• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Xi Jinping

చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !

10 Wednesday Dec 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

China, Donald trump, Japan pacifist constitution, PLA Liaoning, PLA warships, Sanae Takaichi, Taiwan Matters, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటే తప్ప అమెరికాకు రోజుగడవదు. దాన్లో భాగంగానే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నది. ఇటీవల రెండు సార్లు తమ విమానాల రాడార్లపై చైనా ఆయుధాలను గురిపెట్టిందని జపాన్‌ ఆరోపించింది. మిలిటరీ పరిభాషలో లాక్‌ ఆన్‌ అంటే ఒక దేశానికి చెందిన మిలిటరీ విమానాలు మరోదేశానికి చెందిన విమానాలపై రాడార్ల ద్వారా నిఘావేసి సంకేతాలు పంపటమే. ఇదికొన్ని సందర్భాలలో కూల్చివేతలకు కూడా దారి తీయవచ్చు. నిఘా అవసరాలకూ వినియోగించవచ్చు. దేనికి అలా చేశారన్నది ఆయా దేశాలు చెప్పే భాష్యాలు వివాదం అవుతున్నాయి. దొంగే దొంగ అని అరచినట్లుగా జపాన్‌ నిఘావిమానాలను తమపై కేంద్రీకరించి తామేదో చేసినట్లు గుండెలు బాదుకుంటూ ప్రపంచాన్ని నమ్మింపచూస్తున్నదని చైనా విమర్శించింది. అయితే ఎటు వైపు నుంచి ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు చోటు చేసుకోలేదు గానీ గత దశాబ్దికాలంలో ఎన్నడూ లేని విధంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. లాక్‌ ఆన్‌ ప్రచారం జపాన్‌ ప్రారంభించిన ఆయుధీకరణకు ఒక ముసుగు మాత్రమే. జపాన్‌ ఆరోపణలకు మంగళవారం నాడు అమెరికా మద్దతు పలికింది.చైనా చర్యలు ఆ ప్రాంతంలో శాంతియుత వాతావరణానికి దోహద పడటం లేదన్నది. అమెరికా ప్రకటన తమ రెండు దేశాల మధ్య ఉన్న బంధం ఎంతగట్టిదో వెల్లడించిందని జపాన్‌ స్పందించింది. రెండవ ప్రపంచ యుద్దంలో కేవలం ఆత్మరక్షణకు అవసరమైన మిలిటరీ మాత్రమే జపాన్‌కు ఉండాలని ఒప్పందం కుదిరింది. అయితే 2015 ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి తమకే గాక మిత్రదేశాలకు ఆపద వచ్చినపుడు కూడా జోక్యం చేసుకోవచ్చని కొత్త నిబంధన చేర్చారు.నిజానికి తైవాన్‌ ఒక దేశం అని ఐరాస గుర్తించలేదు, అక్టోబరులో బాధ్యతలు స్వీకరించిన ప్రధాని సానాయి టకాయిచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇటీవల మాట్లాడుతూ బలవంతంగా తైవాన్‌ ప్రాంతాన్ని చైనా స్వాధీనం చేసుకుంటే తమ దేశభద్రతకు ముప్పు వచ్చినట్లే అని దాన్ని తాము అంగీకరించేది లేదని ప్రకటించారు.

చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ ప్రస్తుతం ఒక తిరుగుబాటు రాష్ట్రంగా ఉంది.శాంతియుత పద్దతుల్లో తిరిగి ప్రధాన భూభాగంతో అనుసంధానం చేసేందుకు చూస్తామని,అవసరమైతే మిలిటరీచర్యతో అయినా ఆ పని చేస్తామని చైనా పదే పదే ప్రకటించింది. హాంకాంగ్‌, మకావో దీవుల విలీనం మాదిరి ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింది తైవాన్‌లో ఉన్న వ్యవస్థను 2049 వరకు ఎలాంటి మార్పులు చేయబోమని కూడా స్పష్టం చేసింది, అంటే అప్పటి వరకు స్వయం పాలనకు అవకాశమివ్వటమేగాక అక్కడ ఉన్న పెట్టుబడులకు రక్షణ కల్పించటమే. అయితే ఒక వైపు తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమే అని అంగీకరిస్తూనే అమెరికా, జపాన్‌ ఇతర పశ్చిమ దేశాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవటాన్ని తాము అంగీకరించేది లేదని వితండ వాదనకు దిగుతున్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న తైవాన్‌లోని వేర్పాటువాద శక్తులకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. ఒక దేశం మాదిరి అక్కడ మిలిటరీని ఏర్పాటు చేసేందుకు, వాటికి యుద్ధ విమానాలతో సహా అన్ని రకాల ఆయుధాలను అందచేస్తున్నాయి. అమెరికా కవ్వింపులను గమనించిన చైనా ఆచితూచి వ్యవహరిస్తున్నది, ఎప్పటికప్పుడు తన అధికారాన్ని అది పునరుద్ఘాటిస్తున్నది. తెగేదాకా లాగితే ఏం జరుగుతుందో చూడండి అంటూ తరచు తైవాన్‌ చుట్టూ మిలిటరీ విన్యాసాలను కూడా నిర్వహిస్తున్నది. వాటిని చూపి ఇంకేముంది చైనా బలప్రయోగానికి పూనుకుందంటూ అమెరికా కూటమి దేశాలు నానా యాగీ చేస్తున్నాయి.

క్లుప్తంగా తైవాన్‌ సమస్య గురించి చూద్దాం.చైనా స్వాతంత్య్రం కోసం కొమింటాంగ్‌ పార్టీ ఏర్పడింది.సన్‌ యెట్‌ సేన్‌ నాయకత్వంలో 1912లో చైనా స్వాతంత్రం ప్రకటించుకొని రిపబ్లిక్‌గా అవతరించింది. తరువాత జరిగిన కొన్ని పరిణామాలలో అధికారానికి దూరమైన సన్‌ తరువాత మరోసారి అధికారానికి వచ్చి కమ్యూనిస్టులతో కలసి తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మరణం తరువాత 1925లో అధికారానికి వచ్చిన ఛాంగ్‌కై షేక్‌ కొమింటాంగ్‌ పార్టీలో కమ్యూనిస్టులతో సయోధ్యను కోరుకొనే వారిని పక్కన పెట్టి కమ్యూనిస్టు వ్యతిరేకిగా మారాడు. మావో నాయకత్వాన కమ్యూనిస్టులు 1949లో అధికారానికి వచ్చిన సమయంలో భారీ సంఖ్యలో మిలిటరీ, ఆయుధాలను తీసుకొని చాంగ్‌కై షేక్‌ తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడి నుంచి కమ్యూనిస్టులను ప్రతిఘటించాడు. ప్రధాన భూభాగంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం ముఖ్యమని భావించిన కమ్యూనిస్టులు దాని మీద కేంద్రీకరించారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఏర్పడిన ఐరాసలో అప్పుడు అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ నియమించిన ప్రతినిధులనే గుర్తించారు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనా అంటే తైవాన్‌లో తిష్టవేసిన కొఇమింటాంగ్‌ పార్టీయే చైనా ప్రతినిధి అని 1970దశకం వరకు పరిగణించారు.ఎట్టకేలకు కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పని పరిస్థితి ఏర్పడింది. 1971 అక్టోబరులో జరిగిన 26వ సమావేశంలో 2,758 తీర్మానం ద్వారా కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రధాన భూభాగంలో ఉన్న జనచైనా(పిఆర్‌సి) అసలైన ప్రతినిధి అని గుర్తించారు. నాటి నుంచి తైవాన్‌లో ఉన్న పాలకులు నియమించిన వారికి గుర్తింపు రద్దు చేశారు. చైనాలో తైవాన్‌ అంతర్భాగమని అందరూ అంగీకరించారు. అయితే అప్పుడు జరిగిన చర్చలో దీర్ఘకాలం విడిగా ఉన్నందున బలవంతపు విలీనం జరగకూడదని పలుదేశాలు చెప్పిన అభిప్రాయాన్ని చైనా నాయకత్వం కూడా అంగీకరించింది. నాటి చర్చను సాకుగా తీసుకొని తరువాత ఎప్పుడు విలీన యత్నం చేసినా తగిన పరిస్థితి ఏర్పడలేదని పశ్చిమ దేశాలు పాటపాడుతున్నాయి. ఇప్పటికీ అదే సాకు చెబుతూ విలీనాన్ని అడ్డుకుంటున్నాయి. తన పౌరులపై బలప్రయోగం అంటే రక్తపాతమే గనుక చైనా అందుకు పూనుకోవటం లేదు, దాని సహనాన్ని పదే పదే రెచ్చగొడుతున్నారు. దానిలో భాగమే తైవాన్‌ విలీనం తమ దేశానికి ముప్పు అని జపాన్‌ చెబుతున్న కుంటిసాకు. ప్రస్తుతం తైవాన్‌ వేరుగా ఉన్నందున చైనాకు వచ్చిన ముప్పేమీ లేదు గనుక ఉపేక్షిస్తున్నది. అది చెబుతున్న 2049 గడువులోగా దారికి వస్తే సరే, రాకుంటే అప్పుడేం జరుగుతుందో ఇప్పుడు ఊహించి చెప్పలేము. ఒక్కటి మాత్రం స్పష్టం. తైవాన్‌ వ్యవహారాల్లో మరోదేశం జోక్యం చేసుకోవటం, భిన్నంగా మాట్లాడటం అంటే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, తమ సార్వభౌమత్వం, రాజ్యాంగం, అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించటమే అని చైనా చెబుతున్నది. ఇదే అంశాన్ని సోమవారం నాడు జర్మనీ విదేశాంగ మంత్రితో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి, కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూర్‌ సభ్యుడు వాంగ్‌ ఇ స్పష్టం చేశారు. తైవాన్‌ గురించి అనేక అంశాలను వివరించాడు. ఈ ప్రాంతాన్ని జపాన్‌ అర్ధశతాబ్దం పాటు ఆక్రమించుకొని వలసగా చేసుకున్నదని, తమ పౌరుల మీద లెక్కలేనని అత్యాచారాలు చేసిందని కూడా చెప్పాడు.

చైనా బూచిని చూపుతూ జపనీయులను రెచ్చగొడుతున్న అక్కడి పాలకులు మిలటరీ బడ్జెట్‌ను పెంచేందుకు సాకులు వెతుకుతున్నారు.ఇదంతా అమెరికా ఆడిస్తున్న క్రీడ తప్ప మరొకటి కాదు. తాను నేరుగా దిగితే చైనాతో సమస్యలు వస్తాయని తెలుసుగనుక ట్రంప్‌ యంత్రాంగం జపాన్ను ఎగదోస్తున్నది. తైవాన్‌ దీవికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన చివరి దీవుల సముదాయం,( ఇది చైనాకూ అంతే దూరం) జనాభా పెద్దగా లేని యంగునీ దీవుల సముదాయంలో దీర్ఘశ్రేణి క్షిపణులను మోహరించేందుకు పూనుకుంది. అక్కడ రాడార్‌ కేంద్రాలు, మందుగుండు గిడ్డంగులు, అమెరికా అందచేసిన ఎఫ్‌-35 విమానాల మోహరింపు, ఇతర మిలిటరీ నిర్మాణాలకు పూనుకుంది. ఇప్పటికే సిబ్బంది నివాసాలకు కొన్ని భవనాల నిర్మాణం పూర్తి చేసింది. కొద్ది రోజుల క్రితం ఆ దీవుల్లో ఉన్న పౌరులు కొంత మందితో సమావేశం జరిపి చైనాపై నిఘా, దాని ఎలక్ట్రానిక్‌ పరికరాలనుంచి వెలువడే అయస్కాంత తరంగాలను స్థంభింప చేసేందుకు మిలిటరీ నిర్మాణాలు అవసరమని తేల్చి చెప్పారు. ఇది చైనాను కవ్వించటం తప్ప మరొకటి కాదు. ఒక వేళ రెండు దేశాల మధ్య యుద్దం అంటూ వస్తే అది జపాన్‌ వైపు నుంచే మొదలు కావాలి తప్ప చైనా నుంచి జరగదు. ఒక వేళ జరిగితే అమెరికా తమను ఆదుకొనే పరిస్థితి లేదని గతంలో ప్రభుత్వ విశ్లేషకురాలిగా ఉండి, ప్రస్తుతం నిగాటా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఒక మహిళా ప్రొఫెసర్‌ చెప్పారు. ప్రభుత్వ మిలిటరీ, క్షిపణుల మోహరింపు గురించి అక్కడి కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీచర్చలో వ్యతిరేకతను వెల్లడించింది. ఇతర దేశాల మాదిరే జపాన్‌ కూడా చేస్తున్నదని రక్షణ మంత్రి సమర్ధించాడు.

గత వారంలో విమర్శలకు దారితీసిన ఉదంతం జపాన్‌లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉన్న ఒకినావా దీవి సమీపంలో జరిగింది. చైనా తమ విమానాలను లక్ష్యంగా చేసుకున్నదని తప్ప గగనతలాన్ని అతిక్రమించినట్లు జపాన్‌ ఇంతవరకు చెప్పలేదు.ముందుగా అంతర్జాతీయ జలాల్లో ఉన్న తమ విమానవాహక యుద్ధ నౌక సమీపానికి ప్రమాదకరంగా జపాన్‌ యుద్ధ విమానాలే వచ్చాయని, తమవైపు నుంచి అనివార్యమైన ప్రతిస్పందన ఉందని బీజింగ్‌ చెబుతున్నది.చైనా విమానవాహక యుద్ద నౌక లియావోనింగ్‌ వైపు జపాన్‌ యుద్ధ విమానాలు సమీపంలోకి వచ్చినపుడు చైనా విమానాలు అడ్డుకొని హద్దు మీరితే అంతే సంగతులని హెచ్చరించినట్లు, అవి పూర్తిగా సమర్దనీయమే అని చైనా నిపుణులు చెబుతున్నారు. జపాన్‌ సమీపంలో చైనా విమానవాహక నౌక కార్యకలాపాలు నిర్వహించటం ఇదే మొదటిసారి అని జపాన్‌ వార్తా సంస్థ కొయోడో పేర్కొన్నది. తూర్పు ఆసియా సముద్రంలో చైనా నౌకాదళానికి చెందిన వివిధ రకాల వంద నౌకలు పాల్గ్గొన్నట్లు రాయిటర్స్‌ వార్త ఆరోపించింది. తమ నౌకలు పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో ఇలాంటి విన్యాసాలు జరపటం సాధారణమని అయితే ప్రతిసారీ జపాన్‌ తమకు చైనా నుంచి ముప్పు ఉందని చెప్పేందుకు, తన మిలిటరీ శక్తిని పెంచుకొనేందుకు వాటిని బూతద్దంలో చూపుతున్నదని, అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగానే తాము జరుపుతున్నట్లు, జపాన్‌ ఆత్మరక్షణ రాజ్యాంగం నుంచి పక్కకు జరుగుతున్నదని చైనా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వాటి మీద అతిగా స్పందించటం, విపరీత భాష్యాలు ఎవరూ చెప్పకూడదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిన్‌జియాన్‌ చెప్పాడు.అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుపుతున్న తమ విన్యాసాల గురించి గుండెలు బాదుకుంటున్న జపాన్‌ అదే పని అమెరికా చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నదని చైనా ప్రశ్నిస్తోంది.

తైవాన్‌ సమస్యపై రెచ్చగొడుతున్న జపాన్‌ తీరును చూస్తే అమెరికా పన్నిన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వివాదం చెలరేగిన సమయంలోనే తైవాన్‌ సమస్యపై తక్షణమే చైనాతో యుద్ధం రాకుండా చూసుకోవాలని ఒక పథకం రూపొందించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ముందుగా అమెరికా, దాని మిత్రదేశాలు మిలిటరీ బలాన్నిపెంచుకోవాలని, చైనా వైపునుంచి తైవాన్‌, జపాన్‌ మీద వత్తిడి పెరుగుతున్నదని డిసెంబరు ఐదున ప్రచురించిన ఒక పత్రంలో అమెరికా జాతీయ వ్యూహకర్తలు పేర్కొన్నారు.2017లో ప్రచురించిన పత్రంలో ఒక వాక్యంలో మూడుసార్లు తైవాన్‌ ప్రస్తావన చేయగా తాజా పత్రంలో మూడు పేరాల్లో ఎనిమిదిసార్లు ఉన్నట్లు రాయిటర్స్‌ తెలిపింది. వాణిజ్య యుద్దాలు జరుగుతున్న, సెమికండక్టర్ల ఉత్పత్తిలో ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో తైవాన్‌ గురించి సరిగానే కేంద్రీకరించినట్లు, జపాన్‌ నుంచి ఆగేయాసియా వరకు ఏ దీవి మీద కూడా ఎక్కడా దురాక్రమణ జరగకుండా అమెరికా మిలిటరీ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని ఆ పత్రం పేర్కొన్నది. ఇదే సమయంలో అమెరికా ఒక్కటే చేయలేదని, చేయకూడదని, మిత్రదేశాలు మిలిటరీ ఖర్చు పెంచుకోవాలని, ఉమ్మడిగా రక్షణకు పని చేయాలని హితవు పలికింది.ఈ బలం తైవాన్‌ ఆక్రమణ యత్నాలు మానుకొనే స్థాయికి పెరగాలని కోరింది. ఈ వ్యూహం, ఎత్తుగడల్లో భాగంగానే ఆత్మరక్షణ యుద్ధం నుంచి ఎదురుదాడులు చేసే విధంగా ఆయుధాలను పెంచుకోవాలని జపాన్‌ చూస్తున్నది, దానికి సాకుగా చైనా బూచిని చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

తగ్గేదే లేదని క్షిపణి ప్రయోగంతో జవాబిచ్చిన ఉత్తర కొరియా – వాణిజ్య ఒప్పందాలతో సాగిన ట్రంప్‌ ఆసియా పర్యటన !

29 Wednesday Oct 2025

Posted by raomk in CHINA, Current Affairs, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

APEC, asean summit, Donald trump, Kim Jong-un, Trump business tour, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ అన్‌కు అంగీకారమైతే తాను అతనితో కూడా భేటీ అవుతానని తన ఆసియా పర్యటనలో విలేకర్ల ప్రశ్నకు ట్రంప్‌ బదులిచ్చాడు. ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహితం కావిస్తే పెద్ద బహుమతి( ఆంక్షల ఎత్తివేత) పొందుతారంటూ ట్రంప్‌ బిస్కెట్‌ వేసేందుకు చూశాడు. అయితే నా స్పందన ఇది అంటూ మంగళవారం నాడు సముద్రం మీద నుంచి ఉపరితలానికి క్రూయిజ్‌ క్షిపణిని ప్రయోగించి కిమ్‌ బదులిచ్చాడు. శత్రువుతో మాటలు కాదు చేతలే అని చెప్పినట్లయింది. అది జరిగేందుకు ఆస్కారం లేదనే చెప్పవచ్చు ! జపాన్‌ నుంచి బుధవారం నాడు దక్షిణ కొరియాకు వెళ్లే ముందు ఈ ప్రయోగం జరిపారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి శత్రువులకు గుర్తు చేయటమే ఇదని ఉత్తర కొరియా అధికారిక మీడియా వర్ణించింది. ఈ ప్రయోగం భద్రతా మండలి విధించిన నిషేధాన్ని ఉల్లంఘించినట్లు కాదని, తమ అణ్వాయుధాల గురించి చర్చించటానికి తాము సిద్దం కాదనే సందేశం ఇచ్చినట్లని బిబిసి వర్ణించింది. దక్షిణ కొరియాలో జరిగే అపెక్‌ సమావేశానికి ఉత్తర కొరియా నేత కిమ్‌ హాజరు కావటం లేదు. వియత్నాంలో 2019లో ట్రంప్‌ ఆహ్వానం మేరకు కిమ్‌తో భేటీ జరిగింది. అయితే ఆ చర్చలు విఫలం కావటంతో తరువాత వారి మధ్య ఎలాంటి సమావేశమూ జరగలేదు. కిమ్‌కు అంగీకారమైతే తాను ఒక రోజు దక్షిణ కొరియాలో అదనంగా ఉంటానని ట్రంప్‌ విలేకర్లతో చెప్పాడు. దానికి కిమ్‌ నుంచి ఇంతవరకు ఎలాంటి జవాబు రాలేదు. అణు పరీక్షలు జరుపుతున్నందున ఉత్తర కొరియా మీద అమెరికా అనేక ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా మీద మరిన్ని ఆంక్షలు ప్రకటించిన తరువాత ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చోయి సన్‌ హుయి గత వారంలో మాస్కో వెళ్లి చర్చలు జరిపాడు. ట్రంప్‌ ఆసియా పర్యటన సందర్భంగా క్షిపణి పరీక్షలు నిర్వహించటం విశేషం.

మంగళవారం నాడు అమెరికా, జపాన్‌ మధ్య వాణిజ్య, విలువైన ఖనిజాల ఒప్పందం కుదిరింది.అధ్యక్షుడు ట్రంప్‌, జపాన్‌ ప్రధమ మహిళా ప్రధాని తకాయిచి టోక్యోలో సంతకాలు చేశారు.వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. అమెరికాలో 550 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ అంగీకరించగా ప్రతిగా దాని వస్తువులపై 15శాతం దిగుమతి పన్ను విధించేందుకు అమెరికా అంగీకరించింది. ట్రంప్‌కు కావాల్సినన్ని పొగడ్తలు తప్ప అమెరికాకు పెద్దగా ఒరిగిందేమీ లేదని డెమోక్రటిక్‌ పార్టీ మద్దతుదారైన న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందాలను రెండు దేశాల మధ్య సంబంధాలలో ” నూతన స్వర్ణయుగం ” అని వర్ణించారు.అదిరింపులు బెదిరింపుల మధ్య జూలై నెలలోనే పెట్టుబడులు, పన్నుల గురించి ఒక అవగాహన కుదిరినట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాడు. అయితే మంగళవారం నాడు సంతకాలు జరగటానికి ముందు చివరి క్షణం వరకు అనేక అనుమానాలు షికారు చేశాయి. పశ్చిమాసియాలో శాంతి, థారులాండ్‌-కంపూచియా మధ్య వివాదాన్ని పరిష్కరించటంలో ట్రంప్‌ పాత్రను తకాయిచి ఆకాశానికి ఎత్తారు. అసాధారణ చారిత్రక విజయాలుగా ఆమె వర్ణించారు. వారి చర్చల తరువాతే టోక్యోలోని అక్సాకా పాలెస్‌లో జరిగిన స్వాగత కార్యక్రమానికి ట్రంప్‌ హాజరయ్యాడు. ఈ ఒప్పందం గురించి ప్రశంసలు, విమర్శలు గతంలోనే వెల్లడయ్యాయి.

