• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: China

ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !

28 Wednesday Jan 2026

Posted by raomk in CHINA, Current Affairs, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RUSSIA, UK, USA, WAR

≈ Leave a comment

Tags

China, Donald trump, Narendra Modi Failures, World Military Power, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

77వ రిపబ్లిక్‌ దినోత్సవం రోజున మన సైనిక బలగాల సత్తాను ప్రదర్శించారు. న్యూఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిపిన కవాతును చూసి దేశం యావత్‌ పులకించిపోయింది.ప్రతి దేశం రిపబ్లిక్‌ దినోత్సవం లేదా స్వాతంత్య్ర దినోత్సవం, ఇతర ముఖ్య ఉదంతాలు ఉంటే ఆరోజున ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించి తమ శక్తి ఇదని ప్రపంచానికి చాటుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు విశ్లేషకులు, కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన కథనాలు, విశ్లేషణల్లో అతిశయోక్తులు దార్లాయి.ఈ నేపధ్యంలో ప్రపంచ మిలిటరీ బలం బలగాల గురించి పరిమితంగా అయినా ఒక్కసారి అవలోకనం చేసుకోవటం అవసరం. హిందూ మహాసముద్రం భారతదేశానిదే అని ఒక విశ్లేషకుడు చెప్పారు. ఒక దేశ సరిహద్దు నుంచి 12 నాటికల్‌ మైళ్ల(ఒక్కో నాటికల్‌ మైలు 1.852 కిలోమీటర్లకు సమానం) వరకు ఆయా దేశాలకు సర్వహక్కులు ఉంటాయి.పన్నెండు నుంచి 24 నాటికల్‌ మైల్స్‌ వరకు కస్టమ్స్‌, వలసలు,కాలుష్యాలకు సంబంధించిన చట్టాలు అమలు చేసే అధికారం ఉంటుంది.రెండువందల నాటికల్‌ మైల్స్‌ వరకు సముద్ర ఉత్పత్తులు,ఆ పరిధిలో ఉన్న ఖనిజవనరులను తవ్వితీసుకొనే హక్కు ఆయాదేశాలకు ఉంటుంది. ఆపైన ఉండే ప్రాంతం అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. శ్రీలంక-భారత్‌ మధ్య దూరం 288 కిలోమీటర్లు మాత్రమే ఉన్నందున సమదూరంతో సరిహద్దుల నిర్ణయం జరిగింది. నిజానికి హిందూమహాసముద్రం అంటే మనదేశ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు. పొడవు 9,600, వెడల్పు 7,600 కిలోమీటర్లు ఉంది.మనదేశానికి ఇది మూడువైపుల ఉంది. దీనిలో అందరికీ తెలిసిన అరేబియా సముద్రం, బంగాళాఖాతం,మరికొన్ని ప్రాంతీయ సముద్రాలు ఉన్నాయి.వీటన్నింటినీ కలిపి హిందూ మహాసముద్రం అంటున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండం వరకు విస్తరించి ఉంది.

మనదేశం వద్ద 1,500 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ నౌకలను దెబ్బతీసే సామర్ధ్యం గల దీర్ఘశ్రేణి క్షిపణి (ఎల్‌ఆర్‌-ఎఎస్‌హెచ్‌ఎం)తో చైనా,అమెరికా నౌకలను కూడా దెబ్బతీయగలవని విశ్లేషకుడు చెప్పారు. అది నిజమే, ఎప్పుడు యుద్ధం వచ్చినపుడు, ఎదుటి వారు దాడికి దిగనంతవరకు మాత్రమే.హిందూమహాసముద్ర అంతర్జాతీయ జలాల్లో ప్రవేశించిన ఏ దేశనౌకనైనా వెంటనే పేల్చివేయటానికి ఉండదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అలాంటి క్షిపణులను తయారు చేసే దేశంగా మనం ఇటీవలనే సామర్ధ్యం సంపాదించుకున్నాం.మనకంటే బలమైన మిలిటరీ శక్తి ఉన్న విషయాన్ని దాచి ప్రపంచంలో మనకు ఎదురులేదని ఎవరైనా చెపితే అది వాట్సాప్‌ పాండిత్యం తప్ప మరొకటి కాదు. వర్తమాన బలా బలాల గురించి ఈ సందర్భంగా చూద్దాం.మన దగ్గర ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయోగించగల ఖండాంతర క్షిపణి అగ్ని-5 ఉంది. ఇతర దేశాలలో మినిట్‌మాన్‌- అమెరికా క్షిపణి 13,000 కిమీ, రష్యాలో ఆర్‌ఎస్‌- 28 శాటమాన్‌ క్షిపణి పదకొండువేల కి.మీ, చైనా వద్ద డాంగ్‌ ఫెంగ్‌-41 రకం తొమ్మిదివేల కిలోమీటర్లు ప్రయాణించగలవి ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద గరిష్టంగా 15వేల కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణి తయారీలో ఉన్నట్లు ఊహాగానాలు. దాని వద్ద శక్తివంతమైన ద్రీర్ఘశ్రేణి క్షిపణులు ఉన్నకారణంగా తేడా వస్తే తన మిత్రదేశంగా ఉన్న జపాన్‌ మీద ప్రయోగించగలదనే భయంతోనే అమెరికా ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యవహరిస్తున్నది. ఇలా ఒకరిని మించి ఒకరు తమ ఆయుధాలకు పదునుపెట్టుకుంటున్నారు.ఇప్పటికే ప్రపంచంలో చైనా నావికాదళశక్తిలో ఒకటవ స్థానంలో ఉంది. అమెరికా వద్ద అన్ని రకాల యుద్ధ నావలు 471 ఉండగా చైనా 1,025 భారత్‌ 290 మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే అమెరికా వద్ద విమానవాహక యుద్ద నౌకలు 11, చైనా దగ్గర మూడు, భారత్‌ వద్ద రెండు ఉన్నాయి. ఈ పూర్వరంగంలో మనదేశం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆయుధాలను తయారు చేసుకోవాల్సిందే అనటం నిర్వివాదాంశం. దీనిలో భాగంగానే అణ్వస్త్రాలను తయారు చేసుకొనే అవకాశాలను అట్టిపెట్టుకొని అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాం.గతంలో రెండుసార్లు మనం అణుపరీక్షలు జరిపినపుడు మిత్రదేశం అంటూనే మన మీద కక్షతో అమెరికా ఒక్కటే ఆంక్షలు విధించింది.శత్రువైరుధ్యాలు ఉన్నప్పటికీ చైనా అలాంటి చర్యలకు పాల్పడలేదు.

మానవాళికి ముప్పు తెచ్చే యుద్ధాలు వద్దనే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. కానీ ఉన్మాదంతో కొందరు ఊగిపోతున్నారు. పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని దెబ్బతీసే మన తాజా క్షిపణి ధ్వని వేగం (గాలిలో గంటకు 1,225కిలోమీటర్లు) పది మాక్‌లంటే 12,250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని పావు గంటలోనే పని ముగిస్తుందని చెబుతున్నారు. ఇది మన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. అయితే వారు ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. రష్యా వద్ద 27 మాక్‌ల అవన్‌గార్డ్‌, చైనా వద్ద 27మాక్‌ల డిఎఫ్‌-41, అమెరికా దగ్గర ట్రైడెంట్‌ 24, మినిట్‌మాన్‌ 23,రష్యా వద్ద 20.64మాక్‌ల క్షిపణులు ఉన్నాయి. అందువలన మాదేవుడే అందరికీ అంటే ఎలా అంగీకరించటం లేదో ఇది కూడా అంతే. మన గొప్ప గురించి మనం చెప్పుకోవచ్చు తప్ప మనమే గొప్ప అంటే జనాలను తప్పుదారి పట్టించినట్లే. మన మిలిటరీ అజేయమే అయితే నరేంద్రమోడీ మన ఆక్రమిత కాశ్మీర్‌ను ఎందుకు వెనక్కు తీసుకురాలేదు, ఆపరేషన్‌ సింధూర్‌లో మరికొంత మందుకు పోయి ఉంటే పని జరిగేది కదా అని అనేక మంది అనుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం యుద్ధాల్లో కావాల్సింది ఎప్పటి సమాచారాన్ని అప్పుడు తెలియచేసే పరిజ్ఞానం. ఉక్రెయిన్‌కు అలాంటి సత్తాలేనప్పటికీ పశ్చిమ దేశాలు అందచేసిన సమాచారంతో గడచిన నాలుగు సంవత్సరాలుగా రష్యాను అడ్డుకోవటమే గాక, కొన్ని దాడులు కూడా చేయగలుగుతున్నదంటే కారణం అదే. ఆపరేషన్‌ సింధూర్‌లో తొలి రోజు మనకు ఎదురుదెబ్బలు తగలటానికి కారణం పాకిస్తాన్‌కు పశ్చిమదేశాలు(అమెరికాతో సహా) అందించిన సమాచారమే కారణంగా కొందరు భావిస్తున్నారు.

అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం మిలిటరీ అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహాలు అమెరికా వద్ద 247, చైనా 157, రష్యా 110,ఫ్రాన్స్‌ 17, ఇజ్రాయెల్‌ 12, ఇటలీ 10, మనదేశం 9, జర్మనీ 8,బ్రిటన్‌ 6, స్పెయిన్‌ 4 కలిగి ఉన్నాయి.అందువలన భూమి చుట్టూ తిరిగే అవి ఒకదాని వెనుక ఒకటి సమాచారాన్ని పసిగడితేనే 24గంటల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు.మిలిటరీతో సహా అన్ని అవసరాలకు గాను అమెరికా 5,176, బ్రిటన్‌ 653, చైనా 623, రష్యా 181, జపాన్‌ 88 కలిగి ఉండగా మనదేశం 62 కలిగి ఉంది. అయితే ఈ ఉపగ్రహాలు సేకరించే సమాచారం కూడా మిలిటరీ అవసరాలకు ఉపయోగపడుతుంది.ఈ కారణంగానే ప్రపంచంలో ఏమూల ఏమిజరిగినా అమెరికా ఇట్టే పసిగడుతున్నదంటే ఈ వ్యవస్థలే కారణం. ఇటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రపంచానికి భద్రత లేదని, తనకు అన్ని వైపుల నుంచీ ముప్పు ఉన్నదని అమెరికా ప్రపంచాన్ని నమ్మించేందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నది. గ్రీన్‌లాండ్‌ ప్రాంతాన్ని తాము ఆక్రమిస్తామని చెప్పిన ట్రంప్‌ తమ దేశ రక్షణకు ఉన్న ” గోల్డెన్‌ డోమ్‌ ” వంటిదాన్నే ఆ ప్రాంతానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఏమిటిది అంటే గగనతలం నుంచి జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించటం.మన రామాయణ, మహాభారత కథలో అలాంటివి చూసే ఉంటారు. రాక్షసులు యాగాన్ని కొనసాగ నివ్వకుండా చేసేందుకు చూస్తే రక్షణగా రాముడిని నియమించిన సంగతి, మహాభారతంలో బాణాలతో అర్జునుడి పరాక్రమం తెలిసిందే.కొన్ని దశాబ్దాలకు ముందే అమెరికా హాలీవుడ్‌ స్టార్‌వార్స్‌పేరుతో సినిమాలు తీసింది. ఇప్పుడు నిజంగానే అలాంటి గగనతల యుద్ధాలు జరుగుతున్నాయా ? అమెరికా కనుసన్నలలో పని చేసే సంస్థలు, కొందరు వ్యక్తులు రష్యా, చైనా ఈ రంగంలో ముందున్నాయని, ప్రపంచానికి ముప్పు ఉందని ప్రచారం చేస్తున్నారు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడన్నట్లుగా తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. అంతా రహస్యంగా జరుగుతున్న వ్యవహారం గనుక ఈ పోటీ గురించి చెబుతున్న అంశాలను అవుననీ, కాదని చెప్పలేము.

భూ కక్ష్యలో ఉపగ్రహాలను దెబ్బతీసే సాంకేతిక పరిజ్ఞానం(ఎసాట్‌) ప్రతిదేశం కలిగి ఉండాలని అందరూ చెబుతున్నారు. గగనతల కేంద్రంగా ఆయుధాలు కావాలని అమెరికా మిలిటరీ నిపుణులు బహిరంగంగానే చెప్పారు.ఈ విషయంలో రష్యన్లు, చైనీయులు తమ సామర్ధ్యాలను ఎంతో ఆధునికంగా కనపరుస్తున్నారని, దాన్ని కాదనలేమని బ్రిటన్‌లోని డుర్హామ్‌ విశ్వవిద్యాలయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం సహడైరెక్టర్‌ బ్లెడిన్‌ బోవెన్‌ చెప్పాడు. నిజంగా అలాంటి వేదికలు ఇప్పుడు ఉన్నాయో లేదో చెప్పలేము గానీ అవసరమైన సాంకేతికతలను వారు చూపుతున్నారని అన్నాడు. ఒక ఉపగ్రహాన్ని నేరుగా దెబ్బతీయటం,ఇతరంగా కూల్చివేయటం వాటిలో ఒకటి.భూతలం నుంచి సముద్రాల్లో నౌకలను ముంచివేయటం, టెర్మినళ్లను దెబ్బతీయటం, ఎలక్ట్రానిక్స్‌ ద్వారా చేసేవన్నీ గగనతల పోరులో భాగమే అన్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ పోరులో స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ వంటి ప్రైవేటు ఉపగ్రహసేవలను అందించేవారు రష్యన్ల ఆయుధాలను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని, సైబర్‌దాడులకు పాల్పడుతున్నారని, అదే విధంగా రష్యా నుంచి సంకేతాలను అడ్డుకోవటాన్ని గమనించినట్లు బోవెన్‌ చెప్పాడు. గగనతల దాడుల ఆయుధాలను తయారు చేయకూడదన్న ఒప్పందాల మేరకు నాడు సోవియట్‌ వెనక్కు తగ్గిందని ఇప్పుడు రష్యా తిరిగి పూనుకున్నట్లు కనిపిస్తున్నదని రాండ్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ బ్రూస్‌ ఎం క్లింటాక్‌ ఆరోపించాడు. సాధారణంగా గగనతలంపై రష్యా పరిమితంగానే ఆధారపడుతుందని, అదే అమెరికా తన ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలకు గరిష్టంగా ఆధారపడుతున్నది. రోజువారీ ఉపగ్రహ ప్రయోగాలను చూస్తే చైనా కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తున్నదని క్లింటాక్‌ చెప్పాడు. ముందే చెప్పుకున్నట్లు ట్రంప్‌ ప్రస్తావించిన ”గోల్డెన్‌ డోమ్‌ ” ఏర్పాటుకు 1983 నాటి అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ప్రకటించిన స్ట్రాటజిక్‌ డిఫెన్స్‌ ఇనిషియేటివ్‌ నాంది. దీన్నే స్టార్‌వార్స్‌ అని పిలిచారు.దీనిలో గగనతలంలో ఉండే పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే గోల్డెన్‌ డోమ్‌ వ్యవస్థ అణ్వాయుధాల నుంచి రక్షణ కల్పించలేదు గానీ ఇతరంగా ఎంతో ఉపయోగం అని బోవెన్‌ చెప్పాడు. గతంలో ఎదురైన అనేక సాంకేతిక సవాళ్లను అధిగమించారని, గగనతలంలో అడ్డుకోవటం సంక్లిష్టమైనదని, వాటిని వేగంగా రూపొందించటం, పరీక్షించటం అంతతేలిక కాదని అంటున్నారు.

అంతరిక్ష రంగంలో మనదేశం అనేక విజయాలను సాధించింది. అయితే ఇంకా ఎంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.చైనా తన సోషలిస్టు వ్యవస్థను కాపాడుకొనేందుకు అమెరికాతో పోటీ అని చెప్పకపోయినప్పటికీ మిలిటరీ రీత్యా బలాన్ని పెంచుకుంటున్నది, ఆర్థికంగా దానికా శక్తి ఉంది. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు మిలిటరీ మీద అవసరమైనదాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.మనదేశం 109 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుంటే (జిడిపి 4లక్షల కోట్ల డాలర్లు) చైనా 303 బిలియన్‌ డాలర్లు (జిడిపి 19లక్షల కోట్ల డాలర్లు) వెచ్చిస్తున్నది.అమెరికా 831 బిలియన్‌ డాలర్లు (జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు) కేటాయించింది.తన ఆయుధ ప రిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా వెచ్చిస్తున్నది, చైనా స్వంతంగా తయారు చేసుకొనేందుకు పూనుకుంది.మనం ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాం. అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తే ఓకే, మనం కూడా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే పోటీపడే ఆర్ధిక శక్తి ఉందా లేదా అన్నది ముందు చూసుకోవాలి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

14 Wednesday Jan 2026

Posted by raomk in Current Affairs, Europe, History, imperialism, INTERNATIONAL NEWS, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

China, Denmark, Donald trump, Greenland annexation By US, NATO, RUSSIA, The Battle Over Greenland:

ఎం కోటేశ్వరరావు

ప్రస్తుతం డెన్మార్క్‌లో స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొనేందుకు అమెరికా రంగం సిద్దం చేసింది. ఆప్రాంతాన్ని తమ 51వ రాష్ట్రంగా స్వాధీనం చేసుకొనేందుకు అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధుల సభ సభ్యుడు రాండీ ఫైన్‌ ఒక బిల్లును ప్రవేశపెట్టాడు.ఈ దురాగతాన్ని ఐక్యంగా అడ్డుకోవాలని డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ నిర్ణయించాయి. గతంలో వాణిజ్యం పేరుతో ఐరోపా సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్‌,డచ్‌, పోర్చుగీసు,ఫ్రాన్సు వంటి దేశాలు ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాయి. ఆక్రమంలో వాటి మధ్య యుద్ధాలు కూడా జరిగాయి.ఇప్పుడు తన భద్రతకు ముప్పు పేరుతో ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు అమెరికా పావులు కదుపుతోంది. మాదకద్రవ్యాలను సరఫరా చేసే ముఠాకు నాయకుడంటూ తప్పుడు ప్రచారం చేసి వెనెజులా అధ్యక్షుడిని అపహరించింది. ఇరాన్‌లో ప్రజాందోళలను అణచివేస్తున్నందున జోక్యం చేసుకుంటామని బెదిరిస్తున్నది. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. ఆర్కిటిక్‌ సముద్రంలో ఉన్న డెన్మార్క్‌కు చెందిన స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌లాండ్‌ దీవి తన రక్షణకు అవసరమంటూ దాన్ని ఆక్రమించుకొనేందుకు పూనుకుంది. అన్ని ఖండాలలో 800కు పైగా చిన్నా, పెద్ద మిలిటరీ కేంద్రాలు, లక్షలాది మంది సైన్యాన్ని మోహరించిన అమెరికా ఏ దేశం మీదనైనా దాడికి దిగదలుచుకుంటే కొన్ని గంటల్లోనే సైన్యాన్ని దించగలదు. అలాంటిది చిన్న దేశమైన క్యూబా మొదలు పెద్ద దేశమైన చైనా వరకు అన్నీ తన భద్రతకు ముప్పు తలపెట్టాయంటూ ఒక మైండ్‌ గేమ్‌(మానసిక క్రీడ) ఆడుతోంది. ఆ సాకుతో బెదిరింపులకు, ఆక్రమణలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చెప్పిన అనేక మధురమైన మాటలతో ఇంక పనిలేదు, అనుకున్న లక్ష్యాలు నెరవేరటం లేదంటూ కర్ర పుచ్చుకొని దందాకు పూనుకుంది. తనకు లొంగని వెనెజులా మీద దాడి చేసి అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అపహరించి విచారణ తతంగం ప్రారంభించింది. ఆ దేశానికి తానే తాత్కాలిక అధ్యక్షుడనని ట్రంప్‌ ప్రకటించుకున్నాడు. తదుపరి లక్ష్యాలుగా కెనడా,గ్రీన్‌లాండ్‌,ఇరాన్‌, మెక్సికో, కొలంబియా ఇలా జాబితాను పెంచుకుంటూ పోతోంది.

ఇరాన్‌ మీద గతేడాది భీకరదాడి జరిపినప్పటికీ అది సాధించిందేమీ లేదు. అణుస్థావరాలకు ఆవగింజంత నష్టం కూడా జరగలేదని తేలింది. అందువలన ఇప్పుడు మరోసారి దాడి జరగాలంటే అనేక అంశాలను మదింపు చేసుకోవాల్సి ఉంటుంది. అందువలన తొలుత గ్రీన్‌లాండ్‌తో ఆక్రమణ ప్రారంభం కావచ్చన్నది ఒక అభిప్రాయం. ఒక గుండా ముందుగా బలహీనులనే దాడికి ఎంచుకుంటాడు. దాని వలన రెండు ప్రయోజనాలు ఒకటి నా తడాఖా ఇట్లుంటది అని చూపుకోవచ్చు, మిగిలిన వారిని బెదిరించవచ్చు. గ్రీన్‌లాండ్‌ను తాను స్వాధీనం చేసుకోనట్లయితే రష్యా, చైనా ఆక్రమించుకుంటాయని అందువలన తానే ఆపని చేయనున్నట్లు ట్రంప్‌ ఒక అబద్దాన్ని చెప్పాడు. నిజానికి అలాంటి ఆరోపణలను ఏ దేశం లేదా వాటిని వ్యతిరేకించే మీడియా కూడా చేసేందుకు సాహసించలేదు.జనాలను తప్పుదారి పట్టించేందుకు ఒక పధకం ప్రకారం గోబెల్స్‌ను మించి ప్రచారాలు చేయటంలో అమెరికా పేరుమోసింది.ఆర్కిటిక్‌ సముద్రంలో అనేక దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి.ఎక్కడా దాపరికం లేదు, చైనా కూడా అదే చేస్తోంది. కానీ గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొనేందుకే అని బీజింగ్‌ మీద కథనాలు రాస్తున్నారు. ఆర్కిటిక్‌ సముద్రంలో మంచుకరిగి పోతున్నదని గత మూడుదశాబ్దాలుగా అనేక మంది చెబుతున్నారు, దాని పరిణామాలు, పర్యవసానాల గురించి పరిశోధనలు చేయటం ఆ ప్రాంత దేశాలైన నార్వే, డెన్మార్క్‌, స్వీడన్‌,ఐస్‌లాండ్‌, కెనడా, అమెరికా, రష్యా, ఫిన్లాండ్‌ దేశాలకే కాదు, యావత్‌ మానవాళికి అవసరం.అయితే అవి అంగీకరించిన అంతర్జాతీయ చట్టాలు, నిబంధనల మేరకు జరగాలి. ప్రస్తుతం వార్తలోకి ఎక్కిన గ్రీన్‌ లాండ్‌ దీవి డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం. అది డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌కు అమెరికా రాజధాని వాషింగ్టన్‌డిసికి మధ్యలో రెండు దేశాలకు 3,200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రష్యాకు ఐదువేలు, చైనాకు ఎనిమిది, మనదేశానికి తొమ్మిదివేల కిలోమీటర్లు ఉంటుంది.గ్రీన్‌లాండ్‌ రాజధాని నుక్‌ పట్టణం డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌కు 3,500 కిలోమీటర్ల దూరంలో ఉంటే అమెరికా నగరం న్యూయార్క్‌కు 2,900కి.మీ దూరంలో ఉంది. దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని చెబుతున్న అమెరికా, ఆర్కిటిక్‌ సర్కిల్‌ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రాంతంలో పరిశోధనలు చేసే హక్కు చైనాతో సహా ఏ దేశానికైనా ఉంటుందా లేదా ! ప్రచ్చన్న యుద్ధ కాలంలో ఈ ప్రాంతంలో అమెరికా, సోవియట్‌ యూనియన్‌ కూడా అణుజలాంతర్గాములను మోహరించాయి. ఇప్పుడు మరోసారి ఆ ప్రాంతాన్ని ఒక యుద్ధ కార్యక్షేత్రంగా మార్చేందుకు అమెరికా పూనుకుంది. ఇప్పటికే గ్రీన్‌లాండ్‌లో ఉన్న తన మిలిటరీ కేంద్రాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తనకు ఆ దీవి పూర్తిగా కావాలని, మర్యాదగా ఇస్తే సరి, లేకుంటే బలప్రయోగం చేయాల్సి వస్తుందని బెదిరింపులకు దిగింది. రష్యా, చైనా నుంచి ఆర్కిటిక్‌ ప్రాంతానికి ముప్పు వచ్చిందని 2024లోనే అమెరికా ప్రచారం ప్రారంభించింది.

