• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: BJP

అమెరికా సాయం అసలు కథేంటి ? మోడీ సర్కార్‌ ఎందుకు మౌనంగా ఉన్నట్లు ?

22 Saturday Feb 2025

Posted by raomk in Africa, BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Joe Biden, Narendra Modi Failures, RSS, sangh parivar, USAID

ఎం కోటేశ్వరరావు


మన ఎన్నికలలో ఓటర్లు ఎక్కువగా పాల్గొనేందుకు ప్రోత్సాహ చర్యలు తీసుకొనేందుకు అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యాన నడిచే ఏజన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (యూఎస్‌ఎయిడ్‌) సంస్థ 21 మిలియన్‌ డాలర్లు (రు.182 కోట్లు) మంజూరు చేసింది. దీన్ని జో బైడెన్‌ సర్కార్‌ కేటాయిస్తే డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ ఆ నిర్ణయాన్ని 90 రోజుల పాటు స్థంభింపచేస్తూ జనవరి 20న ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశాడు. నిజానికి ఈ మొత్తాన్నే కాదు, ప్రపంచమంతటా వివిధ దేశాలకు ఇస్తున్న మొత్తాలపై ఈ నిర్ణయం జరిగింది. భారత్‌ దగ్గర చాలా డబ్బుంది, అక్కడ ఓటర్లను ప్రోత్సహించేందుకు మనమెందుకు డబ్బివ్వాలంటూ ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఈ సొమ్మును గతంలో ఇచ్చారా, రాబోయే రోజుల్లో ఖర్చుచేసేందుకు మంజూరు చేశారా, విడుదల చేశారా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. బిజెపి నేతలు అమిత్‌ మాలవీయ, రాజీవ్‌ చంద్రశేఖర్‌ల స్పందన చూస్తే ఈ మొత్తం ఖర్చు చేసినట్లుగా అర్ధం అవుతున్నది. ‘‘ ఓటర్లు బారులు తీరేందుకు 21 మిలియన్‌ డాలర్లా ? ఇది కచ్చితంగా భారత్‌ ఎన్నికల ప్రక్రియలో విదేశీ జోక్యమే. దీన్నుంచి ఎవరు లబ్ది పొందారు ? అధికారపక్షమైతే కచ్చితంగా కాదు ’’ అని అమిత్‌ మాలవీయ చెప్పారు. రాజుగారి చిన్న భార్య అందగత్తె అంటే పెద్ద భార్య అనాకారి అనేకదా అన్నట్లుగా అధికారంలో ఉన్న బిజెపి గాకపోతే కాంగ్రెస్‌ లబ్దిపొందినట్లు ఆరోపించటమే కదా ? ఈ మాత్రం అర్ధం చేసుకోలేనంత అమాయకంగా మన జనాలు ఉన్నారా ?ప్రజాస్వామ్యాలను బలహీనపరచటం, జోక్యం చేసుకోవాటానికి ఇది నిదర్శనం అని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రకటించారు.ఒక వైపు ప్రజాస్వామిక విలువల గురించి చర్చ చేస్తూ మరోవైపు నిర్లజ్జగా ప్రజాస్వామిక దేశాలను బలహీనపరిచేందుకు పూనుకోవటం దిగ్భ్రాంతి కలిగిస్తున్నదన్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. శుక్రవారం నాడు విదేశాంగశాఖ ప్రతినిధి మాట్లాడుతూ తామీ సమాచారాన్ని చూశామని, సహజంగానే ఇది ఎంతో ఆందోళన కలిగిస్తుంది, భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం గురించి ఆందోళనకు దారి తీసింది. సంబంధిత శాఖలు, ఏజన్సీలు దీని గురించి చూస్తున్నాయి, ఈ దశలో బహిరంగంగా ప్రకటించటం తొందరపాటు అవుతుంది,తరువాత చెబుతాము అన్నారు.

నిజానికి ఇంత స్వల్ప మొత్తంతో ప్రభావితమై ఒక రాష్ట్రం లేదా దేశంలో ఓటర్లు కుప్పలు తెప్పలుగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తారా ? ఒక్కో ఎంపీ అభ్యర్థి వంద కోట్లు, ఎంఎల్‌ఏ పాతిక కోట్ల వరకు ఖర్చు పెడుతుంటేనే మాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, వేరేవారికి ఎక్కువ ఇచ్చారంటూ నిరసనలతో అందరూ రావటం లేదు. ఏ మూలన చీమ చిటుక్కుమన్నా పసిగట్టే అమెరికన్లకు ఇంత చిన్న విషయం తెలియదా ? తామిచ్చే 182 కోట్లతో ఓటర్లు బారులు తీరతారా ? సాక్షాత్తూ అమెరికా ప్రభుత్వం వెల్లడిరచిన ఈ అంశం మీడియాలో చర్చకు దారితీసింది. వాస్తవాలను వెల్లడిరచేవరకు ఇది చర్చలో ఉంటుంది. సూది కోసం సోదికి పోతే పాత బాగోతాలన్నీ బయటపడినట్లు ఈ వ్యవహారంలో ఎంత పాత్ర ఉందో తెలియదు గానీ అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీణా రెడ్డి అనే ఆమె 2021 ఆగస్టు నుంచి 2024 జూలై వరకు అమెరికా సాయ ఏజన్సీ భారత డైరెక్టర్‌గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నించారని తాను ఊహిస్తున్నట్లు ట్రంప్‌ ఒక సాధారణ వ్యాఖ్య చేశాడు. 2014కు ముందు పెద్ద మొత్తంలో అమెరికా సాయం వచ్చిందని, తాము అధికారంలోకి వచ్చాక నామమాత్రమని బిజెపి పెద్దలు చెబుతున్నారు. అదే నిజమైతే ఆ సొమ్మును మోడీ గెలుపుకోసం వినియోగించినట్లు ఎందుకు భావించకూడదు ? ఒక వేళ కాంగ్రెస్‌ కోసం ఖర్చు చేసి ఉంటే పదేండ్ల నుంచి బిజెపి పాలకులు నిజాల నిగ్గుతేల్చకుండా ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? బిజెపి మాజీ ఎంపీ మహేష్‌ జత్మలానీ వీణా రెడ్డి గురించి ఒక ట్వీట్‌ చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఆమె అమెరికా వెళ్లారని ఇక్కడ ఉంటే దర్యాప్తు సంస్థలు ఈ సొమ్ము గురించి ప్రశ్నించి ఉండేవారన్నారు. తప్పించుకుపోయారన్న అర్ధం దీని వెనుక ఉంది. అమెరికాలో ఉంటే మాత్రం మన కేంద్ర ప్రభుత్వానికి అడిగే అవకాశం లేదా ? యూఎస్‌ఎయిడ్‌ ప్రభుత్వ సంస్థ, అందువలన నేరుగా మన ప్రభుత్వమే వివరాలు ఇవ్వాలని ఈ పాటికే ఎందుకు అడగలేదు ? జనానికి చెవుల్లో కమలంపూలు పెడుతున్నట్లుగా ఉంది. అమెరికా ప్రభుత్వ సమాచారాన్ని ఉటంకించిన ఇండియా టుడే వార్త ప్రకారం వీణా రెడ్డి హయాంలో మన దేశానికి అమెరికా సాయం రు.720 కోట్ల నుంచి 2022లో రు.2,500 కోట్లకు పెరిగినట్లు, 2023లో రు.1,515 కోట్లు, 2024లో రు.1,304 కోట్లు వచ్చాయి. ఈ సొమ్మును దేనికి ఖర్చు చేశారో నిగ్గుతేల్చాల్సింది పోయి, కాంగ్రెస్‌ మీద మరొక పార్టీ మీద నిందలు వేస్తే కుదరుతుందా ? ఓటర్లను పెద్ద ఎత్తున రప్పించేందుకు ఇచ్చినట్లు చెబుతున్న 21మిలియన్‌ డాలర్లు(రు.182 కోట్లు) అమెరికా కేంద్రంగా పని చేస్తున్న కన్సార్టియం ఫర్‌ ఎలక్షన్స్‌ అండ్‌ పొలిటికల్‌ ప్రోసెస్‌ స్ట్రెంతనింగ్‌`సిఇపిపిఎస్‌( ఎన్నికలు, రాజకీయ క్రమాన్ని పటిష్ట పరిచేందుకు ఏర్పడిన సహవ్యవస్థ)కు కేటాయించారు. ఇది అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఎలక్ట్రొరల్‌ సిస్టమ్స్‌, ఇంటర్నేషనల్‌ రిపబ్లికన్‌ ఇనిస్టిట్యూట్‌, నేషనల్‌ డెమోక్రటిక్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థలతో కూడిన కూటమి. ఎలన్‌ మస్క్‌ నిర్వహిస్తున్న ప్రభుత్వ సామర్ధ్య శాఖ(డోజె) వెల్లడిరచిన సమాచారమే ఇది.

సాయం పేరుతో ఎంత ఖర్చు చేస్తే అంతగా ఆర్థికంగా, రాజకీయంగా అమెరికా లబ్ది పొందింది తప్ప ఊరికే ఒక్క డాలరు కూడా వెచ్చించలేదు.అమెరికా సాయ సంస్థ 1949లో అధ్యక్షుడు ట్రూమన్‌ హయాం నుంచి తరువాత కాలంలో అనేక మార్పులు, చేర్పులతో సహా అనేక దేశాలకు నిధులు కేటాయిస్తున్నది. వాటిని కమ్యూనిస్టు వ్యతిరేక, తనను వ్యతిరేకించే దేశాలకు వ్యతిరేకంగా ప్రచారం, కుట్రలు, పాలకులు, ప్రభుత్వాలను కూలదోయటం, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆకట్టుకొనేందుకు, ఉగ్రవాదులతో సహా ఎన్‌జిఓలు, మరొక పేరుతో ప్రపంచ మంతటా తన తొత్తులను, విద్రోహులను సమకూర్చుకోవటం దానిపని. అందుకోసం ప్రపంచమంతటా పదివేల మంది సిబ్బంది, ఏటా వందబిలియన్‌ డాలర్ల వరకు బడ్జెట్‌తో నడుస్తున్నది. గూఢచార సంస్థ సిఐఏతో అనుసంధానించుకొని ప్రజాస్వామిక సంస్కరణలు, అభివృద్ధి పేరుతో కథనడిపిస్తున్నది. మన దేశం, చైనాకు వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు 2004లో మిలీనియం ఛాలెంజ్‌ కార్పొరేషన్‌ (ఎంసిసి) ఏర్పాటు చేసి శ్రీలంక, నేపాల్‌ దేశాలను దానిలో చేరాలని వత్తిడి చేసింది. మొత్తం 29 దేశాలతో 2019 నాటికి 37 ఒప్పందాలు చేసుకుంది. 1990కి ముందు సోవియట్‌ యూనియన్‌తో ప్రచ్చన్న యుద్ధం సాగించిన కాలంలో దాని పనితీరు ఒక విధంగా ఉంటే తరువాత కొన్ని మార్పులు చేసుకుంది. అవి ఏవైనప్పటికీ ప్రపంచంలో మార్కెట్‌ సంస్కరణలతో సహా అమెరికా ప్రయోజనాలకు అనుగుణమైనవి, రాజకీయంగా వ్యతిరేకించేవారిని లక్ష్యంగా చేసుకున్నవే. తమ మిలిటరీ, రాజకీయ ఎత్తుగడలో భాగంగా ముందుకు తెచ్చిన క్వాడ్‌ కూటమిలో చేరాలని బంగ్లాదేశ్‌పై అమెరికా వత్తిడి తెచ్చింది. చిట్టగాంగ్‌ ప్రాంతంలోని సెయింట్‌ మార్టిన్‌ దీవిని తమకు కౌలుకు ఇవ్వాలని, అక్కడ మిలిటరీ కేంద్రం ఏర్పాటు చేస్తామని చేసిన ప్రతిపాదనను షేక్‌ హసీనా వ్యతిరేకించారు. ఆ కారణంగానే ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆమెను దేశం నుంచి తరిమివేసిన శక్తుల వెనుక ‘‘ అమెరికా సాయం ’’ ఉందని వార్తలు వచ్చాయి. నిజానికి ఆ కేంద్రాన్ని చైనాను దెబ్బతీయాలని చెప్పినప్పటికీ అది మన దేశానికీ ముప్పు తలపెట్టేదే.


ప్రజాస్వామ్యం, స్వేచ్చా మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ పేరుతో రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌ దురాక్రమణకు అమెరికా దాదాపు రెండులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. దీనిలో అభివృద్ధి కోసం చేసిన ఖర్చు కేవలం 3,240 కోట్ల డాలర్లు మాత్రమే ఉంది. చివరకు తాలిబాన్లకు సలాం గొట్టి అన్నింటినీ వదలివేసి 2021 అమెరికా సేనలు అక్కడి నుంచి పారిపోయాయి. తమ సాయం ఆకలి, దారిద్య్ర నిర్మూలన, విద్య, వైద్యం వంటి వాటికి ఖర్చు చేస్తున్నట్లు అమెరికా చెబుతుంది. ఇరవై ఏండ్ల దురాక్రమణ తరువాత అక్కడ చూస్తే సర్వనాశనం. ముఫ్పైవేల మంది పౌరులతో సహా 1.74లక్షల మంది ఆప్ఘన్‌లు మరణించారు, 30లక్షల మంది పిల్లలు బడికి దూరం, 1.89 కోట్ల మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు.తాలిబాన్లతో సాగించిన పోరులో భయానక చర్యలెన్నో. 950 కోట్ల డాలర్ల మేర ఆఫ్ఘన్‌ జాతీయ సంపదలను దోచుకున్నారు. ఇలాంటి ఉదాహరణలను ఎన్నో చెప్పవచ్చు. మన దేశంలో కాశ్మీరు, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాల వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల వెనుక అమెరికా సాయ హస్తం గురించి చెప్పుకోనవసరం లేదు. హాంకాంగ్‌ స్వాతంత్య్రం పేరుతో గతంలో విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్లెక్కించటం వెనుక, చైనాలో అంతర్భాగంగా ఐరాస గుర్తించిన తైవాన్‌ స్వాతంత్య్ర నినాదం, టిబెట్‌ వేర్పాటు వాదుల వెనుక అమెరికా హస్తం, సాయం బహిరంగ రహస్యమే.


అమెరికా మేథో సంస్థ కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌(సిఎఫ్‌ఆర్‌) ఫిబ్రవరి ఏడవ తేదీన రాసిన విశ్లేషణలో ప్రతి ఏటా అమెరికా సాయం ఎలా ఉంటుందో వెల్లడిరచింది. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాపితంగా 7,200 కోట్ల డాలర్లను అందించగా దానిలో 61శాతం యుఎస్‌ఎయిడ్‌ ద్వారా పంపిణీ జరిగింది. దీని ద్వారా జరుగుతున్నట్లు చెబుతున్న సాయంలో ఒక డాలరులోని వంద సెంట్లకు గాను 10 నుంచి 30 మాత్రమే అవసరమైన వారికి అందుతున్నదని ఇటీవల సిబిఎస్‌ మీడియాతో అమెరికా ఎంపీ బ్రియాన్‌ మాస్ట్‌ చెప్పాడు. చైనా తప్పుడు ప్రభావాన్ని ఎదుర్కొనే పేరుతో 2024 సెప్టెంబరులో 32.5 కోట్ల డాలర్లను అమెరికా పార్లమెంటు మంజూరు చేసింది.2023 నుంచి 2027వరకు ఇదే కార్యక్రమాలకు మొత్తం 162.5 కోట్ల డాలర్లను ఖర్చు చేసేందుకు నిర్ణయించారు. ఇంత మొత్తాన్ని ఎవరి పర్యవేక్షణలో ఎలా ఖర్చు చేస్తారో వెల్లడిరచలేదు గానీ యుఎస్‌ఎయిడ్‌ ప్రతినిధే ఉంటాడు. ఎందుకు ? ఎలా అంటే 2021లో జింబాబ్వే బడా పత్రిక హెరాల్డ్‌ అసలు విషయాన్ని వెల్లడిరచింది. ఆఫ్రికా ఖండంలో చైనా పెట్టుబడుల గురించి తప్పుడు వార్తలను ఎలా వండాలో స్థానిక విలేకర్లకు శిక్షణ ఇచ్చేందుకు అమెరికా నిధులు అందచేసిందట. మన దేశంలో కొన్ని పత్రికలు, టీవీలలో వస్తున్న కథనాలు, విశ్లేషణల వెనుక అమెరికా సాయం ఉందంటే తప్పు పట్టాలా ?

అమెరికా సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించగానే కొంత మంది సరికొత్త పల్లవి అందుకున్నారు. ఇప్పటికే బిఆర్‌ఐ పథకాలతో అనేక దేశాలలో చైనా పాగా వేస్తున్నదని, ఇప్పుడు అమెరికా సాయం ఆగిపోతే అది మరింతగా విస్తరించి అనేక దేశాలను అదుపులోకి తీసుకుంటుందనే పాటపాడుతున్నారు. ఇది రెండు అంశాలను తేటతెల్లం చేస్తున్నది. ఒకటి ఇన్ని దశాబ్దాలుగా సాయం పేరుతో అమెరికా తన ఆధిపత్యం కోసం ప్రయత్నించిందని నిర్ధారించటం, మరొకటి చైనా ఆధిపత్యం పెరుగుతుందనే భయాన్ని రెచ్చగొట్టటం. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని నివారించే పేరుతో తాలిబాన్లను తయారు చేయటం, తరువాత ఏకుమేకైన వారి మీదే పోరు సాగించిన అమెరికా మాదిరి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడైనా చైనా వ్యవహరించిందా ? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత రెండు కొరియాలు ఐక్యం కావాల్సి ఉండగా దాన్ని పడనీయకుండా దక్షిణ కొరియాలో అమెరికా మిలిటరీ తిష్టవేసి కొనసాగిస్తున్నది. ఆ మాదిరి చైనా ఎక్కడైనా కేంద్రాలను ఏర్పాటు చేసిందా ? అమెరికా సాయం పేరుతో మన దేశంలో సాగించిన తప్పుడు పనులను బహిర్గతం చేసేందుకు మోడీ సర్కార్‌ ముందుకు వస్తుందా ? వాటిలో సంఘపరివార్‌ సంస్థలేమైనా ఉంటే అసలు రంగు బయటపడుతుందని భయపడి మూసి పెడుతుందా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

మరణశయ్య మీద ఉన్న కన్నతల్లిని కూడా చూడనివ్వని ‘‘హిందూత్వ కర్కశత్వం ’’ క్షమా సావంత్‌కు వీసా నిరాకరించిన మోడీ సర్కార్‌ !

