ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు : చంద్రబాబు పట్టాభిషేకం – తమిళశైకి అమిత్‌ షా అక్షింతలు ! కెసిఆర్‌ కూడా ఇలా అవమానించలేదు !!

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


అక్కటా ఏమిటీ విధి వైపరీత్యం ! చంద్రబాబు పట్టాభిషేకానికి నేను వెళ్లటం ఏమిటి ? వెళితినిపో.. ఏదో ఒక మూలన కూర్చోకుండా అమిత్‌ షా అన్నను మర్యాదగా పలకరించాలనుకోవటం ఏమిటి ? అనుకుంటిని పో… నా నమస్కారానికి తిరస్కారంగా నన్ను చీవాట్లు పెట్టటం ఏమిటి ? అన్నగనుక దాన్లో తప్పులేదు ! పక్కనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇంకా పార్టీ పెద్దలు, ఇతరులు అనేక మంది చూస్తుండగానే బహిరంగవేదిక మీద అలా చేయవచ్చా ? అయినా అంత తప్పు నేనేం చేశాను ? పోనీ నా అపరాధం ఏదైనా ఉంటే నాలుగ్గోడల మధ్య చివాట్లు వేయవచ్చు. ఇలా బహిరంగవేదిక మీద, టీవీల ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని తెలిసి కూడా అమిత్‌ అన్నకు అంత ఆగ్రహం రావటం ఏమిటి ? నన్ను అవమానించటం ఏమిటి, తెలంగాణా గవర్నర్‌గా ఉండగా కెసిఆర్‌ చేసిన అవమానం దీనితో పోలిస్తే చాలా చిన్నది. అమిత్‌ అన్న చేసింది భరించలేనిదిగా ఉంది. బేటీ బచావో అంటూ మోడీ ఇచ్చిన నినాదాన్ని అమిత్‌ అన్న విస్మరించి ఇలా అవమానించటం ఏమిటి ? ఉన్న గవర్నర్‌ ఉద్యోగం వదులుకొని కేంద్ర మంత్రి పదవి మీద ఆశతో బరిలో దిగి అటు ఎన్నికల్లో ఓడి ఇటు అమిత్‌ అన్నతో చివాట్లు తిన్న తరువాత నేను రాష్ట్రంలో తలెత్తుకోగలనా ? కింకర్తవ్యం ఏమిటి ? ఇలా పరిపరి విధాలుగా తెలంగాణా మాజీ గవర్నర్‌, తమిళనాడు బిజెపి నేత తమిళశై సౌందర్‌రాజన్‌ మధనపడుతూ ఉండి ఉండాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది చూస్తుండగా జరిగిన ఉదంతాన్ని ఎవరైనా జీర్ణించుకోవటం కష్టం.


2024జూన్‌ 12న బుధవారం నాడు విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రుల ప్రమాణోత్సవానికి హాజరైన అనేక మంది బిజెపి ప్రముఖులలో తమిళశై ఒకరు. వేదిక మీద ఆసీనుడైన అమిత్‌ షా, పక్కనే ఉన్న వెంకయ్య నాయుడికి ఆమె నమస్కారం చేయగానే అమిత్‌ షా ముఖకవళికలు మారిపోయాయి, అభివాదం చేసి వెళుతున్న ఆమెను వెనక్కు పిలిచి వేలు చూపుతూ తీవ్రంగా హెచ్చరిక లేదా మందలించినట్లు కనిపించింది.ఆమె ఏదో వివరణ ఇవ్వబోగా అదేమీ కుదరదన్నట్లు కనిపించింది. ఇదంతా క్షణాల్లోనే జరిగింది. ఏం మాట్లాడింది పక్కనున్న వెంకయ్యనాయుడు,ఇతర బిజెపినేతలు నోరువిప్పితేనే వాస్తవం తెలుస్తుంది.ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారమైంది. మీడియా సంస్థలు విశ్లేషణలు వెలువరించాయి. తమిళనాడు బిజెపిలో ఉన్న కుమ్ములాటల గురించే అమిత్‌ షా మందలించినట్లు పేర్కొన్నాయి. మీడియా వ్యాఖ్యానాలను పక్కన పెడదాం. ” తమిళశై అక్కను అమిత్‌షా గారు తీవ్రంగా మందలించినట్లు దానిలో కనిపిస్తున్నది.అయితే బహిరంగంగా చేసిన ఈ ”హెచ్చరిక”కు కారణం ఏదై ఉండవచ్చు ? అవాంఛనీయ బహిరంగ వ్యాఖ్యలా ? ” అని ఏకంగా తమిళనాడు బిజెపి ఐటి విభాగపు ఉపాధ్యక్షుడు కార్తిక్‌ గోపీనాధ్‌ ఎక్స్‌లో స్పందించారు. ఎక్కడ జనాలు సదరు వీడియోను చూడలేదో అని దాన్ని కూడా జతచేశారు.


తాజా లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేత అన్నామలై అద్భుతాలు సృష్టించబోతున్నారు, తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాయబోతున్నారన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఏ పార్టీతో పొత్తు లేకుండా డిఎంకె నాయకత్వంలోని కూటమిని మట్టికరిపిస్తారని చెప్పారు. అది జరగకపోగా ఇప్పుడు పార్టీ ఖాతా తెరవకపోవటానికి కారణం నువ్వంటే నువ్వన్నట్లు అన్నామలై-తమిళశై వర్గాలు కుమ్ములాటలకు దిగాయి. ఎన్నికల ఓటమి గురించి ఒక యూట్యూబ్‌ ఛానలతో తమిళశై మాట్లాడుతూ చీలికలు లేని అన్నా డిఎంకెతో సర్దుబాటు చేసుకొని ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని చేసిన వ్యాఖ్య బిజెపిలో విబేధాలకు కారణమైంది. పార్టీ అధ్యక్షుడు అన్నామలై దీనికి వ్యతిరేకమైన వైఖరితో ఉన్నారు. అన్నామలై కారణంగానే అన్నాడిఎంకెతో బిజెపి మైత్రి చెడిందని, దాంతో పార్టీ తీవ్రంగా నష్టపోయిందని పార్టీలో కొందరు మండిపడుతున్నారు. అన్నాడిఎంకె మాజీ మంత్రి ఎస్‌పి వేలుమణి మాట్లాడుతూ తమ పార్టీలో చీలికకు అన్నామలై పూర్తి కారకుడని విమర్శించారు. రెండు పార్టీలు పొత్తుపెట్టుకొని ఉంటే తమ కూటమి 35 సీట్లు గెలిచి ఉండేదన్న అతని అభిప్రాయాన్ని తమిళశై బలపరచటంతో రెండు వర్గాల మధ్య దూరం పెరిగింది. ఒక్క సీటుకూడా తెచ్చుకోని పార్టీ నేత చెప్పిన మాటలను ఎలా సమర్ధిస్తారంటూ అన్నామలై ధ్వజమెత్తారు. పన్నెండు స్థానాల్లో అన్నాడిఎంకెను మూడవ స్థానంలోకి నెట్టామని ఇది బిజెపి సాధించిన విజయమని అన్నామలై సమర్ధించుకున్నారు. గతంలో తాను పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నపుడు ఒక ప్రమాణం పెట్టుకున్నానని, సంఘవ్యతిరేక శక్తులను ప్రోత్సహించలేదని, కానీ ఇటీవల అలాంటి వారిని పార్టీలోకి తీసుకున్నారని. అన్నామలై మంచినేత అనటంలో తనకెలాంటి సందేహం లేదని, మనమంతా అనేక రకాల నేతలమని, భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటామని తమిళశై పరోక్షంగా అన్నామలై మీద ధ్వజమెత్తారు. అయితే దీని మీద మాజీనేత తిరుచ్చి సూర్య శివ స్పందిస్తూ ఆమె పార్టీ నేతగా ఉండగా రాష్ట్రంలో పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రాలేదని విమర్శించారు. దీంతో సామాజిక మాధ్యమంలో ఇద్దరి అభిమానులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కుమ్ములాటలు బహిరంగమై పార్టీ పరువుతీశాయి.


ఓటర్లలో మాజీ హీరోయిన్‌ కుష్‌బూకు ఉన్న ఆకర్షణను ఎన్నికల్లో ఉపయోగించుకొని ఉంటే ఫలితాలు వేరుగా వచ్చి ఉండేవని బాలీవుడ్‌ దర్శకుడు, బిజెపి అభిమాని ఆనంద కుమార్‌ చెప్పారు. అన్నామలై గనుక కుష్‌బూను ప్రచారంలోకి దించి ఉంటే తమిళనాడులో ఫలితాలు వేరుగా ఉండేవన్నారు. తమిళనాడు బిజెపిలో సమన్వయం లేదు, రాజకీయాల్లో ఒకే ఒక్కడు ప్రత్యేకించి రాజకీయాలకు కొత్తగా వచ్చిన అన్నామలై పోరాడలేరు. ఓట్ల శాతం పెరిగి ఉండవచ్చు తప్ప ఒక్క సీటూ రాలేదన్నారు. ఎంతగానో ఆకర్షణ ఉన్న కుష్‌బూను బిజెపి ఎందుకు వినియోగించుకోలేదో, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా, జెపి నడ్డా వచ్చిన సభలకు ఎందుకు ఆహ్వానించలేదో ఆశ్చర్యంగా ఉందన్నారు.


అసలే సంపూర్ణ మెజారిటీకి పార్టీ దూరమై కారణాలను బహిరంగంగా చెప్పుకోలేని స్థితిలో పడితే ఒక్క సీటు కూడా రాని చోట ఈ రచ్చేమిటని కేంద్ర నాయకత్వం తలలు పట్టుకుంది. ఈ పూర్వరంగంలో అమిత్‌ షా బహిరంగ మందలింపు ఉదంతం చోటు చేసుకుంది.అన్నామలై కేంద్ర నాయకత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని బిజెపి మేథావుల విభాగపునేత కల్యాణ రామన్‌ ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో పార్టీకి ఒక అంకెలో వచ్చిన ఓట్లు ఇప్పుడు రెండంకెల శాతానికి పెరిగాయని చెప్పటం తప్పుదారి పట్టించటమే అన్నారు.2019లో తొమ్మిది సీట్లలో పోటీ చేసినపుడు 5.56శాతం ఓట్లు వచ్చాయని తాజాగా 23చోట్ల పోటీ చేస్తే 11.24శాతం వచ్చాయి. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే పోటీ చేసిన సీట్ల ప్రాతిపదికన ఈ సారి 14.25శాతం రావాలని రామన్‌ వాదించారు. అన్నామలైకి నైతిక విలువలు లేవని పదవికి రాజీనామా చేయాలన్నారు. అమిత్‌ షా తీరు గురించి డిఎంకె ప్రతినిధి ఎస్‌ అన్నాదురై ఎక్స్‌ ద్వారా స్పందిస్తూ ” ఇవేమి రాజకీయాలు ? తమిళనాడుకు చెందిన ప్రముఖ మహిళానేతను బహిరంగంగా మందలించటం సభ్యతేనా ? ఇది చాలా చెడు ఉదాహరణ, ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తారని అమిత్‌ షా తెలుసుకోవాలి ” అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఓటమి తరువాత తమిళనాడు బిజెపిలో ఉన్న కుమ్ములాటల గురించి దేశంలోనే పెద్దగా తెలియదు. అమిత్‌ షా ఆగ్రహ ప్రదర్శనతో అది విశ్వవ్యాప్తమైంది.

కందకు లేని దురద కత్తిపీటకెందుకు !
అమిత్‌ షా తీరుపై అటు తమిళనాడులో, ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళుల్లో నిరసన వ్యక్తమైంది. అయితే ముందే చెప్పుకున్నట్లు అక్కడి బిజెపి రెండు ముఠాల మద్దతుదార్లు తమనేతలకు అనుకూలంగా కాని వారికి ప్రతికూలంగా స్పందించారు.యాంటీ క్లైమాక్స్‌ (విలోమ పరాకాష్ట) ఏమిటంటే అవమానానికి గురైన తమిళశై అబ్బే అలాంటిదేమీ లేదు, పార్టీ కోసం పనిచేయాలనే సూచనలు ఇచ్చారంటూ గురువారం నాడు ఎక్స్‌ చేశారు.ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా వేదికపై ఆసీనులైన కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఆయన తననేమీ మందలించలేదని, పార్టీ కోసం పనిచేయాలంటూ సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు. ”ఎన్నికల తరువాత తొలిసారిగా ఆ వేదికపైనే అమిత్‌ షాతో మాట్లాడాను. ఎన్నికలు ముగిసినందున ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయని అడిగారు. నేను వాటిని వివరిస్తుండగా సమయం లేకపోవడంతో త్వరత్వరగా మాట్లాడుతూ పార్టీకి, నియోజకవర్గం అభివద్ధికి మరింత విస్తతంగా పనిచేయాలని చెప్పారు. దీనిపై రకరకాల వదంతులు వ్యాపించడంతో ఈ వివరణ ఇస్తున్నానని ” పేర్కొన్నారు. వేదికపై ఆమెతో అమిత్‌ షా మాట్లాడిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియో లేదా ఫొటోలను చూసిన మానవ మాత్రులెవరూ ఆ పెద్ద మనిషి సూచనలు ఇచ్చినట్లుగా భావించరు. ఆమె మౌనంగా ఉన్నా అదో తీరు. వివరణ ద్వారా తన ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టారని చెప్పవచ్చు. మద్దతుగా స్పందించిన వారిని ఇరకాటంలో పెట్టారు. కేంద్రంలో ఐదేండ్లు అమిత్‌ షా అధికారంలో ఉంటారు గనుక కేంద్ర పెద్దల ప్రాపకం కోసం ఏమీ జరగలేదని ప్రకటించారు. అయినా కందకు లేని దురద కత్తిపీటలకెందుకు అన్నట్లు అవమానంపై ఆమెకు లేని అభ్యంతరం మనకెందుకు అన్నట్లు జనాలు ఆ స్పందనను చూసిన వారు భావిస్తున్నారు.

ఐరోపా పార్లమెంటు ఎన్నికలు : పెరిగిన నాజీ, ఫాసిస్టుల ముప్పు !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఐరోపా యూనియన్‌లోని 27దేశాలలో జూన్‌ ఆరు నుంచి తొమ్మిదవ తేదీవరకు జరిగిన యూనియన్‌ పదవ పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అందోళనకర సూచనలు వెలువడ్డాయి. అధికారికంగా ఫలితాల పూర్తి ప్రకటన వెలువడలేదు, నాలుగు దేశాల్లో లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి అందిన సమాచారం, ఫలితాల తీరుతెన్నుల ప్రకారం నయా నాజీ, ఫాసిస్టు, పచ్చి మితవాద శక్తులు బలం పుంజుకున్నాయి. ఈ పరిణామం ఐరోపా విధానాలనే తీవ్రంగా ప్రభావితం చేసేదిగా ఉంది. వివిధ దేశాలలో పాలక పార్టీలు, కూటములకు ఎదురుదెబ్బలు తగిలాయి.ఐరోపా సమాఖ్య వైఖరిలో వచ్చే మార్పులు, చేర్పుల గురించి చర్చ ప్రారంభమైంది ఐరోపా సమాఖ్యకు ఒక స్థంభం వంటి ఫ్రాన్సు మీద పిడుగులా పడి ఇంకా రెండు సంవత్సరాల గడువు ఉన్న పార్లమెంటురద్దుకు దారితీసింది.పాలకపక్షం ఘోరంగా దెబ్బతినటంలో పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరపనున్నట్లు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మక్రాన్‌ వెంటనే ప్రకటించాడు. అక్కడి రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉన్నా, ప్రధాని, మంత్రులు వేరే పార్టీకి చెందినవారైనా, అధ్యక్షుడికే సర్వాధికారాలు ఉంటాయి. 2027లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో మక్రాన్‌ పోటీ చేసేందుకు నిబంధనలు అంగీకరించవు . జర్మనీ ప్రతిపక్షం మధ్యంతర ఎన్నికలకు డిమాండ్‌ చేసింది. అధికార త్రిపక్ష సంకీర్ణ కూటమికి ఎదురు దెబ్బ తగిలినా ఎన్నికలకు వెళ్లేది లేదని ప్రకటించింది.


పార్లమెంటులోని మొత్తం 720స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మెజారిటీ 361 సాధించిన కూటమి ఎంచుకున్న నేత ఐరోపా కమిషన్‌ అధ్యక్ష పదవిని అధిష్టిస్తారు. కమిషన్‌ విధానాలను ఐరోపా పార్లమెంటు రూపొందిస్తుంది. ప్రతి దేశానికి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. గత ఎన్నికల్లో 751 స్థానాలుండగా 27 సీట్లున్న బ్రిటన్‌ ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగినందున వాటిని ఇతర దేశాలకు కేటాయించినప్పటికీ తరువాత వాటికి ఉపఎన్నికలు జరగలేదు. తరువాత 46 స్థానాలను రద్దు చేశారు. తాజా ఎన్నికలకు ముందు ఆమోదించిన విధానం ప్రకారం 705 నుంచి 720కి స్థానాలను పెంచారు. జర్మనీలో 96,ఫ్రాన్స్‌81, ఇటలీ 76 స్థానాలతో అగ్రభాగాన ఉన్నాయి. మాల్టా, సైప్రస్‌, లక్జెంబర్గ్‌ దేశాలలో తక్కువగా ఆరేసి స్థానాల చొప్పున ఉన్నాయి. ఏ దేశానికి ఆదేశం ఎంచుకున్న పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటులో ఒక పక్షాన్ని గుర్తించాలంటే ఏడు దేశాలలో పోటీచేసి కనీసం 23 స్థానాలను తెచ్చుకోవాల్సి ఉంది. ఆ నిబంధనకు అనుగుణంగా లేని వాటిని గుర్తింపులేని పార్టీలుగా పరిగణిస్తారు.ఈ ఎన్నికల్లో కేవలం 51శాతం మాత్రమే ఓటర్లు పాల్గొన్నట్లు తొలి వార్తలు తెలిపాయి. గరిష్టంగా బెల్జియంలో 89.2, లక్జెంబర్గ్‌లో 82.3శాతం పోలు కాగా క్రోషియాలో అత్యల్పంగా కేవలం 21.3శాతమే ఓటర్లు పాల్గొని ఒక రికార్డు సృష్టించారు. కొన్ని దేశాలలో ఈ సందర్భంగానే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించారు.


ఈ ఎన్నికలలో ప్రస్తుతం సమాఖ్య అధ్యక్షురాలిగా ఉన్న ఉర్సులా వాండరె లెయన్‌ నాయకత్వంలోని యూరోపియన్‌ పీపుల్స్‌ పార్టీ(ఇపిపి) 191సీట్లతో పెద్ద పక్షంగా అవతరించింది. పచ్చి మితవాదులను అధికారంలోకి రాకుండా నిరోధించగలమని ఆమె చెప్పింది. మరోసారి ఆమె సమాఖ్య అధ్యక్ష స్థానం కోసం పోటీలో ఉన్నారు. ఐరోపా రాజకీయ పరిభాషలో ఇపిపిని మధ్యేవాద మితవాద పార్టీగా పరిగణిస్తారు. ఫ్రాన్సులో మేరీనె లీపెన్‌ నాయకత్వంలోని పచ్చిమితవాద ఐడెంటిటీ(ఉనికి)-డెమోక్రసీ(ప్రజాస్వామ్య) పార్టీ(ఐడి)కి 57 వచ్చాయి. ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ నాయకత్వంలోని యూరోపియన్‌ కన్సర్వేటివ్‌, రిఫార్మిస్టు(ఇసిఆర్‌) పార్టీకి 71 వచ్చాయి. ఈ మూడు పక్షాలూ గతం కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నాయి. సోషలిస్టు మరియు డెమోక్రాట్స్‌ కూటమి(ఎస్‌డి) రెండవ పెద్ద పక్షంగా 135 సీట్లు తెచ్చుకుంది. గుర్తింపు పొందని చిన్న పక్షాలు 95 గెలుచుకున్నాయి.గ్రీన్స్‌ పార్టీ 53,రెన్యూ(పునరుద్దరణ) యూరోప్‌(ఆర్‌ఇ) 83, ఐరోపా వామపక్ష పార్టీ 35 సీట్లు తెచ్చుకుంది. గత ఎన్నికల్లో ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలిగా ఉర్సులా వాండెర్‌ లెయాన్‌ అభ్యర్థిత్వాన్ని సమర్ధించి గెలిపించిన పార్టీలు తాజా ఎన్నికల్లో 720కి గాను 402 స్థానాలను తెచ్చుకున్నట్లు వెల్లడైంది. అందువలన ఆమె తిరిగి మరోసారి అదే పదవిలో కొనసాగవచ్చు. ఆమె గనుక పచ్చిమితవాద పార్టీల మద్దతుకోసం ప్రయత్నిస్తే తాము దూరంగా ఉంటామని, ఉదారవాద, మితవాద పార్టీల ప్రతినిధులు హెచ్చరించారు. ఆమె బలహీన పడిన గ్రీన్స్‌, ఇటలీ మితవాది మెలోనీ పార్టీ మద్దతు కోరవచ్చని కొందరు విశ్లేషకులు జోశ్యం చెప్పారు.హంగరీలో జాతీయవాద నేత విక్టర్‌ ఒర్బాన్‌ పార్టీ బలం తగ్గినా 44శాతం తెచ్చుకుంది.ఇటలీలో మితవాద ప్రధాని మెలోనీ పార్టీ 30శాతం తెచ్చుకుంది.