గ్రీన్‌లాండ్‌ ప్రాంతంపై అమెరికా కన్ను ఎందుకు ? ఆర్కిటిక్‌ ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నాయి, అక్కడి సర్వేలో తేలిన 34 రకాల్లో 25 విలువైన ఖనిజ జాబితాలో ఉన్నాయి. నౌకా రవాణా మార్గంగా ఉండటం, మిలిటరీ రీత్యా కీలక ప్రాంతం కావటంతో దాన్ని తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలని, చైనా, రష్యాలను మరింతగా ఇబ్బంది పెట్టాలన్నది అసలు లక్ష్యం.ఇదే జరిగితే ఐరోపా భద్రత, ప్రపంచ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. గ్రీన్‌లాండ్‌ భౌగోళికంగా ఉత్తర అమెరికాలో ఉంది, ఐరోపాలోని డెన్మార్క్‌లో భాగం అయినప్పటికీ స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న ప్రపంచంలోని పెద్ద దీవి.జనాభా కేవలం 60వేల లోపే, వారు కూడా ఎక్కువగా చేపలవేట మీదే ఆధారపడుతున్నారు. ఈ ప్రాంతంలో మిలిటరీ కార్యకలాపాల నిర్వహణకు డెన్మార్క్‌తో అమెరికా రక్షణ ఒప్పందాలు చేసుకుంది. పర్యావరణ మార్పులతో మంచు కరిగిపోతుండటంతో నూతన నౌకా మార్గాలు ఏర్పడ్డాయి.ప్రయాణ దూరం తగ్గింది,ముడి చమురు, గ్యాస్‌, విలువైన ఖనిజాల వంటి లక్షల కోట్ల డాలర్ల విలువగల సహజవనరుల వెలికితీతకు మార్గం ఏర్పడింది.మిలిటరీ నిఘాకూడా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ ఆక్రమణను నిరోధించేందుకు అమెరికా ప్రవేశానికి డెన్మార్క్‌ అనుమతించింది. ఈ ప్రాంతాన్ని తమకు అమ్మాలని 1946లోనే వాషింగ్టన్‌ ప్రతిపాదించినప్పటికీ అంగీకరించలేదు.

ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియాలను దగ్గర చేసేందుకు సూయజ్‌ కాలువ మీదుగా కంటే ఆర్కిటిక్‌ ప్రాంతం అనువుగా ఉండటం, దూరం తగ్గటం, సమయం, ఖర్చు కూడా తగ్గుతుండటంతో ఇటీవలి కాలంలో నౌకా రవాణా పెరిగింది. చైనా, రష్యా నౌకలు సంచరిస్తున్నాయి. రష్యా నుంచి చైనాకు చమురు రవాణాకు ప్రత్యామ్నాయ నౌకా మార్గంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవాలని చూస్తున్నారు. ఆ నౌకల మీద నిఘాపెంచాలంటే అమెరికన్లకు ఈ దీవి ఎంతో అనువుగా ఉంటుంది.దీనితో పాటు ఉపగ్రహాలకూ అనువైన ప్రాంతం. ప్రస్తుతం కొన్ని రంగాలకు చమురు, బంగారం కంటే విలువైన ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా వీటిపై 90శాతం అదుపు కలిగి ఉంది, ఎవరు తోక ఝాడించినా వాటి ఎగుమతులు నిలిపివేసి ప్రతీకారం తీర్చుకుంటున్నది.అమెరికా కూడా దాని మీద ఆధారపడి ఉండటంతో ఎక్కడ అలాంటి వనరులుంటే వాటిని సొంతం చేసుకొనేందుకు అమెరికా పూనుకుంది. లిథియం, కోబాల్ట్‌,చమురు, గ్యాస్‌ పుష్కలంగా ఉన్నాయి.

గ్రీన్‌లాండ్‌ ఆక్రమణకు పూనుకుంటే ఐరోపా ఎలా స్పందిస్తున్న అంశాన్ని ఇప్పుడు అమెరికా మదింపువేస్తున్నది. నాటో ప్రారంభ దేశాలలో డెన్మార్క్‌ ఒకటి. ఇప్పుడు దాని స్వయం పాలిత ప్రాంతాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవటం అంటే నిబంధనలకు విరుద్దం. నాటో దేశాలన్నీ దాన్ని ఎదుర్కోవాలని నిబంధన ఉంది. అయితే గతంలో టర్కీ-గ్రీస్‌ మధ్య తలెత్తిన వివాదంలో నాటో నాయకత్వం చేసిందేమీ లేదు. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందా ? ఆదివారం నాడు బ్రిటన్‌, జర్మనీ నాయకత్వంలో కొన్ని దేశాల ప్రతినిధులు సమావేశమై ఆర్కిటిక్‌ ప్రాంత భద్రత గురించి మరింత సమన్వయంతో పని చేయాలని నిర్ణయించినట్లు వార్తలు. ఒక దేశసార్వభౌమత్వానికి వ్యతిరేకంగా అమెరికా చేసిన వ్యాఖ్యల పూర్వరంగంలో అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కెనడా కూడా కోరింది. అయితే ముసుగులో కుమ్ములాట మాదిరి తప్ప నేరుగా అమెరికాను విమర్శించటానికి ఇంకా ముందుకు రావటం లేదు. తాము అమెరికన్లుగా మారటానికి సిద్ధంగా లేమని గ్రీన్‌లాండ్‌ ప్రధాని జేన్స్‌ ఫ్రెడరిక్‌ నీల్సెన్‌తో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక ప్రకటన చేశాయి. తమ భవిష్యత్‌ను తామే నిర్ణయించుకుంటామని స్పష్టం చేశాయి.ఆర్కిటిక్‌ ప్రాంతంలో తమ వ్యతిరేకులను అడ్డుకోవటానికి ప్రాధాన్యత ఇస్తామని అమెరికా అధ్యక్ష భవనం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.అంతకు ముందు జనవరి నాలుగున ట్రంప్‌ స్వయంగా మాట్లాడుతూ గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో రష్యా, చైనా నౌకలు తిరుగుతున్నందున తమ జాతీయ భద్రతా అవసరాల రీత్యా ఆ ప్రాంతం తమకు కావాలని చెప్పాడు. ఎలా స్వాధీనం చేసుకోవాలా అన్నది అధ్యక్షుడు తన బృందంతో చర్చిస్తున్నాడని,మిలిటరీ వినియోగ అవకాశం ఎప్పుడూ ఉంటుందని అధ్యక్ష భవన ప్రకటన తేటతెల్లం చేసింది. 1979 నుంచి గ్రీన్‌లాండ్‌ డెన్మార్క్‌లో స్వయంపాలిత ప్రాంతంగా ఉంది, ప్రజాభిప్రాయ సేకరణ తరువాత స్వాతంత్య్రం ప్రకటించుకొనే అవకాశం కూడా 2009 నుంచి దానికి వచ్చింది. అయితే ఇంతవరకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు.నిజానికి ట్రంప్‌ 2019లోనే గ్రీన్‌లాండ్‌ స్వాధీనం గురించి చెప్పాడు. ట్రంప్‌ వ్యాఖ్యలు వెలువడిన జనవరి నాలుగునే డెన్మార్క్‌ ప్రధాని మెటీ ఫ్రెడరిక్సన్‌ ఖండించారు.డెన్మార్క్‌ రాజరికంలోని మూడు ప్రాంతాలలో ఏ ఒక్కదానిని విలీనం చేసుకొనే హక్కు అమెరికా లేదని ఆమె పేర్కొన్నారు. ఫారో దీవి కూడా గ్రీన్‌లాండ్‌ వంటిదే అన్నారు, మరో దేశంగానే గాక చారిత్రకంగా సన్నిహితంగా ఉన్న దేశం మీద అమెరికా ఇలాంటి కోరికలను వెలిబుచ్చటం తగదన్నారు.

అమెరికా విస్తరణ కాంక్ష ఒక్క గ్రీన్‌లాండ్‌కే పరిమితం కాదు. కెనడా తమ 51వ రాష్ట్రం కావాలని గతంలోనే ట్రంప్‌ కోరిన సంగతి తెలిసిందే. అందువలన కెనడియన్లు కూడా అప్రమత్తం కావాలని అనేక మంది హెచ్చరిస్తున్నారు.గ్రీన్‌లాండ్‌తో పోల్చితే కెనడా పక్కనే ఉంటుంది, అక్కడ కూడా సహజ సంపదలు పుష్కలంగానే ఉన్న సంగతి తెలిసిందే.ప్రపంచంలో అధిక చమురు నిల్వలున్న దేశాల్లో నాలుగవదిగా ఉంది. బ్రిటన్‌ నుంచి రెండు దేశాలూ స్వాతంత్య్రం పొందినవే. గత రెండువందల సంవత్సరాల్లో లాటిన్‌ అమెరికాలో అమెరికన్లు జరపని కుట్ర లేదు, అనేక ప్రభుత్వాలను కూల్చివేశారు, అనేక మందిని హత్య చేయించారు. మొత్తం పశ్చిమార్ధగోళం తమకిందే ఉండాలని పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే.చరిత్రలోకి చూస్తే కెనడాను ఆక్రమించుకొనేందుకు అమెరికా 1812లోనే ప్రయత్నించింది.1939వరకు కెనడాను ఆక్రమించాలనే మిలిటరీ వ్యూహాన్ని కొనసాగించి తరువాత ఉపసంహరించుకుంది, ట్రంప్‌కు ఆ గతం గుర్తుకు వచ్చి ఉంటుంది.కెనడా వర్తమాన చరిత్రను చూస్తే అన్ని అంశాల్లోనూ అమెరికాతో కలసి అనేక దాడుల్లో భాగస్వామిగా ఉంది.నాటో కూటమిలో కూడా చేరింది.అయితే కొన్ని సందర్భాలలో అమెరికా వైఖరితో విబేధించింది. అణ్వాయుధాల మోహరింపుకు అంగీకరించలేదు, వియత్నాంపై యుద్దాన్ని అంగీకరించలేదు. క్యూబా విషయంలో కూడా సానుకూలంగా ఉంది.చివరికి తన ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికా రుద్దిన ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో మెక్సికోతో కలసి భాగస్వామి అయింది.గల్ఫ్‌వార్‌లో అమెరికాతో కలసిపనిచేసింది.వీటితో పాటు కొన్ని మిత్రబేధాలు ఉన్నాయి. అందుకే తాజా పన్ను ఉగ్రవాదాన్ని ట్రంప్‌ కెనడాకూ విస్తరించాడు.ఈ పూర్వరంగంలో చూసినపుడు గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకొంటే ఐరోపా, మిగతా ప్రపంచం ఎలా స్పందిస్తుందో చూసిన తరువాత కెనడాను కూడా తనదారికి తెచ్చుకుంటుందా ? చూద్దాం ! హొహొహొహొహొహొహొహొహొహొహొహొహొహొహొ

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా : నరేంద్రమోడీకి విషమ పరీక్ష పెట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌ !

28 Sunday Dec 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA, WAR

≈ Leave a comment

Tags

14th Dalai Lama, 2025 Pentagon Report, anti china, Anti communist, BJP, China, China Arms, Donald trump, Narendra Modi Failures, RSS, Vladimir Putin, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

ప్రతి ఏటా మాదిరే ఈసారి కూడా అమెరికా రక్షణశాఖ ( పెంటగన్‌ ) 2025 నివేదిక విడుదల చేసింది. దానిలో ఉన్న అభూత కల్పనలు, కుట్ర సిద్దాంతాలు, వక్రీకరణలతో సహా అనేక అంశాల గురించి మీడియాలో, ఇతరంగా అనేక మంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. హెచ్చరికలు, పరోక్ష బెదిరింపులు, బుజ్జగింపులు, చైనా, మనదేశం పరస్పరం దెబ్బలాడుకొనేందుకు తంపులు పెట్టటం వంటివి అనేకం ఉన్నాయి. ఈ ఏడాది నివేదిక ప్రత్యేకత ఏమంటే తనతో చెట్టపట్టాలు వేసుకుతిరిగి ఒకే కంచం, ఒకే మంచం అనే జిగిని దోస్తులా ఉన్న నరేంద్రమోడీకి సహజభాగస్వామి డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్ని పరీక్ష పెట్టాడంటే అతిశయోక్తి కాదు. ఏడాది కాలంలో ఎంతలో ఎంతమార్పు ? ఐదేండ్ల పాటు శత్రువుగా పరిగణించిన చైనాతో పూర్వంమాదిరి సంబంధాలు, అమెరికాతో ఎడబాటుకు 2025 నాంది పలికింది. అమెరికా మీడియా కొన్ని అంతర్గత అంశాల మీద విమర్శనాత్మకంగా ఉన్నప్పటికీ మొత్తం మీద ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ కనుసన్నలలోనే ఉంటుంది.” భవిష్యత్‌లో ఘర్షణ అవకాశం ” ఉంటుందంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజాగా భారత్‌-చైనా గురించి ఒక విశ్లేషణ రాసింది. దానికి ఆధారం పెంటగన్‌ నివేదికలోని అంశాలు. భవిష్యత్‌లో చైనాతో తలెత్తే యుద్ధం కోసం యావత్‌ హిమాలయ ప్రాంతంలో భారత్‌ వందల కోట్ల డాలర్లతో రోడ్లు, సొరంగాలు, విమానాలు ఎగిరే, దిగే ఏర్పాట్లు తదితర మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. రక్షణ విషయంలో సమతూకంతో ఉండటం కాకుండా వ్యూహాత్మక పోటీని సంచలనాత్మకం కావిస్తోంది. 2020 గాల్వన్‌ లోయలో మాదిరి చైనా కొద్ది గంటల్లోనే అదనపు బలగాలను దించగలదు, మౌలిక సదుపాయాలు లేని కారణంగా అదే భారత్‌కు ఒక వారం పడుతుంది. మొత్తం వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందని గుర్తించామని, అందువలన ఆలోచనలు నాటకీయంగా మారినట్లు లడఖ్‌ ప్రాంతంలో రవాణా నిర్వహణ వ్యవహారాలను పర్యవేక్షించిన మాజీ అధికారి మేజర్‌ జనరల్‌ అమ్రిత్‌ పాల్‌ సింగ్‌ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది.గాల్వన్‌లోయ ఉదంతాల తరువాత రెండుదేశాల మధ్య సంబంధాలు కనిష్ట స్థాయికి పడిపోయాయని, డోనాల్డ్‌ ట్రంప్‌ పన్నుల విధింపుతో భారత్‌, చైనాలతో అమెరికా సంబంధాలు దెబ్బతిన్నట్లు కూడా వ్యాఖ్యానించింది.

రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవాలని 2024 అక్టోబరు నుంచి నిర్ణయించుకోవటమేగాక వేగంగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాయి. దాంతో ఏడు సంవత్సరాల తరువాత ప్రధాని నరేంద్రమోడీ చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి హాజరై పుతిన్‌, షీ జింపింగ్‌లతో భేటీ జరిపి అమెరికాకు పరోక్ష హెచ్చరికలు పంపారు. పెంటగన్‌ నివేదిక ఈ పూర్వరంగంలో తయారైందే అన్నది స్పష్టం. సరిహద్దులలో ఉద్రిక్తతలు తగ్గటాన్ని అవకాశంగా తీసుకొని అమెరికా-భారత్‌ సంబంధాలను బలహీనపరిచేందుకు చూస్తున్నదని, పాకిస్తాన్‌తో రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకుంటున్నదని, అరుణాచల్‌ ప్రదేశ్‌ను ప్రధాన అంశంగా చూస్తున్నదని ఆ నివేదికలో చైనా మీద ఆరోపించారు. గత పదకొండు సంవత్సరాలు, అంతకు ముందు యుపిఏ హయాంలో అమెరికా జూనియర్‌ భాగస్వామిగా మారేందుకు మన్మోహన్‌ సింగ్‌ ప్రయత్నించారు. ఆ కారణంతోనే యుపిఏ-2 హయాంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. తరువాత నరేంద్రమోడీ హౌడీమోడీ కార్యక్రమంలో డోనాల్డ్‌ ట్రంప్‌ను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేసి చెట్టపట్టాలు వేసుకుతిరిగి మరింత సన్నిహితమయ్యారు. క్వాడ్‌ పేరుతో చైనాకు వ్యతిరేకంగా మరింత చురుకుగా వ్యవహరించారు.ఈ పరిణామాలకు చైనా కారణమా ? ప్రారంభ సంవత్సరాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా అమెరికావైపే మొగ్గారు.దానిది ధృతరాష్ట్ర కౌగిలి అని అర్ధమయ్యాక అలీనవిధానం, సోవియట్‌ వైపు మొగ్గారు. పరిస్థితిని చూస్తుంటే ఇప్పుడు నరేంద్రమోడీ కూడా చైనాతో రానున్న రోజుల్లో ఎలా ఉంటారో తెలియదుగాని అనివార్యంగా అమెరికా బెదిరింపులను వ్యతిరేకించకతప్పని స్థితిలో ఉన్నారు. నరేంద్రమోడీ అమాయకంగా చైనా వలలో చిక్కుకున్నారని అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. అవసరాలు అలానడిపిస్తాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో అంతర్భాగమని మనదేశంలో ఆశ్రయం పొందుతున్న దలైలామా స్వయంగా చెప్పాడు. ఆ పెద్దమనిషికి మనదేశం అన్నివిధాలుగా మద్దతు ఇస్తున్నది.అదే మాట చైనా కూడా చెబుతున్నమాట నిజం.అయితే ఎన్నడూ ఆక్రమించుకుంటామని చెప్పలేదు.1962 యుద్ధం సందర్భంగా చైనా సేనలు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తేజ్‌పూర్‌ వరకు వచ్చాయి. అక్కడే తిష్టవేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.యుద్ధంలో కాల్పుల విరమణను వారే ప్రకటించి, తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతాల నుంచి ఉపసంహరించుకొని వాస్తవాధీన రేఖకు ఆవలకు వెళ్లాయి. ఇది చైనా వ్యతిరేకులు కూడా అంగీకరిస్తున్న తిరుగులేని వాస్తవం. బ్రిటీష్‌ అధికారులు గీచిన సరిహద్దు రేఖలను చైనా ఎన్నడూ అంగీకరించ లేదు. లడఖ్‌లోని ఆక్సారు చిన్‌ ప్రాంతం మనదిగానూ, అరుణాచల్‌ చైనాలో భాగంగా బ్రిటీష్‌ మాపుల్లో ఉంది. అందుకే సరిహద్దు వివాదం తలెత్తింది. ఐదేండ్ల క్రితం ఆరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి చైనా కొన్ని గ్రామాలు నిర్మిస్తున్నదని మన మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అవి అమెరికా సిఐఏ సృష్టించిన కట్టుకథలు, వక్రీకరించిన చిత్రాలు. హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన మన మిలిటరీ అధికారి రావత్‌ అప్పుడే ఆ వార్తలు అవాస్తమని ప్రకటించారు. గతంలో ఎన్నడో నిర్మించిన ఇండ్లు పాతబడిపోయినందున వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు తప్ప చైనా ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని చెప్పారు.మన కేంద్ర ప్రభుత్వం కూడా కొత్తగా ఎలాంటి దురాక్రమణలు జరగలేదని పార్లమెంటులో, వెలుపలా ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు, యుద్ధ విమానాలు విక్రయిస్తున్నది జాగ్రత్త అంటూ మనదేశాన్ని భయపెట్టేందుకు పెంటగన్‌ పూనుకుంది. ఆయుధాల క్రయ, విక్రయాలు అంతర్జాతీయ నిబంధనలమేరకే జరుగుతున్నాయి.చైనా గురించి మనలను రెచ్చగొడుతున్న అమెరికా దాని కంటే ముందుగానే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను, ఇతర ఆయుధాలను పాకిస్తాన్‌కు ఎందుకు అమ్మినట్లు ? మనకు కూడా ఎఫ్‌-35 విమానాలను ఇస్తామని స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే చెప్పాడు కదా ? మనం ఫ్రాన్సునుంచి రాఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నాం. అదేవిధంగా చైనా నుంచి పాకిస్తాన్‌ కొనుగోలు చేసింది. చైనా విమానాలు ఎగరలేవు, ఆయుధాలు తుస్సుమనే నాశిరకం అని ఒకవైపు ప్రచారం చేస్తున్నవారు, వాటి గురించి ఎందుకు భయపెడుతున్నట్లు ? ఎంతో సమర్ధవంతమైనవని చెబుతున్న రాఫేల్‌ విమానాలను పాకిస్తాన్‌ ఆ నాశిరకం ఆయుధాలతోనే కూల్చివేసింది. ఆపరేషన్‌ సింధూర్‌లో ఏం జరిగిందీ, చైనా ఆయుధాల గురించీ నరేంద్రమోడీకి తెలియని అంశం కాదు. ఆ తరువాతే కదా చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశానికి మోడీ వెళ్లటం, చైనాకు వీసాలు, విమానాల పునరుద్ధరణ వంటి సానుకూల పరిణామాలన్నీ చోటు చేసుకున్నది. సంబంధాల పునరుద్ధరణ సందర్భంగా రెండు దేశాలూ ఇతర దేశాలతో సంబంధాల విషయంలో పరస్పరం ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని నిర్ణయించాయి. పెంటగన్‌ నివేదికను చూసి మనదేశంలోని కొందరు నిజమే కదా అనుకుంటున్నారు.కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.

తగాదాలు పెట్టటం, అనుమానాలను పెంచటంలో అమెరికా తరువాతే ఎవరైనా. పెంటగన్‌ నివేదికను బయటపెట్టిన తరువాత గతంలో అధ్యక్షుడిగా ఉన్న జార్జి డబ్ల్యు బుష్‌ మరియు రష్యా అధినేత వ్లదిమిర్‌ పుతిన్‌ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణలు బయటకు వచ్చాయి. చైనాను నమ్మవద్దని ఇప్పుడు మనకు ట్రంప్‌ చెబుతున్నట్లే నాడు బుష్‌ కూడా పుతిన్‌కు చెప్పాడు. బుష్‌-పుతిన్‌ మధ్య 2001 నుంచి 2008వరకు జరిగిన సంభాషణల ప్రకారం చైనా నుంచి మీకూ మాకూ ఇద్దరికీ దీర్ఘకాలిక సవాలు ఉన్నదని, అందువలన మీరు జాగ్రత్తలు తీసుకోవాలని బుష్‌ చెప్పాడు. తొలిసారి స్లోవేనియాలో ఇద్దరు నేతలు భేటీ అయినపుడు రష్యా పశ్చిమదేశాల్లో భాగం అనీ శత్రుదేశం కాదని, చైనాతో జాగ్రత్తగా ఉండాలని, ఇద్దరికీ దీర్ఘకాలం సమస్యలుంటాయని బుష్‌ అన్నాడు.2005లో కూడా ఈ ప్రస్తావన చేసినపుడు మాకంటే మీకే ఎక్కువ సమస్యలని పుతిన్‌ చెప్పాడు. దానికి వారేమీ మా సరిహద్దులలో లేరని (చైనా – రష్యా మధ్య 4,195 కిలోమీటర్ల సరిహద్దు ఉంది ) చైనా నుంచి వ్యవస్థాపరమైన సవాలు ఉందని బుష్‌ బదులిచ్చాడు.అయితే పుతిన్‌ తక్కువేమీ తినలేదు గనుక తమకు తక్షణ ప్రమాదం నాటో తూర్పువిస్తరణ, ఐరోపాలో అమెరికా క్షిపణి మోహరింపు పధకాల నుంచి వుందని చెప్పాడు. చివరి సారిగా ఇద్దరు నేతల మధ్య 2008లో సంభాషణలు చోటు చేసుకున్నాయి. అక్కడ కూడా బుష్‌ చైనా గురించి హెచ్చరించాడు. అయితే తమ దేశ సరిహద్దులకు పశ్చిమ దేశాల మిలిటరీ మోహరింపు తక్షణ ప్రమాదంగా ఉందని పుతిన్‌ స్పష్టం చేశాడు. తరువాత జరిగిన పరిణామాల్లో రష్యాను నమ్మించి మోసం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని నాటో చేసిన కుట్రలు బయటపడ్డాయి. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల ప్రభుత్వాన్ని కూలదోసి తమకు తొత్తులుగా ఉండేవారిని గద్దెనెక్కించి, దానికి నాటో సభ్యత్వమిచ్చి రష్యా సరిహద్దుల్లో తిష్టవేసేందుకు పూనుకున్నారు. దానికి ప్రతిగానే రష్యా 2014లో ఉక్రెయిన్‌లో ఉన్న ప్రాంతమైన క్రిమియాను స్వాధీనం చేసుకుంది. దాంతో రష్యాను జి 8 కూటమి నుంచి తొలగించారు.