17 Monday Feb 2025

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Religious Intolarence, USA, Women

≈ Leave a comment

Tags

BJP, caste discrimination in US, Hindu Fundamentalism, hindutva, Kshama Sawant, Narendra Modi Failures, RSS, VHP

ఎం కోటేశ్వరరావు

తాను అందరి మాదిరి జీవ సంబంధంగా పుట్టలేని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. రాగద్వేషాలు లేని కర్మయోగి, విశ్వగురువు అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన కన్నతల్లి వృద్ధాప్యంలో ఉన్నపుడు, చివరి రోజు వరకు చూసేందుకు అనేక సార్లు వెళ్లారు, సేవ చేశారని వార్తలు చదివాం, చిత్రాలను చూశాం. కానీ అలాంటి మరో తల్లిని చూసేందుకు ఆమె కుమార్తెకు వీసా నిరాకరించిన అదే పెద్దమనిషి తీరును ఎలా చూడాలి. ఎందుకు అలా చేశారు ? భారతీయ సంప్రదాయం, నైతికత అయితే కాదు, మరి రాజకీయ కక్షా ? అది అంత అమానవీయంగా ఉంటుందా ? అనేక వ్యాధులతో దినదిన గండగా నేడో రేపో అన్నట్లుగా గడుపుతున్న 82 ఏండ్ల కన్నతల్లిని చూసేందుకు ఒక కుమార్తెకు వీసా ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిరాకరించింది. ఆమె వీసా సమస్య గురించి విదేశాంగ మంత్రి జై శంకర్‌కు పూర్తిగా తెలుసు.జూన్‌ 26 నుంచి జూలై 15 మధ్య బెంగలూరు వచ్చేందుకు తనను అనుమతించాలని ఆమె జై శంకర్‌కు 2024 జూన్‌ 13న ఒక లేఖ రాశారు. రెండు సంవత్సరాల నుంచి తన తల్లి చికిత్స పొందుతున్నదని, దానికి సంబంధించిన వైద్యుల వివరణను కూడా జత చేసినా కనీసం లేఖ అందినట్లుగానీ, అనుమతి గురించి గానీ ఎలాంటి సమాధానం మంత్రి నుంచి రాలేదని ఆమె పేర్కొన్నారు. తాను కేవలం తల్లిని చూడటానికి మాత్రమే వస్తున్నట్లు, ఇతర కారణాలేమీ లేవని కూడా స్పష్టం చేసినప్పటికీ పట్టించుకోలేదు. విశ్వగురువు, అపరమానవతావాదిగా ప్రశంసలు పొందిన నరేంద్రమోడీ నాయకత్వంలోని అధికారులు ఒకసారి కాదు ఏడాదిలో ఏకంగా మూడు సార్లు తిరస్కరించారు. దీని గురించి అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన తరువాత కూడా స్పందించలేదంటే కచ్చితంగా కావాలనే నిరాకరిస్తున్నట్లు భావించాల్సి వస్తోంది.

ఈ ఏడాది జనవరి తొమ్మిదిన ఆన్‌లైన్‌ ద్వారా క్షమ, ఆమె భర్త వీసా దరఖాస్తులను సమర్పించగా దాదాపు నెల రోజుల పాటు దరఖాస్తును తొక్కి పట్టి ఏ కారణం చెప్పకుండా మానసిక ఆందోళనకు గురిచేశారు. చివరికి భర్త కాల్విన్‌ ప్రీస్ట్‌కు మంజూరు చేసి క్షమకు తిరస్కరించారు. బెంగలూరులో ఉంటున్న తల్లి వసుంధరా రామానుజమ్‌ను పరామర్శించే నిమిత్తం ఇండియన్‌అమెరికన్‌ మహిళ క్షమా సావంత్‌(51) గతేడాది మే నెల నుంచి మూడు సార్లు దరఖాస్తు చేశారు. అమెరికాలోని మన దౌత్య కార్యాలయాలు అత్యవసర వీసా నిరాకరించాయి.తీవ్ర నేరారారోపణలతో జైళ్లలో ఉన్న నిందితులకు, శిక్షలు పడిన వారికి కూడా ఇలాంటి కారణాలతో పరిమిత బెయిలు మంజూరు చేసిన ఉదంతాలు మనకు తెలిసిందే. క్షమ సావంత్‌ నేరస్థురాలు కాదు, మన దేశ ఉగ్రవాద లేదా మరొక నిషేధిత జాబితాలో ఆమె పేరు లేదు. ఎలాంటి కేసులు లేవు. కానీ కారణాలు చూపకుండానే మీరు తిరస్కరణ జాబితాలో ఉన్నారంటూ అమెరికా వాషింగ్టన్‌ రాష్ట్రంలోని సియాటిల్‌ నగరంలో భారత కాన్సులేట్‌ దౌత్య కార్యాలయం 2025 ఫిబ్రవరి మొదటి వారంలో వీసా నిరాకరించింది. కారణం ఏమిటో చెప్పాలంటూ గట్టిగా అడిగినందుకు, చెప్పాల్సిన పని లేదని, కార్యాలయంలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులను పిలిపించింది. భర్త కాల్విన్‌ ప్రీస్ట్‌కు వీసా మంజూరు చేసి తనకు నిరాకరించటానికి నరేంద్రమోడీ విధానాలను వ్యతిరేకించే రాజకీయ కారణాలు తప్ప మరొకటి కాదని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.

మోడీ సర్కార్‌ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సిఏఏ), జాతీయ పౌరనమోదు (ఎన్‌ఆర్‌సి)లను ఖండిస్తూ ఆమె ప్రాతినిధ్యం వహించిన సియాటిల్‌ నగరపాలక సంస్థలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కులవివక్షకు వ్యతిరేకంగా 2023లో అదే సంస్థలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. కొన్ని కులాల వారి పట్ల వివక్ష చూపకూడదంటూ అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక నగరంలో తీర్మానించటం ఇదే ప్రధమం.ఈ పరిణామం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించటమే గాక భారత్‌లో ఉన్న వివక్ష గురించి చర్చకు దారితీసింది. ఆమె సోషలిస్టు ప్రత్నామ్నాయం అనే సంస్థలో సభ్యురాలు. వీసా నిరాకరించిన కారణం చెప్పనందుకు తాను, తన భర్త , మద్దతుదారులతో కలిసి శాంతియుత పద్దతిలో ధర్నా చేశామని, వివరణ ఇచ్చేందుకు వారు తిరస్కరించారు, తెలుసుకోకుండా కదిలేది లేదని మేము తిరస్కరించటంతో వారు పోలీసులను పిలుస్తామని బెదిరించారంటూ ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన మీద, మద్దతుదారులపై కూడా చేయి చేసుకున్నట్లు ఆ తెలిపారు. తనకు వీసా ఇవ్వకపోవటానికి నరేంద్రమోడీ ప్రభుత్వ తిరస్కరణ జాబితాలో పేరుండటమే అని ఒక అధికారి తనతో చెప్పినట్లు కూడా ఆమె మరో పోస్టులో పేర్కొన్నారు. వారాల తరబడి ఎలాంటి స్పందన లేకపోగా ఫోన్‌ ద్వారా సంప్రదించినా సమాధానం లేదన్నారు. వాషింగ్టన్‌ రాష్ట్రంలోని అతి పెద్ద నగరమైన సియాటిల్‌ సిటీ కౌన్సిల్లో సిఏఏ, ఎన్‌ఆర్‌సిలకు వ్యతిరేకంగా తాను తీర్మానాలు ప్రవేశ పెట్టటమే దీనికి కారణమని కూడా క్షమ పేర్కొన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాల పట్ల విమర్శనాత్మక వైఖరిని వెల్లడిరచిన స్వీడన్‌లో ఉన్న భారతీయ ప్రొఫెసర్‌ అశోక్‌ సవాయిన్‌, బ్రిటన్‌లో ఉన్న రచయిత నితాషా కౌల్‌కు సైతం ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. విదేశాల్లో ఉంటూ తమ ప్రభుత్వాన్ని విమర్శించటం ఏమిటన్న దురహంకారం, కక్ష తప్ప దీనిలో మరోటి కనిపించటం లేదు.

క్షమ సావంత్‌ మహారాష్ట్రలోని పూనాలో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. తల్లి స్కూల్‌ పిన్సిపల్‌గా పని చేశారు. క్షమ 13 ఏండ్ల వయస్సులో ఇంజనీరైన తండ్రి ఒక ప్రమాదంలో మరణించారు. ముంబైలో ఆమె చదువుకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరయ్యారు.1996లో అమెరికా వెళ్లిన తరువాత అర్థశాస్త్రంలో పిహెచ్‌డి చేసి కొంతకాలం ప్రొఫెసర్‌గా పని చేశారు. అక్కడే ఆమె 2006లో వామపక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు.అంతకు ముందు ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. 2012లో వాషింగ్టన్‌ ప్రజాప్రతినిధుల సభకు పోటీచేసి ఓడిపోయారు. తరువాత సియాటిల్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలిచి 2014 నుంచి 2024వరకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో కులవివక్ష వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదింప చేయించటంతో పాటు కనీసం వేతనం గంటకు 15 డాలర్ల చట్టాన్ని అమలు జరిపించటంలో కూడా ఆమె పట్టుబట్టారు. కుల వివక్షకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదింప చేసేందుకు ఆమె కృషి చేయటాన్ని, సిఎఎ, ఎన్‌ఆర్‌సి చట్టాలను ఖండిస్తూ తీర్మానాలను చేయించటాన్ని అమెరికాలోని హిందూత్వశక్తులు జీర్ణించుకోలేకపోయాయి.


కుల వివక్ష వ్యతిరేక తీర్మానం చేయించటంలో కీలక పాత్ర పోషించటాన్ని హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీసా తిరస్కరణ వెనుక ఈ అంశం ఉందా అన్న ప్రశ్నకు ఇంతకు మించి బిజెపి ప్రభుత్వ రాజకీయ నిర్ణయం వెనుక మరొక కారణం కనిపించటం లేదు అన్నారు. నేను ఒక సోషలిస్టును, పదేండ్ల పాటు కార్మికవర్గ ప్రతినిధిగా సియాటిల్‌ కౌన్సిల్లో ఉన్నాను, ఆ సమయంలో నేను ప్రజా ఉద్యమ నిర్మాణానికి, కనీసవేతనం గంటకు 15డాలర్లకు పెంచాలని కోరుతూ నా పదవిని వినియోగించాను. ఇప్పుడది 20.76 డాలర్లకు పెరిగింది. అమెరికాలో ఇది గరిష్టం. పేదల గృహ నిర్మాణాలకు కార్పొరేట్‌ సంస్థలు వాటా చెల్లించాలని కూడా నేను పని చేశాను.2020 ఫిబ్రవరిలో సిఏఏ, ఎన్‌ఆర్‌సి చట్టాలను ఖండిస్తూ సియాటిల్‌ కౌన్సిల్లో పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ కార్యాలయం నాకు ఒక లేఖ పంపింది. అమెరికాలోని హిందూత్వ శక్తులు, మోడీ మద్దతుదార్లనుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాం.2023 ఫిబ్రవరిలో కులవివక్షపై చారిత్రాత్మక నిషేధాన్ని ప్రకటించటంలో విజయం సాధించాం. మాకు విశ్వహిందూ పరిషత్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. మితవాద హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌, ఉత్తర అమెరికా హిందువుల సంఘటన మాకు వ్యతిరేకంగా పని చేశాయి. అందువలన మోడీ ప్రభుత్వం, అమెరికాలోని దాని మద్దతుదార్లు మాకు వ్యతిరేకంగా ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. వారందరికీ నా రాజకీయ అభిప్రాయాలు ఏమిటో తెలుసు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు అనుమతించకపోవటం అమానుషం, ఏ రకమైన ప్రభుత్వమిది. నా వీసా తిరస్కరణ వెనుక రాజకీయ కారణాలు లేవని మోడీ సర్కార్‌ చెప్పుకోవాలంటే వీసా మంజూరు చేసి నిరూపించుకోవచ్చని క్షమ పేర్కొన్నారు.

అమెరికాకు వెళ్లిన వారు అందరూ అని కాదు గానీ ఎక్కువ మంది తమతో పాటు కులతత్వాన్ని, కులవివక్షను కూడా తీసుకుపోయారు. ఈ మధ్య దానికి మతాన్ని కూడా తోడు చేశారు. మన దేశంలో మత ప్రాతిక మీద పని చేసే సంస్థలన్నింటికీ అమెరికా శాఖలు ఉన్నాయి. దక్షిణాసియా నుంచి వచ్చిన దళితులు, ఇతర అణచివేతకు గురైన కులాల వారు అమెరికాలో కూడా దాన్ని తప్పించుకోలేకపోతున్నారు.కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ అనే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం విద్యాపరంగా మూడిరట ఒక వంతు, పని స్థలాల్లో , మూడిరట రెండువంతుల మంది వివక్షను ఎదుర్కొన్నట్లు తేలింది. తక్కువగా చూడటం, సూటిపోటి మాటలు, లైంగిక వేధింపుల గురించి 30 మంది దళిత మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు తమ అనుభవాలను బహిరంగ లేఖ రూపంలో వెల్లడిరచారు. సిస్కో సిస్టమ్స్‌ కంపెనీలో అగ్రవర్ణాలుగా భావించబడుతున్నవారు తనకు రావాల్సిన ఉద్యోగోన్నతి, వేతన పెంపుదలను ఎలా అడ్డుకుంటున్నారో వెల్లడిస్తూ దాఖలు చేసిన కేసును ఒక దళత సామాజిక తరగతికి చెందిన ఇంజనీరు గెలిచారు. ఆ తరువాత వందలాది మంది తాము ఎదుర్కొన్న వివక్ష గురించి గళం విప్పారు. ఈ పూర్వరంగంలోనే క్షమ సావంత్‌ సియాటిల్‌ సిటీ కౌన్సిలర్‌గా వివక్షకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింప చేయించారు. లేని సమస్య ఉన్నట్లు, అతిగా చేసి పరువు తీస్తున్నారంటూ హిందూత్వ సంస్థలు, అగ్రకుల నాయకత్వంలోని సంస్థలు ఆమె మీద ధ్వజమెత్తాయి. సియాటిల్‌ కౌన్సిల్లో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారు ఎక్కువ మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారు తొలుత తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. మితవాదులు ముందుకు తెచ్చిన వాదనలనే వారు వల్లించారు. చివరి వరకు ఏదో విధంగా అడ్డుకోవాలని చూశారు. అయితే వారి మీద వచ్చిన వత్తిడి కారణంగా ఒకరు తప్ప మిగతావారందరూ ఓటు వేయటంతో తీర్మానం నెగ్గింది.

క్షమా సావంత్‌ అలుపెరగని పోరాట యోధురాలిగా ఉన్నారు.కార్మికవర్గాన్ని దోచుకుంటున్న ధనికులు, వారికి మద్దతు ఇస్తున్న అధికార రిపబ్లిక్‌, ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీల వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 22న సియాటిల్‌ నగరంలో ఒక సభను ఆమె నాయకత్వంలో పని చేస్తున్న వర్కర్స్‌ స్ట్రైక్‌ బాక్‌ సంస్థ నిర్వహిస్తున్నది. డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ఉన్న బెర్నీ శాండర్స్‌ కూడా అందరికీ అందుబాటులో వైద్యం వంటి అంశాలలో జో బైడెన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించారని కూడా ఆమె విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ప్రత్నామ్నాయంగా మరొక పార్టీ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని గతంలో ప్రకటించారు. దళితుల సమస్యల మీద ఆ సామాజిక తరగతికి చెందిన వారు మాత్రమే సక్రమంగా స్పందించగలరని వారు మాత్రమే పోరాటాలకు నాయకత్వం వహించాలని చెబుతున్న వారు క్షమ పోరాటం, ఆమె ఎదుర్కొంటున్న వేధింపులను చూసిన తరువాత తమ సంకుచిత వైఖరిని మార్చుకోవాలని సూచించటం తప్పుకాదేమో !

Share this:

  • Tweet
  • More
Like Loading...

మోడీ అమెరికా వెళ్లారు, వచ్చారు – వారికి సమర్పించుకున్నదేమిటి ? మన దేశానికి తెచ్చిందేమిటి ?

15 Saturday Feb 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Donald trump, MAGA, MIGA-Modi, Narendra Modi Failures, Narendra Modi US Visit

ఎం కోటేశ్వరరావు

హమ్మయ్య ఒక పనైపోయింది. తెలుగువారి కళారూపాల్లో ఒకటైన ఏక పాత్రాభినయం గురించి తెలిసిందే. డోనాల్డ్‌ ట్రంప్‌ తన పట్టాభిషేకానికి నన్నెందుకు ఆహ్వానించలేదు, నన్ను పక్కన పెడితే పెట్టారు, చైనా నేత షీ జింపింగ్‌కు పెద్ద పీటవేయనేల, అతగాడు రాడని తెలిసి కూడా ఆహ్వానమేల, పోనీ వచ్చేందుకు తిరస్కరించిన తరువాత కూడా నన్ను పిలవాలని తట్టలేదా ? గత ఆలింగనాలు, చెట్టపట్టాలు గుర్తుకు రాలేదా ? అంతలా మర్చిపోతారా ? విదేశాంగ మంత్రి జై శంకర్‌ వెళ్లి చేసిన నిర్వాకం ఏమిటి ? పరిపరి విధాల ఇలాంటి స్థితిలో ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీకి ట్రంప్‌ నుంచి ఆహ్వానం వచ్చింది. ఫిబ్రవరి 13,14 తేదీలలో వెళ్లారు. ట్రంప్‌తో కరచాలనాలు, ఆలింగనాల తరువాత భేటీ జరిగింది. పరస్పరం పొగడ్తలకు ఎలాంటి లోటు జరగలేదు. అసలే 56 అంగుళాల ఛాతీ అంటారు, ట్రంప్‌ మర్యాదలతో అది మరింతగా పొంగిన స్థితిలో మోడీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇంటి పెద్ద ఏదైనా ప్రయాణం చేసి వచ్చినపుడు కుటుంబంలోని వారు తమకేమి తెచ్చారా అని ఎదురు చూడటం సహజం. ఇప్పుడు మన మోడీ ఏం తెచ్చారని మన జనం ఆసక్తి కనపరుస్తున్నారు. మోడీ తిరిగి రాకముందే వచ్చిన వార్త ఏమింటే సుంకాల విధింపులో తగ్గేదేలేదు, భారత్‌ అయినా మరొకరైనా మా మీద విధిస్తే మేమూ అంతే చేస్తాం అన్న ప్రకటన పతాక శీర్షికల్లో వచ్చింది.పరస్పర వడ్డింపులు అందరికీ వర్తిస్తాయి, ఎవ్వరికీ మినహాయింపులేదు.వాణిజ్యం విషయంలో మా శత్రుదేశాల కంటే మిత్ర దేశాలు అధ్వాన్నంగా ఉన్నాయి. భారత్‌ పెద్ద మొత్తంలో పన్నులు విధిస్తున్నది. ఆ కారణంగా హార్లే డేవిడ్స్‌న్‌ తమ మోటారు సైకిళ్లను అమ్ముకోలేకపోయిందని నాకు గుర్తువస్తున్నది. తమ జరిమానాలను తప్పించుకోవాలంటే ఇతర దేశాలు తమ పన్నులు ఎత్తివేయాలి లేదా తగ్గించాల్సిందే అని ట్రంప్‌ చెప్పాడు. తాను తీసుకొనే చర్యలు అంతిమంగా అమెరికా కంపెనీలకు మేలు చేస్తాయన్నాడు. 2030 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకు పెంచుతామని, రక్షణ రంగంలో సహకారం, పౌర అణుఒప్పందంలో అమెరికా కంపెనీలకు అనుకూలమైన నిర్ణయాలు, ఇతర అనేక అంశాల గురించి మరో సందర్భంలో చర్చించుకోవచ్చు, పరిమితంగా కొన్ని అంశాలను చూద్దాం.