ఫ్రెంచి పార్లమెంటును ఆకస్మికంగా రద్దు చేయటంతో ఫ్రాన్స్‌లో సంకీర్ణ రాజకీయాలకు తెరలేచింది. ఈనెల 30,జూలై ఏడున ఎన్నికలు జరగనున్నాయి. పదహారవ తేదీలోగా అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. అధ్యక్షుడు మక్రాన్‌ ప్రకటన వెలువడిన వెంటనే ఐడి పార్టీ నాయకురాలు మేరీనే లీపెన్‌ దేశ పౌరులు ఈ ఎన్నికల్లో కూడా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో ఆమె పార్టీ 31.5శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో ఉంది. గతంలో నేషనల్‌ ఫ్రంట్‌ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన జీన్‌ మారీ లీపెన్‌ కుమార్తె మేరీనే కాగా మనుమరాలు మరియో మార్చెల్‌ ఆమెతో వేరుపడి రికగ్నిట్‌ పేరుతో మరో పచ్చిమితవాద పార్టీని ఏర్పాటు చేసింది. ఎన్నికల సమయంలో మేనత్త మీద ఎలాంటి విమర్శలూ చేయలేదు, మితవాదులందరూ కలవాల్సిన అవసరం గతం కంటే నేడు ఎక్కువగా ఉందంటూ ఎన్నికల ఫలితాల తరువాత మరియో వ్యాఖ్యానించింది. వ్యతిరేకులు, పోటీదార్లకు తేడా ఉంది అన్నారు.అయితే ఇప్పటికే మార్చెల్‌తో మేరీ లీపెన్‌ ప్రతినిధి జోర్డాన్‌ బార్‌డెలా సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. మక్రాన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకించే మితవాద పార్టీలు మేరీ లీపెన్‌, మార్చెల్‌తో కలిసే అవకాశాలు ఉన్నాయి. వివిధ పార్టీలలో చీలికలు తెచ్చి తనవైపు తిప్పుకొనేందుకు మక్రాన్‌ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాడు. అతగాడి అధ్యక్ష పదవీకాలం 2027వరకు ఉంది. పార్లమెంటులో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంటే ఇబ్బంది కనుక వాటిని అడ్డుకొనేందుకు సర్వశక్తులూ వడ్డాలని చూస్తున్నాడు. సోషలిస్టులు, గ్రీన్స్‌, మరికొన్ని వామపక్ష పార్టీలు కూడా కూటమిగా ఏర్పడేందుకు చూస్తున్నాయి. ఐరోపా యూనియన్‌ ఎన్నికలలో సోషలిస్టు పార్టీ(పిఎస్‌)కు 14శాతం ఓట్లు వచ్చాయి.కొన్ని సర్వేల ప్రకారం ప్రస్తుతం ఉన్న సీట్లలో మక్రాన్‌ నాయకత్వంలోని రినయసాన్స్‌ పార్టీ(ఆర్‌ఎన్‌) సగం స్థానాలను కోల్పోనున్నట్లు వెల్లడైంది.


జర్మనీలో పాలక కూటమిలోని సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎస్‌పిడి) 13.9శాతం ఓట్లు తెచ్చుకొని మూడవ స్థానంలో ఉంది. పచ్చిమితవాద పార్టీ ఏఎఫ్‌డి 16శాతం తెచ్చుకొని చరిత్ర సృష్టించింది. ప్రతిపక్ష క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌-క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌ కూటమి 30శాతం తెచ్చుకొని ప్రధమ స్థానంలో ఉంది.తూర్పు జర్మనీ ప్రాంతంలో ఎఎఫ్‌డి అగ్రస్థానంలో ఉంది. సంకీర్ణ కూటమిలోని సోషల్‌ డెమోక్రాట్స్‌(ఎస్‌పిడి), పర్యావరణ గ్రీన్స్‌,ఫ్రీ డెమోక్రాట్స్‌ పార్టీలు వరుసగా 13.9 -11.9-5.2శాతాల చొప్పున తెచ్చుకొని చావు దెబ్బతిన్నాయి.దీంతో వెంటనే ఎన్నికలు జరపాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది.నాలుగింట మూడు వంతుల మంది జనం కూటమి పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారని ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ బెర్లిన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చినందున మామూలుగా తమపని తాము చేసే అవకాశాలు ఉండకపోవచ్చని అన్నాడు. వచ్చే జాతీయ ఎన్నికల్లో ఓటర్ల అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తామన్నాడు.నూటముప్ఫై సంవత్సరాల చరిత్రలో ఇంత తక్కువగా ఎస్‌పిడి ఎన్నడూ ఓట్లు తెచ్చుకోలేదు. ప్రత్యామ్నాయ జర్మనీ (ఎఎఫ్‌డి) ఈ ఎన్నికలలో తెచ్చుకున్న ఓట్లతో సుస్థిరం కావటాన్ని అడ్డుకుంటామని, వెనక్కు కొడతామని అన్నాడు. జర్మనీలో, ఐరోపా అంతటా సంప్రదాయ ప్రజాస్వామిక పార్టీలు ఇప్పటికీ మెజారిటీగా ఉన్నాయని అన్నాడు. ప్రతిపక్షం కోరినట్లుగా మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, గడువు ప్రకారమే జరుగుతాయని షుల్జ్‌ ప్రతినిధి స్టెఫెన్‌ ó చెప్పాడు. జాతీయవాదం,విద్వేష ప్రమాదాలను జనం మరచిపోరాదని జర్మనీ అధ్యక్షుడు (మన రాష్ట్రపతి మాదిరి) ఫ్రాంక్‌ వాల్టర్‌ స్టెయిమెయిర్‌ హెచ్చరించాడు. రెండవ ప్రపంచ యుద్దంలో నాజీల మారణకాండకు బలైనవారి గౌరవార్ధం ప్రాన్సులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పచ్చిమితవాద పార్టీలు ఎదగటాన్ని ప్రస్తావించి జర్మనీలో నేషనల్‌ సోషలిస్టులు(హిట్లర్‌ నాజీ పార్టీ) సాగించిన అత్యాచారాలను గుర్తు చేశాడు.


ఉక్రెయిన్‌ సంక్షోభం, గాజాలో జరుగుతున్న పరిణామాలు,ఐరోపా అంతటా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం వంటి అంశాలన్నింటి కారణంగా మరింత భద్రత కావాలని ఓటర్లు కోరుకున్నారని, దాని మీద పచ్చి మితవాదులు వాగ్దానం చేశారని, ఈ ఎన్నికలు జాతీయ నాయకుల మీద జరిగిన ప్రజాభిప్రాయవెల్లడి అని ఐరోపా సమాఖ్య విదేశీ సంబంధాల డిప్యూటీ డైరెక్టర్‌ వెసెలా టెక్నర్‌నెవా అన్నారు.ఐరోపాలో ఫాసిస్టు, నాజీ, పచ్చి మితవాద శక్తులు పుంజుకోవటమే కాదు, తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న ధోరణి కనిపిస్తున్నది. అయితే ఈ ఎన్నికల్లో అనేక మంది ఊహించిన మాదిరి అవి ఎక్కువ బలాన్ని పెంచుకోలేదు. మూడోవంతు సీట్లు తెచ్చుకోవటం రానున్న ముప్పును వెల్లడిస్తున్నది.ఇప్పటివరకు అనేక కారణాలతో వివిధ దేశాల్లోని ఈ శక్తుల మధ్య ఐక్యత లేదు, అసంఘటితంగా కూడా ఉన్నాయి.ఎవరికి వారుగానే పని చేస్తున్నారు. మితవాదులు, పచ్చిమితవాదులకు స్వల్పతేడాలు మాత్రమే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న పూర్వరంగంలో పార్లమెంట్‌లో ఈ శక్తులు కలిస్తే పరిణామాలు ఎలా ఉండేదీ చెప్పలేము. ఒక వేళ అదే జరిగితే వాటిని వ్యతిరేకించే వారందరూ ఒక కూటమిగా ఏర్పడవచ్చు, వారితో వామపక్షాలు కూడా చేతులు కలిపే అవకాశం లేకపోలేదు.పచ్చిమితవాద శక్తులు బలం పుంజుకోవటం వలన పర్యావరణ,వలసలు, ఉక్రెయిన్‌కు సాయంతో సహా విదేశాంగ విధానంలో మార్పుల కోసం పట్టుపట్టవచ్చు, వేగంగా నిర్ణయాలు తీసుకోవటాన్ని అడ్డుకోవచ్చు.

కంగన రనౌత్‌కు చెంపదెబ్బ – ఒక సిక్కు మహిళకు ఎందుకు, ఎలా అంత ధైర్యం వచ్చింది !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


చండీఘర్‌ విమానాశ్రయంలో 2024 జూన్‌ ఆరవ తేదీన ఒక అనూహ్య ఉదంతం జరిగింది.హిమచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున గెలుపొందిన సినీనటి కంగన రనౌత్‌ ఢిల్లీ వెళ్లేందుకు విమానం ఎక్కాల్సి ఉంది. ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఒక సిఐఎస్‌ఎఫ్‌ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. రోజుకు వంద, రెండు వందల రూపాయలు తీసుకొని మహిళలు ఢిల్లీ రైతు ఉద్యమంలో పాల్గొన్నారని గతంలో కంగన నిందించారని, ఆ మహిళల్లో తన తల్లి కూడా ఉన్నందున ఆమెను అవమానించినందుకు గాను తాను కొట్టానని కుల్విందర్‌ కౌర్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆమె మీద కేసు నమోదు చేయటమే గాక విధి నిర్వహణ నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టారు. అరెస్టు చేశారు. చట్టాల ప్రకారం ఆమెకు ఎంత శిక్ష వేస్తారు, ఏం చేస్తారు అనేది చూద్దాం. పంజాబ్‌ సుల్తాన్‌పూర్‌ లోధీ ప్రాంతంలో ఉన్న ఆమె తలిదండ్రుల ఇంటికి పెద్ద సంఖ్యలో రైతులు, ఇతరులు వచ్చి మద్దతు తెలుపుతున్నారు.కుటుంబ సభ్యులందరికీ సిక్కు మత గౌరవ చిహ్నాలలో ఒకటైన కాషాయ రంగు సిరోప్స్‌(శాలువ వంటి వస్త్రం) కప్పి గౌరవిస్తున్నారు.కుల్విందర్‌ కౌర్‌ సోదరుడు షేర్‌ సింగ్‌ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష కమిటీ స్థానిక నేత. కుటుంబం మొత్తం రైతుల ఉద్యమంలో పాల్గొన్నది. కుల్విందర్‌ భర్త కూడా సిఐఎస్‌ఎఫ్‌లోనే పని చేస్తున్నారు.ఆమెకు మద్దతుగా రైతు సంఘాలు ప్రకటనలు చేశాయి.


కంగన వ్యాఖ్యానించినట్లుగా నేను పనికిమాలినదాన్నా అంటూ కుల్విందర్‌ కౌర్‌ తల్లి వీర్‌ కౌర్‌ ప్రశ్నించారు. కంగన తొలిసారిగా తప్పు మాట్లాడి ఉండవచ్చు, కానీ అంతకు ముందు ఆమె ప్రవర్తన బాగానే ఉంది. ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. నేను రైతు ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నాను. కొంత మంది మా సన్నిహిత బంధువులు మిలిటరీలో పనిచేశారు, ఇప్పటికీ కొనసాగుతున్నారు. నా భర్త ఇద్దరు అన్నలు కూడా మిలిటరీలో ఉన్నారు, 1965యుద్ధంలో పాల్గొన్నారని ఆమె మీడియాతో చెప్పారు. కుటుంబమంతా రైతు ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ దాని గురించి తన సోదరితో ఎప్పుడూ పెద్దగా చర్చించలేదని షేర్‌ సింగ్‌ చెప్పారు. ఘటన తరువాత ఆమెతో మాట్లాడటం కుదరలేదని, భర్తతో మాట్లాడి ఇద్దరు పిల్లలను తమ ఇంటికి తీసుకువచ్చామని, మీడియా, సామాజిక మాధ్యమం ద్వారానే విషయాలు తెలుసుకుంటున్నామని, అందువలన ఉదంతానికి సంబంధించి వీడియో మొత్తాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని షేర్‌ సింగ్‌ కోరారు.


కుల్విందర్‌ కౌర్‌కు మద్దతు తెలపటం మీద కంగన రౌనత్‌ తనదైన శైలిలో విరుచుకు పడ్డారు.సినిమా పరిశ్రమ మౌనంగా ఉందని ఆరోపించారు. అఫ్‌కోర్సు అది ఆమె ఇష్టం. తన అనుమతి లేకుండా తన శరీరాన్ని తాకారంటూ చెంపదెబ్బ కొట్టటాన్ని సమర్ధించేవారి గురించి ఆమె మండి పడ్డారు. ” ఏ కారణం లేకుండా ఏ నేరమూ ఎప్పుడూ జరగదు.నేరం చేసిన వారి మానసిక ధోరణులేమిటో కుల్విందర్‌ కౌర్‌ను సమర్ధిస్తున్నవారు చూడాలి. అత్యాచారం, హత్య చేసిన వారికి లేదా దొంగలకు కూడా బలమైన భావోద్వేగ, భౌతిక, మానసిక లేదా ఆర్థికపరమైన కారణాలు ఎల్లవేళలా ఉంటాయి.అయినప్పటికీ వారికి శిక్ష విధించి జైలుకు పంపుతారు. బలమైన భావోద్వేగాలతో నేరాలకు పాల్పడిన నేరగాండ్లతో మీరు చేతులు కలుపుతున్నారంటే దేశంలో ఉన్న చట్టాలన్నింటినీ ఉల్లంఘించటమే. అనుమతి లేకుండా కొంతమంది శరీర భాగాలను తాకి వారి అంతరంగిక పరిధిలోకి చొరబడటాన్ని అంగీకరిస్తున్నారంటే, గుర్తుపెట్టుకోండి మీరు అత్యాచారం, హత్యలను కూడా సమర్ధించినట్లే. వాటిలో మాత్రం పెద్ద ఏముంది కేవలం దూర్చటం,పొడవటమేగా అని ఇతరులు చెప్పుకోలేని, చూడకూడని చోట్లకు వెళ్లటమే. మీరు మీ మానసిక, నేరపూరిత ధోరణుల్లోకి లోతుగా చూడండి, దయచేసి యోగా, ధ్యానం చేయండని మనవి చేస్తున్నా లేకపోతే జీవితం మీకు దుర్భరమౌతుంది, మరీ అంత పగ,ద్వేషం, అసూయలను పెంచుకోకండి, వాటి నుంచి దూరం కండి ” అంటూ ఎక్స్‌ల మీద ఎక్స్‌లు(ట్వీట్లు) చేశారు.అంతేకాదు ఆమె పోస్టు చేసిన ఒక వీడియోలో పంజాబ్‌లో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరుగుతున్నదని అంటూ మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలని ప్రశ్నించారు.


తనను చెంపదెబ్బ, అదీ ఒక మహిళ కొట్టినందుకు, ఆ చర్యను కొందరు తప్పేముంది అన్నందుకు ఇంతలా దిగ(భాష) జారి నోరుపారవేసుకోవటం పద్మ అవార్డు గ్రహీత కంగనకే చెల్లింది. అత్యాచారం అంటే లైంగిక దాడి తప్ప దూర్చటమేగా అని ఏ నాగరికజీవీ ఇంతవరకు ఎక్కడా అన్నట్లు వినలేదు, అలా అంటారేమో అని కంగన చెప్పారు.బహుశా తన పరివారంలో అలాంటి దిగజారుడు భాష వాడతారేమో ! కంగనను మహిళా కానిస్టేబుల్‌ చెంపదెబ్బ కొట్టింది తప్ప అంతకు మించి జరిగిన ఇతర పరాభవమేమీ లేదు.(దీని అర్ధం చెంపదెబ్బను సమర్ధిస్తున్నానని కాదు, అనేక ఉదంతాల్లో మహిళలే మహిళల మీద దాడి చేసి కొట్టటంతో పాటు వివస్త్రలను చేసిన ఉదంతాలు తెలిసిందే.) చెంపదెబ్బను సమర్ధించినందుకే ఇంతగా మండిపడుతున్న సాధ్వీమణి గుజరాత్‌లో బిలికిస్‌ బానూ సామూహిక అత్యాచారం కేసులో శిక్షపడి బిజెపి పెద్దల ఆశ్వీరచనాలతో జైలు శిక్ష నుంచి మినహాయింపు పొందిన నేరగాండ్లకు అదే బిజెపి ప్రజాప్రతినిధులు మిఠాయిలు పంచి మంచి ప్రవర్తన కలిగిన బ్రాహ్మలని కితాబులిచ్చినపుడు కంగనకు ఎలాంటి తప్పూ కనిపించలేదు. మణిపూర్‌లో గిరిజన మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించినపుడూ కంగనకు ఎలాంటి అవమానమూ కనిపించలేదు, నోటికి తాళం వేసుకున్నారు.చివరకు ఎంత దిగజారుడు అంటే బిలికిస్‌ బానూ ఉదంతం మీద సినిమా తీసి సొమ్ము చేసుకోవాలని చూస్తే ఏ ఓటిటి సంస్థా, టీవీ కూడా అంగీకరించలేదు.తను చెంపదెబ్బ కొట్టిన మహిళలో ఉగ్రవాదం, తీవ్రవాదం కనిపించింది గానీ, పార్లమెంటు మీద పొగబాంబులతో దాడి చేసిన వారి ప్రవేశానికి పాసులిచ్చిన బిజెపి మైసూరు ఎంపీలో మాత్రం దేశభక్తి కనిపించింది గనుక మౌనంగా ఉన్నారు.


తనకు కంగన మీద ప్రేమ దోమా వంటివేమీ లేవు గానీ, ఆమెను చెంపదెబ్బ కొట్టినందుకు ఉత్సవంలో పాల్గొనటం లేదని ప్రముఖ సినీనటి షబనా ఆజ్మీ స్పందించారు. హింస, గూండాయిజం అంటూ రవీనా టాండన్‌ వర్ణించారు.తాను హింసాకాండను ఎప్పుడూ సమర్ధించనని అయితే కుల్విందర్‌ కౌర్‌ను ఉద్యోగం నుంచి తీసివేస్తే ఆమెకు ఉపాధి కల్పిస్తానని సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్‌ దద్లానీ ప్రకటించాడు. ఒక మహిళ తన ఉద్యోగ స్థానాన్ని వినియోగించుకొని మరొక మహిళ మీద దాడి చేయటం విచారకరమని, చట్టపరంగా దర్యాప్తు జరపాలని అనుపమ ఖేర్‌,శేఖర్‌ సుమన్‌, అతని కుమారుడు అధ్యాయన్‌ సుమన్‌ కూడా ఖండించారు. తనను చెంపదెబ్బ కొట్టటంపై సినిమా పరిశ్రమ మౌనంగా ఉందంటూ కంగన తప్పు పట్టారు.ఇలాంటిదే రేపు మీకు, మీ పిల్లలకూ జరగవచ్చు, ఒకరి మీద జరిగిన ఉగ్రదాడిని మీరు ఉత్సవంగా జరుపుకుంటే అలాంటి రోజే మీకూ ఎదురౌతుంది సిద్దంగా ఉండండి అని శాపనార్ధాలు పెట్టారు. రైతులను వంద, రెండు వందలు తీసుకొని వచ్చిన కిరాయిబాపతు అని ఆమె నిందించినపుడు కూడా సినిమా పరిశ్రమ మౌనంగానే ఉంది మరి.అప్పుడు మోదం-ఇప్పుడు ఖేదం !


