అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం : చైనా పేర్లు ఎందుకు మార్చుతున్నది, అమెరికా ఆడుతున్న నాటకం ఏమిటి ?

Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇరుగు పొరుగుదేశాలతో వివాదాలు ఉన్నపుడు అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.బిజెపి నేతలు, వారిని నడిపించే సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు నిరంతరం తమకు అనుకూలంగా ఏదో ఒక వివాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. ఉదాహరణకు గతంలో భారత్‌-శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చాతీవు దీవిని శ్రీలంకకు అప్పగించారు. దాన్ని డిఎంకె, కాంగ్రెస్‌ మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు బిజెపి ఎన్నికల సందర్భంగా ముందుకు తెచ్చింది. ఆ దీవిని వెనక్కు తీసుకొనేందుకు పదేండ్ల పాటు అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ఏమైనా చేశారా ? పోనీ ఇప్పుడేదైనా కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారా అంటే అదీ లేదు. ఇదే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ఎవరివో నిర్ధారణగాని ప్రాంతాలపై బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకున్నారు. 2015లో కుదుర్చుకున్న అవగాహన మేరకు 17,160 ఎకరాల విస్తీర్ణం ఉన్న లంకలు, ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు అప్పగించి,7,110 ఎకరాలను మనదేశం తీసుకున్నది. దీని గురించి మాత్రం బిజెపి, మోడీ మాట్లాడరు. కచ్చాతీవు గురించి తమను విమర్శించినందుకు కాంగ్రెస్‌ ఈ అంశాన్ని ప్రస్తావించి ఈ నిర్వాకం సంగతేమిటని నిలదీసింది. ఈ రెండు ఉదంతాలు చెబుతున్న పాఠమేమిటి ? ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇరుగు పొరుగుదేశాలతో ఇచ్చిపుచ్చుకొనే పద్దతిలో వివాదాలను పరిష్కారం చేసుకోవాలనే కదా ?


ఇక మరొక పొరుగుదేశమైన చైనా వ్యతిరేకతను కాషాయదళాలు రెచ్చగొడుతూనే ఉన్నప్పటికీ కీలక సమయాల్లో నరేంద్రమోడీ ఆచితూచి మాట్లాడుతున్నారు.కొత్తగా మన భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు అని గాల్వన్‌ ఉదంత సమయంలో చేసిన ప్రకటన వాటిలో ఒకటి. తాజాగా అమెరికా పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడిన అంశాలు ఆలోచింపచేసేవిగా ఉన్నట్లు చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి నరేంద్రమోడీ మృదుస్వరంతో మాట్లాడినట్లుందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ప్రారంభవాక్యాలతోనే తన విశ్లేషణ ప్రారంభించింది.మోడీ అశక్తత, పిరికితనం కనిపించిందని, గాల్వన్‌ ఉదంతంలో ప్రాణాలు అర్పించిన వారికి అవమానకరంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్ణించింది. ఇంతకీ నరేంద్రమోడీ ఏం చెప్పారు ? సరిహద్దుల్లో దీర్ఘకాలంగా సాగుతున్న పరిస్థితి మీద తక్షణమే మాట్లాడుకోవాల్సి ఉందని, తద్వారా రెండు దేశాల మధ్య ఉన్న అసాధారణతను వెనక్కు నెట్టవచ్చని, స్థిరమైన,శాంతియుత సంబంధాలు కేవలం రెండు దేశాలకే కాదు మొత్తం ప్రాంతానికి ముఖ్యమని నరేంద్రమోడీ చెప్పారు. దౌత్య రంగం, మిలిటరీ అధికారులు అప్పుడప్పుడూ రెండు దేశాల మధ్య సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు మృదువుగా కొన్ని సార్లు కఠినంగా ఉన్నాయని, అయితే మోడీ నేరుగా చెప్పిన మాటలు ప్రత్యేకించి స్పష్టమైన వైఖరి వెల్లడించటం అసాధారణం, సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకున్నారని, సానుకూల సంకేతాలు పంపారని గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. భారత్‌-చైనా సంబంధాలను బలహీనపరచాలని చూస్తున్న అమెరికాలో కొందరికి మోడీ మాటలు అంత వినసొంపుగా ఉండకపోవచ్చని కూడా చైనా పత్రిక పేర్కొన్నది.రెండు దేశాలను ఘర్షణ దిశగా తీసుకుపోవాలని అమెరికా చూస్తున్నదని కూడా చెప్పింది.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా లిపిలో-టిబెటన్‌ పేర్లు ఖరారు చేస్తూ మూడవ జాబితాను ఇటీవల చైనా విడుదల చేసింది.అరుణాచల్‌ను టిబెట్‌లోని జాంగ్‌నాన్‌ ప్రాంతంగా చైనా పరిగణిస్తున్నది. ఒక దగ్గర స్విచ్‌ వేస్తే మరోదగ్గర లైటు వెలిగినట్లుగా అంతర్జాతీయ రాజకీయాల్లో దాదాపు అన్ని సందర్భాల్లో లైటు వెలగటమే కనిపిస్తుంది గానీ స్విచ్‌ ఎక్కడుంది, ఎవరు, ఎందుకు వేశారన్నది అంతగా తెలియదు. జపాన్‌ తదితర దేశాల ప్రతినిధులు పరిశీలకులుగా అమెరికా, ఇతరదేశాలతో కలసి పశ్చిమబెంగాల్లోని కలైకుండ వైమానిక స్థావరంలో ఏప్రిల్‌ 11-23వ తేదీలలో మనదేశం వైమానిక యుద్ధ విన్యాసాలు జరపటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు హెచ్చరిస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పేర్ల జాబితాను చైనా విడుదల చేసిందని డిప్లొమాట్‌ పత్రిక సంపాదకులలో ఒకరైన సుధా రామచంద్రన్‌ పేర్కొన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో అంతర్భాగమని చైనా వాదిస్తున్నది. అందువల్లనే సందర్భం వచ్చినపుడల్లా తమ ప్రాంతమే అని చైనా బహిరంగంగా చెబుతున్నది.ఇప్పుడు జరుగుతున్న విన్యాసాలను చైనా తీవ్రంగా పరిగణిస్తున్నదని అంతర్జాతీయ మీడియాలో విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచంలో ఆధునిక యుద్ద విమానాలు, ఇతర వ్యవస్థలను రప్పించి తరంగశక్తి తొలి దశ పేరుతో ఆగస్టులో మరోసారి తొలిసారిగా విన్యాసాలు జరపనున్నారు. ఈ విన్యాసాలలో చైనా, రష్యాలను వ్యతిరేకించేదేశాలే భాగస్వాములుగా ఉన్నాయి.అమెరికా, జర్మనీ,ఫ్రాన్స్‌,ఆస్ట్రేలియా తదితర దేశాల వైమానిక దళాలు పాల్గొంటాయి. సహజంగానే ఇలాంటి విన్యాసాలు తనను ఉద్దేశించి జరుపుతున్నట్లు భావించే ఏ దేశమైనా తనదైన శైలిలో స్పందిస్తుంది.


చైనా తాజాగా ప్రకటించిన 30 పేర్ల గురించి గతంలో మాదిరే మనదేశం స్పందించింది.మన ప్రాంతాలకు మరొక దేశం తన పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారి ప్రాంతాలవుతాయా, వాస్తవాలను మారుస్తాయా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.మనదేశంలో మీడియా మరోసారి తీవ్రంగా స్పందించింది. రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు టీవీ ఛానళ్లు చూశాయి.రెండవ సారి 2017లో పేర్లు పెట్టిన వాటిలో రెండు నివాసిత ప్రాంతాలు, ఐదు పర్వతాలు, రెండు నదులు, మరో రెండు ప్రాంతాలు ఉన్నాయి. మరో 15 ప్రాంతాలకు 2021లో చైనా పేర్లు పెట్టింది.తమవి అని చెప్పుకుంటున్న వివాదాస్పద ప్రాంతాలకు ఏ దేశమైనా తన పేర్లు పెట్టుకోవటం కొత్తదేమీ కాదు. ప్రస్తుతం చైనా ఏలుబడిలో ఉన్న ఆక్సారు చిన్‌ ప్రాంతం ఉంది. అది మనదే అని మన ప్రభుత్వం చెబుతుంది. దాన్ని లడఖ్‌ ప్రాంతంలోని లే జిల్లాగా పిలుస్తారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ మీద ఉన్న వివాదం కూడా అలాంటిదే. దాన్ని చైనా వారు జింగ్‌నాన్‌ అనే పేరుతో వ్యవహరిస్తారు.మన పురాణాల్లో మానస సరోవరంగా పిలిచే సరస్సు చైనాలోని టిబెట్‌లో ఉంది. అక్కడ దాని పేరు మాపాంగ్‌ యంగ్‌.


రెండు దేశాల మధ్య లడఖ్‌, అరుణాచల్‌ ప్రాంతాలపై వివాదం ఉంది. దాన్ని బ్రిటీష్‌ వారు సృష్టించారు.మన దేశం బ్రిటీష్‌ వారి నుంచి 1947లో స్వాతంత్య్రం పొందింది. మనదేశం మాదిరి చైనాను బ్రిటన్‌ పూర్తిగా ఆక్రమించలేకపోయింది. వివిధ ప్రాంతాలలోని యుద్ధ ప్రభువులు బలంగా ఉండటంతో అమెరికాతో సహా ఐరోపా దేశాలన్నీ తమకు కావాల్సిన వాణిజ్యం మీద వివిధ ఒప్పందాలను చేసుకున్నాయి తప్ప వారి పాలనను రుద్దలేకపోయాయి. అయితే చైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. నదులు, రేవులు, వాణిజ్యాలపై అనేక హక్కులను పొందారు. హంకాంగ్‌ దీవులను 99 సంవత్సరాలకు బ్రిటీష్‌ వారు కౌలుకు తీసుకున్నారు. అలాగే మకావో దీవులను పోర్సుగీసు వారు కౌలుకు తీసుకున్నారు. పేరుకు దేశం క్వింగ్‌ రాజరిక పాలనలో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీద అదుపులేదు. యుద్ద ప్రభువులు పెత్తనం చెలాయించేవారు. వారి మధ్య ఉన్న విబేధాలను విదేశాలు ఉపయోగించుకున్నాయి. ఈ నేపధ్యంలో ఎనిమిది దేశాల కూటమి క్వింగ్‌ వంశ రాజు మీద అనేక ఒప్పందాలను రుద్దింది.దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిమాదిరి చేశారు. దాంతో దేశభక్తులు రాజరికాన్ని కూలదోసి రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్యమం సాగించిన ఫలితంగా 1911లో చైనా రాజరికం నుంచి రిపబ్లిక్‌గా మారింది. మనకు జాతిపితగా మహాత్మాగాంధీ ఎలాగో చైనాలో సన్‌ ఏట్‌ సేన్‌ దానికి నాయకత్వం వహించాడు. అధికారం వచ్చిన తరువాత యుద్ధ ప్రభువులు కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించకుండా తిరుగుబాటు, కుట్రలకు పాల్పడ్డారు.1949లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాతే ఒకే ప్రభుత్వ ఏలుబడిలోకి చైనా వచ్చింది. సామంత రాజ్యంగా ఉన్న టిబెట్‌ను రెచ్చగొట్టి స్వతంత్రదేశంగా మార్చి తమ స్థావరంగా చేసుకోవాలని చూసిన బ్రిటన్‌, తరువాత అమెరికా జరిపిన కుట్రల కారణంగా టిబెట్‌ పాలకుడిగా ఉన్న దలైలామా తిరుగుబాటు,మనదేశానికి పారిపోయి రావటం తెలిసిందే.


మన ప్రభుత్వ సాయంతో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాసంలో ఉన్న 88 సంవత్సరాల పద్నాలుగవ దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతం టిబెట్‌లో అంతర్భాగమే అని 2003లో చెప్పాడు. తరువాత వైఖరి మార్చుకున్నాడు.బ్రిటీష్‌ అధికారి మెక్‌మోహన్‌ గీసిన సరిహద్దు రేఖ ప్రకారం భారత్‌లో అంతర్భాగమే అని మాట మార్చాడు. మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దుగా 1914లోనే బ్రిటన్‌-టిబెట్‌ గుర్తించాయనే వాదనను ముందుకు తెచ్చాడు. అయితే ఆ ఒప్పందాన్ని చైనా ప్రభుత్వం అంగీకరిస్తేనే అమల్లోకి వస్తుందనే అంశం ఉంది. సదరు ఒప్పందాన్ని చైనా గుర్తించలేదు. ఒక సామంత ప్రాంతానికి విదేశాలతో ఒప్పందం చేసుకొనే హక్కులేదు.ఆక్సారుచిన్‌ ప్రాంతాన్ని కూడా బ్రిటీష్‌ అధికారులు నిర్దిష్టంగా గుర్తించకపోవటంతో అది కూడా వివాదాస్పద ప్రాంతంగా మారింది. వారి గీతలు ఎలా ఉన్నప్పటికీ స్వాతంత్య్రం వచ్చేనాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ మన పాలనలో, ఆక్సారుచిన్‌ చైనా ఏలుబడిలో ఉంది. మనం దీని గురించి అడిగితే వారు దాని సంగతేమిటని ప్రస్తావిస్తున్నారు.1962లో రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినపుడు చైనా సైన్యాలు అరుణాచల్‌ను దాటి నేటి అసోంలోని తేజ్‌పూర్‌ వరకు వచ్చాయి. తరువాత వెనక్కుపోయి, వాస్తవాధీనరేఖకు అవతల గతంలో మాదిరే ఉన్నాయి. తమ మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు మనదేశం ఆశ్రయం ఇవ్వటాన్ని చైనా వ్యతిరేకిస్తున్నది.2017లో దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లో వారం రోజుల పర్యటనను చైనా వ్యతిరేకించింది. అతడిని ఆపకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని చైనా పత్రికల్లో వార్తలు వచ్చాయి. దలైలామా పర్యటన తరువాత తొలిసారిగా కొన్ని ప్రాంతాలకు తమ పేర్లను చైనా ప్రకటించింది. ఆ తరువాతే 73రోజుల పాటు డోక్లామ్‌ ప్రతిష్ఠంభన కొనసాగింది.తరువాత 2021లో మరోసారి కొన్ని ప్రాంతాలకు పేర్లు ప్రకటించింది.


టిబెట్‌ను చైనా అంతర్భాగమని మనదేశం గుర్తించింది, కానీ అదే సమయంలో మానవతాకారణాలను సాకుగా చూపి తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం కల్పించటం,ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. రెండు దేశాల మధ్య తెగని వివాదాల్లో ఇదొకటి.తమ వ్యతిరేకశక్తులకు భారత్‌ ఆశ్రయమిస్తున్నదని చైనా విమర్శిస్తున్నది.చైనాతో ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో ఉన్ననేతలు(తరువాత వారు సిపిఎంగా ఏర్పడ్డారు) కొందరు 1962లో కోరినందుకు వారిని దేశద్రోహులుగా, చైనా ఏజంట్లుగా చిత్రించి జైలుపాలు చేశారు. తరువాత అదే కాంగ్రెస్‌ పాలకులు చైనాతో వివాదాన్ని కొనసాగిస్తూనే సాధారణ సంబంధాలను నెలకొల్పుకున్నారు.వర్తమానంలో నరేంద్రమోడీ గత ప్రధానులెవరూ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీలు జరిపి రికార్డు సృష్టించారు.గాల్వన్‌లోయ ఉదంతాలకు ముందు ఇరుదేశాల నేతలు కలసి ఉయ్యాలలూగటాన్ని ఊహాన్‌, మహాబలిపురం నగరాల్లో చూశాము.ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వెనుక భారత్‌ భుజం మీద తుపాకి పెట్టి అమెరికన్లు తమను కాల్చాలని చూస్తున్నట్లు చైనా అనుమానిస్తుండటం ఒక కారణం. అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగంగా తాము గుర్తిస్తున్నట్లు 2024 మార్చినెల తొమ్మిదవ తేదీన అమెరికా ఒక ప్రకటన చేసింది. వివాదాన్ని పెంచటానికి గాకపోతే ఇరుదేశాలకు సంబంధించిన అంశాల మీద దానికి సంబంధం ఏమిటి ? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును భారత్‌ అంతర్భాగంగా గుర్తిస్తున్నట్లు అమెరికా ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఎందుకని ? అదే అమెరికా ఆడుతున్న రాజకీయం,అలా ప్రకటిస్తే పాకిస్తాన్‌ ఎక్కడ చైనాకు మరింత దగ్గర అవుతుందేమో అన్నదే దాని భయం.మన స్వతంత్ర విదేశాంగ విధానం ప్రకారం వివాదాలను పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా వలలో చిక్కుకొని కొత్త సమస్యలు తెచ్చుకోవద్దన్నదే అనేక మంది చెబుతున్నమాట.

ఆరు నెలల ఇజ్రాయెల్‌ మారణకాండ ! పాలస్థీనియన్ల ప్రతిఘటన !!

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


2023 అక్టోబరు ఏడు నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో యూదు దురహంకారులు జరుపుతున్న మారణకాండ, దానికి పాలస్థీనియన్ల ప్రతిఘటనకు ఆరు నెలలు దాటింది. అమెరికా, ఇతర పశ్చిమదేశాల దన్ను చూసుకొని గాజాలో సాగిస్తున్న హత్యలు, విధ్వంస కాండ ఎప్పుడు, ఎలా ముగుస్తుందో తెలియదు.ఈ దారుణాన్ని నివారించలేని పనికిమాలిన సంస్థగా ఐరాస పేరుతెచ్చుకుంది.ఎన్ని కబుర్లు చెప్పినా ఆచరణకు వచ్చేసరికి న్యాయం వైపు ఎవరు నిలిచారో, అన్యాయం, అక్రమాలను ఎవరు సమర్ధిస్తున్నారో లోకానికి వెల్లడైంది.ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండకు మద్దతు ఇస్తున్న జర్మనీపై అత్యవసరంగా ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ కోర్టులో వామపక్ష నేత డేనియల్‌ ఓర్టేగా అధ్యక్షుడిగా ఉన్న లాటిన్‌ అమెరికాలోని నికరాగువా దాఖలు చేసిన పిటీషన్‌పై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. మారణకాండకు మద్దతు ఇవ్వటమేగాక పాలస్థీనా నిర్వాసితులకు సాయం చేస్తున్న ఐరాస సంస్థకు జర్మనీ నిధులను నిలిపివేసిందని కూడా నికరాగువా పేర్కొన్నది. తక్షణమే గాజాలో దాడులను విరమించాలని, యుద్ధం, నేరాలకు జవాబుదారీ ఎవరో తేల్చాలని తాజాగా ఐరాస మానవహక్కుల మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే ఓటింగ్‌ నుంచి మనదేశం, మరోపన్నెండు తప్పుకున్నాయి.చైనాతో సహా 28 దేశాలు అనుకూలంగా, అమెరికాతో పాటు మరో ఆరు వ్యతిరేకంగా ఓటు వేశాయి. విశ్వగురువులం కదా ! మనం ఎటున్నట్లు ? మానవహక్కుల రక్షణకా భక్షణకా ? బేటీపడావో బేటీ బచావో అని చెప్పిన పెద్దలకు గాజాలో మరణిస్తున్నవారిలో 70శాతం మంది పిల్లలు, మహిళలు ఉన్న సంగతి తెలియదా ? ఈ దారుణాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ను నిలదీసేందుకు ఎందుకు నోరు రావటం లేదు ? ముస్లిం వ్యతిరేకత తప్ప ఎవరిని సంతుష్టీకరించేందుకు ఈ వైఖరి ?


