Tags
Donald trump, Maduro Kidnap, Narendra Modi Failures, Nicolás Maduro, Nicolás Maduro Moros, Oil politics, US aggression against Venezuela, Vladimir Putin, Xi Jinping
ఎం కోటేశ్వరరావు
లాటిన్ అమెరికాలోని వెనెజులా ప్రస్తుతం ఒక విచిత్ర పరిస్థితిలో ఉంది.జనవరి మూడవ తేదీన రాజధాని కారకాస్పై దాడి చేసిన అమెరికా నిద్రలో ఉన్న అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణి సిసిలీ ఫ్లోర్స్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయింది.నార్కో టెర్రరిస్టు అని అభియోగం మోపి న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టింది.తాను వెనెజులా అధ్యక్షుడినని, ఎలాంటి నేరం చేయలేదని మదురో కోర్టులో చెప్పాడు.తదుపరి ఏం జరుగుతుందో తెలియదు. తామే వెనెజులాను నడిపిస్తామని ట్రంప్ ప్రకటించాడు.ఏ న్యాయశాస్త్రంలోనూ ఒక దేశాన్ని నడిపించటం గురించి మనకు కనపడదు.ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగజ్ అధ్యక్ష భాద్యతలు చేపట్టారు.తమకు సహకరించకపోతే మదురో కంటే ఎక్కువగా అనుభవించాల్సి వస్తుందని ట్రంప్ ఆమెను బెదిరించాడు.ఆర్థిక, రాజకీయ ” సంస్కరణలు ” చేపట్టాలని, అందుకు వెనెజులా పూర్తిగా సహకరిస్తుందంటూ విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ట్రంప్ ఆదేశించాడు. ఒక పెద్ద బృందం అక్కడికి వెళ్లనుందని సలహాదారు స్టీఫెన్ మిలర్ చెప్పాడు.వెనెజులాలో పరిస్థితి గురించి భిన్న కథనాలు వెలువడుతున్నాయ. వాటిని అవునని లేదా కాదని గానీ వెంటనే నిర్దారించలేము. ఉదాహరణకు కొందరు వెనెజులా అధికారులు అమెరికాతో చేతులు కలిపారని అంటున్నారు. అది జరిగి ఉండకపోతే అంత సులభంగా కిడ్నాప్ జరిగేదా అనే సందేహాలు ఉన్నాయి.దేని గురించి తొందరపడి నిర్దారణలకు రానవసరం లేదు. అమెరికా చర్యను ఐరాస ఖండించింది. ప్రపంచ ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి వంటిది భారత్ అని చెబుతున్న ప్రధాని నరేంద్రమోడీ ఈ దుర్మార్గాన్ని ఖండించకుండా మౌనముద్ర దాల్చారు.తాను భారత్ పట్ల సంతోషంగా లేనని ట్రంప్ ప్రకటించాడు. అతగాడిని ” సంతుష్టీకరించేందుకే ” మౌన దౌత్యమా ! మొత్తానికి మోడీని అమెరికా ఇరకాటంలో పెట్టింది. చమురుకోసమే అన్నది అందరికీ అర్ధమైన ఒక అంశం. మదురో మీద నార్కో టెర్రరిస్టు ముద్రవేసిన అమెరికా, ప్రస్తుతం అధ్యక్షరాలిగా ఉన్న డెల్సీ మీద అలాంటి ఆరోపణ చేయలేదు, తమకు సహరించకపోతే సంగతి చూస్తాం అని బెదిరించిందంటే కారణాలు ఉన్నాయన్నది స్పష్టం. వాటి గురించి ప్రపంచంలో పండిత మధనం జరుగుతోంది.
మదురోను ఎలా పట్టుకున్నారు, అందుకు అనుసరించిన పద్దతేమిటి అనే అంశాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. కొన్ని నెలల పాటు మదురు నివశించే భవనం లాంటిదే ఒకటి ఏర్పాటు చేసి రెక్కీ నిర్వహించారని, మదురో సిబ్బందిని ప్రలోభపెట్టి వివరాలు తెలుసుకున్నట్లు చెబుతున్నారు.అపహరణ సమయంలో జరిగిన ప్రతిఘటనలో 80 మంది మరణించారని, వారిలో 32 మంది క్యూబన్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగజ్, ఆమె సోదరుడు జార్జి ఇద్దరూ వామపక్ష గెరిల్లా కుటుంబం నుంచి వచ్చిన వారే. మదురో పాలకుడైతే జార్జి విధానాల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నాడు. వారి తండ్రి జార్జి ఆంటోనియో రోడ్రిగజ్ 1970దశకంలో వెనెజులా నిరంకుశత్వాన్ని వ్యతిరేకించిన గెరిల్లా పోరాట యోధుడు. అతన్ని పట్టుకొని పోలీసులు కస్టడీలో చంపివేశారు.డెల్సీ రోడ్రిగజ్ సహకరించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ ఆమెనేమీ చేయలేదు. ఇది లొంగదీసుకొనేందుకు బెదిరింపుగా కనిపిస్తున్నది. మరోవైపు డెల్సీ అమెరికా విదేశాంగ మంత్రితో సంబంధాలు కలిగి ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇవి ఛావెజ్ అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించటానికి ఎత్తుగడగా వ్యాపింపచేసినవి కూడా కావచ్చు.