కంగన రనౌత్‌ 2020 డిసెంబరు మొదటి వారంలో రైతులను నిందిస్తూ ట్వీట్‌ చేశారు. అప్పుడే పెద్ద రచ్చ జరిగింది. మూడున్నర సంవత్సరాల తరువాత దానికి ప్రతిగా కంగన చెంపదెబ్బ తిన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఢిల్లీలో జరిగిన షాహిన్‌ బాగ్‌ నిరసనల్లో ప్రముఖంగా పాల్గొన్న 82 సంవత్సరాల బిలికిస్‌ అనే మహిళ రైతు ఉద్యమంలో కూడా పాల్గొంటున్నదను కొని వంద రెండు వందలకు దొరికే ఆమె తిరిగి వచ్చిందంటూ కంగన్‌ నోరు పారవేసుకున్నారు. తరువాత తన తప్పు తెలుసుకొని ఆ ట్వీట్‌ను తొలగించారు. అయితే అప్పటికే దాని మీద పెద్ద రచ్చ జరిగింది. ఉడతా పంజాబ్‌ సినిమా నటుడు-గాయకుడు అయిన దిల్జిత్‌ దోసాంజ్‌ కంగన మీద తీవ్రంగా విరుచుకు పడ్డాడు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాడు.దిల్జిత్‌ను ఒక జంతువు అని ఆమె నిందించారు. సిక్కు మహిళ మహిందర్‌ కౌర్‌ను ఉద్దేశించి కంగన నోరుపారవేసుకున్నారని ఒక వీడియో రుజువు చూపాడు. దాంతో కంగన వెనక్కు తగ్గింది.తనను కరణ్‌ జోహార్‌ పెంపుడు జంతువు అన్న కంగన్‌ బాలీవుడ్‌లో అనేక మందితో కలసి పనిచేశారని ఆమెకూడా ఆమె వారందరికీ పెంపుడు జంతువుగా ఉన్నట్లా అంటూ ఇది బాలీవుడ్‌ కాదు, పంజాబ్‌, పౌరుల మనోభావాలతో ఆడుకోవద్దని దిల్జిత్‌ హెచ్చరించాడు. సరిగ్గా అదే పంజాబీ మనోభావం ఇంకా ఉన్నందున కుల్విందర్‌ కౌర్‌తో చెంపదెబ్బ కొట్టించింది.


ఇన్ని సంవత్సరాల తరువాత ఆమె ఎందుకు స్పందించిందన్న ప్రశ్న అనేక మందిలో తలెత్తింది. గతంలో ఢిల్లీలో నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులను అడ్డుకొని నెలల తరబడి అడ్డుకున్న బిజెపి సర్కార్‌ తీరుతో పంజాబీ రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో లోక్‌సభ ఎన్నికల్లో వెల్లడైంది. 2019లోక్‌సభ ఎన్నికలలో అకాలీదళ్‌, బిజెపి ఉమ్మడిగా పది, మూడు సీట్ల చొప్పున పోటీ చేసి 27.76-9.63శాతాల చొప్పు ఓట్లు రెండేసి సీట్లు తెచ్చుకున్నాయి. కాంగ్రెస్‌కు ఎనిమిది, ఆమ్‌ఆద్మీకి ఒకటి వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏడు, ఆమ్‌ ఆద్మీకి మూడు, అకాలీదళ్‌కు ఒకటి, స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. బిజెపికి ఒక్కసీటూ రాలేదు.ఓట్ల రీత్యా కాంగ్రెస్‌, ఆప్‌ తరువాత మూడవ పార్టీగా వచ్చింది. ఎన్నికలకు ముందు కూడా రైతులు ఆందోళనకు దిగటం దాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీకి వచ్చే రోడ్ల మీద కందకాలు తవ్వటం, బండరాళ్లతో కూడిన ట్రక్కులను ఏర్పాటు చేయటం వంటి పనులకు మోడీ సర్కార్‌ పాల్పడింది.హర్యానా బిజెపి ప్రభుత్వ పోలీసులు ఒక పంజాబీరైతు ప్రాణాన్ని బలిగొన్నారు, అణచివేసేందుకు చూశారు.నిజానికి రైతు ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన బిజెపి, దాన్ని గుడ్డిగా సమర్దించిన పెద్దలందరికీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పంజాబ్‌లో ప్రచారానికి వెళ్లగా అనేక గ్రామాల్లో ప్రవేశం కష్టమైంది, తీవ్ర నిరసన తెలిపారు. అలాంటి నేతలందరూ గత మూడు సంవత్సరాలుగా అనేక బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూనే ఉన్నారు. ఆకస్మికంగా ఎవరైనా వెళ్లి చెంపదెబ్బ కొట్టటమో, మరో రూపంలో నిరసన తెలపటానికి అనేక అవకాశాలు ఉంటాయి. కానీ ఆ పని చేయలేదు. ఈ ఎన్నికల్లో బిజెపికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగినన్ని సీట్లు రాకపోవటం, నరేంద్రమోడీ గ్యారంటీలను జనం నమ్మకపోవటం, చివరికి అయోధ్యలోనే బిజెపి ఓడటం, మోడీ గెలుపు మెజారిటీ గణనీయంగా తగ్గటం, ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చిన బలహీనత వెల్లడైంది. అంతకు ముందు బిజెపిని చూసి భయపడిన వారంతూ ఇప్పుడు దాన్ని కూడా జనం ఓడించగలరని రుజువు కావటంతో అనేక మందిలో ఉత్సాహం కట్టలు తెంచుకున్నది. దానికి ప్రతిస్పందనే కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ. ప్రజా ఉద్యమాలను కించపరుస్తూ అధికారగర్వంతో విర్రవీగిన వారందరికీ ఈ ఉదంతం ఒక హెచ్చరిక కావాలి. అయితే ప్రజా ఉద్యమాలను అణచేందుకు చూసిన వారికి, తూలనాడిన వారికి చేయాల్సింది చెంపదెబ్బల శాస్తి కాదు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడకుండా తమ చేతులతో ఎన్నికల యంత్రాల మీట నొక్కి అలాంటి పార్టీలు, శక్తులకు రాజకీయంగా పీకనొక్కాలి.

విధి వైపరీత్యం : ముస్లిం అనుకూల పార్టీల దయ మీద నరేంద్ర మోడీ ! హిందూ దేవునిబిడ్డకేమిటీ పరిస్థితి !!

Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


మన దేశంలో విధిని నమ్మేవారు ఎక్కువ, నమ్మనివారు తక్కువ. విధి వైపరీత్యం గురించి చెప్పే బాబాలు, జ్యోతిష్కులు,ప్రవచనకారులను రోజూ చూస్తూనే ఉన్నాం. పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం అంటూ కొత్త కొత్త అంశాల గురించి అనేక మంది చెబుతారు. ఫ్రెంచి జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్‌ 1,555లోనే నరేంద్రమోడీ గురించి జోశ్యం చెప్పాడని కేంద్ర మంత్రి కిరెన్‌ రిజుజు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014లో హిందువులు అధికారానికి వస్తారని ( అతల్‌ బిహారీ వాజ్‌పాయిను హిందువుగా గుర్తించలేదా లేక దుర్భిణికి కనిపించలేదా) భూమ్యాకాశాలను పాలిస్తారని, ఆసియాలో వారిని ఎవరూ నిరోధించలేరని,భారత అధినాయకుడు గుజరాత్‌లో జన్మిస్తాడని,అతని తండ్రి టీ అమ్ముతారని,అతని మొదటి నామం నరేన్‌దసు అని, 2026వరకు అధికారంలో ఉంటారని రాతపూర్వకంగా ఉందని సదరు మంత్రి సెలవిచ్చారు. ఇన్ని చెప్పిన సదరు జ్యోతిష్కుడు బాబరీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ మారణకాండల గురించి, ఆ కారణంగా అమెరికా తన గడ్డమీద అడుగు పెట్టనివ్వదనీ, 2024లో ముస్లిం అనుకూల పార్టీల దయతో ఏలుబడిలోకి వస్తారని ఎలా పసిగట్టలేకపోయారన్నది ప్రశ్న. ఇంకా చాలా ఉన్నాయి. అయోధ్యలో రామమందిరం కట్టిస్తారని, ఓట్ల కోసం దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని, చివరకు అక్కడ పార్టీని గెలిపించటంలో మోడీ చతికిల పడతారని, రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తారని నరేంద్రమోడీ ఎవరి గురించి చెప్పారో ఆ సమాజవాది పార్టీ ప్రతినిధిని ఆ రాముడే తన ఆలయ రక్షణకు గెలిపిస్తారని, బిజెపిని ఓడిస్తారని ఎందుకు చెప్పలేదు. హిందూ హృదయ సామ్రాట్టుగా మన్ననలను అందుకున్న, ముస్లింల సంతుష్టీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన 56 అంగుళాల ఛాతీ ఉన్న ధైర్యవంతుడిగా స్తోత్రపాఠాలు అందుకున్న నేతపట్ల విధి ఎందుకు ఇంత విపరీతంగా ప్రవర్తించినట్లు ?నోస్ట్రాడామస్‌ను పక్కన పెడదాం, సాధారణ మానవుల మాదిరిగాక దైవాంశ సంభూతుడిగా జన్మించినట్లు చెప్పుకున్న కారణజన్ముడు సైతం రాగల పరిణామాలను ఎందుకు ఊహించలేకపోయారు.


తాను బతికి ఉండగా ముస్లిం రిజర్వేషన్లను అనుమతించే ప్రసక్తి లేదని నరేంద్రమోడీ ప్రతిజ్ఞ చేశారు, దేశానికి గ్యారంటీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే నాలుగుశాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. నితీష్‌ కుమార్‌ కూడా ముస్లింలకు అనుకూలంగానే వ్యవహరించారు.బీహార్‌లో కుల గణన సర్వే వివరాలు నిలిపివేయాలని కోరిన కేసులో సుప్రీం కోర్టు తిరస్కరించిన తీర్పు మరుసటి రోజు 2023 అక్టోబరు ఏడున నితీష్‌ కుమార్‌ తన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సుదీర్ఘసమావేశం జరిపారు.మైనారీటీల సంక్షేమం, సామాజిక భద్రత గురించి వారికి హామీ ఇచ్చి లోక్‌సభ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కుల సర్వే వివరాల ప్రకారం బీహార్‌లో ముస్లిం జనాభా 17.7శాతం ఉంది.కులగణనలో ముస్లింలలో ఉన్న పాతిక కులాల వారిని అత్యంత వెనుకబడిన తరగతి(ఇబిసి)గా పరిగణించి లెక్కించారు.స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లకు అర్హత కల్పించారు.నితీష్‌ కుమార్‌ రిజర్వేషన్‌ ఫార్ములా ప్రకారం దళితులకు 16, గిరిజనులకు ఒకటి, ఇబిసిలకు 18, ఓబిసిలకు 12, ఇబిసి మహిళలకు మూడు శాతం అని చెప్పారు.ఇదంతా చేసిన తరువాత ఆ పెద్ద మనిషి ఇండియా కూటమినుంచి ఫిరాయించి తిరిగి ఎన్‌డిఏ కూటమిలో చేరి బిజెపితో అధికారాన్ని పంచుకున్నారు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వచ్చే ఏడాది అక్టోబరు-నవంబరు మాసాల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. నితీష్‌ కుమార్‌కు అవి పెద్ద పరీక్షగా మారతాయి.తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఏ పార్టీలకు వచ్చిన ఓట్లను చూసినపుడు 2019లో వచ్చిన ఓట్లకంటే ఆరుశాతం తగ్గగా ఇండియా కూటమి ఓట్లు 3.5శాతం పెరిగాయి. ఓట్లపరంగా చూసినపుడు ఆర్‌జెడి 22.41శాతం ఓట్లతో పెద్ద పార్టీగా ఉంది.బిజెపి 20.5శాతంతో ద్వితీయ, 18.52శాతంతో జెడియు మూడవ స్థానంలో ఉంది.బిజెపి, జెడియు రెండూ గతంలో ఉన్న లోక్‌సభ స్ధానాలలో తొమ్మిదింటిని కోల్పోయాయి.తెలుగు ప్రాంతాలలో ఇంత బతుకూ బతికి ఇంటివెనకాల చచ్చినట్లు అనే లోకోక్తి తెలిసిందే. తమ పార్టీ ఓట్ల కోసం ఎవరినీ సంతుష్టీకరించదు, మిగతా పార్టీలన్నీ మైనారిటీల సంతుష్టీకరణకు పాల్పడుతున్నట్లు వూరూ వాడా చెడా మడా ప్రచారం చేసిన బిజెపి గురించి తెలిసిందే. ముస్లిం సంతుష్టీకరణకు వ్యతిరేకం, ఎట్టి పరిస్థితిలోనూ దానికి లొంగేది లేదని చెప్పిన వారు ఇప్పుడు ముస్లిం అనుకూల విధానాలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు, నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని పార్టీల దయమీద కేంద్రంలో అధికారానికి రావటాన్ని ఏమనాలి ? ముస్లిం రిజర్వేషన్లు అమలు జరిపితీరుతామని చెప్పిన చంద్రబాబుతో మోడీ రాజీపడతారా లేక చంద్రబాబు నాయుడు నితీష్‌ కుమార్‌ ఇద్దరూ మోడీతో సర్దుకుపోదాం పదండి అంటారా ? విధి వైపరీత్యం ఎవరితో ఎలా ఆడుకుంటుందో, వారిని నమ్మిన వారిని ఏం చేస్తుందో చూద్దాం.


నరేంద్రమోడీని ఇప్పటి వరకు అనేక మంది విశ్వగురువుగా, ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే నేతగా ప్రచారం చేశారు. నిజమే అని నమ్మి అబ్‌కీబార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని బాహాటంగా ప్రకటించిన నరేంద్రమోడీ అమెరికాలో చేతులు కాల్చుకున్నది తెలిసిందే. సదరు ట్రంప్‌ అధికారం పోయింది. స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకుండా మోడీకి జనం తగిన పాఠం చెప్పారు.అదే ట్రంప్‌ మనదేశం వచ్చి నరేంద్రమోడీకి అనుకూలంగా చెప్పి ఉంటే ఏం జరిగేదో అనూహ్యం.ఎన్నికల తరువాత మోడీ గురించి ప్రపంచం ఏమనుకుంటోంది అంటే మీడియా వ్యాఖ్యలను చూడాల్సిందే. బిజెపి పెద్దలు తరచూ పాకిస్తాన్‌తో పోల్చి తాము సాధించిన విజయాల గురించి చెప్పుకుంటారు.అదే పాక్‌ ఆంగ్ల పత్రిక ”డాన్‌ ” మన ఎన్నికల గురించి పతాకశీర్షిక పెట్టింది.” విద్వేషాన్ని ఓడించిన భారత్‌, ముస్లిం అనుకూల పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన మోడీ ” అని రాసింది. దీన్ని చూస్తే మోడీ భక్తులకు మామూలుగా మండదు. మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు తొంగిచూసి కిసుక్కున నవ్వినందుకు అనే ఒక సామెత గుర్తుకు రావటం లేదూ ! అందరూ ఈ వార్తను చూస్తారో లేదోనని ఆ పత్రిక మొదటి పేజీని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి తన ఎక్స్‌ ఖాతాలో పంచుకొని మోడీని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ హిందూత్వ ఉత్సాహం, ముస్లింలు, ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవటాన్ని అంగీకరించని బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌లోని లౌకిక పార్టీల దయమీద ఆధారపడాల్సి వచ్చిందని, కేరళలో తొలిసారిగా విజయం సాధించిన బిజెపి అభ్యర్థికూడా మైనారిటీలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తని కూడా డాన్‌ పేర్కొన్నది. బలహీన పడినప్పటికీ ఇంకా ప్రాణాంతకమే అంటూ బిజెపి, నరేంద్రమోడీ గురించి అదే పత్రిక మరో విశ్లేషణలో హెచ్చరించింది.


”భారత్‌లో మోడీ పార్టీ బిజెపి తన ఆధిక్యతను ఎలా కోల్పోయింది ” అనే ప్రశ్నార్ధక శీర్షికతో అంతర్జాతీయ ఎఎఫ్‌పి సంస్థ వార్త ఇచ్చింది.పది సంవత్సరాల క్రితం హిందూ జాతీయనేత అధికారానికి వచ్చిన తరువాత తొలిసారిగా సంపూర్ణ మెజారిటీని సాధించటంలో భారత ప్రధాని నాయకత్వంలోని బిజెపి విఫలమైంది అని వ్యాఖ్యానించింది.వరుసగా మూడవ సారి భారీ మెజారిటీ సాధించటంలో వైఫల్యానికి కారణాలను పేర్కొన్నది.విభజన వాద ప్రచారం దెబ్బతీసింది.హిందూ మెజారిటీని సమీకరించుకొనేందుకు అసాధారణ రీతిలో ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ మాట్లాడారు.తన సభల్లో వారిని చొరబాటుదార్లు అన్నారు, ప్రతిపక్ష కాంగ్రెస్‌ అధికారానికి వస్తే దేశ సంపదలను ముస్లింలకు పంచుతుందని చెప్పారు. ఇది హిందూ ఓటర్లను ఉత్సాహపరచలేకపోయింది, మైనారిటీల మద్దతు ప్రతిపక్షానికి గట్టిపడేట్లు చేసింది.ఎన్నికల సందర్భంగా తాము ఓటర్లను కదిలించినపుడు ప్రభుత్వ భావజాల(హిందూత్వ) అజెండా కంటే తమకు నిరుద్యోగ సమస్య ప్రధానమని చెప్పినట్లు పేర్కొన్నది. జనం తమ జీవనం, నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి ఎక్కువ ఆవేదన చెందినట్లు , మోడీ, బిజెపి చెబుతున్నవి తమకు సంబంధం లేని అంశాలుగా జనం భావించారని మోడీ జీవిత చరిత్రను రాసిన నిలంజన్‌ ముఖోపాధ్యాయ కూడా అన్నట్లు ఈ వార్తా సంస్థ పేర్కొన్నది. పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లలో విఫలం కావటం, దక్షిణాది రాష్ట్రాలలో బలం పెంచుకొనేందుకు పదేపదే పర్యటించినా ఫలితం లేకపోవటం, అయోధ్యలో ఓటమి తదితర అంశాలను అది ఉటంకించింది.


”భారత ఎన్నికల్లో బిజెపికి ఎదురుదెబ్బలు, మోడీ విజయం” అంటూ అమెరికా టీవీ సిఎన్‌ఎన్‌ వార్తలను ఇచ్చింది.ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటర్లు ప్రజాకర్ష హిందూ దేశానికి అగ్రతాంబూలం అనే దృక్పధాన్ని ఓటర్లు పాక్షికంగా తిరస్కరించారని విశ్లేషణలో పేర్కొన్నది.మోడీ ముద్రగల హిందూ దేవాలయం ఉన్న పెరటితోటలో తిరుగులేని ఓటమి అంటూ అయోధ్య గురించి న్యూస్‌వీక్‌ పత్రిక పేర్కొన్నది. ఎట్టకేలకు మేలుకున్న భారతీయ ఓటర్లు అంటూ న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక శీర్షిక పెట్టి విశ్లేషణ రాసింది.అజేయమైన శక్తి అనే మోడీ ప్రతిష్టకు చిల్లుపడింది, సంకీర్ణ రాజకీయాలు తిరిగి వచ్చాయి అని పేర్కొన్నది. మోడీ, ఆయన పార్టీకి తిరుగులేని దెబ్బ అని వాషింగ్టన్‌ పోస్టు పేర్కొన్నది. మోడీ పేలవ ప్రదర్శన ప్రతిపక్షం పుంజుకోవటానికి నిదర్శనం అని బ్రిటన్‌ పత్రిక ఇండిపెండెంట్‌ పేర్కొన్నది. ”మోడీ విజయంతో చైనా, అమెరికాలతో భారత్‌ మరింత దగ్గర ” అంటూ చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ విశ్లేషణ శీర్షిక పెట్టింది.మోడీ ఏలుబడి తొలి ఐదు సంవత్సరాలలో చైనాతో ముద్దులతో మొదలై గుద్దులదాకా వచ్చింది, తరువాత మరింత ఆర్థిక సహకారం కోసం ఉద్రిక్తతలను సడలించింది.2019 నుంచి సరిహద్దు ప్రతిష్ఠంభను ఒక ప్రధాన సమస్యగా చేసింది. మూడవసారి మరింత జాగ్రత్తలతో కూడిన మార్పులు జరగవచ్చు.శాంతియుత, స్థిరమైన సంబంధాలు రెండుదేశాలకూ కీలకం, సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ రెండు దేశాల మధ్య వాణిజ్యం 2023లో అమెరికా-భారత్‌ లావాదేవీలను అధిగమించింది. గుడ్డిగా వివాదపడితే ఎవరికీ ఉపయోగం ఉండదని రుజువైందని పేర్కొన్నది.


