ఎం కోటేశ్వరరావు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హౌదా, ఆర్టికల్ 35ఏ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు ఆమోదం తెలిపింది. అది తాత్కాలికమే గనుక రద్దు సబబే అన్నది. తీర్పు ఇచ్చిన కోర్టు, న్యాయమూర్తులకు దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు. తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు ఉంది గనుక ఆ మేరకు అనేక మంది అనుకూలంగా, వ్యతిరేకంగానూ స్పందిస్తున్నారు.భిన్న అభిప్రాయం చెప్పటం దేశద్రోహం లేదా ఉన్నత న్యాయస్థానాన్ని ధిక్కరించటం కాదు. ఈ తీర్పుతో రాష్ట్రంలోని ఒక తరగతి జనం సంతోషించరు అని కాశ్మీరు మాజీ రాజు హరిసింగ్ కుమారుడు, కేంద్ర మంత్రిగా పని చేసిన కాంగ్రెస్ నేత కరణ్ సింగ్ స్పందించారు. తీర్పుతో ఆశాభంగం చెందాం తప్ప నిరుత్సాహపడటం లేదని మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు. కాంగ్రెస్ నుంచి వెలుపలికి వచ్చి బిజెపికి దగ్గరగా ఉంటున్న గులాం నబీ అజాద్ కూడా ఆశాభంగం చెందినట్లు ప్రకటించారు. తీర్పు వెలువరిస్తున్న సందర్భంగా కాశ్మీరులోయలో ఆర్టికల్ రద్దును వ్యతిరేకించిన రాజకీయ పార్టీలకు చెందిన వారిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఆ వార్తలను సహజంగానే ప్రభుత్వం కొట్టిపడవేసింది. కోర్టు తీర్పును ఆమోదించటం తప్పనిసరి అంటూ దీనికి వ్యతిరేకంగా అనవసరంగా గోడకేసి తలలను కొట్టుకోవాల్సిన పనిలేదు.వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు శక్తిని సమీకరించుకోవాలని కరణ్ సింగ్ సలహా ఇచ్చారు.
ఆర్టికల్ 370 వలన దేశంలోని ఇతర ప్రాంతాల వారెవరూ అక్కడ ఉండటానికి, భూములు కొనుక్కోనేందుకు అవకాశం లేదని, కాశ్మీరు వేరే దేశం అన్నట్లుగా ఉందని రకరకాల ప్రచారాలు చేశారు. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యాలను జోడించారు. కాశ్మీరుకు ప్రత్యేక హౌదా తొలగించిన గత నాలుగున్నర సంవత్సరాలలో జరిగిందేమిటి? వాటిలో కొన్నింటిని చూద్దాం. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత ” నూతన కాశ్మీరు ” ఎంతో అభివృద్ది చెందిందని ప్రచారం చేస్తున్నారు. 2018-19 కాశ్మీరు రాష్ట్ర ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం మానవాభివృద్ది రంగాల్లో గుజరాత్ కంటే ముందున్నట్లు పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఇంకా జరిగిందని చెబుతున్నట్లా ? 2019జూన్లో ఎకనమిక్ టైమ్స్ ప్రచురించిన వార్త ప్రకారం 15-29 సంవత్సరాల వారిలో నిరుద్యోగం 15.89శాతం ఉంది. రాష్ట్రాన్ని కేంద్రం స్వాధీనం చేసుకున్న తరువాత 2020లో 17.8శాతం ఉన్నట్లు లేబర్ సర్వేలో తేలింది. ఇక తాజా సమాచారం ప్రకారం 18.3 శాతం ఉందని కేంద్ర మంత్రి నిత్యానందరారు పార్లమెంటులో చెప్పినట్లు హిందూస్తాన్ టైమ్స్ పత్రిక 2023 జూలై 26న ప్రచురించింది. కేంద్ర పాలనలో సాధారణ పరిస్థితి ఏర్పడిందని, ఉపాధి పెరిగిందని చేస్తున్న ప్రచారానికి పొంతన కనిపించటం లేదు. ఉగ్రవాదులు చెలరేగుతూనే ఉన్నారు. ఆ కారణంగానే రాష్ట్ర ప్రతిపత్తిని ఇంకా పునరుద్దరించలేదు.