గాజాలో జరుగుతున్నదేమిటి ? తమ మాతృదేశ పునరుద్దరణ జరగాలన్న పాలస్థీనియన్ల అణచివేత తప్ప మరొకటి కాదు. ఎవరు చేస్తున్నారు ? సామ్రాజ్యవాదుల మద్దతుతో వారి చేతిలో పావుగా ఉన్న ఇజ్రాయెల్‌, అంటే సామ్రాజ్యవాదులే దాడి కారకులు.చరిత్రలో వారు చేసిన దాడులన్నీ దారుణాలుగా నమోదయ్యాయి. అందుకు అత్యంత దుర్మార్గ ఉదాహరణ 1968 మార్చి 15వ తేదీన వియత్నాంలోని మై లాయి ఊచకోత. విలియం కాలే అనే అధికారి ఉత్తరువుల మేరకు ఎర్నెస్ట్‌ మెదీనా అనే అమెరికన్‌ కెప్టెన్‌ కదులుతున్న ప్రతిదాన్నీ అంతం చేయమని ఆదేశాలు జారీ చేస్తే అమెరికా సైనికులు ఐదు వందల మందిని చంపివేశారు. ఇప్పుడు గాజాలో జరుగుతున్నదానికి దానికి తేడా ఏమైనా ఉందా ? ఆసుపత్రులు, స్కూళ్లు, నిర్వాసితుల కేంద్రాలు, సహాయ శిబిరాలు, అన్నదానం చేస్తున్నవారు ఎవరు కనిపించినా హతమార్చాలని నెతన్యాహు ఆదేశాలు జారీ చేస్తే ఇజ్రాయెల్‌ సైనికులు అమలు చేస్తున్నారు. గత ఆరునెలల్లో 33,482(ఏప్రిల్‌ 10వ తేదీ నాటికి) మందిని చంపివేశారు. మరో విధంగా చెప్పాలంటే గాజాలోని ప్రతి 70 మందికి ఒకరిని, రోజుకు 180మందిని చంపారు. వీరుగాక 75,815 మందిని, రోజుకు 400 మందిని, ప్రతి 30 మందిలో ఒకరిని గాయపరిచారు. విధ్వంసమైన భవనాల గురించి చెప్పనవసరం లేదు. ఇరవై రెండు లక్షల మంది జనాభాలో 19లక్షల మంది నిరాశ్రయులు కావటం లేదా నెలవులు తప్పారంటే ప్రభావితం కాని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా అన్ని రకాల ఆయుధాలను అందించటమే కాదు, ఎర్ర సముద్రంలోకి తన యుద్ధ నావలను దింపి బాసటగా నిలుస్తున్నది. ఆ ప్రాంత దేశాలు జోక్యం చేసుకోకుండా బెదిరిస్తున్నది.


సామ్రాజ్యవాదుల వర్తమాన రక్త చరిత్రలో విస్మరించరాని దుర్మార్గమిది. కొందరు సైనికులు చేసిన దారుణం కాదిది, వ్యవస్థాపూర్వకమైనది. ఎవరికి ఏది నేర్పితే దాన్నే పాటిస్తారు.ఇజ్రాయెల్‌ రక్షణ దళాల్లో ప్రతి యువకుడు కొంతకాలం విధిగా పని చేయాలి. ఆదేశించిన దుర్మార్గాలను అమలు చేయాలి.తిరస్కరిస్తే ఏం చేస్తారు ? ప్రజాస్వామిక హక్కని వదలి వేయరు. విదేశాల్లో ఉన్న ఒక యువ ఇజ్రాయెలీ కమ్యూనిస్టు ఈ దళాల్లో చేరేందుకు తిరస్కరించాడు. గాజా మారణకాండను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొని అరెస్టయ్యాడనే కారణాన్ని చూపి అతని పౌరసత్వాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం రద్దు చేసింది. దేశంలోకి రావటాన్ని నిషేధించింది.రాజ్య అణచివేత, మిలటరీ విధానాలను నిరసించాలని, అణచివేతను వ్యతిరేకించాలని సోదర ఇజ్రాయెలీలకు అతను రాసిన లేఖలో పేర్కొన్నాడు. మధ్య ప్రాచ్య సోషలిస్టు ఫెడరేషన్‌లో భాగంగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా సోషలిస్టు ఫెడరేషన్‌ ఏర్పాటు జరిగినపుడే ఈ ప్రాంతంలోని జనాలందరూ సుఖంగా ఉంటారని పేర్కొన్నాడు. గాజాలో మారణకాండను విమర్శించినందుకు ఇజ్రాయెల్‌ పార్లమెంటులోని కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు ఒఫెర్‌ కాసిఫ్‌ను 2023 అక్టోబర్‌ 18న 45 రోజుల పాటు సస్పెండ్‌ చేస్తూ పార్లమెంటరీ నైతిక నియమాల కమిటీ తీర్మానించింది. అయినప్పటికీ ఖాతరు చేయని ఒఫెర్‌ అంతర్జాతీయ కోర్టులో దక్షిణాఫ్రికా దాఖలు చేసిన కేసును సమర్దిస్తూ ఒక పిటీషన్‌పై సంతకం చేశాడనే సాకు చూపి ఏకంగా పార్లమెంటు సభ్యత్వాన్నే రద్దు చేసేందుకు పూనుకున్నారు.దానిలో భాగంగా 85 మంది ఎంపీలతో తీర్మానాన్ని ప్రతిపాదించారు.దాన్ని పార్లమెంటరీ కమిటీ జనవరి 30న 14-2 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. దక్షిణాఫ్రికా చర్య కుట్ర అని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సాయుధపోరాటాన్ని సమర్ధించటమేనని వర్ణించింది. ఫిబ్రవరి 19న పార్లమెంటులో ఓటింగ్‌ జరగ్గా అది వీగిపోయింది. నూట ఇరవై మంది సభ్యులకు గాను పదకొండు మంది వ్యతిరేకంగా, 24 మంది ఓటింగ్‌కు దూరంగా ఉండగా 85 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఒక సభ్యుడిని తొలగించాలంటే 90 మంది మద్దతు అవసరం. దేశంలో ఎవరూ వ్యతిరేకంగా ఉండకూడదనే దుర్మార్గం తప్ప దీని వెనుక మరొకటి లేదు.పార్లమెంటులోని ఇతర వామపక్ష వాదులకూ ఇదే జరుగుతుందని హెచ్చరించటమే.


ఆరునెలల మారణకాండ తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే గాజా సర్వనాశనమైంది. అక్కడ బతికి ఉన్నవారు తిరిగి సాధారణ జీవితాలను ప్రారంభించే అవకాశం ఉంటుందా ? ఇంకా ఎందరిని బలితీసుకుంటారనే ప్రశ్నలకు ఇప్పటికైతే సమాధానాలు లేవు. రంజాన్‌ మాసం తరువాత మరింత పెద్ద ఎత్తున దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్‌ సన్నాహాలు జరుపుతున్నట్లు వార్తలు. అది ఒక్క గాజాకే పరిమితం అవుతుందా లేక మొత్తం మధ్య ప్రాచ్య దేశాలకు విస్తరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. గాజాలో మరణించిన వారందరూ హమస్‌ సాయుధులే అన్నట్లుగా ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్‌ చూస్తున్నది. ఒప్పందం ప్రకారం కొందరు బందీలను విడిపించుకోవటం తప్ప హమస్‌ వద్ద ఉన్న ఇతర బందీల జాడను కూడా తెలుసుకోలేకపోయింది. చీమ చిటుక్కుమన్నా కనుగొనే నిఘా వ్యవస్థను ఏమార్చి హమస్‌ సాయుధులు సరిహద్దులోని ఇజ్రాయెల్‌ ప్రాంతంపై ఎలా దాడి చేశారన్నది ఇప్పటికీ వీడని రహస్యంగానే ఉండిపోయింది. దాడులు, హత్యాకాండతో పాలస్థీనియన్లను లొంగదీసుకోలేమని గ్రహించిన ఇజ్రాయెల్‌ వారిని రోగాలు, ఆకలితో మాడ్చి చంపేందుకు పూనుకున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. గాజా మారణకాండను ఎలా ఆపాలన్నదాని కంటే అది కొనసాగితే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్‌ భవితవ్యం ఎలా ఉండనున్నదో అంటూ అనేక మంది విశ్లేషణల్లో నిమగమయ్యారంటే వారి చర్మం ఎంత మందంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు. కొందరైతే హమస్‌ చేసిన దుర్మార్గాలంటూ ఇంకా చిలవలు పలవలుగా వర్ణిస్తూ గాజాలో జరుపుతున్నదారుణాలను తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.


గత ఆరునెలల్లో జరిగిన పరిణామాల్లో ఎమెన్‌పై అమెరికా నేరుగా యుద్ధానికి దిగటం ఒక ముఖ్యాంశం.ఇది కూడా ఇజ్రాయెల్‌ సంబంధిత పరిణామాల్లోనే జరుగుతోంది. ఉగ్రవాదంపై పోరు ముసుగులో గతంలో సౌదీ అరేబియా ద్వారా దాడులు చేయించింది. అమెరికాలో తయారైన విమానాలతో అక్కడి నుంచే వచ్చిన బాంబులతో జరిపించిన దాడిలో వేలాది మంది యెమెనీలు మరణించారు. ఇరాన్‌తో సయోధ్య కుదరటంతో సౌదీ నిలిపివేసింది.ఇప్పుడు నేరుగా అమెరికా ఆ పని చేస్తున్నది. ఎమెన్‌ అంతర్యుద్ధంలో రాజధానితో సహా ఉత్తర ఎమెన్‌పై పైచేయి సాధించిన హౌతీలు లేదా అన్సరల్లా సాయుధులు గాజా మారణకాండకు నిరసనగా ఎర్ర సముద్రం ద్వారా ఇజ్రాయెల్‌ వైపు వెళ్లే నౌకల మీద దాడులను జరుపుతున్నారు. దానికి ప్రతిగా నౌకల రక్షణ పేరుతో అమెరికా రంగంలోకి దిగి ప్రతిదాడులు చేస్తున్నది.సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలో ప్రవేశించి హిందూ మహాసముద్రంలోకి రాకపోకలు సాగించే నౌకల రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. అవి ఆఫ్రికా ఖండంలోని గుడ్‌హౌప్‌ ఆగ్రంను చుట్టి వస్తున్నాయి. దాంతో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఎర్ర సముద్రం నుండి ఏడెన్‌ జలసంధి ద్వారా అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలోకి నౌకలు ప్రవేశించే కీలక ప్రాంతం బాబ్‌ అల్‌ మాండెబ్‌. ఈ కారణంగా ఎమెన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని సామ్రాజ్యవాదులు ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఆసియలోని ఎమెన్‌కు ఎదురుగా ఆఫ్రికా ఖండంలోని జిబౌటీ ఉంది. ఈ కారణంగానే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అన్నట్లుగా అక్కడ అనేక దేశాలు తమ మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి.


గాజా మారణకాండ నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు సామ్రాజ్యవాదం మార్గాలను వెతుకుతున్నది. మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాకు వివాదాన్ని విస్తరించేందుకు అమెరికా చూస్తున్నది.ఇరాన్ను ఒంటరిపాటు చేసేందుకు దీర్ఘకాలంగా అనుసరిస్తున్న ఎత్తుగడలకు ఎదురుదెబ్బ తగిలింది.చైనా చొరవతో ఉప్పు నిప్పుగా ఉన్న సౌదీ అరేబియా-ఇరాన్‌ సాధారణ సంబంధాలను నెలకొల్పుకున్నాయి. సౌదీ-ఇజ్రాయెల్‌ మధ్య సయోధ్య కుదర్చాలని అమెరికా ఎంతగా చూసినా కుదరలేదు. పాలస్థీనా స్వతంత్రదేశం ఏర్పడే వరకు సాధారణ సంబంధాలు కుదరవని సౌదీ స్పష్టం చేసింది. గాజాపై దాడులతో అది మరింత వెనక్కు పోయింది. కీలకమైన మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని తన చేతుల్లో ఉంచుకోవాలన్న ప్రయత్నాన్ని అమెరికా కొనసాగిస్తూనే ఉంది.ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా నాటో కూటమిని ఏర్పాటు చేసినట్లే ఇరాన్ను దెబ్బతీసేందుకు అలాంటి మరోకూటమి ఏర్పాటు చేయాలని, దానిలో ఇజ్రాయెల్‌కు కీలకపాత్ర ఉండేట్లు చూడాలన్నది లక్ష్యం. అమెరికా, ఇజ్రాయెల్‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసి కూడా సౌదీ అరేబియా నేతలు ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకోవటం అమెరికా ఊహించినట్లు కనపడదు. ఇరాన్‌కు మద్దతుగా చైనా, రష్యా నిలవటం మరొక కొత్త పరిణామం. ఉక్రెయిన్‌ వివాదం, గాజా మారణకాండ దాన్ని మరింత పటిష్టం చేసిందని చెప్పవచ్చు. కొందరైతే ఈ కూటమితో అమెరికా ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నదనే వర్ణిస్తున్నారు.

నరేంద్రమోడీ బడాయి : ట్రైలర్‌కే పదేండ్లా ! అసలు సినిమా చూస్తామా ?

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


గడిచిన పది సంవత్సరాల్లో మీరు చూసింది కేవలం ట్రైలరే మరోసారి ఎన్నుకుంటే అసలు సినిమా ముందు చూపిస్తా అని ప్రధాని నరేంద్రమోడీ రాజస్థాన్‌లోని చురు పట్టణంలో జరిగిన ఎన్నికల సభలో చెప్పారు. అంతకు ముందు ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటులో మాట్లాడుతూ దేశ జిడిపి 11వ స్థానంలో ఉన్నందుకు కాంగ్రెస్‌ ఉత్సవాలు చేసుకుంది. కానీ ఈ రోజు ఐదవ స్థానానికి చేరుకుంది. కాంగ్రెస్‌ దిగ్భ్రాంతిలో ఉంది. ఈ విజయం సాధించాలంటే కాంగ్రెస్‌కు వంద ఏండ్లు పడుతుంది అని ఎద్దేవా చేశారు. నరేంద్రమోడీ సర్కార్‌ జిడిపిని ఒక విజయంగా గొప్పలు చెప్పుకుంటోంది. అయితే దాన్ని చూసి జనం ఎక్కడా సంబరాలు చేసుకోవటం లేదు. కొన్ని ట్రైలర్లను చూసి సినిమాకు వెళ్లినా, శీర్షికలను చూసి యూ ట్యూబ్‌ చూసినా ఆశాభంగం తప్ప మరొకటి మిగలదు.


నరేంద్రమోడీ ట్రైలర్లలో ఒకటైన జిడిపి సంగతి చూద్దాం. వివిధ సంస్థలు ప్రకటించే గణాంకాల్లో తేడాలు ఉండే అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి. అయితే స్వల్పతేడాలున్నా ధోరణుల్లో పెద్ద తేడా లేదు. 2004లో ప్రపంచ జిడిపిలో భారత్‌ 12వ స్థానంలో ఉంది, 2014లో ఐఎంఎఫ్‌, ప్రపంచ బాంకు విశ్లేషణల ప్రకారం తొమ్మిది, 2015,16లో ఏడు,2017లో ఆరు, 2018లో ఏడవదిగా ఉంది. తరువాత ఐదవ స్థానానికి చేరింది. యుపిఏ లేదా కాంగ్రెస్‌ జిడిపిని ఒక విజయంగా చెప్పలేదు. 2004లో మన తలసరి జిడిపి మాక్రోట్రెండ్స్‌ విశ్లేషణ ప్రకారం 624 డాలర్లు, 2013లో 1,438 డాలర్లు, అంటే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అది నరేంద్రమోడీ ఏలుబడిలో 2022నాటికి 2,389కి పెరిగింది.రెట్టింపు కంటే చాలా తక్కువ అని ఎవరైనా చెబుతారు. మన కంటే దిగజారిన వారితో పోల్చుకొని మన స్థానం పెరిగిందని సంబరపడుతున్నారు. ప్రతిదానికీ చైనాతో పోల్చుకుంటున్నపుడు దీన్ని కూడా దానితోనే చూపాలి కదా.ప్రపంచ బ్యాంకు విశ్లేషణ ప్రకారం 2014లో చైనాలో 7,636 డాలర్లున్న తలసరి జిడిపి 2022 నాటికి 12,720కి పెరిగితే అదే కాలంలో మన దగ్గర 1,560 నుంచి 2,380కు మాత్రమే పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) సమాచారం ప్రకారం 2023లో ప్రపంచ తలసరి జిడిపి 13,330 డాలర్లు. అంతకంటే ఎక్కువగా 65దేశాల్లో ఉంది. ప్రపంచ జిడిపిలో మనం ఐదవ స్థానంలో ఉంటే తలసరి జిడిపిలో 138లో ఉంది. దీని గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు ? ప్రపంచ జిడిపిలో 32వదిగా ఉన్న బంగ్లాదేశ్‌ తలసరిలో మనకంటే ఎగువన 137వదిగా ఉంది. చైనా రెండు, 71వ స్థానాల్లో ఉన్నాయి. కనుక జిడిపి గురించి నరేంద్రమోడీ గొప్పలు చెప్పుకోవాల్సింది ఏముంది ?


