• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Japan

నరేంద్రమోడీ ప్రేమ-ద్వేషం : చైనా వద్దు అమెరికన్‌ విద్యుత్‌ కార్లు ముద్దు !

29 Wednesday Nov 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Environment, Europe, Health, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, UK, USA

≈ Leave a comment

Tags

BJP, BYD, Donald trump, Electric car wars, EU, Joe Biden, Narendra Modi, Narendra Modi Failures, Tesla


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో ఎలక్ట్రానిక్‌ కార్ల యుద్ధానికి తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చైనా ఒక వైపు, ఐరోపా సమాఖ్య-అమెరికా మరోవైపు మోహరిస్తున్నాయి. అమెరికా కంపెనీ టెస్లా కార్ల దిగుమతికిి మన కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదరిందని, వచ్చే ఏడాది నుంచి ఓడల్లో కార్లు దిగనున్నాయని వార్తలు. అధికారికంగా జనవరిలో ప్రకటించవచ్చు. రానున్న రెండు సంవత్సరాల్లో కార్ల తయారీ(విడి భాగాలను తీసుకువచ్చి ఇక్కడ అమర్చటం) కూడా ప్రారంభించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ప్రపంచంలో అత్యధిక కార్లను అమ్ముతున్న చైనా బివైడి కంపెనీతో కలసి కార్ల తయారీని ప్రారంభిస్తామన్న మెఘా ఇంజనీరింగ్‌ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. టెస్లా రెండు వందల కోట్ల డాలర్ల మేర కార్ల తయారీ కేంద్రానికి పెట్టుబడి పెడుతుందని మన దేశం నుంచి 1,500 కోట్ల డాలర్ల విలువగల విడి భాగాలను కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ సెప్టెంబరు నెలలో కాలిఫోర్నియాలోని టెస్లా కంపెనీని సందర్శించి వచ్చిన సంగతి తెలిసినదే. వంద కోట్ల డాలర్ల పెట్టుబడితో హైదరాబాదులో ఏటా పది నుంచి పదిహేను వేల కార్ల తయారీ, ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేస్తామని చైనా బివైడి-మెఘా చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలు చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అనుమతించే అవకాశం లేదని కారణం చెప్పింది. మెఘా కంపెనీ పెట్టుబడిపెడితే సాంకేతిక పరిజ్ఞానం చైనా కంపెనీ అందచేస్తుందని చెప్పినప్పటికీ అంగీకరించలేదు. దీనికి కారణం అమెరికన్‌ కంపెనీ టెస్లాను అనుమతించేందుకు సముఖంగా ఉండటమే అని చెప్పవచ్చు. మనం ఎలాగూ తయారు చేయలేనపుడు రెండు విదేశీ కంపెనీలు పోటీ పడి ధరలను తగ్గిస్తే మన వినియోగదారులకు లాభం, కొన్ని విడిభాగాలు ఇక్కడే తయారీ ద్వారా కొంత మేరకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ టెస్లావైపే మొగ్గుచూపటం ఏమిటన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. చైనాలో స్వంతంగా తయారు చేసే కంపెనీలు ఉన్నప్పటికీ టెస్లాను కూడా అనుమతించిన కారణంగా పోటీ బడి అది కూడా తక్కువ ధరలకే అక్కడ కార్లు అమ్ముతున్నది. మెఘా ఇంజనీరింగ్‌ కంపెనీ ఇప్పటికే చైనా కంపెనీతో కలసి ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.దానికి లేని అడ్డంకి కార్లకు వచ్చిందంటే 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణలు, చైనా వ్యతిరేక కూటమిలో మన దేశం మరింతగా భాగస్వామి కావటమే అని చెప్పవచ్చు.


ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిలో చైనా జోరు ప్రపంచ మార్కెట్లను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది.సాంప్రదాయ కార్ల నుంచి ఎలక్ట్రానిక్‌ వాహనాలకు మారితే ప్రస్తుతం తమ సంఘంలోని లక్షా యాభై వేల మంది కార్మికుల్లో 35వేల మందికి ఉపాధిపోతుందని అమెరికా యునైటెడ్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ తెలిపింది. తమ దేశంలో 2032 నాటికి మూడింట రెండువంతులు ఎలక్ట్రానిక్‌ కార్ల విక్రయమే ఉంటుందని అమెరికా ప్రకటించగా, 2035 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ కార్లనే అమ్ముతామని ఐరోపా సమాఖ్య పేర్కొన్నది. ఈ లక్ష్యాలను సాధించటానికి చైనా నుంచి వాహనాల దిగుమతులను అనుమతించాలా వద్దా అని ఆ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కేవలం ఎలక్ట్రిక్‌ మరియు ఇంథనంతోనూ నడిచే హైబ్రిడ్‌ కార్లతో సహా 2022లో ప్రపంచంలో నూటికి 60 చైనాలోనే ఉత్పత్తి చేశారు.చైనాలో ఐదువేల నుంచి 90వేల డాలర్ల వరకు ధర ఉండే 90 రకాల కార్లను అందుబాటులో ఉంచారు. సగటు ధర 53,800 డాలర్లుండగా ఐరోపాలో 94,100 డాలర్లుంది. ఈ ఏడాది చైనాలో మొత్తం కార్ల అమ్మకాల్లో నాలుగో వంతు(80లక్షలు) ఎలక్ట్రిక్‌ కార్లుండగా, ఐరోపా సమాఖ్య దేశాల్లో 22, అమెరికాలో ఆరు, జపాన్‌లో కేవలం మూడు శాతమే ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఐరోపా సమాఖ్య(ఇయు) 2022లో చైనా నుంచి దిగుమతి చేసుకున్న కార్లు సమాఖ్య మొత్తం ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో మూడు శాతమే. అవి 2030నాటికి 20శాతానికి చేరతాయని స్థానిక కార్ల కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. చైనా పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇచ్చిన కారణంగా తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపిస్తూ వాటి మీద విచారణ జరపాలని ఇయు నిర్ణయించింది. దిగుమతి సుంకాల మీద ఒక నిర్ణయం తీసుకొనేందుకు పూనుకుంది.ఇయు నిర్ణయం రక్షణాత్మక చర్యలు తప్ప మరొకటి కాదని వెంటనే చైనా స్పందించింది. అక్కడ ఇస్తున్న సబ్సిడీల సంగతేమిటని ప్రశ్నించింది. ఏ హౌదాతో తమపై విచారణ జరుపుతుందని నిలదీసింది. చైనా నుంచి వస్తున్న దిగుమతులతో స్థానికంగా ఉన్న కార్ల గిరాకీ 20శాతం తగ్గుతుందని అంచనా. చైనా కస్టమ్స్‌ సమాచారం ప్రకారం వర్తమాన సంవత్సరం ఏడునెలల్లో గతేడాది కంటే 113శాతం పెరగ్గా, 2020తో పోల్చితే3,205 శాతం ఎక్కువ. చైనా ఇస్తున్న సబ్సిడీలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే పోరాడాల్సిందేనని జర్మనీ మంత్రితో భేటీ అయిన ఫ్రెంచి ఆర్థిక మంత్రి బ్రూనో లీ మెయరే చెప్పాడు. అయితే కొందరు ఐరోపా వాణిజ్యవేత్తలు దర్యాప్తును వ్యతిరేకిస్తున్నారు. దీంతో చైనా కూడా ఎదురుదాడికి దిగితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు అనేక దేశాలు చైనా నుంచి చౌకగా వచ్చే కార్లను దిగుమతి చేసుకోవాలని ఉన్నా స్థానిక కార్మికులకు పని లేకుండా పోతుందనే భయం మరోవైపు ఉంది.ప్రపంచంలో ఆటో పరిశ్రమల్లో కార్మికులు కోటీ నలభై లక్షల మంది ఉండగా చైనాలో 40లక్షలు,ఇయులో 25, అమెరికా, మెక్సికో, జపాన్లలో పది లక్షల వంతున ఉన్నారు. గతేడాది ప్రపంచ కార్ల ఎగుమతి విలువ 780బిలియన్‌ డాలర్లు కాగా ఇయు 407, జపాన్‌ 87, అమెరికా 58, దక్షిణ కొరియా 52, మెక్సికో 47 బి.డాలర్ల వాటా కలిగి ఉండగా చైనా 45 బి.డాలర్ల మేరకే ఎగుమతి చేసింది. ఉక్కు రంగంలో 2021లో మిగతా దేశాలను వెనక్కు నెట్టేసినట్లుగా రానున్న రోజుల్లో కార్లలో కూడా చైనా అగ్రస్థానానికి వస్తుందేమోనన్న భయం వెల్లడవుతోంది.


అమెరికాలో పికప్‌ ట్రక్కుల మీద 25శాతం తప్ప సాధారణ పన్ను 2.5శాతమే, అయితే చైనాతో వాణిజ్యపోరు ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా కార్ల మీద 25శాతం విధించగా దాన్ని జోబైడెన్‌ కొనసాగిస్తున్నాడు. జపాన్‌లో అసలు పన్ను లేదు, పదిశాతం వసూలు చేస్తున్న ఇయు చైనా కార్ల మీద పన్ను పెంచాలని చూస్తున్నది.చైనా కంపెనీలు తక్కువ ధరలకు కార్లను ఎందుకు విక్రయించగలుగుతున్నాయన్నది ప్రశ్న. ఎలక్ట్రిక్‌ కార్లలో కీలకమైనవి. లిథియం – అయాన్‌ బ్యాటరీలు.వీటి పరిశోధన-అభివృద్దికి చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది, ఆ రంగంలో ఉన్నవారికి రాయితీలిచ్చింది. దానికి తోడు వాటి తయారీకి అవసరమైన ముడిపదార్దాలు చైనాలో పుష్కలంగా ఉండటం అక్కడి కంపెనీలకు కలసివచ్చింది. దీంతో స్థానిక వినియోగదారులు ఆకర్షితులౌతున్నారు ప్రపంచంలో వందకార్లు అమ్మితే గతేడాది చైనాలోనే 59 అమ్మారు. ఈ ఊపుతో ప్రపంచ మార్కెట్లకు విస్తరించాలని అక్కడి కంపెనీలు చూస్తున్నాయి. ఐరోపా దేశాల్లో తలెత్తిన కాలుష్యం కారణంగా రోడ్ల మీద ధ్వనితో 40శాతం మంది బ్రిటీష్‌ పౌరులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తేలింది.వాయు కాలుష్యంతో శ్వాస సమస్యలు పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ కార్ల వలన 17 నుంచి 30శాతం వరకు గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ విడుదల తగ్గుతుందని అంచనా. అందుకే 2035నాటికి బ్రిటన్‌లో మొత్తం ఎలక్ట్రిక్‌ కార్లనే అమ్మాలని నిర్ణయించారు. ఒకవైపు చమురు ఇంథన కాలుష్యం తగ్గుతుందనే సానుకూలత ఉన్నా ప్రతికూలతల గురించి కూడా చర్చ మొదలైంది. హరిత ఇంథనం కోసం ధనికదేశాల ప్రయత్నం పేద దేశాల్లో పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నది.


ప్రస్తుత తీరుతెన్నులను చూస్తే చైనా – ఇతర దేశాల మధ్య కార్ల ధరల యుద్దం జరిగే సూచన కనిపిస్తున్నది. అమెరికా కంపెనీ టెస్లా దీనికి నాంది పలికింది.దీంతో చైనాలోని కొన్ని రకాల కార్ల ఉత్పత్తిని ఆపివేయాల్సి వచ్చింది.ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో దేశీయ మార్కెట్లో 114లక్షల కార్లను విక్రయించగా 20లక్షలు ఎగుమతి చేసింది. విదేశీ ఎగుమతులు 80శాతం పెరగ్గా, స్వదేశీ మార్కెట్‌ 1.7శాతమే పెరిగినందున ధరల పోటీకి దిగితే చైనా కూడా నష్టపోవచ్చని కొందరు చెబుతున్నారు.గతేడాది డిసెంబరు నాటికి చైనాలో 4.3 కోట్ల కార్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉందని, ఉన్న సామర్ధ్యంలో 2017లో 66.6శాతం వినియోగిస్తే గతేడాది 54.5శాతంగా ఉందని రాయిటర్స్‌ పేర్కొన్నది.అక్కడ ఆటోపరిశ్రమ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మూడు కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. జపాన్‌ కార్ల పరిశ్రమకు సైతం చైనా సెగతగులుతోంది.టయోటా తదితర కంపెనీలు తమ డిమాండ్‌ పడిపోకుండా చూసుకుంటున్నాయి.చైనాలో హైబ్రిడ్‌ కార్లకు మార్కెట్‌ ఎక్కువగా ఉంది. నిజంగా కార్ల ధర యుద్దమే తీవ్రమైతే చైనాకు తక్షణమే ఇబ్బంది ఉండదు. ఇప్పటికే సామర్ధ్యాన్ని సమకూర్చుకున్నందున పూర్తిస్థాయిలో ఉత్పత్తి వెంటనే జరపవచ్చు, అదే మిగతా దేశాల్లో సామర్ధ్యాన్ని పెంచుకొనేందుకు భారీగా పెట్టుబడులను కూడా పెట్టాల్సి వస్తుంది.


మన దేశంలో ఎలక్ట్రానిక్‌ కార్ల తయారీకి పూనుకుంటే ముడిపదార్దాలు, బ్యాటరీల కోసం చైనా మీద ఆధారపడటం పెరుగుతుందని గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(గిట్రి) ఈ ఏడాది మార్చి నెలలో తన నివేదికలో పేర్కొన్నది. భారత్‌లో తయారయ్యే వాహనాలకు అవసరమైన వాటిలో 70శాతం వస్తువులను చైనా, ఇతర దేశాల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుంది..కాలుష్యం, ఉపాధిపై తలెత్తే పర్యవసానాల వంటి 13 అంశాలను గిట్రి గుర్తించింది.ఈ వాహనాల బ్యాటరీలను దిగుమతి చేసుకోవాలి, ధరలు ఎక్కువగా ఉంటాయి, ఆరేడు సంవత్సరాల తరువాత కొత్తవాటిని వేసుకోవాలి, వాటిని రీసైకిల్‌ చేయాలంటే వెలువడే విషపదార్దాలు సమస్యగా మారతాయి, దీని వలన విద్యుత్‌ గిరాకీ పెరుగుతుంది, బొగ్గుద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ ప్రక్రియలో కాలుష్యం పెరుగుతుంది. దూరప్రయాణాలకు అనువుగా ఉండవు,ప్రజా రవాణాకు పెద్దగా ఉపయోగపడవు,చైనా మీద ఎక్కువగా ఆధారపడటం వంటి అంశాలను పేర్కొన్నది. ఆటో విడిభాగాలను తయారు చేసే ఏడు వందల సంఘటిత రంగ సంస్థలతో పాటు పదివేల అసంఘటిత రంగ సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. విడిభాగాలు అమ్మేవారు, లక్షలాది గారేజ్‌ షాపులు, సర్వీసు సెంటర్ల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని కూడా పేర్కొన్నది. తమ కాలుష్యకారక పరిశ్రమలను రక్షించుకొనేందుకు, ప్రపంచ వాణిజ్యాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లాలని ఐరోపా దేశాల చెబుతున్నాయి తప్ప ప్రపంచమంతా అలా లేదు.ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు చార్జర్లకు ఒక ప్రమాణం లేదు, అందువలన ప్రతి సంస్థ తనదైన నమూనాను ఇస్తున్నది, దేశమంతటా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నదని గిట్రి పేర్కొన్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పతకాలు తెచ్చిన భారత ఆసియాడ్‌ క్రీడాకారులకు అభినందనలు – ఆటలను పట్టించుకోని పాలకులకు అక్షింతలు !

08 Sunday Oct 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Sports

≈ Leave a comment

Tags

Asian Games 2023, BJP, China, First Asian Games, Hangzhou Asian Games, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


చైనాలోని హాంగ్‌ఝౌలో శనివారం నాడు ముగిసిన పందొమ్మిదవ ఆసియాడ్‌లో మన క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. పతకాల వేటలో గత 70 రికార్డును అధిగమించి వంద పతకాలను సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో వెళ్లి 107 పతకాలతో తిరిగి వచ్చినందుకు యావత్‌ దేశం వారిని అభినందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలను తెచ్చి దేశ కీర్తిపతాకను సమున్నతంగా ఎగురవేయాలని ఆశిస్తోంది.నాలుగేండ్లకు ఒకసారి జరుగుతున్న ఆసియా క్రీడలు చైనాలో కరోనా నిరోధ చర్యల కారణంగా 2022లో జరగాల్సినవి ఈ ఏడాది నిర్వహించారు. 2026లో జపాన్‌లోని ఇచి, నాగోయా నగరాల్లో జరగనున్నాయి. మన క్రీడాకారులు 28 బంగారు,38 రజిత, 41 కాంస్య పతకాలను సాధించారు. వీటిలో కొన్ని అనూహ్య పతకాలు ఉన్నాయి. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా తరువాత నాలుగవ స్థానంలో మన దేశం ఉంది.జనాభాతో, ఆర్థికంగా చైనాతో పోటీపడుతున్న మనం క్రీడల్లో ఎందుకు పోటీలో లేము అని ఎవరైనా అనుకోవచ్చు.దానికి ఏడున్నర దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న పార్టీలు, వాటి నేతలు తప్ప క్రీడాకారులు కాదు. అధికారం నిలుపుకోవటం మీద ఉన్న యావ యువతలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలన్నదాని మీద ఏ మాత్రం లేదు. పోటీలకు ముందు రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌ (బిజెపి ఎంపీ ) నిర్వాకం, క్రీడాకారుల ఆందోళన గురించి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తన ఎంపీని కాపాడుకొనేందుకు ఇచ్చిన ప్రాధాన్యత పోటీల్లో పాల్గొనేవారి పట్ల చూపలేదు. అందుకే చివరికి ఫెడరేషన్‌ లేదు, జాతీయ శిక్షణా శిబిరాలు లేవు, అంతర్జాతీయ శిక్షకులు లేరు, అయినప్పటికీ తాజా క్రీడల్లో వారు ఒక వెండి, నాలుగు కాంస్య పతకాలను సాధించారు.మరికొన్ని క్రీడలకు సంబంధించిన వివాదాల కారణంగా చివరి వరకు ఎంపికలు జరగలేదంటే మన యాజమాన్య నిర్వహణ ఎంత అసమర్ధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఈక్వెస్ట్రియన్‌ పోటీలో పాల్గొనాలంటే క్రీడాకారులతో పాటు గుర్రాలను కూడా తీసుకుపోవాల్సి ఉంటుంది. క్వారంటైన్‌ నిబంధనల కారణంగా భారత గుర్రాలను చైనా అనుమతించటం లేదనే కీలక అంశాన్ని తన దగ్గర దాచారని క్రీడాకారుడు గౌరవ్‌ పుందిర్‌ చెప్పాడు. తీరా తెలుసుకున్న తరువాత ఐరోపా, మరోచోట తగిన గుర్రాల కోసం వెళ్లేందుకు, శిక్షణ పొందేందుకు తనకు అవకాశం లేకుండా పోయిందని, ఎంపిక విధానాన్ని కూడా మార్చారని వాపోయాడు. పోటీలకు వెళ్లకుండా తనను అడ్డుకోవటమే ఫెడరేషన్‌ అధికారుల ఎత్తుగడగా కనిపించిందని ఆరోపించాడు. పతకాలు వచ్చిన వారికి బహుమతులు ఇచ్చి గొప్పలు చెప్పుకోవటం కాదు కావాల్సింది. ప్రతిభను గుర్తించి అవసరమైన శిక్షణ సౌకర్యాలు, క్రీడలనే ఆలంబనగా చేసుకున్న వారు జీవితంలో స్థిరపడేందుకు ఇచ్చే చేయూతను బట్టే యువతరం ముందుకు వస్తుంది. ఇప్పుడు వచ్చిన పతకాల కీర్తి కూడా క్రీడాకారుల తపనకు, వారిని ప్రోత్సహించిన తలిదండ్రులకు తప్ప మరొకరికి దక్కదు. ఈ క్రీడల్లో కొన్ని అనూహ్య పతకాలను మన దేశానికి సాధించటం సంచలనం కలిగించింది.


