ఫాసిస్టు వ్యతిరేక పోరాటం – ఫ్రెంచి ఎన్నికల్లో వామపక్షాలు నేర్పిన పాఠం ఏమిటి !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఈ ఏడాది ప్రపంచంలో 50కి పైగా దేశాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటి వరకు 25దేశాల్లో పాలకులు మారారు. ఆ పరంపరలో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ చేరాయి. రెండు చోట్లా మధ్యంతర ఎన్నికలు జరిగాయి, అనూహ్య, ఉత్తేజం కలిగించే పరిణామాలు సంభవించాయి. అధ్యక్ష తరహా పాలన ఉన్న ఫ్రాన్సులో హంగ్‌ పార్లమెంటు ఏర్పడింది. నాలుగు కూటములు, అనేక స్వతంత్ర పార్టీలు పోటీ పడినా ఏ కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యలో సీట్లు తెచ్చుకోలేదు. పార్లమెంటులోని 577 స్థానాలకు గాను వామపక్షాల కూటమి 188సీట్లతో పెద్ద పక్షంగా అవతరించింది. ఫాసిస్టు శక్తుల ముప్పు తప్పింది. బ్రిటన్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘనవిజయం సాధించింది అనటం కంటే టోరీ(కన్సర్వేటివ్‌) పార్టీ చరిత్రలో తొలిసారిగా ఓటర్ల చేతిలో ఊచకోతకు గురైంది, అతి తక్కువ సీట్లు తెచ్చుకుంది. ఈ ఘనత భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ ఏలుబడిలో జరిగింది. పార్లమెంటులోని 650 సీట్లకు గాను లేబర్‌ పార్టీ 411తో తిరుగులేని మెజారిటీ సాధించింది. ఫ్రెంచి పార్లమెంటు ఎన్నికల తొలిదశలో ఫాసిస్టు శక్తులది పైచేయిగా ఉండటమే కాదు,ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 289 సీట్ల కంటే ఎక్కువగా 297 స్థానాలలో ప్రధమ స్థానంలో ఉంది. పచ్చి మితవాద నేషనల్‌ రాలీ-ఆర్‌ఎన్‌ (గతంలో నేషనల్‌ ఫ్రంట్‌) ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో 31శాతం ఓట్లతో విసిరిన సవాలుతో అధ్యక్షుడు మక్రాన్‌ పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు తెరతీశాడు. ఈ ఎన్నికల తొలిరౌండులో 33.21శాతం తెచ్చుకుంది.రెండవ రౌండ్‌లో 37.06శాతానికి పెంచుకుంది.వామపక్షాలతో కూడిన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(ఎన్‌ఎఫ్‌ఇ) తొలి దఫా 28.21శాతం తెచ్చుకోగా మలి దశలో 25.81శాతం పొందింది. అధికారపక్షమైన టుగెదర్‌ కూటమి 21.28 నుంచి 24.53శాతానికి పెంచుకుంది.


పార్లమెంటులోని 577 స్థానాలకు గాను జూన్‌ 30న జరిగిన ఎన్నికల్లో 76 నియోజకవర్గాలలో ఫలితాలు తేలాయి. ఆర్‌ఎన్‌ పార్టీ 37, వామపక్ష కూటమి 32, అధికార పక్షం రెండు స్థానాలు గెలుచుకున్నాయి. ఇతరులు ఐదు చోట్ల గెలిచారు. మిగిలిన స్థానాలకు ఏడవ తేదీన పోలింగ్‌ జరిగింది. త్రిముఖ పోటీ జరిగితే దేశ చరిత్రలో తొలిసారిగా పచ్చిమితవాదులు అధికారాన్ని కైవశం చేసుకుంటారని తేలింది. ఈ ముప్పును తప్పించేందుకు విధానపరంగా ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ వామపక్ష కూటమి, అధికార పార్టీ ఒక అవగాహనకు వచ్చాయి. అదేమంటే ఆర్‌ఎన్‌ పార్టీ ఆధిక్యత ఉన్న చోట రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థికి అనుకూలంగా మూడవ అభ్యర్థి ఉపసంహరించుకొని మద్దతు ఇవ్వటంతో ఫాసిస్టు పార్టీ ఓట్ల రీత్యా పెద్దదిగా ఉన్నా సీట్లలో మూడవ స్థానానానికి పడిపోయింది. రెండవ దశలో సీట్ల సర్దుబాటు కారణంగా వామపక్ష కూటమి, అధికార కూటమి లబ్ది పొందాయి. వామపక్ష సంఘటనలో ఉన్న పార్టీలకు గతంలో 130 ఉండగా ఈ సారి 188, అధికార ఐక్యత కూటమికిి 245 నుంచి 161కి పడిపోగా ఆర్‌ఎన్‌ పార్టీ కూటమికి 89 నుంచి 142కు పెరిగాయి. ప్రస్తుతానికి ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ముప్పు తప్పినా ఓట్లపరంగా 37శాతానికి పెంచుకోవటం ప్రమాదకరపరిణామం. వామపక్ష కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి అధికార ఐక్యత కూటమి మద్దతు ఇవ్వటం లేదా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి కావటం తప్ప మరొక మార్గం లేదు. ఈ పరిణామంతో రానున్న రోజుల్లో అనేక అంశాలపై మక్రాన్‌ వైఖరిలో మార్పులు కూడా ఉంటాయని భావిస్తున్నారు.


ఫలితాల్లో ఫాసిస్టు పార్టీ అధికారానికి రాదనే తీరు కనిపించగానే పారిస్‌తో సహా దేశమంతటా జనం వీధుల్లోకి వచ్చారు. సంతోషం, ఆనందంతో కన్నీటి బాష్పాలు రాల్చారు.ఫలితాల మీద తొలి ప్రకటన వెలువడగానే ఎదురుగా ఉన్న వారు పరిచితులా, అపరిచితులా అన్నదానితో నిమిత్తం లేకుండా ఎవరుంటే వారిని వారిని హత్తుకున్న దృశ్యాలు కనిపించాయి. నిమిషాల తరబడి చప్పట్లు చరిచారు. ఫాసిస్టు శక్తులను ఓడించేందుకు పరస్పర విరుద్ద వైఖరులతో పని చేస్తున్న పార్టీలు ఐక్యమైనపుడు విబేధాలను పక్కన పెట్టి అదే జనం మద్దతు ఇచ్చి గెలిపించినపుడు ఇలాంటి దృశ్యాలు ఆశ్చర్యం కలిగించవు. ఐరోపా పార్లమెంటు, తొలిదశ ఎన్నికల్లో ఫాసిస్టు పార్టీ పెద్దదిగా అవతరించటంతో ఆందోళనకు గురైన అనేక మంది బరువు దించుకున్నారు. మరోవైపు ఫాసిస్టు పార్టీ అభిమానులు చిక్కినట్లే చిక్కి అధికారం దూరమైందన్నట్లుగా తీవ్ర ఆశాభంగం చెందారు.అయినా తమ కూటమి ప్రతిసారీ బలం పెంచుకుంటున్నదని సంతృప్తిని కూడా వెల్లడిస్తున్నారు. 2027లో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఏ కూటమి కూడా పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రకటించిన విధానాల నుంచి వైదొలిగే అవకాశాలు ఉండవు. ప్రజలిచ్చిన తీర్పుతో ఫ్రెంచి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతాయా, మక్రాన్‌ సర్కార్‌కు కొత్త ప్రభుత్వం గుదిబండగా మారుతుందా ? విదేశీ, అంతర్గత విధానాలపై మక్రాన్‌తో వామపక్షాలు విబేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అనేక సందేహాల మీద చర్చ ప్రారంభమైంది. ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధాని గాబ్రియెల్‌ అతల్‌ రాజీనామా లేఖను పంపాడు. దాన్ని తాను ఆమోదించటం లేదని మక్రాన్‌ ప్రకటించాడు.ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశాన్ని తమకే ఇవ్వాలని, ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్దంగా ఉన్నామని వామపక్ష కూటమి నేత జీన్‌ లక్‌ మెలెన్‌చోన్‌ ప్రకటించాడు. తాము గెలిస్తే హమస్‌ అణచివేత పేరుతో మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే వైఖరి ఉపసంహరించుకుంటామని, జనానికి ఉపశమనం కలిగించేందుకు భారీ మొత్తంలో ప్రభుత్వ ఖర్చు పెంచుతామని వామఫక్షాలు ఎన్నికల ప్రణాళికల్లో వాగ్దానం చేశాయి. వామపక్షాల తీరు తీవ్రంగా ఉందని, ప్రభుత్వ ఖర్చు పెంచేందుకు అవసరమైన నిధులు కొన్ని సంపద పన్ను, అధికాదాయం వచ్చేవారి మీద పన్ను పెంపుదల వంటి అంశాలను అమలు జరిపితే దేశం నాశనం అవుతుందని, ఇప్పటికే దేశం అప్పుల ఊబిలో ఉందని మక్రాన్‌ వ్యాఖ్యానించాడు.


అనూహ్యంగా పెద్ద కూటమిగా అవతరించిన వామపక్ష న్యూ పాపులర్‌ ఫ్రంట్‌(ఎన్‌ఎఫ్‌పి) గురించి అనేక మందిలో ఆసక్తి నెలకొన్నది, ఇది ఫాసిస్టు శక్తులను మట్టి కరిపించింది.ఐరోపాలో ఇలాంటి శక్తుల వ్యతిరేకులకు ఒక దారి చూపిందంటే అతిశయోక్తి కాదు. కొన్ని అంశాలపై తేడాలతో గతేడాది అక్టోబరులో వామపక్ష ఫ్రంట్‌ విడిపోయింది.ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో ఆర్‌ఎన్‌ పార్టీ పెద్దదిగా అవతరించటం, అధ్యక్షుడు మక్రాన్‌ పార్లమెంటు రద్దు చేయటంతో తలెత్తిన నూతన పరిస్థితుల్లో వామపక్షాలు తమ విబేధాలను పక్కన పెట్టి జూన్‌ 13న ఎన్‌ఎఫ్‌పి ఏర్పాటుకు అంగీకరించాయి. దీనికి ఒక చారిత్రక నేపధ్యం ఉంది. ఫాసిజానికి వ్యతిరేకంగా 1930దశకంలో పాపులర్‌ ఫ్రంట్‌ ఏర్పడింది, ఆ పేరుకు న్యూ(కొత్త) అని చేర్చారు నెల రోజుల్లోనే పెద్ద పక్షంగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీనిలో నాలుగు పార్టీలు ఉన్నాయి. కూటమిలో 75 సీట్లు ఫ్రాన్స్‌ అన్‌బౌవ్‌డ్‌ -తలవంచని పార్టీ (ఎల్‌పిఐ)కు వచ్చాయి. ఇది సోషలిస్టు పార్టీ నుంచి విడిపోయిన వారితో ఏర్పడింది. భావజాలంలో కమ్యూనిస్టు పార్టీ కంటే తక్కువ సోషలిస్టు పార్టీ కంటే ఎక్కువ అంటే మధ్యస్థంగా ఉంటుందని విశ్లేషకులు వర్ణించారు. రెండవది 65 సీట్లు తెచ్చుకున్న సోషలిస్టు పార్టీ. దీన్ని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీగా పేర్కొంటారు. మూడవ పక్షం ది ఇకోలజిస్ట్స్‌(ఎల్‌ఇ)-పర్యావరణ పార్టీ, దీనికి 33 స్థానాలు వచ్చాయి.నాలుగవది ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ. దీనికి తొమ్మిది స్థానాలు వచ్చాయి. సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల సోషలిస్టు సమాజాలను కూల్చివేసిన తరువాత పార్టీ బలహీనపడినప్పటికీ ఇతర దేశాలలో కమ్యూనిస్టుల మాదిరి తన ఉనికిని కాపాడుకుంటున్నది. మరికొన్ని చిన్న పార్టీలు కూడా దీనిలో ఉన్నాయి. అధ్యక్షుడు మక్రాన్‌ విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్న ఈ కూటమితో అతగాడి నాయకత్వంలోని మితవాద కూటమి కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, బయట ఉండి మద్దతు ఇస్తుందా అన్నది స్పష్టం కాలేదు. ఫాసిస్టులకు వ్యతిరేకంగా రెండు కూటములు ఎన్నికల సర్దుబాటు చేసుకున్నాయి.


ముందే చెప్పుకున్నట్లు బ్రిటన్‌లో కూడా కొన్ని నెలల ముందే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి.పద్నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టోరీ(కన్సర్వేటివ్‌ పార్టీ)ని ఓటర్లు ఊచకోత కోశారని కొందరు వ్యాఖ్యానించారు. రిషి సునాక్‌ను నేతగా ఎన్నుకొని తప్పుచేశామని అనేక మంది టోరీలు తలలు పట్టుకుంటున్నారు.గడచిన వందేండ్లలో ఇంత తక్కువ సీట్లు ఎప్పుడూ రాలేదని అంటున్నారు. పొదుపు చర్యల పేరుతో అమలు జరిపిన విధానాలతో జనజీవితం అతలాకుతలం అయింది. అందుకనే ఈ సారి 650 స్థానాలకు గాను ఆ పార్టీకి 53 నుంచి 131 మధ్యలో సీట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో పేర్కొనగా 121 వచ్చాయి.గతంలో ఉన్నవాటిలో 251 స్థానాలను కోల్పోయారు. మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌,పన్నెండు మంది మంత్రులు మట్టికరిచారు.ఆశ్చర్యం ఏమిటంటే మూడవ పక్షమైన లిబరల్‌ పార్టీ ఈ ఎన్నికల్లో పదకొండు నుంచి 72 స్థానాలకు తన బలాన్ని పెంచుకుంది. టోరీ ప్రధానులుగా పనిచేసిన డేవిడ్‌ కామెరాన్‌, థెరెసా మే ప్రాతినిధ్యం వహించిన స్థానాలను ఈ పార్టీ కైవశం చేసుకుంది.ఈ ఎన్నికలు మరొక రికార్డును కూడా సృష్టించాయి. 1918 తరువాత రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు 57.4 శాతమే. లేబర్‌ పార్టీ 33.7శాతం ఓట్లతో 411 సీట్లు(63.2శాతం) తెచ్చుకోగా టోరీ 23.7శాతం ఓట్లు, 121 సీట్లు(18.6శాతం) తెచ్చుకున్నాయి. గ్రీన్స్‌ పార్టీకి 6.7శాతం ఓట్లు వచ్చినప్పటికీ కేవలం నాలుగు స్థానాలు(0.6శాతం) మాత్రమే వచ్చాయి. రిఫామ్‌(సంస్కరణ) యుకె పార్టీకి లిబరల్స్‌ కంటే ఎక్కువగా 14.3శాతం ఓట్లు వచ్చినా కేవలం 5(0.8శాతం) సీట్లు వచ్చాయి. డెమోక్రటిక్‌ యూనియనిస్టు పార్టీకి కూడా ఐదు సీట్లు వచ్చినా దానికి వచ్చిన ఓట్లు కేవలం 0.6శాతమే ఈ తీరును చూసిన కొందరు ఎన్నికల సంస్కరణలు అవసరమని సూచించారు.బ్రిటన్‌ పార్లమెంటు చరిత్రలో అధికారానికి వచ్చిన పార్టీ తక్కువ ఓట్లు తెచ్చుకోవటం ఒక రికార్డు, దాన్ని లేబర్‌ పార్టీ సొంతం చేసుకుంది.మూడు ప్రధాన పార్టీలకు 69.6 శాతం ఓట్లు 92.9 శాతం సీట్లు వచ్చాయి. చిన్న పార్టీలు ఓట్లు గణనీయంగా తెచ్చుకున్నట్లు ఈ గణాంకాలు వెల్లడించాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 7.4శాతం తగ్గి 59.9శాతం ఓట్లు పోలయ్యాయి. దీన్ని బట్టి ఓటర్లు ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదన్నది స్పష్టమైంది. లేబర్‌ పార్టీ గత ఎన్నికల కంటే కేవలం 1.7శాతం, లిబరల్‌ పార్టీ 0.6శాతం మాత్రమే అదనంగా తెచ్చుకోగా టోరీలు 19.9శాతం కోల్పోయారు.అధికారంలోకి లేబర్‌ పార్టీ వస్తుందా లేదా అన్నదాని కంటే టోరీ పార్టీని వదిలించుకోవాలని ఓటర్లు భావించినట్లు ఈ అంకెలు స్పష్టం చేశాయి.


లేబర్‌ పార్టీ పెద్ద విజయాన్ని సాధించగానే సమస్యలన్నీ పరిష్కారమైనట్లు భావించనవసరం లేదు. దాని ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.ప్రతిపక్షంలో ఉండగా పౌరుల కోసం కడవల కొద్దీ కన్నీరు కార్చే లేబర్‌ పార్టీ నేతలు అధికారానికి వచ్చిన తరువాత జనాన్ని మరచిపోతారనే నానుడి ఉంది. గతంలో అది నిరూపితమైంది. దాని నేత కెయిర్‌ స్టామర్‌ కార్పొరేట్లకు అనుకూలమనే అభిప్రాయం ఉంది. దీనికి అనుగుణంగానే ఫలితాలు వెలువడిన తరువాత తొలిరోజు స్టాక్‌మార్కెట్‌ సూచీ0.86పెరిగిందన్నది ఒక అభిప్రాయం.ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ది కేవలం 0.6శాతమే పెరగ్గా ధరలు రెండు పెరిగాయి. ఇతర అభివృద్ది చెందిన దేశాలతో పోలిస్తే కరోనాకు ముందున్న ఉత్పాదకత, పెట్టుబడి రేట్లు తక్కువగా ఉన్నాయి. 1980దశకంలో పెట్టుబడి రేటు 23శాతం ఉండగా రెండువేల సంవత్సరం నుంచి 17శాతానికి అటూ ఇటూగా ఉంది. అదే ఇతర జి7 దే శాలలో 20-25శాతంగా ఉంది.ఆదాయపన్నుతో సహా ఇతర పన్నులేవీ పెంచబోమని లేబర్‌ పార్టీ ఎన్నికల్లో చెప్పింది. పెంచకపోతే మరింత అప్పులపాలౌతామని, స్పష్టంగా వైఖరిని వివరించాలని టోరీల నేత రిషి సునాక్‌ పదే పదే లేబర్‌ పార్టీ నేతలను ప్ర శ్నించాడు. ప్రస్తుతం జిడిపితో పోలిస్తే 100శాతం అప్పుల్లో,ద్రవ్యలోటుతో బ్రిటన్‌ ఉంది.దాన్ని అధిగమించాలంటే జనాన్ని పన్నులతో బాదాలని టోరీలు చెబుతున్నారు. జనంలో వ్యతిరేకత కనిపించటంతో మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ సర్కార్‌ పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నది. గత పద్నాలుగు సంవత్సరాలుగా ఏదో ఒక పేరుతో ప్రభుత్వ రంగ సిబ్బందికి వేతనాలను స్థంభింపచేశారు. కార్మిక సంఘాలన్నీ లేబర్‌ పార్టీ నిర్వహణలో ఉన్నందున వేతన సమస్య ప్రధానంగా ముందుకు రానుంది. దేశంలోని అతి పెద్ద థేమ్స్‌ నీటి కంపెనీ అప్పులపాలైంది.అయినా వాటాదార్లకు డివిడెండ్లు చెల్లిస్తున్నది. దివాలా తీసే స్థితిలో ఉన్నదాన్ని నిలబెట్టటం ఒక సమస్య. దీన్ని జాతీయం చేయవచ్చని, అందుకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. జైళ్లన్నీ 99శాతం నిండి ఉన్నాయి.న్యాయవ్యవస్థ విఫలమైందనే విమర్శకూడా ఉంది. నేరాలను ఎలా తగ్గించాలనేదాని కంటే కొత్తగా జైళ్ల నిర్మాణం గురించి పాలకులు ఆలోచిస్తున్నారు.విశ్వవిద్యాలయాల నిర్వహణ ఖర్చు పెరిగింది, 2012తరువాత ట్యూషన్‌ ఫీజులను పెంచలేదు.విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా తగ్గుతున్నారు.దీంతో వాటి రాబడి పడిపోతున్నది.బ్రిటన్‌ పెద్ద సమస్యల్లో ఇదొకటి. ఆరోగ్య రంగ బడ్జెట్‌లోటులో ఉంది.చికిత్సకు పట్టే వ్యవధి రోజు రోజుకూ పెరుగుతోంది, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి.సేవలను మెరుగుపరచాల్సి ఉంది.టోరీల పొదుపు చర్యల కారణంగా స్థానిక సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. 2018 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సంస్థలు దివాలా ప్రకటించాయి.ప్రస్తుతం ప్రతి ఐదింటిలో ఒకటి అదే బాటలో ఉన్నది.ఈ పూర్వరంగంలో లేబర్‌ పార్టీ ముందు పెద్ద సవాలే ఉంది.

