• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Europe

చైనా కమ్యూనిస్టులు బైబిల్‌ను తిరగరాస్తున్నారా ? నిజానిజాలేమిటి ?

29 Saturday Jul 2023

Posted by raomk in CHINA, Communalism, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RELIGION, Uncategorized, USA

≈ Leave a comment

Tags

Anti communist, chinese communist party, Gospel of John, Jesus, Pope Francis, Rewriting the Bible, RSS, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


మతాన్ని చైనీకరణ కావించేందుకు గాను అక్కడి కమ్యూనిస్టు పార్టీ (సిసిపి) బైబిల్‌ను తిరగరాస్తున్నదని ప్రచారం చేస్తున్నవారిని అమెరికా ప్రోత్సహిస్తున్నది. దానికి పార్లమెంటరీ కమిటీని వేదికగా చేసుకుంది. అమెరికా పార్లమెంట్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుతెన్నులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీ సమావేశంలో రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ మైక్‌ గాలఘెర్‌ చైనా మీద ఆరోపించాడు. జనాలు దేవుడి కంటే పార్టీకి విశ్వాస పాత్రులుగా ఉండేట్లుగా మార్చాలని, దానికి గాను అన్ని మతాలను చైనీకరణ గావించాలని, మతం, సోషలిజం ఒకదానికి ఒకటి తోడుగా ఉనికిలో ఉండేట్లు చూడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ మహాసభ జరిగినపుడు 2017లో అధినేత షీ జింపింగ్‌ కోరినట్లు ,దానిలో భాగంగానే బైబిల్‌ను తిరగరాస్తున్నారని కూడా మైక్‌ ఆరోపించాడు. ఈ ప్రచారాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఒక పథకం ప్రకారం సాగిస్తున్నారు. పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగరాసే పని పెట్టుకున్నారన్నది వాటిలో ఒకటి. దీన్ని ఒక్క క్రైస్తవ మతానికే పరిమితం చేయలేదని బౌద్దం, ఇస్లాంకు కూడా వర్తింప చేస్తున్నారని మైక్‌ ఆరోపించాడు.మతం మీద పూర్తి అధికారాన్ని సాధించేందుకు సిసిపి చూస్తున్నదనే ప్రచారాన్ని అనేక క్రైస్తవ మత సంస్థలు, మీడియాలో కూడా గత ఆరు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. మతం, సోషలిజం సహజీవనం అన్నది వక్రీకరణ తప్ప వాస్తవం కాదు. మత స్వేచ్చను అనుమతించటం అంటే ప్రోత్సహించటం, ఉనికిని కాపాడటం కాదు. తరతరాలుగా వేళ్లూనుకున్న భావనలను క్రమంగా పోగొట్టాలి తప్ప ప్రార్ధనా మందిరాలను కూల్చివేసినా, నిషేధాలతో అణచివేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి.


చిత్రం ఏమిటంటే మతాన్ని అణచివేస్తున్నట్లు ఒక వైపు ఆరోపణలు చేస్తున్న తరుణంలోనే 2018లో చైనా ప్రభుత్వంతో పోప్‌ ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం ఎంపిక చేసిన వారిని చైనాలో కాథలిక్‌ మత అధిపతులుగా పోప్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా టిబెట్‌లో తదుపరి దలైలామాను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు గాను ముందుగా పోప్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక బైబిల్‌ను తిరగరాస్తున్నారని చెప్పేందుకు మైక్‌ గాలఘెర్‌ రెండు ఆరోపణలు చేశాడు. న్యూటెస్ట్‌మెంట్‌ బైబిల్‌లో జాన్‌ సువార్త ప్రకారం వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక మహిళను రాళ్లతో కొట్టటాన్ని చూసిన ఏసు క్రీస్తు వారి వద్దకు వెళ్లి మీలో పాపం చేయనివారెవరైనా ఉంటే ముందుగా వారు వచ్చి కొట్టమని చెప్పారన్న కథ అందరికీ తెలిసిందే.దాన్ని చైనా వారు మార్చి ఏసు క్రీస్తే స్వయంగా రాళ్లు వేసినట్లు రాశారని మైక్‌ ఆరోపించాడు. ఇది తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. మరికొన్ని దీన్నే మరోవిధంగా ప్రచారం చేస్తున్నారు. ఏసుక్రీస్తు జోక్యం చేసుకున్న తరువాత రాళ్లు వేసిన వారు వెళ్లిపోయారని, వారు నిన్ను చంపారా అని సదరు మహిళను అడిగితే లేదని ఆమె చెప్పిన తరువాత వారు గాక పోతే నేనే చంపేస్తా, ఇలాంటి పాపం మరొకసారి చేేయ వద్దు, వెళ్లిపో అన్నట్లుగా బైబిల్‌ను తిరగరాసినట్లు ప్రచారం చేస్తున్నారు.


మరొక కథనం ప్రకారం ఫార్సీ(నాటి చట్టాల గురించి తెలిసినవారు) యూదులు ఒక మహిళను తీసుకు వచ్చి ఏసుక్రీస్తు ముందు నిలిపారు. బోధకుడా ఈ మహిళ వ్యభిచారం చేస్తూ పట్టుబడినది. చట్టం , మోజెస్‌ మాకు చెప్పినదాని ప్రకారం అలాంటి మహిళను రాళ్లతో కొట్టాలి. ఇప్పుడు మీరేమి చెబుతారు అని ప్రశ్నించారట. ఇదంతా ఏసుక్రీస్తును ఉచ్చులో ఇరికించేందుకు యూదునేతలు చేశారట. అప్పుడు ఏసు క్రీస్తు నేల మీద వేలితో ఏదో రాస్తూ (అదేమిటో ఇప్పటికీ తెలియదట) మీలో పాపం చేయని వారెవరైనా ఉంటే ముందుగా వారు రాళ్లతో కొట్టండి అన్నారట. దాంతో వణికిపోయి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారట. అప్పుడు ఏసు మహిళా వారెక్కడ, ఎవరూ నీ మీద దాడి చేయలేదు కదా అంటే అవునయ్యా అందట. నేను కూడా నిన్ను కొట్టను వెళ్లిపో నీ జీవితంలో ఇంక పాపం చేయవద్దు అన్నాడట. అలా అందరూ వెళ్లిన తరువాత ఏసు ఆమెను స్వయంగా రాయితో కొట్టి నేను కూడా పాపినే అని చెప్పినట్లు చైనా కమ్యూనిస్టులు తిరగరాస్తున్న బైబిల్‌లో ఉందని, దాన్ని తరగతి పుస్తకాల్లో పెట్టారని కొన్ని క్రైస్తవ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.ఇది ఏసు దైవత్వాన్ని కించపరచటమే అని ఆరోపిస్తున్నారు.


ప్రస్తుతం చైనా, మన దేశం,ఇంకా అనేక దేశాల్లో ఉన్న చట్టం ప్రకారం అక్రమ సంబంధం నేరం కాదు. అందువలన దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టాలని, ఏసుక్రీస్తే ఆపని చేశారు గనుక మీరూ చేయవచ్చని చైనాలో ఉన్న క్రైస్తవులకు గానీ మరొకరికి గానీ చెప్పాల్సిన అవసరం కమ్యూనిస్టులకు లేదు, అందుకుగాను బైబిల్‌ను తిరగరాయాల్సిన అగత్యమూ లేదు. దానికీ సోషలిస్టు సమాజ నిర్మాణానికి సంబంధం లేదు. అలాగని అక్రమ సంబంధాలను ప్రోత్సహిస్తున్నదీ లేదు. ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చని చైనా చట్టాలలో ఉంది. వివాహం చేసుకున్నప్పటికీ స్త్రీ సదరు పురుషుడి ఆస్తికాదు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 497 ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్య పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే సదరు పరపురుషుడు అవివాహితుడైనప్పటికీ అభియోగం రుజువైతే ఐదు సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. వివాహిత మహిళకు ఎలాంటి శిక్ష ఉండదు. ఈ సెక్షన్‌ రాజ్యాంగ విరుద్దమని 2018 సెప్టెంబరు 27న సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. మరొకరి భాగస్వామి అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే నగదు జరిమానా విధించవచ్చని సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ చెప్పింది.


చైనాలోని హేనాన్‌ రాష్ట్రంలోని ప్రొటెస్టెంట్‌ చర్చిలలో టెన్‌కమాండ్‌మెంట్స్‌ బదులు చైనా అధినేత షీ జింపింగ్‌ చెప్పిన మాటలను బోధించాలని కమ్యూనిస్టు పార్టీ నేతలు బలవంతం చేస్తున్నారని, ఈ మేరకు మొదటి కమాండ్‌మెంట్‌ను మార్చి రాశారని కూడా అమెరికన్‌ ఎంపీ ఆరోపించాడు. పశ్చిమ దేశాల భావజాలాన్ని చొరనివ్వకుండా ఇలా చేస్తున్నారని, తిరస్కరించిన ఇద్దరు పాస్టర్లను శిక్షించినట్లు, ఇతరులను అడ్డుకుంటున్నట్లు ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ కన్సరన్‌(ఐసిసి) నివేదించినట్లు పార్లమెంటు కమిటీ ముందు చెప్పాడు. బైబిల్‌ రెండు రకాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఓల్డ్‌ టెస్టిమెంట్‌, న్యూ టెస్టిమెంట్‌ అన్న గ్రంధాలు మనం ఎక్కడైనా చూడవచ్చు. వాటిని తిరగ రాసింది క్రైస్తవులు తప్ప కమ్యూనిస్టులు కాదు.వివిధ మత గ్రంధాల మీద అనేక మంది భిన్నమైన భాష్యాలు రాశారు. కైస్తవం కమ్యూనిజానికి అనుకూలమని, వ్యతిరేకమని బైబిల్‌లో ఉన్న అంశాలకు వ్యాఖ్యానం చెప్పిన వారు లేకపోలేదు. అసలు ఏసుక్రీస్తు ఎప్పుడు జన్మించాడు, బైబిల్‌ అంశాలను ఎవరు ఎప్పుడు ప్రబోధించారు లేదా ఎప్పుడు రాశారు ? అప్పటికీ అసలు కమ్యూనిజం, సోషలిజం అన్న ప్రాధమిక భావనలు కూడా లేవు. అలాంటపుడు ప్రబోధకులు లేదా రాసిన వారు వాటికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలా వాదనలు చేయగలరు. బైబిల్‌ను తిరగరాసి దానిలో ఇలా ఉంది అని చెప్పి జనాన్ని కమ్యూనిజానికి అనుకూలంగా మార్చేంత భావ దారిద్య్రంలో ప్రపంచంలో ఏ కమ్యూనిస్టులూ లేరు. దోపిడీకి వ్యతిరేకంగా జరిపే పోరాటాలను పక్కదారి పట్టించేందుకు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు ప్రతి మతం యత్నించటాన్ని రోజూ మనం చూస్తున్నదే.

మనదేశంలో మనుధర్మం పేరుతో అమలు జరిపిన వివక్ష, దుర్మార్గాలు చేస్తున్నపుడే సర్వేజనా సుఖినోభవంతు అని కూడా చెప్పారు. అందువలన అలా చెప్పిన వారిని మన దేశంలో తొలి సోషలిస్టులు, కమ్యూనిస్టులు అంటారా ? ప్రతి సమాజంలో దుర్మార్గాలను చూడలేని అనేక మంది తమ వాంఛలను వెల్లడించారు. వాటిని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే శాస్త్రీయ సిద్దాంతం, ఆచరణలను కమ్యూనిస్టులు చెప్పారు. వ్యక్తులకు, వారి ఇండ్లకు, ప్రార్ధనా స్థలాలకు పరిమితం కావాల్సిన మతాన్ని వీధులు, రాజకీయాలు, దోపిడీదార్లకు కొమ్ముకాసేందుకు తీసుకురావటాన్ని కమ్యూనిస్టులే కాదు, హేతువాదులు, పురోగామివాదులెవరూ అంగీకరించరు. రాజ్యం, పౌరుల మీద మత పెత్తనాన్ని చివరికి పెట్టుబడిదారులు కూడా అంగీకరించరు.ఐరోపాలో ఒక దశలో భూమిలో అత్యధిక భాగం మత సంస్థల చేతుల్లోనే ఉండేది. దాన్ని బద్దలు కొట్టటం ఫ్రెంచి విప్లవంలో ఒక భాగం, ఫ్యూడల్‌ బంధాలను,మత పట్టును అది బద్దలు చేసింది.పేదలు,అణగారిన వర్గాలను రక్షించేందుకే క్రైస్తవం తొలి రోజుల్లో ముందుకు వచ్చింది గనుకనే జనం ఖండాలు, రంగు, భాషా బేధాలతో నిమిత్తం లేకుండా ఆదరించారు. కానీ అదే మతం కష్టజీవుల మూలుగులను పీల్చే పెట్టుబడిదారులు,యుద్ధాలతో రక్తపుటేరులు పారించిన నియంతల పట్ల దాని వైఖరి ఏమంటే సానుకూలమే. మత యుద్ధాలకు పాల్పడిన చరిత్ర కూడా తెలిసిందే. దోపిడీని అంతం చేయాలన్న సోషలిస్టు, కమ్యూనిజం మతానికి వ్యతిరేకం అని ఆ మత పెద్దలే రోజూ తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.


దేశాల మీద మతపెత్తనం కుదరదు, మత రాజ్యాలు అంతరించాయి. మతం పేరుతో విద్రోహానికి పూనుకుంటే సహించాల్సిన అవసరం ఉందా? తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలు, సోవియట్‌ కూల్చివేతలో క్రైస్తవమత పెద్దలు కూడా అమెరికా, ఇతర సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన చరిత్ర మన కళ్ల ముందు ఉంది. అటువంటి కుట్రలను చైనా సాగనివ్వటం లేదు గనుక దాని మీద తప్పుడు ప్రచారాలు అన్నది స్పష్టం. చైనాలో బైబిల్‌, ఖురాన్‌ ఏ పవిత్ర గ్రంధాన్ని కూడ సహించరని ప్రచారం చేస్తున్న క్రైస్తవ సంస్థలు నేడు ఐరోపాలో పెరుగుతున్న ముస్లిం వ్యతిరేకత, ఖురాన్‌ గ్రంధాలను తగులపెడుతున్న ఉదంతాల గురించి ఎక్కడా మాట్లాడవు.స్టాక్‌హౌమ్‌లోని టర్కీ ఎంబసీ ముందు ఖురాన్‌ ప్రతిని తగుల బెట్టేందుకు స్వీడన్‌ ప్రభుత్వం ఏకంగా అధికారిక అనుమతి మంజూరు చేసింది. ఇంకా అనేక దేశాల్లో పచ్చి ముస్లిం వ్యతిరేకులు ఇలానే రెచ్చిపోతున్నారు. వాటి గురించి అమెరికా ఎంపీలెవరూ మాట్లాడరు. చైనా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 36 ప్రకారం మత స్వేచ్చ ఉంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులు ఫలానా మతాన్ని నమ్మాలని లేదా వద్దని గానీ వత్తిడి తేకూడదు.వివక్ష చూపకూడదు.ప్రజా జీవనాన్ని విచ్చిన్నం చేసేందుకు లేదా పౌరుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు చూడకూడదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదు. ఏ మత సంస్థకూడా విదేశీ పెత్తనాన్ని అంగీకరించకూడదు. ఇదే విధంగా మత సంస్థలు విద్యాసంస్థలను ఏర్పాటు చేయవచ్చు తప్ప వాటిలో మత బోధన చేయకూడదు. ఇలా మతాన్ని పరిమితం చేసే నిబంధనలు ఉన్నాయి. అంతే తప్ప మా మతం ఇలా చెప్పింది లేదా మత కేంద్రం ఫలానా చోట ఉంది, వారు చెప్పినట్లు నడచుకుంటాం, దేశంలోని చట్టాలు మాకు వర్తించవు అంటే కుదరదు. మేం చెప్పినట్లే నడవాలి అంటే అసలు కుదరదు. ఇది అన్ని మతాలకూ వర్తిస్తుంది. బౌద్దం పేరుతో జనాన్ని రెచ్చగొట్టి తిరుగుబాటు చేసిన టిబెట్‌ దలైలామా పారిపోయి మన దేశంలో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.


అమర జీవుల గళం(విఓఎం) పేరుతో పని చేస్తున్న ఒక సంస్థ ప్రతినిధి టోడ్‌ నెటెల్టన్‌ ఒక పత్రికతో మాట్లాడుతూ పది సంవత్సరాల్లో బైబిల్‌ను తిరగ రాయాలని చైనా కమ్యూనిస్టు పార్టీ 2019లో నిర్ణయించిందని. దానిలో కన్ఫూసియస్‌, బౌద్ద సూత్రాలను కూడా చొప్పించి పార్టీకి మద్దతు ఇచ్చేవిధంగా రాస్తారని ఆరోపించాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే 140 కోట్ల చైనా జనాభాలో ఇండెక్స్‌ ముండీ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం క్రైస్తవులు కేవలం 5.2, ముస్లింలు రెండు శాతమే.ఏ మతానికీ చెందని వారు 51.8, స్థానిక తెగల మతాల వారు 21.9, బౌద్దులు 18.3 శాతాల చొప్పున ఉన్నారు. మనదేశంలో మాదిరి 80శాతం మంది ఉన్న హిందూమతానికి ముస్లిం, క్రైస్తవుల నుంచి ముప్పు వచ్చిందని చెప్పేవారెవరూ అక్కడ లేరు. ప్రపంచంలో ఎక్కడా వర్తమాన కాలంలో ఏ దేశంలోనూ ఒక మతస్తులు తమ జనాభాను విపరీతంగా పెంచి మరొక మతానికి ముప్పు తెచ్చిన ఉదంతమేదీ జరగలేదు. చైనాలో నిజంగా బైబిల్‌ను తిరగరాస్తూ దానిలో కొన్ని భాగాలను ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో పెట్టి ఉంటే రోమ్‌లో ఉన్న క్రైస్తవమత కేంద్రానికి, పోప్‌కు తెలియకుండా ఉంటుందా ? తెలిస్తే అధికారికంగానే దాని మీద స్పందించిన దాఖలా ఇంతవరకు లేదు.


క్రైస్తవుల కోసం పని చేస్తున్నామంటూ ప్రచారం చేసుకొనే వారూ, పత్రికల్లో రాతలు రాసేవారూ చివరికి పోప్‌ ఫ్రాన్సిస్‌ను కూడా వదలటం లేదు. చైనా అక్రమంగా నియమించిన షాంఘై బిషప్‌ను అంగీకరించినట్లు ధ్వజమెత్తారు.2018లో చైనాతో పోప్‌ కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పటికీ రహస్యమేనని, దాన్ని ఇప్పటికి రెండు సార్లు సమీక్షించినట్లు జూలై 27న ఒక విశ్లేషకుడు పేర్కొన్నాడు. ఒప్పందం ప్రకారం బిషప్పులను ఎంపిక చేసేది చైనా అయినా అధికారికంగా ప్రకటించాల్సింది పోప్‌ అని దానికి విరుద్దంగా షాంఘై బిషప్‌ వ్యవహారం ఉందని, వాటికన్‌కు ఆ సంగతి పత్రికా వార్తల ద్వారా తెలిసిందని కూడా ఆరోపించాడు. ఏప్రిల్‌ నాలుగున నియామకం జరిగితే జూలై 15న పోప్‌ అధికారికంగా ప్రకటించారని వాపోయాడు. గొడవలెందుకని ఊరుకొని ఆమోదించాంగానీ చైనా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వాటికన్‌ విదేశాంగ మంత్రి కార్డినల్‌ పెట్రో పరోలిన్‌ చెప్పినట్లు కూడా రాశాడు. 2018 ఒప్పందం ప్రకారం అనుమతి లేకుండా చర్చి సమావేశాలు నిర్వహించటాన్ని ఎవరూ ప్రోత్సహించకూడదు. అలాంటి వారంతా చైనా ప్రభుత్వం గుర్తించిన దేశభక్త కాథలిక్‌ చర్చిలో విలీనం కావాలి.కానీ ఇప్పటికీ రహస్య చర్చ్‌లు కొనసాగుతున్నట్లు వాటికన్‌ మంత్రి అంగీకరించాడు. అలా చేరని వారి మనోభావాలను గౌరవించాలని కూడా ఇప్పుడు మంత్రి చెప్పటాన్ని బట్టి దాని అర్ధం వారికి వెలుపలి నుంచి మద్దతు లభిస్తున్నది. వారికి రక్షణ కల్పించాలని అనేక మంది పత్రికల్లో డిమాండ్‌ చేస్తున్నారంటే పోప్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి తూట్లు పొడవటం, ధిక్కరణ తప్ప మరొకకాదు. బైబిల్‌ను తిరగరాయాలంటే ఎక్కడైనా పది సంవత్సరాలు అవసరం లేదు. తెల్లవారేసరికి పోటీ గ్రంధాలను రాసేవారున్నారు. కమ్యూనిస్టులు అలాంటి పనికిమాలిన పని పెట్టుకోరు. గతంలో మతాన్ని అనుమతించరని, ప్రార్ధనా మందిరాలను కూల్చివేశారని చేసిన ప్రచారం అబద్దమని తేలింది. అందువలన ఎత్తుగడలను మార్చి మతాన్ని తమకు అనుకూలంగా మారుస్తున్నారని, మత గ్రంధాలను తిరగరాస్తున్నారనే తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా మరో ముందడుగు : అమెరికాను హడలెత్తిస్తూ జెట్‌ ఇంజన్‌ రూపకల్పన, ఉత్పత్తి ! మనదేశం ఎక్కడ ?

27 Thursday Jul 2023

Posted by raomk in CHINA, Current Affairs, Europe, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

AVIC, Chengdu J-20 stealth fighter, China’s J-20 fighter, F 35, F-22, Joe Biden, Narendra Modi Failures, PENTAGON, PRC


ఎం కోటేశ్వరరావు


కాపీ కొట్టేందుకు వీలుగాక స్వంత జెట్‌ ఇంజన్‌ చైనా యత్నం అనే శీర్షికతో రాయిటర్స్‌ వార్తా సంస్థ ఒక విశ్లేషణను వెలువరించింది. అణు క్షిపణులను రూపొందించింది, వ్యోమగాములను రోదసీలోకి పంపింది గానీ ఇంతవరకు ఎంతో కీలకమైన జెట్‌ ఇంజన్లను తయారు చేయలేకపోయింది అన్న మాటలతో ప్రారంభమైంది. ఇది 2012 అక్టోబరు 30న రాసింది. కథ అల్లింది వార్తా సంస్థ కావచ్చుగానీ దానిలో ఉన్న అంశాలు పశ్చిమ దేశాల నిపుణుల బుర్రలో ఉన్నవే అన్నది స్పష్టం. చైనా వాటిని సవాలుగా తీసుకొని పది సంవత్సరాల్లో తన స్వంత జెట్‌ ఇంజన్ను ఎగురవేసింది. అది చైనా ప్రత్యేకత. చైనా అంటే కాపీ అన్న తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఇది చెంపపెట్టు. కాపీకి వీలైతే ఎవరైనా ఆపని చేయవచ్చు. చైనాకు ధీటుగా మన దేశాన్ని రూపొందిస్తామని చెబుతున్న వారు ఈ రంగంలో మనం ఎక్కడున్నామో కూడా చెప్పాల్సి ఉంది. జెట్‌ ఇంజను రూపకల్పనకు చైనా 1600 కోట్ల డాలర్ల(10000 కోట్ల యువాన్ల) పధకాన్ని రూపొందించినట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది. అంత మొత్తం మన దగ్గర లేదా ? నిపుణులకు మన దేశంలో కొదవ లేదు, కాంగ్రెస్‌ పాలకులు పట్టించుకోలేదనుకుందాం, నరేంద్రమోడీ ఎందుకు పూనుకోలేదు, ఒక వేళ పూనుకుంటే మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం ? కొందరు పశ్చిమ దేశాల నిపుణులు రానున్న రెండు దశాబ్దాల్లో చైనా 4,900 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుందని కూడా అంచనాలు చెప్పారు. వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక పెద్ద ముందడుగు వేసింది. పశ్చిమ దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. ఒకసారి బండి కదిలిన తరువాత ఊపందుకోవటం పెద్ద పని కాదు. ” ఐరోపా, అమెరికా, రష్యాలను కలిపి చూస్తే అవి కొన్ని వందల సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాయి. కానీ చైనా మాత్రం 30 సంవత్సరాల నుంచే పని చేస్తున్నది ” అని హాంకాంగ్‌ నుంచి వెలువడే కానవా ఆసియన్‌ డిఫెన్స్‌ మాగజైన్‌ సంపాదకుడు ఆండ్రెయి చాంగ్‌ అన్నాడు.


అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అందువలన ప్రతి దేశం తన భద్రత గురించి జాగ్రత్తపడటం సాధారణ అంశమే. ఇటీవలి కాలంలో కొన్ని దేశాలను బూచిగా చూపి ఆ పేరుతో మిలిటరీ ఖర్చు పెంచేట్లు అమెరికా కుట్రలు చేస్తోంది, తప్పుడు సమాచారం అందిస్తోంది. ఉదాహరణకు మనకు చైనాతో విరోధాన్ని పెంచేందుకు అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులు మన ప్రాంతంలో చైనా కొత్త గ్రామాలను నిర్మిస్తున్నట్లు కొన్ని ఫొటోలను అమెరికా విడుదల చేసింది. అది వాస్తవం కాదని, తమ ప్రాంతంలోనే పాతబడిన ఇండ్ల స్థానంలో కొత్తవాటిని నిర్మిస్తున్నట్లు మన మిలిటరీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అమెరికా మాటలను నమ్మి అవసరం కంటే అధికంగా మిలిటరీ ఖర్చు చేసిన దేశమేదీ బాగుపడిన దాఖలాల్లేవు. సాధారణ పరిస్థితుల్లో కూడా ప్రతిదేశం తన మిలిటరీ పరికరాలను నవీకరించుకోవటం అవసరం, దానికి మన దేశం మినహాయింపు కాదు. ఇటీవలనే ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్‌ వెళ్లి కొత్తగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చారు. ఫ్రెంచి కంపెనీతో కలసి జెట్‌ ఇంజన్ల అభివృద్ధికి ఒప్పందం చేసుకున్నట్లు కూడా ప్రకటించారు.


పారిస్‌లో ఇటీవలనే విమాన ఎగ్జిబిషన్‌ జరిగింది. ఈ సందర్భంగా నాటో కూటమి గూఢచార సంస్థలో పని చేసి రిటైరైన ఒక అధికారి బ్రేకింగ్‌ డిఫెన్స్‌ అనే మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఉంది.” చైనా స్వంతంగా జెట్‌ ఇంజన్ల రూపకల్పన, ఉత్పత్తి చేసేదిగా మారాలని ఎవ్వరూ కోరుకోవటం లేదని ” అన్నాడు. అది ఒక్క చైనాకే వర్తిస్తుందని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఇప్పటికే ఆ రంగంలో ఉన్న దేశాలు ఎవరికైనా షరతులతో అమ్ముతాయి తప్ప ఎవరినీ స్వంతంగా ఎదగనివ్వవు. పశ్చిమ దేశాలు ఎంతగా అడ్డుకుంటున్నప్పటికీ సవాలుగా తీసుకొని చైనా ముందుకు పోవటం వాటికి ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ దేశాలు ప్రత్యేకించి అమెరికా ఇతర దేశాలను భయపెట్టేందుకు ముందుగానే హడావుడి ప్రకటనలు చేస్తాయి. ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తాయి. చైనా అంశానికి వస్తే అది చేసి చూపించిన తరువాతే చెబుతుంది. పారిస్‌ విమాన ప్రదర్శన 2023 జూన్‌ 24న ముగిసింది. అక్కడ చైనా స్టాల్‌ ఉన్నప్పటికీ ఎవరూ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. తరువాత నాలుగు రోజులకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రాడార్లకు దొరకని, గురిచూసి దాడి చేసే చైనా ఐదవ తరం చెంగుడు జె-20 బాంబరు వీడియోను విడుదల చేసింది. దాని సత్తా గురించి పశ్చిమ దేశాలు ఇప్పుడు జుట్టుపీక్కుంటున్నాయి. అంతకు ముందు పరీక్షించినప్పటికీ తొలిసారిగా జె-20ని రెండు డబ్ల్యుఎస్‌-15 కొత్త ఇంజన్లతో విడుదల చేశారు. దీంతో అమెరికా, దాని మిత్ర దేశాలు ఆందోళన చెందుతున్నాయి.


గతంలో చైనా తమ విమానాలకు అవసరమైన జెట్‌ ఇంజన్లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. అవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. ఎంత కాలం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తాం, మనమే ఎందుకు రూపకల్పన చేసి ఉత్పత్తికి పూనుకోకూడదని 2016 ఆగస్టులో జెట్‌ ఇంజన్ల విడిభాగాలు తయారు చేసే యూనిట్లను ఒక దగ్గరకు చేర్చి 750 కోట్ల డాలర్ల పెట్టుబడి, 96వేల మంది సిబ్బందితో ఏరో ఇంజిన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా(ఎఇసిసి)ను ఏర్పాటు చేశారు. అది చేపట్టిన అనేక ప్రాజెక్టులలో డబ్ల్యుఎస్‌-15 ఇంజిన్‌ ఒకటి. రెండు సార్లు విఫల పరీక్షల తరువాత ఇటీవలే దాన్ని జయప్రదంగా ఎగురవేశారు. అంతకు ముందే అదే సీరీస్‌లో తక్కువ సామర్ధ్యం కలిగిన ఇంజన్లు తయారు చేసి జె-20 విమానాలకు అమర్చారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న జెట్‌ ఇంజన్లను కూడా వాటికి అమర్చుతున్నారు, జె-20 బాంబరును 2011 నుంచీ నిర్వహిస్తున్నారు.సమర్దవంతమైన స్వంత ఇంజన్లతో నడపటమే తాజా ప్రత్యేకత. ఎక్కడి నుంచైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేసినపుడు రెండు నుంచి ఎనిమిది వరకు ఇంజన్లను అదనంగా కొనుగోలు చేస్తారు. ఖర్చు రీత్యా అన్ని దేశాలు ఇలా చేయలేవు. ఇంజన్లు విడిగా కావాలంటే తమ సుఖోయి-35 ఫైటర్‌ జెట్‌లను ఎక్కువగా కొనుగోలు చేయాలని రష్యా షరతు పెట్టింది. అందువలన ఎల్ల వేళలా దాని మీద ఆధారపడటం సాధ్యం కాదని చైనా భావించింది. జూన్‌ 28న ఎగిరిన జె-20 బాంబరుకు ఒక కొత్త ఇంజను, మరొక పాత ఇంజను అమర్చారు. ఒకటి విఫలమైతే రెండవది పని చేస్తుంది. పరీక్షలో నిగ్గుతేలినప్పటికీ ఇంకా అనేక పరీక్షలు, మెరుగుపరచిన తరువాతే ఆ ఇంజన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తారని చైనా మాజీ సైనికాధికారి సాంగ్‌ ఝోంగ్‌పింగ్‌ చెప్పాడు.


ఈ ఏడాది ప్రారంభంలో ఒక చైనా పత్రికలో రాసిన విశ్లేషణలో తమ జె -20 ఐదవ తరం బాంబరు అమెరికా తయారీ ఎఫ్‌ – 35, ఎఫ్‌ -22 కంటే ఉన్నతమైనదని పేర్కొన్నారు. ఒక ఉదంతంలో తూర్పు చైనా సముద్రంలో చైనా-అమెరికా విమానాలు చాలా దగ్గరగా వచ్చాయి. ఆ సందర్భంగా అమెరికన్‌ పైలట్లు చైనా విమానాన్ని చూసి ప్రభావితులైనట్లు అమెరికా పసిఫిక్‌ ఎయిర్‌ఫోర్సు కమాండర్‌ జనరల్‌ కెనెత్‌ విల్స్‌బాచ్‌ చెప్పిన మాటలను ఆ పత్రిక ఉటంకించింది. నవీకరణ అవసరాన్ని గురించి చెప్పేటపుడు చైనా ఆయుధ వ్యవస్థల గురించి అటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారని వాటిని పట్టించుకోనవసరం లేదని కొందరు కొట్టిపారవేశారు. కానీ విమానం ఎగిరిన తీరు చూస్తే దాని కంట్రోలు వ్యవస్థలు సక్రమంగానే ఉన్నట్లు కనిపిస్తోందని, గతంలో ఈ మాత్రం కూడా తెలియలేదనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. ీ చైనా విమానం గురించి సమాచారం పెద్దగా తెలియదంటూనే అమెరికా పత్రికల్లో రెండింటి గురించి విశ్లేషణలు చేస్తున్నారు.


జె-20 విమాన సామర్ధ్యం గురించి పశ్చిమ దేశాలు నిర్ధారణకు రాలేకపోతున్నాయి. ఒక వేళ చైనా వాటిని వినియోగంలోకి తెస్తే ఎఫ్‌ 22తో చైనాను ఢకొీట్టగలమా, తగినన్ని అందుబాటులో ఉన్నాయా అని తర్జనభర్జన పడుతున్నాయి. చైనా డబ్ల్యుఎస్‌-15 జెట్‌ ఇంజన్‌ ఉత్పత్తి ఆలశ్యం అవుతున్నదని గతంలో వార్తలు వచ్చాయి. 2019 చివరి నాటికే 50 జె-20 విమానాలను చైనా తయారు చేయనుందని పశ్చిమ దేశాలు అంచనా వేశాయి. ఒక వేళ 50 లేదా వంద తయారు చేసినా అమెరికా వద్ద ప్రస్తుతం ఉన్నవాటి కంటే చాలా తక్కువ అని, లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ నివేదిక ప్రకారం 195 ఎఫ్‌-22 విమానాలను ఇప్పటికే అంద చేయగా వాటిలో 186పోరుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపున వికీపీడియా సమాచారం ప్రకారం చైనా వద్ద జె-20 విమానాలు మూడు రకాలు 210కి పైగా ఉన్నాయి. ఇలాంటి బాంబర్లను అమెరికా తరువాత చైనా మాత్రమే రూపొందించింది. తాజా సమాచారం ప్రకారం 2023లో లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ 147 నుంచి 153 ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్లను తన ఖాతాదార్లకు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది, అయితే వాటిలో 50 వరకు ఈ ఏడాది తయారుకాకపోవచ్చునని బల్గేరియన్‌ మిలిటరీ డాట్‌ కామ్‌ జూలై 22న పేర్కొన్నది. ఇదే సమయంలో చైనా జె-20 ఉత్పత్తి ఏడాదికి 120 మించనున్నదని కూడా తెలిపింది. ఎఫ్‌-35ఏ, సి రకాల బాంబర్లు నాలుగు నుంచి ఆరు క్షిపణులను, అదే జె-20 ఎనిమిది క్షిపణుల వరకు మోసుపోగలదని కూడా ఆ వార్తలో పేర్కొన్నారు.
అమెరికా, జపాన్‌ ఇతర సామ్రాజ్యవాదుల నుంచి తమకు ఎప్పుడైనా ముప్పు తప్పదని కమ్యూనిస్టు చైనా తొలి నుంచీ భావిస్తూనే ఉంది. దానికి ఆధునిక పరిజ్ఞానం అందనివ్వకూడదని రష్యాతో పాటు పశ్చిమ దేశాలు కూడా చూస్తున్నాయి. దాన్ని సవాలుగా తీసుకొని కసితో చైనా ముందుకు పోతోంది. రష్యా నుంచి యుద్ధ విమానాల ఇంజన్లు కొనుగోలు చేస్తూనే స్వంత తయారీకి పూనుకుంది. 2031 నాటికి పదేండ్ల క్రితం ఉన్న వాటి కంటే 5,260 ప్రయాణీకుల విమానాలు, 2,400 బిజినెస్‌ జెట్‌లు అవసరమని వాటికిగాను 16 వేల ఇంజన్లు అవసరమని అంచనా వేశారు.


స్టాక్‌హౌమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) 2022 వార్షిక నివేదికలో ప్రపంచంలో మిలిటరీ ఖర్చు కొత్త రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నది. అంతరిక్షం, సైబర్‌ రంగాలలో అమెరికా ముందున్నందున మిగిలిన దేశాలతో పాటు చైనా కూడా తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంటున్నది. సైబర్‌ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్‌ అని చైనా వర్ణిస్తున్నది. చైనా రూపొందిస్తున్న సైబర్‌ ఆయుధాలతో ఉపగ్రహాలను కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చని సిఐఏ తన నివేదికలలో పేర్కొన్నది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్‌ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా రష్యా సేనల గురించి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ మిలిటరీ ఖర్చు 2021తో పోల్చితే 2022లో 3.7శాతం పెరిగింది. డాలర్లలో 2022 ఖర్చు 2,240బిలియన్లు, ఇది ప్రపంచ జిడిపిలో 2.2శాతం. మొత్తం ఖర్చులో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాల వాటా 63శాతం. అమెరికా 39, చైనా 13, రష్యా 3.9,భారత్‌ 3.6, సౌదీ 3.3శాతం చొప్పున కలిగి ఉన్నాయి. ఇక రష్యా ఖర్చు దాని జిడిపిలో ఒక ఏడాది కాలంలో 3.7 నుంచి 4.1శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఉక్రెయిన్‌ ఖర్చు 640శాతం పెరిగి జిడిపిలో 3.2 నుంచి 34శాతానికి పెరిగింది. దక్షిణ చైనా సముద్రం గురించి అమెరికా లేవనెత్తుతున్న వివాదం, తైవాన్‌పై చైనాను రెచ్చగొడుతున్న కారణంగా ఈ ప్రాంతంలోని అనేక దేశాలు ఆయుధాల కొనుగోలుకు పూనుకున్నాయి.


అమెరికా రక్షణ ఖర్చు 877 బి.డాలర్లతో పోలిస్తే చైనా 292 బి.డాలర్లు తక్కువే. ఆత్మరక్షణ సిబ్బంది తప్ప మిలిటరీ ఖర్చు లేదని చెప్పుకొనే జపాన్‌ ఖర్చు 46బి.డాలర్లకు చేరింది.దక్షిణ కొరియా 46.4బి.డాలర్లకు పెరచింది.ఈ రెండు దేశాలూ అమెరికా రక్షణలో ఉన్నాయి. మన దేశం 2021తో పోలిస్తే మరుసటి ఏడాది ఖర్చు(81.4బి.డాలర్లు) ఆరుశాతం పెంచినట్లు సిప్రి పేర్కొన్నది. స్టాక్‌హౌం సంస్థ పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం ప్రపంచంలో 40దేశాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. వాటిలో మన దేశం మూడవ స్థానంలో ఉండగా మన పొరుగునే ఉన్న పాకిస్తాన్‌ 10.3 బి.డాలర్లతో 24వదిగా ఉంది. తలసరి మిలిటరీ ఖర్చును డాలర్లలో చూస్తే అమెరికా 2,240,చైనా 163, శ్రీలంక 116, పాకిస్తాన్‌ 50, మయన్మార్‌ 48, భారత్‌ 43,బంగ్లాదేశ్‌ 27, నేపాల్‌ 7 చొప్పున ఖర్చు చేస్తున్నది. అమెరికా, ఇతర ధనిక దేశాల కూటమి ప్రపంచాన్ని ఉద్రిక్తతల వైపు నడిపిస్తూ వినాశనం వైపు నడిపిస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి క్లస్టర్‌ బాంబులు-మరో మలుపు తిరిగిన సంక్షోభం !

19 Wednesday Jul 2023

Posted by raomk in Current Affairs, Europe, Germany, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

cluster munitions, Joe Biden, Ukraine crisis, US Cluster Munitions, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


శాంతి నెలకానాల్సిన చోట మరింత అశాంతి తలెత్తేలా జో బైడెన్‌ సర్కార్‌ ఉక్రెయిన్‌కు క్లస్టర్‌ బాంబులు పంపింది. సంక్షోభాన్ని మరింత తీవ్రతరం కావించేందుకు, రష్యా మీద మరిన్ని ఆంక్షలతో నష్టపరిచేందుకు నాటో కూటమి పూనుకుంది. దానికి ప్రతిగా దాడులను మరింత తీవ్రం గావించటంతో పాటు, ఉక్రెయిన్నుంచి నల్లసముద్రం ద్వారా జరుగుతున్న ధాన్య ఎగుమతుల ఒప్పందం నుంచి రష్యా తప్పుకుంది. ఆదివారంతో ముగిసిన ఒప్పందాన్ని అది పొడిగించలేదు. దీంతో 45 దేశాలకు ఉక్రెయిన్‌ ధాన్య ఎగుమతులపై అనిశ్చితి ఏర్పడింది.నౌకలకు భద్రత లేనందున రవాణా నిలిచిపోనుంది. గత ఏడాది టర్కీ చొరవతో ఐరాస మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందం మేరకు ఉక్రెయిన్‌ రేవుల దిగ్బంధనాన్ని రష్యా ఎత్తివేసింది. దానికి ప్రతిగా తమ ఆహార ధాన్యాలు, ఎరువుల ఎగుమతులపై పశ్చిమ దేశాలు ఆంక్షలను తొలగించలేదని పుతిన్‌ విమర్శించాడు.మూడు ఉక్రెయిన్‌ రేవుల నుంచి వివిధ దేశాలకు 3.28 కోట్ల టన్నుల గోధుమలు,ఇతర ధాన్యాలు, పొద్దుతిరుగుడు పువ్వుల నూనె ఎగుమతి జరిగింది. వీటిలో 46శాతం ఆసియా, 40శాతం పశ్చిమ ఐరోపా, 12శాతం ఆఫ్రికా, రెండు శాతం తూర్పు ఐరోపా దేశాలకు వెళ్లాయి. దాంతో గత ఏడాది మార్చి నుంచి ఇటీవలి వరకు ప్రపంచ మార్కెట్లో ఆహార ధరలు 23శాతం వరకు తగ్గినట్లు తేలింది. తిరిగి పరిస్థితి మొదటికి రావటంతో సోమవారం నాడు చికాగో మార్కెట్లో గోధుమల ముందస్తు ధర 3.5శాతం పెరిగింది. వెంటనే ఒప్పంద పునరుద్దరణ జరగకపోతే భారత్‌తో సహా అనేక దేశాల మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఒప్పందాన్ని కొనసాగించలేదనే ఆగ్రహంతో క్రిమియా ద్వీపాన్ని రష్యా ప్రధాన భూ భాగాన్ని కలిపే వంతెన పేల్చివేసేందుకు ఉక్రెయిన్‌ దాడిజరిపింది. పాక్షికంగా దెబ్బతిన్న వంతెనను వెంటనే రాకపోకలకు పునరుద్దరించినటు పుతిన్‌ సర్కార్‌ ప్రకటించింది. దీనికి ప్రతిగా భారీ ఎత్తున నల్లసముద్రంలోని రేవు, ఉక్రెయిన్‌ ఇతర ప్రాంతాల మీద రష్యా పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరుపుతున్నట్లు మంగళవారం నాడు వార్తలు వచ్చాయి. తమ తూర్పు ప్రాంతంలో పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నప్పటికీ తమ అదుపులోనే ఉందని ఉక్రెయిన్‌ మిలిటరీ అధికారి చెప్పాడు. లక్ష మందికి పైగా మిలిటరీ, తొమ్మిది వందలకు మించి టాంకులను రష్యా మోహరించిందని అన్నాడు.


మానవ హక్కుల బృందాలు విమర్శించినా ఖాతరు చేయకుండా నిషేధిత క్లస్టర్‌ బాంబులను ( పలు రకాల బాంబుల గుత్తి ) ఉక్రెయిన్‌కు సరఫరా చేసి సంక్షోభాన్ని ప్రమాదకర మలుపు తిప్పేందుకు అమెరికా పూనుకుంది. ఎనభై కోట్ల డాలర్ల విలువగల పాకేజ్‌లో భాగంగా ఇప్పటికే వాటిని అక్కడకు తరలించింది. ఒక వేళ వాటిని తమ మీదకు వదిలితే తాము కూడా ప్రయోగించేందుకు తమ వద్ద భారీగా నిల్వలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించాడు. ఒక రష్యా జర్నలిస్టుతో మాట్లాడినపుడు ఈఅంశాన్ని చెప్పాడు. గతంలో అమెరికా వీటిని ప్రయోగించిన ప్రాంతాలలో జరిగిన ప్రాణ నష్టం, వనరుల విధ్వంసం కారణంగా వాటిని నిషేధించారు. కొన్ని సందర్భాలలో కొన్ని బాంబులు పేలవు. వాటి గురించి తెలియక ఎవరైనా ముట్టుకుంటే సంవత్సరాల తరువాత కూడా మందుపాతరల మాదిరి పేలే ముప్పు ఉంది. గగనతలం నుంచి విమానాలు, భూమి, సముద్రాల మీద నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు. గతంలో ఇవి పేలినపుడు మరణించిన వారిలో 94శాతం మంది పౌరులు కాగా 40శాతం మంది పిల్లలు ఉన్నారు. వీటిని రూపొందించే పద్దతిని బట్టి ఒక్కో గుత్తిలో కొన్ని డజన్ల నుంచి గరిష్టంగా ఆరువందల బాంబులను అమర్చవచ్చు. తక్కువ మంది మిలిటరీ, పరిమితమైన విమానాలు, ఓడలు, రాకెట్‌ వాహనాలతో భారీ నష్టం కలిగించవచ్చు.