1951లో మనదేశమే తొలి ఆసియాడ్‌కు ఆతిధ్యమిచ్చింది.నాడు 17 దేశాల వారు 489 మంది పాల్గొంటే ఇప్పుడు 41కి, పోటీలు 57 నుంచి 481 అంశాలకు పెరిగాయి. చైనా 1962 నుంచి మాత్రమే పాల్గొంటున్నది.ఇప్పటి వరకు వివిధ దేశాలు సాధించిన బంగారు పతకాల సంఖ్య ఇలా ఉంది. బ్రాకెట్లలో ఉన్నవి మొత్తం పతకాల సంఖ్య) చైనా 1,674 ( 3,570, జపాన్‌ 1,084( 3,240), దక్షిణ కొరియా 787 (2,425), ఇరాన్‌ 193 (611), భారత్‌ 183( 779).తొలి ఆసియన్‌ గేమ్స్‌ జరిగిన తీరు చూస్తే అసలు నిర్వాహకులు ఎంత ఇబ్బంది పడింది, అధికారంలో ఉన్నవారికి క్రీడల పట్ల శ్రద్దలేమి స్పష్టంగా కనిపించింది. నాటి నుంచి నేటి వరకు ఉత్సాహవంతులైన వారి చొరవే ప్రధానంగా కనిపించింది. తొలి క్రీడల్లో జపాన్‌ 24 బంగారు పతకాలతో మొత్తం 58 పొందగా రెండవ స్థానంలో మన దేశం 15 స్వర్ణాలతో 51 పతకాలు సాధించింది. తరువాత 1962లో జపాన్‌ 73 స్వర్ణాలతో ముందుండగా పదింటితో రెండవ స్థానంలో మన దేశం ఉండటం తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం రెండవ స్థానానికి ఎదగలేదు. టెహరాన్‌ 1974 క్రీడలలో చైనా 32 స్వర్ణాలతో రెండవ స్థానంలోకి వచ్చింది. తరువాత 1982లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియాడ్‌లో తొలిసారిగా 61 పతకాలతో జపాన్ను వెనక్కు నెట్టి మొదటి స్థానానికి వచ్చిన చైనా అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూడలేదు.1990లో తొలిసారిగా చైనాలో ఆసియా క్రీడలు జరిగాయి.183 బంగారు, మొత్తం 341 పతకాలతో చైనా క్రీడాకారులు అదరగొట్టారు. తాజా పోటీలలో 200 స్వర్ణ, 111 రజత, 71 కాంస్యాలతో మొత్తం 382 పతకాలను సాధించింది.


1896 నుంచి 2020 వరకు జరిగిన ఒలింపిక్స్‌లో మనదేశం నిరాశాజనక ప్రతిభనే కనపరిచింది.2024లో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో మంచి ప్రతిభ కనపరచాలని కోరుకుందాం. 2020లో జరగాల్సిన టోకియో ఒలింపిక్స్‌ మరుసటి ఏడాది జరిగాయి. వాటిలో 39 స్వర్ణాలు, మొత్తం 113 పతకాలతో అమెరికా, 38 స్వర్ణాలు, మొత్తం 89తో చైనా, 26 స్వర్ణాలు, మొత్తం 57 పతకాలతో జపాన్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మన దేశం ఒక స్వర్ణం, మొత్తం ఏడు పతకాలతో 48వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన 32 పోటీల్లో ఐదు స్థానాలో అధిక పతకాలు తెచ్చుకున్న తొలి దేశాల వివరాలు ఇలా ఉన్నాయి. సోవియట్‌ యూనియన్‌కు వెయ్యికిపైగా పతకాలు వచ్చినప్పటికీ అది ఉనికిలో లేనందున దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చైనా ఆలశ్యంగా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిందన్న అంశాన్ని గమనలో ఉంచుకోవాలి.1984 లాస్‌ ఏంజల్స్‌ పోటీల నుంచి పాల్గొంటున్నది.
దేశం×××× స్వర్ణం ××రజతం×× కాంస్య××× మొత్తం
అమెరికా × 1,061×× 830 ×× 738××× 2,629
బ్రిటన్‌ ××× 284 ×× 318 ×× 314 ××× 916
ఫ్రాన్స్‌×××× 223 ×× 251×× 277 ××× 751
జర్మనీ×××× 201 ×× 207 ×× 247 ××× 655
చైనా ×××× 263 ×× 199 ×× 174 ××× 636
ఇటలీ ×××× 217 ×× 188 ×× 213 ××× 618
భారత్‌ ×××× 10 ×× 9 ×× 16 ××× 35


క్రీడలకు రాజకీయాలు ఉండవు. రాజకీయ కారణాలతో కొన్ని దేశాలు కొన్ని పోటీలను బహిష్కరించిన ఉదంతాలు ఉన్నాయి. చైనాతో జనాభాను అధిగమించిన మనం క్రీడల్లో ఎందుకు దూసుకుపోలేకపోతున్నాం అన్నది ప్రశ్న. మన దేశంలో పిల్లలతో ఆటలాడించేందుకు స్థలాల్లేకుండానే పాఠశాలలకు అనుమతులిస్తున్నారు. ఎన్ని స్కూళ్లలో క్రీడోపాధ్యాయులు ఉన్నారు. ఎన్ని చోట్ల ఆటలాడిస్తున్నారు, అవసరమైన కనీస పరికరాలు ఎన్ని చోట్ల ఉన్నాయి అన్నది రోజు మనం చూస్తున్నదే.కేంద్రమైనా, రాష్ట్రాలైనా ఒకే విధంగా ఉన్నాయి. పిండికొద్దీ రొట్టె అన్నారు. క్రీడల మీద మనం చేస్తున్న ఖర్చు ఎంత ? మాజీ అధ్లెట్‌, 2018లో కేంద్ర మంత్రిగా ఉన్న రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాధోడ్‌ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ 2017-18లో కేంద్ర క్రీడల బడ్జెట్‌ రు.1,329 కోట్లని, 2011 జనాభా లెక్కల ప్రకారం రోజుకు తలకు ఒక్కరి మీద మూడు పైసలు క్రీడలకు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.ఆ వార్తను ప్రచురించిన స్పోర్ట్స్‌ క్రీడా డాట్‌ కామ్‌ చైనా డైలీలో వచ్చిన సమాచారం ప్రకారం చైనా ప్రభుత్వం ఏటా 316.5బిలియన్‌ యువాన్లు ఖర్చు చేస్తున్నదని దాన్ని రూపాయల్లో మారిస్తే మూడులక్షల కోట్లని(2018 జనవరి 9) పేర్కొన్నది. ఈ ఏడాది మార్చి 28వ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో వచ్చిన వార్త ప్రకారం 2007-08లో మన కేంద్ర బడ్జెట్‌లో రు.708 కోట్లు కేటాయించారని తరువాత కామన్‌వెల్త్‌ క్రీడలు ఉన్నందున 2009-10లో రు.3,760, మరుసటి ఏడాది రు.2,841కోట్లుగా ఉందని 2015-16లో రు.1,121 కోట్లకు తగ్గింది. ఖేలో ఇండియా కార్యక్రమం ప్రకటించిన తరువాత 2019-20లో రు.2,636 కోట్లు కేటాయించారు. కరోనాలో రు.1,800 కోట్లకు తగ్గించారు.2023-24 బడ్జెట్‌లో రు.3.397 కోట్లు కేటాయించగా దానిలో ఖేలో ఇండియాకు వెయ్యికోట్లు పక్కన పెట్టారు.ఈ మొత్తం 140 కోట్ల జనాభాకు తలకు ఏటా రు.24 అవుతుంది. బ్రిటన్‌లో 2022-23లో తలకు రు.4,898, ఆస్ట్రేలియాలో రు.976 ఖర్చు చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏటా కేటాయిస్తున్న మొత్తాలు రూపాయలలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. కానీ ఎంత పెరిగినప్పటికీ మొత్తం బడ్జెట్‌లో వాటా 0.6 నుంచి 0.8శాతం మధ్యనే ఉంటోంది. మన దేశంలో ఇంత తక్కువ ఖర్చు పెడితే క్రీడాకారులు ఎలా తయారవుతారు, పతకాలు ఎలా వస్తాయి ? పోనీ ప్రతిభ గలవారికి కొరత ఉందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

జి 20 ఢిల్లీ శిఖరాగ్ర సభ : రష్యాను ఖండించకుండా పశ్చిమ దేశాలు ఎందుకు దిగి వచ్చాయి !

13 Wednesday Sep 2023

Posted by raomk in Africa, BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

BJP, China, G 20, G20 Delhi summit, Joe Biden, Narendra Modi, Ukraine crisis, Vladimir Putin, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో జి 20 దేశాల 2023 శిఖరాగ్ర సమావేశం జయప్రదంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఒక సభ్య దేశ ఆతిధ్యంలో సమావేశాలు జరుగుతాయి. గత ఏడాది ఇండోనేషియాలో జరగ్గా వచ్చే ఏడాది బ్రెజిల్‌ వేదిక కానుంది. మరుసటి ఏడాది దక్షిణాఫ్రికాలో జరుగుతుంది, కాగా 2026లో జరగాల్సిన సభకు అమెరికా వేదిక కావటాన్ని చైనా ప్రశ్నించినప్పటికీ చివరికి అంగీకరించింది. ప్రతి సమావేశం తరువాత విడుదల చేసే సంయుక్త ప్రకటన విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తినప్పటికీ చివరికి విడుదల చేశారు. ఈ కూటమిలోని కొన్ని దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్ర విబేధాలు, పరస్పర అనుమానాలు తదితర కారణాల వలన చైనా అధినేత షీ జింపింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హాజరు కాలేదు. దీని గురించి ఎవరికి తోచిన ఊహాగానాలను వారుచేశారు తప్ప అధికారికంగా సదరు దేశాల నుంచి ఎలాంటి ప్రకటనలూ విడుదల కాలేదు. చైనా తరఫున ప్రధాని లీ చియాంగ్‌, రష్యా నుంచి విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావరోవ్‌ ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహించారు. ఈ కూటమిలో ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వం ఇవ్వటంతో ఇప్పటి నుంచి అది జి21గా మారింది. దీనిలో 19 దేశాలు ఉన్నాయి. వాటిలో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా,ఇండోనేషియా, రష్యా, చైనా, అర్జెంటీనా, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, మెక్సికో, కెనడా, బ్రిటన్‌, జర్మనీ,ఫ్రాన్స్‌, టర్కీ, ఇటలీ, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా ఉన్నాయి. ఆఫ్రికా యూనియన్‌, ఐరోపా యూనియన్‌ పూర్తి సభ్యత్వం గల సంస్థలు, ఐరాసతో సహా కొన్ని శాశ్వత ఆహ్వానితుల జాబితా ఉన్నాయి. పశ్చిమ దేశాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తినపుడు ఒక పరిష్కార మార్గంగా ఈ కూటమి ఏర్పాటుకు 1999లో జి7 దేశాల కూటమి ఆలోచన చేసింది. 2008లో ధనిక దేశాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తినపుడు ప్రతి ఏటా శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.


ఈ కూటమిలో ఇప్పటి వరకు ఆహ్వానితురాలిగా ఉన్న ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వ హౌదా కల్పిస్తూ ఢిల్లీ సభ ఆమోదం తెలిపింది. దీనికి కారకులం తామంటే తామని మన దేశంతో పాటు రష్యా, చైనాలు కూడా ప్రకటించుకున్నాయి.ఈ చర్య ద్వారా పేద దేశాల గొంతుక వినిపించేందుకు అవకాశం వచ్చిందన్నది స్పష్టం. సభ్యత్వం ఇచ్చిన ఖ్యాతిని ఎవరి ఖాతాలో వేసుకోవటం అన్నది ముఖ్యం కాదు. వాటికి తోడ్పడుతున్నది ఎవరు అన్నదే గీటురాయి. దాన్ని పరిశీలించినపుడు ఇటీవలి కాలంలో ఆఫ్రికా ఖండంలో రష్యా, చైనా సాయంతో పాటు వాటి పలుకుబడి కూడా పెరుగుతోందన్నది అందరికీ తెలిసిందే. న్యూఢిల్లీ సభ జరిగిన తీరుతెన్నులు, పర్యవసానాలు, ఫలితాల గురించి సమీక్షలు వెలువడుతున్నాయి. తీసుకున్న నిర్ణయాలపై నవంబరు నెలలో వీడియో కాన్ఫరెన్సుద్వారా సమీక్ష జరుపుతారు. ఆమోదించాల్సిన తీర్మానాలు, నిర్ణయాల మీద ఏకాభిప్రాయం సాధించే బాధ్యత ఆతిధ్య దేశం కలిగి ఉంటుంది. అందుకు అనుగుణ్యంగానే దాన్ని మన దేశం కూడా నిర్వహించింది.ఐరాస తీర్మానాలు, పారిస్‌ ఒప్పందాల వంటి వాటినే అంగీకరించకుండా, అమలు జరపకుండా ఠలాయిస్తున్న దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి.నిర్ణయాలను స్వచ్చందంగా అమలు జరపటం తప్ప విధి కాదు. కొన్ని స్పందనలు, కొన్ని అభిప్రాయాలకు భిన్నంగా దేశాలు వ్యవహరిస్తున్న తీరు తెన్నుల గురించి స్థూలంగా చూద్దాం. ఈ సమావేశాలను తన రాజకీయ ప్రయోజనాలకు నరేంద్రమోడీ ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం మనదేశంలో ఇప్పటికే ఉంది. సభ జరిగిన తీరు మీద బిజెపి, నరేంద్రమోడీ మద్దతుదారుల స్పందన కూడా దానికి అనుగుణంగానే ఉంది.


పశ్చిమాసియాలో ప్రముఖ మీడియా సంస్థ ” అల్‌ జజీరా ” లో రాసిన ఒక విశ్లేషణ ఇలా ప్రారంభమైంది.” నరేంద్రమోడీ మోము, భారత దౌత్య మహత్తు(లేదా వివేకము) ప్రదర్శితమైంది.కానీ భారత భిన్నత్వ ప్రదర్శనకు అవకాశాన్ని నిరాకరించారు.భారత్‌ 140 కోట్ల జనాభా ఉన్న దేశం. కానీ సమావేశ రోజుల్లో రాజధాని నగరంలో ఎక్కడ చూసినా కేవలం ఒక ముఖమే కనిపించింది. జి 20 కూటమి నేతలకు ఆతిధ్యం ఇస్తున్న ప్రధాని నరేంద్రమోడీదే అది. కేవలం విమానాశ్రయం వద్దనే కాదు, సభకోసం ఇటీవల జరిపిన నిర్మాణం వరకు చూస్తే ప్రతి రోడ్డు, కొన్ని చోట్ల ప్రతి కొన్ని అడుగులకు, ఎక్కువ చోట్ల రెండుకార్ల పొడవునా ఒక వ్యక్తి ప్రదర్శన మాత్రమే కనిపించింది. దౌత్య ఆడంబర ప్రదర్శనలో మోడీ హీరో కాగా మధ్య ఢిల్లీలో సభ నిర్వహణ ప్రాంతానికి సమీపంలోని విదేశీరాయబార కార్యాలయాలు, హౌటళ్ల వద్ద సంచరించే కోతులను భయపెట్టేందుకు వాటి బొమ్మలతో కూడిన భారీ కటౌట్లను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. సభ జరిగిన చోట వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేసే భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతీకగా ఉన్న మోడీ బొమ్మలు ఎక్కువగా కనిపించాయి. ప్రగతి మైదాన్‌గా పిలుస్తున్న ప్రాంతంలో కొత్త సభా భవనాన్ని నిర్మించి దానికి భారత మండపం అని పేరు పెట్టారు. దీంతో లౌకిక ముద్ర నుంచి దూరంగా జరిగినట్లయింది. హిందూ దేవాలయాల్లో ముందు వసారాలను మండపం అని పిలుస్తారు. ” ఈ విశ్లేషణలో వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు.


శిఖరాగ్ర సభ ఒక రోజు ముందే సంయుక్త ప్రకటనను ఆమోదించింది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్‌ అని దానిలో పిలుపునిచ్చారు. ఈ సుభాషితంతో ఎవరికీ ఇబ్బంది లేదు, అభినందనీయమే. దానికి కట్టుబడి ఉన్నది ఎవరన్నదే ప్రశ్న. ఇది యుద్ధాలకు తగిన యుగం కాదు అన్నది ప్రకటనలోని ఒక అంశం. ఈ కూటమి ఉనికిలోకి వచ్చిన తరువాతనే ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్ల మీద ఈ కూటమిలోని దేశాలు దురాక్రమణలకు పాల్పడిన చరిత్ర, అనేక దేశాల మీద దాడులకు ఉగ్రవాదులను,కిరాయి మూకలను ఉసిగొల్పుతున్న తీరు తెలిసిందే. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఎగదోసిందీ, రష్యా ప్రాదేశిక భద్రత మీద ఎలాంటి హామీ ఇవ్వకుండా ఆయుధాలను సరిహద్దుల్లోకి చేర్చటం ప్రారంభించిన తరువాతే పుతిన్‌ సైనిక చర్యకు పాల్పడినదాన్ని ప్రపంచం చూసింది. దాన్ని పరిష్కరించాల్సిన పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు తమ ఆయుధ సంపత్తిని అందిస్తూ ప్రోత్సహిస్తూ మరోవైపు సుద్దులు చెప్పటం హాస్యాస్పదం. తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని ఐరాస గుర్తించింది. దాన్ని విలీనం చేసుకొనే హక్కు చైనాకు ఉంది. దానికి తగిన సమయం రాలేదంటూ తైవాన్‌కు ఆయుధాలు ఇస్తూ చైనా మీద దాడికి ఉసిగొల్పుతున్న దేశాల నిజాయితీ ఏమిటన్నది ప్రశ్న. దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో చైనా ఇంతవరకు ఏ దేశ నౌకనూ అడ్డుకున్న దాఖలా లేదు.


న్యూఢిల్లీ ప్రకటనలో పేర్కొన్న లక్ష్యానికి భిన్నంగా ప్రపంచంలో పరిణామాలు జరుగుతున్నాయి. అణ్వాయుధాల వినియోగం గురించి ప్రకటన హెచ్చరించింది. కానీ తానుగా వాటిని వినియోగించబోనని ప్రకటించేందుకు ఇంతవరకు అమెరికా అంగీకరించ లేదు. అణ్వాయుధాలను మోసుకుపోయే ఆధునిక క్షిపణులు, విమానాలను రోజు రోజుకూ మెరుగుపరుస్తోంది. ఐరాస నిబంధనావళి ప్రకారం ఏ దేశమూ బలప్రయోగం చేయకూడదని పేర్కొన్నది. దీని మీద కూటమి దేశాలు రాజీపడినట్లు ఉక్రెయిన్‌ మండిపడింది. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడతామని రష్యా కూడా అంగీకరించిందని అందుకే దిగి వచ్చి సంతకం చేసిందని కొందరు పశ్చిమ దేశాల వారు వక్రీకరించారు. వాస్తవానికి పశ్చిమ దేశాల వలలో చిక్కుకొని నాటోలో చేరి తమ ప్రాదేశిక భద్రతకు ముప్పు తలపెట్టినందున ఉక్రెయిన్ను దారికి తెచ్చేందుకు సైనిక చర్య జరుపుతున్నాం తప్ప దాన్ని ఆక్రమించుకొనే లక్ష్యం లేదని రష్యా ప్రారంభం నుంచీ చెబుతున్నది. రష్యా,ఉక్రెయిన్ల నుంచి ఆహారం, ధాన్యాలు, ఎరువుల సరఫరాను పునరుద్దరించాలని, ఎగుమతి దిగుమతులను అడ్డుకోరాదని, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కూడా జి21 కూటమి కోరింది. టర్కీ మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందాన్ని పశ్చిమ దేశాలు ఉల్లంఘించి తమను దెబ్బతీస్తున్న కారణంగానే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ కారణంగా అనేక పేద దేశాలు అధిక ధరలకు ఇతర దేశాల నుంచి ఆహారాన్ని దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితికి పశ్చిమ దేశాలే కారణం. రైతులు విదేశాలకు సైతం ఎగుమతులు చేసుకొని లబ్దిపొందవచ్చంటూ మూడు సాగు చట్టాలను రైతుల మీద రుద్దినపుడు కబుర్లు చెప్పిన నరేంద్రమోడీ జి20 అధ్యక్ష స్థానంలో ఉన్నపుడే గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లి ఎగుమతులను కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.


