రైతుల పంపుసెట్లకు మీటర్ల ఒప్పందం నిజమేనా : బిజెపి మద్దతు ! వ్యతిరేకించిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ రద్దు చేస్తాయా ?

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


విద్యుత్‌ వినియోగదారులందరికీ స్మార్ట్‌ మీటర్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత రెడ్డి చేసిన ప్రకటన, సభకు చూపిన పత్రాలు వివాదాస్పదమయ్యాయి.తాము వ్యవసాయ పంపుసెట్లకు తప్ప మిగిలిన వాటికి మాత్రమే స్మార్టు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకున్నామని, ఆ విషయాన్ని దాచి తమపై అవాస్తవాలు చెప్పారని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెడుతున్నారు. పంపిణీ ట్రాన్స్‌ఫర్లకు మీటర్లు పెడతామని అంగీకరించారని, రైతులకు కూడా అక్కడి నుంచే సరఫరా జరుగుతుంది గనుక వ్యవసాయ సరఫరాకూ మీటర్లు పెట్టేందుకు సమ్మతించినట్లే కదా అని కాంగ్రెస్‌ చెబుతోంది. ఒప్పంద పత్రాలను జనాలకు అందుబాటులో ఉంచితే నిజానిజాలేమిటో అందరికీ సుబోధకం అవుతుంది.2017లో కుదుర్చుకున్న ఒప్పందంలో ఏమి ఉంది అన్నది పక్కన పెడితే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల పంపుసెట్లకు మీటర్లు పెట్టలేదన్నది వాస్తవం. అందువలన నిజంగా వ్యవసాయ పంపుసెట్లకు తప్ప అనే పదం ఒప్పందంలో ఉందా లేదా అన్నది ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది.


ఇప్పటికే విద్యుత్‌ మీటర్లు ఉన్నాయి కదా స్మార్ట్‌ మీటర్లంటే ఏమిటని ఎవరికైనా సందేహం రావచ్చు.ప్రయివేటీకరించే రంగాలలో విద్యుత్‌ పంపిణీ కూడా ఒకటి. సెల్‌ఫోన్లకు రెండు పథకాలు ఉన్నాయి. ఒకటి ముందుగానే డబ్బు చెల్లించేది, రెండవది తరువాత బిల్లు కట్టేది. విద్యుత్‌ రంగంలో స్మార్టు మీటర్లు అంటే ముందుగా సొమ్ము చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేయాలి. ఆ మేరకు వినియోగించగానే సరఫరా ఆగిపోతుంది. వాడకం తరువాత బిల్లు చెల్లించే పథకాలనూ పెట్టవచ్చు. అసలు ఈ విధానం ఎందుకు, చెప్పిన కారణాలేమిటి ? వినియోగించే ప్రతి యూనిట్‌కూ లెక్కతేలాలని, మీటర్లు లేకుండా వినియోగించేవారిని నిరోధించేందుకు, ఖర్చు మొత్తం వినియోగదారుల నుంచి రాబట్టేందుకు అని చెప్పారు. ప్రయివేటీకరించిన తరువాత కొనుగోలు చేసిన కార్పొరేట్‌ సంస్థకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం ఒకటైతే, ముందుగానే చెల్లించే జనం సొమ్ముతో పెట్టుబడి పెద్దగా లేకుండా సదరు సంస్థలకు లాభాలు అప్పగించే మహత్తర ఆలోచన దీనివెనుక ఉంది. వినియోగదారులు చెల్లించే మొత్తాలనే జన్‌కోలకు చెల్లిస్తారు. ఇతర ఖర్చులకూ వినియోగిస్తారు.ప్రస్తుతం రైతాంగానికి కొన్ని రాష్ట్రాలలో ఉచితంగా అందచేస్తున్నారు, కొందరికి సబ్సిడీలు ఇస్తున్నారు. స్మార్టు మీటర్లు పెడితే అందరూ ముందుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయాలి. ఎలా అంటే గతంలో వంటగ్యాస్‌కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించి చెల్లిస్తే సిలిండర్లు ఇచ్చేవారు. ఇటీవల దాన్ని మార్చి ముందుగా మొత్తం చెల్లించేట్లు చేశారు. తరువాత సబ్సిడీ మొత్తం వారి బాంకు ఖాతాలలో జమ చేస్తున్నారు. విద్యుత్‌కూ అంతే చేయనున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తే వినియోగదారులకు బదలాయిస్తారు. చేతులేత్తేసినా చేసేదేమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు పంపిణీ సంస్థలకు సబ్సిడీ సొమ్మును నెలల తరబడి చెల్లించటం లేదు, ప్రభుత్వ శాఖలు బిల్లులు చెల్లించకుండానే వాడుతున్నాయి. దీంతో పంపిణీ సంస్థ(డిస్కామ్‌లు)లు అప్పుల పాలవుతున్నాయి.ప్రైవేటీకరిస్తే వాటిని కొనుగోలు చేసే సంస్థలు ముందుకు రావు. అందుకే రుణాలు లేకుండా చూసేందుకు విధానపరంగా ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.


దానిలో భాగంగానే నరేంద్రమోడీ సర్కార్‌ అధికారంలోకి రాగానే 2015లో ఉజ్వల డిస్కామ్‌ అస్యూరెన్సు యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది.దీని పొట్టి రూపమే ”ఉదరు”. తొలుత ప్రకటించినదాని ప్రకారం 2018-19 నాటికి విద్యుత్‌ ప్రసార నష్టాలను 22 నుంచి 15శాతానికి తగ్గించాలి.విద్యుత్‌ కొనుగోలు,సరఫరా, ప్రసారానికి అయ్యే ఖర్చును పూర్తిగా వినియోగదారుల నుంచి రాబట్టాలి. ఇందుకు గాను స్మార్ట్‌ మీటర్లను విధిగా పెట్టించి నిర్వహణా సామర్ధ్యాన్ని మెరుగుపరచాలి. పొదుపు చర్యల్లో భాగంగా ఎల్‌ఇడి బల్బులను ప్రోత్సహించాలి, ఇదే మాదిరి వ్యవసాయ పంపుసెట్లు, ఫ్యాన్లు, ఎయిర్‌ కండీషనర్లను ప్రోత్సహించాలి. విద్యుత్‌ ఖర్చు, వడ్డీ భారాన్ని, నష్టాలను తగ్గించాలి.సరసమైన ధరలకు విద్యుత్‌ను అందించాలి. ఇలాంటి చర్యలను చేపట్టిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందించాలి.ఇది ఘోరంగా విఫలం కావటంతో తొలుత ప్రకటించిన లక్ష్యాలను కొన్నింటిని 2021జూన్‌లో సవరించారు. వాటి ప్రకారం ప్రైవేటు రంగంలో ఉన్న పంపిణీ సంస్థలు తప్ప ప్రభుత్వ రంగంలో ఉన్నవాటి ఆర్థిక, నిర్వహణ సామర్ధ్యాన్ని పెంచాలి.మౌలిక సదుపాయాల పటిష్టతకు ఆర్థిక సాయం చేసేందుకు కొన్ని షరతులను విధించాలి.ప్రసార నష్టాలను 2024-25నాటికి 12-15శాతానికి తగ్గించాలి. సరఫరా ఖర్చును పూర్తిగా వినియోగదారుల నుంచి వసూలు చేయాలి, ఆధునిక పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.పైన చెప్పుకున్న స్మార్ట్‌ మీటర్ల కథ ఈ పధకంలో భాగమే. ఆంధ్రప్రదేశ్‌లో అందిన కాడికి అప్పులు చేసిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సర్కార్‌ వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెట్టేందుకు అంగీకరించి ఎఫ్‌ఆర్‌బిఎం అర్హతకు మించి అదనంగా 0.5 అప్పులు తెచ్చుకొనే ” ప్రోత్సాహాన్ని ” పొందింది. తెలంగాణాలో విద్యుత్‌ మోటార్లు ఎక్కువగా ఉన్నందున అంగీకరిస్తే రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తుంది గనుక బిఆర్‌ఎస్‌ సర్కార్‌ వాటి జోలికి పోకుండా పంపిణీ ట్రాన్సఫార్మర్లకు మీటర్లు పెట్టి లెక్క తేలుస్తామని, ఇతర వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకుంది.


రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు, పార్టీలు అధికారంలోకి వచ్చాయి. స్మార్టు మీటర్లను రెండచోట్లా బిజెపి సమర్ధించింది, ఇప్పటికీ సమర్ధిస్తున్నది. ఈ విషయంలో బిఆర్‌ఎస్‌, వైసిపి విధానాలకు మద్దతు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం వ్యతిరేకించింది. ఇప్పుడు అదే బిజెపితో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసిపి తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తామని గానీ, కొనసాగిస్తామనీ ఇంతవరకు స్పష్టం చేయలేదు.తెలంగాణాలో వ్యతిరేకించిన కాంగ్రెస్‌దీ ఇప్పుడు అదే పరిస్థితి. అమలు చేయకపోతే పంపిణీ సంస్థలపై కేంద్రం చర్యలు తీసుకోవచ్చని చెబుతోంది తప్ప, స్మార్టు మీటర్లు పెట్టేదీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఏం చేస్తారో చూడాలి.మరోవైపు విద్యుత్‌ సంస్కరణలను అమలు జరిపి తీరుతామని బిజెపి గట్టిగా చెబుతోంది. పంపిణీ సంస్థలు అప్పుల్లో కూరుకుపోవటం గురించి రాజకీయపరమైన దాడి చేస్తున్నది. అనేక రాష్ట్రాలలో అంగీకరించినందున రెండు తెలుగు రాష్ట్రాలలో ఎందుకు వ్యతిరేకించాలని బిజెపి అంటున్నది. ఇది అసంబద్ద వాదన. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అధారిటీ (సిఇఏ) కేంద్ర ప్రభుత్వ సంస్థ, దాని నివేదిక 2023 ప్రకారం 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక,తెలంగాణా, పంజాబ్‌ రాష్ట్రాలు మాత్రమే రైతాంగానికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నాయి. మీటర్లు లేకుండా పంపుసెట్ల సామర్ధ్యాన్ని బట్టి మరో ఎనిమిది రాష్ట్రాలు రేట్లు నిర్ణయించాయి. ఒక హార్స్‌ పవర్‌కు బీహార్‌లో నెలకు రు.800, గుజరాత్‌లో రు.200, హర్యానాలో పదిహేను హెచ్‌పి వరకు రు.12, అంతకు మించితే రు.15, కాశ్మీరులో పది హెచ్‌పి వరకు రు.205, 11 నుంచి 20కి రు.222, ఇరవై మించితే రు.1,415, మహారాష్ట్రలో జోన్లు, హార్స్‌పవర్‌ ప్రాతిపదికన గరిష్టంగా రు.422 నుంచి కనిష్టంగా రు.265వరకు, పంజాబ్‌లో ప్రభుత్వ సబ్సిడీ లేని పంపుసెట్లకు రు.419, రాజస్తాన్‌లో రు.775, 955 చొప్పున రెండు తరగతులుగా, ఉత్తర ప్రదేశ్‌లో రైతాంగానికి రు.170( లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం దీన్ని రద్దు చేశారు, రు.1,500 కోట్లు సబ్సిడికి కేటాయించినట్లు ప్రకటించారు.), ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ నిర్వహణలో ఉన్న పంపుసెట్లకు 100 హెచ్‌పివరకు రు.3,300 వసూలు చేస్తున్నారు. అందువలన ఈ రాష్ట్రాలలో మీటర్లు పెట్టినందున రైతులకు జరిగే నష్టం లేదు, ఎలాగూ సొమ్ము చెల్లిస్తున్నారు. అందువలన అవి అంగీకరించాయంటే వేరు, ఉచితంగా ఇచ్చే వాటి సమస్య వేరు. అయితే మీటర్లు పెట్టి ఇప్పుడు చెల్లిస్తున్నదానికంటే అదనపు భారం మోపితే వచ్చే వ్యతిరేకతను అక్కడి పార్టీలు అనుభవించాల్సి ఉంటుంది.


ఇక పంపిణీ సంస్థల నిర్వహణ ఇతర పార్టీల ఏలుబడి ఉన్న చోట కంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏమైనా మెరుగ్గా ఉందా ?బిజెపి వారు తెలంగాణాలో తరచూ హైదరాబాదు పాత బస్తీలో విద్యుత్‌ చౌర్యం గురించి చెబుతూ ఉంటారు. అక్కడ ఉన్నవారిలో ఒక్క ముస్లింలే విద్యుత్‌ను అక్రమంగా వాడుతున్నట్లు ? హిందువులుగా ఉన్నవారు దేశం కోసం ధర్మం కోసం నిజాయితీగా ఉన్నట్లు చిత్రిస్తున్నారు.అవకాశం ఉంటే చౌర్యంలో ఎవరూ తక్కువ కాదు, వివిధ సందర్భాలలో లైన్ల మీద కొక్కేలు వేసేవారందరూ చోరులే. ఇతర చోట్ల, ఇతర రాష్ట్రాలలో ఇలాంటి ఆక్రమాలు, మీటర్లు తిరగకుండా చేస్తున్నవారు లేరా ? స్వయంగా ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌ను చూద్దాం. హైదరాబాద్‌ పాతబస్తీలో విద్యుత్‌ చౌర్యం జరుగుతోందని బిజెపి ఆరోపిస్తున్న, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న తెలంగాణాలో డిస్కామ్‌ల రుణం రు.62వేల కోట్లు దాటింది. ఉత్తర ప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడేవారి మీద ప్రయోగానికి అక్కడ యోగి బుల్డోజర్లు సిద్దంగా ఉంటాయి, రెండింజన్ల పాలన. రెండు దశల్లో ఉదరు పథకాన్ని అమలు జరిపిన తరువాత చూస్తే పంపిణీ సంస్థల నష్టాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి తప్ప మరొకటి కాదు.జూలై నెలలో పదహారవ ఆర్థిక సంఘానికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సమర్పించిన పత్రంలో 2022-23సంవత్సరం నాటికే దేశంలో అన్ని పంపిణీ సంస్థలకు పేరుకు పోయిన నష్టాల మొత్తం రు.6.77లక్షల కోట్లు, వీటిలో సమర్దవంతమైన పాలన సాగిస్తున్నట్లు చెబుతున్న యోగి ఏలుబడిలో ఉత్తర ప్రదేశ్‌ వాటా పదిహేనుశాతం అంటే లక్ష కోట్లు దాటింది, ఈ నష్టాలు సగటున ఏటా పదిశాతం పెరుగుతున్నట్లు చెబుతున్నందున మరుసటి ఏడాదిలో మరో పదివేల కోట్లు అదనం, రాజస్తాన్‌ వాటా కూడా పదిహేనుశాతం, మరోబిజెపి పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో పదిశాతం నష్టాలు ఉన్నాయి.తెలంగాణాలో కూడా పదిశాతం ఉన్నాయి. వినియోగదారుల మీద భారాలు మోపటానికి బదులు గడచిన పదేండ్లుగా విద్యుత్‌ ప్రసార నష్టాలను తగ్గించేందుకు కేంద్రం పూనుకొని ఉంటే ఎంతో మేలు జరిగేది. మోడీ సర్కార్‌ దాని మీద కేంద్రీకరించి ఉంటే ఈ పాటికి ఎంతో మేలు జరిగి ఉండేది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న 2014 వివరాల ప్రకారం మనదేశంలో ఆ నష్టాలు 19.33శాతం ఉంటే బంగ్లాదేశ్‌లో 11.4, శ్రీలంకలో 11 పాకిస్తాన్‌లో 17.14 శాతం ఉండగా చైనాలో 5.47శాతం ఉంది.ప్రపంచంలోని 138దేశాల సూచికలో మనం 25వ స్థానంలో ఉండగా చైనా 119వదిగా ఉంది. అందువలన ఈ విఫల పధకం గురించి కాంగ్రెస్‌-బిఆర్‌ఎస్‌ దెబ్బలాడుకుంటే ప్రయోజనం లేదు.వినియోగదారుల మీద భారాలు మోపటాన్ని సమర్ధిస్తున్న బిజెపిని ఎండగడుతూ విధానాన్ని వ్యతిరేకించేందుకు పూనుకోవాలి !

పోలవరంలో మునిగి తేలుతున్న చంద్రబాబు : బీహార్‌కు అధిక కేటాయింపుల వెనుక అసలు కథేంటి ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికార యంత్రాంగం సహకరించటం లేదా ? ఆర్థిక ఇబ్బందుల ఆత్రంతో చేయాల్సింది చేయటం లేదా ? రాజకీయంగా నరేంద్రమోడీ చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నారా ? మొత్తం మీద ఏదో జరుగుతోంది. నీతి ఆయోగ్‌ సమావేశాలకు వెళ్లిన సందర్భంగా మరోసారి సిఎం కేంద్ర మంత్రులను కలుస్తారని చెబుతున్నారు. బడ్జెట్‌ పెట్టక ముందు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పర్యటన జరిపి అనేక అంశాలను కేంద్రానికి నివేదించారు. ఎన్నికలకు ముందు బిజెపి పెద్దలు చెప్పింది ఒకటి తరువాత చేస్తున్నది ఒకటి అన్న సంగతి అమరావతికి అప్పు ఇప్పిస్తామనటంలోనే వెల్లడైంది. బయటకు చెప్పుకోలేక చంద్రబాబు అదియును మంచిదే అన్నారు. దేవుడు నైవేద్యం తినడని పూజారికి మాత్రమే తెలుసు. కేంద్రం ఇచ్చేదేమిటో చంద్రబాబుకు ముందే తెలుసు గనుకనే వచ్చేదేమీ ఉండదని బడ్జెట్‌ను రెండునెలలు వాయిదా వేసుకున్నారు. బడ్జెట్‌ కేటాయింపులు చూసిన తరువాత అది వాస్తవమని తేలింది. అసలేమీలేని దానికంటే పదే పదే రాష్ట్రం పేరును ప్రస్తావించటాన్ని చూసి కడుపు నింపుకున్న వారు కొందరు ఉన్నారు. అమరావతికి గ్రాంటు బదులు అప్పు ఇప్పిస్తామంటే పండగ చేసుకున్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామంటే ఆహా ఓహౌ అన్నారు. కానీ ఆకస్మికంగా ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు పోలవరం గురించి చర్చించి ఒక తీర్మానాన్ని ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. బడ్జెట్‌కు ముందు జరిగిన కాబినెట్‌లో ఆ తీర్మానాన్ని ఎందుకు చేయలేదు ? దాని అవసరం గురించి అధికార యంత్రాంగం తప్పుదారి పట్టించిందా ? ఇంతకూ ఏమిటా తీర్మానం ?


పోలవరం ప్రాజక్టు డయాఫ్రం వాల్‌ 2020వరదల్లో దెబ్బతిన్నది. ఏది జరిగినా అందుకయ్యే ఖర్చును భరించాల్సింది కేంద్రమే. దేవుడు చేసిన దానికి మా బాధ్యత లేదంటే కుదరదు. అది జాతీయ ప్రాజెక్టు, ఖర్చంతా భరించేందుకు ఎప్పుడో అంగీకరించారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలని జూలై మూడున నిపుణుల సమక్షంలో కేంద్ర జలసంఘం చైర్మన్‌ కుశ్చిందర్‌ ఓహ్రా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దానికి అవసరమైన నిధులు ఇవ్వటమే తరువాయి, అంచనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే తన నిపుణులను పంపవచ్చు లేదా రాష్ట్రం పంపిన వాటిని పరిశీలించి ఆమోదముద్ర వేయవచ్చు. డిపిఆర్‌లో లేని కొత్త అంశమైతే అర్ధం చేసుకోవచ్చు, అలాకానపుడు ముద్ద ముద్దకు గోవిందా గోవిందా లేదా బిస్మిల్లా బిస్మిల్లా అనాల్సిన అవసరం ఏమిటి ? దీనికి గాను ఆకస్మికంగా మంత్రి వర్గ సమావేశం, తీర్మానంతో పనేమిటి ? కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి రు.900 కోట్లు కేటాయించాలని, తొలిదశ సవరించిన అంచనా రు.30,437 కోట్లకు గాను ఇంకా రు.12,157 కోట్లు రావాల్సి ఉందని, ఆ మొత్తాన్ని ముందుస్తుగా మంజూరు చేయాలని మంత్రివర్గ తీర్మానంలో పేర్కొన్నారు. సాంకేతికంగా అలాంటి తీర్మానం అవసరం అయితే బడ్జెట్‌కు ముందే కేంద్రానికి పంపివుంటే నిర్మలా సీతారామన్‌ కేటాయించి ఉండేవారు కదా ! ఎందుకు పంపలేదు ? అధికార యంత్రాంగానికి తెలియదా ? ఇప్పుడు బడ్జెట్‌ను సవరించి కేటాయిస్తారా ? లోగుట్టు పెరుమాళ్లకెరుక !


