుకూలంగా మార్చుకొనేందుకు చూసే క్రమంలో ఏ దేశాలు వాటి కూటములు గానీ ఇతర దేశాల న్యాయబద్దమైన భద్రతా ప్రయోజనాలను నష్టపరిచేందుకు చూడటాన్ని వ్యతిరేకిస్తాయి. సాధ్యమైనంత త్వరలో శాంతి చర్చలను తిరిగి ప్రారంభించేందుకు రష్యా చూపిన సుముఖతను చైనా వైపు నుంచి సానుకూలంగా మదింపు చేస్తున్నది అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు బంతి ఉక్రెయిన్‌ దానికి మద్దతుదారులుగా ఉన్న అమెరికా, పశ్చిమ దేశాల చేతుల్లో ఉంది.


జింపింగ్‌ పర్యటన ఖరారు కాగానే పుతిన్‌ మీద అరెస్టు వారంటు జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు, దానికి ఆ అర్హత లేదంటూ సదరు కోర్టు జడ్జీలు, ప్రాసిక్యూటర్‌పై తామే దర్యాప్తు జరుపుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్లో స్వాధీనం చేసుకున్న మరియాపూల్‌ ప్రాంతాన్ని పుతిన్‌ సందర్శించారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను అందించేందుకు నాటో కూటమి పూనుకుంది. దానిలో భాగంగా గతంలో సోవియట్‌ నుంచి పొందిన మిగ్‌ 29 విమానాలను పోలాండ్‌, స్లోవేకియా దేశాలు ఉక్రెయిన్‌కు అందచేసి రష్యా మీదకు పురికొల్పుతున్నాయి. కిరాయి మూకల పేరుతో పోలాండ్‌ తన మిలిటరీని కూడా పంపినట్లు వార్తలు. ఇలాంటి వాటితో పుతిన్‌ సేనలు ఓటమి ఖాయమంటూ మరోవైపున ప్రచారం. చైనా బెలూన్‌ కూల్చివేతకు ప్రతీకారం అన్నట్లుగా అమెరికా ప్రయోగించిన ఒక నిఘా డ్రోన్ను నల్ల సముద్రంలో రష్యా విమానాలు కూల్చివేశాయి. ఫిన్లండ్‌ నాటోలో చేరేందుకు టర్కీ అంగీకారం తెలిపింది. ఇలా అనేక కీలక పరిణామాలు జింపింగ్‌ రాక ముందు జరిగాయి.


షీ జింపింగ్‌ పర్యటనలో చివరి రోజు-బుధవారం నాడు రెండు దేశాలు ఏ ప్రకటన చేస్తాయనేది వెల్లడిగాక ముందే ప్రపంచ మీడియాలో పరిపరి విధాలుగా చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య స్నేహబంధం, ఇతర సంబంధాలు మరింత పటిష్టం కావించుకోవటం గురించి చివరి రోజు ఎలాగూ చెబుతారు. చైనా ముందుకు తెచ్చిన ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కార అంశాల చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తున్నది. ఈ పర్యటనతోనే అవి కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. ఇది ప్రారంభం మాత్రమే. పశ్చిమ దేశాలు నడిపే శల్యసారధ్యం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో ఉక్రెయిన్‌ తొలి రోజుల్లో చర్చలకు సిద్దపడినా అమెరికా తన పథకాన్ని అమలు జరిపేందుకు వాటిని చెడగొట్టింది. రష్యా లేవనెత్తిన తన భద్రత అంశాలను విస్మరించటమేగాక దానిపై ఆంక్షల కత్తికట్టింది.ఇతర పశ్చిమ దేశాలు వంతపాడుతున్నాయి. పుతిన్‌తో చర్చించిన తరువాత షీ జింపింగ్‌ అవసరమైతే ఉక్రెయిన్‌ కూడా వెళతారని వార్తలు.గతేడాది డిసెంబరు 30న షీ జింపింగ్‌తో పుతిన్‌ జరిపిన వీడియో చర్చలలో మాస్కో రావాలని పుతిన్‌ ఆహ్వానించినా, కేవలం వారం రోజుల ముందే షీ టూర్‌ ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీన చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ శాంతి ప్రతిపాదనలను ప్రకటించింది. షీ టూర్‌కు ముందు అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసిసి) పశ్చిమ దేశాల ప్రచారదాడి పథకంలో భాగంగానే పుతిన్‌ మీద అరెస్టు వారంట్‌ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటామని అంగీకరించిన దేశాలకే దాని నిర్ణయాలు వర్తిస్తాయి ఇతర దేశాలకు కాదు. ఇది చైనా మీద వత్తిడి తేవటంలో భాగంగా జరిగినట్లు చెబుతున్నారు. ఐసిసిలో అమెరికా, చైనా, రష్యా మరికొన్ని దేశాలు భాగస్వాములు కాదు. లేని మారణాయుధాలను సాకుగా చూపి ఇరాక్‌ మీద దాడి చేసి దాదాపు ఆరులక్షల మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న, కోట్లాది మంది జీవితాలను అతలాకుతలం గావించిన అమెరికా, దాని మిత్రదేశాల అధిపతుల మీద ఐసిసి ఇలాంటి అరెస్టు వారంట్లను జారీ చేయలేదు.


