• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

అమెరికాకు భారత కోళ్ల రైతుల బలి: మన్మోహన్‌ సింగ్‌ అడ్డుకుంటే నరేంద్రమోడీ అప్పగించారు !

30 Monday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Farmers, Health, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

American chicken legs, American poultry, BJP, China, Donald trump, India-US trade, Joe Biden, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ఉల్లి తల్లి వంటిది అని చెబుతారు. చాలా మంది హరిదాసు-ఉల్లి కథ వినే ఉంటారు.జనానికి చెప్పే కథల సందర్భంగా ఒక హరిదాసు ఉల్లిపాయలు తినొద్దు అని హితవు చెప్పాడు. ఆ శ్రోతల్లో ఒకరిగా ఉన్న భార్య మరుసటి రోజు ఉల్లిపాయ లేకుండా కూరలు వండింది. కోపంతో చిర్రెత్తిన దాసు ఎందుకు వేయలేదు అని అరిచాడు. రాత్రి మీరే కదా తినొద్దని చెప్పారు అని నసిగింది . ఊరందరినీ తినొద్దని చెప్పాను తప్ప నీకు చెప్పానా అంటూ చిందులు వేయటంతో ఆ ఇల్లాలు నివ్వెరపోయింది. ఎందుకు ఈ కథను చెప్పాల్సి వచ్చిందంటే ఆదివారం నాడు మన ప్రధాని నరేంద్రమోడీ 106వ మన్‌కీ బాత్‌ సుభాషితాల్లో స్థానిక వస్తువులనే కొనండి అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాటలు విన్నతరువాత ఇతరులకు నీతులు చెప్పే హరిదాసు గుర్తుకు వచ్చారు. ప్రపంచంలో కోడి మాంసం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఎఫ్‌ఏఓ సంస్థ 2021 వివరాల ప్రకారం భారత్‌ ఆరవ స్థానంలో ఉంది. అమెరికా 2,06,52,971 టన్నులతో మొదటి స్థానంలో, చైనా 1,47,00,000, బ్రెజిల్‌ 1,46,36,478, రష్యా 46,17,338, ఇండోనేషియా 38,44,346,భారత్‌ 36,70,156 టన్నులతో, తొలి పది స్థానాల్లో మన తరువాత మెక్సికో, జపాన్‌, అర్జెంటీనా,టర్కీ ఉన్నాయి.చైనా, మనదేశం జనాభాలో ఒకే విధంగా ఉన్నప్పటికీ జనాభా కొనుగోలు శక్తి ఎక్కువ గనుక చైనా ఇంకా దిగుమతి చేసుకుంటోంది.మన దగ్గర ఉత్పత్తి అవుతున్న కోడి మాంసం, గుడ్లనే పూర్తిగా వినియోగించలేని స్థితిలో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.2014-2019 సంవత్సరాల్లో తలసరి సగటు కోడి మాంస వినియోగం చైనాలో 12.1 నుంచి 14.9 కిలోలకు పెరగ్గా మన దేశంలో 2.49 నుంచి 3.17 కిలోలకు పెరిగింది.పాకిస్తాన్‌లో 5.11 నుంచి 6.8 కిలోలకు పెరిగింది. ప్రపంచంలో 2021లో బహామాస్‌ 70.2 కిలోలతో ప్రధమ స్థానంలో ఉంది.


తాజాగా నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలలో భాగంగా అక్కడ తినటానికి తిరస్కరించే కోడి కాళ్లను మన దేశం దిగుమతి చేసుకొనేందుకు, భారీగా పన్ను తగ్గించేందుకు అంగీకరించింది. అమెరికా మోజులో ఉన్న నరేంద్రమోడీకి అక్కడి కోడి కాళ్లు, ఉత్పత్తిదారులు, వారి లాభాలు తప్ప భారతీయ కోడి మాంసం, దాని ఉత్పత్తి, మార్కెటింగ్‌లో భాగస్వాములయే లక్షల మంది రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు గుర్తుకు రాలేదు. నిత్యం పారాయణం చేసే దేశభక్తి, స్వప్రయోజనాలను తుంగలో తొక్కారా లేక విశ్వగురువుగా నీరాజనాలందుకొనేందుకు అమెరికాకు దాసోహం అన్నారా ? ఏడు సంవత్సరాల క్రితం మన కోళ్ల పరిశ్రమ మార్కెట్‌ విలువ యాభైవేల కోట్లు, 2022లో రు.1,90,530 కోట్లకు పెరిగింది, 2028 నాటికి రు.3,40,780 కోట్లకు చేరుతుందని అంచనా. లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే కోడి మాంసం, ఇతర కొన్ని దిగుమతుల మీద భారీగా పన్నుల తగ్గింపును అడ్డుకొనేందుకు కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. కోర్టులో ఎవరు ఏం వాదిస్తారో చెప్పలేము, ప్రభుత్వ విధాన నిర్ణయాలను సాధారణంగా కోర్టులు సమర్ధిస్తాయి. అమెరికాలో కోడి బ్రెస్ట్‌ తప్ప కాళ్లు, లివరు తినరు, అందువలన వారికి పనికిరాని వాటిని ఇతర దేశాలకు చౌకగా ఎగుమతి చేస్తారు. అవి ఆయా దేశాల పరిశ్రమను దెబ్బతీస్తాయి గనుక అనేక దేశాలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా కోళ్లు, బాతుల మాంసంతో పాటు యాపిల్స్‌, బాదం పప్పు, కాబూలీ(పెద్ద) సెనగలు, కాయధాన్యాలు తదితర వ్యవసాయ ఉత్పత్తులపై మనదేశం భారీగా దిగుమతి పన్ను తగ్గించనుంది. దిగుమతి చేసుకొనే ఉత్పత్తులతో గతంలో పంటలు, పర్యావరణాన్ని దెబ్బతీసే కలుపు మొక్కలు, తెగుళ్ల వంటివి మన దేశానికి వచ్చాయి.1950లో పిఎల్‌ 480 పేరుతో అమెరికా అందచేసిన నాసిరకం గోధుమలతో పాటు వయ్యారి భామ, కాంగ్రెస్‌ గడ్డి అని పిలిచే పార్థీనియం అనే విషపూరితమైన కలుపు మొక్క మన దేశానికి వచ్చింది.అదే విధంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇది వ్యాపించింది. దీని వలన మనుషులకు చర్మ, శ్వాస సంబంధమైన రుగ్మతలు కలుగుతాయని తేలింది.


2022లో అమెరికాలో బర్డ్‌ ఫ్లూ అనే వ్యాధితో కోట్లాది కోళ్లు మరణించాయి. వాటితో పాటు ఆ వ్యాధి మనుషులకూ వ్యాపిస్తుంది. అలాంటి అవకాశం ఉన్న చోట నుంచి కోడి, బాతు మాంస ఉత్పత్తులను దిగుమతికి నరేంద్రమోడీ సర్కార్‌ తలుపులు బార్లా తెరిచి జనాల ఆరోగ్యానికి కూడా హాని తలపెట్టినట్లు అనేక మంది భావిస్తున్నారు. రెండవది అమెరికాలో కోళ్ల దాణా పశు, పంది మాంసం, ఎముకల నుంచి తయారు చేస్తారు. అలాంటి వాటితో పెంచిన కోళ్ల మాసం తినేందుకు అనేక మంది మనోభావాలు అంగీకరించవు. మోడీ సర్కార్‌ వాటిని పట్టించుకోలేదు.ఈ దాణాతో పెంచిన కోళ్ల, బాతుల మాంసం అని వాటి ఉత్పత్తుల మీద ప్రకటిస్తారో లేదో తెలియదు. ఒక వేళ ప్రకటించినప్పటికీ వినియోగదారులకు అలా ముద్రించిన పాకెట్లలో సరఫరా చేస్తే అదొక దారి. హౌటళ్లలో వాటిని వడ్డిస్తే వినియోగదారులు కనుక్కోలేరు.దేశ కోళ్ల పరిశ్రమ రైతులకు హానికలిగించే ఈ ఏకపక్ష నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు భారత కోళ్ల పరిశ్రమ ఫెడరేషన్‌ అధ్యక్షుడు రాణ్‌పాల్‌ ధండా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమెరికన్‌ కంపెనీల లాభాలను కాదు, దేశంలోని రైతుల ప్రయోజనాలను చూడాలని అన్నారు.ఈ నిర్ణయంతో అమెరికా ఉత్పత్తిదారులకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయని, ఉత్పత్తులు మరింతగా భారత్‌లో అందుబాటులోకి వస్తాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తారు ప్రకటించారు.బాదం పప్పు, సెనగలు, కాయధాన్యాలు, యాపిల్స్‌ దిగుమతుల మీద పన్ను పెంచాల్సిందిపోయి తగ్గించటం నరేంద్రమోడీ సర్కార్‌ రైతుల ప్రయోజనాలను దెబ్బతీయటమే అని, ఈ ఉత్పత్తులపై అమెరికా ఇచ్చే ఎగువుతి సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థలో మనదేశంతో కలసి పోరాడిన దేశాలను కేంద్ర ప్రభుత్వం మోసం చేయటం తప్ప మరొకటి కాదని రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఫ్‌ు జాతీయ సమన్వయకర్త కెవి బిజు అన్నారు.ఈ నిర్ణయం వలన కాశ్మీర్‌, హిమచల్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. అమెరికా, ప్రపంచబాంకు వత్తిడికి లొంగి ఇలాంటి నిర్ణయాలు తీసుకొనేందుకు తీసుకు వచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని తిప్పి కొట్టేందుకు రైతాంగాన్ని కదిలించిస సంయుక్త కిసాన్‌ మోర్చా, ఇండియా కూటమి కూడా కేంద్ర నిర్ణయాన్ని ప్రశ్నించింది. భారత్‌లో టర్కీ కోడి మాంసంపై ప్రస్తుతం ఉన్న 30శాతం దిగుమతి పన్నును ఐదు శాతానికి తగ్గిస్తారని అమెరికా పార్లమెంటు సభ్యురాలు అమీ క్లోబుచర్‌ ప్రకటించారు.


తమ కోళ్ల ఉత్పత్తులను మనదేశంలో కుమ్మరించేందుకు అమెరికా చాలా కాలం నుంచి చూస్తోంది. బెదిరింపు, వత్తిడి వంటి అనేక రూపాల్లో అది ప్రయత్నించి చివరికి అనుకున్నది సాధించింది.2007లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న నాటి యుపిఏ ప్రభుత్వం అమెరికా కోళ్ల ఉత్పత్తులపై నిషేధం విధించింది. అది చెల్లదంటూ అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేసింది.అమెరికా తన కోళ్ల ఉత్పత్తుల్లో 15 నుంచి 20శాతం వరకు ఎగుమతులు చేస్తున్నది.2014లో అమెరికా కేసు గెలిచింది. అధికారానికి వచ్చిన కొత్త రోజులు గనుక మోడీ సర్కార్‌ ఆ తీర్పును అమలు చేసేందుకు భయపడింది.ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా భారత్‌ మీద ఆంక్షలను విధింపచేయిస్తామని అమెరికా బెదిరించటంతో కేంద్ర ప్రభుత్వం చికెన్‌లెగ్స్‌ దిగుమతులకు అనుమతిస్తున్నట్లు 2017లో తెలిపింది. నిజానికి మన దేశంలో ఉత్పత్తి అవుతున్న చికెన్‌ మాంసం, గుడ్లు అవసరాలకు మించి ఉండటంతో 2016-17లోనే రు.532 కోట్ల మేరకు వివిధ దేశాలకు ఎగుమతి చేశాము. నరేంద్రమోడీ రెండవ సారి విజయం సాధించిన తరువాత నాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఒకవైపు మోడీని పొగడ్తలు, ఆలింగనాలతో ముంచెత్తుతూనే మరోవైపు మరింత వత్తిడి పెంచాడు. అప్పటి వరకు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తున్న వస్తువుల మీద జిపిఎస్‌ పేరుతో 600 కోట్ల డాలర్ల మేర ఇస్తున్న దిగుమతిపన్ను రాయితీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.దానికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న యాపిల్స్‌ వంటి 28రకాల వస్తువులపై దిగుమతి పన్ను పెంచింది. మన మార్కెట్‌ను మరింతగా తెరవాలని డిమాండ్‌ చేస్తున్న అమెరికా ఇంతవరకు జిపిఎస్‌ను పునరుద్దరించలేదు.ట్రంప్‌ పోయి బైడెన్‌ వచ్చినా జరిగిందేమీ లేదు గానీ మనదేశం మాత్రం అమెరికా వస్తువుల మీద విధించిన పన్నులను మోడీ సర్కార్‌ తాజాగా తగ్గించింది. అమెరికా-చైనా వాణిజ్యపోరుతో మన దేశం లబ్దిపొందవచ్చని కొందరు ఆశించారు.అది కార్యరూపందాల్చలేదు. తొలి రోజుల్లో అమెరికా మీద మోడీ సర్కార్‌ చూపిన పరిమిత ప్రతిఘటన తరువాత నీరుగారింది. ఇప్పుడు పూర్తిగా లొంగిపోయింది. నిజానికి నరేంద్రమోడీ జూన్‌ నెలలో అమెరికా వెళ్లినపుడే పన్నుల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు, సెప్టెంబరులో వెల్లడించారు.


కోళ్ల పరిశ్రమలో మార్కెట్‌ను మరింత తెరిచారు. రైతాంగ స్పందన చూసిన తరువాత అమెరికా, ఐరోపా, ఇతర దేశాల నుంచి పాల ఉత్పత్తులను అనుమతించి పాడి పరిశ్రమకూ మంగళం పాడేందుకు చూస్తున్నారు. అన్నీ ఒకేసారి చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది గనుక దశలవారీ నిర్ణయాలు తీసుకుంటారు. మన దేశంలో పాల పదార్ధాల ధరల్లో సగానికి దిగుమతి చేసుకున్నవాటిని విక్రయిస్తారని గతంలోనే అనేక మంది చెప్పారు.2020లో మన దేశంలో పాలపొడి ధర కిలో రు.130 నుంచి 150వరకు ఉండగా 30శాతం దిగుమతి పన్నుతో సహా అమెరికా నుంచి రు.70కే దిగుమతి చేసుకోవచ్చని తేలింది. ఇప్పుడు కూడా ధరల్లో మార్పులు ఉండవచ్చు తప్ప విదేశాలు ఇచ్చే సబ్సిడీలు భారీ ఎత్తున ఉంటాయి.చైనాతో అమెరికా 2018లో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందువలన అమెరికన్లు తమ వస్తువులకు కొత్త మార్కెట్లకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అమెరికా వత్తిడిని అడ్డుకొనేందుకు మనసుండాలేగానీ మార్గం దొరక్కపోదు.గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాలో వ్యాపించిన బర్డ్‌ ఫ్లూను పేర్కొంటూ కోళ్ల ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది. నరేంద్రమోడీ ఆంక్షలను, దిగుమతి పన్నులను సడలిస్తున్న సమయంలో అమెరికాలోని వాణిజ్య పౌల్ట్రీ ఫారాల్లో ఫ్లూ కనిపించింది. 2022 నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాధికి అక్కడ 5.88 కోట్ల కోళ్లు, టర్కీ కోళ్లు మరణించినట్లు 2023 అక్టోబరు పదవ తేదీన రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. అమెరికాలో అతి పెద్ద గుడ్ల ఉత్పత్తి సంస్థ కాల్‌ మైన్‌ ఫుడ్స్‌ విక్రయించే గుడ్ల ధర గత ఏడాది కాలంలో 48శాతం పడిపోయింది. సెప్టెంబరు రెండవ తేదీనాటికి అంతకు ముందు నాలుగు నెలల్లో అమ్మకాలు 30శాతం పడిపోయినట్లు పేర్కొన్నది. బర్డ్‌ ఫ్లూ మనుషుల్లో కూడా సులభంగా వ్యాప్తి చెందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థకూడా జూలైనెలలో హెచ్చరికలు జారీచేశాయి. 2022లో 67దేశాల్లో వ్యాధికారణంగా 13 కోట్ల కోళ్లను వధించటం లేదా మరణించినట్లు లెక్కలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు మరో 14దేశాల్లో వ్యాధి కనిపించింది. అందువలన ఈ కారణంగా కూడా అమెరికా ఉత్పత్తులను అడ్డుకోవచ్చు.


అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద దిగుమతి పన్ను ఐదు నుంచి పదిశాతానికి పరిమితం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఇది ఒక్క అమెరికాకే కాదు, ప్రపంచ వాణిజ్య సంస్థలో ఉన్న అన్ని దేశాలకూ అదే రేటు వర్తిస్తుంది. గతంలో దిగుమతి చేసుకున్న కోడి కాళ్ల మీద మన ప్రభుత్వం వందశాతం పన్ను విధించేది. తరువాత దాన్ని 35 నుంచి 45శాతానికి తగ్గించింది. వచ్చే ఆరునెలల్లో ఐదు, పదిశాతాన్ని ఏ వస్తువు మీద ఎంత అనేది నిర్దిష్టంగా నిర్ణయిస్తారు. అందుకే ఈ లోగా పన్ను తగ్గింపు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేసేందుకు కొందరు పూనుకున్నారు. వందశాతం పన్ను విధించినప్పటికీ భారీ మొత్తాలు సబ్సిడి ఇస్తున్న అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చికెన్‌ లెగ్స్‌ మనదేశంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువకే దొరుకుతాయని అది మన పరిశ్రమకు తీరని దెబ్బ అని సంయుక్త కిసాన్‌ మోర్చా హెచ్చరించింది.అమెరికాలో చికెన్స్‌ లెగ్స్‌ ఉత్పాదన ఖర్చు టన్నుకు 700 నుంచి 800 డాలర్లు ఉంటుందని, వందశాతం పన్ను విధిస్తే 1,500 నుంచి 1,600 డాలర్లకు దిగుమతి చేసుకోవచ్చని, మన దేశంలో టన్ను ఉత్పత్తి ఖర్చు 1,800 డాలర్లుగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నది. అదే ఐదు, పదిశాతం పన్ను మాత్రమే విధిస్తే ఎంత చౌకగా మన మార్కెట్‌ను ముంచెత్తుతారో ఊహించుకోవాల్సిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

జాడలేని భారత ఉత్పత్తి, తయారీ – చైనాతో వాణిజ్యలోటుపై కొత్త డ్రామాకు తెరతీసిన మోడీ సర్కార్‌ !

27 Friday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, Boycott of goods made in China, India Trade with China, Make In India, Narendra Modi Failures, Niti Aayog, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


2018 ఏప్రిల్‌ నెలలో మన ప్రధాని నరేంద్రమోడీ చైనాలోని ఊహాన్‌ నగరంలో చైనా నేత షీ జింపింగ్‌తో కలసి ఊయల ఊగేందుకు వెళ్లారు. అప్పుడు నీతి ఆయోగ్‌ ఒక పత్రాన్ని ప్రధాని బృందానికి సమర్పించింది. దానిలో ఏం చెప్పిందంటే గడచిన దశాబ్దకాలంలో చైనాతో వాణిజ్యలోటు పదమూడు రెట్లు పెరిగిందనీ, పాత స్వేచ్చావాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని, నూతన ఒప్పందాల్లో ఏదైనా ఉపేక్ష ఉంటే అది మన మార్కెట్లను దెబ్బతీస్తుందని, భారత్‌ పట్ల చైనా ఔదార్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని, చైనాతో మనదేశం జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. మంచిదే, అంతకంటే కావాల్సిందేముంది ! ఇప్పటికి ఐదున్నర సంవత్సరాలు గడిచాయి. జరిగిందేమిటి ? రెండు దేశాల మధ్య కొత్త ఒప్పందాలేమీ కుదరలేదు. ఉన్నవి రద్దు కాలేదు. 2004-05నుంచి 2013-14 మధ్య కాలంలో 148 కోట్ల డాలర్లుగా ఉన్న చైనా-భారత వాణిజ్య లోటు 3,621కోట్లకు చేరిందని, అది 2,346శాతం పెరుగుదల అని అప్పటి నుంచి తమ ఏలుబడిలో 2021-22 నాటికి 7,331 కోట్లకు అంటే కేవలం వందశాతమే పెరిగిందని రాజ్యసభకు వెల్లడించిన సమాచారంలో కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ సమర్ధించుకున్నారు. మరుసటి ఏడాది అంది పదివేల కోట్ల డాలర్లకు చేరింది.ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 5,653 కోట్ల డాలర్లు ఉంది.చైనాతో వాణిజ్య లోటును తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు నవంబరు ఏడవ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చని నీతి ఆయోగ్‌ సంస్థ తాజాగా కన్సల్టెన్సీ సంస్థలను కోరింది. రెండు రకాల అధ్యయనాలు చేస్తారట.సిఫార్సులు చేయటం, నివేదికలను రూపొందించటం తప్ప అధికారాలు లేని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థను నరేంద్రమోడీ ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి నెలకొల్పారు.