అసలు అమెరికా ఎందుకు గుండెలు బాదుకుంటోంది ? ఆసియా ఖండంపై ఆధిపత్యం కోసం, దానిలో భాగంగా చైనాను కట్టడి చేసేందుకు దీర్ఘకాలంగా అది అనుసరిస్తున్న విధానానికి న్యూఢిల్లీ-బీజింగ్‌ సాధారణ సంబంధాల పునరుద్దరణ పెద్ద ఎదురుదెబ్బ.భారత్‌ మెడమీద తుపాకి పెట్టి చైనాను కాల్చాలనుకున్న దాని ఎత్తుగడ పారే అవకాశం లేదని అనుకుంటున్నది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంలో మూడోదేశ జోక్యానికి అవకాశం లేదని మోడీ సర్కార్‌ స్పష్టం చేసింది.చైనాతో దౌత్య సంబంధాలు, వీసాలు, విమానాల పునరుద్దరణ ఏదో తాత్కాలిక వ్యూహంలో భాగం అనుకోలేము. రష్యా,చైనా, భారత్‌ సంబంధాలు మరింత సన్నిహితం కావటం సహజంగానే అమెరికాకు మింగుడుపడటం లేదు. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాలలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేదిగా కనిపిస్తున్నది. ఈ పూర్వరంగంలో అమెరికా, భారత్‌,జపాన్‌,ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్‌ కూటమి భవిష్యత్‌ ఏమిటన్నది ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు.దక్షిణ చైనా సముద్రంలో చైనాను అడ్డుకొనేందుకు 2007లో ఈ కూటమిని అమెరికా ముందుకు తెచ్చింది. తరువాత దాని పరిణామాలు, పర్యవసానాలను మదింపు చేసుకొని మన్మోహన్‌ సింగ్‌ దాని పట్ల ఆసక్తి చూపకపోవటంతో ఒక విధంగా అది అటకెక్కింది. తరువాత నరేంద్రమోడీ ఉత్సాహం చూపటంతో 2017 నుంచి చురుకుగా పని చేస్తున్నది. అప్పటి వరకు అది ఆసియా – పసిఫిక్‌ అనే ఇతివృత్తంతో పని చేస్తున్నది కాస్తా మన దేశాన్ని ఇరికించేందుకు అమెరికా తెలివిగా ” ఇండో-పసిఫిక్‌ ” అజండాగా మార్చి దానికి భారత్‌ మూలస్థంభం అంటూ మోడీని మునగచెట్టు ఎక్కించి మన భుజాల మీద తుపాకి పెట్టి చైనాను కాల్చాలని పధకం వేసింది. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో మోడీ ముందుకు పోతారా ? ఈ కూటమి తనకు వ్యతిరేకంగా రూపొందిన ” ఆసియా నాటో ” అని చైనా భావిస్తున్నది. తమకు ముప్పు తలపెట్టిన ఐరోపా కేంద్రంగా ఉన్న నాటో కూటమిని పుతిన్‌ వ్యతిరేకించటమేగాక దానికి పావుగా ఉన్న ఉక్రెయిన్‌ మీద మిలిటరీ చర్య జరుపుతున్న సంగతి తెలిసిందే. క్వాడ్‌ అంశంలో మరింత ముందుకు పోతే చైనాకు, వెనక్కు తగ్గితే అమెరికాకు ఆగ్రహం. అందుకే నరేంద్రమోడీకి డోనాల్డ్‌ ట్రంప్‌ అగ్నిపరీక్ష పెట్టాడని చెప్పాల్సి వస్తోంది. ఏ దేశానికైనా దీర్ఘకాలిక విదేశాంగ విధానం ఉండాలి. ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి అన్నట్లు ఎటువాటంగా ఉంటే అటుపోతే ఇలాంటి ఇరకాటాలే వస్తాయి మరి ! ఏం జరుగుతుందో చూద్దాం !!

రాజకీయంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అది నడిపించే బిజెపిలోని అత్యధికులు కమ్యూనిస్టు వ్యతిరేకత, చైనా వ్యతిరేకత కారణంగా అమెరికా వైపు మొగ్గాలని వత్తిడి చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అయితే మనవిదేశాంగ విధానం, స్వదేశీ విధానాలను నిర్దేశించేది ఇక్కడ ఉన్న పాలకవర్గం-బడా కార్పొరేట్లు, వారితో చేతులు కలిపే భూస్వామ్య, ధనిక రైతులు- అన్నది బహిరంగ రహస్యం. కొంత మందికి వెంటనే అవగతం గాకపోవచ్చు. అమెరికా విధించే షరతులు,వాణిజ్య విధానం తమకు నష్టదాయకమని పాలకవర్గం భావిస్తున్నది. దానికి అనుగుణంగా నడుచుకోవటం మినహా ప్రధానిగా ఎవరున్నా చేసేదేమీ లేదు. ధిక్కరిస్తే తమకు దాసులుగా ఉన్నవారిని గద్దెనెక్కిస్తారు.సంస్కరణలను మరింతవేగవంతంగా, ప్రతిఘటనను అణచివేసి తమకు మరింతగా లాభాలు సంపాదించి పెడతారనే నమ్మకంతోనే మన్మోహన్‌ సింగ్‌ను వదిలించుకొని నరేంద్రమోడీని రంగంలోకి తెచ్చారు. మారిన పరిస్ధితుల్లో అంతర్గతంగా మోడీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్నారు, చైనా వైపు మొగ్గారు. అందుకే ట్రంప్‌ ఇప్పుడు అగ్నిపరీక్ష పెట్టారు. ఏ గట్టునుండాలో తేల్చుకొమ్మని హెచ్చరించాడు. చరిత్రలో అనేక మంది తీరుతెన్నులను చూసినపుడు జెండాలు, అజెండాలను ఊసరవెల్లి మాదిరి పరిస్థితికి తగినట్లుగా మార్చటం చూశాము. ముందు రోజు రాత్రి వరకు జనతా పార్టీని గట్టిగా సమర్ధించిన ” సోషలిస్టు ” జార్జి ఫెర్నాండెజ్‌ తెల్లవారేసరికి మొరార్జీదేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారటం తెలిసిందే. ఇప్పుడు నరేంద్రమోడీ ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

వెంటిలేటర్‌పై రూపాయి : బిజెపి నేతలు,సమర్ధకులకు భారతీయ ఆత్మే ఉంటే ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ?

21 Sunday Dec 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, Economics, History, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#India trade matters, BJP, China, India exports and Imports, Japan, Narendra Modi Failures, Nirmala Sitharaman, Rupee, Rupee fall under Modi rule, US Dollar

ఎం కోటేశ్వరరావు

వినేవారికి కేవలం చెవులే ఉండి మెదడులో పదార్ధం లేకపోతే చెప్పేవారు ఎన్ని కతలైనా వినిపిస్తారు. రూపాయి పతనం గురించి ఇప్పుడు అదే నడుస్తున్నది. డాలరు విలువ పెరిగింది తప్ప మన రూపాయి పడిపోలేదని ఒక పాట, మిగతా కరెన్సీలతో పోలిస్తే మన పతనం తక్కువ, ఇతర కరెన్సీలన్నీ ఇలాగే ఉన్నాయంటూ మరోముక్తాయింపు. గతంలో వీరే ఏం చెప్పారంటే తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే ……. అన్నట్లుగా ఉంది. అవునులే నడిచినంత కాలం దేశం కోసం ధర్మం కోసం అంటూ ఏమైనా చెప్పవచ్చు, చేయవచ్చు. డాలరుతో పోటీ పడి మన రూపాయి విలువను ఎందుకు పెంచలేదని ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహం నేరం కింద జైల్లో వేస్తారు. రూపాయి పతనమైతే వచ్చే నష్టం ఏమిటి ? ఉదాహరణకు నరేంద్రమోడీకి అమెరికాలో ఉన్న పలుకుబడి కారణంగా గత పదకొండేళ్లుగా మనం కేవలం పదిడాలర్లకే విమానంలో అమెరికా వెళుతున్నాం, రాయితీ టిక్కెట్ల ధరలు పెంచలేదు అనుకుందాం. గత ఏడాది కాలంలో రూపాయి విలువ 85 నుంచి 91కి దిగజారింది. టికెట్‌ కొనుక్కోవాలంటే రు.850 బదులు రు.910 చెల్లించాలి. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే రూపాయి పాపాయికి రక్షణ లేకుండా పోయిందని నరేంద్రమోడీ, బిజెపి నేతలు ఊరూవాడా నానా యాగీచేసి అధికారానికి వచ్చినపుడు కేవలం రు.600లకే ఆ టికెట్‌ దొరికేది. బిజెపి నేత సుబ్రమణ్య స్వామి చెప్పినట్లు మోడీ వస్తే విలువను 35కు పెంచుతామని చెప్పారు. ఆ పుణ్యం కట్టుకొని ఉంటే రు.350కే దొరికేది. ఇది అత్యాశ అనుకున్నా కనీసం ”56” కు పెంచినా రు.560కి దొరికేది. మోడీకి అంత బలమైన ఛాతీ ఉందని జనం నమ్మేవారు. బిజెపి ప్రభుత్వ నిర్వాకం గురించి ఇంతకంటే వివరణ అవసరం లేదేమో ?

ప్రధాన మంత్రికి రోజూ సలహాలిస్తున్న ఆర్థిక సలహామండలి సభ్యుల్లో ఒకరైన సంజీవ్‌ సన్యాల్‌ పుండు మీద కారం చల్లుతున్నారు. రూపాయి పతనంపై తనకెలాంటి ఆందోళన లేదని చెప్పారు.ఆర్ధిక స్థితికి – రూపాయికి సంబంధం లేదని, దేశాల ఆర్థిక వ్యవస్థలలో ఉన్నత వృద్ధి రేటు ఉన్నపుడు తరచుగా కరెన్సీ మారకపు విలువలు తక్కువగా ఉంటాయన్నారు. రూపాయి పతనం 91 నుంచి వందకు చేరి నరేంద్రమోడీ కళ్లలో ఆనందం చూసే సమయం దగ్గరపడుతున్నదని నెటిజన్లు స్పందిస్తున్న తరుణమిది. టైమ్స్‌ నెట్‌వర్క్‌ 2025 సమావేశంలో సన్యాల్‌ మాట్లాడారు.దేశీయంగా ద్రవ్యోల్బణానికి కారణం కానంత వరకు రూపాయి పతనమైనా ఇబ్బంది లేదని, వెనక్కు తిరిగి చూస్తే జపాన్‌ ఆర్థిక వ్యవస్థ చాలా చాలా వేగంగా పురోగమిస్తున్నపుడు దాని కరెన్సీ చాలా బలహీనంగా ఉంది.చైనా తన కరెన్సీ విలువను పెరగనిచ్చేంతవరకు 1990, 2000దశకాల్లో అలాగే ఉందంటూ సన్యాల్‌ చెప్పారు. ఒక దేశ కరెన్సీ డాలరుతో మారకపు విలువ తక్కువగా ఉన్నపుడు ఆయాదేశాల వస్తువుల ధరలు ప్రపంచ మార్కెట్లో చౌకగా ఉండి ఎగుమతులు పెరిగేందుకు అవకాశం ఉండే మాట నిజం. కానీ మన కరెన్సీ పతనమైనా ఎగుమతులు దానికి అనుగుణంగా ఎందుకు పెరగలేదో పెద్దలు చెప్పాలి. చైనానే తీసుకుంటే జిడిపిలో దాని ఎగుమతులు 2013లో 24.6శాతం కాగా 2024లో 20శాతానికి తగ్గాయి. దాని యువాన్‌ విలువ పెరిగిందని సరిపెట్టుకుందాం. సన్యాల్‌ వాదన ప్రకారం దాని కరెన్సీ విలువ పెరిగింది కనుక తగ్గినట్లు అంగీకరిద్దాం. భారత్‌ పరిస్థితి ఏమిటి ? 2013లో జిడిపిలో మన ఎగుమతులు 25.43 శాతం కాగా 2024లో 21.2శాతానికి తగ్గాయి. ఈ కాలంలోనే కదా మన రూపాయి విలువ 60 నుంచి ఇప్పుడు 91కి పడిపోయినా ఎగుమతులు ఎందుకు తగ్గినట్లు ? జపాన్‌ ఎన్‌ విలువ డాలరుకు 2014లో 106కాగా ఇప్పుడు 157కు తగ్గింది. ఇదే కాలంలో దాని జిడిపిలో ఎగుమతులు 15.8 నుంచి 22.8శాతానికి పెరిగాయి. మన కరెన్సీ విలువపతనమైనా ఎగుమతులు ఎందుకు పెరగలేదు ? అందుకని రూపాయి పతనం గురించి ఎప్పటికెయ్యది అప్పటికామాటలాడి తప్పించుకుంటున్నారు. వారి ధైర్యం ఏమంటే దీని గురించి సామాన్యులకు నిజానిజాలు తెలుసుకొనే తీరిక, ఆసక్తి లేదా తెలివి తేటలు ఉండవనే గట్టి నమ్మకం. అభివృద్ధి చెందుతున్నపుడు కరెన్సీ విలువను తగ్గించి ఉంచుతారని చెప్పటమంటే కావాలనే పతనాన్ని ప్రోత్సహిస్తున్నారు లేదా పతనమౌతుంటే కాగల కార్యం గంధర్వులు తీర్చుతున్నారన్నట్లుగా చూస్తూ ఊరుకున్నట్లు కనిపిస్తున్నది. రూపాయి పతనం అవుతుంటే ఎగుమతిదార్లు సంతోషిస్తారు, దిగుమతిదార్లు పెరిగిన భారాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు, వారికి పోయేదేమీ లేదు, జనాలకు జేబులు గుల్ల. అందుకే సన్యాల్‌ వంటి ఆర్థికవేత్తలకు ఎలాంటి ఆందోళన ఉండదు. ఒక్క సన్యాలే కాదు. ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్‌ ఇంకా తీవ్రమైన వ్యాఖ్య చేశారు. రూపాయి పతనం అవుతుంటే ప్రభుత్వం ” నిద్ర చెడగొట్టుకోవటం ”లేదన్నారు. అంటే తాపీగా తడిబట్ట వేసుకొని ఉందని వేరే చెప్పనవసరం లేదు.

బిజెపి పెద్దలు ప్రతిపక్షంలో ఉన్నపుడేంచెప్పారో చూద్దాం. రాజ్యసభలో బిజెపి ఉపనేతగా ఉన్న రవి శంకర్‌ (2013 జూలై 10) రూపాయి విలువ 60.15కు పడిపోయినపుడు ” జాతీయ స్వాభిమానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది,ప్రభుత్వం ఏమి చెప్పినప్పటికీ ఆర్థిక మూలాలు విపరీతంగా దిగజారుతున్నయనేందుకు ఇది నిదర్శనం. విదేశీ పెట్టుబడులపై ఆధారపడటం దుర్బల నమూనా, ఎక్కువగా వాటిపై ఆధారపడితే అవెంత వేగంగా వస్తాయో అదే విధంగా వెనక్కు వెళతాయి.” ఇలాంటి పెద్ద మనుషులందరూ 2014లో అధికారానికి వచ్చినకొత్తలో మోడీ పదే పదే విదేశాలకు ఎందుకు వెళుతున్నారంటే దేశప్రతిష్ట పునరుద్దరణ, విదేశీ పెట్టుబడుల కోసం అని సమర్ధించిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. యుపిఏ ప్రభుత్వ హయాంతో పోల్చితే ఎక్కువగా రూపాయి పతనమైంది. ఇప్పుడు స్వాభిమానం పెరిగినట్లా దిగజారినట్లా ? ఆడవారి మాటలకు అర్దాలే వేరులే అని మహిళలను రచయిత పింగళి నాగేంద్రరావు మిస్సమ్మ సినిమాలో తూలనాడారు గానీ బిజెపి నేతల మాటలకు అది వర్తిస్తుంది.

చిట్కాలు చెప్పటంలో మన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పెట్టింది పేరు. రూపాయి పతనం చెందినందుకు అసలు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే పోతుంది అన్నారు.(2013సెప్టెంబరు ఒకటి) చెన్నరులో మాట్లాడుతూ పక్షవాతం వచ్చిన ప్రభుత్వాన్ని దేశం భరించలేదు, ఈ అనిశ్చితిని తొలగించటం మంచిది, సాధ్యమైనంత మేరకు త్వరగా ఎన్నికలు పెట్టాలి. మన్మోహన్‌ సింగ్‌ దేశ ఆర్థిక బాధల కంటే తన పేరు ప్రతిష్టలను పెంచుకోవటం గురించి ఎక్కువగా శ్రద్ద చూపుతున్నారు. ప్రభుత్వ పెద్దగా దీనికి బాధ్యత ఎవరిదో నిర్ణయించాలి. సదరు వ్యక్తిని తొలగించాలి లేదా తానే బాధ్యత తీసుకోవాలి ” ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా వేదంలా విలువైన దంటూ ఒక పాట గుర్తుకు వచ్చింది. ఇప్పుడు నరేంద్రమోడీని లేదా కనీసం నిర్మలాసీతారామన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలి మరి, చేస్తారా ? బిజెపి జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ గడ్కరీ (ఇప్పుడు జాతీయ రహదారుల కేంద్ర మంత్రి) ఉన్న సమయంలో(2012 మే 24) రూపాయి పతనానికి ప్రపంచ కారణాలు కానేకాదంటూ ” సమస్య యూరో జోన్‌లో కాదు, యుపిఏ జోన్‌లో ఉంది. ఆర్థికవేత్త అయిన మన ప్రధాని నాయకత్వంలో రూపాయి స్వేచ్చగా పతనమౌతున్నది.” బిజెపి మరోనేత పియూష్‌ గోయల్‌, ఇప్పుడు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి 2013 జూన్‌ 26న ఒక ట్వీట్‌ చేశారు(ఇప్పుడు ఎక్స్‌) పతనం అవుతున్న రూపాయిని చూస్తుంటే చాలా వేదనా భరితంగా ఉంది ” రూపాయి పతనం కాకుండా మోడీ ప్రభుత్వం ఏమైనా పడకుండా కాపాడుతున్నదా ? గోయల్‌ ఆనందంతో గంతులు వేస్తున్నారా ? బిజెపి అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ 2013లో మాట్లాడుతూ రూపాయి పతనాన్ని ఆపలేనట్లయితే మన్మోహన్‌ సింగ్‌ రాజీనామా చేయాలి.ఒక ఆర్థికవేత్తగా ఏం చేస్తున్నారు ? పదవిలో కొనసాగే హక్కులేదు ” అని చెప్పారు. మరో బిజెపి నేత ప్రకాష్‌ జవదేకర్‌ 2013లో మాట్లాడుతూ ” పూర్తిగా దివాలాకోరు ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోలేని స్థితి,పాలన లేదు. రూపాయి పతనానికి అసమర్ధ నాయకత్వమే కారణం, మన్మోహన్‌ సింగ్‌, ఆయన మంత్రులే బాధ్యులన్నది స్పష్టం. మౌలిక సదుపాయాలు, వాణిజ్యంపై సకాలంలో చర్యలు తీసుకుంటే రూపాయి పతనాన్ని అరికట్టవచ్చు ” అన్నారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉందటూ ప్రధానిగా మోడీ పేరును ముందుకు తెచ్చిపుడు చెప్పారు. సదరు అనుభవం రూపాయి పతనాన్ని ఆపలేకపోయింది. ఇక మౌలిక సదుపాయాల గురించి అతిశయోక్తులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎనిమిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం పెద్ద ప్రకటనలు ఇచ్చి విజయాల గురించి చెప్పుకుంది.తమ ఏలుబడిలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 140కి పెరిగిందన్నది వాటిలో ఒకటి. నిజానికి 2014లో దేశంలో 94 పని చేస్తున్నవి, 31పని చేయనివి ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్‌ అధారిటీ వార్షిక నివేదికలో ఉందని ఫాక్ట్‌చెకర్‌ అనే వెబ్‌ పోర్టల్‌ పేర్కొన్నది. యుపిఏ పాలనలో రోజుకు 12కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించగా తాము 37 కిలోమీటర్లు నిర్మించినట్లు చెప్పుకుంది. నిజానికి తొమ్మిది సంవత్సరాల సగటు 19.17 కిలోమీటర్లు మాత్రమే, 2021లో 36.5 కిలోమీటర్లు నిర్మించారని లోక్‌సభకు అందచేసిన సమాచారంలో పేర్కొన్నారు. అందువలన అసత్యాలు,అర్ధసత్యాలకు మోడీ సర్కార్‌ పేరు మోసిందన్నది సత్యం.రూపాయి పతనం గురించి ఒక్క బిజెపి నేతలే కాదు, వారిని సమర్ధించే సినీనటీనటులు, ఆధ్యాత్మికులం అని చెప్పుకొనే బాబాలు కూడా యుపిఏ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వారు తలలు ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు. జూహీ చావ్లా ఒకపుడు ప్రముఖ హీరోయిన్‌, 2013 ఆగస్టు 21న ఒక ట్వీట్‌ చేశారు.” దేవుడా నీకు కృతజ్ఞతలు, నా అండర్‌వేర్‌ పేరు డాలర్‌, రూపాయి గనుక అయి ఉంటే అది మాటి మాటికీ జారిపోతూ ఉండేది ” అని పేర్కొన్నారు. నెటిజన్లు మామూలుగా స్పందించలేదు, ఇప్పుడు ఆమె అండర్‌వేర్‌ను చూడాలి,రూపాయి పడిపోకుండా డాలర్‌కు రాఖీ కట్టటం(ముడివేయటం) ఆపిందేమో అంటూ సెటైర్లు. గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ ఒక ట్వీట్‌లో నరేంద్రమోడీ అధికారానికి వస్తే రూపాయి విలువ 40కి పెరుగుతుందని పేర్కొన్నారు. నిజమే అతని పేరులో ఉన్న ఒక్కో శ్రీ కి 45 రూపాయల చొప్పున ఇప్పుడు 90కి దిగజారిందరటూ జోకులు. బాబా రామ్‌దేవ్‌ యుపిఏ ప్రభుత్వం మీద ఆరోపణల పత్రం(చార్జిషీట్‌) దాఖలు చేయాలని 2013లో చెప్పారు.ఈ 0.75కంటి మనిషి కాంగ్రెస్‌ మీద చార్జిషీట్‌ వేయాలన్నారు, ఇప్పుడు స్వదేశీ పేరుతో భక్తులను వెర్రి వెంగళప్పలను చేస్తున్నాడంటూ నెటిజన్లు ఆడుకున్నారు.