ఢిల్లీ సమావేశానికి షీ జింపింగ్‌ హాజరు కాకపోవటం గురించి మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.గతంలో జరిగిన ఇలాంటి శిఖరాగ్ర సమావేశాలకు కొన్ని దేశాల నేతలు రాకపోవటం తెలిసిందే. కానీ జింపింగ్‌ రాలేదంటే దాని వెనుక బలమైన కారణాలేమీ లేవంటే ఎవరూ నమ్మరు, తప్పుకుండా ఉండి ఉంటాయి. చతుష్టయ కూటమి(క్వాడ్‌) అమెరికా, భారత్‌,జపాన్‌, ఆస్ట్రేలియా కూటమి తనకు వ్యతిరేకమే అని చైనా భావిస్తున్నది. ఈ కూటమి నేతలను వచ్చే రిపబ్లిక్‌ దినోత్సవ అతిధులుగా పిలవాలని మన ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీలో ఒక గదిలో చైనా ప్రధాని ఉండగా మరొక పక్క గదిలో జో బైడెన్‌-నరేంద్రమోడీ సమావేశమై క్వాడ్‌ పటిష్టత గురించి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్చా నౌకారవాణా గురించి చర్చలు జరిపారు. ఇవి చైనాను రెచ్చగొట్టేవే అన్నది స్పష్టం. వీటికంటే ముందే చైనా రూపొందించిన ప్రపంచ పటంలో మన భూభాగాలను కొన్నింటిని మినహాయించటం, దాని మీద వివాదం చెలరేగిన సంగతీ తెలిసిందే. గతేడాది ఇండోనేషియా నగరమైన బాలిలో జరిగిన సమావేశ ప్రకటనలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఖండిస్తూ చేర్చిన పేరా వివాదాస్పదమైంది. రాజీమార్గంగా చివరకు ఎక్కువ మంది సభ్యులు ఖండించారని, పరిస్థితి మీద ఇతరులు భిన్నమైన వైఖరులను వెల్లడించారని పేర్కొన్నారు. మొత్తం మీద ఖండన దానిలో కనిపించింది. ఆ సమావేశంలో వీడియో కాన్ఫరెన్సుద్వారా మాట్లాడిన ఉక్రెయిన్‌ నేత జెలెనెస్కీ కూటమిని జి20 బదులు జి19 అని సంబోధించటం(రష్యాను గుర్తించకుండా) కూడా రచ్చకు దారి తీసింది. సమావేశం జరుగుతుండగా పోలాండ్‌లో క్షిపణి పేలుడు జరిగింది. వాస్తవాలు నిర్ధారించుకోకుండానే దానికి రష్యా కారణమని ఆరోపించటం, సభలో ఉన్న జి7, నాటో కూటమి దేశాల నేతలు అక్కడే విడిగా సమావేశం కావటం, వాటన్నింటికంటే ముందే రష్యా ప్రతినిధి వర్గ నేత లావరోవ్‌తో ఫొటో దిగేందుకు అనేక మంది నేతలు తిరస్కరించటంతో అసలు బాలిలో పాల్గన్నవారి కుటుంబ చిత్రమే లేకుండా పోయింది. తరువాత జరిగిన అనేక పరిణామాలు చైనా, రష్యాలతో అమెరికా, ఐరోపా పశ్చిమ దేశాల సంబంధాలు మరింతగా దిగజారాయే తప్ప మెరుగుపడలేదు. బాలిలో షీ జింపింగ్‌-జో బైడెన్‌ భేటీ జరిగింది, సంబంధాలను, మాటా మంతిని పునరుద్దరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన వెలువడింది. కానీ ఆ వెంటనే అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నానీ పెలోసీ చైనా అభ్యంతరాలను ఖాతరు చేయకుండా పంతంతో తైవాన్‌ వెళ్లటం తెలిసిందే. తరువాత అమెరికా సర్కార్‌ మరింతగా మిలిటరీ సాయాన్ని ప్రకటించింది. ఈ పూర్వరంగంలో వెళ్లకపోవటమే మంచిదని షీ జింపింగ్‌, పుతిన్‌ భావించి ఉండాలి.సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించి బాలి ప్రకటనలో ఉన్న పదజాలానికి భిన్నంగా రష్యా పేరు లేకుండా యుద్ధం కారణంగా జనం పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే పేర్కొన్నారు. ఇది పశ్చిమ దేశాలకు ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. బాలిలో మాదిరి ఖండిస్తే చైనా, రష్యా అంగీకరించకపోతే అసలు ప్రకటనే వెలువడి ఉండేది కాదు. అది జరిగితే తాము బలపరస్తున్న నరేంద్రమోడీ ప్రతిష్టకు భంగం అని భావించి పశ్చిమ దేశాలు అయిష్టంగానే రష్యా మిలిటరీ చర్య ప్రస్తావన లేకుండా అంగీకరించినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన అగ్ని క్షిపణులు చైనాను భయపెడతాయా ? పరిజ్ఞానంలో ఏ దేశం ఎక్కడుంది ?

06 Wednesday Sep 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

Agni V, BJP, China, Missile technology, Propaganda War, RSS


ఎం కోటేశ్వరరావు


చైనాను చంద్రయాన్‌-3 విజయవంతం కావటంతో యావత్‌ దేశం మన ఇస్రో శాస్త్రవేత్తలను వేనోళ్ల కొనియాడుతున్నది. ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరొక దారి అన్న సామెత తెలిసిందే.మన ఇస్రో విజయాన్ని కూడా మతకళ్లతో చూసే బాపతు రెచ్చిపోతున్నది. మన దేశంలో మిసైల్‌ మహిళగా పేరు తెచ్చుకున్న కేరళకు చెందిన టెసీ థామస్‌ గురించి సామాజిక మాధ్యమంలో తాజాగా ఒక పోస్టును పెట్టారు.యునైటెడ్‌ బ్రాహ్మిన్స్‌ ఫ్రెండ్స్‌(ఆల్‌ ఇండియన్‌ బ్రాహ్మిన్‌ కమ్యూనిటీస్‌)కు చెందిన ఒకరు పెట్టిన ఆ పోస్టులో ఉన్న అంశం ఏమంటే అగ్ని క్షిపణి రూపకర్త టెసీ థామస్‌ అనీ ఆమె నుదుట బొట్టు, దాని మీద చిన్న గంధపు గీత ఉందని రాశారు. ఆమె క్రిస్టియన్‌ అయినప్పటికీ హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు చెప్పటం దీని లక్ష్యం. క్షిపణి రూపకర్తలలో ప్రముఖురాలు ఆమె అనటంలో ఎవరికీ పేచీ లేదు. అందరూ అభినందించాల్సిన అంశమే. బిజెపి ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన కంగన రనౌత్‌ చంద్రయాన్‌-3 విజయం గురించి స్పందించారు. అందరికీ ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభ పాటవాలు కనిపిస్తే ఆమె వేరే విధంగా చూశారు. మహిళా శాస్త్రవేత్తలు ఉన్న ఒక ఫోటోను తన ఇనస్టాగ్రామ్‌లో పోస్టు చేసి వారంతా బిందీ, సింధూరాలు, తాళిడబొట్లు ధరించి ఉన్నారని, ఉన్నత ఆలోచనలు, సాధారణ జీవితాల భారతీయతకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇలా చెప్పటం ద్వారా బొట్టు లేనివారు కాదని ఆమె జనాలకు సందేశం ఇవ్వదలచుకున్నారు. దాని తరువాతే టెసీ థామస్‌ బొట్టు, చందనం గురించి బ్రాహ్మణ సంఘాలు పోస్టు పెట్టాయి. రెండవ అంశం ఏమంటే 145 కోట్ల చైనీయుల గుండెల్లో భయం పుట్టించిన మహిళ అని చెప్పారు. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అణువార్‌ హెడ్‌తో చైనాలోని ఏ ప్రదేశాన్నైనా ఖచ్చితత్వంతో ఢకొీట్టగల అగ్ని-5 క్షిపణి రూపకర్త టెసీ థామస్‌ అని రాశారు.(ఆమె క్రిస్టియన్‌ అయినప్పటికీ బ్రాహ్మణ క్రైస్తవురాలని, అందుకే బ్రాహ్మణ సంఘాలు ఆమె గురించి రాసినట్లు సామాజిక మాధ్యమంలో కొందరు స్పందించారు ) ఆ క్షిపణిని 2018లోనే పరీక్షించారు, మిలిటరీకి అందచేశారు, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమిటి ?


అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అని చెప్పిన వారే ఇప్పుడు శాస్త్రవేత్తలకు మతం, కులం ఆపాదించుతున్న తీరును చూస్తున్నాం.వారిలో ఎవరైనా బొట్టు పెట్టుకోలేదో దేశవ్యతిరేక మతాల ముద్రవేస్తారు. వాటిని పక్కన పెడితే చంద్రయాన్‌ విజయం, అగ్ని క్షిపణితో మన మిలిటరీ సామర్ధ్యం పెరుగుతుందన్నది స్పష్టం. కానీ చైనీయులకు భయం పుట్టించిందని చెప్పటం అవసరమా ? అసలది నిజమా ? అతిశయోక్తులు మాత్రమే. అంతరిక్ష ప్రయోగాల్లో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, క్షిపణుల రంగంలోనూ అదే పరిస్థితి. తాజా సమాచారం ప్రకారం జూలై రెండవ వారంలో గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌(జిఎఫ్‌పి) అనే సంస్థ మిలిటరీ బల రాంకులు-2023 ప్రకారం శక్తివంతమైన పది దేశాల్లో వరుసగా అమెరికా, రష్యా, చైనా, భారత్‌,బ్రిటన్‌, దక్షిణ కొరియా,పాకిస్థాన్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ ఉన్నాయి. నూటనలభై దేశాలలో అత్యంత బలహీనమైన దేశాల మిలిటరీలో భూటాన్‌ తొలి స్థానంలో ఉంది. ఈ రాంకులు ప్రతి ఏడాదీ మారుతుంటాయి. గతేడాది తొలి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాల్లో ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు. గతేడాది ఎనిమిదో స్థానంలో ఉన్న బ్రిటన్‌ తాజాగా ఐదవ స్థానంలోకి వచ్చింది. పాకిస్థాన్‌ తొలిసారిగా మొదటి పదిలో ఏడవ స్థానం పొందింది. ఇక ఈ రాంకులు ఇచ్చేందుకు అన్ని దేశాలు అంగీకరించిన ఒక ప్రామాణిక సంస్థ ఏదీ లేదు.


ఉదాహరణకు ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వచ్చిన వార్తల ప్రకారం అమెరికాకు చెందిన ఫెయిర్‌ బృందం రాంకులను యుఎస్‌ న్యూస్‌ ప్రకటించింది. దాని ప్రకారం అత్యంత శక్తివంతమైన మిలిటరీలో చైనాకు రెండవ, భారత్‌కు 14స్థానం ఇచ్చారు. వీటిని తయారు చేసింది అమెరికా సంస్థలు, అక్కడి ఆయుధ తయారీదారుల హస్తం దీని వెనుక ఉన్నట్లు కనిపిస్తున్నది. చైనాతో పోల్చితే భారత్‌ ఎంతో వెనుకబడి ఉంది కనుక ఆయుధాలను మరింతగా కొనాలని వత్తిడి తెచ్చే ఎత్తుగడ ఉందన్నది స్పష్టం. ఎందుకంటే అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు వెంట తన ఆధీనంలోని భూ భాగంలో గతంలో ఎప్పుడో నిర్మించిన గృహాల స్థానంలో చైనా కొత్తవాటిని నిర్మిస్తే ఇంకే ముంది అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా వారు గ్రామాలను నిర్మిస్తున్నట్లు మన దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు అమెరికా సంస్థలు చూసిన సంగతి తెలిసిందే.మన దేశం ప్రపంచంలో అన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో పదకొండుశాతం వాటాతో ప్రధమ స్థానం కలిగి ఉండగా చైనా 4.6శాతమే కలిగి ఉంది. అంటే ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడటం తక్కువగా ఉంది. గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ సంస్థ పేర్కొన్న సమాచారం ప్రకారం మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న చైనా-భారత్‌ మిలిటరీ బలాల పోలిక దిగువ విధంగా ఉంది.
అంశం ××××××× చైనా ××××× భారత్‌
రాంకు ××××××× 3 ××××× 4
అందుబాటులో జనం ××76,16,91,468×× 65,31,29,600
మిలిటరీకి అర్హులు ××62,48,69,113×× 51,55,55,492
ఏటా మిలిటరీవయస్సు వారు××1,97,47,552 ×× 2,36,23,837
రక్షణ బడ్జెట్‌, బి.డాలర్లు ×× 230 ×× 50.2
విమానాలు ×× 3,284 ×× 2,210
యుద్ద విమానాలు ×× 1,199 ×× 577
హెలికాప్టర్లు ×× 913 ×× 807
విమానాశ్రయాలు ×× 507 ×× 346
యుద్ద టాంకులు ×× 4,950 ×× 4,614
యుద్ద నౌకలు ×× 730 ×× 295
వి.వాహకనౌకలు ×× 3 ×× 2
హెలికాప్టర్‌ నౌకలు ×× 3 ×× 0
జలాంతర్గాములు ×× 78 ×× 18
డెస్ట్రాయర్లు ×× 50 ×× 11
రేవులు ×× 22 ×× 13
స్వయంచలిత ఆర్టిలరీ ×× 2,720 ×× 100
రాకెట్‌ ఆర్టిలరీ ×××××× 3,140 ×× 960
సాయుధ శకటాలు ×× 14,130 ××× 8,600


భారత్‌ వద్ద మిగ్‌-21 రకం 107, మిగ్‌-29 రకం 66 ఉన్నాయి. చైనా వద్ద స్వంత తయారీ జె-11 రకం 442, జె-7 రకం 388, జె-18 రకం 96, యస్‌యు-30 రకం 121 ఉన్నాయి. బహుముఖ పాత్ర పోషించే యుద్ద విమానాలు మన దేశం దగ్గర సుఖోరు -30 రకం 272, మిరేజ్‌ 49, మిగ్‌ – 29 రకం 36, రాఫెల్‌ 26, తేజస్వి 22, కమోవ్‌ 14 మొత్తం 393 ఉన్నాయి. అదే చైనా వద్ద అన్ని రకాలు కలసి 1,130 ఉన్నాయి. మన దగ్గర మిలిటరీ డ్రోన్లు 12 ఉండగా, చైనా వద్ద 151ఉన్నాయి. రాఫెల్‌ 4.5 తరం విమానాలను మనం కొనుగోలు చేయగా, దాని కంటే మెరుగైన స్వంత తయారీ 5వ తరం జె-20 విమానాలు చైనా వద్ద ఉన్నాయి.మిలిటరీ ఆయుధాలకు సంబంధించి ప్రపంచ సంస్థలు చెప్పే అంకెలు కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ మిలిటరీ బలాబలాల ధోరణులు తెలుసుకొనేందుకు ఉపయోగపడతాయి.వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ 2023 అంచనా ప్రకారం చైనా వద్ద 350, పాకిస్థాన్‌ దగ్గర 165, మనదగ్గర 156 అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాలను ఉపయోగించబోమని భారత్‌-చైనా ప్రకటించాయి. అందువలన ఎవరి దగ్గర ఎంత ఎక్కువ దూరం ప్రయాణించే క్షిపణులు ఉన్నప్పటికీ వాటితో అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం లేదు. ఎవరైనా దాన్ని ఉల్లంఘించి అణుదాడులకు పాల్పడితే ఎవరూ మిగలరు. అందువలన మన అగ్ని క్షిపణిని చూసి చైనా వారు గానీ వారి వద్ద 12 నుంచి 15వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే డిఎఫ్‌-41క్షిపణులను చూసి మన జనం భయపడుతున్నారా అంటే లేదు.మన అణుక్షిపణి పరిధి ఏడువేల కిలోమీటర్లని మన శాస్త్రవేత్తలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మన దేశంతో సహా అన్ని దేశాలూ అలాంటివి మరింత వేగంతో, ఎక్కువ దూరం ప్రయాణించేందుకు నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉంటాయి. ది కంట్రీస్‌ ఆఫ్‌ డాట్‌ కామ్‌ ఆగస్టు ఎనిమిదిన వెల్లడించిన సమాచారం ప్రకారం 2023లో క్షిపణి సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో వున్న పది దేశాల వరుస ఇలా ఉంది. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, భారత్‌, ఇజ్రాయెల్‌, పాకిస్థాన్‌, ఇరాన్‌, ఉత్తర కొరియా ఉన్నాయి.మన పొరుగునే ఉన్న పాకిస్థాన్‌ ఇప్పటికే 2,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఘౌరీ, షాహిన్‌ క్షిపణులను కలిగి ఉంది, వాటిని ఇంకా విస్తరించే పరిశోధనలో ఉంది. దాని దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అంత మాత్రాన భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. మనకు పాక్‌, చైనా ఎంత దూరమో, మనం కూడా వాటికి అంతేదూరంలో ఉన్నాము.


ఒకరు బాంబులు విసురుతుంటే రెండోవారు గులాబ్‌ జాములు అందిస్తూ స్పందించేంత ఉత్తములు ఈ రోజుల్లో ఎవరూ ఉండరు. అలా ఉండాలన్నా ఉండనివ్వరు. శత్రుదేశాల ఉపగ్రహాల మీద దాడి చేసేందుకు అవసరమైన ఆయుధాలను చైనా రూపొందిస్తున్నట్లు, ఇతర దేశాల ఉప గ్రహాలను అదుపులోకి తెచ్చే సత్తా ఉన్నదని సిఐఏ నివేదించినట్లు బహిర్గతమైన అమెరికా గూఢచార, ఇతర కీలక పత్రాల్లో ఉంది.చైనా ఆయుధాల గురించి సిఐఏ పత్రాలను ఉటంకిస్తూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రికలో పేర్కొన్నారు. స్టాక్‌హౌమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) విడుదల చేసిన 2022 వార్షిక నివేదికలో ప్రపంచంలో మిలిటరీ ఖర్చు కొత్త రికార్డు నెలకొల్పినట్లు పేర్కొన్నది. అంతరిక్షం, సైబర్‌ రంగాలలో అమెరికా ముందున్నది. తాజాగా చంద్రయాన్‌ -3 విజయం, ఇతర ఉపగ్రహాల ప్రయోగాలతో మన దేశం కూడా ధీటుగా ఉండేందుకు అవకాశాలు పెరుగుతున్నాయి. సైబర్‌ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్‌గా ఉంది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్‌ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా రష్యా సేనల సమాచారం గురించి ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌కు అందచేస్తున్న సంగతి తెలిసిందే. దాని ద్వారా మనతో సహా ఏ దేశ సమాచారాన్నైనా అమెరికా తెలుసుకోవచ్చు. దీని మాతృసంస్థ ఎలాన్‌ మస్క్‌ అధిపతిగా ఉన్న స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ ఇప్పటి వరకు 3,580 చిన్న ఉపగ్రహాలను పంపి 53 దేశాలకు సమాచారాన్ని అందచేస్తున్నది, వాటిని పన్నెండువేలకు పెంచాలని కూడా చూస్తున్నది. అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యానికి ఇదొక నిదర్శనం.


అమెరికా, అది ఎగదోస్తున్న దేశాలు ఇటీవలి కాలంలో మిలిటరీ ఖర్చు పెంచటం, కొత్త కూటములను కడుతుండటంతో మన దేశం, చైనా కూడా తన ఖర్చును పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టాక్‌హౌం సంస్థ పరిగణనలోకి తీసుకున్న అంశాల ప్రకారం ప్రపంచంలో 40దేశాలు గణనీయంగా ఖర్చు చేస్తున్నాయి. వాటిలో మన దేశం మూడవ స్థానంలో ఉండగా మన పొరుగునే ఉన్న పాకిస్తాన్‌ 24వదిగా ఉంది. ఏ దేశమైనా మిలిటరీ ఖర్చును పెంచి అది జనాల మీద భారం,జీవితాలు మెరుగుపడే అవకాశం లేదన్నది అనేక దేశాల అనుభవం చెబుతున్నది. ఉగ్రవాదం కారణంగా పక్కనే ఉన్న శ్రీలంక తన వనరులన్నింటినీ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు గాను మిలిటరీని విపరీతంగా పెంచింది. ఉగ్రవాదులను నిర్మూలించినా వెంటనే దాని మిలిటరీ ఖర్చు వెంటనే తగ్గదని తేలింది.మనతో గిల్లికజ్జాలు పెట్టుకొనే పాకిస్తాన్‌ తలసరి ఖర్చు మనకంటే ఎక్కువే. అది ఇప్పుడు ఆర్థికంగా ఎంత దివాళా తీసిందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నదో చూస్తున్నదే. మన దేశంలో ఉన్న కొంత మంది చైనాను బూచిగా చూపి మిలిటరీ బడ్జెట్‌ను గణనీయంగా పెంచాలని చెప్పటం వెనుక అమెరికా మిలిటరీ కార్పొరేట్‌ లాబీ ఉందన్నది స్పష్టం.మన జిడిపితో పోలిస్తే చైనా ఐదురెట్లు ఎక్కువ.అందువలన దానితో మిలిటరీ ఖర్చులో మనం పోటీ పడాలంటే వనరులన్నింటినీ మళ్లించాల్సి ఉంటుంది. అది జరిగితే ఆర్థికవృద్ది కుంటుపడుతుంది.అలాగని మన రక్షణ ఏర్పాట్లను నిర్లక్ష్యం చేయనవసరం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి : కొనసాగుతున్న రూపాయి పతనం-నిరోధానికి చేసింది శూన్యం !

