నయనతారకు ఒక న్యాయం,రామాలయ ట్రస్టుకు మరొకటా ! పవిత్ర కట్టడం కాదు సమాధి అన్న శంకరాచార్య !! హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదెవరు ?

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


నయనతార ప్రధాన పాత్రలో నటించిన అన్నపూరణి సినిమా తమ మనోభావాలను గాయపరచిందని హిందూత్వవాదులు ఫిర్యాదు చేసిన కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ ఆ సినిమాను తన వేదిక నుంచి తొలగించింది. ఒక బ్రాహ్మణ పూజారి కుమార్తె బతుకుతెరువు కోసం వంటగత్తెగా మారి ఎలా ఎదిగిందన్నది ప్రధాన కథ. తండ్రి ప్రసాదాలు వండి వడ్డిస్తే, కుటుంబ ఆంక్షలకు భిన్నంగా పాకశాస్త్ర కాలేజీలో చేరి మాంసాహార తయారీ నేర్చుకోవటమే గాక, ఒక రోజు తింటూ కనిపిస్తుంది. ఆ క్రమంలో ఆమెకు బలవంతంగా వివాహం చేసేందుకు తండ్రి చూడటంతో ఇష్టం లేనందున తన స్నేహితుడు ఫర్హాన్‌తో కలసి ఇంటి నుంచి పారిపోతుంది. ఈ సినిమాను సెన్సార్‌ బోర్డు అనుమతించిన తరువాత విడుదలైంది. అయితే కొద్ది రోజుల తరువాత ఆ కథ, చిత్రీకరణలో తమ దేవతలు మాంసాహారాన్ని తింటున్నట్లు చిత్రించారని, ఇది హిందూమత, బ్రాహ్మణ కుల మనోభావాలను గాయపరచిందంటూ ఫిర్యాదులు, పోలీసు కేసుల దాఖలు వరకు హిందూత్వవాదులు వెళ్లారు.లవ్‌ జీహాద్‌ కోణం కూడా ఉందని ఆరోపించారు. ఇదే సమయంలో అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట శాస్త్రవిరుద్దంగా జరుగుతోందంటూ ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏకంగా నలుగురు శంకరాచార్యలు తిరస్కరించారు. వారి మనోభావాలు దెబ్బతిన్న కారణంగానే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. భార్యలేని నరేంద్రమోడీ విగ్రహ ప్రతిష్ట పూజలకు అనర్హులని సామాజిక మాధ్యమంలో వ్యతిరేక, అనుకూల వాదనలు వెల్లువెత్తాయి. శంకరాచార్యుల వ్యాఖ్యల మీద మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రామాలయ ట్రస్టు చేస్తున్నది సనాతన హిందూ ధర్మ విరుద్దమని వారు ప్రకటించినప్పటికీ ఏ ఒక్క హిందూత్వవాది మనోభావాలూ గాయపడలేదు, ఆ కార్యక్రమం మీద ఎలాంటి పోలీసు కేసులు నమోదు చేయలేదు. ఎవరు ఎవరి మనోభావాలను దెబ్బతీశారు. కొందరిపైనే హిందూత్వవాదులు ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారు.శంకరాచార్యులు చెప్పిన మాటలనే ఏ నాస్తికులో, హేతువాదులో చెప్పి ఉంటే ఈ పాటికి ఎంత రచ్చ జరిగి ఉండేది !


బాబరీ మసీదు-రామ మందిర వివాదానికి సుప్రీం కోర్టు తెరదించింది. ఆ తీర్పు గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా దాన్నెవరూ సవాలు చేయలేదు. ఆ మేరకు బాబరీ మసీదును కూల్చిన ప్రాంతంలో రామాలయ నిర్మాణం జరుగుతోంది.అది పూర్తిగాక ముందే ప్రారంభానికి ముహూర్తం పెట్టటంతో కొన్ని వివాదాలు తలెత్తాయి. వాటిని నాస్తికులు, హేతువాదులు, అబ్రహామిక్‌ మతాల వారో చెప్పలేదు. సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధులుగా, భాష్యం చెబుతున్న నలుగురు శంకరాచార్యులే అభ్యంతరాలను లేవనెత్తారు. రామాలయ నిర్మాణం కావించిన నరేంద్రమోడీ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిధిగా రావటాన్ని సహించలేని శంకరాచార్యులు తమ మనోభావాలను గాయపరుస్తున్నారంటూ వారి మీద సామాజిక మాధ్యమంలో మోడీ భక్తులు విరుచుకుపడుతున్నారు. అసలు రామాలయ ఉద్యమంలో వారెక్కడ ఉన్నారని సవాళ్లు విసురుతున్నారు. తమ మనోభావాలను దెబ్బతీస్తూ సనాతన ధర్మ విరుద్ద పద్దతులకు తెరతీశారని శంకరాచార్యులను అనుసరించేవారు కుమిలిపోతున్నారు. ఎవరైనా నరేంద్రమోడీ చేస్తున్నది ధర్మవిరుద్దం అంటూ వీధుల్లోకి వస్తే వారి వీపులకు హామీ లేదనే వాతావరణం నేడుంది అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. హిందూ మతంలోని అసంబద్దతలు, మతం లేదా మనుస్మృతి పేరుతో అమలు జరిపిన వివక్షాపూరితమైన చర్యలను ప్రశ్నించిన నాస్తికులు, హేతువాదులు, సంస్కరణ వాదులు, పురోగామివాదులు, కమ్యూనిస్టులను హిందూ ద్వేషులు, సనాతన ధర్మవిరోధులుగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు హిందూత్వను పరిరక్షిస్తామని చెబుతున్నవారు శంకరాచార్యులను కూడా ఆ జాబితాలో చేరుస్తారా ? లేదా సనాతనాన్ని నిలబెట్టాలని కంకణం కట్టుకున్నాం అనుకుంటున్నవారు రామాలయాన్ని రాజకీయం చేసిన నరేంద్రమోడీ, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలను ధర్మం కోసం- దేశం కోసం వ్యతిరేకిస్తారో లేదో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చింది.


హిందూ ఉనికి కోసం పోరాటం(స్ట్రగుల్‌ ఫర్‌ హిందూ ఎగ్జిస్టెన్స్‌.ఓఆర్‌జి) అనే వెబ్‌ సైట్‌ జనవరి ఏడవ తేదీన దైనిక్‌ జాగరణ్‌ అనే పత్రిక ప్రచురించిన ఒక వ్యాసం ఆధారంగా చేసిన వ్యాఖ్యను తన సైట్‌లో ఉంచింది. నలుగురు సనాతన హిందూ ధర్మ గురువులు ఎందుకు రామ మందిర ప్రాణప్రతిష్టలో పాల్గొనటం లేదు అన్నది దాని శీర్షిక. దాన్ని రాసిన వారు ఉపేంద్ర భారతి, శౌనక్‌ రారు చౌదరి. వారి రచనలో పేర్కొన్న కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.” గోవర్ధన మఠ పూరీ పీఠ శంకరాచార్య స్వామి శ్రీ నిశ్చలానంద సరస్వతి అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరస్కరించారు. ఆయనిలా చెప్పారు.” పవిత్ర ఆలయ నిర్మాణంవైపుగా ప్రభుత్వ ప్రయత్నం లేదు ” ఆయన మాటల్లోనే ” ఒక సమాధి ” అని ఆ నిర్మాణాన్ని వర్ణించటాన్ని బట్టి సాంప్రదాయ ఆలయ నిర్మాణానికి ఉండవలసిన పూజ్యభావం మరియు పవిత్రత దానికి లేవు అని సూచించినట్లయింది. తగిన గౌరవంలేని స్థలానికి వెళ్లటం ఇష్టం లేదనే ఆయన నిర్ణయం వెల్లడిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవటం అంటే శ్రీరాముడిని తిరస్కరించటం కాదు. కొందరు నేతల అవకాశవాద, తిమ్మినిబమ్మిని చేసే రాజకీయాలకు వ్యతిరేకం.


శృంగేరి శారదా పీఠ శంకరాచార్య స్వామి శ్రీ భారతీ తీర్ధ ఎందుకు తిరస్కరించారంటే ఆలయ నిర్మాణం అసంపూర్తిగా జరగటమే.అలాంటి దానికి వెళ్లటం సరైన చర్యకాదు. దీనితో పాటే ఆసియాలో అతి పెద్దదైన మసీదును అయోధ్యలో నిర్మించాలని తలపెట్టటం పట్ల ఆయన తన ఆందోళన వెల్లడించారు. దురదృష్టకరమైన పరిణామాలుగా భావిస్తున్నారు.తాను, ఇతరులు కోర్టుకు రామమందిరం సాక్ష్యాలను సమర్పించామని, కానీ రామమందిర ట్రస్ట్‌ లేదా దాని ప్రతినిధులుగానీ ఆలయనిర్మాణంలో తమ సలహాలు తీసుకోలేదని భారతీ తీర్ధ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలో ద్వంద్వ వైఖరి ఉన్నట్లు శంకరాచార్య విమర్శించారు. రామాలయ నిర్మాణం చేసినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మనోభావాలను ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతీ తీర్ధ నిరాకరణకు ప్రాణ ప్రతిష్ట పవిత్రత, నిర్మాణ క్రమం పట్ల అసంతృప్తి, మత వ్యవహారాల పట్ల ప్రభుత్వ వైఖరికి తిరస్కరణగా చెప్పవచ్చు.


ద్వారకా పీఠ శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి అనేక అంశాల మీద ఆందోళన వెల్లడించారు. పుష్య మాసం ప్రాణప్రతిష్టకు శుభప్రదం కాదన్నది మొదటి విమర్శ.దేవతల ప్రతిష్టాపన అశుభ గడియల్లో చేపట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. సరైన సమయం వచ్చే శ్రీరామ నవమి అవుతుంది.రామ నవమి నాటికి ఎన్నికల నియమావళి అడ్డం వస్తుంది గనుక ముందుగానే ఎంచుకోవటం వ్యూహాత్మకమని, అప్పుడు జరిపితే పెద్దగా ఉపయోగం ఉండదని బిజెపి నేతలు భావించిన కారణంగానే నిర్మాణం పూర్తి కాకుండా ముందుగానే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారని సదానంద సరస్వతి భావిస్తున్నారు. మతపరమైన అంశాలు, రాజకీయ ఉద్దేశ్యాలు, ప్రాణ ప్రతిష్ట సమయం, నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభించటం అనే అంశాలు అయోధ్య రావటం లేదని చెప్పటానికి సదానంద సరస్వతి కారణాలుగా చెప్పవచ్చు.


ఉత్తరాఖండ్‌ జ్యోతిర్‌మఠ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తిరస్కరణకు మతపరమైన, సామాజిక అంశాలు ఉన్నాయి. వేదాలు, హిందూ మత గ్రంధాల్లో బ్రాహ్మణుల పాత్ర గురించి ప్రత్యేక స్థానం ఉంది. పూజారులుగా కేవలం వారినే నియమించాలి.ప్రత్యేకించి శూద్రులను పూజారులుగా నియమించటాన్ని ఆయన విమర్శిస్తున్నారు. మత ఆచారాల ఫలాలను అందరూ పొందటానికి అర్హులే అయినప్పటికీ శూద్రులు సేవకు మాత్రమే పరిమితం, సనాతన హిందూ ధర్మంలో వివక్ష ఉందనటాన్ని ఆయన ఖండిస్తారు.బ్రాహ్మణులకు బదులు పూజారులుగా శూద్రుల నియామకం వేదాలకు విరుద్ధం అని భావిస్తారు. అలాంటి నియామకాలు శ్రీ రాముడితో ముడివడిన ఆదర్శాలకు విరుద్దం, వేదాల్లో చెప్పినట్లు సామాజిక వ్యవస్థ ఉండాలి అంటారు. వీటికి విరుద్దంగా జరుగుతున్న కారణంగానే అవిముక్తేశ్వరానంద హాజరు కావటం లేదు. రాజకీయ లబ్దికోసం ఒకనాడు శంకరాచార్యుల పాదాల ముందు మోకరిల్లిన నరేంద్రమోడీ ఇప్పుడు సనాతన విలువలు, మర్యాదలకు భిన్నంగా అధర్మంగా వ్యవహరించటం దురదృష్టకరం. రామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రారు ప్రధాని మోడీలో విష్ణు అవతారాన్ని మాత్రమే చూస్తున్నారు. నలుగురు శంకరాచార్యల్లో శివుడిని చూడలేకపోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్టలో హిందూ ధర్మంలోని ఉన్నత ధర్మ గురువులు భాగస్వాములు గాకపోవటం దురదృష్టకరం. ఇది కేవలం మతపరమైన ఎదురుదెబ్బే కాదు సామాజిక, రాజకీయ చిక్కులను కూడా తీసుకువస్తాయి. ఇదీ స్ట్రగుల్‌ ఫర్‌ హిందూ ఎగ్జిస్టెన్స్‌.ఓఆర్‌జి విశ్లేషణ, వ్యాఖ్య సారం. ఈ భావాలు, అభిప్రాయాలతో నిజమైన హిందువులు ఏకీభవిస్తారు తప్ప రాజకీయ హిందూత్వ వాదులకు మింగుడు పడదు. పురోగామి వాదుల దృష్టిలో మతం వ్యక్తిగతం, రాజీకీయాల్లోకి చొప్పించకూడదని ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు మతాన్ని రాజకీయాలకు ముడి పెట్టారని ఏకంగా శంకరాచార్యలు చెప్పటమే కొసమెరుపు.


విశ్వాసుల ఖర్మో లేక రాముడికి పరీక్షో గానీ రామాలయాన్ని కూడా సొమ్ము చేసుకొనేందుకు మోసగాండ్లు బయలుదేరారు. జనవరి 22 అయోధ్య రామాలయ ప్రతిష్టకు ఆహ్వానం అంటూ వాట్సాప్‌ విశ్వవిద్యాలయంలో మోసగాండ్లు రెచ్చిపోతున్నారని వార్తలు.” రామజన్మ భూమి గృహసంపర్క్‌ అభియాన్‌.ఏపికే ” పేరుతో ఉన్న యాప్‌ను ఫోన్లో ఏర్పాటు చేసుకోవాలని, దానితో ప్రముఖుల పాస్‌లను పొందాలని కోరుతున్న మెసేజ్‌లు మొదలయ్యాయి.ఎవరైనా ఆ పని చేస్తే తమ సమాచారం మొత్తాన్ని దొంగలకు స్వయంగా అప్పగించినట్లే.ఇక అనేక వెబ్‌సైట్లు కూడా ప్రారంభమై దోచుకోవటం ప్రారంభించాయి. రాముడి ప్రసాదం ఉచితంగా పంపుతామని, మీరు చేయవలసిందల్లా రవాణా ఖర్చులు ముందుగా పంపటమేనని పేర్కొంటున్నాయి. ఇది మీ జేబులోని సొమ్ముతో పాటు మీ సమాచారాన్ని కూడా మోసగాండ్లకు అప్పగించటమే అవుతుంది.

దురహంకార జాతీయవాదంతో మాల్దీవులు మరింత దూరమైతే ఎవరికి నష్టం !

Tags

, , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


రాజకీయాలు అవి స్థానికం, జాతీయం, అంతర్జాతీయం ఏవైనా వైరం పెరిగినపుడు ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయటం ఒక ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిణామాల్లో అది జరిగితే సంభవించే నష్టం ఎంతో ఎక్కువ. ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటి. ఆసియాలో రెండవది. కేవలం ఐదు లక్షల 21వేల జనాభా మాత్రమే కలిగిన మాల్దీవులతో ఇప్పుడు ప్రపంచంలో జనాభాలో అతి పెద్ద స్థానంలో ఉన్న మన దేశంలో కొందరి వైఖరి దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను అంటున్నట్లుగా ఉంది. సున్నితమైన అనేక అంశాలను విస్మరిస్తున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరి మాల్దీవులతో సంబంధాల అంశం ఇప్పుడు మన సామాజిక మాధ్యమం, మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. మన ప్రధాని నరేంద్రమోడీని అవమానించినందుకుగాను దానికి తగిన బుద్ది చెప్పాలని, మన విహార యాత్రీకులు వెళ్లరాదని పిలుపు ఇస్తున్నారు. ఒక విమానయాన సంస్థ ఇప్పటికే నిరవధికంగా ప్రయాణాలను నిలిపివేసినట్లు ప్రకటించింది, హౌటల్‌ బుకింగులను కూడా మన వారు రద్దు చేసుకున్నట్లు వార్తలు. మాల్దీవుల ప్రయాణం, అక్కడి హౌటళ్ల రేట్లు సగానికి సగం తగ్గినట్లు ప్రచారం. కొందరు క్రీడాకారులు, సినీతారలు కూడా స్పందించారు. గరిష్టంగా విహార యాత్రీకులను పంపుతున్న మన దేశాన్ని, ఫ్రధానిని కూడా అలా కించపరుస్తారా అని మండిపడ్డారు.


సామాజిక మాధ్యమంలో కించపరుస్తూ వ్యాఖ్యానించినందుకు మల్షా షరీఫ్‌, మరియం షిహునా, అబ్దుల్లా మఝూన్‌ మజీద్‌ అనే ముగ్గురు ఉప మంత్రులను మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు సస్పెండ్‌ చేశారు. మోడీని వారు హాస్యగాడు, ఉగ్రవాది, ఇజ్రాయెల్‌ తొత్తు అని, మన దేశంలో పరిశుభ్రత తక్కువ అని పేర్కొన్నారు. ఇది బాధ్యతా రాహిత్యం తప్ప మరొకటి కాదు.అరేబియా సముద్రంలోని మన లక్షద్వీప్‌లో విహార యాత్రలను ప్రోత్సహించేందుకు గాను మోడీ ఒక బీచ్‌లో కూర్చున్న వీడియోను పోస్టు చేసిన తరువాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.తమ దేశానికి యాత్రీకులు రాకుండా చేసేందుకే ఇలా చేశారని అక్కడి కొందరు భావించారు. కించపరచటం గురించి మాలే లోని మన రాయబారి అక్కడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మాల్దీవుల ప్రతిపక్ష నేతలు అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం పెడతామనేవరకు వెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలను తాము గమనించామని, అవి వారి వ్యక్తిగతం తప్ప అధికారిక వైఖరి కాదని అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. జరిగినదాని మీద విచారణకు ఆదేశించారని రాయిటర్స్‌ పేర్కొన్నది. మాల్దీవుల్లో ఎవరు అధికారానికి వచ్చినా గతంలో తొలి విదేశీ పర్యటన భారత్‌తోనే ప్రారంభమయ్యేది. అలాంటిది ముయిజ్జు తొలుత టర్కీ, తరువాత యుఏయి, ఈనెల 8 నుంచి 12వరకు చైనా పర్యటించారు. ఇది మన అహాన్ని దెబ్బతీసిందా ?


