• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Category Archives: Communalism

బిజెపి అజెండాను ముందుకు తెచ్చిన లా కమిషన్‌ : ఏక రూప పౌరస్మృతిని హిందువులందరూ అంగీకరిస్తారా ?

16 Friday Jun 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, Loksabha Elections, NATIONAL NEWS, Opinion, Others, RELIGION, Religious Intolarence, Social Inclusion

≈ Leave a comment

Tags

BJP, Hindu Code, Hindu Undivided Family, Indian constitution, Law Commission, Muslim Personal Law, Narendra Modi Failures, RSS, Supreme Court, Uniform Civil Code


ఎం కోటేశ్వరరావు


ఏక రూప పౌర స్మృతి గురించి ఆసక్తి ఉన్న వారు నోటిఫికేషన్‌ జారీ చేసిన జూన్‌ 14వ తేదీ నుంచి నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలపాలంటూ ఇరవై రెండవ లా కమిషన్‌ ఒక ప్రకటన చేసింది. అది లేకపోతే దేశం ఇంకేమాత్రం ముందుకు పోదు, తీవ్ర ఆటంకంగా ఉందన్నట్లు కొందరు గుండెలు బాదుకుంటున్నారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నదే కదా దాన్ని అమలు చేస్తామంటుంటే ఎందుకు లేనిపోని దురుద్దేశాలు అంటగడుతున్నారు అంటూ అమాయకత్వాన్ని నటిస్తున్నారు. అదే గనుక వాస్తవమైతే నరేంద్రమోడీ తొమ్మిది సంవత్సరాలుగా ఏం చేస్తున్నట్లు ? చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. లా కమిషన్‌ సరిగ్గా ఇప్పుడు దాన్ని ఎందుకు ముందుకు తీసుకు వచ్చిందన్నది ప్రశ్న. దీని గురించి దాన్ని ఎవరూ సవాలు చేయటం లేదు, విబేధించటమూ లేదు. ఎన్నో తర్జన భర్జనల తరువాత మన దేశంలోని సంక్లిష్ట పరిస్థితుల కారణంగా ఏకాభిప్రాయసాధనతో సాధించాల్సిన అంశంగా పరిగణించి అర్టికల్‌ 44లో ఇతర అదేశిక సూత్రాలలో దాన్ని చేర్చారు. వాటిని కోర్టులు అమలు జరపలేవని కూడా రాజ్యాంగంలో ఉంది. వాటిలో పని హక్కు, నిరుద్యోగ భృతి వంటి వివాదం లేని వాటిని అమలు జరపటం మీద శ్రద్ద లేని బిజెపి వివాదాస్పద ఏక రూప పౌర స్మృతి మీద కేంద్రీకరిస్తున్నది. మతోన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే మెజారిటీ-మైనారిటీ మతశక్తులు రెచ్చిపోతున్న తరుణంలో అనేక అపోహలు ఉన్న ఈ అంశం ఇప్పుడు తక్షణ అవసరం అంటూ బిజెపి ముందుకు తెస్తున్నది.

మహిళల ఉద్దరణ అని చెబుతున్నది. నిజానికి దానికి అంత శ్రద్ద ఉంటే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ ఎందుకు కల్పించలేదు. ఒక ముసాదాను రూపొందించి జనం ముందు ఎందుకు పెట్టలేదు ? త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇరవై రెండవ లా కమిషన్‌ ద్వారా ఒక ప్రచార అస్త్రంగా తన అజెండాను ముందుకు తెచ్చింది.
ఏక రూప పౌర స్మృతి ఈ దశలో అవసరమూ కాదు వాంఛనీయమూ కాదని 2018 ఆగస్టులో ఇరవై ఒకటవ లా కమిషన్‌ విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో స్పష్టంగా పేర్కొన్నది. ఆ పత్రం విడుదల చేసి మూడు సంవత్సరాలు దాటినందున నాటి నోటిఫికేషన్‌ గడువు ముగిసిందని, వివిధ కోర్టుల ఉత్తర్వులు దీని మీద ఉన్నందున ఈ అంశం మీద కొత్తగా అభిప్రాయాలను సేకరించనున్నట్లు పేర్కొన్నది. అభిప్రాయాలు తప్ప కోర్టు ఉత్తరువులేమీ లేవు.తాజా సేకరణతో ఏమి చేస్తారో చెప్పలేదు. గత కమిషన్‌ 2016 జూన్‌ 17 నోటి ఫికేషన్‌ ద్వారా అభిప్రాయాలను సేకరించింది. వాటిని క్రోడీకరించి కుటుంబ చట్ట సంస్కరణలు పేరుతో 185 పేజీల పత్రాన్ని విడుదల చేసింది. ఏక రూప దేశం అంటే సమరూపత ఉండనవసరం లేదు. మానవహక్కుల అంశంలో ప్రపంచమంతటా ఉన్న వివాదాలు లేని తర్కాలతో మన భిన్నత్వాన్ని సమ్మతింప చేసేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉందని ఆ పత్రం పేర్కొన్నది. వివిధ మతాలకు సంబంధించి పర్సనల్‌ చట్టాల్లో ఉన్న వివక్ష, అసమానతలను ఎదుర్కొనేందుకు ఇప్పుడున్న కుటుంబ చట్టాలను అవసరమైన మేరకు క్రోడీకరించి, సవరించవచ్చని కూడా పేర్కొన్నది. సుప్రీం కోర్టు తన ముందుకు వచ్చిన వివిధ కేసుల విచారణ సందర్భంగా ఏకరూప పౌర స్మృతి అవసరమని అభిప్రాయపడింది. తాజాగా మార్చి 23వ తేదీన వివిధ పిటీషన్ల మీద తీర్పు చెబుతూ ఇలాంటి పిటీషన్లను ఆమోదించి విచారించటం అంటే అలాంటి చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటును ఆదేశించటమేనని, తామాపని చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్ర చూడ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. దీని గురించి తాజాగా ఆలోచించాలని, ఏ చర్యలు తీసుకున్నది కోర్టుకు తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. 2022 అక్టోబరులో సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్లపై ప్రభుత్వం స్పందిస్తూ మత ప్రాతిపదికన ఉన్న వ్యక్తిగత చట్టాలు దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్నట్లు, ఏకరూప పౌర స్మృతిని తీసుకువస్తామని పేర్కొన్నది.


దేశ ఐక్యతకు, సామాజిక సమతుల్యతకు ముప్పు తెస్తున్న అంశాలలో విద్వేష పూరిత ప్రసంగాలు, ఇతర వివాదాస్పద అంశాలు, చట్టాన్ని కొందరు చేతుల్లోకి తీసుకోవటం, వ్యవస్థల దుర్వినియోగం వంటివి నేడు ప్రధానంగా ముందుకు వచ్చాయి. అలాంటి వారి మీద ఫిర్యాదు లేకున్నా కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఒకటికి రెండుసార్లు చెప్పాల్సి వచ్చింది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే అలాంటి ప్రసంగాలు చేసిన వారి మీద కేసు నమోదు చేసిన వారికి భద్రత లేదన్నది స్పష్టం. ఆదేశిక సూత్రాల్లోని పని, విద్య, నిరుద్యోగ భృతి వంటి హక్కులను అమల్లోకి తెస్తే కరోనాలో వలస కార్మికులు దిక్కులేని చావులకు, ఇబ్బందులకు గురయ్యేవారు కాదు. వలస కూలీలు తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని స్థానికులు దాడులకు దిగేవారూ కాదు.రిజర్వేషన్ల కోసం తన్నుకు చచ్చేవారూ కాదు.తాజాగా మణిపూర్‌ మంటలూ ఉండేవి కాదు, ప్రధాని మోడీ కనిపించటం లేదనే పోస్టర్లూ వెలువడేవి కాదు.


ఏకరూప పౌర స్మృతి అంటే ఎలా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించి ఎలాంటి మార్పులు చేసేదీ జనంలో చర్చకు పెడితే దాని గురించి ఉన్న అనేక అపోహలు తొలుగుతాయి. ఏమైనా సరే వెంటనే అమలు జరపాలని కోరుతున్న మోడీ సర్కార్‌ గత తొమ్మిది సంవత్సరాలుగా అలాంటిదేమీ తీసుకురాలేదు. రూపు రేఖలు లేని ఒక ప్రతిపాదన మీద అభిప్రాయాలు చెప్పమంటే ఏమి చెబుతారు ? గతంలో చెప్పిన అభిప్రాయాలకు కాలదోషం పట్టిందని వర్తమాన లా కమిషన్‌ ఏ ప్రాతిపదికన నిర్దారించింది. అసలది ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ తప్ప రాజ్యాంగబద్దమైనది కాదు, ప్రభుత్వం దాని ద్వారా అభిప్రాయసేకరణ జరపమని కోరింది గాని రాజ్యాంగ ఆదేశం లేదు. ఏకరూప పౌర స్మృతిని ముస్లింలు లేదా ఏమతం వారైనా ఎలాంటి హేతుబద్దత లేకుండా గుడ్డిగా తిరస్కరించనవసరంలేదు, భిన్న అభిప్రాయం వెల్లడించవచ్చు, ముసాయిదాను ముందుపెడితే వివరణలు కోరవచ్చు.


ఆదేశిక సూత్రాల్లో అనేక అంశాలు ఉన్నప్పటికీ మిగతావాటిని అమలు జరపకుండా ఏకరూప పౌర స్మృతి మీద బిజెపి కేంద్రీకరణ అన్నది ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ఆ మతానికి చెందినవారితో పాటు ఇతర మతాల వారు, మతం, కుల పట్టింపులు లేనివారు కూడా బలంగా నమ్ముతున్నారు. దాన్ని ఏకాభిప్రాయంతో సాధించాల్సి ఉందని అంబేద్కర్‌తో సహా మెజారిటీ భావించిన కారణంగానే ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు పది సంవత్సరాలు చాలని నాడు భావించారు. ఆ లక్ష్యం నెరవేర లేదు గనుక పొడిగిస్తూ వస్తున్నారు. తరువాత ఓబిసిలకూ వర్తింప చేశారు. పౌర స్మృతి మీద ఇప్పటికీ ఏకాభిప్రాయ పరిస్థితి ఉందా అంటే లేదు. అసలు హిందువులందరూ దానితో ఏకీభవిస్తారా అన్నది ప్రశ్న. కర్ణాటకలో ఎక్కువగా ఉన్న లింగాయతుల తమను ప్రత్యేక మతానికి చెందిన వారిగా పరిగణించాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.శైవులు, వైష్ణవులు వారిలో కులాల వారీ భిన్న ఆచారాలు, ఇలా ఎన్నో విభిన్నతలు ఉన్నాయి. వాటన్నింటిలో బిజెపి లేదా కేంద్ర ప్రభుత్వం వేలు బెట్టాలని, ఫలానా పద్దతి పాటించాలని ఆదేశించాలని చూస్తున్నదా ? అందుకే ముసాయిదా చట్టాన్ని ముందుపెడితే ఇలాంటి అనుమానాలకు తెరపడుతుంది లేదా కొత్త అంశాలు ముందుకు రావచ్చు. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే అదేదో ముస్లింలకు సంబంధించిందని అనేక మంది భావించి మద్దతు ఇచ్చారు. రాముడి గుడి కడతామంటే సరే అన్నారు. వ్యక్తిగత అంశాల్లో తమదాకా వస్తే అలాగే ఉంటారా ? ఒక కులానికి చెందిన వారు మరో కులం, మతానికి చెందిన వారిని వివాహం చేసుకోకూడదని తీర్మానాలు చేస్తున్న పంచాయత్‌లు సాగుతూనే ఉన్నాయి.ఎవరికి వారు తమ కులాన్ని, మతాన్ని పవిత్రంగా మార్చాలని చూస్తున్నారు. అలాంటి స్థితిలో అందరూ సమానమే, ఒకటే అనే భావనను అంగీకరిస్తాయా ?


గోవాలో ఏకరూప పౌర స్మృతి అమలు జరుపుతున్నపుడు ఇతర చోట్ల ఎందుకు అమలు జరపకూడదు అని కొందరు వాదిస్తున్నారు. పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా 1961లో దేశంలో విలీనమైంది. అప్పటి వరకు అక్కడ అమల్లో ఉన్న పౌర స్మృతిని మార్చి కొత్త విధానాన్ని వర్తింప చేయాల్సిన అగత్యం తలెత్తలేదు. దాన్నే వర్తింప చేసేందుకు నాడు కేంద్రం అంగీకరించింది, ఎవరూ అభ్యంతర పెట్టలేదు. అలాంటి చట్టాన్ని మిగతా దేశంలో అమలు జరపవద్దని ఎవరూ అనటం లేదు, బలవంతంగా రుద్దటం గాక అనుమానాలను తీర్చి అమలు జరపాలని చెబుతున్నారు. అందుకు అనువైన వాతావరణం లేదు గనుక తొందరపడవద్దంటున్నారు. మిగిలిన ఆదేశిక సూత్రాలు అమలు జరిపిన తరువాత దీన్ని కూడా చేపట్టవచ్చు. గోవాలో ఉన్న చట్టం ప్రకారం వివాహమైన వెంటనే ఏ మతం వారికైనా భర్త ఆస్తిలో భార్యకు సగం వాటా మీద హక్కు దఖలు పడుతుంది. దేశంలో దాన్ని అమలు చేస్తే ఇప్పుడున్న హిందూ అవిభక్త కుటుంబం, దానితో పాటే ఆ పేరుతో పొందుతున్న పన్ను రాయి రద్దవుతుంది. దీన్ని దేశంలోని హిందువులందరూ సమ్మతిస్తారా ? ఉత్తరాదిన సప్తపది హౌమం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తేనే వివాహం జరిగినట్లు, దక్షిణాదిన అదే హిందువుల్లో ఎవరైనా పాటించ వచ్చు తప్ప విధి కాదు. లేదు. ఇలాంటి అనేక తేడాలు ఉన్నప్పుడు ఏక రూప చట్టం ఎలా ఉంటుందో ఎవరిని ఎలా ప్రభావితం చేస్తుందో, ఎలా స్పందిస్తారో తెలియదు. పంజాబ్‌లో వారసత్వహక్కులు హిందువులకు ఒక విధంగా సిక్కులకు మరొక విధంగా ఉన్నాయి. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం ఆ మతానికి చెందిన పురుషులు నలుగురిని వివాహం చేసుకోవచ్చు, ఆ మేరకు వివాహాలు చేసుకుంటూ హిందువులు మెజారిటీగా ఉన్న దేశాన్ని ముస్లిం మెజారిటీగా మార్చేందుకు కుట్రపన్నుతున్నారంటూ కాషాయదళాలు నిరంతరం చేస్తున్న గోబెల్స్‌ ప్రచారం తెలిసిందే.


నిషేధం ఉన్నప్పటికీ ముస్లింలలో కంటే హిందువులు, ఇతరుల్లోనే ఎక్కువగా బహుభార్యాత్వం ఉందని గతంలో జరిపిన విశ్లేషణలో తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2005-06 ప్రకారం హిందువుల్లో 1.9, ముస్లింలలో 2.9, ఇతరుల్లో 2.9శాతం ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్నారు. అదే 2019-20 సర్వే ప్రకారం 1.3,1.9,1.6 శాతాలకు తగ్గారు. తగ్గుదల అందరిలోనూ ఉంది. అందువలన ముస్లింలు పనిగట్టుకొని ఎక్కువ మందిని వివాహమాడి పిల్లలను కని దేశాన్ని ఆక్రమిస్తున్నారనే ప్రచారం వాస్తవం కాదు. విద్యలేని వారు, పేదలు, చిన్న వయస్సులోనే వివాహాలు చేసుకున్న వారిలో ఈ దురాచారం ఎక్కువగా ఉన్నట్లు కూడా అధికారిక సర్వే వెల్లడించింది. కులాల వారీ చూసినపుడు తాజా సర్వే ప్రకారం గిరిజనుల్లో 2.4, ఎస్‌సి 1.5, ఒబిసి 1.3, ఇతరుల్లో 1.2శాతం చొప్పున, మతాలవారీ హిందూ 1.3, ముస్లిం 1.9, క్రైస్తవులు 2.1, బౌద్దులు 1.3, సిక్కులు 0.5, ఇతరులు 2.5 శాతం మంది ఉన్నారు. ముస్లింలకు మినహా ఇతరుల్లో ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉండటం నిషేధం. దేశంలో జరిపిన నేషనల్‌ శాంపుల్‌ సర్వే ప్రకారం ఓబిసిలు 40.94, దళితులు 19.59, గిరిజనులు 8.63 శాతం ఉన్నారు. వీరిలో అనేక కులాలు, ఉపకులాలు ఆచారాలు, సాంప్రదాయాలన్నీ ఒకటే కాదు, వీరందరూ హిందువులే, ఎంతో భిన్నత్వం కలిగిన వారందరికీ ఒకే పౌరస్మృతిని అమలు జరిపే ముందు వీరిలో ఉన్న అనుమానాలను తొలగించాలా లేదా ? దానికి మార్గం నమూనా చట్టం జనం ముందు పెట్టటమే.


ప్రస్తుతం వివిధ మతాల వ్యక్తిగత చట్టాల ప్రకారం ఒకే అంశంపై ఏకీ భావం లేదు. ఎవరి భాష్యాలు వారు చెబుతున్నారు. జనంలో అనేక అనుమానాలు, గందరగోళం ఉంది. ఏక రూప పౌరస్మృతిని బిజెపి బలవంతంగా రుద్దాలనుకుంటే ప్రస్తుతం దానికి అడ్డులేదు. పార్లమెంటులో దానికి గుడ్డిగా మద్దతు ఇచ్చే పార్టీలు ఉన్నందున అదేమీ పెద్ద అంశం కాదు. దాన్ని ఒక ఎన్నికల ప్రచార అస్త్రంగా, ముస్లింల మీద విద్వేషాలు, వ్యతిరేకతను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకు సృష్టికి, సంతుష్టీకరణకు పూనుకుంది. దీనికి ఇస్లాం లేదా దేశంలోని ముస్లింలు వ్యతిరేకమనే ప్రచారం చేస్తున్నారు. దీనిలో వాస్తవం-వక్రీకరణ రెండూ ఉన్నాయి. ముస్లిం మతశక్తులు గుడ్డిగా సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయి తప్ప సామాన్య ముస్లింలందరూ అలా లేరు, అదే విధంగా హిందూత్వ పేరుతో వీరంగం వేస్తున్న వారు ముస్లింల పట్ల గుడ్డి ద్వేషాన్ని వెళ్లగక్కుతుంటే మొత్తం హిందువులందరూ అలా లేరు. ఏ మతమైనా వర్తమానానికి అనుగుణంగా మారకపోతే మౌఢ్యం పెరుగుతుంది. ఉన్న మతాల్లో హిందూ అని చెబుతున్న అనేక సామ్యాలున్న శైవ, వైష్ణవ ఇతర వివిధ మతాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నందున అనేక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. లేకపోతే జనం మతాలను పక్కన పెట్టేస్తారు. అమెరికా వెళ్లి హిందూమత గొప్పతనం గురించి ప్రసంగించిన స్వామి వివేకానందుడి గురించి గొప్పగా చెబుతారు. సముద్రయానం చేశాడనే కారణంగా తిరిగి వచ్చిన తరువాత అదే హిందూమతం వివేకానంద దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకుంది. ఇటీవలి కాలంలో ఆ మూఢనమ్మకాన్ని సవరించుకొని పరిహారంగా కొన్ని క్రతువులు చేస్తే చాలని సరిపుచ్చుతున్నారు. ఎందుకంటే అనేక మంది స్వామీజీలు విదేశాల సందర్శన సరదాను అణుచుకోలేకపోయారు. మడిని గట్టున పెట్టి వెళ్లారు. సముద్రం దాటిన వారు కులాన్ని కోల్పోతారని శాస్త్రాల్లో రాసి ఉంది మరి. ఎవరైనా కులం పోగొట్టుకున్నవారు ఉన్నారా ? లేకపోగా విదేశాల్లో కూడా కుల గజ్జిని వ్యాపింప చేస్తున్నారు. దేశ పరువును గంగలో కలుపుతున్నారు. ఉన్న మతాలలో తాజాది ఇస్లాం గనుక ఆ మతం మీద ముల్లా ” అగ్రహారికుల ” ప్రభావం ఎక్కువగా ఉంది. వివాహం, విడాకులు, ఆస్తి హక్కులు, సంరక్షణ, దత్తత వంటి అంశాలు ఎంతో సున్నితమైనవి గనుక వాటిని సమానత్వ ప్రాతిపదికన, లింగవివక్ష లేకుండా ఎలా చట్టాన్ని రూపొందించాలన్నది పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అన్ని మతాలూ మహిళను చిన్న చూపు చూసేవే, అణచేందుకు చూసేవే. అందువలన వారికి అనుకూలమైన ఏ చట్టం రూపొందాలన్నా చట్ట సభల్లో వారికి హక్కుగా ప్రవేశించే హక్కు కల్పించటం ముందుగా జరగాలి. అప్పుడే పితృస్వామిక సమాజ పెత్తనాన్ని చట్టబద్దంగా కూడా అడ్డుగోగలరు. అనుమానాలను తొలగిస్తూ, విశ్వాసాన్ని పాదుకొల్పుతూ తేవాల్సిన ఏకరూప పౌరస్మృతిని బిజెపి కోరుకుంటున్నట్లుగా ఏకపక్షంగా రుద్దకూడదు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎక్కడైనా బావే గానీ సిఎం కుర్చీ దగ్గర కాదు : మహారాష్ట్రలో బిజెపి, షిండే శివసేన కుమ్ములాట – ముద్దులాట !

14 Wednesday Jun 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BJP-Sena rift, Maharashtra, Narendra Modi Failures, Siva Sena


ఎం కోటేశ్వరరావు


మహారాష్ట్రలో అసలు సిసలు మహత్తర హిందూత్వ శక్తులం, హిందుమత ఉద్దారకులం తామే అంటున్న బిజెపి – షిండే శివసేన నేతలు ఎంతవారలైనా అధికార కాంత దాసులే అన్నట్లుగా వచ్చే ఎన్నికల్లో సిఎం కుర్చీ కోసం కొట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది.” ఢిల్లీలో నరేంద్రమోడీ – రాష్ట్రంలో ఫడ్నవీస్‌ ” అంటూ బిజెపి ఒక నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానికి పోటీగా ” దేశంలో మోడీ – మహారాష్ట్రలో షిండే ” అంటూ తాజాగా షిండే శివసేన సోమవారం నాటి పత్రికల్లో ఇచ్చిన ప్రకటన రెండు పార్టీల మధ్య కాక పుట్టించింది.మంగళవారం నాడు కొల్లాపూర్‌లో సిఎం ఏకనాధ్‌ షిండే పాల్గొన్న కార్యక్రమాలను దేవేంద్ర ఫడ్నవిస్‌ బహిష్కరించారు, అనారోగ్యసాకు చెప్పినట్లు వార్తలు. దాంతో రెండు పార్టీలు నష్ట నివారణకు పూనుకొని బుధవారం నాటి పత్రికల్లో ఐక్యంగా ఉన్నట్లు కనిపించేందుకు శివసేన మరొక ప్రకటన ఇచ్చింది.” అందరూ ప్రేమించిన అద్భుతమైన బృందం ” అనే శీర్షికతో నష్ట నివారణకు గాను శివసేన మరొక ప్రకటన జారీ చేసింది. దానిలో నరేంద్రమోడీ, అమిత్‌ షా, బాలాసాహెబ్‌ థాకరే, ఆనంద దిఘేల బొమ్మలతో పాటు ఏకనాధ్‌ షిండే -దేవేంద్ర ఫడ్నవిస్‌ ఇద్దరూ జట్టుగా చేతులూపుతున్న చిత్రాన్ని ప్రదర్శించారు. వాటితో పాటు శివసేన ఎన్నికల గుర్తు బాణం, బిజెపి గుర్తు కమలం కూడా చోటు చేసుకుంది. తొలి ప్రకటనలో షిండేకు 26.1శాతం, ఫడ్నవిస్‌కు 23.2 శాతం మద్దతు అని పేర్కొనగా తాజా ప్రకటనలో ఇద్దరికీ కలిపి 49.3 శాతం మద్దతు అని పేర్కొన్నారు. ఈ పరిణామం మిగతా రాష్ట్రాలలో బిజెపితో చేతులు కలిపే ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఒక పాఠంగా పనికివస్తుంది. మరోవైపు కొద్ది రోజుల క్రితం సకాల్‌ అనే మరాఠీ దినపత్రిక వెల్లడించిన ఒక సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్‌సిపిా థాకరే శివసేన పార్టీ (ఎంవిఏ) మెజారిటీ సీట్లను సాధిస్తుంది. నిర్ణీత గడువు ప్రకారమైతే లోక్‌సభ తరువాత వచ్చే ఏడాది అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు, అలాగాక రెండింటినీ కలుపుతారా అన్నది చెప్పలేము.


