లడ్డు రాజకీయం : సనాతనవాదిగా పవన్‌ కల్యాణ్‌ – కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడినదాంట్లో తప్పేంటి ?

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది ? మాజీ సిఎం జగన్‌ మోహనరెడ్డిని ఇరుకున పెట్టాలని చూసిన చంద్రబాబు నాయుడు చివరకు తిరుమల పర్యటనను తీవ్ర వివాదాస్పదం గావించి మొత్తం మీద జగన్‌ నెత్తిన పాలుపోశారనే చెప్పాలి. పోలీస్‌ సెక్షన్‌ 30 తదితర ఆంక్షల పేరుతో ఆటంక పరచకుండా అనుమతించి ఉంటే పరమతాలకు చెందిన వారందరి మాదిరే జగన్‌ కూడా ఆలయసంప్రదాయాలను గౌరవిస్తున్నట్లు రిజిస్టర్‌లో సంతకం చేసేవారా లేదా అనేది తేలిపోయి ఉండేది.చేయకపోతే అభ్యంతరం తెలిపి ఉంటే బంతి జగన్‌ కోర్టులో ఉండేది. అలాంటి అవకాశం లేకుండా వ్యవహరించటంతో జగన్‌ వ్యతిరేకులందరూ ఒక రకంగా నీరుగారిపోయారు. అయితే దీని మీద ఎవరి భాష్యం వారు చెప్పుకుంటున్నారు గనుక జనం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఇకనైనా లడ్డు రాజకీయానికి తెరదించి రాష్ట్ర సమస్యల మీద కేంద్రీకరించాలి.


చంద్రబాబు నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల వెంకటేశ్వరుడి దర్శనాన్ని చేసుకొని ప్రార్ధిస్తానని ప్రకటించిన వైఎస్‌ జగన్‌మోహన రెడ్డిని పరోక్షంగా ప్రభుత్వం అడ్డుకుంది. అంతకు ముందు తెలుగుదేశం, జనసేన, బిజెపి, వారి కనుసన్నలలో పనిచేసే సంస్థలు, వ్యక్తులు స్వామి దర్శనం చేసుకోవాలంటే ఆచారాలను మన్నిస్తూ దేవస్థాన రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందేనని, తలనీలాలు సమర్పించుకోవాల్సిందేనని ప్రకటించాయి. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి పాపానికి పాల్పడ్డారని దానికి ప్రాయచిత్తంగా సెప్టెంబరు 28 తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో పూజలు చేయాలని క్రైస్తవమతావలంబకుడిగా అందరికీ తెలిసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు. మరోసారి శుక్రవారం నాడు మీడియా సమావేశంలో కూడా అదే చెప్పారు. తాను నాలుగు గోడల మధ్య బైబిలు చదువుతానని, బయట అన్ని మతాలను పాటిస్తానని, తనది మానవమతమని ఏం కావాలంటే అది రాసుకోవచ్చని కూడా చెప్పారు. తమ ప్రభుత్వం జగన్‌కు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని, తిరుమల పర్యటనను అడ్డుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అన్యమతస్తులెవరైనా ఆలయ రిజిస్టర్‌లో సంతకం చేయాల్సిందే అన్నారు. ఇప్పుడు లడ్డు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తులో తేలేదేమిటి, జరిగిందని చెబుతున్న లడ్డు నెయ్యి కల్తీ ఎప్పటికి నిర్ధారణ అయ్యేను, నిందితులుగా ఎవరిని తేల్చేను, ఏ శిక్షలు పడేను అన్నది భక్తులు నమ్మే ఆ భగవంతుడికే తెలియాలి. లడ్డు పరిణామాలతో అనేక ముఖ్య సమస్యలు జనం అజెండానుంచి మాయమయ్యాయి. ముఖ్యంగా ఇటీవలి వరదల్లో సంభవించిన భారీ నష్టానికి కేంద్రం నుంచి వరదలా సాయం వస్తుందని ఆశలు రేకెత్తించిన వారికి కనీసం మబ్బులు కూడా కనిపించటం లేదు.


తిరుమల దేవుడి మహిమల సంగతి తెలియదు.అఫ్‌ కోర్స్‌ నిజంగా మహిమే ఉంటే తన లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంటే పట్టించుకోకపోవటమేమిటి, దాని పేరుతో రాజకీయం చేస్తుంటే ఉపేక్షించటం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎవరూ మనోభావాలను గాయపరుచుకోనవసరం లేదు. దేవుడి లడ్డులో కల్తీ నెయ్యి దగ్గర ప్రారంభమైన వివాదం మలుపులు తిరుగుతూ మతం, సనాతన ధర్మ పరిరక్షణ వైపు పయనిస్తోంది. అనేక మంది నిజరూపాలను బహిర్గతం చేస్తోంది. మతం పేరుతో రాజకీయం, ఓటు బాంకులను ఏర్పాటు చేసుకొనే పార్టీల జాబితాలో బిజెపితో పాటు తెలుగుదేశం, జనసేన కూడా పోటీ పడుతోందన్నది తేలిపోయింది. అయితే దేశంలో మతరాజకీయాలు చేసే వారి గురించి జనం కళ్లు తెరుస్తున్న స్థితిలో ఆంధ్రులు అలాంటి తిరోగమన రాజకీయ వలలో పడతారా ? తిరుమల లేదా మరొక మతకేంద్రం కావచ్చు, మతేతరులు వాటిని సందర్శించాలని అనుకున్నపుడు అక్కడి ఆచారాలను గౌరవిస్తున్నట్లు అంగీకరించాలన్న నిబంధనలు, ఆచారాలు ఉన్నాయి. శుక్రవారం నాటి విలేకర్ల సమావేశంలో తాను వాటిని పాటించనని లేదా పాటిస్తానని గానీ జగన్‌ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోసారి తిరుపతి వెళతానని కూడా చెప్పలేదు.


లడ్డు కల్తీ సంగతి విచారణ తరువాత ఏదో ఒకటి తేలుతుంది. కానీ ఈ వివాదం తెచ్చిన సమస్యలు మాత్రం ముందుకూడా కొనసాగుతాయి. భగత్‌ సింగ్‌, చేగువేరా భావజాలం కలవ్యక్తిగా అనేక మంది ఇప్పటివరకు పవన్‌ కల్యాణ్‌ గురించి భావిస్తున్నవారికి భ్రమలు తొలిగిపోయాయి. అఫ్‌కోర్స్‌ వారాహి పూజలను చూసినపుడే చాలా మందికి అర్ధమైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలిచ్చిందని విమర్శించి తిరుమల లడ్డుకు మరోవిధంగా ప్రచారం కల్పించిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆ లడ్డూతోనే రాజకీయం ఆడుతున్నారు. అందువలన కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అన్నట్లుగా ఆ పెద్దమనిషి సనాతన ధర్మం గురించి రెచ్చిపోయి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించలేదు. ఎన్నో పుస్తకాలు చదివినట్లు చెప్పుకున్న మేథావికి సనాతన ధర్మం పేరుతో ఈ దేశంలో జరిగిన దారుణాలు, కలిగించిన హాని అర్ధం కాలేదా లేక పుస్తకాలు చదవటం అన్నది ఒట్టి కబుర్లేనా ? నిజంగా అర్ధమై ఉంటే కనీసం మౌనంగా ఉండేవారు తప్ప దాన్ని పరిరక్షిస్తానంటూ విరుచుకుపడేవారు కాదు. బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేసినపుడు ప్రకాష్‌ రాజ్‌ ఎక్కడకు వెళ్లారంటూ పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారని ఒన్‌ ఇండియా అనే వెబ్‌సైట్‌ తన విశ్లేషణకు శీర్షిక పెట్టింది. అక్కడ జరిగిన వాటి గురించి వాస్తవాల కంటే అభూత కల్పనలే ఎక్కువ వచ్చాయి, కాదూ ఒక వేళ నిజమే అనుకుంటే నరేంద్రమోడీ, బిజెపి ఎందుకు పెద్దగా స్పందించలేదో చెప్పగలరా ? చిన్న పాటి విమర్శ, అభ్యంతరాన్ని కూడా బిజెపి, హిందూత్వశక్తులు సహించవు. ఆరునెలలకే వారు వీరవుతారన్నట్లుగా అంతకంటే ఎక్కువ కాలమే బిజెపితో బంధంలో ఉన్నందున అదే జరిగినట్లు కనిపిస్తోంది. అసలు లడ్డు వివాదం గురించి ప్రకాష్‌ రాజ్‌ అన్నదేమిటి ? ‘‘ ప్రియమైన పవన్‌ కల్యాణ్‌, ఇది మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగింది.దయచేసి దర్యాప్తు చేయండి.దోషులను పట్టుకోండి కఠినమైన చర్యలు తీసుకోండి. జాతీయ స్థాయిలో అనవసర భయాలను ఎందుకు వ్యాపింపచేస్తారు,ఎందుకు పెద్దదాన్ని చేస్తారు.మనకు ఇప్పటికే తగినంత మతతత్వం ఉంది(కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు కృతజ్ఞతలు) ’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీని మీద పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ‘‘ నేను ప్రకాష్‌ రాజ్‌ను ఇష్టపడతాను, ఆయన నాకు మంచి స్నేహితుడు, మేము గొప్ప బంధాన్ని పంచుకుంటాము.రాజకీయ అంశాల మీద మేము విబేధించవచ్చు గానీ, ఒక నటుడిగా నేను నిజంగా గౌరవిస్తాను. అయితే ఈ సమస్య మీద వ్యాఖ్యానించే అవసరం ఆయనకు లేదు ’’ అంటూ స్పందించారు. ప్రపంచంలోని వారందరూ స్పందిస్తున్నట్లు అనేక అంశాల మీద నిరంతరం తన భావాలను వెల్లడిరచే ప్రకాష్‌ రాజ్‌ దీని మీద మౌనంగా ఎలా ఉంటారు ? ఎందుకు ఉండాలి ? వద్దని చెప్పటానికి పవన్‌ కల్యాణ్‌ ఎవరు ? ఇదేమీ వ్యక్తిగత వ్యవహారం కాదు.


వన్‌ ఇండియా ఇంటర్వ్యూలో చెప్పినట్లు రాసిన అంశాలను బట్టి చూస్తే మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగి చూసినందుకు విరుచుకుపడినట్లుగా పవన్‌ కల్యాణ్‌ తీరు ఉంది.‘‘ ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలను చూస్తే రాజకీయ అంశాలను ముందుకు తెచ్చినట్లుగా ఉంది.బిజెపిని, ప్రధాని మోడీని చర్చలోకి లాగుతున్నారు. తానొక గొప్ప లౌకికవాదినని ఆయన భావిస్తున్నారు. అతని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలుసు. నా ప్రశ్న ఏమిటంటే బంగ్లాదేశ్‌లో హిందువులను చంపివేస్తుంటే ఆయన ఎక్కడ ఉన్నారు ? దాని మీద మాట్లాడారా ? కానీ అనేక మంది లౌకికవాదులు హిందూ సమాజం మీద వ్యాఖ్యానించటం సులభం కానీ ఇతర మతాల వారి మీద వ్యాఖ్యానించటానికి భయపడతారు. వారికి లౌకిక వాదం అంటే ఒక వైపు మాత్రమే ప్రయాణించే దారి వంటిది, హిందూయిజం వెలుపల ఉన్న సమస్యలను విమర్శించటాన్ని తప్పించుకుంటారు. అందరి పట్ల సమంగా చూడకపోతే లౌకికత్వం అంటే ఏమిటి ? వ్యాఖ్యానించదలచుకున్నవారు అందరినీ ఒకేవిధంగా చూడాలి, దీన్నే సగటు భారతీయుడు వాంఛిస్తున్నాడు. మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించాలి లేకపోతే మౌనంగా ఉండాలి ’’ ఇవన్నీ సంఘపరివారం స్కూల్లో బోధించే తర్కంలోని అంశాలే. ప్రతిదాన్నీ ప్రశ్నిస్తాను, అవసరమైతే తోలువలుస్తా, తాట తీస్తా అని మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌ ఇలా మాట్లాడటం అవకాశవాదం తప్ప మరొకటి కాదు. అందుకే ప్రకాష్‌ రాజ్‌ పరోక్షంగా ఒక చురక అంటించారు. ‘‘ గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తరువాత మరో అవతారం, ఏంటీ అవాంతరం … ఎందుకు మనకీ అయోమయం… ఏది నిజం, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ ఒక ఎక్స్‌, ‘‘ చేయని తప్పుకి సారీ చెప్పించుకోవటంలో ఆనందమేమిటో, ఊరికే అడుగుతున్నా ’’ అంటూ మరో ఎక్స్‌లో స్పందించారు. అంతే కాదు, మరో ఎక్స్‌లో ఇలా పేర్కొన్నారు.‘‘ ప్రియమైన పవన్‌ కల్యాణ్‌ గారూ … మీ ప్రెస్‌ మీట్‌ను నేను చూశాను. నేను చెప్పిందేమిటి, మీరు దానికి వక్రభాష్యం చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి నేను తిరిగి వస్తా, ఈ లోగా నేను ఇంతకు ముందు చేసిన ట్వీట్‌ను పూర్తిగా పరిశీలించండి, అవగాహన చేసుకోండి, ఊరికే అడుగుతున్నా ’’ అని పేర్కొన్నారు. సినిమా హీరో కార్తి ఎప్పుడూ నవ్వుముఖంతో కనిపిస్తాడు. లడ్డు గురించి అడిగితే అదే ముఖంతో అది సున్నితమైన అంశం అని చెప్పటాన్ని కూడా పవన్‌ కల్యాణ్‌ తప్పుపట్టారు.


ఎవరు ఎటు ఉన్నారో, ఎవరి రంగు ఏమిటో జనాలు గ్రహిస్తున్నారు. మాంసం తింటాంగనుక ఎముకలను మెడలో వేసుకు తిరుగుతాం అన్నట్లుగా తాము భారత మితవాదులమని సగర్వంగా చెప్పుకొనే పత్రిక ‘‘ స్వరాజ్య ’’. అది లడ్డు వివాదంపై ఒక విశ్లేషణకు ‘‘ తిరుపతి లడ్డు సమస్య : పవన్‌ కల్యాణ్‌ మీ ముఖంలో కనిపిస్తున్న హిందూయిజానికి ఆంధ్రలో స్వాగతం ’’ అని శీర్షిక పెట్టింది. పార్టీలతో నిమిత్తం లేకుండా మరింత మంది బిజెపి ఏతర పార్టీల నేతలు సనాతన ధర్మం గురించి మాట్లాడాలని తద్వారా హిందువుల ప్రయోజనాలు రక్షించబడతాయని నొక్కి వక్కాణించారు. సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ బోర్డు నెలకొల్పాలని పిలుపు ఇచ్చిన తరువాత సినిమా నటులు కార్తీ, ప్రకాష్‌ రాజ్‌ వ్యాఖ్యలపై గట్టిగా స్పందించారని ప్రశంసలు కురిపించారు. నీవెవరో తెలియలాంటే నీ స్నేహితులను చూస్తే చాలన్నది గత లోకోక్తి ఇప్పుడు నీ బండారం తెలియలాంటే నిన్ను పొగుడుతున్నవారిని చూస్తే చాలు అని చెప్పాల్సి వస్తోంది. పవన్‌ కల్యాణ్‌ గారు చెబుతున్న సనాతన ధర్మం ఈ దేశంలో దాదాపు నలభై కోట్ల మంది దళితులు, గిరిజనులను అంటరానివారిగా వేల సంవత్సరాల పాటు వెలివాడల్లో దూరంగా పెట్టింది. వెనుకబడిన తరగతుల వారినీ పరిమితం కావించింది. మహిళలను అణచివేసింది.శూద్ర కులాలకు చెందిన వారితో సహా అందరినీ విద్యకు దూరం చేసింది. అందుకే అంబేద్కర్‌ ఈ సనాతన వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్‌ కల్యాణ్‌ ఆయనకంటే ఎక్కువ అధ్యయనం చేసి ఉంటారని అనుకోలేము. సనాతన వాదాన్ని పరిరక్షించాలని కోరుతున్నవారు నిజానికి ఎంత మంది దాని ప్రకారం నడుచుకుంటున్నారు. సనాతన వాదం మారేది కాదంటున్నారు. ఏక పత్నీవ్రతుడైన రాముడిని, బహుపత్నులున్న కృష్ణుడినీ ఒకే రకమైన భక్తితో సనాతనులు సమర్థిస్తున్నారు.వివాహ బంధంతో నిమిత్తం లేకుండా వేరేవారికి పిల్లలను కనటాన్ని కూడా మహాభారతంలో సమర్ధించారు. పెళ్లితో నిమిత్తం లేకుండా ఏళ్లతరబడి సహజీవనం చేసిన వారు, ఏ కారణంగా చెప్పకుండా భార్యలను వదలివేసిన వారూ, సనాతనంతో సంబంధం లేని ఆధునిక చట్టాల ప్రకారం విడాకులు తీసుకొని అనేక వివాహాలు చేసుకుంటున్నవారు కూడా సనాతన పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. అదొక ఫాషనైపోయింది. సనాతనం గురించి మరొకదాని గురించి గతంలోనే అనేక చర్చలు జరిగాయి.ముఖం మీద నామం అడ్డంగా పెట్టుకోవాలా నిలువుగా పెట్టుకోవాలా అంటూ దాడులు చేసుకున్న సనాతనుల గురించి తెలిసిందే. ఇప్పటికీ దాని మీద ఏకీభావం లేదు. ఇప్పుడు అలాంటి వారంతా ఒకటై సనాతనాన్ని విమర్శించేవారి మీద దాడులకు దిగుతున్నారు. గతంలో లోకాయతులను అణచివేశారు. కొత్తగా మతం పుచ్చుకున్నవారు మరీ రెచ్చిపోతున్నారు. సనాతనం మనదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల బాటలో నిలుపలేదు. ఆ తిరోగమనవాదాన్ని పరిరక్షించి దేశాన్ని ముందుకు తీసుకుపోతామని చెబుతున్నవారు తాత్కాలికంగా ఓటు బ్యాంకులను సృష్టించుకోవచ్చు తప్ప దేశానికి చేసే మేలేమీ ఉండదు.

నోటి దూల కంగన విచారం – చిత్తశుద్దిలేని శివపూజ ! మోడీ ఎందుకు ఆమెను అదుపుచేయలేకపోతున్నారు ?

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

అంతే, కొందరి నోటిని అదుపు చేయటం ఆ బ్రహ్మతరం కూడా కాదంటారు. విశ్వగురువుగా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగలరు, అమెరికా అధ్యక్షుడిని తన కాళ్లదగ్గరకి తెచ్చుకోగలరు అనుకుంటున్నవారిది భ్రమగాకపోతే కంగన రనౌత్‌ నోటిని అదుపులో పెట్టటం నరేంద్రమోడీ వల్ల అవుతుందా ? ఆయనకంటే శక్తివంతురాలు గాకపోతే నెల రోజుల్లోనే రెండు సార్లు బిజెపిని ఇరకాటంలో పెట్టగలరా ? రైతుల ఉద్యమం, రద్దు చేసిన మూడు సాగు చట్టాల గురించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు 2024 సెప్టెంబరు 25 ఆమె ప్రకటించారు. దానిలో చిత్తశుద్ధి కనిపించటం లేదు. ఆగస్టు చివరి వారంలో దైనిక్‌ భాస్కర్‌ అనే పత్రికతో మాట్లాడిన కంగన 202021లో జరిగిన రైతు ఉద్యమం గురించి నోరుపారవేసుకున్నారు. ఆ సందర్భంగా మృతదేహాలు వేలాడాయని,మానభంగాలు జరిగాయని ఆరోపించారు.రైతు ఉద్యమం జరిగిన హర్యానాలో లోక్‌సభ ఎన్నికల్లో పదికి గాను ఐదు సీట్లు పోగొట్టుకున్న బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దూరం కానుందనే భయంతో ఉంది. సరిగ్గా ఈ తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హర్యానా రైతాంగాన్ని మరింతగా రెచ్చగొట్టేవే. పార్టీకి నష్టం కలిగిస్తాయని హర్యానా పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు. దాంతో కేంద్ర బిజెపి వెంటనే కంగన మాటలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంది తప్ప కనీసంగా ఆమెను మందలించలేదు. బంగ్లాదేశ్‌లో మాదిరి పరిస్థితిని భారత్‌లో సృష్టించే పథకం ఉందని, రైతుల నిరసనల వెనుక చైనా, అమెరికా హస్తం ఉందని కూడా అంతకు ముందు ఆరోపించారు. పార్టీ విధానాల గురించి ప్రకటనలు చేసేందుకు కంగన రనౌత్‌కు అధికారం లేదా అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్‌లో అలాంటి ప్రకటనలు చేయకూడదని కోరినట్లు బిజెపి ప్రకటించింది. అయినప్పటికీ తగ్గేదేలే అన్నట్లుగా నెల రోజులు తిరక్క ముందే మరోసారి నోరు పారవేసుకున్నారు. బిజెపి కూడా మరోసారి ఆమె ప్రకటనతో తమకే సంబంధం లేదని గత ప్రకటననే తేదీ మార్చి ప్రకటించింది తప్ప కనీసం మందలించలేదు.