వాస్తవానికి చైనా నుంచి విధిగా దిగుమతులు చేసుకోవాలనే ప్రత్యేక ఒప్పందమేమీ మనదేశానికి లేదు. మనకు అవసరం ఎక్కువగా ఉంది గనుక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, వారికి మన నుంచి పెద్దగా దిగుమతులు అవసరం లేదు గనుక లోటు పెరుగుతోంది. అందువలన వాణిజ్య లోటు తగ్గించాలన్నా పూర్తిగా లేకుండా చేయాలన్నా చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే సరిపోతుంది. లేదా మన ఎగుమతులు పెంచాలి. గత పదేండ్లుగా ఈ రెండూ చేతగాని స్థితిలో మోడీ దేశాన్ని ఉంచారా ? ఏం చేయాలో నీతి అయోగ్‌ సంస్థకు తెలియదా ? కొన్ని కోట్లు సమర్పించుకొని సలహలను కొనుక్కోవాలా ? లడక్‌ సరిహద్దులో జరిగిన ఘర్షణ ఉదంతాల తరువాత మన దేశంలో అనేక మంది మనం చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందని చెప్పారు. ఇంతకాలం రికార్డు స్థాయిలో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకొని నరేంద్రమోడీ సర్కార్‌ దిగుమతులకు అనుమతులు ఇచ్చింది. స్టాటిస్టా సంస్థ వివరాల ప్రకారం 2022లో మన దేశం చేస్తున్న ఎగుమతుల్లో 18.5శాతం అమెరికాకు, 6.65శాతం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు, మూడవ స్థానంలో ఉన్న చైనాకు 5.04శాతం ఉన్నాయి. ఇదే కాలంలో చైనా ఎగుమతుల్లో 16.2శాతం అమెరికాకు ఆరవ స్థానంలో ఉన్న మన దేశానికి 3.29శాతమే ఉన్నాయి. అందువలన మనం దిగుమతులు, ఎగుమతులు నిలిపివేస్తే అరిటాకు మీద ముల్లు సామెత అవుతుంది. పదేండ్లుగా చెబుతున్న మేకిన్‌ ఇండియా(భారత ఉత్పత్తి), మేడిన్‌ ఇండియా(భారత తయారీ), ఆత్మనిర్భరత పిలుపుల వలన జరిగిందేమీ లేదు. 2022-23లో మన జిడిపిలో ఉత్పాదకరంగం వాటా 14.7శాతం, మోడీ ఏలుబడి పది సంవత్సరాల్లో దీనికి అటూ ఇటూగానే ఉంది తప్ప 25శాతానికి పెంచాలన్న లక్ష్యం ఎండమావిగానే ఉంది. పన్నెండు రంగాలలో దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు సలహాలు ఇవ్వాలని నీతి అయోగ్‌ కోరుతున్నది. చైనా నుంచి దిగుమతులను తగ్గించాలని 2018లోనే నీతి అయోగ్‌ చెప్పింది కదా ! పోనీ అప్పుడే ఎందుకు అడగలేదు ? తగ్గించకపోగా ఎందుకు పెంచినట్లు ? ఇప్పుడు జనాన్ని మభ్య పెట్టేందుకు తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు నీతి అయోగ్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకం తప్ప ఇది మరొకటి కాదు. అమెరికా, జర్మనీ వంటి దేశాలు మేము చైనా మీద ఆధారపడకుండా ఉండలేంగానీ మీరు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తామని మనలను మునగచెట్టు ఎక్కిస్తున్నాయి.


వాటికే సాధ్యం కానిది మనకెలా కుదురుతుంది ! చైనా నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయి. మరి ఎందుకు ఇతర దేశాల నుంచి తెచ్చుకోవటం లేదంటే చైనా మాదిరి తక్కువ ధరలకు మరొకదేశమేదీ ఇవ్వదు. అధిక ధరలకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మన చేతి చమురు మరింత వదులుతుంది.ద్రవ్యోల్బణం, ధరలు పెరుగుతాయి. మన జనం కొనాలంటే జిఎస్‌టి పెంచుతారు, విదేశాలకు పద్నాలుగు రకాల వస్తువులను చౌకగా ఎగుమతి చేసేందుకు జనం సొమ్ము రెండు లక్షల కోట్ల రూపాయల మేర సబ్సిడీ ఇస్తున్నా ఎదుగూబొదుగూ లేదు. చైనాను పక్కకు నెట్టి ఆ స్థానాన్ని మనదేశం ఆక్రమిస్తుందని చెప్పటం పరిణితిలేనితనమని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ గతంలో చెప్పాడు. ఐఎంఎఫ్‌ తాజా అంచనా ప్రకారం 2028నాటికి మన జిడిపి 5.94లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని, అదే చైనాలో 23.61లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. కానీ కొందరు అప్పటికి మన దేశం చైనాను అధిగమిస్తుందని చెబుతుంటే మరి కొందరు నిజమే కామోసనుకుంటున్నారు. ఎవరి నమ్మకం వారిది ? వినేవారుంటే చెప్పేవారికి కొదవ ఉండదు. చైనా వ్యతిరేక కళ్లద్దాలను పెట్టుకొని చూస్తే అలాగే కనిపిస్తుంది మరి ! గోల్డ్‌మాన్‌ శాచస్‌ సంస్థ అంచనా ప్రకారం 2075 నాటికి చైనా 57లక్షల కోట్ల డాలర్లతో ప్రధమ స్థానంలో 52.5లక్షల కోట్ల డాలర్లతో మనదేశం రెండవదిగా 51.5లక్షల కోట్ల డాలర్లతో అమెరికా మూడవ స్థానంలో ఉంటుందని చెప్పింది. ఇవన్నీ అంచనాలు తప్ప యాభై ఏండ్ల తరువాత రాజెవరో రెడ్డెవరో !


ప్రపంచం రక్షణాత్మక చర్యలు తీసుకుంటోందని, చైనా మీద ఇప్పటికే అమెరికా వాణిజ్యపోరు ప్రారంభించిందని, చైనా మీద అన్ని వైపుల నుంచి వత్తిడి పెరుగుతున్నందున దాన్ని అవకాశంగా మలుచుకోవాలని, మనదేశం చైనా వస్తువులకు మార్కెట్‌ను తెరవకూడదని నీతి అయోగ్‌ 2018 పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. చైనా వస్తువులను మన దేశంలో కుమ్మరించటం గాకుండా చైనా తమ దేశంలో తయారు చేస్తున్నవాటిని మన దేశంలో కూడా పెట్టుబడులు పెట్టి, మన కంపెనీలతో కలసి తయారు చేయించాలని నరేంద్రమోడీకి సలహా ఇచ్చింది. అలా చేస్తే దానికి బదులు ప్రపంచంలో ఇతర దేశాల రక్షణాత్మక చర్యలకు వ్యతిరేకంగా మనదేశ సహాయాన్ని చైనా కోరే అవకాశం ఉందని కూడా చెప్పింది. తెలివితేటలకు తక్కువేం లేదు. అదైనా చేశారా ? లడక్‌ సరిహద్దు ఉదంతం తరువాత చైనాను ఒక శత్రుదేశంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.పోనీ మనలను ఎగదోస్తున్న అమెరికా, ఇతర ఐరోపా దేశాలు మనకేమైనా సాయం చేస్తున్నాయా ? తమ దేశంలో ఒక సిక్కు ఉగ్రవాదిని భారత్‌ దేశమే హత్య చేయించిందన్న కెనడా ఆరోపణకు అమెరికా, ఐరోపా దేశాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.


ప్రతి దేశం తన ప్రయోజనాలను తాను చూసుకుంటున్నది, తన పరిస్థితిని బట్టి అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించుకోవాలి తప్ప చైనా దెబ్బతింటే మనకు అవకాశం వస్తుందని చెప్పేవారి మాటలు వింటే జరిగేదేమీ ఉండదని ఇప్పటికే తేలిపోయింది. ఇతర దేశాల వైఫల్యాల కారణంగా చైనా నేడు ఈ స్థితికి రాలేదు. తన స్వంత విధానాలను రూపొందించుకుంది. కరోనా నిరోధానికి అక్కడ అమలు జరిపిన కఠిన ఆంక్షలు కొంత మేరకు వృద్ధిని దెబ్బతీశాయి తప్ప అనేక మంది ఆశించినట్లు కుప్పకూలలేదు, ఇప్పుడు అలాంటి మాటలు చెప్పేవారి నోళ్లు మూతపడ్డాయి. నాలుగు సంవత్సరాల నాడు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద(ఆర్‌సిఇపి) చర్చల నుంచి మనదేశం వైదొలిగిన తరువాత మనం సాధించిందేమీ లేదు. 2022 జనవరి నుంచి ఆ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దానిలో చేరాలని తాజాగా బంగ్లాదేశ్‌, శ్రీలంక దరఖాస్తు చేసుకున్నాయి. దానిలో మనం చేరితే దిగుమతి వ్యాపారం చేసే శక్తులు లాభపడతామని భావిస్తుండగా నష్టపోతామని పారిశ్రామిక రంగం వ్యతిరేకిస్తోంది. మన దేశానికి తలుపులు తెరిచే ఉంచామని ఆ కూటమి పదే పదే చెబుతోంది.


అసలు చైనాతో మనదేశం పూర్తిగా తెగతెంపులు చేసుకోగలదా ? చైనా సంస్థలను నిరోధించగలదా ? చైనా నుంచి వస్తు దిగుమతులను నిలిపివేయవచ్చు. అదే జరిగితే ఆ దిగుమతులతో లబ్ది పొందుతున్న ఫార్మా, ఇతర రంగాల కార్పొరేట్ల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. చైనా సభ్యురాలిగా ఉన్న ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బాంక్‌(ఎడిబి), ఏఐఐబి, ప్రపంచబాంకు వంటి ఆర్థిక సంస్థలలో మనదేశం కూడా భాగస్వామి. వాటి నుంచి రుణాలు తీసుకొని మనదేశంలో అమలు జరిపే ప్రాజెక్టులలో కాంట్రాక్టులను దక్కించుకొనేందుకు చైనా సంస్థలకు హక్కు ఉంటుంది. వాటికవి దూరంగా ఉంటే లేదా నిబంధనలను ఉల్లంఘిస్తే తప్ప నిరాకరించటానికి కుదరదు. గాల్వన్‌ ఉదంతాల తరువాత ఢిల్లీ-మీరట్‌ రాపిడ్‌ రైల్‌ మార్గంలో చైనా కంపెనీల కాంటాక్టులను రద్దు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ మంచ్‌ తదితర సంస్థలు ఆందోళన చేసినప్పటికీ కుదరలేదు.ఎందుకంటే అవసరమైన నిధులను ఏడిబి నుంచి రుణాలుగా తీసుకున్నారు. చైనా కంపెనీలు పూర్తి చేసిన మార్గాన్నే ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. మన దేశంలో దాదాపు ఎనిమిది వందల చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌, బైజూస్‌,స్విగ్గీ, జొమాటో,ఉడాన్‌, ఓలా,పేటియం, పేటియం మాల్‌, బిగ్‌బాస్కెట్‌,పోలసీబజార్‌,ఓయో వంటి కంపెనీలలో చైనా పెట్టుబడులు ఉన్నాయి. వాటన్నింటిని తెల్లవారేసరికి వెళ్లిపొమ్మని నరేంద్రమోడీ చెప్పవచ్చు, వాటికవి వెళ్లిపోతే సరే, లేకుంటే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని ప్రభుత్వం భరిస్తుందా ? ఇష్టం లేదని ఈ రోజు చైనా కంపెనీలను వెళ్లగొడితే మనదేశాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల కంపెనీలు ముందుకు వస్తాయా ? పాలకులకు ఇష్టం లేకపోతే రేపు మనకూ అదే గతి అని ఆలోచించవా ? సరిహద్దు వివాదం తరువాత మనం చైనా వైపు తలుపులు మూసుకున్నాం తప్ప ఇతర దేశాల నుంచి సాధించిందీ లేదు, ఏ ఒక్క చైనా కంపెనీ కూడా వెనక్కు వెళ్లిపోలేదు.


చైనా టెక్‌ కంపెనీల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటే తమ సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని, రక్షణకు ముప్పని అమెరికా, ఐరోపా దేశాలు చెబుతున్నాయి.ఇప్పుడు మన దేశమూ అదే చెబుతోంది. నిజమే అనుకుందాం. ఇంటెల్‌ వంటి అమెరికా, ఐరోపా కంపెనీల ఉత్పత్తులను దశాబ్దాల తరబడి చైనా దిగుమతి చేసుకుంది.వాటితో చైనాకూ భద్రతా ముప్పు ఉన్నట్లే కదా ! పోనీ మన దేశం చైనా బదులు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తే వాటి నుంచి మనకు ముప్పు ఉండదా ? మన సమాచారాన్ని అవి తస్కరించవా ? జపాన్‌ నాగసాకీ నగరంలో 2023 మే నెలలో జరిగిన జి7 దేశాల సమావేశం చైనాతో ఉన్న సరఫరా గొలుసు నుంచి విడగొట్టుకుంటామని చెబుతూ మన దేశాన్ని చైనా స్థానంలోకి నెడతామని చెప్పాయి.వాటిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరిని దాటేందుకు చూసినట్లే ! దశాబ్దాల తరబడి చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్న పశ్చిమ దేశాలకు ఇప్పుడెందుకు జ్ఞానోదయం కలిగినట్లు ? వాటి మాటలు నమ్మి చైనా అనే కొండను ఢ కొడతామని మనం అనుకోవటం సరైందేనా ? చైనాతో తెగతెంపులు చేసుకుంటే తమ ఆర్ధిక వ్యవస్థలు మెరుగుపడతాయని పశ్చిమ దేశాలు అనుకుంటున్నాయి. అలాంటివి తమ దేశాల్లోనే పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టుకుంటాయి తప్ప మనదేశం ఎందుకు వస్తాయి ? చైనా మీద ఆధారపడి చేతులు కాల్చుకున్నామని భావిస్తున్నవారు మన మీద ఆధారపడి మరోసారి అదే తప్పు చేస్తారా ? సొల్లు మాటలను కట్టిపెట్టి ముందు చైనాతో విడగొట్టుకోమనండి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనా కరెన్సీలో చమురు డబ్బు డిమాండ్‌ చేస్తున్న రష్యా – పరువు పోతుందని నరేంద్రమోడీ భావిస్తున్నారా ?

22 Sunday Oct 2023

Posted by raomk in BJP, CHINA, COUNTRIES, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices, RUSSIA, USA

≈ Leave a comment

Tags

BJP, China, De Dollarisation, Narendra Modi Failures, Russian oil, U.S. Dollar, yuan

ఎం కోటేశ్వరరావు

గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్రమోడీ సర్కార్‌ చిక్కుకుందా ? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా ? చైనా మీద కోపంతో అధిక ధరలకు ఇతర దేశాల నుంచి కొని జనం మీద భారం మోపేందుకు సిద్దపడుతుందా ? తాజాగా తలెత్తిన పరిస్థితి నుంచి పుట్టుకువస్తున్న అనుమానాలివి. తమ ముడి చమురుకు చైనా యువాన్లు చెల్లించాలన్న రష్యా డిమాండ్‌ను భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెప్పినట్లుగా బ్లూమ్‌బెర్గ్‌ మీడియా పేర్కొన్నది. ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యన్లు తమ వద్ద కొనుగోలు చేసే దేశాలకు రాయితీ ధరలకు చమురును విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గతం కంటే ఎంతో ఎక్కువగా చైనాపై ఆధారపడ్డారు. ఐరోపా యూరోలు, అమెరికా డాలర్లను మార్చుకొనేందుకు ఆంక్షలు అడ్డువస్తున్నందున తమకు చైనా యువాన్లలో చెల్లించాలని రష్యా మన దేశాన్ని కోరింది. దీనికి మనదేశం అంగీకరించే అవకాశాలు లేవని బ్లూమ్‌బెర్గ్‌ వ్యాఖ్యానించింది. అదే జరిగితే రష్యా నుంచి కొనుగోలు నిలిపివేసి డాలర్లు చెల్లించి అధిక ధరకు ఇతర మార్కెట్లో చమురు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ యువాన్లలో చెల్లించినప్పటికీ, ఇప్పుడు హిందూస్తాన్‌ పెట్రోలియం, భారత పెట్రోలియం కార్పొరేషన్‌ చెల్లింపుల అంశానికి వస్తే ప్రభుత్వం విముఖంగా ఉందని రాయిటర్స్‌ వార్తా సంస్థ కొద్ది రోజుల క్రితం పేర్కొన్నది. కొత్తగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరం ఏమిటో తెలియదు. గతేడాది నవంబరు నాలుగున ఒపెక్‌ దేశాల నుంచి మనం కొనుగోలు చేస్తున్న ముడి చమురు పీపా ధర 93.86 డాలర్లు ఉండగా తరువాత మే మూడవ తేదీకి 70.52 డాలర్లకు తగ్గింది.సెప్టెంబరు 29న 97.03 డాలర్లకు పెరిగి తరువాత కాస్త తగ్గి అక్టోబరు 19న 91.71 డాలర్ల వద్ద ఉంది.

చైనాతో సరిహద్దు వివాదంలో ఎలాంటి పురోగతి లేకపోవటం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో చైనాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాలకు మరింత సన్నిహితం కావటం వంటి కారణాలు ఉండవచ్చు. లేదా రూపాయిని అంతర్జాతీయ మారక కరెన్సీగా మారుస్తామన్న మాటల ప్రచార బండారం సంగతేమిటని జనం అడుగుతారన్న భయం కావచ్చు. 2022-23లో రోజుకు 7.8లక్షల పీపాల రష్యా చమురు దిగుమతి చేసుకోగా 2023-24లో ఇప్పటి వరకు 17.6లక్షలకు పెరిగింది. ఈ మేరకు ఒపెక్‌(చమురు ఎగుమతి దేశాలు) నుంచి దిగుమతులు తగ్గాయి. 2022 ఏప్రిల్‌-సెప్టెంబరు కాలానికి మన మొత్తం అవసరాల్లో 63 శాతం ఒపెక్‌ నుంచి దిగుమతి చేసుకోగా ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 40శాతానికి తగ్గింది. ఒపెక్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకొనే చమురుతో పోలిస్తే తక్కువ ధర, రూపాయల్లో చెల్లింపుల వెసులుబాటు వంటి సానుకూల కారణాలు ఉన్న కారణంగానే మనదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. మన రూపాయలతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు దొరకదు. అందుకోసం డాలర్లు ఖర్చు చేయాల్సిందే. వాటి బదులు యువాన్లలో చెల్లిస్తే మనకు పడే అదనపు భారం ఉండదు. మన వినియోగదారులకు మేలు కలుగుతున్నపుడు, ఖజానా మీద భారం పడనపుడు ఏ విదేశీ కరెన్సీలో చెల్లిస్తే ఏమిటి ? వివాదాలకు – వ్యాపారానికి సంబంధం లేదంటూ గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి చైనా నుంచి దిగుమతులు సజావుగానే మనం చేసుకుంటున్నాం.వాటి దగ్గర లేనిది యువాన్ల దగ్గర పట్టుదల అవసరమా ?అంతర్జాతీయ మార్కెట్లో యువాన్లను కొనుగోలు చేయటం అవమానంగా భావిస్తున్నామా ?

ప్రయివేటు సంస్థలు యువాన్లలో చెల్లింపులు జరపటంపై ఎలాంటి నిషేధం లేదని మన ప్రభుత్వం ప్రకటించింది. అయితే అలాంటి లావాదేవీలను ప్రోత్సహించటం గానీ, వీలు కల్పించటం గాని చేసేది లేదని కూడా పేర్కొన్నది. తాము డాలర్లను స్వీకరించేది లేదని, యువాన్లు లేదా రూబుళ్లను చమురు లావాదేవీల్లో అంగీకరిస్తామని రష్యా కంపెనీ గాజ్‌ ప్రోమ్‌ స్పష్టం చేసింది. ప్రపంచ లావాదేవీలు యువాన్లతో జరపాలన్న ప్రతిపాదనల పట్ల మనదేశం సంతోషంగా లేదని ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఏ కరెన్సీతో లావాదేవీలు జరపాలన్న అంశం తేలకపోవటంతో రష్యాకు సెప్టెంబరు నుంచి ఏడు టాంకర్ల చెల్లింపులు నిలిచిపోయాయి.ఇప్పటికే తన దగ్గర భారీ మొత్తంలో రూపాయి నిల్వలు ఉన్నందున చమురు చెల్లింపులకు గాను తనకు యువాన్లలో చెల్లించాల్సిందేనని రష్యా పట్టుబట్టింది. తాను చైనా దిగుమతుల మీద ఆధారపడి నందున యువాన్ల అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ప్రయివేటు చమురుశుద్ధి సంస్థలు కొంత మేరకు చెల్లింపులు జరిపాయి. యుఏఇ దిర్‌హామ్స్‌లో కూడా రష్యాకు చెల్లించాము. కొన్ని రష్యన్‌ కంపెనీలు దిరహామ్స్‌ను కూడా అంగీకరించటం లేదు. పీపా ముడి చమురును 60 డాలర్లకు మించి రష్యా దగ్గర కొనుగోలు చేస్తే అమెరికా ఆంక్షలను అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మారుస్తామని చెబుతున్న తరుణం, సరిహద్దు వివాదం కారణంగా చైనా కరెన్సీలో చెల్లింపులు చేసేందుకు మోడీ సర్కార్‌ ఇబ్బంది పడుతోంది.బ్రిక్స్‌ దేశాల కూటమిలో ఉమ్మడి కరెన్సీ ప్రతిపాదన రాగా మనదేశం మాత్రమే వ్యతిరేకించింది. ఒకవేళ అంగీకరిస్తే యువాను అవుతుందన్నభయం ఉందని వార్తలు. ప్రస్తుతం రూపాయి అంతర్జాతీయ లావాదేవీల్లో పూర్తిగా మారకం కావటం లేదు. అందువలన తన దగ్గర ఉన్న వందల కోట్ల రూపాయలను ఏం చేసుకోవాలని రష్యా అడుగుతోంది. ఇప్పటి వరకు స్థానిక కరెన్సీలో లావాదేవీలు జరిపిన కారణంగా రష్యాకు యువాన్లు వస్తున్నాయి. రష్యా రాయితీల వలన చైనా 10, భారత్‌ 7 బిలియన్ల డాలర్లను పొదుపు చేసుకున్నాయి.ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి, వాటికిి ప్రతికూలంగా నడిచే పరిస్థితి మనకు ఉందా అన్నది సమస్య.