శివసేనను చీల్చి బిజెపి మద్దతుతో బిజెపి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏదో ఒక అంశం రెండు పార్టీల మధ్య అనుమానాలను పెంచింది. రెండుసార్లు సిఎంగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఉప ముఖ్యమంత్రిగా పెట్టి అసలు కథ నడిపించాలన్నది బిజెపి పన్నాగం. ఏకనాధ్‌ షిండే తాత్కాలికమే, సిఎం పదవి తనదే అన్నట్లుగా ఫడ్నవిస్‌ ” ఢిల్లీలో నరేంద్రమోడీ- రాష్ట్రంలో ఫడ్నవీస్‌ ” అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. దానికి పోటీగా ఏకనాధ్‌ షిండే రంగంలోకి దిగారు. ఒక టీవీ ఛానల్‌-ఒక ఏజన్సీ నిర్వహించిన సర్వేలో తిరిగి సిఎంగా షిండేను కోరుతున్నవారు 26.1శాతం, ఫడ్నవిస్‌ను కోరుతున్నవారు 23.2శాతం అని తేలిందని పేర్కొంటూ శివసేన పేరుతో ఒక ప్రకటన జారీ చేశారు. అంతే కాదు బిజెపికి 30.2శాతం, షిండే సేనకు 16.2శాతం ఓటర్ల మద్దతు ఉందని, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో షిండే అమలు జరుపుతున్న పధకాల వలన ప్రజా మద్దతు పెరిగిందని కూడా పేర్కొనటం గమనించాల్సిన అంశం. బాలాసాహెబ్‌ థాకరే ఫొటో లేకుండా ఆ ప్రకటన జారీ చేయటం అంటే మోడీ, అమిత్‌ షాలను చూసి షిండే భయపడుతున్నారని తేలిందని ఉద్ధావ్‌ ధాకరే సేన నేత సంజయ రౌత్‌ ధ్వజమెత్తారు. ఈ ప్రకటనను బట్టి ఏకనాధ్‌ షిండేను సిఎంగా అంగీకరించినట్లేనని ఫడ్నవిస్‌కు ఇది విచారకరమైన రోజని ఎన్‌సిపి స్పందించింది. ఈ ప్రకటన గురించి బిజెపి పెద్దలకు తెలిపామని, వారి అంగీకారంతోనే విడుదల చేసినట్లు షిండే వర్గం చెప్పుకుంది. సిఎంను పొగడటం వరకు ఓకే , ఇద్దరికీ కలిపి ఉన్న బలం గురించి ప్రతిపక్షాలకు చెప్పాలి మనలో ఎవరికి ఎంత బలం ఉందో, తమ నేత ఫడ్నవిస్‌కు జనంలో ఆదరణ లేదని చెప్పటాన్ని అంగీకరించేది లేదని బిజెపి నేతలు మండిపడ్డారు. షిండే తనతో పాటు తీసుకువచ్చిన 40 మంది ఎంఎల్‌ఏల కారణంగానే బిజెపికి అధికారం దక్కిందని గుర్తించాలని షిండే వర్గం తిప్పి కొట్టింది. ఇలాంటి ప్రకటనల రాజకీయాలు కొత్త కాదు. 2019 ఎన్నికల్లో మోడీ దేశానికి దేవేంద్ర రాష్ట్రానికి అంటూ బిజెపి ప్రకటనలు జారీ చేసింది.


షిండే సేన ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలు తమవే అని బిజెపి చెబుతోందని, అదే విధంగా షిండే వర్గానికి చెందిన ఐదుగురు మంత్రులను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మంత్రులు ఉద్దావ్‌ధాక్రేపై తిరుగుబాటులో కీలకపాత్ర పోషించారు. వారి ప్రవర్తనతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని ఫడ్నవిస్‌ ఇటీవల అమిత్‌ షా వద్ద మొరపెట్టుకున్నారని వార్తలు. ఇటీవల ఎవరికి వారు తమ ఎంఎల్‌ఏలతో విడివిడి సమావేశాలు జరపటం, నిధులు సరిగా కేటాయించటం లేదని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నట్లు షిండే కుమారుడు, ఎంపీ డాక్టర్‌ శ్రీకాంత్‌ షిండేపై బిజెపి నేతలు ధ్వజమెత్తారు. శ్రీకాంత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కల్యాణ్‌ లోక్‌సభ సీటు తమదే అని కూడా వారు బహిరంగంగా చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో బలపరచకూడదని తీర్మానాలు కూడా చేశారు. ఈ పూర్వరంగంలో అవసరమైతే తాను రాజీనామా చేస్తానని శ్రీకాంత్‌ గతవారంలో ప్రకటించారు. సిఎంగా తండ్రి తీసుకొనే నిర్ణయాల వెనుక కుమారుడి ప్రభావం ఉందన్న పేరుంది. ఏకనాధ్‌ షిండేను అదుపులో ఉంచేందుకు, అవసరమైతే తప్పించేందుకు ఎన్‌సిపి నేత అజిత్‌ పవార్‌కు బిజెపి గాలం వేసింది. రాష్ట్ర రాజకీయాలలో అధికారం కోసం అర్రులు చాస్తారన్న పేరున్న అజిత్‌ బిజెపిలో చేరటం లాంఛనమే అన్న వార్తలు కూడా వచ్చాయి. అదే జరిగితే తాము కూటమి నుంచి తప్పుకుంటామని బిజెపిని షిండేసేన హెచ్చరించింది. అజిత్‌ పవార్‌ గతంలో బిజెపితో చేతులు కలిపి దొంగచాటుగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 80 గంటల తరువాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష కూటమి నేతగా ఉన్నారు.


మరాఠీ పత్రిక సకాల్‌ ఇటీవల ప్రకటించిన సర్వే ప్రకారం మహారాష్ట్రలో నరేంద్రమోడీని ప్రధానిగా కోరుకుంటున్నవారు 42.1శాతంగా కాగా వద్దన్నవారు 41.5శాతం ఉన్నారు. మిగిలిన వారు చెప్పేందుకు నిరాకరించటం లేదా తెలియదని చెప్పారు. దాదాపు 70శాతం మంది ఆర్థిక రంగంలో మోడీ విఫలం చెందినట్లు పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌ తరువాత ఎక్కువ 48 స్థానాలున్న ఇక్కడ మోడీ పట్ల అనుకూలత ఎంతో ప్రతికూలత కూడా అంతే ఉంది. కోర్టులో శివసేన పేరు, గుర్తును షిండే వర్గం దక్కించుకోవచ్చుగానీ ఈ సర్వే ప్రకారం ఓటర్లు 12.5శాతం మంది ఉద్దావ్‌ ధాక్రే శివసేనకు మద్దతు ప్రకటిస్తే కేవలం 5.5శాతమే షిండేకు అనుకూలమని చెప్పారు. బిజెపికి 33.7శాతం మొగ్గుచూపారు. బిజెపి కూటమికి 39.2 శాతం మద్దతు పలకగా ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్‌సిపి, ఉద్దావ్‌ శివసేన కూటమికి 48శాతం మంది అనుకూలం అన్నారు. అరమరికలు లేకుండా ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఓటు బదిలీ చేసుకుంటే బిజెపి శంకరగిరి మాన్యాలు పడుతుందని అంకెలు చెబుతున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్‌-ఎన్‌సిపి ఒక కూటమిగా పోటీ చేశాయి. బిజెపికి 27.84, శివసేనకు 23.5, కూటమికి 51.34 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌, ఎన్‌సిపిలకు 16.41,15.66 మొత్తం 32.07శాతం రాగా 47 చోట్ల బరిలోకి దిగిన వంచిత్‌ బహుజన్‌ అగాధీకి 6.92 శాతం దానితో కలసి ఒక చోట పోటీ చేసి దాన్ని గెలుచుకున్న మజ్లిస్‌కు 0.73 ఓట్లు వచ్చాయి. వంచిత్‌ బహుజన్‌ అగాధీ ప్రస్తుతం ఉద్దావ్‌ శివసేనకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2019 అక్టోబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, శివసేన కూటమికి 25.75,16.41 చొప్పున మొత్తం 42.16 శాతం మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌, ఎన్‌సిపి కూటమికి 15.87, 16.71 చొప్పున, మొత్తం 32.58 శాతం వచ్చాయి. ఇక కుమ్ములాటలు-ముద్దులాటలుగా ఉన్న బిజెపి-షిండే సేన కూటమి తాత్కాలికంగా కలసి ఉన్నట్లు కనిపించేందుకు పూనుకున్నప్పటికీ అధికార కుమ్ములాటలు,పరిణామాలు ఏ రూపం తీసుకొనేది చెప్పలేము.కలసి ఉన్నా ఎంవిఏ కూటమిని ఎంత మేరకు ఎదుర్కొనేది ప్రశ్నార్ధకమే.
.

Share this:

  • Tweet
  • More
Like Loading...

మంచి కంటే హాని ఎక్కువ చేస్తున్న మతం : మెజారిటీ భారతీయుల మనోగతమిది ! మార్కెట్‌ సరకుగా హిందూత్వ !!

05 Monday Jun 2023

Posted by raomk in Africa, Asia, BJP, Communalism, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ 1 Comment

Tags

Anti Muslim propaganda in India, BJP, Desecularization, Global Religion 2023, hindutva, Hindutva nationalism, India’s population, polygamy, polygamy in india, RSS


ఎం కోటేశ్వరరావు


మతం మంచి కంటే హాని ఎక్కువగా చేస్తున్నదని నమ్ముతున్న వారు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారు. ” ప్రపంచ మతం 2023 ” అనే నివేదిక వెల్లడించిన అంశమిది. ఇప్‌సాస్‌ అనే అమెరికన్‌ మీడియా సంస్థ 26దేశాలకు చెందిన వారి మీద జరిపిన సర్వే వివరాలను ఇటీవలనే వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 20 ఫిబ్రవరి మూడవ తేదీ మధ్య సర్వే జరిగింది. కొన్ని దేశాల్లో వెయ్యి, కొన్ని చోట్ల ఐదు వందల మందిని ప్రశ్నించగా మన దేశంలో 2,200 మందిని ఎంచుకున్నట్లు సంస్థ పేర్కొన్నది. వీరిలో తాము హిందువులమని 87శాతం, ముస్లింలు పది, క్రైస్తవులమని రెండు శాతం, మతం ఏమిటో చెప్పని వారు ఒక శాతం ఉన్నారు. సర్వేలో ప్రశ్నలకు వచ్చిన కొన్ని సమాధానాల సారం ఇలా ఉంది. మంచి కంటే మతం హాని ఎక్కువ చేస్తున్నదని నమ్ముతున్న వారు 26 దేశాల సగటు 47శాతం కాగా అగ్రస్థానంలో మన దేశంలో 73 శాతం ఉన్నారు. చుట్టుపక్కల ఇతర మత విశ్వాసాల వారు ఉన్నప్పటికీ పూర్తి నిశ్చింతగా ఉన్నట్లు చెప్పిన వారు సగటున 76శాతం కాగా మన దేశంలో 80శాతం ఉన్నారు. దక్షిణాఫ్రికా 92శాతంతో ప్రధమ, 53శాతంతో దక్షిణ కొరియా అధమ స్థానంలో ఉంది. మత విశ్వాసాలు, దేవుడికి సంబంధించి మన దేశంలో నమ్మకం ఉన్న వారు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దేవుడిని కొలిచేందుకు ప్రార్ధనా స్థలాలకు వెళ్లే వారు సగటున 28శాతం ఉండగా మన దేశంలో అధికంగా 71శాతం ఉన్నారు. జపాన్‌లో అతి తక్కువ ఐదుశాతం. మతం, దేవుడు, స్వర్గం, నరకం గురించి విశ్వాసాలు ఉన్నవారు మన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. మన దేశంలోని పట్టణపౌరుల్లో పదింట ఎనిమిదికి దేవుడు అంటే విశ్వాసం ఉంది. దేవుడిని నమ్మే వారు సగటున 40శాతం మంది, అదృశ్య శక్తి ఏదో ఉందని భావిస్తున్నవారు 20 శాతం ఉన్నారు. అదే మన దేశంలో 70, 11 శాతాల చొప్పున ఉన్నట్లు తేలింది.


మన దేశంలో ఓటు బాంకు రాజకీయాల సంతుష్టీకరణ అంశం చర్చనీయాంశంగా ఉంది.మైనారిటీల పరిరక్షణకు పూనుకోవటాన్ని సంతుష్టీకరణగా వర్ణించుతున్న శక్తులు, ఉన్మాదం, విద్వేషాన్ని రెచ్చగొడుతూ మెజారిటీ ఓటు బాంకు సృష్టికి పూనుకున్నాయి. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అని చెబుతున్న బిజెపి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో 15శాతంగా ఉన్న ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారెవరినీ ఒక్క చోట కూడా అభ్యర్ధులుగా పోటీకి నిలపటం లేదు. ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ ప్రముఖ నేత ఒకరు తమకు ముస్లిం ఓట్లు అవసరం లేదని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే పార్టీ నేతలు అసెంబ్లీ ఫలితాల తరువాత ముస్లిలంతా ఒక పార్టీకి వేసినందున తాము ఓడినట్లు ఆరోపించారు.ఇది మెజారిటీని ఆకర్షించే మార్కెటింగ్‌ ఎత్తుగడ, ఒక తరహా విద్వేష ప్రచారం. హిందూ మత రక్షణ అంటూ లేని ప్రమాదాన్ని జనం మెదళ్లలోకి ఎక్కించటమే. వందల సంవత్సరాల ముస్లిం, ఆంగ్లేయుల పాలనలో జరగని హాని ఇప్పుడు జరుగుతోందని చెప్పటం దుష్ట పధకంలో భాగం తప్ప మరొకటి కాదు. హిందూత్వ శక్తులు చెబుతున్నట్లుగా మెజారిటీ మతరాజ్యాన్ని ఏర్పాటు చేస్తే పాకిస్తాన్‌ మాదిరి మట్టి కొట్టుకుపోవటం తప్ప మరొకటి జరగదు. దీన్ని దేశ పౌరులు అంగీకరిస్తారా ? త్వరలో దేశంలో ముస్లిం జనాభా పెరిగి వారి పాలన వస్తుందంటూ వాట్సాప్‌లో రోజూ ఊరూ పేరు, ఆధారం లేని సమాచారాన్ని జనానికి చేరవేసి బుర్రలను ఖరాబు చేస్తున్న సంగతి తెలిసిందే. మన దేశం 2030 నాటికి చైనాను నెట్టేసి అధిక జనాభా దేశంగా మారనుందని ఐరాస గతంలో వేసిన అంచనాను దెబ్బతీసి ఏడు సంవత్సరాల ముందే ఆ ఘనతను మనం సాధించాము. ఇతర అభివృద్ధి లక్ష్యాలకు ఎంతో దూరంలో ఉన్నాము.


మత రాజ్యం దిశగా దేశాన్ని మార్చాలని, అదే ప్రాతిపదికన సమాజాన్ని విభజించాలని చూస్తున్న శక్తులు రెచ్చిపోతున్న కాలమిది. మతం, దేవుళ్లను వీధుల్లోకి తెచ్చి ఓట్లను దండుకోవటం తాత్కాలికం తప్ప శాశ్వతం కాదు గానీ, ఒక్కటిగా ఉండాల్సిన సమాజం పరస్పర అనుమానాలతో విడిపోతుంది. కొన్ని మతాల వారు ఉంటే పరిసరాల్లో ఉండలేమని కొన్ని శక్తులు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని అని ఇప్‌సాస్‌ సర్వే వెల్లడించింది. మార్కెటింగ్‌ అవసరాల కోసం ఇప్‌సాస్‌ సంస్థ వివిధ సర్వేలు చేస్తున్నది. ఓట్లను దండుకోవటం, అధికారం కోసం మతాన్ని, విశ్వాసాలను మార్కెటింగ్‌ చేసుకొనే శక్తులకు ఈ సర్వే కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో అలాంటి శక్తుల కుట్రలకు దేశం, జనం బలికాకుండా చూసేందుకు పూనుకున్న లౌకిక, పురోగామి శక్తులు కూడా తమ విధానాలు, వైఖరులను రూపొందించుకొనేందుకూ ఇది తోడ్పడుతుంది. ప్రతిదాన్నీ మార్కెట్‌ సరకుగా మార్చివేస్తున్న పూర్వరంగంలో మతం, విశ్వాసాలు, దేవుడు, దేవతలను కూడా అదే చేస్తున్నారు. ప్రతి పండుగనూ ఒక ఆదాయవనరుగా మార్చివేసి పెట్టుబడి లేకుండా, ఏమాత్రం శ్రమపడకుండా పరాన్న జీవులుగా మారి లబ్దిపొందేందుకు కొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. వారు అలాంటి శక్తులకు మద్దతుదారులుగా మారటం సహజం. ఇది మార్కెట్‌ సూత్రంలో భాగమే. వామపక్షాలు మినహా మిగతా పార్టీలన్నీ తరతమ తేడాలతో మత మార్కెటింగ్‌లో పోటీపడుతుండగా బిజెపి అన్నింటికీ అందనంత ముందు ఉంది. మాది నాణ్యమైన సరకు అంటే కాదు మాదే అసలు సిసలు అని కంపెనీలు పోటీ పడుతున్నట్లుగా నిజమైన హిందూత్వకు ప్రతీకలం తామంటే తామని బిజెపి-శివసేన పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. హిందూత్వ మార్కెటింగ్‌లో భాగంగానే విద్వేష ప్రచారాన్ని చూడాల్సి ఉంటుంది.


ముస్లింలు నాలుగు వివాహాలు చేసుకోవచ్చు, ఎందరినైనా పిల్లలను కనవచ్చు గనుక వారు జనాభాను ఉత్పత్తి చేసి మెజారిటీగా మారనున్నారు అనే తప్పుడు ప్రచారం సాగుతోంది. దేశంలో పిల్లలను ఎందరినైనా కనేందుకు అవకాశం ఉంది. అయితే ఎన్నికలలో పోటీ చేసేందుకు, సంక్షేమ పధకాలను అందించేందుకు ప్రభుత్వాలు కొన్ని ఆంక్షలు పెట్టాయి. అంతకు మించి సంతానం ఉన్నవారు వాటికి అనర్హులు. 1951 నుంచి 2011 వరకు నిర్వహించిన జనాభా లెక్కలను చూస్తే మొత్తంగా జనాభా పెరుగుదల రేటు 21.6 నుంచి 17.7శాతానికి తగ్గింది. హిందువుల్లో అది 20.7 నుంచి 16.6కు (నాలుగుశాతం తగ్గింది) పడిపోగా ముస్లింలో 32.7 నుంచి 24.7(ఎనిమిదిశాతం తగ్గింది)శాతానికి, క్రైస్తవుల్లో 29 నుంచి 15.7 శాతానికి తగ్గింది. అందువలన మెజారిటీ ముస్లింలు ఉంటారని చెప్పటం దురుద్దేశంతో చేస్తున్న ప్రచారమే. ఈ కాలంలో ముస్లిం జనాభా 4.4శాతం పెరిగి 14.2కు, హిందువులు 4.3శాతం తగ్గి 79.8శాతం వద్ద ఉంది. ఈ తీరు తెన్నులతో హిందువులు మైనారిటీ కావటం జరగదు.2050 నాటికి ముస్లింలు 31.1 కోట్లకు, హిందువులు 130 కోట్లకు, క్రైస్తవులు 3.7, ఇతరులు 4.6 కోట్లకు పెరుగుతారని అంచనా. హమ్‌ పాంచ్‌ హమారో పచ్చాస్‌ (మనం ఐదుగురం మనకు పాతిక మంది) హమ్‌ దో హమారే బారా(మన మిద్దరం మనకు పన్నెండు మంది) అనే తప్పుడు ప్రచారం పనిగట్టుకు చేస్తున్నారు. మన దేశంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, ముస్లింలలో వెనుకబాటుతనం, దారిద్య్రం ఎక్కువ.ఇలాంటి స్థితిలో పిల్లలు ఎక్కువ ఉంటారు, దీనికి మతానికి సంబంధం లేదు. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌లోని ముస్లింలలో సంతనోత్పత్తి రేటు 3.1, కేరళలో 1.86 ఉందని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ ఐదవ సర్వే వెల్లడించింది. దీనికి ఆర్థిక, విద్య, గ్రామీణ, పట్టణ తేడాలు అన్నది స్పష్టం. తమిళనాడులో 1.74 మాత్రమే ఉంది. ఉత్తర ప్రదేశ్‌ పట్టణ ప్రాంతాల్లో 2.1 మంది పిల్లలు ఉంటే గ్రామాల్లో ముగ్గురు ఉన్నారు. జనాభా పెరుగదలలో మత విశ్వాసాల కోణం కొంత మేరకు ఉంది. అది ఒక్క ముస్లింలకే పరిమితం కాదు, అన్ని మతాల్లో , వెనుకబడిన సమాజాలన్నింటా ఉన్న లక్షణమే. ఉత్తర ప్రదేశ్‌ను తీసుకుంటే 1991-2001 కాలంలో మొత్తంగా 25.85 శాతం పెరిగితే అది 2001-11 నాటికి 20.9శాతానికి తగ్గింది.


బహుభార్యత్వం గురించి కూడా తప్పుడు ప్రచారం సాగుతున్నది. రాముడు ఏకపత్నీ వ్రతుడైతే, కృష్ణుడు బహుపత్నీ వ్రతుడు. ఇద్దరూ పూజనీయులుగానే ఉన్నారు. అసలు 1955లో చట్టం నిషేధించేవరకు హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు ఒకరికి మించి భార్యలను కలిగి ఉండవచ్చని ఎంత మందికి తెలుసు ? ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం మహిళల స్థితి గురించి 1974లో వేసిన కమిటీ నివేదికలో నిషేధించినప్పటికీ హిందువుల్లో బహుభార్యత్వం కొనసాగుతున్నది.గిరిజనుల్లో 15.25, బౌద్దులలో 9.7,జైనుల్లో 6.72, హిందువుల్లో 5.8, ముస్లింలలో 5.7శాతం మంది ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉన్నారని పేర్కొన్నది. తరువాత ఇంతవరకు అలాంటి సర్వే జరగలేదు ? అలాంటపుడు ఏ ప్రాతిపదికన ముస్లింలను దోషులుగా చిత్రిస్తున్నట్లు ? ముస్లిం పర్సనల్‌ లా 1937 ప్రకారం ఎక్కువ మంది భార్యలను, పిల్లలను కలిగి ఉండవచ్చని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ భాష్యం చెప్పింది.2015లో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం బహుభార్యత్వం ఇస్లాంలో మౌలిక అంతర్భాగం కాదని, ఆర్టికల్‌ 25 ప్రకారం ఏక భార్యత్వ సంస్కరణ గురించి చట్టం చేసే హక్కు రాజ్యానికి ఉందని చెప్పింది. పర్సనల్‌ లా అనుమతించినప్పటికీ అది ఇస్లాంను పాటించే వారికి మౌలిక హక్కు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.