ఈ బాంబులను రకరకాలుగా రూపొందిస్తున్నారు. మామూలుగా ఒక బాంబును వేస్తే ఒక చోటే నష్టం కలిగిస్తుంది. కానీ ఈ గుత్తి బాంబు వేసిన తరువాత అది అనేకంగా విడిపోయి విసృత ప్రాంతంలో పేలుళ్లకు కారణమౌతుంది. మనుషులను చంపటంతో పాటు రోడ్లు,వాహనాలు, విద్యుత్‌ లైన్లు ఇలా ఆ ప్రాంతంలో ఏవి ఉంటే వాటిని ధ్వంసం చేస్తాయి. కొన్ని సందర్భాలలో మానవాళి, పంటలకు ముప్పు కలిగించే జీవ, రసాయనాలతో కూడా బాంబులను రూపొందిస్తున్నారు. యుద్ధం, ఇతర సందర్భాలలో పౌరులను హెచ్చరించేందుకు, బెదిరించేందుకు రూపొందించిన కరపత్రాలను కూడా ఈ బాంబుల ద్వారా వెదజల్లిన ఉదంతాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో ఇవి కలిగించిన అపార నష్టాన్ని చూసిన తరువాత 2008 మే 30వ తేదీన డబ్లిన్‌ నగరంలో 107 దేశాలు వీటి ఉత్పత్తి, వినియోగం, బదిలీ, నిల్వ చేయరాదని ఒక అవగాహనకు వచ్చాయి, అదే ఏడాది డిసెంబరు మూడున ఓస్లో నగరంలో ఒప్పందం మీద సంతకాలు చేశాయి. 2010 ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం 111 దేశాలు సంతకాలు చేసి పార్లమెంట్లలో ఆమోద ముద్ర వేశాయి, మరో పన్నెండు దేశాలు సంతకాలు చేసినా తదుపరి ప్రక్రియను పూర్తి చేయలేదు. మన దేశం, అమెరికా, చైనా, రష్యా, ఉక్రెయిన్‌, పాకిస్తాన్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు ఒప్పందంలో చేరలేదు. నాటోలోని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ వంటి పద్దెనిమిది దేశాలు కూడా ఒప్పందాన్ని అమలు చేస్తున్నవాటిలో ఉన్నాయి. అవి కూడా అమెరికాను నివారించేందుకు పూనుకోలేదు. అయిష్టంగానే తాము ఉక్రెయిన్‌కు అందచేస్తున్నట్లు జో బైడెన్‌ ప్రపంచాన్ని నమ్మించేందుకు చూశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో దురాక్రమణకు పూనుకున్న నాజీ సేనల మీద 1943లో నాటి సోవియట్‌ కురుస్క్‌ ప్రాంతంలో వీటిని వేసింది. అదే ఏడాది ఇంగ్లాండ్‌లోని గ్రిమ్స్‌బై ప్రాంతం మీద నాజీ సేనలు వెయ్యి బటర్‌ ఫ్లై బాంబులు వేశాయి. ఇండో చైనాను ఆక్రమించుకొనేందుకు పూనుకున్న అమెరికా 1960,70 దశకాల్లో వియత్నాం, లావోస్‌, కంపూచియాల మీద వాటిని వేసింది. ఒక్క వియత్నాం మీదనే 4,13,130 టన్నుల బాంబులు, లావోస్‌ మీద 27 కోట్లు వేసింది. రెడ్‌క్రాస్‌ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం లావోస్‌లోని 17 రాష్ట్రాలలో ఇప్పటికీ ఏటా మూడు వందల మంది చొప్పున అవి పేలి మరణిస్తున్నారు. అక్కడ ఎనిమిది కోట్ల బాంబులు పేలలేదని అంచనా. అవి ఎక్కడ పడిందీ కనుగొనటం ఎంతో కష్టం. ఎప్పుడైనా పేలవచ్చు. 1975-88 సంవత్సరాల్లో మొరాకో మిలిటరీ వీటిని తిరుగుబాటుదార్ల మీద వేసింది.1978లో లెబనాన్‌పై దురాక్రమణ జరిపిన ఇజ్రాయెల్‌ వాటితో దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌-అమెరికా రెండూ కూడా వాటితో దాడులు జరిపాయి. బ్రిటన్‌ 1982 ఫాక్‌లాండ్స్‌ దాడిలో అర్జెంటీనా మీద వేసింది. ఇరాక్‌పై దురాక్రమణ దాడిలో అమెరికా, దాని మిత్ర పక్షాలు 61వేల వైమానిక దాడులలో వీటిని వదిలాయి. బోస్నియాపై 1992-95లో యుగోస్లావ్‌ సేనలు, 1994-96లో చెచెన్‌ తిరుగుబాటుదార్లపై రష్యా,1995లో క్రోషియాపై సెర్బ్‌, 1996-99లో సూడాన్‌ మిలిటరీ దక్షిణ సూడాన్‌ తిరుగుబాటుదార్ల మీద, ఇంకా ఎరిట్రియా, ఇథియోపియా,అల్బేనియా, కొసావా వార్‌లో నాటో సేనలు, జార్జియాపై 2008లో రష్యా,సిరియా, ఎమెన్‌ తదితర చోట్ల కూడా వీటిని వినియోగించారు.


రష్యా ఉక్రెయిన్‌ మీద వేసినట్లు గతంలో నాటో కూటమి ఆధారం లేని ఆరోపణలు చేసింది. తాజాగా అమెరికా వాటిని ఇవ్వటాన్ని సమర్ధించుకొనేందుకు ముందుగానే ఈ ప్రచారం చేసినట్లు దీన్ని బట్టి అర్ధం అవుతోంది. పట్టణాల మీద వీటిని వేయకూడదని రాతపూర్వకంగా ఉక్రెయిన్నుంచి హామీ పొందినట్లు నమ్మించేందుకు అమెరికా చూస్తోంది. కొంత మంది ఇలా అందచేతతో తలెత్తే చట్టపరమైన అంశాల గురించి చర్చలు చేస్తున్నారు. నాటోలోని కొన్ని అమెరికా మిత్రదేశాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. తప్పని చెబుతూనే ఉక్రెయిన్‌ ఆత్మరక్షణకు ఇస్తున్నారు గనుక అర్ధం చేసుకున్నామంటూ సమర్ధించాయి. ఐదు వందల రోజుల సంక్షోభం తరువాత ఎందుకు ఇప్పుడు వీటిని అమెరికా సరఫరా చేస్తున్నది అనే ప్రశ్న తలెత్తటం సహజం. రష్యా అదుపులో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు తాము ప్రతిదాడులు జరుపుతున్నట్లు జెలెనెస్కీ ప్రకటించాడు. దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఎలాంటి పురోగతి లేకపోగా భారీ నష్టాలను చవి చూస్తున్నట్లు వార్తలు. టాంకులు, శతఘ్నులను పెద్ద ఎత్తున నష్టపోయింది. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతాలలో రష్యన్లు భారీ సంఖ్యలో మందుపాతరలను అమర్చినట్లు, కందకాలను తవ్వినట్లు వెల్లడికావటంతో ఉక్రెయిన్‌, నాటో మిలిటరీ అంచనాలు తప్పాయి. వాటిని దాటుకొని ముందుకు పోవటం అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవటమే. అందుకే ఆ ప్రాంతాల మీద క్లస్టర్‌ బాంబులను వేయటం తప్ప మరొక మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇవి కందకాల మీద, బహిరంగంగా ఉన్న టాంకులు, శతఘ్నులను పేలుళ్లు జరిపి నష్టపరుస్తాయి. పేలని బాంబులు, వాటితో పాటు జారవిడిచే మందుపాతరలను తప్పించుకొని పుతిన్‌ సేనలు ముందుకు పోవటం కూడా ఇబ్బందే.


క్లస్టర్‌ బాంబులను గతంలో ప్రయోగించిన ప్రాంతాలన్నీ మిలిటరీ, పౌరులు కలసి ఉన్న ప్రాంతాలే కావటంతో అనేక మంది వీటిని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. ఈ బాంబులలో రెండు నుంచి నలభై శాతం వరకు పేలే అవకాశం లేదని, చెట్లు, గుట్టలు, బురద ప్రాంతాల్లో పడినవి తరువాత ఎవరైనా వాటిని కదిలించినపుడు లేదా అవేమిటో తెలియని పిల్లలు, ఇతరులు వాటిని ముట్టుకున్నపుడు పేలి ప్రాణాలు తీస్తాయి. తాము ఉక్రెయిన్‌కు పంపిన ఈ బాంబుల్లో పేలనివి 2.35శాతమే ఉంటుందని, ఎంతో మెరుగుపరచిన పరిజ్ఞానంతో రూపొందించినట్లు అమెరికా నమ్మించచూస్తోంది. అయితే దాని రక్షణశాఖ జరిపిన పరీక్షల్లో పేలనివి 14 నుంచి 20శాతం అంతకంటే ఎక్కువే ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌కు వాటిని అందించటమంటే అక్కడి సంక్షోభాన్ని మరో మలుపు తిప్పటమే కాదు, తీవ్ర పర్యవసానాలకూ దారి తీస్తుంది. ఉద్రిక్తతలను ఎగదోసే యుద్ధోన్మాదాన్ని ఎండగట్టాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

స్వీడన్‌ నాటో సభ్యత్వానికి మెలిక పెట్టి తోకముడిచిన టర్కీ !

12 Wednesday Jul 2023

Posted by raomk in COUNTRIES, Current Affairs, Europe, Germany, Greek, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA, WAR

≈ Leave a comment

Tags

Joe Biden, NATO, NATO summit in Vilnius, Recep Tayyip Erdoğan, Sweden’s NATO bid, Ukraine crisis, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


ఐరోపా సమాఖ్య తలుపులు తెరుస్తారేమోనని ఐదు దశాబ్దాలుగా గుమ్మం ముందు పడిగాపులు కాస్తున్నాం. సమయం వచ్చింది గనుక చెబుతున్నా మాకు సమాఖ్యలో సభ్యత్వానికి అంగీకరిస్తే మేము నాటోలో స్వీడన్‌ ప్రవేశానికి అడ్డుతొలుగుతామని టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తాయిప్‌ ఎర్డోవాన్‌ సోమవారం నాడు మెలిక పెట్టాడు.లిథువేనియా రాజధాని విలినస్‌లో మంగళ,బుధవారాల్లో జరగనున్న నాటో కూటమి వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లే ముందు టీవీలో చెప్పాడు. ఆదివారం నాడు తాను అమెరికా అధినేత జో బైడెన్‌తో చర్చలు జరిపినపుడు ఈ అంశాన్ని స్పష్టం చేసినట్లు కూడా వెల్లడించాడు. ఈ అనూహ్యప్రకటనతో పశ్చిమ దేశాలు కంగారు పడ్డాయి. ఇలా వివాదపడితే అంతిమంగా రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ లబ్దిపొందుతాడంటూ నష్టనివారణకు పూనుకున్నాయి. మరోవైపున సోమవారం నాడే విలినస్‌లో ఎర్డోవాన్‌- స్వీడన్‌ ప్రధాని క్రిస్టెర్‌సన్‌ భేటీ జరిగింది. తరువాత స్వీడన్‌కు చారిత్రాత్మక క్షణం అంటూ తమ దేశ టీవీలో ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో టర్కీ వెనక్కు తగ్గిందని, లాంఛనంగా నాటోలో స్వీడన్‌ ప్రవేశానికి త్వరలో తమ పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోద ముద్ర వేసేందుకు ఎర్డోవాన్‌ అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం టర్కీ ఎదుర్కొంటున్న ఆర్థిక, ఇతర ఇబ్బందుల కారణంగా మెత్తబడిందన్నది స్పష్టం. ఎవరి ప్రయోజనం వారు చూసుకుంటున్నందున మీరు మాకది ఇస్తే మేం మీకిది ఇస్తాం అన్నట్లుగా అందుకోసం వేస్తున్న ఎత్తులు జిత్తులలో భాగంగానే ఐరోపా సమాఖ్యలో సభ్యత్వానికి ముడిపెట్టి ప్రకటించినట్లు స్పష్టమైంది. తమ గడ్డ మీద ఉన్న రష్యా సేనల మీద ఎదురుదాడులు జరిపి పోగొట్టుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రతిజ్ఞలు చేసిన ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోతున్నదనే వార్తలు వస్తున్నాయి. జెలెనెస్కీ దళాలకు అవసరమైన ఆయుధాలు, ఇతర సాయం ఎలా అందించాలా అని నాటో నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నాటోలో చేరేందుకు ఫిన్లండ్‌, స్వీడన్‌ దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది ప్రారంభంలో ఫిన్లండ్‌కు ఆమోదం తెలిపారు. సంస్థ నిబంధనల ప్రకారం సభ్యదేశాలన్నీ అంగీకరిస్తేనే కొత్త దేశాలను చేర్చుకోవటానికి వీలుంటుంది.ప్రస్తుతం ఈ కూటమిలో 31 దేశాలు ఉన్నాయి. తాజా వార్తల ప్రకారం ఇప్పటికి ఉక్రెయిన్‌కు సభó్యత్వం లేనట్లే అని స్పష్టమైంది.


విలినస్‌ సమావేశాల్లో స్వీడన్‌ ప్రవేశానికి ఆమోద ముద్ర కూడా అజెండాలో ఉంది.టర్కీ దానికి మోకాలడ్డటంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పోరు ముగిసేంత వరకు నాటోలో ఉక్రెయిన్‌ చేరకూడదని అమెరికా అధినేత జో బైడెన్‌ చేసిన ప్రకటన కూడా తలనొప్పిగా మారింది. టర్కీ షరతులను తాము అంగీకరించేది లేదని ఐరోపా సమాఖ్య ప్రకటించగా స్వీడన్‌కు ఆమోదం తెలిపితేనే తాము ఎఫ్‌ 16 యుద్ధ విమానాలను టర్కీకి విక్రయిస్తామని అమెరికా మెలిక పెట్టింది. ” ముందు ఐరోపా సమాఖ్యలో టర్కీ చేరికకు మార్గాన్ని సుగమం చేయాలి, తరువాత ఫిన్లండ్‌ మాదిరి స్వీడన్‌కూ మేము దారి ఇస్తాము. మేము 50 సంవత్సరాలుగా గేటు ముందు వేచి చూస్తున్నాం, నాటోలోని దేశాలన్నీదాదాపు సమాఖ్యలో సభ్యులే ” అని ఎర్డోవాన్‌ చెప్పాడు. తమ దేశంలో వేర్పాటు వాదులు, కర్దిష్‌ వర్కర్స్‌ పార్టీ వంటి ఉగ్రవాదులను స్వీడన్‌ బలపరస్తున్నదని, ఖురాన్‌ దహనంతో సహా ఇస్లాం వ్యతిరేక ప్రదర్శనలను అనుమతించిన కారణంగా తాము అంగీకరించేది లేదని గతంలో టర్కీ ప్రకటించింది. ఇప్పుడు తమకు ఐరోపా సమాఖ్యలో సభ్యత్వానికి లంకె పెట్టింది. టర్కీని సంతుష్టీకరించేందుకు స్వీడన్‌ ఉగ్రవాద చట్టాల్లో మార్పు చేసింది. వాటితో టర్కీ సంతృప్తి చెందలేదు. సోమవారం రాత్రి టర్కీ వైఖరిలో మార్పు వచ్చిన తరువాత ఐరోపా సమాఖó్యవైపు నుంచి ప్రతికూల స్పందనలు, సంకేతాలు రాలేదు తప్ప సానుకూలత కూడా వెల్లడి కాలేదు. తరువాత ఇప్పుడున్న స్థితి నుంచి టర్కీతో సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు పూనుకొని సంతుష్టీకరించవచ్చు.


ప్రపంచ రాజకీయాల్లో టర్కీ అనుసరిస్తున్న విధానాలే దానికి అమెరికా యుద్ధ విమానాల విక్రయం, ఐరోపా సమాఖ్యలో చేర్చుకొనేందుకు ప్రధాన ఆటంకాలుగా ఉన్నాయి.ఐరోపా ఆర్థిక సమాఖ్యలో చేరేందుకు 1963 సెప్టెంబరు 12న ఒక ఒప్పందం చేసుకుంది. అది మరుసటి ఏడాది డిసెంబరు ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నట్లు చెప్పినప్పటికీ సంపూర్ణం కాలేదు.అది నత్తనడక నడుస్తోంది.మొత్తం 35 నిబంధనలకు గాను ఇంతవరకు టర్కీ 15 మాత్రమే, అదీ పాక్షికంగా నెరవేర్చింది. కేవలం శాస్త్ర, పరిశోధనా రంగాలకు సంబంధించిన అంశమే సంపూర్ణంగా అమలు చేసింది. ఏదో ఒకసాకుతో ఇతర దేశాలు పూర్తి సభ్యత్వానికి అడ్డుపడుతున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం, మానవహక్కులను కాలరాస్తున్నారని విమర్శిస్తున్నాయి. తాజా పరిణామాలకు వస్తే 2016లో ఎర్డోవాన్ను పదవి నుంచి దించేందుకు ఒక విఫల కుట్ర జరిగింది. తరువాత తన పదవిని సురక్షితం కావించుకొనేందుకు చేసిన రాజ్యాంగ సవరణలతో మానవహక్కులు, చట్టపరమైన ఆటంకాలను కల్పిస్తున్నట్లు వాటిని తొలగించి నిబంధనలన్నింటినీ పూర్తి చేస్తేనే చేర్చుకుంటామని సమాఖ్య చెబుతోంది. వీటి కంటే పుతిన్‌తో స్నేహం, ఇతర అంశాలు ప్రధానంగా పని చేస్తున్నాయని చెప్పవచ్చు. సిరియాలో పశ్చిమ దేశాలు మద్దతు ఇస్తున్న కిరాయి మూకలు, ఉగ్రవాదులను అణచేందుకు రష్యా తోడ్పడుతున్నది, దానికి టర్కీ మద్దతు ఇస్తున్నది. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని సృష్టించింది, దాన్ని కొనసాగించాలని చూస్తున్నది పశ్చిమ దేశాలు కాగా తాను మధ్యవర్తిగా ఉంటానని టర్కీ ముందుకు రావటం వాటికి సుతరామూ ఇష్టం లేదు. టర్కీకి అవసరమైన మిలిటరీ పరికరాలను నాటో, అమెరికా నుంచి కొనుగోలుకు వీల్లేకుండా ఆంక్షలు విధించారు. సిరియా నుంచి ఐరోపాకు వచ్చే 40లక్షల మంది కాందిశీకులను రాకుండా చేసినందుకు ఇప్పటి వరకు ఐరోపా సమాఖ్య బిలియన్లమేర యూరోలను అందచేసింది. మరో ఆరు బిలియన్లను అందచేసేందుకు కుదిరిన ఒప్పందాన్ని టర్కీ నిలిపివేసింది. ఐరోపా సమాఖ్య తల మీద తుపాకి గురిపెట్టినట్లుగా తమ షరతులను అంగీకరించకపోతే ఇతర ఐరోపా దేశాలకు కాందిశీకుల వరద పారిస్తామని టర్కీ బెదిరిస్తున్నది.


ఎర్డోవాన్‌ పెట్టిన మెలికను ఐరోపా కమిషన్‌ తిరస్కరించింది. స్వీడన్‌ నాటోలో, టర్కీ ఐరోపా సమాఖ్యలో చేరటం రెండూ వేర్వేరని, సమాంతరంగా జరుగుతున్న పరిణామాలు గనుక ఒకదానికి మరొకదాన్ని పోటీ పెట్టరాదని ప్రతినిధి దానా సిపినాంట్‌ స్పష్టం చేసింది. జర్మన్‌ ఛాన్సలర్‌ షుల్జ్‌ కూడా ఆ వైఖరిని బలపరిచాడు. టర్కీ కోర్కెను తాను సమర్ధిస్తున్నట్లు నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ చెప్పాడు. స్వీడన్‌ చేరికను టర్కీ బలపరుస్తుందని కూడా అన్నాడు. ఎర్డోవాన్‌ మెలిక పెట్టినప్పటికీ ఇప్పటికీ ఆమోదించే అవకాశం ఉందనే ఆశాభావం వెల్లడించాడు. విస్తరణకు సంబంధించి 2022 నివేదికలో సమాఖ్య పేర్కొన్న అంశాలు టర్కీ చేరిక అంత తేలిక కాదని స్పష్టం చేస్తున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నదని, చట్టబద్దపాలన, ప్రాధమికహక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థల గురించి తీవ్ర ఆందోళన వెల్లడించింది.


గ్రీసును బెదిరించకుండా ఉండేట్లైతే, నాటోలో స్వీడన్‌ చేరికను ఆమోదిస్తే తాము టర్కీకి ఎఫ్‌ 16 విమానాలను విక్రయించేందుకు సిద్దమే అని అమెరికా గతంలో సందేశం పంపింది. విలినస్‌కు బయలు దేరిన జో బైడెన్‌ ఆదివారం నాడు విమానం నుంచే ఎర్డోవాన్‌తో గంటసేపు సంభాషించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని అమెరికా అధికారవర్గాలు చెప్పినట్లు వార్తలు. గ్రీసు పట్ల శతృత్వం, రష్యానుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు టర్కీ నిర్ణయించిననందున ఎఫ్‌ 16 విమానాలను విక్రయించకూడదని గతంలో అమెరికా నిర్ణయించింది. ఇప్పుడు ఒక అడుగు దిగివచ్చినట్లు కనిపిస్తోంది. స్వీడన్‌ చేరికకు మద్దతు ఇస్తే టర్కీకి విమానాలు విక్రయించేందుకు అమెరికా పార్లమెంటు ఆమోదించవచ్చని వార్తలు వచ్చాయి. వాటిని తమకు వ్యతిరేకంగా వినియోగించరాదని గ్రీసు డిమాండ్‌ చేస్తోంది. ఏజియన్‌ సముద్ర జలాల్లో నౌకా సంచార హక్కుల గురించి వివాదం ఉంది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ రోజూ తమ దీవుల మీదుగా విమానాలు ఎగురుతున్నట్లు గ్రీసు చెబుతున్నది. ఆ దీవుల మీదుగా ఎఫ్‌16 విమానాలను అనుమతించకూడదని ఆరుగురు అమెరికన్‌ ఎంపీలు తమ విదేశాంగ మంత్రికి లేఖలు రాశారు. విలినస్‌ సమావేశాల్లో జరిగిన పరిణామాల్లో వాటిని సరఫరా చేసేందుకు అమెరికా మార్గం సుగమం చేసినట్లు, దీంతో పుతిన్‌కు దూరం జరిగి టర్కీ పశ్చిమ దేశాలకు దగ్గరైనట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. మంగళవారం నాడు అమెరికా భద్రతా సలహాదారు సులివాన్‌ మాట్లాడుతూ స్వీడన్‌కు టర్కీ పచ్చజెండా ఊపినందున 2021లో కుదిరిన ఒప్పందం మేరకు లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ నుంచి 20బిలియన్‌ డాలర్ల విలువ గల కొత్త ఎఫ్‌ 16 విమానాలతో పాటు ఇప్పటికే టర్కీ దగ్గర ఉన్న 80పాత వాటిని నవీకరించేందుకు ముందుకు వెళ్లనున్నట్లు చెప్పాడు.


విలినస్‌ నాటో వార్షిక సమావేశాల్లో ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధ సాయం గురించి తప్ప నాటోలో ప్రవేశం మీద ఎలాంటి నిర్ణయమూ తీసుకొనే అవకాశం లేదు. అక్కడ పోరు ముగిసిన తరువాతే దాన్ని గురించి పరిశీలిస్తామని జో బైడెన్‌ సిఎన్‌ఎన్‌ టీవీతో చెప్పాడు. నాటో కుటుంబంలో ఉక్రెయిన్ను చేర్చుకోవాలా వద్దా అనే అంశం మీద సభ్యదేశాల్లో ఏకీభావం లేదని కూడా అన్నాడు.ఇప్పుడు గనుక చేర్చుకుంటే మేమంతా యుద్ధంలో ఉన్నట్లే అవుతుంది. ఇప్పుడే ఓటింగ్‌ జరపాలనటం అపరిపక్వత అవుతుంది, ఒక దేశాన్ని చేర్చుకోవాలంటే ప్రజాస్వామీకరణతో సహా కొన్ని అర్హతలు ఉండాలి అని కూడా బైడెన్‌ చెప్పాడు. జర్మనీ కూడా అమెరికా వైఖరితో ఏకీభవిస్తోంది. నాటో నిబంధన ఐదును పరీక్షించే అవకాశం పుతిన్‌కు ఇవ్వకూడదని జర్మనీ కోరుకొంటోందని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్‌కు తక్షణమే నాటో సభ్యత్వం అన్న చర్చ అసంగతం, దానికి చేస్తున్న మంచిని మరచి దీని గురించి చర్చను అనుమతించటం విచారకరం.ఎవరూ ఇప్పటికిప్పుడు నాటోలో చేరాలని గట్టిగా చెప్పటం లేదు, దానికి తగిన మార్గం గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఎలా సాయం చేయాలా అని ఆలోచిస్తున్నాం. దీని గురించి గాక సభ్యత్వం గురించి చర్చ పెట్టటం అంటే సమావేశాన్ని పక్కదారి పట్టించటమే, పశ్చిమ దేశాల్లో విబేధాలు ఉన్నట్లు అని చెప్పటమే, దీన్ని రష్యా స్వాగతిస్తుందని నాటో అధికారులు చెప్పినట్లు మీడియా పేర్కొన్నది.