ప్రపంచ జిడిపిలో చైనా వాటా 2014లో 13.1శాతం ఉండగా 2023లో 17.86కు పెరిగింది. త్వరలో చైనాను అధిగమిస్తామని చెబుతున్న నరేంద్రమోడీ ఏలుబడిలో ముక్కుతూ మూలుగుతూ 2.6 నుంచి 3.37శాతానికి మాత్రమే అంటే ఒకశాతం కూడా పెరగలేదు. ఈ మాత్రానికే ఇది ట్రైలర్‌ అంటున్నారు.అసలు సినిమా ప్రారంభమే కాలేదని, జనం చూసేదేమీ ఉండదని ఈ తీరు వెల్లడించటం లేదా ! ఈ మధ్య కాలంలో కొందరు పడకకుర్చీ మేథావులు చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది గనుక మనదేశం దాని స్థానాన్ని ఆక్రమించనుందనే కబుర్లు చెబుతున్నారు. మనదేశం అందరితో పోటీపడాలని, ఆరోగ్యకరమైన పోటీతో అధిగమించాలని కోరుకోవటం వేరు, మనం ఎగువన ఉండాలంటే మిగతావారు దిగువకు తగ్గాలని కోరుకోవటం విడ్డూరం, మన పూర్వీకులు మనకు చెప్పిన సుగుణమిదా ! గత పాతిక సంవత్సరాలలో దేశంలో రోడ్లు, రేవుల వంటి మౌలిక సదుపాయాలను వృద్ధి చేశారు. ఏ బిజెపి నేతను కదిలించినా పాడిందే పాడరా అన్నట్లు మనకు చెప్పేది ఇదే. సంస్కరణలు, వాటిలో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చైనాలో కూడా ఇదే మాదిరి చేశారు. అనేక మంది అక్కడి మాదిరే ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందని, మరో పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని ఆశించారు, ఆహ్వానించారు. కానీ అదేమీ జరగలేదు. చైనాలో ఉత్పత్తులతో పాటే వాటి రవాణా వేగంగా జరగటానికి మౌలిక సదుపాయాలను కల్పించారు. మన దేశంలో చూడండి మేము వేసిన రోడ్లు, రేవులు అని బిజెపి నేతలు చెప్పుకొనేందుకు తప్ప జనానికి ఉపాధిని పెంచే పారిశ్రామిక ఉత్పత్తి పెరగకపోగా గత పదేండ్లలో జిడిపిలో దాని వాటా తగ్గిపోయింది. గత పాలకుల ఏలుబడిలో ప్రారంభమైన ఉపాధి రహిత పరిశ్రమలు, సేవారంగాలు మరింతగా విస్తరించాయి. రవాణా చేసేందుకు రోడ్లు, రేవులు ఉన్నా సరకులు లేవు.డిజిటల్‌ చెల్లింపుల రంగంలో గణనీయ పురోగతి ఉంది తప్ప రాబడులు పెరగటం లేదు.


సేవారంగంలో పని చేసేందుకు అవసరమైన ఐటి నిపుణులు గణణీయంగా పెరిగారు.దీనికిగాను ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వటం తప్ప పెట్టుబడులేమీ పెట్టలేదు. ప్రభుత్వరంగంలో సంస్థలేవీ రాలేదు.ఈ రంగంలో ఎగుమతుల వల్లనే మన పరిస్థితి మెరుగుపడింది తప్ప పారిశ్రామిక రంగ వృద్ది వలన కాదు. పారిశ్రామిక రంగంలో మాదిరి సేవారంగంలో కూడా మనవారిని చౌకగా వినియోగించుకొనేందుకు అనేక విదేశీ కంపెనీలు ఇక్కడకు వాలిపోయాయి. జెపి మోర్గాన్‌, గోల్డ్‌మాన్‌ శాచస్‌, అమెజాన్‌, తదితర విదేశీ కంపెనీలు వేలాది మందిని నియమించుకుంటున్నాయి.చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లు సంవత్సరాల నుంచి చెబుతున్నారు. కొన్ని వస్తున్నమాట నిజం. అవి మనదేశంలో ఉత్పత్తిని పెంచుతున్నాయా ? ఉపాధి కల్పిస్తున్నాయా ? రెండూ లేవు. స్టాక్‌ మార్కెట్‌, రుణ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. జనవరి చివరి నాటికి అలాంటి పెట్టుబడులు రు.1.43 లక్షల కోట్లు వచ్చినట్లు, అంతకు ముందు ఏడాది అదే కాలంలో రు.91,460 కోట్లు వచ్చినట్లు వివరాలు వెల్లడించాయి. ఇలాంటి వాటికోసం మన పాలకులు చూస్తున్నారు తప్ప ఉత్పత్తికి, తద్వారా ఉపాధి పెరుగుదలకు అవసరమైన పెట్టుబడుల గురించి శ్రద్దలేదు. స్టాక్‌ మార్కెట్లు, రుణాలలో విదేశీ పెట్టుబడులు ఎంత పెరిగితే అంతగా అది చైనా, మనదేశం మరొకటైనా లాభాలను తరలించుకుపోతే నష్టం తప్ప లాభం ఉండదు. నైపుణ్యాలతో పెద్దగా పనిలేని వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతులు చేయటంలో ప్రస్తుతం చైనా వాటా ప్రపంచంలో 40శాతం ఉండగా మనవాటా మూడు శాతానికి అటూ ఇటూగా ఉంది. రానున్న దశాబ్దంలో ఇది 5 నుంచి పదిశాతం వరకు పెరగవచ్చని కొందరి అంచనా. ఇదే సమయంలో చైనా అలాంటి ఎగుమతులను తగ్గించి అధిక నైపుణ్యం గల వస్తువులవైపు కేంద్రీకరిస్తున్నది. అక్కడ వేతనాల పెరుగుదల వంటి కారణంగా కొందరు మనవైపు చూస్తున్న మాట నిజం.దీన్నే బూతద్దంలో చూపి చైనా స్థానంలో మనదేశం ఉంటుందని చెబుతున్నారు. కానీ ప్రచారం చేస్తున్నదానికి అనుగుణంగా మనదేశంలో అలాంటి మార్పులు కనిపించటం లేదని, దానికి విధానపరమైన లోపాలే కారణమని అనేక మంది చెబుతున్నారు.మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చినప్పటికీ ఎన్ని విదేశీ సంస్థలు తమ కార్యకలాపాలను మనదేశంలో విస్తరించాయన్నది సమస్య. 2023లో వెల్లడైన లెక్కల ప్రకారం ప్రపంచ వస్తూత్పత్తిలో చైనా 28.4, అమెరికా 16.6, జపాన్‌ 7.5, జర్మనీ 5.8 శాతాల చొప్పున మొత్తం 58.3శాతం నాలుగుదేశాలే చేస్తున్నాయి. మనం 3.3శాతంతో ఉన్నాం. 2010లో మొదటి స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కు నెట్టి చైనా ముందుకు వచ్చింది. అదే ఏడాది తొమ్మిదవ స్థానంలో ఉన్న మనదేశం 2014లో ఆరవ స్థానానికి వచ్చింది. గుజరాత్‌ నమూనా అని మేకిన్‌, మేడిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ వంటి ఎన్ని కబుర్లు చెప్పినా మోడీ ఏలుబడిలో పదేండ్లు గడచినా ఐదవ స్థానంలో మాత్రమే ఉంది.


విదేశాల్లో దేశ ప్రతిష్టను పెంచానని, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించానని మోడీ చెప్పుకుంటారు.2004లో మనదేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4.3బిలియన్‌ డాలర్ల నుంచి 2014 నాటికి 36బిలియన్లకు పెరిగాయి. మోడీ ఏలుబడిలో గరిష్టంగా 84.8బి.డాలర్లకు పెరిగి 2023లో 70.9బి.డాలర్లకు తగ్గాయి. గత పదేండ్లు, అంతకు ముందు పెరుగుదల రేటు ఎంత ? ఈ కాలంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే వస్త్ర రంగంలో ఎగుమతులు తగ్గాయి. కొత్త ప్రాజెక్టులు పెట్టి ముప్పు ఎదుర్కోవటం కంటే ఉన్న కంపెనీల వాటాల మీద పెట్టుబడి పెట్టటం లాభసాటిగా ఉంది కనుక విదేశీ పెట్టుబడిదారులు స్టాక్‌ మార్కెట్‌ వైపు చూస్తున్నారు. స్థానిక పరిశ్రమలకు రక్షణ కల్పిస్తున్న కారణంగా విదేశీ కంపెనీలు పెద్దగా ఉత్పత్తి రంగంలో ఆసక్తి చూపటం లేదు. సెల్‌ఫోన్ల వంటి రాయితీలు ఉన్న వాటికే వస్తున్నారు. లాప్‌టాప్‌ల దిగుమతులపై పరిమితులు విధించి తరువాత నిబంధనలను నీరుగార్చారు. దాని వలన జరిగిందేమిటి ? ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో తెలియని స్థితిలో స్థానిక పెట్టుబడిదారులు, విదేశీయులూ ముందుకు రావటం లేదు.చైనాలో ఇలాంటి అనిశ్చితికు తావులేదు గనుకనే విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఒక నిర్దిష్ట వ్యవధి వరకు విధానాల్లో మార్పులు ఉండవని చెబుతున్నారు. ఉదాహరణకు బ్రిటీష్‌, పోర్చుగీసు వారి కౌలు గడువు తీరిన తరువాత హాంకాంగ్‌, మకావో దీవులను నేరుగా ప్రధాన భూభాగం చైనాలో విలీనం చేసుకోవచ్చు.కాని దాని వలన కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ గనుక ఆ ప్రాంతాల్లో ఉన్న పెట్టుబడులు, సేవారంగం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఒకే దేశం – రెండు వ్యవస్థలనే విధానాన్ని ప్రకటించింది. దాని ప్రకారం 50 ఏండ్లు అంటే 2049వరకు ఆ రెండు దీవుల్లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను కొనసాగిస్తామనే నిర్దిష్ట హామీ ఇచ్చింది.

కంగనా రనౌత్‌ అతి తెలివి – నరేంద్రమోడీకి అపర సృష్టికర్తల అవార్డు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


బిజెపి తరఫున హిమచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సినీ నటి పద్మశ్రీ కంగన రనౌత్‌ ఒక టీవి ఇంటర్వ్యూలో సుభాష్‌ చంద్రబోస్‌ను భారత ప్రధమ ప్రధానిగా వర్ణించారు. దీని మీద విమర్శలు, పరిహాసాలు వెల్లడయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం రాకముందు ప్రవాసంలో అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ప్రభుత్వాన్ని రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సింగపూర్‌లో ఏర్పాటు చేశారు, ప్రధానిగా ప్రకటించుకున్నారు గనుక నేను అలా చెప్పాను తప్పేముంది అంటూ ఆమె ఎదురుదాడికి దిగారు. దాన్ని అర్ధం చేసుకోవచ్చు. ” నాకొక సంగతి చెప్పండి, మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రధమ ప్రధాని సుభాస్‌ చంద్రబోస్‌ ఎక్కిడికి వెళ్లారు ” అని ఇంటర్వ్యూలో విలేకరిని కంగన ప్రశ్నించటమే ఆమె తెలివితేటలను వెల్లడించింది. సదరు విలేకరి ఆమె చెప్పిందాన్ని సరిచేసేందుకు ప్రయత్నించగా ” మీరు నాకేమీ చెప్పవద్దు. ఆయన ఎక్కిడికి వెళ్లారో ఈ రోజు స్పష్టం చేయాలి ” అని మరోసారి అతి తెలివిని ప్రదర్శించారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే సుభాష్‌ చంద్రబోస్‌ 1945 ఆగస్టు 18న నాడు జపాన్‌ ఆక్రమణలో ఉన్న చైనాలోని తైవాన్‌ దీవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన సంగతి ఆమెకు తెలిసి ఉంటే స్వాతంత్య్రం వచ్చినపుడు ఎక్కడికి వెళ్లారనే ప్రశ్న ఆమె నోటి వెంట వచ్చి ఉండేది కాదు.బోస్‌ను ప్రధమ ప్రధానిగా వర్ణించినందుకు విమర్శించిన వారి మీద విరుచుకుపడ్డారు. భారతీయ కళలను, గతాన్ని ప్రతిబింబించే ఖజురహౌ, ఎల్లోరా శిల్పాలు, అజంతా చిత్రాలు, అనేక దేవాలయాల మీద ఉన్న బూతుబొమ్మల, వాత్సాయన కామసూత్రాల ఒరవడిలో ఒళ్లుదాచుకోకుండా సినిమాల్లో నటించి ఆ సంప్రదాయాలను ముందుకు తీసుకుపోయిన అనుభవం ఆమెకుంది. నటనా నిష్ణాతుల్లో ఒకరు కావచ్చు గానీ తనకు అన్నీ తెలుసు అనుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.


తన తెలివితేటలను ప్రశ్నించేవారు తన సినిమా ”ఎమర్జన్సీ” ని చూడాలని సలహా ఇచ్చారు.” ప్రధమ భారత ప్రధాని గురించి నాకు జ్ఞానదానం చేస్తున్నవారు ముందుగా దీన్ని(సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవాస ప్రభుత్వ ప్రకటన వార్త) చదవాలి. కొత్తగా తెలుసుకొనే వారికి కొంత సాధారణ పరిజ్ఞానం వస్తుంది. కొద్దిగా చదువు సంధ్యలు నేర్చుకోవాలని నాకు చెబుతున్న మేథావులందరూ తప్పక తెలుసుకోవాల్సిందేమంటే నేనే రాసి, నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జన్సీ అనే సినిమా గురించి తెలుసుకోవాలి. అది ప్రాధమికంగా నెహ్రూ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఆడాళ్లకు ఏమీ తెలియదని చెప్పేందుకు చూసే మగబుద్దిని చూపకండి ” అని ఎదురుదాడికి దిగారు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు 2024 మార్చినెల ఎనిమిదవ తేదీన ప్రధాని నరేంద్రమోడీ జాతీయ సృష్టికర్తల అవార్డులను(నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డ్స్‌) ఇరవై రంగాల్లో 23 మందికి ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో అసాధారణమైన ప్రతిభ చూపిన వారిని సత్కరించే పేరుతో తొలిసారిగా వీటిని ఇచ్చారు. కంగన చెప్పిన మాటలు ఈ అవార్డులకు ముందే వెలువడి ఉంటే బహుశా ఆమెను కూడా తిమ్మిని బమ్మిని చేసే చరిత్ర సృష్టికర్త లేదా ప్రభావితురాలు అంటూ అవార్డుతో సత్కరించి ఉండేవారు. ఎందుకంటే గతంలో ఆమె నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాతే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని సెలవిచ్చారు. అంతేనా నోబెల్‌ బహుమతి పోటీదారుగా నరేంద్రమోడీ ఉన్నారని ఏడాది క్రితం వచ్చిన ఒక తప్పుడు వార్తను ఆమె తాజాగా ఎక్స్‌లో పోస్టు చేశారు. అందువలన తొలి భారత ప్రధానిగా నెహ్రూను ఆమె అంగీకరించే ప్రశ్నే లేదు.


2001 నుంచి 2014వరకు గుజరాత్‌ సిఎం, తరువాత పదేండ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీకి దేశంలో అసాధారణ ప్రతిభను గుర్తించాలనే ఆలోచన ఇప్పటి వరకు ఎందుకు తట్టలేదు అనే ప్రశ్న దేశద్రోహం కనుక ఎవరూ వేయకూడదు. పోనీ ఈ ప్రతిభావంతులు దేశంలో ఆకలిని తగ్గించేందుకు, దేశ, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని అటే పట్టి ఇట్టే తెచ్చే చిట్కాలను కనిపెట్టినందుకో, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామన్న మోడీ వాగ్దానాన్ని అమలు జరిపేందుకు దగ్గరదారిని చూపినందుకో, అచ్చేదిన్‌ ఎలా తేవాలో వెల్లడించినందుకో అవార్డులను అందుకున్నారా అంటే కాదు. మరి వీరి ప్రతిభ ఏమిటి ? బూమ్‌లైవ్‌ డాట్‌ కామ్‌ అనే పోర్టల్‌ ఈ అవార్డుల గురించి కొన్ని విశ్లేషణలను వెల్లడించింది.అవార్డు గ్రహీతలలో 60శాతం మంది హిందూమతం, బిజెపి నేతలను కలవటం లేదా పాలకపార్టీ విధానాలు లేదా భావజాలాన్ని బలపరిచిన వారు, సృష్టించిన వాటి స్వభావం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తటస్థుల పేరుతో బిజెపి చెబుతున్నదాన్ని జనంలోకి తీసుకుపోవటమే అవార్డులకు అర్హత. వాటి ప్రదాన సభలో నరేంద్రమోడీ అసలు విషయం చెప్పేశారు. ” రానున్న కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ సభను ఏర్పాటు చేసినట్లు మీరు భావించవద్దు, ఎన్నికలకు ఈ అవార్డులకు సంబంధం లేదు ” అని ” స్పష్టంగా ” చెప్పారు. ఈ మాటలు చెబుతుండగా ఎదురుగా ఉన్న జనం మీకు నాలుగు వందల సీట్లు అంటూ నినాదాలు చేశారు. ” అవకాశం వుంటే వచ్చే శివరాత్రి లేదా మరొక తేదీన ఇలాంటి కార్యక్రమాన్ని నేను మాత్రమే నిర్వహిస్తానని మీకు హామీ ఇస్తున్నా ” అని కూడా మోడీ చెప్పారు.
కేవలం ఆరు రోజుల్లోనే ప్రభుత్వం రు. 2.4కోట్లు సామాజిక మాధ్యమాలపై వెచ్చించి మోడీని పొగిడించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధీనంలోని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ మార్చి పది నుంచి 16వ తేదీ వరకు (ఎన్నికల ప్రకటన ) గూగుల్‌లో వీడియో ప్రకటనలకు ఖర్చు చేసింది. ఒక వీడియోలో జనం మోడీ మోడీ అని నినాదాలిస్తుండగా మోడీ అవార్డులను ప్రదానం చేస్తుంటారు.” అతను ఉన్న ధోరణులను అనుసరించి పోవటంలేదు, అతనే ఒక ధోరణి సృష్టికర్త ” అంటూ నేపధ్యంలో మోడీ గురించి యాంకర్‌ వ్యాఖ్యలు ఉన్నాయి. జయా కిషోరీ అనే ఆమె ”బహుముఖ ప్రజ్ఞాశాలి” అని పొగిడితే టెక్నికల్‌ గురూజీగా సామాజిక మాధ్యమాల్లో పేరున్న గౌరవ్‌ చౌదరి మేక్‌ ఇన్‌ ఇండియా చొరవ మోడీదే అని పొగిడారు. బహుశా అది ఘోరంగా విఫలమైన పధకం అని తెలియదో లేక తెలిసినా పోయేదేముంది అని అన్నారో చెప్పలేము. మైథిలీ ఠాకూర్‌ అనే 23 ఏండ్ల గాయని ”ఎంవిపి” అన్నారు. క్రీడల్లో మోస్ట్‌ వాల్యూబుల్‌ ప్లేయర్‌ అని ఉపయోగించే పదాన్ని వాడారు. బహుశా రాజకీయ అటగాడని అర్ధమేమో ! అవార్డులు రాకపోయినా నామినేట్‌ అయిన కొందరు ఇలాంటి అవార్డులు ఇస్తున్నందుకు అంటూ మోడీని ఆకాశానికి ఎత్తారు. సామాజిక మాధ్యమంలో పేరు పొందిన వారిని ప్రభుత్వ ప్రచారానికి వాడుకోవటం అన్ని చోట్లా జరుగుతున్నదే.