2020 డిసెంబరులో అమెరికా పూ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, ఈజిప్టులలో బహు భార్యలు ఉన్న పురుషులు ఒక శాతం కూడా లేరు. ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో గరిష్టంగా 36శాతం మంది బహుభార్యలను కలిగి ఉంటే ముస్లింలలో 40శాతం, క్రైస్తవులలో 24శాతం మంది కలిగి ఉన్నారు. మరో పద్నాలుగు ఆఫ్రికా దేశాలలో 34 నుంచి రెండు శాతం వరకు ఉన్నారు. ఈ దేశాలన్నింటా ముస్లింలతో పాటు క్రైస్తవులు, మతంతో సంబంధం లేని గిరిజన తెగల్లో కూడా ఎక్కువ మందిని వివాహమాడుతున్నారు. వందల సంవత్సరాలనాడు అరేబియా యుద్ధాలలో పురుషులు ఎక్కువ మంది మరణించటంతో వితంతువులు, అనాధల సమస్య తలెత్తి వారి ఆలనా పాలనా చూసేందుకు బహుభార్యలను కలిగి ఉండవచ్చని ఇస్లాం అనుమతించిందని చరిత్రకారులు చెప్పారు. పాకిస్తాన్‌లో రెండవ వివాహం చేసుకోవాలంటే మొదటి భార్య రాతపూర్వక అనుమతి అవసరం. అలా తీసుకోకుండా మరో మహిళను వివాహం చేసుకున్న ఒక కేసులో భర్తకు 2017లో కోర్టు జైలు శిక్ష విధించింది.
మన దేశంలో స్త్రీ – పురుషుల నిష్పత్తిని చూసినపుడు పురుషులకు అనేక ప్రాంతాల్లో అసలు వివాహం కావటమే ఒక సమస్యగా మారినపుడు బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యం కాదు.1951లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 946 మంది మహిళలు ఉన్నారు. 2011 నాటికి అది 943కు తగ్గింది. ఏడు దశాబ్దాల సగటు 936 గా ఉంది. ఒక సర్వే ప్రకారం ముస్లింలలో మొదటి భార్యకు సగటున 4.67 మంది ఉంటే రెండవ భార్యకు 1.78 మాత్రమే పిల్లలు ఉన్నట్లు తేలింది. ఒక పరిశీలన ప్రకారం ఐదేండ్ల లోపు పిల్లల మరణాలు హిందువుల్లో 29 ఉండగా ముస్లిం పిల్లల్లో 18 మాత్రమే. అందువలన ఇరు మతాల వారికీ పిల్లలు ఒకే సంఖ్యలో పుట్టినా జీవించే వారు ఎక్కువగా ఉన్నందున జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండవచ్చని తేలింది.

ముస్లింలలో మగపిల్లవాడే కావాలనే వైఖరి లేకపోవటం కూడా స్త్రీ-పురుష నిష్పత్తిలో పెద్ద తేడా ఉండటం లేదన్నది పరిశీలనల్లో తేలింది. మతం కారణంగానే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారనే నిర్ణయానికి వస్తే జననాల రేటు ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గటానికి కారణాలేమిటి అనే దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. విద్య, ఆర్థికం వంటి అనేక అంశాలు దీనికి దోహదం చేస్తున్నాయి. ప్రపంచమంతటినీ ఇస్లామిక్‌ సమాజంగా మార్చేందుకు పిల్లల్ని ఎక్కువ కంటున్నారనేది మరొక ఆరోపణ. పాకిస్తాన్‌ సంగతి చూస్తే 1951లో సగటున ఒక స్త్రీ 6.6 మంది పిల్లల్ని కనగా(1980 వరకు అదే రేటు) 2023లో 3.238కి తగ్గింది.2050 నాటికి 2.332కు 2100నాటికి 1.81కి తగ్గనుందని అంచనా. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 1961పాకిస్తాన్‌లో ఒక మహిళ 6.8 మందిని కంటే మన దేశంలో 5.92 మంది.1971లో బంగ్లాదేశ్‌లో 6.86 ఉండగా 2020 నాటికి రెండుకు తగ్గారు.మన దేశంలో 2.05 ఉన్నారు. ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టేవారు దీన్ని ఏ విధంగా వర్ణిస్తారు ?


గతంతో పోల్చితే భావజాల పోరు తగ్గింది. అటువంటపుడు సహజంగానే వివిధ కారణాలతో అణగిమణిగి ఉన్న మతశక్తులు విజృంభిస్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు ప్రపంచంలో మత ప్రభావం పెరిగింది, దీనికి మినహాయింపుగా మన దేశం ఉండజాలదు. అందుకే మత శక్తులకు అనువైన వాతావరణం నేడున్నది. మతోన్మాదాన్ని, విద్వేషాన్ని ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ 2019లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు 37.36శాతం, దాని మిత్రపక్షాలను కూడా కలుపుకుంటే 45శాతం. 2022 ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు 41.29శాతమే.ఈ పార్టీలకు కేవలం హిందువులే వేశారని భాష్యం చెప్పినా మెజారిటీ హిందువులు వ్యతిరేకమే అన్నది స్పష్టం. ఓటే వేయనివారు మత రాజ్యంగా మార్చి దేశాన్ని నాశనం చేస్తామంటే అంగీకరిస్తారా ?పేదరికం, బాధల నుంచి బయటపడే చిట్కాల కోసం పేదలు, మరింత ధనికులుగా మారేందుకు, దానికి ఆటంకాలు లేకుండా చూసుకొనేందుకు మధ్యతరగతి, ధనికులు నేడు ఎక్కడ చూసినా గురువులు, స్వామీజీలు, సాధ్వులు, హస్త సాముద్రికులు, వాస్తు పండితుల చుట్టూ తిరుగుతున్నారు. వారి వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా ఉంది. 2007లో అమెరికాకు చెందిన పూ సంస్థ ప్రపంచ దృక్పధం అనే అంశంపై 47 దేశాలలో జరిపిన సర్వేలో ఒక ప్రశ్న అడిగింది. ” మా జనాలు నిర్దోషమైన వారు కాదు. కానీ మా సంస్కృతి ఇతరుల కంటే ఉన్నతమైనది ” అనే అంశాన్ని అంగీకరిస్తారా లేదా అంటే మన దేశానికి చెందిన వారు 93శాతం మంది అవును అని చెప్పి అగ్రస్తానంలో ఉన్నారు. సంస్కృతి పేరుతో సంఘపరివార్‌ జనంలో మనోభావాలను ఎంతగా చొప్పించిందో దీన్ని బట్టి అర్ధం అవుతుంది. ఇలాంటి స్థితిలో ఎవరైనా సంస్కృతి మంచి చెడ్డలను ప్రశ్నిస్తే వారిని దేశద్రోహులుగా, పశ్చిమ దేశాల ప్రభావానికి గురైన వారిగా చిత్రించి దాడి చేస్తున్నారు. ఒక్కసారిగా చంపివేస్తే వేరు కానీ జీవితాంతం మీరు అంటరాని వారు అంటూ కోట్లాది మందిని నిత్యం మానసికంగా చంపటం ఘనమైన సంస్కృతిలో భాగమా ? దాన్ని ప్రశ్నిస్తే నేరమా ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

తమిళ తంబిల ఓట్ల కోసం రాజదండం సరే, కిరీటం, పట్టపు రాణి, రాజ గురువు, రాజ నర్తకి… సంప్రదాయాల సంగతేమిటి !

31 Wednesday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, COUNTRIES, Current Affairs, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Uncategorized

≈ Leave a comment

Tags

Amith shah, BJP, Dharma Danda, Jawaharlal Nehru, Narendra Modi, Narendra Modi Failures, Raja Danda, RSS, Sengol, vd savarkar


ఎం కోటేశ్వరరావు


వివాదాస్పద అంశాలను ముందుకు తేవటం ప్రతిపక్షాలను, జనాన్ని వాటి చుట్టూ తిప్పటంలో కొంత మంది సిద్దహస్తులు. వారిలో నరేంద్రమోడీకి సాటి రాగల వారెవరూ కనిపించటం లేదు. గతాన్ని కాసేపు పక్కన పెడితే నూతన పార్లమెంటు భవన ప్రారంభాన్ని ప్రధమ పౌరురాలు, రాజ్యాంగ అధిపతిగా ఉన్న రాష్ట్రపతి పదవిని అగౌరవపరచి, ఆ పదివిలో ఉన్న ద్రౌపది ముర్మును విస్మరించి తానే ప్రారంభించి చర్చకు తెరలేపారు. అదే విధంగా రాజ్యాంగం. అధికారంతో సంబంధంలేని ఒక రాజ దండాన్ని ముందుకు తెచ్చి మరో పనిలేని చర్చను ముందుకు తెచ్చారు. పురాతన సంప్రదాయాలకు ప్రాణ ప్రతిష్ట చేయాలనే నాన్నగారి తాతగారి భావాలకు దాసులైన వారికి వెనుక చూపు తప్ప వర్తమానం, ముందు చూపు ఉండదు. అలాంటి వారు కుహనా గతాన్ని అమలు జరపాలని చూస్తారు. లేని చరిత్రను, ఉదంతాలను సృష్టించటంలో, చిన్న వాటిని బూతద్దంలో చూపటంలోనూ పేరు మోసిన మన వాట్సాప్‌ విశ్వవిద్యాలయం స్వర్గంలో ఉన్న గోబెల్స్‌కు సదరు అంశాలపై తమకు మార్గదర్శకుడిగా ఉన్నందుకు గౌరవడాక్టరేట్‌ ప్రదానం చేసిందట.


ఫలానా చోట ఫలానా ఉదంతం జరిగింది. మీడియాలో మొత్తం హిందూ వ్యతిరేకులే ఉన్నందున ఏ టీవీ, పత్రికలోనూ రాలేదు, రాదు. కనుక మీరు దీనిని అందరికీ పంపించండి అన్న తప్పుడు వర్తమానం ఒక్కటైనా వాట్సాప్‌ను వాడే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అందే ఉంటుంది. పెద్దలు చెప్పిన ఒక హితవును కాషాయ దళాలు పక్కాగా పాటిస్తున్నాయి . అదేమంటే ఒక అబద్దం చెబితే గోడ కట్టినట్లు ఉండాలి తప్ప తడికలా ఉండకూడదు. ప్రాణ, విత్త, మాన భంగములందు అబద్దం చెప్పవచ్చనే మినహాయింపు ఇచ్చారు మన పెద్దలు. దీనీలో ఎన్నికలను కూడా చేర్చి పచ్చి అబద్దాలు చెబుతున్నారు. వీటిని చూసి, విని గోబెల్స్‌ కూడా సిగ్గుపడుతున్నట్లు సమాచారం. తాజాగా దేశమంతటా పెద్ద చర్చ జరిగిన, పార్లమెంటులో ప్రతిష్టించిన రాజదండం గురించి కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా తడిక కథ చెప్పారు. దేవుడు ప్రసాదం తినడని పూజారికి మాత్రమే తెలుసు. అదే మాదిరి నరేంద్రమోడీకి రాజకీయ ఇబ్బందులు వస్తున్నట్లు అమిత్‌షాకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఆడిన మాట తప్పని తెగకు చెందినవారం అని చెప్పుకుంటారు గనుక చెప్పింది వాస్తవం కాదు అని తేలిన తరువాత కూడా తన ప్రకటనను వెనక్కు తీసుకోలేదు, సవరించుకోలేదు. చరిత్రలో అత్యంత దుర్మార్గమైన రెండవ ప్రపంచ యుద్ధం తప్పుడు ప్రచారంతోనే నాజీలు ప్రారంభించారు. అదేమిటంటే జర్మనీ రేడియో ట్రాన్స్‌మిటర్‌ మీద పోలాండ్‌ చేసిన దాడికి ప్రతీకారం పేరుతో హిట్లర్‌ మూకలు పోలాండ్‌ మీద టాంకులతో దాడికి దిగాయి. ఒక ట్రాన్స్‌మిటర్‌ను ధ్వంసం చేస్తేనే మరొక దేశం మీద దాడికి దిగాలా ? ఏదో ఒక సాకు కావాలి. తరువాత నిజానిజాలు వెల్లడైనా అప్పటికే జరగాల్సిన మారణ హౌమం జరిగింది. మహా జర్మనీ నుంచి నినాదం నుంచి కాపీ కొట్టిందే అఖండభారత్‌,అలాంటి అనేక పోలికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గతమెంతో ఘనం అన్న జాతీయవాదం రోజు రోజుకూ ఊపందుకుంటోంది. ఏ దేశ చరిత్రలోనైనా ఘనమూ, హీనమూ రెండూ ఉంటాయి. ఘనాన్ని దాచుకొని రెండవ దాన్ని చరిత్ర చెత్తబుట్టలోకి నెడుతుంది. దాన్నుంచి కూడా లబ్ది పొందాలని చూసే వారు చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తారు.


నూతన పార్లమెంటు భవనంలో గత ఘనం, సంస్కృతి పరిరక్షణలో భాగంగా రాజ దండానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామంటూ మన ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ప్రతిష్టించారు. అంతకు ముందు హౌమంత్రి అమిత్‌ షా విలేకర్లతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినపుడు బ్రిటీష్‌ చివరి వైస్రాయి మౌంట్‌ బాటన్‌ అధికార మార్పిడి చిహ్నంగా రాజదండాన్ని నెహ్రూకు అందచేస్తే దాన్ని పక్కన పెట్టేసి మన సంస్కృతిని అవమానపరిచారు, ఆ చారిత్రాత్మకమైన రాజదండాన్ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు భవనంలో ప్రతిష్టించి గౌరవాన్ని నిలబెడతారు అని సెలవిచ్చారు. దేశ ప్రజలందరూ దీన్ని చూసి ఈ చారిత్రాత్మక ఉదంతం గురించి తెలుసుకోవాలని, అందరికి గర్వకారణము అని కూడా చెప్పారు. ఆ రాజదండం మన దేశంలోని అనేక రాజవంశాలలో ఏదో ఒకరు వాడినది అనుకుందామా అంటే అదేమీ కాదు. అది శైవ మతాన్ని అవలంభించిన వారు రూపొందించిన దండం, వైష్టవులు, బౌద్ద, జైనాలను ఆదరించిన రాజులు వాడిన దండాలు వేరుగా ఉంటాయి. వర్తమాన ప్రభుత్వం అంగీకరించాలంటే ఏ రాజదండాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ? అసలు అది రాజదండం కాదు, చరిత్రలో వర్ణించిన చోళ రాజరిక దండ నమూనా మాత్రమే. స్వాతంత్య్ర తరుణంలో అధికార మార్పిడి గురుతుగా ఏదైనా క్రతువు నిర్వహించుతారా అని మౌంట్‌ బాటన్‌ నాడు నెహ్రూను అడిగారట. దాని గురించి రాజాజీగా సుపరిచితులైన సి రాజగోపాలచారిని నెహ్రూ సంప్రదించగా చోళ రాజుల పద్దతిని పాటిద్దామని చెప్పారట. ఈ పూర్వరంగంలో తమిళనాడులోని తిరువదుత్తురై అనే ఒక మఠానికి చెందిన వారు 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూకు నమూనా రాజదండాన్ని పూజా పునస్కార తంతుతో బహుకరించారు తప్ప దానికి మౌంట్‌బాటన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు. నమూనా రాజదండాన్ని ఉమ్మిడి బంగారు చెట్టి రూపొందించగా ఉమ్మిడి ఎతిరాజులు(96),ఉమ్మిడి సుధాకర్‌(88) తయారు చేశారు. వారు చెన్నైలో నివసిస్తున్నారు. క్రీస్తు పూర్వం 300సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1279 వరకు చోళ రాజుల పాలన సాగింది. అంటే తరువాత వారి రాజదండాన్ని ఎవరికిచ్చినట్లు ? తరువాత వచ్చిన రాజులు దాన్ని పక్కన పెట్టి కొత్త రాజదండాలను వాడారా అసలు సిసలు దండం ఎక్కడ ఉన్నట్లు అన్న ప్రశ్నకు సమాధానం లేదు.


అసలు పురావస్తుశాలలోని రాజదండం ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఆసక్తికరం. దీనికోసం చెప్పిన ” కత ” విన్న తరువాత సందేహాలు తలెత్తటం సహజం. దీన్ని చారిత్రాత్మక రాజదండం అని వర్ణించటంతోనే పురాతన వస్తువు పేరుతో నకిలీలను అంటగట్టే మోసగాళ్లను గుర్తుకు తెచ్చారు. చోళుల నాటి ఈ రాజదండాన్ని బ్రిటీష్‌ వారికి అందచేయగా వారి చివరి ప్రతినిధి మౌంట్‌బాటన్‌ అధికార మార్పిడి సూచికగా దాన్ని దాని నెహ్రూకు అందచేశారన్నది కూడా మోసగాళ్ల కథలో భాగమే. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌గా మారిన పూర్వపు అలహాబాద్‌ నగరంలో నెహ్రూ నివాసం ఆనంద భవన్‌ను ఒక పురావస్తుశాలగా మార్చారు. దానిలో తనకు బహుమతిగా ఇచ్చిన నమూనా రాజదండాన్ని కూడా ఉంచారు. దాన్ని బంగారు చేతి కర్రగా నమోదు చేశారు. ఇది చోళ రాజవంశం నాటిదని చివరికి అమిత్‌ షా కూడా నమ్మారు.లేదా నమ్మినట్లు నటించి చెప్పారు. పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం దాన్ని తయారు చేసిన ఉమ్మిడి బంగారు చెట్టి కుటుంబీకులు కూడా దాని గురించి మరచిపోయారు.నిజానికి దానికి అంతటి ప్రాధాన్య ఉంటే దాన్ని తయారు చేసిన ఆ కుటుంబీకులు ఇప్పటికీ సజీవులుగా ఉన్నప్పటికీ గడచిన 75 సంవత్సరాలుగా తమ వారికి చెప్పలేదంటే తాము తయారు చేసిన అనేక వస్తువుల్లో ఒకటిగా చూశారు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. ఆ కుటుంబానికి చెందిన ఉమ్మిడి అమరేంద్రన్‌ చెప్పినదాని ప్రకారం 2018లో ఒక పత్రికలో దాని గురించి చదివారట. మరుసటి ఏడాది పురావస్తు శాలలో చూశారట. దాని గురించి ఒక పత్రికా గోష్టి పెడదామనుకుంటే కరోనా (2020లో కరోనా బయటపడింది) కారణంగా కుదరలేదట. దాంతో ఒక నిమిషము నిడివి గల వీడియో తీస్తే అది నరేంద్రమోడీ కంటబడటంతో వెలుగులోకి వచ్చిందట. దాన్ని ఎప్పుడు తీశారు, నరేంద్రమోడీ ఎప్పుడు చూశారు, ప్రధానికి వీడియోలు చూసే తీరిక ఉందా అని సందేహం కలగవచ్చు.

ఉమ్మిడి కుటుంబం దాన్ని వంద సావరిన్‌(సవర్లు)ల బంగారంతో తయారు చేసి ప్రభుత్వం నుంచి రు.15వేలు తీసుకున్నదట. దీని గురించి ప్రధాని మోడీ కార్యాలయం పంపిన బృందంలోని జర్నలిస్టు ఎస్‌ గురుమూర్తి ఉమ్మిడి కుటుంబాన్ని సంప్రదించారు. వారి కోరిక మేరకు దాని ప్రతిరూపాన్ని రూపొందించారు. వెండితో చేసిన దానికి బంగారు పూత పూశారు. అసలైన బంగారు వస్తువును శాశ్వతంగా పార్లమెంటు భవనంలో, దాని ప్రతి రూపాన్ని జనం కోసం ప్రదర్శిస్తారని చెప్పారు. గవర్నర్‌ జనరల్‌గా ఉన్న రాజగోపాల చారి అనేక పుస్తకాలను చదివి చివరికి చోళుల రాజదండం గురించి తెలుసుకొని కొత్త రాజులకు అధికారిక మార్పిడి సూచికగా రాజదండాలను అందచేసే వారని తెలుసుకొన్నారు. తరువాత తికెవదుత్తురై మఠానికి చెందిన స్వాములను సంప్రదించి బంగారు రాజదండాన్ని తయారు చేయించి వారి ద్వారానే నెహ్రూకు అంద చేయించారు. దీనికి నెహ్రూ అంగీకరించారని చెబుతున్నారు. అదే గనుక వాస్తవమైతే అదే నెహ్రూ దాన్ని ఎందుకు పక్కన పడవేసినట్లు ? తన తరువాత అధికారానికి వచ్చేవారికి దాన్ని అందచేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదు ? ఈ విషయాలన్నీ తరువాత అధికారానికి వచ్చిన లాల్‌బహదూర్‌ శాస్త్రికి ఎవరూ ఎందుకు చెప్పలేదు ? నెహ్రూకు అందచేసిన మఠాధిపతులైనా తరువాత ప్రధానులుగా చేసిన వారికి కూడా ఎందుకు ఈ ఘనమైన సంప్రదాయం, సంస్కృతి గురించి ఎందుకు గుర్తు చేయ లేదు ? ఇలా ఆలోచించటం కూడా జాతి వ్యతిరేకం అంటారేమో ? రాజదండ ప్రహసనం వచ్చే ఎన్నికల్లో తమిళుల ఎన్నికల కోసమే అన్న విమర్శ ఉంది.


ద్రావిడ నాడు అనే పత్రికలో 1947 ఆగస్టు 24వ తేదీ సంచికలో తరువాత డిఎంకె స్థాపకుడిగా, సిఎంగా పని చేసిన సిఎన్‌ అన్నాదురై రాజదండం బహుకరించిన వారి ఉద్దేశం ఏమిటో గ్రహించాలని నెహ్రూను హెచ్చరిస్తూ రాశారు. దానిలో ఎక్కడా అది చోళుల నాటి రాజదండం అని గానీ పరంపరగా అధికార బదిలీ గురించిగానీ లేదు. అన్ని రకాలుగాను జనాన్ని దోచుకుంటున్న మఠాలు, స్వాములు కేంద్ర ప్రభుత్వాన్ని మంచి చేసుకొనేందుకు, తమ ఆస్తుల జోలికి రాకుండా, ఎదురులేకుండా చేసుకొనేందుకు గాను దాన్ని బహుకరించినట్లు పేర్కొన్నారు.దాని గురించి తమిళనాడు ప్రభుత్వ పత్రాల్లో ప్రస్తావించారు.అధికారానికి చిహ్నంగా రాజముద్రికలు ఉండేవి.రాజ ఫర్మానాల మీద ఆ ముద్రిక ఉంటేనే దాన్ని రాజాధికారిక పత్రంగా పరిగణించారని తెలుసు. రాజులుగా అధికారం స్వీకరించినపుడు కిరీటం ధరించటం అధికారిక చిహ్నంగా ఉండేది. రాజదండం అనేది ఒక అలంకార ప్రాయం తప్ప అధికారిక గుర్తు కాదు. అధికార మార్పిడి అంటే ఒక పత్రం మీద సంతకం చేసి కరచాలనం చేసుకోవటమే కాదు, స్థాుక సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలని అమిత్‌ షా గారు చెప్పారు. మన దేశంలో అనేక రాజవంశాలు, సంప్రదాయాలు ఉండేవి. దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? సంప్రదాయాల ప్రకారం అధికారానికి చిహ్నంగా పరిగణించారని చెబుతున్న రాజదండం, రాజముద్రికలు, కిరీటం రాజుగారి కనుసన్నలలోనే ఉంటాయి.