చరిత్రను చూస్తే ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి ప్రపంచానికి నిత్యం నీతి సూత్రాలను బోధించే అమెరికా అడుగడుగునా వాటిని ఉల్లంఘించిన ఉదంతాలు కోకొల్లలు. అది సమర్ధించని నియంతలు లేరు, మారణకాండ లేదు.తమదారికి రాని వారిని ఏం చేస్తామో ఇది ప్రారంభం మాత్రమే అని మదురో అపహరణ తరువాత ట్రంప్ చెప్పాడంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ప్రపంచానికి ఎలాంటి ముప్పురానుందో ! రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్ హిట్లర్ యూదుల మారణకాండకు పాల్పడినా, అనేక దేశాలను ఆక్రమించుకోవటం ప్రారంభించినా ”ప్రజాస్వామిక ముసుగు ” వేసుకున్నదేశాలేవీ అడ్డుకోలేదు, వాడికి అమెరికా ఆయుధాలు కూడా అందించింది.సోవియట్ కమ్యూనిస్టుల మీదకు వెళ్లినపుడు సోషలిస్టు వ్యవస్థను అంతంచేస్తాడని కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ ఆనందించారు. ఉక్కు మనిషి స్టాలిన్ నాయకత్వంలో ప్రతిఘటించి చుక్కలు చూపించిన తరువాత హిట్లర్ ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చాడు.ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ రూపంలో ఉన్న అమెరికన్ ఫాసిస్టు శక్తిని నిలువరించేది ఎవరు ? తదుపరి లక్ష్యం మెక్సికో, కొలంబియా, క్యూబా అని కూడా ట్రంప్ చెప్పాడు. అది అక్కడితోనే ఆగదు.రెండవ ప్రపంచ యుద్ధంతో భౌతిక వలసలు సాధ్యం కాదని గ్రహించిన సామ్రాజ్యవాదులు ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను స్వాధీనం చేసుకొనేందుకు చూశారు.అది కూడా సాధ్యం కాదని 80 ఏండ్ల అనుభవం తేల్చింది. అందుకు గాను అంతకు ముందునాటి ఆక్రమణలు మినహా మరో మార్గం లేదని,గతంలో తమ పెరటి తోటగా పరిగణించిన లాటిన్ అమెరికాతోనే ప్రారంభం అని వెనెజులా ఉదంతం స్పష్టం చేసింది. అంతకు ముందు డెన్మార్క్ స్వయంపాలిత గ్రీన్ లాండ్ తమకు కావాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఏది కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకొనే ట్రంప్ తరహా సామ్రాజ్యవాదంగా చరిత్రలో నమోదైంది.
