• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: Narendra Modi Failures

మహాత్మాగాంధీకి ప్రపంచ గుర్తింపు – నరేంద్రమోడీ అజ్ఞానమా ? అవమానించారా ?

01 Saturday Jun 2024

Posted by raomk in BJP, Communalism, Congress, COUNTRIES, Current Affairs, History, INDIA, International, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, UK, USA

≈ Leave a comment

Tags

BJP, GANDHI INTERNATIONAL FAME, Mahatma Gandhi, Narendra Modi Failures, Nathuram Godse, RSS


ఎం కోటేశ్వరరావు


పద్దెనిమిదవ లోక్‌సభ చివరిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. భక్తులకు వినసొంపుగా వారు కోరుకున్నట్లుగా, వ్యతిరేకులకు అనేక విమర్శనాస్త్రాలు అందిస్తూ, నిష్పాక్షికంగా వాస్తవాలను పరిశీలించేవారు అవాక్కయ్యే విధంగా ఎన్నికల ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ ప్రక్షాళన కోసమో, మరొకదానికోసమో 45 గంటల పాటు కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో ధ్యానదీక్ష చేశారు.నువ్వు చెయ్యాల్సింది చెయ్యి, ఫలితాలు, పర్యవసానాలు, విమర్శల గురించి పట్టించుకోకు మౌనవ్రతమే నీ ఆయుధం అన్నట్లుగా దేవుడి అంశతో జన్మించినట్లు చెప్పుకున్న మోడీ కార్యాచరణలో నిమిత్తమాత్రుడు తప్ప ఆటాడించిందీ, మాట్లాడించిందీ ఆ దేవుడే గనుక ప్రతిష్టో అప్రతిష్టో ఆయన ఖాతాకు తప్ప మోడీకి కాదని వేరే చెప్పనవసరం లేదు. పచ్చి అవాస్తవాలు,ఎడారిలో సముద్రాల మాదిరి మాటలు, ప్రలోభాలు, బెదరింపులు,బ్రతిమిలాటలు ఇలా ఎన్నో. సకలకళా వల్లభుల ప్రదర్శనలను దేశం చూసింది. మంచో చెడో ఒక నిర్ణయం తీసుకొని ఓటర్లు తమ తీర్పునిచ్చారు. జూన్‌ నాలుగున వెలువడే ఫలితాలలో గెలిచిన పార్టీల, అభ్యర్థుల హడావుడి, ఓడిన పార్టీలు, అభ్యర్థుల వాదనలు, వేదనలు సరేసరి.. ఏ పార్టీ లేదా ఏ కూటమికి మెజారిటీ రాకుండా హంగ్‌ ఏర్పడితే ఏం జరుగుతుందో అనూహ్యం. ఎన్‌డిఏ-ఇండియా కూటమి రెండూ మెజారిటీ సాధనకు తలపడతాయి. చిన్న పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు వరకు కింగ్‌మేకర్లుగా మారతాయి.తరువాత వాటి భవిష్యత్‌ చెప్పలేము.చిన పాముపు పెద పాము, చిన చేపను పెద చేప మింగినట్లుగా జరిగే అవకాశం ఉంది. లోక్‌సభలోని 543 స్థానాలకు గాను మెజారిటీ 272 సాధించుకున్న పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.గత ఎన్నికలను చూసినపుడు 2014లో బిజెపి 31శాతం ఓట్లతో 282 సీట్లు తెచ్చుకుంది,2019లో 37.3శాతం ఓట్లు 303 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 2014లో 19.31శాతం ఓట్లు 44 సీట్లు, తదుపరి ఎన్నికల్లో 19.46శాతం ఓట్లు, 52 సీట్లు తెచ్చుకుంది. బిజెపి హిందూత్వను ఎంతగా రెచ్చగొట్టినా, నరేంద్రమోడీని హిందూ హృదయ సామ్రాట్టుగా జనం ముందుకు తెచ్చినా గత రెండు ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు రాలేదు. అదే కాంగ్రెస్‌ను చూస్తే ఓట్ల శాతంలో పెద్ద మార్పు లేదు.2014కు ముందు జరిగిన ఎన్నికల్లో బిజెపి తెచ్చుకున్న 18.8శాతం ఓట్లను 31శాతానికి పెంచుకోగా, కాంగ్రెస్‌ 28.55 నుంచి 19.31శాతానికి కోల్పోయింది. అంతకు ముందు ఎన్నికలతో పోల్చితే 2014లో బిజెపి 12.2శాతం అదనంగా తెచ్చుకోగా 2019లో అదనంగా 6.36శాతం తెచ్చుకుంది. కాంగ్రెస్‌ 2014తో పోల్చితే 2019లో 0.18శాతం ఓట్లు అదనంగా తెచ్చుకుంది. తినబోతూ రుచెందుకు అన్నట్లుగా 2024లో తీరుతెన్నుల గురించి జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.


ప్రేమ కోసం, యుద్ధంలో గెలుపుకోసం అబద్దాలు చెప్పవచ్చు అన్నట్లుగా ఈ ఎన్నికలలో నరేంద్రమోడీ, బిజెపి నేతల ప్రసంగాల తీరు ఉంది. ఎవరేమనుకుంటే మాకేటి అన్నట్లు వ్యవహరించారు.చివరి దశలో ప్రధాని నరేంద్రమోడీ ఎబిపి టీవీ ఛానల్‌కు జర్నలిస్టులతో మాట్లాడుతూ రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ సినిమా తీసిన తరువాతే మహాత్మాగాంధీ ఎవరు అనే ఉత్సుకత ప్రపంచంలో పెరిగిందని చెప్పారు. నిజానికి ఇది ఎన్నికల అంశంగా ఏ పార్టీ కూడా ప్రస్తావన తేలేదు. ఆకర్షణీయమైన నేతలు తప్పులు ఎందుకు చేస్తారంటూ ”అవెంటస్‌ ” పార్టనర్స్‌ అనే ఒక వెబ్‌సైట్‌లో తేదీలేని ఒక సర్వే విశ్లేషణ ఉంది. నేతలు అందునా ఉత్తమ నేతలు కూడా అవివేకమైన తప్పులు తరచుగా చేస్తుంటారని పేర్కొన్నది.పదవి మరియు తెలివితేటల కారణంగా మితిమీరిన విశ్వాసం మరియు అధికారంతో తీవ్రమైన తప్పులు చేస్తుంటారని దీన్ని సైద్దాంతిక వేత్తలు (హ్యూమన్‌ ఫోలీ) మానవ అజ్ఞానం లేదా మూర్ఖత్వమని పిలిచారని పేర్కొన్నది. దానిలో పేర్కొన్న ఐదు తప్పుల సారం ఇలా ఉంది. సంవత్సరాల తరబడి నిరంతరం అందుకునే ప్రశంసల కారణంగా అత్యధిక నేతలు తమ తెలివితేటలు, సామర్ధ్యాల గురించి తిరుగులేని విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటారట.కీలకమైన నిర్ణయాలు తీసుకొనే సమయంలో తమ మీద తమకు ఏర్పడిన అతివిశ్వాసం కారణంగా ఇతరులు వెల్లడించే అభిప్రాయాలు, సూచనలను పట్టించుకోరు, దీంతో చురుకైన నేతలు తప్పుడు నిర్ణయాలు తీసుకొనే ముప్పు ఎక్కువగా ఉంటుందట. సూక్ష్మ నిర్వహణ(మైక్రోమేనేజ్‌మెంట్‌) సమస్య నేతలకు మాత్రమే కాదు సంస్థలలోనూ ఉంది.నాయకత్వ స్థానాల్లో సూక్ష్మ నిర్వహణ, బదలాయింపు లేకపోతే మొత్తం జట్టు మీద ప్రభావం చూపుతుంది. సంక్షోభ సమయాల్లో చురుకైన నేతలు జట్టు హస్తం అందుకొనేందుకు చూస్తారు, కానీ కొత్త ఆలోచనల అన్వేషణలో వారి ఆసరా తీసుకోరు. చురుకైన నేతలు తాము రూపొందించిన నిబంధనలను పాటించటంలో విఫలమైనపుడు ఆ సంస్థల విలువలు, సూత్రాల మీదనే సందేహాలు తలెత్తుతాయి. తరువాత వాటన్నింటినీ పరిరక్షించాల్సిన వ్యక్తి విశ్వసనీయతే ప్రశ్నార్ధకం అవుతుంది. చురుకైన వారు ఇతరులు చెప్పేదానికి విలువ ఇవ్వరు. తమకు సలహాలు ఇచ్చేంత గొప్పవారా అనుకుంటారు.తమ తప్పును అంగీకరించరు. తరచుగా మంచిచెడ్డల స్వీకరణ నిలిపివేత వీరు చేసే అవివేకమైన తప్పు. బలమైన నేతలకు అవకాశాలు సులభంగా వచ్చినపుడు అన్నింటినీ చేసేయగలమనే వ్యక్తిత్వాలను పెంచుకుంటారు. లక్ష్యాలను పెద్దగా నిర్ణయించుకుంటారు, అనుకున్న విధంగా జరగకపోతే తగిన ప్రయత్నం లేకపోవటం అనుకుంటారు.వాస్తవ విరుద్దమైన లక్ష్యాలను నిర్ణయించుకొని ఎలాగైనా సాధించాలనుకొని జనాలను ఇబ్బందుల్లోకి నెడతారు. చురుకైన తెలివితేటలు కలిగిన వారందరూ పైన పేర్కొన్న లక్షణాలు, ధోరణులు గల నేతలు ఎవరన్నది ఎవరికి వారు అన్వయించుకొని ఒక అంచనాకు రావచ్చు.


నరేంద్రమోడీని అనేక మంది చురుకైన, ఆకర్షణ కలిగిన నేత అని చెబుతారు. ఆయనకు ఉందని చెబుతున్న పట్టా రాజకీయ శాస్త్రంలో అని కూడా అందరం చదువుకున్నదే. అలాంటి వ్యక్తికి చరిత్ర తెలియదా లేక కావాలనే ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలను వక్రీకరించినట్లుగా జాతిపిత గురించి కూడా మాట్లాడారా ? రెండూ వాస్తవం కావచ్చు. ప్రపంచ వలస దేశాల చరిత్రను చూసినపుడు మనదేశమంత పెద్దది బ్రిటీష్‌ సామ్రాజ్యంలో మరొకటి లేదు. వారి పాలనను అంతం చేసిన స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారెవరు అన్న చర్చ జరిగినపుడు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే మహాత్మాగాంధీ అని ప్రపంచం తెలుసుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో గాడ్సే గురించి తప్ప గాంధీ గురించి పెద్దగా బోధించి ఉండరు. భగవద్గీత వంటి గ్రంధాల కంటే ” నేనెందుకు గాంధీని చంపాను ” అంటూ గాడ్సే కోర్టులో మాట్లాడిన అంశాలను పెద్ద ఎత్తున బోధిస్తారని వినికిడి. ఆ పుస్తకాన్ని అచ్చువేసి, పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన అంశం తెలిసిందే.మహాత్మాగాంధీ జాతిపిత అని ఎవరు చెప్పారు, ఎలా అయ్యారంటూ, దేశానికి చేసిన ద్రోహాలంటూ వాట్సాప్‌ యూనివర్సిటీలో ప్రచారం చేసే ఊరూపేరు చెప్పుకొనేందుకు ధైర్యం లేని చీకటి బతుకుల బాపతు ఎవరు అన్నది వేరే చెప్పనవసరం లేదు.


మహాత్ముడు కాక ముందు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే బహుశా ఆయన తండ్రి లాగూలు(అప్పటికి నిక్కర్లు వచ్చి ఉండవు) వేసుకొంటున్న సమయానికే 1920దశకంలోనే మోహనదాస్‌ కరంచంద్‌ గాంధీ గురించి పశ్చిమ దేశాలలో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం చరిత్రను ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి అనుగుణ్యంగా తిరగరాస్తున్నది. గాంధీ హత్య నేపధ్యం గురించి భావితరాలకు తెలియకూడదు అనే లక్ష్యంతో ఎన్‌సిఇఆర్‌టి ద్వారా 2022జూన్‌లో రాజకీయ శాస్త్రంలో ఉన్న అంశాలను తొలగింపచేయించిన ఉదంతం తెలిసిందే.ఏమిటవి ? ” పాకిస్తాన్‌ ముస్లింలకు అన్నట్లుగా ఇండియా హిందువుల దేశంగా మారాలని లేదా హిందువులు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నవారికి ప్రత్యేకించి ఆయన(గాంధీ) అంటే అయిష్టం…హిందువులు-ముస్లింలు ఐక్యంగా ఉండాలనే స్థిరమైన అనుసరణతో రెచ్చిపోయిన హిందూ ఉగ్రవాదులు ఆ మేరకు అనేక సార్లు గాంధీజీని హత్య చేసేందుకు చూశారు….గాంధీజీ మరణం దేశంలో ఉన్న మతపరిస్థితిపై దాదాపు మాయా ప్రభావం(మేజికల్‌ ఎఫెక్ట్‌) చూపింది…..మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్న సంస్థలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు వంటి సంస్థలపై కొంత కాలం నిషేధం విధించింది…” ఇలాంటి కుదురు నుంచి వచ్చిన నరేంద్రమోడీ నోట మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి అని వెలువడటం వెనుక చిత్తశుద్ది ఉందని ఎవరైనా అనుకోగలరా ?


ఇంతకీ మహాత్ముడి గురించి నరేంద్రమోడీ సెలవిచ్చిందేమిటి ? ప్రతిపక్షాలు రామమందిర ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు, ఎన్నికలలో దీని ప్రభావం ఉంటుందా అని ఎబిపి విలేకర్లు అడిగిన ప్రశ్నపై స్పందించిన మోడీ ప్రతిపక్షం బానిసత్వ భావనలనుంచి బయటకు రాలేదు అంటూ ” మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి. మహాత్మా గాంధీ గురించి ప్రపంచం తెలుసుకొనే విధంగా ఈ 75 సంవత్సరాలలో చేయాల్సిన బాధ్యత మనది కాదా ? మహాత్మా గాంధీ గురించి ఎవరికీ తెలియదు. గాంధీ సినిమా తీసిన తరువాత మాత్రమే ఈ మనిషి ఎవరన్న జిజ్ఞాస ప్రపంచంలో పెరిగింది.మనమాపని చేయలేదు. అది మన బాధ్యత. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ గురించి ప్రపంచానికి తెలిసిందంటే, దక్షిణాఫ్రికానేత నెల్సన్‌ మండేలా ప్రపంచానికి తెలిశారంటే వారికంటే గాంధీ తక్కువేమీ కాదు. మీరు దీన్ని అంగీకరించాలి.ప్రపంచమంతా తిరిగిన తరువాత నేను ఈ విషయాన్ని చెబుతున్నాను” అని మోడీ చెప్పారు. బ్రిటీష్‌ సినిమా దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ సినిమాతీశాడు, బెన్‌కింగ్‌స్లే గాంధీ పాత్ర పోషించాడు. దానికి పదకొండు అకాడమీ అవార్డులు వచ్చాయి. ఆ సినిమా తరువాతే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందని చెప్పటం మహాత్ముడిని అవమానించటం తప్ప మరొకటి కాదు.ఆ సినిమా తరువాతనే నాకు గాంధీ గురించి తెలిసిందని మోడీ చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటం మీద గాంధీ ప్రభావం గురించి స్వయంగా నెల్సన్‌ మండేలానే చెప్పారు. ఆ పోరాటం గాంధీ సినిమా చూసిన తరువాత ప్రారంభం కాలేదు.


మహాత్మా గాంధీ పుట్టిన గుజరాత్‌కు సిఎంగా పని చేసిన నరేంద్రమోడీ అమ్మా గూగులమ్మా మా గాంధీ గురించి కాస్త చెప్పమ్మా అని మోడీ అడిగినా, ఆయన సిబ్బంది అడిగినా గాంధీ సినిమాకు ముందు, తరువాత కూడా ఎన్నో విషయాలు తెలిసి ఉండేవి. సామాజిక మాధ్యమంలో ప్రతిపక్షాల నుంచి ఇప్పుడు ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది కాదు. గాంధీ గురించి ఉన్న వెబ్‌సైట్‌ను అసలు ఒక్కసారైనా చూసి ఉంటారా అన్నది అనుమానమే. చూసి ఉంటే ఇలా మాట్లాడేందుకు ధైర్యం చేసి ఉండేవారు కాదు.బ్రిటన్‌ వార పత్రిక గ్రాఫిక్‌లో 1922లో గాంధీ అరెస్టయినపుడు గాంధీ గురించి రాశారు. నైరోబీలో గాంధీ అరెస్టు గురించి చేసిన ఆందోళనపై రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన వార్తను అదే ఏడాది లాహౌర్‌ నుంచి వెలువడిన సివిల్‌ మరియు మిలిటరీ గెజెట్‌లో ప్రచురించారు.” సదాచార గాంధీ :1930వ సంవత్సర పురుషుడు ” అంటూ టైమ్‌ పత్రిక 1931 జనవరి ఐదవ తేదీన ప్రచురించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా 1930లో గాంధీతో పాటు అరెస్టు అయిన 30వేల మందిని ఏం చేయాలా అని బ్రిటీష్‌ సామ్రాజ్యం భయంతో ఉంది. ఆ ఏడాది చివరిలో ఒక అర్దనగ మనిషిని చూసింది, ప్రపంచ చరిత్ర 1930లో ఆ మనిషి సంకేతం నిస్సందేహంగా అన్నింటికంటే పెద్దది ” అని దానిలో రాసింది. అదే ఏడాది సెప్టెంబరు 20న అమెరికా నుంచి వెలువడే బర్లింగ్టన్‌ హాక్‌ ఐ అనే పత్రిక ఒక పూర్తి పేజీ కేటాయించి గాంధీ గురించి రాసింది.” ప్రపంచంలో ఎక్కువ మంది చర్చించిన మనిషి ” అనే శీర్షిక పెట్టింది. రాట్నం వడుకుతున్న మహాత్మాగాంధీ ఫొటో ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. అమెరికా ఫొటోగ్రాఫర్‌ మార్గరెట్‌ బుర్కే వైట్‌ తీసిన దాన్ని 1946 మే 27వ తేదీన లైఫ్‌ అనే పత్రిక ” భారత నేతలు ‘ అనే శీర్షికతో ప్రచురించింది.


మహాత్మాగాంధీ హత్య గురించి న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఒక పతాక శీర్షికతో ప్రచురించింది.” ఒక హిందూ చేతిలో గాంధీ హత్య, కంపించిన భారత్‌,కొట్లాటల్లో బాంబేలో 15 మంది మృతి ” అని రాసింది.గార్డియన్‌, వాషింగ్టన్‌ పోస్టు, డెయిలీ టెలిగ్రాఫ్‌ వంటి పత్రికలన్నీ పతాక శీర్షికలతో గాంధీ హత్య వార్తను ప్రచురించాయి. గాంధీతో ప్రముఖ సినిమా నటుడు చార్లీ చాప్లిన్‌ భేటీ, ఆల్బర్ట్‌ ఐనిస్టీన్‌ ఉత్తర ప్రత్యుత్తరాలు, గాంధీ గురించి మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ రాసిన అంశాలన్నీ సుపరిచతమే.అమెరికా జర్నలిస్టు లూయీస్‌ ఫిశ్చర్‌ 1950లో ” మహాత్మాగాంధీ జీవితం ” పేరుతో రాసిన జీవిత చరిత్రను ఎంతో మంది చదివారు. గాంధీ సినిమాకు ముందే అనేక దేశాలు గాంధీ గౌరవార్ధం పోస్టల్‌ స్టాంపులను ప్రచురించాయి. ఇంత ప్రాచుర్య చరిత్ర ఉంటే నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్దమే గాక అసహ్యం కలిగిస్తున్నట్లు విమర్శలు వెలువడ్డాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఈజిప్టు ఫారోలా ! దేవరాజులా !! దేవదూత నరేంద్రమోడీ ఎవరి సరసన ? చరిత్రలో ఇలాంటి వారు చేసిన దుర్మార్గాలేమిటి ?