అలాంటి దాన్ని లోక్‌సభ స్పీకర్‌ స్థానం పక్కనే ప్రతిష్టించారు. ఆడా మగా కాని ఈ కొత్త పరంపర ఏమిటి ? స్పీకర్‌ దేశ సర్వాధికారి అని అర్ధమా? ఉప రాష్ట్రపతి ఉండే రాజ్యసభ సంగతేమిటి ? స్థానిక సంప్రదాయాల గురించి వాటికి అసలు సిసలు వారసులుగా చెప్పుకొనే వారి పరంపరకు చెందిన వాజ్‌పాయి, నరేంద్రమోడీ పదవీ స్వీకారం చేసినపుడు వారికి, లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ, బిజెపినేతలకు వాటి గురించి గుర్తులేదా ? ఆధునిక రాజ్యాంగం ప్రకారం అధికారాన్ని అనుభవిస్తూ మనుధర్మశాస్త్ర కాలానికి జనాన్ని తీసుకుపోవాలని చూస్తున్న వారికి సంప్రదాయాలను, ఆధునికతను మేళవించాలనే అందమైన మాటలను చెప్పటం కష్టం కాదు. పోనీ అలా చేస్తే నష్టం ఏమిటి , గతాన్ని ఎందుకు వదులు కోవాలి అని గొర్రెదాటు కబుర్ల చెప్పేవారు మపకు ఎక్కడబడితే అక్కడ దొరుకుతారు, వాటిని సమర్ధించటమూ తెలిసిందే. కనిపించిన ప్రతి రాయికి రప్పకూ మొక్కి ఒక నమస్కారమే కదా పోయేదేముంది అనే వారికి కొదవ లేదు. ఆ తర్కం ప్రకారమే సమర్ధన. రాజదండంతో పాటు కిరీటం, పట్టపురాణి, రాజ గురువు, రాజనర్తకి తదితర సాంప్రదాయాల సంగతేమిటి ? ఇపుడు అధికారిక పురోహితులు, స్వాములు లేరు. ఏ ప్రాతిపదికన రాజరిక చిహ్నమైన రాజదండాన్ని పట్టుకొని నరేంద్రమోడీ ఒక మతానికి చెందిన 20 మఠాల వారిని పార్లమెంటులో నడిపించినట్లు ?

ఇదంతా నూతన పార్లమెంటు భవనం బదులు ఒక రాజు కొత్త కోటను ప్రారంభించినట్లుగా ఉంది. అందుకే కొల్‌కతా నుంచి వెలువడే టెలిగ్రాఫ్‌ దినపత్రిక పతాక శీర్షికలో క్రీస్తు పూర్వం 2023 అని ప్రముఖంగా ప్రచురించింది. రాజరికాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ రాజదండం అన్నది 1300 సంవత్సరాల నుంచి మాత్రమే ఉనికిలోకి వచ్చిందని, దాని అసలు పేరు నంది ధ్వజము అని ఆరియాలజిస్టులు సిహెచ్‌ బాబ్జీరావు, ఇ శివనాగిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వాములుగా చెలామణిలో ఉన్న కొందరు రాజ దండాన్ని ధర్మ దండం అని పిలిచేవారని చెబుతున్నారు. ప్రధాని మోడీ, అమిత్‌ షాకు మద్దతుగా సాంప్రదాయాల గురించి స్వామీజీలు, మరి కొందరు రంగంలోకి దిగారు. రాజు కోరుకుంటే ఇలాంటి వారికి కొదవా ? వారి వాదనలసారం ఇలా ఉంది.
పట్టాభిషేకం జరిగినపుడు మంత్రాల ద్వారా ” నా రాజదండంతో పరిపాలన చేసేందుకు పూనుకున్నాను. నా అధికారంతో నేను పాలన-దండన చేస్తాను ” అని ప్రమాణం చేసిన తరువాత రాజ గురువు రాజును రాజదండంతో తాటించి ధర్మ దండంతో పాలించాలని అందచేస్తాడట.( వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పే వేదకాలం నాటి వారు ప్రతి తరంలోనూ ఉంటారు.) రాజదండం అంటే ధర్మ ప్రతీక అని, దానికి వృషభం ప్రతినిధి అని, దానికి ఉండే నాలుగు కాళ్లను సత్య, సౌచ(శుచి), బహుతాద్య,(భూత దయ), నిష్మామకర్మలుగా చెప్పారు. పూర్వీకులు చెప్పిన ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుందంటే అర్ధమిదేనట.

నంది ఒక పాదాన్ని ఎందుకు ముడవకుండా కూర్చుంటుందటా !. ఎందుకంటే సత్యం కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు లేచి వెళ్లటానికట. ధర్మాన్ని కాపాడే శివుడి ముందే కూర్చుంటుంది గనుక అది లేవాల్సిన అవసరం ఉండదట. అలాగే నరేంద్రమోడీ ధర్మ పరీక్షకు కూడా పరిగెత్తనవసరం లేదట. అంటే మోడీ శివుడితో సమానం అని చెప్పటం. సంస్కృత పదాలకు అర్ధాలకోసం కూడా వెతుక్కోవాల్సిన పని లేదట. భారత అంటే సత్యం, సెక్యులర్‌ ఇండియా అంటే మాయ, విశ్వగురువు అంటే దక్షిణామూర్తి (నరేంద్రమోడీ అవతారానికి అర్ధం అదే అని చెప్పలేదుగానీ భావం అదే ). వసుధైక కుటుంబం అంటే స్వచ్చ భారత్‌, స్మార్ట్‌ సిటీస్‌,జాతీయ రహదారులు, కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్లు, వందే భారత్‌ తదితరాలు శుచిలో భాగమట. భూత దయ అంటే నమామి గంగ, పునరుత్పాదక శక్తి, ఎల్‌ఇడి లైట్లు, ఉజ్వల పధకం, ఆయుష్మాన్‌ భారత్‌, నేరుగా నగదు బదిలీ, గోవధ నిషేధం, ఆవు పేడతో సేంద్రీయ సాగు, నిష్కామకర్మ అంటే అగ్నివీర్‌, అవినీతి రహిత పాలన, అధికారయంత్రాంగ ప్రక్షాళన, కిసాన్‌ సమ్మాన్‌ యోజన, ముద్ర యోజన తదితరాలట. అమృత కాలం నూతన పార్లమెంటు భవనంతో ప్రారంభమౌతుందట. (అంటే ఇప్పటి వరకు చెప్పిన అచ్చేదిన్‌, ఇతర వాగ్దానాలన్నీ వచ్చే రోజుల్లో అమలు చేస్తారని, గతం గురించి ప్రశ్నించకుండా నోర్మూసుకోవాలని చెబుతున్నారు ధర్మ మూర్తులు) ధర్మ విజయాన్ని పున:ప్రతిష్టించే అవకాశం నరేంద్రమోడీకి వచ్చింది. ధర్మాన్ని కాపాడే ధర్మ దండాన్ని నరేంద్రమోడీ ప్రతిష్ఠిస్తున్నారు గనుక కాంగ్రెస్‌ వణికి పోతోందని కూడా చెప్పారు.

వీటిని చూస్తే మేం కూడా ఇంతగా పొగడలేదని పూర్వపు భట్రాజులు కూడా సిగ్గుపడిపోతారు( ఒక కులాన్ని కించపరచటంగా భావించవద్దని మనవి) రాజు దైవాంశ సంభూతుడని చిత్రించిన వారు, నిరంకుశ రాజరికాలను ప్రోత్సహించిన వారు రాజదండాన్ని ఆ దేవుడే పంపాడు, దేవు ప్రతినిధులం తాము గనుక రాజులకు అందించే తంతు తమదని పూజారులు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ భావనలను, హిందూత్వను ముందుకు తెచ్చిన విడి సావర్కర్‌ కూడా నమ్మారు, అతగాడిని ఆరాధించే శక్తులు గనుకనే సావర్కర్‌ జన్మదినం రోజునే పార్లమెంటులో రాజదండం ప్రతిష్టాపన, భవన ప్రారంభోత్సం జరిపారు. అదేమీ కాదు, ఏదో ఒక తేదీని ఎంచుకోవాలి కదా అలా చేస్తే ఏదో అలా కలసి వచ్చిందని చెబితే ఎవరూ నమ్మరు. రాజరికాలను తిరిగి ప్రతిష్టించాలనే కోరిక, తిరిగి సమాజాన్ని వెనక్కు నడపాలనే , ప్రజస్వామ్యాన్ని పాతిపెట్టి హిందూత్వ పాలన రుద్దాలన్న ప్రగాఢవాంఛ నరనరాన ఉన్నవారే దీనికి పాల్పడతారని వేరే చెప్పనవసరం లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు అనే గ్రంధంలో బిఆర్‌ అంబేద్కర్‌ రాసిన ఒక పేరాలో ఏముందో చూద్దాం.” ఒక బ్రాహ్మణుడు స్వతంత్ర దేశ తొలి ప్రధాని ఐన సందర్భంగా పండుగ చేసుకొనేందుకు బనారస్‌ బ్రాహ్మలు చేసిన యజ్ఞంలో ప్రధాని నెహ్రూ పాల్గొనలేదు. ఆ బ్రాహ్మలు అందించిన రాజదండాన్ని ధరించలేదు, గంగ నుంచి తెచ్చిన జలాన్ని తాగలేదు ” అని రాశారు. అధికార మార్పిడి జరిగిన మరుసటి రోజు యజ్ఞం జరిగింది. అధికార మార్పిడి చిహ్నంగా రాజదండం, దాన్ని మౌంట్‌బాటన్‌ అందచేశాడనటాుకి ఎలాంటి రుజువులు, ఆధారాలు లేవు.

గోద్రా ఉదంతం తరువాత గుజరాత్‌లో జరిగిన మారణకాండ సందర్భంగా రాజధర్మం పాటించాలని ప్రధానిగా ఉన్న వాజ్‌పాయి నరేంద్రమోడీకి హితవు చెప్పిన సంగతి తెలిసిందే. దాన్ని పాటించిన దాఖలాల్లేవు. రాజులు దండాన్ని దుష్టుల మీద ప్రయోగించాలని చెప్పారు. ్ల ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుమేరకు విధిలేక కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో కేసు పెట్టిన వారిని అరెస్టు చేస్తారన్న సంగతి తెలిసిందే. కానీ తన పార్టీకి చెందిన సదరు ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌కి మద్దతుగా కొందరు ప్రదర్శనలకు దిగుతున్నారు. గుజరాత్‌లో అత్యాచారాలకు పాల్పడి రుజువైన కేసులో శిక్షలను పూర్తిగా అమలు జరపకుండా నేరగాండ్లను విడుదల చేసి వారికి గౌరవ మర్యాదలు చేసిన బిజెపి ఘనులను నరేంద్రమోడీ పల్లెత్తు మాట అనలేదు. బ్రిజ్‌ భూషణ్ను కాపాడుతూ అరెస్టు డిమాండ్‌ చేస్తున్న రెజ్లర్ల మీద దండాన్ని ఝళిపించి అధికారాన్ని దేనికి, ఎలా ఉపయోగించేదీ బేటీ పడావో బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ లోకానికి వెల్లడించారు. ఇది మన గతం, సంప్రదాయం అని మనం నమ్మాలి, ఏమి చేసినా కిమ్మన కూడదు ? రాజదండ సందేశమిదే !

Share this:

  • Tweet
  • More
Like Loading...

నరేంద్రమోడీ, బిజెపిని నీట ముంచిన కర్ణాటక పాల రైతులు !

19 Friday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, Farmers, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Politics, Prices, RELIGION, Religious Intolarence, Women

≈ Leave a comment

Tags

BJP, Karnataka election 2023, Karnataka milk producers, Narendra Modi Failures


ఎం.కోటేశ్వరరావు


ఎవరమైనా ఏదో ఒక నాటికి పోవాల్సిన వాళ్లమే. ఒకరు ముందు ఇంకొకరు వెనుక అంతే తేడా ! అన్న శ్మశాన వైరాగ్యం గురించి అందరికీ తెలిసిందే. అమూల్‌ పాల కంపెనీ గుజరాత్‌ ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వాలు చేయాల్సింది పాలన తప్ప పాలు, నీళ్లు,చింతపండు, ఉల్లిపాయల వంటి వాటిని అమ్మటం కాదు. కనుక గతంలో ఏం జరిగినా ప్రభుత్వ రంగంలో ఉన్న వీటికి సంబంధించిన సంస్థలన్నింటినీ అమ్మి సొమ్ము చేసుకోవాలన్నది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ విధానం. అఫ్‌ కోర్స్‌ ఇది, కాంగ్రెస్‌ విధానమే, కాకపోతే తాను జన్మించింది దాని కోసమే అన్నట్లుగా దాన్నే మరింత భక్తి శ్రద్దలతో మోడీ అమలు జరుపుతున్నారు. అందువలన అన్నింటినీ తెగనమ్మిన తరువాత అమూల్‌ను కూడా అమ్మకుండా మరోసారి అధికారం అప్పగిస్తే నరేంద్రమోడీ లేదా వారసులు ఊరుకుంటారా ? ఒకసారి అపని జరిగాక విదేశాల నుంచి చౌకగా దొరికే పాలు, పాలపదార్ధాలను మన మీద రుద్దుతారు. పాలతో కొంత రాబడి కోసం ఆవులు, గేదెలను మేపే రైతుల నోట్లో అప్పుడు మట్టే. కర్ణాటక నందిని పాల సంస్థను మూతపెట్టి అమూల్‌కు మార్కెట్‌ను కట్టబెట్టేందుకు కర్ణాటకలోని బిజెపి పాలకులు చూడటాన్ని అక్కడి రైతులు జీర్ణించుకోలేకపోయారు. పాల రైతులకు మేలు చేసేందుకు గాను తమకు తిరిగి అధికారం అప్పగిస్తే జనాలకు రోజుకు అరలీటరు పాలు సరఫరా చేస్తామని బిజెపి నమ్మబలికింది. మీ పాల సంగతి తరువాత అంటూ ఆ బిజెపిని పాల రైతులు కావేరీ, కృష్ణ నీళ్లలో ముంచి గుణపాఠం చెప్పారు.


అమూల్‌ పేరు చెబితే లేదా దాని మార్కెటింగ్‌ అవకాశాలు పెంచితే నరేంద్రమోడీ దృష్టిలో పడి ప్రశంసలు పొందవచ్చని బిజెపి నేతలు భావించి అందుకు తెగించినట్లు చెప్పవచ్చు. గతేడాది డిసెంబరులో పాల రైతులు ఎక్కువగా ఉన్న మాండ్య జిల్లా కేంద్రంలో జరిపిన సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా పాల వివాదానికి తెరతీశారు.పాల రైతుల సంక్షేమానికి కర్ణాటక నందిని, గుజరాత్‌ అమూల్‌ పాల సంస్థలు కలసి పని చేయాలని చెప్పారు. ప్రభుత్వ రంగ పాల కంపెనీలన్నీ సమన్వయంతో పని చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి ఉంటే అదొక తీరు. కేవలం అమూల్‌ పేరే చెప్పటంతో నందిని పాలు కనుమరుగుకానున్నాయనే అనుమానం కర్ణాటక రైతుల్లో తలెత్తింది. అదేమీ కాదని 40శాతం కమిషన్‌ సిఎం బొమ్మై మొదలు ఎందరు బిజెపి పెద్దలు సంజాయిషీ ఇచ్చుకున్నా రైతులు నమ్మలేదు. అవకాశం కోసం ఎదురు చూశారు. చేయాల్సింది చేశారు. బెళగావి, హసన్‌, తుంకూరు, మైసూరు, మాండ్య జిల్లాలు పాల ఉత్పత్తికి ప్రసిద్ది. ఈ ఐదు జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలుండగా కాంగ్రెస్‌ 33 గెలుచుకుంది. గతంలో పదకొండు ఉన్నాయి. బిజెపి బలం 21 నుంచి 12కు తగ్గింది. జెడిఎస్‌ కూడా సీట్లను పొగొట్టుకుంది. గతంలో జరిగిన సర్వే ప్రకారం దేశంలోని 20 రాష్ట్రాల్లో పాల ఉత్పత్తిలో 9వ స్థానంలో ఉంది. గుజరాత్‌ తరువాత పాలను సహకార సంస్థలకు ఎక్కువగా అమ్మే రాష్ట్రంగా కర్ణాటక ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గతం కంటే ఏడుశాతం ఓట్లను అదనంగా పొందింది. రాష్ట్రమంతటా బిజెపి మద్దతుదారులుగా ఉన్న లింగాయత్‌ సామాజిక తరగతి ఓటర్లలో వచ్చిన మార్పు కూడా దీనికి దోహదం చేసింది.


జనాలకు పాలు సరఫరా చేస్తామని బిజెపి వాగ్దానం చేసింది. ఇతరులకు శుద్దులు చెప్పిందని తప్ప నిజానికి దానిలో తప్పు పట్టాల్సిందేమీ లేదు. అది ఉచితం కాదు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు, పాల రైతులకు లబ్ది చేకూర్చేందుకు, మార్కెట్‌ను పెంచేందుకు అని బిజెపి నేతలు టీవీ చర్చల్లో సమర్ధించుకున్నారు. అదే పని గత మూడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉండగా కర్ణాటక బిజెపి గానీ, గుజరాత్‌తో సహా ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో గానీ ఎందుకు అమలు జరపటం లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. కర్ణాటక ఎన్నికల ప్రచారం మొదలైనపుడే ఏప్రిల్‌ నాలుగవ తేదీన రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన ఒక వార్త ప్రకారం గత దశాబ్ది కాలంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది కాలంలోనే 15శాతం పాలధరలు పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దోహదం చేసింది. దాంతో ధరల తగ్గించే పేరుతో విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పాలు, పాల ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను రద్దు చేసింది. ఇది పాల వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగించినా అదే విధానాన్ని కొనసాగిస్తే మన పాడి పరిశ్రమ మూతపడుతుంది. డాలర్లు చెల్లించి చమురుతో పాటు పాలు, పెరుగు కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. రైతులకు తగిన గిట్టుబాటు ధర రాకపోతే పాడి తగ్గుతుంది. ధర పెరిగితే పోషకాహారం కొనుగోలూ తగ్గుతుంది. మాంసం కోసం ఆవులను వధించారని ఆరోపిస్తూ మూక దాడులు చేసి ప్రాణాలు తీసేందుకు వెనుకాడని గో వంశ రక్షక, గో రక్షక దళాలను చూశాము. ఈ కాషాయ దళాలు మేతలేక కృశించే, రోగాలతో మరణించే ఆవుల సంరక్షణ గురించి మాట్లాడవు. పాలు ఇవ్వని వాటిని, మేపలేక ఎవరైనా వధశాలలకు అమ్ముకోవటానికి వీల్లేకుండా చేశారు. రోడ్ల మీద వదలివేస్తే కొత్త సమస్యలను ముందుకు తెచ్చాయి. మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ ఆవులకు సోకిన లంపీ స్కిన్‌ వ్యాధి నివారణకు అవసరమైన చర్యలు లేవు. దాంతో 2022లోనే కనీసం మూడులక్షల ఆవులు మరణించటం లేదా ఈ రోగం కారణంగా వట్టిపోయినట్లు అంచనా. ఈ కారణంగా పాల ఉత్పత్తి తగ్గటంతో పాటు రైతాంగానికి ఆర్థికంగా విపరీత నష్టం వాటిల్లింది. ఆవు రాజకీయాలు చేసే వారికి ఇదేమీ పట్టలేదు.


ప్రపంచంలో అధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో ఇటీవలి సంవత్సరాలలో తొలిసారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అవసరాలు-ఉత్పత్తికి జత కుదరటం లేదు. ఉత్పత్తి పెరుగుదల దిగజారింది. జాతీయపాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ సమాచారం మేరకు 2022-23లో మన దేశం 477 కోట్ల డాలర్ల విలువ గల పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఇది వెయ్యి శాతం ఎక్కువ. ప్రపంచంలో పెరిగిన నెయ్యి గిరాకీ కారణంగా మన దేశం గతేడాది ఏప్రిల్‌-డిసెంబరు కాలంలో 47 కోట్ల డాలర్ల విలువగల ఎగుమతులు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గొప్పలు చెప్పుకొనేందుకు 19.45శాతం ఎక్కువే, కానీ భారీగా పెరిగిన దిగుమతుల మాటేమిటి ? దేశంలో నిల్వల పరిస్థితిని బట్టి పాలపొడి, వెన్న, నెయ్యితో సహా ఇతర పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకొనేందుకు దిగుమతి పన్నులను సులభతరం చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగవచ్చని కేంద్ర పశుసంవర్థకశాఖ అధికారి రాజేష్‌ కుమార్‌ ఏప్రిల్‌ 5న చెప్పారు. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పాల ఉత్పత్తి ఒక్క శాతమే పెరిగింది. గత దశాబ్దికాలంలో వార్షిక సగటు 5.6శాతం ఉంది. ఈ ఏడాది పాల ఉత్పత్తుల డిమాండ్‌ ఏడుశాతం పెరగవచ్చని అంచనా.గోధుమ గడ్డి, ఇతర మేత లభ్యత తగ్గిన కారణంగా వాటి టోకు ధరలు ఏడాది కాలంలో 25శాతం పెరిగింది. మార్కెట్లో ఆవులు తగ్గిన కారణంగా గేదెల ధరలు బాగా పెరిగాయి.