ప్రపంచమంతటా సంకుచిత జాతీయ వాదం పెరిగింది. ఎవరికి వారు తమ దేశానికే అగ్రస్థానం ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవైపు వసుధైక కుటుంబం, ప్రపంచమంతా నేడు ఒక కుగ్రామం అని చెప్పేవారు కూడా సంకుచితంగా గిరిగీసుకొంటున్నారు. ఇప్పుడు మాల్దీవులను దారికి తెచ్చుకోవాలంటే అక్కడికి మన యాత్రీకులు వెళ్లకూడదని చెబుతున్నవారు ప్రతికూల ఫలితాల నిచ్చే ఆర్థిక జాతీయవాదానికి లోనైనట్లు చెప్పవచ్చు. మన దేశంలో ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలోనే చైనా పర్యటనలో అధ్యక్షుడు ముయిజ్జు 20 ఒప్పందాలు చేసుకున్నట్లు, పెద్ద ఎత్తున యాత్రీకులను తమ దేశానికి పంపాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. లడక్‌ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఉదంతాల తరువాత చైనాకు బుద్ది చెప్పాలని, దాని వస్తువులను బహిష్కరించాలని, అక్కడి నుంచి దిగుమతులను మానుకొని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు, దిగుమతులను రికార్డు స్థాయిలో చేసుకుంటున్నాము. 2022-23లో మన దేశం 9,850 కోట్ల డాలర్ల మేర వస్తువులను దిగుమతి చేసుకుంటే మన ఎగుమతులు 1,530 కోట్లు, అవి పోను నిఖరంగా 8,320కోట్ల డాలర్లను డ్రాగన్‌ దేశానికి సమర్పించున్నాము. మన దేశాన్ని, ప్రధానిని విమర్శించినా మౌనంగా ఉండాలా అంటే తగిన పద్దతుల్లో దానికి నిరసన తెపాల్సిందే, ఏదైనా ఒక దేశాన్ని ఏ రూపంలోనైనా మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలన్న దురహంకార ఆలోచనే ఎవరినైనా తప్పుదారి పట్టిస్తుంది. ఇతరులను మరోపక్కకు నెడుతుంది. ఇప్పుడు మాల్దీవుల విషయంలో అదే జరుగుతోందా ?

మాల్దీవులకు వెళ్ల వద్దన్న దాన్ని ఎంత మేరకు ఎంత మంది పాటించారు. చైనా వస్తువు బహిష్కరణ పిలుపు మాదిరే ఉన్నట్లు ఇప్పటికే సమాచారం వస్తోంది. అక్కడికి బదులు లక్షద్వీపాలకు వెళ్లాలని చెబుతున్నారు. ఎక్కడకు వెళ్లాలనేది ఎవరికి వారు నిర్ణయించుకొనేది తప్ప మరొకటి కాదు. గతంతో పోలిస్తే లక్షద్వీప్‌ గురించి గత కొద్ది రోజులుగా సమాచారం అడుగుతున్నవారు 50శాతం పెరిగారు తప్ప ఆచరణలోకి రావటం లేదని టూరిజం రంగంలో ఉన్నవారు చెప్పారు. ప్రస్తుతం కేరళలోని కోచి నుంచి రోజూ లక్షద్వీప్‌కు తిరుగుతున్న విమానం ఒకటి.దానిలో ఉన్న సీట్లు 72, మార్చి నెలాఖరు వరకు సీట్లన్ని నిండినట్లు ఇండియా టుడే పేర్కొన్నది. ఇదే సమయంలో మాల్దీవులకు చెడు వార్తలేమీ లేవని కూడా చెప్పింది. ఇప్పటికే బుక్‌ చేసుకున్న వారు రద్దు చేసుకుంటే చెల్లించిన సొమ్ము వెనక్కి రాదన్న సంగతి తెలిసిందే. లక్షద్వీపాలకు యాత్రీకులను ఆకర్షించేందుకే మన ప్రధాని నరేంద్రమోడీ అక్కడికి వెళ్లి బీచ్‌ ఫొటోలను ప్రపంచానికి విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. దాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు.తాజాగా వచ్చిన వార్తల ప్రకారం గోవాకు వచ్చే విదేశీ యాత్రీకుల సంఖ్య పడిపోయినట్లు టూరిజం శాఖా మంత్రి రోహన్‌ కౌంతే ప్రకటించారు. గోవాకు రష్యా, ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌ నుంచి వచ్చే యాత్రీకులు గణనీయంగా ఉంటారని ప్రస్తుతం ఆ దేశాలు సంక్షోభంలో ఉన్నందున రాక తగ్గినట్లు చెప్పారు. సౌదీ అరేబియా చేపట్టిన ఎర్ర సముద్ర ప్రాజెక్టు నిర్ణీత గడువుకంటే ముందుగానే పూర్తి కానుండటం, దీనికి తోడు బహరెయిన్‌ క్రమంగా వివాహాలకు కేంద్రంగా మారుతుండటంతో గోవా టూరిజానికి సవాలు పెరుగుతున్నట్లు కూడా మంత్రి చెప్పారు. రష్యా, బ్రిటన్ల మీద ఎక్కువగా ఆధారపడటాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం కూడా వచ్చిందన్నారు.


రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు చిన్న దేశం కావచ్చుగాని కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. ఈ కారణంగానే బ్రిటీషు వారు ఆక్రమించిన మారిషస్‌కు చెందిన డిగోగార్సియా దీవులను అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఖాళీ చేసేందుకు మొరాయిస్తున్నది. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది. మనదేశంలోని కన్యాకుమారికి ఆ దీవులు 1,796కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అది మనదేశంతో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకూ ఆందోళన కలిగించే అంశమే. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా అనుసరిస్తున్న విధానాల కారణంగా దాని పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఆ వరుసలో మాల్దీవులు కూడా చేరితే ఏమిటన్నదే వారి ఆందోళన. ఆ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా 1965లో బ్రిటన్‌ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది. అనేక విధాలుగా సాయం చేసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. తమను అదుకోవాలని అనేక దేశాలను కోరినా ఎవరూ ముందుకు రాలేదు. భారత్‌ స్పందించింది, ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో ఆగ్రా వైమానిక దళ కేంద్రం నుంచి ఐదు వందల మంది పారా ట్రూపర్లను దించి కుట్రను విఫలం గావించింది. అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి. గతేడాది ఎన్నికల ప్రచారంలో ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరిని ప్రకటించినప్పటికీ ఎన్నికైన తరువాత స్వరాన్ని తగ్గించారు. ఈ పూర్వరంగంలో ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను దిగజారేట్లు చేశాయి. మరింత గట్టి సంబంధాలను పెట్టుకుంటామని, నుంచి పర్యాటకులను మరింతగా పంపాలనిఐదురోజుల పర్యటనలో ముయిజ్జు చైనా నేతలను కోరినట్లు వార్తలు వచ్చాయి. మాల్దీవులకు పెద్ద సంఖ్యలో భారత్‌ నుంచి పర్యాటకులు ప్రస్తుతం పదకొండు శాతం వెళుతున్నమాట వాస్తవం,90శాతం ఇతర దేశాల నుంచి ఉన్నారని మరచిపోకూడదు..


2019లో మనదేశంతో కుదుర్చుకున్న జలవాతావరణ(హైడ్రాలజీ) పరిశీలన పధకం నుంచి తాము వైదొలుగుతున్నట్లు మాల్దీవుల అధికారులు 2023 డిసెంబరు 14న తెలిపారు. తమ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు తప్ప చైనాకు దగ్గరవుతున్నందున ఈ నిర్ణయం తీసుకోలేదని మాల్దీవుల అధికారులు చెప్పారు. సాధారణంగా మాల్దీవుల్లో ఎవరు అధికారానికి వచ్చినా తొలి అధికారిక పర్యటన మనదేశంలో జరపటం సాంప్రదాయంగా వస్తోంది. దానికి కూడా నూతన అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు స్వస్తి పలికి టర్కీ వెళ్లాడు. దీంతో మన నేతల అహం దెబ్బతిన్నదా ? అంతే గాక మాల్దీవుల్లో ఉన్న మన సైనికులు కూడా వెనక్కు వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇదే సమయంలో హిందూ మహాసముద్రంలో అట్టడుగు జలాల్లో పరిశోధనలు చేసేందుకు తమ యువాన్‌ వాంగ్‌ నౌక లంగరు వేసేందుకు అనుమతించాలని మాల్దీవులను కోరటం గమనించాల్సిన అంశం. మాల్దీవుల మొగ్గు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణాలు ఏమిటన్నది తీవ్రంగా ఆలోచించాలి.


మాల్దీవులకు చైనా నుంచి విమాన మార్గం 4,900 కిలోమీటర్ల దూరం ఉంది. సముద్ర మార్గంలో 4,682 నాటికల్‌ మైళ్లు లేదా 8,670 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రాంతీయ, ప్రపంచ యుద్దాలు తలెత్తితే సముద్రాల్లోని ఒక చిన్న దీవి, దాని మీద పెత్తనం లేదా ఎవరి ప్రభావం ఉంది అన్నది కూడా ఎంతో కీలకమైనదే. ఈ కారణంగానే మిలిటరీ వ్యూహకర్తలు రూపొందించిన ప్రణాళికలు, ఎత్తుగడల ప్రకారం ఇరుగు పొరుగు, దూరంగా ఉన్న దేశాలు కూడా సంబంధాలను నిర్వహిస్తుంటాయి. 2023 సెప్టెంబరు 30న జరిగిన ఎన్నికలు చైనా – భారత్‌ మధ్య పోటీగా జరిగాయి. ఇంత బాహాటంగా ఏ దేశంలోనూ రాజకీయ పార్టీలు పోటీ చేసి ఉండవు. తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. 2020లో ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక కూటమిగా ఏర్పడి ” భారత్‌ను బయటకు పంపాలి( భారత్‌ అవుట్‌) ” అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించాయి. మనదేశానికి చెందిన జిఎంఆర్‌ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక అధ్యక్షుడు నషీద్‌ మద్దతు కూడా ఉందని చెబుతారు. అదే పెద్ద మనిషి మీద అవినీతి అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తటంతో జనంలో నిరసన తలెత్తి చివరకు 2012లో రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్నాడు. జనం ఛీకొట్టిన నషీద్‌ మనదేశంతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది. ఇప్పుడు మన దేశం నుంచి యాత్రీకులు వెళ్లనందున మాల్దీవుల్లో ఆర్థిక సంక్షోభమేమీ రాదు. ఈ పూర్వరంగంలో దూరమౌతున్న దాన్ని దగ్గరకు ఎలా తెచ్చుకోవాలా, మన ప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలా అని చూడాలి తప్ప నీ సంగతి చూస్తా అన్నట్లుగా ఉంటే నడిచే రోజులు కావివి.

మలుపు తిరిగిన రామాలయ వివాదం : నలుగురు శంకరాచార్యలూ దూరం ! వారి డిఎన్‌ఏల గురించి బిజెపి ప్రశ్నిస్తుందా !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


మొన్న సిపిఎం నేత సీతారాం ఏచూరి, నిన్న కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ అయోధ్య రామాలయ ప్రతిష్టకు రావటం లేదని చెప్పగానే బిజెపి నేతలు అసలు వారి డిఎన్‌ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందంటూ ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ప్రచారదాడి చేస్తున్నారు. రధయాత్ర నిర్వహించిన ఎల్‌కె అద్వానీని ఆ ఛాయలకే రావద్దని చెప్పిన పెద్దలు ఓటు బాంకు రాజకీయం గాకపోతే వారి డిఎన్‌ఏ గురించి ముందే తెలిసినపుడు అసలు ఆహ్వానాలు పంపటం ఎందుకు ? కమ్యూనిస్టులు దేవాలయాలు, మసీదులు, చర్చ్‌ల ప్రారంభాలకు రారని అందరికీ తెలుసు.వారు లేదా కాంగ్రెస్‌ నేతలు గానీ బిజెపి మత రాజకీయాలను విమర్శించటం ఇప్పుడు కొత్తగా చేసింది కాదు. హిందూమతానికి భాష్యకారులుగా, పీఠాధిపతులుగా ఉన్న నలుగురు శంకారాచార్యలూ అయోధ్య వెళ్లటం లేదన్న సమాచారం ఇది రాసిన సమయానికి ఉంది. చివరి నిమిషంలో వారు మనసు మార్చుకుంటారో లేక ఏం చేస్తారు అన్నది పెద్ద సమస్య కాదు. పూరీ శంకరాచార్య నిశ్శలానంద, ఉత్తరాఖండ్‌ జ్యోతిర్‌ మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద తాము రావటం లేదని తమ కారణాలను వివరిస్తూ చెప్పారు. ద్వారకా పీఠం అధిపతి స్వామి సదానంద సరస్వతి, శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్ధ రామాలయ ప్రతిష్టకు ఆశీర్వచనాలు చెప్పారే తప్ప వస్తున్నదీ లేనిదీ ఇంతవరకు ప్రకటించలేదు. ఆలయ నిర్మాణం పూర్తి కానందున నలుగురమూ అయోధ్య వెళ్లటం లేదని అవిముక్తేశ్వరానంద చెప్పిన మాటల మీద వారు మౌనంగా ఉన్నారు. అందరి తరఫున మాట్లాడేందుకు అనుమతించలేదని ఎవరూ ఇంతవరకు ప్రకటించలేదు. హిందూ శాస్త్రాలకు వ్యతిరేకంగా అసంపూర్తి నిర్మాణంలో ఉన్న దేవాలయాన్ని ప్రారంభించటం తగదని అవిముక్తేశ్వరానంద ఎక్స్‌లో ఒక ప్రకటన చేశారు. తమ చర్యలను మోడీ వ్యతిరేకమైనవిగా చూడరాదని, శాస్త్ర వ్యతిరేకులుగా మారటం ఇష్టం లేకనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మేమెందుకు వెళ్లటం లేదు ? మాకు ద్వేషం ఉండి కాదు. శాస్త్ర విధిని పాటించటం, పాటించేట్లు చూడటం శంకరాచార్యుల బాధ్యత, ఇక్కడ శాస్త్ర విధిని విస్మరించారు, ఆలయ నిర్మాణం ఇంకా పూర్తిగాక ముందే ప్రాణ ప్రతిష్టకు పూనుకోవటం ఇక్కడ పెద్ద సమస్య, దీన్ని మేం చెబితే మమ్మల్ని మోడీ వ్యతిరేకులని పిలుస్తున్నారు, ఇక్కడ మోడీ వ్యతిరేకత ఏముంది అని అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. రామాలయాన్ని రాజకీయం చేస్తున్నారని రాజకీయ పార్టీలు చెబితే, శాస్త్రవిరుద్దమని శంకరాచార్యలు భావిస్తున్నారు. రాజకీయ నేతల డిఎన్‌ఏల గురించి ధ్వజమెత్తుతున్న బిజెపి శంకరాచార్యల డిఎన్‌ఏల గురించి ప్రశ్నించగలదా ? వారిని అనుసరించే వారి మనోభావాలను గాయపరచి తట్టుకోగలదా ?


” మోడీ గారు విగ్రహాన్ని తాకి ప్రారంభోత్సవం చేస్తుంటే నేను అక్కడ ఉండి చేసేదేమిటి ?నేను లేచి నిలబడి చప్పట్లు కొట్టాలా ? నాకు పదవి అవసరం లేదు, ఇప్పటికే నేను పెద్ద స్థితిలో ఉన్నాను, నాకు పేరు అవసరం లేదు. శంకరాచార్యలు అక్కడికి వెళ్లి చేసేదేమిటి ఇది అహంకారం కాదు, నేనున్న స్థానపు గౌరవం గురించి నాకు తెలుసు, అందుకే నేను అక్కడికి వెళ్లటం లేదు, నాకు ఆహ్వానం వచ్చింది, దానిలో నాతో పాటు ఒకరిని తీసుకురావచ్చు అని ఉంది, నాతో పాటు ఒకరిని నేనెందుకు తీసుకుపోవాలి ” అని ఒక వీడియోలో స్వామి నిశ్చలానంద ప్రశ్నించారు. మత వ్యవహారాల్లో మోడీ జోక్యం చేసుకుంటున్నారని, తనకు అయోధ్య అంటే వ్యతిరేకత లేదని కూడా చెప్పారు. విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్‌(రామాలయ నిర్మాణ, నిర్వహణ) ప్రధాన కార్యదర్శి చంపత్‌ రారు అమర్‌ ఉజాలా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామాలయం వైష్టవులకు చెందిన రామానంద సాంప్రదాయానికి చెందింది తప్ప సన్యాసులది లేదా శైవులదీ కాదు అని చెప్పారు.ఆది శంకరుడు శైవుడు, ఆయన స్థాపించిన నాలుగు శంకరమఠాధిపతులూ శైవులే, అయితే వారు విష్ణుమూర్తిని కూడా అంగీకరిస్తారు.శైవుల అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ధ్వని చంపత్‌ రారులో వినిపించింది.రారు ప్రకటన తరువాత అవిముక్తేశ్వరానంద స్పందించారు.” ధర్మశాస్త్రాల ప్రకారమే జరగాలని మేమూ, జనం కూడా కోరుకుంటున్నారు. రాముడు మనకు చెప్పిన పాప పుణ్యాలేమిటో మనకు తెలిసినవే. రామాలయ ప్రతిష్టకు రావటం లేదన్న మా నిర్ణయం ఏమిటో బహిర్గతమైంది. అక్కడకు శంకరాచార్యలు రానవసరం లేదని చంపత్‌ రారు చెబుతున్నారు, ఎందుకంటే ఆ స్థలం రామానంద సంప్రదాయానికి చెందినది అంటున్నారు. ఇక్కడ సమస్య ఏమంటే రామాలయం వైష్ణవులదే అయితే చంపత్‌ రారు అక్కడెందుకు ఉన్నారు ? నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా, పూర్వపు అయోధ్య సంస్థానం, రామాలయ ట్రస్టీ రాజా సాహెబ్‌ అక్కడ ఎందుకు ఉన్నట్లు ? వారు రాజీనామా చేసి రామానంద సంప్రదాయ ప్రతినిధులకు ఆలయాన్ని ప్రతిష్టాపనకు ముందే అప్పగించాలి.ప్రతిష్టను రాజకీయం చేశారు, మతాధిపతులను కావాలనే పక్కన పెట్టారు, ఆలయం రామానంద సంప్రదాయవాదులదే అయితే వారు విరాళాలు తీసుకొనే ముందే ఆ ముక్క చెప్పాలి. ఆ సమయంలో మీరు మా నుంచి కూడా విరాళాలు పొందారు.అలయం శంకరాచార్యులది కాదంటే మీరు మానుంచి విరాళాలను ఎందుకు స్వీకరించినట్లు? అని అవిముక్తేశ్వరానంద ప్రశ్నించారు. రామానంద పరంపరలో నిర్మోహీ అఖారా మతపరమైన చిహ్నం, సుప్రీం కోర్టు తీర్పు రాకముందు అక్కడ పూజలు నిర్వహిస్తున్న సంస్థ అది, దానికే ఆ బాధ్యతను కూడా మరోసారి అప్పగించాలి, మీరు మరింత మంది పూజారులను ఎందుకు నియమిస్తున్నారు, పూజ బాధ్యతను రామానంద సాంప్రదాయం ప్రకారం నిర్మోహి అఖారాకు అప్పగించాలి, దాన్ని మేము ఆమోదిస్తాము, దీంతో నలుగురు శంకరాచార్యలూ సంతోషిస్తారు అని కూడా ముక్తేశ్వరానంద అన్నారు.