బిజెపిలో సుబ్రమణ్యస్వామి స్థానం ఏమిటో ఒక బ్రహ్మపదార్ధం.తనకు పదవులు ఇచ్చినపుడు, కావాల్సినపుడు ఒక మాట లేనపుడు మరోమాట మాట్లాడతారు, అయినా ఎలాంటి చర్య తీసుకొనే ధైర్యం బిజెపికి లేదు. ఆ పెద్దమనిషి ఆర్థికవేత్త కూడా, 2014 ఏప్రిల్‌ 27న మాట్లాడుతూ ఎన్‌డిఏ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేట్లయితే మోడీ ప్రధానమంత్రి అవుతారు, రెండు సంవత్సరాలలోపు రూపాయి బలపడి రు.35కు చేరుతుంది ” అన్నారు. నిర్మలా సీతారామన్‌ ప్రతిపక్షంలో ఉండగా ఏం చెప్పారో చూద్దాం ” రూపాయి పతనం చెందుతున్నపుడు మీరు ఊహించుకోవచ్చు, భారత ఎగుమతులు పెరుగుతాయి, ఎందుకంటే మీ వస్తువులు చౌకగా మారతాయి. మీ వస్తువులను కొనేందుకు విదేశాల వారు ఆకర్షణకు లోనౌతారు. కానీ అలా జరగటం లేదు, మీ వస్తువులను కొనాలని జనాలు అనుకోవటం లేదు. మీ పెట్టుబడులు పెరుగుతున్నాయి, రూపాయి పతనం అవుతున్నా మీ ఎగుమతులు పెరగటం లేదు, ఇది తీవ్రమైన పరిస్ధితి. ఆందోళన పడాల్సిన అవసరం లేదని మనకు ప్రతిసారీ ప్రభుత్వం చెబుతున్నది. నేను ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చాను.నాకు తెలుసు అనేక మంది తమకున్న కొద్దిపాటి పొలాలను కూడా అమ్ముకొని విదేశాల్లో చదువుకుంటున్న తమ పిల్లల కోసం డబ్బు చెల్లించారు. రూపాయి విలువ పతనం కారణంగా బయట ఉన్న విద్యార్ధులు చదువులను మధ్యలో ఆపివేసి తిరిగి రాకతప్పటం లేదు.మనం ఎప్పుడైనా ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల గురించి మాట్లాడుతున్నాం రూపాయి పతనం గురించి చెబుతున్నామా ? మనకేమీ చెప్పటం లేదు ” ఒకనాడు తెలుగింటి కోడలిగా ఉన్న ఆమె ఇప్పుడు మాట్లాడటం లేదేం ?

పైన చెప్పుకున్నవారందరికీ తిరుగులేని నేత నరేంద్రమోడీ ఏం సెలవిచ్చారో చెప్పుకోకపోతే ప్రహసనం సంపూర్ణం కాదు. ప్రధానమంత్రి పదవి స్వీకరించిన తరువాత రూపాయి పతనం గురించి నోరెత్తితే భారతమాత మీద ఒట్టు. అఫ్‌కోర్స్‌ మహానుభావులుగా మారిన తరువాత వారి మౌనానికి ఎన్నో అర్దాలు ఉంటాయనుకోండి. కర్ణాటకలోని హుబ్లీలో 2014 ఫిబ్రవరి 28న జరిగిన సభలో మాట్లాడుతూ ఇలా అన్నారు.” మన రూపాయి నిలకడ లేకుండా ఉంది. విలువ పడిపోతూనే ఉంది. అతల్‌ జీ ప్రభుత్వంలో రూపాయి 40-45 మధ్య ఉంది,ఈ ప్రభుత్వ హయాంలో 62,65,70…..గా పడిపోతూనే ఉంది.దిగుమతులు పెరుగుతున్నాయి, ఎగుమతులు తగ్గుతున్నాయి…స్పృహ ఉన్న ప్రభుత్వం చేయాల్సినపని ఎగుమతులను పెంచాలి, దిగుమతులను తగ్గించాలి ” పదకొండు సంవత్సరాల పాలనలో మోడీ ప్రభుత్వం చేసిందేమిటి ? తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం 2025లో చైనా కస్టమ్స్‌శాఖ చెబుతున్నదాని ప్రకారం బీజింగ్‌తో మన వాణిజ్య లోటు 115 బిలియన్‌ డాలర్లు, మనదేశం 106 బిలియన్‌ డాలర్లు అంటున్నది, ఏ సంఖ్యను చూసినా మోడీ తన రికార్డులను తానే బద్దలుకొట్టుకున్నారు. పదకొండు సంవత్సరాల మోడీ ప్రభుత్వ నిర్వాకాన్ని చూసినపుడు 2014 తరువాత ఒక్క ఏడాది కూడా ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గలేదు. పదకొండు సంవత్సరాలలో మన వాణిజ్య లోటు 80వేల కోట్ల డాలర్లు. తొలి ఏడాది 607 కోట్ల డాలర్లు లోటు ఉంటే 2024-25లో అది 950 కోట్ల డాలర్లకు చేరింది. అయినా సరే సమర్ధవంతమైన పాలన అందిస్తున్నామని చెబుతుంటే మనమంతా నిజమేకదా అని నమ్ముతున్నాం, విశ్వాసం అలాంటిది మరి. రూపాయి గురించి గతంలో నరేంద్రమోడీ ఇంకా ఏం చెప్పారు ! రూపాయి ఆసుపత్రిలో ఉంది ఐసియులో చేర్చారు. సంక్షోభం వచ్చింది, ఇలాంటి సమయాల్లో ఆశల్లేనపుడు, నాయకత్వం ఎటుపోతున్నదో తెలియనపుడు సంక్షోభం మరింత తీవ్రం అవుతుంది. ఒకసారి రూపాయి పతనం అయితే ప్రపంచ శక్తులు దాన్ని పూర్తి అవకాశంగా మలుచుకుంటాయి. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం రూపాయి పోటీ పడుతున్నాయి, రూపాయి విలువ వేగంగా పతనం అవుతున్నది. అతల్‌ జీ అధికారానికి వచ్చినపుడు రూపాయి విలువ రు.42 ఉంది, దిగిపోయేటపుడు 44, కానీ ఈ ప్రభుత్వం(యుపిఏ) దాన్ని రు.60కి దిగజార్చింది. రూపాయి బలాన్ని కోల్పోవటం లేదు, దాని సైజు మారింది, ఎందుకంటే ఢిల్లీలో అధికారంలో ఉన్నవారు అవినీతి మీద కేంద్రీకరించారని చెప్పారు. నిజంగా బిజెపి నేతలకు, వారిని సమర్ధించేవారికి భారతీయ ఆత్మ, విలువలు, వలువలు ఉండి వారి గతాన్ని నెమరువేసుకుంటే వారి ముఖాలు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు ?

Share this:

  • Tweet
  • More
Like Loading...

చైనాపై జపాన్‌ తప్పుడు ఆరోపణలకు అమెరికా దన్ను !

10 Wednesday Dec 2025

Posted by raomk in CHINA, Current Affairs, History, imperialism, INTERNATIONAL NEWS, Japan, Opinion, USA, WAR

≈ Leave a comment

Tags

China, Donald trump, Japan pacifist constitution, PLA Liaoning, PLA warships, Sanae Takaichi, Taiwan Matters, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఉద్రిక్తతలను రెచ్చగొట్టి ఆయుధాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటే తప్ప అమెరికాకు రోజుగడవదు. దాన్లో భాగంగానే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నది. ఇటీవల రెండు సార్లు తమ విమానాల రాడార్లపై చైనా ఆయుధాలను గురిపెట్టిందని జపాన్‌ ఆరోపించింది. మిలిటరీ పరిభాషలో లాక్‌ ఆన్‌ అంటే ఒక దేశానికి చెందిన మిలిటరీ విమానాలు మరోదేశానికి చెందిన విమానాలపై రాడార్ల ద్వారా నిఘావేసి సంకేతాలు పంపటమే. ఇదికొన్ని సందర్భాలలో కూల్చివేతలకు కూడా దారి తీయవచ్చు. నిఘా అవసరాలకూ వినియోగించవచ్చు. దేనికి అలా చేశారన్నది ఆయా దేశాలు చెప్పే భాష్యాలు వివాదం అవుతున్నాయి. దొంగే దొంగ అని అరచినట్లుగా జపాన్‌ నిఘావిమానాలను తమపై కేంద్రీకరించి తామేదో చేసినట్లు గుండెలు బాదుకుంటూ ప్రపంచాన్ని నమ్మింపచూస్తున్నదని చైనా విమర్శించింది. అయితే ఎటు వైపు నుంచి ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు చోటు చేసుకోలేదు గానీ గత దశాబ్దికాలంలో ఎన్నడూ లేని విధంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. లాక్‌ ఆన్‌ ప్రచారం జపాన్‌ ప్రారంభించిన ఆయుధీకరణకు ఒక ముసుగు మాత్రమే. జపాన్‌ ఆరోపణలకు మంగళవారం నాడు అమెరికా మద్దతు పలికింది.చైనా చర్యలు ఆ ప్రాంతంలో శాంతియుత వాతావరణానికి దోహద పడటం లేదన్నది. అమెరికా ప్రకటన తమ రెండు దేశాల మధ్య ఉన్న బంధం ఎంతగట్టిదో వెల్లడించిందని జపాన్‌ స్పందించింది. రెండవ ప్రపంచ యుద్దంలో కేవలం ఆత్మరక్షణకు అవసరమైన మిలిటరీ మాత్రమే జపాన్‌కు ఉండాలని ఒప్పందం కుదిరింది. అయితే 2015 ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి తమకే గాక మిత్రదేశాలకు ఆపద వచ్చినపుడు కూడా జోక్యం చేసుకోవచ్చని కొత్త నిబంధన చేర్చారు.నిజానికి తైవాన్‌ ఒక దేశం అని ఐరాస గుర్తించలేదు, అక్టోబరులో బాధ్యతలు స్వీకరించిన ప్రధాని సానాయి టకాయిచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇటీవల మాట్లాడుతూ బలవంతంగా తైవాన్‌ ప్రాంతాన్ని చైనా స్వాధీనం చేసుకుంటే తమ దేశభద్రతకు ముప్పు వచ్చినట్లే అని దాన్ని తాము అంగీకరించేది లేదని ప్రకటించారు.

చైనాలో అంతర్భాగమైన తైవాన్‌ ప్రస్తుతం ఒక తిరుగుబాటు రాష్ట్రంగా ఉంది.శాంతియుత పద్దతుల్లో తిరిగి ప్రధాన భూభాగంతో అనుసంధానం చేసేందుకు చూస్తామని,అవసరమైతే మిలిటరీచర్యతో అయినా ఆ పని చేస్తామని చైనా పదే పదే ప్రకటించింది. హాంకాంగ్‌, మకావో దీవుల విలీనం మాదిరి ఒక దేశం రెండు వ్యవస్థల విధానం కింది తైవాన్‌లో ఉన్న వ్యవస్థను 2049 వరకు ఎలాంటి మార్పులు చేయబోమని కూడా స్పష్టం చేసింది, అంటే అప్పటి వరకు స్వయం పాలనకు అవకాశమివ్వటమేగాక అక్కడ ఉన్న పెట్టుబడులకు రక్షణ కల్పించటమే. అయితే ఒక వైపు తైవాన్‌ ప్రాంతం చైనా అంతర్భాగమే అని అంగీకరిస్తూనే అమెరికా, జపాన్‌ ఇతర పశ్చిమ దేశాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవటాన్ని తాము అంగీకరించేది లేదని వితండ వాదనకు దిగుతున్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న తైవాన్‌లోని వేర్పాటువాద శక్తులకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాయి. ఒక దేశం మాదిరి అక్కడ మిలిటరీని ఏర్పాటు చేసేందుకు, వాటికి యుద్ధ విమానాలతో సహా అన్ని రకాల ఆయుధాలను అందచేస్తున్నాయి. అమెరికా కవ్వింపులను గమనించిన చైనా ఆచితూచి వ్యవహరిస్తున్నది, ఎప్పటికప్పుడు తన అధికారాన్ని అది పునరుద్ఘాటిస్తున్నది. తెగేదాకా లాగితే ఏం జరుగుతుందో చూడండి అంటూ తరచు తైవాన్‌ చుట్టూ మిలిటరీ విన్యాసాలను కూడా నిర్వహిస్తున్నది. వాటిని చూపి ఇంకేముంది చైనా బలప్రయోగానికి పూనుకుందంటూ అమెరికా కూటమి దేశాలు నానా యాగీ చేస్తున్నాయి.

క్లుప్తంగా తైవాన్‌ సమస్య గురించి చూద్దాం.చైనా స్వాతంత్య్రం కోసం కొమింటాంగ్‌ పార్టీ ఏర్పడింది.సన్‌ యెట్‌ సేన్‌ నాయకత్వంలో 1912లో చైనా స్వాతంత్రం ప్రకటించుకొని రిపబ్లిక్‌గా అవతరించింది. తరువాత జరిగిన కొన్ని పరిణామాలలో అధికారానికి దూరమైన సన్‌ తరువాత మరోసారి అధికారానికి వచ్చి కమ్యూనిస్టులతో కలసి తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మరణం తరువాత 1925లో అధికారానికి వచ్చిన ఛాంగ్‌కై షేక్‌ కొమింటాంగ్‌ పార్టీలో కమ్యూనిస్టులతో సయోధ్యను కోరుకొనే వారిని పక్కన పెట్టి కమ్యూనిస్టు వ్యతిరేకిగా మారాడు. మావో నాయకత్వాన కమ్యూనిస్టులు 1949లో అధికారానికి వచ్చిన సమయంలో భారీ సంఖ్యలో మిలిటరీ, ఆయుధాలను తీసుకొని చాంగ్‌కై షేక్‌ తైవాన్‌ దీవికి పారిపోయి అక్కడి నుంచి కమ్యూనిస్టులను ప్రతిఘటించాడు. ప్రధాన భూభాగంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం ముఖ్యమని భావించిన కమ్యూనిస్టులు దాని మీద కేంద్రీకరించారు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఏర్పడిన ఐరాసలో అప్పుడు అధికారంలో ఉన్న చాంగ్‌కై షేక్‌ నియమించిన ప్రతినిధులనే గుర్తించారు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత చైనా అంటే తైవాన్‌లో తిష్టవేసిన కొఇమింటాంగ్‌ పార్టీయే చైనా ప్రతినిధి అని 1970దశకం వరకు పరిగణించారు.ఎట్టకేలకు కమ్యూనిస్టు చైనాను గుర్తించకతప్పని పరిస్థితి ఏర్పడింది. 1971 అక్టోబరులో జరిగిన 26వ సమావేశంలో 2,758 తీర్మానం ద్వారా కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రధాన భూభాగంలో ఉన్న జనచైనా(పిఆర్‌సి) అసలైన ప్రతినిధి అని గుర్తించారు. నాటి నుంచి తైవాన్‌లో ఉన్న పాలకులు నియమించిన వారికి గుర్తింపు రద్దు చేశారు. చైనాలో తైవాన్‌ అంతర్భాగమని అందరూ అంగీకరించారు. అయితే అప్పుడు జరిగిన చర్చలో దీర్ఘకాలం విడిగా ఉన్నందున బలవంతపు విలీనం జరగకూడదని పలుదేశాలు చెప్పిన అభిప్రాయాన్ని చైనా నాయకత్వం కూడా అంగీకరించింది. నాటి చర్చను సాకుగా తీసుకొని తరువాత ఎప్పుడు విలీన యత్నం చేసినా తగిన పరిస్థితి ఏర్పడలేదని పశ్చిమ దేశాలు పాటపాడుతున్నాయి. ఇప్పటికీ అదే సాకు చెబుతూ విలీనాన్ని అడ్డుకుంటున్నాయి. తన పౌరులపై బలప్రయోగం అంటే రక్తపాతమే గనుక చైనా అందుకు పూనుకోవటం లేదు, దాని సహనాన్ని పదే పదే రెచ్చగొడుతున్నారు. దానిలో భాగమే తైవాన్‌ విలీనం తమ దేశానికి ముప్పు అని జపాన్‌ చెబుతున్న కుంటిసాకు. ప్రస్తుతం తైవాన్‌ వేరుగా ఉన్నందున చైనాకు వచ్చిన ముప్పేమీ లేదు గనుక ఉపేక్షిస్తున్నది. అది చెబుతున్న 2049 గడువులోగా దారికి వస్తే సరే, రాకుంటే అప్పుడేం జరుగుతుందో ఇప్పుడు ఊహించి చెప్పలేము. ఒక్కటి మాత్రం స్పష్టం. తైవాన్‌ వ్యవహారాల్లో మరోదేశం జోక్యం చేసుకోవటం, భిన్నంగా మాట్లాడటం అంటే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, తమ సార్వభౌమత్వం, రాజ్యాంగం, అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘించటమే అని చైనా చెబుతున్నది. ఇదే అంశాన్ని సోమవారం నాడు జర్మనీ విదేశాంగ మంత్రితో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి, కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూర్‌ సభ్యుడు వాంగ్‌ ఇ స్పష్టం చేశారు. తైవాన్‌ గురించి అనేక అంశాలను వివరించాడు. ఈ ప్రాంతాన్ని జపాన్‌ అర్ధశతాబ్దం పాటు ఆక్రమించుకొని వలసగా చేసుకున్నదని, తమ పౌరుల మీద లెక్కలేనని అత్యాచారాలు చేసిందని కూడా చెప్పాడు.

చైనా బూచిని చూపుతూ జపనీయులను రెచ్చగొడుతున్న అక్కడి పాలకులు మిలటరీ బడ్జెట్‌ను పెంచేందుకు సాకులు వెతుకుతున్నారు.ఇదంతా అమెరికా ఆడిస్తున్న క్రీడ తప్ప మరొకటి కాదు. తాను నేరుగా దిగితే చైనాతో సమస్యలు వస్తాయని తెలుసుగనుక ట్రంప్‌ యంత్రాంగం జపాన్ను ఎగదోస్తున్నది. తైవాన్‌ దీవికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన చివరి దీవుల సముదాయం,( ఇది చైనాకూ అంతే దూరం) జనాభా పెద్దగా లేని యంగునీ దీవుల సముదాయంలో దీర్ఘశ్రేణి క్షిపణులను మోహరించేందుకు పూనుకుంది. అక్కడ రాడార్‌ కేంద్రాలు, మందుగుండు గిడ్డంగులు, అమెరికా అందచేసిన ఎఫ్‌-35 విమానాల మోహరింపు, ఇతర మిలిటరీ నిర్మాణాలకు పూనుకుంది. ఇప్పటికే సిబ్బంది నివాసాలకు కొన్ని భవనాల నిర్మాణం పూర్తి చేసింది. కొద్ది రోజుల క్రితం ఆ దీవుల్లో ఉన్న పౌరులు కొంత మందితో సమావేశం జరిపి చైనాపై నిఘా, దాని ఎలక్ట్రానిక్‌ పరికరాలనుంచి వెలువడే అయస్కాంత తరంగాలను స్థంభింప చేసేందుకు మిలిటరీ నిర్మాణాలు అవసరమని తేల్చి చెప్పారు. ఇది చైనాను కవ్వించటం తప్ప మరొకటి కాదు. ఒక వేళ రెండు దేశాల మధ్య యుద్దం అంటూ వస్తే అది జపాన్‌ వైపు నుంచే మొదలు కావాలి తప్ప చైనా నుంచి జరగదు. ఒక వేళ జరిగితే అమెరికా తమను ఆదుకొనే పరిస్థితి లేదని గతంలో ప్రభుత్వ విశ్లేషకురాలిగా ఉండి, ప్రస్తుతం నిగాటా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఒక మహిళా ప్రొఫెసర్‌ చెప్పారు. ప్రభుత్వ మిలిటరీ, క్షిపణుల మోహరింపు గురించి అక్కడి కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీచర్చలో వ్యతిరేకతను వెల్లడించింది. ఇతర దేశాల మాదిరే జపాన్‌ కూడా చేస్తున్నదని రక్షణ మంత్రి సమర్ధించాడు.

గత వారంలో విమర్శలకు దారితీసిన ఉదంతం జపాన్‌లో అమెరికా మిలిటరీ కేంద్రం ఉన్న ఒకినావా దీవి సమీపంలో జరిగింది. చైనా తమ విమానాలను లక్ష్యంగా చేసుకున్నదని తప్ప గగనతలాన్ని అతిక్రమించినట్లు జపాన్‌ ఇంతవరకు చెప్పలేదు.ముందుగా అంతర్జాతీయ జలాల్లో ఉన్న తమ విమానవాహక యుద్ధ నౌక సమీపానికి ప్రమాదకరంగా జపాన్‌ యుద్ధ విమానాలే వచ్చాయని, తమవైపు నుంచి అనివార్యమైన ప్రతిస్పందన ఉందని బీజింగ్‌ చెబుతున్నది.చైనా విమానవాహక యుద్ద నౌక లియావోనింగ్‌ వైపు జపాన్‌ యుద్ధ విమానాలు సమీపంలోకి వచ్చినపుడు చైనా విమానాలు అడ్డుకొని హద్దు మీరితే అంతే సంగతులని హెచ్చరించినట్లు, అవి పూర్తిగా సమర్దనీయమే అని చైనా నిపుణులు చెబుతున్నారు. జపాన్‌ సమీపంలో చైనా విమానవాహక నౌక కార్యకలాపాలు నిర్వహించటం ఇదే మొదటిసారి అని జపాన్‌ వార్తా సంస్థ కొయోడో పేర్కొన్నది. తూర్పు ఆసియా సముద్రంలో చైనా నౌకాదళానికి చెందిన వివిధ రకాల వంద నౌకలు పాల్గ్గొన్నట్లు రాయిటర్స్‌ వార్త ఆరోపించింది. తమ నౌకలు పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో ఇలాంటి విన్యాసాలు జరపటం సాధారణమని అయితే ప్రతిసారీ జపాన్‌ తమకు చైనా నుంచి ముప్పు ఉందని చెప్పేందుకు, తన మిలిటరీ శక్తిని పెంచుకొనేందుకు వాటిని బూతద్దంలో చూపుతున్నదని, అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగానే తాము జరుపుతున్నట్లు, జపాన్‌ ఆత్మరక్షణ రాజ్యాంగం నుంచి పక్కకు జరుగుతున్నదని చైనా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వాటి మీద అతిగా స్పందించటం, విపరీత భాష్యాలు ఎవరూ చెప్పకూడదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లిన్‌జియాన్‌ చెప్పాడు.అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుపుతున్న తమ విన్యాసాల గురించి గుండెలు బాదుకుంటున్న జపాన్‌ అదే పని అమెరికా చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నదని చైనా ప్రశ్నిస్తోంది.

తైవాన్‌ సమస్యపై రెచ్చగొడుతున్న జపాన్‌ తీరును చూస్తే అమెరికా పన్నిన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వివాదం చెలరేగిన సమయంలోనే తైవాన్‌ సమస్యపై తక్షణమే చైనాతో యుద్ధం రాకుండా చూసుకోవాలని ఒక పథకం రూపొందించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ముందుగా అమెరికా, దాని మిత్రదేశాలు మిలిటరీ బలాన్నిపెంచుకోవాలని, చైనా వైపునుంచి తైవాన్‌, జపాన్‌ మీద వత్తిడి పెరుగుతున్నదని డిసెంబరు ఐదున ప్రచురించిన ఒక పత్రంలో అమెరికా జాతీయ వ్యూహకర్తలు పేర్కొన్నారు.2017లో ప్రచురించిన పత్రంలో ఒక వాక్యంలో మూడుసార్లు తైవాన్‌ ప్రస్తావన చేయగా తాజా పత్రంలో మూడు పేరాల్లో ఎనిమిదిసార్లు ఉన్నట్లు రాయిటర్స్‌ తెలిపింది. వాణిజ్య యుద్దాలు జరుగుతున్న, సెమికండక్టర్ల ఉత్పత్తిలో ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో తైవాన్‌ గురించి సరిగానే కేంద్రీకరించినట్లు, జపాన్‌ నుంచి ఆగేయాసియా వరకు ఏ దీవి మీద కూడా ఎక్కడా దురాక్రమణ జరగకుండా అమెరికా మిలిటరీ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని ఆ పత్రం పేర్కొన్నది. ఇదే సమయంలో అమెరికా ఒక్కటే చేయలేదని, చేయకూడదని, మిత్రదేశాలు మిలిటరీ ఖర్చు పెంచుకోవాలని, ఉమ్మడిగా రక్షణకు పని చేయాలని హితవు పలికింది.ఈ బలం తైవాన్‌ ఆక్రమణ యత్నాలు మానుకొనే స్థాయికి పెరగాలని కోరింది. ఈ వ్యూహం, ఎత్తుగడల్లో భాగంగానే ఆత్మరక్షణ యుద్ధం నుంచి ఎదురుదాడులు చేసే విధంగా ఆయుధాలను పెంచుకోవాలని జపాన్‌ చూస్తున్నది, దానికి సాకుగా చైనా బూచిని చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది !

Share this:

  • Tweet
  • More
Like Loading...

సముద్రంలో చైనా డేటా సెంటర్‌ : నిజంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు భవిష్యత్‌ దార్శనికులా !

27 Monday Oct 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Environment, Europe, Germany, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

# China underwater data center, BJP, CHANDRABABU, China, Data Centers, Data centers Employment, Narendra Modi Failures, Vizag Google Data Center, Xi Jinping, YS jagan

ఎం కోటేశ్వరరావు

సముద్రంలో చైనా నిర్మించిన పదమూడు వందల టన్నుల బరువుగల డేటా సెంటర్‌ ఆదివారం నాడు(2025 అక్టోబరు26న) ప్రారంభమైంది. ఇది గాలి మరలతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను వినియోగించనుంది. హై క్లౌడ్‌ అనే కంపెనీ మొదటి దశలో భాగంగా 24మెగావాట్ల కేంద్రాన్ని షాంఘై తీరంలో నెలకొల్పింది. న్యూస్‌ అట్లాస్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం సముద్రపు ఒడ్డున నిర్మించిన గాలి మరల విద్యుత్‌ కేంద్రం నుంచి 95శాతం విద్యుత్‌ను ఈ కేంద్రానికి సరఫరా చేస్తారు, సముద్రపు నీటిని చల్లబరిచేందుకు వినియోగిస్తారు. మొత్తం 22.6 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించిన ఈ కేంద్రంలో సాంప్రదాయపు డేటా సెంటర్ల కంటే 23శాతం విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. సముద్రంలో 114 అడుగుల అడుగున ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలోని ఒక్కో గదిలో 4 నుంచి ఐదు వందల సర్వర్లు ఉంటాయి. సముద్రంలో ఏర్పాటు చేసిన టెలికాం కేబుళ్ల ద్వారా ఈస్ట్రన్‌ డేటా, వెస్ట్రన్‌ కంప్యూటింగ్‌ వ్యూహం ప్రకారం ప్రధాన భూభాగంలోని కేంద్రానికి అనుసంధానం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటివే మరో వందగదులను నిర్మించి విస్తరిస్తారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ చైనాలో 2015లో పైలట్‌ ప్రాజక్టుగా సముద్రంలో ఒక డాటా కేంద్రాన్ని నిర్మించింది. ప్రాజెక్ట్‌ నాటిక్‌ పేరుతో చేసిన ఈ ప్రయోగానికి స్వస్తి పలికి 2024జూన్‌లో దాన్ని సముద్రంలో ముంచివేసింది. ఆదివారం నాడు సముద్రంలో తొలి వాణిజ్య డాటా కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించిన తొలి దేశంగా చైనా చరిత్రకెక్కింది. ఇలాంటివే మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఈ కేంద్రం చైనాలో అతి పెద్ద తొలి స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఉన్న హైనాన్‌ సమీపంలో ఉంది. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో నిర్మించారు.

విశాఖలో అదానీ, ఎయిర్‌టెల్‌ కంపెనీలతో కలసి గూగుల్‌ నిర్మించనున్న డేటా కేంద్రం ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందన్నది చర్చ. లింక్‌డ్‌ఇన్‌లో వచ్చిన ఒక విశ్లేషణ జర్మనీలోని బిఎఎస్‌ఎఫ్‌ రసాయన కంపెనీతో డేటా సెంటర్ల ఉపాధిని పోల్చింది. సదరు జర్మనీ సంస్థ 684మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది, 50వేల మందికి పూర్తి స్థాయి ఉపాధిని కల్పిస్తున్నది. అదే జర్మనీలో డాటా కేంద్రం 2,283మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగించే చోట పూర్తి కాలపు ఉపాధి 6,849 నుంచి 13,699 మందికి చూపుతుంది. రసాయన ఫ్యాక్టరీ ఒక మెగావాట్‌కు 73 మందికి ఉద్యోగ కల్పన చేస్తుంటే డేటా సెంటర్‌ ఒక మెగావాట్‌కు 3 నుంచి ఆరు ఉద్యోగాలను ఇస్తున్నది. గూగుల్‌ ఆధునిక సాంకేతిక ప్రక్రియలను వినియోగిస్తుంది గనుక ఇంకా తగ్గవచ్చు. ఆ లెక్కన చూసినా విశాఖలో నిర్మించే ఒక గిగావాట్‌(వెయ్యి మెగావాట్లు) కేంద్రం మూడు నుంచి ఆరువేల మందికి పర్మనెంటు ఉద్యోగాలను కల్పిస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పిన అంకెలు దీనికి దగ్గరగా ఉన్నాయి. దానికి భిన్నంగా రాష్ట్ర మంత్రి లోకేష్‌ చెప్పారు. ఇద్దరికి సమాచార వనరు ఏమిటి ? ఈ విషయాన్ని చెప్పటానికి బిడియపడాల్సిందేముంది. అదే గూగుల్‌ను అడిగితే అందించిన ఇతర విశ్లేషణలు కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలన్నీ సాధ్యమైనమేరకు తక్కువ మందితో పని చేయించుకొనేందుకు చూస్తాయి. కన్సిడర్‌ మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన సిడ్నీలోని డాటా కేంద్రం 2023లో అకస్మాత్తుగా ఆగిపోయింది. తగినంత మంది సిబ్బంది లేని కారణంగా జరిగిన ఆ అంతరాయం 46 గంటల పాటు సేవల నిలిపివేతకు దారితీసింది. అప్‌టైమ్‌ ఇనిస్టిట్యూట్‌ అనే సంస్థ సిబ్బంది కొరత గురించి పేర్కొన్నది. ప్రపంచ డాటా సెంట్లర్లలో 2019లో ఇరవైలక్షల మంది పూర్తి కాలపు ఉద్యోగులు ఉంటే 2025 నాటికి కేంద్రాలు పెరిగినా 23లక్షల మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులా అన్నది వివరణ లేదు. ప్రపంచంలో ఇప్పుడున్న 122 గిగావాట్ల సామర్థ్యంలో సగటు తీసుకుంటే ఒక్కో గిగావాట్‌కు 18,700 ఉన్నట్లు కనిపిస్తున్నది. విశాఖ గూగుల్‌ సెంటర్‌కు అందరూ కలసి 20 నుంచి 30వేల మంది ఉంటారని కూడా పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. డాటా కంపెనీలు సిబ్బందిని చేర్చుకోవటం, నిలుపుకోవటంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చిన్న కేంద్రాలు(ఒకటి నుంచి ఐదు మెగావాట్లు) 8 నుంచి 15 మంది, ఐదు నుంచి ఇరవై మెగావాట్ల కేంద్రాలు 15 నుంచి 35 మంది, ఇరవై అంతకు మించిన సామర్ధ్యం కలిగినవి 35 మందికి పైగా, 40 మెగావాట్ల సంస్థలు 45 మందిని, వంద మెగావాట్లు అంతకు మించి సామర్ధ్యం కలిగినవి కొద్దిమందితోనే నిర్వహిస్తున్నాయి, ఎందుకంటే యాంత్రీకరణ మరియు నిర్ణీత ప్రమాణాలతో ఉండే వ్యవస్థలు అందుకు దోహదం చేస్తున్నాయి. నియమించుకుంటున్నాయి. డేటా సెంటర్లలో మొత్తం 230 రకాల సిబ్బంది అవసరం అని చెబుతున్నారు. అయితే చిన్న సంస్థలు అంతమందిని నియమించవు, అవి అవసరమైనపుడు పొరుగు సేవలను ఉపయోగించుకుంటాయి. సగం డేటా సెంటర్లు అవసరమైన నిపుణులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి.

రెండును రెండుతో కలిపినా, హెచ్చవేసినా ఫలితం నాలుగే. ఇది చెప్పటానికి గణితమేథావులతో పనిలేదు. డేటా సెంటర్లతో కలిగే పర్యావరణహాని, విషపూరితమైన వ్యర్ధాల వంటి ఇతర దుష్ఫలితాల గురించి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెప్పినా(అఫ్‌ కోర్స్‌ అధికారంలో ఉన్నపుడు ఈ పెద్దమనిషి వీటి గురించి చెప్పలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నోరు విప్పరు) ఆ రంగం గురించి అధ్యయనం చేసినవారు చెప్పినా విషయం ఒకటే. ఎవరైనా రాజకీయాలతో నిమిత్తం లేని వారు చెబితే చూశారా రాష్ట్ర అభివృద్దిని వ్యతిరేకించేవారు జగన్‌తో చేతులు కలిపి అవే వాదనలు చేస్తున్నారంటూ ప్రచారదాడికి దిగుతున్నారు. అంటే నోరు మూయించేందుకు ఇదొక రకం నియంతృత్వపోకడతప్ప మరొకటి కాదు. తేమ కారణంగా యంత్రాలు పనికి రాకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున అమెరికాలోని డేటా కేంద్రాలన్నీ పొడివాతావరణం ఉండే ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారని చెబుతున్నారు.పెట్టుబడిలో నాలుగో వంతు సబ్సిడీలు, సంవత్సరాల తరబడి రాయితీ ధరలకు నీరు, విద్యుత్‌ అందచేస్తున్న తరువాత ఏ పెట్టుబడిదారుడు మాత్రం చంద్రబాబు నాయుడి దరిచేరడు ! డాటా సెంటర్‌ మాప్‌ డాట్‌ కామ్‌ సమాచారం ప్రకారం గూగుల్‌కు ప్రపంచంలో 113 డాటా సెంటర్లు ఉండగా వాటిలో 68 పని చేస్తున్నాయి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఎందరు ఉద్యోగులు పని చేస్తున్నారని అడిగితే సమాచారం లేదని బదులు వచ్చింది. ప్రపంచంలో గూగుల్‌ సంస్థలో లక్షా 83వేల మంది పనిచేస్తున్నారనే సమాచారం ఉంది తప్ప ఏ విభాగంలో ఎందరు అన్నది లభ్యం కావటం లేదు. ఎవరికైనా దొరికితే ఈ విశ్లేషణకు జత చేస్తాను. మానవహక్కుల ఫోరం(హెచ్‌ఆర్‌ఎఫ్‌) సమాచారం ప్రకారం అమెరికాలోని అష్‌బర్న్‌ మరియు లీస్‌బర్గ్‌ డాటా సెంటర్లు రెండిలోనూ కలిపి ప్రత్యక్షంగా 400 మందికి పరోక్షంగా 3,100 మంది ఉపాధి దొరుకుతున్నట్లు పేర్కొన్నది.లోకేష్‌ చెప్పినట్లు లక్షా 88వేల ఉద్యోగాల్లో 88వేలు పర్మనెంటు అనుకుంటే మొత్తం గూగుల్‌ ఉద్యోగులు విశాఖలోనే ఉంటారన్నట్లుగా భావించాలి, అది జరిగేదేనా !

ఇంటర్నెట్‌ వెతుకులాటలో డాటా సెంటర్ల ఉపాధి గురించి ఎవరెటు తిప్పి చెప్పినా పెట్టుబడులు, స్థలాల విస్తీర్ణం ఎక్కువ, ప్రత్యక్ష ఉపాధి తక్కువ, పరోక్ష ఉపాధి గురించి మాత్రమే వెల్లడవుతున్నది. పరోక్షం అంటే భవనాల నిర్మాణ సమయంలో దొరికే ఉపాధి, వాటి చుట్టూ ఉండే నివాసాలతో కలిగే లబ్ది గురించి మాత్రమే ప్రస్తావన ఉంటున్నది. ఆ లెక్కన బడా పరిశ్రమలు అంతకంటే ఎక్కువ కల్పిస్తున్నాయి. వస్తూత్పత్తిలో చైనాను పక్కకు నెట్టే ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా దేశాన్ని మారుస్తామన్న మాటలు ఇప్పుడు ఎకువగా వినిపించటం లేదు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ గురించి కబుర్లు పెరిగాయి.ఒకదానికి ఒకటి పోటీ కాదు, పరస్పరం సాయం చేసుకొనేవే.పెట్టుబడులు ఎక్కువ ఉపాధి తక్కువ ఉండే టెక్‌ కంపెనీల కోసం మోడీ, చంద్రబాబు వంటి వారు వెంపర్లాడుతున్నారు. ఒకసారి భవనాల నిర్మాణాలు పూర్తయిన తరువాత తాత్కాలిక కార్మికులకు పని ఉండదు. ఆటోమేషన్‌ ప్రధాన ప్రక్రియగా నడిచే ఈ కేంద్రాలలో కీలకమైన సిబ్బంది ఎవరంటే సెంటర్ల మేనేజర్లు, నెట్‌వర్క్‌ మరియు వ్యవస్థల అడ్మినిస్ట్రేటర్లు, సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక నిపుణులు, వారికి సహాయ సిబ్బంది.

ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఏటా పదివేల కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. డేటా సెంటర్లు అవసరమే, అయితే అవి కొత్త సమస్యలను సృష్టించకూడదు. మనదేశంలో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం గురించి తెలిసిందే. పాలకులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారంటే ఉత్పత్తులకు తప్ప కాలుష్యానికి కాదు, దాన్ని నివారించేందుకు పరిశ్రమలే చర్యలు తీసుకోవాలన్న నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేస్తే తమ లాభాలు తగ్గుతాయని తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతంలో ఫార్మా, ఇతర సంస్థల నుంచి వెలువడుతున్న కాలుష్యం సమీపంలోని సముద్రంలో కలుస్తున్నది. దాంతో మత్స్యకారుల ఉపాధికి దెబ్బతగులుతున్నది. పరిష్కరించండి మహానుభావా అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను అడిగితే ఈ మధ్యే మాట్లాడుతూ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది తాము కాదని, వంద రోజుల గడువులో పరిష్కరిస్తానని చెప్పారు. అధికారానికి వచ్చి 15నెలల తరువాత ఈ మాటలు చెప్పిన పెద్ద మనిషి ఇంతకాలం ఏం చేస్తున్నట్లు ?

డేటా అనేక విధాలుగా కీలక పాత్ర పోషిస్తున్న పూర్వరంగంలో మనదేశం కూడా వెనుకపడకూడదు. కానీ నరేంద్రమోడీ లేదా రెండింజన్ల పాలనలో ఉన్న ప్రభుత్వాలు గానీ ఎంతో నిర్లక్ష్యం చేశాయన్నది అంకెలే చెబుతున్నాయి.2019లో 350 మెగావాట్ల సామర్ధ్యం ఉండగా 2025 నాటికి 1,350 మెగావాట్లకు చేరుతుందని చెబుతున్నారు. ఈ రంగంలో మిగిలిన దేశాలు ఎంతో ముందున్నాయి.దీనికి కూడా నెహ్రూయే కారణం అని చెబుతారేమో తెలియదు. ముందు చూపు లేకపోవటం తప్ప మరొకటి కాదు.చైనాలో గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు లేవు, మైక్రోసాఫ్ట్‌ కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో తప్ప ప్రభుత్వం వినియోగించటం లేదు.కృత్రిమ మేథ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో చైనా వెనుకబడిందని శత్రువులు కూడా చెప్పలేరు.తాజా సమాచారం ప్రకారం 2024నాటికి చైనాలో డేటా వాణిజ్య విలువ 47.23 బిలియన్‌ డాలర్లు కాగా 2030 నాటికి అది 97.30బి.డాలర్లకు పెరుగుతుందని రిసర్చ్‌ అండ్‌ మార్కెట్స్‌ సంస్థ పేర్కొన్నది. స్టాటిస్టా సంస్థ విశ్లేషణ మరోవిధంగా ఉంది.అమెరికాలో 2025 నాటికి డాటా సెంటర్ల ఆదాయం 171.9 బిలియన్‌ డాలర్లు, కాగా చైనాలో 103.19 బిలియన్‌ డాలర్లని 2030 నాటికి 142.64 బి.డాలర్లకు పెరుగుతుందని అంచనా. మరో సమాచారం ప్రకారం ప్రపంచ డేటా సెంటర్ల సామర్ధ్యం 2024నాటికి 122.2 గిగావాట్లు. దీనిలో అమెరికా 53.7(44శాతం) కలిగి ఉండగా చైనా 31.9 గిగావాట్లు కలిగి ఉంది. మూడో స్థానంలో ఒక కూటమిగా ఐరోపా యూనియన్‌ 11.9 గిగావాట్లు, మనదేశం 3.6గా ఉంది.చైనాలో ఇటీవల జత చేసిన సామర్ధ్యాన్ని పని చేయించటం లేదని వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి అర్ధం అవుతున్నదేమిటి ? దేశం వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలన్నింటా వృద్ది చెందితేనే డేటా కేంద్రాలకు చేతినిండా పని ఉంటుంది. గడచిన పదకొండు సంవత్సరాలుగా కబుర్లు తప్ప అభివృద్ధి లేని కారణంగా డేటా సెంటర్ల సామర్ధ్యం కూడా పెరగలేదన్నది స్పష్టం.విశ్లేషణలను కొనుగోలు చేసేవారు లేకపోతే రేపు విశాఖ గూగుల్‌ సెంటర్‌ అయినా ఈగలు తోలుకుంటూ కూర్చోవాల్సిందే.

దేశాన్ని, రాష్ట్రాన్ని వికసిత్‌ భారత్‌లో ఎక్కడికో తీసుకుపోతామని ప్రధాని నరేంద్రమోడీ, ఆయన అడుగుజాడల్లో లేదా అడుగులకు మడుగులద్దుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక మంది దృష్టిలో దేశంలో అతి పెద్ద దార్శనికులు, ఇతరులకు తట్టనివి అనేకం వారికి కనిపిస్తాయని చెబుతారు. ఆ ప్రచారం వలన దేశానికి ఎంత లాభమో తెలియదు గానీ నష్టం కలిగిస్తున్నారంటే ఎవరూ నొచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరిశోధన మరియు అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి) నేడు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాయో చెప్పనవసరం లేదు.తన పాలనలో జిడిపిని పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి తెచ్చిన ఘనత నాదే అంటారు మోడీ. కాసేపు అంగీకరిద్దాం, ఆ పురోగతి ఇతర రంగాల్లో ఉందా ? వాటిలో కీలకమైన పరిశోధనకు కేటాయింపుల సంగతేమిటి ? 1995-96 నుంచి 2014-15వరకు రెండు దశాబ్దాల వార్షిక సగటు జిడిపిలో 0.73 శాతం ఉంది. యుపిఏ పాలనలో 2008-09లో జిడిపిలో 0.8శాతం నిధులు కేటాయిస్తే మోడీ ఏలుబడిలో 2017-18లో 0.7, ఇప్పుడు 0.64శాతానికి తగ్గించారు. దీనికైతే జవహర్‌లాల్‌ నెహ్రూ కారణం కచ్చితంగా కాదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే భావజాలంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల ఈ నిర్వాకాన్ని చంద్రబాబు నాయుడు సమర్ధిస్తారా ? 2013 నాటి సైన్స్‌ మరియు టెక్నాలజీ విధానంలో, 2017-18 ఆర్థిక సర్వేలో కూడా కనీసం రెండు శాతం కేటాయించాలని చెప్పిన అంశం ఎవరికీ తెలియదా ? ఇద్దరు నేతలు దేశ దేశాలు తిరుగుతున్నారు కదా ఎక్కడ ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోరా ? ఎందుకీ నిర్లక్ష్యం ? మన అభివృద్ధి మీద గణనీయమైన ప్రభావం చూపాలంటే 2047నాటి వరకు కనీసం ఒక శాతం, ఆదర్శవంతంగా(ఐడియల్‌) ఉండాలంటే మూడుశాతం చొప్పున ఖర్చు చేయాలని నిపుణులు చెబుతున్నారు. పిండికొద్దీ రొట్టె, పరిశోధనా రంగంలో మనం ప్రపంచ బస్‌ను అందుకోకుండా చేసింది ఎవరంటే ఎవరిని చూపాలి ? పరిశోధనలకు మనం తక్కువ కేటాయిస్తున్నా, పరిశోధనా పత్రాలు గణనీయంగానే మనవారు సమర్పిస్తున్నారుగా అని సమర్ధించుకొనే వారిని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు ! ఎలాంటి పాలకులను మోస్తున్నాంరా బాబూ అని తల పట్టుకోవాలి !!

సంబంధిత మరో విశ్లేషణ దిగువ లింక్‌లో చదవవచ్చు ;

మేథోమధనం : డేటా సెంటర్లంటే గోడౌన్లా ! ఉత్పత్తి కేంద్రాలా !! జగన్‌, చంద్రబాబు చెబుతున్నదానిలో నిజానిజాలేమిటి ?
https://vedikaa.com/2025/10/25/are-data-centers-godowns-or-production-houses-what-is-the-truth-about-ycp-and-tdp-claims-on-employment/

Share this:

  • Tweet
  • More
Like Loading...

ఇది కదా కమ్యూనిస్టుల ముందు చూపు – మేథోవలస- తిరిగి రాకపై దశాబ్దాలనాడే చైనా ముందు జాగ్రత్త !

24 Wednesday Sep 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, Education, employees, Europe, History, imperialism, INDIA, INTERNATIONAL NEWS, Japan, NATIONAL NEWS, Opinion, Science, USA

≈ Leave a comment

Tags

BJP, Brain drain and Gain, China, china communist party, Donald trump, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

రానున్న రోజుల్లో తమ దేశానికి హెచ్‌ 1 బి వీసా మీద వచ్చే వారు లక్ష డాలర్లు(88 లక్షలరూపాయలు) చెల్లించాల్సి ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయం భారతీయులను విస్మయానికి గురిచేసింది. అనేక మంది డాలర్‌ కలలు కల్లలైనట్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయానికి ట్రంప్‌ కట్టుబడి ఉంటాడా కార్పొరేట్లు తెచ్చే వత్తిడికి లొంగి సవరించుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ప్రపంచ వ్యాపితంగా మేథోవలస-తిరిగి రాకల గురించి మధనం ప్రారంభమైంది.ట్రంప్‌ నిర్ణయం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది మరికొంత స్పష్టత వచ్చిన తరువాతనే చెప్పుకోవటం మంచిది. ఈ సందర్భంగా వచ్చిన కొన్ని వ్యాఖ్యలు, పత్రికా శీర్షికలు, వాటి వెనుక ఉన్న అంశాల గురించి చూద్దాం. అమెరికా లక్షల డాలర్ల ఫీజు కేవలం ఒక చెడ్డ విధానమేగాక చైనాకు వ్యూహాత్మక బహుమతి అంటూ ఒక బడా ఆంగ్ల పత్రికలో విశ్లేషణ ప్రారంభమైంది. హ్రస్వదృష్టితో ఉన్న అమెరికా వైఖరి కేవలం చైనా సాంకేతిక ప్రగతి పెరగటానికే తోడ్పడుతుందని కూడా వ్యాఖ్యాత వాపోయారు. విలువైన సంపదలను వెండి పళ్లెంలో పెట్టి చైనాకు అప్పగిస్తున్నారంటూ మరొకరు. ఎవరు ఎన్ని ఏడ్పులు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా గడచిన ఐదు దశాబ్దాల చరిత్రను చూసినపుడు అమెరికా, ఇతర ధనిక దేశాల విధాన నిర్ణేతలు, మేథావులు అనుసరించిన విధానాలు, అడ్డుకోవటాలు జనచైనా ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయన్నది జగమెరిగిన సత్యం. చైనా గురించి ఈ మాటలు చెబుతున్నవారు ట్రంప్‌ నిర్ణయం భారత్‌కు బహుమతి అని ఎందుకు చెప్పలేకపోయారు ? అత్తారింటికి దారేది సినిమాలో పదిలక్షల రూపాయల సూట్‌కేసును పవన్‌ కల్యాణ్‌ బహుమతిగా ఇస్తే దాన్ని తీసుకు వెళ్లిన ఆలీ తాళం రావటం లేదంటూ తిరిగి వచ్చిన దృశ్యాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆకస్మికంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియని స్థితిలో పదకొండేండ్ల మోడీ పాలన మనదేశాన్ని ఉంచిందని భావించాలా ? ఎందుకంటే ఏది జరిగినా మోడీ కారణంగానే అంటున్నారు గనుక ఇలా వ్యాఖ్యానించాల్సి వస్తోంది.