హిమచల్‌ ప్రదేశ్‌ మండి లోక్‌సభకు ఆమె బిజెపి తరఫున ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గ పరిధిలోని నాచన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 సెప్టెంబరు 23వ తేదీన ఒక మతపరమైన కార్యక్రమంలో, ఆ సందర్భంగా కొంత మంది విలేకర్లతో మాట్లాడుతూ రద్దు చేసిన సాగు చట్టాలను తిరిగి ప్రవేశపెట్టాలని రైతులు డిమాండ్‌ చేయాలన్నారు. ఇలా మాట్లాడటం వివాదాస్పదం కావచ్చు గానీ అవి ఒకే దేశం `ఒకే ఎన్నికల మాదిరి ఎంతో ప్రయోజనకరమైనవని కూడా వర్ణించారు. అక్టోబరు ఐదవ తేదీన హర్యానాలో జరగనున్న ఎన్నికల పూర్వరంగంలో వెంటనే కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, రైతు సంఘాల నేతలు తీవ్రంగా ఖండిరచారు. ఆమె మాటలతో పార్టీకి సంబంధం లేదని, వ్యక్తిగతమని హిమచల్‌ ప్రదేశ్‌ బిజెపి నేత కరణ్‌ నందా అన్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్‌ దర్శన్‌ పాల్‌ స్పందిస్తూ కంగన రైతులను రెచ్చగొడుతున్నారు. బహుశా తన సినిమా ప్రచారం కోసం ఇలా చేస్తుండవచ్చని, ఆమెకు మూడు సాగు చట్టాల ప్రతికూల ప్రభావం తెలియదని అన్నారు. నిత్యం వివాదాల్లో ఉండాలన్న యావతో ఉన్నట్లు చెప్పారు. మరొక రైతు నేత జగమోహన్‌ సింగ్‌ డకుండా మాట్లాడుతూ ప్రధాన మంత్రే వాటిని రద్దు చేసిన తరువాత అమలు జరపాలని చెప్పటానికి ఆమె ఎవరని ప్రశ్నించారు. ఆ ప్రకటనలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


బుధవారం నాడు (సెప్టెంబరు 25న) ఎక్స్‌లో ఒక వీడియో ప్రకటన చేస్తూ రైతుల చట్టాల గురించి గత కొద్ది రోజులుగా మీడియా నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. ఆ చట్టాలను తిరిగి తీసుకురమ్మని రైతులు ప్రధాని మోడీని కోరాలని నేను చెప్పాను. రైతుల చట్టాలను ప్రతిపాదించినపుడు మేమంతా మద్దతు ఇచ్చాము. కానీ ఎంతో సున్నిత అంశం, రైతుల పట్ల సానుభూతితో గౌరవ ప్రధాని వాటిని వెనక్కు తీసుకున్నారు. తాను ఒక కళాకారిణి మాత్రమే కాదని, బిజెపి సభ్యురాలిగా కూడా ఉన్నానని, తన ప్రకటనలు పార్టీ వైఖరికి అనువుగా ఉండాలన్నారు. అంతే కాదు బిజెపి సభ్యురాలిగా తన అభిప్రాయం పార్టీ వైఖరికి అనుగుణంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండకూడదు.నా మాటలు, అభిప్రాయాలు ఎవరినైనా ఆశాభంగానికి గురిచేస్తే విచారం వెల్లడిస్తున్నాను. నా మాటలను వెనక్కు తీసుకుంటున్నాను అని పేర్కొన్నారు. మరొక పోస్టులో రైతుల చట్టాలపై నా అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి, అవి పార్టీ వైఖరికి ప్రాతినిధ్యం వహించవు, కృతజ్ఞతలు అని చెప్పారు.


‘‘ బిజెపి జనాలు కొన్ని అభిప్రాయాలను పరీక్షకు పెడతారు. ఒక అభిప్రాయాన్ని వెల్లడిరచమని కొందరికి పని అప్పగిస్తారు. దాని మీద వచ్చే ప్రతి స్పందనను చూస్తారు. గతంలో ఇదే జరిగింది. మూడు నల్ల సాగు చట్టాలను పునరుద్దరించాలని వారి ఎంపీ ఒకరిచేత చెప్పించారు. ఇలాంటి వాటికి మీరు వ్యతిరేకమా లేక మరోసారి ఇలాంటి చెరుపే చేయిస్తారా ?మోడీ గారు మీరు స్పష్టత ఇవ్వాలి. మూడు సాగు చట్టాలను పునరుద్దరిస్తారా లేదా చెప్పండి. మీరు గనుక అలా చేసేట్లయితే ఇండియా కూటమి మొత్తంగా దాన్ని వ్యతిరేకిస్తుందని మీకు స్పష్టం చేస్తున్నాను, ఏడు వందల మంది ప్రాణాలర్పించారు, వారిని స్మరించుకోవాలి, గౌరవించాలి ’’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ ద్వారా స్పందించారు. కంగనా రనౌత్‌ ప్రకటనతో తమకేమీ సంబంధం లేదని పార్టీ ప్రకటించిన తరువాత క్షమాపణ చెప్పటం తప్ప ఆమెకు మరొక దారి లేదని బిజెపి మిత్ర పక్షం జెడియు ప్రతినిధి రాజీవ్‌ రంజన్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. నిజానికి ఆమె తన ప్రకటనను వెనక్కు తీసుకున్నట్లు, విచారం ప్రకటించారు తప్ప క్షమాపణ చెప్పలేదు.


బస్తీమే సవాల్‌ అన్నట్లుగా అనేక సందర్భాలలో ఆమె నోటి తీట తీర్చుకున్నారు.బిజెపి ఆమెను అదుపుచేయలేకపోతోందన్నది వాస్తవం.గతంలో చేసిన అనేక వివాదాస్పద ప్రకటనలు, ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగినపుడు బిజెపి నోరు మెదపలేదు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని 2021లో టైమ్స్‌ నౌ సమావేశంలో చెప్పారు.స్వీయ అనుభవంతో తానీ మాటలు చెబుతున్నట్లు, తన అతి మంచితనం కారణంగా వ్యవస్థ తనను దేశం విడిచి అమెరికా వెళ్లేట్లు చేసిందని, మోడీ అధికారానికి వచ్చాక తాను తిరిగి వచ్చానని అందుకే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. నరేంద్రమోడీ అంటే అభిమానం మరొకటి ఉండవచ్చు, ప్రాణాలు అర్పించి, సర్వంధారపోసి పోరాడిన సమరయోధులను అవమానించానని ఆమె గ్రహించలేకపోయారు.బిజెపి నేత వరుణ్‌ గాంధీ ఈ వ్యాఖ్యలను ఉన్మాదమనాలా లేక విద్రోహమనాలా అని స్పందించారు. తాను గనుక సమర యోధులను అవమానించినట్లు నిరూపిస్తే తన పద్మ అవార్డును తిరిగి ఇచ్చివేస్తానంటూ కంగన చిందులు వేశారు. గతంలో కత్రినా కైఫ్‌ వంటి విదేశీ హీరోయిన్లు ఎంతో రాణించారని కానీ 2014తరువాత స్వదేశీ నటీనటులు, కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విదేశీయుల నృత్యాలు ఆపాలని జనం చెప్పారని, ఇటాలియన్‌ ప్రభుత్వాన్ని తొలగించి ఒక చాయ్‌వాలాను ప్రధానిని చేశారని కూడా సెలవిచ్చారు.సుభాస్‌ చంద్రబోస్‌ను భారత ప్రధమ ప్రధాని అని చెప్పటమే కాదు, ఆయన అజాద్‌ హింద్‌ ప్రభుత్వాన్ని ఏర్పరచిన కారణంగా బోసే ప్రధమ ప్రధాని అని సమర్ధించుకున్నారు.తనను విమర్శించిన వారికి రెండు రకాల మెదడు కణాలు ఉంటాయని వారికి ఇది అర్ధం కాదని కూడా ఎదురుదాడి చేశారు.రామనాధ్‌ కోవింద్‌ను కోవిడ్‌గా పలకటమేగాక, ప్రధమ దళిత రాష్ట్రపతిగా వర్ణించి తరువాత నాలుక కరుచుకున్నారు. 2022లో దర్శకుడు ఆర్యన్‌ ముఖర్జీ, నిర్మాత కరణ్‌ జోహర్‌ సినిమా బ్రహ్మాస్త్ర విడుదల సందర్భంగా వారి మీద దాడి చేశారు. హిందూయిజాన్ని వాడుకున్నారని, సినిమా ప్రచారానికి దక్షిణాది వారిని అడుక్కున్నారని నోరుపారవేసుకున్నారు.దర్శకుడు ఆరువందల కోట్లను బూడిదపాలు చేశారన్నారు. ఆ సినిమా దారుణంగా ఉంటుందని శాపనార్ధాలు పెట్టారు. కరణ్‌ జోహర్‌ నిరంకుశుడన్నారు. ఫిలింఫేర్‌ పత్రిక అనుసరిస్తున్న అనైతిక, అవినీతి చర్యల కారణంగా తాను 2014 నుంచి ఆ పత్రికను బహిష్కరించినప్పటికీ తనను పదే పదే ఆహ్వానిస్తున్నారని, తన తలైవి సినిమాకు అవార్డు ఇస్తామని చెపితే తాను దిగ్భ్రాంతి చెందానన్నారు. దానికి గాను ఆ పత్రిక మీద దావా వేస్తానని బెదిరించారు. క్రిష్‌ సినిమా హీరో హృతిక్‌ రోషన్‌తో తాను ప్రేమాయణం నడుపుతున్నట్లు 2013 కంగన చేసిన ప్రకటన వాస్తవం కాదని సదరు హీరో ఖండిరచాడు.తరువాత ఇద్దరూ పత్రికలకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ముంబై పోలీసులు మాఫియా గ్యాంగుల కంటే బాలీవుడ్‌ నటుల కోసమే ఎక్కువగా వేటాడతారని 2020లో ఆరోపించారు. ముంబై మరో పాక్‌ ఆక్రమిత కాశ్మీరుగా మారిందన్నారు. శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తనను బహిరంగంగా బెదిరించారని ఆరోపించారు. అయితే కంగన ఒక మెంటల్‌ కేసు, స్వయంగా అన్నం తినే కంచంలో ఉమ్మి ఊసే రకం, అలాంటి వారిని కొన్నిపార్టీల వారు సమర్థిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా బిజెపిని వ్యతిరేకించే ఉద్దావ్‌ థాకరే సిఎంగా ఉన్నారు.


రైతులపై నోరుపారవేసుకున్న కంగన కుల గణన జరగదు అని మరొక ప్రకటన వదిలారు. వెంటనే అది మా వైఖరి కాదు అంటూ బిజెపి జనానికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది.న్యూస్‌ 24 అనే టీవీతో మాట్లాడుతూ కుల గణన తప్పకుండా చేయాలా అన్న ప్రశ్నకు అవసరమే లేదు అంటూ కంగన చెప్పేశారు. కుల గణన మీద యోగి ఆదిత్యనాథ్‌ వైఖరే తనదని, అందరం కలసి ఉంటేనే మంచిదని, విడిపోతే నాశనం అవుతామన్నారు.‘‘ కులగణన జరపకూడదు.నటుల కులమేమిటో మనకు తెలియదు.ఎవరికీ ఏమీ తెలియదు.నా చుట్టూ ఉన్నవారు కులం గురించి పట్టించుకోరు. దాన్ని ఎందుకు ఇప్పుడు తేల్చాలి.గతంలో మనం చేయలేదు, ఇప్పుడూ అవసరం లేదు.కేవలం పేదలు, రైతులు, మహిళలు అనే మూడు కులాలు మాత్రమే ఉన్నాయి, నాలుగో కులం ఉండకూడదు’’ అన్నారు. రైతు ఉద్యమంలో పాల్గన్న ఒక సిక్కు మహిళ రోజుకు వంద రూపాయల సంపాదన కోసం పాల్గంటున్నదని ఆమే అంతకు ముందు ఢల్లీిలో జరిగిన షాహిన్‌ బాగ్‌ ఆందోళనలో ఉన్నట్లు కంగన తప్పుడు ట్వీట్‌ చేశారు. తన సినిమా మణికర్ణికను విమర్శిస్తూ సమీక్షించినందుకు జస్టిన్‌ రావు అనే జర్నలిస్టుపై విరుచుకుపడితే చివరకు సినిమా నిర్మాతలు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. నిబంధనలను అతిక్రమించి విద్వేష పూరిత ట్వీట్లు చేసినందుకు కంగనను ట్విట్టర్‌ శాశ్వతంగా బహిష్కరించింది. ఇలాంటి నోటి దూల వ్యక్తులను నరేంద్రమోడీ అదుపుచేయలేని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది.మొదటి సారి పార్టీ తప్పని చెప్పిన తరువాత ఆమె తన ప్రకటనను వెనక్కు తీసుకోలేదు. నెలకూడా గడవక ముందే మరోసారి అదే మాటలను మరో రూపంలో చెప్పటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. హర్యానా ఎన్నికల కారణంగా పార్టీ నుంచి తీవ్ర వత్తిడి వల్లనే నామ మాత్రంగా ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారన్నది స్పష్టం. మొత్తం మీద చూస్తే మోడీ కంటే కంగన బలవంతురాలిగా కనిపిస్తున్నారు.

శ్రీలంక అధ్యక్షుడిగా కమ్యూనిస్టు – నవంబరు 24న పార్లమెంటు ఎన్నికలు, ప్రభుత్వం ముందున్న సవాళ్లేమిటి !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి) కూటమి నేత అనుర కుమార దిశనాయకే సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం నాడు అదే కూటమికి చెందిన మేథావుల సంస్థ నాయకురాలు హరిణి అమర సూర్య ప్రధానిగా నియమితులయ్యారు. పార్లమెంటును రద్దు చేశారు. నవంబరు 24న ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల దామాషా ప్రాతిపదికన సభ్యులను ఎన్నుకుంటారు.1948లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన లంకలో ఒక కమ్యూనిస్టు పాలనాబాధ్యతలు చేపట్టటం చరిత్రలో మరో అధ్యాయ ప్రారంభం. ఐదు సంవత్సరాల క్రితం కేవలం 3.16శాతం ఓట్లు తెచ్చుకున్న వామపక్ష నేత 42.3శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో నిలవటం, రెండవ ప్రాధాన్యతా ఓట్లలెక్కింపులో 55.89శాతం ఓట్లతో విజయం సాధించటం చిన్న విషయమేమీ కాదు. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల పతనం తరువాత ప్రపంచంలో కమ్యూనిస్టులకు ఎదురుగాలి వీచిందన్నది వాస్తవం. కమ్యూనిస్టులపై ప్రచ్చన్న యుద్ధంలో విజేతలం తామే అని ప్రకటించుకున్న వారి కలలు కల్లలే అని తరువాత జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాటిలో తాజాగా శ్రీలంక చరిత్రకెక్కింది. అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు పేర్లు మార్చుకున్నాయి, కొన్ని చోట్ల దుకాణాలను మూసివేసి వేరే పార్టీల్లో చేరిపోయారు. వీటన్నింటిని చూసి అనేక మంది ఇంకేముంది కమ్యూనిస్టులు, వామపక్ష శక్తులపని అయిపోయింది, తిరిగి కోలుకునే అవకాశం లేదంటూ నిస్తేజంగా ఉన్న వారిని శ్రీలంకలో అరుణోదయం మేల్కొలిపింది.

తాజా ఎన్నికలలో ఎన్‌పిపి అభ్యర్థి తొలిరౌండ్‌లో 42.3శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో దిశనాయకే, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఎస్‌ఎల్‌పి అభ్యర్థి సాజిత్‌ ప్రేమదాస 32.76శాతం,ప్రస్తుత అధ్యక్షుడు రానిల్‌ విక్రమ సింఘే 17.27శాతం ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. మిగిలిన ఓట్లను 35 మంది ఇతర అభ్యర్థులు తెచ్చుకున్నారు. అక్కడి విధానం ప్రకారం ప్రతి ఓటరూ ముగ్గురికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయవచ్చు.సగానికిపైగా ఓట్లు తెచ్చుకున్నవారినే విజేతగా ప్రకటిస్తారు. అలా రాని పక్షంలో మొదటి ఇద్దరిని మినహాయించి మిగిలిన వారిని పోటీ నుంచి తొలగిస్తారు. వారికి వచ్చిన ఓట్లలో రెండవ ప్రాధాన్యతా ఓట్లు ఎవరికి వేశారో వారికి కలిపి 50శాతంపైగా తెచ్చుకున్నవారిని విజేతగా నిర్ధారిస్తారు. ఆ ప్రకారం వామపక్ష నేతకు 55.89 శాతం రావటంతో ఎన్నికైనట్లు ప్రకటించారు. శ్రీలంక నూతన రాజ్యాంగం ప్రకారం 1982 తరువాత జరిగిన ఎన్నికలన్నింటిలో గెలిచిన వారందరూ మొదటి రౌండులోనే గెలిచారు. తొలిసారిగా ఈ దఫా రెండవ ప్రాధాన్యత ఓటును పరిగణనలోకి తీసుకొని విజేతను నిర్ణయించారు.

ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటున్నపుడు ప్రతిదీ మార్పుకు గురవుతుందన్నది నమ్మకం కాదు, ఒక శాస్త్రీయ భౌతిక వాస్తవం. ఎక్కడైతే కమ్యూనిజం విఫలమైందని విజయగీతాలాపన చేశారో అదే అమెరికాలో, ఇతర అలాంటి దేశాల్లో ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందని వినిపిస్తోంది. అందుకే ప్రత్యామ్నాయంగా సోషలిజం గురించి ఆసక్తి వ్యక్తమౌతున్నది. కమ్యూనిస్టు అంటేనే ఒకనాడు ఎయిడ్స్‌ రోగి మాదిరిగా చూసిన అమెరికాలో ఇప్పుడు కోట్లాది మంది యువత మేం సోషలిస్టులం అని సగర్వంగా చెప్పుకొనే పరిస్థితి ఉంది. అనేక భావజాలాలు కలిగిన వారందరికీ అవకాశం ఇచ్చిన జనం తగిన సమయం వచ్చినపుడు వామపక్ష శక్తులకు మాత్రం ఎందుకు ఇవ్వరు అంటూ అనేక మంది తగిలిన ఎదురుదెబ్బలను తట్టుకొని అరుణపతాకను అలాగే సమున్నతంగా ఎగరేస్తూ అచంచల విశ్వాసంతో అనేక మంది ఉన్నారు. అలాంటి వామపక్ష శక్తులు లంకలో జన సమ్మతిని పొందాయి.అనేక రకాలుగా విష ప్రచారం చేస్తున్నప్పటికీ లాటిన్‌ అమెరికా దేశాల్లో అనేక చోట్ల వామపక్ష శక్తుల మీద జనం విశ్వాసం ఉంచారు. దక్షిణాఫ్రికా అధికార కూటమిలో కమ్యూనిస్టులు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. నేపాల్లో తిరుగులేని శక్తిగా వామపక్షాల ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన శ్రీలంక చేరింది. దాని గురించి ఇరుగుపొరుగుదేశాలన్నింటా ముఖ్యంగా మనదేశంలో దీని గురించి చర్చ జరగటం అనివార్యం.