జపాన్‌ నుంచి అమెరికా ఇప్పటివరకు లక్ష కోట్ల డాలర్ల మేర రుణాలుగా తీసుకుంది. అమెరికా డాలర్లకోసం ప్రతిదేశాన్నీ బెదిరిస్తున్నది. అయితే తాజాగా కుదిరిన ఒప్పందం గురించి గతంలోనే ట్రంప్‌ మీద విమర్శలు వచ్చాయి. ఆ ఒప్పందంలో తరువాత ఎలాంటి మార్పులూ చేసినట్లు ఎవరూ ప్రకటించలేదు గనుక గత విమర్శలేమిటో ఒకసారి చూద్దాం. ఐదువందల యాభై బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ప్రభుత్వానికి ఇస్తే తమ ఇష్టం వచ్చినట్లు వినియోగించుకుంటామని, దాని మీద వచ్చే లాభాలలో 90శాతం తమకే అని ట్రంప్‌ వత్తిడి చేశాడు. అయితే ఆ మొత్తంలో కేవలం రెండు శాతం మాత్రమే పెట్టుబడిగా ఉంటుందని, మిగిలిన మొత్తం రుణాలు, రుణ హామీల వంటి ఇతర రూపాల్లో ఉంటుందని జపాన్‌ ప్రతినిధి వర్గనేత రోయెసీ అకజావా టీవీలో బహిరంగంగా చెప్పాడు. కొంత మంది అమెరికన్లకు జపాన్ను విక్రయించారని విమర్శిస్తున్నారని, లాభాల్లో 90శాతానికి అంగీకరించినందున నష్టం పెద్దగా ఉండదని దీనికి ప్రతిగా అమెరికా తగ్గించే పన్నుల వలన 68 బిలియన్‌ డాలర్ల మేర జపాన్‌కు లబ్ది కలుగుతుందని కూడా చెప్పాడు. బహుశా ఈ కారణంతోనే మంగళవారం నాడు ఒప్పందంపై సంతకాల తరువాత న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రతికూలంగా వ్యాఖ్యానించిందని చెప్పవచ్చు. తమ దేశంలో పెట్టుబడులకు, పన్నులు విధింపుకు లంకెపెట్టటం ఒక జపాన్‌ విషయంలోనే కాదు. ఇప్పటికే ఐరోపా యూనియన్‌తో 600బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడితేనే 15శాతం పన్నులు విధిస్తామని లేకుంటే ఎక్కువ అని ట్రంప్‌ బెదిరించాడు.

వాణిజ్యం చేయటం, లాభాలు పిండుకోవటంలో అమెరికా, జపాన్‌ ఎవరికి ఎవరూ తీసిపోరు గనుక పరస్పర లబ్ది లేకుండా అంగీకరించే అవకాశం ఉండదని చెప్పవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ఒక లక్షకోట్ల డాలర్లు అమెరికాకు అప్పు ఇవ్వటమేగాక మరో రెండులక్షల కోట్ల డాలర్ల మేర ఇప్పటికే జపాన్‌ పెట్టుబడులు పెట్టింది. జపాన్‌లో డాలర్లు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎవరైనా అక్కడి బాంకుల్లో డబ్బుదాచుకుంటే వారే బ్యాంకులకు ఎదురు ఇవ్వాల్సి ఉంటుంది. తమ దేశంలో ఉన్న వడ్డీ రేట్లతో పోలిస్తే అమెరికాకు అప్పులు ఇవ్వటం జపాన్‌కు ఎంతో లాభం కలుగుతుంది. జపాన్‌లో తక్కువ వడ్డీ చెల్లించి జనాల నుంచి బాంకులు రుణాలు తీసుకుంటాయి, వాటిని ఎక్కువ వడ్డీ రేట్లకు అమెరికా, ఇతర దేశాలలో పెట్టుబడులుగా పెట్టి లాభాలు ఆర్జిస్తాయి, ఈ క్రమంలోనే అమెరికాకు అత్యధికంగా జపాన్‌ లక్ష కోట్ల డాలర్ల మేర రుణబాండ్లలో పెట్టుబడులు పెట్టింది. ఈ విషయంలో బ్రిటన్‌ రెండవ స్థానంలో ఉంటే చైనా మూడవదిగా ఉంది. అమెరికాలో ఉన్న జపాన్‌ కంపెనీలైన సోనీ,టొయోటా వంటి బహుళజాతి కంపెనీలు, ద్రవ్యపెట్టుబడి సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిస్తున్నాయి, వచ్చిన లాభాలను తిరిగి అక్కడే పెట్టుబడులుగా పెడుతున్నాయి. తాజా ఒప్పందంలో అమెరికా కార్లకు ద్వారాలు తెరిచేందుకు జపాన్‌ అంగీకరించినట్లు చెబుతున్నారు. గాలికిపోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లు డీజిలు, పెట్రోలు తాగే అమెరికన్‌ కార్లను జపాన్‌లో కొనుగోలు చేసేదెవరు ? లేదూ అమెరికన్లు అమ్ముకోవాలనుకుంటే జపనీయుల అవసరం, అభిరుచులకు అనుగుణంగా సరసమైన ధరలకు అందచేస్తే ఇబ్బంది ఉండదు. అక్కడ అమెరికా కార్లకు డిమాండ్‌ కూడా తక్కువే గనుక వాటి దిగుమతులకు అనుమతించినా జపాన్‌ కార్ల మార్కెట్‌కు పెద్దనష్టమేమీ ఉండదు. జపాన్‌లో తలెత్తిన ఆర్థిక మాంద్యం కారణంగా జనాలు ప్రజా రవాణా వ్యవస్థ పట్ల మొగ్గుచూపుతున్నారు. నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండే అమెరికన్‌ కార్లను పట్టించుకుంటారా ? గతంలో కార్లంటే అమెరికా, ఇప్పుడు జపాన్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాలూ తక్కువ తినలేదు, విద్యుత్‌ కార్ల రంగంలో చైనా సవాలు విసురుతోంది. అందువలన ట్రంప్‌ విధించే పదిహేనుశాతం దిగుమతి పన్నుతో అమెరికా కంపెనీల యజమానులు కొంత కాలం పాటు ఊరట పొందవచ్చు తప్ప తరువాత పోటీకి అనుగుణంగా తయారుగాకపోతే అంతే సంగతులు.

ట్రంప్‌ ఆసియా పర్యటనలో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు కొన్ని షరతులను రుద్దినట్లుగా కనిపిస్తోంది. చిన్న చిన్న దేశాలలో ఎంత దొరికితే అంత అన్నట్లుగా విలువైన ఖనిజాల గురించి ఒప్పందాలు చేసుకున్నాడు. మలేషియా వస్తువుల మీద 19శాతం పన్నుల విధింపు అమల్లో ఉందని చెబుతూనే కొన్నిమినహాయింపులు ఇచ్చాడు.దీనికి ప్రతిగా అమెరికా వస్తువులు, గ్యాస్‌, వ్యవసాయ ఉత్పత్తులను మలేషియా కొనుగోలు చేయనుంది. అమెరికా కంపెనీ బోయింగ్‌ నుంచి 30 విమానాలను కొనుగోలు చేస్తామని, మరో 30 గురించి ఆలోచిస్తామని చెప్పింది. ఇవిగాక అమెరికాలో 70 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులుగా పెట్టేందుకు అంగీకరించింది. అయితే కీలకమైన సెమీ కండక్టర్ల ఉత్పత్తి చేస్తున్న మలేషియా అమెరికా షరతులకు తలొగ్గలేదు. కంపూచియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా వస్తువుల దిగుమతిపై ఎలాంటి పన్ను ఉండదు. విలువైన ఖనిజాల శుద్ధి వంటి ప్రక్రియకు అమెరికా పెట్టుబడులను అనుమతిస్తుంది. వియత్నాంపై విధించిన 46శాతం పన్నులను 20శాతానికి తగ్గించేందుకు అమెరికా దిగివచ్చింది. దీనికి ప్రతిగా ఎనిమిది బిలియన్‌ డాలర్లతో 50 బోయింగ్‌ విమానాలను కొనుగోలు చేస్తుంది. వీటితో పాటు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటుంది.చైనా నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో తయారు చేసి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై పన్ను వివాదం కొనసాగుతూనే ఉంది. ఒక నిర్దిష్ట నిర్వచనం లేదు. థారులాండ్‌ వస్తువులపై 19శాతం పన్నుల నుంచి అనేక వస్తువులకు మినహాయింపు ఇస్తారు. ఎనభై విమానాలను థారు కొనుగోలు చేస్తుంది. దక్షిణ కొరియా వస్తువుల మీద పన్ను 15శాతానికి పరిమితం చేయాలంటే తమ దేశంలో 350 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాల్సిందే అని అమెరికా వత్తిడి చేస్తున్నది.అది దక్షిణ కొరియా జిడిపిలో 6.5శాతానికి సమానం. అంత పెట్టుబడి పెడుతుందా అన్నది ప్రశ్న.

డోనాల్డ్‌ ట్రంప్‌ కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్‌ ప్లస్‌ 3 (ఏపిటి) సమావేశాలకు, తరువాత దక్షిణ కొరియాలో జరిగే మరోసభలో పాల్గ్గొనేందుకు వస్తూ అనేక దేశాలతో విలువైన లోహాలు, ఇతర ఒప్పందాలు కుదుర్చుకొనేందుకు డోనాల్డ్‌ ట్రంప్‌ వచ్చాడు. పది ఆగేయాసియా దేశాలతో కూడిన ఆసియన్‌ కూటమిలో తాజాగా తైమూర్‌-లెస్తే చేరింది. ఇవిగాక చైనా, జపాన్‌, దక్షిణ కొరియా అనుబంధంగా ఉన్న కారణంగా ఆసియన్‌ ప్లస్‌ మూడు అని పిలుస్తున్నారు. ధనిక దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాల నుంచి తట్టుకోవాలంటే ఈ కూటమి దేశాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని చైనా ప్రధాని లీ క్వియాంగ్‌ కోరాడు. గత కొద్ది సంవత్సరాలుగా తూర్పు ఆసియా వేగంగా వృద్ది చెందుతున్నది. ఇదే సమయంలో కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటున్నది. ఈ సమావేశాలకు తమ మంత్రిద్వారా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభూ సుబియాంతో ఒక సందేశం పంపాడు. ఆర్‌సిఇపితో సమన్వయం చేసుకొని దాన్నొక వేదికగా ఆసియన్‌ దేశాలు వినియోగించుకోవాలని కోరాడు.ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్న దేశాలను ఐక్యంగా ఎదుర్కొవాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జేయి మయుంగ్‌ కోరాడు. రక్షణాత్మక చర్యలతో పాటు సరఫరా గొలుసుల సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు, సరఫరా వ్యవస్థల్లో వస్తున్న మార్పులు ఆసియన్‌ దేశాలకు హెచ్చరికలు పంపుతున్నాయని, వాటిని చూసి నిర్ఘాంతపోయి అచేతనంగా ఉండరాదని మలేసియా ప్రధాని అన్వర్‌ చెప్పాడు. ఇప్పుడున్న భాగస్వామ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తూ కొత్త భాగస్వామ్యాల కోసం ధైర్యంగా వ్యవహరించాలన్నాడు. వర్తమాన సంవత్సరంలో జనవరి నుంచి సెప్టెంబరు వరకు తొమ్మిది నెలల కాలంలో చైనా మరియు ఆసియన్‌ దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు 782 బిలియన్‌ డాలర్ల మేర జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 9.6శాతం ఎక్కువ. కౌలాలంపూర్‌ సమావేశంలో చైనా-ఆసియన్‌ దేశాల స్వేచ్చావాణిజ్య ప్రాంతం 3.0 ఒప్పందం కుదిరింది. అమెరికా పన్నులకు అందరం బాధితులమే అని దాని రక్షణాత్మక వైఖరిని వ్యతిరేకించాలని ఆసియన్‌ దేశాలన్నింటా ఏకీ భావం కనిపించింది. అయితే వివిధ కారణాలతో అనేక దేశాలు అమెరికాతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ ఒక్కటిగా ఉండకపోతే నష్టమనే భావన ఏర్పడింది.

గత ఏడాది లావోస్‌లో జరిగిన 27వ సమావేశం పెరుగుతున్న ప్రాంతీయ సహకారం గురించి చర్చించింది, దాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు కౌలాలంపూర్‌ సమావేశం దృష్టి సారించింది, ఇది అనివార్యమైన పరిణామం. అన్ని దేశాల మీద ట్రంప్‌ పన్నుల దాడి మొదలు పెట్టిన పూర్వరంగంలో దానికి గురయ్యే దేశాలకు ఇంతకు మించి మరొక మార్గం లేదు.ఈ కూటమి లేదా వ్యవస్థ 1997లో ఉనికిలోకి వచ్చింది. ఆసియన్‌ కూటమిలో బ్రూనీ, కంపూచియా, ఇండోనేషియా, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థారులాండ్‌, వియత్నాం సభ్యులుగా ఉండగా పదకొండవ దేశంగా తైమూర్‌-లెస్తే చేరింది. ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా దక్షిణ కొరియాలో జరిగే ఆసియా -పసిఫిక్‌ ఆర్థిక సహకార వేదిక (ఎపిఇసి) సమావేశాల మీద ఉంది. అక్కడ 30వ తేదీన చైనా అధినేత షీ జింపింగ్‌తో ట్రంప్‌ భేటీ కానున్నాడు. విలువైన ఖనిజాల ఉత్పత్తులపై చైనా ఆంక్షలు విధించిన తరువాత కొద్ది రోజుల క్రితం ఒక ఒప్పందం జరిగినట్లు వార్తలు వచ్చాయి. తుది ఒప్పందం మీద ఇరు దేశాల నేతలు సంతకాలు చేయవచ్చని చెబుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సముద్రంలో చైనా డేటా సెంటర్‌ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్‌ దార్శనికులా !

27 Monday Oct 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Environment, Europe, Germany, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

# China underwater data center, BJP, CHANDRABABU, China, Data Centers, Data centers Employment, Narendra Modi Failures, Vizag Google Data Center, Xi Jinping, YS jagan

ఎం కోటేశ్వరరావు

సముద్రంలో చైనా నిర్మించిన పదమూడు వందల టన్నుల బరువుగల డేటా సెంటర్‌ ఆదివారం నాడు(2025 అక్టోబరు26న) ప్రారంభమైంది. ఇది గాలి మరలతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వినియోగించనుంది. హై క్లౌడ్‌ అనే కంపెనీ మొదటి దశలో భాగంగా 24మెగావాట్ల కేంద్రాన్ని షాంఘై తీరంలో నెలకొల్పింది. న్యూస్‌ అట్లాస్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం సముద్రపు ఒడ్డున నిర్మించిన గాలి మరల విద్యుత్‌ కేంద్రం నుంచి 95శాతం విద్యుత్‌ను ఈ కేంద్రానికి సరఫరా చేస్తారు, సముద్రపు నీటిని చల్లబరిచేందుకు వినియోగిస్తారు. మొత్తం 22.6 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేంద్రంలో సాంప్రదాయపు డేటా సెంటర్ల కంటే 23శాతం విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. సముద్రంలో 114 అడుగుల అడుగున ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలోని ఒక్కో గదిలో 4 నుంచి ఐదు వందల సర్వర్లు ఉంటాయి. సముద్రంలో ఏర్పాటు చేసిన టెలికాం కేబుళ్ల ద్వారా ఈస్ట్రన్‌ డేటా, వెస్ట్రన్‌ కంప్యూటింగ్‌ వ్యూహం ప్రకారం ప్రధాన భూభాగంలోని కేంద్రానికి అనుసంధానం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివే మరో వందగదులను నిర్మించి విస్తరిస్తారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ చైనాలో 2015లో పైలట్‌ ప్రాజక్టుగా సముద్రంలో ఒక డాటా కేంద్రాన్ని నిర్మించింది. ప్రాజెక్ట్‌ నాటిక్‌ పేరుతో చేసిన ఈ ప్రయోగానికి స్వస్తి పలికి 2024జూన్‌లో దాన్ని సముద్రంలో ముంచివేసింది. ఆదివారం నాడు సముద్రంలో తొలి వాణిజ్య డాటా కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించిన తొలి దేశంగా చైనా చరిత్రకెక్కింది. ఇలాంటివే మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఈ కేంద్రం చైనాలో అతి పెద్ద తొలి స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఉన్న హైనాన్‌ సమీపంలో ఉంది. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో నిర్మించారు.

విశాఖలో అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీలతో కలసి గూగుల్‌ నిర్మించనున్న డేటా కేంద్రం ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందన్నది చర్చ. లింక్‌డ్‌ఇన్‌లో వచ్చిన ఒక విశ్లేషణ జర్మనీలోని బిఎఎస్‌ఎఫ్‌ రసాయన కంపెనీతో డేటా సెంటర్ల ఉపాధిని పోల్చింది. సదరు జర్మనీ సంస్థ 684మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది, 50వేల మందికి పూర్తి స్థాయి ఉపాధిని కల్పిస్తున్నది. అదే జర్మనీలో డాటా కేంద్రం 2,283మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగించే చోట పూర్తి కాలపు ఉపాధి 6,849 నుంచి 13,699 మందికి చూపుతుంది. రసాయన ఫ్యాక్టరీ ఒక మెగావాట్‌కు 73 మందికి ఉద్యోగ కల్పన చేస్తుంటే డేటా సెంటర్‌ ఒక మెగావాట్‌కు 3 నుంచి ఆరు ఉద్యోగాలను ఇస్తున్నది. గూగుల్‌ ఆధునిక సాంకేతిక ప్రక్రియలను వినియోగిస్తుంది గనుక ఇంకా తగ్గవచ్చు. ఆ లెక్కన చూసినా విశాఖలో నిర్మించే ఒక గిగావాట్‌(వెయ్యి మెగావాట్లు) కేంద్రం మూడు నుంచి ఆరువేల మందికి పర్మనెంటు ఉద్యోగాలను కల్పిస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలు దీనికి దగ్గరగా ఉన్నాయి. దానికి భిన్నంగా రాష్ట్ర మంత్రి లోకేష్‌ చెప్పారు. ఇద్దరికి సమాచార వనరు ఏమిటి ? ఈ విషయాన్ని చెప్పటానికి బిడియపడాల్సిందేముంది. అదే గూగుల్‌ను అడిగితే అందించిన ఇతర విశ్లేషణలు కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలన్నీ సాధ్యమైనమేరకు తక్కువ మందితో పని చేయించుకొనేందుకు చూస్తాయి. కన్సిడర్‌ మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన సిడ్నీలోని డాటా కేంద్రం 2023లో అకస్మాత్తుగా ఆగిపోయింది. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా జరిగిన ఆ అంతరాయం 46 గంటల పాటు సేవల నిలిపివేతకు దారితీసింది. అప్‌టైమ్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ సిబ్బంది కొరత గురించి పేర్కొన్నది. ప్రపంచ డాటా సెంట్లర్లలో 2019లో ఇరవైలక్షల మంది పూర్తి కాలపు ఉద్యోగులు ఉంటే 2025 నాటికి కేంద్రాలు పెరిగినా 23లక్షల మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులా అన్నది వివరణ లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న 122 గిగావాట్ల సామర్థ్యంలో సగటు తీసుకుంటే ఒక్కో గిగావాట్‌కు 18,700 ఉన్నట్లు కనిపిస్తున్నది. విశాఖ గూగుల్‌ సెంటర్‌కు అందరూ కలసి 20 నుంచి 30వేల మంది ఉంటారని కూడా పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. డాటా కంపెనీలు సిబ్బందిని చేర్చుకోవటం, నిలుపుకోవటంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చిన్న కేంద్రాలు(ఒకటి నుంచి ఐదు మెగావాట్లు) 8 నుంచి 15 మంది, ఐదు నుంచి ఇరవై మెగావాట్ల కేంద్రాలు 15 నుంచి 35 మంది, ఇరవై అంతకు మించిన సామర్ధ్యం కలిగినవి 35 మందికి పైగా, 40 మెగావాట్ల సంస్థలు 45 మందిని, వంద మెగావాట్లు అంతకు మించి సామర్ధ్యం కలిగినవి కొద్దిమందితోనే నిర్వహిస్తున్నాయి, ఎందుకంటే యాంత్రీకరణ మరియు నిర్ణీత ప్రమాణాలతో ఉండే వ్యవస్థలు అందుకు దోహదం చేస్తున్నాయి. నియమించుకుంటున్నాయి. డేటా సెంటర్లలో మొత్తం 230 రకాల సిబ్బంది అవసరం అని చెబుతున్నారు. అయితే చిన్న సంస్థలు అంతమందిని నియమించవు, అవి అవసరమైనపుడు పొరుగు సేవలను ఉపయోగించుకుంటాయి. సగం డేటా సెంటర్లు అవసరమైన నిపుణులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి.

రెండును రెండుతో కలిపినా, హెచ్చవేసినా ఫలితం నాలుగే. ఇది చెప్పటానికి గణితమేథావులతో పనిలేదు. డేటా సెంటర్లతో కలిగే పర్యావరణహాని, విషపూరితమైన వ్యర్ధాల వంటి ఇతర దుష్ఫలితాల గురించి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెప్పినా(అఫ్‌ కోర్స్‌ అధికారంలో ఉన్నపుడు ఈ పెద్దమనిషి వీటి గురించి చెప్పలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నోరు విప్పరు) ఆ రంగం గురించి అధ్యయనం చేసినవారు చెప్పినా విషయం ఒకటే. ఎవరైనా రాజకీయాలతో నిమిత్తం లేని వారు చెబితే చూశారా రాష్ట్ర అభివృద్దిని వ్యతిరేకించేవారు జగన్‌తో చేతులు కలిపి అవే వాదనలు చేస్తున్నారంటూ ప్రచారదాడికి దిగుతున్నారు. అంటే నోరు మూయించేందుకు ఇదొక రకం నియంతృత్వపోకడతప్ప మరొకటి కాదు. తేమ కారణంగా యంత్రాలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అమెరికాలోని డేటా కేంద్రాలన్నీ పొడివాతావరణం ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారని చెబుతున్నారు.పెట్టుబడిలో నాలుగో వంతు సబ్సిడీలు, సంవత్సరాల తరబడి రాయితీ ధరలకు నీరు, విద్యుత్‌ అందచేస్తున్న తరువాత ఏ పెట్టుబడిదారుడు మాత్రం చంద్రబాబు నాయుడి దరిచేరడు ! డాటా సెంటర్‌ మాప్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం గూగుల్‌కు ప్రపంచంలో 113 డాటా సెంటర్లు ఉండగా వాటిలో 68 పని చేస్తున్నాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎందరు ఉద్యోగులు పని చేస్తున్నారని అడిగితే సమాచారం లేదని బదులు వచ్చింది. ప్రపంచంలో గూగుల్‌ సంస్థలో లక్షా 83వేల మంది పనిచేస్తున్నారనే సమాచారం ఉంది తప్ప ఏ విభాగంలో ఎందరు అన్నది లభ్యం కావటం లేదు. ఎవరికైనా దొరికితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. మానవహక్కుల ఫోరం(హెచ్‌ఆర్‌ఎఫ్‌) సమాచారం ప్రకారం అమెరికాలోని అష్‌బర్న్‌ మరియు లీస్‌బర్గ్‌ డాటా సెంటర్లు రెండిలోనూ కలిపి ప్రత్యక్షంగా 400 మందికి పరోక్షంగా 3,100 మంది ఉపాధి దొరుకుతున్నట్లు పేర్కొన్నది.లోకేష్‌ చెప్పినట్లు లక్షా 88వేల ఉద్యోగాల్లో 88వేలు పర్మనెంటు అనుకుంటే మొత్తం గూగుల్‌ ఉద్యోగులు విశాఖలోనే ఉంటారన్నట్లుగా భావించాలి, అది జరిగేదేనా !