20 Sunday Aug 2023

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, Europe, History, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

BJP, Indian Rupee, Narendra Modi Failures, Rupee depreciation, Rupee Fall, U.S. Dollar


ఎం కోటేశ్వరరావు


ఒకే విధానాలను అనుసరిస్తూ ఎదుటి వారిని వేలెత్తి చూపితే అవకాశం వచ్చినపుడు అవే వేళ్లు మనవైపు తిరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ స్పృహ ఉండదని గతంలో అనేక ఉదంతాలు వెల్లడించాయి. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి నేతలకూ అదే పరిస్థితిని రూపాయి తెచ్చింది. ” రూపాయి అగాధంలో పడుతుందా దాని కంటే ఎక్కువ లోతులో కాంగ్రెస్‌ పడుతుందా అన్న పోటీ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి దేశ భద్రత గురించిగానీ అదే విధంగా రూపాయి పతనం గురించి గానీ పట్టలేదు. దాని కుర్చీని కాపాడుకోవటం గురించే ఆందోళన పడుతోంది. డాలరుతో మారకంలో రూపాయి పతనం అవుతోంది. కాంగ్రెస్‌ కారణంగా అది ఐసియులో ఉంది. ” రూపాయి పతనం గురించి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్రమోడీ ట్వీట్లు, సభలలో చేసిన విమర్శలివి.2013-14లో రూపాయి ఒక డాలరుకు రు. 56-62 మధ్య కదలాడింది. ఇప్పుడు కొత్త రికార్డు నెలకొల్పి రు. 83 దాటింది.

తాము అధికారానికి వస్తే రూపాయి విలువను రు.45కు పెంచుతామని నాడు బిజెపి చెప్పింది. ” గత మూడు నెలలుగా రూపాయి పతనం వేగంగా జరుగుతోంది. దాన్ని బలపరిచేందుకు కేంద్రం ఏ చర్యలూ చేపట్టలేదు. ఇలా రూపాయి పతనం అవుతుంటే ఇతర దేశాలు దీన్ని అవకాశంగా తీసుకుంటాయి.ఇంతటి తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంటుందని దేశం ఎన్నడూ ఊహించలేదు.కానీ అలాంటి సంక్షోభంలో నాయకత్వం దిక్కుతోచకుండా ఉంది.దీంతో ఆశ సన్నగిల్లుతోంది.పౌరుల్లో విశ్వాసాన్ని నింపేందుకు ఎలాంటి చర్యలనూ కేంద్రం తీసుకోలేదు. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి మూడునెలలకు ఒకసారి ధరలు తగ్గుతాయని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని కేంద్రం చెప్పటాన్ని వింటున్నాంగానీ జరిగిందేమీలేదు. ” అని బిజెపి ఎన్నికల ప్రచారకమిటీ నేతగా మోడీ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం 2022 జూలై 11న పార్లమెంటులో అంగీకరించినదాని ప్రకారం గడచిన ఎనిమిది సంవత్సరాల్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ రు.16.08(25.39శాతం) పతనమైంది. ఆరోజు మారకపు విలువ రు.79.41గా ఉంది. ఇప్పుడు 83 దాటింది. డాలరుతో మారకంలో అన్ని కరెన్సీల విలువలు పడిపోతున్నపుడు మనది ఎలా తగ్గకుండా ఉంటుందని పాలకపార్టీ నేతలు వాదనలు చేస్తున్నారు. ఇతర కరెన్సీలతో విలువ తగ్గలేదంటున్నారు. ప్రధాన కరెన్సీలతో 2014-2023లో ఆగస్టు 19నాటి రూపాయి విలువలు ఎలా ఉన్నదీ చూస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుంది. 2014 ఏడాదిలో సగటు విలువ అని గమనించాలి.
కరెన్సీ ×××××× 2014 ××× 2023
డాలరు ×××××× 60.99 ××× 83.15
రూబుల్‌ ×××××× 1.61 ××× 0.88
పౌండ్‌ ××××××100.45 ××× 105.89
యువాన్‌్‌ ××××× 9.90 ××× 11.42
యన్‌్‌ ××××× 0.57 ××× 0.57
యూరో ××××× 81.04 ××× 90.57


డాలరు విలువ పెరిగింది తప్ప మన రూపాయి విలువ తగ్గలేదు, ఇతర కరెన్సీల కంటే మనది పటిష్టంగా ఉంది, ఇతర కరెన్సీల విలువలు కూడా పడిపోతున్నాయంటూ సమర్ధించుకొనేందుకు, జనాన్ని నమ్మించేందుకు బిజెపి మంత్రులు, నేతలు చూస్తున్నారు. దాని వలన మనకు ఒరిగేదేమిటి ? పైన పేర్కొన్న పట్టిక ప్రకారం ఒక్క జపాన్‌ కరెన్సీ ఎన్‌తో మాత్రమే మన రూపాయి విలువలో మార్పు లేదు. మిగిలిన కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి పతనమైంది. మన కంటే దరిద్రంగా ఉన్న దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే మనది పెరగవచ్చు. ఉదాహరణకు పాక్‌ రూపాయి. 2014లో దాని విలువ 1.70 కాగా ఇప్పుడు 0.28కి పడిపోయింది. పాకిస్తాన్‌ నుంచి సరకులు దిగుమతి చేసుకుంటే మనకు కారుచౌక. మన దేశం నుంచి వారు దిగుమతి చేసుకుంటే భారం పెరుగుతుంది. ప్రధాన కరెన్సీలతో కూడా పతనం అన్నది వాస్తవం. డాలరు విలువ పెరిగింది, మనది తగ్గలేదు అని చెబుతున్న వారు ఇప్పుడున్న మారకం రేటుతో డాలర్లను కొంటారా లేక 2014నాటి రేట్లతో కొనుగోలు చేస్తారా ? ఒన్‌ ఇండియా డాట్‌ కామ్‌లో 2020 ఆగస్టు 14న ప్రచురితమైన ఒక విశ్లేషణ ప్రకారం 2005 జనవరిలో రు.43.47 గా ఉన్నది 2014 మే నెలలో రు.59.44గా ఉంది. పతనం పదహారు రూపాయలు. ఇప్పుడు రు.83 అనుకుంటే మోడీ ఏలుబడిలో రు.24 తగ్గింది. మనది ఎగుమతి చేసే దేశమైతే మన కరెన్సీ పటిష్టంగా ఉంటే మనకు లాభం, దిగుమతులైతే డాలర్లు, ఇతర కరెన్సీల కోసం మనం ఎక్కువ రూపాయలు చెల్లించాలి.రాయితీ రేట్లకు మనం రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం. వారికి డాలర్లలో చెల్లించేందుకు వీలు లేదు గనుక మన చమురు శుద్ధి సంస్థలు ఇటీవల చైనా యువాన్లలో చెల్లిస్తున్నాయి. అంటే మనం డాలర్ల బదులు యువాన్లు కొనుగోలు చేస్తున్నాం.మన కంటే ముందే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఎప్పటి నుంచో యువాన్లు చెల్లిస్తున్నాయి.


తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో రూపాయి విలువ పతనంలో కొత్త రికార్డులను తాకింది. ఇంకా పతనం కావచ్చని చెబుతున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గించాలంటే అక్కడ వడ్డీ రేటు పెంచటాన్ని మార్గంగా విధాన నిర్ణేతలు ఎంచుకున్నారు. దాంతో అమెరికా డాలరు రుణాల మీద వచ్చే వడ్డీ ఎక్కువగా ఉండటంతో ప్రపంచంలో ఉన్న డాలర్లన్నీ అక్కడకు చేరుతున్నాయి.దాని విలువ పెరుగుతోంది.మనతో అనేక కరెన్సీల మీద ప్రతికూల ప్రభావం పడుతోంది. మరికొంత కాలం అమెరికా వడ్డీ రేటు ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. అంటే మన కరెన్సీ విలువ ఇంకా పతనం కావచ్చు.మన ఎగుమతులు దిగుమతుల కంటే తక్కువగా ఉన్నందున మనకు నష్టం. డాలరుతో చైనా కరెన్సీ విలువ కూడా తగ్గింది. అది చైనాకు వరంగా మారింది. దాని ఎగుమతులు ప్రపంచంలో తక్కువ ధరకు అమ్ముడుపోతాయి. ఎగుమతి సామర్ధ్యం పెరుగుతుంది.మన ఎగుమతులకు పోటీ పెరుగుతుంది. వాణిజ్య లోటు పెరిగితే మన రూపాయి మరింత బలహీనమౌతుంది.మన దేశంతో సహా ప్రపంచంలోని నల్లధనం గల అనేక మంది స్విస్‌ బాంకుల్లో డబ్బుదాచుకుంటారని తెలిసిందే. వాటిని రక్షిత స్వర్గాలు అని పిలుస్తారు. అంటే స్విస్‌ కరెన్సీ ఫ్రాంక్‌లోకి డబ్బును మార్చుకొని ఆస్తులు కొనుగోలు లేదా బాంకుల్లో డబ్బు దాచుకుంటారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లో ఒక స్విస్‌ ఫ్రాంక్‌కు మన కరెన్సీ మారకపు విలువ ఏడాది సగటు రు.66.68. అది ఇప్పుడు ఆగస్టు 19న రు.94.28గా ఉంది. అంటే మన కరెన్సీ పతనమౌతున్న కొద్దీ నగదు వ్యాపారులు డాలర్లు లేదా ఫ్రాంక్‌లో తమ డబ్బును దాచుకునేందుకు ఎగబడతారు. దాంతో వాటి విలువ మరింత పెరుగుతుంది. ఎగబడే దేశాల కరెన్సీ విలువ పతనమౌతుంది. ఇప్పుడు మన రూపాయి ఈ సమస్యనే ఎదుర్కొంటోంది. పదేండ్ల క్రితం విమర్శలు చేసిన నరేంద్రమోడీ లేదా ఇతర బిజెపి నేతలు ఇప్పుడు నోటికి తాళం వేసుకొని పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారు. మన కరెన్సీ విలువను పెంచేందుకు అంటే పదేండ్ల క్రితం బిజెపి చెప్పినట్లు రు.45కు తగ్గించేందుకు పూనుకుంటే మన ఎగుమతిదార్లు గగ్గోలు పెడతారు, దిగుమతిదార్లు సంతోషిస్తారు. అదే పతనాన్ని అనుమతిస్తే దానికి భిన్నంగా స్పందన ఉంటుంది.


2013 నాటి పతనానికి ఇప్పటి పతనానికి పోలిక సరైంది కాదు అని కొందరు ఆర్థికవేత్తలు కూడా చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో కొన్ని కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలపడిందని కూడా ఉదాహరణలు చూపారు. అలా జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జనానికి కావలసింది రూపాయి బలపడితే లేదా పతనమైతే జనం మీద మన ఖజానా మీద చూపిన అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఏమిటన్నది గీటురాయి. రెండురెళ్లు నాలుగు అన్నట్లుగా మన ఎగుమతులు పెరిగితే మనకు లాభం, దిగుమతులు పెరిగితే నష్టం. అన్ని అనర్ధాలకు కారకులు గత యుపిఏ పాలకులు అని ఊరూవాడా ప్రచారం చేశారు. మేకిన్‌ ఇండియా, మేక్‌ ఇండియా పేరుతో పెద్ద ఎత్తున ఎగుమతులు చేసి చైనా స్థానాన్ని ఆక్రమిస్తామన్నారు. కానీ జరిగిందేమిటి ? కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2022-23లోని గణాంకాల అనుబంధం పేజీ 108,109లో ఇచ్చిన సమాచారం ఏమి చెబుతున్నదో ఎవరైనా చూడవచ్చు.2003-04 (వాజ్‌పాయి సర్కార్‌ చివరి సంవత్సరం)లో మన దేశ ఎగుమతుల విలువ రు.2,93,367 కోట్లు కాగా యుపిఏ చివరి సంవత్సరం 2013-14 నాటికి అవి రు.19,05,011కోట్లకు చేరాయి. అదే నరేంద్రమోడీ ఏలుబడిలో 2021-22 నాటికి రు.30,47,021కు చేరాయి.ఎవరు ఎంత వృద్ధి సాధించినట్లు ? ఏ స్కూలు విద్యార్ధిని అడిగినా కాంగ్రెసే అని వెంటనే చెప్పేస్తారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో దేశం పరువు పోయిందని, విదేశాలు తిరిగి తమ నేతి తిరిగి తెచ్చారని చెప్పుకుంటున్న బిజెపి నేతలు మన ఎగుమతులకు మార్కెట్లను ఎందుకు సంపాదించలేకపోయారో చెప్పగలరా ?


మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం మేరకు 2004 నుంచి 2013 వరకు పది సంవత్సరాల్లో సగటున మన జిడిపిలో 22.09 శాతం విలువగల వస్తు,సేవల ఎగుమతులు జరిగాయి. 2014 నుంచి 2021వరకు ఎనిమిది సంవత్సరాల సగటు 19.85శాతమే ఉంది. నరేంద్రమోడీ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచారని, మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా పిలుపులు, ఎగుమతి ప్రోత్సాహకాలు, భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తెచ్చారని, సులభతర వాణిజ్య సూచికను ఎంతగానో మెరుగుపరిచారని చెప్పిన కబుర్లు, ప్రచారం ఏమైనట్లు ? ఎగుమతుల శాతం ఎందుకు తగ్గినట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల నరేంద్రమోడీ ఏలుబడి : ఉపాధి నైపుణ్యం నిల్‌ – ఓట్లు తెచ్చే విద్వేషం ఫుల్‌ !

14 Monday Aug 2023

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, Education, employees, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Political Parties, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, employability, Hate crime, Hate-Speech, Narendra Modi Failures, National Skill Development, practical skills, Skilled Labor Force


ఎం కోటేశ్వరరావు


ఈ మధ్య రెండు అంశాలపై వార్తలు వచ్చాయి. ఒకటి దేశంలో నిపుణులైన కార్మికుల లేమి గురించి ఒక నివేదిక వెలువడింది. నైపుణ్య శిక్షణ పేరుతో చేసిన హడావుడి ఎలా విఫలమైందో అంతకు ముందే విశ్లేషణలు వచ్చాయి. విద్వేష ప్రసంగాల మీద నమోదైన కేసుల గురించి ఒక కమిటీని ఆగస్టు 18లోగా ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విద్వేష ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగం కొన్ని చోట్ల పని చేయటం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. రెండింటిలోనూ కేంద్ర వైఫల్యం స్పష్టమైంది. నిజానికి సుప్రీం కోర్టు ఆదేశం మోడీ సర్కార్‌ను పరోక్షంగా అభిశంసించటం తప్ప వేరు కాదు. నైపుణ్య మెరుగుదల కోసం ఎన్నో పధకాలు, ఏకంగా మంత్రినే ఏర్పాటు చేసిన ఘనత తమదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఇతర పథకాలు, ప్రకటనల మాదిరే ఇది కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. 2023 ఆగస్టు రెండవ వారంలో స్కిల్‌ ఫైనాన్సింగ్‌ రిపోర్టు 2023 కొన్ని అంశాలను వెల్లడించింది.దేశంలోని 78శాతం మంది యువతరానికి అభ్యాససిద్దమైన నైపుణ్యాలు లేవు.జనాభాలో 15-24 సంవత్సరాల యువత 25.4 కోట్ల మంది ఉన్నారు.ఉపాధికి అవసరమైన ఉన్నత నైపుణ్యాలు కలిగిన వారు కేవలం 46.2శాతం మందే ఉన్నారు. మొత్తం మీద నైపుణ్యాల రాంకులో మన దేశం ప్రపంచంలో 60వ స్థానంలో ఉంది. 2015 వరకు మన దేశంలోని కార్మికుల్లో 4.7శాతమే నైపుణ్య శిక్షణ పొందగా దక్షిణ కొరియాలో 90, జపాన్‌లో 80, బ్రిటన్‌లో 68, అమెరికాలో 52శాతం ఉన్నారు. ఇక ప్రతిదాన్ని వాణిజ్య ప్రాతిపదికన లెక్కిస్తున్నారు గనుక 2030 నాటికి ప్రపంచ వృత్తి విద్యా మార్కెట్‌ విలువ పెరుగుదల 1,585 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందట.ఇక 2031నాటికి విద్యా రుణాల మార్కెట్‌ విలువ 8,750 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. మన దేశంలో శిక్షణ పెద్ద ఎత్తున అవసరం గనుక నిధుల కేటాయింపు పెద్ద ఎత్తున పెంచాల్సి ఉంటుందని కూడా సదరు నివేదిక సలహా ఇచ్చింది. నైపుణ్యాలు, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ మార్కెట్‌ విలువ 2020లో మన దేశంలో 180 బిలియన్‌ డాలర్లు ఉందని, 2030 నాటికి అది 313 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా.


2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు 2015లో ప్రధాని నరేంద్రమోడీ ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్‌డిటివీ వార్త ప్రకారం సంబంధిత మంత్రిత్వశాఖ సమాచారం మేరకు 2021 జనవరి 19 నాటికి దేశమంతటా 1.07 కోట్ల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 46.27లక్షల మందికి స్వల్పకాల శిక్షణ ఇచ్చారు. మిగిలిన వారికి అంతకు ముందు వారు నేర్చుకున్నదాని గురించి పునశ్చరణ తరగతులు నిర్వహించారు. వారిలో 19లక్షల మందికి ఉపాధి దొరికింది.స్కిల్‌డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ సమాచారం మేరకు 2023 ఫిబ్రవరి ఆరు నాటికి 142లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 137లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. 124లక్షల మందిని విశ్లేషించి 110లక్షల మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. తరువాత ఈ పధకంలో కొన్ని మార్పులు చేశారు. ప్రభుత్వ విధానాల పరిశోధనా సంస్థ (సిపిపిఆర్‌) వెబ్‌సైట్‌లో 2023 ఫిబ్రవరి నాలుగున ” కొనసాగుతున్న యువనైపుణ్య శిక్షణ నిర్లక్ష్యానికి దేశం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ” అనే శీర్షికతో ప్రచురించిన ఒక విశ్లేషణలోని అంశాల సారాంశం ఇలా ఉంది.ప్రభుత్వం గత అనేక సంవత్సరాలుగా చేసిన వాగ్దానాలు, సాధించిన దానికి చాలా తేడా ఉంది.యువత నైపుణ్యానికి వస్తే దాని పునాదులు ఇప్పటికీ బలహీనంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అది ఇవ్వదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి పార్లమెంటు ప్రసంగంలో ఏడుసార్లు యువత అనే పదాన్ని ఉచ్చరించారు తప్ప ఒక్కసారి కూడా నైపుణ్యం గురించి చెప్పలేదు.(అది మోడీ సర్కార్‌ రాసి ఇచ్చిన ప్రసంగమే) 2023 బడ్జెట్‌లో ప్రకటించిన నైపుణ్య శిక్షణ పధకాలు వాస్తవరూపం ధరించాలంటే సంవత్సరాలు పడుతుంది.లోక్‌సభలో 2022 మార్చి 14న ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రకారం పిఎంకెవివై 1.0 కింద 18.04లక్షల మంది నమోదై శిక్షణ పొందగా వారిలో 13.32లక్షల మందికి నైపుణ్య సర్టిఫికెట్లు ఇచ్చారు. వారిలో కేవలం 2.53లక్షల మందికే లేదా 19శాతం మందికి మాత్రమే ఉపాధి దొరికింది. పిఎంకెవివై 3.0 ప్రకారం స్థానిక అవసరాలకు అనుగుణ్యంగా నైపుణ్యం ఇవ్వాలని నిర్ణయించారు, తమిళనాడు వంటి పారిశ్రామిక రాష్ట్రంలో కూడా మొత్తంగా అది విఫలమైంది. పిఎంకెవివై 3.0లో 4.98లక్షల మంది నమోదు చేసుకోగా 4.45లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. వారిలో 1.72లక్షల మంది సర్టిఫికెట్లను పొందారు. వారిలో కేవలం 15,450 మందికి మాత్రమే ఉపాధి దొరికింది. పిఎంకెవివై 1.0లో 12,218 నైపుణ్య శిక్షణ కేంద్రాలుండగా, 2.0నాటికి 9,030 కేంద్రాలు, 3.0లో కేవలం 683 మాత్రమే ఉన్నాయి. ఇదీ ఆ విశ్లేషణ సారం.