ఐఎంఎఫ్‌ భారాలకు కెన్యాలో ప్రతిఘటన !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


జనంపై భారాలు మోపుతూ పార్లమెంటు ఆమోదించిన విత్త బిల్లుకు వ్యతిరేకంగా జూన్‌ 25న కెన్యాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా 26 మంది కాల్పుల్లో మరణించగా అనేక మంది గాయపడినట్లు దేశ మానవహక్కుల కమిషన్‌ ప్రకటించింది.మృతుల సంఖ్య 30దాటినట్లు వార్తలు వచ్చాయి.దేశ పార్లమెంటు భవనానికి నిరసనకారులు నిప్పు పెట్టటంతో సహా అనేక చోట్ల లూటీలు, దహనకాండకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో బిల్లుపై తాను సంతకం పెట్టటం లేదంటూ అధ్యక్షుడు విలియమ్స్‌ రూటో ప్రకటించాడు. అయినప్పటికీ నమ్మకం లేక రాజీనామా చేయాలని కోరుతూ జూలై రెండున తిరిగి ప్రదర్శనలకు పిలుపు ఇచ్చారు. రాజధాని నైరోబీలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకులను బ్రెట్టన్‌ ఉడ్‌ కవలలు అంటారు. అక్కడ జరిగిన సమావేశాల్లో అవి పుట్టాయిగనుక ఆ పేరు వచ్చింది.ప్రజాకంటకుల పుట్టుక కూడా మామూలుగానే జరిగినప్పటికీ వారు పెరిగి పెద్దవారైన తరువాత మాత్రమే సమాజానికి ముప్పుగా చివరకు జనం చేతిలో తుప్పుగా మారతారు.కానీ ఈ కవలలు అలాంటివి కాదు. పుట్టుకతోనే వాటి దగ్గరకు వెళ్లిన దేశాలకు స్పాట్‌ పెడుతున్నాయి.ప్రపంచ బ్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తమ విధానాలకు ముఖ్యంగా విద్యుత్‌ సంస్కరణలకు ఒక ప్రయోగశాలగా మార్చిన సంగతి తెలిసిందే. వాటికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమం, పర్యవసానంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పరాజయం పాలైన విషయాన్నీ వేరే చెప్పనవసం లేదు.


ఆఫ్రికా ఖండంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఒక దేశం కెన్యా. హిందూ మహాసముద్ర తీరంలో ఉన్న ఈ దేశ జనాభా 5.22 కోట్లు. రాజధాని నైరోబీ. ఐరోపా సామ్రాజ్యవాదుల వలసగా ఉంది. బ్రిటీష్‌ పాలకులు తొలుత తమ రక్షక ప్రాంతంగా, తరువాత వలసగా మార్చారు.1952 నుంచి ప్రారంభమైన మౌమౌ విప్లవంగా పిలిచిన ఉద్యమం కారణంగా 1963లో స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది.ఆఫ్రికాలో ఆర్థికంగా అభివృద్ధి, ప్రజాస్వామిక వ్యవస్థతో స్థిరంగా ఉన్న దేశంగా చెబుతారు.అలాంటిది గతంలో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనాలపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా మరణించారని, నేరస్థ ముఠాల చేతుల్లో గితురాయి అనే చోట250 మంది మరణించినట్లు, వారి మృత దేహాలను కూడా లభ్యం కావటం లేదని, అనేక మంది అపహరణలకు గురైనట్లు వార్తలు వచ్చాయి.పౌరులపై భారాలను మోపే ఆర్థిక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన వెంటనే ఆందోళన తలెత్తింది. దాంతో బిల్లును నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించినప్పటికీ నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది. అతగాడి మాటల మీద తమకు నమ్మకం లేదంటూ రూటో రాజీనామా చేసి గద్దె దిగాల్సిందేనంటూ యువత అనేక పట్టణాల్లో ప్రదర్శనలు జరిపింది. మిలిటరీ కవాతులతో భయపెట్టాలని చూసినా బెదరటం లేదు. మరో శ్రీలంకగా మారినా ఆశ్చర్యం లేదు.


ఎందుకీ పరిస్థితి వచ్చింది ? దేశం అప్పులపాలైంది. దేశ, విదేశీ అప్పు 80 బిలియన్‌ డాలర్లు దాటింది. వాటిని గడువులోపల తీర్చే పరిస్థితి కనిపించటం లేదు.దివాలా ప్రకటిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. దాంతో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు దగ్గరకు వెళ్లింది. మేం చెప్పిన షరతులకు అంగీకారం తెలిపితే ఇబ్బందుల నుంచి బయటపడవేస్తామని అవి చెప్పాయి. ఆ మేరకు ప్రభుత్వం 2021లో ఒప్పందం చేసుకుంది. బ్రెట్టన్‌ఉడ్‌ కవలలు, ఇతర అంతర్జాతీయ సంస్థలన్నీ ముందుగా అప్పెలా తీరుస్తారో చెప్పమంటాయి. వెంటనే, మీరేమీ చెప్పలేరుగానీ మేం చెప్పినట్లు చేయండి, వాటికి మీ పేరు పెట్టుకోండి అంటాయి. ఇదిగో అలాంటి ఒప్పందంలో భాగంగానే కెన్యా పార్లమెంటు ఆమోదించిన 2024 విత్త బిల్లు.దాని ప్రకారం నిత్యావసర వస్తువులు, పిల్లలకు మార్చే డైపర్లతో సహా అనేక వస్తువులపై ఎడాపెడా పన్నులను పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే పెరిగిన నిరుద్యోగం, ధరల పెరుగుదలతో అతలాకుతలంగా ఉన్న పరిస్థితి మరింత దిగజారనుందనే భయంతో జనం నిరసనలకు దిగారు. ఆగ్రహం ఎలా ఉందంటే పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు.ఎంపీలందరూ బతుకు జీవుడా అంటూ పారిపోయారు.అయినా తగ్గేదే లే అన్నట్లుగా అధ్యక్షుడి వైఖరి ఉండటంతో ఆందోళన విస్తరించింది.దాంతో బిల్లు మీద సంతకం చేయటం లేదని ప్రకటించాడు. ఇదంతా ఒక నాటకమని, వ్యవధి తీసుకొనేందుకు వేసిన పాచిక అని చెబుతున్నారు.నిజానికి జనంలో ఆగ్రహం ఇప్పటికిప్పుడు పెరిగింది కాదు. కరోనాకు ముందు పరిస్థితి దిగజారటం ప్రారంభమైంది, కరోనా మరింత దెబ్బతీసింది. అనేక మంది యువతకు ఉపాధిపోయింది. గతేడాది వేసవిలోనే పన్నుల వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఉపాధి, పరిశ్రమలు పెద్దగా పెరగకపోయినా అనేక దేశాల్లో విదేశీ సంస్థలు ఇచ్చే రుణాలు, వాటితో పాటు దొరకే ముడుపులకు ఆశపడి ఆర్థిక వ్యవస్థ అవసరాలతో నిమిత్తం లేకుండా పెద్ద ఎత్తున రోడ్ల వంటి మౌలిక సదుపాయాలకు గాను దొరికిన మేర అప్పులు చేసిన దేశాలలో కెన్యా ఒకటి.రెండువేల సంవత్సరాల ప్రారంభంలో విదేశాల నుంచి తీసుకున్న భారీ మొత్తాలను ఆర్థిక వృద్దికి ఖర్చు పెట్టలేదు.దానికి తోడు వరదలు, కరోనా జతకలిశాయి.


దివాలా కోరు ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న అన్ని వర్ధమాన దేశాల మాదిరే కెన్యా కూడా ఉంది.ప్రపంచంలో మూడు వందల కోట్ల మంది జనాభా ఉన్న దేశాలు ప్రజారోగ్యం, వైద్యం వంటి వాటికి చేస్తున్న ఖర్చు కంటే రుణాల అసలు, వడ్డీలు తీర్చటానికి ఎక్కువ మొత్తాలను ఖర్చు చేస్తున్నట్లు ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు బినాయిఫెర్‌ నౌరోజీ చెప్పాడు. వలసవాద అవశేషాలు, అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, విత్త దుర్వినియోగం. పెరిగిన ఆర్థిక, తెగల మధ్య అసమానతల వంటి అంశాలు కెన్యాను పట్టిపీడిస్తున్నాయి. వీటన్నింటినీ తొలగించి మంచి రోజులను తెస్తానంటూ అనేక సంవత్సరాలు మంత్రిగా, ఐదేండ్ల పాటు ఉపాధ్యక్షుడిగా పని చేసిన విలియం రూటో 2022 ఎన్నికల్లో అధ్యక్షుడయ్యాడు. రెండు సంవత్సరాల్లోనే తన నిజస్వరూపాన్ని ప్రదర్శించి ప్రజా వ్యతిరేకిగా రుజువు చేసుకున్నాడు. తాజా విత్త బిల్లును ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఉద్దేశించారు. దానికి గాను పొదుపు అని ముద్దు పేరు పెట్టారు. చూడండి నా కార్యాలయ ఖర్చుకే కోతపెడుతున్నా అంటూ రూటో ప్రకటించాడు. ఇదంతా జనం మీద మోపే భారాలకు నాంది. ప్రపంచంలో పొదుపు చర్యలు ఎక్కడ తీసుకున్నప్పటికీ తొలుత కోతల వేటు పడేది సామాన్యులు, వారికి ప్రభుత్వం చేసే ఖర్చుల మీదే.అన్నింటికీ ఒక్కసారే కోతపెడితే జనం సహించరు. చేదు మాత్రను మింగించటం అలవాటు చేసినట్లుగా దశల వారీ మొదలు పెడతారు. కెన్యా రాబడిలో 60శాతం రుణాలు తీర్చేందుకే పోతోంది. అందువలన నేరుగా చేసే నగదు బదిలీల మొత్తాల కోత, చివరకు బడి పిల్లల మధ్యాహ్న భోజనఖర్చునూ తగ్గించనున్నారు.


పశ్చిమ దేశాలకు, ప్రత్యేకించి అమెరికా తొత్తుగా అధ్యక్షుడు విలియమ్‌ రూటో వ్యవహరిస్తున్నాడడని కెన్యా కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది. గద్దె దిగేవరకూ ఆందోళన చేస్తామని ప్రకటించింది. రాజీనామా మినహా మరొకదాన్ని అంగీకరించేది లేదంది. గాజాలో మారణకాండ జరుపుతున్న యూదు దురహంకార ఇజ్రాయెల్‌ పాలకులకు, ఉక్రెయిన్‌ వివాదంలో నాటోకు మద్దతు ఇచ్చాడు. ఇటీవల కెన్యాను నాటో ఏతర భాగస్వామిగా ప్రకటించారు. సిఐఏ అల్లుతున్న కతలన్నింటినీ వల్లిస్తున్నాడు. అమెరికా మిలిటరీ కార్యకలాపాలకు మండా అనే దీవిని అప్పగించాడు. దేశీయంగా ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరుపుతున్నట్లు కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. ఒకసారి పార్లమెంటు ఆమోదించిన బిల్లును వెనక్కు తీసుకోవటానికి రాజ్యాంగం అనుమతించదని, ఒక వేళ అధ్యక్షుడు వెనక్కు పంపితే మూడింట రెండువంతుల మెజారిటీతో ప్రతిపాదనను ఆమోదిస్తే అది చట్టమై కూర్చుంటుందని చెప్పింది. పార్లమెంటు బిల్లును ఆమోదించిన తరువాత 14రోజుల్లో అధ్యక్షుడు ఆమోదం తెలపాల్సి ఉంటుంది, లేదా సవరణలు చేయాలంటూ వెనక్కు పంపాలి.


రొట్టెలపై 16,వంటనూనెలపై 25శాతం పన్ను ప్రతిపాదించారు.ఆర్థిక లావాదేవీలపై దశలవారీ పన్ను పెంపుదల, మోటారు వాహనాల ధరలో రెండున్నరశాతం ప్రతి ఏటా పన్ను కొత్తగా విధింపు, పర్యావరణానికి హాని కలిగించే వృధా ఉత్పత్తులపై పన్ను ప్రతిపాదించారు. దీనిలోనే దిగుమతి చేసుకొనే ఎలక్ట్రానిక్‌ వస్తువులు, శానిటరీ పాడ్‌ల మీద పన్ను ప్రతిపాదించారు. జిఎస్‌టి 16శాతం, ఆసుపత్రుల్లో వాడే పరికరాలు, నిర్మాణ సామగ్రి మీద కూడా పన్ను ప్రతిపాదించారు.ఉద్యోగుల వేతనాలపై గరిష్ట పన్ను మొత్తాన్ని 30 నుంచి 35శాతానికి పెంచగా, కొత్తగా 1.5శాతం ఇంటి పన్ను, వైద్య బీమా పేరుతో 2.75శాతం, ఇంథనంపై ఎనిమిదిశాతంగా ఉన్న పన్నును 16శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. పన్నుల పెంపుదల బాధాకరమే అయినప్పటికీ మన స్వాతంత్య్ర సమర యోధులు గర్వపడాలంటే జనం త్యాగాలు చేయాల్సి ఉంటుందని అధ్యక్షుడు సమర్ధించుకున్నాడు. తనకు గత ప్రభుత్వం నుంచి 65 బిలియన్‌ డాలర్ల అప్పు వారసత్వంగా వచ్చిందన్నాడు. రానున్న కాలంలో పన్ను వసూలు రోజులను కూడా పాటించాల్సి ఉంటుందేమో అంటూ జోకులు వేశాడు. ఏడాది కాలంలో 40సార్లు విదేశీ పర్యటనలు జరిపిన రూటో అట్టహాసంగా ఎంతో ఖర్చు చేశాడు. ఎందుకీ పర్యటనలు అంటే పెట్టుబడుల సాధన, ఉద్యోగఅవకాశాలను వెతికేందుకు అని సమర్ధించుకున్నాడు.ఇదే సమయంలో అనేక సంస్థలు మూతబడి వేలాది మందికి ఉపాధి పోయింది.రానున్న రోజుల్లో ఇంకా కార్యకలాపాలను కుదించవచ్చని కెన్యా యజమానుల సంఘం పేర్కొన్నది.జనం దగ్గర డబ్బులేక రోజుకు ఏడువందల గ్యాస్‌ సిలిండర్లు అమ్మేతాను ప్రస్తుతం రెండువందలకు పడిపోయినట్లు, తన దగ్గర ఉన్న సిబ్బందిని ఆ మేరకు తగ్గించినట్లు ఒక సంస్థ యజమాని చెప్పాడు. ప్రభుత్వ సిబ్బంది పన్ను వసూలు పేరుతో వ్యాపారులను వేధిస్తున్నట్లు చెప్పాడు. గత పాలకుల హయాంలో జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, జనాన్ని పట్టించుకోకపోవటం వంటి అంశాలను తీసుకొని తాము వస్తే మంచి రోజులు తెస్తామని చెప్పి, అంతకంటే ఎక్కువ భారాలు మోపిన వారిని చరిత్రలో ఎందరో ఉన్నారు. శ్రీలంకలో తాము అభిమానించిన దేశాధ్యక్షుడినే జనం చివరకు తరిమి కొట్టిన తీరును చూశాము. కెన్యాలో ప్రతిపాదించిన భారాలను రద్దు చేస్తే సరే లేకుంటే ఏం జరుగుతుందో చెప్పలేము.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పలుకుబడి, ప్రతిష్ట, నరేంద్రమోడీ చిత్తశుద్ధికి పోలవరం ఒక పెద్ద సవాలు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఒకటి. అప్పులు చేయటంలో నరేంద్రమోడీ అంతకు ముందున్న ప్రధానుల రికార్డులను తునాతునకలు చేశారు. 2023 మార్చి 31నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు మొత్తం రు.152,61,122 కోట్ల 12లక్షలకు చేరుతుందని, అది 2024 మార్చి 31కి రు.169,46,666 కోట్ల 85లక్షల కోట్లకు చేరుతుందని నిర్మలమ్మగారి బడ్జెట్‌ పత్రాల్లో ఉంది. వర్తమానంలో మరో 16-17లక్షల కోట్లు అప్పు చేయనున్నారు. అందువలన పోలవరానికి నిధుల సమస్య ఉండదని, చంద్రబాబు అడగాలే గానీ ఎంత కావాలంటే అంత ఇస్తారని అందరూ భావిస్తున్నారు.అది సాకారం కావాలని కోరుకుందాం. గడచిన పది సంవత్సరాలలో జరిగిన పోలవరం ప్రాజక్టు నిర్మాణం-సంభవించిన నష్టం, ప్రస్తుత పరిస్థితి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్‌ 28న శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి చెప్పాయి. పునరుద్దరణే కాదు, సంక్షేమ పధకాలను మరింతగా అమలు చేస్తామని వాగ్దానం చేశాయి. అలవిగాని హామీలు ఇచ్చిన తెలంగాణా కాంగ్రెస్‌ వాటిని ఎలా అమలు చేయనుందో చెప్పాలని ఆ రాష్ట్ర బిజెపి డిమాండ్‌ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మీ కూటమి కూడా అంతకంటే ఎక్కువే వాగ్దానాలు చేసింది, వాటి సంగతేమిటంటే ఆ ఎన్నికల ప్రణాళికతో బిజెపికి సంబంధం లేదని నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఆంధ్రప్రదేశ్‌ బిజెపి నేతలకు కంటిచూపే తప్ప నోటమాట ఉండటం లేదు. మరీ గట్టిగా అడిగితే చంద్రబాబుకు ఉన్న అనుభవంతో అన్నింటినీ అమలు చేస్తారంటూ ఆయన మీద నెడుతున్నారు. ఇక్కడ పోలవరం ప్రాజక్టు శ్వేత పత్రంలోని అంశాలను చూద్దాం.


గోదావరి నదిపై రాజమండ్రి కాటన్‌ బారేజ్‌కు ఎగువన 42కిలో మీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లా రామయ్య పేట సమీపంలో బహుళార్ధసాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం జాతీయ హౌదా ఇవ్వక ముందే దీనికి అనుమతులతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని పనులు జరిగాయి. సముద్ర మట్టానికి 45.72 మీటర్ల ఎత్తున ఆనకట్ట నిర్మిస్తే 194.6టిఎంసిల నీటిని నిలువ చేయవచ్చని అంచనా. ఈ నీటితో 3.2లక్షల ఎకరాలు కుడి, నాలుగు లక్షల ఎకరాలకు ఎడమ కాలువ ప్రాంతంలో కొత్తగా సాగునీరు, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతంలోని 23.5లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణ, 80టిఎంసి నీటిని ప్రకాశం బారేజ్‌కు ఎగువన కృష్ణా నదికి మళ్లింపు, 960మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమలు, పరిసరాల్లో ఉన్న జనావాసాలకు 23.44 టీఎంసీల నీటి సరఫరా, కాలువలు వెళ్లే ప్రాంతాలలోని 540 గ్రామాలకు మంచి నీటి సరఫరా కలుగుతుంది. అందుకే దీన్ని జీవనాడిగా పరిగణిస్తున్నారు. పైన చెప్పుకున్న 80టిఎంసిల మళ్లింపు జలాలు వాడుకున్నందుకు గాను కృష్ణా నదీ జలాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ వాటా తగ్గుతుంది. ఈ నీటిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు 45,కర్ణాటకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసిలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణా విడిపోయినందున దానికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంది.పోలవరంపై బ్రిటీష్‌ వారి హయాంలో తొలిసారిగా 1941లో ప్రతిపాదన రాగా 1942-44 సంవత్సరాలలో ప్రాధమిక పరిశీలన జరిగింది. ఆనకట్ట ఎత్తు 170 నుంచి 208 అడుగులు ఉంటే 340 నుంచి 700 టిఎంసిల వరకు నీటిని నిల్వచేయవచ్చని చెప్పారు.ఇపుడు అంత ఎత్తుకు ఎగువ రాష్ట్రాలు అంగీకరించే ప్రసక్తే లేదు గనుక ఆ ప్రతిపాదన చరిత్రగా మిగిలింది. ప్రస్తుతం 150 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రంలో ఉన్న సంగతులు, వాటిని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రానున్న ఐదేండ్లలో సాకారం గురించి, ఇతర అంశాల గురించి చెప్పుకుందాం.
ఒక ప్రధాన సమస్య కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించినపుడే మొదలైంది, అదే పునరావాసం.ముందే చెప్పుకున్నట్లుగా ప్రాజక్టు నిర్మాణం ముందే ప్రారంభమైన కారణంగాగా 2014 ఏప్రిల్‌ ఒకటి నుంచి అప్పటి అంచనా ప్రకారం నీటి పారుదల(ఆనకట్ట, కాలువలు) నిమిత్తమయ్యే ఖర్చు నూటికి నూరుశాతం భరిస్తామని కేంద్రం చెప్పింది. దానిలో ప్రధానమైన ముంపు బాధితుల పునరావాసం, విద్యుత్‌ ప్రాజక్టు ఖర్చు లేదు. విద్యుత్‌ ప్రాజక్టుకు అయ్యే వ్యవయం రు.4,560 కోట్లే గనుక తామే భరిస్తామని నాటి తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించింది. పునరావాసానికి అయ్యే ఖర్చు తామే భరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితి శాతాల గురించి శ్వేత పత్రంలో దిగువ విధంగా పేర్కొన్నారు.
అంశం×××× 2019 మే××× 2024 మే
సివిల్‌ పని ×× 71.93 ××× 75.77
హెడ్‌ వర్క్స్‌ × 65.67 ××× 72.63
కాంక్రీటు ×× 91.14 ××× 92.75
ఎల్‌ఎంసి ×× 70.99 ××× 73.07
పునరావాసం× 18.66 ××× 22.55
ఖర్చురు.కోట్లు×16493.18××21489.71