అమెరికా డాలరు పెత్తనానికి రోజులు దగ్గర పడుతున్నాయా ? అనేక వైపుల నుంచి వస్తున్న వార్తలు ఏదో జరగబోతోందనే సూచిస్తున్నాయి. తన బిఆర్‌ఐ పధకం కింద గతంలో ఎక్కువగా డాలర్లు ఇచ్చిన చైనా ఇప్పుడు తన కరెన్సీ యువాన్‌ ఇవ్వటం ప్రారంభించింది. అక్టోబరు మూడవ వారంలో ఈ మేరకు అనేక ఒప్పందాలను కుదుర్చుకుంది. రాయిటర్స్‌ వార్తా సంస్థ కథనం ప్రకారం చైనా అభివృద్ధి బాంకు మలేషియా, ఈజిప్టు, పెరూ కేంద్ర బాంకులతో ఒప్పందాలు చేసుకుంది.చైనా ఎగుమతి-దిగుమతి బాంకు సౌదీ నేషనల్‌ బాంకుతో, బాంక్‌ ఆఫ్‌ చైనా ఈజిప్టుకు 47.9 కోట్ల డాలర్ల విలువగల యువాన్‌ పాండా బాండ్లను జారీ చేసింది. సిల్క్‌ రోడ్‌ నిధులకు గాను 80 బిలియన్ల యువాన్లను అదనంగా చైనా పక్కన పెట్టింది. అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్ల వాటా ఎంతో ఎక్కువగా ఉంది. ఆగస్టు నెలలో 83.95శాతంగా ఉన్నది సెప్టెంబరులో 84.15కు పెరిగింది. యూరో వాటా 6.43 నుంచి 5.43శాతానికి తగ్గగా చైనా యువాన్‌ లావాదేవీలు 4.82 నుంచి 5.8శాతానికి చేరి రెండవ స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో యూరో, జపాన్‌ ఎన్‌, సౌదీ రియాల్‌ ఉన్నాయి.యువాన్‌ వాటా తక్కువే అయినప్పటికీ క్రమంగా పెరుగుతోంది. ఇరవై భాగస్వామ్య దేశాలతో చైనా ఇప్పటి వరకు పదిహేడింటితో యువాన్‌ మార్పిడి ఒప్పందాలు కుదుర్చుకుంది. అర్జెంటీనాలో ఆరున్నర బిలియన్‌ డాలర్ల విలువగల యువాన్‌ మార్పిడి ఒప్పందం చేసుకుంది.అంతర్జాతీయ వాణిజ్యంలో 15శాతం వాటా ఉన్న చైనా కరెన్సీయే అంత తక్కువగా ఉన్నపుడు కేవలం 1.8శాతం వాణిజ్యం ఉన్న మనదేశ కరెన్సీ వాటా ఎంత ఉంటుందో చెప్పనవసరం లేదు.

బ్లాక్‌ మార్కెట్‌ కారణంగా కరెన్సీ మారకపు విలువలో సంభవిస్తున్న హెచ్చు తగ్గుల వలన తమ దేశానికి పదిబిలియన్‌ డాలర్ల మేర నష్టం జరుగుతున్నదని ఇరాక్‌ కేంద్ర బాంకు పెట్టుబడులు, స్వీకరణల డైరెక్టర్‌ జనరల్‌ మజెన్‌ అహమ్మద్‌ చెప్పాడు.డాలరు దిగుమతుల్లో సగం అక్రమంగా జరుగుతున్నవే అన్నాడు. 2023లో స్వీకరించిన డాలరు డిపాజిట్లను వచ్చే ఏడాది ఉపసంహరిస్తామని,2024 జనవరి ఒకటి తరువాత స్వీకరించబోమన్నాడు. ఆంక్షల కారణంగా గత రెండు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న ఇరాక్‌ బ్రిక్స్‌ కూటమిలో చేరాలని, డాలరుతో నిమిత్తం లేకుండా ఆర్ధిక వ్యవస్థ నిర్వహణ జరపాలని చూస్తున్నది.ఆహ్వానం వస్తే బ్రిక్స్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నామని ఇరాక్‌ ప్రధాని మహమ్మద్‌ షియా అల్‌ సుదానీ ప్రకటించాడు.తమ ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు అవసరమైన పెట్టుబడుల ఆకర్షణకు వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపడుతున్నట్లు, తద్వారా స్థానిక కరెన్సీకి ఆసరా దొరుకుతుందని మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం చెప్పాడు. బ్రిక్స్‌ దేశాల స్ఫూర్తితో తమ కరెన్సీ రింగెట్‌ను స్థిరపరిచేందుకు చూస్తామన్నాడు. ఇండోనేషియా, చైనా, థాయిలాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలలో రింగెట్‌ను వినియోగిస్తామన్నాడు. డాలరు మీద పూర్తిగా ఆధారపడటం కష్టమన్నాడు.డాలరు బదులు స్థానిక కరెన్సీ బ్రిక్స్‌ దేశాలు గనుక తమతో జరిపే లావాదేవీలలో ముఖ్యంగా ఇంథనానికి తమకు స్థానిక కరెన్సీలలోనే చెల్లింపులు జరపాలని అమెరికా, ఐరోపా దేశాలను డిమాండ్‌ చేస్తే పరిస్థితి ఏమిటి అన్నది ఒక చర్చ. తమకు డాలర్లలోనే చెల్లింపులు జరపాలనేదేమీ లేదని స్థానిక కరెన్సీలను కూడా అంగీకరిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి న్యూ డెవలప్‌మెంట్‌ బాంక్‌ (ఎన్‌డిబి) ఏర్పాటు చేసింది. రానున్న మూడు సంవత్సరాల్లో సభ్య దేశాలు డాలరు బదులు ఆయా దేశాల కరెన్సీలలో లావాదేవీలు జరుపుకోవాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఆయా దేశాల కరెన్సీలలో ఇతర దేశాలకు రుణాలు ఇవ్వాలని సూచించింది. 2026 నాటికి డాలర్‌ పెత్తనం తగ్గటం ప్రారంభమవుతుందని అంచనా.ప్రస్తుతం బ్రిక్స్‌ కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 30శాతం వాటా కలిగి ఉంది, దాన్ని మరింతగా విస్తరించాలనే యత్నాల్లో ఉన్నారు. ఈ కూటమిలో చేరాలని 40కి పైగా దేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. సెప్టెంబరులో జరిగిన కూటమి సమావేశంలో సౌదీ అరేబియా, ఇరాన్‌, ఈజిప్టు, ఇథియోపియా,అర్జెంటీనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను చేర్చుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది. వీటిలో అర్జెంటీనా మినహా ఐదు దేశాలూ చమురు ఎగుమతి దేశాలే అన్నది తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న పశ్చిమ దేశాల పెత్తనం క్రమంగా తూర్పు దేశాలకు వస్తుందని భావిస్తున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

బంగ్లాదేశ్‌ – పాలస్తీనా విముక్తి అంశంలో బిజెపి రెండు నాలుకల ధోరణి !

21 Saturday Oct 2023

Posted by raomk in BJP, Communalism, COUNTRIES, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, UK, USA, WAR

≈ Leave a comment

Tags

2023 Israel–Hamas war, HAMAS attacks 2003, Joe Biden, Narendra Modi Failures, Rishi Sunak


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన గూఢచారి సంస్థలలో ఒకటైన మొసాద్‌ తమ ప్రభుత్వానికి హమస్‌ దాడుల గురించి ఎందుకు ఉప్పందించలేకపోయిందన్న ప్రశ్నకు దాడి జరిగిన రెండు వారాలకు కూడా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఇప్పుడు మేం యుద్ధంలో ఉన్నాం వాటి గురించి దర్యాప్తు జరపటం లేదని అధికారులు సమాధానమిస్తున్నారు.స్వజనం, ఇతర దేశాల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తప్పుదారి పట్టించేందుకు అసలు హమస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశంపై అనేక కథలను ప్రచారం చేస్తున్నారు. హమస్‌ సంస్థ అధికారంలో ఉన్న గాజా ప్రాంత విస్తీర్ణం 360 చదరపు కిలోమీటర్లు, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియా ఎంతో తెలుసా ? 7,257చదరపు కిలోమీటర్లు. జన సాంద్రత 1,474. గాజా గడచిన పదిహేడు సంవత్సరాలుగా చుట్టూ ఆరుమీటర్ల ఎత్తున ఇనుపకంచెతో అనుమతి లేకుండా జనం బయటకు పోకుండా చేసిన ఒక బహిరంగ జైలు మాదిరి ఉంది. జనాభా ఇరవై మూడు లక్షలు.చదరపు కిలోమీటరుకు 6,507. అలాంటి జనసమ్మర్ధం ఉన్న ప్రాంతం మీద హమస్‌ తీవ్రవాదులను పట్టుకుంటామనే పేరుతో ఇజ్రాయెల్‌ విమానాలతో బాంబులు వేస్తోంది. సగం ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే వైపు వెళ్లమని జనాన్ని నెట్టేస్తోంది.తరువాత మరోసగాన్ని మరోవైపు పంపి నాశనం చేయాలన్నది దాని పథకం. ఇటు వంటి దుర్మార్గాన్ని గట్టిగా కొనసాగించమని అమెరికా అధిపతి జో బైడెన్‌, భారత అల్లుడు, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సలహా ఇచ్చి వెళ్లారు.మన ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వెళ్లలేదు తప్ప ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించటం బైడెన్‌, సునాక్‌ అడుగుల్లో అడుగు వేయటమే !


నిజమే హమస్‌కు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి.ఈ ప్రశ్నకు సమాధానం కోరుతున్న వారు 1947కు ముందు వివిధ దేశాల నుంచి బ్రిటీష్‌ ఆక్రమణలో ఉన్న పాలస్తీనా ప్రాంతంలోకి యూదులు ఎలా వచ్చారు, వారికి ఆయుధాలు ఎలా అందుబాటులోకి వచ్చాయి, మిలిటరీ శిక్షణ ఎవరు ఇచ్చారు అన్న వాస్తవాలు తెలుసుకుంటే పాలస్తీనాకు చెందిన హమస్‌కు అస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చిందీ తెలుసుకోవటం అంత కష్టం కాదు. పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న ముందస్తు పథకంతో ఉన్న బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాదులు ఎక్కడెక్కడి నుంచో యూదులను రప్పించి ఆయుధాలు, శిక్షణ ఇచ్చారు.ఐరాస తీర్మానం చేసిన నాటి నుంచి వారు పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకోవటం ప్రారంభించారు. మాతృభూమి రక్షణ కోసం పోరాడుతున్న వారికి నాటి నుంచి నేటి వరకు మద్దతు ఇస్తున్న ఇరుగుపొరుగు దేశాలు ఆయుధాలు అందిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన రహస్యం !


పాకిస్తాన్‌ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం బంగ్లాదేశ్‌ పౌరులు ఉద్యమించారు. ఆయుధాలు చేతబట్టి గెరిల్లా పోరు సాగించారు. వారికి ఆయుధాలు ఎవరు ఇచ్చారు ? తుపాకి పట్టిన ప్రతివారినీ ఉగ్రవాది అనలేం.బంగ్లా ముక్తివాహిని పేరుతో తిరుగుబాటు చేసిన వారికి మన దేశం మద్దతు ప్రకటించటమే కాదు, మన మిలిటరీని కూడా పంపి పాక్‌ సైన్యాన్ని అణచివేసింది. బంగ్లా విముక్తికి ఆయుధాలు పట్టిన వారిని నాడు జనసంఘం సమర్ధించింది. నేడు పాలస్తీనా వాసులు ఆయుధాలు పట్టినందుకు బిజెపి తప్పుపడుతోంది. నిజానికి బంగ్లా విభజనకు ఐరాస తీర్మానాలు లేవు. పాలస్తీనా ఏర్పాటుకు తీర్మానం ఉన్నప్పటికీ అడ్డుకుంటున్న ఇజ్రాయెల్‌కు నరేంద్రమోడీ, బిజెపి మద్దతు ప్రకటించటం రెండు నాలుకల వైఖరికి నిదర్శనం. బంగ్లా విముక్తికి చర్యలు తీసుకున్నందుకు అభినందిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత గురూజీగా పిలుచుకున్న గోల్వాల్కర్‌ కూడా ఇందిరా గాంధీకి లేఖ రాశారు. మద్దతు పలికినందుకు గాను అతల్‌బిహారీ వాజ్‌పాయికి 2015లో బంగ్లాదేశ్‌ అత్యున్నత ” విముక్తి యుద్ధ గౌరవ ” అవార్డును బంగ్లాదేశ్‌ ప్రకటించింది.తమ దేశ ఏర్పాటుకు అడ్డుపడుతున్న ఇజ్రాయెల్‌ మీద పాలస్తీనియన్లు అనేక రకాలుగా పోరాడుతున్నారు. ఆయుధాలు పట్టిన వారిని ఉగ్రవాదులుగా చిత్రిస్తే నరేంద్రమోడీ దానికి తాన తందాన తాన అంటున్నారు. ఇజ్రాయెల్‌ దుర్మార్గాలను గుర్తించేందుకు నిరాకరించటం తప్ప మరొకటి కాదు. ఉక్రెయిన్‌ అంశంలో తటస్థవైఖరి తీసుకున్న మోడీ ఇప్పుడు ఒక పక్షం వహించటం అంటే అమెరికా కూటమి మెప్పు పొందేందుకు తహతహలాడటమే. రష్యా నుంచి ఆయుధాల అవసరం ఉంది, చౌకగా చమురు దొరుకుతుంది గనుక తటస్థం అన్నారు. పాలస్తీనా నుంచి అలాంటివేమీ ఉండవు గనుక ఒక పక్షానికి మద్దతు పలుకుతున్నారు.


హమస్‌ సాయుధులు ఆయుధాలను ఇరాన్‌ నుంచి తెచ్చుకుంటున్నారని, గాజాలోనే తయారు చేస్తున్నారంటూ సిఐఏ చెప్పిందని మీడియాలో వార్తలు వచ్చాయి. హమస్‌ కోసం ఇరాన్‌ ఆయుధాలను అక్రమంగా సేకరిస్తున్నదని, దానితో పాటు స్వంతంగా తయారు చేసుకోవటం గురించి శిక్షణ ఇస్తున్నట్లు సిఐఏ ఆరోపించింది. వాషింగ్టన్‌ ఇనిస్టిట్యూట్‌ అనే అమెరికా అనుకూల సంస్థ నిపుణుడు మైకేల్‌ నైట్స్‌ తమ దేశం ఇజ్రాయెల్‌కు పంపిన ఆయుధాలను పట్టుకొని లేదా బ్లాక్‌మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నదని చెప్పాడు. స్మగ్లింగ్‌ జరిగే మార్గాలను ఈజిప్టు కట్టుదిట్టం చేసిన తరువాత గాజాలోనే తయారు చేసుకుంటున్నారని అన్నాడు. తప్పేముంది. ఇజ్రాయెల్‌ వైపు నుంచి మిలిటరీ, సాయుధ యూదులు బాంబులు వేస్తుంటే పాలస్తీనియన్లు రసగుల్లాలు విసురుతారా ? ఇదే సంస్థ 2021లో విడుదల చేసిన ఒక నివేదికలో ఇజ్రాయెల్‌ ప్రయోగించిన వాటిలో కొన్ని పేలలేదని, పేలిన వాటి విడిభాగాలను రీసైకిలింగ్‌ చేసి హమస్‌ నిపుణులు స్వంతంగా ఆయుధాలను రూపొందిస్తున్నారని పేర్కొన్నది. హమస్‌ సాయుధుల దాడుల చిత్రాలను చూసిన అమెరికా పార్లమెంటు సభ్యులు కొందరు మాట్లాడుతూ ఉక్రెయిన్‌కు పంపినవి లేదా ఆఫ్ఘనిస్తాన్‌లో వదలి వచ్చినవి గానీ వారి చేతుల్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు పంపిన ఆయుధాలను అది బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకుంటున్నదని కూడా చెబుతున్నారని అందువలన ఉక్రెయిన్‌కు సాయం అందించకూడదని కూడా మైకేల్‌ నైట్స్‌ చెప్పాడు. కాదు కాదు ఇలాంటి వార్తలన్నింటినీ రష్యా పుట్టిస్తున్నది కనుక నమ్మవద్దని మరికొందరు తమ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారు. వియత్నాం నుంచి పారిపోతూ అమెరికన్లు వదలివేసిన ఆయుధాలు తరువాత ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించాయని కొందరు గుర్తు చేశారు. ఉక్రెయిన్‌కు పంపుతున్న ఆయుధాలు ఇతరుల చేతుల్లో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి 2022 అక్టోబరులో అమెరికా విదేశాంగశాఖ ఒక పత్రంలో పేర్కొన్నది. ఉక్రేనియన్లను పట్టుకున్నపుడు వారి వద్ద దొరికిన అమెరికా ఆయుధాలను రష్యా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తుందని కూడా హెచ్చరించింది.


అక్టోబరు ఏడవ తేదీ దాడి తరువాత ఇజ్రాయెల్‌ సేకరించిన నమూనాలను బట్టి హమస్‌ పూర్వపు సోవియట్‌ కాలం నాటి క్షిపణులతో దాడి చేసిందని ఒక కథనం. కాదు స్వంతంగా తయారు చేసిన వాటితోనే జరిపిందని ఇజ్రాయెల్‌ సైనికుడు చెప్పిన వీడియో కూడా బయటకు వచ్చింది. వారు వాడిన ఆయుధాలు చాలా చిన్నవని అమెరికా అందచేసే వాటిని గాజాలోకి చేర్చటం చాలా కష్టమని కొందరు చెప్పారు. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా తెచ్చారు అన్నది కాదు బుల్లెట్‌ దిగిందా లేదా అన్నదే గీటురాయి ! భుజాల మీద మోస్తూ ప్రయోగించే ఉత్తర కొరియా ఆయుధాలను హమస్‌ వినియోగించిందన్నది మరొక కథ ! దానికి రుజువు ఏమిటట, వాటికి ఎర్ర రిబ్బన్లు కట్టి ఉన్నాయట. ఎవడైనా వాటి గుర్తింపు తెలియకుండా ఎర్ర రిబ్బన్లు తీసివేస్తాడు తప్ప అలంకరించి మరీ వాడతారా ? అసలు ఉత్తర కొరియా ఆయుధాలను సరఫరా చేసిందా లేదా అని కొందరు అడగవచ్చు. ఇజ్రాయెల్‌కు బ్రిటన్‌తో సహా పశ్చిమ దేశాలన్నీ అన్ని రకాల ఆయుధాలను, వందల కోట్ల డాలర్లు అందిస్తున్నాయి. అమెరికా వారు ఎఫ్‌ 16 యుద్ధ విమానాలను అందించవచ్చు, మధ్య ధరా సముద్రానికి తన విమానవాహక యుద్ధ నౌకలను పంపించి ఆ ప్రాంతదేశాల మీద దాడులు చేస్తామని బెదిరించవచ్చు.ప్రపంచానికంతటికీ ఆయుధాలను ఆమ్మవచ్చు. ఉత్తర కొరియా హమస్‌కు ఆయుధాలు నిజంగా అందించిందో లేదో తెలియదు, ఒకవేళ ఇజ్రాయెల్‌ నుంచి ఆత్మరక్షణకు అందిస్తే తప్పే ముంది ? పాలస్తీనియన్లను వారి ఖర్మకు వారిని వదలివేయాలా ? గతంలో ఉత్తర కొరియా మీద అమెరికా దాడి చేసింది, ఇంకా దాడి చేసేందుకు దక్షిణ కొరియాలో వేలాది మంది మిలిటరీతో తిష్టవేసింది. మరోసారి ఉత్తర కొరియా మీద కూడా దాడులకు దిగవచ్చు. అప్పుడు దానికి దిక్కెవరు ? ఇంతకీ ఉత్తర కొరియా ఆయుధాలను హమస్‌ వాడిందా లేదా అని ఏపి వార్తా సంస్థ అడిగితే సమాధానం చెప్పేందుకు ఇజ్రాయెల్‌ మిలిటరీ తిరస్కరించింది. ఇవన్నీ అమెరికా వ్యాపింపచేసే కట్టుకథలని ఉత్తర కొరియా పేర్కొన్నది. వెయ్యి కంటెయినర్లలో రష్యాకు ఆయుధాలు, మందుగుండు ఉత్తర కొరియా నుంచి వెళ్లినట్లు అమెరికా ఆరోపించింది. నిరంతరం ఇతర దేశాల మీద అలాంటి నిందలను ప్రచారం చేస్తూనే ఉంది.హమస్‌ గురించి మనదేశంలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అందువలన వాటిని గుడ్డిగా నమ్మాల్సినపని లేదు.