27 Monday May 2024

Posted by raomk in Africa, BJP, CHINA, Communalism, Europe, Germany, Greek, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, USA

≈ 2 Comments

Tags

Act of God, ‘Sent by god’, Biological, BJP, Donald trump, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఎన్నికలు చివరిదశకు చేరాయి, 2024జూన్‌ నాలుగున ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. అది సక్రమంగా ఉంటుందా అంటూ ” దేవుడు లేదా దేవుడి ప్రతినిధి ” గురించి అనేక మంది ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి నరేంద్రమోడీ తిరిగి అధికారానికి వస్తే లేదా కోల్పోతే ఏం జరుగుతుంది. మొదటిదాని గురించి ఇండియా కూటమి ఇప్పటికే ప్రచారంలో పేర్కొన్నట్లు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగం, సామాజిక న్యాయానికి ముప్పు ఏర్పడుతుందని నమ్ముతున్నవారు ఉన్నారు.మోడీని ఒక వైపు కాంగ్రెస్‌కు గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావంటారు, ఇండియా కూటమి వస్తే ఏడాదికొకరు ప్రధాని పదవి చేపడతారంటారు. అదే నోటితో కాంగ్రెస్‌ అధికారానికి వస్తే మెజారిటీ భారతీయులు రెండవ తరగతి పౌరులుగా మారిపోతారని, మహిళల మెడల్లో ఉన్న పుస్తెలతో సహా ఆభరణాలన్నీ తీసుకొని చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలు కలవారికి పంపిణీ చేస్తారని,క్రికెట్‌ జట్లలో ఎక్కువ మంది ముస్లింలను చేర్చుతారని, అయోధ్యలో రామాలయాన్ని కూల్చేందుకు బుల్డోజర్లు పంపుతారని ఆరోపిస్తారు. పరుచూరి బ్రదర్స్‌ చెప్పినట్లు ఒక జేబులో ఒకటి, మరోజేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే రాజకీయనేతగా మోడీ కనిపించటం లేదూ ! ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని సంఘపరివారం నిరంతరం చేస్తున్న ప్రచారం తెలిసిందే. తాను వారి గురించి కాదు అని తరువాత మోడీ మార్చారు. మరి ఎవరిని అన్నట్లు ? సమాజంలో ధనికులుగా ఉన్నవారు, ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసీ సామాజిక తరగతులతో పోల్చితే ఇతరులు పిల్లలను ఎక్కువగా కనటం లేదన్నది తెలిసిందే. అంటే ఆ మూడు సామాజిక తరగతుల మీదనే మోడీ ధ్వజమెత్తారని అనుకోవాలి మరి.లేకపోతే నరం లేని నాలుక అనుకోవాలి. ఇక రెండవ దృశ్యానికి వస్తే మోడీ జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫలితాన్ని గుర్తించను అంటూ అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌ మీదకు తన మద్దతుదార్లను ఉసిగొల్పిన ఉదంతం ఇక్కడ ప్రతిబింబిస్తుందా ? అన్నది చూడాల్సి ఉంది.


నరేంద్రమోడీ నోటి వెంట ప్రమాదాన్ని సూచించే మరో మాట వెలువడింది. రాజులు దైవాంశ సంభూతులని వంది మాగధులు వర్ణించారు, పొగిడారు. ఏకంగా తామే దైవాంశ అని, దేవుళ్లమని చెప్పుకున్న వారిని చరిత్ర ఎందరినో చూసింది. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా మా నమో లీలలు వర్ణించతరమా అన్న పూనకంతో బిజెపి నేత సంబిత్‌ పాత్ర ఏకంగా పూరీ జగన్నాధుడే నరేంద్రమోడీ భక్తుడుగా మారినట్లు ”వెల్లడించిన” సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ పూరీలో రోడ్‌ షో జరిపిన తరువాత అక్కడ పోటీ చేస్తున్న సంబిత్‌ పాత్ర ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ” ప్రభువు పూరీ జగన్నాధుడు నరేంద్రమోడీ భక్తుడు, మేమంతా మోడీ కుటుంబసభ్యులం.ఇలాంటి మహత్తర క్షణాలను చూసిన తరువాత నా భావావేశాలను ఆపుకోలేను, ఒరియా వారందరికీ ఇది ఒక ప్రత్యేకమైన రోజు ” అని మాట్లాడారు.దీని మీద ప్రతికూల స్పందనలు తలెత్తటంతో క్షమించమని వేడికోళ్లకు పూనుకున్నారు.ఈ తప్పుకు గాను ఉపవాసం ఉండి ప్రాయచిత్తం చేసుకుంటానని చెప్పిన ఈ పెద్దమనిషిని ఎన్నికల్లో పూరీ జగన్నాధుడు ఏం చేస్తాడో చూడాలి.


దేవుడు దేశానికి ఇచ్చిన బహుమతి నరేంద్రమోడీ అని కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఎం వెంకయ్యనాయుడు 2016 మార్చి నెలలో సెలవిచ్చారు.బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ పేదల పాలిట దైవాంశగల ఒక మహా పురుషుడు(మేషయ) అని కూడా వర్ణించారు. తరువాత విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మరో కేంద్ర మంత్రి రాజనాధ్‌ సింగ్‌ను విలేకర్లు ప్రశ్నించగా వెంకయ్యనాయుడి వ్యాఖ్యలను తాను వినలేదని, ఆ ప్రసంగాన్ని అంతగా ఆలకించలేదని చెప్పారు.(బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక 2016 మార్చి 21వ తేదీ) ఇంతగా వ్యక్తి పూజ తలకెక్కిన తరువాత నిజంగానే తాను దేవుడు పంపిన దూతను అని నరేంద్రమోడీ నమ్మటంలో ఆశ్చర్యం ఏముంది. ఇతరులు మాట్లాడితే విమర్శలు తలెత్తటం, రభస ఎందుకు ఏకంగా తానే రంగంలోకి దిగి మాట్లాడితే నోరెత్తే మీడియా ఉండదు కదా అనుకున్నారేమో ! ” కారణ జన్ములు ” అనే శీర్షికతో సంపాదకీయం రాసిన ఒక ప్రముఖ తెలుగు పత్రిక నరేంద్రమోడీ పేరెత్తటానికి భయపడిందంటే గోడీ మీడియా అని ఎవరైనా అంటే తప్పేముంది. అత్యవసర పరిస్థితి సమయంలో దేవకాంత బారువా అనే కాంగ్రెస్‌ నేత ఇందిరే ఇండియా-ఇండియాయే ఇందిర అని పొగడ్తలకు దిగి అభాసుపాలైన సంగతి తెలిసిందే.óఅప్పుడు కూడా మీడియా నోరెత్తలేదు, ఎత్తిన వాటిని ఎలా సెన్సార్‌ చేశారో తెలిసిందే.


తన పుట్టుక అందరి మాదిరి కాదని, తనను దేవుడు పంపినట్లు నమ్మకం కలిగిందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.న్యూస్‌ 18 అనే ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడారు.” నా తల్లి జీవించి ఉన్నంత వరకు నేను జీవసంబంధం (అందరి మాదిరే అమ్మా నాన్నలకు పుట్టినట్లు)గా పుట్టినట్లు భావించేవాడినని, ఆమె మరణం తరువాత నా అనుభవాలను చూస్తే నన్ను దేవుడు పంపినట్లు నిర్ధారించుకున్నాను. అందుకే దేవుడు నాకు సామర్ధ్యం, శక్తి, స్వచ్చమైన హృదయం, ఈ పనులు చేసేందుకు దైవావేశం కూడా ఇచ్చినట్లు భావిస్తున్నాను. దేవుడు పంపిన ఒక సాధనాన్ని తప్ప నేను మరొకటి కాదు ” అని చెప్పారు. కల్యాణమొచ్చినా కక్కొచ్చినా(వాంతి) ఆగదంటారు, ఇప్పుడు దీనికి మోడీ మనసులోకి ఏది వచ్చినా అనే దాన్ని కూడా జతచేసుకొని నవీకరించాలి. చివరి దశ ఎన్నికల్లోగా లేదా తరువాత అయినా తన జన్మ ఏ దేవుడి అంశో అన్న రహస్యాన్ని వెల్లడించినా ఆశ్చర్యం లేదు. అప్పటి వరకు గుజరాత్‌ ద్వారక కృష్ణుడా, అయోధ్య రాముడా, వారణాసి శివుడా ఎవరు పంపారన్నది జనాలు జుట్టుపీక్కోవాల్సిందే. జర్మన్‌ నాజీ హిట్లర్‌ స్వచ్చమైన ఆర్య సంతతి అని భావించిన సావిత్రీదేవి ముఖర్జీ అనే ఫ్రాన్సులో పుట్టిన గ్రీకు ఫాసిస్టు రాసిన పుస్తకంలో హిట్లర్‌ను విష్ణువు అవతారమని చెప్పింది. సదరు అవతారి ఒక మారణహౌమానికి ఎలా కారకుడయ్యాడో తెలిసిందే. అజిత్‌ కృష్ణ ముఖర్జీ అనే బెంగాలీని వివాహం చేసుకొన్న సావిత్రిదేవీ కొల్‌కతాలో జీవించి రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాలకు వ్యతిరేకంగా జర్మన్‌ గూఢచారిగా పనిచేసి తరువాత నాజీగా జీవించింది.


ముందే చెప్పుకున్నట్లు చరిత్రను చూస్తే ఈజిప్టులో ఫారోలుగా వర్ణితమైన పురాతన రాజులు తమను దేవుళ్లుగా భావించుకోవటమే కాదు, పేర్లు కూడా అలాగే పెట్టుకొనే వారు. తదుపరి జన్మ కొనసాగింపుకోసం చచ్చిన రాజుల శవాలను మమ్మీలుగా మార్చి పిరమిడ్‌లను నిర్మించిన సంగతి తెలిసిందే. కొందరు చైనా రాజులు కూడా తమను స్వర్గ పుత్రులని వర్ణించుకున్నారు. చరిత్రలో అలెగ్జాండర్‌ ది గ్రేట్‌గా పిలిచే గ్రీకు చక్రవర్తి ఈజిప్టు ఫారోల మాదిరే తాను కూడా దైవాంశ సంభూతుడిగానే భావించుకున్నాడు.తన నిజమైన తండ్రి జీయస్‌ అమన్‌ అనే ఈజిప్టు పురాతన దేవుడని భావించాడు.ఇండోనేషియాలో అనేక మంది పురాతన రాజులు తాము హిందూ దేవుళ్ల అంశగా చెప్పుకున్నారని చరిత్ర చెబుతోంది.ఆగేయాసియా దేశాలలో దేవరాజ అని పిలుచుకున్న అనేక మంది శివుడు లేదా విష్ణువు అవతారాలు లేదా వారసుల మని చెప్పుకున్నారు. సూర్య, చంద్ర వంశీకులమని చెప్పుకున్న వారి సంగతి తెలిసిందే.టిబెట్‌లో దలైలామాలు ఇప్పటికీ తాము బుద్దుని అవతారమని చెప్పుకుంటున్నారు. నేపాల్లో షా వంశ రాజులు కూడా తమను విష్టు అవతారాలుగా వర్ణించుకున్నారు. సత్యసాయి బాబాను దత్తాత్రేయ అవతారంగా భావించే భక్తులు సరేసరి. చరిత్రలో తమను తాము దేవుళ్లుగా, దేవదూతలుగా వర్ణించుకున్నవారు, మతాన్ని కాపాడతామని చెప్పేవారు, కలుషితమైన జాతిని పరిశుద్ధం చేయాలనే వారు చేయించిన లేదా చేసిన దుర్మార్గాలు ఎన్నో. ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం పేరుతో అధికారానికి వచ్చిన మతశక్తులు ప్రత్యర్ధులను ముఖ్యంగా కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు ”దేవుని శత్రువు ”లు అనే సాకుతో వేలాది మందిని బూటకపు విచారణలతో ఉరితీశారు. జపాన్‌లో షోకో అసహరా అనే వాడు తనను క్రీస్తుగా చెప్పుకున్నాడు. తరువాత బౌద్దం-హిందూ విశ్వాసాలలను కలగలిపి ప్రచారం చేశాడు. యుగాంతం ముంచుకువస్తుందని తన భక్తులను నమ్మించాడు.టోక్యోలో 1995లో శరీన్‌ గాస్‌ను ప్రయోగించి వేలాది మందిని గాయపరచి 13 మంది ప్రాణాలు తీశారు. చివరకు మరో ఏడుగురితో కలిపి అసహరాను అక్కడి ప్రభుత్వం విచారించి ఉరితీసింది. అమెరికాలో ఆస్కార్‌ రామిరో ఓర్టేగా హెర్నాండెస్‌ అనే పెద్ద నేరగాడు తనను దేవదూతగా, ఏసుక్రీస్తుగా వర్ణించుకున్నాడు.అమెరికా అధ్యక్ష భవనం మీద దాడికి దేవుడు తనను ఆదేశించినట్లు చెప్పుకున్నాడు.


తనను దేవుడు ఆవహించినట్లు చెప్పుకున్నా, కొన్ని పనులు చేసేందుకు పంపినట్లు భావించినా, వంది మాగధులు అలాంటి వాతావరణం కల్పించినా చరిత్రలో జరిగిన నష్టాలు ఎన్నో. అనేక మంది ఎలాంటి ఆలోచన లేకుండా వారేం చేసినా సమర్ధించే ఉన్మాదానికి ఎందుకు లోనవుతారు అన్నది అంతుచిక్కని ప్రశ్న. జర్మనీలో జరిగింది అదే.జర్మన్‌ జాతికి యూదుల నుంచి ముప్పు ఏర్పడిందని, వారు జర్మనీకి ద్రోహం చేశారనే ప్రచారాన్ని సామాన్య జనం నిజంగా నమ్మబట్టే హిట్లర్‌ ఆటలు సాగాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తాను చెప్పిన వక్రీకరణలు, అవాస్తవాలను జనాలు నిజాలుగా భావిస్తారన్న గట్టి విశ్వాసం ఉన్నకారణంగానే నరేంద్రమోడీ ప్రసంగాలు చేశారు. తన జన్మ మామూలుది కాదని చెప్పుకున్నారు. హిట్లర్‌ను దేవుడే పంపాడని జర్మనీ పిల్లలకు నూరిపోశారు, దాంతో వాడిని ఒక సాధారణ రాజకీయవేత్తగా చూడటానికి బదులు దేవుడు పంపిన దూతగా చూశారు. మతాన్ని రాజకీయాలను జోడిస్తే జరిగేది ఇదే. జర్మనీ పూర్వపు ఔన్నత్యాన్ని నిలపాలంటే యూదులను అంతం చేయాలని చెబితే నిజమే అని నమ్మారు.ఇప్పుడు మనదేశంలో కూడా అన్ని రకాల అనర్ధాలకు ముస్లిం పాలకుల దండయాత్రలు, ఆక్రమణ, హిందువుల జనాభా తగ్గుతూ ముస్లింల జనాభాను పెంచుతూ ఒక నాటికి హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందన్న ప్రచారాన్ని నమ్ముతున్న వారు ఉన్నారు. దాన్ని అడ్డుకోవాలంటే మెజారిటీ హిందూత్వ పాలన రావాలన్నదానికి మద్దతు పెరుగుతోంది. మంచి చెడుల ఆలోచన లేదు. ప్రజాస్వామ్యం ఎక్కువ కావటం కూడా మంచిది కాదంటూ అనాలోచితంగా మాట్లాడుతున్న జనాలు రోజు రోజుకూ పెరుగుతున్నారు.


ఇందిరా గాంధీ ఉపన్యాసాలు, విన్యాసాలు చూసిన జనం ఆకర్షితులయ్యారు.గరీబీహటావో అంటే నిజమే అని నమ్మారు. చివరకు అత్యవసర పరిస్థితిని ప్రకటించి దేశాన్ని ప్రమాదపు అంచుల్లోకి నెట్టారు. ఇప్పుడు నరేంద్రమోడీ అద్భుతాలు చేస్తారని, తమ జీవితాలను మార్చివేస్తారని అనేక మంది నమ్ముతున్నారు. ఒక వైపు సంపదలన్నీ కొంత మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంటే అలాంటి వారిని మోడీ వెనకేసుకు వస్తుంటే మార్పు సాధ్యం కాదనే ఆలోచనకు తావివ్వటం లేదు.గోవులను వధిస్తున్నారనే పేరుతో రోజూ తమ కళ్ల ముందు తిరిగే వారి మీద మూకదాడులకు పాల్పడుతుంటే చూస్తూ ఏమీ చేయలేని వారిని చూశాం.” నాజీ అంతరాత్మ ” పేరుతో 2003లో వెలువరించిన ఒక పుస్తకంలో క్లాడియా కూంజ్‌ అనే చరిత్రకారిణి ఒక ఉదంతాన్ని వివరించారు.ఆల్ఫోన్స్‌ హెక్‌ అనే యువకుడు హిట్లర్‌ యూత్‌లో ఉన్నాడు. (ఇప్పుడు మనదేశంలో ”దళ్‌ ” పేరుతో ఉన్న సంస్థల మాదిరి.) తన గ్రామంలో నాజీ పోలీసులు యూదులను నరహంతక శిబిరాలకు తరలించేందుకు ఒక దగ్గర పోగుచేస్తూ ఉంటే వారిలో హెయినిజ్‌ అనే తన మంచి స్నేహితుడు ఉన్నప్పటికీ ఎంత అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని తనలో తాను కూడా అనుకోలేకపోయాడట. యూదుల నుంచి ముప్పు ఉందనే అంశాన్ని బుర్రకు ఎక్కించుకొని ఉండటంతో హెయినిజ్‌ దురదృష్టం ఏమిటంటే అతను యూదుగా పుట్టటమే అని, వారిని తరలించటం సమంజసమే అని అనుకున్నట్లు తరువాత గుర్తు చేసుకున్నాడట. ఒక ఉన్మాదం తలెత్తినపుడు మనుషుల ఆలోచనల్లో వచ్చే మార్పును కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.” నా భాష జర్మన్‌, నా సంస్కృతి, అనుబంధాలు అన్నీ కూడా జర్మనే.జర్మనీ, జర్మనీ ఆస్ట్రియాలో యూదు వ్యతిరేకత పెరుగుతున్నదని గుర్తించేవరకు నేను కూడా జర్మన్‌ మేథావినే అనుకున్నాను. కానీ యూదు వ్యతిరేకత పెరిగిన తరువాత ఒక యూదును అని నన్ను నేను అనుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చాను” అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది కూడా అదే. హిట్లర్‌ పుట్టుకతోనే నాజీ కాదు. కేవలం జర్మన్‌ జాతి ఒక్కటే నాగరికతకు తగినది అనే భావజాలం విస్తరిస్తున్న సమయంలో అనేక మంది దానికి ఆకర్షితులయ్యారు. అదే భావజాలం మరింత ముదిరి హిట్లర్‌ను నియంత, నరహంతకుడిగా మార్చాయి. అందుకే నేడు కావాల్సింది నిరంకుశత్వానికి దారితీసే మితవాద భావజాలం వైపు ఆకర్షితులౌతున్నవారిని నిందిస్తూ కూర్చోవటం కాదు, ఆ భావజాలాన్ని ఎదుర్కొనే పోరును మరింత ముందుకు తీసుకుపోవటం, దీనికి అధ్యయనం తప్ప దగ్గరదారి లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిప్‌ ఖరాబైందా ? నరేంద్రమోడీని హిట్లర్‌, గోబెల్స్‌ ఆవహించారా !

19 Sunday May 2024

Posted by raomk in BJP, Congress, Current Affairs, Germany, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Uncategorized, WAR

≈ 1 Comment

Tags

Adolf Hitler, BJP, Donald trump, Narendra Modi, Narendra Modi Failures, Nazi Joseph Goebbels, Nazism, RSS


ఎం కోటేశ్వరరావు


రంభా, ఊర్వశి, మేనక వంటి వారితో సంతోషంగా గడుపుతున్న జర్మన్‌ నాజీ మాజీ మంత్రి జోసెఫ్‌ గోబెల్స్‌ భారత్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి గనుక తన ఆరాధకులు ఎలా పని చేస్తున్నారో చూద్దామని వచ్చినట్లు కనిపిస్తున్నది. (విడ్డూరంగాకపోతే ఎంతైతే మాత్రం మన భారతీయ సంప్రదాయాలు, విలువలకు కట్టుబడిన అప్సరసలు ఒక మ్లేచ్చుడితో ఆడిపాడతారా, ఇంకా ఏదైనా చేస్తారా అని కొంత మంది సనాతనవాదులకు కోపం రావచ్చు.కంచంలో తేడా ఉంటుంది గానీ మంచంలో ఎలాంటి బేధాలను పాటించని ”విశాల భావాలు” మనవి అన్నది తెలిసిందే.అందులోనూ జర్మన్‌ గోబెల్స్‌ మనవా(ఆర్యు)డే అని భావిస్తున్నపుడు, స్వర్గంలో మాట్లాడేది ఎలాగూ సంస్మృతమే, అయినా భాషతో పనేముంది, అంటూ సొంటూ ఏముంటుంది) ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా దేశంకోసం-ధర్మకోసం పని చేస్తున్నట్లు చెప్పుకుంటున్న మన నరేంద్రమోడీ, ఇతర సంఘపరివార్‌ నేతలను గోబెల్స్‌ ఆవహించినట్లు కనిపిస్తోంది. లేకుంటే ఉత్తర ప్రదేశ్‌లో సమాజవాది పార్టీ-కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వారు ఆయోధ్య రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని, బాలరాముడిని తిరిగి గుడారాల్లో కూర్చో పెడతారని నరేంద్రమోడీ చెప్పేవారు కాదేమో ! ఎందుకిలా మాట్లాడినట్లు ?
వాట్సాప్‌లో తిరుగుతున్న ఒక వర్తమానంలో రచయిత ఎవరో తెలియదు గానీ నరేంద్రమోడీ-హిట్లర్‌ మధ్య ఒక పోలిక తెచ్చారు.హిట్లర్‌ వివాహం చేసుకోలేదు.(మోడీ వివాహం చేసుకున్నా కాపురం చేయకుండా విడాకులు కూడా ఇవ్వకుండా వదలివేశారు. భారతీయ ధర్మాన్ని, రాజ్యాంగాన్నీ పాటించలేదు).ఒక మతం వారు దేశానికి వ్యతిరేకులనే భావాన్ని హిట్లర్‌ తలకు ఎక్కించుకున్నాడు. హిట్లర్‌ను ఎవరైనా విమర్శిస్తే మద్దతుదార్లు సహించేవారు కాదు. అన్ని రకాల మీడియాను తన గురించి గొప్పలు చెప్పుకోవటానికి హిట్లర్‌ ఉపయోగించుకున్నాడు.తన వ్యతిరేకులందరినీ అణచివేశాడు. వారు దేశ ద్రోహులని, జాతి వ్యతిరేకులని ఎల్లవేళలా పిలిచాడు. అన్ని సమస్యలనూ స్వల్పకాలంలోనే పరిష్కరిస్తానని వాగ్దానం చేశాడు.మంచి రోజులు రానున్నాయన్నది హిట్లర్‌ నినాదం. మంచి దుస్తులు వేసుకొని అందంగా కనిపించేందుకు హిట్లర్‌ చూశేవాడు. అబద్దాలను నిజాలుగా భ్రమింపచేసే కళను హిట్లర్‌ ప్రదర్శించేవాడు.రేడియోలో ఉపన్యాసాలు ఇచ్చేందుకు హిట్లర్‌ ఇష్టపడేవాడు.స్నేహితులు, సోదరులు, సోదరీమణులంటూ తన ప్రతి ప్రసంగంలో హిట్లర్‌ మాట్లాడేవాడు.హిట్లర్‌కు ఫొటోలు తీయించుకోవటమంటే పిచ్చి.