తప్పుడు విధానాలు అనుసరించి శ్రీలంకను దివాలా తీయించిన పాలకులను రెండు సంవత్సరాల క్రితం లంకేయులు తరిమికొట్టారు. ఆ పరిణామాల గురించి ఎంతో చర్చ జరిగింది. అలాంటి చోట కమ్యూనిస్టులను ఎలా ఎన్నుకున్నారబ్బా అని అదేమాదిరి జనం ఇప్పుడు ఆలోచిస్తారు. అలాంటి మధనం మనదేశంతో సహా ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రతిదేశ పాలకుల్లో వణుకు పుట్టించటం అనివార్యం. మార్క్సిజంలెనినిజం ఒక శాస్త్రీయ సిద్దాంతం. దాన్ని అన్ని చోట్లా రూళ్ల కర్రలా ఒకే మాదిరి వర్తింపచేయాలని చూసిన కొన్ని పార్టీలకు ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రతిదేశ విప్లవం తనదైన పద్దతిలో ఉంటుంది తప్ప ఏదో ఒకనమూనాలో జరగదు. చైనా మార్గంలోనో రష్యా మాదిరో వస్తుందని భావించిన వారు దుందుడుకు, మితవాద చర్యలకు పాల్పడటంతో అనేక చోట్ల ఉద్యమం దెబ్బతిన్నది. అలాంటి దేశాలలో శ్రీలంక ఒకటి. యూనిఫాం అంటే ఏకరూపం ఉండాలి తప్ప అందరికీ ఒకే కొలతలని కాదు. అలాగే మార్క్సిస్టు శాస్త్రీయ సిద్దాంతాన్ని కమ్యూనిస్టు పార్టీలు తమ దేశాలు, పరిస్థితులకు అన్వయించుకోవాల్సి ఉంది. ఆ అవగాహనపై వచ్చిన తేడాలే పలు కమ్యూనిస్టు, వామపక్ష పార్టీల ఏర్పాటుకు దారితీశాయి. అలాంటిదే శ్రీలంకలో జనతా విముక్తి పెరుమన(సంఘటన). దానితో పాటు మరో 27 వామపక్ష పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు కలసి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పిపి) పేరుతో ఒక కూటమిగా పోటీ చేశాయి.


ఏడున్నరదశాబ్దాలుగా వివిధ పార్టీలను చూసిన జనం వాటి మీద విశ్వాసం కోల్పోయి వామపక్ష అభ్యర్థికి ఓట్లు వేశారు. గతంలో తుపాకి చేతపట్టి విప్లవాన్ని తీసుకువచ్చేందుకు రెండుసార్లు జనతా విముక్తి పెరుమున విఫలయత్నం చేసింది. ఇప్పుడు బాలట్‌ద్వారా అధికారాన్ని పొందింది. తాజా విజయం దాని చరిత్రలో ఒక ప్రధాన మలుపు.శ్రీలంకలో కమ్యూనిస్టు ఉద్యమ తీరుతెన్నులను క్లుప్తంగా చూద్దాం. బ్రిటీష్‌ పాలనా కాలంలో 1935లో తొలి వామపక్ష లంక సమ సమాజ పార్టీ(ఎల్‌ఎస్‌ఎస్‌పి) ఏర్పడిరది.1943లో దీని నుంచి విడివడిన వారు శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ(సిపిఎస్‌ఎల్‌)గా ఏర్పడ్డారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన సైద్దాంతిక సమస్యల కారణంగా 1960దశకంలో సోవియట్‌,చైనా మార్గాలను అనుసరించే పార్టీలుగా విడిపోయాయి. సోవియట్‌ను అనుసరించే పార్టీ, ఎల్‌ఎస్‌ఎస్‌పి రెండూ 1964లో సిరిమావో బండారు నాయకే మంత్రివర్గంలో చేరాయి. తరువాత వాటి బలం క్రమంగా క్షీణించింది.చైనా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పుకున్న పార్టీలో తరువాత సైద్దాంతిక విబేధాలు తలెత్తటంతో కొంత మంది కొత్త పార్టీ ఏర్పాటుకు పూనుకున్నారు. ఆక్రమంలో ఉద్బవించిందే జనతా విముక్తి పెరుమన(జెవిపి). అది పార్టీ రూపం సంతరించుకోక ముందే (మన దేశంలో నక్సల్స్‌ మాదిరి) విద్యార్థులు, కార్మికులు, ఇతర తరగతుల్లో పనిచేయటం ప్రారంభించింది. 1970 మే నెలలో లంక ఫ్రీడమ్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది, దానిలో కమ్యూనిస్టు పార్టీ భాగస్వామిగా ఉంది. అదే నెల 12న తరువాత కాలంలో జెవిపి నేతగా ఎన్నికైన రోహన్‌ విజెవీర అరెస్టయ్యాడు. వీరి కార్యకలాపాలను నాటి ప్రభుత్వం చేగువేరా ఉద్యమంగా వర్ణించి అణచివేసేందుకు పూనుకుంది. జూలై 9న విజెవీర విడుదలయ్యాడు. ఆగస్టు పదిన కొలంబోలో నిర్వహించిన తొలి ప్రదర్శన సభలో జెవిపి ఏర్పాటును ప్రకటించారు.


1971 మార్చి ఆరున నాడు అధికారంలో ఉన్న పార్టీల కొందరు మద్దతుదారులు వియత్నాంలో అమెరికా జరుపుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా రాయబార కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రదర్శకులలో ఒకడు రాయబార కార్యాలయ ప్రాంగణంలోకి ఒక పెట్రోలు బాంబు విసిరాడు. వెంటనే దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఈ ఉదంతం వెనుక జెవిపి ఉందంటూ ఆ పార్టీ నేత విజెవీరను పదమూడవ తేదీన అరెస్టు చేశారు. తరువాత మరో ఐదువందల మందిని అరెస్టు చేసి వివిధ జైళ్లలో నిర్బంధించారు. ఏప్రిల్‌ ఒకటవ తేదీన జెవిపి నాయకత్వం సమావేశమై ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ ఐదున దాదాపు వంద పోలీస్‌ స్టేషన్ల మీద దాడులు చేసింది. అయితే ఒక నెలలోనే ప్రభుత్వం తిరుగుబాటును అణచివేసింది. దాదాపు పదివేల మంది జెవిపి సభ్యులు, మద్దతుదార్లను చంపివేసినట్లు తేలింది. మరో ఇరవైవేల మందిని అరెస్టు చేసింది. అణచివేత చర్యలకు 14దేశాలు మద్దతు తెలిపాయని, భారత్‌ తన వైమానికదళ పైలట్లు, మిగ్‌ విమానాలను పంపినట్లు జెవిపి ప్రకటించింది. నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత 1976లో చట్టబద్ద రాజకీయ పార్టీగా బహిరంగ కార్యకలాపాలను ప్రారంభించింది.1978లో తొలి జాతీయ మహాసభ నిర్వహించింది.తరువాత ఎన్నికల్లో పాల్గొన్నది.1987లో శ్రీలంక`భారత్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని జెవిపి వ్యతిరేకించింది.లంక సార్వభౌమత్వాన్ని రక్షించాలంటూ మరోసారి పెద్ద ఎత్తున సాయుధ పోరాటానికి దిగింది.ఈ పోరులో దాదాపు 60వేల మంది మరణించారు. జెవిపి కేంద్ర నాయకత్వంలో ఒకరు తప్ప మిగతావారందరినీ అరెస్టు లేదా చంపివేయటమో జరిగింది. తప్పించుకున్న పొలిట్‌బ్యూరో సభ్యుడు అమరసింఘ విదేశాల్లో తలదాచుకొని రహస్యంగా పార్టీ నిర్మాణానికి కృషి చేశాడు. మరోసారి చట్టబద్ద పార్టీగా ముందుకు వచ్చి 1994 ఎన్నికల్లో పోటీచేసింది. మరుసటి ఏడాది మహాసభ జరిపి కొత్త కేంద్ర కమిటీని ఎన్నుకుంది.2004లో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది.కొంతకాలం తరువాత బయటకు వచ్చింది. 1968లో జన్మించిన అనుర కుమార దిశనాయకే విద్యార్ధి దశలోనే జెవిపి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 1987 తిరుగుబాటు సమయంలో విశ్వవిద్యాలయ విద్యార్ధిగా ఉన్నారు. తరువాత 1995లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2000 సంవత్సరం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. 2004లో చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఉగ్రవాద సంస్థ ఎల్‌టిటిఇని వ్యతిరేకించిన కారణంగా కొంత మంది జెవిపిని తమిళ వ్యతిరేక పార్టీగా, సింహళజాతీయవాద పార్టీగా ఆరోపిస్తారు.


అధ్యక్షపదవిలో కొలువు దీరిన వామపక్ష కూటమి పార్లమెంటులో కూడా ఆధిక్యతను సంపాదించాల్సి ఉంది.లాటిన్‌ అమెరికాలో అధికారానికి వచ్చిన వామపక్షాలు అధ్యక్ష, ప్రధాని పదవులు పొందుతున్నప్పటికీ పార్లమెంట్లలో మెజారిటీ తెచ్చుకోలేని కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అంతకు ముందున్న వ్యవస్థపునాదుల మీదనే అవి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అయితే వాటికి ఉన్న పరిమితుల కారణంగా కొన్ని చోట్ల ఎన్నికల్లో ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. వాటి నుంచి లంక వామపక్ష ఎన్‌పిపి తగిన పాఠాలు తీసుకోవాలి.2022లో అధికారానికి వచ్చిన ప్రభుత్వం ఐఎంఎఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థల షరతులన్నింటికీ తలవూపి రుణాలు తీసుకుంది. దాని వలన పౌర సంక్షేమానికి నిధుల కోత ఒకటైతే భారాలు మరొకటి. ఐఎంఎఫ్‌ ఒప్పందాల నుంచి తక్షణమే వైదొలిగితే మరోసారి లంక చెల్లింపులతో పాటు ఇతర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. దాని షరతుల నుంచి ఉపశమనం కలిగించకపోతే జనంలో అసంతృత్తి తలెత్తటం అనివార్యం. ఈ పరిస్థితిని వామపక్ష ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.మనదేశంలో బిజెపి రెండు సీట్ల నుంచి మూడువందలకు పైగా సీట్లతో అధికారం పొందామని గర్వంగా, ఘనతగా చెప్పుకుంటుంది. దానికి ఆ పార్టీకి మూడు దశాబ్దాలు పట్టింది, జెవిపి ఐదేండ్లలోనే అలాంటి అధికారాన్ని పొందింది. రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి.సింహళ హృదయ సామ్రాట్టులుగా పేరు తెచ్చుకున్న రాజపక్సే సోదరులు 2019 ఎన్నికల్లో 52.25శాతం ఓట్లు తెచ్చుకున్నారు. వారిని 2022లో జనం ఇండ్ల నుంచి తరిమికొట్టారు. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 2.57శాతమే. అందువలన జనానికి దూరమైతే ఎవరికైనా ఇదే గతి అని లంక జనాలు చెప్పారు. మన దేశంలోని పార్టీలు దీన్ని గుణపాఠంగా తీసుకుంటాయా ?

జమిలి ఎన్నికలు – జిందా తిలిస్మాత్‌ : అసంబద్ద వాదనలు – అతకని సమర్థనలు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


జమిలి ఎన్నికల గురించి తన అజెండాను అమలు జరిపేందుకు బిజెపి పూనుకుంది. ఆ విధానాన్ని వ్యతిరేకించే పార్టీలు తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశాయి. గోడమీది పిల్లులు ఎటు వాటంగా ఉంటే అటు దూకాలని చూస్తున్నాయి. అతల్‌ బిహారీ వాజ్‌పాయి కాలంలో బిజెపి మౌనంగా ఉంది, నరేంద్రమోడీ పదేండ్ల పాలనలో చప్పుడు చేయలేదు. ఇన్నాళ్లూ జమిలి ఎన్నికలతో అభివృద్ధి అనే జ్ఞానోదయం కలిగించిన వృక్షం ఏమిటో తెలియదు. అదే ప్రాతిపదిక అయితే అసలు ఎన్నికలు లేని, తూతూమంత్రంగా జరిగే దేశాలు ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండాలి. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన కొన్ని వాదనలు, ఇతర అంశాలను చూద్దాం.


ప్రజాస్వామ్యం ఖూనీ –ముందుగానే నిర్ణయం తీసుకున్న తరువాత పార్టీలు చెప్పేదేముంది ?

జమిలి ఎన్నికల ప్రతిపాదనలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది ? కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఎలా అమలు జరపాలో సూచించండి అంటూ ఒక కమిటీని వేసింది.రోగి కోరుకున్నదే వైద్యుడు ఇచ్చాడన్నట్లు చేసిన సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు, పార్టీలతో చర్చించి ఒక బిల్లును పెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదేమి ప్రజాస్వామ్యం ? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ? కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ 2023 సెప్టెంబరు రెండున తీసుకున్న నిర్ణయం ప్రకారం మాజీ రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఒక ఉన్నత స్థామి కమిటీని వేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకుగాను ఆ సమస్యను పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేసినట్లు న్యాయశాఖ తీర్మానంలో ఉంది.దాని అర్ధం ఏమిటి ముందే తీసుకున్న నిర్ణయాన్ని ఎలా అమలు జరపాలో చెప్పమని కోరటమే కదా ? ప్రతిపక్షాలు తనను గేలి చేసినట్లు నరేంద్రమోడీ ఆరోపించారు. మరి ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం లేదా గేలిచేయటం కాదా ? ఇంత చేసిన తరువాత బిల్లు పెట్టటానికి పార్టీలను అడిగేదేమిటి ? అవి చెప్పేదేమిటి? ఇంతకు ముందే కమిటీకి చెప్పాయి కదా ! అందుకే అనేక పార్టీలు తమ వ్యతిరేకతను పునరుద్ఘాటించాయి. గోడమీది పిల్లులు ఇప్పటికీ నోరు విప్పటం లేదు. స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాల్లో జమిలి ఎన్నికలు జరిగాయి.రాజ్యాంగంలో ఎక్కడా వాటికి సంబంధించి నిర్దిష్ట ఆదేశమేమీ లేదు.అందుకే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని కోవింద్‌ కమిటీ కూడా చెప్పింది.

‘‘ తరచూ ఎన్నికలు రాకుండా ఉంటే విధానాలను గొప్పగా కొనసాగించవచ్చు’’

2014 నుంచి కేంద్రంలో నిరాటంకంగా పాలన కొనసాగుతున్నది. ఒకే ప్రభుత్వం ఉంది. అది ప్రకటించిన మేకిన్‌ ఇండియా, మేక్‌ ఇండియా విధానాలు ఎందుకు విఫలమైనట్లు ? మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఎందుకు జరుగుతున్నట్లు ? దీనికోసం సిద్దాంత గ్రంధాలు రాయనక్కర లేదు. బిజెపి వారే చెబుతున్నట్లు రెండిరజన్ల పాలిత రాష్ట్రాలే ఎక్కువ. అక్కడ గానీ, ఇతర పార్టీల రాష్ట్రాలలో గానీ పదేండ్లలో ఎక్కడైనా మధ్యంతర ఎన్నికలు వచ్చి ఆటంకం కలిగిందా అంటే లేదు. అభివృద్ధి చెందిన దేశాల చరిత్రను చూసినపుడు అనేక అంశాలతో పాటు పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి)కి భారీ మొత్తాలలో ఖర్చు చేయటం తెలిసిందే.మోడీ పాలనలో ఆవు పేడ, మూత్రంలో బంగారం ఉందా మరొకటి ఉందా అన్న పరిశోధనల మీద చూపిన శ్రద్ద మరొకదాని మీద లేదు. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ ప్రధాన సలహాదారు అజయ్‌ కుమార్‌ సూద్‌ చెప్పిందేమిటి ? ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ 2047లో మనం ఎక్కడ ఉండాలని మీరు నన్ను అడిగితే సైన్సుకు సంబంధించి సర్వత్రా వినియోగిస్తున్న సూచికల ప్రకారం మనం ఎగువన మూడు లేదా ఐదవ స్థానంలో ఉండాలి. నిజానికి మనం మూడవ స్థానంలో ఉండాలి.ఒక దేశ శాస్త్రీయ పటిష్టను కొలిచేందుకు అన్ని చోట్లా వినియోగించే సూచికలను చూసినపుడు మనం చాలా వెనుకబడి ఉన్నాము, ప్రపంచ సగటు కంటే తక్కువ ’’ అన్నారు. ఈ సూచికలను మెరుగుపరచాలంటే ఆర్‌ ఆండ్‌ డి మీద పెట్టే మొత్తం ఖర్చు పెరగాలి, పరిశోధకలు, శాస్త్రీయ అంశాలలో మహిళలు, పేటెంట్లవంటివి పెరగాలని కూడా చెప్పారు. దరిద్రం ఏమిటంటే దేశంలో జరిగిన ప్రతి అనర్దానికి నెహ్రూ కారకుడని నిత్యం పారాయణం చేసే పెద్దలు పదేండ్లుగా పరిశోధన రంగ విధాన రూపకల్పన కూడా చేయలేకపోయారు. వేదాల్లోనే అన్నీ ఉన్నాయట అని చెప్పేవారిని నమ్ముకొని వాటిని వెలికితీసేందుకు దశాబ్ద కాలాన్ని వృధా చేశారని అనుకోవాలి. అనేక చర్చల తరువాత 2023లో వచ్చే ఐదేండ్ల కాలంలో 600 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తామని అందుకోసం జాతీయ పరిశోధనా ఫౌండేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనేక మంది నిజమే కదా అని సంతోషించారు. పాఠ్య పుస్తకాల నుంచి డార్విన్‌ సిద్దాంతాన్ని, కొన్ని శాస్త్రీయ అంశాలను తొలగించారు. ఇదేదో అమాయకంగా చేశారని అనుకుంటే పొరపాటు. కరోనా నిరోధానికి గిన్నెలు మోగించాలని, కొవ్వొత్తులు వెలిగించాలని, గంగలో మునగాలని చెప్పిన పెద్దలకు ఇన్నేండ్ల తరువాతైనా జ్ఞానోదయం అయిందని చాలా మంది సరిపెట్టుకున్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు 202324 బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం ఎంతో తెలుసా ? ఏటా సగటున 120 కోట్ల డాలర్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 3.09 కోట్ల డాలర్లు మాత్రమే. దశాబ్దాల తరబడి విధానాలను రూపొందించలేకపోవటమే కాదు, దానికి తగిన కేటాయింపులూ లేవు.1990దశకంలో జిడిపిలో 0.8శాతం ఉండగా 2023నాటికి 0.65శాతానికి తగ్గాయి. కబుర్లు మాత్రం రెండుశాతం ఉండాలని చెబుతారు.మూడు దశాబ్దాల క్రితం భారత్‌చైనా కేటాయింపులు దాదాపు సమంగా ఉన్నాయి. ఇప్పుడు చైనా 2.43శాతం ఖర్చు చేస్తోంది. ప్రపంచంలో తొలి అగ్రశ్రేణి వంద విశ్వవిద్యాలయాలు, సంస్థలలో చైనా ఏడిరటిని కలిగి ఉండగా మనదేశంలోని సంస్థలు కొన్ని 200400 మధ్య రాంకుల్లో ఉన్నాయి.మంత్రాలకు చింతకాయలు రాల్తాయా లేదా అని కళ్లలో వత్తులు వేసుకొని మరీ చూసే మన పాలకులు మాత్రం 2047నాటికి వికసిత భారత్‌కు జమిలి ఎన్నికలే జిందాతిలిస్మాత్‌ అంటే జనం చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు.


రాజ్యాంగం ఆమోదించిన ఆదేశిక సూత్రాలను అమలు జరిపేందుకు మాత్రం ముందుకు రారు.జమిలి ఎన్నికల మీద ఏకాభిప్రాయం రాదని తేలిపోయింది.దాన్ని పక్కన పెట్టాల్సిందిపోయి వ్యతిరేకించేవారి మీద రాజకీయదాడి చేసేందుకు పూనుకోవటం అంటే దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించే ఎత్తుగడతప్ప మరొకటి కాదు.1952 నుంచి 1967వరకు లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అప్పుడేమీ దేశం గంతులు వేస్తూ అభివృద్ధి చెందిన దాఖలాలేమీ లేవు. విదేశీ చెల్లింపుల సంక్షోభం, రూపాయి విలువ తగ్గింపు, ఐఎంఎఫ్‌రుణం, ధరల పెరుగుదల తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఓటమి, కాంగ్రెస్‌లో చీలికతో 1971లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వాల పతనం వంటి పరిణామాలన్నీ జరిగాయి.జస్టిస్‌ బిపి జీవన్‌ రెడ్డి నాయకత్వంలోని లా కమిషన్‌ 1999`2000లో ఖర్చు తగ్గింపు, పాలన మెరుగుదులకు జమిలి ఎన్నికల గురించి పరిశీలించాలని చెప్పింది తప్ప అభివృద్ధికి ముడిపెట్టలేదు. ఇంత పెద్ద దేశానికి ఓటర్లకు, ఓట్ల పెట్టెలకు రక్షణ లేని ఈ దేశంలో ఎన్నికల సమయంలో భద్రతా సిబ్బంది నియామకం,ఎన్నికల సిబ్బందికి అయ్యే ఖర్చు పెద్ద సమస్య కాదు. దాన్నే బూతద్దంలో చూపి ఆ కారణంగానే దేశం వృద్ధి చెందటం లేదంటున్నారు.నియంతలు పాలించిన అనేక దేశాల్లో దశాబ్దాల తరబడి ఒకేపాలన సాగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినా అవేవీ వృద్ధి చెందలేదు. జపాన్‌లో రెండవ ప్రపంచ యుద్దం తరువాత 26సార్లు పార్లమెంటు ఎన్నికలు జరిగాయి, 38 మంది ప్రధానులు మారారు. అది గత కొన్ని దశాబ్దాలుగా పక్షవాత రోగి మాదిరి దాని అర్థిక వ్యవస్థ ఉంది. అభివృద్ధి నమూనాగా ఒకప్పుడు జపాన్ను చెప్పారు.దాన్ని చూసి నేర్చుకోవాలన్నారు. దాని పరిస్థితి ఏమిటి ? 2012లో జిడిపి ఆరులక్షల కోట్ల దాలర్లు దాటింది. ఇప్పుడు నాలుగు లక్షల కోట్లకు పడిపోయింది.