యువ భారతం అని, తగినంత మంది పని చేసే వారున్నారని గొప్పలు చెప్పుకుంటే చాలదు. ఏటా కోటి మంది కొత్తగా పని కోసం వస్తున్నారు. ఏటికేడు కొత్త సాంకేతికతలు ముందుకు వస్తున్నాయి. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ప్రయివేటు రంగం ఆ బాధ్యత తీసుకొనేందుకు ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. గతేడాది జూన్‌లో భారత్‌ కోసం కృత్రిమ మేథ అనే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. పాతికలక్షల మందికి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడపదాటటం లేదు. ఏ దేశానికైనా నిపుణులైన కార్మికులు అవసరం. అది వారి జీవన పరిస్థితులను మెరుగుపరుస్తుంది.అమెరికా మీడియా యుఎస్‌ న్యూస్‌ 2022 సెప్టెంబరులో 85 దేశాల పరిస్థితుల మీద సర్వే చేసి జాబితాను ప్రకటించింది. కార్మిక నైపుణ్యంలో జపాన్‌, దక్షిణ కొరియా తరువాత చైనా మూడవ స్థానంలో ఉంది. మన దేశం ఇరవై ఒకటవ స్థానంలో ఉంది.మొత్తం మీద అన్ని రకాల నైపుణ్యాల్లో చైనా 17వ దేశం కాగా మనది 31వదిగా ఉంది.అమెరికా సిఐఏ ఫాక్ట్‌బుక్‌ పేరుతో సమాచారాన్ని విడుదల చేస్తుంది. దాని ప్రకారం 2021లో చైనాలో నిపుణులైన కార్మికులు 79 కోట్ల 14లక్షల 83వేల మంది ఉండగా మన దేశంలో 46 కోట్ల,66లక్షల 70వేల వంద మంది ఉన్నారు. నిజానికి ఈ సంఖ్య తక్కువేమీ కాదు గానీ పని చేసే వారికి అవకాశాలు కల్పించటమే కీలకం, మన దగ్గర అది లేదు. గడచిన నాలుగు దశాబ్దాల్లో నైపుణ్యం పెంచేందుకు చైనా ప్రభుత్వమే భారీ ఎత్తున ఖర్చు చేసింది. అందుకే నిపుణులైన కార్మికుల మీద పెట్టే ఖర్చు తప్పుతుంది గనుక అమెరికా, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయి, చైనా 17.7లక్షల కోట్ల జిడిపిని సృష్టించగలిగింది. దాని తలసరి జిడిపి(పిపిపి) 19,338 డాలర్లు, మన దేశం 3.17లక్షల కోట్ల డాలర్లు, తలసరి 7,334 డాలర్లతో ఉంది. ఏ దేశమైనా నైపణ్యం పెంచటమే కాదు, పరిశోధన-అభివృద్ధికి భారీ మొత్తాలను ఖర్చు చేయాల్సి ఉంది. మన దేశంలో ఆ రెండూ లేవు.


మరి మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అన్నది ప్రశ్న. చేసేందుకు ఉపాధి లేక, ఉపాధికి అవసరమైన నైపుణ్యం లేక నామ మాత్ర వేతనాలతో పని చేసే యువతను తప్పు దారి పట్టించటానికి అనువైన పరిస్థితులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం కాలంలో ఉన్నాం. దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వైపు చూడకుండా ఆవు పేడ, మూత్రంలో ఉన్న బంగారాన్ని వెలికి తీస్తే ధనిక దేశంగా మారతాం అనే ఆలోచనలో ఇంకా ఉన్నామంటే అతిశయోక్తి కాదు. బహుశా ఏ దేశంలోనూ లేని విధంగా వాట్సాప్‌ ద్వారా తప్పుడు, విద్వేష సమాచారాన్ని క్షణాల్లో ఎలా వ్యాపింప చేయాలో మన పండితులు ప్రపంచానికి పాఠాలు నేర్పేవారిగా ఉన్నారు. టెక్నాలజీ పరుగులో ముందుండాలంటే పరిశోధన, అభివృద్ది ఖర్చు లేకుండా కుదరదు. అందుకు గాను జిడిపిలో మన దేశ ఖర్చు 0.7శాతం కాగా చైనా ఖర్చు 2.1శాతంగా ఉంది.ి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారంటే కేటాయింపు లేకుండా కేవలం కబుర్లు చెబుతున్నారన్నది స్పష్టం.


నైపుణ్యం పెంచటానికి, పరిశోధనకు నిధులు కేటాయించేందుకు ప్రధాని నరేంద్రమోడీని ఎవరూ అడ్డుకోలేదు. కానీ మన దేశంలో విద్వేషం పెరుగుతున్నది. దానికి కారకులు ఎవరో పదే పదే చెప్పనవసరం లేదు. ఇది ఇంకా పెరిగితే వచ్చే పెట్టుబడులు రావు. మతకొట్లాటలు, పరస్పర అవిశ్వాసంతో కొట్టుకు చావాల్సిందే. అది తెలిసినా మత దేశంగా ఉన్న పాకిస్తాన్‌ దరిద్రం గురించి ఒకవైపు చెబుతున్నవారే దేశాన్ని మెజారిటీ హిందూ దేశంగా మార్చుతామని రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా దేశంలో ఉన్న విద్వేష పూరిత వాతావరణ, ఉదంతాల గురించి సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఇటీవలి కాలంలో పదే పదే ఆందోళన వెల్లడిస్తున్నది. జాతి, మతం, పుట్టిన ప్రాంతం,నివాసం, భాష తదితర అంశాల ప్రాతిపదికన భిన్న పౌర సమూహాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి సామరస్యతను దెబ్బతీసే శక్తులను అదుపు చేసేందుకు ఐపిసిలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. వాటిలో ఒకటైన 153 ఏ ప్రకారం నమోదు చేసిన కేసులు దేశంలో 2014-2020 కాలంలో 323 నుంచి 1,804కు పెరిగాయి. జాతీయ సమగ్రతను దెబ్బతీసేందుకు పాల్పడేవారి మీద 153 బి సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తారు. ఇవి 13 నుంచి 82కు పెరిగాయి. తప్పుదారి పట్టించే, విద్వేషాన్ని, శతృత్వాన్ని పెంచే సమాచారాన్ని వ్యాపింప చేయటం, ప్రకటనలు చేసే వారిని శిక్షించేందుకు ఉన్న సెక్షన్‌ 505 కేసులు 2017లో 257 ఉంటే 2020 నాటికి 1,527కు పెరిగాయి. రాష్ట్రాల్లో బిజెపి అధికారం ఉన్న చోట ఒక సామాజిక తరగతి మీద అసలు కేసులే నమోదు చేయటం లేదన్న విమర్శలున్న సంగతి తెలిసిందే. అందుకే బాధితులు లేదా ఎవరూ ఫిర్యాదు చేయకున్నా పోలీసులు తమంతట తాముగా కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.దేశంలో తలెత్తుతున్న ఆందోళనకర పరిస్థితికి ఈ కేసులు, సుప్రీం కోర్టు ఆదేశాలు నిదర్శనం.


2022 అక్టోబరు 21న సుప్రీం కోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్‌, హృషీకేష్‌ రాయి బెంచ్‌ ” ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము ? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్‌ 51చెబుతున్నది.మతం పేరుతో జరుగుతున్నదేమిటి ? ఇది విషాదం ” అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌ పోలీసు అధికారులు అలాంటి ద్వేష పూరిత ప్రసంగాలు ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆర్టికల్‌ 51(ఏ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పధాన్ని పాటించాలని, భారత్‌ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్న మతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించనట్లైతే సహౌదరభావం ఉండదని కోర్టు పేర్కొన్నది.


మానభంగం వంటి అత్యాచారాల కేసుల్లో శిక్షలు పడిన వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘించింది. గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మంది పెరోలుపై వెలుపలికి వచ్చినపుడు సత్పప్రవర్తనతో మెలిగారని చెబుతూ జీవిత కాల శిక్ష పడిన వారిని గుజరాత్‌ సర్కార్‌ విడుదల చేసింది.2002లో గోద్రా రైలు సజీవదహనం,దానిలో కొందరు కరసేవకులు మరణించిన తరువాత జరిగిన మారణకాండలో ఈ దారుణం చోటు చేసుకుంది. బిజెపి పెద్దలు వారికి ఘనస్వాగతాలు పలికి స్వీట్లు పంచారు, వీరకుంకుమలు దిద్దారు. తమ ” ఘన ” కార్యానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించింది. బాధితులుగా ఉన్న తమను దీని గురించి సంప్రదించలేదని, విడుదల గురించి తమకు తెలుపలేదని బిల్కిస్‌ కుటుంబం పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే ఈ నేరగాండ్లను గుజరాత్‌ ప్రభుత్వం ఆజాదీకా అమృతమహౌత్సవం పేరుతో ఆగస్టు15న విడుదల చేసింది. నారీశక్తి, మహిళలకు రక్షణ గురించి కబుర్లు చెబుతున్న పెద్దలు ఈ కేసులో రేపిస్టులను విడుదల చేసేందుకు ఎవరినీ ఖాతరు చేయలేదు. కేసు విచారణ జరిపిన సిబిఐ కోర్టు జడ్జి కూడా వీరి విడుదలను వ్యతిరేకించారు.” ఈ కేసులో నేరగాండ్లకు – బాధితులకు ఎలాంటి సంబంధమూ లేదు, ఎలాంటి వైరమూ లేదు.బాధితులు ఒక మతానికి చెందిన వారనే కారణాలతో మాత్రమే నేరానికి పాల్పడ్డారు.ఈ కేసులో చిన్న పిల్లలను, గర్భిణీని వదల్లేదు.ఇది అత్యంత హీనమైన విద్వేషపూరిత, మానవత్వం మీదనే జరిపిన నేరం ” అని పేర్కొన్నారు. ఇలాంటి రెండింజన్ల పాలనే మణిపూర్‌లో కూడా ఉన్నందున మహిళలను నగంగా తిప్పి, అత్యాచారం చేసిన ఉదంతాన్ని వెల్లడి కాకుండా తొక్కి పెట్టాలని చూశారు. వీడియో వెల్లడి కావటంతో మొక్కుబడి ప్రకటనతో సరిపుచ్చారు.విద్వేషాన్ని రెచ్చగొట్టటంలో ఎవరూ తక్కువ తినటం లేదు. రిజర్వేషన్ల గురించి ఆందోళన తలెత్తితే మణిపూర్‌లో చర్చ్‌లను తగులబెడతారు, మహిళల మీద అత్యాచారాలు చేస్తారు. మత విద్వేషం చెలరేగితే హర్యానాలో ఒక మతానికి చెందిన వారి నివాసాలు, దుకాణాల మీదకు మాత్రమే అక్కడి ప్రభుత్వ అధికారులు బుల్డోజర్లు నడుపుతారు. దేశం ఎటుపోతోంది అని గాదు ఎటు తీసుకుపోతున్నారు, ఎవరు అన్నది ఆలోచించాల్సిన తరుణం వచ్చింది.దేశంలో ముస్లింలు, దళితుల మీద జరుగుతున్న దాడులను నమోదు చేసేందుకు 2017లో హిందూస్తాన్‌ టైమ్స్‌ అనే పత్రిక పూనుకుంది.దాన్ని వెంటనే యాజమాన్యం నిలిపివేసింది, దానికి చొరవ చూపిన సంపాదకుడు రాజీనామా చేసి తప్పుకున్నారు. దీని వెనుక ఎవరి వత్తిడి ఉండి ఉంటుందో వేరే చెప్పాలా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

రానున్నది రోబోట్లు, కోబోట్ల యుగం !

02 Wednesday Aug 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Education, employees, Europe, Germany, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, UK, Uncategorized, USA

≈ 1 Comment

Tags

China, Cobots, robotics, Robots, Robots vs. Cobots


ఎం కోటేశ్వరరావు


ఒక నాడు కంప్యూటర్ల ప్రవేశం, వినియోగం గురించి అనుకూల వ్యతిరేక వాదనలు జరిగినట్లుగానే ఇప్పుడు ప్రపంచంలో రోబోట్లు, కోబోట్ల గురించి మాట్లాడుతున్నారు. మానవులతో పని లేకుండా ప్రోగ్రామ్‌ చేసి వదిలితే వాటంతట అవే పని చేసేవి రోబోట్లు, మనుషులు పని చేయించేవి కోబోట్లు. రెండూ ఉత్పత్తిని పెంచేవే. ఎవరు వద్దన్నా కద్దన్నా వచ్చే రోజులు వాటివే. అంతర్జాతీయ రోబోటిక్స్‌ ఫెడరేషన్‌ వెల్లడించిన తాజా అధ్యయనం ప్రకారం చైనా పెద్ద మొత్తంలో రోబోట్ల మీద పెట్టుబడి పెడుతోంది. ప్రతి పదివేల మంది కార్మికులకు అక్కడ ప్రస్తుతం 322 రోబోట్లు ఉన్నాయి. దీన్ని రోబోట్ల సాంద్రతగా పరిగణిస్తున్నారు. ఉత్పాదక రంగ పరిశ్రమల్లో 2021 సమాచారం ప్రకారం ప్రపంచ సగటు 141రోబోలు ఉన్నాయి. దేశాల వారీగా దక్షిణ కొరియా 1,000, సింగపూర్‌ 670, జపాన్‌ 399, జర్మనీ 397, చైనా 322, స్వీడన్‌ 321, చైనీస్‌ హాంకాంగ్‌ 304, చైనీస్‌ తైవాన్‌ 276, అమెరికా 274, స్లోవేనియా 249తో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. గతంలో వ్యవసాయం నుంచి పరిశ్రమలకు మారినపుడు, 1980వ దశకంలో వచ్చిన కంప్యూటర్ల తరువాత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఉపాధి దొరికినట్లే రోబోలు వచ్చినా కొత్త అవకాశాలు వస్తాయని సమర్దకులు చెబుతున్నారు. కార్మికుల స్థానంలో గతంలో యంత్రాలు వచ్చినా వాటిని నడిపేందుకు కార్మికులు కావాల్సి వచ్చింది. ఇప్పుడు రోబోలకు ఎవరితోనూ అవసరం ఉండదు.అందువలన అంత తేలిక కాదు అంటున్నారు మరికొందరు.


ప్రపంచ పరిణామాలను చూస్తున్నపుడు పెద్ద మొత్తంలో భారీ పరిశ్రమలను నిర్వహించేవారు లాభాలు ఎక్కువగా ఉంటాయి గనుక రోబోట్ల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. చిన్న సంస్థలు కోబోటిక్స్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరింత ఆధునిక రోబోలను రూపొందించేందుకు పరిశోధన- అభివృద్ధికి దేశాలూ, సంస్థలు కూడా భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. రోబో రంగంలో ప్రపంచ అగ్రగామిగా మారే లక్ష్యంతో చైనా 2021 డిసెంబరు 21న పద్నాలుగవ పంచవర్ష ప్రణాళికను ప్రకటించింది. ఐదు సంవత్సరాల్లో ఎనిమిది కీలక పరిశ్రమలను రోబోట్లతో నింపాలని పేర్కొన్నారు.” తెలివైన రోబో ” ను ఆవిష్కరించేందుకు 2022 ఏప్రిల్‌ 23న 4.35 కోట్ల డాలర్లతో పరిశోధనకు శ్రీకారం చుట్టారు.2018లో ప్రపంచంలో చైనా 20వ స్థానంలో ఉండగా మూడు సంవత్సరాల్లో ఐదవ స్థానానికి ఎదిగింది. నూతన రోబోట్‌ వ్యూహం పేరుతో జపాన్‌ 93 కోట్ల డాలర్లతో నూతన ఆవిష్కరణలతో తమ దేశాన్ని ప్రపంచ రోబో హబ్‌గా మార్చేందుకు పూనుకుంది. స్వంతంగా వాహనాలను నడిపే రోబోలతో సహా ఇతర ఆధునిక ఆవిష్కరణలకు నిధులు వెచ్చిస్తున్నది. పారిశ్రామిక రోబోల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జపాన్‌ 2021లో ప్రపంచానికి 45శాతం సరఫరా చేసింది.
నాలుగవ తరం పారిశ్రామిక విప్లవానికి అవసరమైన రోబోలను అందించేందుకు దక్షిణ కొరియా 2022వ సంవత్సరానికే 17.25 కోట్ల డాలర్లను కేటాయించింది. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలకు 2021 నుంచి 2027వరకు 9.43 కోట్ల డాలర్లను ఐరోపా సమాఖ్య వెచ్చించనుంది. 2021-22లో రోబో సంబంధిత కార్యక్రమానికి 19.85 కోట్ల డాలర్లను కేటాయించింది. హైటెక్‌ వ్యూహం 2025 పేరుతో జర్మనీ పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఏటా 6.9 కోట్ల డాలర్లను 2026 వరకు ఖర్చు చేస్తుంది. జాతీయ రోబోటిక్‌ చొరవ(ఎన్‌ఆర్‌ఐ 3.0) పేరుతో అమెరికా కూడా 2021లో 1.4 కోట్ల డాలర్లతో నవీకరణకు పూనుకుంది. అంతరిక్షంలో పరిశోధనలకు అవసరమైన రోబోలను రూపొందించటం కూడా దీనిలో ఉంది. రోబో సాంద్రతలో వెనుకబడ కూడదని అది భావిస్తున్నది.


రానున్న రోజుల్లో పారిశ్రామిక ఉత్పత్తి, అంతరిక్షం, వైద్యం మొదలు అనేక రంగాల్లో ముందుండేందుకు ప్రపంచ దేశాలన్నీ పరుగులు పెడుతున్నాయి.కృత్రిమ మేథలో ఎవరికి వారు పైచేయి సాధించాలని చూస్తున్నారు. వైద్యం వంటి రంగాలలో రోబోలతో మరింత మెరుగైన సేవలను అందించవచ్చుగానీ పారిశ్రామిక రంగంలో వీటి ప్రవేశంతో వేతనాల తగ్గుదల, నిరుద్యోగం పెరుగుతుందనే అభిప్రాయాలతో పాటు దీర్ఘకాలంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని చెప్పేవారు కూడా ఉన్నారు.చైనాలో జరిగిన పరిశోధనలో పారిశ్రామిక రోబోలు ప్రతికూల ప్రభావం చూపుతాయని తేలిందని కొందరు ఉటంకిస్తున్నారు.2016లో ప్రచురితమైన ఒక పత్రం ప్రకారం యాంత్రీకరణ వలన 77శాతం మంది ఉపాధికి గండిపడుతుందని పేర్కొన్నారు. దానికి ఫాక్స్‌కాన్‌ కంపెనీని ఉదహరించారు. 2020నాటికి 30శాతం ఆటోమేషన్‌ చేసేందుకు గాను 2012-16 సంవత్సరాల్లో నాలుగు లక్షల ఉద్యోగాలను రోబోలతో నింపారు. అన్నింటా అదే జరుగుతుందని చెప్పలేము. గంటలవారీ చెల్లించే వేతనాలు తొమ్మిదిశాతం తగ్గినట్లు కూడా తేలింది. కార్మికుల పని గంటలు కూడా పెరిగాయి. మెకెన్సీ గ్లోబల్‌ సంస్థ 2017లో వెల్లడించిన నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచంలో ఐదో వంతు అంటే 80 కోట్ల ఉద్యోగాలు రద్దుకానున్నట్లు అంచనా వేశారు.నలభై ఆరు దేశాల్లోని పరిస్థితిని విశ్లేషించారు. ధనిక దేశాల్లో యాంత్రీకరణ మరింత ఎక్కువగా ఉంటుంది కనుక నిధులు కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, పేద దేశాల దగ్గర డబ్బు ఉండదు కనుక వాటి మీద ప్రభావం తక్కువేనని కూడా పేర్కొన్నది. యాంత్రీకరణతో మెషిన్‌ ఆపరేటర్లు, ఆహార కార్మికులు, ఆఫీసు సిబ్బంది, అకౌంటెంట్లు ఎక్కువగా ప్రభావితులౌతారు. భారత్‌లో తొమ్మిది శాతం ఉద్యోగాలను నూతన సాంకేతిక యంత్రాలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది. వైద్యులు, లాయర్లు, బార్లలో పనిచేసే వారు, తక్కువ వేతనాలతో పనిచేసే గార్డెనర్లు, ప్లంబర్లు, సంరక్షణ సిబ్బంది మీద పెద్దగా ప్రభావం ఉండదు. తక్కువ చదువుకున్నవారికి ఉపాధి తగ్గుతుంది, అభివృద్ది చెందిన దేశాలలో విశ్వవిద్యాలయాల చదువు అవసరాలు పెరుగుతాయి.అమెరికాలో 2030 నాటికి 3.9 నుంచి 7.3 కోట్ల వరకు ఉద్యోగాలు రద్దవుతాయని, ఉపాధి కోల్పోయే రెండు కోట్ల మందిని ఇతర పరిశ్రమల్లోకి సర్దుబాటు చేయవచ్చని, బ్రిటన్‌లో 20శాతం ఉద్యోగాలను రోబోలతో నింపుతారని మెకెన్సీ పేర్కొన్నది.