అవార్డులు పొందిన 23 మందిలో వారు సృష్టించిన అంశాల ఇతివృత్తాల గురించి డీకోడ్‌ పేరుతో బూమ్‌లైవ్‌ విశ్లేషించింది. వారిలో పదిహేను మంది సృష్టి మతపరమైన, బిజెపినేతలతో భేటీలు, బిజెపి విధానాలు, భావజాలాన్ని సమర్దించేవిగా ఉన్నట్లు పేర్కొన్నది.వారిలో ఏడుగురు హిందూయిజానికి సంబంధించిన అంశాలమీదే చురుకుగా ఉంటారని తేలింది. వారిలో ఒకరైన రణవీర్‌ అలహాబాదియా (బీర్‌ బిసెప్స్‌) నిరంతరం బిజెపి అజెండాలోని మత అంశాలనే పోస్టు చేస్తుంటాడు.శివుడు ఎవరు, శ్రీరామ ప్రభు, హనుమాన్‌జీ, సీతా మాత, రామాయణ పాఠాలు వంటివి వాటిలో ఉంటాయి.హిందూ దేవతలు, మతపరమైన భజనలు, గీతాలను ఆలపించే జయా కిషోరీ అనే ఆమెను ” ఉత్తమ సామాజిక మార్పు సృష్టికర్త ” అవార్డుకు ఎంపిక చేశారు. ఆమె జనవరి 22న అయోధ్యలో కాషాయ దుస్తులు ధరించి రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగాలు చేశారు. హిందూమతానికి సంబంధించిన పాటలు పాడే, వీడియోలు చేసే మైథిలీ ఠాకూర్‌ను సాంస్కృతిక రాయబారి అవార్డుకు, అలాంటి వాటినే సృష్టిస్తున్న జాహ్నవీ సింగ్‌ను వారసత్వ సంస్కృతి ప్రతీక అవార్డుకు ఎంపిక చేశారు. వేద సిద్దాంతం అనే పేరుతో హిందూమత, సనాతన ధర్మ తదితర పోస్టులు పెట్టే అర్దిమాన్‌ వంటి వారిని అవార్డులు వరించాయి. ఇక టెక్నికల్‌ గురూజీగా పేరున్న గౌరవ్‌ చౌదరి వంటి మరో ఆరుగురికి బిజెపి నేతలతో భేటీ జరిపిన పూర్వరంగంలో అవార్డులు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను పొగిడుతూ కార్యక్రమాలను రూపొందించిన వారు సరేసరి. ఒక ఎఫ్‌ఎం రేడియో జాకీగా ఉన్న రౌనక్‌ అవార్డులు పొందిన వారిలో ఒకరు. అతగాడు చేసిందల్లా ఒకటే. జి20 సమావేశాల సందర్భంగా ” భారత్‌ : ద బాస్‌ ” అనే పేరుతో ఒక వీడియోను పోస్టు చేశాడు. ఆ సమావేశాలను నిర్వహించినందుకు భారతీయులు ఎంతో గర్వపడుతున్నారని పేర్కొన్నాడు. మరో వీడియో ” ఇండియా బనేగా భారత్‌( భారత్‌గా మారనున్న ఇండియా) ” అనేదాన్ని చేసినందుకు అవార్డు ఇచ్చారు.వీటి గురించి బిజెపి నేతలు ఎంత గొప్పగా చెప్పుకున్నదీ తెలిసిందే.


సామాజిక మాధ్యమాల్లో బహుళ ప్రచారం పొందిన వారిని రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వినియోగించుకోవటం ఇటీవలి కాలంలో రోజు రోజుకూ పెరుగుతున్నది.టీవీ యాంకర్లను రాజకీయ పార్టీల సభలకు రప్పించటం తెలిసిందే.ఈ నేపధ్యంలో బిజెపి అలాంటి వారిని అవార్డులు మరోపేరుతో మరింత ప్రచారం కల్పించి వారికి డిమాండ్‌ను పెంచటంతో పాటు తన ప్రచారానికి ఉచితంగా వాడుకొనేందుకు చూస్తున్నదన్నది స్పష్టం. వీరికి రాజకీయాలు, విధానాల గురించి అంతగా ప్రవేశం లేకున్నా పార్టీలు రాసి ఇచ్చిన అంశాలను తమవిగా చెప్పుకుంటూ జనాలను ప్రభావితం చేసేందుకు చూస్తారు.జనాలను ప్రభావితం చేసే ఇతివృత్తాల సృష్టికర్తలు, ప్రభావితులుగా ఉన్నవారికి అవార్డులు ఇచ్చిన నరేంద్రమోడీ అలాంటి వారి నేతగా టీమ్‌ అవార్డు పొందటానికి అర్హులని ఈ సందర్భంగా అంగీకరించకతప్పదు. ఆ అవార్డులో కథలు చెప్పటంలో నైపుణ్యం వున్నవారికి కూడా ఒక అవార్డు ఉంది. గత పది సంవత్సరాలుగా చెప్పిన మాట చెప్పకుండా జనాలకు కొత్త కతలు చెప్పటంలో నరేంద్రమోడీ అందరికంటే ఎంతో ఎత్తున ఉన్నారు.దేశంలో 46కోట్లకు పైగా యూట్యూబ్‌ ఖాతాదార్లు ఉన్నారని అంచనా. అందువలన దానిలో వెల్లడించే సమాచారంతో ఓటర్లను పెద్ద ఎత్తున ప్రభావితం చేయవచ్చని బిజెపి భావిస్తున్నది. పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నది. దానికి అనుగుణంగానే ఈ అవార్డుల పేరుతో ఆ రంగంలో పేరున్న వారందరినీ తనవైపు ఆకర్షించేందుకు పూనుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు, వాటిని చూసి సంస్థలు ఆశ్రయిస్తే ఈ ప్రభావితులుకు డబ్బేడబ్బు.స్టాటిస్టా అనే సంస్థ 2023లో ఒక విశ్లేషణ వెల్లడించింది. 2022నాటికి మనదేశంలో ఈ ప్రభావితుల మార్కెట్‌ విలువ పన్నెండు వందల కోట్ల రూపాయలని 2026 నాటికి 2,800 కోట్లకు పెరగనుందని పేర్కొన్నది. జనానికి ఎలా చెప్పాలో అన్న నేర్పరితనం వీరి దగ్గర ఉంటుంది తప్ప వీరి ప్రభావానికి పరిమితులు ఉన్నాయని హెచ్చరించింది. ప్రభావితులు, సృష్టికర్తలు రెండు రకాలు. 2007లో నరేంద్రమోడీ గుజరాత్‌ సిఎంగా ఉన్నపుడు ప్రముఖ జర్నలిస్టు కరణ్‌థాపర్‌ ఇంటర్వ్యూ ప్రారంభించిన మూడు నిమిషాల్లోనే సూటిగా సమాధానాలు చెప్పలేక మంచినీళ్లు తాగి అకస్మాత్తుగా ముగించి లేచిపోయిన మోడీ ఉదంతం తెలిసిందే. ఇలాంటి వారు ఉన్నారనే బహుశా ప్రధానిగా ఇంతవరకు ఒక్కసారి కూడా మోడీ విలేకర్ల సమావేశం పెట్టలేదు. అప్పటి నుంచి రెండవ తరగతి సానుకూల ప్రశ్నలతో ఇంటర్వ్యూలు జరిపే వారితో మాత్రమే మోడీ మాట్లాడుతున్నారు.ఎందుకంటే వారు ముందే ప్రశ్నలు పంపుతారు. అంతకు మించి అడగరు. సృష్టికర్తల అవార్డులు పొందిన వారు కూడా సానుకూల తరగతికి చెందిన వారే అన్నది వేరే చెప్పనవసరం లేదు.

భారత్‌ను ముంచెత్తనున్న విద్యుత్‌ వాహనాలు – చైనా మీద మోడీ సర్కార్‌కు ఎక్కడలేని ప్రేమ ఎందుకబ్బా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


సరిహద్దు సమస్యల గురించి మాతో రహస్యంగా భారత్‌ లోతైన చర్చలు జరుపుతున్నదని, మరోవైపు విదేశాంగ మంత్రి రాజీపడేది లేదని ప్రకటిస్తారని, ఇదంతా నెపం మా మీద నెట్టేందుకు, బేరమాడేందుకు చేస్తున్న ట్రిక్కు అని చైనా విదేశాంగశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నది. గత నెలలో బీజింగ్‌లో రెండు దేశాల ప్రతినిధులు సరిహద్దు వివాదాల గురించి 29వ దఫా చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనాలంటే సరిహద్దులో సాంప్రదాయ పద్దతిలో బలగాలను మోహరించితేనే సాధ్యమని చర్చల అనంతరం మలేషియా భారతజాతీయుల సమావేశంలో జై శంకర్‌ చెప్పారు. సరిహద్దు సమస్యపై రాజీపడేది లేదన్నారు. భారత్‌లో జరగనున్న ఎన్నికల్లో లబ్దిపొందేందుకే జైశంకర్‌ ఇంత గట్టిగా మాడ్లాడారని చైనా విశ్లేషకులు పేర్కొన్నారు. సరిహద్దు వివాదానికి బాధ్యత చైనాదే అని ప్రపంచానికి చెప్పే యత్నం కూడా దీనిలో ఉందన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను భారత్‌ అంతర్భాగంగా తాము ఎన్నడూ గుర్తించలేదని, మరోసారి దాన్ని గురించి ప్రస్తావించటం కూడా ఎన్నికల కోసమే అని విమర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ను చైనా జాంగ్‌నాన్‌ అని పిలుస్తున్నది, పురాతన కాలం నుంచి అది చైనా ప్రాంతమే అని వాదిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన సమయానికి అది మనదేశ అంతర్భాగంగా ఉంది.అదే విధంగా మనదని చెబుతున్న ఆక్సారుచిన్‌ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. ఇది రెండు దేశాల మధ్య తెగని సరిహద్దు వివాదంగా కొనసాగుతున్నది. పరస్పరం చొరబడకుండా వాస్తవాధీన రేఖకు అటూ రెండు దేశాలూ కాపలా కాస్తుంటాయి.ఉద్రిక్తతలు తలెత్తినపుడు మిలిటరీని మోహరిస్తున్నాయి. లడక్‌ ప్రాంతంలోని గాల్వన్‌ లోయ 2020 ఉదంతం తరువాత మోహరించిన మిలిటరీలు కొనసాగుతున్నాయి. వాటి ఉపసంహరణ గురించి చర్చలు జరుగుతున్నా కొత్త వివాదం తలెత్తలేదు తప్ప పూర్వపు స్థితి నెలకొనలేదు.


ఒక వైపు మనదేశంలోని సంఘపరివార్‌, ఇతర కొన్ని శక్తులు చైనా వ్యతిరేకతను నిరంతరం రెచ్చగొడుతూ ప్రచారం చేస్తుంటాయి. మరోవైపు అదే చైనా నుంచి మన దేశం రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకుంటున్నది. గత రికార్డులను నరేంద్రమోడీ బద్దలు కొట్టారు.ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గతేడాది అదే నెలలతో పోలిస్తే 15.8శాతం తమతో వాణిజ్యం పెరిగిందని చైనా కస్టమ్స్‌ శాఖ ప్రకటించింది. తూర్పు చైనాలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న షియాంగ్‌సు రాష్ట్రం నుంచి బ్రెజిల్‌,భారత్‌,రష్యా, దక్షిణాఫ్రికా దేశాలతో గతేడాదితో పోలిస్తే 2024జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 36శాతం పెరిగి 14.4బిలియన్‌ డాలర్లకు చేరిందని వెల్లడించారు.షియాంగ్‌షు రాష్ట్రం నుంచి ప్రధానంగా విద్యుత్‌ వాహనాలు, వాటిలో వినియోగించే లిథియమ్‌ అయాన్‌ బాటరీలు, ఫొటోవోల్టాయిక్‌ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.పైన పేర్కొన్న నాలుగుదేశాలతో పాటు చైనాను కలిపి బ్రిక్స్‌ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి దీనిలో సౌదీ అరేబియా, ఈజిప్టు,ఇరాన్‌, యుఏయి. ఇథియోపియా కూడా చేరటంతో దీన్ని బ్రిక్స్‌ ప్లస్‌ అని పిలుస్తున్నారు. ఒక వైపు చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, మనదగ్గర నుంచే మేకిన్‌ ఇండియా, మేడిన్‌ ఇండియాలో భాగంగా ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేసే అవకాశం వచ్చిందని మీడియా ఊదరగొడుతున్నది. మరోవైపు మనదేశం చైనా, ఐరోపా సమాఖ్య మీద ఆధారపడటం పెరుగుతున్నదని తాజాగా ఐరాస సంస్థ ” అంక్టాడ్‌ ” ప్రకటించింది.
మనదేశం అందించిన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ కరోనా తరువాత, రష్యా-ఉక్రెయిన్‌ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి చైనా, ఐరోపా సమాఖ్యపై భారత్‌ ఆధారపడటం 1.2శాతం పెరిగిందని, సౌదీ అరేబియాపై 0.6శాతం తగ్గిందని పేర్కొన్నది. భారత్‌లో ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకం(పిఎల్‌ఐ) అమలు, చైనా నుంచి వస్తున్న దిగుమతులపై నాణ్యతా ప్రమాణాల ఉత్తరువుల పేరుతో పరిమితులను విధించిన తరువాత కూడా భారత్‌ ఆధారపడటం పెరిగింది. గడచిన రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ వాణిజ్యం స్థిరంగా ఉండటం, రాజకీయాల ప్రాతిపదికన వాణిజ్యం పెరిగినప్పటికీ చైనా మీద ఆధారపడటం ఎక్కువైంది. చైనాపై ఆధారపడటాన్ని 2023లో అమెరికా 1.2శాతం తగ్గించుకుంటే మనదేశం పెంచుకుంది. ఈ కాలంలోనే చైనాపై ఆధారపడిన రష్యా వాణిజ్యం 7.1శాతం పెరగ్గా, ఐరోపా మీద 5.3శాతం తగ్గింది.2022 నుంచి ప్రపంచ వస్తు వ్యాపారం క్రమంగా తగ్గుతున్నది, సేవల లావాదేవీలు పెరుగుతున్నాయి. పొద్దున లేస్తే చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న కారణంగా చైనాతో పెంచుకుంటున్న వాణిజ్య లావాదేవీల గురించి చెప్పుకొనేందుకు మన మీడియా సిగ్గుపడుతున్నదని చెప్పవచ్చు. మన ఆర్థిక సంవత్సరపు లెక్కలను మన అధికారులు వెల్లడిస్తే చైనా జనవరి నుంచి డిసెంబరు ప్రాతిపదిక వార్షిక లెక్కలు ప్రకటిస్తుంది. అందువలన రెండుదేశాల లెక్కల్లో తేడాలు కనిపిస్తాయి.చైనా నుంచి జనవరిలో వస్తువులు ఎగుమతి జరిగి అవి మనదేశానికి వచ్చే సరికి ఒకటి రెండు నెలలు పడుతుంది. ఇది లెక్కల్లో తేడాలకు ఒక కారణం.


మనదేశ వాణిజ్య శాఖ సమాచారం ప్రకారం 2021-22 నుంచి 2023-24వరకు మూడు సంవత్సరాలలో 95.266 నుంచి 99.389 బిలియన్‌ డాలర్లకు చైనాతో వాణిజ్యం పెరిగింది. ఇదే సమయంలో చైనా వెల్లడించిన సమాచారం ప్రకారం 110.361 నుంచి 116.953 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా లెక్కలు తప్పు మనం అంతగా దిగుమతులు చేసుకోలేదు అని కొందరు వాదించవచ్చు. అంకెల్లో తేడాలున్నా చైనా నుంచి దిగుమతులు పెరిగాయన్నది స్పష్టం.లేకపోతే కొంత మంది చెబుతున్నట్లు దిగుమతి చేసుకున్న వస్తువుల విలువను తగ్గించి లేదా పెంచి చూపుతున్నట్లు వార్తలు. దాన్ని నిర్ధారించుకోవటం కష్టమేమీ కాదు. కొన్ని వస్తువులు చైనా బదులు హాంకాంగ్‌ నుంచి వచ్చినట్లుగా మనదేశం నమోదు చేస్తే చైనా నుంచి తక్కువ మొత్తాలు కనిపించవచ్చు. మనదేశం చైనాతో పోటీ పడాల్సిన అవసరం ఉందని, కానీ నిర్లక్ష్యం చేశారని, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్‌ సూరత్‌లో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మేకిన్‌, మేడిన్‌ ఇండియా అని పిలుపులు ఎన్ని ఇచ్చినా పారిశ్రామిక వస్తుఉత్పత్తి పెద్దగా పెరగటం లేదు.2010 నుంచి 2022వరకు ఉన్న వివరాల ప్రకారం వార్షిక సగటు జిడిపిలో పారిశ్రామిక రంగం వాటా 14.92శాతం ఉంది.స్టాటిస్టా అందించిన వివరాల ప్రకారం 2010లో 17శాతం ఉన్నది 2022నాటికి 13కు తగ్గింది. చైనాలో 2013 నుంచి 2023వరకు వార్షిక సగటు 40శాతం కాగా, 2013లో 44.2 నుంచి 2023లో 38.3శాతానికి తగ్గింది. దీన్ని బట్టి ప్రపంచ ఫ్యాక్టరీగా చైనాను వెనక్కునెట్టటం మరో పదేండ్లు పదవిలో ఉన్నా నరేంద్రమోడీ వల్లకాదని అనుభవం తేల్చింది. అందువలన జైశంకర్‌ చెబుతున్న మాటలు మోడీని మునగచెట్టు ఎక్కించటానికి మాత్రమే పనికివస్తాయి.


చైనా నుంచి వచ్చే పెట్టుబడులను నిరుత్సాహపరచాలని గతంలో తీసుకున్న నిర్నయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. విద్యుత్‌ వాహనాల తయారీలో మనదేశంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి స్థానికంగా ఉత్పత్తి చేస్తే చైనాతో సహా ఏ కంపెనీలనైనా అనుమతిస్తామని మన అధికారులు వెల్లడించారు. అలాంటి కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించే వరకు దిగుమతి చేసుకొనే వాహనాలపై ఇప్పుడున్న 70-100శాతం పన్ను మొత్తాన్ని 15శాతానికి తగ్గిస్తున్నట్లు కూడా ప్రకటించింది. టిక్‌టాక్‌ యాప్‌తో మన సమాచారం అంతా చైనా సంగ్రహిస్తుందని నిషేధించిన పెద్దలు ఇప్పుడు చైనా పెట్టుబడితో ఫ్యాక్టరీలు పెట్టటాన్ని ఎలా అనుమతిస్తున్నట్లు ? చైనా మీద ప్రేమతో లేదా నరేంద్రమోడీ మారుమనసు పొంది కాదు. కార్పొరేట్ల వత్తిడే కారణం ! 2022-23లో మన దేశం 20.3బిలియన్‌ డాలర్ల మేరకు ఆటో విడిభాగాలను దిగుమతి చేసుకుంటే వాటిలో 30శాతం చైనా నుంచే ఉన్నాయి. రానున్నది విద్యుత్‌ వాహనాల యుగం. ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. స్థానికంగా వాటిని తయారు చేసే కంపెనీలకు చైనా విడిభాగాలు అవసరం. తమ పెట్టుబడులను అడ్డుకుంటామంటే చైనా ఊరుకుంటుందా ? ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతుంది. విద్యుత్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీల ఉత్పత్తిలో 75శాతంతో చైనా ముందుంది.వాహనతయారీ ఖర్చులో 40శాతం బ్యాటరీలదే. ప్రస్తుతం ప్రపంచ విద్యుత్‌ వాహనాల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా 50శాతం వాటా కలిగి ఉంది. రానున్న కొద్ది సంవత్సరాల్లో భారత రోడ్లపై తిరిగే ప్రయాణ,వాణిజ్య విద్యుత్‌ వాహనాల్లో ప్రతి మూడింటిలో ఒకటి చైనా సంస్థలు లేదా వాటితో భాగస్వామ్యం కలిగినవే ఉత్పత్తి చేయనున్నాయని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆమేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అందువలన అనివార్యమై కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులు, వాహనాలకు అనుమతి ఇచ్చింది.వాటిలో ఒకటైన బ్రిటన్‌కు చెందిన ఎంజి మోటార్స్‌ ఇండియా ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అనేక చైనా కంపెనీలు రంగ ప్రవేశం చేయనున్నాయి.దీంతో చైనా నుంచి విడిభాగాల దిగుమతులు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి.టెస్లా, విన్‌ఫాస్ట్‌ వంటి ఇతర దేశాల కంపెనీలు కూడా చైనా వాహనాలతో పోటీ పడేందుకు చూస్తున్నాయి. దీని వలన మన వినియోగదారులకు మేలు జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు.