రామనాధ్‌ కోవింద్‌ కమిటీ దక్షిణాఫ్రికా,జర్మనీ, స్వీడెన్‌, ఇండోనేషియా,ఫిలిప్పీన్స్‌, జపాన్‌, బెల్జియం దేశాలలో జమిలి ఎన్నికల గురించి అధ్యయనం చేసింది. అక్కడ ఏకకాలంలో జరిగే వాటిని మాత్రమే తీసుకుంది తప్ప దామాషా ప్రాతిపదికన ప్రతి ఓటుకూ విలువ నిచ్చే నిజమైన ప్రజాస్వామిక పద్దతిని సిఫార్సు చేయకుండా వదలివేసింది.వాటిని గమనించినట్లు మాత్రం పేర్కొన్నది. ఎందుకుంటే సిఫార్సు చేస్తే బిజెపి ఆగ్రహం వస్తుంది గనుక.ప్రపంచం జమిలి ఎన్నికలు జరుగుతున్నవి మూడే మూడు దేశాలు అవి స్వీడన్‌, బెల్జియం, దక్షిణాఫ్రికా. ఈ మూడు చోట్లా దామాషా ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయి.మరి ఈ విధానాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల ఎన్నికలు జరిగిన దక్షిణాఫ్రికాలో 64లక్షలు (40శాతం) ఓట్లు తెచ్చుకున్న పార్టీకి 200కు గాను 73 సీట్లు వస్తే కేవలం 29వేలు తెచ్చుకున్న పార్టీకి ఒక సీటు వచ్చింది.ప్రతి ఓటుకూ విలువ ఇచ్చే అసలు సిసలు ప్రజాస్వామ్యమంటే ఇది కదా ! కానీ మనదేశంలో జరుగుతున్నదేమిటి ? పార్టీలు తెచ్చుకున్న ఓట్లకు సీట్లకు పొంతన ఉంటోందా ? 2019లో బిజెపికి వచ్చిన ఓట్లు 37.36శాతమైతే సీట్లు 55.8శాతం, అదే 2024లో ఓట్లు 36.56శాతం కాగా సీట్లు 44శాతం వచ్చాయి. మైనారిటీ ఓట్లతో అధికారాన్ని పొందింది.


ఎన్నికల్లో డబ్బు ప్రమేయం ఎలా పెరిగిపోయిందో చూస్తున్నాము. ఇన్నేండ్ల తరువాత తమకు డబ్బు ఇస్తేనే ఓట్లు వేస్తామని కొన్ని చోట్ల, ఇతరులకు ఇచ్చిన మొత్తం తమకెందుకు ఇవ్వలేదని కొన్ని చోట్ల ఓటర్లు ధర్నా చేయటాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు అసలు ఊహించి ఉండరు. ఇలాంటి ధోరణులు పెరిగిన తరువాత డబ్బున్న పార్టీ ఓట్లను టోకుగా కొనుగోలు చేయటం తప్ప మరొకటి జరుగుతోందా ? రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిమితంగా పోటీ చేస్తున్న కమ్యూనిస్టులు తప్ప ఓటర్లకు డబ్బు పంచని పార్టీ ఏది ? దాని ప్రమేయం లేకుండా ఎందుకు చేయరు ? ఎన్నికల విధానాన్ని ఎందుకు సంస్కరించరు ? బిజెపికి ఇవేవీ తెలియనంత అమాయకంగా ఉందా ? ఎన్నికల కమిషన్‌ తొలి సాధారణ ఎన్నికల్లో ప్రతి ఓటుకు చేసిన ఖర్చు రు.0.60 కాగా 2014లో ఆ మొత్తం రు.46.40కి పెరిగింది. తొలి సాధారణ ఎన్నికల్లో ఒక అభ్యర్ధి రు.25వేలకు మించి ఖర్చు చేయకూడదని చెప్పిన ఎన్నికల కమిషన్‌ తాజాగా దాన్ని రు.75 నుంచి 95లక్షల వరకు పెట్టవచ్చని, అసెంబ్లీ అభ్యర్ధులు 28 నుంచి 40 లక్షల వరకు పెంచింది. లెక్కలో చూపకుండా చేసే ఖర్చు గురించి తెలిసిందే. వీటిని పరిగణనలోకి తీసుకొని సిఎంఎస్‌ అనే సంస్థ వేసిన లెక్క ప్రకారం 2019లో ఒక్కో ఓటు ఖర్చు రు.700 కాగా 2024 రు.1,400లకు పెరిగింది.1998లో ఎన్నికల ఖర్చు రు.9,000 కోట్లు కాగా అది 2024లో లక్షా 35వేల కోట్లకు పెరిగినట్లు అంచనా ? దీన్ని నివారించటానికి కమిటీ వేయాల్సిన అవసరం లేదా ?


జమిలి ఎన్నికలు జరపాలని బిజెపి చెబుతున్నది. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించిన ఘనత తమదే అని జబ్బలు చరుచుకుంటున్నది. కానీ ఆచరణలో ఎక్కడా ఆ స్ఫూర్తి కనిపించటం లేదు. రిజర్వేషన్ల బిల్లును ఆమోదించిన తరువాత జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడా మూడోవంతు సీట్లకు ఆ పార్టీ మహిళలను నిలపలేదు. బిజెపి తాను పోటీ చేసిన 446 స్థానాల్లో కేవలం 69 మందిని 15.47శాతం మందినే నిలిపింది.బిజెడి ఒడిషాలో 33శాతం మందిని నిలిపింది. అసలు 150 స్థానాల్లో మహిళా అభ్యర్దులే లేరు. గత లోక్‌సభలో అన్ని పార్టీల తరఫున 78 మంది గెలిస్తే ఈసారి 73కు తగ్గారు. అదే విధంగా తాను తన మిత్ర పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసి లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిపించి ఉంటే ఆదర్శంగా ఉండేది. ఆ పార్టీ చెబుతున్నట్లు దాని వలన కలిగే లాభాలేమిటో ఎందుకు చూపలేదు ? దానికి రాజ్యాంగసవరణలతో పని లేదు. ఏ పార్టీ కూడా వ్యతిరేకించేదేమీ లేదు కదా ! బిజెపికి చివరికి ఎన్నికల కమిషన్‌కూ చిత్తశుద్ది లేదు. గతంలో హర్యానా, మహారాష్ట్రలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈ సారి బిజెపికి అనుకూలంగా ఉండేందుకు మహారాష్ట్ర ఎన్నికలను విడిగా జరుపుతున్నారు. రెండు రాష్ట్రాలూ బిజెపివేగనుక ఆరునెలల కంటే తక్కువే వ్యవధి ఉన్నందున వాటినైనా రద్దు చేసి లోక్‌సభతో పాటు ఎన్నికలు జరపవచ్చు. అదే విధంగా ఎప్పుడో జరగాల్సిన కాశ్మీరు అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభతో పాటు ఎందుకు జరపలేదంటే సరైన సమాధానం లేదు.


జమిలి ఎన్నికలు మేలని 1999లోనే లా కమిషన్‌ అభిప్రాయపడిరది. దేశాభివృద్దికి ఇది సర్వరోగనివారణి జిందాతిలిస్మాత్‌ అనుకుంటే నాడు అధికారంలో ఉన్న వాజ్‌పాయి ఎందుకు చొరవ తీసుకోలేదు, పోనీ 2014లోనే గద్దె నెక్కిన నరేంద్రమోడీ వెంటనే దీన్ని ఎందుకు ముందుకు తేలేదు ? దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే తన పాలన వైఫల్య దిశగా పోతున్నదని అందరికంటే ముందుగా గ్రహించిన వ్యక్తి మోడీ. ప్రతి ఎన్నికలలోనూ పాతదాన్ని వదలి కొత్త నినాదాన్ని ముందుకు తేవటం తెలిసిందే. అధికారయంత్రాంగ సమయం, డబ్బు వృధాను అరికట్టటానికి ఒకేసారి ఎన్నికలని మరొక పాట పాడుతున్నారు.కోవింద్‌ కమిటీ చేసిన సూచనలలో ఏ కారణంతోనైనా ఒక ప్రభుత్వం పడిపోతే జరిగే ఎన్నికలు ఐదేండ్లలో మిగిలిన కాలానికి మాత్రమే అన్నది ఒకటి. సంక్షోభంతో ఐదేండ్లలో ఎన్నిసార్లు పతనమైతే అన్ని సార్లు జరుపుతారా ? జనాభా లెక్కలతో కలిపి బిసి కులగణన జరపాలని కోరితే దానికి బిజెపి ససేమిరా అంటున్నది.కావాలంటే రాష్ట్రాలు లెక్కించుకోవచ్చు అన్నది. అప్పుడు సిబ్బంది సమయం, డబ్బుదండగకాదా ? జమిలి ఎన్నికల వాదన దీనికి ఎందుకు వర్తించదు ? జమిలి ఎన్నికల చర్చ జరుగుతుండగానే దాని స్ఫూర్తిని దెబ్బతీసేదిగా కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఒకేసారి జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలను ఈసారి విడదీసింది. మరోవైపు జమిలిని వ్యతిరేకించేపార్టీలకు నీతులు చెబుతున్నారు. ? పదేండ్ల మోడీ విఫల పాలన మీద జనం దృష్టిని మళ్లించేందుకు తప్ప జమిలి ఎన్నికలు మరొక మేలుకు కాదన్నది స్పష్టం. ‘‘ మీరు కొంత కాలం జనాలందరినీ వెర్రి వారిగా చేయగలరు. కొంత మందిని కాలం చేయగలరు. అందరినీ ఎల్లకాలం వెర్రివారిని చేయలేరు.’’ అన్న అబ్రహాం లింకన్‌ మాట మోడీతో సహా ఎవరికైనా వర్తిస్తుంది. కాదంటారా ?

ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు ఆదేశాల అమలుకు నరేంద్రమోడీ, పాకిస్తాన్‌ జీ హుజూర్‌ !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకోవాలని అడిగిన పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్‌ పెట్టిన షరతేమిటో తెలుసా ? వర్తమాన తరుణం నుంచి 37 నెలల రుణవాయిదాల కాలంలో 2026 జూన్‌ నాటికి క్రమంగా వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల ఎత్తివేతను అమలు జరపాలంది. అక్కడి ఐదు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పాటించాలని చెప్పింది. ఇలాంటి షరతులనే మనకూ ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ పెట్టాయి. రైతాంగానికి భయపడి కాంగ్రెస్‌ పాలకులు వాటిని అమలు జరిపేందుకు సాహసించలేదు. తాయత్తు కట్టుకొని జై భజరంగ భళీ అంటూ నరేంద్రమోడీ మూడు సాగు చట్టాల రూపంలో వాటిని రుద్దేందుకు చూశారు. ఫలితాన్ని, పర్యవసానాలను అనుభవించటం చూస్తున్నాము. దివాలా స్థితిలో ఉన్న పాకిస్తాన్ను ఆదుకొనేందుకు అమెరికా పైరవీతో ఐఎంఎఫ్‌ 700 కోట్ల డాలర్ల సాయం అందించేందుకు అంగీకరించింది. దానికి గాను ఒక షరతు పెట్టింది. తమ అప్పు తీరాలంటే రైతులతో సహా ఎవరికీ రాయితీలు, సబ్సిడీలు ఇవ్వకుండా ‘‘పాదుపు’’ చేయాలంది. దానికి గాను ప్రభుత్వ ఖర్చు తగ్గించాలన్నది. కావాలంటే ప్రభుత్వం తన అవసరాలకు మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేసి అదే ధరలకు విక్రయించాలి తప్ప సబ్సిడీలు కుదరవంది. ఐఎంఎఫ్‌ షరతు అమల్లోకి వస్తే కనీస మద్దతు ధరలూ ఉండవు, ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యతా ఉండదు. పొదుపు పాటింపులో భాగంగా ఎరువులు, విద్యుత్‌ తదితర రాయితీలు రద్దు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాక్‌ పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం గోధుమల సేకరణ నిలిపివేయటంతో బహిరంగ మార్కెట్‌లో 40శాతం ధరలు పడిపోయాయి. తరువాత వంతు చెరకు, పత్తి ధర ప్రకటన విధాన రద్దు అంటున్నారు. వినియోగదారులకు ఇస్తున్న గాస్‌ సబ్సిడీ తదితరాలకు దశలవారీ కోత పెడతారు. ఇది పాకిస్తాన్‌కే తప్ప సురక్షితమైన హస్తాలు ఉన్న నరేంద్రమోడీ ఉన్నంత వరకు భారత్‌కు వర్తించదు అని ఎవరైనా అనుకుంటే చేసేదేమీ లేదు.గతంలో 1990దశకంలో తప్ప తరువాత కాలంలో మనదేశం ఐఎంఎఫ్‌ నుంచి అప్పులు తీసుకోలేదు. ప్రపంచ బ్యాంకు నుంచి వివిధ పధకాలకు ప్రాజెక్టు రుణాలు తీసుకుంటున్నాం. కుడికన్ను ఎడమ కన్ను తేడా తప్ప రెండు సంస్థల నుంచి తీసుకొనే రుణాలకు షరతులు షరా మామూలే.మన దేశంలో ఎరువుల ధరల నియంత్రణ విధానాన్ని ఎత్తివేసి పరిమితంగా కొన్నింటికి సబ్సిడీ విధానం అమలు చేస్తున్నారు. ఎగుమతులకు సబ్సిడీలు ఇవ్వకూడదు దిగుమతుల మీద పన్ను విధించకూడదన్న షరతులు కూడా ఐఎంఎఫ్‌ విధించింది. మన దేశం కూడా చేస్తున్నది అదే. చిత్రం ఏమిటంటే మన పాలకులు పాకిస్తాన్‌తో కొట్లాడినట్లు జనం ముందు ఫోజు పెడతారు. ఇద్దరిని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ పిలిపించినపుడు వాటి ముందు చెప్పినట్లే చేస్తాం జీ హుజూర్‌ అంటూ చేతులు కట్టుకొని నిలబడటం తప్ప వ్యతిరేకించే ధైర్యం లేదు.


అన్ని అవకాశాలూ మూసుకుపోయిన తరువాతనే ఏ దేశమైనా ఐఎంఎఫ్‌ వద్దకు అప్పుకోసం వెళుతుంది.ఒకసారి తీసుకుంటే దాని రుణ ఊబిలో చిక్కుకున్నట్లే. పాత అప్పులు తీసుకొనేందుకు కొత్త రుణాలు తీసుకోవాల్సిందే.రుణాలు తీసుకున్న దేశాల మీద సర్‌ఛార్జీలు విధించి జలగలా పీల్చుతుంది. ఈ విధానం మీద తీవ్ర విమర్శలు తలెత్తటంతో సర్‌ఛార్జీల రూపంలో వచ్చిన రాబడిని రాయితీలతో కూడిన రుణాలు ఇవ్వటానికి వినియోగిస్తామని చెబుతోంది. ఇది మోసం తప్ప మరొకటి కాదు.తీసుకున్న రుణాల మీద వడ్డీ, సేవారుసుముల మీద అదనపు వసూలునే సర్‌ఛార్జి అంటారు.జనం భాషలో చక్రవడ్డీ. రుణాలు ఎక్కువగా తీసుకోకుండా దేశాలను నిరోధించేందుకే వాటికే విధిస్తున్నామని వితండవాదం చేస్తోంది. ఇబ్బందుల్లో ఉన్న దేశాలను ఉద్దరించటానికే తాము రుణాలు ఇస్తున్నామని ఐఎంఎఫ్‌ చెబుతుంది. అదే నిజమైతే ఇప్పటికి 24సార్లు రుణం తీసుకున్న పాకిస్తాన్‌ పరిస్థితి ఇప్పుడేమిటి ? దాన్ని ఉద్దరించిందీ లేదు, మరోసారి అప్పుకు రాకుండా చూసిందీ లేదు. ఐఎంఎఫ్‌కు చక్రవడ్డీలు చెల్లిస్తున్న ఐదు దేశాల్లో అదొకటిగా మారింది. పాకిస్తాన్‌ జిడిపిలో 70శాతం మేరకు అప్పులున్నాయి. ప్రభుత్వ ఆదాయంలో 50 నుంచి 60శాతం అసలు, వడ్డీల చెల్లింపులకే పోతోంది. మన ప్రభుత్వ రుణ భారం కూడా వందశాతానికి చేరనుందని ఐఎంఎఫ్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. రానున్న ఐదు సంవత్సరాల్లో 22 దేశాల నుంచి ఐఎంఎఫ్‌ అదనపుబాదుడు 980 కోట్ల డాలర్లు ఉంటుందని, వాటిలో 2024 నుంచి 2033 వరకు ఉక్రెయిన్‌ 290 కోట్ల డాలర్ల మేర చెల్లించనుందని తేలింది.ధనిక దేశాల మీద ఆధారపడకుండా స్వంతంగా నిధులు సమకూర్చుకోవాలంటే అదనపు వసూలు తప్పదని సమర్థకులు చెబుతున్నారు. అంటే దివాలా స్థితిలో ఉన్నవాటి దగ్గర వసూలు చేసి ఆ మొత్తాన్నే తిరిగి వడ్డీలకు ఇస్తారన్నమాట, ఈ విధంగా కూడా ధనికదేశాలకు ఐఎంఎఫ్‌ మేలు చేస్తున్నది.


ఇబ్బందుల్లో ఉన్న 22 దేశాల నుంచి అదనపు బాదుడు ద్వారా ఐఎంఎఫ్‌కు వస్తున్న ఆదాయం ఎక్కువగా ఉంది. అలాంటి దేశాలను రక్షించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ నిధి చివరికి చక్రవడ్డీ వ్యాపారిలా మారి పీక్కుతింటోంది.2020లో అదనపు చెల్లింపు దేశాల సంఖ్య పది కాగా కరోనా దెబ్బతో కుదేలై ఐఎంఎఫ్‌ దగ్గరకు అప్పుకోసం వెళ్లిన మరోపన్నెండు దేశాలు వాటి సరసన చేరాయి. ఈ సంస్థ వడ్డీ రేటు ఒకటి నుంచి ఐదుశాతానికి పెరగ్గా, సర్‌ఛార్జి చెల్లించే దేశాలకు అది 7.8శాతంగా ఉంటోంది. అందువలన ఈ దేశాలు అప్పుల ఊబినుంచి బయటపడే అవకాశమే లేదని అనేక మంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ అప్పు, వడ్డీ చెల్లించటానికి ఆ దేశాల పాలకులు జనాన్ని పీక్కు తింటారు. ఈ క్రమంలో మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు అంతర్జాతీయ మానవహక్కుల పరిశీలన సంస్థ(హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌) ఏడాది క్రితం ‘‘ బుల్లెట్‌ గాయంపై బాండేజ్‌ ’’ పేరుతో 131పేజీల నివేదికలో వెల్లడిరచింది. ఐఎంఎఫ్‌ షరతులు అనేక సంక్లిష్ట పరిస్థితులను సృష్టించటమేగాక అసమానతలను కూడా పెంచుతున్నాయని చెప్పింది.