ఇంటర్నెట్‌ వెతుకులాటలో డాటా సెంటర్ల ఉపాధి గురించి ఎవరెటు తిప్పి చెప్పినా పెట్టుబడులు, స్థలాల విస్తీర్ణం ఎక్కువ, ప్రత్యక్ష ఉపాధి తక్కువ, పరోక్ష ఉపాధి గురించి మాత్రమే వెల్లడవుతున్నది. పరోక్షం అంటే భవనాల నిర్మాణ సమయంలో దొరికే ఉపాధి, వాటి చుట్టూ ఉండే నివాసాలతో కలిగే లబ్ది గురించి మాత్రమే ప్రస్తావన ఉంటున్నది. ఆ లెక్కన బడా పరిశ్రమలు అంతకంటే ఎక్కువ కల్పిస్తున్నాయి. వస్తూత్పత్తిలో చైనాను పక్కకు నెట్టే ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా దేశాన్ని మారుస్తామన్న మాటలు ఇప్పుడు ఎకువగా వినిపించటం లేదు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గురించి కబుర్లు పెరిగాయి.ఒకదానికి ఒకటి పోటీ కాదు, పరస్పరం సాయం చేసుకొనేవే.పెట్టుబడులు ఎక్కువ ఉపాధి తక్కువ ఉండే టెక్‌ కంపెనీల కోసం మోడీ, చంద్రబాబు వంటి వారు వెంపర్లాడుతున్నారు. ఒకసారి భవనాల నిర్మాణాలు పూర్తయిన తరువాత తాత్కాలిక కార్మికులకు పని ఉండదు. ఆటోమేషన్‌ ప్రధాన ప్రక్రియగా నడిచే ఈ కేంద్రాలలో కీలకమైన సిబ్బంది ఎవరంటే సెంటర్ల మేనేజర్లు, నెట్‌వర్క్‌ మరియు వ్యవస్థల అడ్మినిస్ట్రేటర్లు, సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక నిపుణులు, వారికి సహాయ సిబ్బంది.

ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఏటా పదివేల కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. డేటా సెంటర్లు అవసరమే, అయితే అవి కొత్త సమస్యలను సృష్టించకూడదు. మనదేశంలో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం గురించి తెలిసిందే. పాలకులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారంటే ఉత్పత్తులకు తప్ప కాలుష్యానికి కాదు, దాన్ని నివారించేందుకు పరిశ్రమలే చర్యలు తీసుకోవాలన్న నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేస్తే తమ లాభాలు తగ్గుతాయని తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో ఫార్మా, ఇతర సంస్థల నుంచి వెలువడుతున్న కాలుష్యం సమీపంలోని సముద్రంలో కలుస్తున్నది. దాంతో మత్స్యకారుల ఉపాధికి దెబ్బతగులుతున్నది. పరిష్కరించండి మహానుభావా అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అడిగితే ఈ మధ్యే మాట్లాడుతూ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది తాము కాదని, వంద రోజుల గడువులో పరిష్కరిస్తానని చెప్పారు. అధికారానికి వచ్చి 15నెలల తరువాత ఈ మాటలు చెప్పిన పెద్ద మనిషి ఇంతకాలం ఏం చేస్తున్నట్లు ?

డేటా అనేక విధాలుగా కీలక పాత్ర పోషిస్తున్న పూర్వరంగంలో మనదేశం కూడా వెనుకపడకూడదు. కానీ నరేంద్రమోడీ లేదా రెండింజన్ల పాలనలో ఉన్న ప్రభుత్వాలు గానీ ఎంతో నిర్లక్ష్యం చేశాయన్నది అంకెలే చెబుతున్నాయి.2019లో 350 మెగావాట్ల సామర్ధ్యం ఉండగా 2025 నాటికి 1,350 మెగావాట్లకు చేరుతుందని చెబుతున్నారు. ఈ రంగంలో మిగిలిన దేశాలు ఎంతో ముందున్నాయి.దీనికి కూడా నెహ్రూయే కారణం అని చెబుతారేమో తెలియదు. ముందు చూపు లేకపోవటం తప్ప మరొకటి కాదు.చైనాలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు లేవు, మైక్రోసాఫ్ట్‌ కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో తప్ప ప్రభుత్వం వినియోగించటం లేదు.కృత్రిమ మేథ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో చైనా వెనుకబడిందని శత్రువులు కూడా చెప్పలేరు.తాజా సమాచారం ప్రకారం 2024నాటికి చైనాలో డేటా వాణిజ్య విలువ 47.23 బిలియన్‌ డాలర్లు కాగా 2030 నాటికి అది 97.30బి.డాలర్లకు పెరుగుతుందని రిసర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ సంస్థ పేర్కొన్నది. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ మరోవిధంగా ఉంది.అమెరికాలో 2025 నాటికి డాటా సెంటర్ల ఆదాయం 171.9 బిలియన్‌ డాలర్లు, కాగా చైనాలో 103.19 బిలియన్‌ డాలర్లని 2030 నాటికి 142.64 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. మరో సమాచారం ప్రకారం ప్రపంచ డేటా సెంటర్ల సామర్ధ్యం 2024నాటికి 122.2 గిగావాట్లు. దీనిలో అమెరికా 53.7(44శాతం) కలిగి ఉండగా చైనా 31.9 గిగావాట్లు కలిగి ఉంది. మూడో స్థానంలో ఒక కూటమిగా ఐరోపా యూనియన్‌ 11.9 గిగావాట్లు, మనదేశం 3.6గా ఉంది.చైనాలో ఇటీవల జత చేసిన సామర్ధ్యాన్ని పని చేయించటం లేదని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి అర్ధం అవుతున్నదేమిటి ? దేశం వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలన్నింటా వృద్ది చెందితేనే డేటా కేంద్రాలకు చేతినిండా పని ఉంటుంది. గడచిన పదకొండు సంవత్సరాలుగా కబుర్లు తప్ప అభివృద్ధి లేని కారణంగా డేటా సెంటర్ల సామర్ధ్యం కూడా పెరగలేదన్నది స్పష్టం.విశ్లేషణలను కొనుగోలు చేసేవారు లేకపోతే రేపు విశాఖ గూగుల్‌ సెంటర్‌ అయినా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే.

దేశాన్ని, రాష్ట్రాన్ని వికసిత్‌ భారత్‌లో ఎక్కడికో తీసుకుపోతామని ప్రధాని నరేంద్రమోడీ, ఆయన అడుగుజాడల్లో లేదా అడుగులకు మడుగులద్దుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మంది దృష్టిలో దేశంలో అతి పెద్ద దార్శనికులు, ఇతరులకు తట్టనివి అనేకం వారికి కనిపిస్తాయని చెబుతారు. ఆ ప్రచారం వలన దేశానికి ఎంత లాభమో తెలియదు గానీ నష్టం కలిగిస్తున్నారంటే ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి) నేడు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో చెప్పనవసరం లేదు.తన పాలనలో జిడిపిని పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి తెచ్చిన ఘనత నాదే అంటారు మోడీ. కాసేపు అంగీకరిద్దాం, ఆ పురోగతి ఇతర రంగాల్లో ఉందా ? వాటిలో కీలకమైన పరిశోధనకు కేటాయింపుల సంగతేమిటి ? 1995-96 నుంచి 2014-15వరకు రెండు దశాబ్దాల వార్షిక సగటు జిడిపిలో 0.73 శాతం ఉంది. యుపిఏ పాలనలో 2008-09లో జిడిపిలో 0.8శాతం నిధులు కేటాయిస్తే మోడీ ఏలుబడిలో 2017-18లో 0.7, ఇప్పుడు 0.64శాతానికి తగ్గించారు. దీనికైతే జవహర్‌లాల్‌ నెహ్రూ కారణం కచ్చితంగా కాదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే భావజాలంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల ఈ నిర్వాకాన్ని చంద్రబాబు నాయుడు సమర్ధిస్తారా ? 2013 నాటి సైన్స్‌ మరియు టెక్నాలజీ విధానంలో, 2017-18 ఆర్థిక సర్వేలో కూడా కనీసం రెండు శాతం కేటాయించాలని చెప్పిన అంశం ఎవరికీ తెలియదా ? ఇద్దరు నేతలు దేశ దేశాలు తిరుగుతున్నారు కదా ఎక్కడ ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోరా ? ఎందుకీ నిర్లక్ష్యం ? మన అభివృద్ధి మీద గణనీయమైన ప్రభావం చూపాలంటే 2047నాటి వరకు కనీసం ఒక శాతం, ఆదర్శవంతంగా(ఐడియల్‌) ఉండాలంటే మూడుశాతం చొప్పున ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు. పిండికొద్దీ రొట్టె, పరిశోధనా రంగంలో మనం ప్రపంచ బస్‌ను అందుకోకుండా చేసింది ఎవరంటే ఎవరిని చూపాలి ? పరిశోధనలకు మనం తక్కువ కేటాయిస్తున్నా, పరిశోధనా పత్రాలు గణనీయంగానే మనవారు సమర్పిస్తున్నారుగా అని సమర్ధించుకొనే వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు ! ఎలాంటి పాలకులను మోస్తున్నాంరా బాబూ అని తల పట్టుకోవాలి !!

సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు ;

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?
https://vedikaa.com/2025/10/25/are-data-centers-godowns-or-production-houses-what-is-the-truth-about-ycp-and-tdp-claims-on-employment/

Share this:

  • Tweet
  • More
Like Loading...

ముందు నుయ్యి – వెనుక గొయ్యి : దూరదృష్టిలేమితో దేశాన్ని ఇరకాటంలోకి నెట్టిన ” సమర్ధ ” నరేంద్రమోడీ !

18 Saturday Oct 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

CHANDRABABU, Donald trump, Narendra Modi 2047, Narendra Modi Failures, visionless Narendra Modi, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

అన్నీ వారే చేశారంటూ గాంధీ, నెహ్రూ వంటి నేతలను ఇప్పటికీ ఆడిపోసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఐదు దశాబ్దాలలో చేయలేనిదానిని తమ మోడీ ఐదేండ్లలో చేశారు చూడండని డబ్బాకొట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంటి వారు రంగంలోకి దిగి జిఎస్‌టిి సంస్కరణలతో బొందితో కైలాసానికి తీసుకుపోతున్నారన్నట్లుగా ఆకాశానికి ఎత్తుతున్నారు. గతంలో ఏం మాట్లాడారో తెలిసిందే ! నిజానికి ఏం జరుగుతోంది ? తాజాగా సెప్టెంబరు మాసంలో దేశ వాణిజ్యలోటు వివరాలు వెల్లడయ్యాయి. ఎగుమతులు 6.7శాతం పెరిగి 36.38 బిలియన్‌ డాలర్లకు చేరగా దిగుమతులు 16.7శాతం పెరిగి 68.53 బిలియన్‌ డాలర్లకు చేరాయి.కిందపడ్డా గెలిచింది మేమే అన్నట్లుగా దిగుమతులు అంటే మేం వస్తుకొనుగోలు శక్తి పెంచిన కారణంగానే అవసరం అవుతున్నాయని సమర్ధించుకుంటున్నారు. రూపాయి పాపాయిని ఆరోగ్యంతో బలిష్టంగా పెంచుతామని చెప్పారు. మోడీ మూడోసారి పాలన ఐదేండ్లు గడిచే సరికి ఇప్పుడున్న 89 డాలరుకు ముచ్చటగా వంద రూపాయలకు పతనమైనా ఆశ్చర్యం లేదు.

వికసిత భారత్‌ 2047 పేరుతో నరేంద్రమోడీ దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామన్నారు, ఇప్పుడు ఎటు తీసుకుపోతున్నారో తెలియదు. కొన్ని చేదు నిజాలను అంగీకరించకతప్పదు. ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం మన దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మోడీ అధికారానికి వచ్చిన తరువాత జిడిపిలో 2.1శాతం ఉండగా 2023 నాటికి 0.8శాతానికి దిగజారాయి. అంకెల్లో చూస్తే 2014 నుంచి 2024వరకు వచ్చిన మొత్తం 509.69 బిలియన్‌ డాలర్లు(సగటున ఏడాదికి 46.34బి. డాలర్లు) అధికారానికి వచ్చిన కొత్తలో విమానం వేసుకొని దేశదేశాలూ ఎందుకు తిరుగుతున్నారంటే దిగజారిన దేశ ప్రతిష్ట పునరుద్దరణ, పెట్టుబడుల కోసం అని చెప్పారు. గొర్రెతోక బెత్తెడు అన్నట్లుగా 2016లో 46 బిలియన్‌ డాలర్లు వస్తే 2024లో 53 బిలియన్‌ డాలర్లు ఉంది. చైనాకు 2019 నుంచి 21వరకు మూడు సంవత్సరాల్లో వచ్చిన మొత్తం 787 బిలియన్‌ డాలర్లు. తరువాత కాలంలో చైనాకు మనదేశానికి వచ్చిన మొత్తం కూడా రాలేదు.2021లో 344 బిలియన్‌ డాలర్లు వస్తే 2023లో 51.3, 2024లో 18.6బిలియన్‌ డాలర్లు మాత్రమే వచ్చాయి. దానికి ఉన్న కారణాల గురించి మరోసందర్భంలో చెప్పుకోవచ్చు.చైనాలో పెరిగిన ఉత్పాదకత ఖర్చులతో వచ్చే లాభదాయకత కంటే అమెరికాలో వడ్డీ రేటు ఎక్కువగా ఉండటం ఒకటి. ఇక్కడ ముఖ్యాంశమేమంటే చైనాకు పెట్టుబడులు ఆగిపోయాయి, మనదేశానికి అవి రూటుమార్చాయి, కంపెనీలు వరుసలో నిలుచున్నాయి అని చెప్పిన వారు యాపిల్‌ కంపెనీ గురించి పదే పదే చెప్పటం తప్ప చైనాకు తగ్గిన ఎఫ్‌డిఐ మనకు ఎందుకు రాలేదో చెప్పాలి. చైనా కంపెనీలు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దపడితే గత ఐదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే.ఆశించిన అమెరికా, ఇతర దేశాల కంపెనీల జాడకనిపించకపోవటంతో ఇప్పుడు చైనా పెట్టుబడులకు ద్వారాలు తెరిచేందుకు మోడీ సర్కార్‌ పూనుకుంది.

కుండలో కూడు కదల కూడదు బిడ్డడు దుడ్డులా ఉండాలన్నది మన ఆలోచనా విధానంగా ఉంది. అది మారనంత వరకు అటూ ఇటూ కాని స్థితే. ఇతర అభివృద్ధి చెందిన, చైనా వంటి దేశాలతో పోల్చితే మనదేశంలో కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల పరిమితం, బలహీనమైన మౌలిక సదుపాయాలు ఆకర్షణీయంగా లేనపుడు రాజకీయ నేతలు, వారికి భజన చేసే మీడియా ఎన్ని కబుర్లు చెప్పినా ఉపయోగం ఉండదు.” విదేశీ కంపెనీలకు భారత్‌ శ్మశానం వంటిది ” అని ఏకంగా ప్రపంచబ్యాంకే వాణిజ్య నివేదికలో పేర్కొన్నది.ఆ ముద్ర నుంచి ఇంతవరకు బయటపడిందా అన్నది సందేహమే. ఇంతే కాదు 2014 నుంచి 2021 వరకు మన దేశంలో ఉన్న 2,800 విదేశీ కంపెనీలు దుకాణాలు మూసుకొని వేరేచోట్లకు వెళ్లిపోయాయి.మన దేశానికి రావాలనుకొనే వారు ఇలాంటి వాటన్నింటినీ ఒకటికి రెండుసార్లు చూసుకుంటారు. ఇప్పుడు అమెరికా విధించిన పన్నులతో ఇక్కడ పరిశ్రమలే ఎలా మనుగడ సాగించాలా అని ఆలోచిస్తుండగా కొత్తగా వచ్చేవారి సంగతి వేరే చెప్పనవసరం లేదు. మన కార్పొరేట్ల తీరుతెన్నులు చూస్తే మిగతావారి మాదిరే తమ లాభాలు తప్ప వేరే పట్టవు. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా తమకు అనుకూలమైన విధానాలను అమలు చేయిస్తారు. ఇప్పుడు అమెరికా, ఇతర దేశాలతో తలెత్తిన పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచటం లేదని చెప్పవచ్చు.గతంలో ఆసియన్‌ దేశాలతో కూడిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి) కూటమిలో లేదా పసిఫిక్‌ భాగస్వామ్య కూటమి సిపిటిపిపి(కాంప్రహెన్సివ్‌ అండ్‌ ప్రోగ్రెసివ్‌ ఎగ్రిమెంట్‌ ఫర్‌ ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌)లో చేరాలా ? చేరితే వచ్చే లాభాలేమిటి ? నష్టాలేమిటనే గుంజాటనలో పాలకవర్గం దాని ప్రతినిధిగా ప్రస్తుతం ఉన్న నరేంద్రమోడీ సర్కార్‌ ఉంది. ఏదో ఒక కూటమిలో చేరాలనే వత్తిడి ప్రారంభమైంది.చేరితో పౌరుల నుంచి వచ్చే వ్యతిరేకత తమ అధికారానికే ఎసరు తెస్తుందేమో అన్న భయం బిజెపి, దాని మద్దతుదార్లలో కూడా తలెత్తింది. పైకి చెప్పుకోకపోవచ్చు.

ముందుగా ఆర్‌సిఇపి గురించి చూద్దాం. ఈ కూటమి ఒప్పందంపై 2020 నవంబరు 15 సంతకాలు చేసింది. అది 2022 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది.దీనిలో ఆస్ట్రేలియా,బ్రూనీ, కంపూచియా, చైనా, ఇండోనేషియా, జపాన్‌, దక్షిణ కొరియా, లావోస్‌, మయన్మార్‌, మలేసియా, న్యూజీలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌,థారులాండ్‌, వియత్నాం ఉన్నాయి. ఏడు సంవత్సరాలు తర్జన భర్జన పడిన తరువాత 2019 నవంబరులో ఈ కూటమిలో చేరకూడదని నరేంద్రమోడీ సర్కార్‌ నిర్ణయించింది. ముందు ఎట్టిపరిస్థితిలోనూ చేరకూడదని రైతు, వ్యవసాయ కార్మిక, పారిశ్రామిక కార్మికులు, ఇతరులూ స్పష్టం చేశారు. చైనా ఉన్న ఏ వాణిజ్య కూటమిలోనూ చేరకూడదని పారిశ్రామికవేత్తలు గట్టిగా పట్టుబట్టారు. దాంతో ఈ కూటమికి మనదేశం దూరంగా ఉంది. అయితే ఇప్పటికీ ఆర్‌సిఇపి మన దేశానికి ఆహ్వానం పలుకుతూనే ఉంది. గతంలో వ్యతిరేకించిన కార్పొరేట్‌ శక్తులే డోనాల్డ్‌ట్రంప్‌ దెబ్బతో పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. వారెందుకు నాడు వ్యతిరేకించారంటే ఒకటి, చైనాతో అప్పటికే ఉన్న వాణిజ్యలోటు మరింత పెరుగుతుంది, రెండు, ఆ కూటమిలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తమ పాడి ఉత్పత్తులకు మన మార్కెట్‌ను తెరవాలని డిమాండ్‌ చేస్తున్నాయి, అదే జరిగితే మన పాడి పరిశ్రమలో ఉన్న కోట్లాది మంది రైతులు నష్టపోతారు.రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో సున్నితమైన అంశం. మూడవది, సేవారంగానికి ఇతర దేశాలు తమ మార్కెట్లను తెరిచే అంశంపై మన ప్రతిపాదనలకు ప్రత్యేకించి నిపుణుల రాకపోకలకు సంబంధించి తగిన మద్దతు రాకపోవటం.

అయితే ఇప్పుడు కార్పొరేట్లలో పునరాలోచనకు పరిస్థితులేమైనా మారాయా ? ఒక్క మాటలో చెప్పాలంటే లేదు. చైనాతో వాణిజ్య లోటు ఆరేళ్ల క్రితం 48.6 బిలియన్‌ డాలర్లు ఉంటే ఇప్పుడు వంద బిలియన్‌ డాలర్లకు చేరింది. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై మన వైఖరిలో అప్పుడూ ఇప్పుడూ ఒకటిగానే ఉంది. అందుకే ఆస్ట్రేలియా, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటానికి మోడీ సర్కార్‌ భయపడుతోంది. నయా ఉదారవాదం ప్రకారం మనకు లబ్ది కలిగించే సేవారంగ మార్కెట్‌లను తెరవాలన్న మన ప్రతిపాదనలకు ఇతర దేశాలు సుముఖంగా లేవు. దీని అర్ధం ఎవరి రక్షణ చర్యలకు వారు కట్టుబడి ఉన్నారు. ఈ స్థితిలో పునరాలోచన చేయాలని కొందరు ఎందుకు కోరుతున్నారంటే ట్రంప్‌ ఇచ్చిన షాక్‌తో ప్రభావితమైన రంగాలకు ఏం చేయాలో తోచక ఈ ప్రయత్నం ఏమైనా ఉపయోగపడుతుందా అని భావిస్తున్నారని చెప్పవచ్చు.పోనీ చేరితే వెంటనే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే ఉండదు. దాని నిబంధనావళి ప్రకారం 2022 నుంచి ఇరవై సంవత్సరాల వ్యవధిలో నాడున్న పన్నులను 92శాతం తగ్గించాల్సి ఉంటుంది. అదే విధంగా ఎగుమతి, దిగుమతుల కోటాలను ఖరారు చేస్తారు. తెల్లవారేసరికి మన సరుకులను ఎగుమతి చేసి లాభాలు సంపాదించాలంటే కుదరదు. మన రైతాంగానికి, పాడి, కోళ్ల పరిశ్రమల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకొని మార్కెట్‌ను తెరిస్తే అదొక తీరు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించటానికే మొరాయిస్తున్న నరేంద్రమోడీ సర్కార్‌ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందంటే నమ్మేదెవరు ? రైతాంగమే కాదు కొన్ని పరిశ్రమలు కూడా దెబ్బతింటాయి.