రామాలయ నిర్మాణాన్ని ఓట్లకోసం బిజెపి ఉపయోగిస్తున్నదని లోకం కోడై కూస్తున్నది. వచ్చేలోక్‌సభ ఎన్నికల్లో రామాలయాన్ని ప్రభావితం చేసేందుకు ఐదువేల మంది చొప్పున ప్రతి నియోజకవర్గంలో నియమించాలని బిజెపి పధకం వేసినట్లు ఒక బిజెపి నేత చెప్పినట్లు ది ప్రింట్‌ న్యూస్‌ పోర్టల్‌ తన విశ్లేషణలో పేర్కొన్నది. రానున్న మూడు మాసాలలో దేశమంతటి నుంచి రెండున్నర కోట్ల మందికి రామదర్శనం ఏర్పాటు చేసి హిందూ ఓటు బాంకును ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నట్లు కూడా తెలిపింది. అయోధ్యను సందర్శించిన వారు తమ అనుభవాలను ఇతరులకు తెలియచేస్తారని బిజెపి ఎంపీ ప్రదీప్‌ చౌదరి చెప్పినట్లు ప్రింట్‌ రాసింది. రామాలయ ప్రతిష్ట రాజకీయం తప్ప సనాతనం కాదని అయోధ్యలోని మహంతులు కొందరు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించే ప్రాణ ప్రతిష్ట కార్యాక్రమాన్ని వారణాసికి చెందిన లక్ష్మీకాంత దీక్షిత్‌ నిర్వహిస్తున్నారు. దీపావళి ఉత్సవానికి మమ్మల్ని ఆహ్వానించారు ఇప్పుడెందుకు పిలవలేదని మహంత్‌ భానుదాస్‌ ప్రశ్నించారు. విమర్శలు చేసిన శంకరాచార్యలను సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున మోడీ అభిమానులుగా ఉన్న వారు చీల్చి చెండాడుతున్నారు. వారు ఎప్పుడైనా రామాలయం కోసం ఎప్పుడైనా ఆందోళన చేశారా అని ప్రశ్నిస్తున్నారు.శంకరాచార్యులను అనుసరించే వారి మనోభావాలను వారు తీవ్రంగా గాయపరుస్తున్నారు.మొత్తం మీద రాముడిని మరోసారి వివాదాస్పదం కావించారు. వీధుల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు

షేక్‌ హసీనా విజయం : చైనాకు మరింత దగ్గరగా బంగ్లాదేశ్‌ !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


డెబ్బయ్యారు సంవత్సరాల షేక్‌ హసీనా వరుసగా బంగ్లాదేశ్‌లో నాలుగవ సారి అధికారానికి వచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో అధికారంలో ఉన్న మరే దేశ మహిళ ఎవరూ ఇంత దీర్ఘకాలం పదవిలో లేరు.పార్లమెంటులోని 350 స్థానాలకు గాను 300 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. మరో 50 సీట్లను మహిళలకు కేటాయించారు. పార్లమెంటులో తెచ్చుకున్న సీట్ల దామాషాకు అనుగుణంగా ఆయా పార్టీల నుంచి మహిళను నామినేట్‌ చేస్తారు. ఆదివారం నాడు జరిగిన ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ 222 సాధించింది.ఆమెకు మద్దతు ఇస్తున్న కూటమిలోని చిన్న పార్టీలు, స్వతంత్రులను కూడా కలుపుకుంటే మద్దతు ఇంకా ఎక్కువే ఉంటుంది. రద్దయిన పార్లమెంటులో అవామీ లీగ్‌కు 306 స్థానాలున్నాయి. పదిహేడు కోట్ల మంది జనాభా ఉన్న ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బిఎన్‌పి), పరిమితమైన బలం కలిగిన కొన్ని కమ్యూనిస్టు, ఇతర వామపక్షాలతో కూడిన కూటమి, ఇతర చిన్న పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఎన్నికలను తటస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని, ప్రతిపక్షాల అణచివేతకు నిరసనగా తాము పోటీ చేయటం లేదని అవి ప్రకటించాయి.


ఈ ఎన్నికలలో ఓటర్లు చాలా తక్కువ మంది పాల్గొనటాన్ని బట్టి పాలకపక్షం మీద తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చెప్పవచ్చు.2018లో జరిగిన ఎన్నికల్లో 80.2, అంతకు ముందు 61.29శాతం ఓట్లు పోలుకాగా తాజాగా 41.8శాతమే నమోదైంది. బంగ్లాదేశ్‌లో ఎవరు అధికారంలో ఉన్నా ఎన్నికల అక్రమాల ఆరోపణలు, విమర్శలు, బహిష్కరించటాలు మామూలే. తమ ప్రభుత్వం మీద వచ్చిన విమర్శలను హసీనా తిరస్కరించారు, స్వేచ్చగా, న్యాయంగా ఎన్నికలు జరిగినట్లు చెప్పారు. పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కోసం సాగించిన పోరు ఫలించి 1971లో స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఏర్పడింది. ఆ విముక్తి పోరాటానికి నాయకత్వం వహించి బంగ బంధుగా పేరు తెచ్చుకున్న తొలి ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ కుమార్తె షేక్‌ హసీనా. 1975లో జరిగిన మిలిటరీ తిరుగుబాటులో ముజిబుర్‌ రహమాన్‌తో పాటు కుటుంబ సభ్యులందరినీ చంపివేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న హసీనా, ఆమె సోదరి రెహనా, హసీనా భర్త ఎంఎ వాజెద్‌ మియా ఢిల్లీలో అణుశాస్త్రవేత్తగా పని చేస్తుండటతో అతను, వారి పిల్లలు కూడా హత్యా కాండ నుంచి తప్పించుకున్నారు. తొలుత వారు జర్మనీలో, తరువాత మనదేశంలో ఆశ్రయం పొందారు. ఆమె ప్రవాసంలో ఉండగానే 1981లో అవామీ లీగ్‌ నేతగా ఎన్నికయ్యారు. తొలుత ప్రతిపక్ష నేతగా ఆ తరువాత 1996 నుంచి 2001వరకు తొలిసారి ప్రధానిగా పని చేశారు.రెండవ సారి 2009లో బాధ్యతలు చేపట్టి అదే పదవిలో కొనసాగుతున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు ఆమె మీద పందొమ్మిది సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినట్లు చెబుతారు. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా పేరుతెచ్చుకున్నారు. ఆరుపదుల వయస్సులో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె ప్రకటించినప్పటికీ 76 సంవత్సరాలు వచ్చినా కొనసాగుతూనే ఉన్నారు.ఆమె సోదరి రెహనా లేదా కుమారుడు సాజిద్‌ వాహెద్‌ రాజకీయ వారసులుగా వస్తారని చెబుతున్నారు. ముజిబుర్‌ రహమాన్‌ హత్య తరువాత మిలిటరీ నియంత జియావుర్‌ రహమాన్‌ అధ్యక్షుడిగా అధికారానికి వచ్చాడు. 1978లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీని ఏర్పాటు చేశాడు.1981లో మిలిటరీ తిరుగుబాటులో హతమయ్యాడు. తరువాత ఆ పార్టీకి భార్య ఖలీదా జియా నేతృత్వం వహించటమే కాదు, రెండుసార్లు ప్రధానిగా పని చేశారు.తాజా ఎన్నికలను బహిష్కరించారు. జియాఉర్‌ రహమాన్‌ అధికారంలో ఉండగా ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు చూశాడు. వర్తమాన రాజకీయాల్లో బిఎన్‌పి మితవాద పార్టీగా ఉంది. దానికి జమాయతే ఇస్లామీ పార్టీ మద్దతు ఇస్తున్నది. మరో మిలిటరీ నియంత ఎర్షాద్‌ అధికారాన్ని చేజిక్కించుకోవటంతో అతగాడిని గద్దె దించేందుకు షేక్‌ హసీనా-ఖలీదా జియా ఇద్దరు చేతులు కలిపి ఆందోళనలు నిర్వహించారు. ఎర్షాద్‌ పదవి నుంచి దిగిన తరువాత ఇద్దరూ ప్రత్యర్దులుగా మారారు.


షేక్‌ హసీనా పదవీ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.కరోనా ముందు వరకు మెరుగ్గా కనిపించిన ఆర్థిక స్థితి తరువాత ఇప్పటి వరకు కోలుకోలేదు.దాంతో 470 కోట్ల డాలర్ల రుణం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ధరలు ప్రత్యేకించి ఆహారద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది.కరెన్సీ విలువను తగ్గించటంతో జనజీవితాలు అతలాకుతలమయ్యాయి. దాంతో ప్రధాన ఎగుమతి పరిశ్రమ రెడీమేడ్‌ దుస్తుల తయారీ రంగంలో కార్మికులు సమ్మెలకు దిగారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 40 నుంచి 17 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. అవి మూడు నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఈ ఏడాది విదేశీ చెల్లింపులు ఎక్కువగా ఉండటంతో పరిస్థితి ఇంకా దిగజారవచ్చని చెబుతున్నారు. బంగ్లా విముక్తి పోరాట సమయంలో పాకిస్థాన్‌ పాలకులతో చేతులు కలిపిన విద్రోహులను శిక్షించేందుకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. విచారణ జరిపి అనేక మందిని ఉరితీశారు. హేతువాదులను శిక్షించేందుకు, ఇస్లాంను కించపరిచేవారిని దండించేందుకు కొత్త చట్టాలను తేవాలంటూ హిఫాజత్‌ ఇ ఇస్లామ్‌ అనే మితవాద సంస్థ పుట్టుకు వచ్చింది.లౌకికవాదులు, హేతువాదులను ఇస్లామిక్‌ స్టేట్‌, ఆల్‌ఖైదా వంటి సంస్థలకు చెందిన వారు అనేక మందిని హత్య చేశారు. వారిపట్ల కఠినంగా వ్యవహరించి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ అమెరికా, ఐరోపాలోని మానవహక్కుల నంస్థలు విమర్శలు చేశాయి. ఎన్నికలను తటస్థ ఆపద్దర్మ ప్రభుత్వం నిర్వహించాలన్న నిబంధనను 2014 ఎన్నికల్లో హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. ఆ కారణంతో బిఎన్‌పి 2014 ఎన్నికలను బహిష్కరించింది. ఇప్పుడూ అదే చెప్పింది.


తాజాగా ఎన్నికలు స్వేచ్చగా జరగలేదని అమెరికా, బ్రిటన్‌ ఆరోపించాయి. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో బంగ్లాదేశ్‌ ఈ దేశాలకు అనుకూలంగా లేకపోవటమే దీనికి కారణం అని చెప్పవచ్చు. ఒక దేశ అంతర్గత అంశాల్లో మరొక దేశం జోక్యం చేసుకోవటం, వ్యాఖ్యానించటం తగనిపని, నిజంగా అక్రమాలు జరిగితే అక్కడి జనమే తేల్చుకోవాలి తప్ప మరొకరికి హక్కు లేదు.మరోవైపున చైనా, రష్యా, భారత్‌లు హసీనాను అభినందించాయి. ఆ మేరకు రాయబారులు ఆమెను కలిశారు. ప్రధాని నరేంద్రమోడీ ఫోన్‌ చేసి హసీనాకు అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఉన్న ఏకైక అణువిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించిన రష్యా రానున్న రోజుల్లో మరింతగా సహకరిస్తామని ప్రకటించింది. ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌ విదేశాంగ విధానం గురించి అనేక కథనాలు వచ్చాయి. చైనా ఇస్తున్న అప్పులతో అది మరొక శ్రీలంకగా మారుతుందన్న ప్రచారం వాటిలో ఒకటి. ఇటీవలి కాలంలో రెండు దేశాలు మరింతగా సన్నిహితం కావటమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అమెరికా, ఇతర దేశాల మాదిరి తాజా ఎన్నికల్లో ఫలానా చర్యలు తీసుకోవాలి అంటూ చైనా ఎలాంటి షరతులను బంగ్లా ప్రభుత్వం ముందు ఉంచలేదు. రెండు దేశాల మధ్య సంబంధాలు పెరగటానికి 2012లో జరిగిన పరిణామం ఒక ప్రధాన కారణం. గంగోత్రి నుంచి ప్రారంభమైన గంగానది ఉపనదిని బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు. అది అక్కడ పెద్ద నది. పద్మానది మీద కట్టిన భారీ వంతెన నిర్మాణంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రపంచబాంకు ఆ ఏడాది బహిరంగంగా ప్రకటించింది.నిధులు నిలిపివేయటంతో పరువు, ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా భావించిన బంగ్లా ప్రభుత్వం చైనాను సంప్రదించగా 360 కోట్ల డాలర్లు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. రాజధాని ఢాకాతో 21 జిల్లాలను అది అనుసంధానం గావించింది.తరువాత ఇతర దేశాల నుంచి తీసుకున్నట్లుగానే ప్రాజెక్టు రుణాలను చైనా నుంచి కూడా బంగ్లాదేశ్‌ పొందింది. 2016ay బిఆర్‌ఐ పధకంలో చేరి విద్యుత్‌ కేంద్రాలు, రైల్వే లైన్లు,రోడ్లు, రేవులు, సొరంగాల వంటి పదిహేడు ప్రాజెక్టులకు రుణాలు పొందింది. అంతే కాదు, తనకు అవసరమైన ఆయుధాల్లో 74శాతం చైనా నుంచి పొందుతున్నది. పశ్చిమ దేశాలతో ప్రత్యేకించి అమెరికా పోల్చుకుంటే ఎంతా లాభసాటిగా ఉండటమే చైనా పెట్టుబడుల వైపు మొగ్గుకు కారణం.


తన దారికి రాని దేశాల మీద మానవహక్కుల ఉల్లంఘన పేరుతో అమెరికా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ మీద కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ కారణంగా కూడా హసీనా సర్కార్‌ చైనాకు మరింత చేరువైంది.2021లో అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బంగ్లాదేశ్‌ను ఆహ్వానించలేదు. అప్పుడు చైనా రాయబారి బంగ్లాకు మద్దతుగా నిలిచారు.తన ఇండో-పసిఫిక్‌ వ్యూహం(క్వాడ్‌)లో చైనాకు వ్యతిరేకంగా కలసి రావాలని జోబైడెన్‌ తెచ్చిన వత్తిడిని బంగ్లా తిరస్కరించింది. ప్రచ్చన్న యుద్ధ ఆలోచనలు, కూటమి రాజకీయాలకు బంగ్లాదేశ్‌ దూరంగా ఉండాలని 2022లో చైనా బహిరంగంగానే హితవు చెప్పింది. దాంతో తాము అలీన విధానంతో స్వతంత్ర వైఖరిని అనుసరిస్తామని తరువాత బంగ్లాదేశ్‌ ప్రకటించింది. అమెరికా చెబుతున్నదానికి భిన్నంగా తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని ఒకే చైనా అని కూడా చెప్పింది.కొల్‌కతాకు 212 నాటికల్‌ మైళ్ల దూరంలో బంగాళఖాత తీరంలోని కాక్స్‌బజార్‌ రేవు ప్రాంతంలో నిర్మించిన జలాంతర్గామి కేంద్రానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయంచేసినంత మాత్రాన భారత్‌ రక్షణకు ఎలాంటి ముప్పు లేదని బంగ్లాదేశ్‌ ప్రకటించింది. చైనా తమకు ఆర్థిక భాగస్వామి తప్ప రక్షణకు కాదని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలతో భారత్‌ కూడా లబ్దిపొందుతుందని ఈశాన్య భారతానికి వేగంగా భూ, జలమార్గాల ద్వారా సరకు రవాణా చేయవచ్చని కొందరు నిపుణులు చెప్పారు. చైనా పెట్టుబడులతో బంగ్లాదేశ్‌కు ఎలాటి ముప్పు లేదని వాటి మీద పెట్టుబడి కంటే లాభాలు ఎక్కువ అని జహంగీర్‌ నగర్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సాహెబా నామ్‌ ఖాన్‌ చెప్పాడు.