గత కొద్ది వారాలుగా ఇంకేముంది ఉక్రెయిన్‌ గడ్డమీద రష్యా ఓడిపోతున్న సూచనలు కనిపించటంతో తటస్థం అని పైకి చెప్పినా పుతిన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు చైనా నిర్ణయించిందంటూ పెద్ద ఎత్తున పశ్చిమ దేశాలు ప్రచారం చేశాయి. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నాయి. పూర్తిగా ఓడిపోక ముందే కలుసుకోవాలని జింపింగ్‌ అనుకున్నారని, పశ్చిమ దేశాలకు గెలిచే అవకాశం ఇవ్వకూడదని చూస్తున్నారని చెబుతున్నాయి. శాంతిదూత మాదిరి నటిస్తూ రాజకీయ క్రీడలో భాగంగా సంక్షోభ పరిష్కారానికి శాంతి ప్రతిపాదనలను ముందుకు తేవటంతో పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు అందచేస్తున్నదానికి భిన్నంగా తాత్కాలికంగానైనా ఆయుధ సరఫరా జరపదు అంటూ కొత్త పల్లవి అందుకున్నాయి. తన అవసరాల కోసం చైనా మీద ఆధారపడినందున పుతిన్‌ శాంతి ప్రతిపాదనలను పరిశీలించేందుకు అంగీకరించినా అమలుకు మాత్రం ససేమిరా అంటాడని జోశ్యం చెబుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు తమ మీద మరింత దూకుడును ప్రదర్శించకుండా చైనా చూసుకుంటున్నదని ఆరోపిస్తున్నాయి. ఇలా చిలవలు పలవలుగా కథనాలను అల్లుతున్న దశలో షీ జింపింగ్‌ మాస్కో వెళ్లారు.


అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రపంచ వ్యవస్థను కాపాడేందుకు రష్యాతో పాటు ఒక రక్షకుడిగా చైనా నిలిచేందుకు సిద్దమని మాస్కోలో జింపింగ్‌ చెప్పాడు. సోమవారం రాత్రి విందుకు ముందు పుతిన్‌తో కలసి ఇష్టా గోష్టిగా విలేకర్లతో క్లుప్తంగా మాట్లాడుతూ వ్లదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం మేరకు మరోసారి సందర్శనకు రావటం సంతోషంగా ఉందని, ఇరుదేశాల సంబంధాలు చక్కగా, స్థిరమైన వృద్దితో ముందుకు సాగేందుకు కొత్త ఊపు నిస్తుందని అన్నాడు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ సంక్షోభ తీవ్రత గురించి చైనా ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, వాటి గురించి చర్చిందుకు మాకు అవకాశం వచ్చిందంటూ, చర్చలకు తాము ఎప్పుడూ సిద్దంగానే ఉన్నట్లు చెప్పాడు. అంతకు ముందు పీపుల్స్‌ డైలీ ( చైనా) పత్రికలో పుతిన్‌ రాసిన ఒక వ్యాసంలో ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాల మీద చైనా సమతుల్య వైఖరితో ఉన్నందుకు తాము కృతజ్ఞులమై ఉంటామని,దాన్ని పరిష్కరించేందుకు ఒక నిర్మాణాత్మక పాత్రను పోషించేందుకు సుముఖంగా ఉండటాన్ని ఆహ్వానిస్తున్నామన్నాడు. ఉక్రెయిన్‌ అంశంలో వ్యవహార జ్ఞానంతో ఉండాలని షీ జింపింగ్‌ కోరినట్లు రష్యా అధికార పత్రిక రూసిసక్యా గజెటాలో ప్రచురించిన ఒక ఆర్టికల్లో పేర్కొన్నారు.


ప్రపంచ వ్యవహారాల నిర్వహణలో మరింత ప్రబలమైన పాత్ర పోషించాలని చైనా కోరుకుంటోందని దాన్ని మరింత ముందుకు నెట్టేందుకు ఈ పర్యటన కలసి వచ్చిందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఉక్రెయిన్నుంచి పుతిన్‌ సేనలు వైదొలగటం, స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి వెళ్లిపోవటం వంటి వాటి గురించి చైనా ప్రతిపాదనల్లో స్పష్టత లేదని, అందువలన అది ముందుకు పోదని పశ్చిమ దేశాలు చిత్రిస్తున్నాయి. చైనా ప్రతిపాదనలు ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తాయని అమెరికా పత్రిక టైమ్‌ ధ్వజమెత్తింది.ఈ ప్రతిపాదన ద్వారా అంతర్జాతీయ రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని ఆక్రమించేందుకు ఒక ముఖ్యమైన అడుగువేసింది.చైనా భద్రతతో నేరుగా సంబంధ లేని అంశాల్లో బాధ్యత తీసుకొనేందుకు, ముప్పు ఎదుర్కొనేందుకు గతంలో దూరంగా ఉండేది.ఇప్పుడు జింపింగ్‌ కొత్త పద్దతుల్లో చైనా ప్రభావాన్ని చూపేందుకు పూనుకున్నారు. శాంతి ప్రతిపాదనల్లో మొక్కుబడిగా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వం పట్ల గౌరవం ఉందని పేర్కొన్నది.పౌరుల రక్షణ, మానవతా పూర్వసాయంపై జోక్యం చేసుకోరాదని,అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశాలను ఖండించటం, ప్రపంచంలో వెల్లడైన అభిప్రాయాలను అది ప్రతిబింబించినప్పటికీ ప్రధానంగా రష్యాకు సాయపడేవిధంగా ప్రతిపాదనలు ఉన్నట్లు టైమ్స్‌ విశ్లేకుడు ఆరోపించాడు. వాటి ప్రకారం తక్షణమే కాల్పుల విరమణ జరిగితే రష్యా జయించింది దాని దగ్గరే ఉంటుంది. తమ ప్రాంతాలను తమకు స్వచ్చందంగా అప్పగించాలని పుతిన్ను ఉక్రెయిన్‌ బతిమాలుకోవాల్సి ఉంటుందని టైమ్‌ రెచ్చగొట్టింది. నష్టపోయేందుకు ఎవరూ సిద్దం కానందున ఈ దశలో శాంతిపధకం విజయవంతం కాదని పేర్కొన్నది. పశ్చిమ దేశాల వ్యాఖ్యాతలు ముందుకు తెచ్చిన అంశాలు వాటి పాలకవర్గాల ఆలోచనా వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి.వాటిలో చైనాను బెదిరించటం కూడా ఒకటి.