ఇక రెండో ఆర్థిక కూటమి సిపిటిపిపిని చూద్దాం. దీనిలో ఆర్‌సిఇపిలో ఉన్న కొన్నింటితో పాటు ఇతర దేశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, వియత్నాం, సింగపూర్‌, బ్రూనీ,కెనడా, మలేసియా,జపాన్‌, చిలీ, పెరూ, బ్రిటన్‌,మెక్సికో ఉన్నాయి. వీటి మధ్య ఒప్పందం 2018లో ఉనికిలోకి వచ్చింది. దీని ప్రకారం 99శాతం వరకు పన్నులను తగ్గించాల్సి ఉంటుంది.ఆర్‌సిఇపి కంటే నిబంధనలు గట్టిగా ఉన్నాయి. అంతకు ముందు ట్రాన్స్‌ ఫసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ (టిపిపి) పేరుతో కుదిరిన ఒప్పందం నుంచి అమెరికా వైదొలగటంతో అది మూలన పడి దాని స్థానంలో కొత్తగా ఉనికిలోకి వచ్చింది.దీనిలో సభ్యత్వం కోసం చైనా దరఖాస్తు చేసినప్పటికీ దానికి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆర్ధిక సేవారంగాన్ని తెరవాలన్న నిబంధనతో పాటు సమాచారాన్ని స్వేచ్చగా ఇచ్చిపుచ్చుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించాలనే షరతులు ఉన్నాయి. వాటిని చైనా అంగీకరించటం లేదు. అమెరికా, చైనా రెండూ లేవు గనుక మనం చేరితే ఉపయోగం ఉంటుందన్న ఆశతో సిపిటిపిపిలో చేరితే ఎలా ఉంటుందని మన కార్పొరేట్లు ఆలోచన చేస్తున్నారు. ఆర్‌సిఇపి కంటే మరింతగా ఉదారవాద విధానాలను అమలు జరపాల్సి ఉంటుంది.ప్రస్తుతం నరేంద్రమోడీ చేస్తున్నవాటికే ప్రతిఘటన ఎలా ఉంటుందో రైతాంగ ఉద్యమం స్పష్టం చేసింది. ఇప్పుడు కార్మిక చట్టాలలో తెస్తున్న మార్పులకు వ్యతిరేకంగా కార్మికవర్గం కూడా ఆందోళనకు సిద్దం అవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను పరిమితం చేసే యత్నాలకు వాటి సిబ్బంది కూడా వ్యతిరేకత వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అందువలన ఈ కూటమిలో చేరటం కూడా అంత తేలిక కాదు.

ఏ దేశానికైనా ఒక దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలు ఎత్తుగడలు అవసరం. నరేంద్రమోడీ సర్కార్‌కు అలాంటి ఆలోచనగానీ, ఆచరణగానీ లేదు. అందువల్లనే అమెరికా మనమీద పెద్ద ఎత్తున వత్తిడి తెస్తున్నది.దాన్ని తప్పించుకొనేందుకు మాటల్లేవ్‌, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్లుగా ఐదేండ్ల క్రితం అన్ని సంబంధాలను తెంచుకున్న చైనాతో తిరిగి చేయి కలపటం, అవసరమైతే రష్యా, చైనా, భారత్‌ ఒక కూటమిగా ఏర్పడతాయనే సందేశాన్ని షాంఘై సహకార సంస్థ సమావేశాల సందర్భంగా ఇచ్చారు. అయితే అమెరికాతో సంబంధాలకు కూడా తహతహలాడుతున్నారు.అందుకే చైనా, రష్యా బహిరంగంగా చెప్పనప్పటికీ ప్రతి అడుగూ అనుమానంతో వేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ఐరోపా సమాఖ్యతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని, స్థానిక గిరాకీని పెంచేందుకు పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలని, అదనపు రిస్కులను తీసుకోకుండా అన్ని దేశాలతో ఉన్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలతో గరిష్టంగా లబ్దిపొందేందుకు చర్యలు తీసుకోవాలని మనకార్పొరేట్లు కోరుతున్నారు. పదేండ్ల మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో చైనా ప్లస్‌ 1పేరుతో కొత్త పల్లవి అందుకున్నారు.

బహుళజాతి కంపెనీలు ముందుకు తెచ్చిన ఈ వ్యూహం వాణిజ్యపరమైనది. సరఫరా వ్యవస్థ లేదా గొలుసులో చైనాను విస్మరించలేరు.కనుచూపు మేరలో ప్రత్యామ్నాయం కనిపించటం లేదు. చైనాలో కార్మికవేతనాలు పెరుగుతున్నందున, ఇతర నిబంధనలతో ఉత్పాదక ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే 140 కోట్ల జనాభా ఉన్న మార్కెట్‌ను వదులుకోలేరు. అందుకే చైనాతో పాటు మరొక దేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించాలన్నదే చైనా ప్లస్‌ 1 అర్ధం. మన దేశంలో యాపిల్‌ కంపెనీ కార్యకలాపాలకు కారణమిదే. దీని భావం అన్ని కంపెనీలు మన దేశానికి బారులు తీరాయని కాదు. వియత్నాం,ఇండోనేషియా,థారులాండ్‌ ఇలా ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ఎంచుకోవచ్చు.మన విషయానికి వస్తే సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి. యువజనాభా గణనీయంగా ఉండటం, కార్మికవేతన ఖర్చు తక్కువ(2023 సర్వే ప్రకారం చైనా కంటే వేతనాలు 47శాతం తక్కువ.) ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాలు ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇవి సానుకూల అంశాలు కాగా సవాళ్లు కూడా ఉన్నాయి. 2013 నుంచి చైనాలో వేతనాలు పెరుగుతున్నందున కంపెనీలు మనదేశానికి వస్తాయని చెప్పినా వాటి జాడలేదు. నియంత్రణలు ఎక్కువ ( అంబానీ, అదానీలకు ఎవరూ పోటీ రాకూడదు, అందుకే అమెజాన్‌ అధిపతి బెజోఫ్‌కు గతంలో మోడీ కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించలేదు) మౌలిక సదుపాయాలు అంటే ” తోలు ” వలిచే రోడ్లు మాత్రమే కాదు. వియత్నాం, థారులాండ్‌ వంటి చిన్నదేశాల నుంచి కూడా మనకు పోటీ ఎక్కువగా ఉంది. కబుర్లు ఎక్కువ ఆచరణ తక్కువ.మొత్తంగా చూసినపుడు సమర్ధుడైన నావికుడిగా భావించి మన నావను నరేంద్రమోడీకి అప్పగిస్తే ఇప్పుడది చుక్కాని లేనట్లు ఎటు పోతుందో తెలియకుండా నడి సముద్రంలో ఉంది. చిత్రం ఏమిటంటే దీనికి కూడా నెహ్రూ కారణమని చెప్పగల సమర్ధులుంటే నిజమే అని నమ్మే అమాయకులు పుష్కలంగా ఉండటం అసలైన సమస్య !

Share this:

  • Tweet
  • More
Like Loading...

పసిడి ధర ఐదేండ్లలో మూడు రెట్లు పెరుగుదల ? ప్రపంచ అప్పుకు దీనికి సంబంధం ఉందా !

01 Wednesday Oct 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

Donald trump, GLOBAL DEBT SURGE, Gold Price Record, India debt matters, Narendra Modi Failures, World Debt, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ప్రపంచ రుణం 338 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌(ఐఐఎఫ్‌) సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.(ఎవరికైనా ఆసక్తి ఉండి యుఎస్‌ డెబిట్‌ క్లాక్‌ డాట్‌ ఓఆర్‌జి వెబ్‌సైట్‌లోకి వెళితే ప్రతి క్షణం ఏ దేశానికి ఎంత అప్పు పెరుగుతున్నదో చూడవచ్చు.) మన జిడిపి నాలుగు లక్షల కోట్ల డాలర్లు, ప్రపంచ రుణం మాత్రం ప్రతి నెలా సగటున 3.4లక్షల కోట్ల డాలర్లు పెరుగుతున్నది.ఈ లెక్కన ఈ ఏడాది డిసెంబరు నాటికి మరో 20లక్షల కోట్ల డాలర్ల మేర ప్రపంచ రుణం పెరగనుంది. ఇలా పెరుగుతున్న అప్పులతో జనాలకు తిప్పలు కూడా అధికం అవుతున్నాయి. అమెరికా కరెన్సీ డాలరు ఈ ఏడాది జనవరి నుంచి 9.75శాతం పతనమైంది. అందువలన రుణం బాగా పెరిగినట్లు కనిపిస్తోందని కొంత మంది భాష్యం చెబుతున్నారు. కరోనా వచ్చిన 2020లో ఈ మాదిరి భారీ పెరుగుదల ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకున్నా పెరగటం ఆందోళన కలిగిస్తున్నది. కుటుంబాలకు అప్పులు పెరిగితే ఏమౌతుంది. దానికి తగిన రాబడి లేకపోతే వాటిని తీర్చేందుకు కొన్ని కుటుంబ అవసరాలను తగ్గించుకొని రుణ చెల్లింపులకు కొంత మొత్తాన్ని మళ్లించాల్సి వస్తుంది. ప్రభుత్వాలు అయినా చేస్తున్నది అదే. ఉదాహరణకు ప్రపంచంలో అత్యధికంగా అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లు. దానికి ఏటా చెల్లిస్తున్న వడ్డీ,అసలు మొత్తం 1.157లక్షల కోట్ల డాలర్లు. కొత్తగా తీసుకొనే అప్పులో సగానికి పైగా రుణ చెల్లింపులకే పోతున్నది.

అప్పులు పెరిగే కొద్దీ చేసిన వాగ్దానాలకు, అమలు చేస్తున్న పథకాలకు ఏదో ఒక సాకుతో కోత పెడతున్నారు.నిజానికి సామాన్యులకు ఏం జరుగుతున్నదో కూడా తెలియటం లేదు. నరేంద్రమోడీ సర్కార్‌ తీరుతెన్నులను చూద్దాం. మన దేశ మొత్తం అప్పు 2025 మార్చి నాటికి రు.181,74,284 కోట్లు దీన్ని 2026 మార్చి నాటికి రు.196,78,772 కోట్లకు పెంచుతామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. శాశ్వత ఆస్తుల కల్పనకు మూలధన పెట్టుబడిగా పెట్టాలి లేదా సంక్షేమానికి కేటాయించాలి.అప్పు తెస్తామన్న రు.15.69లక్షల కోట్లలో వడ్డీలు, అసలు చెల్లించేందుకు రు. 12.76లక్షల కోట్లు కేటాయించారు.2024-25 బడ్జెట్‌లో సబ్సిడీలకు రు.4.28లక్షల కోట్లు కేటాయించి పదకొండువేల కోట్లు కోత పెట్టారు. తాజా బడ్జెట్‌లో రు.4.26వేల కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం మీద గతేడాది కేటాయింపులతో పోలిస్తే 0.4శాతం తగ్గించారు. నూతన ఉపాధి కల్పన పధకానికి గతేడాది పదివేల కోట్లు కేటాయించి 6,800 కోట్లు ఖర్చు చేసి వర్తమాన కేటాయింపుల్లో 20వేల కోట్లు చూపి 194శాతం అదనం అని గొప్పలు చెప్పారు.గ్రామీణ ప్రాంతాలకు మంచినీటిని అందచేసే జలజీవన్‌ పథకానికి 70వేల కోట్లు కేటాయించి చేసిన ఖర్చు చేసిన కేవలం 22.693వేల కోట్లు మాత్రమే. ఈ ఏడాది 67వేల కోట్లు కేటాయించి చూశారా 195 శాతం పెంచామంటూ ఊదరగొడుతున్నారు. వీటన్నింటినీ నిజంగా ఖర్చు చేస్తారా అన్నది చూడాలి. ఎరువుల సబ్సిడీగా 2023-24లో రు.1.88 వేల కోట్లు ఖర్చు చేసిన సర్కార్‌ ఈ ఏడాది దాన్ని 1.67లక్షల కోట్లకు కోత పెట్టింది. ఈ కారణంగానే అవసరమైన మేరకు యూరియా ఇతర ఎరువులను దిగుమతి చేసుకోకుండా డబ్బు మిగుల్చుకొని రైతాంగాన్ని ఇక్కట్ల పాలు చేసింది. కార్పొరేట్‌ పన్ను తగ్గించిన కారణంగా గతేడాది లక్ష కోట్ల మేరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కోత పడింది. ఇవన్నీ చూసినపుడు పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు, కార్పొరేట్లకు రాయితీల కొనసాగింపు, కోట్లాది మంది రైతాంగానికి, ఇతరులకు సబ్సిడీల కోత స్పష్టంగా కనిపిస్తున్నది.

నరేంద్రమోడీ మిత్రుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్నది కూడా ఇదే. వివిధ దేశాల వస్తువుల మీద దిగుమతి పన్నులు వేసి రానున్న పది సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్ల డాలర్ల మేర లోటుబడ్జెట్‌ను తగ్గించుకోవాలని చూస్తున్నాడు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే ఆ పన్నుల మొత్తాన్ని చెల్లించాల్సింది సామాన్య పౌరులే గనుక తన అసమర్ధతను జనం మీద రుద్దుతున్నట్లే. నరేంద్రమోడీ చేస్తున్నది కూడా అదే మన అవసరాల్లో 80శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాం.దాని ఉత్పత్తులైన పెట్రోలు, డీజిలుపై సెస్‌, ఇతర పన్నుల భారాన్ని పెంచారు. మోడీ అధికారానికి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ ఎనాలసిస్‌ సెల్‌ సమాచారం ప్రకారం ఎక్సైజ్‌ డ్యూటీ రు.99,068 కోట్లు, దాన్ని 2020-21 నాటికి రు.3,72,930 కోట్లకు పెంచారు. తరువాత ఎన్నికలు, తదితర కారణాలతో 2023-24 నాటికి రు.2,73,684 కోట్లకు తగ్గించారు. ఏటా లక్షా 73వేల కోట్ల మేర జనం నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధర పీపాకు 20డాలర్లు తగ్గినా ఒక్క పైసా కూడా వినియోగదారులకు ధరలు తగ్గించలేదు. రష్యా నుంచి చౌకధరలకు ముడి చమురు దిగుమతి చేసుకొని లాభాలకు ఐరోపా దేశాలకు ఉత్పత్తులను అమ్మిస్తున్నారు. దేశంలో ముడిచమురు ఉత్పత్తి 2014-15లో ప్రభుత్వ-ప్రైవేటు ఉత్పత్తి 35.9 మిలియన్‌ టన్నులుంటే 2023-24నాటికి 27.2మి.టన్నులకు పడిపోయింది. అందుకే అభివృద్ధి కోసం రుణాలు చేస్తున్నామని రాజకీయ నేతలు చెప్పే మాటలు బూటకం అని చెప్పాల్సి వస్తోంది.

కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రాలు కూడా నానాటికీ రుణ ఊబిలో కూరుకుపోతున్నాయి. అవి కూడా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నాయి.హిమచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం పద్నాలుగు రకాల సబ్సిడీలను క్రమబద్దీకరించే పేరుతో కోత పెట్టేందుకు కసరత్తు చేస్తున్నది.మహారాష్ట్రలో రెండింజన్ల పాలన ఉంది. రాష్ట్ర రుణ భారం 9.25లక్షల కోట్లకు పెరగనుంది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి లడకీ బహిన్‌ పధకానికి రు.46వేల కోట్లు కేటాయించారు. తాజాగా దాన్ని రు.36వేల కోట్లకు కోత పెట్టారు.వృద్ధులకు యాత్రల సబ్సిడీ కొత్త కేటాయింపులు లేవు. మరో రెండింజన్ల పాలన రాష్ట్రం మధ్య ప్రదేశ్‌. అక్కడ ప్రాధమిక పాఠశాల విద్యకు ఈ ఏడాది రు.15,509 కోట్ల నుంచి రు.11,837 కోట్లకు కుదించారు. మహిళలకు ఉచిత బస్‌ పథకాన్ని ప్రకటించిన కర్ణాటక సర్కార్‌ 15శాతం బస్‌ ఛార్జీలను పెంచింది.

ఒక్క చైనా తప్ప రుణ భారం పెరిగిన ప్రపంచ దేశాలన్నింటా సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నారు. అందుకే అనేక చోట్ల వలస వచ్చిన వారు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారంటూ మితవాద శక్తులు జనాలను రెచ్చగొడుతున్నాయి.జి 7 దేశాలతో పాటు చైనా రుణభారం గణనీయంగా పెరుగుతున్నట్లు ఐఐఎఫ్‌ నివేదిక పేర్కొన్నది.అమెరికా వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం జపాన్‌ పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం కలిగి ఉంది. ఇది జిడిపికి 293శాతం ఎక్కువ. ఇంత రుణం కలిగిన జపాన్‌ అమెరికాకు లక్ష కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అదే విధంగా జిడిపిలో 86.7శాతం 16లక్షల కోట్ల రుణం ఉన్న చైనా మరోవైపున అమెరికాకు 750 బిలియన్‌డాలర్ల రుణం ఇచ్చింది. ఇతర దేశాలలో సూడాన్‌ రుణం జిడిపికి 252 శాతం ఉంది. నిరంతరం అంతర్యుద్ధాలతో సూడాన్‌ అప్పు పెరిగింది. జపాన్‌లో కార్పొరేట్లకు ఉద్దీపన పథకాలు, వృద్ధుల సంఖ్య పెరగటం కారణాలుగా చెబుతున్నారు. సింగపూర్‌ 175, బహరెయిన్‌ 141, ఇటలీ 137 అమెరికా 123శాతం రుణభారంతో ఉన్నాయి. ధనిక దేశాలు ఇలా ఉండటానికి కారణంగా కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలే ప్రధాన కారణం. ధనిక దేశాలకు సగటున 110, వర్దమాన దేశాలకు 74శాతం రుణభారం ఉంది. ధనిక దేశాల కంటే వర్ధమానదేశాల రుణ భారం వేగంగా పెరగటం ఆందోళన కలిగిస్తోందని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది.గతంలో యుద్ధ సమయాల్లోనే దేశాలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొనేవి. 1980దశకం నుంచి అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు రుణాలు తీసుకోవటం జరుగుతున్నది. చిత్రం ఏమిటంటే అప్పులు పెరుగుతున్నాయి అభివృద్ధి దిగజారుతున్నది, అనేక ధనిక దేశాల అనుభవం ఇదే. అంటే అభివృద్ధికి అప్పులు అనేది పూర్తిగా నిజం కాదు. అనేక దేశాలు రుణాలు తీసుకోవటమే కాదు ఇస్తున్నాయి. ఉదాహరణకు పన్నెండు లక్షల కోట్ల డాలర్ల రుణం ఉన్న జపాన్‌ అమెరికాకు లక్ష కోట్లతో సహా ఇతర దేశాలన్నింటికీ ఇస్తున్న రుణం 2024 నవంబరు నాటికి 4.18 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.ఇలాగే ఇతర దేశాలు కూడా ఇస్తున్నాయి. అందువలన ఇలాంటి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే నిఖరంగా ఎంత అప్పు అన్నది తేలుతుంది. మన జిడిపి చాలా తక్కువే అయినప్పటికీ 216, చైనా 750 బిలియన్‌ డాలర్లు అమెరికాకు అప్పు ఇచ్చాయి. కరీబియన్‌ సముద్రంలో కేమన్‌ దీవుల జనాభా 90వేలకు అటూ ఇటూ, అది అమెరికాకు ఇచ్చిన అప్పు 2024లో 423 బిలియన్‌ డాలర్లు. అదెలా అంటే అదొక పన్నుల స్వర్గం, అక్కడ డబ్బుదాచుకుంటే ఎవరూ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల్లో పన్నులు ఎగవేసిన పెద్దల నల్లధనం మొత్తం ఇలాంటి చోట్లకు చేర్చి అక్కడి నుంచి ఏ దేశానికైనా రుణాలు ఇచ్చి బ్లాక్‌ను వైట్‌గా మార్చుకుంటారు. అమెరికా అప్పు 37.5లక్షల కోట్ల డాలర్లలో అక్కడి ఫెడరల్‌ రిజర్వు ప్రభుత్వం జారీచేసిన రుణబాండ్లను ఆరులక్షల డాలర్లమేర కొనుగోలు చేసింది, అంటే అప్పు ఇచ్చింది. మన కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం 196లక్షల కోట్లలో 190లక్షల కోట్లు అంతర్గత రుణాలే. అంటే మన బాంకులు, ఉద్యోగులు, ద్రవ్య సంస్థలు ఇచ్చిన అప్పులే అవి. వడ్డీ రాబడి కోసం ఇదంతా జరుగుతున్నది. ఇతర దేశాల మాదిరి జిడిపిలో మన రుణం 93శాతం, దానికి మించి పెరిగితే ఇబ్బందులు వస్తాయి.

