ఎం కోటేశ్వరరావు
ఉచిత పథకాలు, నగదు బదిలీల వంటి రాజకీయ పార్టీల వాగ్దానాల కారణంగా జనాలు సోమరులుగా మారుతున్నారని, పరాన్నజీవులవుతున్నారంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బుధవారం(ఫిబ్రవరి 12,2024) వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. చిత్రం ఏమిటంటే ఇలాంటి వాటి గురించి కేసులు వేసేవారు ఉంటారు తప్ప ప్రోత్సాహకాల పేరుతో వేళ్లమీద లెక్కించదగిన కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు, బాంకు అప్పుల మాఫీలు,రికార్డు స్థాయిలో ప్రభుత్వాలు చేస్తున్న అప్పుల గురించి ఎవరైనా సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారా ? పోనీ న్యాయమూర్తులు మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారా అంటే అదీ కనపడదు. అప్పులు తెచ్చేది ఎందుకు అంటే అభివృద్ధి కోసం అని అధికార పార్టీ నుంచి తడుముకోకుండా చెప్పే సమాధానం. ఆ మేరకు దాని ఆనవాళ్లు లేవేమి అంటే ఫలితాలు వెంటనే ఎలా కనిపిస్తాయి, రానున్న రోజుల్లో చూడండి అంటారు. స్వాతంత్య్రం తరువాత దేశాన్ని పాలించిన ప్రధానులందరూ కలసి 2004 నాటికి కేంద్ర ప్రభుత్వానికి మిగిల్చిన అప్పు రు.17,79,763 కోట్లు. పదేండ్ల మన్మోహన్ సింగ్ పాలనలో 2014మార్చి నెల నాటికి బడ్జెట్ పత్రాల సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మిగిల్చిపోయిన అంతర్గత, విదేశీ అప్పుల మొత్తం రు.55,87,149 కోట్లు, అది 2025 మార్చి నాటికి రు.185.11లక్షల కోట్లని, 2026 మార్చి నెలాఖరుకు రు.200.16లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. పదేండ్ల క్రితం ఇప్పుడు కూడా చర్చ అభివృద్ధి మీదే. పదేండ్లలో యుపిఏ పాలనలో అదనంగా 38లక్షల కోట్ల అప్పు చేస్తే దేశాన్ని అప్పుల పాలు చేశారు, అభివృద్దీ చేయలేదు అంటూ నరేంద్రమోడీ నాడు ధ్వజమెత్తారు. తన ఏలుబడిలో 2025మార్చినెలతో ముగిసే ఆర్థిక సంవత్సరం నాటికి అదనంగా చేసిన అప్పు 129లక్షల కోట్లు. ఇది చాలక ఈ ఏడాది మరో 15.68లక్షల కోట్లు కొత్తగా అప్పులు తీసుకొనేందుకు నిర్ణయించారు. తీరా ఇంత చేసినా 80కోట్ల జనాభా ఉచితంగా నెలనెలా ఐదు కిలోల ఆహారధాన్యాలు ఉచితంగా తీసుకుంటే తప్ప గడవని స్థితికి దేశాన్ని దిగజార్చారు. మరో 22 సంవత్సరాల్లో (2047నాటికి) దేశాన్ని ఎక్కడికో తీసుకుపోతామని కబుర్లు చెబుతున్నారు. నమ్మే మాటలేనా ?
అంతకు ముందు కాంగ్రెస్ పాలనకు పదకొండు సంవత్సరాల నరేంద్రమోడీ పాలనకు పెద్ద తేడా ఏమిటి ? మన్మోహన్ సింగ్ మాకు పెద్ద మొత్తంలో అప్పులు మిగిల్చిపోయారు, వాటిని తీర్చటానికే సరిపోతోందని వాదించవచ్చు. అప్పుల్లో మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు గనుక అది తర్కానికి నిలిచేది కాదు.201415లో మోడీ సర్కార్ అసలు, వడ్డీ మొత్తాలను తీర్చేందుకు ఖర్చు చేసిన మొత్తం రు.3,13,169 కోట్లు కాగా 2026 మార్చి నాటికి తీర్చాల్సిన మొత్తం రు.12,76,338 కోట్లుగా నిర్మలమ్మ తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు.ఈ ఏడాది బడ్జెట్ మొత్తం రు.50.65లక్షల కోట్లకు గాను రు.15.68లక్షల కోట్లు అప్పుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. మూడు సంవత్సరాల తీరుతెన్నులను చూస్తే వడ్డీ, అసలు చెల్లింపుల మొత్తం ఏడాదికి లక్ష కోట్ల వంతున పెరుగుతోంది. ఈ లెక్కన మోడీ మూడోవిడత పాలన ముగిసే నాటికి ఎంత అప్పు తెస్తే అంతమొత్తం పాత అప్పులకే సరిపోతుందని వేరే చెప్పనవసరం లేదు.ఒక వైపు అప్పుల కుప్ప పెరుగుతోంది,జనం మీద జిఎస్టి, చమురు మీద సెస్ల భారం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా ఒక్క పైసా కూడా వినియోగదారులకు తగ్గించకుండా 2022 ఏప్రిల్ మొదటి వారం నుంచి ఒకే ధర కొనసాగిస్తూ జేబులను కొల్లగొడుతూనే ఉన్నారు. తెచ్చిన అప్పుల మేరకైనా సంపదలను పెంచే మూలధన పెట్టుబడులుగా పెడుతున్నారా అంటే అదీ లేదు.202324లో రు.16.54లక్షల కోట్ల మేర అప్పులు తెస్తే మూలధన పెట్టుబడులకు రు.7.88 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు, మరుసటి ఏడాది రు.15.69లక్షల కోట్ల అప్పులో రు.8.47లక్షల కోట్లు సవరించిన బడ్జెట్ కాగా 202526లో మూలధన పెట్టుబడిగా రు.8.95లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. అంతకు ముందు 9.18లక్షల కోట్లు కేటాయించి దాన్ని కుదించినట్లే వచ్చే ఏడాది కూడా అంత మొత్తం ఖర్చు చేస్తారన్న హామీ లేదు. వడ్డీ చెల్లింపుల మాదిరి శాశ్వత ఆస్థుల కల్పన లేదు. అందుకే నరేంద్రమోడీ ఏలుబడి గొప్పతనం ఏమిటి అని ప్రశ్నించాల్సి వస్తోంది.