ఇక చైనా రుణాల గురించి తప్పుడు ప్రచారం బంగ్లాదేశ్‌ మీద కూడా చేస్తున్నారు.ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు 2023లో 7,230 కోట్ల డాలర్ల విదేశీ రుణం ఉంది. వాటిలో ప్రపంచ బాంకు నుంచి 1,820, ఆసియన్‌ అభివృద్ధి బాంకు నుంచి 1,330, జపాన్‌ నుంచి 920, రష్యా నుంచి 510, చైనా నుంచి 480, భారత్‌ నుంచి 102 కోట్లు ఉన్నాయని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఎంఎ అబ్దుల్‌ మోమెన్‌ చెప్పాడు. దీన్ని బంగ్లాదేశ్‌కు అన్ని దేశాల నుంచి రుణాలు కావాలి, తీసుకుంటున్నది. ఇవి గాక వివిధ పథకాలకు తీసుకొనే రుణాలు వేరు. అమెరికా తెస్తున్న వత్తిడి, సృష్టించిన పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నదని మన నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాకు తెలిపినట్లు 2023 ఆగస్టు 28వ తేదీ హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక రియాజుల్‌ హెచ్‌ లస్కర్‌ పేరుతో ఒక సమీక్ష ప్రచురించింది.ప్రతిపక్ష బిఎన్‌పికి మతోన్మాద జమాతే ఇస్లామీ మద్దతు ఉంది, దానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నందున షేక్‌ హసీనా గెలవటం మన దేశానికి ఊరట కలిగించే అంశమే.

అయోధ్య రామాలయ రాజకీయం : అద్వానీని రావద్దన్నారు ! పిలిచినా వెళ్లేది లేదన్నారు పూరీ శంకరాచార్య !!

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావటం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.దీని మీద మోడీ భక్తులు సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నారు. వస్తే ఎంత రాకపోతే ఎంత అసలు రామాలయం కోసం పూరీ శంకరాచార్య ఏం చేశారంటూ నిలదీస్తున్నారు.రధయాత్ర నిర్వహించి, బాబరీ మసీదు కూల్చివేత కేసులను ఎదుర్కొన్న ఎల్‌కె అద్వానీకి ఆహ్వానం ఇస్తూనే అసలు కార్యక్రమానికి రావద్దని చెప్పినట్లు నిర్వాహకులు ప్రకటించారు. చిత్రం ఏమిటంటే రామాలయంతో ఎలాంటి సంబంధంలేని, బాబరీ మసీదు కూల్చివేతను ఖండించిన సీతారాం ఏచూరి, ఇతర పార్టీల నేతలనూ ఆహ్వానించారు గానీ రావద్దని చెప్పలేదు. హాజరు కావటం లేదని చెప్పిన వారి మీద ప్రచారదాడులు చేస్తున్నారు. అద్వానీ(96), మురళీమనోహర్‌ జోషి(90) ఏండ్ల పెద్దవారు గనుక వారు వచ్చి ఇబ్బంది పడతారని అందువల్లనే రావద్దని చెప్పామని విమర్శలు చెలరేగిన తరువాత వివరణ ఇచ్చుకున్నారు. తరువాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా విశ్వహిందూపరిషత్‌ నేతలు ఆహ్వానించినట్లు ప్రకటించారు. కానీ మాజీ ప్రధాని దేవెగౌడకూ 90 ఏండ్లే అయినప్పటికీ ఆయన వయసు రీత్యా రావద్దని నిర్వాహకులు చెప్పలేదు.ఎందుకు అంటే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత దేవెగౌడ-కుమారస్వామి పార్టీ జెడిఎస్‌ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపితో జట్టుకట్టాలని నిర్ణయించింది. అందుకే అయోధ్య రామాలయ రాజకీయం రంజుగా నడుస్తోంది అని చెప్పాల్సి వస్తోంది. ఈ మాట అంటే కొందరు మనోభావాలను ముందుకు తెచ్చుకొని బాధపడితే చేసేదేమీ లేదు. వయసు రీత్యా కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ శుభ కార్యాలు జరిగినపుడు ఆహ్వానం పలకటం, వారు రాలేమని చెప్పినపుడు వీలు చూసుకొని రావాలని ఆకాంక్ష వెలిబుచ్చటం మన భారతీయ సంప్రదాయం. కానీ దాన్ని తుంగలో తొక్కి రావద్దని మేమే చెప్పామని నిర్వాహకులు చెప్పటాన్ని ఏ సంప్రదాయం అంటారో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు.రధయాత్ర పేరుతో బిజెపి నేత ఎల్‌కె అద్వానీ నిర్వహించిన కార్యక్రమం అది సృష్టించిన వినాశకర, అవాంఛనీయ ఉదంతాల గురించి తెలిసిందే. వారు వస్తారా లేదా స్పందన ఏమిటో చూడాల్సి ఉంది. ఒక వేళ వారు నిజంగా రాగలిగినా రానిచ్చేవారా అన్న సందేహాలు కూడా వారిని వద్దన్న తరువాత జనంలో తలెత్తాయి. తనదారిని సుగమం చేసుకొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన వెంటనే అద్వానీ, ఎంఎ జోషి వంటి వారితో మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అది ఇంతవరకు ఒక్కసారి కూడా సమావేశమైన సమాచారంగానీ, ఇచ్చిన మార్గదర్శనం గురించి గానీ ఎవరికీ తెలియదు. గుడులకు పరిమితం కావాల్సిన రాముడిని ఓట్ల కోసం వీధుల్లోకి తెచ్చారు.


ఆది శంకరాచార్య ఏర్పాటు చేసిన నాలుగు పీఠాల్లో పూరీలోని గోవర్ధన మఠం ఒకటి. దాని అధిపతిగా ఉన్న స్వామి నిశ్చలానంద సరస్వతి(80)కి కూడా రామాలయ నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దాన్ని తిరస్కరించినట్లు స్వామి చెప్పారు, గతవారంలో ఒక టీవీ ఛానల్‌తో, అదే విధంగా మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన ఒక సనాతన ధర్మ సభకు హాజరైనపుడు విలేకర్లతో మాట్లాడారు. తనకు పంపిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఒక వేళ హాజరు కావాలని అనుకుంటే తోడుగా గరిష్టంగా ఒకరిని మాత్రమే తెచ్చుకోవాలని దానిలో పేర్కొన్నట్లు చెబుతూ ఒక్కరు కాదు వందమందిని అనుమతించినా ఆ రోజు తాను వెళ్లేది లేదని నిశ్చలానంద చెప్పారు. గతంలో కూడా వెళ్లానని భవిష్యత్‌లో కూడా అయోధ్య వెళ్లి రాముడిని సందర్శిస్తానని అన్నారు. రాముడి విగ్రహాన్ని శాస్త్ర విధి ప్రకారం ఏర్పాటు చేయాలని ఇప్పుడు అలా జరగటం లేదన్నారు. తమ మఠపరిధి ప్రయాగ వరకు ఉందని అయినప్పటికీ తమ సలహా, మార్గదర్శనం కానీ కోరలేదని చెప్పారు. ఈ పరిణామాల గురించి ” నేను ఏ మాత్రం ఆశాభంగం చెందలేదు. ఇతర హిందూ సనాతనుల మాదిరి సంతోషంగా ఉన్నాను. ప్రత్యేకించి ప్రస్తుత ప్రధాని ఒక లౌకికవాదిగా కనిపించేందుకు తాపత్రయపడటం లేదు.విగ్రహారాధన, హిందూత్వ అంశాలలో అతనెంతో ధైర్యశాలి, వాటి పట్ల గర్వపడతారు. తనను ఒక లౌకికవాదిగా ప్రదర్శించుకొనేందుకు అతనేమీ పిరికివాడు కాదు.అయితే ఒక శంకరాచార్యగా నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి ? మోడీగారు విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంటే చప్పట్లు కొట్టి పొగడాలా ? అని ప్రశ్నించారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే ముందు తనను నరేంద్రమోడీ ఎలా కలిశారో నిశ్చలానంద గుర్తు చేసుకున్నారు.కరోనాకు ముందు యోగి ఆదిత్యనాధ్‌ ఏడాదికి రెండు మూడు సార్లు కలిసేవారు. విశ్వహిందూ పరిషత్‌ మాజీ అధ్యక్షుడు దివంగత అశోక్‌ సింఘాల్‌ కనీసం 70సార్లు కలిశారని చెప్పారు.తీర్థస్థలాలను అభివృద్ధి పేరుతో భోగస్థలాలుగా మార్చుతున్నారు,టూరిజం కేంద్రాలుగా చేస్తున్నారని అన్నారు. ఇదే అంశంపై సోమవారం నాడు మరోసారి నిశ్చలానంద తన వ్యతిరేకతను వెల్లడించారు. చత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయపూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 17న ఒడిషా ప్రభుత్వం ప్రారంభించనున్న శ్రీమందిర్‌ పరికర్మ ప్రకల్ప పధకం గురించి స్పందించారు.పుణ్య స్థలాలను విహార కేంద్రాలుగా మార్చటం అంటే వాటిని విలాస కేంద్రాలుగా మార్చటమే అన్నారు.హౌటళ్ల వారు, రవాణా రంగంలో ఉన్నవారు లబ్ది పొందుతారు తప్ప ఆ కేంద్రాలకు ఉన్న ప్రత్యేకత తగ్గుతుందన్నారు.ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని అయితే వెళ్లాలా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. రామాలయ ప్రతిష్టాపన గురించి చేసిన వ్యాఖ్యల మీద నిశ్చలానందపై కాషాయ మరుగుజ్జు దళాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నాయి.


సిఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 టీవీ ఛానల్‌తో 30 నిమిషాలు మాట్లాడిన శంకరాచార్య రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించేటపుడు క్రతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.చాతుర్వర్ణ వ్యవస్థకు భగవద్గీతలోని కృష్ణుడి బోధనల్లోనే మూలాలు ఉన్నాయి.గుణము, చర్యలను బట్టి నాలుగు వర్ణాలుగా సమాజాన్ని వర్గీకరించారు.ఇది పుట్టుకను బట్టి అని చెప్పటంగాక చేసే పనులు, వాటి స్వభావాన్ని వర్ణాలు ఉంటాయి.పశ్చిమ దేశాల్లో కూడా వర్ణ వ్యవస్థ మాదిరే విద్య, ఆర్థికం, రక్షణ, సేవా రంగాలు ఉన్నాయి.ఇప్పుడు వర్తమాన సమాజంలో పోలీసుల లేదా ప్రధానులు ఏలాంటి పాత్రను పోషించారో వర్ణ వ్యవస్థలో కూ ఎవరికి వారు తమ స్థితిని బట్టి సమతూకాన్ని నిర్వహించారు. శివపురాణంలో వివిధ రకాల బ్రాహ్మలు ఉన్నారని ఒక కుటుంబంలో పుట్టినంత మాత్రాన్నే బ్రాహ్మలుకాదన్నారు.ఒక బ్రాహ్మడు వ్యాపారం చేస్తే వైశ్య బ్రాహ్మణ అని పిలవాలి, పురాతన గ్రంధాలలో చెప్పిన వాటిని అచరిస్తేనే ఒకబ్రాహ్మడిని బ్రాహ్మడిగా పరిగణించాలి అన్నారు.


ఏసుక్రీస్తు, మహమ్మద్‌ ప్రవక్త పూర్వీకులు సనాతన హిందువులే అని స్వామీజి గతేడాది సెలవిచ్చారు(ఫిబ్రవరి 1, 2023 ఓపి ఇండియా పోర్టల్‌) అమెరికా ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారని అది రుజువైందని నిశ్చలానంద చెప్పారు. వారు క్రైస్తవం, ఇస్లాం స్వీకరించే ముందు హిందువులే అన్నారు. ఏసు క్రీస్తు పది సంవత్సరాలు భారత్‌లో ఉన్నారని దాన్ని ఎక్కడా పేర్కొనలేదన్నారు. పూరీలో మూడు సంత్సరాలు ఉన్నారని క్రీస్తు వైష్ణవుడని హిందూ క్రతువులన్నీ చేసినట్లు చెప్పారు. ఏసు క్రీస్తుకంటే ముందే హిందూయిజం ఉందని అందువలన ఆయన పూర్వీకులు హిందువులే అన్నది స్వామి వారి అభిప్రాయమని ఎన్నోసార్లు చెప్పారని, పూరీ మఠ ప్రజా సంబంధాల అధికారి మాతృదత్తా చెప్పారు. ప్రభుత్వాలకు మఠాలు, దేవాలయాల మీద అదుపు ఉండకూడదని, ప్రతి మూలను అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అనుసరిస్తున్నారంటూ తన మీద వచ్చిన విమర్శలు నిశ్చలానంద ఖండించారు, నేను అనుసరించటం లేదు, కావాలంటే వారే నా వెనుక నడవొచ్చు,ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ నాముందు బాలగోపాలుడి మాదిరి కూర్చుంటారని అన్నారు.


రామాలయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చూస్తున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్న బిజెపి ఒడిషాలో అక్కడి సిఎం నవీన్‌ పట్నాయక్‌ శ్రీమందిర్‌ పరిక్రమ రధాల ద్వారా ఎన్నికల రాజకీయం చేస్తున్నారని బిజెపి నేత పృధ్వీరాజ్‌ హరిచందన్‌ ఆరోపించారు. జగన్నాధ సంస్కృతిని రూపుమాపేందుకు కుట్ర జరుగుతోందని, తన మాజీ ప్రయివేటు కార్యదర్శి ద్వారా ఒరియా పౌరుల మీద దక్షిణ భారత సంస్కృతిని బలవంతంగా రుద్దేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు.దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.శ్రీమందిర్‌ పధకం ఒక రాజకీయ నాటకమని, ఎన్నికల ముందు తమ అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు తలపెట్టారని, 160 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును బిజెడి తన ఎన్నికల ప్రచారానికి వినియోగించటం గర్హనీయమైన చర్య అన్నారు. బిజెపి నేతల విమర్శలను బిజెడి నేత, ఎంఎల్‌ఏ పద్మనాభ బెహరా తిప్పికొట్టారు. మనమంతా జగన్నాధుని పిల్లలం, మనంగాకపోతే భగవంతుడి పేరును ఎవరు తీసుకుంటారు, దీని గురించి మాట్లాడేందుకేమీ లేదు, రాజకీయం అసలే లేదన్నారు. భువనేశ్వర్‌ నగరంలోని అరవై ఏడు వార్డుల్లో శ్రీమందిర్‌ పరిక్రమ పధకంలోని రధాలను రెండు రోజుల పాటు తిప్పుతారు. ప్రతి ఇంటి నుంచి ఆకు వక్కలను, ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ పధకంలో భాగంగా పూరీలోని జగన్నాధ ఆలయ పరిసరాలలో రధయాత్ర వేగంగా కదలటాన్ని సులభతరం చేసేందుకు, తొక్కిడి లేకుండా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జగన్నాధ దేవాలయం చుట్టూ 75 మీటర్ల పరిధిలో ఉన్న కట్టడాలను తొలగించేందుకు యాత్రకు అవసరమైన పద్దతుల్లో తీర్చిదిద్దేందుకు అవసరమైన భూ,భవనాలను సేకరించారు. జనాలకు అవసరమైన మరుగుదొడ్లు, మంచినీరు, సామాన్లు భద్రపరుచుకొనే గదులతో పాటు భద్రతకు అవసరమైన కేంద్రాల వంటివి ఈ పధకంలో ఏర్పాటు చేశారు. దీన్ని బిజెపి రాజకీయం చేస్తున్నది.

చైనాలో ఏం జరుగుతోంది ? ఆర్థిక రంగం పతన దశలో ఉందా !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనాలో ఏం జరుగుతోంది ? చాలా మందికి అర్థంగాని, గందరగోళ పరిచే ప్రశ్న. అక్కడి వ్యవస్థ, ఆర్థికరంగం గురించి గతంలో చెప్పిన, వర్తమానంలో చెబుతున్న జోశ్యాల సంగతేమిటి ? భారత ఉత్పాదక రంగ పిఎంఐ (పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) 2023 డిసెంబరుల్లో పద్దెనిమిది నెలల కనిష్టానికి నవంబరులో ఉన్న 56 నుంచి 54.9కి తగ్గిందన్నది వార్త. ఎందుకటా కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి బలహీనంగా పెరగటం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ సూచిక 50 అంతకు మించి ఉంటే ఉత్పాదకరంగం విస్తరిస్తున్నట్లు, తగ్గితే దిగజారుతున్నట్లు లెక్క. గడచిన 30నెలలుగా 50కిపైగా నమోదు అవుతోంది. చైనాలో నవంబరులో ఉన్న 50.7పిఎంఐ డిసెంబరులో 50.8కి పెరిగిందని కాయిక్సిన్‌ సర్వే వెల్లడించింది.చిత్రం ఏమిటంటే చైనా ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం గడచిన ఆరునెలల్లో డిసెంబరులో ఫ్యాక్టరీ ఉత్పాదకత తగ్గింది. ప్రభుత్వం సర్వేకు ఎంచుకున్న బడా కంపెనీలకు, కాయిక్సిన్‌ ఎంచుకున్న చిన్న, మధ్య తరహా సంస్థలు కాస్త బాగా పని చేస్తున్నట్లు కొందరు అదీ ఇదీ రెండు సరైనవే అని చెప్పారు. చైనాలో జరుగుతున్న ఆర్థిక మార్పులు కొన్ని సమస్యలను ముందుకు తెచ్చిన మాట వాస్తవం. గతంలో శ్రామికశక్తి ఎక్కువగా ఉన్న పరిశ్రమలు, వ్యాపారాల స్థానంలో ఆధునిక ఉత్పాదక, సాంకేతిక మార్పులు ప్రవేశించాయి. ఈ కారణంగా ఉపాధి రంగం మీద కొన్ని ప్రతికూల ప్రభావాలు పడి సర్దుబాటు సమస్య తలెత్తింది. ఇది ప్రతిదేశంలోనూ జరిగిందే, జరుగుతున్నదే. ఒకనాడు మన దేశంలో సాధారణ డిగ్రీ చదువుకుంటే మెరుగైన ఉపాధి లభించేది, ఇప్పుడు అది కొరగానిదిగా మారింది.దాన్ని చేతపట్టుకొని ఉపాధి పొందలేకపోతున్నారు. అందుకే మన కేంద్ర ప్రభుత్వం నైపుణ్యాల అభివృద్ధి(స్కిల్‌ డెవలప్‌మెంట్‌) పధకాలను అమలు జరుపుతున్నది. అది ఎంతమేరకు పనికి వచ్చేది, దానిలో శిక్షణ లేకుండా సర్టిఫికెట్లు ఇస్తూ ఎంత అవినీతి జరిగేదీ, నైపుణ్యపాలు ఎంత అన్నది వేరే సంగతి. చైనాలో పరిశ్రమల్లో వస్తున్న మార్పులు శిక్షణ సమస్యలనే ముందుకు తెస్తున్నాయి. వాటిని పరిష్కరించేదిశగా ప్రభుత్వం ఉంది అంటే కొందరికి నమ్మకం కలగటం లేదు.చైనా ఏం చెప్పినా, ఏం చేసినా నమ్మనివారు ఎప్పుడూ ఉంటారు.