గాల్వన్‌ ఉదంతం తరువాత 2020 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం షీ ఇన్‌తో పాటు చైనాకు చెందిన 58 యాప్‌లను నిషేధించింది. వీటి ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత,రక్షణ, భద్రతలకు ముప్పు తలెత్తినట్లు కారణంగా చెప్పారు. తరువాత జాబితాను 270కి పెంచారు. షీ ఇన్‌ ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఫాషన్‌ దుస్తుల విక్రయాల కంపెనీ. 2022 ఏప్రిల్‌ నాటికి 150 దేశాల్లో దాని లావాదేవీల విలువ 100బిలియన్‌ డాలర్లు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పుడు సింగపూర్‌లో ఉంది కనుక గతంలో మన ప్రభుత్వం దానిపై విధించిన నిషేధం ఇప్పుడు వర్తించదని రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోవచ్చని, మన ప్రభుత్వం తిరిగి అనుమతించనున్నదని పత్రికలు రాశాయి. అసలు సంగతి ఏమంటే మరింతగా విస్తరించేందుకు, పన్నుల భారాన్ని తగ్గించుకొనేందుకు గాను తన ప్రధాన కార్యాలయాన్ని 2019లోనే చైనా నుంచి సింగపూర్‌కు మార్చుకుంది. 2020లో నిషేధం విధించేటపుడు అది చైనా కంపెనీ అని చూశారు తప్ప దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని కాదు. ఇప్పటికీ అది చైనా కంపెనీనే కదా ! రిలయన్స్‌ దానితో ఒప్పందం చేసుకోనుంది గనుక దాని వత్తిడి మేరకు సింగపూర్‌ పేరును ముందుకు తెచ్చారు. ఇప్పుడు విద్యుత్‌ వాహనాలు,పెట్టుబడులకు గేట్లు తెరిచారు.కార్పొరేట్లు రంగంలోకి దిగితే నరేంద్రమోడీ తనమాటలను తానే దిగమింగుతారు. కాషాయమార్కు దేశభక్తి మరి !

సాగుకు ముందుకు రాని యువత – ఐరోపా రైతాంగ ఆందోళన కారణాలేమిటి !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.ప్రపంచమంతటా పొలాల్లో పని చేసేందుకు యువత ముందుకు రావటం లేదు.వ్యవసాయమే వృత్తిగా ఉన్న వారిని వివాహం చేసుకొనేందుకు కొన్ని చోట్ల యువతులు సుముఖత చూపటం లేదు. పర్యావరణం పేరుతో అనేక నిబంధనలు, సబ్సిడీల కోతలతో పాటు, చౌకగా ఉత్పత్తుల దిగుమతులతో సాగు గిట్టుబాటు కావటం లేదు. అనేక దేశాలు, ఐరోపా పార్లమెంట్‌కు ఎన్నికల సంవత్సరమిది. మమ్మల్ని నానా కష్టాలు పెడుతున్న మీరు మమ్మల్ని ఎలా ఓటు అడుగుతారో, మా జీవితాలను ఫణంగా పెట్టి పాలన ఎలా సాగిస్తారో చూస్తామంటూ అనేక దేశాల్లో గ్రామీణులు ఆందోళన బాట పట్టారు. ఎక్కడైనా వ్యవసాయం ఒక్కటే, అందరూ రైతులే అయితే, ఒక్కో దేశంలో ఒక్కో సమస్య ముందుకు వస్తున్నది. రైతులను ఉద్యమాల్లోకి ముందుకు తెస్తున్నది. మార్కెట్‌ యార్డులతో నిమిత్తం లేకుండా ఎక్కడబడితే అక్కడ అమ్ముకొనేందుకు, నేరుగా ఎగుమతులు చేసుకొని భారీ మొత్తంలో రాబడి పొందేందుకు మూడు సాగు చట్టాలను తీసుకువచ్చినట్లు గతంలో నరేంద్రమోడీ రైతాంగాన్ని నమ్మించేందుకు చూసి, భంగపడి క్షమాపణలు చెప్పి మరీ వెనక్కు తగ్గారు.ప్రభుత్వం బాధ్యతలనుంచి తప్పుకొని ప్రయివేటు శక్తులకు అప్పగిస్తే ఏం జరుగుతుంది ?


స్పెయిన్‌ అనుభవమే తీసుకుందాం. అక్కడ మార్కెట్‌ యార్డులు లేవు. ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఐరోపాలో జరుగుతున్న ఆందోళనలో స్పెయిన్‌ రైతులు ముందున్నారని పత్రికల్లో విశ్లేషణలు వచ్చాయి. టోకు సూపర్‌మార్కెట్ల యజమానులు రైతాంగానికి సరసమైన చెల్లించి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అక్కడ చట్టం ఉంది. దాన్ని అమలు జరిపేనాధుడు లేకపోవటంతో రైతులు పోరుబాట పట్టారు. మన దేశంలో కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళన సాగుతున్న సంగతి తెలిసిందే. వినియోగదారులకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, తమ ఉత్పత్తులకు ధర రావటం లేదని, ఇతర దేశాల నుంచి పోటీ, 2012 నుంచి 2022 మధ్య కాలంలో దిగుమతులు ఎనభైశాతం పెరిగినట్లు స్పెయిన్‌ రైతులు చెబుతున్నారు.2023 జూన్‌-సెప్టెంబరు మాసాల మధ్య అంతకు ముందు ఏడాది వచ్చిన సగటు ధరలకంటే రైతుల ఉత్పత్తుల ధరలు తొమ్మిదిశాతం తగ్గినట్లు తేలింది.మరోవైపున సాగు ఖర్చుల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ పేరుతో అమలు జరుపుతున్న నిబంధనలు, నియంత్రణ, చౌకధరలకు దిగుమతులతో తీవ్రమైన విదేశీ పోటీని అక్కడి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నది.దేశీయ రైతుల మీద నిబంధనలను గట్టిగా అమలు జరుపుతున్న పాలకులు కార్పొరేట్‌ కంపెనీల దిగుమతుల మీద ఉన్నవాటిని చూసీ చూడనట్లు వదలివేస్తున్నారు.
ఐరోపా పారిశ్రామిక, సేవారంగ కార్పొరేట్ల నుంచి వస్తున్న వత్తిడిని తక్కువ అంచనా వేయకూడదు.ఐరోపా సమాఖ్య దేశాల జిడిపిలో వ్యవసాయ రంగం నుంచి వస్తున్నది కేవలం 1.4శాతం, ఉపాధి కల్పిస్తున్నది 4.2శాతం మందికి మాత్రమే కాగా సమాఖ్య బడ్జెట్‌లో వ్యవసాయ రంగం 30శాతం పొందుతున్నదని కొందరు లెక్కలు చెబుతున్నారు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే అంతకంటే తక్కువ ఖర్చుతో దిగుమతులు చేసుకొని కడుపునింపుకోవచ్చు, ఇక్కడ సాగు ఎందుకు అని ప్రశ్నించటమే.1960లో స్పెయిన్‌ జిడిపిలో వ్యవసాయ వాటా 23.5శాతం కాగా 2022 నాటికి 2.6శాతానికి, ఉపాధి 39 నుంచి 3.6శాతానికి తగ్గింది. నియంత ఫ్రాంకో పాలనలో మార్కెట్‌ ఎకానమీకి మారిన తరువాత జరిగిన పరిణామమిది.పారిశ్రామిక రంగ జిడిపి వాటా కూడా ఇదే కాలంలో .30.8 నుంచి 17.4శాతానికి తగ్గగా సేవారంగం 41.7 నుంచి 74.6శాతానికి పెరిగింది.ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో 11.3శాతం మందికి ఉపాధి దొరుకుతుండగా సేవారంగంలో 78.2శాతం ఉన్నారు. దేశంలో తొమ్మిది లక్షల కమతాలుండగా 6.6లక్షల యజమానులు ఏదో ఒక రూపంలో ఐరోపా సమాఖ్య సాయం పొందుతున్నారు. గతేడాది నలభైశాతం ప్రాంతంలో తీవ్రమైన కరవు ఏర్పడింది. తొంభైలక్షల మంది జనాభా మీద ఏదో ఒక నియంత్రణ అమల్లో ఉంది. తెలుగు ప్రాంతాల్లో వేరుశనగ నూనె వంటలకు వాడినట్లుగా స్పెయిన్‌లో ఆలివ్‌ నూనె వినియోగిస్తారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గి లీటరు ధర ఐదు నుంచి 14యూరోలకు పెరిగింది. దుకాణాల్లో దొంగతనాలు చేసే వస్తువుగా మారింది.


రైతుల ఆందోళన కారణంగా స్థానిక ప్రభుత్వాలు, ఐరోపా సమాఖ్య కొన్ని నిబంధనలను సడలించింది, మరికొన్నింటిని వాయిదా వేసినప్పటికీ మెడమీద కత్తిలా వేలాడుతూనే ఉన్నాయి.వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి పర్యావరణానికి హానికలిగించే వాయువుల విడుదలను 2040 నాటికి తగ్గించేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. మీథేన్‌, నైట్రోజన్‌ తదితర వాయువులను 30శాతం తగ్గించాలన్నది ఒకటి.ఓజోన్‌ పొరను దెబ్బతీసే వాయువులు వ్యవసాయ రంగం నుంచి 14.2శాతం వెలువడుతున్నాయని 2050 నాటికి వాటిని సున్నాకు తగ్గించాలన్నది మరొక లక్ష్యం. ఇందుకోసం నిబంధనల జారీ, వాటి అమలుతో రైతాంగం ఆందోళనబాట పట్టారు.మన మీద కూడా దాని ప్రభావం కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదు పంటలకు ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధరకు హామీ ఇస్తామని చెబుతూ పంటల మార్పిడి విధానం అనుసరించిన రైతులకే అది వర్తిస్తుందనే షరతు పెట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ మీద రష్యా దాడులు జరుపుతోంది గనుక అక్కడి నుంచి ఎలాంటి దిగుమతి పన్నులు లేకుండా 2025 జూన్‌ వరకు వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చని ఐరోపా సమాఖ్య అనుమతి ఇచ్చింది. రష్యాను త్వరలోనే ఓడిస్తామని మా ఆర్థిక మంత్రి చెబితే నిజమే అని నమ్మాం, ఇప్పుడు అలాంటి సూచనలేమీ కనిపించటం లేదు, అదే యుద్దం ఇప్పుడు మమ్మల్ని నాశనం చేస్తోందని ఫ్రెంచి రైతులు చెబుతున్నారు.


ఐరోపా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ఆధారం చేసుకొని అనేక దేశాల్లో మితవాద శక్తులు జనాల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకుంటున్నాయి. జూన్‌లో జరిగే ఐరోపా యూనియన్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఈ శక్తులు బలం పుంజుకుంటాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అనేక చోట్ల స్థానిక ఎన్నికల్లో అలాంటి ధోరణి వెల్లడైంది. పోర్చుగల్‌ ఎన్నికల్లో చెగా అనే మితవాద పార్టీ గతంలో ఉన్న 7.2శాతం ఓట్లను 18.1కి పెంచుకుంది. స్పెయిన్‌ రైతుల్లో ఉన్న అసంతృప్తి కారణంగా ఓక్స్‌ అనే మితవాద పార్టీ గతంలో ఉన్న 24 పార్లమెంటు సీట్లను గతేడాది 33కు పెంచుకుంది. అనేక రాష్ట్రాలలో రైతుల ఓట్లు పార్టీల తలరాతలను మార్చివేస్తున్నాయి. అనేక దేశాల్లో లాటిన్‌ అమెరికా దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాన పార్టీలన్నీ ముందుకు వచ్చాయి. రైతుల ఆందోళన కారణంగా ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.జూన్‌లో జరిగే ఎన్నికలను గమనంలో ఉంచుకొని ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్‌ డిసెంబరులో సంతకం చేయాల్సిన ఒక ఒప్పందాన్ని వాయిదా వేయటానికి కారణం అక్కడి రైతుల ఆందోళనే. అదే విధంగా రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకంపై ఆంక్షలు విధించే బిల్లును కూడా వెనక్కు తీసుకున్నాడు. ఇలా తాత్కాలికంగా వెనక్కు తగ్గినా ఎన్నికల తరువాత ముందుకు పోతారని భావిస్తున్నారు. తమకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని కర్ణాటక బిజెపి ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే ప్రకటించిన సంగతి తెలిసిందే. నరేంద్రమోడీ మరోసారి అధికారానికి వస్తే గతంలో వెనక్కు తీసుకున్న మూడు సాగు చట్టాలను మరో రూపంలో తిరిగి ప్రవేశపెడతారనే భావం కార్పొరేట్లలో ఆశలు రేపుతోంది. అందుకే మద్దతు ఇస్తున్నారు. అనేక దేశాల్లో జరుగుతున్న రైతుల ఉద్యమాల నుంచి మనదేశంలో జరుగుతున్నదానిని వేరు చేసి చూడలేము.ప్రపంచీకరణ యుగంలో ప్రతి రంగంలోనూ విడదీయరాని బంధం ఉంటుంది.


లోక్‌సభ ఎన్నికలలో బిజెపి ప్రచారానికి అనుమతి లేదంటూ పంజాబ్‌లోని అనేక గ్రామాలలో పోస్టర్లు వెలువడినట్లు జాతీయ పత్రికలు వెల్లడించాయి.” మీరు మమ్మల్ని ఢిల్లీలో ప్రవేశించనివ్వలేదు గనుక మీ నేతలను గ్రామాల్లోకి రానివ్వం ” అని పోస్టర్లలో హెచ్చరించారు. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే రద్దు చేసిన సాగు చట్టాలను మరో రూపంలో ప్రవేశపెడతారని పంజాబ్‌లో జరుగుతున్న రైతుల సభల్లో హెచ్చరిస్తున్నారు. ఇటీవలనే కాంగ్రెస్‌ నుంచి బిజెపిలోకి ఫిరాయించిన సునీల్‌ జక్కర్‌ మార్చినెల 24న భటిండాలో తలపెట్టిన బిజెపి మహౌత్సవ్‌ సభ రైతుల నిరసన కారణంగా రద్దు చేసుకున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది.ఇలాంటి నిరసనలే అనేక గ్రామాల్లో వెల్లడౌతున్నాయి. రైతుల ఆందోళన పట్ల బిజెపి వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గం, ఎన్‌డిఏ నుంచి అకాలీదళ్‌ వైదొలిగిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీతో సర్దుబాటు చేసుకొనేందుకు చూసిన బిజెపి భంగపడింది. రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరి కారణంగానే బిజెపితో చేతులు కలిపేందుకు ఆ పార్టీ భయపడిందని చెప్పవచ్చు.” బిజెపి బండారాన్ని బయటపెట్టండి, బిజెపిని వ్యతిరేకించండి, బిజెపిని శిక్షించండి ” అంటూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ప్రచారం చేస్తున్నది.