దీని ప్రకారం రానున్న రోజుల్లో ప్రధానమైన సమస్యగా పునరావాసం ముందుకు రానుంది.ఆనకట్ట నిర్మాణం పూర్తి చేసిన తరువాత రిజర్యాయర్లో మునిగే ప్రాంతం, అక్కడి వారి పునరావాసం గురించి మాట్లాడకుండా శ్వేత పత్రంలోనూ, విడిగా చంద్రబాబు నాయుడు అశ్వద్ధామ కుంజరహ అన్నట్లుగా గత ఐదేండ్ల జగన్‌మోహన రెడ్డి పాలనలో జరిగిన తప్పిదాల గురించే పెద్ద ఎత్తున చర్చలోకి తీసుకువస్తున్నారు. శ్వేత పత్రంలో పునరావాసం గురించి ప్రస్తావించినప్పటికీ అందుకు అవసరమైన మొత్తాలను కేంద్రం నుంచి తెస్తారా, రాష్ట్రమే భరిస్తుందా అన్న ప్రస్తావన లేదా వివరణ లేదు.మొదటి దశ అంటే ఆనకట్ట ఎత్తు 41.15 మీటర్లు లేదా 130 అడుగుల వరకు నిర్మిస్తే లక్షా 98 ఎకరాల భూసేకరణకు గాను 83,659 ఎకరాలను స్వాధీనం చేసుకోగా మిగిలిన మొత్తాన్ని 2025 జనవరి నాటికి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలోని 38,060కు గాను 12,797 కుటుంబాలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. మిగిలిన వారిని 2026 మార్చి నాటికి తరలిస్తారు. రెండవ దశ 150 అడుగుల ఎత్తుకు ఆనకట్ట నిర్మాణం జరిపితే మునిగే మరో 67,665 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 29,465ఎకరాలను స్వాధీనం చేసుకోగా మిగతా ప్రాంతాన్ని రెండవ దశలో చేపడతారు. ఈ ప్రాంతంలో 2017-18 సంవత్సరంలో చేసిన సర్వే ప్రకారం 1,06,006 కుటుంబాలను తరలించాల్సి ఉంటుంది.అయితే సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం 96,660 కుటుంబాలను మాత్రమే గుర్తించారు. ఈ లెక్క ప్రకారమైనా రెండు దశల్లో ఇప్పటికి తరలించిన 12,797పోను మరో 83,863 కుటుంబాలను ఇంకా తరలించాల్సి ఉంది. తొలి సర్వే ప్రకారమైతే 93,209 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. దీనికి గాను తొలి దశ భూసేకరణ-పునరావాసానికి రు.7,116, రెండవ దశకు రు.18,801 కోట్లు, మొత్తం రు.25.917 కోట్లు కావాల్సి ఉన్నట్లు శ్వేత పత్రం తెలిపింది. ఇతర వ్యయం పెరిగినట్లే దీనికి కూడా కచ్చితంగా పెరుగుతుంది. ఈ మొత్తం రు.35వేల కోట్ల వరకు ఉండవచ్చని చెబుతున్నారు.దీని గురించి శ్వేత పత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదు. బాధితులకు చెల్లించాల్సిన మొత్తాల గురించి కూడా ఒక స్పష్టత లేదు.


ప్రాజెక్టు పూర్తి చేయటం, నీటి విడుదల గురించి గతంలో, ప్రస్తుతం తెలుగుదేశం, వైసిపి ప్రభుత్వాల సిఎంలు చెప్పిన కబుర్లు మొదటి దశ గురించే అన్నది గమనించాలి.ఏజన్సీని మార్చకుండా, పథకం ప్రకారం పనులు జరిగి ఉంటే 2020 నాటికే నీటిని సరఫరా చేసి ఉండేవారని చెప్పారు, తరువాత వాయిదాలు వేసి 2023జూన్‌కు పొడిగించారు, ఇప్పుడు మరో ఏడాది గడచింది. ఇది ఎప్పుడు పూర్తవుతుందంటే సిఎం చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు అని చెబుతున్నారు.కుడి, ఎడమ కాలవల్లో మిగతా భాగాలు పూర్తి కావాలి. పంట కాలువల తవ్వకం ఇంతవరకు చేపట్టలేదు. అందువలన రెండవ దశ ఎప్పటికి అన్నది అసలు చర్చకే రాలేదు. ఇక ప్రాజెక్టు వ్యయం ఇబ్బడి ముబ్బడి అయింది. దాన్ని ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు.గతంలో నిర్మాణ వ్యయానికి సంబంధించిన వివరాలు దిగువ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కోట్ల రూపాయల్లో అని గమనించాలి.టిఏసి-టెక్నికల్‌ అసిస్టెస్స్‌ కమిటి, సిడబ్ల్యుసి-కేంద్ర జల కమిషన్‌, ఆర్‌సిసి-సవరించిన ధరల కమిటీ
అంశం ××××××××× 2010-11××××××2013-14××××××××2017-18
అంశం ××××××××× టిఏసి ××× టిఏసి × సిడబ్ల్యుసి × ఆర్‌సిసి × సిడబ్ల్యుసి
నీటిపారుదల ×××××× 12,944 ×××24,467 × 26,158ి × 43,165 × 51,096
విద్యుత్‌ ఉత్పత్తి×××××× 3,716 ××× 4,561 × 4,561ి × 4,561 × 4,561
మొత్తం ఖర్చు ×××××× 16,010 ×××29,028 × 30.719 × 47,725 × 55,657


పైన పేర్కొన్న వివరాలలో 2013-14 సంవత్సర సిఫార్సులను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.ఇక 2017-18 సంవత్సరాల సవరించిన అంచనాలను 2019 ఫిబ్రవరి 11న చంద్రబాబు నాయుడు సిఎంగా ఉండగానే టెక్నికల్‌ అసిస్టెన్స్‌ కమిటీ రు.55,657 కోట్లకు ఆమోదం తెలిపింది. జగన్‌మోహన రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో అనేక సార్లు మోడీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వినతి పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందటానికి ఏం చేసిందీ తెలియదు. లేఖలు రాశారా, కేంద్రం ఏం సమాధానమిచ్చిందీ తెలియదు. ఆమోదం లభించలేదని తాజా శ్వేతపత్రం తెలిపింది. ఈ అంచనా సవరణ జరిగి ఆరు సంవత్సరాలైంది. అప్పటి నుంచి ధరలు మరింత పెరిగాయి.పైన పేర్కొన్నట్లుగా కేవలం మూడు సంవత్సరాల్లోనే వ్యయం 30 నుంచి 55వేల కోట్లకు పెరిగితే తరువాత ఆరు సంవత్సరాల్లో పెరుగుదల అంచనా వేయాల్సి ఉంది. ఆరేండ్ల నాటి దానికే మోడీ సర్కార్‌ ఆమోదం తెలపలేదు, ఇప్పుడు తాజా అంచనాలు ఇంకా వేయలేదు, వాటికి ఎప్పుడు ఆమోదం లభించేదీ అగమ్యగోచరమే.

అందువలన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడి వర్తమాన హయాంలో మొదటి దశ పూర్తి కావటం కూడా ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పవచ్చు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే అదేమీ అసాధ్యం కాదు. ఎన్నికలకు ముందు పోలవరం బాధితుల పునరావాసానికి అయ్యే 30వేల కోట్లను విరాళాల ద్వారా సేకరించి ఇవ్వవచ్చని దానికి గాను తన వంతు వాటాగా కోటి రూపాయలు ఇస్తానని పవన్‌ కల్యాణ్‌ ఒక సందర్భంగా చెప్పారు.దేశ విదేశాల్లో చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌కు ఎంతో పలుకుబడి ఉందని చెబుతున్నారు గనుక కేంద్రం ఇవ్వకపోతే ఆమొత్తాన్ని వారు సేకరించి బాధితులకు న్యాయం చేయాలి. కావాల్సింది పునరావాసం తప్ప నిధులు ఎక్కడి నుంచి తెచ్చారన్నదానితో బాధితులకు సంబంధం ఉండదు.పోలవరం సత్వర నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు, పునరావాస ఖర్చు భరింపుకు ఆమోదం పొందటం కోసం చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ తమ ప్రతిష్ట, పలుకుబడిని ఉపయోగించగలరని జనం గట్టిగా నమ్ముతున్నారు.అయితే ఆంధ్రప్రదేశ్‌ పట్ల బిజెపి చిత్తశుద్దితో ఉన్నదా అన్న అనుమానాలు ఇప్పటికీ జనంలో ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రణాళికకు అది దూరంగా ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలు సర్దుకుపోయాయి. వాగ్దానాలకే ముందుకు రాని బిజెపి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు భారీ మొత్తంలో నిధులను కేటాయిస్తారా ? చంద్రబాబు చెప్పినట్లు ఏపి అంటే అమరావతి, పోలవరం కాదు. అవి రెండు ప్రధాన సమస్యలు మాత్రమే. మొత్తం రాష్ట్ర సమగ్రవృద్దికి పని చేస్తున్నారనే అభిప్రాయం జనంలో కలగకపోతే రాజకీయంగా పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

చైనాతో గిల్లి కజ్జా : అమెరికా రాజకీయ క్రీడలో పావుగా దలైలామా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ధర్మశాలలో ప్రవాస జీవితం గడుపుతున్న 88 ఏండ్ల దలైలామా మోకాలి చికిత్సకోసం అమెరికా వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ రాజకీయ నేతలతో చర్చలు జరుపుతారా లేదా అన్నది ఇంకా స్ఫష్టం కాలేదు. గతవారంలో అమెరికా పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసి హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో దలైలామాను కలిశారు.ఈ సందర్భంగానే ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కూడా ఆమె నాయకత్వంలో వచ్చిన ఏడుగురు ఎంపీల బృందం భేటీ జరిపింది. ఇతర పని మీద భారత్‌ పర్యటనలో భాగంగా ఏదో ఇంతదూరం వచ్చాం కదా మర్యాద పూర్వకంగా అనుకుంటే దలైలామాను కలవటం పెద్ద వార్తే కాదు.రావటమే కాదు,నేను చైనాను విమర్శిస్తే అది దలైమాకు అంగీకారం కాదని తెలిసినా అంటూ అక్కడే చైనా అధినేత షీ జింపింగ్‌ మీద ధ్వజమెత్తింది. అందుకే ఇది పక్కా రాజకీయ, చైనా వ్యతిరేక పర్యటనే అనటంలో ఎలాంటి సందేహం లేదు.దలైలామా వారసత్వం ఎప్పటికీ ఉండిపోతుంది, కానీ చైనా అధ్యక్షపదవిలో ఉన్న మీరు శాశ్వతంగా ఉండరు,ఎవరూ, దేనికీ మిమ్మల్ని గుర్తుంచుకోరు అంటూ నాన్సీ పెలోసి నోరుపారవేసుకుంది. దలైలామాతో చైనా ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కూడా చెప్పింది.
ఈ పరిణామం మీద మన విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ భారత వైఖరిలో ఎలాంటి మార్పులేదు, స్థిరంగా ఉందని చెప్పారు.మనదేశంలో మతపరమైన,ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించేందుకు మాత్రమే దలైలామాకు ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. నాన్సీ పెలోసీ చేసిన రాజకీయ వ్యాఖ్యలకు-మన ప్రభుత్వానికి సంబంధం లేదని, వాటి గురించి మీరు అమెరికానే ప్రశ్నించాలని విలేకర్లతో చెప్పారు. ధర్మశాలలో ఉందని చెబుతున్న టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం ఒక వేర్పాటు వాద రాజకీయ సంస్థ, చైనా రాజ్యాంగం, చట్టాల ప్రకారం అది చట్టవిరుద్దం, ఆ సంస్థకు ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు లేదు, ఇక దలైలామాతో సంప్రదింపులు, మాటల విషయానికి వస్తే అది చైనా ప్రభుత్వం-పద్నాలుగవ దలైలామాకు సంబంధించిన వ్యవహారం అన్నది ఎప్పుటి నుంచో మేము చెబుతున్నాం అని చైనా స్పందించింది. ఈ సందర్భంగా కొన్ని అభిప్రాయాలు, వక్రీకరణలు, భాష్యాలు వెలువడ్డాయి.టిబెటన్ల హక్కుల పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆడుతున్న నాటకం తెలిసిందే. అమెరికా, దానికి తాన తందాన పలికే దేశాలు చెబుతున్నదాని ప్రకారం టిబెట్‌ ఒక స్వతంత్ర దేశం, కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్ని చైనా ఆక్రమించింది. కనుక టిబెటన్ల హక్కును పరిరక్షించాలి అంటూ వేర్పాటు వాదాన్ని సమర్ధిస్తున్నది.మనదేశంలో బ్రిటీష్‌ ప్రభుత్వానికి లోబడిన సామంత రాజరిక సంస్థానాల మాదిరే చైనాలో రాజరిక కాలంలో టిబెట్‌ కూడా అలాంటిదే.చైనాకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత చైనా ప్రభుత్వానికి లోబడిన ఒక స్వయం పాలిత ప్రాంతంగా ఉంది, దాని అధిపతిగా దలైలామా కొనసాగాడు.


చైనా కమ్యూనిస్టు పార్టీ లాంగ్‌ మార్చ్‌ లేదా విప్లవపోరాట కాలంలో అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ ప్రభుత్వం కూలిపోవటం తధ్యమని గ్రహించిన అమెరికా, బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు ఒక వ్యూహం ప్రకారం నాడు ఫార్మోజా దీవిగా నేడు తైవాన్‌గా పిలుస్తున్న ప్రాంతానికి మిలిటరీ, ఆయుధాలను తరలించి అక్కడే తిష్టవేయించింది. చైనా రాజులు ఆ దీవిని 1895లో జపాన్‌కు ధారాదత్తం చేశారు. రెండవ ప్రపంచ యుద్దంలో ఓడిపోయిన తరువాత 1945లో దాన్ని తిరిగి చైనా ప్రభుత్వానికి అప్పగించారు. మిగతా ప్రధాన ప్రాంతంలో కమ్యూనిస్టులు కేంద్రీకరించి తరువాత తైవాన్‌ సంగతి చూద్దాం లెమ్మని భావించారు.తరువాత అనేక కారణాలతో స్వాధీనం చేసుకోలేదు. ఈ లోగా అమెరికా, ఇతర దేశాలు తైవాన్‌ పాలకులకు భారీ ఎత్తున ఆయుధాలు ఇచ్చి ఒక దేశం మాదిరి తయారు చేశారు. దాన్నే అసలైనా చైనాగా భద్రతా మండలిలో గుర్తించారు. 1970దశకంలో అనివార్య స్థితిలో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తీర్మానం ప్రకారం చైనా అంటే తైవాన్‌తో కూడిన ప్రాంతం తప్ప రెండు చైనాలు లేవు. దీనికి అమెరికా కూడా అంగీకరించింది. అయితే శాంతియుతంగా విలీనం జరగాలంటూ కొత్త నాటకం ప్రారంభించింది. బలవంతంగా ఆక్రమించేందుకు చైనా పూనుకుంటే తాము సహించేది లేదని అమెరికా అంటున్నది. తైవాన్‌ వ్యవహారాలను చూసేందుకు ఏ ఒక్కదేశానికీ భద్రతా మండలి అనుమతి ఇవ్వలేదు. తనకు తానే రక్షకురాలిగా అమెరికా ప్రకటించుకుంది. ఆధునిక ఆయుధాలన్నీ ఇచ్చి ఎదురుదాడులకు కూడా అనుగుణంగా తయారు చేస్తున్నది.


ఇక టిబెట్‌ విషయానికి వస్తే కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్తతో వ్యవహించి సామ్రాజ్యవాదుల కుట్రలను వమ్ముచేసింది. మతం, దలైలామా పేరుతో జరిపిన తిరుగుబాటును అణచివేసింది.టిబెట్‌లో తిరుగుబాటు చేసేందుకు పూనుకున్న వేర్పాటు వాదులకు సిఐఏ అనేక చోట్ల రహస్యంగా సాయుధ శిక్షణ, పెద్ద మొత్తంలో నిధులు అందచేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ 1949లో అధికారానికి వచ్చిన తరువాత ” ఇంకే ముంది మనం చైనాను నష్టపోయాం, మన అదుపు నుంచి పోయింది, మనకు కొత్త విరోధి ఉనికిలోకి వచ్చింది ” అన్నట్లుగా అమెరికా పాలకవర్గం భావించింది. విప్లవ కాలంలోనే చైనాలో కమ్యూనిస్టు పార్టీని అడ్డుకోవటంలో విఫలం కావటం గురించి అది బెంగపెట్టుకుంది. ఇరాన్‌లో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు1953లో మహమ్మద్‌ మొసాద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు చేసిన ఖర్చుతో పోలిస్తే సిఐఏ 1949-51కాలంలో ఇరవై రెట్లు మొత్తాన్ని చైనా కోసం వెచ్చించింది.రహస్య కార్యకలాపాలకు పది రెట్లు సిబ్బందిని పెట్టింది.కార్యస్థానంగా టిబెట్‌ను ఎంచుకుంది.చరిత్రను చూస్తే టిబెట్‌ ప్రాంతంలో చైనా రాజులకు సామంత రాజ్యంగా ఉంది తప్ప స్వతంత్రదేశం కాదు.1912లో క్వింగ్‌ రాజరిక వ్యవస్థకూలిపోయిన మరుసటి ఏడాది పదమూడవ దలైలామా తమకు స్వాతంత్య్రం కావాలని ప్రకటించాడు.చైనా ఆశీస్సులతో నిమిత్తం లేకుండా ఆధ్యాత్మిక, రాజకీయ అధికారాన్ని చెలాయిస్తానని చెప్పుకున్నాడు.దాన్ని చైనా ప్రభుత్వం ఆమోదించలేదు. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత టిబెట్‌ను పూర్తిగా చైనాలో విలీనం చేసేందుకు చూస్తున్నట్లు 1941డిసెంబరు 20వ తేదీ డైరీలో నాటి ప్రధానిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ రాశాడు.


కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత ముందే చెప్పుకున్నట్లు సిఐఏ రంగంలోకి దిగింది. దీన్ని పసిగట్టిన మావో జెడాంగ్‌ ముందు జాగ్రత్త చర్యగా 1950లో అక్కడికి 40వేల మంది మిలిటరీని పంపాడు.దీంతో పాటు చైనాతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకున్నాడు. అదే ఏడాది అక్టోబరు 6-24వ తేదీల మధ్య తూర్పు టిబెట్‌లో తిరుగుబాటుకు తెరతీసిన వేర్పాటు వాదులను చామడో పోరులో మిలిటరీ అణచివేసింది, మూడు వేల మందిని బందీలుగా పట్టుకుంది. టిబెట్‌ పౌరుల మీద ఎలాంటి దాడులు జరపలేదు. ప్రస్తుతం మనదేశంలో ఉన్న 14వ దలైలామా టెంజిన్‌ జియాస్టో ఆ పరిణామం తరువాత తాను క్రమశిక్షణతో మెలుగుతానని ప్రకటించాడు. కాశ్మీరు, హైదరాబాదు సంస్థానాలను మనదేశంలో విలీనం చేసినట్లుగానే టిబెట్‌ సంస్థానాన్ని చైనా 1951 మే నెలలో విలీనం చేసింది. టిబెట్‌ రాజకీయం చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రావటానికంటే ముందే మొదలైంది.మన దేశం తొలిసారిగా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం టిబెట్‌తోనే మొదలైంది.చైనా మిలిటరీ చర్య గర్హనీయమని, అది చైనా ప్రయోజనాలకు, శాంతికి కూడా దోహదం చేయదని నాటి నెహ్రూ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి వెంటనే అమెరికా, బ్రిటన్‌ తదితర ఆ గుంపు దేశాలు కూడా మద్దతు ఇచ్చాయి.