ప్రతిభావంతులకు చైనా,బ్రిటన్‌ వల అన్నది ఒక ప్రముఖ తెలుగు పత్రిక శీర్షిక. అమెరికా అడ్డుకుంటే ప్రతిభను వృధా కానివ్వాలా ? ఆ పని మనమెందుకు చేయటం లేదని ప్రశ్నించాల్సిన వారు ఇతర దేశాల గురించి అలాంటి పదజాలంతో కించపరుస్తూ వ్యాఖ్యానించటాన్ని ఏమనాలి. అక్టోబరు ఒకటవ తేదీ నుంచి కె వీసాల జారీతో చైనా ఎంతో చురుకుగా ప్రపంచంలోని స్టెమ్‌ (సైన్సు,టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, గణిత) మేథావులను ఆకర్షిస్తున్నదని ట్రంప్‌ ప్రకటన తరువాత వార్తలు వెలువడ్డాయి. నిజానికి చైనా నిర్ణయం ఎంతో ముందుగానే తీసుకున్నది. మన మీడియా, అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ మన పాలకులు చైనా చర్యలను గుర్తించలేదు, అసలు ప్రయత్నం కూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు.మనం లేకపోతే అమెరికాకు గడవదు అని మనజబ్బలు మనం చరుచుకున్నాం తప్ప అసలు వారెందుకు ప్రపంచమంతటి నుంచీ మేథావంతులను ఆకర్షిస్తున్నారు, తేడా వచ్చి ఆకస్మికంగా అడ్డుకుంటే ప్రత్యామ్నాయం ఏమిటి అని 2047 విజన్‌ గురించి చెబుతున్న నరేంద్రమోడీ గానీ, అంతకు ముందే విజన్లను ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గానీ ఎప్పుడైనా ఆలోచించారా ? కాక మీద ఉన్నపుడే ఇనుము మీద దెబ్బలు వేసి అవసరానికి అనుగుణంగా మలుచుకోవాలి. ఇప్పుడు యువత కూడా ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. అమెరికాగాకపోతే ఆస్ట్రేలియా, అదిగాక పోతే ఆఫ్రికా అన్నట్లు కొందరు మాట్లాడుతున్నారు. సంచార తెగమాదిరి ఎక్కడికో అక్కడికి పోవటం తప్ప మన దేశం పురోగమించటం గురించి, గౌరవ ప్రదమైన ఉపాధి గురించి ఎందుకు ఆలోచించరు ?

అమెరికా వ్యూహాత్మకంగా స్వయంగా చేసిన తప్పిదం అంటున్నారు సరే, దాంతో మనకు పోయేదేమీ లేదు, మనం ఎందుకు వ్యూహాత్మకంగా ఆలోచించలేదు అని కదా పాఠాలు తీసుకోవాల్సింది. చైనా కె వీసా ఎంతో స్మార్ట్‌గా, వ్యూహాత్మకంగా, నిర్దాక్షిణ్యమైన అవకాశవాదంతో ( రూత్‌లెస్లీ ఆపర్చ్యునిస్టిక్‌) ఉందని కూడా ఉక్రోషం వెలిబుచ్చారు. ఈ వీసాలకు దరఖాస్తు చేసుకొనేందుకు చైనాలోని ఏదో ఒక కంపెనీ ఇచ్చే అవకాశంతో పని లేదు. అనుభం కూడా అవసరం లేదు. వారు కోరిన అర్హతలు ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందే చెప్పుకున్నట్లు ప్రతిభావంతులను ఆకర్షించటం ఇప్పుడే ప్రారంభం కాలేదు. వేయి ప్రతిభల పథకం(టిటిపి) పేరుతో చైనా 2008 నుంచే ఆకర్షించటం ప్రారంభించింది. అయితే చైనా మీద ఉన్న తప్పుడు ప్రచారం, అమెరికాతో పోలిస్తే దక్కే ప్రతిఫలం తక్కువగా ఉండటం, కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వం అనే వ్యతిరేక భావనలు ఇలా అనేక అంశాలు చైనా వైపు చూడటానికి యువతను అడ్డుకున్నాయి. అది కూడా చాపకింద నీరులా తన పథకాన్ని అమలు జరిపింది తప్పహడావుడి చేయలేదు. ఇప్పుడు చైనా సాధిస్తున్న పురోగతి, ఇతర దేశాల్లో విధిస్తున్న ఆంక్షలు, జాత్యహంకారం వంటి వివక్ష ఇతర సమస్యల కారణంగా గతంలో మాదిరి అడ్డుకొనే అవకాశాలు పరిమితం. అనేక మంది వైద్య విద్యకోసం చైనా వెళ్లిన సంగతి తెలిసిందే.

మన దేశానికి ట్రంప్‌ మంచి అవకాశాన్ని కల్పించాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవటం మన విధాన నిర్ణేతలు, పాలకుల చేతుల్లో ఉంది. సేవారంగంలో మన యువత ముందంజలో ఉంది.మొత్తంగా చూసినపుడు సాధించాల్సింది ఇంకా ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఎంతో ఉంది. ప్రపంచంలో పరిశోధన మరియు అభివృద్ధి మీద చేస్తున్న ఖర్చు వంద రూపాయలు అనుకుంటే మనం చేస్తున్నది కేవలం రు.2.90 మాత్రమే. అదే అమెరికా 24.8, చైనా 22.80 ఖర్చు చేస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ప్రపంచంలో నవకల్పనలకు పేటెంట్‌ హక్కులు లభిస్తున్నాయి. వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం 2023లో చైనా అత్యధికంగా 16,19,268 దరఖాస్తులు సమర్పించగా 7,98,347 మంజూరయ్యాయి. రెండవ స్థానంలో ఉన్న అమెరికా 5,94,340కి గాను 3,20,410 పొందింది. మన విషయానికి వస్తే ఐదవ స్థానంలో 70,068 మాత్రమే సమర్పించి 30,490 పొందాము. మూడవ స్థానంలో ఉన్న జపాన్‌ 2,89,530కి గాను 2,01,420, నాలుగవది దక్షిణ కొరియా 2,37,633కు గాను 1,35,180 పొందాయి. ఏదైనా పిండికొద్దీ రొట్టె.గడచిన పదకొండు సంవత్సరాలుగా అంతకు ముందు కూడా పరిశోధన, అభివృద్ధికి మనదేశం చేసిన ఖర్చు పెరగలేదు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అనే కబుర్లతో కాలక్షేపం చేస్తే ఇలాగే ఉంటుంది.పోనీ వాటినైనా వెలికి తీస్తారా అంటే అదీ చేయరు. పడక కుర్చీ కబుర్లు చెబుతుంటారు. యుద్ద ప్రాతిపదికన కొన్ని సంవత్సరాల పాటు అవసరమైన నిధులు కేటాయించి ప్రోత్సహిస్తే మనం కనీసం మూడవ స్థానానికి చేరుకుంటాం.ఈ అవకాశాన్ని మోడీ సర్కార్‌ సద్వినియోగం చేస్తుందా ? చౌకబారు రాజకీయాల మీదనే కేంద్రీకరిస్తుందా ? కొంత మంది అంచనా వేస్తున్నట్లు రానున్న రోజుల్లో ప్రావీణ్యం అసలైన శక్తిగా ముందుకు రానుంది. దీన్ని చైనా ఎప్పుడో గుర్తించింది, అమెరికా ఇప్పుడు నేర్చుకుంటున్నది, మరి మనం ? అవు సైన్సును నమ్ముకుంటే గోమూత్రం, పేడ దగ్గరే ఉండిపోతాం. వార్షిక ప్రపంచ రాంకింగ్‌లను చూసినపుడు చైనా విద్యా సంస్థల పురోగతి స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పటికీ చైనాను గుడ్డిగా వ్యతిరేకించే వారు అది అనుకరించేది తప్ప నవకల్పనలు చేసేది కాదని వాదిస్తారు. వారిని అలాగే ఉండనిద్దాం, వాస్తవాలను చూద్దాం. అమెరికాకు చెందిన న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ నివేదికలో 105 దేశాలకు చెందిన 2,250 ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ సంవత్సరం బీజింగ్‌లోని సిన్హువా విశ్వవిద్యాలయం ప్రపంచ రాంకుల్లో పదకొండవ స్థానం పొందింది. పెకింగ్‌, ఝెజియాంగ్‌ 25,45వ స్థానాల్లో ఉన్నాయి. 2018లో సిన్హువా, పెకింగ్‌ 50, 68 స్థానాలతో తొలి వందలో ఉన్నాయి.ఈ ఏడాది వాటి సంఖ్య పదిహేనుకు చేరింది.చైనాలో అమలు జరిపిన కరోనా ఆంక్షలు, అంతకు ముందే 2018లో ట్రంప్‌ తొలి పాలనా కాలంలో ప్రారంభమైన అమెరికా వేధింపులు పెరగటంతో 2019-20లో 3,72,532గా అమెరికాలో చదివిన చైనా విద్యార్థుల సంఖ్య 2023-24లో 2,77,398కి తగ్గింది. దీంతో ఇప్పుడు మన దేశం మొదటి స్థానంలోకి వెళ్లింది.

ఇప్పటి వరకు చైనా నుంచి అమెరికాకు మేథోవలస జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగి రావటం ప్రారంభమైంది. దీనికి అక్కడ పరిశోధన మరియు అభివృద్ధికి చేస్తున్న ఖర్చు పెరగటంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులో చైనాను విస్మరించలేని స్థితికి చేరుకోవటం, అక్కడ కూడా అనేక స్టార్టప్‌లు ప్రారంభించటానికి ప్రభుత్వం అవకాశం కల్పించటం వంటి కారణాలు దీనికి దోహదంచేస్తున్నాయి.2035 నాటికి ప్రపంచ అగ్రస్థానంలో సాంకేతిక రంగాన్ని నిలబెట్టేందుకు చైనా పూనుకుంది. అందుకు అవసరమైన పెట్టుబడిలో అమెరికాతో పోటీపడుతోంది.ఓయిసిడి సంస్థ సమాచారం ప్రకారం పదేండ్ల క్రితం అమెరికా చేసిన పరిశోధన ఖర్చులో 72శాతం చేసిన చైనా 2023నాటికి 780 బిలియన్‌ డాలర్లు వెచ్చించి 96శాతానికి చేరుకుంది. పరిశోధన ఉత్పత్తిలో 2017లోనే అమెరికాను అధిగమించింది. డీప్‌ సీక్‌ సంచలనం తెలిసిందే. దానిలో పనిచేసిన వారందరూ చైనా యువకులే.కొంత మందికి ఎక్కడా పని చేసిన అనుభవం కూడా లేదు. దీనితో పాటు ఝజియాంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాడ్యుయేట్లు డీప్‌ రోబోటిక్స్‌లో ప్రావీణ్యం పొందారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, ప్రమాదకరమైన హై ఓల్టేజి సమస్యల పరిష్కారానికి వారు కృషి చేస్తున్నారు. సిలికాన్‌ వాలీతో పోటీ పడేట్లుగా చైనా ప్రోత్సహిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞాన ఎగుమతులపై అమెరికా విధించిన నిషేధాలను సవాలుగా తీసుకుంది.అవకాశాలను అందిపుచ్చుకోవటంలో చైనాను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 1970దశకంలో అనివార్యమైన స్థితిలో ఐరాస భద్రతా మండలిలో కమ్యూనిస్టు చైనాను అసలైన శాశ్వత ప్రతినిధిగా అమెరికా గుర్తించాల్సి వచ్చింది.

దాని కొనసాగింపుగా చైనా ప్రారంభించిన సంస్కరణలను సొమ్ము చేసుకోవాలని అమెరికా భావించింది. తాత్కాలిక లాభాలను అమెరికన్లు చూస్తే దీర్ఘకాలిక లక్ష్యంతో సంస్కరణలను చైనా తలపెట్టింది.1978 వరకు అమెరికా ఉన్నత విద్యా సంస్థలలో చైనీయులకు ప్రవేశం లేదు. సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకొనే ప్రక్రియలో భాగంగా అమెరికా సైన్సు సలహాదారు ఫ్రాంక్‌ ప్రెస్‌ బీజింగ్‌ సందర్శనకు వచ్చాడు. అక్కడి నుంచి నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌కు ఫోన్‌ చేసి తమ విద్యార్థులు ఐదువేల మందిని అమెరికా విద్య కోసం పంపేందుకు ఆసక్తితో ఉన్నట్లు చైనా చెప్పిందని, ఏం చేయమంటారని అడిగాడు. ఐదువేలేం ఖర్మ లక్ష మందిని పంపవచ్చని వారికి చెప్పండని కార్టర్‌ సమాధానమిచ్చాడట. అలా వెళ్లిన లక్షలాది మంది చైనా విద్యార్ధులు అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏటా 15 బిలియన్‌ డాలర్ల లబ్ది కలించారు.ఆ విధంగా అమెరికా మేథోవలసను ప్రోత్సహించి ఎంతోలబ్ది పొందింది. అక్కడి మార్కో పోలో అనే మేథో సంస్థ ప్రపంచ కృత్రిమే మేథ సర్వే చేసింది. అమెరికాలోని అగ్రశ్రేణి ఏఐ పరిశోధకుల్లో 37శాతం మంది అమెరికన్లు కాగా చైనీయులు 38శాతం ఉన్నట్లు తేలింది.చాట్‌ జిపిటి 4 ప్రాజెక్టులో కీలకమైన సేవలు అందించిన వారిలో 20శాతం మంది చైనీయులే. వీటన్నింటిని చూసిన తరువాత భయపడిన అమెరికన్లు పొమ్మనకుండా చైనీయులకు పొగ పెట్టారు. మా దేశంలో చదువుకొనేందుకు రావచ్చు గానీ స్టెమ్‌ కోర్సుల బదులు, మావవ, సామాజిక శాస్త్రాలను ఎంచుకోవాలని వత్తిడి తెస్తున్నది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన కోర్సులో ప్రవేశాన్ని పరిమితం చేసింది. అందుకే చైనీయులు వేలాది మంది స్వదేశం బాట పట్టి అమెరికాకు పాఠం చెప్పేందుకు పూనుకున్నారు. మోడీ సర్కార్‌ మనవారికి అలాంటి అవకాశాలను కల్పిస్తుందా అన్న శేష ప్రశ్న !

Share this:

  • Tweet
  • More
Like Loading...

చెవిలో పూలు : పాకిస్థాన్‌ ప్రాజెక్టుల నుంచి చైనా తప్పుకుందా, కాషాయ దళాలు, మీడియా కథనాల్లో నిజమెంత !

07 Sunday Sep 2025

Posted by raomk in Africa, BJP, CHINA, Congress, Current Affairs, Economics, Europe, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Uncategorized

≈ Leave a comment

Tags

BJP, BRI, China, CPEC, Narendra Modi Failures, pakistan, RSS, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


‘‘ పాకిస్థాన్‌ 60 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నడవా ప్రాజెక్టు నుంచి వైదొలిగిన చైనా, నిధుల కోసం ఎడిబిని ఆశ్రయించిన ఇస్లామాబాద్‌ ’’ ఇది కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక.ఇదే అర్ధం వచ్చేవి మరికొన్నింటిలో వున్నాయి. దీనికి కాషాయ దళం చెప్పిన భాష్యం మచ్చుకు ఒకటి ఇలా ఉంది. ‘‘ భారత జాతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కనెక్టివిటీని మోడీజీ వ్యతిరేకించిన తరువాత (సిపిఇసి ప్రాజెక్టులో స్పష్టంగా సూచించడం) చైనా పాకిస్తాన్‌ యొక్క 60 బిలియన్‌ డాలర్స్‌ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ఇది భారతదేశానికి దౌత్యపరంగా అతిగొప్ప విజయం, పాక్‌కు చావు దెబ్బ ’’ అని పేర్కొన్నారు. ఇది నిజమా ? మొదటి అవాస్తవం ఏమిటంటే నరేంద్రమోడీ ప్రధాన మంత్రిగాక ముందే దానికి నాంది పలికిన 2013లోనే నాటి యుపిఏ ప్రభుత్వం ఈ పథకానికి అభ్యంతర తెలుపుతూ వ్యతిరేకించింది. ఎందుకు ? పాక్‌ ఆక్రమిత్‌ కాశ్మీరులో భాగమైన గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంలో 600 కిలోమీటర్ల పొడవున పాకిస్థాన్‌ మరియు చైనా నడవా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు మరియు రైలు మార్గ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు సాగుతుంది. అది చైనాలోని షింజియాంగ్‌ స్వయంపాలిత ప్రాంతం నుంచి మొదలై మూడువేల కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్‌ అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్‌ రేవు వరకు ఉంటుంది. గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతంపై మనదేశం హక్కును వదులుకోలేదు గనుక ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని మన ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయినప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు.2014లో అధికారానికి వచ్చిన నరేంద్రమోడీ సర్కార్‌ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వివిధ సందర్భాలలో నిరసన తెలుపుతూనే ఉంది. వాస్తవం ఇది కాగా, కొత్తగా మోడీ వ్యతిరేకత తెలిపినట్లు దానికి తలొగ్గి ప్రాజెక్టు నుంచి చైనా వైదొలిగినట్లు చెప్పటం జనాల చెవుల్లో పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.


నిజానికి మన్మోహన్‌ సింగ్‌ గానీ, నరేంద్రమోడీ గానీ ఈ సమస్య మీద పెద్దగా చేసిందేమీ లేదు. వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇద్దరూ చైనాతో ఇతర సంబంధాలను కొనసాగించారు. షాంఘై సహకార సంస్థలో మనదేశం 2005 నుంచి పరిశీలకురాలిగా 2014వరకు ఉంది. ఆ ఏడాది మోడీ ప్రభుత్వం పూర్తి స్థాయి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. మనదేశమూ, పాకిస్థాన్‌ రెండూ 2017లో ఒకేసారి సభ్యత్వం పొందాయి. అప్పుడు సిపిఇసి నడవాను ఒక సమస్యగా మోడీ ముందుకు తేలేదు. నరేంద్రమోడీ హయాంలో 2020 గాల్వన్‌లోయ ఉదంతాల ముందుకు వరకు చైనాతో సంబంధాలు మరింత ముందుకు పోయాయి.ఐదేండ్ల తరువాత తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) 25వ వార్షిక సమావేశాలకు నరేంద్రమోడీతో పాటు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా హాజరయ్యారు. మోడీ వెంటనే తిరిగి రాగా సెప్టెంబరు మూడున జపాన్‌పై రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా సాధించిన విజయం 80వ వార్షికోత్సవ మిలిటరీ పరేడ్‌లో ఒక అతిధిగా షరీఫ్‌ పాల్గొన్నారు.ఆ ఉత్సవానికి నరేంద్రమోడీకి కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరు కాలేదు. ఎస్‌సిఓ సమావేశాలలో సిపిఇసి గురించి అభ్యంతరాలు తెలిపినట్లుగానీ, చైనా నేతలతో మాట్లాడినట్లుగానీ ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాలేదు. కానీ కొద్ది రోజుల తరువాత మీడియాలో వచ్చిన కథనాలను పట్టుకొని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ తనదైన శైలిలో రాసింది. ఆరు రోజులు పాటు చైనాలో ఉన్నప్పటికీ షెహబాజ్‌ షరీఫ్‌ సిపిఇసికి రెండవ దశ పెట్టుబడుల విషయంలో విఫలమయ్యారు.పరిమితమైన అవగాహన ఒప్పందాలు మాత్రమే చేసుకున్నారు.పెద్ద పెట్టుబడులేమీ లేవు. సిపిఇసి 2.0 ప్రారంభమైనట్లు షెహబాజ్‌ ఏకపక్షంగా ప్రకటించారు తప్ప చైనా వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేదు.పరేడ్‌లో చైనా అధ్యక్షుడు తనతో పాటు పుతిన్‌, ఉత్తర కొరియా కిమ్‌ను తప్ప షెహబాజ్‌ను పట్టించుకోలేదు.పుతిన్‌తో సంభాషించినపుడు చెవులకు ఫోన్లను కూడా షరీఫ్‌ సరిగా అమర్చుకోలేకపోయారంటూ రాసింది. పాకిస్థాన్‌తో సిపిఇసి పెట్టుబడుల నుంచి వెనక్కు తగ్గినట్లు చైనా అధికారిక ప్రకటనను ఆర్గనైజర్‌ లేదా కథనాలు రాసిన ఇతర పత్రికలు చూపగలవా ?

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎటుతిప్పి ఎటురాసినా కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఇవ్వటం లేదని చైనా చెప్పిందని, గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు తగ్గిందని, ఆ మొత్తాన్ని ఆసియన్‌ అభివృద్ధి బ్యాంకు (ఏడిబి) నుంచి తీసుకోవాలని పాక్‌ నిర్ణయించిందని రాశాయి. పదే పదే ఐఎంఎఫ్‌ నుంచి రుణాలు తీసుకుంటున్న పాకిస్థాన్‌కు తాము ఇచ్చిన రుణాలను చెల్లించే సత్తాదానికి ఉందా అనే అనుమానాలు చైనాకు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక స్నేహితుడి కోసం మరొకర్ని వదులుకోలేమని ఇటీవల పాక్‌ ఆర్మీ ప్రధాన అధికారి అసిమ్‌ మునీర్‌ చెప్పాడని, దాంతో చైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదన్నట్లుగా వర్ణించారు. ఇదే సమయంలో 8.5 బిలియన్‌ డాలర్లను వివిధ పథకాలకు చైనా అందించేందుకు పాక్‌ ప్రధానితో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలను మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు. రెండు బిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు తిరస్కరించిన చైనా కొత్తగా 8.5బి.డాలర్లు ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించినట్లు ? ఈ మొత్తాన్ని సిపిఇసి 2.0లో ఐదు కొత్త కారిడార్లు, అదే విధంగా ఇతర రంగాలలో వినియోగించనున్నట్లు ప్రముఖ పాక్‌ పత్రిక డాన్‌ రాసిందని మనదేశ వార్తా సంస్థ పిటిఐ పేర్కొన్నది. తొలిసారిగా పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఒక సంస్థ సిపిఇసిలో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిందని కూడా వార్తల్లో రాశారు.చైనాకు లాభదాయకం కాని వాటిలో అదెందుకు పెట్టుబడులు పెడుతున్నట్లు ? సమాధానం ఉండదు.