2020 మార్చి నెల నుంచి 2023 మార్చి నెల వరకు 110 కోట్ల జనాభా ఉన్న 38దేశాలకు ఇచ్చిన రుణాలను ఆ నివేదికలో విశ్లేషించారు. పొదుపు షరతులే అత్యధికంగా ఉన్నాయి. ప్రభుత్వ ఖర్చు తగ్గింపు, రాబడి పెరిగే కొద్దీ మధ్యతరగతి, ధనికులు చెల్లించాల్సిన పన్ను రేటు తగ్గింపు, తక్కువ ఆదాయం వచ్చేవారి మీద పన్ను పెంపు విధానాలను అది రుద్దుతున్నది. ఈ విధానాలకు వ్యతిరేకంగా అనేక దేశాల్లో జనం ఆందోళనలకు దిగుతున్నారు.ఈ షరతుల వలన ఆయా దేశాల రుణ దామాషాలు తగ్గటం లేదని స్వయంగా ఆ సంస్థ నివేదికలోనే పేర్కొన్నారు. దాని 39 ప్రాజెక్టులను సమీక్షించగా 32లో ఏదో ఒక ఆదేశం లేదా షరతు మానవహక్కులను ఉల్లంఘించేదిగా ఉందని తేలింది. ఇరవై రెండిరటిలో ప్రభుత్వ వేతన బిల్లు తగ్గించేందుకు వేతన స్థంభన, వేతన పరిమితి లేదా తగ్గింపు షరతులు ఉన్నాయి.ఇరవై మూడు ఉదంతాలల్లో వ్యాట్‌ పెంచాలనే ఆదేశాలున్నాయి. ఇరవై ప్రాజెక్టుల్లో ఇంథనం, విద్యుత్‌ సబ్సిడీల తగ్గింపు, సామాజిక భద్రతా పథకాల ఖర్చు తగ్గింపు వంటివి ఉన్నాయి. మన దేశంలో నరేంద్రమోడీ సర్కార్‌ పెట్రోలు, డీజిలు మీద పెద్ద మొత్తంలో సెస్‌ల పేరుతో వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అంశాలపై ఖర్చు తగ్గించటం, ప్రభుత్వాలు ఆ రంగాల నుంచి వైదొలగటం లేదా నామమాత్రంగా ఉండాలన్నది ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు చెప్పే సలహాలు లేదా ఆ ముసుగులో ఆదేశాలు ఉంటాయి. ఈ రెండు సంస్థలను బ్రెట్టన్‌ఉడ్‌ కవలలు అంటారు. ఎందుకంటే ఒకే దగ్గర అవి రూపుదిద్దుకున్నాయి.నాణానికి బొమ్మ బొరుసు వంటివి. రెండూ వేర్వేరుగా ఉన్నప్పటికీ సమన్వయంతో పనిచేస్తాయి. దేశాల మీద ఆదేశాలను రుద్దుతాయి. వాటి దగ్గరకు వెళ్లక ముందు మన దేశంలో రోడ్లకు టోల్‌టాక్సు, సెస్‌లు, వినియోగదారుల రుసుముల వంటి భారాలు లేవు. పెట్రోలు, డీజిలు మీద భారీగా ఒకవైపు పన్నులు సెస్‌ల వడ్డింపు,వాహనాలకు జీవితకాల పన్ను, మరోవైపు అవి రోడ్ల మీద తిరిగితే టోల్‌టాక్సు. దీన్నే గోడదెబ్బ`చెంపదెబ్బ అంటారు.


ఐఎంఎఫ్‌ విధానాలను అమలు జరిపిన జోర్డాన్‌ పరిస్థితిని మానవహక్కుల సంస్థ విశ్లేషించింది.2011 నుంచి 2017 మధ్య అక్కడ వృద్దాప్య పెన్షన్ల వంటి సామాజిక భద్రతా బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించారు. ఇంథనం, రొట్టెల మీద ఉన్న సబ్సిడీలను(మనదేశంలో పెట్రోలు,డీజిలు, గ్యాస్‌ మాదిరి) ఎత్తేశారు.తద్వారా ఆరు సంవత్సరాల్లో 110 కోట్ల డాలర్లను పొదుపు చేశారు.కోటీ పది లక్షల మంది జనాభాకు గాను కేవలం లక్షా ఇరవై వేల మందికి 2019లో ప్రపంచ బ్యాంకు సహకారంతో ఐఎంఎఫ్‌ పధకాల్లో నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టారు.తమకూ వర్తింపచేయాలని కోరిన వారిని వేధించారు, అణచివేశారు. 2018 నుంచి 2022 కాలంలో దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారు 15 నుంచి 24శాతానికి పెరిగారు. దరఖాస్తు చేసుకున్న అత్యధికులకు తిరస్కరించారు. కేంద్రం అనుమతి ఇవ్వని కారణంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత పది సంవత్సరాలుగా కొత్తగా తెల్లరేషన్‌ కార్డుల జారీ నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఇదీ మానవహక్కుల ఉల్లంఘనకిందికే వస్తుంది.

అమెరికా ఎన్నికల్లో కమ్యూనిజం చర్చ- ట్రంప్‌పై రెండో హత్యాయత్నం ?

Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

నవంబరు ఐదవ తేదీన అమెరికాలో ఎన్నికలు సజావుగా జరుగుతాయా ? తనకు ప్రతికూలంగా ఫలితం వస్తే డోనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరిస్తాడా ? గెలుపుకోసం ఎంతకైనా తెగిస్తాడా ? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాల నడుమ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మరోసారి ట్రంప్‌ మీద హత్యాయత్నం జరిగిందని, దుండగుడిని పట్టుకున్నట్లు భద్రతా సిబ్బంది ప్రకటించారు. ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో తన స్వంత మైదానంలో గోల్ఫ్‌ ఆడుతుండగా భద్రతా సిబ్బంది సమీపంలో ఉన్న పొదల్లో సాయుధ దుండగుడిని గమనించి కాల్పులు జరిపారు. దాంతో దుండగుడు రయన్‌ రౌత్‌ తన వద్ద ఉన్న ఎకె47 మాదిరి తుపాకి, మరికొన్ని వస్తువులను వదలి తన కారులో పారిపోగా 65 కిలోమీటర్ల తరువాత పట్టుకున్నట్లు చెబుతున్నారు. రౌత్‌ కాల్పులు జరిపాడా లేక పొదల్లో శబ్దాలకారణంగా అతని ఉనికిని గుర్తించి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారా అన్నది వెంటనే స్పష్టం కాలేదు. అతని సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలించగా డెమోక్రటిక్‌ పార్టీ అభిమాని అని తేలినట్లు చెప్పారు. అయితే అది వాస్తవం కాదని గత ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటువేశాడని, తాజా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన భారతీయ మూలాలున్న వివేక్‌ రామస్వామి చివరి వరకు పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్‌ ట్రంప్‌ మీద పోటీలో ఉండాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు మరొక ప్రచారం. జూలై 13వ తేదీన జరిపిన కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవి తమ్మెకు గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే దుండగుడిని పట్టుకొని కాల్చి చంపారు. భద్రతా వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రహస్య భద్రతా సిబ్బంది డైరెక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ట్రంప్‌ మద్దతుదారైన ప్రపంచ ధనికుడు ఎలాన్‌ మస్క్‌ తాజా ఉదంతం మీద స్పందించిన తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. హత్యాయత్నాలు అధ్యక్షుడు జోబైడెన్‌, పోటీలో ఉన్న కమలాహారిస్‌ మీద ఎందుకు జరగటం లేదు, ట్రంప్‌ మీదనే ఎందుకు అంటూ ఎక్స్‌ ద్వారా మస్క్‌ స్పందించాడు. ఇది అత్యంత బాధ్యతారహితం అని అనేక మంది గర్హించారు. ట్రంప్‌కు ఏమీ కానందుకు జో బైడెన్‌, కమలా హారిస్‌ ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా అధ్యక్షులు గనుక గోల్ఫ్‌ ఆడితే ఆ మైదానం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడతారు. ట్రంప్‌ మాజీ గనుక అలాంటి రక్షణ కల్పించలేదని అధికారులు వివరణ ఇచ్చారు. అమెరికాలో హింసాకాండకు తావులేదని ఎక్స్‌లో కమల స్పందించారు. అమెతో జరిగిన సంవాదంలో ట్రంప్‌ వెనుకబడినట్లు సర్వేలు తేల్చిన తరువాతే ఈ ఉదంతం జరగటం అనేక అనుమానాలకు తావిస్తోంది. జో బైడెన్‌, కమల తన మీద ధ్వజమెత్తుతున్న కారణంగానే హత్యాయత్నాలు జరుగుతున్నాయని ట్రంప్‌ ఆరోపించాడు.


ఒకవేళ ఓడితే ఫలితాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరిస్తాడా, గతంలో మాదిరే అనుచరులను రెచ్చగొట్టి దాడులకో మరొకదానికో పాల్పడతాడా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే నవంబరు ఐదవ తేదీ దగ్గర పడేకొద్దీ అనూహ్యపరిణామాలు సంభవిస్తాయోమోనని భావిస్తున్నారు.జో బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో ట్రంప్‌ ముందంజలో ఉన్నాడు. తొలిసారి హత్యాయత్నం తరువాత ఆధిక్యత మరింత పెరిగి విజయం ఖాయం అనే వాతావరణం ఏర్పడిరది. కమలా హారిస్‌ రంగ ప్రవేశంతో అదంతా తారుమారైంది. తీవ్రమైన పోటీ స్వల్ప ఆధిక్యంలో కమల ఉన్నట్లు సర్వేలు వెల్లడిరచాయి. సెప్టెంబరు పదవ తేదీన వారిద్దరి మధ్య జరిగిన సంవాదంలో ట్రంప్‌ తేలిపోయాడు. కొన్ని సర్వేలు కమల 23పాయింట్ల ఆధిక్యతతో ఉన్నట్లు పేర్కొన్నాయి. తరువాత జరిగిన మరికొన్ని సర్వేలలో కూడా ఆమెదే పైచేయిగా ఉంది.దాంతో తాను మరోసారి ఆమెతో బహిరంగ చర్చలో పాల్గొనాల్సిన అవసరం లేదని ట్రంప్‌ సంచలన ప్రకటన చేశాడు. దీంతో పోలింగ్‌కు ముందే ఓటమిని అంగీకరించినట్లు కావటంతో మాటమార్చాడు. పిచ్చోడు ఎప్పుడేం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలియదు, ట్రంపు కూడా అంతే. అక్టోబరులో జరిగే మరో రెండు చర్చల్లో పాల్గొనేదీ లేనిదీ చెప్పలేము. ఒక వేళ సిద్దపడకపోతే పారిపోతున్నట్లుగానే ఓటర్లు భావిస్తారు.కమలతో సంవాదాన్ని నిర్వహించిన ఏబిసి సంస్థ వీక్షకుల అభిప్రాయాన్ని తారుమారు చేసిందని తానే ముందున్నట్లు ట్రంప్‌ ప్రకటించుకున్నాడు.గొప్ప చర్చ చేసినందుకుగాను ఓటర్లు తనకు మద్దతు ఇవ్వటం ప్రారంభించారని, సర్వేల్లో అదే వెల్లడైనా కుహనా మీడియా వాటిని వెల్లడిరచటం లేదు రిగ్గింగు చేసినట్లు స్వంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌ వేదికలో రాసుకున్నాడు.


అమెరికా ఎన్నికల్లో మైలురాళ్లుగా చెప్పుకోవాల్సి వస్తే జూలై 15న రిపబ్లికన్‌ పార్టీ జాతీయ సమావేశం ట్రంప్‌ను, ఆగస్టు 19న కమలాహారిస్‌ను డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ సమావేశం అభ్యర్థులుగా ఖరారు చేశాయి.సెప్టెంబరు పదిన ట్రంప్‌కమల తొలి సంవాదం జరిగింది.నవంబరు ఐదున ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. జనవరి ఆరున ఫలితాలను నిర్ధారిస్తారు.జనవరి 20న నూతన అధ్యక్ష పాలన ప్రారంభం అవుతుంది. ప్రముఖులుగా ఉన్నవారు, ఓటర్లను ప్రభావితం చేసే వారు కొందరు ఎన్నికల్లో ఏదో ఒక పక్షాన్ని లేదా అభ్యర్థిని బలపరుస్తారు ఎక్స్‌ అధిపతి, ప్రపంచంలోనే పెద్ద కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ట్రంప్‌ను సమర్ధిస్తున్నాడు. అదే విధంగా ప్రముఖ గాయని, నటి, రచయిత్రి టేలర్‌ స్విఫ్ట్‌ కమలా హారిస్‌ను బలపరుస్తున్నట్లు ప్రకటించింది. ఎలన్‌ మస్క్‌ సామాజిక మాధ్యమాల్లో ఉన్న అసహ్యకరమైన మనిషి అంటూ మస్క్‌ కుమార్తె వివియన్‌ జెనా విల్సన్‌ విరుచుకుపడిరది.టేలర్‌ స్విఫ్ట్‌ను ఉద్దేశించి ఒక ఎక్స్‌ చేస్తూ ‘‘ బాగుంది టేలర్‌..నేను నీకు ఒక బిడ్డను ఇస్తా, నా జీవితాతం నీ కుక్కలకు కాపలా కాస్తా ’’ అని మస్క్‌ పేర్కొన్నాడు. అమెరికా ఎన్నికల ప్రచారం ఎంతలా దిగజారి ఉంటుందో దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు. టేలర్‌ వ్యతిరేకతను తట్టుకోలేని ట్రంప్‌ అందుకు తగిన మూల్యం చెల్లిస్తావంటూ బెదిరింపులకు పూనుకున్నాడు.

ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పోటీలో లేకపోయినా కమ్యూనిజం, సోషలిజాల గురించి పెద్ద చర్చే నడుస్తున్నది. గతకొద్ది దశాబ్దాలుగా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన కారణంగా అనేక మంది బుర్రల్లో అది రాయిలా గడ్డకట్టింది. తాను గెలవాలంటే పాతబడిన కమ్యూనిస్టు వ్యతిరేకతను ఒక అస్త్రంగా చేసుకోవాలని ట్రంప్‌ ఎంచుకున్నాడు.దానిలో భాగంగా కామ్రేడ్‌ కమల మన దేశానికి భయంకరమైన వ్యక్తి. అమె ఒక మార్క్సిస్టు లేదా కమ్యూనిస్టు, ఎప్పుడూ కమ్యూనిస్టుగానే ఉన్నారు, భవిష్యత్‌లో కూడా అలాగే ఉంటారు, ఎన్నుకుంటే అమెరికా చరిత్ర ముగిసినట్లే అని న్యూయార్క్‌ ఎకనమిక్‌ క్లబ్‌ ప్రసంగంలో అన్నాడు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక ప్రధాన పార్టీ అభ్యర్ధి, స్వేచ్చను తిరస్కరిస్తూ మార్క్సిజం, కమ్యూనిజం, ఫాసిజాలను అనుసరిస్తున్నారన్నాడు. ఆమె రూపంలో స్టాలిన్‌ జన్మించాడని చెప్పాడు. మౌలికంగా కృత్రిమ మేథ(ఏఐ) ద్వారా ఆమె కమ్యూనిస్టు టోపీ, ఎర్ర కోటు ధరించినట్లు ఒకటి, ఇంకా కమ్యూనిస్టు అని చెప్పే రకరకాల చిత్రాలను సృష్టించి వైరల్‌ చేయించాడు. కమల అభ్యర్థిగా నిర్ణయంగాక ముందే డెమోక్రటిక్‌ పార్టీని దేవుడు లేడని చెప్పే కమ్యూనిస్టు అని వర్ణించాడు. మన ప్రత్యర్థిని ఒక కమ్యూనిస్టు,సోషలిస్టు లేదా అమెరికాను నాశనం చేసే మరోవ్యక్తిగా చిత్రించి ప్రచారం చేయాలని తన మద్దతుదార్లను బహిరంగంగానే కోరాడు.ఎలన్‌ మస్క్‌ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నాడు. సోవియట్‌ నాయకుల మాదిరి కమల బొమ్మలను సృష్టించాడు.కమల తొలి రోజు నుంచే ఒక కమ్యూనిస్టు నియంతగా మారనున్నారు. అమెరికన్ల ఆర్థిక స్వేచ్చను హరించేందుకు సిద్దంగా ఉన్న ఒక సోషలిస్టు అంటూ వ్యాఖ్యలను జోడిరచి ప్రచారంలో పెట్టాడు.

కమలా హారిస్‌ కమ్యూనిస్టు కాదు, డెమోక్రటిక్‌ పార్టీలో ఉన్న ఉదారవాదుల్లో ఒకరు మాత్రమే. డెమోక్రటిక్‌ సోషలిస్టు నేత బెర్నీ శాండర్స్‌ కొన్ని అంశాలలో ఆమె వైఖరిని బట్టి పురోగామివాదిగా పరిగణిస్తున్నట్లు చెప్పాడు. అమెరికాలో గాడిద(డెమోక్రటిక్‌ పార్టీ)ఏనుగు (రిపబ్లికన్‌ పార్టీ) గుర్తుల మీద ఎవరు పోటీ చేసినా రెండిరటినీ బలపరిచే కార్పొరేట్లకు ఆమోదమైతేనే రంగంలో ఉంటారు.కమల కూడా అంతే. కమ్యూనిస్టు వ్యతిరేకులు ఏమి చెప్పినప్పటికీ కార్పొరేట్లకు ప్రాతినిధ్యం వహించే గోల్డ్‌మన్‌ శాచస్‌ సంస్థ ట్రంప్‌ కంటే కమల మెరుగని పేర్కొన్నది. ఆమె గెలిస్తే అమెరికా ఆర్ధిక వ్యవస్థకు శక్తి వస్తుందని, ట్రంప్‌ వస్తే దెబ్బతింటుందని చెప్పింది. కమ్యూనిస్టు నియంత మెరుగని ప్రపంచంలోని అతి పెద్ద పెట్టుబడిదారులు ఎలా చెబుతున్నారంటూ కొందరు గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడిదారుల చక్రవర్తి ట్రంప్‌ ఆర్థిక ప్రణాళిక ప్రకారం కమ్యూనిస్టు కామ్రేడ్‌ కమల చెబుతున్నదాని కంటే లోటు ఐదు రెట్లు పెరుగుతుందని తటస్థంగా ఉంటే పెన్‌ వార్టన్‌ బడ్జెట్‌ నమూనా నివేదిక చెప్పిందని ఒకరు పేర్కొన్నారు. ఇంతకీ కమల లేదా డెమోక్రటిక్‌ పార్టీ చెబుతున్నదేమిటి ? యాభైవేల డాలర్లతో ప్రారంభించే చిన్న అంకుర సంస్థలకు పన్ను రాయితీలను వర్తింపచేయటం, బడా సంస్థలకు పన్నులు పెంచటం, దీన్నే కమ్యూనిజం అంటున్నారు. స్కూలు పిల్లలకు ఉచితంగా మధ్యాహ్నభోజనం పెట్టటాన్ని కూడా సోషలిజం అని వర్ణించేబాపతు ఇలా చెప్పటంలో ఆశ్చర్యం ఏముంది? వాషింగ్టన్‌ ఎగ్జామినర్‌ అనే మీడియాతో కమలాహారిస్‌ మాట్లాడిన అంశాలను రిపబ్లికన్లు కమ్యూనిజంగా వర్ణించటాన్ని పురోగామి మార్పు ప్రచార కమిటీ స్థాపకుల్లో ఒకరైన ఆడమ్‌ గ్రీన్‌ ఎద్దేవా చేశాడు. రానున్న వారాల్లో గుడ్ల ధర ఏడు నుంచి తొమ్మిది దాలర్లకు పెరగటాన్ని అడ్డుకుంటామని కమలా హారిస్‌ చెబుతున్నారు, మితవాదులు దాన్నే గనుక కమ్యూనిజం అంటే అత్యధిక అమెరికన్లు దాన్నే కోరుకుంటారు, మీరేం మాట్లాడుతున్నారో అర్ధమౌతోందా అని గ్రీన్స్‌ ప్రశ్నించాడు.ధరలను అదుపు చేయటాన్ని కూడా ట్రంప్‌ కమ్యూనిజంగా వర్ణించాడు. కరోనా కాలం నాటితో పోల్చితే ప్రస్తుతం అమెరికాలో ధరలు 20శాతం పెరిగాయి.నిజవేతనాలు గణనీయంగా పడిపోతున్నాయి. అందుకే బతుకుదుర్భరమౌతున్న కారణంగా అనేక మంది యువతకు సోషలిజం, కమ్యూనిజాల గురించి తెలియకపోయినా అదే కావాలని కోరుకుంటున్నారు. ట్రంప్‌ వంటి వారు చేసే విపరీత ప్రచారం వాటి గురించి ఆసక్తి పెంచేందుకు దోహదం చేస్తున్నదంటే అతిశయోక్తి కాదు. అందుకే పెట్టుబడిదారీ దేశాల్లో చేస్తున్న సర్వేల్లో యువతలో సోషలిజం పట్ల సానుకూలత వెల్లడి అవుతున్నది. అమెరికాలో డెమోక్రాట్లను కమ్యూనిస్టులని ప్రచారం చేయటం ఇదే మొదటి సారి కాదు. ఈ ఎన్నికల్లో అది మరింతగా పెరిగింది.