మార్కెట్లో అనిశ్చితి కారణంగా జపాన్‌లో కూడా ఫ్యాక్టరీ కార్యకలాపాలు తగ్గాయి. పిఎంఐ అంతకు ముందు నెలలో ఉన్న 48.3 నుంచి డిసెంబరులో 47.9కి తగ్గింది. యాభైకంటే తక్కువగా ఉన్నప్పటికీ జపాన్‌ మాంద్యంలో ఉందని చెప్పరుగానీ అంతకంటే ఎక్కువ ఉన్న చైనాలో మాంద్యం ఉందని చిత్రిస్తారు. గ్లోబల్‌ ఎకానమీ డాట్‌కామ్‌ సమాచారం ప్రకారం ఉత్పత్తి, సేవారంగాల సంయుక్త పిఎంఐ వివిధ దేశాల పరిస్థితి దిగువ విధంగా ఉంది.(న అంటే నవంబరు, డి అంటే డిసెంబరు 2023గా గమనించాలి)
దేశం ×××× తాజాపిఎంఐ×× మూడునెలలక్రితం×× ఏడాది క్రితం
భారత్‌ ××× 57.40న ××× 60.90 ××××××× 56.70
చైనా ××× 51.60న ××× 51.70 ××××××× 47.00
జపాన్‌ ××× 50.40డి ××× 52.10 ××××××× 49.70
అమెరికా×× 51.00డి ××× 50.20 ××××××× 45.00
యూరో××× 47.00డి ××× 47.20 ××××××× 49.30
ఎగువ వివరాలను చూసినపుడు ఏడాది క్రితం పరిస్థితి పోల్చుకుంటే ఎక్కడ ఎలాంటి సమస్య ఉందో ఎవరికి వారు నిర్ధారణకు రావచ్చు.పిఎంఐలను బట్టే మాంద్యాల్లోకి పోయినట్లు లేదా బయటపడినట్లు పూర్తిగా చెప్పలేము. అది ఒక సూచిక మాత్రమే. చైనా, ఇతర దేశాల కంటే మనదేశ సంయుక్త పిఎంఐ ఎక్కువగా కనిపిస్తోంది. అదే వాస్తవమైతే వస్తు, సేవల ఎగుమతుల్లో అది ప్రతిబింబించాలి.2023 గణాంకాలు ఇంకా ఖరారు కానందున 2022ను ప్రామాణికంగా తీసుకుంటే ప్రపంచంలో తొలి పది వస్తు ఎగుమతి దేశాల జాబితాలో మనకు చోటు లేదు.పోనీ అంతర్గత డిమాండ్‌ పెరిగితే డిసెంబరు నెలలో వస్తూత్పత్తి పిఎంఐ పద్దెనిమిది నెలల కనిష్టానికి ఎందుకు తగ్గినట్లు ? విజువల్‌ కాపిటలిస్ట్‌ డాట్‌కామ్‌ సేకరించిన సమాచారం ప్రకారం 2022లో వివిధ దేశాల వస్తు ఎగుమతులు ఇలా ఉన్నాయి.1.చైనా 3.6లక్షల కోట్ల డాలర్లు,2.అమెరికా 2.1ల.కో.డా, 3.జర్మనీ 1.7లకోడా,4.నెదర్లాండ్స్‌ 965.5బిలియన్‌ డాలర్లు, 5.జపాన్‌ 746.9 బి.డా,6. దక్షిణ కొరియా 683.6బి.డా,7.ఇటలీ 656.9 బి.డా, 8. బెల్జియం 632.9 బి.డా, 9.ఫ్రాన్స్‌ 617.8 బి.డా,10.హాంకాంగ్‌ 609.9బి.డా, 11.యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 598.5బి.డాలర్లుగా ఉన్నాయి.మన ఎగుమతులు 453.58బి.డాలర్లు.


ముందే చెప్పుకున్నట్లు పిఎంఐ ఒక దేశ ఆర్థికరంగ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదు. అది ఇతర దేశాల పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది.ఉదాహరణకు 2015 డిసెంబరు రెండున మింట్‌ పత్రిక విశ్లేషణలో వివిధ దేశాల పిఎంఐల వివరాలను ఇచ్చింది. దాని ప్రకారం జపాన్‌ 52.6తో అగ్రస్థానంలో ఉండగా భారత్‌ 50.3, తైవాన్‌ 49.5, వియత్నాం 49.4, దక్షిణ కొరియా 49.1,చైనా 48.6, మలేషియా 47, ఇండోనేషియా 46.6గా ఉంది. అంటే మనదేశం అప్పుడే చైనా కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్లే. అలాంటిది ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఎగుమతుల్లో ఎందుకు ఎదుగుదల లేదు.మేకిన్‌, మేడిన్‌ ఇండియాల జాడ ఎక్కడ ? పిఐబి 2022 జూలై 29న విడుదల చేసిన సమాచారం ప్రకారం 2017-18లో జిడిపిలో వస్తు ఎగుమతుల శాతం 11.4కాగా 2021-22లో 13.3శాతంగా పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల సగటు 11.78శాతం ఉంది. వస్తు, సేవల ఎగుమతులు ఈ కాలంలోనే 18.8 శాతం నుంచి 21.4శాతం మధ్య ఉన్నాయి. సగటు 19.5శాతమే ఉంది. అందువలన వాటిలో కూడా పెద్దగా పెరుగుదల లేదు.మాక్రోట్రెండ్స్‌ అనే పోర్టల్‌ నిర్వహిస్తున్న సమాచారం ప్రకారం 2004 నుంచి 2013వరకు ఏటా సగటున మన దేశ జిడిపిలో 22.1శాతం ఎగుమతులు జరిగాయి. ఈలెక్కన మోడీ ఏలుబడిలో దిగుమతులు పడిపోయినట్లా పెరిగినట్లా ?


చైనాలో మాంద్యం… ఒప్పుకొన్న జింపింగ్‌ అనే శీర్షికలతో పాటు అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి.ఆర్థికంగా చైనా ఎంతో ఇబ్బందుల్లో ఉందని వాణిజ్యాలు గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నాయని, జనాలు ఉపాధి పొందలేకపోతున్నారని, కొంత మందికి రోజువారీ అవసరాలు తీరటం లేదని వర్తమాన స్థితి గురించి దేశాధినేత షీ జింపింగ్‌ నూతన సంవత్సర సందేశంలో చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు చైనా నేత ఏం చెప్పారు ? షీ జింపింగ్‌ చైనా భాషలో ఇచ్చిన సందేశాన్ని విదేశీ మంత్రిత్వశాఖ ఆంగ్లంలో అనువదించి విడుదల చేసింది. దానిలో అనేక ఆకాంక్షలను వెలిబుచ్చారు. వాటితో పాటు దిగువ మాటలను చెప్పారు.” ప్రయాణంలో మనం కొన్ని ఎదురుగాలులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొన్ని సంస్థలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొన్నాయి.కొంత మంది పౌరులు ఉపాధిని వెతుక్కోవటంలో, మౌలిక అవసరాలను తీర్చుకోవటంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాలు వరదలు, తుపాన్లు, భూ కంపాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నాయి. ఇవన్నీ నా మదిలో అగ్రభాగాన ఉన్నాయి.”. ఈ మాటలను పట్టుకొని చైనా ఆర్థిక స్థితి గురించి చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు చేశారు. జింపింగ్‌ గడచిన సంవత్సరంలో చైనా ఎదుర్కొన్న అంశాలను ప్రస్తావించారు. సాధించిన విజయాలను కూడా పేర్కొన్నారు.వాటిని విస్మరించి ఇబ్బందుల్లో ఉందన్న ప్రచారం చేస్తున్నారు. దాని వలన కొంత మంది తప్పుదారి పట్టటం తప్ప చైనాకు వచ్చే నష్టమేమీ లేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే చైనా జింపింగ్‌ దాచేందుకు ప్రయత్నించలేదు.


ఇంతకీ అసలు మాంద్యం అంటే ఏమిటి ? చైనాలో ఆ పరిస్థితి ఉందా ? మందగమనం అంటే మాంద్యమని అర్ధమా ? న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో 1974లో రాసిన ఒక విశ్లేషణలో అమెరికా కార్మిక గణాంకాల కమిషనర్‌ జూలియస్‌ షిష్కిన్‌ ఒక భాష్యం చెప్పారు. వరుసగా రెండు త్రైమాసిక (ఆరునెలలు) కాలాల్లో వాస్తవ జిఎన్‌పి(జాతీయ మొత్తం ఉత్పత్తి) తగ్గినా, ఆరునెలల్లో పారిశ్రామిక ఉత్పత్తి పతనమైనా దాన్ని మాంద్యం అంటారు. దీని తీవ్రత నిజ జిఎన్‌పి 1.5శాతం తగ్గినపుడు, వ్యవసాయేతర ఉపాధి 15శాతం పతనమైనపుడు, నిరుద్యోగం రెండు శాతం పెరిగి ఆరుశాతం స్థాయికి చేరినపుడు, ఇక వ్యాప్తి గురించి చెప్పాల్సి వస్తే వ్యవసాయేతర రంగంలో 75శాతం పైగా పరిశ్రమల్లో ఆరునెలలు, అంతకు మించి ఉపాధి తగ్గినపుడు మాంద్యంలో ఉన్నట్లు పరిగణించాలని షిష్కిన్‌ చెప్పాడు. ఇలాంటి పరిస్థితి చైనాలో ఉందా ? జింపింగ్‌ నోట మాంద్యం అనే మాట వచ్చిందా ? కరోనా తరువాత చైనా ఆర్థికరంగం మందగమనంలో ఉంది తప్ప మాంద్యంలో కాదు.చైనాలో గడచిన నాలుగున్నర దశాబ్దాల పారిశ్రామిక విధానం వేరు, ఇప్పుడు అనుసరిస్తున్నది వేరు. తన ఉత్పత్తిని పెంచుకొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగమతి చేసుకున్న చైనా ఇప్పుడు స్వంతంగా రూపొందించుకున్నదానితో ఆ రంగంలో ముందున్న దేశాలతో పోటీపడేందుకు చూస్తోంది. సాంప్రదాయ పరిశ్రమల స్థానంలో ఆధునికమైనవి వస్తున్నాయి. వాటికి అవసరమైన పరిశోధన-అభివృద్ధి ఖర్చులో మన వంటి దేశాలతో పోలిస్తే ఎంతో ముందున్నా ధనికదేశాలతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉంది. దాన్ని అధిగమించే క్రమంలో ఉంది.అడ్డుకొనేందుకు పశ్చిమ దేశాలు చూస్తున్నాయి.దానిలో భాగమే చిప్‌ వార్‌. కృత్రిమ మేథ(ఏఐ)లో పశ్చిమ దేశాలకు సవాలు విసురుతోంది. చైనా అంటే ఇష్టంలేని మీడియా సంస్థలు అక్కడ జరుగుతున్నదాని గురించి జనాలను తప్పుదారి పట్టిస్తున్నాయి. వైఫల్యాలను వారేమీ దాచటం లేదు. చైనా గురించి గతంలో చెప్పినవన్నీ అర్ధసత్యాలుగానూ అవాస్తవాలుగా తేలాయి. కూలిపోతుంది, విఫలమౌతుందని చెప్పిన జోశ్యాలన్నీ తప్పాయి. గతంలో మాదిరి రెండంకెల పెరుగుదల లేదు గానీ ధనిక దేశాల కంటే వృద్ధి రేటు అధికంగా ఉంది. అవి పతనం కానపుడు చైనాకే ఆ దుర్గతి ఎలా పడుతుంది ? ఇంత చిన్న తర్కాన్ని అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నామా ?

నరేంద్రమోడీ క్మిస్మస్‌ విందు రాజకీయం – కేరళ మంత్రి వ్యాఖ్య టీకప్పులో తుపాను !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవ పూజార్లకు ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో విందు ఇచ్చారు. దానిలో పాల్గొన్న బిషప్పులు మణిపూర్‌లో తమ సామాజిక తరగతికి చెందిన వారి మీద జరుగుతున్నదాడుల గురించి ప్రధానితో ప్రస్తావించలేదని కేరళ మంత్రి సాజి చెరియన్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.జనవరి మూడున కేరళ సిఎం పినరయి విజయన్‌ ఇచ్చిన క్రిస్మస్‌ విందుకు చెరియన్‌ వ్యాఖ్యలను తప్పుపట్టిన బిషప్పుల కౌన్సిల్‌ నేత క్లిమిస్‌తో సహా అనేక మంది హాజరయ్యారు. అంతకు ముందు చెరియన్‌ తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతో ఆ వివాదం ముగిసింది. ఈ విందుకు గవర్నర్‌ మహమ్మద్‌ ఆరిఫ్‌ ఖాన్‌ హాజరు కాలేదు. సిఎం ఆహ్వానించని కారణంగానే రాలేదని వచ్చిన వార్తలపై గవర్నర్‌ స్పందించారు. కావాలంటే రాజభవన్‌కు వచ్చి తనిఖీ చేసుకోవచ్చు, నేను ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించానో మీరు శోధించవచ్చు, ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నలు అడగవచ్చు అన్నారు. ప్రధాని విందు వివాదం గురించి చూద్దాం. న్యూ ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఇచ్చిన క్రిస్మస్‌ విందుకు ఆహ్వానం అందగానే కొందరు బిషప్పులకు వెంట్రుకలు నిక్కబొడుచుకొని అక్కడ అందించిన పండ్లరసాలు, ద్రాక్ష రసాలు, కేకుల మీద చూపిన శ్రద్ద తమ స్వంత సామాజిక తరగతి మీద మణిపూర్‌లో జరిగిన హింసను మరిచిపోయారని, వారికది ఒక సమస్యగా కనిపించలేదని కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెరియన్‌ ఒక సభలో అన్నారు. చెరియన్‌ సిపిఎం నేత, క్రైస్తవ సామాజిక తరగతికి చెందిన వారు. దాని మీద కేరళ కాథలిక్‌ బిషప్పుల కౌన్సిల్‌(కెసిబిసి) అధ్యక్షుడు కార్డినల్‌ మార్‌ బెసిలియోస్‌ క్లిమిస్‌ మండిపడుతూ మంత్రి మాటలను ఉపసంహరించుకొనేంత వరకు తాము ప్రభుత్వానికి సహకరించేది లేదని ప్రకటించారు. వివాదాన్ని పొడిగించకుండా ఉండేందుకు తాను చేసిన విమర్శలో వెంట్రుకలు నిక్కపొడుచుకోవటం, కేకులు, డ్రాక్ష రసం పదాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే మణిపూర్‌ హింసాకాండపై క్రైస్తవ మతాధికారులు స్పందించలేదన్న విమర్శకు కట్టుబడి ఉన్నట్లు చెరియన్‌ స్పష్టం చేశారు. కెసిబిసి ప్రతినిధి ఫాదర్‌ జాకబ్‌ పాలకపిలి మాట్లాడుతూ దేశానికి క్రైస్తవులు చేసిన సేవల గురించి చర్చించేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశమని పేర్కొన్నారు.మణిపూర్‌ జనాభాలో 41శాతాల చొప్పున క్రైస్తవులు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఎనిమిదిశాతంపైగా ఉన్నారు. అక్కడ గతేడాది మే 3వ తేదీన ప్రారంభమైన మెయితీ-గిరిజన ఘర్షణలు వందలాది మంది ప్రాణాలు తీశాయి. వేలాది ఇండ్లు, వందలాది ప్రార్ధనా మందిరాలను ధ్వంసమయ్యాయి. దాదాపు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. గిరిజన మహిళలను ఇద్దరిని వివస్త్రలను గావించి రోడ్ల మీద తిప్పిన దుర్మార్గం వెలుగులోకి వచ్చిన తరువాత ప్రధాని మొక్కుబడిగా ఖండించారు తప్ప ఇంత వరకు ఆ రాష్ట్రానికి వెళ్లి భరోసా కల్పించేందుకు పూనుకోలేదు..