అమెరికాలో రోబోల ప్రవేశం గురించి జరిగిన పరిశోధనలో ప్రతి 1000 మంది కార్మికులకు ఒక రోబోను ఏర్పాటు చేస్తే 0.42 శాతం వేతనాలు తగ్గుతాయని, ఉపాధి జనాభా దామాషాలో 0.2శాతం తగ్గుతుందని అంచనా వేశారు.ప్రదేశాలను బట్టి ఇవి మారతాయి. మరొక రోబోను తోడు చేస్తే ఆరుగురికి ఉపాధి ఉండదు. వెల్డింగ్‌, పెయింటింగ్‌, పాకింగ్‌ వంటి వాటిని పూర్తిగా ఆటోమేషన్‌ చేయవచ్చు. 1993-2007 కాలంలో అమెరికాలో పారిశ్రామిక రోబోట్లు నాలుగు రెట్లు పెరిగాయి.యాంత్రీకరణ కంటే ఇవి ఎక్కువ మంది ఉపాధి పోగొట్టినట్లు తేలింది. ఆటోమోటివ్‌ పరిశ్రమలో ఎక్కువగా రోబోట్లు వస్తున్నాయి.ఎలక్ట్రానిక్స్‌లో 15,కెమికల్స్‌లో 10శాతం రోబోట్లను పెట్టగా ఆటో పరిశ్రమలో 38శాతం ఏర్పాటు చేశారు. పెట్టుబడిదారీ దేశాల్లో కార్పొరేట్ల లాభాల ప్రాతిపదికనే రోబోలను ఏర్పాటు చేస్తే చైనాలో ఎందుకు వేగంగా ప్రవేశపెడుతున్నారనే ప్రశ్న తలెత్తవచ్చు. అమెరికా, ఐరోపా ధనిక దేశాల్లో జనాభా తక్కువ, ఉత్పత్తి ఎక్కువ గనుక లాభాల కోసం చేస్తే చైనాలో 140 కోట్ల జనాభా వినియోగం కోసం ఉత్పత్తి, సేవలను ఎంతగానో పెంచాల్సిన అవసరం ఉంది. పెట్టుబడిదారీ దేశాల్లో లాభం కొన్ని సంస్థల చేతుల్లో చేరుతుంది, చైనాలో ఎక్కువ భాగం సమాజపరం అవుతుంది. ఐరోపా, జపాన్‌ మాదిరి చైనాలో సగటు జీవిత కాలం పెరగటం, పిల్లల్ని కనటం తగ్గింది కనుక రానున్న కాలంలో కార్మికులకు కొరత ఏర్పడనుందని అక్కడి నిపుణులు అంచనా వేశారు. ఆ పరిణామం పశ్చిమ ఐరోపా దేశాల్లో చూస్తున్నదే. ఈ కారణంగా కూడా చైనా రోబోట్లను ప్రవేశపెడుతున్నది. చైనాలో గత దశాబ్దిలో 50లక్షల జనాభా తగ్గింది. సామర్ధ్యపెంపుదలకు, డ్రైవర్లతో పని లేని కార్లు, రోబోలతో నడిచే గోదాముల వంటి వాటి ఏర్పాటుకు అనేక పరిశోధనలు చేస్తున్నారు. పది సంవత్సరాల క్రితం ఫైనాన్సియల్‌ రంగంలో పని చేసే ఒక కార్మికుడి ఉత్పాదకత ఐరోపాతో పోల్చితే చైనాలో 20శాతం ఉంది, తరువాత 40,50 శాతం వరకు పెరిగినప్పటికీ ఇంకా చాలా తేడా ఉంది. అందువలన వాటితో పోటీ పడాలంటే తగిన మార్పులు అవసరం అని భావిస్తున్నారు. మన దేశంలో కారు డ్రైవర్లకు తక్కువ వేతనాలకు దొరుకుతున్నారు గానీ ఐరోపాలో, అమెరికాలో అలా దొరకరు. అందుకే డ్రైవర్లతో పనిలేని కార్ల గురించి పరిశోధనకు తెరతీశారు.రోబో, యాంత్రీకరణ కారణంగా చైనాలో 2018-30 మధ్య 30శాతం మంది కార్మికులు ఒక పని నుంచి మరొకదానికి మారాల్సి ఉంటుందని మెకెన్సీ సంస్థ అంచనా వేసింది. ఇది అక్కడి ప్రభుత్వం, పౌరులకూ పెద్ద సవాలే అనటంలో సందేహం లేదు. దాన్ని అధిగమించేందుకు చైనా సన్నద్దం అవుతున్నది.


చైనాలో రోబోట్ల ప్రవేశం వలన కలిగే ప్రతికూల పర్యవసానాలు రానున్న రెండు దశాబ్దాల్లో కనిపిస్తాయని కొందరు చెబుతున్నారు. కృత్రిమ మేథ, రోబోట్ల వలన రెండు దశాబ్దాల్లో 26శాతం మంది వేరే ఉపాధి చూసుకోవాల్సి వుంటుందని ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ అంచనా వేసింది. దీనికీ మెకెన్సీ అంచనాకు చాలా తేడా ఉంది. కొన్ని పోవటం, కొత్త ఉపాధి రావటం ఏతా వాతా వచ్చే రెండు దశాబ్దాల్లో నికరంగా పన్నెండు శాతం ఉపాధి పెరుగుతుందని కూడా ప్రైస్‌వాటర్‌ చెప్పింది.2017-37 మధ్య సేవారంగంలో 9.7 కోట్లు, నిర్మాణ రంగంలో 1.4 కోట్లు, పరిశ్రమల్లో 40లక్షల మందికి ఉపాధి పెరిగితే వ్యవసాయంలో 2.2 కోట్లు తగ్గితే మొత్తంగా 9.3 కోట్లు పెరుగుతాయని అంచనా వేసింది. అక్కడ ఉన్నది ప్రజానుకూల సోషలిస్టు ప్రభుత్వం గనుక వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన సర్దుబాటు చేస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఇదంతా దానికంతటికి అదే జరుగుతుందని ఎవరూ భావించనవసరం లేదు. ఎదురవుతున్న అనేక సవాళ్లను అధిగమించిన చైనా గత చరిత్రను బట్టి ఇలా చెప్పవచ్చు. జనానికి పని కల్పించి ఉత్పత్తి పెంచి ఎగుమతులు చేసి ఎంతో ప్రగతి సాధించిన చైనాలో మాదిరి ఇతర దేశాల్లో కార్మికుల వేతనాలు పెరగలేదు. ఒకనాడు తక్కువగా ఉన్న కారణంగా అనేక దేశాలు తమ పెట్టుబడులతో అక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేతనాలు పెంచిన కారణంగా ఆశించిన మేర లాభాలు రావటం లేదని కొన్ని సంస్థలు అక్కడి నుంచి వెనక్కు పోతున్నాయి. ఎగుమతుల మీద ఎల్లకాలం ఆధారపడటం సాధ్యం కాదని గ్రహించిన కారణంగానే తమ జనాల కొనుగోలు శక్తిని పెంచేందుకు వేతన పెంపుదల వంటి చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. నూతన ఆవిష్కరణలతో ఉత్పత్తి పెరిగితే ఆ మేరకు మానవ శ్రమ పని గంటలను తగ్గించి అందరికీ ఉపాధి కల్పించటం, సంపదల పంపిణీతో జనం అవసరాలను తీర్చటం వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందువలన ఈ నూతన సవాలును ప్రజల పట్ల బాధ్యత కలిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ అధిగమించటం ఖాయం, అయితే ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఆసక్తికరం, ఇదే సమస్యను ఎదుర్కొనే పెట్టుబడిదారీ దేశాలు ఎలా పని చేసేది చూడాల్సి ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ప్రధాని నరేంద్రమోడీకి ఒక బహిరంగ లేఖ : ఆవు పేడ కాదు, కావాల్సింది సెమీ కండక్టర్ల పరిశోధన !

31 Monday Jul 2023

Posted by raomk in CHINA, Current Affairs, Economics, Europe, Germany, History, INDIA, International, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, UK, USA

≈ Leave a comment

Tags

America's tech war with China, India’s R&D, Narendra Modi, Narendra Modi Failures, R&D investment, Research on cow dung, Semicon India 2023, Semiconductor


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారికి,
అయ్యా ప్రతి నెలా మీ మన్‌కీ బాత్‌ అంశాలను చదివేవారిలో నేను ఒకరిని.ఒక జర్నలిస్టుగా జన్‌కీ బాత్‌లో ఉన్న కొన్ని ంటిని ఈ బహిరంగ లేఖ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జూలై 28-30 తేదీలలో గుజరాత్‌ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో తమరు సెమికాన్‌ ఇండియా 2023 రెండవ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా దేశమంతటా పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు కూడా జారీ చేశారు. దేశాన్ని సెమీకండక్టర్ల కేంద్రంగా మార్చుతామని, మూడు వందల కాలేజీల్లో సెమికండక్టర్‌ కోర్సులను ప్రవేశపెడతామని తమరు ప్రకటించటం సంతోషం. గతంలో దేశంలో జరిగిన అనర్ధాలకు, వెనుకబడి ఉండటానికి,మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రాకపోవటానికి నెహ్రూనే కారణం అని బిజెపి, దాని మాతృసంస్థ సంఘపరివారం ఠకీమని సమాధానం చెబుతుంది. సెమికండక్టర్ల రంగంలో వెనుకబడటానికి కూడా నెహ్రూనే నిందిస్తారా ?


అన్నీ మీరే చేశారు అని మా తెలుగు సినిమాలో ఒక పాత్ర తండ్రిని తప్పుపడుతుంది. అలాగే అన్నీ ఆ నెహ్రూ చేశారనే కాసేపు అనుకుందాం.ఆయన అనుసరించిన విధానాల నుంచి కాంగ్రెస్‌ 1990దశకంలోనే నూతన ఆర్ధిక విధానాల పేరుతో వైదొలిగిందని మీకు తెలియంది కాదు. వాటినే మీరు అమలు జరుపుతున్నారు తప్ప కొత్త విధానాలు కాదు, ఎందుకంటే వాటిని మన మీద ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ రుద్దింది. గత పది సంవత్సరాలలో మీకు పూర్తి అధికారం ఉన్నప్పటికీ మీరు అంగీకరించినా లేకున్నా అనేక రంగాలలో వైఫల్యబాటలోనే దేశం ఉండటానికి కారణం ఆ విఫల విధానాలనే మరింత వేగంగా అమలు జరపటమే. అరిగిపోయిన రికార్డు అంటే ఇప్పటివారికి తెలియదు కనుక అన్నీ నెహ్రూనే చేశారు అనే పాచిపాట ఇంకా ఎంతకాలం పాడాలి అని మీ భక్తులు, జనం నుంచి ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. మీరు చెప్పిన మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, దేశమంతటా గుజరాత్‌ నమూనా అభివృద్ధి వంటి విఫల నినాదాలను చూసిన తరువాత ఎన్నికల కోసం ఆడుతున్న ఆటలో భాగం ఇదని అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన నినాదం, చెప్పిన మాట మరోసారి మీ నోటి వెంట రాదన్నది స్పష్టమే. మీ శైలి అనితరసాధ్యం. గతంలో అమెరికా, పూర్వపు సోవియట్‌ మధ్య ప్రచ్చన్న పోరులో అణ్వాయుధాలు కేంద్ర స్థానంలో ఉంటే ఇప్పుడు అమెరికా, చైనా మధó్య తలెత్తిన పోరులో సెమీకండక్టర్‌లు ఉన్నాయి.ఆయుధాలలో కూడా ఇవి కీలకంగా మారనున్నాయని విశ్వగురువుగా ప్రపంచాన్ని ఔపోసన పట్టిన మీకు నేను చెప్పాల్సినపని లేదు.


ఎయిర్‌బస్‌లో అనేక దేశాలను అలా వెళ్లి ఇలా చుట్టివచ్చిన మీరు సెమీకండక్టర్‌ బస్‌ను ఎలా మిస్‌ అయ్యారన్నది చాలా మందికి అర్ధం కావటం లేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తరువాత వచ్చిన ప్రధానులెవరికీ(వారిలో అతల్‌ బిహారీ వాజ్‌పాయి ఉన్నదీ లేనిదీ తెలియదు) దూర దృష్టి లేదని విమర్శించే మీ అనుయాయులు (సుబ్రమణ్య స్వామిని పక్కన పెడదాం) మీ గురించి ఏం చెబుతారో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేసిన దాన్ని మీరు తొలి ఐదు సంవత్సరాల్లోనే చేసి చూపించారని గత ఎన్నికలపుడు ప్రచారం చేశారు. చేసిందేమిటో సాధికారిక సమాచారాన్ని జనానికి అందిస్తే వాస్తవం తెలుస్తుంది. మన దేశంలో మీ కంటే ముందు నుంచి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) పేరుతో వివరాలను సేకరిస్తున్నారు. దానిలో మీ పాలనలో అనేక సూచికలు దిగజారినట్లు కనిపించింది. మీ ఏలుబడిలో నిరుద్యోగం పెరిగిందన్న సమాచారాన్ని గత లోక్‌సభ ఎన్నికల ముందు తొక్కిపెట్టిన సంగతి మీకు చెప్పనవసరం లేదు. వచ్చే సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని సమాచారాన్ని సేకరించే పద్దతిని రూపొందించే సంస్థ అధిపతినే తప్పించారు అని జనం అనుకుంటున్నారు.


నరేంద్రమోడీ పెద్ద విజనరీ అంటే భూత, వర్తమాన, భవిష్యత్‌ను చూడగలిగిన దృష్టి కలవారని అని ప్రచారం చేశారు. నిజమే కావచ్చు, సర్వేల్లో వచ్చే సమాచారం ఎలాంటిదో మీకు ముందే తెలిసి ఉంటుంది గనుక దాని రూపకర్తనే తొలగించారు. అన్నట్లు మరిచాను. ఈ ఏడాది మీ మీద ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని మీరు ముందే గ్రహించి ఆ విషయాన్ని ఎన్నో సంవత్సరాల ముందే మీరు చెప్పినట్లు కొందరు సామాజిక మాధ్యమంలో మీ గొప్ప గురించి ప్రచారం చేస్తున్న పోస్టు ఉంది. దాని నిజా నిజాలు మీకే ఎరుక. నిజంగా మీకు తెలిసి ఉంటే మణిపూర్‌ దురంతాన్ని ఎందుకు నివారించలేకపోయారు అన్న ప్రశ్న వస్తోంది. దాన్ని వదలివేద్దాం. నాలుగవ తరం పారిశ్రామిక విప్లవం గురించి కూడా మీరు చెప్పారు. పిండి లేకుండా రొట్టెలు రావు కదా ? దానికి అవసరమైన పరిశోధన, అభివృద్ధి రంగాల ప్రాధాన్యత, దానిలో సెమికండక్టర్ల గురించి ప్రధాని కాగానే లేదా అంతకు ముందు గుజరాత్‌ సిఎంగా ఎందుకు పసిగట్టలేకపోయినట్లు ? ఈ రంగానికి నిధుల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు చేయాల్సి ఉంది. రెండూ జరగటం లేదు. ముంబై కేంద్రంగా పని చేస్తున్న గేట్‌వే హౌస్‌ అనే ఒక మేథో సంస్థ 2015 జనవరి పదహారున టెక్నాలజీ పరుగులో చైనా ముందు భారత్‌ ఓడిపోనుందా అనే శీర్షికతో ఒక విశ్లేషణను ప్రచురించింది. మీ సలహాదారులకు దీని గురించి తెలియదని అనుకోలేము.లేదా ఇలాంటి వాటిని పట్టించుకోకపోతే మన దేశ ఖర్మ అనుకోవటం తప్ప చేసేదేమీ లేదు. దానిలో పరిశోధన, అభివృద్ది ఖర్చు గురించి చర్చించారు. 1991 నుంచి చైనా పరిశోధన ఖర్చును ఏటా 19శాతం పెంచుతూ 2012నాటికి జిడిపిలో 1.97శాతానికి చేరినట్లు పేర్కొన్నారు.అప్పటికి మనదేశ ఖర్చు 0.9శాతం మాత్రమే ఉంది.ఫస్ట్‌ పోస్ట్‌ అనే పత్రికలో 2023 ఫిబ్రవరి ఒకటిన ప్రచురితమైన ఒక విశ్లేషణలో జిడిపిలో మనదేశ తాజా ఖర్చు 0.7శాతమే అని చైనా 2.1శాతంగా పేర్కొన్నారు. జిడిపిలో రెండు శాతం ఖర్చు చేయాలని గతంలో వాజ్‌పాయి సర్కార్‌ కూడా చెప్పింది. దూరదృష్టి గల మీ పాలనలో గతం కంటే తగ్గిందేమిటి ? మన దేశంలో నిపుణులకు, పరిశోధకులకు కొరత ఉన్నదా ?


కుహనా అంశాలమీద పరిశోధనకు మీరు చూపుతున్న శ్రద్ధ సెమికండక్టర్స్‌ వంటి ప్రాధాన్యరంగాల మీద లేదు, ఆవు పేడ, మూత్రం, పాలలో బంగారం ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ పరిశోధనలకు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృధా చేస్తున్నదని 2020 సంవత్సరంలో వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రభుత్వతీరుతెన్నులను తప్పు పడుతూ ఆ పరిశోధనలను ఆపివేయాలని కోరినా మీరు పట్టించుకోలేదు. అంతకు ముందు 2017లో పంచగవ్య గురించి ఆయుర్వేద పుస్తకాల్లో రాసిన వాటిని రుజువు చేసేందుకు పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. మొత్తంగా పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించకుండా ముందుకు పోవటానికి మీ దగ్గర మంత్రదండమేదైనా ఉంటే హాం ఫట్‌ అంటూ తిప్పండి.ప్రతి లక్ష మంది జనాభాకు ఇజ్రాయెల్‌లో 834, దక్షిణ కొరియా 749,అమెరికాలో 441, చైనాలో 130 మంది పరిశోధకులు ఉండగా మనదేశంలో కేవలం 25 మంది మాత్రమే ఉన్నారని చెప్పటం మీకు ఇష్టముండదని తెలిసినా తప్పటం లేదు.


తినేందుకు బంగాళాదుంప, అరటి చిప్స్‌ లేకున్నా రోజు గడుస్తుందిగానీ ఎలక్ట్రానిక్స్‌ చిప్స్‌ లేకుండా మనకు క్షణం గడవదంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో నిపుణులైన సెమికండక్టర్‌ రూపకల్పన ఇంజనీర్లు ప్రపంచం మొత్తంలో ఉన్నవారిలో 20శాతం మంది మనదేశంలో ఉన్నారని అంచనా. వారందరినీ విదేశీ కంపెనీలకు చౌక శ్రామికులుగా సమర్పించటం తప్ప ఇప్పుడు జరుగుతున్నదేమైనా ఉందా ? వారు సాధించే పేటెంట్స్‌ మన దేశానికి దక్కవు. మన ఇంజనీర్లు ఐటి రంగంలో ముందున్నారు. దీనికి మీ సర్కార్‌ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. హార్డ్‌వేర్‌ రంగంలో ఆ స్థితి లేదు. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువ భాగం మనం దిగుమతి చేసుకుంటున్నార. అదే విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో విదేశీ కంపెనీలు రూపకల్పనలో లబ్ది పొందటం తప్ప చిప్స్‌ తయారీ మన దేశంలో ఎంతమేరకు జరుగుతుందన్నది ప్రశ్నార్ధకమే. ప్రస్తుతం అమెరికా మైక్రాన్‌ కంపెనీ ఎక్కడో ఉత్పత్తి చేసిన వాటిని మనదేశంలో పరీక్షించి పాకింగ్‌ చేయిస్తున్నది. దానితోనే పండగ చేసుకుందామా ?


చైనా మీద అమెరికా ప్రారంభించిన టెక్నాలజీ పోరులో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది.తమ దేశంలోనే సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయాలని, అక్కడి నుంచి ఎగుమతులు జరపాలని అమెరికా సర్కార్‌ పట్టుబడుతోంది. తైవాన్‌లోని టిఎస్‌ఎంసి కంపెనీ ఉత్పత్తి మీద అదుపు కలిగి ఉంది.1990లో ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పతిలో అమెరికా వాటా 37శాతం ఉంటే 2020లో 12శాతానికి తగ్గింది. తిరిగి పూర్వపు స్థితికి చేరాలంటూ కొత్త పరిశ్రమలకు ఇచ్చేందుకు 280 బిలియన్‌ డాలర్లను అమెరికా కేటాయించింది.ఈ మొత్తానికి స్థానిక ప్రభుత్వాలు ఇచ్చేది అదనం. ఇప్పటి వరకు అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్‌ సెమీకండక్టర్ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు సబ్సిడీల నిమిత్తం పదివేల కోట్ల డాలర్లు పక్కన పెడుతున్నట్లు ప్రకటించాయి. ఇంటెల్‌ కంపెనీ జర్మనీలో 30బిలియన్‌ యూరోల ప్లాంట్‌ పెట్టాలంటే మూడో వంతు తమకు సబ్సిడీ ఇవ్వాలని బేరమాడింది.పోలాండ్‌, జర్మనీ, ఇజ్రాయెల్లో కొత్త ప్లాంటులు పెట్టేందుకు 50బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇంటెల్‌ పేర్కొన్నది. మొత్తం మీద చూస్తే ఈ రంగంలో ముందున్న కంపెనీలు పెద్ద ఎత్తున లబ్దిపొందనున్నాయి. ఈ పోరులో మనదేశం ఎక్కడ అన్నది ప్రశ్నార్ధకమే.