దలైలామాకు 1940దశకంలోనే సిఐఏతో సంబంధాలు, నిధుల అందచేత ఉన్నట్లు తరువాత వెల్లడైంది. అమెరికాలోని కొలరాడోలో టిబెట్‌ తిరుగుబాటుదార్లకు శిక్షణ ఇచ్చింది. వారిని అక్కడికి విమానాల్లో తరలించి తరువాత తిరిగి టిబెట్‌కు చేర్చింది. ఆయుధాలను ఇచ్చింది. అలాంటి వారి నాయకత్వంలో 1956లో తూర్పు టిబెట్‌లో రెండు చోట్ల తిరుగుబాటును ప్రకటించారు. దలైలామా అన్న గయాలో తోండప్‌ 1951లో అమెరికా వెళ్లాడు.అక్కడే ఉండి ఎప్పటికప్పుడు చైనా, టిబెట్‌లో పరిస్థితుల గురించి అక్కడ ఎందరు సైనికులు ఉన్నదీ మొదలైన సమాచారాన్ని అందచేసేవాడు. దానికి ప్రతిగా చైనాకు వ్యతిరేకంగా తమకు సాయం చేయాలని కోరాడు. అందుకోసం భారత్‌, నేపాల్లో అమెరికా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జపాన్‌లోని ఒకినావా, మైక్రోనేసియా ప్రాంతంలోని ఫసిపిక్‌ దీవుల్లో అమెరికా ఆధీనంలో ఉన్న గువామ్‌లో టిబెటన్లకు శిక్షణ ఇచ్చారు. ఢిల్లీలో సిఐఏ-మనదేశ సంస్థ కలసి ఒక కేంద్రాన్ని కూడా నడిపినట్లు తరువాత వెల్లడైంది. ఆపరేషన్‌ ఎస్‌టి సర్కస్‌ పేరుతో ఒక పధకాన్ని రూపొందించి 1959లో దలైలామా సోదరుడి నాయకత్వంలో గెరిల్లా తిరుగుబాటు ప్రారంభించారు. అయితే దాన్ని చైనా మిలిటరీ రెండు వారాల్లోనే అణచివేసింది. లాసా నుంచి పారిపోయిన దలైలామా నాటి భారత ప్రభుత్వ సహకారంతో నేటి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతం ద్వారా మనదేశానికి 1959 మార్చి 31న వచ్చాడు. ధర్మశాలలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో కాందిశీకుల పేరుతో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత తాను వైదొలిగి ఇతరులకు అప్పగించాడు. ఈ ప్రభుత్వాన్ని మనదేశం గుర్తించనప్పటికీ నాటి నుంచి నేటి వరకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నది. అమెరికా విదేశాంగశాఖ 1998లో వెల్లడించిన పత్రాలలో ఉన్న సమాచారం మేరకు దలైలామా 1970దశకం మధ్య వరకు ఏటా లక్షా 80వేల డాలర్లను అమెరికా సిఐఏ నుంచి పొందినట్లు ఉంది. ఇప్పటికీ అమెరికా మద్దతు కొనసాగుతోంది. నాన్సీ పెలోసీ గుంపు పర్యటన అదే.


దలైలామాతో చర్చలు జరపాలని చైనాను డిమాండ్‌ చేసే హక్కు అమెరికాకు లేదు. తాను చేసిన చట్టాలు, లేదా అవగాహన ప్రకారం బిన్‌లాడెన్‌ లాంటి కొంత మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. అలాంటి వారితో ఎవరైనా చర్చలు జరపాలని కోరితే అంగీకరిస్తుందా. చైనా దృష్టిలో తిరుగుబాటు చేసిన దలైలామా వేర్పాటువాది. అలాంటి వారితో చర్చలు జరిపేది లేదని గతంలోనే ప్రకటించింది.దలైలామా ఒక్క మతనాయకుడే కాదు, ప్రవాసంలో ఉన్న రాజకీయవాది కూడా అని తాజాగా స్పష్టం చేసింది. అతగాడి వైఖరిలో మార్పు లేదు. ఇప్పుడు దలైలామాకు వృద్దాప్యం వచ్చింది. తదుపరి వారసుడు ఎవరన్నది తేలాల్సి ఉంది. తన వారసుడు భారత్‌లో ఉన్నట్లు దలైలామా చెబుతున్నారు. కొత్త దలైలామాను తాము ఆమోదించాల్సిందేనని చైనా అంటున్నది.జూన్‌ పన్నెండున అమెరికా పార్లమెంటు టిబెట్‌-చైనా వివాద బిల్లును ఆమోదించింది.అధ్యక్షుడు ఆమోదిస్తే చట్టం అవుతుంది. అది ఉభయ దేశాల సంబంధాల మీద ప్రభావం చూపుతుంది గనుక అలాంటి పనికి పూనుకోవద్దని చైనా హితవు పలికింది. పురాతన కాలం నుంచి చైనాలో టిబెట్‌ భాగం కాదని దానిలో పేర్కొన్నారు. అసలు అలాంటి చట్టం చేసే అధికారం అమెరికా పార్లమెంటుకు ఎవరిచ్చారు. దలైలామా గురించి ప్రపంచంలో ఆసక్తి తగ్గిపోతున్న తరుణంలో అమెరికా ఈ పని చేసింది.

అధికారం కోసం దేశం-ధర్మం పేరుతో అమాయక రైతులకు కాషాయ గుంపు అన్యాయం !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మూడవ సారి నరేంద్రమోడీ ప్రధాని పదవి చేపట్టారు. ఎంతో వేగంగా పని చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. దానికి పక్కా నిదర్శనం జమ్మూ-కాశ్మీరుకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 370ని ఎంత వేగంగా రద్దు చేశారో దేశం చూసింది. 2019 జూలై చివరి వారంలో అసాధారణ రీతిలో కాశ్మీరులో భద్రతా దళాలను మోహరించారు.ఆగస్టు రెండవ తేదీ శుక్రవారం నాడు అమరనాధ్‌ యాత్రీకులకు ముప్పు ఉందంటూ యాత్ర నిలిపివేయాలని భద్రతా హెచ్చరిక కాశ్మీరు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.ఆదివారం నాడు రాష్ట్ర మంతటా 144సెక్షన్‌ ప్రకటించారు, ఇంటర్నెట్‌ నిలిపివేశారు. సోమవారం నాడు ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ముందు అదేరోజు రాష్ట్రపతి ఉత్తరువు వెలువడింది. వెంటనే మంత్రివర్గ సమావేశం, అనంతరం అదే రోజు దాని మీద రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు.సభ్యులకు దాని కాపీలు ఇవ్వలేదు. ఉదయం పదకొండు గంటలకు సభ సమావేశమైతే గంటన్నరలో అంటే 12.30లోగా 57పేజీల పత్రం మీద కావాలంటే సవరణలు ప్రవేశపెట్టవచ్చంటూ చెప్పారు. వాటిని చదివేందుకు కూడా ఆ సమయం చాలదు. అదే రోజు సభలో ఆమోదం కూడా పొందారు.మరుసటి ఏడాది కరోనాను అవకాశంగా తీసుకొని మూడు సాగు చట్టాలనూ అంతే వేగంగా ఆమోదించి అమలు చేసేందుకు పూనుకున్నారు.వేగంగా పనిచేసే నాయకత్వ ఘనత గురించి నరేంద్రమోడీ భక్తులు, గోడీ మీడియా పండితులను అడిగితే కొండవీటి చాంతాడంత జాబితాను మన ముందుంచుతారు. రైతుల మహత్తర ఉద్యమం కారణంగా స్వాతంత్య్రానంతరం దేశంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను క్షమాపణ చెప్పి మరీ 2021లో వెనక్కు తీసుకోవటం కూడా వేగంగా జరిగినట్లే !


ఈ వేగం కోట్లాది మంది కోట్లాది మంది రైతులు కోరుతున్న, గతంలో నరేంద్రమోడీ కూడా డిమాండ్‌ చేసిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించేందుకు ఎందుకు లేదు ? రెండు సంవత్సరాల క్రితం ఎంఎస్‌పితో సహా రైతాంగ సమస్యలపై నియమించిన కమిటీ నుంచి ఇంతవరకు తాత్కాలిక నివేదికను కూడా ఎందుకు తెప్పించుకోలేదు ? ఇష్టంలేని పెళ్లికి తలంబ్రాలు పోసినట్లుగా ప్రభుత్వ తీరు ఉంది. మూడు సాగు చట్టాలను 2021నవంబరులో రద్దుచేసినపుడు వెంటనే ఒక కమిటీని వేస్తామన్నారు. వెంటనే అంటే ఎనిమిది నెలలు, 2022 జూలై 12న కమిటీని వేశారు. ఆలస్యం ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల కారణంగా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని, సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) నుంచి స్పందన కోసం ఎదురుచూడాల్సి రావటం అని వ్యవసాయ మంత్రి సాకులు చెప్పారు. ఆ కమిటీకి నివేదించిన అంశాలు, కమిటీలో ప్రతిపాదించిన వ్యక్తుల పట్ల అభ్యంతరాలు తెలుపుతూ మోర్చా తన ప్రతినిధులను పంపేందుకు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం-ఎన్నికల కమిషన్‌ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను అందించాలని సమాచార హక్కు కింద కోరగా అలాంటి రికార్డులు లేవని సమాధానం ఇవ్వటాన్ని బట్టి అసలు బండారం వెల్లడైంది.అంతే కాదు రైతు సంఘాలతో సంప్రదింపుల సమాచారం కూడా లేదని 2023 డిసెంబరు నాలుగవ తేదీన మరో సమాచార హక్కు ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఇక ప్రభుత్వం నియమించిన కమిటీ తీరుతెన్నులను చూస్తే ఎస్‌కెఎం ఎందుకు బహిష్కరించిందో వివరణ అవసరం లేదు. మొత్తం 29 మంది సభ్యులలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు, కాలేజీల్లో పనిచేసే వారే 18 మంది ఉన్నారు. మిగిలిన పదకొండు మంది అధికారేతర సభ్యులలో ఎస్‌కెఎం నుంచి ముగ్గురిని నియమిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. మరో ఎనిమిది మంది అధికారపార్టీ కనుసన్నలలో వ్యవహరించే రైతు ప్రతినిధులే ఉన్నారు. ఈ కమిటీకి అధ్యక్షుడు సంజరు అగర్వాల్‌. వివాదాస్పద మూడు సాగు చట్టాలను ప్రతిపాదించినపుడు వ్యవసాయశాఖ కార్యదర్శి. మరో సభ్యుడు ఇఫ్‌కో చైర్మన్‌ దిలీప్‌, ఇతగాడు గుజరాత్‌ బిజెపి మాజీ ఎంపీ. మరొకరు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ బికెఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడైన ప్రమోద్‌ చౌదరి, ఐదవ సభ్యుడు సయ్యద్‌ పాషా పటేల్‌ మహారాష్ట్ర బిజెపి మాజీ ఎంఎల్‌సి, ఇలా అందరూ గత సాగు చట్టాలను అడ్డంగా సమర్దించిన వారితోనే నింపిన తరువాత ఎస్‌కెఎం గళానికి అవకాశం ఎక్కడ ఉంటుంది.


ఇక ఈ కమిటీ తొలి పద్దెనిమిది నెలల కాలంలో 35 సమావేశాలు జరిపినట్లు, ఎప్పుడు నివేదిక సమర్పిస్తుందో చెప్పకుండా పార్లమెంటుకు ప్రభుత్వం జవాబిచ్చింది.ఫిబ్రవరి తరువాత మరో రెండు సార్లు సమావేశమైనట్లు వార్తలు.ఈ కమిటీ అనేక ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. వాటి నివేదికలు ఇవ్వాలని కోరినా అందుబాటులో లేవన్నదే ప్రభుత్వ సమాధానం. గతంలో స్వామినాధన్‌ కమిషన్‌, తరువాత నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన 2016కమిటీ కూడా అనేక అంశాలను చర్చించింది. అందువలన కొత్త కమిటీ చర్చల పేరుతో కాలయాపన తప్ప మరొకటి కాదు. వాటి సిఫార్సులకు వ్యతిరేకంగా మూడు సాగు చట్టాల్లోని అంశాలు ఉన్నాయి. అయినా మోడీ వాటిని రద్దు చేస్తూ 2021లో చేసిన ప్రసంగంలో రైతులకు కొత్త ఆశలను రేకెత్తించారు.2014 ఎన్నికల సమయంలో బిజెపి చేసిన వాగ్దానానికి వ్యతిరేకంగా మోడీ సర్కార్‌ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దేశ 75వ స్వాతంత్య్రదినోత్సవం (2022) నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరి 28 బడ్జెట్‌ సందర్బంగా మోడీ చెప్పారు. అదే ఏడాది ఏర్పాటు చేసిన అశోక్‌ దలవాయి కమిటీ 2012-13 ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అంచనా ప్రాతిపదికన 2015-2016లో ఒక రైతు రాబడి ఏడాదికి రు.96,703, నెలకు రు.8,058 ఉంటుందని అంచనా వేసి 2022-23నాటికి అది రు.2,71,378- రు.22,610 ఉండాలని, దాన్ని సాధించాలంటే ఏటా 10.4శాతం పెరుగుదల ఉండాలని చెప్పింది. ఇప్పుడు ఎంత ఉందో ఎక్కడా ప్రభుత్వం ప్రకటించలేదు. అయితే 2018-19లో 77వ రైతు కుటుంబాల పరిస్థితి అంచనా సర్వే ప్రకారం రాబడుల మొత్తాలు రు.1,22,616-రు.10,218 ఉన్నట్లు తేలింది. ఈ నివేదికను 2021లో విడుదల చేశారు. దీని ప్రకారం చూస్తే వార్షిక పెరుగుదల కేవలం 2.8శాతమే ఉంది. పదేండ్ల యూపిఏ పాలన సగటు మూడు శాతం కంటే తక్కువ. అయితే ఏ ప్రాతిపదిక లెక్కించారో చెప్పకుండా కొన్ని పంటలకు 2022 ఆర్థిక సంవత్సరంలో రాబడి రెట్టింపు ఉన్నట్లు ఎస్‌బిఐ పరిశోధనా విభాగం చెప్పిన అంకెలను బిజెపి పెద్దలు ఊరూవాడా ప్రచారం చేశారు. గోడీ మీడియా దాన్ని ఇంకా ఎక్కువ చేసింది. నిజంగా అంత పెరిగి ఉంటే రైతాంగం ఈ ఎన్నికల్లో అనేక చోట్ల బిజెపి, దాని మిత్రపక్షాలను ఎందుకు మట్టికరిపించినట్లు ? అనేక చోట్ల రైతులు కనీస మద్దతు ధరలకంటే తక్కువకే అమ్ముకుంటున్నారు. రైతుల రాబడి రెట్టింపు ఎంతవరకు వచ్చిందన్న ప్రశ్నకు 2023 డిసెంబరులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పందిస్తూ వ్యవసాయం రాష్ట్రాల అంశం గనుక అవి చూసుకుంటాయని దాట వేశారు. మూడు సాగు చట్టాలను రాష్ట్రాలతో సంప్రదించకుండా వాటి ఆమోదం లేకుండా అమలుకు పూనుకున్నపుడు ఈ అంశం గుర్తులేదా ? రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తిని గమనించి గత ఎన్నికలకు ముందు కొంత మంది రైతులకు నెలకు రు.500 ఏడాదికి ఆరువేల చొప్పున పిఎం కిసాన్‌ నిధిపేరుతో ఇస్తున్నారు. ఐదేండ్లలో పెరిగిన వ్యవసాయ ఖర్చులతో పోల్చితే ఇది ఏమూలకూ రాదు. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచనుందనే లీకులను వదిలి రైతాంగాన్ని మభ్యపెట్టేందుకు చూసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు.


తాజాగా వర్తమాన ఖరీఫ్‌ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గతేడాది ఏడుశాతం పెంచగా ఇప్పుడు ఓట్లతో నిమిత్తం లేదు గనుక 5.4శాతం మాత్రమే పెంచారు. తాజా ఎన్నికల్లో 159 గ్రామీణ నియోజకవర్గాలలో ఓడిపోయిన బిజెపి దాన్నుంచి ఎలాంటి పాఠం నేర్చుకోలేదన్న సంయుక్త కిసాన్‌ మోర్చా వ్యాఖ్యను గమనించాలి.ఈ సందర్భంగా పదేండ్ల యుపిఏ పాలనలో పెరిగింది ఎంత, రాబడిని రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోడీ ఎంత పెంచారు అన్నది మీడియాలో చర్చకు వచ్చింది. దీన్ని గోడీ మీడియా మూసిపెట్టేందుకు చూసింది.ప్రభుత్వ సమాచారం ప్రకారమే మచ్చుకు సోయాబీన్‌కు గత పాలకులు, 175, పత్తికి 115శాతం పెంచగా మోడీ పదేండ్లలో 80,79శాతాల చొప్పునే పెంచారు. అనేక పంటల ధరల పెరుగుదల శాతాల తీరు తెన్నులు దిగువ విధంగా ఉన్నాయి. దీనికి ఆధారం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం.ఈ కనీస మద్దతు ధరలు కూడా రైతాంగంలో కేవలం పద్నాలుగుశాతం మాత్రమే పొందుతున్నారన్నది అంచనా.


పంట××××× యుపిఏ ×× మోడీ ఏలుబడి

వరి ముతక×× 138.2 ×× 66.7
గోధుమ ×× 122.2 ×× 62.5
చెరకు ×× 187.7 ×× 50.0
ఆవాలు ×× 90.6 ×× 85.3
పత్తి ××114.5 ×× 78.9
మొక్క జొన్న ××1594 ×× 59.5
శనగలు ×× 121.4×× 75.5
కందులు ×× 216.2×× 62.8
నరేంద్రమోడీ సర్కార్‌ రైతులకు చేసిన మేలు ఇలా ఉంది గనుకనే అనేక చోట్ల బిజెపి ఎదురుదెబ్బలు తిన్నది, గత ఎన్నికల కంటే సీట్లు, ఓట్ల శాతాన్ని కూడా కోల్పోయింది. దేశాన్ని ఊపివేస్తున్న నీట్‌ పరీక్షా పత్రాల కుంభకోణం ఎన్నికలకు ముందే వెలువడి ఉంటే దాని పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. దేశం కోసం-ధర్మం కోసమంటూ కబుర్లు చెప్పిన కాషాయదళం తీరుతెన్నులు వచ్చే ఐదు సంవత్సరాలూ వ్యవసాయ రంగంలో ఇదే విధంగా ఉండకూడని అనేక మంది కోరుతున్నారు.పెడచెవిన పెడితే రైతాంగ ఉద్యమాలు వెల్లువెత్తుతాయి. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 15-16శాతమే ఉన్నప్పటికీ జనాభాలో 45శాతం మందికి ఉపాధి చూపుతున్నది. ఇది కూడా కుదేలైతే గ్రామీణా ప్రాంతాలలో అలజడి రేగుతుంది. జూలై పదవ తేదీన సంయుక్త కిసాన్‌మోర్చా జనరల్‌ బాడీ సమావేశం ఎన్నికల అనంతర పరిస్థితి గురించి సమీక్ష, కార్యాచరణ గురించి చర్చించనుంది.

నరేంద్రమోడీ రెండు ముఖాలు : రైౖతుల మద్దతు కోసం పాకులాట – ఉద్యమ సంఘాలపై పగసాధింపు !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన కిసాన్‌ సమ్మాన్‌ యోజన పదిహేడవ విడత నిధులను మూడోసారి అధికారానికి వచ్చిన తరువాత పెద్ద ఆర్భాటంతో ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు.(ఆంధ్రప్రదేశ్‌ మాజీ సిఎం వైఎస్‌ జగన్‌ మీట నొక్కుడును గుర్తుకు తెచ్చింది) అంతకు ముందు తొలిసంతకం దాని మీదే చేసినట్లు కూడా ప్రచారం జరిగింది.వెంటనే తాను ఎన్నికైన లోక్‌సభ స్థానం వారణాసి వెళ్లి రైతులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎగుమతుల ద్వారా భారత ఆహార వస్తువులను ప్రపంచంలో ప్రతి ఒక్కరి కంచంలో చూడాలని ఉందన్నారు. గతంలో ఎన్నడూ పిఎం కిసాన్‌ యోజన నిధుల విడుదలకు ఇంత హంగామా చేయలేదు. నిజానికి ఈ సొమ్ము ఏ కార్పొరేట్ల నుంచో ధనికుల నుంచో వసూలు చేసి ఇవ్వటం లేదు. మనం కొనుగోలు చేసే పెట్రోలు మీద లీటరుకు రు.2.50, డీజిలు మీద రు.4.00 సెస్‌ల పేరుతో కేంద్రం వసూలు చేసి దాన్నుంచి ఇస్తున్నది. ఇదే కాదు మొత్తం 29 వస్తువులపై ఈ పేరుతో పన్ను మీద 15శాతం సెస్‌ల రూపంలో వినియోగదారుల జేబుల నుంచి కొట్టివేసి దాన్నుంచే కొన్ని పథకాలను అమలు చేస్తున్నది. ఎప్పుడూ లేనిది కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదలను ప్రచారానికి ఎందుకు వినియోగించుకున్నట్లు ? అదేమీ అర్ధంగాని తత్వం లేదా బ్రహ్మ పదార్ధం కాదు.తాజా లోక్‌సభ ఎన్నికల్లో రైతుల నుంచి వెల్లడైన వ్యతిరేకత అనేక ప్రాంతాల్లో ఓటమిలో వారి పాత్రను చూశారు. తత్వం తలకెక్కి రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దగ్గరయ్యే ఎత్తుగడతో వారికోసం తాను తపిస్తున్నట్లు కనిపించేందుకు చేసిన యత్నం తప్ప మరొకటి కాదు.కొందరి విశ్లేషణ ప్రకారం గత లోక్‌సభలో 543 స్థానాలకు గాను బిజెపి 201గ్రామీణ నియోజకవర్గాలలో విజయం సాధించగా తాజా ఎన్నికల్లో 126 చోట్ల మాత్రమే గెలిచింది.వ్యవసాయదారులను నిర్లక్ష్యం చేసిన కారణంగా 159 చోట్ల బిజెపి ఓడిపోయిందని, రైతుల ప్రతినిధులను బడ్జెట్‌ చర్చల ప్రక్రియలో భాగస్వాములను చేయకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తే, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే దేశవ్యాపితంగా ఆందోళన తప్ప మరొక మార్గం లేదని ఆలిండియా కిసాన్‌ సభ (ఏఐకెఎస్‌) స్పష్టం చేసింది.