పైన పేర్కొన్నవాటిలో నరేంద్రమోడీకి ఏ లక్షణాలు, ఏమి ఉన్నాయో లేవో ఎవరికి వారు బేరీజు వేసుకోవచ్చు. చిన్న తనంలో ఒక రైల్వే స్టేషన్‌లో టీ అమ్మినట్లు మోడీ చెప్పుకున్న సంగతి తెలిసిందే. దానికి ఆధారాలు లేవని చెబుతారు. హిట్లర్‌ చిన్న తనంలో, కాస్త వయస్సు వచ్చాక కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడినట్లు, అనాధ గృహాల్లో గడిపినట్లు చరిత్ర చెబుతున్నది.హిట్లర్‌ హైస్కూలు విద్యను కూడా పూర్తి చేయకపోవటంతో ఉన్నత విద్యకు అర్హÛత సాధించలేకపోయాడు. నరేంద్రమోడీ ఉన్నత విద్య చదివినట్లు చెప్పుకున్నా దానికి తగిన ఆధారాలు లేవు. నాజీగా హిట్లర్‌, నాజీల బాటలో నడుస్తుందనే విమర్శలున్న ఆర్‌ఎస్‌ఎస్‌లో మోడీ చాలా తక్కువ కాలంలోనే ప్రముఖ స్థానాలకు ఎగబాకారు.హిట్లర్‌ ఒకనాడు జర్మనీలో దేవుడిగా ఒక వెలుగు వెలిగాడు. నరేంద్రమోడీని కూడా అభిమానులు అలాగే చూస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడే స్వయంగా మోడీ దేవుడి బహుమతి, పేదల పట్ల దేవదూత అని చెప్పిన సంగతి తెలిసిందే.


2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన లేదా జరిపిన ప్రచారంలో ఇండియా కూటమి బిజెపి విధానాలపై విమర్శలతో పాటు ఆ కూటమిలోని పార్టీలు విడివిగా ప్రకటించిన మానిఫెస్టోలోని అంశాలను, బిజెపి చెబుతున్నట్లుగా నాలుగువందల సీట్లు ఎందుకు కోరుతున్నదో, ఏం చేసేందుకు అన్నిసీట్లు కోరుతున్నదో స్పష్టంగానే ప్రచారం చేశాయి. బిజెపి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను ఎత్తివేస్తుందన్నది ప్రధానమైన విమర్శ. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బిజెపి ఎంతసేపూ ఎన్నిమరుగుదొడ్లు కట్టించిందీ, ఎన్ని ఉజ్వల గాస్‌ కనెక్షన్లు ఇచ్చిందీ, రోడ్లు వేసిందీ చెప్పుకోవటం తప్ప జన జీవితాలను మెరుగుపరిచేందుకు చేసిందేమిటో పెద్దగా చెప్పలేదు. పచ్చి అవాస్తవాలను, ఆధారంలేని ఆరోపణలను ఎన్నింటినో స్వయంగా నరేంద్రమోడీ ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఇంతగా వక్రీకరణ, అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారం చేసిన ప్రభుత్వ నేత మరొకరు లేరన్నది వేరే చెప్పనవసరం లేదు. మీడియాలో ఎన్ని టీవీ ఛానళ్లు వాటి గురించి చర్చలు పెట్టాయి, ఎన్ని పత్రికలు ప్రముఖంగా విశ్వేషణలు, వాస్తవాలను వెల్లడించాయి ? ఇదేం ప్రచారం అన్నట్లుగా కొందరు గొణగినట్లు విమర్శించటం తప్ప గట్టిగా బట్టబయలు చేసే ధైర్యం చేయటం లేదు. విదేశీ మీడియాలో కూడా ఇదే వ్యక్తమైంది.


నరేంద్రమోడీ ఇన్ని పచ్చి అబద్దాలను ప్రచారం చేయటం వెనుక ఉన్న మతలబు ఏమిటి ? పలుకుబడి దిగజారుతున్న పూర్వరంగంలో మైనారిటీ విద్వేషంతో లాభం లేదని గ్రహించి కాబోలు ముందే చెప్పుకున్నట్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారంటూ హిందువులను రెచ్చగొట్టి లబ్దిపొందాలన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి మసీదులు, చర్చీలను కూల్చివేసిన చరిత్ర కాషాయ దళాలది తప్ప ఇతర పార్టీలది కాదు. రోడ్ల విస్తరణ పేరుతో నరేంద్రమోడీ సిఎంగా ఉండగా అహమ్మదాబాద్‌లో కొన్ని మందిరాలను కూడా తొలగించారన్న వార్తలు తెలిసిందే.హిట్లర్‌ నాయకత్వంలోని నాజీల ప్రచారం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. విశ్లేషణలు వెలువడుతూనే ఉన్నాయి. రాజకీయ,చరిత్ర,మతం, కులం, సాంస్కృతిక అంశం ఏదైనా సరే తమకు అనుకూలంగా ఉంటుందని ఎవరు భావించినా వాటిని వక్రీకరించి తమకు అనుకూలంగా మలుచుకోవటం వెనుక రెండు రెళ్లు నాలుగు అన్న విశ్వవ్యాప్త సూత్రం ఒకటే ప్రాతిపదిక. అదే ” పర్వతమంత అబద్దం ” చెప్పటం, వాస్తవానికి వక్రీకరణ, వక్రభాష్యం చెప్పి జనాన్ని బురిడీ కొట్టించటం. ఒక అబద్దాన్ని పదే పదే చెబితే చివరికి నిజమై కూర్చుంటుంది. ఎంతైతే మాత్రం ఫలానావారు అంత నిస్సిగ్గుగా అబద్దం అడతారంటే నేను నమ్మను అనే విశ్వాసాన్ని సొమ్ము చేసుకోవాలని తొలిసారిగా హిట్లర్‌ 1925లో మెయిన్‌ కాంఫ్‌ అనే గ్రంధంలో చెప్పాడు. మొదటి ప్రపంచ యుద్దంలో ఓడిపోయినపుడు జర్మనీలో చర్చ జరిగింది. జర్మనీ మిలిటరీలో లక్షమందికి పైగా యూదులు సైనికులుగా ఉన్నారు.యుద్ధరంగంలో యూదులు సరిగా పోరాడని కారణంగానే జర్మనీ ఓడిపోయిందని ఒక ప్రచారం జరిగింది.ఓటమి గురించి ప్రభుత్వం విచారణ జరిపింది. పేరు పెట్టి ఫలానా సామాజిక తరగతి అని చెప్పలేదు గానీ వెన్ను పోటు కారణంగానే జర్మనీ ఓడిపోయిందనే ప్రచారాన్ని నిజమే అని చాలామంది నమ్మారు. నిజానికి దానిలో ఎలాంటి వాస్తవం లేదు. దాన్ని హిట్లర్‌ వంటి జాతీయవాదులు భుజానవేసుకొని యూదులే వెన్నుపోటుదారులంటూ రెచ్చగొట్టారు. అప్పటికే మతరీత్యా యూదులపై ఉన్న అభిప్రాయాలు, అనుమానాలతో ఉన్న జనం నిజమని నమ్మారు. చివరకు అది ఎంతవరకు దారి తీసిందంటే జర్మనీ ఆత్మరక్షణకు యూదులను అంతమొందించటానికి జర్మన్లకు హక్కు ఉందన్నవరకు పోయి మారణకాండకు దారితీసిన సంగతి తెలిసిందే. తన పార్లమెంటు భవనాన్ని(రీచ్‌స్టాగ్‌) తానే తగులబెట్టించి ఆ నెపాన్ని కమ్యూనిస్టుల మీద మోపి అణచివేసిన దుర్మార్గం తెలిసిందే. హిట్లర్‌ ప్రచార పద్దతులను ఎన్నికల్లో ఓడిన డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా వినియోగించుకొనేందుకు చూశాడు.ఎన్నికల్లో డెమోక్రాట్లు అక్రమాలకు పాల్పడ్డారని, ఫలితాలను తారుమారు చేశారని, తాను ఓటమిని అంగీకరించనని చెప్పటమే కాదు, అమెరికా అధికార కేంద్రంపై తన అనుచరులతో దాడి చేయించిన దుండగాన్ని కూడా చూశాము. తాను నిజంగానే ఓడినట్లు ట్రంప్‌కు ముందే తెలిసినా కావాలని రెచ్చగొట్టినట్లు తరువాత వెల్లడైంది. అలాంటి ట్రంప్‌ను గెలిపించాలని పిలుపు ఇచ్చిన మోడీ గురించి తెలిసిందే.


కొందరు పనిగట్టుకొని పదే పదే తప్పుడు సమాచారాన్ని మెదళ్లలోకి ఎక్కిస్తే జనం ఎందుకు నమ్ముతున్నారు అనేది ప్రశ్న. దీని గురించి భిన్న కోణాలు వెలువడుతున్నాయి. తమ ముందుకు వచ్చిన ఒక సమాచారం వాస్తవం కాదని తెలిసినప్పటికీ అది పదే పదే వేర్వేరు మార్గాల్లో చేరితే ఏమో నిజమేనేమో అనే సందేహంలో పడతారు.బ్రాహ్మణుడు-మేకపిల్ల కథ తెలిసిందే. దానికి ప్రతిగా సమాచారం లేకపోతే చివరికి నిజమని నమ్ముతారు. ఉదాహరణకు వైరస్‌తో జలుబు చేస్తుంది. నిజానికి దానికి మందు లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మారిన వైరస్‌కు వెంటనే మందు కనుగొనటం సాధ్యం కాదు. ఏదైనా బిళ్ల వాడితే వారంలో వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందన్న లోకోక్తి తెలిసిందే. మనశరీరంలోని రోగనిరోధకశక్తి ఆ వైరస్‌ను ఎదుర్కొన్న తరువాత అదే తగ్గిపోతుంది కానీ అనేక మంది ఫలానా బిళ్ల వేసుకుంటే మాకు తగ్గింది అని చెప్పారనుకోండి, కొంతకాలానికి మిగతావారు పోయేదేముంది మనమూ చూద్దాం అని ఆ బిళ్లలనే వాడతారు. ఇది వ్యక్తులకు సంబంధించిన అంశం కనుక పెద్దగా నష్టం ఉండదు. పొట్టను తగ్గించాలంటే సూక్ష్మంలో మోక్షంలా ఫలానా మిషన్‌ వాడితే తగ్గిపోతుందనే ప్రచారం తెలిసిందే. ఒకసారి చూద్దాం పోయేదేముంది అనుకొని అనేక మంది కొనుగోలు చేయటం, ఆయిల్‌ పుల్లింగ్‌, మంచినీటి వైద్యాల వంటి వాటికి బుర్రలను అప్పగించటం చాలా మందికి తెలిసిందే. ఇలాంటి వాటి వలన వ్యక్తులు నష్టపోతారు. అదే ఒక ప్రతికూల భావజాలానికి చెవి అప్పగిస్తే యావత్‌ సమాజానికే ప్రమాదకరం. ప్రతి మనిషి సగటున రోజు 35వేల నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కొందరు పరిశోధకులు చెప్పారు. ఒక షర్టు ఆరటానికి అర్ధగంట పడితే పది షర్కులు ఎంతసేపటిలో ఆరతాయంటే ఐదు గంటలు అనేవారు, ఒక కిలో దూది బరువా ఒక కిలో ఇనుము బరువా అంటే ఇనుము అని చెప్పేవారి గురించి తెలిసిందే.అంటే ప్రతి క్షణానికి మన మెదళ్లకు ఎంతో సమాచారం అందుతుంటుంది.బహుశా ఈకారణంగానే వెంటనే బుర్రకు తర్కం కూడా తట్టదు. మన బుర్రలో రెండు రకాల ఆలోచనా వ్యవస్థలుంటాయట. ఒకటి అదుపులేని సృహతో తక్షణమే స్పందించేది, రెండవది సృహతో దీర్ఘంగా, లోతుగా ఆలోచించి నిర్ణయించేది. జనాలు మొదటిదానికే ఎక్కువగా పనిపెడతారని,అందువలన లోతుగా ఆలోచించకుండా చేసే పద్దతులు, సమాచారాన్ని కొన్ని శక్తులు మనబుర్రలకు చేరవేస్తాయని భావిస్తున్నందున హిట్లర్‌ వంటి నియంతలు, మార్కెటింగ్‌ నిపుణులు, రంగులు మార్చే రాజకీయవేత్తలు ప్రతితరాన్ని ఏదో విధంగా మభ్యపెట్టగలుగుతూనే ఉన్నారు.


ఫేక్‌,వక్రీకరించిన సమాచారం ఈ రోజు సామాజిక మాధ్యమాన్ని ఊపివేస్తున్నది. ఇవి పెద్దగా జనానికి అందుబాటులో లేని రోజుల్లో వినాయకుడు పాలు తాగాడన్న వార్త ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. సైన్సు పత్రికలో ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం వాస్తవ కథనాలకంటే తప్పుడు వార్తలు జనాలకు ఆరు రెట్లు వేగంగా చేరతాయని తేలింది.సంఘపరివార్‌ వంటి సంస్థలకు చెందిన వారు తొలిసారిగా చెప్పిన అంశాలను అనేక మంది తొలిరోజుల్లో నమ్మలేదు. కానీ పదే పదే వాటిని ప్రచారం చేస్తుండటంతో అనేక భ్రమాత్మక అంశాలు నిజమై కూర్చున్నాయి. ఉదాహరణకు రాహుల్‌ గాంధీకి అసలు గాంధీ పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించటం తెలిసిందే. రాహుల్‌ తాత ఫిరోజ్‌ గాంధీ, అతని తలిదండ్రులు జొరాస్ట్రియన్‌ మతానికి చెందిన వారు. వందల సంవత్సరాల క్రితం పర్షియాపై దండయాత్ర చేసిన ఇస్లాం పాలకులు జొరాస్ట్రియన్లను అణచేందుకు పూనుకున్నపుడు అనేక మంది అరేబియా సముద్ర మార్గం ద్వారా గుజరాత్‌కు వలస వచ్చిన పూర్వీకుల కుటుంబాలలో ఫిరోజ్‌ గాంధీది ఒకటి. పర్షియాకు మరో పేరు ఇరాన్‌, అక్కడి నుంచి వచ్చారు గనుక ఇరానీలు, పార్సీలయ్యారు.వారి సంఖ్య ప్రస్తుతం లక్షమందికి లోపే.గతంలో పర్షియాలో ఉన్నపుడే వాణిజ్యంలో ముందున్నారు గనుక మన దేశం వచ్చిన వారు కూడా దాన్ని అందిపుచ్చుకొని దేశంలో నేడు ప్రముఖ వాణిజ్య, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. మహాత్మాగాంధీలో గాంధీ పేరుతో ఎలాంటి సంబంధం లేదు, పార్సీలలో గాందే పేరుతో ఉన్నవారు చివరికి గాంధీలుగా నామాంతరం చెందారు.ఫిరోజ్‌ అని ఉంది గనుక అతను మనవాడే అని అనేక మంది ముస్లింలు భావించారు.దీన్ని ఎంత మంది గూగుల్లో వెతికి నిర్ధారించుకుంటారు. వాట్సాప్‌ ద్వారా పనిగట్టుకు చేస్తున్న ప్రచారం కూడా అలాంటిదే. అనేక తప్పుడు ప్రచారాలు ప్రారంభిస్తే కొన్నాళ్లకవి నిజాలై కూర్చుకుంటాయి. మతోన్మాదశక్తులు ఇంతకాలం చేసింది అదే. వాటితో జనాలు ప్రభావితులౌతున్నారు. అఫ్‌కోర్సు పెరుగుట విరుగుట కొరకే. హిట్లర్‌ను ఆరాధించిన జర్మన్లే ఇప్పుడు ఆ పేరు ఎత్తటానికి కూడా ఇచ్చగించరు వాడొక కుక్క అంటారు.ఎవరికైనా అదే గతి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏమి రాజకీయాల్రా బాబూ : చైనాపై అమెరికా పెద్దన్న ధ్వజం – విశ్వగురువు నరేంద్రమోడీ లొంగుబాటు !!

16 Thursday May 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, USA, WAR

≈ Leave a comment

Tags

Anti China Propaganda, Anti communist, BJP, China, CHINA TRADE, Donald trump, Import duty on EVs, Joe Biden, Narendra Modi Failures, RSS, TRADE WAR, Xi Jinping


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు బెదిరించి లొంగదీసుకోవాలన్న ఎత్తుగడ. మరోవైపు జనం ముందు శత్రువు అంటూనే చైనా సంతుష్టీకరణ.ఎందుకిలా జరుగుతోంది ? ” ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నరేంద్రమోడీ ఆపివేయగలిగారు. అమెరికా, రష్యా అధినేతలను సైతం శాసించగలిగిన పలుకుబడి కలిగిన విశ్వగురువుగా ఎదిగారు, ప్రపంచ నేతల్లో పలుకుబడి ఎక్కువ కలిగిన నేతగా ఉన్నారు.” మోడీ గురించి ఇలాంటి ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. జనం కూడా నిజమే కదా అని వింటున్నారు, మేము సైతం తక్కువ తిన్నామా అన్నట్లుగా వాటిని ఇతరులకు ఉచితంగా పంచుతున్నారు. వాట్సాప్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి కష్టం లేకుండానే పట్టాలు పొందుతున్నారు.ఇక తాజా విషయానికి వస్తే చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్‌ వాహనాలు,కంప్యూటర్‌ చిప్స్‌, వైద్య ఉత్పత్తులపై అమెరికా సర్కార్‌ వందశాతం వరకు దిగుమతి సుంకాన్ని విధించి వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తున్నాం కాసుకోండి అంటూ ఒక సవాల్‌ విసిరింది. మరి అదే అమెరికా మెడలు వంచారని, దారిలోకి తెచ్చుకున్నారని చెబుతున్న నరేంద్రమోడీ ఏం చేశారు ? ఇప్పటి వరకు మనదేశం విదేశీ విద్యుత్‌ వాహనాలపై రకాన్ని బట్టి 70 నుంచి 100శాతం వరకు విధిస్తున్న దిగుమతి సుంకాన్ని పదిహేను శాతానికి తగ్గించారు. అయితే చైనా కంపెనీలతో సహా ఎవరైనా 50 కోట్ల డాలర్ల మేరకు ఆ వాహనరంగంలో మనదేశంలో పెట్టుబడులు పెట్టాలి, ఉత్పత్తి ప్రారంభించేంత వరకు ఐదు సంవత్సరాల పాటు ఏటా ఎనిమిది నుంచి 40వేల వరకు వాహనాలను ప్రతి కంపెనీ నేరుగా దిగుమతులు చేసుకోవచ్చు. వాహనాల తయారీలో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న విడిభాగాల వినియోగం ప్రస్తుతం 30 నుంచి 40శాతం వరకు ఉందని, నూతన విధానం వలన మరింత పెరుగుతుందని ప్రభుత్వం చెబుతుండగా రానున్న రోజుల్లో చైనా వాహనాలతో భారత మార్కెట్‌ నిండిపోతుందని ఆ రంగ నిపుణులు హెచ్చరిక, ఆందోళన వెల్లడించారు. అమెరికా మెడలే వంచగలిగిన నరేంద్రమోడీ చైనా విషయంలో ఇప్పుడున్న పన్నును కొనసాగించకుండా ఇలా ఎందుకు లొంగిపోయినట్లు ? అమెరికా పెద్దన్న బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తుంటే, విశ్వగురువు తనకు నచ్చని మాట సంతుష్టీకరణకు ఎందుకు పూనుకున్నట్లు ?


నవంబరు నెలలో జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్‌కు ప్రత్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ చుక్కలు చూపిస్తున్నాడు.చైనా నుంచి దిగుమతులు అంటే అమెరికన్లకు ఉపాధి తగ్గటమే. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అమెరికాలో విద్యుత్‌ వాహనాలను తయారు చేసే కంపెనీలు ఉన్నాయి గనుక అక్కడి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనదేశంలో పదేండ్లలో మోడీ అలాంటి కార్ల తయారీని ప్రోత్సహించటం, పరిశోధనా, అభివృద్ధి రంగాలను పట్టించుకోలేదు. ఈ కారణంగా మనదేశంలోని కార్పొరేట్‌ సంస్థలు చైనా కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యం, దిగుమతులకు మోడీ సర్కార్‌ మీద వత్తిడి తెచ్చాయి. ఎన్నికలలో వాటి నుంచి నిధులు కావాలి గనుక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే వాటిని సంతుష్టీకరించేందుకు విద్యుత్‌ వాహనాల దిగుమతి, తయారీ విధానంలో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్ల రూపంలో అంతకు ముందే బిజెపికి గణనీయమొత్తాలను సమర్పించుకున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు తరువాత బహుశా టెంపోలలో నోట్లను రవాణా చేసి ఉంటాయి. దిగుమతుల కారణంగా ఉపాధి తగ్గినా లేక నిరుద్యోగం ప్రాప్తించినా అమెరికా సమాజం సహించదు. మనదేశంలో అలాంటి పరిస్థితి లేదు, మతం, కులం, ప్రాంతం, విద్వేషం, తప్పుడు సమాచారం తదితర అనేక మత్తుమందులను ప్రయోగిస్తూ అసలు సమస్యల నుంచి జనాన్ని తప్పుదారి పట్టించటంలో ఎవరు అధికారంలో ఉన్నా సర్వసాధారణమైంది. జనం కూడా అలవాటు పడ్డారు.గుళ్లు, మసీదు, చర్చీలు ఇతర ప్రార్ధనామందిరాలకు వెళ్లి రోజంతా వేడుకోవటానికి కానుకల సమర్పణ, కొబ్బరి కాయలు కొట్టేందుకు సిద్దపడుతున్నారు గానీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటానికి ఆసక్తి చూపటం లేదు.