మణిపూర్‌ ఉదంతాల గురించి మౌనంగా ఉండటంపై కేరళ క్రైస్తవ మత పత్రికల్లోనే తీవ్ర విమర్శలు చాలా నెలల క్రితమే వచ్చాయి. ఈ పూర్వరంగంలోనే మంత్రి చెరియన్‌ మాట్లాడారు. కేరళలో ఓటు బాంకు ఏర్పాటు చేసుకొనే ఎత్తుగడతో క్రైస్తవ మతాధికారులను ప్రసన్నం చేసుకొనేందుకు బిజెపి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది.లౌ జీహాద్‌ పేరుతో హిందూ, క్రైస్తవ యువతులను కూడా ఆకర్షించి మతమార్పిడికి పూనుకుంటున్నారని క్రైస్తవుల-ముస్లింల మధ్య విబేధాలు సృష్టించే విధంగా బిజెపి నేతలు గతంలో కొందరు వ్యాఖ్యానించారు. క్రైస్తవులు దేశానికి చేసిన సేవ గురించి చర్చించేందుకు ప్రధాని విందు ఏర్పాటు చేసినట్లు చెప్పటమే విచిత్రం.సంఘపరివార్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఏర్పాటు చేసిన బిజెపి, ఇతర అనేక సంస్థలు క్రైస్తవ మిషనరీల గురించి, ప్రలోభాలతో మతమార్పిడులు చేస్తున్నారంటూ నిత్యం చేస్తున్న ప్రచారం, ఆ పేరుతో చేస్తున్న దాడుల గురించి తెలిసిందే. వాటిని నివారించటం గురించి ప్రధాని నరేంద్రమోడీ గడచిన పది సంవత్సరాల్లో ఎలాంటి సమావేశాల ఏర్పాటు లేదా ప్రయత్నాలుగానీ కనిపించవు.
2014లో నరేంద్రమోడీ ప్రధానిగా అధికారానికి వచ్చిన తరువాత ముస్లింలు, క్రైస్తవులు అభద్రతా భావానికి గురయ్యారు.భారత్‌లో ఇతర మతాల్లో ఉన్నప్పటికీ వారంతా గతంలో హిందువులే అన్న ప్రచారాన్ని తీవ్రం చేయటంతో పాటు ఘర్‌వాపసీ పేరుతో ఇతర మతాల వారిని తిరిగి హిందువులుగా మార్చే పేరుతో పెద్ద హడావుడి చేశారు. దానికి స్పందన రాలేదు. గుజరాత్‌లో జరిపిన మారణకాండను నివారించటంలో విఫలమైన నరేంద్రమోడీ తమ దేశంలో అడుగుపెట్టకూడదంటూ 2005 అమెరికా అనుమతి నిరాకరించింది. తరువాత అదే అమెరికా మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత ఆహ్వానం పలికింది. 2014 అక్టోబరు, 2015 జనవరిలో నరేంద్రమోడీతో భేటీ అయినపుడు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా,మత స్వేచ్చపై అమెరికా కమిషన్‌ కూడా భారత్‌లో మతస్వేచ్చకు భంగం కలుగుతున్నదని, మైనారిటీ మతాల వారి మీద దాడులు జరుపుతున్నట్లు విమర్శలు చేసింది. భారత్‌లో కనిపిస్తున్న అసహనాన్ని మహాత్మాగాంధీ చూసి ఉంటే దిగ్భ్రాంతికి గురై ఉండేవాడని బరాక్‌ ఒబామా వ్యాఖ్యానించాడు. ఈ పూర్వరంగంలో అమెరికాను సంతుష్టీకరించేందుకు, ప్రపంచంలో తన ప్రతిష్టకు కలిగిన మచ్చను కనిపించకుండా చేసుకొనేందుకు నరేంద్రమోడీ చూశారు. తమ ప్రభుత్వం ఎలాంటి వత్తిడీ, ప్రభావం లేకుండా పౌరులు ఏ మతాన్నైనా అనుసరించటానికి, లేదా నిలుపుకోవటానికి స్వేచ్చను అన్ని విధాలుగా పరిరక్షిస్తుందని, మెజారిటీ లేదా మైనారిటీ మతాలకు చెందిన వారు ఎవరైనా ఇతరుల మీద విద్వేషాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా రెచ్చగొట్టినప్పటికీ సహించదని పార్లమెంటులో చెప్పాల్సి వచ్చింది. విదేశాల వారిని ఆకట్టుకొనేందుకు ఈ ముక్కలను ఆంగ్లంలో చెప్పారని కొందరు వ్యాఖ్యానించారు. ఈ మాత్రం మాట్లాడటాన్ని కూడా సహించలేని హిందూ జాతీయవాదులు ” లౌకిక నరేంద్రమోడీ ” అంటూ ఎద్దేవా చేశారని వాషింగ్టన్‌ పోస్టు, గార్డియన్‌ పత్రికలు రాశాయి. క్రైస్తవ మతాధికారులతో సమావేశాన్ని కూడా మోడీ నిర్వహించారు.


నరేంద్రమోడీ చేసిన ప్రకటన ఇంకా చెవుల్లో వినిపిస్తుండగానే ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్‌ భగవత్‌ మదర్‌ తెరెసాను విమర్శిస్తూ తన గణాన్ని సంతృప్తి పరచేందుకు చూశారు. మిషనరీలు తమ సాయం కోరి వచ్చిన వారిని మతం మారాలని కోరినట్లు ఆరోపించారు.ఆమె సేవలు మంచివే కావచ్చు, కానీ వాటిని వినియోగించుకున్న వారిని క్రైస్తవులుగా మార్చే లక్ష్యంతో చేశారని అన్నారు. ప్రభుత్వేతర సంస్థలు కూడా సేవలు చేస్తాయి అవి మదర్‌ తెరేసా వంటివి కాదు అన్నారు. అంతకు ముందు మతపరమైన మైనారిటీలను అపహరణకు గురైన వస్తువులుగా వర్ణిస్తూ నా వస్తువులను నేను తిరిగి పొందుతా అన్నారు. మదర్‌ తెరేసాపై మోహన్‌ భగవత్‌ మాటలతో తీవ్ర విమర్శలు రావటంతో తమ నేత మాటలను మీడియా వక్రీకరించిందంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. విదేశీ నిధులతో క్రైస్తవ మిషనరీలు, సంస్థలు మత మార్పిడికి పాల్పడుతున్నాయంటూ చేస్తున్న ప్రచారం ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. క్రైస్తవం మన దేశానికి రెండువేల సంవత్సరాల నాడే వచ్చింది. రెండు వందల సంవత్సరాల బ్రిటీష్‌ పాలన, తరువాత కూడా చూస్తే ప్రస్తుతం దేశంలో క్రైస్తవుల సంఖ్య కేవలం 2.3శాతమే. అంటరానితనం వంటి తీవ్ర వివక్ష కారణంగా అనేక మంది క్రైస్తవంలోకి మారారు. ఆ సమస్యతో నిమిత్తం లేని వారు ఆర్థిక, ఇతర ప్రయోజనాల కోసం క్రైస్తవం పుచ్చుకున్నారు. మొఘల్‌ పాలనా కాలంలో కూడా జరిగింది అదే. రిజర్వేషన్ల కారణంగా అనేక మంది క్రైస్తవంలోకి మారనప్పటికీ దేవాలయాలకు బదులు చర్చ్‌లకు వెళ్లి క్రీస్తును పూజిస్తున్నారన్నది హిందూత్వవాదుల దుగ్ద.


గతంలో జపాన్‌ ప్రధాని షింజో అబేతో కలసి అహమ్మదాబాద్‌లో ఒక పురాతన మసీదును మోడీ సందర్శించారు. సందర్శన వేరు, చర్చిలో మాదిరి పూజా క్రతువులో భాగంగా కొవ్వొత్తి వెలిగించినట్లుగా మసీదులో ఎక్కడా చూడలేదు.విదేశాలకు వెళ్లినపుడు అబూదాబీలో మోడీ మసీదును సందర్శించారు. ఇవన్నీ ఇస్లామిక్‌, క్రైస్తవ దేశాల పాలకుల మెప్పు పొందేందుకే అన్నది స్పష్టం. గతేడాది ఈస్టర్‌ పండగనాడు మోడీ చర్చికి వెళ్లటానికి ముందు క్రైస్తవుల మీద అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ ముంబైలో పదివేల మంది ప్రదర్శన చేశారు.” ఈస్టర్‌ పండగ రోజు కెథడ్రల్‌ చర్చిని సందర్శించాలన్న వాంఛను ప్రధాని మోడీ వెలిబుచ్చారు. మేము ఏర్పాటు చేశాము. దీని మీద స్పందన ఏమిటని అనేక మంది జర్నలిస్టులు ఎందుకు అడుగుతున్నారో తెలియటం లేదని ” అన్న ఢిల్లీ ఆర్చిబిషప్‌ అనిల్‌ కౌటో అంతకు మించి మాట్లాడేందుకు తిరస్కరించారు.ప్రధాని కోరితే కుదరదని చెప్పలేం అని ఫరీదాబాద్‌ సిరో మలబార్‌ చర్చి అధిపతి కురియకోస్‌ భరణికులనగార అన్నారు. ప్రధాని చర్చిలో ఉండగా మూడు స్తోత్రాలను ఆలపించాము, రైసెన్‌ క్రీస్టు విగ్రహం ముందు కొవ్వొత్తిని కూడా వెలిగించారని చెప్పారు.అరగంటపాటు అక్కడే ఉన్న మోడీ ప్రాంగణంలో ఒక మొక్క నాటారు.ముంబైలో క్రైస్తవుల ప్రదర్శన నిర్వాహకులలో ఒకరైన డోల్ఫీ డి సౌజా మాట్లాడుతూ నరేంద్రమోడీ చర్చికి రావటానికి మాకెలాంటి సమస్య లేదు. స్వాగతిస్తాం, కానీ మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత క్రైస్తవుల మీద హింసాకాండ పెరిగింది, దాడులకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడటానికి మోడీ నిరాకరిస్తున్నారు, అదే మాకు ఆందోళన కలిగిస్తోంది అని కూడా డి సౌజా చెప్పారు.అలాంటి ప్రధాని మణిపూర్‌ గురించి మౌనంగా ఉండటాన్ని ఎందుకు ప్రశ్నించలేదనే కేరళ మంత్రి తప్పుపట్టారు.


ఈస్టర్‌ పండుగ రోజున బిజెపి నేతలు కేరళలో పదివేల చర్చ్‌లు, క్రైస్తవుల ఇండ్లను సందర్శించి వారిని సంతుష్టీకరించేందుకు, ఓటు బాంకుగా మార్చుకునేందుకు చూశారు. ఈస్టర్‌ రోజున ఆడించిన నాటకమిదని కేరళకు చెందిన కురియకోస్‌ భరణికులనగార విమర్శించారు. కేరళలో సిరో మలబార్‌ చర్చ్‌ ఆర్చిబిషప్‌ కార్డినల్‌ జార్జి అలెంచెరీ నరేంద్రమోడీని ప్రశంసించినట్లు, దేశంలో క్రైస్తవులు అభద్రతతో లేరని చెప్పినట్లు న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక రాసింది. దేశంలో ఆందోళనకరంగా ఉన్న వాస్తవం కార్డినల్‌ అలెంచెరీ మాటల్లో ప్రతిబింబించలేదని కేరళలో ప్రచురితమయే సత్యదీపమ్‌ అనే కాథలిక్‌ పత్రిక సంపాదకుడు ఫాదర్‌ పాల్‌ తెలక్కాట్‌ వ్యాఖ్యానించారు. మోడీ పాలనను ప్రశంసించటం క్రైస్తవులకు విభ్రాంతి కలిగించిందని కూడా అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మిజోరం వెళ్లలేదు. మణిపూర్‌ తగులబడుతుంటే రాని ప్రధాని తగుదునమ్మా అంటూ పక్కనే ఉన్న మిజోరంలో ఓట్ల కోసం వచ్చారనే విమర్శను మూటగట్టుకోవాల్సి వస్తుందనే కారణం తప్ప మరొకటి కాదు. లోక్‌సభ ఎన్నికల పూర్వరంగంలో నరేంద్రమోడీ క్రిస్మస్‌ రాజకీయం చేశారు. ఈ పూర్వరంగంలో ప్రధాని విందుకు వెళ్లిన బిషప్పులు మణిపూర్‌లో జరుగుతున్న ఉదంతాలను పట్టించుకోలేదని కేరళ మంత్రి సాజీ చెరియన్‌ చేసిన వ్యాఖ్యలను చూడాల్సి ఉంది.

ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా కేసు, బీరూట్‌లో హమస్‌ నేత హత్య, ఎర్ర సముద్రంలోకి ఇరాన్‌ యుద్ధనౌక !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకవైపు గాజా నుంచి సైన్య ఉపసంహరణ వార్తలు, మరోవైపు ఆలోగా మిగిలి ఉన్న నివాసాలను పూర్తిగా నాశనం చేయటం, సాధ్యమైనంత మంది పాలస్తీనియన్ల ప్రాణాలను హరించేందుకు వైమానిక, టాంకులతో ఇజ్రాయెల్‌ మిలిటరీ విరుచుకుపడుతున్నట్లు సమాచారం. నిబంధనలను తోసిరాజని అమెరికా భారీ ఎత్తున మిలిటరీ సాయం. పాలస్తీనా జాతిని తుడిచిపెట్టేందుకు పూనుకున్న ఇజ్రాయెల్‌ మీద విచారించాలంటూ అంతర్జాతీయ కోర్టు (ఐసిజె)లో దక్షిణాఫ్రికా కేసు దాఖలు. ఎమెన్‌ కేంద్రంగా ఉన్న హౌతీ సాయుధులు ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు, వారి మీద అమెరికా యుద్ధనౌకల నుంచి ప్రతిదాడులు. పది మంది హౌతీల మరణం,ఈ పూర్వరంగంలో మంగళవారం నాడు ఎర్ర సముద్రంలోకి ఇరాన్‌ తన యుద్ధ నౌక అల్‌బోర్జ్‌ను నడిపింది. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా ముడి చమురు ధరలు పెరిగాయి. హిందూమహా సముద్రంతో ఎర్రసముద్రాన్ని కలిపే ఏడెన్‌ జలసంధి నుంచి ఎర్ర సముద్రం దక్షిణ ప్రాంతంలోకి ఇరాన్‌ నౌక ప్రవేశించింది. తాము కూడా ఆ ప్రాంతంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పించేందుకే అని ఇరాన్‌ ప్రకటించింది. అదే పేరుతో అమెరికా, బ్రిటన్‌ ఇతర దేశాల నౌకలు ఉన్నాయి.2009 నుంచి నియమిత కాలాల్లో తమ నౌక ఆ ప్రాంతంలో గస్తీకి రావటం మామూలేనని, ఎవరికీ చెందని జలాల్లోకి ఇతర దేశాల యుద్ధ నావలు ఎలా వస్తున్నాయో తమది కూడా అంతేనని ఇరాన్‌ చెప్పింది.2021లో ఏడెన్‌ జలసంధిలో రెండు చమురు టాంకర్లపై సముద్ర దొంగల దాడిని తమ అల్‌బోర్జ్‌ తిప్పిన కొట్టిన అంశాన్ని గుర్తు చేసింది. ఎర్ర సముద్రంలో నౌకల స్వేచ్చా విహారానికి విఘాతం కలిగిస్తున్న హౌతీల మీద ప్రత్యక్ష చర్యకు దిగుతామని బ్రిటన్‌ బెదిరించింది. మంగళవారం నాడు లెబనాన్‌ రాజధాని బీరూట్‌ శివార్లలో హమస్‌ అగ్రనేతలలో ఒకడైెన సాలే అల్‌ అరౌరీని హత్య చేశారు. ఇజ్రాయెల్‌ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ దాడిలో మరణించినట్లు హమస్‌ ప్రకటించింది, అయితే ఏ సంస్థ కూడా తామే హతమార్చినట్లు చెప్పుకోలేదు. దీని గురించి మాట్లాడవద్దని ఇజ్రాయెల్‌ తమ నేతలకు సలహా ఇచ్చింది. ఇవీ మధ్యప్రాచ్యంలో వర్తమాన పరిణామాలు.


పాలస్తీనా జాతిని తుడిచిపెట్టి, గాజా ప్రాంతాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు పూనుకున్న ఇజ్రాయెల్‌ మీద విచారణ జరపాలని దక్షిణాఫ్రికా ఐసిజెలో కేసు దాఖలు చేసింది. పాలస్తీనియన్లు యూదుదురహంకారుల అణచివేతకు గురవుతున్నట్లే శతాబ్దాల తరబడి శ్వేత జాతి దురహంకారుల వివక్ష, అణచివేతకు దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్లు బలైన సంగతి తెలిసిందే. ఆ బాధ ఏమిటో వారికి తెలిసినంతగా మరొకరికి అవగతం కాదు, ఈ కారణంగానే పాలస్తీనియన్లకు మద్దతుగా కేసుదాఖలు చేసినట్లు భావిస్తున్నారు. అది ఏమౌతుందో చెప్పలేము గానీ ఇజ్రాయెల్‌ మీద వత్తిడి పెంచుతుంది, బహుశా దాని ప్రభావం వల్లనే పెద్ద సంఖ్యలో సేనలను గాజా నుంచి వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించిందా ? అబ్బే అదేమీ లేదు, పోరులో ఉన్నవారికి విశ్రాంతినిచ్చేందుకు, వారి స్థానంలో కొత్తవారిని దించుతామని ఇజ్రాయెల్‌ అధికారులు ప్రకటించింది వాస్తవమా ? చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు గాజాలో ఇరవై రెండువేల మందికి పైగా పౌరులను చంపారు. ఎనిమిది వేల మంది హమస్‌ తీవ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ చెప్పుకోవటం తప్ప దానికి తగిన ఆధారాలను చూపలేదు, ఎవరూ నమ్మటం లేదు. ఈ ఏడాది అంతటా తమ దాడులు కొనసాగుతాయని ప్రకటించారు. అంతర్జాతీయ వ్యవస్థలో ఐసిజె సివిల్‌ కోర్టు, ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు(ఐసిసి) నేరాలను విచారిస్తుంది. ఐరాసలో రెండు దేశాలూ సభ్యులే కనుక కోర్టు నిర్ణయాలకు బద్దులు కావాల్సి ఉంది.తమ దేశంలో 1994లో అంతమైన జాత్యంహకార పాలనలో శ్వేతజాతి మైనారిటీలు జనాన్ని బలవంతంగా వేర్వేరుగా ఉంచారని, ఇప్పుడు ఇజ్రాయెల్‌ విధానాలు కూడా అలాగే ఉన్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా చెప్పాడు. అక్టోబరు ఏడు నుంచి గాజాలో ఇజ్రాయెల్‌ చర్యలు జాతుల అంతంపై ఐరాస తీర్మానాలకు విరుద్దంగా ఉన్నాయని అందువలన తక్షణమే విచారణ జరపాలని కోర్టును దక్షిణాఫ్రికా అభ్యర్ధించింది. గాజాలో కాల్పుల విరమణ జరిపేవరకు ప్రిటోరియాలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించటమే గాక అన్ని రకాల దౌత్య సంబంధాలను పక్కన పెడుతున్నట్లు దక్షిణాఫ్రికా చాలా రోజుల క్రితమే ప్రకటించింది. తమ మీద చేసిన అభియోగాలకు ఆధారం లేదని, రక్తపు మరకలను తమకు అంటిస్తున్నారని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. గాజాలోని పౌరులు తమకు శత్రువులు కాదని చెప్పుకుంది.మరోవైపు గాజాలో అమాయకులెవరూ లేరని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు హర్‌జోగ్‌ ప్రకటించాడు. అక్కడి జనం మానవ మృగాలు గనుక వారికి సామూహిక శిక్ష విధిస్తామని రక్షణ మంత్రి చెప్పాడు. ప్రధాని నెతన్యాహు బైబిల్‌లోని అంశాలను ఉల్లేఖించటం జాతి నిర్మూలనకు పిలుపు నివ్వటం తప్ప మరొకటి కాదని అనేక మంది చెప్పారు. దక్షిణాఫ్రికా చర్యను పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వశాఖ స్వాగతించింది.వెంటనే కోర్టు స్పందించాలని, పౌరులకు మరింత హాని జరగకుండా చూడాలని కోరింది.