గత పది సంవత్సరాలుగా ఈ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణం అని మీ మద్దతుదార్లు చెప్పినా ఆశ్చర్యంలేదు. అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండోతో మన మంత్రి పియూష్‌ గోయల్‌ 2023 మార్చి పదవ తేదీన సెమీకండక్టర్ల సరఫరా, నూతన ఆవిష్కరణల భాగస్వామ్యం గురించి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో సంక్లిష్టమైన, వర్ధమాన సాంకేతికతల (ఐసిఇటి) సహకారం గురించి ఒప్పందం జరిగింది. చిత్రం ఏమంటే అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వాస్తవాల పత్రంలో మిగతా అంశాల గురించి ఉంది తప్ప సెమీకండక్టర్ల మీద నిర్దిష్టంగా ఏమీ లేదు అని కార్నెగీ ఇండియా వెబ్‌సైట్‌లో 2023 మే నెల 23వ తేదీన కోణార్క భండారీ రాశారు. మన దగ్గర దానికి భిన్నమైన సమాచారం ఉంటే ఆ పత్రాన్ని విడుదల చేస్తే వాస్తవం తెలుస్తుంది. మనదేశంలో ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే వాటిని ప్రోత్సహించేందుకు ఉత్పాదకతతో ముడివడిన ప్రోత్సాహక(పిఎల్‌ఐ) పధకాన్ని 2021 నుంచి ఐదేండ్లలో రు.1.97లక్షల కోట్లు ఇచ్చే ప్రవేశపెట్టారు. కానీ దాన్ని ఆచరణలో ఉత్పత్తి బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలను ఒక దగ్గర చేర్చే సెల్‌ఫోన్లకు, చిప్స్‌ పరీక్షలకు ఇస్తున్నారు. అందుకే భలే మంచి పధకం, వదలితే దొరకదని పొలోమంటూ ఆపిల్‌, మైక్రాన్‌ వంటి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయి.


రెండు దిగ్గజదేశాలైన అమెరికా, చైనా సెమీకండక్టర్ల రంగంలో పైచేయి సాధించేందుకు భారీ సబ్సిడీలతో పోటీ పడుతున్నాయి. అదే సమయంలో చైనా తన స్వంత రూపకల్పన, ఉత్పత్తికి గాను భారీ మొత్తంలో పరిశోధనకు నిధులు వెచ్చిస్తున్నది. మనదేశంలో ఒక సమగ్ర విధానాన్ని కూడా ఇప్పటికీ రూపొందించుకోలేకపోయాము.అలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా ఉంటే మన దేశాన్ని సెమీకండక్టర్‌ హబ్‌గా మారుస్తానని మీరు చెబుతున్నారు. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ తాజా(2023) సమాచారం ప్రకారం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌, చైనా, అమెరికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఫాబ్రికేషన్‌లో 2022 డిసెంబరు నాటికి జపాన్‌లో 102, తైవాన్‌ 77, అమెరికా 76, చైనా 70, జర్మనీ 20, బ్రిటన్‌ 12, మలేషియా 7 ప్లాంట్లను కలిగి ఉన్నాయి. తరువాత స్థానాల్లో ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. గుజరాత్‌లో 70శాతం సబ్సిడీ ఇచ్చి అమెరికా మైక్రాన్‌ కంపెనీతో ఒక పాకింగ్‌ కేంద్రాన్ని పెట్టించి దీంతో ప్రపంచ హబ్‌గా మారుస్తానని మీరు జనాలకు చెబుతున్నారు. ఇది ఎంతకాలం నడుస్తుంది ? అమెరికా మనలను తన సహజ భాగస్వామిగా పరిగణిస్తున్నదని, పిలిచి పెద్ద పీటవేస్తున్నదని చెబుతున్నారు. గతేడాది (2022) మార్చి నెలలో తొలిసారిగా అమెరికా చొరవతో చిప్స్‌ 4 లేదా ఫాబ్‌ 4 కూటమి ఏర్పడింది. దానిలో తైవాన్‌(చైనా తిరుగుబాటు రాష్ట్రం), జపాన్‌, దక్షిణ కొరియా ఇతర భాగస్వాములు తప్ప మనకు చోటు లేదు. ప్రపంచ సెమీకండక్టర్ల పరిశ్రమలో 70శాతం వాటా ఈ నాలుగు దేశాలదే. విధాన రూపకల్పన, ఉత్పత్తిలో పరస్పరం సహకరించుకొనేందుకు, విస్తరణకు దీన్ని ఏర్పాటు చేశారు.


గత తొమ్మిది సంవత్సరాల్లో దేశ అప్పును విపరీతంగా పెంచివేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రు.50,68,235 కోట్లు కాగా 2015 మార్చి నాటికి అంటే తొలి ఏడాది దాన్ని రు.56,07,315 కోట్లకు తరువాత మీరు దాన్ని ఎడాపెడా పెంచారు.కేవలం మీరు చేసిన అప్పు 2024 మార్చి నాటికి 118,78,431కోట్లకు పెంచుతామని ప్రతిపాదించారు.మీరు అధికారానికి వచ్చినపుడు కేంద్ర ప్రభుత్వ రుణం జిడిపిలో 67.1 శాతం కాగా 2021లో 88.5 శాతానికి పెరిగింది, 2023 నాటికి అది 83.1శాతంగా ఉంది. ఇంత చేసిన వారు పరిశోధనకు పెంచకపోగా ఎందుకు తగ్గించిందీ ఏదైనా ఒక మన్‌కీ బాత్‌లో చెబితే సంతోషం. ఆవు పేడ పరిశోధన నిధులు సెమీ కండక్టర్లకు మళ్లించండి, సబ్సిడీలతో పాటు పరిశోధనలకూ నిధులు ఇవ్వండి. ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నా.
తోటి భారతీయుడు
ఎం కోటేశ్వరరావు

Share this:

  • Tweet
  • More
Like Loading...

పరిశోధనల్లో చైనాను తక్కువ అంచనా వేస్తే ముప్పే – అమెరికాను హెచ్చరించిన ఓ నివేదిక !

14 Wednesday Jun 2023

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, Science, Uncategorized, USA

≈ Leave a comment

Tags

anti china, Chinese Innovation Inputs, Chinese Scientific Articles, ITIF, natural-science research ranking, R&D Expenditures


ఎం కోటేశ్వరరావు


ప్రకృతి విజ్ఞానం(నేచురల్‌ సైన్స్‌)లో అమెరికాను వెనక్కు నెట్టి చైనా ప్రధమ స్థానానికి వచ్చిందన్నది ఒక నివేదిక.” మేలుకో అమెరికా : నవ కల్పన ఉత్పత్తిలో అమెరికాను అధిగమిస్తున్న చైనా ” అనే శీర్షికతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఐటిఐఎఫ్‌) ఒక నివేదికలో హెచ్చరించింది. ” చైనా నకిలీ సైన్సు పరిశ్రమ ” అంటూ ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక ఒక పెద్ద నింద మోపింది. ఇవన్నీ ఇటీవల చైనా గురించి వచ్చిన విశ్లేషణలు, వార్తలకు సంబంధించిన అంశాలు. ప్రకృతి విజ్ఞానంలో చైనా తొలిసారిగా అమెరికాను అధిగమించి ఒకటవ స్థానంలో ఉన్నట్లు నేచర్‌ ఇండెక్స్‌ పేర్కొన్నది. అగ్రశ్రేణి పత్రికల్లో 2022 సంవత్సరంలో ప్రచురితమైన పరిశోధనా పత్రాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. ఎనభై రెండు పత్రికల్లో చైనాకు చెందిన వారు సమర్పించిన పత్రాలు 19,373 కాగా అమెరికా నుంచి వచ్చినవి 17,610 ఉన్నాయి. ఏ దేశానికి చెందిన వారైనా ఏ దేశం నుంచి పత్రాలను సమర్పిస్తే వాటిని ఆ దేశాల ఖాతాలో వేస్తారు. ప్రకృతి విజ్ఞాన పరిశోధనా పత్రాల సమర్పణలో చైనా, అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, జపాన్‌ మొదటి ఐదు స్థానాల్లో ఉండగా మన దేశం పదవ స్థానంలో ఉంది. భౌతిక, రసాయన శాస్త్ర పరిశోధనల్లో 2021లో చైనా మొదటి స్థానంలో ఉంది. తాజా సమాచారాన్ని పరిశీలించినపుడు భూమి, పర్యావరణ శాస్త్రాలలో కూడా తొలిసారిగా అమెరికాను వెనక్కు నెట్టి చైనా ముందుకు వచ్చింది. గత ఏడాది వివరాలను పరిశీలించినపుడు ప్రపంచ అగ్రశ్రేణి 50 పరిశోధన ఉత్పాదక సంస్థలలో చైనా సైన్సెస్‌ అకాడమీ ఒకటవదిగా ఉండగా మొత్తం 19 చైనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఆ జాబితాలో ఉన్నాయి. 2010 నుంచి జాతీయ సమతూకంలో మార్పు ఉన్నట్లు నేచర్‌ ఇండెక్సు ప్రకటన పేర్కొన్నది.2018 -2020 సంవత్సరాలలో ఉటంకించిన అగ్రశ్రేణి ఒకశాతం పరిశోధనా పత్రాలలో అమెరికా కంటే చైనావే ఎక్కువగా ఉన్నట్లు సైన్సెస్‌ మరియు టెక్నాలజీ జపాన్‌ జాతీయ సంస్థ 2022 నివేదిక పేర్కొన్నది.

నిజానికి 2018లోనే మొత్తం పరిశోధనా పత్రాల సమర్పణలో అమెరికా, ఐరోపాను వెనక్కు నెట్టి చైనా ముందుంది.
2018 నుంచి 2020వరకు ప్రపంచ శాస్త్ర పత్రాలలో 23.4శాతంతో చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతానికి జీవ శాస్త్ర రంగంలోనే అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.అమెరికా ఎన్నో శతాబ్దాలు ముందుండి పరుగులు పెడుతుంటే చైనా ఇటీవలనే నడక ప్రారంభించింది. అందుకే ఇప్పటికీ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు కొన్ని రంగాలలో ముందున్నాయి. నోబెల్‌ బహుమతులను కొలబద్దగా తీసుకుంటే 403తో అమెరికా, 137తో బ్రిటన్‌, 114తో జర్మనీ మొదటి మూడు స్థానాల్లో ఉండగా చైనా తొమ్మిదితో 23వ స్థానంలో ఉంది. 2015లో పశ్చిమ దేశాల సైన్సు పత్రికలలో చైనా పరిశోధనా పత్రాలు కేవలం ఏడున్నవేలు మాత్రమే ప్రచురణకు నోచుకోగా అమెరికా నుంచి 21వేలవరకు ఉన్నాయి. 2020 అమెరికా పత్రాలు స్వల్ప తేడాతో స్థిరంగా ఉండగా తరువాత తగ్గటం ప్రారంభమైంది. మరోవైపున అచిర కాలంలోనే చైనా దాన్ని అధిగమించింది. పశ్చిమ దేశాల పరిశోధనా సంస్థలు కొన్ని రంగాలలో తప్పనిసరైతే తప్ప చైనా లేదా మరొక వర్ధమాన దేశంతో సహకరించటం లేదన్నది తెలిసిందే. కొత్తవాటిని కనుగొనటం కాకుండా ఉన్నవాటిని కాపీ కొడుతుందని ఇప్పటికీ చైనా గురించి చెప్పేవారు మనకు కనిపిస్తారు. అదే నిజమైతే మిగిలిన దేశాలకూ అలాంటి అవకాశం ఉన్నట్లే, మరి అవెందుకు ఆ పని చేయటం లేదు ? మన దేశంలో దొంగ డిగ్రీలు, చివరికి పిహెచ్‌డి థీసిస్‌లను కూడా కొనుక్కొని పట్టాలు పొందవచ్చు కనుక అనేక మంది చైనా గురించి జరుగుతున్న ప్రచారాన్ని నమ్మటంలో వింత లేదు.


వాషింగ్టన్‌ డిసి కేంద్రంగా పని చేస్తున్న ఐటిఐఎఫ్‌కు చైనా మీద ఎలాంటి ప్రత్యేక అభిమానం ఏమీ ఉండదు, అది అమెరికాలోని ఒక స్వచ్చంద సంస్థ. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదికలో అమెరికా పాలకవర్గానికి ఒక హెచ్చరిక చేసింది. చైనాను ఒక నవకల్పన దేశానికి బదులు అనుకరించేది అని తక్కువగా అంచనా వేస్తే తనకు తానే ఆపద కొనితెచ్చుకున్నట్లు అవుతుందని పేర్కొన్నది.2020 నాటికి అంతర్జాతీయ పేటెంట్‌ కుటుంబాల (అమ్మా, నాన్న, పిల్లలు కుటుంబం అన్నట్లే, ఒక పేటెంట్‌ దానికి అనుబంధంగా పేటెంట్లు ఉండటాన్ని కూడా కుటుంబంగా పరిగణిస్తారు) సంఖ్య అమెరికా కంటే చైనాకు చెందినవి ఐదు రెట్లు ఉన్నట్లు చెప్పింది.నవకల్పనలో అమెరికా ఆధిపత్యాన్ని పునరుద్దరించాలని విధాన నిర్ణేతలకు సూచించింది. మేడిన్‌ చైనా 2025 వ్యూహం ప్రకారం ఆ దేశం ముందుకు పోతున్నదని కూడా చెప్పింది. పరిశోధనా రంగంలో సాధిస్తున్న ప్రగతిని పేర్కొంటూ 2010లో ఐరోపా సమాఖ్య ప్రకటించిన పరిశోధన-అభివృద్ధి రంగంలో పెట్టుబడుల సూచికలో 1,400 కంపెనీలకు గాను 19 చైనా కంపెనీలుండగా 2020 నాటికి 278కి పెరగ్గా ఇదే కాలంలో అమెరికా సంస్థలు 487 నుంచి 449కి తగ్గాయి. సైన్స్‌, ఇంజనీరింగ్‌ పరిశోధనా పత్రాలు 2020లో 7,42,000 కాగా అవి అమెరికా కంటే 123.7శాతం ఎక్కువని ఐటిఐఎఫ్‌ పేర్కొన్నది. పేటెంట్ల లైసన్సు ద్వారా వచ్చే రాబడిలో అమెరికా ఎంతో ముందుంది. చైనాకు 2016లో అమెరికాకు వచ్చే రాబడిలో కేవలం రెండుశాతమే రాగా 2020 నాటికి 12శాతానికి పెరిగిందని ప్రపంచ బాంకు సమాచారం వెల్లడించింది. సూపర్‌ కంప్యూటర్లలో 2020 నాటికి 500 అగ్రశ్రేణి వ్యవస్థలకు గాను చైనాలో 214 ఉండగా అమెరికా 113 మాత్రమే ఉన్నాయి. పారిశ్రామిక రోబోల వినియోగంలో 2010 అమెరికాతో పోలిస్తే పదికి ఒకటి ఉండగా ఇప్పుడు అమెరికాతో సమంగా ఉన్నాయి. గణనీయ పురోగతి ఉన్నప్పటికీ చైనా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఐటిఐఎఫ్‌ పేర్కొన్నది.


ఎలక్ట్రిక్‌ బాటరీలు, హైపర్‌సోనిక్‌,5జి,6జి, నానో స్కేల్‌ మెటీరియల్స్‌, సింథటిక్‌ బయాలజీ వంటి కొన్ని రంగాలలో తిరుగులేనిదిగా ఉన్న చైనా 44 సాంకేతిక పరిజ్ఞానాల్లో 37లో ముందున్నదని ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పోలసీ ఇనిస్టిట్యూట్‌ అనే మేథో సంస్థ 2022 నివేదికలో పేర్కొన్నది. మిగిలిన ఏడింటిలో అమెరికా ముందున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని పది అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలు చైనాలో ఉన్నాయని, అమెరికా కంటే తొమ్మిది రెట్లు పరిశోధనా పత్రాలను అవి రూపొందిస్తున్నట్లు , షీ జింపింగ్‌, అంతకు ముందున్న నేతల మార్గదర్శకత్వంలో ఈ కృషి కొనసాగుతున్నదని పేర్కొన్నది. అణ్వాయుధాలను మోసుకుపోగల హైపర్‌సోనిక్‌ క్షిపణులను 2021లో పరీక్షించిన తీరును చూసి అమెరికా గూఢచార సంస్థలు ఆశ్చర్యపడనవసరం లేదని, గడచిన ఐదు సంవత్సరాలలో ప్రపంచంలో పెద్ద ప్రభావం కలిగించే మొత్తం పరిశోధనా పత్రాల్లో 48.49శాతం ఒక్క చైనా నుంచే ఉన్నట్లు ఆస్ట్రేలియన్‌ సంస్థ పేర్కొన్నది.


పరిశోధనల్లో వివిధ దేశాల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. సహకరించిన వారెవరైనా ఏ దేశానికి చెందిన వారు పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తే దాన్ని ఆ దేశ ఖాతాలో వేస్తారు.చైనా నుంచి వస్తున్న పరిశోధనా పత్రాలు ఇతరుల సహకారంతో సమర్పిస్తున్నవని కొందరు చైనాను తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.రెండవది చైనా తమ పరిశోధన అంశాలను తస్కరిస్తున్నారని నిందిస్తున్నారు. మన దేశంతో సహా అనేక దేశాల సంప్రదాయ విజ్ఞానాన్ని అమెరికా, ఐరోపా దేశాలు అపహరించి తమ పేరుతో మేథో సంపత్తి హక్కులు పొందాయి. అందుకు ఒక చక్కటి ఉదాహరణ మన దేశం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు చెబుతున్న పసుపు మీద అమెరికా పేటెంట్‌ హక్కు దఖలు పరచుకుంది. దాని మీద మన దేశం చట్టబద్దమైన పోరాటం చేసి విజయం సాధించింది. ఇలాంటి అవకాశం ఏ దేశానికైనా ఉంది. కొందరు ఆరోపిస్తున్నట్లు చైనా కూడా అలాంటి పని చేస్తే దాన్ని కూడా కోర్టులకు లాగవచ్చు. ఎవరి విజ్ఞానాన్ని వారు పరిరక్షించుకోవచ్చు.విద్యుత్‌ బల్బును కనుగొన్నది ఎవరని అడిగితే ఠకీమని చెప్పే జవాబు థామస్‌ ఎడిసన్‌ అని వస్తుంది. కానీ ఎడిసన్‌ కంటే ముందే అనేక మంది దాని మీద పరిశోధనలు చేశారు, బల్బులను రూపొందించారు. దాని కొనసాగింపుగా ఎడిసన్‌ తన పరిశోధనలను జోడించి ఆ బల్బును వాణిజ్యపరంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అనుసరించిన క్రమం గురించి పేటెంట్‌ పొందాడు. దాంతో పేరు అతనికి వచ్చింది. ఆ పరిశోధనలో అనేక మంది ఎడిసన్‌కు సహకరించారన్నది గమనించాలి. మరొకరెవరూ తదుపరి పరిశోధనలు చేయకూడదు, ఎడిసన్‌ లేదా అతని వారసులు మాత్రమే చేయాలంటే ఈ రోజు ఇన్ని రకాల బల్బులు వచ్చి ఉండేవి కాదు. పరిశోధనలకు మూలం అంతకు ముందున్న తరాల విజ్ఞానమే అన్నది తెలిసిందే.