అమెరికా పెంచిన పన్నులను రద్దు చేయాలని లేదా తాము కూడా ప్రతిచర్య తీసుకుంటామని చైనా స్పందించింది.చైనా నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ వాహనాలు,అల్యూమినియం, సెమీకండక్టర్లు,బ్యాటరీలు, కొన్ని రకాల ఖనిజాలు, సోలార్‌ సెల్స్‌,క్రేన్ల వంటి వాటి మీద దిగుమతి పన్ను పెంపు కారణంగా కనీసం 1,800కోట్ల డాలర్ల మేర అమెరికా వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఆ కారణంగా దిగుమతులు నిలిపివేస్తే ప్రత్యామ్నాయం చూపే పరిస్థితిలో అమెరికా లేదు. వాటినే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తే భారం ఇంకా పెరుగుతుంది. గత ఏడాది చైనా నుంచి 427 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులను దిగుమతి చేసుకున్న అమెరికా 148బి.డాలర్ల విలువగల వస్తువులను ఎగుమతి చేసింది.గతంలో చైనా కూడా ప్రతిచర్యల్లో భాగంగా పన్నులు పెంచింది. చైనా వస్తువుల మీద ఆధారపడకుండా స్వంతంగా తయారు చేసుకోవాలని, తద్వారా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని, తమ కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలనే సంకల్పం చెప్పుకున్న అమెరికా, ఐరోపా దేశాల సరసన మనదేశం కూడా ఉంది.
అనేక దేశాలతో మనదేశం స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టిఏ) చేసుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి పరస్పరం లబ్ది పొందేందుకు వీటిని చేసుకుంటున్నారు. విదేశాలు తిరిగి మనవస్తువులకు మార్కెట్‌ అవకాశాలను పెంచానని, దానితో పాటు పలుకుబడి కూడా పెరిగిందని నరేంద్రమోడీ పదే పదే చెబుతారు. కానీ గత ఐదు సంవత్సరాల వివరాలను చూసినపుడు ఎగుమతుల అంశంలో మన పలుకుబడి పప్పులు ఉడకలేదు. 2019-2024 ఆర్థిక సంవత్సరాలలో ఎఫ్‌టిఏలు ఉన్న దేశాలకు మనం ఎగుమతి చేసిన వస్తువుల విలువ 107.2 నుంచి 122.72 బిలియన్‌ డాలర్లకు(14.48శాతం) పెరిగితే, దిగుమతులు 136.2 నుంచి 187.92 బిలియన్‌ డాలర్లకు ( 37.97శాతం) పెరిగినట్లు జిటిఆర్‌ఐ నివేదిక వెల్లడించింది. ఎగుమతులపై మోడీ ప్రచార బండారాన్ని బయట పెట్టింది. మొత్తంగా చూసుకున్నపుడు ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో 1.8శాతంతో మనదేశం 17వదిగా ఉండగా దిగుమతుల్లో 2.8శాతం వాటాతో ఎనిమిదవ స్థానంలో ఉంది. అంతా బాగుంది అని చెప్పిన 2023-24లో మన వస్తు ఎగుమతులు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 3.11శాతం తగ్గి 437.1బిలియన్‌ డాలర్ల వద్ద ఉన్నాయి. దిగుమతి చేసుకున్న వస్తువులను కొనుగోలు చేయటం తగ్గటంతో గతేడాది 5.4శాతం తగ్గి 677.2బి.డాలర్లుగా ఉన్నాయి.


ట్రంప్‌ మాదిరి చైనా పట్ల కఠినంగా ఉండాలని జో బైడెన్‌ కూడా జనానికి కనిపించేందుకు తాజా చర్యకు పూనుకున్నాడు. గతనెలలో రాయిటర్స్‌ జరిపిన ఒక సర్వేలో ట్రంప్‌ కంటే బైడెన్‌ ఏడుపాయింట్లు వెనుకబడి ఉన్నాడు. అయితే 2020లో చైనాతో ట్రంప్‌ కుదుర్చుకున్న ఒప్పందంతో ఎలాంటి ఫలితమూ రాలేదు. పరస్పరం సహకారం పెంచుకోవాలని చెబుతూనే దిగుమతి పన్నుల పెంపుదలకు సాకుగా తాము అవసరాలకు మించి హరిత ఉత్పత్తులు చేస్తున్నామని లేనిపోని మాటలు చెబుతున్నదని చైనా విమర్శించింది. ఇది రక్షణాత్మక చర్యలకు పూనుకొనేందుకు చేస్తున్న ప్రచారమని, తనను తాను దెబ్బతీసుకోవటమేనని, గతంలో వచ్చిన అవగాహనకు భిన్నమని, రెండు దేశాల మార్గంలో గుంతలు తవ్వవద్దని హితవు చెప్పింది. బైడెన్‌ ఎన్నికల కోసం రాజకీయంగా తీసుకున్న చర్య తప్ప తమ మీద పెద్దగా ప్రభావం పడదని కూడా వ్యాఖ్యానించింది.2023 నుంచి ఈ ఏడాది మార్చినెల వరకు అమెరికా సమాచారాన్ని చూస్తే జర్మనీ నుంచి 689 కోట్ల డాలర్లు, దక్షిణ కొరియా నుంచి 622 కోట్ల డాలర్ల విలువగల విద్యుత్‌ బాటరీల వాహనాలను కొనుగోలు చేసిన అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకున్నది కేవలం 38 కోట్ల డాలర్ల విలువగలవే అని ఒక పత్రిక పేర్కొన్నది. బైడెన్‌ నిర్ణయం ప్రకారం విద్యుత్‌ వాహనాలపై పన్ను 25 నుంచి 102.5శాతానికి పెరిగింది. బాటరీలు, వాటి విడి భాగాలపై 7.5శాతం నుంచి 50శాతం వరకు పెంచారు.నౌకల నుంచి సరకులను తీరానికి చేర్చే క్రేన్లపై ఇప్పటి వరకు పన్నులేదు, వాటి మీద 25శాతం, సిరంజ్‌లు, సూదులపై 50శాతం, రక్షణకు ఉపయోగించే వైద్య కిట్లపై 25శాతం విధించారు. రానున్న సంవత్సరాల్లో ఈ పన్నులు ఇంకా పెరుగుతాయి.ఈ పెరుగుదల అంతా అమెరికా వినియోగదారుల మీదనే భారం మోపుతుంది.చైనా అనుచిత వ్యాపారాన్ని అడ్డుకొనేందుకే ఈ చర్యలని అమెరికా సమర్ధించుకుంటున్నది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే సాకుతో దేశీయంగా తయారైన వాహనాల కొనుగోలుదార్లకు అమెరికా ప్రభుత్వం ఏడున్నరవేల డాలర్లు రాయితీ ఇస్తుంది. అయితే ఇటీవల అలాంటి వాహనాల్లో చైనా విడిభాగాలు ఏవైనా ఉంటే ఆ రాయితీ వర్తించదని ప్రకటించారు.


మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు మనదేశంతో వాణిజ్య లావాదేవీల్లో అమెరికా మొదటి స్థానంలోకి వచ్చింది. దాంతో మీడియాలో కొందరు ఇంకేముంది చైనాతో మనకు పనేముంది, సరఫరా గొలుసు నుంచి బయటపడ్డాం అన్నట్లుగా సంబరాన్ని ప్రకటించారు. కానీ తిరిగి చైనా మొదటి స్థానానికి వచ్చినట్లు తాజా సమాచారం వెల్లడించింది. ఇదంతా సరిహద్దు వివాదంలో చైనా సంగతి తేలుస్తాం, బుద్దిచెబుతాం అనే పటాటోపం మధ్యనే జరిగింది.2023-24 సంవత్సరంలో రెండు దేశాల వాణిజ్యం 11,840 కోట్లు కాగా అమెరికాతో 11,380 కోట్ల డాలర్లు ఉంది.కౌంటర్‌పాయింట్‌ అధ్యయనం ప్రకారం ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకం(పిఎల్‌ఐ) పధకం ఉన్నప్పటికీ మనదేశంలో చైనా బ్రాండు ఫోన్లు గణనీయమార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి.ఈ పధకం వలన ఆపిల్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు లబ్దిపొందినప్పటికీ మార్కెట్లో వాటి వాటా దానికి తగినట్లుగా పెరగలేదని హిందూ బిజినెస్‌లైన్‌ పత్రిక రాసింది. ఇతర బ్రాండ్లతో ఉత్పత్తి కాంట్రాక్టులు కుదుర్చుకోవటం, ఎగుమతులు తప్ప భారతీయ బ్రాండ్లకు రూపకల్పన, అభివృద్ధి జరగలేదు.ఫార్మారంగంలో కొన్నింటిని పిఎల్‌ఐ కారణంగా మనదేశంలోనే తయారు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మన పరిశ్రమలు చైనా మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దిగుమతుల నిరోధానికి ఈ పధక చికిత్స పనిచేయలేదు. గతేడాది మనదేశం చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ దిగుమతుల్లో చైనా నుంచి 43.9శాతం ఉన్నాయి. కుండలో కూడు అలాగే ఉండాలి పిల్లాడు దుడ్డులా ఎదగాలి అంటే కుదరదన్న సామెత తెలిసిందే. గడచిన పది సంవత్సరాల్లో అన్నీ వేదాల్లోనే ఉన్నాయష బాపతు పెరిగింది తప్ప ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రభుత్వం ఖర్చు చేయాలన్న జ్ఞానం పాలకులకు రాలేదు.గతమెంతో ఘనం అనే పిచ్చిలోనే కొట్టుకుంటున్నారు. జనాన్ని ముంచుతున్నారు. జిడిపిలో మనకంటే చైనా ఐదు రెట్లు పెద్దది. మనం 0.75శాతం పరిశోధనలకు ఖర్చు చేస్తుంటే అక్కడ 3.5శాతం ఉంది. దీని అర్ధం మనకంటే చైనాలో 25రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రొఫెసర్‌ అరుణకుమార్‌ వ్యాఖ్యానించారు.మన విశ్వవిద్యాలయాల్లో రాజకీయ, అధికార జోక్యం ఎక్కువగా ఉంది తప్ప పరిశోధన వాతావరణాన్ని సృష్టించలేదన్నారు. ఏవైనా నిధులు ఉంటే గోమూత్రం, పేడలో బంగారం, ఇతరంగా ఏమున్నాయో పరిశోధనలు చేయిస్తున్నారు.చైనా ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకం పెంపు పర్యవసానాలు మనదేశం మీద ఎలా ఉంటాయన్న చర్చ మొదలైంది. చైనా ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా మనదగ్గరకు వచ్చిపడతాయని, మన ఎగుమతి అవకాశాలు పెరగవన్నది ఒక అభిప్రాయం. అమెరికా, ఐరోపా యూనియన్‌ దిగుమతి పన్నులు పెంచటం, దిగుమతులను తగ్గిస్తున్న కారణంగా చైనా తన వాహనాలకు భారత్‌ ఇతర దేశాల మీద ఆధారపడుతుందని కొందరి అంచనా. ఈ అంశాలను ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నప్పటికీ నరేంద్రమోడీ చైనా నుంచి పెట్టుబడులు, దిగుమతులను పెంచేందుకు వీలుగా దిగుమతి పన్ను ఎందుకు తగ్గించారన్నది వారి ప్రశ్న. కార్పొరేట్ల లాభాల కోసం సంతుష్టీకరణ తప్ప మరొకటి కనిపించటం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎమితిని సెపితివి కపితము : కడప, విశాఖ ఉక్కు మాటెత్తకుండా కూరగాయలు, అరటి పండ్ల కబుర్లు, రాహుల్‌పై అసత్యాలు చెప్పిన నరేంద్రమోడీ !

10 Friday May 2024

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

Adani, Ambani and Adani, ANDHRA PRADESH, BJP, CHANDRABABU, India Elections 2024, Modi distortions, Narendra Modi escapement, Narendra Modi Failures, YS jagan


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి, దానితో చేతులు కలిపిన తెలుగుదేశం, జనసేనలు తబ్బిబ్బులౌతున్నాయి. పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయితేనేం అన్నట్లుగా తిరిగి వైసిపి గెలుస్తుందా ? మూడు పార్టీల కూటమి గెలుస్తుందా అన్నది తప్ప ఎవరు గెలిచినా కొత్తగా రాష్ట్రానికి, జనానికి ఒరిగేదేమీ లేదని మోడీ మాటలతో తేలిపోయింది. చిత్రం ఏమిటంటే తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి సంవత్సరాల తరబడి బిజెపి నేతలు ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది, అనుమతులు మంజూరు చేసింది మీరు, ఆరోపణలను ఎందుకు ఒక కమిషన్‌తో విచారించటం లేదని ప్రశ్నిస్తే కేంద్రం అవసరమైన సమాచారం అంతా సేకరిస్తున్నది త్వరలో చర్య ఏమిటో మీరే చూస్తారంటూ కబుర్లు చెప్పేవారు. చేసిందేమీ లేదు. ఐదు సంవత్సరాల తరువాత నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి పాలకుల మీద రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు. అమిత్‌ షా మాటల్లో చెప్పాలంటే జుమ్లా (అవసరానికి తగినట్లుగా మాట్లాడటం) తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు పోలవరంను ఏటిఎంగా వాడుకున్నట్లుగానే కాళేశ్వరాన్ని బిఆర్‌ఎస్‌ నేతలు వాడుకున్నారని కూడా మోడీ చెప్పారు. కాళేశ్వరానికి కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పోలవరం కేంద్ర ప్రాజెక్టు. దాన్నుంచి పిండుకున్నారని విమర్శించిన మోడీ ఐదేండ్లు చేసిదేమీ లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో వైసిపి పాలకుల మీద చర్య తీసుకుంటామంటే జనానికి చెవుల్లో కమలం పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు.


బిజెపి నుంచి ఆంధ్రప్రదేశ్‌ పౌరులు ఆశిస్తున్నదీ, తెలుగుదేశం, జనసేన ఆశలు కల్పించిందీ విభజన హామీల అమలు గురించి తప్ప వట్టిస్తరి మంచినీళ్ల గురించి కాదు.కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తారా లేదా విశాఖలో ఉన్న ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తారా, అది సక్రమంగా పని చేయాలంటే అవసరమైన ఇనుప ఖనిజ గనులను కేటాయిస్తారా లేదా ఏం చెబుతారోనని ఎదురు చూస్తుంటే అవేమీ తనకు సంబంధం లేనట్లుగా రాజంపేట ఎన్నికల సభలో కూరగాయల శీతల గిడ్డంగులు,పులివెందులలో అరటి పరిశ్రమ గురించి మాట్లాడారు. పోనీ వాటినైనా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులతో ఏర్పాటు చేస్తామన్నారా అంటే అదీ లేదు.ఆంధ్రప్రదేశ్‌ పౌరులను మరీ అమాయకులుగా భావించినట్లు కనిపిస్తోంది.పదేండ్ల క్రితం ఏర్పాటు చేయాల్సిన విశాఖ రైల్వే జోన్‌కు ఇంతవరకు అతీగతి లేదు, దాని గురించి చెప్పకుండా మీకు బుల్లెట్‌ రైలు వద్దా అని ప్రశ్నించారు.వద్దని ఎవరు చెప్పారు. రద్దు చేసిన పాసింజరు రైళ్లను పూర్తిగా పునరుద్దరించలేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్తవాటిని వేయటం లేదు గానీ సామాన్యులు భరించలేని టిక్కెట్‌ ధరలతో నడిచే బుల్లెట్‌ రైలు వద్దా అంటున్నారు. తక్కువ ఛార్జీలతో నడిచే రైళ్లకు బదులు రాబోయే రోజుల్లో ప్రైవేటు వారికి గిట్టుబాటుగా ఉండేందుకు గాను రద్దీ మార్గాల్లో సాధారణ సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు బదులు వందేభారత్‌లను ప్రవేశపెడుతున్నారు.వాటిని కూడా ప్రవేశపెట్టండి కలిగిన వారు ఎక్కుతారు. కానీ మధ్యతరగతి, దిగువ ఆదాయవర్గాల అవసరాలకు అనుగుణంగా ఇతర రైళ్లను ఎందుకు వేయరు.


మూడు పార్టీలు ఒక కూటమిగా పోటీ చేస్తున్నప్పటికీ తెలుగుదేశం-జనసేన పార్టీలు మాత్రమే ఉమ్మడి మానిఫెస్టోను విడుదల చేశాయి. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌తో కలసి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఆవిష్కరించేందుకు బిజెపి నేత సిద్దార్దనాధ్‌ తిరస్కరించిన వీడియోలను జనమంతా చూశారు. తమ కేంద్ర మానిఫెస్టో తెలుగు కాపీని మాత్రమే బిజెపి విడుదల చేసింది. బహిరంగ సభల్లో వెనుకబడిన తరగతుల జాబితాలో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పటం తప్ప ఎక్కడ బిజెపికి ఆగ్రహం వస్తుందో అన్న భయంతో తమ మానిఫెస్టోలో దాన్ని పెట్టలేదు. పోలవరం ప్రాజెక్టు కిందనిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం సంగతి తేల్చటం లేదు. ప్రాజెక్టు నిర్మిస్తున్న కేంద్రం ఇచ్చేదీ, రాష్ట్రమే భరించేదీ ఇంతవరకు తేల్చలేదు.ఇచ్చేందుకు కేంద్రం మొరాయిస్తున్నది.తన పర్యటనలో నరేంద్రమోడీ దాని గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ కేంద్రాన్నైనా మరొకరినైనా తాట వలుస్తాం, తోలు తీస్తాం అని సినిమా డైలాగులు చెప్పిన పవన్‌ కల్యాణ్‌ పోలవరం నిర్వాసితులకు చెల్లించేందుకు అవసరమైన వేల కోట్ల రూపాయలను సెస్‌ రూపంలో, విరాళాలు వసూలు చేసి చెల్లిస్తామని ప్రకటించటం గమనించాల్సిన అంశం. ఇలా ఇంతవరకు ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా ? తెలుగుదేశం-జనసేన మానిఫెస్టో అమలుకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి తెస్తారని అడిగితే ముందు అధికారమివ్వండి తరువాత చంద్రబాబు నాయుడు తన అనుభవంతో చక్రం తిప్పి కేంద్రం నుంచి సాధిస్తారు, రాష్ట్రంలో వనరుల వృద్ధికి అల్లా ఉద్దీన్‌ అద్బుత దీపం ఉందన్నట్లుగా మాట్లాడుతున్నారు. గత ఐదు సంవత్సరాల్లో అలాంటి దాఖలాలు లేవు కదా అంటే ఈ సారి చూడండి అంటున్నారు. తెలంగాణాలో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ మరిన్ని అప్పులు చేస్తే తప్ప రోజు గడవని స్థితిలో ఉంది. తెలంగాణా కంటే వైఎస్‌ జగన్మోహనరెడ్డి సర్కార్‌ ఎక్కువ అప్పులు చేసిందని చెబుతున్న తెలుగుదేశం పార్టీకి నిజంగానే అధికారం దక్కితే ఎలా నెట్టుకొస్తుందన్నది ప్రశ్న.


