• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Monthly Archives: March 2024

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి రాజకీయం : తెదే, వైసిపి అసంబద్ద వాదనలు, అంకెలతో వంచన !

30 Saturday Mar 2024

Posted by raomk in AP NEWS, BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, TDP, Ycp

≈ Leave a comment

Tags

Aandhra Pradesh Politics, Andhra Pradesh Elections 2024, Andhrapradesh, AP CM YS Jagan, CHANDRABABU


ఎం కోటేశ్వరరావు


గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌ సర్వనాశనమైందని తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి చెబుతోంది. అంతే కాదు, తమ పాలనలో వచ్చిన అనేక పరిశ్రమలు రాష్ట్రం వదలివెళ్లినట్లు కూడా ఆరోపిస్తున్నారు. దానికి పోటీగా వైసిపి తనదైన శైలిలో జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నది. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఊదరగొడుతున్నది. ఉదాహరణకు జిఎస్‌డిపిలో దేశంలో రాష్ట్రాన్ని ఒకటవ స్థానంలో నిలబెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. చెప్పేవారికి లేకున్నా వినేవారికి వివేకం ఉండాలంటారు.వర్తమాన ఆర్థిక సంవత్సరం 2023-24 మార్చినెల 31తో ముగుస్తుంది. వెంటనే గణాంకాలు ఖరారు కావు. వివిధ రాష్ట్రాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో పేర్కొన్న అంచనాల ప్రకారం కొన్ని సూచికలను వెలువరించారు. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి 14.49లక్షల కోట్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది. తరువాత తెలంగాణా. మొదటి ఏడింటిలో మహారాష్ట్ర 38.79,తమిళనాడు 28.3, గుజరాత్‌ 25.62, కర్ణాటక 25, ఉత్తర ప్రదేశ్‌ 24.39,పశ్చిమ బెంగాల్‌ 17.19, రాజస్థాన్‌ 15.7లక్షల కోట్లతో ఉన్నాయి. ఇక తలసరి జిడిపిలో 2022-23 సంవత్సరంలో అగ్రస్థానంలో 5.19లక్షలతో సిక్కిం, 4.72లక్షలతో గోవా రెండవదిగా ఉంది. పెద్ద రాష్ట్రాలలో 3.08లక్షలతో తెలంగాణా ప్రధమ, 3.01తో కర్ణాటక,2.96తో హర్యానా, 2.73తో తమిళనాడు, 2.72తో ఢిల్లీ, 2.41తో గుజరాత్‌, 2.33తో ఉత్తరాఖండ్‌, కేరళ, 2.24తో మహారాష్ట్ర,2.22తో హిమచల్‌ ప్రదేశ్‌, 2.19తో ఆంధ్రప్రదేశ్‌ పదకొండవ స్థానంలో ఉంది. ఇక వైసిపి చెప్పుకుంటున్న ఒకటవ స్థానం సంగతేమిటి అంటే ప్రతి ఏటా జిఎస్‌డిపి వృద్ది రేటు ప్రతి రాష్ట్రంలోనూ మారుతూ ఉంటుంది.2021-22లో వృద్ధి రేటులో స్థిర ధరల్లో 11.43శాతంతో మొదటి స్థానంలో ఉంది అని తేల్చారు గనుక, దాన్నే మొత్తం జిడిపిలో మొదటి స్థానంగా చెబుతూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. జిడిపి అంటే అంబానీ,అదానీ సంపదలతో పాటు అట్టడుగు బడుగు జీవులకు వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకొని వేసే మొత్తం, తలసరి అంటే దాన్ని జనాభాతో భాగించగా వచ్చేది. అందుకే తెలంగాణా జిడిపిలో మనకంటే తక్కువగా ఉన్నప్పటికీ జనాభా తక్కువ గనుక దేశంలో పెద్ద రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది. జిడిపిలో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో ఉన్నప్పటికిటీ తలసరిలో తొమ్మిదవదిగా ఉంది.ఈ సూచికలతో జనానికి ఒరిగేదేమీ ఉండదు.తెలుగుదేశం పార్టీ కూడా తన ఐదు సంవత్సరాల పాలనలో వృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంది.2013-14లో రాష్ట్ర జిడిపి వృద్ది రేటు ఏడుశాతంగా ఉన్నదానిని 2017-18 నాటికి 11.2శాతానికి పెంచినట్లు అంకెల్లో చూపింది.


తెలుగుదేశం వారు తమ ఏలుబడిలో విశాఖను ఐటి హబ్‌గా మార్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఇదొక అతిశయోక్తి. హైదరాబాద్‌లో ఐటి పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు నాయుడే కారణమనే ప్రచారం గురించి తెలిసిందే. అలాంటి నేత ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఐటి పరిశ్రమలను ఆకర్షించలేకపోయారో ఎవరూ చెప్పరు. పెట్టుబడుల ఆకర్షణల పేరుతో సమావేశాల ఆర్భాటాలు చేయటం వేరు, ఆచరణలో పెట్టుబడులు రావటం వేరు. ఐటి రంగాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి బండారం బయటపడుతుంది. దీని అర్ధం వైసిపి అభివృద్ధి చేసిందని కాదు. దొందూ దొందే.ఐటి అంటే మారుపేరు చంద్రబాబు అని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు గనుక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది.కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటి సాంకేతిక మంత్రిత్వశాఖ సమాచారం ఆధారంగా 2021-22 సంవత్సర వివరాలతో రూపొందించిన ఎగువ మాప్‌ ఐటి ఎగుమతుల్లో ఏ రాష్ట్రం ఎక్కడుందో వెల్లడిస్తున్నది. ఎవరైనా అది వాస్తవం కాదని అంటే వాస్తవం ఏమిటో వెల్లడించాలి. పొరుగున ఉన్న ఒడిషా ఐదువేల కోట్ల రూపాయల మేర ఎగుమతి చేస్తే ఆంధ్రప్రదేశ్‌ వెయ్యి కోట్లుగా ఉంది. తరువాతి సంవత్సరాల్లో మొత్తంగా ఎగుమతులు పెరిగినందున ఆమేరకు అంకెలు మారవచ్చు తప్ప ధోరణిలో పెద్ద తేడా ఉండదు. ఆ ఏడాది రు.11.59లక్షల కోట్ల మేర ఎగుమతి చేస్తే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాల నుంచే రు.9.72లక్షల కోట్లు ఉంది. ఉపాధి కూడా దీనికి అనుగుణంగానే ఉంటుంది. ఐటి ఉద్యోగాలంటే బెంగలూరు,పూనే,హైదరాబాద్‌, చెన్నయిని చూస్తున్నారు తప్ప విశాఖ, విజయవాడ అని ఎవరైనా అంటారా ? 2023 మార్చి నాటికి దేశంలో 54లక్షల మంది ఐటి, ఐటి అనుబంధ సేవారంగంలో పని చేస్తున్నారు. పరోక్షంగా మరో కోటి మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నవారు ఎందరు ? ఎన్నికలు వస్తున్నాయి గనుక అంకెలతో ఆడుకుంటూ జనాన్ని మభ్యపెడుతున్నారు తస్మాత్‌ జాగ్రత్త అని చెప్పాల్సి వస్తోంది. రెండు పార్టీలూ పోలీసు యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మలచుకొని ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలు, న్యాయమైన డిమాండ్లపై ఆందోళనలను అణచేందుకే చూశాయి. మాట తప్పి మడమ తిప్పిన వారే. ఎవరూ తక్కువ తినలేదు.


ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా తెలుగుదేశం, వైసిపి పాలన ఉంది. కొన్ని వివరాలను చూద్దాం. ఉదాహరణకు అప్పుల గురించి ఆరోపణలు-ప్రత్యారోపణలు చోటుచేసుకుంటున్నారు.కాపిటల్‌ అంటే కాపిటల్‌ పెట్టుబడి,రుణాలు, వడ్డీ చెల్లింలులు రు.కోట్లలో.రెండు పార్టీల పాలనలో మచ్చుకు రెండేసి సంవత్సరాల వివరాలు.ఈ అంకెలకు పిఆర్‌ఎస్‌ సంస్థ విశ్లేషణలు ఆధారం.
ఏడాది××× రుణాలు ×× వడ్డీ చెల్లింపు××రుణ చెల్లింపు×× కాపిటల్‌
2016-17×59,923 ×× 11,697 ×× 34,776 ×× 50,520
2017-18×30,500 ×× 14,783 ×× 8,009 ×× 40,792(బడ్జెట్‌)
2021-22×53,524 ×× 22,165 ×× 15,503 ×× 16,373
2022-23× 64,978 ×× 25,288 ×× 16,291 ×× 16,847
రాష్ట్రంలో శాశ్వత సంపదలు, వాటి ద్వారా సేవలు, ఉపాధి సృష్టికి చేసే ఖర్చును మూలధన లేదా కాపిటల్‌ అంటారు. రెండు పార్టీల పాలనలోనూ ఇది దిగజారింది తప్ప ప్రాధాన్యత లేదు. పిఆర్‌ఎస్‌ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం రెండు పార్టీలూ బడ్జెట్లలో భారీ మొత్తాలను ప్రకటించి ఏడాది చివరికి కోత పెట్టటంలో దొందూ దొందే. తెలుగుదేశం పార్టీ చివరి రెండు సంవత్సరాలలో ప్రతిపాదిత మొత్తాలలో 39,30శాతాల చొప్పున, వైసిపి మొదటి నాలుగు సంవత్సరాలలో 82,37,48,45శాతాల చొప్పున కోతలు పెట్టింది.
తెలుగుదేశం పార్టీ చివరి మూడు సంవత్సరాలలో రాష్ట్ర రుణ భారం జిఎస్‌డిపిలో సగటున ఏటా 28.6శాతం ఉంటే, వైసిపి ఐదు సంవత్సరాల పాలనలో 32.74శాతం ఉంది. వీటికి ప్రభుత్వం హామీగా ఉండి కార్పొరేషన్లు, ఇతర సంస్థల ద్వారా చేసిన అప్పులు, ప్రభుత్వ సంస్థలు తీసుకున్న అప్పులు అదనం.ఉదాహరణకు 2022 మార్చి 31నాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు రు.1,38,875 కోట్లు వీటిలో విద్యుత్‌ సంస్థల వాటా రు.38,473 కోట్లు. జిఎస్‌డిపిలో ఇలాంటి మొత్తాలు 2021-22లో పన్నెండు శాతం ఉంది. అంటే ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకొనే అప్పులకు ఇది అదనం. తెలుగుదేశం పాలనలో చివరి నాలుగు సంవత్సరాలలో ఇతర రాష్ట్రాల కేటాయింపులతో పోల్చితే విద్యారంగంలో తక్కువ, వైద్య రంగంలో సమంగా, గ్రామీణాభివృద్ధి రంగంలో ఎక్కువగా ఉంది.వైసిపి పాలనలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయనే విమర్శ పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే.2022-23లో అన్ని రాష్ట్రాలలో సగటున రోడ్లు, భవనాలకు 4.5శాతం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహనరెడ్డి సర్కార్‌ 2021-22లో 0.9, మరుసటి ఏడాది 0.8శాతం మాత్రమే కేటాయించింది.తీవ్ర విమర్శల తరువాత 2023-24లో 1.8శాతంగా ప్రతిపాదించింది, ఆచరణలో ఎంత ఖర్చు చేసిందీ వెల్లడి కావాల్సి ఉంది. వైసిపి ప్రభుత్వం అనేక కీలక రంగాలను అలక్ష్యం చేసింది. ఆర్థిక మంత్రి భారీ మొత్తాలు కేటాయించినట్లు చూపటం తప్ప కోతల సంగతి తరువాత చెప్పలేదు. ఉదాహరణకు 2021-22 బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తాలలో అమలులో వివిధ శాఖలకు పెట్టిన కోతలను చూస్తే అభివృద్ది బండారం బయటపడుతుంది.రోడ్లు, భవనాలకు 55,గృహనిర్మాణం 54,నీటిసరఫరా, పారిశుధ్యం 46,సాగు నీరు 45,పట్టణాభివృద్ధి 42,వ్యవసాయం 40, సాంఘిక సంక్షేమం 39, గ్రామీణాభివృద్ది 34,ఆరోగ్యం, ఎస్‌సి,ఎస్‌టి,బిసి సంక్షేమశాఖలలో 20శాతాల చొప్పున కోత పెట్టారు. సంక్షేమ పథకాలు అమలు జరిపినంత మాత్రాన సరిపోదు.వాటినెవరూ వ్యతిరేకించటం లేదు. వివిధ శాఖలకు ప్రతిపాదించిన కేటాయింపులను కోత ఎందుకు పెట్టారో, తెచ్చిన అప్పులను దేనికి వెచ్చించారన్నది జనం అడుగుతున్న ప్రశ్న.


మోయలేని అప్పుల భారం గురించి ఒకవైపు చెబుతున్న తెలుగుదేశం కూటమి తాము అధికారానికి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలను మరింతగా పెంచి అమలు చేస్తామని ఆశచూపుతున్నాయి. ఇప్పటికే ఉన్న అప్పులతో కొత్త అప్పులు చేసే అవకాశాలు లేవు. కేంద్రం రుద్దిన విద్యుత్‌ సంస్కరణలు అమలు జరుపుతున్నందుకు అన్ని రాష్ట్రాలకు అనుమతించి జిఎస్‌డిపిలో 3.5శాతం పరిమితిని మించి మరో అరశాతం వైసిపి సర్కార్‌ ఉపయోగించుకుంది. వ్యవసాయానికి విద్యుత్‌ మీటర్లు బిగించే షరతును ఇందుకోసం అంగీకరించింది.పక్కనే ఉన్న తెలంగాణాలో అక్కడి ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రాలతో అప్పుల భారం ఎంత పెరిగిందో స్పష్టమైంది. కొత్త ప్రభుత్వం గత మూడునెలలుగా కొత్త అప్పులు తీసుకుంటే తప్ప గడవని స్థితి.ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన పరిస్థితి మీద శ్వేత పత్రం ప్రకటిస్తే తప్ప వాస్తవాలు వెల్లడికావు. ఎవరు అధికారానికి వచ్చినా కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లేమిటి అన్నది ప్రశ్న.జనం మీద పన్నుల భారాన్ని విపరీతంగా మోపటం ఒకటి లేదా అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలకు ఏదో ఒకసాకుతో కోత పెట్టటం మినహా మరో మార్గం కనిపించటం లేదు. అందుకే పోటీ చేస్తున్న పార్టీలు నిర్ధిష్ట ప్రతిపాదనలతో ప్రణాళికలను ప్రకటిస్తే వాటి బండారం బయట పడుతుంది. ముందు మాకు తెలియలేదు, ఖజానాలో పైసా లేదని తెలంగాణాలో కాంగ్రెస్‌ చెప్పిన మాదిరి నాలుక మడతవేస్తే పరిస్థితి ఏమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చమురు రాజకీయం : అమెరికా చంకనెక్కి రష్యాకు చేయిచ్చిన విశ్వగురువు మోడీ !

28 Thursday Mar 2024

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

Anti Russia, BJP, China, crude imports from Russia, India Oil Imports, Joe Biden, Narendra Modi Failures, world oil politics


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ రాజకీయాల్లో మనదేశం రష్యాను దూరం చేసుకొంటున్నదా ? పరిణామాలను చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా రాయితీ ధరలకు, రూపాయి మారకంతో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు కొనుగోలును మన దేశం ఇప్పుడు దాదాపు నిలిపివేసింది. దానికి బదులు అమెరికా నుంచి భారీ మొత్తంలో అధిక ధరలకు కొనుగోలు చేసేందుకు పూనుకుంది. అంతర్జాతీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ విశ్వగురువుగా అగ్రరాజ్యం అమెరికాను సైతం తన కాళ్ల ముందుకు రప్పించుకోగలరు అని భక్తులు చెబుతారు.అయితే దానికి ఎక్కడా రుజువులు కానరావు. దశాబ్దాలుగా భారత్‌కు మిత్రదేశంగా, బ్రహ్మౌస్‌ ఖండాంతర క్షిపణులు, ఎకె-47రైఫిళ్ల తయారీలో భాగస్వామిగా ఉన్న రష్యాను పక్కన పెట్టి ఇప్పుడు నరేంద్రమోడీ అమెరికా ముందు చేతులెత్తేశారు. రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు బదులు ఎలాంటి రాయితీలు లేని అమెరికా సరకును దిగుమతి చేసుకొనేందుకు నిర్ణయించారు.వచ్చే నెల నుంచి రోజుకు రెండున్నరలక్షల పీపాల ముడి చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకొనేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రష్యా ప్రభుత్వరంగ నౌకల కంపెనీపై విధించిన ఆంక్షల కారణంగా రష్యా పశ్చిమ ప్రాంతంలోని బాల్టిక్‌ సముద్ర రేవుల ద్వారా చమురు ఎగుమతుల రవాణా ఖర్చు పెరుగుతోంది.ఆరు నుంచి ఎనిమిది శాతం అదనంగా కానుందని అంచనా. తద్వారా రష్యాను దెబ్బతీయాలని చూస్తున్నాయి.దీంతో రష్యా ఎగుమతులకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది.లేదా కొనుగోలు చేసే దేశాలకు ఆ మేరకు ధర తగ్గించి విక్రయించాల్సి ఉంటుంది. అమెరికా కొత్త ఆంక్షలు, బెదిరింపుల కారణంగా మనదేశానికి బయలుదేరిన కోటి పీపాల పరిమాణం గల సరకుతో బయలుదేరిన రష్యన్‌ టాంకర్లు ఇప్పుడు చైనా, ఇతర దేశాలవైపు వెళుతున్నాయి.