కరోనా, తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా తలెత్తిన పరిస్థితి, పేద, వర్ధమాన దేశాలకు సంకటంగా మారింది. దాన్ని పరిష్కరించకుండా అడ్డుపడుతున్నది అమెరికా, పశ్చిమదేశాల కూటమే అని అవి భావిస్తున్నాయి. ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, సరఫరా సంక్షోభం వంటి తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.ఉక్రెయిన్‌ వివాదాన్ని మరింత తీవ్రంగావించే, దీర్ఘకాలం కొనసాగించే ఎత్తుగడల కారణంగా రష్యా మీద విధించిన ఆంక్షలకు అవి మద్దతు పలకకపోవటంతో అమెరికా వ్యూహవేత్తలు కంగుతిన్నారు. ఇరాన్‌-సౌదీ మధ్య చైనా కుదిర్చిన ఒప్పందం తరువాత ఉక్రెయిన్‌ సంక్షోభం పరిష్కారానికి అడ్డుపడేవారి మీద వత్తిడిపెరుగుతోంది. ఇప్పుడు చైనా ముందుకు తెచ్చిన శాంతి పథకాన్ని సూత్ర ప్రాయంగా ఏ దేశమూ కాదనలేదు. ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచి చర్చలకు అడ్డుపడుతున్న పశ్చిమ దేశాల మీద మరింత ఆగ్రహం వెల్లడి అవుతోంది.
తమ పెత్తనానికి ఎసరు వస్తోందని, దానికి చైనా, రష్యాలే కారణమని భావిస్తున్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇటీవలి కాలంలో అన్ని విధాలుగా పెద్ద సవాలు విసురుతున్నాయి.ఈ నేపధ్యంలో రెండు దేశాలూ తమ సంబంధాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చాయి. ఉక్రెయిన్‌ సంక్షోభం ఏడాది క్రితం ప్రారంభమైనట్లు పైకి కనిపించినా పశ్చిమ దేశాల మద్దతుతో పది సంవత్సరాల క్రితం ” యూరోమైదాన్‌ ” పేరుతో ఉక్రెయిన్లో అమలు జరిపిన కుట్ర దానికి నాంది పలికింది. అది అమెరికా-రష్యా ఘర్షణకు దారి తీసింది.రష్యా మీద అవసరమైతే దాడి చేసేందుకు అమెరికా రెండు విమానవాహక యుద్ద నౌకలను రష్యా ముంగిట తెచ్చిపెట్టింది. దాంతో ఉక్రెయిన్‌ మీద పుతిన్‌ సైనిక చర్యకు దిగాడు. మరోవైపు డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో చైనాతో వాణిజ్య పోరుతో ప్రారంభించి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞాన పోరు అనే మరో రెండో రంగాన్ని కూడా తెరిచారు. ఈ పూర్వరంగంలో షీ జింపింగ్‌ మాస్కో పర్యటన నామమాత్రం కాదు అన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండో ఏడాదిలోకి ఉక్రెయిన్‌ సంక్షోభం – స్టార్ట్‌ 2 ఒప్పందాన్ని పక్కన పెట్టిన రష్యా !

22 Wednesday Feb 2023

Posted by raomk in CHINA, Current Affairs, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

China, Joe Biden, New START treaty, Ukraine crisis, Ukraine war, Ukraine-Russia crisis, US imperialism, Vladimir Putin, Zelensky


ఎం కోటేశ్వరరావు


అమెరికాతో ఉన్న నూతన వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం (స్టార్ట్‌) నుంచి తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మంగళవారం నాడు రష్యన్‌ పార్లమెంటు సమావేశంలో ప్రకటించాడు.1991లో కుదిరిన స్టార్ట్‌ ఒకటవ వప్పందం ప్రకారం రెండు దేశాలూ ఆరువేల చొప్పున అణ్వాయుధాలు, పదహారు వందల ఖండాంతర క్షిపణులు, బాంబర్లకు మించి కలిగి ఉండరాదు. దీని గడువు 2009లో ముగిసింది.తరువాత 2010లో కుదిరిన రెండవ ఒప్పందం ప్రకారం 2026 నాటికి రెండు దేశాలూ వాటిని ఇంకా తగ్గించాల్సి ఉంది. పుతిన్‌ ప్రకటన మీద అమెరికా స్పందన వెల్లడి కావాల్సి ఉంది. ఉక్రెయిన్‌ వివాదాన్ని పశ్చిమ దేశాలే ప్రారంభించాయని దాన్ని ముగించేందుకు రష్యా తన బలాన్ని వినియోగిస్తున్నదని పుతిన్‌ పార్లమెంటు సమావేశంలో చెప్పాడు. ఇప్పటికీ సంప్రదింపులకు ద్వారాలు తెరిచే ఉంచామని పరస్పర సమానత్వం, భద్రత ప్రాతిపదికన అవి ఉండాలని అన్నాడు.నాటో విస్తరణ గురించి నిజాయితీలేని సమాధానాలు చెబుతున్నారని అన్నాడు. స్థానిక వివాదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయేందుకు అమెరికా చూస్తున్నదని, ఉక్రెయిన్‌ పౌరులు తమ పశ్చిమ దేశాల యజమానుల చేతిలో బందీలుగా మారారని పుతిన్‌ అన్నాడు.


రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు జరిపిన అనేక యుద్ధాలు దశాబ్దాల తరబడి సాగినవి ఉన్నప్పటికీ 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచాన్ని కుదిపివేసింది. ఇప్పటికీ దాని ప్రతికూల పర్యవసానాలు ప్రభావం చూపుతూనే ఉన్నాయి. రష్యా ప్రారంభించిన మిలిటరీ చర్య శుక్రవారం నాడు రెండవ ఏడాదిలో ప్రవేశించనుంది. దాన్ని మరింతగా రెచ్చగొట్టేందుకు అవసరమైన అస్ర,్త శస్త్రాలను అందిస్తామని ఉక్రెయిన్‌ రాజధానికి సోమవారం నాడు ఆకస్మికంగా వచ్చిన అమెరికా అధినేత జో బైడెన్‌ వాగ్దానం చేసి వెళ్లాడు. ముందుగా ప్రకటిస్తే ఎటు నుంచి ఏ ముప్పు ఉంటుందో నని భయపడిన కారణంగానే కొద్ది గంటల ముందే సమాచారాన్ని వెల్లడించి కేవలం ఐదు గంటలు మాత్రమే కీవ్‌లో గడిపి పక్కనే ఉన్న పోలాండ్‌ వెళ్లాడు.గతవారంలో మ్యూనిచ్‌ నగరంలో జరిగిన భద్రతా సమావేశం తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
పదిహేను సంవత్సరాల తరువాత అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్‌ రావటం ఇదే ప్రధమం.గతంలో బిల్‌ క్లింటన్‌ 1994,1995, 2000 సంవత్సరాలలో, తరువాత 2008లో జార్జి డబ్ల్యు బుష్‌ కీవ్‌ సందర్శనకు వచ్చారు. జూనియర్‌ బుష్‌ పెట్టిన చిచ్చు చివరకు 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న తన ప్రాంతమైన క్రిమియాను విలీనం చేసుకొనేందుకు రష్యాను పురికొల్పింది. దాని కొనసాగింపుగా సామ్రాజ్యవాదులు పన్నిన రష్యా ముంగిటకు నాటో విస్తరణ అన్న కుట్ర తన రక్షణకు 2022లో రష్యాను మిలిటరీ చర్యకు పురికొల్పింది.తొలుత సంప్రదింపులంటూ లోకాన్ని నమ్మింప చేసేందుకు చూసినప్పటికీ తరువాత పశ్చిమ దేశాలకు అలాంటి ఉద్దేశ్యం లేదని స్పష్టమైంది. ఈ పూర్వరంగంలో ఇప్పుడు జో బైడెన్‌ పర్యటన ఏ కొత్త పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేము.


జెలెనెస్కీ కోరుతున్న విమానాలు తప్ప టాంకులతో సహా ఉక్రెయిన్‌ పౌరులను రక్షించేందుకు అన్ని రకాల అస్త్రాలను మరింతగా సరఫరా చేస్తామని, రష్యామీద మరిన్ని ఆంక్షలను అమలు చేస్తామని జో బైడెన్‌ చెప్పాడు. ఒక వైపు ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పశ్చిమ దేశాల నాటో కూటమి మరోవైపు శాంతికోసం పుతిన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు లేవంటూ ప్రచారదాడి చేస్తున్నది. ఇప్పటి వరకు పది దఫాలుగా రష్యా మీద ఆంక్షల తీవ్రతను పెంచుతున్నారు.మరో దఫాను ప్రతిపాదించారు. నాటో కూటమి ప్రకటనలను చూస్తుంటే మరో యుద్ద రంగాన్ని తెరిచేందుకు సిద్దం అవుతున్నట్లు చెబుతున్నారు. మ్యూనిచ్‌ భద్రతా సమావేశం(ఎంఎఎస్‌సి) సందర్భంగా శనివారం నాడు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడుతూ ఈ రోజు ఐరోపాలో జరుగుతున్నది రేపు ఆసియాలో జరగవచ్చు అన్నాడు. ఎప్పటి నుంచో ఇప్పుడు ఉక్రెయిన్‌ తదుపరి తైవాన్‌ అన్న ప్రచారం సంగతి, వరుసగా చైనాను రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రష్యాకు మరింతగా చైనా ఆయుధాలు అంద చేయనున్నది అనే ప్రచారం కూడా జరుగుతున్నది.అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అదే సమావేశంలో దాన్ని పునశ్చరణ గావించారు. భారత్‌-చైనా రెండూ ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థంగా ఉన్నాయి. రష్యా నుంచి మన దేశం ఎంత చమురు కొనుగోలు చేసినా ఆ మేరకు పుతిన్‌ సర్కార్‌కు లబ్ది చేకూర్చినా కనపడని తప్పు అదేపని చేస్తున్న చైనాలో పశ్చిమ దేశాలు చూస్తున్నాయి. రష్యా చమురును మన దేశం శుద్ది చేసి డీజిల్‌ ఇతర ఉత్పత్తులను అమెరికా, ఐరోపాతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది.


నాటో కూటమిలోని జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు రష్యాను శత్రువుగా పరిగణిస్తున్న మాదిరి చైనా పట్ల లేవు. కానీ మొత్తం నాటోను, ఐరోపాను తమ గుప్పిటలో ఉంచుకోవాలంటే రెండు దేశాల నుంచీ ముప్పు ఉందని, ఐరోపాను తాము తప్ప మరొకరు కాపాడలేరని నమ్మించేందుకు అమెరికా చూస్తున్నది. అందుకే రెండు దేశాలూ ఒకటే అని నూరిపోస్తున్నది. తైవాన్‌ సమస్యలో కూడా అందరం కలసి కట్టుగా ఉండాలని చెబుతున్నది. రష్యా గనుక ఉక్రెయిన్‌లో గెలిస్తే మొత్తం ఐరోపాకే ముప్పు అని చెబుతున్నది. తాము తమ దేశ స్వేచ్చ కోసమే గాక మొత్తం ఐరోపా కోసం పోరు సల్పుతున్నట్లు నిరంతరం జెలెనెస్కీతో చెప్పించటం కూడా దానిలో భాగమే. రష్యాను బూచిగా చూపి ఐరోపా రక్షణ బడ్జెట్లను పెంచుకోవాలని ఆ సొమ్ముతో తమ ఆయుధాలను కొనుగోలు చేయాలని వత్తిడి తెస్తున్నది. మరోవైపు జర్మనీ వంటి కొన్ని దేశాలు అమెరికా పట్ల అనుమానంతో చూస్తున్నాయి. రష్యా నుంచి ఐరోపా దేశాలకు ఇంథనాన్ని సరఫరా చేసే నోర్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌ లైన్‌ పేలుళ్ల వెనుక అమెరికా హస్తం ఉందని తెలిసిన తరువాత అవి ఉలిక్కిపడ్డాయి.