తెలంగాణాలో నరేంద్రమోడీ కొత్త సంగతి చెప్పారు. ఏదైనా పార్టీతో ఒప్పందం చేసుకుంటే అంబానీ-అదానీలు టెంపోల ద్వారా నోట్ల కట్టలను వారికి పంపుతారట. ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ నోట అంబానీ-అదానీ మాటలు రావటం లేదని, వారితో కాంగ్రెస్‌ ఒప్పందం కుదుర్చుకుందా ? టెంపోలలో నోట్లు వారికి చేరాయా అని ప్రధానికరీంనగర్‌ జిల్లా వేములవాడ ఎన్నికల సభలో ప్రశ్నించారు.” ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి వీరు అంబానీ-అదానీలను దుర్భాషలాడటం మానుకున్నారు. నేను తెలంగాణా గడ్డ నుంచి అడగదలుచుకున్నాను.అంబానీ-అదానీల నుంచి ఎంత సొమ్ము తీసుకున్నారో రాకుమారుడిని వెల్లడించమనండి. టెంపోల కొద్దీ నోట్లు కాంగ్రెస్‌కు చేరాయా ? తెల్లవారేసరికి అంబానీ-అదానీలను దూషించటం ఆగిపోయింది కనుక ఏ ఒప్పందం కుదిరింది. మీరు వారిని ఐదేండ్లుగా దూషించటాన్ని ఆకస్మికంగా ఆపివేశారంటే ఏదో నీచం జరిగింది( జరూర్‌ దాల్‌ మే కుచ్‌ కాలా హై(పప్పులో కంపు కొట్టేది ఏదో పడింది) ” అని మోడీ అన్నారు. రాహుల్‌ గాంధీ వెంటనే దానికి తగిన జవాబు ఇచ్చారు.” నమస్కారం మోడీ గారూ, మీరు భయపడుతున్నారు.సాధారణంగా మీరు తలుపులు మూసుకొని రహస్యంగా అంబానీ-అదానీల గురించి మాట్లాడతారు.తొలిసారిగా మీరు వారి గురించి బహిరంగంగా మాట్లాడారు.వారు టెంపోలలో డబ్బు ఇస్తారని మీకు తెలుసు, అది మీ వ్యక్తిగత అనుభవమా ? సాధ్యమైనంత త్వరలో దీని గురించి ఒక విచారణ జరపండి ” అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన రోజు నుంచి దేశంలో అనేక చోట్ల తనిఖీలు జరుపుతూ భారీ మొత్తాలలో నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. మరి టెంపోలలో తరలిస్తున్న సొమ్ము పట్టుకున్నట్లుగానీ, అవి అంబానీ, అదానీలవని ఎక్కడా వార్తలు రాలేదు. వారి కంపెనీలన్నీ బిజెపి పాలిత రాష్ట్రాలలోనే ఎక్కువగా ఉన్నాయి. నరేంద్రమోడీ ఆరోపించినట్లుగా నిజంగానే ఎన్నికల ప్రకటన తేదీ నుంచి రాహుల్‌ గాంధీ ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలను విమర్శించలేదా ? అది పచ్చి అవాస్తవమని హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక వాస్తవ నిర్ధారణ వార్త వెల్లడించింది. తొలిదశ ఓటింగ్‌ (ఏప్రిల్‌ 19) నుంచి తమ బృందం రాహుల్‌ గాంధీ,కాంగ్రెస్‌ యూట్యూబ్‌ ఉపన్యాసాలను పరిశీలించగా అనేక సందర్భాలలో విమర్శించినట్లు ఉందని మే తొమ్మిదవ తేదీన ప్రచురించిన వార్తలో వివరాలను ఇచ్చింది. ఇదీ విశ్వగురువు బండారం.


నిజానికి ఇది ఎదురుదాడి తప్ప మరొకటి కాదు. అదానీ కంపెనీల అక్రమాలపై హిండెన్‌బర్గ్‌ నివేదిక అనేక ఆరోపణలు చేసింది. సూట్‌ కేసు కంపెనీల గురించి చెప్పింది. ఆ నివేదికలోని అంశాల మీద పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని, అదానీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదనైనా మీ నోటితో చెప్పండని ప్రతిపక్షాలు కోరితే అంగీకరించలేదు. అసలు పార్లమెంటులో లేదా వెలుపల అదానీ పేరే మోడీ ఉచ్చరించలేదు. దీని వెనుక ఏదైనా ఒప్పందం, టెంపోల కొద్దీ నోట్లు అందాయా ? ఎందుకంటే అంబానీ, అదానీ ఇతర బడా కార్పొరేట్ల కంపెనీల పేర్లు ఎక్కడా ఎన్నికల బాండ్ల జాబితాలో పెద్దగా కనిపించలేదు. రాజకీయ పార్టీలకు అవి విరాళాలు ఇవ్వలేదంటే నమ్మే అమాయకులు ఎవరైనా ఉన్నారా ? అంబానీలు, అదానీలు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రాపకంతో మరింత ధనవంతులౌతున్నారని కాంగ్రెస్‌, వామపక్షాలు, మరికొన్ని పార్టీలు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు ఎవరైనా వ్యాపార, పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై పరస్పరం లబ్దిపొందే నిర్ణయాలు తీసుకొని మాకది-మీకిది అని పంచుకోవటం బహిరంగ రహస్యం.చట్టబద్దంగా జరుగుతున్న అవినీతి. వేములవాడ సభలో నరేంద్రమోడీ చలోక్తి విసిరారని కొందరు భాష్యం చెబుతున్నారు.అదానీ కంపెనీల అక్రమాల గురించి మోడీ మాట్లాడకపోవటాన్ని ప్రతిపక్షాలు జోక్‌గా విమర్శించలేదు,సీరియస్‌గానే చెప్పాయి.


రెండింజన్ల పాలన పుణ్యమా అని మధ్యప్రదేశ్‌ ఎంతో వెనుకబడింది. దానికి అనుగుణంగానే అక్కడి జనంలో వెనుకబాటుతనం కూడా ఎక్కువేకావచ్చు. నరేంద్రమోడీ మంచి మాటకారి, జనాన్ని బుట్టలో వేయటంలో దిట్ట అనటంలో సందేహం లేదు. కానీ ఏం చెబితే దాన్ని గుడ్డిగా నమ్ముతారా ? లేకపోతే విశ్వగురువు అంతధైర్యంగా మాట్లాడగలరా ? అది జన అమాయకత్వమా ? నేతల దిగజారుడా ? మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ నాలుగు వందల సీట్లు ఎందుకు కావాలంటున్నానంటే అని చెబుతూ క్రికెట్‌ జట్టులో ఎక్కువ మంది ముస్లింలను కాంగ్రెస్‌ చేర్చకుండా ఉండేందుకు అని చెప్పారని మేనెల ఏడవ తేదీన ది వైర్‌ పోర్టల్‌ నివేదించింది. నాలుగు వందల సీట్లు కావాలని బిజెపి అడగటం రాజ్యాంగాన్ని మార్చేందుకు, రిజర్వేషన్లు తొలగించేందుకు అని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే నరేంద్రమోడీ ముస్లిం విద్వేష అజండాను ఎంచుకున్నారు.” కాంగ్రెస్‌ ఉద్దేశ్యం ఏమంటే క్రీడల్లో మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వటం. దీని అర్ధం ఏమిటి ? మత ప్రాతిపదికన క్రికెట్‌ టీములో ఎవరు ఉండాలో లేదో అది నిర్ణయిస్తుందన్నమాట. నేను కాంగ్రెస్‌ను ఈ రోజు అడుగుతున్నాను.ఇలా వారు కోరుకోబట్టే, ఇందుకే 1947లో స్వాతంత్య్రం వచ్చినపుడు భారతమాతను మూడు ముక్కలు చేశారు. వారు 1947లో దేశం మొత్తాన్ని పాకిస్తాన్‌గా మార్చాలనుకున్నారు, తరువాత భారత ఆనవాళ్లు చెరిపివేయాలనుకున్నారు.నేను ఈ రోజు స్పష్టంగా చెబుతున్నా. కాంగ్రెస్‌ వారందరూ, వారిని అభిమానించేవారు జాగ్రత్తగా వినాలి…. మోడీ బతికి ఉన్నంత కాలం నకిలీ లేదా తప్పుడు లౌకికవాదం పేరుతో భారత గుర్తింపును చెరిపేందుకు ప్రయత్నిస్తే అతను అనుమతించడు ” అని మోడీ చెప్పారు.


దశాబ్దాలుగా ఉన్న బాబరీ మసీదు తాళాలను తీయించింది రాజీవ్‌ గాంధీ అన్నది తెలిసిందే. కాంగ్రెస్‌ అధికారానికి వస్తే రామాలయం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసి ఆలయానికి కాంగ్రెస్‌ తాళం వేస్తుందని, జమ్మూ-కాశ్మీరుకు ఆర్టికల్‌ 370 తిరిగి తీసుకువస్తుందని దాన్ని నివారించాలన్నా, రిజర్వేషన్లను కాంగ్రెస్‌ తస్కరించకుండా, వాటిని ముస్లింలకు అప్పగించకుండా ఉండాలన్నా, పది సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లను పొడిగించాలన్నా తనకు నాలుగు వందల సీట్లు అవసరం అని కూడా నరేంద్రమోడీ చెప్పారు. ఇది భారతీయ తర్కమా, అడ్డగోలు మాటలా ? అధికారంలో కాంగ్రెస్‌ ఉండి తనకు నాలుగు వందల సీట్లు కావాలని కోరితే పైన చెప్పినవన్నీ జరగకుండా ఉండాలంటే తమకు అధికారం ఇవ్వాలనో, అంత భారీ మెజారిటీ ఇవ్వకూడదనో జనానికి చెబితే అర్ధం వుంది. ఆ సంఖ్య కోరుతున్న తమ మీద వస్తున్న విమర్శలను కాంగ్రెస్‌కు ఆపాదించి జనాన్ని తప్పుదారి పట్టించటం తప్ప ఇది మరొకటి కాదు.జనం మరీ అంత అమాయకంగా ఉన్నారా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

కమ్యూనిస్టులు కంపెనీలను రానివ్వరా ? నరేంద్రమోడీ, చంద్రబాబు, జగన్‌ అభివృద్ధి బండారమేమిటి ?

08 Wednesday May 2024

Posted by raomk in AP, BJP, Congress, CPI(M), Current Affairs, Economics, Gujarat, History, INDIA, NATIONAL NEWS, Political Parties, STATES NEWS, TDP, Ycp

≈ Leave a comment

Tags

ANDHRA PRADESH, BJP, CHANDRABABU, Chinese companies, Companies in India, CPI()M, Narendra Modi Failures, YS jagan


ఎం కోటేశ్వరరావు


చరిత్రలో నరేంద్రమోడీ పాలనలో జరిగినంత అభివృద్ధి మరే ప్రధాని, పార్టీ పాలనలోనూ జరగలేదంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా వార్తల కంటే గ్యారంటీ అంటూ నరేంద్రమోడీ దర్శనమిస్తున్నారు. ఎన్నికల బాండ్ల రూపంలో పోగేసుకున్న సొమ్మా మజాకా ! ప్రచారాన్ని గుడ్డిగా నమ్మటం లేదా నమ్మకపోవటం తెలిసిందే.ఏం జరుగుతోంది, వాస్తవాలేమిటి అని నిర్ధారించుకొనే ఓపిక లేదా తీరిక అందరికీ ఉండదు.ఒకదాన్ని నిర్ధారించుకొనే లోపల వంద వచ్చిపడుతున్నకాలమిది.దేశంలో కొత్త కంపెనీల ఏర్పాటు, పాతవాటి మూత తదితర అంశాల గురించి ప్రతినెల కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంసిఏ) ఒక నివేదిక విడుదల చేస్తుంది. 2024 మార్చినెల నివేదిక ప్రకారం దేశంలో 26,63,016 కంపెనీలు నమోదు కాగా వాటిలో 16,91,495 కంపెనీలు (64శాతం) పని చేస్తున్నాయి. మూతపడినవి 9,31,644 లేదా 34.98శాతం ఉన్నాయి. మిగిలినవి కూడా ఇతర ప్రక్రియల్లో ఉన్నాయి. 2014 ఏప్రిల్‌ 28వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌ వార్త ప్రకారం 2014 మార్చి ఆఖరు నాటికి 13,94,819 కంపెనీలుండగా వాటిలో 9,52,433 లేదా 68శాతం పని చేశాయి. మిగిలినవన్నీ మూత లేదా ఆ దారిలో ఉన్నవే. 2015 మార్చి నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 14,59,278కి గాను పని చేస్తున్నవి 10,22,011 లేదా 70శాతంగా ఉన్నాయి. నరేంద్రమోడీ తొలి ఐదు సంవత్సరాల్లోచూస్తే మొత్తం కంపెనీలు 18,73,044 కాగా పని చేస్తున్నవి 11,56,374 లేదా 61.73శాతం ఉన్నాయి. 2012-13, 2013-14 సంవత్సరాలలో ఇప్పటితో పోల్చితే దిగజారుడు చాలా ఎక్కువగా ఉందని 2020జనవరి 25న ఇటి నౌ ఇంటర్వ్యూలో నీతి అయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా చెప్పారు. దీని ప్రకారం చూస్తే యుపిఏ పదేండ్ల పాలన చివరి రెండు సంవత్సరాలు దిగజారుడు ఎక్కువగా ఉన్నపుడే 68శాతం కంపెలు పని చేయగా తన పాలనలో అస్తవ్యస్థతను సరిదిద్ది గాడిలో పెట్టానని చెప్పుకున్న నరేంద్రమోడీ పదవ ఏడాది పాలనలో 63.5శాతానికి తగ్గాయి. 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 1,85,312 కంపెనీలు నమోదు వాటి మూలధనం రు.30,927 కోట్లుగా ఉంది. అదే యుపిఏ పాలన చివరి సంవత్సరంలో 98,473 కంపెనీలు నమోదు కాగా వాటి మూల ధనం 39వేల కోట్ల రూపాయలు.పదేండ్ల పాలన అంతకు ముందు పది సంవత్సరాల స్థితిని చూస్తే మోడీ ఏలుబడిలో దిగజారినట్లా వెలిగిపోతున్నట్లా ?


కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ప్రతినెలా విడుదల చేస్తున్న బులిటెన్‌లో ఏ రాష్ట్రంలో ఎన్ని సంస్థలు నమోదవుతున్నాయన్నది దానిలో ఉంటుంది. మధ్య,చిన్న,సన్నకారు పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ)ల వివరాలు అందులో ఉండవు. కంపెనీల చట్టం కింద నమోదైనవే ఉంటాయి.కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచారం మేరకు కొన్ని రాష్ట్రాల తీరు తెన్నులను చూద్దాం. మూడు సంవత్సరాలలో మార్చి 31వరకు ఉన్న కంపెనీల పరిస్థితి, మొత్తం అంటే కంపెనీల చట్టం కింద నమోదైనవి. మన చట్టాలలో కంపనీల మూత గురించి చాలా గందరగోళం ఉంది. అందువలన పని చేస్తున్న వాటినే పరిగణనలోకి తీసుకుంటే మిగిలినవాటిలో మూతపడినవి, పని చేయనివి తదితరాలు ఉంటాయని గమనించాలి.


ఏడాది×× రాష్ట్రం ×××× మొత్తం ×××× పని చేస్తున్నవి××× శాతం
2015 ×× దేశం ×××14,59,278××× 10,22,011 ××× 70
2019 ×× దేశం ×××18,73,044××× 11,56,374 ××× 61.73
2024 ×× దేశం ×××26,63,016××× 16,91,495 ××× 63.5

దేశంలో 2014-15 నాటికి ఉన్న కంపెనీలలో పారిశ్రామిక రంగంలో 21, వ్యవసాయ రంగంలో మూడు శాతం, సేవారంగంలో 76శాతం ఉన్నాయి. సేవారంగంలో ఐటి, వాణిజ్యం,గనులు, విద్యుత్‌ ఉత్పత్తి వంటి ఉన్నాయి. కాగా పదేండ్ల తరువాత చూస్తే గతేడాది నమోదైన వాటిలో 71శాతం సేవారంగం, 23 పరిశ్రమలు, ఆరుశాతం వ్యవసాయరంగంలో ఉన్నాయి.ఇది ఇటీవలి సంవత్సరాల ధోరణులకు ప్రతిబింబంగా చెప్పవచ్చు. ఈ కారణంగానే మన ఎగుమతుల్లో సేవారంగం తప్ప పారిశ్రామిక వస్తువులు పెరగటం లేదు, జిడిపిలో ఈ రంగం వాటా గిడసబారిపోయింది. గతేడాది నమోదైన కంపెనీలను చూస్తే 17.6శాతంతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. పదేండ్ల క్రితం కూడా అదే స్థానంలో ఉంది.తొలిసారి ప్రధాని అయినపుడు నరేంద్రమోడీ విదేశాలు, విమానాల్లోనే ఎక్కువ కాలం గడిపారనే పేరు తెచ్చుకున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే అంతకు ముందు కాంగ్రెస్‌ పాలనా కాలంలో విదేశాల్లో పోయిన పరువు పునరుద్దరణతో పాటు భారీ మొత్తంలో విదేశీ నిధులు తెచ్చి చైనాతో పోటీ పడి మరీ ఎగుమతులు చేసేందుకు అని చెప్పారు.2015 మార్చి నాటికి దేశంలో 3,314 విదేశీ కంపెనీలు ఉండగా మోడీ తొలి ఏడాది కొత్తగా నమోదైనవి 157 ఉన్నాయి.2024 అవి 5,164కు పెరగ్గా పని చేస్తున్నవి 3,288 లేదా 64శాతం మాత్రమే. 2023 ఆగస్టు చివరి నాటికి చైనా ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం అక్కడ నమోదైన విదేశీ కంపెనీల సంఖ్య 11లక్షల 50వేలు, వాటిలో ఉన్న విదేశీ పెట్టుబడుల మొత్తం 1,950 బిలియన్‌ డాలర్లు.కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ 2021 నవంబరు 29న పార్లమెంటుకు వెల్లడించిన సమాచారం ప్రకారం 2016 ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి సమాచారం వెల్లడించేనాటికి దేశంలో 7,17,059 కొత్త కంపెనీలు నమోదు కాగా 5,00,506 కంపెనీలు మూత పడ్డాయి.దీనికి పెద్ద నోట్ల రద్దు, కరోనా కారణమని చెప్పారు.2017-18లో 2,36,262, మరుసటి ఏడాది 1,43,233 కంపెనీలు మూత పడ్డాయి. దీనికి పెద్ద నోట్ల రద్దు, ఇతర కారణాలు తప్ప కరోనా కాదు.ఈ సంవత్సరాల్లో నమోదైనవాటికంటే మూతపడినవే ఎక్కువ.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి గురించి తెలుగుదేశం, వైసిపి మధ్య పెద్ద రచ్చ నడుస్తున్నది, మేం రాష్ట్రాన్ని పరిశ్రమలు, సేవారంగ సంస్థలతో ముందుకు ఉరికించామంటే మేమే అని చెప్పుకుంటున్నాయి.తమ పాలనలో సులభతర వాణిజ్య సూచికల్లో ఎంతో ముందున్నామని, లక్షల కోట్ల రూపాయల మేరకు వివిధ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని రెండు పార్టీల నేతలూ హడావుడి చేశారు. గత పదేండ్లలో జరిగిందేమిటో చూద్దాం.


ఏడాది×× రాష్ట్రం ×××× మొత్తం ××××పని చేస్తున్నవి××× శాతం
2015××ఆంధ్రప్రదేశ్‌ ×× 21,205 ××× 13,395 ××× 63.16
2019××ఆంధ్రప్రదేశ్‌ ×× 30,530 ××× 19,331 ××× 63.31
2024××ఆంధ్రప్రదేశ్‌ ×× 46,625 ××× 30,029 ××× 64.40
ఆమేరకు చూసినపుడు రాష్ట్రం విడిపోయిన తరువాత కంపెనీల నమోదు పెరిగినప్పటికీ పని చేస్తున్నవాటి శాతాలలో పెద్ద తేడా లేదు. అందువలన మేము ప్రోత్సాహమిచ్చాం, ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలను ఆదుకున్నాం అని చెప్పే కబుర్లలో పసలేదు. చంద్రబాబు నాయుడి ఐదేండ్ల పాలనలో వచ్చినవి 9,325 కాగా మూతపడినవాటి జాబితాలో చేరినవి 5,934 ఉన్నాయి. ఇక వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలనలో కొత్తగా నమోదైనవి 16,596 కాగా మూతపడినవి 10,698 ఉన్నాయి.
ప్రపంచం, దేశంలోని వివిధ రాష్ట్రాల ధోరణులను చూసినపుడు ఎక్కడ రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయో అక్కడ, భూమి, విద్యుత్‌, నిపుణులైన పనివారి లభ్యత మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నపుడు ముందుగా ఎక్కడైతే కంపెనీలు వస్తాయో అక్కడే పెరుగుదల ఉంటుంది.దానికి ఉదాహరణ తెలంగాణా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తరువాత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.


ఏడాది×× రాష్ట్రం ×××× మొత్తం ××××పని చేస్తున్నవి××× శాతం
2015××తెలంగాణా ×× 77,040 ××× 51,743 ××× 67.16
2019××తెలంగాణా ××1,05,072××× 62,123 ××× 59.12
2024××తెలంగాణా ××1,57,064××× 98,440 ××× 62.67
ఈ వివరాలను చూసినపుడు నరేంద్రమోడీ చేసిన పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చి చేష్ట దెబ్బ దేశం మొత్తం మీద పడినట్లే తెలంగాణా కంపెనీల మీద కూడా పడింది. పదేండ్లకు ముందున్న స్థితికి చేరుకోలేదన్నది స్పష్టం.పదేండ్లలో కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో 21,205 నుంచి 46,625 అంటే 25,420 పెరిగితే తెలంగాణాలో 80,024 ఉన్నాయి. రాష్ట్ర విభజన ఆందోళన సందర్భంగా తెలంగాణాలో నేతలు కొందరు ఆంధ్ర ప్రదేశ్‌ పెట్టుబడిదార్లు దోపిడీ చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దానికి పోటీగా తమ ప్రాంతాలను విస్మరించి తమ పెట్టుబడులన్నింటినీ తెలంగణాలో పెట్టామని ఆంధ్ర ప్రాంతం వారు వాపోయారు. లాభం వస్తేనే వ్యాపార వరదన పోతాడన్న లోకోక్తి తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర భక్తులైన పెట్టుబడిదార్లు గత పదేండ్లలో అక్కడ ఇబ్బడి ముబ్బడిగా కంపెనీలు పెట్టిన దాఖలాలు లేవని అంకెలే వెల్లడిస్తున్నాయి.తమ పెట్టుబడులు నిలిపివేసినంత మాత్రాన తెలంగాణాకు కంపెనీలు రావని భ్రమించిన వారు గణాంకాలను చూసి ఏమంటారు ?