మోడీ పర్యటన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే డోనాల్డ్‌ ట్రంప్‌కు భారీగా సమర్పించుకొని వచ్చారు తప్ప అక్కడి నుంచి తెచ్చిందేమీ లేదంటే కొందరు నొచ్చుకోవచ్చుగానీ అది మింగలేని నిజం. అంత తొందరగా నిర్ణయానికి రావటమెందుకు తరువాత ఫలితాలు వస్తాయోమో అనే వాళ్లను నిరుత్సాహపరచటం లేదు. ట్రంప్‌ ఏం చెప్పాడు ? భారత్‌అమెరికా వాణిజ్యంలో మేం లోటులో ఉన్నాం, ఆ మేరకు మా దగ్గర నుంచి సరకులు కొనుగోలు చేయాలి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత ముడి చమురు మా దగ్గర ఉంది, భారత్‌కు అది అవసరం, మా నుంచి కొనుగోలు చేయాలి. మా వస్తువుల మీద దిగుమతి పన్ను తగ్గించాలి, వాటిని దిగుమతి చేసుకోవాలి అని నిర్మొహమాటంగా చెబితే, సరే ఇంకేం చేస్తాం అంటూ మోడీ తలూపి వచ్చారు. ఇతర దేశాల కంటే ఎక్కువగా అమెరికా నుంచి ముడిచమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తామని అంగీకరించి వచ్చారు.మన దేశానికి అమెరికా ఐదవతరం ఎఫ్‌35 యుద్ధ విమానాలు విక్రయిస్తామని ట్రంప్‌ చెప్పాడు. ఇంకేముంది చైనాను నిలువరించేందుకు వచ్చేసినట్లే అన్నట్లుగా మీడియాలో కొందరు చిత్రించారు. నిజానికి ఆలూలేదూ చూలూ లేదు. అసలు ఒప్పందమే లేదు. ఎప్పుడో చేసుకున్న ఒప్పందాల ప్రకారం మనకు అవసరమైన పాతతరం ఇంజన్లు సరఫరా చేసేందుకే అమెరికా జాప్యం చేస్తున్నది.

మన దేశం తేలిక రకం తేజాస్‌ యుద్ధ విమానాలను తయారు చేసే క్రమంలో ఉంది.వాటిని సాంకేతికంగా ఉన్నతీకరిస్తున్నారు. ఎంకె1ఏ రకం విమానానికి అవసరమైన ఇంజన్ల కోసం సందేహాలున్నప్పటికీ అమెరికా జిఇ కంపెనీతో మన హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ 2021లో ఎఫ్‌404రకం 99 ఇంజన్ల సరఫరా, నిర్వహణ ఒప్పందం చేసుకుంది. సరఫరా గడువు దాటింది, ఒప్పందం ప్రకారం అపరాధ రుసుం వేసినప్పటికీ ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఇంజన్‌ కూడా మనకు రాలేదు. అవే రాలేదనుకుంటే నరేంద్రమోడీ 2023లో అమెరికా వెళ్లినపుడు ఎల్‌సిఏ ఎంకె2కు అవసరమైన జిఇ 414 ఇంజన్ల సరఫరా ఒప్పందం కూడా చేసుకున్నారు. మొదటిదానికే దిక్కులేదు. ఎందుకు సరఫరా చేయటం లేదు అంటే దానికి అవసరమైన విడిభాగాలను సరఫరా చేసే దక్షిణ కొరియా కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని సాకు చెబుతున్నారు. అలాంటిది ఆధునిక ఎఫ్‌35 యుద్ద విమానాలను మనకు విక్రయిస్తుందా ? అంతే కాదు అమెరికా తయారు చేసిన ఎఫ్‌16 యుద్ద విమానం ఇప్పుడు పాతబడిపోయింది.దానికి రంగులు మార్చి లేదా పరిమితమైన మార్పులు చేసి ఎఫ్‌21పేరుతో మనకు విక్రయించేందుకు లాక్‌హీడ్‌ మార్టిన్‌ కంపెనీ చూస్తున్నదని వార్తలు. అది ఐదవతరం ఎఫ్‌22 రాప్టర్‌కు ఒక అడుగు మాత్రమే వెనుక ఉన్నట్లు కూడా చెప్పారు. ట్రంప్‌మోడీ ఏమోయ్‌ అంటే ఏమోయ్‌ అనుకునేట్లుగా ఉన్న సమయంలోనే పాకిస్తాన్‌కు అమెరికా ఎఫ్‌16 విమానాలను అందచేసిందని, 2019 ఫిబ్రవరి 27న మన వైమానిక దళం వాటిలో ఒకదాన్ని కూల్చి వేసిందని గుర్తుకు తెచ్చుకోవాలి.


మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ – మాగా (అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలి) అన్నది ట్రంప్‌ నినాదం. దానికి అడ్డువచ్చే వారిని ఎవరినీ సహించడు అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అన్ని రంగాల్లో సవాలు విసురుతున్న చైనా ఒక వైపు ఉంటే భారత్‌ కూడా అలాగే తయారవుతానంటే అంగీకరిస్తాడా ? కానీ నరేంద్రమోడీ గారు మాగాకు పోటీగా మిగా అని ఎక్స్‌ చేశారు. వికసిత భారత్‌ లక్ష్యాన్ని మేక్‌ ఇండియా గ్రేట్‌ ఎగైన్‌ అని మేం కూడా అనొచ్చు అన్నారు. అమెరికా అంటే గతంలో అన్ని రంగాల్లో ముందున్నది, ప్రాసకోసం తప్ప వస్తు తయారీలో మనం ఎప్పుడు ముందున్నాం ? పదేండ్ల క్రితం ఉన్న జిడిపిలో ఉన్న స్థాయిలో కూడా నేడు మన తయారీ రంగం లేదన్నది దాస్తే దాగుతుందా ? గత చరిత్ర మొత్తం అమెరికా మనలను అడ్డుకున్నదే.తొలిసారిగా 1962లో మన దేశం చైనాతో యుద్ధానికి దిగినపుడు ఫైటర్‌ జెట్లు కావాలని నాటి ప్రభుత్వం కోరితే వాటికి బదులు రవాణా విమానాలు, రాడార్లను ఇచ్చిందట. తరువాత పాకిస్తాన్‌కు 12 సూపర్‌ సోనిక్‌ ఫైటర్‌జెట్లను ఇస్తే వాటిని 1965లో మన మీద ప్రయోగించారు. ఆ తరువాతే మనం సోవియట్‌ యూనియన్‌ నుంచి మిగ్‌ 21 విమానాలను కొనుగోలు చేశాము.1998లో మన దేశం అణుపరీక్షలు జరిపితే అమెరికా మనలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనేక ఆంక్షలను విధించింది. అక్రమచొరబాటుదార్లను గుర్తించేందుకు ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలు కావాలని కోరితే అమెరికా నిరాకరించింది. తరువాత మనమే సొంతంగా రూపొందించుకున్నాం. గాల్వన్‌లోయలో జరిగిన ఉదంతాల వెనుక అమెరికా ఇచ్చిన తప్పుడు సమాచారం ఉందని కూడా చెబుతారు. తరువాత అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా అక్రమంగా గ్రామాల నిర్మాణం చేస్తోందంటూ కూడా ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని మన మిలిటరీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. వారి ప్రాంతంలో ఎప్పుడో నిర్మించి పాతబడిన వాటిని తిరిగి నిర్మిస్తున్నది తప్ప కొత్తవి కాదని ప్రకటించారు.

ఇల్లలక గానే పండగ కాదన్నట్లుగా నరేంద్రమోడీ డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య కుదిరిన అవగాహనలేమిటో, వాటి పరిణామాలు, పర్యవసానాలను చూడాల్సి ఉంది. నమస్కార బాణం వేసినట్లు ముందుగానే మన వైపు నుంచి అమెరికా వస్తువులకు కొన్ని రాయితీలు ఇవ్వటానికి సిద్దం అనే సంకేతాలు ఇచ్చాము.అయితే ట్రంప్‌కు అవి సంతృప్తి కలగలేదు గనుకనే భారత్‌ ఎంత సుంకం విధిస్తుందో మేమూ అంతే వేస్తాం అంటూ కరాఖండితంగా ముందే చెప్పాడు. తమ వస్తువులను మనదేశంలో కుమ్మరించేందుకు తొలిసారి అధికారానికి వచ్చినపుడే ట్రంప్‌ ఎత్తుగడ వేశాడు.ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్లు తాము చేసినదానికి ప్రతిగా భారత్‌ రాయితీలు ఇవ్వలేదంటూ 2019లో ప్రత్యేక వాణిజ్య భాగస్వామిగా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువుల మీద ఇస్తున్న ప్రాధాన్యత (జిఎస్‌పిాజనరలైజ్‌డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ఫ్రిఫరెన్సు)ను రద్దు చేసి సుంకాలు విధించాడు. దానికి ప్రతిగా మన దేశం కూడా పన్నులు విధించింది. ఎక్కడైనా బావేగాని వంగతోట దగ్గర కాదన్నట్లుగా మోడీ పర్యటన సందర్భంగా ట్రంప్‌ ఎన్ని మెచ్చుకోలు మాటలు చెప్పినా తాను తీసుకున్న చర్యను వెనక్కు తీసుకోవటం గురించి ఒక్క మాటా లేదు. మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్‌ మా యింటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్నట్లుగానే ఉంది.

ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే అమెరికా వస్తువులపై మనం విధించే పన్నుల గురించి ట్రంప్‌ గుర్రుగా ఉన్నాడు. పన్నుల రారాజు అంటూ మన దేశాన్ని గతంలో వర్ణించాడు. నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా కూడా తన అంతరంగాన్ని దాచుకోలేదు. అమెరికన్‌ కార్ల వంటి వాటి మీద 70శాతం పన్ను విధిస్తున్నారని, ఇది పెద్ద సమస్య అన్నాడు. అనేక వస్తువుల మీద 30,40,60 చివరికి 70శాతం పన్ను కూడా భారత్‌ విధిస్తున్నది, వాటిని తగ్గిస్తామని మోడీ చెప్పారు. 70శాతం పన్ను ఉంటే అమెరికా కార్లను ఆమ్ముకోలేం, భారత్‌తో దాదాపు వంద బిలియన్‌ డాలర్ల మేర తమకు లోటు ఉంది అన్నాడు. మా దగ్గర ఏ దేశంలోనూ లేనంతగా ఉన్న చమురు, గ్యాస్‌ను విక్రయించి ఆలోటును పూడ్చాలనుకుంటున్నాం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఇటీవలి అంతర్జాతీయ పరిణామాల కారణంగా రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం.2024 ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఎనిమిది మాసాలలో మన దేశం దిగుమతి చేసుకున్న ముడిచమురులో రష్యా వాటా 37.6, ఇరాక్‌ 19.9, సౌదీ అరేబియా 13.3,యుఏయి 9.1 అమెరికా 4.3, ఇతర దేశాల నుంచి 16.4శాతం వాటా ఉంది. ఆ తరువాత రష్యా నుంచి చమురు రవాణా చేసే నౌకల మీద కూడా అమెరికా ఆంక్షలు విధించటంతో ఈ ఏడాది, ఫిబ్రవరి, మార్చి నుంచి పెద్ద మొత్తంలో తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు రష్యా స్థానాన్ని అమెరికా ఆక్రమిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే చమురు ధరలో ఎలాంటి రాయితీ ఉండదు, దూరం గనుక రవాణా ఖర్చులు పెరుగుతాయి, సమయమూ ఎక్కువ పడుతుంది. ఆ భారం మొత్తం వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. దీనికి తోడు అమెరికా రకం ముడి చమురును శుద్ది చేయాలంటే మన రిఫైనరీలలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని, అది కంపెనీల మీద అదనపు భారం మోపుతుందని చెబుతున్నారు. అమెరికా బెదిరింపులకు లొంగి ఇప్పటికే ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. ఇప్పుడు రష్యా, ఇతర దేశాల నుంచి కూడా నిలిపివేసి ఒక్క అమెరికా మీదనే ఆధారపడితే మన జుట్టును దాని చేతికి ఇచ్చినట్లే అవుతుంది. అదే జరిగితే మన ఇంథన భద్రతకే ముప్పు వస్తుంది. వ్యూహాత్మకంగా కావచ్చు లేదా మరొక కారణంతో గానీ ట్రంప్‌`మోడీ భేటీలో చైనా ప్రస్తావన పెద్దగా రాలేదు. గతంలో ట్రంపు అధికారంలో ఉండగానే చైనాతో సరిహద్దులోని గాల్వన్‌లోయలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఇరుదేశాలు ఆ ఉదంత పూర్వపు స్థాయికి సంబంధాలను నెలకొల్పుకొనేందుకు ఇటీవలనే ఒప్పందం చేసుకొని ముందుకు పోతున్నాయి. కావాలంటే సరిహద్దు సమస్యలో సాయం చేసేందుకు నేను సిద్దం అని మోడీతో ట్రంప్‌ అన్నట్లు వార్తలు వచ్చాయి. సాయం సంగతి దేవుడెరుగు తంపులు పెట్టకుండా ఉంటే చాలు. ఇరుగు పొరుగు దేశాలతో సమస్యలను పరిష్కరించుకోలేనంత అసమర్ధంగా మనదేశం లేదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మన్మోహన్‌ సింగ్‌ పదేండ్లలో రు.38లక్షల కోట్లు, నరేంద్రమోడీ అప్పు రు.129లక్షల కోట్లు ఎవరి కోసం చేసినట్లు !

12 Wednesday Feb 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties

≈ Leave a comment

Tags

BJP, India debt matters, Manmohan Singh, Narendra Modi Failures, UPA

ఎం కోటేశ్వరరావు


ఉచిత పథకాలు, నగదు బదిలీల వంటి రాజకీయ పార్టీల వాగ్దానాల కారణంగా జనాలు సోమరులుగా మారుతున్నారని, పరాన్నజీవులవుతున్నారంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బుధవారం(ఫిబ్రవరి 12,2024) వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. చిత్రం ఏమిటంటే ఇలాంటి వాటి గురించి కేసులు వేసేవారు ఉంటారు తప్ప ప్రోత్సాహకాల పేరుతో వేళ్లమీద లెక్కించదగిన కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు, బాంకు అప్పుల మాఫీలు,రికార్డు స్థాయిలో ప్రభుత్వాలు చేస్తున్న అప్పుల గురించి ఎవరైనా సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారా ? పోనీ న్యాయమూర్తులు మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారా అంటే అదీ కనపడదు. అప్పులు తెచ్చేది ఎందుకు అంటే అభివృద్ధి కోసం అని అధికార పార్టీ నుంచి తడుముకోకుండా చెప్పే సమాధానం. ఆ మేరకు దాని ఆనవాళ్లు లేవేమి అంటే ఫలితాలు వెంటనే ఎలా కనిపిస్తాయి, రానున్న రోజుల్లో చూడండి అంటారు. స్వాతంత్య్రం తరువాత దేశాన్ని పాలించిన ప్రధానులందరూ కలసి 2004 నాటికి కేంద్ర ప్రభుత్వానికి మిగిల్చిన అప్పు రు.17,79,763 కోట్లు. పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ పాలనలో 2014మార్చి నెల నాటికి బడ్జెట్‌ పత్రాల సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మిగిల్చిపోయిన అంతర్గత, విదేశీ అప్పుల మొత్తం రు.55,87,149 కోట్లు, అది 2025 మార్చి నాటికి రు.185.11లక్షల కోట్లని, 2026 మార్చి నెలాఖరుకు రు.200.16లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. పదేండ్ల క్రితం ఇప్పుడు కూడా చర్చ అభివృద్ధి మీదే. పదేండ్లలో యుపిఏ పాలనలో అదనంగా 38లక్షల కోట్ల అప్పు చేస్తే దేశాన్ని అప్పుల పాలు చేశారు, అభివృద్దీ చేయలేదు అంటూ నరేంద్రమోడీ నాడు ధ్వజమెత్తారు. తన ఏలుబడిలో 2025మార్చినెలతో ముగిసే ఆర్థిక సంవత్సరం నాటికి అదనంగా చేసిన అప్పు 129లక్షల కోట్లు. ఇది చాలక ఈ ఏడాది మరో 15.68లక్షల కోట్లు కొత్తగా అప్పులు తీసుకొనేందుకు నిర్ణయించారు. తీరా ఇంత చేసినా 80కోట్ల జనాభా ఉచితంగా నెలనెలా ఐదు కిలోల ఆహారధాన్యాలు ఉచితంగా తీసుకుంటే తప్ప గడవని స్థితికి దేశాన్ని దిగజార్చారు. మరో 22 సంవత్సరాల్లో (2047నాటికి) దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు. నమ్మే మాటలేనా ?

అంతకు ముందు కాంగ్రెస్‌ పాలనకు పదకొండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనకు పెద్ద తేడా ఏమిటి ? మన్మోహన్‌ సింగ్‌ మాకు పెద్ద మొత్తంలో అప్పులు మిగిల్చిపోయారు, వాటిని తీర్చటానికే సరిపోతోందని వాదించవచ్చు. అప్పుల్లో మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు గనుక అది తర్కానికి నిలిచేది కాదు.201415లో మోడీ సర్కార్‌ అసలు, వడ్డీ మొత్తాలను తీర్చేందుకు ఖర్చు చేసిన మొత్తం రు.3,13,169 కోట్లు కాగా 2026 మార్చి నాటికి తీర్చాల్సిన మొత్తం రు.12,76,338 కోట్లుగా నిర్మలమ్మ తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు.ఈ ఏడాది బడ్జెట్‌ మొత్తం రు.50.65లక్షల కోట్లకు గాను రు.15.68లక్షల కోట్లు అప్పుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల తీరుతెన్నులను చూస్తే వడ్డీ, అసలు చెల్లింపుల మొత్తం ఏడాదికి లక్ష కోట్ల వంతున పెరుగుతోంది. ఈ లెక్కన మోడీ మూడోవిడత పాలన ముగిసే నాటికి ఎంత అప్పు తెస్తే అంతమొత్తం పాత అప్పులకే సరిపోతుందని వేరే చెప్పనవసరం లేదు.ఒక వైపు అప్పుల కుప్ప పెరుగుతోంది,జనం మీద జిఎస్‌టి, చమురు మీద సెస్‌ల భారం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా ఒక్క పైసా కూడా వినియోగదారులకు తగ్గించకుండా 2022 ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఒకే ధర కొనసాగిస్తూ జేబులను కొల్లగొడుతూనే ఉన్నారు. తెచ్చిన అప్పుల మేరకైనా సంపదలను పెంచే మూలధన పెట్టుబడులుగా పెడుతున్నారా అంటే అదీ లేదు.202324లో రు.16.54లక్షల కోట్ల మేర అప్పులు తెస్తే మూలధన పెట్టుబడులకు రు.7.88 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు, మరుసటి ఏడాది రు.15.69లక్షల కోట్ల అప్పులో రు.8.47లక్షల కోట్లు సవరించిన బడ్జెట్‌ కాగా 202526లో మూలధన పెట్టుబడిగా రు.8.95లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకు ముందు 9.18లక్షల కోట్లు కేటాయించి దాన్ని కుదించినట్లే వచ్చే ఏడాది కూడా అంత మొత్తం ఖర్చు చేస్తారన్న హామీ లేదు. వడ్డీ చెల్లింపుల మాదిరి శాశ్వత ఆస్థుల కల్పన లేదు. అందుకే నరేంద్రమోడీ ఏలుబడి గొప్పతనం ఏమిటి అని ప్రశ్నించాల్సి వస్తోంది.