ప్రస్తుతం ప్రపంచంలో అస్థిరపరిస్థితి రోజు రోజుకూ పెరుగుతున్నట్లుగా ఉంది.ఉక్రెయిన్, పాలస్తీనాలోని గాజా, పశ్చిమగట్టు, కాంగో, సూడాన్లో దాడులు, అంతర్యుద్ధాలు,రష్యా, ఇరాన్, వెనెజులాలపై ఆంక్షలు, ఐరాస ప్రసంగాల వేదికగా మారి చేష్టలుడిగి చూస్తున్నదిగా మారటం,సోవియట్తో ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తరువాత అమెరికా అనేక దేశాల మీద దాడులకు పూనుకోవటం, సిరియా,లిబియాల్లో జోక్యం, గాజాలో ఇజ్రాయెల్ మారణకాండకు మద్దతు, ఇరాన్పై దాడి, ఇరాక్, ఆఫ్ఘ్నిస్తాన్లో పరాభవం.మొత్తం మీద ప్రపంచంలో విలువైన వనరులను చేజిక్కించుకొనేందుకు అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్న అమెరికా తీరు ఇటీవలి కాలంలో మరింతగా ప్రపంచానికి తేటతెల్లమైంది. వెనెజులాలో జరిగిన దుర్మార్గానికి అమెరికా, ఐరోపా, ఇతర అమెరికా అనుకూల దేశాల్లోని మీడియా ” ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన నెలకొల్పే చర్య ” గా వర్ణించి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. అమెరికా చెప్పిన కట్టుకతలనే వల్లిస్తున్నాయి.ఒక పధకం ప్రకారం వెనెజులాలో తన తొత్తు మరియా కొరీనా మచాడోకు నోబెల్ బహుమతి ఇప్పించిన అమెరికా ఇప్పుడు ఆమెతో చిలుకపలుకులు పలికిస్తున్నది,వాటిని పట్టుకంని పశ్చిమదేశాల మీడియా వేదవాక్కులుగా చెబుతున్నది. వెనెజులా మాదక ద్రవ్యాల కేంద్రంగా ఉన్నట్లు చివరికి అమెరికా సంస్థలు కూడా చెప్పలేదు.డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్( డిఇఏ) తాజా నివేదికలో ఒక పేరాలో మాత్రమే పేర్కొన్నది. ఐరాస వందపేజీల నివేదికలో ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఐరోపా సమాఖ్య నివేదికలో కూడా అంతే. అయినా సరే పశ్చిమ దేశాల మీడియాకు అవేవీ పట్టలేదు. మదురో నియంత అంటూ రోతపాటలను పాడుతున్నాయి. మెక్సికో వంటి అనేక దేశాల్లో మాదకద్రవ్యాల ముఠాలు ఎలా చెలరేగుతున్నాయో అందరికీ తెలుసు, మెక్సికోలో నిజమైన పాలకులు అవే అని స్వయంగా ట్రంప్ తాజాగా చెప్పాడు.పక్కనే సరిహద్దు నుంచి పెంటానిల్ అనే డ్రగ్ సరఫరా అవుతున్నదని కూడా గతంలో చెప్పాడు.మరి దాని మీద ఎందుకు దాడి చేయలేదన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. అసలు కారణం ఏమిటంటే గత పాతిక సంవత్సరాలుగా వెనెజులా కొరకరాని కొయ్యగా తయారైంది.క్యూబా చమురు అవసరాలు తీరుస్తున్నది, పెద్ద మొత్తంలో చైనాకు సరఫరా చేస్తున్నది, ఒక్క వీటికే కాదు, ఎవరు వస్తే వారికి విక్రయిస్తున్నది.మనదేశం 2024లో 140 కోట్ల డాలర్ల మేర చమురు దిగుమతి చేసుకుంది. ట్రంప్ బెదిరించటంతో 2025లో 81శాతం తగ్గించింది.తెగించినవాడికి తెడ్డే లింగం అన్నట్లుగా ట్రంప్ ఎలాంటి శషభిషలు లేకుండా తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.కట్టుకథలు చెప్పినా నమ్మే స్థితిలో ప్రపంచం లేదు, శాసించేదిగా అమెరికా లేదు. ఇప్పటికీ బలమైన శక్తిగా ఉన్నప్పటికీ అదుపు చేసే శక్తి దానికి లేదు. ఇంకా ఆలశ్యం చేస్తే ఉన్న పట్టుకూడా జారిపోయేట్లు ఉన్నదని భావించి అమెరికా తెగింపుకు దిగింది. భద్రతా మండలిలో ఒక శాశ్వత రాజ్యంగా ఉండి మరో సర్వసత్తాక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిందంటే ఐరాస ఉండీ లేనట్లే.తాను భాగస్వామిగా ఉండి నెలకొల్పిన అనేక సంస్థలు అనివార్యమై తనకే అడ్డుపడుతుండటంతో క్రమంగా అమెరికా నాశనం చేస్తున్నది.