ఆర్టికల్ 370కు అనుబంధంగా రాష్ట్రపతి ఉత్తరువు ద్వారా 1954లో రాజ్యాంగానికి ఆర్టికల్ 35ఏ తోడైంది. అనేక రాష్ట్రాలలో కల్పించిన మాదిరి కాశ్మీరులో ఉన్న శాశ్వత నివాసులకు కొన్ని ప్రత్యేక అవకాశాలు, హక్కులను ఇది కల్పించింది. రాష్ట్రం వెలుపల ఉన్న వారికి స్థిర ఆస్తులను కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. ఎవరు శాశ్వత నివాసులన్న నిర్వచనాన్ని మూడింట రెండువంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మాత్రమే మార్చగలదు.ఈ ఆర్టికల్ వలన దేశంలోని ఇతరులు కాశ్మీరులో రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడుతున్నట్లు , ఇది పౌరుల మౌలిక హక్కులకే విరుద్దం అని రాష్ట్రం వెలుపలి వారిని వివాహం చేసుకున్న కాశ్మీరీ మహిళకు జన్మించిన సంతానానికి కూడా ఆస్తిహక్కు ఉండదని ఇది వివక్ష కాదా అని కొందరు భాష్యం చెప్పారు. నిజానికి కాశ్మీరు శాశ్వత నివాసుల గురించి 1927లోనే నాటి రాజు హరిసింగ్ ఉత్తరువులు జారీ చేశారు. విలీనం సందర్భంగా వాటికి హమీ ఇచ్చినందున రాజ్యాంగంలో పొందు పరచినట్లు సమర్ధకులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక హక్కులు మరికొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నాయని వాటి సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా సవరించిన దాని ప్రకారం కాశ్మీరులో స్థానికత నిర్దారణకు నిబంధనలు ఇలా ఉన్నాయి. పదిహేను సంవత్సరాలు కాశ్మీరులో నివసించిన వారు, రాష్ట్రంలో ఏడు సంవత్సరాల పాటు చదివి పది లేదా పన్నెండవ తరగతి పరీక్షకు హాజరైన వారు, వలస వచ్చినట్లు పునరావాస, సహాయ కమిషనర్ వద్ద నమోదు చేయించుకున్నవారు, పదేండ్లకు పైగా కాశ్మీరులో పని చేసిన ఆలిండియా సర్వీసు అధికారులు, ప్రభుత్వ రంగసంస్థలు, బాంకులు, పరిశోధనా సంస్థలు, చట్టబద్ద ఇతర సంస్థలలో వారు పని చేసినా స్థానికులుగా పరిగణించబడతారు. అలాంటి వారి పిల్లలు రాష్ట్రం వెలుపల ఉపాధి, వాణిజ్యం, వంటి వాటికోసం ఉంటే వారినీ స్థానికులుగా పరిగణిస్తారు.
ఒకే దేశం, పౌరులంతా సమానమే అని చెప్పినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో వెలుపలి వారు భూములు కొనేందుకు లేదు. జమ్మూకాశ్మీరులో నిబంధనలు సడలించినప్పటికీ భూముల కొనుగోలు మినహాయింపు అది పరిశ్రమలకే తప్ప ఎవరుబడితే వారు కొనుగోలు చేసేందుకు కాదని లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారు. సవరించిన కాశ్మీరు రెవెన్యూ చట్టం ప్రకారం వ్యవసాయదారులు కాని వారు సాగు భూమి కొనుగోలు చేసేందుకు లేదు. ఎవరు వ్యవసాయదారు అంటే స్వంతంగా చేసే