ఒక వైపు అప్పులు పెరుగుతుంటే మరోవైపు ప్రపంచ మార్కెట్లో బంగారం ధర దూసుకుపోతోంది.ఈ రెండింటికీ సంబంధం ఉంది అంటున్నారు. గత చరిత్ర ఇదే చెబుతోంది.రుణాలు పెరిగే కొద్దీ కరెన్సీ విలువలు కూడా పడిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే దేశాలూ, వ్యక్తులూ కూడా బంగారం కొనుగోళ్లు సురక్షితం అని భావిస్తున్నారు.మొదటి ప్రపంచ యుద్ధంలో అప్పులపాలైన జర్మనీ తీర్చేందుకు 1920దశకంలో విపరీతంగా నోట్లను ముద్రించింది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి నోట్లు దేనికీ పనికిరాకుండా పోయాయి. జనాలు కరెన్సీ నోట్లను గోడలకు కాగితాల మాదిరి అంటించి నిరసన తెలిపారు. సంక్షోభాలకు బీమా వంటిది బంగారం అని చెబుతారు. ఇప్పుడు ప్రపంచంలో రిజర్వు ఆస్తులలో బంగారానిది రెండవ స్థానం.ప్రపంచ ధనిక దేశాల్లో 2008లో తలెత్తిన ద్రవ్య సంక్షోభంతో ఉద్దీపన పథకాలు అమలు జరిపిన కారణంగా ప్రపంచ రుణం 2007 నుంచి 2009 కాలంలో 20శాతం పెరిగి 178లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బంగారం ఔన్సు(28.35గ్రాములు) ధర 869 డాలర్ల నుంచి 1,224 డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచ రుణం ముందే చెప్పుకున్నట్లు 338లక్షల కోట్లడాలర్లు దాటింది. ప్రస్తుతం ఔన్సు ధర 3,800 డాలర్లుగా ఉన్నది త్వరలో 4,800 డాలర్లకు పెరగవచ్చని జోశ్యం చెబుతున్నారు. ఐరోపాలో 2011-2012లో తలెత్తిన రుణ సంక్షోభ సమయంలో మదుపుదార్లకు యూరో మీద విశ్వాసం తగ్గి బంగారంవైపు మొగ్గు చూపటంతో 2011 సెప్టెంబరులో 1,920 డాలర్లకు పెరిగింది. జపాన్‌లో 2020-21 సంవత్సరాలలో రుణ భారం 266శాతానికి పెరగటంతో మదుపుదార్లు బంగారం కొనుగోలుకు ఎగబడటంతో కరెన్సీ విలువలో ధర 18శాతం పెరిగింది.2024లో అమెరికా ఐపి పెట్టేవరకు వచ్చి బయటపడింది.రుణం 34లక్షల కోట్ల డాలర్లు దాటింది.దాంతో బంగారం ధర 2,100 డాలర్లకు పెరిగింది. ఏడాది కాలంలోనే 3,800 డాలర్లకు చేరిందంటే సంక్షోభం మరింత ముదురుతున్నట్లు మదుపుదార్లు భావిస్తున్నారు.ప్రస్తుతం ప్రపంచ రుణం జిడిపిలో 95శాతం ఉంది, 2030 నాటికి అది వందశాతానికి చేరవచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అంటే సామాన్యులకు ముప్పు మూడినట్లే ! మరి బంగారం ధర సంగతి ? జోశ్యాలను చూస్తే సామాన్యులు దానివైపు చూడనవసరం లేదనట్లుగా ఉన్నాయి. అక్టోబరు ఒకటవ తేదీన ఔన్సు ధర 3,875 డాలర్లకు చేరింది.1999లో కనిష్ట ధర 252 డాలర్లు. డిసెంబరు ఆఖరుకు 4,036 డాలర్ల వరకు పెరగవచ్చని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. కొందరైతే 4,289 డాలర్లకు చేరవచ్చన్నారు.వచ్చే ఏడాది(2026) ఆఖరుకు 5,488 డాలర్లు, 2027-30 మధ్య 5,479 నుంచి 7,956 డాలర్ల మధ్య ధర ఉండవచ్చని కొందరు చెబుతుంటే 2030 నాటికి 11,330 డాలర్లకు పెరగవచ్చని మరికొందరు. కొనుగోలు చేయాలా వద్దా ? ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇది కదా కమ్యూనిస్టుల ముందు చూపు – మేథోవలస- తిరిగి రాకపై దశాబ్దాలనాడే చైనా ముందు జాగ్రత్త !

24 Wednesday Sep 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

BJP, Brain drain and Gain, China, china communist party, Donald trump, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

రానున్న రోజుల్లో తమ దేశానికి హెచ్‌ 1 బి వీసా మీద వచ్చే వారు లక్ష డాలర్లు(88 లక్షలరూపాయలు) చెల్లించాల్సి ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయం భారతీయులను విస్మయానికి గురిచేసింది. అనేక మంది డాలర్‌ కలలు కల్లలైనట్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయానికి ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా కార్పొరేట్లు తెచ్చే వత్తిడికి లొంగి సవరించుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ప్రపంచ వ్యాపితంగా మేథోవలస-తిరిగి రాకల గురించి మధనం ప్రారంభమైంది.ట్రంప్‌ నిర్ణయం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది మరికొంత స్పష్టత వచ్చిన తరువాతనే చెప్పుకోవటం మంచిది. ఈ సందర్భంగా వచ్చిన కొన్ని వ్యాఖ్యలు, పత్రికా శీర్షికలు, వాటి వెనుక ఉన్న అంశాల గురించి చూద్దాం. అమెరికా లక్షల డాలర్ల ఫీజు కేవలం ఒక చెడ్డ విధానమేగాక చైనాకు వ్యూహాత్మక బహుమతి అంటూ ఒక బడా ఆంగ్ల పత్రికలో విశ్లేషణ ప్రారంభమైంది. హ్రస్వదృష్టితో ఉన్న అమెరికా వైఖరి కేవలం చైనా సాంకేతిక ప్రగతి పెరగటానికే తోడ్పడుతుందని కూడా వ్యాఖ్యాత వాపోయారు. విలువైన సంపదలను వెండి పళ్లెంలో పెట్టి చైనాకు అప్పగిస్తున్నారంటూ మరొకరు. ఎవరు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా గడచిన ఐదు దశాబ్దాల చరిత్రను చూసినపుడు అమెరికా, ఇతర ధనిక దేశాల విధాన నిర్ణేతలు, మేథావులు అనుసరించిన విధానాలు, అడ్డుకోవటాలు జనచైనా ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయన్నది జగమెరిగిన సత్యం. చైనా గురించి ఈ మాటలు చెబుతున్నవారు ట్రంప్‌ నిర్ణయం భారత్‌కు బహుమతి అని ఎందుకు చెప్పలేకపోయారు ? అత్తారింటికి దారేది సినిమాలో పదిలక్షల రూపాయల సూట్‌కేసును పవన్‌ కల్యాణ్‌ బహుమతిగా ఇస్తే దాన్ని తీసుకు వెళ్లిన ఆలీ తాళం రావటం లేదంటూ తిరిగి వచ్చిన దృశ్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆకస్మికంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని స్థితిలో పదకొండేండ్ల మోడీ పాలన మనదేశాన్ని ఉంచిందని భావించాలా ? ఎందుకంటే ఏది జరిగినా మోడీ కారణంగానే అంటున్నారు గనుక ఇలా వ్యాఖ్యానించాల్సి వస్తోంది.

ప్రతిభావంతులకు చైనా,బ్రిటన్‌ వల అన్నది ఒక ప్రముఖ తెలుగు పత్రిక శీర్షిక. అమెరికా అడ్డుకుంటే ప్రతిభను వృధా కానివ్వాలా ? ఆ పని మనమెందుకు చేయటం లేదని ప్రశ్నించాల్సిన వారు ఇతర దేశాల గురించి అలాంటి పదజాలంతో కించపరుస్తూ వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి కె వీసాల జారీతో చైనా ఎంతో చురుకుగా ప్రపంచంలోని స్టెమ్‌ (సైన్సు,టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత) మేథావులను ఆకర్షిస్తున్నదని ట్రంప్‌ ప్రకటన తరువాత వార్తలు వెలువడ్డాయి. నిజానికి చైనా నిర్ణయం ఎంతో ముందుగానే తీసుకున్నది. మన మీడియా, అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ మన పాలకులు చైనా చర్యలను గుర్తించలేదు, అసలు ప్రయత్నం కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు.మనం లేకపోతే అమెరికాకు గడవదు అని మనజబ్బలు మనం చరుచుకున్నాం తప్ప అసలు వారెందుకు ప్రపంచమంతటి నుంచీ మేథావంతులను ఆకర్షిస్తున్నారు, తేడా వచ్చి ఆకస్మికంగా అడ్డుకుంటే ప్రత్యామ్నాయం ఏమిటి అని 2047 విజన్‌ గురించి చెబుతున్న నరేంద్రమోడీ గానీ, అంతకు ముందే విజన్లను ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గానీ ఎప్పుడైనా ఆలోచించారా ? కాక మీద ఉన్నపుడే ఇనుము మీద దెబ్బలు వేసి అవసరానికి అనుగుణంగా మలుచుకోవాలి. ఇప్పుడు యువత కూడా ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. అమెరికాగాకపోతే ఆస్ట్రేలియా, అదిగాక పోతే ఆఫ్రికా అన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు. సంచార తెగమాదిరి ఎక్కడికో అక్కడికి పోవటం తప్ప మన దేశం పురోగమించటం గురించి, గౌరవ ప్రదమైన ఉపాధి గురించి ఎందుకు ఆలోచించరు ?

అమెరికా వ్యూహాత్మకంగా స్వయంగా చేసిన తప్పిదం అంటున్నారు సరే, దాంతో మనకు పోయేదేమీ లేదు, మనం ఎందుకు వ్యూహాత్మకంగా ఆలోచించలేదు అని కదా పాఠాలు తీసుకోవాల్సింది. చైనా కె వీసా ఎంతో స్మార్ట్‌గా, వ్యూహాత్మకంగా, నిర్దాక్షిణ్యమైన అవకాశవాదంతో ( రూత్‌లెస్లీ ఆపర్చ్యునిస్టిక్‌) ఉందని కూడా ఉక్రోషం వెలిబుచ్చారు. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకొనేందుకు చైనాలోని ఏదో ఒక కంపెనీ ఇచ్చే అవకాశంతో పని లేదు. అనుభం కూడా అవసరం లేదు. వారు కోరిన అర్హతలు ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతిభావంతులను ఆకర్షించటం ఇప్పుడే ప్రారంభం కాలేదు. వేయి ప్రతిభల పథకం(టిటిపి) పేరుతో చైనా 2008 నుంచే ఆకర్షించటం ప్రారంభించింది. అయితే చైనా మీద ఉన్న తప్పుడు ప్రచారం, అమెరికాతో పోలిస్తే దక్కే ప్రతిఫలం తక్కువగా ఉండటం, కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వం అనే వ్యతిరేక భావనలు ఇలా అనేక అంశాలు చైనా వైపు చూడటానికి యువతను అడ్డుకున్నాయి. అది కూడా చాపకింద నీరులా తన పథకాన్ని అమలు జరిపింది తప్పహడావుడి చేయలేదు. ఇప్పుడు చైనా సాధిస్తున్న పురోగతి, ఇతర దేశాల్లో విధిస్తున్న ఆంక్షలు, జాత్యహంకారం వంటి వివక్ష ఇతర సమస్యల కారణంగా గతంలో మాదిరి అడ్డుకొనే అవకాశాలు పరిమితం. అనేక మంది వైద్య విద్యకోసం చైనా వెళ్లిన సంగతి తెలిసిందే.

మన దేశానికి ట్రంప్‌ మంచి అవకాశాన్ని కల్పించాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవటం మన విధాన నిర్ణేతలు, పాలకుల చేతుల్లో ఉంది. సేవారంగంలో మన యువత ముందంజలో ఉంది.మొత్తంగా చూసినపుడు సాధించాల్సింది ఇంకా ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది. ప్రపంచంలో పరిశోధన మరియు అభివృద్ధి మీద చేస్తున్న ఖర్చు వంద రూపాయలు అనుకుంటే మనం చేస్తున్నది కేవలం రు.2.90 మాత్రమే. అదే అమెరికా 24.8, చైనా 22.80 ఖర్చు చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ప్రపంచంలో నవకల్పనలకు పేటెంట్‌ హక్కులు లభిస్తున్నాయి. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం 2023లో చైనా అత్యధికంగా 16,19,268 దరఖాస్తులు సమర్పించగా 7,98,347 మంజూరయ్యాయి. రెండవ స్థానంలో ఉన్న అమెరికా 5,94,340కి గాను 3,20,410 పొందింది. మన విషయానికి వస్తే ఐదవ స్థానంలో 70,068 మాత్రమే సమర్పించి 30,490 పొందాము. మూడవ స్థానంలో ఉన్న జపాన్‌ 2,89,530కి గాను 2,01,420, నాలుగవది దక్షిణ కొరియా 2,37,633కు గాను 1,35,180 పొందాయి. ఏదైనా పిండికొద్దీ రొట్టె.గడచిన పదకొండు సంవత్సరాలుగా అంతకు ముందు కూడా పరిశోధన, అభివృద్ధికి మనదేశం చేసిన ఖర్చు పెరగలేదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తే ఇలాగే ఉంటుంది.పోనీ వాటినైనా వెలికి తీస్తారా అంటే అదీ చేయరు. పడక కుర్చీ కబుర్లు చెబుతుంటారు. యుద్ద ప్రాతిపదికన కొన్ని సంవత్సరాల పాటు అవసరమైన నిధులు కేటాయించి ప్రోత్సహిస్తే మనం కనీసం మూడవ స్థానానికి చేరుకుంటాం.ఈ అవకాశాన్ని మోడీ సర్కార్‌ సద్వినియోగం చేస్తుందా ? చౌకబారు రాజకీయాల మీదనే కేంద్రీకరిస్తుందా ? కొంత మంది అంచనా వేస్తున్నట్లు రానున్న రోజుల్లో ప్రావీణ్యం అసలైన శక్తిగా ముందుకు రానుంది. దీన్ని చైనా ఎప్పుడో గుర్తించింది, అమెరికా ఇప్పుడు నేర్చుకుంటున్నది, మరి మనం ? అవు సైన్సును నమ్ముకుంటే గోమూత్రం, పేడ దగ్గరే ఉండిపోతాం. వార్షిక ప్రపంచ రాంకింగ్‌లను చూసినపుడు చైనా విద్యా సంస్థల పురోగతి స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పటికీ చైనాను గుడ్డిగా వ్యతిరేకించే వారు అది అనుకరించేది తప్ప నవకల్పనలు చేసేది కాదని వాదిస్తారు. వారిని అలాగే ఉండనిద్దాం, వాస్తవాలను చూద్దాం. అమెరికాకు చెందిన న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ నివేదికలో 105 దేశాలకు చెందిన 2,250 ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ సంవత్సరం బీజింగ్‌లోని సిన్హువా విశ్వవిద్యాలయం ప్రపంచ రాంకుల్లో పదకొండవ స్థానం పొందింది. పెకింగ్‌, ఝెజియాంగ్‌ 25,45వ స్థానాల్లో ఉన్నాయి. 2018లో సిన్హువా, పెకింగ్‌ 50, 68 స్థానాలతో తొలి వందలో ఉన్నాయి.ఈ ఏడాది వాటి సంఖ్య పదిహేనుకు చేరింది.చైనాలో అమలు జరిపిన కరోనా ఆంక్షలు, అంతకు ముందే 2018లో ట్రంప్‌ తొలి పాలనా కాలంలో ప్రారంభమైన అమెరికా వేధింపులు పెరగటంతో 2019-20లో 3,72,532గా అమెరికాలో చదివిన చైనా విద్యార్థుల సంఖ్య 2023-24లో 2,77,398కి తగ్గింది. దీంతో ఇప్పుడు మన దేశం మొదటి స్థానంలోకి వెళ్లింది.

ఇప్పటి వరకు చైనా నుంచి అమెరికాకు మేథోవలస జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగి రావటం ప్రారంభమైంది. దీనికి అక్కడ పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు పెరగటంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులో చైనాను విస్మరించలేని స్థితికి చేరుకోవటం, అక్కడ కూడా అనేక స్టార్టప్‌లు ప్రారంభించటానికి ప్రభుత్వం అవకాశం కల్పించటం వంటి కారణాలు దీనికి దోహదంచేస్తున్నాయి.2035 నాటికి ప్రపంచ అగ్రస్థానంలో సాంకేతిక రంగాన్ని నిలబెట్టేందుకు చైనా పూనుకుంది. అందుకు అవసరమైన పెట్టుబడిలో అమెరికాతో పోటీపడుతోంది.ఓయిసిడి సంస్థ సమాచారం ప్రకారం పదేండ్ల క్రితం అమెరికా చేసిన పరిశోధన ఖర్చులో 72శాతం చేసిన చైనా 2023నాటికి 780 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 96శాతానికి చేరుకుంది. పరిశోధన ఉత్పత్తిలో 2017లోనే అమెరికాను అధిగమించింది. డీప్‌ సీక్‌ సంచలనం తెలిసిందే. దానిలో పనిచేసిన వారందరూ చైనా యువకులే.కొంత మందికి ఎక్కడా పని చేసిన అనుభవం కూడా లేదు. దీనితో పాటు ఝజియాంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాడ్యుయేట్లు డీప్‌ రోబోటిక్స్‌లో ప్రావీణ్యం పొందారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ప్రమాదకరమైన హై ఓల్టేజి సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తున్నారు. సిలికాన్‌ వాలీతో పోటీ పడేట్లుగా చైనా ప్రోత్సహిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞాన ఎగుమతులపై అమెరికా విధించిన నిషేధాలను సవాలుగా తీసుకుంది.అవకాశాలను అందిపుచ్చుకోవటంలో చైనాను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 1970దశకంలో అనివార్యమైన స్థితిలో ఐరాస భద్రతా మండలిలో కమ్యూనిస్టు చైనాను అసలైన శాశ్వత ప్రతినిధిగా అమెరికా గుర్తించాల్సి వచ్చింది.

దాని కొనసాగింపుగా చైనా ప్రారంభించిన సంస్కరణలను సొమ్ము చేసుకోవాలని అమెరికా భావించింది. తాత్కాలిక లాభాలను అమెరికన్లు చూస్తే దీర్ఘకాలిక లక్ష్యంతో సంస్కరణలను చైనా తలపెట్టింది.1978 వరకు అమెరికా ఉన్నత విద్యా సంస్థలలో చైనీయులకు ప్రవేశం లేదు. సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకొనే ప్రక్రియలో భాగంగా అమెరికా సైన్సు సలహాదారు ఫ్రాంక్‌ ప్రెస్‌ బీజింగ్‌ సందర్శనకు వచ్చాడు. అక్కడి నుంచి నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు ఫోన్‌ చేసి తమ విద్యార్థులు ఐదువేల మందిని అమెరికా విద్య కోసం పంపేందుకు ఆసక్తితో ఉన్నట్లు చైనా చెప్పిందని, ఏం చేయమంటారని అడిగాడు. ఐదువేలేం ఖర్మ లక్ష మందిని పంపవచ్చని వారికి చెప్పండని కార్టర్‌ సమాధానమిచ్చాడట. అలా వెళ్లిన లక్షలాది మంది చైనా విద్యార్ధులు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏటా 15 బిలియన్‌ డాలర్ల లబ్ది కలించారు.ఆ విధంగా అమెరికా మేథోవలసను ప్రోత్సహించి ఎంతోలబ్ది పొందింది. అక్కడి మార్కో పోలో అనే మేథో సంస్థ ప్రపంచ కృత్రిమే మేథ సర్వే చేసింది. అమెరికాలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధకుల్లో 37శాతం మంది అమెరికన్లు కాగా చైనీయులు 38శాతం ఉన్నట్లు తేలింది.చాట్‌ జిపిటి 4 ప్రాజెక్టులో కీలకమైన సేవలు అందించిన వారిలో 20శాతం మంది చైనీయులే. వీటన్నింటిని చూసిన తరువాత భయపడిన అమెరికన్లు పొమ్మనకుండా చైనీయులకు పొగ పెట్టారు. మా దేశంలో చదువుకొనేందుకు రావచ్చు గానీ స్టెమ్‌ కోర్సుల బదులు, మావవ, సామాజిక శాస్త్రాలను ఎంచుకోవాలని వత్తిడి తెస్తున్నది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన కోర్సులో ప్రవేశాన్ని పరిమితం చేసింది. అందుకే చైనీయులు వేలాది మంది స్వదేశం బాట పట్టి అమెరికాకు పాఠం చెప్పేందుకు పూనుకున్నారు. మోడీ సర్కార్‌ మనవారికి అలాంటి అవకాశాలను కల్పిస్తుందా అన్న శేష ప్రశ్న !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చెవిలో పూలు : పాకిస్థాన్‌ ప్రాజెక్టుల నుంచి చైనా తప్పుకుందా, కాషాయ దళాలు, మీడియా కథనాల్లో నిజమెంత !

07 Sunday Sep 2025

Posted by raomk in Africa, BJP, CHINA, Congress, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BRI, China, CPEC, Narendra Modi Failures, pakistan, RSS, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


‘‘ పాకిస్థాన్‌ 60 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నడవా ప్రాజెక్టు నుంచి వైదొలిగిన చైనా, నిధుల కోసం ఎడిబిని ఆశ్రయించిన ఇస్లామాబాద్‌ ’’ ఇది కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.ఇదే అర్ధం వచ్చేవి మరికొన్నింటిలో వున్నాయి. దీనికి కాషాయ దళం చెప్పిన భాష్యం మచ్చుకు ఒకటి ఇలా ఉంది. ‘‘ భారత జాతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కనెక్టివిటీని మోడీజీ వ్యతిరేకించిన తరువాత (సిపిఇసి ప్రాజెక్టులో స్పష్టంగా సూచించడం) చైనా పాకిస్తాన్‌ యొక్క 60 బిలియన్‌ డాలర్స్‌ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ఇది భారతదేశానికి దౌత్యపరంగా అతిగొప్ప విజయం, పాక్‌కు చావు దెబ్బ ’’ అని పేర్కొన్నారు. ఇది నిజమా ? మొదటి అవాస్తవం ఏమిటంటే నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగాక ముందే దానికి నాంది పలికిన 2013లోనే నాటి యుపిఏ ప్రభుత్వం ఈ పథకానికి అభ్యంతర తెలుపుతూ వ్యతిరేకించింది. ఎందుకు ? పాక్‌ ఆక్రమిత్‌ కాశ్మీరులో భాగమైన గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంలో 600 కిలోమీటర్ల పొడవున పాకిస్థాన్‌ మరియు చైనా నడవా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు మరియు రైలు మార్గ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు సాగుతుంది. అది చైనాలోని షింజియాంగ్‌ స్వయంపాలిత ప్రాంతం నుంచి మొదలై మూడువేల కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్‌ అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్‌ రేవు వరకు ఉంటుంది. గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంపై మనదేశం హక్కును వదులుకోలేదు గనుక ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని మన ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయినప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు.2014లో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సర్కార్‌ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వివిధ సందర్భాలలో నిరసన తెలుపుతూనే ఉంది. వాస్తవం ఇది కాగా, కొత్తగా మోడీ వ్యతిరేకత తెలిపినట్లు దానికి తలొగ్గి ప్రాజెక్టు నుంచి చైనా వైదొలిగినట్లు చెప్పటం జనాల చెవుల్లో పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.