తమ పాలనలో విదేశీ అప్పులు పెద్దగా తీసుకోలేదని బిజెపి నేతలు గొప్పలు చెప్పుకుంటారు. అంకెలేమి చెబుతున్నాయి. 2014 మార్చి నాటికి విదేశీ అప్పుల మొత్తం మన కరెన్సీలో రు.1.82లక్షల కోట్లు, ఈ మొత్తం 2026 మార్చి నాటికి 6.63లక్షల కోట్లకు పెరుగుతుందని నిర్మలమ్మ బడ్జెట్‌లో చెప్పారు.గత పది సంవత్సరాలలో ఇంత మొత్తం అప్పులు తెచ్చిందెవరు ? మోడీ ఏలుబడిలో రూపాయి విలువ 62 నుంచి 86కు పతనమైంది. దీని వలన జరిగిందేమిటి ? పదేండ్ల క్రితం మోడీ ఒక డాలరు విదేశీ అప్పు తీసుకుంటే దాన్ని మరుసటి ఏడాది చెల్లించాలంటే నాడున్న మారకపు విలువ ప్రకారం రు.62, దానికి నామమాత్రంగా వడ్డీ చెల్లిస్తే సరిపోయేది. అదే డాలరును ఎలాంటి వడ్డీ లేకుండా పదేండ్ల తరువాత ఇచ్చే ఒప్పందం మీద ఎవరైనా ఉదారంగా అప్పు ఇస్తే ఇప్పుడు 86 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.మోడీ దిగిపోయే 2029 నాటికి వందకు పతనమైనా ఆశ్చర్యం లేదు.అధికారానికి వచ్చిన వెంటనే అప్పు తీర్చి ఉంటే ఇంత ఆముదం జనానికి అంటేది కాదు కదా ! ఇదీ మోడీ ఘనత.

ఇప్పుడు కార్పొరేట్లు తమకు మరిన్ని రాయితీలతో పాటు తాము తయారు చేసే వస్తువులు, అందించే సేవలను కొనుగోలు చేసేందుకు మధ్యతరగతికి ఆదాయపన్ను రాయితీలు ఇవ్వాలని, కొందరైతే కార్మికులకు వేతనాలు పెంచాలని కూడా సూచించారు. పన్నెండు లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. దీని వలన ఏటా లక్ష రూపాయలవరకు ఆలోపు రాబడి ఉన్నవారికి మిగులుతుందని అంచనా.ఈ మొత్తంతోనే దేశంలో పడిపోయిన వినియోగం పెరుగుతుందా ? ఈ స్వల్ప మిగులుతో గతంలో చేసిన అప్పులు కూడా తీర్చుకోవచ్చు, వస్తువులే కొనాలని లేదు. లేదా పెరిగిన ఖర్చులకు సరిపెట్టుకోవచ్చు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం, స్వదేశీ పెట్టుబడిదారులకు మరింత ఊతం ఇచ్చే పేరుతో కార్పొరేట్‌ పన్ను 30 నుంచి 22 శాతానికి తగ్గించారు. కొత్తగా పెట్టే సంస్థలకు 15శాతమే అన్నారు. ఈ రాయితీలతో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల లాభాలు విపరీతంగా పెరిగాయి, వాటాదార్లకు డివిడెండ్లు వచ్చాయి తప్ప ఆ మొత్తం పెట్టుబడుల రూపంలో తిరిగి రాలేదు, ఆ మేరకు ఉపాధి కూడా పెరగలేదు. అదే జరిగి ఉంటే వస్తువినియోగం పెరిగి ఉండేది, రూపాయి రూపాయి లెక్కించుకోవాల్సి వచ్చేది కాదు. సంపదలు కొద్ది మంది దగ్గర పోగుపడుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. 201314లో ఏడాదికి 50లక్షల రూపాయల రాబడిని చూపి పన్ను చెల్లించిన వారు 1.85లక్షలుంటే 2023`24లో వారి సంఖ్య 9.34లక్షలకు పెరిగింది. అయితే ఇంకా పన్ను ఎగవేసేవారు, రాబడిని చూపని వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.


దేశంలో 2011జనాభా లెక్కల ప్రకారం రైతులుగా నమోదైన వారు 11.88 కోట్లు, వ్యవసాయ కార్మికులు 14.43 కోట్లు. కార్పొరేట్‌ పన్ను చెల్లించే సంస్థలు 2021లో 9,67,054. నిర్మలా సీతారామన్‌ స్వయంగా వెల్లడిరచినదాని ప్రకారం పైన పేర్కొన్న కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కారణంగా ప్రభుత్వం ఏటా రు.1.45 లక్షల కోట్ల రాబడి కోల్పోతున్నది. పిఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరుతో పెట్టుబడి ఖర్చులకు గాను ఏటా 10.32 కోట్ల మంది రైతులకు 63వేల కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం ఇస్తున్నది. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అంటే ఇదే. రైతులు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నారా, కార్పొరేట్‌ సంస్థలు ఎక్కువ మందికి పని చూపుతున్నాయా ? ఎందుకీ వివక్ష ? రైతులకు ఇచ్చే ఆ మొత్తంతో కార్పిరేట్లు విక్రయించే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాల వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు. దానిలో కూడా కార్పొరేట్లకు లాభాలు, ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రాబడి వస్తుంది.కానీ కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలతో వారేమైనా వస్తువులు, సేవల ధరలు తగ్గించిన దాఖలా ఉందా ? ఆదాయపన్ను రాయితీలు ఒకటైతే ఎగమతి ప్రోత్సాహకాలు, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టినందుకు ప్రోత్సాహకాల రూపంలో ఇచ్చే రాయితీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే వారికి కట్టబెడుతున్న మొత్తాలు ఇంకా ఎక్కువే ఉంటాయి.


ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న వాగ్దానాన్ని పాక్షికంగా నెరవేర్చినా జిడిపి వృద్ది రేటు, కొనుగోలు శక్తి దిగజారి ఉండేది కాదు.పని చేసేందుకు ఏ దేశంలోనూ లేనంత మంది యువత ఉన్నదని గొప్పలు చెప్పుకోవటం తప్ప వారికి ఉపాధి సంగతి తరువాత గత పదేండ్లలో పనిచేసేందుకు ముందుకు వచ్చేవారికి కనీసం నైపుణ్యం అయినా కల్పించారా అంటే అదీ లేదు. నైపుణ్యశిక్షణ పేరుతో తగలేసిన వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద కుంభకోణంగా చెప్పవచ్చు. దరిద్రం ఏమిటంటే అసలు ఎంత మంది నిపుణులున్నారో కూడా తెలియదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ లెక్కలు సేకరిస్తానని ఇప్పుడు చెబుతోంది.నైపుణ్య భారత్‌ కార్యక్రమం కింద కోటీ 40లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని, మరో 54లక్షల మందికి నైపుణ్యాలను పెంచటం లేదా తిరిగి శిక్షణ ఇచ్చామని 2024 కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంది. జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డిసి) 2024లో వెల్లడిరచిన అధ్యయన వివరాల ప్రకారం దేశంలో 10.3కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం కాగా 7.4కోట్ల మందే ఉన్నారు. మారుతున్న అవసరాలకనుగుణ్యంగా నిన్న నేర్చుకున్న నైపుణ్యం రేపటికి పనికి రావటం లేదు. అందువలన వీరిలో ఎందరు పనికి వస్తారన్నది కూడా ప్రశ్న.చైనాలో 40 కోట్ల మంది కార్మికులు ఉంటే వారిలో 20 కోట్ల మంది నిపుణులైన వారు కాగా ఆరు కోట్ల మంది అత్యంత నైపుణ్యం కలిగిన వారని, ఇతర దేశాలతో పోటీ పడేందుకు తమకు ‘‘ నూతన ఉత్పాదక శక్తులు ’’ ఇంకా ఎంతో మంది కావాలని చైనా చెబుతోంది.మహాకుంభ మేళాలో రికార్డు స్థాయిలో జనాలను గంగలో ముంచి స్నానాలు చేయించేందుకు ఇచ్చిన ప్రాధాన్యత పరిశోధన మరియు అభివృద్ధికి నిధుల కేటాయింపు, నైపుణ్య శిక్షణలో ఎక్కడా కనిపించటం లేదు. ఇలాంటి వారు దేశాన్ని, దేశమంటే మట్టి కాదోయ్‌ మనుషులోయ్‌ అన్న గురజాడ చెప్పిన స్పూర్తితో ముందుకు తీసుకుపోతారా !

Share this:

  • Tweet
  • More
Like Loading...

రైతు నేత దల్లేవాల్‌కు వైద్యం : ఫిబ్రవరి 14నచర్చలు ! మద్దతు ధరల చట్టబద్దతపై మోడీ దిగివచ్చేనా !!

19 Sunday Jan 2025

Posted by raomk in BJP, Current Affairs, Economics, employees, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Prices

≈ Leave a comment

Tags

BJP, farm crisis, Farmers agitations, Jagjit Singh Dallewal, MSP demand, Narendra Modi Failures, SKM

ఎం కోటేశ్వరరావు


నవంబరు 26వ తేదీ నుంచి రైతుల సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చారాజకీయ రహిత సంస్థ కన్వీనర్‌ జగత్‌సింగ్‌ దల్లేవాల్‌ జనవరి 18వ తేదీ అర్ధరాత్రి వైద్య చికిత్సకు అంగీకరించారు, ఆ మేరకు ప్రభుత్వ వైద్యులు తగిన చర్యలను ప్రారంభించారు. ఫిబ్రవరి 14వ తేదీన చండీఘర్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. సంయుక్త కిసాన్‌ మోర్చా(రాజకీయ రహిత), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా ప్రతినిధులతో కేంద్ర అధికారులు చర్చలు జరిపారు. ఏడు పదుల వయస్సున్న దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్న పూర్వరంగంలో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు పోవాలని చర్చలు జరపటం, బిజెపికి కీలకమైన ఢల్లీి ఎన్నికలు, దల్లేవాల్‌కు మద్దతుగా మరో 121 మంది నిరవధిక దీక్షలకు పూనుకోవటం, కేంద్ర ప్రభుత్వంపై రోజు రోజుకూ వత్తిడి పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ మేరకు దిగివచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ రైతుల గురించి మాట్లాడరు, రైతు ప్రతినిధులతో మాట్లాడేందుకు సమయం లేదంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు.కోట్లాది మంది రైతుల గురించి చర్చించేందుకు సమయం లేదనటాన్ని బట్టి ఎవరి ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టం అయింది. బడ్జెట్‌పై చర్చలంటూ రైతు ప్రతినిధులను మినహా మిగిలిన వారందరినీ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించి చర్చలను జరిపింది. వీటన్నింటినీ చూసినపుడు వచ్చే నెలలో జరిగే చర్చల్లో ఒరిగేదేమిటి అన్నది పెద్ద ప్రశ్న.ఈనెల 31న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇతర సమస్యలతో పాటు రైతుల గురించి ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, గతంలో రైతు ఉద్యమం సందర్భంగా మరణించిన వారికి పరిహారం, లఖింపూర్‌ ఖేరీ హింసా కాండ బాధితులకు న్యాయం,2013 భూసేకరణ పరిహార చట్ట పునరుద్దరణ,రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌, రైతుల రుణమాఫీ వంటి అంశాలపై రైతులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.

బడ్జెట్‌ ప్రవేశపెట్టబోయే ముందు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వివిధ తరగతుల ప్రతినిధులతో చర్చలు జరపటం ఒక తంతుగా జరుగుతున్నది. అన్ని రోడ్లూ రోమ్‌కే అన్నట్లుగా ఏ పార్టీ చరిత్ర చూసినా గర్వకారణం ఏమీ లేదు. సంపదలలో పెద్ద పీట కార్పొరేట్‌ శక్తులకే వేస్తున్న కారణంగానే అసమానతలు ఏటేటా పెరుగుతున్నాయి. తంతుగా అయినా బడెట్‌ చర్చకు రైతు సంఘాలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు. కొంత మంది కొన్ని పోలికలు తెస్తున్నారు. వాటిలో ఉద్యోగులకు వేతన కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయించిందిగానీ రైతులకు ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించటం లేదన్నది వాటిలో ఒకటి. దీనిలో రెండవది వాస్తవం, ఉద్యోగులకు పది సంవత్సరాల తరువాత వేతన కమిషన్‌ ఏర్పాటును దీనికి ముడి పెట్టనవసరం లేదు. పదేండ్లకు ఒకసారి వేతన సవరణ ద్వారా వారికి అన్యాయమే జరుగుతున్నది తప్ప న్యాయం కాదు. కనీస మద్దతు ధరలకు చట్టబద్దత, ఇతర అంశాల గురించి పరిశీలించేందుకు 2022 జూలైలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతవరకు అది ఏమి చేసిందో ఎవరికీ తెలియదు, వారు నివేదిక సమర్పించరు, ప్రభుత్వమూ అడగదు, అంతా ఒక నాటకంగా మారింది. ఈ లోగా 2021లో క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తీసుకున్న మూడు సాగు చట్టాలను మరో రూపంలో ముందుకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశంలో భూ కమతాలు పద్నాలుగు కోట్లకు పైగా ఉన్నాయి. వాటిలో 88శాతం రెండున్నర ఎకరాల లోపు కలిగిన రైతులే ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదంటూ వారందరినీ కార్పొరేట్లకు అప్పగించేందుకు తన బాధ్యతను వదిలించుకొనేందుకు కేంద్రం చూస్తున్నది.ఒకసారి అది జరిగితే రాష్ట్రాలు కూడా అదేబాట పడతాయి.పరిశ్రమలు, వాణిజ్యాలకు అనేక రక్షణలు, రాయితీలు ఉన్నాయి. వాటి మాదిరిగానే తమకూ కల్పించాలని రైతులు కోరటం గొంతెమ్మ కోర్కె కాదు. కనీస మద్దతు ధరను ఒక్క హక్కుగా చట్టబద్దం చేయాలని కోరుతున్నారు.

పారిశ్రామిక ఉత్పత్తులకు, ఎగుమతులకు, దిగుమతులకూ రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం రైతులను ఎందుకు విస్మరిస్తున్నది, పోనీ వ్యవసాయం ఉపాధి కల్పించటం లేదా పరిశ్రమలు, సేవారంగాల కంటే ఎక్కువ 44శాతం మందికి కల్పిస్తున్నది. సంఘటితంగా పోరాడే స్థితిలో వారు లేకపోవటం తప్ప మరొకటి కనిపించటం లేదు. మనకు అవసరమైన వంట నూనెల్లో 60శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, దానికి ఎన్నో రాయితీలు ఇస్తున్నది ప్రభుత్వం కానీ ఇక్కడ నూనె గింజలు పండిరచేవారికి ధరల గురించి ఒక హామీ ఇవ్వటానికి ముందుకు రావటం లేదు.మార్కెట్‌ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదలివేస్తున్నది. గతేడాది సోయా, ఆవ రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువే పొందారు. మరోవైపున బియ్యం, గోధుమలు, ఉల్లి, పంచదార వంటి వాటి ఎగుమతుల మీద నిషేధం పెట్టి మార్కెట్లో రైతులకు అన్యాయం చేశారు. వినియోగదారులకు మేలు చేయటం అంటే రైతుల నోట్లో మట్టికొట్టటం కాదు కదా ! ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే తక్కువకు రైతుల నుంచి చెరకును మిల్లులు కొనుగోలు చేయకూడదు(అది గిట్టుబాటు కావటం లేదు). అదే మాదిరి ఇతర పంటలకు ప్రభుత్వం ఎందుకు హామీ ఇవ్వటానికి నిరాకరిస్తున్నది ? కనీస వేతన చట్టాన్ని అమలు జరపకపోతే కార్మికులు కోర్టులకు ఎక్కే హక్కు ఉంది, కానీ రైతులకు కనీస మద్దతు ధరలకు అలాంటి అవకాశం లేదు. దాదాపు పదిహేను కోట్ల మంది రైతులు ఉండగా వారిలో తొమ్మిది కోట్ల మందికి ఏటా ఆరువేల రూపాయలు ఇచ్చి అదే మహాభాగ్యం అని చెబుతున్నది. తప్పుల తడకలతో కూడిన గణాంకాలు( వివిధ సూచికలను ప్రకటించినపుడు ప్రభుత్వమే అలా చెబుతున్నది. ఉదా : దేశ ఆకలి సూచిక) వెల్లడిరచినదాని ప్రకారం 2004-05లో వ్యవసాయ వాణిజ్య సూచిక 87.72గా ఉన్నది 2010-11 నాటికి 102.95కు పెరిగింది.దాని ప్రకారం పెట్టుబడుల కంటే పంటల అమ్మకం ద్వారా ఎక్కువ పొందారని భాష్యం చెప్పారు. అదే 202223లో ఆ సూచిక 97.21కి పడిపోయింది. అంటే రైతులు పొందుతున్నది తగ్గిపోయింది. అందుకే రైతుల కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కోరుతున్నారు.


రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మూడు సంవత్సరాల తరువాత కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన మరో రూపంలో ముందుకు తీసుకురావటం ఆందోళన కలిగించే అంశం. నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ పాలసీ(నాంప్‌)ని 2024 నవంబరు 25న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ఆధ్వర్యాన డిసెంబరు 23న దేశమంతటా నిరసన తెలిపారు. అనేక మంది నిపుణులు విమర్శించారు. దాని మీద అభిప్రాయాలు తెలిపేందుకు కేవలం పదిహేను రోజులు మాత్రమే కేంద్రం గడువు ఇచ్చింది. ఇప్పుడున్న మార్కెటింగ్‌ వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవని కాదు, దాన్ని సంస్కరించకూడదని ఎవరూ చెప్పటం లేదు. అయితే ఆ పేరుతో ఇప్పుడున్నదాని కంటే ప్రమాదకరమైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయద్రవ్య పెట్టుబడి సంస్థలు సూచించిన పద్దతిలో సమూల మార్పులు ప్రతిపాదించటం ఆందోళనకరం. దాని ప్రకారం దేశమంతటిని అనుసంధానించే ఒకే మార్కెట్‌ను ఏర్పాటు చేస్తారు. ఇదంతా చిన్న రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాల కంటే కార్పొరేట్లకే ప్రాధాన్యత ఇచ్చే వ్యవహారం.రైతులు ముడి సరకును సరఫరా చేసేవారిగా మాత్రమే ఉంటారు.వాటి నుంచి ఉత్పత్తులు తయారు చేయటం,వాణిజ్యం, ఎగుమతి అంతా కార్పొరేట్లదే. ఈ క్రమంలో తేలే మిగులులో రైతుల వాటా గురించి ఎక్కడా స్పష్టత లేదు. అంతే కాదు కనీస మద్దతు ధరలకు ఎలాంటి హామీ ప్రస్తావన కూడా లేదు.అలాంటి ఉద్దేశ్యం ఉంటే ఈ పాటికి కేంద్ర ప్రభుత్వం దాని గురించి ఒక స్పష్టత ఇచ్చి ఉండేది. రైతాంగానికి గరిష్ట ప్రయోజనం, డిజిటల్‌, పారదర్శకత, జాతీయ మార్కెట్‌ సమాచారం వంటి పదజాలం ఎంతగా వల్లించినా వాటిని వినియోగించుకొనే అవకాశం ఎంత మంది రైతులకు ఉంటుందన్నది ప్రశ్న. ఇప్పుడు అనేక నియంత్రణలు ఉన్నా వాటిని ఖాతరు చేయకపోవటం, దొడ్డిదారిన ఉల్లంఘిస్తున్న కంపెనీలపై అసలు ఎలాంటి నియంత్రణలు ఉండకూడదని ఈ ప్రతిపాదనల్లో ఉన్నది. వ్యవసాయ ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఈ విధానంతో రాష్టాల హక్కులు, నియంత్రణలకు నీళ్లదులుకోవాల్సిందే. అమల్లోకి వచ్చిన తరువాత గానీ ఇతర మంచి చెడ్డలు వెల్లడి కావు.

ఫిబ్రవరి 14వ తేదీన కేంద్ర, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య జరిగే చర్చల అజెండా ఏమిటో తెలియదు. ఎవరెవరు పాల్గ్గొనేదీ ఇంకా స్పష్టం కాలేదు. ఒకటి మాత్రం స్పష్టం, ఇది ఒక రోజులో తేలే వ్యవహారం కాదు.కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని 2012లోనే సిఎంగా ఉండగా నరేంద్రమోడీ కమిటీ నాటి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీని గురించి తాజా పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసినా మోడీ మొరాయిస్తున్నారు. పార్లమెంటరీ కమిటీ సిఫార్సును అమలు చేయాలంటూ కేంద్రానికి సూచించాలని రైతు సంఘాల నేతలు సుప్రీం కోర్టును కోరారు. వ్యవసాయ గ్రాంట్లపై ఏర్పాటైన కమిటీ 202425 నివేదికను గతేడాది డిసెంబరు 20న పార్లమెంటుకు సమర్పించింది.దీన్ని కేంద్రం ఆమోదిస్తే అమలుకు ఉపక్రమించాలి తిరస్కరిస్తే కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటరీ కమిటీ చేసిస సిఫార్సు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజన మొత్తం రు. ఆరువేలను పన్నెండు వేలకు పెంచాలి.(దాన్ని చూసి కొంత మంది అమలు జరగనున్నట్లు ప్రచారం చేశారు) ఈ ప్రోత్సహకాన్ని కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు కూడా ఇవ్వాలి. కనీస మద్దతు ధరల చట్టబద్దతకు ఒక రోడ్‌ మాప్‌ను సాధ్యమైనంత త్వరలో ప్రకటించాలి. వ్యవసాయ కార్మికులకు కనీస జీవన వేతనాల నిమిత్తం జాతీయ కమిషన్‌ ఏర్పాటు. రైతులు, వ్యవసాయ కార్మికులకు రుణాల రద్దు పధకాన్ని ప్రవేశ పెట్టాలి.వ్యవసాయ శాఖ పేరులో వ్యవసాయ కార్మికుల పేరును కూడా చేర్చాలి.

కనీస మద్దతు ధరలకు అనుకూల వాదనల సారం ఇలా ఉంది. రైతులకు ధరల మీద ఒక చట్టబద్దత ఉంటుంది. మార్కెట్‌ వడిదుడుకుల నుంచి రక్షణ ఉంటుంది. మధ్యవర్తుల దోపిడీ నిరోధంగా ఉంటుంది.ఉత్పత్తి ఖర్చులను భరించేందుకు, ఆర్థిక పరమైన భద్రతను మెరుగుపరచుకొనేందుకు స్థిరమైన రాబడికి వీలు కలిగిస్తుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉత్పాదకత, సామర్ధ్యాలను పెంచుతుంది. ఆహార భద్రత, కొరతలను తీరుస్తుంది, దారిద్య్ర తగ్గింపుకు తోడ్పడుతుంది.రైతాంగ జీవనాన్ని మెరుగుపరుస్తుంది. మార్కెట్‌ వడిదుడుకులను తగ్గిస్తుంది. వ్యతిరేకించే వారేమంటారంటే.. మార్కెట్లో అసమతూకానికి దారితీస్తుంది, కొన్ని పంటలను అవసరాలకు మించి ప్రోత్సహిస్తుంది. సరఫరాఅవసరాల తీరు తెన్నులను విచ్చిన్నం చేస్తుంది.ప్రభుత్వాల మీద భారం మోపుతుంది, మిగులును కొని నిల్వచేయాల్సిన అవసరాన్ని పెంచుతుంది.వనరుల కేటాయింపులో అసమర్ధతకు దారి తీస్తుంది. పంటల వైవిధ్యానికి బదులు కొన్ని పంటలనే ప్రోత్సహిస్తుంది.అవినీతిని ప్రోత్సహిస్తుంది. మధ్యవర్తులు అవకాశంగా తీసుకొని రైతులకు లబ్దిని తగ్గిస్తారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలను అడ్డుకుంటుంది,ప్రతిదానికీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సి ఉంటుంది. మార్కెట్‌ వ్యవస్థలో పోటీని తగ్గిస్తుంది. రైతులు కొత్త పద్దతులవైపు చూడకుండా కనీస మద్దతు ధరల మీద ఆధారపడతారు,మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మారరు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పాకేజ్‌ ఉపశమనమే : విశాఖ ఉక్కుపై వేలాడుతున్న ప్రయివేటు కత్తి !

18 Saturday Jan 2025

Posted by raomk in BJP, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ 1 Comment

Tags

:vizag steel package, BJP, CHANDRABABU, Narendra Modi Failures, VISVESVARAYA IRON AND STEEL FACTORY, vizag-steel-plant


ఎం కోటేశ్వరరావు


ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విశాఖ ఉక్కును ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం రు.11,440 కోట్ల పాకేజ్‌ను ప్రకటించింది.ఆ మొత్తంలో రు.10,300 కోట్లు ఈక్విటీ వాటా సొమ్ముగా, మిగిలిన మొత్తం నిర్వహణ రుణం. అది గ్రాంటు కాదు.అయినా కనుక కొంత మేలు కలుగుతుంది. తీవ్రంగా ఉన్న రోగికి నొప్పి తగ్గించే మాత్ర ఇస్తే తాత్కాలిక ఉపశమనం తప్ప జబ్బు పోయినట్లు కాదు.ఈ మాత్రానికే తెలుగుదేశం శ్రేణులు సంబంరాలు చేసుకుంటున్నాయి. ఇది రెండిరజన్ల పాలన కారణంగానే జరిగినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపి పలుకులు వల్లిస్తున్నారు. ప్రయివేటీకరణ ముప్పు తొలగిపోయినట్లు నమ్మించేందుకు చూస్తున్నారు. ఆంధ్రుల ఆకాంక్షలను కేంద్రం గమనించిందని చిత్రిస్తున్నారు. ఈ పదజాలం నరేంద్రమోడీని పొగిడేందుకు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.నిజానికి బిజెపికి మతపరమైన మనోభావాలు తప్ప ఇతర అంశాలు పట్టవు. భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్దం ఆయన పేరు పెట్టిన భద్రావతి ఉక్కునే అమ్మేందుకు చూసిన వారికి విశాఖ ఉక్కు ఒక లెఖ్కా. దాన్ని రక్షించుకొనేందుకు 1,390 రోజులుగా కార్మికులు,వామపక్ష పార్టీలకు చెందిన వారు ఏదో ఒక రూపంలో నిరసన తెలియచేస్తూనే ఉన్నారు. ఈ ప్లాంట్‌ ఉనికిలోకి వచ్చిన నాలుగుదశాబ్దాల కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగానే ఉంది తప్ప ఆ సంస్థను నిలబెట్టేందుకు అవసరమైన మౌలిక చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు.
చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రెండిరజన్ల పాలన కారణంగానే పదకొండువేల కోట్ల పాకేజ్‌ వస్తే కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండగా అక్కడి భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఉక్కు కర్మాగారానికి నెల రోజుల క్రితమే ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామి పదిహేనువేల కోట్ల పాకేజ్‌ను ప్రకటించటాన్ని ఎలా చూడాలి. ఆ సంస్థ పునరుద్దరణకు పదివేల కోట్లు అవసరమని గతంలో చెప్పిన మంత్రి పదిహేనువేల కోట్ల పాకేజ్‌ ప్రకటించారు, 26వేల కోట్ల అప్పులున్న విశాఖ స్టీలుకు పదకొండున్నరవేల కోట్లా ? గొప్పలు చెప్పుకొనేందుకు కాస్త వెనుకా ముందు చూసుకోవాల్సిన అవసరం లేదా ? జనం మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నారా ? విశాఖ ఉక్కు లాభాలతో నడిచేందుకు అవసరమైన స్వంత గనుల గురించి, సెయిల్‌ సంస్థలో విలీనం గురించి రెండిరజన్ల పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు.


భద్రావతి ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారాలను గమనించినపుడు ఒక వేళ విశాఖ ఉక్కును సెయిల్‌ సంస్థలో విలీనం చేసినా ప్రైవేటీకరణ ముప్పు ఉండదనే హామీ లేదు.భద్రావతి ఉక్కు సెయిల్లోనే ఉంది. అయినప్పటికీ దాన్ని మూసివేయాలని, విక్రయించాలని అదే సంస్థగతంలో నిర్ణయించటమే గాదు టెండర్లను కూడా పిలిచింది. లోక్‌సభ ఎన్నికలు జరిగి మూడోసారి నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2024జూన్‌ 30వ తేదీన మంత్రి కుమారస్వామి ఆ సంస్థను సందర్శించి తిరిగి పనిచేయిస్తామని వాగ్దానం చేశారు.అది జరిగిన నెల రోజులకు జూలై 30వ తేదీన అదే మంత్రిత్వశాఖ లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో దాన్ని ఇప్పటికే మూసివేయాలని నిర్ణయించామని అందువలన తిరిగి పనిచేయించే ఉద్దేశ్యం లేదని స్పష్టంగా పేర్కొన్నది. ప్రశ్న అడిగింది ఎవరో కాదు, షిమోగా బిజెపి ఎంపీ బివై రాఘవేంద్ర(మాజీ సిఎం ఎడియూరప్ప కుమారుడు). దానికి ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సమాధానం ఇచ్చారు. 2016 అక్టోబరులోనే సూత్రప్రాయంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానం కింద ఫ్యాక్టరీని అమ్మివేసేందుకు అనుమతి ఇచ్చినట్లు, అయితే దరఖాస్తు చేసిన వాటిలో ఎంపిక చేసిన సంస్థలు తదుపరి ముందుకు పోయేందుకు ఆసక్తి చూపకపోవటంతో అమ్మివేయాలనే నిర్ణయాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. తరువాత దాన్ని మూసివేసేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు.ఈ విషయాన్ని 2022 అక్టోబరు 14వ తేదీన పెట్టుబడుల మరియు ప్రభుత్వ ఆస్తుల యాజమాన్యశాఖకు తెలియచేసినట్లు కూడా మంత్రి తెలిపారు.ప్రస్తుతం 245 మంది పర్మనెంటు ఉద్యోగులు ఉన్నట్లు అనుబంధ సంస్థలు పంపిన కొన్ని పూర్తిగాని ఉత్పత్తులకు మెరుగులు దిద్దుతున్నట్లు, 202324లో అమ్మకానికి వీలైన పదమూడువేల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. నాలుగోసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ ఉక్కు ఫ్యాక్టరీని పునరుద్దరింప చేయటంలో విఫలమైనట్లు కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున రాఘవేంద్రపై విమర్శల దాడికి దిగటంతో ప్రశ్న అడగాల్సి వచ్చింది.

వంద సంవత్సరాల క్రితం మైసూరు రాజు నలవాది కృష్జరాజ వడయార్‌ రాజ్యంలో దివానుగా ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీ మైసూర్‌ ఐరన్‌ వర్క్స్‌ పేరుతో 1923లో భద్ర నది తీరంలో ప్రారంభమైంది.ఇతర లోహాలతో మిళితం చేసి ప్రత్యేకమైన ఉక్కును తయారు చేసిన దేశంలోని తొలి ఫ్యాక్టరీ ఇది. తరువాత మైసూర్‌ ఐరన్‌ మరియు స్టీల్‌ వర్క్స్‌గా మారింది. 1962లో 40:60శాతం వాటాలతో కేంద్రకర్నాటక ప్రభుత్వ కంపెనీగా ఉనికిలోకి వచ్చింది.1975లో విశ్వేశ్వరయ్య ఐరన్‌ మరియు స్టీల్‌ లిమిటెడ్‌ అని నామకరణం చేశారు. 1989లో సెయిల్‌ అనుబంధ సంస్థగా జతచేసి 1998లో విలీనం చేశారు.2004లో లాభాల బాట పట్టిన సంస్థ తరువాత నష్టాలపాలైంది.తరువాత సెయిల్‌ దాన్ని మూసివేసి విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఫ్యాక్టరీ మూసివేత, అమ్మివేత నిర్ణయం రెండిరజన్ల పాలనలోనే జరిగింది.కర్ణాటకలో అప్పుడు బిజెపి అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత కూడా మూసివేతకే కట్టుబడి ఉన్నట్లు అది స్పష్టంగా చెప్పింది.ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, తక్కువ పరిమాణంలో ఉత్పత్తి ఉందని, పాతబడిన సాంకేతిక పరిజ్ఞానం, కాపిటివ్‌ మైన్స్‌ కూడా లేవని, అల్లాయ్‌ ఉక్కు రంగంలో పోటీ ఎక్కువగా ఉందని 2023లో ఉక్కుశాఖ మంత్రిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా పార్లమెంటులో వాదించారు. నాటకీయ పరిణామాల మధ్య గతేడాది డిసెంబరులో దాని పునరుద్దరణకు పదిహేనువేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు.అయితే నిర్దిష్ట చర్యలేవీ ఇంతవరకు ప్రారంభం కాలేదు, అది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందా లేక ఏదో ఒకసాకుతో అయినకాడికి తెగనమ్మి వదిలించుకుంటారా అన్నది చెప్పలేము.


భద్రావతి ఉక్కుతో పోలిస్తే విశాఖ ఉక్కు ఎంతో అధునాతనమైన సంస్థ.ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖలోని అతి పెద్ద కంపెనీ. ఏది పెద్దది ఏది చిన్నది అన్న చర్చ అవసరం లేదు. రెండిరటినీ రక్షించుకోవాల్సిందే. ఇప్పుడు రెండు సంస్థలకూ కేంద్ర ప్రభుత్వం పాకేజీలను ప్రకటించాల్సి వచ్చింది.దీనికి కారణం కేంద్రంలో బలాబలాల్లో వచ్చిన మార్పే అన్నది స్పష్టం. ఎవరి మద్దతు అవసరం లేకుండా స్వంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం నరేంద్రమోడీకి లోక్‌సభ వచ్చినపుడు కళ్లు నెత్తికెక్కాయంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి అధికారానికి వచ్చినపుడు విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గట్టిగా అడిగింది లేదు, జగన్మోహనరెడ్డి ఏలుబడి సంగతి తెలిసిందే. రెండు పార్టీలూ మోడీకి మద్దతు ఇవ్వటంలో పోటీ పడ్డాయి. భద్రావతి ఉక్కును పునరుద్దరించాలని బిజెపి నేత యడియూరప్ప నాయకత్వంలో ఆ పార్టీ ప్రతినిధివర్గం నరేంద్రమోడీని కలిసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.బిజెపికి దూరంగా ఉన్న కారణంగా అప్పుడు దేవెగౌడ పాలనలో తగిన చర్యలు తీసుకొని ఉంటే మూతపడే పరిస్థితి వచ్చేది కాదని ఎడియూరప్ప కుమారుడు, ఎంపీ రాఘవేంద్ర నెపాన్ని ఆయన మీదకు నెట్టేందుకు చూశారు. భద్రావతి ఉక్కును కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాని కారణంగా అది అలాగే ఉండిపోయింది తప్ప లేకుంటే తుక్కు కింద ఎప్పుడో మారి ఉండేది.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 33వేల ఎకరాల్లో ఉంది.అందువలన అమ్మకానికి పెడితే దాన్ని ఎగరేసుకు పోయేందుకు సిద్దంగా ఉన్నారు.ఆ ఫ్యాక్టరీ కోసం ప్రాణాలర్పించిన వారుగానీ, దానికి భూములు ఇచ్చిన వారు గానీ పప్పుబెల్లాల్లా పందారం చేసి కారుచౌకగా ఎవరికో కట్టబెట్టేందుకు కాదు. ఇప్పటి వరకు ప్రైవేటీకరణ విధానంలో మార్పు చేసినట్లు కేంద్రం ఎక్కడా చెప్పటం లేదు. అందువలన తెలుగుదేశం, జనసేన నేతల మాటలు నమ్మనవసరం లేదు. తీరా వేటు పడిన తరువాత మేము చేయాల్సిందంతా చేశామని చేతులు దులుపుకుంటారు. ఇప్పటివరకు ఎంతో పట్టుదలతో ఉన్న కార్మికులు, వారికి మద్దతుగా ఉన్న వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలను మరింతగా జనం ఆదరించి నిలబడితే ప్రైవేటీకరణ ముప్పును తిప్పికొట్టటం అసాధ్యం కాదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

పంజాబ్‌లో ‘‘ఎమర్జన్సీ’’ సినిమా ప్రదర్శనకు బ్రేక్‌, సిక్కులపై విరుచుకుపడిన కంగన ! నరేంద్రమోడీపై ఉక్రోషం !!