వారు అని స్పష్టం చేశారు. ఎవరు కొనుగోలుకు అర్హులో నిర్ణయించాల్సి ఉంది. తిరిగి రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఏర్పడే ప్రభుత్వం తలచుకుంటే ఆంక్షలను తిరిగి ప్రవేశపెట్టవచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్ 371 ప్రకారం అనేక రాష్ట్రాలలో ప్రత్యేక హక్కులను కల్పించారు. ఇరవై సంవత్సరాలకు పైగా నివాసం ఉన్నవారే హిమచల్ ప్రదేశ్లో ఎక్కడైనా భూమికొనుగోలుకు అర్హులు.ఎవరైనా నిజమైన స్థానికుడిని హిమాచలీ కాని మహిళ వివాహం చేసుకుంటే అలాంటి వారికి మినహాయింపు ఉంటుంది. స్థానికులైనా వ్యవసాయదారులు కాని వారు సాగు భూములు కొనటానికి లేదు. నివాసానికి కొనుగోలు చేయాలన్నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.వ్యవసాయేతర భూమిని వెలుపలి వారు కొనుగోలు చేయాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. జలవిద్యుత్ ప్రాజెక్టులకు పెట్టుబడిదారులు భూమి కొనుగోలు చేయవచ్చు. నాగాలాండ్లో ఆర్టికల్ 371ఏ ప్రకారం అక్కడి భూముల బదిలీ, యాజమాన్య హక్కులపై కేంద్రం కూడా చట్టాలు చేయటానికి లేదు. భూమి పుత్రులు తప్ప ఇతరులు భూమికొనే అవకాశం లేదు. సిక్కింలో ఆర్టికల్ 371ఎఫ్ ప్రకారం వెలుపలి వారు భూమి, ఆస్తులు కొనుగోలు మీద ఆంక్షలు ఉన్నాయి. కొన్ని మునిసిపల్ ప్రాంతాల్లో తప్ప సిక్కిం వాసులు ఆస్తి కొనుగోలు చేయవచ్చు, వారు కూడా గిరిజన ప్రాంతాల్లో కొనటానికి లేదు అక్కడ వారికి మాత్రమే కొనే అమ్మే హక్కు ఉంటుంది.ఎవరైనా పరిశ్రమలు పెడితే వెలుపలి వారు కొనుగోలు చేయవచ్చు. అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం,పశ్చిమబెంగాల్లో రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలులో పేర్కొన్న స్వయం పాలిత గిరిజన ప్రాంతాల్లో ఇతరులు భూములు కొనటానికి లేదు. మిజోరంలో ఆర్టికల్ 371జి ప్రకారం గిరిజనేతర ప్రాంతాల్లో భూబదలాయింపుల్లో పరిమితులు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో సాంకేతికంగా, సంప్రదాయంగా స్థానిక నివాసులు, కానివారికీ ఎవరికీ భూమిపై హక్కులు లేవు.2018లో చేసిన చట్టం ప్రకారం స్థానికులకు వ్యక్తిగత ఆస్తి హక్కులు కల్పించారు. వెలుపలి వారు, గిరిజనేతరులు స్వంత ఆస్తి కలిగి ఉండటానికి లేదు. ఝార్ఖండ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మధ్య ప్రదేశ్, చత్తీస్ఘర్లలో గిరిజనేతరులు గిరిజనుల భూములు కొనుగోలు చేయటంపై ఆంక్షలు ఉన్నాయి. ఉత్తరాఖండ్లో 2003లో చేసిన చట్టం ప్రకారం వెలుపలి వారు నివాసం కోసం కేవలం 250 చదరపు మీటర్ల భూమిని మాత్రమే కొనుగోలు చేయవచ్చు.