నరేంద్రమోడీ తీరు ఇలాగే ఉంటే …… మనదగ్గరా శ్రీలంక, బంగ్లాదేశ్‌ పరిణామాలు పునరావృతం !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన సైనికచర్య, ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వ కూల్చివేత వంటి పరిణామాలు ,కుట్రలు సంభవిస్తాయంటూ నరేంద్రమోడీని బలపరిచే శక్తులు కొన్ని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే వాటి నేపధ్యం వేరే కావచ్చుగానీ జనంపై మోపుతున్న భారాలు అన్ని రంగాలలో వెల్లడౌతున్న వైఫల్యాన్ని చూస్తే మన దేశంలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన పరిణామాలు పునరావృతం అవుతాయా అని ఆలోచించాల్సి వస్తోంది. దానికి వేరే దేశాలు కుట్రలే చేయనవసరం లేదు. హసీనా స్వయంకృతాన్ని ఆమెను వ్యతిరేకించే అమెరికా, బంగ్లా ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి. అయితే చరిత్ర పునరావృతం కావచ్చుగానీ ఒకే విధంగా ఉండదు. ఎవరూ ఊహించలేరు.


తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు, ఓట్ల కోసం ఎంతకైనా కొన్ని రాజకీయ పార్టీలు తెగిస్తున్న రోజులివి.2024 సెప్టెంబరు 14 నుంచి అమల్లోకి వచ్చేలా మనం దిగుమతి చేసుకుంటున్న ఖాద్య తైలాలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున దిగుమతి సుంకాలను విధించింది.ముడి(శుద్ధి చేయని) పామ్‌, సోయా,సన్‌ఫ్లవర్‌ దిగుమతి ధరలపై ఇప్పుడున్న 5.5శాతం పన్ను మొత్తాన్ని 27.5శాతానికి పెంచింది. వీటికి ఇప్పటికే ఉన్న సెస్‌లు అదనంగా పెరుగుతాయి. ఇది సగటు ధర, అదే శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు పువ్వు ఆయిల్‌ దిగుమతి చేసుకుంటే ఇప్పుడున్న 13.75 నుంచి 35.75కు పెరుగుతుంది. ఉదాహరణకు ఒక లీటరు వంద రూపాయలకు దిగుమతి చేసుకుంటే ఇప్పుడు రు.113.75 చెల్లిస్తున్నాము. పెంచిన పన్నుతో అది రు.135.75కు అవుతుంది. ఇది మొత్తంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుందని వేరే చెప్పనవరం లేదు. మనదేశం ఖాద్యతైలాల దిగుమతిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఏటా వంద కిలోలు దిగుమతి చేసుకుంటే మన వాటా 20కిలోలకు పైగా ఉంది. ఈ కారణంగానే మన ప్రభుత్వం అనుసరించే వైఖరి ఒక విధంగా ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నది. దిగుమతి సుంకం పెంచగానే చికాగో మార్కెట్‌లో సోయా ధర రెండుశాతం పతనమైంది.లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వినియోగదారులను ఉద్దరించేందుకు దిగుమతి సుంకాలు తగ్గించినట్లు చెప్పిన మోడీ సర్కార్‌ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో రైతుల ఓట్ల కోసం అవే సుంకాలను పెంచుతూ నిర్ణయించింది.ఏది చేసినా ఓట్లకోసమే అంటే కొందరు తమ మనోభావాలను గాయపరుచుకోవచ్చుగానీ వాస్తవం.


హర్యానాలో బాస్మతి రకం వరిని సాగు చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పతనం అక్కడి రైతుల మీద కూడా పడిరది. బాస్మతి బియ్యాన్ని టన్నుకు 1200 డాలర్లకు తగ్గకుండా ఎగుమతి చేయాలని నిర్ణయించారు. తరువాత దాన్ని 950డాలర్లకు తగ్గించారు. పక్కనే ఉన్న పాకిస్తాన్‌ అంతకంటే తక్కువ ధరకే ఎగుమతి చేస్తున్నందున మన బియ్యాన్ని కొనేవారు లేకుండా పోవటంతో మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని పది స్థానాల్లో బిజెపి ఐదింటిని పోగొట్టుకుంది. రైతులు ఆగ్రహంతో ఉన్నట్లు తేలటంతో ఇప్పుడు కనీస ఎగుమతి ధరల విధానాన్ని ఎత్తివేసింది. పోయిన ఖాతాదారులు తిరిగి వస్తారా, ఇది రైతులకు మేలు చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.అదే విధంగా మహారాష్ట్రలో కూడా బిజెపి చావుదెబ్బతిన్నది, దానికి ఉల్లిరైతుల ఆగ్రహం అని తేలింది.లోక్‌సభ ఎన్నికలకు ముందు వినియోగదారులకు కన్నీరు తెప్పించిన ఉల్లిధరలను తగ్గించేందుకు ఎగుమతులపై ఆంక్షలు, కనీస ఎగుమతి ధర టన్నుకు 550 డాలర్లు ఉండాలని నిర్ణయించింది. ఇప్పుడు వాటిని రద్దు చేసింది. దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. మహారాష్ట్రలో సోయా సాగు కూడా ఎక్కువే. దానికి కేంద్రం నిర్ణయించిన క్వింటాలు కనీస మద్దతు ధర రు.4,892 కంటే మార్కెట్‌లో రు.4,500 నుంచి 600 వరకు మాత్రమే పలుకుతోంది.దీంతో రైతుల్లో తలెత్తిన అసంతృప్తి అసెంబ్లీ ఎన్నికల మీద పడకుండా మోడీ సర్కార్‌ సోయా మీద దిగుమతి పన్ను పెంచి కొంతమేరకైనా మార్కెట్లో ధరలు పెరుగుతాయనే ఆశతో ఈ చర్య తీసుకుంది.


ఇటు రైతులుఅటు వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలనటంలో మరోమాట లేదు. అందుకు తీసుకొనే చర్యలను సమర్దించవచ్చు. కానీ గత పది సంవత్సరాల్లో ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.మధ్యలో మార్కెటింగ్‌ రంగంలో ఉన్న వాణిజ్యవేత్తలకే లబ్ది చేకూరింది.మన దేశ అవసరాలలో మూడిరట రెండువంతుల ఖాద్యతైలాలను దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్నాం. నూనెగింజలను ఉత్పత్తి చేసే రైతాంగానికి అవసరమైన గిట్టుబాటు ధర ఉండటం లేదు. అనేక దేశాల్లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికదిగుబడి వంగడాలను రూపొందించి ఉత్పత్తిని గణనీయంగా పెంచారు. అది అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకూ మేలు. నరేంద్రమోడీ 2001 నుంచి 2014వరకు గుజరాత్‌ సిఎంగా ఉన్నపుడు అక్కడ గణనీయంగా సాగుచేసే వేరుశనగ దిగుబడి పెంచేందుకు అవసరమైన వంగడాలను రూపొందించలేదు, పదేండ్లు ప్రధానిగా ఉన్నా చేసిందేమీ లేదు. 2022 గణాకాల(అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డాటా వెబ్‌సైట్‌ ) మేరకు అమెరికాలో హెక్టారుకు వేరుశనగ నాలుగున్నరటన్నుల దిగుబడి ఉండగా, చైనాలో 4.13టన్నులు, అదే మనదేశంలో 1.78 టన్నులు మాత్రమే. మొత్తంగా నూనె గింజల దిగుబడి కూడా ఇదే మాదిరి ఉంది గడచిన పదకొండు సంవత్సరాల సగటు 1.22 టన్నులు మాత్రమే. ఎందుకీ దుస్థితి, దీనికి బాధ్యులెవరు ? జవహర్‌లాల్‌ నెహ్రూయే కారణం అంటారా ? నూనె గింజల సాగు గిట్టుబాటు కాని కారణంగానే రైతులు అటువైపు మొగ్గు చూపటం లేదు. పదేండ్లలో మన కరెన్సీ రూపాయి విలువ పతనం కారణంగా అధిక మొత్తాలను చెల్లించి దిగుమతి చేసుకోవటంతో వినియోగదారులకు ధరలు మండుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం 201314లో దేశ అవసరాల్లో 48.1శాతంగా ఉన్న దేశీయ ఉత్పత్తి 202223 నాటికి 42.92శాతానికి పడిపోయినట్లు అంచనా. దీనికి కారకులెవరు ? మెజారిటీ రాష్ట్రాలలో అధికారం మాదే, అభివృద్ధికి రెండిరజన్ల పాలన కావాలని చెబుతున్న బిజెపి ఏం చెబుతుంది? ఎంతకాలమీ పరిస్థితి, ఈ వైఫల్యాన్ని సహించాల్సిందేనా ? 2047నాటికి వికసిత భారత్‌ అనే కబుర్లతో కడుపు నిండుతుందా ? మన దేశంలో కొంత మంది వైద్యులు, వైద్యుల కంటే తమకే ఎక్కువ తెలుసు అన్నట్లుగా కబుర్లు చెప్పేవారు తయారై వంటల్లో నూనెలను తగ్గించండి వీలైతే పూర్తిగా మానుకోండి అని చెప్పటం తెలిసిందే. ఇటీవల యూట్యూబర్లు ఇలాంటి సలహాలు ఇవ్వటంలో అందరినీ మించిపోయారు. ఆరోగ్యపరంగా సమస్యలున్నవారికి అలాంటి సలహాలు ఇవ్వటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచంలో కొన్ని దేశాల్లో తలసరి వంటనూనెల కిలోల వాడకాన్ని చూద్దాం. జనాభా రీత్యా మొత్తం వాడకంలో మనదేశం చైనా తరువాత రెండవ స్ధానంలో ఉండవచ్చుగానీ తలసరిలో ఎక్కడో ఉన్నాం.

దేశం——–2010-2012–2022-22---2032 ప్రపంచం- --14.36 ---16.00 --16.60 పేదదేశాలు---07.13---06.97---07.79 భారత్‌----- 09.85---09.87---10.95 ఇండోనేషియా-05.55---10.32---12.24 లాటిన్‌అమెరికా06.95---17.61---18.18 ఐరోపా----- 18.55---24.10---21.73 చైనా------ 20.37---26.02---27.24 అమెరికా----36.63---40.26---36.76

మన దేశంలో కరోనాకు ముందు ఉన్న స్థాయికి వంట నూనెల డిమాండ్‌ పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.అనేక దేశాలతో పోల్చితే మన వినియోగం తక్కువగా ఉన్నపుడే పరిస్థితి కొనబోతే కొరివి అమ్మబోతే అడవిగా ఉంది. అన్నింటికీ పోల్చుతున్న చైనా స్థాయికి చేరితే దిగుమతి చేసుకొనేందుకు మన దగ్గర అవసరమైన డాలర్లు ఉంటాయా ? మూడు దశాబ్దాల కాలంలో వినియోగంలో పెద్ద మార్పు ఉండదనేది గత,వర్తమాన, భవిష్యత్‌ అంచనాలు తెలుపుతున్నాయి. ఇండోనేషియా తన అవసరాలను గమనంలో ఉంచుకొని పామ్‌ ఆయిల్‌ ఎగుమతులపై గతంలోనే కొన్ని ఆంక్షలు విధించింది. రానున్న సంవత్సరాల్లో దాని వినియోగం పెరగనుందనే అంచనాలు వాస్తవ రూపం దాల్చితే మన దిగుమతులు మరింత భారంగా మారే అవకాశం కనిపిస్తోంది. పోటీతో పాటు మన దిగుమతి అవకాశాలు తగ్గితే సోయా ఆయిల్‌ ఎగుమతి దేశాలు కూడా ధరలు పెంచే అవకాశాలు లేకపోలేదు. మన మొత్తం దిగుమతుల్లో పామాయిల్‌ వాటా 60శాతం.

దిగుమతి చేసుకొనే ఖాద్య తైలాల మీద పన్నులు పెంచితే రైతాంగాన్ని ఆదుకోవచ్చని చెప్పటం వంచన తప్ప మరొకటి కాదు. ఇప్పటి వరకు అది వాస్తవ రూపం దాల్చలేదు, సాగు పెద్దగా పెరగలేదు. నిజంగా మేలు చేయాలంటే ఇతర మార్గాలను ఆలోచించాలి. మార్చినెలతో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో రు.2.37లక్షల కోట్ల మేర జిఎస్‌టిని ఎగవేసినట్లు అధికార యంత్రాంగం తేల్చింది.అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే ఇది రెట్టింపు. మొత్తమే కాదు కేసులు కూడా పెరిగాయి.ముంబై, పూనే, గురుగ్రామ్‌, ఢల్లీి, హైదరాబాద్‌ కేంద్రాలుగా ఈ ఎగవేతను కనుగొన్నారు. మూడోవంతు రు.71వేల కోట్లు ఒక్క ముంబైలోనే ఉంది. అక్కడ రెండిరజన్ల పాలనే సాగుతోంది.లావాదేవీలేమీ లేకుండానే ఇన్‌పుట్‌ టాక్సు క్రెడిట్‌ పేరుతో కొట్టేసిన మొత్తం 20శాతం ఉంది. పన్ను ఎగవేతలను అరికట్టే పేరుతో 2017లో జిఎస్‌టిని తీసుకువచ్చారు.అంతకు ముందు ఎగవేత రు.7,879 కోట్లు కాగా తరువాత ఇంతింతై వటుడిరతై అన్నట్లుగా తాజాగా రు.2.37లక్షల కోట్లకు చేరుకుంది. ప్రతిపక్ష పార్టీల నేతలు, తమను వ్యతిరేకించేవారి మీద సిబిఐ,ఐటి,ఇడి దాడులను సాగిస్తున్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎగవేస్తుంటే ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? దీన్ని అరికడితే రైతాంగానికి అదనంగా చెల్లించవచ్చు, ఖాద్య తైలాల మీద దిగుమతి సుంకం విధించకపోతే వినియోగదారులనూ ఆదుకున్నట్లు అవుతుందా లేదా ? ఖాద్య తైలాల సంవత్సరం నవంబరు నుంచి అక్టోబరు వరకు ఉంటుంది.భారత సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ సమాచారం ప్రకారం 201314 నుంచి 202223తో పోల్చితే పదేండ్లలో నూనెల దిగుమతులు 116 లక్షల టన్నుల నుంచి 165లక్షల టన్నులకు పెరిగితే మోడీ ప్రభుత్వ నిర్వాకంతో రూపాయి విలువ తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కారణంగా ఖర్చు రు.60,750 కోట్ల నుంచి రు.1,38,424 కోట్లకు పెరిగింది. దీనికి తగ్గట్లుగా వినియోగదారుల రాబడి పెరిగిందా ? పోనీ సాగు విస్తీర్ణం పెరిగిందా అంటే లేదు.201112లో 263లక్షల హెక్టార్లలో సాగు చేయగా 202223లో 301లక్షలకు మాత్రమే చేరింది.మన అవసరాలకు ఇదేమాత్రం చాలదు.

గత రెండు సంవత్సరాలుగా పెట్రోలు, డీజిలు ధరలు పెంచలేదు చూడండి అంటూ బిజెపి నేతలు గొప్పలు చెప్పుకుంటారు. కానీ అసలు సంగతేమిటి ? గతంలో ప్రకటించి అమలు జరిపిన విధానం ప్రకారం గణనీయంగా ధరలను తగ్గించాల్సి ఉండగా పాతవాటినే కొనసాగించి మన జేబులను కొల్లగొడుతున్నారు. 202223 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసినపుడు మనదేశం దిగుమతి చేసుకున్న ముడిచమురు పీపా ధర 93.15 డాలర్లు కాగా 202324లో అది 82.58కి తగ్గింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు 15వరకు సగటు ధర81.92 డాలర్లు ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన మేరకు ఎందుకు ధరలు తగ్గించటం లేదంటే అన్నింటికీ జవాబుదారీ అని చెప్పుకుంటున్న నరేంద్రమోడీ ఎన్నడైనా దేశ పౌరులకు తన మన్‌కీ బాత్‌లో చెప్పారా ? ఎందుకు నోరు విప్పటం లేదో ఎవరైనా చెబుతారా ? వంటనూనెల వ్యాపారంలో అదానీ, పెట్రోలియం ఉత్పత్తులలో అంబానీ వంటి కంపెనీలు ఉండగా వాటికి లబ్ది చేకూరేవిధంగా మన ఎగుమతిదిగుమతి విధానాలు ఉన్నాయి తప్ప రైతులు, వినియోగదారులు పట్టలేదు. 1970దశకం ప్రారంభంలో ముంబైలో చిన్నగా ప్రారంభమైన ధరల పెరుగుదల వ్యతిరేక ఆందోళన క్రమంగా గుజరాత్‌, బీహార్‌ తదితర ప్రాంతాలకు విస్తరించటం, జయప్రకాష్‌ నారాయణ్‌ రంగ ప్రవేశం, ఇందిరాగాంధీ ఎన్నికల కేసులో ఓటమి, అత్యవసరపరిస్థితి విధింపు, ఆ సమయంలోనే జనతా పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి వంటి పరిణామాలు తెలిసినవే.గతంలో లాటిన్‌ అమెరికా, ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి చోట్ల ఏండ్ల తరబడి హృదయ సామ్రాట్టులుగా అభిమానం చూరగొన్న నాయకులనే జనం చివరికి తరిమికొట్టటాన్ని చూశాము. భారాలు పెరిగి జీవనం దుర్భరమైతే ఎక్కడైనా అలాంటి పరిణామాలు జరగవచ్చు. దానికి మనదేశం అతీతమేమీ కాదు. అయితే చరిత్ర ఏ రూపంలో ఎలా పునరావృతం అవుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. అన్నీ అనూహ్యంగా జరిగినవే.

చైనాపై పెరుగుతున్న విశ్వాసం – ఆఫ్రికాపై పట్టుకోసం అమెరికా ఆరాటం !

Tags

, , , , ,

ఎం కోటేశ్వరరావు

మూడు రోజుల పాటు 2024 సెప్టెంబరు 46 తేదీల మధ్య బీజింగ్‌లో జరిగిన చైనాఆఫ్రికా సహకార వేదిక సమావేశాలు జయప్రదంగా ముగిశాయి.వర్తమాన భూభౌతిక రాజకీయాల్లో ఈ వేదిక 8వ సమావేశాలకు ఆఫ్రికాలోని 54కు గాను 53దేశాల నుంచి ప్రభుత్వాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. గత సమావేశాలు సెనెగల్‌ రాజధాని డాకర్‌లో జరిగాయి. అమెరికాకు అనుకూలంగా తిరుగుబాటు ప్రాంతం తైవాన్ను చైనాగా గుర్తించిన పన్నెండు లక్షల జనాభా గల చిన్నదేశం స్వాతినీ(గతంలో స్వాజీలాండ్‌ అని పిలిచేవారు) మాత్రమే రాలేదు. 2000 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చిన చైనాఆఫ్రికా సహకార వేదిక ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించి భవిష్యత్‌ కార్యక్రమాలను నిర్ణయించుకుంటుంది. ఈ వేదిక సాధనంగా ప్రపంచంలోని పేద దేశాలకు చెందిన 280కోట్ల మంది జీవితాలను నవీకరించవచ్చని సమావేశాలను ప్రారంభించిన చైనా అధినేత షీ జింపింగ్‌ చెప్పారు.చైనా,ఆఫ్రికా రెండూ సామ్రాజ్యవాదుల దురాక్రమణ,వలస వాదానికి వ్యతిరేకంగా పోరాడినవే అని గుర్తు చేశారు. కేవలం పదినిమిషాలు మాత్రమే మాట్లాడిన షీ రానున్న మూడు సంవత్సరాల్లో చేపట్టదలచిన పది అంశాలను సభ ముందుంచారు. గత రెండున్నర దశాబ్దాలుగా ఆఫ్రికా,చైనా సంబంధాలు నానాటికీ పెరగటం అమెరికాను కలవర పెడుతోంది.భౌగోళికంగా ప్రాధాన్యత ఉన్న ఆ ప్రాంతంలో చైనాతో మిత్రత్వంతో కంటే తన పట్ల వ్యతిరేకత పెరగటాన్ని అది సహించలేకపోతోందంటే అతిశయోక్తి కాదు. ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా ఖండంలోని సామ్రాజ్యవాద, ధనిక దేశాలు చీకటి ఖండగా పిలిచిన ఆఫ్రికాను తమ ఉత్పత్తులకు మార్కెట్‌గా, తమ పరిశ్రమలు, గనులు,భూముల్లో పని చేసేందుకు బానిసలుగా పట్టుకువచ్చేందుకు అనువైన ప్రాంతంగా మాత్రమే చూసినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు చైనా దానికి విరుద్దమైన విధానాలతో స్నేహ బంధాలను నెలకొల్పుకోవటం వాటికి మింగుడుపడటం లేదు.