నిజానికి మన్మోహన్‌ సింగ్‌ గానీ, నరేంద్రమోడీ గానీ ఈ సమస్య మీద పెద్దగా చేసిందేమీ లేదు. వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇద్దరూ చైనాతో ఇతర సంబంధాలను కొనసాగించారు. షాంఘై సహకార సంస్థలో మనదేశం 2005 నుంచి పరిశీలకురాలిగా 2014వరకు ఉంది. ఆ ఏడాది మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. మనదేశమూ, పాకిస్థాన్‌ రెండూ 2017లో ఒకేసారి సభ్యత్వం పొందాయి. అప్పుడు సిపిఇసి నడవాను ఒక సమస్యగా మోడీ ముందుకు తేలేదు. నరేంద్రమోడీ హయాంలో 2020 గాల్వన్‌లోయ ఉదంతాల ముందుకు వరకు చైనాతో సంబంధాలు మరింత ముందుకు పోయాయి.ఐదేండ్ల తరువాత తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) 25వ వార్షిక సమావేశాలకు నరేంద్రమోడీతో పాటు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా హాజరయ్యారు. మోడీ వెంటనే తిరిగి రాగా సెప్టెంబరు మూడున జపాన్‌పై రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా సాధించిన విజయం 80వ వార్షికోత్సవ మిలిటరీ పరేడ్‌లో ఒక అతిధిగా షరీఫ్‌ పాల్గొన్నారు.ఆ ఉత్సవానికి నరేంద్రమోడీకి కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరు కాలేదు. ఎస్‌సిఓ సమావేశాలలో సిపిఇసి గురించి అభ్యంతరాలు తెలిపినట్లుగానీ, చైనా నేతలతో మాట్లాడినట్లుగానీ ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాలేదు. కానీ కొద్ది రోజుల తరువాత మీడియాలో వచ్చిన కథనాలను పట్టుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ తనదైన శైలిలో రాసింది. ఆరు రోజులు పాటు చైనాలో ఉన్నప్పటికీ షెహబాజ్‌ షరీఫ్‌ సిపిఇసికి రెండవ దశ పెట్టుబడుల విషయంలో విఫలమయ్యారు.పరిమితమైన అవగాహన ఒప్పందాలు మాత్రమే చేసుకున్నారు.పెద్ద పెట్టుబడులేమీ లేవు. సిపిఇసి 2.0 ప్రారంభమైనట్లు షెహబాజ్‌ ఏకపక్షంగా ప్రకటించారు తప్ప చైనా వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేదు.పరేడ్‌లో చైనా అధ్యక్షుడు తనతో పాటు పుతిన్‌, ఉత్తర కొరియా కిమ్‌ను తప్ప షెహబాజ్‌ను పట్టించుకోలేదు.పుతిన్‌తో సంభాషించినపుడు చెవులకు ఫోన్లను కూడా షరీఫ్‌ సరిగా అమర్చుకోలేకపోయారంటూ రాసింది. పాకిస్థాన్‌తో సిపిఇసి పెట్టుబడుల నుంచి వెనక్కు తగ్గినట్లు చైనా అధికారిక ప్రకటనను ఆర్గనైజర్‌ లేదా కథనాలు రాసిన ఇతర పత్రికలు చూపగలవా ?

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎటుతిప్పి ఎటురాసినా కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఇవ్వటం లేదని చైనా చెప్పిందని, గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు తగ్గిందని, ఆ మొత్తాన్ని ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు (ఏడిబి) నుంచి తీసుకోవాలని పాక్‌ నిర్ణయించిందని రాశాయి. పదే పదే ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకుంటున్న పాకిస్థాన్‌కు తాము ఇచ్చిన రుణాలను చెల్లించే సత్తాదానికి ఉందా అనే అనుమానాలు చైనాకు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక స్నేహితుడి కోసం మరొకర్ని వదులుకోలేమని ఇటీవల పాక్‌ ఆర్మీ ప్రధాన అధికారి అసిమ్‌ మునీర్‌ చెప్పాడని, దాంతో చైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదన్నట్లుగా వర్ణించారు. ఇదే సమయంలో 8.5 బిలియన్‌ డాలర్లను వివిధ పథకాలకు చైనా అందించేందుకు పాక్‌ ప్రధానితో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలను మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు. రెండు బిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు తిరస్కరించిన చైనా కొత్తగా 8.5బి.డాలర్లు ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించినట్లు ? ఈ మొత్తాన్ని సిపిఇసి 2.0లో ఐదు కొత్త కారిడార్లు, అదే విధంగా ఇతర రంగాలలో వినియోగించనున్నట్లు ప్రముఖ పాక్‌ పత్రిక డాన్‌ రాసిందని మనదేశ వార్తా సంస్థ పిటిఐ పేర్కొన్నది. తొలిసారిగా పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఒక సంస్థ సిపిఇసిలో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిందని కూడా వార్తల్లో రాశారు.చైనాకు లాభదాయకం కాని వాటిలో అదెందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? సమాధానం ఉండదు.


నిజానికి ఇలాంటి కథనాలు రావటం ఇదే కొత్త కాదు. 2024 జూన్‌ 11న బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక రాసిన కథనానికి ‘‘ సిపిఇసి 2.0లేదు, భారీ పెట్టుబడులు లేవని పాకిస్థాన్‌కు చెప్పకనే చెప్పింది ’’ అనే శీర్షిక పెట్టింది. ఐదు రోజుల పర్యటన జరిపిన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పర్యటనకు ముందు ఇస్లామాబాద్‌ అధికారులు సిపిఇసి మరొక ఉన్నత స్థాయికి తీసుకువెళతారని చెప్పారని అయితే ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని, పాక్‌ ఆశల మీద చైనా నీళ్లు చల్లిందని, పరిమిత లబ్దితోనే తిరిగి వెళ్లినట్లు నికీ ఆసియా రాసిందని దాన్లో పేర్కొన్నారు. ఏడాది క్రితం మోడీ చైనా వెళ్లలేదు, దానితో సాధారణ సంబంధాల స్థితి కూడా లేదు, అప్పుడెందుకు చైనా అలా వ్యవహరించిందో మీడియా ‘‘ వంట ’’ వారు, కాషాయ దళాలు చెప్పగలవా ? ‘‘పాకిస్థాన్‌ : ఎందుకు చైనా సిపిఇసి ప్రాజెక్టులు నిలిపివేసింది ?’’ అనే శీర్షికతో ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ (ఒఆర్‌ఎఫ్‌) వెబ్‌సైట్‌లో 2020 నవంబరు 25వ తేదీన అయిజాజ్‌ వానీ రాసిన విశ్లేషణను ప్రచురించింది. అప్పుడు గాల్వన్‌లోయ ఉదంతాలతో చైనాతో మనదేశం వైరంలో ఉంది తప్ప మిత్రదేశంగా లేదు కదా, ఆ నాడే అలా ఎందుకు రాయాల్సి వచ్చినట్లు ? నరేంద్రమోడీ నిరసన లేదా పలుకుబడి ఏమైనట్లు ? అప్పటికే కొన్ని అంశాలను నిలిపివేసినట్లు అయిజాజ్‌ వానీ రాశారు. పాకిస్థాన్‌లో మాంద్యం, అవినీతి,బెలూచిస్తాన్‌ ఇతర తిరుగుబాట్లు వంటి అంశాలతో అనేక ప్రాజక్టులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.


సిపిఇసి అవకాశాన్ని పాకిస్థాన్‌ వృధా కావించిందని, మద్దతు గురించి చైనా పునరాలోచనలో పడిరదని సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయ మాజీ ఫ్రొఫెసర్‌ సజ్దాద్‌ అష్రాఫ్‌ 2025 మే రెండవ తేదీన రాశారు. పదేండ్ల తరువాత పాకిస్థాన్‌ అసమర్ధత, రాజకీయ అవకతవకల వంటి కారణాలతో అనేక కీలక ప్రాజెక్టులు ఆలశ్యం,వాయిదా పడటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం.2015 ఏప్రిల్‌ 20న షీ జింపింగ్‌ ఇస్లామాబాద్‌లో ఎంతో అట్టహాసంగా ప్రాజెక్టును ప్రారంభించారు. పదేండ్ల తరువాత తలపెట్టిన 90 పథకాల్లో 38 పూర్తి కాగా మరో 23 నిర్మాణంలో ఉన్నాయి. మూడోవంతును ఇంతవరకు ముట్టుకోలేదు. దీనికి బాధ్యత పరిమితంగా చైనాది కాగా ఎక్కువగా ఇస్లామాబాద్‌దే ఉంది. అత్యంత కీలకమైన ప్రత్యేకించి సెజ్‌లు, పారిశ్రామికవాడలు పూర్తికాలేదు. దీనికి పాకిస్థాన్‌ రాజకీయ నేతలు, ఆసక్తి కనపరచని, సమన్వయం లేని ఉన్నతాధికారులదే బాధ్యత. వీటికి కేటాయించిన వనరులను ఆర్థికంగా పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ ఉండని లాహార్‌ మెట్రో రైలు ప్రాజక్టుకు మళ్లించారు. ఇలాంటి వాటికి తోడు 2021 నుంచి ప్రాజెక్టులలో పని చేస్తున్న చైనా సిబ్బందికి రక్షణ కల్పించటంలో తీవ్ర పరిస్థితి ఏర్పడిరది. అప్పటి నుంచి 14దాడులు జరగ్గా 20 మంది మరణించారు, 34 మంది గాయపడ్డారు. వీటిలో ఎక్కువ భాగం బెలూచిస్తాన్‌లో జరిగాయి. దౌత్యపరంగా ఇప్పటికీ సిపిఇసికి చైనా మద్దతు ఉన్నప్పటికీ 2023 తరువాత కొత్త పెట్టుబడుల పట్ల వెనక్కి తగ్గుతున్నది.


చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ(బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌) పెట్టుబడి పథకాన్ని ప్రారంభం నుంచి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వాటి ఆధ్వర్యాన నడిచే ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌, గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ గుండా రోడ్డు, రైలు మార్గాల నిర్మాణాన్ని కారణంగా చూపినప్పటికీ మనదేశం కూడా దానికి వ్యతిరేకమే అనే చెప్పాలి. పాకిస్థాన్‌లో రాజకీయ, ఇతర కారణాలతో అక్కడి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. బెలూచిస్తాన్‌లోని ఉగ్రవాద శక్తులు చైనా జాతీయుల మీద చేసిన దాడుల వెనుక బిఆర్‌ఐని వ్యతిరేకించే దేశాలు ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యలు, వాటి పరిణామాలు, పర్యవసానాల గురించి చైనాకు తెలిసినప్పటికీ ఎందుకు చేపట్టిందన్నది ప్రశ్న. ప్రపంచ ఫ్యాక్టరీగా తయారైన తరువాత దాని ఎగుమతులు, దిగుమతులు తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో యూరేషియా, ఆఫ్రికా దేశాలకు చేరేందుకు గల మార్గాలను అన్వేషించినపుడు సిపిఇసి ముందుకు వచ్చింది. దక్షిణ చైనా సముద్రం, మలక్కా జలసంధి ద్వారా రవాణా కంటే పశ్చిమ చైనాలోని షిజియాంగ్‌(ఉఘిర్‌) స్వయంపాలిత ప్రాంతం నుంచి పాక్‌ అరేబియా సముద్రరేవు పట్టణం గద్వార్‌ వరకు రవాణా సదుపాయాల ఏర్పాటు లాభదాయకమని భావించింది. చరిత్రలో ఇంగ్లీష్‌ ఛానల్‌ ప్రాంతంలో బ్రిటన్‌ మరియు ఫ్రాన్సును కలుపుతూ ఏర్పాటు చేసిన భూగర్భ రైల్వే టన్నెల్‌, పనామా, సూయజ్‌ కాలవల తవ్వకం అలా జరిగిందే. ప్రస్తుత పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో 51 ఒప్పందాల ద్వారా 46 బిలియన్‌ డాలర్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రారంభించారు. ఇప్పుడు అది 65 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని అంచనా. మధ్యలో కరోనా, ఇతర సమస్యలతో అనుకున్నంత వేగంగా పూర్తి కావటం లేదు. ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌ నుంచి 60 బిలియన్‌ డాలర్ల ప్రాజక్టు నుంచి చైనా వైదొలిగిందని రాస్తే జనం నమ్మాలా ? ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా శాశ్వతంగా ఉంటుందని భావించి మనదేశం అక్కడ మూడు బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. మనకు కూడా చెప్పకుండా అమెరికన్లు 2021లో అక్కడి నుంచి బతుకుజీవుడా మమ్మల్ని ప్రాణాలతో పోనిస్తే చాలంటూ ఆయుధాలు, రవాణా వాహనాల వంటి వాటన్నింటినీ వదిలి కాలికి బుద్ది చెప్పటాన్ని చూశాము. అప్పటి నుంచి మనదేశం తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా తెరవెనుక వారితో మంతనాలు జరుపుతూ పెట్టుబడులను రాబట్టుకొనేందుకు చూస్తున్న సంగతి బహిరంగ రహస్యం. వదలివేసినట్లు ఎక్కడా ప్రకటించలేదు. జూలై మొదటి వారంలో తాలిబాన్‌ సర్కార్‌ను గుర్తించిన ఏకైక దేశం రష్యా. దానితో మనకున్న సంబంధాలను ఉపయోగిస్తామని వేరే చెప్పనవసరం లేదు. అలాంటిది 60 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను అర్ధంతరంగా పాకిస్థాన్‌కు వదలి వట్టి చేతులతో చైనా తిరిగి వెళుతుందని మీడియాలో కొందరు రాస్తే, నరేంద్రమోడీ అభ్యంతరంతోనే ఆపని చేసిందని కాషాయదళాలు జనాన్ని నమ్మించేందుకు చూడటం నిజంగానే దుస్సాహసం. జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరని వారికి చెప్పకతప్పదు !

. 

Share this:

  • Tweet
  • More
Like Loading...

షాంఘై సహకారం : ట్రంప్‌ను హెచ్చరించిన జింపిగ్‌, భారత పర్యటన రద్దు, స్వరం మార్చిన అమెరికా !

03 Wednesday Sep 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BJP, Donald trump, Narendra Modi, RSS, SCO Summit 2025, Shanghai Cooperation Organisation, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


కొన్ని సమయాలలో కొందరు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేం. అదే మాదిరి అంతర్జాతీయ రాజకీయాల ఎత్తులు జిత్తులలో భాగంగా సంభవించే పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. ఆగస్టు 31, సెప్టెంబరు ఒకటవ తేదీలలో చైనాలోని రేవు పట్టణమైన తియాన్‌జిన్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) 25 వార్షిక సమావేశం జయప్రదంగా జరిగింది. దాని చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం అని చెప్పవచ్చు.ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పేందుకు ఈ సభ నాంది పలుకుతుందా ? పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయంటూ సానుకూలంగా, ప్రతికూలంగా ఉండే పండితులందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. చైనా, భారత్‌ మధ్య వెల్లవిరిసిన స్నేహం మరింతగా విస్తరిస్తుందా లేదా అని కమ్యూనిస్టులు, పురోగామి శక్తులలో ఒకింత ఆనందం, అదే స్థాయిలో సందేహాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఒక్క ఈ తరగతికి చెందిన వారే కాదు చైనా, కమ్యూనిజాలను వ్యతిరేకించే, అమెరికాను భక్తితో కొలిచే కాషాయ దళాలు, ఇతరులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. జరుగుతున్న పరిణామాలు వారికి ఏమాత్రం మింగుడు పడటం లేదంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు తియాన్‌జిన్‌లో నరేంద్రమోడీ చైనా ఎర్రజెండా కారులో ప్రయాణం, ఉపన్యాసాలు, కరచాలనాలు, ఆత్మీయపలకరింపులు జరుగుతుండగానే అమెరికాలో కలవరం మొదలై స్వరం మార్చి ప్రకటనలు చేయటం ప్రారంభించారు. ఎవరేం మాట్లాడుతున్నారో తెలియకుండా గందరగోళంగా మాట్లాడారు. తమ కౌగిలిలోకి వస్తారని భావించిన నరేంద్రమోడీ షీ జింపింగ్‌, పుతిన్‌తో చేతులు కలపటంతో డోనాల్డ్‌ ట్రంప్‌లో ఉక్రోషం కట్టలు తెగింది. ఈ ఏడాది చివరిలో తలపెట్టిన క్వాడ్‌ సమావేశంలో పాల్గొనేందుకు రావాల్సిన మనదేశ పర్యటనను రద్దు చేసుకున్నాడు. చివరి క్షణంలో మనసు మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. అయితే తెగేదాకా లాగామా అన్న మలి ఆలోచనలో అమెరికన్లు పడ్డారనే చెప్పాలి.బహుశా ఆ కారణంగానే నవంబరులో వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని మన వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ చెప్పారా ? చైనాకు దగ్గర అవుతున్నామన్న సందేశంతో అమెరికాతో మోడీ బేరమాడేందుకు పూనుకున్నారా ? ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. ఒకటి మాత్రం నిజం రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ఎవరు తగ్గినా జనంలో గబ్బుపట్టటం ఖాయం.


షాంఘై ఐదు పేరుతో 1996 ఏప్రిల్‌ 26న చైనా, పూర్వపు సోవియట్‌ యూనియన్‌ విచ్చిన్నమైన తరువాత స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన రష్యా, కజకస్తాన్‌, కిర్ఖిరిaస్తాన్‌, తజికిస్తాన్‌లతో పాటు చైనా భాగస్వామిగా ఒక బృందం ప్రారంభమైంది. వాటిన్నిటికీ చైనాతో సరిహద్దు సంబంధాలు కొత్తగా ఏర్పడటంతో మిలిటరీ ఖర్చు తగ్గించుకొనేందుకు, పరస్పరం విశ్వాసం పాదుకొల్పటం వాటి ఒప్పంద అసలు లక్ష్యం. రెండవ సమావేశంలోనే బహుధృవ ప్రపంచం గురించి 1997 మాస్కో సమావేశంలో చైనా, రష్యా నేతలు ఒక ప్రకటన చేశారు. అంటే చక్రవర్తి, సామంత రాజులు అని గాకుండా ఎవరి స్వతంత్రవైఖరిని వారు కలిగి ఉండటం, పెత్తందారీ పోకడలకు దూరంగా, సహకరించుకోవటాన్ని సంకల్పంగా ప్రకటించారు. తరువాత 2001 జూన్‌ 21న ఆరవ దేశంగా ఉజ్బెకిస్తాన్ను చేర్చుకోవటమే కాదు షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) ఏర్పడి భాగస్వాముల మధ్య సహకారాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. తరువాత వివిధ సంస్థల ఏర్పాటుతో పాటు ఆర్థిక, భద్రతా విషయాల్లో కూడా చొరవ తీసుకొనేందుకు ముందుకు పోయారు. తరువాత దానిలో భారత్‌, పాకిస్తాన్‌, ఇరాన్‌, బెలారస్‌ సభ్య దేశాలుగా చేరాయి. ఇవి గాక 17దేశాలు చర్చల భాగస్వాములుగా, ఐక్యరాజ్యసమితి, ఆసియన్‌ కూటమి, పూర్వపు సోవియట్‌ రిపబ్లిక్‌లుగా ఉండి స్వతంత్రదేశాలైన వాటితో కూడిన కామనవెల్త్‌ ఇండిపెండెంట్‌ కంట్రీస్‌(సిఐఎస్‌) సంస్థ, తుర్క్‌మెనిస్తాన్‌ అతిధులుగా ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో ఈ దేశాలు ఉన్నాయి.మొత్తం 50 రంగాలలో సహకరించుకుంటున్నాయి. ఈ దేశాల జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు ఉండగా ప్రపంచ జనాభాలో 42శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.


తియాన్‌జిన్‌ సమావేశాన్ని ప్రారంభించి చైనా నేత షీ జింపింగ్‌ పేరు ప్రస్తావించకుండానే అమెరికాకు తీవ్రమైన హెచ్చరిక చేశాడు. ప్రచ్చన్న యుద్ధ మానసిక స్థితి నుంచి బయటపడాలని, అంతర్జాతీయ సంబంధాలలో అదిరించి బెదిరించే ఎత్తుగడలు, కూటముల ఘర్షణలు సాగవని, నిజాయితీ, న్యాయంతో వ్యవహరించాలని ప్రపంచ నేతలను కోరాడు.సంస్థ సభ్యదేశాలు భద్రత, అభివృద్ధి రంగాలలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని, సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పాడు.మిలిటరీ వ్యవహారాల్లో పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు ప్రారంభమైన ఎస్‌సిఓ ఇప్పుడు సరిహద్దులను అధిగమించి స్నేహ బంధంగా, పరస్పర విశ్వాసం,సహకారంతో విస్తరించిందని, ఈ స్పూర్తిని ముందు ముందు కూడా కొనసాగించాలని షీ జింపింగ్‌ ఆకాంక్షించాడు.విబేధాలను పక్కన పెట్టి పరస్పర లాభదాయకమైన అంశాల మీద కేంద్రీకరించాలని, ఆచరణ ప్రాతిపదికన నిజమైన ఫలితాల సాధన, ఉన్నతమైన సామర్ధ్యంతో వ్యవహరించాలని కోరాడు. సభ్యదేశాలన్నీ స్నేహితులు, భాగస్వాములే అన్నాడు. విబేధాలను గౌరవించాలని, వ్యూహాత్మక సంప్రదింపులతో ఏకాభిప్రాయ సాధనకు రావాలని కోరాడు. భద్రత, ఆర్థికపరమైన సహకారంలో భాగంగా సాధ్యమైనంత త్వరలో ఎస్‌సిఓ అభివృద్ధి బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకుందామని షీ ప్రతిపాదించాడు.ఈ ఏడాదే సభ్యదేశాలకు తాము రెండు బిలియన్‌ యువాన్ల మేర గ్రాంట్లు ఇస్తామని, వాటితో పాటు పది బిలియన్‌ యువాన్లు రానున్న మూడు సంవత్సరాలలో సభ్యదేశాల బాంకుల కన్సార్టియంకు రుణాలు కూడా ఇస్తామన్నాడు. కూటమి దేశాలలో ఇప్పటి వరకు చైనా 84బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది, దాని వాణిజ్య లావాదేవీల విలువ 2024లో 890 బిలియన్‌ డాలర్లు దాటింది. ప్రపంచ జిడిపిలో 23, జనాభాలో 42, ప్రపంచ చమురు నిల్వల్లో 20, గ్యాస్‌లో 44శాతాల చొప్పున ఈ కూటమి దేశాలు కలిగి ఉన్నాయి. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకులకు పోటీగా పెద్దగా షరతులు లేకుండా బ్రిక్స్‌ కూటమి నూతన అభివృద్ది బ్యాంకును కూడా ఏర్పాటు చేసింది, ఇప్పుడు షాంఘై సహకార సంస్థ కూడా మరో బ్యాంకును ఏర్పాటు చేసేందుకు పూనుకుంది.