తమ ప్రభుత్వ హయాంలోనే డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరినా అనుమతి రానందున తామేమీ చేయలేకపోయినట్లు వైసిపి నేతలు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చర్చల్లో చెప్పారు. అంతకు ముందు కేంద్ర నిర్వాకాన్ని గురించి జగన్‌ మోహనరెడ్డి లేదా పార్టీ పెద్దలు ఎవరూ ఎక్కడా చెప్పిన, లేదా అనుమతికి కేంద్రం మీద వత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. గురువారం నాడు రాష్ట్రమంత్రి వర్గం ఆకస్మిక సమావేశం జరిపి తీర్మానం చేసిన వార్తతో పాటు శుక్రవారం నాడు సాక్షి పత్రిక కొన్ని విషయాలను ప్రస్తావించింది. దాని కథనం ప్రకారం ” దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేస్తామని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన ప్రతిపాదన మేరకు 2022 మార్చి నాలుగవ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించాలని అప్పట్లోనే ప్రతిపాదించారు.వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి మేరకు తొలిదశ పూర్తి చేయడానికి రు.10,911 కోట్లు, డయాఫ్రం వాల్‌ పునరుద్దరణ, మరమ్మతులకు రు.2వేల కోట్లు వెరసి రు.12,911 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్‌ ఐదున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నోట్‌ జారీచేశారు. ఆ నిధులు విడుదల చేయాలంటే కేంద్ర కాబినెట్‌ ఆమోదం తప్పనిసరి. ఎందుకంటే 2016 సెప్టెంబరు ఆరున పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకొనే క్రమంలో 2013-14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తానని చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 2014 ఏప్రిల్‌ ఒకటి నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయం అంటే రు.15,667.90 కోట్లు ఇవ్వాలని 2017 మార్చి 15న కేంద్రకాబినెట్‌నిర్ణయించింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రు.15,146.28 కోట్లు విడుదల చేసింది.దీనికి తోడు రు.12,157.52 కోట్లు విడుదల చేయాలంటే 2017 మార్చి 15న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర కాబినెట్‌ మారుస్తూ తీర్మానం చేయాలి. ఈ మేరకు కేంద్రజలశక్తి శాఖ ఈ ఏడాది మార్చి ఆరున కేంద్ర కాబినెట్‌కు ప్రతిపాదన పంపింది.”


అయితే అప్పటికే ఎన్‌డిఏలో చేరిన టిడిపి అధినేత చంద్రబాబు ఆ నిధులు ఇస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వ పెద్దల చెవుల్లో ఊదారని, దాంతో కేంద్రం పక్కన పెట్టిందని కూడా సాక్షి కథనం ఆరోపించింది. రు.30,436.95 కోట్లకు ఆమోదం తెలిపిన అంశాన్ని చంద్రబాబు కాబినెట్‌ సమావేశం గుర్తు చేసిందని ఆంధ్రజ్యోతి వార్తలో పేర్కొన్నారు. అదే నిజమైతే మిగిలిన మొత్తం రు.12,157కోట్లు విడుదల చేయాలంటూ ఆకస్మికంగా రాష్ట్ర కాబినెట్‌ తీర్మానించాల్సిన అవసరం ఏమిటి అన్నది ప్రశ్న. దీనిపై కేంద్ర ప్రభుత్వం అదే మాదిరి చంద్రబాబు నాయుడు కూడా వాస్తవాలేమిటో జనానికి వెల్లడించాలి. తాజాగా పోలవరంపై విడుదల చేసి శ్వేత పత్రంలో సవరించిన ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం ఆమోదించినట్లు చెప్పలేదు. 2013-14 సంవత్సర సిఫార్సులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.ఇక 2017-18 సంవత్సరాల సవరించిన అంచనాలను 2019 ఫిబ్రవరి 11న చంద్రబాబు నాయుడు సిఎంగా ఉండగానే టెక్నికల్‌ అసిస్టెన్స్‌ కమిటీ రు.55,657 కోట్లకు ఆమోదం తెలిపింది. దానికి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఒకవేళ రు.30వేల కోట్లకు ఆమోదం తెలిపితే విడుదల కోసం ప్రత్యేకంగా తీర్మానంతో పనిలేదు. తరువాత పెరిగిన ధరల ఖర్చు సంగతేమిటి ? నీతి అయోగ్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని చెబుతున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు చేసేది ఉంటుందా ? ప్రతిపాదనలను సవరించేందుకు కేంద్రం అంగీకరిస్తుందా ? అదే జరిగితే మిగతా రాష్ట్రాలు చేస్తున్న వత్తిడి మరింత పెరగదా ? చూద్దాం ఏం జరుగుతుందో !


కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అప్పు ఇప్పిస్తామని చెప్పి బీహార్‌కు పెద్ద మొత్తంలో పథకాలకు నిధులు ఇస్తామని ప్రకటించింది. ఎందుకిలా చేసింది ? ఏమిటీ వివక్ష ? ఆ రాష్ట్రానికి మొత్తం 62వేల కోట్ల రూపాయల విలువగల పథకాలను ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. వీటిలో రోడ్లు, వంతెనలకు రు.26వేల కోట్లు, 2,400 మెగావాట్ల నూతన విద్యుత్‌ కేంద్రంతో సహా విద్యుత్‌ ప్రాజెక్టులకు రు.21,400 కోట్లు, వరదల నిరోధంతో సహా సాగునీటి పథకాలకు రు.11,500 కోట్లు, ఇవిగాక మెడికల్‌ కాలేజీలు, విమానాశ్రయాలు, క్రీడలకు మౌలిక సదుపాయాలు, దేవాలయాల టూరిజం పాకేజ్‌లు ఉన్నాయి. వీటిని బీహార్‌కు ఇచ్చినందుకు ఎవరూ తప్పుపట్టటం లేదు. అయితే ఒక్కసారిగా ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారన్నది ప్రశ్న. బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి-జెడియు కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది సీట్లతో పాటు దాదాపు తొమ్మిదిశాతం ఓట్లను కూడా కోల్పోయింది. నరేంద్రమోడీకి ఎదురులేదని భావించిన నితీష్‌ కుమార్‌ అంచనా తప్పింది, బిజెపి స్వంతంగా మెజారిటీని సాధించలేకపోయింది. మోడీ, బిజెపి బలహీనత వెల్లడైనందున దాని ప్రభావం వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడుతుంది. పలుకుబడి ఇంకా దిగజారక ముందే జాగ్రత్త పడేందుకు ముందస్తు ఎన్నికలకు పోయినా ఆశ్చర్యం లేదు. ఈ కేటాయింపులను చూస్తే ఈ ఏడాది మహారాష్ట్ర, హర్యానాలతో కలిపి జరుపుతారా అన్న అనుమానం కలుగుతోంది. ఈ రాష్ట్రాలలో కూడా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు తగిలాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగితే బీహార్‌ను వదులు కోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో తిరిగి తనకే సిఎం కుర్చీ కావాలని అడిగే అవకాశాలు నితీష్‌కుమార్‌కు సన్నగిల్లుతున్నాయి. లోక్‌సభ ఓటింగ్‌ వివరాల ప్రకారం ఆర్‌జెడి తరువాత బీహార్‌లో బిజెపి పెద్ద పార్టీ, అది అక్కడ నిలవాలంటే జెడియు నితీష్‌ కుమార్‌ అవసరం ఉంది.

అదే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మీద బిజెపి ఆధారపడాల్సి ఉంది. అక్కడ పెద్ద పార్టీగా ఎదిగే అవకాశాలు లేవు. అందువలన నితీష్‌ కుమార్‌ కంటే తన స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు బిజెపి బీహార్‌ మీద వరాల వాన కురిపించింది.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి, ఎక్కువ సాయం చేస్తే అది తెలుగుదేశం, జనసేనకే రాజకీయ లబ్దితప్ప బిజెపికి పెద్దగా ఒరిగేదేమీ లేదు. తెలుగుదేశం పార్టీ తాను తప్ప మరొక పార్టీని ఎదగనివ్వదు. అయినా ఇంకా ఐదు సంవత్సరాల వరకు జనంతో సంబంధం ఉండదు, అడిగేవారు ఎవరూ ఉండరు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలు గనుక నోటికి తాళం వేసుకుంటాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తమకే అధికారం కట్టబెట్టాలని అడగాలంటే తెలుగుదేశం బలపడకూడదు.దానికి తోకగా ఎంతకాలం ఉండాలి. అప్పులు ఇప్పిస్తామనటం అంటే పొమ్మనకుండా పొగపెట్టటమే. పోలవరానికి పెరిగిన అంచనాను ఆలశ్యం చేస్తే అది పూర్తిగాక విమర్శలను ఎదుర్కోవాల్సింది చంద్రబాబే. బహుశా ఈ తర్కంతో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీసేందుకు కూడా వెనకాడటం లేదా ? ఏమో దేన్నీ కాదనలేం !!

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు : అమరావతి రుణం, కేంద్ర సాయంపై శ్వేతపత్రం ప్రకటిస్తారా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో లేదా ఇతర చోట్ల ఏ ఇద్దరు తెలుగు వారు కలిసినా, రచ్చబండల మీద జరిగిన,కానసాగుతున్న చర్చ ఒక్కటే. అది రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం గురించే, ప్రత్యేకించి రాజధాని అమరావతి పట్టణ అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన పదిహేనువేల కోట్ల రూపాయలు రుణమా లేక దానమా (ఆంగ్లంలో గ్రాంట్‌ అంటే తెలుగులో దానం ) అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కొన్ని మీడియా సంస్థల వార్తల్లో, చర్చల సందర్భంగా తెలుగుదేశం నాయకత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రతినిధులు దానమే అంటే, కొందరైతే మరొక అడుగు ముందుకు వేసి ఐదేండ్లపాటు ఏటా పదిహేనువేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినందున పండగ చేసుకోవాలని చెప్పారు.కాదన్నవారి మీద మండిపడ్డారు. కొందరైతే విదేశీ సాయంతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే ప్రాజెక్టుల ఖర్చులో కేంద్రం 90శాతం భరిస్తుందని, కేవలం పదిశాతమే రాష్ట్రం పెట్టుకోవాలని చెప్పారు. అంటే పదమూడున్నరవేల కోట్లు కేంద్రమే భరిస్తుందని, పదిహేను వందల కోట్లు రాష్ట్రం పెట్టుకోవాలన్నది వారి వాదన. అదే నిజమనుకున్నా రాష్ట్రానికి కొంత మేలే. రాష్ట్రం కోరుతున్నది తన మీద భారం మోపని సాయం. కేంద్ర మంత్రి చెప్పిన పదాలకు అర్ధం రుణం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఉన్న రెండు ఇంజన్ల డ్రైవర్లు ఏది నిజమో చెబితే జనం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సినపని లేదు.చెప్పటానికి సిద్దంగా ఉన్నారా ?


దీని గురించి స్పష్టంగా చెప్పకుండా చంద్రబాబు నాయుడు తన పరువును, నరేంద్రమోడీ పరువును కాపాడేందుకు పూనుకున్నారు. గతంలో కేంద్రం ప్రత్యేక హౌదా బదులు పాకేజ్‌ ఇస్తామంటే అదే గొప్పదని చెప్పారు. బిజెపితో బంధం తెగిన తరువాత మాట మార్చారు. ఇప్పుడు ఎలాగైతేనేం డబ్బులు వస్తున్నాయిగా అంటున్నారు.తరువాత ఏమంటారో భవిష్యత్‌కే వదలివేద్దాం.తనదైన శైలిలో చెప్పిందేమిటి ? ” నిధులు ఎక్కడి నుంచి ఎలా వస్తేనేం రాష్ట్రం అభివృద్ది చెందుతుంది.కేంద్రం ముందు ఆంధ్రప్రదేశ్‌ ఉంచిన ప్రతిపాదనల్లో అత్యధికాన్ని ఆమోదించింది. రాజధానికి వచ్చే నిధులతో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి, దీంతో పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. వాగ్దానం చేసిన నిధులతో రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభమౌతుంది.విదేశీ సంస్థల నుంచి రుణాల రూపంలో వచ్చినప్పటికీ వాటిని 20-30 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వివిధ సంస్థల నుంచి వచ్చే రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. రాజధాని సహాయ రూపంలో కొన్ని కేంద్ర గ్రాంటులు వస్తాయి.వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ ఖండ్‌ తరహా సాయం వచ్చే అవకాశం ఉంది.ఈ పాకేజ్‌లో పారిశ్రామిక సబ్సిడీలు కూడా ఉంటాయి.” అన్నారు చంద్రబాబు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తరువాత విలేకర్లతో నిర్మలా సీతారామన్‌ మాట్లాడిన అంశాలు గందరగోళంగా ఉన్నాయి. ” రాజధాని నిర్మాణానికి ఈ ఏడాదే ప్రపంచ బాంకు నుంచి 15వేల కోట్ల రుణం తీసుకుంటాం.ఇందులో రాష్ట్రం వాటాను కూడా భరించాలి.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం తన వాటాను చెల్లించగలదా లేదా కేంద్రమే గ్రాంటు ఇస్తుందా అన్న విషయాలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం ” అని నిర్మలమ్మ చెప్పారు. ప్రపంచబ్యాంకు నుంచి కేంద్రం రుణం తీసుకుంటే దానిలో రాష్ట్రం భరించాల్సిదేమిటి ? ఇచ్చేది రాష్ట్రానికే అయినపుడు రాష్ట్ర వాటా ఏమిటి ? దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


ప్రపంచ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రాజెక్టుల రుణాలు తీసుకోవటం కొత్తేమీ కాదు. అవి రాష్ట్రాల్లో అమలు జరిగినా కేంద్రం హామీ ఇవ్వాల్సి ఉంటుంది.నేరుగా రాష్ట్రాలు తీసుకొనేందుకు వీలులేదు. అలా ఇచ్చే రుణాలలో కొన్నింటిలో కొంత గ్రాంటు కూడా వుంటుంది. బాటా కంపెనీ చెప్పుల ధరలు, వెయ్యో, రెండువేలో కాకుండా రు.999, 1,999 మాదిరి ఉంటాయి. వినియోగదారుని మానసిక స్థితిని సొమ్ముచేసుకొనే వాణిజ్య చిట్కా ఇది. అలాగే అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రుణాలకు అనేక షరతులు ఉంటాయి. వాటికి వ్యతిరేకత తలెత్తకుండా ఉండేందుకు అవిచ్చే రుణాల్లో కొంత భాగాన్ని గ్రాంటుగా ఇస్తాయి. చేదు మాత్రను మింగించేందుకు వాటికి పంచదార పూత పూయటం వంటిదే ఇది. రుణ షరతులను వ్యతిరేకించేవారి నోరు మూయించేందుకు గ్రాంటు భాగాన్ని జనానికి చూపుతారు. అమరావతి స్వయం పోషక నగరమని, దాని నిధులతోనే నిర్మాణం జరుపుతామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆర్థిక మంత్రి విదేశీ సంస్థల నుంచి అప్పుతీసుకుంటామంటున్నారు. ఒక వేళ అదే వాస్తవం అనుకుంటే ఆ అప్పును ఎవరు తీర్చాలి ? కేంద్రం అంటే దేశం మొత్తం కదా ! ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చేసే అప్పును దేశం మొత్తం ఎందుకు భరించాలి ? మా రాజధానులను కూడా నవీకరిస్తాం, ప్రపంచ స్థాయి నగరాలుగా చేస్తాం అప్పుచేసి మాకూ నిధులు ఇవ్వాలి అంటే కేంద్రం అంగీకరిస్తుందా ? విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకోవాలంటే ముందుగా ఆ సంస్థలకు ప్రాజెక్టు వివరాలను సమర్పించాలి. పర్యావరణం,వాటి అమలుతో నష్టపోయేవారెవరైనా ఉన్నారా, ఉంటే వారికి పరిహారం ఎలా చెల్లించాలి? తీసుకున్న అప్పులను ఎలా తీరుస్తారు? అందుకుగాను మీదగ్గర ఉన్న ఆదాయవనరులు ఏమిటి ? లేకపోతే ఎలా రాబడతారు ? ఇలా అనేక అంశాలను పరిశీలించి షరతులతో కూడిన రుణాలను మంజూరు చేస్తాయి. ఆదాయాన్ని ఎలా రాబట్టాలో కూడా వినియోగదారుల ఛార్జీల వంటి సూచనల రూపంలో షరతులు విధిస్తాయి. మనం సాధారణంగా బాంకులకు అలా వెళ్లి ఇలా అప్పుతెచ్చుకున్నంత సులభంగా విదేశీ సంస్థల అప్పు ఉండదు. అయినప్పటికీ ఇంకా వర్తమాన ఆర్థిక సంవత్సరంలోనే విదేశీ సంస్థల నుంచి రుణం తీసుకొని ఇస్తామంటూ నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బహుశా నరేంద్రమోడీగారిని విశ్వగురువుగా, నేతగా ప్రచారం చేస్తున్నారు గనుక అలాంటి నిబంధనలను పక్కన పెట్టే ప్రత్యేక వెసులు బాటు, వివరాలేమీ లేకుండానే ముందుగానే ఇచ్చే అవకాశం ఉందేమో తెలియదు. ఇంతవరకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్‌)ను కేంద్రానికి సమర్పించినట్లు చంద్రబాబు నాయుడు ఎక్కడా ప్రకటించలేదు, లీకులు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు అమరావతి కోసం విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. వినియోగదారుల దగ్గర రుసుములు వసూలు చేసే షరతులతో ముందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం మారటం, అమరావతిని వదలివేయటంతో కథకంచికి చేరింది. ఒక వేళ ఇప్పుడు మరోసారి ప్రయత్నించాలన్నా, పెరిగిన ధరలకు అనుగుణ్యంగా డిపిఆర్‌ను సమర్పించాలి. అలాంటి ప్రక్రియ ఇంతవరకు లేనందున పదిహేనువేల కోట్లు వెంటనే ఎలా వస్తాయన్నది ప్రశ్న.


ఇలాంటి ప్రశ్నలు, సందేహాలను ఎవరైనా లేవనెత్తితే రాష్ట్ర అభివృద్ధిని కోరుకోవటం లేదనో, వైసిపి కండువా కప్పుకున్నారనో ఎన్‌డిఏ కూటమి ఎదురుదాడికి దిగవచ్చు.గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నిస్తే వైసిపి వారు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. వాటిని వదలి వేద్దాం.హిందూ బిజినెస్‌లైన్‌ పత్రికలో 2024 జూలై 18న న్యూఢిల్లీ ప్రతినిధి రాసిన విశ్లేషణ ప్రకారం ”రాష్ట్ర పునర్‌నిర్మాణానికి ” కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల సాయం కావాలని చంద్రబాబు నాయుడు కోరారు. అందుకోసం ప్రధాని నరేంద్రమోడీ, అరడజను మంది కేంద్ర మంత్రులు, పదహారవ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియాను కలిశారు. నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరణాత్మక పత్రాన్ని కూడా అందచేశారు.కేంద్రం ఎందుకు సాయం చేయాలో కూడా వివరించారు.వర్తమాన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి జిడిపిలో మూడుశాతం నిబంధనను సడలిస్తూ 0.5శాతం పెంచాలని, అమరావతి నిర్మాణానికి రు.50వేల కోట్ల సాయం ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు పన్నెండువేల కోట్లు ఇవ్వాలని కోరారు. అలాగే దుగ్గరాజపట్నం రేవు నిర్మాణం, రాష్ట్ర మూలధన పెట్టుబడికి ప్రత్యేక పధకం కింద సాయం,బుందేల్‌ ఖండ్‌ పాకేజ్‌ మాదిరి వెనుకబడిన ప్రాంతాలకు సాయాన్ని, చమురుశుద్ధి కర్మాగారాల ఏర్పాటును కూడా కోరారు.కీలకమైన కేంద్ర మంత్రి పదవులు,లోక్‌సభ ఉపసభాపతి పదవిని కూడా కోరకుండా ఆర్థిక సాయం మీదే కేంద్రీకరించినట్లు కూడా బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ” ఆంధ్రప్రదేశ్‌కు నిర్మల మద్దతు, కానీ నాయుడు కోరిన దానికి చాలా తక్కువ ” అనే శీర్షికతో అదే బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. దానిలోని అంశాల సారం ఇలా ఉంది. కేంద్ర సాయాన్ని ఆశిస్తూ బడ్జెట్‌లో ఏం కేటాయిస్తారో చూసేందుకు గాను చంద్రబాబు రాష్ట్రబడ్జెట్‌ ప్రవేశపెట్టటాన్ని వాయిదా వేసుకున్నారు. స్థానికంగా వనరులను పెంచేందుకు మార్గాలు వెతకాల్సి ఉంటుంది, పదిహేనవ ఆర్థిక సంఘం సూచనను అనుసరిస్తే రాష్ట్ర ప్రభుత్వం పన్నేతర రాబడులను పెంచుకోవాల్సి ఉంది.కేేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక పాకేజ్‌ లేదా ప్రత్యేక హౌదా ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతానికి బడ్జెట్‌ పెట్టకుండా సమయాన్ని తీసుకుంది.అయితే చంద్రబాబు లక్ష్యం అంత తేలిక కాదు.రాష్ట్ర ఆదాయంతో పోల్చితే వడ్డీ చెల్లింపులు గణనీయంగా ఎక్కువగా ఉన్నందున ఆర్థిక పునర్‌నిర్మాణం కోసం ఎంతో ఎంతో చేయాల్సి ఉందని పేర్కొన్నారు.