మనదేశంలో రైతు కుటుంబాలలో యువకులకు వివాహాలు ఒక సమస్యగా మారుతున్న పరిణామాన్ని చూస్తున్నాం. ఐరోపా, అమెరికాల్లో కూడా వ్యవసాయం చేసేందుకు యువకులు ముందుకు రావటం లేదు.ఫ్రాన్సులో రైతుల సగటు వయస్సు 50 సంవత్సరాలుగా ఉందని, అనేక కుటుంబాల్లో సాగును కొనసాగించే వారు కనిపించటం లేదని విశ్లేషణలు వెలువడ్డాయి. యాంత్రీకరణతో పనిచేసే జనాభా తగ్గి అనేక చోట్ల గ్రామాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.ఫ్రెంచి ఆహార, వ్యవసాయ, పర్యావరణ జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం 18శాతం మంది రైతులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు, మరో 25శాతం మంది చావ బతకలేని స్థితిలో ఉన్నారు.పర్యావరణం పేరుతో సాగుకు ఆటంకం కలిగించటం పట్ల రైతులు ఆగ్రహం వెల్లడిస్తున్నారు.నాలుగుశాతం సాగు భూమిలో సాగు చేయకుండా చెట్ల పెంపకానికి వదలివేయాలన్నది ఒక నిబంధన పెట్టారు. ఇతర నిబంధనల కారణంగా సబ్సిడీలకు కోత పెడుతున్నారు. ఐరోపాలో పర్యావరణ పరిరక్షణ పేరుతో ఏర్పడిన పార్టీల సమావేశాల మీద రైతులు దాడులకు దిగుతున్నారు. జర్మనీలో అదే జరిగింది. బెర్లిన్‌ సమపంలో రోడ్లపై ఎరువుల మడ్డిని కుమ్మరించటంతో అనేక కార్లు ఒకదానినొకటి ఢకొీన్నాయి.ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ఐరోపా దేశాల్లో ఇంథన, విద్యుత్‌ ధరలు విపరీతంగా పెరిగాయి.ఫ్రాన్స్‌లో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ ఖర్చు అంతకు ముందుతో పోలిస్తే గతేడాది రెట్టింపైంది. ఎరువుల ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఐరోపా వ్యవసాయ విధానమే అక్కడి రైతులను ఆందోళనలకు పురికొల్పుతున్నది. పోలాండ్‌లో కార్మికుల వేతన రేట్లు చాలా తక్కువ, దానికి తోడు చౌకగా కోళ్లను పెంచి ఇతర దేశాల మార్కెట్లలో కుమ్మరించటంతో ఫ్రాన్స్‌ వంటి చోట్ల కోళ్ల రైతులకు గిట్టుబాటు కావటం లేదు.ఉక్రెయిన్లో వేతనాలు మరీ తక్కువ. దాంతో అక్కడి నుంచి చౌక ధరలకు దిగుమతులు విపరీతంగా పెరిగాయి. అది రైతుల్లో అసంతృప్తికి దారితీయటంతో పంచదార, కోడి మాంస దిగుమతులపై ఐరోపా సమాఖ్య కొన్ని ఆంక్షలను విధించక తప్పలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి రాజకీయం : తెదే, వైసిపి అసంబద్ద వాదనలు, అంకెలతో వంచన !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌ సర్వనాశనమైందని తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి చెబుతోంది. అంతే కాదు, తమ పాలనలో వచ్చిన అనేక పరిశ్రమలు రాష్ట్రం వదలివెళ్లినట్లు కూడా ఆరోపిస్తున్నారు. దానికి పోటీగా వైసిపి తనదైన శైలిలో జనాన్ని తప్పుదారి పట్టించేందుకు చూస్తున్నది. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఊదరగొడుతున్నది. ఉదాహరణకు జిఎస్‌డిపిలో దేశంలో రాష్ట్రాన్ని ఒకటవ స్థానంలో నిలబెట్టినట్లు ప్రచారం చేస్తున్నారు. చెప్పేవారికి లేకున్నా వినేవారికి వివేకం ఉండాలంటారు.వర్తమాన ఆర్థిక సంవత్సరం 2023-24 మార్చినెల 31తో ముగుస్తుంది. వెంటనే గణాంకాలు ఖరారు కావు. వివిధ రాష్ట్రాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో పేర్కొన్న అంచనాల ప్రకారం కొన్ని సూచికలను వెలువరించారు. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి 14.49లక్షల కోట్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది. తరువాత తెలంగాణా. మొదటి ఏడింటిలో మహారాష్ట్ర 38.79,తమిళనాడు 28.3, గుజరాత్‌ 25.62, కర్ణాటక 25, ఉత్తర ప్రదేశ్‌ 24.39,పశ్చిమ బెంగాల్‌ 17.19, రాజస్థాన్‌ 15.7లక్షల కోట్లతో ఉన్నాయి. ఇక తలసరి జిడిపిలో 2022-23 సంవత్సరంలో అగ్రస్థానంలో 5.19లక్షలతో సిక్కిం, 4.72లక్షలతో గోవా రెండవదిగా ఉంది. పెద్ద రాష్ట్రాలలో 3.08లక్షలతో తెలంగాణా ప్రధమ, 3.01తో కర్ణాటక,2.96తో హర్యానా, 2.73తో తమిళనాడు, 2.72తో ఢిల్లీ, 2.41తో గుజరాత్‌, 2.33తో ఉత్తరాఖండ్‌, కేరళ, 2.24తో మహారాష్ట్ర,2.22తో హిమచల్‌ ప్రదేశ్‌, 2.19తో ఆంధ్రప్రదేశ్‌ పదకొండవ స్థానంలో ఉంది. ఇక వైసిపి చెప్పుకుంటున్న ఒకటవ స్థానం సంగతేమిటి అంటే ప్రతి ఏటా జిఎస్‌డిపి వృద్ది రేటు ప్రతి రాష్ట్రంలోనూ మారుతూ ఉంటుంది.2021-22లో వృద్ధి రేటులో స్థిర ధరల్లో 11.43శాతంతో మొదటి స్థానంలో ఉంది అని తేల్చారు గనుక, దాన్నే మొత్తం జిడిపిలో మొదటి స్థానంగా చెబుతూ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. జిడిపి అంటే అంబానీ,అదానీ సంపదలతో పాటు అట్టడుగు బడుగు జీవులకు వచ్చే ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకొని వేసే మొత్తం, తలసరి అంటే దాన్ని జనాభాతో భాగించగా వచ్చేది. అందుకే తెలంగాణా జిడిపిలో మనకంటే తక్కువగా ఉన్నప్పటికీ జనాభా తక్కువ గనుక దేశంలో పెద్ద రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉంది. జిడిపిలో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో ఉన్నప్పటికిటీ తలసరిలో తొమ్మిదవదిగా ఉంది.ఈ సూచికలతో జనానికి ఒరిగేదేమీ ఉండదు.తెలుగుదేశం పార్టీ కూడా తన ఐదు సంవత్సరాల పాలనలో వృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంది.2013-14లో రాష్ట్ర జిడిపి వృద్ది రేటు ఏడుశాతంగా ఉన్నదానిని 2017-18 నాటికి 11.2శాతానికి పెంచినట్లు అంకెల్లో చూపింది.


తెలుగుదేశం వారు తమ ఏలుబడిలో విశాఖను ఐటి హబ్‌గా మార్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఇదొక అతిశయోక్తి. హైదరాబాద్‌లో ఐటి పరిశ్రమల ఏర్పాటుకు చంద్రబాబు నాయుడే కారణమనే ప్రచారం గురించి తెలిసిందే. అలాంటి నేత ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఐటి పరిశ్రమలను ఆకర్షించలేకపోయారో ఎవరూ చెప్పరు. పెట్టుబడుల ఆకర్షణల పేరుతో సమావేశాల ఆర్భాటాలు చేయటం వేరు, ఆచరణలో పెట్టుబడులు రావటం వేరు. ఐటి రంగాన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి బండారం బయటపడుతుంది. దీని అర్ధం వైసిపి అభివృద్ధి చేసిందని కాదు. దొందూ దొందే.ఐటి అంటే మారుపేరు చంద్రబాబు అని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు గనుక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది.కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటి సాంకేతిక మంత్రిత్వశాఖ సమాచారం ఆధారంగా 2021-22 సంవత్సర వివరాలతో రూపొందించిన ఎగువ మాప్‌ ఐటి ఎగుమతుల్లో ఏ రాష్ట్రం ఎక్కడుందో వెల్లడిస్తున్నది. ఎవరైనా అది వాస్తవం కాదని అంటే వాస్తవం ఏమిటో వెల్లడించాలి. పొరుగున ఉన్న ఒడిషా ఐదువేల కోట్ల రూపాయల మేర ఎగుమతి చేస్తే ఆంధ్రప్రదేశ్‌ వెయ్యి కోట్లుగా ఉంది. తరువాతి సంవత్సరాల్లో మొత్తంగా ఎగుమతులు పెరిగినందున ఆమేరకు అంకెలు మారవచ్చు తప్ప ధోరణిలో పెద్ద తేడా ఉండదు. ఆ ఏడాది రు.11.59లక్షల కోట్ల మేర ఎగుమతి చేస్తే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాల నుంచే రు.9.72లక్షల కోట్లు ఉంది. ఉపాధి కూడా దీనికి అనుగుణంగానే ఉంటుంది. ఐటి ఉద్యోగాలంటే బెంగలూరు,పూనే,హైదరాబాద్‌, చెన్నయిని చూస్తున్నారు తప్ప విశాఖ, విజయవాడ అని ఎవరైనా అంటారా ? 2023 మార్చి నాటికి దేశంలో 54లక్షల మంది ఐటి, ఐటి అనుబంధ సేవారంగంలో పని చేస్తున్నారు. పరోక్షంగా మరో కోటి మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నవారు ఎందరు ? ఎన్నికలు వస్తున్నాయి గనుక అంకెలతో ఆడుకుంటూ జనాన్ని మభ్యపెడుతున్నారు తస్మాత్‌ జాగ్రత్త అని చెప్పాల్సి వస్తోంది. రెండు పార్టీలూ పోలీసు యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా మలచుకొని ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలు, న్యాయమైన డిమాండ్లపై ఆందోళనలను అణచేందుకే చూశాయి. మాట తప్పి మడమ తిప్పిన వారే. ఎవరూ తక్కువ తినలేదు.


ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా తెలుగుదేశం, వైసిపి పాలన ఉంది. కొన్ని వివరాలను చూద్దాం. ఉదాహరణకు అప్పుల గురించి ఆరోపణలు-ప్రత్యారోపణలు చోటుచేసుకుంటున్నారు.కాపిటల్‌ అంటే కాపిటల్‌ పెట్టుబడి,రుణాలు, వడ్డీ చెల్లింలులు రు.కోట్లలో.రెండు పార్టీల పాలనలో మచ్చుకు రెండేసి సంవత్సరాల వివరాలు.ఈ అంకెలకు పిఆర్‌ఎస్‌ సంస్థ విశ్లేషణలు ఆధారం.
ఏడాది××× రుణాలు ×× వడ్డీ చెల్లింపు××రుణ చెల్లింపు×× కాపిటల్‌
2016-17×59,923 ×× 11,697 ×× 34,776 ×× 50,520
2017-18×30,500 ×× 14,783 ×× 8,009 ×× 40,792(బడ్జెట్‌)
2021-22×53,524 ×× 22,165 ×× 15,503 ×× 16,373
2022-23× 64,978 ×× 25,288 ×× 16,291 ×× 16,847
రాష్ట్రంలో శాశ్వత సంపదలు, వాటి ద్వారా సేవలు, ఉపాధి సృష్టికి చేసే ఖర్చును మూలధన లేదా కాపిటల్‌ అంటారు. రెండు పార్టీల పాలనలోనూ ఇది దిగజారింది తప్ప ప్రాధాన్యత లేదు. పిఆర్‌ఎస్‌ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం రెండు పార్టీలూ బడ్జెట్లలో భారీ మొత్తాలను ప్రకటించి ఏడాది చివరికి కోత పెట్టటంలో దొందూ దొందే. తెలుగుదేశం పార్టీ చివరి రెండు సంవత్సరాలలో ప్రతిపాదిత మొత్తాలలో 39,30శాతాల చొప్పున, వైసిపి మొదటి నాలుగు సంవత్సరాలలో 82,37,48,45శాతాల చొప్పున కోతలు పెట్టింది.
తెలుగుదేశం పార్టీ చివరి మూడు సంవత్సరాలలో రాష్ట్ర రుణ భారం జిఎస్‌డిపిలో సగటున ఏటా 28.6శాతం ఉంటే, వైసిపి ఐదు సంవత్సరాల పాలనలో 32.74శాతం ఉంది. వీటికి ప్రభుత్వం హామీగా ఉండి కార్పొరేషన్లు, ఇతర సంస్థల ద్వారా చేసిన అప్పులు, ప్రభుత్వ సంస్థలు తీసుకున్న అప్పులు అదనం.ఉదాహరణకు 2022 మార్చి 31నాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు రు.1,38,875 కోట్లు వీటిలో విద్యుత్‌ సంస్థల వాటా రు.38,473 కోట్లు. జిఎస్‌డిపిలో ఇలాంటి మొత్తాలు 2021-22లో పన్నెండు శాతం ఉంది. అంటే ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకొనే అప్పులకు ఇది అదనం. తెలుగుదేశం పాలనలో చివరి నాలుగు సంవత్సరాలలో ఇతర రాష్ట్రాల కేటాయింపులతో పోల్చితే విద్యారంగంలో తక్కువ, వైద్య రంగంలో సమంగా, గ్రామీణాభివృద్ధి రంగంలో ఎక్కువగా ఉంది.వైసిపి పాలనలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయనే విమర్శ పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే.2022-23లో అన్ని రాష్ట్రాలలో సగటున రోడ్లు, భవనాలకు 4.5శాతం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహనరెడ్డి సర్కార్‌ 2021-22లో 0.9, మరుసటి ఏడాది 0.8శాతం మాత్రమే కేటాయించింది.తీవ్ర విమర్శల తరువాత 2023-24లో 1.8శాతంగా ప్రతిపాదించింది, ఆచరణలో ఎంత ఖర్చు చేసిందీ వెల్లడి కావాల్సి ఉంది. వైసిపి ప్రభుత్వం అనేక కీలక రంగాలను అలక్ష్యం చేసింది. ఆర్థిక మంత్రి భారీ మొత్తాలు కేటాయించినట్లు చూపటం తప్ప కోతల సంగతి తరువాత చెప్పలేదు. ఉదాహరణకు 2021-22 బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తాలలో అమలులో వివిధ శాఖలకు పెట్టిన కోతలను చూస్తే అభివృద్ది బండారం బయటపడుతుంది.రోడ్లు, భవనాలకు 55,గృహనిర్మాణం 54,నీటిసరఫరా, పారిశుధ్యం 46,సాగు నీరు 45,పట్టణాభివృద్ధి 42,వ్యవసాయం 40, సాంఘిక సంక్షేమం 39, గ్రామీణాభివృద్ది 34,ఆరోగ్యం, ఎస్‌సి,ఎస్‌టి,బిసి సంక్షేమశాఖలలో 20శాతాల చొప్పున కోత పెట్టారు. సంక్షేమ పథకాలు అమలు జరిపినంత మాత్రాన సరిపోదు.వాటినెవరూ వ్యతిరేకించటం లేదు. వివిధ శాఖలకు ప్రతిపాదించిన కేటాయింపులను కోత ఎందుకు పెట్టారో, తెచ్చిన అప్పులను దేనికి వెచ్చించారన్నది జనం అడుగుతున్న ప్రశ్న.


మోయలేని అప్పుల భారం గురించి ఒకవైపు చెబుతున్న తెలుగుదేశం కూటమి తాము అధికారానికి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలను మరింతగా పెంచి అమలు చేస్తామని ఆశచూపుతున్నాయి. ఇప్పటికే ఉన్న అప్పులతో కొత్త అప్పులు చేసే అవకాశాలు లేవు. కేంద్రం రుద్దిన విద్యుత్‌ సంస్కరణలు అమలు జరుపుతున్నందుకు అన్ని రాష్ట్రాలకు అనుమతించి జిఎస్‌డిపిలో 3.5శాతం పరిమితిని మించి మరో అరశాతం వైసిపి సర్కార్‌ ఉపయోగించుకుంది. వ్యవసాయానికి విద్యుత్‌ మీటర్లు బిగించే షరతును ఇందుకోసం అంగీకరించింది.పక్కనే ఉన్న తెలంగాణాలో అక్కడి ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రాలతో అప్పుల భారం ఎంత పెరిగిందో స్పష్టమైంది. కొత్త ప్రభుత్వం గత మూడునెలలుగా కొత్త అప్పులు తీసుకుంటే తప్ప గడవని స్థితి.ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన పరిస్థితి మీద శ్వేత పత్రం ప్రకటిస్తే తప్ప వాస్తవాలు వెల్లడికావు. ఎవరు అధికారానికి వచ్చినా కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లేమిటి అన్నది ప్రశ్న.జనం మీద పన్నుల భారాన్ని విపరీతంగా మోపటం ఒకటి లేదా అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలకు ఏదో ఒకసాకుతో కోత పెట్టటం మినహా మరో మార్గం కనిపించటం లేదు. అందుకే పోటీ చేస్తున్న పార్టీలు నిర్ధిష్ట ప్రతిపాదనలతో ప్రణాళికలను ప్రకటిస్తే వాటి బండారం బయట పడుతుంది. ముందు మాకు తెలియలేదు, ఖజానాలో పైసా లేదని తెలంగాణాలో కాంగ్రెస్‌ చెప్పిన మాదిరి నాలుక మడతవేస్తే పరిస్థితి ఏమిటి ?

చమురు రాజకీయం : అమెరికా చంకనెక్కి రష్యాకు చేయిచ్చిన విశ్వగురువు మోడీ !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచ రాజకీయాల్లో మనదేశం రష్యాను దూరం చేసుకొంటున్నదా ? పరిణామాలను చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. గత రెండు సంవత్సరాలుగా రాయితీ ధరలకు, రూపాయి మారకంతో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు కొనుగోలును మన దేశం ఇప్పుడు దాదాపు నిలిపివేసింది. దానికి బదులు అమెరికా నుంచి భారీ మొత్తంలో అధిక ధరలకు కొనుగోలు చేసేందుకు పూనుకుంది. అంతర్జాతీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ విశ్వగురువుగా అగ్రరాజ్యం అమెరికాను సైతం తన కాళ్ల ముందుకు రప్పించుకోగలరు అని భక్తులు చెబుతారు.అయితే దానికి ఎక్కడా రుజువులు కానరావు. దశాబ్దాలుగా భారత్‌కు మిత్రదేశంగా, బ్రహ్మౌస్‌ ఖండాంతర క్షిపణులు, ఎకె-47రైఫిళ్ల తయారీలో భాగస్వామిగా ఉన్న రష్యాను పక్కన పెట్టి ఇప్పుడు నరేంద్రమోడీ అమెరికా ముందు చేతులెత్తేశారు. రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు బదులు ఎలాంటి రాయితీలు లేని అమెరికా సరకును దిగుమతి చేసుకొనేందుకు నిర్ణయించారు.వచ్చే నెల నుంచి రోజుకు రెండున్నరలక్షల పీపాల ముడి చమురును అమెరికా నుంచి దిగుమతి చేసుకొనేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు రష్యా ప్రభుత్వరంగ నౌకల కంపెనీపై విధించిన ఆంక్షల కారణంగా రష్యా పశ్చిమ ప్రాంతంలోని బాల్టిక్‌ సముద్ర రేవుల ద్వారా చమురు ఎగుమతుల రవాణా ఖర్చు పెరుగుతోంది.ఆరు నుంచి ఎనిమిది శాతం అదనంగా కానుందని అంచనా. తద్వారా రష్యాను దెబ్బతీయాలని చూస్తున్నాయి.దీంతో రష్యా ఎగుమతులకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది.లేదా కొనుగోలు చేసే దేశాలకు ఆ మేరకు ధర తగ్గించి విక్రయించాల్సి ఉంటుంది. అమెరికా కొత్త ఆంక్షలు, బెదిరింపుల కారణంగా మనదేశానికి బయలుదేరిన కోటి పీపాల పరిమాణం గల సరకుతో బయలుదేరిన రష్యన్‌ టాంకర్లు ఇప్పుడు చైనా, ఇతర దేశాలవైపు వెళుతున్నాయి.