నిజానికి ఇలాంటి కథనాలు రావటం ఇదే కొత్త కాదు. 2024 జూన్‌ 11న బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక రాసిన కథనానికి ‘‘ సిపిఇసి 2.0లేదు, భారీ పెట్టుబడులు లేవని పాకిస్థాన్‌కు చెప్పకనే చెప్పింది ’’ అనే శీర్షిక పెట్టింది. ఐదు రోజుల పర్యటన జరిపిన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పర్యటనకు ముందు ఇస్లామాబాద్‌ అధికారులు సిపిఇసి మరొక ఉన్నత స్థాయికి తీసుకువెళతారని చెప్పారని అయితే ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని, పాక్‌ ఆశల మీద చైనా నీళ్లు చల్లిందని, పరిమిత లబ్దితోనే తిరిగి వెళ్లినట్లు నికీ ఆసియా రాసిందని దాన్లో పేర్కొన్నారు. ఏడాది క్రితం మోడీ చైనా వెళ్లలేదు, దానితో సాధారణ సంబంధాల స్థితి కూడా లేదు, అప్పుడెందుకు చైనా అలా వ్యవహరించిందో మీడియా ‘‘ వంట ’’ వారు, కాషాయ దళాలు చెప్పగలవా ? ‘‘పాకిస్థాన్‌ : ఎందుకు చైనా సిపిఇసి ప్రాజెక్టులు నిలిపివేసింది ?’’ అనే శీర్షికతో ఢల్లీి కేంద్రంగా పని చేస్తున్న అబ్జర్వర్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ (ఒఆర్‌ఎఫ్‌) వెబ్‌సైట్‌లో 2020 నవంబరు 25వ తేదీన అయిజాజ్‌ వానీ రాసిన విశ్లేషణను ప్రచురించింది. అప్పుడు గాల్వన్‌లోయ ఉదంతాలతో చైనాతో మనదేశం వైరంలో ఉంది తప్ప మిత్రదేశంగా లేదు కదా, ఆ నాడే అలా ఎందుకు రాయాల్సి వచ్చినట్లు ? నరేంద్రమోడీ నిరసన లేదా పలుకుబడి ఏమైనట్లు ? అప్పటికే కొన్ని అంశాలను నిలిపివేసినట్లు అయిజాజ్‌ వానీ రాశారు. పాకిస్థాన్‌లో మాంద్యం, అవినీతి,బెలూచిస్తాన్‌ ఇతర తిరుగుబాట్లు వంటి అంశాలతో అనేక ప్రాజక్టులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.


సిపిఇసి అవకాశాన్ని పాకిస్థాన్‌ వృధా కావించిందని, మద్దతు గురించి చైనా పునరాలోచనలో పడిరదని సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయ మాజీ ఫ్రొఫెసర్‌ సజ్దాద్‌ అష్రాఫ్‌ 2025 మే రెండవ తేదీన రాశారు. పదేండ్ల తరువాత పాకిస్థాన్‌ అసమర్ధత, రాజకీయ అవకతవకల వంటి కారణాలతో అనేక కీలక ప్రాజెక్టులు ఆలశ్యం,వాయిదా పడటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం.2015 ఏప్రిల్‌ 20న షీ జింపింగ్‌ ఇస్లామాబాద్‌లో ఎంతో అట్టహాసంగా ప్రాజెక్టును ప్రారంభించారు. పదేండ్ల తరువాత తలపెట్టిన 90 పథకాల్లో 38 పూర్తి కాగా మరో 23 నిర్మాణంలో ఉన్నాయి. మూడోవంతును ఇంతవరకు ముట్టుకోలేదు. దీనికి బాధ్యత పరిమితంగా చైనాది కాగా ఎక్కువగా ఇస్లామాబాద్‌దే ఉంది. అత్యంత కీలకమైన ప్రత్యేకించి సెజ్‌లు, పారిశ్రామికవాడలు పూర్తికాలేదు. దీనికి పాకిస్థాన్‌ రాజకీయ నేతలు, ఆసక్తి కనపరచని, సమన్వయం లేని ఉన్నతాధికారులదే బాధ్యత. వీటికి కేటాయించిన వనరులను ఆర్థికంగా పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ ఉండని లాహార్‌ మెట్రో రైలు ప్రాజక్టుకు మళ్లించారు. ఇలాంటి వాటికి తోడు 2021 నుంచి ప్రాజెక్టులలో పని చేస్తున్న చైనా సిబ్బందికి రక్షణ కల్పించటంలో తీవ్ర పరిస్థితి ఏర్పడిరది. అప్పటి నుంచి 14దాడులు జరగ్గా 20 మంది మరణించారు, 34 మంది గాయపడ్డారు. వీటిలో ఎక్కువ భాగం బెలూచిస్తాన్‌లో జరిగాయి. దౌత్యపరంగా ఇప్పటికీ సిపిఇసికి చైనా మద్దతు ఉన్నప్పటికీ 2023 తరువాత కొత్త పెట్టుబడుల పట్ల వెనక్కి తగ్గుతున్నది.


చైనా ప్రారంభించిన బిఆర్‌ఐ(బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌) పెట్టుబడి పథకాన్ని ప్రారంభం నుంచి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, వాటి ఆధ్వర్యాన నడిచే ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌, గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ గుండా రోడ్డు, రైలు మార్గాల నిర్మాణాన్ని కారణంగా చూపినప్పటికీ మనదేశం కూడా దానికి వ్యతిరేకమే అనే చెప్పాలి. పాకిస్థాన్‌లో రాజకీయ, ఇతర కారణాలతో అక్కడి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. బెలూచిస్తాన్‌లోని ఉగ్రవాద శక్తులు చైనా జాతీయుల మీద చేసిన దాడుల వెనుక బిఆర్‌ఐని వ్యతిరేకించే దేశాలు ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యలు, వాటి పరిణామాలు, పర్యవసానాల గురించి చైనాకు తెలిసినప్పటికీ ఎందుకు చేపట్టిందన్నది ప్రశ్న. ప్రపంచ ఫ్యాక్టరీగా తయారైన తరువాత దాని ఎగుమతులు, దిగుమతులు తక్కువ ఖర్చు, తక్కువ వ్యవధిలో యూరేషియా, ఆఫ్రికా దేశాలకు చేరేందుకు గల మార్గాలను అన్వేషించినపుడు సిపిఇసి ముందుకు వచ్చింది. దక్షిణ చైనా సముద్రం, మలక్కా జలసంధి ద్వారా రవాణా కంటే పశ్చిమ చైనాలోని షిజియాంగ్‌(ఉఘిర్‌) స్వయంపాలిత ప్రాంతం నుంచి పాక్‌ అరేబియా సముద్రరేవు పట్టణం గద్వార్‌ వరకు రవాణా సదుపాయాల ఏర్పాటు లాభదాయకమని భావించింది. చరిత్రలో ఇంగ్లీష్‌ ఛానల్‌ ప్రాంతంలో బ్రిటన్‌ మరియు ఫ్రాన్సును కలుపుతూ ఏర్పాటు చేసిన భూగర్భ రైల్వే టన్నెల్‌, పనామా, సూయజ్‌ కాలవల తవ్వకం అలా జరిగిందే. ప్రస్తుత పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో 51 ఒప్పందాల ద్వారా 46 బిలియన్‌ డాలర్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రారంభించారు. ఇప్పుడు అది 65 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని అంచనా. మధ్యలో కరోనా, ఇతర సమస్యలతో అనుకున్నంత వేగంగా పూర్తి కావటం లేదు. ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌ నుంచి 60 బిలియన్‌ డాలర్ల ప్రాజక్టు నుంచి చైనా వైదొలిగిందని రాస్తే జనం నమ్మాలా ? ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా శాశ్వతంగా ఉంటుందని భావించి మనదేశం అక్కడ మూడు బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. మనకు కూడా చెప్పకుండా అమెరికన్లు 2021లో అక్కడి నుంచి బతుకుజీవుడా మమ్మల్ని ప్రాణాలతో పోనిస్తే చాలంటూ ఆయుధాలు, రవాణా వాహనాల వంటి వాటన్నింటినీ వదిలి కాలికి బుద్ది చెప్పటాన్ని చూశాము. అప్పటి నుంచి మనదేశం తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా తెరవెనుక వారితో మంతనాలు జరుపుతూ పెట్టుబడులను రాబట్టుకొనేందుకు చూస్తున్న సంగతి బహిరంగ రహస్యం. వదలివేసినట్లు ఎక్కడా ప్రకటించలేదు. జూలై మొదటి వారంలో తాలిబాన్‌ సర్కార్‌ను గుర్తించిన ఏకైక దేశం రష్యా. దానితో మనకున్న సంబంధాలను ఉపయోగిస్తామని వేరే చెప్పనవసరం లేదు. అలాంటిది 60 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను అర్ధంతరంగా పాకిస్థాన్‌కు వదలి వట్టి చేతులతో చైనా తిరిగి వెళుతుందని మీడియాలో కొందరు రాస్తే, నరేంద్రమోడీ అభ్యంతరంతోనే ఆపని చేసిందని కాషాయదళాలు జనాన్ని నమ్మించేందుకు చూడటం నిజంగానే దుస్సాహసం. జనాలు చెవుల్లో పూలు పెట్టుకొని లేరని వారికి చెప్పకతప్పదు !

. 

Share this:

  • Tweet
  • More
Like Loading...

సోవియట్‌ నాటి చరిత్ర పునరావృతం అవుతుందా : బులబాటం తీర్చిన డోనాల్డ్‌ ట్రంప్‌ – నరేంద్రమోడీ ఆరాటానికి ముందున్నది అసలు పరీక్ష !

01 Friday Aug 2025

Posted by raomk in BJP, CHINA, Current Affairs, Economics, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, Uncategorized, USA

≈ Leave a comment

Tags

BJP, China, Donald trump, Donald Trump Tariffs, Narendra Modi Failures, Tariff War, Trade agreement with US, Xi Jinping

ఎం కోటేశ్వరరావు

నాటకీయ పరిణామాలు జరగకపోతే అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం వెంపర్లాడిన నరేంద్రమోడీ బృందానికి ప్రస్తుతానికి డోనాల్డ్‌ ట్రంప్‌ తగిన పాఠమే చెప్పాడు. మనదేశం నుంచి తాము దిగుమతి చేసుకొనే వస్తువులపై 25శాతం పన్నులు, రష్యా నుంచి మనం ముడిచమురు, ఆయుధాలు, ఇతర వస్తువులను దిగుమతి చేసుకొంటున్న కారణంగా అదనంగా జరిమానా విధిస్తున్నట్లు బుధవారం నాడు ప్రకటించాడు. మనసార్వభౌమత్వాన్నే కించపరిచాడు. పుండు మీద కారం చల్లినట్లుగా పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని అక్కడ నిల్వచేసే చమురును భారత్‌కు అమ్మిస్తానని కూడా చెప్పాడు. ఇది మరీ అవమానం. రష్యా, భారత్‌ రెండూ మృత ఆర్థిక వ్యవస్థలు, కలసి ఏం చేస్తాయో చేసుకోండి అంటూ ఎద్దేవా చేశాడు.ట్రంప్‌ ప్రకటించిన మేరకు ఆగస్టు ఒకటి నుంచి మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న వివిధ సరకులపై కనిష్టంగా 25 గరిష్టంగా 193శాతం పన్నులు విధిస్తారు. వీటికి జరిమానా అదనం. ఇవి ఇలానే ఉండేట్లయితే ఏ రంగం ఎలా ప్రభావితం అవుతుందో ఆచరణలో తెలుస్తుంది.ఔషధాలు, సెల్‌ఫోన్లు వంటి వాటిని ప్రస్తుతానికి మినహాయించారు. అవి పేకాటలో తురుపు ముక్కల వంటివి, మనదేశాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే ఎత్తుగడలో భాగం తప్ప మరొకటి కాదు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం ఒక సాదాసీదా ప్రకటన విడుదల చేసింది. మహా వ్యూహవేత్త అంటున్నారు గనుక మామూలుగానే ప్రధాని నరేంద్రమోడీ, ఇతర మంత్రులు నోరు విప్పలేదు, సమాచార శాఖ(పిఐబి) ద్వారా మొక్కుబడిగా ఒక ప్రకటన విడుదల చేశారు.పరిస్థితిని అన్ని విధాలుగా మదింపు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అమెరికా చర్యలకు ప్రతిగా చైనా మాదిరి మన ప్రభుత్వం కూడా ప్రతి సుంకాలు విధిస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అమెరికాతో ఇప్పుడున్న 130 బిలియన్‌ డాలర్ల లావాదేవీలను మరో ఐదు సంవత్సరాల్లో 500 బిలియన్‌ డాలర్ల స్థాయికి పెంచుతామని రంగుల కలను జనం ముందించిన నేతలు ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది. ఈ నెల 25వరకు భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతాయని, తమ ప్రతినిధి వర్గం ఢల్లీి సందర్శించనున్నదని అమెరికా అధికారులు చెప్పినదాన్ని బట్టి ఇప్పటికీ మన మీద వత్తిడి తెచ్చే యత్నాలను ట్రంప్‌ మానుకోలేదని, సుంకాల ప్రకటన బెదిరింపుల్లో భాగమే అని చెప్పవచ్చు. మోడీ లొంగుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే అసలు అగ్ని పరీక్ష ముందుంది. ఫిబ్రవరి నుంచి జరుగుతున్న చర్చల గురించి రకరకాల లీకుల కథనాలు, ట్రంప్‌ ప్రకటనల నేపధ్యంలో ఎలక్ట్రానిక్‌ రంగంలో పెద్ద మొత్తంలో చైనా పెట్టుబడులను ఆకర్షించేందుకు మనదేశం సానుకూల సంకేతాలను పంపిందంటూ తాజాగా ఒక వార్త. ఇలాంటి పరోక్ష సందేశాలతో చైనాను చూపి అమెరికా నుంచి రాయితీలు రాబట్టుకొనే ఎత్తుగడగా కూడా దీన్ని చెప్పవచ్చు. గతంలో అమెరికాను చూపి సోవియట్‌, దాన్ని చూపి వాషింగ్టన్‌తో బేరసారాలాడిన మన పాలకవర్గం ఇలాంటి వాటిలో ఆరితేరింది. ఇప్పటి వరకు ఈ ఎత్తుగడ ఫలించినట్లు లేదు. నిజంగానే మనదేశం చైనా ఎలక్ట్రానిక్‌ కంపెనీలు, వాటి పెట్టుబడులను అనుమతిస్తే అమెరికా మరింత శత్రుపూరితంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. జిగినీ దోస్తుతో సంబంధాలను నరేంద్రమోడీ అంత తేలికగా వదులు కుంటారా అన్నది చూడాల్సి ఉంది.

మన జిడిపి పదిలక్షల కోట్ల డాలర్లకు చేరాలంటే చైనాతో సయోధ్య తప్పనిసరని కొందరి సూచన, డ్రాగన్‌తో పెట్టుకుంటే మృత్యుఘంటికలే అని కొందరి హెచ్చరిక. ఏది సత్యం ! ఏదసత్యం ఓ మహాత్మా, ఓ మహర్షీ !! గాల్వన్‌ లోయ ఘర్షణ సందర్భంగా ఇంక చైనాతో మాటల్లేవ్‌, మాట్లాడుకోవటం లేదు, పోరేశరణ్యం అంటూ ఊగిపోయిన దృశ్యాలు మన కళ్ల ముందే ఉన్నాయి.చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం, రాయబారి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు రాహుల్‌ గాంధీని ఎద్దేవా చేసిన వారు తమ కింది నలుపు చూసుకుంటున్నలేదు. రాహుల్‌ ఒప్పందానికి ముందే 2001లోనే జాన కృష్ణమూర్తి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిజెపి చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు పెట్టుకుంది. గాల్వన్‌ ఉదంతాలు జరిగి ఐదేండ్లు గడచిన తరువాత చూస్తే మూసిన తలుపులను మనమే తెరుస్తున్నాం. చైనా తలపులతో మునిగిపోతున్నాం. ఆశ్చర్యంగా ఉంది కదూ ! అప్పుడెందుకు మూశారు, ఇప్పుడెందుకు తెరిచారు, ఇన్నేండ్లు ఎందుకు ఆలశ్యం చేశారు అని ఎవరైనా అడిగారో దేశద్రోహ ముద్రవేస్తారు జాగ్రత్త. బిజెపి నందంటే నంది పందంటే పంది అంతే ! త్వరలో షాంఘై సహకార సంస్థ సమావేశాలకు గాను ప్రధాని నరేంద్రమోడీ బీజింగ్‌ సందర్శనకు వెళతారని అంటున్నారు.అన్నీ సక్రమంగా ఉంటే షీ జింపింగ్‌ కూడా ఢల్లీి రావచ్చు. ఏదీ అసాధ్యం కాదు, షీ జింపింగ్‌ రమ్మనాలే గానీ వెళ్లటానికి అన్నీ సర్దుకొని ఉన్నా అన్నట్లుగా ట్రంప్‌ ఉన్నాడు.ఎవరి ఎత్తుగడలు వారివి, ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యం.

త్వరలో చైనాను అధిగమించేందుకు ముందుకు పోతున్నామని కొందరు చెబుతుంటారు. ఆ చైనీయులేమో అమెరికాను దాటేస్తాం చూడండి అన్నట్లుగా సందడి లేకుండా తమపని తాము చేసుకుపోతున్నారు.మన సంకల్పం మంచిదే, ఆరోగ్యకరమైన పోటీ ప్రతిదేశంతోనూ ఉండాల్సిందే. మధ్యలో చైనా ఎందుకు ఏకంగా అమెరికాతోనే పోటీ పడాలి.ఆశ, ఆకాంక్షల్లో కూడా పిసిరానితనం అవసరమా ! అయితే పేచీ ఎక్కడ అంటే ఎవరికి వారు మేమే ముందుండాలి, అగ్రస్థానం మాకే దక్కాలి అనుకుంటే ఫలితం, పర్యవసానాలు ప్రతికూలంగానే ఉంటాయి.ఎవరి సంగతివారే చూసుకోవాలి అనుకున్నపుడు మన అభివృద్ధిని మరొకరు ఓర్వలేకుండా ఉన్నారని ఏడిస్తే ప్రయోజనం లేదు.1970 దశకం వరకు కమ్యూనిస్టు చైనాకు ఐరాసలో, 2001వరకు ప్రపంచ వాణిజ్యసంస్థలో సభ్యత్వమే లేదు.అడ్డుకున్నది ఎవరంటే అమెరికా, దాని కనుసన్నలలో నడిచే దేశాలే అన్నది తెలిసిందే. చిత్రం ఏమిటంటే అదే అమెరికా తరువాత కాలంలో తన కంపెనీల పెట్టుబడులను చైనాలో అనుమతించింది, తన అవసరం కోసం పరిమితంగా, ఫరవాలేదు పాతబడిరదే కదా అనుకున్న సాంకేతిక పరిజ్ఞాన బదిలీని అనుమతించింది. లాటిన్‌ అమెరికా దేశాల మాదిరి వస్తు ఎగుమతి ఆధారిత దేశంగా ఉంటూ తనకు లాభాలను అందిస్తుంది అనుకున్న ఆశలను చైనా వమ్ము చేసింది. లాటిన్‌ అమెరికా దేశాలు పెట్టుబడిదారీ, చైనా కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉందనే వాస్తవాన్ని పశ్చిమదేశాల వారు అర్ధం చేసుకోలేకపోయారు. చేయి అందిస్తే ఏకంగా అల్లుకు పోతుందని అమెరికా కార్పొరేట్‌ మేథావులు నాలుగుదశాబ్దాల క్రితం గుర్తించలేకపోయారు. చైనా నేడు అనేక రంగాలలో సవాలు చేస్తున్నది. అడ్డుకొనేందుకు అడుగడుగునా అమెరికా కూటమి చూస్తున్నది.ఆధునిక చిప్స్‌ అందుబాటులో లేకుండా చేయాలని ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే.తన కోడి కూయకపోతే చైనాలో తెల్లవారదని అది భావిస్తున్నది.

ఇలాంటి ఆటంకాలు మనకు లేవు. నిజంగానే ‘‘ కమ్యూనిస్టు నియంతృత్వ’’ చైనా మనకు అడ్డుపడుతున్నది అనుకుంటే మనవారు కీర్తించే ‘‘ ప్రజాస్వామ్య ’’ అమెరికా, ఇతర పశ్చిమదేశాలు మిత్రులు, భాగస్వాములే, అయినా సాయం చేసేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు. బీజింగ్‌కు పోటీగా మనలను ఎందుకు నిలపటం లేదు ? మనదేశంలోని కొందరు మేథావులు చైనా మాత్రమే మనలను అడ్డుకుంటున్నదని తమ దాడిని ఎందుకు ఎక్కుపెడుతున్నట్లు ? జనం ఆలోచించాలి ! అమెరికాతో మనదేశ వాణిజ్య ఒప్పంద గడువు జూలై తొమ్మిది, ఆగస్టు ఒకటి రెండూ మురిగిపోయాయి. చైనాతో వాణిజ్యం మీద లేని ఒప్పందం అమెరికాతో ఎందుకు అన్నది సామాన్యులకు అర్ధం కావటం లేదు. చైనాతో1954లో కుదిరిన ఒక సాధారణ ఒప్పందం మాత్రమే అమల్లో ఉంది.పరిస్థితులకు అనుగుణ్యంగా దాన్ని నవీకరించటం లేదా నూతన ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి ఎలాంటి చొరవా రెండువైపుల నుంచి లేదు. కానీ భారీ మొత్తంలో వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి.

అసలు వాణిజ్య ఒప్పందాలు ఎందుకు ? వివాదాలు లేకుండా ఒక పద్దతిగా నడుద్దామని రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 23దేశాల మధ్య (భారత్‌, చైనాలతో సహా) వాణిజ్యం, పన్నులపై సాధారణ ఒప్పందం( జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ టారిఫ్‌గాట్‌) 1947లో కుదిరింది, దీన్నే జెనీవా ఒప్పందం అని కూడా అంటారు.తరువాత అది 1995 జనవరి ఒకటి నుంచి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ)గా మారింది. గాట్‌ దేశాల్లో చైనా ఉన్నప్పటికీ అది కమ్యూనిస్టుల ఏలుబడిలోకి వచ్చిన తరువాత తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ పేరుతో ఉన్న చైనానే గుర్తించారు తప్ప మిగతా దేశాల మాదిరి సభ్యత్వం ఇవ్వలేదు. అనివార్యమైన స్థితిలో 2001లో చైనాను చేర్చుకున్నారు. ప్రపంచీకరణను ముందుకు తెచ్చిన దేశాలే నేడు దానికి భిన్నంగా డబ్ల్యుటివోను పక్కన పెట్టి విడివిడిగా ఒప్పందాలు చేసుకోవటం తెలిసిందే.


మన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న దేశాలలో అమెరికా, చైనా ఒకటి రెండు స్థానాలలో ఉంటున్నాయి. ప్రతిదేశం తన దగ్గర మిగులుగా ఉన్న సరకులను అమ్ముకొనేందుకు గతంలో ఏకంగా బలహీన దేశాలను ఆక్రమించుకోవటం, అందుకోసం యుద్ధాలకు దిగటం తెలిసిందే. ఆ రోజులు గతించాయి గనుక వాటి స్థానంలో మార్కెట్ల ఆక్రమణకు ఒప్పందాలు వచ్చాయి. పన్నులు ఎలా వేయాలో, ఎగుమతి, దిగుమతులు ఎలా జరగాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక విధానాన్ని రూపొందించింది. అది ఉండగా విడివిడిగా ఒప్పందాల కోసం ప్రయత్నించటం చూస్తున్నాం. ఐక్యరాజ్య సమితి(ఐరాస) మాదిరి డబ్ల్యుటిఓ కూడా విఫలమైందా ? అలాగే కనిపిస్తున్నది, దాని నిబంధనలను పక్కన పెట్టి కొన్ని దేశాలు కొన్ని వస్తువుల మీద ఎక్కువ పన్నులు విధిస్తున్నాయి. ప్రతి చర్యలతో వివాదాలు. వాటిని పరిష్కరించే ట్రిబ్యునల్‌కు న్యాయమూర్తుల నియామకం జరగకుండా అమెరికా అడ్డుకుంటున్నది, పోటీ పడలేక వాణిజ్య దందాకు దిగి చైనా మీద కత్తి గట్టింది. దాని వైఖరిని మిగతా దేశాలు అప్పుడే ప్రతిఘటించి ఉంటే ఇప్పుడు అన్నిదేశాల మీద దాడికి దిగేది కాదు.నష్టపోయేది చైనాయే గదా అని భావించిన దేశాలకు ఇప్పుడు తెలిసి వస్తోంది.