ఇక కన్నడిగుల ఆరోగ్యం కోసం పాల సరఫరా వాగ్దానం చేసినట్లు వాదిస్తున్న బిజెపి నేతలను జనం నిలదీయాల్సి ఉంది. దేశమంతటా తమదే పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి జన ఆరోగ్యం గురించి పట్టించుకున్న తీరును ఒక్కసారి చూద్దాం. అజాగళ స్థనం వంటి నీతిఅయోగ్‌(ఎందుకంటే అది సూచించిన మేరకు కేంద్రం నిధులు ఇవ్వదు, కానీ కాగితాల మీద సిఫార్సులు మాత్రం అందంగా కనిపిస్తుంటాయి) నివేదికలను రూపొందించేందుకు మాత్రమే పనికి వస్తుంది. ప్రపంచ బాంకు, అది కలసి 2021 డిసెంబరులో మన దేశంలోని రాష్ట్రాల ఆరోగ్య సూచికలను విడుదల చేసింది.2019-20లో మొత్తంగా పందొమ్మిది పెద్ద రాష్ట్రాల పనితీరును మదింపు చేస్తూ రాంకులు ఇచ్చారు.దానిలో 82.2 మార్కులతో కేరళ మొదటి స్థానంలో ఉంది. దేశానికి నమూనాగా చెబుతూ ఆ విధానాన్ని దేశమంతటా అమలు జరుపుతామని మోడీ 2014లో చెప్పిన గుజరాత్‌ 63.59 మార్కులతో ఆరవ స్థానంలో ఉంది. అది రెండింజన్ల పాలనలో కూడా ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఇక యోగి ఆదిత్యనాధ్‌ పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ 30.57 మార్కులతో 19వ(చివరి) స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌ 36.72తో దిగువ నుంచి మూడవ స్థానం, చాలాకాలం బిజెపి ఏలుబడిలో ఉన్న బీహార్‌ 31మార్కులతో ఉత్తర ప్రదేశ్‌ కంటే ఎగువున ఉంది. అక్కడ ఎక్కడా జనాలకు బిజెపి పాల వాగ్దానం చేయలేదు. దీని గురించి ఒక చర్చలో బిజెపి ప్రతినిధి చెప్పిన హాస్యాస్పద కారణం ఏమింటే యోగి ఆదిత్యనాధ్‌ శాంతి భద్రతల మీద కేంద్రీకరిస్తున్నందున పాల గురించి పట్టించుకోలేదట. దానికీ దీనికి సంబంధం ఏమిటి, ఇతర పధకాలన్నింటినీ పక్కన పెట్టారా ? పోనీ గుజరాత్‌, ఎంపీ సంగతేమిటి ? రక్తహీనత తల్లీ,పిల్లల మరణాలకు దారి తీస్తోంది. రక్తహీనత ముక్త భారత్‌ అంటూ కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రకటించిన పధకం తీరుతెన్నుల గురించి 2022 ఫిబ్రవరి నాలుగున ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం జనాభాను ఆరు తరగతులుగా విభజించి 2019-20 సంవత్సరంలో నిర్వహించిన ఆరోగ్య సర్వే వివరాల ప్రకారం ఎవరిలో ఎంతశాతం రక్తహీనత ఉందో పేర్కొన్నారు. 19-49 సంవత్సరాల పురుషుల్లో 25, మహిళల్లో 57, గర్భవతుల్లో 52.2శాతం చొప్పున ఉంది. ఇక 15-19 సంవత్సరాల తరగతి బాలురలో 31.1, బాలికల్లో 59.1 శాతం ఐదేండ్లలోపు పిల్లల్లో 67.1 శాతం ఉంది. ఇవి దేశ సగటు అంకెలు. పిల్లలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో 66.4, మహారాష్ట్రలో 68.9, బీహార్‌లో 69.4 హర్యానాలో 70.4, రాజస్తాన్‌లో 71.5, కాశ్మీరు, మధ్యప్రదేశ్‌లో 72.7, గుజరాత్‌లో79.7,లడఖ్‌లో 92.5 శాతాల చొప్పున రక్తహీనత ఉంది. ఇక్కడంతా బిజెపి ఏలుబడే సాగింది, సాగుతోంది. అక్కడెక్కడా లేని పాల ఊసు కర్ణాటకలో ఎందుకు తెచ్చారంటే అమూల్‌ కోసం నందిని బలిపెడుతున్నారని రైతాంగం భావించటం తప్ప జనం మీద శ్రద్దకాదంటే ఏమంటారు ? దేశ పాడి పరిశ్రమకు ఎదురవుతున్న సవాళ్లను కేంద్రం పట్టించుకుంటుందా ? ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రైవేటు డైరీలకు పెద్ద పీట వేస్తున్నారు. రేపు దిగుమతులకూ అంగీకరిస్తే మన రైతుల గతేంగాను ?


ప్రపంచంలో పాల రైతులు రెండు తరగతులుగా ఉన్నారు. ఒకటి ఎగుమతుల కోసం పాడిని అమ్ముకొని లాభాలు పొందే వారు, రెండవది జీవనోపాధికోసం పాడిని నమ్ముకొని బతికేవారు. రెండవ తరగతిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.న్యూజిలాండ్‌, అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని ఐరోపా దేశాలు పాడిని అమ్ముకొనేవి కాగా మన దేశం వంటి కొన్ని దేశాలు రెండవ తరగతిలో ఉన్నాయి. మన పాడి పరిశ్రమలోని రైతులు నిలదొక్కుకొనేందుకు జీవన పోరాటం చేస్తుండగా వారిని పడగొట్టి తమ ఉత్పత్తులను మన దేశంలో గుమ్మరించాలని పైన పేర్కొన్న దేశాలు చూస్తున్నాయి. మనది జీవనోపాధి, వారిది లాభాల వేట.ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికిలోకి వచ్చిన తరువాత మన మీద వత్తిడి పెరుగుతోంది. ఎగుమతులు చేస్తున్న దేశాలలో 2022లో న్యూజిలాండ్‌ 1,353 కోట్ల డాలర్ల మేర, అమెరికా 950, ఆస్ట్రేలియా(2021) 220, కెనడా 50, మన దేశం 2022లో 40 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు చేసింది. ఆస్ట్రేలియా తన పాల ఉత్పత్తులకు మార్కెట్‌ తెరవాలని మన మీద వత్తిడి తెస్తున్నది. భారత్‌లో ఉత్పత్తిగాని ఆహార ఉత్పత్తులను మాత్రమే అక్కడి నుంచి దిగుమతులకు అనుమతిస్తామని చెబుతున్న మన ప్రభుత్వం ఆ వైఖరికి ఎంతకాలం కట్టుబడి ఉంటుందో చూడాల్సి ఉంది. అమెరికా వత్తిడి కూడా తక్కువగా లేదు. న్యూజిలాండ్‌ ఉత్పత్తిలో 95శాతం ఎగుమతులకే ఉంటోంది. అమెరికా పెద్ద ఎత్తున ఎగుమతిదార్లకు సబ్సిడీ ఇచ్చి తన ఉత్పత్తులకు మార్కెట్‌ కోసం చూస్తున్నది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కర్ణాటకలో మోడీపై పోలీస్‌ స్టేషన్‌లో ”ఉగ్ర ” ఫిర్యాదు : ఆవు మొదలు ఎందెందు చూసినా అందందు దొరుకుతున్న ” దేశభక్త ఉగ్రవాదులు, విద్రోహులు ” !

15 Monday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Complaint against Narendra Modi, DRDO, Gau Rakshaks, Gouri lankesh, Narendra Modi, Narendra Modi Failures, RSS, terrorism


ఎం కోటేశ్వరరావు


కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. దక్షిణ భారతంలో అడ్డదారిలో మూడున్నర సంవత్సరాల క్రితం అధికారం కైవశం చేసుకున్న ఏకౖౖెక రాష్ట్రాన్ని బిజెపి కోల్పోయింది. బిడ్డ పోయినా పురుటి వాసన పోదు అన్న సామెత తెలిసిందే. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు చేసిన వాగ్దానాలు, నేతల ప్రసంగాలు రానున్న రోజుల్లో చర్చనీయాంశాలుగా మారతాయి. వాటిలో ఒకటి ప్రధాని నరేంద్రమోడీ మీద కాంగ్రెస్‌ దాఖలు చేసిన ఒక కేసు కూడా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.ఉగ్రవాదానికి-కాంగ్రెస్‌కు సంబంధాన్ని అంటగడుతూ చేసిన ప్రసంగాల మీద విస్తృత దర్యాప్తు జరిపి కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజాస్వామ్య పుట్టినిల్లు మన దేశమే అని నరేంద్రమోడీ స్వయంగా చెప్పినందున చట్టం ముందు అందరూ సమానులే కనుక తన మీద దాఖలైన కేసుకు సహకరిస్తారా లేదా అన్నది చూద్దాం.ఓట్‌ బాంక్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదాన్ని పోషించింది,ఆశ్రయం కల్పించింది, లొంగింది అని మోడీ ఒక ఎన్నికల సభలో ఆరోపించారు. తప్పుడు ఆరోపణలతో ప్రధాని పదవిని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు చూశారని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించటమే గనుక చర్య తీసుకోవాలంటూ పోలింగ్‌కు ముందే బెంగలూరు నగరంలోని హై గ్రౌండ్స్‌ పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అక్రమాలకు పాల్పడుతున్న మోడీ పేర్లున్న కొందరి గురించి రాహుల్‌ గాంధీ కర్ణాటకలో గత లోక్‌సభ ఎన్నికలపుడు చేసిన వ్యాఖ్యలు,వాటి మీద గుజరాత్‌లోని సూరత్‌లో కేసు, కోర్టు విచారణ, రెండేళ్ల జైలు శిక్ష, దాంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వంపై వెంటనే అనర్హత వేటు, సదరు తీర్పు చెప్పిన జడ్జికి పదోన్నతి, దాన్ని నిలిపివేసిన సుప్రీం కోర్టు ఆదేశం వంటి అంశాలన్నీ తెలిసినవే. ఈ పూర్వరంగంలో తమ ప్రభుత్వమే అధికారానికి వచ్చింది గనుక కాంగ్రెస్‌ తాను దాఖలు చేసిన కేసు పట్ల ఎంత శ్రద్ద చూపుతుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.


ఉగ్రవాదులు అనే అనుమానంతో మధ్య ప్రదేశ్‌ పోలీసులు హైదరాబాదు, శివారు ప్రాంతాలలో ఇటీవల ఆరుగురిని అరెస్టు చేసి భోపాల్‌ తరలించారు. అక్కడ దొరికిన పదకొండు మంది నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఇక్కడ సోదాలు జరిపి పట్టుకున్నారు.అరెస్టైన వారిలో మజ్లిస్‌ నేత ఒవైసికి చెందిన మెడికాల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఒకరు కూడా ఉన్నారు. వారు ఏ దుండగాలకు పాల్పడిందీ ఇంకా వెల్లడికాలేదు. ఇలా పట్టుబడినపుడల్లా మీడియాలో, బిజెపి నేతల నోళ్లలో హైదరాబాద్‌ ఉగ్రవాదుల అడ్డా అని ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు నిందితులు సౌత్‌ గ్రూప్‌కు చెందిన వారు అన్న పదజాలాన్ని చార్జి షీట్లలో పదే పదే ప్రస్తావించటాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టి మొత్తం దక్షిణ భారతాన్ని నిందించేవిధంగా ఉన్నట్లు చివాట్లు వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విధానాలను లండన్‌లో జరిగిన ఒక సభలో విమర్శించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విదేశాల్లో దేశ పరువు తీశారని ఊరూవాడా టాంటాం వేస్తున్న వారు హైదరాబాద్‌ను ఉగ్రవాదుల అడ్డాగా పేర్కొని అవమానిస్తున్నట్లు కాదా ? ఎక్కడ ఉగ్రవాదులు దొరికితే ఆ రాష్ట్రాన్ని వారి అడ్డాగా వర్ణిస్తే బిజెపి పాలనలో ఉన్న భోపాల్‌ను కూడా ఆ పార్టీ నేతలు అదే విధంగా పేర్కొంటున్నారా ? ముస్లింలందరూ ఉగ్రవాదులు, దేశ ద్రోహాలు కాదు గానీ దొరికినవారందరూ ముస్లింలే అనే ప్రచారం జరుగుతోంది.నిజమేనా ? అదే ప్రాతిపదికన మరి హిందువులు, క్రైస్తవులు, సిక్కుల సంగతేమిటి ?


డిఆర్‌డిఓ శాస్త్రవేత్త ప్రదీప్‌ ఎం కుల్కర్‌ను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధ పోలీసు దళం పూనేలో మే నెల మూడవ తేదీన అరెస్టు చేసింది, పదిహేనవ తేదీ వరకు కస్టడీకి పంపారు.యాభై తొమ్మిది సంవత్సరాల ఈ పెద్దమనిషి తన తండ్రి, తాతల నుంచి తాము ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగస్వాములుగా ఉన్నట్లు గర్వంగా చెప్పుకున్న వీడియో కూడా అందరికీ అందుబాటులో ఉంది. కేంద్రంలో, మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉన్నది రెండింజన్ల పార్టీ అన్నది తెలిసిందే. అందువలన కుట్రతోనో మరోరకంగానో అరెస్టు చేశారని చెప్పేందుకు లేదు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనకపోగా బ్రిటీష్‌ వారికి సేవ చేసిన పూర్వరంగం, మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాడు కావటంతో నాడు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అందువలన ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నవారు గానీ అభిమానించే వారు గానీ బహిరంగంగా ఆ అంశాన్ని చెప్పుకొనేందుకు సిగ్గుపడేవారు. గుట్టుగా దాచేవారు. రోజులు మారాయి. చరిత్ర మరుగునపడింది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని వారు, ద్రోహం చేసిన వారిని అసలు సిసలు సమరయోధులుగా పేర్కొంటూ నకిలీ చరిత్రను రాస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. కొత్త తరాలు అదే నిజమనుకుంటున్నాయి. కుల్కర్‌ లాంటి వారు పాకిస్తాన్‌కు మన రక్షణ రహస్యాలను ఎప్పటి నుంచి చేరవేస్తున్న జాతీయవాదో తెలియదు. తన ద్రోహాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దేశపాలనలో చక్రం తిప్పుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం గురించి చెప్పుకుంటే తనవైపు చూడరని కుల్కర్‌ అనుకున్నాడేమో అన్న సందేహం కలుగుతోంది. ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలో పని చేస్తూ ఒక మహిళ వలలో పడి సమాచారాన్ని చేరవేసినట్లు ప్రాధమిక సమాచారం. చార్జిషీటు దాఖలు చేస్తే మొత్తం వెల్లడిఅవుతుంది.


డిఆర్‌డిఓకు చెందిన బాబూరామ్‌ డే అనే మరో ఉద్యోగిని ఫిబ్రవరి 24న ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు.బాలసోర్‌ జిల్లా చండీపూర్‌ క్షిపణి ప్రయోగ కేంద్రంలో పని చేస్తాడు. అన్ని పరీక్షలపుడు అతడు భాగస్వామి. ఆ సమాచారాన్ని, నిషేధిత ప్రాంతాల ఫొటోలను పాకిస్తాన్‌కు చేరేవేసేవాడని, అతను కూడా ఒక మహిళ వలలో చిక్కుకొని ఆమె ద్వారా కథ నడిపించేవాడని పోలీసులు చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు అందచేస్తున్నారనే సమాచారంతో (2016లో పెద్ద నోట్ల రద్దు ద్వారా ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేసినట్లు నరేంద్రమోడీ చెప్పుకున్న అంశాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి, ఆ సలహా తానే ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి చెప్పుకున్నారు) 2019లో మధ్య ప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో భజరంగ్‌ దళ్‌ నేత బలరామ్‌ సింగ్‌, సునీల్‌ సింగ్‌, శుభమ్‌ మిశ్రా ఉన్నారు. పంపిన సమాచారం ఎప్పటికప్పుడు కనిపించకుండా చేసే ఒక ఆప్‌ ద్వారా వారు ఉగ్రవాదులకు నిధుల సమాచారాన్ని చేరవేసేవారని పోలీసులు వెల్లడించారు. అంతకు రెండు సంవత్సరాల ముందు బిజెపి యువమోర్చా, బిజెపి ఐటి విభాగ నేత ధృవ సక్సేనా మరోపదిమందిని కూడా ఇదే ఆరోపణలతో అరెస్టు చేశారు. వీరంతా ఒక ముఠాగా పని చేస్తున్నట్లు వెల్లడైంది. అరెస్టుల గురించి రాష్ట్ర మంత్రి గోవింద్‌ సింగ్‌ మాట్లాడుతూ అనేక మంది బిజెపికి చెందిన వారు సంవత్సరాలుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉన్నారని, నిధులు, రహస్య సమాచారాన్ని చేరవేశారని చెప్పారు. బిజెపి నేతలు పాక్‌ ఐఎస్‌ఐ ఏజంట్లుగా మారారని, వారికి బెయిలు కోసం ప్రయత్నించినందుకు సిఎం శివరాజ్‌ సింగ్‌ సిగ్గుపడాలని, ఎవరు దేశద్రోహులో చెప్పాలని మాజీ సిఎం, కాంగ్రెస్‌ నేత దిగ్విజయ సింగ్‌ ట్వీట్‌ చేశారు. ఉగ్రవాద సంబంధిత కేసులతో రాజకీయం చేయకూడదని, కోర్టు వారికి బెయిలిచ్చిందని బిజెపి నేత దీపక్‌ విజయవర్గీయ సమర్ధించుకున్నారు. ఈ తర్కం తెలంగాణా బిజెపి నేత బండి సంజయకు అర్ధంగాక లేదా తెలియక తరచూ అదే రాజకీయం చేస్తున్నారా ? బిజెపి చేస్తే సంసారం, ఇతర పార్టీలు చేస్తే మరొకటా ?


కాశ్మీరులో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబాకు చెందిన వారిని గత సంవత్సరం పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకడు బిజెపి ప్రాంతీయనేత అని అతను అమిత్‌షాతో దిగిన ఫొటోలు ఉన్నట్లు, అమరనాధ్‌ యాత్రీకుల మీద దాడి చేసేందుకు కుట్రపన్నినట్లు 2022 జూలై 9న కాంగ్రెస్‌ నేతలు ఒకే రోజు దేశమంతటా 23 చోట్ల విలేకర్ల సమావేశాలు పెట్టి మరీ చెప్పారు. నూపుర్‌ శర్మ నోటి దురుసు మాటలకు ప్రభావితుడై మద్దతు తెలిపిన ఉదయపూర్‌ దర్జీ కనయలాల్‌ను హత్య చేసిన వారిలో బిజెపి మద్దతుదారులు ఉన్నట్లు, ఒక తీవ్రవాద బృందానికి ప్రభుత్వ నిధులను అందచేసినందుకు 2017లో అసోం బిజెపి నేత నిరంజన్‌ హజయికి ఎన్‌ఐఏ కోర్టు యావజ్జీవ శిక్ష విధించినట్లు కూడా కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.శ్రీనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఉగ్రవాది అజార్‌ మసూద్‌ శిష్యుడు మహమ్మద్‌ ఫరూక్‌ ఖాన్ను బిజెపి నిలిపిందని కూడా వెల్లడించారు.


హైదరాబాదులో దొరికిన ఉగ్రవాదులు ఇరుగుపొరుగువారితో ఎలాంటి వివాదాలు లేకుండా అసలు ఉన్నట్లే తెలియకుండా ఉన్నారని, అరెస్టులతో ఆ ప్రాంత వాసులు ఉలిక్కిపడినట్లు మీడియా వెల్లడించింది. ఉగ్రవాదులు ఎవరైనా మెడలో బిళ్ల వేసుకొని లేదా ఇంటికి బోర్డు పెట్టి తమ గుర్తింపును వెల్లడించుకుంటారా ? హైదరాబాదులో అరెస్టు చేసిన ఆరుగురిలో ముగ్గురు మతం మారి ఇస్లాం బోధనలు సాగిస్తున్నట్లు కూడా ఒక పత్రిక రాసింది. అదే వాస్తవమైతే కొందరు హిందువుల పధకం ప్రకారమే మతం మారి ముస్లింల పేరుతో ఉగ్రవాద విద్రోహులుగా పని చేస్తున్నట్లు భావించాలి. ఇదొక కొత్త కోణం. ఒక ఉగ్రవాద ముఠా కుట్రను భగం చేసినట్లు 2018 ఆగస్టులో మహారాష్ట్ర ఏటిఎస్‌ టీమ్‌ ప్రకటించింది.వారిలో ఒకడి అరెస్టు వార్తతో ఇరుగుపొరుగు వారు అవాక్కయ్యారట. ఇరుగుపొరుగువారితో ఎంతో సౌమ్యంగా ఉండేవాడని, సమాజంలో ఆ కుటుంబానికి ఎంతో మంచి పేరు ఉందని కూడా చెప్పారట. వారిలో వైభవ్‌ రౌత్‌ గో వంశ రక్ష సమితి నేతగా చెప్పుకున్నాడు. అతని అనుచరులుగా సుధాన్వ గోంధాల్కర్‌, శరద్‌ కలాస్కర్‌ ఉన్నారు. పోలీసులు వెల్లడించినదాని ప్రకారం వీరు మరికొందరు కలసి ఒక ఉగ్రవాద ముఠాగా ఏర్పడ్డారు. వారిలో రౌత్‌, కలాస్కర్‌ వద్ద 20 నాటుబాంబులు, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు, రెండు జిలిటెన్‌ స్టిక్స్‌, నాలుగు ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు, 22 ఇతర డిటోనేటర్లు, రెండు సీసాల విషం, బాటరీలు, తదితరాలు దొరికాయి.సుధాన్వ గోంధాల్కర్‌ వద్ద పదకొండు నాటు తుపాకులు, తూటాలు, ఇతర విడిభాగాలు లభించాయి. ఇవన్నీ గోవులను సంరక్షించటానికే అని జనం నమ్మాలి. రౌత్‌ మతవిద్వేషాన్ని రెచ్చగొట్టటంలో దిట్ట. అతని నివాస ప్రాంతం పక్కనే ముస్లింలు ఎక్కువగా ఉండటంతో వారి పండుగులపుడు రౌత్‌ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశిస్తారు.సనాతనతో సహా అనేక హిందూత్వ సంస్థలతో కలసి సభల్లో అతను పాల్గొంటాడు. కలాస్కర్‌ అరెస్టు వార్త వినగానే సోదరుడు, ఇతర బంధువులు నమ్మలేదు. కొల్లాపూర్‌లో ఏదో పని చేస్తున్నాడనే భావనలో వారు ఉన్నారు.వివిధ సందర్భాలలో హిందూత్వ సభలు, ప్రదర్శనల్లో కలుసుకున్న వీరు ఒక ముఠాగా ఏర్పడ్డారు.మాలెగావ్‌ పేలుడు కేసులో అరెస్టయిన హిందూ తీవ్రవాదుల గురించి తెలిసిందే.


హిందూమతానికి ప్రమాదం వచ్చిందని, హిందూత్వ పేరుతో సాగిస్తున్న విద్వేష ప్రచారంతో అనేక మంది అమాయకులు నమ్మి అలాంటి వారి వలలో చిక్కుకుంటున్నారు. తొలుత బోధలతో బుర్రలను చెడగొట్టి తరువాత నేరాలు చేయించి తమ వలలో బంధిస్తారు.మాఫియా, గూండా ముఠాలు, ఇస్లామిక్‌, ఇతర అన్ని రకాల తీవ్రవాద సంస్థలు చేస్తున్నది కూడా ఇదే. ఇలాంటి శక్తులకు ఒక ప్రాంతం, దేశం, ఖండం అనే తేడాలు ఉండవు. ఎక్కడబడితే అక్కడ విష బీజాలు నాటుతారు. ఇస్లాంకు ముప్పు వచ్చిందని, భారత్‌తో సహా ప్రపంచమంతా ఇస్లామిక్‌ రాజ్యాలను స్థాపించాలని ఆ మత ఉగ్రవాద, ఛాందస సంస్థలు ఎలా రెచ్చగొడతాయో మిగిలిన మతోన్మాదశక్తులూ అంతే. దానికి ఒక ఉదాహరణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్య. ఆమెను కాషాయ ఉగ్రవాదులు చంపారన్న కేసు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. పదివేల పేజీల చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు.మతం పేరుతో ఉగ్రవాద సంస్థలు ముస్లిం యువతను ఆకర్షించి ఉగ్రవాదులుగా మారుస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా హిందూ యువతీ,యువకులను ఆకర్షించి ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. అలా మారినవారే గౌరీ లంకేష్‌ను హతమార్చారు.వారిలో ఒకడు అమోల్‌ కాలే అనే మెకానికల్‌ ఇంజనీరు. బహుళజాతి గుత్త సంస్థలో ఉద్యోగం మానుకొని హిందూత్వకు అంకితం కావాలని నిర్ణయించుకున్నాడు.హిందూ మతానికి ముప్పు తలెత్తిందనే విష ప్రభావానికి లోనై ఒక ఉన్మాదిగా మారినట్లు అతని తీరుతెన్నులు స్పష్టం చేశాయి. ఎవరైనా హిందూమతాన్ని కించపరిచినట్లు అని పిస్తే వారి మీద హింసాత్మక దాడులకు పాల్పడాలని తనకు అనిపిస్తుందని విచారణలో పోలీసులకు చెప్పాడు. గౌరితో పాటు హేతువాదులు నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారేల హత్యల్లోనూ ఇతని హస్తం ఉంది. మరోహేతువాది కెఎస్‌ భగవాన్ను కూడా చంపేందుకు కుట్ర చేశాడు.