ఈ సమావేశాల్లో రానున్న మూడు సంవత్సరాల్లో ఆఫ్రికాలో పది లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు 51బిలియన్‌ డాలర్ల మేరకు అందిస్తామని చైనా వాగ్దానం చేసింది. ఈ మొత్తంలో 30బిలియన్లు రుణాలు,పదిబి.డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. చైనాఆఫ్రికా మధ్య వాణిజ్య లావాదేవీలు ఈ ఏడాది తొలి ఆరుమాసాల్లో 167.8బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.వర్తమాన దశాబ్ది చివరకు 300 బి.డాలర్లకు పెంచాలని చూస్తున్నారు. బీజింగ్‌ కార్యాచరణ పధకం పేరుతో ఆమోదించిన ప్రకటన ప్రకారం రానున్న రోజుల్లో మరింతగా హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా అందించనుంది. ప్రపంచంలో ఈ రంగంలో అన్ని దేశాల కంటే చైనా ఎంతో ముందుంది. తన బిఆర్‌ఐ (బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌) పధకం కింద గత దశాబ్దకాలంలో వివిధ దేశాలలో రోడ్లు, రైల్వేలు, విద్యుత్‌ ప్రాజెక్టులు, వంతెనలు, ఆసుపత్రుల వంటి అనేక పధకాలకు 120 కోట్ల డాలర్లమేర పెట్టుబడులు పెట్టింది. సోవియట్‌ను విచ్చిన్నం చేసిన తరువాత సంక్లిష్టమైన ఈ ఖండ దేశాలు చైనాను తమ నమ్మకమైన భాగస్వామిగా పరిగణిస్తున్నాయి. అనేక దేశాల్లో కొనసాగుతున్న అంతర్గత కలహాలు, అంతర్యుద్ధాలలో అమెరికా మాదిరి ఏదో ఒక పక్షం వహించకుండా వీలైతే వాటిని పరిష్కరించటానికి, సర్దుబాటు చేసేందుకు చూస్తున్నది.

ఆఫ్రికాతో పాటు అనేక దేశాలలో చైనా పెట్టుబడులు పెడుతున్నది, రుణాలు ఇస్తున్నది. వీటితో సదరు దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతే వాటి ఆస్తులపై కన్నువేస్తున్నదని ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తునప్రచారం జరుగుతున్నది. చైనా కంటే అమెరికా, ఐరోపాలో అనేక ధనికదేశాలు ఉన్నాయి. అవసరమైన పేద, వర్ధమాన దేశాలకు అవే సులభతరమైన పద్దతిలో పెట్టుబడులు, రుణాలు ఇచ్చి చైనాకు ఎందుకు అడ్డుకట్టవేయటం లేదు ? చైనా అంటే ఇటీవలి కాలంలో రుణాలు, పెట్టుబడులు పెడుతున్నది. మరి గత శతాబ్దిలో లాటిన్‌ అమెరికా దేశాలు అప్పులపాలై సంక్షోభంలో కూరుకుపోవటానికి కారకులు ఎవరు ? మన దేశం కూడా ప్రపంచ బాంకు వద్దకు వెళ్లి అది విధించిన షరతుల మీద అప్పులు తీసుకున్న చరిత్ర ఉంది కదా ? దానికి కారకులు ఎవరు ? సందర్భం ఆఫ్రికా గురించి కనుక దాని అప్పుల నిజానిజాల గురించి చూద్దాం. గతేడాది(2023)చివరి నాటికి ఆఫ్రికా దేశాల మొత్తం అప్పు 1,15,200 కోట్ల డాలర్లు. దీనికి గాను 2010లో చెల్లించిన వడ్డీ, అసలు మొత్తం 6,100 కోట్ల డాలర్లు కాగా 2024 నాటికి 16,300 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఇక చైనా 2000 నుంచి 2023వరకు ఆఫ్రికాకు ఇచ్చిన అప్పు 18,228 కోట్ల డాలర్లు. ఈ మొత్తంతోనే ఆఫ్రికాను చైనా ఆక్రమించుకుంటే మరో లక్ష కోట్ల డాలర్లు ఇచ్చిన దేశాలూ, సంస్థలూ గుడ్లప్పగించి చూస్తూ ఉంటాయా ? ఎందుకు చైనా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ? ఆఫ్రికా దేశాలు సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినవి. మంచేదో చెడేదో నిర్ణయించుకోగలగిన పరిణితి కలిగినవే. వాటిని చైనా వలలో ఇరుకుంటున్నాయని చెప్పటమంటే అవమానించటం తప్ప మరొకటి కాదు. పశ్చిమ దేశాలు, వాటి సంస్థలు, ప్రైవేటు సంస్థల నుంచి అప్పులు చేసినపుడు ఇలాంటి హెచ్చరికలను ఎందుకు చేయలేదు ? నాడు అప్పుల ద్వారానే అభివృద్ధి, రుణాలు తీసుకోని దేశం ఏదైనా ఉందా అంటూ సమర్ధించారు. పాలకులు బయటి నుంచి తీసుకున్న అప్పులను దుర్వినియోగం చేయటాన్ని ఈ సందర్భంగా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఒక్క చైనా నుంచి తీసుకున్నవాటినే స్వాహా చేస్తారు, మిగతా దేశాల వాటిని ముట్టుకుంటే భస్మమౌతారని చెబుతున్నట్లా ? ఏ అవినీతి, అక్రమం జరిగినా దాని గురించి ఆయాదేశాల జనమే తేల్చుకుంటారు.అలాంటి పాలకులందరినీ జనం చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టారు. లాటిన్‌ అమెరికా దేశాలను అప్పుల పాలు చేసిన పాలకులను పేరు చెప్పి మరీ ఓడిరచిన ఉదంతాలు తెలిసిందే, వారికి మద్దతు ఇచ్చిన అమెరికా అంటే అక్కడ నేడు ఎంత వ్యతిరేకత ఎంతో ఉందో కూడా చూస్తున్నాము. పరస్పరం లబ్ది పొందుతున్న కారణంగానే చైనా ఆఫ్రికా సంబంధాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.చైనా పెట్టుబడులు ఆఫ్రికా ఖండాన్ని అప్పుల ఊబిలో దింపుతాయని చెప్పే మాటలను తాను విశ్వసించనని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా బీజింగ్‌ సమావేశాలకు హాజరైన సందర్భంగా విలేకర్లతో చెప్పాడు. పరస్పర లాభదాయకమైనవన్నాడు.


రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతల్లో బ్రిటన్‌, ఫ్రాన్సులు కూడా ఉన్నప్పటికీ అవి ఆఫ్రికాలో వలసలుగా చేసుకున్న దేశాలన్నింటినీ వదలి వెళ్లాల్సి వచ్చింది, స్వచ్చందంగా చేయని చోట పోరాటాల ద్వారా జనం తరిమికొట్టారు. ఆ తరువాత మార్కెట్లను ఆక్రమించటంలో అమెరికా ముందుకు వచ్చింది. తమను దెబ్బతీసే వలసలను, నిరంకుశ పాలకులను వ్యతిరేకించిన ఆఫ్రికన్లు ఒకవేళ చైనా కూడా తమను దోపిడీ చేస్తున్నదని భావిస్తే అదే పని చేస్తారు. గతంలో సోవియట్‌ యూనియన్‌ అలాంటి పనులకు పాల్పడలేదు కనుకనే చైనాను వారు నమ్ముతున్నారు.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రత్యక్ష వలసలు సాధ్యం కాదని గ్రహించిన పశ్చిమదేశాలు మార్కెట్లను ఆక్రమించుకొనేందుకు నయావలస విధాన సాధనాలుగా ఐరాస, ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణ్యిస్థలను ముందుకు తెచ్చాయి. అవేవీ పేద,వర్ధమానదేశాలను ఉద్దరించేవికాదని ఎనిమిది దశాబ్దాల అనుభవం నేర్పింది. వాటి విధానాల పర్యవసానమే ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల్లో ఇరుక్కోవటం, దానికి వ్యతిరేకంగా తలెత్తిన పోరాటాలను అణచేందుకు మిలిటరీ, మితవాద నిరంకుశ శక్తులను రుద్ది ప్రజాస్వామ్యాన్ని కూడా హరించటం దాస్తే దాగేది కాదు.గతంలో సోవియట్‌ యూనియన్‌గానీ, ఇటీవల తాను పెట్టుబడులు పెట్టిన లేదా రుణాలు ఇచ్చిన దేశాల్లో అలాంటి శక్తులను చైనా ప్రతిష్ఠించిన లేదా పనిగట్టుకొని సమర్ధించిన దాఖలాలు లేవు.


ఆఫ్రికాలో చైనా పలుకుబడి పెరగటాన్ని అమెరికా, ఐరోపా ధనికదేశాలు భరించలేకపోతున్నాయి.ప్రధానంగా అమెరికా ముందుంది. చైనాను అడ్డుకొనేందుకు చూస్తున్నది.అదే సమయంలో తాను కూడా ఆఫ్రికా పేద దేశాలను ఆదుకుంటానంటూ పోటీగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నది. 2022 డిసెంబరు 1315 తేదీలలో వాషింగ్టన్‌ డిసిలో అమెరికాఆఫ్రికా నేతల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దాదాపు 50దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. 2000 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చైనా`ఆఫ్రికా వేదిక సమావేశాలు జరుగుతున్నాయి.క్రమంగా పెట్టుబడులతో ముందుకు పోతున్నది.చైనా పట్ల సానుకూల ధోరణి పెరుగుతోంది. కొన్ని సందర్భాలలో అమెరికా మీద వత్తిడి పెరుగుతోంది. దీర్ఘకాలంగా ఆఫ్రికాతో వాణిజ్యం జరిపే దేశాలలో ముందున్న అమెరికాను 2021లో చైనా వెనక్కు నెట్టేసింది. అనేక దేశాల మాదిరే ఆఫ్రికాలోని జిబౌటీలో చైనా కూడా 2017తన మిలిటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది విదేశాల్లో దాని తొలి కేంద్రం. అనేక మంది ఆఫ్రికన్‌ నేతలు చైనాతో పాటు అమెరికా నుంచి కూడా లబ్దిపొందాలని చూస్తున్నారు. అయితే అమెరికాతో సహా అనేక దేశాలు కబుర్లు చెప్పటం తప్ప నిర్దిష్టంగా చేస్తున్నదేమీ లేదనే విమర్శలు వచ్చాయి.దాన్ని పొగొట్టుకొనేందుకు అమెరికా తొలి సమావేశాన్ని 2014లో నిర్వహించిన తరువాత 2022లో ఏర్పాటు చేసింది. గతంలో వచ్చిన విమర్శలు వాస్తవం కాదని చెప్పుకొనేందుకు అమెరికా చూసింది. ఈ సభలో 1,500 కోట్ల డాలర్ల మేర ఒప్పందాలు కుదిరినట్లు ప్రకటించారు. అంతకు ముందు కూడా కొన్ని లావాదేవీలు జరిగాయి.2023లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆఫ్రికాలోని మూడు దేశాల్లో పర్యటించారు.ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, తమకు ముప్పు సాకుతో అమెరికా, దాని మిత్రదేశాలు అనేక దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయి.అంతర్యుద్దాలను రెచ్చగొట్టి తాము దూరాలని చూస్తున్నాయి.ఆఫ్రికాలో కూడా జరుగుతున్నది అదే.అనేక దేశాలు వాటి నుంచి దూరం జరుగుతున్నాయి. అమెరికా వైఖరిని అనేక చోట్ల రష్యా ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తున్నది.అనేక చోట్ల ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ అమెరికా ఇప్పటికీ దాదాపు ఆరువేల మంది సైనికులను ఆఫ్రికాలో నిర్వహిస్తున్నది. రష్యా ఒక వైపు మిలిటరీ రీత్యా ఆఫ్రికా దేశాలకు దగ్గర అవుతుంటే ఆర్థిక రంగంలో చైనా ముందుకు పోతున్నది. ఈ రెండు దేశాలూ తమను సవాలు చేయటాన్ని అమెరికా సహించలేకపోతున్నది.

చైనాకు తలుపులు మూయలేదు, నరేంద్రమోడీకి ‘‘ అమెరికా మనిషి జయశంకర్‌ సమస్య ’’ గా మారారా?

Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


‘‘ చైనాతో వాణిజ్యానికి వ్యతిరేకం కాదు, ఏ రంగంలో లావాదేవీలు ఎలా అన్నదే సమస్య అన్న జయశంకర్‌ ’’ ఈటివి భారత్‌ ప్రసారం చేసిన ఒక వార్త శీర్షిక ఇది. ఇంకా మరికొన్ని పత్రికలు కూడా ఇదే వార్తను ఇచ్చాయి. 2024 సెప్టెంబరు పదిన అక్కడి విదేశాంగ మంత్రితో కలసి జర్మనీ నగరమైన బెర్లిన్‌లో ఒక చర్చలో పాల్గొన్న జయశంకర్‌ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘ చైనాతో వాణిజ్యానికి తలుపులు మూయలేదు. ప్రపంచంలో అది రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. అది ఒక ప్రముఖ ఉత్పత్తిదారు. చైనాతో వాణిజ్యం చేయబోమని చెప్పగలిగేవారెవరూ లేరు. ఏఏ రంగాలలో వాణిజ్యం చేయాలి, ఏ షరతులతో చేయాలన్నదే సమస్య అని నేను అనుకుంటున్నాను. ఇది ఎంతో సంక్లిష్టమైనది, నలుపా తెలుపా అన్నంత సులభంగా సమాధానం చెప్పలేము ’’ అన్నారు. జయశంకర్‌ చెప్పిన ‘‘ సమస్య ’’ ఒక్క చైనాతోనే అనే ముంది, ప్రతిదేశంతోనూ ఉండేది కాదా ? చైనాతో ఆచితూచి, మిగతా దేశాలతో ఎలాబడితే అలా చేస్తారా ? 2020లో జరిగిన గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత మనదేశం చైనా పేరు పెట్టకపోయినా దానికి వర్తించే అనేక ఆంక్షలను పెట్టిన సంగతి తెలిసిందే. భద్రత, సమాచార రక్షణ పేరుతో అంతకు ముందు స్వేచ్చగా అనుమతించిన టిక్‌టాక్‌ వంటి యాప్‌లను కూడా నిషేధించింది. ఆగస్టు నెలలో ఒక సందర్భంలో జయశంకర్‌ మాట్లాడుతూ చైనాతో ప్రత్యేక సమస్యలు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఏం జరుగుతోంది ? మన విధానాలను ప్రభావితం చేస్తున్నది ఎవరు ? ప్రధాని నరేంద్రమోడీకి విదేశాంగ మంత్రి జయశంకర్‌ సమస్యగా మారారా ? ఆయన వెనుక ఎవరున్నారు ? జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే ఇలా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి.


ఇటీవలి కాలంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌తో సహా అనేక మంది చైనా పెట్టుబడులకు అనుకూలంగా సంకేతాలివ్వటమేగాక మాట్లాడుతున్నారు.జూలై నెలలో విడుదల చేసిన మనదేశ వార్షిక ఆర్థిక సర్వేలో చైనా సరఫరా గొలుసుతో అనుసంధానం చేసుకోవటం,మరింతగా చెనా పెట్టుబడులను మనదేశంలోకి అనుమతించటం గురించి పేర్కొన్నారు. సూర్యరశ్మి పలకలు, విద్యుత్‌ వాహనాల బ్యాటరీలు, ఇంకా మన దగ్గర తయారీకి నైపుణ్యం లేని, రక్షణ సమస్యలు లేని ఉత్పత్తుల వంటి రంగాలలో చైనా పెట్టుబడుల అనుమతికి, చైనీయులకు నిలిపివేసిన వీసాల జారీ నిబంధనలను భారత్‌ సడలించవచ్చని జూలై నెలలోనే రాయిటర్స్‌ వార్తా సంస్థ నివేదించింది.జై శంకర్‌ జర్మనీ పర్యటనలో ఉండగానే చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌లో ‘‘ భారత దౌత్యానికి ఎస్‌ జైశంకర్‌ సమస్య ’’ అనే శీర్షికతో ఒక విశ్లేషణ వెలువడిరది. దాన్ని వెబ్‌సైట్‌ నుంచి వెంటనే తొలగించారని కూడా వార్తలు వచ్చాయి.అయితే అది నెటిజన్లకు అందుబాటులో ఉంది. దానిలో పేర్కొన్న అంశాల సారం ఏమిటి ?


ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు, సంప్రదింపులు సంబంధాలు మెరుగుపడటానికి అనువైన వాతావరణాన్ని సృష్టించిన నేపధ్యంలో ఎకనమిక్‌ టైమ్స్‌ పత్రిక నిర్వహించిన ప్రపంచ వేదిక సమావేశంలో జై శంకర్‌ చేసిన వ్యాఖ్యలను చైనా విశ్లేషకుడు తప్పు పట్టటమే కాదు, రెండుదేశాల సంబంధాలు మెరుగుపడటం ఇష్టం ఉన్నట్లు లేదని విమర్శించాడు. ‘‘ మామూలుగానే చైనా సమస్య ఉంది.చైనా గురించి చర్చిస్తున్నది ప్రపంచంలో భారత్‌ ఒక్కటే కాదు. భారత్‌కు చైనా సమస్య ఉంది… ప్రపంచానికి ఉన్న సాధారణ చైనా సమస్య కంటే భారత్‌కు ప్రత్యేక సమస్య ఉంది’’ అన్న జై శంకర్‌ వ్యాఖ్యను ఉటంకించాడు. అంతే కాదు కేంద్రంలో నేటి పరిస్థితి గురించి మనదేశ విశ్లేషకుడు ప్రవీణ్‌ సాహ్నే చేసిన వ్యాఖ్యలను కూడా పేర్కొన్నాడు. అవేమిటంటే ‘‘ మోడీ సర్కార్‌లో ఒక బలమైన వర్గం చైనాతో సంబంధాలను సాధారణ స్థాయికి తేవాలని అభిప్రాయపడుతున్నది. జై శంకర్‌ నాయకత్వంలోని మరొక శక్తివంతమైన వర్గం చైనాతో సాధారణ సంబంధాలు నెలకొల్పుకుంటే అమెరికాతో ఉన్న భారత సంబంధాలు సంకటంలో పడతాయి కనుక జరగకూడదని చెబుతున్నది. లబ్ది పొందాలని చూస్తున్న కారణంగా నరేంద్రమోడీ ఎటూ తేల్చుకోలేదు ’’ అని పేర్కొన్నారు. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పకపోయినా జై శంకర్‌ అమెరికన్‌ లాబీయిస్టుగా ఉన్నారని చైనా చెబుతోంది. భారత్‌చైనా సంబంధాలు మెరుగుపడటం, బలపడటం గురించి జై శంకర్‌ భయపడుతున్నారని కూడా గ్లోబల్‌టైమ్స్‌ విశ్లేషణలో ఉంది.ఒక వర్గం తమతో సంబంధాల గురించి అనుకూలంగా ఉన్నపుడు ఇలాంటి వ్యాఖ్యలు అవసరం లేదన్న పునరాలోచనతో దాన్ని వెబ్‌సైట్‌ నుంచి తొలగించి ఉండవచ్చు. చైనా యాప్‌లు, దాని కంపెనీల టెలికాం పరికరాలతో సమాచారాన్నంతా సంగ్రహిస్తుందని, దేశ భద్రతలకు ప్రమాదమని కదా చెబుతోంది. మా పరికరాల ద్వారా అలాంటి ముప్పు ఉందనుకుంటే మరి అమెరికా పరికరాలతో భద్రత ఉంటుందనే హామీ ఇస్తారా అని చైనా అడుగుతోంది. ప్రిజమ్‌ పేరుతో అమెరికా వివిధ మార్గాలలో ఇతర దేశాల సమాచారం మొత్తాన్ని సేకరిస్తోందని దాని రహస్య మెయిళ్లు, ఫైళ్లను బయటపెట్టిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ ఉదంతం గురించి అది పేర్కొన్నది. మరొక దేశ పరికరాల ద్వారా గూఢచర్యం జరుగుతోందని ప్రతిదాన్నీ అనుమానిస్తే మన పరికరాలు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లను మనం అమ్ముకోగలమా? కొనేవాళ్లు గుడ్డిగా ఉంటారా ?