ఉక్రెయిన్‌పై సైనిక చర్య అంశంలో మనదేశం తటస్థంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరిస్తున్నామని కారణంగా గత రెండు సంవత్సరాలుగా రష్యాపై విధించిన ఆంక్షలను సమర్ధించటం లేదని, ఎక్కడ చౌకగా ఉంటే అక్కడ మనకు ఇష్టమైన దగ్గర చమురుకొనుగోలు చేస్తామని మన ఇంథన, విదేశాంగశాఖ మంత్రులు చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంక్షలు, కొత్త పరిణామాలేవీ లేవు. విదేశాంగ విధానంలో మార్పులు వచ్చినట్లు కూడా ప్రకటించలేదు. కానీ రష్యా నుంచి కొనుగోలు నిలిపివేశారు. మూడు భారీ టాంకర్లు, ఇతర నౌకల ద్వారా 76లక్షల పీపాల చమురు అమెరికా నుంచి బయలుదేరినట్లు కెప్లర్‌ సంస్థ తెలిపింది. రష్యా నుంచి చమురు కొనగూడదని రిలయన్స్‌, ఇతర కంపెనీలు నిర్ణయించాయి. ఇప్పటి వరకు రష్యా నుంచి రాయితీ ధరకు ముడి చమురు కొనుగోలు చేసి చమురు ఉత్పత్తులను ఐరోపా, అమెరికాలకు మనదేశం నుంచి ఎగుమతి చేస్తున్నారు. అమెరికా నుంచి చమురు ఎగుమతులపై 2015వరకు నిషేధం ఉండేది. అనేక దేశాలతో వాణిజ్య లోటు ఉండటం, ఎగుమతులకు అనుమతించాలని అమెరికా చమురు కంపెనీల వత్తిడి కారణంగా ఎత్తివేశారు.అచిర కాలంలోనే అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకొనే దేశాలలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది. ఇటీవలి వరకు అమెరికా దిగుమతి దేశంగా ఉండి ఇప్పుడు ఎగుమతి చేసేదిగా మారింది. గత ఏడాది రోజుకు 40లక్షల పీపాలను ఎగుమతి చేసింది. రాతి పొరల నుంచి చమురు (షేల్‌ అయిల్‌) తీసేందుకు భారీ మొత్తాలలో పెట్టుబడులు పెట్టిన కార్పొరేట్‌ సంస్థలు ఇప్పుడు లాభాలు పిండుకొనేందుకు చూస్తున్నాయి.రానున్న రోజుల్లో ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించబోమని 2015లో అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక బిల్లును ఆమోదించాడు. ఆ ఏడాది రోజుకు కేవలం పదిలక్షల పీపాల ఎగుమతి జరగ్గా గతేడాదికి 40లక్షలకు పెరిగాయి.తన పలుకుబడితో అనేక దేశాల మీద వత్తిడి తెచ్చి చమురు ఎగుమతి చేస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యాను రెచ్చగొట్టటం వెనుక ఐరోపా, ఆసియా చమురు మార్కెట్‌లో ప్రవేశించే అమెరికా ఎత్తుగడ ఉన్నట్లు స్పష్టమైంది.అమెరికా వలలో చిక్కిన దేశాలు ఇప్పుడు ఆంక్షల పేరుతో రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేశాయి.


ప్రపంచ రాజకీయాలనే శాసించే స్థితికి చేరామని చెప్పుకుంటున్న మనదేశం ఎంతో చిన్నదైన ఉత్తర కొరియా పాటి ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతున్నది.రష్యాపై విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తున్నామని చెబుతూనే అమలు జరపటం మనదేశ ప్రతిష్టను పెంచుతుందా, తగ్గిస్తుందా ? అణుపరీక్షలను జరుపుతున్న కారణంగా ఐరాస ఉత్తర కొరియా మీద విధించిన ఆంక్షలను ధిక్కరించి రష్యా చమురు ఎగుమతి చేస్తున్నది. దానికి ప్రతిగా ఉత్తర కొరియానుంచి అవసరమైన ఆయుధాలను పొందుతున్నది. ఒపెక్‌ దేశాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం జూన్‌ నాటికి రోజుకు 90లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించాలని రష్యా కోరింది.దానిలో భాగంగా తన ఉత్పత్తిలో కోత పెట్టి 4.71లక్షల పీపాల ఎగుమతులను కూడా తగ్గించనుంది. ఇదంతా అంతర్జాతీయ చమురు ధరలను తగ్గకుండా చూసేందుకు జరుగుతున్నది. ఐదు సంవత్సరాల క్రితం రష్యా రోజుకు 117లక్షల పీపాలను ఉత్పత్తి చేసేది.ప్రస్తుతం 108లక్షలకు తగ్గించింది. సరిహద్దుల్లో ఉన్న చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌ దాడులు జరుపుతున్నది. దీని వలన రోజుకు ఆరులక్షల పీపాల చమురు శుద్ది సామర్ధ్యం తగ్గింది. అయితే కొద్ది వారాల్లోనే తిరిగి పూర్వపు స్థితికి చేరుకుంటుందని చెబుతున్నారు. మార్చినెల ఒకటవ తేదీ నుంచి నాటో కూటమి రష్యా ఇంథన ఎగుమతులపై మరిన్ని ఆంక్షలను అమలు జరుపుతున్నది. ఆధునిక పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుకుంటున్నప్పటికీ రష్యాలో స్వంత పరిజ్ఞానంతో చమురు డ్రిల్లింగ్‌ భారీఎత్తున జరుగుతున్నది.ఒకవైపు చైనా ఆర్థిక రంగం కుదేలైందని పశ్చిమ దేశాలు ప్రచారం చేస్తుండగా మరోవైపున చైనా పెట్రో సంస్థలు రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించినట్లు వార్తలు వచ్చాయి. 2022 నాటి వినియోగస్థాయికి చేరుకున్నట్లు లాభాలు 8.3శాతం పెరిగినట్లు ప్రకటించారు.చైనా, భారత్‌ రెండూ ఇంథనాన్ని దిగుమతి చేసుకునే దేశాలే.మార్చి 25వ తేదీన చైనాలో పెట్రోలు ధర 1.18 డాలర్లుండగా మనదేశంలో 1.25, పాకిస్థాన్‌లో 1.007డాలర్లు, బంగ్లాదేశ్‌లో 1.112 డాలర్లు ఉంది. అమెరికా వత్తిడి మేరకు మిత్రదేశమైన రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేత పర్యవసానాలు ఎలా ఉండేది అప్పుడే చెప్పలేము.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బ్రెజిల్‌ నుంచి విశాఖకు మాదక ద్రవ్యాలు – మార్కెట్‌గా మారిన భారత్‌ ?

27 Wednesday Mar 2024

Posted by raomk in Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Latin America, NATIONAL NEWS, USA

≈ Leave a comment

Tags

Drug trade, Drug trafficking, narcotics trade, Narendra Modi Failures, President Luiz Inácio Lula da Silva, Synthetic Drug Market


ఎం కోటేశ్వరరావు


బ్రెజిల్‌ నుంచి విశాఖ రేవుకు భారీ మొత్తంలో ఒక కంటెయినర్‌లో వచ్చిన మాదక ద్రవ్యాల గురించి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. సంధ్య ఆక్వా కంపెనీ చిరునామాతో వచ్చిన వాటి మార్కెట్‌ విలువ యాభై వేల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఆక్వా మేత తయారీకి అవసరమైన పొడి ఈస్టు(పులియపెట్టేందుకు అవసరమైన శిలీంధ్రము)ను తెప్పించామే తప్ప దానిలో మాదక ద్రవ్యాల గురించి తమకు తెలియదని సదరు కంపెనీ చెబుతోంది. దీని వెనుక తెలుగుదేశం, వైసిపి, బిజెపి నేతలు కంపెనీ యజమానులతో సంబంధాల గురించి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. బ్రెజిల్‌ ఎన్నికల్లో లూలా గెలిచినపుడు వైసిపి పక్ష నేతగా అభినందనలు పంపానే తప్ప వేరే సంబంధాలేవీ లేవని విజయసాయి రెడ్డి ప్రకటించుకున్నారు. సాక్షి పత్రిక వెలువరించిన కథనం తన ప్రతిష్టకు భంగం కలిగించినందున రు.20కోట్లకు దావా వేస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ప్రకటించారు.వివరాలు పూర్తిగా తెలియక ముందే చంద్రబాబు, లోకేష్‌ ముందుగానే స్పందించారంటే వారికి ముందే తెలుసు అన్నట్లుగా వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విశాఖ రేవులో రాష్ట్ర అధికారులు సిబిఐకి సహకరించలేదనే విమర్శలు వచ్చాయి. వైసిపి నేత అభినందనలు తెలిపారంటే మాదక ద్రవ్యాలతో లూలాకూ సంబంధం ఉండవచ్చనే అనుమానాలు కలిగే విధంగా కొన్ని పత్రికల్లో రాతలు ఉన్నాయి.


ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా ఒకటి. లాటిన్‌ అమెరికాలో ముఠాలు అక్కడి ప్రభుత్వాల కూల్చివేతకు, ప్రజాస్వామ్యానికే ముప్పుగా ఈ ముఠాలు పరిణమించాయి. మనదేశ భద్రతకూ ప్రమాదం వస్తున్నదని అనేక మంది హెచ్చరిస్తున్నారు. గతంలో మనదేశం మాదకద్రవ్యాల సరఫరా మార్పిడి కేంద్రంగా ఉండగా ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్‌గా కూడా రూపొందినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే ఇటీవలి సంవత్సరాలలో భారీ మొత్తాలలో పట్టుబడుతున్నాయి. గత ఏడాది పాకిస్థాన్‌ నుంచి వచ్చిన రు. 25వేల కోట్ల విలువగల మాదక ద్రవ్యాలను మన అధికారులు పట్టుకున్నారు. అంతకు ముందు గుజరాత్‌లోని ముంద్రా రేవుకు వచ్చిన 21వేల విలువగల మూడువేల కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్న అంశం తెలిసిందే. రవాణా జరుగుతున్నవాటిలో పట్టుకుంటున్న మొత్తాలు స్వల్పమే అన్న సంగతి తెలిసిందే.గతేడాది 650బిలియన్‌ డాలర్ల విలువ గల లావాదేవీలు జరిగినట్లు అంచనా. చట్టవిరుద్దమైన ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల్లో 30శాతమని అంచనా. మాదకద్రవ్యాల ముఠాలు మనదేశంపై కేంద్రీకరిస్తున్నట్లు పట్టుబడుతున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల సంఘటిత ముఠాలు ఆసియా, అందులోనూ మనదేశం మీద కేంద్రీకరించటానికి కారణం నడమంత్రపు సిరి వచ్చిన కుటుంబాలు, వారి సంపదలు పెరగటంతో పాటు మాదక ద్రవ్యాల వాడకం కూడా పెరుగుతున్నది. అమెరికా, ఇతర ధనిక దేశాలలో వీటి వినియోగం గరిష్ట స్థాయికి చేరి మార్కెట్‌ పెరగకపోవటం, సింథటిక్‌ డ్రగ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వటం వంటి కారణాలతో కొత్త మార్కెట్ల వేటలో మనదేశం మీద కేంద్రీకరించారు. కొకెయిన్‌ తయారీకి అవసరమైన కోకా ఉత్పత్తి, దిగుబడి ఇటీవలి కాలంలో లాటిన్‌ అమెరికాలో విపరీతంగా పెరిగింది.కొత్త ప్రాంతాలు, దేశాలకు అది విస్తరించింది.మార్కెట్‌లో పోటీ, సరఫరాకు కొత్త మార్గాలను వెతుకుతున్నారు.


మాదక ద్రవ్యాల మాఫియా కుట్రలకు బలైన వారిలో ప్రస్తుత బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా ఒకరు. లాటిన్‌ అమెరికాలో అనేక మంది రాజకీయ నేతలుా,మాఫియా డాన్లకు పెద్ద తేడా కనపడదు. అనేక దేశాల్లో వీరు ప్రజాస్వామిక, వామపక్ష నేతల సారధ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చివేయటం, అనేక మంది నేతల అపహరణ, హత్యల్లో భాగస్వాములు.బ్రెజిల్‌,మెక్సికో మాదక ద్రవ్య మాఫియాలకు పెట్టింది పేరు. వారు మిలిటరీతో సహా అన్ని రంగాలలో ప్రవేశించారు. అనేక దేశాల పాలకులను తెరవెనుక ఉండి నడిపించేది వారే.వామపక్ష ఉద్యమాలను అడ్డుకొనేందుకు అమెరికా ఇలాంటి శక్తులకు పూర్తి మద్దతు, అవసరమైన మారణాయుధాలను అందిస్తోంది. వారిని ప్రజాస్వామిక పరిరక్షకులుగా చిత్రిస్తోంది. బ్రెజిల్లో ఇలాంటి ముఠాలను అడ్డుకొనేందుకు, రవాణా నిరోధానికి లూలా ప్రభుత్వం త్రివిధ దళాల నుంచి వేలాది మిలిటరీ, ఇతర భద్రతా సిబ్బందిని రేవులు, విమానాశ్రయాల్లో నియమించాల్సి వచ్చిందంటే సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 2023 నవంబరులో ప్రారంభించిన వేట ఈ ఏడాది మే నెల వరకు జరుగుతుందని లూలా ప్రకటించారు. దీన్ని అడ్డుకొనేందుకు మాఫియా గాంగులు అనేక బస్సులు, ఒక రైలును దగ్దం చేశారు. అనేక నగరాల్లో ఈ శక్తుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయలేని స్థితి ఉంది. ఒక వైపు ఈ ముఠాలతో చేతులు కలిపిన రాజకీయ ప్రత్యర్ధులు, మరోవైపు ఈ గాంగ్‌లను ఎదుర్కొనేందుకు లూలా పని చేయాల్సి వస్తోంది. ఈ అణచివేత కారణంగానే బ్రెజిల్‌ నుంచి విశాఖకు డ్రగ్స్‌ తరలించి ఉండవచ్చు.


కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత మాదక ద్రవ్యాల రవాణా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కొకెయిన్‌ పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. ఒక టన్ను ఆకు బొలీవియా వంటి చోట్ల వెయ్యి డాలర్లకు దొరికితే ఐరోపా రేవుల్లో 35వేల డాలర్లు పలుకుతోంది. అది వినియోగదారుల వద్దకు వచ్చేసరికి మరికొన్ని రెట్లు అవుతుంది. కోకా ఆకుల ఉత్పత్తి ప్రపంచ కేంద్రంగా లాటిన్‌ అమెరికా ఉంది.మిగతా వాటి ఉత్పత్తి కూడా ఎక్కువే. గతంలో కరీబియన్‌ ప్రాంతం నుంచి రవాణా జరిగితే ఇప్పుడు బ్రెజిల్‌ నుంచి ఎక్కువగా ఉంది. వంద సంవత్సరాల క్రితమే వీటిపై నిషేధం పెట్టినప్పటికీ పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. డ్రగ్స్‌ ముఠాలతో పాటు వారికి అవసరమైన ఆయుధాలను అందచేసే పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున లబ్దిపొందుతున్నాయి.ప్రస్తుతం మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, సరఫరా అన్నీ వికేంద్రీకరణ కావటంతో ఎక్కడైనా పట్టుబడిన వారు తప్పితే మిగతా నేరగాండ్లు తప్పించుకుంటున్నారు. బ్రెజిల్‌ అధ్యక్షుడిగా పనిచేసిన పచ్చి మితవాది జైర్‌ బోల్సనారో మాదక ద్రవ్యాల మాఫియాల సంబంధాలు జగమెరిగిన సత్యం. బోల్సనారో మీదే ప్రస్తుత వామపక్ష అధ్యక్షుడు లూలా గెలిచాడు. బోల్సనారో ఏలుబడిలో రియో నగర శివార్లలో మాఫియా ముఠాలు పదిహేడు లక్షల మంది నివసించే బ్రిటన్‌లోని బర్మింగ్‌హౌమ్‌ నగరమంతటి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు విశ్లేషకులు వెల్లడించారు. అక్కడ వారే సర్వస్వం. ఇలాంటి వారు ప్రజాస్వామ్యానికి ముప్పు అని వేరే చెప్పనవసరం లేదు. ఇలాంటి గాంగుల ఉన్నందునే నేరాలు అదుపులో ఉంటున్నట్లు గతంలో బోల్సనారో బహిరంగంగా ప్రశంసలు కురింపించాడు.తుపాకులపై ఉన్న ఆంక్షలు తొలగించి వాటిని సులభంగా కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించాడు.


మూడు దశాబ్దాల క్రితం 1993లో బ్రెజిల్‌ సావోపాలో నగర జైల్లో నేరగాండ్ల మధ్య కొట్లాట జరిగింది. కారణం ఏమిటంటే ఫస్ట్‌ కాపిటల్‌ కమాండ్‌ అనే కొత్త మాఫియా ఏర్పడటమే. ఇప్పుడది లాటిన్‌ అమెరికాలో,ప్రపంచంలో అతిపెద్ద ముఠాగా ఎదిగింది.దానిలో నలభైవేల మంది జీవిత కాల సభ్యులు, మరో అరవై వేల మంది దానితో సంబంధాలు కలిగి ఉన్నారు. వారు వివిధ దేశాల్లో విస్తరించారు.పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌ నగరంలోని జైళ్లలో ఈ ముఠాకు చెందిన వెయ్యి మంది ఉన్నారని అక్కడి అధికారులే గతేడాది వెల్లడించారు.ఈ ముఠా నైజీరియాలో కూడా పెద్ద ఎత్తున విస్తరించింది. మన దేశంలో అనేక మంది నైజీరియన్లు మాదకద్రవ్యాలతో పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.కొందరు చెబుతున్నదాన్ని బట్టి ఒక నైజీరియన్‌ మనదేశంలో డ్రగ్‌మాఫియాను అదుపు చేస్తున్నట్లు వార్తలు.ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా పసిగట్టే శక్తి అమెరికా సిఐఏ, ఎఫ్‌బిఐలకు ఉందని చెబుతారు. పక్కనే ఉన్న మెక్సికో నుంచి వస్తున్న మాదకద్రవ్యాలను ఎందుకు అరికట్టలేకపోతోందన్నది ప్రశ్న. నిజానికి చేతగాక కాదు. ఆ ముఠాలతో అమెరికాలో ఉన్నవారికి ఉన్న లావాదేవీలే కారణం. అక్రమంగా ప్రవేశించేవారితో అమెరికాలోని పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాలలో చౌకగా పనిచేయించుకుంటారు. మాదక ద్రవ్యాలను తెప్పించుకుంటారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో డ్రగ్‌ మాఫియాదే రాజ్యం. వారికి తెలియకుండా అక్రమంగా ప్రవేశించేవారు ఉండరు. అక్కడి నుంచి మాదకద్రవ్యాల సరఫరా జరుగుతుంది. ఫెంటానిల్‌ అనే మత్తు పదార్ధం ఒక బిళ్ల తయారీకి పది సెంట్లు ఖర్చు అవుతుంది. దాన్ని ఔషధం పేరుతో నకిలీ మందుల చీటీలను సృష్టించి కొనుగోలు చేసి పది నుంచి 30 డాలర్ల వంతున అమ్ముతారు. పదికిలోల ఫెంటానిల్‌ 50వేల డాలర్లకు దొరికితే దాన్ని రెండు కోట్ల డాలర్లకు విక్రయిస్తారు. అమెరికాలో దీన్ని వాడి 2022లో లక్ష తొమ్మిదివేల మంది మరణించినట్లు నమోదైంది.


మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దాన్ని ఆసరా చేసుకొని ఇష్టంలేని ప్రభుత్వాలను కూల్చేందుకు, ప్రజా ఉద్యమాలను దెబ్బతీసేందుకు ముఠాలను అనేక దేశాల్లో అమెరికా ప్రోత్సహించింది. చివరికి అవి ఏకుమేకైనట్లుగా సంఘటిత ముఠాలుగా ఏర్పడి దేశాలనే శాసించే స్థితికి చేరాయి.తమలో తాము ఘర్షణ పడకుండా ఎవరి ప్రాంతంలో వారు దందా చేసుకొనేందుకు స్వతంత్ర (కార్టెల్స్‌) సంస్థలను ఏర్పాటు చేసుకొనే స్థాయికి ఎదిగాయి.అమెరికాలో తొలిసారి 1968లో అధ్యక్షుడిగా గెలిచిన రిచర్డ్‌ నిక్సన్‌ విధిలేని పరిస్థితిలో మాదక ద్రవ్యాలు పౌరుల తొలిశత్రువు అని ప్రకటించాడు. అప్పటికే హెరాయిన్‌, మార్జువానా అమెరికాలో విపరీతంగా పెరిగి, కొకెయిన్‌ రంగంలోకి వచ్చింది.మార్కెట్‌ ఎంతో లాభసాటిగా ఉండటంతో కార్టెల్స్‌కు శ్రీకారం చుట్టారు. ఇవి ఎంతగా ఎదిగాయంటే కరీబియన్‌ ప్రాంతంలో కొన్ని దీవులను కొనుగోలు చేసి అక్కడ ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేసి సరకు రవాణాకు విమానాలను కూడ కొనుగోలు చేశాయి. అలాంటి సంస్థలలో విబేధాలు తలెత్తి మార్కెట్‌ ఆక్రమణకు కొత్త సంస్థలను ఉనికిలోకి తెచ్చారు. ప్రత్యర్ధులను అంతం చేసేందుకు సాయుధ ముఠాలనూ రంగంలోకి తెచ్చారు. మాదక ద్రవ్యాల వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఉగ్రవాద సంస్థలు ఆ వైపు మళ్లాయి. అందువలన అవి చేసే కార్యకలాపాలను నార్కో టెర్రరిజం అని పిలుస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ పాలకుల కోరిక మేరకు జోక్యం చేసుకున్న సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా అక్కడ తాలిబాన్లను ప్రోత్సహించిన అమెరికా వారి చేత మాదక ద్రవ్యాలను కూడా ప్రోత్సహించింది. తరువాత వారే అమెరికాకు వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మీడియా, సిబిఐ, ఇడి, ఎన్నికల బాండ్లు, ఎస్‌బిఐ, కోర్టుల నిష్పక్షపాతాన్ని ఎవరైనా నమ్మేదెలా !

24 Sunday Mar 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics

≈ Leave a comment

Tags

BJP, cbi, ED, electoral bond, godi media, Narendra Modi Failures, SBI, Supreme Court


ఎం కోటేశ్వరరావు


ఎన్నికల బాండ్ల రూపంలో కార్పొరేట్ల కంపెనీల నుంచి విరాళాలను తీసుకోవటం అక్రమం అని ఆ పథకం ప్రారంభం నుంచి అనేక మంది చెబుతున్నా గుడ్డిగా గొర్రె కసాయివాడిని నమ్మినట్లు చాలా మంది అదొక మంచి సంస్కరణ అని మద్దతు ఇచ్చారు. సుప్రీం కోర్టు 2024ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పుతో కొందరు స్వంత బుర్రలతో ఆలోచించటం మొదలు పెట్టారు. మరికొందరు మరక మంచిదే అన్నట్లుగా బాండ్లను, తీసుకున్న పార్టీలను సమర్థిస్తున్నారు. అనేక కేసుల్లో వచ్చిన తీర్పులు, వాటి తరువాత పదవి నుంచి దిగిపోయిన న్యాయమూర్తులు పొందిన పదవులను చూసిన తరువాత న్యాయవ్యవస్థ మీద జనం విశ్వాసం కోల్పోయారు. అలాంటి స్థితిలో ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు వ్యవహరించిన తీరుతో అనేక మందికి విశ్వాసం పెరిగింది. ఇది మరొక భ్రమకు దారి తీస్తుందా ? మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా మీద దర్యాప్తు సంస్థలు సమర్పించిన తప్పుడు వివరాల ప్రాతిపదికన దిగువ కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తే హైకోర్టు దాన్ని కొట్టివేసింది. పదేండ్ల పాటు వేధింపులకు, జైలుపాలై, ఉద్యోగం పోగొట్టుకున్న ఉదంతం చూసిన తరువాత ఎవరికైనా ఏమనిపిస్తుంది ? వ్యవస్థల మీద విశ్వాసం పెరుగుతుందా, తగ్గుతుందా !


పదేండ్ల క్రితం లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశాన్ని ఊపివేసిన, బిజెపికి ఓట్లు, అంతకంటే ఎక్కువ సీట్లు రాల్చిన కేసుల్లో 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం ఒకటి. దీని గురించి ఎంత మందికి జ్ఞాపకం ఉండి ఉంటుంది ? మరోసారి 2024 మార్చి 22న ఢిల్లీ హైకోర్టు దీని గురించి జనానికి గుర్తు చేసింది. అదేమంటే 2017 డిసెంబరు 21 ఎలాంటి ఆధారాలు లేవంటూ కొట్టివేసిన ప్రత్యేక కోర్టు తీర్పును తిరిగి విచారించాలని 2018 మార్చి 20వ తేదీన సిబిఐ దాఖలు చేసిన పిటీషన్‌కు అనుకూలంగా ఆరు సంవత్సరాల తరువాత ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సదరు తీర్పులో పరస్పర వైరుధ్యాలు కనిపించాయని, దాని మీద అప్పీలు చేయాలా లేదా అనేది సిబిఐ ఇష్టమని చెప్పింది. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే అనుమతించింది. ఒక తీర్పు మీద చేసిన అప్పీలును పరిష్కరించటానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్న న్యాయవ్యవస్థ మీద, అందునా ఏడుగురు న్యాయమూర్తులు విచారించిన తరువాత సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇచ్చిన తీర్పు మీద జనాలకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది ? ఎన్నికల బాండ్ల మీద స్పందించిన తీరుకు సంతోషించాలా ? 2జి కేసులో చేసిందాన్ని మరొక విధంగా భావించాలా ? యుపిఏ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న డిఎంకె నేత రాజా, అదే పార్టీ ఎంపీగా ఉన్న కనిమొళి, మరో 16 మంది అధికారులు, ఇతరులు 2జి కేసులో నిర్దోషులని 2017 తీర్పులో కోర్టు పేర్కొని వారిని విడుదల చేసింది. అనుచిత పద్దతుల్లో అయిన వారికి వీలుగా అనుసరించిన పద్దతి కారణంగా లక్షా 76వేల కోట్ల రూపాయలు దేశ ఖజానా నష్టపోయిందన్నది కేసులో వచ్చిన తీవ్ర ఆరోపణ. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ లైసన్సుదారులకు రు.30 కోట్ల మేర రాయితీలు అనుచితంగా ఇచ్చిందని, ప్రయివేటు మద్యం వ్యాపారులు దుకాణాలను దక్కించుకొనేందుకు అనువుగా విధానాన్ని రూపొందించినందుకు లబ్ది పొందిన వారు వంద కోట్ల రూపాయల ముడుపులు అందచేసినట్లు ఆరోపణలు చేశారు.


అవినీతి ఎంత అయినా అందుకు పాల్పడిన వారిని వదల కూడదు. వంద కోట్ల నిగ్గుతేల్చటంలో రెండు సంవత్సరాలుగా సిబిఐ, ఇడి కూడా విఫలమైంది. కొందరిని అనుమానితులు, సాక్షులు, నిందితులు అంటూ అరెస్టుచేసి వివరాలు చెప్పాలని వారిని అడుగుతున్నది, నిందితులను నిరవధికంగా బెయిలు రాకుండా జైలు పాలు చేసింది. తాము నిధులు ఇచ్చామంటూ అప్రూవర్లుగా మారిన కొందరు చెప్పటం తప్ప ఆ సొమ్ము ఎవరి ఖాతాకు, ఎలా చేరిందన్నది ఇంతవరకు తెలియదు. బిఆర్‌ఎస్‌ నాయకురాలు కల్వకుంట్ల కవితను ముందు సాక్షి అన్నారు, తరువాత నిందితురాలిగా ప్రకటించిన తరువాత అరెస్టు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీవాల్‌ తమ ముందుకు హాజరుకావాలని ఇడి తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చింది. తాను ఏ హౌదాలో రావాలో చెప్పమని అడిగితే అదేం కుదరదు మేం రమ్మన్నాం గనుక రావాల్సిందే అన్నట్లుగా వ్యవహరించింది. దాంతో తనను బలవంతం చేస్తున్నారని, రక్షణ కల్పించాలని కేజరీ వాల్‌ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంగా వ్యక్తిగత హౌదాలో విచారణకు రావాలని, వచ్చిన తరువాత అరెస్టు చేస్తామని గాని లేదని గానీ తాము చెప్పటం లేదని ఇడి కోర్టులో వాదించింది. కోర్టు కేజరీవాల్‌ కోరినట్లుగా రక్షణ కల్పించేందుకు తిరస్కరించింది. వెంటనే ఇడి అధికారులు కేజరీవాల్‌ ఇంటికి పోవటం సోదా తతంగం, అరెస్టు అంతా నాటకీయంగా జరిగింది. కవిత, కేజరీవాల్‌ అవినీతికి పాల్పడ్డారా లేదా అనే సంగతి కాసేపు పక్కన పెడదాం. రెండు సంతవ్సరాల నుంచి జరుగుతున్న హడావుడి తరువాత ఒక వేళ అవినీతి జరిగి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలను వారు ఇండ్లలో భద్రపరచి ఇడి అధికారులు కనుగొనే విధంగా ఉంచుతారా ? వంద కోట్ల మద్యం కేసు మీద ఇంత తీవ్రంగా కేంద్రీకరించిన అదే సిబిఐ, ఇడి కాగ్‌ చెప్పిన లక్షా 76వేల కోట్ల నష్టం జరిగిందన్న కేసులో ముడుపులను నిరూపించటంలో ఎందుకు ఘోరంగా విఫలమైనట్లు ?


ప్రభుత్వ సంస్థలను తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకుంటారో ఎన్నికల బాండ్ల కేసులో ఎస్‌బిఐ తీరు తిరుగులేని విధంగా వెల్లడించింది. సుప్రీం కోర్టు తీర్పును వమ్ముచేసేందుకు తమ దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించాలంటే మూడు నెలలు పడుతుందని కోర్టునే తప్పుదారి పట్టించేందుకు చూసింది. చివరకు విధిలేక వెంటనే సమర్పించింది.అది ఎలా సాధ్యమైంది ? ముందుకు ఎందుకు ఎవరిని రక్షించేందుకు ఠలాయించినట్లు ?కచ్చితంగా బిజెపిని రక్షించేందుకే అన్నది స్పష్టం. రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన స్టేట్‌ బాంకు పరువు మురికి గంగలో కలిసింది.అక్రమాలకు పాల్పడిన ప్రయివేటు రంగ ఎస్‌ బాంకును ఆదుకొనేందుకు అధికారంలో ఉన్న పెద్దలు ఆరువేల కోట్ల రూపాయలను ఎస్‌బిఐ ద్వారా ఇప్పించినపుడే అది స్వతంత్ర సంస్థకాదు పాలకుల కీలుబొమ్మ అని తేలింది.


సిబిఐ, ఇడి డెరెక్టర్ల పదవీ కాలాన్ని నియంత్రించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందని 2023 జూలైలో ముగ్గురు సభ్యుల సుప్రీం కోర్టు బెంచ్‌ తీర్పు ఇచ్చింది. అందువలన ఆ సంస్థల పదవుల్లో ఉన్నవారు, వాటి కోసం అర్రులు చాస్తున్నవారు కేంద్ర పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుంటారన్నది స్పష్టం. అందుకు సిద్దపడ్డ వారినే ఎంపిక చేస్తారు. అందువలన అవి స్వతంత్ర సంస్థలని చెప్పటం జనాన్ని వంచించటం తప్ప మరొకటి కాదు. గతేడాది మార్చి నెలలో పద్నాలుగు ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఇడి అరెస్టుల నుంచి రక్షించాలని సుప్రీం కోర్టు తలుపు తట్టారు. గడచిన పదేండ్ల కాలంలో ఆ సంస్థ చేసిన అరెస్టుల్లో 95శాతం ప్రతిపక్షాలకు చెందిన వారే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆలోచన ఎంత ప్రమాదకరంగా ఉందో ఒక కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వెల్లడించింది.నిందితుడిని అరెస్టు చేసేందుకు ఇడి తగిన కారణాలు చూపుతూ ఎలాంటి మినహాయింపులు లేకుండా రాతపూర్వకంగా నోటీసు అందచేయాలని ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, ఇతరులు దాఖలు చేసిన పిటీషన్‌ మీద ఎలాంటి పునరాలోచన అవసరం లేదని పేర్కొన్నది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదనే ఒక్క కారణంతో కూడా ఎవరినైనా అరెస్టు చేయవచ్చనే ఇడి వాదనను తోసిపుచ్చుతూ ఒక మనీలాండరింగ్‌ కేసులో గతేడాది అక్టోబరులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.ఇడి తీరు పారదర్శకంగా ఉండాలని, వేధింపులకు గురిచేస్తున్నట్లుగా ఉండకూడదని పేర్కొన్నది. మనీలాండరింగ్‌ చట్టం 2002లో సెక్షన్‌ 50 ప్రకారం సమన్లకు సాక్షి సహకరించటం లేనందున సెక్షన్‌ 19 ప్రకారం అరెస్టుకు అతడు లేదా ఆమె అర్హురాలే అని ఇడి చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. దీని మీద పునరాలోచన చేయాలంటూ ఇడి వాదనను సమర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక పిటీషన్‌ దాఖలు చేయటం నిరంకుశ అధికారాలను దానికి కట్టబెట్టాలని చూడటమే.


ఎన్నికల బాండ్లు అంటే అక్రమంగా తీసుకొనే విరాళాలను సక్రమంగా చేసే పెద్ద అవినీతి తప్ప మరొకటి కాదు. దీని మీద దేశంలోని మీడియా వ్యవహరించిన తీరు సదరు అక్రమాన్ని దాచిపెట్టేందుకే చూసింది తప్ప మరొకటి కాదు. రాజీవ్‌ గాంధీ హయాంలో జరిగిన 64 కోట్ల బోఫోర్స్‌ కుంభకోణం ఏనుగు ముందు ఎలుక వంటిది. కార్పొరేట్‌ కంపెనీలు ఇచ్చిన విరాళాల గురించి ఏ ఒక్క బడా పత్రిక, ఛానల్‌ గానీ ఆరేండ్లుగా ఏ ఒక్క పరిశోధన కధనాన్ని ప్రచురించలేదు.ఈ కాలంలో గోడీ మీడియాగా మారిపోవటమే అసలు కారణం. గోడీ అంటే నచ్చిన వారి ఒళ్లో కూర్చుని కబుర్లు చెప్పటం. రాజకీయ నేతలను బెదిరించినట్లుగానే మీడియా యాజమాన్యాల మీద కూడా దర్యాప్తు సంస్థల కత్తిని చూపటం, ప్రధాన మీడియా కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో ఉండటం, అది నరేంద్రమోడీ మద్దతుదారుగా మారిన తరువాత వాస్తవాలను వెల్లడించేందుకు ఎవరైనా ఎందుకు ముందుకు వస్తారు. వాస్తవాలను వెల్లడిస్తున్న న్యూస్‌ క్లిక్‌ వంటి ఒక చిన్న సంస్థను కూడా సహించలేక దానికి చైనా నుంచి నిధులు వస్తున్నాయంటూ ఆధారం లేని ఆరోపణలను చేస్తూ యజమానులను ఎలా వెంటాడుతున్నదీ చూస్తున్నాము. నిజానికి మీడియా రంగంలోకి దిగితే అక్రమాలను వెలికి తీయటం కష్టం కాదు.ప్రస్తుతం మనదేశంలో నిలిచిపోయిన అఫ్‌పోస్ట్‌ ఇండియా పత్రిక సమాచార హక్కు చట్ట నిబంధనలను ఉపయోగించుకొని ఎన్నికల బాండ్ల అక్రమాన్ని వెల్లడించింది. గడువు ముగిసిన ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు తమ ఖాతాలకు మళ్లించుకోకూడదు. కానీ ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయ జోక్యంతో 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పది కోట్ల రూపాయల మురిగిపోయిన బాండ్లను మార్చుకొన్న తీరును ఆ పత్రిక బయటపెట్టింది. ఆ బాండ్లు ఏ పార్టీకి వెళ్లి ఉంటాయో వేరే చెప్పనవసరం లేదు. 2017-18 – 2019-20 సంవత్సరాలలో 19 పార్టీలు స్వీకరించిన రు.6,201 కోట్ల ఎన్నికల బాండ్లలో 68శాతం బిజెపికే వెళ్లినట్లు రిపోర్టర్స్‌ కలెక్టివ్‌, ఆర్టికల్‌ 14 అనే మీడియా సంస్థలు సీల్డ్‌ కవర్లలో సుప్రీం కోర్టుకు ఇచ్చిన వాటిలో ఏముందో 2022లోనే వెల్లడించాయి. ఎన్నికల బాండ్ల కోసం కార్పొరేట్‌ సంస్థలు సూట్‌కేస్‌ కంపెనీలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని గతంలో ఎన్నికల కమిషన్‌ కేంద్ర న్యాయశాఖకు రాసిన లేఖ గురించి కూడా ది వైర్‌ వెల్లడించింది.