హమస్‌కు ఆయుధాల సరఫరా గురించి చీకట్లో బాణం వేసినట్లుగా ఇతర దేశాల మీద ఆరోపణలు చేయటం తప్ప ఎవరిదగ్గరా నిర్దిష్ట సమాచారం లేదు.ఇక హమస్‌ ఆయుధ తయారీ గురించి కొన్ని వీడియోలు ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ నిజమని నమ్మటానికి లేదు. ఇజ్రాయెల్‌ను తప్పుదారి పట్టించేందుకు లేదా తమపై దాడులు చేస్తూ తమ ప్రాంతాలను ఆక్రమిస్తున్న తమ పాలకులు మీద ఇజ్రాయెలీ పౌరులు వత్తిడి తెచ్చేందుకు కొన్ని వీడియోలను రూపొందించి ప్రచారదాడి చేస్తున్నట్లు కూడా కొందరు చెబుతారు. అలాంటి వాటిలో ఒకదానిలో తాము గాజాలో పది నుంచి 250కిలో మీటర్ల వరకు ప్రయోగించే మోర్టార్లు, వాటికి అవసరమైన షెల్స్‌ తయారు చేసేందుకు ఫ్యాక్టరీలు ఉన్నట్లు, రష్యా అనుమతితో ఎకె రకం తుపాకులు, తూటాలు కూడా తయారు చేస్తున్నట్లు హమస్‌ ప్రతినిధి చెప్పినట్లుగా ఉంది. మరోవైపు ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీలు గాజాలో లేవని, దుస్తులు, ఫర్నీచర్‌, ఆహార పదార్ధాలు తయారు చేసే పరిశ్రమలే ఉన్నట్లు సిఐఏ వెలువరించే ఫ్యాక్ట్‌ బుక్‌లో ఉంది. ఇతర దేశాలు తయారు చేసిన ఆయుధాలు హమస్‌ దగ్గర దొరికినంత మాత్రాన ఆయా దేశాలు దానికి సరఫరా చేసినట్లు కాదు. కాశ్మీరులో లష్కరే తోయబా, జైషే మహమ్మద్‌ తదితర ఉగ్రవాదుల దగ్గర అమెరికా తయారీ ఆయుధాలు దొరికాయి. మనకు మిత్ర దేశం అని చెబుతున్న అమెరికా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సిరియా వంటి చోట్ల అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక ఉగ్రవాద, కిరాయి మూకలకు అమెరికా స్వయంగా ఆయుధాలు అందచేయటం బహిరంగ రహస్యం. అమెరికాకు ఆయుధాల తయారీ, విక్రయం పెద్ద లాభసాటి వ్యాపారం. డాలర్లు చెల్లిస్తే చాలు ఎవరికైనా అమ్ముతుంది.2018-22 కాలంలో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా 40శాతంగా ఉందని స్టాక్‌హౌం ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(సిప్రి) 2023 మార్చి నెలలో ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోతూ అమెరికన్లు 712 కోట్ల డాలర్ల విలువగల ఆయుధాలు, రక్షణ సామగ్రి వదలి వెళితే అవన్నీ తాలిబాన్ల వశమయ్యాయి.వాటిలో కొన్ని కాశ్మీరులో దొరికాయి. అవి తాలిబాన్ల నుంచి లేదా పాకిస్తాన్‌ నుంచి కూడా సరఫరా చేసి ఉండవచ్చు. ఇతర దేశాల నుంచి సేకరించిన అమెరికా ఆయుధాలనే హమస్‌ ఇటీవల ఇజ్రాయెల్‌ మీద ప్రయోగించినట్లు అమెరికన్‌ పార్లమెంటు సభ్యులు ప్రకటించారు.


ఇతర దేశాల్లో గూఢచర్యం కోసం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం మొసాద్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. మన దేశంలో ” రా ” అమెరికా సిఐఏ వంటిది. దేశీయంగా షిన్‌ బెట్‌ అనే గూఢచార సంస్థ ఉంది. ఇవి రెండూ కూడా హమస్‌ దాడిని పసిగట్టలేకపోయాయి.తాము విఫలం చెందినట్లు షిన్‌ బెట్‌ అధిపతి రొనెన్‌ బార్‌ అంగీకరించాడు. హమస్‌ దగ్గర ఇజ్రాయెల్‌ మిలిటరీ రహస్యాలు, వాటి మాప్‌లు ఉన్నట్లు, పది మంది గాజా సాయుధులకు కచ్చితమైన సమాచారం ఉండబట్టే వారు లోపలికి చొరబడినట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక రాసింది. డ్రోన్లతో నిఘా, సమాచార టవర్లను కూల్చివేశారని, బుల్డోజర్లు, ట్రాక్టర్లతో సరిహద్దులో ఉన్న పెద్ద కంచెను కూల్చివేసి ముందు రోజు రెండువందల మంది మరుసటి రోజు 1,800 మంది హమస్‌ సాయుధులు ఇజ్రాయెల్‌లో ప్రవేశించినట్లు అధికారులను ఉటంకిస్తూ పేర్కొన్నది.ఇంత జరుగుతున్నా ఎందుకు పసిగట్టలేకపోయారన్నదే ప్రశ్న. గాజా ప్రాంతలోని హమస్‌ను బాగా బలహీన పరిచినందున అక్కడి నుంచి దాడి జరిగే అవకాశం లేదని, లెబనాన్‌లోని హిజబుల్లా నుంచే ముప్పు ఉందనే అంచనాకు ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థలు భావించిన కారణంగా అవి దృష్టి పెట్టలేదని, హమస్‌ శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేసిందని కొందరి విశ్లేషణ. ఇజ్రాయెల్‌లో ఉన్న అంతర్గత కుమ్ములాటల కారణంగా తెలిసి కూడా మౌనంగా ఉన్నారన్నది మరొక కథనం.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇజ్రాయెల్‌పై హమస్‌ దాడులకు కారణం ఏమిటి ! ఆజ్యం పోస్తున్న అమెరికా కూటమి !!

11 Wednesday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Europe, Germany, History, imperialism, International, NATIONAL NEWS, Opinion, UK, USA, WAR

≈ 1 Comment

Tags

BJP, China, Gaza, Hamas, Israel, Joe Biden, Narendra Modi Failures, Palestinian People, RSS, USS Gerald R Ford


ఎం కోటేశ్వరరావు


పాలస్తీనా సమరయోధుల సంస్థ హమస్‌- ఇజ్రాయెల్‌ మధ్య మరోసారి చెలరేగిన పోరు ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందా అని ఒకవైపు ప్రపంచం ఆందోళన చెందుతుంటే మరోవైపు అమెరికా స్టాక్‌మార్కెట్‌లో ఆయుధ ఉత్పత్తి కంపెనీల వాటాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇల్లుకాలుతుంటే బొగ్గులేరుకొనేందుకు చూడటం అంటే ఇదే. గత మూడు సంవత్సరాల్లో ఎంతగా లేనంతగా సోమవారం ఒక్కరోజే ఎనిమిది శాతం ఎగువకు దూసుకుపోయాయంటే తమకు లాభాల పంట పండుతుందని మదుపుదార్లు వాటాల కొనుగోలు ఎగబడిన ఫలితమే అది. ఇజ్రాయెల్‌కు మరింతగా సాయం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించటంతో ఆయుధ కంపెనీలకు చేతినిండా పని అన్నది తెలిసిందే. తాజా పరిణామాల్లో అటూ ఇటూ పెద్ద ఎత్తున జననష్టం, ఆస్థి విధ్వంసం గురించి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. తక్షణమే దాడులు నిలిపివేయాలన్న అభిప్రాయం వెల్లడి అవుతోంది. ఎవరు ముందు ప్రారంభించారు, ఎవరు ప్రతిఘటిస్తున్నారు అన్న విచక్షణలోకి పోతే పైకి హమస్‌ దాడులు కనిపించవచ్చుగానీ అంతకు ముందు ఇజ్రాయెల్‌ చేసిన దారుణాలు తక్కువేమీ కాదు.ఇది ప్రారంభం కాదు, అంతమూ కాదు. ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామాలకు కారణాలు ఏమిటన్నది చూద్దాం. ఒకటి పాలస్తీనా ఏర్పాటును అడ్డుకోవటమే కాదు, ఐరాస దానికి కేటాయించిన ప్రాంతాలను క్రమంగా ఆక్రమించుకుంటున్న ఇజ్రాయెల్‌, దానికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాల వైఖరి ఒకటైతే, తక్షణ కారణాలేమిటన్నది మరొక అంశం. తాజాగా తలెత్తిన వివాదానికి అమెరికా మరింతగా ఆజ్యం పోస్తున్నది, ఇజ్రాయెల్‌కు మద్దతుగా మధ్యధరా సముద్రానికి తన సప్తమ నౌకా దళం, జెట్‌ యుద్ధ విమానాలను పంపుతున్నది. మధ్యవర్తిగా ఉన్న ఒక దేశం ఇలా ఒకపక్ష కొమ్ముకాయటం దుర్మార్గం.


పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదంలో జరూసలెం పట్టణం ఎవరికి చెందాలన్నది ఒక అంశం. ఇటీవలి వరకు టెల్‌ అవీవ్‌లో ఉన్న తన ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించాలని అమెరికా నిర్ణయించటం ఏకపక్షం, పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమిస్తున్న ఇజ్రాయెల్‌ దుర్మార్గానికి మద్దతు ఇవ్వటమే. ఇంకా అమెరికా కనుసన్నలలో నడిచే అనేక దేశాలు అదే మాదిరి తమ కార్యాలయాలను కూడా జెరూసలెంకు తరలించాలని చూడటం యూదుల ఆక్రమణలను శాశ్వతం చేసే కుట్రలో భాగమే. జెరూసలెంలోని చారిత్రాత్మక అల్‌ అక్సా మసీదును ఆక్రమించుకొనేందుకు ఇజ్రాయెల్‌ పూనుకోవటమే తాజాగా హమస్‌ను దాడులకు పురికొల్పిందని చెప్పవచ్చు. 2021 ఏప్రిల్‌లో రంజాన్‌, యూదుల పండుగ పాసోవర్‌ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ముస్లిమేతరులు ఆ మసీదు ప్రాంగణాన్ని సందర్శించాలంటే అనుమతి తీసుకోవాలి. ఇజ్రాయెల్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో మసీదు పరిసరాలను ఆక్రమించిన యూదులు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాసోవర్‌ పండగ సందర్భంగా ప్రాంగణాన్ని దురాక్రమించి ప్రార్ధనలు జరిపారు. ఏప్రిల్‌ 14వ తేదీన ఇజ్రాయెల్‌ పోలీసులు బలవంతంగా ప్రవేశించి మసీదులో ఉన్న మైకుల వైర్లను తెంచివేశారు.ఎందుకు అంటే మసీదు పక్కనే జరుగుతున్న ఇజ్రాయెలీ అధ్యక్షుడి కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని సాకు చెప్పారు. తరువాత రెండు రోజులకు పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ పోలీసుల ఆంక్షలను తోసిపుచ్చి వేలాది మంది చేరి ప్రార్ధన చేశారు. మరుసటి నెలలో యూదు దురాక్రమణదార్లు పాలస్తీనియన్ల మీద జరిపిన దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. అదే ఏడాది ఇజ్రాయెల్‌ – హమస్‌ మధ్య పదకొండురోజుల పాటు దాడులు ప్రతిదాడులు జరిగాయి. గతేడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెలీ దళాలు ప్రవేశించి పాలస్తీనియన్ల మీద దాడులు చేశాయి. మసీదులో తిష్టవేసిన వారు తమ మీద రాళ్లు వేసినట్లు సాకు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఐదున కూడా ఇజ్రాయెల్‌ దళాలు మసీదు మీద దాడి జరిపాయి. మసీదులో ఉన్నవారు రాళ్లు విసిరినట్లు పాత కథనే తిరిగి వల్లించారు. అప్పటి నుంచి ఏదో ఒక సాకుతో అల్‌ అక్సా మసీదు, పరిసరాల్లో ఉన్న పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకొనేందుకు ఇజ్రాయలీలు రెచ్చగొడుతుండటమే ఈనెల ఆరున హమస్‌ దాడులకు కారణంగా చెబుతున్నారు. యాభై సంవత్సరాల క్రితం 1973 అక్టోబరు ఆరున ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలపై అరబ్బులు ఆకస్మికంగా దాడులు జరిపారు. నాటి ఉదంతాల గురించి ఇజ్రాయెలీ మీడియాలో గత కొద్ది రోజులుగా పాలస్తీనియన్లను రెచ్చగొడుతూ వార్తలు, విశ్లేషణలు వెలువడుతున్నాయి.దాన్లో భాగంగానే సిమ్‌చాట్‌ తోరా పేరుతో యూదులు పండుగ చేసుకుంటున్న పూర్వరంగంలో దాడులకు ఆక్టోబరు ఆరవ తేదీనే హమస్‌ కూడా ఎంచుకున్నదని, ” ఆపరేషన్‌ అల్‌ అక్సా ఫ్లడ్‌ ” పేరు పెట్టినట్లు చెబుతున్నారు. దీని గురించి ఇజ్రాయెలీ గూఢచారులు ఏ మాత్రం పసిగట్టలేకపోయారు. తాడిని ఎక్కేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడు.


ఆయుధాలతో అరబ్బులను బెదిరించి వారి ప్రాంతాలను ఆక్రమించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న బ్రిటీష్‌ పాలకుల చర్యలను 1938లోనే గాంధీ మహత్ముడు హరిజన్‌ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో వ్యతిరేకించారు.యూదులు ఏదేశంలో ఉంటే అదే వారి మాతృదేశం అవుతుందని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదుల కుట్రలో భాగంగా 1948లో పాలస్తీనాలో కొన్ని ప్రాంతాలను గుర్తించి ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేశారు. తరువాతే అసలు కుట్ర బయటపడింది. పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించి తన రక్షణకు అవి అవసరమంటూ నాటి నుంచి నేటి వరకు అసలు పాలస్తీనా ఉనికినే లేకుండా చేసింది ఇజ్రాయెల్‌. అంతకు ముందు ఎక్కడెక్కడో ఉన్న యూదులందరినీ సమీకరించి బ్రిటీష్‌ పాలకులు అక్రమంగా పాలస్తీనాలో ప్రవేశపెట్టారు. వారికి ఆయుధాలతో శిక్షణ, నిధులు అందచేశారు.ఐరాస చేసిన విభజన తీర్మానాన్ని పాలస్తీనా అంగీకరించలేదు. ఇతర దేశాల్లోని యూదులను చేర్చటంతో అప్పటి వరకు పాలస్తీనాలో 90శాతంగా ఉన్న అరబ్బులు 67శాతానికి తగ్గారు. సారవంతమైన ప్రాంతాలతో సహా పాలస్తీనాలో 55శాతాన్ని యూదులకు కేటాయిస్తూ విభజన పధకంలో చేర్చారు. అరబ్బులకు 42శాతం, మూడుశాతం విస్తీర్ణంలో ఉన్న జెరూసలేం ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యవేక్షణలో ఉంచేందుకు నిర్ణయించారు.ప్రస్తుతం పశ్చిమ గట్టు, గాజా పాలస్తీనా పాలిత ప్రాంతాలుగా పేరుకు 23శాతం విస్తీర్ణంలో ఉన్నప్పటికీ వాటిలో కూడా ఇజ్రాయెల్‌ ఆక్రమణలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పాలస్తీనాను విభజించినపుడు ఏడున్నరలక్షల మంది అరబ్బులు నిర్వాసితులై విదేశాలకు శరణార్ధులుగా వెళ్లారు. గడచిన 75 సంవత్సరాల్లో వారి వారసుల సంఖ్య అరవైలక్షలకు పెరిగింది. వారంతా పాలస్తీనాలోని కొన్ని శిబిరాలు, ఈజిప్టు, లెబనాన్‌, జోర్డాన్‌, సిరియాల్లో తలదాచుకుంటున్నారు.
తాజాగా హమస్‌ దాడుల గురించి పశ్చిమ దేశాల వార్తా సంస్థలు ఇచ్చిన వార్తల్లో వారి ఆధీనంలో ఉన్న గాజా ప్రాంతంలో వంద మంది ఐరోపావాసులు బందీలుగా ఉన్నట్లు పెద్ద ఎత్తున కథనాలు ఇచ్చాయి. ఇజ్రాయెల్‌ జైళ్లలో ఉన్న వేలాది మంది తమవారిని విడిచిపెడితే వారిని తాము కూడా స్వదేశాలకు పంపుతామని హమస్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.పశ్చిమ దేశాలు, అక్కడి మీడియాను అనుసరించే మన దేశంలోని కొందరు హమస్‌ను ఉగ్రవాదులుగానూ, ఇజ్రాయెల్‌ను ప్రజాస్వామిక శక్తిగా చిత్రిస్తున్నారు. ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న తమ దేశాన్ని విముక్తి కావించేందుకు అనేక శక్తులు అనేక పద్దతుల్లో పోరాడుతున్నాయి. పాలస్తీనా విమోచనా సంస్థ యాసర్‌ అరాఫత్‌నే ఉగ్రవాదిగా చిత్రించిన వారు హమస్‌ను మరొక విధంగా పేర్కొంటారని అనుకోలేము.హమస్‌ గాజా ప్రాంతంలో అధికారంలో ఉంది.అది సాయుధపోరాటాన్ని ఒక మార్గంగా ఎంచుకుంది. పశ్చిమ దేశాల మద్దతు, బలమైన మిలిటరీ ఉన్న ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనేందుకు కొన్ని సందర్భాల్లో గెరిల్లా పద్దతిలో దాడులు జరుపుతుంది. మన దేశ చరిత్రలో శివాజీ కూడా ఔరంగజేబు సేనల మీద, అల్లూరి సీతారామ రాజు బ్రిటీష్‌ వారి పాలకుల మీద గెరిల్లా పద్దతిలో దాడులు జరిపిన సంగతి తెలిసిందే. వారిని ఉగ్రవాదులందామా ? బ్రిటీష్‌ వారు భగత్‌ సింగ్‌నే ఉగ్రవాది అని నిందించిన సంగతి తెలిసిందే.


చరిత్రలో హిట్లర్‌ మూకలు యూదులను నిర్బంధ శిబిరాల్లో చిత్రహింసలు పెట్టి చంపిన దారుణ మారణకాండను ప్రపంచం చూసింది. గాజా ప్రాంతంలో ఇరవైలక్షల మందికి పైగా అరబ్బులు నివశిస్తున్నారు. ప్రపంచంలో అదొక పెద్ద జైలు అంటే అతిశయోక్తి కాదు. అక్కడి జనం బయటకు రావాలన్నా, పరిసరాల్లో పనిపాటలు చేసుకోవాలన్నా ఇజ్రాయెల్‌ మిలిటరీ అనుమతి తీసుకోవాల్సిందే. తనిఖీ లేందే జనాలను కదలనివ్వరు.హమస్‌ దాడులకు ముందే ఇజ్రాయెల్‌ పోలీసులు 5,250 మంది పాలస్తీనియన్లను బందీలుగా ఉంచుకున్నారు, వారిలో 170 మంది పిల్లలు కూడా ఉన్నారు. వీరి గురించి మీడియా, పశ్చిమ దేశాల మానవతావాదులు పట్టించుకోరు. ఉగ్రవాదం మీద దాడులు చేయండి తప్ప పాలస్తీనియన్ల మీద కాదంటూ కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏడున్నర దశాబ్దాలుగా దాడులు చేస్తున్నది సామాన్యజనం మీదనే అన్న వాస్తవాన్ని దాచేందుకే ఈ పదజాలం.పాలస్తీనా వాసులు పోరులోనే పుట్టి ,పోరులోనే పెరిగి ,పోరులోనే మరణిస్తున్నారు. అంతకంటే వారికి పోయేదేమీ లేదు. వారి మాతృదేశ కాంక్ష మరింతగా పెరుగుతుందే తప్ప నిర్భంధంతో అణిగేది కాదు. జెరూసలెంతో సహా అరబ్బులకు నిర్దేశించిన ప్రాంతాలను పూర్తిగా తిరిగి వారికి అప్పగించకుండా, వారి ప్రాంతాలలో యూదుల నివాసాలను ఖాళీ చేయించకుండా సమస్య పరిష్కారం కాదు. పాలస్తీనియన్ల మాతృదేశ కాంక్ష తీరదు.