అనేక అంతర్జాతీయ మీడియా సంస్థల విశ్లేషణలు ఇంకా రానున్న రోజుల్లో వెలువడతాయి. వాటితో మోడీ ప్రతిష్ట మరింత మసకబారేదే తప్ప వెలిగేది కాదు. దేశీయంగా సంపూర్ణ మెజారిటీ లేని నరేంద్రమోడీ ఇతర పక్షాల మీద ఆధారపడి ఎలా పని చేస్తారో చూడాల్సి ఉంది. అజేయశక్తి అనుకున్న నేత బలహీనత వెల్లడైన తరువాత ప్రపంచ దేశాలు, నేతలు గతం మాదిరే గౌరవిస్తారా ?ఎలా స్పందిస్తాయన్నది ప్రశ్న.మూడోసారి ప్రధానిగా పదవీ స్వీకారం చేయనున్న నరేంద్రమోడీ రానున్న రోజుల్లో తన ప్రాధాన్యతలు ఏమిటో వెల్లడిస్తారని ఎదురు చూసిన దేశానికి పాత చింతకాయ పచ్చడి కబుర్లు వినిపించారు.శుక్రవారం నాడు జరిగిన ఎన్‌డిఏ ఎంపీల సమావేశంలో మోడీని తమ నేతగా ఎన్నుకున్న సందర్భంగా కాంగ్రెస్‌ మీద దాడికి ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఇప్పుడున్న సీట్లు కూడా రావన్న మోడీ మనిషి పదేండ్లలో వంద సీట్లు కూడా తెచ్చుకోలేకపోయిందన్నారు. స్వంతంగా 370, కూటమిగా 400కు పైగా సీట్లు తెచ్చుకుంటామన్న బిజెపి తన బలాన్ని కోల్పోయి 240కి ఎందుకు పరిమితమైందనే చర్చ దేశంలో జరుగుతుండగా దాన్ని తక్కువ చేసి చూపేందుకు కాంగ్రెస్‌ మీద దాడికి దిగారు.బిజెపి, నరేంద్ర మోడీ బలహీన పడివుండవచ్చు తప్ప ప్రమాదకరంగా ఉంటారన్నది ఇండియా కూటమే కాదు, ఎన్‌డిఏ పక్షాలు కూడా గ్రహించాలి.తన మిత్రపక్షాలను అది ఎలా మింగివేసిందో తెలుగుదేశానికి, శివసేనకూ తెలిసిందే.

అమెరికా తీరు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


తాము అందించిన ఆయుధాలతో రష్యా మీద పరిమిత దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉక్రెయిన్‌కు అధికారమిచ్చాడు. దీని గురించి ఎలాంటి ఆర్భాటం లేకుండా అమెరికా చూసింది. ఎప్పటి నుంచో జెలెనెస్కీ ఈ మేరకు నాటో కూటమి దేశాలకు విన్నవించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ భూభాగం మీద మిలిటరీ చర్యకు దిగిన రష్యా మిలిటరీని ఎదుర్కొనేందుకు మాత్రమే నాటో ఆయుధాలను వినియోగిస్తున్నారు. బైడెన్‌ నిర్ణయానికి ముందు ఫ్రెంచి నేత మక్రాన్‌, కెనడాతో సహా పన్నెండు దేశాలు కూడా అదే పద్దతిలో అనుమతులు ఇచ్చినట్లు వార్తలు. దాని ప్రకారం రష్యా భూ భాగాలపై ఉక్రెయిన్‌ దాడులు చేయటానికి వీలుకలుగుతుంది. నిజంగా అదే జరిగితే ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది. నాటో ఆయుధాలతో దాడులు జరిపితే ఆ కూటమి దేశాలు ప్రత్యక్షంగా దాడులకు దిగినట్లుగానే పరిగణిస్తామని గతంలోనే రష్యా అధినేత పుతిన్‌ ప్రకటించాడు. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను దెబ్బతీసే క్షిపణులను ఇప్పటికే అందచేయటమే గాక వాటి ప్రయోగానికి అవసరమైన శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే క్రిమియా ప్రాంతంపై ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే అడ్డుకొని రష్యా కూల్చివేసింది. దీర్ఘ శ్రేణి క్షిపణులకు అనుమతి ఇవ్వలేదని అమెరికా చెబుతోంది.డ్రోన్లు, యుద్ద విమానాలను కూడా ఉక్రెయిన్‌కు సరఫరా చేశారు.ఎఫ్‌16 విమానాలను ప్రయోగించాలంటే అవసరమైన రన్‌వేలు ఉక్రెయిన్లో లేవు. వాటిని నిర్మిస్తే రష్యా చూస్తూ ఊరుకొనే అవకాశాలు లేవు.


పశ్చిమ దేశాల నిర్ణయాలు, కదలికల గురించి రష్యా అప్రమత్తం అవుతోంది. ఒక వేళ నాటో కూటమి దేశాలు గనుక తమపై దాడులకు తెగిస్తే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్‌ హెచ్చరికలు జారీ చేశాడు. అలాంటి పరిస్థితే వస్తే ఒక్క రోజులోనే బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వద్ద ఉన్న అణ్వాయుధాల సామర్ధ్యాన్ని దెబ్బతీయగలమని రష్యా మిలిటరీ నిపుణుడు యూరీ బరాన్‌చిక్‌ చెప్పినట్లు మిర్రర్‌ పత్రిక రాసింది. అణ్వాయుధాల సామర్ధ్యం ఉన్న దేశాల సంఖ్య తొమ్మిది నుంచి ఏడుకు తగ్గుతుంది అని కూడా చెప్పాడు. ముందు జాగ్రత్తగా పెద్ద పట్టణాలలో సంచార అణు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు నాటో దేశాల పత్రికలు రాస్తున్నాయి.నిజంగా మూడవ ప్రపంచ యుద్దం వస్తుందా ? రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన కొద్ది కాలానికే అనేక మంది పండితులు మూడవ ప్రపంచ యుద్దం గురించి చెప్పటం మొదలు పెట్టారు.అనేక కుట్ర సిద్దాంతాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు వలసల ఆక్రమణలో మొదలైన పోటీ ఐరోపా యుద్ధాలకు దారితీసింది. ఫ్రెంచి సామ్రాజ్యవాది నెపోలియన్‌ బోనపార్టీ 1804 నుంచి ఓటమిపాలైన చివరి యుద్ధం 1815వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు యుద్దాలు చేశాడు. తరువాత వంద సంవత్సరాలకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. పాత్రలోని నీరు మరిగి వంద డిగ్రీలకు చేరుకున్న తరువాత ఆవిరిగా రూపాంతరం చెందినట్లు ఏదైన ఒక ప్రధాన పరిణమానికి ముందు అంతర్గతంగా ఎన్నో జరుగుతాయి. అనూహ్య పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి.
1871లో పునరేకీకరణ తరువాత జర్మనీ చర్యల వలన అప్పటి వరకు ఉన్న బలాబలాల్లో నాటకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రియా-హంగరీ, ఇటలీతో జర్మనీ జట్టుకట్టింది. దాంతో జర్మనీని అడ్డుకొనేందుకు ఫ్రాన్స్‌- జారిస్టు రష్యా ఒక్కటయ్యాయి. అప్పటి వరకు ఈ రెండు దేశాల నుంచి తమకు ముప్పు ఉందని భావించిన బ్రిటన్‌ ఆకస్మికంగా జర్మనీ నుంచి వచ్చిన సవాలును ఊహించలేకపోయింది. ఉప్పు-నిప్పుగా ఉన్న బ్రిటన్‌- ఫాన్స్‌ 1904లో సయోధ్య కుదుర్చుకున్నాయి.దేశాల ఆక్రమణలపై సహకరించుకున్నాయి. ఆఫ్రికాలోని మొరాకోను ఫ్రాన్స్‌ ఆక్రమించగా జర్మనీ వ్యతిరేకించింది, బ్రిటన్‌ మద్దతు ఇచ్చింది.రష్యా,బ్రిటన్‌, ఫ్రాన్సు కూటమి గట్టటం తమకు ప్రమాదమని జర్మనీ భావించింది. ఐరోపా రెండు శిబిరాలుగా తయారైంది.జర్మనీ ప్రోద్బలంతో సెర్బియాపై ఆస్ట్రియా-హంగరీ 1914లో యుద్దం ప్రకటించగా రష్యా వ్యతిరేకించింది.ఫ్రాన్సు కూడా సెర్బియాకు మద్దతు ఇచ్చింది. తటస్థంగా ఉన్న బెల్జియం మీద జర్మనీ యుద్ధం ప్రకటించటంతో ఐరోపాలో దాని ఆధిపత్యం పెరిగిపోతుందనే భయంతో బ్రిటన్‌ కూడా యుద్ధంలోకి దిగింది. ఇదంతా మూడున్నర దశాబ్దాల మధనం తరువాత జరిగింది. వైరుధ్యాలు పెరగటంతో మొదటి యుద్ధం తరువాత రెండవ ప్రపంచ యుద్దం రెండుదశాబ్దాల్లోనే వచ్చింది. అది ముగిసి ఎనిమిది దశాబ్దాలైంది. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను చూసి కొందరు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు 1930దశకంలో ఉన్న పరిస్థితి ఉందని అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చెబుతున్నారు.


అలాంటి వారి వాదనల ప్రకారం ఒక వైపు అమెరికా నాయకత్వంలోని నాటో కూటమి, ఇతర కొన్ని దేశాలు సమీకృతం అవుతున్నాయి. మరోవైపు చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా జట్టుకడుతున్నాయి.ఐరోపాలో అమెరికా, నాటో కూటమి కారణంగా ఉక్రెయిన్‌ రూపంలో వైరుధ్యం నడుస్తున్నది.రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు 1936-39 స్పెయిన్లో అంతర్యుద్ధం జరిగింది. మిలిటరీ తిరుగుబాటును ఫాసిస్టు జర్మనీ, ఇటలీ సమర్ధించగా మిలిటరీని వ్యతిరేకించిన శక్తులకు సోవియట్‌ యూనియన్‌ మద్దతు ఇచ్చింది. అమెరికా కూడా బాసటగా నిలిచింది. ఇప్పుడు ఉక్రెయిన్‌లో జరుగుతున్న సైనిక చర్యను పశ్చిమదేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. చైనా తటస్థంగా ఉన్నప్పటికీ రష్యాకు అవసరమైన ఆర్థిక మద్దతు ఇస్తున్నది. ఇరాన్‌, ఉత్తర కొరియా ఆయుధాలు అందచేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో దేశాలు సైనికులను పంపితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. గాజాలో జరుగుతున్న మారణకాండపై పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తుండగా, మిగిలిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ చైనాలో అంతర్భాగమని అంగీకరిస్తూనే విలీనానికి తగిన తరుణం ఆసన్నం కాలేదని పశ్చిమ దేశాలు విలీనాన్ని వ్యతిరేకించేశక్తులకు ఆయుధాలు అందచేస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దేశాలను రెచ్చగొట్టి చైనాతో కవ్వింపుకు పూనుకున్నాయి. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్‌ సంయుక్తంగా మిలిటరీ విన్యాసాల పేరుతో బల ప్రదర్శన చేశాయి.
గతంలో దేశాలను ఆక్రమించుకొనేందుకు పోరు జరగ్గా ఇప్పుడు అలాంటి అవకాశం లేకపోవటంతో మార్కెట్లను ఆక్రమించుకొనేందుకు చూస్తున్నారు.దానికి అనుగుణంగానే పెట్టుబడిదారీ దేశాలు ముందుకు తెచ్చిన ప్రపంచీకరణ. అది కూడా వాటికి ఆశించిన మాదిరి లాభాలు తేలేదు.దాన్ని పక్కన పెట్టి రక్షణాత్మక చర్యలకు తెరలేపారు. వాటిలో ఒకటే దిగుమతి పన్నుల వడ్డింపు, దీన్నే వాణిజ్య యుద్దం అని కూడా అంటున్నారు. దీనికి అనుబంధంగానే సాంకేతిక పరిజ్ఞాన బదిలీని అడ్డుకొనేందుకు సాంకేతిక యుద్దాన్ని కూడా ప్రారంభించారు. వాణిజ్య ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థలు మరింత దగ్గర కావటానికి బదులు దూరం జరుగుతున్నాయి.కొత్త సమస్యలు, సవాళ్లను ముందుకు తెస్తున్నాయి.ఆంక్షల కారణంగా దీర్ఘకాలంలో ప్రపంచ ఆర్థిక ఉత్పత్తి ఏడు శాతం లేదా 7.4లక్షల కోట్ల డాలర్లమేరకు తగ్గుతుందని గతేడాది ఆగస్టులో ఒక అంచనా వెలువడింది.2019 తరువాత వాణిజ్య ఆంక్షలు మూడింతలు పెరిగి 2022 నాటికే మూడువేలకు పెరిగినట్లు ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జియేవా పేర్కొన్నారు.


డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా మీద ప్రారంభించిన యుద్ధాన్ని జో బైడెన్‌ కూడా కొనసాగించాడు. ఉక్రెయిన్‌ వివాదంతో రష్యా మీద వాణిజ్య ఆంక్షలను అమలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అణుకార్యక్రమాన్ని కొనసాగిస్తున్నదనే సాకుతో ఇరాన్‌పై అంతకు ముందు నుంచే ఆంక్షలు ఉన్నాయి. పశ్చిమ దేశాలు చైనా మీద ఒక వైపు ఆధారపడుతూనే మరోవైపు దాన్ని దెబ్బతీసేందుకు చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో తన ఉత్పత్తులకు చైనా కొత్త మార్కెట్లను వెతుకుతోంది.వర్ధమాన, పేద దేశాల మీద ఎక్కువగా కేంద్రీకరిస్తోంది. డాలరుకు బదులు ప్రత్యామ్నాయ నగదు లావాదేవీలను ముందుకు తెచ్చేందుకు అనేక దేశాలు చూస్తున్నాయి. పరిస్థితులు ఆందోళనకర స్థాయికి చేరినట్లు చెప్పలేము గానీ ఆందోళన కలిగిస్తున్నాయని,ప్రపంచదేశాలు అమెరికా, చైనా, అలీనదేశాల కూటములుగా చీలిపోతున్నాయని ఐఎంఎఫ్‌ అధికారిణి గీతా గోపినాధ్‌ చెప్పారు. తగ్గుతున్న తన పట్టు నిలుపుకొనేందుకు అమెరికా చూస్తుండగా, చైనా, రష్యా దాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా విజయం సాధిస్తే ఇతర దేశాల మీద కేంద్రీకరిస్తాడంటూ పుతిన్‌ గురించి పశ్చిమదేశాలు రెచ్చగొడుతున్నాయి.


ప్రపంచంలో కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ అవి ప్రపంచ యుద్ధానికి దారితీసేవిగా లేవన్నది ఒక అభిప్రాయం. రెండు ప్రపంచ యుద్ధాలూ ప్రపంచ దేశాల ఆక్రమణల కోసం సామ్రాజ్యవాద దేశాల మధ్య వచ్చిన తగాదా కారణంగా జరిగాయి. గతంలో సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాల మాదిరి ఒక సోషలిస్టు కూటమి వంటిది లేకపోయినప్పటికీ ప్రధాన వైరుధ్యం సోషలిజం-పెట్టుబడిదారీ విధానం మధ్యనే ఉంది. సామ్రాజ్యవాద దేశాలు జి7 కూటమి పేరుతో ఒక్కటిగా ఉంటూ ప్రపంచ మార్కెట్లను ఆక్రమించుకొనేందుకు చూస్తున్నాయి తప్ప దెబ్బలాడుకోవటం లేదు. చైనా,వియత్నాం, క్యూబాలను దెబ్బతీసేందుకు విడివిడిగా, ఉమ్మడిగా ప్రయత్నిస్తున్నాయి. జి7 దేశాలు రష్యాను కూడా తమతో కలుపుకొని జి8గా మారి జూనియర్‌ భాగస్వామిగా చేసుకొనేందుకు చూడటంతో రష్యా అంగీకరించలేదు. అందుకే దాన్ని పక్కన పెట్టి కత్తిగట్టాయి. తరువాత ఏం జరుగుతుందో తెలియదుగాని ప్రస్తుతానికి అనివార్య స్థితిలో చైనాకు రష్యా దగ్గరకావాల్సి వచ్చింది. అమెరికాను ఎదుర్కొనేందుకు చైనాకూ రష్యా, ఇరాన్‌ వంటి దేశాల అవసరం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్సు నాజీ కూటమిని ఓడించేందుకు సోవియట్‌తో చేతులు కలపాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. పెట్టుబడిదారీ విధానం ముందుకు పోవటానికి, నూతన మార్కెట్ల వేటలో ప్రపంచీకరణను ముందుకు తెచ్చింది. అది కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దాంతో పెట్టుబడిదారీ దేశాలు గతం మాదిరి రక్షణ చర్యలకు దిగాయి.గడచిన పది సంవత్సరాల్లో అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఉత్పాదకరంగంలో పెరుగుదల దాదాపు లేదు.అమెరికా వాణిజ్య లోటును తగ్గించటంలో కూడా ట్రంప్‌, బైడెన్‌ విఫలమయ్యారు.రక్షణాత్మక చర్యలు కూడా విఫలమయ్యాయి. సోషలిస్టు దేశాలు యుద్ధాన్ని కోరుకోవటం లేదు. అదిరించి బెదిరించి తమ ఉత్పత్తులను అమ్ముకొనేందుకు చూస్తున్నాయి తప్ప సామ్రాజ్యవాదులు యుద్ధం చేసే స్థితిలో లేరు. ఈ పూర్వరంగంలో కుట్ర సిద్దాంతాలు చెబుతున్నట్లు ఇప్పటికైతే మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే స్థితి లేదు. అయితే పెట్టుబడిదారీ విధానం సంక్షోభం, వైఫల్యాన్ని అధిగమించేందుకు ఎంతకైనా తెగిస్తుందనే అంశాన్ని సదా గమనంలో ఉంచుకోవాలి.

మహాత్మాగాంధీకి ప్రపంచ గుర్తింపు – నరేంద్రమోడీ అజ్ఞానమా ? అవమానించారా ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


పద్దెనిమిదవ లోక్‌సభ చివరిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. భక్తులకు వినసొంపుగా వారు కోరుకున్నట్లుగా, వ్యతిరేకులకు అనేక విమర్శనాస్త్రాలు అందిస్తూ, నిష్పాక్షికంగా వాస్తవాలను పరిశీలించేవారు అవాక్కయ్యే విధంగా ఎన్నికల ప్రసంగాలు చేసిన నరేంద్రమోడీ ప్రక్షాళన కోసమో, మరొకదానికోసమో 45 గంటల పాటు కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రంలో ధ్యానదీక్ష చేశారు.నువ్వు చెయ్యాల్సింది చెయ్యి, ఫలితాలు, పర్యవసానాలు, విమర్శల గురించి పట్టించుకోకు మౌనవ్రతమే నీ ఆయుధం అన్నట్లుగా దేవుడి అంశతో జన్మించినట్లు చెప్పుకున్న మోడీ కార్యాచరణలో నిమిత్తమాత్రుడు తప్ప ఆటాడించిందీ, మాట్లాడించిందీ ఆ దేవుడే గనుక ప్రతిష్టో అప్రతిష్టో ఆయన ఖాతాకు తప్ప మోడీకి కాదని వేరే చెప్పనవసరం లేదు. పచ్చి అవాస్తవాలు,ఎడారిలో సముద్రాల మాదిరి మాటలు, ప్రలోభాలు, బెదరింపులు,బ్రతిమిలాటలు ఇలా ఎన్నో. సకలకళా వల్లభుల ప్రదర్శనలను దేశం చూసింది. మంచో చెడో ఒక నిర్ణయం తీసుకొని ఓటర్లు తమ తీర్పునిచ్చారు. జూన్‌ నాలుగున వెలువడే ఫలితాలలో గెలిచిన పార్టీల, అభ్యర్థుల హడావుడి, ఓడిన పార్టీలు, అభ్యర్థుల వాదనలు, వేదనలు సరేసరి.. ఏ పార్టీ లేదా ఏ కూటమికి మెజారిటీ రాకుండా హంగ్‌ ఏర్పడితే ఏం జరుగుతుందో అనూహ్యం. ఎన్‌డిఏ-ఇండియా కూటమి రెండూ మెజారిటీ సాధనకు తలపడతాయి. చిన్న పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు వరకు కింగ్‌మేకర్లుగా మారతాయి.తరువాత వాటి భవిష్యత్‌ చెప్పలేము.చిన పాముపు పెద పాము, చిన చేపను పెద చేప మింగినట్లుగా జరిగే అవకాశం ఉంది. లోక్‌సభలోని 543 స్థానాలకు గాను మెజారిటీ 272 సాధించుకున్న పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.గత ఎన్నికలను చూసినపుడు 2014లో బిజెపి 31శాతం ఓట్లతో 282 సీట్లు తెచ్చుకుంది,2019లో 37.3శాతం ఓట్లు 303 సీట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌ విషయానికి వస్తే 2014లో 19.31శాతం ఓట్లు 44 సీట్లు, తదుపరి ఎన్నికల్లో 19.46శాతం ఓట్లు, 52 సీట్లు తెచ్చుకుంది. బిజెపి హిందూత్వను ఎంతగా రెచ్చగొట్టినా, నరేంద్రమోడీని హిందూ హృదయ సామ్రాట్టుగా జనం ముందుకు తెచ్చినా గత రెండు ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు రాలేదు. అదే కాంగ్రెస్‌ను చూస్తే ఓట్ల శాతంలో పెద్ద మార్పు లేదు.2014కు ముందు జరిగిన ఎన్నికల్లో బిజెపి తెచ్చుకున్న 18.8శాతం ఓట్లను 31శాతానికి పెంచుకోగా, కాంగ్రెస్‌ 28.55 నుంచి 19.31శాతానికి కోల్పోయింది. అంతకు ముందు ఎన్నికలతో పోల్చితే 2014లో బిజెపి 12.2శాతం అదనంగా తెచ్చుకోగా 2019లో అదనంగా 6.36శాతం తెచ్చుకుంది. కాంగ్రెస్‌ 2014తో పోల్చితే 2019లో 0.18శాతం ఓట్లు అదనంగా తెచ్చుకుంది. తినబోతూ రుచెందుకు అన్నట్లుగా 2024లో తీరుతెన్నుల గురించి జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.