బడ్జెట్‌ కేటాయింపులను పరిశీలించేపేరుతో కొద్ది రోజులు కాలయాపన చేయవచ్చు. కేంద్రం నుంచి ఆశించిన సాయం, దాని గురించి తెలుగుదేశం పార్టీ, జనసేన జనంలో పెద్ద ఎత్తున ఆశలు కలిగించాయి.సూపర్‌సిక్స్‌ పేరుతో చేసిన వాగ్దానాలను బిజెపి ఆమోదించి ఉంటే ఉమ్మడి ఎన్నికల ప్రణాళికలో దాని పేరు కూడా ఉండేది.ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం గురించి 2014-19 మధ్య బిజెపితో కలసి కాపురం చేసినంత కాలం చంద్రబాబు నాయుడు సానుకూలంగా మాట్లాడారు తప్ప జనాలకు వివరాలు చెప్పలేదు. ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్న తరువాతే గళమెత్తి, ఢిల్లీలో నిరసనలు, తరువాత 2019ఎన్నికలకు ముందు శ్వేత పత్రాలను ప్రకటించారు. జనం వాటిని నమ్మలేదు.చిత్తుగా ఓడించారు.వైసిపిని గెలిపించారు. ఆ పార్టీ అనుసరించిన వైఖరితో విసిగిపోయి చారిత్మ్రాక స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిని గెలిపించారు. రాష్ట్రం ఉన్న స్థితి గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాదిరి గుండెలు బాదుకుంటే, వైసిపి మీద విమర్శలను గుప్పిస్తే కుదరదు. కేంద్ర సాయం గురించి తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాలంటే అధికారానికి వచ్చిన తరువాత కేంద్రాన్ని ఏ ఏ రంగాలలో ఎంత సాయం చేయాలని కోరారు, తాజా బడ్జెట్‌లో వాటిలో ఏమేరకు వచ్చింది అనే అంశాలను జనానికి అర్దమయ్యే రీతిలో ఒక శ్వేతపత్రం ద్వారా ప్రకటించి పరిస్థితిని వివరించాలి. అందుకు చంద్రబాబు సిద్దపడతారా ?
హొ

రెండుగా చీలిన అమెరికా సమాజం : డోనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు-ఓటమిపై సమీకరణ ! కమలా హారిస్‌ వైపు మొగ్గు !!

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


అమెరికా అధ్యక్షుడు, రెండవసారి పోటీచేసేందుకు ప్రయత్నించిన డెమోక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ తాను పోటీ పరుగు నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం నాడు ప్రకటించటమే కాదు, అధ్యక్షపదవి అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను బలపరుస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా చరిత్రలో అధికారంలో ఉండి పోటీ నుంచి తప్పుకున్న తొలి వ్యక్తిగా చరిత్రకెక్కాడు. ముదిమితో మతి తప్పి మాట్లాడుతున్న 81ఏండ్ల బైడెన్‌ పోటీ నుంచి వైదొలగి వేరొకరికి అవకాశం ఇవ్వాలన్న వత్తిడి గత కొద్ది వారాలుగా వచ్చింది. అయినప్పటికీ పోటీలో ఉంటానని చెప్పిన పెద్దమనిషి ఆకస్మికంగా ప్రకటించటంతో డెమోక్రాట్లు కొత్త అభ్యర్థికోసం హడావుడి పడుతున్నారు. ఆగస్టు 19-22వ తేదీలలో పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఎన్నిక జరుగుతుంది. మరి కొంత మంది కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చినా బైడెన్‌ ప్రకటన తరువాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అనూహ్యపరిణామాలు జరిగే తప్ప డోనాల్డ్‌ ట్రంప్‌ను ఢకొీనబోయేది కమలాహారిస్‌ అని చెప్పవచ్చు. డోనాల్డ్‌ ట్రంప్‌ పలుకుబడి దిగజారినట్లు,హత్యాయత్నం జరిగిన తరువాత ట్రంప్‌ విజయావకాశాలు మరింత పెరిగినట్లు వార్తలు వచ్చిన పూర్వరంగం జో బైడెన్‌ నిర్ణయాన్ని వేగిరం కావించింది. అయితే పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన తరువాత కమలా హారిస్‌ రెండు పాయింట్ల స్వల్ప ఆధిక్యంతో 44 -42తో ట్రంప్‌పై పైచేయి సాధించినట్లు సోమ, మంగళవారాల్లో రాయిటర్స్‌ జరిపిన ఎన్నికల సర్వేలో వెల్లడైంది. ఇదే ధోరణి ముందుకూడా కొనసాగితే సంకుల సమరం సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో ఫాసిస్టులను ఇంటికి పంపిన మాదిరి మితవాది ట్రంప్‌ను ఓడించే అవకాశాలనూ తోసి పుచ్చలేము.


బైడెన్‌ నిర్ణయం అమెరికా లోపలా వెలుపలా, శత్రువులూ, మిత్రుల మధ్య చర్చనీయాంశమైంది. మిత్రదేశాల నేతలందరూ సానుకూలంగా మాట్లాడారు.” ఇటీవలి సంవత్సరాలలో అమెరికాలో జరుగుతున్న పరిణామాలు మాకు ఒక అంశాన్ని నేర్పాయి, అదేమిటంటే దేని గురించి మేము ఆశ్చర్యపడాల్సిందేమీ ఉండదు అని, ఈ అంశం అమెరికా ఓటర్లకు సంబంధించింది తప్ప మాది కాదు, భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నదే మాకు చాలా ముఖ్యం, ఇప్పుడవి చరిత్రలో అత్యంత దిగజారిన స్థితిలో ఉన్నాయి ” అని రష్యా ప్రతినిధి స్పందించారు. ఇది వారి అంతర్గత అంశమని చైనా పేర్కొన్నది.అయితే అక్కడి మీడియా, సామాజిక మాధ్యమంలో పెద్ద స్పందన వెలువడింది.నలభైకోట్ల మంది ఈ వార్తను చూసినట్లు లక్షలది మంది వ్యాఖ్యలు చేసినట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది. అధ్యక్ష పీఠంపై ఎవరు ఉన్నా అమెరికా పెద్దన్నకే అగ్రతాంబూలం అన్నట్లుగా వ్యవహరిస్తారన్నది తెలిసిందే. ఈ కారణంగానే ఎన్నికలు వారి అంతర్గత అంశమైనప్పటికీ అనేక దేశాల నేతలు స్పందించారు. అంతర్గతంగా కమలా హారిస్‌ గెలుస్తారా, ఆమె బలం,బలహీనతలు ఏమిటి అన్న చర్చ మొదలైంది. బైడెన్‌ ప్రకటన వెలువడగానే ఆమె స్పందించారు.” పార్టీని ఐక్యంగా ఉంచేందుకు చేయాల్సిందంతా చేస్తాను. డోనాల్డ్‌ ట్రంప్‌ను, ప్రమాదకరమైన అతగాడి ప్రాజెక్టు 2025 అజెండాను ఓడించేందుకు గాను దేశాన్ని ఐక్యం చేసేందుకు పూనుకుంటానని ” పేర్కొన్నారు.


ప్రపంచంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను పరిష్కరించటంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యం చెందింది.జనం దగ్గర దారిలో పరిష్కారాల కోసం చూస్తున్నారు. పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్థతప్ప ఇప్పటికి మరొకటి లేదు. అయితే సోవియట్‌ యూనియన్‌, ఇతర దేశాల్లో జరిగిన ప్రయోగాలు, వాటి గురించి సోషలిజం అనుకూలశక్తులలోనే తలెత్తిన విబేధాలు, వ్యతిరేకులు చేసిన ఎదురుదాడి నేపధ్యంలో జనం గందరగోళంలో ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించేందుకు, కాపాడేందుకు అవసరమైతే నిర్బంధకాండకు సైతం సిద్దపడే పచ్చిమితవాద, ఫాసిస్టు శక్తులు రంగంలోకి వస్తున్నాయి.ఐరోపాలో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది.అమెరికా కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రాజెక్టు 2025ను రూపొందించిన హెరిటేజ్‌ ఫౌండేషన్‌ మితవాద,నిరంకుశుల అజెండా. ట్రంప్‌ అధికారానికి వస్తే అమలు జరుపుతారనే ప్రచారం ఉంది. దీన్ని జనంలోకి తీసుకువెళితే జో బైడెన్‌ మరోసారి ఎన్నికౌతారని డెమోక్రాట్లు భావించారు. ఇప్పుడు రంగం నుంచి తప్పుకున్నప్పటికీ ట్రంప్‌ను దెబ్బకొట్టగలిగే అస్త్రం ఇదే అని వారు ఇప్పటికీ భావిస్తున్నారు.కమలా హారిస్‌ మాటల భావమిదే. అసలేమిటిది ?


పచ్చి మితవాద భావజాల సంస్థ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ 1973లో ఉనికిలోకి వచ్చింది. వందకు పైగా అలాంటి బృందాల సలహాలతో 922 పేజీల విశ్లేషణ, సిఫార్సులే ప్రాజెక్టు 2025. దీని వెనకాల ఉన్నది ఎవరో నాకు తెలియదు.వారితో నాకెలాంటి సంబంధమూ లేదు అని ఇటీవల ట్రంప్‌ చెప్పుకున్నాడు.ఎన్నికలు ముగిసేవరకు ట్రంప్‌ ఇదే నాటకాన్ని కొనసాగిస్తాడన్నది తెలిసిందే. అయితే బుకాయించినా గతంలో అతని దగ్గర పనిచేసిన వారూ, మద్దతుదారులందరూ దాని రూపకల్పనలో భాగస్వాములే కనుక, దాన్నే అమలు జరుపుతారని వేరే చెప్పనవసరం లేదు. మన దేశంలో ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ చేసిన సిఫార్సులు, ఆదేశాలను అమలు జరుపుతున్న పార్టీలేవీ ఎక్కడా బహిరంగంగా వాటి గురించి చెప్పరు. అవన్నీ తమ విధానాలే అని జనాన్ని నమ్మించేందుకు చూస్తాయి.తమ ముద్రవేసుకుంటాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌, బిజెపి, తెలుగుదేశం, బిఆర్‌ఎస్‌ ఇలా ఏ పార్టీని చూసినా అదే కనిపిస్తుంది. అందుకే ఈ పార్టీల మధ్య అధికారం కోసం కుమ్ములాటలుంటాయి తప్ప విధానపరంగా ఎలాంటి ఘర్షణ ఉండదు. ఫాసిస్టు శక్తులు అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు వాటిని వ్యతిరేకించే మితవాద, వామపక్ష శక్తులందరూ ఇటీవలి ఫ్రెంచి పార్లమెంటు ఎన్నికల్లో చేతులు కలిపి ప్రస్తుతానికి ఆ ముప్పును తప్పించిన సంగతి తెలిసిందే. అమెరికాలో కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా అదే జరగనుందా ?


అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యేవారు, నియమిత అధికార యంత్రాంగానికి ఇప్పుడున్న వాటి కంటే అధికారాలను మరింతగా కట్టబెట్టటం, మరింత కేంద్రీకరించటం ప్రాజెక్టు 2025లక్ష్యాలలో ఒకటి.అధికార దుర్వినియోగానికి ఇది బాటవేస్తుందని భావిస్తున్నారు. సంక్షేమ పధకాలకు కోతపెట్టాలని, నియంత్రణలను నామమాత్రం చేయాలని కార్పొరేట్‌, మితవాద శక్తులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి, అందువలన వీటి సాధన రెండవది.సామాజిక, మతపరమైన అంశాలలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య వ్యత్యాసం ఉంది.అబార్షన్లను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారాలను వినియోగించాలని, గర్భనిరోధ పద్దతులను పరిమితం చేయాలని, బూతుపై నిషేధం, ఆ ఇతివృత్తంతో తీసే సినిమాలు, సీరియళ్లు, ఇతర ఉత్పత్తులను సృష్టించేవారు, వాటిని పంపిణీ చేసే వారి మీద నిషేధం పెట్టాలని, శిక్షించాలన్న అజండా కూడా దీనిలో ఉంది. ఇవన్నీ నిరంకుశ, తిరోగామి ప్రతిపాదనలని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఇవి కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలూ కావు.వీటిని అమలు జరిపేందుకు తగిన వాడు ట్రంప్‌ అని భావించటమే తాజాదనం. తన ఓటమిని అంగీకరించకుండా, జో బైడెన్‌ ఎన్నికను అధికారికంగా ప్రకటించకుండా అడ్డుకొనేందుకు అమెరికా అధికార కేంద్రం మీద దాడి చేయించిన ట్రంప్‌కే ఈ అజెండాను అమలు చేసే దమ్ముఉంటుదని అనేక మంది గట్టిగా భావిస్తున్నారు. ఇదే మితవాదులను వ్యతిరేకించేవారిలో ఇటీవల ఆందోళనను పెంచుతోంది. లక్షలాది మంది పౌర ఉద్యోగులను తొలగించి తన మద్దతుదార్లను నియమించేందుకు 2020లో ట్రంప్‌ నిర్ణయించాడు. అయితే అమలు జరిపే సమయానికి ఎన్నికల్లో ఓడి పదవి నుంచి దిగిపోయాడు. ఆ నిర్ణయాన్ని బైడెన్‌ రద్దు చేశాడు. ఇప్పుడు ట్రంప్‌ గెలిస్తే తన అజెండాను అమలు జరపవచ్చని భావిస్తున్నారు.విద్యా శాఖను రద్దు చేసి అమ్మవడి-తల్లికి వందనం పేరుతో అమ్మలకు ఇస్తున్న నగదు మాదిరే ప్రయివేటు స్కూళ్లకు పంపే తలిదండ్రులకు నగదు ఇవ్వాలని మితవాదులు కోరుతున్నారు. తక్కువ రాబడి వచ్చే స్కూళ్లకు నిధుల నిలిపివేత, మధ్యాహ్నభోజన పధకాల రద్దు, విద్యారుణాలను విధిగా వసూలు చేయాలనే చర్యలు చేపట్టవచ్చు. పర్యావరణ హాని నివారణ చర్యలను నిలిపివేయాలని, హరిత ఇంథన సబ్సిడీలను ఎత్తివేయాలని, చమురు, గ్యాస్‌ వెలికితీతపై పర్యావరణ ఆంక్షలను రద్దు చేయాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమంగా వచ్చిన వారికి విద్యా రుణాలు ఇవ్వకూడదని,ప్రభుత్వ సహాయం పొందే గృహాల్లో వారికి అవకాశం కల్పించరాదని, అక్రమ ప్రవేశాల నిరోధానికి సరిహద్దుల్లో అశ్వికదళాలను తిరిగి నియమించటమే గాక విస్తరించాలని కోరుతున్నారు.

ఇలాంటి ప్రతిపాదనలతో ఉన్నదే ప్రాజెక్టు 2025. దీని రూపకల్పనలో భాగస్వాములు, వాటితో ఏకీభవించేవారిని యంత్రాంగంలో నియమించి వారి పేరుతో అమలు జరిపించేందుకు ట్రంప్‌ చూస్తున్నారని పురోగామివాదులు అనేక మంది హెచ్చరిస్తున్నారు.
హెరిటేజ్‌ ఫౌండేషన్‌కు నిధుల కొరత లేదు. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక కావాలనేదానికంటే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే రీతిలో తన మనుషులను యంత్రాంగంలోకి పంపేందుకే ఇది ప్రాధాన్యత ఇస్తుంది. ఇరవైవేల మంది సుశిక్షుతులైన కార్యకర్తలు, ఇరవైలక్షల మంది స్వచ్చందకార్యకర్తలు దీనికి ఉన్నట్లు అంచనా.దాని అజెండాను అమలు జరిపేందుకు, ప్రజాప్రతినిధులను ప్రభావితం చేసేందుకు, సామాజిక మాధ్యమంలో జనాన్ని సమీకరించేందుకు వారంతా రంగంలోకి దిగుతారు. అనేక మందిని పార్లమెంటరీ కార్యాలయాల్లోకి ఇప్పటికే చొప్పించింది.ట్రంప్‌ యంత్రాంగంలో 2017నాటికి 70 మంది ఈ సంస్థతో సంబంధం ఉన్నవారున్నారు.వారిలో నలుగురు మంత్రులు. ఈ సంస్థ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి రిపబ్లికన్లు మరింత మితవాదం వైపు మొగ్గేందుకు చేయాల్సిందంతా చేస్తోంది.1981లో రోనాల్డ్‌ రీగన్‌ అధికారంలోకి వచ్చినపుడు దీని అజెండాలో 60శాతం అమలు జరిపాడు. ట్రంప్‌ తొలిసారి అధికారంలో ఉన్నపుడు దీని సిఫార్సుల్లో 64శాతం అమలు చేశాడంటే దీని సత్తా ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. రిచర్డ్‌ నిక్సన్‌ హయాంలో 1973లో ఉనికిలోకి వచ్చిన ఈ సంస్థ నిర్వాహకులు తాము కమ్యూనిజానికి వ్యతిరేకమని, కార్పొరేట్లకు అనుకూలమని, క్రైస్తవ మత భావజాలానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పుకున్నారు. తాజా విషయానికి వస్తే ట్రంపిజాన్ని వ్యవస్థీకృతం కావించేందుకు తాము పనిచేస్తామని ఫౌండేషన్‌ అధ్యక్షుడు కెవిన్‌ డి రాబర్ట్స్‌ న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికతో చెప్పాడు. అమెరికా ఇప్పుడు రెండవ విప్లవ క్రమంలో ఉందని, అది రక్తపాత రహితంగా ఉంటుందని కూడా ఒక టీవీ చర్చలో చెప్పాడు. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఈ అంశాలను జనంలోకి తీసుకువెళ్ల గలిగితే నల్లేరు మీద బండిలా సాగుతుందనుకుంటున్న ట్రంప్‌ ఎన్నిక తిరగబడినా ఆశ్చర్యం లేదు.


అయితే అది అంత తేలిక కాదు. ఇప్పటికే జో బైడెన్‌ ప్రతిష్ట దిగజారింది. దాని ప్రభావం కమలాహారిస్‌ మీద కూడ పడుతుంది.వ్యక్తిగా బైడెన్‌ కంటే అతగాడి విధానాల ఫలితంగానే పలుకుబడి తగ్గటమే దీనికి కారణం. రెండవది ఊపు మీద ఉన్న ట్రంప్‌ మద్దతుదార్లు ఆమె మీద పెద్ద ఎత్తున ప్రచారదాడికి దిగే అవకాశం ఉంది. గార్డియన్‌ పత్రిక పేర్కొన్న సమాచారం ప్రకారం పోటాపోటీగా ఉన్న పెన్సిల్వేనియా, జార్జియా, అరిజోనా వంటి రాష్ట్రాలలో టీవీ ప్రకటనల కోసం 50లక్షల డాలర్లను కుమ్మరించేందుకు సిద్దంగా ఉన్నారు. అదే విధంగా అబార్షన్ల వంటి అంశాలపై ఆమె అభిప్రాయాల మీద రెచ్చగొట్టే అవకాశం ఉంది.కమలా హారిస్‌ తల్లి భారతీయ మూలాలున్న మహిళ, తండ్రి ఆఫ్రికన్‌. అందువలన మనదేశంలోని వారు మనమ్మాయి అన్నట్లుగా ప్రచారం చేసుకున్నా అమెరికాలో ఆమెను ఒక ఆఫ్రికన్‌గానే చూస్తారు. శ్వేతజాతి అహంకారం ఉన్న అమెరికాలో దాన్ని కూడా ముందుకు తీసుకురావచ్చు.ఆమె అభ్యర్థిత్వం ఖరారైన తరువాత తలెత్తే పరిణామాల గురించి మరోసారి చూద్దాం !