షాంఘై సహకార సంస్థ సమావేశాలకు ముందే ఆదివారం నాడు షీ జింపింగ్‌ మరియు నరేంద్రమోడీ భేటీ జరిగింది.చైనాతో సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవాలని వాంఛిస్తున్నట్లు మోడీ చెప్పారు. భారత్‌పై అమెరికా పన్నులు, జరిమానాలు అమల్లోకి వచ్చిన తరువాత జరిగిన ఈ సమావేశానికి పరిశీలకులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పరస్పర మన్నన, విశ్వాసం, సున్నితత్వాల ప్రాతిపదికన ఇరుదేశాల సంబంధాలను పెంచుకొనేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. ఏడు సంవత్సరాల తరువాత చైనాను తొలిసారిగా సందర్శించారు. ఇరుదేశాల సంబంధాలను మరింతగా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని, నిరంతరం ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన అభివృద్దిని ముందుకు తీసుకుపోవాలని షీ జింపింగ్‌ ప్రతిస్పందించాడు. ఇరు దేశాల సంబంధాలలో సరిహద్దు సమస్యల నిర్ధారణ అంశాన్ని ముందుకు తేవద్దని, రెండు దేశాల ఆర్థిక అభివృద్ధి మీద ప్రధానంగా కేంద్రీకరించాలని, మనం ప్రత్యర్ధులు గాకుండా భాగస్వాములుగా ఉండాలని కట్టుబడి ఉన్నంతకాలం బెదిరింపులుగాక అభివృద్ధి అవకాశాల మీద దృష్టిపెట్టాలని రెండు దేశాల సంబంధాలు మరింతగా ముందుకు పోయి ఫలించాలన్నాడు.


ఈ వాంఛలను రెండు దేశాలూ వెల్లడిరచటాన్ని చైనాకు భారత్‌ మరింత దగ్గర అవుతున్నట్లు అమెరికా పరిగణిస్తోంది. సరిహద్దుల యాజమాన్యం గురించి ఒక ఒప్పందం, సరిహద్దు వాణిజ్యం, వీసాలు, విమానాల రాకపోకల పునరుద్దరణ, చైనా పెట్టుబడులకు అనుమతి, టిబెట్‌లోని మానససరోవరాన్ని భారత యాత్రీకులకు తెరవటం, విలువైన ఖనిజాలు, ఉత్పత్తులపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేయటం, ఎరువుల సరఫరా పునరుద్దరణ, సొరంగాలను తవ్వే యంత్రాల సరఫరా, అన్నింటికీ మించి చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రముఖుడు, విదేశాంగ మంత్రిగా ఉన్న వాంగ్‌ యి భారత పర్యటనలను ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారానికి వచ్చి ఏడాది కూడా గడవక ముందే ఇవన్నీ జరగటాన్ని అమెరికా జీర్జించుకోలేకపోతోంది. వీటితో పాటు షాంఘై సహకార సంస్థ అమెరికా నాయకత్వంలోని నాటో మిలిటరీ కూటమికి పోటీగా తయారు అవుతుందేమో అన్న భయం కూడా దాన్ని పట్టిపీడిస్తోంది. నిజానికి అలాంటి ఆలోచనలు కూటమిలోని ఏ దేశ అంజండాలో కూడా లేదు. పశ్చిమదేశాల అధికార కూటములకు భిన్నంగా నూతన అంతర్జాతీయ సంబంధాలకు ప్రయత్నిస్తున్నట్లు పాతిక సంవత్సరాల తీరు తెన్నులు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా పెత్తందారీతనాన్ని వ్యతిరేకించటం అంటే మరో మిలిటరీ కూటమిని కట్టటం కాదు.


నాటో, ధనికదేశాలతో కూడిన జి7, ఐరోపా సమాఖ్యకు పోటీగా తయారవుతుందేమో అన్న భయ సందేహాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి అజెండా ఎస్‌సిఓలో ఇంతవరకు లేదు. బ్రిక్స్‌, ఎస్‌సిఓ రెండూ కూడా విస్తరణ దశలో ఉన్నాయి. స్థానిక కరెన్సీలతో వాణిజ్య లావాదేవీలు జరపాలనటంలో వాటి మధ్య ఏకీభావం ఉంది. తొలుత అది విజయవంతమైన తరువాత డాలరుకు పోటీగా మరోకరెన్సీని తీసుకురావచ్చు. రష్యా, భారత్‌, చైనాలతో కూడిన(రిక్‌) కూటమి గురించి కూడా కొందరు చర్చిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి ఆ దిశగా ఎలాంటి పరిణామాలు లేవు.అమెరికా చేసే దాడుల తీవ్రతను బట్టి అజెండాలోకి రావచ్చు. తెగేదాకా లాగినట్లు భావించి లేదా దిద్దుబాటు చర్యల్లో భాగంగా అమెరికా స్వరం మార్చింది. గత కొన్ని దశాబ్దాలుగా వాణిజ్యంలో భారత్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న తమనేత ట్రంప్‌ వ్యాఖ్యల పూర్వరంగంలో రెండు దేశాలూ ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చునని విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ వ్యాఖ్యానించాడు.తాము భారత్‌ నుంచి ఎంతో ఎక్కువగా కొనుగోలు చేయగా తమ నుంచి తక్కువ దిగుమతి చేసుకున్నట్లు ట్రంప్‌ చెప్పాడు. తమ వస్తువుల మీద ఎలాంటి పన్నులు ఉండవని భారత్‌ చెప్పిందనీ అయితే ఇప్పటికే సమయం మించిపోయింది గనుక తాను వెనక్కు తగ్గేదేలేదన్నట్లు మాట్లాడాడు. బెసెంట్‌ ఫాక్స్‌ టీవీతో మాట్లాడుతూ విబేధాలను కూడా పరిష్కరించుకోవచ్చన్నాడు. అన్ని అవకాశాలూ తమ ముందు ఉన్నాయని చెప్పాడు. చిత్రం ఏమిటంటే ట్రంప్‌ కంటే ముందు అమెరికా మరియు భారత సంబంధాల గురించి అమెరికా రాయబార కార్యాలయం పొగిడిరది. ఇరుదేశాల సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయంటూ తమ విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో చేసిన వ్యాఖ్యలను అది ఉటంకించింది. ట్రంప్‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే బెసెంట్‌ భారత్‌ను సంతుష్టీకరించే స్వరంతో మాట్లాడాడు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పాడు. షాంఘై సహకార సంస్థ సమావేశం మొత్తం మీద నాటకీయ వ్యవహారం, తద్దినం లాంటిదని, భారత్‌ ప్రపంచంలో అత్యధిక జనాభాగల ప్రజాస్వామిక దేశం, వారి విలువలు చైనా, రష్యాల కంటే అమెరికాకే దగ్గరగా ఉంటాయన్నాడు. అధ్యక్షుడు, రాయబార కార్యాలయం, ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను చూసినపుడు వారి మధ్య సమన్వయం లేకపోవటంతో పాటు నష్టనివారణకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా చూసినపుడు భారత్‌ను దువ్వేందుకు అమెరికా పూనుకుంది. ఈ నెలలో ఐరాస సమావేశాలకు వెళ్లిన సమయంలో ప్రధాని నరేంద్రమోడీ బృందం ట్రంప్‌తో భేటీ కానున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి, అది జరుగుతుందా లేదా జరిగితే ఏమిటి అన్నది చూడాల్సివుంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చరిత్ర గమనాన్ని మార్చివేస్తున్న కమ్యూనిస్టులు : ప్రతిభావంతులను ఆకర్షిస్తున్న చైనా, బెంబేలెత్తుతున్న అమెరికా !

21 Thursday Aug 2025

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Education, Europe, Germany, History, imperialism, INTERNATIONAL NEWS, Left politics, Opinion, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

China “young talent” K visa, china communist party, China vs US, Donald trump, global scientific talent China, STEM experts, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


అవును ఎవరు అవునన్నా కాదన్నా, మరొకటన్నా ఇది నిజం. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లుగా మేథావులందరూ పశ్చిమదేశాలలోనే పుట్టారు, మిగతా దేశాల వారు అక్కడికే వెళతారు అన్నట్లుగా కొందరు చాలాకాలంగా జనాల మెదళ్లకు ఎక్కించారు. ఇప్పుడు చైనా కమ్యూనిస్టులు దాన్ని తలకిందులు చేస్తున్నారు. గత శతాబ్దిలో ప్రపంచాన్ని ఏలిన చమురుకు ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది. అయితే అదే సర్వస్వం కాదని తేలిపోయింది. దాన్ని పక్కన పెట్టే ‘‘ ప్రతిభ ’’ ప్రత్యామ్నాయ హరిత ఇంథనం, క్వాంటమ్‌, కృత్రిమ మేథ వంటి రూపాల్లో ముందుకు వస్తున్నది. చమురుతో పని లేకుండా నడిచే విద్యుత్‌ వాహనాలు రోడ్లను ముంచెత్తటం తెలిసిందే. ఈ పూర్వరంగంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో 2035 నాటికి అమెరికాను అధిగమించేందుకు చైనా నడుంకట్టటం గురించి కొద్ది నెలలుగా మీడియాలో విశ్లేషణలు వెలువడుతున్నాయి, అవేవీ కమ్యూనిస్టులు నడిపేవి కాదు, చివరికి కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ వాదుల పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక పత్రిక ‘‘స్వరాజ్య ’’లో 2025 జూన్‌ 27న అమిత్‌ మిశ్రా అనే విశ్లేషకుడు కూడా రాశారు.దాన్ని నవీకరించి ఆగస్టు మూడున తిరిగి ప్రచురించారు. ‘‘ మేథోవంతుల ఆకర్షణ : వేయి ప్రతిభల చైనా వ్యూహం దాని ఔన్నత్యాన్ని ఎలా ముందుకు నెడుతున్నది ’’ అనే శీర్షిక( కోర్టింగ్‌ జీనియసెస్‌ : హౌ చైనా స్‌ థౌసెండ్‌ టాలంట్స్‌ స్ట్రాటజీ ఈస్‌ ఫ్యూయలింగ్‌ ఇట్స్‌ ఎసెంట్‌)తో ఒక విశ్లేషణ వెలుండిరది. ఇక్కడ దీన్ని ప్రస్తావించటం అంటే చైనాకు మిత,మతవాదుల సర్టిఫికెట్‌ లేదా ప్రశంసల గురించి కాదు. చైనా ఎలా దూసుకుపోతున్నదో చూడండి అనే ఉక్రోషం, అసూయ ప్రదర్శన దాని వెనుక ఉందని చెప్పేందుకే.


ఇక సందర్భానికి వస్తే ఈ ఏడాది అక్టోబరు ఒకటి నుంచి అంటే విప్లవదినోత్సం రోజు నుంచి చైనా ప్రభుత్వం ప్రపంచంలోని యువ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కె రకం వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఎందుకు అంటే 2035నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామి దేశంగా మారేందుకు అక్కడి కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. కొత్తగా పట్టా పుచ్చుకున్న స్వదేశీయులు లేదా విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వారు, ఇతర దేశాల్లో ఇప్పటికే ఆయా రంగాలలో పని చేస్తున్న వారిని ఆకర్షించేందుకు పూనుకుంది. ఇటీవలి కాలంలో చైనా విధాన నిర్ణయాలలో ఇది పెద్దదని భావిస్తున్నారు. తనకు ఎదురులేనంతవరకు చైనాను ఎదగనిచ్చిన అమెరికా ఎప్పుడైతే తన ఆధిపత్యానికి అన్ని రంగాలలో ప్రతిఘటన ఎదురవుతున్నదని గ్రహించిందో అప్పటి నుంచి అడ్డుకోవటం ప్రారంభించింది. వైట్‌హౌస్‌లో ఏ పార్టీ వారున్నా అదే చేస్తున్న పూర్వరంగంలో దానికి ధీటుగా చైనా కమ్యూనిస్టు పార్టీ చేసిన కసరత్తు నుంచి వెలువడిరదే తాజా నిర్ణయం. ప్రధాని లీ క్వియాంగ్‌ సంతకంతో అది చట్టంగా మారింది. స్టెమ్‌(సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణితం) రంగాలలో ప్రతిభావంతులైన విదేశీ యువతను ఆకర్షించేందుకు సరికొత్త ‘‘ యువ ప్రతిభ ’’ కె వీసా ప్రత్యేకత ఏమంటే చైనాలో ఉన్న కంపెనీల యజమానులు లేదా సంస్థల నుంచి సిఫార్సులు అవసరం లేదు.నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రతిభావంతులైన యువశాస్త్రవేత్తల కార్యక్రమంలో వయస్సు గరిష్ట పరిమితి 45 సంవత్సరాలు, మరో పధకానికి 40 ఏండ్లు. దీనికి ఎలాంటి పరిమితి నిబంధన లేదు. ఇతర దేశాలతో పోటీ పడుతూ వేతనాలు, వసతి, బోనస్‌, పిల్లలకు విద్య వంటి ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.దేశ విధానానికి లోబడి పరిశోధనలో స్వేచ్చ ఉంటుంది. ఇప్పటి వరకు విదేశీ పెట్టుబడులకు ఎలాంటి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించారో ఇప్పుడు ప్రతిభావంతులైన వారిని ఆకర్షించేందుకు అలాంటి విధానాన్నే ముందుకు తెచ్చారని చెప్పవచ్చు. ఇలాంటి ప్రత్యేక వీసాలు అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి.

అమెరికాలో చైనా సంతతికి చెందిన వారి మీద పెరుగుతున్న జాత్యహంకార వివక్ష, ఆంక్షలు, పరిశోధనలకు కేటాయింపుల కోత, గూఢచర్య ఆరోపణలతో వేధింపులు, రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల పూర్వరంగంలో అనేక మంది అక్కడి నుంచి బయటపడేందుకు చూస్తున్నారు. మంచి పండ్లను ఏరి దిగుమతి చేసుకున్నట్లుగా దశాబ్దాల తరబడి, అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు మేథోవలసతో ఎంతగానో లబ్దిపొందాయి. ఇప్పుడు అటునుంచి వలసలకు చైనాతో నాంది పడిరదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది ఒక్క రోజులో జరిగింది కాదు.చైనా కమ్యూనిస్టు పార్టీ నేత లి యువాన్‌చావో 2008లో ‘‘వేయి ప్రతిభావంతుల పథకాని(టిటిపి)కి రూపకల్పన చేశారు .విదేశాల్లో ఉన్న చైనా సంతతికి చెందిన వారిలో కనీసం రెండువేల మందిని స్వదేశానికి ఆహ్వానించి ఒక నవకల్పన సమాజంగా దేశాన్ని మార్చాలని తలపెట్టారు. 2011ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినపుడు ఏటా 50 నుంచి వందమందిని పదేండ్ల పాటు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దానికి మించి ఇప్పటి వరకు ఏడువేల మంది శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు,వాణిజ్య,పారిశ్రామికవేత్తలు వచ్చారని అంచనా, వారిలో ఇతర దేశాలకు చెందినవారు కూడా ఉన్నారు. మరొక సమాచారం ప్రకారం 2010 నుంచి 2021 మధ్య కాలలో కనీసం 20వేల మంది చైనా జాతీయులు అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లారు. ఇలాంటి వారు చూపుతున్న ప్రతిభను బట్టి మిలియన్ల యువాన్లను బోనస్‌, ఇతర రాయితీలను ప్రతిఫలంగా చెల్లించుతున్నారు. అమెరికా నుంచి వచ్చే వారు విద్రోహచర్యల నిమిత్తం వస్తున్నారా నిజంగానే పని చేసేందుకే అని నిర్ధారించుకొనేందుకు సునిశిత పరిశీలనలు కూడా చేశారని వార్తలు. ఈ పధకానికి చైనా పెద్ద ప్రచారం ఇవ్వలేదు గాని దాని తీరుతెన్నులు గమనించిన అమెరికా జాతీయ గూఢచార సంస్థ, ఎఫ్‌బిఐ గుండెలు బాదుకుంటూ నివేదికలు రూపొందించాయి. చైనా ఆర్థిక, మిలిటరీ రంగాలలో పురోగమించటానికి చట్టబద్దంగా, అక్రమ పద్దతుల్లో అమెరికా మేథో సంపదను చైనా కొల్లగొడుతున్నదని ఆరోపించారు. ఈ ప్రచారం పెరగటంతో చైనా కొత్త పద్దతుల్లో క్విమింగ్‌ పేరుతో ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పూనుకుంది.2019 నుంచి 2023వరకు ఐదు వందలకు పైగా ప్రభుత్వ పత్రాలను పరిశీలించిన రాయిటర్స్‌ వార్తా సంస్థ చైనా ఇస్తున్న నగదు, ఇతర మొత్తాల గురించి పేర్కొన్నది.

దశాబ్దాలుగా భారత్‌, చైనా వంటి దేశాల నుంచి ఎందరో ప్రతిభావంతులు ఎక్కువగా అమెరికా, ఇతర పశ్చిమదేశాలకు వలస వెళ్లారు.వ్యక్తిగతంగా వారితో పాటు ఆయా దేశాల పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. ఆర్థికంగా నిలదొక్కుకొని ఎదగటం ప్రారంభమైన తరువాత మరింత ముందుకు పోవాలంటే అలాంటి అవసరం ఎంతో ఉందని చైనా కమ్యూనిస్టు పార్టీ గుర్తించింది.కమ్యూనిస్టులు ప్రతిభావంతుల మీద కూడా తమ సిద్దాంతాలను రుద్దుతారని, వారికి స్వేచ్చ ఇవ్వరని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.చైనా కమ్యూనిస్టులు దాన్ని కూడా గమనంలో ఉంచుకున్నారు. నూటనలభై కోట్ల జనాభా జీవితాలను ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దాన్లో భాగంగానే తమ దగ్గరలేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించారు. అవి తమ నుంచి లబ్దిపొందుతాయని తెలిసినప్పటికీ దాని కంటే తాము ఎక్కువ ప్రయోజనం పొందుతామనే ముందు చూపు, ధైర్యంతో ఎన్ని విమర్శలు వచ్చినా సంస్కరణలకు తెరతీశారు, విజయం సాధించారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది గనుక అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రతిభావంతులను అక్కున చేర్చుకుంటున్నారు.దాని ఫలితాలు కనిపించాయి. సెమికండక్టర్లు, వైమానిక రంగం, 5జి, క్వాంటమ్‌ వంటి అనేక రంగాల్లో మరొకదాని వెనుక వెళ్లే పరిస్థితి నుంచి పోటీదారుగా మారింది. జీవశాస్త్రంలో అమెరికాను అధిగమించి 2017లోనే ఎక్కువగా పరిశోధక పత్రాలను చైనీయులు ప్రచురించారు.

గత నాలుగున్నర దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, విధానాల గురించి కొంత మంది విమర్శలు చేయవచ్చు.ఇప్పుడు చైనా మరొకదశలో ప్రవేశించింది. అధికారాన్ని కార్మికవర్గం చేతిలో పెట్టటం ద్వారా విప్లవం చేయాల్సినపని చేసింది. సాధించిన అధికారం ఒక్కటే జన జీవితాలను మెరుగుపరచదని గుర్తించిన తరువాత తీసుకున్న చర్యలకు తగిన ఫలితాలు వచ్చాయి. వాటికి ఉన్న పరిమితులను గమనించి మరొక అడుగు ముందుకు వేస్తున్నది. విదేశీ పెట్టుబడులకు కొంత ప్రతిఫలాన్ని చెల్లించినట్లుగా, స్వదేశంలోనే సంస్థల పెరుగుదలకు వ్యక్తులను ప్రోత్షహించిన తీరు చూశాము. అలాగే ప్రతిభావంతులకు మిగతావారితో పోలిస్తే అధికమొత్తాలను ఇవ్వాల్సి ఉంటుందని గ్రహించింది. మరిన్ని పరిశోధనల ద్వారా జనకల్యాణానికి వినియోగించేందుకు పూనుకున్నది. ప్రపంచంలో ఉన్న ప్రతిభావంతులను చైనా ఆకర్షించటం అమెరికా మాదిరి కార్పొరేట్ల లాభాలకు కాదు, జనాల కోసం.ఈ ప్రయత్నం వెనుక వ్యూహాత్మక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి. నిజానికి ఇది చైనా కమ్యూనిస్టు పార్టీకి కత్తిమీద సామువంటిదే.వచ్చేవారు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి, శాస్త్ర రంగ నాయకత్వంతో పాటు రాజకీయ నాయకత్వంలో ఇమిడి పోయే విధంగా ఉండాలి. కమ్యూనిస్టుల గురించి అనేక తప్పుడు ప్రచారాలు జరిగిన నేపధ్యం,అన్యవర్గ ప్రభావంతో అలాంటి వారు ప్రతి చర్యనూ అనుమానంతో చూసే అవకాశం ఉంటుంది, సహజం. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొనే చైనా కమ్యూనిస్టులు ఒక ప్రయోగం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు అది చేసిన వన్నీ మొత్తం మీద ఫలించాయి.