తమిళనాడులో జిల్లాకలెక్టర్ అనుమతితో గరిష్టంగా 59.95 ఎకరాల వ్యవసాయ భూమిని మాత్రమే కొనుగోలు చేయవచ్చు. గడచిన పది సంవత్సరాల్లో సాగులేని భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎవరైనా వ్యవసాయ భూములు కొనవచ్చు.ఏ తరగతి ప్రాంతాల్లో గరిష్టంగా పది ఎకరాలు అంటే నీటి వసతి ఉన్నచోట, కె తరగతి ప్రాంతాల్లో మెట్ట, నీటివసతి లేని చోట 54 ఎకరాలను కొనుగోలు చేయవచ్చు.కేరళలో ఎవరైనా భూములు కొనవచ్చు. అయితే వివాహం కాని పెద్దలు లేదా కుటుంబంలో ఒకరే ఉంటే ఐదు నుంచి ఏడున్నర ఎకరాలు మాత్రమే కొనుగోలు చేయవచ్చు.ఐదుగురి వరకు ఉన్న కుటుంబం పది నుంచి పదిహేను ఎకరాలు కొనుక్కోవచ్చు.పదికి మించి ఉన్న కుటుంబం గరిష్టంగా ఇరవై ఎకరాల వరకు కొనవచ్చు.మహారాష్ట్రలో కేవలం వ్యవసాయదారులు మాత్రమే గరిష్టంగా 54ఎకరాల వరకు సాగు భూములు కొనవచ్చు.హర్యానాలో అదుపులో ఉన్న ప్రాంతాలుగా ప్రకటించిన చోట వ్యవసాయేతర అవసరాల కోసం సాగు భూములు కొనాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. గుజరాత్లో ఉన్న నిబంధనల ప్రకారం వ్యవసాయం చేయని వారు సాగు భూములు కొనేందుకు లేదు. గుజరాతీలకు మాత్రమే వ్యవసాయ భూముల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉంది.2012లో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుప్రకారం దేశంలోని ఏ సాగుదారైనా గుజరాత్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేయవచ్చు. వివిధ నేపధ్యాల పూర్వరంగంలో ఒకే దేశమైనప్పటికీ భూములు కొనుగోలుపై ఆంక్షలు ఉన్నాయి. కాశ్మీరులో కూడా అదే జరిగింది. ప్రస్తుతం అది కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. రేపు తిరిగి రాష్ట్రంగా ఏర్పడితే భూమి హక్కులు, ఇతర అంశాలకు సంబంధించి తనదైన చట్టాలను చేసుకొనేందుకు అవకాశాలు లేకపోలేదు. కేంద్రం రద్దు చేసిన 35ఏ ఆర్టికల్లోని అంశాలను మరో చట్టం రూపంలో తెచ్చినా ఆశ్చర్యం లేదు.
వాట్సాప్లో కాషాయదళాలు అనేక తప్పుడు ప్రచారాలు చేశాయి. కాశ్మీరులో హిందువులు, సిక్కులు మైనారిటీలు వారికి అక్కడ రిజర్వేషన్లు లేవు అన్నది ఒకటి.హిందూ మతం దేశంలో మైనారిటీ కాదు. రాష్ట్రాలలో ఉన్న జనాభా ప్రాతిపదికను బట్టి నిర్ణయిస్తే ఈశాన్య రాష్ట్రాలలో అనేక చోట్ల క్రైస్తవులు మెజారిటీ, కానీ అక్కడ హిందువులకు రిజర్వేషన్లు అడగలేదు.మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే మా ప్రాణాలైనా ఇస్తాంగానీ అమలు జరగనివ్వం అని చెబుతున్న బిజెపి వారు కాశ్మీర్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా అడుగుతారు ? కాశ్మీరు 2005 రిజర్వేషన్ చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల వారికి 20, షెడ్యూలు తరగతులకు 10, షెడ్యూలు కులాలవారికి 8, మాజీ సైనికులకు 6, వికలాంగులకు మూడు, వాస్తవాధీన రేఖ సమీపంలో వున్నవారికి మూడు, వెనుక బడిన తరగతులకు రెండుశాతం వున్నాయి. వీటిని 2020లో కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా షెడ్యూలు తరగతులకు 10,షెడ్యూలు కులాలకు 8, ఇడబ్ల్యుఎస్ 10, వెనుకబడిన ప్రాంతాల వారికి పది, మాజీ సైనికులకు ఆరు,పహారీ భాష మాట్లాడేవారికి, వికలాంగులు, వాస్తవాధీన రేఖ వెంబడి ఉండేవారికి, బలహీన వర్గాల(సామాజిక కులాలు)కు నాలుగేసి శాతాల చొప్పున సవరించారు. మొత్తం రిజర్వేషన్లు అరవైశాతం ఉన్నాయి. వర్తమాన పార్లమెంటు సమావేశాల్లో వాటిని చట్టబద్దం చేస్తూ బిల్లులను ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం కాశ్మీరులో హిందువులకు ప్రత్యేక రిజర్వేష్లన్లను ఎందుకు పెట్టలేదో బిజెపి వారు చెప్పగలరా ?