ఇప్పటికే మాతృగడ్డమీద దశబ్దాల తరబడి బందీలుగా మారిన పాలస్తీయన్ల భవితవ్యం గురించి ఒకవైపు ప్రపంచం ఆలోచిస్తుంటే మరోవైపు వారిని మరింతగా అణచివేసేందుకు అవసరమైన ఆయుధాలను అమ్ముకొనేందుకు అమెరికా పూనుకుంది. ఇజ్రాయెల్‌ మీద దాడి చేసినందుకు ప్రతీకారంగా పాలస్తీనాకు అందచేస్తున్న సాయాన్ని సమీక్షించే నెపంతో ఐరోపా నిలిపివేసింది. అదే పాలస్తీనా మీద యుద్ద విమానాలతో దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా సాయాన్ని పెంచాలని నిర్ణయించింది. యూదుల అణచివేతను ఆయుధంగా చేసుకొని హిట్లర్‌ మారణకాండకు పాల్పడ్డాడు. అదే యూదులకు మాతృదేశాన్ని ఏర్పాటు చేయాలనే సాకుతో పశ్చిమాసియాలో ఉన్న చమురు, ఇతర సహజ సంపదలను ఆక్రమించాలని చూసిన బ్రిటన్‌, అమెరికా తదితర పశ్చిమ దేశాలు అందుకోసం తమ తొత్తుగా పనిచేసే ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేయాలన్న ఎత్తుగడలను ప్రపంచం చూసింది.ఉక్రెయిన్‌ వివాదంలో తటస్థవిధానాన్ని అనుసరించిన మనదేశం పశ్చిమాసియాలోనే కాదు, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ఇజ్రాయెల్‌ దుశ్చర్యలను ఖండించాల్సిందిపోయి ఇప్పుడు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించింది. ఇది గడచిన ఏడుదశాబ్దాలుగా అనుసరిస్తున్న మన విదేశాంగ విధానానికే విరుద్దం. నరేంద్రమోడీ సర్కార్‌ వైఖరి బిజెపితో సహా సంఘపరివార్‌ సంస్థల ముస్లిం వ్యతిరేకతకు ప్రతిబింబం తప్ప మరొకటి కాదు. ఇలాంటి వైఖరితో తలెత్తే పర్యవసానాల గురించి ఎవరెన్ని హెచ్చరికలు చేసినా, సుద్దులు చెప్పినా పట్టించుకోకపోవటం విచారకరమే కాదు గర్హనీయం.స్వాతంత్య్రపోరాటంలో భాగస్వామ్యం లేకపోవటమే కాదు దానికి వ్యతిరేకంగా పని చేసిన శక్తుల వారసులు పాలస్తీనియన్ల మాతృదేశ విముక్తి వాంఛ, దురాక్రమణ వ్యతిరేక పోరాటాన్ని అర్ధం చేసుకొంటారని భావించటం అత్యాశే అవుతుంది. ఇజ్రాయెల్‌ను సమర్ధిస్తున్న అమెరికా తదితర దేశాల వైఖరిని యావత్‌ శాంతి శక్తులు ఎలుగెత్తి ఖండించాలి, పాలస్తీనా విముక్తికి పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిన్న దేశం మాల్దీవుల ఎన్నికలు – చైనాకు అనుకూలమా ? భారత్‌ ఎదురు దెబ్బా !

04 Wednesday Oct 2023

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

China, Maldives election 2023, Maldives presidency, Mohamed Muizzu, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మాల్దీవులు,ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటి. ఆసియాలో రెండవది. కేవలం ఐదు లక్షల 21వేల జనాభా మాత్రమే కలిగిన ఈ దేశం ఇప్పుడు ప్రపంచ మీడియాలో పెద్ద స్థానాన్ని ఆక్రమించింది.కారణం గతనెల 30న అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. వాటి మీద ప్రపంచ మీడియాలో వచ్చిన కొన్ని శీర్షికలు ఇలా ఉన్నాయి.” మాల్దీవుల ఎన్నికల్లో మహమ్మద్‌ ముయిజ్జు గెలుపు చైనా అనుకూల శిబిరానికి విజయం ” భారత్‌కు మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఒక దౌత్యసవాలుకు ప్రతినిధి ” ” చైనా చెవులకు సంగీత విందు ” ” భారత్‌ వెళ్లిపోవాలంటున్న మాల్దీవుల చైనా అనుకూల నూతన అధ్యక్షుడు ” ఇలా పదజాలాల్లో మార్పు ఉన్నప్పటికీ స్పందన స్వభావమిది.హిందూ మహా సముద్రంలో మనదేశం, శ్రీలంకకు 750 కిలోమీటర్ల దూరంలో ఈ దేశం ఉంది. నామమాత్రంగా క్రైస్తవులు తప్పు నూటికి నూరుశాతం ముస్లింలు ఉన్న 1,200 చిన్నా పెద్ద దీవుల దేశానికి ఎవరితోనూ సరిహద్దు తగాదాలు లేవు. దేశ రాజధాని మాలె దీవిలో దేశంలోని సగం జనాభా ఉంది. చైనా నుంచి విమాన మార్గం 4,900 కిలోమీటర్ల దూరం ఉంది. సముద్ర మార్గంలో 4,682 నాటికల్‌ మైళ్లు లేదా 8,670 కిలోమీటర్ల దూరంలో ఉంది.ప్రపంచంలో ఏ దేశమూ మరొక దేశాన్ని విశ్వసించక పరస్పరం అనుమానంతో చూస్తున్న అంశం తెలిసిందే. ప్రాంతీయ, ప్రపంచ యుద్దాలు తలెత్తితే సముద్రాల్లోని ఒక చిన్న దీవి, దాని మీద పెత్తనం లేదా ఎవరి ప్రభావంలో ఉంది అన్న అంశం కూడా ఎంతో కీలకమైనదే. అందువల్లనే ఆయా దేశాల మిలిటరీ వ్యూహకర్తలు రూపొందించిన ప్రణాళికలు, ఎత్తుగడల ప్రకారం ఇరుగు పొరుగు, దూరంగా ఉన్న దేశాలు కూడా సంబంధాలను నిర్వహిస్తుంటాయి. అలాంటి కీలక ప్రాంతాలలో ఒకటిగా మాల్దీవులు ఉన్న కారణంగానే అక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ప్రపంచం జాగ్రత్తగా గమనిస్తుంది.


ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇబ్రహీం మహమ్మద్‌ సాలి 2018లో అధికారానికి వచ్చాడు. అంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యామీన్‌ మీద అవినీతి ఆరోపణల కేసులు పెట్టి పదకొండు సంవత్సరాల పాటు జైలు శిక్ష వేయించాడని ఆరోపణ ఉంది. సదరు యామీన్‌ ప్రభుత్వంలో మంత్రి, రాజకీయ వారసుడే నూతన అధ్యక్షుడు ముయిజ్జు.అక్కడి విధానం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఎందరైనా పోటీ పడవచ్చు. పోలైన ఓట్లలో 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధిని విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ అలా తెచ్చుకోని పక్షంలో అధిక ఓట్లు తెచ్చుకొని మొదటి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య 21వ రోజున తిరిగి పోటీ నిర్వహిస్తారు. సెప్టెంబరు 9న జరిగిన ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది పోటీ చేశారు. వారిలో పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ తరఫున 45 ఏండ్ల మహమ్మద్‌ ముయిజ్జు 46.06శాతం ఓట్లు తెచ్చుకోగా రెండవ స్థానంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇబ్రహీం మహమ్మద్‌ సాలి 39.05 తెచ్చుకున్నాడు. సాలి నాయకత్వంలోని మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీలో ఎన్నికల ముందు చీలిక వచ్చింది. విడిపోయిన వారు డెమోక్రాట్స్‌ పేరుతో పోటీ చేసి 7.18శాతం తెచ్చుకున్నారు. సెప్టెంబరు 30న రెండవసారి ఎన్నిక జరిగింది. ముయిజ్జు 54.04శాతం తెచ్చుకున్నాడు.నవంబరు 17న అధికారాన్ని స్వీకరిస్తాడు, ప్రస్తుతం రాజధాని మాలె నగర మేయర్‌గా పని చేస్తున్నాడు. ఈ ఎన్నికల నిర్వహణ గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. మాల్దీవుల ట్రాన్సఫరెన్సీ అనే సంస్థ ఎన్నికల హింసాకాండ ఉదంతాలు కొన్ని జరిగినట్లు చెప్పటం తప్ప వివరాలను వెల్లడించలేదు. అర్హులైన రెండు లక్షల 82వేల మంది ఓటర్లలో తొలి దఫా 79.85, తుది విడత 87.31 శాతం ఓట్లు వేశారు.


ఈ ఎన్నిక ఒక విధంగా చెప్పాలంటే చైనా – భారత్‌ మధ్య పోటీగా జరిగిందంటే అతిశయోక్తి కాదు. బహుశా ఎక్కడా ఇంత బాహాటంగా రాజకీయ పార్టీలు పోటీ చేసి ఉండవు. ఈ ఎన్నికలు తమ పౌరుల దేశ భక్తికి ఒక ప్రతిబింబమని, మా ఇరుగు పొరుగు వారు, భాగస్వాములు తమ స్వాతంత్య్రం, సర్వసత్తాకతను పూర్తిగా గౌరవించాలని ఇచ్చిన ఒక పిలుపు అని పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ కూటమి ప్రతినిధి వ్యాఖ్యానించాడు. చైనా బిఆర్‌ఐ పధకం కింద పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వంలో గృహశాఖ మంత్రిగా ముయిజ్జు పని చేశాడు. తాను అధికారానికి వస్తే రెండు దేశాల మధ్య మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతానని గతేడాదే ప్రకటించాడు. 2018లో అధికారానికి వచ్చిన సాలి తన పాలనా కాలంలో విచక్షణా రహితంగా భారత ప్రవేశానికి అవకాశమిచ్చినట్లు విమర్శలు చేశాడు. చివరికి భారత మిలిటరీని కూడా దేశంలో అనుమతించాడని, తాను అధికారానికి వస్తే దళాలను వెనక్కు పంపటమే గాక ప్రస్తుతం భారత్‌కు అనుకూలంగా వాణిజ్య సంబంధాలను సమతూకంలో ఉండేట్లు చూస్తానని వాగ్దానం చేశాడు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒక ఒప్పందం మేరకు ఒక డాక్‌యార్డ్‌ నిర్మాణ పర్యవేక్షణకు మాత్రమే భారత సైనికులు ఉన్నారని సాలి సమర్ధించుకున్నాడు. కొత్త ప్రభుత్వం భారత్‌-చైనాల పట్ల ఎలాంటి వైఖరిని అనుసరిస్తుందనే అంశంపై విమర్శకులు భిన్న అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. చైనాకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ భారత్‌ను తక్కువ చేయదన్నది వాటిలో ఒకటి.


రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. ఈ కారణంగానే బ్రిటీష్‌ ఆక్రమించిన మారిషస్‌కు చెందిన డిగోగార్సియా దీవులను అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఖాళీ చేసేందుకు మొరాయిస్తున్నది. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది. మనదేశంలోని కన్యాకుమారికి ఆ దీవులు 1,796కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అది మనదేశంతో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకూ ఆందోళన కలిగించే అంశమే. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఆ వరుసలో మాల్దీవులు కూడా చేరితే ఏమిటన్నదే వారి ఆందోళన. ఈ పరిణామం భారత భద్రతకు ముప్పు అని మన దేశానికి అవి చెబుతున్నాయి. ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా 1965లో బ్రిటన్‌ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది. అనేక విధాలుగా సాయం చేసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. తమను అదుకోవాలని అనేక దేశాలను గయూమ్‌ కోరినా ఎవరూ ముందుకు రాలేదు. భారత్‌ స్పందించింది, ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపర్లను ఎక్కడా ఆపకుండా నేరుగా మాల్దీవుల్లో దించి కుట్రను విఫలం గావించింది. అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి.


తరువాత జరిగిన పరిణామాల్లో దీవుల ఆర్థిక సమస్యలను, పౌరుల జీవితాలను మెరుగుపరచటంలో పాలకుల వైఫల్యం కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. సరిగ్గా అదే సమయంలో చైనా తన బిఆర్‌ఐ పధకాన్ని ముందుకు తెచ్చింది. ఐఎంఎఫ్‌, ప్రపంచబాంక్‌, అమెరికా, ఇతర పశ్చిమదేశాల మాదిరి కఠినమైనవి కాకుండా సాధారణ షరతులతో ప్రాజెక్టులకు చైనా రుణాలు ఇచ్చింది. దాంతో 2013లో అధికారానికి వచ్చిన అబ్దుల్లా యామిన్‌ చైనాతో సంబంధాలను పెంచుకున్నాడు.2018లో గెలిచిన ఇబ్రహీం సాలి భారత్‌కు పెద్ద పీట అనే విధానంతో మన దేశానికి సన్నిహితంగా భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాడు. అది తాజా ఎన్నికల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.2020లో ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక కూటమిగా ఏర్పడి ” భారత్‌ను బయటకు పంపాలి( భారత్‌ అవుట్‌) ” అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించాయి. జనంలో ఉన్న భారత వ్యతిరేక మనోభావాలు కూడా దీనికి దోహదం చేశాయి. 1978లో అధ్యక్షుడిగా నియమితుడైన అబ్దుల్‌ గయూమ్‌ ప్రజాస్వామిక స్వేచ్చకు తిలోదకాలిచ్చి 2008లో ఓడిపోయే వరకు పదవిలో కొనసాగాడు. అతడి మీద జరిగిన కుట్రను భారత్‌ అడ్డుకొని అధికారంలో కొనసాగేందుకు దోహదం చేసింది.2013లో పోటీ చేసిన యామిన్‌ ఈ గయూమ్‌కు సవతి సోదరుడు. ఆ ఎన్నికల్లో గయూమ్‌ అతనికి మద్దతు ఇచ్చాడు. తరువాత ఇద్దరి మధ్య తలెత్తిన విబేధాలతో గయూమ్‌ పార్టీని చీల్చి ప్రతిపక్షంతో చేతులు కలిపాడు. తరువాత ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రచేశాడనే ఆరోపణతో 2018లో అతన్ని అరెస్టు చేశారు. తరువాత బెయిలు మీద విడుదల చేశారు. మనదేశానికి చెందిన జిఎంఆర్‌ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక అధ్యక్షుడు నషీద్‌ మద్దతు కూడా ఉందని చెబుతారు. అదే పెద్ద మనిషి మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్‌ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది.దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకున్నాయి.


2013లో అధికారానికి వచ్చిన యామీన్‌ మరుసటి ఏడాది చైనా అధినేత షీ జింపింగ్‌ను పర్యటనకు ఆహ్వానించాడు. అధికారికంగా భారత్‌కు అగ్రస్థానం అనే విధానం నుంచి వైదొలగనప్పటికీ చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. మౌలిక సదుపాయాల పధకాలకు ఒప్పందం చేసుకున్నాడు.చైనాతో కలసి సాగర పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరిపాడు.చైనాతో బంధం బలపడిన తరువాత 2018లో అప్పటి వరకు మాల్దీవుల్లో నిర్వహిస్తున్న భారత హెలికాప్టర్లు, నిర్వహణ సిబ్బంది తమ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు, గూఢచర్యం జరుపుతున్నట్లు ఆరోపించి వెంటనే వెనక్కు తీసుకోవాలని మనదేశాన్ని కోరాడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. అధికారానికి వచ్చిన ఇబ్రహీం సాలి చైనా రుణ పధకాలనుంచి దేశాన్ని కాపాడినట్లు చెప్పుకున్నాడు.జనం విశ్వసించలేదు. ప్రపంచ బాంకు, ఐఎంఎఫ్‌ మాదిరి విధానపరమైన షరతులను ఎవరి మీద చైనా రుద్దలేదు. చైనా రుణాలు పుచ్చుకున్న దేశాలు, అందుకు చొరవ చూపిన అక్కడి పాలకులు అనుసరించిన విధానాల్లో ఏవైనా లోపాలు, అక్రమాలు, అవినీతి ఉంటే అవి ఆ దేశాల అంతర్గత అంశాలు. వాటి మంచి చెడ్డలను జనం చూసుకుంటారు. కానీ చైనా వ్యతిరేక పశ్చిమ దేశాలు, వాటికి వంతపాడే ఇతర దేశాల పాలకులు, మీడియా అనేక కట్టుకధలను వ్యాపింప చేస్తోంది. మాల్దీవుల్లో కూడా అదే జరిగింది. 2018లో యామీన్‌ పదవి నుంచి దిగిపోయేనాటికి ఉన్న పరిస్థితిని తిరిగి కొనసాగిస్తామని ముయిజ్జు ఎన్నికలకు ముందే స్పష్టం చేశాడు. అందువలన ఆ విధానాలకు అనుకూలంగా జనం ఇచ్చిన తీర్పుగా దీన్ని పరిగణించాలి తప్ప, భారత్‌కు ఎదురుదెబ్బ అనో మరో విధంగానో చిత్రించటం మన ప్రయోజనాలను కాపాడుకోవాలనే సరైన ఆలోచనలో భాగం కాదు. మాల్దీవులే కాదు మరేదేశానికైనా మన దేశం కూడా అభివృద్ధికి తోడ్పడి మనకు మిత్రదేశాలుగా ఉండేట్లు చూసుకోవాలి తప్ప అమెరికా రాజకీయంలో భాగంగా వ్యవహరించకూడదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పదేండ్ల నరేంద్రమోడీ పాలన : పెరిగిన అప్పులు – తగ్గిన మానవాభివృద్ధి, పన్నుబాదుడులో ఔరంగజేబే ఆదర్శం !

02 Monday Oct 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Health, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

BJP, China, India debt matters, India HDI, Modi 2014 vs 2024, Narendra Modi Failures, Ten years Narendra Modi rule


ఎం కోటేశ్వరరావు


వెలిగిపోతున్న పాలన సాగిస్తున్నామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ సెప్టెంబరు చివరి వారంలో జనానికి రెండు ” శుభవార్తలు ” చెప్పింది. ఒకటి వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి ఐదు మాసాల్లో ద్రవ్యలోటు రు.6.43లక్షల కోట్లకు పెరిగింది. బడ్జెట్‌లో సూచించిన మొత్తం కంటే ఎక్కువగా రిజర్వుబాంకు మిగులు నుంచి రు.87,420 కోట్లు బదలాయించిన తరువాత కూడా ఇలా జరిగింది. గతేదాది ఈ మొత్తం రు.5.42లక్షల కోట్లు. దీన్ని సులభంగా చెప్పుకోవాలంటే తెలుగింటి కోడలు నిర్మలమ్మ ఆర్థికశాఖ మంత్రిగా 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టినపుడు వచ్చే పన్నెండు నెలల్లో ఒక వంద రూపాయలు కొత్తగా ద్రవ్యలోటు ఉంటుందని ప్రతిపాదించారని అనుకుందాం. అది ఐదు నెలలకే 36 రూపాయలకు చేరింది, అదే కాలానికి గత ఏడాది రు.32.60 మాత్రమే ఉంది.మరింత వివరణ ఏమంటే గతేడాది మొత్తం లోటు రు.16.61లక్షల కోట్లని చెప్పగా వర్తమాన సంవత్సరంలో రు.17.86లక్షలుగా ప్రతిపాదించారు. మొత్తం పెరుగుదల లక్షా 25వేల కోట్లు, ఇప్పటికే లక్ష కోట్లు పోగా ఇంకా మిగిలింది 25వేల కోట్లు మాత్రమే. వచ్చే ఏడు నెలల్లో ఏ పధకానికి కోత పెడతారు, కొత్త అప్పులు తెస్తారా, కొత్త నోట్లను ముద్రిస్తారా ఏం చేస్తారన్నది చూడాలి. నరేంద్రమోడీకి సర్వాధికారాలు ఉన్నాయి కదా ! ఏం చేసినా అడిగేవారు లేరు. నోట్ల ముద్రణ జరిగితే ధరలు మరింతగా పెరుగుతాయి, రూపాయి విలువ పతనం అవుతుంది.


ఇక రెండవ మంచి వార్త ఏమంటే మన విదేశీ రుణ భారం 2023 జూన్‌నాటికి 629.1 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. తమ విశ్వగురువు విదేశీ రుణాల మీద ఆధారపడరని, తగ్గిస్తారని భక్త జనులు అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో ప్రచారం చేశారు. 2014లో మోడీ అధికారానికి వచ్చినపుడు 2013 డిసెంబరు నాటికి ఉన్న విదేశీ రుణం 409.4 బిలియన్‌ డాలర్లు మాత్రమే. దానిలో తీర్చింది తీర్చగా ఆ మొత్తం అలాగే ఉందనుకుంటే అదనంగా 220 బిలియన్‌ డాలర్లు కొత్త అప్పులు చేశారు. ఇది ప్రతి మూడు నెలలకు పెరుగుతున్నది తప్ప తగ్గటం లేదు.ఈ ఏడాది మార్చి నాటికి 624.3 బిలియన్‌ డాలర్లకు అదనంగా 470 కోట్ల డాలర్లు తోడైంది. దీన్ని మోడీ సర్కార్‌ వైఫల్యంగా చెబుతారా, ఘనత అంటారా ? గతంలో వాజ్‌పాయి ఏలుబడిలో, యుపిఏ కాలంలో కూడా అప్పులు గణనీయంగా తీసుకున్నారు. విదేశీ రుణాలన్నీ డాలర్లలో ఉండవు.1991లో మన విదేశీ రుణం 83.8 బిలియన్‌ డాలర్లు కాగా దానిలో రాయితీలతో కూడిన మొత్తం 45.9శాతం ఉండేది. అది తరువాత క్రమంగా తగ్గుతూ 2013నాటికి 11.1కి 2022 డిసెంబరు నాటికి 8.1శాతానికి తగ్గింది.