వెనెజులాను ఆక్రమించటం దాని బలహీనతకు చిహ్నం తప్ప బలానికి కాదు. రష్యాను శాసించలేదని ఉక్రెయిన్ సంక్షోభం వెల్లడించింది. చైనా మిలిటరీ రీత్యా కూడా బలపడుతున్నది.ఈ రెండూ కలసి వాషింగ్టన్ను సవాలు చేస్తున్నాయి. అమెరికా ఎత్తుగడల గురించి రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మదురోను పట్టుకోవటం కాదని, అసలు లక్ష్యం చైనా అన్నది వాటిలో ఒకటి.చైనాను దెబ్బతీసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చిప్స్ అందకుండా ఇప్పటికే ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచంలో చమురు దిగుమతి చేసుకొనే దేశాలలో చైనా అగ్రస్థానంలో ఉంది. వెనెజులా ఒక ప్రధాన సరఫరాదారు, అక్కడ చైనా పెట్టుబడులు కూడా ఉన్నాయి. అక్కడి చమురును స్వాధీనం చేసుకుంటే చైనాకు సరఫరా నిలిపివేయవచ్చు.మరో ప్రధాన సరఫరాదారు ఇరాన్ మీద కూడా మిలిటరీ చర్య ద్వారా దాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా చూస్తున్నది. ఇదే సమయంలో మరో ప్రధాన వనరుగా ఉన్న రష్యాను కూడా చైనా నుంచి దూరం చేయాలనే ఎత్తుగడ ఉంది. దానిలో భాగంగానే ఉక్రెయిన్లో కోరిన ప్రాంతాలను అప్పగించేందుకు కూడా సిద్దపడుతున్నట్లు ట్రంప్ తీరుతెన్నులు ఉన్నాయి.అయితే అది జరగాలంటే అనేక చిక్కు ముడులు ఉన్నాయి. అమెరికా చెలగాటం తమకు ప్రాణగండంగా ఐరోపా భావిస్తే ప్రపంచ రాజకీయాలే మరోమలుపు తిరుగుతాయి. మొత్తం మీద చెప్పాలంటే చైనాకు చమురు దొరక్కుండా చేయాలనే ఎత్తుగడలో అమెరికా ఉంది. భారత్ మీద తాను ఆగ్రహంగా ఉన్నట్లు వారికి తెలుసని ఈ సందర్భంగా ట్రంప్ చేసిన ప్రకటన నరేంద్రమోడీని మరింతగా ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ను తానే ఆపివేయించానని పదే పదే చెప్పిన ట్రంప్ వాణిజ్య ఒప్పందం గురించి ఇంకా పట్టుబడుతూనే ఉన్నాడు.ఒక వైపు పాకిస్తాన్ మరో వైపు నుంచి బంగ్లాదేశ్ను మన మీదకు ఉసిగొల్పుతున్నాడు.
అమెరికా ఒక దేశాధ్యక్షుడిని పదవి నుంచి కూల్చివేయటం నికోలస్ మదురోతోనే ప్రారంభం కాలేదు. పనామాలో స్వయంగా మిలిటరీ నియంత మాన్యుయల్ నోరిగాను గద్దె నెక్కించింది అమెరికా. సంబంధాలు చెడింతరువాత మాదకద్రవ్యాల నిరోధం పేరుతో అదే అ మూడు వందల విమానాలు, 27వేల మంది సైనికులతో పనామా మీద దాడి చేసి అతగాడిని పట్టుకొని అమెరికాలో విచారించి 40 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. మానవాళికి ముప్పు తెచ్చే ఆయుధాలను గుట్టలుగా నిల్వచేశాడంటూ ఇరాక్ మీద దాడి చేసి అధ్యక్షుడు సద్దామ్ హుస్సేన్ను పట్టుకొని తరువాత ఉరితీసి అమెరికా చంపింది.హైతీ అధ్యక్షుడు జీన్ బెట్రాండ్ అరిస్డైడ్ను కిడ్నాప్ చేసి పదవి నుంచి తొలగించింది. హొండూరాస్ అధ్యక్షుడు జువాన్ ఆర్లాండో హెర్నాండెస్ను అరెస్టు చేసి అమెరికా కోర్టులో మాదక ద్రవ్యాల కేసులో 45ఏండ్ల శిక్షవేసింది. ట్రంప్ అతగాడిని క్షమించి జైలు నుంచి ఇటీవలనే విడుదల చేశాడు. ఇరాన్లో అమెరికా, ఇతర ఐరోపా దేశాల చమురు కంపెనీలను జాతీయం చేసినందుకు ప్రధాని మహమ్మద్ మొసాదిక్ను తొలగించి నియంత షాను గద్దెనెక్కించింది.గౌతమాలాలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించే పేరుతో జాకబ్ ఆర్బెంజ్ను తొలగించింది. అతనికీ కమ్యూనిజానికి సంబంధం లేదు. పశ్చిమదేశాలను వ్యతిరేకించే వామపక్ష అనుకూలుడైన అధ్యక్షుడు అబ్దుల్ కరీం ఖాశింను ఇరాక్లో హత్య చేయించింది. దక్షిణ వియత్నాంలో తామే గద్దె నెక్కించిన నియంత నగో దిన్ డైమ్ కమ్యూనిస్టులను అణచటంలో విఫలమయ్యాడని మిలిటరీ తిరుగుబాటులో తొలగించింది. కమ్యూనిస్టుల మీద నెపాన్ని నెట్టింది.గ్రెనడాలో హడ్సన్ ఆస్టిన్ను తొలగించింది.లిబియాలో గడాఫీని కూలదోయించి హత్య చేయించింది..