ఉక్రెయిన్‌పై సైనిక చర్య అంశంలో మనదేశం తటస్థంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరిస్తున్నామని కారణంగా గత రెండు సంవత్సరాలుగా రష్యాపై విధించిన ఆంక్షలను సమర్ధించటం లేదని, ఎక్కడ చౌకగా ఉంటే అక్కడ మనకు ఇష్టమైన దగ్గర చమురుకొనుగోలు చేస్తామని మన ఇంథన, విదేశాంగశాఖ మంత్రులు చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంక్షలు, కొత్త పరిణామాలేవీ లేవు. విదేశాంగ విధానంలో మార్పులు వచ్చినట్లు కూడా ప్రకటించలేదు. కానీ రష్యా నుంచి కొనుగోలు నిలిపివేశారు. మూడు భారీ టాంకర్లు, ఇతర నౌకల ద్వారా 76లక్షల పీపాల చమురు అమెరికా నుంచి బయలుదేరినట్లు కెప్లర్‌ సంస్థ తెలిపింది. రష్యా నుంచి చమురు కొనగూడదని రిలయన్స్‌, ఇతర కంపెనీలు నిర్ణయించాయి. ఇప్పటి వరకు రష్యా నుంచి రాయితీ ధరకు ముడి చమురు కొనుగోలు చేసి చమురు ఉత్పత్తులను ఐరోపా, అమెరికాలకు మనదేశం నుంచి ఎగుమతి చేస్తున్నారు. అమెరికా నుంచి చమురు ఎగుమతులపై 2015వరకు నిషేధం ఉండేది. అనేక దేశాలతో వాణిజ్య లోటు ఉండటం, ఎగుమతులకు అనుమతించాలని అమెరికా చమురు కంపెనీల వత్తిడి కారణంగా ఎత్తివేశారు.అచిర కాలంలోనే అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకొనే దేశాలలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది. ఇటీవలి వరకు అమెరికా దిగుమతి దేశంగా ఉండి ఇప్పుడు ఎగుమతి చేసేదిగా మారింది. గత ఏడాది రోజుకు 40లక్షల పీపాలను ఎగుమతి చేసింది. రాతి పొరల నుంచి చమురు (షేల్‌ అయిల్‌) తీసేందుకు భారీ మొత్తాలలో పెట్టుబడులు పెట్టిన కార్పొరేట్‌ సంస్థలు ఇప్పుడు లాభాలు పిండుకొనేందుకు చూస్తున్నాయి.రానున్న రోజుల్లో ఎగుమతులపై ఎలాంటి నిషేధం విధించబోమని 2015లో అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక బిల్లును ఆమోదించాడు. ఆ ఏడాది రోజుకు కేవలం పదిలక్షల పీపాల ఎగుమతి జరగ్గా గతేడాదికి 40లక్షలకు పెరిగాయి.తన పలుకుబడితో అనేక దేశాల మీద వత్తిడి తెచ్చి చమురు ఎగుమతి చేస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యాను రెచ్చగొట్టటం వెనుక ఐరోపా, ఆసియా చమురు మార్కెట్‌లో ప్రవేశించే అమెరికా ఎత్తుగడ ఉన్నట్లు స్పష్టమైంది.అమెరికా వలలో చిక్కిన దేశాలు ఇప్పుడు ఆంక్షల పేరుతో రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేశాయి.


ప్రపంచ రాజకీయాలనే శాసించే స్థితికి చేరామని చెప్పుకుంటున్న మనదేశం ఎంతో చిన్నదైన ఉత్తర కొరియా పాటి ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతున్నది.రష్యాపై విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తున్నామని చెబుతూనే అమలు జరపటం మనదేశ ప్రతిష్టను పెంచుతుందా, తగ్గిస్తుందా ? అణుపరీక్షలను జరుపుతున్న కారణంగా ఐరాస ఉత్తర కొరియా మీద విధించిన ఆంక్షలను ధిక్కరించి రష్యా చమురు ఎగుమతి చేస్తున్నది. దానికి ప్రతిగా ఉత్తర కొరియానుంచి అవసరమైన ఆయుధాలను పొందుతున్నది. ఒపెక్‌ దేశాలతో కుదిరిన ఒప్పందం ప్రకారం జూన్‌ నాటికి రోజుకు 90లక్షల పీపాల చమురు ఉత్పత్తిని తగ్గించాలని రష్యా కోరింది.దానిలో భాగంగా తన ఉత్పత్తిలో కోత పెట్టి 4.71లక్షల పీపాల ఎగుమతులను కూడా తగ్గించనుంది. ఇదంతా అంతర్జాతీయ చమురు ధరలను తగ్గకుండా చూసేందుకు జరుగుతున్నది. ఐదు సంవత్సరాల క్రితం రష్యా రోజుకు 117లక్షల పీపాలను ఉత్పత్తి చేసేది.ప్రస్తుతం 108లక్షలకు తగ్గించింది. సరిహద్దుల్లో ఉన్న చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌ దాడులు జరుపుతున్నది. దీని వలన రోజుకు ఆరులక్షల పీపాల చమురు శుద్ది సామర్ధ్యం తగ్గింది. అయితే కొద్ది వారాల్లోనే తిరిగి పూర్వపు స్థితికి చేరుకుంటుందని చెబుతున్నారు. మార్చినెల ఒకటవ తేదీ నుంచి నాటో కూటమి రష్యా ఇంథన ఎగుమతులపై మరిన్ని ఆంక్షలను అమలు జరుపుతున్నది. ఆధునిక పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుకుంటున్నప్పటికీ రష్యాలో స్వంత పరిజ్ఞానంతో చమురు డ్రిల్లింగ్‌ భారీఎత్తున జరుగుతున్నది.ఒకవైపు చైనా ఆర్థిక రంగం కుదేలైందని పశ్చిమ దేశాలు ప్రచారం చేస్తుండగా మరోవైపున చైనా పెట్రో సంస్థలు రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించినట్లు వార్తలు వచ్చాయి. 2022 నాటి వినియోగస్థాయికి చేరుకున్నట్లు లాభాలు 8.3శాతం పెరిగినట్లు ప్రకటించారు.చైనా, భారత్‌ రెండూ ఇంథనాన్ని దిగుమతి చేసుకునే దేశాలే.మార్చి 25వ తేదీన చైనాలో పెట్రోలు ధర 1.18 డాలర్లుండగా మనదేశంలో 1.25, పాకిస్థాన్‌లో 1.007డాలర్లు, బంగ్లాదేశ్‌లో 1.112 డాలర్లు ఉంది. అమెరికా వత్తిడి మేరకు మిత్రదేశమైన రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేత పర్యవసానాలు ఎలా ఉండేది అప్పుడే చెప్పలేము.

బ్రెజిల్‌ నుంచి విశాఖకు మాదక ద్రవ్యాలు – మార్కెట్‌గా మారిన భారత్‌ ?

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


బ్రెజిల్‌ నుంచి విశాఖ రేవుకు భారీ మొత్తంలో ఒక కంటెయినర్‌లో వచ్చిన మాదక ద్రవ్యాల గురించి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. సంధ్య ఆక్వా కంపెనీ చిరునామాతో వచ్చిన వాటి మార్కెట్‌ విలువ యాభై వేల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఆక్వా మేత తయారీకి అవసరమైన పొడి ఈస్టు(పులియపెట్టేందుకు అవసరమైన శిలీంధ్రము)ను తెప్పించామే తప్ప దానిలో మాదక ద్రవ్యాల గురించి తమకు తెలియదని సదరు కంపెనీ చెబుతోంది. దీని వెనుక తెలుగుదేశం, వైసిపి, బిజెపి నేతలు కంపెనీ యజమానులతో సంబంధాల గురించి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. బ్రెజిల్‌ ఎన్నికల్లో లూలా గెలిచినపుడు వైసిపి పక్ష నేతగా అభినందనలు పంపానే తప్ప వేరే సంబంధాలేవీ లేవని విజయసాయి రెడ్డి ప్రకటించుకున్నారు. సాక్షి పత్రిక వెలువరించిన కథనం తన ప్రతిష్టకు భంగం కలిగించినందున రు.20కోట్లకు దావా వేస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ప్రకటించారు.వివరాలు పూర్తిగా తెలియక ముందే చంద్రబాబు, లోకేష్‌ ముందుగానే స్పందించారంటే వారికి ముందే తెలుసు అన్నట్లుగా వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. విశాఖ రేవులో రాష్ట్ర అధికారులు సిబిఐకి సహకరించలేదనే విమర్శలు వచ్చాయి. వైసిపి నేత అభినందనలు తెలిపారంటే మాదక ద్రవ్యాలతో లూలాకూ సంబంధం ఉండవచ్చనే అనుమానాలు కలిగే విధంగా కొన్ని పత్రికల్లో రాతలు ఉన్నాయి.


ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా ఒకటి. లాటిన్‌ అమెరికాలో ముఠాలు అక్కడి ప్రభుత్వాల కూల్చివేతకు, ప్రజాస్వామ్యానికే ముప్పుగా ఈ ముఠాలు పరిణమించాయి. మనదేశ భద్రతకూ ప్రమాదం వస్తున్నదని అనేక మంది హెచ్చరిస్తున్నారు. గతంలో మనదేశం మాదకద్రవ్యాల సరఫరా మార్పిడి కేంద్రంగా ఉండగా ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్‌గా కూడా రూపొందినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే ఇటీవలి సంవత్సరాలలో భారీ మొత్తాలలో పట్టుబడుతున్నాయి. గత ఏడాది పాకిస్థాన్‌ నుంచి వచ్చిన రు. 25వేల కోట్ల విలువగల మాదక ద్రవ్యాలను మన అధికారులు పట్టుకున్నారు. అంతకు ముందు గుజరాత్‌లోని ముంద్రా రేవుకు వచ్చిన 21వేల విలువగల మూడువేల కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్న అంశం తెలిసిందే. రవాణా జరుగుతున్నవాటిలో పట్టుకుంటున్న మొత్తాలు స్వల్పమే అన్న సంగతి తెలిసిందే.గతేడాది 650బిలియన్‌ డాలర్ల విలువ గల లావాదేవీలు జరిగినట్లు అంచనా. చట్టవిరుద్దమైన ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల్లో 30శాతమని అంచనా. మాదకద్రవ్యాల ముఠాలు మనదేశంపై కేంద్రీకరిస్తున్నట్లు పట్టుబడుతున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశాల సంఘటిత ముఠాలు ఆసియా, అందులోనూ మనదేశం మీద కేంద్రీకరించటానికి కారణం నడమంత్రపు సిరి వచ్చిన కుటుంబాలు, వారి సంపదలు పెరగటంతో పాటు మాదక ద్రవ్యాల వాడకం కూడా పెరుగుతున్నది. అమెరికా, ఇతర ధనిక దేశాలలో వీటి వినియోగం గరిష్ట స్థాయికి చేరి మార్కెట్‌ పెరగకపోవటం, సింథటిక్‌ డ్రగ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వటం వంటి కారణాలతో కొత్త మార్కెట్ల వేటలో మనదేశం మీద కేంద్రీకరించారు. కొకెయిన్‌ తయారీకి అవసరమైన కోకా ఉత్పత్తి, దిగుబడి ఇటీవలి కాలంలో లాటిన్‌ అమెరికాలో విపరీతంగా పెరిగింది.కొత్త ప్రాంతాలు, దేశాలకు అది విస్తరించింది.మార్కెట్‌లో పోటీ, సరఫరాకు కొత్త మార్గాలను వెతుకుతున్నారు.


మాదక ద్రవ్యాల మాఫియా కుట్రలకు బలైన వారిలో ప్రస్తుత బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డిసిల్వా ఒకరు. లాటిన్‌ అమెరికాలో అనేక మంది రాజకీయ నేతలుా,మాఫియా డాన్లకు పెద్ద తేడా కనపడదు. అనేక దేశాల్లో వీరు ప్రజాస్వామిక, వామపక్ష నేతల సారధ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చివేయటం, అనేక మంది నేతల అపహరణ, హత్యల్లో భాగస్వాములు.బ్రెజిల్‌,మెక్సికో మాదక ద్రవ్య మాఫియాలకు పెట్టింది పేరు. వారు మిలిటరీతో సహా అన్ని రంగాలలో ప్రవేశించారు. అనేక దేశాల పాలకులను తెరవెనుక ఉండి నడిపించేది వారే.వామపక్ష ఉద్యమాలను అడ్డుకొనేందుకు అమెరికా ఇలాంటి శక్తులకు పూర్తి మద్దతు, అవసరమైన మారణాయుధాలను అందిస్తోంది. వారిని ప్రజాస్వామిక పరిరక్షకులుగా చిత్రిస్తోంది. బ్రెజిల్లో ఇలాంటి ముఠాలను అడ్డుకొనేందుకు, రవాణా నిరోధానికి లూలా ప్రభుత్వం త్రివిధ దళాల నుంచి వేలాది మిలిటరీ, ఇతర భద్రతా సిబ్బందిని రేవులు, విమానాశ్రయాల్లో నియమించాల్సి వచ్చిందంటే సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 2023 నవంబరులో ప్రారంభించిన వేట ఈ ఏడాది మే నెల వరకు జరుగుతుందని లూలా ప్రకటించారు. దీన్ని అడ్డుకొనేందుకు మాఫియా గాంగులు అనేక బస్సులు, ఒక రైలును దగ్దం చేశారు. అనేక నగరాల్లో ఈ శక్తుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయలేని స్థితి ఉంది. ఒక వైపు ఈ ముఠాలతో చేతులు కలిపిన రాజకీయ ప్రత్యర్ధులు, మరోవైపు ఈ గాంగ్‌లను ఎదుర్కొనేందుకు లూలా పని చేయాల్సి వస్తోంది. ఈ అణచివేత కారణంగానే బ్రెజిల్‌ నుంచి విశాఖకు డ్రగ్స్‌ తరలించి ఉండవచ్చు.


కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత మాదక ద్రవ్యాల రవాణా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కొకెయిన్‌ పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. ఒక టన్ను ఆకు బొలీవియా వంటి చోట్ల వెయ్యి డాలర్లకు దొరికితే ఐరోపా రేవుల్లో 35వేల డాలర్లు పలుకుతోంది. అది వినియోగదారుల వద్దకు వచ్చేసరికి మరికొన్ని రెట్లు అవుతుంది. కోకా ఆకుల ఉత్పత్తి ప్రపంచ కేంద్రంగా లాటిన్‌ అమెరికా ఉంది.మిగతా వాటి ఉత్పత్తి కూడా ఎక్కువే. గతంలో కరీబియన్‌ ప్రాంతం నుంచి రవాణా జరిగితే ఇప్పుడు బ్రెజిల్‌ నుంచి ఎక్కువగా ఉంది. వంద సంవత్సరాల క్రితమే వీటిపై నిషేధం పెట్టినప్పటికీ పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. డ్రగ్స్‌ ముఠాలతో పాటు వారికి అవసరమైన ఆయుధాలను అందచేసే పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున లబ్దిపొందుతున్నాయి.ప్రస్తుతం మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, సరఫరా అన్నీ వికేంద్రీకరణ కావటంతో ఎక్కడైనా పట్టుబడిన వారు తప్పితే మిగతా నేరగాండ్లు తప్పించుకుంటున్నారు. బ్రెజిల్‌ అధ్యక్షుడిగా పనిచేసిన పచ్చి మితవాది జైర్‌ బోల్సనారో మాదక ద్రవ్యాల మాఫియాల సంబంధాలు జగమెరిగిన సత్యం. బోల్సనారో మీదే ప్రస్తుత వామపక్ష అధ్యక్షుడు లూలా గెలిచాడు. బోల్సనారో ఏలుబడిలో రియో నగర శివార్లలో మాఫియా ముఠాలు పదిహేడు లక్షల మంది నివసించే బ్రిటన్‌లోని బర్మింగ్‌హౌమ్‌ నగరమంతటి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు విశ్లేషకులు వెల్లడించారు. అక్కడ వారే సర్వస్వం. ఇలాంటి వారు ప్రజాస్వామ్యానికి ముప్పు అని వేరే చెప్పనవసరం లేదు. ఇలాంటి గాంగుల ఉన్నందునే నేరాలు అదుపులో ఉంటున్నట్లు గతంలో బోల్సనారో బహిరంగంగా ప్రశంసలు కురింపించాడు.తుపాకులపై ఉన్న ఆంక్షలు తొలగించి వాటిని సులభంగా కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించాడు.


మూడు దశాబ్దాల క్రితం 1993లో బ్రెజిల్‌ సావోపాలో నగర జైల్లో నేరగాండ్ల మధ్య కొట్లాట జరిగింది. కారణం ఏమిటంటే ఫస్ట్‌ కాపిటల్‌ కమాండ్‌ అనే కొత్త మాఫియా ఏర్పడటమే. ఇప్పుడది లాటిన్‌ అమెరికాలో,ప్రపంచంలో అతిపెద్ద ముఠాగా ఎదిగింది.దానిలో నలభైవేల మంది జీవిత కాల సభ్యులు, మరో అరవై వేల మంది దానితో సంబంధాలు కలిగి ఉన్నారు. వారు వివిధ దేశాల్లో విస్తరించారు.పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌ నగరంలోని జైళ్లలో ఈ ముఠాకు చెందిన వెయ్యి మంది ఉన్నారని అక్కడి అధికారులే గతేడాది వెల్లడించారు.ఈ ముఠా నైజీరియాలో కూడా పెద్ద ఎత్తున విస్తరించింది. మన దేశంలో అనేక మంది నైజీరియన్లు మాదకద్రవ్యాలతో పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.కొందరు చెబుతున్నదాన్ని బట్టి ఒక నైజీరియన్‌ మనదేశంలో డ్రగ్‌మాఫియాను అదుపు చేస్తున్నట్లు వార్తలు.ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా పసిగట్టే శక్తి అమెరికా సిఐఏ, ఎఫ్‌బిఐలకు ఉందని చెబుతారు. పక్కనే ఉన్న మెక్సికో నుంచి వస్తున్న మాదకద్రవ్యాలను ఎందుకు అరికట్టలేకపోతోందన్నది ప్రశ్న. నిజానికి చేతగాక కాదు. ఆ ముఠాలతో అమెరికాలో ఉన్నవారికి ఉన్న లావాదేవీలే కారణం. అక్రమంగా ప్రవేశించేవారితో అమెరికాలోని పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాలలో చౌకగా పనిచేయించుకుంటారు. మాదక ద్రవ్యాలను తెప్పించుకుంటారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో డ్రగ్‌ మాఫియాదే రాజ్యం. వారికి తెలియకుండా అక్రమంగా ప్రవేశించేవారు ఉండరు. అక్కడి నుంచి మాదకద్రవ్యాల సరఫరా జరుగుతుంది. ఫెంటానిల్‌ అనే మత్తు పదార్ధం ఒక బిళ్ల తయారీకి పది సెంట్లు ఖర్చు అవుతుంది. దాన్ని ఔషధం పేరుతో నకిలీ మందుల చీటీలను సృష్టించి కొనుగోలు చేసి పది నుంచి 30 డాలర్ల వంతున అమ్ముతారు. పదికిలోల ఫెంటానిల్‌ 50వేల డాలర్లకు దొరికితే దాన్ని రెండు కోట్ల డాలర్లకు విక్రయిస్తారు. అమెరికాలో దీన్ని వాడి 2022లో లక్ష తొమ్మిదివేల మంది మరణించినట్లు నమోదైంది.


మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దాన్ని ఆసరా చేసుకొని ఇష్టంలేని ప్రభుత్వాలను కూల్చేందుకు, ప్రజా ఉద్యమాలను దెబ్బతీసేందుకు ముఠాలను అనేక దేశాల్లో అమెరికా ప్రోత్సహించింది. చివరికి అవి ఏకుమేకైనట్లుగా సంఘటిత ముఠాలుగా ఏర్పడి దేశాలనే శాసించే స్థితికి చేరాయి.తమలో తాము ఘర్షణ పడకుండా ఎవరి ప్రాంతంలో వారు దందా చేసుకొనేందుకు స్వతంత్ర (కార్టెల్స్‌) సంస్థలను ఏర్పాటు చేసుకొనే స్థాయికి ఎదిగాయి.అమెరికాలో తొలిసారి 1968లో అధ్యక్షుడిగా గెలిచిన రిచర్డ్‌ నిక్సన్‌ విధిలేని పరిస్థితిలో మాదక ద్రవ్యాలు పౌరుల తొలిశత్రువు అని ప్రకటించాడు. అప్పటికే హెరాయిన్‌, మార్జువానా అమెరికాలో విపరీతంగా పెరిగి, కొకెయిన్‌ రంగంలోకి వచ్చింది.మార్కెట్‌ ఎంతో లాభసాటిగా ఉండటంతో కార్టెల్స్‌కు శ్రీకారం చుట్టారు. ఇవి ఎంతగా ఎదిగాయంటే కరీబియన్‌ ప్రాంతంలో కొన్ని దీవులను కొనుగోలు చేసి అక్కడ ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేసి సరకు రవాణాకు విమానాలను కూడ కొనుగోలు చేశాయి. అలాంటి సంస్థలలో విబేధాలు తలెత్తి మార్కెట్‌ ఆక్రమణకు కొత్త సంస్థలను ఉనికిలోకి తెచ్చారు. ప్రత్యర్ధులను అంతం చేసేందుకు సాయుధ ముఠాలనూ రంగంలోకి తెచ్చారు. మాదక ద్రవ్యాల వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఉగ్రవాద సంస్థలు ఆ వైపు మళ్లాయి. అందువలన అవి చేసే కార్యకలాపాలను నార్కో టెర్రరిజం అని పిలుస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ పాలకుల కోరిక మేరకు జోక్యం చేసుకున్న సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా అక్కడ తాలిబాన్లను ప్రోత్సహించిన అమెరికా వారి చేత మాదక ద్రవ్యాలను కూడా ప్రోత్సహించింది. తరువాత వారే అమెరికాకు వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే.

మీడియా, సిబిఐ, ఇడి, ఎన్నికల బాండ్లు, ఎస్‌బిఐ, కోర్టుల నిష్పక్షపాతాన్ని ఎవరైనా నమ్మేదెలా !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎన్నికల బాండ్ల రూపంలో కార్పొరేట్ల కంపెనీల నుంచి విరాళాలను తీసుకోవటం అక్రమం అని ఆ పథకం ప్రారంభం నుంచి అనేక మంది చెబుతున్నా గుడ్డిగా గొర్రె కసాయివాడిని నమ్మినట్లు చాలా మంది అదొక మంచి సంస్కరణ అని మద్దతు ఇచ్చారు. సుప్రీం కోర్టు 2024ఫిబ్రవరి 15న ఇచ్చిన తీర్పుతో కొందరు స్వంత బుర్రలతో ఆలోచించటం మొదలు పెట్టారు. మరికొందరు మరక మంచిదే అన్నట్లుగా బాండ్లను, తీసుకున్న పార్టీలను సమర్థిస్తున్నారు. అనేక కేసుల్లో వచ్చిన తీర్పులు, వాటి తరువాత పదవి నుంచి దిగిపోయిన న్యాయమూర్తులు పొందిన పదవులను చూసిన తరువాత న్యాయవ్యవస్థ మీద జనం విశ్వాసం కోల్పోయారు. అలాంటి స్థితిలో ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు వ్యవహరించిన తీరుతో అనేక మందికి విశ్వాసం పెరిగింది. ఇది మరొక భ్రమకు దారి తీస్తుందా ? మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా మీద దర్యాప్తు సంస్థలు సమర్పించిన తప్పుడు వివరాల ప్రాతిపదికన దిగువ కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తే హైకోర్టు దాన్ని కొట్టివేసింది. పదేండ్ల పాటు వేధింపులకు, జైలుపాలై, ఉద్యోగం పోగొట్టుకున్న ఉదంతం చూసిన తరువాత ఎవరికైనా ఏమనిపిస్తుంది ? వ్యవస్థల మీద విశ్వాసం పెరుగుతుందా, తగ్గుతుందా !


పదేండ్ల క్రితం లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశాన్ని ఊపివేసిన, బిజెపికి ఓట్లు, అంతకంటే ఎక్కువ సీట్లు రాల్చిన కేసుల్లో 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం ఒకటి. దీని గురించి ఎంత మందికి జ్ఞాపకం ఉండి ఉంటుంది ? మరోసారి 2024 మార్చి 22న ఢిల్లీ హైకోర్టు దీని గురించి జనానికి గుర్తు చేసింది. అదేమంటే 2017 డిసెంబరు 21 ఎలాంటి ఆధారాలు లేవంటూ కొట్టివేసిన ప్రత్యేక కోర్టు తీర్పును తిరిగి విచారించాలని 2018 మార్చి 20వ తేదీన సిబిఐ దాఖలు చేసిన పిటీషన్‌కు అనుకూలంగా ఆరు సంవత్సరాల తరువాత ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సదరు తీర్పులో పరస్పర వైరుధ్యాలు కనిపించాయని, దాని మీద అప్పీలు చేయాలా లేదా అనేది సిబిఐ ఇష్టమని చెప్పింది. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే అనుమతించింది. ఒక తీర్పు మీద చేసిన అప్పీలును పరిష్కరించటానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్న న్యాయవ్యవస్థ మీద, అందునా ఏడుగురు న్యాయమూర్తులు విచారించిన తరువాత సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇచ్చిన తీర్పు మీద జనాలకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది ? ఎన్నికల బాండ్ల మీద స్పందించిన తీరుకు సంతోషించాలా ? 2జి కేసులో చేసిందాన్ని మరొక విధంగా భావించాలా ? యుపిఏ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న డిఎంకె నేత రాజా, అదే పార్టీ ఎంపీగా ఉన్న కనిమొళి, మరో 16 మంది అధికారులు, ఇతరులు 2జి కేసులో నిర్దోషులని 2017 తీర్పులో కోర్టు పేర్కొని వారిని విడుదల చేసింది. అనుచిత పద్దతుల్లో అయిన వారికి వీలుగా అనుసరించిన పద్దతి కారణంగా లక్షా 76వేల కోట్ల రూపాయలు దేశ ఖజానా నష్టపోయిందన్నది కేసులో వచ్చిన తీవ్ర ఆరోపణ. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ లైసన్సుదారులకు రు.30 కోట్ల మేర రాయితీలు అనుచితంగా ఇచ్చిందని, ప్రయివేటు మద్యం వ్యాపారులు దుకాణాలను దక్కించుకొనేందుకు అనువుగా విధానాన్ని రూపొందించినందుకు లబ్ది పొందిన వారు వంద కోట్ల రూపాయల ముడుపులు అందచేసినట్లు ఆరోపణలు చేశారు.


అవినీతి ఎంత అయినా అందుకు పాల్పడిన వారిని వదల కూడదు. వంద కోట్ల నిగ్గుతేల్చటంలో రెండు సంవత్సరాలుగా సిబిఐ, ఇడి కూడా విఫలమైంది. కొందరిని అనుమానితులు, సాక్షులు, నిందితులు అంటూ అరెస్టుచేసి వివరాలు చెప్పాలని వారిని అడుగుతున్నది, నిందితులను నిరవధికంగా బెయిలు రాకుండా జైలు పాలు చేసింది. తాము నిధులు ఇచ్చామంటూ అప్రూవర్లుగా మారిన కొందరు చెప్పటం తప్ప ఆ సొమ్ము ఎవరి ఖాతాకు, ఎలా చేరిందన్నది ఇంతవరకు తెలియదు. బిఆర్‌ఎస్‌ నాయకురాలు కల్వకుంట్ల కవితను ముందు సాక్షి అన్నారు, తరువాత నిందితురాలిగా ప్రకటించిన తరువాత అరెస్టు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరీవాల్‌ తమ ముందుకు హాజరుకావాలని ఇడి తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చింది. తాను ఏ హౌదాలో రావాలో చెప్పమని అడిగితే అదేం కుదరదు మేం రమ్మన్నాం గనుక రావాల్సిందే అన్నట్లుగా వ్యవహరించింది. దాంతో తనను బలవంతం చేస్తున్నారని, రక్షణ కల్పించాలని కేజరీ వాల్‌ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంగా వ్యక్తిగత హౌదాలో విచారణకు రావాలని, వచ్చిన తరువాత అరెస్టు చేస్తామని గాని లేదని గానీ తాము చెప్పటం లేదని ఇడి కోర్టులో వాదించింది. కోర్టు కేజరీవాల్‌ కోరినట్లుగా రక్షణ కల్పించేందుకు తిరస్కరించింది. వెంటనే ఇడి అధికారులు కేజరీవాల్‌ ఇంటికి పోవటం సోదా తతంగం, అరెస్టు అంతా నాటకీయంగా జరిగింది. కవిత, కేజరీవాల్‌ అవినీతికి పాల్పడ్డారా లేదా అనే సంగతి కాసేపు పక్కన పెడదాం. రెండు సంతవ్సరాల నుంచి జరుగుతున్న హడావుడి తరువాత ఒక వేళ అవినీతి జరిగి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలను వారు ఇండ్లలో భద్రపరచి ఇడి అధికారులు కనుగొనే విధంగా ఉంచుతారా ? వంద కోట్ల మద్యం కేసు మీద ఇంత తీవ్రంగా కేంద్రీకరించిన అదే సిబిఐ, ఇడి కాగ్‌ చెప్పిన లక్షా 76వేల కోట్ల నష్టం జరిగిందన్న కేసులో ముడుపులను నిరూపించటంలో ఎందుకు ఘోరంగా విఫలమైనట్లు ?


ప్రభుత్వ సంస్థలను తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకుంటారో ఎన్నికల బాండ్ల కేసులో ఎస్‌బిఐ తీరు తిరుగులేని విధంగా వెల్లడించింది. సుప్రీం కోర్టు తీర్పును వమ్ముచేసేందుకు తమ దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించాలంటే మూడు నెలలు పడుతుందని కోర్టునే తప్పుదారి పట్టించేందుకు చూసింది. చివరకు విధిలేక వెంటనే సమర్పించింది.అది ఎలా సాధ్యమైంది ? ముందుకు ఎందుకు ఎవరిని రక్షించేందుకు ఠలాయించినట్లు ?కచ్చితంగా బిజెపిని రక్షించేందుకే అన్నది స్పష్టం. రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన స్టేట్‌ బాంకు పరువు మురికి గంగలో కలిసింది.అక్రమాలకు పాల్పడిన ప్రయివేటు రంగ ఎస్‌ బాంకును ఆదుకొనేందుకు అధికారంలో ఉన్న పెద్దలు ఆరువేల కోట్ల రూపాయలను ఎస్‌బిఐ ద్వారా ఇప్పించినపుడే అది స్వతంత్ర సంస్థకాదు పాలకుల కీలుబొమ్మ అని తేలింది.


సిబిఐ, ఇడి డెరెక్టర్ల పదవీ కాలాన్ని నియంత్రించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందని 2023 జూలైలో ముగ్గురు సభ్యుల సుప్రీం కోర్టు బెంచ్‌ తీర్పు ఇచ్చింది. అందువలన ఆ సంస్థల పదవుల్లో ఉన్నవారు, వాటి కోసం అర్రులు చాస్తున్నవారు కేంద్ర పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుంటారన్నది స్పష్టం. అందుకు సిద్దపడ్డ వారినే ఎంపిక చేస్తారు. అందువలన అవి స్వతంత్ర సంస్థలని చెప్పటం జనాన్ని వంచించటం తప్ప మరొకటి కాదు. గతేడాది మార్చి నెలలో పద్నాలుగు ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఇడి అరెస్టుల నుంచి రక్షించాలని సుప్రీం కోర్టు తలుపు తట్టారు. గడచిన పదేండ్ల కాలంలో ఆ సంస్థ చేసిన అరెస్టుల్లో 95శాతం ప్రతిపక్షాలకు చెందిన వారే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆలోచన ఎంత ప్రమాదకరంగా ఉందో ఒక కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వెల్లడించింది.నిందితుడిని అరెస్టు చేసేందుకు ఇడి తగిన కారణాలు చూపుతూ ఎలాంటి మినహాయింపులు లేకుండా రాతపూర్వకంగా నోటీసు అందచేయాలని ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, ఇతరులు దాఖలు చేసిన పిటీషన్‌ మీద ఎలాంటి పునరాలోచన అవసరం లేదని పేర్కొన్నది. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదనే ఒక్క కారణంతో కూడా ఎవరినైనా అరెస్టు చేయవచ్చనే ఇడి వాదనను తోసిపుచ్చుతూ ఒక మనీలాండరింగ్‌ కేసులో గతేడాది అక్టోబరులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.ఇడి తీరు పారదర్శకంగా ఉండాలని, వేధింపులకు గురిచేస్తున్నట్లుగా ఉండకూడదని పేర్కొన్నది. మనీలాండరింగ్‌ చట్టం 2002లో సెక్షన్‌ 50 ప్రకారం సమన్లకు సాక్షి సహకరించటం లేనందున సెక్షన్‌ 19 ప్రకారం అరెస్టుకు అతడు లేదా ఆమె అర్హురాలే అని ఇడి చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. దీని మీద పునరాలోచన చేయాలంటూ ఇడి వాదనను సమర్ధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక పిటీషన్‌ దాఖలు చేయటం నిరంకుశ అధికారాలను దానికి కట్టబెట్టాలని చూడటమే.


ఎన్నికల బాండ్లు అంటే అక్రమంగా తీసుకొనే విరాళాలను సక్రమంగా చేసే పెద్ద అవినీతి తప్ప మరొకటి కాదు. దీని మీద దేశంలోని మీడియా వ్యవహరించిన తీరు సదరు అక్రమాన్ని దాచిపెట్టేందుకే చూసింది తప్ప మరొకటి కాదు. రాజీవ్‌ గాంధీ హయాంలో జరిగిన 64 కోట్ల బోఫోర్స్‌ కుంభకోణం ఏనుగు ముందు ఎలుక వంటిది. కార్పొరేట్‌ కంపెనీలు ఇచ్చిన విరాళాల గురించి ఏ ఒక్క బడా పత్రిక, ఛానల్‌ గానీ ఆరేండ్లుగా ఏ ఒక్క పరిశోధన కధనాన్ని ప్రచురించలేదు.ఈ కాలంలో గోడీ మీడియాగా మారిపోవటమే అసలు కారణం. గోడీ అంటే నచ్చిన వారి ఒళ్లో కూర్చుని కబుర్లు చెప్పటం. రాజకీయ నేతలను బెదిరించినట్లుగానే మీడియా యాజమాన్యాల మీద కూడా దర్యాప్తు సంస్థల కత్తిని చూపటం, ప్రధాన మీడియా కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో ఉండటం, అది నరేంద్రమోడీ మద్దతుదారుగా మారిన తరువాత వాస్తవాలను వెల్లడించేందుకు ఎవరైనా ఎందుకు ముందుకు వస్తారు. వాస్తవాలను వెల్లడిస్తున్న న్యూస్‌ క్లిక్‌ వంటి ఒక చిన్న సంస్థను కూడా సహించలేక దానికి చైనా నుంచి నిధులు వస్తున్నాయంటూ ఆధారం లేని ఆరోపణలను చేస్తూ యజమానులను ఎలా వెంటాడుతున్నదీ చూస్తున్నాము. నిజానికి మీడియా రంగంలోకి దిగితే అక్రమాలను వెలికి తీయటం కష్టం కాదు.ప్రస్తుతం మనదేశంలో నిలిచిపోయిన అఫ్‌పోస్ట్‌ ఇండియా పత్రిక సమాచార హక్కు చట్ట నిబంధనలను ఉపయోగించుకొని ఎన్నికల బాండ్ల అక్రమాన్ని వెల్లడించింది. గడువు ముగిసిన ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు తమ ఖాతాలకు మళ్లించుకోకూడదు. కానీ ప్రధాని నరేంద్రమోడీ కార్యాలయ జోక్యంతో 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పది కోట్ల రూపాయల మురిగిపోయిన బాండ్లను మార్చుకొన్న తీరును ఆ పత్రిక బయటపెట్టింది. ఆ బాండ్లు ఏ పార్టీకి వెళ్లి ఉంటాయో వేరే చెప్పనవసరం లేదు. 2017-18 – 2019-20 సంవత్సరాలలో 19 పార్టీలు స్వీకరించిన రు.6,201 కోట్ల ఎన్నికల బాండ్లలో 68శాతం బిజెపికే వెళ్లినట్లు రిపోర్టర్స్‌ కలెక్టివ్‌, ఆర్టికల్‌ 14 అనే మీడియా సంస్థలు సీల్డ్‌ కవర్లలో సుప్రీం కోర్టుకు ఇచ్చిన వాటిలో ఏముందో 2022లోనే వెల్లడించాయి. ఎన్నికల బాండ్ల కోసం కార్పొరేట్‌ సంస్థలు సూట్‌కేస్‌ కంపెనీలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని గతంలో ఎన్నికల కమిషన్‌ కేంద్ర న్యాయశాఖకు రాసిన లేఖ గురించి కూడా ది వైర్‌ వెల్లడించింది.


ముంబయి కేంద్రంగా హిందూస్థాన్‌ టైమ్స్‌లో పని చేసిన సీనియర్‌ ఎడిటర్‌ సతీష్‌ నందగోంకర్‌ను ఆ పత్రిక ఎడిటర్‌ వేధించిన తీరు అతను మరణించిన తరువాత వెల్లడైంది. ముంబై ప్రెస్‌ క్లబ్‌ మరణానికి దారి తీసిన కారణాలపై పరిశోధన జరిపింది. కొంత మంది ఫ్రీలాన్సర్‌ జర్నలిస్టులు రాసిన వార్తలను ప్రచురించాలని నందగోంకర్‌ సంపాదకుడికి పంపారు. వాటిని ప్రచురించకపోవటమే గాక పనికిమాలినవంటూ అవమానించాడు. అయితే పత్రికలో తనకున్న అవకాశాన్ని వినియోగించుకొని ఆన్‌లైన్‌ ఎడిషన్‌లో వాటిని ప్రచురించారు. అవి ముద్రణ సంచికల్లో రాలేదు. కొన్ని రోజుల తరువాత నందగోంకర్‌ ఆన్‌లైన్‌ స్టోరీలను ఎంపిక చేసి ప్రచురించే బాధ్యతల నుంచి తొలగించి అవమానించారు. ఆ వత్తిడితో అతను గుండెపోటుకు గురై మరణించినట్లు తేలింది. తమకు నచ్చని కథనాలను రాసే జర్నలిస్టులను యజమానులు ఎలా వేధించేది అందరికీ తెలిసిన సత్యమే. దీనికి మీడియా యాజమాన్యాలకు పార్టీలకు, అధికారంలో ఉన్నవారితో ఉన్న పరస్పర ప్రయోజన సంబంధాలే కారణం. గతంలో కూడా వివిధ వ్యవస్థలను అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ దుర్వినియోగం చేసింది. ప్రతిపక్షంగా దాన్ని విమర్శించిన బిజెపి ఇప్పుడు అంతకంటే వేగంగా, దారుణంగా దుర్వినియోగానికి పాల్పడుతోంది. వ్యవస్థల మీద జనాలకు విశ్వాసం కోల్పోవటాన్ని వేగిరం చేస్తోంది.