ఏడాది కాలంలో ఉక్రెయిన్‌ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగిస్తున్న నష్టం ఎంత అన్నది ఎవరూ చెప్పలేని స్థితి. ఈ ఏడాది చివరి నాటికి నష్టం 2.8లక్షల కోట్ల డాలర్లని ఓయిసిడి దేశాల సంస్థ అంచనా.ప్రపంచ ఆర్థికవేదిక ప్రపంచంలోని 87.4శాతం జనాభా ఉన్న 116దేశాలలో ఇంథన ధరల పెరుగుదల గురించి సర్వే జరిపింది.ప్రత్యక్ష, పరోక్ష కారణాలతో ఒక్కో కుటుంబానికి 63 నుంచి 113శాతం వరకు పెరిగాయి.అనేక దేశాల్లో చలికాచుకొనేందుకు అవసరమైన ఇంథనాన్ని కొనుగోలు చేయలేని కారణంగా ఇంథన దారిద్య్రంలో మునిగిన వారు, ఇతర జీవన వ్యయం పెరుగుదల వలన ప్రపంచబాంకు దారిద్య్ర దుర్భర రేఖకు దిగువకు వెళ్లిన వారు 7.8 నుంచి 14.1 కోట్ల మంది వరకు ఉంటారు.అమెరికా అంచనా ప్రకారం నలభైవేల మంది ఉక్రెయిన్‌ పౌరులు, రెండు దేశాలకు చెందిన సైనికులు లక్ష మంది చొప్పున మరణించి ఉంటారు.మరి కొందరు చెప్పినదాని ప్రకారం రెండు లక్షల మంది పుతిన్‌ సైనికులు మరణించిగానీ గాయపడి గానీ ఉంటారు. వీటిని ఎవరూ నిర్ధారించలేదు. అరవైఎనిమిది లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులు దేశం విడిచి వెళ్లగా మరో 66లక్షల మంది స్వదేశంలో నెలవులు తప్పారు. జర్మనీకి చెందిన కెల్‌ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం గతేడాది జనవరి-అక్టోబరు కాలంలో పశ్చిమ దేశాలు అందించిన మిలిటరీ మద్దతు విలువ 40బిలియన్‌ డాలర్లు కాగా మానవతా పూర్వక సాయం15బి.డాలర్లు మాత్రమే. ప్రపంచ దేశాల సరఫరా గొలుసులన్నీ ఈ సంక్షోభంతో దెబ్బతిన్నాయి.వాటిని పునరుద్దరించటం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేసుకొనేందుకు ఎంతో సమయం పడుతుంది.


కొద్ది వారాల్లోనే ఉక్రెయిన్ను దారికి తెచ్చుకుంటామన్న పుతిన్‌ అంచనాలు ఎలా తప్పాయో రష్యాను తరిమికొట్టామని చెప్పిన జెలెనెస్కీ మాటలు, పశ్చిమదేశాల ప్రచారం కూడా వాస్తవం కాదని ఏడాదిలో జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.నిజానికి ఒక్క ఉక్రెయిన్‌ మిలిటరీ మాత్రమే రంగంలో ఉంటే వారాలు కాకున్నా నెలల్లో పరిష్కారం దొరికి ఉండేది. కానీ పశ్చిమ దేశాలు తమ సైనికులను పంపలేదు తప్ప తమ దగ్గర ఉన్న అధునాతన అస్త్రాలన్నింటినీ రంగంలోకి దించటంతో అంచనాలు తప్పాయి.ఇరవైశాతం ఉక్రెయిన్‌ ప్రాంతం స్వాతంత్య్రం ప్రకటించుకొని గానీ, రష్యా అదుపులో ఉందని గానీ చెబుతున్నారు. అనేక ఎదురు దెబ్బలు తగిలిన తరువాత పుతిన్‌ సేనలు ఎత్తుగడలు మార్చుకున్నాయి. ఒక వైపు సాధారణ పౌరుల ప్రాణనష్టం జరగకుండా చూడటం, పశ్చిమ దేశాల దన్ను ఉన్న జెలెనెస్కీ సేనలు, కిరాయి దళాలను అదుపులోకి తెచ్చుకొనేందుకు సరికొత్త దాడులకు సిద్దం అవుతున్నట్లు వార్తలు.ఐరోపాలో చలికాలం ముగిసిన తరువాత అవి ప్రారంభం కావచ్చు.దానికి గాను అవసరమైన సరంజామా సిద్దం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కొత్తగా మిలిటరీలోకి మూడులక్షల మందిని చేర్చుకున్నట్లు పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. జెలెనెస్కీ కోరినంత వేగంగా పశ్చిమ దేశాల సరఫరా ఉండటం లేదు.


సంక్షోభం రెండో ఏడాదిలో ప్రవేశించిన తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అందరూ చెబుతున్నారు. అవి రాజకీయంగా ఎలాంటి పర్యవసానాలకు దారి తీసేదీ చెప్పలేము. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాతో నిమిత్తం లేకుండా తమ భద్రతను తామే చూసుకోగలమనే జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాల ధీమా ఇప్పుడు కనిపించటం లేదు. వాటిని ఇరకాటంలో పెట్టి తమ అవసరాన్ని మిగతా దేశాలతో గుర్తించే ఎత్తుగడలో భాగంగానే ఉక్రెయిన్ను ముందుకు తోసి అమెరికా వర్తమాన పరిస్థితిని సృష్టించిందన్నది స్పష్టం. దానికి రష్యాను అదుపు చేయటంతో పాటు దాని బూచిని చూపి మొత్తం ఐరోపాను తన అదుపులో ఉంచుకొనేందుకు చూస్తున్నది.ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ తప్పుకున్నప్పటికీ తన నమ్మిన బంటుగా అమెరికా నిలబెట్టుకుంది. మరోవైపున భద్రతామండలి, ఐరాస చేసేదేమీ లేదని ప్రపంచానికి రుజువైంది. దీంతో ఎవరి జాగ్రత్తలు వారు చూసుకుంటున్నారు.
రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఇచ్చేందుకు చైనా సిద్దం అవుతున్నదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి బ్లింకెన్‌ సిబిఎస్‌ టీవీలో ఆరోపించాడు.ఇప్పటికే మారణాయుధాలు కాని వాటిని ఇస్తున్నదని త్వరలో వాటిని కూడా అందచేయ నుందని చెప్పాడు.చైనాలో ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీలకు తేడా లేదని ఎవరు ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినట్లుగానే భావిస్తామన్నాడు. పశ్చిమ దేశాల ఆంక్షలను నీరు గార్చేందుకు చైనా పుతిన్‌కు తోడ్పడుతోందని, చమురు, గాస్‌, బొగ్గు దిగుమతి చేసుకుంటున్నదని ఆరోపించాడు. అనవసరంగా తమ వైపు వేలు చూపితే, బెదిరింపులకు దిగితే అంగీకరించేది లేదని చైనా స్పష్టం చేసింది. మ్యూనిచ్‌ సమావేశంలో చైనా ప్రతినిధి మాట్లాడుతూ కొన్ని శక్తులు సంప్రదింపులు జయప్రదం కావాలని గానీ పోరు త్వరగా ముగియాలని గానీ కోరుకోవటం లేదన్నాడు.పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించటం పాతబడిన సంగతి. పోరును సాగదీసేందుకు, కొత్త ప్రాంతాలలో ఏదో ఒకసాకుతో చిచ్చుపెట్టేందుకు పూనుకోవటం అన్నది తాజా పరిణామాలు ప్రపంచానికి ఇస్తున్న సూచికలు.రష్యాతో సాగుతున్న ప్రతిఘటన కార్యకలాపాలను చక్కదిద్దేందుకు ఉక్రెయిన్‌ వెళుతున్నట్లు అధికారికంగా చేసిన ప్రకటనలో జో బైడెన్‌ పేర్కొన్నాడు. ప్రపంచ శాంతి కోసం సామ్రాజ్యవాదుల పన్నాగాలను మరింతగా వివరించటం, జనాన్ని కూడగట్టేందుకు శాంతిశక్తులు మరింతగా రంగంలోకి దిగాల్సిన అవసరాన్ని ఇవి వెల్లడిస్తున్నాయి.