18 Saturday Jan 2025

Posted by raomk in BJP, Congress, Current Affairs, Farmers, Filims, History, INDIA, Literature., NATIONAL NEWS, Political Parties

≈ Leave a comment

Tags

BJP, Kangana ranaut, Kangana Ranaut’s Emergency ’, Narendra Modi, SGPC, Sikh’s protest

ఎం కోటేశ్వరరావు


అందరూ ఊహించినట్లుగానే వివాదాస్పద ‘‘ ఎమర్జన్సీ ’’ (అత్యవసర పరిస్థితి) సినిమా ప్రదర్శనకు పంజాబ్‌లో ఆటంకం ఏర్పడిరది. హిమచల్‌ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన సినిమా హీరోయిన్‌ కంగన రనౌత్‌ నిర్మించి,దర్శకత్వం వహించటమే గాక ఇందిరా గాంధీ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు (2025 జనవరి 17న) విడుదలైన ఈ సినిమా గురించి ప్రశంసలు విమర్శలు వెలువడ్డాయి. చరిత్ర కంటే మైకం ఎక్కువగా కనిపించిందని, వాస్తవ చరిత్రను ఎలా తీయకూడదో దీన్ని చూసి నేర్చుకోవాలన్న అభిప్రాయం కూడా వచ్చింది. తన చిత్రాన్ని అడ్డుకోవటం కళాకారులు, కళను అడ్డుకోవటమే అంటూ కంగన రనౌత్‌ విమర్శలకు దిగారు. తొలి రోజు సినిమా వసూళ్లు గణనీయంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నోటి దురుసు వ్యక్తిగా పేరు మోసిన కంగనా రనౌత్‌ ‘‘ ఎమర్జన్సీ’’ సినిమా 2024లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపికి తలనొప్పిగా మారింది. చరిత్రను వక్రీకరించటమే గాక తమను దేశద్రోహులు, ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, సోదరత్వాన్ని దెబ్బతీసి అది తమపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉన్నందున ఆ చిత్రంపై నిషేధం విధించాలంటూ దేశవ్యాపితంగా సిక్కులు డిమాండ్‌ చేశారు. ఖలిస్తాన్‌ మద్దతుదార్లు కంగనను చంపివేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో 2024సెప్టెంబరు ఆరున విడుదల తేదీని ప్రకటించిన కంగన కొద్ది రోజుల ముందు సెన్సార్‌ ధృవీకరణ పత్రం రాలేదని ప్రకటించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం, ఆమె ప్రధానిగా ఉన్నపుడు 21నెలల అత్యవసరపరిస్థితి విధింపు తదితర అంశాల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.2024 ఆగస్టు 14వ తేదీన 2.43నిమిషాల నిడివిగల ట్రైలర్‌ను విడుదల చేయగా 50లక్షల మంది చూశారని, కేవలం 461 మంది మాత్రమే ఇష్టపడినట్లు నమోదైనట్లు గతేడాది ఇండియా టుడే పేర్కొన్నది.ప్రతి ఒక్క ఓటునూ లెక్కించుకున్న బిజెపి దేశంలో ఉన్న మూడు కోట్ల మంది సిక్కులు ఉన్నందున వారంతా వ్యతిరేకిస్తారని భయపడిరది. లోక్‌సభ ఎన్నికల తరువాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నందున మొత్తం మీద ఏదో ఒకసాకుతో సినిమా విడుదలను వాయిదా వేయించారు. గతంలో బిజెపి మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్‌ కూడా సినిమా ప్రదర్శనను వ్యతిరేకించింది. వచ్చే నెలలో ఢల్లీి ఎన్నికలు జరుగుతుండగా విడుదలైన ఈ చిత్రం మీద తలెత్తిన వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఢల్లీిలో దాదాపు పది లక్షల మంది సిక్కు సామాజిక తరగతి ఓటర్లు ఉన్నారు, అక్కడ ఉన్న 70 నియోజకవర్గాలలో వారు విస్తరించి ఉన్నారు. అదే సామాజిక తరగతికి చెందిన ఆతిషి మోర్లెనా ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వ సిఎంగా ఉన్న సంగతి తెలిసిందే.


ఎమర్జన్సీ సినిమా ప్రదర్శనకు నిరసన తెలుపుతామని శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ(ఎస్‌జిపిసి) ఇచ్చిన పిలుపుతో శుక్రవారం నాడు పలు సినిమా ధియేటర్ల వద్ద సిక్కులు నిరసన తెలిపారు. దాంతో పంజాబ్‌ అంతగా సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.సిక్కు మత చరిత్రను, 1984 ఉదంతాలను సినిమాలో వక్రీకరించారని ఆ సంస్థ విమర్శించింది. చరిత్రను వక్రీకరించి మసాలాను దట్టించకపోతే ఇలాంటి సినిమాలను ఎవరూ చూడరు గనుక అలా తీశారని, సెన్సార్‌బోర్డు, ప్రభుత్వాలు ఈ అంశాలను గమనంలోకి తీసుకోవాలని పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరిందర్‌ సింగ్‌ రాజా పేర్కొన్నారు, ఉడ్తా పంజాబ్‌ పేరుతో తీసిన సినిమా కూడా అలాంటిదే అన్నారు. చండీఘర్‌ పక్కనే ఉన్న పంజాబ్‌ మొహాలీ నగరంలో సినిమా హాళ్ల వద్ద రైతులు కూడా నిరసన వెల్లడిరచారు. స్వర్ణదేవాలయం ఉన్న అమృతసర్‌ పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఎక్కడైనా అవాంఛనీయ ఉదంతాలు జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్‌జిపిసి హెచ్చరించింది. రానున్న రోజుల్లో కూడా హాలు యజమానులు ఇదే వైఖరిని అనుసరిస్తే మంచిది లేకుంటే నిరసనను తీవ్రం చేస్తామని పేర్కొన్నది. సంస్థ న్యాయవాది హర్జిందర్‌ సింగ్‌ రాష్ట్ర ్పభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో చిత్ర ప్రదర్శనను అడ్డుకోవాలని కోరారు. ఎమర్జన్సీ చిత్రంలో ముఖ్యమైన చరిత్రను నమోదు చేశారని, కంగన ప్రతిభావంతంగా నటించారని, బిజెపి నేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రకటించారు. తన సినిమాను తిలకించి అభినందించినందుకు కంగన కృతజ్ఞత తెలిపారు. రాజకీయాల ప్రాతిపదికన సామాజిక మాధ్యమంలో స్పందించిన కొందరు కంగనకు జాతీయ అవార్డు ఇవ్వాలని కూడా చెప్పారు. నాడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నవారిని గొప్పగా చూపారనే విమర్శలు వచ్చాయి.


ప్రధాని నరేంద్రమోడీని స్వయంగా కలవాలనుకున్నాను, జరగలేదు, అంత మాత్రాన ఇతర ప్రముఖులు కలిస్తే నేనెందుకు కలవరపడతాను అంటూ కంగన రనౌత్‌ తన ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. శుభంకర్‌ మిశ్రా అనే జర్నలిస్టుతో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కంగన లేదంటూనే కలవరపాటును వెల్లడిరచారు. గతంలో రైతు ఉద్యమాన్ని గట్టిగా సమర్ధించిన సినిమా గాయకుడు, నటుడు, నిర్మాత దల్జిత్‌ దోసంజ్‌, కపూర్‌ కుటుంబ సభ్యులు ఇటీవల కలిసేందుకు నరేంద్రమోడీ అవకాశం ఇచ్చారు. కపూర్‌ కుటుంబం పేరెత్తకుండానే దానికి నా కెందుకు కలవరం, దీన్లో అలాంటిదేముంది అంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల నిరసనలో దల్జిత్‌ ముందు వరుసలో ఉన్నాడు, వారిని సమర్ధించాడు అని కంగన ధ్వజమెత్తారు.మరి అలాంటి వ్యక్తిని కలుసుకొనేందుకు, తీరికలేకుండా ఉండే ప్రధాని అతని పాటలు వినేందుకు, సంగీతం గురించి చర్చించేందుకు కొన్ని గంటలు కేటాయించటం మిమ్మల్ని గాయపరచలేదా అన్న ప్రశ్నకు తనకు అవకాశం ఇవ్వకుండా దల్జీత్‌ను కలిసినందుకు తనకు ఎలాంటి కలవరం కలగలేదన్నారు, దీనికి కలవరపడాల్సిందేముంది? ఆయనకు అందరూ సమానమే, సినీ రంగానికి చెందిన అనుపమఖేర్‌, మనోజ్‌ ముంతాషిర్‌ వంటి వారికి గతంలో ప్రధాని కలిసే అవకాశం వచ్చింది.తనకు కొద్ది క్షణాలు మాత్రమే కలిసే అవకాశం వచ్చింది, ఇతరులు కలిసినందుకు నేను ఆశాభంగం చెందలేదు. నిజానికి నేను ఎన్నడూ ప్రధానిని కలవలేదు.ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒకసారి ఆయనకు నమస్కారం పెట్టాను తప్ప మాట్లాడలేదు. నేను ప్రధానికి పెద్ద అభిమానిని అని మీరు తెలుసుకోవాలి. కళల గురించి ఆయన ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకొనేందుకు అభిప్రాయాలు మార్పిడి, దీర్ఘమైన చర్చ జరపాలని కోరుకుంటాను అని కంగన వివరణ ఇచ్చుకున్నారు. తన చిత్రం ఎమర్జన్సీ ప్రచారంలో భాగంగా విడుదలకు ముందు రోజు ఆమె వివిధ మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ దృష్టిని ఆకర్షించటానికి ఆమె పడరాని పాట్లు పడ్డారు. అధికారానికి వచ్చిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని 2021లో చెప్పారు.స్వీయ అనుభవంతో తానీ మాటలు చెబుతున్నట్లు, తన అతి మంచితనం కారణంగా వ్యవస్థ తనను దేశం విడిచి అమెరికా వెళ్లేట్లు చేసిందని, మోడీ అధికారానికి వచ్చాక తాను తిరిగి వచ్చానని అందుకే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. అదే విధంగా కత్రినా కైఫ్‌ వంటి విదేశీ హీరోయిన్లు ఎంతో రాణించారని కానీ 2014తరువాత స్వదేశీ నటీనటులు, కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, విదేశీయుల నృత్యాలు ఆపాలని జనం చెప్పారని, ఇటాలియన్‌ ప్రభుత్వాన్ని తొలగించి ఒక చాయ్‌వాలాను ప్రధానిని చేశారని కూడా సెలవిచ్చారు. రైతు ఉద్యమాన్ని వ్యతిరేకించటమే గాక అందులో పాల్గొన్నవారిపై నోరు పారవేసుకున్నందుకు చండీఘర్‌ విమానాశ్రయంలో ఒక మహిళా కానిస్టేబుల్‌ చేతిలో చెంపదెబ్బ తిన్న సంగతి కూడా తెలిసిందే.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మనుస్మృతిపై మద్రాస్‌ హైకోర్టు తీర్పు : హిందూత్వ మనువాదుల మనోభావాలకు చెంపపెట్టు !

14 Tuesday Jan 2025

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, Left politics, Literature., NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION, Women

≈ Leave a comment

Tags

BHU, BJP, Hinduthwa, Madras HC, Manusmriti, RSS, VCK

ఎం కోటేశ్వరరావు


ఉన్నది ఉన్నట్లు చెప్పినా తమ మనోభావాలను దెబ్బతీశారంటూ దెబ్బలాటలకు దిగుతున్న రోజులివి.తరతరాలుగా జరుగుతున్నదే. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని నాటి క్రైస్తవ మతగ్రంధాలు, జ్యోతిష గ్రంధాలు చెప్పినది వాస్తవం కాదని సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నదని నిరూపించిన ఖగోళశాస్త్రజ్ఞుడు నికోలస్‌ కోపర్నికస్‌పై ఐదు వందల సంవత్సరాల క్రితమే నాటి క్రైస్తవ మతవాదులు దాడి చేశారు, మూర్ఖుడని నిందించారు. చరిత్రలో ఏ మతవాదీ నిజాన్ని అంగీకరించిన దాఖలా లేదు. మన దేశంలో హిందూత్వ, ఇస్లామిక్‌, క్రైస్తవ మతవాదులు దానికి అతీతులు కాదు. అలాంటి వారికి 2025జనవరి మొదటి వారంలో మద్రాస్‌ హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది. తమిళనాడులో విడుతలై చిరుతాయిగల్‌ కచ్చి(విసికె) అనే పార్టీ ఎంపీ తిరుమవలన్‌. అతని మీద 2020లో ఒక ప్రైవేటు కేసు నమోదైంది.అదేమిటంటే పెరియార్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో ఫిర్యాదుదారు ఒక కార్యక్రమాన్ని చూశారు. తిరుమవలన్‌ మరొక వ్యక్తితో కలసి హిందూ మహిళల గురించి బహిరంగంగా చెప్పిన మాటలు వారి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని, వారి గురించి ఒక తప్పుడు కథనాన్ని చెప్పారని, వాటిని విని ఒక హిందువుగా అవమానకరంగా భావించానని, తన మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నందున తగిన చర్యలు తీసుకొని శిక్షించాలన్నది కేసు సారం. ఆ కేసులో పసలేదని దాన్ని కొట్టివేయాలంటూ తిరుమవలన్‌ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపిన న్యాయమూర్తి పి.వేలుమురుగన్‌ కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. కరోనా సమయంలో పెరియార్‌ మరియు భారత రాజకీయాలు అనే అంశంపై యూరోపియన్‌ పెరియార్‌ అంబేద్కర్‌ కామ్రేడ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సమావేశంలో తిరుమవలన్‌ ప్రసంగించారు. దానిలో మనుస్మృతిలో ఉన్న కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి తమ మనోభావాలను దెబ్బతీశాయన్నది కేసు. అయితే తిరుమలన్‌ మనుస్మృతిలో ఉన్న అంశాలను ప్రస్తావించి వాటికి అర్ధం చెప్పారు తానుగా కొత్తగా చెప్పిందేమీ లేనందున ఎలాంటి చర్య తీసుకోవనవసరం లేదంటూ న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. తిరోగామి భావజాలం గురించి గతంలోనే అనేక మంది చీల్చి చెండాడారు.వాటిని పునశ్చరణ చేయవచ్చు, మరింతగా వివరించవచ్చు. అంతే కాదు ఈ తీర్పుతో ఒకటి స్పష్టమైంది. ఎవరినీ కొట్టావద్దు తిట్టావద్దు, పురాతన సంస్మృత గ్రంధాల్లో ఉన్న వాటి అసలు అర్ధాలను చెబుతూ వాటిని జనంలోకి మరింతగా తీసుకువెళితే చాలు. ముంజేతిని చూసుకొనేందుకు అద్దాలు అవసరం లేదు.


ఇదే అంశంపై మద్రాస్‌ హైకోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని 2020 నవంబరులో జస్టిస్‌ ఎం సత్యనారాయణన్‌, జస్టిస్‌ ఆర్‌ హేమలత డివిజన్‌ బెంచి కొట్టివేసింది.ఎస్‌ కాశీరామలింగం దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో బిజెపి నేత, న్యాయవాది ఆర్‌సి పాల్‌ కనకరాజ్‌ వాదించారు.ఉనికిలో లేని మనుస్మృతిని నిషేధించాలని పార్లమెంటు సభ్యుడు కోరుతూ చేసిన ప్రసంగం అశాంతికి, వివిధ తరగతులను రెచ్చగొట్టటానికి దోహదం చేసినందున సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. ప్రసంగం చేయటమే గాక దాన్ని నిషేధించాలని కూడా డిమాండ్‌ చేశారన్నారు. మనుస్మృతి రాజ్యాంగబద్దమైనదేమీ కాదని, అందువలన దాన్ని ఫలాన విధంగానే చదవాలనే నిబంధనేమీ లేదని, రెండువేల సంవత్సరాల నాటి గ్రంధానికి భాష్యాలు చెప్పవచ్చని అందువలన ఎంపీపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది.దానిలో చెప్పిన నైతిక నియమావళి రాజ్యాంగబద్దం కాదని, వాటిని అమలు జరపలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు.వాద ప్రతివాదనల సందర్భంగా తమ పిటీషన్ను ఉపసంహరించుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన అంశాలతో మరొక పిటీషన్‌ దాఖలు చేసేందుకు అనుమతించాలని న్యాయవాది పాల్‌ కనకరాజ్‌ కోర్టును కోరారు.చివరికి పిల్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ అంశం మీదే జిల్లా కోర్టులో ఒక ప్రైవేట్‌ కేసును దాఖలు చేశారు.దాన్ని ఈ నెలలో హైకోర్టు కొట్టివేసింది.


బహుశా ఆ తమిళనాడు పిటీషనర్‌ మనుస్మృతిలో ఏమి రాసి ఉందో చదివి, అర్ధం చేసుకొని ఉంటే నిజంగానే సిగ్గుపడి ఆ కేసు దాఖలు చేసి ఉండేవారు. ఆ గ్రంధాన్ని పరమపవిత్రంగా పూజించేవారు ఉన్నారు.మద్రాస్‌ హైకోర్టు తీర్పు మరో ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. కర్ణాటకలో మైసూరు విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్‌, ప్రముఖ రచయిత, హేతువాది కెఎస్‌. భగవాన్‌. రామాయణం ఉత్తరకాండలో ఉన్న వాటిని గురించి చెప్పినందుకు హిందూత్వవాదులు అంతుచూస్తామని బెదిరించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఈ అంశాలను చెబుతున్నారు. ఉత్తరకాండలో ఉన్నదాని ప్రకారం రాముడు పదకొండువేల సంవత్సరాలు పాలించలేదని, పదకొండు ఏళ్లు మాత్రమే రాజుగా ఉన్నట్లు, అడవుల్లో తాను మద్యం తాగుతూ సీతాదేవిని కూడా తాగమని కోరినట్లు, కొందరు రామరాజ్యం తెస్తామని చెబుతున్నారని, రాముడు ఆదర్శప్రాయుడేమీ కాదని భగవాన్‌ చెప్పిన అంశాలు తమ మనోభావాలను గాయపరచినట్లు కొందరు ప్రైవేటు కేసును దాఖలు చేశారు. సీతాదేవిని అడవుల పాల్జేసి పట్టించుకోని, శూద్రుడైన శంబుకుణ్ని వధించిన రాముడిని ఎలా సమర్ధిస్తారని భగవాన్‌ ప్రశ్నించారు.‘‘ ప్రొఫెసర్‌ కల్‌బుర్గి, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దబోల్కర్‌లను హత్యచేసినవారు ఇప్పుడు నన్ను కూడా చంపుతామని బెదిరిస్తున్నారు, వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటే, మీరు మా మీద దాడి చేయవచ్చు, ముక్కలుగా నరకవచ్చు కానీ మారచనలు సజీవంగానే ఉంటాయి. వారు నన్ను చంపవచ్చు తప్ప నా వైఖరిని మార్చలేరు ’’ అని భగవాన్‌ స్పష్టం చేశారు. ఈ వివాదం తరువాత కొంత మంది అసలు ఉత్తరకాండను వాల్మీకి రాయలేదని, తరువాత కొందరు దాన్ని చేర్చారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రామాయణాలు అనేకం ఉన్నాయి. దేన్ని సాధికారికంగా తీసుకోవాలో చెప్పినవారెవరూ లేదు. ఎవరికీ అలాంటి సాధికారత లేదు.ఎవరైనా పుచ్చుకుంటే దానితో అంగీకరించాలని కూడా లేదు.