ప్రేమ కోసం, యుద్ధంలో గెలుపుకోసం అబద్దాలు చెప్పవచ్చు అన్నట్లుగా ఈ ఎన్నికలలో నరేంద్రమోడీ, బిజెపి నేతల ప్రసంగాల తీరు ఉంది. ఎవరేమనుకుంటే మాకేటి అన్నట్లు వ్యవహరించారు.చివరి దశలో ప్రధాని నరేంద్రమోడీ ఎబిపి టీవీ ఛానల్‌కు జర్నలిస్టులతో మాట్లాడుతూ రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ సినిమా తీసిన తరువాతే మహాత్మాగాంధీ ఎవరు అనే ఉత్సుకత ప్రపంచంలో పెరిగిందని చెప్పారు. నిజానికి ఇది ఎన్నికల అంశంగా ఏ పార్టీ కూడా ప్రస్తావన తేలేదు. ఆకర్షణీయమైన నేతలు తప్పులు ఎందుకు చేస్తారంటూ ”అవెంటస్‌ ” పార్టనర్స్‌ అనే ఒక వెబ్‌సైట్‌లో తేదీలేని ఒక సర్వే విశ్లేషణ ఉంది. నేతలు అందునా ఉత్తమ నేతలు కూడా అవివేకమైన తప్పులు తరచుగా చేస్తుంటారని పేర్కొన్నది.పదవి మరియు తెలివితేటల కారణంగా మితిమీరిన విశ్వాసం మరియు అధికారంతో తీవ్రమైన తప్పులు చేస్తుంటారని దీన్ని సైద్దాంతిక వేత్తలు (హ్యూమన్‌ ఫోలీ) మానవ అజ్ఞానం లేదా మూర్ఖత్వమని పిలిచారని పేర్కొన్నది. దానిలో పేర్కొన్న ఐదు తప్పుల సారం ఇలా ఉంది. సంవత్సరాల తరబడి నిరంతరం అందుకునే ప్రశంసల కారణంగా అత్యధిక నేతలు తమ తెలివితేటలు, సామర్ధ్యాల గురించి తిరుగులేని విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటారట.కీలకమైన నిర్ణయాలు తీసుకొనే సమయంలో తమ మీద తమకు ఏర్పడిన అతివిశ్వాసం కారణంగా ఇతరులు వెల్లడించే అభిప్రాయాలు, సూచనలను పట్టించుకోరు, దీంతో చురుకైన నేతలు తప్పుడు నిర్ణయాలు తీసుకొనే ముప్పు ఎక్కువగా ఉంటుందట. సూక్ష్మ నిర్వహణ(మైక్రోమేనేజ్‌మెంట్‌) సమస్య నేతలకు మాత్రమే కాదు సంస్థలలోనూ ఉంది.నాయకత్వ స్థానాల్లో సూక్ష్మ నిర్వహణ, బదలాయింపు లేకపోతే మొత్తం జట్టు మీద ప్రభావం చూపుతుంది. సంక్షోభ సమయాల్లో చురుకైన నేతలు జట్టు హస్తం అందుకొనేందుకు చూస్తారు, కానీ కొత్త ఆలోచనల అన్వేషణలో వారి ఆసరా తీసుకోరు. చురుకైన నేతలు తాము రూపొందించిన నిబంధనలను పాటించటంలో విఫలమైనపుడు ఆ సంస్థల విలువలు, సూత్రాల మీదనే సందేహాలు తలెత్తుతాయి. తరువాత వాటన్నింటినీ పరిరక్షించాల్సిన వ్యక్తి విశ్వసనీయతే ప్రశ్నార్ధకం అవుతుంది. చురుకైన వారు ఇతరులు చెప్పేదానికి విలువ ఇవ్వరు. తమకు సలహాలు ఇచ్చేంత గొప్పవారా అనుకుంటారు.తమ తప్పును అంగీకరించరు. తరచుగా మంచిచెడ్డల స్వీకరణ నిలిపివేత వీరు చేసే అవివేకమైన తప్పు. బలమైన నేతలకు అవకాశాలు సులభంగా వచ్చినపుడు అన్నింటినీ చేసేయగలమనే వ్యక్తిత్వాలను పెంచుకుంటారు. లక్ష్యాలను పెద్దగా నిర్ణయించుకుంటారు, అనుకున్న విధంగా జరగకపోతే తగిన ప్రయత్నం లేకపోవటం అనుకుంటారు.వాస్తవ విరుద్దమైన లక్ష్యాలను నిర్ణయించుకొని ఎలాగైనా సాధించాలనుకొని జనాలను ఇబ్బందుల్లోకి నెడతారు. చురుకైన తెలివితేటలు కలిగిన వారందరూ పైన పేర్కొన్న లక్షణాలు, ధోరణులు గల నేతలు ఎవరన్నది ఎవరికి వారు అన్వయించుకొని ఒక అంచనాకు రావచ్చు.


నరేంద్రమోడీని అనేక మంది చురుకైన, ఆకర్షణ కలిగిన నేత అని చెబుతారు. ఆయనకు ఉందని చెబుతున్న పట్టా రాజకీయ శాస్త్రంలో అని కూడా అందరం చదువుకున్నదే. అలాంటి వ్యక్తికి చరిత్ర తెలియదా లేక కావాలనే ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలను వక్రీకరించినట్లుగా జాతిపిత గురించి కూడా మాట్లాడారా ? రెండూ వాస్తవం కావచ్చు. ప్రపంచ వలస దేశాల చరిత్రను చూసినపుడు మనదేశమంత పెద్దది బ్రిటీష్‌ సామ్రాజ్యంలో మరొకటి లేదు. వారి పాలనను అంతం చేసిన స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారెవరు అన్న చర్చ జరిగినపుడు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే మహాత్మాగాంధీ అని ప్రపంచం తెలుసుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేని ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో గాడ్సే గురించి తప్ప గాంధీ గురించి పెద్దగా బోధించి ఉండరు. భగవద్గీత వంటి గ్రంధాల కంటే ” నేనెందుకు గాంధీని చంపాను ” అంటూ గాడ్సే కోర్టులో మాట్లాడిన అంశాలను పెద్ద ఎత్తున బోధిస్తారని వినికిడి. ఆ పుస్తకాన్ని అచ్చువేసి, పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చిన అంశం తెలిసిందే.మహాత్మాగాంధీ జాతిపిత అని ఎవరు చెప్పారు, ఎలా అయ్యారంటూ, దేశానికి చేసిన ద్రోహాలంటూ వాట్సాప్‌ యూనివర్సిటీలో ప్రచారం చేసే ఊరూపేరు చెప్పుకొనేందుకు ధైర్యం లేని చీకటి బతుకుల బాపతు ఎవరు అన్నది వేరే చెప్పనవసరం లేదు.


మహాత్ముడు కాక ముందు అంటే నరేంద్రమోడీ పుట్టక ముందే బహుశా ఆయన తండ్రి లాగూలు(అప్పటికి నిక్కర్లు వచ్చి ఉండవు) వేసుకొంటున్న సమయానికే 1920దశకంలోనే మోహనదాస్‌ కరంచంద్‌ గాంధీ గురించి పశ్చిమ దేశాలలో చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం చరిత్రను ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి అనుగుణ్యంగా తిరగరాస్తున్నది. గాంధీ హత్య నేపధ్యం గురించి భావితరాలకు తెలియకూడదు అనే లక్ష్యంతో ఎన్‌సిఇఆర్‌టి ద్వారా 2022జూన్‌లో రాజకీయ శాస్త్రంలో ఉన్న అంశాలను తొలగింపచేయించిన ఉదంతం తెలిసిందే.ఏమిటవి ? ” పాకిస్తాన్‌ ముస్లింలకు అన్నట్లుగా ఇండియా హిందువుల దేశంగా మారాలని లేదా హిందువులు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నవారికి ప్రత్యేకించి ఆయన(గాంధీ) అంటే అయిష్టం…హిందువులు-ముస్లింలు ఐక్యంగా ఉండాలనే స్థిరమైన అనుసరణతో రెచ్చిపోయిన హిందూ ఉగ్రవాదులు ఆ మేరకు అనేక సార్లు గాంధీజీని హత్య చేసేందుకు చూశారు….గాంధీజీ మరణం దేశంలో ఉన్న మతపరిస్థితిపై దాదాపు మాయా ప్రభావం(మేజికల్‌ ఎఫెక్ట్‌) చూపింది…..మతవిద్వేషాన్ని రెచ్చగొడుతున్న సంస్థలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు వంటి సంస్థలపై కొంత కాలం నిషేధం విధించింది…” ఇలాంటి కుదురు నుంచి వచ్చిన నరేంద్రమోడీ నోట మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి అని వెలువడటం వెనుక చిత్తశుద్ది ఉందని ఎవరైనా అనుకోగలరా ?


ఇంతకీ మహాత్ముడి గురించి నరేంద్రమోడీ సెలవిచ్చిందేమిటి ? ప్రతిపక్షాలు రామమందిర ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు, ఎన్నికలలో దీని ప్రభావం ఉంటుందా అని ఎబిపి విలేకర్లు అడిగిన ప్రశ్నపై స్పందించిన మోడీ ప్రతిపక్షం బానిసత్వ భావనలనుంచి బయటకు రాలేదు అంటూ ” మహాత్మా గాంధీ గొప్ప వ్యక్తి. మహాత్మా గాంధీ గురించి ప్రపంచం తెలుసుకొనే విధంగా ఈ 75 సంవత్సరాలలో చేయాల్సిన బాధ్యత మనది కాదా ? మహాత్మా గాంధీ గురించి ఎవరికీ తెలియదు. గాంధీ సినిమా తీసిన తరువాత మాత్రమే ఈ మనిషి ఎవరన్న జిజ్ఞాస ప్రపంచంలో పెరిగింది.మనమాపని చేయలేదు. అది మన బాధ్యత. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ గురించి ప్రపంచానికి తెలిసిందంటే, దక్షిణాఫ్రికానేత నెల్సన్‌ మండేలా ప్రపంచానికి తెలిశారంటే వారికంటే గాంధీ తక్కువేమీ కాదు. మీరు దీన్ని అంగీకరించాలి.ప్రపంచమంతా తిరిగిన తరువాత నేను ఈ విషయాన్ని చెబుతున్నాను” అని మోడీ చెప్పారు. బ్రిటీష్‌ సినిమా దర్శకుడు రిచర్డ్‌ అటెన్‌బరో గాంధీ సినిమాతీశాడు, బెన్‌కింగ్‌స్లే గాంధీ పాత్ర పోషించాడు. దానికి పదకొండు అకాడమీ అవార్డులు వచ్చాయి. ఆ సినిమా తరువాతే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందని చెప్పటం మహాత్ముడిని అవమానించటం తప్ప మరొకటి కాదు.ఆ సినిమా తరువాతనే నాకు గాంధీ గురించి తెలిసిందని మోడీ చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటం మీద గాంధీ ప్రభావం గురించి స్వయంగా నెల్సన్‌ మండేలానే చెప్పారు. ఆ పోరాటం గాంధీ సినిమా చూసిన తరువాత ప్రారంభం కాలేదు.


మహాత్మా గాంధీ పుట్టిన గుజరాత్‌కు సిఎంగా పని చేసిన నరేంద్రమోడీ అమ్మా గూగులమ్మా మా గాంధీ గురించి కాస్త చెప్పమ్మా అని మోడీ అడిగినా, ఆయన సిబ్బంది అడిగినా గాంధీ సినిమాకు ముందు, తరువాత కూడా ఎన్నో విషయాలు తెలిసి ఉండేవి. సామాజిక మాధ్యమంలో ప్రతిపక్షాల నుంచి ఇప్పుడు ఇన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది కాదు. గాంధీ గురించి ఉన్న వెబ్‌సైట్‌ను అసలు ఒక్కసారైనా చూసి ఉంటారా అన్నది అనుమానమే. చూసి ఉంటే ఇలా మాట్లాడేందుకు ధైర్యం చేసి ఉండేవారు కాదు.బ్రిటన్‌ వార పత్రిక గ్రాఫిక్‌లో 1922లో గాంధీ అరెస్టయినపుడు గాంధీ గురించి రాశారు. నైరోబీలో గాంధీ అరెస్టు గురించి చేసిన ఆందోళనపై రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన వార్తను అదే ఏడాది లాహౌర్‌ నుంచి వెలువడిన సివిల్‌ మరియు మిలిటరీ గెజెట్‌లో ప్రచురించారు.” సదాచార గాంధీ :1930వ సంవత్సర పురుషుడు ” అంటూ టైమ్‌ పత్రిక 1931 జనవరి ఐదవ తేదీన ప్రచురించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా 1930లో గాంధీతో పాటు అరెస్టు అయిన 30వేల మందిని ఏం చేయాలా అని బ్రిటీష్‌ సామ్రాజ్యం భయంతో ఉంది. ఆ ఏడాది చివరిలో ఒక అర్దనగ మనిషిని చూసింది, ప్రపంచ చరిత్ర 1930లో ఆ మనిషి సంకేతం నిస్సందేహంగా అన్నింటికంటే పెద్దది ” అని దానిలో రాసింది. అదే ఏడాది సెప్టెంబరు 20న అమెరికా నుంచి వెలువడే బర్లింగ్టన్‌ హాక్‌ ఐ అనే పత్రిక ఒక పూర్తి పేజీ కేటాయించి గాంధీ గురించి రాసింది.” ప్రపంచంలో ఎక్కువ మంది చర్చించిన మనిషి ” అనే శీర్షిక పెట్టింది. రాట్నం వడుకుతున్న మహాత్మాగాంధీ ఫొటో ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. అమెరికా ఫొటోగ్రాఫర్‌ మార్గరెట్‌ బుర్కే వైట్‌ తీసిన దాన్ని 1946 మే 27వ తేదీన లైఫ్‌ అనే పత్రిక ” భారత నేతలు ‘ అనే శీర్షికతో ప్రచురించింది.


మహాత్మాగాంధీ హత్య గురించి న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ఒక పతాక శీర్షికతో ప్రచురించింది.” ఒక హిందూ చేతిలో గాంధీ హత్య, కంపించిన భారత్‌,కొట్లాటల్లో బాంబేలో 15 మంది మృతి ” అని రాసింది.గార్డియన్‌, వాషింగ్టన్‌ పోస్టు, డెయిలీ టెలిగ్రాఫ్‌ వంటి పత్రికలన్నీ పతాక శీర్షికలతో గాంధీ హత్య వార్తను ప్రచురించాయి. గాంధీతో ప్రముఖ సినిమా నటుడు చార్లీ చాప్లిన్‌ భేటీ, ఆల్బర్ట్‌ ఐనిస్టీన్‌ ఉత్తర ప్రత్యుత్తరాలు, గాంధీ గురించి మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ రాసిన అంశాలన్నీ సుపరిచతమే.అమెరికా జర్నలిస్టు లూయీస్‌ ఫిశ్చర్‌ 1950లో ” మహాత్మాగాంధీ జీవితం ” పేరుతో రాసిన జీవిత చరిత్రను ఎంతో మంది చదివారు. గాంధీ సినిమాకు ముందే అనేక దేశాలు గాంధీ గౌరవార్ధం పోస్టల్‌ స్టాంపులను ప్రచురించాయి. ఇంత ప్రాచుర్య చరిత్ర ఉంటే నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్దమే గాక అసహ్యం కలిగిస్తున్నట్లు విమర్శలు వెలువడ్డాయి.

పారిస్‌ ఒలింపిక్స్‌లో చైనా వస్తువుల సందడి !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనా రియలెస్టేట్‌ రంగంలో తలెత్తిన కొన్ని సమస్యలను చూపి ఇంకేముంది అక్కడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అంటూ కొంత మంది విశ్లేషణలు చేశారు, పండగ చేసుకున్నారు. కానీ అదే చైనా వస్తువులు ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11వరకు జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో పెద్ద మొత్తంలో దర్శనమివ్వనున్నాయి.క్రీడా పతకాలతో పాటు ప్రపంచ ఫ్యాక్టరీగా తన సత్తా ఏమిటో చూపనుంది. చైనా తూర్పున ఉన్న జెజియాంగ్‌ రాష్ట్రంలో ‘ఇవు’ అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్‌ ఉంది. అది ఎంత పెద్దది అంటే నలభైలక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన సముదాయం, 75వేల దుకాణాలు ఉన్నాయి. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌ ఇతివృత్తంతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసేందుకు దిగుమతిదారులు పెద్ద సంఖ్యలో ఆ మార్కెట్‌ను సందర్శించి వస్తువులకు ఆర్డర్లు పెట్టారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల నుంచి ఈ సందడి ప్రారంభమైంది.ఈ వాణిజ్య, పారిశ్రామిక కేంద్రం నుంచి ఒక్క పారిస్‌ ఒలింపిక్స్‌కే కాదు, అమెరికా, ఐరోపాదేశాల్లో జరిగే అని ప్రముఖక్రీడలకూ అవసరమైన వస్తువులను ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నారు. జూన్‌ మాసం వరకు ఒలింపిక్‌ ఆర్డర్ల తయారీకి ఒప్పందాలు కుదిరాయి.జెర్సీలు, ట్రోఫీలు, మెడల్స్‌ ఒకటేమిటి అన్ని రకాల క్రీడా సామగ్రి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్నాయి.టేబుల్‌ టెన్నిస్‌ బంతుల్లో తక్కువ రకం ధర 0.083 డాలర్లు (రు.6.90) ఉంది.పారిస్‌ ఒలింపిక్స్‌లో వాడే ఆరుబంతుల ధర.460గా ఉంది.


అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే మొత్తంగా ఫ్రాన్స్‌కు ఈ మార్కెట్‌ కేంద్రం నుంచి ఎగుమతులు 42శాతం పెరగ్గా వాటిలో క్రీడావస్తువుల పెరుగుదల 70శాతం ఉందంటే పారిస్‌ ఒలింపిక్సే కారణం.జెజియాంగ్‌ రాష్ట్ర జనాభా 5.75 కోట్లు. ఇక్కడ ప్రధానంగా వస్త్రాల వంటి వినిమయ వస్తువులు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. చైనా నుంచి వస్తువులను కొనుగోలు చేసేవారు వేరే దేశాలకు మరలుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రమశక్తి ఎక్కువగా ఉండే వస్తుతయారీ నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉత్పత్తుల మీద చైనా కేంద్రీకరించింది. దీనికి తోడు వేతనాల పెరుగుదల వంటి కారణాలతో కొన్ని సంస్థలు ఎక్కడ లాభసాటిగా ఉంటే అక్కడికి వెళ్లటం బహిరంగ రహస్యం.దీనికి తోడు వాణిజ్య ఆంక్షలు, సుంకాల విధింపు, ప్రపంచ రాజకీయాలూ పని చేస్తున్నాయి.ఇన్ని కారణాలున్నా ప్రపంచ సరఫరా గొలుసు నుంచి చైనాను తప్పించటం ఇప్పట్లో జరిగేది కాదన్నది పచ్చినిజం. శ్రమశక్తి ఎక్కువగా ఉండే వస్తువులు చైనా మొత్తం ఎగుమతుల్లో 2017లో 18శాతం ఉండగా 2023లో 17శాతానికి మాత్రమే తగ్గాయి. ఇదంతా అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం తరువాత జరిగిన పరిణామం.