,

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏ క్షణమైనా ఉక్రెయిన్‌ పతనం ! విశ్వగురువుగా మోడీ పాత్ర ఏమిటి ?

25 Friday Feb 2022

Posted by raomk in Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, Narendra Modi Failures, NATO, Ukraine crisis, Ukraine war, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


రష్యన్‌ దళాలు రెండవ రోజు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంవైపు కదులుతున్నాయి. రష్యా పోరుకు తాము దళాలను పంపేది లేదని అమెరికా, నాటో ప్రకటించాయి. అందువలన ఏ క్షణంలోనైనా అది పతనం కావచ్చు. తరువాత ఉక్రెయిన్‌ పాలకులను అదుపులోకి తీసుకుంటారా, మిలిటరీ లొంగిపోతుందా ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. కీవ్‌ తరువాత తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెస్కీ ప్రకటించాడు. తమను ముందుకు నెట్టి ఈ దేశాలు దూరం నుంచి చూస్తున్నాయని జెలెనెస్కీ అన్నాడు. ఇప్పుడు రష్యా వ్యతిరేక యుద్ద కూటమిని ఏర్పాటు చేయాలని కూడా అన్నాడు. ప్రపంచంలో శక్తివంతమైన దేశం దూరం నుంచి చూస్తోంది అని అమెరికానుద్దేశించి వాపోయాడు. పరస్పరం ఆంక్షల ఆంక్షల పర్వం కొనసాగుతోంది. మూడు వైపుల నుంచి రష్యా ముట్టడి, గగనతలంపై అదుపు సాధించిన కారణంగా అమెరికా, ఇతర నాటో దేశాల నుంచి గానీ ఉక్రెయిన్‌కు కొత్తగా ఆయుధాలు అందే అవకాశం లేదని, అందువలన అక్కడి మిలిటరీ పోరాడటమో లొంగిపోవటమో జరుగుతుందని సిఐఏ మాజీనేత పెట్రాస్‌ చెప్పాడు. పోలాండ్‌ వైపు నుంచి రోడ్డుద్వారా అందే అవకాశాలున్నా ఇప్పుడు పంపేదెవరు ?


ఉక్రెయిన్‌ అస్త్ర సన్యాసం చేస్తేనే చర్చలు జరుపుతామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌ చెప్పాడు. తాము ఉక్రెయిన్‌ ఆక్రమణకు పాల్పడేందుకు నయా నాజీలం కాదని, అక్కడ ఎవరిని పాలకులుగా ఎన్నుకుంటారన్నది ఆ దేశ ప్రజల ఇష్టమని అన్నాడు. మరోవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రష్యా ఆక్రమణకు పాల్పడుతుందని, తనలో విలీనం చేసుకుంటుందని ప్రచారం మొదలెట్టాయి. ఉక్రెయిన్‌లో పోరాడేందుకు అమెరికా దళాలు వెళ్లటం లేదు, వెళ్లాలనుకోవటం లేదు, కానీ అమెరికా నాటో మిత్రదేశాలను రక్షించుకుంటామని మరోసారి హామీ ఇస్తున్నట్లు జోబైడెన్‌ స్పష్టంగా చెప్పాడు. ఆంక్షల విధింపు ఆత్మరక్షణ చర్యలేతప్ప తమకు రష్యాతో పోరుసల్పాలని లేదన్నాడు. ఒకరిపై ఒకరు కాల్చుకొనే ప్రపంచ యుద్దం ఉండదన్నాడు.నాటో కూటమి కూడా అదే చెప్పింది. అమెరికాలోని 52శాతం మంది ఉక్రెయిన్‌ వివాదంలో అమెరికా స్వల్ప పాత్ర పోషించాలని చెబితే, 20శాతం మంది అది కూడా వద్దని చెప్పినట్లు ఎపి-ఎన్‌ఓఆర్‌సి సర్వే వెల్లడించింది.ఇరవైఆరుశాతం మంది మాత్రం చురుకైనా పాత్రపోషించాలని చెప్పారు. బహుశా ఈ కారణంగానే జో బైడెన్‌ జోరు తగ్గించినట్లు చెప్పవచ్చు.ఆంక్షల ప్రకటనతో గురువారం నాడు పీపా ముడిచమురు ధర 106డాలర్లకు పెరిగింది. తరువాత ఇంధనాన్ని మినహాయించినట్లు ప్రకటించటంతో 99కి పడిపోయింది.శుక్రవారం నాడు తిరిగి 102 డాలర్ల వరకు పెరిగినా తిరిగి 98.74కు తగ్గింది.