అంకెలతో జనాన్ని తిమ్మిని బమ్మిని చేయవచ్చు. దానిలో భాగంగానే విదేశీ అప్పు మొత్తం పెరిగిందని ఒకవైపు అంగీకరిస్తూనే మార్చినెలతో ముగిసిన దానితో పోలిస్తే జూన్‌ నాటికి జిడిపిలో అప్పు శాతం 18.8 నుంచి 18.6 శాతానికి తగ్గినట్లు ఆర్‌బిఐ చెబుతోంది.ప్రభుత్వ అప్పు తగ్గింది, ప్రభుత్వేతర అప్పు పెరిగిందని కూడా పేర్కొన్నది. గతంలో కూడా ప్రభుత్వ అప్పు తగ్గింది తప్ప పెరగలేదు, కానీ బిజెపి నేతలు దాని గురించి ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి అన్నట్లు కాంగ్రెస్‌ పాలన గురించి నానా యాగీ చేశారు. మొత్తంగా పెరిగిందా లేదా అన్నది గీటురాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన అప్పు తక్కువ అని మరోసన్నాయి నొక్కు. ప్రతిదానికి చైనాతో పోలుస్తున్నారు, దాని విదేశీ అప్పు జిడిపిలో 13.6శాతం ఉంది, దాని కంటే మన అప్పు ఆరుశాతం ఎక్కువ. ఇంటా బయటా అప్పులు చేసి లేదా ప్రయివేటు అప్పులకు హామీ ఇచ్చి సాధించింది ఏమిటి ? కాంగ్రెస్‌ యాభై సంవత్సరాలలో చేయలేని వాటిని తన తొలి ఐదు సంవత్సరాల పాలనలోనే సాధించినట్లు నరేంద్రమోడీ చెప్పుకున్నారు. అందువలన పదేండ్ల కాలం తక్కువేమీ కాదు. కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉంది. విధానాలను అమలు జరపటానికి వచ్చిన ఇబ్బంది లేదు.ఒక దేశ అభివృద్ధికి ఒక కొలమానం మానవాభివృద్ధి సూచిక. ఐరాస అభివృద్ధి ప్రమాణాల(హెచ్‌డిఐ) ప్రకారం 0.550 కంటే తక్కువ పాయింట్లు వచ్చిన దేశాలు తక్కువ, 0.550 -0.699 మధ్య ఉన్నవి మధ్యరకం, 0.699 నుంచి 0.799 పాయింట్లు వస్తే ఉన్నత, 0.800 కంటే మించితే అత్యున్నత వృద్ధి సాధించిన దేశాలుగా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది ప్రకటించిన 2022 నివేదిక ప్రకారం 0.633 పాయింట్లతో మనదేశం 188 దేశాల జాబితాలో 132వదిగా ఉంది.నరేంద్రమోడీ అధికారానికి వచ్చినపుడు ఉన్న 130 నుంచి రెండు స్థానాలు దిగజారింది. మన దేశం ఇచ్చిన సమాచారం ప్రకారమే విశ్లేషించి సూచికలను రూపొందిస్తారని తెలిసిందే. ఎందుకీ దిగజారుడు ? ఇష్టం ఉన్నా లేకున్నా చైనాతో పోలుస్తున్నారు గనుక అదెక్కడ ఉందో చూద్దాం. తాజా సూచిక ప్రకారం 0.768 పాయింట్లతో 79వ స్థానంలో ఉంది. ఈ సూచికలకు ఇచ్చే పాయింట్లు ఆయా దేశాల్లో జరిగే వృద్ధిని బట్టి ఏటా మారుతూ ఉంటాయి. లింగ సమానత్వం, ఆరోగ్యం, విద్య, ఆదాయం, అసమానతల వంటి 13 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గడచిన నాలుగున్నర దశాబ్దాలుగా కొన్ని దేశాల మానవాభివృద్ధి సూచికలలో వచ్చిన మార్పులు దిగువ విధంగా ఉన్నాయి. బ్రాకెట్లలో ఉన్న అంకెలు సదరు ఏడాది పరిగణనలోకి తీసుకున్న దేశాల సంఖ్యగా గమనించాలి.
హెచ్‌డిఐ ××× 1980 ×× 1990 ×××× 2000 ×××× 2010 ×× 2014 ×××× 2022
చైనా ×××××0.423 ×× 0.501 ×× 0.588 ××0.699 ××0.727 ×× 0.768
చైనారాంక్‌ ×××92(124) ××103(143) ××108(166) ××102(188)××90(188) ××79(191)
భారత్‌ ×××0.369 ×× 0.428 ××0.496 ××0.586 ×××× 0.609 ×× 0.633
భారతరాంక్‌×××100(124) ××114(143) ××120(166) ××136(188)××130(188) ××132(191)
అమెరికా ×××0.825 ×× 0.859 ××××0.883 ××××0.909 ××××0.915 ×××× 0.921
అమెరికారాంక్‌×× 2(124) ×× 2 (143) ×× 5 (166) ×× 5 (188)×× 8 (188) ×× 21(191)


తన పాలనలో జిడిపి గణనీయంగా పెరిగిందని, త్వరలో ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చుతామని, 2047 నాటికి చైనాను కూడా అధిగమిస్తామని బిజెపి నమ్మింప చూస్తున్నది. రాష్ట్రాలు రుణాలు తీసుకోవద్దని, సంక్షేమ పధకాలకు అనవసరంగా ఖర్చు చేయవద్దని ప్రధాని నరేంద్రమోడీ పదే పదే చెబుతున్నారు.కానీ ఆ పెద్ద మనిషి ఏలుబడిలో జరిగిందేమిటి ? 2013-14 సంవత్సరంతో పోల్చితే 2022-23నాటికి స్వదేశీ అప్పు 174శాతం, విదేశీ అప్పు వందశాతం పెరిగింది.కాగ్‌ ఖరారు చేసిన గణాంకాల ప్రకారం 2014 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ విదేశీ, స్వదేశీ అప్పు మొత్తం రు.50,68,235 కోట్లు. వర్తమాన సంవత్సర బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అప్పుల గురించి నిర్మలమ్మ పార్లమెంటుకు సమర్పించిన పత్రం ప్రకారం 2023 మార్చి నెల ఆఖరుకు రు. 152,61,122.12 కోట్లుగా ఉన్నది 2024 మార్చి ఆఖరుకు రు.169,46,466.85 కోట్లకు చేరుతుంది. ఎన్నికల సంవత్సరం గనుక ఇంకా పెరగటమే తప్ప తగ్గే అవకాశం లేదు. దీనిలో స్వదేశీ అప్పు రు.147,77,724.43 కోట్ల నుంచి రు.164, 23,983.04కు, విదేశీ రుణం రు.4,83,397.69 నుంచి రు.5,22,683.81 కోట్లకు పెరుగుతుందని చెప్పారు. ఇంత అప్పు చేసినా మానవాభివృద్ధి సూచికలు దిగజారాయంటే ఆ సొమ్మును జనానికి గాకుండా కార్పొరేట్లకే కట్టపెట్టారన్నది స్పష్టం. పెంచిన పన్ను భారాలు, అప్పుల గురించి అడిగితే జాతీయ రహదారులు, రైల్వేలను అభివృద్ధి చేశామంటారు. నిజమే, వాటిని వినియోగించుకున్నవారి నుంచి వసూలు చేస్తున్న టోలు టాక్సు, ఎంత ? సామాన్యులు ఎక్కే పాసింజరు రైళ్లను రద్దు చేసి వాటిని ఎక్స్‌ ప్రెస్‌ల పేరుతో జనాన్ని బాదుతున్నారు. వృద్దులకు ఇచ్చే రాయితీలను రద్దు చేశారు.రిజర్వేషన్ల రద్దుకు ఎంత వసూలు కోత పెడుతున్నారో తెలిసిందే. స్టాటిస్టా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం 2017 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 వరకు టోల్‌టాక్సు రు.17,942 కోట్ల నుంచి 48,028 కోట్లకు పెరిగింది. దీనిలో సరకు, ప్రయాణీకుల రవాణా వాహనాల నుంచి వసూలు చేసేదే ఎక్కువ అన్నది తెలిసిందే, అంటే ఆ మేరకు జనం మీద భారం మోపుతున్నారు.


ఆరోగ్య పరిస్థితిని చూస్తే ఆందోళనకరంగా ఉంది. తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయని కారణంగా దేశంలో అన్ని వయసుల వారిలో రక్త హీనత (అనీమియా)పెద్ద సమస్యగా ఉంది. కుటుంబ జాతీయ ఆరోగ్య సర్వే 5 (2019-21) ప్రకారం ఆరు నెలల నుంచి ఐదేండ్ల మధ్య వయస్సు పిల్లల్లో 67శాతం, 15-19 సంవత్సరాల బాలికల్లో 59, బాలురలో 31,పిల్లల్ని కనేవయస్సున్న మహిళల్లో 57, గర్భిణుల్లో 52, గర్భిణులు కాని మహిళల్లో 57 మంది రక్త హీనతో ఉన్నారు. అంతకు ముందు చేసిన సర్వే 4 వివరాలతో పోలిస్తే పైన చెప్పుకున్న అన్ని తరగతుల వారిలో ఈ సమస్య తీవ్రత పెరిగింది. దేశానికి గుజరాత్‌ తరహా అభివృద్ధిని అమలు చేస్తానని నరేంద్రమోడీ చెప్పారు, ఆ గుజరాత్‌ పిల్లల్లో తీవ్రత 62.6 నుంచి 79.7శాతానికి పెరిగింది. ఈసురో మని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోరు అని మహాకవి గురజాడ చెప్పింది ఇలాంటి వారి గురించే.2018లో అనీమియా ముక్త భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. అది ఏమేరకు ఫలితాలు ఇచ్చిందో ఇంకా ఏమి చేయాలో తెలియాలంటే సర్వేలు తప్ప మరొక మార్గం లేదు కానీ, ఆరవ విడత నిర్వహించదలచిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆ సమాచారాన్ని రాబట్టే ప్రశ్నలనే కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఎందుకంటే తీవ్రత తగ్గకపోతే మోడీ సర్కార్‌ వైఫల్యం వెల్లడౌతుంది. అంతకు మించి మరొక కారణం కనిపించటం లేదు. దీని మీద తీవ్ర విమర్శలు రావటంతో డైట్‌ మరియు బయోమేకర్స్‌ సర్వే(డాబ్స్‌-1) ఆ సమాచారాన్ని సేకరిస్తుందని కేంద్ర ప్రకటిచింది. మన దేశంలో తృణధాన్యాల వినియోగం గురించి ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ 2019 సంవత్సర వివరాలను వెల్లడించింది.ప్రపంచ వ్యాపితంగా తలసరి ఆహారం,దాణాగా 304కిలోలు వినియోగిస్తున్నారు. మన దేశంలో 171 కిలోలు, ఆఫ్రికాలో 190, బాగా వెనుక బడిన దేశాల్లో 205, బ్రెజిల్‌, చైనాలో 360, రష్యాలో 407,ఐరోపా పారిశ్రామిక దేశాల్లో 494, అమెరికాలో 590 కిలోలు ఉంది. దీన్ని బట్టి 121 దేశాల్లో మన దేశం ఆకలి సూచికలో 107వదిగా ఎందుకు ఉందో అర్ధం చేసుకోవటం కష్టం కాదేమో ? రాష్ట్రాలకు చెందాల్సిన న్యాయమైన వాటాను రాకుండా ఎగవేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న కొన్ని భారాలను చూస్తే స్వచ్చ భారత్‌, విద్య, ఆరోగ్యం,రోడ్డు , నాణ్యమైన ఇంథనం, వ్యవసాయం పేరుతో విధిస్తున్న సెస్‌ల గురించి జనానికి తెలిసిందే తక్కువే. రాబడి కోసం ఔరంగజేబు ముస్లిమేతరుల మీద విధించిన జిజియా పన్ను గురించి చరిత్ర పాఠాల్లో చదువుకున్నాం.ఇప్పుడు జరుగుతున్నదేమిటి ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మహిళా రిజర్వేషన్లపై నరేంద్రమోడీ టక్కు టమారాలు : పదేండ్లు పట్టించుకోలేదు, 2034 తరువాతే అమలు !

25 Monday Sep 2023

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Women

≈ Leave a comment

Tags

BJP, Delimitation Commission of India, Narendra Modi, Narendra Modi Failures, women reservation bill 2023


ఎం కోటేశ్వరరావు


నాటకీయ పరిణామాల మధ్య నరేంద్రమోడీ సర్కార్‌ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చట్ట సభల్లో 33శాతం మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది.అది చట్టం కావటం లాంఛనమే. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే దాని అమలుకు బాటపడుతుంది. ఏ అసెంబ్లీ, లోక్‌సభ సెగ్మెంట్లలోని ఓటర్లలో పురుషులు ఎందరు, మహిళలు ఎందరు అనే వివరాలు ఇప్పటికే ఉన్నాయి గనుక కొందరు ఆ స్థానాలను ఉటంకిస్తూ అవన్నీ మహిళలకు రిజర్వు చేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అసలు ఈ రిజర్వేషన్లు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే 2029 నాటికి అని మరికొందరు 2034 లేదా ఆ తరువాతే అని భాష్యం చెబుతున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరిగేదీ, ఎక్కడ ఎన్ని సీట్లు తగ్గేది కూడా కొన్ని అంకెలను కూడా ఉటంకిస్తున్నారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం రిజర్వేషన్లు పదిహేను సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. షెడ్యూలు కులాలు, తరగతులకు నిర్ధేశించిన సీట్లలో కూడా మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. వెనుబడిన తరగతుల మహిళకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఆమోదించిన బిల్లు చట్టమై ఎప్పటికి అమల్లోకి వస్తుంది, అసలు ఏం జరగబోతోంది ?


రాజ్యసభలో 2010లోనే ఆమోదం పొందిన రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందితే సరిపోతుంది. యుపిఏ ఏలుబడిలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీల వ్యతిరేకత లేదా అభ్యంతరాల కారణంగా అది లోక్‌సభలోకి రాలేదు. తమకు పూర్తి మెజారిటీ వస్తే దాన్ని తక్షణమే ఆమోదిస్తామని బిజెపి వాగ్దానం చేసింది. 2014లో, 2019లో అవసరమైన మెజారిటీ, సగానికంటే ఎక్కువ రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలే ఉన్నందున ఆ బిల్లు ఆమోదానికి ఆటంకం లేదు, అయినప్పటికీ తొమ్మిదేండ్లుగా దాని ప్రస్తావన, అసలు చొరవే చూపలేదు. నిజానికి అధికారానికి వచ్చిన వెంటనే ఆమోదం పొంది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లలోనే మహిళల కోటా అమలు జరిపేందుకు పునర్విభజనతో నిమిత్తం లేకుండా అవసరమైన రాజ్యాంగ సవరణ చేసి ఉంటే అమల్లోకి వచ్చి ఉండేది. చిత్తశుద్ది ముఖ్యం, అది లేదు కనుకనే విమర్శలు. కారణాలు, ఉద్దేశ్యాలు ఏమైనప్పటికీ ముందు రోజు కాబినెట్‌లో ఆమోదించి మరుసటి రోజు లోక్‌సభలో, తరువాత రాజ్యసభలో ఆమోదానికి పెట్టారు.లోక్‌సభలో ఇద్దరున్న మజ్లిస్‌ మినహా మిగిలిన పార్టీలేవీ వ్యతిరేకంగా ఓటు వేయలేదు, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఈ పరిణామాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో, జనానికి ఏం చెబుతుందో, ఓటర్లు ఎలా స్వీకరిస్తారో చూద్దాం.


ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది ? పదేండ్లకు ఒకసారి జరిగే జన గణన తరువాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నది స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన నిర్ణయం. దీన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేసే కమిషన్‌కు ఒక విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఉంటారు. దాని నిర్ణయాన్ని ఆమోదించటం తప్ప ఏ కోర్టులోనూ సవాలు చేసే అవకాశం లేదు. ఆ మేరకు 1952, 1963, 1973లో జరిగాయి.1973 తరువాత పాతికేండ్ల పాటు ఆ ప్రక్రియను స్థంభింప చేస్తూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేశారు. ఆ మేరకు 2002లో మరో పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తరువాత మరో పాతికేండ్లపాటు 2026వరకు అదే సంఖ్యను కొనసాగించాలని కూడా నిర్ణయించారు. తొలి లోక్‌సభలో 494 నియోజకవర్గాలుండగా, తరువాత పది సంవత్సరాలకు 522కు పెంచారు. మరో పది సంవత్సరాల తరువాత 542కు పెంచారు. ఆప్రక్రియ తరువాత సిక్కిం మనదేశంలో విలీనం కావటంతో మరొక స్థానాన్ని దానికి కేటాయించటంతో 543 అయ్యాయి. వీటిలో పదమూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి 2026వరకు ఆ సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు. మధ్యలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలలో కొన్ని ప్రాంతాలూ, అసెంబ్లీ సెగ్మెంట్లు అటూ ఇటూ అయ్యాయి. కొన్ని నియోజవర్గాలు రద్దు, కొన్ని కొత్తవి వచ్చాయి. తెలంగాణాలో జనాభా పెరగటంతో ఆంధ్రప్రాంతంలో సీట్లు తగ్గాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తరువాత ఎక్కడ ఉన్న సీట్లు అక్కడే ఉన్నాయి.రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణా సీట్లను 119 నుంచి 153కు, ఆంధ్ర ప్రదేశ్‌లో 175ను 225కు పెంచుతామని వాగ్దానం చేసినందున 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియలో భాగంగా అవి అమల్లోకి వస్తాయి.


2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. గడువు ప్రకారం వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి వుంది. అందువలన జనగణన జరుగుతుందా, మరుసటి ఏడాదికి వాయిదా పడుతుందా అన్నది ప్రస్తుతానికి ఊహాగానమే. 2026లోపు జనగణన జరుగుతుందనే భావనతో తరువాత జరిగే పునర్విభజన ప్రకారం 2029లోక్‌ సభ ఎన్నికలు, గడువు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33శాతం కేటాయించాల్సి ఉంటుందని అందువలన 2029లో అమలు జరుగుతాయని కొందరు భాష్యం చెబుతున్నారు. ఇక పార్లమెంటు ఆమోదించిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియకు ఆ తరువాత జరిగే అంటే 2031లో జరిగే జనగణన ప్రాతిపదికన జరగాల్సి ఉంటుంది. 2021లో జరగాల్సిన జనగణన 2024 లేదా 2025లో జరిగితే పదేండ్లు గడవకుండానే మరోగణన 2031లో జరుపుతారా లేక పదేండ్లు అంటే 2034 లేదా 2035లో జరుపుతారా అన్నది తెలియదు. ఒక వేళ అదే జరిగితే ఆ తరువాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అందుకే కపిల్‌ సిబల్‌ వంటి న్యాయకోవిదులు 2034కు ముందు అమల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. రెండవది పునర్విభజన ప్రక్రియకు నిర్ణీత కాలవ్యవధి లేదు.


అనేక రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధానాలను సక్రమంగా అమలు జరపకపోవటం, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లను కేటాయిస్తున్నందున ఎక్కువ సీట్లు పొందేందుకు జనాభా అదుపును పట్టించుకోవటం లేదనే అభిప్రాయం ఉంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పకుండా 1976లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాలలో ఎలాంటి మార్పులు చేయకూడని నిబంధనను సవరించారు. తరువాత జనాభా స్థిరీకరణ అవుతుందనే అంచనాతో మరోసారి 84వ రాజ్యాంగసవరణ ద్వారా 2026వరకు సీట్ల సంఖ్యలో మార్పులేకుండా నిర్ణయించారు. 2002లో ఏర్పాటు చేసిన కమిషన్‌ 1991 జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్ధీకరణ చేపట్టాలని నిర్ణయించారు.కమిషన్‌ పని చేపట్టిన తరువాత 2003లో 87వ రాజ్యాంగసవరణ ద్వారా 2001జనాభా ప్రాతిపదికను నిర్ణయించటంతో తిరిగి నూతన ప్రక్రియను చేపట్టాల్సి వచ్చింది, 2008వరకు పూర్తి కాలేదు. జమ్మూ-కాశ్మీర్‌లో జనగణన జరగలేదు గనుక దీన్నుంచి మినహాయించారు, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ జనాభా లెక్కల్లో తేడాలు ఉన్నందున కోర్టు వివాదాల కారణంగా అక్కడ జరగలేదు. 2009 సాధారణ ఎన్నికల నాటికి 543కు గాను 499చోట్ల పునర్వ్యస్థీకరణ జరిగింది. పన్ను ఆదాయ పంపిణీకి పదిహేనవ ఆర్థిక సంఘం ఎంచుకున్న జనాభా ప్రాతిపదికతో ఎక్కువ మొత్తాలను జమ చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు తక్కువ మొత్తాలను పొందుతూ వివక్షకు గురవుతున్నాయి.అంతకు ముందు 1971 జనాభా ప్రాతికగా ఉన్న కేటాయింపులను 2011కు మార్చటంతో పెద్ద తేడా వచ్చింది. దేశ జనాభాలో 18శాతం ఉన్న రాష్ట్రాలు జిడిపిలో 35శాతం సమకూర్చుతున్నాయి. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉండాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. కానీ 2003లో చేసిన సవరణతో ఎవరు ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చు. అలాంటి వారు ఆ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారా ? అక్కడి సమస్యలను పట్టించుకుంటారా ? వచ్చే పునర్విభజనలో పాత జనాభా పద్దతినే ఆమోదిస్తే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గటం ఖాయం.