చైనాలో తలెత్తిన రియలెస్టేట్‌ సమస్యలకూ పారిశ్రామిక ఉత్పత్తులకు కొందరు ముడిపెడుతున్నారు. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి రేటు 5.3శాతం కాగా పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల రేటు 6.1శాతం కాగా పెట్టుబడులు పదిశాతం వరకు పెరిగాయి. మొత్తం సంక్షోభంలో కూరుకుపోయిందని చెబుతున్నవారే అవసరాలకు మించి ఉత్పత్తి చేసి తమ దేశాల్లో కుమ్మరిస్తున్నట్లు గగ్గోలు పెడతారు.ఈ ఏడాది ప్రారంభంలో చైనా పారిశ్రామికరంగ వినియోగం 75శాతం ఉంది. తీసుకున్న ఆర్డర్లను వేగంగా సకాలంలో పూర్తి చేసి ఇవ్వటంలో చైనా తిరుగులేనిదిగా ఉంది.పారిస్‌ ఒలింపిక్స్‌ వస్తువుల విషయంలోనూ అదే నమ్మకం ఉన్నకారణంగా వ్యాపారులు ఎగబడ్డారు.తక్కువ ధరలకు అందించటంతో పాటు సకాలంలో సరఫరా ఇక్కడ ముఖ్యం.జెజియాంగ్‌ రాష్ట్రంలో 78 పారిశ్రామిక పార్కులుంటే వాటిలో నాలుగున్నరవేల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి.వాటికి స్థానిక సంస్థలు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్నందున ఆధునిక ప్రమాణాలతో కూడిన ఉత్పాదక పద్దతులతో పాటు మార్కెటింగ్‌ సౌకర్యాలను కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మార్కెట్‌ ధోరణులను పసిగట్టి అందుకనుగుణ్యంగా ఉత్పత్తుల్లో మార్పులు చేయటం చైనా ప్రత్యేకత అని చెప్పవచ్చు.ఈ కారణంగానే ప్రపంచంలో పెద్ద వాటిలో ఒకటైన షి ఇన్‌ ఫ్యాషన్‌ కంపెనీ వారానికి 50వేల కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుండగా జారా అనే కంపెనీ ఏటా పాతికవేలను ఉంచుతున్నది. భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్న కారణంగా చైనాలో ఖర్చు తగ్గుతుంది, దాంతో చౌక ధరలకు విక్రయించగలుగుతున్నది.తనకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన విధానాలను రూపొందిస్తున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చైనాకు ఇతర దేశాలు ఎంత అవసరమో, ప్రపంచానికి దాని అవసరమూ అంతే ఉంది. పరస్పర ఆధారాన్ని ఎవరు దెబ్బతీసినా రెండు పక్షాలూ నష్టపోతాయి.


చైనాలో మే ఒకటవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు మేడే సెలవలు ఇస్తారు. ఈ సందర్భంగా జరిగే వస్తు విక్రయాలు చైనా ఆర్థిక వ్యవస్థ, పౌరుల కొనుగోలు శక్తిని అంచనా వేసేందుకు ఒక కొలబద్దగా పరిగణిస్తారు. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో నమోదైన వివరాలు చైనా తిరిగి కోలుకోవటమే కాదు పెరగటాన్ని సూచించాయి. మే ఒకటవ తేదీన ప్రయివేటు, ప్రభుత్వ సంస్థల వద్ద నమోదైన వివరాల ప్రకారం 28 కోట్ల ప్రయాణాలు జరిగాయి. ఇవి కరోనాకు ముందున్న స్థాయిని దాటినట్లు పేర్కొన్నారు.జల, వాయు, భూ మార్గాలలో జరిగే ఈ ప్రయాణాలతో రవాణా సంస్థలే కాదు, పర్యాటక రంగం, వస్తూత్పత్తి ఇతర సేవారంగాలు కూడా లబ్దిపొందుతాయి. అనేక దేశాలకు ఎలాంటి వీసాలతో నిమిత్తం లేకుండా చైనా పౌరులు విహార యాత్రలకు వెళ్లవచ్చు. దీంతో ఆయా దేశాలూ, చైనా కూడా లబ్దిపొందుతున్నది. ఐదు రోజుల మేడే సెలవుల్లో 5,800 విమానాలు 9.18లక్షల మంది ప్రయాణీకులను చేరవేస్తాయని అంచనా వేశారు.జపాన్‌, దక్షిణ కొరియాలకు ఎక్కువ మంది వెళతారు.ఈ సారి 2019తో పోలిస్తే ఈ ఏడాది 20శాతం ఎక్కువగా ఈ దేశాలకు టికెట్లను కొనుగోలు చేశారు.ఇతర దేశాలకూ ఇదే రద్దీ ఏర్పడింది.


ఆధునిక పరిజ్ఞానంలో గతంలో చైనా ఎంతో వెనుకబడి ఉండేది. ఇప్పుడు కొన్ని రంగాలలో పశ్చిమ దేశాలను సవాలు చేస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం జనం నోళ్లలో నానుతున్న కృత్రిమ మేథ(ఏఐ)లో చైనా పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముందుకు వస్తుందేమో అన్న భయంతో అమెరికాకు నిదురబట్టటం లేదంటే అతిశయోక్తి కాదు. మేథోసంపత్తి హక్కులున్న నమూనాలకు బదులు అందరికీ అందుబాటులో(ఓపెన్‌ సోర్స్‌) ఉన్న వనరుల మీద చైనా కేంద్రీకరిస్తున్నది. ఇప్పటి వరకు అనేక బడా కంపెనీలు కొన్ని ఉత్పత్తులపై పేటెంట్‌ హక్కులను పొంది విపరీతంగా లాభాలు పొందుతున్న సంగతి తెలిసిందే.కృత్రిమ మేథ అలాంటి కంపెనీలను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. మేథో విజ్ఞానాన్ని మానవ కల్యాణానికి బదులు మారణాయుధాలు తయారు చేసేందుకు, తమకు లొంగని దేశాల వ్యవస్థలను దెబ్బతీసేందుకు వినియోగించిన చరిత్ర పశ్చిమదేశాలది. వివిధ భాషల్లో ఉన్న సమాచారాన్ని పెద్ద ఖర్చు లేకుండానే మన భాషలో తర్జుమా చేసుకొని చదువుకోవచ్చు. మనదేశంలో దుర్వినియోగం చేస్తూ జనాన్ని తప్పుడు సమాచారంతో పక్కదారి పట్టిస్తున్న తీరు ఇప్పటికే చూస్తున్నాము. ఈ రంగంలో చైనా పురోగతిని చూసి అది కూడా తమ మాదిరే వ్యవహరిస్తే అని ఊహించుకొని ఏఐతో చైనా ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటుందని, సైబర్‌దాడులు, జీవాయుధాల తయారీ వంటి వాటికి వినియోగించనుందంటూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు.లైనక్స్‌, హ్యూమన్‌ జినోమ్‌, ఇమేజ్‌నెట్‌, పైటార్చ్‌ వంటి అందరికీ అందుబాటులో ఉన్న వనరులతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో లబ్దిపొందవచ్చు,విద్యార్ధులు, పరిశోధకులకు ఇవి ఎంతో ఉపయోగం.చైనా కంపెనీల విజయానికి ఇదొక ప్రధాన కారణం.వారి నుంచి ఇతర దేశాలు ఎంతో నేర్చుకుంటున్నాయి.చైనాతో పోటీ పడాలని అమెరికాలోని అనేక మంది తమ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు.
తెలివితేటలు కేవలం కొందరి సొంత అన్న భ్రమలు కలిగిన వారికి అవి పటాపంచలయ్యాయి.కృత్రిమ మేథతో ప్రయోజనాలకంటే ప్రమాదాలే ఎక్కువ అనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. గూండాల చేతుల్లో పడితే చాకులు మారణాయుధాలుగా మారతాయి గనుక ఎక్కువ మందికి వినియోగపడే వాటిని తయారు చేయటం మానుకుంటామా ? అణుబాంబులు కలిగి ఉన్న చైనా, రష్యా కృత్రిమ మేథతో వాటిని మోహరించేందుకు నిర్ణయం తీసుకుంటే ప్రమాదమమని అమెరికా గుండెలు బాదుకుంటోంది. అవసరం లేకున్నా ప్రపంచాన్ని భయపెట్టేందుకు, తమకు లొంగనివారికి ఇదే గతి అని హెచ్చరించేందుకు రెండవ ప్రపంచ యుద్ధ చివరి రోజుల్లో జపాన్‌ మీద అణుబాంబులు వేసిన దుర్మార్గానికి అమెరికా పాల్పడిన సంగతి తెలిసిందే. అణుబాంబులు దాని వద్ద, మిత్రదేశాలుగా ఉన్న బ్రిటన్‌, ఫ్రాన్సు దగ్గర కూడా ఉన్నాయి. అవి దుర్వినియోగానికి పాల్పడవన్న హామీ ప్రపంచానికి లేదు. ఆధునిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయవద్దంటూ తమ అధికారులు చైనాతో సంప్రదింపుల్లో చెప్పినట్లు అమెరికా అధ్యక్ష భవనం ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది. కృత్రిమ మేథను దుర్వినియోగం చేస్తున్నారన్న ప్రచారకొనసాగింపులో ఇదొక భాగం.చైనాతో వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానంలో పోటీపడలేమని, దానితో ఏదో ఘర్షణ పడటం వలన ప్రయోజనం లేదని అమెరికాకు అవగతమైందంటున్నవారూ లేకపోలేదు.


గత రెండు దశాబ్దాల్లో చైనా సాధించిన ప్రగతిని చూసి అమెరికాలో తీవ్ర మధనం జరుగుతోంది.దాన్నింక ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని అనేక మంది భావిస్తున్నారు. మార్చినెలలో అధ్యక్షుడు జో బైడెన్‌ తన పౌరులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ” చైనా పెరుగుతోంది, అమెరికా పడిపోతోందంటూ గత కొద్ది సంవత్సరాలుగా నా రిపబ్లికన్‌ మరియు డెమోక్రాట్స్‌ స్నేహితుల నుంచి వింటున్నాను ” అని చెప్పాడు.కరోనా తరువాత ఇంక చైనా పని అయిపోయింది, పెరగాల్సిన మేరకు పెరిగింది, ఇంక అవకాశం లేదు అని చెప్పేవారు తయారయ్యారు.కొందరు త్వరలో అమెరికాను అధిగమిస్తుందని, మాంద్యంలో కూరుకుపోతుందని చెప్పినవారూ ఉన్నారు.చైనా వృద్ధి వేగం తగ్గిన మాట నిజం.2021 నుంచి 2023 వరకు అమెరికా జిడిపిలో 76 నుంచి 67శాతానికి చైనాలో తగ్గిందని, అయినప్పటికీ 2019తో పోల్చితే 20శాతం పెద్దదని, కరోనా సమయంలో అమెరికా కేవలం ఎనిమిదిశాతమే పెద్దదన్నది మరచిపోవద్దని అంకెలు చెబుతున్నాయి. అమెరికాలో 2023జిడిపి పెరుగుదల రేటు 6.3శాతం ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ వృద్దిరేటు 2.5శాతమే. అదే చైనాను చూస్తే జిడిపి వృద్ది రేటు 4.6శాతమైనప్పటికీ వాస్తవ వృద్ది 5.2శాతం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ వైరుధ్యానికి కారణం చైనాలో ద్రవ్యోల్బణం రేటు తక్కువ, అమెరికాలో ఎక్కువగా ఉండటమే.అమెరికాలో వడ్డీరేటు 2022 మార్చినెల నుంచి 0.25 నుంచి 5.5శాతానికి పెంచగా చైనాలో 3.7 నుంచి 3.45శాతానికి తగ్గించారు. అమెరికాలో వడ్డీరేట్లను తగ్గిస్తే ఎలా ఉండేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.

ఈజిప్టు ఫారోలా ! దేవరాజులా !! దేవదూత నరేంద్రమోడీ ఎవరి సరసన ? చరిత్రలో ఇలాంటి వారు చేసిన దుర్మార్గాలేమిటి ?

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎన్నికలు చివరిదశకు చేరాయి, 2024జూన్‌ నాలుగున ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. అది సక్రమంగా ఉంటుందా అంటూ ” దేవుడు లేదా దేవుడి ప్రతినిధి ” గురించి అనేక మంది ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి నరేంద్రమోడీ తిరిగి అధికారానికి వస్తే లేదా కోల్పోతే ఏం జరుగుతుంది. మొదటిదాని గురించి ఇండియా కూటమి ఇప్పటికే ప్రచారంలో పేర్కొన్నట్లు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగం, సామాజిక న్యాయానికి ముప్పు ఏర్పడుతుందని నమ్ముతున్నవారు ఉన్నారు.మోడీని ఒక వైపు కాంగ్రెస్‌కు గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావంటారు, ఇండియా కూటమి వస్తే ఏడాదికొకరు ప్రధాని పదవి చేపడతారంటారు. అదే నోటితో కాంగ్రెస్‌ అధికారానికి వస్తే మెజారిటీ భారతీయులు రెండవ తరగతి పౌరులుగా మారిపోతారని, మహిళల మెడల్లో ఉన్న పుస్తెలతో సహా ఆభరణాలన్నీ తీసుకొని చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలు కలవారికి పంపిణీ చేస్తారని,క్రికెట్‌ జట్లలో ఎక్కువ మంది ముస్లింలను చేర్చుతారని, అయోధ్యలో రామాలయాన్ని కూల్చేందుకు బుల్డోజర్లు పంపుతారని ఆరోపిస్తారు. పరుచూరి బ్రదర్స్‌ చెప్పినట్లు ఒక జేబులో ఒకటి, మరోజేబులో మరో ప్రకటన పెట్టుకుతిరిగే రాజకీయనేతగా మోడీ కనిపించటం లేదూ ! ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని సంఘపరివారం నిరంతరం చేస్తున్న ప్రచారం తెలిసిందే. తాను వారి గురించి కాదు అని తరువాత మోడీ మార్చారు. మరి ఎవరిని అన్నట్లు ? సమాజంలో ధనికులుగా ఉన్నవారు, ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసీ సామాజిక తరగతులతో పోల్చితే ఇతరులు పిల్లలను ఎక్కువగా కనటం లేదన్నది తెలిసిందే. అంటే ఆ మూడు సామాజిక తరగతుల మీదనే మోడీ ధ్వజమెత్తారని అనుకోవాలి మరి.లేకపోతే నరం లేని నాలుక అనుకోవాలి. ఇక రెండవ దృశ్యానికి వస్తే మోడీ జిగినీ దోస్తు డోనాల్డ్‌ ట్రంప్‌ మాదిరి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫలితాన్ని గుర్తించను అంటూ అధికార కేంద్రం కాపిటల్‌ హిల్‌ మీదకు తన మద్దతుదార్లను ఉసిగొల్పిన ఉదంతం ఇక్కడ ప్రతిబింబిస్తుందా ? అన్నది చూడాల్సి ఉంది.


నరేంద్రమోడీ నోటి వెంట ప్రమాదాన్ని సూచించే మరో మాట వెలువడింది. రాజులు దైవాంశ సంభూతులని వంది మాగధులు వర్ణించారు, పొగిడారు. ఏకంగా తామే దైవాంశ అని, దేవుళ్లమని చెప్పుకున్న వారిని చరిత్ర ఎందరినో చూసింది. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా మా నమో లీలలు వర్ణించతరమా అన్న పూనకంతో బిజెపి నేత సంబిత్‌ పాత్ర ఏకంగా పూరీ జగన్నాధుడే నరేంద్రమోడీ భక్తుడుగా మారినట్లు ”వెల్లడించిన” సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ పూరీలో రోడ్‌ షో జరిపిన తరువాత అక్కడ పోటీ చేస్తున్న సంబిత్‌ పాత్ర ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ” ప్రభువు పూరీ జగన్నాధుడు నరేంద్రమోడీ భక్తుడు, మేమంతా మోడీ కుటుంబసభ్యులం.ఇలాంటి మహత్తర క్షణాలను చూసిన తరువాత నా భావావేశాలను ఆపుకోలేను, ఒరియా వారందరికీ ఇది ఒక ప్రత్యేకమైన రోజు ” అని మాట్లాడారు.దీని మీద ప్రతికూల స్పందనలు తలెత్తటంతో క్షమించమని వేడికోళ్లకు పూనుకున్నారు.ఈ తప్పుకు గాను ఉపవాసం ఉండి ప్రాయచిత్తం చేసుకుంటానని చెప్పిన ఈ పెద్దమనిషిని ఎన్నికల్లో పూరీ జగన్నాధుడు ఏం చేస్తాడో చూడాలి.


దేవుడు దేశానికి ఇచ్చిన బహుమతి నరేంద్రమోడీ అని కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఎం వెంకయ్యనాయుడు 2016 మార్చి నెలలో సెలవిచ్చారు.బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ పేదల పాలిట దైవాంశగల ఒక మహా పురుషుడు(మేషయ) అని కూడా వర్ణించారు. తరువాత విలేకర్ల సమావేశంలో మాట్లాడిన మరో కేంద్ర మంత్రి రాజనాధ్‌ సింగ్‌ను విలేకర్లు ప్రశ్నించగా వెంకయ్యనాయుడి వ్యాఖ్యలను తాను వినలేదని, ఆ ప్రసంగాన్ని అంతగా ఆలకించలేదని చెప్పారు.(బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక 2016 మార్చి 21వ తేదీ) ఇంతగా వ్యక్తి పూజ తలకెక్కిన తరువాత నిజంగానే తాను దేవుడు పంపిన దూతను అని నరేంద్రమోడీ నమ్మటంలో ఆశ్చర్యం ఏముంది. ఇతరులు మాట్లాడితే విమర్శలు తలెత్తటం, రభస ఎందుకు ఏకంగా తానే రంగంలోకి దిగి మాట్లాడితే నోరెత్తే మీడియా ఉండదు కదా అనుకున్నారేమో ! ” కారణ జన్ములు ” అనే శీర్షికతో సంపాదకీయం రాసిన ఒక ప్రముఖ తెలుగు పత్రిక నరేంద్రమోడీ పేరెత్తటానికి భయపడిందంటే గోడీ మీడియా అని ఎవరైనా అంటే తప్పేముంది. అత్యవసర పరిస్థితి సమయంలో దేవకాంత బారువా అనే కాంగ్రెస్‌ నేత ఇందిరే ఇండియా-ఇండియాయే ఇందిర అని పొగడ్తలకు దిగి అభాసుపాలైన సంగతి తెలిసిందే.óఅప్పుడు కూడా మీడియా నోరెత్తలేదు, ఎత్తిన వాటిని ఎలా సెన్సార్‌ చేశారో తెలిసిందే.


తన పుట్టుక అందరి మాదిరి కాదని, తనను దేవుడు పంపినట్లు నమ్మకం కలిగిందని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.న్యూస్‌ 18 అనే ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడారు.” నా తల్లి జీవించి ఉన్నంత వరకు నేను జీవసంబంధం (అందరి మాదిరే అమ్మా నాన్నలకు పుట్టినట్లు)గా పుట్టినట్లు భావించేవాడినని, ఆమె మరణం తరువాత నా అనుభవాలను చూస్తే నన్ను దేవుడు పంపినట్లు నిర్ధారించుకున్నాను. అందుకే దేవుడు నాకు సామర్ధ్యం, శక్తి, స్వచ్చమైన హృదయం, ఈ పనులు చేసేందుకు దైవావేశం కూడా ఇచ్చినట్లు భావిస్తున్నాను. దేవుడు పంపిన ఒక సాధనాన్ని తప్ప నేను మరొకటి కాదు ” అని చెప్పారు. కల్యాణమొచ్చినా కక్కొచ్చినా(వాంతి) ఆగదంటారు, ఇప్పుడు దీనికి మోడీ మనసులోకి ఏది వచ్చినా అనే దాన్ని కూడా జతచేసుకొని నవీకరించాలి. చివరి దశ ఎన్నికల్లోగా లేదా తరువాత అయినా తన జన్మ ఏ దేవుడి అంశో అన్న రహస్యాన్ని వెల్లడించినా ఆశ్చర్యం లేదు. అప్పటి వరకు గుజరాత్‌ ద్వారక కృష్ణుడా, అయోధ్య రాముడా, వారణాసి శివుడా ఎవరు పంపారన్నది జనాలు జుట్టుపీక్కోవాల్సిందే. జర్మన్‌ నాజీ హిట్లర్‌ స్వచ్చమైన ఆర్య సంతతి అని భావించిన సావిత్రీదేవి ముఖర్జీ అనే ఫ్రాన్సులో పుట్టిన గ్రీకు ఫాసిస్టు రాసిన పుస్తకంలో హిట్లర్‌ను విష్ణువు అవతారమని చెప్పింది. సదరు అవతారి ఒక మారణహౌమానికి ఎలా కారకుడయ్యాడో తెలిసిందే. అజిత్‌ కృష్ణ ముఖర్జీ అనే బెంగాలీని వివాహం చేసుకొన్న సావిత్రిదేవీ కొల్‌కతాలో జీవించి రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రదేశాలకు వ్యతిరేకంగా జర్మన్‌ గూఢచారిగా పనిచేసి తరువాత నాజీగా జీవించింది.