కన్వర్‌ యాత్ర నిబంధనలకు సుప్రీం కోర్టు బ్రేక్‌, బిజెపి హిందూత్వకు ఎదురుదెబ్బ, దళితులతో ముందు ముంత వెనుక చీపురు కట్టించినా ఆశ్చర్యం లేదు !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


జూలై 22 నుంచి ఆగస్టు ఆరు వరకు జరిపే కన్వర్‌-కావడి యాత్రల సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరా ఖండ్‌ ప్రభుత్వాలు జారీ చేసిన వివాదాస్పద ఉత్తరువు అమలును సోమవారం నాడు సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది బిజెపి హిందూత్వ అజెండాకు ఎదురు దెబ్బ యాత్రలు జరిగే దారిలో ఉన్న దుకాణాలు,హౌటళ్ల, పానీయాల దుకాణాల యజమానుల పేర్లను సంస్థల ముందు ప్రదర్శించాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. వాటిలో హలాల్‌ ధృవీకరణ పత్రం ఉన్న పదార్థాలను విక్రయించరాదని కూడా పేర్కొన్నారు. యాత్రల పవిత్రతను కాపాడేందుకు అని చెబుతున్నప్పటికీ అధికారిక ఉత్తరువుల్లో శాంతి భద్రతలను సాకుగా చూపారు. ఈ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం పేర్ల ప్రదర్శనకు బ్రేకు పడింది. అయితే ఆహార పదార్ధాల స్వభావాన్ని వినియోగదారులకు ప్రదర్శించాలని కోర్టు పేర్కొన్నది. పోలీసులు తీసుకున్న చర్యలతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిందని, సామాజికంగా వెనుకబడిన తరగతులు, మైనారిటీలను ఆర్థికంగా విడదీస్తుందని పిటీషనర్ల తరఫున వాదించిన సియు సింగ్‌ చెప్పారు. మరో న్యాయవాది అభిషేక్‌ షింఘ్వి తన వాదనలను వినిపిస్తూ ” నేను గనుక పేరును ప్రదర్శించకపోతే నన్ను మినహాయిస్తారు, నేను పేరును ప్రదర్శించినా మినహాయిస్తారని ” చెప్పారు. అయ్యప్ప, భవానీ వంటి దీక్షలు, కన్వర్‌(కావడి) యాత్ర వంటివి జనాల వ్యక్తిగత అంశాలు. ఇష్టమైన వారు పాటిస్తారు, కాని వారు దూరంగా ఉంటారు. వీరంతా నాస్తికులని గానీ పాటించేవారే పరమ ఆస్తికులని గానీ నిర్ధారించటానికి, ముద్రవేసేందుకు ఎవరికీ హక్కులేదు.పౌరహక్కుల పరిరక్షణ సంస్థ(ఎపిసిఆర్‌) పేరుతో ఉన్న ఒక స్వచ్చంద సంస్థ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టు తలుపుతట్టింది.న్యాయమూర్తులు హృషికేష్‌ రారు, ఎస్‌విఎన్‌ భట్‌ ధర్మాసనం సోమవారం నాడు విచారించింది. ప్రభుత్వ ఉత్తరువుల కారణంగా దుకాణాల యజమానుల మతపరమైన గుర్తింపు వెల్లడి కావటమేగాక ముస్లిం మతానికి చెందిన దుకాణాల యజమానుల పట్ల వివక్ష ప్రదర్శించటమే అని పిటీషన్‌లో పేర్కొన్నారు.ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంటూ, తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని అధికారపక్షానికి స్పష్టం చేశాయి. కోర్టు ఆదేశాలతో దీని మీద చర్చ జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.


బిజెపి మిత్రపక్షాలుగా ఉన్న జెడియు, ఎల్‌జెపి, ఆర్‌ఎల్‌డి పార్టీలు ఇలాంటి ఉత్తరువులు తగవని వ్యతిరేకతను వెల్లడించినా బిజెపి ఖాతరు చేయ లేదు. జనాలను మత ప్రాతిపదికన చీల్చే, ముస్లింలపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అజండాను అమలు జరిపేందుకే పూనుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు తాజా పరిణామాల వెనుక ఉన్న కుట్రలేమిటి, ఏం జరగనుంది అన్నది ఆసక్తికరంగా, ఆందోళనకరంగా మారింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఆయోధ్యతో సహా అనేక చోట్ల చావుదెబ్బతిన్నది. దీనికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కారణమంటూ కేంద్ర పెద్దల మద్దతుతో బిజెపి స్థానిక నేతలు ధ్వజమెత్తటమే కాదు, నాయకత్వ మార్పు జరగాలని కోరుతున్నారు. మరోవైపున దానికి ప్రతిగా యోగి కూడా తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. వాటిలో కన్వర్‌ యాత్రల ఆదేశం ఒకటి. శివలింగం మీద తేలును చెప్పుతో కొట్టలేరు, చేతితో తొలగించలేరు అన్నట్లుగా కేంద్ర బిజెపి నాయకత్వం ముందు పరిస్థితి ఉంది. ఇంతకూ ఈ యాత్రీకులు చేసేదేమిటి ? శ్రావణమాసంలో పవిత్ర జలం పేరుతో గంగా నది నుంచి నీరు తెచ్చి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో అభిషేకం చేసి శివుని కృపకు పాత్రులౌతామనే నమ్మకాన్ని వెల్లడిస్తారు. జూలై 22 నుంచి ఆగస్టు ఆరవ తేదీ మధ్య హరిద్వార్‌ వద్ద ఉన్న గంగానది నుంచి తెచ్చే నీటి పాత్రలను కావళ్లలో పెట్టి తీసుకువస్తారు గనుక దీనికి కావడి యాత్ర అనే పేరు వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి వేర్వేరు మార్గాల్లో భక్తులు హరిద్వార్‌ వస్తారు. ఈ మార్గాల్లో యాత్రీకుల కోసం వస్తువుల దుకాణాలు, ఆహార పదార్దాల హౌటళ్లు. దాబాలు, బండ్లు ఏర్పాటు చేస్తారు. కాలినడకన, మోటారు వాహనాలు ఇలా ఎవరికి వీలైన పద్దతుల్లో వారు ఈ యాత్రలో పాల్గొంటారు. 1980దశకం వరకు చాలా పరిమితంగా జరిగే ఈ క్రతువును క్రమంగా పెద్ద కార్యక్రమంగా మార్చారు. అయ్యప్ప దీక్షలకు పోటీగా అనేక దీక్షలను తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా అలాంటిదే.


దుకాణాలు, హౌటళ్ల ముందు యజమానుల పేర్లకు బదులు ” మానవత్వం ” అని ప్రదర్శించాలని ప్రముఖ నటుడు సోనూ సూద్‌ ఎక్స్‌లో సూచన చేశారు.దీని మీద బాలీవుడ్‌ హీరోయిన్‌, బిజెపి లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్‌ స్పందిస్తూ ఉమ్మిన ఆహారం, ఆపని చేసేవారిని సమర్ధించటమే ఇదంటూ ధ్వజమెత్తారు. ముస్లింలు తయారు చేసే ఆహారం, విక్రయించే పండ్లు మొదలైన వాటి మీద ఉమ్ముతారని, హలాల్‌ చేస్తారని,అపవిత్రమైన వాటిని హిందువులు బహిష్కరించాలని, హిందువుల పవిత్ర స్థలాలు, గుడులు గోపురాలు ఉన్న ప్రాంతాలలో ముస్లింల దుకాణాలను అనుమతించరాదని, ఇప్పటికే ఉంటే ఎత్తివేయాలని హిందూత్వ సంస్థలు ఎప్పటి నుంచో రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. సాధారణ పౌరులెవరూ వాటిని పట్టించుకోవటం లేదన్నది కూడా ఎరిగిందే. అయోధ్యలో రామాలయం పేరుతో యోగి సర్కార్‌ బుల్డోజర్లతో కూలదోయించిన కట్టడాల్లో హిందువులవి కూడా ఉన్నాయి. అందుకే అక్కడ బిజెపికి వ్యతిరేకంగా ఓటువేయటం, అభ్యర్థి ఓటమి తెలిసిందే. పాలస్తీనాలో అరబ్బులపై దాడులు, మారణకాండ, స్వతంత్ర దేశ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్‌ ఉత్పత్తులను బహిష్కరించాలని ముస్లిం, అరబ్బుదేశాలలో పలు సంస్థలు గతంలో పిలుపునిచ్చాయి. వాటిని కాపీకొట్టిన కాషాయ దళాలు మనదేశంలో ముస్లింల వ్యాపారాలను దెబ్బతీసేందుకు వినియోగిస్తున్నాయి. అరబ్బు దేశాల చమురును బహిష్కరించమని చెప్పేందుకు వారికి నోరురాదు, ఎందుకంటే వారి యాత్రల వాహనాలు నడవాలంటే అక్కడి నుంచి దిగుమతి చేసుకున్న ఇంథనమే దిక్కు. అక్కడ పవిత్రత గుర్తుకు రాదు.


ఉమ్ముతారని చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. నిజమే అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అనేక బిర్యానీ హౌటళ్లకు, రంజాన్‌ మాసం సందర్భంగా హలీం కోసం ఎగబడేవారిలో ఎక్కువ మంది ముస్లిమేతరులే ఎందుకు ఉంటున్నారు.దుకాణాలలో విక్రయించే వస్తువులు నాణ్యమైనవా కాదా, హౌటళ్లలో వడ్డించే ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది గీటురాయిగా ఉండాలి తప్ప యజమానుల వివరాలు ఎందుకు ? ఒకవేళ ముస్లిం మతానికి చెందిన వారు యజమానులుగా ఉంటే వాటిని బహిష్కరించాలని పరోక్షంగా చెప్పటమే ఇది. పేర్ల ప్రదర్శన ఒక్క ముస్లింలనే దెబ్బతీస్తుందా ? హిందువులను కూడా నష్టపరుస్తుంది.మన సమాజంలో మత విద్వేషమే కాదు, కుల వివక్ష, విద్వేషం కూడా ఎక్కువే, అందునా దేశ ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలలో మరీ ఎక్కువ.దళితులు వివాహాల సందర్భంగా గుర్రాల మీద, ఇతరత్రా ఊరేగింపులు జరపకూడదని, ఎక్క కూడదని దాడులు చేసిన ఉదంతాలు ఎన్ని లేవు.దుకాణాలపై దళితులు, గిరిజనులు, వెనుకబడిన సామాజిక తరగతులకు చెందిన యజమానుల పేర్లను ప్రదర్శిస్తే ముస్లిం దుకాణాల పట్ల అనుసరించే వైఖరినే మనువాద కులాల వారు పాటిస్తారని వేరే చెప్పనవసరం లేదు. అందుకే అనేక చోట్ల గతంలో ఆర్యవైశ్య బ్రాహ్మణ హౌటల్‌ అని రాసుకొనే వారు. ఇప్పుడు ఇంకా ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో ఉండి ఉండవచ్చు. వాటి స్థానలో రెడ్డి, చౌదరి హౌటల్స్‌ పేరుతో ఎక్కడ చూసినా మనకు దర్శనమిస్తున్నాయి తప్ప ఇతర కులాలను సూచించే హౌటళ్లు ఎక్కడా కనిపించకపోవటానికి సమాజంలో ఇప్పటికీ ఉన్న చిన్న చూపు, వివక్షే కారణం. అదే ముస్లింల విషయానికి వస్తే మతవిద్వేషం. రాఘవేంద్ర,రామా, కృష్ణా, వెంకటేశ్వర విలాస్‌లు తప్ప ఎక్కడైనా అబ్రహాం, ఇబ్రహీం, ఏసుక్రీస్తు,మహమ్మద్‌ ప్రవక్త విలాస్‌లను చూడగలమా ?


ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ యుపి ప్రభుత్వ చర్యను తప్పు పట్టారు. ఒక మతపరమైన యాత్ర సందర్భంగా పోలీసులు జారీ చేసిన ఆదేశాలు దుకాణాలు, హౌటళ్ల యజమానుల పేర్లను ప్రముఖంగా వాటి ముందు రాసి ఉంచాలని చెప్పారు. సమీప భవిష్యత్‌లో ఇది వాహనాలకు సైతం వర్తింప చేస్తారని, గతంలో నాజీ జర్మనీలో కొన్ని దుకాణాలు, ఇండ్లకు ఇలాంటి గుర్తింపును అమలు చేశారని జావేద్‌ అక్తర్‌ ఎక్స్‌లో స్పందించారు.బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ కూడా తప్పు పట్టారు. ఇది అంటరానితనాన్ని ప్రోత్సహించటం తప్పవేరు కాదన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను నేరుగా విమర్శించలేని నక్వీ దీనికి అధికారయంత్రాంగం కారణమని విరుచుకుపడ్డారు. అత్యుత్సాహపరులైన అధికారులే ఇది చేశారన్నారు.సమాజవాది పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌, బిఎస్‌పి నాయకురాలు మాయావతి, మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా విమర్శించారు. ఇది సామాజిక నేరమని, కోర్టులు కలగచేసుకొని నివారించాలన్నారు. తొలుత యజమానుల పేర్లను ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు. దాని మీద విమర్శలు రావటంతో కాదు స్వచ్చందంగా చేయాలన్నారు, చివరికి విధిగా ప్రదర్శించాలని నిర్ణయించారు.స్వచ్చందంగా అన్నప్పటికీ అంతిమంగా ఫలితం మతపరమైన గుర్తింపును విధిగా వెల్లడించేట్లు చేయటమే. పేర్లు ప్రదర్శించని హిందువులను కూడా ముస్లింలుగానే భావించేందుకు ఆస్కారం ఉంటుంది. ముస్లింలు పేర్లు రాసుకొని ప్రదర్శిస్తే వారి దగ్గర కొనవద్దని చెప్పేందుకు తప్ప దీనిలో శాంతి భద్రతల సమస్య ఎక్కడుంది. యాత్రికులకు ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకంటూ ముజఫర్‌ నగర్‌ ఎస్‌పి ప్రకటన సాకు మాత్రమే. కావాల్సిన వస్తువు లేదా ఆహారం ఎవరి దగ్గర కొనుగోలు చేస్తేనేం, దానిలో యాత్రీకులు పడే గందరగోళం ఏమిటి ? దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్లను వేరు చేసేందుకు సృష్టించిన బంటూస్తాన్‌లకు, మనదేశంలో వెలిగా ఉంచిన దళిత వాడలకు, వీటికీ తేడా ఏముంది? దళితవాడల్లో నివశించేందుకు ఎంత మంది దళితేతరులు సిద్దపడుతున్నారు ? ముస్లింలు మెజారిటీగా ఉన్న అనేక ప్రాంతాల్లో ఇతరులు ఇండ్లు కొనేందుకు జంకే ఇతరుల గురించి తెలియని వారెవరు ?


చరిత్రలో మతపరమైన గుర్తింపు చాలా ప్రమాదకరం అని రుజువు చేసింది.మనతో సహా ఆసియా ఉపఖండంలోని దేశాల్లో మతంతో పాటు ఎక్కడా లేని కులపరమైన గుర్తింపు బోనస్‌.మధ్య యుగాల్లో, తరువాత ఇస్లామిక్‌, క్రైస్తవమతాల ఉన్మాదంతో ఇతర మతాల వారు ప్రత్యేక గుర్తులు ధరించాలని ఆదేశించారు. మౌఢ్యం లేదా నిరంకుశత్వం చోటు చేసుకుంది. నాజీ జర్మనీలో యూదు వ్యతిరేకతలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. మహమ్మద్‌ ప్రవక్త మరణం తరువాత అరేబియాలో అధికారానికి వచ్చిన ఖలీఫా రెండవ ఉమర్‌ 717-20 సంవత్సరాలలో ముస్లిమేతరులు ప్రత్యేక చిహ్నాలను ధరించాలని తొలిసారిగా ఆదేశించినట్లు వికీపీడియా సమాచారం తెలుపుతోంది. నేటి ఇటలీలోని సిసిలీ ప్రాంతంలో రాజ్యాధికారం చలాయించిన అరబ్‌ రాజవంశం అగలాబిద్‌ 887-88లో యూదులు తమ ఇండ్లకు గాడిదలను చిత్రించిన వస్త్రాలను వేలాడదీయాలని, పసుపు పచ్చ బెల్టులు, టోపీలు ధరించాలని ఆదేశించింది. తరువాత 1,212లో మూడవ పోప్‌ ఇన్నోసెంట్‌ ప్రతి క్రైస్తవ ప్రాంతంలో గుర్తించేందుకు వీలుగా యూదులు ప్రత్యేక చిహ్నాలను ధరించాలని ఆదేశించాడు. ప్రష్యాలో 1,710లో అధికారంలో ఉన్న ఒకటవ ఫెడరిక్‌ విలియమ్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం యూదులు ప్రత్యేక చిహ్నాలను ధరించనవసరం లేదు.అయితే అలా ఉండాలంటే ఎనిమిదివేల వెండి నాణాల నగదు చెల్లించాలని షరతు పెట్టాడు. తరువాత రెండవ ప్రపంచ యుద్దం సందర్భంగా జర్మనీలో నాజీ పాలకులు యూదులను గుర్తించేందుకు డేవిడ్‌ బొమ్మ ఉన్న ఏదో ఒక రంగు గుర్తును ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.హిట్లర్‌ యంత్రాంగం కొత్త ఆదేశాలను జారీచేసి యూదుల ఇండ్ల ముఖద్వారాలకు గుర్తులు వేయాలని ఆదేశించింది. అనేక దేశాల్లో వివిధ రూపాల్లో ఇలాంటి గుర్తింపు ఆదేశాలను అమలు చేశారు. హంగరీ ఆక్రమణ తరువాత యూదుల పౌరసత్వాలను రద్దు చేసి వారంతా ప్రత్యేక గుర్తులను ధరించాలని ఆదేశించారు.ఇక వర్తమానంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు 1996-2001 మధ్య తమదేశంలో ఉండే హిందువులు పసుపుపచ్చ గుర్తున్న బాడ్జ్‌లను ధరించాలని, వేధింపులకు గురికాకుండా ఉండేందుకు హిందూ మహిళలు బురఖాలు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కన్వర్‌ యాత్రీకులు గందరగోళపడకుండా ఉండేందుకు, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అనే పేరుతో దుకాణాల యజమానులు తమ పేర్లను ప్రముఖంగా రాసి ప్రదర్శించాలని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఆకుపచ్చ తాలిబాన్లకు కాషాయ తాలిబాన్లకు పద్దతి తప్ప ఇతరంగా తేడా ఏమిటి ? యోగి సర్కార్‌ ఉత్తరువులు ముస్లింల కోసమేనని,మనకేంటి అని ఇతరులు ఎవరైనా భావిస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు. చరిత్రను చూసినపుడు సనాతనం లేదా మనువాదం కారణంగా దళితులకు ఇతరుల వాడల్లో ప్రవేశం నిషేధించారు, ఒకవేళ అనుమతిస్తే ఉమ్మివేయకుండా మెడలో ముంత ధరించాలని, వీపులకు చీపుర్లు కట్టుకొని ఊడ్చుకుంటూ నడిపించిన చరిత్ర దాస్తే దాగేది కాదు. ఇప్పుడు కన్వర్‌ మరోపేరుతో మతవిద్వేషం రెచ్చగొడుతున్నవారు మనువాదుల వారసులే. సనాతనాన్ని అమలు జరపాలని కోరేశక్తులకు ప్రతిఘటన లేకపోతే దళితులకు ముంతలు, చీపుర్లే గతి, వెనుకబడిన తరగతులు తిరిగి కులవృత్తులకు పోవాల్సిందే ! కాదంటారా !