పాత విధానాన్ని అనుసరిస్తే పునర్యవస్థీకరణ తరువాత ఇప్పుడున్న 543 సీట్లు( ఇద్దరు ఆంగ్లోఇండియన్‌ల నామినేషన్‌ రద్దు చేశారు గనుక 541 ఉంటాయి) 848కి పెరుగుతాయని కొందరి జోశ్యం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సూచించినట్లుగా గతంలో నిర్ణయించిన దాని కంటే జనాభా రెట్టింపైనందున సీట్ల పెరుగుదల వెయ్యి ఉండవచ్చనేది ఒక వాదన.మరో అంచనా ప్రకారం 753 ఉంటాయి. తదుపరి పునర్యవస్థీకరణ సంవత్సరాన్ని ముందే ఖరారు చేసినందున ఏ ప్రాతిపదికన జరిగేదీ కమిషన్‌ నియామక సమయంలోనే తెలుస్తుంది. దాన్ని బట్టే ఎన్ని సీట్లు అన్నది ఖరారు అవుతుంది. అప్పటి వరకు వెలువడే సంఖ్యలన్నీ ఊహాగానాలే. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81 ప్రకారం జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అన్నది ఖరారు కావాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, కొన్ని చోట్ల తగ్గుదల కారణంగా ఆ సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. రాజ్యాంగం ప్రారంభంలో లోక్‌సభ సీట్లు 500గా ఖరారు చేసింది. తరువాత రాష్ట్రాల పునర్విభజన, ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రాతిపదికన సీట్లను పెంచారు.1971 జనాభా ప్రాతిపదికనే ఇప్పటికీ సీట్ల సంఖ్య కొనసాగటం సహేతుకం కాదని పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు సీట్లు కేటాయించాలన్నది ఒక అభిప్రాయం.ఉదాహరణకు దాని ప్రకారం 2001 జనాభా ప్రాతిపదికన ఉత్తర ప్రదేశ్‌కు ఏడు సీట్లు పెంచాలి, తమిళనాడుకు ఏడు తగ్గించాలి, అదే 2011లెక్కల ప్రకారం ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లకు 22 అదనంగా కేటాయించాలి, అదే ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణా, కేరళ, తమిళనాడుకు 17 సీట్లు తగ్గించాలి.2021(ఎప్పుడు జరిగితే అప్పుడు) జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల సీట్లు ఇంకా తగ్గవచ్చు.2019లో జచేసిన ఒక విశ్లేషణ ప్రకారం ఉత్తర భారత్‌కు 32 సీట్లు పెరుగుతాయి, దక్షిణ భారత్‌కు 24 తగ్గుతాయి. కుటుంబ నియంత్రణ పద్దతులను జయప్రదంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అన్నది వినిపిస్తున్నమాట.కార్నెగీ సంస్థ విశ్లేషణ మేరకు 2031 జనాభా ప్రకారమైతే ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రెండు రాష్ట్రాలకే 21 సీట్లు అదనంగా పెరిగితే, తమిళనాడు, కేరళకు కలిపి 16 తగ్గుతాయి. మొత్తం సీట్లు 848కి పెరిగితే ఒక్క ఉత్తర ప్రదేశ్‌కే 143, కేరళకు 20 ఉంటాయి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటక బిజెపి టిక్కెట్‌ మోసం కేసు : పోలీసు కస్టడీలో పక్కా హిందూత్వ వాదులు !

23 Saturday Sep 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Religious Intolarence, Women, Women

≈ Leave a comment

Tags

BJP, Chaitra Kundapura, G M Abhinava Halaveerappajja, Karnataka BJP ticket promise case, RSS, VHP


ఎం కోటేశ్వరరావు


ఆమె మూడు పదులు నిండకుండానే అన్ని విధాలుగా పేరు మోసిన కట్టర్‌ హిందూత్వ వాది. అతడు తన మఠం, కాషాయ దుస్తులతో మోసానికి పాల్పడిన మరో కట్టర్‌. వీరితో చేతులు కలిపిన మరో నలుగురితో కలసి వారు ఇప్పుడు బెంగలూరు పోలీసు కస్టడీలో ఉన్నారు. కర్ణాటకలో పక్కా హిందూత్వ వాదులుగా జనంలో ప్రాచుర్యం పొందిన వారు. ఇప్పుడు పక్కా మోసకారులుగా పోలీసుల చేతికి చిక్కారు. సంవత్సరాల తరబడి వారిని ఉపయోగించుకున్న బిజెపి, ఇతర హిందూత్వ సంస్థలు ఇప్పుడు వారితో తమకేమీ సంబంధం లేదని నమ్మబలుకుతున్నాయి. ఉద్రేక, ఉన్మాద ఉపన్యాసాలు చేసి రెచ్చగొట్టటంలో పేరు మోసిన హిందూత్వ నేతగా పేరున్న చైత్ర కుందాపుర, శ్రీ హలస్వామి మహాసంస్థాన్‌మఠ అధిపతి అభినవ హలస్వామి, వారితో చేతులు కలిపిన బిజెపి యువమోర్చ నేతలు, ఇతరులు ఈ కేసులో ఉన్నారు. అధికారంలో ఉన్న పెద్దలతో తమకు ఉన్న సంబంధాలను ఉపయోగించి నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో పోటీకి టిక్కెట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు కొట్టేసేవారి గురించి బయటకు తెలిసేది తక్కువ. ఎందుకంటే చెప్పుకుంటే పరువుపోతుందని అనేక మంది తేలుకుట్టిన దొంగల మాదిరి కిమ్మనరు. కర్ణాటకలో ఇప్పుడు బిజెపి టిక్కెట్ల కుంభకోణం వెల్లడి కావటంతో ఆ పార్టీ ఇప్పుడు ఇరుకున పడింది.తమకేమీ సంబంధం లేదని పార్టీ నేతలు చెబుతుండగా, అగ్రనేతల ప్రమేయం ఉందని కేసుల్లో అరెస్టయిన వారు అంటున్నారు. బిజెపిలో టిక్కెట్లు ఎలా సంపాదించుకొనే అవకాశం ఉందో ఈ మోసం వెల్లడిస్తున్నది.


ఇంతకీ జరిగిందేమిటంటే బిజెపి టికెట్‌ వస్తే దాంతో గెలిచి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించవచ్చనే దురాశతో గోవిందబాబు పూజారి అనే వ్యాపారవేత్త పైన చెప్పుకున్న మోసగాళ్ల ముఠాకు ఐదు కోట్లు సమర్పించుకున్నట్లు సెప్టెంబరు ఎనిమిదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ప్రధాన నిందితుల్లో చైత్ర కుందాపుర, ఆమె అనుచరులను పోలీసు అరెస్టు చేశారు.ఈ వార్త తెలియగానే మరో ప్రధాన నిందితుడు అభినవ హలస్వామి కాషాయ దుస్తులు పక్కన పడేసి మారు వేషంలో తప్పించుకున్నాడు. టీ షర్టు, షార్టు (లాగు కంటే ఎక్కువ, పాంట్స్‌ కంటే తక్కువ పొడవు) వేసుకొని పారిపోతుండగా ఒడిషా పోలీసులు పట్టుకున్నారు. ఉడిపి జిల్లాలోని బైందూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తనకు బిజెపి టిక్కెట్‌ ఇస్తామంటూ డబ్బు తీసుకొని మోసం చేశారని గోవిందబాబు పూజారి అనే వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని, కేంద్ర హౌం మంత్రి కార్యాలయం,ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో తమకు ఉన్న సంబంధాల గురించి చెప్పి డబ్బు వసూలు చేశారన్నది వారి మీద మోపిన నేరం. తనకు ఒకరిని పరిచయం చేసి అతగాడు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అని చెప్పారని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీకి నిధులు అవసరమంటూ చెప్పటంతో అతగాడికి మూడు కోట్లు, మరో రెండు కోట్లు చైత్ర అనుచరులకు చెల్లించినట్లు పూజారి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బు తీసుకున్నప్పటి నుంచి వారంతా తప్పించుకుంటున్నారని తెలిపాడు.


అనేక రాష్ట్రాలలో ఇలాంటి మోసగాళ్లు ఎందరో ఉన్నారు. కర్ణాటకలో 2020లో బెంగలూరు పోలీసులు స్వామి అలియాస్‌ సేవాలాల్‌ అనే జ్యోతిష్కుడు యువరాజ్‌ రామదాస్‌ను అరెస్టు చేశారు.అతగాడు 2014 నుంచి 2020వరకు అనేక మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక గవర్నర్‌, ఒక కేంద్ర మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడితో తనకు సన్నిహిత సంబంధాలున్నట్లు చెప్పేవాడు.2015లో జౌళిశాఖ కేంద్ర మంత్రిగా ఉన్న సంతోష్‌ గాంగవార్‌కు శ్రీకాళహస్తికి చెందిన కోలా ఆనందకుమార్‌ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. కేంద్ర సిల్క్‌బోర్డు చైర్మన్‌ పదవి ఇప్పిస్తానంటూ ఒకటిన్నర కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఈ స్వామికి ఒక ప్రముఖ బిజెపి నేత తనను పరిచయం చేసినట్లు, తన దగ్గర డబ్బు తీసుకున్న తరువాత పదవీ లేదు, స్వామి ముఖంచాటేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆనందకుమార్‌ పేర్కొన్నారు. సదరు స్వామి ఒక ఎంపీని తిరిగి నామినేట్‌ చేయిస్తానని ఇరవై కోట్లు, కర్ణాటక హైకోర్టు మాజీ మహిళా జడ్జికి గవర్నర్‌ పదవి ఇప్పిస్తానంటూ ఎనిమిదిన్నర కోట్లు కోట్లు వసూలు చేశాడు. బిఎస్‌ ఇంద్ర కళ అనే ఆ మాజీ జడ్జి నగదు రూపంలో నాలుగున్నర కోట్లు, ఆర్‌టిజిఎస్‌ ద్వారా రు.3.77 కోట్లు చెల్లించారు. ఆమెను ఢిల్లీ తీసుకువెళ్లి కొంత మంది బిజెపి అగ్రనేతలను పరిచయం చేశారట.ఆమె 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తులుగా ఎలాంటి వారు ఎంపిక అవుతున్నారు, గవర్నర్‌ పదవులను కొనుక్కోవటం ఎంత సులభంగా ఉంటుందో డబ్బు, పలుకుబడి కలవారి ప్రయత్నాల గురించి ఈ ఉదంతం వెల్లడించింది.బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతో ఉన్న పలుకుబడితో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించమని ఒక డాక్టర్‌ 30లక్షలు సమర్పించుకున్నారట.2019లో స్వామి తనను పది కోట్లకు మోసం చేసినట్లు శశికాంత్‌ బంద్రే అనే వాణిజ్యవేత్త ఫిర్యాదు చేసిన తరువాత పైన పేర్కొన్న మోసాలన్నీ వెలుగులోకి వచ్చాయి.


ఇక హిందూత్వ నాయకురాలు చైత్ర కుందాపూర్‌, ఆమె గాంగ్‌ మోసం చేసిన తీరు గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోసగాళ్ల ముఠాలో స్వామీజీతో పాటు కబాబ్‌లు తయారు చేసి అమ్ముకొనే వ్యక్తి , ఒక క్షురకుడు ఉన్నారు.తమ సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి, ప్రధాని కార్యాలయంలో తనకు పెద్ద తలకాయలు ఎందరో తెలుసని చైత్ర ప్రచారం చేసుకుంది. 2022లో వ్యాపారవేత్త పూజారికి ప్రసాద్‌ బైదూర్‌ అనే వ్యక్తిని పరిచయం చేసి అతను బిజెపి కార్యకర్త అని చెప్పారు. చైత్ర తలచుకుంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఏదైనా సాధించగలదని అతను పూజారిని నమ్మించాడు. అది బాగా పని చేసిందని గ్రహించిన తరువాత ఆ ముఠా గగన్‌ కదూర్‌, రమేష్‌ నాయక్‌ అనే వారిని పరిచయం చేశారు. రమేష్‌ తన పేరును దాచి తాను చిక్‌మగళూరుకు చెందిన విశ్వనాధ్‌ అనే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతనని గత 45 ఏండ్లుగా పని చేస్తున్నట్లు నమ్మించాడు. తరువాత బెంగలూరులోని ధనికులు నివాసం ఉండే ప్రాంతంలో చెన్నా నాయక్‌ అనే అతన్ని బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడని పరిచయం చేశారు. ఒక పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు పొందిన 110 సంవత్సరాల తిమ్మక్క కుమారుడు ఉమేష్‌తో గగన్‌ కదూర్‌కు పరిచయం ఉంది. ఆమెకు వయసు పైబడటంతో కాబినెట్‌ స్థాయి కల్పించి ఒక కారు కూడా ఇచ్చారు.ఉమేష్‌ను ఒప్పించి ఆ కారులో చెన్నానాయక్‌, ఇతర ముఠా పూజారిని కలిశారు. అధికారిక కారును చూసి నిజంగానే పలుకుబడి కలిగిన వారని పూజారి నమ్మాడు. టిక్కెట్‌ కనుక రాకపోతే ఇచ్చిన సొమ్ము పూర్తిగా తిరిగి ఇస్తామని రమేష్‌ నాయక్‌ నమ్మబలికాడు. మూడు రోజుల్లో 50 లక్షలు, తరువాత మూడు కోట్ల మేర వసూలు చేశారు. ఆ సొమ్ములో ఒకటిన్నర కోట్లు అభినవ హలశ్రీ స్వామి అనే మఠాధిపతికి చెల్లించినట్లు పూజారి పేర్కొన్నాడు.2022 జూలై ఏడు నుంచి 2023 జనవరి 16 వరకు మొత్తం ఐదు కోట్లు సమర్పించుకున్నాడు.


బిజెపి అభ్యర్ధులను ప్రకటించటానికి కొద్ది రోజుల ముందు కాశ్మీరులోని ఒక ఆసుపత్రిలో ఆర్‌ఎస్‌ఎస్‌నేత విశ్వనాధ్‌ మరణించినట్లు గగన్‌ కదూర్‌ చెప్పాడు. అనుమానం వచ్చిన పూజారి విచారించగా అసలు ఆ పేరుగల వ్యక్తి లేడని తేలింది.దాంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయటంతో మోసగాళ్ల ముఠా తప్పించుకు తిరిగింది.చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అరెస్టు చేశారు. సెప్టెంబరు పన్నెండు నుంచి హలశ్రీ స్వామి పరారీలో ఉండి పందొమ్మిదవ తేదీ రాత్రి ఒడిషా పోలీసులకు చిక్కాడు. ఇంతకీ రమేష్‌ నాయక్‌ చిక్‌మగలూర్‌లోని ఒక క్షురకుడు అని తేలింది. చెన్నానాయక్‌ బెంగలూర్‌ కెఆర్‌ పురంలో వీధుల్లో కబాబ్‌లు అమ్ముతాడని పోలీసులు గుర్తించారు. పూజారి నుంచి కొట్టేసిన సొమ్ములో భారీ మొత్తాని చైత్ర నొక్కేసింది. కుందాపురలోని ఒక సహకార బాంకులో రు.1.8 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్లు, రు.65లక్షలు పెట్టి బంగారు నగలు కొన్నట్లు, మరో రు.40లక్షలను ఒక బంధువు సాయంతో శ్రీరామ్‌ బాంక్‌లో డిపాజిట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరొక బాంకులాకర్‌ నుంచి రు.23లక్షల బంగారు బిస్కట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక నలభై లక్షలు వెచ్చింది చైత్ర తనకు కొత్త ఇంటి నిర్మాణంతో పాటు తన సోదరి ఇంటిని 15లక్షలతో మరమ్మతు చేయించినట్లు, పన్నెండు లక్షలతో కియా కారు కొన్నట్లు తేలింది. గగన్‌ కదూర్‌ వివాహానికి రు.35లక్షలు ఖర్చు చేసి పది లక్షలతో కొత్త కారు కొన్నారు, రమేష్‌ నాయక్‌ రు.1.5లక్షలు, చెన్నా నాయక్‌కు రు.93వేలు ఇచ్చారు. తమ ముఠాలోని ఆరుగురు మూడు కోట్లు తీసుకున్నట్లు చైత్ర పోలీసులకు వెల్లడించింది. స్వామీజిని అరెస్టు చేస్తే దీని వెనుక ఉన్న పెద్దల గురించి తెలుస్తుందని కూడా చెప్పిందని పోలీసులు చెప్పారు.ఆమెను ప్రశ్నిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకేమీ కాలేదని తరువాత తేలింది. బిజెపి నేత ఒకరు ఈ ముఠావెనుక ఉన్నట్లు రాష్ట్ర మంత్రి ఆర్‌బి తిమ్మాపూర్‌ ఆరోపించారు. కొంత మందికి టిక్కెట్లు రాకపోవటంతో ఇలాంటి మోసాలన్నీ వెలుగు చూస్తున్నాయని మాజీ సిఎం, బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీష్‌ షెట్టార్‌ అన్నారు.రియలెస్టేట్‌ బిజినెస్‌లో ఉన్నవారికి టిక్కెట్లు ఇచ్చారని విమర్శించారు. అరెస్టు చేసిన వారెవరూ అసలు తమకు తెలియదని బిజెపి నేతలు చెబుతున్నారు.ఈ కేసులో ఇప్పటి వరకు 80శాతం కొట్టేసిన సొమ్ము ఆచూకీ దొరికినట్లు పోలీసులు చెప్పారు.


ఒకటిన్నర కోట్లు తీసుకున్న హలశ్రీ స్వామి తప్పించుకోగా అతని కారు డ్రైవర్‌ పోలీసులకు దొరికాడు. సెప్టెంబరు ఎనిమిదవ తేదీన గోవింద పూజారి కేసు దాఖలు చేశారు. పన్నెండవ తేదీన చైత్రను ఉడిపిలో అదుపులోకి తీసుకున్నారు. అది తెలిసిన స్వామి ఆ రోజు హాజరు కావాల్సిన ఒక కార్యక్రమానికి వెళ్ల కుండా తప్పించుకున్నాడు. మైసూరు పారిపోయే ముందు నాలుగు కొత్త సిమ్‌ కార్డులు, నాలుగు కొత్త ఫోన్లు కొన్నాడట, పారిపోతున్నపుడు కారు నంబరు ప్లేటును తొలగించారు, తరువాత కారును ఒక బంధువు ఇంట్లో ఉంచి, కర్ణాటక నుంచి తప్పించుకున్నాడు. భువనేశ్వర్‌ నుంచి బుద్ధ గయకు రైలులో వెళుతుండగా కటక్‌ వద్ద పోలీసులకు దొరికాడు. మైసూరు నుంచి హైదరాబాద్‌, పూరీ, కోణార్క్‌ వెళ్లి అక్కడి నుంచి వారణాసి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు దొరికాడు. గోవింద పూజారి నుంచి తీసుకున్న సొమ్ముతో వ్యవసాయ భూమి కొనుగోలు, ఒక పెట్రోలు బంకులో పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు.


విద్యార్ధినిగా ఉండగా ఎబివిపిలో పని చేసిన చైత్ర కొన్ని పత్రికల్లో జర్నలిస్టుగా, స్పందన అనే టీవీలో యాంకర్‌గా పని చేసింది. హిందూత్వ కార్యకర్తగా మైనారిటీల మీద రెచ్చగొట్టే ప్రసంగాలతో అనేక పాత్రల్లో కనిపించిన చైత్ర 2018లో ఉడిపి పట్టణంలో కాంగ్రెస్‌ మీద ధ్వజమెత్తి వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రులు కూడా ఆమెను ఆకాశానికి ఎత్తారు. ముస్లింల మీద విద్వేష పూరిత ప్రసంగాలు చేసినందుకు ఆమె మీద కేసులు కూడా నమోదు చేశారు.ఈ ఉపన్యాసాలకు భజరంగ్‌దళ్‌, విశ్వహిందూపరిషత్‌ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, సభలు, సమావేశాలే వేదికలు.2021లో ఒక సభలో ముస్లింలు, క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరవై మూడు శాతం ఉన్న మీకే ఇంత అహం ఉంటే 70శాతంగా ఉన్న హిందువులకు ఎంత ఉండాలి ?ఇదే మీకు చివరి హెచ్చరిక, మీరు గనుక లౌ జీహాద్‌ను మానుకుంటేనే మీరు బతికి ఉంటారు, 70శాతం హిందువులు 23శాతం మందిని మార్చాలని అనుకుంటే, లౌ జీహాద్‌కుపూనుకుంటే రెండు రోజులు చాలు మీ ఇండ్లలో ఒక్క బుర్కా కూడా కనిపించదు. మేము ప్రతి ముస్లిం యువతి నుదుటి మీద తిలకం దిద్దుతాం అని రెచ్చగొడుతూ మాట్లాడారు. ఆమె గత ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేశారు. శ్రీరామ్‌ సేన నేత ప్రమోద్‌ ముతాలిక్‌తో కలసి వేదికలను పంచుకున్నది. రెచ్చగొట్టే ప్రసంగాలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందును కలుబుర్గి జిల్లాలో అలంద్‌ తాలుకాలో వారం రోజుల పాటు తిరగ కుండా జిల్లా కలెక్టర్‌ ఈ ఏడాది ప్రారంభంలో నిషేధం విధించారు. 2018లో సర్పపూజ్‌ ఎలా చేయాలనే అంశంపై గొడవ పడి గురుప్రసాద్‌ పంజా అనే హిందూ జాగరణ్‌ వేదిక కార్యకర్తమీద చేయి చేసుకున్న కేసులో అరెస్టయింది.