ఏడాది×× రాష్ట్రం×× మొత్తం ××××పని చేస్తున్నవి××× శాతం
2015×× కేరళ ×× 37,905 ××× 24,835 ××× 65.52
2019×× కేరళ ×× 51,809 ××× 32,440 ××× 62.61
2024×× కేరళ ×× 81,177 ××× 54,460 ××× 67.08
కమ్యూనిస్టులతో పెద్ద తలనొప్పి కార్మికులు, ఉద్యోగులు వేతనాలు పెంచాలంటారు తప్ప రాష్ట్రం, దేశ అభివృద్ధి గురించి పట్టదు, పెట్టుబడిదార్లను బెదిరిస్తారు అనే ప్రచారం తెలిసిందే. తనను తాను స్వయంగా సిఇఓ అని పిలుచుకున్న చంద్రబాబు లేదా విజయవంతమైన వ్యాపార, పారిశ్రామికవేత్త అని పేరు పడిన జగన్‌మోహనరెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన కంపెనీల కంటే పోరాటాలకు చిరునామాగా ఉన్న సిపిఎం నాయకత్వంలోని కేరళలో గత పది సంవత్సరాలలో అదనంగా నమోదైన కంపెనీలు 43,272. మరి దీనికి విమర్శకులు ఏ సమాధానం చెబుతారు ? రెండవది అక్కడి కంపెనీల పని తీరు దేశ సగటుతో, రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉందా లేదా ? మధ్యప్రదేశ్‌లో 2003 నుంచి మధ్యలో ఒక ఏడాది కాంగ్రెస్‌ మినహా ఇప్పటి వరకూ బిజెపి పాలన కొనసాగుతోంది. 2015లో అక్కడ నమోదైన కంపెనీలు 29,782 కాగా 2024నాటికి 60,700కు అంటే 30,918 మాత్రమే పెరిగాయి. అక్కడేమీ కమ్యూనిస్టుల ప్రభావం లేదు, రెండింజన్ల పాలన ఎందుకు కంపెనీలు రాలేదు ? ఇక దేశానికి గుజరాత్‌ను నమూనా ప్రకటించి ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోడీ గురించి తెలిసిందే. అక్కడ 2015లో పని చేస్తున్న కంపెనీలు 64.72శాతం కాగా 2019లో 61.32, 2024లో శాతం 65.5 చొప్పున ఉన్నాయి. గుజరాత్‌ నమూనా అంత గొప్పగా లేదని, ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ప్రత్యేకంగా చేసిందేమీ లేదని గణాంకాలు వెల్లడించటం లేదా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

అల్లుడికి బుద్ది చెప్పి మామ అదే తప్పు చేసినట్లు : బిజెపిలో పెరుగుతున్న వారసత్వం ! తుస్సుమన్న నరేంద్ర మోడీ అస్త్రం !!

05 Sunday May 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, TDP, Ycp

≈ Leave a comment

Tags

BJP, BJP Dynastic Politics, Family Politics in India, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


ఆరునెలల్లో వారు వీరవుతారు అన్న సామెత తెలిసిందే, అంతేనా అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు అనే లోకోక్తి కూడా తెలిసిందే.లోక్‌సభ ఎన్నికలలో ప్రకటిస్తున్న అభ్యర్థులను చూసిన తరువాత బిజెపి ఈ సామెతలను రుజువు చేస్తున్నదని వేరే చెప్పనవసరం లేదు. కాంగ్రెస్‌ దశాబ్దాల కాలంలో వారసత్వ రాజకీయాలకు అలవాటు పడితే బిజెపి ఒక దశాబ్దిలోనే ఎంతో వేగంగా కాంగ్రెస్‌ను అధిగమించుతోందా అనిపిస్తోంది.మహిళా రెజలర్లను వేధించిన తమ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ మీద బేటీ బచావో-బేటీ పఢావో (ఆడపిల్లల్ని రక్షించండి-ఆడపిల్లల్ని చదివించండి) అనే నినాదమిచ్చిన బిజెపి ఎలాంటి చర్య తీసుకోలేదు. తిరిగి అతగాడిని నిలిపితే పరువుపోతుందని భయపడి కొడుకు కరణ్‌కు సీటు ఇచ్చింది. ఎందుకు అంటే కైసర్‌గంజ్‌ నియోజకవర్గం, పరిసరాలలో బ్రిజ్‌ భూషణ్‌ కుటుంబాన్ని ఎదిరించి బిజెపిలో మరొకరు పోటీకి ముందుకు వచ్చే అవకాశం లేదు.భార్య గతంలో జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌గా పని చేశారు. ఒక కొడుకు ఇప్పుడు ఎంఎల్‌ఏ.బాబరీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న ”యోధుడు ”,రౌడీ, గూండా చట్టాల కింద అనేక కేసులు, కండబలంతో పెద్ద ఎత్తున సంపదలను కూడబెట్టుకున్న నేపధ్యంలో బిజెపి ఆ కుటుంబాన్ని వదులుకుంటుందా ! మహిళల వలువలను వలిస్తేనేం ” దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ విలువలను ” కాపాడేందుకు ఇలాంటి జనాలు కావాలి కదా !బ్రిజ్‌ భూషణ్‌ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు కుమారుడు నామినేషన్‌ వేసే సందర్భంగా ఏడు వందల కార్లు, పదివేల మందితో ప్రదర్శన చేయించినట్లు, ఆ సందర్భంగా తాను కనిపిస్తే రచ్చ అవుతుందని వాటికి దూరంగా తెరవెనుక ఉండి నడిపించినట్లు వార్తలు వచ్చాయి.


దేశంలో ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్పేవారు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడరు. రాజకీయాలను శాసించే కుటుంబాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఒకసారి అధికారం, దానితో ఎలా సంపాదించుకోవచ్చో అనుభవంలోకి వచ్చిన తరువాత ఎంత సేపూ అధికార యావ, వారసులను రంగంలోకి తేవటం తెలిసిందే. దీనికి ఎన్‌డిఏ, ఇండియా కూటమిలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ అతీతం కాదు. ఏడున్నర దశాబ్దాల తరువాత కుటుంబ రాజకీయాలు సాధారణ స్థితికి వచ్చాయి, జనం కూడా ఆమోదం తెలుపుతున్నారు. ఎందుకు అనే ప్రశ్న వేయకుండా అసలు ప్రశ్నించటమే తప్పు అనేట్లు, గొర్రెదాటు వైఖరిని జనాల బుర్రలోకి ఎక్కించటంలో మతం, పురాణాలు, కులం, ప్రాంతాలు, అవకాశవాద రాజకీయాలు ఇలా తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా ఎవరి పాత్రను అవి పోషించాయి. జరిగిందాంట్లో తమ తప్పేమీ లేదని సమర్ధించుకుంటాయి. స్వాతంత్య్ర ఉద్యమ నేపధ్యం ఉంది గనుక కాంగ్రెస్‌లో మోతీలాల్‌ నెహ్రూ, కుమారుడు జవహర్‌లాల్‌ నెహ్రూ, కుమార్తె ఇందిరా గాంధీ, కుమారుడు రాజీవ్‌ గాంధీ, కుమారుడు, కుమార్తె రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను చూపి వారసత్వ రాజకీయాలు అంటూ విమర్శించేందుకు బిజెపికి మంచి అవకాశం దొరికింది. ఆ పార్టీ లేదా దాని పూర్వీకులకు దేశభక్తి, స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన పూర్వ చరిత్ర లేదు.జనసంఘం స్థాపకులలో ఒకరు విజయరాజె సింధియా, తరువాత అది పేరు మార్చుకొన్న బిజెపిలో ఆమె కుమార్తె రాజస్తాన్‌ మాజీ సిఎం వసుంధర రాజే ఇటీవల మరోసారి ఆ పదవికి పోటీ పడ్డారు. ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌(ఎంపీ), ఇప్పుడు నాలుగవసారి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం స్థాపకుడు ఎన్‌టి రామారావు, కుమార్తె పురందరేశ ్వరి, కుమారులు హరికృష్ట, బాలకృష్ట, అల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు, కుమారుడు లోకేష్‌.ఈ కుటుంబానికి చెందిన వారు అన్నతెలుగుదేశం పార్టీని పెట్టారు. తెలుగుదేశం,కాంగ్రెస్‌, వైసిపి, బిజెపిలో చేరారు. బాలకృష్ణ మరొక అల్లుడు శ్రీ భరత్‌ విశాఖ లోక్‌సభ తెదే అభ్యర్ధి, గతంలో భరత్‌ తాత ఎంవివిఎస్‌ మూర్తి తెలుగుదేశం ఎంపీగా చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంతానం జగన్‌మోహనరెడ్డి, వైఎస్‌ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మహారాష్ట్రలో శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియ సూలే బారామతి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తుండగా ఎన్‌సిపి నుంచి ఫిరాయించి బిజెపితో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర ఇప్పుడు అక్కడ బిజెపి కూటమి తరఫున పోటీలో ఉన్నారు. ఇలా వివిధ రాష్ట్రాలలో కుటుంబాల నేపధ్య ప్రాతినిధ్యం పెరుగుతోంది.ఎక్కడైనా సీటు రాకపోతే, ఉన్న పార్టీలో గెలిచే అవకాశాలు లేకున్నా వేరే పార్టీలో చేరిపోతున్నారు.చత్రపతి శివాజీ వారసులమని చెప్పుకుంటూ తమను గెలిపించాలని కొల్లాపూర్‌లో ఒకరు కాంగ్రెస్‌ తరఫున మరొకరు బిజెపి తరఫున పోటీ చేస్తున్నారు. జనాన్ని మోసం చేయటం గాకపోతే శివాజీ వారసత్వానికి ఈ ఎన్నికలకు సంబంధం ఏమిటి ?


కాశ్మీరును స్వతంత్ర దేశంగా ఉంచాలని నాటి రాజు హరిసింగ్‌ చూస్తే దానికి వ్యతిరేకంగా భారత్‌లో విలీనం కోసం ఉద్యమించిన నేత షేక్‌ అబ్దుల్లా, కుమారుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ ఫరూక్‌ అబ్దుల్లా. నేషనల్‌ కాన్ఫరెన్సు పార్టీ నేతలుగా ఉన్నారు. ఆ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించి తరువాత దాన్నుంచి విడివడి కాంగ్రెస్‌, జనతాదళ్‌లో పని చేసి స్వంత పార్టీ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీని ఏర్పాచేసిన ముప్తీ మహమ్మద్‌ సయీద్‌ రెండుసార్లు సిఎంగా పని చేశారు. ఆయన కుమార్తె మెహబూబా ముప్తి ముఖ్యమంత్రి పదవి కోసం బిజెపితో చేతులు కలిపారు.ఈ రెండు పార్టీల నేతల కుటుంబ సభ్యులు, బంధువులు అనేక మంది ముఖ్యమైన పదవులను అనుభవించారు. కర్ణాటకలో అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న జెడిఎస్‌ నేత కుమారస్వామి గురించి తెలిసిందే. సిఎం పదవి కోసం బిజెపి, కాంగ్రెస్‌ రెండింటితో చేతులు కలిపారు. తండ్రి దేవెగౌడ జెడిఎస్‌కు జాతీయ నేత,ఒక కుమారుడు కుమారస్వామి, మరోకుమారుడు రేవన్న ఎంఎల్‌ఏ, ఇప్పుడు అత్యాచారం, కిడ్నాప్‌ కేసులో అరెస్టయ్యారు. రేవన్న కుమారుడు ప్రజ్వల్‌ ఎంపీ,మహిళలపై అత్యాచార వీడియోలు, కేసుల కారణంగా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు. ఈ పెద్దమనిషిని గెలిపించాలని నరేంద్రమోడీ కర్ణాటకలో ప్రచారం తెలిసిందే. కర్ణాటకలో యెడియూరప్ప కుటుంబ రాజకీయాలు, పదవి కోసం అవకాశం వాదం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌లో సమాజవాదీ, ఆర్‌జెడి నేతలు, హర్యానాలో దేవీలాల్‌, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌ కుటుంబ సభ్యుల పదవుల గురించి తెలిసిందే.


ఇక బిజెపి వారసత్వ రాజకీయాల గురించి చూస్తే లోక్‌సభ, రాజ్యసభల్లో ఉన్న 388 మంది ఎంపీల్లో 45 మంది కుటుంబ నేపధ్యం ఉన్నవారే. బిజెపి ఇటీవలి సంవత్సరాలలోనే వివిధ రాష్ట్రాలలో అధికారానికి వచ్చింది కనుక రాజకీయ వారసులు పుట్టుకు వచ్చారు. రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతారు. అసలు బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌లో రాజరిక లక్షణాలు ఉంటాయి. ఒకసారి ఆ సంస్థకు అధిపతిగా నియమితులైన వారు జీవితాంతం కొనసాగుతారు. దానికి ఎన్నికలు ఉండవు. తాజా ఎన్నికల్లో ఏప్రిల్‌ పదవ తేదీనాటికి ప్రకటించిన అభ్యర్ధుల జాబితా ప్రకారం 250 మంది కాంగ్రెస్‌ వారిలో 65 అంటే ప్రతి నలుగురిలో ఒకరు, 424 బిజెపి జాబితాలో 87, ప్రతి ఐదుగురిలో ఒకరు రాజకీయ కుటుంబాల వారసులే ఉన్నారని హిందూస్తాన్‌ టైమ్స్‌ విశ్లేషించింది. కేవలం ఒక పార్టీలో ఉంటూ వారసత్వంగా పదవుల్లోకి రావటాన్నే వారసత్వం అనటానికి లేదు. వీరంతా కేవలం బిజెపి నేతల రాజకీయ వారసులే కాదు, వివిధ పార్టీలో పదవులు అనుభవించిన వారి వారసులు కూడా ఉన్నారు. ఉదాహరణకు బిజెపి అభ్యర్ధిగా ఉన్న మాజీ సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఆయన తండ్రి అమరనాధరెడ్డి కాంగ్రెస్‌లో పదవులు అనుభవించిన వారే. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు నీరజ్‌ మరొకరు. మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి కుమారులు, మనవలు డొల్లుపుచ్చకాయల్లా ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఒక మనవడు సిద్దార్దనాద్‌ సింగ్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ బిజెపి ఎన్నికల పర్యవేక్షకుడిగా ఉన్నారు. తండ్రి అమిత్‌ షా కేంద్ర మంత్రిగా ఉన్న కారణం తప్ప అసలు క్రికెట్‌ ఆడకుండానే బిసిసిఐ కార్యదర్శిగా జరు షా ఎన్నికకాలేదా అని ఆమ్‌ ఆద్మీ నేత సంజరు సింగ్‌ ప్రశ్నించారు. దేశంలో కుటుంబవారసత్వ రాజకీయాలంటే నెహ్రూ కుటుంబాన్నే ముందు చెబుతారు.ఇప్పుడు అనేక కుటుంబాలు రంగంలోకి వచ్చాయి.ఐదు సంవత్సరాల క్రితం ప్రింట్‌ అనే పత్రిక అలాంటి 34 కుటుంబాలను గుర్తించింది.ఇరవై రాష్ట్రాలలో వీరు ఉన్నట్లు పేర్కొన్నది. కనీసం ముగ్గురు కుటుంబ సభ్యులు రాజకీయాల్లో వున్నవారిని పరిగణనలోకి తీసుకుంది. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటాయి.


కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకమని, తమ నేత తమ కుటుంబ సభ్యులను ఎవరినైనా రాజకీయాల్లోకి తీసుకు వచ్చారా చూడండని బిజెపి నేతలు అడ్డుసవాళ్లు విసురుతారు.దేశం కోసం-ధర్మం కోసం కట్టుకున్న భార్యను భారతీయ సంప్రదాయం ప్రకారం వదలి పెట్టకూడదు.రాజ్యాంగం ప్రకారం విడాకులు ఇవ్వకుండా, పట్టించుకోకుండా భార్యను వదలి పెట్టటం చట్ట విరుద్దం.నరేంద్రమోడీకి తనదంటూ కుటుంబం లేకపోవచ్చు గానీ, కుటుంబవారసులను రంగంలోకి తెస్తుంటే ఎందుకు అనుమతిస్తున్నట్లు ? అభ్యర్ధుల జాబితాల్లో నేర చరిత్ర ఉన్నవారు, కోటీశ్వరులు రోజు రోజుకూ పెరుగుతున్నారు. అలాంటి వారు లేకపోతే నరేంద్రమోడీ ఉండరు అన్నది దిగమింగలేని నిజం కనుక. గతంలో బిజెపి నేతలు ఇతర పార్టీల వారినే కుటుంబ వారసత్వం, రాజకీయాల గురించి వేలెత్తి చూపేవారు. ఇప్పుడు బిజెపిలోనే అది ప్రారంభమైంది. కర్ణాటకలో ఎడియూరప్ప తన కుమారుడిని రానున్న రోజుల్లో సిఎం చేసేందుకు చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీకి దిగి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కెఎస్‌ ఈశ్వరప్ప ధ్వజమెత్తారు. ఏ హిందూత్వ పేరుతో బిజెపి రాజకీయం చేస్తున్నదో దాన్నే ముందుకు తెచ్చి పార్టీలో హిందూత్వకోసం పని చేస్తున్న నేతలను ఎడియూరప్ప పక్కన పెడుతున్నారని కూడా విమర్శించారు. బిజెపిలో ఇది ఆరంభం మాత్రమే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మేకతోలు కప్పుకున్న పులులు : రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు ఏం మాట్లాడారు ?

03 Friday May 2024

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, TDP

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, OBC Reservations, Reservation controversy, Reservations, RSS


ఎం కోటేశ్వరరావు


తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ముస్లింలకు రిజర్వేషన్లను అడ్డుకుంటానని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మాయని మచ్చగా ఉన్న అంటరాని తనం నిర్మూలన గురించి, దానికి కారణమైన సనాతన ధర్మం, మనువాదం గురించి మోడీ నోటి వెంట ఒక్క మాటా ఇంతవరకు రాకపోగా సనాతన ధర్మాన్ని కాపాడతామని వీర ప్రతిజ్ఞలు చేస్తున్నారు. సబ్‌కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అన్న నోటితోనే ఒక సామాజిక తరగతికి రిజర్వేషన్లను అడ్డుకుంటానని ప్రతిజ్ఞ చేశారు నరేంద్రమోడీ. అనేక అంశాలలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులతో సమంగా ముస్లింలు ఉన్నారని అనేక నివేదికలు స్పష్టం చేశాయి. కేవలం మతాన్ని చూపి వారిని సామాజిక న్యాయానికి దూరం చేయటం సమంజసమా ? తమకు నాలుగు వందలకు పైగా స్థానాలను ఇవ్వాలని బిజెపి చెప్పటం వెనుక రాజ్యాంగమార్పు, రిజర్వేషన్ల ఎత్తివేతకే అనే అనేక మంది భావిస్తున్నారు. దాని సెగ తగిలిన కారణంగానే ఒక వైపు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వం అని చెబుతూనే ఇతరుల రిజర్వేషన్లు రద్దు చేయం అని బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు పదే పదే నమ్మబలుకుతున్నారు. తమతో చేతులు కలిపిన తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుపుతానంటూ ప్రచారం చేస్తున్నారు. ఓట్ల కోసం బిజెపి సమర్ధిస్తున్నది. రిజర్వేషన్ల గురించి ఎవరేం మాట్లాడారో చూద్దాం.
బీహార్‌లో మరోమారు బిజెపి చంకనెక్కి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకున్న నితీష్‌ కుమార్‌ గతంలో చెప్పిందేమిటి ?(2015 సెప్టెంబరు 23, ఇండియా డాట్‌కామ్‌, ఇండో ఆసియన్‌ న్యూస్‌ సర్వీసు) దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి రిజర్వేషన్లను తొలగించాలని కోరుకుంటున్నది. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని చెప్పటం వారి వ్యూహంలో భాగం.ఇది ప్రమాదకరం, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగం బిజెపి. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ ఇప్పుడున్న రిజర్వేషన్‌ విధానం సరైంది కాదని ఇటీవల అన్నారని కూడా నితీష్‌ కుమార్‌ చెప్పారు. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని జెడి(యు) సీనియర్‌ నేత ఉపేంద్ర కుష్వాహ (పిటిఐ వార్త, 2022 అక్టోబరు 16, బిజినెస్‌ స్టాండర్డ్‌) చెప్పారు. రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా బోధనా సిబ్బంది నియామకానికి యుజిసి జారీ చేసిన మార్గదర్శక సూత్రాలే దానికి నిదర్శనం అన్నారు.ఈ విధానం కింద నియమించిన 40 మందిలో ఒక్కరు కూడా వెనుకబడిన తరగతులకు చెందిన వారు లేరన్నారు.దొడ్డిదారిన ఆర్‌ఎస్‌ఎస్‌ అభిమానులను ప్రవేశపెట్టే కుట్ర ఉందన్నారు.ఇప్పుడు ఆ పార్టీ బిజెపి చంకనెక్కిన సంగతి తెలిసిందే. జెడియు నేతలు బిజెపికి వ్యతిరేకంగా ఉన్నపుడు అలాంటి మాటలుగాక మరోవిధంగా ఎలా మాట్లాడతారని కొందరు ప్రశ్నించవచ్చు. ఇప్పుడు అదే నేతలు మాట మార్చి రిజర్వేషన్లు కొనసాగుతాయని ఇప్పుడు చెబుతున్నారు, వాటినెందుకు నమ్మాలి ?