చైనా ది గ్రేట్‌ : మైక్రోసాఫ్ట్‌ దెబ్బనుంచి తప్పించుకున్న ఒకే ఒక్క దేశం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


వర్తమాన సమాజం సాంకేతిక పరిజ్ఞాన మీద ఎంతగా ఆధారపడి ఉందో, దానికి చిన్నపాటి అంతరాయం కలిగినా ఎన్ని ఇబ్బందులు, ఎంత నష్టం జరుగుతుందో 2024 జూలై 19న తలెత్తిన ఒక చిన్న సాంకేతిక సమస్య లేదా జరిగిన తప్పిదం ప్రపంచానికి వెల్లడించింది. ఆకస్మికంగా ఐదువేలకుపైగా విమానాల రద్దు ప్రకటన, ఎందుకో, ఎప్పుడు పునరుద్దరణ అవుతాయో చెప్పే నాధుడు లేడు. ప్రయాణీకుల్లో గందరగోళం. ఆసుపత్రులలో ఆపరేషన్లు నిలిపివేశారు.బ్యాంకు ఖాతాలు పనిచేయలేదు. రైలు టికెట్లు జారీ కాలేదు.వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. ఇదంతా క్రౌడ్‌ స్ట్రయిక్‌ అనే సైబర్‌ భద్రతా సంస్థ వైరస్‌లను కనుగొనేందుకు అందచేసిన ఒక లోపభూయిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను మైక్రోసాఫ్ట్‌ సర్వర్లు, కంప్యూటర్లకు అందచేసిన ఫలితమే. నిత్య జీవితంలో ఎంత ఎక్కువగా ఇంటర్నెట్‌ను, కంప్యూటర్లను వినియోగిస్తారో, ప్రత్యేకించి మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ పరికరాలను వినియోగిస్తారో అక్కడల్లా ప్రపంచమంతటా కొన్ని గంటల పాటు ఇవే దృశ్యాలు.( ఆపిల్‌ మాక్‌ కంప్యూటర్లకు ఎలాంటి అంతరాయం కలగలేదు.) నీలి రంగు తెరతో దర్మనమిచ్చిన కంప్యూటర్లు పదే పదే వాటంతట అవే మూతబడ్డాయి, అదే మాదిరి తెరుచుకున్నాయి, తప్పపనిచేయలేదు. దీన్నే నీలిరంగు తెర మృత్యువు అన్నారు గానీ నిజానికి అది చావు బతుకుల మధ్యకొట్టుకోవటం. ఆపరేటర్లకు ఎందుకలా జరిగిందో అర్ధం కాదు, ఏం చేయాలో అసలే తెలియలేదు.ఎలాగైతేనేం పరిస్థితి చక్కబడింది. ఇప్పుడు తీరికగా జరిగిన నష్టం ఎంత అనే లెక్కల్లో మునిగారు. కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం ఉంటే ఇదే జరుగుతుందనే హెచ్చరికలు వెలువడ్డాయి. కొందరు ఇదే మంచి తరుణం మించిపోవును మీ కంప్యూటర్‌ వ్యవస్థలకు బీమా చేయించండి అంటూ సలహాలిస్తుంటే ఇదొక ఆముదమా అంటూ యజమానులు పెదవి విరుస్తున్నారు. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లను కనిపెట్టినవారే వాటిని దెబ్బతీసే వైరస్‌లను సృష్టిస్తారు, వాటిని నిరోధించే లేదా సంహరించే భద్రత అంటూ మరొక సాఫ్ట్‌వేర్లను అంటగట్టటం తెలిసిందే. తమ కంప్యూటర్లలో తాము సూచించిన సాఫ్ట్‌వేర్లనే వాడాలనే నిబంధనల గురించి తెలిసిందే.మూడింట రెండు వంతుల క్లౌడ్‌ సదుపాయాల వ్యవస్థలను మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌ సంస్థలే సమకూర్చుతున్నాయి. ఏదీ ఊరికే రాదు, ప్రతిదీ లాభం కోసమే కదా ! గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతిపాదనలను గతంలో మైక్రోసాఫ్ట్‌ వమ్ముచేసిందనే విమర్శలు ఉన్నాయి.


ఎనభైమూడు బిలియన్‌ డాలర్ల విలువగల క్రౌడ్‌ స్ట్రయిక్‌ అనే సైబర్‌ భద్రతా ఉత్పత్తుల సంస్థకు ప్రపంచవ్యాపితంగా ఇరవై వేల మంది ఖాతాదారులున్నారు,మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వాటిలో ఉన్నాయి. విండోస్‌కు అందచేసిన తమ ఉత్పత్తి ఫాల్కన్‌ సెన్సర్‌ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం కారణంగా మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులందరూ ఇబ్బంది పడినట్లు అది ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ అప్రదిష్ట కారణంగా ఈ కంపెనీ వాటాల ధరలు పదకొడుశాతం పడిపోయాయి. సైబర్‌ దాడి జరిగితే వేరు, తాజా ఉదంతం బాధ్యతా రహితంగా వ్యవహరించిన తీరుతో జరిగింది. ముందస్తు పరీక్షలు జరపకుండా, సరి చూసుకోకుండా నేరుగా ప్రయోగించిన లోప భూయిష్టమైన సాఫ్ట్‌వేర్‌ దెబ్బకు ఒక్క దేశం, చైనా తప్ప ప్రపంచం మొత్తం విలవిల్లాడింది. ప్రపంచ వ్యాపితంగా అంతరాయం కలిగినప్పటికీ ఒక్క చైనా దాన్నుంచి తప్పించుకున్నట్లు హాంకాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మోర్నింగ్‌ పోస్ట్‌ అనే పత్రిక పేర్కొన్నది.రాజధాని బీజింగ్‌, ఆర్థిక కేంద్రం షాంఘై వంటి చోట్ల ఉన్న విమానాశ్రయాలు సాధారణంగా నడుస్తున్నట్లు తెలిపింది. తరువాత ఇతర దేశాల మీడియా కూడా అవే కథనాలను ఇచ్చాయి. చైనా పౌరులు మైక్రోసాఫ్ట్‌ గురించి సామాజిక మాధ్యమం వెయిబోలో జోకులే జోకులు పేల్చారు.తమకు ఒక పూట సెలవు ఇచ్చినట్లు కొందరు చెప్పగా మా కంపెనీ వెంటనే మరోకంప్యూటర్‌కు మారినందున మాకు అది కూడా దక్కలేదని కొందరు చమత్కరించారు.


ఇప్పటికీ నల్లమందు భాయీలంటూ నిందించేవారు, చౌకరకం వస్తువులను తయారు చేయటం తప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వారి దగ్గర లేదంటూ చైనాను వర్ణించేవారికి ఒక్కసారిగా బుర్రలు పనిచేయటం నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్‌ దెబ్బకు జరిగిన నష్టం విలువ ఎంతో ఇంకా తేలలేదు, దాన్నుంచి బయటపడేందుకు ఎంత సమయం తీసుకుంటుందో తెలియదని చెబుతున్నారు. ఇక చైనాను చూసి పనిచేయటం ఆగిపోయిన వారి బుర్రలు ఎప్పటికీ సాధారణ స్థితికి వస్తాయో తెలియదు.అఫ్‌ కోర్స్‌ , చైనా వ్యతిరేక వైరస్‌ సోకిన వారికి చికిత్సలేదనుకోండి. అయితే చైనాలో అసలేమీ ప్రభావితం కాలేదా ? అక్కడ మైక్రోసాఫ్ట్‌ సేవలు లేవా ? ఉన్నాయి, కొన్ని ప్రభావితమయ్యాయి. మైక్రోసాఫ్ట్‌తో పనిచేసే అక్కడి విదేశీ సంస్థలు తప్ప చైనా స్వంత విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మామూలుగానే పనిచేశాయి. బహుశా ప్రపంచంలో సాంకేతిక అంతరాయం ఇంత పెద్ద ఎత్తున ఏర్పడటం ఇదే ప్రధమం. తిరుగులేని సంస్థగా పేరున్న మైక్రోసాఫ్ట్‌కూ ఇది కోలుకోలేని దెబ్బ. దాని మీద ఆధారపడిన విమానాశ్రయాలు, సంస్థలు, బాంకులు, మీడియా సంస్థల కార్యకలాపాలకూ అంతరాయం కలిగింది. రక్షణ సాఫ్ట్‌వేర్‌ దెబ్బకు దాన్ని తయారు చేసిన కంపెనీతో పాటు మైక్రోసాఫ్ట్‌ కూడా పేరుతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోయాయి.వాటి ఖాతాదారులకు జరిగిన నష్టం గురించి అంచనాలు వేస్తున్నారు. ఇవి 24వందల కోట్ల నుంచి లక్షల కోట్ల డాలర్ల వరకు ఉంటుందని, కొన్ని వారాల వరకు అంతరాయ పర్యవసానాలు ఉంటాయని చెబుతున్నారు. అమెరికాలో ప్రొవైడెన్స్‌ హెల్త్‌ అనే సంస్థకు ఏడు రాష్ట్రాలలో 52 ఆసుపత్రులున్నాయి.నలభైవేల సర్వర్లకు గాను పదిహేను వేలు, లక్షా 50వేల కంప్యూటర్లు పనిచేయలేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.ప్రపంచ వ్యాపితంగా ఉన్న కంప్యూటర్లలో ఒకశాతానికి అటూ ఇటుగా అంటే 85లక్షల విండోస్‌ కంప్యూటర్లు ప్రభావితమయ్యాయి.2017లో వాన్నాక్రై సైబర్‌దాడిలో 150దేశాల్లో మూడులక్షల కంప్యూటర్లు దెబ్బతిన్నాయి.ఇలాంటి పెద్ద దాడులేగాక చిన్న చిన్నవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కానీ శుక్రవారం నాటి అంతరాయం చారిత్రాత్మకమైనదిగా నమోదైంది. ఈ ఉదంతం తరువాత జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి.నకిలీ ఇమెయిల్స్‌,ఫోన్లలో పిలుపులు, నకిలీ వెబ్‌సైట్లు వస్తాయని, వాటిని తెరవ కూడదని చెప్పారు.


ఇంతకూ చైనా ఎందుకు ప్రభావితం కాలేదు.కమ్యూనిస్టు చైనా ఉద్బవించినప్పటి నుంచి దాన్ని నాశనం చేసేందుకు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందువలన ప్రతి దశలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలను తీసుకొంటూ ఆ కుట్రలను వమ్ము చేస్తున్నది. సంస్కరణల్లో భాగంగా విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించినప్పటికీ సమాంతరంగా తన స్వంత పరి శోధనలను కొనసాగిస్తున్నది. దీని గురించి తెలిసినా తెలియనట్లు, అబ్బే అదంతా ఉత్తిదే అనే ప్రచారం జరుగుతోంది. దాన్ని పట్టించుకోని చైనీయులు తమపని తాము చేసుకుపోతున్నారు. పూర్తిగా విదేశీ కంపెనీలు, దేశాలకు తమ జుట్టు అందించకుండా షరతులతో జాగ్రత్త పడ్డారు. అదే దాని బహిరంగ రహస్యం.చైనాలో మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సర్వీసులు అందించే కంపెనీలు సదరు సంస్థ ప్రపంచ మౌలిక వ్యవస్థతో నిమిత్తం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నది ప్రభుత్వ షరతు. దీన్నినా గట్టిగా అమలు చేస్తున్న కారణంగా చైనాలో మైక్ట్రోసాఫ్ట్‌ సేవలు, వాటికి రక్షణ ఇతర దేశాలకు భిన్నంగా ఉంటుంది.స్వంత హార్డ్‌వేర్‌, 360 వంటి భద్రతా సాప్ట్‌వేర్‌లతో అవి పని చేస్తాయి.మిగతా ప్రపంచం మాదిరి చైనా సంస్థలు మైక్రోసాఫ్ట్‌కు బదులు తమ స్వంత అలీబాబా, టెన్సెంట్‌,హువెరు వంటి సంస్థల సేవలనే వినియోగించుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్‌తో పనిచేసే అంతర్జాతీయ గ్రూపు హౌటళ్లను నిర్వహిస్తున్న షెరటన్‌, మారియట్‌, హయత్‌ వంటి సంస్థల నుంచి వివరాలు తెలుసుకొనేందుకు చూస్తే వీలు కాలేదని చైనా నెటిజన్లు చెప్పారు.ఇటీవలి కాలంలో చైనాలో విదేశీ ఐటి వ్యవస్థలను వదిలించుకొని దేశీయ నెట్‌వర్క్‌లను వినియోగించుకోవటం పెరుగుతోంది.సమాంతర వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా ఉత్పత్తుల మీద ఆధారపడటం లేదు. క్రౌడ్‌ స్ట్రయిక్‌ ఉత్పత్తులను అక్కడ వాడటం లేదు గనుక తప్పించుకుంది. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఇతర దేశాలన్నీ అమెరికా కంపెనీల మీద ఆధారపడిన కారణంగా దెబ్బతిన్నాయి. ఒక వేళ వాటి ఉత్పత్తుల కారణంగా నష్టం జరిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నది తాజా ఉదంతం నేర్పిన పాఠం. ఇటీవలఅమెరికాతో సహా కొన్ని దేశాలు సైబర్‌దాడులకు సిద్దం అవుతున్నాయి. తాడిని తన్నేవాడుంటే వాడి తలతన్నేవాడు వస్తాడని వేరే చెప్పనవసరం లేదు.

బిజెపి క్రమశిక్షణ నేతి బీరలో నెయ్యి : మఠం దారిలో యోగి ఆదిత్యనాథ్‌, పావులు కదుపుతున్న మో-షా !!

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి దిమ్మతిరిగింది. గుండెకాయ వంటి ఉత్తర ప్రదేశ్‌లో చెప్పుకోలేని చోట దెబ్బ తగిలింది. దీంతో పార్టీలో చదరంగం, వైకుంఠపాళీ క్రీడలు ప్రారంభమయ్యాయి. దీన్ని అవకాశంగా తీసుకొని సమాజవాది పార్టీ తన తురుపు ముక్కను ప్రయోగించింది. ఎవరైనా వంద మంది ఎంఎల్‌ఏలతో బిజెపి నుంచి వెలుపలికి వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తామని, ఇది వర్షాకాల ధమాకా అని ప్రతిపక్ష నేత అఖిలేష్‌ యాదవ్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఆ రాష్ట్రంలోని 80లోక్‌సభ స్థానాలకు గాను బిజెపికి 2014లో 72, గత ఎన్నికల్లో 62రాగా ఇప్పుడు 33కు పడిపోయాయి. సమాజవాది పార్టీకి 37,దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు ఆరు స్థానాలు వచ్చాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. యోగిని తప్పించి తిరిగి గోరఖ్‌పూర్‌ మఠానికి పంపేందుకు నరేంద్రమోడీ, అమిత్‌ షా పూనుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. రకరకాల కథనాలను ప్రచారంలో పెట్టారు. మరోవైపు పార్టీ, ప్రభుత్వం మొత్తం తన వెనుకే ఉందని చూపేందుకు యోగి వరుసగా సమావేశాలు జరుపుతూ బల ప్రదర్శనకు పూనుకున్నారు.బిజెపి స్వయం ప్రకటిత నిబంధనల ప్రకారం 75 సంవత్సరాలు దాటిన వారు ముఖ్యమైన పదవుల్లో ఉండకూడదు.ఆ సాకుతో అద్వానీని ప్రధాని పదవికి దూరంగా పెట్టారు. ఇప్పుడు నరేంద్రమోడీ వంతు వచ్చింది. ఆ స్థానంలో తదుపరి యోగి ఆదిత్యనాధ్‌ ఉంటారని ఒక ప్రచారం కాగా నితిన్‌ గడ్కరీ పేరు మరోవైపు నుంచి వినిపిస్తున్నది. అమిత్‌ షా ప్రయత్నం సరేసరి. తన పుట్టుక మామూలుగా జరగలేదని, దైవాంశతో జన్మించిన కారణంగానే తనకు శక్తి వస్తున్నదంటూ వయస్సు వచ్చినా గద్దె దిగేది లేదన్నట్లు మోడీ తెగేసి చెప్పారు. ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్‌ ఓటమికి యోగిని బాధ్యుడిగా చేసి ఒకవేళ ప్రధానిగా అమిత్‌ షాకు అవకాశం వస్తే అడ్డుతొలిగించుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని చూస్తున్నట్లుకూడా చెబుతున్నారు. దేన్నీ కాదనలేని స్థితి. మొత్తం మీద మిగతా పార్టీలకూ బిజెపికీ పెద్ద తేడాలేదని జనాల కళ్లు తెరిపిస్తున్నారు.


ఇతర పార్టీల వ్యవహారాల్లో వేలుపెట్టి కెలుకుతున్న బిజెపి నేతలు ఇప్పుడు స్వంత పార్టీలోనే చేస్తున్నారని అఖిలేష్‌ యాదవ్‌ ఊరికే అనలేదు. ఉత్తర ప్రదేశ్‌లో అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌తో సహా అనేక కీలక నియోజకవర్గాలలో బిజెపి మట్టికరచింది. నరేంద్రమోడీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో గతంలో వచ్చిన మెజారిటీ 4.79లక్షల నుంచి 1.52లక్షలకు దిగజారింది. తమను ఓట్ల రొంపిలోకి లాగటం ఏమిటని అటు రాముడు, ఇటు కాశీ విశ్వనాధుడు కన్నెర్ర చేసినట్లు స్పష్టమైంది. అంతా మీరే చేశారు, అన్నింటికీ మీరే కారణం అన్నట్లుగా ఓటమి కారణాలను యోగి మీదకు నెట్టేందుకు పావులు కదుపుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తన ప్రమేయం లేదని యోగి చెబుతున్నారు. నిజానికి యోగి పేరుకు సర్వసంగ పరిత్యాగి తప్ప అతగాడి వెనుక బలమైన రాజపుత్ర ఠాకూర్‌ సామాజిక తరగతి ఉంది. ఓసిలలో బ్రాహ్మణులు, యాదవుల తరువాత ఎనిమిది శాతంతో వీరిదే పెద్ద సంఖ్య. ఆర్థికంగా బలమైన తరగతి. బ్రాహ్మణులు-ఠాకూర్ల మధ్య వైరం ఎప్పటి నుంచో ఉంది. నరేంద్రమోడీ ఈ సామాజిక తరగతులను పక్కన పెట్టి వెనుకబడిన తరగతులను ముందుకు తెచ్చి తనదైన ఓటు బాంకు ఏర్పాటుకు పూనుకున్నారు. నిజానికి ఈ రాష్ట్ర బిజెపిలో ఎప్పటి నుంచో కుమ్ములాటలు ఉన్నాయి.లోక్‌సభ ఎన్నికల తరువాత యోగిని ఇంటికి పంపుతారన్న ప్రచారం ముందే ఉంది. మూడోసారి మోడీ గెలిస్తే యోగికి మూడినట్లే అనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఎన్నికలలో చావు దెబ్బతినటంతో యోగి వ్యతిరేకులకు, అనుకూలురకు కూడా మంచి ఊపు వచ్చింది. బిజెపిలో కించపరిచే పదజాలం ఒక్క ముస్లింలకే పరిమితం కాదు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నియోజకవర్గ అభ్యర్థి, కాబినెట్‌ మంత్రి పురుషోత్తం రూపాలా రాజపుత్రుల మీద విరుచుకుపడ్డారు. రోటీ బేటీ కా సాత్‌ – రాజపుత్రులు బ్రిటీష్‌ వారికి వారి కుమార్తెలనిచ్చి వివాహాలు చేశారని, బ్రిటీష్‌ వారితో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. ఇది గుజరాత్‌తో పాటు ఉత్తర భారతంలో రాజపుత్రులున్న చోటల్లా వారికి కాలింది. మధ్య ప్రదేశ్‌లో ఠాకూర్లను పక్కన పెట్టినట్లుగానే ఉత్తర ప్రదేశ్‌లో వికె సింగ్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌ వంటి కీలక నేతలను ఇంటికి పంపారు. రక్షణ మంత్రిగా ఉన్నప్పటికీ రాజనాధ్‌ సింగ్‌ను కూడా పక్కన పెట్టినట్లుగానే భావిస్తున్నారు. ఆ కారణంగానే ఎక్కడా పెద్దగా మాట్లాడరు. ఆగ్రహంతో ఉన్న ఠాకూర్లను బుజ్జగించేందుకు అధిష్టానం ఇప్పుడు రాజనాధ్‌ను ఎంచుకుందని వార్తలు వచ్చాయి. వారిని సంతుష్టీకరించే ప్రక్రియలో భాగంగా అమిత్‌ షా ఇప్పటికే కొందరు నేతలతో రహస్యమంతనాలు జరిపారు. ఠాకూర్లలో పలుకుబడి కలిగిన రాజా భయ్యాను చేరదీసి వారిలో చీలిక తెచ్చి ఠాకూర్లను విస్మరించలేదనే సందేశంతో యోగికి పోటీ నేతగా ముందుకు తెచ్చే ఎత్తుగడ దీనిలో ఉంది. ఈ పరిణామం మీద ఆ సామాజిక తరగతి ఎలా స్పందించేదీ చూడాల్సి ఉంది. దీంతో యోగిని సాగనంపటం ఎలా అన్నది ఆసక్తికరంగా మారింది.
శాసనసభలో పది స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.వాటిలో మిత్రపక్షాలకు ఒక్కటి కూడా ఇవ్వకుండా బిజెపి ఒక్కటే బరిలో ఉండాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. వీటిలో ఐదు స్థానాలు సమాజవాది పార్టీ, నాలుగు బిజెపి, ఒకటి ఆర్‌ఎల్‌డి గతంలో గెలిచినవే.వీటిలో బిజెపి దెబ్బతింటే దానికి బాధ్యత యోగీదే అని చెప్పేందుకు ప్రత్యర్ధులు సిద్దం అవుతున్నారు. ఇటీవల ఏడు రాష్ట్రాల్లో జరిగిన 13 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పది చోట్ల ఇండియా కూటమి గెలిచింది. ఉత్తర ప్రదేశ్‌లో ఓటమికి యోగి కంటే ప్రధానిగా నరేంద్రమోడీ ఎక్కువగా ఎక్కువగా బాధ్యత వహించాలి.చివరకు తన మెజారిటీ తగ్గటానికి కూడా వేరే వారిని నిందిస్తే కుదరదు. యోగి ఒక్కరే సర్వస్వం కాదు అన్న సందేశం ఇచ్చేందుకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను అధిష్టానం నియమించింది. ప్రతి చిన్న విషయాన్ని ప్రధాని కార్యాలయం నియంత్రిస్తోందనే విమర్శలూ ఉన్నాయి. రాష్ట్ర డిజిపి నియామకంలో తనకు ఇష్టమైన వారిని ఎంచుకొనేందుకు యోగికి అవకాశం ఇవ్వటం లేదు.తొలిసారి అధికారానికి వచ్చినపుడు ఎంతో వత్తిడితో ఒకరిని నియమించినా తరువాత నలుగురు తాత్కాలిక డిజిపిలు తప్ప శాశ్వత నియామకాలు లేవు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో కూడా అదే జరిగింది.మంత్రివర్గం నుంచి యోగి అనుకూల సూర్య ప్రతాప షాహిని తొలగించి వ్యతిరేకిగా ఉన్న శివ ప్రతాప శుక్లాకు కట్టబెట్టారు. ఒక విధంగా యోగిని పొమ్మనకుండా పొగబెట్టారు.రెండవసారి గెలిచిన తరువాత కూడా అదే జరిగింది. తీవ్రంగా వ్యతిరేకించినా ఇద్దరిని మంత్రులుగా చేర్చారు. వారిలో ఒకరు ఉప ఎన్నికలో ఓడిన తరువాత సమాజవాది పార్టీలో చేరారు. ప్రస్తుతం ఇద్దరిలో ఒకరైన ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్యకు మోడీ, షా మద్దతు ఉందని, అందువల్లనే ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదని తాజాగా ధ్వజమెత్తినట్లు చెబుతున్నారు.పార్టీ కార్యకర్తల బాధ తనకు తెలుసునని మౌర్య అనటాన్ని యోగి మద్దతుదార్లు తప్పుపడుతున్నారు. అతను ఉపముఖ్యమంత్రి కాదా ? కార్యకర్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదా ?అది చేయకుండా ప్రతికూల ప్రచారం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.