అవివాహిత అయిన చైత్ర కుందాపుర మీద ఉడిపిలో బిజెపి కార్యకర్త సుధీన్‌ ఒక కేసు దాఖలు చేశాడు. తన కోసం ఒక దుకాణాన్ని కట్టిస్తానని చెప్పి ఆమె ఐదు లక్షలు తీసుకున్నదని, అది చేయకపోగా సొమ్ము వాపసు అడిగితే అత్యాచారం చేసినట్లు కేసు పెడతానని , హత్య చేయిస్తానని బెదిరించినట్లు పేర్కొన్నాడు. బిజెపి టిక్కెట్‌ పేరుతో సొమ్ము తీసుకున్న వ్యాపారి పూజారిని కూడా బెదిరించినట్లు వెల్లడైంది. అరెస్టుకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఒక లేఖ రాసి అతని వాణిజ్య లావాదేవీల మీద విచారణ జరపాలని, దర్యాప్తుకు తాను సహకరిస్తానని పేర్కొన్నది. తాను జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి గోవిందబాబు పూజారి తెలుసునని, బిజెపి టిక్కెట్‌ కోసం చూశాడని, తాను ఒక ప్రైవేటు కంపెనీలో పని చేసినపుడు అతని అక్రమ లావాదేవీల గురించి తెలుసుకున్నట్లు రాసింది. అతని అక్రమాలను బయట పెట్టేందుకు అతనితో సంబంధాల్లో ఉండి సమాచారం సేకరించినట్లు చెప్పుకుంది. చిత్రం ఏమిటంటే సదరు పూజారికి ఎంఎల్‌ఏ టిక్కెట్‌ రాకున్నా, ఎన్నికలకు ముందు బిజెపి వెనుకబడిన తరగతుల మోర్చా కార్యదర్శి పదవిని బహుకరించారు. ఏ నియోజకవర్గంలో టికెట్‌ను ఆశించాడో అదే చోట బిజెపి అభ్యర్ధికి ప్రచారం చేశాడు. అనేక మంది నేతలతో సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఒక గుర్తింపు పొందాడు. అధికారం వచ్చిన తరువాత ఆ సొమ్మును ఏదో విధంగా రాబట్టుకోవచ్చని భావించి ఉండాలి. బిజెపి ఓడిపోవటం, పార్టీ పదవి ఉన్నా ప్రయోజనం లేదని గ్రహించిన తరువాత తన సొమ్ము తనకు ఇచ్చివేయాలని డిమాండ్‌ చేయటంతో అసలు కథ బట్టబయలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

అంతన్నాడింతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు : పదేండ్ల నరేంద్రమోడీ పాలనలో ఎగుమతులు తగ్గాయన్న ప్రపంచ బాంక్‌ !

16 Saturday Sep 2023

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

#Failed Narendra Modi, 10 years Narendra Modi, BJP, China, Donald trump, India Exports, India Imports, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు మనల్ని నిలదీస్తారు. అంతే కాదు ప్రపంచ దేశాల్లో 2022 సౌదీ అరేబియా తప్ప జి-20 దేశాల్లో 6.7శాతంతో మన దేశమే అగ్రస్థానంలో ఉంది. మరి అలాంటపుడు మన దిగుమతులు కూడా ఎందుకు తగ్గినట్లు ? తాజాగా వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్‌ బరత్వాల్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం వర్తమాన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు మన ఎగుమతులు 11.9శాతం తగ్గి 172.95 బిలియన్‌ డాలర్లుండగా మన దిగుమతులు 12శాతం తగ్గి 271.83 బి.డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే మన వాణిజ్య లోటు 112.85 నుంచి 98.88 బి.డాలర్లకు తగ్గింది. అంటే పద్నాలుగు బిలియన్‌ డాలర్ల మేర మన విదేశీమారక ద్రవ్యం మిగిలింది. కానీ సెప్టెంబరు 16వ తేదీ సమాచారం ప్రకారం గడచిన పదకొండు వారాలలో ఐదు బిలియన్‌ డాలర్లు తగ్గి మన నిల్వలు 593,9బి.డాలర్లకు చేరాయి. మన దిగుమతులు గతేడాది మాదిరిగా ఉంటే వాటి పరిస్థితి ఇంకా దిగజారి ఉండేది.

అంతన్నాడింతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు, హస్కన్నడు బుస్కన్నాడే గంగరాజు అంటూ సాగే జానపద గీతంలో మాదిరి పదేండ్ల నుంచి ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన కబుర్లేమిటో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.
గుజరాత్‌ తరహాలో దేశమంతటినీ అభివృద్ధి చేస్తామన్నారు. నల్లధనాన్ని వెలికి తీసి ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామని చెప్పారు. ఎగుమతులతో చైనాను వెనక్కు నెట్టేసేందుకు గాను మేడిన్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భరత పధకాలను ప్రకటించారు. గంగరాజు మురిపించిన మాదిరి కబుర్లు తప్ప పరిస్థితి ఇంకా దిగజారింది తప్ప మెరుగుపడలేదు. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్ప కేంద్రం ప్రకటించిన ఆర్ధిక విధానాలనే రాష్ట్రాలు అమలు జరుపుతున్నాయి.మెజారిటీ రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలోనే కొనసాగుతున్నాయి. గ్లోబల్‌ ఫైనాన్స్‌ అనే పత్రికలో 2023 జూన్‌ ఎనిమిదవ తేదీన ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం 2018 నుంచి 2022 వరకు ఐదు సంవత్సరాల కాలంలో మన సగటు వృద్ధి రేటు 4.1శాతం కాగా, దిగజారిందీ, తీవ్ర ఆర్థిక సమస్యలతో ఉందని చెబుతున్న చైనాలో 5.5 శాతం ఉంది. వికీపీడియా సమాచారం ప్రకారం 2022లో ఎగుమతులలో ప్రధమ స్థానంలో ఉన్న చైనా వస్తు, సేవల విలువ 3,71,582.7 కోట్ల డాలర్లు కాగా, అమెరికా 3,01,185.9 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. మనదేశం 76,771.7 కోట్లతో పదవ స్థానంలో ఉంది. పదిహేనవదిగా ఉన్న హాంకాంగ్‌ ఎగుమతుల విలువ 69,829.3 కోట్ల డాలర్లు. చైనా తన ఉత్పత్తులు కొన్నింటిని హాంకాంగ్‌ పేరుతో ఎగుమతి చేస్తున్న సంగతి బహిరంగమే. ప్రపంచ జిడిపిలో దేశాన్ని నరేంద్రమోడీ ఐదవ స్థానంలోకి తీసుకుపోయినట్లు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నవారు ఎగుమతుల్లో ఎందుకు తీసుకుపోలేదన్నది ప్రశ్న. ప్రపంచబాంకు విశ్లేషణ ((https://data.worldbank.org/indicator/NE.EXP.GNFS.ZS?locations=IN ) )ప్రకారం 2004లో యుపిఏ అధికారంలోకి వచ్చినపుడు మన జిడిపిలో వస్తు, సేవల ఎగుమతుల విలువ 17.9 శాతం కాగా 2013 నాటికి 25.3కు పెరిగింది. మరుసటి ఏడు 23శాతంగా ఉంది. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత అది క్రమంగా తగ్గుతూ 2019లో 18.7కు దిగజారింది. తరువాత 2022లో 22.4శాతం ఉంది.1960 నుంచి 1990 వరకు మన జిడిపిలో ఎగుమతుల విలువ 4.5 నుంచి 7.1శాతం మధ్య ఉంది. నూతన ఆర్థిక సంస్కరణల పేరుతో ఆర్ధిక విధానాల్లో మార్పుల తరువాత అది 1998 నాటికి 11 శాతానికి చేరింది. బిజెపి నేత అతల్‌ బిహారీ వాజ్‌పాయి అధికారంలో ఉన్న 1998-2004కాలంలో పైన చెప్పుక్నుట్లు 17.9శాతానికి పెరిగింది. నరేంద్రమోడీ ఏలుబడిలోనే తొలిసారిగా పదేండ్ల కాలంలో పతనమైంది. ఎగుమతులను పెంచేందుకు ప్రతి దేశమూ చర్యలు తీసుకుంటున్నపుడు మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నవాటిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒక నిర్దిష్ట విధానం, నిలకడ, స్పష్టత లేని, సరైనవి కాని విధానాలను అమలు జరిపినపుడు అవి జయప్రదం కావు. మన దేశంలో జరిగిందీ, జరుగుతున్నదీ అదే. జనానికి ఏం చెప్పారు, ఆచరణలో ఏం చేస్తున్నారన్నదే ప్రశ్న.


చైనాతో సరిహద్దు ఉన్న గాల్వన్‌ లోయలో 2020లో జరిగిన ఉదంతంలో మన సైనికుల మీద చైనా మిలిటరీ దాడి చేసి చంపినదానికి ప్రతీకారం అంటూ నాడు చైనా యాప్‌ల మీద నిషేధం, చైనా నుంచి పెట్టుబడులు రాకుండా ఆంక్షల విధింపు హడావుడి చేసిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. దాంతో అనేక మంది చైనా ఉత్పత్తులు బహిష్కరిస్తే అది మన కాళ్ల దగ్గరకు వస్తుందని, నరేంద్రమోడీ అందుకు సమర్ధులని ప్రచార ఆర్భాటం చేశారు. జనాల మనోభావాలను సంతుష్టీకరించి చైనాను దెబ్బతీసిన మొనగాడిగా నరేంద్రమోడీ కనిపించిన సంగతి తెలిసిందే.యాప్‌లు, పెట్టుబడులు మన రక్షణను దెబ్బతీస్తాయని చెబితేే జనమంతా నిజమే కామోసు అనుకున్నారు. మోడీ మీద ఉన్న భ్రమ అలాంటిది. సరిహద్దు వివాదం, 1962లో యుద్ధం జరిగినప్పటికీ తరువాత కాలంలో రెండు దేశాలూ వివాదాలకు దౌత్య సంబంధాలకు, వాణిజ్యానికి ముడిపెట్టకూడదన్న అవగాహనకు వచ్చాయి. దాని ఫలితం, పర్యవసానమే నరేంద్రమోడీ- షీ జింపింగ్‌ ఇద్దరూ కలసి ఊహాన్‌-మహాబలిపురాల్లో ఉయ్యాలలూగేందుకు దోహదం చేసింది. గాల్వన్‌ ఉదంతాలు తీవ్ర విచారకరమైనవి. కానీ వాటికి-వాణిజ్యానికి లంకెపెట్టి హడావుడి చేసిన పెద్దలు ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా తమ మాటలను తామే దిగమింగి పెద్ద ప్రచారం లేకుండా చైనా సంస్థలకు తిరిగి స్వాగతం పలుకుతున్నారు. ఇది రక్షణకు ముప్పులేదని అంగీకరించటమే కదా ! మన దేశంతో సరిహద్దులు కలిగి ఉన్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయించింది. చైనా మినహా మిగిలిన దేశాలన్నీ మన నుంచి పెట్టుబడులను తీసుకొనేవే తప్ప పెట్టుబడులు పెట్టే సత్తా వాటికి లేదన్నది తెలిసిందే. అందుకే ఆ నిబంధన చైనాను కట్టడి చేసేందుకే అన్నది స్పష్టం. కానీ సూటిగా ఆ మాట చెప్పే ధైర్యం మోడీ సర్కార్‌కు లేదు. కొండంత ప్రతికూల రాగం తీసి కీచు గొంతుతో మాట్లాడుతున్నట్లు ఇప్పుడు దారి తెరిచారు.


మన దేశంలో షియోమీ ఫోన్లను సరఫరా చేసే డిక్సన్‌ టెక్నాలజీస్‌ భాగస్వామ్యంతో సెల్‌ ఫోన్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు పోతున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌ తెలిపింది. నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో రానున్న మూడు సంవత్సరాల్లో మూడు లక్షల చదరపు అడుగుల్లో స్మార్ట్‌ ఫోన్ల యూనిట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు, వచ్చే నెలలో ప్రారంభించనట్లు వార్తలో పేర్కొన్నారు. ఇదే విధంగా మన దేశంలోని అప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థకు బ్లూటూత్‌ నెక్‌బాండ్‌ ఇయర్‌ ఫోన్ల తయారీ కాంట్రాక్టును కూడా అదే కంపెనీ అప్పగించింది. ఇటీవలి కాలంలో షియోమీ కంపెనీ మీద విధించిన ఆంక్షలు, ఇతర కారణాలతో మన దేశంలో దాని ఉత్పత్తుల విక్రయం తగ్గింది. ఈ ఒప్పందాలతో ఆటంకాలను అధిగమించి తిరిగి మార్కెట్‌ వాటాను పెంచుకోవచ్చని భావిస్తున్నారు.చట్టబద్దంగా, మన చట్టాలకు అనుగుణంగా పని చేసే చైనాతో సహా ఏ దేశానికి చెందిన ఏ సంస్థనైనా అనుమతిస్తామని ఐటి, ఎలక్ట్రానిక్స్‌ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనా సరఫరా వ్యవస్థ నుంచి వైదొలగాలని అమెరికా, ఇతర ఐరోపా దేశాల గీతానికి మన దేశం కోరస్‌గా గొంతు కలిపింది. అయితే చైనా మీద ఆధారపడకుండా మనుగడ కష్టమని గడచిన మూడు సంవత్సరాల అనుభవతత్వం బోధపడటం, మన దేశంలోని కార్పొరేట్‌ సంస్థల వత్తిడి, ఇతర దేశాలకు చెందిన కంపెనీలు ముందుకు రాకపోవటం, చైనా నుంచి కంపెనీలు వియత్నాంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు పూనుకోవటం వంటి పరిణామాలతో చైనా కంపెనీల గురించి కేంద్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాల్సి వచ్చిందన్నది స్పష్టం. తన వైఖరిని సమర్ధించుకొనేందుకు మనదేశ కంపెనీలకు 51శాతం వాటా ఉండాలన్న నిబంధన విధించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు 2022 డిసెంబరులోనే కేంద్ర ప్రభుత్వ అధికారులు మీడియాకు లీకులు వదిలారు. గాల్వన్‌ ఉదంతాల తరువాత విధించిన ఆంక్షల ప్రకారం 2020-21లో చైనా నుంచి వచ్చిన 58 ఎఫ్‌డిఐ ప్రతిపాదనలను, మరుసటి ఏడాది మరో 33 ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించింది.సంయుక్త రంగంలో విద్యుత్‌ వాహనాల తయారీకి వంద కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామన్న చైనా బివైడి కంపెనీ ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. అయినప్పటికీ ఆ ప్రతిపాదన కూడా ఇంకా పరిశీలనలోనే ఉందని చెబుతున్నారు.2023 మార్చి 21 నాటికి చైనా లేదా హాంకాంగ్‌ నుంచి వచ్చిన 54 పెట్టుబడి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు తెలిపారు.


ప్రతి దేశం తన స్వంత పరిశ్రమలు, వాణిజ్యాన్ని కాపాడుకొనేందుకు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నది. దానికి మనదేశం కూడా మినహాయింపు కాదు. నరేంద్రమోడీ సర్కారు కూడా ఆర్ధిక ఆయుధాలను ప్రయోగించి పరీక్షిస్తున్నది.చైనా విషయంలో అవి పని చేయటం లేదన్నది గత పది సంవత్సరాల అనుభవం చెబుతున్నది. చైనా నుంచి మన దిగుమతులు దాదాపు రెట్టింపు కావటమే దానికి నిదర్శనం. అదే మాదిరి మన ఎగుమతులు పెరగలేదు. ఐఎంఎఫ్‌ సమాచారం ప్రకారం రెండు దేశాల మధ్య 2022లో 117 బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగితే చైనా నుంచి దిగుమతుల వాటా 87శాతం ఉంది. మన దేశం నుంచి రొయ్యలు, పీతల వంటి సముద్ర ఉత్పత్తులు, పత్తి, గ్రానైట్‌, వజ్రాల వంటి వాటిని ఎగుమతి చేస్తుంటే చైనా నుంచి ఎలక్ట్రానిక్‌ చిప్స్‌,ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లు, ఔషధాల తయారీకి అవసరమైన పదార్ధాలను దిగుమతి చేసుకుంటున్నాము. మన ఉత్పత్తుల ఎగుమతి నిలిపివేసినా చైనా వాటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కానీ చైనా నుంచి మనం తెచ్చుకుంటున్న వస్తువులను అంత తక్కువ ధరలకు మరేదేశమూ ఇవ్వని కారణంగానే మరో మార్గం లేకౖ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అనుమతించకపోతే కార్పొరేట్ల ఆగ్రహానికి మోడీ గురికావాల్సి వస్తుంది.


ఇక మనదేశం తీసుకుంటున్న రక్షణాత్మక చర్యల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆగస్టు మొదటి వారంలో అంబానీ కంపెనీ జియో లాప్‌టాప్‌లు,టాబ్‌లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. అంతకు ముందు అదే కంపెనీ వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకొని మార్కెట్‌ చేసింది. ఇప్పుడు విడిభాగాలను దిగుమతి చేసుకొని ఇక్కడ అసెంబ్లింగ్‌ చేస్తూ తన పేరు పెట్టుకుంది. సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాప్‌టాప్‌ల దిగుమతులపై ఆంక్షలు విధించి అవసరమైన వారు అనుమతి తీసుకోవాలంటూ నిబంధన విధించింది.ఇంతకాలం లేని అనుమతులు ఇప్పుడెందుకు ? ఇది ఎవరికోసమో చెప్పనవసరం లేదు. 2018లో అమెరికా అధినేతగా ఉన్న ట్రంప్‌ చైనా వస్తువుల మీద దిగుమతి పన్ను విధిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీశాడు. అదే ఏడాది మన కేంద్ర ప్రభుత్వం చైనా ఫోన్ల దిగుమతులను అడ్డుకొనేందుకు ఇరవైశాతం పన్ను విధించింది. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా బొమ్మలపై అప్పటికే ఉన్న దిగుమతి పన్నును 60, తరువాత 2021లో 70శాతానికి పెంచింది.షియోమీ, బిబికె ఎలక్ట్రానిక్స్‌ చెల్లించాల్సినదాని కంటే తక్కువ పన్ను చెల్లించినట్లు ఆరోపించి ఆ సంస్థల మీద దాడులు చేశారు. మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఉత్పాదక ఎగుమతి బోనస్‌గా చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం 33 బిలియన్‌ డాలర్లను పక్కన పెట్టి ఒక పధకాన్ని రూపొందించింది. అందుకోసం పద్నాలుగు రంగాలను గుర్తించింది, వాటిలో ఎక్కువగా చైనా కంపెనీల ఆధిపత్యమే కొనసాగుతున్నది. చివరకు ఇప్పుడు ఆ చైనా కంపెనీల పెట్టుబడులకే అనుమతులు ఇచ్చి ఉత్పత్తులు చేయించేందుకు, సబ్సిడీలు ఇచ్చి ఎగుమతు చేయించేందుకు పూనుకుంది. స్థానిక కంపెనీలతో కలసి సంయుక్త సంస్థలను ఏర్పాటు చేయాలనే షరతు విధించింది. గతంలో నిషేధం విధించిన షి ఇన్‌ కంపెనీ మన అంబానీ రిలయన్స్‌తో ఒప్పందం చేసుకోవటంతో కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతించింది. ఎందుకు అంటే సదరు కంపెనీ ఇప్పుడు సింగపూర్‌లో ఉందని చెబుతున్నారు. ఎక్కడున్నా అది చైనా కంపెనీయే, లాభాలు వెళ్లేది చైనాకే కదా ! గతేడాది మన దేశం దిగుమతి చేసుకున్న ఉక్కు ఉత్పత్తుల్లో జూన్‌ నెలలో చైనా నుంచి 26.1, వియత్నాం నుంచి ఒకశాతం ఉండగా ఈ ఏడాది జూన్‌ నాటికి అవి 37.1, 4.8 శాతాలకు పెరిగాయి. చైనా ఉక్కు ఉత్పత్తుల దిగుమతి కారణంగా తమకు నష్టం జరుగుతోందని అందువలన వాటి మీద సబ్సిడీ వ్యతిరేక పన్ను విధించాలని మన ఉత్పత్తిదారులు చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే తిరస్కరించింది. దానికి తగిన ఆధారాలు లేవంది. ఇది చైనాను ప్రసన్నం చేసుకొనే చర్యగా ఆ రంగానికి చెందినవారు భావిస్తున్నారు. రాజకీయం, వివాదాస్పదం చేయటం, తిరిగి అదే చైనాకు అనుమతులు ఇవ్వటమెందుకు అంటే లేకుంటే కార్పొరేట్ల లాభాలకు గండి పడుతుంది, అప్పుడు వాటి కన్నెర్రకు గురి కావాల్సి వస్తుంది, చివరికి అధికారానికే ఎసరు వస్తుంది గనుక, కాదంటారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d