ముంబయి కేంద్రంగా హిందూస్థాన్‌ టైమ్స్‌లో పని చేసిన సీనియర్‌ ఎడిటర్‌ సతీష్‌ నందగోంకర్‌ను ఆ పత్రిక ఎడిటర్‌ వేధించిన తీరు అతను మరణించిన తరువాత వెల్లడైంది. ముంబై ప్రెస్‌ క్లబ్‌ మరణానికి దారి తీసిన కారణాలపై పరిశోధన జరిపింది. కొంత మంది ఫ్రీలాన్సర్‌ జర్నలిస్టులు రాసిన వార్తలను ప్రచురించాలని నందగోంకర్‌ సంపాదకుడికి పంపారు. వాటిని ప్రచురించకపోవటమే గాక పనికిమాలినవంటూ అవమానించాడు. అయితే పత్రికలో తనకున్న అవకాశాన్ని వినియోగించుకొని ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో వాటిని ప్రచురించారు. అవి ముద్రణ సంచికల్లో రాలేదు. కొన్ని రోజుల తరువాత నందగోంకర్‌ ఆన్‌లైన్‌ స్టోరీలను ఎంపిక చేసి ప్రచురించే బాధ్యతల నుంచి తొలగించి అవమానించారు. ఆ వత్తిడితో అతను గుండెపోటుకు గురై మరణించినట్లు తేలింది. తమకు నచ్చని కథనాలను రాసే జర్నలిస్టులను యజమానులు ఎలా వేధించేది అందరికీ తెలిసిన సత్యమే. దీనికి మీడియా యాజమాన్యాలకు పార్టీలకు, అధికారంలో ఉన్నవారితో ఉన్న పరస్పర ప్రయోజన సంబంధాలే కారణం. గతంలో కూడా వివిధ వ్యవస్థలను అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ దుర్వినియోగం చేసింది. ప్రతిపక్షంగా దాన్ని విమర్శించిన బిజెపి ఇప్పుడు అంతకంటే వేగంగా, దారుణంగా దుర్వినియోగానికి పాల్పడుతోంది. వ్యవస్థల మీద జనాలకు విశ్వాసం కోల్పోవటాన్ని వేగిరం చేస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అచ్చేదిన్‌ పదేండ్లలో ఆవిరైన సంతోషం, పాకిస్థాన్‌ కంటే దిగువనే : నాడు బ్రిటీష్‌ రాజ్యం – నేడు బిలియనీర్ల భోజ్యం !!

22 Friday Mar 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, Education, Health, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Religious Intolarence

≈ Leave a comment

Tags

BILLIONAIRE RAJ, BJP, ECONOMIC INEQUALITY IN INDIA, Narendra Modi Failures, RSS, World Happiness Report 2024


ఎం కోటేశ్వరరావు


తెల్లోడి రాజ్యమే బాగుంది, కమ్యూనిస్టులే మంచోళ్లు అని మా తాత చెప్పేవాడు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్ల పాలకులు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచండి అన్న విధానంలో భాగంగా బండి పట్టాలకు అవసరమైన ఇనుము ఇచ్చారట, వాటిని పంపిణీ చేయటంలో ఆ నాడే కాంగ్రెస్‌ వారు తన, పర బేధాన్ని పాటిస్తే కమ్యూనిస్టులు అందరికీ ఇప్పించేందుకు చూశారట. తెల్లోడి పాలనను తప్పు పట్టనందుకు మా తాతను విమర్శించాలా ? ఒక రైతుగా తన పరిమిత ప్రయోజనాన్ని చూసి సంతోషించినందుకు విమర్శించాలా ? ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. జనజీవితాలను దిగజారుస్తూ కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీని వ్యతిరేకించాలా ? రామాలయం కట్టినందుకు సానుకూలంగా ఉండాలా ? ముఖ్యవైరుధ్యం ఏమిటన్నదే కీలకం. నరేంద్రమోడీ పదేండ్ల విజయ గీతాలాపన వికసిత భారత్‌ చెవుల తుప్పు వదిలిస్తున్నది. అఫ్‌ కోర్స్‌ 2004 ఇదే బిజెపి దేశం వెలిగిపోతోందంటూ తాను ఆరిపోయిందనుకోండి. ఇప్పుడూ అదే జరగనుందా ? ఎవరి అంచనాలు వారివి ! పదేండ్లలో తమను మరింతగా పెంచిన మోడీ ఏలుబడిని బిలియనీర్లు అంత తేలికగా వదులుకోరు, వారి చేతుల్లో ఉన్న మీడియాలో మోడీ భజన మరింత పెరుగుతుంది, దీనికి మత మత్తు ఎలాగూ ఉంది. ఈ అంశాన్ని తక్కువ అంచనా వేయకూడదు.


వికసిత భారత్‌ అంటూ బిజెపి ప్రచార గాలి తీస్తూ రెండు నివేదికలు తాజాగా వెలువడ్డాయి. ఒకటి ప్రపంచ సంతోష సూచికలో మనదేశ స్థానం గత పది సంవత్సరాల్లో దిగజారింది తప్ప జనానికి అచ్చేదిన్‌ జాడలేదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి రూపొందిస్తున్నది గనుక సంతోష సూచికను మేం అంగీకరించం అని బిజెపి ఠలాయిస్తే కుదరదు.తలసరి జిడిపి, సామాజిక మద్దతు,ఆరోగ్యం, జీవన విధానాన్ని ఎంచుకొనే స్వేచ్చ,ఉదారత, ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో అవినీతిని జనం ఎలా చూస్తున్నారు అనే ప్రాతిపదికల మీద ప్రతిదేశం తెచ్చుకొనే మార్కులను బట్టి సూచికలను ప్రకటిస్తారు. ప్రతి ఏడాది సూచిక అంతకు ముందు రెండు సంవత్సరాల తీరుతెన్నుల ప్రాతిపదిన ఉంటుంది. కొన్ని సార్లు పరిగణనలోకి తీసుకొనే దేశాల సంఖ్యలో తేడాలు ఉండవచ్చు. అందువలన మార్కులను బట్టి దిగజారిందా మెరుగుపడిందా అన్నది కూడా చెప్పవచ్చు. మన ఇరుగు పొరుగు దేశాల వివరాలను చూద్దాం. 1.సూచిక, మార్కులు అంటే 2014-16 పంవత్సరాలకు సంబంధించి 2017వ సంవత్సర నివేదిక, 2 సూచిక, మార్కులు అంటే 2021-23కు సంబంధించి 2024 నివేదిక వివరాలు అని గమనించాలి.
దేశంపేరు×1.సూచిక×1.మార్కులు×2.సూచిక××2.మార్కులు
భారత్‌ ×× 118 ×× 4.407 ×× 126 ×× 4.054
చైనా ×× 83 ×× 5.245 ×× 60 ×× 5.979
పాకిస్థాన్‌ ×× 92 ×× 5.132 ×× 108 ×× 4.657
నేపాల్‌ ×× 107 ×× 4.793 ×× 93 ×× 5.158
బంగ్లాదేశ్‌ ×× 110 ×× 4.643 ×× 129 ×× 3.886
శ్రీలంక ×× 117 ×× 4.415 ×× 128 ×× 3.898
నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ప్రపంచ జిడిపిలో పదవ స్థానంలో ఉన్నదానిని ఐదవ స్థానానికి చేర్చారని గొప్పలు చెప్పుకుంటారు.త్వరలో చైనాను అధిగమించి పోతామని అందుకే వికసిత భారత్‌ అని చెబుతున్నారు.వచ్చే రోజుల్లో రాజెవరో రెడ్డెవరో అన్నట్లుగా వాటి గురించి వదలివేద్దాం. గడచిన పదేండ్లలో చైనాకు పోటీగా దేశాన్ని నిలబెడతానని చెప్పిన మోడీ దానితో పోలిస్తే దేశాన్ని ఎక్కడ ఉంచారోపైన పేర్కొన్న సంతోష సూచికల్లోనే డొల్లతనం వెల్లడైంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా కూడా ఉంచటంలో విఫలమయ్యారు. పదేండ్ల క్రితం ప్రపంచ జిడిపిలో చైనా వాటా 13.1శాతంగా ఉన్నదాన్ని 2023లో 17.7శాతానికి పెంచుకోగా మన వాటా 2.6 నుంచి 3.73కు పెరిగింది. పాకిస్థాన్‌ జిడిపి 2014లో 271.4బిలియన్‌ డాలర్ల నుంచి మధ్యలో ఒక ఏడాది 374.66 బి.డాలర్లకు పెరిగి 2023లో 340.64బి.డాలర్ల వద్ద ఉంది. జిడిపి పెరిగినా సంతోష సూచిక పతనంలో మనకూ పాకిస్థాన్‌కూ తేడా ఏముంది ? అచ్చేదిన్‌, వికసిత భారత్‌ నినాదాలు ఇచ్చిన వారూ, విదేశాల్లో దేశ ప్రతిష్ట పెంచినట్లు చెప్పుకున్నవారూ అక్కడ లేరు. బిజెపి వారు చెబుతున్నట్లు మనకు అన్నీ ఉన్నా జనాలు ఎందుకు సంతోషంగా లేకపోతున్నారు ?


నాటి బ్రిటీష్‌ వలస పాలనలో కంటే నేటి స్వతంత్ర పాలనలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా పెరిగినట్లు తాజాగా ప్రపంచ అసమానతల ప్రయోగశాల(వరల్డ్‌ ఇనీక్వాలిటీ లాబ్‌) 2024 మనదేశం గురించి ప్రకటించిన విశ్లేషణలో పేర్కొన్నది. నాడు మన జనాన్ని విదేశీ దొరలు దోచుకుంటే నేడు స్వదేశీ దొరలు ఆపని చేస్తున్నారు. అనేక అంశాల మీద అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఆర్థికవేత్తలు నితిన్‌ కుమార్‌ భర్తీ, లూకాస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెట్టీ, అన్‌మోల్‌ సోమాంచీ ఒక పత్రాన్ని రూపొందించారు.దానిలో పేర్కొన్న ప్రధాన అంశాలేమిటి ? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1980దశకం వరకు అసమానతలు తగ్గాయి. తరువాత ముఖ్యంగా 1990దశకంలో సంస్కరణలు ప్రారంభించిన పదేండ్ల తరువాత విపరీతంగా పెరిగాయి.నరేంద్రమోడీ ఏలుబడిలో అది మరింత ఎక్కువైంది. 1982 నాటికి దేశంలోని ఎగువ ఒకశాతం మంది రాబడి 6.1శాతం, అది 2014-15 నుంచి 2022-23 వరకు పరిశీలించినపుడు 22.6శాతం ఉంటే వారి వద్ద పోగుబడిన సంపదలు 40.1శాతంగా ఉన్నాయి. ఎగువ పదిశాతం మంది వద్ద 2022 నాటికి దేశ సంపదల్లో 60శాతం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు.అంతరాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, అమెరికాల్లో కూడా ఆదాయరాబడి వాటా ఇంతగా లేదు. పన్నుల విధానం, ప్రపంచీకరణ దీనికి కారణం.ధనికులుగా ఉన్న 167 కుటుంబాల సంపదపై రెండుశాతం పన్ను విధిస్తే జాతీయ ఆదాయం 0.5శాతం పెరుగుతుందని అంచనా వేశారంటే సంపద ఎలా గుట్టలుగా పడి ఉందో అర్ధం చేసుకోవచ్చు. సక్రమంగా లేని సమాచారం మేరకే తాము అసమానతల గురించి చెబుతున్నామని, నాణ్యమైన, సమగ్ర సమాచారం ఉంటే అసమానతలు ఇంకా ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ధనికుల్లో ఉన్న ఎగువ తరగతిలో కూడా మిగతావారితో పోలిస్తే వారిలో 0.1శాతం మంది పదిశాతం రాబడిని పొందారు. ప్రస్తుతం రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయని కొందరు చెప్పిన మాటలను నరేంద్రమోడీ నిజం చేస్తున్నారు. అందుకే కార్పొరేట్‌ మీడియా, ధనికుల ప్రతినిధులందరూ మరోసారి వచ్చే ఎన్నికల్లో మోడీని కోరుకుంటున్నారన్నది స్పష్టం.


దేశంలో అనేక సమస్యలకు జనాభా పెరుగుదలే కారణం అని గతంలో ఊదరగొట్టారు, కుటుంబనియంత్రణ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటి పాలకులు అధిక జనాభా మన దేశానికి వరం అని ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా మారటానికి అవసరమైన చౌక శ్రామిక శక్తి అందుబాటులో ఉందని తమ జబ్బలను తామే చరుచుకుంటున్నారు. మరోవైపు గత పదేండ్లుగా కేంద్రంలో, వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాషాయ దళాలు ముస్లిం జనాభా పెరిగి హిందువుల కంటే మెజారిటీగా మారనున్నదనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అది నిజమా, సంతోషం ఆవిరి అవుతున్న స్థితిలో ఏ మతానికి చెందిన వారైనా ప్రతి కుటుంబమూ పరిమితం చేసుకొనేందుకు చూస్తున్నాయని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి.జనన-మరణాల రేటును ప్రాతిపదికగా తీసుకున్నపుడు జననాల రేటు 2.1గా ఉండాలని ఆ రంగనిపుణులు పేర్కొన్నారు. కానీ తాజా సర్వ ప్రకారం రెండుశాతమే ఉన్నందున రానున్న రోజుల్లో జనాభా తగ్గుతుంది తప్ప పెరగదని చెబుతున్నారు. జనాభాలో పదిహేనేండ్ల లోపు వారు 2015-16లో 28.6శాతం ఉండగా 2019-21లో 26.5శాతానికి తగ్గారు. అంటే కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గుతోంది. జమ్మూ-కాశ్మీరు జనాభాలో 68శాతం ముస్లింలే ఉన్నారు. అక్కడ జననాల రేటు దేశ సగటు కంటే తక్కువగా 1.4శాతమే ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ముస్లిం జననాల సగటు కంటే కూడా ఇది తక్కువ. విద్య, ఉపాధి, వైద్య, ఆరోగ్య రంగాల్లో కేటాయింపులు ఎక్కువగా ఉండి జనాల పరిస్థితి మెరుగుపడితే కులం, మతంతో నిమిత్తం లేకుండా కుటుంబనియంత్రణ ఎవరికి వారు పాటిస్తారన్నది అందరికీ తెలిసిన సత్యం.

రెండు సంవత్సరాల క్రితం ఆక్స్‌ఫామ్‌ ఇండియా సంస్థ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం కేవలం 98 మంది ధనికులైన భారతీయులు రు.49.15లక్షల కోట్ల సంపదలను అదుపు చేస్తుండగా పేదల్లోని 55.5 కోట్ల మంది వద్ద అంత ఉందని పేర్కొన్నది. 2021లో ఒక వ్యక్తి జాతీయ ఆదాయ సగటు రు.2,04,200గా లెక్కించగా దిగువ 50శాతం మంది ఆదాయం రు.53,610 ఉంది. ఎగువ పదిశాతం మంది జనాల సగటు రాబడి రు.11,66,520గా ఉంది. కరోనా తరువాత పేదలలో 20శాతం మంది రాబడి 2020-21లో 53శాతం తగ్గగా ఇదే సమయంలో ఎగువ 20శాతం మంది రాబడి 39శాతం పెరిగింది. కరోనా కారణంగా ఆరు కోట్లుగా ఉన్న పేదలు 13.4 కోట్లకు పెరిగారు. వైద్య ఖర్చుల కారణంగా 2017లో 5.5 కోట్ల మంది పేదరికంలోకి దిగజారారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా దిగువ తరగతి జనాల రాబడి పెరగకపోతే వారి జీవితాలు అతలాకుతలం అవుతాయి. విద్య, వైద్య రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటూ ప్రయివేటు వారిని ప్రోత్సహిస్తున్నాయి. రుణగ్రస్తులు కావటానికి వీటి మీద పెట్టే ఖర్చు కూడా ఒక అంశంగా మారింది.జిడిపిలో విద్య మీద ఆరుశాతం ఖర్చు పెట్టాలన్నది లక్ష్యం. కానీ నరేంద్రమోడీ తొలి ఐదు సంవత్సరాలలో మూడు శాతానికి మించలేదు, ఏటేటా తగ్గుతున్నది.జిడిపిలో ఐదవ స్థానానికి దేశాన్ని చేర్చామని గొప్పలు చెప్పుకోవటం కాదు. మన కంటే ఎంతో తక్కువగా ఉన్న బ్రెజిల్‌ విద్యకు 6.1, వైద్యానికి 9.5శాతం, రష్యా 4.7-5.3 చొప్పున దక్షిణాఫ్రికా 6.8-8.2శాతాల చొప్పున కేటాయిస్తున్నాయి. సంతోష సూచికలో సామాజిక రంగాల మీద పెట్టే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటారని గమనించాలి. వాటి కేటాయింపులు సరిగా లేకపోతే,తగ్గుతుంటే సంతోషం ఆవిరి అవుతుంది. గడచిన పదేండ్లలో సూచికలో దిగజారటానికి కారణం ఇదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

వల్లించేది శాంతి ప్రవచనాలు – ఆచరణలో అశాంతి బీజాలు !