తన పదవికి ఎసరు పెడుతున్నారని గ్రహించిన యోగి జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు.ఇంతవరకు ఎక్కడా బహిరంగంగా ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు.తన అనుచరులను రంగంలోకి దించారు. ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదన్న కేశవ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యపై వెంటనే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పార్టీ నేత సునీల్‌ భరాలా స్పందించారు.” ఎన్నికలలో ఎదురుదెబ్బలు, ఓటమికి పార్టీయే కారణమని గౌరవనీయ ఉపముఖ్యమంత్రి కెపి మౌర్య వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.కనుక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నష్టాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలి ” అని ఎక్స్‌ ద్వారా డిమాండ్‌ చేశారు. ఈ పోస్టును తొలగించేందుకు బిజెపి కేంద్ర పెద్దలు తెచ్చిన వత్తిడికి ఇప్పటివరకైతే భరాలా లొంగలేదు. గతంలో పార్టీ ఓడినపుడు కల్‌రాజ్‌ మిశ్రా, వినరుకతియార్‌ రాజీనామా చేశారని కూడా గుర్తుచేశారు. బిజెపి మురికివాడల విభాగపు జాతీయ కన్వీనర్‌గా భరాలా ఉన్నారు.ఇలాంటి వారు అనేక మంది యోగి కనుసైగల కోసం ఎదురు చూస్తున్నారు. తన అనుచరులకు సీట్లు ఇవ్వకపోతే ఏం చేస్తానో చూడండి అన్నట్లుగా యోగి చూపారు. ఆయన కనుసన్నలలో నడిచే హిందూ యువ వాహిని స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఉప ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు వస్తే తనపై వేటు పడుతుందని గ్రహించిన యోగి ఆ నియోజకవర్గాలకు 16 మంది మంత్రులను కేటాయించారు. ఎన్నికలు ముగిసేవరకు వారంలో రెండు రోజులు మంత్రులు అక్కడే మకాం వేయాలని ఆదేశించారు. గెలిస్తే తన ప్రతిభ లేకపోతే మంత్రులు సరిగా పనిచేయలేదని చెబుతారు.


ఆకస్మికంగా ప్రభుత్వం మీద జనాలకు ఆగ్రహం కలిగేందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటంటూ బిజెపి ఎంఎల్‌సి దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సిఎంకు లేఖ రాశారు.రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నందున కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకోవాలన్న ఎంఎల్‌ఏ రమేష్‌ మిశ్రా వీడియో వైరల్‌ అవుతోంది.బిజెపి మిత్ర పక్షం నిషాద్‌ నేత సంజరు నిషాద్‌ కూడా యోగిపై ధ్వజమెత్తారు.బుల్డోజర్లను మాఫియాలు, భూ కబ్జాదారులపై ప్రయోగించాలి తప్ప తగిన పత్రాలు లేని పేదల ఇండ్లు కూల్చివేతకు ఉపయోగించరాదని, అలా చేస్తే ఎన్నికల్లో మనలను ఓడించేందుకు వారు సంఘటితం అవుతారని, అనేక ఉదంతాలలో అధికారులు అలాంటి కూల్చివేతలకు పాల్పడ్డారని అన్నారు. అతి విశ్వాసం, ఓట్ల బదిలీ మన అంచనాలను దెబ్బతీశాయి. గతంలో ప్రతిపక్షం వెంటిలేటర్‌ మీద ఉంది, ఇప్పుడు కొంత ప్రాణవాయువు తీసుకుంటున్నదని ఆదిత్యనాథ్‌ చెప్పారు.ఫైజాబాద్‌(ఆయోధ్య ఉన్న నియోజకవర్గం) వంటి గట్టి ప్రాంతాల్లో ఓడిపోవటానికి కొన్ని కులాలు దూరం కావటమే కారణం, ఓబిసి కులాల,దళితుల మద్దతు తిరిగి పొందాలంటే ఓబిసి నేత, ఉపముఖ్యమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఉన్న మౌర్యకు పెద్ద పదవి ఇవ్వాల్సి ఉంటుందని యోగి వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.ప్రధాని నరేంద్రమోడీ కొన్ని రౌండ్లలో వెనుకబడిన తీరు చూస్తే నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కొట్టుకుపోయినట్లు ఎంతవారైనా ఓడిపోకతప్పదు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో పది స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని, తరువాత యోగికి ఉద్వాసన ఖాయమని చెబుతున్నారు.అధికారం అందరినీ కలిపి ఉంచుతుంది. దానికి ముప్పు సూచనలు కనిపిస్తే అసలు రంగు తెలుస్తుంది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌ బిజెపిలో జరుగుతున్న పరిణామాలు దీన్నే వెల్లడిస్తున్నాయి.

నరేంద్రమోడీ ఫైల్స్‌ అట్టర్‌ ఫ్లాఫ్‌ : అప్పుల కుప్పలు, ఉత్పత్తిలో కాదు ఉత్తుత్తి కబుర్లలో చైనాతో పోటీ !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


వచ్చే ఏడాది 2025 మార్చి నెలాఖరుకు మన వస్తు, సేవల ఎగుమతులు 800 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బరత్‌వాల్‌ తాజాగా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరలో 778.2బి.డాలర్లు ఉన్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి మూడు మాసాలలో 200బి.డాలర్ల మేర ఎగుమతులు జరిగినందున ఇదే ధోరణి మిగిలిన తొమ్మిది మాసాల్లో కూడా కొనసాగుతాయన్నది ఆశాభావం మాత్రమే. దిగుమతులు వెయ్యి బిలియన్‌ డాలర్లకు మించే ఉంటాయని కూడా చెప్పవచ్చు. గడచిన పది సంవత్సరాలలో ట్రైలర్‌ మాత్రమే చూపానని అసలైన సినిమా తరువాత ఉంటుందని నరేంద్రమోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా సినీ ప్రేక్షకులను ట్రైలర్లతో ఆకట్టుకొనేందుకు చూస్తారు. ఈ రీత్యా చూసినపుడు ట్రైలర్‌ చూసిన తరువాత జనానికి నచ్చని కారణంగానే లోక్‌సభలో స్వంతంగా మెజారిటీని తెచ్చుకోలేకపోయారు. కూటమిగా కూడా నాలుగు వందల సీట్లకు చాలా దూరంలో ఉన్నారు. ఇక నరేంద్రమోడీ ఫైల్స్‌ అనే సినిమాలో అనేక అంశాలు ఉన్నాయి. ముందుగా విదేశీ అప్పుల గురించి చూద్దాం.
మోడీ గద్దె నెక్కిన 2014లో మన విదేశీ అప్పులు 446.2బిలియన్‌ డాలర్లు. మోడీ కొత్త అప్పులు చేయలేదు, పాత అప్పులు తీర్చారంటూ భక్తులు గొప్పగా దైవాంశ సంభూతుడి మహిమల గురించి ప్రచారం చేశారు.కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 2024 మార్చినెలలో వెల్లడించిన సమాచారం ప్రకారం 2023 డిసెంబరు ఆఖరుకు 648.2బిలియన్‌ డాలర్ల విదేశీ అప్పు ఉంది. అంటే రెండు వందల బిలియన్‌ డాలర్లు పెరిగింది. పాత అప్పు తీర్చితే బకాయి తగ్గాలి, కానీ పెరిగిందంటే కొత్త అప్పులు చేసినట్లే కదా ! దీనికి బాధ్యులెవరు ? మన విదేశీ మారక ద్రవ్య నిల్వ ప్రస్తుతం 657 బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ఉన్నాయి. ఇవి అప్పులకు సరిపోతాయి. మోడీ అధికారానికి వచ్చిన తొలి ఏడాది మన విదేశీ వాణిజ్య లోటు 137 బిలియన్‌ డాలర్లు కాగా తాజాగా నెలకు ఇరవై బిలియన్‌ డాలర్లకు అటూ ఇటూగా ఉంది, అంటే 240బి.డాలర్లు. లోటు తగ్గించలేకపోతే మానే పెత్తనంలో పెంచకూడదనుకుంటారు, కానీ దాదాపు రెట్టింపుకు దగ్గరగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల శాఖ సమాచారం మేరకు 2023-24లో మన వాణిజ్యలోటు 238 బిలియన్‌ డాలర్లు.దీనిలో మూడోవంతుకు పైగా 85.09బి.డాలర్లు చైనాకే సమర్పించుకున్నాం, కొన్ని వస్తువులను హాంకాంగ్‌ ద్వారా చైనా ఎగుమతులు చేస్తున్నది కనుక దానితో ఉన్న 12.21 బి.డాలర్లను కూడా కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది. మన విదేశీ మారక నిల్వలు అప్పులకు సరిపడా ఉన్నాయి. ఎగుమతులతో వచ్చే రాబడి దిగుమతులకు చాలటం లేదు, దేశం ముందుకుపోతున్నట్లా వెనక్కు నడుస్తున్నట్లా ? చివరకు లాటిన్‌ అమెరికా దేశాల మాదిరి అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందా ? విదేశాల్లో ప్రతిష్ట, పలుకుబడి, మార్కెట్లను పెంచానంటారు తప్ప అది దేవతా లేదా మాయవస్త్రంలా మామూలోళ్లకు కనిపించటం లేదు.


మాక్రోట్రెండ్స్‌ నెట్‌ సమాచారం ప్రకారం 1970లో ఎనిమిది బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ అప్పు నూతన ఆర్థిక విధానాలను అమల్లోకి తెచ్చిన 1990నాటికి 83బి.డాలర్లకు చేరింది. తరువాత పదేండ్లకు 101, 2010 నాటికి 290, నరేంద్రమోడీ అధికారానికి వచ్చేనాటికి 457 బి.డాలర్లకు చేరింది. అప్పటి నుంచి ఐఎంఎఫ్‌ తాజా విశ్లేషణ ప్రకారం 2024 మార్చి నాటికి 681, మరుసటి ఏడాది మార్చికి 748 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది.ఈ సంవత్సరాలలో వార్షిక అప్పు పెరుగుదల శాతాల్లో ఎగుడుదిగుళ్లు ఉండవచ్చు తప్ప మొత్తంగా చూసినపుడు పెరుగుదల ధోరణే ఉంది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ దేశీయ రుణ భారం 58.6లక్షల కోట్ల నుంచి 156.6లక్షల కోట్లకు 174శాతం పెరిగింది.కరోనా కారణంగా ఇంత అప్పు చేశాము, ఉచితంగా వాక్సిన్లు వేశాము అని బిజెపి పెద్దలు చెప్పవచ్చు. ఇన్ని లక్షల కోట్లు దానికే తెచ్చారా ? బడ్జెట్‌ పత్రాల్లో పేర్కొన్నదాని ప్రకారం 2024 మార్చి నాటికి దేశీయ అప్పు రు.164లక్షల కోట్లు, విదేశీ అప్పు 5లక్షల కోట్లు మొత్తం కలిపితే రు.169లక్షల కోట్లకు, 2025 మార్చి ఆఖరుకు 184లక్షల కోట్లకు చేరనుంది.


మన ఎగుమతుల తీరుతెన్నులను చూద్దాం. సిఎంఐఇ సేకరించిన సమాచారం ప్రకారం మన ఎగుమతుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో చూద్దాం. బాగా పలుకుబడి పెరిగిందని చెప్పుకున్న కారణంగా జనం రెండోసారి అధికారాన్ని కట్టబెట్టారు. సంవత్సరాల వారీ మొత్తం ఎగుమతుల్లో వస్తువుల శాతాలు ఇలా ఉన్నాయి.
వస్తువులు×××××××2019-20×2020-21×2021-22×2022-23×2023-24
చమురు ఉత్పత్తులు××× 13.2 ××× 8.8 ××× 16.0 ××× 21.6 ××× 19.3
చమురేతర ఉత్పత్తులు×× 86.8 ××× 91.2 ×× 84.0 ××× 78.4 ××× 80.7
వ్యవసాయ ఉత్పత్తులు×× 11.2 ××× 14.2 ×× 11.8 ××× 11.6 ××× 11.0
ఖనిజ ఉత్పత్తులు ×××× 01.5 ××× 02.4 ×× 01.4 ××× 01.1 ××× 01.5
పారిశ్రామికవస్తువులుు×× 73.0 ××× 73.5 ×× 69.8 ×× ×64.3 ××× 66.8
ఎగువన ఉన్న వివరాలు చెబుతున్నదేమిటి ? కరోనా సమయంలో పెద్దగా చర్చ లేకుండా ఎవరూ వ్యతిరేకించరనే ఎత్తుగడతో మూడు సాగు చట్టాలను తీసుకువచ్చినపుడు రైతులకు చెప్పిందేమిటి ? మన వ్యవసాయ ఉత్పత్తులకు పెద్గగా మార్కెట్‌ను పెంచాం, నేరుగా ఎక్కడికైనా ఎగుమతులు చేసుకొనేందుకు వీలుగా ఈ చట్టాలను తీసుకువచ్చామని చెప్పారు.కానీ మన ఉత్పత్తులకు మోడీ చెప్పినంత మార్కెట్‌, ఎగుమతి అవకాశాలు లేని కారణంగానే ఎదుగూబొదుగూ లేకపోవటం లేదా గిడసబారిన తీరు కనిపిస్తోంది.ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ఎగుమతులను పెంచామని తమ జబ్బలను తామే చరుచుకుంటారు. మొత్తం ఎగుమతుల్లో అవి 4.1 నుంచి ఐదేండ్లలో 7.1శాతానికి పెరిగాయి. ఇదే సమయంలో మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఎగుమతుల ప్రోత్సాహక పథకం వంటి కబుర్లు ఎన్ని చెప్పినా మొత్తం పారిశ్రామిక వస్తువుల ఎగుమతుల వాటా తగ్గుతోంది.మనం ముడి చమురును దిగుమతి చేసుకొని దాన్నుంచి ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేయటం ఒక్కటే పెరుగుతోంది.అది కూడా రష్యా నుంచి చౌకగా దిగుమతులు చేసుకొని ఎగుమతులు పెరిగినందున ఆ మేరకు ఉంది. చమురుకు విదేశాల మీద ఆధారపడటం తగ్గించాలని గద్దెనెక్కగానే చెప్పారు. స్వదేశీ ఉత్పత్తి పెంచుతామన్నారు.2014-15లో మొత్తం దేశీయ ముడిచమురు ఉత్పత్తి 37.46మిలియన్‌ టన్నులు కాగా అదేమి దరిద్రమో పదేండ్లలో 30మి.టన్నులకు పడిపోయింది.దీనిలో 22.6 మిలియన్‌ టన్నులు పనికిరాని వంటూ నిత్యం ఆడిపోసుకొనే ప్రభుత్వ రంగ సంస్థలే చేస్తున్నాయి.రిలయన్స్‌ వంటి ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించేందుకు వాటిని కూడా సరిగా పని చేయనివ్వకుండా చేస్తున్నందున వాటి ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కిందా అంటే ప్రయివేటు కంపెనీలు పొడిచిందేమీ లేదు.


చైనా వృద్ధి రేటు భారత్‌ కంటే ఎంతో తక్కువగా ఉందని,రియలెస్టేట్‌ రంగం సంక్షోభంలో పడిందని, మొత్తం ఆర్థిక వ్యవస్తే కుప్పకూలిపోనుందన్నట్లుగా రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. జూన్‌ మాసంలో మన ఎగుమతులు 2.5శాతం పెరగ్గా, దిగుమతుల వృద్ధి రేటు ఐదు శాతం ఉన్నట్లు వెల్లడించిన తరుణంలోనే చైనా గురించి కూడా వార్తలు వచ్చాయి. రాయిటర్స్‌ విశ్లేషణ ప్రకారం జూన్‌లో చైనా ఎగుమతులు అంచనాలకు మించి జరగ్గా దిగుమతులు తగ్గాయి. ఇలా జరగటం అంటే స్థానిక డిమాండ్‌ తగ్గటం ఆందోళన కలిగించే పరిణామం, గిరాకీని పెంచాలంటే ఉద్దీపన పథకాలను అమలు జరపాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. గడచిన పదిహేను మాసాల్లో ఎగుమతులు జూన్‌లో వేగంగా పెరిగినట్లు కూడా ఆ వార్త పేర్కొన్నది. ప్రపంచంలో డిమాండ్‌ పెరిగిన కారణంగా చైనా ఎగుమతులు 8.6శాతం పెరిగినట్లు జపాన్‌ ఆసియా నికీ డాట్‌కామ్‌ పేర్కొన్నది. చైనా వస్తువుల దిగుమతులను అడ్డుకొనేందుకు అనేక దేశాలు భారీ మొత్తాలలో దిగుమతి పన్నులను విధించినప్పటికీ ఈ పెరుగుదల ఉంది. ఇదే సమయంలో మన వస్తువుల మీద అలాంటి పన్నులు లేకున్నా ఎగుమతులు 2.5శాతానికే ఎందుకు పరిమితం అయినట్లు ? చైనా దిగుమతులు తగ్గినందున గిరాకీ పెంచేందుకు ఉద్దీపన ప్రకటించాలని కోరుతున్నవారు విదేశీ కార్పొరేట్ల ప్రతినిధులు తప్ప వేరు కాదు. స్వదేశీ వస్తు వినియోగం తగ్గితే ఆందోళన చెందాలి లేదా పెంచటానికి ప్రోత్సాహకాలు ఇస్తే ఏ దేశానికైనా లాభం, గిరాకీ పెరిగితే పరిశ్రమలు పని చేస్తాయి, కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, జనాలకు రాబడి పెరిగితే గిరాకీ పెరుగుతుంది తప్ప విదేశీ వస్తువులకు రాయితీలు ఇస్తే ఆయా దేశాల పరిశ్రమలకు, కార్మికులకు లబ్ది ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్నది అదే.అయితే చైనా దిగుమతుల్లో మూడో వంతు పరికరాలు తిరిగి ఎగుమతి చేసేందుకు ఉద్దేశించిన విడి భాగాలే. ఈ రీత్యా చైనాకు సమస్యలొస్తే వాటిని ఎగుమతి చేసే దేశాలకూ వచ్చినట్లే. కనుక అవి కూడా చైనాతో సంబంధాలను పునరాలోచించుకోవాలి. ఇతర దేశాల ఆంక్షల కారణంగా దిగుమతులకు అవకాశం లేని సెమీ కండక్టర్ల వంటి వాటిని చైనా స్వయంగా తయారు చేసుకోవటం కూడా ప్రారంభించింది. తొలి ఆరు నెలల కాలంలో చైనా ఎగుమతులు 3.6శాతం పెరిగి 1.71లక్షల కోట్ల డాలర్లకు, దిగుమతులు రెండుశాతం పెరిగి 1.27లక్షల కోట్ల డాలర్లకు చేరాయి. వాణిజ్య మిగులు 435బిలియన్‌ డాలర్లు. మన అధికారులు చెప్పినట్లు మొత్తం ఎగుమతులు 800బిలియన్‌ డాలర్లకు పెరిగినప్పటికీ అది చైనా వాణిజ్య మిగులు కంటే తక్కువే.అమెరికా వంటి వ్యతిరేక దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచుకోవటం కంటే అదిరించి బెదిరించి తమ వస్తువులను కొనిపించాలని లేదా చైనాను ఎలా దెబ్బతీయాలా అన్నదాని మీదే ఎక్కువ కేంద్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. అనేక దేశాలు రక్షణాత్మక చర్యలకు పూనుకున్నాయి. చైనా వస్తువుల మీద అవి కేంద్రీకరిస్తున్నప్పటికీ అంతిమంగా ఇతర దేశాల మీద కూడా ఆంక్షలకు పూనుకుంటాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనంతీసుకున్న నిర్ణయాల గురించి అనేక దేశాలు ఎదురు చూస్తున్నాయి.