నిజంగా వ్యవసాయం, దాని మీద ఆధారపడిన రైతులు, కూలీల గురించి కేంద్ర ప్రభుత్వానికి అంతశ్రద్ద ఉందా ? పదేండ్ల ఆచరణ చూస్తే అలా కనిపించదు. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయ రంగంలో రాష్ట్రాలలో చర్చ, ఆమోదంతో నిమిత్తం లేకుండా కరోనా సమయంలో అమల్లోకి తెచ్చిన మూడు రైతు వ్యతిరేక సాగు చట్టాలు, వాటికి వ్యతిరేకంగా ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం తెలిసిందే.విధి లేని స్థితిలో క్షమాపణలు చెప్పిమరీ మోడీ వాటిని వెనక్కు తీసుకున్నారు. ఆ మహత్తర ఉద్యమానికి నాయకత్వం వహించింది అనేక రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం). ఆ వేదికలో కీలక పాత్రపోషించిన ఆలిండియా కిసాన్‌ సభ(ఎఐకెఎస్‌) దేశంలో అతి పెద్ద రైతు ఉద్యమ సంస్థ, తొలి వరుసలో ఉంది. మూడు సాగు చట్టాల రద్దు కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు, ఇతర అంశాల గురించి 2022 జూలైలో ఒక కమిటీని వేసింది. అది ఏం చేస్తున్నదో నివేదిక ఎప్పుడు సమర్పిస్తుందో తెలియదు. బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా వివిధ తరగతులు ఏ కోరుకుంటున్నారో తెలుసుకొనేందుకు ప్రభుత్వం సంస్థలు, వ్యక్తులను కూడా పిలిచి ప్రతి ఏడాది సంప్రదింపులు జరుపుతుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆమోదం పొందిన తాత్కాలిక(ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌) స్థానంలో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఇప్పుడు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ చర్చలకు ఎస్‌కెఎం, ఏఐకెఎస్‌లను దూరంగా పెట్టింది. ఇది రైతులను అవమానించటం, కక్ష సాధింపు అనేందుకు పక్కానిదర్శనం.ఈ వైఖరిని ఆలిండియా కిసాన్‌ సభ ఒక ప్రకటనలో తీవ్రంగా నిరసించింది. కనీస మద్దతు ధరలను సిఫార్సు చేసే వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సిఏసిపి) ప్రతి ఏటా ఎఐకెఎస్‌ను ఆహ్వానించి అభిప్రాయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎస్‌కెఎం నాయకులను కూడా చర్చల నుంచి మినహాయించటాన్ని కూడా ఎఐకెఎస్‌ ఖండించింది.


మూడవసారి అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ వ్యవసాయం గురించి సరికొత్తగా ఆలోచించి కార్యాచరణ చేపట్టాలని అనేక మంది చెబుతున్నారు. మోడీ సర్కార్‌ పారిశ్రామిక వస్తు ఎగుమతుల్లో విఫలమైంది. సముద్ర ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులకు జతచేసిి మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిగా చూపుతున్నారు.2014-15 సంవత్సరంలో మొత్తం ఎగుమతులు 36.18బిలియన్‌ డాలర్లుండగా 2020-21నాటికి 38.32 బి.డాలర్లకు పెరిగినట్లు ఏటా పెరుగుదల శాతం 0.96శాతంగా ఉన్నట్లు ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపినట్లు బిజినెస్‌ టుడే పత్రిక 2021 డిసెంబరు 10న ప్రచురించిన వార్తలో పేర్కొన్నది.సముద్ర, తోటల ఉత్పత్తులను మినహాయించి కేవలం వ్యవసాయ ఉత్పత్తుల విలువ 2020-21లో 29.81 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మోడీ అధికారానికి రాకముందు 2013-14 సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 37.292బి.డాలర్లు. ఈ అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించినట్లు పిఐబి 2014జూలై తొమ్మిదిన తెలిపింది.దీంతో పోల్చుకున్నా, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ విలువ తిరోగమనంలోనే ఉంటుంది. జనాన్ని మభ్యపరిచేందుకు పాలకుల కనుసన్నలలో పనిచేసే అధికార యంత్రాంగం ఎన్నితిప్పలు పడుతుందో పిఐబి 2024 ఫిబ్రవరి 17న వెల్లడించిన మరో సమాచారాన్ని చూస్తే తెలుస్తుంది. మోడీ అధికారానికి వచ్చిన పదేండ్లలో సాధించిన విజయాల గురించి కీర్తించటం తెలిసిందే. దానిలో భాగంగానే 1987-88లో అపెడా( వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ) ఎగుమతులు కేవలం 0.6బిలియన్‌ డాలర్లేనని అలాంటిది 2022-23నాటికి 26.7బి.డాలర్లకు పెరిగినట్లు , ఇది మోడీ గొప్పతనం అన్నట్లు చిత్రించింది. ఈ ఏడాదిలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 53.1బి.డాలర్లని కూడా తెలిపింది. ఈ లెక్కన చూసుకున్నా పదేండ్లలో పెరిగింది 53.1-37.29=15.81 బి.డాలర్లు మాత్రమే. తాను వచ్చిన తరువాత భారత ప్రతిష్టను, విదేశాల్లో తిరిగి మార్కెట్లను పెంచానని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు చేశామని చెప్పుకున్న నరేంద్రమోడీ ప్రచారానికి ధీటుగా ఈ పెరుగుదల లేదు. యాహూ న్యూస్‌ 2024 మార్చి 21వ తేదీ విశ్లేషణ ప్రకారం 2022లో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే 20 అగ్రదేశాలలో మనది 11వ స్థానం, చైనా ఆరవదిగా ఉంది.


మన రైతులు నేరుగా ఏ దేశానికైనా ఎగుమతులు చేసుకొనేందుకు, దేశంలో ఎక్కడైనా అమ్ముకొనేందుకు వీలుగా మూడు సాగు చట్టాలను తీసుకొచ్చినట్లు నరేంద్రమోడీ సర్కార్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే.కానీ అదే ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు గోధుమలు, బియ్యం, పంచదార, ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలు, నిషేధం ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి పండే ప్రాంతాలలో ఎక్కువ చోట్ల బిజెపి లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్నది. ఆంక్షల వలన 2023 ఏప్రిల్‌-అక్టోబరు మాసాల మధ్య బాస్మతి బియ్యం ఎగుమతులు 16శాతం పెరిగినా ఇతర ఉత్పత్తుల్లో నాలుగు బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు జరగలేదు. తొమ్మిదిశాతం ఎగుమతులు తన పరిధిలో తగ్గినట్లు అపెడా పేర్కొన్నది. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు అన్నట్లుగా బిజెపి రైతుల ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా నేపాల్‌, ఇతర దేశాలు మన బదులు పాకిస్తాన్‌, చైనాల నుంచి కొనుగోలుకు పూనుకున్నాయి. అంటే ఎగుమతి అవకాశాన్ని తన ఎన్నికల లబ్దికోసం మోడీ అనిశ్చితిలో పడేశారు. పోనీ మనదేశంలో ఉల్లి దిగుబడిని పెంచేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ కనపడదు. చైనాలో హెక్టారుకు 21.85 టన్నుల దిగుబడి ఉండగా మనదేశంలో 16.12 టన్నులు మాత్రమే ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో రెండు దేశాలూ ఒకటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి.


వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలకు బదులు రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు మూడు సాగు చట్టాల పేరుతో చేసిన యత్నం బెడిసి కొట్టింది. తరువాత కూడా అదే వైఖరి. కనీస మద్దతు ధరల(ఎంఎస్‌పి) విధానాన్ని ఎత్తివేయాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల అమలుకు చూస్తున్నారు. ఆ కారణంగానే ఎంఎస్‌పికి చట్టబద్దత కల్పించేందుకు మొరాయిస్తున్నారు. మరో ఐదు సంవత్సరాల వరకు పార్లమెంటు ఎన్నికలు లేవు గనుక ఎగుమతి వ్యాపారంలో ఉన్న బడా సంస్థల కోసం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలను త్వరలో ఎత్తివేసి అవి రైతులకోసమే అని చెప్పినా ఆశ్చర్యం లేదు. మూడు సాగు చట్టాల తరువాత వేసిన కమిటీతో మరో రూపంలో ఆ చట్టాల్లోని అంశాలనే చెప్పించి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించటానికి సాకుల కోసం చూస్తున్నారు. ఆ పేరుతో ప్రపంచవాణిజ్య సంస్థ, ఐఎంఎఫ్‌, ప్రపంచ బాంకులను సంతుష్టీకరించేందుకు పూనుకోవచ్చు.మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన నరేంద్రమోడీ మరోవైపు పప్పుధాన్యాలు, ఖాద్యతైలాల దిగుమతులపై పన్నులు తగ్గించారు. దీంతో మనదేశంలో వీటిని సాగుచేసే రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. ద్రవ్యోల్బణ అదుపు చర్యలంటూ ఎగుమతులపై ఆంక్షలు, దిగుమతులపై పన్నుల తగ్గింపు కారణంగా అంతిమంగా నష్టపోయింది రైతులు మాత్రమే. ఎన్నికలు జరుగుతున్నపుడు కిలో ఇరవై రూపాయలున్న ఉల్లి ఫలితాలు వచ్చిన వెంటనే యాభై రూపాయలకు పెరిగింది. దీంతో రైతులెంత లబ్దిపొందుతారో తెలియదు గానీ వినియోగదారుల జేబులకు చిల్లి పడింది.

తొలిసారి నరేంద్రమోడీ అధికారానికి రావటానికి, కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోవటానికి కారణాల్లో ద్రవ్యోల్బణం-ధరల పెరుగుదల కూడా ఒకటి.అందుకే తాజా ఎన్నికలకు ముందు దాన్ని కృత్రిమంగా అదుపులో ఉంచేందుకు పైన పేర్కొన్న చర్యలను తీసుకున్నారు.అయినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం 2023 నవంబరు నుంచి ఎనిమిదిశాతానికి అటూ ఇటూగా ఉంది. ఆ మేరకు పప్పులు, నూనెలు, ఇతర ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. బిజెపిని దెబ్బతీసిన అంశాలలో ఇది కూడా ఒకటి. ఈ నేపధ్యంలో బడ్జెట్‌లో రైతులు ఏం కోరుతున్నారో తెలుసుకోవాలంటే వారి సమస్యలపట్ల నిత్యం పని చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా, ఆలిండియా కిసాన్‌ సభ వంటి సంస్థలను, రైతాంగ సమస్యలపై అధ్యయనం చేస్తున్న మేధావులను సంప్రదించకుండా కుదిరేది కాదు. ఆ దిశగా కేంద్ర తీరు లేదంటే దాని అర్ధం ఏమిటి ? చర్చలకు పిలిస్తే ఎవరేం కోరుతున్నారో రైతులకు స్పష్టత వస్తుంది, వాటిని అమలు జరపకపోతే పాలకుల మీద వత్తిడి పెరుగుతుంది. అందుకే దూరంగా పెట్టారు.తన కోడి కూయకపోతే ఎలా తెల్లవారుతుందో చూస్తానని ఒక ముసలమ్మ అనుకుందట.అలాగే ప్రభుత్వం అవకాశం కల్పించనంత మాత్రాన ఉద్యమ సంస్థల వాణి రైతులకు చేరకుండా ఉంటుందా ?

నరేంద్రమోడీ వట్టిస్తరి మంచినీళ్లు : భారత్‌లో మహిళా సమానత్వ సాధనకు 152 ఏళ్లు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


బేటీ బచావో బేటీ పఢావో, మహిళా సురక్ష కేంద్ర, మహిళా పోలీసు వలంటీర్స్‌, రాష్ట్రీయ మహిళా కోష్‌, సుకన్య సమృద్ధి యోజన, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ… ఇవన్నీ మన దేశంలో ఉన్న పధకాలు, ఎవరికో చెప్పనవసరం లేదు.కొన్ని రాష్ట్రాల్లో వీటికి పేర్లు మార్చి అమలు జరుపుతున్నారు. మొత్తం మీద ఇన్ని జరిగిన తరువాత కూడా ప్రపంచంలో స్త్రీ, పురుష సమానత్వ తేడాలో 2024 ప్రపంచ 146దేశాల జాబితా ప్రకారం మన స్థానం 129. పదేండ్లతో పోల్చుకుంటే దిగజారింది. మహిళల అభ్యున్నతి గురించి గత పది సంవత్సరాలుగా తమ భుజాలను తామే చరుచుకొని రొమ్ములు విరుచుకొని గొప్పలు చెప్పుకున్న, మహిళలను వంచించిన వారు, అంతకంటే ఘనడు ఆచంట మల్లన అన్నట్లు వారికి భజన చేసిన ఘనులు తలలెక్కడ పెట్టుకుంటారో చూడాలి. పధకాలన్నీ మావే, రాష్ట్రాలు పేర్లు మార్చుకుంటున్నాయి, అందువలన మా ఫొటోలు పెట్టాలి, వాటి ” ఖ్యాతి ”లో మాకూ వాటా రావాలని కోరుతున్న బిజెపి పెద్దలు ఆ మొత్తాన్ని వారే తీసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. డిఎంకె సభ్యురాలు కనిమొళి రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు నాడు మంత్రిగా ఉన్న మేనకా గాంధీ 2015 మే 7వ తేదీన ఇచ్చిన జవాబు సారం ఇలా ఉంది. ప్రపంచ ఆర్థికవేదిక (డబ్ల్యుఇఎఫ్‌) లింగసమానత్వ తేడా నివేదిక 2014 ప్రకారం 142దేశాలలో భారత్‌ 114వదిగా ఉంది. అంతకు ముందు సంవత్సర నివేదిక ప్రకారం 136 దేశాలలో 101వదిగా ఉంది. ఏడాది కాలంలోనే ఇంతగా దిగజారి పోవటానికి కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం తగ్గటం, అవకాశాలు లేకపోవటమే అని పేర్కొన్నారు. అలాంటిది కొన్ని మార్పులు జరిగినా పదేండ్ల తరువాత 101 నుంచి 129వ స్థానానికి దిగజారింది. కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బిజెపి, మిత్రపక్షాలే, మెరుగుపరచకపోయినా దిగజారటానికి నెపం నెహ్రూ మీదో, గాంధీ మీదో నెడితే కుదరదు.


ఈ సూచికలను రూపొందించటానికి నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.1.ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం, అవకాశాలు, 2. విద్యా అవకాశాలు, 3. ఆరోగ్యం,బతుకు, 4.రాజకీయ సాధికారత. వీటన్నింటిలో ఏ దేశం ఎక్కడుందనే సూచికలు, పాయింట్లు వేస్తారు. వాటన్నింటిని కలిపి మొత్తంగా సాధారణ సూచికలను రూపొందిస్తారు. ఇలాంటి నివేదికలను 2006 నుంచి ప్రతి ఏటా రూపొందిస్తున్నారు. పరిగణనలోకి తీసుకున్న 146దేశాల సగటు లింగ సమానత్వ తేడా 2024లో 68.5శాతం ఉంది. గతేడాది కంటే కేవలం 0.1శాతమే మెరుగైంది. అంటే 31.5శాతాన్ని పూరించాల్సి ఉంది. ఇప్పుడున్న వేగంతో తేడాను పూర్తిగా తగ్గించాలంటే 134 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచంలో నూటికి నూరుశాతం సమానత్వం సాధించిన దేశమేమీ లేదు. మొదటి స్థానంలో ఉన్న ఐస్‌లాండ్‌లో 93.5శాతం సాధించారు.భారత్‌లో 64.1శాతం ఉంది. ఈ లెక్కన పూర్తి సమానత్వం సాధించటానికి కనీసం 152 సంవత్సరాలు పడుతుంది. దక్షిణాసియా దేశాల సగటు తేడా 63.7శాతమే. పది సంవత్సరాల నాడు మొత్తం రాంకు మార్కులను చూస్తే 0.6455 కాగా తాజా సూచికలో 0.641కి దిగజారింది.


మన దేశంలో లింగ బేధాలను తగ్గించటంలో పదేండ్ల నరేంద్రమోడీ పాలన ఘోరంగా విఫలమైంది. మరింత దిగజారింది.ఇరుగుపొరుగు దేశాలలో బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌ తరువాత ఐదవదిగా మనదేశం ఉంటే బిజెపి పెద్దలు నిత్యం స్మరించే పాకిస్తాన్‌ ఏడవదిగా ఉంది.ఆర్థిక భాగస్వామ్యం, ఆరోగ్యంలో 146కు గాను 142వదిగా ఉంది.(మన తరువాత పాకిస్తాన్‌ ఉంది) విద్య అందుబాటులో 112, రాజకీయ రంగంలో 65, కార్మికశక్తి భాగస్వామ్యంలో 134వదిగా ఉంది. విద్యాఅవకాశాలు, రాజకీయ సాధికారత తగ్గుదల కారణంగానే గతేడాది వచ్చిన 127వ రాంకు 129కి దిగజారింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినప్పటికీ ఆ స్ఫూర్తిని రాజకీయ పార్టీలేవీ పాటించలేదు. దాని ఘనత తమదే అని భుజాలు చరుచుకున్న బిజెపి 30 మంది కాబినెట్‌ మంత్రులకు గాను కేవలం ఇద్దరికి, మొత్తం మంత్రివర్గంలో గతంలో ఉన్న పది మందిని ఈ సారి ఏడుకు తగ్గించింది. నేపాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న మంత్రులలో 23.5శాతం మంది మహిళలే ఉన్నారు. చట్టసభల్లో మహిళల ప్రపంచ సగటు 33శాతం కాగా అక్కడ 49.9శాతం ఉంది.


జనాభాలో సగంగా ఉన్న మహిళలకు ఉత్పాదక రంగంలో భాగస్వామ్యం కల్పించకుండా వారి సాధికారత గురించి ఎన్ని కబుర్లు చెప్పినా వట్టిస్తరి మంచి నీళ్లు తప్ప మరొకటి కాదు. గడచిన పది సంవత్సరాల్లో జరిగింది అదే. లింగసమానత్వ తాజా నివేదికలో మనదేశంలో కార్మికశక్తిలో మహిళా భాగస్వామ్యం 35.09శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కూడా ప్రభుత్వం అందచేసిన తప్పుడు లెక్కల కారణంగానే. నిజంగానే అంత ఉందా ? లోక్‌సభ ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశట్టే ముందు నరేంద్రమోడీ తన పాలనలో మహిళాభ్యున్నతిని చూసి ప్రతిపక్షాలు ఆత్మశోధన చేసుకోవాలని చెప్పారు. తన పదేండ్ల ఏలుబడిలో దిగజారిన రాంకును చూసి తలవంచుకుంటారా ? ప్రతిపక్షాలకు సుభాషితాలు చెబుతూనే ఉంటారా ? ప్రభుత్వం ప్రకటించిన సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్న అంకెలకు, ప్రభుత్వ లెక్కలకు పొంతన కుదరటం లేదు. స్టాటిస్టా విశ్లేషణ ప్రకారం 2014 నుంచి 2022వరకు తొమ్మిదేండ్ల సగటు 26.81శాతం కాగా 2023లో 32.68శాతం ఉన్నట్లు అదే సంస్థ పేర్కొన్నది.ఒక్కసారిగా అంత ఎలా పెరిగింది ? ప్రపంచ బాంకు లెక్క 32.7శాతం అన్నది. దేశంలో 2022-23లో నియమిత కాల కార్మిక శక్తి సర్వే ప్రకారం మహిళలు అంతకు ముందుతో పోలిస్తే 4.2శాతం పెరిగి యూజువల్‌ స్టేటస్‌ లెక్కింపు అవగాహన ప్రకారం 37శాతానికి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరు తొమ్మిదిన ప్రకటించింది. అందుకే అంకెల గారడీ అనాల్సి వస్తోంది.