మనది 138 కోట్ల జనాభాగల దేశం. దానికి నరేంద్రమోడీ ప్రధాని.ప్రపంచ నేతగా, విశ్వగురువుగా ఇంటా బయటా పొగడ్తలు అందుకుంటున్న స్ధితి.మన దేశం ప్రపంచ రాజకీయాల్లో పాత్ర వహించాలని అధికారానికి వచ్చిన రోజు నుంచీ నరేంద్రమోడీ చెబుతున్నారు, తహతహలాడుతున్నారు. తప్పులేదు, మన దేశానికి గౌరవాన్ని పెంచినా, మన ప్రయోజనాలను కాపాడినా సంతోషమే. ఎవరి చాణక్యమైనా, నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చేది కీలక పరిణామాలు జరిగినప్పుడే కదా ! ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన రష్యా-ఉక్రెయిన్‌ పరిణామాల్లో నరేంద్రమోడీ నాయకత్వం అలాంటి వాటిని ప్రదర్శించిందా ? అనేక దేశాల నేతల మాదిరి నరేంద్రమోడీ ఒక్క ప్రకటన కూడా బహిరంగంగా ఎందుకు చేయలేకపోయారు.


సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో మన ప్రతినిధి దేశ వైఖరిని వెల్లడించారు. ” అన్ని పక్షాలు ” ” పరిస్ధితి దిగజారకుండా” ” దౌత్యం ద్వారా ” పరిష్కరించుకోవాలనే ధ్వని, పరిధిలోనే మాట్లాడారు. ఇలా తటస్ధంగా ఉన్నందుకు రష్యా స్వాగతం పలికింది. జో బైడెను యంత్రాంగం గుర్రుగా ఉంది.ఉక్రెయిన్‌ తీవ్ర అసంతృప్తి వెల్లడించింది. అమెరికా మన సహజ భాగస్వామి అని పదే పదే చెప్పారు. ఏమోయి మోడీ అంటే ఏంటోయి బైడెన్‌ అంటూ భుజాల మీద చేతులు వేసుకొని మాట్లాడే బంధం ఉంది.( డోనాల్డ్‌ట్రంప్‌తో కౌగిలింతల గురించి చెప్పనవసరం లేదు.) అలాంటి వారు ఐరోపాలో ఇంత జరుగుతుంటే ముందుగానీ, పోరు ప్రారంభమైన తరువాత గానీ (ఇదిరాసిన సమయానికి) వారిరువురూ ఎందుకు సంప్రదింపులు జరపలేదు, అభిప్రాయ మార్పిడిగానీ ఎందుకు చేసుకోలేదన్నది పెద్ద ప్రశ్న. పోరు మొదలైన తరువాత పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడి దాడులను నివారించాలని కోరారు. ఇదే సమయంలో మరింతగా ఆజ్యం పోయవద్దు అని జో బైడెనుకు ఒక్క ముక్క చెప్పి ఫోన్‌పెట్టేసి ఉంటే మోడీ సర్కార్‌ నిజంగానే తటస్ధంగా ఉంది అనేది మరింతగా వెల్లడై ఉండేది. కానీ అది జరగలేదు, అన్నింటా మనకు మద్దతుగా ఉన్న నరేంద్రమోడీ ఈ అంశంలో మనతో మాట్లాడలేదు, ఏమైందో ఏమో పోనీ మనమే ఫోన్‌ చేద్దామని జో బైడెన్‌ కూడా అనుకోలేదు.


తీరా దాడులు మొదలైన తరువాత భారత్‌తో సంప్రదింపులు జరుపుతామని జో బైడెన్‌ గురువారం నాడు ప్రకటించారు. ఈ వివాదంలో మీ రక్షణ భాగస్వామి భారత్‌ పూర్తిగా మీ బృంద సభ్యురాలిగా ఉందా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భారత్‌తో సంప్రదింపులు జరపనున్నాం,ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మేము పూర్తిగా పరిష్కరించలేదు అని బైడెన్‌ చెప్పాడు.అందువలన నరేంద్రమోడీ నోరు విప్పి తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంది. అంతకంటే ముందు భారత్‌లో ఉక్రెయిన్‌ రాయబారి డాక్టర్‌ ఇగోర్‌ పోలిఖా విలేకర్లతో మాట్లాడుతూ ” ప్రస్తుతం మేము భారత్‌ నుంచి అన్ని రకాల రాజకీయ సాయం అందించాలని కోరుకుంటున్నాము.ప్రపంచంలోని శక్తివంతులైన నేతలలో ఒకరైన మోడీ గారికి రష్యాతో ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. కౌటిల్యుడు, చాణక్యుడి వంటివారితో దౌత్యంలో భారత్‌ ఎప్పుడో అర్హత సాధించింది. ఐరోపాలో నాగరికత లేని కొన్నివేల సంవత్సరాలనాడే భారత్‌లో ఈ స్ధితి ఉంది. అనేక సంవత్సరాలుగా ఇటీవల భారత్‌ ప్రభావం చూపే ప్రపంచ పాత్రధారిగా ఉంది. మహాభారతంలో మాదిరి మోడీ దౌత్యాన్ని ప్రదర్శించాలి ” అని కూడా చెప్పారు. అదే రాయబారి భారత వైఖరితో తాము తీవ్ర అసంతృప్తి చెందామని కూడా చెప్పాడు. ఇప్పుడు రష్యాదాడుల్లో 50 మంది మరణించినట్లు తెలిసింది, అదే వందలు, వేల మంది మరణించి ఉంటే ఏమై ఉండేది అంటూ భారత్‌ జోక్యం చేసుకోవాలని అన్నాడు. ఇదేదో కేవలం మా రక్షణ కోసమే కాదు, మీ దేశానికి చెందిన పదిహేనువేలమందికి పైగా ఉన్న విద్యార్దుల రక్షణ కూడా ఇమిడి ఉంది అని కూడా అన్నాడు. దీన్ని మొత్తంగా చూస్తే వారి అసంతృప్తి, అమెరికా అంతరంగాన్ని వెల్లడించటమే.భద్రతా మండలిలో భారత వైఖరిని ఎలా చూస్తున్నారన్న ప్రశ్నకు అమెరికన్‌ అధికారి సమాధానం చెప్పకుండా తప్పించుకోవటం కూడా దీన్ని నిర్దారించింది. తెరవెనుక అమెరికా మన వైఖరి మీద అసంతృప్తి ప్రకటించుతున్నట్లు వార్తలు వచ్చాయి.