గాజాలో ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా ఎర్ర సముద్రంలోని బాబ్‌ ఎల్‌ మాండెబ్‌ జలసంధి ద్వారా రాకపోకలు సాగిస్తున్న నౌకలపై తాము దాడులు చేస్తామని ఎమెన్‌ కేంద్రంగా ఉన్న హౌతీ సాయుధ దళాలు ప్రకటించాయి. తమ సేనలు మూడు హౌతీ పడవలను ముంచివేసి పదిమందిని హతమార్చినట్లు అమెరికా వెల్లడించింది. తొలిసారిగా ప్రత్యక్ష దాడులకు దిగటం ఇదే ప్రధమం. ఎమెన్‌ కాలమానం ప్రకారం ఆదివారం నాడు ఉదయం ఆరున్నర గంటలకు హంగఝౌ అనే కంటెయినర్‌ నౌక మీద చిన్న పడవల నుంచి దాడులు జరగటంతో తమను రక్షించాలని నౌకలో ఉన్నవారు కోరిన వెంటనే యుద్ధ నౌకలు, కొన్ని హెలికాప్టర్లను పంపి హౌతీలపై అమెరికన్లు దాడులు జరిపారు. బహుళజాతి సముద్రయాన రక్షణ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబరు 19న అమెరికా ప్రకటించగా సుముఖత చూపిన పందొమ్మిది దేశాలు సంతకాలు చేసినప్పటికీ కేవలం తొమ్మిది మాత్రమే ఈ ప్రయత్నంలో ఉన్నట్లు తమ పేర్లు పేర్కొనాలని చెప్పాయి.ఒక్క బ్రిటన్‌ మాత్రమే తమ యుద్ధ నౌకలను పంపింది. అనేక అరబ్బు దేశాలు పరిణామాలు, పర్యవసానాల గురించి ఆందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్‌కు సంబంధం ఉన్న నౌకల రక్షణకు తామెందుకు మద్దతు ఇవ్వాలని అవి ఆలోచిస్తున్నాయి. హౌతీల దాడుల గురించి అమెరికా రక్షణశాఖ ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. హౌతీలు కేవలం రెండువేల డాలర్ల విలువగల డ్రోన్లతో దాడులు చేస్తుంటే తాము 21 లక్షల డాలర్ల విలువగల క్షిపణులను వాటిని కూల్చేందుకు వినియోగించాల్సి రావటం భారంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. గడచిన రెండు నెలల కాలంలో ఎర్రసముద్రంలో 38 డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా చెప్పుకుంది. ఇరాన్‌ తయారు చేస్తున్న డ్రోన్ల కనిష్ట ధర రెండు వేల డాలర్లు కాగా గరిష్టంగా ఇరవైవేల డాలర్లు ఉంది. ప్రస్తుతం అమెరికా మధ్యధరాసముద్రం, ఏడెన్‌ గల్ఫ్‌కు రెండు విమానవాహక యుద్ద నౌకలు, నాలుగు డెస్ట్రాయర్లు, ఒక క్రూయిజర్‌ను పంపింది.సూయజ్‌ కాలువ ద్వారా హిందూ మహాసముద్రంలో ప్రవేశించే మార్గం ద్వారా ప్రపంచ వాణిజ్యంలో పన్నెండు శాతం రవాణా జరుగుతుంది. ఎర్ర సముద్రంలో తలెత్తిన పరిస్థితి కారణంగా నౌకలు గుడ్‌హౌప్‌ ఆగ్రం వరకు వెళ్లి ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వచ్చే పాత మార్గానికి మళ్లుతున్నాయి. ఇది ఖర్చుతో పాటు ప్రయాణ సమయాన్ని కూడా పెంచుతుంది. ఇజ్రాయెల్‌ చెబుతున్నట్లు ఈ ఏడాది అంతా గాజామీద దాడులు జరిపితే ఎర్రసముద్రంలో దాడులు కూడా కొనసాగుతాయి. ఎవరి ఎత్తుగడలు వారికి ఉంటాయి. అమెరికా నేరుగా రంగంలోకి దిగటంతో తమ దాడులను కూడా తీవ్రం చేస్తామని హౌతీలు ప్రకటించారు.


పశ్చిమాసియా, ఉక్రెయిన్‌ సంక్షోభాలలో డ్రోన్ల వినియోగం యుద్ధ తీరుతెన్నులనే మార్చివేసిందంటే అతిశయోక్తి కాదు.భారీ ఖర్చుతో కూడిన అమెరికా, ఇతర నాటో దేశాల ఆధునిక ఆయుధాలు స్వల్ప ఖర్చుతో రూపొందించే నాటు రకం డ్రోన్లను కూల్చేందుకు ఉపయోగించాల్సి రావటం ఎంతో వ్యయంతో కూడుకున్నది. అందువలన ఇప్పుడు డ్రోన్లను కూల్చేందుకు శక్తివంతమైన లేజర్‌ కిరణాలను పంపే విధంగా కొత్త వ్యవస్థలను రూపొందించాల్సిన అగత్యం అమెరికాకు ఏర్పడింది. రష్యా ఇప్పటికే తన డ్రోన్లు పనిచేయకుండా స్థంభింపచేసే ఎలక్ట్రానిక్‌ యుద్ధ వ్యవస్థలను వమ్ము చేసేందుకు మాజిక్‌ రేడియో పేరుతో రక్షణ కల్పిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.దీన్ని బట్టి రానున్న రోజుల్లో సినిమాల్లో మాదిరి కిరణాల యుద్ధాలు జరగనున్నాయని చెప్పవచ్చు.శక్తివంతమైన లేజర్‌ కిరణాలను పంపి డ్రోన్లు, క్షిపణుల మీద దాడి చేసినపుడు వాటినుంచి వెలువడే ఉష్ణం వాటిని మండించి పనికి రాకుండా చేస్తుంది. హమస్‌, హౌతీ సాయుధులు ఉపయోగిస్తున్న మానవ రహిత ఆత్మాహుతి డ్రోన్లతో అమెరికా రక్షణశాఖను ఆతురతలోకి నెట్టారు. ఈ డ్రోన్లన ఇరాన్‌ వీరితో పాటు రష్యాకూ సరఫరా చేస్తున్నది. వాటితో ఉక్రెయిన్‌ మౌలిససదుపాయాల వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న సంగతి తెలిసిందే.కేవలం యాభైవేల డాలర్ల విలువ గల రష్యా డ్రోన్లను కూల్చేందుకు అమెరికా అందచేసిన 30లక్షల డాలర్ల ఖరీదు చేసే పేట్రియాట్‌ క్షిపణులను జెలెనెస్కీ సేనలు ప్రయోగిస్తున్నాయి. వీటిని ప్రయోగించే మొత్తం వ్యవస్థకయ్యే ఖర్చు 110 కోట్ల డాలర్లు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు ఉక్రెయిన్‌ వద్ద నిండుకున్నట్లు, అందుకే పరిమితంగా వాటిని వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. డ్రోన్ల గుంపు అంటే ఎన్ని అన్నది కూడా అర్ధంకాని స్థితి ఉంది.కొన్ని డజన్లు అంతకంటే ఎక్కువ దూసుకువచ్చినపుడు శక్తివంతమైన లేజర్‌ కిరణాలు వాటన్నింటినీ కూల్చివేసే అవకాశం లేదని చెబుతున్నారు. వీటిని ప్రయోగించాలంటే వాటిని ఉంచిన కేంద్రాలలో నిరంతరం విద్యుత్‌ సరఫరా కూడా ఉండాలి.


తాము నిర్మించినవే గనుక ఉక్రెయిన్‌లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థలన్నీ రష్యన్లకు కొట్టినపిండి. ఇరాన్‌ సరఫరా చేసిన దీర్ఘశ్రేణి డ్రోన్లలో ముందుగానే లక్ష్యాలను నిక్షిప్తం చేసి వదులుతున్నందున అక్కడి వ్యవస్థలను ధ్వంసం చేయగలుగుతున్నాయి.గాజాపై దాడులను విరమించకపోతే తాము ఇజ్రాయెల్లో మంటలు రేపుతామని హమస్‌ తీవ్రవాదులు హెచ్చరిస్తున్నారంటే వారి దగ్గర ఇలాంటి డ్రోన్లు ఇప్పటికే చేరి ఉండాలి. ఉక్రెయిన్‌ వద్ద రాడార్లను, లేజర్‌ కిరణాలను తప్పించుకుంటూ సముద్రాల మీద తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు ఉన్న కారణంగానే అజోవ్‌ సముద్రంలోని వంతెన పేల్చివేత, సెవాస్తపూల్‌లోని రష్యా నౌకలపై దాడులు సాధ్యమైందని చెబుతున్నారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌ యుద్దాలలో వీటిని చూసిన తరువాత ప్రపంచ దేశాలలో ఆందోళన తలెత్తుతున్నది, భారీ ఆయుధాలు, జెట్‌ విమానాలను కూల్చటమెట్లా అని ఇప్పటి వరకు ఆలోచిస్తున్న దేశాలు ఇప్పుడు ఇలాంటి చిన్న వాటిని పసిగట్టేవాటిని తయారు చేయటం మీద కేంద్రీకరించాయి.

పాలస్తీనా ప్రజలు చరిత్ర నిర్మిస్తున్నారు

Tags

, , , ,


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


2023 అక్టోబరు 7న హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి తరువాత పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులతో మారణకాండకు పూనుకుంది. ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్ధుల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని కార్పెట్‌ బాంబుదాడులను సాగిస్తోంది. కొరియా, వియత్నాంలపై దురాక్రమణ యుద్ధాలలో ఒక్క అంగుళంకూడా వదలకుండా ఇలాగే అమెరికా మారణహౌమాన్ని సష్టించింది. అదే చరిత్రను పునరావతం చేస్తూ, ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలో ఇళ్ళను భూమట్టంచేస్తూ తన పై దాడి చేసిన హమాస్‌ వారిని పట్టుకోలేక, 22 వేలమందికి పైగా సామాన్య అమాయక ప్రజలను హతమార్చింది. ఇందులో 70 శాతం మంది చిన్న పిల్లలు, మహిళల తోపాటుగా జర్నలిస్టులు , డాక్టర్లు కూడా వున్నారు. తీవ్ర అననుకూల పరిస్ధితులలోవార్తలను సేకరిస్తూ, సంఘర్షణలను, బాంబుదాడులను చిత్రీకరిస్తూ 90 మంది జర్నలిస్టులు తమ ప్రాణాలనర్పించారు. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ గత వారం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం యుద్ధ నేరానికి పాల్పడిందని ప్రకటించింది. ప్రజలకు ఆహారం, నీరు అందకుండా కత్రిమ కరువు ను సష్టించి ప్రజల ప్రాణాలను తీస్తున్నఇజ్రాయల్‌ ప్రధాని నెతన్యాహూని ఈ నాటి హిట్లర్‌ అని టర్కీఅధ్యక్షుడు ఎర్డోగాన్‌ అన్నాడు. అంతేకాకుండా గాజాపై ఈ ఉన్మాద దాడులను ఆపేయాలి అన్నాడు. పాలస్తీనా ప్రజలకు అండగా మేమున్నామంటూ, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ప్రదర్శను ఇస్తాంబుల్‌ పట్టణంలో నిర్వహించారు. మలేసియా ప్రధాని అన్వర్‌ఇబ్రహీమ్‌ తమది ఒక స్వతంత్ర సార్వభౌమ దేశమని, అమెరికా వత్తుడులకు లోంగమన్నారు. తమహక్కులకోసం, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న పాలస్తీనియన్లకు పూర్తి సహకారం అందిస్తామని పెద్ద ప్రజా ప్రదర్శనను నిర్వహించారు. కొలంబియా అధ్యక్షుడు పెట్రో. దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు రామపోసా , అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, తదితర దేశాల్లో ప్రజలు గాజా ప్రజలకుఅండగా వుంటామన్నారు.

మానవ కల్పిత కరువు

గాజాలోని పాలస్తీనియన్లకు అవసరమయిన ఆహారంలో కేవలం 10 శాతం మాత్రమే అందుతున్నదని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఐరాస ఏజెన్సీలు మరియు స్వచ్చంద సహాయ సంస్థల భాగస్వామ్యం అయిన ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ ఫేజ్‌ క్లాసిఫికేషన్‌ ప్రచురించిన ఒక నివేదికలో, గాజాలో ఉన్న కుటుంబాలు సంక్షోభంలో తీవ్రమైన ఆహార అభద్రతతో బాధపడుతున్నట్లు పేర్కొంది. గాజాలోని మొత్తం 23 లక్షల జనాభా అతిపెద్ద మానవ కల్పిత కరువు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని హెచ్చరించింది.తక్షణ కాల్పుల విరమణ కోసం ఐ రా స పిలుపునిచ్చేందుకు వీల్లేదని అమెరికా వీటోని ప్రయోగించి తన సామ్రాజ్యవాద స్వభావాన్ని మరోసారి నిరూపించుకున్నది. గాజాలో మానవతావాద పరిస్థితి మరింత భయంకరంగా మారడంతో ఇజ్రాయెల్‌ సైనిక చర్య సమర్థించలేనిదిగా మారడంతో, బలమైన మద్దతుదారు అమెరికా, జర్మనీ, బ్రిటన్‌ లలోకూడా ప్రజలు తీవ్ర నిరసనతెలపుతున్నారు. ప్రభుత్వాలు ఇరుకున పడుతున్నాయి.ఎర్ర సముద్రంలోని ”ఇజ్రాయెల్‌- సంబంధిత” నౌకలపై యెమెన్‌ హౌతీ మిలీషియా దాడులను తీవ్రతరం చేయడంతో వివాదం మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఇజ్రాయల్‌-పాలస్తీనాకు పరిమితమయిన యుద్ధం సముద్రానికి మారింది.

పాలస్తీనాకు మద్దతిస్తున్న హౌతీ రెబెల్స్‌ ఎర్రసముద్రంలో ఇజ్రాయల్‌తో సంబంధమున్న దేశాల నౌకలపై డ్రోన్లు, క్షిపణు లతో దాడులను చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య రంగంలో ముఖ్యమైన నౌకా రవాణా రంగంలో అత్యంత కీలకమైన మార్గమిది. అమెరికా, ఐరోపా దేశాలు ఆసియా, ఆఫ్రికా దేశాలతో వ్యాపారం చేసి లాభాలను ఆర్జిస్తూన్నాయి. ఆఫ్రికా చుట్టూ తిరిగిరాకుండా ఈజిప్ట్‌లోని సూయజ్‌ కాలువ-ఎర్రసముద్రం మీదుగా ఆంతర్జాతీయ వాణిజ్యంసాగుతోంది. బాబ్‌ ఎల్‌ మండెప్‌ జలసంధి వద్ద మార్గం చాలా సన్నంగా 29 కి.మీ. మాత్రమే వుండటం వలన నౌకలపై దాడులకు అనువుగా వుంది. పక్కనే ఉన్న ఎమెన్‌ స్ధావరంగా చేసుకుని హౌతీ రెబెల్స్‌ వాణిజ్య నౌకలపై దాడుల ద్వారా గాజాలో మారణహౌమాన్ని ఆపాలని వత్తిడి తెస్తున్నారు. ఇజ్రాయల్‌, అమెరికా, యూరప్‌లను హడలెత్తిస్తున్నారు. మొత్తం ఆంతర్జాతీయ సమాజానికి అల్టిమేటం ఇస్తున్నారు. పది దేశాల మిలిటరీ బలగాలను ఎర్రసముద్రం లోకి దించి హౌతీలను ఎదుర్కోవాలని అమెరికా”ఆపరేషన్‌ ప్రాస్పరిటీ గార్డియన్‌” వ్యూహాలను రచిస్తున్నది. యుద్ధ నౌకల పహారాతో నౌకలను దాడులనుండి రక్షించటానికి ఎర్రసముద్ర సంకీర్ణ రక్షణ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమిలో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బహరైన్‌, షెషల్స్‌, స్పెయిన్‌, నార్వే, నెదర్లాండ్‌, కెనడా, ఇటలీతో 10 దేశాలున్నాయి. ప్రాంతీయ దేశాలలో బలమైన సౌదీ అరేబియా, ఈజిప్టు చేరలేదు. ఒక్క బహ్రైన్‌ చేరింది. కూటమిలో చేరటానికి అన్ని నాటో దేశాలు ఉత్సాహం చూపటంలేదు.

గాజాపై దాడులు ఆపకపోతే ప్రపంచ ఇంటర్నెట్‌పై కూడా దాడి చేస్తామని హౌతీలు హెచ్చరించారు. బాబ్‌ ఎల్‌ మండెప్‌ జలసంధికి దగ్గర సముద్ర కేబుల్‌ నెట్‌ వర్క్‌ వైర్‌లను కత్తిరించేస్తామన్నారు. హౌతీలు వాణిజ్య నౌకల పైననే కాకుండా , అమెరికా యుద్ధనౌకలపైనా, ఇజ్రాయల్‌ రేవులపౖౖె కూడా దాడులను మొదలెట్టారు. వందలకొలదీ నౌకలు సముద్రంలో లంగరు వేసి ఆగిపోయాయి. అతి పెద్ద, యం.స్‌.సీ యునైటెడ్‌ వాణిజ్య నౌక పై డిసెంబర్‌ 26న హౌతీ మిలిటరీ మిస్సైల్‌ తో దాడి చేసినట్లుగా వెల్లడించింది. గెలక్సీ లీడర్‌ అనే ఇజ్రాయల్‌ వ్యాపారి నౌకను హైజాక్‌ చేసి 25 మంది సిబ్బందిని ఎమెన్‌ లో నిర్బంధించారు. ఇజ్రాయల్‌ తో అంటకాగుతున్న ఇండియా నౌకలను కూడా వదలలేదు. ఇండియా వస్తున్నఎం.వి.కెమ్‌.ఫ్లూటో నౌక పైనా, సౌదీనుండి వస్తున్న ఎం.వి.సాయిబాబా నౌకల పైన కూడా డ్రోన్‌ దాడులు జరిగాయి. భారతదేశం 3 యుద్ధ నౌకలను కాపలాగా పంపించింది. అందులో”ఐ యన్‌ యస్‌ మారముగో”గైడెడ్‌ మిస్సైల్‌ విధ్వంసక నౌక కూడా వుంది.