ఇండియా టుడే వెబ్‌సైట్‌ 2023 జూన్‌ పదకొండున రోషిణీ చక్రవర్తి రాసిన విశ్లేషణకు ” భారత్‌లో తగ్గుతున్న మహిళా శ్రామికులు, ఎందుకు మహిళలు పని చేయటం లేదు ” అనే శీర్షిక పెట్టింది. భారత్‌లో వేతనాలు చెల్లించే ఉపాధిలో మహిళలు ఇరవైశాతానికి లోపుగానే ఉన్నట్లు ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికను దానిలో ఉటంకించారు. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం ఉపాధిలో కేవలం 19.2శాతం మంది మాత్రమే మహిళలు ఉండగా పురుషుల్లో 70.1శాతం ఉన్నారు. మహిళల భాగస్వామ్యం పెరిగితే 2025 నాటికి జిడిపిలో 70వేల కోట్ల డాలర్లు పెరుగుతుందన్నది ఒక అంచనా. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం భారత్‌లో 52శాతం మంది మహిళలు వేతన ఉపాధి లేదా లేదా కుటుంబ సంరక్షణలో రెండింటిలో ఉంటామని చెప్పారు. కానీ 2005లో 32శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి 2021నాటికి 19.2శాతానికి తగ్గింది. ప్రముఖ మీడియా సంస్థ అల్‌ జజీరా. అది 2023 ఏప్రిల్‌ పదిన ఒక విశ్లేషణ ప్రచురించింది.” జనాభాలో భారత్‌ దూసుకుపోతున్నా శ్రామిక శక్తిలో తగ్గుతున్న మహిళలు ” అని పేరు పెట్టింది.ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న భారత్‌ మహిళా శ్రామిక శక్తిలో ప్రపంచంలోని అతితక్కువ 20దేశాల్లో ఒకటిగా ఉందని, గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నట్లు పేర్కొన్నది. పెరుగుతున్న జనాభాకు ప్రత్యేకించి మహిళలకు ఉపాధిని చూపటంలో విఫలమైతే భారత్‌కు అది గుదిబండగా మారుతుంది. అధికారిక సమాచారాన్ని విశ్లేషించినపుడు 2004లో గరిష్టంగా 35శాతం మంది మహిళలు ఉపాధి పొందగా 2022 నాటికి 25శాతానికి తగ్గినట్లు అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్థికవేత్త రోజా అబ్రహాం చెప్పిన అంశాన్ని అల్‌ జజీరా ఉటంకించింది. సిఎంఐయి ఉపాధి నిర్వచనం ప్రకారం 2022లో పని చేసే వయస్సులో ఉన్నవారిలో కేవలం పదిశాతం మంది మాత్రమే అంటే 3.9 కోట్ల మంది మాత్రమే పని చేస్తూ ఉండటం లేదా పని కోసం ఎదురు చూస్తున్నవారున్నారని , అదే పురుషుల విషయానికి వస్తే 36.1కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. పని చేయగలిగిన వయస్సు వారి పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి పెరగటం లేదని, గత దశాబ్దిలో మంచి ఉద్యోగాలు గణనీయంగా తగ్గినట్లు, తక్కువ వేతనాలతో పని చేయటం కంటే ఇల్లు, పిల్లలను చూసుకోవటం మరింత లాభదాయకమని వారి కుటుంబాలు భావిస్తున్నాయని సిఎంఐఇ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ చెప్పిన మాటలను ఉటంకించింది.శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పదిశాతం పెరిగితే జిడిపి 552 బిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుందని 2018లో మెకెన్సీ నివేదిక పేర్కొన్నది. చిత్రం ఏమిటంటే మహిళలకు అన్ని గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం, ఇన్ని మరుగుదొడ్లు కట్టించాం అని ఊరూ వాడా ప్రచారం చేసే బిజెపి ప్రచార దళాలు తమ రెండింజన్ల డ్రైవర్లు సాధించిందేమిటో, పదేండ్లలో పరిస్థితి ఎందుకు దిగజారిందో ఎక్కడా మాట్లాడటం లేదు. గోడీ మీడియా సంగతి సరేసరి తేలుకుట్టిన దొంగల్లా నోరెత్తటం లేదు. ఈ అంశాన్ని పట్టించుకోవాల్సింది కాదన్నట్లుగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సంపూర్ణ మెజారిటీని కోల్పోవటానికి మహిళా ఉపాధి తగ్గటం కూడా ఒక కారణమే.

చైనా-రష్యాలను మరింత దగ్గర చేసిన జి7 కూటమి !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇటలీలోని అపూలియాలో 2024 జూన్‌ 13-15 తేదీలలో జరిగిన జి7 50వ శిఖరాగ్ర వార్షిక సమావేశ తీరుతెన్నులు, పరిణామాలు, పర్యవసానాల గురించి చర్చ జరుగుతున్నది. ఈ సమావేశాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రధాని నరేంద్రమోడీతో సహా పన్నెండు దేశాధినేతలను,ఆఫ్రికా యూనియన్‌ ప్రతినిధిని ఆహ్వానించారు. ఇలాంటి వేదికలన్నింటా పూసల్లో దారంలా ప్రపంచ దేశాల బలాబలాల సమీకరణ లక్ష్యం ఉంటుంది. ధనికదేశాలు తమకు సవాలు విసురుతున్న చైనా, రష్యాలను దెబ్బతీసేందుకుగాను వర్దమాన,పేద దేశాలను తమ వైపు తిప్పుకొనేందుకు అపూలియాలో గట్టి ప్రయత్నమే చేసినా ఫలితం ఏమిటన్నది ప్రశ్నార్ధకమే. అనేక అంశాల మీద ఈ కూటమి ఒక ప్రకటన చేసినప్పటికీ దానిలో ప్రధానమైన వాటిని చూద్దాం. ఆతిధ్యం ఇచ్చిన దేశం తనకు నచ్చిన, తాను మెచ్చిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు అల్జీరియా, అర్జెంటీనా,బ్రెజిల్‌,భారత్‌,జోర్డాన్‌, కెన్యా, మారిటేనియా, ఆఫ్రికన్‌ యూనియన్‌,ట్యునీసియా, టర్కీ,యునైటెడ్‌ అరబ్‌ఎమిరేట్స్‌,ఉక్రెయిన్‌, వాటికన్‌ నగరం నుంచి అధిపతులు వచ్చారు. ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా, రష్యా దేశాలకు ఆహ్వానం లేనప్పటికీ మూడు రోజుల సమావేశాలు వాటి నామజపంతోనే ముగిశాయంటే అతిశయోక్తి కాదు. సమావేశ ప్రకటనలో 28 సందర్భాలలో చైనా పేరును ప్రతికూలంగా ప్రస్తావించారంటే దాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీని అర్ధం ఘర్షణకు సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.గతేడాది జపాన్‌-ఒసాకాలో జరిగిన కూటమి ప్రకటనలో 20సార్లు ప్రస్తావించారు.ప్రస్తుతం ధనికదేశాల కూటమికి చైనాను ఢకొీనే సత్తా ఉందా అన్నది ప్రశ్న. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం చైనా అని నెపం నెట్టేందుకు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు పశ్చిమ దేశాలు చూస్తున్నాయి.


అసలు జి 7 కూటమి, ఎందుకు ఎలా ఉనికిలోకి వచ్చిందీ చూద్దాం. అమెరికా,జపాన్‌, కెనడా, నెదర్లాండ్స్‌తో తలెత్తిన వివాదంలో ఆ దేశాలకు చమురు సరఫరాలపై నిషేధం విధిస్తూ ఒపెక్‌ దేశాలు చేసిన ప్రకటన 1973లో చమురు సంక్షోభానికి దారి తీసింది. ఆ పర్యవసానంతో పుట్టిందే జి7. చమురు, విత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 1975లో నాటి ఫ్రెంచి అధ్యక్షుడు వాలెరీ గిస్కార్డ్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ హెల్మట్‌ స్మిత్‌ చొరవతో పారిస్‌లో తొలి సమావేశం జరిగింది. అమెరికా,బ్రిటన్‌,ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ నేతలు వచ్చారు.మరుసటి ఏడాది కెనడా, 1998లో రష్యా చేరింది. దాంతో అది జి8గా మారింది. 2014లో ఉక్రెయిన్‌ ఏలుబడిలో ఉన్న పూర్వపు తన క్రిమియా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటంతో ఆ బృందం నుంచి రష్యాను తొలగించటంతో తిరిగి జి7గా మారింది.1981 నుంచి ఐరోపా సమాఖ్య(ఇయు)ను శాశ్వత ఆహ్వానిత సంస్థగా మార్చారు. శిఖరాగ్ర సమావేశాలకు ఎవరు ఆతిధ్యం ఇస్తే తదుపరి సమావేశం వరకు ఏడాది పాటాదేశాధినేత అధ్యక్ష స్థానంలో ఉంటారు.ఈ బృందానికి ఒక కేంద్ర స్థానం లేదా శాశ్వత సిబ్బందిగానీ లేరు. సమావేశాల్లో ఐరాసతో సహా వివిధ ప్రపంచ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. అపూలియా సభలో ఉక్రెయిన్‌, వాతావరణ సంక్షోభాలు, సైబర్‌ భద్రతకు ముప్పు, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం, మానవహక్కుల హరింపు, అవసరాలకు మించి అదనంగా ఉత్పత్తి చేస్తూ విద్యుత్‌ వాహనాలను ప్రపంచం మీద కుమ్మరిస్తున్నదంటూ చైనా మీద దుమ్మెత్తి పోశారు. రష్యాకు ఆయుధాలను సరఫరా చేయకపోయినా, వాటి ఉత్పత్తికి అవసరమైన వాటిని అందిస్తున్నదంటూ విధించిన ఆంక్షలకు ఆమోదం తెలిపింది. ప్రతికూల చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగింది.


ఈ సమావేశాలకు హాజరైన నేతలందరి పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్లుగా ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నారు. అయినా లేస్తే మనుషలం కాదన్నట్లుగా ఫోజు పెట్టారు.చైనాను దెబ్బతీసేందుకు మిత్రదేశాలను అమెరికా ఎలా కూడగడుతున్నదో తనను తాను రక్షించుకొనేందుకు బీజింగ్‌ కూడా అదే చేయనుందని వేరే చెప్పనవసరం లేదు. ” ఆరుగురు అసమర్ధులు మరియు జార్జియా మెలోనీ 2024 జి7 తరగతిలో కూడిక ” అన్న శీర్షికతో పొలిటికో పత్రిక ఒక బలహీన సమావేశం అంటూ విశ్లేషణ రాసింది. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పచ్చిమితవాద పార్టీలు బలపడటంతో ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ ఏకంగా పార్లమెంటును రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాడు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా అంతకు ముందే అదేపని చేశాడు. జర్మనీ ఛాన్సలర్‌ షఉల్జ్‌ కూడా చావు దెబ్బతిన్నాడు, ఎప్పుడైనా అదేపని చేయవచ్చు. తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడేవ్‌ ”వెర్రి(క్రేజీ)” పదవి నుంచి తప్పుకోనున్నట్లు బహిరంగంగానే ప్రకటించాడు.జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా పలుకుబడి అధ్వాన్నంగా ఉంది. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్‌ తిరిగి అధికారానికి రావటం అనుమానంగానే ఉంది. ఇలాంటి వాటన్నింటినీ మూసిపెట్టేందుకు రష్యాతో పాటు చైనాను కూడా బూచిగా చూపేందుకు కసరత్తు చేశారు.


ఉక్రెయిన్‌-రష్యా వివాదం ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. అయితే దాన్ని పరిష్కరించటానికి బదులు మరింత ఎగదోసేదిగా కనిపించింది. ఈ సమావేశం ఫలితాలు, పర్యవసానాల విషయానికి వస్తే ఇప్పటికే దగ్గరైన చైనా-రష్యాలను మరింత దగ్గరగా చేసేందుకు దోహదం చేసిందని చెప్పవచ్చు.ఉక్రెయిన్‌ యుద్ధంలో చైనా ఆయుధాలను రష్యాకు సరఫరా చేయటం లేదు, కానీ వాటిని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సామర్ధ్యాన్ని సమకూరుస్తున్నది, కాబట్టి నిజానికి అది రష్యాకు సాయం చేయటమే అని జో బైడెన్‌ విలేకర్ల సమావేశంలో చెప్పాడు. రష్యా యుద్ధ యంత్రాంగ రక్షకురాలిగా చిత్రించటం తప్ప వేరు కాదు.గత కొద్ది సంవత్సరాలుగా చైనా మీద సాగిస్తున్న విమర్శ మరింత పదును తేలింది. గత రెండు సమావేశాల్లో చైనా పాత్ర గురించి దాదాపు లేవనెత్తలేదని, ఉక్రెయిన్‌పై వ్లదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాన్ని పేల్చుతారన్న భయాలు తలెత్తినపుడు షీ జింపింగ్‌ అంతదాకా పోనివ్వని నియంత్రణశక్తిగా భావించారని, ఈసారి దానికి భిన్నంగా సమావేశ ప్రకటన ప్రారంభమైందని న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది.రష్యా యుద్ధ యంత్రాంగానికి వస్తు సరఫరా చేస్తున్న చైనా, మూడవ పక్షదేశాల సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటం కొనసాగిస్తామని ప్రకటనలో పేర్కొన్నట్లు ఉటంకించింది. గత సమావేశాల్లో వాతావరణ ప్రతికూల మార్పులను అడ్డుకొనేందుకు,ఉగ్రవాదం, అణ్వాయుధ నిరోధం కోసం చైనాతో చేతులు కలుపుతామంటూ మాట్లాడిన ధనికదేశాలు ఇప్పుడు శత్రువుగా చూస్తున్నాయంటే ఆ సమస్యల పట్ల వాటి చిత్తశుద్ది ఏమిటో స్వయంగా వెల్లడించుకున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ షీ జింపింగ్‌ చైనా ఆధిపత్య లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అపూలియా అంతరంగిక సమావేశంలో అభిప్రాయపడినట్లు అమెరికా అధికారి ఒకరు విలేకర్లతో చెప్పాడు. ఉక్రెయిన్‌ వివాదంలో చైనా పాత్ర గురించి షీ జింపింగ్‌ వైఖరిలో గత ఏడాది కాలంలో మార్పు వచ్చినట్లు అమెరికా ప్రచారం చేస్తున్నది.రష్యాతో అవధులు లేని భాగస్వామ్యంగా ప్రకటించినప్పటి నుంచి అది ప్రారంభమైందని ఆరోపిస్తోంది. స్విడ్జర్లాండ్‌లో పశ్చిమదేశాలు నిర్వహించిన ఉక్రెయిన్‌ శాంతి సదస్సులో పాల్గొనవద్దని దేశాలను నిరుత్సాహపరచిందని కూడా ఆరోపించింది. చిత్రం ఏమిటంటే ఈ సమావేశంలో భాగస్వామిగా ఉన్న మనదేశం సమావేశ ప్రకటనను ఆమోదించటానికి తిరస్కరించింది. దీని వెనుక కూడా చైనా హస్తం ఉందని చెప్పగలరా ?


అవసరానికి మించి చైనా ఉత్పత్తులు చేస్తున్నదనే ప్రచారం పెద్ద ఎత్తున పశ్చిమదేశాలు చేస్తున్నాయి. ఇటలీ సభలో కూడా ఇది ఒక ప్రధాన అజెండాగా ఉంది. పెట్టుబడిదారీ విధాన సూత్రం ప్రకారం అవసరానికి మించి ఉత్పత్తి చేస్తే కొనేవారు లేక సంక్షోభానికి దారితీస్తుంది. ఈ కనీస ఇంగితం చైనా నాయకత్వానికి లేదని భావిస్తున్నారా ? చైనా ఉత్పత్తులు, సరఫరా గొలుసు మీద ఆధారపడకూడదని, విడగొట్టుకోవాలని చెబుతున్నవారిని ఎవరూ బలవంతంగా ఆపలేదే. వస్తు తయారీకి ధనిక దేశాల వద్ద పెట్టుబడులు లేవా, సాంకేతిక పరిజ్ఞానం లేదా, పని చేసే కార్మికులు లేరా ? చైనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నది అనుకుంటే ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేయవచ్చు. అమెరికా, ఐరోపా యూనియన్‌ కూడా చైనా ఉత్పత్తుల మీద దిగుమతి పన్నులను పెంచి రక్షణాత్మక చర్యలు తీసుకొని కూడా గగ్గోలు పెడుతున్నాయి. తమ బలహీనతలను కప్పిపుచ్చుకొనేందుకు తమమీద నిందలు వేస్తున్నట్లు చైనా విమర్శిస్తున్నది.


చైనా మీద వ్యతిరేకతను పెంచేందుకు చేయని తప్పుడు ప్రచారం లేదు. అవసరమైనపుడు అమెరికా, ఐరోపా దేశాలలోని అన్నిరకాల వ్యవస్థలను పనిచేయకుండా చేసేందుకు వాటిలో కంప్యూటర్‌ వైరస్‌లను పెట్టి సిద్ధంగా ఉంచిందని అమెరికా ఆరోపించింది. దీనికి ” ఓల్ట్‌ టైఫూన్‌ ” అనే పేరు పెట్టారు. దీని ప్రకారం విద్యుత్‌,నీరు,రేవుల వంటి వ్యవస్థలను అమెరికా, దాని మిత్రదేశాలలో పనిచేయకుండా చేసేందుకు చైనా ఒక ప్రోగ్రామ్‌ను రూపొందించి సదరు వ్యవస్థలలో ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. ఐటి, అన్ని రకాల సాంకేతిక రంగాలలో తమకు మించిన వారు లేరని విర్రవీగుతున్న పశ్చిమదేశాలు తమ వ్యవస్థలకు రక్షణ ఏర్పాట్లు చేసుకోలేనంత అసమర్ధంగా ఉన్నాయా ? అంటే ఎవరూ నమ్మరు, చైనాను బూచిగా చూపి జనంలో దిగజారుతున్న తమ పలుకుబడిని నిలుపుకొనేందుకు, ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ఒక మైండ్‌ గేమ్‌ తప్ప మరొకటి కాదు. ఒకవేళ బలవంతంగా తైవాన్‌ విలీనానికి చైనా పూనుకుంటే అక్కడి చిప్స్‌ తయారీ కేంద్రాలను పేల్చివేస్తామని అమెరికా బెదిరించిన సంగతి తెలిసిందే. అందువలన ఒక వేళ నిజంగా చైనా అలాంటి వైరస్‌ను చొప్పించిందంటే దెబ్బకు దెబ్బ తీసే జాగ్రత్త అని అర్ధం చేసుకోవాలి.
ఇక అపూలియా సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీ హాజరైపుడు ఫొటో తీసుకొనేందుకు హాజరైన నేతలందరూ చుట్టుముట్టారని, నేతల మధ్యలో మోడీ ఉండటమే దానికి నిదర్శనం అన్నట్లు సమావేశ గ్రూపు ఫొటోను చూపి కొంత మంది చౌకబారు ప్రచారం చేస్తున్నారు. ఐదుసార్లు ఈ సమావేశాలకు మోడీ వెళ్లారన్నది మరొకటి. యుపిఏ పదేండ్ల కాలంలో మన్మోహన్‌ సింగ్‌ కూడా ఐదుసార్లు హాజరయ్యారు.(2006 సెంట్‌పీటర్స్‌బర్గ్‌ సమావేశానికి మనదేశం నుంచి తీసుకువెళ్లిన జర్నలిస్టుల బృందంలో ఈ రచయిత కూడా ఒకరు ) భారత్‌ ఈ కూటమి సభ్యదేశంగా చేరనుందనే భావం కల్పిస్తూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. ఏ ఒక్కదేశమూ ఈ గ్రూపును విస్తరించే ప్రతిపాదనలు ముందుకు తేలేదు. ఒకవేళ విస్తరించినా మనదేశాన్ని చేర్చుకుంటారన్నది సందేహమే. ఆ గ్రూపులోని ఐదు దేశాల జిడిపి కంటే మనది ఎక్కువగా ఉన్నది తప్ప ధనికదేశ వర్గీకరణకు ఎంతో దూరంలో ఉంది. యాభై ఏండ్లుగా ఉన్న ఆ బృందం ప్రపంచ పరిణామాలను నియంత్రించటంలో నానాటికీ బలహీనపడుతున్న తరుణంలో మనదేశం చేరినంత మాత్రాన మన జనానికి ఒరిగేదేమిటి ? ఒకవేళ నిజంగా చేరితే చైనా, రష్యాలతో ఒక శత్రుకూటమిగా మనదేశం కూడా లడాయికి దిగటమే. అటువంటి దుస్సాహసానికి నరేంద్రమోడీ పాల్పడతారా ?

ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ ఫాసిస్టు సంస్థ, ఊసరవెల్లి : సోషలిస్టు నేత మధు లిమాయే చెప్పిన వాస్తవాలేమిటి ?

Tags

, , , , , , , ,


మధులిమాయే


నేను 1937లో రాజకీయ జీవితంలో ప్రవేశించాను. ఆ రోజుల్లో పూనాలో ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు సావర్కర్‌వాదులు( వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అనుచరులు) ఒక వైపు, మరోవైపు జాతీయవాదులు, సోషలిస్టులు మరియు వామపక్ష రాజకీయ సంస్థలు ఎంతో చురుకుగా ఉండేవి.1938 మే ఒకటవ తేదీన మే దినోత్సవాన్ని పాటించేందుకు మేము ఒక ప్రదర్శన జరిపాము. దాని మీద ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌వాదులు దాడి చేశారు. ఆ సందర్భంగా సుపరిచితులైన విప్లవవాది సేనాపతి బాపట్‌, మా సోషలిస్టు నేత ఎస్‌ఎం జోషి కూడా గాయపడిన వారిలో ఉన్నారు. హిందూత్వ సంస్థలతో అప్పటి నుంచి మాకు తీవ్రమైన విబేధాలు ఉండేవి. జాతీయవాద సమస్య మీద ఆర్‌ఎస్‌ఎస్‌తో మా తొలి విబేధం ఉంది. భారత దేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని మేము నమ్మాము. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌ వాదులు హిందూ రాష్ట్ర అనే భావంతో వచ్చారు. మహమ్మదాలీ జిన్నా కూడా అలాంటి లోకపు భావన బాధితుడే. భారత్‌ రెండు – ముస్లిం, హిందూ దేశాలతో ఏర్పడిందని అతను నమ్మారు, సావర్కర్‌ కూడా అదే చెప్పారు.