తమను వెంటనో నాటోలో చేర్చుకోవాలని, ఆధునిక అస్త్రాలను పెద్ద ఎత్తున సరఫరా చేయాలని ఉక్రెయిన్‌ డిమాండ్‌ చేస్తున్నది. అదే గనుక జరిగితే ఉక్రెయిన్‌ సంక్షోభ స్వభావమే మారిపోతుంది. పుతిన్‌ మీద నేరుగా ఆ కూటమి సేనలు యుద్ధానికి దిగవచ్చు. రష్యా దాడులకు దిగకముందుఉన్న పరిస్థితి వేరు, తరువాత తమ ప్రాంతాలను ఆక్రమించుకున్నందున నాటో సభ్వత్వం ఇవ్వాలని గతేడాది సెప్టెంబరులో జెలెనెస్కీ దరఖాస్తు చేశాడు. అనేక దేశాలు అందుకు మద్దతు తెలిపినా అమెరికా, జర్మనీ సిద్దం కాలేదు. కొన్ని ప్రాంతాలు ఉక్రెయిన్నుంచి వేరుపడి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. క్రిమియా ద్వీపం తమదే అంటూ 2014లోనే రష్యా స్వాధీనం చేసుకుంది. మరికొన్ని ప్రాంతాలు ఇప్పుడు దాని ఆధీనంలో ఉన్నాయి, అటువంటపుడు మధ్యలో సభ్యత్వం ఇవ్వటం, గతం నుంచి వర్తింప చేసి ఎదురుదాడులకు పూనుకోవటం నాటో ఐదవ ఆర్టికల్‌ నిబంధన పరిధిలోకి రాదని చెబుతున్నారు. దాన్ని సవరించి నాటోలో చేర్చుకొని రష్యాతో నేరుగా తలపడేందుకు నాటో కూటమి ప్రస్తుతం సిద్దంగా లేదన్నది స్పష్టం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ చిప్స్‌ యాపారం మేకింగ్‌ కాదు పాకింగ్‌ : రు. 30పెట్టుబడికి 70 సబ్సిడీ, ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా !

07 Friday Jul 2023

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, India’s Micron deal, Joe Biden, Micron, Narendra Modi Failures, Semiconductor


ఎం కోటేశ్వరరావు


2024 డిసెంబరు నాటికి మేడిన్‌ ఇండియా తొలి చిప్‌ మార్కెట్‌కు వస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా వెళ్లినపుడు ఈ మేరకు మైక్రాన్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, గుజరాత్‌లోని సనంద్‌ వద్ద దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఫాక్స్‌కాన్‌-వేదాంత సంయుక్త భాగస్వామ్యంలో మరో కంపెనీ కూడా దరఖాస్తు చేయనుందని చెప్పారు. జనాలు నిజమే అని ఆహౌ ఓహౌ నరేంద్రమోడీ మంత్రదండం మహిమ ఏమిటో చూడండి, ఇలా ఒప్పందం చేసుకున్నారో లేదా అలా ఉత్పత్తి వచ్చేస్తోంది, ఇదే ఊపుతో త్వరలో చైనాను వెనక్కు నెట్టేస్తాం అన్నట్లుగా స్పందించారు. ఆకలితో ఆవురావురు మంటూ ఎదురు చూస్తున్న అన్నం కనిపిస్తే చాలు కడుపు నిండుతుంది అన్నట్లుగా ఈ వార్త సంతోషం కలిగిస్తుంది, ఆనందాన్ని తెస్తుంది. దీని వెనుక ఉన్న కథ తెలిస్తే వామ్మో గుజరాత్‌ మోడల్‌ ఇలా ఉంటుందా అని గుండెలు బాదుకుంటారు.ఇక్కడ ఒక ప్రశ్న అడిగితే దేశభక్తిని ప్రశ్నిస్తారేమో ? ఫాక్స్‌కాన్‌ – వేదాంత సంస్థ కలసి గుజరాత్‌లో లక్ష మందికి ఉపాధి కల్పించేందుకు 19.5 బిలియన్‌ డాలర్లతో(రు.లక్షా 60వేల కోట్లు ) ఒక చిప్స్‌ ఫ్యాక్టరీని పెడుతున్నట్లు 2022 సెప్టెంబరులో ప్రకటించారు. అది ఇంతవరకు ఏమైందో ఎక్కడుందో చెప్పరు.కొత్తగా పద్దెనిమిది నెలల్లోనే ఐదువేల మందికి పని చూపే మైక్రాన్‌ ఉత్పత్తి మార్కెట్‌కు వస్తుందని చెబుతున్నారు. మోడీ గారు చెప్పింది వినాలి తప్ప అడిగితే మామూలుగా ఉండదు. ప్రశ్న అడిగిన అమెరికా జర్నలిస్టును ఎలా వేధిస్తున్నారో చూస్తున్నాంగా !


మైక్రాన్‌ కంపెనీ పెట్టుబడి 270 కోట్ల డాలర్లు( మన రూపాయల్లో 22,350 కోట్లు) అని చెప్పారు. దీనిలో అది నిజంగా పెట్టే మొత్తం రు.6,830 కోట్లు. మరి మిగతాది ! కేంద్ర ప్రభుత్వం పదకొండువేల కోట్లు ( 50శాతం) , రాష్ట్ర ప్రభుత్వం భూమి, ఇతర రూపాల్లో మరో ఇరవైశాతం సబ్సిడీ ఇస్తుందట. కంపెనీ పెట్టేది కేవలం 30శాతం మాత్రమే.అంటే రు.30 పెట్టుబడి పెట్టిన మైక్రాన్‌ కంపెనీని రు.వందకు స్వంతదారును చేస్తారు.ప్రతి పైసాను కాపాడేందుకు చౌకీదారును అని చెప్పుకున్న మోడీ ఏలుబడిలో తప్ప ఎక్కడైనా ఇలా జరుగుతుందా ? చైనాలో గిట్టుబాటు కావటం లేదని కొన్ని కంపెనీలు ఇతర దేశాల్లో సబ్సిడీలను చూసి అక్కడ నుంచి వెళుతున్నట్లు చెబుతున్నారు. అలాగే మరొక దేశం ఏదైనా ఇంతకంటే ఎక్కువ సబ్సిడీలు ఇస్తామంటే మైక్రాన్‌ కంపెనీ సరకు, సరంజామా మొత్తాన్ని అక్కడికి తరలిస్తే…..2020లో జనరల్‌ మోటార్స్‌ కంపెనీ వెళ్లిపోయినట్లే జరగవచ్చు. అది తీసుకున్న సబ్సిడీ పైసా తిరిగి ఇవ్వదు. అయినా 70శాతం సబ్సిడీ ఇస్తామంటే ఎవరైనా మన దేశానికి రాకుండా ఉంటారా ? అవసరం తీరింతరువాత వెళ్లిపోకుండా ఉంటారా ? అసలు కత వేరే. ఈ కంపెనీ మన దేశంలో చిప్స్‌(సెమీకండక్టర్లు) తయారు చేయదు. ఎక్కడో డిజైన్‌ చేసి మరెక్కడో ఉత్పత్తి చేసిన విడిభాగాలను మన దేశానికి తీసుకువచ్చి వాటి రూపకల్పన ప్రకారం ఒకదగ్గర అమర్చి(ఫాబ్రికేషన్‌), సరిగా ఉన్నాయా లేదా అని పరీక్ష చేసి అట్టపెట్టెల్లో పెట్టి ఎక్కడి కావాలంటే అక్కడికి పంపుతారు. చెప్పేది మేడిన్‌ లేదా మేకిన్‌ ఇండియా జరిగేది, పాకింగ్‌ ఇండియా. అదైనా గొప్పేకదా కొంత మందికి ఉపాధి దొరుకుతుంది కదా అని చెప్పేవారిని మేకింగుకు పాకింగు తేడా తెలుసుకోవాలని చెప్పటం తప్ప చేసేదేమీ లేదు.


మేకిన్‌, మేడిన్‌ ఇండియా పిలుపులు విఫలమైనందున కేంద్ర ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల రూపాయలను పక్కన పెట్టింది. మైక్రాన్‌ సంస్థ మన దేశంలో ఉత్పాదక కంపెనీ కాదు, కానీ దీనికి ఆ సొమ్మును ఇవ్వనుంది. ఇంత వాటంగా ఉంది కనుకనే అమెరికా పాలకులు అక్కడి కంపెనీలను మన దేశంలో పాకింగ్‌ యూనిట్లు పెట్టి ఎంత వీలైతే అంత సొమ్ము చేసుకోమని చెబుతున్నారు. చైనా బాటలో నడచి దేశాన్ని వృద్ది చేస్తామని, దాన్ని వెనక్కు నెడతామని మన పాలకులు చెప్పారు. చైనా కూడా పెట్టుబడులు పెట్టిన వారికి సబ్సిడీలు ఇచ్చింది, ఇలా పాకింగ్‌ రాయితీలు కాదు, ఉత్పత్తి చేసి తన జనానికి పని కల్పించి ఎగుమతులు చేసింది. అమెరికాను మించి జిడిపిలో ముందుకు పోనుంది. సెమికండక్టర్‌ రంగంలో స్వంతంగా ఉత్పత్తికి పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది తప్ప ఇతర దేశాలకు లొంగి వాటి షరతులను, పాకింగ్‌లకు అంగీకరించటం లేదు. గతంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైన చిప్స్‌లో 90శాతం దిగుమతి చేసుకొనేది. ప్రస్తుతం నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ 1,000 రకాల చిప్స్‌ను చైనా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వరంగ కార్ల సంస్థ నిర్ణయించింది. ఆధునిక రకాల రూపకల్పనకు యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోతున్నది.


చైనాతో మైక్రాన్‌ కంపెనీకి ఎక్కడ చెడింది ? ప్రతి దేశం తన భద్రతను తాను చూసుకుంటుంది. అమెరికాలో ఉత్పత్తి అవుతున్న చిప్స్‌ను ఏ దేశంలోనైనా వినియోగిస్తే ఆ దేశానికి లేదా ఉత్పత్తికి సంబంధించిన సమాచారం, రహస్యాలను సేకరించే అవకాశం ఉంది. తన టెలికాం పరికరాల ద్వారా చైనా ఆ పని చేస్తున్నదంటూ అమెరికా, మన దేశం అనేక యాప్స్‌ను నిషేధించించిన అంశం తెలిసిందే. అలాంటి పరీక్షలో మైక్రాన్‌ సంస్థ తన ఉత్పత్తుల్లో అలాంటి దొంగ చెవులు, కళ్లేమీ లేవని నిరూపించుకోలేపోయింది కనుక చైనా తమ మార్కెట్లో వాటి కొనుగోళ్ల మీద ఆంక్షలు ప్రకటించింది. భద్రతా పరీక్షలేమీ లేకుండా వాటిని మన మార్కెట్లో అమ్ముకొనేందుకు, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అంగీకరించింది. అమెరికా మీద అంతనమ్మకం ఉంచటం ప్రమాదకరం. సెమికండక్టర్ల పరిశ్రమలు పెడితే సబ్సిడీలు ఇచ్చేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల మేరకు నిధులు పక్కన పెడుతున్నట్లు చెప్పింది. ఆ మొత్తాన్ని స్వంతం చేసుకోవాలని అనేక మంది రంగంలోకి వచ్చారు.వాటిలో ఫాక్స్‌కాన్‌-వేదాంత ఒకటి. వీటి దగ్గర డబ్బు ఉంది తప్ప చిప్స్‌ ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవమూ లేదు. రెండూ కలసి ఐరోపాకు చెందిన ఎస్‌టిఎం మైక్రోటెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రతిపాదించాయి. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పెట్టుబడితో సహా అనేక షరతులను ఎస్‌టిఎం ముందుకు తెచ్చింది. ఐదు-పది సంవత్సరాల తరువాత తాము తప్పుకుంటామని చెప్పగా వేదాంత-ఫాక్స్‌కాన్‌ దీర్ఘకాలం ఉండాలని డిమాండ్‌ చేసినట్లు వార్తలు. వీరి పెట్టుబడి రు.66 వేల కోట్లు కాగా దీనికి కూడా కేంద్రం రు.76వేల కోట్లు సబ్సిడీ ఇస్తామన్నది, గుజరాత్‌ కూడా గణనీయంగా రాయితీలు ఇచ్చేందుకు సిద్దపడినా ముందుకు సాగటం లేదు. ఇది కూడా 30కి 70 సబ్సిడీగానే ఉంటుంది. కర్ణాటకలో పరువు పోయింది. దేశంలో ఆర్థిక స్థితి సజావుగా లేదు. ఐదు రాష్ట్రాలు, తరువాత లోక్‌ సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కనుక పాకింగ్‌ను కూడా మేకింగ్‌గా ఎన్నికల ముందు ప్రచారం చేసుకోవచ్చని మైక్రాన్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తోంది.దేశ ప్రజలందరి సొమ్మును మోడీ సర్కార్‌ గుజరాత్‌కే సబ్సిడీగా ఖర్చు చేసేందుకు పూనుకోవటం మరొక అంశం. ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలకూ లేదు, మోడీకి అణగిమణగి ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా, తెలంగాణా వంటి రాష్ట్రాలకూ ఒక్క ప్రాజెక్టూ రావటం లేదు. గుజరాత్‌కు ఇస్తున్న మాదిరి కేంద్రం సబ్సిడీ ఇస్తే ఏ రాష్ట్రంలోనైనా వాటిని పెట్టవచ్చు. మోడీ అంటే గుజరాత్‌ ప్రధాని అనుకుంటున్నారు గనుక అది జరగదన్నది తెలిసిందే.


నరేంద్రమోడీ సర్కార్‌ గత తొమ్మిదేండ్లలో చేసిన అప్పు గురించి ఎవరైనా అడిగితే కరోనా కాలంలో చేసిన సాయం, ఉకితంగా వాక్సిన్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఎదురు ప్రశ్నిస్తారు. అవి నిన్నగాక మొన్న, 2014 నుంచి చేసిన అప్పులు, చమురు మీద విధించిన భారీ సెస్సుల మొత్తం గురించి మాట్లాడరు. మోడీ చేసిన అప్పుకు గబ్బర్‌సింగ్‌ టాక్సు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తే వచ్చిన డబ్బు అదనం. ఇంత అప్పుతో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కానీ, పేదరిక నిర్మూలన అనేది ఎక్కడా జరగలేదు. మరి ఈ డబ్బు ఎక్కడికి పోయింది ? అంటూ ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. అచ్చేదిన్‌, తనకు అధికారం ఇస్తే కాంగ్రెస్‌ ఏలుబడిలో తూర్పున పొడిచిన సూర్యుడిని పశ్చిమానికి మారుస్తాను అన్నట్లుగా జనాన్ని నమ్మించిన నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చారు. కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా కేవలం నరేంద్రమోడీ చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు. దీనికి పాత అప్పును కలుపుకుంటే 169 లక్షల కోట్లు అవుతుంది. కొత్తగా ప్రభుత్వ రంగంలో ఒక్క పరిశ్రమ లేదు. తొమ్మిదేండ్లలో ఎవరితోనూ యుద్ధాలు లేవు గనుక మిలిటరీ నిర్వహణ తప్ప కొత్తగా ఆయుధాలు పెద్దగా కొన్నది లేదు. ఇంత సొమ్ము ఏం చేశారంటే కార్పొరేట్లు బాంకులకు ఎగవేసిన రుణాలను రద్దు చేసి దాని బదులు ప్రభుత్వ రంగ బాంకులకు కొంత మొత్తం సర్దుబాటు చేశారు.ఏదో ఒక పేరుతో పైన చెప్పిన సెమికండక్టర్‌ పరిశ్రమల రాయితీలు, ఇతర సబ్సిడీల పేరుతో కార్పొరేట్లకు సమర్పించుకున్నారన్నది స్పష్టం. వాటితో పోలిస్తే రైతాంగానికి, ఇతరులకు ఇచ్చిన రాయితీలు నామమాత్రం. అందుకే సొమ్ము పోయే శనీ పట్టే అన్నట్లుగా కార్పొరేట్లు సబ్సిడీలను తమ ఖాతాల్లో వేసుకున్నారు తప్ప తిరిగి పెట్టుబడిగా కూడా పెట్టలేదు. జనానికి ఉపాధిలేదు.


పాబ్రికేషన్‌, పాకింగ్‌ ద్వారా ప్రపంచ సెమికండక్టర్‌ ఉత్పత్తి కేంద్రంగా మన దేశం మారుతుందని ఎవరైనా చెప్పగలరా ? ఇలా ఏ దేశమైనా ఏ ఉత్పత్తిలోనైనా ఇలా మారిందా ?మలేషియా ఇప్పటికే ఈ రంగంలో ఎంతో ముందుంది. వేరే చోట్ల తయారైన చిప్స్‌ పరీక్ష, విడిభాగాల ఫాబ్రికేషన్‌ ప్రపంచ ఉత్పత్తిలో పదమూడుశాతం వరకు అక్కడే అక్కడ జరుగుతోంది. ఒక విధంగా ప్రపంచ హబ్‌గా ఉంది. ఆధునిక చిప్స్‌ కంపెనీలను తమ దేశంలోనే ఉంచుకొని తక్కువ రకం వాటిని ఇతర చోట్ల పరీక్షలకు అమెరికా కంపెనీలు పంపుతున్నాయి.వంద బిలియన్‌ డాలర్ల మెగా ఫాబ్రికేషన్‌ సంస్థను అమెరికా వాషింగ్టన్‌ సమీపంలోని క్లే అనే చోట ఏర్పాటు చేస్తూ 2.75బి.డాలర్ల (దానిలో 70శాతం మన సబ్సిడీ) సంస్థను గుజరాత్‌లో ఏర్పాటు చేసేందుకు మైక్రాన్‌ సంస్థ పూనుకుంది. మన దేశంలో చిప్స్‌ అవసరం నానాటికీ పెరుగుతున్నది. ఎంతగా అంటే 2019లో 22.7బిలియన్‌ డాలర్లుగా ఉన్న మార్కెట్‌ 2026 నాటికి 64బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. అందువలన మన దేశం స్వంతంగా ఉత్పత్తి చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. ప్రస్తుతం వివిధ రకాల సెమీకండక్టర్లు ఉన్నాయి. వాటి రూపకల్పన,తయారీ, విడిభాగాల అమరిక, పరీక్ష, ఉత్పత్తి చేసే యంత్రాలు ఇలా ఎన్నో ప్రక్రియలు ప్రస్తుతం కొన్ని దేశాల స్వంతం అంటే అతిశయోక్తి కాదు. గుత్తాధిపత్యం, మార్కెటింగ్‌ నిలుపుకొనేందుకు పెద్ద ఎత్తున పోటీపడుతున్నాయి. తైవాన్‌ ప్రాంతం, దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌, నెదర్లాండ్స్‌, చైనా, ఐరోపా సమాఖ్య, ఇజ్రాయెల్‌ ఈ రంగంలో తిరుగులేనివిగా ఉన్నాయి.


ఇతర దేశాల ఉత్పత్తులతో పోల్చితే చైనా వెనుకబడి ఉంది. ఉత్పత్తితో పాటు అవసరాలకు అది ఎక్కువగా దిగుమతుల మీదనే ఆధారపడుతోంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఎగుమతులు, ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను చైనాకు అమ్మకుండా అమెరికా, దానితో చేతులు కలిపిన దేశాలు ప్రస్తుతం చిప్స్‌ వార్‌ జరుపుతున్నాయి. చివరకు తమ పౌరులెవరూ చైనా కంపెనీల్లో పని చేయకూడదని నిషేధం విధించాయి. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఎలక్ట్రిక్‌ వాహనాలు,రక్షణ ఉత్పత్తుల వంటి వాటిలో సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన గాలియం, జెర్మీనియం వంటి లోహాల దిగుమతి, వినియోగం గురించి అమ్మకాలు జరిపే సంస్థలు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటూ పరోక్షంగా చైనా నిషేధం విధించింది. అమెరికాకు చెందిన మైక్రాన్‌ సంస్థ ఉత్పత్తులు రక్షణకు ముప్పు తెస్తాయని వాటిని నిషేధించింది. ఈ పోరు ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించటం లేదు. గతంలో అనేక రంగాల్లో చైనాను ఇబ్బంది పెట్టేందుకు చూస్తే వాటిని సవాలుగా తీసుకొని తనదైన ప్రత్యేకతను నిరూపించుకుంది. ఇప్పుడూ అదే బాటలో ఉంది. మన దేశం మాదిరి పాకింగ్‌తో సంతృప్తి చెందకుండా మేకింగ్‌తో ముందుకు పోతోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పోలీసు దురాగతం : రెండో వారంలోకి ఫ్రెంచి నిరసనలు !

05 Wednesday Jul 2023

Posted by raomk in Africa, Current Affairs, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Uncategorized

≈ Leave a comment

Tags

emmanuel macron, French protests, Nahel Merzouk, Riots in France


ఎం కోటేశ్వరరావు


అల్జీరియా-మొరాకో సంతతికి చెందిన 17 సంవత్సరాల నహేల్‌ అనే కుర్రవాడు ట్రాఫిక్‌ సిగల్‌ నిబంధనలను ఉల్లంఘించాడంటూ పోలీసులు గుండెల మీద కాల్చి చంపిన దురంతం ప్రస్తుతం ఫ్రాన్స్‌ను ఊపివేస్తున్నది. జూన్‌ 27న పారిస్‌ శివార్లలోని నాన్‌తెరేలో ఈ దారుణం జరిగింది. ఇరవై తొమ్మిదవ తేదీన అంత్యక్రియల సందర్భంగా దేశమంతటా ఆగ్రహించినవారి తీవ్ర నిరసనలు, దాడులు కొనసాగుతున్నాయి. మధ్యేవాద, వామపక్ష పార్టీలు, శక్తులు ఈ ఉదంతాన్ని ఖండించాయి, నిరసనలో పాల్గొన్నాయి. జాత్యహంకారి, హంతకుడైన పోలీసు అధికారికి మద్దతుగా విరాళాలు ఇవ్వాలని పచ్చిమితవాద నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ నేత మేరీనె లీపెన్‌ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాటికి 17లక్షల డాలర్లకు పైగా వసూలైంది. నాలుగు సంవత్సరాల క్రితం ” పసుపు చొక్కాల ” ఆందోళన జరిగినపుడు పోలీసుల మీద దాడి చేసిన మాజీ బాక్సర్‌కు మద్దతుగా నిధుల సేకరణకు పిలుపు ఇచ్చినపుడు వెంటనే ఆ నిధి సేకరణను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు అలా జరగలేదు. అరబ్బులను చంపండి మీరు మిలియనీర్లు కావచ్చు అని ఈ నిధి సేకరణ సందేశం ఇస్తున్నదని వామపక్ష నేత డేవిడ్‌ గుయిరాడ్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ చర్య అన్యాయం జరుగుతున్నదనే మనోభావాలను రగిలించటంతో పాటు ఉద్రిక్తతలు మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుందని స్లీపింగ్‌ జైంట్స్‌ అనే సంస్థ పేర్కొన్నది. ఒక మేయరు ఇంటి మీద తగులబడుతున్న కారును తోలి దాడికి పాల్పడ్డారంటే జాతి వివక్ష ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో వెల్లడించింది. దేశంలో తలెత్తిన ఉద్రిక్తత కారణంగా అధ్యక్షుడు మక్రాన్‌ జర్మనీ పర్యటనను రద్దు చేసుకున్నాడు. మైనారిటీల పట్ల దేశంలో ఉన్న జాతివివక్ష గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆందోళన రెండో వారంలో ప్రవేశించింది.