ప్రపంచ ప్రజలు ఉద్యమించాలి

నౌకలు రెడ్‌ సీ ద్వారా రోజుకి 16 నాటికల్‌ మైళ్ళ వేగంతో ప్రయాణించి 25 రోజులలో యూరప్‌ ని చేరగల్గుతున్నాయి. ఎర్రసముద్రాన్ని తప్పించి ఆఫ్రికా చుట్టూ తిరిగి గుడ్‌ హౌప్‌ మార్గం ద్వారా ప్రయాణించటానికి 43 రోజులు పడ్తుంది. వ్యయ ప్రయాసలకోర్చిరూట్‌ మార్చే ప్రయాణానికి 9 రోజులనుండి 30 రోజులు ఆలస్యమవుతుంది. 15 రోజులు ప్రయాణ కాలం పెరిగితే నౌకకు ఇంధనం ఖర్చు అదనంగా 10లక్షల డాలర్ల వుతాయి. వందకు పైగా వాణిజ్య నౌకలు రూటు మార్చుకున్నాయి. ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. భీమా కంపెనీలు ప్రతి కంటైనర్‌ మీద 700 డాలర్ల సర్‌ ఛార్జి విధిస్తున్నాయి. నిత్యవసరవస్తువులన్నిటికీ ఆసియా, ఆఫ్రికా దేశాలపై ఆధారపడిన అమెరికా యూరప్‌ దేశాలు సరుకుల రవాణా ఆలస్యాన్ని భరించలేవు. ఖర్చు పెరుగుతుంది. ఆసియా ధేశాలకు చమురు సహజ వాయువు దిగుమతులు కష్టవుతాయి. ప్రపంచవ్యాపితంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం సంభవించి ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రమాదంగా పరిణమించిన సమస్యను పరిష్కరించాలంటే గాజా పై ఇజ్రాయల్‌ మానవ హననాన్ని ఆపేటట్లుగా ప్రపంచ ప్రజలు ఉద్యమించాలి.

టెక్నాలజీ, ఆయుధాలు సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాయనే విశ్వాసం అన్నిసార్లూ వాస్తవం కాదని పాలస్తీనీయులు, హౌతీలు నిరూపించారు. ప్రపంచంలో అత్యంత ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఏదైనా ముందే కనుక్కోగలమనే ఇంటలిజెన్స్‌ నెట్‌ వర్క్‌ వున్నదనుకుని విర్రవీగే ఇజ్రాయల్‌ ప్రభుత్వం, హమాస్‌ దాడిని ముందే పసిగట్టలేకపోయింది. హఠాత్తుగా జరిగిన అక్టోబర్‌ 7 దాడిని జీర్ణించుకోలేక సాగిస్తున్నవిశంఖలదాడులు హమాస్‌ ని పట్టుకోవటం లో విఫలం చెంది విచక్షణారహితంగా సామాన్యప్రజలను హతమారుస్తున్నారు. 200 డాలర్లతో తయరయ్యే డ్రోన్‌ ల తో , లక్షలకోట్ల డాలర్ల విలువ చేసే నౌకలను హౌతీలు హడలెత్తిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం సంక్షోభం లోకి జారేటట్లున్నది. వరస ఎదురుదెబ్బలు తింటూ, డాలర్‌ పతనం ప్రారంభమయి, ఉక్రెయిన్‌ లోకూడా భంగపడబోతున్న అమెరికాకు ఇజ్రాయల్‌ దుశ్చర్యలను చివరకంటా బలపరచటం సాధ్యంకాదు. ప్రజలే చరిత్రను నిర్మిస్తున్నారు.

చెల్లెలు షర్మిల రాజకీయం : వసుదేవుడి స్థితిలో అన్న వైఎస్‌ జగన్మోహనరెడ్డి ?

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కాంగ్రెస్‌లో చేరవద్దు, అన్నతో చేతులు కలిపి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగాలని, అక్కడ ఉన్న ఎంపీ అవినాష్‌ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయిస్తామని సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెల్లెలు షర్మిలకు రాయబారం పంపినట్లు, ఆమె తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమా కాదా అన్నది పెద్దగా ప్రాధాన్యత కలిగిన అంశం కాదు. అన్నతో కలిస్తే లేదా లడాయికి దిగితే జరిగే పరిణామాలు, పర్యవసానాలు ఏమిటన్నదే చర్చ. నిజానికి షర్మిల కాంగ్రెస్‌లో చేరటం తెలంగాణా ఎన్నికలకు ముందే ఖరారైంది. ఆమె ఎక్కడ తన నూతన ప్రస్థానాన్ని ప్రారంభిస్తే పార్టీకి ప్రయోజనం అన్న తర్జనభర్జనల తరువాత చివరికి ఆంధ్రప్రదేశ్‌ను కార్యస్థానంగా ఎంచుకోవాలని కాంగ్రెస్‌ కోరింది. ఇది వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఊహించని పరిణామేమీ కాదు. తెలంగాణాలో తిరిగి బిఆర్‌ఎస్‌ గెలుస్తుందని వేసుకున్న లెక్కల పరీక్షలో జగన్‌ తప్పారు. అతని ధీమా గురించి ఎరిగిన వైసిపి అభిమానులు తెలంగాణాలో బిఆర్‌ఎస్‌ విజయం మీద ధీమాతో పెద్ద మొత్తంలో పందాలు కాసి చేతులు కాల్చుకున్నారు.సోదరి కాంగ్రెస్‌ ప్రవేశం గురించి ఆ ఎన్నికలకు ముందు తరువాత అంచనాల్లో మార్పులతో జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు పూనుకున్నారని చెబుతున్నారు. తల్లీ, చెల్లిని ఇంటి నుంచి, రాష్ట్ర రాజకీయాల నుంచి గెంటివేశారన్న విమర్శలకు జగన్మోహనరెడ్డి గానీ, వైసిపి నేతల వద్దగానీ సరైన, సమర్ధనీయమైన సమాధానం లేదు. షర్మిలను ఇంటికి ఆహ్వానించటం అంటే తల్లిని కూడా చేరదీయటమే అవుతుందని, తమ మీద ఉన్న విమర్శలకు సమాధానం చెప్పినట్లు అవుతుందని వైసిపి నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.తమ నేత అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారని, చిప్పకూడు తిన్నారని తెలుగుదేశం, జనసేన ఇతర పార్టీలు, మీడియా చేస్తున్న దాడిని తక్కువ చేసేందుకు, మీ నేత కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు, అదే చిప్పకూడు తిన్నారు అని తమ గణాలకు ఒక ఆయుధం ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడిని కేసులతో జైలుకు పంపారన్న విమర్శలు, ఆ ఉదంతాన్ని వైసిపి శ్రేణులు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. షర్మిలను దగ్గరకు తీయటం జరుగుతుందా ?


రాజకీయాల్లో ఏదీ అనూహ్యం కాదు, ఎవరు ఎప్పుడు దేనికి ఎవరితో చేతులు కలుపుతారో ఊహించలేము.నారా లోకేష్‌కు క్రిస్మస్‌ బహుమతి పంపిన షర్మిల తీరును సాధారణ అంశంగా కొట్టివేయలేము. ఊహాగానాల్లో ఉన్న అంశం ప్రకారం షర్మిల తన అన్న జగన్మోహనరెడ్డితో కలిస్తే జరిగేదేమిటి ? అన్న చేసిన అన్యాయానికి ఎంత లబ్దిపొంది చేతులు కలిపారు అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగానే అన్నా-చెల్లెళ్లు ఒకటైతే తెరవెనుక షర్మిలకు జరిగే లాభం ఏమిటో వెల్లడికాదు కానీ తెరముందు జగన్‌కు అది పెద్ద నష్టానికి దారి తీస్తుంది. ఓట్ల పరంగా షర్మిల తెచ్చేదేమీ ఉండదు. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్లు పట్టుకోవాల్సి వచ్చిందన్న లోకోక్తి తెలిసిందే. అయితే పురాణాల్లో అది ఒక మహత్తర కార్యం కోసం అలా చేశారని సమర్దిస్తారు. కానీ షర్మిల కోసం జగన్‌ తలవంచినా, ఒక అడుగువెనక్కు తగ్గినా సమర్థన జనానికి ఎక్కదు. ఓడిపోయే పరిస్థితి వచ్చింది కనుకనే అలా చేస్తున్నారని అనుకోవటం ఖాయం. అదే జరిగితే వైసిపి శ్రేణుల్లో జగన్‌ మీద ఉన్న విశ్వాసం మరింతగా సన్నగిల్లుతుంది, డొల్లతనం బయటపడుతుంది, ఓటర్ల మీద ప్రతికూల ప్రభావంతో మరింత నష్టం జరుగుతుంది. తమకు ఎవరితో పనిలేదని ఇంతకాలం చేసిన ప్రచారానికి ఎదురుదెబ్బ. అలాగాక రాయబారం లేదా బేరాన్ని షర్మిల తిరస్కరించినట్లు వచ్చిన వార్తలు నిజమే అయితే అది కూడా జగన్‌కు ఎదురుదెబ్బే. వ్రతం చెడ్డా ఫలం దక్కని స్థితి. దాన్ని కూడా జగన్‌ బలహీనతగానే ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చేస్తాయి. ఎలా జరిగినా అన్నను చెల్లెలు ఇరకాటంలోకి నెట్టినట్లే. బహుశా జగన్‌ లేదా సలహాదారులు దీన్ని ఊహించి ఉండరు.


2024 ఎలా ఉంటుందో తెలియదు గానీ 2023 వైఎస్‌ జగన్‌కు నిద్రలేని రాత్రులతో వీడ్కోలు పలికిందని చెప్పవచ్చు. మరోవైపు తెలుగుదేశ-జనసేన కూటమికి ఆశావహ సూచనలతో 2024 స్వాగతం పలికింది.అయితే బిజెపితో తెలుగుదేశం సయోధ్యకు పూనుకున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే ఆ సంతోషం తాత్కాలికమే కావచ్చు.నాలుగు లోక్‌సభ, పన్నెండు అసెంబ్లీ స్థానాల కోసం బిజెపి బేరమాడుతున్నట్లు చెబుతున్నారు. ఒప్పందం కుదురుతుందా లేదా ప్రచారమేనా, ఎన్ని సీట్లు కొనుక్కుంటారు అన్నది పక్కన పెడితే వచ్చే పర్యవసానాలు ఏమిటన్నది ముఖ్యం. 2004లో బిజెపితో చేతులు కలిపి చేతులు కాల్చుకున్న చంద్రబాబు నాయుడు పదేండ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.2014లో బిజెపితో ముడివేసుకొని ఐదేండ్లూ కాపురం చేయకుండానే ఎవరిదారి వారు చూసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు చేసిన విమర్శలకు ఫలితాల తరువాత మోడీ, ఇడి, ఐటి, సిబిఐలను చూసి తెలుగుదేశం నోటికి తాళం వేసుకుంది. ఇప్పుడు వైసిపిని ఓడించటమనే ఏకైక అజండా తప్ప బిజెపి- తెలుగుదేశం కలవటానికి మరొక కారణం లేదు. అధికార యావతప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదని జనం భావిస్తారు. తమకు ముస్లింల ఓట్లు అవసరం లేదని కర్ణాటకలో బిజెపి నేతలు స్వయంగా ప్రకటించారు. రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల తీరుతెన్నులు చూసినపుడు మైనారిటీలు బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు ఓటుచేసినట్లు స్పష్టమైంది. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించింది వైఎస్‌ జగన్మోహరెడ్డి అయితే వెనుక నుంచి ప్రోత్సహించింది లేదా మీ ఇష్టం అన్నట్లు వ్యవహరించింది బిజెపి అని తెలుగుదేశం శ్రేణులు భావించాయి. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలపటాన్ని ఎంతవరకు జీర్ణించుకుంటాయి ?ప్రస్తుతం తెలుగుదేశం కూటమి, వైసిపి మధ్య నువ్వానేనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాంటపుడు వచ్చే-పోయే ప్రతి ఓటుకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణా, రాజస్థాన్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికార మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే.


అధికారమే పరమావధిగా ఉన్న రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులూ ఎవరూ ఉండరు.ఇప్పటి వరకు తెరవెనుక వైసిపి మద్దతుదారుగా ఉన్న బిజెపి ఒక్కసారిగా తెరముందు తెలుగుదేశంతో చేతులు కలిపితే షర్మిల చేరిన కాంగ్రెస్‌తో జగన్మోహనరెడ్డి చేతులు కలిపే అవకాశాన్ని కొట్టిపారవేయలేము. ఇప్పుడు అది ఊహాజనితమే కావచ్చు. జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదని, కేసులు బనాయించిందన్న దుగ్దతప్ప కాంగ్రెస్‌తో వైసిపికి ఇతర పంచాయితీ ఏముంది. తన సత్తాఏమిటో జగన్‌ నిరూపించుకున్నందున అతనితో కలిసేందుకు కాంగ్రెస్‌కూ ఇబ్బంది ఉండదు. దానికి పార్టీ పునరుద్దరణ ముఖ్యం తప్ప మరొకటి కాదు. పాత సంవత్సరం తెలుగుదేశానికి ఒక పీడకల అని చెప్పాలి. చంద్రబాబునే అరెస్టు చేయించిన జగన్మోహనరెడ్డి తమ మీద కేంద్రీకరిస్తే ఏమిటన్న ఆందోళన తెలుగుదేశ శ్రేణుల్లో తలెత్తిందన్నది కాదనలేని వాస్తవం. ఒక విధంగా చంద్రబాబు నాయుడి మీద బనాయించిన కేసు, రిమాండ్‌కు పంపటం తెలుగుదేశం కార్యకర్తల్లో ఇంతకంటే ఏం చేస్తారు అన్న తెగింపును కూడా తెచ్చింది. బెయిలు వచ్చిన తరువాత వారిలో చలి వదిలింది..


మూడు రాజధానులతో రాష్ట్ర అభివృద్ధి చేస్తామనే పేరుతో వైసిపి ఆడిన క్రీడ వికటించింది.వట్టిస్తరి మంచినీళ్లు అన్నట్లుగా అభివృద్దీ లేదు, దానికి రోడ్‌మాపూ లేదు. అమరావతిని గాలికి వదలివేశారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రకరకాల ఆందోళనలను, న్యాయపోరాటాలను సాగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద, గత ఒప్పందాలను విస్మరించటం మీద కేసులు దాఖలు చేశారు. విశాఖకు కార్యనిర్వాహక రాజధాని అన్న ప్రచారం అక్కడ భూ దందాలకు తెరలేపేందుకే అన్న సంగతిని ఆ ప్రాంత వాసులు ఇప్పటికే గుర్తించారు.ముహూర్తాలు ఎన్నో చెప్పారు. చివరికి 2023 నవంబరు 22న జారీచేసిన ఉత్తరువులో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పధకాల సమీక్షల నిమిత్తం ముఖ్యమంత్రి, శాఖాధిపతుల క్యాంపు కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దానిలో ఎక్కడా కార్యనిర్వాహక రాజధాని అనే పదం లేదు. చివరికి కోర్టులో కేసు దాఖలు కావటంతో అది కూడా ఆగిపోయింది. ఇది జగన్‌కు ఊహించని దెబ్బ. కోర్టు కేసు ఇప్పట్లో తేలే అవకాశాలు లేవు. ఈ లోగా ఎన్నికల షెడ్యూలు ప్రకటన రానుంది. కాళేశ్వరాన్ని చూపి ఓట్లు కొల్లగొట్టాలన్న బిఆర్‌ఎస్‌ ఆశలను మేడిగడ్డ బారేజ్‌ పిల్లర్ల కుంగుబాటు ఎలా దెబ్బతీసిందో చూశాము. వైసిపికి మూడు రాజధానుల అంశం కూడా అలాంటిదే. ప్రతిపక్షం మీద ఆరోపణలు చేసేందుకు మాత్రమే పనికి వస్తుంది తప్ప జనాన్ని మెప్పించేది కాదు.


జగన్మోహనరెడ్డికి 2023 మిగిల్చిన మరో ఆశాభంగం స్కిల్‌డెవలప్‌మెంట్‌, ఇతర కేసులు. తెలుగుదేశం పార్టీ నేతలను ప్రత్యేకించి మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌లను వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు లేదా కనీసం ఎన్నికల తేదీ వరకు జైలుకు పంపి ప్రచారానికి దూరం చేయటం, అంతకంటే ముఖ్యంగా అగ్రనేతలకే ఏ గతి పట్టిందో చూడండి అని తెలుగుదేశం శ్రేణులను భయపెట్టేందుకు చూశారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈకేసుల్లో సిఐడి వ్యవహరించిన తీరు ఊహించినదానికంటే ముందుగానే జనసేనను తెలుగుదేశానికి మరింతదగ్గర కావించింది. చంద్రబాబు నాయుడిపై బనాయించిన కేసు బలం, తమ ప్రభుత్వం గురించి గొప్పగా ఊహించుకున్న వైసిపి శ్రేణులు పైకి చెప్పుకోలేని విధంగా తీవ్ర ఆశాభంగం చెందాయి. నాలుగేండ్లు మౌనంగా ఉండి 2023 చివరిలో చంద్రబాబును ముద్దాయిగా చేర్చటం విఫల రాజకీయ వ్యూహంలో భాగమే. బెయిలు రాదు అనుకున్న చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి రావటమే కాదు, రాజకీయ ప్రచారం చేసుకొనేందుకు కూడా కోర్టు అనుమతించింది. మంత్రులు, ఎంఎల్‌ఏల పని తీరు మీద అటు జనంలోనూ ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి ఉన్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వచ్చాయి. ఎంఎల్‌ఏలు, ఎంపీలను వదిలించుకొనేందుకు, వీలుగాకపోతే బదిలీలు చేసేందుకు జగన్‌ పూనుకున్నారు. పొమ్మనకుండా పొగపెట్టినట్లు ముందుగానే భారీ మొత్తంలో నిధి సమర్పించుకోవాలని చెబుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. వైసిపికి 90 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని ఇంటలిజెన్స్‌ ఇచ్చిన నివేదిక పేర్కొన్నట్లు చెబుతున్నారు. అధికారానికి కావాల్సిన సంఖ్య 88, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వైసిపి మునిగిపోయే నావ మాదిరి ఉంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రక్షించటం కష్టం.