చైనా శాస్త్రవేత్తల పరిశోధనల్లో పెద్దగా పస ఉండదు, నాసిరకం, ఇతరులు చేసిన వాటిని అటూ ఇటూ మార్చి నూతన పరిశోధనల పేరుతో సమర్పిస్తున్నారు, ఒకే వనరు నుంచి కాపీ పరిశోధనలు వస్తున్నాయి, ఇతరులు బొమ్మలను మరోకోణంలో కొత్తవిగా చూపుతున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు కొందరు. చైనాలో ఉన్న అవినీతిని తొలగించేందుకు ఎలాంటి కఠిన శిక్షలను అమలు చేస్తున్నారో తెలిసిందే. పరిశోధనా రంగంలో ఉన్నవారు కూడా అవినీతికి పాల్పడితేవారి నుంచి వచ్చిన వాటిని అంతర్జాతీయ సమాజం పక్కన పెట్టవచ్చు. పరిశోధనలను ప్రోత్సహించే క్రమంలో ప్రచురించిన పత్రాల ప్రాతిపదికన చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిన కారణంగా కొందరు అవినీతికి పాల్పడి ఉండవచ్చు తప్ప మొత్తంగా నకిలీ అనే వారిని చేసేదేమీ లేదు. ఇప్పుడు అలాంటి ప్రోత్సహకాలను నిలిపివేసింది. అక్కడ జరుగుతున్న అభివృద్ది వాస్తవం, సాధిస్తున్న అద్బుతాలు నిజం. ఈ పూర్వరంగంలో చైనా మీద బురద జల్లేందుకు కుహనా శాస్త్ర పరిశ్రమ పేరుతో వారినీ వీరిని ఉటంకించి ఫైనాన్సియల్‌ టైమ్స్‌ ఒక కథను అల్లింది. చైనాదంతా బోగస్‌ అని అమెరికా ఇతరులను నమ్మించేందుకు ప్రచారం చేయవచ్చు తప్ప దాన్ని వారే నమ్మటం లేదు. చైనాతో పోటీని తట్టుకొనేందుకు వచ్చే పది సంవత్సరాల్లో శాస్త్ర పరిశోధనలకు రెండు వందల బిలియన్‌ డాలర్లను అధ్యక్షుడు జో బైడెన్‌ నిధుల మంజూరు చేసేవాడే కాదు.


ఇంతవరకు ప్రపంచంలో చైనా గురించి చేసినన్ని తప్పుడు ప్రచారాలు మరొక దేశం గురించి లేవంటే అతిశయోక్తి కాదేమో ! ఎవరు అవునన్నా కాదన్నా చైనా నేడు సాంకేతిక, ఆర్థిక రంగాల్లోనే కాదు, శాస్త్ర రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలను సవాలు చేస్తూ ముందుకు పోతోంది. అది కూలిపోవాలి, పేలిపోవాలని ఎన్ని దుష్ట కోరికలు కోరుకున్నప్పటికీ, కూలుతుందని తేదీలు, సంవత్సరాలను ఉటంకించినప్పటికీ అలాంటి జాడలేమీ లేవు. అనేక రంగాలలో ముందుకు పోవటానికి కారణం జనానికి జవాబుదారీగా ఉండే కమ్యూనిస్టు భావజాలం కలిగిన శక్తులు అక్కడ అధికారంలో ఉండటమే కారణం. దోపిడీ లేని మరో సమాజ నిర్మాణం సాధ్యమే అని నిరూపించేందుకు కమ్యూనిస్టులు ముందుకు పోతుండగా అడ్డుకొంటున్న ప్రతిసారీ ఆటంకాలను అధిగమించి ముందుకు పోతున్నది. ఆ క్రమంలో ఉన్న లోపాలను చైనా ప్రభుత్వం, పార్టీ కూడా దాచుకోవటం లేదు. వాటిని అధిగమిస్తూ, అందుకు పాల్పడిన వారిని కఠినంగా అదుపు చేస్తూ జగన్నాధ రధం ముందుకు పోతున్నది. పరిశోధన-అభివృద్ధి రంగంలో 2022లో అమెరికా 660 బి.డాలర్లు ఖర్చు చేయగా జిడిపిలో అది 2.6శాతం. అదే చైనా 556 (3.1), జపాన్‌ 194 (3.4) భారత్‌ 159 (0.56), ఖర్చు చేస్తున్నట్లు వికీపీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా జిడిపిలో 5.9, 5 శాతాల చొప్పున అగ్రస్థానంలో ఉన్నాయి. అందుకే పిండికొద్దీ రొట్టె అంటారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

రెండు సభలు – ఒకటి అభివృద్ధికి, రెండవది ఉద్రిక్తతలను పురికొల్పేది !

24 Wednesday May 2023

Posted by raomk in CHINA, COUNTRIES, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, RUSSIA, UK, USA

≈ Leave a comment

Tags

China-Central Asia Summit 2023, G7 summit, Hiroshima, Joe Biden, Narendra Modi, The Group of Seven (G7) 2023, Xi Jinping warns US-Taiwan separatists


ఎం కోటేశ్వరరావు


ఏ పదజాలం వెనుక ఏమి దాగుందో తెలుసుకోలేనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు అన్న లెనిన్‌ మాటలు పరమ సత్యాలు. అలాగే ఏ సమావేశం ఎందుకు జరిగిందో అని కూడా మనం అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఒకే సారి ఆసియాలో రెండు ముఖ్య సమావేశాలు జరిగాయి. ఒకటి ప్రపంచంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతూ శాంతి, అభివృద్ధికి ముప్పు తెస్తున్న అమెరికా నేతృత్వంలోని జి 7 సమావేశం 19-21 తేదీలలో జపాన్‌లోని హీరోషిమాలో జరిగింది. రెండవది చైనాలోని షియాన్‌ నగరంలో మే 18-19 తేదీలలో మధ్య ఆసియా దేశాల సదస్సు. మొదటిది రాజకీయాల చుట్టూ నడిస్తే రెండవది అభివృద్ధి కేంద్రంగా జరిగింది. చైనాతో విడగొట్టుకోకుండానే నష్టాలను పరిమితం చేసుకోవాలని ఈనెల జపాన్‌లోని హిరోషిమా నగరంలో జరిగిన జి 7 దేశాల శిఖరాగ్ర సమావేశం పిలుపునిచ్చింది. తన పాటకు అనుగుణంగా నృత్యం చేయించాలని ఈ బృందంతో సహా ప్రపంచదేశాలన్నింటి మీద అమెరికా వత్తిడి తెస్తున్నప్పటికీ దానికి కొన్ని దేశాలు సిద్దంగా లేవన్నది ఈ ప్రకటనలో అంతర్లీనంగా ఉన్న సందేశం. అయితే పదజాలం దానికి చెప్పే భాష్యాలు ఎలా ఉన్నప్పటికీ సమావేశం జరిగిన తీరు, ఆమోదించిన ప్రకటన చూస్తే చైనా చుట్టూ తిప్పి దాన్ని ఎలా దెబ్బతీయాలన్న దాని మీదే కేంద్రీకరించారన్న విశ్లేషణలు వెలువడ్డాయి.


అమెరికా కోరుతున్నట్లుగా చైనాతో విడగొట్టుకొనేందుకు జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి కొన్ని దేశాలు సిద్దంగా లేవు. ఈ కారణంగానే ఆర్థిక అంశాల్లో బస్తీమే సవాల్‌ అంటూ చైనా మీద తొడగొట్టకుండా అటు అమెరికాను, ఇటు ఇతర దేశాలను సంతుష్టీకరించే విధంగా ఈ పిలుపు ఉంది. ఆర్థికంగా చైనా ఇతర దేశాలను బలాత్కారం చేస్తోందన్న ఆరోపణలను ఇటీవలి కాలంలో అనేక దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.హిరోషిమా సమావేశాలు కూడా దాని చుట్టూ తిరిగాయి గానీ బహిరంగంగా వేలెత్తి చూపేందుకు ఎవరూ ముందుకు రాలేదు.చైనా నుంచి చేసుకొనే దిగుమతులను తగ్గించుకొని ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు.చైనా నుంచి విడగొట్టుకోవటం ఇప్పటల్లో జరిగేది కాదని తెలుసు గనుకనే ప్రతి దేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు చూస్తుంది తప్ప చైనా ఆర్థిక ప్రగతి, అభివృద్ధిని అడ్డుకోవటం తమ ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చుకొనేందుకు చూశాయి. దశాబ్దాల తరబడి పక్షవాత రోగి మాదిరిగా ఉన్న జపాన్‌కు చైనాతో వాణిజ్య సంబంధాలు ఎంతో అవసరం. గత సంవత్సరం జపాన్‌ చైనాకు 189 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు, 145బి.డాలర్ల దిగుమతులు చేసుకుంది. నష్టాలను తగ్గించుకోవటం అంటే అవసరమైన వస్తువుల కోసం ఒక దేశం మీద ఆధారపడకుండా చూసుకోవాలన్నది అమెరికా వైఖరి అని జో బైడెన్‌ చెప్పాడు. చైనాలో పెట్టుబడులతో ముప్పు కూడా ఉంటుందని తెలిసినప్పటికీ తాము పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ చెప్పాడు.


చైనాతో సంబంధాలను విడగొట్టుకోవాలని జి 7 కోరుకోవటం లేదు, ఎందుకంటే అది ఎంతో కష్టం,ఇబ్బందులను కూడా తెస్తుంది, సాధ్యం కూడా కాదు అని కునీహికో మియాకే అనే విశ్లేషకుడు చెప్పాడు. అందుకే సమావేశ ప్రకటనలో విడగొట్టుకోవటం అనే పదం బదులు ముప్పు తగ్గించుకోవటం అని చెప్పారని అన్నాడు. జి 7 సమావేశం చైనా వ్యతిరేక (వర్క్‌షాప్‌) కసరత్తు అని చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వర్ణించింది.2021 నుంచి జి 7 సమావేశాల ప్రకటనలు క్రమంగా ట్రాఫిక్‌ సిగల్‌ మాదిరి మారుతూ చైనాను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, ఆ బృందం పూర్తి పేరు ఏడు పారిశ్రామిక శక్తి దేశాల బృందం అనీ, ఆర్థికంగా చేసేదేమీ లేక ఇప్పుడది ఒక చిన్న వర్క్‌షాప్‌గా పని చేస్తూ చైనా వ్యతిరేక నకిలీ ఉత్పత్తుల సామూహిక ఉత్పత్తి మీద కేంద్రీకరిస్తోందని గ్లోబల్‌టైమ్స్‌ ఎద్దేవా చేసింది. తాజా ప్రకటనలో తైవాన్‌,తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్‌, షింజియాంగ్‌, చైనా అణుశక్తి అంటూ ఇరవైసార్లు చైనా పేరును పలవరించినట్లు పేర్కొన్నది. దీనికి తోడు చైనా ఆర్థిక బలత్కారాన్ని కూడా చేర్చినట్లు పేర్కొన్నది. శిబిరాల మధ ఘర్షణలను కోరుతూ ఈ బృందం ప్రపంచ శాంతి, అభివృద్ధికి అతి పెద్ద ముప్పులలో ఒకటిగా మారినట్లు స్పష్టం చేసింది.


ఆర్థిక అంశాలకు సంబంధించి సమావేశ ప్రకటనలో మాటల గారడీ చేసినా రాజకీయాలకు వస్తే చైనా మీద దూకుడుగానే ఉన్నారు. దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ ఆర్థిక నియమావళిని తిరిగి రాసేందుకు పూనుకుందని ఆరోపించాయి. సిడ్నీలో జరగాల్సిన చతుష్టయ(క్వాడ్‌) సమావేశాలు రద్దు కావటంతో పరువు దక్కించుకొనేందుకు హిరోషిమాకు వచ్చిన అమెరికా,ఆస్ట్రేలియా,జపాన్‌, భారతదేశ నేతలు ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్‌ అధినేత జెలెనెస్కీని ఆహ్వానించి జి7 సభ్యదేశాలన్నీ అతని వెనుక నిలిచాయి.సాయాన్ని పెంచనున్నట్లు ప్రకటించాయి. ఈ పరిణామాలను చూసినపుడు ఈ సమావేశం చైనా, రష్యాల మీద కేంద్రీకరించినట్లు చెప్పకనే చెప్పింది. ఈ ప్రకటనలు చేస్తుండగానే దీర్ఘకాలంగా పోరు సాగుతున్న బఖుమత్‌ పట్టణాన్ని రష్యా తన అదుపులోకి తెచ్చుకొని ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న దేశాల పప్పులు ఉడకవనే సందేశాన్ని పంపింది. గత సమావేశాలు లేదా ఇతర శిఖరాగ్ర సమావేశాలకు భిన్నంగా హిరోషిమా సభ ఒక రోజు ముందుగానే సమావేశ ప్రకటనను విడుదల చేసింది. మీడియాలో జెలెనెస్కీకి ప్రాధాన్యత ఇచ్చి ఈప్రకటనను పక్కన పడవేస్తారన్న కారణంగా ముందుగానే విడుదల చేసినట్లు కొందరు చెప్పారు. నిజానికి గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అన్నట్లుగా సమావేశం చేసే ప్రకటనలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా చైనా మీద కేంద్రీకరించటం తప్ప కొత్తగా చెప్పేదేమీ ఉండదని ముందుగా ఊహించిందే. దానికోసం ప్రకటన దాకా ఆగాల్సిన అవసరం కూడా లేదు.చైనా మీద వత్తిడి స్వరాన్ని పెంచినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం, సహకరించుకోవటం లక్ష్యంగా ఏర్పడిన జి7 ఇటీవలి కాలంలో దాని కంటే ప్రపంచ రాజకీయాల మీదనే ఎక్కువగా కేంద్రీకరిస్తున్నది. ఐదు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న ఈ కూటమిలోని దేశాలు నాడు ప్రపంచ జీడిపిలో 70శాతం కలిగి ఉన్నాయి. ఇప్పుడు దాని విలువ నలభైశాతానికి అటూ ఇటూగా ఉంది.


అసలు జి 7 ఎలా ఉనికిలోకి వచ్చిందీ క్లుప్తంగా చూద్దాం. అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తున్నట్లు ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. దాన్నుంచి బయడపడేందుకు ధనికదేశాల ఆలోచన నుంచి పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధనిక దేశాలు ఉమ్మడిగా చేసిన ఆలోచనకు ఒక రూపమే 1975లో ఏర్పడిన ఈ దేశాల బృందం.అమెరికా చొరవతో పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సమావేశానికి అమెరికా అధ్యక్షభవనంలోని గ్రంధాలయం వేదిక అయింది. దాంతో నాలుగు దేశాలను గ్రంధాలయ బృందం అని పిలిచారు. తరువాత జపాన్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలా అది జి5 అయింది. తరువాత ఇటలీ, కెనడాలను చేర్చుకున్న తరువాత జి7 అయింది.1998లో రష్యా చేరి జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి రష్యాను తొలగించిన తరువాత తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. శిఖరాగ్ర సమావేశాలపుడు ఎవరు దేశాల అధిపతిగా ఉంటే వారు ప్రతినిధిగా హాజరవుతారు. ప్రతి సంవత్సరం ఒక సభ్యదేశ ఆతిధ్యంలో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి.సహజంగా ఆ దేశాధినేతలే ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో ఉంటారు.తమ దేశంలో జరిగే సమావేశాలకు ఇతర దేశాలను ఆహ్వానించే స్వేచ్చ ఆ దేశానికి ఉంటుంది. ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ ఉండరు. శిఖరాగ్ర సమావేశాల్లో ఐరాసతో సహా వివిధ ప్రపంచ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ఇప్పటి వరకు గత తొమ్మిది సంవత్సరాల్లో నరేంద్రమోడీ నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు మన్మోహన్‌ సింగ్‌ పదేండ్ల కాలంలో ఐదు సార్లు అతిధిగా వెళ్లారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక రంగంలో మన దేశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా మన దేశానికి ప్రతిదేశం ఆహ్వానం పలుకుతోంది. మన దేశం ఆహ్వానం అందుకోవటం నరేంద్రమోడీ ఘనత అన్నట్లు కొందరు చిత్రిస్తున్నారు. ఆహ్వానాలు అందుకున్న తొమ్మిది దేశాలలో మనది కూడా ఒకటి తప్ప ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇలా పాల్గన్నదేశాల అధినేతలు విడి విడిగా ఇతర దేశాల నేతలను కలుసుకోవటం, వేదిక మీద ధర్మోపన్యాసాలు చేయటం తప్ప బృంద నిర్ణయాలతో ఎలాంటి ప్రమేయం ఉండదు. ఈ ఏడాది అతిధులుగా ఆస్ట్రేలియా,బ్రెజిల్‌, కామెరూస్‌,కూక్‌ ఐలాండ్స్‌, భారత్‌, ఇండోనేషియా, దక్షిణ కొరియా, ఉక్రెయిన్‌, వియత్నాం అధినేతలను ఆహ్వానించారు. పసిఫిక్‌ సముద్రంలో కేవలం 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పదిహేను దీవుల సముదాయం 15,040 మంది జనాభా ఉన్న ఈ దేశ అధినేతకు ప్రపంచంలో పెద్దదైన భారత అధినేతల మర్యాదలు ఒకే విధంగా ఉంటాయి. పసిఫిక్‌ దీవుల్లో ఉన్న చిన్న దేశాలకు ఏర్పడిన ప్రాధాన్యాత కారణంగానే కూక్‌ ఐలాండ్స్‌కు ఆహ్వానం పలికారన్నది స్పష్టం.


ఒక దశలో ట్రంప్‌ ఏలుబడిలో తిరిగి రష్యాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, భారత్‌లను చేర్చుకోవాలని జి11గా విస్తరించాలన్న ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి.తరువాత అది ముందుకు పోలేదు. దాని వలన చేరే దేశాలకు జరిగే మేలేమీ కనిపించకపోవటం ఒక కారణం అని చెప్పవచ్చు.అన్నింటికీ మించి అమెరికా అజెండాను ముందుకు తీసుకువెళ్లే ఒక వాహనంగా అది మారింది. ధనిక దేశాల బృందం తన పూర్వపు ఆర్థిక శక్తిని తిరిగి తెచ్చుకొనేందుకు చూపుతున్న శ్రద్ద కంటే ఇటీవలి కాలంలో చైనా వ్యతిరేక స్వరాన్ని పెంచుతున్నారంటే దాని అర్ధం ఈ బృందం అమెరికా విదేశాంగ విధాన ప్రయోజనాలకు తోడ్పడటం తప్ప వేరు కాదు. చైనా ఆర్థిక బలాత్కారం అనే ఆరోపణ ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రచారంలో పెట్టారు. తన వస్తువులను కొనుగోలు చేయాలంటూ ఏ దేశాన్నైనా వత్తిడి చేసిన దాఖలాలు లేవు. ప్రపంచబాంకు, ఐఎంఎఫ్‌ రుణాల ద్వారా అలాంటి పనిచేసిన, ఇప్పటికీ చేస్తున్నది వాటి మీద పెత్తనం చేస్తున్న ధనిక దేశాలన్నది బహిరంగ రహస్యం. తమకు లంగని లేదా రాజకీయంగా వ్యతిరేకించే దేశాల మీద ఆర్థిక, వాణిజ్య అంశాలను ఆయుధాలుగా మారుస్తున్నది పశ్చిమ దేశాలు. లడఖ్‌ సరిహద్దు వివాదం తరువాత మన దేశంలోని సంఘపరివార్‌, ఇతర చైనా వ్యతిరేక శక్తులు చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని చేసిన హడావుడి గురించి తెలిసిందే. ఊహలు, వాంఛలను బట్టి ప్రపంచం నడవదు. నరేంద్రమోడీ సర్కార్‌ గత రికార్డులను బద్దలు కొట్టి చైనా నుంచి దిగుమతులను భారీగా పెంచింది. మరోవైపు చైనా నుంచి విడగొట్టుకోవాలన్నదేశాలతో యుగళగీతం ఆలపిస్తున్నారు.


షియాన్‌ నగరంలో చైనా, ఆరు మధ్య ఆసియా దేశాల సదస్సు రాజకీయాలతో నిమిత్తం లేకుండా అభివృద్ది అజండాతో జరిగింది. పలు ఒప్పందాలను చేసుకున్నారు.అమెరికా, ఐరోపా, మన దేశంతో చైనా జరుపుతున్న వాణిజ్యలావాదేవీల మాదిరే ఈ దేశాలతో కూడా జరుపుతున్నది. పరస్పర అంగీకారంతో పెట్టుబడులు పెడుతున్నది.కొందరు విశ్లేషకులు ఈ సమావేశాన్ని తన పలుకుబడిని పెంచుకొనేందుకు చైనా చేసిన కసరత్తుగా ఆరోపించుతున్నారు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట అమెరికా అభివృద్ది పేరుతో పాగా వేసేందుకు, రక్షణ పేరుతో తన విష కౌగిలిలో బంధించేందుకు చూస్తున్నది తెలిసిందే. అలాంటిది చైనా తన పొరుగున ఉన్నదేశాల ఆర్థిక వృద్ధికి తోడ్పడితే దాన్ని విస్తరణ కాంక్షగా వర్ణించటం అర్ధం లేదు. మన దేశం పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌లకు చేస్తున్న సాయాన్ని విస్తరణ కాంక్షలో భాగంగా చేస్తున్నామా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ఇరాన్‌పై దాడి – మిత్ర దేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్‌ !
  • ఇరాన్‌కు చైనా ఆయుధాల నిజానిజాలేమిటి !
  • వహ్వా వహ్వా ! ఎవరైనా ఊహించారా : జిగినీదోస్తు మోడీ, కాషాయ దళాలను ఇరకాటంలో పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • ఇరాన్‌పై అమెరికా దాడి: అసంబద్ద వాదనలు, అడ్డగోలు సమర్ధనలు!
  • శనగ రైతుల సంక్షోభం

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d