ఉదయం ఎనిమిది గంటలపుడు మెర్సిడెజ్‌ కారు నడుపుతున్న నహేల్‌ దురుసుగా ఒక స్టాప్‌ వద్ద ఉన్న ఇద్దరు పోలీసుల మీద దురుసుగా కారును పోనిచ్చేందుకు చూసాడనే కథనాలు వెలువడ్డాయి. అది వాస్తవం కాదని, వారిద్దరూ కారు పక్కనే ఉన్నట్లు, కారు కదలక ముందే ఒక పోలీసు కారులో ఉన్న నహేల్‌ మీద తుపాకి గురిపెట్టినట్లు కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమంలో దర్శనమిచ్చాయి.కాల్పులు జరిపిన తరువాత అదుపుతప్పిన కారు సమీపంలోని ఒక స్థంభాన్ని ఢకొీట్టి ఆగింది. నీ తలలో బుల్లెట్‌ దిగుతోంది అన్న మాటలు వినిపించినట్లు ఒక టీవీ ఛానల్‌ పేర్కొన్నది. కాల్పులు జరిపినపుడు నహేల్‌తో పాటు కారులో మరో ఇద్దరు ఉన్నారని వారిలో ఒకడు పోలీసులతో మాట్లాడినట్లు, మరొకడు కారు దిగి పారిపోయినట్లు చూసిన వారు చెబుతున్నారు. కాల్పులు జరపటానికి ముందు బస్సులు వెళ్లే మార్గంలో వెళుతున్న కారును ఇద్దరు పోలీసులు మోటారు సైకిళ్ల మీద వెంబడించి ఆపేందుకు చూడగా నహేల్‌ కారును ఆపలేదు, కొంత దూరం వెళ్లిన తరువాత ట్రాఫిక్‌ కారణంగా నిలపాల్సి వచ్చింది. వెనుకనే వచ్చిన పోలీసుల్లో ఒకడు కారు పక్కకు వచ్చి కాల్పులు జరిపాడు. ఈ తీరుతో జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చైనా పర్యాటకులు వెళుతున్న బస్‌పై జరిగిన దాడి తరువాత అనేక దేశాలు తమ పౌరులను హెచ్చరిస్తూ ఫ్రాన్స్‌ వెళ్లవద్దని సలహా ఇచ్చాయి.


గతవారం రోజులుగా దేశమంతటా వేలాది మంది సాయుధ పోలీసులను మోహరించి హింసాకాండను ఆపేందుకు పూనుకున్నారు. వేలాది మందిని అరెస్టు చేశారు. హింసాకాండకు పాల్పడుతున్న వారు తన మనవడి మరణాన్ని సాకుగా చూపుతున్నారని అమ్మమ్మ నాదియా ఒక టీవీలో చెప్పింది. ఆందోళనలు విరమించాలని కోరింది. నహేల్‌ ఉదంతం ఇలాంటి పరిస్థితిని ఎందుకు సృష్టించిందన్నది ప్రశ్న. 2020లో అమెరికాలోని మినియాపోలిస్‌ పట్టణంలో పోలీసులు జార్జి ఫ్లాయడ్‌ అనే నల్లజాతి యువకుడిని ఊపిరాడకుండా చేసి చంపిన తీరును చుట్టుపక్కల ఉన్నవారు తీసిన వీడియో సంచలనంగా మారి ఆందోళనకు దారితీసింది. నహేల్‌ను కాల్చి చంపుతున్న వీడియో కూడా అలాంటి ప్రతిస్పందననే కలిగించింది.2005లో పోలీసులు వెంటాడినపుడు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించినపుడు దేశమంతటా మూడు వారాల పాటు తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఆ తరువాత ఇప్పుడు అదే మాదిరి ఫ్రాన్సులోని మైనారిటీలు ఆందోళనకు పూనుకున్నారు. ఫ్రెంచి పోలీసుల దుర్మార్గపూరిత వైఖరి, జాతి వివక్ష తీరుతెన్నులకు ఈ ఉదంతాలు నిదర్శనం.


నెలల తరబడి సాగిన పెన్షన్‌ సమ్మెలు,ఇతర ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్‌లో అధికారాన్ని నెట్టుకువస్తున్న మక్రాన్‌ ప్రభుత్వానికి తాజా ఆందోళనతో ఎదురైన సవాలు ఎంత తీవ్రమైనదంటే బ్రసెల్స్‌లో జరుగుతున్న ఒక సమావేశం నుంచి ముందుగానే స్వదేశానికి చేరుకోవటం, జర్మనీ పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.పెన్షన్‌ సంస్కరణలకు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న సమయంలో బ్రిటన్‌ రాజు చార్లెస్‌ కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రెంచి టూర్‌ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మన దేశంలోని మణిపూర్‌లో పరిస్థితి ఎంతగా దిగజారిందో తెలిసిందే. శాంతిగా ఉండాలని కనీసం ప్రధాని నరేంద్రమోడీ నోటి వెంట ఒక్క ముక్కరాలేదు, స్వయంగా పరిస్థితిని తెలుసుకొనేందుకు అక్కడకు వెళ్లలేదు. తమ రాష్ట్రంలో శాంతినెలకాల్పాలని కోరుతూ ఢిల్లీ వచ్చిన ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల ప్రతినిధులను కూడా కలుసుకొనేందుకు అవకాశం ఇవ్వలేదు. అమెరికా, ఈజిప్టు వెళ్లి సుభాషితాలు చెప్పివచ్చారు. సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ మంగళవారం నాడు దేశంలోని 220 మంది మేయర్లతో(స్థానిక సంస్థల అధిపతులు) సమావేశం కానున్నట్లు వార్తలు వచ్చాయి.


అల్జీరియా ఫ్రెంచి వలసగా ఉన్న కాలంలో ఫ్రెంచి దళాలు జరిపిన దారుణమారణకాండలు ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. అనేక మంది అల్జీరియన్స్‌ ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు. అలాంటి కుటుంబానికి చెందిన వాడే గత నెలలో పోలీసుల చేతిలో మరణించిన నహేల్‌. వలస వచ్చిన ఆఫ్రికా అరబ్బులు, ఇతరులు అంటే ఫ్రెంచి అధికార యంత్రాంగానికి చిన్న చూపు, నేరగాండ్లుగా చూస్తారు.వారితో మమేకం కావటానికి బదులు దమనకాండ ప్రదర్శిస్తారు. అందుకే వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తరచూ వివాదాలు జరుగుతుంటాయి. పశ్చిమ దేశాలలో అమెరికా తరువాత ఫ్రాన్స్‌లోనే పోలీసుల చేతుల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, ఆర్థిక దిగజారుడు పరిణామాలు, వలసదారుల అంశాల మీద ఐరోపా దేశాల్లో పరిస్థితి దిగజారుతోంది.ఇటువంటి స్థితిలో జనంలో ఉన్న అసంతృప్తి ఇలాంటి ఉదంతాలు జరిగినపుడు ఊహించని రీతిలో వెల్లడౌతుంది.ఫ్రాన్స్‌ ఆందోళనకు పూర్వరంగమిదే. నహేల్‌ హత్య ఊహించని ఉదంతమైనా దానికి ప్రతికూల స్పందన గూడు కట్టుకున్న అసంతృప్తికి నిదర్శనం. ఇటీవలి కాలంలో ఫ్రెంచి అధినేత మక్రాన్‌ తమకు మరింత వ్యూహాత్మక స్వయం నిర్ణయాధికారం ఉండాలని, ప్రపంచ వ్యవస్థలో బహుళనాయకత్వం ఉండాలని గట్టిగా చెబుతున్నారు. ఇది అమెరికా గురించే అన్నది స్పష్టం. మక్రాన్నుదారిలోకి తెచ్చుకొనేందుకు పెత్తందారీ ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని చూస్తున్న శక్తుల హస్తం కూడా తాజా కొట్లాటల వెనుక ఉండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అమెరికాకు నచ్చని వైఖరిని తీసుకున్నపుడల్లా ఫ్రాన్స్‌లో కొట్లాటలు జరగటాన్ని బట్టి ఇలా అనుమానించాల్సి వస్తోందని చెబుతున్నారు. అందువలన ఇది ఒక్క ఫ్రాన్స్‌కే కాదు, ఐరోపా సమాఖ్యకు, దేశాలకు ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.


ఐరోపాలో ఇటీవలి కాలంలో ముస్లిం వ్యతిరేక వైఖరితో ఉన్న పచ్చిమితవాద శక్తులు రెచ్చిపోతున్నారు.ఫ్రాన్స్‌ కొట్లాటల్లో పాల్గొన్నది వలస వచ్చిన లేదా ఎప్పటి నుంచో అక్కడ స్థిరపడిన ముస్లింలు, అరబిక్‌ లేదా ఆఫ్రికన్‌ దేశాల నుంచి వలస వచ్చిన వారని చెబుతున్నారు. తాజా పరిణామాల గురించి మీడియాలో చర్చ జరుగుతున్నది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసులకు మరింత శిక్షణ అవసరమని, జాతి వివక్ష అంశాన్ని పరిష్కరించాలని, పేదలు-ధనికుల మధ్యపెరిగిన అంతరాన్ని తగ్గించాలని, నిరుద్యోగం పెరుగుదల గురించి సూచనలు చేస్తున్నారు. నిజానికి ఇవి కొత్తవి కాదు ఎప్పటి నుంచో ఉన్నవే. ప్రపంచీకరణ తెచ్చిన సంక్లిష్ట సమస్యలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ప్రపంచీకరణ క్రమంలో ఉత్పత్తి ఖర్చు అధికంగా ఉందనే కారణంతో ఇతర దేశాల నుంచి పారిశ్రామిక వస్తువులను దిగుమతి చేసుకొని సేవారంగం మీద కేంద్రీకరించాయి. ఈ విధానంతో నిరంతర వృద్ది సాగదని తేలింది. ప్రపంచ అభివృద్దిలో అసమతూకానికి దారితీసింది, ప్రపంచీకరణకు వ్యతిరేకతను పెంచింది. కరోనా, ఉక్రెయిన్‌ సంక్షోభం సమస్యల తీవ్రతను వేగతరం కావించింది. ఆర్థిక మందగమన ప్రతికూల పర్యవసానాలు పేద, మధ్య తరగతి మీద భారాలను మోపుతున్నాయి.స్థిరమైన ఉపాధి, అవసరాలకు అనుగుణంగా పెరిగే రాబడి, కుటుంబ జీవనం సంతోషంగా ఉంటుందనే అంశాల మీద ఆశలను తుంచివేస్తున్నది. వీటికి జాత్యహంకారం కూడా తోడైతే ఇక చెప్పనవసరం లేదు. అసంతృప్తి కనిపించని గాస్‌ మాదిరి వ్యాపిస్తే మండటం క్షణాల్లో జరుగుతుంది. గడచిన ఐదు దశాబ్దాల్లో ప్రపంచీకరణ తెచ్చిన మార్పు ఫ్రాన్సులోనూ ఇతర పశ్చిమ దేశాల్లోనూ అనేక పరిణామాలు, ఉద్యమాలు, ఆందోళనలకు దారి తీసింది. వస్తు దిగుమతులు తమ ఉపాధిని దెబ్బతీసిందనే అసంతృప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే అభిప్రాయం రోజు రోజుకూ బలపడటానికి దారి తీస్తోంది. గత రెండు దశాబ్దాల్లో ఏ నేతా ఎదుర్కోనటువంటి తీవ్ర సవాలును మక్రాన్‌ ఎదుర్కొంటున్నట్లు కొందరు విశ్లేషించారు. పార్లమెంటులోని 577 స్థానాలకు గాను మక్రాన్‌ నాయకత్వంలోని రినయసెన్స్‌ పార్టీకి 251 సీట్లే ఉన్నాయి. రెండవ సారి ఎన్నికైనపుడు సంపూర్ణ మెజారిటీ రాకపోవటంతో ద్వితీయ రౌండ్‌లో మితవాది మారినే లీపెన్‌ మీద 58శాతం ఓట్లతో గెలిచాడు. మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో కొనసాగేందుకు పార్లమెంటులో ప్రతిపక్షాల సహకారంతోనే గట్టెక్కే అవకాశం ఉంది.వచ్చే ఏడాది జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా మక్రాన్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మూతపడుతున్న మసీదులు, ఖాళీగా చర్చ్‌లు, లాభసాటిగా గుళ్ల వ్యాపారం !

05 Wednesday Jul 2023

Posted by raomk in BJP, CHINA, Communalism, Current Affairs, Europe, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, UK, Uncategorized, USA

≈ Leave a comment

Tags

American religious landscape, BJP, Building temples, church congregation, Closed mosques, RSS


ఎం కోటేశ్వరరావు


భగవంతుడు ఉన్నట్లు తాము చెప్పలేమని సగం మంది అమెరికన్లు భావిస్తున్నారని ఇటీవలి జనరల్‌ సోషల్‌ సర్వే చికాగో విశ్వవిద్యాలయం వెల్లడించింది.1972 నుంచి ఈ సంస్థ అమెరికా సామాజిక ధోరణుల మీద జరుగుతున్న సర్వేల ప్రకారం ప్రస్తుతం సగం మంది అమెరికన్లు మాత్రమే దేవుడి ఉనికి గురించి గట్టి విశ్వాసంతో ఉన్నారట. 1993లో మూడింట రెండు వంతులు, 2008లో 60 శాతం నుంచి ఇప్పుడు 50శాతానికి తగ్గారు.జనాభాలో అసలు చర్చ్‌కు వెళ్లని వారు 34శాతం ఉన్నారని, గడచిన ఐదు దశాబ్దాల్లో ఇది అధికమని తేలింది. మరణం తరువాత జీవితం ఉంటుందనే నమ్మకం మాత్రం ఎక్కువ మందిలో ఉంది. తాము క్రైస్తవులమని చెప్పుకున్న వారు 1990 దశకంలో 90శాతం ఉండగా ఇప్పుడు మూడింట రెండువంతులకు తగ్గారు. పిఆర్‌ఆర్‌ఐ సర్వే ప్రకారం 2008లో తమకెలాంటి మత అనుబంధం లేదని చెప్పిన వారు 16శాతం కాగా 2022లో 27శాతానికి పెరిగారు. ఏసు క్రీస్తును రక్షకుడు, ప్రభువు అని గట్టిగానమ్మే ఇవాంజెలికల్‌ ప్రొటెస్టెంట్స్‌ ఇదే కాలంలో 23 నుంచి 13.6శాతానికి తగ్గారు.1965-81 కాలంలో పుట్టిన జనరేషన్‌ ఎక్స్‌లో 25శాతం,1982-2004 మధ్య పుట్టిన మిలీనియల్స్‌లో 29శాతం 1996-2010 మధ్య జన్మించిన జడ్‌ తరంలో 34శాతం మంది ఏ చర్చ్‌కు అనుబంధంగా లేరు.” మతం నుంచి స్వేచ్చ ఫౌండేషన్‌ ” సహ అధ్యక్షుడు డాన్‌ బార్కర్‌ ప్రపంచంలో మతం గురించి మారుతున్న వైఖరి మీద స్పందిస్తూ అమెరికాలో బలమైన మతవిశ్వాసాలు ఉన్నవారు తగ్గటాన్ని హర్షిస్తూ, ఇతర ఐరోపా దేశాలతో అమెరికా పోటీ పడుతున్నదన్నాడు.


ఒక దేశంలో మెజారిటీ మతం మరొక చోట మైనారిటీగా ఉండవచ్చు. మన దేశంలో హిందూ అని పిలుస్తున్న మతంలో వివిధ శాఖలు ఉన్నట్లుగానే క్రైస్తవం, ఇస్లాం, ఇతర మతాల్లో కూడా ఉన్నాయి. తమ దేశంలోని 75వేల మసీదుల్లో 50వేలను మూసివేసినట్లు ఇరాన్‌ మౌలానా మహమ్మద్‌ అబోలఘాసిమ్‌ దౌలబీ జూన్‌ ఒకటిన చెప్పాడు. మసీదులకు వచ్చేవారు గణనీయంగా తగ్గటమే దీనికి కారణం అన్నాడు. ఇతగాడు ప్రభుత్వం-మత సంస్థల సమన్వయకర్తలలో ఒకడు. దీని గురించి హిందూత్వకు పక్కాగా మద్దతు పలికే, ముస్లింల మీద విద్వేషాన్ని వెదజల్లుతుందనే విమర్శ ఉన్న ఓపి ఇండియా వెబ్‌పోర్టల్‌ రాసింది. ఇస్లామిక్‌ విశ్వాసాలతో ఛాందసవాదుల హవా నడుస్తున్న చోట ఇలాంటి పరిణామం మన దేశాన్ని హిందూ ఛాందసవాదం, మనువాద హిందూత్వం వైపు తీసుకుపోవాలని చూస్తున్న శక్తులకు ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పవచ్చు. హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనకు దిగిన ఇరాన్‌ మహిళలకు ప్రపంచమంతా జేజేలు పలికింది. అదే తీరున మన దేశంలో కూడా మతఛాందసులు, మతోన్మాదుల అజెండా మేరకు సమాజాన్ని నడిపితే ఇక్కడ కూడా వ్యతిరేకత వెల్లడైతే హిందూత్వ అజెండా కుప్పకూలుతుందన్న భయం ఆశక్తులకు కలగటం సహజం. ఇరాన్‌ మతశక్తులు పౌరుల జీవితాల మీద మతాన్ని రుద్దటాన్ని అక్కడి సమాజం తిరస్కరించటం నానాటికీ పెరుగుతోంది. శిక్షించటాన్ని సహించటం లేదు. ” సమాజంలోని బలమైన మత భావనలు అంతరిస్తున్నాయి. మతం ఇచ్చేదాన్ని జనం చూస్తారు, మతం పేరుతో జనాలను అవమానించటం, మత బోధనలు, భావనల పేరుతో మతపరమైన కల్పనలతో సహా అనేక కారణాలు, ఇంకా మతం పేరుతో పౌరులకు గౌరవ ప్రదమైన జీవితాన్ని నిరాకరించటం, వారిని దారిద్య్రంలో నెట్టటం వంటి అంశాలను బట్టి ఆ మతంలో చేరాలా లేక దాన్ని వదలి వెళ్లాలా అని నిర్ణయించుకుంటారు.” అని కూడా మౌలానా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. హిజాబ్‌ను సరిగా ధరించలేదనే కారణంతో నైతిక పోలీసులు గతేడాది సెప్టెంబరులో మహసా అమిని అనే యువతిని దారుణంగా కొట్టి చంపటంతో పెద్ద ఎత్తున ఇరాన్‌లో నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రార్ధనలకు వచ్చేవారు లేక 60శాతం మసీదులను మూసినట్లు వార్తలు వచ్చాయి.


లవ్‌ జీహాద్‌, లాండ్‌ జీహాద్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా పురోలా పట్టణంలో ఉన్న ముస్లింలందరూ వెళ్లిపోవాలంటూ హిందూత్వ పేరుతో ఉన్న శక్తులు జూన్‌ 15వ తేదీ గడువు నిర్ణయించి బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. హిందువుల్లో ఒక కులం వారు మరొక కులం వారిని వివాహం చేసుకోకూడదంటూ ఉత్తరాది రాష్ట్రాలలో తీర్పులు చెప్పే పంచాయత్‌లను చూస్తున్నాము. ఇది వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవటం తప్ప వేరు కాదు. ఇదే పని ఇతర మతఛాందసులు చేసినా అదే అవుతుంది. రెచ్చిపోతున్న మతశక్తులను చూస్తే మన దేశం కూడా ఈ రోజుగాకపోతే రేపు మరో ఇరాన్‌ అవుతుంది. ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు తమ దేశంలో బౌద్ధం అంతరించటానికి కారకులౌతున్నారంటూ శ్రీలంకలోని బౌద్ధ మత ఛాందసులు రెచ్చిపోతున్నారు.రెచ్చగొట్టి దాడులకు పాల్పడేందుకు చూస్తున్నారు.


మతంతో నిమిత్తం లేని వారు అమెరికాలో పెరుగుతున్న కారణంగా ప్రతి ఏటా అనేక చర్చ్‌లు మూతపడుతున్నట్లు వార్తలు.చర్చి ప్రాంగణాలను కొనుగోలు చేసే వారికి భలే మంచి చౌకబేరం అన్నట్లుగా ఉంది. 2019లో నాలుగున్నరవేల ప్రొటెస్టెంట్‌ చర్చ్‌లు మూతపడితే, గతేడాది మూడువేల కొత్త చర్చ్‌లు ప్రారంభమైనట్లు వార్తలు.మొత్తం మీద జనాలు చర్చ్‌లకు రాకపోవటం తాత్కాలికమా లేక అదే ధోరణి ముందుకూడా కొనసాగుతుందా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గడచిన మూడు సంవత్సరాల ధోరణులను చూసినపుడు మూసివేతలకే ఎక్కువ అవకాశాలున్నట్లు కొందరు భావిస్తున్నారు. కరోనా తరువాత చర్చ్‌లకు వస్తున్నవారిని చూస్తే అంతకు ముందువచ్చే వారిలో 85శాతమే ఉన్నట్లు ప్రొటెస్టెంట్‌ పాస్టర్లు నివేదించారట. కరోనాకు ముందు ఏడాదికి కనీసం ఒకసారి చర్చ్‌కు వచ్చినవారు 75శాతం ఉంటే గతేడాది 67కు తగ్గారు. కుర్రకారు హైస్కూలు చదువులో ఉండగా కనీసం ఒక ఏడాది పాటు చర్చ్‌కు ప్రతివారం వచ్చేవారని 2017 వివరాలు వెల్లడించగా ఇప్పడు ప్రతి పదిమందిలో ఏడుగురు రావటం లేదని లైఫ్‌వే పరిశోధనలో తేలింది. మతంతో సంబంధం లేకుండా పిల్లల్ని పెంచుతున్నవారు పెరగటం దీనికి ఒక కారణం అంటున్నారు. పూ సంస్థ విశ్లేషకులు చెప్పినదాని ప్రకారం 1972లో 92శాతం మంది అమెరికన్లు క్రైస్తవులుగా చెప్పుకోగా 2070 నాటికి 50శాతం లోపుకు పడిపోవచ్చట. ఇప్పుడున్న వారిలో తాతలు ప్రతివారం చర్చ్‌కు వెళ్లి ఉంటారని, వారి పిల్లలు తమకు దేవుడు అంటే విశ్వాసం అని చెప్పారు తప్ప ప్రతివారం విధిగా చర్చ్‌కు వెళ్ల లేదని, మిలీయన్‌ మనవల దగ్గరకు వచ్చే సరికి చర్చికి వెళ్లే సంబంధాలు గానీ మతంతో గానీ అనుభవం తక్కువని కొందరు విశ్లేషకులు చెప్పారు. కాథలిక్‌ చర్చ్‌లో సెక్స్‌ కుంభకోణాల కారణంగా జనాలు చర్చ్‌లకు దూరంగా ఉంటున్నారని, దానికి కరోనా కూడా తోడైందని కూడా తేలింది.


కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఇలాంటి పరిణామం ముందే జరిగిందని, అమెరికాలో మెల్లగా జరుగుతోందని చెబుతున్నారు. దీనికి సోషలిస్టు దేశాలతో అమెరికా జరిపిన ప్రచ్చన్న యుద్ధం కారణమని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. క్రైస్తవ అమెరికా-దేవుడు లేని కమ్యూనిజం మధ్య పోరు జరుగుతోందని, మతం లేని వారు అసలు అమెరికన్లే కాదని రెచ్చగొట్టారు.(ఇప్పుడు మన దేశంలో ఎవరైనా బిజెపి, సంఘపరివార్‌, హిందూత్వ సంస్థలను లేదా మతంలోని అవలక్షణాలను, మూఢవిశ్వాసాలను ఎవరైనా విమర్శిస్తే లేదా వారితో ఏకీభవించకపోతే మీరు హిందువులే కాదంటూ రెచ్చగొడుతున్న తీరు చూస్తున్నదే). మూడు దశాబ్దాల క్రితం ప్రచ్చన్న పోరులో గెలిచినట్లు అమెరికా ప్రకటించిన తరువాత వారి దగ్గర కమ్యూనిజం గురించి చెప్పటానికేమీ లేదు. అందువలన యువతలో ఒక్క మతం గురించే కాదు, సోషలిజం, పెట్టుబడిదారీ విధానం గురించి కూడా మధనం ప్రారంభమైంది. చివరకు అది ఇప్పుడు సోషలిస్టు వైఫల్యం గురించిగాక తాము ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ దివాలాకోరు తనం గురించి మాట్లాడేందుకు దారి తీసింది. అమెరికా చర్చ్‌ ఆస్తుల లావాదేవీల్లో అగ్రగామి సంస్థగా ఉన్న ఎడి ఎడ్వైజర్స్‌ ఎండి బ్రెయిన్‌ డోల్‌హైడ్‌ మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో విక్రయాలు పెరిగినట్లు చెప్పాడు. కొన్నింటిని గృహాలుగా, కొన్నింటిని సంరక్షణ కేంద్రాలుగా మార్చగా కొన్ని చర్చ్‌లు విస్తరణలో భాగంగా కొనుగోలు చేసినట్లు చెప్పాడు.


వయస్సులో దేవుడు, మతం గురించి పెద్దగా పట్టించుకోని అనేక మంది ముసలితనం వచ్చేసరికి పక్కా భక్తులుగా, చాదస్తులుగా కూడా మారుతున్నవారిని చూస్తున్నాం. ఇది ఒక్క మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో ఇలాంటి వైఖరే ఉంది. చిత్రం ఏమిటంటే ప్రస్తుతం ఐరోపా దేశాల్లో కుర్రకారుకంటే వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. కానీ అక్కడ యువతరంతో పాటు వృద్ధుల్లో కూడా మతం మీద గట్టిగా ఉన్న భావన తగ్గుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. ఎందుకు ఇలా జరుగుతోందని అక్కడి పరిశోధకులు కుస్తీపడుతున్నారు.మన దేశంలో ప్రస్తుతం కుర్రకారులో తాతగారి నాన్నగారి అశాస్త్రీయ, మతభావనలు, అంతరించిన ఆచారాల పునరుద్దరణ జరగాలనే తిరోగమన ధోరణులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


యువత మతానికి దూరం జరిగితే అమెరికా సమాజం ఎటుపోనుంది అనే అందోళన అనేక మందిలో తలెత్తుతోంది.వారిలో మతాన్ని మత్తు మందుగా మార్చి దోపిడీకి మార్గం సుగమం చేయాలనే వారు తప్పకుండా ఉంటారు. మతం స్థానంలో ఆత్మ స్వరూపత్వం(స్పిరిట్యువాలిటీ) పెరుగుతున్నదని కొందరు విశ్లేషకులు చెప్పగా మరికొందరు దాన్ని పూర్వపక్షం చేస్తూ ఎక్కువ మంది లౌకికవాదం వైపు మళ్లుతున్నారని కొన్ని సర్వేల గణాంకాలను చూపుతున్నారు. త్రమ బిడ్డలను చర్చి ప్రార్ధనలు, మత సేవలకు తీసుకురావటానికి చేస్తున్న పెనుగులాటలో తలిదండ్రులు ఓడిపోతున్నారు. అమెరికాలో వ్యక్తివాద సంస్కృతి నానాటికీ పెరుగుతున్నకారణంగా మతానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు.మతం అధికారాన్ని సమర్ధిస్తుంది- వ్యక్తివాద సంస్కృతి ప్రతిఘటిస్తుంది. మత పెత్తనం లేదా ప్రాధాన్యతను కూడా తగ్గిస్తుంది. ఐరోపా దేశాలలో వివాహం అన్నది విధి కాదు.ఎక్కువ మంది యువత వివాహ బంధంతో నిమిత్తం లేకుండానే పిల్లలను కూడా కంటున్నారు. ఇది అమెరికాకూ విస్తరించింది.అమెరికాలో 1981లో 18శాతం మంది మహిళలు వివాహంతో నిమిత్తం లేకుండా పిల్లల్ని కనగా 2021లో 40శాతానికి పెరిగింది. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఇసిడి) దేశాలలో 42శాతం మంది పిల్లలు వివాహాలతో నిమిత్తం లేకుండానే పుడుతున్నారు. ఈ కూటమిలోని చిలిలో 75శాతం మంది,కోస్టారికాలో 73 మెక్సికోలో 70శాతం మంది ఉండగా జపాన్‌, దక్షిణ కొరియా, టర్కీలలో రెండు-మూడు శాతం మధ్య ఉన్నారు. అమెరికాలోని ఆఫ్రో-అమెరికన్లలో చాలా ఎక్కువ మంది పుడుతున్నారు.


తమ జీవితాల్లో మతం అత్యంత ప్రాముఖ్యత కలిగినదని భావిస్తున్న వారు కేవలం పదహారుశాతం మందేనని తాజాగా ఒక సర్వేలో తేలింది. పదేండ్ల క్రితం ఇరవై శాతం ఉన్నారు.దేవుడి మీద నమ్మకం లేదంటూనే జ్యోతిషం, క్షుద్రవిద్యల పట్ల సగం మంది అమెరికా మిలీనియల్స్‌ నమ్మకాలు పెంచుకుంటున్నారని, అదే చైనాలో కేవలం ఎనిమిది శాతమే అని తేలింది. అమెరికాలో ఇలాంటి మానసిక సేవల పరిశ్రమ లావాదేవీల విలువ రెండు వందల కోట్ల డాలర్లకు పెరిగింది. దేవుడి వ్యాపారం దేశమంతటా మంచి వాణిజ్యమని ఒకనాడు బిజెపిలో పని చేసి, కేంద్రంలో ఆర్థిక మంత్రికి సలహాదారు, రచయితగా ఉన్న మోహన్‌ గురుస్వామి 2021 ఏప్రిల్‌ 24న డక్కన్‌ క్రానికల్‌ పత్రికలో ఒక విశ్లేషణ రాశారు. సారం ఇలా ఉంది. రాజకీయాల్లోనే కాదు మతం ఆర్థిక రంగంలో కూడా రోజు రోజుకూ ప్రాధాన్యత పెంచుకుంటోంది. మధ్య ప్రాచ్య దేశాల్లో ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు పెరగటంతో పెద్ద ఎత్తున డబ్బు దేశానికి చేరింది.దాంతో అనేక మసీదుల నిర్మాణం జరిగింది. బ్రిటిష్‌ వారి కాలంలో చర్చ్‌లకు ప్రాధాన్యత ఉన్నందున మంచి ప్రదేశాల్లో అవి వచ్చాయి.మిషనరీల నిధులు ఇప్పటికీ వస్తున్నాయి. మహా చర్చ్‌లు కాకున్నా చిన్న చిన్న వాటిని పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. మసీదులు, చర్చ్‌ల నిర్మాణాల మీద నియంత్రణ ఉంది. దానికి స్పందనగా వెలిసిన గుళ్ల విస్తరణ మీద ఎలాంటి అదుపు లేదు. ఇటీవల తెలంగాణాను సందర్శించినపుడు చిన్న చిన్న గ్రామాల్లో కూడా రెండు మూడు గుళ్లు కనిపించాయి. ఇది హిందువులకు భిన్నమైన దేవుళ్లను ఎంచుకొనే స్వేచ్చ ఉండి కాదు, భిన్న కులాలు, గోత్రాలకు చెందిన వారు నిర్మించినవీ, పక్క పక్కనే ఉన్నాయి, ఒకరితో ఒకరు పోటీ పడి నిర్మించుతున్నారు. ఈ అంశంలో చీరలు, నగలు, మిఠాయి దుకాణాలకు వాటికీ పెద్ద తేడా లేదు. అనుమతుల్లేకుండానే అక్రమ ఇసుక తవ్వకం, అనుమతి లేని మద్యం అమ్మకాల మాదిరి ఆదాయవనరులుగా మార్చుకుంటున్నారు.

దేశంలో టూరిజం ద్వారా జిడిపిలో 9.6శాతం వస్తోంది. దీనిలో స్వదేశీ వాటా 88శాతం ఉంది. 2019లో విదేశీ యాత్రీకులు తొమ్మిది కోట్ల మంది రాగా స్వదేశీ 140 కోట్లు ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో విదేశీ, స్వదేశీ టూరిస్టులు ఎక్కువ మంది తిరుపతి, మధురై వంటి మతపరమైన కేంద్రాలను సందర్శించారు. మత పరమైన టూరిజం ఇప్పుడు పెద్ద వ్యాపారం, దీన్ని చూసి మనం ఆందోళన చెందాలా ? పూ సంస్థ ప్రపంచ వైఖరుల గురించి చేసిన సర్వేలో గడచిన నాలుగైదు సంవత్సరాలలో 25శాతానికి పైగా భారతీయులు మరింత మతపరమైన వారిగా మారారు.2007-15 సంవత్సరాల మధ్య మతపరమైన టూరిజం మీద పెడుతున్న ఖర్చు రెట్టింపైంది. వేగంగా పెరుగుతున్న ఈ వాణిజ్య ధోరణులను చూస్తుంటే ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. పెరుగుతున్న మత ధోరణుల పర్యవసానాలను కూడా చూడాలి. గుడ్డి విశ్వాసాలు, మూఢభక్తి, జగడాల మారి మత ధోరణులు పెరుగుతున్నాయి. గుళ్ల నిర్మాణం లాభసాటిగా ఉండటంతో అవాంఛనీయ శక్తులు బహిరంగ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. ఒకసారి నిర్మించి దేవుడు, దేవతలను ప్రతిష్టించిన తరువాత వాటిని తొలగించలేరు, ట్రాపిక్‌ సమస్యలను సృష్టిస్తున్నాయి.” మోహన గురుస్వామి పరిశీలనే కాదు, ఈ రోజు ఎక్కడ చూసినా పూజలు, భక్తి వేలం వెర్రిగా మారటాన్ని ఎవరైనా చూడవచ్చు. ఇది విద్యావంతులలో మరీ ఎక్కువగా ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పరిశోధనల్లో చైనాను తక్కువ అంచనా వేస్తే ముప్పే – అమెరికాను హెచ్చరించిన ఓ నివేదిక !

14 Wednesday Jun 2023

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti china, Chinese Innovation Inputs, Chinese Scientific Articles, ITIF, natural-science research ranking, R&D Expenditures


ఎం కోటేశ్వరరావు


ప్రకృతి విజ్ఞానం(నేచురల్‌ సైన్స్‌)లో అమెరికాను వెనక్కు నెట్టి చైనా ప్రధమ స్థానానికి వచ్చిందన్నది ఒక నివేదిక.” మేలుకో అమెరికా : నవ కల్పన ఉత్పత్తిలో అమెరికాను అధిగమిస్తున్న చైనా ” అనే శీర్షికతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఐటిఐఎఫ్‌) ఒక నివేదికలో హెచ్చరించింది. ” చైనా నకిలీ సైన్సు పరిశ్రమ ” అంటూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక ఒక పెద్ద నింద మోపింది. ఇవన్నీ ఇటీవల చైనా గురించి వచ్చిన విశ్లేషణలు, వార్తలకు సంబంధించిన అంశాలు. ప్రకృతి విజ్ఞానంలో చైనా తొలిసారిగా అమెరికాను అధిగమించి ఒకటవ స్థానంలో ఉన్నట్లు నేచర్‌ ఇండెక్స్‌ పేర్కొన్నది. అగ్రశ్రేణి పత్రికల్లో 2022 సంవత్సరంలో ప్రచురితమైన పరిశోధనా పత్రాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. ఎనభై రెండు పత్రికల్లో చైనాకు చెందిన వారు సమర్పించిన పత్రాలు 19,373 కాగా అమెరికా నుంచి వచ్చినవి 17,610 ఉన్నాయి. ఏ దేశానికి చెందిన వారైనా ఏ దేశం నుంచి పత్రాలను సమర్పిస్తే వాటిని ఆ దేశాల ఖాతాలో వేస్తారు. ప్రకృతి విజ్ఞాన పరిశోధనా పత్రాల సమర్పణలో చైనా, అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, జపాన్‌ మొదటి ఐదు స్థానాల్లో ఉండగా మన దేశం పదవ స్థానంలో ఉంది. భౌతిక, రసాయన శాస్త్ర పరిశోధనల్లో 2021లో చైనా మొదటి స్థానంలో ఉంది. తాజా సమాచారాన్ని పరిశీలించినపుడు భూమి, పర్యావరణ శాస్త్రాలలో కూడా తొలిసారిగా అమెరికాను వెనక్కు నెట్టి చైనా ముందుకు వచ్చింది. గత ఏడాది వివరాలను పరిశీలించినపుడు ప్రపంచ అగ్రశ్రేణి 50 పరిశోధన ఉత్పాదక సంస్థలలో చైనా సైన్సెస్‌ అకాడమీ ఒకటవదిగా ఉండగా మొత్తం 19 చైనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఆ జాబితాలో ఉన్నాయి. 2010 నుంచి జాతీయ సమతూకంలో మార్పు ఉన్నట్లు నేచర్‌ ఇండెక్సు ప్రకటన పేర్కొన్నది.2018 -2020 సంవత్సరాలలో ఉటంకించిన అగ్రశ్రేణి ఒకశాతం పరిశోధనా పత్రాలలో అమెరికా కంటే చైనావే ఎక్కువగా ఉన్నట్లు సైన్సెస్‌ మరియు టెక్నాలజీ జపాన్‌ జాతీయ సంస్థ 2022 నివేదిక పేర్కొన్నది.

నిజానికి 2018లోనే మొత్తం పరిశోధనా పత్రాల సమర్పణలో అమెరికా, ఐరోపాను వెనక్కు నెట్టి చైనా ముందుంది.
2018 నుంచి 2020వరకు ప్రపంచ శాస్త్ర పత్రాలలో 23.4శాతంతో చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతానికి జీవ శాస్త్ర రంగంలోనే అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.అమెరికా ఎన్నో శతాబ్దాలు ముందుండి పరుగులు పెడుతుంటే చైనా ఇటీవలనే నడక ప్రారంభించింది. అందుకే ఇప్పటికీ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు కొన్ని రంగాలలో ముందున్నాయి. నోబెల్‌ బహుమతులను కొలబద్దగా తీసుకుంటే 403తో అమెరికా, 137తో బ్రిటన్‌, 114తో జర్మనీ మొదటి మూడు స్థానాల్లో ఉండగా చైనా తొమ్మిదితో 23వ స్థానంలో ఉంది. 2015లో పశ్చిమ దేశాల సైన్సు పత్రికలలో చైనా పరిశోధనా పత్రాలు కేవలం ఏడున్నవేలు మాత్రమే ప్రచురణకు నోచుకోగా అమెరికా నుంచి 21వేలవరకు ఉన్నాయి. 2020 అమెరికా పత్రాలు స్వల్ప తేడాతో స్థిరంగా ఉండగా తరువాత తగ్గటం ప్రారంభమైంది. మరోవైపున అచిర కాలంలోనే చైనా దాన్ని అధిగమించింది. పశ్చిమ దేశాల పరిశోధనా సంస్థలు కొన్ని రంగాలలో తప్పనిసరైతే తప్ప చైనా లేదా మరొక వర్ధమాన దేశంతో సహకరించటం లేదన్నది తెలిసిందే. కొత్తవాటిని కనుగొనటం కాకుండా ఉన్నవాటిని కాపీ కొడుతుందని ఇప్పటికీ చైనా గురించి చెప్పేవారు మనకు కనిపిస్తారు. అదే నిజమైతే మిగిలిన దేశాలకూ అలాంటి అవకాశం ఉన్నట్లే, మరి అవెందుకు ఆ పని చేయటం లేదు ? మన దేశంలో దొంగ డిగ్రీలు, చివరికి పిహెచ్‌డి థీసిస్‌లను కూడా కొనుక్కొని పట్టాలు పొందవచ్చు కనుక అనేక మంది చైనా గురించి జరుగుతున్న ప్రచారాన్ని నమ్మటంలో వింత లేదు.


వాషింగ్టన్‌ డిసి కేంద్రంగా పని చేస్తున్న ఐటిఐఎఫ్‌కు చైనా మీద ఎలాంటి ప్రత్యేక అభిమానం ఏమీ ఉండదు, అది అమెరికాలోని ఒక స్వచ్చంద సంస్థ. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదికలో అమెరికా పాలకవర్గానికి ఒక హెచ్చరిక చేసింది. చైనాను ఒక నవకల్పన దేశానికి బదులు అనుకరించేది అని తక్కువగా అంచనా వేస్తే తనకు తానే ఆపద కొనితెచ్చుకున్నట్లు అవుతుందని పేర్కొన్నది.2020 నాటికి అంతర్జాతీయ పేటెంట్‌ కుటుంబాల (అమ్మా, నాన్న, పిల్లలు కుటుంబం అన్నట్లే, ఒక పేటెంట్‌ దానికి అనుబంధంగా పేటెంట్లు ఉండటాన్ని కూడా కుటుంబంగా పరిగణిస్తారు) సంఖ్య అమెరికా కంటే చైనాకు చెందినవి ఐదు రెట్లు ఉన్నట్లు చెప్పింది.నవకల్పనలో అమెరికా ఆధిపత్యాన్ని పునరుద్దరించాలని విధాన నిర్ణేతలకు సూచించింది. మేడిన్‌ చైనా 2025 వ్యూహం ప్రకారం ఆ దేశం ముందుకు పోతున్నదని కూడా చెప్పింది. పరిశోధనా రంగంలో సాధిస్తున్న ప్రగతిని పేర్కొంటూ 2010లో ఐరోపా సమాఖ్య ప్రకటించిన పరిశోధన-అభివృద్ధి రంగంలో పెట్టుబడుల సూచికలో 1,400 కంపెనీలకు గాను 19 చైనా కంపెనీలుండగా 2020 నాటికి 278కి పెరగ్గా ఇదే కాలంలో అమెరికా సంస్థలు 487 నుంచి 449కి తగ్గాయి. సైన్స్‌, ఇంజనీరింగ్‌ పరిశోధనా పత్రాలు 2020లో 7,42,000 కాగా అవి అమెరికా కంటే 123.7శాతం ఎక్కువని ఐటిఐఎఫ్‌ పేర్కొన్నది. పేటెంట్ల లైసన్సు ద్వారా వచ్చే రాబడిలో అమెరికా ఎంతో ముందుంది. చైనాకు 2016లో అమెరికాకు వచ్చే రాబడిలో కేవలం రెండుశాతమే రాగా 2020 నాటికి 12శాతానికి పెరిగిందని ప్రపంచ బాంకు సమాచారం వెల్లడించింది. సూపర్‌ కంప్యూటర్లలో 2020 నాటికి 500 అగ్రశ్రేణి వ్యవస్థలకు గాను చైనాలో 214 ఉండగా అమెరికా 113 మాత్రమే ఉన్నాయి. పారిశ్రామిక రోబోల వినియోగంలో 2010 అమెరికాతో పోలిస్తే పదికి ఒకటి ఉండగా ఇప్పుడు అమెరికాతో సమంగా ఉన్నాయి. గణనీయ పురోగతి ఉన్నప్పటికీ చైనా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఐటిఐఎఫ్‌ పేర్కొన్నది.


ఎలక్ట్రిక్‌ బాటరీలు, హైపర్‌సోనిక్‌,5జి,6జి, నానో స్కేల్‌ మెటీరియల్స్‌, సింథటిక్‌ బయాలజీ వంటి కొన్ని రంగాలలో తిరుగులేనిదిగా ఉన్న చైనా 44 సాంకేతిక పరిజ్ఞానాల్లో 37లో ముందున్నదని ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పోలసీ ఇనిస్టిట్యూట్‌ అనే మేథో సంస్థ 2022 నివేదికలో పేర్కొన్నది. మిగిలిన ఏడింటిలో అమెరికా ముందున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని పది అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలు చైనాలో ఉన్నాయని, అమెరికా కంటే తొమ్మిది రెట్లు పరిశోధనా పత్రాలను అవి రూపొందిస్తున్నట్లు , షీ జింపింగ్‌, అంతకు ముందున్న నేతల మార్గదర్శకత్వంలో ఈ కృషి కొనసాగుతున్నదని పేర్కొన్నది. అణ్వాయుధాలను మోసుకుపోగల హైపర్‌సోనిక్‌ క్షిపణులను 2021లో పరీక్షించిన తీరును చూసి అమెరికా గూఢచార సంస్థలు ఆశ్చర్యపడనవసరం లేదని, గడచిన ఐదు సంవత్సరాలలో ప్రపంచంలో పెద్ద ప్రభావం కలిగించే మొత్తం పరిశోధనా పత్రాల్లో 48.49శాతం ఒక్క చైనా నుంచే ఉన్నట్లు ఆస్ట్రేలియన్‌ సంస్థ పేర్కొన్నది.


పరిశోధనల్లో వివిధ దేశాల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. సహకరించిన వారెవరైనా ఏ దేశానికి చెందిన వారు పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తే దాన్ని ఆ దేశ ఖాతాలో వేస్తారు.చైనా నుంచి వస్తున్న పరిశోధనా పత్రాలు ఇతరుల సహకారంతో సమర్పిస్తున్నవని కొందరు చైనాను తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.రెండవది చైనా తమ పరిశోధన అంశాలను తస్కరిస్తున్నారని నిందిస్తున్నారు. మన దేశంతో సహా అనేక దేశాల సంప్రదాయ విజ్ఞానాన్ని అమెరికా, ఐరోపా దేశాలు అపహరించి తమ పేరుతో మేథో సంపత్తి హక్కులు పొందాయి. అందుకు ఒక చక్కటి ఉదాహరణ మన దేశం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు చెబుతున్న పసుపు మీద అమెరికా పేటెంట్‌ హక్కు దఖలు పరచుకుంది. దాని మీద మన దేశం చట్టబద్దమైన పోరాటం చేసి విజయం సాధించింది. ఇలాంటి అవకాశం ఏ దేశానికైనా ఉంది. కొందరు ఆరోపిస్తున్నట్లు చైనా కూడా అలాంటి పని చేస్తే దాన్ని కూడా కోర్టులకు లాగవచ్చు. ఎవరి విజ్ఞానాన్ని వారు పరిరక్షించుకోవచ్చు.విద్యుత్‌ బల్బును కనుగొన్నది ఎవరని అడిగితే ఠకీమని చెప్పే జవాబు థామస్‌ ఎడిసన్‌ అని వస్తుంది. కానీ ఎడిసన్‌ కంటే ముందే అనేక మంది దాని మీద పరిశోధనలు చేశారు, బల్బులను రూపొందించారు. దాని కొనసాగింపుగా ఎడిసన్‌ తన పరిశోధనలను జోడించి ఆ బల్బును వాణిజ్యపరంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అనుసరించిన క్రమం గురించి పేటెంట్‌ పొందాడు. దాంతో పేరు అతనికి వచ్చింది. ఆ పరిశోధనలో అనేక మంది ఎడిసన్‌కు సహకరించారన్నది గమనించాలి. మరొకరెవరూ తదుపరి పరిశోధనలు చేయకూడదు, ఎడిసన్‌ లేదా అతని వారసులు మాత్రమే చేయాలంటే ఈ రోజు ఇన్ని రకాల బల్బులు వచ్చి ఉండేవి కాదు. పరిశోధనలకు మూలం అంతకు ముందున్న తరాల విజ్ఞానమే అన్నది తెలిసిందే.