అధికారానికి వచ్చినప్పటి నుంచీ చైనాను అధిగమిస్తామని, దేశాన్ని ప్రపంచ ఫ్యాక్టరీగా మారుస్తామని నరేంద్రమోడీ చెబుతూనే ఉన్నారు. పదేండ్లలో ఒక్క ఏడాదైనా వాణిజ్య మిగులును సాధించలేకపోయారు.మోడీకి పొగడ్తలు తప్ప మన వస్తువులకు మార్కెట్‌లేదు. దిగుమతులు పెరిగినప్పుడు తమ ఘనతే, దేశంలో కొనుగోలు శక్తి పెరగటానికి నిదర్శనం అంటారు.ఎప్పుడైనా తగ్గితే చూశారా దిగుమతుల మీద ఆధారపడటం తగ్గించాం, విజయం కాదా అంటారు. వాణిజ్య విషయాలకు వస్తే 2022-23తో పోలిస్తే వస్తు ఎగుమతులు 451 నుంచి 437 బి.డాలర్లకు తగ్గగా సేవలు 325 నుంచి 339బి.డాలర్లకు పెరిగాయి.దిగుమతులు 752 నుంచి 677 బి.డాలర్లకు, సేవలు 182 నుంచి 177 బి.డాలర్లకు తగ్గాయి. జిడిపిలో ఐదవ స్థానానికి చేర్చటం తమ ఘనత అని, త్వరలో మూడో స్థానానికి తీసుకుపోతాం అని చెప్పుకుంటున్న మోడీ బృందం వస్తు ఎగుమతుల్లో ఎక్కడ ఉందో ఎందుకు చెప్పదు. గత పది సంవత్సరాల్లో ప్రపంచంలో 19 నుంచి 17వ స్థానానికి ఎగబాకింది. మొదటి స్థానంలో ఉన్న చైనా 3,380 బిలియన్‌ డాలర్ల మేర 2023లో ఎగుమతి చేయగా మనం 432బి.డాలర్ల దగ్గర (స్టాటిస్టా సమాచారం) ఉన్నాం. చివరకు చైనా ఏలుబడిలో 70లక్షలకు పైగా జనాభా ఉన్న హాంకాంగ్‌ 573బి.డాలర్లతో పదవ స్థానంలో ఉంది.చైనాతో పోటీ పడాల్సిందే ! దేనిలో, ఉత్పత్తిలో తప్ప ఉత్తుత్తి కబుర్లలో కాదు !!

హత్యాయత్నం ట్రంప్‌కు కలసివచ్చింది : అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు ఎవరి నుంచి ?

Tags

, , , , , ,



ఎం కోటేశ్వరరావు


” అమెరికా మీద దాడి జరుగుతోంది, ముట్టడిలో ఉంది, ప్రజాస్వామ్యాన్ని హతమార్చేందుకు చూస్తున్నారు.చీకటి అధ్యాయానికి నాంది ” మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హత్యాయత్నంపై వెలువడిన తక్షణ వ్యాఖ్యలివి.అతగాడు ప్రాణాపాయం నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు.శనివారం నాడు అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్‌ అనే పట్టణంలో ఎన్నికల సభలో ప్రసంగిస్తుండగా ఒక దుండగుడు జరిపిన కాల్పులో ట్రంప్‌కు కుడి చెవి దగ్గర బుల్లెట్‌ గాయం తగిలింది.దుండగుడి కాల్పుల్లో సభికుల్లో ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హంతకుడిని వెంటనే భద్రతా దళాలు కాల్చి చంపాయి. సభ సమీపంలోని ఒక భవనంపై మాటువేసి కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. ఈ ఉదంతం తరువాత అమెరికా రాజకీయాలు, ఎన్నికల్లో ఏం జరగనుందనే చర్చ మొదలైంది.దీనికి ముందు డెమోక్రటిక్‌ అభ్యర్ధి జోబైడెన్‌ వృద్దాప్యం గురించి, పోటీ నుంచి తప్పుకొని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ లేదా మరొకరికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. హత్యాయత్నంతో సానుభూతి తలెత్తి ట్రంప్‌ విజయావకాశాలు మెరుగుపడినట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో పార్టీల నేతలు, ఎన్నికల్లో అభ్యర్థులపై ౖ జరిగేదాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఎన్నికల్లో ప్రత్యర్థి జో బైడెన్‌ వెంటనే ఖండించాడు. ట్రంప్‌పై దాడిని వివిధ దేశాల నేతలు ఖండించారు. దుండగుడు ఇరవై ఏండ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారుగా నమోదై ఉన్నాడు. గతంలో డెమోక్రటిక్‌ పార్టీకి విరాళం ఇచ్చిన దాఖలా కూడా వెల్లడైంది. ఎందుకు కాల్పులు జరిపాడో వెంటనే తెలియలేదు. క్రూక్స్‌కు తొలిసారిగా ఓటు హక్కు వచ్చింది. తాను ట్రంప్‌ను, రిపబ్లికన్‌ పార్టీని కూడా వ్యతిరేకిస్తున్నట్లు అతడు చెప్పాడన్న వార్తలు కూడా వచ్చాయి. కేవలం ఈ మాత్రానికే దాడికి పాల్పడతాడా ? దీని వెనుక డెమోక్రటిక్‌ పార్టీ,ట్రంప్‌ మరోసారి అధికారానికి రాకూడదని కోరుకుంటున్న ప్రభుత్వంలోని వారు, రష్యా, చైనా, ఇరాన్‌, ఉత్తర కొరియా దేశాల హస్తం ఉండవచ్చా అనే సందేహాలను కూడా కొందరు లేవనెత్తినట్లు చెబుతున్నారు. దుండగుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొన్నది.ఉగ్రవాదం నుంచి కూడా పెట్టుబడిదారులు ఎలా లాభాలు పొందుతారో ట్రంప్‌పై కాల్పుల ఉదంతం వెల్లడించింది. ఈ ఉదంతం తరువాత ట్రంప్‌ మీడియా మరియు టెక్నాలజీ గ్రూపు కంపెనీల వాటాల ధరలు సోమవారం నాడు 55శాతం పెరిగాయి, ఒక దశలో 71శాతాన్ని తాకాయి. ఈ కారణంగా ట్రంప్‌ సంపద విలువ ఒక్క రోజులోనే రెండు బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఈ కంపెనీ ట్రంప్‌ సామాజిక మాధ్యమ ప్రచారాన్ని నిర్వహించే ట్రూత్‌ సోషల్‌ వేదికను కూడా నిర్వహిస్తున్నది. అనేక కంపెనీల వాటాల ధరలు కూడా పెరిగాయి. దీని అర్దం ఏమిటి ? ట్రంప్‌ ఎన్నిక అవకాశాలు పెరిగినట్లు పెట్టుబడిదారులు భావించటమే దీనికి కారణం. ట్రూత్‌ సోషల్‌ను అనుసరించే వారు కూడా గణనీయంగా పెరగటంతో నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ రానున్న రోజుల్లో లాభాల బాట పట్టినట్లే. తుపాకులు, తూటాలు తయారు చేసే కంపెనీల వాటాల ధరలు కూడా పెరిగాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధిగా డోనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్ష అభ్యర్థిగా ” ఆంధ్రా అల్లుడు ” జెడి వాన్స్‌(39) ఎంపికయ్యారు.(ఎగువ చిత్రంలో ట్రంప్‌తో కలసి ఉన్నవ్యక్తి) వాన్స్‌ ఆంధ్రప్రదేశ్‌ మూలాలున్న ప్రవాస భారత కుటుంబానికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్నాడు.


ట్రంప్‌పై దాడి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిలో కొందరు మూడు సంవత్సరాల క్రితం 2021జనవరి ఆరవ తేదీన అమెరికా అధికార కేంద్రంపై దాడికి తన మద్దతుదార్లను పంపిన డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్వాకాన్ని విస్మరించారు. ట్రంప్‌పై దాడి వ్యక్తిగతం, కానీ అతగాడి మద్దతుదార్ల చర్య మొత్తం అమెరికా అధికార, ప్రజాస్వామిక వ్యవస్థనే అపహాస్యం పాలు చేసిందనే అంశాన్ని మరిచిపోరాదు. అమెరికా, దాని ప్రజాస్వామ్యం మీద అసలైన దాడి అది.అమెరికాలో నలుగురు అధ్యక్షులను తుపాకి తూటాలు బలితీసుకున్నాయి. కొంత మంది అధ్యక్షులు తృటిలో తప్పించుకున్నారు, ఇటీవలి కాలంలో రాజకీయపరమైన దాడులు మరింతగా పెరుగుతున్నాయి. కానీ దేశ అధికార కేంద్రంపై ట్రంప్‌ నాయకత్వంలో జరిగిన దాడి చరిత్రలో అదే మొదటిది. తాను ఓడిపోతే ఫలితాలను అంగీకరించేది లేదని ముందుగానే అపర ప్రజాస్వామికవాది ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓడిపోయిన తరువాత విజేతను అధికారికంగా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని జరగకుండా చూసేందుకు, జో బైడెన్‌ గద్దెనెక్కకుండా చేసేందుకు ట్రంప్‌ చేసిన కుట్రలో భాగమది. అంతే కాదు దేశీయ ఉగ్రవాదం అనే కోణంలో ఎఫ్‌బిఐ, ఇతర చట్టాన్ని అమలు జరిపే సంస్థలు చూశాయి. దాడికి ముందు అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు కొద్ది దూరంలో తన మద్దతుదారులతో సమావేశం జరిపిన ట్రంప్‌ కాపిటోల్‌ను ఆక్రమించాలని, ఎన్నిక నిర్దారించే పత్రాన్ని ఇవ్వకుండా అడ్డుకోవాలని రెచ్చగొట్టి పంపించాడు.ఈ కేసులో కొంత మందికి శిక్షలు పడినప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌పై విచారణ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలలోపు పూర్తయ్యే అవకాశం లేదు, ఒకవేళ ట్రంపు గెలిస్తే అసలు విచారణే ఉండకపోవచ్చు, ఓడితే వచ్చే ఏడాది జరగవచ్చు.


ట్రంప్‌పై దాడి ప్రపంచానికి చూపుతున్నదేమిటి ? అమెరికాలో రాజకీయ విభజన కారణంగా రాజకీయ హింస కూడా పెరుగుతున్నది. దాడి వెనుక మూడు కారణాలున్నట్లు ఒక అభిప్రాయం. ఒకటి, ట్రంప్‌ గెలవ కూడదని కోరుకుంటున్న ప్రభుత్వంలోని వారి హస్తం, ట్రంప్‌ వంటి పచ్చిమితవాది అధికారానికి రాకూడదని కోరుకుంటున్న వామపక్ష తీవ్రవాద శక్తులు, ఎవరితో ప్రమేయం లేకుండా ట్రంప్‌ మీద తలెత్తిన వ్యక్తిగత ఆగ్రహం కారణంగా కాల్పులు జరిపి వుండవచ్చని చెబుతున్నారు. ఈ కారణాలతో రానున్న రోజుల్లో మరిన్ని ప్రయత్నాలు జరగవచ్చన్న హెచ్చరికలు వెలువడ్డాయి. అమెరికా చరిత్రలో రాజకీయ హింసాకాండ నేతలపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. తొలి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌. 1865 ఏప్రిల్‌ 14న జాన్‌ విల్కెస్‌ బూత్‌ కాల్చి చంపాడు. నల్ల జాతీయుల హక్కులకు మద్దతు ఇవ్వడమే లింకన్‌ హత్యకు కారణం.బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలకే అమెరికా 20వ అధ్యక్షుడైన అమెస్‌ గార్‌ఫీల్డ్‌ను హత్య చేశారు. 1881 జూలై 2న వాషింగ్టన్‌ రైల్వే స్టేషన్‌లో నడుస్తుండగా ఛార్లెస్‌ గిటౌ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రజలతో కరచాలనం చేస్తుండగా అమెరికా 25వ అధ్యక్షుడైన విలియం మెకిన్లే 1901 సెప్టెంబర్‌ 1న న్యూయార్క్‌లోని బఫెలోలో హత్యకు గురయ్యారు. 28 సంవత్సరాల నిరుద్యోగ వైద్యుడు కాల్పులు జరిపాడు. 1965 నవంబర్‌లో 35వ అధ్యక్షుడైన జాన్‌ ఎఫ్‌ కెన్నడీ తన సతీమణి జాక్వెలిన్‌తో కలిసి డల్లాస్‌లో పర్యటిస్తుండగా హంతకుడు లీ ఆర్వీ ఆస్వాయిడ్‌ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ హత్య గురించి తలెత్తిన అనుమానాలు ఇంతవరకు తీరలేదు, అదొక రహస్యంగా ఉండిపోయింది.
రెండుసార్లు దేశాధ్యక్షుడిగా పనిచేసి, మూడోసారి పోటీకి దిగిన థియొడోర్‌ రూజ్‌వెల్ట్‌పై ప్రచార సందర్భంగా 1912లో మిల్వాకీలో కాల్పులు జరిగాయి. అయితే ఆయనకు తీవ్రమైన గాయాలేవీ కాలేదు. అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ 1933 ఫిబ్రవరిలో మియామీలో ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ ఘటన నుండి రూజ్‌వెల్ట్‌ తప్పించుకున్నప్పటికీ చికాగో మేయర్‌ ఆంటన్‌ సెర్మాక్‌ చనిపోయాడు. 1950లో 33వ అధ్యక్షుడు హారీ ఎస్‌. ట్రూమన్‌ నివసిస్తున్న బ్లార్‌ హౌస్‌లోకి ఇద్దరు సాయుధులు ప్రవేశించి కాల్పులు జరిపారు. ట్రూమన్‌ తప్పించుకున్నప్పటికీ ఎదురు కాల్పుల్లో అధ్యక్ష భవనం పోలీసు, ఒక దుండగుడు చనిపోయాడు.డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాబర్ట్‌ కెన్నడీని లాస్‌ ఏంజెల్స్‌ హౌటల్‌లో హత్య చేశారు. 1972లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన జార్జ్‌ వాలస్‌పై కాల్పులు జరిగాయి. 1975లో 38వ అధ్యక్షుడైన ఫోర్డ్‌ కొన్ని వారాల వ్యవధిలోనే రెండు హత్యాయత్నాల నుండి తప్పించుకున్నారు. 40వ అధ్యక్షుడైన రోనాల్డ్‌ రీగన్‌ 1981 మార్చిలో వాషింగ్టన్‌ డీసీలో జనంలో ఉన్న జాన్‌ హింక్లీ జూనియర్‌ కాల్పులు జరిపాడు. ఆయన కోలుకున్నప్పటికీ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు 43వ అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్‌ బుష్‌ 2005లో జార్జియా అధ్యక్షుడు మిఖాయిల్‌ సాకష్వీతో కలిసి ఓ ర్యాలీకి హాజరు కాగా ఆయనపై చేతి గ్రెనేడ్‌ విసిరారు.అయితే అది పేలకపోవడంతో ఎవరూ గాయపడలేదు.

అమెరికా రాజకీయ ముఖచిత్రాన్ని చూసినట్లయితే కొన్ని అంశాలలో తేడాలున్నప్పటికీ డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు రెండూ అక్కడి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పాటుపడేవే. ఇటీవలి కాలంలో రెండు పార్టీల వైఫల్యాలు గతం కంటే ఎక్కువగా జనం నోళ్లలో నానుతున్నాయి. ప్రపంచంలో అమెరికా పెత్తనాన్ని సాగించేందుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, పరువు పోతున్నది. ఎన్నికల సమయంలో వ్యక్తిగత బలహీనతలు, అవినీతి అక్రమాలను బయటపెట్టుకోవటం ఇటీవలి కాలంలో పెరుగుతున్నది. విధానపరమైన వైఫల్యాలు రెండు పార్టీల్లో ఉండటమే దీనికి కారణం. ఈ పూర్వరంగంలోనే మూడవ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం గురించి అమెరికా సమాజంలో చర్చ ప్రారంభమైంది.కాల్పులు జరిగిన వెంటనే రక్తం కారుతున్న ట్రంప్‌ను భద్రతా సిబ్బంది తీసుకువెళుతుండగా ట్రంప్‌ చేయెత్తి తనకేమీ కాలేదన్న సంకేతం ఇచ్చిన ఫొటోను చూపి కొందరు ట్రంప్‌ అభిమానులు తమనేత దేశం కోసం ఒక హీరో మాదిరి నిలబడిన తీరును చూపుతున్నదని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు మరో నాలుగునెలల్లో జరగనున్నందున ప్రచారం మరింత తీవ్రం కానుంది. గురువారం నాడు జరిగే ఒక సమావేశంలో ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని లాంఛనంగా పార్టీ ప్రకటించనుంది. ప్రతిదాన్నీ సొమ్ము చేసుకొనేందుకు ఎదురు చూసే కొందరు గాయపడిన ట్రంప్‌ బమ్మను ముద్రించిన టీ షర్టులను అందుబాటులోకి తెచ్చారు.