వాణిజ్య మిగులు ఉన్న దేశాలతో లోటు ఉన్నవి సమానం చేసేందుకు చూస్తాయి. మనదేశ లావాదేవీలను చూసినపుడు 151దేశాలతో వాణిజ్య మిగులుతో ఉన్నాం, 75దేశాలతో లోటులో ఉన్నాం. మన ఎగుమతుల గురించి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ మొత్తం మీద ఏటేటా లోటు పెరగటం తప్ప తగ్గటం లేదు. పదేండ్ల మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో మనదేశ మొత్తం వాణిజ్య లోటు (వికీపీడియా సమాచారం) 942.23 బిలియన్‌ డాలర్లు. ఇదే 2014 నుంచి 2024వరకు నరేంద్రమోడీ పాలనలో 1,506.22 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ కాలంలో మన ఎగుమతులు 201314లో 466.22 బిలియన్‌ డాలర్లు కాగా 20232024లో 778.21 బి.డాలర్లకు పెరిగాయి. మేకిన్‌, మేడిన్‌ ఇండియా పథకాలు జయప్రదమై ఉంటే మనకీ దుస్థితి ఉండేది కాదు. పదేండ్లలో మోడీ సర్కార్‌ నిర్వాకం కారణంగా మన విలువైన విదేశీమారకద్రవ్యం 614 బిలియన్‌ డాలర్లను చైనాకు పువ్వుల్లో పెట్టి ఇచ్చాం.అయినప్పటికీ మనం దిగుమతులు నిలిపివేసి డ్రాగన్‌కు చుక్కలు చూపించాలని కాషాయ దళాలు నిత్యం చెబుతూనే ఉంటాయి. నిజమే కామోసని గుడ్డిగా నమ్మేవారు ఉన్నారు. ఇంత తేడా ఉన్నప్పటికీ ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం పడుతున్న ఆరాటం చైనాతో జరగటం లేదన్నది తెలిసిందే. ఇదే సమయంలో అమెరికాతో ఉన్న వాణిజ్య మిగులును తగ్గించి తమ వస్తువులను మనమీద రుద్దేందుకు పూనుకున్న ట్రంప్‌తో మాత్రం ఒప్పందం కోసం ఇప్పటికీ అర్రులు చాస్తున్నది.


ప్రపంచ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిలో 60శాతం చైనాలోనే జరుగుతోంది. మనదేశంలో కూడా ఉత్పత్తిని పెంచాలంటే చైనా పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం అవసరం అని ఈ పూర్వరంగంలో చైనాను విస్మరించలేమని మన విధాన నిర్ణేతలకు అవగతమైనట్లు కనిపిస్తోంది.జిడిపిలో పదిలక్షల కోట్ల మైలురాయిని దాటాలంటే చైనాతో ఎంతో అవసరం ఉందని అబ్జర్వర్‌ రీసర్చ్‌ ఫౌండేషన్‌(ఓఆర్‌ఎఫ్‌) అధ్యక్షుడు సమీర్‌ శరణ్‌ అభిప్రాయపడ్డారు. చాలా సంవత్సరాల తరువాత చైనాతో ఆర్థిక సంబంధాల పునరుద్దరణకు ఎంతో అవకాశం ఉందని, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలనే చెప్పారు. చైనా తనసరకులను అమ్ముకొనేందుకు మనదేశాన్ని పెద్ద మార్కెట్‌గా చూస్తోందని, అందునా శత్రుదేశంగా ఉందంటూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. చైనా పర్యాటకులకు వీసాలు ఇవ్వాలని మనదేశం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. భద్రతాపరమైన తనిఖీలతో నిమిత్తం లేకుండా చైనా కంపెనీలను 24శాతం వాటాలతో భారత కంపెనీల్లో పెట్టుబడులను అనుమతించవచ్చని నీతి ఆయోగ్‌ ఇటీవల ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం, అధికార బిజెపిలో ఒక వర్గం చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తుండగా మరొకటి సానుకూలంగా ఉంది. నీతి ఆయోగ్‌ చెప్పటం అంటే మన బడాకొర్పొరేట్ల ప్రయోజనాలు, వాటి పరిరక్షణకు మోడీ మనసెరిగి నివేదించటం తప్ప మరొకటి కాదు. నిజంగా అదే జరిగితే ముందే చెప్పుకున్నట్లు డోనాల్డ్‌ ట్రంప్‌ మరింత రెచ్చిపోతాడు, వియోగమే అనివార్యమైతే మన నరేంద్రమోడీ, కాషాయ దళాలు తట్టుకుంటాయా ! దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందా ? గతంలో అంటే సోవియట్‌ యూనియన్‌తో ఉన్న మిత్ర సంబంధాలు వేరు, ఇప్పుడు చైనాతో అవసరమైతప్ప సంబంధాల్లో మిత్రత్వం ఎంత అన్నది అనుమానమే, అటువంటి చైనా కోసం అమెరికాను దూరంగా పెడతారా, ఏమో భారత పాలకవర్గం తనకు ఏది లాభం అనుకుంటే దానికే పెద్ద పీటవేస్తుందని సోవియట్‌ నాటి చరిత్ర చెబుతోంది ! పిల్లి నల్లదా తెల్లదా అని కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నది ముఖ్యం అన్నట్లుగా కమ్యూనిస్టు చైనా లేదా పెట్టుబడిదారీ అమెరికా అన్నది ముఖ్యం కాదు, తమకు లాభాలు దేనితో ఉంటాయన్నదే మన కార్పొరేట్లకు గీటురాయి !

Share this:

  • Tweet
  • More
Like Loading...

దలైలామా వారసుడు : అడుసుతొక్కనేల కాలుకడగనేల ! చైనా అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టటం అవసరమా, దేశానికి ఒరిగేదేమిటి ?

06 Sunday Jul 2025

Posted by raomk in BJP, CHINA, Congress, Current Affairs, History, imperialism, INDIA, International, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, RELIGION, UK, USA

≈ Leave a comment

Tags

anti china, China, Dalai Lama, Dalai Lama succession row, Kiren Rejiju, Narendra Modi Failures, Xi Jinping

ఎం కోటేశ్వరరావు


పద్నాలుగవ దలైలామా 90వ జన్మదినోత్సవం హిమచల్‌ ప్రదేశ్‌ ధర్మశాలలో లిటిల్‌ లాసాగా పిలిచే మెక్‌లియోడగంజ్‌లో జూలై ఆరవతేదీ ఆదివారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు కిరణ్‌ రిజుజు, లాలన్‌ సింగ్‌ హాజరయ్యారు.ఒక భక్తుడిగా దలైలామా నిర్ణయమే తనకు శిరోధార్యమని, మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా కిరణ్‌ రిజుజు పునరుద్ఘాటించారు. దలైలామా వారసుడి గురించి కొద్ది రోజులుగా పెద్ద రచ్చే జరిగింది.పరిణామాలు, పర్యవసానాల గురించి భయపడిన టిబెట్‌ బౌద్ద దలైలామా టెంజిన్‌ జియాట్సో ఆ వివాదానికి తాత్కాలికంగా తెరదించారు. సుగలాగ్‌ఖాంగ్‌ ప్రధాన బౌద్ద ఆలయంలో దీర్ఘకాలం ఆయన జీవించాలని కోరుతూ జరిపిన ప్రార్ధనల సందర్భంగా మాట్లాడుతూ తాను మరో 30 నుంచి 40 సంవత్సరాలు జీవిస్తానని ప్రకటించారు. ‘‘ అనేక జోశ్యాలను చూసినపుడు అవలోకితేశ్వర ఆశీస్సులు ఉన్నట్లు భావించాను. ఇప్పటి వరకు చేయగలిగిందంతా చేశాను. ఇంకా 30`40 సంవత్సరాలు జీవించగలనని అనుకుంటున్నాను , ఇప్పటి వరకు మీ ప్రార్ధనలు ఫలించాయి. మనం దేశాన్ని కోల్పోయినప్పటికీ భారత్‌లో ప్రవాసం ఉంటున్నాము. ఇక్కడ నేను ఎన్నో పొందాను, ధర్మశాలలో నివసిస్తున్న వారంతా కూడా అలాగే లబ్దిపొందాలని, నేను చేయగలిగిన సేవ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. అంతకు ముందు తనవారసుడు చైనా వెలుపలే జన్మిస్తాడని చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది.


దలైలామా తరువాత ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో తెలియదు గానీ మనదేశం చైనా అంతర్గత వ్యవహారమైన వారసుడి విషయంలో అనవసరంగా వేలుబెట్టి చైనాతో చెప్పించుకొని, సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది గౌరవప్రదమా, అసలు అవసరమా ! ఐదు సంవత్సరాల తరువాత రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొంటున్న తరుణంలో చైనాను రెచ్చగొట్టటం ద్వారా మనదేశానికి ఒరిగేదేమిటని ప్రతివారూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారసుడి విషయంలో దలైలామా ఆకాంక్షలను అనుసరించాలని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, బౌద్దుడైన కిరెన్‌ రిజుజు చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది.చైనా తీవ్ర అభ్యంతరం తెలిపిన తరువాత మతవ్యవహారాల్లో ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్య చేయలేదని మనవిదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వివరణ ఇచ్చారు. తన తదనంతరం దలైలామా వ్యవస్థ కొనసాగుతుందని, 2011లో తాను ఏర్పాటు చేసిన గాడెన్‌ ఫోడ్రాంగ్‌ ట్రస్టు తన వారసుడిని నిర్ణయిస్తుందని కొద్ది రోజుల క్రితం దలైలామా చేసిన ప్రకటనతో రచ్చ మొదలైంది. గతంలో చేసిన ప్రకటననే పునరుద్ఘాటించారు. గాడెన్‌ ఫోడ్రాంగ్‌ అనేది టిబెట్‌లోని లాసాలో ఉన్న 17వ శతాబ్దం నాటి డ్రెపంగ్‌ సంఘారామంలో ఉన్న దలైలామా నివాసం పేరు. ఆ ట్రస్టుకు దలైలామా చైర్మన్‌, ఆయన సన్నిహితులుగా ఉన్నవారు సభ్యులు, దలైలామా కార్యాలయమే దాని వ్యవహారాలను చూస్తున్నది.పదిహేనవ దలైలామా, తదుపరి పరంపరను నిర్ణయించాల్సింది ఆ ట్రస్టు మాత్రమే అని ప్రభుత్వంతో సహా మరొకరికి అధికారం లేదని దలైలామా ప్రకటించారు. ఈ ట్రస్టుతో పాటు న్యూఢల్లీి, జూరిచ్‌ నగరాల్లో కూడా ట్రస్టులను ఏర్పాటు చేశారు. మతానికి చెందిన లామాలు, ఇతర పెద్దలు వారసుడిని గుర్తించి ప్రతిపాదిస్తే అంతిమంగా ఈ ట్రస్టు ఆమోదిస్తేనే వారసత్వం ఖరారు అవుతుందని ట్రస్టు నిబంధనావళి పేర్కొన్నది.


ఇక్కడే అసలు సమస్య ఉంది. గతంలో ఎంపిక చేసిన వారసుల పేర్లను ఒక బంగరు కలశంలో వేసి లాటరీ పద్దతిద్వారా ఎంపిక చేస్తారు, ఆ పేరును చైనా కేంద్రప్రభుత్వం ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుందని, గతంలో ఇలాగే జరిగిందని బీజింగ్‌ ప్రకటించింది.తన ఎంపిక అలాగే జరిగిందని తెలిసినప్పటికీ ఈ విధానాన్ని 14వ దలైలామా అంగీకరించటం లేదు. అతగాడి ప్రకటనపై తాము ఎలాంటి వ్యాఖ్య చేయబోమని, మత వ్యవహారాలపై ఎలాంటి వైఖరిని తీసుకొనేది లేదని మన కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దలైలామా ప్రకటన సంబంధిత వార్తలను చూశామని, మతాలకు సంబంధించిన విశ్వాసాలు, వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోవటం లేదని. మత స్వేచ్చకు కట్టుబడి ఉన్నామని విదేశాంగశాఖ పేర్కొన్నది. క్వింగ్‌ రాజరిక పాలన నాటి నుంచి బంగారు కలశంలో ఉంచిన పేర్లతో లాటరీ తీసి ఎంపిక చేసిన దానిని చైనా ప్రభుత్వ ఆమోదిస్తే దలైలామా, పెంచన్‌ లామాలను ఖరారు చేస్తారని, ఆ మేరకు ప్రభుత్వ అధికారం కొనసాగుతున్నదని, దానికి తిరుగులేదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్‌ స్పష్టం చేశారు.ప్రస్తుత దలైలామాను కూడా అదే పద్దతిలో ఎంపిక చేయగా నాటి ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. తమ అంతర్గత వ్యవహారాల గురించి జాగ్రత్తగా వ్యాఖ్యానించాలని ఆమె మన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు చేసిన ప్రకటన గురించి పేర్కొన్నారు. టిబెట్‌పై ప్రకటించిన వైఖరికి భారత్‌ కట్టుబడి ఉండాలని, టిబెట్‌ సంబంధిత వ్యవహారాలపై చేసే వ్యాఖ్యలు ఇరుదేశాల సంబంధాల మెరుగుదల, అభివృద్ధికి విఘాతం కలిగించకూడదని హితవు చెప్పారు. దలైలామా ప్రకటనను చైనా ఖండిరచిన తరువాత అతగాడికి మద్దతుగా కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు మాట్లాడటంతో చైనా స్పందించింది. దలైలామా వైఖరిని పునరుద్ఘాటిస్తూ వారసుడి నిర్ణయంలో మరొకరి పాత్ర లేదని మంత్రి మాట్లాడారు. గాల్వన్‌ ఉదంతం తరువాత రెండు దేశాల సంబంధాలు స్థంభించిన సంగతి తెలిసిందే. గతేడాది రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జింపింగ్‌ భేటీ తరువాత ఏడాది కాలంలో సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. కైలాష్‌,మానస సరోవర్‌ యాత్రలను పునరుద్దరించారు.


టిబెట్‌ బౌద్ధ మతానికి ఉన్నత మతాధికారి దలైలామా. మన దేశంలో పీఠాధిపతులకు చాంతాడంత పేర్లు ఉన్నట్లే ప్రస్తుత దలైలామా మతపరమైన పేరు జెస్టన్‌ జాంఫెల్‌ గవాంగ్‌ లొబసాంగ్‌ యెషే టెంజిన్‌ గియాస్టో. పొట్టిగా టెంజిన్‌ గియాస్టో అని పిలుస్తారు. పుట్టినపుడు పెట్టిన పేరు లామో తోండప్‌. ఇతగాడు వివాదాస్పదమైన మతగురువు, 1935 జూలై ఆరున జన్మించారు. దలైలామాలను జీవించి ఉన్న బుద్ధుడు లేక బోధిసత్వుడు అని నమ్ముతారు. మరణానంతరం వారసులను ఎన్నుకుంటారు. దలై అంటే సముద్రం, ఇది మంగోలియన్‌ భాషా పదం.పదమూడవ దలైలామా మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత 1937లో అతడి వారసుడిగా టెంజిన్ను ఎంపిక చేశారు, 1939లో దలైలామాగా ప్రకటించారు. మరుసటి ఏడాది ఫిబ్రవరి 22న చైనా ప్రభుత్వం ఆమోదముద్రవేసింది. అమెరికా, బ్రిటన్‌ కుట్రలో భాగంగా కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1959లో టిబెట్‌లో తిరుగుబాటు పేరుతో సాయుధులను రంగంలోకి దించారు. వారిని చైనా ప్రభుత్వం అణచివేసింది, తిరుగుబాటు కేంద్రంగా దలైలామా కార్యక్షేత్రాన్ని గుర్తించారు.దాంతో 1959 ఏప్రిల్‌ 29న సిఐఏ పథకం ప్రకారం దలైలామాను నేపాల్‌ ద్వారా దాటించి అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న తేజ్‌పూర్‌ పట్టణంలో ప్రవేశపెట్టి ఆశ్రయం కల్పించారు.ఉత్తర ప్రదేశ్‌లోని ముస్సోరీలో దలైలామాతో ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు, మరుసటి ఏడాది హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు రప్పించారు.చైనాపై సిఐఏ రూపొందించిన కుట్ర సిద్దాంతాన్ని నమ్మిలేదా అమెరికా వత్తిడికి లొంగి నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దలైలామాకు ఆశ్రయం కల్పించారు. మూడవ ప్రపంచ యుద్ధంలో టిబెట్‌ నుంచి చైనా భారత్‌ ఇతర దేశాల మీద దాడి చేసేందుకు పథకం రూపొందించిందన్నది సిఐఏ కట్టుకథ. అమెరికా, బ్రిటన్‌ కుట్రల కారణంగా కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం తొలి పది సంవత్సరాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది. వాటిలో టిబెట్‌లో తిరుగుబాటు కుట్ర ఒకటి. దలైలామా అన్న గయలో తోండుప్‌ సిఐఏ ఏజంట్‌గా మారాడు. తెరవనుక ఉండి కథంతా నడిపించింది అతనే (97 సంవత్సరాల వయస్సులో ఈ ఏడాది ఫిబ్రవరి 8న పశ్చిమబెంగాల్లోని కలింపాంగ్‌లో మరణించాడు) అని, కుట్ర గురించి పూర్తిగా దలైలామాకు తెలియదని కూడా చెబుతారు. ఏమైనప్పటికీ తరువాత కాలంలో తెలిసినా అదే అమెరికా ప్రాపకంలో నాటి నుంచి నేటి వరకు చైనాకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నాడు.2011వరకు టిబెట్‌ ప్రవాస ప్రభుత్వ అధినేతగా చలామణి అయ్యాడు. తరువాత వేరేవారికి బాధ్యతలను అప్పగించాడు.

చైనాను అస్థిరపరచటం సాధ్యం కాదని గ్రహించిన అమెరికా విస్తారమైన దాని మార్కెట్‌లో ప్రవేశించేందుకు పూనుకొని ఐరాసలో కమ్యూనిస్టు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధిగా గుర్తించటంతో పాటు సాధారణ సంబంధాలను ఏర్పరుచుకుంది. దాంతో టిబెట్‌ తిరుగుబాటుదార్లకు అందచేస్తున్న సాయాన్ని 1972 నుంచి తగ్గించింది తప్ప ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది.దలైలామాకు 1989లో నోబెల్‌ శాంతి బహుమతిని కూడా ఇప్పించింది.మనదేశంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ సకల వసతులు కల్పిస్తూ చైనా వ్యతిరేక ప్రచారానికి అన్ని రకాలుగా తోడ్పడుతున్నారు. దలైలామా తరువాత స్వతంత్రుడైౖన పెంచెన్‌ లామా బౌద్దులకు ముఖ్యుడు. అతగాడే పదమూడవ దలైలామా వారసుడిగా గుర్తించిన ముగ్గురిలో ఒకడు లామో ధోండప్‌ తరువాత 14వ దలైలామా అయ్యాడు.క్రీస్తుశకం 1642 నుంచి కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన 1949వరకు చైనా ప్రభుత్వానికి లోబడి పరిమిత అధికారాలతో టిబెట్‌ ప్రాంతంపై దలైలామాలు లేదా అతగాడి ప్రతినిధులు రాజకీయ అధికారాన్ని కూడా చెలాయించేవారు. దీన్నే టిబెట్‌ స్వతంత్రదేశమని వక్రీకరించారు.1912లో చైనాలో తలెత్తిన తిరుగుబాటుతో క్వింగ్‌ రాజరికం పతనమై స్వతంత్రదేశంగా అవతరించింది, ఆ సమయంలో బ్రిటీష్‌ వారి కుట్రలో భాగంగా టిబెట్‌ స్వాతంత్య్రాన్ని పదమూడవదలైలామా ప్రకటించాడు. అయితే సన్‌యేట్‌ సేన్‌ నాయకత్వంలోని జాతీయ ప్రభుత్వం గుర్తించలేదు, టిబెట్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని స్పష్టం చేసింది. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత కూడా అదే విధంగా కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కొందరు టిబెటన్లు జపాన్‌కు అనుకూలంగా వ్యవహరించటంతో వారిని అణచివేసేందుకు నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ మిలిటరీని పంపి అణచివేశాడు. తరువాత జరిగిన పరిణామాల్లో ఖామ్‌ అనే యుద్ద ప్రభువు ఆధీనంలో ఉన్న టిబెట్‌ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొనేందుకు కమ్యూనిస్టు ప్రభుత్వం 1950 అక్టోబరులో ప్రజాసైన్యాన్ని పంపి స్వాధీనం చేసుకుంది. అదే ఏడాది పదిహేనేండ్ల వయస్సులో 14వ దలైలామాను టిబెట్‌ పాలకుడిగా ప్రకటించినప్పటికీ కమ్యూనిస్టు ప్రభుత్వం అంగీకరించలేదు.1951లో చైనా ప్రభుత్వానికి లోబడి స్వయంపాలిత ప్రాంతంగా టిబెట్‌ ఉండేందుకు దలైలామా ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు.1954లో మావోతో భేటీ అయ్యాడు, చైనా పార్లమెంటు స్టాండిరగ్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. మావో తనను ఒక కొడుకు మాదిరి చూశాడని దలైలామా తన ఆత్మకథలో చెప్పాడు.

1954 తరువాత సిఐఏ తనకుట్రను అమలు ప్రారంభించింది.1956లో దలైలామా భారత్‌ను సందర్శించినపుడు ఒకవేళ తాను రాజకీయ ఆశ్రయం కోరితే అంగీకరిస్తారా అని ప్రధాని నెహ్రూను కోరాడు.చైనా ప్రభుత్వంతో అప్పటికే ఒప్పందం ఉన్నందున అలాంటి పని చేస్తే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, రెచ్చగొట్టినట్లు అవుతుందని నెహ్రూ సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత అమెరికా వత్తిడికి లొంగిన నెహ్రూ ఆశ్రయమే కాదు, తిరుగుబాటు ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సహకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశం రెండు దేశాల మధ్య ఒక ప్రధాన సమస్యగానే ఉంటోంది. మన ప్రభుత్వం టిబెట్‌ను చైనాలో అంతర్భాగంగా గుర్తిస్తూనే వేర్పాటు వాదులకు అనధికారిక మద్దతు కొనసాగిస్తున్నది.మనదేశంలో కాలు పెట్టిన తరువాత 1967లో తొలిసారిగా దలైలామా విదేశీ పర్యటనకు జపాన్‌ వెళ్లారు. ఆయనకు వీసా ఇచ్చిన ప్రభుత్వం తమ గడ్డమీద ఉన్నంత వరకు చైనా వ్యతిరేక మాటలు మాట్లాడవద్దని షరతు విధించింది.కానీ మనపాలకులు మాత్రం పూర్తి స్వేచ్చ ఇచ్చారు.

Share this:

  • Tweet
  • More
Like Loading...
← Older posts

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • ప్రపంచ మిలిటరీ శక్తిలో భారత్‌-చైనా ఎవరెక్కడ !
  • రాష్ట్రాలు మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టక తప్పదా :బిజెపి ఏజంట్లుగా గవర్నర్లు,అసెంబ్లీల నుంచి వాకౌట్‌ !
  • ఇరకాటంలో ఐరోపా : గ్రీన్‌లాండ్‌ కోసం ఎంతకు తెగిస్తామో చూపుతా అన్న ట్రంప్‌ !
  • విపరీతంగా పెరుగుతున్న అసమానతలు : మంచిరోజులకు బదులు పేదలను ముంచుతున్న నరేంద్రమోడీ విధానాలు !
  • అమెరికా తదుపరి లక్ష్యం గ్రీన్‌లాండ్‌ ! నిజంగా చైనా, రష్యాల నుంచి ఆ ప్రాంతానికి ముప్పు ఉందా !!

Recent Comments

pscknr's avatarpscknr on కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫల…
Venugopalrao Nagumothu's avatarVenugopalrao Nagumot… on విత్తనాల ముసాయిదా బిల్లు …
Raj's avatarRaj on న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు…
Aravind's avatarAravind on సిజెఐ బిఆర్‌ గవాయిపై దాడి యత్న…
Arthur K's avatarArthur K on CPI(M) for proportional repres…

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • Africa
  • AP
  • AP NEWS
  • Asia
  • BJP
  • BRS
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Europe
  • Farmers
  • Filims
  • Germany
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • tdp
  • TDP
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women
  • Ycp

Meta

  • Create account
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Subscribe Subscribed
    • vedika
    • Join 246 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Subscribe Subscribed
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d