కెనడా హిందూ మహాసభ అనే సంస్థ డైరెక్టర్‌గా ఉన్న రాన్‌ బెనర్జీ బీట్‌ ఆఫ్‌ ద నార్త్‌ అనే ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. దీని గురించి 2022 జూన్‌ 25న వార్తలు వచ్చాయి.ముస్లింలు, సిక్కులను ఊచకోత కోయాలని చెప్పాడు. ” హిందూయిజం ఒక మార్గం. నేను తీవ్ర హిందూ జాతీయవాదిని.భారత్‌లో మాదిరి కెనడాలో కూడా నరేంద్రమోడీ పాలన రావాలని కోరుకుంటున్నాను. అతను ముస్లింలు, సిక్కు తీవ్రవాదులను హతమారుస్తాడు.దాన్ని నేను సమర్ధిస్తాను, ఎందుకంటే వారు చావాల్సిందే, మోడీ చేస్తున్నది అద్భుతంగా ఉంది.” అని చెప్పాడు. ఇలా మాట్లాడినందుకు ఒకసారి అరెస్టైనా తీరు మార్చుకోలేదు. అమెరికా, కెనడాల్లో ఉన్న ఇలాంటి వారు హిందూత్వ సంస్థలకు అందచేస్తున్న నిధుల వంటి అనేక అంశాలను చూస్తే ఇస్లామిక్‌ జీహాదీల మాదిరే హిందూ జీహాదీలను కూడా తయారు చేస్తున్నారు. ఏ మత జీహాదీలైనా అమెరికా ఉగ్రవాద పరిశ్రమకు లాభాలు తెచ్చిపెట్టే వారిగా మారుతున్నారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...

కాషాయ ముప్పు తొలగలేదన్న కర్ణాటక ఫలితాలు : హిట్లర్‌, ముస్సోలినీ అంతరించినా నాజీ, ఫాసిజం బతికే ఉంది, మతోన్మాదమూ అంతే !

14 Sunday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, History, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Amith shah, BJP, Congress party, Karnataka assembly elections 2023, Narendra Modi Failures, RSS, Saffron gang


ఎం కోటేశ్వరరావు


మూడు ముక్కలాటలకు తెరదించి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కర్ణాటక ఓటర్లు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. మతతత్వ బిజెపి, అధికారమే పరమావధిగా ఉన్న అవకాశవాద జెడిఎస్‌కు గుణపాఠం చెప్పారు. మూడున్నర దశాబ్దాల తరువాత కాంగ్రెస్‌ ఓట్లు, సీట్లను కూడా భారీగా తెచ్చుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముప్పుగా పరిణమిస్తున్న సంఘపరివార్‌ శక్తులను ఎదిరించేందుకు ముందుకు వస్తున్న ఒక ప్రధాన శక్తిగా కాంగ్రెస్‌ విజయాన్ని లౌకిక శక్తులన్నీ హర్షించాయి.అధికారికంగా ఫలితాలను నిర్ధారించక ముందే జరిగేదేమిటో స్పష్టమైనందున మీడియా పెద్దలు సిఎం గద్దెపై కూర్చొనేదెవరు అన్న చర్చకు తెరలేపారు. కాంగ్రెస్‌ గతాన్ని బట్టి అలాంటి విశ్లేషణలు చేసేవారిని తప్పుపట్టనవసరం లేదు. గెలిచిన కాంగ్రెస్‌ సంబరాల్లో ఉంది, నరేంద్రమోడీ ఓడినట్లుగా తాము భావించటం లేదని ఆపద్దర్మ సిఎం బసవరాజు బొమ్మై తనను తాను ఓదార్చుకున్నారు. ఒక ఎదురుదెబ్బ ఈ ఓటమి తమనేమీ కదిలించలేదని కమలనాధులు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ గెలుపు కారణాలతో పాటు బిజెపి ఓటమి గురించి విశ్లేషణలు వెలువడుతున్నాయి.జెడిఎస్‌ భవితవ్యం ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చనీయమే.విధాన సభలోని మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 135(80), బిజెపి 66(104), జెడిఎస్‌(32) 19, ఇతరులు నాలుగు స్థానాలు తెచ్చుకున్నారు.బ్రాకెట్లలోని అంకెలు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు. ఓట్లను చూస్తే మూడు పార్టీలకు వరుసగా 42.9,36,13.3 శాతం వచ్చాయి. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌కు 4.9శాతం పెరగ్గా బిజెపికి 0.3, జెడిఎస్‌కు ఐదుశాతం చొప్పున తగ్గాయి. ఇతరుల ఓట్లు 0.4శాతం పెరిగాయి.


కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణా మీద ఎలాంటి ప్రభావం చూపవని బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ స్పందించారు. అదే ఊపులో ఇక్కడా విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.గెలుపు పట్ల తమ పార్టీ ధీమాగా ఉందని బిజెపినేత బండి సంజయ చెప్పారు. కాంగ్రెస్‌ సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ముస్లింలు మొత్తంగా ఆ పార్టీకి ఓటు వేశారని, అలా వేయకపోతే బిజెపి తిరిగి అధికారంలోకి వస్తుందని జెడిఎస్‌ కర్ణాటక నేత ఇబ్రహీం బహిరంగంగానే చెప్పారని కూడా బండి చెప్పారు. తమకు సీట్లు తగ్గినా ఓట్లు తగ్గలేదన్నారు. ఫలితాలపై చర్చల్లో బిజెపి ప్రతినిధులందరూ దాదాపు ఇదే విధంగా మాట్లాడారు. టీవీలను వీక్షించేవారిని, పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో చదివేవారిని తప్పుదారి పట్టించేందుకు చూశారు. తరువాత కూడా మొదలు పెట్టారు. కర్ణాటకలోనే కాదు, దేశమంతటా ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాలను రెచ్చగొట్టి మెజారిటీ ఓటు బాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి 80-20 నినాదాన్ని ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే.


హిందూత్వ సంస్థలు, నోటి తుత్తర నేతలు విద్వేష ప్రసంగాలను చేస్తున్న నేపధ్యంలో ఎవరూ ఫిర్యాదు చేయకున్నా పోలీసులు కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. బిజెపి సబ్‌కా సాత్‌ -సబ్‌కా వికాస్‌ అని తీపి కబుర్లు చెబుతుంది. అందరం కలసి ఉంటే అందరి పురోభివృద్ధి అన్నది అర్ధం. ప్రపంచంలో మొత్తం ముస్లింలు వంద మంది ఉన్నారనుకుంటే ఒక్క మనదేశంలోనే 10.9 మంది ఉన్నారు. ఈ మాత్రాన్నే భరించలేని వారు ముస్లిం జనాభా శాతం ఇంకా పెరిగే అఖండ భారత్‌ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.మన దేశ జనాభాలో తాజా అంచనా ప్రకారం 15.5శాతం ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో ఉన్న సామాజిక తరగతిని అభివృద్ధిలో, ప్రజా ప్రాతినిధ్యంలో విస్మరిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. కర్ణాటకలో జాతీయ సగటు కంటే తక్కువే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 12.92 శాతం ఉన్నారు.కొన్ని జిల్లాల్లో అంతకంటే ఎక్కువ ఉన్నారు. తాజా ఎన్నికల గురించి హిందూ పత్రిక చేసిన విశ్లేషణలో ముస్లిం సామాజిక తరగతి ఎక్కువగా (మొత్తం జనాభాలో కాదు) ఉన్న ఐదు జిల్లాల్లో బిజెపి ఓట్ల శాతం 2023 ఎన్నికల్లో గతంతో పోలిస్తే 0.3శాతం పెరుగుదలతో 44.5 శాతం కాగా కాంగ్రెస్‌కు 2.1శాతం పెరిగి 42.5శాతంగా ఉంది. జెడిఎస్‌ 3.9శాతం కోల్పోయి 5.5శాతానికి పరిమితమైంది. విద్వేషాన్ని ఎంతగానో ఎక్కించబట్టే బిజెపి తన ఓట్లశాతాన్ని స్వల్పంగానైనా గతం కంటే పెంచుకుంది. దాని ప్రమాదాన్ని నిరోధించాలని భావించబట్టే దాన్ని ఎదుర్కొనే పార్టీ కాంగ్రెసే గనుక అనేక మంది దానివైపు మొగ్గటంతో బిజెపి రాష్రమంతటా చావు దెబ్బతిన్నది.


ఒకవైపు ముస్లిం మత సంస్థలతో ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు తెరవెనుక సంప్రదింపులు జరుపుతారు.కేరళలో వామపక్షాలకు వ్యతిరేకంగా క్రైస్తవులను నిలిపేందుకు నరేంద్రమోడీ ఏకంగా చర్చ్‌కు వెళ్లారు, బిజెపి నేతలు బిషప్పులు, ఇతర మతాధికార్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈస్టర్‌ సందర్భంగా క్రైస్తవులు, రంజాన్‌కు ముస్లింల ఇండ్లకు వెళ్లి కానుకలు ఇవ్వాలని, మళయాళ సంవత్సరాది సందర్భంగా వారిని ఇండ్లకు ఆహ్వానించాలని కేరళ బిజెపి ఏకంగా ఒక కార్యక్రమాన్నే ప్రకటించింది. తెలంగాణాలో హిందూ ఏక్తా యాత్రలు జరుపుతున్నారు. అందరినీ కలుపుకోవాలని చెప్పే బిజెపి తాజా కర్ణాటక ఎన్నికల్లో గతంలో జరిగిన లోక్‌సభ లేదా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కరంటే ఒక్క ముస్లింను కూడా పోటీకి ఎందుకు నిలపలేదు. ఇంతేనా మాజీ ఉప ముఖ్యమంత్రి, కెఎస్‌ ఈశ్వరప్ప గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ 40శాతం కమిషన్‌ ఇవ్వాలని వేధించినట్లు లేఖలు రాసిన బిజెపికి చెందిన కాంట్రాక్టర్‌, హిందూవాహిని సంస్థ నేత సంతోష్‌ పాటిల్‌ 2022 ఏప్రిల్‌ 12న ఒక హౌటల్లో ఉరివేసుకొని మరణించాడు. దాంతో ఈశ్వరప్ప ఉద్యోగం ఊడింది. అతగాడు మేనెల పదవ తేదీన జరిగిన ఎన్నికల్లో ముస్లింలు తమ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయనవసరం లేదని బహిరంగంగా ప్రకటించాడు. అతన్ని ఏ ఒక్క బిజెపి నేత కూడా తప్పని ఖండించలేదు. మీ ఓట్లు వద్దన్న పార్టీకి వేసేందుకు ఏ సామాజిక తరగతికైనా ఆత్మగౌరవం అనుమతిస్తుందా ? తమ పార్టీ విద్వేషాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్‌ సంతుష్టీకరించిన కారణంగానే ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు, అందువల్లనే తాము ఓడినట్లు మాట్లాడే బిజెపి నేతలవి నోళ్లా మరొకటా అని జనం అనుకుంటున్నారు. వారు చెప్పేదాని ప్రకారం ముస్లింలు వేస్తే వారికి లేదా ఇతర పార్టీలకు వేటికీ వేయకుండా దూరంగా ఉండాలి.


కర్ణాటక ఎన్నికల్లో ఓడిన తరువాత కూడా వాట్సాప్‌ యూనివర్సిటీ మత విద్వేషాన్ని రెచ్చగొట్టటం మానుకోలేదు.తొంభైశాతం మైనారిటీలు ఓటింగ్‌కు వచ్చారని, హిందువుల 60శాతం దాటలేదని ఇలా ఉంటే భవిష్యత్‌ ఉండదంటూ ఒక ప్రచారం మొదలైంది. ఒక వెయ్యి ఓట్లు కాంగ్రెస్‌కు బదులు బిజెపికి పడితే ఆ పార్టీకి 51 సీట్లు వచ్చేవంటూ దానిలో లెక్క చెప్పారు. రెండున్నరశాతం, అంతకంటే తక్కువ ఓట్ల మెజారిటీతో మూడు పార్టీలు గెలిచిన స్థానాలు 33, గత ఎన్నికల్లో 23 ఉన్నాయి. వాటిలో గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఒకటి పెరిగి 17, బిజెపికి ఎనిమిది పెరిగి 13, జెడిఎస్‌కు ఒకటి పెరిగి మూడు వచ్చాయి. అలాంటపుడు వెయ్యి ఓట్లు పడితే బిజెపికి 51 ఎలా వస్తాయి. చిన్న పిల్లలు, అమాయంగా ఉండే వారిని మోసపుచ్చటం తప్ప మరొకటి కాదు. కాబినెట్‌లోని 22 మందికి గాను 14 మంది మంత్రులు ఓడారు. ఇంకా ఓడిన ప్రముఖుల్లో ఎడియూరప్పను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రముఖ నేత, బిజెపి జాతీయ కార్యదర్శి సిటి రవి ఒకరు. బాబాబుడాంగిరి దర్గా చుట్టూ విద్వేషాన్ని రెచ్చగొట్టిన వారిలో రవి పేరుమోసినట్లు విమర్శలున్నాయి. మాజీ సిఎం సిద్ద రామయ్య ఎన్నికలు వచ్చినపుడు హిందువు, తరువాత హిందువులను ద్వేషిస్తారు. సిద్దరాముల్లా ఖాన్‌ గనుక అధికారానికి వస్తే హిందువుల పని ఖతం అని రెచ్చగొట్టిన ప్రకటనల స్పెషలిస్టు. హాస్యనటుడు బ్రహ్మానందం వెళ్లి మంత్రి సుధాకర్‌కు మద్దతుగా ప్రచారం చేసి అపహాస్యం పాలైనారు. కిచ్చా సుదీప్‌ అనే కన్నడ సూపర్‌ స్టార్‌ బిజెపికి ప్రచారం చేసినా పరువుదక్కలేదు. అలాంటిది బ్రహ్మానందం ఒక లెక్కా. సుధాకర్‌ 2019లో కాంగ్రెస్‌ నుంచి బిజెపికి జంప్‌ చేశారు. కరోనాలో తన జిల్లావారిని తప్ప ఇతరులను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.ఓడినవారిలో హిజాబ్‌ మంత్రి నాగేష్‌ వంటి వారున్నారు.


ఇంకా అనేక అంశాల మీద సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఎన్నికలను ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడా లేని విధంగా రోడ్‌ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఇరవై స్థానాల్లో ప్రచారం చేస్తే 15 చోట్ల బిజెపి ఓడినట్లు వార్తలు. జై భజరంగ బలీ అని నినాదమిస్తూ ఓటు వేయాలని పిలుపునిచ్చి ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని కూడా దిగజార్చినట్లు విమర్శలు వెల్లువెత్తాయి.తనను చూసి ఓటు వేయాలని కూడా కోరినందున బిజెపి కంటే నరేంద్రమోడీ ఓటమిగానే జనం చూస్తున్నారు. 1989లో కాంగ్రెస్‌ నేత వీరేంద్ర పాటిల్‌ ఏలుబడిలో ఆ పార్టీకి 43.76శాతం ఓట్లు, 178 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో బిజెపికి ఓట్లు తక్కువ వచ్చినప్పటికీ సీట్లు ఎక్కువ రావటానికి కాంగ్రెస్‌-జెడిఎస్‌ మధ్య ఓట్ల చీలికే ప్రధాన కారణం. ఈ సారి గణనీయంగా జెడిఎస్‌ ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లటంతో బిజెపి బొక్కబోర్లా పడింది. దీన్ని దాచిపెట్టి తమ ఓటమి కంటే జెడిఎస్‌కు ఓట్లు తక్కువ రావటం గురించే బిజెపి నేతలు ఎక్కువగా చెబుతున్నారు. తమ ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత ఉంటే తమకు గతం కంటే ఓట్లు కూడా తగ్గాలి కదా అని బిజెపి వాదిస్తోంది.


దక్షిణాదిన సంఘపరివార్‌ తమ హిందూత్వ ప్రయోగశాలగా కర్ణాటకను ఎంచుకోవటానికి అక్కడ అనువైన పరిస్థితులు ఉన్నాయి. ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టటం, దాడులు, హిజాబ్‌, హలాల్‌ వివాదం వంటి వన్నీ ప్రయోగాల్లో భాగమే.కులం, మతం, ప్రాంతీయ విద్వేషాల పులుల మీద ఒకసారి జనాన్ని ఎక్కించిన తరువాత వారు వాటి నుంచి అంత తేలికంగా దిగలేరు. విష ప్రభావానికి గురైన కొన్ని తరాలు చివరి వరకు అలాగే కొనసాగుతాయి.ఐరోపాలో ఫాసిజం, నాజీజాలను, యూదుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టిన శక్తులు సృష్టించిన మారణహౌమం, రెండు ప్రపంచ యుద్ధాలను తెచ్చిన సంగతి తెలిసిందే. అవి అంతరించినా అవి ముందుకు తెచ్చిన దుర్మార్గ భావజాలాన్ని నయా నాజీలు, ఫాసిస్టులు అందిపుచ్చుకుంటున్న వర్తమానం మన కళ్ల ముందు ఉంది. అలాంటి శక్తుల స్ఫూర్తితో మన దేశంలో ఉనికిలోకి వచ్చిన కాషాయదళాలు కూడా అలాంటి విష బీజాలనే నాటాయి. గతంలో యూదులను బూచిగా చూపి విద్వేషాన్ని రెచ్చగొడితే ఇప్పుడు ఇస్లాం మతం వారిని ప్రపంచ శత్రువులుగా చూపి అదే చేస్తున్నారు.కసాయిని నమ్మి గొర్రె వెంట వెళ్లిన లోకోక్తి గురించి మన పెద్దలు చెప్పిన సంగతి తెలిసిందే. నాజీల నిజస్వరూపం తెలుసుకొనేందుకు జర్మన్లు, ఐరోపా వారికి చాలా కాలం పట్టింది. మన దేశంలో కూడా అలాంటి శక్తులను గుర్తించే క్రమం ప్రారంభమైంది.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఓట్లకోసం ఇన్ని పాట్లు, కుట్రలా : హనుమంతుడిని రోడ్డు మీదకు లాగిన మోడీ, కర్ణాటకలో పాలు తాగిస్తాం అన్న బిజెపి !

06 Saturday May 2023

Posted by raomk in BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

Bhajarangdal, BJP, Congress party, Freebies, Karnataka election 2023, Narendra Modi Failures, RSS, VHP


ఎం కోటేశ్వరరావు


అగ్గి పుల్లా సబ్బు బిళ్లా, కుక్క పిల్లా కాదేదీ కవిత కనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఓట్ల కోసం ఏ గడ్డి కరచినా తప్పులేదన్నట్లు విశ్వగురువు నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి తీరుతెన్నులు ఉన్నాయి.ఈనెల పదవ తేదీన జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్నది బిజెపి లక్ష్యంగా కనిపిస్తున్నది.చట్టాన్ని వ్యక్తులు, నిషేధిత b పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పిఎఫ్‌ఐ), భజరంగ్‌ దళ్‌ వంటి సంస్థలు ఉల్లంఘిస్తే వాటి మీద నిషేధంతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక కాంగ్రెస్‌ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్నారు. పదజాలం ఏదైనా నిషేధం విధిస్తామనే భావం దానిలో ఉంది. దీన్ని అవకాశంగా తీసుకొని ప్రధాని నరేంద్రమోడీ జై భజరంగ బలీ(జై హనుమాన్‌) అని నినాదమిస్తూ ఓటు వేయాలని ఎన్నికల సభల్లో పిలుపు ఇచ్చారు. మమ్మల్ని పిఎఫ్‌ఐ వంటి సంస్థలతో పోలుస్తారా, నిషేధిస్తామని అంటారా అంటూ సంఘపరివార్‌ సంస్థలు, బిజెపి దేశమంతటా వీధులకెక్కింది. కాంగ్రెస్‌ ఆఫీసుల మీదకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారు.ప్రజాస్వామ్య పద్దతిలో ఎవరైనా నిరసన ప్రకటనలు లేదా వేరే చోట్ల ఆందోళనలు చేయటం వేరు, ఆఫీసుల మీదకు వెళ్లటం మూకస్వామ్యం, ఫాసిస్టు లక్షణమే. దీన్ని బట్టే వారి స్వభావం, ప్రమాదం ఏమిటో స్పష్టం అవుతున్నది. హనుమంతుడిని వీధుల్లోకి తేవటంతో ఓటర్ల మీద ప్రభావం పడుతుందేమో అన్న భయంతో కాంగ్రెస్‌ నష్ట నివారణకు పూనుకొని నిషేధం తమ ఉద్దేశ్యం కాదని, అలాంటి చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్రాలకు లేదని ఆ పార్టీ నేతలు వివరణలు ఇచ్చారు. అయినప్పటికీ మత ఉద్రిక్తతలు, మనోభావాలను రెచ్చగొట్టటం ద్వారా లబ్ది పొందవచ్చనే ఎత్తుగడతో ఎన్నికల తేదీ వరకు బిజెపి రచ్చ చేసేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. మానిఫెస్టోలో పెట్టకపోయినా వారు చేసేది చేస్తారు. ఉచిత పథకాలను అమలు జరిపితే రాష్ట్రాలు రుణ ఊబిలో కూరుకుపోతాయంటూ సుభాషితాలు పలికిన నరేంద్రమోడీ కర్ణాటక బిజెపి ఎన్నికల ప్రణాళిక భేషుగ్గా ఉందని కితాబునిచ్చినట్లు వార్తలు. ఒక సంస్థ మీద ఒక రాష్ట్రం ఎలా నిషేధం విధించలేదో అలాంటిదే ఉమ్మడి పౌరస్మృతి. దాన్ని ఒక రాష్ట్రం అమలు జరిపేది కాదు. అయినప్పటికీ అమలు జరుపుతామని కర్ణాటక బిజెపి తన మానిఫెస్టోలో పెట్టింది. ఇది క్రైస్తవ, ముస్లిం, ఇతర మైనారిటీ మతాల వారిని రెచ్చగొట్టేందుకు, హిందూత్వ శక్తులను సంతుష్టీకరించేందుకు చేసిన కసరత్తు. బిజెపి ఇన్ని పాట్లు పడినా ఎన్నికల్లో గట్టెక్కుతుందా అన్నది శేష ప్రశ్న.


నిజానికి భజరంగదళ్‌, ఇతర హిందూత్వ సంస్థల మీద నిషేధంతో సహా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ ఈ నాటిది కాదు. విద్వేషాన్ని రెచ్చగొట్టే శక్తుల మీద ఫిర్యాదు లేకున్నా పోలీసులు కేసులు నమోదు చేయాలని ఉన్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఒకటికి రెండుసార్లు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాంటి నేరాలకు పాల్పడే వారు మెజారిటీ హిందూత్వ కావచ్చు మైనారిటీ మత శక్తులు కావచ్చు. భజరంగ్‌ దళ్‌ మీద నిషేధం విధించవచ్చు అని చెప్పిన కాంగ్రెస్‌ తనకు తానే హాని చేసుకుందని కొందరు విశ్లేషణల పేరుతో బిజెపి అనుకూల ప్రచారానికి దిగారు. ఈ అంశంతోనే కాంగ్రెస్‌ విజయావకాశాలు దెబ్బతింటాయా ? కర్ణాటక ఓటర్లు కాషాయ దళాల వలలో పడతారా ? నిషేధ ప్రతిపాదన లేదా డిమాండ్‌ లేకముందే హిజాబ్‌, లవ్‌ జీహాద్‌, ఇతర మతోన్మాద అజెండాతో మతవిద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, కర్ణాటకలో మెజారిటీ ఓటు బాంకు సృష్టికి బిజెపి ఎప్పటి నుంచో అనేక వివాదాలను ముందుకు తెచ్చింది. ఇప్పటి వరకు ఎక్కించిన మతోన్మాదం, కుల ఓటు బాంకు రాజకీయాలు తక్కువేమీ కాదు.వాటితో మతోన్మాద పులిని ఎక్కి వీరంగం వేస్తున్న వారు ఇప్పటికే ఉన్నారు. ఇన్ని తెచ్చిన తరువాత కూడా ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోనుందనే వాతావరణం ఏర్పడిందని గమనించాలి.


కేరళలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునే ఖాతరు చేయని అపర ప్రజాస్వామికశక్తులుగా కాషాయదళాలు రుజువు చేసుకున్నాయి. ఆ కేసుకు కమ్యూనిస్టులకు ఎలాంటి సంబంధమూ లేదు. కోర్టును తీర్పును అమలు జరుపుతామని అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం చెప్పింది. దాంతో ఇంకేముంది హిందూమతానికి ముప్పు వచ్చింది అంటూ రెచ్చగొట్టారు. మహిళలను ముందు పెట్టి ఆగమాగం చేశారు.దాడులకు పాల్పడ్డారు.2021లో జరిగే ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ను దెబ్బతీసేందుకు చూశారు. చివరకు బొక్కబోర్లా పడి ఉన్న ఒక్క సీటునూ పోగొట్టుకున్నారు.శబరిమలతో సహా ప్రముఖ దేవాలయాలున్న ప్రతిచోటా అంతకు ముందు ఉన్న ఓట్లనూ తెచ్చుకోలేకపోయారు. హనుమంతుడు కర్ణాటకలోని హంపిలో పుట్టినట్లు కాషాయ దళాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.


కర్ణాటకలో భజరంగదళ్‌ అంశం ఏమేరకు పని చేస్తుందో చూడాల్సి ఉంది. అక్కడ ఆ సంస్థ చరిత్రను చూసినపుడు అనేక ఉదంతాల్లో అది భాగస్వామిగా ఉంది. 2008లో బిజెపి అధికారానికి వచ్చిన తరువాత కర్ణాటక కోస్తా ప్రాంతంలో చర్చ్‌లు, క్రైస్తవ సంస్థల మీద చేసిన దాడుల గురించి సిఎంగా ఉన్న ఎడియూరప్ప జస్టిస్‌ బికె సోమశేఖర కమిషన్‌ ఏర్పాటు చేశారు. మరుసటి ఏడాది సమర్పించిన మధ్యంతర నివేదికలో ఆ దాడుల్లో భజరంగదళ్‌ వంటి మితవాద బృందాలున్నట్లు పేర్కొన్నారు. మంగుళూరు ప్రాంతంలో చర్చ్‌ల మీద దాడులు తామే చేసినట్లు భజరంగ్‌దళనేతలు పత్రికా గోష్టి పెట్టిమరీ చెప్పారు. గతేడాది షిమోగాలో హలాల్‌ మాంసం అమ్మాడంటూ ఒక ముస్లిం వ్యాపారి మీద దాడి చేసిన కేసులు ఆ సంస్థకు చెందిన వారిని అరెస్టు చేశారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.ఒడిషా, కర్ణాటకల్లో జరిపిన హింసాకాండకు గాను విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌ దళ్‌ మీద నిషేధం విధించాలని 2013లో కేంద్ర మంత్రిగా ఉన్న లోక్‌జనశక్తి పార్టీ నేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ డిమాండ్‌ చేశారు. తరువాత అదే పెద్ద మనిషి బిజెపి చంకనెక్కి మంత్రిగా పని చేశారు.చివరిగా బిజెపి మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారు.


అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఉచితాల గురించి రచ్చ చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటకలో తమ పార్టీ ఉచితాలను సమర్ధించారు.కర్ణాటక కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలతో రాష్ట్రం అప్పుల వూబిలో మునుగుతుందన్నారు. ఉచితాల సంస్మృతి భవిష్యత్‌ తరాల వనరులను హరించి వేస్తుందని, తాము రానున్న పాతిక సంవత్సరాల గురించి ఆలోచిస్తాము తప్ప దగ్గరదారుల్లో వెళ్లం అన్నారు. ప్రతి రోజు బిపిఎల్‌ కుటుంబాలకు పాల సరఫరా హామీ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే ఆ రాష్ట్ర పాలరైతులకు మార్కెటింగ్‌ కల్పించి ఆదుకొనేందుకు అని బిజెపి నేతలు చెబుతున్నారు. మరి అధికారంలో ఇప్పటికే ఉన్న చోట్ల ఎందుకు ఇవ్వటం లేదు, కర్ణాటకలో కూడా ఇప్పటి వరకు ఎందుకు పాలు సరఫరా చేయలేదు ? కుటుంబ పాలన, అవినీతి గురించి మోడీ పెద్దగా ప్రస్తావించటం లేదు. ఎందుకంటే 40శాతం అవినీతి పాలన అని బిజెపి సర్కార్‌ గబ్బుపట్టింది. ఇక ఎడియూరప్పను పక్కన పెట్టుకొని కుటుంబపాలన గురించి చెబితే కన్నడిగులు ముఖం మీదే జనం నవ్వుతారు. మోడీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. కాశ్మీరులో భద్రతా దళాలకు అధికారం ఇవ్వలేదంటూ ఆర్టికల్‌ 370 రద్దు, ఏకంగా రాష్ట్రానే రద్దు చేసి కేంద్ర పాలన సాగిస్తోంది. అక్కడ ఒక వైపు ఉగ్రవాదులు భద్రతాదళాల ప్రాణాలు తీస్తుంటే మరోవైపు కర్ణాటకలో మోడీ ఉగ్రవాదం గురించి ఇతరుల మీద రాళ్లు వేస్తున్నారు. వారితో చేతులు కలిపిన వారి మీద చర్యలు తీసుకుంటే ఎవరు అడ్డుకున్నారు ? ఇంతవరకు ఎంత మందిని పట్టుకున్నారు, ఎన్నికేసులు పెట్టారు ?


ఉచితాలకు వ్యతిరేకంగా బిజెపి నేత అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో కేసు వేశారు. సంక్షేమ చర్యలు అంటే ప్రతిదాన్నీ ఉచితంగా ఇవ్వటం కాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు.కర్ణాటకలో ఉచిత పాలు, ఉచిత సిలిండర్లు, ఉచిత ఆహార ధాన్యాల సంగతేమిటి ? గత ఏడాది(2022) ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు లోక కల్యాణ సంకల్ప పత్రం పేరుతో బిజెపి ఎన్నికల వాగ్దాన పత్రాన్ని మోడీలో సగంగా భావిస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌ షా విడుదల చేశారు. ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరుపదులు దాటిన మహిళలకు ఉచిత ప్రయాణం ( కరోనా పేరుతో రైళ్లలో వృద్ద స్త్రీ, పురుషులకు ఇస్తున్న రాయితీలను , పేదలకు అందుబాటులో ఉన్న పాసింజరు రైళ్లను మోడీ సర్కార్‌ రద్దు చేసిన సంగతిని ఇక్కడ గుర్తుకు తేవాలి), ప్రతిభ చూపిన విద్యార్థినులకు స్కూటీలు, విద్యార్థులందరికీ రెండు కోట్ల స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్ల పంపిణీ, పిఎం ఉజ్వల పధకం కింద హౌలి, దీపావళి పండుగలకు రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు, అన్న పూర్ణ కాంటీన్లు వాటిలో ఉన్నాయి. ఇదే ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన పేరుతో ఉచితంగా నిధులు ఇచ్చేందుకు 2022-23 బడ్జెట్‌లో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు.


అమ్‌దానీ ఆఠాణీ, ఖర్చా రూపయా (రాబడి ఎనిమిదణాలు ఖర్చు పదహారణాలు) అని నరేంద్రమోడీ ఉచితాల గురించి ఎద్దేవా చేశారు. ” ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పధకం కింద 39లక్షల మందికి రెండు ఉచిత గాస్‌ సిలిండర్లు ఇవ్వనున్నట్లు అక్టోబరు 17న గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది.” (డెక్కన్‌ హెరాల్డ్‌ 2022 నవంబరు 13). ” బిజెపి ప్రకటించిన వాటిలో ఉచిత విద్య,ఉచిత వైద్యం, రెండు ఉచిత సిలిండర్లు, సబ్సిడీతో సెనగలు, వంట నూనె, కాలేజీలకు వెళ్లే బాలికలకు ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటీలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు హిమచల్‌ ప్రదేశ్‌లోని బిజెపి సర్కార్‌ ఏప్రిల్‌ నెలలో ఇండ్ల అవసరాలకు గాను 125 యుూనిట్లకు చార్జీ ఎత్తివేసి రు.250 కోట్లు లబ్ది చేకూర్చుతున్నట్లు, గ్రామాలలో నీటి సరఫరా చార్జీలను మాఫీ చేస్తున్నట్లు, రాష్ట్ర ఆర్టీసి బస్సుల్లో మహిళలకు సగం చార్జీ రాయితీ ఇస్తున్నట్లు, 18-60 సంవత్సరాల మహిళలకు నెలకు రు.1,500 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బిజెపి చేస్తే సంసారం, ఇతరులు చేస్తే మరొకటా ?


ఉచితాలను పన్ను చెల్లింపుదార్లు నిరసిస్తున్నారని అంటూ వాటికి వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ఒకవైపు నరేంద్రమోడీ చూస్తున్నారు.మరోవైపు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బాంకులు రు.10,09,510 కోట్ల మేరకు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించగా ఇదే కాలంలో అలాంటి ఖాతాల నుంచి వసూలు చేసిన మొత్తం రు.1,32,036 కోట్లని ప్రభుత్వం తాజాగా పార్లమెంటులో, సమాచార హక్కు కింద ఆర్‌బిఐ వెల్లడించింది.(2022, డిసెంబరు 13వ తేదీ వార్త). వారి మీద తీసుకున్న చర్యలేమిటో ఎవరికైనా తెలుసా ?


కార్పొరేట్‌లపై పన్ను ద్వారా ఖజానాకు వచ్చే మొత్తం కూడా ప్రజలదే. కానీ ఒక్క పైసాను కూడా జాగ్రత్తగా చూస్తానని చెప్పిన నరేంద్రమోడీ కార్పొరేట్‌ పన్నును 30 నుంచి 22కు, 15శాతానికి తగ్గించారు. దీన్ని హర్షించే పెద్దలు సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను ఇస్తే పేదలు వాటిని తినకుండా వేరే వారికి అమ్ముకుంటున్నారని దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి కార్పొరేట్లకు ఇస్తున్న సబ్సిడీ అంతా తిరిగి పెట్టుబడిగా వస్తున్నదా ? అది దేశానికి, జనానికి లబ్ది చేకూర్చుతున్నదా ? దీన్ని కార్పొరేట్లకు ఇస్తున్న ఉచితం అంటారా, దోచిపెడుతున్న సొమ్మంటారా ? ఇదే కాలంలో కార్పొరేట్ల నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో బిజెపికి వస్తున్న సొమ్మెంతో కూడా చూస్తున్నాము. కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వారు తిరిగి దాన్ని పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పిస్తారని చెబుతున్నారు. జనమూ అంతేగా ! ఒక వస్తువు లేదా సేవను ఉచితంగా పొందితే దానికి వెచ్చించే సొమ్ముతో మరొకదాన్ని కొనుగోలు చేసి దేశానికి తోడ్పడుతున్నారు. ఉదాహరణకు నరేంద్రమోడీ 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రైతులకు ఉచితంగా ఏడాదికి ఆరువేల రూపాయలను మూడు విడతలుగా బాంకుల్లో వేసే పథకాన్ని ప్రకటించారు. రైతులు ఆ సొమ్మును స్విస్‌ బాంకుల్లోకి, ఇతర దేశాలకేమీ తరలించి దాచుకోవటం లేదు, ఎరువులో, పురుగుమందులో మరొక వస్తువునో కొనుక్కుంటున్నారు. సాగు చేయని వారు ఇతర వస్తువులకు వెచ్చిస్తున్నారు. అదీ దేశానికి మేలు చేస్తున్నట్లే !


స్వేచ్చా మార్కెట్‌, ఏదీ ఉచితం ఇవ్వకూడదు అన్న నయా ఉదారవాదం పేరుతో కార్పొరేట్లకు సంపదలను కట్టబెట్టే విధానాలు వచ్చిన దగ్గర నుంచీ అసమానతల పెరుగుదలతో పాటు ఉచితాల మీద దాడి ప్రారంభమైంది. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చివేశారు. ఒకనాడు అపహాస్యం చేసిన పధకాలనే తరువాత జాతీయంగా అమలు చేశారు.తొలుత తమిళనాడు స్కూలు పిల్లలకు మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేసినపుడు అదే జరిగింది. ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఎన్టీర్‌ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎద్దేవా చేసిన వారున్నారు. ఆహార భద్రతా పధకం కింద ఇప్పుడు దేశమంతటా అమలు చేస్తున్నారు. ఒడిషా, తెలంగాణాలో ముందుగా రైతు బంధును ప్రకటిస్తే తరువాత నరేంద్రమోడీ కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో దేశమంతటా అమలు చేస్తున్నారు. అందువలన ఈ రోజున ఉచితాలన్న వాటిని రేపు ఏం చేస్తారో చెప్పలేము. రాష్ట్రాల వనరులు తగ్గుతున్నట్లు ఉచితాలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ కేంద్ర పెద్దలు గుండెలు బాదుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ పత్రాల ప్రకారం 2014లో కేంద్ర ప్రభుత్వ అప్పు 55 లక్షల కోట్లు, మోడీ పదేండ్ల పాలన గడిచే నాటికి అది 169లక్షల కోట్లకు చేరనుంది. ఇంత అప్పు దేనికి చేసినట్లు, ఎక్కడ నుంచి తెచ్చిందీ, దేనికెంత ఖర్చు చేసిందీ మోడీ చెబుతారా ? దోమలు దూరే కంతలను చూసి గుండెలు బాదుకొనే వారికి ఏనుగులు పోతున్న మహాద్వారాలు కనిపించవా ? పార్లమెంటులో 2017జూలై 21 నక్షత్ర గుర్తులేని ప్రశ్న 938కి ఇచ్చిన సమాధానం ప్రకారం 2004-05 కస్టమ్స్‌, ఎక్సైజ్‌, కార్పొరేట్‌, వ్యక్తిగత పన్ను రాయితీల వలన ప్రభుత్వం కోల్పోయిన రాబడి లక్షా 95వేల కోట్ల రూపాయలు. తరువాత అది ఏటేటా పెరుగుతూ వచ్చింది నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత జనానికి అర్ధంగాకుండా లెక్కలను తారుమారు చేసి సరికొత్త పద్దతుల్లో దోచి పెట్టటం ప్రారంభించారు.2014-15లో కస్టమ్స్‌, ఎక్సైజ్‌ పన్నుల రాబడిలో కోల్పోయిన మొత్తం రు.4,35,756 కోట్లుగా పేర్కొనగా మరుసటి ఏడాది నాటకీయంగా ఆ మొత్తాలను రు.1,48,442 కోట్లుగా చెప్పారు. దీని అర్ధం ఖజానాకు మోడీ గారు రు.2,87,314 కోట్లు మిగిల్చినట్లా ? నిజానికి అంత మిగిల్చి ఉంటే పెట్రోలు, డీజిలు మీద 2014-15లో ఎక్సైజ్‌ పన్ను ఖాతా కింద కేంద్రానికి వచ్చిన మొత్తం రు.99,068 కోట్ల మొత్తాన్ని మరుసటి ఏడాదికి రు.1,78,447 కోట్లకు, తరువాత క్రమంగా పెంచి 2020-21నాటికి రు.3,72,970 కోట్లకు చేర్చారు. ఇంత మొత్తం భారాన్ని మోపటంతో పాటు గాస్‌ సబ్సిడీని భారీగా తగ్గించి ముష్టి విదిల్చినట్లుగా మార్చివేశారు. పైన పేర్కొన్నట్లుగా అప్పు తడిచి మోపెడైంది ? ఎవరికోసం బిజెపి పని చేస్తున్నట్లు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఎట్టకేలకు బిజెపి ” మల్లుడు ” మీద కీచక కేసులు : పరువు పోగొట్టుకున్న పరుగుల రాణి పిటి ఉష !

29 Saturday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Political Parties, Sports, Uncategorized, Women

≈ Leave a comment

Tags

BJP, Narendra Modi Failures, POCSO Act against WFI chief Brij Bhushan- PT Usha lost her credibility, PT Usha, RSS, Sports Minister Anurag Thakur’, Supreme Court, WFI, Wrestlers


ఎం కోటేశ్వరరావు


సుప్రీం కోర్టు ఆదేశించటంతో విధిలేని స్థితిలో లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న బిజెపి ఎంపీ, మల్లుడు, నలభై కేసులున్న నేరచరితుడైన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌ మీద అమిత్‌ షా ఆధీనంలో పని చేసే ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన పోక్సోకేసు. ఒక కేసు నమోదు చేసేందుకు దేశ ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్న వార్త ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ అని చెప్పుకుంటున్న దేశ పరువును తీసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం, పాలకపార్టీ పెద్దలు, వారి సమర్ధకులు తప్ప వేరెవరూ కారణం కాదు. బేటీ పఢావో బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ ఏలుబడిలో ఆయన అధికార పీఠం ఉన్న చోటే ఆఫ్టరాల్‌ ఒక కేసు నమోదుకు ఇంత రచ్చ జరిగిందంటే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా అని జనం ఆశ్చర్యపోతున్నారు. అంతకు ముందు జరిగిన పరిణామాల్లో అఫ్‌కోర్స్‌ ఎవరేమనుకుంటే నాకేటి…. అనుకున్నట్లుగా ఒక నాడు పరుగుల రాణిగా దేశ ప్రజల, క్రీడాకారుల నీరాజనాలు అందుకున్న పిటి ఉష, రెజ్లర్ల మీద విమర్శలకు దిగి పరువు పొగొట్టుకున్నారు. ఇప్పుడేమంటారో చూడాలి. ఢిల్లీ పోలీసుల మీద ఎవరికీ విశ్వాసం లేదు.కేసు నీరుగారేట్లు చేస్తారని అనేక మంది భావిస్తున్నారు. బహుశా ఈ దుమ్ముతోనే కేసులు పెట్టినా తాను రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ పదవికి రాజీనామా చేసేది లేదని బ్రిజ్‌ భూషణ్‌ ప్రకటించారు. కేసులు నమోదు చేశాం కనుక ఆందోళన విరమించండి, జంతర్‌ మంతర్‌ నుంచి వెళ్లిపోండి అంటూ శరవేగంతో వచ్చిన పోలీసులు ఆందోళన శిబిరంలో ఉన్న వారికి నీరు, ఆహారం అందకుండా అడ్డుకున్నారు.


వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేసి మల్లయుద్ధ క్రీడాకారులు దేశ ప్రతిష్టను మంటగలిపారంటూ భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) అధ్యక్షురాలు పిటి ఉష ఆరోపించారు. రోడ్లెక్కే ముందుకు ఐఓఏను సంప్రదించి ఉండాల్సిందంటూ హితవు పలికారు.మల్లయోధులు తమ అసోసియేషన్‌కు తాత్కాలిక కమిటీ వేయాలని కోరారని, తామాపని చేసినట్లు ఉష చెప్పారు. అంతకు ముందు జరిగిన ఐఓఏ కార్యవర్గ సమావేశం తరువాత కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఎల్లవేళలా ఆటగాళ్ల పక్షానే ఉందని, క్రీడలు, అథ్లెట్లు తమ ప్రాధాన్యత అని చెప్పుకున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మీద విమర్శలు వచ్చిన దగ్గర నుంచి జరిగిన పరిణామాలను చూస్తే అతగాడిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, బిజెపి చూపుతున్న శ్రద్ద నిజాలను నిగ్గుదేల్చేందుకు చూప లేదు. నిజానికి రెజ్లర్లను వీధుల్లోకి లాగింది, దేశ ప్రతిష్టను దిగజార్చిందీ కేంద్రం, బిజెపి పార్టీ తప్ప మరొకటి కాదు. బిజెపి నేత అద్వానీ మీద హవాలా ఆరోపణ వచ్చినపుడు ఎంపీగా రాజీనామా చేసి ఆ నింద తొలిగిన తరువాతనే తిరిగి ఎన్నికల్లో నిలిచారు. బ్రిజ్‌ భూషణ్‌ అంశంలో బిజెపి ఎందుకు ఠలాయిస్తున్నట్లు ? వెంటనే పదవి నుంచి తప్పించి విచారణ సక్రమంగా జరిపించి ఉంటే ప్రపంచ క్రీడా రంగంలో, ఇతరంగా దేశ పరువు నిలిచేది కదా !


రాజ్యసభకు పంపినందుకు బిజెపి పట్ల కృతజ్ఞతగా బహుశా పిటి ఉష ఈ కోణాన్ని చూడకుండా రెజ్లర్ల మీదనే దాడికి దిగారన్నది స్పష్టం. నిరసన తెలపటం ప్రజాస్వామిక హక్కు, ఒక మహిళగా తోటి మహిళా అథ్లెట్ల బాధను ఆమె అవగాహన చేసుకోలేదు. అన్ని రంగాల్లో లైంగిక వేధింపులు జరుగుతున్న సంగతి తెలియదని అనుకోవాలా ? ఇతర అసోసియేషన్లలో చేయని ఆరోపణలు రెజ్లింగ్‌లోనే ఎందుకు వచ్చినట్లు ? రెజ్లర్లు తమ వద్దకు రాలేదని చెబుతున్న ఉష, ఆమే వారిని తన వద్దకు ఎందుకు పిలిపించుకోలేదు. జనవరి 18న తొలిసారిగా రెజ్లర్లు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే ఆమె రంగంలోకి దిగితే ఇంతదాకా వచ్చేది కాదు కదా ! తాత్కాలిక కమిటినీ తమంత తాముగా ఎందుకు వేయలేదు ? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తటం సహజం. లండన్‌ పర్యటనలో రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలతో దేశం పరువు తీసినట్లు, పోయినట్లు బిజెపి ఇప్పటికీ నానా యాగీ చేస్తోంది. ఇప్పుడు అదే భాషను పరుగుల రాణి వినిపించారు.నిరసన తెలపటమే నేరం అన్నట్లు మాట్లాడారు ? బిజెపి గీసిన గిరి నుంచి వెలుపలికి వస్తే ప్రపంచంలో గతంలో, వర్తమానంలో జరుగుతున్నదేమిటో ఆమెకు తెలిసి ఉండేది. అసలు ఆమె సంగతేమిటి ? ఆమె క్రమశిక్షణ బండారమేమిటి ?


పిటి ఉష రాజకీయ రంగు దాస్తే దాగేది కాదు. క్రీడా రంగంలో ఉన్నంత వరకే ఆమె క్రీడాకారిణి.తరువాత సాధారణ పౌరురాలే. ఏ రాజకీయపార్టీనైనా అభిమానించవచ్చు, చేరవచ్చు. ఆమె నెరపిన రాజకీయం ఏమిటో కేరళ జనాలకు తెలుసు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఏ క్షణంలోనైనా బిజెపిలో చేరవచ్చని 2021 పత్రికలను తిరగేస్తే వచ్చిన వార్తలు చూడవచ్చు. విజయ యాత్ర జరిపిన బిజెపి చివరికి ఉన్న ఒక్క అసెంబ్లీ సీటు, అంతకు ముందు వచ్చిన ఓట్లను కూడా పోగొట్టుకుంది. ఏ రాష్ట్రంలోనూ సిఎం అభ్యర్థిని ప్రకటించటం తమ విధానం కాదని చెప్పుకొనే బిజెపి అక్కడ మెట్రో మాన్‌ శ్రీధరన్ను ప్రకటించింది. తనకేమీ రాజకీయాల్లేవంటూనే 2016లో కేరళలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ఆహ్వాన సంఘానికి అధ్యక్షురాలిగా పని చేశారు. ఆ మరుసటి ఏడాది ఉష అథ్లెటిక్‌ స్కూలులో సింథటిక్‌ ట్రాక్‌ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఆ తరువాత రైతులు తిరస్కరించి ఏడాది పాటు ఆందోళన సాగించిన మోడీ మూడు సాగు చట్టాలను ఆమె సమర్ధించారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారంటూ గ్రేటా థన్‌బెర్గ్‌, గాయని రిహానాను ఖండించారు. వీటికి ప్రతిఫలంగా ఆమెకు రాజ్యసభ సభ్యత్వం దక్కింది.