ట్రంప్‌ ప్రాజెక్టు 2015పేరుతో ముందుకు తెస్తున్న అజెండా కార్మికవర్గం మీద దాడికి ఉద్దేశించిందని పురోగామి రాజకీయ బృందం హెచ్చరించింది. పౌరహక్కులకు ముప్పు ఏర్పడిందని ఆఫ్రో-అమెరికన్ల కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ట్రంప్‌ కోరిక మేరకు మితవాద హెరిటేజ్‌ ఫౌండేషన్‌ దీన్ని రూపొందించింది. దీన్ని అమలు జరిపేందుకు ట్రంప్‌ నియంతగా మారే అవకాశం ఉందని కూడా పేర్కొన్నది. తాను తిరిగి అధికారానికి వస్తే రాజ్యాంగంలోని కొన్నిసెక్షన్లను తొలగిస్తానని ఏడాది క్రితమే ట్రంప్‌ చెప్పిన అంశాన్ని గుర్తు చేసింది. తొమ్మిది దశాబ్దాల క్రితం చేసిన జాతీయ కార్మిక సంబంధాల చట్టాన్ని వెనక్కు తీసుకుంటామని ట్రంప్‌ తొలిసారి అధికారంలో ఉన్నపుడు నియమించిన బోర్టులో అత్యధికులు కార్మిక వ్యతిరేకులు ఉన్నారు.సోషలిజం విఫలమైందని గతంలో అమెరికా చెప్పింది. కానీ అదే అమెరికాలో ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం విఫలమైందనే భావం విస్తరిస్తోంది.చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలతో పోల్చి వేస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. అక్కడ ధనిక-పేద వ్యత్యాసం పెరిగిపోతోంది. మధ్యతరగతి వర్గం కనుమరుగు అవుతోంది. ఆర్థిక, వలసకార్మికులను అనుమతించే విధానాలపై అసంతృప్తి పెరుగుతున్నది. ఈ పూర్వరంగంలోనే సామాజిక వైరుధ్యాలు పెరుగుతున్నాయి. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎందుకు కాల్చిచంపుతారో తెలియదు. తుపాకి లేకుండా జనాలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. తుపాకి సంస్కృతిని పెంపొందించటం, వాటిని తయారు చేసే కార్పొరేట్లకు లాభాలు సమకూర్చటంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఎవరూ తక్కువ తినలేదు. పామును పాలుపోసి పెంచిన చేతినే అది కాటువేస్తుంది. అందువలన ఆ తుపాకులకు ఎప్పుడు ఎవరు బలౌతారో చెప్పలేని అయోమయ స్థితి నేడు అమెరికాలో ఉంది. ఒక దుండగుడు కాదు, అలాంటి వారిని తయారు చేసిన వ్యవస్థ, దాన్ని కాపాడుతున్నవారే ప్రజాస్వామ్యానికి అసలైన ముప్పు. 2021జనవరి ఆరున తన గుంపును అమెరికా అధికార కేంద్రం మీద దాడికి ఉసిగొల్పిన ట్రంప్‌ నుంచే అసలైన ముప్పుకు నాంది. ఇలాంటి ట్రంపు, అతగాడి ఇతర వెర్రి వేషాలను కూడా అక్కడి మీడియా జనానికి చెప్పటం లేదు. ఇది కూడా అమెరికాకు ముప్పు తెచ్చేదే !

చికిత్సలేని హిందూత్వ వైరస్‌ – వాళ్లంతే ! అదో టైపు !! ఓటేయని ముస్లింలు, యాదవులను పట్టించుకోరట-ప్రమాణాన్ని ఉల్లంఘించిన కేంద్ర మంత్రి !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


” ముస్లింలు నాకు ఓటు వేయలేదు.కాబట్టి ఇప్పుడు నేను కూడా వారికోసం పని చేయటం లేదు. నా ప్రాంతంలోని ఒక మౌల్వీ ఒక ఇల్లు, ఉజ్వల గ్యాస్‌, ఐదులక్షల రూపాయల ఆయుష్మాన్‌, మరుగుదొడ్డి, రేషన్‌ కార్డు కూడా పొందాడు. నాకు ఓటు వేసి ఉంటే ప్రమాణం చేసి చెప్పాలని నేను అడిగాను, అతనా పనిచేయలేదు. నా హృదయం ముక్కలైంది. ఇది సనాతన ధర్మాన్ని బలహీన పరిచేందుకు, భారత్‌పై ముస్లిం యుద్ధం (ఘజ్వా ఏ హింద్‌ ) చేసేందుకు పక్కాగా రూపొందించిన ఒక వ్యూహం ” తెల్లారగానే సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌ సుప్రభాతంతో జనాన్ని నిద్రలేపే కారణజన్ముడైన దేవుని బిడ్డ నరేంద్రమోడీ గురించి తెలిసిందే. అలాంటి దైవాంశసంభూతుడి మంత్రివర్గ సభ్యుడైన జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత తాజాగా ఎక్స్‌ ఖాతాలో వెల్లడించిన అభిప్రాయమిది. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రిగా ” నా బాధ్యతలను నమ్మకంగా మరియు మనస్సాక్షిగా నిర్వర్తిస్తాను. మరియు రాజ్యాంగం మరియు చట్ట ప్రకారం అన్ని రకాల ప్రజలకు భయం లేదా అభిమానం, ఆప్యాయత లేదా దురుద్దేశ్యం లేకుండా న్యాయం చేస్తాను ” అని ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రి దాన్ని ఉల్లంఘించారు. ఇందుకు గాను అతగాడిని మంత్రి వర్గం నుంచి ప్రధాని తొలగించాలి, లేదా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాష్ట్రపతి తన బాధ్యతను నిర్వర్తించాలి. ఏదీ జరిగే సూచనలు లేవు.


ఘజ్వా ఏ హింద్‌ అనే పదాన్ని ఇటీవల అనేక మంది ముఖ్యంగా హిందూ-ముస్లిం మతోన్మాదులు, ఉగ్రవాదులు, కొన్ని మీడియా సంస్థల జర్నలిస్టులు రెండు మతాలవారినీ రెచ్చగొట్టేందుకు వినియోగిస్తున్నారు. కొంత మంది ఇస్లామిక్‌ పండితులు దాని అసలు అర్దాన్ని వక్రీకరిస్తున్నారని వివరణ ఇచ్చారు. దాని సారం ఏమిటంటే మహమ్మద్‌ ప్రవక్త ప్రవచనాలకు తప్పుడు భాష్యం చెబుతున్నారు.దానితో విబేధించే పండితులు కూడా ఉన్నారు. క్రైస్తవం మీద తిరుగుబాటులో భాగంగా ఇస్లాం ఉద్భవించింది. క్రీస్తుశకం 530వ సంవత్సరంలో జన్మించిన మహమ్మద్‌ ప్రవక్త 632జూన్‌ ఎనిమిదిన మరణించాడు.ఎవరి భాష్యం ఎలా ఉన్నప్పటికీ నాడు చెప్పిన అంశాలు నేడు వర్తించవన్నది తెలిసిందే. ఈ అంశాలలో హిందూ-ముస్లిం మతశక్తులు బొమ్మా- బొరుసు వంటివి. సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని రెండూ చెబుతున్నాయి. అరబ్బీలో ఘజ్వా అంటే యుద్ధం. భారత ఉపఖండం మీద దాడి చేసి ఇస్లాం భావజాలాన్ని వ్యాపింప చేయాలని ప్రవక్త చెప్పాడని, దాన్ని కొనసాగించాలని ముస్లిం తిరోగమనవాదులు నిత్యం రెచ్చగొడుతుంటారు. ముస్లింలు ఇప్పటికీ ఘజ్వాను వదల్లేదని అందువలన వారి దాడి నుంచి హిందూ లేదా సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ హిందూ తిరోగమన వాదులు పదే పదే దాన్ని ఆయుధంగా చేసుకుంటున్నారు.నిజానికి సనాతనం అంత గొప్పదైతే మరి అంటరానితనం, వివక్షలనే కాన్సర్లు మన సమాజంలో ఎలా విస్తరించాయి ? మహానుభావుడు అంబేద్కర్‌కు సనాతనం గురించి తెలియదా ? పక్కాగా తెలుసు, నాటి సనాతనుల ఆచరణను చూసే దాన్ని వ్యతిరేకించి బౌద్దంలోకి మారిన సంగతి తెలిసిందే.అంటరాని తనంతో సహా అనేక వివక్షలను రుద్దిన మనుస్మృతిని అమలు జరపాలని అంటే దళితులు, గిరిజనులు, వెనుక బడిన తరగతుల వారు బిజెపికి దూరం అవుతారనే భయంతో దాని బదులు సనాతన ధర్మం అనే పల్లవిని అందుకున్నారు. ఇది కూడా ఎంతో కాలం నడవదన్నది వేరే సంగతి.


దానిలో భాగంగానే హిందూ దేవాలయాలు, యాత్రా ప్రాంతాలలో ఉన్న ముస్లింల దుకాణాలను మూసివేయాలి. ముస్లిం పేర్లతోనే ముస్లింలు దాబాలను ఎందుకు తెరవరు ? కన్వర్‌ యాత్రీకులను మోసం చేసేందుకు ముస్లిం దాబాల యజమానులు హిందూ పేర్లు పెడుతున్నారు,పేర్లు ఎందుకు మార్చాలి, దాబాలను ఎందుకు తెరవాలి అంటూ విశ్వహిందూ పరిషత్‌ ప్రశ్నిస్తోంది. సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్థలకు చెందిన వారు, దాని మతోన్మాద వైరస్‌ బారిన పడిన వారు ఇలాంటి విద్వేషాన్ని వెళ్లగక్కటం తెలిసిందే. అఫ్‌ కోర్సు అలాంటి వాటిని అలఓకగా వెల్లడించే వారిలో పేరుమోసిన వ్యక్తి గిరిరాజ్‌ సింగ్‌ అన్నది తెలిసిందే. ఇలా మాట్లాడటం తగదని తన సహచరులకు నరేంద్రమోడీ అంతర్గతంగానైనా చెప్పి ఉంటే గిరిరాజ్‌ సింగ్‌ లాంటి వారు, విశ్వహిందూ పరిషత్‌ వంటి సంస్థలు పదే పదే రెచ్చిపోతాయా ? దైవాంశ సంభూతుడిని తిరస్కరిస్తాయా ? మీరంతా నిమిత్త మాత్రులు, మీతో చెప్పించేది, చేయించేదీ అన్నీ నేనే అనే భగవద్గీత సారం తెలిసిందే. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి…గుడిసెలు అనే సామెత తెలిసిందే కనుక టీకా తాత్పర్యాలు అవసరం లేదు.


మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంది గనుకనే నరేంద్రమోడీ మూడవసారి అధికారానికి వచ్చిన తరువాత అమెరికా మత స్వేచ్చ నివేదికలో మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు, విద్వేష ప్రచారం గురించి పేర్కొన్నారు. ప్రతి ఏటా అమెరికా నివేదికల్లో ఈ అంశాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు.వాటిని ఒక వైపు మోడీ సర్కార్‌ ఖండిస్తున్నదీ, తిరస్కరిస్తున్నది. మరోవైపున కాషాయ దళం తనపని తాను చేస్తున్నది. నిజం ఏమిటో మన జనానికి తెలియదా ? మణిపూర్‌లో క్రైస్తవులైన గిరిజన కుకీల మీద జరిగిన దాడులు,హత్యాకాండ, ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన వైనం అక్కడి బిజెపి రాష్ట్ర ప్రభుత్వం దాచినా దాగలేదు.గిరిజనులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలోనే కాదు, చివరకు హిందువులైన మెయితీలు అధికంగా ఉన్న చోట కూడా బిజెపి రెండు చోట్లా తాజా లోక్‌సభ ఎన్నికల్లో మట్టికరచింది. గిరిరాజ్‌ సింగ్‌ కేంద్ర మంత్రిగా ఎవరి పట్లా వివక్ష చూపనంటూ చేసిన ప్రమాణస్వీకారాన్ని ఉల్లంఘించి మాట్లాడారు గనుకనే ఆ పెద్ద మనిషి గురించి చెప్పుకోవాల్సి వస్తున్నది. ముస్లింలు దుకాణాలు తెరవకూడదు, ఉన్నవాటిని మూసివేయాలంటూ వీరంగం వేసిన అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో హిందువులే మెజారిటీ అయినప్పటికీ అక్కడ బిజెపి ఓడిపోయింది. ప్రతిపక్షాలు గెలిస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని స్వయంగా నరేంద్రమోడీ చెప్పినా అక్కడి జనాలు పట్టించుకోకుండా చెంపదెబ్బ కొట్టినట్లుగా తీర్పు చెప్పారు.


ఆరునెల్లు గడిస్తే వారు వీరవుతారు అన్నట్లుగా బిజెపితో చేతులు కలిపిన ఇతర పార్టీలు కూడా దాని భావజాలాన్ని, విద్వేషాన్ని తలకెక్కించుకుంటున్నాయి.లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఓటు వేయని యాదవులు, ముస్లింల కోసం తాను ఎలాంటి పనులు చేయనని బీహార్‌లోని నితీష్‌ కుమార్‌ పార్టీ జెడియు సీతామరి ఎంపీ దేవేష్‌ చంద్ర ఠాకూర్‌ ఇటీవల ప్రకటించారు. యాదవులు, ముస్లింలు తనవద్దకు వస్తే స్వీట్లు పెట్టి, టీ ఇచ్చి పంపుతాను తప్ప వారికి ఎలాంటి పనులూ చేయనని అన్నారు.హృదయంలో చెలరేగిన భావాలతోనే ఠాకూర్‌ అలా మాట్లాడినట్లు అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అతగాడిని సమర్ధించారు.కేంద్రం, రాష్ట్రం అమలు జరిపిన పధకాలతో లబ్ది పొందిన ముస్లింలు తనకూ ఓట్లు వేయలేదన్నారు. దీనికంతటికీ మంగళసూత్రాలు లాక్కుంటారంటూ ప్రతిపక్షాల మీద ప్రధాని నరేంద్రమోడీ చేసిన తప్పుడు ప్రచారమే కారణని ఆర్‌జెడి విమర్శించింది. ఎంపీలు, ఎంఎల్‌ఏలు నియోజకవర్గాల్లో ఉన్న అందరికీ చెందిన వారు తప్ప ఒక కులం, మతానికో ప్రాతినిధ్యం వహించేవారు కాదని, రాజ్యాంగం మేరకు దేశం నడుస్తున్నది తప్ప కొంత మంది బుర్రల్లో పుట్టినదాని ప్రకారం కాదని పేర్కొన్నది. ఇలాంటి ఎంపీలు, కేంద్ర మంత్రుల వద్దకు కేవలం టీ తాగేందుకు ఆత్మగౌరవం కలవారు ఎవరైనా వెళతారా ?యాదవులు, ముస్లింలే కాదు, వీరికి ఓటేయని ఏ సామాజిక తరగతికీ మినహాయింపు ఉండదని అందరూ గమనించాలి.ఇలాంటి వారు బిజెపి, దాని మిత్రపక్షాల్లో ఎంతగా వర్ధిల్లితే అంతగా జనం అసలు రంగు తెలుసుకుంటారు.


గిరిరాజ్‌ సింగ్‌ ఏం మాట్లాడినా బిజెపి పెద్దలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 2019లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నాటి పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలోనే బీహార్‌ బెగుసరారు నియోజకవర్గంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు జిల్లా కలెక్టర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బహుశా ఈ పెద్ద మనిషి డిఎన్‌ఏలోనే ముస్లిం ద్వేషం ఉన్నట్లు అతగాడి వదరుబోతుతనం వెల్లడిస్తున్నది.దేశ విభజన సందర్భంగా ముస్లింలందరినీ పాకిస్తాన్‌ పంపకపోవటం మన పూర్వీకులు చేసిన పెద్ద తప్పిదం అన్నారు.2014లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీకి ఓటు వేయని వారిని పాకిస్తాన్‌ పంపాలని సెలవిచ్చినందుకు బహుమతిగా నాడు సహాయ కేంద్ర మంత్రి పదవి, తరువాత మరింతగా రెచ్చిపోయినందుకు 2019లో కాబినెట్‌ మంత్రిగా, మరోసారి ఇప్పుడు కొనసాగించారు మోడీ. బీహార్‌లో మిత్ర పక్షాలుగా ఉన్న ఎల్‌జెపి, జెడియు నేతలు ఈ పెద్దమనిషి వ్యాఖ్యలను విమర్శించటం తప్ప గట్టిగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు. మోడీ రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్థలలో ఇలాంటి విద్వేష ప్రసంగీకులకు కొదవ లేదు. విశ్వహిందూ పరిషత్‌ నేత ప్రవీణ్‌ తొగాడియా వారిలో ఒకరు. ” మనం అధికులుగా ఉన్న ప్రాంతాలలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ముస్లింలను భయపెట్టాలి ” అన్నారు. నోటిదూల, నోటి తుత్తర లేదా విద్వేష గళాల పీఠాధిపతుల్లో గిరిరాజ్‌ సింగ్‌ను ఒకరిగా చెప్పవచ్చు.ప్రపంచ జనాభా దినం సందర్భంగా 2019 జూలై 11న మంత్రి హౌదాలో ఒక ట్వీట్‌ ( ప్రస్తుతం ఎక్స్‌) చేశారు. ” ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ఓటింగ్‌ హక్కు రద్దు చేయాలన్నది నా వైఖరి ” అని పేర్కొన్నారు. ఇది ముస్లింలను ఉద్దేశించే చేసినప్పటికీ ఇతర మతాలలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి కూడా వర్తిస్తుంది కనుక వారు కూడా ఇలాంటి వ్యక్తులు, వారి పార్టీ గురించి ఆలోచించుకోవాలి.


బిజెపి నేతలు హిందూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని బహిరంగంగానే ప్రకటిస్తారు. తనకు మియా(అసోంలోని ముస్లింలకు మరోపేరు)ల ఓట్లు అవసరం లేదని సాక్షాత్తూ ఆ రాష్ట్ర సిఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. తాను వారి ప్రాంతాలలో అసలు ప్రచారానికే వెళ్లనని కూడా చెప్పారు. మియాల్లో బాల్య వివాహాలు అంతరించేవరకు వారి ఓట్లను తాను కోరనని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని కూడా చెప్పారు. ముస్లిం సామాజిక తరగతి ఉద్దారకుడిగా ఫోజు పెడుతూ వారి మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటం తప్ప ఇది మరొకటి కాదు. దేశంలో బాల్యవివాహాల సామాజిక రుగ్మత ఉంది. దాన్ని రూపుమాపాలంటే జనాల ఆర్థిక, విద్యా స్థాయిని మెరుగుపరచాలి. అసలు వాస్తవం ఏమంటే దేశంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 84శాతం హిందువుల్లోనే ఉన్నట్లు ఇండియా స్పెండ్‌ అనే మీడియా సంస్థ జనాభా లెక్కలను విశ్లేషించి చెప్పింది. ముస్లింలలో పదకొండుశాతం, ఇతరులు మిగతా మతాల్లో ఉన్నారు. అదే హిమంత బిశ్వశర్మ బాల్య వివాహాలు చేసే హిందువుల ఓట్లు, అంటరానితనం పాటించేవారి ఓట్లు తమకు అవసరం లేదని చెప్పగలరా ? బిజెపి నేతల నాలికలకు నరం లేదు. ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది మాట్లాడతారు. తనకు ఓట్లు వేయని కారణంగా ముస్లింల కోసం తాను పనిచేయనని రాజ్యాంగ విరుద్దమైన మాటలను కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వల్లిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో బిజెపి సీనియర్‌ నేత కెఎస్‌ ఈశ్వరప్ప తమకు ముస్లింల ఓట్లు ఒక్కటి కూడా అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఆవు చేలో మేస్తుంటే దూడగట్టున ఉంటుందా ? అధినేత నరేంద్రమోడీ స్వయంగా ఇటీవలి ఎన్నికల్లో ముస్లిం విద్వేషాన్ని ఎలా రెచ్చగొట్టారో తెలిసిందే. మోడీ ముందు హిమంత బిశ్వశర్మలూ, గిరిరాజ్‌ సింగ్‌లూ మరుగుజ్జులే. తన ఉపన్యాసాలు, వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశం అవుతాయని, భారత ప్రతిష్ట మురికి గంగలో కలుస్తుందని తెలిసి కూడా మోడీ వెనక్కు తగ్గలేదు.ఏది ఎటుపోతేనేం ! కావాల్సింది ఓట్లు, అధికారం ! రామరాజ్యం కోరుకొనే శక్తులకు ఓటు వేస్తారా లేక ఓట్‌ జీహాదీలకు వేస్తారా అంటూ మోడీ ఓటర్లను అడగటం తెలిసిందే.కాంగ్రెస్‌ అధికారానికి వస్తే చొరబాటుదార్లకు, ఎక్కువ మంది పిల్లలున్న వారికి సంపదలు పంచుతారని, పుస్తెలను కూడా లాక్కుంటారని పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి మాట్లాడిందీ తెలిసిందే. దేశాన్ని ఆక్రమించుకొనేందుకు ముస్లింలకు కాంగ్రెస్‌ సహాయం చేస్తోందని కూడా ఆరోపించారు. మోడీ దిగజారి మాట్లాడినట్లు, అది కూడా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం అవాంఛనీయమని బిజెపి నేత అలోక్‌ వత్స తమతో వ్యాఖ్యానించినట్లు వాయిస్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొన్నది. సంవత్సరాల తరబడి గుడ్డిగా మోడీకి మద్దతు ఇచ్చిన వారు కూడా ఆయన వ్యాఖ్యలను ఆమోదించరని, ప్రధాని స్థాయికి తగని మాటలని వత్స అన్నట్లు పేర్కొన్నది. ఇలాంటి నేత అనుచర గణం ప్రసన్నం చేసుకొనేందుకు మరింత రెచ్చిపోతుంది తప్ప వెనక్కు తగ్గదు.