చైనాలో ప్రస్తుతం ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాల పర్యావరణం నానాటికీ పెరుగుతున్నది.ప్రపంచ స్థాయి సంస్థలలో చైనా వాటికి చోటుదక్కుతున్నది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోమెడిసిన్‌, కృత్రిమ మేథ, ప్రత్యామ్నాయ ఇంథన రంగాలలో సాధించే పురోగతితో అగ్రగామిగా ఉన్న అమెరికాను అధిగమించాలన్నది కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించిన లక్ష్యం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ క్రమంలో తలెత్తే మిత్రవైరుధ్యాలు ఎలా ఉంటాయి, వాటిని పార్టీ ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తి కలిగించే అంశం.మరోవైపున చూస్తే అమెరికా, ఇతర పెట్టుబడిదారీ ధనిక దేశాలు పరిశోధకులను, వారితో కలిగే లాభాలను కోల్పోతే చూస్తూ ఊరుకోవు. ప్రమాణాలకు గీటురాళ్లుగా ఇప్పటి వరకు కొనసాగిన అమెరికా విశ్వవిద్యాలయాలు ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటాయా ? ప్రతిభావంతులను ఆకర్షించేందుకు పోటీ పడటంలో కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, జర్మనీ, అరబ్‌ ఎమిరేట్స్‌ వంటివి కూడా ఉన్నాయన్నది మరచిపోరాదు. గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టే విధంగా రానున్న రోజుల్లో పోటీ మరింత పెరగటం మంచిదే. వ్యక్తుల ప్రతిభకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది, అయితే అది పూర్తిగా వారి స్వంతం కాదు, సమాజం నేర్పినదానికి తమ సృజనాత్మకతను జోడిరపు మాత్రమే. ఉదాహరణకు విద్యుత్‌ బల్బ్‌ను చూస్తే, 1,799 సంవత్సరం నుంచి బల్బులు, బ్యాటరీల తయారీకి పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అనేక మంది చేసిన కృషి 1870, 80 దశకాల్లో పోటీ మరింత పెరిగింది.బ్రిటన్‌లో జోసెఫ్‌ స్వాన్‌, అమెరికాలో థామస్‌ ఎడిసన్‌ ఒకేసారి బల్బులను కనుగొన్నారు.స్వాన్‌ బల్బులు విలియమ్‌ స్టెయిట్‌ రూపొందించన నమూనాల ప్రకారం ఉన్నాయి. వాటి ఫిలమెంటు చాలా మందంగా ఉంది. ఎడిసన్‌ బల్బులో పలుచగా ఉండటంతో వాణిజ్య పరంగా అది విజయవంతమైంది. స్వాన్‌, ఎడిసన్‌ మధ్య పోటీ చివరకు వారిద్దరినీ ఒక దగ్గరకు చేర్చి ఎడిసన్‌ మరియు స్వాన్‌ ఎలక్ట్రిక్‌ లైట్‌ కంపెనీగా ఏర్పడి స్వాన్‌ రూపొందించిన ఫిలమెంట్‌తో మార్కెట్‌ చేశారు. కానీ పేరు ఎడిసన్‌కు వచ్చింది, దాని వెనుక ఎందరో ఉన్నారు. ఆ తరువాత బల్బుల్లో ఎన్ని మార్పులు, చేర్పులు జరిగాయో మనకు తెలిసిందే. అందువలన ప్రతి నవకల్పన సమాజానికి ఉపయోగపడుతుందా, కార్పొరేట్ల లాభాలకా అన్నదాన్ని బట్టి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల వర్గదృకృధం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. చైనా కార్మికవర్గ వైఖరితో ప్రతిభకు పట్టం కడుతున్నదని చెప్పవచ్చు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సోవియట్‌ నాటి చరిత్ర పునరావృతం అవుతుందా : బులబాటం తీర్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ ఆరాటానికి ముందున్నది అసలు పరీక్ష !

01 Friday Aug 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Donald Trump Tariffs, Narendra Modi Failures, Tariff War, Trade agreement with US, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

నాటకీయ పరిణామాలు జరగకపోతే అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం వెంపర్లాడిన నరేంద్రమోడీ బృందానికి ప్రస్తుతానికి డోనాల్డ్‌ ట్రంప్‌ తగిన పాఠమే చెప్పాడు. మనదేశం నుంచి తాము దిగుమతి చేసుకొనే వస్తువులపై 25శాతం పన్నులు, రష్యా నుంచి మనం ముడిచమురు, ఆయుధాలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకొంటున్న కారణంగా అదనంగా జరిమానా విధిస్తున్నట్లు బుధవారం నాడు ప్రకటించాడు. మనసార్వభౌమత్వాన్నే కించపరిచాడు. పుండు మీద కారం చల్లినట్లుగా పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ నిల్వచేసే చమురును భారత్‌కు అమ్మిస్తానని కూడా చెప్పాడు. ఇది మరీ అవమానం. రష్యా, భారత్‌ రెండూ మృత ఆర్థిక వ్యవస్థలు, కలసి ఏం చేస్తాయో చేసుకోండి అంటూ ఎద్దేవా చేశాడు.ట్రంప్‌ ప్రకటించిన మేరకు ఆగస్టు ఒకటి నుంచి మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న వివిధ సరకులపై కనిష్టంగా 25 గరిష్టంగా 193శాతం పన్నులు విధిస్తారు. వీటికి జరిమానా అదనం. ఇవి ఇలానే ఉండేట్లయితే ఏ రంగం ఎలా ప్రభావితం అవుతుందో ఆచరణలో తెలుస్తుంది.ఔషధాలు, సెల్‌ఫోన్లు వంటి వాటిని ప్రస్తుతానికి మినహాయించారు. అవి పేకాటలో తురుపు ముక్కల వంటివి, మనదేశాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే ఎత్తుగడలో భాగం తప్ప మరొకటి కాదు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం ఒక సాదాసీదా ప్రకటన విడుదల చేసింది. మహా వ్యూహవేత్త అంటున్నారు గనుక మామూలుగానే ప్రధాని నరేంద్రమోడీ, ఇతర మంత్రులు నోరు విప్పలేదు, సమాచార శాఖ(పిఐబి) ద్వారా మొక్కుబడిగా ఒక ప్రకటన విడుదల చేశారు.పరిస్థితిని అన్ని విధాలుగా మదింపు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అమెరికా చర్యలకు ప్రతిగా చైనా మాదిరి మన ప్రభుత్వం కూడా ప్రతి సుంకాలు విధిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అమెరికాతో ఇప్పుడున్న 130 బిలియన్‌ డాలర్ల లావాదేవీలను మరో ఐదు సంవత్సరాల్లో 500 బిలియన్‌ డాలర్ల స్థాయికి పెంచుతామని రంగుల కలను జనం ముందించిన నేతలు ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. ఈ నెల 25వరకు భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతాయని, తమ ప్రతినిధి వర్గం ఢల్లీి సందర్శించనున్నదని అమెరికా అధికారులు చెప్పినదాన్ని బట్టి ఇప్పటికీ మన మీద వత్తిడి తెచ్చే యత్నాలను ట్రంప్‌ మానుకోలేదని, సుంకాల ప్రకటన బెదిరింపుల్లో భాగమే అని చెప్పవచ్చు. మోడీ లొంగుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే అసలు అగ్ని పరీక్ష ముందుంది. ఫిబ్రవరి నుంచి జరుగుతున్న చర్చల గురించి రకరకాల లీకుల కథనాలు, ట్రంప్‌ ప్రకటనల నేపధ్యంలో ఎలక్ట్రానిక్‌ రంగంలో పెద్ద మొత్తంలో చైనా పెట్టుబడులను ఆకర్షించేందుకు మనదేశం సానుకూల సంకేతాలను పంపిందంటూ తాజాగా ఒక వార్త. ఇలాంటి పరోక్ష సందేశాలతో చైనాను చూపి అమెరికా నుంచి రాయితీలు రాబట్టుకొనే ఎత్తుగడగా కూడా దీన్ని చెప్పవచ్చు. గతంలో అమెరికాను చూపి సోవియట్‌, దాన్ని చూపి వాషింగ్టన్‌తో బేరసారాలాడిన మన పాలకవర్గం ఇలాంటి వాటిలో ఆరితేరింది. ఇప్పటి వరకు ఈ ఎత్తుగడ ఫలించినట్లు లేదు. నిజంగానే మనదేశం చైనా ఎలక్ట్రానిక్‌ కంపెనీలు, వాటి పెట్టుబడులను అనుమతిస్తే అమెరికా మరింత శత్రుపూరితంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. జిగినీ దోస్తుతో సంబంధాలను నరేంద్రమోడీ అంత తేలికగా వదులు కుంటారా అన్నది చూడాల్సి ఉంది.

మన జిడిపి పదిలక్షల కోట్ల డాలర్లకు చేరాలంటే చైనాతో సయోధ్య తప్పనిసరని కొందరి సూచన, డ్రాగన్‌తో పెట్టుకుంటే మృత్యుఘంటికలే అని కొందరి హెచ్చరిక. ఏది సత్యం ! ఏదసత్యం ఓ మహాత్మా, ఓ మహర్షీ !! గాల్వన్‌ లోయ ఘర్షణ సందర్భంగా ఇంక చైనాతో మాటల్లేవ్‌, మాట్లాడుకోవటం లేదు, పోరేశరణ్యం అంటూ ఊగిపోయిన దృశ్యాలు మన కళ్ల ముందే ఉన్నాయి.చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం, రాయబారి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు రాహుల్‌ గాంధీని ఎద్దేవా చేసిన వారు తమ కింది నలుపు చూసుకుంటున్నలేదు. రాహుల్‌ ఒప్పందానికి ముందే 2001లోనే జాన కృష్ణమూర్తి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిజెపి చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు పెట్టుకుంది. గాల్వన్‌ ఉదంతాలు జరిగి ఐదేండ్లు గడచిన తరువాత చూస్తే మూసిన తలుపులను మనమే తెరుస్తున్నాం. చైనా తలపులతో మునిగిపోతున్నాం. ఆశ్చర్యంగా ఉంది కదూ ! అప్పుడెందుకు మూశారు, ఇప్పుడెందుకు తెరిచారు, ఇన్నేండ్లు ఎందుకు ఆలశ్యం చేశారు అని ఎవరైనా అడిగారో దేశద్రోహ ముద్రవేస్తారు జాగ్రత్త. బిజెపి నందంటే నంది పందంటే పంది అంతే ! త్వరలో షాంఘై సహకార సంస్థ సమావేశాలకు గాను ప్రధాని నరేంద్రమోడీ బీజింగ్‌ సందర్శనకు వెళతారని అంటున్నారు.అన్నీ సక్రమంగా ఉంటే షీ జింపింగ్‌ కూడా ఢల్లీి రావచ్చు. ఏదీ అసాధ్యం కాదు, షీ జింపింగ్‌ రమ్మనాలే గానీ వెళ్లటానికి అన్నీ సర్దుకొని ఉన్నా అన్నట్లుగా ట్రంప్‌ ఉన్నాడు.ఎవరి ఎత్తుగడలు వారివి, ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యం.

త్వరలో చైనాను అధిగమించేందుకు ముందుకు పోతున్నామని కొందరు చెబుతుంటారు. ఆ చైనీయులేమో అమెరికాను దాటేస్తాం చూడండి అన్నట్లుగా సందడి లేకుండా తమపని తాము చేసుకుపోతున్నారు.మన సంకల్పం మంచిదే, ఆరోగ్యకరమైన పోటీ ప్రతిదేశంతోనూ ఉండాల్సిందే. మధ్యలో చైనా ఎందుకు ఏకంగా అమెరికాతోనే పోటీ పడాలి.ఆశ, ఆకాంక్షల్లో కూడా పిసిరానితనం అవసరమా ! అయితే పేచీ ఎక్కడ అంటే ఎవరికి వారు మేమే ముందుండాలి, అగ్రస్థానం మాకే దక్కాలి అనుకుంటే ఫలితం, పర్యవసానాలు ప్రతికూలంగానే ఉంటాయి.ఎవరి సంగతివారే చూసుకోవాలి అనుకున్నపుడు మన అభివృద్ధిని మరొకరు ఓర్వలేకుండా ఉన్నారని ఏడిస్తే ప్రయోజనం లేదు.1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాకు ఐరాసలో, 2001వరకు ప్రపంచ వాణిజ్యసంస్థలో సభ్యత్వమే లేదు.అడ్డుకున్నది ఎవరంటే అమెరికా, దాని కనుసన్నలలో నడిచే దేశాలే అన్నది తెలిసిందే. చిత్రం ఏమిటంటే అదే అమెరికా తరువాత కాలంలో తన కంపెనీల పెట్టుబడులను చైనాలో అనుమతించింది, తన అవసరం కోసం పరిమితంగా, ఫరవాలేదు పాతబడిరదే కదా అనుకున్న సాంకేతిక పరిజ్ఞాన బదిలీని అనుమతించింది. లాటిన్‌ అమెరికా దేశాల మాదిరి వస్తు ఎగుమతి ఆధారిత దేశంగా ఉంటూ తనకు లాభాలను అందిస్తుంది అనుకున్న ఆశలను చైనా వమ్ము చేసింది. లాటిన్‌ అమెరికా దేశాలు పెట్టుబడిదారీ, చైనా కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉందనే వాస్తవాన్ని పశ్చిమదేశాల వారు అర్ధం చేసుకోలేకపోయారు. చేయి అందిస్తే ఏకంగా అల్లుకు పోతుందని అమెరికా కార్పొరేట్‌ మేథావులు నాలుగుదశాబ్దాల క్రితం గుర్తించలేకపోయారు. చైనా నేడు అనేక రంగాలలో సవాలు చేస్తున్నది. అడ్డుకొనేందుకు అడుగడుగునా అమెరికా కూటమి చూస్తున్నది.ఆధునిక చిప్స్‌ అందుబాటులో లేకుండా చేయాలని ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే.తన కోడి కూయకపోతే చైనాలో తెల్లవారదని అది భావిస్తున్నది.

ఇలాంటి ఆటంకాలు మనకు లేవు. నిజంగానే ‘‘ కమ్యూనిస్టు నియంతృత్వ’’ చైనా మనకు అడ్డుపడుతున్నది అనుకుంటే మనవారు కీర్తించే ‘‘ ప్రజాస్వామ్య ’’ అమెరికా, ఇతర పశ్చిమదేశాలు మిత్రులు, భాగస్వాములే, అయినా సాయం చేసేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు. బీజింగ్‌కు పోటీగా మనలను ఎందుకు నిలపటం లేదు ? మనదేశంలోని కొందరు మేథావులు చైనా మాత్రమే మనలను అడ్డుకుంటున్నదని తమ దాడిని ఎందుకు ఎక్కుపెడుతున్నట్లు ? జనం ఆలోచించాలి ! అమెరికాతో మనదేశ వాణిజ్య ఒప్పంద గడువు జూలై తొమ్మిది, ఆగస్టు ఒకటి రెండూ మురిగిపోయాయి. చైనాతో వాణిజ్యం మీద లేని ఒప్పందం అమెరికాతో ఎందుకు అన్నది సామాన్యులకు అర్ధం కావటం లేదు. చైనాతో1954లో కుదిరిన ఒక సాధారణ ఒప్పందం మాత్రమే అమల్లో ఉంది.పరిస్థితులకు అనుగుణ్యంగా దాన్ని నవీకరించటం లేదా నూతన ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి ఎలాంటి చొరవా రెండువైపుల నుంచి లేదు. కానీ భారీ మొత్తంలో వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి.

అసలు వాణిజ్య ఒప్పందాలు ఎందుకు ? వివాదాలు లేకుండా ఒక పద్దతిగా నడుద్దామని రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 23దేశాల మధ్య (భారత్‌, చైనాలతో సహా) వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందం( జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ టారిఫ్‌గాట్‌) 1947లో కుదిరింది, దీన్నే జెనీవా ఒప్పందం అని కూడా అంటారు.తరువాత అది 1995 జనవరి ఒకటి నుంచి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)గా మారింది. గాట్‌ దేశాల్లో చైనా ఉన్నప్పటికీ అది కమ్యూనిస్టుల ఏలుబడిలోకి వచ్చిన తరువాత తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ పేరుతో ఉన్న చైనానే గుర్తించారు తప్ప మిగతా దేశాల మాదిరి సభ్యత్వం ఇవ్వలేదు. అనివార్యమైన స్థితిలో 2001లో చైనాను చేర్చుకున్నారు. ప్రపంచీకరణను ముందుకు తెచ్చిన దేశాలే నేడు దానికి భిన్నంగా డబ్ల్యుటివోను పక్కన పెట్టి విడివిడిగా ఒప్పందాలు చేసుకోవటం తెలిసిందే.


మన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న దేశాలలో అమెరికా, చైనా ఒకటి రెండు స్థానాలలో ఉంటున్నాయి. ప్రతిదేశం తన దగ్గర మిగులుగా ఉన్న సరకులను అమ్ముకొనేందుకు గతంలో ఏకంగా బలహీన దేశాలను ఆక్రమించుకోవటం, అందుకోసం యుద్ధాలకు దిగటం తెలిసిందే. ఆ రోజులు గతించాయి గనుక వాటి స్థానంలో మార్కెట్ల ఆక్రమణకు ఒప్పందాలు వచ్చాయి. పన్నులు ఎలా వేయాలో, ఎగుమతి, దిగుమతులు ఎలా జరగాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక విధానాన్ని రూపొందించింది. అది ఉండగా విడివిడిగా ఒప్పందాల కోసం ప్రయత్నించటం చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి(ఐరాస) మాదిరి డబ్ల్యుటిఓ కూడా విఫలమైందా ? అలాగే కనిపిస్తున్నది, దాని నిబంధనలను పక్కన పెట్టి కొన్ని దేశాలు కొన్ని వస్తువుల మీద ఎక్కువ పన్నులు విధిస్తున్నాయి. ప్రతి చర్యలతో వివాదాలు. వాటిని పరిష్కరించే ట్రిబ్యునల్‌కు న్యాయమూర్తుల నియామకం జరగకుండా అమెరికా అడ్డుకుంటున్నది, పోటీ పడలేక వాణిజ్య దందాకు దిగి చైనా మీద కత్తి గట్టింది. దాని వైఖరిని మిగతా దేశాలు అప్పుడే ప్రతిఘటించి ఉంటే ఇప్పుడు అన్నిదేశాల మీద దాడికి దిగేది కాదు.నష్టపోయేది చైనాయే గదా అని భావించిన దేశాలకు ఇప్పుడు తెలిసి వస్తోంది.

వాణిజ్య మిగులు ఉన్న దేశాలతో లోటు ఉన్నవి సమానం చేసేందుకు చూస్తాయి. మనదేశ లావాదేవీలను చూసినపుడు 151దేశాలతో వాణిజ్య మిగులుతో ఉన్నాం, 75దేశాలతో లోటులో ఉన్నాం. మన ఎగుమతుల గురించి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ మొత్తం మీద ఏటేటా లోటు పెరగటం తప్ప తగ్గటం లేదు. పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో మనదేశ మొత్తం వాణిజ్య లోటు (వికీపీడియా సమాచారం) 942.23 బిలియన్‌ డాలర్లు. ఇదే 2014 నుంచి 2024వరకు నరేంద్రమోడీ పాలనలో 1,506.22 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ కాలంలో మన ఎగుమతులు 201314లో 466.22 బిలియన్‌ డాలర్లు కాగా 20232024లో 778.21 బి.డాలర్లకు పెరిగాయి. మేకిన్‌, మేడిన్‌ ఇండియా పథకాలు జయప్రదమై ఉంటే మనకీ దుస్థితి ఉండేది కాదు. పదేండ్లలో మోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా మన విలువైన విదేశీమారకద్రవ్యం 614 బిలియన్‌ డాలర్లను చైనాకు పువ్వుల్లో పెట్టి ఇచ్చాం.అయినప్పటికీ మనం దిగుమతులు నిలిపివేసి డ్రాగన్‌కు చుక్కలు చూపించాలని కాషాయ దళాలు నిత్యం చెబుతూనే ఉంటాయి. నిజమే కామోసని గుడ్డిగా నమ్మేవారు ఉన్నారు. ఇంత తేడా ఉన్నప్పటికీ ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం పడుతున్న ఆరాటం చైనాతో జరగటం లేదన్నది తెలిసిందే. ఇదే సమయంలో అమెరికాతో ఉన్న వాణిజ్య మిగులును తగ్గించి తమ వస్తువులను మనమీద రుద్దేందుకు పూనుకున్న ట్రంప్‌తో మాత్రం ఒప్పందం కోసం ఇప్పటికీ అర్రులు చాస్తున్నది.


ప్రపంచ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిలో 60శాతం చైనాలోనే జరుగుతోంది. మనదేశంలో కూడా ఉత్పత్తిని పెంచాలంటే చైనా పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం అవసరం అని ఈ పూర్వరంగంలో చైనాను విస్మరించలేమని మన విధాన నిర్ణేతలకు అవగతమైనట్లు కనిపిస్తోంది.జిడిపిలో పదిలక్షల కోట్ల మైలురాయిని దాటాలంటే చైనాతో ఎంతో అవసరం ఉందని అబ్జర్వర్‌ రీసర్చ్‌ ఫౌండేషన్‌(ఓఆర్‌ఎఫ్‌) అధ్యక్షుడు సమీర్‌ శరణ్‌ అభిప్రాయపడ్డారు. చాలా సంవత్సరాల తరువాత చైనాతో ఆర్థిక సంబంధాల పునరుద్దరణకు ఎంతో అవకాశం ఉందని, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలనే చెప్పారు. చైనా తనసరకులను అమ్ముకొనేందుకు మనదేశాన్ని పెద్ద మార్కెట్‌గా చూస్తోందని, అందునా శత్రుదేశంగా ఉందంటూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. చైనా పర్యాటకులకు వీసాలు ఇవ్వాలని మనదేశం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. భద్రతాపరమైన తనిఖీలతో నిమిత్తం లేకుండా చైనా కంపెనీలను 24శాతం వాటాలతో భారత కంపెనీల్లో పెట్టుబడులను అనుమతించవచ్చని నీతి ఆయోగ్‌ ఇటీవల ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం, అధికార బిజెపిలో ఒక వర్గం చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తుండగా మరొకటి సానుకూలంగా ఉంది. నీతి ఆయోగ్‌ చెప్పటం అంటే మన బడాకొర్పొరేట్ల ప్రయోజనాలు, వాటి పరిరక్షణకు మోడీ మనసెరిగి నివేదించటం తప్ప మరొకటి కాదు. నిజంగా అదే జరిగితే ముందే చెప్పుకున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ మరింత రెచ్చిపోతాడు, వియోగమే అనివార్యమైతే మన నరేంద్రమోడీ, కాషాయ దళాలు తట్టుకుంటాయా ! దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందా ? గతంలో అంటే సోవియట్‌ యూనియన్‌తో ఉన్న మిత్ర సంబంధాలు వేరు, ఇప్పుడు చైనాతో అవసరమైతప్ప సంబంధాల్లో మిత్రత్వం ఎంత అన్నది అనుమానమే, అటువంటి చైనా కోసం అమెరికాను దూరంగా పెడతారా, ఏమో భారత పాలకవర్గం తనకు ఏది లాభం అనుకుంటే దానికే పెద్ద పీటవేస్తుందని సోవియట్‌ నాటి చరిత్ర చెబుతోంది ! పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా కమ్యూనిస్టు చైనా లేదా పెట్టుబడిదారీ అమెరికా అన్నది ముఖ్యం కాదు, తమకు లాభాలు దేనితో ఉంటాయన్నదే మన కార్పొరేట్లకు గీటురాయి !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d