మా మధ్య రెండో ప్రధాన విబేధం ఏమిటంటే మేము ఒక ప్రజాస్వామిక సర్వసత్తాక రాజ్యం ఉద్భవించాలని కలగన్నాము, ప్రజాస్వామ్యం పశ్చిమదేశాల భావన, భారత్‌కు పనికిరాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది. ఆ రోజుల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు అడాల్ఫ్‌ హిట్లర్‌ను ఎంతగానో పొగిడేవారు. గురూజీ(మాధవ సదాశివ గోల్వాల్కర్‌) ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగానే కాదు సైద్దాంతిక గురువుగా కూడా ఉండేవారు.గురూజీ మరియు నాజీల మధ్య ఆలోచనల్లో అద్భుతమైన సామీప్యతలు ఉన్నాయి. ఆయన ఉత్తమ రచనల్లో ఒకటిగా ఉన్న ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” అనే గ్రంధం అనేక ప్రచురణలు పొందింది. హిందువులు కాని వారిని పౌరులుగా పరిగణించకూడదని స్పష్టంగా దానిలో చెప్పారు.వారి పౌరసత్వహక్కులను రద్దుచేయాలని కోరారు. ఈ ఆలోచనలు కొత్తగా రూపుదిద్దుకున్నవి కాదు. మేము కాలేజీలో ఉన్న రోజుల నుంచి(1930 దశకం మధ్యలో) హిట్లర్‌ భావజాలం వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు మొగ్గుచూపేవారు. వారి దృష్టి ప్రకారం జర్మనీలో యూదుల పట్ల హిట్లర్‌ ఎలా వ్యవహరించాడో అదే మాదిరి భారత్‌లో ముస్లింలు, క్రైస్తవుల పట్ల వ్యవహరించాలి.నాజీ పార్టీ భావాల పట్ల గురూజీ ఎంతలా సానుకూలంగా ఉన్నారో ” ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్‌డ్‌ ” గ్రంధంలో దిగువ పేరాయే సాక్ష్యం.” తన జాతి, సంస్మృతిని పరిశుద్దంగా ఉంచేందుకు సెమిటిక్‌ జాతులను-యూదులను అంతమొందించి జర్మనీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతి ఔన్నత్యం దాన్ని ఉన్నతిని ఇక్కడ స్పష్టం చేసింది. జాతులు,సంస్కృతుల మధ్య ఉన్న విబేధాలకు కారణాలు తెలుసుకొంటే వాటిని తొలగించటం అసాధ్యం కాదని, ఐక్యంగా ఉంచటానికి సమీకృతం చేసేందుకు ప్రపంచానికి జర్మనీ దారి చూపింది, దాన్నుంచి నేర్చుకొనేందుకు, లబ్దిపొందేందుకు హిందూస్తాన్‌లో మనకు మంచి పాఠం ”


కుల సమస్య మీద గురూజీ మరియు ఆర్‌ఎస్‌ఎస్‌తో మా మూడో ప్రధాన విబేధం. ఒక సోషలిస్టుగా నా వంటి వారికి అది ఒక పెద్ద శత్రువు కాగా కుల వ్యవస్థ సమర్ధకులు వారు. కుల వ్యవస్థ దాని పునాదిగా ఉన్న అసమానతలను నిర్మూలించకుండా భారత్‌లో ఆర్థిక, సామాజిక సమానత్వం సాధ్యం కాదన్నది నా గట్టి వైఖరి. మేము విబేధించిన నాలుగో అంశం భాష. పౌరుల భాషలను ప్రోత్సహించేందుకు మేము అనుకూలం. అన్ని ప్రాంతీయ భాషలు దేశీయమైనవే. కానీ దీని మీద చెప్పిందేమిటి ? అందరికీ ఉమ్మడి భాషగా ప్రస్తుతానికి హిందీని, తరువాత అంతిమంగా జాతీయ భాషగా సంస్కృతాన్ని చేయాలని గురూజీ చెప్పారు. ఐదవది, స్వాతంత్య్రం కోసం తలెత్తిన జాతీయ ఉద్యమం ఫెడరల్‌ రాజ్యం అనే భావనను ఆమోదించింది. ఒక సమాఖ్య దేశంలో కొన్ని నిర్దేశిత విషయాలలో కేంద్రం కొన్ని తప్పనిసరి అధికారాలను కలిగి ఉంటుంది, ఇతర అన్ని అంశాలు రాష్ట్రాలకు చెందినవిగా ఉండాలి. కానీ దేశ విభజన తరువాత కేంద్రాన్ని పటిష్టపరిచేందుకు ఉమ్మడి జాబితాను నిర్దేశించారు. ఈ జాబితా ప్రకారం అనేక అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారు. వాటి మీద కేంద్రం, రాష్ట్రాలకు సమానమైన అధికారపరిధి ఉంది.ఆ విధంగా సమాఖ్య రాజ్యం ఉనికిలోకి వచ్చింది. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు దాని ప్రధాన సిద్దాంతవేత్త గురు గోల్వాల్కర్‌ ఈ మౌలిక రాజ్యాంగ ఏర్పాటును వ్యతిరేకించారు. రాష్ట్రాల సమాఖ్య భావననే వీరు అపహాస్యం చేశారు. రాష్ట్రాల సమాఖ్యను కోరిన రాజ్యాంగాన్నే రద్దు చేయాలన్నారు. తన ” బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ ” అనే గ్రంధంలో రాజ్యాంగాన్ని సమీక్షించాలని, కొత్త రాజ్యాంగంలో ఏక(యూనిటరీ) రాజ్య ఏర్పాటును లిఖించాలని పేర్కొన్నారు. ఏక లేదా మరో మాటలో చెప్పాలంటే కేంద్రీకృత రాజ్యాన్ని గురూజీ కోరారు.రాష్ట్రాల వ్యవస్థను వదిలించుకోవాలని చెప్పారు.


జాతీయోద్యమం ఎంచుకున్న త్రివర్ణ పతాకం మరొక సమస్య. మనం ఎంచుకున్న జాతీయ పతాక గౌరవం, ఔన్నత్యం కోసం వందలాది మంది భారతీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, వేలాది మంది లాఠీ దెబ్బలను తిన్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆర్‌ఎస్‌ఎస్‌ త్రివర్ణాన్ని జాతీయ జెండాగా ఎన్నడూ ఆమోదించలేదు. అది ఎల్లవేళలా కాషాయపతాకానికే వందనం చేస్తుంది.స్మృతికందని కాలం నుంచీ అది హిందూ రాజ్య పతాకంగా ఉందని చెబుతుంది.ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల గురూజీకి విశ్వాసం లేదు. ప్రజాస్వామ్య భావన పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నదనే ధృడ వైఖరిని కలిగి ఉన్నారు. భారతీయ నాగరికత, ఆలోచనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తగినది కాదన్నారు. ఏక నాయకత్వ సూత్రాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నమ్ముతుంది.ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక మానసిక దృక్పధాన్ని సృష్టిస్తుందని అది పూర్తిగా క్రమశిక్షణతో కూడుకున్నదిగా ఉంటుందని అది ఏం చెబితే దాన్ని జనం అంగీకరిస్తారని గురూజీ కూడా స్వయంగా చెప్పారు. ఈ సంస్థ ఏక వ్యక్తి నాయకత్వ సూత్రం మీదనే పనిచేస్తుంది. సోషలిజం గురూజీ దృష్టిలో పూర్తిగా వెలుపలి భావజాలం, సోషలిజం, ప్రజాస్వామ్యంతో పాటు అన్ని ఇజాలూ విదేశీ ఆలోచనలే, వాటిని తిరస్కరించాలని, భారతీయ సమాజాన్ని భారతీయ సంస్కృతి ఆధారంగా నిర్మించాలని అతను పదే పదే చెప్పారు. మా గురించి చెప్పాలంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం,సోషలిజం పట్ల మాకు విశ్వాసం ఉంది. శాంతియుత పద్దతుల్లో గాంధియన్‌ సూత్రాలకు అనుగుణంగా సోషలిజాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. మరోవైపు ఒక ప్రత్యేక మూసలో యువ మెదళ్లను తయారు చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక నైపుణ్యాన్ని సంతరించుకుంది. తొలుత అది పిల్లలు, యువత మెదళ్లలోకి ఏమీ ప్రవేశించకుండా ఘనీభవింపచేస్తుంది. ఆ తరువాత వారు ఇతర భావజాలాలకు స్పందించలేని అశక్తులుగా మారిపోతారు.


పేదల పట్ల కనికరం అవసరం లేదని గురూజీ భావించారు. తన బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌ గ్రంధంలో దేశంలో జమిందారీ వ్యవస్థ రద్దు పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆ వ్యవస్థ రద్దు పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేయటమే కాదు, తీవ్రంగా కలత చెందారు. ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని రుద్దినపుడు వీరితో(ఆర్‌ఎస్‌ఎస్‌ మరియు జనసంఫ్‌ు) మేము ఒక కూటమి కట్టామన్నది ఒక వాస్తవం. ఒక పార్టీగా ప్రతిపక్షాలు ఐక్యంగాకపోతే ఇందిరా గాంధీని ఓడించలేమని లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ నమ్మారు.చౌదరి చరణ్‌ సింగ్‌ కూడా అలాంటి వైఖరినే కలిగి ఉన్నారు గనుక మేము ఒకే పార్టీగా ఐక్యమయ్యాము. మేము జైల్లో ఉండగా ఒక పార్టీని ఏర్పాటు చేయటం, ఎన్నికల్లో పోటీ చేయటం గురించి అబిప్రాయాలు చెప్పమని మమ్మల్ని అడిగారు. మనం తప్పనిసరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక సందేశాన్ని పంపిన అంశాన్ని గుర్తు చేసుకున్నాను. కోట్లాది మంది జనం ఎన్నికల్లో పాల్గొంటారు. ఎన్నికలు ఒక క్రియాశీల క్రమం. ఎన్నికల వాతావరణం పెరిగే కొద్దీ అత్యవసర పరిస్థితి సంకెళ్లు తెగుతాయి,జనం తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకుంటారు. అందువలన మనం ఎన్నికల్లో పాల్గొనాలని నేను గట్టిగా చెప్పాను. ఒకే పార్టీ పతాకం కిందకు అందరూ రాకపోతే విజయం సాధించలేమని లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఇతర నేతల వైఖరి ఉన్న కారణంగా సోషలిస్టులంగా మా అంగీకారం తెలిపాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పదలచాను. రాజకీయ పార్టీలు-జనసంఫ్‌ు, సోషలిస్టు పార్టీ, కాంగ్రెస్‌(ఓ), భారతీయ లోక్‌దళ్‌(బిఎల్‌డి), కాంగ్రెస్‌ ముఠాలలోని కొన్ని అసంతృప్త తరగతుల మధ్య మాత్రమే అవగాహన కుదిరింది.ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలాంటి ఏర్పాటుకు మేము రాలేదు, దాని డిమాండ్లను వేటినీ అంగీకరించలేదు. ఇంకా చెప్పాల్సిందేమంటే జైల్లో ఉన్న మా మధ్య పంపిణీ అయిన మనూభారు పటేల్‌ లేఖ ద్వారా 1976 జూలై 7న మేము తెలుసుకున్నదేమంటే కొత్త పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్‌ వారు కూడా పార్టీ సభ్యులైతే ద్వంద్వ సభ్యత్వ వివాదం తలెత్తవచ్చని చౌదరి చరణ్‌ సింగ్‌ ఒక సమస్యను లేవనెత్తారు. దీని మీద అప్పుడు జనసంఫ్‌ు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఓమ్‌ ప్రకాష్‌ త్యాగి స్పందిస్తూ కొత్త పార్టీ సభ్యత్వాన్ని ఎలా కావాలంటే అలా రూపొందిచుకోవచ్చని స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నందున రద్దయినట్లేనని, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వ సమస్య తలెత్తదని కూడా చెప్పారు.


తరువాత ప్రతిపాదిత జనతా పార్టీ నిబంధనావళిని రూపొందించేందుకు ఒక ఉపసంఘాన్ని నియమించారు. జనతా పార్టీ లక్ష్యాలు, విధానాలు, కార్యక్రమాలతో విబేధించే ఏ సంస్థకు చెందిన వారికీ జనతా పార్టీలో సభ్యత్వం ఇవ్వకూడదని ముసాయిదా నిబంధనావళిలో పెట్టారు. దీని అర్ధం ఏమంటే ఎవరూ ఈ నిబంధనను వ్యతిరేకించకూడదన్నది స్పష్టం.అయినప్పటికీ దీనికి వచ్చిన ఒకే ఒక అభ్యంతరం జనసంఫ్‌ుకు చెందిన సుందర్‌ సింగ్‌ భండారీ నుంచి వెలువడటం గమనించాలి. తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు 1976 డిసెంబరులో ఏర్పాటు చేసిన సమావేశానికి జనసంఫ్‌ు, ఆర్‌ఎస్‌ఎస్‌ తరఫున అతల్‌ బిహారీ వాజ్‌పాయి రాసిన లేఖలో ప్రతిపాదిత పార్టీలో ఒక తరగతి నేతలు జనతా పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్‌ సమస్యను లేవనెత్తకూడదని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అయితే అనేక మంది నేతలు అలాంటి హామీ ఇవ్వలేదని నాకు చెప్పారు. ఎందుకంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విలీనం కావాలని తలపెట్టినపుడు రంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎక్కడా లేదు గనుక అన్నారు. నేను ఒకటి స్పష్టం చేయదలచాను. ఆ సమయంలో నేను జైల్లో ఉన్నాను. ఒక వేళ ఒక రహస్య అవగాహనకు వచ్చి ఉండి ఉంటే దానిలో నాకు భాగస్వామ్యం లేదు.


నేను ఒకటి విస్పష్టంగా చెప్పగలను. జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఏ రీత్యా చూసినా ఆర్‌ఎస్‌ఎస్‌ అంశాలను ప్రతిబింబించలేదు. వాస్తవానికి ప్రణాళికలోని ప్రతి అంశమూ స్పష్టంగా ఉంది. లౌకిక, ప్రజాస్వామిక, గాంధియన్‌ సూత్రాల ప్రాతిపదికగా సోషలిస్టు సమాజం గురించి జనతా పార్టీ ప్రణాళిక ఉంది.దానిలో హిందూ దేశం గురించిన ప్రస్తావన లేదు.మైనారిటీలకు సమానహక్కులకు హామీ ఇవ్వటమే కాదు, వారి హక్కులకు రక్షణ కల్పిస్తామని కూడా చెప్పింది. కుల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిందా ? ఇతరుల సేవకు శూద్రులు తమ జీవితాలను అర్పించాలని చెప్పిందా ? దానికి విరుద్దంగా వెనుకబడిన తరగతుల పురోగమనానికి వాగ్దానం చేయటమే కాదు పూర్తి అవకాశాలు కల్పిస్తామని చెప్పింది, వారికోసం ప్రత్యేక విధానాలు తీసుకొస్తామని పేర్కొన్నది. వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 25-33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. గురూజీ కేంద్రీకరణ జరపాలని గట్టిగా చెప్పగా వికేంద్రీకరిస్తామని జనతా పార్టీ అంగీకరించింది. రాష్ట్రాలను రద్దు చేయాలని, అసెంబ్లీలను, మంత్రివర్గాలను కూడా రద్దు చేయాలని అతను కోరగా మరింత వికేంద్రీకరణ జరగాలని జనతా పార్టీ నొక్కివక్కాణించింది. మరో విధంగా చెప్పాలంటే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని లాక్కోవాలన్న వాంఛ జనతా పార్టీకి లేదు.


పార్టీ ఎన్నికల ప్రణాళికలోని అంశాలను స్వచ్చందంగా అంగీకరించలేదన్నది నిజం. ఇది నా అభ్యంతరం, అంతే కాదు రాతపూర్వకంగా ఒకసారి కుష్‌భాహు థాకరేకు ఫిర్యాదు చేశాను. చర్చల సందర్భంగా మీవారు(ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఫ్‌ు) వెంటనే అంగీకరించినా హృదయపూర్వకంగా పూర్తిగా వ్యతిరేకించారని నేను చెప్పాను. అందుకే మీ ఉద్దేశ్యాలను అనుమానించాల్సి వస్తోంది.ఈ లేఖను నేను ఎంతో కాలం క్రితమే రాశాను, ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి నాకు ఎప్పుడూ సందేహమే.నిరంకుశత్వాన్ని వ్యతిరేకించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలన్న లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ వాంఛ, ఎలాంటి రాజీలు లేకుండా పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉండటం వలన మన ఐక్యతకు నేను ఆమోదం తెలిపాను. అదే సమయంలో నేను ఒకటి చెప్పదలచుకున్నాను. ప్రారంభం నుంచి నాకు ఒక స్పష్టత ఉంది ఐక్య, విశ్వసనీయమైన జనతా పార్టీ ఆవిర్భవించాలంటే రెండు పనులు చేయాల్సి ఉంటుందని నా మనసులో ఉంది. ఒకటి, ఆర్‌ఎస్‌ఎస్‌ తన భావజాలాన్ని మార్చుకోవాలి మరియు లౌకిక,ప్రజాస్వామిక రాజ్య భావనను అంగీకరించాలి.రెండవది, సంఘపరివార్‌లో భాగంగా ఉన్న వివిధ సంస్థలు భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు, విద్యార్ధి పరిషత్‌ వంటివి తమను తాము రద్దు చేసుకొని లౌకిక భావజాలం ఉన్న కార్మిక సంఘాల్లో, జనతా పార్టీ విద్యార్థి విభాగంలో విలీనం కావాలి. జనతా పార్టీ కార్మిక విభాగం, విద్యార్థి విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించమని పార్టీ నాకు విధి అప్పగించిన నాటి నుంచీ నేను దీని గురించి స్పష్టతతో ఉన్నాను. ఈ రెండు సంస్థలూ ప్రత్యేక ఉనికిని రద్దు చేసుకోవాలని నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. హిందువులను మాత్రమే సంఘటితపరచాలనే మీ భావజాలాన్ని వదలి వేసుకోవాలని, మీ సంస్థలో అన్ని మతాల వారికీ చోటు కల్పించాలని,జనతా పార్టీలో ఉన్న భిన్నమైన తరగతుల ప్రాతిపదికన ఉన్న సంస్థలలో విలీనం కావాలని నేను ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులకు చెప్పాను. అది వెంటనే జరిగేది కాదని, అనేక ఇబ్బందులు ఉన్నాయని, కానీ కొద్ది కొద్దిగా మారాలని కోరుకుంటున్నట్లు వారి స్పందన ఉంది. వారు అలా తప్పించుకొనే జవాబులను కొనసాగించారు.


వారి ప్రవర్తన చూసిన తరువాత వారిలో మార్పు ఉద్దేశ్యం లేదన్న నిర్దారణకు వచ్చాను.ప్రత్యేకించి 1977జూన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత వారు నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారానికి రాగలిగారు. అప్పటి నుంచి కొత్తగా వచ్చిన ప్రతిష్టతో మారాల్సిన అవసరం లేదని వారు ఆలోచించటం ప్రారంభించారు.ఇప్పటికే వారు నాలుగు రాష్ట్రాలను కైవశం చేసుకున్నారు. క్రమంగా ఇతర రాష్ట్రాలను, చివరకు కేంద్రాన్ని కూడా పట్టుకొనేందుకు చూస్తారు. జనతా పార్టీలోని ఇతర రాజకీయ నేతలు పెద్ద వారు, వారు ఎంతో కాలం జీవించలేరు. పార్టీలో ఉన్న ఉన్నత స్థానాలకు ఎదిగేట్లు ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘేతర నేతలను చేయలేరు. అయినప్పటికీ నేను ప్రయత్నించాను. ఒక సందర్భంగా అన్ని కార్మిక సంఘాలనేతల సమావేశం ఏర్పాటు చేశాను. జనతా పార్టీలోని అన్ని పక్షాల ప్రతినిధులు వచ్చారు, భారతీయ మజ్దూర్‌ సంఫ్‌ు సమావేశాన్ని బహిష్కరించింది. అంతే కాదు ఎలాంటి కారణం లేకుండానే వారు నన్ను దూషించారు. విద్యార్థి పరిషత్‌, యువమోర్చాలతో అలాంటి ప్రయత్నమే జరిగింది. విలీనం కోసం జరిగిన అన్ని ప్రయత్నాలకూ వారు దూరంగా ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే పార్టీ మీద పెత్తనం చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ వాంఛ కారణంగానే. ప్రజల ప్రతి జీవనరంగంలోకి ప్రవేశించాలన్నది వారి లక్ష్యం, అంతేకాదు దాన్ని అదుపు చేయాలన్నది కూడా. ఇలాంటి అభిప్రాయాలను గురూజీ తన ఉరు ఆర్‌ అవర్‌ నేషన్‌హుడ్‌ డిఫైన్డ్‌ అనే గ్రంధంలో పదే పదే వక్కాణించారు. నిరంకుశ సంస్థ ఏదీ స్వేచ్చను అనుమతించదు. దాని వేర్లు కళలు, సంగీతం, ఆర్థికం, సాంస్కృతిక రంగం ప్రతిచోటా ఉంటాయి. ప్రతి ఫాసిస్టు సంస్థ సారం ఇదే. వీరు అరుదైన సందర్భాలలో చేసేదానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. గురూజీ బాటలో ఆలోచనలను వదలి వేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ చెప్పలేదు. జైళ్లలో ఉన్నపుడు వీరు క్షమాభిక్ష కోసం ప్రార్ధించారు. రాజనారాయణ్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇందిరా గాంధీకి అనుకూలంగా వచ్చినపుడు బాలాసాహెబ్‌ దేవరస్‌ ఆమెను అభినందించారు. అందువలన వీరి ఉద్ఘాటనల మీద నాకు నమ్మకం లేదు. నేను వీరిని (జనతా పార్టీలో పూర్వపు జనసంఫ్‌ు నేతలు) ఎప్పుడు నమ్ముతానంటే పార్టీ, కార్యవర్గ కమిటీల నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలను బహిష్కరించినపుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల మీద ఆంక్షలు విధించినపుడు, ప్రత్యేకించి నానాజీ దేశముఖ్‌, సుందర్‌ సింగ్‌ బండారీ వారి అనుచరులను బహిష్కరించినపుడే నమ్ముతాను.