ముందే చెప్పుకున్నట్లు చరిత్రను చూస్తే ఈజిప్టులో ఫారోలుగా వర్ణితమైన పురాతన రాజులు తమను దేవుళ్లుగా భావించుకోవటమే కాదు, పేర్లు కూడా అలాగే పెట్టుకొనే వారు. తదుపరి జన్మ కొనసాగింపుకోసం చచ్చిన రాజుల శవాలను మమ్మీలుగా మార్చి పిరమిడ్‌లను నిర్మించిన సంగతి తెలిసిందే. కొందరు చైనా రాజులు కూడా తమను స్వర్గ పుత్రులని వర్ణించుకున్నారు. చరిత్రలో అలెగ్జాండర్‌ ది గ్రేట్‌గా పిలిచే గ్రీకు చక్రవర్తి ఈజిప్టు ఫారోల మాదిరే తాను కూడా దైవాంశ సంభూతుడిగానే భావించుకున్నాడు.తన నిజమైన తండ్రి జీయస్‌ అమన్‌ అనే ఈజిప్టు పురాతన దేవుడని భావించాడు.ఇండోనేషియాలో అనేక మంది పురాతన రాజులు తాము హిందూ దేవుళ్ల అంశగా చెప్పుకున్నారని చరిత్ర చెబుతోంది.ఆగేయాసియా దేశాలలో దేవరాజ అని పిలుచుకున్న అనేక మంది శివుడు లేదా విష్ణువు అవతారాలు లేదా వారసుల మని చెప్పుకున్నారు. సూర్య, చంద్ర వంశీకులమని చెప్పుకున్న వారి సంగతి తెలిసిందే.టిబెట్‌లో దలైలామాలు ఇప్పటికీ తాము బుద్దుని అవతారమని చెప్పుకుంటున్నారు. నేపాల్లో షా వంశ రాజులు కూడా తమను విష్టు అవతారాలుగా వర్ణించుకున్నారు. సత్యసాయి బాబాను దత్తాత్రేయ అవతారంగా భావించే భక్తులు సరేసరి. చరిత్రలో తమను తాము దేవుళ్లుగా, దేవదూతలుగా వర్ణించుకున్నవారు, మతాన్ని కాపాడతామని చెప్పేవారు, కలుషితమైన జాతిని పరిశుద్ధం చేయాలనే వారు చేయించిన లేదా చేసిన దుర్మార్గాలు ఎన్నో. ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం పేరుతో అధికారానికి వచ్చిన మతశక్తులు ప్రత్యర్ధులను ముఖ్యంగా కమ్యూనిస్టులు, వామపక్ష వాదులు ”దేవుని శత్రువు ”లు అనే సాకుతో వేలాది మందిని బూటకపు విచారణలతో ఉరితీశారు. జపాన్‌లో షోకో అసహరా అనే వాడు తనను క్రీస్తుగా చెప్పుకున్నాడు. తరువాత బౌద్దం-హిందూ విశ్వాసాలలను కలగలిపి ప్రచారం చేశాడు. యుగాంతం ముంచుకువస్తుందని తన భక్తులను నమ్మించాడు.టోక్యోలో 1995లో శరీన్‌ గాస్‌ను ప్రయోగించి వేలాది మందిని గాయపరచి 13 మంది ప్రాణాలు తీశారు. చివరకు మరో ఏడుగురితో కలిపి అసహరాను అక్కడి ప్రభుత్వం విచారించి ఉరితీసింది. అమెరికాలో ఆస్కార్‌ రామిరో ఓర్టేగా హెర్నాండెస్‌ అనే పెద్ద నేరగాడు తనను దేవదూతగా, ఏసుక్రీస్తుగా వర్ణించుకున్నాడు.అమెరికా అధ్యక్ష భవనం మీద దాడికి దేవుడు తనను ఆదేశించినట్లు చెప్పుకున్నాడు.


తనను దేవుడు ఆవహించినట్లు చెప్పుకున్నా, కొన్ని పనులు చేసేందుకు పంపినట్లు భావించినా, వంది మాగధులు అలాంటి వాతావరణం కల్పించినా చరిత్రలో జరిగిన నష్టాలు ఎన్నో. అనేక మంది ఎలాంటి ఆలోచన లేకుండా వారేం చేసినా సమర్ధించే ఉన్మాదానికి ఎందుకు లోనవుతారు అన్నది అంతుచిక్కని ప్రశ్న. జర్మనీలో జరిగింది అదే.జర్మన్‌ జాతికి యూదుల నుంచి ముప్పు ఏర్పడిందని, వారు జర్మనీకి ద్రోహం చేశారనే ప్రచారాన్ని సామాన్య జనం నిజంగా నమ్మబట్టే హిట్లర్‌ ఆటలు సాగాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తాను చెప్పిన వక్రీకరణలు, అవాస్తవాలను జనాలు నిజాలుగా భావిస్తారన్న గట్టి విశ్వాసం ఉన్నకారణంగానే నరేంద్రమోడీ ప్రసంగాలు చేశారు. తన జన్మ మామూలుది కాదని చెప్పుకున్నారు. హిట్లర్‌ను దేవుడే పంపాడని జర్మనీ పిల్లలకు నూరిపోశారు, దాంతో వాడిని ఒక సాధారణ రాజకీయవేత్తగా చూడటానికి బదులు దేవుడు పంపిన దూతగా చూశారు. మతాన్ని రాజకీయాలను జోడిస్తే జరిగేది ఇదే. జర్మనీ పూర్వపు ఔన్నత్యాన్ని నిలపాలంటే యూదులను అంతం చేయాలని చెబితే నిజమే అని నమ్మారు.ఇప్పుడు మనదేశంలో కూడా అన్ని రకాల అనర్ధాలకు ముస్లిం పాలకుల దండయాత్రలు, ఆక్రమణ, హిందువుల జనాభా తగ్గుతూ ముస్లింల జనాభాను పెంచుతూ ఒక నాటికి హిందువులను మైనారిటీలుగా మార్చే కుట్ర జరుగుతోందన్న ప్రచారాన్ని నమ్ముతున్న వారు ఉన్నారు. దాన్ని అడ్డుకోవాలంటే మెజారిటీ హిందూత్వ పాలన రావాలన్నదానికి మద్దతు పెరుగుతోంది. మంచి చెడుల ఆలోచన లేదు. ప్రజాస్వామ్యం ఎక్కువ కావటం కూడా మంచిది కాదంటూ అనాలోచితంగా మాట్లాడుతున్న జనాలు రోజు రోజుకూ పెరుగుతున్నారు.


ఇందిరా గాంధీ ఉపన్యాసాలు, విన్యాసాలు చూసిన జనం ఆకర్షితులయ్యారు.గరీబీహటావో అంటే నిజమే అని నమ్మారు. చివరకు అత్యవసర పరిస్థితిని ప్రకటించి దేశాన్ని ప్రమాదపు అంచుల్లోకి నెట్టారు. ఇప్పుడు నరేంద్రమోడీ అద్భుతాలు చేస్తారని, తమ జీవితాలను మార్చివేస్తారని అనేక మంది నమ్ముతున్నారు. ఒక వైపు సంపదలన్నీ కొంత మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంటే అలాంటి వారిని మోడీ వెనకేసుకు వస్తుంటే మార్పు సాధ్యం కాదనే ఆలోచనకు తావివ్వటం లేదు.గోవులను వధిస్తున్నారనే పేరుతో రోజూ తమ కళ్ల ముందు తిరిగే వారి మీద మూకదాడులకు పాల్పడుతుంటే చూస్తూ ఏమీ చేయలేని వారిని చూశాం.” నాజీ అంతరాత్మ ” పేరుతో 2003లో వెలువరించిన ఒక పుస్తకంలో క్లాడియా కూంజ్‌ అనే చరిత్రకారిణి ఒక ఉదంతాన్ని వివరించారు.ఆల్ఫోన్స్‌ హెక్‌ అనే యువకుడు హిట్లర్‌ యూత్‌లో ఉన్నాడు. (ఇప్పుడు మనదేశంలో ”దళ్‌ ” పేరుతో ఉన్న సంస్థల మాదిరి.) తన గ్రామంలో నాజీ పోలీసులు యూదులను నరహంతక శిబిరాలకు తరలించేందుకు ఒక దగ్గర పోగుచేస్తూ ఉంటే వారిలో హెయినిజ్‌ అనే తన మంచి స్నేహితుడు ఉన్నప్పటికీ ఎంత అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని తనలో తాను కూడా అనుకోలేకపోయాడట. యూదుల నుంచి ముప్పు ఉందనే అంశాన్ని బుర్రకు ఎక్కించుకొని ఉండటంతో హెయినిజ్‌ దురదృష్టం ఏమిటంటే అతను యూదుగా పుట్టటమే అని, వారిని తరలించటం సమంజసమే అని అనుకున్నట్లు తరువాత గుర్తు చేసుకున్నాడట. ఒక ఉన్మాదం తలెత్తినపుడు మనుషుల ఆలోచనల్లో వచ్చే మార్పును కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.” నా భాష జర్మన్‌, నా సంస్కృతి, అనుబంధాలు అన్నీ కూడా జర్మనే.జర్మనీ, జర్మనీ ఆస్ట్రియాలో యూదు వ్యతిరేకత పెరుగుతున్నదని గుర్తించేవరకు నేను కూడా జర్మన్‌ మేథావినే అనుకున్నాను. కానీ యూదు వ్యతిరేకత పెరిగిన తరువాత ఒక యూదును అని నన్ను నేను అనుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చాను” అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది కూడా అదే. హిట్లర్‌ పుట్టుకతోనే నాజీ కాదు. కేవలం జర్మన్‌ జాతి ఒక్కటే నాగరికతకు తగినది అనే భావజాలం విస్తరిస్తున్న సమయంలో అనేక మంది దానికి ఆకర్షితులయ్యారు. అదే భావజాలం మరింత ముదిరి హిట్లర్‌ను నియంత, నరహంతకుడిగా మార్చాయి. అందుకే నేడు కావాల్సింది నిరంకుశత్వానికి దారితీసే మితవాద భావజాలం వైపు ఆకర్షితులౌతున్నవారిని నిందిస్తూ కూర్చోవటం కాదు, ఆ భావజాలాన్ని ఎదుర్కొనే పోరును మరింత ముందుకు తీసుకుపోవటం, దీనికి అధ్యయనం తప్ప దగ్గరదారి లేదు.

జూలై 4న బ్రిటన్‌ ఎన్నికలు : టోరీలకు శృంగభంగం, రిషి సునాక్‌ గెలుపూ కష్టమే !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


వచ్చే ఏడాది జనవరి వరకు పార్లమెంటు గడువు ఉన్నప్పటికీ జూలై నాలుగున ముందస్తు ఎన్నికలు జరిపేందుకు ప్రధాని రిషి సునాక్‌ నిర్ణయించాడు. లేబర్‌ పార్టీతో పోల్చితే టోరీల పలుకుబడి 21పాయింట్లు తక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతుండగా తీసుకున్న ఈ నిర్ణయం అనేక మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్టోబరు లేదా నవంబరులో ఎన్నికలకు వెళతారన్న పండితుల అంచనాలు తలకిందులయ్యాయి. ఇటీవలి కాలంలో రిషి సునాక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువలన రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఓటమి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు గనుక దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న చందంగా ఇప్పుడు ఎన్నికలు జరిపితే ఓడినా గౌరవ ప్రదంగా కొన్ని సీట్లు తెచ్చుకోవచ్చన్న ఎత్తుగడే ప్రధానంగా కనిపిస్తోంది.మేనెల పదమూడవ తేదీ సర్వప్రకారం లేబర్‌ పార్టీ 44, టోరీలు 23పాయింట్లతో ఉండగా ప్రధాని రిషి సునాక్‌ పనితీరు బాగోలేదన్నవారు గత ఏడాది జూన్‌తో పోల్చితే 57 నుంచి 65శాతానికి పెరిగారు. వ్రతం చెడినా ఫలం దక్కుతుందా ?


సునాక్‌ దంపతుల సంపద 12 కోట్ల నుంచి 65.1కోట్ల పౌండ్లకు పెరిగిందని తాజాగా సండే టైమ్స్‌ ధనికుల జాబితాలో ప్రకటించింది. కానీ ప్రధానిగా జనాభిమానం మాత్రం దిగజారుతోంది.పద్నాలుగేండ్ల టోరీల పాలన పొదుపు చర్యలతో జనం విసిగిపోయారు.అన్ని విధాలుగా కార్మికవర్గం దెబ్బతిన్నది. లండన్‌ కింగ్స్‌ కాలేజీ జరిపిన అధ్యయనం ప్రకారం 2010-20 సంవత్సరాల మధ్య ప్రభుత్వ పొదుపు విధానాల వలన 148వేల మంది మరణించారు. ఇండ్ల అద్దెలపై అడ్డుఅదుపూ లేదు, బలహీనవర్గాల ఇండ్ల పధకాన్ని రద్దు చేశారు.ప్రపంచంలో బాగా అభివృద్ది చెందిన దేశాలలో బ్రిటన్‌ ఒకటిగా చెబుతున్న సంగతి తెలిసిందే.జనాభా 6.7 కోట్ల మందిలో ఒక ప్రమాణాన్ని తీసుకుంటే కోటీ పది లక్షలు, ఇండ్ల ధరలను కూడా పరిగణనలోకి తీసుకుంటే 1.44 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు అంచనా.పిల్లల్లో 42.2లక్షల మంది దారిద్య్రంలో ఉన్నారు. పది సంవత్సరాల క్రితం ఈ సంఖ్య 22.8లక్షలు.2021-22లో దాదాపు 2.8లక్షల కుటుంబాలకు ఇళ్లు లేవు. అక్కడ ఉన్న చట్టాల ప్రకారం ఎవరికైనా ఇల్లు లేకపోతే కనీసం ఆరునెలలు ఉండేందుకు ప్రభుత్వం ఇంటి వసతిని చూపాల్సి ఉంటుంది.ఎక్కడో ఒక దగ్గర నిద్రపోతూ పని చేసే వారు గణనీయంగా ఉన్నారు. అలా నిద్రపోతూ దొరికిన వారికి వెయ్యి పౌండ్ల వరకు జరిమానా విధించే నిబంధనలను ప్రభుత్వం చేసింది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా జీవన వ్యయం విపరీతంగా పెరిగింది.మనదేశంలో తగినంత ఉపాధి చూపటంలో విఫలమైన నరేంద్రమోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా పేదలు ఆహారధాన్యాలు కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉన్నారు.ఈ కారణంగానే 80 కోట్ల మందికి నెలకు ఐదు కిలోల చొప్పున ఐదేండ్ల పాటు ఉచితంగా ఇస్తున్నట్లు సరిగ్గా ఎన్నికలకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో తినటానికి తిండి దొరకనివారికి ఆహార కూపన్ల ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఆహార పొట్లాలను అందిస్తారు. వాటిని ఆహార బ్యాంకులని ముద్దుపేరుతో పిలుస్తారు. ట్రసెల్‌ అనే పేరుతో ఉన్న ఒక ట్రస్టు నిర్వహిస్తున్న ఆహార బ్యాంకు నుంచి 2008-09లో కేవలం 25,899 మంది ఇలా ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటే 2022-23నాటికి ” మన హిందువు, భారత సంతతి ”గా అనేక మంది కీర్తించిన రిషి సునాక్‌ ఏలుబడిలో వారి సంఖ్య 29లక్షల 86వేల 203కు పెరిగింది.


పొట్టచేతబట్టుకొని లేదా అణచివేతలను తప్పించుకొనేందుకు శరణార్ధులుగా వచ్చే వారిని సహించలేని స్థితిలో బ్రిటన్‌ పెట్టుబడిదారీ వర్గం ఉన్నదంటే అతిశయోక్తి కాదు.దీన్ని ఎదుర్కొనేందుకు అనుమతి లేకుండా వచ్చే వారిని బలవంతంగా ఆఫ్రికాలోని ర్వాండా దేశానికి తరలించి అక్కడ శిబిరాల్లో ఉంచి వారికి బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించాలా లేదా అన్నది నిర్ణయించేందుకు ర్వాండా ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నది బ్రిటన్‌. అందుకు గాను ప్రతి మనిషికి ఇంత అని చెల్లిస్తుంది. ఉదాహరణకు మూడు వందలు అంతకు మించి జనాలను పంపితే పన్నెండు కోట్ల పౌండ్లు ప్రభుత్వానికి, ఇరవైవేల చొప్పున శరణార్ధులకు చెల్లిస్తుంది. డబ్బుకక్కుర్తితో ర్వాండా సర్కార్‌కూడా శరణార్ధులను స్వీకరించేందుకు అంగీకరించింది. ముందు ర్వాండాకు తరలించి బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించేదీ లేనిదీ అక్కడ విచారిస్తారు.ఆశ్రయం కల్పించేందుకు నిర్ణయిస్తే బ్రిటన్‌కు తిరిగి అనుమతిస్తారు లేకపోతే ర్వాండా అంగీకరిస్తే అక్కడే ఉండేందుకు లేదా మూడో దేశం ఏదైనా అంగీకరిస్తే అక్కడకు పంపుతారు. ఇంగ్లీషు ఛానల్‌ దాటి పడవల ద్వారా అనుమతి లేకుండా ప్రవేశించిన వారు స్వచ్చందంగా వెనక్కు వెళ్లిపోయేందుకు అంగీకరిస్తే వారికి మూడువేల పౌండ్లు ఇస్తారు, లేకుంటే విమానాల ద్వారా ర్వాండాకు బలవంతంగా తరలిస్తారు. సుప్రీం కోర్టు ఈ ఒప్పందం చట్టవిరుద్దమని కొట్టివేసిన తరువాత తీర్పును వమ్ము చేస్తూ మరొక చట్టాన్ని 2023నవంబరులో పార్లమెంటు ఆమోదించింది.దీని మీద కూడా పిటీషన్లు దాఖలైతే విచారణకు 25 కోర్టు గదులు, 150 మంది న్యాయమూర్తులను సిద్దంగా ఉంచారు. తన కుటుంబం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన సంగతి గుర్తుంటే వలస వచ్చిన వారిని బలవంతంగా ర్వాండా పంపే కార్యక్రమానికి రిషి సునాక్‌ పూనుకొని ఉండేవాడు కాదు. ఓడమల్లయ్య-బోడి మల్లయ్య కథ మాదిరి ఒక కార్పొరేట్‌గా తన వర్గ స్వభావాన్ని ప్రదర్శించాడు.


టోరీల పద్నాలుగేండ్ల చరిత్రను చూసినపుడు ప్రతి ప్రధానీ విఫలం చెందినట్లు రుజువైంది.ముందస్తు ఎన్నికలతో రిషి సునాక్‌ కూడా చారిత్రక వైఫల్యాన్ని అంగీకరించినట్లే. ” ఇది ఏం చేయాలో తోచని వ్యక్తి ఆడుతున్న ఆట,దారులు కూడా మూసుకుపోయాయి, తన అవకాశాలు మెరుగుపడతాయన్న ఆశ సైతం కనిపించని స్థితి ” అని ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రాసింది. మార్చినెలలో 3.2శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు 2.3శాతానికి తగ్గటం తన ఘనతే అని చెప్పుకుంటూ ఓటర్ల ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.2008 సంక్షోభం నుంచి బ్రిటీష్‌ పెట్టుబడిదారీ విధానం ఇంకా కోలుకోలేదని, అంతకు ముందుతో పోలిస్తే ఏడాదికి ప్రతి కార్మికుడు సగటున పద్నాలువేల పౌండ్లు నష్టపోతున్నట్లు ఒక అంచనా వెలువడింది.వేతన పెరుగుదల తీరుతెన్నులు చూస్తే నెపోలియన్‌ యుద్ధాల (1803-15) తరువాత ఇంత అధ్వాన్నంగా ఎప్పుడూ లేదని చెబుతున్నారు. ప్రభుత్వ ఖర్చులకు కోత, జనజీవీతాలు గిడసబారిపోవటంతో ఆలస్యయ్యేకొద్దీ వ్యతిరేకత పెరుగుతుందని భయపడుతున్నారు. ఒక సర్వేలో ఈ ఏడాది తమ జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని 58శాతం మంది చెప్పారు, అనేక మంది రుణ ఊబిలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితిలో సునాక్‌ ప్రకటనతో అధికారం ముందుగానే దక్కనుందనే సంతోషంతో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ పండుగ చేసుకుంటున్నది.జూలై నాలుగు స్వాతంత్య్రదినమని కొందరు వర్ణించారు. పిచ్చిపని అని టోరీ ఎంపీలు తమలో తాము గొణుక్కుంటున్నారు. కార్మికుల మీద దాడులు జరిపిన టోరీ పాలనకు స్వస్తి చెప్పేందుకు ముందుగానే వచ్చిన అవకాశమని కార్మిక సంఘాలు కూడా ఎన్నికలను స్వాగతించాయి. అయితే కెయిర్‌ స్టార్మర్‌ నాయకత్వంలో ఏర్పడే లేబర్‌ పార్టీ ప్రభుత్వం పట్ల అప్రమత్తగా ఉండాలని కూడా కొన్ని సంఘాలు హెచ్చరించాయి. కార్మికవర్గ జీవితాలను ఫణంగా పెట్టి తాము బయటపడాలని కార్పొరేట్‌శక్తులు చూస్తున్నాయని, స్టార్మర్‌ యజమానులకు, ఇజ్రాయెల్‌కు అనుకూలం, కార్మికులు, వలసలకు వ్యతిరేకి అని పేర్కొన్నాయి. ఇటీవల లేబర్‌ పార్టీ ప్రకటనలు చూస్తే యజమానులకు అనుకూలంగా ఉన్నందున ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచీ ప్రతిఘటించాల్సిందేనని సోషలిస్టు వర్కర్‌ వంటి సంస్థలు స్పష్టం చేశాయి.ఎవరు గెలిచినా సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరు కొనసాగాల్సిందేనని పేర్కొన్నాయి.బ్రిటన్‌ ప్రజాప్రతినిధుల సభ(కామన్స్‌)లోని 650 స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో కన్సర్వేటివ్‌(టోరీ) పార్టీ 43.6శాతం ఓట్లతో 365, లేబర్‌ పార్టీ 32.1శాతం ఓట్లతో 202 సీట్లు తెచ్చుకుంది.ఈసారి ఎన్నికల్లో టోరీ పార్టీకి 98, లేబర్‌ పార్టీకి 468 వస్తాయని సండే టైమ్స్‌ సర్వే పేర్కొన్నది. అనేక మంత్రులు కూడా ఓడిపోనున్నట్లు జోశ్యం చెప్పింది. ప్రధాని రిషి సునాక్‌ కూడా ప్రత్యర్ధికంటే కేవలం 2.5శాతం ఆధిక్యంతోనే ఉన్నట్లు, ఓడిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పింది. వేల్స్‌, స్కాట్లాండ్‌ ప్రాంతాలలో, లండన్‌ నగరంలో ఒక్క సీటూ గెలిచే అవకాశం లేదన్నది.