బిజెపి నేతలు ఉత్సవిగ్రహాలు. దాని మూల విరాట్టులు ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు గతంలో ఏం చెప్పారు ?కాషాయ దళాలు చెబుతున్న మాటల మీద రోజు రోజుకూ అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి ? ఇతర పార్టీల ప్రచారం వల్లనా లేక వారు చెప్పిన మాటలే అందుకు దోహదం చేస్తున్నాయా ? ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతవేత్త, సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ వైద్య జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో మాట్లాడుతూ(2017 జనవరి 20, ఏఎన్‌ఐ వార్త, బిజినెస్‌ స్టాండర్డ్‌, ఎన్‌డిటివి) ఉద్యోగాలు, విద్యా సంస్థలలో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు త్వరలో పోవాలి. అందరికీ సమాన అవకాశాలు కావాలి తప్ప భారత్‌లో రిజర్వేషన్లు అవసరం లేదని, అవి వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తాయని చెప్పారు. సమాజంలో ఘర్షణ సృష్టిస్తాయని అందువలన వాటి మీద పునరాలోచన చేయాలన్నారు. కావాల్సింది అందరికీ సమాన అవకాశాలు తప్ప రిజర్వేషన్లు కాదు, సామాజికంగా అవకాశాలు రాని వారిని రిజర్వేషన్లు రక్షిస్తాయి కానీ అందరికీ సమాన అవకాశాలు పొందాలి, అది జరిగేంత వరకు తమ పట్ల వ్యత్యాసం చూపుతున్నారని, వేరు చేయబడ్డామనే భావం కలిగే ముప్పు ఉంది అన్నారు. ఇలా మాట్లాడటంపై విమర్శలు తలెత్తటంతో వివక్ష కొనసాగినంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు వివరణ ఇచ్చుకున్నారు. బాధ్యతల్లో పని చేశారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ తమ పత్రికలు ఆర్గనైజర్‌, పాంచజన్యలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్‌ విధానంపై ” సామాజిక సమీక్ష ” జరపాలని చెప్పారు. దాని మీద వివాదం తలెత్తటంతో అబ్బే అలాంటిదేమీ లేదు నూటికి నూరు శాతం రిజర్వేషన్లను గౌరవిస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రకటన చేసింది.( ఇండియా టుడే, 2015 సెప్టెంబరు 23) తమ నేత భారత సమాజంలోని బలహీన వర్గాలందరికీ రిజర్వేషన్ల ఫలితాలు అందేలా ఆలోచించాలని కోరినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార ప్రముఖ్‌ మన్మోహన్‌ వైద్య ఒక ప్రకటన జారీ చేశారు.” వాటి మీద రాజకీయాలు చేయకుండా రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నట్లుగా రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తి ఉండేది కాదు, ప్రారంభం నుంచి వాటిని రాజకీయం చేశారు ” అని మోహన్‌ భగవత్‌ చెప్పారు.రిజర్వేషన్‌ విధానాన్ని రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోకుండా ఎవరికి అవసరం, ఎంతకాలం కొనసాగించాలి అనే దాన్ని పరిశీలించేందుకు పౌర సమాజ ప్రతినిధులతో రాజకీయరహిత కమిటీని ఏర్పాటు చేయాలని, వారు నిర్ణయించాలని కూడా భగవత్‌ చెప్పారు. దీనదయాల్‌ ఉపాధ్యాయ ప్రవచించిన సంపూర్ణ భావజాలానికి అనుగుణ్యంగానే భగవత్‌ మాట్లాడినట్లు ఆర్గనైజర్‌ పత్రిక సంపాదకుడు ప్రఫుల్ల కేల్కర్‌ సమర్ధించారు. ఇలా మాట్లాడటం అడ్డుపడటం, ఎస్‌సి, ఎస్‌టి,వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను బలహీనపరిచే యత్నమే అని జెడియు ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి అన్నారు. సంఘపరివార్‌ నేతలు తమ మనసులోని భావాలను బయట పెట్టటం, దాని మీద స్పందనలు ఎలా వస్తాయో చూడటం, బిజెపికి నష్టం కలిగించేవిగా ఉంటే వాటి మీద వివరణ ఇవ్వటం ఒక ఎత్తుగడ తప్ప చిత్తశుద్ధి కాదు.


కులం అనేది ప్రస్తుతం ఏమాత్రం సంబంధం లేనిదిగా మారినందున ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో దళితులు, గిరిజనులు, ఓబిసిలకు ఇచ్చిన రిజర్వేషన్లను వెంటనే ఎత్తివేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్దాంతవేత్త ఎంజి వైద్య (మన్మోహన్‌ వైద్య తండ్రి) చెప్పారు.(2015 ఆగస్టు 31 హిందూ పత్రిక) గుజరాత్‌లో పటేల్‌ సామాజిక తరగతి రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న నేపధ్యంలో హిందూ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ఇప్పుడు ఏ ఒక్క కులం కూడా వెనుకబడి లేనందున కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని,మహా అయితే ఎస్‌సి,ఎస్‌టిలకు రిజర్వేషన్లు కొనసాగించవచ్చనీ అవి కూడా కేవలం పది సంవత్సరాలు మాత్రమే ఉండాలని, తరువాత పూర్తిగా రద్దు చేయాలని వైద్య చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక అగ్రనేత ఇలా మాట్లాడితే ఆ సంస్థ అధిపతి మోహన్‌ భగవత్‌ ఒక సందర్భంలో ఇలా అన్నారు.”వారిని(దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలవారి) రెండువేల సంవత్సరాల పాటు జంతువుల మాదిరి పరిగణించారు. అంత దీర్ఘకాలం వారు బాధలకు గురైనందున వారి లబ్దికోసం మరో రెండు వందల సంవత్సరాల పాటు ఇబ్బంది పడేందుకు జనాలు (ఇతర కులాలు) సిద్దపడాలి. అది అంతగా నేడు పైకి కనిపించకపోవచ్చు, కానీ సమాజంలో వారు ఇప్పటికీ వివక్షకు గురువుతున్నారు. ఇది కేవలం ఆర్థిక,రాజకీయ హక్కుల ప్రశ్న కాదు, ఇది సామాజిక సమానత్వ ప్రశ్న ” 2023 సెప్టెంబరు మొదటి వారంలో నాగపూర్‌లో అగర్వాల్‌ సామాజిక తరగతి విద్యార్ధుల కోసం నిర్వహిస్తున్న ఒక హాస్టల్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోహన్‌ భగవత్‌ ప్రసంగించారు.(సెప్టెంబరు ఆరవ తేదీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇతర అనేక పత్రికలు ఈ ఉపన్యాస వార్తలు ఇచ్చాయి)


ఓబిసి రిజర్వేషన్ల గురించి ఈ సందర్భంగా క్లుప్తంగా చెప్పుకోవటం అవసరం.మండల్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను సమీక్షించాలని కోరిన వారు కొందరైతే కాషాయ దళాలు వాటిని పరోక్షంగా వ్యతిరేకించాయి. అందుకే ఆ రోజుల్లో మండల్‌కు పోటీగా కమండల్‌ అని పత్రికల్లో వర్ణన వచ్చింది.రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటి నుంచి ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.తరువాత బిసిలకూ వాటిని వర్తింప చేయాలన్న డిమాండ్‌కు ముందుకు వచ్చింది. జనతా పార్టీ ప్రధానిగా మొరార్జీ దేశారు ఉన్న సమయంలో బీహార్‌ మాజీ సిఎం బిందేశ్వరీ ప్రసాద్‌ మండల్‌ నాయకత్వంలో ఒక కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఇందిరా గాంధీ తిరిగి అధికారానికి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులను సమర్పించారు. ఆమె దాన్ని పక్కన పడేశారు.తరువాత రాజీవ్‌ గాంధీ కూడా దాన్ని పట్టించుకోలేదు.విపి సింగ్‌ ప్రధాన మంత్రి అయిన తరువాత దుమ్ముదులిపి నివేదికను బయటకు తీశారు.రిజర్వేషన్ల వ్యతిరేకులు పెద్ద ఎత్తున రంగంలోకి వచ్చినప్పటికీ అమల్లోకి వచ్చింది. మండల్‌కు పోటీ బిజెపి కమండల్‌ అజెండాతో రామ జన్మభూమి వివాదాన్ని ముందుకు తెచ్చిందనే విమర్శలు ఆరోజుల్లో వెలువడ్డాయి. రిజర్వేషన్లపై 50శాతం పరిమితి ఉండటంతో అనేక మంది తమను ఓబిసి జాబితాలో చేర్చాలనే డిమాండ్లతో ముందుకు వచ్చారు.వారిని సంతుష్టీకరించేందుకు రిజర్వేషన్లపై సమీక్ష జరగాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చెప్పారు.తరువాత ఇబిసి కోటాను ముందుకు తెచ్చారు.


రిజర్వేషన్లు రాజ్యాంగబద్దమే అయినప్పటికీ అవిశాశ్వతంగా ఉండాలని పేర్కొనలేదు. కనుకనే పది సంవత్సరాలకు ఒకసారి వాటి లక్ష్యం నెరవేరని కారణంగా పొడిగించుకుంటూ వస్తున్నారు. అనేక మంది తమకూ వర్తింప చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.సమాజంలో ఆర్ధిక, విద్యా రంగాలలో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌ కూడా ఉంది.మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ముస్లింలను బిసిలుగా పరిగణించి రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటికే ఉన్న వారికి అన్యాయం జరుగుతుందంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు చూస్తున్నారు.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏమిటీ విడ్డూరం అనే వాదనను ముందుకు తెస్తున్నారు. ఇప్పుడు కల్పిస్తున్న రాజ్యాంగబద్ద రిజర్వేషన్లలో మత ప్రాతిపదిక లేదా ? మతాన్ని ఎవరైనా మార్చుకోవచ్చు, కులానికి అలాంటి అవకాశం లేదు. షెడ్యూలు కులాలు, తరగతులకు చెందిన వారు సిక్కు, బౌద్ద మతాల్లోకి మారితే వారిని దళితులుగానే భావిస్తూ రిజర్వేషన్లు వర్తింప చేస్తున్నారు. క్రైస్తవమతాన్ని స్వీకరిస్తే వారు బిసి రిజర్వేషన్లు పొందవచ్చు.అదే ఇస్లాంను స్వీకరిస్తే మతం మారినందున అసలు రిజర్వేషన్లే వర్తించవు.ఎందుకు అంటే ఇస్లాంలో కులం లేదు గనుక వివక్ష ఉండదు అన్నారు. సిక్కు, బౌద్దంలో కూడా కుల పట్టింపులేనప్పటికీ ఎందుకు వర్తింప చేస్తున్నారన్నదే ప్రశ్న. ఈ అంశంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నది. ఇస్లాంలో కులం లేకున్నా వెనుకబాటు తనం ఉంది కదా ? ఆ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదు ? ఓబిసి రిజర్వేషన్లు కల్పించినపుడు అది వర్తించని కులాల వారు తమ అవకాశాలను లాగివేశారని వ్యతిరేకించారు. ఇప్పుడు ముస్లింలను బిసిలుగా పరిగణించి రిజర్వేషన్లు కల్పిస్తే మీ వాటా తగ్గిపోతుందంటూ వెనుకబడిన తరగతుల వారిని రెచ్చగొడుతున్నారు.నాడూ నేడూ దాని వెనుక ఉంది అసలు మొత్తంగా రిజర్వేషన్లను వ్యతిరేకించేవారి రాజకీయమే.


ఒక వైపు సామాజిక వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లను సమర్ధిస్తామని చెబుతున్న కాషాయ దళాలు ప్రపంచంలో ఏ నాకరిక సమాజంలోనూ లేని అంటరాన్ని తనాన్ని రుద్దిన సనాతనధర్మం, మనుస్మృతిని కాపాడాలని చెప్పటమే కాదు, తామే వాటి అసలైన పరిరక్షకులమని చెప్పుకొనేందుకు సిగ్గుపడటం లేదు. రాజ్యాంగం కంటే మనుస్మృతి గొప్పదని చెప్పిన పెద్దలు. 1949 నవంబరు 30వ తేదీ ఆర్గనైజర్‌ పత్రిక సంపాదకీయంలో వెలిబుచ్చిన అభిప్రాయమే ఇప్పటికీ వారిలో ఉంది.” కానీ మన రాజ్యాంగంలో పురాతన భారత్‌లో అపూర్వమైన రాజ్యాంగ వృద్ది గురించిన ప్రస్తావనే లేదు. స్పార్టా లైకుర్‌గుస్‌ లేదా పర్షియా సోలోన్‌ కంటే ఎంతో ముందుగానే మనుస్మృతి లిఖితమైంది.ఈ రోజుకూ మనుస్మృతిలో మను రాసిన చట్టాలు ప్రపంచ వ్యాపితంగా ఆరాధించాలన్న ప్రేరేపణ ఇస్తాయి.వాటికి విధేయులై ఉండాలని, అనుగుణంగా నడుచుకోవాలనే భావాలను వ్యక్తం చేయిస్తాయి. కానీ మన రాజ్యాంగ పండితులకు దానిలో ఏమీ కనిపించలేదు.” ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా పని చేసిన ఎంఎస్‌ గోల్వాల్కర్‌ ” హిందూ దేశం ఎందుకు ” అనే పుస్తకంలో ఇలా రాశారు.” ఒక వ్యక్తి ఎలాంటి అవగాహన లేకుండా తన ఇంటిలోని పిల్లలు, దొంగలకు సమాన హక్కులు, సంపదలను అందరికీ పంచినట్లుగా దురదృష్టం కొద్దీ మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఇచ్చారు. ” మేకలను మింగటానికి వెళితే భయపడే అవకాశం ఉన్నందున ఒక పులి మేకతోలు కప్పుకున్నదట. అదే మాదిరి ఇలాంటి భావజాలానికి కట్టుబడి ఉంటామని నిత్యం ప్రమాణాలు, పారాయణాలు చేస్తున్న వారే బిజెపి నేతలు. అందుకే వారు నాలుగువందల సీట్లు కావాలంటే తమ అజెండాను అమలు జరిపేందుకు చూస్తున్నారనే అనుమానాలు జనాల్లో పెరుగుతున్నాయి. బిజెపి, కాషాయదళం నిత్యం అంబేద్కర్‌ భజన చేస్తున్న సంగతి తెలిసిందే. నరేంద్రమోడీ ఆ గుంపు వ్యక్తే. అంబేద్కర్‌ 1927 డిసెంబరు 25న బహిరంగంగా మనుస్మృతిని దగ్దం చేశారు.కుల అణచివేతను మనుస్మృతి వ్యవస్థీకృతం కావించింది. సమాజంలోని ఒక తరగతి అత్యధికులుగా ఉన్న వారి అణచివేత, దోపిడీని అది సమర్ధించింది. అగ్రకులం అని పిలిచే జనాలు అత్యధికులుగా ఉన్నవారి మీద వివక్ష చూపటాన్ని అది సమర్ధించింది అని అంబేద్కర్‌ చెప్పారు. అలాంటి మనువాదులే నేడు సనాతనం పేరుతో తిరిగి దాన్ని పునరుద్దరించాలని చూస్తున్నారు. తన బొందిలో ప్రాణం ఉండగా దాన్ని జరగనివ్వను అనే మాట నరేంద్రమోడీ నోట రాదేం. అణచివేత, వివక్ష, దోపిడీని సమర్ధిస్తున్నట్లా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల పాలనలో నరేంద్రమోడీ చైనాకు ఎన్ని లక్షల కోట్లు సమర్పించారో తెలుసా !

30 Tuesday Apr 2024

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics

≈ Leave a comment

Tags

Anti China Propaganda, BJP, CHINA TRADE, India Trade with China, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


పేరు పెట్టి చెప్పకపోయినా చైనాకు పరోక్ష హెచ్చరికలు చేయటంలో మననేతలు తక్కువ తినలేదు. అవి సరిహద్దు సమస్యల మీద కావచ్చు, చైనా స్థానంలో ప్రపంచ ఫ్యాక్టరీగా మనం మారబోతున్నాం అన్న కోతలు ఏవైనా కావచ్చు. మాటలు కోటలు దాటినా చేతలు గడపదాటటం లేదన్న సామెత తెలిసిందే. గత పదేండ్లుగా మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత వంటి నినాదాలు మన చెవుల తుప్పు వదలగొడుతున్నాయి. కానీ పదేండ్ల పాలనలో చైనాకు నరేంద్రమోడీ సమర్పించిన మొత్తం ఎంతో తెలుసా ? యాభై లక్షల కోట్ల రూపాయలకు పైమాటే అంటే ఎవరైనా నమ్ముతారా ? తమ విశ్వగురువు ఇలా చేశారంటే వీర భక్తులు అసలు నమ్మరు. కానీ చేదు నిజం. గడచిన పది సంవత్సరాలలో చైనాతో మన వాణిజ్య లోటు 614బిలియన్‌ డాలర్లు.(గత ఐదేండ్లలో 387బి.డాలర్లు) బిలియన్‌కు వంద కోట్లు అంటే 61,400, ఒక డాలర్‌కు మన రూపాయి మారకం విలువ ఇది రాసిన సమయంలో 83.47 ఉంది. ఆ లెక్కన చైనాకు మనం సమర్పించుకున్న మొత్తం రు.51,25,058 కోట్లు. ఈ వివరాలను 2024 ఫిబ్రవరి 29న ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో విశ్లేషణ రాసిన గ్రూప్‌ కెప్టెన్‌ ప్రవీర్‌ పురోహిత్‌(ఐఎఎఫ్‌ విశ్రాంత ఉద్యోగి) పేర్కొన్నారు.” చైనాతో పెరుగుతున్న భారత వాణిజ్యలోటు వ్యూహాత్మక దుర్బలత్వం ” అనే శీర్షికతో సదరు విశ్లేషణ ఉంది. ఒక వైపు ఏటికేడు చైనా నుంచి దిగుమతులను పెంచుకుంటూ మరోవైపు చైనా నుంచి ముప్పువస్తోంది గనుక అమెరికాతో చేతులు కలపాలి, ఆయుధాలు కొనుగోలు చేయాలి అంటూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న నరేంద్రమోడీ విధానాలను ఎలా అర్ధం చేసుకోవాలి ?మన దేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడి వృద్ధి చెందాలని, జనానికి ఉపాధి కల్పించి సరిపడా ఆదాయకల్పన చేసి మెరుగైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి అనువైన విధానాలను అనుసరించటం లేదనేదే పాలకుల మీద విమర్శ. మనోభావాలను రేకెత్తించటం మీద ఉన్న శ్రద్ద అభివృద్ది మీద లేదు. తమ సరకులను దిగుమతి చేసుకోవాలని ఏ దేశాన్నీ చైనా దేబిరించటం లేదు. మా ఊళ్లో దుకాణం తెరవాలని గ్రామస్తులు ఎవరినైనా వేడుకుంటారా ? ఉన్న దుకాణానికి తోడు కొత్తది వెలిస్తే అక్కడ తక్కువ ధరలకు వస్తువులను అమ్మితే జనం అక్కడే కొనుక్కుంటారు.ప్రపంచ మార్కెట్‌లో ఎప్పటినుంచో ఉన్న అమెరికా, జపాన్‌, జర్మనీ,బ్రిటన్‌ సరసనే చైనా కూడా దుకాణం తెరిచింది.అక్కడ సరసమైన ధరలకు ఇస్తున్నందున ప్రపంచ దేశాలన్నీ ఎగబడి కొనుక్కుంటున్నాయి. గిరాకీని తట్టుకోలేకపోతున్నాము, ఎవరైనా వచ్చి మా దేశంలోనే వస్తూత్పత్తి చేయండి అంటే వివిధ దేశాల నుంచి పెట్టుబడిదారులు అక్కడకు వెళ్లి ఉత్పత్తి చేసి నాలుగురాళ్లు వెనుకేసుకుంటున్నారు. ఆపని చేయలేక మనం కూడా చైనా, ఇతర దేశాల నుంచి కావాల్సినవి కొనుక్కుంటున్నాం.ఎవరూ ఎవరిని బలవంతం చేయటం లేదు. చైనా వస్తువులను బహిష్కరించాలని మనదేశంలో చాలా మంది వాట్సాప్‌ ద్వారా సందేశాలను పంపారు. పెద్ద జోకేమిటంటే అందుకోసం వారు కూడా చైనా ఫోన్లనే వాడుతున్నారు.