ఇంతకూ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను బిజెపిని కాపాడుతున్నదా లేక ఆ పార్టీనే అతను ఒక ప్రాంతంలోనైనా శాశించే స్థితిలో ఉన్నారా ?ఉత్తర ప్రదేశ్‌లోని గోండా ప్రాంతంలో ఒకనాటి రౌడీ షీటర్‌, ఇప్పటికీ హత్యాయత్నం, కొట్లాట, దోపిడీ వంటి 40 క్రిమినల్‌ కేసులున్నప్పటికీ గాంగ్‌స్టర్లను ఏరిపారవేస్తానన్న యోగి పాలనలో ఆ జాబితాలో ఇతగాడి పేరు లేదు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగా దేశం కోసం, ఉత్తర ప్రదేశ్‌ ఉన్నతి కోసం ఎప్పుడూ సాధు, సంతులతో కలసి తిరిగే బిజెపి గాంగ్‌స్టర్లు వేరయా అని లోకానికి సందేశమిచ్చారు. ఎందుకంటే అరవై ఆరు సంవత్సరాల ఈ పెద్దమనిషి స్వయంగా మల్లయోధుడు, ఒకసారి ఎస్‌పి, ఐదుసార్లు బిజెపి ఎంపీగా ఉన్నారు. అదనపు అర్హతలు ఏమంటే పేరుమోసిన హిందూత్వవాది, బాబరీ మసీదు కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుడనని స్వయంగా చెప్పుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌లతో సంబంధాల గురించి చెప్పనవసరం లేదు. ఆ ప్రాంతంలో ” శక్తిశాలి ” అని అనుచరులు ఆకాశానికి ఎత్తుతారు. ఎందుకు అంటే కెమేరాల సాక్షిగా అతిక్‌ అహమ్మద్‌ అనే గూండా సోదరులను కాల్చిచంపిన ఆ పుణ్య గడ్డమీదే తన స్నేహితుడిని చంపిన హంతకుడి మీద కాల్పులు జరిపి హతమార్చినట్లు కెమెరాల ముందే ప్రకటించిన బ్రిజ్‌ తీరు ఉత్తర ప్రదేశ్‌లోగాక మరెక్కడ జరుగుతుంది.లోక్‌సభ ఎన్నికలలో బిజెపి తరఫున పోటీకి దిగినపుడు నాలుగుసార్లు ఎంపీగా ఉన్న కాంగ్రెస్‌ నేత ఆనంద సింగ్‌ మీద పోటీ వద్దని నాటి జిల్లా పోలీసు అధికారి తన కార్యాలయానికి పిలిపించుకొని అడగ్గా తీవ్ర వాదోపవాదాల్లో భాగంగా తన దగ్గర ఉన్న తుపాకిని తీసి ఎస్‌పి మీద గురి పెట్టగా వెనక్కు తగ్గిన తరువాత తాను వెనక్కు వెళ్లినట్లు స్వయంగా మీడియాతో చెప్పారు. అంతేనా ముంబై డాన్‌ అరుణ్‌ గావ్లీ అనుచరుడిని చంపినట్లు ఆరోపణలున్న దావూద్‌ ఇబ్రహీం అనుచరులు సుభాష్‌ ఠాకూర్‌, జయేంద్ర ఠాకూర్‌,ప్రకాష్‌ దేశాయిలతో చేతులు కలిపినందుకు టాడా చట్టం కింద అనేక నెలలు తీహార్‌ జైల్లో ఉన్న హిందూ-ముస్లిం జాతీయవాది, గాంగస్టర్ల ఐక్యతావాది. ఇలాంటి వారి మీద కేసులకు పట్టే గతి తెలిసిందే. ఎవరైనా ముందుకు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పి బతగ్గలరా ?


పన్నెండు సంవత్సరాలుగా దేశ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అతగాడి లైంగిక వేధింపులను భరించలేక కొంత మంది రెజ్లర్లు చేసిన ఫిర్యాదులను ” బేటీ బచావో ” అనుచరులు, అధికారులూ పట్టించుకోలేదు. మాఫియా డాన్‌ అతిక్‌ ఆహమ్మద్‌ సంపాదించిన ఆస్తుల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదని కాషాయ దళాలు సామాజిక మాధ్యమాలలో ఏడ్చి పెడబొబ్బలు పెడుతున్నాయి. ఒక నాడు రౌడీ షీటర్‌గా ఉన్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సంపాదించినదేమీ తక్కువ కాదు.అనేక జిల్లాల్లో కనీసం 50 విద్యాసంస్థలు ఉన్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. వీటి విలువ ఎంతో, ఎలా సంపాదించాడో కాషాయ దళాలు చెప్పాలి. ఇన్ని సంపదలు, కేంద్రం, రాష్ట్రంలో పలుకుబడి, ఎంపీగా ఉన్నకారణంగానే మహిళా రెజ్లర్ల మీద లైంగిక వేధింపులకు పాల్పడి నోరు మూయిస్తున్నట్లు లోకం కోడై కూస్తున్నది.ఇతర పార్టీల కుటుంబ వారసత్వం గురించి బిజెపి లోకానికి సూక్తిముక్తావళి వినిపిస్తుంది. ఇతని కుమారుడు ప్రతీక్‌ భూషన్‌ రెండవసారి ఎంఎల్‌ఏగా ఉన్నారు. మరో కుమారుడు కరన్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌లో ఆఫీసుబేరర్‌, భార్య కేతకీ దేవి గోండా జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2004లో బిజెపి టికెట్‌ నిరాకరించి ఇతని బదులు ఘనశ్యాం శుక్లా అనే అతన్ని నిలిపింది. ఎన్నికల రోజున జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా జరిగిన ఒక ప్రమాదంలో శుక్లా మరణించాడు. ఆపని బ్రిజ్‌ భూషణే చేయించినట్లు శుక్లా కుటుంబం ఆరోపించింది. దీనిపై వాజ్‌పాయి ఆగ్రహించటంతో అతను పార్టీ మారీ సమాజవాదిలో చేరి 2009లో ఎంపీగా గెలిచారు. తరువాత 2014లో నరేంద్రమోడీ తిరిగి అతన్ని పార్టీలో చేర్చుకోవటమే గాక రెండుసార్లు టికెట్‌ ఇచ్చి ఎంపీగా గెలిపించి ” వాజ్‌పాయిని గౌరవించారు.”


మహిళా రెజ్లర్లు తమపై తమపై జరుగుతున్న వేధింపుల మీద గళమెత్తారు.కొన్ని ఉదాహరణలను చూస్తే జాతి వివక్ష వంటి అంశాల మీద నిరసన తెలిపిన ప్రపంచ స్థాయి క్రీడాకారులు, అథ్లెట్ల గురించి పిటీ ఉషకు తెలియకుండా ఉంటుందా ? లేకపోతే మాట్లాడే ముందు తెలుసుకోవాలి. 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో రెండువందల మీటర్ల పరుగు పందెంలో గోల్డ్‌, సిల్వర్‌ పతకాలను సాధించిన అమెరికా టోమీ స్మిత్‌, జాన్‌ కార్లోస్‌ జాతి వివక్షకు నిరసనగా కాళ్లకు బూట్లు లేకుండా, చేతులకు నల్లటి గ్లౌజులు వేసుకొని పోడియం మీదకు ఎక్కారు.2016లో ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు కోలిన్‌ కయిపెర్నిక్‌ ఉదంతం తెలిసిందే. అమెరికాలో కొనసాగుతున్న జాతి వివక్ష, నల్లజాతీయుల మీద జరుగుతున్న పోలీసుదాడులకు నిరసనగా క్రీడలకు ముందు జరిపే జాతీయగీతాలాపన సందర్భంగా లేచి నిలబడకుండా మోకాళ్ల మీద నిలిచి నిరసన తెలిపాడు. ఒకసారి కాదు అనేక సార్లు అదే చేశాడు.దాంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిరసన తెలిపే క్రీడాకారులను లంజకొడుకులని నోరుపారవేసుకున్నాడు.2020లో జార్జి ఫ్లాయడ్‌ అనే నల్లజాతి యువకుడిని పోలీసులు చంపినపుడు అమెరికా అంతటా తీవ్ర నిరసన వెల్లడైంది. అనేక మంది క్రీడాకారులు దానిలో పాల్గొన్నారు. క్రమశిక్షణ పేరుతో మౌనంగా ఉండలేదు.ప్రపంచ ఫుట్‌బాల్‌ సంస్థ పీఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో వాటి మీద స్పందిస్తూ నిరసన తెలిపిన క్రీడాకారులను అభినందించాలి తప్ప శిక్షించకూడదన్నాడు. తోటి మహిళా రెజ్లర్ల మీద లైంగిక వేధింపులు జరుగుతుంటే పిటి ఉష గొంతెత్తి వారి పక్షాన నిలవాల్సిందిపోయి నోరుమూసుకొని భరించమనే సందేశం ఇవ్వటం, దానికి క్రమశిక్షణ అని ముసుగుతొడగటం స్త్రీ జాతికే అవమానం.నిరసించే ధైర్యం లేకపోతే అవమానాలను దిగుమింగుతూ ఆత్మగౌరవాన్ని చంపుకొని చచ్చిన చేపల్లా వాలునబడి కొట్టుకుపోతూ, మౌనంగా ఉంటున్న అనేక మంది మాదిరే ఉంటే అదొక తీరు. తోటి క్రీడాకారులు రోడ్డెక్కితే అనేక మంది ప్రముఖ క్రీడాకారులు వారికి బాసటగా నిలిచారు. అనేక మంది మౌనంగా ఉన్నారు. ఈ రోజు వేధింపులు రెజ్లర్ల మీద జరగవచ్చు. వాటి పట్ల మౌనంగా ఉంటే రేపు తమదాకా వస్తే అని ఆలోచించి ఉంటే ఈ పాటికే ఢిల్లీ పోలీసుల మీద వత్తిడి పెరిగి సుప్రీం కోర్టు వరకు పోకుండా కేసులు నమోదు చేసేవారు. క్రీడాకారుల మౌనం ఎంతో ప్రమాదకరం. సుప్రీం కోర్టును సంతుష్టీకరించేందుకు కేసులు నమోదు చేసినా తరువాత జరిగే వాటి గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఏకత, శీలము ఉన్నవారు చేసే పనేనా ఇది : షిరిడీ సాయి ట్రస్టు మసీదులకు విరాళమిచ్చిందా ?

21 Friday Apr 2023

Posted by raomk in BJP, Communalism, Congress, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion, RELIGION, Religious Intolarence

≈ Leave a comment

Tags

BJP, Gobbles, Propaganda War, Ram Mandir, RSS, Shirdi Sai Baba, Shirdi Sai Trust


ఎం కోటేశ్వరరావు


” షిరిడీ సాయి ట్రస్టు మసీదులకు రు.96 కోట్లు విరాళమిచ్చింది. షిరిడీ సాయి ట్రస్టు హాజ్‌కు రు.35 కోట్లు విరాళమిచ్చింది.” ఈ రెండింటికీ జత చేసిన అంశాలేమిటంటే షిరిడీ దేవాలయానికి విరాళాలు ఎక్కువగా ఇచ్చేది హిందూ భక్తులు. అలాంటి సంస్థ అయోధ్య రామ మందిరానికి విరాళం ఇచ్చేందుకు తిరస్కరించింది. తాము హిందువులకు భిన్నమని చెప్పినట్లు కూడా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇది నిజమేనా అంటూ దీన్నే సరికొత్త పద్దతుల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. తన పేరుతో జరుగుతున్న ఇలాంటి ప్రచారాన్ని అడ్డుకొనేందుకు రాముడు పూనుకున్నట్లు మనకు ఎక్కడా దాఖలా లేదు. రామజన్మభూమి ట్రస్టు ఏదైనా వివరణ ప్రకటన చేసినట్లు గూగుల్‌ వెతుకులాటలో కనిపించలేదు. దొరికిన వారెవరైనా పంపితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. కాగలపని గంధర్వులు తీర్చారు అన్నట్లుగా కాషాయ మరుగుజ్జులు చేస్తున్నదాన్ని చూసీ చూడనట్లు ఉందన్నది స్పష్టం. ఈ ప్రచారానికి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు నిజనిర్దారణలు జరిపి షిరిడీ సాయి ట్రస్టు అలాంటి విరాళాలు ఇవ్వలేదని ప్రకటించినప్పటికీ ఇంకా ప్రచారం జరుగుతూనే ఉంది. పని గట్టుకు చేసేదే చేసే గోబెల్స్‌ ప్రచారం గనుక వారికి వాస్తవాలతో నిమిత్తం ఉండదు. సత్యమునే చెప్పవలెను-అబద్దమాడరాదు, సత్యహరిశ్చంద్రుడు పుట్టిన గడ్డ ఇది అని చెప్పుకొనే చోట ఇలాంటి ప్రచారం జరుగుతున్నదంటే నిజానికి అది రాముడికి, హరిశ్చంద్రుడికి ఘోర అవమానం, వారి పేర్లను స్మరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది స్పష్టం.ఇలాంటి ప్రచారాలు చేసే చీకటి శక్తులేవో అందరికీ తెలిసిందే.ఏకత, శీలము ఉన్నవారు చేసే పనేనా ఇది ?


ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళం ఇమ్మని షిరిడీ సాయి ట్రస్టును అసలు అడగలేదని ది క్వింట్‌ అనే వెబ్‌ పత్రిక 2021 జనవరి 18న స్పష్టం చేసింది. ఈ ప్రచారం పచ్చి అవాస్తవమని, విరాళం కోరుతూ తమకు ఎలాంటి సమాచారం లేదని ట్రస్టు సిఇఓ కెహెచ్‌ బగాటే, విరాళం కోసం తామెలాంటి వినతి పంపలేదని రామాలయ ట్రస్టు సభ్యుడు మోహన ప్రతాప్‌ మిశ్రా చెప్పినట్లు పేర్కొన్నది. హిందూస్తాన్‌ టైమ్స్‌లో వచ్చిన ఒక వార్త ప్రకారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విరాళాలు తీసుకోవటం 2021 జనవరి 15 నుంచి ప్రారంభించిందని, దాని కంటే ముందే ఐదవ తేదీ నుంచే షిరిడీ ట్రస్టు నిరాకరణ గురించి ప్రచారం జరుగుతున్నట్లు క్వింట్‌ పేర్కొన్నది.


ఈ ప్రచారాన్నే ” హార్డ్‌ కోర్‌ హిందూ సేన ఆఫ్‌ చీఫ్‌ మినిస్టర్‌ యోగి ఆదిత్య నాథ్‌ ” పేరుతో నడుపుతున్న ఒక గ్రూపులో, హిందూ రాష్ట్ర భారత్‌ వంటి గ్రూపుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు ది లాలన్‌టాప్‌ అనే వెబ్‌సైట్‌ 2020 జూన్‌ 22న వెల్లడించింది. దీని గురించి శ్రీ సాయి బాబా సంస్థాన్‌ ట్రస్టు సిఇఓ అరుణ్‌ కిషోర్‌ డోంగ్రే మాట్లాడుతూ ఇక్కడికి అన్ని మతాలకు చెందిన వారు వస్తారని, ఒక చట్టం ప్రకారం పని చేస్తున్న ట్రస్టు రు.50లక్షలకు మించి అదనంగా ఎవరికైనా విరాళం ఇవ్వాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలని, రామ మందిరానికి విరాళం ప్రతిపాదన ఎలాంటిదీ తమ వద్దకు రాలేదని, జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని చెప్పినట్లు కూడా ఆ సైట్‌ పేర్కొన్నది. ఈ ప్రచారం 2019 డిసెంబరులో కూడా జరిగిందని, అప్పుడు షిరిడీ ట్రస్టు సిఇఓగా ఉన్న దీపక్‌ ముఘాలికర్‌ కూడా అది తప్పుడు ప్రచారమని చెప్పారు. మసీదుల మరమ్మతు, నిర్మాణాలకు రు.96 కోట్లను షిరిడీ ట్రస్టు విరాళంగా ఇచ్చినట్లు, రామ మందిరానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జరుపుతున్న ప్రచారం వాస్తవం కాదని చెక్‌పోస్ట్‌ అనే మరాఠీ వెబ్‌సైట్‌ 2021అక్టోబరు 30న పేర్కొన్నది. ” బుద్దిలేని మన హిందువులు సాయి గుడికి వెళుతున్నారు. తలలు వంచి కానుకలు సమర్పిస్తున్నారు. ఒక కుట్ర ప్రకారం సాయి విగ్రహాలను హిందువుల గుళ్లలో పెడుతున్నారు.హిందువులారా జాగ్రత్తగా ఉండండి, నిజాలను తెలుసుకొనేందుకు ప్రయత్నించండి ” అంటూ కూడా వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నట్లు అది పేర్కొన్నది. షిరిడీ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌లో ఉంచిన ఒక నివేదిక ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు ఇచ్చిన 58 విరాళాల జాబితా ప్రకారం వాటికి ఇచ్చిన మొత్తం రు. 101.48 కోట్లని, దానిలో కరోనా సమయంలో సిఎం సహాయ నిధికి 51 కోట్లు ఇచ్చినట్లు ఉంది తప్ప ఎలాంటి మసీదు పేరు లేదని చెక్‌పోస్ట్‌ పేర్కొన్నది.


విరాళాన్ని తిరస్కరించిన రామ మందిర ట్రస్టు !
రామ మందిర ట్రస్టు నిబంధనావళిని 2020 ఫిబ్రవరి ఐదున ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించినట్లుగా మనీకంట్రోల్‌ వెబ్‌సైట్‌ అదే ఏడాది ఫిబ్రవరి 20న ఒక వార్తలో పేర్కొన్నది. విరాళాలను స్వీకరించే వ్యవస్థను ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉందని, పెద్ద మొత్తంలో వచ్చిన విరాళాన్ని ట్రస్టు తిరస్కరించినట్లు ద ప్రింట్‌ అనే వెబ్‌సైట్‌ వార్తను అది ఉటంకించింది. దాని ప్రకారం బీహార్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి కిషోర్‌ కునాల్‌ తాను రామ మందిరానికి పది కోట్ల మేరకు విరాళం ఇవ్వదలచుకున్నట్లు ప్రకటించారని, దానిలో భాగంగా రు. రెండు కోట్ల చెక్‌ తీసుకొని అయోధ్య రాగా విరాళాలను స్వీకరించే వ్యవస్థ లేనందున దాన్ని తిరస్కరిస్తున్నట్లు చెప్పారని ప్రింట్‌ పేర్కొన్నది. రామమందిర ట్రస్ట్‌లోని ఏకైక దళిత సభ్యుడు, విశ్వహిందూ పరిషత్‌ నేత కమలేష్‌ చౌపాల్‌ మాట్లాడుతూ దేశమంతటి నుంచి అనేక మంది విరాళాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని , మందిర నిర్మాణానికి నిధుల కొరత లేదని అన్నట్లు కూడా రాసింది.


షిరిడీ సాయి మందిరం గురించి తప్పుడు ప్రచారం కొత్త కాదు. షిరిడీ సాయిబాబా హిందూాముస్లిం ఐక్యతకు ప్రతీక కాదు, దేవుడూ కాదని మానవుడు కనుక పూజించ వద్దని ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద 2014 జూన్‌ 24న చెన్నైలో పిలుపునిచ్చారు. నిజంగా సాయిబాబా హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకైతే ముస్లింలు కూడా విశ్వాసం వెల్లడించేవారని అన్నారు. సాయిబాబా గంగలో మునిగేందుకు తిరస్కరించారని, అతని పేరుతో గుళ్లు కట్టటం డబ్బు సంపాదనకేనని, సనాతన ధర్మంలో విష్ణువు 24 అవతారాల గురించి చెప్పారని దానిలో సాయిబాబా లేరని, హిందువుల మధ్య విభజన కుట్రలో భాగంగా బాబాకు పూజలు చేస్తున్నారని ఆరోపించారు. బ్రిటీష్‌ వారు బాబాను ముందుకు తెచ్చారని కూడా ఆరోపించారు.


దేశంలో ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర ఆలయం, షిరిడీ మందిరం ఆదాయంలో పోటీ పడుతున్నాయి. భక్తులను అయోధ్య రామమందిరం వైపు మళ్లించేందుకు చూస్తున్నారు. దేశంలో భక్తి ముదరటంతో గుళ్లు, గోపురాలు, బాబాలకు డిమాండ్‌ బాగా పెరిగింది. అందుకే అనేక గుళ్లను నవీకరించి రాబడి పెంచేందుకు పూనుకున్నారు. హిందూత్వ రాతలకు ప్రతీకగా ఉన్న ఒపి ఇండియా వెబ్‌సైట్‌లో 2020జనవరి 23న ఒక విశ్లేషణ వెలువడింది. షిరిడీ సాయి బాబా జన్మ స్థలంగా భావిస్తున్న పత్రి అనే చోట బాబా ఆలయాన్ని వృద్ది చేసేందుకు (అప్పటి శివసేన-కాంగ్రెస్‌-ఎన్‌సిపి ) ప్రభుత్వం రు. వంద కోట్లు కేటాయించిందని షిరిడీకి పోటీగా దాన్ని రూపొందించాలని చూస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికే పత్రిలో బాబా ఆలయం ఉన్నప్పటికీ దాని గురించి అంతగా ప్రచారం లేదని, దానికి వంద కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తే మతపరమైన టూరిజం మీద ఆధారపడిన షిరిడీలోని జనం ఆర్థికంగా నష్టపోతారని, అందువలన ఆ ప్రతిపాదనకు నిరసనగా షిరిడీలో బంద్‌ కూడా పాటించారని పేర్కొన్నారు. అహమ్మద్‌ నగర్‌ జిల్లాలో ఉన్న షిరిడీ ట్రస్టు మీద పెత్తనం చేస్తున్న ప్రముఖ కాంగ్రెస్‌ నేత రాధాకృష్ణ విఖీ పాటిల్‌ ఆ పార్టీని వదలి బిజెపిలో చేరినప్పటికీ ట్రస్టు మీద పట్టుకోల్పోలేదని, అందువలన దాన్ని దెబ్బతీసేందుకు పత్రి ఆలయ ట్రస్టు మీద పట్టు ఉన్న ఎన్‌సిపి-కాంగ్రెస్‌ దాని వృద్దికి కుట్ర చేశారని ఆ వెబ్‌సైట్‌ ఆరోపించింది.ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద అసలు షిరిడీ వెళ్లవద్దని, పూజలు జరపవద్దని ఇచ్చిన పిలుపులో దానికి జనాలకు వచ్చే అర్థిక నష్టకోణం కనిపించలేదు. ఈ రాజకీయాలను ఆ దేవుళ్లు, దేవతలు ఎలా భరిస్తున్నారో కదా !

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts
Newer posts →

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • వెనెజులాపై దాడి, మదురో కిడ్నాప్‌ -అమెరికా అసలు లక్ష్యం చైనా !
  • విస్మృత ఆదివాసీకి తొలిసారి పట్టంగట్టిన కేరళ కమ్యూనిస్టులు, శబరిమల బంగారం దొంగలు సోనియా గాంధీతో భేటీ !
  • నైజీరియాపై అమెరికా క్షిపణులు: ” శాంతి ” దూత డోనాల్డ్‌ ట్రంప్‌ చేయించిన తొమ్మిదవ దాడి !
  • ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !
  • జర్మన్‌ హిట్లర్‌ బాటలో శాస్త్రవేత్తలను బయటకు పంపుతున్న ట్రంప్‌ !

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 247 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d