రిషి సునాక్‌ మన వాడు ! బ్రిటన్‌ గద్దెపై తొలి హిందువు ! భారత్‌కు అనుకూలంగా బ్రిటన్‌ విధానాలు !
భారతీయులను అణగదొక్కిన వారి మీద ప్రతీకారం తీర్చుకున్న భారత్‌ ! బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి గురించి మన మీడియాలో ఊదరగొట్టిన అంశాలు. చర్చోపచర్చల సంగతి సరేసరి. తెల్లవారే సరికి బ్రిటన్‌ రూపురేఖలు మార్చగల ఆర్థికవేత్త అంటూ కొండంత రాగాలు.సునాక్‌ తాతలు ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం గుజ్రాన్‌వాలాకు చెందిన వారు. దేశ విభజనకు ముందే వారు బతుకు తెరువు కోసం ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియాకు వలస వెళ్లారు. కెన్యాలో సునాక్‌ తండ్రి, టాంజానియాలో తల్లి జన్మించారు.1960 దశకంలో వారి కుటుంబం బ్రిటన్‌ వలస వచ్చింది. తరువాత 1980 మే 16న రిషి సునాక్‌ బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌లో జన్మించాడు. చదువుకొనేటపుడు మన దేశానికి చెందిన ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిన్‌ నారాయణ మూర్తి కుమార్తె అక్షత లండన్‌లో చదివేటపుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు.


అనేక దేశాల్లో భారతీయ మూలాలు ఉన్న వారు అనేక మంది ఉన్నత పదవులను అధిష్టించారు.ఆ జాబితాను చూసినపుడు రిషి సునాక్కు ఇచ్చినంత ప్రచారం మరొకరికి ఎవరికీ ఎన్నడూ ఇవ్వలేదు. వారిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఉన్నారు. ఎందుకు వీరిని పట్టించుకోలేదు ? ఎవరిని సంతుష్టీకరించేందుకు మన మీడియా ఇంతగా పాకులాడినట్లు ? మీడియా అంతటిని హిందూ వ్యతిరేకులు ఆక్రమించారనే తప్పుడు ప్రచారాన్ని నిరంతరం సాగిస్తున్నవారు ఈ ప్రచారం గురించి ఏమంటారు ? మీడియాను ఎవరు నియంత్రిస్తున్నారు ? కన్సర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌ బ్రిటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు.అది కాదనలేని వాస్తవం. పంజాబీ మూలాలున్న తొలి ఆసియన్ను ప్రధానిగా రాజు ఛార్లెస్‌ నియమించాడు. ఆరునెలల కాలంలోనే ఇద్దరు ప్రధానుల రాజీనామాతో మూడవ కృష్ణుడిగా రిషి రంగంలోకి వచ్చాడు. ఆరు సంవత్సరాల కాలంలో ఐదుగురు ప్రధానులు మారిన బ్రిటన్‌లో ఏర్పడిన అస్థిరతకు ఈ పరిణామాలు నిదర్శనం. బ్రిటన్‌ చరిత్రలో కేవలం 50 రోజులు మాత్రమే పదవిలో ఉండి అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్‌ ట్రస్‌ చరిత్రకెక్కారు.బ్రిటన్‌ కన్సర్వేటివ్‌ పార్టీకి 190 సంవత్సరాలు, తొలుత దాని పేరు టోరీ.నూటపన్నెండు సంవత్సరాల క్రితం కన్సర్వేటివ్‌ అని మార్చుకున్నది. అయినప్పటికీ ఈ పార్టీ వారిని ఇప్పటికీ టోరీలనే ఎక్కువగా పిలుస్తారు. ఇంత సుదీర్ఘచరిత్ర కలిగిన పార్టీ 1906లో కనిష్టంగా 131 సీట్లు తెచ్చుకుంది. ఈ సారి రిషి సునాక్‌ నాయకత్వంలో 98కి మించి రావనే సర్వేలు నిజమైతే పార్టీ చరిత్రలో మరో అధ్యాయం నమోదౌతుంది.

” టెహరాన్‌ కసాయి ” ఇబ్రహీం రైసీ దుర్మరణం : ఇరాన్‌లో ఏం జరగనుంది !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి(63) ఆదివారం నాడు జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లా మరో ఏడుగురు కూడా మరణించారు.వారిలో ముగ్గురు హెలికాప్టర్‌ సిబ్బంది, అధ్యక్షుడి భద్రతా విభాగ కమాండర్‌, తూర్పు అజర్‌బైజాన్‌లో ఖమేనీ ప్రతినిధి, తూర్పు అజర్‌బైజాన్‌ గవర్నర్‌ ఉన్నారు. సరిహద్దులో ఉన్న అజరైబైజాన్‌లో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించిన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, డామ్‌ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా పొగమంచు. వర్షంతో కూడిన వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ పర్యతాల్లో కూలిపోయింది. ఈ దుర్ఘటన వెనుక ఇజ్రాయెల్‌, అమెరికా హంతక గూఢచార సంస్థలు మొసాద్‌, సిఐఏ హస్తం ఉండవచ్చని సామాజిక మాధ్యమంలో అనేక మంది అనుమానాలను వెలిబుచ్చారు. మంగళవారం ఇది రాసిన సమయానికి ఇరాన్‌ ప్రభుత్వం నుంచి అలాంటి ఆరోపణలు రాలేదు. మన ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక దేశాల నేతలు సంతాపాలు ప్రకటించారు. ప్రస్తుతం దేశ సర్వాధినేతగా ఉన్న మతనాయకుడు అయాతుల్లా అలీ ఖమేనీ(85) వారసుడిగా రైసీ బాధ్యతలు చేపడతారని భావిస్తున్న తరుణంలో ఈ ఉదంతం జరిగింది. దీంతో అధ్యక్షుడు, ఖమేనీ వారసుడు ఎవరన్న చర్చ మొదలైంది.రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించినా, పదవి కాలం ముగిసినా 50రోజుల్లో కొత్త నేతను ఎన్నుకోవాలి. అప్పటివరకు ఉపాధ్యక్షులలో ప్రధమంగా ఉన్న మహమ్మద్‌ మొక్బర్‌ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు. జూన్‌ 28వ తేదీన ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.


ఇబ్రహీం రైసి తీరుతెన్నులను చూసినపుడు రెండు ముఖాలు కనిపిస్తాయి.ఒకటి నిరంకుశ మతోన్మాదం, రెండవది తిరుగులేని సామ్రాజ్యవాద వ్యతిరేకత. మరణవార్త నిర్దారణ కాగానే ఇరాన్‌ మతవర్గాలలో దిగ్భ్రాంతి, దేశమంతటా సామాన్య జనంలో సంతోష ఛాయలు, ఊపిరి పీల్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. పాలక ప్రముఖులతో జరిపిన సమావేశంలో ఖమేనీ మాట్లాడుతూ ” దేశం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాజ్య వ్యవహారాల్లో ఎలాంటి అటంకాలు తలెత్తవు” అని చెప్పిన మాటలను బట్టి తన పునాదులు కదిలినట్లు, కుడి భుజాన్ని కోల్పోయిన భయం వాటి వెనుక ఉన్నట్లు స్పష్టమైందని ఒక అభిప్రాయం వెలువడింది.యువకుడిగా ఉన్నపుడే మత ఛాందసాన్ని వంటబట్టించుకున్న ఇబ్రహీం రైసి 1979లో ఇరాన్‌ ఇస్లామిక్‌ విప్లవం పేరుతో జరిగిన పరిణామాల్లో ఖమేనీ అనుచరుడిగా ఉన్నాడు.తరువాత మరింత సన్నిహితుడిగా, దేశ సర్వాధినేతను ఎంపిక చేసి, పర్యవేక్షణ చేసే నిపుణుల కమిటీలో 2006 నుంచి పనిచేశాడు. 2021లో దేశ అధ్యక్షుడిగా అంచెలంచెలుగా వీర విధేయుడిగా ఎదిగాడు.ఐరాస మానవహక్కుల సంస్థ అతని పాత్రను ఖండించగా అమెరికా ఆంక్షలు విధించింది. అనేక అక్రమాలు, అనేక మంది అభ్యర్థులను పోటీకి అనర్హులుగా చేసిన 2021 అధ్యక్ష ఎన్నికలలో అడ్డగోలు పద్దతిలో గెలిచాడనే విమర్శలు ఉన్నాయి. రైసీకి మతపెద్దలతో పాటు మిలిటరీ మద్దతు కూడా ఉన్న కారణంగానే ఎన్నిక సాధ్యమైందని చెబుతారు. ఆ ఎన్నికల్లో దేశ చరిత్రలోనే అత్యంత తక్కువగా 50శాతానికి లోపు ఓట్లు పోలయ్యాయి.


దైవ నిర్ణయం అంటూ మత నేత అయాతుల్లా అలీ ఖమేనీ ఆదేశాల మేరకు 1998లో 30వేల మందికి పైగా రాజకీయ ఖైదీలను ఉరితీశారు. వీరిలో అధికులు పీపుల్స్‌ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ప్రత్యర్ధులే ఉన్నారు. చరిత్రలో అత్యంత హీన నేరగాండ్లుగా నమోదైన వారి జాబితాలో చేరి ఈ మారణకాండకు బాధ్యులైన ముగ్గురిలో ఇబ్రహీం రైసీ ప్రముఖుడు. అందుకే అతన్ని ” టెహరాన్‌ కసాయి ” అని పిలిచారు. ఖమేనీ న్యాయమూర్తుల అధిపతిగా ఉన్న రైసీ 2019లో తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేతలుగా ఉన్న వారితో సహా తరువాత తన పదవీ కాలంలో మొత్తం పదిహేను వందల మందిని ఉరితీయించినట్లు, వారిలో తాను అధ్యక్షుడైన తరువాత 2022లో తలెత్తిన నిరసనల సమయంలో 750 మంది ఉన్నట్లు వార్తలు వవచ్చాయి. జైళ్లు, ఇతర నిర్బంధ శిబిరాలలో మధ్యయుగాలనాటి ఆటవిక పద్దతుల్లో వేలాది మందిని చిత్రహింసలకు గురిచేసినట్లు కూడా వెల్లడైంది. మితవాద మతశక్తులను సంతుష్టీకరించేందుకు అధ్యక్షుడిగా తీసుకున్న చర్యలు జనంలో తీవ్ర అసంతృప్తి, నిరసనలకు దారితీశాయి. ముఖ్యంగా నైతిక పోలీసులను రంగంలోకి దించి సమాజాన్ని మత గిరి నుంచి కదలకుండా చేసేందుకు చూశాడు. ఈ క్రమంలోనే మహషా అమీ అనే యువతిని పోలీసు కస్టడీలో చంపివేయటంతో గడచిన ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.దాదాపు ఐదు వందల మంది నిరసనకారులను చంపివేశారంటే అణచివేత ఎంత క్రూరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.వందలాది మంది జాడ ఇప్పటికీ తెలియదు.వారిని కూడా చంపివేశారా, జైళ్లలో ఉంచారా అన్నది కూడా స్పష్టం కాలేదు.హిజాబ్‌ ధరించకుండా ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యవహరించిందనే ఆరోపణతో మహషా అమీని నైతిక పోలీసులు ఆమెకు నీతి పాఠాలు బోధించే పేరుతో ఒక చిత్ర హింసల శిబిరంలో ప్రాణాలు తీశారు. ఈ సందర్భంగా ఇబ్రహీం రైసి మతాధినేతకు చూపిన విధేయత కారణంగా ఖమేనీకి తగిన వారసుడు అతనే అనే అభిప్రాయం కలిగింది.


అజర్‌బైజాన్‌కు రైసి ప్రయాణించిన హెలికాప్టర్‌ దశాబ్దాల నాటి పాతదనే వార్తలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది.ఆంక్షల కారణంగా దాని మరమ్మతులకు అవసరమైన విడిభాగాలు లేవని, ఆధునిక తరానికి చెందిన వాటిని కొనుగోలు చేయలేకపోయినట్లు వచ్చిన వార్తలు నమ్మశక్యంగా లేవు. అమెరికా, ఇతర పశ్చిమదేశాల ఆంక్షలు, అసమర్ధత, అవినీతి కారణంగా అక్కడి ఆర్థిక వ్యవస్థ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది, వాటిని పరిష్కరించటంలో పాలకులు విఫలమయ్యారు.దానిపై తలెత్తుతున్న నిరసనలను అణచివేస్తున్నారు.రైసి పదవిలోకి వచ్చే నాటికి 40శాతంపైగా ఉన్న ద్రవ్యోల్బణం 2022లో 45శాతం దాటింది. అది తరువాత క్రమంగా తగ్గుతున్నప్పటికీ 2029నాటికి 25శాతానికి పరిమితం అవుతుందని అంచనాలు వెలువడ్డాయి.అమెరికా బెదిరింపుల కారణంగా మన మిత్రదేశంగా ఉన్నప్పటికీ ఇరాన్నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. అయితే చైనా భారీ ఎత్తున దిగుమతి చేసుకొని ఆదుకుంటున్నది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇబ్రహీం రైసి సామ్రాజ్యవాద వ్యతిరేకతలో తిరుగులేని వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది.ఇటీవలి సంవత్సరాలలో అమెరికా దాని కనుసన్నలలో నడిచే ఇతర సామ్రాజ్యవాద, వాటి అనుయాయిలకు వ్యతిరేకంగా చైనా, రష్యాలతో సంబంధాలను మరింతగా పటిష్టపరుచుకున్నాడు.ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు అవసరమైన డ్రోన్లు, మందుగుండు, ఇతర మిలిటరీ పరికరాలను రష్యాకు సరఫరా చేస్తున్నాడు. ఎమెన్‌ అంతర్యుద్ధంలో ఇరాన్‌ అనుకూల హౌతీ సాయుధులను అణచేందుకు అమెరికా తరఫున రంగంలోకి దిగిన సౌదీ అరేబియా సాగించిన దాడుల గురించి తెలిసిందే. అలాంటి సౌదీతో ఏడు సంవత్సరాల తరువాత చైనా మధ్యవర్తిత్వంలో 2023లో సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకోవటం పశ్చిమాసియా పరిణామాల్లో ఎంతో కీలకమైనది. ఇంతేకాదు అమెరికా తొత్తుగా ఉన్న ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే దేశాలు, పలుచోట్ల ఉన్న సాయుధశక్తులకు భారీ ఎత్తున ఇరాన్‌ అన్ని విధాలుగా సాయం చేస్తున్నది.


పశ్చిమ దేశాల వ్యతిరేకతలో భాగంగానే ఆంక్షలు తమను మరింతగా దెబ్బతీస్తాయని తెలిసినప్పటికీ అణుబాంబుల తయారీకి అవసరమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. బాంబుల పరీక్షే తరువాయి అన్నట్లుగా పశ్చిమదేశాలు భావిస్తున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ 2023 అక్టోబరు ఏడు నుంచి ప్రారంభించిన మారణకాండకు వ్యతిరేకంగా ఇరాన్‌ తన వంతు పాత్రను పోషిస్తున్నది. ఇజ్రాయెల్‌-అమెరికాతో నేరుగా ఘర్షణకు తలపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది.సిరియాలోని తన రాయబార కార్యాలయంపై దాడిచేసి కీలకమైన వ్యక్తులను హత్య చేసి ఇజ్రాయెల్‌ ఎంతగా కవ్విస్తున్నప్పటికీ రెచ్చిపోకుండా అవసరమైతే తన సత్తా ఏమిటో చూడండి అన్నట్లుగా తొలిసారిగా పరిమిత డ్రోన్లు, క్షిపణుల దాడి జరిపింది. అది ఇజ్రాయెల్‌ రక్షణ కవచంలో ఉన్న లొసుగులను బయటపెట్టింది. తరువాత ఇజ్రాయెల్‌ ప్రతిదాడి జరిపినప్పటికీ సంయమనంతో ఉంది. రానున్న ఎన్నికల్లో అధ్యక్షుడిగా మత నేత ఎవరిని ఎంపిక చేస్తాడు అన్నది సంతాపదినాలు, అంత్యక్రియలు ముగిసే గురువారం తరువాత వెల్లడి అవుతుంది. నూతన నేత ఎవరైనప్పటికీ అంతర్గత, అంతర్జాతీయ విధానాల్లో పెనుమార్పులు ఉండే అవకాశం ఇప్పటికైతే కనిపించటం లేదు. ఎంతకాలం ఇలా ఆంక్షలతో ఇబ్బంది పడతాం ఏదో విధంగా ఇరాన్‌ పశ్చిమదేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలనే లాబీకూడా అక్కడ బలంగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇరాన్‌పట్ల అనుసరిస్తున్న వైఖరిలో పశ్చిమ దేశాల్లో ఎలాంటి సడలింపులు లేని కారణంగా బహిర్గతం కావటం లేదని చెప్పవచ్చు. ఇబ్రహీం రైసీ స్థానాన్ని సుప్రీం నేతగా ఉన్న అలీ ఖమేనీ కుమారుడు మొజ్‌తాబా స్వీకరిస్తాడని భావిస్తున్నారు.ఒకవేళ అదే జరిగితే గతంలో రాజరికానికి వ్యతిరేకంగా పోరాడిన ఇరానియన్లు వారసత్వ అధికారాన్ని సహిస్తారా, ప్రతిపక్షం పుంజుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.


అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఎవరు అధికారానికి వచ్చినా వర్తమాన స్థితే కొనసాగవచ్చు.ప్రకటించిన సమాచారం మేరకు జూన్‌ 28 శుక్రవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.నామినేషన్ల ప్రక్రియ మే 30 నుంచి జూన్‌ మూడువరకు జరుగుతుంది. పన్నెండవ తేదీ నుంచి 27 ఉదయం వరకు ప్రచారం చేసుకోవచ్చు.దీనితో పాటు సుప్రీం నేతను ఎన్నుకొనే 88 మంది సభ్యులుండే పార్లమెంటు లేదా మజ్లిస్‌ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, దేశంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎన్నికల ద్వారా మితవాద మతశక్తులను గద్దె దించటం సాధ్యంగాకపోవచ్చని చెప్పవచ్చు.నిరంకుశ,మిత, మతవాద శక్తుల తీరుతెన్నులను బట్టి ఒకసారి అధికారానికి వచ్చిన తరువాత భిన్నమైన భావాలను,శక్తులను అనుమతించటం ఎక్కడా జరగలేదు. అంతర్గత కుమ్ములాటలు లేదా తిరుగుబాట్ల ద్వారానే మార్పు సాధ్యమైంది.ఇరాన్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకొనేందుకు అమెరికా పూనుకుంటుందా ? అంటే తగిన బలమైన ప్రత్యర్థి ముందుకు వస్తే కాదనలేము. రెండవది జో బైడెన్‌ పరిస్థితే అనుమానంగా ఉన్నపుడు తన దృష్టిని ఇటువైపు కేంద్రీకరిస్తాడా ? ఇజ్రాయెల్‌ విషయానికి వస్తే గాజా మారణకాండకు నేతృత్వం వహిస్తున్న నెతన్యాహు పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే ఉంది.దురహంకార పులి ఎక్కిన అతడు గాజాలో హమస్‌ను అణచటంలో విఫలమైనట్లు ప్రత్యర్థులు ఇప్పటికే రెచ్చగొడుతున్నారు.రష్యా, చైనా విషయానికి వస్తే అవి మరొకదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం మనకు ఎక్కడా కానరాదు. ఇరాన్‌లో ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అక్కడి పరిస్థితి, పరిణామాల గురించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.