20 Wednesday Mar 2024

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ 1 Comment

Tags

#US Lies, Donald trump, Joe Biden, MIDDLE EAST, Ukraine crisis, US military-industrial complex


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ శాంతికోసమే తాము తాపత్రయపడుతున్నట్లు చెప్పిన వారందరూ చరిత్రలో అశాంతికి మూలకారకులుగా రుజువైంది. ఇప్పటికీ ఆదే జరుగుతోందా ? పాలస్తీనా ప్రాంతాలను కబళించిన ఇజ్రాయెల్‌ ఇప్పుడు మొత్తం అరబ్బులనే అంతం చేసేందుకు, వారి ప్రాంతాల నుంచి వెళ్లగొట్టేందుకు జరుపుతున్న మారణకాండ మంగళవారం నాటికి 165వ రోజులో ప్రవేశించింది. గాజాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 32వేలకు చేరుకుంది.గాయపడిన వారు, నిలువ నీడ, సర్వస్వం కోల్పోయిన వారు, ధ్వంసమైన గృహాల సంఖ్య సరేసరి.మానవహక్కులు, మానవాదానికి అసలు సిసలు ప్రతినిధులుగా చెప్పుకుంటున్నవారు పడక కుర్చీలకే పరిమితమయ్యారు. గతేడాది అక్టోబరు ఏడు నుంచి జరుపుతున్న ఇజ్రాయెల్‌ దాడులతో పాటు మధ్య ప్రాచ్యంలో అమెరికా మిలిటరీ, ఆధునిక ఆయుధాల మోహరింపు కూడా పెరిగింది. ఆసియాలో పరిస్థితి ఇదైతే ఐరోపా దేశాలకు ముప్పు పేరుతో గత ఎనిమిది దశాబ్దాలుగా తిష్టవేసిన అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభం ముసుగులో ఆ దేశాలకు ముప్పును మరింత పెంచేవిధంగా ప్రయత్నించటం శాంతిని కోరుకొనే వారికి ఆందోళన కలిగిస్తోంది. నాటి జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకురాలిగా ఉంటే ఇప్పుడు అమెరికా చర్యలు మూడవ ప్రపంచ పోరుకు దారితీసేవిగా ఉన్నట్లు అనేక మంది చెబుతున్నారు.


ఆసియా ఖండంలోని సహజ సంపదలు, రాజకీయ ఆధిపత్యం మీద కన్నేసిన అమెరికా ఒక్కో దశలో ఒక్కోకారణాన్ని సాకుగా చూపి తిష్టవేస్తోంది. మధ్య ప్రాచ్యంలో పరిణామాలు దేనికి దారితీసేదీ ఎవరూ ఊహించలేని స్థితి.బాధితులకు ఆహార సరఫరా చేస్తున్నట్లు చెబుతూనే అంతకంటే ఎక్కువగా అమెరిన్లు మిలిటరీ కేంద్రీకరణకు పూనుకున్నారు. గాజా మీద దాడులకు నిరసన లేదా ప్రతీకారంగా ప్రపంచంలో ఎంతో కీలకమైన నౌకా మార్గం ఉన్న ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌ వైపు ప్రయాణించే నౌకల మీద ఇరాన్‌ మద్దతు ఉన్న ఎమెన్‌లోని హౌతీ దళాలు దాడులకు దిగటం, వాటి మీద అమెరికా జరుపుతున్న దాడుల గురించి తెలిసిందే. కొద్ది గంటల్లోనే గాజాలోని హమస్‌ సాయుధులను అదుపు చేస్తామని ప్రగల్భాలు పలికిన ఇజ్రాయెల్‌ ఇప్పటి వరకు సామాన్య పౌరులు, వారిలో కూడా 70శాతం మంది పిల్లలూ, మహిళలు, వృద్ధులు, ఆసుపత్రులలో రోగులనే చంపుతున్నది. ఎంతకాలం అవసరమైతే అంతకాలం తాము మధ్య ప్రాచ్యంలోనే తిష్టవేస్తామని అమెరికా మిలిటరీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవటం అంత తేలిక కాదని అమెరికా మిలిటరీ కమాండర్‌ మిగుయెజ్‌ చెప్పాడు. ఆహార సరఫరా పేరుతో ఆయుధాలను పెద్ద ఎత్తున ఎర్ర సముద్ర ప్రాంతానికి చేరవేస్తున్నారు.లెబనాన్‌లోని హిజబుల్లా, హౌతీ సాయుధులను ఎదుర్కొనేందుకు మధ్య ప్రాచ్యంలోని జలాల్లోకి ఐషెన్‌హౌవర్‌, యుఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఫోర్డ్‌ అనే రెండు విమానవాహక యుద్ధ నౌకలను అమెరికా మోహరించింది. వాటికి అనుబంధంగా అనేక ఇతర మిలిటరీ నౌకలు ఉన్నాయి. నీటిలో, నేల మీద ఎలా అవసరమైతే అలా ప్రయాణించే యుద్ధ వాహనాలు, ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పెద్ద ఎత్తున తరలించారు. గతంలో ఇరాక్‌లో మోహరించిన లక్షా 60వేలు, ఆఫ్ఘ్‌నిస్తాన్‌కు తరలించిన లక్ష మంది మిలిటరీతో పోలిస్తే ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో ఉన్న తమ సేనలు తక్కువే అని అమెరికా సమర్ధించుకుంటున్నది. దీర్ఘకాలంగా మిలిటరీ స్థావరాలున్న కతార్‌, బహరెయిన్‌, యుఏయిలతో పాటు జోర్డాన్‌, ఇరాక్‌, సిరియాలలో కూడా వేలాది మంది సైనికులు ఉన్నారు.


తమ మిలిటరీ, పరికరాలను సిద్దంగా ఉంచినప్పటికీ యుద్ధం కోసం కాదని అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూస్తున్నది.అక్టోబర్‌ ఏడవ తేదీ తరువాత ఇప్పటి వరకు హౌతీ దళాలు 170 దాడులను జరిపాయి. వాటిని నిలువరించటంలో అమెరికా ఎలాంటి పురోగతినీ సాధించలేదు. దీంతో రవాణా నౌకలు ఆఫ్రికా గుడ్‌హౌప్‌ ఆగ్రం చుట్టి తిరిగి రావాల్సి వస్తోంది. దీని వలన సరకు రవాణా ఆలశ్యం కావటమే గాక ఖర్చు కూడా పెరుగుతున్నది. దీనికి పూర్తి బాధ్యత అమెరికా, ఇజ్రాయెల్‌దే అన్నది స్పష్టం. మధ్య ప్రాచ్యంలో ఎన్నో ఏండ్లుగా 30వేలకు పైగా అమెరికా దళాలు ఉన్నాయి. ఇవిగాక తాత్కాలికం, అదనపు దళాల పేరుతో మరికొన్ని వేల మందిని, ముందే చెప్పుకున్నట్లు పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలను దించారు. ఒక్క సిరియాలో తప్ప మధ్య ప్రాచ్య, పశ్చిమాసియాలోని దేశాలన్నింటా ఏదో ఒక పేరుతో అనుమతి తీసుకొనే అమెరికా తిష్టవేసింది. కొన్ని చోట్ల ఆయాదేశాల దళాలకు శిక్షణ, ఇస్లామిక్‌ తీవ్రవాదులను ఎదుర్కొనే పేరుతో ఇదంతా జరిగింది. నిజానికి ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధ బృందాలను అరికట్టేందుకే ఇదంతా అన్నది బహిరంగ రహస్యం. జోర్డాన్‌లో ఉన్న మిలిటరీ స్థావరం సరిహద్దుల్లో ఉన్న ఇరాక్‌, సిరియాలపై దాడులు చేసేందుకే ఉంది. తూర్పు సిరియాలో ఇరాన్‌ మద్దతు ఉన్న సాయుధ దళాలు ఉన్నాయి. మధ్య ప్రాచ్యంలో తిష్టవేసిన అమెరికా దళాల గురించి చూద్దాం.


ఎర్ర సముద్రంలోకి ఫిబ్రవరిలో దించిన ఐషెన్‌ హౌవర్‌ విమాన వాహక యుద్ధ నౌకతో పాటు నియంత్రిత క్షిపణిదాడుల నౌక, ప్రత్యర్ధుల క్షిపణులను అడ్డుకొనే రెండు నౌకలు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, ఐదువేల మంది నౌకాదళ సిబ్బంది ఉన్నారు. ఇది ఇరాన్‌కు హెచ్చరికగానే జరిగింది. అణుశక్తితో నడిచే ఓహియో తరగతి జలాంతర్గాములను కూడా సూయజ్‌ కాలువ ద్వారా సమీకరించారు. ఇవి ఎక్కడా ఎలాంటి హడావుడి చేయవు. ఒక్కొక్క జలాంతర్గామి 154 తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను మోసుకుపోగలదు. మధ్యధరా సముద్రంలో ఉన్న ఫోర్డ్‌ కారియర్‌ అనే యుద్ధ నౌకను కూడా తరలించారు.దీనిలో ఒక విమానవాహక యుద్ధ నౌకతో పాటు మూడు ఖండాంతర క్షిఫణి రక్షణ నౌకలు కూడా ఉన్నాయి.ఎమెన్‌ నుంచి ప్రయోగించిన క్షిపణులను కూల్చివేసిన నౌకతో పాటు ఇతర అనేక యుద్ధ నౌకలను మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రంవైపు తరలించారు. ఇవన్నీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా, దాన్ని వ్యతిరేకించే దేశాలను బెదిరించటం, అవసరమైతే దాడులకు దిగేందుకే అన్నది స్పష్టం. నౌకా దళాలు కాకుండా 45వేల మంది వివిధ దేశాల స్థావరాల్లో ఉన్నారు.వీటన్నింటిని చూసుకొనే ప్రపంచం, ఐరాస సాధారణ అసెంబ్లీ ఖండించినా, భద్రతా మండలిలో తీర్మానాలు ప్రవేశపెట్టినా, అంతర్జాతీయ కోర్టులలో కేసులు దాఖలు చేసినా ఇజ్రాయెల్‌ ఏమాత్రం ఖాతరు చేయకుండా గాజాలో మారణకాండ, పశ్చిమగట్టు ప్రాంతంలో నిరంతరం దాడులు జరుపుతున్నది. అమెరికా తీరు వివాదం విస్తరించటానికే దోహదం చేస్తున్నది.


ఆసియాలో ఇలా ఉంటే ఐరోపాలో ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం గావించేందుకు అమెరికా పూనుకుంది.ఉక్రెయిన్‌కు 61బిలియన్‌ డాలర్ల ఆయుధ సరఫరాను అంగీకరించకపోతే ఆ దేశాన్ని,ఐరోపా, మొత్తం స్వేచ్చా ప్రపంచాన్ని ముప్పులో ఉంచినట్లేనని అధ్యక్షుడు జో బైడెన్‌ అమెరికా పార్లమెంట్‌ను బెదిరించాడు.2014కు ముందు ఉన్న ఉక్రెయిన్‌ సరిహద్దులను పునరుద్దరించేందుకు రష్యాను ఓడించాలన్న జో బైడెన్‌ కలను చూస్తుంటే గతంలో వియత్నాం, ఉత్తర కొరియా,ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ సిరియా, ఎమెన్‌ తదితర దేశాలలో మాదిరి ఓటములు గుర్తుకు వస్తున్నట్లు అనేక మంది చెబుతున్నారు. అమెరికా గనుక 2022 ఏప్రిల్‌లోనే టర్కీ ముందుకు తెచ్చిన శాంతి ప్రతిపాదనలను అంగీకరించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని, శాంతికి బదులు అమెరికా, నాటో కూటమి పోరును మరింతగా ఎగదోసేందుకే ఒక సాధనంగా చేసుకుంటున్నారన్నది స్పష్టం. ఉక్రెయిన్‌ వ్యవహరంలో అమెరికా వినాశకర విధానాన్ని అనుసరించటానికి కారకులైన వారిలో ఒకరిగా ఆరోపిస్తూ విక్టోరియా న్యూలాండ్‌ అనే విదేశాంగశాఖ ఉప మంత్రిని పదవీ కాలం ఉండగా ముందుగానే తొలగించారు. అంతకు రెండు వారాల ముందు ఆమె ఒక సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ పోరు మొదటి ప్రపంచయుద్ధానికి దారితీసిన ఘర్షణ స్థాయికి దిగజారిందని, ఉక్రెయిన్‌కు ప్రతిపాదించిన 61బిలియన్‌ డాలర్ల ఆయుధ సాయానికి ఒక వేళ పార్లమెంటు ఆమోదం తెలపకపోతే బైడెన్‌ దగ్గర మరొక ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు. ఈ కారణంగానే ఆమెను తొలగించారని, లేదూ బైడెన్‌ విధానాలకు నిరసనగా ఆమే రాజీనామా చేసినట్లు కూడా కొందరు చెబుతున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 2022 ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైతే నెల రోజుల తరువాత అధ్యక్షుడు జెలెనెస్కీ మాట్లాడుతూ తమ లక్ష్యం శాంతి, సాధ్యమైనంత త్వరలో సాధారణ జీవన పునరుద్దరణ అని చెప్పాడు. కానీ అమెరికా,బ్రిటన్‌,ఫ్రెంచి నేతలు రంగంలోకి దిగి శాంతి చర్చలు కొనసాగకుండా చేశారు. అంతే కాదు పెద్ద సంఖ్యలో నాటో దళాలను ఉక్రెయిన్‌కు పంపుతున్నట్లు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటించాడు.దాన్ని నమ్మిన జెలెనెస్కీ వారి మాయలో పడి శాంతి ప్రక్రియ నుంచి వైదొలిగాడు. ఇప్పటి వరకు ఆయుధాలు తప్ప దళాలను నాటో పంపలేదు. సంక్షోభం ప్రారంభమైపుడు ఉక్రెయిన్‌ జనాలకు హెల్మెట్లు, రాత్రుళ్లు పడుకొనేందుకు బ్యాగులు పంపితే సరిపోతుందని జర్మనీ చెప్పిందని, ఇప్పుడు వారే మరిన్ని క్షిపణులు, యుద్ధ టాంకులు అవసరమంటున్నారని మక్రాన్‌ చెబుతున్నాడు. ప్రతి దశలోనూ ఆరు నుంచి ఎనిమిది నెలలు వెనుబడి ఉన్నామని కూడా అన్నాడు. ఒక వేళ గనుక ఇప్పుడు నాటో దళాలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే అది రష్యా-నాటో యుద్దంగా మారుతుందని రష్యా హెచ్చరించింది. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని పుతిన్‌ చెబుతున్నాడు. అయితే ఇప్పటికే కొన్ని ప్రత్యేక నాటో దళాలు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు పెంటగన్‌ పత్రాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌ చేరిన వేలటన్నుల ఆయుధాలు ఎక్కడకు వెళుతున్నదీ తెలుసుకొనేందుకు కొందరు తమ మిలిటరీ అధికారులు అక్కడ ఉన్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అంగీకరించాడు. ఉక్రెయిన్‌ సంక్షోభం తొలి రోజుల్లో రష్యా యుద్ధ పాటవం పెద్ద లెక్కలోది కాదని ఐరోపా, ఇతర దేశాల జనాలను నమ్మించిన నాటో కూటమి ఇప్పుడు రష్యాను ఒక బూచిగా చూపుతున్నది. సోవియట్‌ యూనియన్‌ ఉనికిలో ఉన్నపుడు ఐరోపాను ఉపయోగించుకున్న అమెరికా, తాజాగా అదే ఐరోపా దేశాలతో కలసి ఉక్రెయిన్‌న్ను పరిశోధన శాలల్లో గినియా పందుల మాదిరి, తరువాత మరోసారి అమెరికా ఐరోపాను సమిధగా వినియోగించుకోవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. రష్యన్లు ఐరోపాను ఆక్రమించుకుంటారన్న ప్రచారం దానిలో భాగమే అన్నది స్పష్టం. అమెరికా గద్దె మీద ఎవరున్నా తమ కార్పొరేట్ల, రాజకీకీయ ప్రయోజనాలు, ప్రపంచాధిపత్యానికే అగ్రపీఠం వేస్తారని తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

గుజరాత్‌ అభివృద్ధి గురించి నరేంద్రమోడీ నోటికి తాళం ఎందుకు వేసుకున్నట్లు ?

19 Tuesday Mar 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Gujarat, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Gujarat development model, Gujarat Fail In Poverty Alleviation, Gujarat growth, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఈ మధ్య కాలంలో టీవీలు, సామాజిక మాధ్యమాలను చూస్తున్నవారికి నరేంద్రమోడీ గ్యారంటీల గురించి చెవుల తుప్పు వదలగొడుతున్నారు. గత పదేండ్లలో ఒకసారి చెప్పిన దానిని మరోసారి మాట్లాడటం లేదు గనుక మామూలుగా చెబితే జనం నమ్మే స్థితి లేదు అందుకే నన్ను నమ్మండి పక్కా గ్యారంటీ అని చెప్పటం తప్ప మరొకటి కాదు.పదేండ్ల క్రితం గుజరాత్‌ తరహా అభివృద్ధిని దేశమంతటా అమలు జరుపుతామని ఎన్నికల సందర్భంగా మోడీ జనానికి ఇచ్చిన గ్యారంటీ గురించి ఎక్కడా ప్రస్తావించటం లేదు. గుజరాత్‌ విజయ గీతాలాపన లేదు.ఎందుకు ? నరేంద్రమోడీ ప్రధానిగా అధికారంలోకి రాగానే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నివేదికలను రూపొందించటం, సిఫార్సులు చేయటం తప్ప వాటికి ఎలాంటి గ్యారంటీ లేని నీతి అయోగ్‌ పేరుతో ఒక అజాగళ స్థనం వంటి సంస్థను ఏర్పాటు చేశారు. సదరు సంస్థ వెల్లడించిన సమాచారం 2019-21 సంవత్సరాలలో బహుముఖ దారిద్య్ర సూచికలో గుజరాత్‌ రాష్ట్రం 16వ స్థానంలో ఉంది. దీర్ఘకాలంగా బిజెపి ఏలుబడిలో రెండింజన్ల పాలన, దానికి స్వయంగా నరేంద్రమోడీ డ్రైవరుగా ఉన్న చోట ఇలా ఉంది గనుకనే దాని గురించి మాట్లాడరు. బిజెపి లేని రాష్ట్రాలలో మాత్రం రెండింజన్లని కబుర్లు చెబుతారు.దశాబ్దాల తరబడి బిజెపి ఏలుబడిలో ఉన్న గుజరాత్‌ దారిద్య్ర నిర్మూలనలో వెనుకబడింది.