చైనాతో సత్సంబంధాలు , రష్యాతో మైత్రి అమెరికన్లకు మింగుడుపడదన్నది బహిరంగ రహస్యం. అందుకే వాటితో పాటు అమెరికాతో కూడా అదే మాదిరి ఉంటున్నాం కదా అని మెప్పించేందుకు మోడీ ఇటీవల ఉక్రెయిన్‌ పర్యటన జరిపినట్లు అనేక మంది భావిస్తున్నారు. నరేంద్రమోడీయే స్వయంగా చైనా సంబంధాల గురించి సానుకూలంగా లేకపోతే ఒక బలమైన వర్గం అనుకూలంగా తయారయ్యే అవకాశమే ఉండదని జై శంకర్‌కూ తెలుసు. మోడీకి చైనా మీద ప్రత్యేక ప్రేమ ఉండి అనుకూలంగా ఉంటున్నారని దీని అర్ధం కాదు, కార్పొరేట్ల ప్రయోజనం, వత్తిడే కారణం. ఇక జై శంకర్‌ వివరాలను చూసినపుడు నరేంద్రమోడీ పాలనలో 2015 నుంచి 18వరకు విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత టాటా కంపెనీ విదేశీ వ్యవహారాలను చూసే కీలక బాధ్యతల్లో పని చేశారు. ఆ సమయంలో టాటా కంపెనీల అవసరాల కోసం చైనాతో సంబంధాల మెరుగుదలకు తీవ్రంగా కృషి చేశారని అలాంటి వ్యక్తి ఇప్పుడు చైనా వ్యతిరేకత కలిగి ఉన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.(అదే టాటా కంపెనీ తన విద్యుత్‌ కార్లకు అవసరమైన బ్యాటరీలను చైనా నుంచి కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ) ఒక బలమైన వర్గం చైనా పెట్టుబడులు, వాణిజ్యాన్ని కోరుకుంటున్న కారణంగానే బెర్లిన్‌లో జై శంకర్‌ చైనాతో సంబంధాలు ఉండవని మేమెప్పుడు చెప్పాం, అసలుదానితో సంబంధాలు లేనివారు ఉంటారా అంటూ మాట్లాడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే తెగేదాకా లాగదలుచుకోలేదు. అందుకే భారత దౌత్య అసలు సమస్యను జై శంకర్‌ సమస్యగా చైనా పరిగణిస్తోంది.

మన కార్పొరేట్ల ప్రయోజనాలను దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ ఇటీవల గట్టిగా ప్రతిబింబిస్తున్నారు. చైనా సరఫరా(గొలుసు) వ్యవస్థతో అనుసంధానించుకోవటం తప్పనిసరని చెప్పినట్లు 2024సెప్టెంబరు 11వ తేదీన రాయిటర్స్‌ వార్త పేర్కొన్నది. మనం పూర్తిగా దిగుమతులు చేసుకోవాలా లేక చైనా పెట్టుబడులతో ఇక్కడే తయారు చేయాలా అన్నది భారత్‌ నిర్ణయించుకోవాలని నాగేశ్వరన్‌ చెప్పారు.అమెరికా, ఐరోపాలు చైనా నుంచి సేకరణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నందున మనం చైనా నుంచి దిగుమతులు చేసుకోవటం, వాటికి కొంత విలువను జోడిరచి తిరిగి ఎగుమతి చేయటం కంటే చైనా కంపెనీల పెట్టుబడులతో మనదేశంలో వస్తువులను ఉత్పత్తి చేసి ఆ మార్కెట్లకు ఎగుమతి చేయటం మరింత ప్రభావం చూపుతుంది అని జూలై నెలలో విడుదల చేసిన దేశ వార్షిక ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు. దాని రూపకల్పన నాగేశ్వర్‌ మార్గదర్శకత్వంలోనే జరిగిందని వేరే చెప్పనవసరం లేదు. మోడీ సర్కార్‌ గతంలో విధించిన ఆంక్షలను సడలించటమే కాదు స్థానిక ఉత్పత్తులను పెంపొందించటానికి సబ్సిడీలు కూడా ఇచ్చేందుకు రూపకల్పన చేసిందని రాయిటర్స్‌ పేర్కొన్నది.‘‘ చైనా సరఫరా గొలుసులలో భాగస్వామి కాకుండా ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన ఉత్పత్తులైన సోలార్‌ సెల్స్‌, విద్యుత్‌ వాహనాల రంగంలో ఏమీ చేయలేమని ’’ అమెరికా ఏలే విశ్వవిద్యాలయ లెక్షరర్‌ సుశాంత సింగ్‌ చెప్పారు. చైనా వస్తువుల మీద దిగుమతి పన్నులు విధించాలని చెబుతున్న మనదేశంలోని ఉక్కు పరిశ్రమ దిగ్గజం నవీన్‌ జిందాల్‌ కూడా చైనాతో ఆచరణాత్మక వైఖరిని అవలంభించాలని చెప్పారు.‘‘ అనేక ఉక్కు కంపెనీలు చైనా నుంచి పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి, చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు ఉత్పత్తిదారు కొన్నింటిలో అది ఎంతో ముందుంది, అన్నింటిలో కాదు ’’ అని జిందాల్‌ అన్నారు.చైనా పెట్టుబడులపై నాలుగు సంవత్సరాల ఆంక్షల తరువాత ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు సన్నిహితం కావటానికి చూస్తున్నారు, తన మేక్‌ ఇండియా లక్ష్యాలకు కొత్త జీవితాన్ని ఇవ్వటానికి చూస్తున్నారని కూడా రాయిటర్స్‌ పేర్కొన్నది. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా నుంచి మన దిగుమతులు 56శాతం పెరిగాయి.వాణిజ్యలోటు రెట్టింపైంది.

చైనా పెట్టుబడుల గురించే కాదు, ఇతర అంశాలలో కూడా పునరాలోచన చేయాలని మన కార్పొరేట్‌ శక్తులు నరేంద్రమోడీ సర్కార్‌ మీద వత్తిడి తెస్తున్నాయి.‘‘ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్‌సిఇపి) పేరుతో పని చేస్తున్న ఆర్థిక కూటమిలో చేరితే మన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు హాని జరుగుతుందనే విమర్శలు, వ్యతిరేకత వెల్లడి కావటంతో మన దేశం దానికి 2019లో దూరంగా ఉంది. అయితే భారత్‌కు తలుపులు తెరిచే ఉంచామని ఆర్‌సిఇపి ప్రకటించింది. మనకు ఇప్పటికీ ముప్పు పొంచి ఉన్నప్పటికీ దానిలో చేరటం గురించి సానుకూలంగా ఆలోచించాలనే వత్తిడి క్రమంగా పెరుగుతోంది.దానికి దూరంగా ఉండటం కంటే చేరి మరింత వాణిజ్యం చేయవచ్చని చెబుతున్నారు. గత పది సంవత్సరాల్లో భారత్‌ వృద్ధి ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ప్రపంచ వాణిజ్యంలో దాని వాటా తక్కువగా ఉందని,వేగాధిక్యత తగ్గుతోందని ఇటీవల ప్రపంచబ్యాంకు చెప్పింది. 2030 నాటికి భారత్‌ లక్ష కోట్ల డాలర్ల మేర ఎగుమతి చేయాలన్న లక్ష్యాన్ని చేరాలంటే ఇప్పుడున్న విధానాలను మార్చుకోవాలని చెప్పింది. మనదేశం ఆర్‌సిఇపిలో ఉంటే చైనాకు పోటీగా ఉంటుందని అనేక దేశాలు భావించాయి. మన దేశ ప్రయోజనాల కంటే చైనాతో దగ్గర అవుతున్నామన్న భావన అమెరికాకు కలిగితే నష్టమని మోడీ సర్కార్‌ ఎక్కువగా భయపడిరది. దీన్లో భాగస్వామిగా మారేందుకు అమెరికా తిరస్కరించింది.చైనాకు పోటీగా అమెరికా నాయకత్వంలోని కూటమి ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకోనుందని మోడీ నాయకత్వం ఆశపడిరది. అయితే అది ఎండమావిగానే మిగిలిపోవటంతో పునరాలోచనలో పడిరది. మరోవైపున మన ఉత్పత్తిదారులు చైనా పోటీని ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఈ కూటమిలోని 15కు గాను 13 దేశాలతో మనకు స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలగటం లేదు.200709 నుంచి 2020`22 మధ్య కాలంలో ఈ దేశాలతో మన వాణిజ్యలోటు 303శాతం పెరిగింది, మనదేశం దీనిలో చేరితే దిగుమతి పన్నులు సున్నా అవుతాయి, అప్పుడు దిగుమతులు మరింతగా పెరుగుతాయి. అయినప్పటికీ కూటమి బయట ఉండటం కంటే లోపలే ఉండటం మేలని మన కార్పొరేట్‌లు భావిస్తున్నాయి.


అయితే ఆర్‌సిఇపిలో చేరితే కలిగే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయనే వాదనలు గతంలోనే ముందుకు వచ్చాయి. వస్తూత్పత్తిదారులు పోటీని తట్టుకోలేమని వ్యతిరేకిస్తుండగా దిగుమతి వ్యాపారులు లబ్ది పొందవచ్చనే ఆశతో అనుకూలంగా ఉన్నారు.పదేండ్లుగా మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా అంటూ లక్షల కోట్ల మేర సబ్సిడీలు ఇచ్చినా ఉత్పాదకత, ఎగుమతులు పెరగలేదని రెండవ వర్గం చేస్తున్నవాదనకు బలం చేకూరుతోంది. సేవల ఎగుమతికి అవకాశాలు పెరుగుతాయని దాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నారు. మనకంటే ఉత్పాదకశక్తి ఎక్కువగా ఉన్న జపాన్‌, దక్షిణ కొరియా, కొన్ని ఆసియన్‌ దేశాలు ఆర్‌సిఇపిలో చేరిన తరువాత తమదేశ వాణిజ్యలోటు పెరిగిందని గగ్గోలు పెడుతున్నాయి. అలాంటిది మన దేశం చేరితే చైనా,మరికొన్ని దేశాల ఉత్పత్తులను ఇబ్బడి ముబ్బడిగా కుమ్మరిస్తాయనే ఆందోళన కూడా ఉంది.ఇప్పటికే చైనాతో వాణిజ్య లోటు భారీగా ఉందని అది మరింతగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.మోడీ సర్కార్‌ ఏం చేస్తుందో, పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే !

కేంద్ర తుపాను సాయ జాడలేదు ! బిజెపి మరో అన్యాయం !! మచిలీపట్నం రిఫైనరీ ఉత్తర ప్రదేశ్‌లో ఏర్పాటు ?

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


పది రోజులుగా బుడమేరు వరదతో విలవిల్లాడుతున్న విజయవాడ, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాల రైతాంగం కేంద్రం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక సార్లు కేంద్రానికి వివరించారు. అయినా ఇంతవరకు వరద సాయం గురించి ఎలాంటి ప్రకటనలూ లేవు. లెక్కలు డొక్కలు తరువాత చూసుకుందాం ముందుగా కొంత సాయం అందిస్తామన్న భరోసా కూడా వెలువడలేదు.కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ రాకను చంద్రబాబు నాయుడి ఘనతగా కొందరు వర్ణించారు. మంచిదే అంతకంటే కావాల్సిందేముంది ? పర్యటనలు కాదు కదా కావాల్సింది ఫలితాలు. మంత్రిగారు వచ్చారు చూశారు వెళ్లారు తప్ప కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అనేక చోట్ల రైతులు అరటి, పసుపు, వరి, కూరగాయల పంటలను పూర్తిగా నష్టపోయినట్లు శివరాజ్‌ సింగ్‌ విలేకర్లతో చెప్పారు. గత ప్రభుత్వం కేంద్ర ఫసల్‌ బీమా పధకాన్ని వినియోగించుకోలేదని, ప్రీమియం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్లుందని కూడా అన్నారు. విపత్తుల సహాయ నిధి(ఎస్‌డిఆర్‌ఎఫ్‌) రు.3,448 కోట్లు రాష్ట్రం దగ్గర ఉందని తక్షణ సాయం కింద దానిని వినియోగించుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చి వెళ్లారు. కొందరు దీన్నే కేంద్రం ఇచ్చిన సాయంగా వర్ణించటంతో అబ్బే అలాంటిదేం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాల్సి వచ్చింది. ఆ నిధి రాజ్యాంగబద్దంగా రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చేదే, ప్రతి రాష్ట్రానికి కేటాయిస్తారు, తెలంగాణాలో అలాంటి నిధి గురించి కేంద్ర మంత్రులు సెలవిచ్చారు. అది కాదు, కేంద్రం ప్రత్యేకంగా జాతీయ విపత్తుగా పరిగణించి ఇచ్చే మొత్తం సంగతేమిటన్నది ప్రశ్న. ఫసల్‌ బీమా సంగతి తరువాత. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమిక నష్ట అంచనాగా రు.6,880 కోట్లని కేంద్రానికి నివేదించి సాయాన్ని కోరింది. మొత్తం రెండు లక్షల ఇండ్లు మునిగిపోయి దెబ్బతినట్లు అంచనా.ఆదివారం నాటికి మరణించిన వారి సంఖ్య 45కు చేరింది. సోమవారం నుంచి వరద నష్ట అంచనా ప్రారంభం అవుతుందని ఆదివారం నాడు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు.


ఇదిలా ఉండగా మచిలీపట్నంలో ఏర్పాటు కానుందని ఊరించిన చమురుశుద్ది కర్మాగారం వట్టి కబుర్లేనా అన్న అనుమానం కలుగుతోంది. ఒక రిఫైనరీని ఉత్తర ప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు జాతీయ పత్రికలలో వార్తలు వచ్చాయి.‘‘ ఆంధ్రప్రదేశ్‌కు చమురు శుద్ది,పెట్రోకెమికల్‌ కేంద్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సమ్మతి సాధించిన చంద్రబాబు ’’ అనే శీర్షికతో 2024జూలై 11న బిజినెస్‌ వరల్డ్‌ పత్రిక వార్త రాసింది. దాని సారాంశం ఇలా ఉంది.‘‘ అరవైవేల కోట్ల రూపాయలతో చమురుశుద్ది మరియు పెట్రోకెమికల్‌ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించటంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవంతమయ్యారు. దీని సాధ్యాసాధ్యాల గురించి చర్చించేందుకు భారత పెట్రోలియం కార్పొరేషన్‌(బిపిసిఎల్‌) సీనియర్‌ అధికారులతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు.జూలై 23వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌లో చమురుశుద్ధి కేంద్ర ఏర్పాటు ప్రకటన చేయటమే తరువాయి. చంద్రబాబుబిపిసిఎల్‌ అధికారుల సమావేశంలో రిఫైనరీ ఏర్పాటుకు శ్రీకాకుళం, మచిలీపట్నం, రామయపట్నాలలో గల అవకాశాల గురించి పరిశీలించారు. జూలై 23వ తేదీన బడ్జెట్‌లో ప్రకటించేంతవరకు ఎక్కడ అన్నదాన్ని వెల్లడిరచరు. అధికారులు దీని గురించి మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. జూలై 10న చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో ఇలా రాశారు ‘‘ వ్యూహాత్మకంగా దేశంలోని తూర్పు తీరంలో ఉన్న మా రాష్ట్రంలో పెట్రోకెమికల్స్‌కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు నేను భారత పెట్రోలియం కార్పొరేషన్‌ చైర్మన్‌ మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రృష్ణ కుమార్‌ నాయకత్వంలోని ప్రతినిధులను(ఎగువ చిత్రం)కలుసుకున్నాను. అరవై నుంచి డెబ్బయి వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌లో అయిల్‌ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాము.తొంభై రోజులలో సాధ్యా సాధ్యాల నివేదిక కావాలని నేను కోరాను.ఈ ప్రాజెక్టుకు సుమారు ఐదువేల ఎకరాల భూమి కావాల్సి ఉంటుంది.ఎలాంటి తలనొప్పులు లేకుండా దాన్ని సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది ’’ అని పేర్కొన్నారు. ఈ పరిణామం చంద్రబాబు నాయుడికి పెద్ద విజయం ’’ అని ఆ పత్రిక రాసింది. ఇతర పత్రికలు కూడా ఇలాగే రాశాయి. బిపిసిఎల్‌ చమురుశుద్ది కర్మాగారం మచిలీపట్నం రూపురేఖలనే మార్చివేస్తుందని గనులు, ఎక్సయిజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పినట్లు జూలై 14న దక్కన్‌ క్రానికల్‌ పత్రిక రాసింది. ఈ సందర్భంగా కాకినాడ దగ్గర బిపిసిఎల్‌ రిఫైనరీ ఏర్పాటు గురించి కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తమ ప్రాంతంలో అంటే తమ ప్రాంతంలో ఏర్పాటు చేయించేందుకు ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఎంపీలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇద్దరూ జనసేనకు చెందిన వారే గనుక ఎక్కడ వచ్చినా ఆ ఘనత ఆ పార్టీ ఖాతాలోనే పడుతుందని, ఎక్కడో అక్కడ రావటం ముఖ్యమని చెప్పారు. అయితే జూలై 23వ తేదీ, కేంద్ర బడ్జెట్‌ రానూ వచ్చింది, ఆమోదమూ పొందింది. రిఫైనరీ ఏర్పాటు గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఎందుకు చేయలేదో ఏ పార్టీ నేతా ఎక్కడా ప్రస్తావించినట్లు కనపడదు. ఈ లోగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌-పూర్వపు అలహాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు బ్లూమ్‌బెర్గ్‌(మీడియా) వార్త రాసింది.ఓఎన్‌జిసి`బిపిసిఎల్‌ సంయుక్త భాగస్వామ్యంలో 70వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు దాని గురించి బాగా తెలిసిన నలుగురు వ్యక్తులు చెప్పినట్లు అది తెలిపింది. ప్రయాగరాజ్‌లో బిపిసిఎల్‌కు భూమి కూడా ఉన్నట్లు పేర్కొన్నది. ఆ వార్తలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు గురించి కూడా బిపిసిఎల్‌ పరిశీలిస్తున్నట్లు ఆ నలుగురిలో ఇద్దరు చెప్పినట్లు తెలిపింది. ఆ రాష్ట్రం ఇవ్వచూపిన ప్రోత్సాహకాలు, ఏర్పాటు అవకాశాల గురించి సలహా ఇచ్చేందుకు అమెరికాలోని ఒక కంపెనీని కూడా బిపిసిఎల్‌ నియమించినట్లు కూడా బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొన్నది.ఇ మెయిల్స్‌ ద్వారా ఓఎన్‌జిసి, బిపిసిఎల్‌ ప్రతినిధుల స్పందన కోరగా వారి నుంచి వెంటనే ఏమీ రాలేదని పేర్కొన్నది.


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. ఎన్‌డిఏ కూటమికి ఘనవిజయం లభించింది. ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి 2019లో 80కి గాను తెచ్చుకున్న 64 సీట్లలో 2024లో 30 సీట్లు, పదిశాతం ఓట్లూ పోగొట్టుకుంది. చివరికి ఆయోధ్యలో ఓడిపోయింది, వారణాసిలో నరేంద్రమోడీ మెజారిటీ గణనీయంగా తగ్గింది. మోడీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇప్పటికే పరువు పోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యోగి నాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుందనే వాతావరణం ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. బహుశా ఈ కారణంగానే ఉత్తర ప్రదేశ్‌లో రిఫైనరీ నెలకొల్పాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకే కంపెనీ అంత భారీ మొత్తాల పెట్టుబడితో రెండు చోట్ల రిఫైనరీలను పెట్టే అవకాశం ఉందా ? నరేంద్రమోడీ, బిజెపికి లోక్‌సభలో ఏడోవంతు సీట్లున్న ఉత్తర ప్రదేశ్‌ను నిలుపుకోవటం ముఖ్యం అన్నది తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఎంత చేసినా తెలుగుదేశానికి తోక పార్టీగా ఉండటం తప్ప ఇప్పటికిప్పుడు స్వంతంగా ఎదిగే అవకాశాలు లేవన్నది స్పష్టం.రిఫైనరీ గురించి ఇంకా అంతిమ నిర్ణయం జరగలేదు గనుక చంద్రబాబు వెంటనే అప్రమత్తమై రాష్ట్రానికి తీసుకువస్తారా ? తన పలుకుబడిని వినియోగిస్తారా ? పెద్ద పరీక్షే మరి !