గమనిక : మధు లిమాయే(1922 -1995 ) పూనాలో జన్మించారు. కాంగ్రెస్‌లో, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ, తరువాత ప్రజా సోషలిస్టు పార్టీ నేతగా వ్యవహరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యత్వంపై వివాదం కారణంగా జనతా పార్టీ నుంచి పూర్వపు జనసంఘనేతలు వేరు పడి బిజెపిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అధికారం కోసం అవసరాలకు అనుగుణంగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చింది తప్ప మౌలిక స్వభావం, లక్ష్యాలలో ఎలాంటి మార్పు లేదు. నాలుగు దశాబ్దాల నాడు (1979) రాసిన ఈ వ్యాసంలో లేవనెత్తిన అంశాలు నేటికీ సంగతమైనవేే గనుక జనతా వార పత్రిక నుంచి సేకరించి అనువదించి అందించాను, : ఎం కోటేశ్వరరావు

నరంలేని నాలుకల సుభాషితాల రచ్చ మామూలుగా లేదు : నరేంద్రమోడీని తప్పించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ రంగం సిద్దం ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


నేతిబీరలో నెయ్యి, మైసూరు పాక్‌లో మైసూరు – పాకిస్తాన్‌, మమకారంలో కారం ! ఇలాంటివి పిల్లల ఆటల్లో చూస్తాం. నరేంద్రమోడీ ఆకర్షణ కూడా అలాంటిదే అని సంఘపరివారం భావిస్తోందా ? వాజ్‌పాయి, అద్వానీలనే పక్కన పెట్టిన వారికి మోడీ ఒక లెక్కా ? ఒక ప్రకటన చేయటం, దాని మీద స్పందన చూసి సానుకూలంగా ఉంటే కొనసాగింపు లేకుంటే వెంటనే మాట మార్చటం తెలిసిందే. మోడీ కూడా పరివారంలో ఇతరుల మాదిరే తప్ప ప్రత్యేకతేమీ లేదనే సందేశాన్ని లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ చేసిన ఉపన్యాసంలో వెల్లడించారు. ఈ సందర్భంగా దానితో పాటు కలగలిపి చెప్పిన సుభాషితాల్లో విశ్వసనీయత,చిత్తశుద్ధి, నిజాయితీ గురించి అనేక మంది ప్రశ్నిస్తున్నారు.రచ్చ కూడా మొదలైంది. మోడీ ఎలా స్పందిస్తారో, తన మద్దతుదార్లను ఎలా సమీకరిస్తారో చూడాల్సి ఉంది. గందరగోళం సృష్టించటానికి తమ నేత మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలకు తప్పుడు భాష్యం చెప్పారని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు చెప్పినట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొన్నది. సంఫ్‌ు-బిజెపి మధ్య ఎలాంటి వివాదాలు లేవని, భగవత్‌ వ్యాఖ్యలను అసందర్భంగా పేర్కొన్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. 2014,2019 ఎన్నికల తరువాత చేసిన ఉపన్యాసాలకు, తాజా ఎన్నికల తరువాత చేసిన దానికి పెద్దగా తేడాలేదని. నరేంద్రమోడీ లేదా ఏ బిజెపి నేతను ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పుకుంది.తమ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం తప్ప సంస్థ అధికారిక వైఖరికి ప్రతిబింబం కాదన్నది.


నిజమైన సంఘసేవకులు పొగరుబోతులుగా ఉండరని మోహన్‌ భగవత్‌ తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ నాగపూర్‌ శిక్షణా సమావేశంలో సెలవిచ్చారు. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పారంటే మోడీనే అని మీడియాలో కొందరు వ్యాఖ్యానించారు. మోడీని హెచ్చరించే ధైర్యం పరివార్‌కు ఉందా, తమకు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు అవసరం లేదని చెప్పిన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను ఉద్దేశించి అని కొందరన్నారు. తన జన్మ మామూలుది కాదని, దైవాంశ సంభూతుడనని నరేంద్రమోడీ చెప్పుకున్నపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి చప్పుడు చేయలేదు. 2018 నుంచి ఎన్‌డిఏ కూటమి కన్వీనర్‌ లేరు, సమావేశాలు జరిపింది లేదు, మిత్రపక్షాలను ముఖ్యమైన అంశాల మీద సంప్రదించిన దాఖలాలు లేవు. అహంకారం, ఏకపక్ష ధోరణే. రైతుల ఆందోళన పట్ల అనుసరించిన వైఖరిని చెప్పనవసరం లేదు. చివరికి అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వంటి పెద్దలతో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసి దానితో ఒక్క సమావేశం జరపకపోయినా, రామమందిర ప్రారంభోత్సవానికి అద్వానీ రావద్దని చెప్పినపుడు గానీ ఆర్‌ఎస్‌ఎస్‌ స్పందించలేదు, సుద్దులు-బుద్దులు చెప్పలేదు. పదేండ్ల పాలన తరువాత సంపూర్ణ మెజారిటీ రాకపోవటం, అయోధ్య రామాలయం ఉన్న చోట బిజెపి మట్టికరవటం, మణిపూర్‌లో పరాభవం వంటి పరిణామాల తరువాత మోడీని కాపాడేందుకే భగవత్‌ రంగంలోకి దిగారనే అభిప్రాయం కూడా ఉంది. గతంలో కూడా అలాగే జరిగిందని కొందరు గుర్తు చేస్తున్నారు. కాదు తమ హిందూత్వ అజెండాకు మొదటికే మోసం వచ్చినందున మోడీని మందలించటం, తరువాత తప్పించేందుకు ముందుగానే పావులు కదిపారన్న అభిప్రాయాలూ ఉన్నాయి.


రెండు నాలుకలతో మాట్లాడటం, ఆ జేబులో ఒక స్టేట్‌మెంటు ఈ జేబులో మరో స్టేట్‌మెంటు పెట్టుకొని తిరిగే వారిలో సంఘపరివార్‌ దళం కూడా ఉంది. ఉదాహరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ మాట్లాడుతూ అహంకారం కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి సీట్లను భగవంతుడు రాముడు 241 సీట్ల దగ్గరనే నిలిపివేసినట్లు, సంపూర్ణ మెజారిటీకి దూరంగా పెట్టినట్లు ధ్వజమెత్తారు. జైపూర్‌ సమీపంలోని కనోటా వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో జూన్‌ 13వ తేదీన మాట్లాడుతూ రామభక్తులు క్రమంగా అహంకారులుగా మారారు. ఆ కారణంగానే రాముడు ఆ పార్టీని అతిపెద్దపార్టీగా 241 సీట్ల వద్ద నిలిపాడని అన్నారు. ఇదంతా మోహన భగవత్‌ వ్యాఖ్యల తరువాతే జరిగింది. ఇంద్రేష్‌ కుమార్‌ వ్యాఖ్యలపై బిజెపి నుంచి నిరసన వెల్లడికావటంతో నష్టనివారణ చర్యగా ఆ సేవక్‌ మాటమార్చారు. రాముడిని వ్యతిరేకించిన వారు అధికారానికి దూరంగా ఉన్నారు. అనుసరించిన వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మరుసటి రోజు చెప్పారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వం రాత్రి పగలు పనిచేస్తుందని,దేశం ఎంతో పురోగతి సాధిస్తుందన్న నమ్మకంతో జనం ఉన్నారని ఆకాశానికి ఎత్తారు.మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలపై తలెత్తిన రచ్చ గురించి ప్రశ్నించగా దాని గురించి సంఫ్‌ు అధికారిక ప్రతినిధులను అడిగితే మంచిదని పిటిఐ వార్తా సంస్థతో అన్నారు.
మోహన్‌ భగవత్‌ చెప్పిన హితవులో మణిపూర్‌ హింసాకాండ అంశం కూడా ఉంది. ” ఈ ఈశాన్య రాష్ట్రంలో చూస్తుంటే ఎట్టకేలకు తుపాకి సంస్కృతి అంతమైనట్లుగా కనిపించింది, అయినప్పటికీ ”ఆకస్మికంగా” హింసాకాండ చెలరేగింది. ఎలాంటి ఆలశ్యం లేకుండా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కనిపిస్తోంది ” అని మోహన్‌ భగవత్‌ చెప్పారు.” గత పది సంవత్సరాల్లో మణిపూర్‌లో హింసాకాండ లేదు. కానీ పరిస్థితి దిగజారింది.శాంతియుత పరిస్థితి కోసం గత ఏడాదిగా ఆ రాష్ట్రం ఎదురుచూస్తోంది.” అన్నారు. మణిపూర్‌, కేంద్రంలోనూ రెండు చోట్లా స్వయం సేవకులే పాలకులుగా ఉన్నారు. హింసాకాండ చెలరేగి వందలాది మంది మరణించారు, వేలాది మంది నెలవులు తప్పారు. గిరిజన మహిళలను వివస్త్రలుగా ఊరేగించిన ఉదంతం వెలుగుచూడకుండా చేసేందుకు అదే సేవకులు పాటుపడ్డారు. అది బయటకు వచ్చిం తరువాత అక్కడకు వెళ్లి వారిని పరామర్శించి ధైర్యం చెప్పిరావాల్సిన కేంద్ర సేవక్‌ కదలేదు, మెదల్లేదు. ఇదేం పని అంటూ ప్రధాన సేవక్‌ ప్రశ్నించిన దాఖల్లాలేవు.చెంపదెబ్బ మాదిరి లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లోని రెండు స్థానాల్లో బిజెపి ఓడిపోయిన తరువాత మోహన్‌ భగవత్‌ సుభాషితాలకు పూనుకున్నారు. అక్కడ హిందువులైన మెయితీలు, క్రైస్తవులైన గిరిజన కుకీలు బిజెపిని మట్టికరిపించారు. రెండింజన్లు పనికిరానివిగా తేల్చారు. గుజరాత్‌ మారణకాండ సందర్భంగా రాజధర్మం పాటించాలని చెప్పిన అతల్‌ బిహారీ వాజ్‌పేయి మాటలనే పూచికపుల్లగా తీసిపారేసిన, మార్గదర్శక మండల్‌ పేరుతో సీనియర్ల కమిటీ అంటూ వేసి దాన్ని విస్మరించిన మోడీ గురించి జనానికి తెలిసినా మోహన్‌ భగవత్‌కు తెలియదంటే నమ్మలేము. స్వయం సేవకుల మీద ఎలాంటి నియంత్రణ ఉండదు అని చెప్పారు.


మణిపూర్‌ గురించి మోహన్‌ భగవత్‌ స్పందించటం ఇదే తొలిసారి కాదు. అక్కడ ఉన్న సామాజిక తరగతులైన మెయితీ-కుకీల మధ్య దీర్ఘకాలంగా ఉన్న పరస్పర అనుమానాలు, విబేధాల పూర్వరంగంలో బిజెపి మత అజండాతో మెయితీలను దగ్గరకు తీసి అధికారాన్ని పొందింది.హిందువుల సంతుష్టీకరణ, ఓటుబ్యాంకు రాజకీయాలకు తెరలేపింది. మెయితీలను కూడా గిరిజనులుగా పరిగణిస్తూ వారికి రిజర్వేషన్లను వర్తింప చేయాలంటూ తనకు లేని అధికారంతో హైకోర్టు సిఫార్సు చేసింది. దానికి నిరసన తెలిపిన గిరిజనులను అణచివేసేందుకు పూనుకోవటంతో హింసాకాండ తలెత్తింది.దారుణాలు చోటు చేసుకున్నాయి.ఈ వాస్తవాన్ని మూసిపెట్టేందుకు హింసాకాండ వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ గతేడాది అక్టోబరు 24న విజయదశమి సందేశంలో మోహన్‌ భగవత్‌ బిజెపి పాటను పాడారు. 2023 మే నెల మూడవ తేదీ నుంచి హింసాకాండ జరుగుతుంటే అక్టోబరు వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ స్పందించలేదు. విదేశీ హస్తమే వాస్తవం అనుకుంటే విదేశీ సరిహద్దులు ఉన్న ఆ రాష్ట్రంలో స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు సదరు హస్తాన్ని ఖండించకుండా, కట్టడి చేయకుండా ఏ గుడ్డిగుర్రాలకు పండ్లుతోముతున్నట్లు ? అప్పటి వరకు మాట్లాడని మాదక ద్రవ్యాల ఉగ్రవాదం, అక్రమంగా ప్రవేశించిన కుకీలు అంటూ కొత్త కతలను చెప్పారు. ఒక మాదక ద్రవ్య మాఫియా నేత (కుకీ) పట్ల నిదానంగా వ్యవహరించాలని ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌(మెయితీ) హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు ఒక పోలీసు అధికారి చెప్పిన మాటలను మరచిపోరాదు.మెయితీ-కుకీల మధ్య సంబంధాలకు ఎవరో మతం రంగు పులిమేందుకు చూశారని కూడా విజయదశమి ఉపన్యాసంలో భగవత్‌ ఆరోపించటం దొంగేదొంగని అరిచినట్లుగా ఉంది. అందువలన మణిపూర్‌ సమస్యను పట్టించుకోవాలని ఇప్పుడు మోహన్‌ భగవత్‌ చెప్పటంలో చిత్తశుద్ది ఉందా ? మణిపూర్‌ను సందర్శించటానికి నరేంద్రమోడీకి తీరిక దొరకలేదు, వెళ్లి సమీక్ష జరపాలని చెప్పటానికి ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆలోచన తట్టలేదంటే నమ్మే అమాయకులు కాదు జనం.


ఎన్నికలలో నరేంద్రమోడీ, బిజెపి పెద్దల దిగజారుడు ప్రసంగాల తీరు తెలిసిందే. దాన్ని తక్కువ చేసి చూపేందుకు అందరూ అలాగే నోరుపారవేసుకున్నారంటూ భగవత్‌ మాట్లాడారు. నిజమైన ” సేవక్‌ ” ఎల్లవేళలా గౌరవం, వినయాన్ని ప్రదర్శించాలన్నారు. మోడీ ఎన్నికల ప్రసంగాల్లో అలాంటివి మచ్చుకైనా కనిపించాయా ? అడుగడుగునా అహంకార ప్రదర్శన, అబద్దాలు, వక్రీకరణలు, స్వంతడబ్బా, ప్రతిపక్షాలపై వ్యంగ్యాలు తప్ప ఒక ప్రధాని స్థాయిలో మాట్లాడింది లేదు. మోడీ గ్యారంటీలంటూ పెద్ద ఎత్తున వ్యక్తిపూజకు తెరలేపారు. దాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ మేథావులు అంగీకరించబట్టే కొనసాగింది. తీరా ఎదురుతన్నిన తరువాత ఇప్పుడు దానికి బాధ్యత తమది కాదన్నట్లుగా మాట్లాడుతున్నారు.తమకు ఆర్‌ఎస్‌ఎస్‌తో అవసరం లేదని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన వ్యాఖ్య యధాలాపంగా చేసిందనుకుంటే పొరపాటు.రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత నరేంద్రమోడీ చుట్టూ ఉన్నవారిలో అంతర్లీనంగా పెరుగుతున్న అభిప్రాయమే ఇది. సంఘపరివార్‌కు బదులు మోడీ పరివారాన్ని రూపొందించే క్రమంలో వ్యక్తిపూజను ముందుకు తెచ్చారు. గతంలో చౌకీదార్‌ అన్నట్లుగానే కేంద్ర మంత్రులతో సహా అందరూ మోడీకాపరివార్‌ అని తమ సామాజిక మాధ్యమాల్లో పేర్లకు తగిలించుకున్నారు. భజనబృందంలో చేరారు. ప్రతి విజయం వెనుక ఉన్నది మోడీ మాత్రమే అని చెప్పటమే కాదు, తాజా ఎన్నికల్లో మోడీ హామీల పేరుతో జనాన్ని ఊదరగొట్టటం దాని కొనసాగింపే. దీనికి గోడీ మీడియా ఎంతగానో సహకరించింది. తాను మామూలుగా జన్మించలేదని మోడీ చెప్పుకోవటం దానికి పరాకాష్ట. దీన్ని సంఘసేవక్‌లు కొందరు జీర్ణించుకోలేదని, వారిని సంతుష్టీకరించేందుకు మోడీ కూడా సంఘసేవకుల్లో ఒకరే అన్న సందేశమిస్తూ మోహన్‌ భగవత్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారని చెప్పవచ్చు. నరేంద్రమోడీ మాదిరి మాజీ ప్రధాని అతల్‌ బిహారీ వాజ్‌పాయి కూడా సంఘసేకుడే, దాని తిరోగామి భావజాల ప్రతినిధే అన్నది నిస్సందేహం. అయితే మోడీ మాదిరి దిగజారిన ప్రసంగాలు చేయలేదు.అద్వానీ మాదిరి కరడుగట్టిన హిందూత్వవాదిగా బయటకు కనిపించేందుకు చూడలేదు.


ప్రపంచంలో అనేక తిరోగామి, ఫాసిస్టు, నాజీ లక్షణాల సంస్థల వంటిదే ఆర్‌ఎస్‌ఎస్‌. అది మత తీవ్రవాద పులిని ఎక్కింది. దాని మీద నుంచి దిగితే మింగివేస్తుంది, ప్రాణాలు నిలుపుకోవాలంటేే స్వారీ చేయాల్సిందే. దేశం, సమాజం మీద పట్టు సాధించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అనేక మందిని జనసంఘం, బిజెపి వంటి రాజకీయ పార్టీ, మత సంస్థల రూపంలో మరికొందరిని ముందుకు తెచ్చింది. ఉపయోగించుకోవటం, పనికిరారు,అజెండాను అమలు జరపలేరు అనుకుంటే పక్కన పెట్టేయటం అనేక మందిని చూశాము. అద్వానీ, వాజ్‌పాయిలను కూడా అది సహించలేదు.నరేంద్రమోడీని కూడా ఉపయోగపడినంత వరకు పల్లెత్తుమాట అనలేదు, మద్దతు ఇచ్చింది, తన అజెండాను అమలు చేయించింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో అది వికటించిన తీరు గమనించిన తరువాత మరో బొమ్మను తెచ్చేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. తన అజెండాను ముందుకు తీసుకుపోయే సాధనంగా పనికి వస్తారా లేదా అన్నదే దానికి గీటురాయి. అయోధ్య రామాలయం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో ఓడిపోవటం, వారణాసిలో గతంలో వచ్చిన మెజారిటీతో పోలిస్తే గణనీయంగా తగ్గటంతో నరేంద్రమోడీ బలహీనత ఏమిటో వెల్లడైంది. ఇంకేమాత్రం తమ అజెండాను ముందుకు తీసుకుపోయే అవకాశం లేదన్న సంశయం మొదలై ఉండాలి. నరేంద్రమోడీని ఒకందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు తెస్తే మరొకందుకు కార్పొరేట్‌ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. అందువలన మోడీని సేవక్‌ల గుంపులో ఒకరిగా ఆర్‌ఎస్‌ఎస్‌ చూస్తే పప్పులో కాలేసినట్లే. సంఘపరివారం మెచ్చిన నేతలు ఉండవచ్చు తప్ప కార్పొరేట్లకు నచ్చిన వ్యక్తిని వెంటనే ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయటం అంత తేలికకాదు. ఇది సంఫ్‌ు బలహీనత. ఈ పూర్వరంగంలో మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు టీకప్పులో తుపానులా సమసిపోతాయా ? 75సంవత్సరాల వయస్సు వచ్చిన వారు పదవుల నుంచి తప్పుకోవాలనే పేరుతో 73 సంవత్సరాల మోడీని కొన్ని రాష్ట్రాల ఎన్నికల తరువాత 2026లో గౌరవంగా సాగనంపుతారా ? దానికి కార్పొరేట్లు అంగీకరిస్తాయా ? చూద్దాం !