తమ పాలనలో విదేశీ అప్పులు పెద్దగా తీసుకోలేదని బిజెపి నేతలు గొప్పలు చెప్పుకుంటారు. అంకెలేమి చెబుతున్నాయి. 2014 మార్చి నాటికి విదేశీ అప్పుల మొత్తం మన కరెన్సీలో రు.1.82లక్షల కోట్లు, ఈ మొత్తం 2026 మార్చి నాటికి 6.63లక్షల కోట్లకు పెరుగుతుందని నిర్మలమ్మ బడ్జెట్లో చెప్పారు.గత పది సంవత్సరాలలో ఇంత మొత్తం అప్పులు తెచ్చిందెవరు ? మోడీ ఏలుబడిలో రూపాయి విలువ 62 నుంచి 86కు పతనమైంది. దీని వలన జరిగిందేమిటి ? పదేండ్ల క్రితం మోడీ ఒక డాలరు విదేశీ అప్పు తీసుకుంటే దాన్ని మరుసటి ఏడాది చెల్లించాలంటే నాడున్న మారకపు విలువ ప్రకారం రు.62, దానికి నామమాత్రంగా వడ్డీ చెల్లిస్తే సరిపోయేది. అదే డాలరును ఎలాంటి వడ్డీ లేకుండా పదేండ్ల తరువాత ఇచ్చే ఒప్పందం మీద ఎవరైనా ఉదారంగా అప్పు ఇస్తే ఇప్పుడు 86 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.మోడీ దిగిపోయే 2029 నాటికి వందకు పతనమైనా ఆశ్చర్యం లేదు.అధికారానికి వచ్చిన వెంటనే అప్పు తీర్చి ఉంటే ఇంత ఆముదం జనానికి అంటేది కాదు కదా ! ఇదీ మోడీ ఘనత.
ఇప్పుడు కార్పొరేట్లు తమకు మరిన్ని రాయితీలతో పాటు తాము తయారు చేసే వస్తువులు, అందించే సేవలను కొనుగోలు చేసేందుకు మధ్యతరగతికి ఆదాయపన్ను రాయితీలు ఇవ్వాలని, కొందరైతే కార్మికులకు వేతనాలు పెంచాలని కూడా సూచించారు. పన్నెండు లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. దీని వలన ఏటా లక్ష రూపాయలవరకు ఆలోపు రాబడి ఉన్నవారికి మిగులుతుందని అంచనా.ఈ మొత్తంతోనే దేశంలో పడిపోయిన వినియోగం పెరుగుతుందా ? ఈ స్వల్ప మిగులుతో గతంలో చేసిన అప్పులు కూడా తీర్చుకోవచ్చు, వస్తువులే కొనాలని లేదు. లేదా పెరిగిన ఖర్చులకు సరిపెట్టుకోవచ్చు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం, స్వదేశీ పెట్టుబడిదారులకు మరింత ఊతం ఇచ్చే పేరుతో కార్పొరేట్ పన్ను 30 నుంచి 22 శాతానికి తగ్గించారు. కొత్తగా పెట్టే సంస్థలకు 15శాతమే అన్నారు. ఈ రాయితీలతో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల లాభాలు విపరీతంగా పెరిగాయి, వాటాదార్లకు డివిడెండ్లు వచ్చాయి తప్ప ఆ మొత్తం పెట్టుబడుల రూపంలో తిరిగి రాలేదు, ఆ మేరకు ఉపాధి కూడా పెరగలేదు. అదే జరిగి ఉంటే వస్తువినియోగం పెరిగి ఉండేది, రూపాయి రూపాయి లెక్కించుకోవాల్సి వచ్చేది కాదు. సంపదలు కొద్ది మంది దగ్గర పోగుపడుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. 201314లో ఏడాదికి 50లక్షల రూపాయల రాబడిని చూపి పన్ను చెల్లించిన వారు 1.85లక్షలుంటే 2023`24లో వారి సంఖ్య 9.34లక్షలకు పెరిగింది. అయితే ఇంకా పన్ను ఎగవేసేవారు, రాబడిని చూపని వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
దేశంలో 2011జనాభా లెక్కల ప్రకారం రైతులుగా నమోదైన వారు 11.88 కోట్లు, వ్యవసాయ కార్మికులు 14.43 కోట్లు. కార్పొరేట్ పన్ను చెల్లించే సంస్థలు 2021లో 9,67,054. నిర్మలా సీతారామన్ స్వయంగా వెల్లడిరచినదాని ప్రకారం పైన పేర్కొన్న కార్పొరేట్ పన్ను తగ్గింపు కారణంగా ప్రభుత్వం ఏటా రు.1.45 లక్షల కోట్ల రాబడి కోల్పోతున్నది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో పెట్టుబడి ఖర్చులకు గాను ఏటా 10.32 కోట్ల మంది రైతులకు 63వేల కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం ఇస్తున్నది. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అంటే ఇదే. రైతులు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నారా, కార్పొరేట్ సంస్థలు ఎక్కువ మందికి పని చూపుతున్నాయా ? ఎందుకీ వివక్ష ? రైతులకు ఇచ్చే ఆ మొత్తంతో కార్పిరేట్లు విక్రయించే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాల వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు. దానిలో కూడా కార్పొరేట్లకు లాభాలు, ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రాబడి వస్తుంది.కానీ కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీలతో వారేమైనా వస్తువులు, సేవల ధరలు తగ్గించిన దాఖలా ఉందా ? ఆదాయపన్ను రాయితీలు ఒకటైతే ఎగమతి ప్రోత్సాహకాలు, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టినందుకు ప్రోత్సాహకాల రూపంలో ఇచ్చే రాయితీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే వారికి కట్టబెడుతున్న మొత్తాలు ఇంకా ఎక్కువే ఉంటాయి.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్న వాగ్దానాన్ని పాక్షికంగా నెరవేర్చినా జిడిపి వృద్ది రేటు, కొనుగోలు శక్తి దిగజారి ఉండేది కాదు.పని చేసేందుకు ఏ దేశంలోనూ లేనంత మంది యువత ఉన్నదని గొప్పలు చెప్పుకోవటం తప్ప వారికి ఉపాధి సంగతి తరువాత గత పదేండ్లలో పనిచేసేందుకు ముందుకు వచ్చేవారికి కనీసం నైపుణ్యం అయినా కల్పించారా అంటే అదీ లేదు. నైపుణ్యశిక్షణ పేరుతో తగలేసిన వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద కుంభకోణంగా చెప్పవచ్చు. దరిద్రం ఏమిటంటే అసలు ఎంత మంది నిపుణులున్నారో కూడా తెలియదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ లెక్కలు సేకరిస్తానని ఇప్పుడు చెబుతోంది.నైపుణ్య భారత్ కార్యక్రమం కింద కోటీ 40లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని, మరో 54లక్షల మందికి నైపుణ్యాలను పెంచటం లేదా తిరిగి శిక్షణ ఇచ్చామని 2024 కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంది. జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్(ఎన్ఎస్డిసి) 2024లో వెల్లడిరచిన అధ్యయన వివరాల ప్రకారం దేశంలో 10.3కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం కాగా 7.4కోట్ల మందే ఉన్నారు. మారుతున్న అవసరాలకనుగుణ్యంగా నిన్న నేర్చుకున్న నైపుణ్యం రేపటికి పనికి రావటం లేదు. అందువలన వీరిలో ఎందరు పనికి వస్తారన్నది కూడా ప్రశ్న.చైనాలో 40 కోట్ల మంది కార్మికులు ఉంటే వారిలో 20 కోట్ల మంది నిపుణులైన వారు కాగా ఆరు కోట్ల మంది అత్యంత నైపుణ్యం కలిగిన వారని, ఇతర దేశాలతో పోటీ పడేందుకు తమకు ‘‘ నూతన ఉత్పాదక శక్తులు ’’ ఇంకా ఎంతో మంది కావాలని చైనా చెబుతోంది.మహాకుంభ మేళాలో రికార్డు స్థాయిలో జనాలను గంగలో ముంచి స్నానాలు చేయించేందుకు ఇచ్చిన ప్రాధాన్యత పరిశోధన మరియు అభివృద్ధికి నిధుల కేటాయింపు, నైపుణ్య శిక్షణలో ఎక్కడా కనిపించటం లేదు. ఇలాంటి వారు దేశాన్ని, దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్న గురజాడ చెప్పిన స్పూర్తితో ముందుకు తీసుకుపోతారా !