చైనా శాస్త్రవేత్తల పరిశోధనల్లో పెద్దగా పస ఉండదు, నాసిరకం, ఇతరులు చేసిన వాటిని అటూ ఇటూ మార్చి నూతన పరిశోధనల పేరుతో సమర్పిస్తున్నారు, ఒకే వనరు నుంచి కాపీ పరిశోధనలు వస్తున్నాయి, ఇతరులు బొమ్మలను మరోకోణంలో కొత్తవిగా చూపుతున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు కొందరు. చైనాలో ఉన్న అవినీతిని తొలగించేందుకు ఎలాంటి కఠిన శిక్షలను అమలు చేస్తున్నారో తెలిసిందే. పరిశోధనా రంగంలో ఉన్నవారు కూడా అవినీతికి పాల్పడితేవారి నుంచి వచ్చిన వాటిని అంతర్జాతీయ సమాజం పక్కన పెట్టవచ్చు. పరిశోధనలను ప్రోత్సహించే క్రమంలో ప్రచురించిన పత్రాల ప్రాతిపదికన చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిన కారణంగా కొందరు అవినీతికి పాల్పడి ఉండవచ్చు తప్ప మొత్తంగా నకిలీ అనే వారిని చేసేదేమీ లేదు. ఇప్పుడు అలాంటి ప్రోత్సహకాలను నిలిపివేసింది. అక్కడ జరుగుతున్న అభివృద్ది వాస్తవం, సాధిస్తున్న అద్బుతాలు నిజం. ఈ పూర్వరంగంలో చైనా మీద బురద జల్లేందుకు కుహనా శాస్త్ర పరిశ్రమ పేరుతో వారినీ వీరిని ఉటంకించి ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఒక కథను అల్లింది. చైనాదంతా బోగస్‌ అని అమెరికా ఇతరులను నమ్మించేందుకు ప్రచారం చేయవచ్చు తప్ప దాన్ని వారే నమ్మటం లేదు. చైనాతో పోటీని తట్టుకొనేందుకు వచ్చే పది సంవత్సరాల్లో శాస్త్ర పరిశోధనలకు రెండు వందల బిలియన్‌ డాలర్లను అధ్యక్షుడు జో బైడెన్‌ నిధుల మంజూరు చేసేవాడే కాదు.


ఇంతవరకు ప్రపంచంలో చైనా గురించి చేసినన్ని తప్పుడు ప్రచారాలు మరొక దేశం గురించి లేవంటే అతిశయోక్తి కాదేమో ! ఎవరు అవునన్నా కాదన్నా చైనా నేడు సాంకేతిక, ఆర్థిక రంగాల్లోనే కాదు, శాస్త్ర రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలను సవాలు చేస్తూ ముందుకు పోతోంది. అది కూలిపోవాలి, పేలిపోవాలని ఎన్ని దుష్ట కోరికలు కోరుకున్నప్పటికీ, కూలుతుందని తేదీలు, సంవత్సరాలను ఉటంకించినప్పటికీ అలాంటి జాడలేమీ లేవు. అనేక రంగాలలో ముందుకు పోవటానికి కారణం జనానికి జవాబుదారీగా ఉండే కమ్యూనిస్టు భావజాలం కలిగిన శక్తులు అక్కడ అధికారంలో ఉండటమే కారణం. దోపిడీ లేని మరో సమాజ నిర్మాణం సాధ్యమే అని నిరూపించేందుకు కమ్యూనిస్టులు ముందుకు పోతుండగా అడ్డుకొంటున్న ప్రతిసారీ ఆటంకాలను అధిగమించి ముందుకు పోతున్నది. ఆ క్రమంలో ఉన్న లోపాలను చైనా ప్రభుత్వం, పార్టీ కూడా దాచుకోవటం లేదు. వాటిని అధిగమిస్తూ, అందుకు పాల్పడిన వారిని కఠినంగా అదుపు చేస్తూ జగన్నాధ రధం ముందుకు పోతున్నది. పరిశోధన-అభివృద్ధి రంగంలో 2022లో అమెరికా 660 బి.డాలర్లు ఖర్చు చేయగా జిడిపిలో అది 2.6శాతం. అదే చైనా 556 (3.1), జపాన్‌ 194 (3.4) భారత్‌ 159 (0.56), ఖర్చు చేస్తున్నట్లు వికీపీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా జిడిపిలో 5.9, 5 శాతాల చొప్పున అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకే పిండికొద్దీ రొట్టె అంటారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏకపక్ష ఆంక్షలతో లొంగని దేశాలను సాధిస్తున్న సామ్రాజ్యవాదం !

31 Wednesday May 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, International, INTERNATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

CEPR, China, Donald trump, Economic Sanctions, imperialism, Joe Biden, Vladimir Putin


ఎం కోటేశ్వరరావు


కొట్టవద్దు తిట్టవద్దు, పొమ్మనకుండా పొగబెట్టు ఎలా దారికి రారో చూద్దాం అన్నట్లుగా ఆర్థిక ఆంక్షలను ఆయుధాలుగా చేసుకొని అమెరికా, పశ్చిమ దేశాలు సామ్రాజ్యవాదులు, వాటి తొత్తులు అనేక దేశాల మీద దాడులు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆర్థిక మరియు విధాన పరిశోధనా కేంద్రం (సిఇపిఆర్‌) ” ఆర్థిక ఆంక్షల మానవీయ పర్యవసానాలు ” అనే శీర్షికతో ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.మానవహక్కులు, ప్రజాస్వామ్యం వంటి పెద్ద కబుర్లు చెప్పే పశ్చిమ దేశాల దుర్మార్గాన్ని అది ఎండగట్టింది. ఆంక్షలలో రెండు రకాలు, ఐరాస విధించేవి ఒక తరగతి. ఇవి స్వంత పౌరుల పట్ల లేదా ఇతర దేశాల మీద కాలుదువ్వే పాలకులను దారికి తెచ్చేందుకు సమిష్టిగా విధించేవి. ఐరాసతో నిమిత్తం లేకుండా కర్ర ఉన్నవాడితే గొర్రె అన్నట్లుగా తమకు లొంగని దేశాలు, సంస్థలు, వ్యక్తుల మీద ఏకపక్షంగా అమెరికా, దాని మిత్రదేశాలు విధించేవి రెండవ కోవకు చెందినవి. కేవలం కమ్యూనిస్టులుగా ఉన్నందుకు, ప్రపంచమంతటా కమ్యూనిజాన్ని అరికట్టే మొనగాడిగా ఉన్న తమకు కూతవేటు దూరంలోనే ఒక సోషలిస్టు దేశం ఉనికిలోకి రావటాన్ని సహించలేని అహంతో అమెరికాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అమానవీయ ఆంక్షలను క్యూబా మీద అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. 1992 నుంచీ ప్రతి ఏటా 2020లో కరోనా కారణంగా తప్ప వాటిని ఖండిస్తూ ఐరాస సాధారణ అసెంబ్లీలో తీర్మానం పెట్టటం దాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యతిరేకించటం, అమెరికా వత్తిడిని తట్టుకోలేక కొన్ని దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండటం తప్ప మిగిలిన దేశాలన్నీ ఖండించినా అమెరికా ఖాతరు చేయటం లేదు.


ఐరాస విధించేవి తప్ప భద్రతా మండలి అనుమతి లేని మిగిలిన ఆంక్షలన్నీ చట్టవిరుద్దమైనవే. దేశమంటే మట్టి కాదు, మనుషులు అని చెప్పిన మహాకవి గురజాడ ప్రకారం అనేక దేశాలను అనేకంటే అక్కడి పౌరుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఈ దుర్మార్గాలను నిరోధించే సత్తా ఐరాసకు లేదు. 1960 దశకం నాటికి ప్రపంచంలోని నాలుగుశాతం దేశాలు ఐరాస, అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షలకు గురికాగా ప్రస్తుతం 54 దేశాలు లేదా 27శాతానికి చేరాయి. వీటి జిడిపి నాలుగు నుంచి 29శాతానికి పెరిగింది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇటీవలి పరిణామాలను చూస్తే బరాక్‌ ఒబామా ఏలుబడిలో సంస్థలు లేదా వ్యక్తుల మీద ఏడాదికి 544 కొత్త ఆంక్షలు విధిస్తే అవి ట్రంప్‌ కాలంలో 975, వర్తమాన జో బైడెన్‌ ఇప్పటి వరకు సగటున 1,151గా ఉన్నాయి. దీర్ఘకాలంగా అమల్లో ఉన్నవాటిలో క్యూబా మీద 1960 దశకం నుంచి అమలు జరుగుతుంటే ఇరాన్‌ మీద 1979, ఆప్ఘనిస్తాన్‌ మీద 1999 నుంచి అమల్లో ఉన్నాయి. ఐరాస మానవహక్కుల మండలి 2014లో ఆమోదించిన తీర్మానంలో ఏకపక్ష ఆంక్షలు పౌరుల మీద చూపుతున్న ప్రతికూల ప్రభావాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్లు పేర్కొన్నది. ఆ తరువాత తీవ్రత, సంఖ్య రీత్యా ఇంకా పెరిగాయి తప్ప తగ్గలేదు.


ఔషధాల దగ్గర నుంచి అన్నింటి మీద అమెరికా విధించిన ఆంక్షల వలన క్యూబా అపార నష్టానికి గురైంది. ఒక దశలో వ్యవసాయ పరికరాలైన ట్రాక్టర్ల వంటి వాటికి కూడా డీజిలు, పెట్రోలు దొరక్క గుర్రాలతో సాగు చేసుకోవాల్సి వచ్చింది. క్యూబా మీద ఆంక్షల వలన తమకు జరిగిన నష్టం గురించి అమెరికా సంస్థలు కూడా గగ్గోలు పెట్టాయి. ఎవడి గోల వాడిది. క్యూబా పాలసీ ఫౌండేషన్‌ అనే సంస్థ 2002లో వేసిన అంచనా ప్రకారం ఏటా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 360 కోట్ల డాలర్ల నష్టం జరిగింది. తరువాత అక్కడి కార్పొరేట్ల వత్తిడి మేరకు ఆంక్షలను సడలించటంతో 2000-2006 కాలంలో అమెరికా వార్షిక ఎగుమతులు 60లక్షల నుంచి 35 కోట్ల డాలర్లకు పెరిగాయి. అయినప్పటికీ తమకు ఏటా 120 కోట్ల డాలర్ల మేర నష్టం జరుగుతున్నట్లు 2009లో అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొన్నది. ప్రారంభం నుంచి తమకు 753 బి. డాలర్ల నష్టం జరిగిందని క్యూబా సర్కార్‌ చెప్పింది. అమెరికాకు ఏటా 484 కోట్ల డాలర్ల మేర, క్యూబాకు 68.5 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగినట్లు క్యూబా పాలసీ ఫౌండేషన్‌ అంచనా వేసింది.భిన్నమైన అంశాల ప్రాతిపదికన చెప్పే ఈ అంచనాలు ఒకదానికి ఒకటి పొసగవు. ఉదాహరణకు 2015లో అల్‌ జజీరా ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం ఆంక్షలు ప్రారంభమైన 55 సంవత్సరాలలో క్యూబాకు 1.1లక్షల కోట్ల నష్టం జరిగింది.


ఇరాన్‌ మీద విధించిన ఆంక్షల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన అత్యవసర ఔషధాల జాబితాలోని 32తో సహా 73 ఔషధాలకు అక్కడ కొరత ఏర్పడింది. ఆప్ఘ్‌నిస్తాన్‌లో తలసరి ఆదాయం దారుణంగా తగ్గింది.2021లో అమెరికాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత అదే అమెరికా, ఐరోపా సమాఖ్య 960 కోట్ల డాలర్ల విలువగల ఆప్ఘన్‌ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఆ దేశ జిడిపిలో సగం. ఆంక్షల కారణంగా విదేశాల నుంచి ఏటా వచ్చే 80 కోట్ల డాలర్ల మేర నిలిచిపోయాయి. వెనెజులా మీద 2017లో విధించిన ఆంక్షల కారణంగా 2020నాటికి దేశ దిగుమతులు 91శాతం తగ్గాయి. దాదాపు పూర్తిగా దిగుమతుల మీదనే ఆహారం సమకూర్చుంటున్న వెనెజులా దిగుమతులు 78శాతం పడిపోయాయి. చమురు ఎగుమతులపై ఆంక్షల కారణంగా జీవన ప్రమాణాలు తగ్గి శిశు, సాధారణ మరణాల రేటు పెరిగింది. తమ ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడిన జనం ఇరాన్‌, వెనెజులా పాలకులపై తిరుగుబాటు చేసే విధంగా పురికొల్పటమే లక్ష్యమని అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి మైక్‌ పాంపియో గతంలో చెప్పాడు. ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యం, మానవహక్కుల పేరుతో ఇలాంటి దుర్మార్గమైన ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. ఆంక్షలు ప్రకటించిన ఏ దేశంలోనైనా జనాన్ని ఇబ్బంది పెట్టటం తప్ప వీటిని సాధించలేదు. అవి సమర్ధించే అనేక దేశాల్లో వాటి జాడే కనపడదు. సోషలిస్టు బాట నుంచి వైదొలిగేట్లుగా లేదా తనకు అనుకూలంగా మార్చుకొనేట్లు క్యూబా మీద అమలు జరుపుతున్న ఆంక్షల ప్రభావం ఏమాత్రం లేదని విలియం లియోగ్రాండే అనే విశ్లేషకుడు చెప్పాడు. ప్రాణాలైనా ఇస్తాంగానీ అమెరికాకు లొంగేది లేదన్న కమ్యూనిస్టుల ప్రత్యేకత ఇది.


అన్ని దేశాల మీద ప్రకటిస్తున్న ఆంక్షల లక్ష్యం కూడా లొంగదీసుకోవటమే. అణుపరీక్షలు జరుపుతున్నదనే కారణంతో ఇరాన్‌ మీద భద్రతా మండలి విధించిన ఆంక్షలు కొన్ని కాగా దానితో నిమిత్తం లేకుండా అమెరికా, ఇతర దేశాలు విధించినవి మరికొన్ని.అణు కార్యమం నిలిపివేతకు అంగీకరించిన ఇరాన్‌తో దానికి ప్రతిగా స్పందించాల్సిన అమెరికా ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలిగింది. తమ భద్రతకు ముప్పుతెచ్చే ఎత్తుగడలో భాగంగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవద్దన్న రష్యా వినతిని ఖాతరు చేయకుండా ముందుకు పోతుండటంతో తప్పనిసరై సైనిక చర్యకు దిగిన పుతిన్‌పై ఆంక్షలు విధించి దేశ ఆర్థిక రంగాన్ని దెబ్బతీసి జనాన్ని వీధుల్లోకి తెచ్చి పుతిన్‌ సర్కార్‌ను గద్దెదింపాలని అమెరికా చూసింది.వాణిజ్య పోరు పేరుతో చైనాను తన దారికి తెచ్చేందుకు అంతకు ముందే పూనుకుంది.వివిధ సందర్భాలలో మనతో సహా అనేక దేశాలను బెదిరించటం చూస్తున్నదే.


ఉక్రెయిన్‌ మీద మిలిటరీ దాడులు జరుపుతున్నదనే కారణంతో రష్యాకు చెందిన సంస్థలు, వ్యక్తుల మీద ఆంక్షలు విధించారు.రష్యా ఐటి,ఇంజనీరింగ్‌ వంటి రంగాలకు అవసరమైన వస్తువులు, సేవల ఎగుమతుల మీద బ్రిటన్‌ నిషేధం విధించింది, 70శాతం సెమీ కండక్టర్ల ఎగుమతులు నిలిచాయి. అమెరికా, ఇతర నాటో దేశాల చమురు, గాస్‌ ఎగుమతుల నిషేధం, చమురు ధరలపై ఆంక్షల గురించి తెలిసిందే. దేశాల వారీ చూస్తే అమెరికా 374, కెనడా 156, బ్రిటన్‌ 95, ఐరోపా సమాఖ్య 44, స్విడ్జర్లాండ్‌ 42,ఆస్ట్రేలియా 28 చొప్పున కొత్త ఆంక్షలు విధించాయి.ఇరాన్‌ మీద కొత్తగా 115 ఆంక్షలు ఈ దేశాలు విధించాయి.హిరోషిమాలో ఇటీవల జరిగిన జి7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి ముందు పలు ఆంక్షలకు తెరతీశారు. వాటి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికే అమలు జరుపుతున్న ఆంక్షల వలన రష్యా ప్రభావితం అవుతున్నది. చమురును ఆరవై డాలర్లకు మించి కొనకూడదన్న ఆంక్ష వలన గానీ రాయితీ ధరలకు వివిధ దేశాలకు అమ్ముతున్నకారణం కావచ్చు ప్రస్తుత రష్యా చమురు సగటు ధర 58.62 డాలర్లు ఉంది. ఆర్మీనియా నుంచి అది దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ 3,700 శాతం పెరిగాయి.వివిధ దేశాల మీద 2023 ఫిబ్రవరి 22 నాటికి విధించిన ఆంక్షల సంఖ్య గురించి స్టాటిస్టా సమాచారం ఇలా ఉంది.
దేశం ×× మొత్తం ××2022, ఫిబ్రవరి×× 2022 ఫిబ్రవరి తరువాత
రష్యా ×× 14,081 ××× 2,754 ××× 11,327
ఇరాన్‌ ×× 4,191 ××× 3,616 ××× 575
సిరియా ×× 2,644 ××× 2,598 ××× 46
ఉ.కొరియా ×× 2,133 ××× 2,052 ××× 81
బెలారస్‌ ×× 1,154 ××× 788 ××× 366
వెనెజులా ×× 651 ××× ××××× ××× ×××


చైనా మార్కెట్‌లో మరింతగా తన వస్తువులను అమ్ముకొనేందుకు, దిగుమతులను అడ్గుకొనేందుకు, చైనాకు అధునాత సాంకేతిక పరిజ్ఞానం అందకుండా చూసేందుకు అమెరికా ఆంక్షలను అమలు జరుపుతోంది. 2008లో రెండు కొత్త ఆంక్షలను విధించగా తరువాత 2018నాటికి వాటిని 59కి పెంచింది. తరువాత నాలుగు సంవత్సరాలలో 29,300,89,36 కొత్తగా విధించింది.వీటిలో ఇటీవలి కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల ఎగుమతుల మీద విధించిన ఆంక్షలు తీవ్రమైనవి. తద్వారా చైనా ఆర్థిక రంగాన్ని కుదేలు కావించాలని చూస్తున్నది.2023తొలి మూడు మాసాలలో విధించిన ఆంక్షలను పరిగణలోకి తీసుకుంటే పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల సంఖ్య 36,500 దాటింది.తాము విధించిన వాటితో పాటు ప్రతిగా తమ మీద విధించిన ఆంక్షలతో పశ్చిమ దేశాలు కూడా కొంత మేరకు ప్రభావితం అవుతాయి. వాటి తీవ్రత పెరిగి తమ లాభాలు, అసలుకే ముప్పు వచ్చేంత వరకు కార్పొరేట్‌ సంస్థలు రంగంలోకి రావు. డాలరు పెత్తనం తగ్గుతుందని అనేక మంది చెబుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే అది అంత తేలిక కాదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ దేశాల రిజర్వుబాంకుల్లో డాలరు నిల్వలు 2021 డిసెంబరులో 7,085.92 బిలియన్‌ డాలర్లుంటే 2022 ఆగస్టులో 6,652.32 బి.డాలర్లకు మాత్రమే తగ్గాయి. ఇదే కాలంలో మొత్తం రిజర్వుబాంకుల ఆస్తుల్లో చైనా యువాన్‌ నిల్వలు నామమాత్రం నుంచి 6.2శాతానికి పెరిగాయి. అందువల్లనే అమెరికా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది, ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నది. సామ్రాజ్యవాదులు, దానితో చేతులు కలుపుతున్న శక్తుల తీరు తెన్నులను చూస్తే తమకు లొంగని దేశాల మీద ఆంక్షలను రోజు రోజుకు పెంచటాన్ని గమనించాము. రానున్న రోజుల్లో ఇదే ధోరణి కొనసాగితే ఆయుధ యుద్ధాలకు బదులు ఆంక్షల దాడులతో జనాలకు ఇబ్బందులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఐరాస వీటిని నిరోధించలేదని ఇప్పటికే తేలిపోయింది. అందువలన యుద్ధాలనే కాదు ఆంక్షలనూ వద్దంటూ జనం వీధుల్లోకి రావాల్సిన అవసరం ఉంది.


.

Share this:

  • Tweet
  • More
Like Loading...

సరిలేరు నీకెవ్వరూ మోడీ రాజా : మనోభావాలతో నాడు చైనా యాప్‌ నిషేధ ఆట, నేడు అంబానీ కోసం అనుమతి క్రీడ !

27 Saturday May 2023

Posted by raomk in Asia, BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, TDP, USA

≈ Leave a comment

Tags

#Anti China, Anti-China 'Remove China Apps', BJP, CHANDRABABU, Narendra Modi, Narendra Modi Failures, Reliance Group, RSS, Shein, SJM


ఎం కోటేశ్వరరావు


షీ ఇన్‌ అనే ఒక చైనా కంపెనీతో మన దేశ బడాసంస్థ రిలయన్స్‌ కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్రం ఆమోద ముద్రవేసినట్లు వార్త. దీని గురించి మీడియా చాలా పరిమితంగా మాత్రమే వార్తలు ఇచ్చింది. పెద్ద హడావుడి లేదు. ఎందుకంటే చైనా వ్యతిరేకతను వెల్లడించటమే అసలు సిసలు దేశ భక్తి అన్నట్లు అవకాశం దొరికినపుడల్లా ప్రదర్శిస్తున్న వారికి ఇది తేలుకుట్టిన దొంగ పరిస్థితే మరి. అమెజాన్‌ మన మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించకుండా తనకు మద్దతు ఇస్తున్న అంబానీ కంపెనీ కోసం నరేంద్రమోడీ సర్కార్‌ శాయశక్తులా చూస్తోంది.గతంలో అమెజాన్‌ అధిపతి బెజోఫ్‌ ఢిల్లీ వచ్చినపుడు కలిసేందుకు అంగీకరించకుండా పడిగాపులు పడేట్లు చేసి నరేంద్రమోడీ నాడు అంబానీకి సంతోషం కలిగించారు.ఇంతకీ షీ ఇన్‌ కంపెనీ, దాని యాప్‌ మీద ఇప్పుడు అంబానీలకు ఎందుకు కన్ను పడిందంటే మూడేండ్ల క్రితం దాన్ని నిషేధించినా అమెజాన్‌ కంపెనీ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ లాభపడుతున్నది. ఆ లబ్దిని తామే నేరుగా ఎందుకు పొందకూడదన్నది ముకేష్‌ అంబానీ కుటుంబ ఆలోచన. డబ్బు ఎవరికి చేదు. వారు తలచుకుంటే దేశభక్తి స్వభావం, రూపమే మారిపోతుంది. జనానికి జ్ఞాపకశక్తి తక్కువ, అసలు ఉండదు అన్నది కొందరి ప్రగాఢ విశ్వాసం. నరేంద్రమోడీ లేదా మోడీని తీర్చిదిద్దిన సంఘపరివార్‌ కూడా అంబానీల ముందు మోకరిల్లాల్సిందే. వారి దేశ భక్తి అలాంటిది. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీకి తోడుగా నిలిచిన బిర్లా కుటుంబం గురించి తెలిసిందే. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చుకోవచ్చన్నది బిర్లా కుటుంబ ఆలోచన. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అదే జరిగింది. ఇప్పుడూ జరుగుతున్నది అదే, కాకుంటే లబ్దిదారు అంబానీ. నరేంద్రమోడీతో 2014లో అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పేవారి గురించి తెలిసిందే.