మనుస్మృతిలో రాసినవి, వాటి ఆచరణ చూసి తన మనోభావాలు తీవ్రంగా గాయపడిన కారణంగానే బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వంద సంవత్సరాల క్రితమే దాన్ని తగులబెట్టి నిరసన వెల్లడిరచారు. సదరు మనువాదాన్ని మరింతగా ముందుకు తీసుకుపోవాలని, అది లేకుండా రచించిన రాజ్యాంగాన్ని విమర్శిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక సంపాదకీయాలు రాసింది. ఆ చర్య మనోభావాలను దెబ్బతీయటమే కాదు, రాజ్యాంగాన్ని వ్యతిరేకించటం నేరం.నక్సలైట్స్‌గా పరిగణించే వారు రాజ్యాంగాన్ని ఆమోదించం అని చెబుతారు, వారికీ ఆర్‌ఎస్‌ఎస్‌ వారికీ పెద్ద తేడా లేనట్లే కదా ? వారు అడవుల్లో చెబితే కాషాయ దళాలు జనారణ్యంలో ఆపని చేశాయి. రాజ్యాంగ నిర్మాతలు పక్కన పెట్టిన మనుస్మృతిని తమ న్యాయశాస్త్ర విద్యార్ధులకు పాఠ్యాంశంగా పెట్టాలని ఢల్లీి విశ్వవిద్యాలయం నిర్ణయించింది. కోర్టులలో అమలు చేసే శిక్షాస్మృతులను పాఠాలుగా చెప్పాలి, శిక్షణ ఇవ్వాలి తప్ప ఇలాంటి చర్యలతో అధికారికంగా మనువాదులను తయారు చేసే వ్యవహరం తప్ప మరొకటి కాదు. ఇలాంటి బలవంతాలు చేసే శక్తులు ఒక వైపు రెచ్చిపోతుంటే మరోవైపు దాన్ని వ్యతిరేకించేవారు కూడా ఎప్పటికప్పుడు తయారవుతారు. నూతన ఆర్థిక విధానాల పేరుతో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశంలో ఆర్థిక అసమానతలను మరింతగా పెంచి, కార్పొరేట్‌ జలగలకు జనాలను అప్పచెప్పాయి. వాటిని మరింత వేగంగా అమలు జరుపుతున్న బిజెపి నూతన విద్యావిధానం పేరుతో తన కాషాయ అజెండాను దేశం మీద రుద్దేందుకు పూనుకుంది. దానిలో భాగమే సిలబస్‌లో మనువాదాన్ని చేర్చటం. మరింతగా మనువాదులను న్యాయవ్యవస్థలో చేర్చేందుకు వేసిన పథకమిది. సమాజంలో సగం మందిగా ఉన్న మహిళలకు విద్య, సమానహక్కులు, సాధికారతను పూర్తిగా వ్యతిరేకించే తిరోగమన భావాలను బలవంతంగా అధ్యయనం చేయించేందుకు చూస్తున్నారు. అంతేకాదు, శూద్రులు,దళితులుగా ఉన్న 85శాతం మంది గురించి కూడా దాన్నిండా వ్యతిరేకతలే, మొత్తంగా మన రాజ్యాంగానికి, దానికి స్ఫూర్తికి వ్యతిరేకమైనది.


ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో భగత్‌ సింగ్‌ స్టూడెంట్స్‌ మోర్చా(బిఎస్‌ఎం)కు చెందిన వారు డిసెంబరు 25న మనుస్మృతి గ్రంధంపై ఒక చర్చ నిర్వహించారు, తరువాత తగులబెట్టేందుకు నిర్ణయించారు. ఆ సందర్భంగా ముగ్గురు విద్యార్ధినులతో సహా 13 మందిని పోలీసులు అరెస్టు చేసి కేసు పెట్టారు. పదిహేడు రోజుల తరువాత వారు బెయిలు మీద జనవరి 11న విడుదలయ్యారు. ఈ విశ్వవిద్యాలయంలో మనుస్మృతిపై పరిశోధన చేసే వారికి ఫెలోషిప్‌ ఇస్తున్నారు. దాని గురించి చర్చించేవారిని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మన నేతన్నలను దెబ్బతీసిన విదేశీ వస్త్రదహనం ఒక పోరాట రూపంగా ఉన్న సంగతి తెలిసిందే. అదే విధంగా దిష్టిబొమ్మల దహనం కూడా. సమాజంలో స్త్రీలు, మెజారిటీ కులాల వారిపట్ల వివక్ష, దురాచారాలను ప్రోత్సహించే మనుస్మృతికి వ్యతిరేకంగా ఒక నిరనస రూపంగా దాన్ని దహనాన్ని అంబేద్కర్‌ ఎంచుకున్నారు.తొలిసారిగా 1927లో స్వయంగా ఆపని చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబరు 25ను మనుస్మృతి దహన దినంగా పాటిస్తున్నారు. ఎక్కడో అక్కడ అది కొనసాగుతూనే ఉంది. బెనారస్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు హింసాకాండకు, దాడులకు పాల్పడ్డారంటూ తప్పుడు కేసులు పెట్టారు.కస్టడీలో పోలీసులు వారిని కొట్టారు, దుస్తులు చించివేశారు, బెదిరించారు. ఉగ్రవాద వ్యతిరేక దళ పోలీసులు వారిని విచారించటాన్ని బట్టి ఎలాంటి నేరాలు మోపారో, ఉత్తర ప్రదేశ్‌లో ఎలాంటి రాజ్యం నడుస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.పదేండ్ల వరకు శిక్షలు పడే సెక్షన్లతో నేరాలను మోపారు. తాము భగత్‌ సింగ్‌బాబా సాహెబ్‌ వారసులమని హిందూత్వ శక్తులు తమను అణచేందుకు చూస్తున్నాయని బిఎస్‌ఎం నేతలు చెప్పారు.

ఒక్క మనుస్మృతే కాదు అనేక పురాణాలు, ఇతర గ్రంధాలు, వెంకటేశ్వరసుప్రభాతం వంటి వాటిలో ఉన్న అశ్లీలత, బూతు గురించి అనేక మంది గతంలోనే రాశారు. అందువలన వాటన్నింటినీ నేటి తరాలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం కూడా ఉంది.ఉదాహరణకు సుప్రభాతంలో ఇలా ఉంది.

కమలాకుచ చూచుక కుంకుమతో

నియతారుని తాతుల నీలతనో

కమలాయతలోచన లోకపతే

దీనికి అర్ధం ఏమిటంటే లక్ష్మీదేవి చనుమొనలయందున్న కుంకుమ పూవు రంగువలన అంతటా ఎర్రగా చేయబడిన రంగుగల వాడా అని హేతువాది వెనిగళ్ల సుబ్బారావు వివరణ ఇచ్చారు.దీన్ని చదివి ఎవరైనా మా మనోభావాలను దెబ్బతీసిందని కేసులు వేస్తే కుదరదు. ఫలానాదే నిర్థిష్ట అర్ధం అని నిర్ధారణ ఉంటే దాన్నే ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇంకా ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. ఉత్తర కాండలో సీతా రాముల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు వివాదం రేపటాన్ని కూడా చూశాము. మనోభావాల పేరుతో ఉన్మాదాన్ని, ఉద్రేకాలను రెచ్చగొట్టటం, దాడులకు పూనుకోవటం తగని పని. మేము చెప్పిందే భాష్యం ఇతరులెవరూ చెప్పటానికి వీల్లేదు అంటే కుదరదు.మద్రాసు హైకోర్టు కేసులో మనోభావం గాయపడిరదని చెప్పుకున్న వ్యక్తి హాజరై మనుస్మృతిలో చెప్పిన దానికి పవిత్రమైన అర్ధం ఇదని చెప్పలేదు, అసలు కోర్టుకే రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఎవరైనా మూడవ పక్షంగా చేరి అసలు అర్ధం చెప్పారా అంటే అది కూడా లేదు. మనుస్మృతిని పాటిస్తున్నామని లేదా పాటించాలని చెప్పేవారి కుటుంబాలలో మహిళలను దానిలో చెప్పినట్లుగానే ఉంచుతున్నారా ? ఉంటున్నారా ? దాని మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఇస్లామిక్‌ షరియాలో కూడా అలాంటివే ఉన్నాయి. వర్తమానానికి వర్తించవు. చిత్రం ఏమిటంటే షరియాను విమర్శించేవారు దానికి ఏమాత్రం తగ్గని, కొన్ని విషయాల్లో అంతకంటే ఎక్కువ తిరోగమన సూత్రాలు ఉన్న మనుస్మృతిని మాత్రం పవిత్రమైనది, మార్పులేని సనాతనమైనదిగా పరిరక్షించాలని కోరటమే కాదు, అమలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.అసలు సనాతనం అంటే ఏమిటో చెప్పలేని వారు కూడా వీర సనాతన్‌ అంటూ ముసుగులు వేసుకొని వీరంగం వేస్తున్నారు. అంబేద్కర్‌ కంటే ముందుగా సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే(182790) మనుస్మృతిని సవాలు చేశారు. దానిపేరుతో బ్రాహ్మణులు అనుసరిస్తున్న పద్దతులను వ్యతిరేకించారు, దళితులు, ఇతరుల దుస్థితిని వెలుగులోకి తెచ్చారు.నూతన తరాలు భావజాల పోరులో భాగంగా పూలే, అంబేద్కర్‌ చెప్పిన వాటిని మరింతగా జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడు ధన్యజీవి ! దేవదూత అన్న నోటితోనే మానవుడిని అని చెప్పుకున్న నరేంద్రమోడీ !!

11 Saturday Jan 2025

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, RELIGION

≈ Leave a comment

Tags

BJP, Modi as God, Modi's Podcast, Narendra Modi Failures, non-biological, RSS

ఎం కోటేశ్వరరావు


ఇంతకీ నరేంద్రమోడీ ఎవరు ? లోక్‌సభ ఎన్నికలకు ముందు చెప్పినట్లు మహత్తర లక్ష్యం కోసం దేవుడు పంపిన దూత అనుకోవాలా ? తాజాగా చెప్పినట్లు మానవుడినే కానీ దేవుడిని కాదు, తప్పులు చేసి ఉంటా అనే మాటలు నమ్మాలా ? మోడీ గురించి తెలిసిన వారు ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగు ధన్యుడు అనుకుంటారు. ఇక తేల్చుకోవాల్సింది భక్తులే ! అప్పుడు దేవుడు ఎందుకు పంపాడని చెప్పారో ఇప్పుడు మానవుడినే అని ఎందుకు అన్నారో మోడీ ఎలాగూ నోరు విప్పరు గనుక ఆయన ప్రధమ గణాలు వివరించాలి. ఈ కాలంలో మోడీ నెరవేర్చిన లేదా మిగిలిపోయిన మహత్తర లక్ష్యం ఏమిటో ఎవరికైనా తెలుసా ? జరోధా అనే సంస్థ తరఫున నిఖిల్‌ కామత్‌ 2025 జనవరిలో మోడీతో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌ ( ఒక జర్నలిస్టు జరిపే ముఖాముఖీ`ప్రశ్నలు ముందే ఇవ్వాలి, ఇంటర్య్వూ సమయంలో మోడీని ఇబ్బందికరమైన కొత్త ప్రశ్నలు అడగకూడదు అనే షరతులు వర్తిస్తాయి)లో అనేక అంశాలను వివరించారు. తనకు దేశమే ప్రధమ లక్ష్యం అన్నారు. గుజరాత్‌ సిఎంగా పని చేస్తున్నపుడే మరో ఇరవై సంవత్సరాల పాటు పనిచేసే బృందాన్ని తాను తయారు చేశానని, ఇప్పుడు కూడా చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ బృందంలో ఎవరున్నారో వెల్లడిరచలేదు, వ్యక్తుల పేర్లు చెబితే అనేక మంది ఇతరులకు అన్యాయం చేసినట్లు అవుతుందని చెప్పుకున్నారు. దీన్ని బట్టి ఆ బృందం ఒక బ్రహ్మపదార్ధం అనాల్సి ఉంటుంది.ప్రతివారినీ తన ఖాతాలో వేసుకోవచ్చు. మరికొన్ని సుభాషితాలు, స్వంత గొప్పలు ఇలా ఉన్నాయి. తప్పులు సహజం కానీ దురుద్ధేశ్యాలతో చేయలేదు, నేనూ తప్పులు చేసి ఉంటాను, నేను మనిషిని దేవుడిని కాదు. నేను ఒక విలక్షణమైన రాజకీయవేత్తను కాదు.నేను ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. అది నాకు తప్పనిసరి, నాకది ఇష్టం లేదు గానీ చేయాల్సి ఉంటుంది. పాడ్‌కాస్ట్‌ ఇలా సాగింది. మహాత్మా గాంధీ, సావర్కర్‌ మార్గాలు వేరైనా ఇద్దరూ స్వాతంత్య్రం కోసమే పోరాడారంటూ ఇద్దరూ ఒకటే అన్నట్లుగా చిత్రించారు. జైలు నుంచి విడుదల చేస్తే బ్రిటీష్‌ వారికి సేవ చేసుకుంటానని, స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉంటానంటూ ప్రేమ లేఖలు రాసిన సావర్కర్‌ను గాంధీతో పోల్చటం చరిత్ర వక్రీకరణ తప్ప మరొకటి కాదు.

ఎనిమిది నెలల క్రితం తన జన్మ జీవ సంబంధమైనది కాదని (2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశ) లో నరేంద్రమోడీ చెప్పుకున్నారు, ఇప్పుడు మానవుడిని అని చెప్పుకోవటం నష్ట నివారణ చర్య అని స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ నేత జయరామ్‌ రమేష్‌ వ్యాఖ్యానించారు. భూమ్మీద తన ఉనికి కేవలం జీవ సంబంధమైనది కాదని, తన తల్లి మరణించిన తరువాత తనను దేవుడు భూలోకంలోకి ఒక లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పంపాడని తనకున్న శక్తులను చూసిన తరువాత తానీ మాటలు చెప్పగలుగుతున్నట్లు మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. ‘‘ నా తల్లి బతికి ఉన్నంత వరకు నేను కూడా జీవసంబంధంగానే జన్మించానని అనుకున్నాను. కానీ తరువాత అనుభవాలను చూస్తే పరమాత్ముడు ఒక లక్ష్యం కోసం పంపాడని నేను నమ్మాను, ఆ లక్ష్యం నెరవేరిన తరువాత మరోసారి నాతో పని ఉండదు. అందువల్లనే నేను పూర్తిగా దేవుడి కోసం అంకితమయ్యాను, నేను ఒక సాధనాన్ని తప్ప మరొకటి కాదు ’’ అంటూ అదానీ యాజమాన్యంలోని ఎన్‌డిటివితో మోడీ చెప్పారు.( ఆ లక్ష్యం ఏమిటో, ఎంత వరకు వచ్చింది, పూర్తి చేసిందీ లేనిదీ చెప్పలేదు) ఒక సామాన్యుడు ఇలాంటి మాటలు మాట్లాడితే అలాంటి వారిని నేరుగా మానసిక వైద్యుడి వద్దకు తీసుకు వెళతారు అంటూ అప్పుడు రాహుల్‌ గాంధీ అపహాస్యం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మోడీ మారు మాట్లాడలేదు. అంతకు కొద్ది రోజుల ముందు తననెవరూ దెబ్బతీయలేరని, తాను మూడు, ఐదు చివరికి ఏడు ఎన్నికలైనా సరే గెలుస్తూనే ఉంటానని చెప్పుకున్నారు.తనకు ఓటు వేయటం అంటే పుణ్యం చేసుకోవటమే అని కూడా చెప్పారు. మోడీ చుట్టూ ఉన్నవారు కూడా ఆయనను ఆకాశానికి ఎత్తిన తీరు చూశాము. ఎంతగా అంటే పూరీ జగన్నాధుడు కూడా నరేంద్రమోడీ భక్తుడేనని ఒడిషాకు చెందిన బిజెపి నేత సంబిత్‌ పాత్ర వర్ణించి తరువాత నోరు జారినట్లు చెప్పుకున్న సంగతి తెలిసిందే.

చరిత్రలో అవతార పురుషులమని ప్రదర్శించుకున్నవారందరూ ఇలాగే ఒక లక్ష్యం కోసం ఉద్భవించినట్లు చెప్పుకున్నవారే. దైవదూతను అన్న నోటితోనే అదానీ, అంబానీలు రాహుల్‌ గాంధీకి టెంపోల నిండుగా నోట్ల కట్టలు పంపారని తుచ్చ మానవుల మాదిరి మోడీ ఎన్నికల సమయంలో ఆరోపణ చేసిన సంగతిని గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే ఆ పారిశ్రామిక, వాణిజ్యవేత్తల వద్ద లెక్కల్లో చూపని నల్లధనం పెద్ద ఎత్తున ఉందని చెప్పటమే. బహుశా ఆ వ్యాఖ్యల తరువాత తన స్నేహితుల గురించి మాట్లాడిరది తప్పని తెలిసిందో లేక వారి నుంచి హెచ్చరికలు వచ్చాయో తెలియదు గానీ తరువాత మరోసారి ప్రస్తావించలేదు. అంతే కాదు ప్రతిపక్షపార్టీల నేతలందరూ ముజ్రా పనులు చేస్తున్నారంటూ దిగువ స్థాయి విమర్శలు కూడా చేశారు.(ఉత్తరాదిన వేశ్యలతో కులీనులు చేసే గానాబజానాలను ముజ్రా అంటారు). తనకు ఇల్లూ, సంసార బంధాలు లేవు, దేశం కోసమే పుట్టినట్లు నరేంద్రమోడీ చెప్పుకుంటారు, భక్తులు కూడా అదే చెబుతారు. గుజరాత్‌ రాజధాని గాంధీ నగర్‌లో ధనికులు నివసించే ప్రాంతంలో తనకు ఒక ఇంటి స్థలం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న అంశాన్ని కారవాన్‌ పత్రిక వెల్లడిరచింది. ముఖ్యమంత్రిగా ఉండగా తన పేరున తానే మంజూరు చేసుకున్న స్థలమది. దాని మీద వివాదం చెలరేగటం, కోర్టులకు ఎక్కటంతో సదరు స్థలాన్ని పార్టీకి ఇస్తానని మోడీ చెప్పారు. ఏ బంధాలు లేని తాను స్థలం తీసుకోవటం ఎందుకు, తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా పార్టీకి ఇస్తానని చెప్పటం ఏమిటి ? ఈ స్థలం ఉన్న అంశం గురించి మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరిగిందనే ఆరోపణ ఉంది.