నరేంద్రమోడీ చెప్పినట్లుగా జోబైడెన్‌ – వ్లదిమిర్‌ పుతిన్‌ వింటే సమస్య పరిష్కారం అవుతుందంటూ జాతీయ మీడియాలో కొంత మంది మోడీ గొప్పతనాన్ని చాటేందుకు ప్రయత్నించారు. అనేక హిందీ, ఆంగ్ల ఛానళ్లు కూడా అమెరికా మీడియా, లీకువార్తలను నిజమే అని నమ్మి ఇంకే ముంది ప్రపంచయుద్దం వచ్చేస్తోంది అన్నట్లు వార్తలను ప్రసారం చేశాయి, కానీ మోడీ వైపు నుంచి పోరు ప్రారంభానికి ముందు అలాంటి నివారణ చొరవ మనకు కనిపించదు.ఎక్కడా మన ప్రమేయం, పలుకుబడి కనిపించలేదు.తటస్ధం అంటే తప్పును తప్పని కూడా చెప్పకపోవటమా ?


ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో మన దేశం తటస్ధ వైఖరిని వెల్లడించింది. కానీ అంతర్జాతీయ విషయాల్లో అమెరికాకు లొంగిపోయిన అపఖ్యాతిని మోడీ సర్కార్‌ మన దేశానికి కలిగించింది. అణుపరీక్షల అంశంలో ఇరాన్‌ – అమెరికాకు, వామపక్ష వ్యతిరేకత కారణంగా లాటిన్‌ అమెరికాలో వెనెజులాతో అమెరికాకు పంచాయితీ తలెత్తింది. ఆ రెండు దేశాలూ మనకు మిత్రులే, రెండు చోట్ల నుంచీ మనం చమురు కొనుగోలు చేస్తున్నాము. కానీ వాటి మీద ఆంక్షలు విధిస్తూ ఎవరైనా వాటితో లావాదేవీలు జరిపితే ఆంక్షలు విధిస్తామని అమెరికా ప్రకటించింది. మన నరేంద్రమోడీ సర్కార్‌ వాటికి భయపడి చమురు కొనుగోలు నిలిపివేసింది. అమెరికాకు లొంగుబాటు తప్ప ఈ అంశాల్లో తటస్ధత ఎక్కడుంది. హాంకాంగ్‌ చైనాలో అంతర్భాగం, అక్కడ ఆందోళనలు దాని అంతర్గత అంశం. పశ్చిమదేశాలు దాన్ని రాజకీయం చేశాయి. వాటితో మనం గొంతు కలపకపోయినా అది వారి అంతర్గత వ్యవహారం అని మన దేశం చెప్పకపోగా ఐరాస మానవహక్కుల సంస్ధలో పశ్చిమ దేశాలకు సంతోషం కలిగే విధంగా ఆందోళన వెలిబుచ్చింది. ఇప్పుడు అమెరికా-ఇరాన్‌ అణు అంశంలో రాజీకుదుర్చుకోనున్నాయి, మన దేశం ఏముఖం పెట్టుకొని గతంలో ఇరాన్‌ ఇచ్చిన రాయితీధరలకు తిరిగి చమురు సరఫరా గురించి అడుగుతుంది ? ప్రపంచంలో మనం పలుచనకావటం లేదా ?


ఉక్రెయిన్‌ – రష్యా వివాదం గత కొద్ది నెలలుగా ముదురుతోంది. ఫిబ్రవరి 16న రష్యాదాడికి దిగనుందని అమెరికా ముందుగానే గడువు ప్రకటించింది.ఉక్రెయిన్లో దాదాపు 20వేల మంది భారతీయ విద్యార్దులున్నారు. వారి సంక్షేమం, అవసరమైతే స్వదేశానికి రప్పించటం, దానిలో ఇమిడి ఉన్న సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం తగినంత ముందుగా పట్టించుకోని కారణంగా వారితో పాటు వారి కుటుంబాలు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన, అనిశ్చితికి గురవుతున్నారు. ఎందుకీ వైఫల్యం అంటే సమాధానం చెప్పేవారు లేరు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనాగ్రామాలు నిర్మించింది, లడక్‌లో మరొకటి చేసిందంటూ సమాచారం ఇచ్చిన అమెరికా ఎందుకు ఉక్రెయిన్లో పరిస్ధితి, పర్యవసానాల గురించి మనకు సమాచారం ఇవ్వలేదు ? మన కేంద్ర భద్రతా అధిపతి అజిత్‌దోవల్‌ను జేమ్స్‌బాండ్‌గా వర్ణిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లకు సలాం చేసి అమెరికా పారిపోవటాన్ని దోవల్‌ పసిగట్టలేదు. ఇప్పుడు వివిధ దేశాల నుంచి ఈ సంక్షోభం గురించిన సమాచారం సేకరించలేదా, అసలు పట్టించుకోలేదా ? పట్టించుకుంటే ఇప్పుడు విద్యార్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది కాదు కదా ? వారి తరలింపు గురించి తగినంత ముందుగానే ఏర్పాట్లు చేసి ఉంటే వారంతా తిరిగి వచ్చి ఉండేవారు, పరిస్ధితి చక్కబడిన తరువాత తిరిగి వెళ్లి ఉండేవారు.అలా జరగకపోవటానికి బాధ్యులెవరు ? ఉక్రెయిన్‌ ఉదంతం ప్రపంచదేశాలకు ఒక పాఠం నేర్పింది. అదేమంటే దాన్ని నమ్ముకొని మరొక దేశంతో తగాదా పెట్టుకోకూడదు, నట్టేట ముంచి తనదారి తాను చూసుకుంటుంది. దీన్ని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటామా ? అమెరికా తోకపట్టుకు పోతామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
Newer posts →

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d