రష్యా ముడిచమురుతో తయారైన ఉత్పత్తులను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోరాదని ఐరోపా సమాఖ్య తొలిసారిగా తన దేశాలను కోరింది.భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులు రష్యా ముడిచమురుతో చేసినవేనని, వాటిని దిగుమతి చేసుకుంటే రష్యా మీద విధించిన ఆంక్షలను ఉల్లంఘించటమే అని సమాఖ్య విదేశాంగ విధాన ఉన్నత ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ వర్ణించారు. పీపా ముడిచమురును 60 డాలర్లకు మించి కొనుగోలు చేసేవారి మీద ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా, ఐరోపా దేశాలు బెదరించిన సంగతి తెలిసిందే. బోరెల్‌ విమర్శలను మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ తోసిపుచ్చారు. తాము ఎగుమతి చేస్తున్నవాటిని భారత ఉత్పత్తులుగానే చూడాలి అన్నారు. మన దేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కంటే రష్యా నుంచి వస్తున్నదానికి పది డాలర్లు తక్కువ చెల్లిస్తున్నాము. ఈ దిగుమతుల్లో 80శాతం పైగా రిలయన్స్‌ మరో ప్రైవేటు కంపెనీలు దిగుమతి చేసుకొని డీజిలు, పెట్రోలు, ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నాయి. దీని వలన మన జనానికి ఎలాంటి లాభమూ లేదు. ఇది మోడీ అసలైన స్వాతంత్య్ర ఫలం.


ఇక తాజాగా అంబానీకి అందిస్తున్న లబ్ది గురించి చూద్దాం. చైనాకు చెందిన షీ ఇన్‌ కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. ఫాషన్‌ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్‌సైట్‌,యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది. గత ఏడాది నాటికి మూడువేల సరఫరాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. షీ ఇన్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదు గనుక రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. ఒక పత్రికలో ” షి ఇన్‌ తిరిగి భారత్‌కు వస్తున్నది, గతంలో దాన్ని ఎందుకు నిషేధించారు ” అంటూ రాసిన వార్తలో అదే రాశారు. ఈ కంపెనీ ఇంకేమాత్రం చైనాకు చెందినదిగా భారత్‌ భావించకపోవచ్చని పేర్కొన్నారు. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు.
గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు.ఐటి చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్రకారం చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత నిషేధిత జాబితాను 270కి పెంచారు. ఇప్పటికీ అదే అమల్లో ఉంది. షీ ఇన్‌ కంపెనీ దెబ్బకు అనేక దేశాల్లోని సంస్థలకు దిమ్మతిరిగింది. దాంతో దాన్ని అడ్డుకొనేందుకు అనేక సాకులను ముందుకు తెచ్చి అడ్డుకొనేందుకు చూశారు. వివిధ దేశాల సమాచారాన్ని అపహరిస్తున్నదని, మూడో పక్షానికి దాన్ని విక్రయిస్తున్నదన్నది వాటిలో ఒకటి. సమగ్ర సమాచారం ఇవ్వలేదనే పేరుతో అమెరికాలో 19లక్షల డాలర్ల జరిమానా విధించారు. మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందని, వేరే బ్రాండ్లను పోలిన బ్రాండ్లను ముందుకు తెచ్చిందని, ట్రేడ్‌మార్క్‌ హక్కులను ఉల్లంఘించిందని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టిందని, బలవంతంగా కార్మికులతో పని చేయించి కార్మికుల హక్కులను ఉల్లంఘించిందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలతో బలవంతగా పనులు చేయించిందని, ఇలా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ కంపెనీకి కూడా ఆపాదించి అడ్డుకోవాలని చూశారు.


ఇక రిలయన్స్‌తో ఒప్పందానికి వస్తే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రిలయన్స్‌ రిటెయిల్స్‌ సేకరణ సామర్ధ్యాలు, గోదాములు, రవాణా సదుపాయాలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దుకాణాలు షీ ఇన్‌కు అందుబాటులోకి వస్తాయి. ఇతర వివరాలేమీ చెప్పం గానీ రిలయన్స్‌తో మా భాగస్వామ్యం పక్కా అని షీ ఇన్‌ ప్రతినిధి చెప్పినట్లు, రిలయన్స్‌ స్పందించలేదని, ఈ లావాదేవీ గురించి తొలుత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించిందని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ తాజాగా తన విశ్లేషణలో పేర్కొన్నది. గత ఏడాది మన దేశంలో జరిగిన ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల లావాదేవీల విలువ పది బిలియ డాలర్లు ఉండవచ్చని అంచనా.చైనాతో తలెత్తిన విబేధాల కారణంగా అమెరికా, ఐరోపాలో షీఇన్‌ మార్కెట్‌ తగ్గుతున్నందున ఇతర చోట్లకు విస్తరించాలని అది చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మైంత్రా ప్రధాన విక్రేతగా ఉంది. షీ ఇన్‌కు అనుమతిస్తే దాని మార్కెట్‌ను సవాలు చేస్తుందని చెబుతున్నారు.


ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నదాని ప్రకారం లైసన్సు ఒప్పందాన్ని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారత్‌లో ద్వారా వచ్చే లాభాల్లో కొంతశాతం షి ఇన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.చైనాలో ఉన్న తన ఎనిమిదివేల మంది సరఫరదారుల నుంచి సేకరించే దుస్తులతో పాటు భారత్‌లో రిలయన్స్‌ సేకరించే వాటిని కూడా ప్రపంచమంతటా విక్రయిస్తుంది. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య వంటి వారు సి ప్లస్‌ 1 అంటే చైనా ప్లస్‌ ఒకటి అనే అవగాహన ప్రకారం మన దేశంలోని ఐదు పెద్ద రిలయన్స్‌, టాటా, బిర్లా,అదానీ, భారతీ గ్రూపు కంపెనీలు లబ్ది పొందవచ్చని చెబుతున్నారు.చైనాలో పెట్టుబడులతో పాటు మరొక దేశంలో పెట్టుబడులు పెట్టటమే దీని అర్ధం. మన దేశంలోని బడా కంపెనీలు చిన్న చిన్నవాటిని మింగివేస్తున్నాయి. ప్రభుత్వం వాటికి రక్షణలు కల్పిస్తున్నది. ఉదాహరణకు అమెజాన్‌ నుంచి రిలయన్స్‌కు రక్షణగా నిలుస్తున్న మాదిరి అని చెప్పవచ్చు. చైనాలో 2010 తరువాత వేతనాలు, అక్కడి కార్పొరేట్‌ కంపెనీలపై పన్నులు గణనీయంగా పెరిగాయి. ఈ పూర్వరంగంలో 2013లోనే అంటే నరేంద్రమోడీ అధికారానికి రాకముందే సి ప్లస్‌ 1 అనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అది ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది మరింత విస్తరిస్తే పెట్టుబడులు భారత్‌కు రావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇతర దేశాలకు తరలుతున్నాయి. ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు ఆ చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్‌ ముందుకు వచ్చింది. అమెజాన్‌తో పోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢకొీట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం. అందుకే అంబానీ వత్తిడికి లంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్రమోడీ అనుమతించారన్నది స్పష్టం.రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని చౌక దుకాణాలు విలేజ్‌ మాల్స్‌గా మారుస్తామని, ఆ కంపెనీల ఉత్పత్తులను విక్రయిస్తామని 2017లో సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం 29వేల చౌకదుకాణాల్లో తొలిదశలో 6,500లను మాల్స్‌గా మార్చాలని, వాటికి అన్న (ఎన్‌టిఆర్‌) విలేజ్‌ మాల్స్‌ అనే పేరు పెట్టాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌ను ఎందుకు కలిపారంటే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది ఆచరణలోకి రాలేదు.


ఒకటి మాత్రం నిజం, అంగీకరించకతప్పదు. ఒకసారి చెప్పిందాన్ని మరోసారి ప్రస్తావించకపోవటం, ఎప్పటికప్పుడు కొత్త అంశాలతో జనాన్ని ఎలా రెచ్చగొట్టాలో, మనోభావాలను ముందుకు తెచ్చి వారితో ఎలా ఆడుకోవాలో, ఓట్లు ఎలా దండుకోవాలో, అంబానీ, అదానీల వంటి కార్పొరేట్లను ఎలా వాడుకోవాలో నరేంద్రమోడీకి తెలిసినంతగా మరొకరికి తెలియదు. గాల్వన్‌ లోయలో మన సైనికుల మీద చైనా మిలిటరీ దాడి చేసి చంపినదానికి ప్రతీకారం అంటూ నాడు చైనా యాప్‌ల మీద, చైనా పెట్టుబడుల మీద నిషేధం విధించారు. ఆ విధంగా జనాల మనోభావాలను సంతుష్టీకరించి వారి దృష్టిలో చైనాను దెబ్బతీసిన మొనగాడిగా కనిపించిన సంగతి తెలిసిందే.యాప్‌ల మీద ఆంక్షలతో ఒక దేశాన్ని దెబ్బతీస్తున్నామంటే మన జనమంతా నిజమే కామోసు అనుకున్నారు. ఇంకే ముంది చైనా కథ ముగిసినట్లే అని సంతోషించారు. మోడీ మీద ఉన్న భ్రమ అలాంటిది. గాల్వన్‌ ఘర్షణ తరువాత చైనా వస్తువులను నిషేధించాలని కాషాయ దళాలు వీధుల్లో వీరంగం వేసిన దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. స్వదేశీ జాగరణ మంచ్‌ నిదురలేచింది. తరువాత అదే చైనా నుంచి మన దిగుమతుల అంశంలో మోడీ తన రికార్డులను తానే బద్దలు చేస్తున్నారు.వందల కోట్ల డాలర్లను ప్రతి ఏటా సమర్పించుకుంటున్నారు. మన ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం 2022-23లో మన చైనా దిగుమతులు 4.16శాతం పెరిగి 98.51 బి.డాలర్లకు చైనాకు మన ఎగుమతులు 28శాతం తగ్గి 15.32 బి.డాలర్లుగా ఉన్నాయి. మన వాణిజ్యలోటు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 72.91 నుంచి 83.2 బి.డాలర్లకు పెరిగింది. అదే మొనగాడు ఇప్పుడు అంబానీ కంపెనీ కోసం వాటిలో షీ ఇన్‌ అనే ఒక యాప్‌కు గుట్టుచప్పుడు కాకుండా అనుమతించేందుకు ఇచ్చేశారు. అటు జనం ఓట్లు ఇటు కార్పొరేట్ల నోట్లు కావాలి కదా ! నరేంద్రమోడీ ఒక చైనా కంపెనీ, యాప్‌ను తిరిగి అనుమతించటం ద్వారా ద్వారం తెరిచారు. వచ్చే రోజుల్లో ఏదో ఒకసాకుతో మిగిలిన వాటికి కూడా తెరుస్తారా ? మన దేశానికి చెందిన ఏదో ఒక బడా కంపెనీకి లబ్ది కలిగితే ఎలాంటి సందేహం లేకుండా అనుమతిస్తారని వేరే చెప్పనవసరం లేదు.


అమెజాన్‌ మన మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించకుండా తనకు మద్దతు ఇస్తున్న అంబానీ కంపెనీ కోసం నరేంద్రమోడీ సర్కార్‌ శాయశక్తులా చూస్తోంది.గతంలో అమెజాన్‌ అధిపతి బెజోఫ్‌ ఢిల్లీ వచ్చినపుడు కలిసేందుకు అంగీకరించకుండా పడిగాపులు పడేట్లు చేసి నరేంద్రమోడీ నాడు అంబానీకి సంతోషం కలిగించారు.ఇంతకీ షీ ఇన్‌ కంపెనీ, దాని యాప్‌ మీద ఇప్పుడు అంబానీలకు ఎందుకు కన్ను పడిందంటే దాన్ని నిషేధించినా అమెజాన్‌ కంపెనీ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ లాభపడుతున్నది. ఆ లబ్దిని తామే నేరుగా ఎందుకు పొందకూడదన్నది ముకేష్‌ అంబానీ కుటుంబ ఆలోచన. డబ్బు ఎవరికి చేదు. వారు తలచుకుంటే దేశభక్తి స్వభావం, రూపమే మారిపోతుంది.నరేంద్రమోడీ లేదా మోడీని తీర్చిదిద్దిన సంఘపరివార్‌ కూడా అంబానీల ముందు మోకరిల్లాల్సిందే. వారి దేశ భక్తి అలాంటిది. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీకి తోడుగా నిలిచిన బిర్లా కుటుంబం గురించి తెలిసిందే. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా నెరవేర్చుకోవచ్చన్నది బిర్లా కుటుంబ ఆలోచన. స్వాతంత్య్రం వచ్చిన తరువాత అదే జరిగింది. ఇప్పుడూ జరుగుతున్నది అదే, కాకుంటే లబ్దిదారు అంబానీ. నరేంద్రమోడీతో 2014లో అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పేవారి గురించి తెలిసిందే.


రష్యా ముడిచమురుతో తయారైన ఉత్పత్తులను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోరాదని ఐరోపా సమాఖ్య తొలిసారిగా తన దేశాలను కోరింది.భారత్‌ నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులు రష్యా ముడిచమురుతో చేసినవేనని, వాటిని దిగుమతి చేసుకుంటే రష్యా మీద విధించిన ఆంక్షలను ఉల్లంఘించటమే అని సమాఖ్య విదేశాంగ విధాన ఉన్నత ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ వర్ణించారు. పీపా ముడిచమురును 60 డాలర్లకు మించి కొనుగోలు చేసేవారి మీద ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా, ఐరోపా దేశాలు బెదరించిన సంగతి తెలిసిందే. బోరెల్‌ విమర్శలను మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ తోసిపుచ్చారు. తాము ఎగుమతి చేస్తున్నవాటిని భారత ఉత్పత్తులుగానే చూడాలి అన్నారు. మన దేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు కంటే రష్యా నుంచి వస్తున్నదానికి పది డాలర్లు తక్కువ చెల్లిస్తున్నాము. ఈ దిగుమతుల్లో 80శాతం పైగా రిలయన్స్‌ మరో ప్రైవేటు కంపెనీలు దిగుమతి చేసుకొని డీజిలు, పెట్రోలు, ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేస్తూ లాభాలు పొందుతున్నాయి. దీని వలన మన జనానికి ఎలాంటి లాభమూ లేదు. ఇది మోడీ అసలైన స్వాతంత్య్ర ఫలం.


ఇక తాజాగా అంబానీకి అందిస్తున్న లబ్ది గురించి చూద్దాం. చైనాకు చెందిన షీ ఇన్‌ కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. ఫాషన్‌ దుస్తులను తక్కువ ధరలతో అందుబాటులోకి తెచ్చి కుర్రకారుకు దగ్గరైన సదరు సంస్థ అనేక దేశాల నుంచి మార్కెట్లో దుస్తులను కొనుగోలు చేసి విక్రయించటంలో పేరుగాంచింది. దాని వెబ్‌సైట్‌,యాప్‌తోనే లావాదేవీలు జరుపుతుంది. గత ఏడాది నాటికి మూడువేల సరఫరాదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. షీ ఇన్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదు గనుక రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. ఒక పత్రికలో ” షి ఇన్‌ తిరిగి భారత్‌కు వస్తున్నది, గతంలో దాన్ని ఎందుకు నిషేధించారు ” అంటూ రాసిన వార్తలో అదే రాశారు. ఈ కంపెనీ ఇంకేమాత్రం చైనాకు చెందినదిగా భారత్‌ భావించకపోవచ్చని పేర్కొన్నారు. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు.
గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు.ఐటి చట్టంలోని సెక్షన్‌ 69ఏ ప్రకారం చేసినట్లు వెల్లడించారు. ఆ తరువాత నిషేధిత జాబితాను 270కి పెంచారు. ఇప్పటికీ అదే అమల్లో ఉంది. షీ ఇన్‌ కంపెనీ దెబ్బకు అనేక దేశాల్లోని సంస్థలకు దిమ్మతిరిగింది. దాంతో దాన్ని అడ్డుకొనేందుకు అనేక సాకులను ముందుకు తెచ్చి అడ్డుకొనేందుకు చూశారు. వివిధ దేశాల సమాచారాన్ని అపహరిస్తున్నదని, మూడో పక్షానికి దాన్ని విక్రయిస్తున్నదన్నది వాటిలో ఒకటి. సమగ్ర సమాచారం ఇవ్వలేదనే పేరుతో అమెరికాలో 19లక్షల డాలర్ల జరిమానా విధించారు. మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందని, వేరే బ్రాండ్లను పోలిన బ్రాండ్లను ముందుకు తెచ్చిందని, ట్రేడ్‌మార్క్‌ హక్కులను ఉల్లంఘించిందని, ఇతరుల డిజైన్లను కాపీ కొట్టిందని, బలవంతంగా కార్మికులతో పని చేయించి కార్మికుల హక్కులను ఉల్లంఘించిందని, చైనాలోని ఉఘీర్‌ ముస్లింలతో బలవంతగా పనులు చేయించిందని, ఇలా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు చైనా మీద చేస్తున్న ఆరోపణలన్నింటినీ ఈ కంపెనీకి కూడా ఆపాదించి అడ్డుకోవాలని చూశారు.


ఇక రిలయన్స్‌తో ఒప్పందానికి వస్తే పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం రిలయన్స్‌ రిటెయిల్స్‌ సేకరణ సామర్ధ్యాలు, గోదాములు, రవాణా సదుపాయాలు, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దుకాణాలు షీ ఇన్‌కు అందుబాటులోకి వస్తాయి. ఇతర వివరాలేమీ చెప్పం గానీ రిలయన్స్‌తో మా భాగస్వామ్యం పక్కా అని షీ ఇన్‌ ప్రతినిధి చెప్పినట్లు, రిలయన్స్‌ స్పందించలేదని, ఈ లావాదేవీ గురించి తొలుత వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించిందని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ తాజాగా తన విశ్లేషణలో పేర్కొన్నది. గత ఏడాది మన దేశంలో జరిగిన ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల లావాదేవీల విలువ పది బిలియ డాలర్లు ఉండవచ్చని అంచనా.చైనాతో తలెత్తిన విబేధాల కారణంగా అమెరికా, ఐరోపాలో షీఇన్‌ మార్కెట్‌ తగ్గుతున్నందున ఇతర చోట్లకు విస్తరించాలని అది చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో మైంత్రా ప్రధాన విక్రేతగా ఉంది. షీ ఇన్‌కు అనుమతిస్తే దాని మార్కెట్‌ను సవాలు చేస్తుందని చెబుతున్నారు.


ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పేర్కొన్నదాని ప్రకారం లైసన్సు ఒప్పందాన్ని ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారత్‌లో ద్వారా వచ్చే లాభాల్లో కొంతశాతం షి ఇన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.చైనాలో ఉన్న తన ఎనిమిదివేల మంది సరఫరదారుల నుంచి సేకరించే దుస్తులతో పాటు భారత్‌లో రిలయన్స్‌ సేకరించే వాటిని కూడా ప్రపంచమంతటా విక్రయిస్తుంది. ఆర్‌బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య వంటి వారు సి ప్లస్‌ 1 అంటే చైనా ప్లస్‌ ఒకటి అనే అవగాహన ప్రకారం మన దేశంలోని ఐదు పెద్ద రిలయన్స్‌, టాటా, బిర్లా,అదానీ, భారతీ గ్రూపు కంపెనీలు లబ్ది పొందవచ్చని చెబుతున్నారు.చైనాలో పెట్టుబడులతో పాటు మరొక దేశంలో పెట్టుబడులు పెట్టటమే దీని అర్ధం. మన దేశంలోని బడా కంపెనీలు చిన్న చిన్నవాటిని మింగివేస్తున్నాయి. ప్రభుత్వం వాటికి రక్షణలు కల్పిస్తున్నది. ఉదాహరణకు అమెజాన్‌ నుంచి రిలయన్స్‌కు రక్షణగా నిలుస్తున్న మాదిరి అని చెప్పవచ్చు. చైనాలో 2010 తరువాత వేతనాలు, అక్కడి కార్పొరేట్‌ కంపెనీలపై పన్నులు గణనీయంగా పెరిగాయి. ఈ పూర్వరంగంలో 2013లోనే అంటే నరేంద్రమోడీ అధికారానికి రాకముందే సి ప్లస్‌ 1 అనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అది ఇటీవలి కాలంలో పెరిగింది. ఇది మరింత విస్తరిస్తే పెట్టుబడులు భారత్‌కు రావచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇతర దేశాలకు తరలుతున్నాయి. ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టటంతో పాటు ఆ చైనాలో పెరిగిన కంపెనీలతోనే చేతులు కలిపి కూడా లాభాలు పొందవచ్చని రిలయన్స్‌ ముందుకు వచ్చింది. అమెజాన్‌తో పోటీని తట్టుకోవాలంటే దాన్ని ఢకొీట్టే మరో కంపెనీ అవసరం అని గుర్తించటమే దీనికి కారణం. అందుకే అంబానీ వత్తిడికి లంగి నిషేధించిన చైనా కంపెనీని తిరిగి నరేంద్రమోడీ అనుమతించారన్నది స్పష్టం.రిలయన్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకొని చౌక దుకాణాలు విలేజ్‌ మాల్స్‌గా మారుస్తామని, ఆ కంపెనీల ఉత్పత్తులను విక్రయిస్తామని 2017లో సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొత్తం 29వేల చౌకదుకాణాల్లో తొలిదశలో 6,500లను మాల్స్‌గా మార్చాలని, వాటికి అన్న (ఎన్‌టిఆర్‌) విలేజ్‌ మాల్స్‌ అనే పేరు పెట్టాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌ను ఎందుకు కలిపారంటే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ కంపెనీతో అది ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు నరేంద్రమోడీ ఒక చైనా కంపెనీ, యాప్‌ను తిరిగి అనుమతించటం ద్వారా ద్వారం తెరిచారు. వచ్చే రోజుల్లో ఏదో ఒకసాకుతో మిగిలిన వాటికి కూడా తెరుస్తారా ? మన దేశానికి చెందిన ఏదో ఒక బడా కంపెనీకి లబ్ది కలిగితే ఎలాంటి సందేహం లేకుండా అనుమతిస్తారని వేరే చెప్పనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • చైనాతో వాణిజ్యంపై ఆందోళన – నిజా నిజాలేమిటి !
  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!

Recent Comments

pscknr's avatarpscknr on చైనాతో వాణిజ్యంపై ఆందోళన…
pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d