తాజాగా గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(జిటిఆర్‌ఐ) అనే సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం పదిహేను సంవత్సరాల క్రితం మనం దిగుమతి చేసుకున్న పారిశ్రామిక వస్తువులలో చైనా వాటా 21 ఉంటే ఇప్పుడు 30శాతానికి పెరిగింది. విదేశాల మీద ప్రత్యేకించి చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించటమే కాదు, అసలు మనమే ప్రపంచానికి ఎగుమతి చేద్దామంటూ నరేంద్రమోడీ ఎంతో హడావుడి చేస్తున్నపుడే ఇదంతాజరిగింది.ఇప్పటికి తాను చేసింది ట్రైలర్‌ మాత్రమే అని చెప్పిన మోడీ రానున్న రోజుల్లో చైనా నుంచి ఇంకా పెద్ద ఎత్తున దిగుమతులకు పూనుకుంటారా ? మరింత గట్టిగా పని చేస్తానంటూ రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత గత ఐదేండ్లలో చైనాకు మన ఎగుమతులు ఏటా 16బిలియన్‌ డాలర్లకు అటూ ఉండగా అక్కడి నుంచి దిగుమతులు 70.3 నుంచి 101 బి.డాలర్లకు పెరిగాయి. ఇది సమర్ధతా, అసమర్ధతకు చిహ్నమా ? చైనా మీద ఆధారపడటం పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా ఉందని జిటిఆర్‌ఐ అన్నది, దేశం కోసం, ధర్మం కోసం అంటూ కబుర్లు చెప్పే నరేంద్రమోడీలో అలాంటిదేమైనా ఉందా ? రామాలయం మీద, దాని ద్వారా ఓట్లు దండుకోవాలన్న యావలో కొంచెమైనా పారిశ్రామికీకరణ మీద ఉందా ? రాజ్యసభలో వైసిపి సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి చైనాతో పెరుగుతున్న మనదేశ వాణిజ్య లోటు గురించి ఒక ప్రశ్న అడిగితే దానికి 2023 డిసెంబరు ఎనిమిదిన కేంద్ర ప్రభుత్వం ఒక సమాధానమిచ్చింది.దానిలో గడచిన తొమ్మిది సంవత్సరాల్లో ఎంతో మార్పు వచ్చిందంటూ గాలిపోగేసి రోజూ చెప్పే కబుర్లను పునరుద్ఘాటించటం తప్ప అసలు సంగతి మన ఎగుమతులు ఎందుకు పెరగటం లేదో దిగుమతులు రికార్డులను ఎందుకు బద్దలు కొడుతున్నదీ చెప్పలేదు.


మనకు అవసరమైన వస్తువులు లేదా ముడి పదార్దాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవాలా మరొక దేశం నుంచా అన్న అంశం మీద కూడా చర్చ జరుగుతున్నది. మనవి కానపుడు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నా ఒకటే. ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరాం గనుక చైనా నుంచి కొన్ని దిగుమతులు చేసుకోక తప్పదు అంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. అదే వాస్తవమైతే పాకిస్తాన్‌ కూడా దానిలో సభ్యురాలే కదా ? అక్కడి నుంచి ఎందుకు దిగుమతులు చేసుకోవటం లేదు. పూర్తిగా చైనా మీద ఆధారపడితే ప్రపంచ రాజకీయాల్లో తేడా వస్తే, అక్కడి నుంచి నిలిచిపోతే పరిస్థితి ఏమిటని కొందరు అంటున్నారు. అసలు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి. మన విధానాలు సరిగా ఉంటే ఎవరితో నైనా వివాదాలు ఎందుకు వస్తాయి. అమెరికా లేదా దాని కనుసన్నలలో పనిచేసే దేశాల మీద ఆధారపడినా అదే జరగదా ? గతంలో అంతర్జాతీయంగా తమ కూటమిలో చేరకుండా ఉన్నందుకే కదా పరిశ్రమలు, అంతరిక్ష ప్రయోగాలకు అలాంటి సహకారం అందించేందుకు అమెరికా నిరాకరించింది. ఆ కారణంగానే మన దేశం సోవియట్‌ వైపు మొగ్గింది.చైనాను మనదేశం శత్రుదేశంగా భావిస్తే ఏ ప్రధానీ కలవనన్ని సార్లు చైనా నేతలను రికార్డు స్థాయిలో నరేంద్రమోడీ ఎందుకు కలసినట్లు ? ఇరు నేతలూ అటు ఊహాన్‌ ఇటు మహాబలిపురంలో కలసి ఉయ్యాలలూగారు. గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత చైనా నుంచి వచ్చే పెట్టుబడులు మనదేశానికి ముప్పు తెస్తాయంటూ కేంద్ర అనుమతి లేకుండా అంగీకరించకూడదని గిరిగీసుకున్నది మనమే. దానికి ప్రతిగా చైనా మన దిగుమతుల మీద లేదా అక్కడి నుంచి వస్తుదిగుమతుల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. మరింత పెరిగాయి, వాటితో ముప్పురాదా ?


పోనీ చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించారా అంటే అదీ లేదు. ఇతర దేశాలతో పోలిస్తే చైనా నుంచి దిగుమతుల వేగం 2.3రెట్లు పెరిగిందని, 2023-24 మనదేశం 677.2 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే దానిలో 101.8 బి.డాలర్లు చైనా నుంచి అంటే 15శాతం ఉన్నట్లు జిటిఆర్‌ఐ నివేదిక పేర్కొన్నది.కీలక రంగాలలో దిగుమతులు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జనవరి మధ్య మనదేశం మొత్తం 67.8 బి.డాలర్ల మేర ఎలక్ట్రానిక్స్‌, టెలికాం, ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే వాటిలో చైనా నుంచి చేసుకున్నవాటి విలువ 26.1 బిలియన్‌ డాలర్లు, 38.4శాతం,యంత్రాల దిగుమతిలో కూడా అక్కడి నుంచి 39.6శాతం,రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు 29.2శాతం ఉంది.మొత్తం దిగుమతుల్లో 50శాతం యంత్రాలు, ఇతర ఉత్పాదక సంబంధమైనవే ఉన్నాయి. శత్రుదేశమంటూ మన మీడియా, సంఘపరివార్‌కు చెందిన సంస్థలు సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తి పోస్తున్నా చైనా వాటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవటం లేదు. జపాన్‌ తదితర దేశాల సముద్ర ఉత్పత్తులను తిరస్కరించినట్లుగా, ఆస్ట్రేలియా ఉత్పత్తుల మీద ఆంక్షలు విధించినట్లుగా మన వస్తువులను తిప్పిపంపిన దాఖలాలు లేవు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఇతర దేశాల్లో కూడా దొరుకుతాయి, అయితే అంత చౌకగా దొరకవు గనుక మోడీ ప్రభుత్వ మెడలు వంచి దిగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు విదేశీమారకద్రవ్యాన్ని కేటాయింప చేసుకొని వస్తు దిగుమతులు చేసుకుంటున్నారు. మనదేశంలో చిన్న పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.ఎంఎస్‌ఎంఇ సంస్థలు మనదేశంలో ఉత్పత్తి చేయగలిగిన వస్త్రాలు, దుస్తులు,గాజువస్తువులు, ఫర్నీచర్‌, కాగితం, చెప్పులు, బొమ్మలను కూడా దిగుమతి చేసుకుంటున్నట్లు జిటిఆర్‌ఐ నివేదిక ఆవేదన వెలిబుచ్చింది.రానున్న రోజుల్లో మనదేశ రోడ్ల మీద తిరిగే ప్రతి మూడు విద్యుత్‌ వాహనాల్లో ఒకటి చైనా సంస్థలు లేదా వాటితో భాగస్వామ్యం కుదుర్చుకున్న లేదా దిగుమతి చేసుకున్నవే ఉంటాయని జిటిఆర్‌ఐ పేర్కొన్నది.మన మార్కెట్‌లోకి చైనా సంస్థలు ప్రవేశిస్తే వాటి ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాలన్నింటినీ చైనా నుంచి దిగుమతి చేసుకొనేందుకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నందున దిగుమతులు మరింతగా పెరుగుతాయని తెలిపింది.మన జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి ఇప్పుడున్న 17 లేక 18శాతం స్థితి నుంచి 25శాతానికి పెరగాలంటే చైనా నుంచి మరిన్ని దిగుమతులు అవసరమని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.


అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో భాగంగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద భారీ మొత్తంలో దిగుమతి పన్ను విధిస్తున్నారు. ఆ మొత్తం అక్కడి వినియోగదారుల మీదనే మోపుతున్నారు తప్ప దిగుమతులను నిలిపివేయలేదు. ప్రత్యక్షంగా వాణిజ్య పోరుకు దిగినట్లు ప్రకటించకపోయినా మనదేశం కూడా చేస్తున్నది అదే. రెండుదశాబ్దాల క్రితం ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ప్రవేశించినపుడు మనదేశంతో వాణిజ్య లావాదేవీల విలువ 3.6బిలియన్‌ డాలర్లు మాత్రమే. దానిలో మనలోటు కేవలం 0.19బి.డాలర్లు మాత్రమే. అదే 2022లో ద్విపక్ష వాణిజ్యం 136 బి.డాలర్లకు చేరగా మనలోటు 101బి.డాలర్లు ఉంది.మరుసటి ఏడాది పరిస్థితి కూడా అలాగే ఉంది.దిగుమతులు మన పరిశ్రమలు, వాణిజ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి దిగుమతి పన్ను 500 రెట్లు పెంచింది. అయినా తగ్గలేదు, అంటే పెంచిన పన్ను మొత్తాలను భరిస్తున్నది మన వినియోగదారులే. మన దేశంలోనే వస్తూత్పత్తి చేసి జనానికి ఉపాధితో పాటు చౌకగా సరకులను అందించాల్సిన నరేంద్రమోడీ దిగుమతి చేసుకున్న వస్తువుల మీద కూడా పన్నులు మోపి జనం జేబులు గుల్లచేస్తున్నారు.రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకున్న ముడి చమురు మీద కూడా అంతే చేస్తున్న సంగతి ఎరిగిందే.వినియోగదారులకు ఒక్క పైసా అయినా తగ్గించారా ? ఫార్మాదిగుమతులపై పన్ను పెంపును మనదేశంలోని పరిశ్రమ వర్గాలు వ్యతిరేకించటంతో 76 ఔషధాలపై పెంపుదలను వెనక్కు తీసుకున్నారు. అనేక వస్తువులపై దిగుమతి పెంపును ఉత్పత్తిదారులు స్వాగతిస్తే దిగుమతిదారులు వ్యతిరేకించారు. ఆర్థికశాఖ తీసుకున్న నిర్ణయాలను ఇతర మంత్రిత్వశాఖలు వ్యతిరేకించాయి.ఈ ఏడాది తాత్కాలిక బడ్జెట్‌కు ముందు అనేక వస్తువులపై పన్నులను తగ్గించారు. ఉత్పాదకత ఎగుమతులతో ముడిపెట్టిన ప్రోత్సాహక పధకం(పిఎల్‌ఐ) రాయితీలను ఉపయోగించుకున్న సంస్థలు పన్నెండింటిలో పదకొండు చైనా సరఫరా గొలుసు భాగస్వాములు లేదా సేవలు అందించే సంస్థలున్నట్లు వార్తలు వచ్చాయి. గత పది సంవత్సరాల కాలంలో అనేక ప్రోత్సాహాకాలు, రక్షణ చర్యలు చేపట్టినా మన పారిశ్రామిక ఉత్పత్తి వాటా జిడిపిలో 15శాతం చుట్టూ తిరుగుతున్నది తప్ప పెరగలేదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత మనదేశం నుంచి ఎగుమతులు నిలిపివేస్తే చైనా మన కాళ్లదగ్గరకు వస్తుందని అనేక మంది కలలు గని అలాంటి పిలుపులే ఇచ్చారు. మొత్తం చైనా చేసుకునే దిగుమతుల్లో మనదేశ వాటా కేవలం మూడుశాతమే, అదే మనం దిగుమతి చేసుకుంటున్నది 15శాతం ఉన్నాయి.చెరువు మీద అలగటం మంచిది కాదని మన విధాన నిర్ణేతలకు అర్ధమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ 400+ మీద హిందూత్వ గుంపులోనే నమ్మకం లేదు !

27 Saturday Apr 2024

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

#400+ claims, BJP, Hindu Fundamentalism, Hinduthwa, India Elections 2024, Narendra Modi Failures, RSS


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీ చెబుతున్నట్లుగా బిజెపికి 370, దాని మిత్ర పక్షాలతో కలిపి 400కు పైగా లోక్‌సభ స్థానాలు వస్తాయా అన్న అనుమానాలు కరడుగట్టిన హిందూత్వ శక్తుల్లోనే తలెత్తాయి.” స్ట్రగుల్‌ ఫర్‌ హిందూ ఎగ్జిస్టెన్స్‌ ”( హిందూ ఉనికి కోసం పోరాటం) అనే వెబ్‌సైట్‌లో 2024 ఏప్రిల్‌ 25న వెలువడిన ఒక విశ్లేషణకు ”బిజెపి-ఎన్‌డిఏ 400 సీట్లకు పైగా అన్న దానికి దూరంగా ఉందా ” అనే శీర్షికను పెట్టారు. దాని రచయిత ఉపానంద బ్రహ్మచారి హరిద్వార్‌కు చెందిన ఒక స్వామి. ” హిందూత్వ ఉత్పాతన పూర్వరంగంలో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 250కి మించి సీట్లు రావంటూ ఒక ఇంటిలిజెన్స్‌ నివేదిక జోశ్యం చెప్పింది ” అనే మాటలతో అది ప్రారంభమైంది.కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ” బిజెపి,నోటుకు ప్రచార మీడియా,దాని ఐటి విభాగం నాలుగు వందల సీట్లకు మించి వస్తాయని చెప్పచూసేందుకు ఒక వ్యర్ధ మార్గంలో ప్రయత్నిస్తున్నాయి. కొన్ని గూఢచార సమాచారాలు దానికి భిన్నంగా ఉన్నందున కొన్ని వర్గాలు చెప్పినట్లుగా బిజెపిలోనే వణుకు ప్రారంభమైంది……ఎంతో ఆసక్తికరమైన అంశం ఏమంటే తొలి దశల్లో బిజెపి విజయానికి చోదక శక్తిగా హిందూత్వ ఉంది. ఇప్పుడు అనేక మంది హిందూత్వ ప్రవర్తకులైన పూజనీయ శంకరాచార్యలు, డాక్టర్‌ సుబ్రమణ్యస్వామి, ఎం నాగేశ్వరరావు, మధు కిష్వెర్‌, సందీప్‌ దేవ్‌ వంటి వారి విమర్శలతో మోడీ తన హిందూత్వ యోగ్యతా పత్రాన్ని కోల్పోయారు. ఈ హిందూత్వ ప్రముఖులు గతంలో మోడీ మరియు బిజెపికి మద్దతు ఇచ్చారు. రామసేతును జాతీయ కట్టడంగా ప్రకటించనందుకు, గోవధపై నిషేధం విధించనందుకు,మతమార్పిళ్లను నిషేధించనందుకు, ప్రభుత్వ నియంత్రణ నుంచి హిందూ దేవాలయాలను విముక్తం చేయనందుకు, కాశ్మీరులోయలో పండిట్లకు పునరావాసం కల్పించనందుకు, ముస్లిం పర్సనల్‌ లా, వక్ప్‌ చట్టాలను రద్దు చేయనందుకు, ప్రార్ధనా స్థలాల చట్టం 1991 రద్దు వంటి అనేక చర్యలను తీసుకోనందుకు వారు ఇప్పుడు మోడీని హిందూత్వ విరోధిగా చూస్తున్నారు.


ఈ హిందూత్వ ప్రముఖుల్లో అనేక మంది బిజెపికి సన్నిహితంగా ఉన్నారు.ఇప్పుడు పార్టీ, హిందూత్వలో మోడీ నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. నకిలీ హిందూత్వ ప్రతీకగా ప్రకటిస్తున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సుప్రీం కోర్టు దారి చూపిందని వారిలో అనేక మంది భావిస్తున్నారు. మోసపూరితంగా, కపటంతో మోడీ అన్ని రకాల ఖ్యాతులను స్వంతం చేసుకున్నారు. హిందుత్వ కుటుంబంలో, దాని నాయకత్వంలో వచ్చిన అలాంటి విభజన వలన ఇప్పుడు బిజెపి హిందూ ఓటు బాంకు తీవ్రంగా దెబ్బతిన్నది. బిజెపి స్వయంగా అభిప్రాయపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు విశ్వసనీయమైన ఇంటెలిజన్స్‌ అందించిన సమాచారం ప్రకారం ఆందోళన కలిగించే అంతర్గత సర్వేలో మెజారిటీ సంఖ్య 272 బిజెపి సాధించలేదని తేలింది. 2024 ఏప్రిల్‌ 19కి ముందు ది ఇండియా ఇంటెలిజన్స్‌ ఇనీషియేటివ్‌, కొన్ని అధికారిక సమాచారాల సహాయంతో నిర్వహించిన సర్వే ప్రకారం పది సీట్లు అటూ ఇటూగా 227కి మించి రావని తేలింది. ఎలా చూసుకున్నప్పటికీ 250కి మించి బిజెపికి రావని పేర్కొన్నది. ఇది కనుక ఇండియా కూటమి సృష్టించిన నకిలీది కానట్లయితే ఆందోళన కలిగించేదిగా ఉంది. దిగువ విధంగా బిజెపికి సీట్లు వస్తాయని సర్వే పేర్కొన్నది.


రాష్ట్రం×××××× సీట్లు ×××× బిజెపికి వచ్చేవి
అండమాన్‌ ×× 1 ×××× 0
ఆంధ్రప్రదేశ్‌ ×× 25 ×××× 1
అరుణాచల్‌ ×× 2 ×××× 1
ఆసోం ×××× 14 ×××× 6
బీహార్‌ ×××× 40 ×××× 10
చండీఘర్‌ ×× 1 ×××× 1
చత్తీస్‌ఘర్‌ ×× 11 ×××× 7
దాద్రా ×××× 1 ×××× 1
ఢిల్లీ ×××× 7 ×××× 3
గోవా ×××× 2 ×××× 1
గుజరాత్‌ ×× 26 ×××× 20
హర్యానా ×× 10 ×××× 6
హిమాచల్‌ ×× 4 ×××× 2
కాశ్మీర్‌ ×××× 5 ×××× 2
ఝార్ఖండ్‌ ×× 14 ×××× 6
కర్ణాటక ×× 28 ×××× 12
కేరళ ×××× 20 ×××× 0
లడఖ్‌ ×××× 1 ×××× 1
లక్షద్వీప్‌ ×× 1 ×××× 0
మధ్యప్రదేశ్‌ ×× 29 ×××× 26
మహరాష్ట్ర ×× 48 ×××× 10
మణిపూర్‌ ×× 2 ×××× 1
మేఘాలయ ×× 2 ×××× 0
మిజోరం ×× 1 ×××× 0
నాగాలాండ్‌ ×× 1 ×××× 0
ఒడిషా×× ×× 21 ×××× 9
పుదుచ్చేరి ×× 1 ×××× 1
పంజాబ్‌ ×× 13 ×××× 2
రాజస్తాన్‌ ×× 25 ×××× 20
సిక్కిం ×××× 1 ×××× 0
తమిళనాడు ×× 39 ×××× 0
తెలంగాణా ×× 17 ×××× 5
త్రిపుర ×××× 2 ×××× 1
ఉత్తరాఖండ్‌ ×× 5 ×××× 3
ఉత్తర ప్రదేశ్‌ ×× 80 ×××× 50
పశ్చిమబెంగాల్‌× 42 ×××× 20
మొత్తం ×××× 543 ×××× 227
సర్వే చేసిన సంస్థలో అనేక మంది మాజీ ఇంటెలిజన్స్‌ అధికారులే ఉన్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి.బిజెపికి 370 సీట్లు, మొత్తం ఎన్‌డిఏకు 400కు పైగా రావన్న అంచనాలతో సామాన్య జనం ఎన్నికల ఫలితాలు, దేశభవిష్యత్‌ గురించి ఆందోళన పడుతున్నారు. అయితే ఏదైనా రాజకీయ కుట్రలో భాగంగా అతి అంచనా అదే విధంగా తక్కువ చేసి చెప్పటాన్ని కూడా వారు ఆమోదించరు. రాజకీయ వాస్తవం అన్నది అరుదుగా ఉన్నందున జూన్‌ నాలుగవ తేదీ ఫలితాలు వాస్తవాలను వెల్లడిస్తాయి.” అని ఉపానంద బ్రహ్మచారి వ్యాసంలో ఉంది. ఒక పచ్చి హిందూత్వ శక్తులు నడిపే వెబ్‌సైట్‌లో ఇలాంటి విశ్లేషణ రావటం గమనించాల్సిన అంశం.


ఎవరైనా కొత్తగా లేదా విరామం తరువాత అధికారానికి వచ్చినపుడు లేదా వస్తామనే ధీమా ఉన్నపుడు తొలి వంద రోజుల్లో ప్రణాళిక గురించి చెబుతారు. కానీ నరేంద్రమోడీ పదేండ్ల అధికారం తరువాత మూడవసారి అధికారానికి వచ్చినపుడు అమలు జరపాల్సిన వంద రోజుల ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను కోరటం మభ్యపరిచే క్రీడలో భాగమే. న్యాయ ప్రణాళిక పేరుతో కాంగ్రెస్‌ ముందుకు తెచ్చిన సంక్షేమ పథకాల గురించి బిజెపికి ఆందోళన పట్టుకున్నట్లు కనిపిస్తోంది.పదేండ్ల పాటు అధికారంలో ఉన్న తరువాత నన్ను నమ్మండి గ్యారంటీ అంటూ నరేంద్రమోడీ ప్రచారం చేయటమే దానికి నిదర్శనం, బిజెపి బలహీనత. అన్ని మరుగుదొడ్లు కట్టించాం, ఇన్ని గాస్‌ కనెక్షన్లు ఇచ్చాం వంటి అభివృద్ధి అంకెలతో జనానికి బోరుకొట్టింది.మరోవైపు గ్యారంటీలను కూడా జనం నమ్మే పరిస్థితి కనిపించకపోవటంతో అలవాటైన మైనారిటీ వ్యతిరేక ప్రచారానికి పూనుకున్నారు.పులి స్వారీకి దిగిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేదా దానికి బలి కావాలి.విద్వేష ప్రచార పులి కూడా అలాంటిదే.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d