ఇక్కడ అభివృద్ధి అంటే పరిశ్రమల గురించి చెబుతారు. నరేంద్రమోడీ సిఎంగా అధికారానికి రాక ముందే ఉమ్మడి బొంబాయి ప్రోవిన్స్‌లో నేటి గుజరాత్‌ ప్రాంతాలు పారిశ్రామికంగా ముందున్నాయి.ఒకసారి ఒక చోట పరిశ్రమలు కేంద్రీకృతమైతే అక్కడే మరింతగా పెరగటం ప్రపంచ వ్యాపితంగా ఉన్న పరిణామం. పరిశ్రమలు ఉన్నంత మాత్రాన అభివృద్ధి చెందినట్లు కాదు. అలాగైతే అమెరికాలో ఇప్పటికీ మన ఉచిత బియ్యం పథకం మాదిరి ఉచిత ఆహార కూపన్లు ఉండేవి కాదు. గుజరాత్‌లో పరిశ్రమల వృద్దికి అక్కడి భౌతిక పరిస్థితులే కారణం తప్ప మోడీ గొప్పతనం కాదు.రాష్ట్ర విస్తీర్ణంలో దాదాపు సగం ఎడారి ప్రాంతం గనుక అక్కడ వ్యవసాయానికి తావుండదు. మన దేశంలో ఇప్పటికీ ఉపాధి వ్యవసాయరంగంలోనే ఉంది, అలాంటి అవకాశం అక్కడ ఉండదు. వాణిజ్య రంగంలో గుజరాతీల వలసలకు అదొక ప్రధాన కారణం.కచ్‌ ప్రాంతంలో ఉప్పు పండిస్తారు, అది ఏడాది మొత్తం ఉండదు. అందుకే గుజరాత్‌ ప్రాంతంలో స్వాతంత్య్రానికి ముందు తరువాత కూడా పరిశ్రమలు, వాణిజ్యం మీద కేంద్రీకరించారు. రేవులు ఒక పెద్ద వనరుగా ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పటికీ దారిద్య్రంతో సహా అనేక అభివృద్ధి సూచికల్లో గుజరాత్‌ వెనుకబడి ఉంది.సృష్టించిన సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నది తప్ప జనానికి చేరటం లేదు. గతంలో దారిద్య్ర నిర్మూలనలో గుజరాత్‌ కొన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో దిగజారుతున్నది. అధికారంలో ఎవరున్నా ఇంతవరకు దారిద్య్ర రేఖ అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్దిష్ట నిర్వచనం లేదు.తమకు అనుకూలమైన అంకెలతో దారిద్య్రం తగ్గిందని జనాన్ని మోసం చేస్తున్నారు. ప్రతి దేశంలోనూ జిడిపి పెరుగుదలను బట్టి దారిద్య్ర రేఖ నిర్వచనం కూడా మారుతూ ఉంటుంది.


రాజకీయ నేతలు అధికార పార్టీల ప్రాపకం కోసం పాకులాడినట్లే కొందరు మేథావులు కూడా అదేమాదిరి ఉన్నారు. అలాంటి వారిలో ఒకరైన ప్రొఫెసర్‌ వివేక్‌ దేవరారు బుర్ర నుంచి పుట్టిందే ”గుజరాత్‌ తరహా అభివృద్ధి నినాదం”. మోడీ గుజరాత్‌ సిఎంగా నాలుగువేల రోజుల పదవీకాలం పూర్తి కానుండగా తదుపరి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ” వృద్ధి, అభివృద్ధికి గుజరాత్‌ పాలన ” అనే పుస్తకాన్ని రాశారు. తరువాత 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ దాన్ని ఒక నినాదంగా తీసుకొని తాను అధికారంలోకి వస్తే దేశమంతటా అదే విధానాన్ని అమలు చేస్తానని నమ్మబలికారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా భక్తులకు తెలియదు. అదే మాదిరి గుజరాత్‌ గురించి తెలిసిన మోడీ ప్రధాని పీఠం అలంకరించిన తరువాత ఎక్కడా దాని ప్రస్తావన తేవటం లేదు. ప్రతి రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నపుడు ఒక రాష్ట్ర నమూనా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తామని చెప్పటమే పెద్ద మోసం. పదేండ్ల నాటి అంకెలను తీసుకొని వివేక్‌ దేవరారు గుజరాత్‌ పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రం భారీగా తగ్గిందని చెప్పారు. ఊట మాదిరి అభివృద్ధి ఫలాలు కిందికి దిగినట్లు సూత్రీకరించారు. పాత లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉన్నపుడు దేశంలో ఏడవ స్థానంలో ఉన్న గుజరాత్‌ తరువాత కాలంలో దిగజారింది. దీన్ని బట్టి పరిశ్రమల వృద్ధి దారిద్య్ర నిర్మూలనకు దోహదం చేయదని కొందరు ఆర్థికవేత్తలు స్పష్టం చేశారు. ఆర్థిక స్వేచ్చలో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉందని దేవరారు చెప్పారు. అలాంటి రాష్ట్రం తాజా నీతిఅయోగ్‌ నివేదిక ప్రకారం దారిద్య్ర నిర్మూలనలో 16వ స్థానానికి ఎందుకు దిగజారిట్లు ?


గుజరాత్‌లో ఎవరు అధికారంలో ఉన్నా కార్పొరేట్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇచ్చారు.వాటిలో పని చేసే కార్మికులకు వేతనాలు తక్కువగా నిర్ణయిస్తున్నారు. ఉదాహరణకు బాగా వెనుక బడిన చత్తీస్‌ఘర్‌లో 2023 అక్టోబరు ఒకటి నాటికి అమల్లో ఉన్నట్లు ప్రకటించిన వేతనాల ప్రకారం నైపుణ్యం లేని కార్మికుడికి నెలకు రు.12,623, నైపుణ్యం ఉన్నవారికి రు.13,698 కాగా అభివృద్ధి చెందిన గుజరాత్‌ రెండింజన్ల పాలనలో రు.12,012 నుంచి 12,298, నిపుణులైన వారికి రు.12,558 నుంచి 12,870 వరకు నిర్ణయించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఊడ్చి, శుభ్రం చేసే కార్మికులకు కనీసవేతనం ఏ జోన్‌లో రు.19,136, బి జోన్లో రు.16,016, సి జోన్లో రు.12,844గా 2023 ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు జరుపుతున్నట్లు ప్రకటించింది. ఇదీ గుజరాత్‌ ఆదర్శం, నరేంద్రమోడీ గారి అచ్చేదిన్‌.అందుకే గుజరాత్‌ కార్పొరేట్లు బలిశారు తప్ప కార్మికులు, ఇతరుల పరిస్థితి దిగజారుతోంది. మానవాభివృద్ధి సూచికలే దానికి పక్కా నిదర్శనం. కొన్ని వివరాలు ఎలా ఉన్నదీ చూద్దాం.వీటికి ఆధారం గ్లోబల్‌ డాటా లాబ్‌ వెబ్‌సైట్‌.
ప్రాంతం×××× 1990 ×× 2000 ×× 2010 ×× 2021
దేశం ×××× 0.434 ××0.491 ××0.575 ××0.633
గుజరాత్‌×××× 0.474 ××0.521 ××0.599 ××0.638
కేరళ ×××× 0.550 ××0.593 ××0.709 ××0.752
మహారాష్ట్ర ××× 0.498 ××0.552 ××0.638 ××0.688
మధ్యప్రదేశ్‌ ××× 0.407 ××0.453 ××0.531××0.596
పైన పేర్కొన్న వివరాలను చూసినపుడు పారిశ్రామికంగా, వ్యవసాయకంగా వెనుకబడిన కేరళలో మానవాభివృద్ధి సూచికల కంటే పారిశ్రామికంగా వృద్ధి చెందిన గుజరాత్‌, మహారాష్ట్ర వెనుకబడి ఉన్నాయి.దీర్ఘకాలంగా బిజెపి ఏలుబడిలో ఉన్న మధ్యప్రదేశ్‌ స్థితినీ చూడవచ్చు.


సంక్షేమ పధకాలను అమలు జరిపితే రాష్ట్రాలు అప్పుల పాలవుతాయని నరేంద్రమోడీ పదే పదే వ్యతిరేకతను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే గుజరాత్‌లో అరవై ఏండ్లు దాటిన వారికి నెలకు వెయ్యి, 80దాటితే రు.1,250 మాత్రమే ఇస్తున్నారు.పోనీ గుజరాత్‌కు అప్పులు లేవా ? 2024-25కు బడ్జెట్‌ అంచనాల ప్రకారం రు.4.26లక్షల కోట్లకు, మరుసటి ఏడాది ఐదులక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు.1995లో బిజెపి పాలన పదివేల కోట్ల అప్పుతో ప్రారంభమై ఈ స్థాయికి పెరిగింది.నరేంద్రమోడీ సిఎంగా అధికారానికి వచ్చే నాటికి రు.45,301 కోట్లు ఉండగా దిగిపోయే నాటికి రు.2.21లక్షల కోట్లకు పెరిగింది.ఈ కారణంగా 2028 నాటికి రు.1.87లక్షల కోట్ల రుణాలను తీర్చాల్సి వస్తోంది. ఇందుకోసం కొత్తగా అప్పులు చేయాల్సి ఉంది. 2016 నుంచి 2021వరకు వార్షిక జిడిపి వృద్ధి రేటు కంటే రుణాల పెరుగుదల రేటు ఎక్కువగా ఉందని కాగ్‌ నివేదిక చెప్పింది.రెండు సంవత్సరాలకు ఒకసారి గుజరాత్‌ ప్రభుత్వం ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహిస్తున్నది. ఈ సదస్సులను నరేంద్రమోడీ ప్రతిష్ట పెంచేందుకు ఉపయోగించారు. ఆహౌ ఓహ అన్నట్లుగా పెట్టుబడులు వచ్చినట్లు ఊదరగొట్టారు. గుజరాత్‌ మోడల్‌ను దేశమంతటా అమలు జరుపుతానని చెప్పేందుకు ఇది కూడా కారణమైంది.మోడీ ఏలుబడిలో 2003 నుంచి 2015 వరకు ఏడు సదస్సులు జరగ్గా 84లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేశారు.2017 సదస్సు సందర్భంగా నాటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెఎన్‌ సింగ్‌ అప్పటి వరకు 61 వాస్తవ రూపం దాల్చినట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక,గణాంకాల శాఖనివేదిక ప్రకారం 2003-11 మధ్య కేవలం ఎనిమిదిశాతమే అమల్లోకి వచ్చాయి. 2000 నుంచి 2016వరకు మహారాష్ట్రలో 30శాతం, గుజరాత్‌లో 10శాతం మాత్రమే వాగ్దానాల్లో అమల్లోకి వచ్చాయి. విదేశీ పెట్టుబడులు మోడీ హయాంలోనే గుజరాత్‌కు తగ్గాయి. మూడు దశాబ్దాల బిజెపి, దానిలో 13 సంవత్సరాల నరేంద్రమోడీ ఏలుబడిలో ఆరోగ్య తలసరి ఖర్చు దిగజారింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం 2020లో వేయిమందికి దేశంలో 0.55 ఆసుపత్రి పడకలుంటే గుజరాత్‌లో 0.33 ఉన్నాయి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు బీహార్‌ కంటే తక్కువ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరించారు.


నెలవారీ తలసరి వినియోగ ఖర్చు ఆయా రాష్ట్రాల్లో జనం ఉన్న స్థితిని అంచనా వేసుకొనేందుకు ఒక అంశంగా తీసుకోవచ్చు. నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎంగా ఉన్న సమయంలో దేశ సగటులో ఉన్న వృద్ధి కంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కూడా గుజరాత్‌ వెనుకబడింది. పదేండ్ల రెండింజన్ల వృద్ధిని చూస్తే దేశ సగటుకు దగ్గరగా మాత్రమే ఉంది. దిగువన తాజాగా కేంద్ర ప్రకటించిన 2022-23 తలసరి వినియోగ ఖర్చు కొన్ని వివరాలను చూద్దాం..ఖర్చు రూపాయలలో.
రాష్ట్రం××××× గ్రామీణ ×× పట్టణ
ఆంధ్రప్రదేశ్‌×× 4,870 ×× 6,782
తమిళనాడు × 5,310 ×× 7,630
కేరళ ××××× 5,924 ×× 7,078
దేశసగటు××× 3,773 ×× 6,459
గుజరాత్‌ ××× 3,798 ×× 6,621
మధ్యప్రదేశ్‌×× 3,384 ×× 4,987
ఉత్తరప్రదేశ్‌×× 3,191 ×× 5,040
2003 నుంచి 2011-12 సంవత్సరాలలో దేశంలో సగటున వినియోగ ఖర్చు గ్రామీణ ప్రాంతాలలో 158, పట్టణ ప్రాంతాలలో 157శాతం పెరిగింది. గుజరాత్‌లో 145, 146శాతాలుగా ఉన్నాయి.కేరళ 2003లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రధమ స్థానంలో ఉంది.2011-12లో పట్టణాలలో హర్యాన ముందుండగా కేరళ రెండవదిగా ఉంది.2022-23లో సర్వే ఫలితాలను బట్టి రెండింజన్ల పాలనలో ఉన్నవి లేని రాష్ట్రాల తీరు తెన్నులు పైవిధంగా ఉన్నాయి.గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఉన్న ప్రధాన రాష్ట్రాల వివరాలను ఎగువున చూశాము. ఎందుకని రెండింజన్ల పాలిత రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి ? బిజెపి చెప్పే మాటలు బూటకం, అభివృద్ధి నాటకం తప్ప వాస్తవం కాదని స్పష్టం కావటం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పెట్రోల్‌, డీజిల్‌ ధర రు.2 తగ్గింపు : నరేంద్రమోడీ కుడుములేస్తున్నారు పండగ చేసుకుందామా !

16 Saturday Mar 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized

≈ 1 Comment

Tags

BJP, fuel politics, Fuel Price in India, Fuel prices freezing, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


త్వరలో ప్రపంచ జిడిపిలో జపాన్‌, జర్మనీలను వెనక్కు నెట్టి మూడవ స్థానం ఆక్రమించే ధనిక దేశంగా మనలను నరేంద్రమోడీ ముందుకు తీసుకుపోతున్నారు. టీవీలు చూడండి రోజూ ఎన్ని గ్యారంటీలను ప్రకటిస్తున్నారో, రామరాజ్యాన్ని తెచ్చారు, రామాలయాన్ని నిర్మించారు, ప్రపంచంలో తలెత్తుకొనేట్లు చేశారు. ఓట్ల కోసం మోడీ ఏమీ చేయరని బరాబర్‌ చెబుతున్నాం అంటూ భక్తులు ఊరూరా తిరుగుతున్నారు. అదే నిజమైతే ”ధనికులైన” మన జనాలకు ముష్టి విదిల్చినట్లుగా తాజాగా పెట్రోలు, డీజిలు మీద లీటరుకు రు.2 తగ్గించటం అవమానించటం కాదా ? ఈ చర్యతో జనం పండగ చేసుకుంటున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు. పూర్వం గ్రామాల్లో వృత్తుల వారికి పండుగల సందర్భంగా రైతులు తాము చేసుకున్న పిండివంటలు ఇస్తే ఎంతో సంతోషించేవారు(దీని అర్ధం వృత్తుల వారిని కించపరచటం కాదు, అలాంటి పరిస్థితి గతంలో ఉందని చెప్పటమే.ఇప్పుడు ఇంకా ఎక్కడైనా అలా ఉందేమో తెలియదు). దాన్నుంచి వచ్చిందే కుడుమేస్తే పండగ అనే లోకోక్తి. ఇప్పుడు ముష్టివిదిల్చినట్లుగా రెండు రూపాయలు , గ్యాస్‌ సిలిండర్‌కు వంద ఇచ్చి బిజెపి వారు జనాలను డూ ఫెస్టివల్‌ (పండగ చేస్కో) అంటున్నారు.2022 ఏప్రిల్‌ ఆరు నుంచి చమురు ధరలను స్థిరంగా ఉంచిన పెద్దలు ఓట్లు కొల్లగొట్టాలని తప్ప ఇప్పుడు ఇంత స్వల్పంగా తగ్గించటానికి ప్రాతిపదిక ఏమిటి ? ఈ మాత్రానికే పండగ చేసుకొని ఓట్లు వేస్తామని ఎవరైనా అంటే అది వారిష్టం.


అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గించే విధానం అమలు జరుపుతున్నట్లు ప్రతి రోజూ సుప్రభాతం మాదిరి ధరలను ప్రకటించే వారు. రెండు సంవత్సరాలుగా ఎందుకు నిలిపివేసినట్లు ? ఎన్నికల్లో మీట నొక్కిన తరువాత తిరిగి పెంచరనే గ్యారంటీ ఏముంది ? కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ సెల్‌(పిపిఏసి) వెబ్‌సైట్‌లోని తాజా సమాచారం ప్రకారం పదేండ్ల యుపిఏ పాలనా కాలంలో 2004-05 నుంచి 2013-14 వరకు కేంద్ర ప్రభుత్వం లేదా చమురు ఉత్పత్తుల మార్కెటింగ్‌ కంపెనీలు వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీల మొత్తం రు.8,88,024 కోట్లు. సగటున ఏటా 88.8వేల కోట్లు. తరువాత నరేంద్రమోడీ అచ్చేదిన్‌ పాలనలో ఈ మొత్తం రు.2,82653 కోట్లు మాత్రమే. సగటున 30.1వేల కోట్లు. వీటిలో ప్రజాపంపిణీ కిరోసిన్‌, ఉజ్వల గ్యాస్‌ సబ్సిడీ ఉన్నాయి. ఇది సబ్సీల కోత తీరు కాగా ఈ కాలంలో చమురు రంగంలో జనంపై మోపిన భారమెంతో చూద్దాం.తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మోడీ సర్కార్‌ పెంచిన పన్నులు, సెస్సులు,చమురు కంపెనీల నుంచి వచ్చిన రాబడుల మొత్తం రు.34,53,930 కోట్లు. అంటే సగటున రు.3.45లక్షల కోట్లు వచ్చింది. అధికారానికి వచ్చిన తొలి ఏడాది అంటే అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ విధించిన పన్నులు, ఇతర రాబడి రు.1.72లక్షల కోట్లు మాత్రమే. అది 2021-22లో గరిష్ట స్థాయికి రు.4.92లక్షల కోట్లకు పెరిగింది. ఈ ప్రాతిపదికన అంటే తొలి ఏడాది పన్నులే కొనసాగి ఉంటే పదేండ్లలో రు17.22 లక్షల కోట్లుగా ఉండేది, కానీ మొత్తం మీద చూసినపుడు రెట్టింపైంది. రద్దు చేసిన సబ్సిడీ, పెంచిన భారాలను కలుపు కుంటే 23లక్షల కోట్ల మేరకు భారం జనం భరించినట్లు లెక్క.


2020లో మనదేశంలో 88.2 బిలియన్‌ లీటర్ల డీజిల్‌,37.2 బిలియన్‌ లీటర్ల పెట్రోలు(స్టాటిస్టా సమాచారం) వినియోగం మొత్తం 125.4బిలియన్‌ లీటర్లు. ఇప్పుడు రెండు రూపాయల చొప్పున తగ్గించారు గనుక ఏడాది పాటు అమలు చేస్తే 250.8బిలియన్లు అంటే 25వేల కోట్లు జనానికి విదిల్చి ఓట్లు కొల్లగొట్టాలని పధకం వేశారు.మోపిన భారం ఎంత ? తగ్గించిన ధర ఎంత ? తరువాత వినియోగం పెరిగి ఉంటే ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరిగినట్లే తగ్గింపు మొత్తం కూడా అదే దామాషాలో పెరుగుతుంది. జనం మరీ ఇంత అమాయకంగా ఉన్నారని, కుడుమేస్తే పండగ చేసుకొనే వారి మాదిరి కనిపిస్తున్నారా ? పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాలకు చమురు ఉత్పత్తుల మీద వచ్చిన పన్ను, ఇతర రాబడి రు.22,19,558 కోట్లు అంటే సగటున 2.3 లక్షల కోట్లు. పదేండ్ల క్రితం వార్షిక రాబడి 1.6లక్షల కోట్ల నుంచి 2.3లక్షల కోట్లకు తప్ప కేంద్రం మాదిరి రు.1.72లక్షల నుంచి 3.45లక్షల కోట్లకు పెరగలేదు. కేంద్రం నుంచి పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా సంగతేమిటని కొందరు ప్రశ్నించవచ్చు. ఎక్సైజ్‌, ఇతర పన్నులో రాష్ట్రాలకు వాటా ఉంటుంది తప్ప సెస్సుల పేరుతో మోపిన దానిలో ఒక్క పైసా కూడా రాదు. మోడీ మోపిందంతా సెస్సుల పేరుతోనే. ధరలు తగ్గించాలని ఒక వైపు డిమాండ్‌ చేసే వారు ప్రభుత్వం అదే చేస్తే సంతోషించకుండా విమర్శలెందుకు చేస్తారు అనే వారు ఉన్నారు.వారందరికీ ఒకటే సమాధానం పెంచాలని ఎవరూ కోరలేదు, వద్దంటున్నా విపరీతంగా పెంచి జేబులు కొల్లగొట్టారు.దానిలో ఓట్ల కోసం నామమాత్రం తగ్గిస్తే పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ తగ్గింపు నేతలకు భజన చేయాల్సినంత గొప్పదేమీ కాదు. రద్దు చేసిన సబ్సిడీలతో పోలిస్తే ఇచ్చిన రాయితీ మొత్తమెంతో ఈ ప్రశ్నలు వేసే వారు సమాధానం చెప్పాలి.యుపిఏ పాలనా కాలంలో వార్షిక సగటు ముడిచమురు పీపా ధర డాలర్లలో, రూపాయలలో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో, నరేంద్రమోడీ హయాంలో ఎలా ఉందో దిగువ చూడవచ్చు.
సంవత్సరం× ధర డాలర్లలో×× పెట్రోలు ×× డీజల్‌
2010-11××× 85.09 ×× 52.64 ×× 38.56
2011-12××× 111.89 ×× 64.71 ×× 40.26
2012-13××× 107.97 ×× 68.71 ×× 45.26
2013-14××× 105.52 ×× 73.70 ×× 51.90
2014-15××× 84.16 ×× 66.36 ×× 52.23
2015-16××× 46.17 ×× 68.71 ×× 45.26


2016-17లో మనదేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు సగటు ధర 47.57 ,2017-18లో 56.43, 2018-19లో 69.88,2019-2020లో 60.57, 2020-21లో 44.82, 2021-22లో 79.18, 2022-23లో 93.15, 2023-24లో 82.41డాలర్లు ఉంది. 2022 ఏప్రిల్‌ ఆరున ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రు.105.41, డీజిల్‌ ధర రు.96.67 కాగా మే 22 నుంచి రు. 96.72, రు.89.62కు తగ్గించారు. అప్పటి నుంచి 2024 మార్చినెల 14వరకు అదే రేట్లు కొనసాగాయి. యుపిఏ పాలనలో 112 డాలర్లకు ముడి చమురు దిగుమతి చేసుకుంటే వినియోగదారుల నుంచి వసూలు చేసింది పెట్రోలు రు.64.71, డీజిల్‌కు రు.40.26 మాత్రమే. ఇప్పుడు తాజా రేటు పైన చెప్పుకున్నట్లు 82.41 డాలర్లు ఉంటే ఢిల్లీలో 96.67, 89.62గా ఎందుకు ఉన్నట్లు? తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు రేటు రు.109, 111 వంతున ఉన్నాయి, మరికొన్ని చోట్ల ఇంకా ఎక్కువ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా వినియోగదారుల నుంచి ఇంతగా ధర వసూలుకు కారణమేమిటి అంటే విపరీతంగా సెస్సులను వడ్డించటం, రూపాయి మారకపు విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధతే తప్ప మరొక కాదు. వీటి గురించి నరేంద్రమోడీ దేశానికి ఇస్తున్న గ్యారంటీలు ఏమిటి అన్నది ప్రశ్న.


.2011-12లో మన దేశం కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర 111.89 డాలర్లు. ఆ ఏడాది అంటే 2012 మార్చి నెలలో ఉన్న సగటు ధర 123.66 డాలర్లుంది.2012 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ పదకొండువరకు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పిపిఏసి వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్‌ పదవ తేదీన మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. ఇక్కడే మనం నరేంద్రమోడీ ఘనత గురించి చెప్పుకోవాలి. అదే ధరకు 2012లో మన చెల్లించిన మొత్తం మన కరెన్సీలో రు.6,201.05 కాగా ఎనిమిదేండ్ల పాలనలో నరేంద్రమోడీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రు.9,434.29.అంటే మంచి రోజుల పేరుతో అధికారాన్ని పొంది బాదుడేబాదుడు అన్నట్లుగా చమురు మీద పెంచిన పన్నులను పక్కన పెడితే రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేని అసమర్ధత కారణంగా ఈ రోజు మనం ప్రతి పీపాకు పదేండ్ల నాటి కంటే అదనంగా రు.3,233.24 చెల్లించాము. పదేండ్ల క్రితం రూపాయి విలువ డాలరుకు 51.13 ఉండగా మోడీ ఏలుబడిలో 2022 జూన్‌ పదిన అది 77.79కి దిగజారింది, పదమూడవ తేదీన 78.29కి పతనమై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు 83కు అటూ ఇటూగా ఉంది. అందువలన పదేండ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ మనం చెల్లించే మొత్తం భారీగా పెరుగుతుంది. రూపాయి విలువను కాపాడలేదంటూ నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలందరూ మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ను దులిపివేశారు. మోడీ సర్కార్‌ నిర్వాకానికి ఇప్పుడు దేశ ప్రజలందరూ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాల గురించి నిరంతరం ఊదరగొడుతుంటారు. 1995లో స్వదేశీ ముడిచమురు ఉత్పత్తి 32.2మిలియన్‌ టన్నులు. దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించుకోవాలి, స్వదేశీ ఉత్పత్తిని పెంచుకోవాలని రోజూ సుభాషితాలు చెబుతుంటారు.మోడీ ఏలుబడిలో 2022 నాటికి 28.4మిలియన్‌ టన్నులకు దిగజారింది. ఎంతో కీలకమైన ఈ రంగంలోనే మన ప్రతిభ ఇలా ఉంటే దేశాన్ని ముందుకు తీసుకుపోతాం, అగ్రస్థానానికి చేరుస్తాం అంటే ఉట్టికి ఎగరలేని వారు స్వర్గానికి ఎగురుతాం అన్నట్లుగా ఉంది.

కరోనా సంక్షోభంలో కార్పొరేట్‌ శక్తులను నరేంద్రమోడీ సర్కార్‌ ఎలా ఆదుకున్నదో, జనం అప్పులపాలై దివాలా తీస్తే ధనికుల దగ్గర సంపద ఎలా పోగుపడిందో చూశాము. ఇప్పుడు ఉక్రెయిను సంక్షోభం కారణంగా మన దేశంలో జనం ధరల పెరుగుదలతో అల్లాడిపోతుంటే రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ది చేసి ఐరోపా దేశాల కోసం ఎగుమతి చేస్తున్నారంటే దీని వలన లబ్ది పొందేది ఎవరు? మన జనమైతే కాదు, పోనీ ఐరోపా దేశాల నుంచి వాటికి ప్రతిగా నరేంద్రమోడీ పలుకుబడితో తక్కువ ధరలకు సరకులను దిగుమతి చేసుకుంటున్నామా అంటే అదీ లేదు. రష్యా నుంచి దిగుమతుల వలన మన జనానికి కలిగిన-కలుగుతున్న మేలు ఇదీ అని ఎవరినైనా చెప్పమనండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

గోధుమ ధరలపై మూడు నెలల్లోనే బిజెపి వాగ్దాన భంగం !

13 Wednesday Mar 2024

Posted by raomk in BJP, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Women

≈ Leave a comment

Tags

#Farmers matter, #Farmers’ protest, #Indian Farmers, BJP, MSP demand, Narendra Modi Failures, SKM, Wheat farmers


ఎం కోటేశ్వరరావు


గోధుమ రైతులకు కనీస మద్దతు ధరకంటే అదనంగా చెల్లిస్తామని వాగ్దానం చేసిన బిజెపి నామమాత్రంగా పెంచి చేతులు దులుపుకుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గోధుమ రైతులకు క్వింటాలుకు రు.2,700 చొప్పున చెల్లిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. మధ్య ప్రదేశ్‌లో బిజెపి వరికి రు.3,100 చెల్లిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. గోధుమ కనీస మద్దతు ధర రు.2,275 కాగా తమను ఎన్నుకుంటే బోనస్‌ రూపంలో ఇచ్చేదానితో పాటు రు.2,700 చెల్లిస్తామని నమ్మబలికింది. తాజాగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రు.125 మాత్రమే పెంచి రు.2,400 ఇస్తామని ప్రకటించాయి.బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం నాణ్యతను బట్టి క్వింటాలు గోధుమల ధర రు.2,700 నుంచి 3,000 ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ధరలు పడిపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో ఇది చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది.రెండు రాష్ట్రాల బిజెపి ప్రభుత్వాలు క్వింటాలుకు రు.125 బోనస్‌ ప్రకటించటంతో అక్కడ నిరసన, ఆ మాత్రమైనా ఉత్తర ప్రదేశ్‌, హర్యానాలో ఉన్న ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పెంచవు అనే వత్తిడి తలెత్తే అవకాశం ఉంది.

రైతులను మోసగించటంలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు నిమగమైతే అసలు రాజధాని ఢిల్లీకే రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని ఫిబ్రవరి 13నుంచి వేలాది మంది రైతులను పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో నిలవేసింది.గతంలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) మార్చి 14వ తేదీ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో తలపెట్టిన కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌కు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్న కేంద్రం వత్తిడికి తట్టుకోలేక చివరకు ఒక రోజు ముందుగా అనుమతి ఇచ్చింది. రైతుల ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అక్కడ సంకల్ప పత్ర పేరుతో తీర్మానం చేయనున్నారు.లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగనుండటంలో భవిష్యత్‌ కార్యాచరణను కూడా ఇక్కడ ప్రకటిస్తారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నుంచి విడిపోయిన కొందరు, గత ఆందోళనకు దూరంగా ఉన్నవారు కలసి ఎస్‌కెఎం(ఎన్‌పి)గా ఏర్పడి ఢిల్లీ చలోకు పిలుపు ఇచ్చారు. వారిని అడ్డుకొనేందుకు అసాధారణ రీతిలో పోలీసులు రాజధానికి వచ్చే రోడ్ల మీద కందకాలు తవ్వటం, మేకులు కొట్టి, పెద్ద పెద్ద సిమెంట్‌ బ్లాకులు, మట్టి, రాళ్లతో నింపిన కంటెయినర్లను రోడ్ల మీద అడ్డంగా పెట్టిన అంశం తెలిసిందే. రామ్‌లీలా మైదానంలో జరిగే మహాపంచాయత్‌కు కేంద్ర కార్మిక సంఘాలు, రంగాల వారీగా పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి.యువజన, విద్యార్ధి,మహిళా సంఘాలు కూడా భాగస్వాములు కానున్నాయి.


ఫిబ్రవరి 22వ తేదీన ఈ సభ గురించి ఎస్‌కెఎం ప్రకటించినప్పటికీ అనుమతి గురించి ఎటూ తేల్చకుండా చివరి నిముషంలో అనుమతి ఇచ్చినప్పటికీ పంజాబ్‌ నుంచి వందలాది బస్సులు, ట్రక్కులు, రైళ్లలో బయలుదేరి 50వేల మంది వస్తున్నట్లు ఆ రాష్ట్రనేతలు చెప్పారు. తమతో పాటు రొట్టెలు చేసుకొనేందుకు పిండి, కూరగాయలు, స్టౌవ్‌లు, గ్యాస్‌ సిలిండర్లు కూడా తెచ్చుకుంటున్నారని, రాజధానిలోని గురుద్వారాలలో రైతులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సమీప హర్యానా, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌,ఉత్తరాఖండ్‌ నుంచి కూడా రైతులు తరలివస్తున్నట్లు ఎస్‌కెఎం నేతలు చెప్పారు.హర్యానాలోని బిజెపి ప్రభుత్వం పంజాబ్‌ నుంచి రైతులు రాకుండా ప్రధాన రహదార్లపై అనేక ఆటంకాలను కల్పించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలలో వస్తున్నారు. రైతు కుటుంబాల నుంచి మహిళలు కూడా గణనీయంగా వస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.


కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయటం, ఆహార భద్రత కోసం ప్రభుత్వ ధాన్య సేకరణ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్దం. అయితే ఈ అంశంపై గత రెండు దశాబ్దాలుగా ఒక ఒప్పందం జరగని కారణంగా వాటిని కొనసాగిస్తున్నారు. అబూదాబీ సమావేశాల్లో కూడా ధనిక దేశాలు ఈ అంశం మీద పట్టుపట్టాయి. వాటిని సంతుష్టీకరించేందుకు కరోనా కాలంలో రైతులు రోడ్ల మీదకు రారనే అంచనాతో నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను తెచ్చారు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా సాగు మీద వస్తున్న రైతుల ఆదాయాలు పడిపోతున్నట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అనేక మంది రైతులు కూలీపని చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. వ్యవసాయ అనుబంధ, పాడి, కోళ్ల పెంపకం వంటి ఇతర వనరుల ద్వారా వస్తున్న రాబడి పెరుగుతున్నది. అందుకే సాగే ప్రధానంగా ఉన్న పంజాబ్‌, హర్యానా, ఇతర ఉత్తరాది ప్రాంతాల రైతులు కనీస మద్దతు ధరలను తమ ప్రాణవాయువుగా చూస్తున్నారు. వాటిని తీసివేస్తే ప్రాణాలు పోతాయని భయపడుతున్నారు గనుకనే, ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఆందోళనలకు సిద్దం అవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తాము అధికారానికి వస్తే గోధుమలు, ధాన్య ధరలను కనీస మద్దతు ధరలకంటే పెంచుతామని బిజెపి చెబుతున్నపుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అదే పని ఎందుకు చేయటం లేదు ? దేశంలోని ఇతర ప్రాంతాల రైతుల నుంచి వ్యతిరేకత పెద్ద ఎత్తున రాకపోవటాన్ని అవకాశంగా తీసుకొని రద్దు చేసిన మూడు సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడే వారు ఇప్పుడు వాదిస్తున్నారు. సాగు చట్టాల రద్దు సందర్భంగా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ కూడా వాటి వలన రైతులకు మేలు జరుగుతుందని, వెనక్కు తీసుకోవటం సరైంది కాదని చెప్పింది. అందువల్లనే ఆ కత్తి ఇప్పటికీ రైతాంగం మెడమీద వేలాడుతూనే ఉంది. నరేంద్రమోడీ మరోసారి అధికారానికి వస్తే రద్దుచేసిన వాటిని తిరిగి ప్రవేశపెట్టబోరనే గ్యారంటీ లేదు. మీడియాలో లోక్‌సభ ఎన్నికలను గమనంలో ఉంచుకొని మోడీ గ్యారంటీలంటూ చెబుతున్నవాటిలో కనీస మద్దతు ధర అంశం లేదని వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిలీలో మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం !

13 Wednesday Mar 2024

Posted by raomk in Current Affairs, History, imperialism, International

≈ Leave a comment

Tags

#latin american left, Anti communist, Chile communists, Gabriel Boric


ఎం కోటేశ్వరరావు


ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని ఏడు నిలువుల లోతున పాతిపెట్టిన చిలీ నియంత పినోచెట్‌ చచ్చి పద్దెనిమిదేండ్లు అవుతున్నా, వాడి వారసులు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల పూర్వరంగంలో మరోసారి కమ్యూనిస్టుల మీద విరుచుకుపడుతున్నారు. చిలీలో ఆశ్రయం పొందిన వెనెజులా సోషలిస్టు వ్యతిరేక మిలిటరీ అధికారి ఒకడు ఇటీవల హతుడయ్యాడు. కమ్యూనిస్టులే చంపారంటూ చిలీ మీడియా,పినోచెట్‌ వారసులైన ప్రతిపక్ష పార్టీ కూటమి తప్పుడు ప్రచారం ప్రారంభించింది. కమ్యూనిస్టుల విశ్వసనీయత ప్రశ్నించరానిదని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ బహిరంగంగా సమర్ధించాడు. వామపక్ష సంఘటన ప్రభుత్వంలో కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రధాన భాగస్వామిగా ఉంది. పార్లమెంటులోని 155 స్థానాలకు గాను అధికార కూటమికి 37,దానికి మద్దతు ఇస్తున్న కూటమికి మరో 37 ఉన్నాయి.వాటిలో సోషలిస్టులకు 13, కమ్యూనిస్టు పార్టీ 12సీట్లతో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. లాటిన్‌ అమెరికాలో ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో మితవాద శక్తుల ప్రధాన ఆయుధం కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టటం ఒకటన్నది తెలిసిందే. అనేక దేశాల్లో నిరంకుశ, మితవాద శక్తులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సోషలిస్టులు, కమ్యూనిస్టులు అధికారానికి వస్తే క్రైస్తవమతానికి, ధనికుల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో చేస్తున్నారు. నాజీ గోబెల్స్‌ను మించి అవాస్తవాలను ప్రచారంలో పెడుతున్నారు.


2017లో వెనెజులా నుంచి పారిపోయి వచ్చి చిలీలో ఆశ్రయం పొందిన మిలిటరీ మాజీ అధికారి రోలాండ్‌ జెడాను కొద్ది రోజుల క్రితం కొందరు అపహరించి హత్యచేశారు. దీని వెనుక కమ్యూనిస్టులు ఉన్నారని, దేశంలో హింసాకాండ సృష్టికి కుట్రలు పన్నుతున్నారంటూ అనేక పత్రికలు, ప్రతిపక్ష మితవాద పక్షాలు ఎలాంటి ఆధారం లేకుండా ధ్వజమెత్తుతున్నాయి. జనంలో అనుమానాలు కలిగించేరీతిలో కథనాలు అల్లుతున్నాయి. ఈ శక్తులన్నీ నియంత పినోచెట్‌ హయాంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఇతర ప్రజాస్వామిక వాదుల అణచివేత, అపహరణలను సమర్ధించినవే. మార్క్సిస్టు కాన్సర్‌ను అంతమొందించాలనే పేరుతో పినోచెట్‌ మిలిటరీ పాలకులు వేలాది మంది కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులను హతమార్చారు, అనేక మంది జాడలేకుండా చేశారు. చిత్రహింసలు, జైళ్లపాలు సరేసరి. 1983లో కేవలం రెండు నెలల వ్యవధిలోనే 20 మంది కమ్యూనిస్టు నేతలను హత్యచేశారు. తరువాత ముగ్గురు నేతల నాలుకలను చీల్చి చిత్రహింసలకు గురిచేశారు. పినోచెట్‌ పాలనలో నాలుగువేల మంది అపహరణలకు గురయ్యారు. కనీసం ఇరవై వేల మంది పిల్లలను అపహరించి విదేశాల్లో చట్టవిరుద్ద దత్తతకు సహకరించారనే విమర్శలున్నాయి. వాటి గురించి దర్యాప్తు జరపాలని, నిజాల నిగ్గుతేల్చాలని కమ్యూనిస్టులు కోరుతున్నారు.


చిలీలో నియంతృత్వం ఉన్నకాలంలో కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాతవాసంలోకి వెళ్లింది.ప్రజల తరఫున పోరాడేందుకు సాయుధ దళాలను ఏర్పాటు చేసింది. నియంతల పాలన అంతరించిన తరువాత కమ్యూనిస్టులు తిరిగి బహిరంగంగా పనిచేయటం ప్రారంభించారు.ప్రస్తుతం 46,023 మంది సభ్యులతో దేశంలో అతి పెద్ద పార్టీగా ఉంది. గత ఎన్నికల్లో కమ్యూనిస్టు అభ్యర్ధి బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే వామపక్ష కూటమిలోని పార్టీల అభిప్రాయం మేరకు గాబ్రియెల్‌ బోరిక్‌ పోటీ చేసి 2021ఎన్నికల్లో గెలిచారు. హతుడైన వెనెజులా మాజీ మిలిటరీ అధికారికి వెనెజులాలో అనేక మందిని హతమార్చిన చరిత్ర ఉంది. హత్యవెనుక వెనెజులా హస్తం ఉందని, దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఖండించటంలో గొంతుకలపాలని చిలీ మితవాద పార్టీలు చేసిన డిమాండ్‌ను కమ్యూనిస్టు పార్టీ తిరస్కరించింది. కమ్యూనిస్టుల మీద విషం చిమ్మటానికి ఇదొక కారణమని చిలీ మంత్రి, కమ్యూనిస్టు నేత గామిలా వలేజో చెప్పారు. పార్లమెంటులో ఉన్న బలంతో గాబ్రియెల్‌ బోరిక్‌ ప్రభుత్వానికి అనేక ఆటంకాలు కలిగిస్తున్న ప్రతిపక్షాలు కమ్యూనిస్టు పార్టీ మీద విషం చిమ్మటంలో ఆశ్చర్యం ఏముందని కమ్యూనిస్టు పార్టీ ఎంపీ, విద్యార్ధి సంఘమాజీ నాయకురాలు కరోల్‌ కారియోలా చెప్పారు.భాగస్వామ్య పక్షాల అవగాహన మేరకు పార్లమెంటు సభాధ్యక్ష స్థానాన్ని కమ్యూనిస్టులు చేపట్టనున్న పూర్వరంగంలో పార్టీ మీద దాడికి దిగినట్లు చెప్పారు.


అంతరంగంలో గూడు కట్టుకున్న కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రతిపక్షాలు వెల్లడిస్తున్నాయి.ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా వ్యక్తులు, సంస్థలు ఎవరిమీదనైనా భయంకరమైన ఆరోపణలు చేయగల సమర్ధత కలిగినవి.వాటి పర్యవసానాలు వాటికి పట్టదు.ఊహాజనితమైన ఆరోపణలు చేస్తున్నాయి. చరిత్రలో చిలీ కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామిక నిబద్దతను ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదు. అది ప్రారంభమైనప్పటి నుంచి అందరికీ తెలుసు. ప్రజాస్వామిక పోరాటాల్లో తమదైన ముద్రను వారు ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణను వారెన్నడూ వీడలేదు. ఆ క్రమంలో నిరంతరం భాగస్వాములుగానే ఉన్నారు. వ్యవస్థాపరమైన చట్రానికి అనుగుణంగా వారు సర్దుబాటు చేసుకొని నడుచుకుంటున్నారు.అందువల్లనే కమ్యూనిస్టుల మీద జరుపుతున్నదాడిని కాకమ్మ కథలుగా చూస్తున్నాను అని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ చెప్పాడు. కమ్యూనిస్టులు న్యాయం, సమానత్వం, హక్కులకు అంకితమయ్యారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు, ఆదర్శసమాజాన్ని ఏర్పాటు చేసేందుకు దేశంలో ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు. అన్ని రకాల వివక్ష, అణచివేతను నిర్మూలించాలన్నదే తమ లక్ష్యమని కూడా చెప్పారు.జనం, సమాజ కేంద్రంగా ఉండాలని, జీవితాలు మెరుగుపడాలని మేం కోరుతుండగా నయా ఉదారవాదం ప్రజలు, వారి హక్కుల కంటే పెట్టుబడికి పెద్ద పీటవేస్తున్నదని బోరిక్‌ చెప్పాడు. ప్రభుత్వ ఏర్పాటు ఒప్పందంలో భాగంగా ప్రజాప్రతినిధుల సభ అధ్యక్ష పదవిని కమ్యూనిస్టులకు అప్పగించాల్సి ఉంది. దానికి అనుగుణంగా నిర్ణయించామని, గౌరవిస్తామని అన్నాడు. ఆ పదవిలో ఎవరు అన్నది సమస్యే కాదు, పార్లమెంటులోని సహచరులందరూ సమర్ధులే, వ్యక్తులు దొరుకుతారా లేదా అన్నది కాదు, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి గనుక ఎవరున్నా ఇబ్బంది ఉండదన్నాడు.


ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలకు సామాజిక ఉద్యమాల ద్వారా మద్దతు కూడగట్టాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపు ఇవ్వటం పార్లమెంటులోని మితవాద శక్తులకు కంటగింపుగా మారింది.చిలీ పార్లమెంటులో ఇప్పుడున్న బలాబలాల ప్రకారం అధికారంలో ఉన్న కూటమి ప్రతిపాదించే విధానాలు ఓటింగ్‌లో వీగిపోయే అవకాశం ఉంది. చట్టాలు, విధానాలను రూపొందించాల్సిన బాధ్యత చట్టసభలది తప్ప సామాజిక మద్దతు పేరుతో వత్తిడి తేవటం ఏమిటని మితవాదశక్తులు, వాటికి మద్దతుగా ఉన్న మీడియా,వాదిస్తున్నాయి. అందులో తప్పేం ఉందని అధ్యక్షుడు బోరిక్‌ ప్రశ్నించాడు. ఆ ఉద్యమాలు ప్రజా ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించినట్లయితే ఆహ్వానించాల్సిందే అన్నాడు. అబార్షన్‌ మీద చేసిన చట్టం వెనుక మహిళా ఉద్యమాల సమీకరణ లేదా అని ప్రశ్నించాడు. విద్యార్ధి ఉద్యమం ఉచిత విద్య కోసం పోరాడిందని, నూతన రాజ్యాంగం సామాజిక ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నదని, ప్రజాస్వామిక పద్దతుల్లో సామాజిక చర్చ జరగాలన్నాడు.వామపక్ష శక్తులు అధికారానికి వచ్చిన తరువాత ప్రతిపాదించిన ప్రజానుకూల సంస్కరణలను ముందుకు తీసుకు వెళ్లలేని వాస్తవ పరిస్థితి పార్లమెంటులో ఉంది. దానిలో భాగంగానే ధనికుల నుంచి పన్నువసూళ్లను పెంచే ప్రతిపాదన పార్లమెంటుముందుంచగా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.కార్పొరేట్‌, ధనికులకు మద్దతుగా నిలిచాయి. పెన్షన్ల పెంపు, పెన్షన్‌ హామీ, సంరక్షణ వంటి పధకాలకు అవసరమైన నిధులను సేకరించేందుకు కలిగిన వారి మీద పన్ను పెంచాలని వామపక్ష ప్రభుత్వం ప్రతిపాదించింది.దాన్ని అడ్డుకోవటం అంటే పౌరుల సామాజిక హక్కుల మీద దాడి చేయటమే. అందుకే అలాంటి పార్టీల మీద వత్తిడి తేవాలంటే పార్లమెంటుతో పాటు వెలుపల ప్రజా ఉద్యమాలను నడపాలని కమ్యూనిస్టు పార్టీ కోరింది. దీని మీద ఆగ్రహిస్తున్న మీడియా వెనెజులా మిలిటరీ మాజీ అధికారి హత్యను సాకుగా తీసుకొని కమ్యూనిస్టుల మీద తప్పుడు ఆరోపణలతో దాడికి దిగింది.


గతంలో ఎన్నడూ లేనంత భయం, విపరీత కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార నేపధ్యంలో 2021 డిసెంబరు 19న జరిగిన చిలీ మలి విడత అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష కూటమి అభ్యర్ధి గాబ్రియెల్‌ బోరిక్‌ ఘనవిజయం సాధించాడు.నవంబరు 21న జరిగిన ఎన్నికలలో క్రిస్టియన్‌ సోషల్‌ ఫ్రంట్‌ అభ్యర్ధి జోస్‌ ఆంటోనియో కాస్ట్‌ 27.92 శాతం ఓట్లతో ప్రధమ స్దానంలో ఉండగా బోరిక్‌ 25.82శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. డిసెంబరు 19న తుది పోటీ జరిగింది. బోరిక్‌ 55.87శాతం, కాస్ట్‌ 44.13శాతం ఓట్లు తెచ్చుకున్నాడు. నయా ఉదారవాద తొలి ప్రయోగశాల లాటిన్‌ అమెరికా కాగా, దానిలో చిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందుకే అక్కడి యువత నయా ఉదారవాదం పుట్టింది ఇక్కడే దానికి గోరీ కట్టేది ఇక్కడే అనే నినాదంతో ఉద్యమించింది, దానికి బోరిక్‌ రూపంలో విజయం లభించింది. పదేండ్ల క్రితం విద్యార్ధి ఉద్యమం ముందుకు తెచ్చిన నేతలలో బోరిక్‌ ఒకడు, 2014 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.
1973లో సోషలిస్టు పార్టీ నేత (మార్క్సిజం-లెనినిజానికి కట్టుబడిన) సాల్వెడార్‌ అలెండీ ప్రభుత్వంపై జరిగిన కుట్రలో భాగంగా మిలిటరీ, పోలీసు తిరుగుబాటు చేసింది. దాన్ని ప్రతిఘటించేందుకు ఆయుధం పట్టిన అలెండీని కుట్రదారులు కాల్చి చంపారు. అయితే ప్రాణాలతో మిలిటరీకి పట్టుబడటం ఇష్టం లేక ఆత్మహత్యచేసుకున్నట్లు 2011లో కోర్టు ప్రకటించింది. ఈ కథను ఎవరూ నమ్మకపోయినా తాము విశ్వసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పటంతో ఆ కేసు విచారణ ముగించారు. అలెండీ మీద తిరుగుబాటు చేసిన జనరల్‌ పినోచెట్‌ తరువాత పగ్గాలు చేపట్టి నయాఉదారవాద విధానాలను జనం మీద రుద్దాడు.1973 నుంచి 1990వరకు నియంతగా పాలించాడు. తరువాత పౌరపాలన పునరుద్దరణ జరిగింది.

మధ్యలో రెండు సార్లు గతంలో అలెండీ నాయకత్వం వహించిన సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచలెట్‌ అధికారానికి వచ్చినప్పటికి మిగతావారి మాదిరే మొత్తం మీద నయా ఉదారవాద విధానాలనే కొనసాగించారు. సాధారణంగా తొలిదఫా ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకున్నప్పటికీ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీ అంతిమ పోటీలో గెలుస్తుంది. చిలీలో దానికి భిన్నంగా రెండవ స్ధానంలో వచ్చిన బోరిక్‌ ఘనవిజయం సాధించాడు. మితవాద శక్తులన్నీ ఒకవైపు, వారిని ప్రతిఘటించే పురోగామి, ఉదారవాదులందరూ మరోవైపు సమీకరణయ్యారు.ఈ క్రమంలో బోరిక్‌ను ఎన్నుకుంటే కమ్యూనిస్టు ప్రమాదం వస్తుందని, దేశం మరొక వెనెజులాగా మారిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. సామాజిక, మతపరమైన అంశాలను కూడా ముందుకు తెచ్చారు. భయం మీద ఆశ విజయం సాధించిందని, ఒక పద్దతి ప్రకారం కమ్యూనిస్టునిస్టు వ్యతిరేక విష ప్రయోగాన్ని కూడా జనం అధిగమించారని బోరిక్‌ తన విజయ సందేశంలో చెప్పాడు. పార్లమెంటు దిగువ సభ డిప్యూటీల ఛాంబర్‌లో దామాషా ప్రాతిపదికన 155 స్ధానాలకు గాను వామపక్ష కూటమి పార్టీలకు వచ్చింది 37 మాత్రమే. ఎగువ సభలోని 50 స్దానాలకు గాను వామపక్షాలకు ఐదు, స్వతంత్రులు ఇద్దరు, మిగిలిన 43మితవాద పార్టీలకే వచ్చాయి. వామపక్షాలలో ప్రధాన పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు గతంలో ఉన్నఎనిమిదింటిని 12కు పెంచుకున్నారు, ఎగువ సభలో కొత్తగా రెండు స్దానాలను గెలుచుకున్నారు. నూతన రాజ్యాంగ ప్రతిపాదనపై 2022లో జరిగిన ఓటింగ్‌ తిరస్కరణకు గురైంది. దాన్ని వామపక్ష వాదులు ప్రతిపాదించినట్లు ప్రచారం చేశారు. తరువాత 2023డిసెంబరులో రెండవ రాజ్యాంగం గురించి జరిగిన ఓటింగ్‌లో మరోసారి తిరస్కరణకు గురైంది. దానిలో మితవాద ముద్ర ఉండటంతో వామపక్ష శక్తులు వ్యతిరేకించాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు, నూతన రాజ్యాంగం వంటి అంశాలలో మితవాద శక్తులు ఇప్పటి నుంచే వామపక్షాలను దెబ్బతీసేందుకు పూనుకున్నాయి. దానిలో భాగంగానే పెద్ద పార్టీగా ఉన్న కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. వాటిని వామపక్షాలు ఎలా ఎదుర్కొంటాయన్నది ఆసక్తిగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !
  • అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం ఎందుకు, 1962లో చైనాతో యుద్ధ కారణాలేమిటి !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d