నరేంద్రమోడీ గురించి ఉన్నతంగా చిత్రించేందుకు ప్రశాంత కిషోర్‌ వంటి నిపుణులెందరో పని చేశారన్నది బహిరంగ రహస్యం. దానికి గోడీ మీడియా ఎంతగానో సహకరించిందని అనేక మంది విమర్శలు చేసింది కూడా వాస్తవమే.2019లో ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ పేరుతో ఒక ప్రచార సినిమా కూడా తీశారు. వాస్తవాల ఆధారంగా తీసినట్లు చెప్పిన ఆ సినిమాలో వక్రీకరణలు, అవాస్తవాలెన్నో, అన్నింటినీ త్యజించి దేశం కోసమే మోడీ పాటుపడుతున్నట్లు చిత్రించారు.ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేసిన నరేంద్రమోడీ బాల్యంలో ఒక చేత్తో టీ అమ్ముతూ మరో చేత్తో జాతీయ జండాను పట్టుకున్నట్లు, దానికి వందనం చేసినట్లు చూపారు. వాస్తవం ఏమంటే అదే ఆర్‌ఎస్‌ఎస్‌ స్వాతంత్య్రం వచ్చిన తరువాత 52 సంవత్సరాల పాటు జాతీయ జండాను ఎగురవేయటానికి నిరాకరించింది, బాల్యంలోనే జాతీయ భావాలతో పెరిగినట్లు సినిమాలో చూపిన మోడీ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వామే.శ్రీనగర్‌ లాల్‌ చౌక్‌లో ఆర్మీ పహారాలో బిజెపి నేత మురళీ మనోహర జోషి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. కానీ ఈ చిత్రంలో నరేంద్రమోడీ ఆ పని చేశారని చిత్రించటం కళ్ల ముందే చరిత్రను వక్రీకరించటం తప్ప మరొకటి కాదు. దేశ చరిత్రలో ఏ ప్రధానీ చేయని విధంగా గుళ్లు గోపురాలు తిరిగి, ధ్యానం పేరుతో ఫొటో ప్రదర్శనలు, అయోధ్యలో రామాలయ ప్రారంభం సందర్భంగా అన్నీ తానై చేసిన హడావుడి, బాలరాముడి చిత్రంతో నరేంద్రమోడీ బొమ్మ పెట్టి వేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాటన్నింటికీ పరాకాష్టగా అసలు తనది జీవసంబంధ జన్మ కాదని చెప్పుకొనేంత వరకు వెళ్లింది. ఇప్పుడు తాను మానవుడనే అని, తప్పులు చేయటం సహజం అని చెప్పుకోవటం కూడా తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటంలో భాగమే అన్నది స్పష్టం.మాట మార్చి తాను మానవమాత్రుడనని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ? అయోధ్యలో బిజెపి ఓడిపోవటం, వారణాసిలో తన మెజారిటీ భారీగా పడిపోవటం, లోక్‌సభలో ఒక పార్టీగా బిజెపికి సంపూర్ణ మెజారిటీని తీసుకురావటంలో వైఫల్యం, గతంకంటే ఓట్లు కూడా తగ్గటం, దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారుడు, ఎటు చూసినా వైఫల్యాలే కనిపిస్తుండగా తాను దైవాంశ సంభూతుడనని, తన శక్తి గురించి చెప్పుకొనే అవకాశాలు ఆవిరయ్యాయి. వీటి గురించి ఎవరు ఎక్కడ ప్రశ్నిస్తారో అని గ్రహించి తాను కూడా మానవ మాత్రుడనేనని, వైఫల్యాలు సహజమేనని చెప్పుకొనేందుకు చూసినట్లు కనిపిస్తోంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

చిత్తశుద్దిలేని శివపూజ : నంగనాచి క్షమాపణ చెప్పి ఎదురుదాడికి దిగిన మణిపూర్‌ సిఎం !

02 Thursday Jan 2025

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, CM Biren Singh, Manipur files, Manipur unrest, Narendra Modi Failures


ఎం కోటేశ్వరరావు


మణిపూర్‌లో 2023 మే మూడవ తేదీన రెండు సామాజిక తరగతుల మధ్య పరస్పర అనుమానాలతో ప్రారంభమైన ఘర్షణ 2024లో కొనసాగి మూడో ఏడాదిలో ప్రవేశించింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియటం లేదు. పరిస్థితిని చక్కదిద్దటంలో విఫలమైనందుకు విచారంగా ఉందంటూ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే ఒక రోజు కూడా గడవక ముందే విమర్శకులపై ఎదురుదాడికి దిగటాన్ని బట్టి విచార ప్రకటనలో చిత్తశుద్ది లేదని స్వయంగా వెల్లడిరచుకున్నారు. మెయితీకుకీ, జో తెగల మధ్య ప్రారంభమైన ఘర్షణలు, భద్రతా దళాల చర్యల్లో కొందరు మహిళలపై అత్యాచారాలు, నగ్నంగా ఊరేగింపు, 260 మంది ప్రాణాలు కోల్పోయారు, అరవై వేల మంది నెలవులు తప్పారు. బాధితుల్లో ఎక్కువ మంది గిరిజనులైన కుకీలే ఉన్నారు. మెయితీలందరినీ గిరిజనులుగా పరిగణించాలంటూ హైకోర్టు పెట్టిన చిచ్చు అక్కడ జరుగుతున్న దారుణ మారణకాండకు మూలం.రెండిరజన్ల పాలన సాగిస్తున్న బిజెపి ఆదిలోనే దానికి తెరదించి ఉంటే ఇంత జరిగేది కాదు. ఓట్ల రాజకీయంలో మెజారిటీ మెయితీలను ఓటు బాంకుగా మార్చుకొనేందుకు ఆ పార్టీ చూసింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో దానికి వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. రెండు స్థానాల్లోనూ అది మట్టి కరచింది. తిరిగి మద్దతు పొందే ఎత్తుగడలో భాగమే పశ్చాత్తాప ప్రకటన ప్రహసనం అని చెప్పవచ్చు. నిజానికి అక్కడ జరిగిన ఉదంతాలను జరిగిందేదో జరిగింది మరిచిపోదాం అంటే సరే అనేవి కాదు.ఒక రోజు, ఒక ఘటన కాదు కదా ! మహిళల మీద అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించిన ఉదంతాన్ని మూసిపెట్టేందుకు చూసిన తీరు, అది వెల్లడైన తరువాత పార్లమెంటులో ప్రతిస్పందనలను మరచిపోవాలని బిజెపి చూడవచ్చు తప్ప చరిత్ర మరవదు, మణిపూరీయులు అసలు మరవరు ! మే మొదటి వారంలో గిరిజన మహిళలపై అత్యాచారం జరిగితే ఏ ఒక్క పత్రికా బయటపెట్టలేదు, అంతా సజావుగా ఉందని రాష్ట్రప్రభుత్వం నమ్మబలికింది. జూలై నెలలో నగ్నంగా తిప్పిన మహిళ వీడియో బయటకు వచ్చిన తరువాత మాత్రమే లోకానికి వెల్లడైంది. అందుకే ఆత్మశుద్ధి లేని యాచారమదియేల, భాండశుద్ది లేని పాకమేల, చిత్తశుద్ది లేని శివపూజలేల అన్న మహాకవి వేమనను ఈ సందర్భంగా బీరేన్‌ సింగ్‌ క్షమాపణల తీరు గుర్తుకు తెచ్చింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ను పొందుపరచటం దుర్వినియోగానికి కాదు సద్వినియోగానికి మాత్రమే. చాకులు, కత్తుల తయారీకి చట్టం అనుమతిస్తున్నదంటే దాని అర్ధం పీకలు కోసేందుకు వినియోగించాలని కాదు. గతంలో సదరు ఆర్టికల్‌ను కాంగ్రెస్‌ దుర్వినియోగం చేసిన మాట నిజం. తమ పాలనలో దాన్ని ఒక్కసారైనా వినియోగిస్తే చెప్పండి అని బిజెపి ప్రశ్నించుతోంది.దుర్వినియోగం ఎంత తప్పో సద్వినియోగం చేయకపోవటం కూడా అంతకంటే పెద్దది. మణిపూర్‌లో బిజెపి రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమైంది. అదే ఏ ప్రతిపక్ష పార్టీనో అధికారంలో ఉంటే అలా ఉపేక్షించేదా ? అది రాజధర్మమేనా ! అల్లకల్లోల పరిస్థితి ఏర్పడిన కారణంగా రాష్ట్రం మొత్తాన్ని మిలిటరీకి అప్పగించారు. అక్కడ బిజెపికి చెందిన ముఖ్యమంత్రి, మంత్రులు రాజభోగాలు అనుభవించటం తప్ప చేసేదేమీ లేదు.వేతనాలు, అలవెన్సులు దండగ. ప్రపంచ మంతటా, మణిపూర్‌ చుట్టూ ప్రధాని నరేంద్రమోడీ విమానాల్లో తిరుగుతారు, సుభాషితాలు చెప్పి వస్తున్నారు తప్ప మణిపూర్‌ వెళ్లి భరోసా ఇచ్చేందుకు ఎలాంటి చొరవ లేదు.

కాంగ్రెస్‌ నేత జయరాం రమేష్‌ ఈ మాట అంటూ ప్రధాని నరేంద్రమోడీ కూడా మణిపూరీయులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దాన్లో తప్పేముంది ? దేశ చరిత్రలో అనేక మంది ప్రధానులు అనేక చట్టాలను చేశారు. కానీ మోడీ తెచ్చిన మూడు సాగు చట్టాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురుకావటంతో విధిలేక క్షమాపణలు చెప్పి మరీ వాటిని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ముందుకు తెచ్చిన అనేక అంశాల మీద మోడీ మౌనంగా ఉన్నట్లుగానే ఆయన ప్రధమ గణంలోని బీరేన్‌ సింగ్‌ మౌనంగా ఉంటే అదొక తీరు. కానీ ఎదురుదాడికి దిగారు. గతంలో కూడా మణిపూర్‌లో అనేక ఉదంతాలు జరిగాయి కదా వాటన్నింటికీ నాడు ప్రధానులుగా ఉన్న పివి నరసింహారావు, ఐకె గుజ్రాల్‌ క్షమాపణలు చెప్పారా అని ప్రశ్నించారు. ఆ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారు కూడా క్షమాపణలు చెప్పిన దాఖలా లేదు, మరి బీరేన్‌ సింగ్‌ ఎందుకు చెప్పినట్లు ? నాడు మణిపూర్‌లో జరిగిన ఉదంతాలను పాలకులు మూసిపెట్టలేదు, మోడీ ఏలుబడిలో ఎందుకు పాచిపోయేట్లు చేసినట్లు ? సామాజిక మాధ్యమంలో నగ్నంగా మహిళను తిప్పిన ఉదంతం వెలువడిన తరువాతనే కదా నోరు విప్పింది. గతంలో కాంగ్రెస్‌ చేసిన పాపాల ఫలితమే నేడు మణిపూర్‌ ఉదంతాలకు మూలం అని బీరేన్‌ సింగ్‌ ఆరోపించారు. ఇది కూడా తర్కానికి నిలిచేది కాదు. ముందే చెప్పుకున్నట్లు మెయితీలకు గిరిజన రిజర్వేషన్‌ కల్పించాలన్న హైకోర్టు సిఫార్సు తాజా పరిణామాలకు మూలం తప్ప మరొకటి కాదు. గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్న మెయితీల డిమాండ్‌ను ప్రస్తావించటం ద్వారా బీరేన్‌ సింగ్‌ ఆ సామాజిక తరగతి తెగనేత స్థాయికి దిగజారారు. ఒక వేళ అది సరైనదే అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎందుకు ప్రకటించరు ?కాంగ్రెసే అంతా చేసిందని చెబుతున్న బిరేన్‌ సింగ్‌ గతం ఏమిటి ? డెమోక్రటిక్‌ రివల్యూషనరీ పీపుల్స్‌ పార్టీని ఏర్పాటు చేసి దాని తరుఫున తొలిసారి ఎంఎల్‌ఏగా గెలిచారు. తరువాత దానిని 2004 లేదా 2005లో కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీలో కొనసాగారు. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదనే అసంతృప్తితో 2016లో బిజెపిలో చేరారు, 2017 ఎన్నికల్లో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఫిరాయింపులతో కొనసాగారు, తరువాత 2022లో మెజారిటీ సీట్లతో సిఎం అయ్యారు.

మణిపూర్‌ అంశం ప్రస్తావనకు వచ్చినపుడల్లా బిజెపి నేతలు గతంలో కాంగ్రెస్‌ అనుసరించిన వైఖరి, విదేశీ జోక్యం గురించి చెబుతూ తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చూస్తారు. సరిహద్దుల భద్రత, అక్రమ చొరబాట్లను అరికట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. పదేండ్ల నుంచి ఏ గుడ్డి గుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? 2017 నుంచి ఇదే బీరేన్‌ సింగ్‌ సిఎంగా ఉన్నారు. ఈ పెద్దమనిషి ఏం చేస్తున్నట్లు ? అంతా చేసి నేరం నుంచి తప్పించుకోవటం తప్ప క్షమాపణలో చిత్తశుద్ది లేదని మణిపూర్‌ గిరిజన సంఘాల ఐక్యతా కమిటీ బీరేన్‌ సింగ్‌ ప్రకటన మీద వ్యాఖ్యానించింది. ఒక మైనారిటీ తరగతి మీద జరిపిన మారణకాండ బాధ్యత నుంచి తప్పించుకొనేందుకు సిఎం చూశారని పేర్కొన్నది. కుకీజో గిరిజనుల పట్ల వివక్ష నిలిపివేయాలని మరో గిరిజన సంఘాల కమిటీ డిమాండ్‌ చేసింది.మణిపూర్‌లో సాయుధ బృందాలపై భద్రతా దళాలు జరిపిన దాడులలో స్టార్‌ లింక్‌ ఉపగ్రహ యాంటెన్నా, రౌటర్‌తో పాటు ఆధునిక రైఫిళ్లు దొరికినట్లు ప్రకటించారు. మారుమూల ప్రాంతాలలో ఇంటర్నెట్‌ సేవలను అందించే ఈ ఉపగ్రహం సేవలను పొందటం మనదేశంలో నిషిద్దం, అయినప్పటికీ అవి దొరికాయంటే అనధికారికంగా సమాచారం అందుకున్నట్లు స్పష్టమౌతోంది. వీటిని మెయితీలు అధికంగా నివసించే ప్రాంతాలపై జరిగిన దాడుల సమయంలో సాయుధులు వదలివేసి పారిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే తమ ఉపగ్రహం నుంచి భారత్‌కు సంకేతాలు అందకుండా చేసినట్లు ఎలన్‌మస్క్‌ చెప్పుకున్నాడు. తమ దాడుల సందర్భంగా మయన్మార్‌లో తయారైన ఆయుధాలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్పారు. వాటిలో మయన్మార్‌ సైనికులు వాడే ఎంఏ4 రైఫిలు,ఎకె47 కూడా ఉంది. గత ఐదారు నెలల నుంచి సాయుధ బృందాలు తలదాచుకున్న ప్రాంతాలలో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌లు, మిలిటరీ యూనిఫారాలు తదితరాలను కూడా పట్టుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మయన్మార్‌ సరిహద్దులను దాటి ఉగ్రవాదులు రాకపోకలు సాగిస్తున్నా, ఆయుధాలు అక్రమ రవాణా జరుగుతుంటే సరిహద్దు భద్రతలను చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? స్టార్‌ లింక్‌ ఉపగ్రహం నుంచి ఉగ్రవాదులు, సాయుధ మూకలకు సంకేతాలు, సందేశాలు అందుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. భద్రమైన చేతుల్లో దేశం ఉందని నరేంద్రమోడీ గురించి గొప్పలు చెప్పుకోవటం తప్ప ఉపయోగం ఏముంది ?

తాజా ఘర్షణలు, దాడులకు కారణం 2023 ఏప్రిల్‌ 14న మణిపూర్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే మూలం. మెయితీ సామాజిక తరగతికి గిరిజన హోదా కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేయాలంటూ తనకు లేని అధికారంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరువాత సుప్రీం కోర్టు ఈ చర్యను తప్పు పట్టింది.ఒక పెద్ద కుట్రలో భాగంగా అక్కడ పరిణామాలు జరిగినట్లు భావిస్తున్నారు. హైకోర్టు ఆదేశాన్ని నిరసిస్తూ మే 3వ తేదీన గిరిజన విద్యార్థులు నిరసన తెలిపారు. నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక వైపు నుంచి హింసాకాండ జరుగుతూనే ఉంది. మెయితీ`గిరిజనుల మధ్య పరస్పరం అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మయన్మార్‌లో 2021 మిలిటరీ తిరుగుబాటు సమయంలో అక్కడి నుంచి శరణార్ధులుగా వచ్చిన వారి గురించి మెయితీలు అభ్యంతరం తెలిపారు. ఇవన్నీ కూడా బిజెపి రెండిరజన్ల పాలనలోనే జరిగాయి. అందువలన గత కాంగ్రెస్‌ పాలనే కారణం అనటం తప్పించుకోచూడటం తప్ప మరొకటి కాదు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అక్కడ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ అనే ఒక ప్రాంతీయ పార్టీతో జత కట్టి చెరోసీటులో పోటీ చేసింది. రెండు సీట్లలో కాంగ్రెస్‌ గెలిచింది. రెండు సీట్లలో కాంగ్రెస్‌కు 47.59శాతం ఓట్లు రాగా నాగా పార్టీకి 18.87, బిజెపికి 16.58శాతం( మొత్తం 35.45శాతం) ఓట్లు వచ్చాయి. అరవై అసెంబ్లీ సెగ్మెంట్లలో 36 చోట్ల కాంగ్రెస్‌, 13 నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌, బిజెపి తొమ్మిది చోట్ల మెజారిటీ తెచ్చుకున్నాయి. మెయితీలు, గిరిజన సామాజిక తరగతులు రెండూ బిజెపిని ఓడిరచాయన్నది స్పష్టం. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకొని క్షమాపణల పర్వానికి తెరతీశారని చెప్పాల్సి వస్తోంది. మెయితీలను గిరిజనులుగా గుర్తించాలా లేదా అన్నది బిజెపి తేల్చటం లేదు. తమకు అన్యాయం చేస్తారని కుకీ, ఇతర గిరిజనులు అనుమానంగా చూస్తుంటే తమకు రిజర్వేషన్ల ఆశచూపి ఓటు బాంకుగా మార్చుకోవాలని చూసి ఎటూ తేల్చటం లేదని మెయితీలు అసంతృప్తితో ఉండటమే బిజెపి ఓటమికి కారణం.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?
  • చైనాతో చిప్‌ యుద్దం 2.0లో గెలుపెవరిది -భారత్‌ను పక్కన పెట్టిన అమెరికా !
  • చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !
  • నరేంద్రమోడీ అభివృద్ధి ఓ అంకెల గారడీ – జిడిపి సమాచార గ్రేడ్‌ తగ్గించిన ఐఎంఎఫ్‌ !
  • యుద్ధం వద్దని పోప్‌ హితవు : ఏ క్షణమైనా వెనెజులాపై దాడికి డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నాహం !

Recent Comments

Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…
Pratapa Chandrasekhar's avatarPratapa Chandrasekha… on బొమ్మా బొరుసూ : ప్రపంచ జిడిపిల…

Archives

  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d